breaking news
Tamil Nadu Assembly Election 2026
-
విజయ్కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు


