రోడ్లు ఇలా.. భక్తులు వచ్చేది ఎలా?
● దుమ్మధూళితో నిండిన రామతీర్థం
● ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలకు
ఇబ్బందులు తప్పవంటూ భక్తుల నిట్టూర్పు
ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న పనులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాములోరి ఆలయంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్సవాలు సమీపిస్తున్నా రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నెల్లిమర్ల–రణస్థలం రోడ్డులో నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా ఎంబేరేయగుళ్లు వరకు రెండు నెలలే కిందట ప్రారంభించిన విస్తరణ పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు అవస్థలు తప్పేలా లేవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి వెళ్లే రోడ్డు అసంపూర్తిగా వదిలేయడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. రెండు నెలల కిందట ప్రారంభించిన పనులు పూర్తి కాకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు వేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, జాతరకు విచ్చేసే భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పనులు చకచకా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే రామతీర్థం పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయని, రోడ్డంతా దుమ్ముధూళితో దర్శనమిస్తోందని, జాతర నాటికి ఈ పరిస్థితులను చక్కదిద్దాలని అధికార యంత్రాంగానికి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొనసాగుతున్న విస్తరణ పనులు...
నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా సతివాడ వరకు రోడ్డు విస్తరణ పనులకు గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పట్లో చకచకా జరిగాయి. రహదారికి ఇరువైపులా బెర్ముల ఏర్పాటు చేయడంతో పాటు సుమారు ఎనిమిది చోట్ల మినీ కల్వర్టులు నిర్మించారు. ప్రభుత్వం మారడంతో విస్తరణ పనులకు బ్రేకులు పడ్డాయి. 16 నెలల సుదీర్ఘ విరామం తరువాత విస్తరణ పనులు ఇటీవల పునఃప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా సంక్రాంతికి ముందు తంగుడుబిల్లి కూడలి నుంచి నెలివాడ ఆలయం వరకు సుమారు కిలోమీటరు మేర మాత్రమే తారుపోసి వదిలేశారు. అనంతరం రామతీర్థం ప్రధాన రోడ్డులో ప్రధాన కాలువ పనులు ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన చోట కాలువలపై పలకలువేస్తూ కొందరు రోడ్డును ఆక్రమిస్తుండడంతో రోడ్డు విస్తరణ చేపట్టినా ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
రోడ్లు ఇలా.. భక్తులు వచ్చేది ఎలా?
రోడ్లు ఇలా.. భక్తులు వచ్చేది ఎలా?


