
ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
‘రిజర్వేషన్లు’ తేల్చేందుకు 30 రోజుల గడువు
ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తికి 60 రోజుల సమయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీ అందిన 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని సర్కారుకు స్పష్టం చేసింది. అప్పటి నుంచి 60 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. గత పంచాయతీల కాల పరిమితి ముగిసి 14 నెలలు దాటిందంటూ, అయితే ఇప్పుడు ‘ఆలస్యం’పై మెరిట్స్లోకి వెళ్లడం లేదని హైకోర్టు పేర్కొంది.
పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లేపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టి ఆయా పక్షాల వాదనల అనంతరం గతంలో తీర్పు రిజర్వు చేసిన జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం తీర్పు వెలువరించారు.
‘ఆలస్యం’ జోలికి వెళ్లాలనుకోవడం లేదు..
‘గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. రాజ్యాంగం ప్రకారం పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆ మేరకు పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం. పంచాయతీల పదవీకాలం ముగిసి 14 నెలల కంటే ఎక్కువ సమయమే గడిచింది. అయితే ఆలస్యం సమర్థనీయమా.. లేదా.. అనే అంశాల్లోకి ప్రస్తుతం వెళ్లదలుచుకోవడంలేదు.
వార్డు సభ్యులు, సర్పంచుల సీట్ల రిజర్వేషన్లు సహా ఎన్నికల ప్రకియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం సముచితమని కోర్టు భావిస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఐదు దశల ప్రక్రియను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం..’ అని న్యాయమూర్తి తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు ఇలా..
అంతకుముందు ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియలో 5 దశలు ఉండగా, 3 దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రెండు దశలను 20 రోజుల్లో పూర్తి చేస్తాం. పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బీసీ కులాల వారీగా రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రక్రియకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు డేటా సిద్ధంగా ఉంది..’ అని చెప్పారు.
ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ‘బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రిజర్వేషన్లు తేలకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ఎన్నికల నిర్వహణపై మేం నిర్ణయం తీసుకోలేం. ఎన్నికల ప్రక్రియకు సర్కార్ అంగీకరించిన నాటి నుంచి మాకు రెండు నెలల సమయం అవసరం..’ అని నివేదించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఎస్ఈసీ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోంది..’ అని విమర్శించారు.