ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన
● శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
● రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
రేగిడి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.. శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ కోరారు. రేగిడి మండలం ఉణుకూరు గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారించలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబ్లతో దాడులు చేయించి వారిని జైళ్లకు పంపించడమే పనిగా పెట్టుకుందన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేసిందన్నారు. 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, కనీసం 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్ మంజూరుచేయడంలేదన్నారు. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేయడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు.


