విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ! | Cow Slaughter Ban: Vijay Govts SC Move Triggers Political Row | Sakshi
Sakshi News home page

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

Jul 2 2026 1:09 PM | Updated on Jul 2 2026 1:21 PM

Cow Slaughter Ban: Vijay Govts SC Move Triggers Political Row

గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. మత స్వేచ్ఛ, చట్టబద్ధ హక్కులు, న్యాయవ్యవస్థ అధికార పరిధి అంశాలపై రాజకీయ దుమారం చెలరేగింది.

మద్రాస్ హైకోర్టు మే 27న ఇచ్చిన తీర్పు తమిళనాడు జంతు సంరక్షణ చట్టం–1958కు విరుద్ధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును తాజాగా ఆశ్రయించింది. పదేళ్లు దాటిన, వ్యవసాయ పనులకు లేదంటే సంతానోత్పత్తికి.. పనికిరాని ఆవులను నిర్దిష్ట నిబంధనల ప్రకారం వధించేందుకు చట్టం అనుమతిస్తోందని, అయితే హైకోర్టు ఎలాంటి మినహాయింపులూ లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడం చట్ట పరిధిని మించిన నిర్ణయమని పేర్కొంది.

అంతేకాదు, కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువుల వధను నిరోధించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఆ అంశానికే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టసభ అధికారాలను న్యాయస్థానం భర్తీ చేసినట్లేనని తన పిటిషన్‌లో పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఆలస్యంగా తీసుకున్న చర్యగా విమర్శిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. ఈ విషయంలో టీవీకే ప్రభుత్వం దాదాపు నెల రోజుల తర్వాత స్పందించిందని ఆరోపించింది. బక్రీద్ సందర్భంగా మాత్రమే దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడంతో ముస్లింలతో పాటు కొన్ని హిందూ దేవాలయాల్లో జరిగే సంప్రదాయ బలిపూజలపైనా ప్రభావం పడిందని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంలో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందని, ఆలస్యంగా స్పందించడం వల్ల ప్రజల్లో అయోమయం నెలకొందని విమర్శించింది.

మరోవైపు, మణితనేయ మక్కల్ కచ్చి (MMK) అధ్యక్షుడు ఎం.హెచ్. జవహిరుల్లా ఈ తీర్పు రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ హక్కును దెబ్బతీస్తోందని ఆరోపించారు. లైసెన్స్ పొందిన స్లాటర్ హౌస్‌లలో మాత్రమే బలులు నిర్వహించాలనడం ఆచరణ సాధ్యం కాదని, సంప్రదాయ మతాచారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలు జంతువుల వధను నియంత్రిస్తున్నాయని, వాటిని పూర్తిగా పక్కనబెట్టి హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించడం న్యాయపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అధికార–ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ పోరుకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement