ఉద్యోగ బకాయిల చెల్లింపునకు ఏపీజీఈఏ డిమాండ్
విజయనగరం అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) డిమాండ్ చేసింది. ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరినప్పటికీ, ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేయాలని కోరింది. తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు బుధవారం వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిలను, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు.
ఈ అంశాన్ని శాసనసభ, శాసన మండలిలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి పద్దులవారీగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఫైనాన్స్బిల్లు వచ్చిన సమయంలో అవసరమైన సందర్భాల్లో ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లెంక సత్తిబాబుతో పాటు శైలాడ ఈశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ వెంకటసతీష్, మహిళా విభాగం అధ్యక్షురాలు వి.రాజేశ్వరి, పెన్షనర్ల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
బడ్జెట్లో నిధులు కేటాయించాలి
తమ తరుఫున పోరాటం చేయాలని శాసన మండలి విపక్షనేత బొత్సకు ఏపీజీఈఏ వినతి


