సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ విజయ దుందుభి మోగించారు. విజయ్ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంల్, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు
మంత్రివర్గ విస్తరణలో వ్యూహం
విజయ్ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

వీసీకే, ఐయూఎంల్ వైఖరి
వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.
వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.
సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు..
వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.
విజయ్ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు.


