ఒకప్పటి హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన సుకన్య ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తోంది. తెలుగులో పదేళ్ల క్రితంలో వచ్చిన 'శ్రీమంతుడు'లో చివరగా కనిపించారు. అయితే ఈమెకు సంబంధించిన ఓ కేసు.. గత 30 ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఇప్పుడు సదరు కేసు తుదితీర్పు వచ్చింది. ఈమెకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది.
(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)
ఏం జరిగింది?
సన్ టీవీలో 1996లో ప్రసారమైన 'నెరుక్కు నెర్' కార్యక్రమంలో అడవి దొంగ వీరప్పన్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే ఇందులో నటి సుక్యన సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వీటి వల్ల తన పరువు దెబ్బతిందని భావించిన సుకన్య కోర్టుని ఆశ్రయించారు. అప్పటినుంచి న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. 2015లో ట్రయల్ కోర్ట్.. సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అయితే కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సన్ టీవీ నెట్వర్క్ అప్పీలు దాఖలు చేసింది. తాజాగా ఆ అప్పీలుగా మద్రాసు హైకోర్టు కొట్టేసింది. దీంతో సుకన్యకు ఎట్టకేలకు న్యాయం దక్కింది. రూ.10.01 లక్షలని పరిహారంగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూ ప్రసారం చేయడానికి ముందే కంటెంట్పై సన్ టీవీకి పూర్తి నియంత్రణ ఉందని, దాన్ని పరిశీలించి పరువు నష్టం కలిగించే వాటిని తొలగించే ఛాన్స్ సంస్థకు ఉందని స్పష్టం చేసింది. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రసారం చేశారని పేర్కొంది.
(ఇదీ చదవండి: తెలుగు ప్రేక్షకులంటే అందరికీ చులకనే!)


