సినీ ఆర్టిస్ట్ జయవాహిని మృతి
● పుట్టి పెరిగింది విజయనగరంలోనే ● కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి ● సంతాపం వ్యక్తం చేసిన సినీ, టీవీ ఆర్టిస్టులు
విజయనగరం టౌన్: విజయనగరంలోని పూల్బాగ్ కాలనీలో జన్మించి, మహారాజా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, సినీ ఇండస్ట్రీపై మక్కువతో మద్రాస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న నటి పద్మక్కగా పిలుచుకునే జయవాహిని కొంతకాలంగా ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయనగరంలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిచెందారన్న వార్త విన్న సినీ, టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె సన్నిహితురాలు విజయనగరం వాసి, మూవీ, టీవీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరంలో పద్మక్కగా పిలుచుకునే వాళ్లమని, కరాటే విద్య నేర్చుకున్నారని, అప్పట్లో పద్మక్కను రాంబో అని అందరూ పిలుచుకునేవాళ్లమన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయనటిగా, టెలివిజన్, సినీరంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్ధానాన్ని ప్రారంభించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారన్నారు. రఘుపతి వెంకయ్యనాయుడు చిత్రంలో కథానాయికగా నటించి ప్రశంసలు పొందారన్నారు. చివరిగా బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటించారని తెలిపారు. టీవీ సీరియల్స్లో నిన్నే పెళ్లాడతా, నాగమ్మ, జయం, అభిమానం వంటి వాటిలో తనదైన శైలిలో ప్రతిభ చూపి అందరి మన్ననలు పొందారన్నారు. విజయనగరంలోని దాసన్నపేట సింగపూర్ సిటీలో డాల్పిన్ హైట్స్లో ఉన్న ఆమె స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. రోటరీ స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తిచేశారు. టీవీ,సినీ ఆర్టిస్ట్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
సినీ ఆర్టిస్ట్ జయవాహిని మృతి


