టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు.
ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.

తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th
— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026


