Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్‌లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్  దేశాలు ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.

    చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో  ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్‌ దేశాలలో  దౌత్య చర్చలు జరిపారు.

    ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ   విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో  ఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

    మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

  • ఇరాన్‌ ప్రస్తుతం యుద్ధంతో అట్టుడుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో విరుచుకపడడంతో ఆ దేశంలోని మౌళిక సదుపాయాలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం ఇంటర్నెట్‌ నిలిపివేసిన దేశంగా రికార్డు సాధించింది.

    ఇరాన్ దేశవ్యాప్తంగా విధిస్తున్న ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇప్పుడు 37వ రోజుకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు నమోదైన అత్యంత సుదీర్ఘమైన జాతీయ స్థాయి ఇంటర్నెట్ బ్లాకౌట్‌గా  నివేదికలు పేర్కొన్నాయి. యుద్ధం ప్రారంభమైన రోజు ఫిబ్రవరి 28నుండి  ప్రారంభమైన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ ఇప్పటికి 864 గంటలకు పైగా కొనసాగుతోంది.

    అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా దాడులు జరుపుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్దిమందికి  మాత్రమే 'వైట్‌లిస్ట్' విధానం ద్వారా యాక్సెస్ ఇస్తున్నట్లు సమాచారం

    అయితే దీనివల్ల యుద్ధ సమయంలో ప్రజలు తమ ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకోలేకపోతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొన్ని సంస్థలు చెబుతున్నప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కాాగా ఇప్పటి వరకూ మయన్మార్, సుడాన్, ఉక్రెయిన్‌, గాజా వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తగ్గించారు గాని ఇంత పెద్ద మెుత్తంలో ప్రభుత్వమే  దానిపై బ్యాన్ విధించలేదు.

  • కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌ తగిలింది. గ్లోబల్ మార్కెట్‌లో గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్‌ ధరల్ని పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్పీజీ గ్యాస్‌ సంస్థ లిట్రో గ్యాస్‌ లంక ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి (ఏప్రిల్‌5)నుంచి అమల్లోకి రానున్నాయి.

     లిట్రో గ్యాస్‌ తెలిపిన వివరాల మేరకు.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

    ప్రస్తుతం కొలంబోలో కొత్త ధరలు ఇలా ఉన్నాయి 
    12.5 కిలోల సిలిండర్: రూ. 775 పెరిగి రూ. 4,765
    5 కిలోల సిలిండర్: రూ. 308 పెరిగి రూ. 1,910
    2.3 కిలోల సిలిండర్: రూ.140 పెరిగి రూ.840

    వినియోగదారులపై ప్రభావం
    ఈ పెంపు వల్ల శ్రీలంక ప్రజలకు జీవన వ్యయాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం (భారత్‌లో ఉగాది..శ్రీలంకలో పుత్తాండు) సీజన్‌లో గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అయితే లిట్రో గ్యాస్‌ లంక వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
     

  • కాఠ్మాండు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతుండడంతో పలు దేశాల‍్లో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం నేపాల్‌పై బాగా పడుతోంది. సాధారణంగా ఆదివారం సెలవు ఉంటుంది. అయితే, చమురు సంక్షోభం వల్ల నేపాల్‌ వారానికి రెండు రోజులు సెలవులను అమలు చేయాలని నేపాల్ ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్‌ 5)  నిర్ణయించింది.

    ఈ నిర్ణయాన్ని కాఠ్మాండులో ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్ 6 నుంచి కొత్త వీకెండ్‌ షెడ్యూల్‌ను పాటించనున్నాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

    పోఖరేల్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలియం సరఫరా అంతరాయాల కారణంగా ఆదివారాల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.

    పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన రూపకల్పనను సిద్ధం చేయాలని కూడా నేపాల్‌ మంత్రివర్గం నిర్ణయించింది. ఇంధన సరఫరా అనిశ్చితి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోఖరేల్‌ తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చడం ద్వారా ఇంధన కొరతను ఎదుర్కోవచ్చని, పర్యావరణహిత రవాణా దిశగా మార్పునకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    ఇరాన్, ఇజ్రాయెల్అ-మెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ పెట్రోలియం సరఫరాను దెబ్బతీసింది. దీని వల్ల నేపాల్‌లో కొరతతో పాటు ధరలు భారీగా పెరిగాయి.

    నేపాల్‌లో పెట్రోలియం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రాష్ట్ర సంస్థ నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తాజా సవరణ ప్రకారం.. కాఠ్మాండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు ఎన్‌పీఆర్‌ 202కి చేరింది. డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు ఎన్‌పీఆర్‌ ఎన్‌పీఆర్‌182కి పెరిగింది.

    గత వారం సంస్థ బోర్డు సమావేశంలో లీటరుకు ఎన్‌పీఆర్‌ 15 పెంపునకు ఆమోదించారు. 18 రోజుల్లో మూడోసారి ధరలు పెంచారు. మార్చి 15, మార్చి 25న కూడా ధరలను పెంచారు. 
     

  • వాషింగ్టన్‌: హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

    ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్‌ ట్రే యింగ్‌స్ట్‌కు ట్రంప్‌ టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇరాన్‌ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్‌ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. లేదంటే అన్నింటిని పేల్చేస్తాం. ఇరాన్‌ చమురును స్వాధీనం చేసుకుంటామని అన్నారు.    

    అంతేకాదు.. హర్మూజ్‌ జలసంధించిన తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష ప్రసాదించినట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే, కీలక ఆస్తులను ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. 

    ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాము ఇరాన్ నిరసనకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆయుధాలు పంపించాం. ఆ ఆయుధాలు నిజంగా నిరసనకారుల చేతికి చేరలేదని, మధ్యలో కుర్దిష్ మార్గాల ద్వారా వెళ్లి.. కుర్దిష్ సమూహాల దగ్గరే ఉండిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. 

    ఇదిలా ఉంటే ట్రంప్‌ జారీ చేసిన అల్టిమేటం గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్‌ హెచ్చరికల్ని ఇరాన్ తోసిపుచ్చింది . ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ జనరల్ అలీయాబాది, ట్రంప్ బెదిరింపును నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివితక్కువ చర్య అని అన్నారు.

    ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. శత్రుత్వం పెరిగితే ఇరాన్‌లో మీకు నరకం కనబడుతోంది. ఇరాన్‌ను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి మీరు అందులో కూరుకుపోతారు’అని రెచ్చగొట్టారు. మరి రేపటితో ముగియనున్న డెడ్‌ లైన్‌ అనంతరం, ట్రంప్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. 

    కాగా, హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అందుకే అమెరికా దీనిని  ప్రపంచ ఆర్థిక భద్రతకు ముప్పుగా చూస్తోంది.

  • వాష్టింగన్‌: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఆ పత్రాల్లో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ పేరు కూడా ప్రస్తావనకు రావడం ఆసక్తి కలిగించింది. దీంతో ఎప్‌స్టీన్‌ లైంగిక నేరాల్లో అంబానీ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఫైల్స్‌ను పరిశీలిస్తే, అంబానీకి ఎప్‌స్టీన్‌తో ఉన్నది వ్యాపార సంబంధాలే తప్ప లైంగిక సంబంధాలు లేవని స్పష్టమైంది.

    ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో అంబానీ పేరు ప్రస్తావన రావడం ఆయన వ్యాపార సమస్యల సమయంలో ఎప్‌స్టీన్‌ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం, పరిచయాలకే పరిమితమైంది. లైంగిక నేరాల విషయంలో ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టంగా తేలింది. అంటే, ఎప్‌స్టీన్‌ వ్యవహారంలో అంబానీ పేరు వినిపించడం ఆయన వ్యాపార సంబంధాల కోణంలో మాత్రమేనని, లైంగిక నేరాలకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఈ పత్రాలు నిర్ధారించాయి.

    అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్‌ ప్రకారం.. అనిల్‌ అంబానీ–జెఫ్రీ ఎప్‌స్టీన్‌ మధ్య 2017 నుండి 2019 వరకు సంభాషణలు జరిగాయి. ఈ చర్చలు ప్రధానంగా అమెరికా–భారత్‌ సంబంధాలు, ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు, అలాగే అంబానీ ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలపై స్నేహపూర్వక సలహాల చుట్టూ తిరిగాయి. అంబానీతో పరిచయం పెంచుకోవడానికి, తాను వైట్‌ హౌస్‌లో లోపలి వ్యక్తి అని చూపించుకోవడానికి ఎప్‌స్టీన్‌ ప్రయత్నించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి.

    ట్రంప్‌ ప్రభుత్వ జాతీయ భద్రతా వ్యూహంలో భారత్‌ స్థానం ఏమిటో తెలుసుకోవాలని అంబానీ ఎప్‌స్టీన్‌ను సంప్రదించగా.. ‘వైట్‌ హౌస్‌లోని అంతర్గత సమాచారం అందిస్తాను’ అంటూ ఎప్‌స్టీన్‌ స్పందించాడు. అలాగే ట్రంప్‌ నియామకాలపై ముందుగానే సమాచారం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు, 2017లో అంబానీ, డేవిడ్‌ పేట్రేయస్‌ను భారత్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తారా అని అడిగితే, ఎప్‌స్టీన్‌ లేదని అని చెప్పాడు. అన్నట్లుగా ఆ పదవి కెన్నెత్‌ జస్టర్‌కు దక్కింది.

    తనకి ట్రంప్‌ సన్నిహితులు స్టీఫెన్‌ బానన్‌, థామస్‌ బారాక్‌లను పరిచయం చేయాలని ఎప్‌స్టీన్‌ సూచించాడు. వ్యాపార సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ‘మానసికంగా బలంగా ఉండాలి’ అని సలహా ఇచ్చాడు. నీతో పరిచయం .. డబ్బు కోసం కాదు, స్నేహితుడిగా మాత్రమే’అని పలుమార్లు చెప్పాడు.

     2019 ఏప్రిల్‌లో అంబానీ ‘ట్రాన్సాక్షన్‌ పూర్తయింది.. కాఫీకి వస్తాను’ అని మెయిల్‌ పంపించారు.  మే 23న న్యూయార్క్‌లోని ఎప్‌స్టీన్‌ ఇంట్లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా వారు సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి ఎన్‌క్రిప్టెడ్‌ ప్లాట్‌ఫారమ్‌లలో మాట్లాడుకున్నారు. అంబానీ ‘ఆర్మనీఏ’ అనే హ్యాండిల్‌తో కనెక్ట్‌ అయ్యారు.

    ఎప్‌స్టీన్‌ అరెస్టుకు మూడు రోజుల ముందు వరకు ఈ సంభాషణలు కొనసాగాయి. ముఖ్యంగా, అనిల్‌ అంబానీపై ఎటువంటి లైంగిక దుర్వినియోగ ఆరోపణలు లేవని న్యూయార్క్ టైమ్స్‌ స్పష్టంచేసింది. ఈ సంబంధం వ్యాపార సమస్యల సమయంలో ఎప్‌స్టీన్‌ ఇచ్చిన సలహాలు, అమెరికా రాజకీయ పరిణామాలపై సమాచారం అనే కోణంలో మాత్రమే నిలిచింది.

  • వాషింగ్టన్‌: ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ట్రూత్‌లో ఓ ప్రకటన చేశారు.

    ‘ఇరాన్‌లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయి. అలాంటి డే మరొకటి ఉండదు.. ఆ స్ట్రైట్ (హార్మూజ్‌ జలసంధి) తెరవండి, పిచ్చి దుర్మార్గుల్లారా.. లేకపోతే మీరు నరకంలో జీవిస్తారు.. చూడండి..’ అని అన్నారు. 

    హార్మూజ్‌ జలసంధి తెరవాలని ట్రంప్‌ చాలా రోజుల నుంచి ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ‍ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్‌ ఏ మాత్రం బెదరడం లేదు. 

    హార్మూజ్‌ జలసంధి తెరవాలని లేదంటే భీకర దాడులు చేస్తామని ట్రంప్‌ మొదటి నుంచి హె‍చ్చరిస్తున్నారు. హార్మూజ్‌ జలసంధిపై రాకపోకలు సులభతరం చేయడం కోసం ఒమన్, ఇరాన్ ఇవాళ (ఏప్రిల్‌ 5) చర్చలు నిర్వహించాయని ఒమన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.

    "ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు సమావేశం నిర్వహించాయి, ఇరుపక్షాల నిపుణులు హాజరయ్యారు. హార్మూజ్ ద్వారా సజావుగా రాకపోకలు జరిగేలా అవకాశాలను సృష్టించడంపై చర్చించారు" అని ఆ వార్తా సంస్థ ఎక్స్‌లో పేర్కొంది. ఇరుపక్షాల నిపుణులు దీనిపై అనేక  ప్రతిపాదనలు ముందుకు తెచ్చారని పేర్కొంది.

     

  • న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)రంగంలో దిగ్గజ కంపెనీలు ఇప్పుడు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా అనూహ్య నిర్ణయాలతో దూసుకుపోతున్నాయి. గూగుల్ తన సరికొత్త ఓపెన్ సోర్స్ మోడల్ ‘జెమ్మా 4’ను ఉచితంగా అందుబాటులోకి తేగా, తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు ఓపెన్ ఏఐ ఏకంగా ఓ ప్రముఖ మీడియా టాక్ షోను కొనుగోలు చేసింది. మరోవైపు మరో ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ కనీవినీ ఎరుగని భారీ డీల్‌తో ఏకంగా వైద్య రంగంలోకి అడుగుపెట్టింది. టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఈ మూడు ప్రధాన పరిణామాల వివరాలలోకి వెళితే..

    ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో పనిచేసే గూగుల్ ‘జెమ్మా 4’
    ఏఐ సాంకేతికత అనేది డెవలపర్లందరికీ ఉచితంగా, పబ్లిక్ వాడకానికి అనువుగా ఉండాలనే లక్ష్యంతో గూగుల్ అపాచీ 2.0 లైసెన్స్‌తో ‘జెమ్మా 4’ మోడల్స్‌ను విడుదల చేసింది. కోడింగ్ రాయడం, సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించడంతో పాటు రియల్ వరల్డ్ టాస్క్‌లను ఇది సులభంగా చేయగలదు. మొత్తం నాలుగు వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉన్న ఈ మోడల్స్ చాలా తేలికైనవి. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే నేరుగా మన స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లలో కూడా సులభంగా రన్ అయ్యేలా వీటిని రూపొందించడం దీని ప్రధాన ఆకర్షణ.

    మీడియా బిజినెస్‌లోకి ఓపెన్ ఏఐ ఎంట్రీ
    చాట్‌జీపీటీ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’తన రూటు మార్చింది. సిలికాన్ వ్యాలీలో విశేష ఆదరణ పొందిన టెక్ టాక్ షో ‘ఐబీపీఎన్‌’ను సొంతం చేసుకుని మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. జాన్ కూగన్, జోర్డి హేస్ హోస్ట్ చేసే ఈ షో ద్వారా.. చాట్‌జీపీటీ, అలాగే సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌పై పబ్లిక్‌లో మరింత సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. కొనుగోలు డీల్ విలువను గోప్యంగా ఉంచినప్పటికీ, ఆ షోకి పూర్తి సంపాదకీయ స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏసీఐ)గురించి ప్రజలతో మరింత మెరుగ్గా కనెక్ట్ అయ్యేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ స్ట్రాటజీ చీఫ్ ఫిడ్జీ సిమో తెలిపారు.

    ఆంత్రోపిక్ మరో సంచలనం
    ఓపెన్ ఏఐకి ప్రధాన పోటీదారు అయిన ‘ఆంత్రోపిక్’ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా 400 బిలియన్ డాలర్లు వెచ్చించి, బయోటెక్ ఏఐ స్టార్టప్ ‘కోఎఫిషియంట్ బయో’ను కొనుగోలు చేసింది. ఈ రికార్డ్ డీల్‌తో ఆంత్రోపిక్ హెల్త్‌కేర్ రంగంలోకి అధికారికంగా ప్రవేశించింది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ టూల్స్ తయారుచేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆంత్రోపిక్ ఈ అడుగు వేసింది. కొత్త మందుల పరిశోధన (డ్రగ్ రీసెర్చ్), ఆవిష్కరణలను వేగవంతం చేయడం, అలాగే రెగ్యులేటరీ స్ట్రాటజీలను అభివృద్ధి చేయడంపై కోఎఫిషియంట్ బయో ప్రధానంగా దృష్టి సారించనుంది.

    ఇది కూడా చదవండి: Delhi: మళ్లీ కృత్రిమ వర్షం.. సక్సెస్ అయ్యేనా?

Andhra Pradesh

  • సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెద్దగదిలిలో  క్రికెట్ ఆట విషాదంగా మారింది. రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో అజిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.  

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటలో తలెత్తిన చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో కిషోర్ అనే వ్యక్తి అజిత్‌ను మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్‌ మృతి చెందాడు. జరిగిన ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.  
     

  • వల్లూరు: వైఎస్సార్‌జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు.  ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.  

    ఈ ఘటనలో గల్లంతైన వారిలో కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాధ పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటి సర్కిల్ కు చెందిన కృష్ణ చైతన్య (20) లుగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. హరిబాబు, హర్షవర్ధన్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • గుంటూరు: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పొన్నూరు 13వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మనోహర్‌, వెంకటరత్నంలపై కర్రలు, రాడ్లతో  దాడులకు దిగారు. 

    ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  రోజు వ్యవధిలో వారిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం రెండోసారి. 

  • కృష్ణాజిల్లా: ఆంధ్రప్రదేశ్‌​ మంత్రి కొల్లు రవీంద్రకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్‌ 5న) పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన కార్యకర్త ఇంటిని మీరు కూల్చేస్తే మేం వెళ్లకూడదా? బాధితుడు తనకు జరిగిన కష్టం గురించి చెబితేనే నేను వెళ్లాను.

    కావాలంటే నా కాల్ డేటా ఇస్తా చెక్ చేసుకో. కోర్టు తీర్పు ఉంటేనే కూల్చేశామని చెబుతున్నారు కదా... దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. కోర్టు తీర్పు చూపించండి... మీరు ఏం చేయమన్నా చేస్తా. కోర్టు తీర్పు ఉందని నిరూపించలేకపోతే నేను చెప్పింది మీరు చేస్తారా? మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కొల్లు రవీంద్ర.

    గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరి తోటలో లే అవుట్ వేశారు. ఇప్పుడు మీరు మంత్రి అయ్యాకే అక్కడ బిల్డింగ్ లు కట్టారు. అక్కడ స్థలానికి, ఇళ్లకు నాకేం సంబంధం? నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా ఎవరి ఆస్తులను కూల్చలేదు. రోడ్డు విస్తరణలో కోర్టు ఆదేశాల మేరకే ఒకే ఒక్క అక్రమ బిల్డింగ్ ను అధికారులు కూల్చివేశారు.

    ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా... బయటికి తీయండి ఆధారాలు. నేనే ఆ బిల్డింగ్ కూల్చి వేయించినట్లు నీ దగ్గర ఆధారాలుంటే నా పై కేసు పెట్టించు. బందరుకు ఏం చేయలేదని నన్ను విమర్శిస్తున్నావు? నేను బందరు రోడ్డు విస్తరణ చేశానని నీ నోటితోనే చెబుతున్నావ్. నా బినామీల కోసమే నేను ఏదైనా చేస్తే బినామీ చట్టం ఉపయోగించండి’ అని అన్నారు.

    మీకు ఆ సత్తా లేదా? 
    ‘మీకు అధికారం ఉంది కదా... మీకు ఆ సత్తా లేదా? అందరినీ ఒప్పించి నేను బందరులో రోడ్డు విస్తరణ చేపట్టాను. 2014-19 వరకూ ఇప్పుడు రెండేళ్లలో బందరుకు మీరేం చేశారో చెప్పగలరా కొల్లు రవీంద్ర? 2004-2014 వరకు బందరు అభివృద్ధికి పాటుపడింది నేను. మీరు వచ్చాక బందరుకు ఏం చేశారో సమాధానం చెప్పండి. 
     


    బందరు కోటలో మీరు కట్టిన ఇంటికి ప్లాన్ లేదు. మార్కెట్‌లో కట్టిన మీ కాంప్లెక్స్‌కు ప్లాన్ లేదు. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్ కు ప్లాన్ లేదు. పోలీస్ కల‍్యాణ మండపానికి ప్లాన్ లేదు. నేను మాట్లాడేవన్నీ ఆన్ రికార్డు. బందరులో ప్లాన్ లేనివన్నీ వెతికిమరీ ఓ లిస్ట్ ఇస్తా. ప్లాన్లు లేనివన్నీ కొట్టేసే దమ్ముందా మీకు? అంత సీనుందా మీకు? నీకు దమ్ముంటే నా బినామీలను బయటపెట్టండి. విజయవాడ కేంద్రంగా మీరు ఆరు న్యూస్ ఛానల్స్ నడిపిస్తున్నారు’ అని అన్నారు. 
     

  • సాక్షి,రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు హర్షవీణపై దాడి కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    ఇటీవల హర్షవీణపై జనసేన నాయకులు నడిరోడ్డుపై దాడి చేసి, పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో నిందితుడు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    తాజాగా, తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హైడ్రామా బయటపడింది. హర్షవీణపై దాడి చేసిన కేసులో విచారణను పోలీసులు అత్యంత గోప్యంగా నిర్వహించారు.  విచారణ సందర్భంగా రైల్వేకోడూరు పోలీస్‌ స్టేషన్‌ గేటుకు బేడీలు వేశాడు. హర్షవీణను నడిరోడ్డుపై చితకబాదినా, ముద్దాయికి వేయాల్సిన బేడీలను స్టేషన్‌ గేటుకు వేసి విచారణ జరపడం పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్న తప్పులకే అమాయకులను నడిరోడ్డుపై నడిపించే పోలీసులు, ఇలాంటి ఘటనలో మాత్రం నిందితుడికి సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ .. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రకు వంతపాడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

     


     

  • ఓబులేసు, మహేష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, చక్కరరెడ్డి.. పేరు ఏదైనా మనిషి మాత్రం ఒక్కడే. తాను ఎక్కడికెళ్లినా కొత్త పేరు పెట్టుకోవడం అతని నైజం. తనను నమ్మిన వారిని నట్టేట ముంచి జెండా ఎత్తేయడం అతని హాబీ. ఎక్కడ పాగా వేసినా రూ.కోట్లలోనే కుచ్చు టోపీ పెట్టడం అతని వృత్తి. పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన ఈ ఘరానా కేటుగాడు ఇప్పటికే పలుమార్లు పోలీసులకు పట్టుబడి రిమాండ్‌కు వెళ్లి వచ్చాడు. అయినా మార్పు రాలేదు. తాజా మోసాలతో మరోసారి రాయదుర్గం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు.  

    అనంతపురం జిల్లా:  గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త చిన్న ఓబులేసు ఘరానా మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో చోట ఒక్కో పేరుతో చలామణి అవుతూ సాగించిన మోసాలను ప్రజలు పసిగట్టలేకపోయారు.  రోజుల వ్యవధిలోనే రూ. లక్షకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్‌గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత రూ. కోట్లలో వసూలు చేసుకుని పెట్టెబేడా సర్దుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇప్పటికే కణేకల్లు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా అవుకు, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మోసాలకు పాల్పడిన ఓబులేసు... తాజాగా బొమ్మనహాళ్‌ పీఎస్‌ పరిధిలోని ఉద్దేహాళ్‌లో మహేష్‌ రెడ్డి పేరుతో రూ.1.50 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. గత ఆరేళ్లలో రూ.20 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  

    గతంలో భాస్కర్‌రెడ్డిగా... మహేష్‌రెడ్డిగా  
    2022 మే లో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్‌రెడ్డిగా పరిచయమైన ఓబులేసు అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారమంటూ స్థానికులను నమ్మించి సుమారు రూ.3 కోట్ల వరకూ మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు  అవుకు పోలీసులు గాలించి అన్నమయ్య జిల్లా గాలివీడులో పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

     అనంతరం బయటకు వచ్చిన ఓబులేసు 2023 జనవరిలో  శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో షేర్‌ మార్కెట్‌ వ్యాపారమంటూ సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతకు ముందు కణేకల్లుతో పాటు  ఆత్మకూరులోనూ రూ. 4 కోట్ల వరకూ జనాలను మోసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికి చేరుకున్న ఓబులేసు...  మహే‹Ùరెడ్డి పేరుతో ఓ అద్దె ఇంట్లో దిగాడు. అద్దె కారును తన సొంత వాహనమని చెప్పుకుంటూ తిరిగేవాడు. సిగరెట్లు, చక్కెర ఎగుమతి..దిగుమతి వ్యాపారం చేస్తున్నానంటూ అందరినీ నమ్మించాడు. 

    తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే రూ.లక్షకు రూ. 3 వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి, పది మందితో సుమారు రూ. 1.50 కోట్లను వసూలు చేసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో మాయమాటలతో గొర్రెల కాపరులను బురిడీ కొట్టించి వంద జీవాలను తీసుకెళ్లాడు. బాధితులందరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న ఓబులేసుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఉద్దేహాళ్‌ గ్రామంలో రూ.1.50 కోట్ల మోసానికి సంబంధించి ఒక్క రూపాయిని కూడా నిందితుడి నుంచి పోలీసులు రికవరీ చేయకపోవడం గమనార్హం.  

     

  • ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రౌడీయిజం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీస్, దేవస్థానం అధికారులను సైతం వారు లెక్కచేయడం లేదు. దర్శనాలకు వెళ్లే సమయంలో ఆలయంలో వారి దురుసు ప్రవర్తన భక్తులను విస్తుగొలుపుతోంది. ఎవరైనా అడ్డొస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అంతే కాదు క్షేత్రంలోని అనివేటి మండపం, పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే వారిని బెదిరించి మరీ రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కల్యాణ మండపాల్లో డిమాండ్‌ చేసి ఒక్కో పెళ్లికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి, వారి బంధువులకు శాపనార్ధాలు పెట్టడం, బెదిరించడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం వంటివి చేస్తున్నారు. దాంతో భీతిల్లుతున్న పెళ్లి బృందాలు ఎందుకొచ్చిన గొడవలే అని వారు అడిగింది ఇచ్చి పంపుతున్నారు.  

    బెదిరించి రూ.50 వేల వసూళ్లు 
    సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే అనివేటి మండపాలు, ఆ పరిసర ప్రాంతాల్లో వివాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక వారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే కొందరు హిజ్రాలు అలాంటి వారిని కూడా వదలడం లేదు. పెళ్లి జరిగే సమయంలో వారి వద్దకు వెళ్లి బెదిరించి, శాపనార్ధాలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అప్పటికీ వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడి ఒక్కో పెళ్లి బృందం నుంచి బలవంతంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారి నుంచి రూ.5 వేలు చొప్పున బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనివేటి మండపాలు, పరిసర ప్రాంతాల్లో 50 వరకు వివాహాలు జరగగా, హిజ్రాలు వారి నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు.  

    అంతరాలయానికి పంపలేదని 
    శనివారం ఉదయం ఇద్దరు హిజ్రాలు, ఒక మహిళను తీసుకుని శ్రీవారి దర్శనానికని వెళ్లగా, అధికారులు వారిని ఆలయంలోకి పంపారు. అయితే అంతరాలయ దర్శనానికి పంపలేదని వారు ఆలయంలో నానా హడావుడి చేశారు. తన చాతీపై చేతులు వేసి నెట్టారంటూ అందులో ఒక హిజ్రా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా వారు లెక్కచేయక పోవడంతో అక్కడున్న అధికారిని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇదంతా చూసిన భక్తులు విసుగుచెందారు. హిజ్రాలు ఆలయంలో ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడ్డారు.  

    దృష్టి సారించాలి 
    గతంలో ఓ సారి హిజ్రాలు క్షేత్రంలో జరిగిన ఓ వీఐపీ వివాహానికి వెళ్లి, డబ్బులు డిమాండ్‌ చేసి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసే, రౌడీయిజం చేసే హిజ్రాలపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో సీఐ, ఎస్సైలకు ఆదేశాలిచ్చారు. కొద్ది నెలలు మాత్రమే ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకునే వారు కొందరు హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక పోతున్నారు. ఇప్పటికైనా పోలీస్‌ ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.  

     

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

    ‘‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి ద‌ళిత ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.

    విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు.

     

Sports

  • ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండో విజ‌యం నమోదు చేసింది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 250 ప‌రుగులు చేసింది.

    బెంగళూరు బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్‌(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్‌(19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో 48) విధ్వంసం. సీఎస్‌కే బౌలర్లలో ఓవర్టన్‌, కాంబోజ్‌, శివమ్‌ దూబే తలా వికెట్‌ సాధించారు.

    సంజూ మ‌ళ్లీ ఫెయిల్‌..
    251 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెన‌ర్లు సంజూ శాంసన్‌(9), రుతురాజ్‌ గైక్వాడ్‌(7) మరోసారి విఫలమయ్యారు. అయితే సర్ఫరాజ్‌ ఖాన్‌(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), ప్రశాంత్‌ వీర్‌(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్‌ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు.

    ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.  కాగా సీఎస్‌కేకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
    చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

  • టీమిండియా వెట‌ర‌న్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా భువీ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అయూశ్ మాత్రేను ఔట్ చేసిన భువీ.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

    ఇప్పటివరకు ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్కును కేవలం లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాత్రమే అందుకున్నాడు. చాహల్ 176 మ్యాచ్‌లలో 224 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2024 సీజన్‌లో తన 153వ మ్యాచ్‌లోనే చాహల్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు భువనేశ్వర్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. 

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలు పెట్టిన భువనేశ్వర్‌.. ఆ తర్వాత పుణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున నాలుగు సీజన్ల పాటు ఆడిన భువీ.. గతేడాది తిరిగి తన సొంత గూటి(ఆర్సీబీ)కి చేరాడు. ఐపీఎల్‌-2025లో భువీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసి ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
    యజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు 
    భువనేశ్వర్ కుమార్: 200 వికెట్లు 
    సునీల్ నరైన్ : 192 వికెట్లు
    పీయూష్ చావ్లా : 192 వికెట్లు 
    రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లు
    చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

  • ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు రెండో ఓట‌మి ఎదురైంది. ఆదివారం హైద‌రాబాద్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది.  ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ప‌రంగా విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌ల్గింది.

    ఈ స్కోర్ కూడా క్లాసెన్‌(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) రాణించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ సాధించ‌గ‌ల్గింది. ఆ త‌ర్వాత 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బౌల‌ర్లు డిఫెండ్ చేయ‌లేక‌పోయారు. ఈ  ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని కిషన్ తెలిపాడు.

    "ఇది చాలా క్లోజ్‌ గేమ్. నిజానికి ప్రత్యర్ధి ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయాము. కానీ మా బౌలర్లు ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చారు. ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించాము. అయితే ఇలాంటి లోస్కోరింగ్ గేమ్స్‌లో కటి లేదా రెండు బౌండరీలు ఫలితాన్ని మార్చేస్తాయి. 

    అయినప్పటికి మేము చివరి వరకు పోరాడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను.  ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్లాసెన్‌, నితీశ్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. మ్యాచ్‌ను ఇంత క్లోజ్‌గాతీసుకెళ్లిన క్రెడిట్ వారికే దక్కుతుంది. అయితే మేము మా బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

    రిషబ్ పంత్ కూడా తెలివిగా ఆడాడు. సింగిల్స్ తీసుకుంటూ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి, మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో మేము తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కిషన్ పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: బోణీ కొట్టిన లక్నో.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో ఓటమి

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో ల‌క్నో సూపర్ జెయింట్స్ తొలి విజ‌యం నమోదు చేసింది. ఆదివారం ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. 

    అయితే 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ప‌డిన స‌న్‌రైజ‌ర్స్‌ను  హెన్రిచ్ క్లాసెన్‌(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచ‌రీల‌తో ఆదుకున్నారు. వీరిద్ద‌రూ ఐదో వికెట్‌కు 116 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ వంటి స్టార్ బ్యాట‌ర్లు మాత్రం విఫ‌ల‌మ‌య్యారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, అవేష్ ఖాన్‌, ప్రిన్స్ యాద‌వ్ త‌లా రెండేసి వికెట్లు చొప్పున ప‌డ‌గొట్టారు.

    పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌..
    ఇక 157 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో ఆరంభంలోనే మిచెల్ మార్ష్‌(14) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఐడైన్ మార్‌క్ర‌మ్‌(45), కెప్టెన్ రిష‌బ్ పంత్‌(68 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. మార్‌క్ర‌మ్ ఔటైన‌ప్ప‌టికి.. పంత్ మాత్రం అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19.5 ఓవర్లలో టార్గెట్‌ను లక్నో చేధించింది.

    ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష్ దూబే రెండు వికెట్లు సాధించ‌గా..  ఎషాన్ మ‌లింగ‌, శివాంగ్ కుమార్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు. అయితే సీనియ‌ర్ పేస‌ర్ జ‌య్‌దేవ్ ఉనద్క‌ట్ మాత్రం భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఉనద్కట్ 3.5 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన సమయంలో ఉనద్కట్ తేలిపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది రెండో ఓటమి.
    చదవండి: IPL 2026: సూపర్‌ డెలివరీ.. దెబ్బకు ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయింది

  • Rcb vs csk live updates and highlights: ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడతున్నాయి.

    ఆర్సీబీ ఘన విజయం
    చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 251పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే..  19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రశాంత్‌ వీర్‌(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్‌ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు. 

    ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.

    సీఎస్‌కే ఏడో వికెట్ డౌన్‌
    సీఎస్‌కే ఏడో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ఓవర్టన్‌.. సుయాష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌:178/7

    సీఎస్‌కే ఆరో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే ఆరో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన శివమ్‌ దూబే.. అభినందన్‌ సింగ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.

    సీఎస్‌కే ఐదో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కార్తీక్‌ శర్మ.. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    సీఎస్‌కే నాలుగో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 50 పరుగులు చేసిన సర్ఫరాజ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

    సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీ
    సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    5 ఓవర్లకు సీఎస్‌కే ‍స్కోరెంతంటే?
    5 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌(18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) దూకుడుగా ఆడుతున్నాడు.

    సీఎస్‌కే మూడో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే స్టార్‌ ప్లేయర్‌ సంజూ శాంసన్‌ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు చేసి శాంసన్‌ ఔటయ్యాడు. 

    సీఎస్‌కే రెండో వికెట్‌ డౌన్‌
    అయూశ్‌ మాత్రే రూపంలో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మాత్రే.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌
    251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే అదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో రుతురాజ్‌ పెవిలియన్‌కు చేరాడు.

    ఆర్సీబీ భారీ స్కోర్‌
    చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా సీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 250 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్‌(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్‌(19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో 48) మెరుపులు మెరిపించారు. సీఎస్‌కే బౌలర్లలో ఓవర్టన్‌, కాంబోజ్‌, శివమ్‌ దూబే తలా వికెట్‌ సాధించారు.

    టిమ్ డేవిడ్ విధ్వంసం
    ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. జేమీ ఓవర్టన్ వేసిన 19 ఓవర్‌లో డేవిడ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 65 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 237/3

    భారీ స్కోర్‌ దిశగా ఆర్సీబీ
    17 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రజిత్ పాటిదార్‌(40), టిమ్ డేవిడ్‌(26) దూకుడుగా ఆడుతున్నారు.

    ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 50 పరుగులు చేసిన దేవ్‌దత్త్‌ పడిక్కల్‌.. ఓవర్టన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

    రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. ఫిల్స్‌సాల్ట్‌  ఔట్‌
    శివం దూబే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌కి దొరికిపోయిన ఫిల్స్‌సాల్ట్‌

    7 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 66/1
    7 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 66 పరుగలుఉ చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(33), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(3) ఉన్నారు.

    విరాట్‌ కోహ్లి ఔట్‌
    విరాట్‌ కోహ్లి రూపంలో ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 28 పరుగులు చేసిన కోహ్లి.. అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 44-1

    3 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోరెంత‌ంటే?
    3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫిల్ సాల్ట్‌(8) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.

    ఈ మ్యాచ్‌కు కూడా సీఎస్‌కే లెజెండ్‌ ఎంఎస్‌ ధోని, యువ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ దూరమయ్యాడు. ధోని త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ స్పష్టం చేశాడు. మరోవైపు ఆర్సీబీ స్టార్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటికి, ఈమ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు.

    తుది జట్లు
    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ

  • ఐపీఎల్‌-2026లో ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్‌ను తన మొదటి ఓవర్‌లోనే పడగొట్టి ప్రత్యర్థి జట్టును ప్రిన్స్ దెబ్బతీశాడు. ఈ లక్నో స్పీడ్ స్టార్ కిషన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన డెలివరీకి ఇషాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.

    ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. మూడో బంతిని గుడ్ లెంగ్త్ ఇన్ స్వింగర్‌గా సంధించాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కిష‌న్‌, క‌వ‌ర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌, ప్యాడ్ మ‌ధ్య ఉన్న గ్యాప్ నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

    దీంతో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే కిష‌న్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ప్రిన్స్‌ యాదవ్‌ తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్‌(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.

    చదవండి: Riyan Parag: ‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’
     

     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    ఈ సమయంలో క్లాసెన్‌, నితీశ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. తొలుత ఆచితూచి ఆడిన వీరిద్దరూ.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన లక్నో బౌలర్లను వీరిద్దరూ ఉతికారేశారు. ముఖ్యంగా నితీశ్ తన సొంత ప్రేక్షకుల ముందు వీరవిహారం చేశాడు. 

    అద్భుతమైన సిక్స్‌లు బాదుతూ అభిమానులు అలరించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న నితీశ్‌ కుమార్‌.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. క్లాసెన్‌ కూడా 41  బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ  ఐదో వికెట్‌కు 116 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 

    దీంతో స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్రిన్స్ యాద‌వ్‌, అవేష్ ఖాన్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. సిద్దార్ద్‌, దిగ్వేష్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.
    చదవండి: IPL 2026: నిప్పులు చెరిగిన ష‌మీ.. వ‌ణికిపోయిన ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు

  • ఐపీఎల్‌-2026లో టీమిండియా వెట‌ర‌న్‌, ల‌క్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ష‌మీ నిప్పులు చెరిగాడు.

    త‌న సంచ‌ల‌న బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో అద్భుత‌మైన బంతితో అభిషేక్ శ‌ర్మ‌ను బోల్తా కొట్టించిన షమీ.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

    షమీ మొత్తంగా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడు అద్భుత బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ కేవలం 10 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా షమీని ఈ ఏడాది సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి రూ.10 కోట్ల భారీ ధరకు షమీని లక్నో ట్రేడ్‌ చేసుకుంది. గత సీజన్‌లో షమీ విఫలం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వదులుకుంది. కానీ ఇప్పుడు తన మాజీ ఫ్రాంచైజీ పైనే షమీ సత్తాచాటాడు.

    తుది జట్లు
    సన్‌రైజర్స్ హైదరాబాద్  
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హైన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్

    ఇంపాక్ట్ సబ్స్‌: ఈషాన్ మలింగ, డేవిడ్ పేన్, సలిల్ అరోరా, శివమ్ మావి, జీషాన్ అంసారీ

    లక్నో సూపర్ జెయింట్స్ 
    మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరి, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఎం. సిద్ధార్థ్

    ఇంపాక్ట్ సబ్స్‌ : అన్రిచ్ నోర్కియా, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్జ్‌కే
     

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తార్ రాయల్స్ రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. తాజగా శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో ఉ‍త్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. 

    'ఈ విజయం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు మేమనుకున్న ప్లాన్‌ను సక్రమంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు సంతోషంగా అనిపించింది. 

    19వ, 20వ ఓవర్లు ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా.  ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నా. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 

    19వ ఓవర్‌ను ఆర్చర్‌కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది. ధ్రువ్‌జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. 

    జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ముంబైపై ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారిస్తాం. ఈసారి గట్టిగా కొడతాం' అని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.

    చదవండి: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే!

  • SRH vs LSG Live Score, IPL 2026:  ఐపీఎల్‌-2026లో భాగంగా ఉప్పల్‌ మైదానం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడతున్నాయి.

    లక్నో ఘన విజయం
    ఐపీఎల్‌-2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.  రిషబ్‌ పంత్‌(50 బంతుల్లో 9 ఫోర్లు, 68 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును గెలిపించాడు. 

    అతడితో పాటు కెప్టెన్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో హర్ష్‌ దూబే రెండు, శివాంగ్‌ కుమార్‌, మలింగ తలా వికెట్‌ సాధించారు.

    విజ‌యానికి చేరువ‌లో లక్నో
    ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో విజ‌యానికి చేర‌వైంది. 17 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో 4 వికెట్ల న‌ష్టానికి 138 ప‌రుగులు చేసింది. ల‌క్నో విజ‌యానికి 19 ప‌రుగులు కావాలి. క్రీజులో రిష‌బ్ పంత్‌(48), అబ్దుల్ స‌మ‌ద్(16) ఉన్నారు.

    లక్నో నాలుగో వికెట్‌ డౌన్‌
    నికోలస్‌ పూరన్‌ రూపంలో లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్‌.. రనౌటయ్యాడు. లక్నో విజయానికి 47 పరుగులు కావాలి.

    లక్నో మూడో వికెట్‌ డౌన్‌
    అయూశ్‌ బదోని రూపంలో లక్నో మూడో వికెట్లు కోల్పోయింది. 12 పరుగులు చేసిన బదోని.. హర్ష్‌ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    లక్నో రెండో వికెట్‌ డౌన్‌
    లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన ఐడైన్‌ మార్‌క్రమ్‌.. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అయూశ్‌ బదోని వచ్చాడు.

    9 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?
    9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్రమ్‌(45),రిషబ్ పంత్‌(16) ఉన్నారు. లక్నో విజయానికి 81 పరుగులు కావాలి.
    ల‌క్నో తొలి వికెట్ డౌన్‌.. మార్ష్ ఔట్‌
    157 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన మిచెల్ మార్ష్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 5 ఓవర్లకు లక్నో స్కోర్‌: 38/1

    3 ఓవర్లకు లక్నో స్కోర్‌ ఎంతంటే?
    3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(16), మిచెల్‌ మార్ష్‌(8) ఉన్నారు.

    అదరగొట్టిన క్లాసెన్‌, నితీశ్‌..
    లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) త‌మ అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో జ‌ట్టును ఆదుకున్నారు. 

    వీరిద్ద‌రూ ఐదో వికెట్‌కు 116 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్రిన్స్ యాద‌వ్‌, అవేష్ ఖాన్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. సిద్దార్ద్‌, దిగ్వేష్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
    ఎస్‌ఆర్‌హెచ్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. అవేష్‌ ఖాన్‌ వేసిన 19 ఓవర్‌లో మొదటి బంతికి హెన్రిచ్‌ క్లాసెన్‌ ఔట్‌ కాగా.. తర్వాతి బంతికి హర్ష్‌ దూబే ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    నితీశ్‌ కుమార్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. సిద్దార్ధ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    నితీశ్ కుమార్ రెడ్డి ఫిప్టీ
    ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను నితీశ్ అందుకున్నాడు.

    16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 123/4
    16 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి(49), హెన్రిచ్‌ క్లాసెన్‌(50) దూకుడుగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 97 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

    దూకుడుగా ఆడుతున్న నితీశ్‌..
    12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల న‌ష్టానికి 65 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌(19), నితీశ్ కుమార్ రెడ్డి(23) స్కోర్ వేగాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

    నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    26 పరుగుల వద్ద లివింగ్‌ స్టోన్‌ (16) ఔట్‌ అయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 26పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.   

    పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌
    స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అభిషేక్‌ శర్మ డకౌట్‌ కాగా.. ఇషాన్‌ (1), త్రావిస్‌ హెడ్‌(7) పరుగులు చేసి పెవీలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఎస్‌ 6 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది 

    మూడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    మొదటి ఓవర్ పూర్తయ్యాక రాథీని బౌలింగ్ నుంచి తీసేశారు. ఆయన స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చాడు. తన మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ ఇషాన్ కిషన్‌కి బంతిని లోపలికి స్వింగ్ చేసి ఆఫ్ స్టంప్‌ను కూల్చేశాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ స్కోరు 11/3గా పడిపోయింది. ఇప్పుడు ఎస్‌ఆర్‌ఎచ్‌  లియామ్ లివింగ్‌స్టోన్, హైన్రిచ్ క్లాసెన్‌పై భారం పడింది. 

    రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌

    • రెండో వికెట్‌ తీసిన మహ్మద్‌ షమీ
    • 2.1వ బంతికి భారీ షాట్‌ ఆడిన ట్రావిస్‌ హెడ్‌ (7)
    • క్యాచ్‌ అందుకున్న మార్‌క్రమ్‌

    రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌

    • ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది
    • మహ్మద్‌ షమీ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతిని అభిషేక్‌ ఫ్లిప్‌ చేశాడు
    • బ్యాట్‌ ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ను తాకి బంతి గాల్లోకి లేచింది.  

    ఆదివారం హైదరాబాద్‌ ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా ప్రారంభమైన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జి)తో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని ఇరు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఎస్ఆర్‌హెచ్ సొంతగడ్డపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎల్‌ఎస్‌జి ఈ సీజన్‌లో తొలి పాయింట్ల కోసం వేటాడుతోంది

    సన్‌రైజర్స్ హైదరాబాద్  
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హైన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్

    ఇంపాక్ట్ సబ్స్‌: ఈషాన్ మలింగ, డేవిడ్ పేన్, సలిల్ అరోరా, శివమ్ మావి, జీషాన్ అంసారీ

    లక్నో సూపర్ జెయింట్స్ 
    మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరి, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఎం. సిద్ధార్థ్

    ఇంపాక్ట్ సబ్స్‌ : అన్రిచ్ నోర్కియా, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్జ్‌కే

  • టీమిండియా సీనియ‌ర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కొత్త‌గా నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. చేజింగ్ మాస్ట‌ర్‌, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అత‌డి సొంతం. చేజింగ్‌లో కోహ్లీని కొట్టే మొన‌గాడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. అది అంత‌ర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్‌లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జ‌ట్టు గుండెల‌పై హాయిగా చేయి వేసుకొని నిద్ర‌పోతాయి. 

    టీమిండియా త‌ర‌ఫున ఇలాంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. ఇక ఐపీఎల్‌లో 19 సీజ‌న్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోహ్లీ చేజింగ్‌లో లెక్క‌లేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్‌లో కూడా కోహ్లీకి ఒక ఫేవ‌రెట్ జ‌ట్టు ఉంది. ఆ జ‌ట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్‌లో పూన‌కం వ‌చ్చేస్తుంది. ఆ జ‌ట్టు పేరే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే). 

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆదివారం డ‌బుల్‌హెడర్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ త‌మ హోంగ్రౌండ్‌లో సీఎస్‌కేతో త‌ల‌ప‌డ‌నుంది. తమ తొలి మ్యాచ్‌లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజ‌యంపై క‌న్నేయ‌గా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో ఉన్న సీఎస్‌కే ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఖాతా తెర‌వాల‌ని చూస్తోంది. 

    కాగా సీఎస్‌కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్‌లో సీఎస్‌కేతో 35 మ్యాచ్‌లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో 1146 ప‌రుగులు సాధించాడు.  చెన్నైపై అత్య‌ధిక స్కోరు 90 నాటౌట్‌గా ఉంది. ఇందులో 10 అర్థ‌సెంచ‌రీలున్నాయి. మ‌రో 14 ప‌రుగులు చేస్తే ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్‌గా త‌న రికార్డును తానే బ‌ద్ద‌లుకొట్ట‌నున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 1159 ప‌రుగులు సాధించాడు.

    చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు!

  • ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. ఉప్పల్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. 

    మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానున్న మ్యాచ్‌ మధ్యలో వర్షం పడే చాన్స్‌ ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు వెదర్‌ రిపోర్ట్‌ చూపిస్తోంది. ప్రస్తుతానికి ఎండ బాగానే కాస్తున్నప్పటికీ మ్యాచ్‌ సమయానికి వాతావరణం చల్లబడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. 

    ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసింది. మరోవైపు పంత్‌ సారథ్యంలోని లక్నో మాత్రం తొలి మ్యాచ్‌లో ఓడి ఇంకా బోణీ కోసం ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో స్థానంలో ఉంటే.. లక్నో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. 

    సొంతగడ్డపై భారీ విజయంతో ముందంజ వేయాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తుంటే.. లక్నో మాత్రం ఎలాగైనా ఉప్పల్‌లో గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. ఇరుజట్లు ముఖాముఖి పోరులో ఆరుసార్లు తలపడితే లక్నో 4 విజయాలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు విజయాలు సాధించాయి. గతేడాది ఇదే ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై లక్నో సూపర్‌జెయింట్స్‌ విజయం సాధించింది.

    చదవండి: అత‌డిని వ‌దిలి సీఎస్‌కే త‌ప్పు చేసిందా?

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌మీర్ రిజ్వీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను గెలిపించ‌డ‌మే గాక రెండుసార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌ను ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో ఆడింది. 

    ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీల‌క ఇన్నింగ్స్ ఆడి ల‌క్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌పై అదే త‌ర‌హాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన స‌మీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 ప‌రుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి స‌మీర్ రిజ్వీ క్రీజులోకి వ‌చ్చే స‌మ‌యానికి ఢిల్లీ 24 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉంది. 

    ఈ స‌మ‌యంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు క‌లిపి 160 ప‌రుగులు చేసిన స‌మీర్ రిజ్వీ ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజ‌న్‌కు ముందు స‌మీర్ రిజ్వీని చెన్నై సూప‌ర్‌కింగ్స్ రూ.8.40 కోట్ల‌కు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో రిజ్వీకి ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. 

    అయితే 2025 సీజ‌న్‌కు ముందు రిజ్వీని విడుద‌ల చేయ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిజ్వీని కేవ‌లం రూ. 95 ల‌క్ష‌ల‌కే ద‌క్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్‌కే అభిమానులు ఆ జ‌ట్టు యాజ‌మాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. 

    ‘చెన్నై జ‌ట్టులో ఉన్న‌ప్పుడు అవ‌కాశాలు ఇవ్వ‌లేదు.. ఇప్పుడేమో ఢిల్లీ త‌ర‌ఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్ల‌గొడుతున్నాడు’.. ‘స‌మీర్ రిజ్వీని వ‌దిలేసి సీఎస్‌కే దిద్దుకోలేని త‌ప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌ లోనూ 27 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతూ క‌ష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను స‌మీర్ రిజ్వీ త‌న విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో గెలిపించ‌డం విశేషం.

    చదవండి: కార్ల్‌సన్‌ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం!

Telangana

  • సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

    స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.  
     

  • సాక్షి హైదరాబాద్: గోల్కొండ తారామతిలోని ఓ రిసార్టులో గత రాత్రి డ్రగ్స్‌ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈగల్‌ టీమ్‌ ఓ ప్రకటన చేసింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపింది. తారామతిలో పోలీసులు, నార్కోటిక్స్‌ టీమ్స్‌తో సంయుక్త దాడులు నిర్వహించామని చెప్పింది. 

    ఇంటర్నేషనల్‌ డీజే మోర్‌ దెన్‌ ఫ్రెండ్స్‌ పేరుతో పార్టీ నిర్వహించినట్లు వివరించింది. మెుత్తం 35 మందికి డ్రగ్స్‌ టెస్టులు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. అరెస్టయిన వారిలో వ్యాపారులు, డీజే ప్లేయర్‌, మోడల్‌, బాలీవుడ్‌ నటుడు, సర్వర్‌ ఉన్నట్లు చెప్పింది.  
     

Business

  • లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ సరైన సమయంలో క్లియర్ చేసుకోక పోవడం వంటివి జరిగితే సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం లేదా నెగటివ్‌లోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకోకపోయినా.. తన సిబిల్ స్కోర్ నెగటివ్‌గా చూపిస్తోందని కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ఉత్తరాఖండ్‌కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వార్ అనే వ్యక్తి.. తాను 2020 నుంచి ఎలాంటి లోన్స్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ నెగటివ్‌గా చూపిస్తోందని, దీనివల్ల లోన్స్, క్రెడిట్ కార్డులు తీసుకోలేక పోతున్నాననే కారణంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. సంబంధిత బ్యాంకుల నుంచి వివరాలు కోరింది.

    కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంకులు రాజేంద్ర సింగ్ పన్వార్ లావాదేవీలు పరిశీలించి, తాను ఎలాంటి లోన్స్ తీసుకోలేదని నిర్దారించాయి. అయితే అతని సిబిల్ స్కోర్ నెగటివ్‌లోకి వెళ్లడానికి కారణం.. ఒకే పేరుతో ఉన్న ఇతర వ్యక్తులకు అదే పాన్‌ నంబర్ జారీ కావడం అని తెలిసింది. దీనివల్లనే స్కోర్ నెగటివ్‌గా చూపించిందని వివరణలో తెలుసుకున్నారు. బ్యాంకుల వివరణల తరువాత పన్వార్ సిబిల్ జారీచేసినట్లు సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి.

    సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
    సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్‌ స్కోర్‌ అంటారు.

    సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.

    సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు
    ➤ క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.

    ➤ లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌ను తగ్గిస్తుంది.

    ➤ మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.

    ➤ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.

    ➤ సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.

    ఇదీ చదవండి: డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?

  • బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.

    ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు

    • డిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.

    • సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.

    • ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.

    • కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.

    • పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.

    • జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.

    • ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

  • ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.

    AI సులభంగా చేసే పనులు
    ➤డేటా ప్రాసెసింగ్
    ➤ప్యాటర్న్ గుర్తింపు
    ➤కంటెంట్ తయారీ
    ➤నియమాల ప్రకారం పనిచేయడం

    వీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

    AI చేయలేని పనులు
    AI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..

    భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.
    నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.
    ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.
    అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.

    సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు
    హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు
    ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్
    మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు
    AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ
    కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు
    క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్

    ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు.

  • ఆటో విడిభాగాల దేశీ కంపెనీ టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌తో టెక్నాలజీ, సర్వీసుల దిగ్గజం బాష్‌ లిమిటెడ్‌ చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నట్లు బాష్‌ పేర్కొంది. జేవీ ప్రధానంగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అవసరాలకు అనుగుణమైన ఇంజినీరింగ్, తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది.

    సమాన వాటాతో పుణేలో ఏర్పాటు చేయనున్న జేవీ అన్ని అనుమతులు లభిస్తే 2026 మధ్యలో కార్యకలాపాలు ప్రారంభించగలదని అంచనా వేసింది. దేశీయంగా ఇంజినీరింగ్, తయారీ, ఈయాక్సిల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ విక్రయాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. భారత్‌ ప్రపంచంలోనే మూడో పెద్ద ఆటోమోటివ్‌ మార్కెట్‌కాగా.. దీంతో దేశీయంగా లభించనున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని బాష్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

  • ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తొలగించిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన మరువకముందే.. కంపెనీ విదేశీ ఉద్యోగులను నియమించడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైంది.

    యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు సంబంధించిన ఫెడరల్ డేటా ప్రకారం.. ఒరాకిల్ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో H-1B కార్మికులను నియమించుకోవడానికి సుమారు 3,126 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో 2026లో మాత్రమే 436 దరఖాస్తులు ఉన్నాయి.

    టెక్నాలజీ, రక్షణ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను కంపెనీ నియమించుకోవచ్చు. అయితే... అంతకంటే ముందు సంస్థలో అదే నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేరని సంస్థ నిరూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఒరాకిల్ భారీ లేఆఫ్స్ చేపట్టిందని చెబుతున్నారు.

    ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చాలామంది ఉద్యోగులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ పంపిన ఈమెయిల్‌లో సంస్థ అవసరాల దృష్ట్యా మీ ఉద్యోగాన్ని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి కొంతమేర పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

    ఒరాకిల్ కంపెనీ కంటే ముందు.. అమెజాన్ కూడా 16000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో 2675 H-1B పిటిషన్లు దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఇది పెద్ద కంపెనీలు అనుసరిస్తున్న ఒక సాధారణ ధోరణిగా కనిపిస్తోంది. దీనిని అమెరికాలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులను ఎక్కువగా నియమించడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?

  • ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నందితా సిన్హా రాజీనామా చేయనున్నారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

    దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో అసోసియేట్ డైరెక్టర్‌గా చేరిన నందితా సిన్హా.. ఆ తరువాత కాలంలో ఫర్నీచర్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, హెల్త్ అండ్ బ్యూటీ వంటి టీమ్స్‌లో పనిచేశారు. మీషోను 2014లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. 2022లో నందితా దానికి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె రాజీనామా చేయడానికి కారణం ఏమిటనే విషయం వెల్లడికాలేదు.

    ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఐపీఓకు వెళ్లడానికి ముందే తన పదవి నుంచి నందితా సిన్హా వైదొలగనున్నారు. తరువాత.. షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

    ఎవరీ షారన్ పైస్?
    షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్‌షిప్ బాధ్యతలు చేపట్టారు. దదాపు నాలుగు సంవత్సరాలు కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా పనిచేశారు. అంతే కాకుండా గత ఏడేళ్ల కాలంలో ఆయన సంస్థలో వివిధ పదవులలో కొనసాగారు. కంపెనీలో చేరడానికి కంటే ముందు.. అంటే 2014లో ప్రాక్టర్, గాంబుల్‌లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు.

  • కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ సర్వీస్ నెట్‌వర్క్‌ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 502 సర్వీస్ టచ్‌పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది. ఇవి ఎరీనా, నెక్సా వర్క్‌షాప్స్, మారుతీ సుజుకీ సేల్స్‌ అండ్‌ సర్వీస్ పాయింట్స్, సర్వీస్–ఆన్‌–వీల్స్, బాడీషాప్‌–ఆన్‌–వీల్స్‌ ఫార్మాట్లలో ఉన్నాయి.

    ప్రస్తుతం 5,926గా ఉన్న టచ్‌పాయింట్స్‌ని 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 8,000కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ హిసాషి టకెయుచి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు అవసరమైనప్పుడు స్పేర్‌ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయనేది కస్టమర్లకు ఒక భరోసాకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే తమ నెట్‌వర్క్‌ని తీర్చిదిద్దుకుంటున్నట్లు వివరించారు.

    ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని కొత్త తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు రూ. 10,189 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ గత నెలలో వెల్లడించింది. 2030–31 నాటికి 40 లక్షల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించుకుంది.

  • ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్‌)తో స్టాక్‌ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.

    త్వరలోనే మరోసారి స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్‌ యాప్‌ లేబుల్‌ను గూగుల్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు.

  • ముంబై: అధిక చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ కాపాడే చర్యలు విదేశీ మారకం నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు (ఫారెక్స్‌) అంతకుముందు వారంతో పోల్చితే 10.29 బిలియన్‌ డాలర్లు తగ్గి 688.06 బిలయన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

    గత వారంలోనూ ఫారెక్స్‌ నిల్వలు 11.41 బిలియన్‌ డాలర్లు తగ్గడం గమనార్హం. ఇరాన్‌–ఇజ్రాయెల్‌/అమెరికా యుద్ధానికి ముందు ఫిబ్రవరి 27న దేశ ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్టం 728.49 బిలియన్‌ డాలర్లకు చేరడం గమనార్హం. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వల్లో.. కరెన్సీ అసెట్స్‌ 6.62 బిలియన్‌ డాలర్లు తగ్గి 551.07 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

    బంగారం నిల్వల విలువ 3.66 బిలియన్‌ డాలర్లు తగ్గి 113.52 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 17 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.64 బిలియన్‌ డాలర్లకు చేరింది.

  • ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. ఆస్తి లావాదేవీల్లో పాన్ (PAN) కార్డ్ నిబంధనలను సడలిస్తూ వెలువడిన ఈ మార్పులపై సమగ్ర కథనం మీ కోసం..

    ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అడుగడుగునా ఎదురయ్యే డాక్యుమెంటేషన్ చిక్కులను తొలగిస్తూ, పాన్ కార్డ్ బహిర్గత పరిమితిని పెంచుతూ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోయనున్నాయి.

    మారిన నిబంధన
    ఇప్పటి వరకు రూ. 10 లక్షలకు మించిన ఏ ఆస్తి లావాదేవీకైనా కొనుగోలుదారు, అమ్మకందారు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. అయితే, ప్రస్తుత మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. అంటే రూ. 20 లక్షల లోపు విలువ చేసే ప్లాట్లు, ఇళ్లు లేదా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై పాన్ కార్డు అవసరం లేదు.

    ఎవరికి లాభం?
    ఈ నిర్ణయం ప్రధానంగా కింది వర్గాలకు వరంగా మారనుంది.
    గ్రామీణ, సెమీ అర్బన్ కొనుగోలుదారులు: చిన్న పట్టణాల్లో డాక్యుమెంటేషన్ లోపాలు ఎక్కువగా ఉంటాయి. పాన్ కార్డు లేని వారు లేదా అప్లై చేసినా రాని వారు ఇకపై రూ. 20 లక్షల లోపు ఒప్పందాలను వేగంగా ముగించుకోవచ్చు.
    మొదటిసారి ఇల్లు కొనేవారు: అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉండే సామాన్యులకు, సమ్మతి (Compliance) సంబంధిత ఇబ్బందులు తగ్గి, ఆస్తి యాజమాన్యం సులభతరమవుతుంది.
    రియల్ ఎస్టేట్ డెవలపర్లు: చిన్న ప్లాట్ల అమ్మకాలు జరిపే డెవలపర్లకు డాక్యుమెంటేషన్ ఆలస్యం కారణంగా ఆగిపోయే డీల్స్ ఇకపై చకచకా పూర్తవుతాయి.

    లావాదేవీల్లో వేగం.. తగ్గిన అడ్డంకులు
    గతంలో రూ. 15 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేయాలంటే, రిజిస్ట్రేషన్ సమయానికి పాన్ కార్డు లేకపోతే ఆ ప్రక్రియ వారాల తరబడి నిలిచిపోయేది. తాజా సడలింపుతో అదనపు ఫార్మాలిటీలు లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. ఇది అటు కొనుగోలుదారులకు, ఇటు అమ్మకందారులకు సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.

    పన్ను నిబంధనల్లో మార్పు లేదు!
    ప్రక్రియను సులభతరం చేయడం కోసమే ఈ నిబంధనను సడలించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) విషయంలో ఎలాంటి మార్పులు లేవు. లావాదేవీ విలువ పెరిగినా, తగ్గినా వర్తించే పన్ను నిబంధనలు యథావిధిగా ఉంటాయి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు చేసిన సంస్కరణ మాత్రమే.

    ఇదీ చదవండి: ఇల్లు ఇక్కడ కడితే తక్కువ ఖర్చు!

  • దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లిమిటెడ్‌ 2025–26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో తన రుణాలు (అడ్వాన్సులు) 12% పెరిగి రూ.29.6 లక్షల కోట్లకు చేరాయని ప్రకటించింది. గత సంవత్సరం మార్చి 31 నాటికి ఇవి రూ.26.43 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 14.4% పెరిగి రూ. 31.05 లక్షల కోట్లకు చేరాయి.

    గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో డిపాజిట్లు రూ.27.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) డిపాజిట్లు 12.3 శాతం వృద్ధితో రూ.9.4 లక్షల కోట్ల నుంచి రూ.10.6 లక్షల కోట్లకు పెరిగాయి. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్‌ ‘పీరియడ్‌ ఎండ్‌ టైమ్‌ డిపాజిట్లు’ సుమారు రూ.20.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2025 మార్చి 31 నాటికి ఉన్న రూ.17.7 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 15.5% వృద్ధి సాధించాయి.  

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌–టైమ్‌ చైర్మన్‌ అతాను చక్రవర్తి మార్చి 18, 2026న ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు, విధానాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరే ఇతర కారణాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ లేఖను గవర్నెన్స్, నామినేషన్, రెమ్యూనరేషన్‌ కమిటీ చైర్మన్‌ హెచ్‌ కే భన్వాలాకు మార్చి 17న పంపించారు.

  • ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు.

    "బ్యాడ్‌ న్యూస్‌.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్‌ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

    పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు
    1974 వరకు అమెరికా డాలర్‌కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్‌కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.

    పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం
    1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

    అప్పుల ఊబిలో అమెరికా
    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.

    మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..
    ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్‌ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా  బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.

    యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.
    ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా..

    "1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్‌ను ముగించారు.

Movies

  • బిడ్డ పుట్టినా సరే అందంలో కియారా తగ్గదే లే

    తమ్ముడి గురించి ప్రియా వారియర్ క్యూట్ పోస్ట్

    'డెకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలతో మృణాల్

    మత్తెక్కించే చూపులతో అనికా సురేంద్రన్

    అందచందాలతో మాయ చేస్తున్న ఐషా శర్మ

    చీరలో అందంగా ముస్తాబైన సప్తమి గౌడ

  • టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ కలర్‌ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. అల్లుడు శ్రీను మొదటి మూవీ కాగా.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

    శ్రీనివాస్‌కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోగా.. 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి జరగనుంది.

    (ఇదీ చదవండి: కాలి నడకనే తిరుమలకు ఎందుకు వెళ్తానంటే?: జాన్వీ కపూర్‌)

  • యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆల్బమ్ సాంగ్ 'కొత్త కొత్తగా'. తాజాగా ఇది రిలీజైంది. ఇందులో 'దేవగుడి' మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య కూడా నటించారు. రఘురామ్ ఈ పాటకు లిరిక్స్ రాసి సంగీతమందించారు. లిప్సిక పాడారు. ఈ సాంగ్ ఆల్బమ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తాజాగా జరిగింది.

    (ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)

    మా 'కొత్త కొత్తగా' సాంగ్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ డీవై చౌదరికి థ్యాంక్స్ చెబుతున్నా. 'రంగస్థలం'లో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మరికొన్ని మూవీస్ చేశారు. టీవీ ఛానెల్స్‌లో షోలు కూడా చేశాను. శ్రీజ మ్యూజిక్ ఛానెల్‌లో మేం చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఇది చేశాం అని శ్రీజ చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: ‍జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది: విఘ్నేశ్ శివన్)

  • తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్‌తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్‌ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్‌తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)

    'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్‌లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్‌తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.

    అసలేంటి వివాదం?
    విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

    నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్‌ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

    విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్‌తో వివాదం గురించి స్పందించాడు.

    (ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి)

  • సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన సినిమా 'విచిత్ర'. దీని ఫస్ట్ లుక్‌ని దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆదివారం రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)

    ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు నటించారు. నిజాని అంజన్ సంగీతమందించారు. వచ్చే నెల 22వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

    (ఇదీ చదవండి: రొమాన్స్‌ కష్టంగా అనిపించింది: మృణాల్‌)

  • అడివి శేష్‌ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ బట్టి చూస్తే..ఇది లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్‌ తొలిసారి ఇందులో యాక్షన్‌ సీన్స్‌ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్‌ సీన్సే కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. 

    డెకాయిట్‌ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం మృణాల్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్‌ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్‌ సన్నివేశాలే ఛాలెంజింగ్‌గా అనిపించాయి. 

    ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్‌లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్‌ చేయాలి. అలా నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్‌ చెప్పుకొచ్చింది. 

  • కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య సతీమణి జ్యోతిక గురించి పరిచయం అక్కర్లేదు. 1997లో  హిందీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అజిత్‌ హీరోగా నటించిన వాలి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. తమిళంతో పాటు తెలుగు,హిందీ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. రెండు దశాబ్దాలకు పైగా నటిస్తూ ఎవర్‌ గ్రీన్‌ హీరోయిన్‌గా తన కెరీర్‌లో దూసుకెళ్లింది. ఆ తర్వాత 2006లో సూర్యను పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ.  సూర్య, జ్యోతిక దంపతులకు దేవ్‌ అనే కొడుకు, దియా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి పిల్లలు ముంబయిలో చదువుతున్నారు.

    ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా.. జ్యోతిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా తన జిమ్‌ వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల కసరత్తులు చేస్తూ జ్యోతిక కనిపించింది. ఈ స్టన్నింగ్ వర్కవుట్స్ చూస్తుంటే జ్యోతిక ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం జ్యోతిక రెండు వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. 
     

     

  • పార్థ గోపాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’. సూర్య జి. యాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్‌. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.. ఈ చిత్రం టైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వాకాడ అప్పారావు, నిర్మాత శిరీష్‌ రెడ్డి, నటుడు శివాజీ రాజా పాల్గొని, ‘డైమండ్‌ డెకాయిట్‌’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

    పార్ధ గోపాల్‌ మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్‌... ఇలా అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌ ‘డైమండ్‌ డెకాయిట్‌’. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో మా సినిమా తీశాం. థియేటర్‌లో వీక్షించి, యూనిట్‌ని సపోర్ట్‌ చేయాలి’’ అని సూర్య జి. యాదవ్‌ పేర్కొన్నారు. 

  • ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. మృత్యుంజమ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి అనే తెలుగు చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', 4వ అధ్యాయం లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు వీటితోపాటు ఓ తెలుగు హారర్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)

    మదనపల్లెలో తీసిన ఈ సినిమాలో సంతోశ్, సయ్యద్ ఆజం, గౌష్ బాషా, మళ్లీశ్వరమ్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. శివాజీ, సురేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

  • బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్‌  రెజ్లర్ లుక్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వీకపూర్‌కు తిరుమలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. అమ్మ శ్రీదేవి బాటలోనే ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఎప్పుడు తిరుమలకు వెళ్లినా కాలి నడకనే కొండపైకి చేరుకుంటుంది జాన్వీ. సెలబ్రిటీ అయినప్పటికీ కాలి నడకన వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. దీని వెనుక గల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.

    తాను తిరుమలకు కాలి నడకన వెళ్లేందుకు గల కారణాలను వివరించింది జాన్వీ కపూర్. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. కాలినడకన ప్రయాణించడం వల్ల కలియుగ దైవం బాలాజీకి మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని తెలిపింది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవమని తనకు చాలా  ఇష్టమని పేర్కొంది. భక్తితో మెట్లు ఎక్కి ఇష్టదైవమైన శ్రీవారి చెంతకు చేరడాన్ని ఒక గొప్ప సౌభాగ్యంగా భావిస్తానని జాన్వీ కపూర్ వెల్లడించింది. 
     

  • మ్యాడ్ హీరో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా  నటించిన మరో సినిమా 'రాకాస'. ఈ సినిమాను నిహారిక తన సొంత బ్యానర్‌ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రిలీజైంది.

    ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వీకెండ్ కలిసి రావడంతో రెండు రోజుల్లో రూ.10.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్‌ రిలీజ్ చేసింది. 
     

     

  • ఇటీవల టీఎన్‌ 2026 చిత్రం గురించి చాలా వివాదాస్పద చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. కారణం ఈ చిత్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల వచ్చాయి. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్‌ విజయ్‌ను పోలి ఉంది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అధవ్‌అర్జున్‌ టీఎన్‌–2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్‌ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని  ఎన్నికలకు కొద్ది వారాల ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని అయితే ఈ చిత్రాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్నన్‌ గ్రూప్‌ పతాకంపై కన్నన్‌రవి, కందన్‌రవి, దీపక్‌ రవి నిర్మించిన చిత్రం టీఎన్‌ 2026. తంబిరామయ్య కథను సమకూర్చిన ఈ చిత్రానికి ఆయన వారసుడు, అర్జున్‌ సర్జా అల్లుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించారు. 

    నట్టి  కథానాయకుడిగా నటించిన ఇందులో శ్రితరావు నాయకిగా నటించారు తంబిరామయ్య, ఎంఎస్‌ భాస్కర్, ఇళవరసు, చాందిని తమిళరసన్, యాషిక ఆనంద్, విజీ చంద్రశేఖర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. తర్బకా శివ సంగీతాన్ని, ముత్తయ్య చాయాగ్రహణం అందించారు. ఈనెల 10న తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ఏఆర్‌ఎస్‌ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తంబిరామయ్య మాట్లాడుతూ టీఎన్‌ 2026  చిత్రం ఏ రాజకీయ పార్టీని విమర్శించే విధంగా ఉండదని పేర్కొన్నారు. అధవ్‌ అర్జున తమ చిత్రం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చిత్రం చూడాలని అన్నారు. విజయ్‌ సింహం అని, ఆయన్ని ఎవరూ విమర్శించలేరని తంబిరామయ్య పేర్కొన్నారు. ఈ చిత్రంలో విజయ్‌ను ఢీ ఫేమ్‌ చేయలేదని నట్టి పేర్కొన్నారు. 

  • బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అభిమానులను మెప్పించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్‌  రెజ్లర్ లుక్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 

    అయితే పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన టీనేజ్‌లో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ అశ్లీల సైట్‌లో తన మార్ఫింగ్ చిత్రాన్ని చూశానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు. మా క్లాస్‌లో కొందరు అబ్బాయిలు సరదా కోసం అలాంటి సైట్స్ చూసేవారని.. ఆ సమయంలో నా ఫోటోలు చూశానని తెలిపింది. నేను చదివే పాఠశాలలోనే ఇలా జరగడంతో చాలా వింత అనుభవాన్ని ఎదురైందని జాన్వీ కపూర్ వివరించింది.

    ఆ సమయంలో తాను ఆ పరిస్థితిని సర్దుకుపోవడానికి ప్రయత్నించానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. అలా నా ఫోటోలు చూశాక సోషల్ మీడియాకు సంబంధించి ఇలాంటి చాలా విషయాలలో నైతికత లేదని అనిపించిందని జాన్వీ తెలిపింది.   అయితే ఇప్పుడు వాటిపై తన దృక్పథం మారిందని.. ఏఐ (AI) రూపొందించిన ఈ చిత్రాలు ఈ రోజుకు తనను ప్రభావితం చేస్తున్నాయని జాన్వీ కపూర్‌ తన బాధను పంచుకుంది. 

    ఇలాంటి పరిస్థితుల్లో తనకు సంతోషం అనేది లేదని జాన్వీ వెల్లడించింది. ఏఐ రూపొందించిన తన ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్నాయని.. కొన్నిసార్లు అధికారిక వార్తా పేజీలు కూడా వాటిని షేర్ చేస్తున్నాయని వివరించింది. ఇలాంటి మార్ఫింగ్, ఏఐ ఫోటోల్లో తాను ఎప్పుడూ ధరించని దుస్తులు, పోజులు ఉన్నాయని జాన్వీ కపూర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఇలా సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రియులు కోరుతున్నారు. 

  • ఒకవైపు దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు వేణు ఊడుగుల. ఆయన నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం భారీ కలెక్షన్స్‌తో బోలెడు అవార్డులను సొంతం చేసుకుంది. ఆయన సమర్పణలో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

    ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో ఇద్దరు బ్రదర్స్‌ సైకిల్ పై వెళ్తుండటం చూపించారు.‘గుణం, గణం, నీతో రణం - ఇది తథ్యం’.. ఇద్దరు సోదరుల భావోద్వేగభరితమైన కథ ’ అంటూ వేణు ఊడుగుల ఈ పోస్టర్‌ని ట్వీట్‌ చేశాడు.  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.

  • ‘‘మేం ఎన్ని చెప్పినా ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించేది కంటెంట్‌ మాత్రమే. మూవీలో కంటెంట్‌ ఉందని ఆడియన్స్‌ అనుకుంటే తప్పకుండా ఆదరిస్తారు. మా ‘గేదెల రాజు’లో మంచి కంటెంట్‌ ఉందని మేము నమ్ముతున్నాం... మా సినిమాని సక్సెస్‌ చేయండి’’ అని సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె చెప్పారు. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గేదెల రాజు’. రవి ఆనంద్‌ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. 

    రఘు కుంచె నటించి, సమర్పించిన చిత్రమిది. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌లో చైతన్య మోటూరి మాట్లాడుతూ–‘‘మర్డర్‌ మిస్టరీ, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. మా మూవీలో హీరోలు, విలన్స్‌ ఉండరు... పాత్రలు మాత్రమే ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మా అబ్బాయి చైతన్య మోటూరికి సినిమా మీద ఉన్న ప్యాషన్‌ను ఎంకరేజ్‌ చేయాలని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు వాణి రవికుమార్‌ మోటూరి.  

  • టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ - రాజశేఖర్‌ కలిసి నటించిన కొత్త సినిమా ‘బైకర్‌’. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు శర్వానంద్‌ కూడా థియేటర్స్‌లోని తమ ఫ్యాన్స్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో  హైదరాబాద్‌లోని  శ్రీరాములు థియేటర్‌లో అభిమానులను చూసిన శర్వానంద్‌  భావోద్వేగానికి గురైయాడు.

    ఆదివారం కావడంతో శ్రీరాములు థియేటర్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. శర్వానంద్‌ సినిమా మధ్యలో థియేటర్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు విజిల్స్‌ వేస్తూ  హర్షధ్వానాలు పలికారు. అయితే, వేదికపై వచ్చిన శర్వానంద్  మైక్ పట్టుకుని మాట్లాడకుండానే తనను ఈ రేంజ్‌కు తెచ్చిన వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. తనకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు శర్వానంద్  ధన్యవాదాలు తెలిపారు.

    భారతీయ తొలి మోటోక్రాస్‌ రేసింగ్‌ సినిమాగా ‘బైకర్‌’ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్‌ రెడ్డి  తెరకెక్కించారు. ఇందులో శర్వానంద్‌కు జంటగా మాళవిక నాయర్‌ నటించారు.  ఈ సినిమాని  యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.
     

  • మలయాళ స్టార్ టోవినో థామస్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ పల్లి చట్టంబి. ఈ సినిమాకు డీజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ నేపథ్యంలోనే తాజాగా పల్లి చట్టంబి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1950 దశకంలో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 10న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్బంగా రణబాలి మూవీ టీమ్‌ ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు చెబుతు మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది.  ఈ క్రమంలో రష్మిక భర్త విజయ్‌ దేవరకొండ కూడా ఆ వీడియోను షేర్‌ చేస్తూ ఐ లవ్‌ యూ జయమ్మ  అని క్యాప్షన్‌ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లి తర్వాత ఈ చిత్రం రానున్నడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ మరోసారి హిట్‌ కొట్టేందుకు బలమైన కథన రెడీ చేసుకున్నాడు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది.   1854 - 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం తెల్లదొరలపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్‌ కనిపించనున్నారు. 
     

  • హీరో రాజశేఖర్‌ తాజాగా బైకర్ మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇండియాలోనే తొలి స్పోర్ట్స్‌  మోటోక్రాస్ రేసింగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో  వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ బైకర్ సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

    హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌కు రాజశేఖర్ సతీమణి జీవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మూవీ రివ్యూవర్లపై మాట్లాడారు. సినిమా ఎంత బాగా తీసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారన్నారు. రివ్యూలు చదువుతుంటే.. సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోందని తెలిపారు. సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసి పారేస్తారు.. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తారు. ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం, కోట్లాది రూపాయల ఖర్చు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రేక్షకులు రివ్యూలు చూసి కాకుండా.. స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని జీవిత పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రేక్షకుడి రివ్యూనే మాకు ముఖ్యమని అన్నారు. ఏవైనా గొడవలున్నా, మనస్పర్థలున్నా మనసు విప్పి మాట్లాడుకోండి.. ఎవరినీ దూరం పెట్టకండి.. సంతోషంగా ఉండటమే జీవితం అంటూ ఆమె ప్రేక్షకులకు సందేశమిచ్చారు జీవిత రాజశేఖర్. ఈ కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 
     

  • సినీ నటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే.  వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.

    సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్‌(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల  అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

    ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియో చేశారు.  'పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. త్వరలో మరికొందరిని అరెస్ట్‌ చేస్తారు. ఎవరూ తప్పించుకోలేరు. మీ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారు. మీరు ఉద్యోగం చేస్తుంటూ ఆఫీస్‌లో తెలుపుతారు. ఎవరినీ బూతులతో తిట్టకండి.' అంటూ కోరారు. రేణు దేశాయ్‌ని ఎందుకు తిట్టారని వారిని పోలీసులు ప్రశ్నాంచారు. ఆమె వల్ల మీకేమి కష్టం జరగలేదు కదా అని అడిగితే.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి తాము తిట్టామని అలా కాస్త ఫేమస్ కావచ్చని అనుకున్నట్లు వివరణ ఇచ్చారు.
     

Politics

  • పాట్నా:  మరో ఐదు రోజుల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణి స్వీకారం చేయబోతున్న బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చేసే ప్రక్రియ వేగమంతమైంది.  ఈ నెల 10వ తేదీ నితీష్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ తరుణంలో అక్కడ సీఎం పోస్ట్‌ ఖాళీ కానుంది. అయితే స్థానాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ సరోగి స్పష్టం చేశారు. ఆ బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుందని  పేర్కొన్నారు. 

    ‘ నితీష్‌ కుమార్‌ గత వారమే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసిన క్రమంలో కౌన్సిల్‌ సభ్యునిగా రాజీనామా చేశారు. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బిహార్‌ సీఎంను ఎంపిక చేసే పనిలో పడింది. ఇందులో నూతన సీఎం ఎంపిక చేసే ప్రక్రియలో నితీష్‌ కుమార్‌ కూడా పాలు పంచుకుంటారు’ అని తెలిపారు.  

    కాగా, మార్చి 16న నితీష్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 190 ప్రకారం.. ఒక వ్యక్తి ఏకకాలంలో అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలోనూ సభ్యునిగా కొనసాగకూడదు. 1950 నాటి ‘ప్రొహిబిషన్ ఆఫ్ సైమల్టేనియస్ మెంబర్‌షిప్’ నిబంధనల ప్రకారం, ఎన్నికైన 14 రోజుల లోపు ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు మార్చి 30 (సోమవారం) నాటితో ముగియనుండటంతో, చివరి రోజున ఆయన తన ఎమ్మెల్సీ పదవికి నితీష్‌ రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

    రేసులో ఉన్నది ఎవరు..?
    నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్ తదుపరి ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ తదితర అగ్రనేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుత బాధ్యతలకు సంబంధించి రానున్న కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  • సాక్షి, హైదరాబాద్‌: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నాదర్‌గూల్‌ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    మాజీ మంత్రి హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్‌గూల్‌ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్‌గూల్‌ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.

    రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.

    లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్‌కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్‌కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్‌ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు.

     

  • సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్‌ జోన్‌ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్‌ చేశారు.

    ‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్‌ బైపాస్‌లో 10 శాతం  పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్‌ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.

    ‘‘వైఎస్‌ జగన్‌ సూచించిన మావిగన్‌ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.

    రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.

    మావిగన్‌కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్‌
    వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ జగన్ సూచించిన మావిగన్‌కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.

    ‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్‌ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్‌ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్‌పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్‌కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.

    అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణు
    అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్‌ లాంటి మావిగన్‌పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?

    అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు

    కృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్‌కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్‌ను కూడా  జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్‌పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం.


     

  • సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ-బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా బీజేపీ కార్పొరేటర్‌ మౌనిక ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు.

    ఇదిలా ఉండగా.. శనివారం చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.

    ఖానాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్‌ స్థానాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌ అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ బలం ఐదుకు చేరింది. ముందుగా చైర్‌పర్సన్‌ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్‌ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు.

     

  • సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో రాజ్యాంగం అపహాస్యం అవుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి నాయకుల వేధింపులు భరించలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు దళితులు అంటే వ్యతిరేకత అంటూ వ్యాఖ్యలు చేశారు.

    మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దళితులపై దాడులు చేస్తున్నారు. ఒక దళితుడిని అయ్యన్నపాత్రుడు చెంప మీద కొట్టారు. దళితుడిని కొట్టిన ఆయన మీద ఎందుకు కేసు నమోదు లేదు?. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తప్పుడు కేసులు పెట్టి దళితులను జైలుకు పంపిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తారా?.

    ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దళితులకు చెందిన 200 కోట్లు విలువైన భూములను ఆక్రమించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితులను వెలివేశారు. రాజమండ్రిలో దళితులను బట్టలు విప్పి పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెట్టరు. కూటమి నాయకుల వేధింపులు భరించకలేక దళితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. 

National

  • పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు. బిహార్‌ రాజధాని పట్నాలో ఆదివారం ఇలాహి ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు పాకిస్థాన్ ద్వారా జరుగుతున్నాయనే వాదనలు నిజం కాదని తెలిపారు.

    "ఈ విషయంలో పాక్‌కు ఎలాంటి పాత్ర లేదు. పాకిస్థాన్ ద్వారా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయన‍్న వాదనల్లో నిజం లేదు. ఇటువంటి మాటలను అమెరికా కేవలం చమురు ధరలను తగ్గించడానికే చెబుతోంది. వారు నిజంగా చర్చలకు సిద్ధంగా లేరు. కొన్ని దేశాలను ఉపయోగించాలనుకున్నారు. చర్చలు జరపాలనుకుంటున్నామని చెప్పారు.. కానీ, అది నిజం కాదు" అని ఆయన తెలిపారు.

    శాంతి ప్రయత్నాల్లో భారతదేశం పాత్ర పోషించగలదా? అనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. భారతదేశం సహా ఇతర అన్ని దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆపడానికి సహకరించవచ్చని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మంచి పాత్రను పోషించవచ్చని పేర్కొన్నారు.

    యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నకు ఇలాహి స్పందిస్తూ.. యుద్ధం ముగింపు అనేది అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఫిబ్రవరి 28న వారు యుద్ధాన్ని ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని అన్నారు.

    "ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలపైనే యుద్ధం ముగింపు అంశం ఆధారపడి ఉంది. వారు ఇరాన్‌పై దాడులు ప్రారంభించారు. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవ వనరుల కేంద్రాలు, గనులపై దాడులు చేశారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది పౌరులు మరణించారు. వారు ఆపితే యుద్ధం ముగుస్తుంది" అని చెప్పారు.

    ఇరాన్ యుద్ధాన్ని కోరుకోలేదని.. ఈ ఘర్షణ వల్ల అనేక దేశాల పౌరులు బాధపడుతున్నారని ఇలాహి చెప్పారు. ప్రపంచ నాయకులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

    "దురదృష్టవశాత్తు ఇది అధర్మ యుద్ధం. ప్రపంచంలోని అనేక మంది బాధపడుతున్నారు. ప్రపంచ నాయకులు కలిసి ఈ యుద్ధాన్ని ప్రారంభించిన దేశాలను ఆపాలని కోరాలి" అని తెలిపారు.
     

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కూచ్ బెహార్‌లోని చారిత్రాత్మక రాస్ మేళా మైదానంలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ, టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

    మోదీ మాట్లాడుతూ.. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని, ప్రజల సొమ్మును నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘చేసిన అక్రమాలకు టీఎంసీ నేతలు తప్పక మూల్యం చెల్లించుకోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి తీసుకుంటాం. నేరస్తులను తగిన విధంగా శిక్షిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

    రాష్ట్రంలో అక్రమ చొరబాట్లను బీజేపీ అడ్డుకుందని, కానీ అది సరిపోదని, ప్రతి అక్రమ వలసదారుని వెనక్కి పంపుతామని మోదీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో టీఎంసీ అవినీతి, హింస, పాలన పతనంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

    ఈ ప్రచారం ద్వారా బీజేపీ, ఈ నెల చివర్లో జరగనున్న ఓటింగ్‌కు ముందు ప్రజలను మరింతగా ఆకర్షించాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి 294 స్థానాల కోసం ఎన్నికలు ఏప్రిల్‌ 23, ఏప్రిల్‌ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. సారాంశంగా, మోదీ ప్రసంగం బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.

     

  • న్యూఢిల్లీ: నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్‌ల అంతర్గత భాగాల అప్‌గ్రేడేషన్‌ జరుగుతోంది. శాంపిల్‌ కోచ్ సిద్ధమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తాజాగా న్యూఢిల్లీ స్టేషన్‌లో ప్రతిపాదిత అంతర్గత డిజైన్, రంగులతో అభివృద్ధి చేసిన నెక్స్ట్-జనరేషన్ అమృత్ భారత్ కోచ్‌ల శాంపిల్‌ కోచ్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు మంచి సౌకర్యం, ఆకట్టుకునే రూపం, మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా ఈ మోడల్‌ కోచ్‌ను రూపకల్పన చేశారు.

    పీవీసీ ఫ్లోరింగ్, సీటు, బెర్త్ రెక్సిన్, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, లావేటరీ ప్రాంతాలు వంటి ముఖ్య భాగాల్లో వాటికి తగ్గ రంగులతో ప్రత్యేక అంతర్గత రంగుల థీమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ కోచ్‌లలో వాడిన అన్ని పదార్థాలు హెచ్ఎల్ 3 అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. 

    హెచ్ఎల్3 (హజార్డ్ లెవల్ 3) యూరోపియన్ రైల్వే స్టాండర్డ్‌ ఈఎన్ 45545-2కి అనుగుణంగా వీటి రూపకల్పన చేస్తున్నారు. హజార్డ్ లెవల్ 3 అంటే అగ్ని ప్రమాదంలో పదార్థాల భద్రత స్థాయి కొలిచే అత్యున్నత ప్రమాణం. ఈఎన్ 45545-2 అంటే యూరోపియన్ రైల్వే అగ్ని భద్రత ప్రమాణాల నియమావళి.

    ఈ రైళ్లకు వాడుతున్న ఈ కలర్‌ స్కీమ్‌ ఆధునిక రూపాన్ని ఇస్తూ దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా చేస్తుంది. నిర్వహణ కూడా సులభతరంగా ఉంటుంది. రైల్వేలో ఉపయోగించే అన్ని రకాల బోగీలు, లోకోమోటివ్‌లను ఆధునికీకరించారు. ఈ సూపర్‌ఫాస్ట్ ప్రయాణికుల రైలులో పీవీసీ ఫ్లోరింగ్ నుంచి రెక్సిన్ సీటు బెర్త్‌లు, స్నాక్ టేబుళ్లు, కర్టెన్లు, మరుగుదొడ్డి వరకు వాటికి తగ్గ రంగుల ప్యాలెట్‌లు వేయడంతో ఈ రైలు చూడగానే ఆకట్టుకుంటోందది.

    ప్రయాణికుల భద్రత, మెరుగైన సౌకర్యాల కోసం కొత్త డిజైన్‌లు, మెరుగైన మరుగుదొడ్డి సౌకర్యాలతో కోచ్‌ల శాంపిల్స్‌ సిద్ధం చేశామని, ఉన్న కోచ్‌ను మెరుగుపరచి నమూనా కోచ్‌గా తయారు చేశామని అశ్విని వైష్ణవ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

     

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న  ఎన్నికల సమరం జరగనుంది. అయితే ఇంతలో టీవీకే అధినేత విజయ్ సవరించిన అఫిడవిట్ సమర్పించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రస్తావించని రెండు కేసుల వివరాలను తాజాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన కొత్త అఫిడవిట్‌లో ఆయన వెల్లడించారు. మార్చి 30న తొలి నామినేషన్ వేసిన విజయ్.. ఏప్రిల్ 3న నోటరీ చేయించి, ఏప్రిల్ 4న తన ప్రతినిధి ద్వారా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో చెన్నై, మదురైలకు చెందిన రెండు క్రిమినల్ కేసుల వివరాలను కొత్తగా చేర్చారు.

    ఆ రెండు కేసులు ఇవే..
    మొదటి ఎఫ్‌ఐఆర్ (74/2026) చెన్నైలోని పెరవళ్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. మార్చి 30న ఎన్నికల ప్రచారంలో ప్రజాశాంతికి భంగం కలిగించారనేది ఆరోపణ. అయితే ఏప్రిల్ 2న సోషల్ మీడియా ద్వారానే ఈ కేసు గురించి తనకు తెలిసిందని విజయ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రెండో ఎఫ్‌ఐఆర్ (108/2025) మదురై జిల్లా కూడకోవిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. 2025 ఆగస్టు 21న జరిగిన పార్టీ సదస్సులో విజయ్ ర్యాంప్ వాక్ చేస్తుండగా, బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయనేది దీని సారాంశం. ఈ ఫిర్యాదుపై తనకు ఇంకా ఎలాంటి అధికారిక సమన్లు అందలేదని విజయ్ స్పష్టం చేశారు.

    కోట్లలో ఆస్తులు.. పన్ను బకాయిలు..
    క్రిమినల్ కేసుల జాబితా మారినా ఆస్తుల వివరాలు దాదాపు పాత అఫిడవిట్ మాదిరిగానే ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ గతంలో రూ.404.58 కోట్లు ఉండగా, అది కాస్తా రూ. 410.59 కోట్లకు పెరిగింది. ఇందులో రూ. 15 లక్షల విలువైన వెండి, రూ. 1.20 కోట్లకు పైగా విలువైన 883 గ్రాముల బంగారం ఉన్నాయి. నీలాంకరై, సాలిగ్రామంలోని వాణిజ్య, నివాస భవనాలతో కలుపుకుని ఆయన స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ. 184.53 కోట్లుగా చూపించిన ఆయన.. సుమారు రూ. 3.44 కోట్ల ఆదాయపు పన్ను బకాయిల వివాదం అప్పీలు దశలో ఉన్నట్లు వెల్లడించారు.

    రాబోయే ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్‌ స్థానానికి (ఏప్రిల్ 2న దాఖలు) ఇచ్చిన వివరాలకు, తొలిసారి పెరంబూర్ స్థానానికి ఇచ్చిన వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ, పెండింగ్ క్రిమినల్ కేసులన్నింటినీ బహిర్గతం చేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విజయ్ ఈ కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు సమచారం.

    ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్‌’కు రూ. కోటి!

  • అలప్పుజ: అదృష్టం తలుపు తట్టడమే కాదు.. ఒక్కోసారి చెత్తబుట్టలో నుంచి కూడా పలకరిస్తుందని కేరళకు చెందిన ఓ మహిళ విషయంలో నిరూపితమయ్యింది. తెలియక పారేసిన లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తృటిలో చేజారిన మహాభాగ్యం తిరిగి దక్కిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడి పంచాయతీ పరిధిలోని ఎడతువా ప్రాంతానికి చెందిన కుంజమ్మ అనే మహిళ, అంబలప్పుజా-తిరువల్లా రాష్ట్ర రహదారి పక్కన ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. రోజూవారీ వ్యాపారంతో పాటే ఆమె స్థానికంగా ఉండే జార్జ్‌కుట్టి అనే లాటరీ విక్రేత వద్ద రెండు ‘కారుణ్య’ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. గురువారం నాడు లాటరీ ఫలితాలు వెలువడగా, కుంజమ్మ ఎంతో ఆసక్తిగా తన వద్ద ఉన్న లాటరీ నంబర్లను ఫలితాలతో సరిచూసుకున్నారు. అయితే తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి మాత్రమే రూ. 5,000 కన్సోలేషన్ బహుమతి వచ్చినట్లు ఆమె గమనించారు. తనకు దక్కిన అదృష్టం అంతేనని సరిపెట్టుకున్న కుంజమ్మ, రెండో టికెట్‌కు ఎలాంటి బహుమతీ రాలేదని భావించి, దానిని తన దుకాణంలో ఉన్న చెత్తబుట్టలో పారేశారు.

    అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. లాటరీ ఫలితాలను నిశితంగా గమనించిన కుంజమ్మ సోదరుడు ఆమెకు ఒక కళ్లు చెదిరే వార్తను చెప్పారు. పనికిరాదని ఆమె చెత్తలో పారేసిన ఆ రెండో టికెట్‌కే ఏకంగా రూ. ఒక కోటి మొదటి బహుమతి వరించిందన్నాడు. ఆ మాట విన్న వెంటనే కుంజమ్మకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని తానే స్వయంగా చెత్తపాలు చేశానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రాత్రికి రాత్రే తన సోదరుడిని వెంటబెట్టుకుని ఆమె తిరిగి తన దుకాణానికి పరుగులు తీశారు. ఇద్దరూ కలిసి  ఆ చెత్తబుట్టలో వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. చెత్తలో పారేసిన ఆ కోటి రూపాయల లాటరీ టికెట్ ఎట్టకేలకు  దొరికింది. అది చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన స్థానికుంగా సంచలనంగా మారింది.

    ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు

Crime

  • హైదరాబాద్‌: నగరంలో  మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.  మూవీ చూసి స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని డీసీఎం ఢీకొట్టింది.  ఆ దంపతుల్లో భార్య కూడా స్కూటీతో వ్యాన్‌లో చిక్కుకుపోయింది. 

    అనంతరం ఆ స్కూటీని  అలాగే కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.  వ్యాన్‌ పక్క నుంచి వెళ్తున్న నగర వాసులు ఈ విషయాన్ని గమనించి ఆ డీసీఎం వ్యాన్‌ను అడ్డగించారు. అనంతరం లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

    వివరాల్లోకి వెళ్తే..  హనియ్యా ఆయేషా (22), అబ్దుల్‌ బాసిత్‌(26)లు భార్యభర్తలు. వీరిది కేరళ రాష్ట్రం. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. జ్యూయలరీ వర్క్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నిన్న రాత్రి మూవీ చూడటానికి వెళ్లారు. అయితే వీరిని తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టడంతో వారిలో భర్త రోడ్డు పక్కకు పడిపోగా, భార్య మాత్రం డీసీఎం వ్యాన్‌లో చిక్కుకుపోయింది. ఇలా కిలో మీటర్లు  వెళ్లిన తర్వాత ఇది గమనించిన కొంతమంది వ్యాన్‌ అడ్డగించి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా, తీవ్రగాయాలైన భర్తకు చికిత్స అందిస్తున్నారు. 

    అయితే వారిని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసినా ఆపకుండా డ్రైవ్‌ చేసుకుంటూ  వెళ్లిపోయాడు. ఆ స్కూటీ ఆ వ్యాన్‌ కింద చిక్కుకున్నా అలానే వెళ్లిపోయాడు. ఇలా కిలో మీటర్లు దాటి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని  ఒక చోట గమనించిన కొంతమంది ఆ వ్యాన్‌ను అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఆ మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.   ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ను, క్లీనర్‌నుపోలీసులకు అప్పగించారు.  ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకకు చెందిన ఆ వ్యాన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు.

Family

  • ఐఐటీ జేఈఈలో ఫెయిల్‌ అయ్యి యూట్యూబ్‌లో ఉ‍ద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకున్న జర్నీని సోషల్‌ మీడియా వేదిక షేర్‌ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. 

    హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసుకున్న పోస్ట్‌లో అభిజయ్‌ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్‌ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్‌ మదర్‌గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్‌ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. 

    నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్‌ అందుకోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్‌లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్‌లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. 

    ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్‌ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్‌ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. 

    తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్‌ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్‌ను పంచుకోవడం ప్రారంభించారు. 

    చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్‌లో​ యూట్యూబ్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌ జాబ్‌ పొందారు. ఆ ఫ్లాట్‌ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్‌కాస్ట్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్‌ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్‌ గోడలపై యూట్యూబ్‌ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. 

    ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. 

    "ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు.

     

    (చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు)

     

  • అత్యంత అరుదైన వింత కేసు. నొప్పులు పడుతున్న టైంలో ఎవ్వరైన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. కానీ ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. భావోద్వేగభరితమైన ఆ సమయంలో విచారణకు హాజరుకావడం విచిత్రం అనుకుంటే..అక్కడ ఆమె వాదన న్యాయమూర్తిని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎవ్వరిని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండ కట్టుదిట్టం చేసి అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. చివరికి ఆ మహిళ..ఇప్పటికీ కోర్టుని, వైద్యులపై ఆరోపణలు చేస్తూ తిట్టిపోస్తూనే ఉంది. 

    అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన చెరీస్‌ డోయ్లిఆస్ప్రతి బెడ​్‌పై నొప్పులు పడుతోంది. ఇంకొద్ది క్షణాల్లో డెలివరీ అనగా..బలవంతంగా కోర్టు ముందుకు హాజరుపరిచారు వైద్యులు. అంతేగాదు ఆమె అనుమతి లేకుండానే ఇదంతా జరగడం విశేషం. వర్చువల్‌ కోర్టు విచారణకు ప్రసవ వేదనతో ఉన్న గర్భణీని బలవంతంగా ప్రవేశపెట్టారు. ఈ దురదృష్టకర ఘటన 2024లో చోటుచేసుకుంది. ప్రసవ వేదన మొదలైన వెంటనే రాత్రికి రాత్రే ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ హాస్పిటల్‌కు చేరుకుంది.

    అయితే ఆమె 12 గంటల పాటు ప్రసవ నొప్పులు అనుభవిస్తోంది. ఆ సమయంలోనే ఆమెను వర్చువల్‌ కోర్టు ముందు హాజరుపరిచారు వైద్యులు. తను వర్చువల్‌ కోర్టు ముందున్న విషయం తెలుసుకుని ఆ నిండు గర్భిణీ కంగుతింది. డోయ్యి వృత్తిపరంగా ప్రసవ సహాయకురాలైన నర్సు. అయితే ఆమె నార్మల్‌ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు కచ్చితంగా సీసెక్షన్‌ చేయాల్సిన ఎమర్జెన్సీ. కానీ అందుకు ససేమిరా అంటోంది డోయ్లి. ఎందుకంటే ముగ్గురు పిల్లల తల్లిగా గతంలో జరిగిన సీ సెక్షన్ల నుంచి కోలుకోవడం కష్టంగా ఉందని, దానివల్ల రక్తస్రావంతో అనేక సమస్యలు వస్తున్నాయని వాదిస్తోంది. 

    ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా..మొండిగా ప్రవర్తించడంతో అక్కడి ప్రభుత్వ అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసి కోర్టు ముందు హాజరపర్చింది. ఆ విషయాన్నే పేషెంట్‌ డోయ్లికి వివరించారు కూడా. అందువల్లే డోయ్లి నొప్పులు పడుతూనే కోర్టులో విచారణకు హాజరైంది. అయితే వైద్యులు ఆమె గనుక నార్మల్‌ డెలివరీకి ట్రై చేస్తే..గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీ సెక్షన్‌ చేయక తప్పదని వాదిస్తుండటం గమనార్హం. అంతేగాదు డోయ్లి వైద్యులు గనుక సాధారణ ప్రసవం చేయలేకపోతే గనుక మరొక ఆస్పత్రికి తరలించమని కూడా అభ్యర్థించింది. 

    అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి..ఆమెకు తక్షణమే ఆపరేషన్‌ చేయమని ఆదేశించలేదు గానీ, విపత్కర పరిస్థితి ఎదురైతే ఆమె సమ్మతితో పనిలేకుండానే ఆస్పత్రి శస్త్ర చికిత్స చేయవచ్చని సూచించింది. అయితే రాత్రికి ఆమె బిడ్డ పల్స్‌ రేట్‌ పడిపోవడంతో హుటాహుటినా..డోయ్లికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయక తప్పలేదు వైద్యులకు.

    ఆ తర్వాత ఆమెను మళ్లా కోర్టు ముందు హాజరుపర్చారు. అప్పుడు కూడా, వైద్యులపై మండిపడుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ దాన్ని ఆమె అవమానంగా భావిస్తూ..కోర్టుని, సదరు ఆస్పత్రి వైద్యులను తిట్టిపోస్తుండటం గమనార్హం. 

     

    (చదవండి: రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..)
     

  • చాలామంది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.

    మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.

    1. Habit Stacking అంటే ఏంటి?
    మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.

    పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్‌కి వెళ్లడం.
    కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.

    ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.

    2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?
    ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.

    Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.
    Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్‌ని ఇస్తాయి.
    Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

    3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్
    "రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.

    4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండి
    Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.

    Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండి
    ముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.

    Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండి
    మీ డైలీ రొటీన్‌లో ఈ మూడు స్టాక్స్‌ను ప్రయత్నించండి:
    ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."

    మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకం చదువుతాను."
    రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."

    Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీ
    ఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.

    5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?
    ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం). దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్). వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.

    మీ అలవాట్లే మీ వారసత్వం!
    బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు.

    "We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." 
    Aristotle

     

    సైకాలజిస్ట్ విశేష్ 
    Genius Matrix Hub 
    8019 000066
    www.psyvisesh.com

    (చదవండి: ఆంతరంగిక ప్రశాంతత)
     

  • దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్‌ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్‌ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్‌. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్‌ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

    బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్‌లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్‌ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్‌ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. 

     

    దోసె వెనుకున్న వారసత్వం..
    ఆ రెస్టారెంట్‌ని అరుణ్‌ కుమార్‌ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్‌ ఈ దోసె. ఈ రెస్టారెంట్‌ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్‌ దీనిని స్థాపించారు. 

    1970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్‌ నటుడు హీరో వెంకటేశ్‌ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్‌ గురించి నెట్టంట సంచలనంగా మారింది. 

    రెస్టారెంట్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్‌ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్‌ని సందర్శించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. వెంకటేశ్‌ అక్కడ బటర్‌ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్‌ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్‌ఫాస్ట్‌ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

    (చదవండి: కంటెంట్‌ క్రియేటర్‌ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..)
     

  • మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్‌ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్‌ అయిన విధానాన్ని నెట్టింట షేర్‌ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్‌కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.

    ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్‌ క్రియేషన్‌ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్‌ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్‌లు గురించి హైలెట్‌ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. 

    ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్‌ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్‌ క్రియేషన్‌ అన్నది సరైన కెరీర్‌ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. 

    అంతేగాదు కంటెంట్‌ను క్రియేట్‌ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్‌ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. 

    చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్‌ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్‌..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్‌ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. 

     

    (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే విస్తుపోతారు!)
     

  • మండూకం అంటే కప్ప. ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం కప్పలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనంలో మోకాళ్లపై కూర్చొని, ముందుకు వంగి కడుపుపై ఒత్తిడి ఇస్తారు. ముఖ్యంగా జీర్ణక్రియ  మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కప్పలా కూర్చుని, కడుపుకు మసాజ్‌ ఇచ్చే యోగానే మండుకాసనం.

    చేసే విధానం..
    ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. ∙పిడికిళ్లను బిగించి నాభి దగ్గర పెట్టాలి. ∙శ్వాస విడిచేటప్పుడు ముందుకు వంగాలి. కడుపుపై ఒత్తిడి వచ్చేలా ఉంచాలి.
    15–20 సెకన్లు ఉండి నెమ్మదిగా పైకి రావాలి.

    జాగ్రత్తలు..
    కడుపు నొప్పి / అల్సర్‌ ఉంటే చేయకూడదు. 
    గర్భిణులు చేయకూడదు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయాలి.

    ఉపయోగాలు..
    జీర్ణక్రియ మెరుగుపడుతుంది.∙గ్యాస్, అజీర్ణం తగ్గుతుంది.
    కడుపు భాగం బలపడుతుంది.
    ఇది డైలీ 2–3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
    అనిత పాతర్ల యోగా ట్రైనర్‌  

  • ఫ్యాషన్‌ ఐకాన్‌గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్‌ స్టైలే వేరేలెవెల్‌. ధరించే డిజైనర్‌ వేర్‌ నుంచి ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగ్‌ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్‌ షూట్‌ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్‌ లుక్స్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. 

    ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్‌తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్‌తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్‌గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్‌వర్క్‌ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 

    పాంఖ్‌ బాగ్‌, గుల్‌ఝురోఖా మెటిఫ్‌లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్‌ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్‌ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్‌మెంట్ మహారాణి-శైలి నెక్లెస్‌ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్‌ని పొరలు పొరలుగా డిజైన్‌ చేశారు. 

    ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్‌ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్‌ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్‌ మ్యాకప్‌తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్‌ రంగు హెర్మెస్‌ మినీ కెల్లి పోచెట్‌ బ్యాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. 

    (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..!)