రోడ్డు ప్రమాదాల్లో ఏటా 960 మంది మృతి
● బాధిత కుటుంబాల జీవితాలు
చిన్నాభిన్నం : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా సగటున 960 మంది ప్రాణాలు కోల్పోతున్నారని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవితం అక్కడితో ముగిసిపోతుందని కానీ ఆ కుటుంబం ఎదుర్కొనే ఆవేదనను జీవితాంతం భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిదన్నారు. కలెక్టరేట్లో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రి పాలైనప్పుడు అయ్యే వైద్య ఖర్చులు ఆయా కుటుంబాలపై తీరని ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా ప్రమాదాల్లో మరణించిన వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఉద్దాటించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి తన కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు ఒక వారం లేదా ఒక నెలతో ముగిసేవి కాదని, ఇది నిరంతర ప్రక్రియ కావాలన్నారు. జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు రవాణా, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని గోల్టెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5 వేలు నగదు పారితోషికం అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన రోడ్ సేఫ్టీ ఎన్డీఓ అధ్యక్షులు మజ్జి అప్పారావు, డాక్టర్ సాయికుమార్లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందించారు. వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలు పద్మిక, మురళీచరణ్, హేమతేజ, సాయి, హర్హవర్ధన్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను సక్రమంగా నడుపుతున్న కలెక్టర్ డ్రైవర్ కృష్ణ, ఎస్పీ డ్రైవర్ ఆనందరావు, వివిధ శాఖల జిల్లా అధికారుల డ్రైవర్లు ప్రతాప్ వర్మ, సాయి, నరేంద్ర ఆలీలను అభినందించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ మణికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రహదారుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతిమణి, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో ఏటా 960 మంది మృతి


