సర్టిఫికెట్, డిప్లమో కోర్సులకు నోటిఫికేషన
విజయనగరం టౌన్: మహారాజా సంగీత, నృత్య కళాశాలలో పలు కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్, డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైనట్టు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శాస్త్రి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్లో తెలిపిన కోర్సులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు జూన్ 30 నాటికి 14 ఏళ్లు నిండినవారై ఉండాలన్నారు. ఈ నెల 28 వరకూ అభ్యర్థులు సాధారణ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. వివరాలకు నేరుగా కళాశాల సమయవేళల్లో కానీ, 08922–223751 నంబర్ను సంప్రదించాలని కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణే
పోలీసుల లక్ష్యం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
● డీపీఓలో ఏఆర్ పోలీసులకు పునశ్చరణ తరగతులు
● 12 రోజుల పాటు ఆయుధాల వినియోగం, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ
● ఈనెల 13వ తేదీ వరకు తరగతులు
విజయనగరం క్రైమ్: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం కావాలని, యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే పునరంకితం కావాలని ఏఆర్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఏఆర్ సిబ్బంది బలమైన శక్తిగా, మాతృశాఖకు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభించిన పోలీస్ పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విధులను నిష్పక్షపాతంగా, అంకిత భావంతో నిర్వర్తించాలన్నారు. శారీరక దారుఢ్యం పెంచేందుకు, వివిధ ఆయుధాల ఉపయోగాలను, ముఖ్యమైన బందోబస్తులలో విధులను ఏవిధంగా నిర్వహించాలో శిక్షణ ఇస్తామన్నారు. ఫైరింగ్ ప్రాక్టీస్, బాంబు స్క్వాడ్, మస్కట్రీ శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్పై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐలు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సర్టిఫికెట్, డిప్లమో కోర్సులకు నోటిఫికేషన


