వీరప్పన్ ముత్తులక్ష్మి, విద్యారాణి
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్మగ్లర్ వీరప్పన్ భార్య, కుమార్తె పోటీ చేస్తున్నారు. అయితే, వీరు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీలో ఉన్నారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కృష్ణగిరి నియోజకవర్గం నుంచి తమిళనాడు జీవ హక్కుల కట్చి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సోమవారం సాయంత్రం కృష్ణగిరి రెవెన్యూ కమిషనర్, ఎన్నికల అధికారి షాజహాన్న్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
వీరప్పన్ కుమార్తె విద్యారాణి మెట్టూరు నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి పోటీ చేసిన ఆమె, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా ఆమె తన నామినేషన్న్ను ఇప్పటికే దాఖలు చేశారు.
కాగా, ఒకే కుటుంబానికి చెందిన వీరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వారు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండడంతో నేరుగా ఒకరిపై ఒకరు తలపడడం లేదు. వీరప్పన్ ప్రభావం ఉన్న అటవీ ప్రాంత నియోజకవర్గాల్లో వీరిద్దరికీ ఓటర్లు ఎలాంటి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.


