గోల్డెన్ అవర్లో ధైర్యమే ప్రాణదాత
పార్వతీపురం రూరల్: ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రాణాన్ని నిలబెట్టేది..ఆస్తి నష్టాన్ని నివారించేది కేవలం అవగాహన మాత్రమేనని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. విపత్తు సమయాల్లో భయం వీడి, బాధితులకు అభయమివ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురం మండలంలోని ఎమ్మార్నగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్’ విన్యాసాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలు (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని, ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. మంటలు ఎగిసిపడినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు అబ్బురపడ్డారు. గ్యాస్ సిలిండర్ల మంటలను అదుపు చేయడం, ఎత్తైన భవనాల్లో చిక్కుకున్న వారిని తాడు సాయంతో సురక్షితంగా వెలికితీయడం వంటి విన్యాసాలు నేత్రపర్వంగా సాగాయి. ఆధునిక రెస్క్యూ పరికరాల పనితీరుపై విద్యార్థులకు సిబ్బంది అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి పి.సింహాచలం, ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రభాకర రెడ్డి


