తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
విజయ్ 1974 జూన్ 22న మద్రాస్లో జన్మించారు. చెన్నైలోని లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత సినిమాల్లో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతలో బాగా పాపులారిటీ ఉంది.
అభిమానులు ఆయనను దళపతి (నాయకుడు) అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్ వెట్రి (1984) సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో “నాళైయ థీర్పు” (1992) ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్గా విఫలమైనా, విజయ్ ప్రతిభను అందరూ గుర్తించారు.
ఆ తర్వాత రసిగన్ (1994), దేవా (1995) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డ్యాన్సులు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు.
ఎంజీఆర్ను గుర్తు చేసిన విజయ్
గతంలో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు సర్కార్ (2018) వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024, ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ పార్టీ స్థాపించారు.
విజయ్ రాజకీయ సభలో చోటుచేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తొక్కిసలాటతో విజయ్ ఇక రాజకీయాల్లో రాణించలేరని చాలా మంది అన్నారు. అయినప్పటికీ పడి లేచిన కెరటంలా ముందుకు సాగారు విజయ్. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.603 – రూ.625 కోట్లు.
విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం (వీఎంఐ) అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తరువాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మూడో శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివర్లో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందన్న సంకేతం కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి, డీఎంకే, అన్నాడీఎంకేను టీవీకే ఓడించింది. ఇన్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేకే అధికారాన్ని కట్టబెడుతూ వచ్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాందిపలికారు. టీవీకే విజయ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించుకున్నారు.


