చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సినిమా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. గురువారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. సామాన్యుల్లా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులు తమతో పాటే క్యూలో నిలబడి ఓటు వేయడాన్ని జనం ఆసక్తిగా గమనించారు. కెమెరాల ముందు పెద్దగా కనబడని ప్రముఖ రాజకీయ నేతల కుటుంబ సభ్యులను చూసేందుకు కూడా జనం ఉత్సుకత కనబరిచారు.
చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథమరై స్టాలిన్ (Senthamarai Stalin), అల్లుడు శబరీసన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించారు. పోలింగ్ కేంద్రంలోని ఉన్నవారంతా సీఎం స్టాలిన్ కుమార్తె, అల్లుడిని ఆసక్తిగా గమనించారు. వ్యాపారవేత్త అయిన సెంథమరై రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. దీంతో ఆమెకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా అందుబాటులో లేదు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Chief Minister MK Stalin's daughter Senthamarai Stalin and son-in-law Sabarisan cast their votes at a polling station in Chennai. pic.twitter.com/UAsFX7VGs4
— ANI (@ANI) April 23, 2026
కాగా, సూపర్స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ బూత్లో తన ఓటు వేశారు. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, తన భార్య కావేరి, కుమార్తె కావ్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. హీరో విశాల్.. అన్నా నగర్లోని పోలింగ్ కేంద్రంలో తన హక్కు వినియోగించుకున్నారు. నటుడు ఆది పినిశెట్టి తన భార్య నిక్కీ గల్రాని, తండ్రి రవిరాజా పినిశెట్టితో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. శింబు సింగిల్గా వచ్చి ఓటు వేశారు.
Actor couple Aadhi and Nikki Galrani cast votes in Chennai, urges public to vote. pic.twitter.com/XIQkMZjfzf
— News Arena India (@NewsArenaIndia) April 23, 2026
చదవండి: ఫస్ట్ టైమ్ ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్ కొడుకు
శివగంగలో ఓటు వేసిన కార్తీ చిదంబరం
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన భార్య శ్రీనిధి, కుమార్తె అదితితో కలిసి శివగంగలో ఓటు వేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నా ఓటు వేశాను. ఎన్నికల రోజులన్నీ పండుగ రోజులే అని భావిస్తాను. ఇది ప్రజాస్వామ్య విజయమని నేను అనుకుంటున్నాను. ప్రజలు వచ్చి ఓటు వేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంద''ని అన్నారు.


