ఓటేయకుండానే సిరా చుక్క.. | Inked But Cant Vote: EVM Chaos and Violence | Sakshi
Sakshi News home page

ఓటేయకుండానే సిరా చుక్క..

Apr 23 2026 1:24 PM | Updated on Apr 23 2026 1:40 PM

Inked But Cant Vote: EVM Chaos and Violence

మొతాబరి: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ  కొనసాగుతోంది. ఒకవైపు ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురవగా, మరోవైపు బాంబు దాడులు, ఘర్షణలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. కనీసం ఓటు వేయకుండానే వేలికి సిరా చుక్క వేయించుకుని వెనుదిరగాల్సిన దయనీయ పరిస్థితి మాల్దా, ముర్షిదాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో నెలకొంది.

మొరాయించిన ఈవీఎంలు
మొతాబరి పోలింగ్ బూత్‌లో ఈవీఎం సాంకేతిక లోపంతో గందరగోళం చెలరేగింది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యంత విచిత్రంగా, ఒక ఓటరు వేలికి అధికారులు సిరా పూశారు కానీ మిషన్ పనిచేయకపోవడంతో ఓటు వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. సెక్టార్ అధికారికి ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారి ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే బూత్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు సుమారు 90 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ తిరిగి ప్రారంభమైంది.

పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్
బెంగాల్‌లోని 16 జిల్లాల్లో 152 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో పలుచోట్ల  ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ముర్షిదాబాద్‌ జిల్లాలోని బెల్దంగా, శంషేర్‌గంజ్, కంది ప్రాంతాలతో పాటు నందిగ్రామ్, సిలిగురిలలో ఓటింగ్ నిలిచిపోయి, ఆలస్యంగా సాగింది. కూచ్ బిహార్‌లో ఒక బూత్‌లో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు. సెంట్రల్ ఫోర్స్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వైఫల్యం పోలింగ్ ప్రక్రియను తీవ్రంగా ఆటంకపరిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement