గ్రంథాలయాల అభివృద్ధికి కృషి అవసరం
● మంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా
డొంకాడ రామకృష్ణ
విజయనగరం టౌన్: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి గ్రంథాలయాల సిబ్బందికి సూచించారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం ప్రమాణం స్వీకారం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులని, వాటి అభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అన్నిదానాల్లో కెల్లా విద్యాదానం శాశ్వతమని పేర్కొన్నారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితి విజయలక్ష్మిగజపతిరాజు, బేబీనాయన, తోయక జగదీశ్వరి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కె.మల్లేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్ధ కార్యదర్శి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


