చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నాయకుడు అన్నామలై తనదైన శైలిలో స్పందించారు. ధన, వారసత్వ రాజకీయాలకు తమ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారని.. మార్పునకు ఓటేశారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చినందుకు తమిళనాడు ప్రజలకు నమస్కరించారు. ఎన్నికల ఫలితాలపై 'ఎక్స్'లో సోమవారం పోస్ట్ పెట్టారు. ఓటర్ల అభిమానం పొందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్కు అభినందనలు తెలిపారు. ఓటమి పాలైన స్టాలిన్కు సానుభూతి ప్రకటించారు. మంచి రోజులు వస్తాయని బీజేపీ శ్రేణులకు భరోసాయిచ్చారు.
''అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నమస్కరిస్తున్నాను. నా గడ్డపై ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పడం సంతోషంగా ఉంది. డబ్బుతో ఓట్లు కొనడాన్ని వ్యతిరేకించారు. వంశపారంపర్య రాజకీయాలను వద్దన్నారు. రాజకీయాల్లో కొత్త మార్పునకు నాంది పలికారు. టీవీకే, విజయ్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన ఆరంభానికి సిద్ధంగా ఉన్న మీకు దేవుడు తోడుగా ఉంటాడు.
క్షేత్రస్థాయిలో ఎన్డీఏ అభ్యర్థులు హోరాహోరీ తలపడ్డారు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఓడిన వారు డీలా పడకుండా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. పరాజయం పాలైన స్టాలిన్, సీమాన్లకు సానుభూతి తెల్పుతున్నాను. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మంచి రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నానని తన పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా, ఎన్డీఏ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా అన్నామలై పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఇందు కోసం ఎన్నికల్లో పోటీకి సైతం ఆయన దూరంగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం పోటీ చేయమని సూచించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు.
చదవండి: అన్నాడీఎంకే మాజీ నేతకు టీవీకే ప్రభుత్వంలో కీలక పదవి!


