ఫీజుల భారం మోయలేం
విజయనగరం గంటస్తంభం: ప్రైవేట్, కార్పొరేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులను ఆర్థికంగా దోచుకుంటున్నారు.. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు... ఈ ఫీజుల భారం మోయలేమంటూ విద్యార్థులు కదం తొక్కారు. విద్యాహక్కును వ్యాపారంగా మార్చుతున్న విధానాలపై నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మయూరి కూడలి నుంచి విజయనగరం కాంప్లెక్స్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంప్లెక్స్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణ్ మాట్లాడుతూ... విద్యార్ధుల భవిష్యత్తును తాకట్టుపెట్టేలా జరుగుతున్న అక్రమ ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్య అనేది హక్కు తప్ప లాభసాటిగా మార్చే వస్తువు కాదని, పేద–మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేని స్థితికి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం తగదన్నారు. విద్యార్థుల కన్నీళ్లు, తల్లిదండ్రుల కష్టాన్ని పట్టించుకోని పాలక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోహన్బాబు యూనివర్సిటీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నాయకుల కిడ్నాప్ ఘటనలో బాధ్యులైన నటుడు మోహన్బాబు, విష్ణు, పీఆర్ఓ సతీష్లను వెంటనే అరెస్టు చేయాలని, విద్యార్ధుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బును పూర్తిగా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శిరీష, భారతి, జయ, వంశీ, సూరిబాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన విద్యార్థులు
విజయనగరంలో ఆందోళన
మోహన్బాబు యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్
ఫీజుల భారం మోయలేం


