breaking news
Panchayat elections
-
రేవంత్ టాప్.. ఆ తర్వాత ఉత్తమ్.. వివేక్ లాస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని మూడు విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఎక్కువమంది కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఉత్తమ్కుమార్రెడ్డి (హుజూర్నగర్), సీతక్క (ములుగు) ఉన్నారు. ఈ ముగ్గురి నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుపొందడం విశేషం. » కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ), శ్రీధర్బాబు (మంథని), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) నియోజకవర్గాల్లో కూడా 70 శాతం కంటే ఎక్కువ చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. » 60 శాతం కంటే ఎక్కువ అధికార పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మధిర, అందోల్, పాలేరు ఉన్నాయి. » మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో కూడా దాదాపు 60 శాతం స్థానాల్లో హస్తం పార్టీ సహకారంతోనే సర్పంచ్లుగా గెలిచారు. వాకిటి శ్రీహరి (మక్తల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)లలో 50–60 శాతం మధ్యలో విజయం దక్కించుకోగలిగారు. » అత్యల్పంగా వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) నియోజకవర్గంలో 50 శాతం కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. సగం చోట్ల బీజేపీ సున్నా.. రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. హుజూర్నగర్, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, చెన్నూరు స్థానాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోలేకపోయారు. » మంత్రుల నియోజకవర్గాల్లో కొల్లాపూర్, హుస్నాబాద్లలో మాత్రమే బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురైందని ఫలితాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. » కొడంగల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. » స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీలు కలిపి మంత్రుల నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలగడం విశేషం. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరులో ఏకంగా 35 మంది స్వతంత్రులు గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా గెలిచింది స్వతంత్రులే. బీఆర్ఎస్ బలపర్చిన వారు స్వతంత్రు లతో పోలిస్తే సగం స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. స్వతంత్రులు ప్ర భావం చూపిన నియోజకవర్గాల్లో మధిర, కొల్లాపూర్, పాలేరు, మంథని, హుస్నాబాద్లు కూడా ఉండడం గమనార్హం. -
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేని విజయం
సాక్షి, యాదాద్రి: వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, అధినేత కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని, భవిష్యత్లో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పునాది వేసిందన్నారు. గురువారం భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. వారిని సన్మానించిన అనంతరం మాట్లాడారు. పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని నిజం చేస్తూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడినా.. నేడు భువనగిరి జిల్లా వ్యాప్తంగా 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్నామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలు.. పార్టీకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వికృత రాజకీయం కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్ను కిరాతకంగా చంపడం, నల్లగొండలో అభ్యర్థిపై దాడిచేసి అమానవీయంగా మూత్రం తాగించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పారు. మూడు ఫీట్లు ఉన్నా.. 30 ఫీట్ల డైలాగులు సీఎం రేవంత్రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా.. ముప్పై ఫీట్ల డైలాగులు కొడతారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓట్లు వేసి మోసపోయామని క్షేత్రస్థాయిలో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటివారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. స్పీకర్ కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్టు నటిస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, గొంగిడి మహేందర్రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. డీఎస్పీకి గాయాలు.. జగిత్యాలలో పోలీసు కాల్పులు
సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. -
ప్రజా విశ్వాసానికి నిదర్శనం !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. దాదాపు 7 వేల వరకు సర్పంచ్ స్థానాలు, మెజార్టీ వార్డు స్థానాల్లో గెలు పొందడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఫలితాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని రుజువైందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై పల్లె ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని అంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇమేజ్కు తోడు మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం మంచి ఫలితాలను సాధించి పెట్టిందని అంచనా వేస్తున్నాయి. సంక్షేమమే బాసటగా..!గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయానికి రాష్ట్రంలో సంక్షేమ పథకాలే బాసటగా నిలిచాయనే అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి కారణమయ్యాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఒకట్రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటా పార్టీ ఆధిక్యం సాధించడం చూస్తే సీఎం రేవంత్రెడ్డి పాలనకు పల్లె ప్రజలు పట్టం కట్టిన విషయం స్పష్టమవుతోందని, పార్టీ పట్ల వ్యతిరేకత లేదని కూడా తేలిపోయిందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు పెంచుకున్నామని, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు ద్వారా పల్లె ప్రాంతాల్లో గట్టిగా పాగా వేయగలిగామని, బీఆర్ఎస్–బీజేపీలు కలిసినా ఆ రెండు పార్టీలకు కలిపి 30 శాతం సీట్లు రాకపోవడం ప్రతిపక్షాలపై ప్రజలకు నమ్మకం లేదని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి పాలనకు గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుండడం, ఓవైపు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ మరోవైపు అభివృద్ధి ఆగకుండా మంత్రివర్గం పని చేస్తుండడం, తెలంగాణను ప్రపంచ యవనికపై నిలబెట్టేందుకు సీఎం రేవంత్ చేస్తున్న కృషి లాంటివన్నీ కలిసి పంచాయతీల్లో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి..’ అని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 75 శాతం మా వాళ్లే..ఏ పార్టీ బలపర్చకుండా స్వతంత్రంగా గెలిచిన వారిలో 90 శాతం మంది తమ పార్టీ వారేనని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,200 గ్రామాల్లో తమ పార్టీ రెబెల్స్ బరిలో ఉన్నారని, పార్టీలో పనిచేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోటీకి ఇది నిదర్శనంగా నిలుస్తుందని చెబుతోంది. ఇప్పుడు గెలిచిన స్వతంత్రులు ఎక్కువ మంది కాంగ్రెస్ గూటికే చేరుతారని, తద్వారా రాష్ట్రంలోని 75 శాతం పంచాయతీలు తమ పక్షమే అవుతాయని విశ్లేషిస్తోంది. -
ఆ అభిప్రాయం తప్పని తేలింది
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా సంతృప్తి కలిగించే ఫలితాలు రాకపోయినా ఒక మోస్తరు మంచి ఫలితాలనే సాధించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా బీజేపీ పట్ట ణప్రాంతాలకే పరిమితమైన పార్టీ అనే విమర్శ ఉన్నా...దానిని ఈ ఎన్నికల్లో సాధించిన ఫలితాల ద్వారా తప్పు అని నిరూపించగలిగామని అంటున్నారు. బుధవారం జరిగిన మూడోవిడత ఎన్నికల ఫలితాలతో కలిపి మొత్తంగా 700 దాకా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు అంచనా వేస్తున్నారు. మొదటి విడత కంటే కూడా రెండు, మూడు విడతల్లో మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్లలో గణనీయమైన స్థానాలు సాధించామని, ఇతర జిల్లాల్లోనూ కనీస ప్రాతినిధ్యం దక్కడంతో మొత్తంగా గ్రామీణ పాంతాల్లో గట్టి ఉనికిని ప్రదర్శించినట్టయ్యిందని చెబుతున్నారు. 900 మంది వరకు మా వాళ్లే: బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు మూడు విడతల్లో కలిపి మొత్తంగా 800 నుంచి 900 వరకు (ఇండిపెండెంట్లు కలుపుకొని) సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ బలపరిచినవారు విజయం సాధించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీ బలంగా చొచ్చుకు వెళ్లిందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో పెరిగిన పార్టీ బలం త్వరలోనే రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. పెద్దసంఖ్యలో వార్డుసభ్య స్థానాలను, ఉప సర్పంచ్లను సైతం గెలుచుకోవడం సంతృప్తిని కలిగించిందన్నారు. మొత్తంగా పార్టీకి బలంగా ఉన్న ప్రాంతాలు..ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇతర జిల్లాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో 163 మంది సర్పంచ్లకే బీజేపీ పరిమితం కావడాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలల్లో ఎన్నికలు జరిగితే 6 నుంచి 7 వేల గ్రామాల్లోనే అభ్యర్థులను నిలపాగలిగామని రాంచందర్రావు తెలిపారు. భద్రాచలం, మహబూబాబాద్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామటుకు పోటీకి నిలబెట్టలేకపోయామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీజేపీకి పట్టున్న అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో అక్కడ ఎన్నికలు జరగలేదన్నారు. -
మూడో విడతలో 85.77%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.తుది విడతలో ఇలా....182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి. ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది. మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు. -
కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని, రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాకతప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని పేర్కొన్నారు. సీఎంకు ముచ్చెమటలు..పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా అధికార పక్షం వైపు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రుల్ని మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్’..’ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలు అధికార పార్టీపై ప్రజల ఆగ్రహానికి కారణమని చెప్పారు.ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందికాంగ్రెస్ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను వీరోచితంగా తట్టుకుని బీఆర్ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం..’ అని అభివర్ణించారు. ‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు శిరస్సువంచి సలాం చేస్తున్నా. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్ను, రేవంత్రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..’ అని ఆయన పేర్కొన్నారు. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. ముత్యాల కుటుంబానికి మూడోసారి..లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్రెడ్డి సర్పంచ్గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
తల్లి కోరిక.. కొడుకు కానుక
మేడిపల్లి: వారిది నిరుపేద కుటుంబం. గౌడవృత్తితోపాటు ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామానికి ఎప్పటికైనా సర్పంచ్ కావాలని ఆ ఇంటి యజమాని కల కనేవాడు. అలా ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు. ఆర్థికంగా లేకపోవడంతో ప్రతిసారీ ఓడిపోయాడు. తన భర్త చివరి కోరికను కొడుకుకు చెప్పగా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈసారి ఎన్నికల్లో తల్లిని సర్పంచ్ చేశాడు. వివరాల్లోకి వెళితే... ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కమ్మరిపేట.. భీమారం మేజర్ గ్రామ పంచాయతీలో విలీన గ్రామంగా ఉండేది. గ్రామానికి చెందిన కోటగిరి గంగరాజం, గంగరాజు (గంగవ్వ) దంపతులు. గంగరాజంకు ఎప్పటికైనా సర్పంచ్ కావాలనే కోరిక ఉండేది. అలా చాలాసార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ కోరిక తీరకుండానే గంగరాజం 2009లో చనిపోయారు. ఆ తర్వాత కమ్మరిపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం గంగవ్వ వయస్సు 82 ఏళ్లు. రెండో విడత ఎన్నికలు రాగానే తండ్రి కోరికను కొడుకు లింగగౌడ్కు చెప్పింది. దీంతో తండ్రి కోరికను తల్లితోనైనా తీర్చాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీలో నిలబెట్టారు. నలుగురు పోటీలో ఉండగా.. గంగవ్వ స్వతంత్ర అభ్యర్థిగా 332 ఓట్లు సాధించింది. 128 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలిచింది. విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆమెను కరీంనగర్లోని ఆయన కార్యాలయానికి సోమవారం పిలిపించుకున్నారు. ఘనంగా సన్మానించారు. తన భర్త కోరికను కొడుకు ద్వారా తీరిందంటూ ఆ తల్లి బండి సంజయ్ ఎదుట ఆనందబాష్పాలు రాలి్చంది. -
ఓటేసేందుకు పట్నం నుంచి వచ్చి..
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్కు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు. -
నడిచొచ్చే ప్రజాస్వామ్యం
ములుగు: మూడో విడతలో భాగంగా ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బుధవారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు మండలాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలే. ఆయా మండలాల్లోని పెనుగోలు, బొల్లారం, మండపాక, కలిపాక, పెంకవాగు, సీతారాంపురం, ముత్తారం, సర్వాయి, మల్కపల్లి, భూపతిపురం ఆదివాసీ గ్రామాల ప్రజలు ఓటు వేయాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు అడవిబాటలో నడిచి రావాల్సిందే. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు గుట్టలు, కొండలు దాటుతూ బాధ్యతగా ఓటు వేసి అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు. వాజేడు పరిధిలో ⇒ కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలులో 29 మంది ఓటర్లు ఉంటారు. వీరు కొండలు, గుట్టలు దాటుకుంటూ అడవి మార్గాన ప్రయా ణిస్తూ 20 కిలోమీటర్ల దూరంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ మొరుమూరు పంచాయతీ పరిధిలోని బొల్లారం గిరిజన గూడెంలో 263 మంది ఓటర్లు ఉంటారు. వీరు 9 కిలోమీటర్ల దూరంలోని ప్రగళ్లపల్లి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ⇒ ఏడ్జెర్లపల్లి పంచాయతీ పరిధిలోని మండపాకకు చెందిన 133 మంది ఓటర్లు 8 కిలోమీటర్ల దూరంలోని ఏడ్జెర్లపల్లికి వచ్చి ఓటేయాలి. వెంకటాపురం(కె) పరిధిలో ⇒ భోదాపురం పంచాయతీ పరిధిలో కలిపాక, పెంకవాగు గిరిజన గ్రామాల్లో 110 మంది ఓటర్లు ఉంటారు. వీరు కాలినడకన 5 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్లో ఓటేయాలి. ⇒ అలుబాక పంచాయతీ పరిధిలోని సీతారాంపురం, ముత్తారం గిరిజన గ్రామాల్లో 100 మంది ఓటర్లు ఉంటారు. వీరు 6 కిలోమీటర్ల పరిధిలోని అలుబాక పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. గుట్టలు, కొండలు దిగుతూ అడవిలో 20 కిలోమీటర్లు నడుస్తూ ఓటేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్న పెనుగోలు ఓటర్లు (ఫైల్) కన్నాయిగూడెం మండలంలో.. సర్వాయి గిరిజనగూడెంలో 198 మంది ఓటర్లు, మల్కపల్లిలో 99 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ట్రాక్టర్పై 12 కిలోమీటర్లు ప్రయాణించి చిట్యాల పో లింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలి. ఇదే పంచాయతీ పరిధిలోని భూపతిపురంలో 295 మంది ఓటర్లు ఉంటారు. రవాణా సౌకర్యం ఉన్నా, బైక్లు, ఆటో ల్లో 8 కిలోమీటర్లు వచ్చి చిట్యాల పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వార్డు ఓట్లన్నీ గంపగుత్తగా... తొర్రూరు రూరల్: రెండో విడత ఎన్నికల్లో 100 శాతం ఓట్లతో ఓ వార్డు సభ్యుడు చరిత్ర సృష్టించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలోని 6వ వార్డు నుంచి బానోతు తేజానాయక్ పోటీ చేశాడు. ఈ వార్డులో 95 ఓట్లు ఉండగా, మొత్తం ఓట్లు తేజానాయక్కే పడ్డాయి. ప్రత్యర్థులెవరికి ఈ వార్డులో ఓట్లు లేవు. -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటు వేయలేదని..
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు. నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు. పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది బ్యాలెట్ పేపర్పై మూడు వరుసల్లో గుర్తులుమఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ సర్పంచ్ స్థానానికి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపరులో మొదటి వరుసలో 8 గుర్తులు, రెండో వరుసలో 8 గుర్తులు, మూడో వరుసలో ఇద్దరు అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తు ముద్రించారు. ఓటు కోసంపంచాయతీ ఎన్నికల వేళ దశాబ్దల తర బడి పరిష్కారానికి నోచుకోని బాట సమస్యకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు ఓట్ల కోసం ఓ వార్డు అభ్యర్థి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు. ఓట్ల కోసం గుట్ట ఎక్కిన మొదటి వ్యక్తి వినోద్ కావడం గమనార్హం.‘పంచాయతీ’తో పరిష్కారం » పోలింగ్కు ముందే రోడ్డు నిర్మాణం పూర్తి » నెరవేరిన హన్వాడ రైతుల దశాబ్దాల కలఇది మహబూబ్నగర్ జిల్లా హన్వాడ–బుద్ధారం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి. దీని కోసం దాదాపు 100 కుటుంబాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు చేయని ప్రయత్నం లేదు.. కలవని నేతలు లేరు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు.. ఇస్నాతి వంశస్తులకు సంబంధించిన పక్కా పట్టా స్థలం. అందులోనూ సాగులో ఉన్న భూమి. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఆ అన్నదాతల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఆ వంశానికి చెందిన సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం ఆ రైతులకు వరమైంది. తమ పొలాలకు రహదారి వదిలితే వంద మంది రైతు కుటుంబాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రతిపాదించడం.. ఇన్నాళ్లూ అంగీకరించని సదరు యజమాని తమ దాయాదులతో మాట్లాడి ఒప్పించడం.. ఆ వెంటనే రైతులు సొంత డబ్బులతో కిలోమీటర్కు పైగా (సుమారు ఎకరా) మట్టి రోడ్డు వేయడం చకచకా జరిగింది. వెతుకుతున్న తీగ కాలుకు తగిలినట్టు సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల సమస్య తీరింది. రోడ్డును ఆనుకునే 36 ఎకరాల్లో ఇస్నాతి వంశస్తుల వ్యవసాయ భూమి ఉండగా.. దానికి ఆనుకొని వెనుకవైపు 400 ఎకరాల వరకు పంటలు సాగవుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతోంది. హన్వాడలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. తనకు మద్దతుగా నిలవాలని సదరు సర్పంచ్ అభ్యర్థి వేడుకుంటున్నాడు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్సర్పంచ్గా గెలిపిస్తే.. పంచాయతీకి రూ.30 లక్షలు ఇస్తా మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్రావు తన సొంత డబ్బులు రూ.30లక్షలు వెచ్చిస్తున్నట్టు బాండ్ పేపర్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులు వచ్చే వరకు ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని చెక్కుతో కూడిన బాండ్ పేపర్ జీపీకి రాసిచ్చాడు. రెండో విడతలో ఆదివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.20 కిలోమీటర్లు నడిచి.. ఓటు అభ్యర్థించి..పెనుగోలు గుట్టపైకెళ్లి ప్రచారం చేసిన వార్డు అభ్యర్థి వినోద్వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు గ్రామంగుట్టలపై ఉంటుంది. కొంగాలనుంచి మూడవ వార్డుకు పోటీ చేస్తున్న లేగల వినోద్.. పెనుగోలు గ్రామస్తుల ఓట్లు తన వార్డులో ఉండటంతో 20 కిలోమీటర్లు కాలి నడకన గుట్టలపైనున్న పెనుగోలుకు చేరుకున్నాడు. ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరాడు. ఈ గ్రామానికి మూడవ విడత ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.సర్పంచ్గా గెలిపిస్తే ఎకరం భూమి ఇస్తాంబాండ్పేపర్పై అగ్రిమెంట్ రాసిచ్చిన ఇద్దరు అభ్యర్థులు భూదాన్పోచంపల్లి : సర్పంచ్గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం చిన్న గ్రామపంచాయతీ. ఇక్కడ మొత్తం 546 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయ్యింది. పంచాయతీ పరిధిలో రసాయన పరిశ్రమలు ఉండటంతో సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మి జంగారెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుమ్మి నరేందర్రెడ్డితోపాటు బీజేపీ నుంచి వస్పరి రాకేశ్ పోటీపడుతున్నారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి గుడి నిర్మాణం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గుమ్మి జంగారెడ్డి, గుమ్మి నరేందర్రెడ్డిలు పోటాపోటీగా బాండ్పేపర్లపై అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు.తమ్ముడి ఓటమి తట్టుకోలేక..అక్క మృతికథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ సర్పంచ్గా పోటీ చేసిన పోతు శేఖర్ ఓటమిపాలయ్యారు. శేఖర్ గెలవాలని కోరుట్లకు చెందిన అతడి అక్క కొక్కుల మమత(40) కొన్నిరోజులు ప్రచారం చేశారు. తమ్ముడు ఓటమి పాలయ్యాడని తెలియగానే గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శుక్రవారం మార్గమధ్యలోనే మమత మృతి చెందింది. ‘వార్డు’ అభ్యర్థి మృతిధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్ పంచాయతీలోని రెండోవార్డుకు సమ్మని రామయ్య(62) పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ తన వార్డులో ప్రచారం చేశారు. అనంతరం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. ఓడిపోయి.. సెల్టవర్ ఎక్కి రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి రంగా శుక్రవారం ఉదయం సెల్టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, రెవెన్యూ అధికారులు రంగాతో ఫోన్లో మాట్లాడి నచ్చచెప్పగా, మధ్యాహ్నం రెండు గంటలకు కిందకు దిగొచ్చాడు.గ్రీన్ మ్యాట్తో పోలింగ్ బూత్ బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో అధికారులు గ్రీన్మ్యాట్లతో డేరాలు కట్టి పోలింగ్ బూత్లు మార్చారు. -
84.28% పోలింగ్ నమోదు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 84.28 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యా హ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్టుగా ఎస్ఈసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే బారులు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్పేపర్తో బ్యాలెట్ బాక్స్లను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే ఒంటిగంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్లలో క్యూలైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా ఓటింగ్ సరళిని ఎస్ఈసీ కార్యాలయం నుంచి లైవ్ లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు కూడా పోలింగ్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. అర్థరాత్రి దాటినా కౌంటింగ్ ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో.. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. -
పంచాయతీ ముచ్చట్లు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైనా గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రాగా, టాస్లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు.టెంట్ల కిందే ఓటింగ్..దుద్యాల్ /దండేపల్లి: పాఠ శాల గదుల్లోనో, పంచాయతీ భవనంలోనో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలను ఈసారి టెంట్ల కింద పూర్తిచేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సట్రకుంటతండాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల స్కూల్, జీపీ భవనాలు మంజూరైనా, ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక టెంట్ల కింద పోలింగ్ జరిపించారు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కగూడెంలో ప్రభుత్వ పాఠశాల లేదు. పైగా పంచాయతీకి పక్కా భవనమూ లేదు. అంగన్వాడీ కేంద్రం కూడా ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రం ఆవరణలోనే టెంట్లు వేసి పోలింగ్ నిర్వహించారు.ఫ్యామిలీ పాలిటిక్స్తల్లిపై కూతురు విజయంకోరుట్లరూరల్/ ఉట్నూర్రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయి పల్లె సర్పంచ్ పదవికి తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లపు సుమలత పోటీ పడగా, కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆరుగురు బరిలో ఉన్నా, ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజీతండా సర్పంచ్గా జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్ విమల బాయిపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మాయ భర్త జాదవ్ హరినాయక్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే గ్రామ పంచాయతీకి జాదవ్ హరినాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగాడుకోరుట్లరూరల్/ శంషాబాద్ రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పోలింగ్ బూత్కు పిట్టల వెంకటి ఓటు వేసేందుకు వచ్చాడు. పోలింగ్ సిబ్బంది ఆయనకు సర్పంచ్, వార్డు సభ్యుడికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసి తీసుకురమ్మన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటి తెలుపు కలర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ నములుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి పిట్టల వెంకటిని జీపులో ఎక్కించుకొని పోలింగ్ స్టేషన్కు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు.తప్పు జరిగిందని బ్యాలెట్ పేపరు చించివేత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండాలోని పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేసేందుకు ముడావత్ సత్యనారాయణ వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే మరో అభ్యర్థికి వేసినట్టు గుర్తించి, ఆ బ్యాలెట్ పేపరును చించివేశాడు. గమనించిన ఎన్నికల అధికారి రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపారు. సత్యనారాయణ పోలింగ్ ఏజెంటుగా తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.బ్యాలెట్లో వార్డు అభ్యర్థి గుర్తు గల్లంతునాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. దీంతో గంటపాటు పోలింగ్ నిలిపివేయించి.. కొత్త బ్యాలెట్స్ తెప్పించి ఓట్లు వేయించడంతో వివాదం ముగిసింది.నాగారంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తండ్రి విజయంనాగారం: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుపై 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి తన స్వగ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలన్న కల సాకారమైంది. తండ్రి గెలుపు కోసం కుమారులు జగదీశ్రెడ్డి, సురేష్రెడ్డి, కుటుంబ సభ్యులు కృషి చేశారు. యువతతో పోటీ పడుతూ ఈ వయసులో రామచంద్రారెడ్డి విజయం సాధించడంపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలిపారు.సర్పంచ్గా గెలిచిన 80 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల సర్పంచ్ బరిలో ముగ్గురు నిలిచారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.చెక్కు చెదరని అభిమానంచనిపోయిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు సర్పంచ్గా గెలిచినట్టు ధ్రువీకరించిన అధికారులు వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేము లవాడ మండలం చింతాల్ ఠాణా సర్పంచ్ పదవికి 1,717 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెర్ల మురళికి 739 ఓట్లు, సమీప ప్రత్యర్థులు సురువు వెంకటికి 369, కొలాపూరి రాజమల్లయ్యకు 357 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈ నెల 4వ తేదీన చెర్ల మురళి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమానంతో ఓట్లు వేశారు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసిన మురళికి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు.ఆయనకు 160 ఓట్లు..మహబూబా బాద్ రూరల్ : మహబూబా బాద్ జిల్లా నడి వాడ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్ద తుతో రాగిపాటి బుచ్చిరెడ్డి పోటీ చేశాడు. ఈ నెల 9న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బుచ్చిరెడ్డి భార్య సావిత్రమ్మ గ్రామ ప్రజల కోరిక మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలోనూ గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమా నాన్ని చాటుకుంటూ ఓటేశారు. దివంగత బుచ్చిరెడ్డికి 160 ఓట్లు వేశారు.ఓటు.. బాధ్యతకొడుకు చనిపోయిన బాధలో ఉన్నా...దుద్యాల్/బోధన్ /ఇబ్రహీంపట్నం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్కు చెందిన భూకల వెంకటయ్య–పద్మమ్మల కొడుకు మల్లేశ్యాదవ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంట్లో మృతదేహం ఉండగానే, రోదిస్తూనే వెళ్లి ఓటు వేశారు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు.అంబులెన్స్లో వచ్చి.. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి మల్లవరపు ఆరోగ్యరాజు అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్లో తీసుకొచ్చారు.ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాఅహ్మద్పల్లి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తన ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీఐపీ విలేజ్ ఆ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో... మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు«ద్రెడ్డి (కాంగ్రెస్) స్వగ్రామం రంగారెడ్డిగూడెం (రాజాపూర్) గ్రామపంచాయతీలో బీజేపీ మద్దతుదారు కాటేపాగ రేవతి విజయం సాధించారు. తొలుత రేవతికి 6 ఓట్ల మెజార్టీ రాగా.. అధికార పార్టీ నాయకుల డిమాండ్తో రీకౌంట్ చేయడంతో రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. \వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్ఎస్‡ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్ట మండలం గంగిమాన్దొడ్డి పంచాయతీలో బోయపద్మ (ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గం) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టల్లపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొలను ప్రశాంత్రెడ్డి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఊరు తరలినా.. ఓట్లు అక్కడే.. కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ వాసులను పునరావాసంలో భాగంగా ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామా నికి తరలించారు. అయినా వీరి ఓట్లు ఉడుంపూర్ పరిధిలోనే ఉన్నాయి. దోసండ్ల లచ్చన్న గ్రామస్తుడి సహాయంతో మోటారుసైకిల్పై 32 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లచ్చన్నకు కళ్లు సరిగ్గా కనబడకపోయినా ఓటేసేందుకు అంత దూరం వెళ్లడం విశేషం.ఓటేసిన శతాధిక వృద్ధుడు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పంచాయతీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధుడు లాడే లింగన్న ఓటేశాడు. హుషారుగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన లింగన్నను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.హరిత పోలింగ్ కేంద్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలు. ఓటరు దేవుళ్లకు దండాలు..వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న మద్దతుదారులు.. లక్కీ.. లక్కీచాన్స్..చీటీ తీసి... సర్పంచ్ ఎంపిక టేక్మాల్/రఘునాథపల్లి /రాజాపేట/కొందుర్గు /మంథనిరూరల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి సర్పంచ్ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా, 3 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య, కాంగ్రెస్ బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. రెండుసార్లు కౌంటింగ్ చేసినా, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేర ఐదైదు చీటీలు రాశారు. ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది. దీంతో ఆయన్ను సర్పంచ్గా ఎన్నికైనట్టు ప్రకటించారు.టాస్తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికి సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండుమార్లు రీకౌంటింగ్ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థిని జోజి వరించింది.లక్ష్మక్కపల్లిలో...యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండ లం లక్ష్మక్కపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతు దారుడు ఇండ్ల రాజయ్య టాస్ ద్వారా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట ఇండ్ల రాజ య్యకు 147 ఓట్లు, వేముల సురేందర్రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయ డంతో ఇండ్ల రాజయ్యకు ఒక్క ఓటు వచ్చింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానం అయ్యాయి. ఎన్ని కల అధికారులు టాస్ వేయగా, రాజయ్యను అదృష్టం వరించింది. ఇదే పంచాయతీ పరిధి లోని 3వ వార్డులో బీమనపల్లి కృష్ణకుమార్, అయిల కిరణ్లకు చెరి 27 ఓట్లు రాగా, టాస్ వేయగా, కృష్ణకుమార్ను గెలిచాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులకు సమానంగా 392 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి మెండే రాజ య్య, బీఆర్ఎస్ నుంచి కనవేన కొమురయ్య బరిలో నిలిచారు. డ్రాలో కనవేన కొమురయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.కోటినాయక్ తండాలో... ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటినాయక్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టి టాస్లో విజేతగా నిలిచింది. ధరావత్ చిట్టికి, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు ధరావత్ తులసికి 315 చొప్పున ఓట్లు సమానంగా రాగా.. అధికారులు టాస్ నిర్వహించారు. టాస్లో ధరావత్ చిట్టి గెలుపొందింది. పోస్టల్ ఓటుతో సమానం..ఆపై టాస్తో గెలుపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాఠి రాజ్ కుమార్కు 211, గోపి రాములుకు 212, వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా, రాజ్కుమార్కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజ్కుమార్, రాములుకు ఓట్లు సరిసమానం అయ్యాయి. టాస్ వేయగా, రాజ్కుమార్ను విజయం వరించింది. వాసాలమర్రిలో... తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మాట అనురాధకు, బీఆర్ఎస్ బలపరిచిన పలుగుల ఉమారాణికి ఓట్లు 615 చొప్పున సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు టాస్నిర్వహించగా దొమ్మాట అనురాధను విజయం వరించింది. డ్రా ఫలితంపై అభ్యంతరం.. లాఠీచార్జ్ సాక్షి, సిద్దిపేట: మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్ఖాన్పల్లి సర్పంచ్గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులే. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మి కి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచి్చందో పూర్తిగా చూపించకుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. ఒక్క ఓటుతో విజయం..గూడూరు/ రేగోడ్ /మంథనిరూరల్: మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు సనుప సుజాత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. పంచాయతీ పరిధిలో 1,140 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ మద్దతుదారు నూనావత్ స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారు సుజాత అభ్యంతరం చెబుతూ రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. రీ కౌంటింగ్లో సుజాతకు 550 రాగా, స్వాతికి 549 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరగా, మరోసారి రీ కౌంటింగ్ చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో రిటర్నింగ్ అధికారులు సుజాతను విజేతగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ హాల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొండాపూర్లో...: మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ సర్పంచ్గా బేగరి పండరి ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. ఓట్ల కౌంటింగ్లలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తయ్యకు 287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ మద్దతులో పోటీలో ఉన్న బేగరి పండరికి 288 ఓట్లు వచ్చాయి. ఇదే మండల పరిధిలో గజ్వాడ సర్పంచ్గా మున్నూరి సరోజన 570 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్గా ఒక్క ఓటుతో బీఆర్ఎస్ మద్దతుదారు తోంబూరపు సుజాత విజయం సాధించారు. ప్రత్యర్థి కోరవేన వైష్ణవికి 559 ఓట్లు రాగా సుజాతకు 560 ఓట్లు వచ్చాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.ఓటు కోసం పల్లెబాటచౌటుప్పల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పెద్ద సంఖ్యలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరుగుపయనమయ్యారు. దీంతో హైదరాబాద్ మార్గంలోనూ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
కాంగ్రెస్దే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశలో గురువారం 3,835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపై విజయం సాధించగా..మరి కొన్నిచోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థులు 200కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. మేజర్ పంచాయతీల్లో పరిస్థితి కాస్త పోటీపోటీగా ఉన్నట్లు కనిపించింది.కాంగ్రెస్ విజయ దుందుభి మొత్తం 4,236 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా 396 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీనితో 3,835 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. గురువారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి..ఏకగ్రీవంగా గెలుపొందిన వారితో కలిపి కాంగ్రెస్ మద్దతు పలికిన వారు 2,440 గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని చాలా గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు పలికిన వారికే ఓటర్లు పట్టం కట్టినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే కొందరు కార్పొరేషన్ చైర్మన్ల (అధికార పార్టీ నేతలు) గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతు పలికిన వారు విజయం సాధించినట్లు సమాచారం. సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు కూడా గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. గురువారం రాత్రి వరకు 1,132 సర్పంచ్ స్థానాల్లో గులాబీ పార్టీ గెలుపొందింది. స్వతంత్రులు 364 చోట్ల విజయం సాధించగా, బీజేపీ 206 స్థానాల్లో, వామపక్షాలు 25 స్థానాల్లో గెలుపొందాయి. మిగతా చోట్ల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.చనిపోయినా సర్పంచ్గా గెలుపు ఈ ఎన్నికల్లో 95 సంవత్సరాల వృద్ధుడు సర్పంచ్గా ఎన్నికవగా.. మరోచోట ఎన్నికల బరిలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల తల్లిపై కూతురు, అత్తపై కోడలు విజయం సాధించిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ నెల 14న రెండో విడత, 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 3,835 సర్పంచ్ స్థానాలతో పాటు 27,628 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరిగాయి. -
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకు ముదిని వెల్లడించారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందాక, దానిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలి పారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదు అందిందన్నా రు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విజయో త్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనుమతికి ఆమోదం తెలిపా మని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశామన్నారు. ఎంసీసీ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు పనిచేస్తు న్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్కీబాత్’కార్యక్రమం తాము రెగ్యులర్గా నిర్వహిస్తున్నామని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారు లు అనుమతి కోరారని చెప్పారు. బుధవారం ఎస్ ఈసీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్భగ వత్, పీఆర్ఆర్డీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారి డా.జి.సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. మకరందుతో కలిసి రాణీ కుముదిని మీడియాతో మాట్లాడారు. గురువారం జరగనున్న తొలివిడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు, ఈ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్, వార్డుల ఏకగ్రీవాలకు సంబంధించి సమీక్ష, అభ్యర్థుల డిక్లరేషన్ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా ఉదంతాల్లో కేసులు నిరూపితమైతే ఆ ఎన్నికలు రద్దు అవుతాయని, ఏకగ్రీవాలపై ఆరోపణలు వచ్చిన చోట నివేదికలు కోరినట్టు చెప్పారు. నోటాను అభ్యర్థిగా పరిగణించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన వినతిపత్రంపై ఎస్ఈసీ స్పందన ఏమిటని ఓ విలేకరి కోరగా.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలి, సింగిల్ నామినేషన్ వస్తే ఏమి చేయాలి తదితరాలపై వేసిన పిల్పై విచారణ సుప్రీంకోర్టులో ఉందని రాణీకుముదిని తెలిపారు. దానిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా తాము కూడా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. మహేశ్భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, వస్తువులు, డ్రగ్స్ ఇలా అన్ని కలిపి రూ.7,54 కోట్ల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏకగ్రీవాలకు సంబంధించి సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులపై అక్కడి పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలపై 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడే 'తొలి' పోరు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభానికి గంట ముందే ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి పూర్తి కాగానే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన వారిలో విజేతలను ప్రకటించనున్నారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను చేపడతారు. మొదటి దశలో 3,834 సర్పంచ్ పదవులకు 12,960 అభ్యర్థులు, 27,628 వార్డుసభ్య స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విడతకు సంబంధించి 5 గ్రామాలకు, 169 వార్డులకు అసలు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి. 396 పంచాయతీల్లో సర్పంచ్లు, 9,633 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒక సర్పంచ్ స్థానంలో, 10 వార్డులలో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు జరగడం లేదు. ఇక పోటీలో ఉన్న సర్పంచ్అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్ బ్యాలెట్ పేపర్ గులాబీ, వార్డు సభ్యుడి బ్యాలెట్పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగియగానే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. సామాగ్రి, సిబ్బంది రెడీ.. పోలింగ్కేంద్రాలకు బుధవారం ఎన్నికల సామాగ్రి చేరుకుంది. సాయంత్రం కల్లా పోలింగ్సిబ్బంది కూడా చేరుకున్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఓటరు స్లిప్పుల విషయంలో ఈసారి ఎస్ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది. పోలింగ్కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి స్లిప్పులను పంపిణీ చేశారు. బుధవారం సాయంత్రం కల్లా వంద శాతం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఇవి అందనివారి కోసం పోలింగ్ రోజు కేంద్రం బయట బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. నేరుగా tsec. gov. in వెబ్సైట్ నుంచి కూడా ఫొటో లేని ఓటరు స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు నుంచే మద్యం అమ్మకాలను నిషేధించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆధార్, పాస్ట్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, బ్యాంక్ పాస్బుక్ తదితర గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చునని ఎస్ఈసీ ప్రకటించింది. -
ఓట్లప్పుడే వస్తారా?
పంచాయతీ ఎన్నికల వేళ.. అభివృద్ధి నోచుకోని గ్రామాలు, తండాల ప్రజలు ఓటుకు దూరంగా ఉంటామని ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్నికలు అనగానే వాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సౌకర్యాలు కల్పించేవరకు ఓటెయ్యంరాయపర్తి/ ఇంద్రవెల్లి: ‘అరవై ఏళ్లుగా తండాలో అన్నీ ఇబ్బందులే.. సౌకర్యాలు వచ్చే వరకు ఓటు వేయం ’అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రం శివారులోని గుబ్బెడుబోడుకింది తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసం ఓటు అడగడానికే వస్తున్నారు కానీ ఆ తర్వాత మా తండాను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో 45 ఓట్లు, 60 మంది జనాభా ఉంటుందని, సరైన రోడ్డు, తాగునీటి సౌకర్యం, వీధిస్తంభాలు, విద్య, వైద్యం అందుబాటులో లేవని చెప్పారు. తెలిపారు తండాను రాయపర్తి నుంచి వేరు చేసి జేతురాంతండాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం తండాకు చేరుకొని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, అంతా ఓటింగ్లో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేయించారు. అయినా, తాము ఓటింగ్లో పాల్గొనబోమని తండావాసులు తేల్చిచెప్పారు. ఎన్నికలకు దూరం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్పూర్, గోపాల్పూర్గూడ గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. మంగళవారం గ్రామ సమీపంలోని వాగు వద్దకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వేస్తామని, అభివృద్ధి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత ఎవరూ ఇటువైపు రావడం లేదన్నారు. సర్పంచ్ అభ్యర్థి కుటుంబానికి పోలీస్ భద్రతచింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిని జాడి దర్శన కుటుంబానికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దర్శన సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా, ఉపసంహరించుకోవాలని గుర్తుతెలియని వ్యక్తులు దళం పేరిట గురువారం తుపాకీతో బెదిరించి లేఖ అందజేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోశ్కుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్ విచారణ చేపట్టారు. అనంతరం దర్శన కుటుంబానికి రక్షణగా రణవెల్లిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రతినిత్యం ఒక ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతిమహబూబాబాద్ రూరల్ /ములకలపల్లి: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్గా రాగిపాటి బుచ్చిరెడ్డి (70) బరిలో ఉన్నాడు. సోమవారం రాత్రి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఇనుగంటి నాగప్రసాద్ (57) నర్సా పురం పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. పంచాయతీ ప్రచారంలో మహిళలు...ఖాళీగా పల్లె వెలుగు బస్సులు కోదాడ: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కా లు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు.అవినీతి కన్నా.. అడుక్కు తినడం మిన్నవరంగల్లో యాచకులతో వినూత్న ర్యాలీహన్మకొండ చౌరస్తా: ‘అవినీతి కన్నా.. అ డుక్కు తినడం మి న్న ’అంటూ జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్సత్తా ఉద్యమ సంస్థ సంయుక్త ఆధ్వ ర్యంలో మంగళవారం వరంగల్లో యాచకుల తో కలిసి ర్యాలీ నిర్వ హించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. లోక్సత్తా ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు, లోక్సత్తా సంస్థ సభ్యు డు శ్రీనివాసరెడ్డి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.ఫ్యామిలీ పంచాయతీ హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూద న్పల్లి సర్పంచ్ పదవికి పోటీలో తల్లీకూతురుతోపాటు అల్లుడి అన్న కోడలు రంగంలో ఉన్నారు. సూదన్పల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే ఆరుగురు పోటీలో ఉన్నారు. వీరిలో తల్లీకూతురు ఆకారపు లచ్చమ్మ, తిక్క శైలజతోపాటు తిక్క మాధవి (శైలజ భర్త సోదరుడి కోడలు) కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఆకారపు లచ్చమ్మ 2006–2011 వరకు సర్పంచ్గా పనిచేశారు.పంపిణీకి కాదేది అనర్హం పర్వతగిరి/సంగెం: పంచాయతీ ఎన్నికల ప్రలోభాల్లోనూ చిత్ర విచిత్రాలు జరుగు తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో మహిళలను ఆకట్టు కునేందుకు ముగ్గు, చాయ్పత్త ఉచితంగా ఇస్తున్నారు. చేపలు కూడా పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లవాయి నుంచి రేషన్ బియ్యాన్ని తన సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి గ్రామంలో పంపిణీ చేసేలా చూస్తానని వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మడివరం సర్పంచ్ అభ్యర్థి ఇజ్జగిరి అశోక్ ఓటర్లకు హామీ ఇస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. -
'పొత్తు' విభేదాలు చిత్తు
సాక్షి నెట్వర్క్: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవే అయినా.. స్థానిక రాజకీయాల దృష్ట్యా పొత్తులు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. ఢిల్లీలో శత్రువులు.. గల్లీలో మిత్రులు అన్నట్టు ఉంది పంచాయతీ ఎన్నికల్లో పొడిచిన పొత్తుల పరిస్థితి.. » మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు చేయి కలిపారు. » ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అనాసాగరంలో సీపీఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కొన్ని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, సీపీఎం జత కట్టాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో కొన్నిచోట్ల బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. » జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గా లుగా విడిపోయింది. పాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలి సి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లా రాకొండ, సింగారం, వనపర్తి జిల్లా పాన్ గల్ మండలంలోని రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్, మదనా పురం మండలంలోని కొత్తపల్లి, నర్సింగాపురం, అమరచింత మండలం చంద్రగడ్లో బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయి. నారాయణ పేట జిల్లా ఎక్లాస్పూర్, గోటూర్.. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకమై పోరులో నిలిచారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గుంటిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్గా.. బీజేపీ మద్దతుదారు ఉప సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. » నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో పోటీ చేస్తుండగా మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పోటీ నెలకొంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్– ఎస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, సీపీ ఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా, గట్టికల్లు గ్రామంలో బీజే పీ,బీఆర్ఎస్, సీపీఎం, కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి. » మంచిర్యాల జిల్లా భీమిని మండలం లక్ష్మీపూర్, కేస్లాపూర్లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు అంతా కలిసే పోటీ చేస్తున్నారు. తాండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సఖ్యత కోసం పావులు కదుపుతున్నారు.ప్రాణం తీసిన పంచాయతీ ఎన్నికలు?ఒత్తిడి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో పుష్ప పోటీలో ఉంది. అయితే ఆమె భర్త రవీందర్ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. రవీందర్ గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా కూడా చేశాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్కు ఇద్దరు కుమారులు ఉన్నారు.సర్పంచ్ ఓట్లు.. కోతులకు పాట్లుచిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికలు కోతులకు తిప్పలను తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఓ వ్యక్తి కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించే చర్యలకు ఉపక్రమించాడు. గురువారం గ్రామంలో దాదాపు 500 కోతులను పట్టించి, బోనులో బంధించాడు. వాటిని మంథని, మహదేవ్పూర్ అడవులకు ప్రత్యేక వాహనంలో తరలించాడు.మూడు తరాల సర్పంచ్లుపాపన్నపేట(మెదక్): 3 తరాలుగా సర్పంచ్ పదవులు చేపట్టి పట్లోల్ల కుటుంబం రాజకీయాధిపత్యాన్ని చాటుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేట గ్రామానికి చెందిన పట్లోల్ల శివరాంరెడ్డి 1959లో గ్రామ మొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1964లో ఆయన అన్న బలరాంరెడ్డి కొడుకు రామచంద్రారెడ్డి సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి కోడలు అనిత సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలరాంరెడ్డి సొంత తమ్ముడు నారాయణరెడ్డి 1970 నుంచి 1981 వరకు సర్పంచ్గా పని చేశారు. అనంతరం 1981లో మెదక్ సమితి ప్రెసిడెంట్గా ఎన్ని కయ్యారు. ఆపై 1989 నుంచి 1994 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం నారాయణరెడ్డి కుమారుడు పట్లోల్ల శశిధర్రెడ్డి 2004లో మెదక్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.సర్పంచ్ బరిలో కార్వాన్ ఎమ్మెల్యే సతీమణివెల్దుర్తి(తూప్రాన్): కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియొద్దీన్ సతీమణి, పాతబస్తీలో రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేసిన నజ్మా సుల్తానా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్ప ంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. బస్వాపూర్ కౌసర్ మొహియొద్దీన్ స్వగ్రా మం కాగా, నజ్మాసుల్తానా గురువారం తన కుమారుడితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు.కుల సంఘం ఓట్ల కోసం రూ.10 లక్షలకు వేలంకల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫత్తేపూర్లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి తనకే గంపగుత్తగా మెజారిటీ ఓట్లు పొందేందుకు ఓ కుల సంఘం నేతలతో కలిసి వేలం పాట జరిపారని సమాచారం. కాంగ్రెస్ బలపర్చిన మరో అభ్యర్థి ఇతర కుల సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రూ.9 లక్షల వరకు వేలం జరిపారు. దీంతో గ్రామంలో మెజారిటీ ఓట్లు ఉన్న కుల సంఘం, ఇతర కుల సంఘాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దారు.సర్పంచ్ పదవి .. రూ.75 లక్షలు!చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ అయ్యింది. దీంతో పోటీ పెరిగి అభ్యర్థులు తమ సొంత డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇంతటితో ఆగకుండా పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో ముగ్గురు వ్యక్తులు పోటీ పడగా ఓ అభ్యర్థి రూ.75లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలో..పోతిరెడ్డిపల్లికి చెందిన వేణుమోహన్పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా సోషల్ మీడియాలో వేణుమోహన్ పోస్టు చేశారు. దీంతో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నవీన్ తెలిపారు.నా భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీదుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో తన భార్యను గెలిపిస్తే ఐదేళ్లు కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానంటూ ఓ భర్త వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. 6వ వార్డు నుంచి శ్రీకాంత్ భార్య శివాని బరిలో ఉన్నారు. నాయీ బ్రాహ్మణుడైన శ్రీకాంత్ తన భార్య గెలుపు కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడు.11 రోజుల పసికందుతో నామినేషన్ కేంద్రానికి..వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ స్థానానికి జాలపల్లి సౌందర్య తన 11 రోజుల చంటి పాప, భర్తతో కలిసి గురువారం నామినేషన్ దాఖలు చేసింది.ఆడబిడ్డ పెళ్లికి రూ. 25 వేలు.. గృహ ప్రవేశానికి రూ. 10 వేలుసర్పంచ్గా గెలిపిస్తే అమలు చేస్తానని హామీపత్రంకల్లూరురూరల్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్పంచ్గా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు(వాసు) ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాడు. సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామంలోని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 25,116, పేదల గృహప్రవేశానికి రూ.10,116 అందచేస్తానని ప్రకటించాడు. పేదిళ్లలో ఆడబిడ్డ ప్రసవానికి రూ.10,116 ఇవ్వడంతోపాటు పురుషులు, మహిళా వ్యవసాయ కూలీలకు సొంత డబ్బుతో ప్రమాద బీమా చేయిస్తానని, అనారోగ్యంతో అత్యవసర చికిత్స అవసరమైన వారికి రూ.5 వేల నుంచి రూ.10వేలు అందిస్తానని ప్రకటించారు. రూ.100 బాండ్పై హామీపత్రం తయారు చేయించి పంపిణీ చేస్తున్నాడు. -
రెండో విడత పంచాయతీకి భారీగా నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు పడ్డాయి. 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్ల సమర్పణతో అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. ఈ నెల 14న జరగనున్న రెండోవిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. రాత్రి పొద్దుపోయేదాకా పలు పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. వివిధ జిల్లాల్లో పడిన నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) చేరాయి. దీంతో రెండోవిడత నామినేషన్ల వివరాలను ఎస్ఈసీ సాయంత్రం వెల్లడించింది. నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్: రెండో విడతలోనూ సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల సంఖ్య విషయంలో నల్లగొండ జిల్లా టాప్ప్లేస్లో నిలిచింది. ఈ జిల్లాలోని 282 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 2,116 నామినేషన్లు, 2,418 వార్డులకు 6,120 నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లాలో 181 పంచాయతీలకు 1,447 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే ఇక్కడ సగటున ఒక్కో సర్పంచ్ సీటుకు 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. అదే నల్లగొండ జిల్లాలో సగటున 7.5గా పోటీ ఉంది. సూర్యాపేట జిల్లాలో 1,628 వార్డులకు 4,378 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 183 సర్పంచ్ స్థానాలకు 1,055 నామినే షన్లు పడగా, 1,686 వార్డులకు 4,160 నామినేషన్లు అనూహ్యంగా దాఖలయ్యాయి. ఏజెన్సీలో తగ్గిన జోరు: మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డులకు పోటీ కాస్త తక్కువగానే ఉంది. ములుగు జిల్లాలోని 52 పంచాయతీలకు అత్యల్పంగా 288 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో సగటున ఒక్కో సీటుకు 5 నుంచి 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, హనుమకొండ జిల్లాల్లో కూడా నామినేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఇంకా తేలని తొలివిడత అభ్యర్థుల లెక్క సాక్షి, హైదరాబాద్ : తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు ఆయా జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు చేరలేదు. 31 జిల్లాల పరిధిలోని 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులకు 11న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను పంచాయతీలలోని నోటీస్ బోర్డులపై ప్రచురించారు. పలు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ప్రకటించారు. అయితే ఏ జిల్లాలో ఎంత మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారనే దానిపై సమాచారం రాత్రి వరకూ ఎస్ఈసీకి అందలేదు. దీంతో అధికారికంగా ఏకగ్రీవమైన సర్పంచ్ల వివరాలు ప్రకటించలేదు. వివరాలను నేడు ఎస్ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. మొదటిదశ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. -
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకే ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసమే పంచాయతీ ఎన్నికలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి స్పష్టం చేశా రు. రాజ్యాంగ ఉద్దేశం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనాభా లేని వర్గాలకు సర్పంచ్, వార్డు స్థానాలను రిజర్వ్ చేస్తే ఎన్నికలు నిలిచి పోయి వాటి ప్రయోజ నానికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర వర్గాలకు రిజర్వ్ చేయాలని తాము ఆదేశిస్తే అది ఎన్నికల నిర్వహణ ను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. తమ ముందున్న పిటిషన్లు విసృత పరిణామాలతో ముడిపడి ఉన్నందున వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వా యిదా వేశారు. వరంగల్ జిల్లా మహమూద్ పట్నంలో ఆరుగురు ఎస్టీలుంటే సర్పంచ్ పోస్టుతోపాటు 3 వా ర్డులను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యాకూబ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటివే మరో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ టి. మాధవీదేవి విచా రణ చేపట్టి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిలిచిపోవడం సరికాదు.. ‘రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 25న నోటిఫికేషన్ ఇచ్చింది. 2011 జనాభా లెక్క లు, 2014 గణాంకాల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభాను తీసుకొని పాలసీ ప్రకారం, రోస్టర్ రొటేషన్ ద్వారా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను రిజర్వ్ చేసింది. తమ గ్రామాల్లో రిజర్వేషన్ కులం లేదని కొందరు, అతికొద్ది మందే ఉన్నారని మరికొందరు పిటిషన్లు వేశారు. రిజర్వ్ అయిన కులాల వారు లేకుంటే స్థానాలు ఖాళీగా ఉండే ఉంటాయని.. అలాంటి చోట రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని, సంబంధిత గ్రామాల్లోని ప్రస్తుత జనాభా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్లు కోరుతున్నారు. 2011 జనగణన డేటాను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశామని, ఇప్పటి డేటాను తీసుకోలేమన్నది అదనపు అడ్వొకేట్ జనరల్ వాదన. ఈ పిటిషన్లలో విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసు కుంటే ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరగకపోవడం సముచితం కాదు. వాటిని ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం’అని తీర్పు కాపీలో న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
పంచాయతీ పదనిసలు
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ...చిత్ర విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. రిజర్వేషన్ మార్చలేదని ఒక గ్రామంలో ఎవరూ నామినేషన్ వేయలేదు. మరో చోట కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగాడు. డబ్బులు, మద్యం ఎన్నికల్లో పంచవద్దని గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులతో ఇంకో చోట ప్రమాణం చేయించారు. అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన రిటైర్డ్ ఎస్ఐ లక్ష్మారెడ్డి దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామ సర్పంచ్ పదవి జనరల్కు రిజర్వు అయ్యింది. ములుగు ఎస్ఐగా పనిచేసిన పోరెడ్డి లక్ష్మారెడ్డి కొన్ని నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. తన పిల్లలు అమెరికాలో ఉండడంతో కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లారు. ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. పోటీ చేయాలని అనుకున్న లక్ష్మారెడ్డి సర్పంచ్ నామినేషన్ ఫామ్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని సంతకం చేసి స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. ఆ నామినేషన్ను బలపరిచిన పోరెడ్డి శరత్ లక్ష్మీపురం క్లస్టర్లో రిటరి్నంగ్ అధికారి భద్రమ్మకు అందించారు. అమెరికాలో ఉండి సర్పంచ్ పదవికి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. 2013 నుంచి 2018 వరకు లక్ష్మారెడ్డి భార్య సుభద్ర బంధంపల్లి సర్పంచ్గా పనిచేశారు. కుటుంబ సభ్యుల మద్దతు లేదని.. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘణపూర్ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వు అయ్యింది. మాజీ ఉపసర్పంచ్ ఘనపురం ఎల్లయ్య (ఎల్లం) తోపాటు అతని అన్న బాల్నర్సయ్య, చిన్నాన్న కుమారుడు సాయిలు పోటీలో ఉండాలని అనుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందినవారు పోటీలో ఉండడం మంచిది కాదని బాల్ నర్సయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఒక్కరే పోటీలో ఉండాలని చెప్పినా వినకుండా ఎల్లంతోపాటు సాయిలు కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు సహకరించడంలేదని మనస్తాపం చెందిన ఎల్లయ్య మంగళవారం పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. పాండురంగాపురం..నామినేషన్లు నిల్ ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడంపై గ్రామస్తుల నిరసన పాల్వంచరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. 1,202 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా, రెండు వార్డు స్థానాలు ఎస్టీ జనరల్కు, ఇంకో రెండు వార్డు స్థానాలు ఎస్టీ మహిళలకు, మిగతా నాలుగు జనరల్, జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో మొదటి నుంచి రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్న గ్రామస్తులంతా ఏకమై ఎవరూ నామినేషన్లు దాఖలు చేయొద్దని నిర్ణయించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే మంగళవారం సాయంత్రం వరకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డిని వివరణ కోరగా పాండురంగాపురంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని చెప్పారు. సర్పంచ్గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న గోమాస శ్యామలత శ్రీకాంత్ ఓటర్లకు 20 వాగ్దానాలతో కరపత్రం విడుదల చేశారు. సర్పంచ్గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తానని, అర్హులైన వారికి నెల రోజుల్లో పింఛన్ మంజూరు చేయిస్తానని, గ్రామస్తులందరికీ మినరల్ వాటర్, ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం, ఇంటి ఆడబిడ్డ పెళ్లికి రూ.5 వేలు కట్నం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కేవీకే సోలార్ పవర్ప్లాంటులో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం తదితర హామీలు ఇచ్చారు. రంగపేట శివారులోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేయించి నిరుపేదలకు పంపిణీ చేయిస్తానని హామీ కూడా ఇచ్చారు.ఈ కరపత్రం వాట్సాప్ గ్రూప్ల్లో వైరల్ అయ్యింది. ఒకటోసారి..రెండోసారి..మూడోసారి సర్పంచ్ పదవులకు కొనసాగుతున్న వేలం పాటలు పాల్వంచరూరల్/నేలకొండపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెంలో రామాలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చే వారినే సర్పంచ్, ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో సర్పంచ్ పదవి ఆశిస్తున్న కేలోతు సునీత రూ.6 లక్షలు, ఉప సర్పంచ్ పదవి కోసం నాగేశ్వరరావు రూ.2.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం జీపీలోనూ ఆలయ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి రూ.8 లక్షలు, ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.4లక్షలు, వార్డు సభ్యులు రూ.10 వేల నుంచి రూ.50 వేలు ఇచ్చేలా అంగీకరించినట్టుతెలిసింది. దీంతో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీల నేతలు ఓ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. తండా ఒక్కటే.. పంచాయతీలు రెండు మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డ తండాలో రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. ఇటుకల గడ్డతండాలో ప్రధాన రహదారికి ఓ వైపు ఎలమంచిలితండా పరిధిలో, మరో వైపు గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. అన్ని రోజులు కలిసి ఉండే తండావాసులు పంచాయతీ ఎన్నికల వేళ రెండు గుంపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తారు. ఎమ్మెల్యే గండ్ర స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం గణపురం: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామమైన గణపురం మండలం బుద్దారంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ విడిదినేని శ్రీలతను బలపరచగా, బీఆర్ఎస్ తరఫున కొంరాజు అమృత నామినేషన్ వేశారు. మంగళవారం అమృత నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో శ్రీలత ఎన్నిక ఏకగ్రీవమైంది. వరంగల్ జిల్లా సంగెం మండలం పెద్దతండా సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ వినోదతోపాటు 8 వార్డులకు 8 మందే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పంచాయతీ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. ఇద్దరు భార్యలతో నామినేషన్లు మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉన్నత విద్యావంతులైన ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయించారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో మంగళవారం రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవమవుతుంది. గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తామని ఈ కుటుంబం చెప్పడంతో ఇతరులు పోటీలో లేరు.జెండాలన్నీ ఒక్కటయ్యాయి కోదాడ: పంచాయతీ ఎన్నికల్లో పలు పార్టీల నేతలు తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను కలిపేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. బేతవోలులో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అభ్యర్థికి బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ నాయకులు మద్దతునిస్తూ ఆయా పార్టీల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇదే గ్రామంలో కాంగ్రెస్లోని మరో వర్గం అభ్యర్థి సీపీఎంతో కలిసి పోటీకి నిలబడింది. చిలుకూరు మండల కేంద్రంలో సీపీఐ అభ్యర్థికి బీఆర్ఎస్లోని ఒక వర్గం మద్దతుగా ఇస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్లో మరో వర్గంతోపాటు టీడీపీ మద్దతుగా నిలుస్తున్నాయి. సర్పంచ్ బరిలో అత్తాకోడలు పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్(ఘనశ్యాందాస్నగర్) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో ఆదివారం నామినేషన్ వేయించారు. మంగళవారం నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకేఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచినట్టయ్యింది. గతంలో జీడీనగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా, సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ)ను సర్పంచ్గా గెలుపొందించుకున్నారు. జీడీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. ఆయన వదిన కూడా పోటీ చేయడం గమనార్హం.సాఫ్ట్వేర్ టు సర్పంచ్ వార్ మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన వీరబత్తిని మాలతి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. ఆమె హైదరాబాద్లోని విప్రో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేశారు. ఆర్మీ జవాన్ కూడా...: ఇదే మండల పరిధిలోని నూకపల్లి సర్పంచ్గా రిటైర్ట్ ఆర్మీ జవాన్ చెవులమద్ది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.17 ఏళ్లు ఆర్మీలో జవాన్గా దేశానికి సేవలందించానని, ఇప్పుడు స్వగ్రామానికి సేవలందించాలనే లక్ష్యంతో తాను బరిలో ఉన్నట్టు తెలిపారు. అక్రమంగా సంపాదిస్తే జప్తు చేసుకోండి బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్ధి తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జైపాల్నాయక్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇప్పుడు తనకు ఉన్న ఆస్తి కన్నా ఒక్క రూపాయి అక్రమంగా ఎక్కువ సంపాదించినా.. ఆ ఆస్తిని గ్రామపంచాయతీ జస్తు చేసుకొని ప్రజలకు పంచొచ్చని బాండ్ పేపర్ రాసి ప్రజలకు పంచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. అవినీతికి పాల్పడితే పదవి నుంచి దించేస్తాం చేర్యాల(సిద్దిపేట): ‘గ్రామ సర్పంచ్గా గెలిచిన వ్యక్తి అవినీతికి పాల్పడినా, స్వార్థ ప్రయోజనాలకు పదవిని దురి్వనియోగం చేసినా ఏసీబీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. పదవి నుంచి దింపేందుకు వెనుకాడం’అని జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచం భీంపల్లిలో సర్పంచ్ అభ్యర్థులతో గ్రామస్తుల ముఖాముఖి కమలాపూర్: ఈ నెల 11న మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తాము డబ్బులు, మద్యం పంచబోమని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ప్రమాణం చేశారు. జవ్వాజి కనుకయ్య, తోట శంకరయ్య, వాసాల శ్రీనివాస్, సముద్రాల మొగిలిలతో గ్రామస్తులు మంగళవారం ఉమ్మడి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికల్లో తాము సర్పంచ్గా గెలిస్తే చేసే అభివృద్ధి పనుల ఎజెండాను సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులకు వివరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచబోమని అభ్యర్థులు హామీ ఇవ్వాలని గ్రామస్తులు కోరగా, సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
నేటి నుంచి మూడో విడత ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 36,452 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగుతాయి. శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంంటుంది. 6వ తేదీన నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఈ నామినేషన్ల తిరస్కరణపై 7న వినతులు స్వీకరించి, 8న వాటిని పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 11వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్ఈసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు మంగళవారంతో ముగిసింది. రాత్రి వరకు కూడా పలు జిల్లాల్లోని పంచాయతీల్లో నామినేషన్ల సమర్పణ కొనసాగినట్టుగా ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు రోజులకు సంబంధించిన నామినేషన్ల వివరాలను బుధవారమే వెల్లడించే అవకాశాలున్నాయి. రెండో విడతలో నోటిఫై చేసిన 4,332 సర్పంచ్ పదవులకు రెండు రోజులు కలిపి మొత్తం 12,479 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యుల విషయానికొస్తే 38,350 వార్డులకు 30,040 నామినేషన్లు పడ్డాయి. జిల్లాల వారీగా చూస్తే.. సర్పంచ్ నామినేషన్లలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 883 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే.. రంగారెడ్డి జిల్లాలో ఆశావహులు క్యూ కట్టారు. ఇక్కడ అత్యధికంగా 2,070 నామినేషన్లు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో నామినేషన్లు తక్కువగానే పడ్డాయి. -
సర్పంచ్: 5,654 వార్డులు: 82,276
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్య లో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్లో ఉండటంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఆదివారం తొలివిడత నామినేషన్ల సంఖ్య తేలింది. మొదటి విడతలో 4,236 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 25,654 మంది, 37,440 వార్డులకు 82,276 మంది నామినేషన్లు వేశారు. ⇒ సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమరి్పంచారు. ఇక్కడ 159 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీల్లో సర్పంచ్ల కోసం1,383 నామినేషన్లు వేయగా, మహబూబాబాద్లో 155 పంచాయతీలకుగాను 1,239, కామారెడ్డి 167 జీపీలకు 1,224, రంగారెడ్డిలో 174 జీపీలకు 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి. ⇒ వార్డు సభ్యుల విషయానికి వస్తే సీన్ మారింది. పంచాయతీలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో వార్డు స్థానాలకు నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కూడా వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకుగాను 4,540, వికారాబాద్ 2,198 వార్డులకుగాను 4,379 నామినేషన్లు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 4,041, కామారెడ్డిలో 1,520 వార్డులకు 3,832, సూర్యాపేటలో 1,442 వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి. 3న నామినేషన్లు ఉపసంహరణ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు. స్రూ్కట్నీ చేసి అభ్యర్థుల జాబితా రూపొందించారు. తిరస్కరించిన నామినేషన్లపై సోమవారం సా యంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. మంగళవారం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు.బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యా హ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రెండో విడత నామినేషన్లు షురూ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుంచి మొదలైంది. అయితే అర్ధరాత్రి వరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రాలేదు. రెండో విడతలో 4,333 సర్పంచ్, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 14న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది. -
చిత్ర విచిత్ర పంచాయతీలు
పంచాయతీ ఎన్నికల వేళ...గ్రామాల్లో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు వేయడం లేదని కొందరు...భూ సమస్య పరిష్కరించడం లేదంటూ మరికొందరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని గ్రామాలకు చెందిన యువకులు తాము నోట్లకు అమ్ముడుపోమని, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు నిస్వార్థంగా వినియోగించుకుంటామని చెప్పారు. ‘నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు’ హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాందారి రమేశ్ తన ఇంటి వద్ద ఈ ఫ్లెక్సీ ప్రదర్శించాడు. ‘నేను మడిపల్లివాసిని.. నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు’అని అందులో రాసి ఉంది. ‘మా ఓట్లు అమ్మబడవు’ హుస్నాబాద్ రూరల్: ‘రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనది. మేము అమ్ముకోం’అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాం«దీనగర్ గ్రామ యువకులు ఆదివారం తమ ఇళ్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బోజ అనిల్కుమార్, కొడముంజ అనిల్కుమార్, ఎర్రవెల్లి సంపత్లు పట్టభద్రులు. వీరు గ్రామాభివృద్ధి కమిటీని బలోపేతం చేసి స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకొనేలా యువతను చైతన్యం చేస్తున్నారు. రిజర్వు ఓటరు ఒక్కరే...ఆమెనే సర్పంచ్ మాడుగులపల్లి: నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి మహిళకు రిజర్వు అయ్యింది. అయితే గ్రామంలో బ్రాహ్మముల రోజా ఒక్కరే ఎస్టీ మహిళా ఓటరు. రోజా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగీవ్రం అయ్యే అవకాశముంది. 2014 పంచాయతీ ఎన్నికల్లోనూ గజలాపురం ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. ఆ ఎన్నికలో ఆమె 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎస్టీకి రిజర్వ్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న కుటుంబం వెళ్లిపోవడంతో.. గ్రామంలో ఇప్పుడు ఒకే ఎస్టీ ఓటు ఉంది. జైలు నుంచి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బూర బాబు ఇటీవల జరిగిన ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో బూర బాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా, వారి బంధువులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నువ్వే పోటీ చేయాలంటూ కాళ్లు పట్టుకున్న ఓటరు దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దాట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీశ్ తల్లి రాములమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదివారం ఓ ఓటరు ఆమె కాళ్లపై పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవం నారాయణపేట/ మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస్ సతీమణి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గుంటల భూమిని ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఎనిమిది వార్డులుండగా, వారు అవి కూడా తను చెప్పిన వారినే ఓకే చేసేందుకు పెద్దలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ఆమె సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్గా గెలిపిస్తే 22 గ్యారంటీలు అమలు చేస్తా గద్వాల టౌన్: పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే 22 గ్యారంటీలను అమలు చేస్తానని రూ.100 బాండ్ పేపర్ను ఓ అభ్యర్థి హామీ పత్రంగా విడుదల చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ పదవికి ఆంజనేయులు నామినేషన్ వేశారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్ను విడుదల చేయడం చర్చనీయాంశమైందితన కుల ఓట్ల కోసం.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువనేత తన కులం కాకుండా వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో తన కులం ఓట్లు మెజారిటీగా ఉండడం.. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే ఓట్లు పడవు అనుకున్నాడో ఏమో గానీ ఆమెను ఎవరికీ తెలియకుండా దాచేశాడు. ఆమెను వేరే ఊరిలో పెట్టి కాపురం చేస్తూ గ్రామంలో మాత్రం తనకు పెళ్లి కానట్టు చెబుతూ సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం చేసుకుంటున్నాడు. రోడ్డు విస్తరణ చేపట్టకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ వెళ్లే ప్రధాన రహదారిని రెండు లేన్లుగా విస్తరించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బండపోసాన్పల్లి, శెట్టిపల్లి కలాన్, రామాయిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన యువకులు ఆయా గ్రామాల గుండా బైక్ ర్యాలీ చేపట్టి శెట్టిపల్లికలాన్లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్డు విస్తరణ చేపట్టాలని పాదయాత్ర, సంతకాల సేకరణ చేపట్టి కలెక్టర్కు అందజేసినా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా భూ సమస్య పరిష్కరిస్తేనే... అక్కన్నపేట(హుస్నాబాద్): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్నాయక్ తండాలో రైతులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. తండాలో ఆదివారం ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూముల రిజిస్ట్రేషన్లు కావడం లేదని అనేకసార్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఎదుట మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు. ధరణిలో సీలింగ్ భూమి కింద నమోదు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. -
‘పంచాయతీ’ నిబంధనలెన్నో..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లకూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థి నియమించుకునే పోలింగ్ ఏజెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఓటరుగా నమోదై ఉండాలి. ఓటరు ఫొటో గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఏదైనా ఇతర గుర్తింపు డాక్యుమెంట్ కలిగి ఉండాలి. దీనివల్ల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) భావిస్తోంది. లెక్కలు చెప్పాల్సిందే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారి ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు తప్పనిసరిగా చూపించాలి. గతంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార వ్యయం వివరాలను ఎప్పుడో గానీ తెలియజేస్తూ ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాలి. ఎవరూ ప్రచార ఖర్చు వివరాలు కోరితే వారికి వాటిని అందించాలని ఎస్ఈసీ సూచించింది. తద్వారా అభ్యర్థులు చేసే ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు తెలియడంతోపాటు, పెరిగే ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసేవారు చేస్తున్న ప్రచార, ఇతరత్రా వ్యయం వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నారు. అభ్యర్థుల వ్యయంలో మార్పు లేదు నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఎన్నికల ఖర్చు పరిమితిని ఐదువేల జనాభా దాటిన గ్రామాల సర్పంచ్ అభ్యర్థులకు రూ.రెండున్నర లక్షలు, ఐదువేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.లక్షన్నర పరిమితికి పెంచారు. ఐదువేల పైబడిన జనాభా ఉన్న పంచాయతీల్లోని వార్డుల అభ్యర్థులకు రూ.యాభైవేలు, ఐదువేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లోని వార్డు అభ్యర్థులకు రూ.30 వేల వ్యయ పరిమితిని ఎస్ఈసీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ (2019 జనవరిలో) అభ్యర్థులకు ఇంతే పరిమితి ఉంది. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగినా కూడా పాత పరిమితినే కొనసాగిస్తుండడం పట్ల రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు » ఎన్నికలకు సంబంధించిన న్యాయ పరమైన నిబంధనలు ఎవరికి వారే స్వయంగా తెలుసుకోవాలి » నిర్దేశిత (నమూనా–3ధ్రు) పత్రం ప్రకారం నామినేషన్ ఉందా లేదా అభ్యర్థి, ప్రపోజర్ల సంతకాలున్నాయా లేదా చూసుకోవాలి » అభ్యర్థి సంతకం చేసిన స్వయం ధ్రువీకరణ పత్రం మరో ఇద్దరి సంతకాలతో ధ్రువీకరణ అయ్యిందో లేదో సరి చూసుకోవాలి » నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే సమరి్పంచాలి» నిర్ణీత పద్ధతి ప్రకారం ఎన్నికల ఏజెంట్ను నియమించుకోవాలి» నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయ్యే ఎన్నికల వ్యయాన్ని ఎస్ఈసీ నిర్దేశిత నమూనాలో సరైన పద్ధతిలో నిర్వహించాలి.బ్యాంక్ ఖాతా తెరవాల్సిందే... ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్లో ఖాతా తెరవాలి, నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటరి్నంగ్ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఈ బ్యాంక్ ఖాతా నుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి. -
కావేవీ ఎన్నికల గుర్తులకు అనర్హం
సాక్షి, హైదరాబాద్: ఉంగరం, కత్తెర, క్రికెట్ బ్యాట్, ఫుట్బా ల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా ? పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించబోయే ఎన్నికల గుర్తులు. ఇవేకాకుండా మరో 20 గుర్తులు కూడా ఉన్నాయి. ఇంతేనా అనుకుంటున్నారా... గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటినా వంటి రోజూ మనకు ఏదో ఒక పనిలో ఉపయోగపడే వస్తువులను వార్డులకు పోటీచేసే వారికి కేటాయించనున్నారు. వీటితో మరో పది ఎన్నికల గుర్తులు కూడా వార్డు అభ్యర్థులకు ఇస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి కాబట్టి సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే వారికి కేటాయించేందుకు ఎన్నికల చిహ్నాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎంపిక చేసింది. ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ గుర్తుల జాబితా నుంచే రిటరి్నంగ్ అధికారులు అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమం అనుసరించి వరుసగా కేటాయిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను (నామినేషన్ పేపర్లో ఉన్న పేర్ల ఆధారంగా) తెలుగు అక్షరమాల క్రమంలో రిటరి్నంగ్ అధికారి జాబితా రూపొందిస్తారు. అభ్యర్థి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా పేర్ల క్రమాన్ని చూస్తారు. ఇందులో ఇంటిపేరును పరిగణనలోకి తీసుకోరు. ఒకే కేటగిరీలో ఇద్దరు అభ్యర్థులు ఒకే పేరుతో ఉంటే ఇంటిపేరు లోని మొదటి అక్షరం ఆధారంగా రెండుపేర్లను ఒక క్రమంలో ఉంచుతారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే పేరుతో ఉంటే ఇంటి పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో పరిగణనలో తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థుల వృత్తి, నివాసం ఇతర వివరాలు జతచేస్తూ విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసిన క్రమంతో సంబంధం లేకుండా వర్ణమాల క్రమంలో తెలుగులో అభ్యర్థుల పేర్ల జాబితాను రూపొందిస్తారు. అభ్యర్థి పేర్లతో ఏదైనా గౌరవ ప్రదమైన, విద్యాపరమైన, వారసత్వ, వృత్తిపరమైన లేదా ఏదైనా ఇతర బిరుదులు జత చేసుకోవచ్చు కానీ అక్షర క్రమంలో పేర్లు అమర్చే జాబితాలో అలాంటి బిరుదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. » సర్పంచ్ స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలోని మొదట ఉన్న వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన జాబితాలోని మొదటి చిహ్నాన్ని, రెండో అభ్యర్థి రెండో చిహ్నం అలా ఆ క్రమంలో మిగతా వారికి వరుసగా ఉన్న గుర్తులు కేటాయిస్తారు. » వార్డు సభ్యులుగా పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలోని మొదట ఉన్న వ్యక్తికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన జాబితాలోని మొదటి చిహ్నాన్ని, రెండో అభ్యర్థి రెండో చిహ్నం అలా ఆ క్రమంలో మిగతా వారికి వరుసగా ఉన్న గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్’ఇవే... ఉంగరం, కత్తెర, క్రికెట్ బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్స్, టీవీ రి మోట్, టూత్పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, బ్లాక్బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జ ల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బాŠయ్్ట్సమాన్, మనిíÙ–తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చెయిన్, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్(వికెట్లు). వార్డు సభ్యులకు కేటాయించే ‘ఫ్రీ సింబల్స్’ఇవే... గౌను, గ్యాస్పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటినా, గరాటా, మూకుడు, ఐస్క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవర్, హాకీ–బంతి, నెక్టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, టీ కెటిల్ నోటాకూ గుర్తు..: పంచాయతీ ఎన్నికల్లో నోటాకు కూడా గుర్తు కేటాయిస్తారు. నమూనా బ్యాలెట్ పేపర్పై కొట్టివేత మార్క్తో ఉన్నదే ఆ గుర్తు. -
పోటీ చేయాలా.. వద్దా?
సాక్షి, పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్తో ఆశావహులతోపాటు వివిధ రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది. కానీ సింగరేణి కార్మికుల్లో అయోమయం తొలగిపోవడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ సింగరేణి అధికారులు తప్ప కిందిస్థాయి కార్మికులు పోటీచేయొచ్చని స్పష్టత ఇచ్చినా.. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో అయోమయం నెలకొంది. తొలివిడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఇప్పటివరకు సింగరేణి స్పష్టత ఇవ్వలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా.. ఎన్నికల్లో పోటీచేసేవారు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలని సింగరేణి గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. దీంతో చాలామంది పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే వారు తప్పనిసరిగా ఉద్యోగానికి రాజీనామా చేయాలని, ఆ నిబంధన స్థానిక ఎన్నికలకు వర్తించదని కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. వాదోపవాదాలు విన్న కోర్టు.. కార్మికులకు అనుకూలంగా దిగువ స్థాయి కార్మికులు పోటీచేయొచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా, ప్రతీ స్థానిక ఎన్నికల సందర్భంగా పోటీ చేయకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్లో మేనేజర్, సెక్రటరీలు తప్ప మిగిలిన ఉద్యోగులు పోటీ చేసేందుకు అర్హులని పేర్కొన్నా.. సింగరేణి ఇప్పటివరకు ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఆశావహుల్లో నిరాశ నెలకొంది. సింగరేణి పరిధిలో దాదాపు 42 వేల మంది కార్మికులు ఉన్నారు. -
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టు ఇవాళ(నవంబర్ 28, శుక్రవారం) విచారణ జరిపింది. ఈ దశలో ఎన్నికల పై స్టే విధించలేం అని హైకోర్టు స్పష్టం చేసింది. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా? పిటీషనర్కు హైకోర్టు ప్రశ్న వేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ తరఫు అడ్వకేట్ తన వాదనలు వినిపించారు.42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమనీ మేమే చెప్పాం కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో 2009 లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.‘‘మేమే ఎన్నికలు నిర్వహిoచమని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇస్తాం’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ రిపోర్డ్ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది. సబ్ క్యాటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 6 వారాలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. -
పదవుల ఆక్షన్, బలవంతపు విత్డ్రాల్స్పై ఎన్నికల సంఘం సీరియస్
సాక్షి, హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల వేల రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవుల ఆక్షన్, బలవంతపు విత్డ్రాల్స్పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. అన్కాంటెస్టెడ్ ఫలితాలపై Rule–15 దుర్వినియోగం నివారించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి విత్డ్రా సమయంలో అభ్యర్థుల నుంచి రెండు డిక్లరేషన్లు తప్పనిసరి. ఒక్క అభ్యర్థి మిగిలితే RO వెంటనే Form-X సిద్ధం చేయాలి. ఆర్వో పంపిన సమాచారం డీఈఏ అదేరోజు ధృవీకరించాలి. వేలం/బెదిరింపు ఆధారాలు ఉంటే ఫలితాన్ని ఆర్వో తాత్కాలికంగా నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలి అని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అన్కాంటెస్టెడ్ ఫలితాలు స్వచ్ఛమైనవి అని నిర్ధారించినప్పుడే ప్రకటించాలని.. మొత్తం ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఎస్ఈసీ పేర్కొంది. -
బీసీ రిజర్వేషన్లపై మీ వైఖరి తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కోసం ఈ నెల 23న జిల్లా కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) జారీ చేసిన గెజిట్ను రద్దు చేయాలని కోరుతూ ఆందోల్ మండలం రాంసాన్పల్లికి చెందిన మాజీ సర్పంచ్ కొరబోయిన ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ, చట్టబద్ధమైన, న్యాయ సూత్రాలను కచ్చితంగా పాటించిన తర్వాత బీసీల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. వన్ మ్యాన్ కమిషన్ సూచించిన మేరకు 42 శాతానికి బదులుగా రాష్ట్రవ్యాప్తంగా 17.087 శాతం పంచాయతీ స్థానాలను కేటాయించడం సబబుకాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క స్థానాన్నీ కేటాయించకపోవడం ఆందోళనకరమన్నారు. ఎన్నికలకు జారీ చేసిన గెజిట్ కులాల మధ్య అసమానతను రుజువు చేస్తోందని చెప్పారు. ఈ కారణంగా అధిక జనాభా ఉన్న బీసీల హక్కులకు భంగం వాటిల్లుతుందని, అలాగే వారి ప్రాతినిధ్యం తీవ్రంగా తగ్గుతుందని నివేదించారు.ఎన్నికల రిజర్వేషన్ల జీవో నిలిపివేయండిహైకోర్టులో దాఖలైన పిటిషన్సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను వెల్లడిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ధర్మాసనం ముందుకు రానుంది. తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతోపాటు మరో ముగ్గురు ఈ పిటిషన్ వేశారు. ‘బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో 46ను జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 9(4) ప్రకారం.. ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఏ, బీ, సీ, డీలకు కేటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. అనంతరామన్ కమిషన్ నివేదికను ప్రభుత్వం విస్మరించింది. దీంతో బీసీల్లోని నాలుగు వర్గాలు అంటే.. మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ వర్గాలే స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతాయి. ఇతర పేద బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతారు. చట్టప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా సర్కార్ను ఆదేశించాలి’అని కోరారు. -
పల్లెల్లో ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సందడంతా పల్లెసీమలకు చేరింది. గురువారం పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారుల ద్వారా ఎలక్షన్ నోటీస్ విడుదలచేసి నోటీస్ బోర్డుపై అతికించడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. గురువారం నుంచి మూడురోజుల పాటు తొలి విడత ఎన్నికలకు (సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు) ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న తొలిదశలో 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడుదశల్లో (డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో) ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ముగిశాక.. 30న వాటిని పరిశీలించి, అదేరోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 1న అప్పీలు చేసుకుంటే, 2న వాటిని పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల్లోగా ఉపసంహరణలు ముగిశాక, ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత నామినేషన్ల స్వీకరణకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్లస్టర్ కేంద్రాల్లో.. ప్రతి గ్రామంలో కాకుండా మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యు ల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రాల్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఏఆర్వోలు) గెజిటెడ్ హోదా కలిగిన అధికారులనే నియమించారు. ప్రభు త్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్పత్రంతోపాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి, ఇతరులు రూ.2 వేలు డిపాజిట్చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి.అభ్యర్థులు డిపాజిట్ను నగదురూపంలో ఆర్వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్పత్రానికి జోడించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పంచాయతీలో ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండడంతో గ్రామాల్లో పోటీకి ఆశావహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అర్హతలివీ... » నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తి చేసుకుని ఉండాలి. » » ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో అభ్యర్థులు తెలంగాణకు సంబంధించిన షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందిన వారై ఉండాలి. » ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. అనర్హతలు... » క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే పోటీకి అనర్హులు. శిక్ష ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఈ అనర్హత వర్తిస్తుంది. » పౌరహక్కుల పరిరక్షణ చట్టం–1955 ప్రకారం శిక్ష పడినవారు అనర్హులు. » తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. » మతిస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు పోటీకి అనర్హులు. » దివాళా తీసిన లేదా దివాళా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించిన వారు లేదా అందుకు దరఖాస్తు చేసుకున్న వారు. » ఏదైనా పారితోíÙకం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్న వారు. » నేర శిక్షాస్మృతి–1973 ప్రకారం మేజిస్ట్రేట్ గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు. » ప్రస్తుత లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామపంచాయతీకి బకాయి పడి, ఆ బకా>యి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు. » గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కాని లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థలో ఉద్యోగిగా ఉన్నవారు. » పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో ఆఫీస్ బేరర్గా ఉండకూడదు. » అవినీతి చర్యలకు పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు పోటీకి అనర్హులు. » గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించనందుకు లేదా సరైన పద్దతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు.బ్యాంక్ ఖాతా తెరవాల్సిందే... ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంక్లో ఖాతా తెరవాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి బ్యాంక్ ఖాతా వివరాలు తప్పకుండా తెలియజేయాలి. ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చుచేయాలి. గతానికి భిన్నంగా ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చు వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)కు సమర్పించాలి. -
పంచాయతీ ప్రచారానికి 7 రోజులే
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. అయితే పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 44 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. » రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుంది. » ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలి. » ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచితప్రవర్తనతో వారిని బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దు. » ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసేవారు కుల ధ్రువీకరణ డిక్లరేషన్ సమర్పించాలి. షెడ్యూల్ తెగలకు చెందినవారు తెలంగాణకు సంబంధించిన ఏదైనా కమ్యూనిటీకి చెందినవారై ఉండాలి. » గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా నేరపూరిత చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి. విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే... ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా వారి సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. నోటా... పంచాయతీ ఎన్నికల్లోనూ నన్ ఆఫ్ ద అబోవ్(నోటా)ను అమలు చేయనున్నారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ‘నోటా’గుర్తును కూడా ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్య ర్థుల్లో ఎవరికి ఓటు వేసేందుకు ఓటరు సంసిద్ధంగా లేకపోతే నోటాపై ముద్ర వేసేందుకు అవకాశం కల్పించారు. -
TG: పంచాయతీ ఎన్నికలు.. బీసీలకు 2,176 గ్రామాలు!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 2,176 గ్రామాలు దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బీసీలకు 17.08 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా తెలిసింది. 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా అంటే 18 నుంచి 23 శాతంలోపు బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు అదే ఒరవడిలో బీసీలకు సర్పంచ్ స్థానాలు కేటాయించినట్టుగా తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అందుబాటులోకి తెచ్చిన సమాచారం ప్రకారం జిల్లాల వారీగా బీసీ వర్గాలకు కేటాయించిన సర్పంచ్ స్థానాల సంఖ్య ఈ విధంగా ఉన్నాయి.👉సంఖ్యాపరంగా 136 స్థానాలతో సిద్దిపేట జిల్లా ముందున్నది👉పర్సంటేజ్ పరంగా 27.45 శాతంతో జోగుళాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది👉7 జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 10 శాతానికి మించలేదు.బదిలీలు, ప్రమోషన్లపై నిషేధం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడిన అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పూర్తి నిషేధం విధించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పేర్కొంది. ఎన్నికల పీరియడ్లో లౌడ్ స్పీకర్ల వినియోగం, ఊరేగింపుల నిర్వహణ, బహిరంగ సభల నిర్వహణ, ఓటర్లను ప్రలోభపరిచే అవినీతి చర్యలు, తదితరాలపై పోలీస్శాఖ కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మంగళశవారం రాత్రి నుంచే గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ తెలియజేసింది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఈ ఎన్నికల్లో ఎత్తివేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సర్కార్ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను ఎత్తివేశారు. తెలంగాణలో మాత్రం గ్రామీణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధన కొనసాగింది. బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఈ నిబంధనను ఎత్తేశారు. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగింది. రాష్ట్ర కేబినెట్లో ఈ అంశంపై చర్చించాక ఈ నిబంధనను ఎత్తివేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గరిష్ట వ్యయ పరిమితి ఇలా...👉5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకు, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.👉5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50 వేల వరకు, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.పోలింగ్ రోజు నియమాలు👉గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 44 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేధం.👉ఓటర్లకు ఇచ్చే స్లిప్పులు తెల్ల కాగితంపై ఉండాలి. వాటిపై పార్టీ గుర్తు గానీ, అభ్యర్థి పేరు గానీ ఉండకూడదు.👉ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మంత్రులు, ప్రభుత్వానికి...నిధులు, పథకాలు, కొత్త గ్రాంట్లు మంజూరు చేయడం, కొత్త పథకాలు ప్రకటించడం లేదా ఆర్థిక హామీలు ఇవ్వడం నిషేధం👉కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయకూడదు.👉మంత్రులు తమ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు లేదా సిబ్బందిని వాడకూడదు.👉మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, సర్పంచ్లు, ప్రభుత్వో ద్యోగులు పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముఖ్యాంశాలు 👉ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.👉ఎన్నికలు జరిగే నిర్దిష్ట ప్రాంతానికి (గ్రామ పంచాయతీ లేదా వార్డు) ఇది వర్తిస్తుంది.👉కులాలు, మతాలు లేదా వర్గాల మధ్య ఉద్రిక్తతలు లేదా విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకూడదు. ఓట్ల కోసం మతం లేదా కులం పేరుతో విజ్ఞప్తి చేయకూడదు👉 ప్రార్థనా మందిరాలు: దేవాలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వాడకూడదు.👉 విధానాలు, పథకాలపై మాత్రమే విమర్శలు ఉండాలి. అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు.👉 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలి.👉 సభలు, ర్యాలీలకు స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.👉 కేవలం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే బహిరంగ సభల కోసం లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు👉 పాటలు లేదా సంగీతం వినిపించడానికి లౌడ్ స్పీకర్లను వాడకూడదు. -
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు విడుదల, జీవో జారీ చేసిన ప్రభుత్వం
-
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు.. 50% మించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం జీవో (ఎంఎస్ నం.46) జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు (బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన) బదులు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.గతానికి భిన్నంగా.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్లు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకుండా, రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలకు స్పష్టం చేసింది. సర్పంచ్ రిజర్వేషన్లు ఎవరికి..ఎలా? సర్పంచ్ల రిజర్వేషన్లు.. ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు, ఎస్సీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు, బీసీలకు సంబంధించి 2024 కులగణన (ఎస్ఈఈఈపీసీ)–2024 సర్వే ప్రకారం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. ప్రతి కేటగిరీలో ఆయా పదవులను ఆ మేరకే రిజర్వ్ చేయాలి.ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసే పోస్టులకు సాధ్యమైనంత మేర రొటేషన్ పద్ధతిని (2019 మొదటి ఎన్నికలకు అనుగుణంగా) అనుసరించాలి. మహిళలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ రిజర్వ్డ్ కేటగిరీలను ప్రత్యేక కేటగిరీలుగానే పరిగణించి రిజర్వేషన్లు కేటాయించాలి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను (అన్ని వార్డులను) ఎస్టీలకే రిజర్వ్ చేయాలి.వార్డు సభ్యులకు ఇలా..వార్డు సభ్యుల స్థానాలకు..ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల రిజర్వేషన్లు కులగణన (ఎస్ఈఈఈపీసీ)–2024 సర్వే ప్రకారమే ఖరారు చేయనున్నారు. వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేస్తారు. అయితే ప్రతి కేటగిరీలో సీట్ల రిజర్వేషన్ను కమిషన్ సూచనల ప్రకారమే చేయాలి. ఈ రిజర్వేషన్లను కూడా వీలైనంత మేర రొటేషన్ పద్ధతిలోనే చేయాలి. కులగణన (ఎస్ఈఈఈపీసీ)–2024 సర్వేకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా ప్రతి కేటగిరీ (ఎస్టీ, ఎస్సీ, బీసీ) జనాభా లెక్కలను అవరోహణ (డిసెండింగ్) పద్ధతిలో సిద్ధం చేయాలి.దీనికి అనుగుణంగా మొదట ఎస్టీలకు (డిసెండింగ్ ఆర్డర్లో) 2019 మొదటి ఎలక్షన్లో కేటాయించిన సీట్లను మినహాయించి, మిగతా వార్టులను ఎస్టీలకు రిజర్వ్ చేసే విషయం పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ, బీసీ కేటగిరీల్లోనూ గతంలో (మొదటి ఎన్నికల్లో) చేసిన రిజర్వేషన్లను మినహాయించి మిగతా వాటికి రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఈ కేటగిరీల రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యాక మిగిలిపోయిన వాటిని అన్ రిజర్వ్డ్గా పరిగణించాలి.ఇక ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆన్ రిజర్వ్డ్.. అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించేందుకు లాటరీ పద్ధతిని అనుసరించాలి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ (మహిళ), ఎస్సీ (మహిళ), బీసీ (మహిళ), అన్ రిజర్వ్డ్ (మహిళ)..ఇలా సెపరేట్ కేటగిరీలుగా చేయాలి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా.. 2019లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు చేయాల్సి ఉన్నందున, ఆ తర్వాత జరిగే ఎన్నికలను రెండో సాధారణ ఎన్నికలుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత కొత్తగా నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే ఎన్నికలను మొదటి ఎన్నికలుగానే పరిగణిస్తారు.పెన్ డ్రైవ్లో పెట్టి పంపాలిజిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్, స్కాన్డ్ కాపీలు పెన్డ్రైవ్లో పెట్టి ఈ నెల 24నఉదయం 10 గంటల లోగా పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయానికి పంపించాలని జిల్లా కలెక్టర్లను పీఆర్ఆర్డీ డైరెక్డర్ డా.జి సృజన ఆదేశించారు. ముందుగానే పూర్తిచేస్తే ఆదివారమైనా తమ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేసేందుకు లాటరీ పద్ధతిని అనుసరించనున్నందున.. అది అన్ని రాజకీయ పారీ్టల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలుతెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణలకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు) అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా.. వార్డు సభ్యులకు, సర్పంచ్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీల్లో సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ ఖరారు బాధ్యత రెవెన్యూ డివిజినల్ అధికారులకు (ఆర్డీవోలకు) అప్పగించారు. -
పంచాయతీ ఎన్నికలకు నెలాఖరులోగా షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై ఈ నెల 25న జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో డిసెంబర్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో..ఆ మేరకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ద్వారా షెడ్యూల్ విడుదలైన పక్షంలో, వచ్చే నెల 25 తేదీ కల్లా మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ద్వారా 50 శాతం రిజర్వేషన్లపై నివేదిక తయారుచేసి సర్కార్కు అందజేయాల్సి ఉంది. ఇందుకు రెండు,మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.ప్రభుత్వం దానిని పరిశీలించి గ్రీన్సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత 25న జరగనున్న మంత్రివర్గ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన రిజర్వేషన్ల ఫార్ములా (ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల శాతం)కు అనుగుణంగా, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 31 జిల్లాల్లో పంచాయతీలు, వార్డు స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టతనిస్తూ ఎస్ఈసీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల ఉత్సవాలకు ఆటంకం! రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1–9 తేదీల మధ్య ప్రజాపాలనా వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈ నెలాఖరులోగానే ఎస్ఈసీ షెడ్యూల్ను విడుదల చేసిన పక్షంలో అన్ని గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దీంతో వారోత్సవాల పేరిట జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించే వీలుండదు. అదే జరిగితే వచ్చేనెల 9వ తేదీ తర్వాతే షెడ్యూల్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటివారం వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగవచ్చునని అధికారులు చెబుతున్నారు. అలా కాకుండా వచ్చే నెల 8, 9 తేదీల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేని హైదరాబాద్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తే అసలు ఏ సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మరోవైపు అధికారికంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రెండేళ్ల ఉత్సవాలను నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయమూ వినిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పారీ్టల గుర్తులపై జరగనందున ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు. గత 21 నెలలుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.4 వేల కోట్లు నిలిచిపోయినందున సత్వరమే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందువల్ల మరింత ఆలస్యం చేయకుండా డిసెంబర్ చివర్లోగా అంతగా కాకపోతే జనవరి మొదటి వారంలోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. -
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన అన్ని పార్టీల నేతలు, మరోవైపు తాము పోటీ చేయాలనుకునే స్థానాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆర్థిక వనరులను, మందీ మార్బలాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 9న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలై, నవంబర్ 11న ఫలితాల వెల్లడితో ఈ ప్రక్రియ ముగియనుండడంతో.. దాదాపు నెల రోజులు అభ్యర్థులకు ఖర్చుల మోత మోగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దసరా, ఆ తర్వాత దీపావళి పండుగల మధ్యలో ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో విందు భోజనాలు, మందు పార్టీల జోరుతో ఎన్నికల హడావుడి పతాకస్థాయికి చేరడం ఖాయమని అంటున్నారు. తొలుత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ముందుగా రాజకీయ పార్టీల గుర్తులపై రెండు దశల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో.. ఆయా సీట్లలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయా స్థానాలకు ముందుగానే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆ మేరకు ఓటర్లకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీకి ఎంపిక చేసుకున్న స్థానాల్లో ప్రజలను కలుసుకోవడం, పలానా స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా వారికి తెలిసేలా ప్రాథమిక ప్రచార నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ముందుగా రాజకీయ పార్టీల జిల్లా స్థాయి నాయకత్వాలను ఒప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికలకు ఎంత మొత్తం ఖర్చు పెట్టాల్సి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాగైనా టికెట్ సాధించి రాజకీయంగా ఎదగాలనే తమ కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలావుండగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీని అమలుపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రెండు స్థానాలకూ పోటీ చేయొచ్చు! ఒక అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు రెండింటికీ ఏకకాలంలో పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలను బట్టి తెలుస్టోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకే మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక ఎలాంటి అవకాశం ఉండదు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు ఆ జిల్లాలోని గ్రామీణ ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లా ఓటరుకు జిల్లాలోని ఏ జెడ్పీటీసీ స్థానం నుంచి అయినా పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసే వారు సంబంధిత మండలం ఓటరై ఉండాలి. ఆ ఓటరు ఆ మండలంలోని ఏ ఎంపీటీసీ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు (రిజర్వేషన్ స్థానం వర్తింపును బట్టి) అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు పూర్తై ఉండాలి ⇒ నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 ఏళ్ల వయసు పూర్తిచేసుకుని ఉండాలి ⇒ ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేయాలంటే.. తెలంగాణకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించిన ఏదేని ఒక కులం, తెగకు (కమ్యూనిటీకి) చెందినవారై ఉండాలి. ఎస్టీలు ఏ వర్గానికి రిజర్వ్ కాని సీటు (జనరల్)కు కూడా పోటీ చేయొచ్చు. ⇒ ఎస్సీలు, బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలు లేదా వెనుకబడిన తరగతులుగా ప్రకటించిన ఏదైనా సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ వర్గాల వారు కూడా ఏ విధంగానూ రిజర్వ్ కాని స్థానాలకు పోటీ చేయొచ్చు. ⇒ మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లలో వారే పోటీ చేయాలి. జనరల్ కేటగిరీ సీటుకు కూడా మహిళలు పోటీ పడొచ్చు. శిక్ష పడితే అనర్హులు ⇒ క్రిమినల్ కోర్టు ద్వారా శిక్ష పడితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు అనర్హులు. శిక్ష ముగిసిన తేదీనుంచి ఐదేళ్ల పాటు అనర్హత వర్తిస్తుంది. ⇒ 1955 పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడినవారు కూడా అనర్హులు. ⇒ 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని 22, 23, 24 సెక్షన్ల ప్రకారం అనర్హులై ఉండకూడదు. ⇒ మతస్థిమితం లేనివారు, చెవిటి లేదా మూగవారు అనర్హులు ⇒ దివాలా తీసిన లేదా దివాలా నుంచి వెలుపలికి రాని వ్యక్తిగా కోర్టు నిర్ణయించినవారు లేదా అందుకు (ఇన్సాల్వెన్సీ) దరఖాస్తు చేసుకున్న వారు అనర్హులు. ⇒ మండల, జిల్లా పరిషత్ లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా చేపట్టిన ఏదైనా పనికి సంబంధించిన కాంట్రాక్ట్ పొందినవారు, అందులో భాగస్వామ్యం ఉన్నవారు అనర్హులు. ⇒ ఏదైనా పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్న వారు అనర్హులు. ⇒ 1973 నేర శిక్షా స్మృతి ప్రకారం మేజిస్ట్రేట్గా ఆ గ్రామంలోని ఏదైనా ప్రాంతంపై అధికార పరిధి కలిగి ఉన్నవారు అనర్హులు. ⇒ ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి, ఆ బకాయి చెల్లించాలని బిల్లు/నోటీస్ ద్వారా తెలియజేసినా నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వారు అనర్హులు. ⇒ గ్రామ సహాయకునిగా (వీఆర్ఓ)గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఉద్యోగిగా కానీ లేదా స్థానిక సంస్థల్లో, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ఏదైనా సంస్థల్లో ఉద్యోగిగా ఉన్నవారు అనర్హులు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత పొందిన ఏదైనా సంస్థలో కార్యవర్గ సభ్యుడిగా ఉండకూడదు. ⇒ అవినీతికి పాల్పడినందుకు కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగింపబడిన వారు తొలగించిన తేదీ నుంచి అయిదేళ్ల వరకు పోటీకి అనర్హులు. ⇒ గతంలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పిచనందుకు, సరైన పద్ధతిలో సమర్పించనందుకు ఎన్నికల సంఘం ద్వారా అనర్హులుగా ప్రకటించినవారు పోటీకి అనర్హులు. బ్యాంకు ఖాతా తెరవాల్సిందే.. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు వీలుగా ఎన్నికల్లో చేసే ఖర్చు వివరాల నిమిత్తం ప్రతీ అభ్యర్థి ప్రత్యేకంగా ఏదో ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలి. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి కనీసం ఒకరోజు ముందుగా ఈ ఖాతా తెరిచి ఉండాలి. నామినేషన్ దాఖలు సమయంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయాలి. ఆ ఖాతానుంచే అభ్యర్థి తన మొత్తం ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. అభ్యర్థి తన సొంత నిధులతో పాటు ఎన్నికల కోసం ఇతరుల నుంచి వచ్చే నిధులను కూడా ఈ ఖాతాలోనే జమ చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలు చూపించాలి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అప్పగించింది. -
స్థానిక పోరుకు సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో దశ ఎన్నికలు అదే నెల 8న జరగనున్నాయి. మొత్తం మీద అక్టోబర్ 9న మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో మొదలయ్యే స్థానిక ఎన్నికల ప్రక్రియ, నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడితో ముగియనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల కౌంటింగ్ (రెండు దఫాలకు) నవంబర్ 11న నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఏ రోజుకు ఆ రోజు సాయంత్రమే చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. మొత్తం ఐదు దశలు.. స్థానిక ఎన్నికల ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామని ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని చెప్పారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయంలో డీజీపీ జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్,పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, పీఆర్ఆర్ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందలతో కలిసి ఆమె స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఖాళీల వివరాలతో కూడిన గెజిట్ను అధికారులు విడుదల చేశారని తెలిపారు. ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెప్పారు. ఇవి జారీ అయిన రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. హైకోరు ్టస్టే ఉత్తర్వులకారణంగా..14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు జరపడం లేదన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 230 వార్డులకు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్ పంచాయతీలు, వీటిలోని 16 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని కమిషనర్ తెలియజేశారు. -
ఉత్తరాఖండ్ ఈసీకి సుప్రీం జరిమానా
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు పలు ఓటరు జాబితాల్లో ఉన్నా పోటీ చేయొచ్చంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ఇచ్చిన సర్క్యులర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా మీరెలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం..రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఉత్తరాఖండ్ పంచాయతీ రాజ్ చట్టం–2016కు వ్యతిరేకంగా ఎస్ఈసీ వివరణ ఉందంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. ఒకే వ్యక్తి ఒకే సమయంలో వేర్వేరు చోట్ల ఓటరుగా నమోదై ఉండరాదని ఆ చట్టం చెబుతోందని గుర్తు చేసింది. ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ ఎస్ఈసీ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కగా చుక్కెదు రవడం గమనార్హం. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందించింది. ఓటు చోరీని సుప్రీంకోర్టు బట్టబయలు చేసిందని, ఎన్నికల కమిషన్ అధికార బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించింది. -
డెడ్లైన్.. సెప్టెంబర్ 30
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీ అందిన 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కారుకు స్పష్టం చేసింది. అప్పటి నుంచి 60 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. గత పంచాయతీల కాల పరిమితి ముగిసి 14 నెలలు దాటిందంటూ, అయితే ఇప్పుడు ‘ఆలస్యం’పై మెరిట్స్లోకి వెళ్లడం లేదని హైకోర్టు పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టి ఆయా పక్షాల వాదనల అనంతరం గతంలో తీర్పు రిజర్వు చేసిన జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు. ‘ఆలస్యం’ జోలికి వెళ్లాలనుకోవడం లేదు..‘గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. రాజ్యాంగం ప్రకారం పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆ మేరకు పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం. పంచాయతీల పదవీకాలం ముగిసి 14 నెలల కంటే ఎక్కువ సమయమే గడిచింది. అయితే ఆలస్యం సమర్థనీయమా.. లేదా.. అనే అంశాల్లోకి ప్రస్తుతం వెళ్లదలుచుకోవడంలేదు. వార్డు సభ్యులు, సర్పంచుల సీట్ల రిజర్వేషన్లు సహా ఎన్నికల ప్రకియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం సముచితమని కోర్టు భావిస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఐదు దశల ప్రక్రియను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం..’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ఇలా..అంతకుముందు ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో 5 దశలు ఉండగా, 3 దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రెండు దశలను 20 రోజుల్లో పూర్తి చేస్తాం. పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బీసీ కులాల వారీగా రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు డేటా సిద్ధంగా ఉంది..’ అని చెప్పారు. ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రిజర్వేషన్లు తేలకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ఎన్నికల నిర్వహణపై మేం నిర్ణయం తీసుకోలేం. ఎన్నికల ప్రక్రియకు సర్కార్ అంగీకరించిన నాటి నుంచి మాకు రెండు నెలల సమయం అవసరం..’ అని నివేదించారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఎస్ఈసీ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు. -
ఎంతకాలం ఈ ‘పంచాయతీ’!
రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో గద్దెనెక్కేవారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల విషయంలో మీనమేషాలు లెక్కించటం పరిపాటయింది. దేశంలో దాదాపు అన్ని చోట్లా ఇదే పోకడ. పల్లెసీమల్లో ప్రజాతంత్ర భావన పెంపొందించి, పంచాయతీరాజ్ సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా పనిచేయనివ్వాలని... వాటికవే అభివృద్ధి ప్రణాళికలను స్వతంత్రంగా రూపొందించుకోవటానికి అవకాశమీయాలన్న సంకల్పంతో మూడున్నర దశాబ్దాల క్రితం 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు ఆ సంస్కృతికి పాతరేస్తున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవలి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదా గడువుతీరిన ఆర్నెల్లలోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాజ్యాంగంలోని 243 ఈ (3) నిర్దేశిస్తోంది. ఎన్నికలు సకాలంలో నిర్వహించని రాష్ట్రాలకు కేంద్రంనుంచి పంచా యతీలకు రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. పర్యవసానంగా అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామాలు పారిశుద్ధ్య లేమితో, అందువల్ల కలిగే అంటువ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు వేనవేల సాకులు చెబుతుంటాయి. అందులో రిజర్వేషన్ల నిర్ధారణ ఒకటి. పారదర్శకత పాటించకుండా, నిబంధనలకు విలు వీయకుండా రూపొందించే ఆ రిజర్వేషన్లు ఎటూ వివాదాస్పదంగా మారి న్యాయస్థానాల పరిశీలనకు వెళ్తాయని, దాన్ని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయొచ్చని చాలా ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అగ్రస్థానంలో ఉంది. ఆఖరుసారి 2006లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఆ కేంద్రపాలిత ప్రాంతం ఆ తర్వాతనుంచి ఏదో ఒక కారణం చూపిస్తూ వాయిదాల్లోనే కాలక్షేపం చేస్తోంది. సిగ్గుచేటైన సంగతేమంటే... అక్కడ ఫ్రెంచ్ పాలన సాగినన్నాళ్లు స్థానిక సంస్థలు అద్భుతంగా పనిచేశాయి. అభివృద్ధి పనుల ప్రణాళికలు ఒక క్రమపద్ధతిలో అమలయ్యాయి. తీరా స్వాతంత్య్రం వచ్చాక ఆ సంస్థలు నీరసించాయి. అధికారంలోకి ఎవరొచ్చినా ఏదో వంకతో వాటి ఎన్నికలు వాయిదా వేస్తూ పోయారు. 1954లో జరిగిన రిఫరెండమ్ ద్వారా భారత్లో విలీనానికి మెజారిటీ ప్రజలు సుముఖత వ్యక్తం చేయగా, 1962లో అది పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతమైంది. 1968–2024 మధ్య కేవలం ఒకే ఒక్కసారి 2006లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలైనా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పుణ్యమే. అంటే గడిచిన 56 ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా పుదుచ్చేరిలోని 108 పల్లెల బాగోగులు చూసే ప్రజాతంత్ర వ్యవస్థలే లేవన్నమాట! చిత్రమేమంటే... వివిధ అంశాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచిన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటివి కూడా సకాలంలో ఎన్నికలు నిర్వహించటంలో విఫలమయ్యాయి. ఇప్పటికి నాలుగేళ్లుగా కర్ణాటకలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు లేవు. మహారాష్ట్ర మూడేళ్లనుంచీ, అస్సాం, జమ్మూ–కశ్మీర్ వంటివి రెండేళ్లనుంచీ ఎన్నికలు నిర్వహించటం లేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో గతేడాది ఎన్నికలు జరగాల్సివుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది కనుక త్వరలోనే పంచా యతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని ఆశించాలి. రాజ్యాంగంలో ఎన్ని ఉన్నతాశయాలున్నా ఆచరణ సరిగా లేనప్పుడు అవన్నీ నీరుగారి పోతాయి. అందులో పల్లెసీమల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే పంచాయతీరాజ్ సంస్థలను నిర్లక్ష్యం చేయటం ఒకటి. నిజానికి నిర్దిష్ట కాలంలో సక్రమంగా ఎన్నికలు జరిగేచోట సైతం ఆ సంస్థల పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. నిధుల విడుదలలో జాప్యం, నాసిరకంగా పనులుండటం, సిబ్బంది కొరత వగైరాలు ఎన్నోవున్నాయి. ఇక మహిళలకు పంచాయతీరాజ్ వ్యవస్థలో పెద్ద పీట వేయాలని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది. అందుకోసం వారికి మూడోవంతు స్థానాలు కేటాయించాలని నిర్దేశించింది. అయితే దీన్ని 50 శాతానికి మార్చాలని మెజారిటీ రాష్ట్రాలు భావించాయి. ఒక లెక్క ప్రకారం 21 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సగం స్థానాలు మహిళలకు కేటాయించాయి. కానీ విషాదమేమంటే... మహిళల పేరుమీద వారి భర్తలో, తండ్రులో అధికారం వెలగబెడుతున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ సంగతి చూడాలని ఆదేశించింది. అటు తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఒక కమిటీ వేశారుగానీ జరిగిందేమీ లేదు. ప్రజా సేవారంగంలో మహిళలు చొరవగా పాల్గొనటా నికి ఉద్దేశించిన విధానం కాస్తా ఇలా దారితప్పుతోంది.దశాబ్దాల తరబడి పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ పోవటంవల్ల పల్లె సీమల్లో వర్ధిల్లాల్సిన ప్రజాస్వామిక వాతావరణం లోపిస్తోంది. తమకున్న వనరులేమిటో, తమ అవ సరాలేమిటో సమీక్షించుకుని ఏయే అభివృద్ధి పనులు చేపట్టాలో నిర్ణయించుకోవాల్సిన పంచాయతీ రాజ్ సంస్థలు నిధుల కోసం బేలగా ఎదురు చూస్తున్నాయి. పల్లెల్లో సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉండిపోవటంవల్ల ఆ సంస్థలపై ప్రజలకు ఒక రకమైన చిన్నచూపు ఏర్పడుతోంది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించినట్టు పంచాయతీరాజ్ ఎన్నికలు సకాలంలో జరిగేలా చూడాలి. పుదుచ్చేరి మాదిరి నిరవధికంగా వాయిదాలతో పొద్దుపుచ్చుతూ, పంచాయతీలను నామ మాత్రావశిష్టంగా మార్చే ప్రభుత్వాలను దారికి తీసుకొచ్చేందుకు కొత్త మార్గాలు వెదకాలి. -
పంచాయతీ ఎన్నికల జాప్యం.. సంక్షేమానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాత కలుగుతోందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక అభివృద్ధి నిధులు నిలిచిపోయాయని గుర్తుచేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టాలని స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తమ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (2025–26) నివేదికను బుధవారం పార్లమెంట్కు సమర్పించింది. ఇందులో పంచాయతీ ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ‘73వ రాజ్యాంగ సవరణ ద్వారా అన్ని రాష్ట్రాలు గ్రామ స్థాయిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఈ(3) ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఆ గ్రామపంచాయతీ కాలపరిమితి ముగిసేలోపు లేదంటే రద్దయ్యాక ఆరు నెలల వ్యవధిలోపు పూర్తి చేయాలి. ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాల్సిన రాజ్యాంగపరమైన నిబంధన’ అని కమిటీ పేర్కొంది. ‘‘ పుదుచ్చేరి (2011), కర్ణాటక (2021), మహారాష్ట్ర (2022), మణిపూర్ (2022), లక్షద్వీప్ (2022), అస్సాం(2023), జమ్మూకశ్మీర్ (2023), లద్దాఖ్ (2023)లలో వివిధ కారణాల వల్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్లలో 2024 ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఇంకా నిర్వహించలేదు’’ అని కమిటీ తెలిపింది. ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయని తెలిపింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం వల్ల గ్రామ అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఆగిపోయాయని పేర్కొంది. ‘‘ఈ గ్రాంట్లు, నిధులు మంజూరు పంచాయతీలకు సకాలంలో సాకారం అయి ఉంటే ఆయా గ్రామాల ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’’ అని కమిటీ వ్యాఖ్యానించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగా నిధుల లభ్యత లేకపోవడంతో గ్రామాల్లో ప్రజల పరిస్థితి మెరుగ్గా లేదని రాష్ట్రాల పర్యటనల్లో తేలినట్లు కమిటీ పార్లమెంట్ దృష్టికి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సత్వరం అత్యున్నత స్థాయి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.‘ఉపాధి’కి నిధులు పెంచాలిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాలని, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ‘ గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ గ్రామీణ ఉపాధి పథకానికీ కేటాయింపులు తగ్గాయి. ఇప్పుడు కేవలం రూ.86,000 కోట్ల కేటాయింపులు చేశారు. గ్రామాల్లో తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న గ్రామీణులకు ఉపాధిహామీ పథకం ఇన్నాళ్లూ కీలకమైన రక్షణచట్రంగా నిలిచింది. కరోనా కాలంలో కోట్లాది మంది పేదలను ఈ పథకం ఆదుకుంది. అణగారిన వర్గాలకు ఉపాధిని కల్పించే ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తగినంత బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అవసరం. అందుకే ఈ పథకానికి కేటాయింపులు సమధికంగా పెంచాలి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖపై గ్రామీణాభివృద్ధి శాఖ ఒత్తిడి తీసుకురావాలి’’ అని కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయం, గ్రామీణ కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోజువారీ వేతన రేట్లు తగిన విధంగా సవరించాలని సూచించింది. -
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలతో కేడర్ను కదిలించే పనిలో పడ్డాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో కూడా కదలిక కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వారంలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు దిశలో డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.కాంగ్రెస్కు కీలకం: అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు కీలకం మారాయి. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడం, తమ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నెలరోజులుగా ఈ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలపై పెట్టింది. కనీసం 80 శాతం స్థానాలు గెలిపించాలని ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు నిర్దేశించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఎన్నికల బిజీలో పడిపోయారు. ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలుప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా స్థానిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరాజయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితిలో పడిపోయిన ఆ పార్టీ.. స్థానిక ఎన్నికల్లోనైనా పట్టు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. కేడర్, లీడర్లను చైతన్యపరిచే పనిలో పడింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. వికారాబాద్, సిర్పూర్ సమావేశాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరికి టికెట్లు ఇచ్చినా అందరూ కలసి పనిచేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. -
ముందు పరిషత్.. తర్వాత పంచాయతీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే మండల పరిషత్ (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ) ఎన్నికలను తొలుత నిర్వహించాలని.. అనంతరం పార్టీల గుర్తులు లేకుండా జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఈ రెండింటినీ కొన్నిరోజుల అంతరంతో జరపాలనే ప్రతిపాదనతోపాటు.. వీలైతే సమాంతరంగా ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉ న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రాకున్నా.. తొలుత పరిషత్లకు, తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశమే ఎక్కువని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉదయం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ, తర్వాత నిర్వహించే శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్పష్టత వస్తుందని వివరిస్తున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. సమగ్ర కుటుంబ సర్వే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు (ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 42 శాతానికి), ఎస్సీ వర్గీకరణ నివేదిక తదితర అంశాలపై మంగళవారం కేబినెట్లో భేటీలో చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి తీర్మానం చేస్తారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 50శాతానికి మించకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులు, కులగణన, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం పార్లమెంటుకు పంపే అవకాశం ఉంది. అందులోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంచాయతీలు, మండలాలు, జిల్లాల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15లోగా షెడ్యూల్! స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15వ తేదీలోగా షెడ్యూల్ విడుదల కానున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు.. తర్వాత వారం గడువిచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయవచ్చని అంటున్నాయి. వచ్చే నెల మొదట్లో ఇంటర్ పరీక్షలు, 21 నుంచి టెన్త్ పరీక్షలు ఉన్నందున.. టెన్త్ పరీక్షలు మొదలయ్యేలోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, వాటిని ఒక విడతలో ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, అభ్యర్థులంతా స్వతంత్రులుగానే పోటీ చేసే విధానంలో జరుగుతాయి కాబట్టి.. వాటిని విడిగా నిర్వహించనున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించి.. ఏ విడతకు ఆ విడతలో పోలింగ్ ముగిశాక సాయంత్రమే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. 2018లో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పేర్కొన్న నేపథ్యంలో.. దీనివైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్రంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల పునర్విభజనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ ఆర్డీ) అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా చూడటం, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసిన నేపథ్యంలో మార్పులు చేర్పులు, కొత్తగా ఏర్పడిన 34 మండలాల్లో ఎంపీటీసీ సీట్ల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై సోమవారం కసరత్తు పూర్తి చేశారు. జిల్లాల వారీగా పునర్విభజన (కార్వింగ్) చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో తుది జాబితాలను ప్రచురించారు. ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు (ఏసీఎల్బీ), ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ టెలీకాన్ఫరెన్స్, గూగుల్ మీట్లు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయడం, గ్రామ పంచాయతీల మ్యాపింగ్, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల లెక్కలు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికలు జరిపేందుకు అందుబాటులో ఉన్న సిబ్బంది, బ్యాలెట్ బాక్స్లు, ఇతర రవాణా ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) నియామకం, ఆర్వోలు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సమీక్షించారు. -
స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
ఫిబ్రవరిలో ‘స్థానిక’ సమరం..?
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల నిర్వహ ణకు ప్రాథమిక కసరత్తు కూడా కొంత ప్రారంభమైనట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సమయంలో జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేస్తే, ఆ తర్వాత 21 రోజుల్లో (ఫిబ్రవరి మొదటి వారంలో) ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో మూడు విడతల్లో నిర్వహించే విషయంలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన అమల్లో ఉండగా... ఈసారి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు గ్రామపంచాయతీలు (ఎంపీటీసీ స్థానాలు) ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ రెండోవారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో‡ ఈ రెండు అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొనేందుకు పంచాయతీరాజ్శాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై మల్లగుల్లాలుస్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దానిని 42 శాతానికి పెంచడం వల్ల అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీనివల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు అడ్డంకిగా మారుతుందన్న అభిప్రా యం కూడా వ్యక్తమవుతోంది. జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసి కుల గణనను చేపట్టిన సంగతి విదితమే. తాజా లెక్కలకు అనుగుణంగా బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేస్తూ బీసీ కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలి.ఆ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపిస్తే.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఈ నోటిఫికేషన్ జారీ అయ్యాక 21 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. గత జనవరి 31తో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. జూలై మొదటివారంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ల పదవీ కాలం కూడా ముగిసింది. గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముందుగా ముగిసినందున, ఎన్నికలు కూడా ముందుగా వాటికే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు, 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రిజర్వేషన్ల ఖరారుకు కుల గణన ప్రాతిపదికగా తీసుకోవాలా.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. కాగా ఈ నెలతో బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. కులగణనతో ఆలస్యం... కులగణన ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై లెక్కలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాలు తీసుకుని మండలాలు, గ్రామస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై అంచనాకు వచ్చి స్థానిక స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎదుట మార్గాంతరంగా ఉంది.ఈ ప్రక్రియను పంచాయతీరాజ్, ›గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడితే 2, 3 నెలల్లోగా ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్థారించేందుకు అవకాశముందని అటు బీసీ కమిషన్, ఇటు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీనిచి్చన విషయం తెలిసిందే. ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిష¯Œన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉంది.సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీ కమిష¯న్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలని పేర్కొంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేయడంతో బీసీ కమిషన్ కసరత్తుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అమలు ఏ మేరకు సాధ్యమనే మీమాంస వ్యక్తమవుతోంది. సీఎం వచ్చాక స్పష్టత వస్తుందా? ఈ నెలాఖరుతో రాష్ట్ర బీసీ కమిష¯న్Œ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తే ఈ ఎన్నికలను సజావుగా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 14 తర్వాత సీఎం రేవంత్రెడ్డి, సీఎస్ల ప్రతినిధి బృందం యూఎస్, దక్షిణ కొరియాల పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలా అయితేనే తమకు కూడా ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉందన్నారు. మూసీ పరీవాహాక ప్రాంతాన్ని 55 కి.మీ. మేర అభివృద్ధి చేస్తున్నామని, కింద రోడ్డు మార్గం, సైక్లింగ్, పైన మెట్రో వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి హైదరాబాద్కు ఎంతమాత్రం పోటీ కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.అమరావతిలో రాజధాని నిర్మాణం, భవనాల నిర్మాణం తర్వాత 10 వేల ఎకరాలే రియల్ ఎస్టేట్కు ఉంటుందని, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కష్టమనేది తన ఆలోచన అని అన్నారు. అక్కడ పెట్టుబడి పెట్టేకన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలు, వరంగల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నట్లు చెప్పారు. లేదా పక్క రాష్ట్రాలైన బెంగళూరు, చెన్నైలలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం రేవంత్.. మీడియా సమావేశంలో వివరాలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ అభివృద్ధి.. నా మార్క్ ‘మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కేసీఆర్ హైదరాబాద్లో చేసిన అభివృద్ధికి ఓ మార్క్ ఉంది. ఇలా నా మార్క్ ఏంటనేది చెప్పాల్సి వస్తే మూసీ నది అభివృద్ధేనని చెప్తా. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో 10 వేలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికీ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు లేదా లేదా నష్టపరిహారం చెల్లిస్తాం.మధ్యమధ్యలో ఎస్టీపీలు కట్టి నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా చేస్తున్నాం. 36 నెలల్లో పూర్తి చేయాలనేది నా ఉద్దేశం. 12–15 కీ.మీ.లకు ఒక క్లస్టర్ లెక్కన 4 కస్టర్లుగా విభజించి 4 కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టును మరింత హుందాగా డిజైన్ చేసేందుకు ఆగస్టులో దక్షిణ కొరియా, జపాన్ వెళ్లి అక్కడి రివర్ డెవలప్మెంట్ మోడల్ను చూసి మరిన్ని ఆలోచనలు చేస్తాం. మొత్తం మూసీ నది అభివృద్ధే రేవంత్ మార్క్ అనేలా అభివృద్ధి చేసి చూపిస్తా’అని రేవంత్ వివరించారు. గండిపేటకు ట్రంక్ లైన్.. ‘మంచినీటి నిల్వ కోసం గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు ట్రంక్ లైన్ వేస్తున్నాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుపై కూడా కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాల్సి ఉన్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాల గురించి ప్రధాని మొదలు కేంద్ర మంత్రులందరినీ నేను, నాతో పాటు మంత్రులు కలుస్తున్నాం. కేంద్రం తెలంగాణకు సాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఎన్నికలు అయిపోయినందున ఇప్పుడు రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. అందుకే అందరినీ కలుస్తున్నాం..’అని సీఎం చెప్పారు. మరికొన్ని అంశాలపై ⇒ వివాదం లేకుండా పోటీ పరీక్షలన్నీ నిర్వహించామని సీఎం అన్నారు. తమకు మంచి పేరు వస్తుందనే గ్రూప్–1 విషయంలో బీఆర్ఎస్ అనవసర రచ్చకు తెరలేపి నిరుద్యోగుల్ని ఉసిగొల్పుతోందని రేవంత్ ఆరోపించారు. అయితే గ్రూప్–1 గురించి ఎవరో ఏదో చెప్పారని చేసుకుంటూ వెళ్లలేమని.. అలా వెళ్తే కోర్టులు ఆక్షేపిస్తాయని చెప్పారు. ⇒ లోక్సభ ఎన్నికలకు ముందే రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని ప్రధానిని కోరానని.. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో త్వరలో కొత్త బ్యాచ్కు చెందిన వారిని కేంద్రం తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందన్నారు. ⇒ కత్తి పట్టుకున్న వాడు కత్తికే బలైనట్లు కేసీఆర్ పరిస్థితి ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వ్యక్తి ఆ కేసుకే పట్టుబడేలా ఉన్నారని పేర్కొన్నారు. తనకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని.. తన ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు.పదేళ్లు నేనే సీఎం..ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పదేళ్లకు ఒకమారు, ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే ట్రెండ్ కొనసాగుతోందని, ఈ లెక్కన పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్కు వచ్చే ఢోకా ఏమీ లేదని చెప్పారు. ‘తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పు విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో పదేళ్లకు ఒకమారు ప్రభుత్వాలు మారి తే, ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లకు ఒకమారు ప్రభు త్వం మారుతోంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కచ్చి తంగా కొనసాగుతుంది. నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా’అని రేవంత్ వ్యాఖ్యానించారు.ఈవీఎంలపై అప్పుడు టీడీపీయే ప్రశ్నించిందిసార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) ట్యాంపరింగ్కు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాటి ట్యాంపరింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈవీఎం ట్యాపరింగ్లు జరిగినట్లు వస్తున్న వార్తలపై అభిప్రాయం ఏమిటని మీడియా అడగ్గా సీఎం రేవంత్ వివరంగా బదులిచ్చారు. ‘2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రశ్నించిందే టీడీపీ (అప్పుడు నేను ఆ పారీ్టలోనే ఉన్నా). ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కలి్పంచాం. అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి..’అని అన్నారు. ఎలా జరగొచ్చంటే.. ‘ఎన్నికలకు ముందురోజు ప్రతి నియోజకవర్గానికి ఈవీఎంలను తీసుకొచ్చి పంపినీ కేంద్రంలో ఉంచుతారు. పోలింగ్కు అవసరమైన ఈవీఎంల కంటే 15 శాతం ఈవీఎలను ఎక్కువగానే కేటాయిస్తారు. ఎన్నికల రోజు ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఆ ఈవీఎంల స్థానంలో వాటిని ఉపయోగించుకోవడానికి ఆ 15 శాతం ఈవీఎంలను అదనంగా ఇస్తారు. ఈవీఎంల పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ రోజు ఈవీఎంలను పోలింగ్ బూత్లకు తరలిస్తారు.అదనంగా తెచి్చన 15 శాతం ఈవీఎంలను మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఉంచుతారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్కు కాకుండా తొలుత డి్రస్టిబ్యూషన్ సెంటర్కే వస్తాయి. అక్కడే రాత్రంతా ఉంచుతారు. ఆ రాత్రి ఈవీఎంలను అటుఇటూ మార్చేలా ఏదైనా జరగొచ్చు కదా? పంపిణీ కేంద్రం బయట పోలీసులు కాపలాగా ఉంటే లోపల ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లు వాటిని తనిఖీ చేయడానికి ఉంటారు. మన చేతిలో అధికారం, బలం ఉంటే మనకు ఇష్టమైన వ్యక్తుల్ని అక్కడ డ్యూటీకి వేసుకొనే అవకాశం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన మర్నాడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు వెళ్తున్నాయి..’అని రేవంత్ తెలిపారు. ట్యాంపరింగ్ ఏ రకంగా చేస్తారో చెప్పలేం‘ఈవీఎంల ట్యాంపరింగ్ను ఎక్కడో కూర్చుని చేశారా లేక చిప్లలోకి ఏదైనా ఫ్రీక్వెన్సీని పంపారా అనేది మనం చెప్పలేము. చిప్లోకి లోఫ్రీక్వెన్సీ అయితే ఒకలాగా, హైఫ్రీక్వెన్సీ అయితే మరోలాగా ఈవీఎంలను ఆపరేట్ చేయొచ్చు. కంపెనీ తయారు చేసే ప్రొగ్రామ్నిబట్టే ఈవీఎం పనిచేస్తుంది. ప్రోగ్రాం రీరైడ్ చేయాలంటే మిషన్ చేతికి రావాల్సి ఉంటుంది. అయితే సిగ్నల్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు.ఫ్రీక్వెన్సీ ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా దేనికి దానికే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది. గెలుపోటముల కోసం 100 శాతం మెషీన్లను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా 10 శాతం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే 10 వేల ఓట్ల వ్యవధిలోనే గెలుపోటములను డిసైడ్ చేయొచ్చు కదా’అని రేవంత్ చెప్పారు. -
జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక!
సాక్షి, అమరావతి : జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. అవసరమైతే రాజ్యాంగంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్దేశించిన ఆర్టికల్ 243 (సీ) క్లాజ్ 5 (బీ)కి సవరణలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం ఉండే అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చించేందుకు వచ్చే నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్లో జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని జాతీయ పంచాయతీరాజ్ శిక్షణ సంస్థలో ఈ ప్రత్యేక వర్క్షాప్ జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ సెక్రటరీ చంద్రశేఖర్కుమార్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు), పంచాయతీరాజ్ శాఖ విభాగాధిపతులకు ఇటీవల లేఖలు కూడా రాశారు. కేంద్రం సవరణ చేసినా, సగం రాష్ట్రాలు ఆమోదం తర్వాతే అమల్లోకి ఒకవేళ.. కేంద్రం ఇప్పుడు దేశమంతటా జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నుకొనేలా రాజ్యాంగ సవరణ చేసినా.., అది అమలులోకి రావాలంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలని పంచాయతీరాజ్ శాఖ అదికారులు చెప్పారు. అన్ని దశల ప్రక్రియ పూర్తవడానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. రాష్ట్రం నుంచి 9 మంది.. అన్ని రాష్ట్రాల నుంచి 261 మంది.. ఈ వర్క్షాప్లో పాల్గొని సూచనలు చేసేందుకు అన్ని రాష్ట్రాల నుంచి జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ సర్పంచుల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. వీరితో పాటు రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు (చాలా రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ – బీడీవోలు అంటారు), రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణ సంస్థ ప్రతినిధులు ఈ వర్క్షాప్లో పాల్గొనాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 9 మంది హాజరవనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 1995కి ముందు ఆ పదవులకు రాష్ట్రంలోనూ ప్రత్యక్ష ఎన్నికలే.. రాష్ట్రంలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నుకొంటున్నారు. 1995కి ముందు కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పదవులకు ప్రత్యక్ష పద్దతిలోనే నేరుగా ప్రజలే ఎన్నుకొనేవారు. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ 1994లో కేంద్రం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ ఎన్నికల విధివిధానాల్లో మార్పులు చేశారు. దాని ప్రకారం పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు మాత్రం రాష్ట్రాల ఇష్టానుసారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చని కేంద్రం ఆ సవరణల్లో పేర్కొంది. ఈ సవరణల మేరకు అన్ని రాష్ట్రాలు రాష్ట్రస్థాయిలో కొత్త పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చాయి. ఆ మేరకు మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచిని ప్రత్యక్ష విధానంలో, జెడ్పీ చైర్పర్సన్, మండలాధ్యక్షులను పరోక్ష పద్ధతిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకొనేలా 1995లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిం ది. -
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
పశ్చిమ బెంగాల్: ఎన్నికల్లో రక్తచరిత్ర.. ఎందుకీ హింస?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి. కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్ వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్ఎస్సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది. భద్రత ఇలా.. ► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది. ధనబలం.. ► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి గాయాలయ్యాయి. ► 2019 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్లోనే 38 వరకు మరణించారు. ► 2018లో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు. ► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు. ► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Poll violence in Bengal: బెంగాల్ పంచాయతీ హింసాత్మకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు. ఉత్తర దింజాపూర్లోని గోల్పోఖార్లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్గంజ్లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీల పరస్పర ఆరోపణలు ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
ఆ మూడు రోజులు మద్యం బంద్: ఎందుకు? ఎక్కడ?
పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్మకాలు నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది. చదవండి : ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
నన్ను గెలిపించనప్పుడు నా డబ్బులు ఇచ్చేయండి! బెదిరిస్తున్న వ్యక్తి
భోపాల్: మధ్యప్రదేశ్లోని రాజు దయమా అనే వ్యక్తి ప్రజలను బెదిరిస్తూ..హింసిస్తున్నందుకుగానూ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే...రాజు మానస తహసీల్లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అతను తాను ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తన డబ్బులు తనకిచ్చేయమంటూ ప్రజలను బెదిరించడం మొదలు పెట్టాడు. రాజు ప్రజలను బెదరించడమే కాకుండా హింసించడం వంటి పనులు కూడా చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజు పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తన వద్ద తీసుకున్న డబ్బులను వెనక్కి ఇచ్చేయాల్సిందే.. అంటూ ప్రజల వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షలు వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు రాజు, అతని సహచరుడి పై ఎన్నికల్లో డబ్బు పంచినందుకు, ప్రజలను డబ్బు ఇచ్చేయమంటూ.. ఇబ్బందిపెట్టినందుకుగానూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు) -
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా 21 ఏళ్ల అమ్మాయి!
21-year-old Ujjain Girl: మధ్యప్రదేశ్లోని చింతామన్ జవాసియా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిని ఓడించి 487 ఓట్ల ఆధిక్యంతో గెలిచిని అతి పిన్న వయస్కురాలిగా ఉజ్జయినికి చెందిన 21 ఏళ్ల అమ్మయిగా లతికా దాగర్ రికార్డు సృష్టించారు. లతికా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. అంతేకాదు ఆమె మేనిఫెస్టోలో తాగునీరు, డ్రైన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని, ఇళ్లు లేని కుటుంబాలకు గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ పలు రకాలు హామీలు ఇచ్చి మరీ గెలుపొందారు. అంతేకాదు మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్లోని అతి పిన్న వయస్కురాలైన మహిళా సర్పంచ్గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ రికార్డును యాదృచ్ఛికంగా తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
రాజధాని గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని, మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అందుకే ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని తెలిపింది. రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియలో పలు లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పింది. గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి లోపాలను సరిదిద్దాల్సి ఉందంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఎన్నికలు నిర్వహించకపోతే ఆ గ్రామాల ప్రజలు వారి సమస్యలను ఏ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాలని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఎస్ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తుళ్లూరుకు చెందిన కొమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటోందన్నారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని, అందువల్ల పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశ్నే తలెత్తదన్నారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నందున ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వం చెప్పిందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్డీఏ తిరిగి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో తెలుసుకుని చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. -
టీడీపీ నేతల బరితెగింపు
పెనుకొండ(అనంతపురం జిల్లా): టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారుల్లో వెళుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఓటర్లను భారీఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలు ఎర వేస్తున్నారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ తదితరులు మూడు వారాలుగా పెనుకొండలోనే మకాం వేశారు. ఒక్కొక్కరు ఒక్కో వార్డు బాధ్యతలు తీసుకుని, ఆ పరిధిలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఇదివరకే ఒకటో వార్డులో స్వయాన బీటీ నాయుడు వాహనంలోనే మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా జంకకుండా టీడీపీ నేతలు ప్రలోభపర్వం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న వార్డుల్లో ఏకంగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా పంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రచారం చివరిరోజైన శనివారం రోడ్షోలకు ఎస్పీ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ రోడ్షో నిర్ణయాన్ని ఉపసంహరించుకుని..ప్రచారానికే పరిమితమయ్యారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వంద వాహనాలతో పట్టణంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు మించి చేస్తున్న హడావుడి, ఆగడాలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?
పాట్నా: పంచాయతీ ఎన్నికలతో బిహార్ రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. ఇప్పటికే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతున్న వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్రావు డ్యాన్స్ కఠియార్ జిల్లా హసన్గంజ్ పంచాయతీలోని రామ్పూర్ గ్రామస్తుడు మహ్మద్ ఆజాద్ ఆలం. ఓ పాడి రైతు. పాడి పశువులను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ వేసేందుకు గేదెపై వెళ్లాడు. అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే.. ‘పెట్రోల్ ధరల పెరుగుదల’ కారణంగా చెప్పాడు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ ‘పెరుగుతున్న పెట్రోల్ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను’ అని అభ్యర్థి ఆలం మీడియాకు తెలిపాడు. అయితే పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బిహార్లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న చివరి దశ జరగనుంది. #WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl — ANI (@ANI) September 13, 2021 -
యూపీలో మొదలైన ఓట్ల ఆట
పంచాయతీ ఎన్నికల తొలివిడతలో ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం, కౌశలం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో సమానంగా పోటీ పడటంలో... పార్టీనీ లేదా కూటమినీ సిద్ధం చేయడంలో అది సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ముందస్తు రాజకీయ చర్యలతో మిగతా పార్టీలకంటే ప్రయోజనం పొందడంలో బీజేపీ ముందంజలో ఉంటున్నట్లే లెక్క. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామనీ, వైరస్ను రాష్ట్రం నుంచి నిర్మూలించేశామనీ అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ ప్రజాగ్రహం, వేదనను ఇవి తొలగించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఈ మనోభావాలను బీజేపీకి, యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా యూపీ ప్రతిపక్షాలు మల్చగలవా అనేది ప్రశ్న. ఉల్లాసం, ఆనందం తర్వాత నిరాశ, నిస్పృహ వెంటాడుతాయి. దాంతోపాటు గాల్లో తేలియాడుతున్న మన కాళ్లు కూడా నేలమీదకొస్తాయి. సరిగ్గా ఈవిధంగానే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వంపై వనరులు, కండబలం, హస్తలాఘవం, నిర్బంధం, అధికార దుర్వినియోగం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినప్పటికీ, పంచాయతీ ఎన్నికల అంతిమ ఫలితాల నేపథ్యంలో వాటికి అర్థం ఏమిటన్న అంశం విషయంలో అవి కఠిన వాస్తవాలతో ఘర్షణ పడాల్సివచ్చింది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో ప్రత్యక్షంగా జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ తొలిదశలో సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీలు రెండూ విజయాలు సాధించాయి. ఓటర్లు ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలకు విశిష్టంగా ప్రాధాన్యతనిచ్చారు. తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఎస్పీలను నిలిపారు. ఇకపోతే కాంగ్రెస్ తదితర పార్టీలు తర్వాత స్థానాల్లో నిలిచి వెనుకబడ్డాయి. కానీ మండల ప్రముఖ్లను, జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్లను ఎన్నుకునే సమయానికి ఈ విజయగాథ తీరు కాస్తా మారిపోయింది. వీరిని పరోక్ష ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి పంచాయతీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. డబ్బు, కండబలం ఉపయోగించి ఫలితాలను తారుమారు చేసేందుకు ఎక్కువ అవకాశముండే ఈ రెండవ, మూడవ స్థాయి ఎన్నికల్లో గెలుపొందడంలో అధికార బీజేపీ ముందంజలో నిలిచింది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పార్టీ చిహ్నాలతో పోరాడటం జరగదు. అయినప్పటికీ ఏ అభ్యర్థి ఏ పార్టీ మద్దతు పొందారు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ పంచాయతీ ఎన్నికల్లో కొనసాగింది కూడా. తార్కికంగా చూస్తే, ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థుల నుంచి ఎలక్టోరల్ కాలేజీని రూపొందిస్తారు కాబట్టి బీజేపీ సాధారణంగా బ్లాక్, పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవాల్సి ఉంది. కానీ అభ్యర్థులను బెదిరిం చడం, హింస, దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తినప్పటికీ, బీజేపీ బ్లాక్ స్థాయిలో (75కు గాను 67 స్థానాలు) జిల్లా పంచాయతీల్లో (825కి గాను 635 స్థానాలు) అధ్యక్ష పదవులను గెల్చి చక్కటి మెజారిటీ సాధించింది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా సహాయపడే గ్రామీణ ప్రాతినిధ్య సంస్థలపై బీజేపీ తన పట్టు నిలుపుకున్నట్లయింది. బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేసిన ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించాయి. గతంలో హిందుత్వ ఆధిపత్య రాజకీయ వాతావరణంలో తనపై పడిన మైనారిటీ అనుకూల ముద్రను చెరిపేసుకోవడంలో స్పష్టత ప్రదర్శించినట్లు కనిపించిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ముస్లింలపై దృష్టి పెట్టారు. యూపీ రాజధానిలోని పార్టీ కార్యాలయంలో అఖిలేష్ తొలి సమావేశం ప్రధానంగా ముస్లింలైన చేనేతకారులతో, లక్నో సమీపంలోని మలిహాబాద్కి చెందిన మామిడితోటల పెంపకందార్లతో జరగడం విశేషం. ‘ప్రజాతీర్పును కొల్లగొట్టారు’, ‘రామాలయ విరాళాలు దొంగిలించారు’, ‘కోవిడ్–19 నిర్వహణలో వైఫల్యం చెందారు’ అనే నినాదాలతో బీజీపీపై, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లపై అఖిలేష్ విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లోలాగా ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడంలో యూపీ ప్రతిపక్షం చాతుర్యం ప్రదర్శించినప్పటికీ, బీజేపీతో పోటీ పడటానికి లేదా కూటమిని సిద్ధం చేయడంలో సుదీర్ఘ ప్రయత్నాలు మొదలెట్టాల్సి ఉంటుంది. తాను తీసుకొస్తున్న జనాభా విధానం ఏ మతాన్ని కూడా గాయపర్చకూడదనే భావానికి బీజేపీ స్థిరంగా దూరం జరుగుతున్నందున నూతన జనాభా పాలసీ ఇప్పుడు మైనారిటీలను భయపెడుతోంది. బీజేపీ నేతలు కొందరు ఎమర్జెన్సీ కాలానికి తిరిగి వెళుతూ ‘మనమిద్దరం, మనకిద్దరు’ అనే సంజయ్ గాంధీ నినాదాన్ని వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. అత్యవసర పరిస్థితిలో ముస్లింలను సామూహికంగా, నిర్బంధంగా కుటుంబ నియంత్రణకు బలవంతపెట్టడంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరాదిలో మట్టిగరిచిపోయింది. యూపీలో విభిన్న సామాజిక వర్గాలను రాజకీయపరంగా చీల్చివేయాలనే తన ప్రాథమిక ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన ప్రతీ చర్యను చేపట్టే విషయంలో యోగి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాగా, నాలుగేళ్లుగా గాఢనిద్రలో ఉండి గత వారమే మేల్కొన్న బహుజన్ సమాజ్ పార్టీ బ్రాహ్మణుల మనస్సును గెల్చుకోవడానికి తన పథకాన్ని ప్రకటించింది. అనేక కారణాల వల్ల యోగిపట్ల బ్రాహ్మణులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాన్పూర్కి చెందిన సవర్ణుడు, తన ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తోడ్పాటుతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల హృదయాలను గెల్చుకోవడంలో బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి విజయం సాధించారు. ఆయనకు బ్రాహ్మణ సమాజంతో చక్కటి అనుసంధానం కలిగి ఉండటం మాయావతికి ఎంతగానో కలిసొచ్చింది. ఆనాటి ఎన్నికల్లో 51 మంది బ్రాహ్మణ అభ్యర్థులను మాయావతి నిలబెడితే 20 స్థానాల్లో వారు గెలవడం సంచలనం కలిగించింది. కానీ 2017లో బీఎస్పీ నిలబెట్టిన 52 మంది బ్రాహ్మణ అభ్యర్థుల్లో నలుగురు మాత్రమే గెలుపొందారు. పైగా బ్రాహ్మణ సమాజం ఇప్పుడు బీజేపీవైపు తిరిగిపోయింది. బ్రాహ్మణులను బీజేపీకి దూరం చేయాలంటే మాయావతి వారికి విశ్వసనీయ సందేశం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూపీలోని సంక్లిష్ట సామాజిక చట్రంలో ప్రస్తుతం బ్రాహ్మణుల మనస్సు గెల్చుకోవాలనుకుంటున్న మాయావతి సామర్థ్యం ముందుగా తన కీలకమైన దళిత ఓట్లను నిలిపి ఉంచుకోవడం పైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి 2014 నుంచి యూపీలోని పలు దళిత ఉపకులాలు బీజేపీ వైపు తిరిగిపోయాయి. పైగా సహరాన్పూర్కి చెందిన యువ లాయర్, కార్యకర్త చంద్రశేఖర్ ఆజాద్ రావన్ తాను స్థాపించిన ఆజాద్ సమాజ్ పార్టీ పతాక కింద దళిత ఓట్లను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మాయా వతికంటే చాలా చిన్నవాడే అయినప్పటికీ, కులాలవారీగా జన గణన చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని ఆజాద్ చర్చకు పెడుతున్నారు. కానీ బీఎస్పీ సంవత్సరాలుగా ఈ అంశంపై సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉండటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చాలా కాలం తర్వాత ఉత్తరప్రదేశ్లో మూడురోజుల పర్యటన చేశారు. యూపీపై మరింత ఎక్కువ సమయం గడుపుతానని ఆమె గతంలో ప్రకటించి ఉన్నారు. ఆమె ప్రస్తుత పర్యటనలో చిన్నచిన్న పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని సంకేతాలు వెలువరించారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను పణంగా పెట్టి ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోమని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే యూపీలో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు లాగా కార్యకర్తలు ఉన్నట్లయితే, 1989 నుంచి యూపీలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చతికిలబడిపోవడానికి బదులుగా రాజ కీయ క్రీడలో ఆ పార్టీ కూడా కొనసాగుతూ వచ్చేది. మరోవైపున కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో విఫలమై ప్రజ లను వారి ఖర్మానికి వారిని వదిలేశారని యూపీ సీఎం తీవ్ర విమర్శల పాలైనప్పటికీ తనలోని సహజాతాల కారణంగా వచ్చే ముందస్తు ప్రయోజనాలను బీజేపీ కొనసాగిస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని, వైరస్ నిర్మూలనను తన గొప్పగా యోగి ఆదిత్యనాథ్ ప్రకటిస్తున్నప్పటికీ, అది ప్రజాగ్రహాన్ని, వారి వేదనను చల్లార్చడానికి సరిపోదు. మరి క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను ప్రతిపక్షం సొంతం చేసుకుని బీజేపీ, ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించగలదా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. రాధికా రామశేషన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఐఏఎస్ ఆఫీసర్ దౌర్జన్యం.. రిపోర్టర్ వెంటపడి మరీ దాడి
UP Block Panchayat Chief Elections స్థానిక సంస్థల ఎన్నికలు దాడుల పర్వంగా మారిపోయాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్లో వరుస దాడుల ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.. మరో ఘటనలో ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్ట్ను వెంటపడి మరీ బాదాడు. ఆ ఘటనా వీడియో సర్క్యూలేట్ అవుతోంది. లక్నో: మియాగంజ్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ ఛీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్.. ఓ టీవీ రిప్టోరన్ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్ఫోన్తో షూట్ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు. ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఘటనపై స్పందించేందుకు దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్ కలెక్టర్ స్పందించారు. జర్నలిస్ట్తో మాట్లాడానని, అతని నుంచి ఫిర్యాదును స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని ఉన్నావ్ జిల్లా మెజిస్రే్టట్ రవీంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కాగా, యూపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా, మిత్రపక్షాలతో కలిసి 635 పంచాయితీ చీఫ్ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ విజయాన్ని ‘చరిత్రాత్మక విజయం’గా అభివర్ణించుకుంటోంది. भाजपा के MLA और ज़िलाध्यक्ष बम लेकर पुलिस वालों पर हमला कर रहे हैं ! ये है भाजपा के गुंडो का असली चेहरा ! #यूपी_में_गुंडाराज #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/l4yg5Gcc0Z — Anshuman Singh. (@AnshumanSP) July 10, 2021 -
BSP: మాయావతి కీలక నిర్ణయం
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయత్ ఎన్నికల్లో తాము పోటీచేయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నామని, అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాయావతి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నానన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘ఉత్తర్ప్రదేశ్ రక్షణే ధ్యేయం’’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా నియోజకవర్గాలపై దృష్టి సారించి, కేడర్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మాయావతి వెల్లడించారు. నిజానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే పోటీ చేసే విషయం గురించి ఆలోచించే వాళ్లమని, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా మాయావతి నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, అధికార బీజేపీకి సహకరించేందుకే మాయావతి పంచాయత్ ఎన్నికల బరిలో నిలవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు... యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ట్విటర్ వేదికగా... ‘‘బీజేపీకి ఎప్పుడు సాయం కావాలన్నా మాయావతి ఈ విధంగా ఎన్నికల నుంచి తప్పుకొంటూ ఉంటారు. జిల్లా పంచాయత్ ఎన్నికల్లో పోటీ చేయం అన్న ప్రకటన కూడా ఈ కోవకు చెందినదే’’ అని విమర్శించారు. ఇందుకు స్పందనగా... బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లా పంచాయతీ సభ్యులు చచ్చినట్లు తమ పార్టీలో చేరతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి బదులిచ్చారు. కాగా జూలై 3న యూపీలో జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా... ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 3 వేల మంది సభ్యులు జిల్లా పంచాయతీ చీఫ్లను ఎన్నుకోనున్నారు. చదవండి: ఎంఐఎంతో పొత్తుండదని మాయావతి స్పష్టీకరణ -
ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం
హుబ్లీ: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఓ వ్యక్తి సదరు గ్రామానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. హుబ్లీ తాలూకా తిమ్మసాగర అంచటకేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప తమను ఊరు విడిచి వెళ్లాలని రోజూ వేధిస్తున్నాడని ఆ గ్రామ ప్రముఖులు మంజునాథ్ తదితరులు మీడియా ఎదుట వాపోయారు. ప్రభుత్వం స్థలంలో వీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దివంగత శివళ్లి మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ క్రమంలోనే వీరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మరణాంతరం పరిస్థితి మారిపోయింది. గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప, మల్లవ్వ జంబాళ మాకు ఓటు వేయలేదంటూ నిత్యం వేధిస్తున్నారని మేము ఎక్కడి వెళ్లాలని బాధితులు వాపోయారు. చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
UP Panchayat Election Result 2021: బీజేపీకి మరో ఎదురుదెబ్బ
లక్నో: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక డీలాపడ్డ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో చేదు అనుభవం ఎదురయ్యింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకంజలో నిలిచింది. మొత్తం 3,050 స్థానాలకు గాను బీజేపీ మద్దతుదారులు కేవలం 599 స్థానాల్లోనే గెలిచారు. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 790, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)354 సీట్లల్లో పాగా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో జెండా ఎగురవేసింది. 1,247 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్పూర్లోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించడం గమనార్హం. కీలకమైన జిల్లాల్లో ఆ పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్ను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న ఆరోపణలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇకమీదట అయినా మేల్కోనకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ సీట్లు బీజేపీ 599 ఎస్పీ 790 బీఎస్పీ 354 కాంగ్రెస్ 60 ఇతరులు 1,247 మొత్తం 3,050 -
ఘోరం: 577 మంది టీచర్లు కరోనాకు బలి
లక్నో: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశ కల్లోలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఆ రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కరోనా బారినపడుతున్నారు. అయితే ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులే కరోనా బారినపడి ఏకంగా 577 మంది చనిపోయారంట. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ‘కరోనా బారిన అంతమంది ఉపాధ్యాయులు చనిపోయారు.. దయచేసి ఎన్నికలు వాయిదా వేయండి’ అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. ఈ మేరకు గురువారం యూపీ శిక్షక్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ చంద్ర శర్మ తమ ప్రతినిధులతో కలిసి ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చారు. మే 2వ తేదీన జరగాల్సిన ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల మృతిపై ఓ నివేదిక ఎన్నికల సంఘానికి సమర్పించారు. 71 జిల్లాల్లో 577 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని నివేదికలో ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున కరోనా సోకిందని దినేశ్చంద్ర శర్మ తెలిపారు. అంతకుముందు మంగళవారం ఏప్రిల్ 27వ తేదీన హైకోర్టు ఉపాధ్యాయుల మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ఆ రాష్ట్రంలో కరోనా బారినపడి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరణిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మన్నించి ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తుందా లేదో వేచి చూడాలి. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. -
ఊరిని మార్చడం కోసం 81 ఏళ్ల వృద్ధురాలు
ఊరే ముందు పుట్టిందో, రాణిదేవే ముందు పుట్టారో ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. ఊళ్లోని చెట్టూ పుట్టా, చేనూ చెరువూ, కొండా కోన ఆమె కళ్ల ముందే ఎదిగాయి. ఎదగకుండా ఉన్నది మాత్రం ఊరే. ఎదగని ఆ ఊరిని చూస్తూ.. ఇక చూస్తూ ఊరుకోకూడదని నిర్ణయించుకున్నారు రాణి దేవి. రాణిదేవి బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలో, లేక ‘గ్రామ ప్రధాన్’నో కానవసరం లేదు. ఆమెకై ఆమె వెళ్లి అడిగితే గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా వెంటనే కుర్చీలోంచి లేచి, ఎదురెళ్లి ఆమెకు నమస్తే పెట్టి, అవసరమైన పని చేసిపెట్టేంత గౌరవనీయమైన పెద్ద వయసులో ఉన్నారు రాణిదేవి. 81 ఏళ్లు! అసలైతే ప్రభుత్వమే ఆమె దగ్గరకు రావాలి. ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లే అవసరం లేదు. ఉందీ అంటే ఆ గ్రామంలో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే! ఎలాగంటే ఒక వృద్ధ మహిళ అడిగితేనే లక్ష్య పెట్టని ప్రభుత్వ సిబ్బంది.. తక్కినవారు అడిగితే పని చేసి పెడతారా?! అలా చేసి పెట్టి ఉంటే ఈ ఎనభై ఏళ్లలో.. రాణిదేవికి ఊహ తెలిసినప్పటి నుంచైతే.. ఈ డెబ్బై ఏళ్లలో రుద్రాపూర్ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి అంటే పెద్దగా ఏం కాదు.. మంచి రోడ్లు, మంచి నీరు, శుభ్రమైన పరిసరాలు.. ఇలా మనిషి మనుగడకు అవసరమైన కనీస వసతులు. కానీ రుద్రాపూర్లో ఏడు దశాబ్దాలుగా ఇవేవీ లేవు. చిత్రంగా ఉంటుంది.. వచ్చి వెళ్లిన పాలకులు, అధికారులు ఏం చేసినట్లు?! ∙∙ ఏం చేయలేదని, ఏం చెయ్యరు కూడానని చివరికి రాణిదేవే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నిలబడేందుకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్లో ఏప్రిల్ 15 నుంచి విడతల వారిగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు రావచ్చు. ఏ పంచాయితీకి ఏ ఫలితం వచ్చినా.. కాన్పూర్ జిల్లా చౌబేపుర్ బ్లాక్ కౌన్సిల్ సభ్యురాలిగా రాణిదేవి గెలవడం అత్యుత్తమ ఫలితం అవుతుంది. రాణిదేవి స్వగ్రామమైన రుద్రాపూర్ ఆ బ్లాక్ పరిధిలోనిది. ఆమె గెలుపు ఎలా అత్యుత్తమమైన ఫలితం అవుతుందో చూడండి. ఆమేమీ అధికారం కోసం, పదవి కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఈ వయసులో నామినేషన్ వేయలేదు. ఏదైనా ఒక పార్టీ తరఫున అసలే పోటీ చేయడం లేదు. తనకై తను సొంతంగా, స్వతంత్ర అభ్యర్థిగా, ఊరిని మార్చడం కోసం ఎన్నికల్లో నిలబడ్డారు. ‘‘నన్ను గెలిపిస్తే ఊరిని నివాస యోగ్యం చేస్తాను’’ అని రాణిదేవి అంటున్నారు. మంచి మాటే! ఆకాశాన్ని కిందికి తెస్తాం, భూమిని పైకి తీసుకెళతాం అని హామీలు ఇవ్వడం కాకుండా.. ఊళ్లో నివాసం ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అని రాణిదేవి అనడం.. ‘ఊరొదిలి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’ అని నమ్మకమైన హామీని ఇవ్వడమే. అయినా రుద్రాపూర్ గ్రామ ప్రజలు ఊరెందుకు వదలి వెళ్లాల్సి వస్తుంది?! ∙∙ ఇన్నేళ్లుగా ఊరిని చూస్తూనే ఉన్నారు కదా రాణిదేవి.. ఊళ్లో సరైన రోడ్లు లేవు. ఆ ఊళ్లో కాలి నడక కూడా మనిషిని కిందపడేస్తుంది. ఎగుడు దిగుడు దిబ్బలే అక్కడి రహదారులు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండలా పేరుకుపోయి ఉంటుంది. ఊరి నిండా మురికి కుంటలే. అంత ‘సౌకర్యవంతంగా’ ఉంటే దోమలు తమ సంతతి ని వృద్ధి చేసుకోకుండా ఉంటాయా, మనుషుల్ని ఆసుపత్రులకు చేర్చకుండా ఉంటాయా?! పరిశుభ్రత అన్న మాటే కనిపించదు. చెప్పీ చెప్పీ ఊళ్లో వాళ్ల నోళ్లు పోయాయి తప్పితే, వాళ్ల ఓట్లతో గెలిచిన పంచాయితీ పాలకులు సక్రమంగా చెత్తను ఎత్తి పారేయించింది లేదు. మురికి కాలవల్ని సాఫీగా పారించింది లేదు. దోమల్ని తరిమిందీ లేదు. ‘‘ఇదిగో ఈ దుస్థితినంతా పోగొట్టి ఊరిని చక్కబరుస్తాను’’ అంటున్నారు రాణిదేవి పట్టుపట్టినట్లుగా. ‘‘పూర్వపు పాలకుల వైఫల్యాలను మా అమ్మ ఎత్తి చూపించడమే కాకుండా, ఎత్తి పారేయబోతున్నారు కూడా’’ అని రాణిదేవి కుమారుడు చాంద్ పాల్ అంటున్నారు. రాణిదేవి మనవరాలు కూడా తన నానమ్మను గెలిపిస్తే ఊరెంత వెలిగిపోతుందో చెబుతూ ఆమె తరఫున ప్రచారం చేస్తోంది. అయితే ఎవరూ ‘ఓట్ ఫర్’ అని చెప్పకుండానే... రుద్రాపుర్ బ్లాక్లోని వారంతా ఇప్పటికే మూకుమ్మడిగా రాణిదేవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దాడి
మాచవరం (గురజాల): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే అక్కసుతో రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ నేతలు దాడిచేశారు. గుంటూరు జిల్లా మాచవరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మండలం కొత్తపాలెం దళితవాడలో ఇద్దరు చిన్నారుల మధ్య పాఠశాలలో వివాదం తలెత్తిన నేపథ్యంలో పత్తిపాటి మోషే, ఏకుల లక్ష్మయ్య కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారంటూ మోషే ఈ నెల ఒకటిన ఏకుల లక్ష్మయ్యపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని ఆదివారం మోషే కుటుంబసభ్యులపై ఏకుల లక్ష్మయ్య గొడవకు దిగాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు మోషే, అతడి భార్య ప్రమీల బంధువులతో కలసి మాచవరం పోలీస్స్టేషన్కు వెళ్లారు. అది గమనించిన గ్రామ సర్పంచ్ గుదె రామారావు, టీడీపీ నాయకుడు యామని రామారావు, మరికొందరు నేతలు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న మోషే, ప్రమీల, చావా ఏసోబు, ఫీల్డ్ అసిస్టెంట్ నరేంద్రలపై దాడి చేశారు. పోలీస్స్టేషన్లోనే దుర్భాషలాడుతూ చొక్కాలు చింపి కొట్టారు. పోలీస్ సిబ్బంది వారించేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా వారే పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ పీవీ ఆంజనేయులు, రాజుపాలెం, బెల్లంకొండ, పిడుగురాళ్ల ఎస్ఐలు అమీర్, రాజశేఖర్, చరణ్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. డీఎస్పీ విజయభాస్కర్రెడ్డి పోలీస్స్టేషన్కు వచ్చి బాధితులతో మాట్లాడారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని బాధితులు ఆయనకు విన్నవించుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రమీల, నరేంద్ర, లక్ష్మయ్యల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజా తెలిపారు. -
ఓట్ ఫర్ మిస్ ఇండియా
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు. వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్గా గెలిచి, క్రమంగా జాన్పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం! మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్మేన్. ముంబై, గోవా, రాజస్థాన్లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్లోని జాన్పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్పుర్ వస్తుంటారు. ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష. -
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!
చిత్తూరు అర్బన్: పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బేజారైన తమ్ముళ్లు మున్ని‘పోల్స్’కు దూరంగా ఉన్నారు. 30 మందికి పైగా సిట్టింగ్ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది సిట్టింగులు దూరం చిత్తూరు నగరపాలక సంస్థకు మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 30కి పైగా స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కటారి అనురాధ చిత్తూరు తొలి మేయర్గా పీఠం అధిష్టించారు. అయితే ఆమెకు మేయర్ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ను వారి రక్తసంబం«దీకులే మట్టుపెట్టారు. అనంతరం నలుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కార్పొరేషన్ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు ప్రజలు ఏకపక్షంగా మద్దతుగా పలికి ఆరణి శ్రీనివాసులును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వచ్చాయి. అయితే నాడు కోట్లు కొల్లగొట్టినవారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధ్యత తీసుకుంటే దాచుకున్న మూటలను బయటకు తీయాల్సివస్తుందని ఇంటికే పరిమితమయ్యారు. టీడీపీలో ఆందోళన టీడీపీ తరఫున అభ్యర్థులు దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు అనామకులతో నామినేషన్లు వేయించారు. బతిమిలాడి.. డబ్బులిచ్చి బరిలో దించిన తమ్ముళ్లు ఇప్పుడు కనిపించకపోవడంతో చిత్తూరు టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు నగర పార్టీకి అధ్యక్షుడినే నియమించకపోవడంతో ఎవరికి వారు తమ కెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. ప్రస్తుత కీలక సమయంలో నూ కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా కనిపించడంలేదు. దీంతో చిత్తూరు నగర టీడీపీలో నిస్తేజం ఆవరించింది. మరోవైపు వైఎస్సార్సీపీ మొత్తం 50 డివిజన్లుకు అభ్యర్థులను ప్రకటించేసింది. పోటీలో దిగిన అభ్యర్థులు ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జిల్లా నాయకులు కింకర్తవ్యం అంటూ మధనపడుతున్నారు. ఎవరికి వారు దూరంగా ఉండిపోతున్నారు. చదవండి: బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! చంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం -
తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి : అంబటి
సాక్షి, తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..'టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచారు. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందంటున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని జగన్ కుప్పం రప్పించారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు బజారు బజారు తిరుగుతున్నారు...ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం' అని అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా వదిలేసి చంద్రబాబు కుప్పంలో తిష్ట వేశారని, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుని కుప్పంలో సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి తీసుకెళ్లి, ఓడిన తర్వాత పక్కన పెట్టారని, చివరికి ఆయన సినిమాలు కూడా చూడవద్దని సూచించిన చంద్రబాబు..ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. 'నేను పులివెందులకు నీళ్లిచ్చాను...ఇప్పుడు కుప్పానికి నీళ్లివ్వండి అంటాడు.నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశావ్...పులివెందులకు నువ్వు నీళ్లిచింది ఎప్పుడు..?' అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయని తెలుగు తమ్ముళ్లు గుర్తించాలన్నారు. 'పుంగనూరులో పోటీ చేస్తాను అని అంటాడు... అంటే కుప్పాన్ని వదిలేసావా..? ఈ రోజు పచ్చకాగితాల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక్కటన్నా అమలు చేశావా? అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని నువ్వు అధికారంలో లేనప్పుడు ఎలా అమలు చేస్తావు? లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారు..ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. జగన్ గారి గన్లో బుల్లెట్స్ లేకపోతే నువ్వు మంగళగిరిలో ఒడిపోయావా? ఆయన గన్లో బుల్లెట్స్ లేకపోతే కుప్పంలో 14 పంచాయతీలకు పరిమితం అయ్యారా? భువనేశ్వరి గారికి సూచన చేస్తున్నా...మీ కుమారుడిని ఎవరికైనా చూపించండి. లోకేష్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమయ్యే పని కాదు అని మీరన్నా గుర్తించండి. నారా వారి కుటుంబానికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లోకేష్ బాబాయిని చూస్తే తెలుస్తోంది. అందరూ ముఖ్యమంత్రుల కుమారులు ముఖ్యమంత్రులు కాలేరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల లోకేష్ పదవీ కాంక్షతో మాట్లాడుతున్నట్లున్నారు' అని పేర్కొన్నారు. జనసేనకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు, ఎదో మేము అప్పుడప్పుడు విమర్శిస్తున్నాం కాబట్టి జనసేన ఉన్నట్లు ప్రజలకి తెలుస్తోందని అంబటి అన్నారు. చదవండి : (చంద్రబాబూ.. నువ్వో చచ్చిన విషసర్పం) (బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! ) -
నేడు కుప్పానికి బాబు: మేము రాలేం బాబోయ్!
కుప్పం ఫలితాలు చంద్రబాబును నియోజకవర్గానికి పరుగులు పెట్టించాయి. అధినేత పర్యటనపై టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శిస్తున్నాయి. మేము రాలేం బాబోయ్ అని తేల్చిచెబుతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం లేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజావిశ్వాసం కోల్పోయాక సమీక్ష సమావేశాలతో ప్రయోజనం లేదని వెల్లడిస్తున్నాయి. బాబు తీరుతో విసిగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల పరాభవానికి ముఖ్య నాయకుల తీరే కారణమని విశ్లేషిస్తున్నాయి. నమ్మించి నట్టేట ముంచేశారని మండిపడుతున్నాయి. సాక్షి, తిరుపతి: కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజలు పర్యటనకు రానున్నారు. ఓటమిపై సమీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక నాయకులు పీఏ మనోహర్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నంపై ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఘోర ఓటమికి మీ ముగ్గురి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర ఆర్థిక వనరులు లేవని, సర్పంచ్ బరిలో నిలబడలేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పోటీకి దించారని వాపోయారు. దీంతో అప్పులపాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రచారానికి కూడా రాలేదని నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం తామెందుకు కష్టపడాలని నిలదీశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి, కోట్లరూపాయలు సంపాదించిన నాయకులు, ఇప్పుడు కాడి పారేశారని మండిపడ్డారు. మా గోడు వినరు! చంద్రబాబు పర్యటనకు తాము హాజరు కాలేమని కార్యకర్తలు తేలి్చచెబుతున్నారు. ఒకవేళ సమావేశానికి వచ్చినా బాబు చెప్పిన మాటలు విని రావటం తప్పితే, తమ గోడు వినే పరిస్థితి ఉండదని వెల్లడిస్తున్నారు. నాయకత్వం మారితేనే కుప్పంలో పార్టీ స్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు. నేడు కుప్పానికి బాబు కుప్పం: నియోజకవర్గంలో మూడు రోజు పర్యటన నిమిత్తం గురువారం కుప్పం రానున్నట్లు టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.గురువారం ఉదయం గుడుపల్లె మండలం రాళ్ల గంగమ్మ ఆలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4 గంటలకు కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రామకుప్పంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం శాంతిపురంలోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. శనివారం ఉదయం కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కార్యాకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదు. ఆర్థిక సాయం చేస్తామని పోరుపెట్టి పోటీకి నిలబెట్టారు. తీరా నమ్మి నామినేషన్ వేస్తే తిరిగి చూడలేదు. పొలం తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఖర్చుపెట్టా. చివరకు ఓడిపోయి అప్పుల పాలయ్యా. అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి ఏం చేస్తారు. కుప్పం నియోజకవర్గంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఆక్రోశం మా నాయన జమీందారులాంటివాడు. రాజకీయాల్లోకి రాక ముందే మాకు చాలా ఆస్తులున్నాయి. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చాలా పోగొట్టుకున్నా. పెట్రోలు బంకుల వంటి ఆదాయ వనరులను కోల్పోయా. చివరకు అప్పులే మిగిలాయి. ఇకపై నాకు ఇన్చార్జి పదవి అక్కర్లేదు. రాజీనామా చేసేస్తా. – కుప్పం టీడీపీ ఇన్చార్జి పీఎస్ మునిరత్నం ఆవేదన చదవండి: ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం టీడీపీ సినిమా ముగిసింది -
ఎమ్మెల్యే గద్దె స్వగ్రామంలో టీడీపీకి ఆశాభంగం
గన్నవరం(కృష్ణా జిల్లా): టీడీపీకి చెందిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు స్వగ్రామమైన మండలంలోని అల్లాపురంలో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి డొక్కు సాంబశివ వెంకన్నబాబు 1,119 ఓట్లు సాధించి స్వతంత్ర అభ్యర్థి వీరాకుమారిపై 836 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ మద్దతు ఇచ్చిన చిక్కవరపు నాగమణి 40 ఓట్లతో మూడో స్థానంలో నిలవడంతో పాటు డిపాజిట్ను కోల్పోయారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పుట్టి పెరిగిన అల్లాపురంలో టీడీపీ ఘోర ఓటమి చెందడం పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం.. ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం..
రణస్థలం(శ్రీకాకుళం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు హింసకు తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో బీభత్సం సృష్టించారు. పోలీ సుల మీద కూడా కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు దొరికినవారిని దొరికినట్టు చితకబాదాయి. సర్పంచ్గా గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అసిరితల్లి భర్తను కొట్టడంతో ఆయన చేయి విరిగింది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం జరిగిన చిల్లపేటరాజాం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు కంబపు అసిరితల్లి 49 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. అయితే కొందరు వ్యక్తులు టీడీపీ మద్దతుదారులు గెలుపొందినట్లు పుకార్లు సృష్టిం చారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసు లు రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు పోలీసులపై కర్రలతో దాడికి పాల్పడడంతోపాటు రాళ్లు, సీసాలు విసరడంతో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు ఎస్ఐ అశోక్బాబుకు గాయాలయ్యాయి. దీంతో ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలు చిల్లపేటరాజాం చేరుకున్నాయి. విచక్షణ కోల్పోయిన ప్రత్యేక బలగాలు.. గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు పరిస్థితిని అదుపుచేసే క్రమంలో కనిపించిన ప్రతి ఒక్కరిపై లాఠీ ఝుళిపించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఇంటింటికీ వెళ్లి దొరికినవాళ్లను దొరికినట్టు పోలీసులు చితకబాదారు. ఘర్షణ నెలకొనడంతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి అసిరితల్లి, ఆమె భర్త నర్సింహులు రెడ్డి ముందుగానే వారి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె భర్తను విచక్షణారహితంగా కొట్టారు. ఆయన ఇంటినంతా చిందరవందర చేశారు. లాఠీదెబ్బలకు నర్సింహులు రెడ్డి చేయి విరిగిపోయింది. సర్పంచ్ ఇంటితోపాటు చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు లోనై తలో దిక్కుకు పరుగులు తీశారు. కార్లు, ఆటోల అద్దాలు పగిలిపోయి వీధుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. 50కి పైగా బైకులు ధ్వంసమయ్యాయి. ఘర్షణతో సంబంధం లేనివారిని పోలీసులు కొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి ప్రవేశించి కిటికీలు, టీవీలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. జేఆర్పురం పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్పురం ఎస్ఐ వాసునారాయణ తెలిపారు. బాధితులకు అండగా ఉంటాం చిల్లపేటరాజాంలో బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భరోసా ఇచ్చారు. గాయపడినవారిని ఆయన సోమవారం పరామ ర్శించారు. పోలీసులు సామాన్యులను శిక్షించడం చాలా బాధాకరమన్నారు. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ 13 మంది దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్.. -
‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం
కుప్పం (చిత్తూరు జిల్లా): నియోజకవర్గంలో రాజకీయ చరిత్ర తిరగబడింది. టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఫలితాలు చంద్రబాబును భయపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 74 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో అయి తే టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబు గుండె కాయ అన్ని చెప్పుకునే గుడుపల్లె మండలంలో 13 పంచాయతీలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. కొన్ని పంచాయతీల్లో టీడీపీ త్రిబుల్ డిజిట్ దాటలేకపోయింది. గుడుపల్లె మండల గుండ్లసాగరం పంచాయతీల్లో కేవలం 15 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి, దాసమానపల్లెలో 98 ఓట్లు, కెంచనబళ్ల పంచాయతీల్లో 39 ఓట్లు, 121 పెద్దూరు 197 ఓట్లు మాత్రమే టీడీపీకి వచ్చింది. కంచుకోటగా ఉన్న కుప్పం నియోజవవర్గంలో టీడీపీ ఎదురు దెబ్బతగిలింది. కరోనాలో కన్నెత్తి చూడని బాబు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో సొంత నియోజకవర్గం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. ఆ ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆయనకు సొంత నియోజక వర్గం గుర్తుకు వచ్చింది. ఫలితాలు వెలువడిన వారం తిరక్కముందే కుప్పం పర్యటనకు పరుగులు తీయడం బాబు అధైర్యానికి నిదర్శంగా తెలుస్తోంది. 35 ఏళ్లు రాజకీయ భవిష్యత్ కల్పించిన కుప్పం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించని బాబు కేవలం పార్టీ దెబ్బతింటే మాత్రం ప్రజలు గుర్తుకు వచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 25,26 తేదీల్లో చంద్రబాబు కుప్పం రాక రాష్ట్ర ప్రతిపక్ష నేత, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు. రెండు రోజులు పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ బాబు గారూ ఇంకా ఎందుకు అబద్దాలు -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
-
మంత్రి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ సోమవారం జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పనితీరుకు పంచాయతీ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు. టీడీపీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు. 80.37 శాతం పంచాయతీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్లం. సీఎం జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి. కుప్పం ఫలితాలే చంద్రబాబుపై వ్యతిరేకతకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని’ మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా.. నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! -
టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా..
సాక్షి, గుంటూరు: తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం, నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న అక్కసుతో టీడీపీ నాయకులు కుట్రలకు తెరతీశారు. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతు చూస్తామని ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతో పాటు, దాడులకు తెగబడ్డారు. వృద్ధుడికి సాయం చేసినందుకు... సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామం ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్లో నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుడికి వైఎస్సార్ సీపీ మద్దతుదారుడి ఏజెంట్గా ఉన్న ఫకీరయ్య సాయం చేయడాన్ని తప్పు బట్టిన టీడీపీ ఏజెంట్లు అతనితో వాగ్వాదానికి దిగారు. కురీ్చతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఫీకీరయ్య తరఫు వారు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఫకీరయ్య గాయపడ్డాడు. పోలీసులు స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడిన ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు. తమకు ఓటు వేయలేదని దాడి పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడు ప్రభాకర్కు సాయంగా అతని సోదరుడు ప్రసన్నకుమార్ పోలింగ్ బూత్కు వెళ్లాడు. ప్రభాకర్ స్వయంగా ఓటు వేయడానికి ఇబ్బందిపడటంతో టీడీపీ మద్దతు ఏజెంట్లు ఓటు వేయడానికి వీళ్లేదని అడ్డుకున్నారు. దీంతో ప్రభాకర్ను తీసుకుని ప్రసన్నకుమార్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా బాబాయి వరసైన సురేష్ విషయం తెలుసుకుని తిరిగి పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లాడు. సురేష్ గట్టిగా ప్రశ్నించడంతో ఓటు వేయడానికి పోలింగ్ ఆఫీసర్ అనుమతించాడు. ప్రభాకర్తో ఓటు వేయించి ఇంటికి వెళ్తుండగా టీడీపీ వర్గీయులు వారిని కులం పేరుతో దూషించి, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అని దాడికి పాల్పడ్డారు. దీంతో సురేష్ పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ప్రశ్నించినందుకు.. సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్ సీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో టీడీపీ వర్గీయులు వాగ్వాదానికి, కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అమరావతి మండలం ఉంగుటూరు పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్సీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చావపాడులో ఓటు వేయడానికి ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది రాగా వైఎస్సార్ సీపీ వర్గీయులు గుర్తించి అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులను ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ముప్పాళ్ల మండలం మాదలలో కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. మాకే ఎదురు నిలబడతారా అంటూ దాడి సత్తెనపల్లి: ‘దళితులు మాకే ఎదురు నిలబతారా?’ అంటూ సత్తెనపల్లి మండలం లక్ష్మీపురంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారుడు వల్లెపల్లి శ్రీనివాసరావు పోటీచేశారు. టీడీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు 110 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతే టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణ సంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారా, కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి’ అంటూ డీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచు మర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్, కె.నరేంద్ర, బి.శ్రీను మరో పది మంది కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. నందం వెంకటేశ్వరరావు, బాధి తులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఓడిపోయామనే దుగ్ధతో... సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు తిప్పిరెడ్డి వెంకటరెడ్డి 353 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేస్తుండగా టీడీపీ మద్దతుదారుడు సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కె.నర్సిరెడ్డికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..! -
పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..!
తిరుపతి రూరల్: మండలంలోని పుదిపట్లలో ఊహించినట్లే జరిగింది. ఊరు, పేరు, ఇంటి నంబర్లు లేని వందలాది దొంగ ఓట్లను తొలగించకుండానే ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లకు నకిలీ ఆధార్కార్డులను సృష్టించారు. అందుకోసం ఏకంగా మీ–సేవ కేంద్రాన్నే స్థావరంగా మార్చుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీ–సేవ కేంద్రంలో దొంగ ఆధార్కార్డులను తయారు చేస్తూ ఆదివారం పుదిపట్ల సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బడి సుధాయాదవ్ అనుచరులు పట్టుబడ్డారు. స్థానికులు ఫిర్యాదుతో ఎంఆర్పల్లె పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో బడి సుధా యాదవ్, వెంకటముని మునిచంద్రా, రవీంద్ర, మణికంఠ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పుదిపట్లలో దాదాపు 1,262 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణలో ద,త,మ,ప, ర, ఖ....ఇలా గుర్తు తెలియని పేర్లతో ఓటరు జాబితా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఒకే వ్యక్తి సెల్ నంబర్తో 470కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించినా చర్యలు లేవు. 0, 00, 000, 0000.... ఊర్లో లేని ఇలాంటివే ఇంటి నంబర్లుగా పెట్టి జాబితాను నింపేశారు. వాటిని ప్రక్షాళన చేయాలని మొ త్తుకున్నా పట్టించుకోలేదు. ఆదివారం పుదిపట్ల లో ఓటింగ్ జరిగింది. ఊహించినట్లుగానే దొంగ ఓట్లు వేసేందుకు బయట వ్యక్తులు వచ్చారు. వారిని ఊరు, పేరు లేని వారి ఓటరు కార్డును చూసి మరోక గుర్తింపు కార్డు చూపించాలని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు అడిగారు. దీంతో ఆధార్కార్డులను చూపించారు. డూప్లికేట్ తరహాలో ఉన్న ఆధార్ అడ్రస్లపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీశారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో నకిలీ ఆధార్కార్డుల గుట్టు బయటపడింది. ఫొటో ఉంచి, అడ్రస్ మార్చి.... దొంగ ఆధార్ కార్డులతో.. దొంగ అడ్రస్లతో ఓటరుగా నమోదు అయిన వ్యక్తులు, ఓటరు కార్డుతో పాటు గుర్తింపు కార్డు కోసం అడ్డదారులు తొక్కారు. అందుకోసం పేరూరు స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న మణికంఠ అనే వ్యక్తి మీ– సేవ కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు. ఫొటో మా త్రం ఉంచుకుని, పుదిపట్ల అడ్రస్తో నకిలీ ఆధార్కార్డులను తయారు చేసుకున్నారు. అక్కడ దాదాపు 500కు పైగా నకిలీ ఆధార్కార్డులు బయటపడ్డాయి. అక్కడే పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడి సుధాయాదవ్ అనుచరులు ఉన్నారు. వాళ్లే తమకు నకిలీ ఆధార్కార్డులు తయారు చేశారని చంద్రమౌళి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో మీ– సేవ నిర్వాహకుడు మణికంఠతోపాటు ఐదుగురిపై ఎంఆర్పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకమైన బడి సుధాయాదవ్ పుదిపట్ల సర్పంచ్గా గెలిచాడు. అతనిపై కూడా కేసు న మోదు అయ్యింది. దీంతో అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. చదవండి: పంచాయతీల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం పులివెందుల ‘పంచ్’ అదిరింది -
భార్యకు ప్రసవ వేదన.. భర్తకు విధి నిర్వహణ!
జామి(శృంగవరపుకోట): ఓ వైపు భార్య ప్రసవ వేదన అనుభవిస్తూ ఆస్పత్రిలో సతమతమవుతోంది.. అదే సమయంలో భర్త మాత్రం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. విజయనగరం జిల్లా జామి ఎస్ఐ ఎస్.సుదర్శన్ భార్య గౌతమి ఆదివారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్ఐ మాత్రం పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా వృద్ధులను మోసుకుని మరీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు తన భార్య పాపకు జన్మనిచ్చినట్టు సమాచారం అందగానే ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
లైవ్: తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 417 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 61, ఇతరులు 75 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. పార్టీ మద్దతుదారుల వారీగా విజయాలు జిల్లా వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 149 24 2 5 విజయనగరం 202 32 2 1 విశాఖ 68 18 1 1 తూర్పు గోదావరి 96 29 21 28 పశ్చిమ గోదావరి 152 41 5 4 కృష్ణా 162 39 1 5 గుంటూరు 153 59 5 4 ప్రకాశం 164 26 0 6 నెల్లూరు 158 14 2 1 చిత్తూరు 324 44 0 8 కర్నూలు 271 49 0 11 అనంతపురం 139 24 0 2 వైఎస్సార్ జిల్లా 203 0 19 2 -
జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు
అమలాపురం (తూర్పుగోదావరి): జనం ముందు కత్తులు దూసుకోవడం.. తెర వెనుక పొత్తులు పెట్టుకోవడం టీడీపీ, జనసేనలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. పార్టీ అగ్రనాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకూ ఇదే పంథా అవలంబిస్తున్నారు. అమరావతి నుంచి అల్లవరం వరకూ తెరచాటు పొత్తులకు తెర లేపుతున్నారు. మొదటి రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ విజయాలు సాధించారు. పల్లె పోరు ఫలితాల్లో అంచనాలు తలకిందులు కావడంతో కనీసం నాలుగో విడతైనా కొన్ని విజయాలు సాధించి పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీలు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు తెర వెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి. దీనిపై ప్రజల్లో విమర్శలు రాకుండా ఆ పార్టీల మద్దతుదారులకు ‘స్వతంత్ర’ ముసుగు వేస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలంటూ చెప్పుకొంటున్నారు. కోనసీమలోని మేజర్ పంచాయతీల్లో ఒకటైన అల్లవరం మండలం బెండమూర్లంకలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. టీడీపీ మద్దతుతో సర్పంచ్గా పోటీ పడుతున్న దొమ్మేటి పద్మకు జనసేన మద్దతు తెలిపింది. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంబాజీపేట మండలం మాచవరంలో రెండు పారీ్టలూ కలసి అభ్యరి్థని నిలిపాయి. టీడీపీకి చెందిన నాగాబత్తుల సుబ్బారావు సతీమణి శాంతకుమారి పోటీ చేస్తుండగా, జనసేన బహిరంగ మద్దతు ఇస్తోంది. అభ్యర్థికి స్వతంత్ర ముసుగు వేసింది. ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలకు సైతం తెర వెనుక పొత్తులను అప్పుడే సిద్ధం చేసుకుంటున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు స్థానాలకు జనసేనకు మద్దతు ఇచ్చేలా.. సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేలా రెండు పారీ్టల్లో ఒకరిద్దరు నాయకులు కలసి ఒప్పందాలు చేసుకోవడం ఇరు పారీ్టల కార్యకర్తల్లో వ్యతిరేకతను తీసుకువస్తోంది. ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లిలో టీడీపీకి చెందిన పినిశెట్టి వెంకట రెడ్డినాయుడు పోటీ చేస్తుండగా టీడీపీ మద్దతు ఇస్తోంది. అమలాపురం మండలంలో చిందాడగరువు, జనుపల్లి, భట్నవిల్లి, గున్నేపల్లి, సాకుర్రు, ఈదరపల్లి; ఆత్రేయపురం మండలం మెర్లపాలెం, ర్యాలి గ్రామాల్లో కూడా ఈ రెండు పార్టీలూ పరస్పరం తెర వెనుక సహకరించుకుంటున్నాయి. ఐ.పోలవరంలో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావుకు జనసేన మద్దతు ఇస్తోంది. కొత్తపేట మండలం మందపల్లి, పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం, రాజోలు మండలం కాట్రేనిపాడు పంచాయతీల్లో రెండు పార్టీలూ కలసి ఉమ్మడి అభ్యర్థులను పోటీ పెట్టాయి. చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన రాళ్ల దాడి
ముప్పాళ్ల(సత్తెనపల్లి): ఎన్నికల ప్రచారం ముగియడంతో గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో శనివారం వైఎస్సార్సీపీ అభిమానులు ఏడో వార్డు మీదుగా నడిచి వెళుతున్నారు. అక్కడే ఉన్న జనసేన పార్టీ శ్రేణులు వచ్చి వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జనసేన శ్రేణులు రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని తరిమివేశారు. దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన శ్యామల చిననాగిరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, గంజి శ్రీను, తమ్మినేని పిచ్చిరెడ్డి, వెన్నా శివారెడ్డి, చల్లా వీరారెడ్డి, మంచికంటి మోహన్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. జనసేనకు చెందిన సూరంశెట్టి సతీష్, నల్లపునేని వెంకటేశ్వర్లు, యర్రంశెట్టి శివ, కోడె భుజంగనాయుడు, శిరిగిరి రాజు, కుమ్మరి శ్రీను, సువారపు గోవిందరావుకు గాయాలయ్యాయి. రూరల్ సీఐ బి.నరసింహారావు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేíసుకున్నట్లు ఎస్ఐ ఎం.నజీర్బేగ్ తెలిపారు. బరితెగిస్తున్న టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఓటమిని తట్టుకోలేక టీడీపీ నేతలు హద్దు మీరుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి పంచాయతీ నుంచి టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలుపున భారతి భర్త అలుపన నాగిరెడ్డి కుప్పిలి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మింది రామప్పడును ఫోన్లో తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారు. అలాగే పోలాకి మండలం బెలమర పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన చింతు గోవిందరావు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటే ఫొటోలు తీశాడని ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మొబైల్ లాక్కోవడమే కాకుండా బుడ్డా రాంబాబు అనే వ్యక్తి ఏకంగా చంపేస్తానంటూ బెదిరించారు. చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర
నగరంపాలెం(గుంటూరు): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు స్టీల్ గిన్నెలను పంపిణీ చేసేందుకు సిద్ధమైన నలుగురిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 19వ తేదీన మేడికొండూరు గ్రామ పంచాయతీలోని ఇంద్రియానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంటూరు–హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై దక్షిణ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ఎన్.మహతి సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 400 స్టీల్ గిన్నెలను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. టీడీపీ సానుభూతి పరులుగా గుర్తింపు పొందిన ఇంద్రియానగర్ వాసులు బద్దెపోగు శివప్రసాద్, పెడిపాగా లూర్ధు, చెరుకూరి చెంచయ్య, చెరుకూరి లాజర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, 400 స్టీలు గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన నలుగురిలో ఒకరైన బద్దెపోగు శివప్రసాద్ అభ్యర్థి. గ్రామ పంచాయతీలోని 10వ వార్డు ఓటర్లకు పంపిణీ చేసేందుకు వాటిని తెచ్చారు. సీజ్ చేసిన గిన్నెలను అర్బన్ ఎస్పీ పరిశీలించారు. చీరలు పంచుతూ పట్టుబడిన టీడీపీ తోటపల్లిగూడూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపలి్లడూగూడూరు మండలం పోట్లపూడి పంచాయతీకి టీడీపీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి నాశిన కల్పన తరఫున శనివారం రాత్రి గ్రామంలో ఓటర్లకు చీరలను పంచిపెట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అజ్మతుల్లాఖాన్,ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 34 చీరలు, రెండు మోటారు బైక్లు,కరపత్రాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. టీడీపీ, జనసేన చీరలు, డబ్బు పంపిణీ ! పెదకాకాని(పొన్నూరు): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఓటుకు రూ.1000 చొప్పున డబ్బు పంపిణీ చేయడంతో పాటు ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్టేషన్కు తరలించారు. వారిలో మున్నంగి నాగరాజు, కాకాని అన్వేష్కుమార్, మున్నంగి నాగప్రసాద్ ఉన్నారు. గోళ్ళమూడి గ్రామంలో జనసేన బలపరచిన వార్డు అభ్యర్థి పసుపులేటి శ్రీనివాసరావు చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఆర్వోకు నోటీసులు కారంచేడు: పంచాయతీ ఎన్నికల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి, వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు కుంబా సుజాత ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్ అ«ధికారి లింగరాజు సుధాకరరావుతో పాటు సిబ్బందికి ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దారు సీతారత్నం, ఎంపీడీవో ఎం.నాగభూషణరావు తెలిపారు. చదవండి: నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం -
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగో దశ (తుది విడత) పంచాయతీ ఎన్నికల్లో గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని పార్టీ నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ పార్టీ గ్రామ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. చదవండి: జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! -
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
-
ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు
సాక్షి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయలపాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు తమ్మినేని చిరంజీవి నాగ్, పప్పల వెంకటరమణ శనివారం పరామర్శించారు. చదవండి: టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు! పేదల గూటికి టీడీపీ గండి! -
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్గా ఖాదర్బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా! -
మా జాబితా తప్పని నిరూపించగలవా!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్సీపీ అభిమానుల వివరాలన్నీ వెబ్సైట్లో ఉంచామని, దమ్ము ధైర్యం ఉంటే ఇందులో ఏ ఒక్కటైనా తప్పుందని నిరూపించగలరా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు తామే కైవసం చేసుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో శుక్రవారం ఘాటుగా స్పందించారు. ప్రజలు చీత్కరించినా ఇంకా ఎవరిని మభ్యపెడతారని ఆయన ప్రశి్నంచారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీతో పోలిస్తే టీడీపీ ఎక్కడా కనీస స్థాయిలో పోటీ పడలేదని పేర్కొన్నారు. ‘మావాళ్ల వివరాలను వెల్లడించడంలో మేమింత పారదర్శకంగా ఉంటే.. టీడీపీ గెలిచిన వారి వివరాలు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు’ అన్నారు. వైఎస్ జగన్ ప్రజా సంక్షేమానికి ప్రజలు పెద్దఎత్తున తీర్పు ఇస్తే.. దీన్ని అపహాస్యం చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. తిమ్మిని బమ్మిని చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదని ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా గెలిపించిన కుప్పం ప్రజలే డబ్బుల మాయలోఓట్లేశారని అవమానించిన చంద్రబాబును ప్రజలు ఎందుకు క్షమించాలని ప్రశ్నించారు. పిల్లనిచి్చన మామను, ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు న్యాయమేనా అన్నారు. ఆయనకున్న సంస్కారం ఇదేనన్నారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ సొల్లు కబుర్లతో శునకానందం: కొడాలి నాని -
అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్ స్టూళ్లకు డిమాండ్
అమలాపురం టౌన్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్ స్టూల్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించడంతో ఆయా అభ్యర్థుల్లో కొందరు ఓటర్లకు తమ గుర్తును తెలియజేస్తూ వారికి నిజమైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, కత్తెర, మంచం తదితర గుర్తులను పెద్దవిగా నమూనా తయారు చేయించి వాటినే ప్రచారాల్లో విరివిగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు సర్పంచ్ అభ్యర్థులు బుల్లి మంచాల నమూనాలు, లేదా వాస్తవ మంచాలతోనే ప్రచారం చేస్తున్నారు. వార్డుల అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తుల్లో ముఖ్యంగా కుక్కర్, స్టూలు గుర్తులను నమూనాగానే కాకుండా అసలైన కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ను కొనుగోలు చేసి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. నాలుగో విడతగా అమలాపురం డివిజన్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని వార్డుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మంది తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది. పి.గన్నవరం మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ తొలి రోజు కొనుగోలు చేసి కొందరు ఓటర్లకు పంచిపెట్టినా, మర్నాడు మిగిలిన ఓటర్లకు పంచిపెట్టేందుకు మార్కెట్కు వెళితే కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ స్టాక్ లేదన్న సమాధానంతో నిరుత్సాహ పడ్డారు. కోనసీమలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మేజర్ పంచాయతీల వార్డుల అభ్యర్థుల్లో చాలా మంది కుక్కర్లు, ప్లాస్టిక్ స్టూల్స్ ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఇస్తున్న గ్రామాల్లో ఓటర్లు చమత్కారంగా జోక్లు వేసుకుంటున్నారు. ఉంగరం (రింగ్) గుర్తు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఒక్కో బంగారం ఉంగరం ఓటర్లకు ఇస్తే ఎంత బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏం చేస్తావో తేల్చుకో బాబు..!
సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం, రెండోదశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచిందన్నారు. కుప్పంలో టీడీపీ కుప్పకూలిందని, వైఎస్సార్సీపీ 75 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. కుప్పంలో టీడీపీ 14 స్థానాలకే పరిమితమైందన్నారు. కుప్పంలో టీడీపీకి వచ్చిన 14 స్థానాలూ అరకొర మెజార్టీతో వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. ‘‘కుప్పంలో మేం చేసిన అభివృద్ధే విజయానికి కారణం. చంద్రబాబు.. కుప్పంలోనే మెజారిటీ సాధించలేకపోయారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి. తన పదవి నుంచి తప్పుకుంటే బాగుంటుంది.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని’’ మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ -
అదే ఆనవాయితీ.. వారే సర్పంచ్లు..
మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్ మహిళగా రిజర్వ్ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది. చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్కు దేహశుద్ధి -
54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు
ఆ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 54 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం తొలిసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఒకేఒక ఏకగ్రీవ సర్పంచ్గా ఎస్ఎ షుకూర్ చరిత్ర సృష్టించారు. కాగా అక్కడ ఆది నుంచి ముస్లిం మైనారిటీల హవానే కొనసాగుతోంది. పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కల్లూరు 1965లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే ఆ గ్రామ సర్పంచ్లుగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ గ్రామ సర్పంచ్గా వైఎస్సార్ సీపీ అభిమాని ఎస్ఎ షుకూర్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి ఏకగ్రీవ సర్పంచ్గా ఆ పంచాయతీ చరిత్రలో ఆయన నిలి చిపోయారు. తొలిసారిగా 1967లో జరిగి న ఎన్నికల్లో నన్నే సాహెబ్ మొదటి సర్పంచ్గా గెలిచారు. అనంతరం హెచ్ఎస్ గఫూ ర్ 19 ఏళ్లు సర్పంచ్గా పనిచేశారు. ఆ తరువాత టీఎస్. గఫర్, ఎస్ఏ జుబేర్సాహెబ్, పీఎస్ నజీర్, హెచ్ఎస్ పర్విన్, పీ ఎస్ నజీర్, హెచ్ఎస్ షబానా సర్పంచ్లుగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్ఎ షు కూర్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ పంచాయతీకి 54 ఏళ్ల తరువాత ప్రస్తుతం తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆది నుంచి ఇప్పటివరకు ముస్లిం మైనారిటీలే సర్పంచ్లుగా కొనసాగుతున్నారు. చదవండి: తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్.. ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్కు దేహశుద్ధి -
తుది విడతలో 553 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: చివరి విడతగా ఈనెల 21న జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 553 పంచాయతీ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. తుది విడతలో జిల్లాల వారీగా ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాల సంఖ్యతోపాటు మిగిలినచోట్ల ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న వివరాలను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నాలుగో విడతలో మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీకాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 553 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రెండు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,744 చోట్ల సర్పంచ్ స్థానాలకు ఈ నెల 21వ తేదీన చివరి పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 7,475 మంది అభ్యర్ధులు సర్పంచ్ పదవులకు పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 33,435 వార్డులున్నాయి. వీటిలో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 22,422 వార్డుల్లో ఈ నెల 21న జరగనున్న ఎన్నికల బరిలో 49,083 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన 92 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. చదవండి: ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు.. పేదలపై భారం మోపలేం.. -
ప్రభంజనం: వైఎస్సార్సీపీ సంబరాలు..
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది. పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు. ముందే ఊహించాం: కన్నబాబు మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ -
చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్
-
లైవ్: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
సాక్షి, అమరావతి : బుధవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. 13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో మొత్తం 3221 పంచాయతీలు ఉండగా.. 579 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,639 సర్పంచ్,19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. పంచాయతీల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,291 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 263 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 13, ఇతరులు 96 చోట్ల గెలుపొందారు. జిల్లాల వారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 195 37 0 0 విజయనగరం 196 9 0 1 విశాఖ 153 45 5 26 తూర్పు గోదావరి 123 15 1 23 పశ్చిమ గోదావరి 100 19 1 10 కృష్ణా 138 8 4 4 గుంటూరు 130 3 1 0 ప్రకాశం 152 23 0 0 నెల్లూరు 276 12 0 0 చిత్తూరు 193 18 0 0 కర్నూలు 191 25 1 12 అనంతపురం 188 25 0 10 వైఎస్సార్ జిల్లా 156 24 0 4 -
ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫోటోలు
-
నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విజయవాడ తూర్పు: ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ విలువలకు విరుద్దంగా టీడీపీ నాయకులు నడిరోడ్డుపై రచ్చ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్కు టీడీపీ తరుపున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపనేని వాణి, అదే పార్టీకి చెందిన బొండా ఉమా అనుచరుడైన కోనేరు వాసుకు కొన్నేళ్లుగా ఆస్తి, సరిహద్దు వివాదం కొనసాగుతుంది. గుణదలలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఆస్తికి ఎప్పటి నుంచో సరిహద్దు తగాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి మరో మారు ఇరు వర్గాల మధ్య తగాదా మొదలైంది. వివాదం పెరిగి పెద్దది కావడంతో కొండపనేని వాణి కుమారుడు శ్రీకాంత్, కోనేరు వాసులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై మరోకరు నడిరోడ్డుపై దాడులకు పాల్పడ్డారు. కాగా స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు అదే సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థి భీమిశెట్టి ప్రవల్లిక పర్యటన కొనసాగుతుంది. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను కలుస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నాయకుల మధ్య రేగిన గొడవను రాజకీయం చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేశారు. దీనికి వత్తాసు పలుకుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు తమ కార్యకర్తలు చేసిన రచ్చను సమర్ధించారు. ఏ ప్రమేయం లేకపోయినా వైఎస్సార్ సీపీ నాయకులు గొడవకు కారణమంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా టీడీపీ అభ్యర్థి వాణిని ప్రోత్సహించారు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నేప«థ్యంలో టీడీపీ నాయకులు తమపై అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో ఏలా అయినా గెలుపొందాలనే దురుద్దేశంతో టీడీపీ నాయులు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతుండటం చర్చనీయాంశంగా మారింది.. విజయవాడ టీడీపీలో చీలిక ‘మీరంతా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అటో.. ఇటో.. ఎటో.. నిర్ణయించుకోండి. ఉంటే మాతో ఉండండి. లేదా ఎంపీతోనైనా వెళ్లిపోండి. ఏదో ఒక వైపు మాత్రమే నిలవాలి. అటూ ఇటూ రెండువైపులా ఉంటామంటే ఇక ఏమాత్రం కుదరదు. ఇందులో మొహమాటం ఏమీలేదు’ అని విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్మీరాలు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులకు హకుం జారీచేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ పేరిట వారివురు కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 18 మంది కార్పొరేట్ అభ్యర్థులు, 19 మంది పార్టీ డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు. టార్గెట్ కేశినేని.. ప్రధానంగా ఎంపీని లక్ష్యంగా చేసుకుని సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ సమావేశానికి గైర్హాజరు కావడంతో పాటు కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కూడా ఎంపీని ప్రత్యేకంగా కలవడం నగర టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ జోక్యంతోనే.. విజయవాడ టీడీపీ నాయకులు గ్రూపు తగాదాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల నగారా మరింత అగ్గి రాజేసింది. అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్యంగా లోకేష్ జోక్యంతోనే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ పరిస్థితులను ఎంపీ కేశినేని నాని వర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. పెత్తనాన్ని జీర్ణించుకోలేక.. పశ్చిమంలో టీడీపీ నాయకత్వం అక్కడి సీనియర్ నాయకులైన బుద్దా, జలీల్, మీరాలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అప్పగించకపోగా నియోజకవర్గాన్ని సమన్వయ పరచుకోవాలని ఎంపీ కేశినేనికి గతంలో సూచించారు. దీంతో డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఎంపీ కనుసన్నల్లోనే జరిగింది. తమ నియోజకవర్గంలో కేశినేని పెత్తనాన్ని జీర్ణించుకోలేని బుద్దా, మీరాలు సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి బొండా ఉమా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లతో చేతులు కలిపారు. సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, ఇటీవలి కాలంలో లోకేష్తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాంలు కూడా పై గ్రూపుతో జతకట్టారు. కేశినేనికి ఇవన్నీ జీర్ణించుకోలేని పరిణామాలుగా మారాయి. మాకే అధిష్టానం మద్దతు ‘మన నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్జీలు అధిక శాతంలో ఉన్నారు. వారొచ్చి మనపై పెత్తనం చేస్తామంటే మనం ఎందుకు అంగీకరించాలి’ అని బుద్ధా, మీరాలు ప్రశ్నించినట్లు తెలిసింది. శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించలేదని చెబుతూ.. అధిష్టానం ఆశీస్సులు లేకపోతే మేం ఈ సమావేశాన్ని నిర్వహించగలమా అని నాయకులు ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. గూండారపు హరిబాబు కూతురు పూజిత గెలవలేదని, ఆమె స్థానంలో శివశర్మను పోటీలో నిలపాలని ఎంపీ కేశినేని ప్రతిపాదిస్తున్నారని చర్చకు లేవనెత్తగా ఆయన కార్పొరేట్ అభ్యర్థులు అందర్నీ గెలిపించగలరా అని నాయకులు ఎద్దేవా చేశారని తెలిసింది. పశ్చిమ నేతల భేటీలో.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నాయకులతో భేటీ అయిన బుద్దా, మీరాలు తమ అజెండాను స్పష్టంగా వెల్లడించారు. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించలేదని, ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు తమందరి సమక్షంలో వెల్లడించారని స్పష్టం చేశారు. శ్వేత పేరు ఎంపీ స్వయం ప్రకటితమని, ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. మేయర్ అభ్యర్థి ఫలానా వారని తేలిన పక్షంలో తమ ఎన్నికల ఖర్చుకు ఇస్తారని ఒకరిద్దరు ప్రస్తావించగా ఎంపీ కేశినేని ఇచ్చే మొత్తం కన్నా తాము రెండింతలు ఎక్కువగానే సమకూర్చుతామని బుద్దా, మీరాలు పోటీదారులకు భరోసా ఇచ్చారని ‘సాక్షి’కి అభ్యర్థులు తెలిపారు. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వర్గీయులు ఆగడాలు మితిమీరిపోయాయి. టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తేనే సాగు, తాగునీరు ఇస్తామని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఓడిపోతే తమ భూముల నుంచి హంద్రీనీవా నీరు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పేరు చెరువుకు నీరు కావాలంటే టీడీపీకి ఓట్లు వేయాలని హుకుం జారీ చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను పయ్యావుల వర్గీయులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని పయ్యావుల కేశవ్ అనుచరులు.. బెదిరింపులకు దిగడంతో ఈ నెల 10న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: అచ్చెన్నా ఒళ్లు దగ్గర పెట్టుకో.. విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు.. -
తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఊరూరా చక్రం తిప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేని దీన స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల తరబడి పాలించిన వారు పనులు చేయకపోవడం, ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడడం పతనానికి హేతువులయ్యాయి. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ పరిహారంలో చేసిన అక్రమాలు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ఉద్దానం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసి తీరా ఓడించారు. ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్దానం అభివృద్ధికి పాటు పడుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారిని అధిక సంఖ్యలో గెలిపించుకు న్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో టీడీపీ నేతల పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి, వాస్తవంగా భూములుండి, నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయు డు, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ కుటుంబీకులకు ప్రజలు షాకిచ్చా రు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వ గ్రామం ఉన్న కవిటి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు భారీ మెజారిటీతో విజ యం సాధించారు. ఈ మేజర్ పంచాయతీలో కూన రవికుమార్, బెందాళం అశోక్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ పూర్తిగా స్వీప్ చేసింది. తిత్లీ అక్రమాలకు పాల్పడ్డ వారిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతి సారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి కరిచింది. బల్లెడ సుమన్ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్ నేత మాదిన రామారావు ఓడిపోయారు. అలాగే, కంచిలి మండలంలోని చిన్న కొజ్జరియా, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడు పూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లీ అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. ఒంటరి పింఛన్ల అక్రమాలు.. భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చిన వైనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యంగా పింఛన్ల అక్రమాలు జరిగిన బూర్జపాడు, ఈదుపురం, లొద్దపుట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పరుగులు.. ఉద్దానం ఏరియాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకిలించేశాయి. కిడ్నీ సమస్య పరిష్కారానికి చేస్తు న్న కృషి, స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింప చేశాయి. అలాగే ఉద్దానం ఏరియాలో స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టీ, కిడ్నీ రోగులకు రూ. 10వేల పింఛను, ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మందసలో 2965 ఓట్ల మెజారీ్ట, సోంపేటలో 2841 ఓట్ల మెజారీ్ట, కవిటిలో 1700పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఆషామాషీ కాదు. పూండి గోవిందపురంలో ఎప్పుడూ టీడీపీయే గెలిచేది. జమీందారి వ్యవస్థ కొనసాగేది. ఆయనెవరు బొట్టు పెడితే వాళ్లే గెలిచేవారు. ఈసారి ఆ పరిస్థితి మారింది. అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తినాయుడు కుటుంబీకులు గెలిచేవారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సోంపేట, మందస, మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి, రేయపాడు నగరంపల్లిలో ప్రతి సారి టీడీపీయే గెలిచేది. తొలిసారిగా ఘోరంగా ఓటమి పాలైంది. (చదవండి: విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు) మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. -
టీడీపీ ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలి: వైఎస్సార్సీపీ
విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబును సోమవారం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురం, వెల్లంక పంచాయతీలలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ ప్రలోభాలకు టీడీపీ మద్దతుదారులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తున్న తెలుగు దేశం పార్టీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరారు. చిత్తూరు జిల్లా తిమ్మాపురం వడ్డేపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలపై టీడీపీ చేసిన దాడులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఓటమి ఎరుగని ‘సర్పంచ్’ ఫ్యామిలీ అది!
కొమరోలు: అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పర్యాయాల పాటు ఒక్క కుటుంబం వారే సర్పంచ్గా ఉంటున్నారు. పార్టీలు ఏవైనా సర్పంచ్ పదవి ఆ కుటుంబాన్ని వరిస్తుంది. 1956 నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ ప్రజలు పట్టం కడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచెర్ల పంచాయతీలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1956లో మొదటగా రెడ్డిచెర్ల బాలవీరంరాజు సర్పంచ్గా గెలిచారు. అనంతరం బాలవీరంరాజు కుమారుడు లక్ష్మీనరసరాజు ఎన్నికయ్యారు. అనంతరం 5 పర్యాయాలు వారి కుటుంబంలోని రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు సర్పంచ్గా ఉన్నారు. 1970 నుంచి 1976 వరకు వెంకటేశ్వరరాజు సర్పంచ్గా ఉండగా, 1983–87 వరకు మళ్లీ ఆయనే ఏకగ్రీవ సర్పంచ్గా ఉన్నారు. తరువాత 1987–1992 వరకు కూడా ఆయనే ఉన్నారు. 1995–2000 వరకు వెంకటేశ్వరరాజు భార్య అంజనమ్మ సర్పంచ్గా ఉన్నారు. అనంతరం రిజర్వేషన్ల ప్రాతిపదిక రావడంతో రెండు దఫాలు ఓసీ, ఎస్సీలకు వచ్చాయి. దీంతో పోటీలో నిలువలేదు. 2006–2011, 2014–2019లో వెంకటేశ్వరరాజు సర్పంచ్గా గెలుపొందారు. ఇప్పటి వరకు వీరి కుటుంబం గ్రామసర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. వెంకటేశ్వరరాజు ఈమధ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిచెర్ల గ్రామపంచాయతీకి బీసీ రాగా వెంకటేశ్వరరాజు కోడలు రెడ్డిచెర్ల ఉమాదేవి వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యరి్థగా పోటీలో నిలిచారు. (చదవండి: హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!) ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు! -
ఇదేందయ్యా ఇది.. ఇదెప్పుడూ చూడలా!
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నరసింగ పాడు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వార్డు అభ్యర్థులిద్దరు గుర్తులు తారుమారయ్యాయని రగడ నెలకొంది. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీయగా.. ఇద్దరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని వారే పొరపాటు పడి ఒకరి గుర్తును మరొకరు ప్రచారం చేసుకున్నారు. వారికి అధికారికంగా కేటాయించిన అసలు గుర్తులేమిటో అధికారులు వివరించడంతో నాలుక్కరుచుకోవడం అభ్యర్థుల వంతయ్యింది. అభ్యర్థుల్లో ఒకరైన సకినాల ఏడుకొండలుకు గౌను, మరో అభ్యర్థి పొదిలి వెంకటేశ్వర్లుకు ప్రెషర్ కుక్కర్ను అధికారులు కేటాయించగా.. అభ్యర్థులు పొరబడి పోటీ అభ్యర్థి గుర్తును తమదిగా ప్రచారం చేసుకున్నారు. (చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!) ప్రజా తీర్పును వక్రీకరిస్తావా? -
‘ఎప్పుడైనా ఓకే.. అందుకు సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: ఎస్ఈసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మాయ, మోసం, దగాలో టీడీపీ పుంజుకుంటోందని ఆయన విమర్శించారు. మొదటిదశలో 3,244, రెండో దశలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని తెలిపారు. రెండో దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2639, టీడీపీ 536, బీజేపీ 6,జనసేన 36, ఇతరులు 108 స్థానాలు గెలిచారని తెలిపారు. ఏకగ్రీవాలతో కలిసి వైఎస్సార్సీపీ మద్దతుదారులు 2,639 మంది గెలిచారని ఆయన వెల్లడించారు. చంద్రబాబులా అంకెలగారడీ చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ దాడులు హేయమైన చర్య: మంత్రి బాలినేని ప్రకాశం: పంచాయతీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం స్పష్టమైందని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. టీడీపీ ఆధిపత్యం గ్రామాల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఓటమిని తట్టుకోలేకే వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని, టీడీపీ దాడులు హేయమైన చర్య అని మంత్రి బాలినేని మండిపడ్డారు. (చదవండి: ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్) పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ -
ఓటమి జీర్ణించుకోలేక.. రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, ప్రకాశం/గుంటూరు: ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఎస్ఎల్.గుడిపాడు, వైదన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించగా, ఓర్చుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. కారుతో పాటు రెండు బైకులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఉంటే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల దాడులపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు: జిల్లాలో వినుకొండ మండలం విట్టంరాజుపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విట్టంరాజుపల్లిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు సుజాత గెలుపొందగా, ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడి.. జిల్లాలోని నూజెండ్ల మండ లంలో టీడీపీ నేతలు బరితెగించారు. ములకలూరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కోటేశ్వరమ్మ విజయం సాధించగా, ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.టీ డీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ) ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్ -
ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు
-
ఆ దమ్ము టీడీపీకి ఉందా..?: పెద్దిరెడ్డి సవాల్
సాక్షి, చిత్తూరు: ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం స్పష్టమైందని.. వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని టీడీపీ నేతలు కోరడం సిగ్గు చేటని మంత్రి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని, చంద్రబాబు తానా అంటే కొన్ని ఛానల్స్, పత్రికలు తందానా అంటున్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలని మంత్రి పెద్దిరెడ్డి కొట్టి పారేశారు. ఆయన.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ: మంత్రి వెల్లంపల్లి విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో మరో పార్టీ లేకుండా ప్రజలు తీర్పు చెప్పారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండో దశలో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీదే గెలుపు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయవాడలోని 64 డివిజన్లు వైఎస్సార్ సీపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో లక్షమంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రూ.600 కోట్లతో విజయవాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కుంభకర్ణుడు కన్నా ఎక్కువ అని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. కేశినేని నాని ఎంపీగా ఉండి నిధులు తేలేని అసమర్థుడని.. మేయర్ పీఠం అంచులకు కూడా ఆయన రాలేడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. (చదవండి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ) టీడీపీ కంచుకోటలు బద్దలు -
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సీనియర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్లకు స్థానిక ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. పరిటాల సొంత మండలం రామగిరిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పాగా వేయడంతో 26 ఏళ్ల పరిటాల ఆధిపత్యానికి చెక్ పడింది. మండలంలో 7 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. రామగిరి, పేరూరు, కుంటిమద్ది, పోలేపల్లి, కొండాపురం, గంతిమర్రి, చెర్లోపల్లి, ఎంసీ పల్లి పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. ధర్మవరం నియోజకవర్గంలోని 70 పంచాయతీల్లో 63 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. రాయదుర్గం బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రి కాల్వకు ఘోర పరాభవం ఎదురయ్యింది. రాయదుర్గం నియోజకవర్గంలో 87 పంచాయతీ లకు గాను 70 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలో పయ్యావుల పట్టుకోల్పోయారు. బెలుగుప్పలోని 19 పంచాయతీల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు జయకేతనం ఎగరవేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్నాయుడు సొంత పంచాయతీ అంకంపల్లిలో టీడీపీ ఓటమి పాలైంది. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) టీడీపీ కంచుకోటలు బద్దలు -
కొంప ముంచిన ‘పదకొండు’
తిరుపతి రూరల్: మనిషికి మతిమరుపనేది సహజం. జాగ్రత్తగా ఉండాల్సిన చోటా పొర పాట్లు చేస్తుంటారు. అచ్చం అలాంటిదే స్థానిక సమరంలో చోటు చేసుకుంది. తిరుపతి రూర ల్ మండలం పెరుమాళ్లపల్లె పంచాయతీలో రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ పత్రం డిక్లరేషన్లో 11వ తేదీ వేయడం మరిచిపోయారు. దీంతో అందరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. (చదవండి: అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!
కోడూరు (అవనిగడ్డ): పంచాయతీ ఎన్నికలు.. పైగా పార్టీలకు అతీతం.. కానీ అక్కడ అలాలేదు. ఆ అభ్యర్థి మెడలో ఏకంగా రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దూరి సునీత మెడలో టీడీపీ, జనసేన పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. (చదవండి: ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!
కొమరోలు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది.. కానీ మూడు గ్రామాలు కలిసిన ఊరది. ఆ ఊర్లో రెండు పంచాయతీలున్నాయి. అక్కడి ఓటర్లు ఇద ్దరు సర్పంచ్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు ఊర్లు రెండు మండలాలుగా విభజిం చడంతో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ ఊరు, గిద్దలూరు మండల పరిధిలోని రెండు ఊర్ల కలయికగా పొదలకొండపల్లె గ్రామం ఏర్పడింది. మూడు గ్రామాల కలయికతో విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది. గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలు భౌగోళికంగా కలిసి ఉండగా, కొమరోలు మండల పరిధిలో పొట్టిరెడ్డిపల్లె గ్రామం కూడా ఆ గ్రామాల్లోనే మిళితమై ఉంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె్ల, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి -
గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!
సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీకి చెంపపెట్టు లాంటి తీర్పు చెప్పినా ఆ పార్టీ అధిష్టానం, నాయకులు మభ్యపుచ్చుకుంటూ విజయం సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొలిదశ ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన పరివారం ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడ్డ పంచాయతీ ఫలితాల్లో దాదాపు అన్నిచోట్లా వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయభేరీ మోగించినా టీడీపీ నేతలు మాత్రం మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. అత్యధిక పంచాయతీలను గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఎదురు చూడాలని సంయమనం పాటిస్తుండగా టీడీపీ నాయకులు మాత్రం ఓడిపోయి కూడా జబ్బలు చరుచుకుంటూ మభ్యపుచ్చుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం తాము ప్రభంజనం సృష్టించినట్లు ప్రచారానికి తెర తీసింది. ఫలితాల టేబుల్ అంటూ రాత్రి 9 గంటల తర్వాత టీడీపీ కార్యాలయం ఒక జాబితాను మీడియాకు లీక్ చేసింది. అందులో టీడీపీ 343 పంచాయతీలను గెలుచుకుందని, వైఎస్సార్సీపీ 546 పంచాయతీల్లో నెగ్గిందని పేర్కొంది. ఇలా రకరకాల ప్రచారాల ద్వారా గందరగోళానికి గురి చేసే ఎత్తుగడను చంద్రబాబు బృందం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి) టీడీపీ కంచుకోటలు బద్దలు -
‘కృష్ణా’లో ఫలితం తేల్చిన ఒక్క ఓటు..
సాక్షి, అమరావతిబ్యూరో: కృష్ణా జిల్లాలోని అతిచిన్న పంచాయతీ అయిన నందివాడ మండలం గండేపూడి గ్రామ పంచాయతీకి శనివారం ఎన్నిక జరిగింది. అక్కడ బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ గ్రామ జనాభా 196 కాగా ఓటర్లు 150 మంది. సర్పంచి పదవి కోసం వైఎస్సార్సీపీ మద్దతుదారు కర్నాటిక సత్యనారాయణ, టీడీపీ బలపరచిన భీమవరపు పార్వతిలు పోటీ పడ్డారు. 150 ఓట్లలో 142 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సత్యనారాయణకు 71 ఓట్లు, పార్వతికి 70 ఓట్లు పోలవగా నోటాకు ఒక ఓటు వేశారు. దీంతో సత్యనారాయణ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అతి తక్కువ ఓట్లున్న ఈ గ్రామ ఫలితమే జిల్లాలో తొలిసారిగా వెలువడింది. కాగా, తొలివిడతలో విజయవాడ డివిజన్లోకెల్లా చిన్న గ్రామమైన కంకిపాడు మండలం కందలంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బాయిరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతోనే గెలుపొందారు. నాగరాజుకు 103, ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 102 ఓట్లు వచ్చాయి. దీంతో నాగరాజు ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచి పదవి దక్కించుకున్నారు. (చదవండి: ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి) మూడో విడత ఏకగ్రీవాల జోరు -
పంచాయతీ ఎన్నిక: వైఎస్సార్ సీపీ ప్రభంజనం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1299 పైగా స్ధానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లా విజయం సాధించిన స్థానాలు శ్రీకాకుళం 144 విజయనగరం 91 విశాఖ 99 తూర్పు గోదావరి 58 పశ్చిమ గోదావరి 57 కృష్ణా 67 గుంటూరు 119 ప్రకాశం 120 నెల్లూరు 95 చిత్తూరు 101 కర్నూలు 177 అనంతపురం 96 వైఎస్సార్ జిల్లా 75 -
పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి..
శ్రీకాకుళం: జిల్లాలో కొత్తగా పెళ్లైన జంటలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పలాస మండలం బొడ్డపాడులో ఓ జంట ఓటు వేయడానికి రాగా, వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక గ్రామపంచాయతీ పరిధిలోని గుల్లలపాడు గ్రామానికి చెందిన మరొక జంట కూడా తమ ఓటు వేయడానికి పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చింది. బొడ్డపాడులో రమేష్, సింధూల వివాహం జరిగిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోగా, మరొక జంట గౌతమీ-యోగేశ్వరరావులు తమ ఓటును వేశారు. వివాహం జరిగిన అనంతరం తన భర్తతో కలసి చిన్నవంక పోలింగ్ బూత్ కి చేరుకొని గౌతమీ.. ఓటు వినియోగించుకున్న అనంతరం మురిపింటివాని పేట చేరుకొని అక్కడ వరుడు యోగేశ్వరరావు ఓటును వినియోగించుకున్నారు. నూతన దంపతులు ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ జె నివాస్ అభినందించారు. వీరు యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని ప్రశంసించారు. కాగా, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: ఫలితాలపై ఉత్కంఠ
-
ఏపీ: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కోక్కటిగా వెలువడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 3.30వరకూ పోలింగ్ జరగ్గా, నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 2,477 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 500 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 14, ఇతరులు 38 చోట్ల గెలుపొందారు. రెండో విడతలో మొత్తంగా 3,328 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ప్రస్తుతానికి ఇలా.. జిల్లా పార్టీ మద్దతుదారులు వైఎస్సార్సీపీ టీడీపీ బీజేపీ ఇతరులు శ్రీకాకుళం 243 28 0 1 విజయనగరం 284 63 1 12 విశాఖ 189 58 1 2 తూర్పు గోదావరి 153 24 7 2 పశ్చిమ గోదావరి 128 23 3 2 కృష్ణా 144 35 1 4 గుంటూరు 177 42 0 3 ప్రకాశం 228 36 0 0 నెల్లూరు 166 22 0 2 చిత్తూరు 232 38 1 4 కర్నూలు 184 40 0 3 అనంతపురం 226 51 0 0 వైఎస్సార్ జిల్లా 150 19 0 3 -
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు..
-
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు..
సాక్షి, విజయవాడ: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరి తెగించింది. ప్రజా మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల రభస సృష్టించారు. టీడీపీ నేతల నిర్వాకంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగారు. కృష్ణా జిల్లా పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మాస్క్ పెట్టుకోలేదన్న నెపంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత బరితెగించారు. వృద్ధురాలితో బూత్లోకి వెళ్లి ఓటు వేసేందుకు టీడీపీ నేత ప్రయత్నించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్ధిపై దౌర్జన్యానికి దిగారు. (చదవండి: మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..) ఇదేం బరితెగింపురా నాయనా..! -
టీడీపీ నేతలకు చేదు అనుభవం..
సాక్షి తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలో ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. కొన్నేళ్లుగా వర్గవైషమ్యాలతో సతమతమవుతున్న పంచాయతీ నేడు ఏకమైంది. దీంతో సర్పంచ్ పదవికి వైస్సార్సీపీ అభిమాని ఒక్కరిదే నామినేషన్ దాఖలైంది. ఇది ఓర్వలేని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ హుటాహుటిన గురువారం రాత్రి 12 గంటల సమయంలో శెట్టిపల్లెకు చేరుకున్నారు. స్థానిక కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎలాగైనా పోటీకి నామినేషన్ వేయించాలని విఫలయత్నం చేశారు. అయితే వీరి రాకను గమనించిన స్థానిక టీడీపీ నాయకులు ముఖం చాటేశారు. నాటి హామీపై నిలదీత! తిరుపతి అసెంబ్లీకి 2012లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు శెట్టిపల్లెలో రోడ్డు షో నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే శెట్టిపల్లె భూమల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చినా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆగ్రహించిన గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సమయం కోసం వేచి చూశారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిన టీడీపీ నేతలకు గట్టి సమాధానమిచ్చారు. సమస్యల పరిష్కారానికే ఏకగ్రీవం సమస్యలను పరిష్కారానికే పారీ్టలను పక్కనపెట్టి ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకున్నట్లు శెట్టిపల్లె వాసులు శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. (చదవండి: ఇదేం.. బరితెగింపు నాయనా..!) మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు.. -
‘2,640 గెలిచాం.. కాదని నిరూపించండి’
తాడేపల్లి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎవరో ఒకరిపై నిందలు వేయడం ఆయనకు అలవాటని చెప్పారు. ఏదైనా వైఫల్యాలను పక్క వారిపై వేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. కాదు కూడదు అంటే ప్రజలదే తప్పు అంటాడని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2,640 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలిచారని ఇది తప్పని ఎవరైనా నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. టీడీపీ చెప్పిన లెక్కలను తాము ప్రశ్నించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 1,055 స్థానాలు ఎక్కడ గెలిచారో చెప్పమని అడిగామని తెలిపారు. మిగిలిన 500 ఎక్కడ ఉన్నాయో టీడీపీ చెప్పాలని ప్రశ్నించారు. తాము నిరూపిస్తామనేసరికి చంద్రబాబు మాట మార్చాడని మండిపడ్డారు. ఇందులో ఏది నిజం..? గెలుపా.. ఎన్నికల సంఘం వైఫల్యమా..? సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనకున్న అధికారాలను విచక్షణతో వాడాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. అధికార పక్షానికే కాళ్లూచేతులూ కట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీకు ఎలా కావాలంటే అలా ఆడుతూ వచ్చాడని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఎంతగా వాడుకోవాలో వాడుకున్నారని చంద్రబాబు తీరుపై సజ్జల మండిపడ్డారు. కలెక్టర్లను బెదరగొట్టారు.. ఆలయాలకు వెళ్లి మొక్కులు మొక్కారని నిమ్మగడ్డ వ్యవహారాన్ని గుర్తుచేశారు. ఎప్పుడూ జరిగే విధంగా 14-15 శాతం ఏకగ్రీవాలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కాదని నిరూపించండి పంచాయతీ ఎన్నికల్లో పరువుపోవడంతో ఇప్పుడు ఉన్నట్లుండి ఎన్నికల సంఘంపై దాడి మొదలుపెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొదటి దశ ఫలితాలు చూసి చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల సంఘంపైనే కాదు గవర్నర్పై కూడా ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. కేంద్ర బలగాలు కావాలని కోరాడు.. ఐక్య రాజ్యసమితి శాంతి సైన్యం కావాలని అడగలేదు.. సంతోషమని ఎద్దేవా చేశారు. గెలిచిన తమ పార్టీ మద్దతుదారుల వివరాలతో మొత్తం ఒక వెబ్సైట్ కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 2,640 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారని సజ్జల ప్రకటించారు. వాటిలో చాలా వరకు ఫొటోలతో సహా వివరాలు వెబ్సైట్లో ఉంచినట్లు వివరించారు. దానిలో ఉన్న సమాచారం తప్పని ఎవరైనా ఛాలెంజ్ చేయవచ్చని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయం ఇన్ని పంచాయతీలు గెలుచుకున్నప్పటికీ వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కింద పడి కూడా పైచేయి తనదేనని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. మోదీని తిట్టినా హత్తుకున్నా ఆయనకే సాధ్యమని పేర్కొన్నారు. చారిత్రక కర్తవ్యమంటూ రాహుల్తో జతకట్టడం ఆయనకే చెల్లిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతే రెండు మాటలు మాట్లాడవచ్చు.. మరీ ఇంతగా అబద్ధాలు చెప్పడం సరికాదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎవరూ వేలెత్తి చూపలేని విజయం మాదని, నమ్మితే ఎంతగా గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించారని ఎన్నికల ఫలితాలపై సజ్జల తెలిపారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ధిక్కరణ అంటూ నోటీసులు ఇస్తున్నారని, ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల అధికారిపై తమకు గౌరవం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తోకకుక్కను ఆడించినట్లు కనిపించిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ వెళ్లడం ఆగిపోయి 12 రోజులైందని తెలిపారు. విశాఖ ఉక్కుపై తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నీ చెప్పారని తెలిపారు. సీఎం జగన్ క్షుణ్నంగా లేఖ రాశారని.. చేయాల్సినదంతా చేస్తున్నాం.. చేస్తామని చెప్పారు. ఒక ప్రభుత్వం ఏమేమి చేయాలో అన్ని చేస్తామని స్పష్టం చేశారు. -
రేపే రెండవ విడత పంచాయతీ ఎన్నికలు
సాక్షి, విజయవాడ : రెండవ విడత పంచాయతీ ఎన్నికలు రేపే (ఫిబ్రవరి13)జరగనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండవ విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు ఉండనున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పోలీంగ్కి 44గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి నోటిఫికేషన్ ఇచ్చిన మొత్తం పంచాయతీలు 3328 కాగా, వాటిలో 539 సర్పంచ్ స్థానలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 33,570 వార్డులు ఉండగా, వాటిలో 12,604 ఏకగ్రీవమయ్యాయి. అయితే 149 వార్డుల్లో నో నామినేషన్ ఉండటంతో 20,817 వార్డులకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. (అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..) 44,876 మంది అభ్యర్థులు వార్డులకి పోటీపడనున్నారు. 167 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రిని ఈరోజు రాత్రి వరకే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 29,304 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 5480 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా, 4181పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికల నిర్వహణకి 18387పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా, 8351 మధ్యరకం, 24034 చిన్న బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 1292 స్టేజ్ - 1 రిటర్నింగ్ అధికారులు ఉండనుండగా, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, 1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉండనున్నారు. ప్రిసైడింగ్ అధికారులు 33835 కాగా, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47492 మంది ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 32141మంది కౌంటింగ్ సిబ్బంది ఉండగా, పర్యవేక్షణ కోసం జిల్లాకి ఒకరు చొప్పున 13 మంది పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులు ఉన్నారు. పంచాయితీ రాజ్ కమీషనర్, డిజిపి కార్యాలయాలలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్ఇసి కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమీషనర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. (సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు ) -
మాస్టార్ కోసం నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, విశాఖపట్నం: మనిషి జీవితంలో తల్లితండ్రి తరువాతి స్థానం గురువుదే.. ఆ తర్వాతే దైవం. ఎందుకంటే అమ్మనాన్న మనకు జన్మనిస్తే.. గురువు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పి.. జీవితంలో మంచి మార్గంలో నడవడానికి.. ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. జీవితంలో మనం మంచి స్థాయిలో ఉన్నామంటే అందుకు తల్లితండ్రులతో పాటు గురువు కూడా కారణమే. అలాంటి మాస్టారుకు ఏమిచ్చినా తక్కువే. వారి రుణం తీర్చుకునే అవకాశం లభించడమే అదృష్టం. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది కొందరు గ్రామస్తులకి. గురువు మీద అభిమానంతో వారు చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు. ఈ క్రమంలో కొయ్యూరు మండలం మంప గ్రామంలో స్కూల్ టీచర్గా పని చేసిన ఇంగువ త్రినాథ్ పడాల్ సర్పంచ్గా బరిలో నిలిచారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు పట్ల కృతజ్ఞతగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఉపాధ్యాయుడు ఇంగువ త్రినాధ్ పడాల్ మంప గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. చదవండి: ఓటర్ల దీవెన.. సర్పంచ్లుగా ముగ్గురు వలంటీర్లు -
అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..!
‘మా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలం గడిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగదు బదిలీ లాంటి పథకాలతో హడావుడి చేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చేస్తున్నారు. అందుకే చంద్రబాబు పనిగట్టుకుని దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు’. – టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్య జిల్లాలో టీడీపీ వరస ఓటములతో కుదేలవుతోంది. భవిష్యత్పై ఆశలు సన్నగిల్లడంతో తమ్ముళ్ల వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పట్టున్న పల్లెలు కూడా జారిపోవడంతో మనోధైర్యం దెబ్బతింటోంది. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే వారిలో సైతం అంతర్మథనం మొదలైంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి గుడ్బై చెప్పే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. పెద్దసంఖ్యలో నేతలు రాజీనామా బాటపట్టడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. వైఎస్సార్సీపీలో చేరికలు పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి, తిరుపతి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. చిత్తూరులో గురువారం కొందరు టీడీపీ జిల్లా, మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మరి కొందరు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజక వర్గం విషయానికి వస్తే. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అధికశాతం ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరిపోయారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కుప్పంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్థానికులు టీడీపీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్స్వీప్ చేశారు. మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి పనితీరుకు రామచంద్రాపురం మండలంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనూహ్య మార్పులు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనన్నట్లు మేధావులు విశ్లేషిస్తున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లె పరిధిలో టీడీపీ ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోయింది. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, పలమనేరు పరిధిలోని అన్ని మండలాల్లోనూ పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన టీడీపీ నాయకులు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తర్వాత మరి కొన్ని వలసలు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం తీరుతో విసిగి పోయిన తమ్ముళ్లు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. (చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యం
గడివేముల(కర్నూలు జిల్లా): జిల్లాలోని గడివేముల టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ సుబ్బరామిరెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయం సమీపంలో తెలంగాణ మద్యం ఉందన్న సమాచారం రావడంతో గురువారం సిబ్బందితో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. 121 క్వార్టర్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, టీడీపీ కార్యకర్త వడ్డె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకే మద్యాన్ని తెచ్చినట్టు తెలుస్తోంది. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
ఓటర్ల దీవెన.. సర్పంచ్లుగా ముగ్గురు వలంటీర్లు
మునగపాక/బుచ్చెయ్యపేట/కశింకోట (విశాఖ జిల్లా) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వలంటీర్లు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం) 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు! -
274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 3,328 పంచాయతీల్లో రేపు (ఈ నెల 13న), మూడో విడతలో 3,221 పంచాయతీల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఈనెల 21న నిర్వహించే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయనివి 274 పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడంలేదు. నోటిఫికేషన్ జారీ అయినా జరగనివి మరికొన్ని ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్ జారీచేసినా సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీల్లోను మూడుచోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్శాఖ అధికారులు తెలిపారు. మూడో విడత ఉపసంహరణకు, నాలుగో విడత నామినేషన్ల దాఖలుకు నేడు గడువు మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
ముగిసిన రెండో దశ ప్రచారం.. 13న ఎన్నిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు వేళయింది. రెండో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీన మొత్తం 2,786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసి చర్చించారు. ఈ మలి దశ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రెండో విడతలో 13 జిల్లాలలోని 18 రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 3,328 పంచాయతీలలో 33,570 వార్డుల ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. వీటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 12,605 ఏకగ్రీవమవడంతో మిగిలిన 20,796 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులకు 44,879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదృష్టం పరీక్షించుకోనున్న అభ్యర్థులు 13 జిల్లాల్లో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఏజెన్సీలోని పంచాయతీలో ఎన్నికలు మధ్యాహ్నం 1.30 గంటల వరకే ఉంటాయి. ఇక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు కొనసాగుతుంది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లోని 167 మండలాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు తొలి విడతలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలు విజయనగరం జిల్లా: పార్వతీపురం డివిజన్లో 15 మండలాలు విశాఖపట్నం జిల్లా: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలోని 14 మండలాలు పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్లోని 13 మండలాలు కృష్ణా జిల్లా: గుడివాడ డివిజన్లోని 9 మండలాలు గుంటూరు జిల్లా: నరసరావుపేట డివిజన్ 11 మండలాలు ప్రకాశం జిల్లా: ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాలు నెల్లూరు జిల్లా: ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలు కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 13 మండలాలు అనంతపురం జిల్లా: ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్లోని 19 మండలాలు వైఎస్సార్ కడప జిల్లా: కడప రెవెన్యూ డివిజన్ 12 మండలాలు చిత్తూరు జిల్లా: మదనపల్లి రెవెన్యూ డివిజన్ 17 మండలాలు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో..
సాక్షి, విజయవాడ: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 90 శాతం విజయం సాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ 49వ డివిజన్లో పాదయాత్ర ప్రారంభించారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా మంచి నీటి, డ్రైనేజి సమస్యల త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్సీపీదే విజయమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుది తెచ్చుకోవాలన్నారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్గా చంద్రబాబును ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు చూస్తున్నారని తెలిపారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు.. నగరంలోని గాంధీనగర్ 36వ డివిజన్లో నిర్వహించిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆయన గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు. టీడీపీ నేతలు.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పారన్నారు. చంద్రబాబు, ఎన్నికల కమిషన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసిన ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతుందన్నారు. ‘‘చంద్రబాబు, దేవినేని ఉమా, అచ్చం నాయుడు నీచ రాజకీయలకు కేరాఫ్ అడ్రస్. స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయ ఢంకా మోగిస్తుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నాం. గాంధీనగర్లో 2 కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నాం. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు మంజూరు చేశాం. నగరంలో రూ.600 కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని’’మల్లాది విష్ణు అన్నారు. (చదవండి: కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!) పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.. -
గ్రామ వలంటీర్ నుంచి సర్పంచ్గా..
కరప: గతనెల వరకు ఆమె గ్రామ వలంటీర్. నేటి నుంచి గ్రామ సర్పంచ్. తమ కళ్ల ముందు తిరుగుతూ కనిపించే అమ్మాయి సర్పంచ్ అయిందంటే ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన కానూరు రమాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది, గ్రామవలంటీర్గా విధుల్లోకి చేరింది. ఏడాదిన్నరగా తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలసి, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో గొర్రిపూడి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావు ప్రోత్సాహంతో రమాదేవి వలంటీర్ పదవికి రాజీనామా చేసి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఈ గ్రామంలో జరిగిన త్రిముఖపోటీలో 508 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 4,229 ఓట్లు పోలవ్వగా రమాదేవికి 2002, సమీప ప్రత్యర్థికి 1494 ఓట్లు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి 613 ఓట్లు రావడంతో 508 ఓట్ల మెజార్టీతో గ్రామవలంటీర్ రమాదేవి సర్పంచ్గా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు, గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎన్నికైన సర్పంచ్ రమాదేవి తెలిపారు. (చదవండి: 24ఏళ్లకే సర్పంచ్..) వీరికి లక్కుంది..! -
కవిటం గ్రామం: 24 ఏళ్లకే సర్పంచ్..
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. చదవండి: వీరికి లక్కుంది..! టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన -
ఏపీ పంచాయతీ ఎన్నికలు: వీరికి లక్కుంది..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వీరికి లక్కుంది.. వారికి అదే దక్కింది.. అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. గెలిచిన అభ్యర్థులు తమ అదృష్టమంటూ ఆనందపడుతుంటే ఓడిన అభ్యర్థులు తమ ఖర్మంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు అనేక గ్రామ పంచాయతీల్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను సొంత ఖర్చులతో గ్రామాలకు పిలిపించి ఓట్లు వేయించినప్పటికీ ఉత్కంఠ పోరులో సింగిల్ డిజిట్ తేడాతో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తక్కువ మెజారిటీతో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపొందిన సర్పంచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ►చీమకుర్తి మండలం నిప్పట్లపాడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు నీదా నాదా అన్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన లెక్కింపు ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఇరువురు అభ్యర్థుల ఆమోదంతో టాస్ వేశారు. ఇందులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీ చేసిన రావులపల్లి కోటేశ్వరరావు విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. ►ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో బరిలో ఉన్న చెన్నుపాటి రాజ్యలక్ష్మి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►పర్చూరు మండలం తూర్పుపెద్దివారిపాలెం పంచాయతీలో సైతం చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన రావి సంధ్యారాణి ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఒంగోలు మండలంలోని యర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న తమ్మిశెట్టి రాములమ్మ ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఇరువర్గాలకు చెరి 5 వార్డులు సమానంగా గెలుపొందడం విశేషం. ►చీమకుర్తి మండలం జీఎల్ పురం గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీలో ఉన్న మన్నం వెంకటరావు చివరకు 4 ఓట్ల స్వల్ప మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ►ఇంకొల్లు మండలం, సూదివారిపాలెం గ్రామంలో సైతం ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈ పోటీలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన గోరంట్ల జయలక్ష్మి 4 ఓట్ల స్వల్ప తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు. ►ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో వైఎస్ఆర్ సీపీ మద్దతుతో పోటీలో నిలిచిన కాట్రగడ్డ కవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో విజయంఢంకా మోగించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ గ్రామంలో మొట్టమొదటి సారి వైఎస్ఆర్ సీపీ పాగా వేసింది. ►ఒంగోలు మండలంలో టీడీపీకి బలమైన గ్రామంగా ఉన్న దేవరంపాడులో సైతం పంచాయతీ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్న నన్నపనేని వెంకటేశ్వరరావు 9 ఓట్ల స్వల్ప మెజారిటీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోరులో 9 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు 9 ఓట్ల లోపు మెజారిటీలతో గెలుపొంది అదృష్టవంతులు అనిపించుకోగా, వీరిపై పోటీ చేసి ఓడిపోయిన 9 మందికి దురదృష్టవశాత్తు ఓటమే దక్కిందని అంతా సానుభూతి చూపుతున్నారు. ఇంకొంచెం కష్టపడి ఒక్క ఓటు తెచ్చుకున్నా గెలిచేవాళ్లమంటూ వీరిలో కొందరు తమ దురదృష్టానికి తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికి తొలిదశ ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతో గెలుపొందిన సర్పంచ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. -
అంగలకుదురులో టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన
తెనాలి/ తెనాలిరూరల్: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించటంతో ఆ పార్టీకి చెందిన కొందరు అవాంఛనీయంగా ప్రవర్తించారు. గ్రామ సచివాలయ బోర్డుపై దాడి చేశారు. బోర్డుపై సీఎం జగన్మోహన్రెడ్డి బొమ్మను కనిపించకుండా చేయాలన్న కసితో ఆ పనిచేసినట్టుగా అర్థమవుతోంది. సర్పంచ్ పదవికి ఎన్నికయ్యాక సర్పంచ్, ఉపసర్పంచ్లు గృహప్రవేశం చేసినట్టుగా ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరొకరు మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో సహా సచివాలయంలోకి ప్రవేశించారు. వీరిని ఆ పార్టీ నేతలు అనుసరించారు. గ్రామంలో ఇదే అభ్యర్థులు నామినేషను దాఖలు రోజున టీడీపీ కండువాలు, జెండాలు ధరించి ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే. గెలిచాక తమ అక్కసును సచివాలయం బోర్డుపై తీర్చుకున్నారు. దీనిపై స్థానికులు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫ్లెక్సీ ధ్వంసంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ ఎం. మురళి తెలిపారు. (చదవండి: నామినేషన్ వేస్తే చంపేస్తాం!) కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి! -
నామినేషన్ వేస్తే చంపేస్తాం!
రేణిగుంట(చిత్తూరు జిల్లా): మండలంలోని జి.పాళెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఝాన్సీరాణి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా ఇంటికే బెదిరించారు. నామినేషన్ వేస్తే హతమారుస్తామని హెచ్చరించారు. గాజులమండ్యం పోలీసుల కథనం మేరకు.. జి.పాళెం పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు వైఎస్సార్సీపీ అభిమాని నారాయణరెడ్డి భార్య ఝాన్సీరాణి ఆసక్తి చూపించారు. గురువారం నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నామినేషన్ వేయవద్దని సూచించారు. మాట వినకుండా నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఝాన్సీరాణి వెంటనే ఎంపీడీఓ కార్యాలయ ఏఓ హరిబాబుకు సమాచారం అందించింది. ఆయన సూచన మేరకు బాధితురాలు గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. (చదవండి: కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!) పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.. -
కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!
జిల్లా టీడీపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. కోరి తెచ్చుకున్న ఎన్నికలు కొంపముంచాయని ఆందోళన చెందుతున్నారు. అధినేత అత్యుత్సాహమే తల బొప్పి కట్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పంచాయతీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాభవం ఎదురుకాలేదని తలలుపట్టుకుంటున్నారు. రాబోయే మూడు విడతల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయేమో అని దిగులుపడుతున్నారు. కాళ్లావేళ్లా పడి నిలబెట్టిన అభ్యర్థులు కాడి పారేస్తారేమో అని సతమతమవుతున్నారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేమనే వాస్తవాలను ఇప్పటికైనా చంద్రబాబు గ్రహించాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్ ఎలా అని బెంగపెట్టుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ భయపడుతోందనే విమర్శలకు తొలివిడత ఫలితాలు తిరుగులేని సమాధానమిచ్చాయి. జిల్లాలో అత్యధిక స్థానాలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో విపక్షాల నోటికి తాళం పడింది. సొంత ఇలాకాలోనే చంద్రబాబుకు గట్టి షాక్ కొట్టింది. పంచాయతీ ఎన్నికల్లో బాబు నిర్ణయాలే ఆశనిపాతంగా పరిణమించాయని ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రజలు సంక్షేమానికే జై కొట్టారని ఈ ఫలితాలను చూస్తే తేటతెల్లమవుతోందని వెల్లడిస్తున్నారు. హుందాగా వ్యవహరించకుండా గిల్లికజ్జాలు పెట్టుకోవడం ద్వారా అప్రతిష్ట మూటగట్టుకోవడం మినహా సాధించేదేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు దుందుడుకు చర్యల వల్లే పంచాయతీలపై పట్టుకోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ శూన్యం! టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పంచాయతీలపై గట్టి పట్టు ఉండేది. 2013 స్థానిక ఎన్నికల్లో సైతం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇది గత వైభవంగానే మారింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతుందడడంతో తమ్ముళ్లకు దిక్కుతోచడంలేదు. తొలివిడత ఫలితాల్లో వైఎస్సార్సీపీకి కనుచూపు మేరలో కూడా టీడీపీ నిలవలేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మలివిడతల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టి తప్పు చేశామని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రాబోయే విడతల్లో పోటీకి నిలబడిన అభ్యర్థులు తమ గతి ఏంటని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. బలవంతంగా పోటీ చేయించి పరువు పోగొట్టుకునే దుస్థితి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. సంక్షేమానికే జై కొట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామరక్ష అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఎదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పల్లెప్రగతికి చేపట్టిన కార్యక్రమాలే పంచాయతీలపై పట్టు పెంచాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నేటి ఫలితాలను చూస్తేనే తెలుస్తోందని చెబుతున్నారు. కొట్టుకుపోయిన కుట్రలు గత ఏడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలకు తెరతీశారు. తన పలుకుబడిని ఉపయోగించి కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయించారు. ఎన్నికల కమిషనర్ను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయించారు. ప్రజలు, అధికారులు, నాయకులు, ప్రభుత్వం వద్దంటున్నా పట్టుబట్టి ఎన్నికలు తీసుకువచ్చారు. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు ఎత్తులు వేశారు. అయితే అన్ని ఎత్తులను ప్రజలు చిత్తు చేశారు. ప్రజాభిమానం ముందు కుట్రలు కొట్టుకుపోతాయని నిరూపించారు. చంద్రబాబు తీరు మారకుంటే రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు తథ్యమని మేధావులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..) టీడీపీ కార్యకర్తల బరితెగింపు -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు
కంబదూరు(అనంతపురం జిల్లా): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. తమ అక్రమాలకు అడ్డుతగిలిన సెబ్ పోలీసులపై ఎదురుదాడికి యత్నించారు. వివరాలు ఇలా... కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తిరుమలేష్, బాబు, తిమ్మరాజు, తిమ్మరాయుడు గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి మద్యాన్ని తీసుకుని రెండు ద్విచక్ర వాహనాలపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కుందుర్పి మండలం తెనగల్లు గ్రామ శివారులో వాహన తనిఖీకి సెబ్ పోలీసులు ప్రయత్నించగా.. దాడికి ప్రయత్నించారు. వారి దాడిని కంబదూరు సెబ్ సీఐ మొహిద్దీన్బాషా, సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొని, నిందితులను అదుపులోకి తీసుకుని, 182 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యంతో పాటు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఈ సందర్భంగా సీఐ తెలిపారు. -
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. మేజర్ పంచాయతీలో ఆధిపత్య పోరు.. పెద్ద కౌకుంట్ల మేజర్ పంచాయతీలో దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్య పోరు సాగిస్తోంది. 14 వార్డులున్న పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచేపల్లి గ్రామాలు మజారా గ్రామాలుగా ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. ఏకపక్షంగా టీడీపీ వారే అన్ని స్థానాలు దక్కించుకునే వారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై.. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 14 వార్డులకు గాను 10 వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ నాయకుల కుట్రలు భగ్నం చేస్తూ ఈ నాలుగు వార్డుల్లోనూ పోటీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. విత్డ్రాలకు నేటితో ఆఖరు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. ప్రత్యర్థి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విత్డ్రా చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్ చేసి, అంతు చూస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు. మాట వినకపోతే... పెద్ద కౌకుంట్ల పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా రాచేపల్లి గ్రామానికి చెందిన పెన్నోబులేసు నామినేషన్ వేశాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరయ్య, వేలూరి నారాయణస్వామి (పయ్యావుల అనుచరులు) బుధవారం ఉదయం పెన్నోబులేసు ఇంటికి వెళ్లి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. దీనిపై అభ్యర్థి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. ‘మా మాట వినకపోతే నీ కొడుకును కిడ్నాప్ చేసి అంతు చూస్తాం’ అంటూ పెన్నోబిలేసు తల్లిదండ్రులను బెదిరించారు. ఘటనతో భయభ్రాంతులకు గురైన పెన్నోబిలేసు కుటుంబసభ్యులు.. తమకు శంకరయ్య, నారాయణస్వామి నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. (చదవండి: జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు) గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు -
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ రోజు(మంగళవారం)మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగ్గా, అనంతరం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. పార్టీల మద్దతుతో గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటివరకూ ఓవరాల్గా వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1282 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 77 చోట్ల గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు 2, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. మొత్తంగా 3,249 పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు.. శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 181, టీడీపీ మద్దతు దారులు-21, ఇతరులు-1 విశాఖ: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 93, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0 తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 73, టీడీపీ మద్దతు దారులు--0, ఇతరులు-0 కృష్ణా: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 64, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-1 గుంటూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 109, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-0 ప్రకాశం: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 95,టీడీపీ మద్దతు దారులు--10, ఇతరులు-0 నెల్లూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 90, టీడీపీ మద్దతు దారులు--3, ఇతరులు-1 చిత్తూరు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 242, టీడీపీ మద్దతు దారులు--16, ఇతరులు-1 అనంతపురం:వైఎస్సార్సీపీ మద్దతు దారులు 61, టీడీపీ మద్దతు దారులు--9, ఇతరులు-1 కర్నూలు: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 111, టీడీపీ మద్దతు దారులు--7, ఇతరులు-2 కడప: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 63, టీడీపీ మద్దతు దారులు--1, ఇతరులు-0 పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ మద్దతు దారులు 100, టీడీపీ మద్దతు దారులు-1,బీజేపీ మద్దతుదారులు-2,ఇతరులు-1 -
ఓటు వేసి కన్నుమూసింది
సాక్షి, శ్రీకాకుళం : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన ఇంటికొచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్.ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ(90) అనే వృద్ధురాలు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఇంటికి చేరుకుంది. తదనంతరం అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది. ఇక ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. -
రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్
కర్నూలు జిల్లా: పల్లె పోరు ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని గ్రామాల్లో సొంత కుటుంబీకులే బరిలో నిలుస్తుండటంతో రసవత్తరంగా ఉంది. ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచ్ స్థానానికి మేనమామ (భార్య తండ్రి)తో అల్లుడు తలపడుతున్నాడు. బీసీ జనరల్కు రిజర్వేషన్ కావడంతో ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మామాఅల్లుడు శివశంకర్, విజయుడిని బరిలో నిలిపాయి. వీరు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: పోలింగ్ సమయంలో సెల్ఫీ దిగితే..)


