Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ త‌న ఐపీఎల్ హాఫ్‌ సెంచ‌రీని సాధించాడు. ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సుంద‌ర్‌.. బుధ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ శ‌త‌కంతో మెరిశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సుంద‌ర్ ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

    వాషీ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. సుంద‌ర్‌ కేవలం 32 బంతుల్లో  5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం సుంద‌ర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని చాలా మంది డిమాండ్ చేశారు. 

    కానీ గుజ‌రాత్ మేనెజ్‌మెంట్ అత‌డిపై న‌మ్మ‌కం ఉంచింది. త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో మేనెజ్‌మెంట్ న‌మ్మ‌కాన్ని సుంద‌ర్ నిల‌బెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో సుంద‌ర్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌(70), జోస్‌ బట్లర్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్‌ కుమార్‌ రెండు, ఎంగిడి, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.


     

     

  • టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్‌-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కే తమ చివరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది. 

    అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువ‌నంత‌పురంకు వెళ్లాడు. ఈ క్ర‌మంలో సంజూ మంగ‌ళ‌వారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు ప‌క్క‌న తాను కారు ఆపాడు. అయితే అదే స‌మ‌యంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్‌లో సంజూ ఉండ‌డంతో చూసి త‌న బైక్‌ను అత‌డు ఆపాడు. 

    శాంస‌న్ త‌న ఫోన్ కాల్ ముగించిన త‌ర్వాత శబరీష్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు.  ఫొటో దిగుదామా అని సంజూనే స్వ‌యంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్‌ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమ‌నించాడు. 

    దీంతో వెంట‌నే సంజూ త‌న వ‌ద్ద ఉన్న రూ. 40,000 విలువైన‌ స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు బహుమతిగా ఇచ్చాడు. స‌ద‌రు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు.
    చదవండి: IPL 2026: జోస్‌ బట్లర్‌ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో

  • ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఎట్టకేల‌కు తన రిథ‌మ్‌ను అందుకున్నాడు. ఈ ధ‌న‌ధాన్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో బట్ల‌ర్ మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు.

    ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్‌కు బట్లర్ చుక్కలు చూపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్  4వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బట్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. 

    ఓవర్ మొదటి బంతికే తన ఫేవరెట్ 'ర్యాంప్ షాట్'తో సిక్సర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. బట్లర్ మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

    తుది జ‌ట్లు
    గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ

    ఢిల్లీ క్యాపిటల్స్:  కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంలో వెట‌ర‌న్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ‌ది కీల‌క పాత్ర. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సందీప్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 

    151 పరుగుల భారీ లక్ష్య చేధనలో ముంబైకి సందీప్ చుక్కులు చూపించాడు. సందీప్‌ శర్మ తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ వంటి కీలక వికెట్‌ను సందీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సం‍దీప్ శర్మపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్ వంటి దిగ్గ‌జ పేస‌ర్ల‌తో సందీప్‌ను అశ్విన్ పోల్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ బౌల‌ర్లు అని అశ్విన్ కొనియాడాడు. 

    "60-70 శాతం మంది బౌలర్లు గేమ్‌ను స‌రిగ్గా అర్ధం చేసుకోలేరు. కానీ సందీప్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అత‌డు బ్యాట‌ర్ల మైండ్‌సెట్‌ను ముందే పసిగడతాడు. సందీప్ శర్మకు బుమ్రాతో పోలిస్తే వేగం తక్కువగా ఉండవచ్చు. కానీ అతడిలో కొన్ని అద్భుతమైన స్కిల్స్‌ ఉన్నాయి.

    అతడు మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. గేమ్‌ను స‌రిగ్గా రీడ్‌ చేయ‌డంతో పాటు త‌మ‌ ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌గ‌ల్గితే ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతారు." అని అశ్విన్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాట‌ర్ల‌పై  సందీప్ శ‌ర్మ‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది.
    చదవండి: IPL 2026: వైభ‌వ్‌, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌!

  • ఐపీఎల్‌ 2026 నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మ్యాచ్‌ సమయంలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్ల కదలికలపై కఠిన నియంత్రణలు విధించింది. జట్టుకు ఎంపికైన 16 మంది (11 మంది ప్లేయర్లు, ఐదుగురు ఇంపాక్ట్‌ సబ్స్‌) ఆటగాళ్లు మాత్రమే ఫీల్డ్‌లోకి వెళ్లి డ్రింక్స్‌, బ్యాట్స్‌ లేదా సందేశాలు ఇవ్వాలి. ఈ జాబితలో లేని ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్డ్‌లోకి ప్రవేశించరాదు. 

    బౌండరీ చుట్టూ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే (బిబ్స్‌ ధరించి) ఉండాలి. మిగతా ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితం కావాలి. బౌండరీ లైన్‌, LED బోర్డుల మధ్య కదలిక చేయరాదు. 

    బీసీసీఐ నియమావళిలోని క్లాజ్‌ 11.5.2, 24.1.4 ఆధారంగా ఈ నియమాలు నిర్దేశించబడ్డాయి. ఇటీవల జట్టులో లేని ఆటగాళ్లు (16 మంద సభ్యుల జాబితాలో లేని వారు) ఫీల్డ్‌లోకి వెళ్లి డ్రింక్స్‌, సందేశాలు ఇవ్వడం వల్ల ఈ నియమాలను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తుంది.  

    ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2026లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్‌ 8) ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఢిల్లీ వేదికగా 14వ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.  

     

  • Gujarat titans vs Delhi capitals live Updates: 

    ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
    అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.  అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. 

    ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిద్ద్ కృష్ణ పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్ గుజరాత్ వశమైంది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) చివరి వరకు పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 

    అంతకుముందు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు నిస్సాంక(41) కూడా రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ రెండు, సిరాజ్‌ ఓ వికెట్‌ సాధించాడు.

    మిల్లర్‌.. కిల్లర్‌
    అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.
    ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరో వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రాహుల్‌.. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.

    ఢిల్లీ ఐదో వికెట్‌ డౌన్‌
    160 పరుగుల వద్ద ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. డిల్లీ విజయానికి 20 బంతుల్లో 50 పరుగులు కావాలి

    ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్‌
    ఢిల్లీ క్యాపిట‌ల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కేవ‌లం రెండు ప‌రుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఢిల్లీ విజ‌యానికి 36 బంతుల్లో 77 ప‌రుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్‌(71) ఉన్నాడు.

    డేవిడ్ మిల్ల‌ర్ రిటైర్డ్ హార్ట్‌
    డేవిడ్ మిల్ల‌ర్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ఎడమ చేతి వేలి గాయం కార‌ణంగా మిల్ల‌ర్ మైదానాన్ని వీడాడు. అత‌డి స్ధానంలో అక్ష‌ర్ ప‌టేల్ క్రీజులోకి వ‌చ్చాడు.
    రషీద్‌ ఖాన్‌ మ్యాజిక్‌
    రషీద్‌ ఖాన్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఒకే ఓవర్‌లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌ ఐదో బంతికి నితీష్‌ రాణా ఔట్‌ కాగా.. ఆరో బంతికి సమీర్‌ రిజ్వీ క్లీన్‌ బౌల్డయ్యాడు.

    కేఎల్‌ రాహుల్‌ ఫిప్టీ
    తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కేఎల్‌ రాహుల్‌.. గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసిన నిస్సాంక.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

    దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు
    6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(26), నిస్సాంక(35) ఉన్నారు.

    4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 36/0
    4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(19), నిస్సాంక(15) ఉన్నారు.

    గిల్‌ విధ్వంసం.. 
    అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌(70), జోస్‌ బట్లర్‌(52), వాషింగ్టన్‌ సుందర్‌(55) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్‌ కుమార్‌ రెండు, ఎంగిడి, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

    శుభ్‌మన్‌ గిల్‌ ఔట్‌
    శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో గుజరాత్‌ టైటాన్స్‌ మూడో వికెట్‌ కోల్పో‍యింది. 70 పరుగులు చేసిన గిల్‌.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    భారీ స్కోర్‌ దిశగా గుజరాత్‌
    గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(51), వాషింగ్టన్‌ సుందర్‌(41) ఉన్నారు.

    గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
    జోస్‌ బట్లర్‌ రూపంలో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  8 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 85/2

    దూకుడుగా ఆడుతున్న గుజరాత్‌
    జోస్‌ బట్లర్‌(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 68 పరుగులు చేసింది.

    గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
    19 ప‌రుగుల గుజ‌రాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన సాయిసుద‌ర్శ‌న్‌.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ‌య్యాడు.  2.1 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 19/1

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
    ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్‌ తిరిగి రావడంతో కుమార్‌ కుశాగ్ర బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జ‌ట్లు
    గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ

    ఢిల్లీ క్యాపిటల్స్:  కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్


     

     

  • ఏప్రిల్‌ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్‌ 8) ప్రకటించింది. స్టార్‌ ప్లేయర్లు సవితా పూనియా (గోల్‌ కీపర్‌), దీపిక (ఫార్వర్డ్‌) ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు. 

    సలీమా టేటే కెప్టెన్‌గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్‌ ఖాన్‌ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్‌ కీపర్‌గా బిచు దేవి ఎంపికయ్యారు.

    డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్‌, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్‌, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్‌ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్‌ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్‌, రుతుజా దాదాసో పిసాల్‌, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్‌ కౌర్‌, నవనీత్‌ కౌర్‌, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్‌దుంగ్‌, లాల్‌రెమ్సియామి, ముంతాజ్‌ ఖాన్ వ్యవహరించనున్నారు.

    ఈ సిరీస్‌ భారత జట్టుకు హాకీ వరల్డ్‌ కప్‌ 2026, ఆసియా గేమ్స్‌కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. 

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ త‌మ నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. కేకేఆర్ ఈ ధన‌ధాన్ లీగ్‌లో భాగంగా  గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మిపాలైన కేకేఆర్.. లక్నోపై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    అయితే ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్‌ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియ‌రెన్స్ ఇచ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అత‌డు బౌలింగ్ చేసే అవ‌కాశ‌ముంది. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ.25.2 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.

    ఆల్‌రౌండ‌ర్‌గా ఉప‌యోప‌డ‌తాడ‌ని గ్రీన్‌పై అంత భారీ మొత్తాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ వెచ్చింది. కానీ గ్రీన్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల‌లోనూ  కేవ‌లం స్పెష‌లిస్టు బ్యాట‌ర్‌గా మాత్ర‌మే బ‌రిలోకి దిగాడు. దీంతో చాలా మంది మాజీలు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించారు. ఈ మాత్రం దానికి అంత ధ‌ర ఎందుకు అని కేకేఆర్‌పై కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

    అయితే అత‌డు వెన్ను గాయం నుంచి కోలుకుని గతేడాది ఆఖ‌రిలో పోటీ క్రికెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేశాడు. ఆస్ట్రేలియా త‌ర‌పున కూడా అత‌డు చాలా మ్యాచ్‌ల‌లో కేవ‌లం బ్యాట‌ర్‌గా మాత్ర‌మే ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌డి ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్ మేనెజ్‌మెంట్‌లో భాగంగా గ్రీన్‌కు ఐపీఎల్‌లో బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి ఇవ్వ‌లేదు. కానీ అత‌డు ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అత‌డికి సీఎ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

    బ్యాటింగ్‌లో కూడా అట్టర్ ప్లాప్‌!
    బౌలింగ్ విష‌యాన్ని పక్క‌న పెడితే బ్యాటింగ్‌లో కూడా అట్ట‌ర్ ప్లాప్ అవుతున్నాడు. టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్ వ‌స్తున్న గ్రీన్ క‌నీస ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. మూడు మ్యాచ్‌లలో 24 పరుగులు మాత్రమే చేశాడు. ప్ర‌స్తుతానికి అత‌డి ప్ర‌ద‌ర్శ‌న చూస్తుంటే ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు తీసుకున్న‌ట్లు ఉంది. క‌నీసం త‌ర్వాత మ్యాచ్‌ల‌లోనైనా గ్రీన్ త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం చేస్తాడో లేదో చూడాలి.
    చదవండి: IPL 2026: వైభ‌వ్‌, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌!

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ సంచ‌ల‌నం స‌మీర్ రిజ్వీ త‌న మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాట‌ర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో  ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు.

    లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్‌)  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 

    కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో కూడా రిజ్వీకే ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్క‌డం గ‌మ‌నార్హం.

    భారత జట్టులోకి ఎంట్రీ?
    మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్బుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న స‌మీర్ రిజ్వీని భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని చాలా మంది మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు. ప్ర‌స్తుత భార‌త టీ20 జ‌ట్టులో టాపార్డ‌ర్ ప‌టిష్టంగా క‌న్పిస్తున్న‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ కొంచెం వీక్‌గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాట‌ర్ జ‌ట్టులోకి వ‌స్తే భార‌త మిడిలార్డ‌ర్ మ‌రింత ప‌టిష్టంగా మార‌నుంది.

    అయితే అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.

    దీంతో భారత జట్టులో​ రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్‌-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

    అయితే ఈ ఏడాది జూన్‌లో భారత అండర్‌-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్‌కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్‌ జట్టులో ఇప్పటికే అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్‌ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.
    చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌!
     

  • భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది స్మృతి మంధాన. టీమిండియా ఓపెనర్‌గా, వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన ఈ ముంబైకర్‌ ఖాతాలో గతేడాది ప్రపంచకప్‌ కూడా చేరింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ గెలవడంతో స్మృతి చిరకాల కోరిక నెరవేరింది.

    ఘనంగా హల్దీ, మెహందీ
    ఆ ఆనందంలోనే మెగా టోర్నీ ముగిసిన కొన్నిరోజులకే పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌ ముచ్చల్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.

    చిరకాల స్నేహితులు, భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటేల్‌, రాధా యాదవ్‌ తదితరులు స్మృతి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో సందడి చేశారు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

    వివాహం రద్దైనట్లు ప్రకటనలు
    పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్‌ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా.. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఆ వెంటనే పలాష్‌ తనతో అసభ్యకరంగా చాటింగ్‌ చేశాడని.. అందులో స్మృతిని కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న స్క్రీన్‌షాట్లను ఓ అమ్మాయి షేర్‌ చేయడం కలకలం రేపింది.

    ఈ పరిణామాల ‍క్రమంలో స్మృతి మంధాన- పలాష్‌ ముచ్చల్‌ తమ వివాహం రద్దైనట్లు విడివిడిగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే, తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ద్వారా స్మృతి- పలాష్‌ల వివాహానికి మార్గం సుగమమైందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది.

    కలిసిపోయిన కుటుంబాలు?
    పలాష్‌ సోదరి, బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ ముంబైలోని ఓ రెస్టారెంట్‌ బయటకు రాగా.. అక్కడే స్మృతి తండ్రి శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. వెంటనే పాలక్‌.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత తన భర్త మిథున్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్మృతి- పలాష్‌ల పెళ్లి జరుగబోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి.

    అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది పాత వీడియో అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత స్మృతి అతడిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. అయితే, స్మృతి అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.

    కాగా పలాష్‌ నిజస్వరూపం తెలిసిన తర్వాత స్మృతి స్నేహితురాళ్లు అతడికి చితక్కొట్టారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పలాష్‌ మాత్రం తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరోవైపు.. పెళ్లి రద్దైన తర్వాత స్మృతి ఆటపై దృష్టి పెట్టి.. వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌​ బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. తద్వారా ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించింది.

    చదవండి: పాపం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేసిన పనికి సిన్నర్‌ ఏమవుతాడో!

     

  • ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. తిరుగులేని టీ20 కెరీర్‌లో అతను అరుదైన హ్యాట్రిక్‌ సాధించాడు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్‌ ప్రస్తానంలో కేవలం నాలుగోసారి మాత్రమే వికెట్‌ లేకుండా వరుసగా మూడు టీ20లను (హ్యాట్రిక్‌) ముగించాడు. నిన్న (ఏప్రిల్‌ 7) రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో వికెట్‌ లేకుండా పోవడంతో బుమ్రా ఖాతాలో ఈ అనవసర రికార్డు చేరింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.  

    ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో బుమ్రా వరుసగా కేకేఆర్‌ (4-0-35-0), ఢిల్లీ (4-0-21-0), రాజస్థాన్‌ (3-0-32-0) మ్యాచ్‌ల్లో వికెట్‌ తీయలేకపోయాడు.

    బుమ్రా టీ20 కెరీర్‌లో ఇలాంటి సందర్భాలు..  
    - 2016 IPL: SRH, RCB, KXIPతో వరుసగా జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.  
    - 2014 IPL: CSK, SRH, KKR, RRతో వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.  
    - 2017/18 T20Is: శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.  

    పై నాలుగు సందర్భాలు మినహా, బుమ్రా తన యావత్‌ టీ20 కెరీర్‌లో మరెప్పుడు వరుసగా 3 మ్యాచ్‌ల్లో వికెట్లు లేకుండా ఉండలేదు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్‌ కెరీర్‌లో బుమ్రా 6.92 సగటున 345 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ కెరీర్‌ మాత్రమే తీసుకుంటే.. ఈ లీగ్‌లో 148 మ్యాచ్‌ల్లో 7.26 సగటున 183 వికెట్లు పడగొట్టాడు.

    బుమ్రాను సైతం వదలని సూర్యవంశీ
    రాజస్థాన్‌ రాయల్స్‌ యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌ జ‌స్ప్రీత్ బుమ్రాకు సైతం చుక్కలు చూపించాడు. 

    బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. అదే ఓవర్‌లో నాలుగో బంతిని మరోసారి స్టాండ్స్‌కు పంపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ దెబ్బకు బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 14 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.

    వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వీ  జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.జైశ్వాల్‌ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌, రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. 

    అనంతరం బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. వైభవ్‌, జైస్వాల్‌ ధాటికి బుమ్రా వికెట్‌ లేకుండానే ఇన్నింగ్స్‌ను ముగించాడు. 

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఒత్తిడిలోనూ తాను సరైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఓ కంటి డాక్టర్‌ ఉన్నారన్నాడు. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ తరఫున నిలకడైన బ్యాటర్‌గా క్లాసెన్‌ కొనసాగుతున్నాడు.

    రెండు హాఫ్‌ సెంచరీలు
    గతంలో వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందించిన క్లాసెన్‌కు.. ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) రాకతో ఈ బాధ్యతల నుంచి విముక్తి లభించింది. ఇక ఈసారి నాలుగు లేదంటే ఐదో స్థానంలోనే అతడు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 31, 52, 62 పరుగులు సాధించాడు.

    కాగా సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాను విజయవంతమైన, నిలకడైన ఆటగాడిగా కొనసాగడం వెనుక కంటి డాక్టర్‌ ఉన్నారని క్లాసెన్‌ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

    ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు
    ‘‘కేప్‌టౌన్‌లో షెరిల్లీ అనే పేరు గల కంటి డాక్టర్‌ సూచనలతో నన్ను నేను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మేము దీనిని EyeGym అని పిలుస్తాము. ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది.

    గత ఏడాది కాలంగా నాకు ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. ఏ విషయంలోనైనా త్వరితగతిన స్పందించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను’’ అని హెన్రిచ్‌ క్లాసెన్‌ చెప్పుకొచ్చాడు.

    ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఒక్కటి మాత్రమే గెలిచింది. తదుపరి చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే దిగ్గజం, గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రస్తావన రాగా..

    ధోనికి ఇప్పుడంత సీన్‌ లేదు
    ‘‘సాధారణంగా అతడు మైదానంలోకి వస్తున్నాడంటే ప్రేక్షకుల నుంచి స్పందన కారణంగా మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినలేము. అయితే, ఈసారి అతడు లేడు కాబట్టి ప్రేక్షకులు కాస్త నిశ్శబ్దంగానే ఉంటారు.

    అది మాకు కలిసి వస్తుంది. అయితే, కెప్టెన్‌గా ధోని గతేడాది కాస్తైనా ప్రభావం చూపినా ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఐదు నుంచి పది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒకవేళ ఈసారి కూడా జట్టుతో ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’’ అని క్లాసెన్‌ అభిప్రాయపడ్డాడు.

    చదవండి: PSL: ‘దుప్పటి, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోవాల్సింది’

  • నలుగురు పాకిస్తాన్‌ క్రికెటర్లు లక్కీ ఛాన్స్‌ కొట్టారు. త్వరలో ప్రారంభం​ కానున్న ఇంగ్లండ్‌ దేశవాలీ సీజన్‌ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్‌ అబ్బాస్‌, సుఫియాన్‌ ముఖీమ్‌ను డెర్బీషైర్‌.. ఉసామా మిర్‌ను వార్సెస్టర్‌షైర్‌ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్‌ నవాజ్‌ టీ20 బ్లాస్ట్‌ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి  పొందాడు. 

    వీరందరికీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్‌, ఉసామా మిర్‌కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్‌ ముఖీమ్‌ జూన్‌ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్‌ అబ్బాస్‌కు సీజన్‌ మొత్తానికి అనుమతి లభించింది.

    స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మొహమ్మద్‌ నవాజ్‌, స్పిన్‌ బౌలర్‌ సుఫియాన్‌ ముఖీమ్‌ T20 బ్లాస్ట్‌లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్‌ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్‌ బౌలర్‌ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు.  

    నవాజ్‌, ముఖీమ్‌, ఉసామా మిర్‌ T20 బ్లాస్ట్‌లో ప్రతిభను చూపి, పాకిస్తాన్‌ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం.   

  • పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ బౌలర్‌ మిర్‌ హమ్జా సజ్జాద్‌ తలకు బంతి బలంగా తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్క్‌ చాప్‌మన్‌ బలంగా కొట్టిన ఓ షాట్‌ సజ్జాద్‌ తల వెనుక భాగానికి తగిలింది. దీంతో అతను స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. 

    హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సజ్జాద్‌ స్పృహలోకి వచ్చి స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గాయ తీవ్రతను అంచనా వేసేందుకు CT స్కాన్‌ చేయనున్నట్లు వెల్లడించారు.  

    మిర్‌ హమ్జా సజ్జాద్‌ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ దేశవాలీ క్రికెటర్‌ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశాడు. 8 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. సజ్జాద్‌ను ఈ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌లోనే ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 70 లక్షలకు (పాక్‌ కరెన్సీ) కొనుగోలు చేసింది. సజ్జాద్‌ ఇంతవరకు పీఎస్‌ఎల్‌ అరంగేట్రం చేయలేదు. ఈ గాయం అతని అరంగేట్రాన్ని మరింత ఆలస్యం చేయవచ్చు.  

    కాగా, ప్రస్తుత పీఎస్‌ఎల్‌ సీజన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. ఇటీవల లాహోర్‌ ఖలందర్స్‌కు చెందిన ఓ బౌలర్‌ కూడా ఇలాగే గాయపడ్డాడు. తాజాగా సజ్జాద్‌ గాయం నెట్స్‌లో ప్రాక్టీస్‌ అంటేనే భయం పుట్టేలా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు భయపడుతున్నారు. లీగ్‌ నిర్వహకులు నెట్స్‌లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. 

    ఈ సీజన్‌ పీఎస్‌ఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిర్వహకులు ఏ విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విదేశీ ఆటగాళ్ల నుంచి ప్రతి రోజు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ లీగ్‌ ఇంధన కొరత కారణంగా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. 

  • ప్ర‌స్తుతం టెన్నిస్‌లో జానిక్ సిన్న‌ర్, కార్లోస్ అల్క‌రాజ్‌లు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డ‌డం మ‌స్తు మ‌జాను అందిస్తుంది. ఈ ఇద్ద‌రు టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఒక‌ప్పుడు నాద‌ల్‌, ఫెద‌ర‌ర్‌, జొకోవిచ్ మ‌ధ్య పోటీ ఎంత ర‌స‌వ‌త్తరంగా ఉండేదో అదే త‌ర‌హాలో ఇప్పుడు సిన్న‌ర్‌, అల్క‌రాజ్‌లు ఎక్క‌డ త‌ల‌ప‌డినా ఆ మ్యాచ్‌కు య‌మా క్రేజ్ ఉంటుంది. 

    అయితే ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు మాంటే కార్లో మాస్ట‌ర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్న‌ర్ డెన్మార్క్‌కు చెందిన మోడ‌ల్ లైలా హ‌స‌నోవిక్‌తో ల‌వ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సిన్న‌ర్ ఏ టోర్నీ ఆడినా అక్క‌డ హ‌స‌నోవిక్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది.

    హ‌స‌నోవిక్ త‌న ప్రియుడి మ్యాచ్‌కు కాకుండా సిన్న‌ర్ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అల్క‌రాజ్ మ్యాచ్‌కు హాజ‌ర‌వ్వ‌డ‌మే ఇక్క‌డ అతిపెద్ద ట్విస్ట్‌. టోర్నీలో భాగంగా అల్క‌రాజ్ తన తొలి మ్యాచ్‌లో సెబాస్టియ‌న్ బేజ్‌ను 6-1, 6-3తో ఓడించాడు. కేవ‌లం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో హ‌స‌నోవిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. 

    ఎందుకంటే అల్క‌రాజ్ ఆడుతున్నంత సేపు హ‌స‌నోవిక్ అత‌డిని క‌ళ్లార్ప‌కుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అంత‌క‌ముందు రోజు త‌న బాయ్‌ఫ్రెండ్ సిన్న‌ర్ మ్యాచ్‌కు కూడా హ‌స‌నోవిక్ హాజ‌ర‌య్యింది. 

    కాగా తొలి రౌండ్ మ్యాచ్‌లో సిన్న‌ర్ 6-3, 6-0తో హ్యూగో హంబ‌ర్ట్‌ను సులువుగా ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మ‌రి ఈ ఇద్ద‌రు ఈ టోర్నీలో త‌ల‌ప‌డిన‌ప్పుడు హ‌స‌పనోవిక్ ఎవ‌రి ఆట చూస్తుందో తెలియ‌డానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.

    చదవండి: జైస్వాల్‌ బ్యాట్‌ వెనుక ఇంత కథ దాగుందా!

  • రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌, భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్‌లో.. అటు భారత జూనియర్‌ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్‌.

    మెరుపులు మెరిపించాడు
    ఇక ఐపీఎల్‌-2026లోనూ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో రాయల్స్‌ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలవడంలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.

    ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్‌ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సిక్సర్‌తో వైభవ్‌ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.

    డెస్టినీ చైల్డ్‌
    ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వైభవ్‌ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్‌. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.

    చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడు
    ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్‌లో చితక్కొడతాను’ అని చెప్పాడు.

    అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్‌ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్‌ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్‌లోనే వైభవ్‌ అదరగొట్టాడు.

    20 ఏళ్లు ధనాధన్‌
    దయచేసి వైభవ్‌ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్‌’’ అంటూ టీమిండియాకు వైభవ్‌ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్‌ పఠాన్‌ బీసీసీఐకి సూచించాడు. 

    చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’

  • రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో 3 మ్యాచ్‌ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.

    ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?
    సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్‌లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్‌ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్‌ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్‌ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్‌, ఉర్విల్‌ పటేల్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.

    - వైభవ్‌ సూర్యవంశీ – 4.88  
    - రొమారియో షెపర్డ్‌ – 5.1  
    - ఉర్విల్‌ పటేల్‌ – 5.3  
    - జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ – 6.4  
    - ఆండ్రీ రసెల్‌ – 6.8  

    ఆకాశమే హద్దు
    ప్రస్తుత ఎడిషన్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్‌, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.

    ఈ సీజన్‌లో వైభవ్‌.. యశస్వి జైస్వాల్‌తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్‌ రాయల్స్‌ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది.

    తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్‌ (77 నాటౌట్‌) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్‌ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్‌ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది. 

International

  • ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకునిపోతుందని హెచ్చరించిన ట్రంప్.. చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌కి పెట్టిన డెడ్‌లైన్‌కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈ లోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్‌ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది.ఈ క్రమంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కి పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోగా, వేలమంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    మరోవైపు ఇజ్రాయెల్‌ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్‌ అవీవ్‌‌పై  దాడి చేస్తామని హెచ్చరించింది.  ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్.. మళ్లీ హర్మూజ్‌ని మూసేవేసింది.

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌, విరుచుకపడుతుంది. కేవలం 10 నిమిషాల్లో 100కు పైగా వైమానిక దాడులు  చేసింది. ఈా దాడులలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అదే విధంగా పెద్ద మెుత్తంలో ప్రజలు గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    అయితే కొద్ది సేపటి క్రితమే ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్‌ అవీవ్‌ పై  దాడి చేస్తామని హెచ్చరించింది. కాగా ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్‌ టెన్షన్‌ నెలకొంది.

  • ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య 14రోజుల సీజ్‌ఫైర్‌ నడుస్తోంది. రెండు వారాల తర్వాత ఇరు దేశాలు యుద్ధం ముగింపుకు అంగీకరిస్తాయా? లేదా అన్న సంగతి తెలియదు. అయితే ఇరాన్‌తో యుద్ధం విషయంలో ట్రంప్ అంతరంగికం గురించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

    ప్రస్తుతం హంగేరి పర్యటనలో ఉన్న జేడీవాన్స్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు జరపడానికి తమ బృందానికి పలు కీలక విషయాలు ట్రంప్ వెల్లడించారన్నారు ఇరాన్‌తో చర్చలు జరిపేటప్పుడు పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో వ్యవహరించాలని చర్చలు జరిపే బృందానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. అయితే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ చాలా అసహనంగా ఉన్నారని త్వరగా ఫలితాలు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

    అయితే ఇరాన్ పాలకవర్గంలో  కొన్ని విభాగాలు చర్చలకు సహకరిస్తున్నప్పటికీ, మరికొన్ని విభాగాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే ఖచ్చితంగా ఒక ఒప్పందానికి రావచ్చని  అదంతా ఇరాన్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నారు.

    గత ఆరు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నిన్న ఇరాన్‌ నాగరికతను అంతం చేస్తాం అని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. అనంతరం కొద్ది సేపటికే 14 రోజుల సీజ్‌ఫైర్‌  ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు ఈ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

  • సీజ్‌ఫైర్‌ కోసం ఇరాన్‌ మ​‍మ్మల్ని వేడుకుందంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాహసంతో చరిత్ర సృష్టించారన్న పీట్ హెగ్సెట్.. 10 శాతం లోపు ఆయుధాలను మాత్రమే వినియోగించామని.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సహా కీలక మంత్రులు, మిలిటరీ అధికారులను అంతం చేశామని పేర్కొన్నారు.

    ఇరాన్ అణు వ్యవస్థను ధ్వంసం చేశాం. ఇక అణు బాంబులను తయారు చేయలేదు. ఎపిక్ ఫ్యూరీతో మా లక్ష్యాలను పూర్తి చేశాం. శాంతికి ఒప్పందాలు కుదుర్చుకుంటామని పీట్‌ హెగ్సెత్‌ అన్నారు.

    ‘‘ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాం. ఇరాన్‌ ఎప్పటీకీ అణ్వాయుధాలు కలిగి ఉండదు. ఇరాన్‌  న్యూక్లియర్‌ సెంటర్లను తొలగించేశాం.  మా షరతులకు ఇరాన్‌ కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నాం. ఒప్పందాలు చేసుకోవడంలో ట్రంప్‌ తర్వాతే ఎవరైనా. తీవ్ర ఒత్తిడికిలోనై ఇరాన్‌ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఇరాన్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ భావించారు. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ గొప్ప విజయం సాధించింది’’ అని పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు.

    మరో వైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో మరో సంచలన పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని.. టారిఫ్‌ల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ ట్రంప్‌ తేల్చి చెప్పారు.
     

  • పశ్చిమాసియా యుద్ధంలో సీజ్‌ఫైర్‌ ఒప్పందంతో ఇరాన్‌ శాంతించినా.. ఇజ్రాయెల్‌ మాత్రం తన తీరు మార్చుకున్నట్లు లేదు. తాజాగా దక్షిణ లెబనాన్‌ ప్రాంతంలో క్షిపణులతో విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌, టెల్‌ అవీవ్‌కు భారీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

    దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుంది. ఈ విషయమై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. "కొన్ని గంటల్లో దక్షిణ లెబనాన్‌పై బాంబుల దాడిని ఆపకుంటే ఇరాన్‌ వైమానికి దళం టెల్‌ అవీవ్‌పై దాడులు కొనసాగిస్తుంది" అని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

    అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు  "ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరాన్‌తో నేరుగా జరిగే యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై పోరాటం ఆగదని" తేల్చి చెప్పారు. లెబనాన్ నుండి హిజ్బుల్లా దాడులు చేస్తున్నంత కాలం ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మరో వైపేమో ఇరాన్‌ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కాల్పుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా అని ఆందోళన ‍వ్యక్తమవుతోంది.

  • అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గ్లోబల్‌ మార్కెట్లను భారీ ఊరట నిచ్చాయి. పెట్టుబడుదారుల సెంటిమెంట్‌ బలపడటంతో  దాదాపు అన్ని మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేలవంగా ఉన్న పాకిస్తాన్‌ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 8న ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పాకిస్తాన్ బెంచ్‌మార్క్ స్టాక్ సూచీ 12,000 పాయింట్లకు పైగా పెరిగి, ఒకే రోజులో అత్యధిక ర్యాలీని నమోదు చేసింది. 

    పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని అస్థిరత కాలం తర్వాత ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. స్థానిక దినపత్రిక డాన్ ప్రకారం, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్  KSE-100 సూచీ  8.15 శాతం పెరిగి 164,035.83 పాయింట్లకు చేరుకుంది.  KSE-100 సూచీ చరిత్రలో ఒకే రోజులో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. దీంతో  ఏరంగా ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అనుగుణంగా ట్రేడింగ్‌ను నిలిపివేయడం విశేషం. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన తర్వాత ఈ లాభాలు నమోదయ్యాయి. 

    ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోని కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరిస్తే, దానికి బదులుగా వాషింగ్టన్ సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించింది. రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్ అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు.ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఒక "నిర్ణయాత్మక ఒప్పందం" కుదుర్చుకోవడమే ఈ చర్చల లక్ష్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఈ చర్చలు ఇస్లామాబాద్‌లో జరగవచ్చని భావిస్తున్నారు.

    భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    ఇదీ చదవండి: షార్ట్‌కట్‌ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి

    కాగా  ఫిబ్రవరి 28న మొదలైన ఇరన్‌పై యుద్ధం ప్రారంభంలో కూడా ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్‌ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో,మార్చి 2న KSE-100 సూచీ 16,089 పాయింట్లు లేదా 9.57 శాతం మేర పడిపోయి, ఒక్కరోజులో అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.

    ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

  • ప్రస్తుతం పశ్చిమాసియాను శాంతి మేఘాలు అలుముకున్నాయి. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌ ఒప్పందం పాటించడంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. అయితే నిన్న ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచాన్నే ఊలిక్కి పడేలా చేశాయి. నాగరికతను అంతం చేస్తా అని ట్రంప్ హెచ్చరించడంతో ఏం జరగనుందా అని అంతా ఆందోళన పడ్డారు. అంతలోనే సీజ్ ఫైర్ ఒప్పందంఅయితే ఇదంతా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి వ్యూహంలో భాగమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ప్రస్తుతం అమెరికా- ఇరాన్‌ మధ్య సీజ్‌ ఫైర్‌ ఒప్పందం నడుస్తోంది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా గుడ్‌ కాప్‌- బాడ్‌ కాప్‌ వ్యూహాన్ని అమలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వైపేమో డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలతో ఇరాన్‌ను భయ భ్రాంతులకు గురి చేయగా ..మరో వైపేమో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెరవెనుక ప్రశాంతంగా రాయబారం నడిపి ఇరాన్‌ని దారికి తెచ్చేలా వ్యవహరించారని రాయిటర్స్ కథనం పేర్కొంది.

    మెుదటి నుంచి జేడీవాన్స్‌ యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ సన్నిహితులైన కుష్నర్ లేదా విట్‌కాఫ్ వంటి వారి మాటలను పెద్దగా పట్టించుకోని ఇరాన్‌..జేడీవాన్స్‌ మాటలకు మాత్రం గౌరవం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ వాన్స్‌తో ఒప్పందం కుదరకపోతే ఇక దేనికీ ఆస్కారం ఉండదు అని  భావించినట్లు తెలుస్తోంది.

    అదే సమయంలో వాన్స్‌ సైతం యుద్ధాన్ని ముగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గత నెలలో కాల్పుల విరమణకు ఏమాత్రం అవకాశం లేని సమయంలో యూఏఈ ,సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాల నాయకులతో పాటు, ఇజ్రాయెల్ అధ్యక్షుడితో వరుస చర్చలు జరిపినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.

    మెుత్తానికి జేడీవాన్స్‌ ఇరాన్‌ని చర్చల ద్వారా సీజ్‌ఫైర్‌ ఒప్పందం చేయించడంలో సఫలీకృతం అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.  పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అమెరికా వనరులు వృధా అవుతాయని, అది దేశానికి భారీ ఆర్థిక భారమని నమ్మేవారు. ఇదే విషయమై ట్రంప్‌ని కూడా ఒప్పించినట్లు తెలుస్తోంది.

  • సాక్షి, ఢిల్లీ: అమెరికా ఇరాన్ కాల్పుల విరమణపై భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. కాల్పుల విరమణను భారత్‌ స్వాగతించింది. పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతి కోసం ఆశిస్తున్నామంటూ భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ఉద్రిక్తతలను తగ్గించడం, చర్చలు, దౌత్యం పరంగా శాంతిని నెలకొల్పాలని గతంలోని చెప్పాం. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగింది. హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా నౌకలు వెళ్తాయని ఆశిస్తున్నాము’’ అని భారత విదేశాంగ పేర్కొంది.

    కాగా, ‘‘ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజు... ఇరాన్ కూడా శాంతినే కోరుకుంటోంది. ఇక యుద్ధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. అలాగే, అందరికీ కూడా ఇలాగే అనిపిస్తోంది’’ అంటూ అమెరికా, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్  చేసిన సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ పెరుగుదల విషయంలో అమెరికా సాయం చేస్తుందన్న ట్రంప్‌.. పాజిటివ్ చర్యలు ఎక్కువగా ఉంటాయన్నారు.

    ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సరఫరాలతో లోడ్ అవుతాము. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండబోతున్నాం. అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అమెరికాలో మేము అనుభవిస్తున్నట్లే, ఇది పశ్చిమాసియాకు స్వర్ణ యుగం కావచ్చు” అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

  • సియోల్: ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా బ్రేక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ గొడవ తగ్గుతుందనుకుంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమ ప్రాంతం నుంచి కలకలం రేపారు. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేసింది. ఆ వెంటనే జపాన్ హెచ్చరిక జారీ చేసింది. జపాన్ ప్రధాన మంత్రి సనయె తకైచి కార్యాలయం కూడా ఈ విషయంపై ఎక్స్‌లో పోస్టు చేసింది. “ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి” అని తకైచి కార్యాలయం తెలిపింది.

    ఈ ప్రయోగం తర్వాత జపాన్ అధికారులు పౌరుల భద్రతపై సూచనలు జారీ చేశారు. “ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడంతో ప్రధాన మంత్రి చేసే సూచనలను పాటించాలి. ప్రజలకు అధికారులు సమయానుకూలంగా సరైన సమాచారం అందించాలి. విమానాలు, నౌకలు, ఇతర ఆస్తుల భద్రతపై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటం సహా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని అధికారిక ప్రకటనలో తెలిపారు.

    కొరియాలో ఉద్రిక‍్తతలు తగ్గుతున్నాయన్న సూచనలు అన్నీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేయించిన ఈ చర్యతో పటాపంచలయ్యాయి. దక్షిణ కొరియా సంయుక్త చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జెసిఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా వోన్సాన్ ప్రాంతం నుంచి తూర్పు తీర సముద్ర దిశగా ఉత్తరకొరియా బుధవారం (ఏప్రిల్‌ 8న) క్షిపణిని ప్రయోగించింది.

    ఇదే రోజు ఉదయం కూడా అదే ప్రాంతం సమీపం నుంచి పలు గుర్తించని స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ క్షిపణులు సుమారు 240 కి.మీ (150 మైళ్లు) ప్రయాణించాయి. దక్షిణ కొరియా, అమెరికా అధికారులు దీనిపై విశ్లేషణ చేస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం బ్లూ హౌస్ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాన‍్ని నిర్వహించింది. ఉత్తరకొరియా ఇలాంటి పరీక్షలను ఆపాలని దక్షిణ కొరియా కోరింది. జపాన్ తీర రక్షక దళం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం తర్వాత సుమారు 10 నిమిషాల్లో సముద్రంలో పడింది. జపాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి క్షిపణులు తమ భౌగోళిక జలాల్లోకి ప్రవేశించలేదు.

     

Politics

  • సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్.. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధుల్ని అగౌరవ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్‌కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆమె ఓ లేఖ రాశారు.

    తమ పార్టీ నేతలతో పాటు మహిళల్ని కించ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో వరుదు కళ్యాణి ఇంకా ఏం పేర్కొన్నారంటే..

    మీడియా స్వేచ్ఛ పేరుతో ఏబీఎన్ వ్యక్తిత్వ హననం
    ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యం తమ ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ వీడియో లింక్ : https://youtu.be/nF_9828F18c సహా, అత్యంత అపకీర్తికరమైన, అవమానకరమైన, తప్పుదారి పట్టించే, అనైతిక విషయాలను ప్రసారం చేసినందుకు సంబంధించి తక్షణ జోక్యం, తగిన చర్యలు తీసుకోవాలి.  ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇందులో అన్నీ అవాస్తవాలతో పాటు దురుద్దేశపూర్వక, హానికరమైన విషయాలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఇది నిష్పక్షపాత పాత్రికేయ కథనం కాదు. ద్వేషం, హేళన, పక్షపాతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నింపేందుకు ఉద్దేశించిన పక్షపాతపూరిత, ఏకపక్ష కథనమే.

    వైఎస్సార్సీపీ నేతలపై దారుణ వ్యాఖ్యలు
    ఏబీఎన్‌లో ప్రసారమైన ఈ కథనంలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం మధ్య ముఖ్యంగా,యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువుకు భంగం కలిగించే భాషను వాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను, మద్దతుదారులను వెన్నెముక లేని వారిగా అభివర్ణించింది. అంతేకాక వారు తమ నాయకుడికి ఆపాదించిన అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలను కూడా గుడ్డిగా నమ్ముతారని అనుకునే విధంగా పలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా చేసింది.

    రేపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ భార్యలు మీ భార్యలు కాదని చెప్పితే, మీరు గుడ్డిగా విశ్వసిస్తారు, అంతేకాదు మీ సొంత భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి, పెళ్లి సంబంధాలకు కూడా చూసుకుంటారు, ఇలాంటి నాయకులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితం, తీవ్ర అభ్యంతరకరం. ప్రజల దృష్టిలో వైఎస్సార్సీపీ నేతల ప్రతిష్టను పలుచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.

    కనీస బాధ్యత లేని పాత్రికేయం
    ఈ వివాదాస్పద కథనంలో ఏబీఎన్.. వైఎస్సార్సీపీ నేతల్ని తెలివి, హేతుబద్దత, బుద్దీ జ్ఞానం లేని వారిగా చిత్రీకరించింది. అలాగే మా పార్టీ విధానాల్ని పిచ్చి ప్రతిపాదనలు అంటూ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. ఈ కథనంలో యాంకర్ మరింత ముందుకు వెళ్లి తమ పార్టీ నేతల్ని పిచ్చి వాళ్ల సమూహంగా కూడా అభివర్ణించడం దారుణం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన, పరువు నష్టం కలిగించే కథనమే అవుతుంది. ఈ వ్యాఖ్యలకు ఏ విధమైన వాస్తవ ఆధారాలు లేవు. లేదా ధృవీకరించబడిన మూలాలు కూడా లేవు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా సాధారణీకరించి, కేవలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా వండి వార్చినట్లు స్పష్టమవుతోంది.  ఇందులో వాడిన భాష కూడా అత్యంత అసభ్యంగా ఉంది.  పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక మర్యాదా ప్రమాణాలను కూడా ఉల్లంఘించింది.

    ఏబీఎన్ కథనం కేబుల్, టెలివిజన్ చట్టం ఉల్లంఘనే
    ఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కథనం కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ (నియంత్రణ) చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్‌ ను పూర్తిగా ఉల్లంఘించింది. ఆ కోడ్ ప్రకారం అగౌరవ, తప్పుడు, అర్థసత్యాలైన విషయాలను ప్రసారం చేయకూడదు.  ఇది పూర్తిగా నిషిద్దం. ఎందుకంటే ఇది ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేది, తప్పుదారి పట్టించేదిగా ఉంది.  అలాగే నిర్లక్ష్యంగా వండి వార్చడంతో పాటు ద్వేషం కలిగించేలా దీన్ని రూపొందించారు. వాస్తవాలను ధృవీకరించకపోవడం, సమతుల్య అభిప్రాయాలు ఇవ్వకపోవడం, లేదా ప్రతిస్పందనకు అవకాశం కల్పించకపోవడం మీడియా బాధ్యత, నైతిక ప్రమాణాల తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. అలాగే ఏబీఎన్ సంస్థ సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లోపించిందని అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యేందుకు అవకాశం లభించింది.

    తక్షణం ఏబీఎన్ పై కఠిన చర్యలు తీసుకోండి
    ఈ కంటెంట్ డిజిటల్ వేదికలపై కొనసాగుతూ అందుబాటులో ఉండటం వల్ల తమ పార్టీకీ, అధినేత జగన్‌కు జరిగిన నష్టం మరింత పెరుగుతోంది. ఎందుకంటే ఇది విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండి వారికి పరువుకు భంగం కలిగించేలా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుంది. అలాగే మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై చట్టప్రకారం తగిన చర్యలు ప్రారంభించాలి.

    అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు  ప్రజలకు క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో ప్రోగ్రామ్ కోడ, పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడాల్సిన అసరం ఉంది. ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఛైర్ పర్సన్ ను కోరుతున్నాం.  న్యాయం, నిష్పాక్షికత, వ్యక్తులు, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఆదేశాలను కూడా జారీ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విజ్ఞప్తి చేశారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: వైఎస్సార్సీపీ నాయ‌కుల‌ను, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా జుగుప్సాక‌రంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని, మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా కేసు న‌మోదు చేసి ఆయ‌న్ను త‌క్ష‌ణం అరెస్టు చేయాల‌ని వైఎస్సార్సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ చేశారు.

    తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌ను సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ లు స‌మ‌ర్థించ‌డం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్య‌లు కావ‌ని, వైఎస్సార్సీపీ నాయ‌కుల వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కుట్ర‌లో భాగంగా జ‌రిగిన పన్నాగంగానే చూడాల‌ని చెప్పారు.

    రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని, ఆచ‌ర‌ణ సాధ్యంకాని అమ‌రావ‌తికి ప్ర‌త్యామ్నాయంగా వైఎస్‌ జ‌గ‌న్ సూచించిన మావిగన్‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డం కోస‌మే రాధాకృష్ణతో కుట్ర‌లు చేయించార‌ని వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పేవ‌ర‌కు వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున పోరాటం చేస్తూనే ఉంటామ‌ని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమ‌న్నారంటే..

    అమ‌రావ‌తి వ్య‌తిరేకుల ముద్ర వేసే కుట్ర
    వీకెండ్ కామెంట్స్‌, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ త‌న ఛానెల్‌లో వైఎస్సార్సీపీ నాయ‌కుల భార్య‌ల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను రాధాకృష్ణ త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకుని మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేసింది. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను ఖండించి ఆయ‌నపై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌, హోంమంత్రి అనిత‌లు ఆయ‌న్ను స‌మ‌ర్థిస్తున్నారు.

    ఆచ‌ర‌ణ సాధ్యంకాని అమ‌రావ‌తికి ప్ర‌త్యామ్నాయంగా త‌క్కువ ఖ‌ర్చుతో మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు కారిడార్‌ని మావిగన్ పేరుతో డెవ‌ల‌ప్ చేసుకోవ‌చ్చ‌ని వైఎస్‌ జ‌గ‌న్‌ సూచించిన క్ష‌ణం నుంచి ప్ర‌జ‌ల్లో ఆలోచన మొద‌లైంది. అమ‌రావ‌తి పేరుతో జ‌రుగుతున్న దోపిడీ గురించి ప్ర‌జ‌లు చ‌ర్చిస్తున్నారు. రాజ‌ధాని ముసుగులో చంద్ర‌బాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని కూట‌మి నాయ‌కులకు అర్థ‌మైపోయింది. దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని డైవ‌ర్ట్ చేయ‌డానికే ప్లాన్ ప్ర‌కారం ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌తో జుగుప్సాక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌తో ఎవ‌రైనా వైఎస్సార్సీపీ నాయ‌కులు రియాక్ట్ అయితే వారిపై అమ‌రావ‌తి వ్య‌తిరేకుల ముద్ర వేసి మావిగ‌న్ అనే పేరెత్త‌కుండా చేయాల‌నే ప‌థ‌కం ప్ర‌కారం కుట్ర చేశారు.

    అవే మాట‌ల‌ను మీకు అన్వ‌యించుకోండి
    ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిర‌స‌న‌ను దాడిగా చిత్రీక‌రించ‌డం దుర్మార్గం. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న తెలియ‌జేసే హక్కు ప్ర‌జ‌ల‌కు లేదా? వైఎస్‌ జ‌గ‌న్ చెబితే వైఎస్సార్సీపీ నాయ‌కులు వారి భార్య‌ల‌ను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తార‌ని చెప్ప‌డం సంపాద‌కీయంలో భాగ‌మ‌ని చంద్రబాబు చెప్ప‌డం సిగ్గుచేటు. శాంతియుతంగా నిర‌స‌న తెలియజేస్తే దాడి అని ప్ర‌చారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్య‌క్తి డిబేట్‌లో మాట్లాడితే సాక్షి కార్యాల‌యాల‌ను ధ్వంసం చేశారు. మీ నాయ‌కుల ఇళ్ల‌లో ఉన్న త‌ల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే స‌మ‌ర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్ల‌లో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్క‌సారైనా చెప్పారా?

    ఏరోజైనా మీ తోబుట్టువుల‌ను పండ‌క్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా?  ఏ హ‌క్కుతో జ‌గ‌న‌న్న కుటుంబ స‌భ్యుల గురించి మాట్లాడ‌తారు? ప‌త్రికా స్వేచ్ఛ ముసుగులో వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తున్న చంద్ర‌బాబుని ఏరకంగా స‌మ‌ర్థిస్తారు?   జ‌గ‌న‌న్న క‌ళ్ల‌లో ఆనందం కోసం వైయ‌స్సార్సీపీ నాయ‌కులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేశార‌ని చెబుతున్న నారా లోకేష్‌, ఎవ‌రి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడాడు?  విశాఖ‌లో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు స్థ‌లం కేటాయించినందుకా?  విజ‌య‌వాడ‌లో రాధాకృష్ణ ప‌వ‌ర్ ప్లాంట్‌కి అనుమ‌తులు ఇచ్చినందుకా?

    ఇదేనా భువ‌నేశ్వ‌రి.. లోకేష్‌కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్య‌త మ‌రిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూర‌మో, సాక్షి నుంచి ఆంధ్ర‌జ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌ను ఇలాగే అంటే ఊరుకుంటారా?  ఏబీఎన్ రాధాకృష్ణ మాట‌లు విశ్లేష‌ణ‌లు అని చెబుతున్న‌ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ద‌వుల కోసం మ‌న‌సు చంపుకుని మాట్లాడ‌టం అవ‌స‌ర‌మా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేప‌ర్‌, టీవీలో త‌న త‌ల్లిని దూషించినందుకు వాటిని బ‌హిష్క‌రించిన విష‌యం అప్పుడే మ‌రిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు.

    హోంమంత్రి అనిత మ‌హిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం సిగ్గుచేటు. ఆమెకు ప‌ద‌వి ఇచ్చింది జ‌గ‌న్‌ని తిట్టడం కోస‌మా?  టీడీపీ నాయ‌కులు కూడా చంద్ర‌బాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టిన‌ప్పుడు సై అన్నారు. మోదీని పొగిడిన‌ప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాట‌లు మీకు అన్వ‌యించుకుంటారా చెప్పండి?  ఆయ‌న యూట‌ర్న్‌ల‌కు వంత‌పాడిన టీడీపీ నాయ‌కుల‌ను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండ‌టం మ‌హిళ‌ల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించ‌డం ద్వారా మ‌హిళా లోకానికే క‌ళంకం తెచ్చారు.

    ప‌త్రికా రంగానికి  ఆంధ్రజ్యోతి చీడ‌, రాధాకృష్ణ పీడ‌
    ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌ను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా కేసు న‌మోదు చేయాలి. ఇంత‌దారుణంగా వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మ‌హిళ‌ల‌కు రాధాకృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. ఆయ‌న మీద కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసే వ‌ర‌కు వైఎస్సార్సీపీ నిర‌స‌న తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వ‌చ్చి న వ్యాఖ్య‌లు కావు. చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల స‌మ‌ర్థింపుతో కావాల‌ని చేసిన కుట్రేన‌ని తేలిపోయింది.

    వైఎస్సార్సీపీ నాయ‌కుల వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌లో భాగంగానే ప‌థ‌కం ప్ర‌కారం ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్‌ జ‌గ‌న్ ఆధారాల‌తో స‌హా వెలికితీయ‌డంతో చంద్ర‌బాబు త‌ట్టుకోలేకపోతున్నారు. వైఎస్‌ జ‌గ‌న్‌ ప్ర‌స్తావించిన మావిగ‌న్ మోడ‌ల్‌తో చంద్ర‌బాబు వేల కోట్ల అవినీతి ఆశ‌లు కుప్ప‌కూలిపోయాయి. వాటి నుంచి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు డైవ‌ర్ట్ చేయ‌డం కోసం వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కుట్ర‌లు చేస్తున్నారు. ప‌త్రికా రంగానికి ఆంధ్ర‌జ్యోతి చీడ లాంటిది. జ‌ర్న‌లిస్టుల స‌మాజంలో రాధాకృష్ణ పీడ‌లాంటి వాడు. చంద్ర‌బాబుకి రాజ‌కీయ ల‌బ్ధి చేకూర్చ‌డానికి ఇలాంటి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశాడు

  • సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్‌తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

    వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

    ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. 

    మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ)  ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

    త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ
  • సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌ భేటీలో మావిగన్‌ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. 

    చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్‌ ఆప్షన్‌గా ప్లాన్‌ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్‌ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్‌ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్‌ను మావిగన్‌(MAVIGUN)ను సూచించాం. 

    అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్‌లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్‌ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో పైవ్‌స్టార్‌ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

    బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు

     

     

Business

  • న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్‌ ఇష్యూలతోపాటు.. పబ్లిక్‌కు కనీస వాటా కేటాయింపు గడువును పెంచింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ముగిసిపోయే ఐపీవోల అనుమతుల గడువును 2026 సెప్టెంబర్‌30 వరకూ పొడిగించింది.

    ఇదేవిధంగా పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కల్పించే నిబంధనల విషయంలోనూ 2026 సెప్టెంబర్‌ 30 వరకూ వెసులుబాటు(ఒకేసారి)కు తెరతీసింది. రెండింటికీ విడిగా సర్క్యులర్‌లను జారీ చేసింది. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనలను అమలు చేయవలసిన లిస్టెడ్‌ కంపెనీలకు 2026 సెప్టెంబర్‌ 30వరకూ గడువు లభించింది.

    గతంలో కరోనా మహమ్మారి తలెత్తిన కాలంలోనూ సెబీ ఇదేతరహా వెసులుబాటును కల్పించిన విషయం విదితమే. పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి, మార్కెట్‌ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకుని సెబీ గడువు పెంపునకు నిర్ణయించింది. 

  • తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్‌స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్‌షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

    3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్‌షిప్‌లో, 20 నిమిషాల ఆన్‌లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.

    సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్‌షిప్‌లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.

    ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది.
     

  • అంతర్జాతీయ టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు (2026) ప్రముఖ దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ లేఆఫ్స్‌ జాబితాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది.

    అమెజాన్, ఇంటెల్ సంస్థల్లోనే అధికం
    వివిధ నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2025 నుంచి ఇప్పటివరకు అమెజాన్ ఏకంగా 30,184 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీని తర్వాత చిప్‌ మేకర్ ఇంటెల్ (Intel) 27,058 మందిని, సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) 15,347 మందిని తొలగించి టాప్-3లో నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు మరియు సంస్థాగత మార్పులే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

    కంపెనీల వారీగా తొలగింపుల వివరాలు

     కంపెనీ పేరుతొలగించిన ఉద్యోగుల సంఖ్య
    1అమెజాన్30,184
    2ఇంటెల్27,058
    3మైక్రోసాఫ్ట్15,347
    4హెచ్‌పీ8,000
    5మెటా5,800
    6సేల్స్ఫోర్స్5,385
    7బ్లాక్ (Block)4,931
    8నార్త్ వోల్ట్2,800
    9హ్యూలెట్ ప్యాకర్డ్2,552
    10ఆటోడెస్క్2,350

    ఎందుకీ కోతలు?
    గత రెండేళ్లుగా టెక్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. 
    AI ప్రభావం: పనులను ఆటోమేట్ చేయడం వల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది.
    ఆర్ధిక మందగమనం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులను తగ్గించుకోవాలనే ఒత్తిడి కంపెనీలపై ఉంది.
    రీస్ట్రక్చరింగ్: లాభదాయకత లేని ప్రాజెక్టులను మూసివేసి, ప్రాధాన్యత ఉన్న రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

    ఈ పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్‌.. ఖండించిన కంపెనీ
    గడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్‌లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని అమెజాన్‌ ఖండించింది. ఇవన్నీ అవాస్తమని, తమకు అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్‌ల షాక్‌ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

    "ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు.

  • ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్  ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. 
    భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్‌లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్‌తో జతకట్టింది.

    మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు  నిధి లాంటివి.

    ఆకాశ మార్గాన తపాలా సేవలు.. 
    ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.

    సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. 
    -పసుపులేటి వెంకటేశ్వరరావు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.

    నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.

    ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.

    శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. 

    రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.

    ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు.

    భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

     

National

  • మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎన్‌ఎన్‌, సీఓటర్‌ ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఓపీనియన్ పోల్ సంచలన ఫలితాలను చూపుతోంది.  

    2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీ-ఓటర్, CNN-News18 వెల్లడించిన ఓపీనియన్ ఫోల్‌ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK మరియు ప్రధాన ప్రతిపక్షం AIADMK మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి. సీఓటర్‌ సర్వే ప్రకారం ఎన్నికల్లో డీఎంకే 41 శాతం ఓట్లు సాధించే అవకాశాలుండగా, ఏఐడీఎంకేకు 38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సీఎన్‌ఎన్‌- న్యూస్‌ 18 సర్వే ప్రకారం ఏఐడీఎంకేకు 41 శాతం, డీఎంకేకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

    అదే సీట్ల విషయానికి వస్తే ఆశ్చర్యంగా ఏఐడీఎంకే కూటమికి 130-140 సీట్లు, డీఎంకే కూటమికి 90-100 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. అదే విధంగా విజయ్‌ పార్టీకి 2-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

    అదే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంలో ఎం.కె. స్టాలిన్ మరియు ఎం. పళనిస్వామి ఇద్దరూ 39% మద్దతుతో సమానంగా ఉన్నారు. అయితే తమిళనాడులో మెుత్తం 234 స్థానాలుండగా మెజారిటీ మార్కు 118 కాగా ప్రస్తుత సర్వేల ప్రకారం 130 - 140 సీట్లు (ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది కూటమి: 90 - 100 సీట్లు, TVK  విజయ్ పార్టీ  2 - 6 సీట్లు సాధించే అవకాశం ఉంది.

    అయితే ఈసారి  AIADMK, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా, DMK తన పాత మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో  AIADMK కూటమికి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే గతంలో చాలా సార్లు సర్వేల అంచనాలు తలకిందులైన సంగతి తెలిసిందే.

  • తిరువనంతపురం: కేరళ హైకోర్టు  కీలక ఉత్తర్వును జారీ చేసింది.  2026–27 మండల-మకర విళక్కు యాత్రా కాలంలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది.

    స్వామివారి దర్శనానికి రోజుకు గరిష్టంగా 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రతను పర్యవేక్షించడం, రద్దీని నియంత్రించడం మరియు క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా చూడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    కేరళ కోర్టు తీర్పు ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అయ్యప్పస్వామి యాత్రికులకు వర్తిస్తుంది. కోర్టు తీర్పుతో స్వామి దీక్షకు వెళ్లే భక్తులు ముందుగానే తమ దర్శన టిక్కెట్లను 'వర్చువల్ క్యూ' ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, భక్తులు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ బుకింగ్ లేదా నీలక్కల్, వండిపెరియార్, పంపా, ఎరుమేలి మరియు చెంగన్నూర్‌ లోని కౌంటర్ల ద్వారా భౌతికంగా బుకింగ్ చేసుకునే స్పాట్ బుకింగ్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

  • ఆడపిల్ల అనే చిన్నచూపుతో ముద్దుల మూటగట్టే కవల పిల్లల్ని కన్నతండ్రే అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ప్రతీ ఒక్కరినీ కంట తడిపెట్టించింది.  ఆధునిక సమాజంలో కూడా ఆడబిడ్డల్నిఒక భారంలా చూస్తున్న వైనం  ఆందోళన రేపుతోంది. అయితే  డెహ్రాడూన్‌లోని ఒక కుటుంబం తమ ఇంట ఆడబిడ్డ పుట్టిన క్షణాలను ఆనందంగా జరుపుకున్నారు.  తద్వారా ఆడబిడ్డలు భారం కాదు,  బలం  ఆనందం, సంతోషం అనే శక్తివంతమైన సందేశాన్ని అందించారు.

    కుటుంబంలోకి ఒక బిడ్డ రావడం సంతోషాన్నిచ్చే వార్తే. జెండర్‌తో సంబంధం లేకుండా కుటుంబమంతా ఆనందపడాల్సి క్షణాలు. డెహ్రాడూన్‌లోని కుటుంబం అదే చేసింది. కాదు కాదు మరింత ప్రత్యేకంగా తమ ఇంటి మహాలక్ష్మికి స్వాగతం పలికింది. బంధువులకు, స్నేహితులకు మామూలుగా ప్రకటించడం కాకుండా, అందరూ గుర్తుంచుకునే విధంగా  పండగలాగా వేడుక చేశారు. ఆనందంతో కుమార్తెకు స్వాగతం పలకడమేకాదు  యావత్ దేశం చూడగలిగే ఒక సందేశాన్ని ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది. 

    ఇదీ చదవండి : గుండె పగిలింది : హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం

    ట్రాఫిక్‌ను నిలిపివేసి మరీ వేడుక
    ఆ కుటుంబం రెండు కార్లలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. గులాబీ రంగు బెలూన్‌లతో అందంగా అలంకరించి దానిపై ‘బేటీ హుయీ హై’ (ఆడబిడ్డ పుట్టింది)  అని రాసి ఉన్న ఒక ప్లకార్డు ఉంచారు. ఆ కార్లను నగర వీధుల్లో ఊరేగించారు. ఇది అందర్నీ విపరీతంగా ఆకర్షించింది. ఎంతలా అంటే ట్రాఫిక్‌ను నిలిపివేసి మరీ  ఆ కుటుంబం సంతోషంలో పాలు పంచుకున్నారు. వాహనదారులు తమ వాహనాలను ఆపివేసి మరీ  ఈ వేడుకను తిలకించారు. ఈ వీడియోను  నీరజ్ పాశ్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

    ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

    మరోవైపు ఈ కుటుంబ సభ్యులలో ఒకరైన తాన్యా సిన్హా కూడా  దీని  సంబరం వెనుక క్షణాలను పంచుకున్నారు. కారును ఎలా అలంకరించారో అలా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆమె పంచుకున్నారు. వైరల్ అవుతుందని తాము ఇలా ప్లాన్ చేయలేదనీ, కేవలం తమ ఆనందాన్నిఇలా ప్రకటించుకున్నామని వివరించారు.   

    ఇదీ చదవండి:  త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్‌ స్పందన ఇదే!

  • టీవీకే అధినేత విజయ్‌కి ఎన్నికల ముందు ఊహించని షాక్‌ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

    ఎడప్పాడీ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ నియామాల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌పై పదిమంది ప్రపోజర్ల సంతకాలు ఉండాలి. అయితే టీవీకే తరుపున పోటీ చేస్తున్న అరుణ్ కుమార్‌ అనే అభ్యర్థి నామినేషన్‌ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉండడంతో పత్రాల్ని రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి ప్రత్యామ్నయంగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ పత్రాలు కూడా ఏడుగురు అభ్యర్థుల సంతకాలు ఉండడంతో రిజెక్ట్ అయ్యింది.

    అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏఐడీఏంకే అధ్యక్షుడు కెె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. అయికే ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్‌ కుమార్‌ ప్రస్తుతం అదృశ్యం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరి నామినేషన్ రిజెక్ట్‌ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా  దీంతో ఆయనను ఏవరైనా కిడ్నాప్‌ చేసి ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

  • అమెరికన్ దిగ్గజం, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో భారీ విడత ఉద్యోగ కోతలకు ప్రణాళిక రచిస్తున్నట్లువార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలలో 14 వేల మందిని ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందా? ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలకడం, ఇటీవల ఒరాకిల్‌  ప్రపంచవ్యాప్తంగా 30వేలమందిని తొలగించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో భారీ ఆందోళన నెలకొంది.  దీనిపై  అమెజాన్‌ ఎలా స్పందించింది?

    అమెజాన్ వచ్చే మే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనుందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అమెజాన్ 2026 మే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14వేల మందినితొలగించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ అవుట్‌లుక్ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, మానవ వనరుల వంటి విభాగాలలో మధ్య-స్థాయి మేనేజర్లు,వైట్-కాలర్ ఉద్యోగులతో సహా కార్పొరేట్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని  అంచనా వేసింది. 

    ఇదీ చదవండి: కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్‌ చంద్రశేఖర్‌!

    అమెజాన్‌ స్పందన
    ఈ వార్తలపై అమెజాన్‌ స్పందించింది. ఇవన్నీ పుకార్లే నని కొట్టి పారేసింది.  ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ  ప్రచారం విశ్వసించవద్దని అమెజాన్ ప్రతినిధి కోరారు. 
    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

  • రాజీవ్‌ చంద్రశేఖర్‌. ఇంజనీర్‌గా మొదలుపెట్టి, వ్యాపారవేత్తగా మారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత. దేన్ని ఎక్కడ ఎలా ముగించాలి, ఎప్పుడు కొత్త మార్గాల్లో అడుగువేయాలనే ఎరుక కలిగిన వ్యక్తి. కేరళ బీజేపీ సారథిగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని ముందుండి నడుపుతున్నారు. బీజేపీకి అందని రాష్ట్రమైన కేరళలో ఈసారి ఎలాగైనా గెలుపు అందించి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. 

    మోదీ హవాను పసిగట్టి 
    రాజీవ్‌ 2006లో రాజకీయ రంగప్రవేశం చేశారు. కర్ణాటకలోని అధికార జేడీ(ఎస్‌), బీజేపీ కూటమి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాలనా సంస్కరణలు, జాతీయ భద్రత, సాయుధ దళాల సిబ్బంది, ముఖ్యంగా మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. 2012, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయని రాజీవ్‌ ముందే పసిగట్టారు. 2014కు ముందు నుంచే మోదీని సమరి్థంచడం ప్రారంభించారు. 2020లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2021లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సహాయ మంత్రి అయ్యారు. డిజిటల్‌ పాలన, డేటా భద్రతా విధానాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. డిజిటల్‌ ఇండియా, ఇంటర్నెట్‌ పాలన, సాంకేతిక విధానాల్లో లోతైన పరిజ్ఞానమున్న పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. 2023లో కేరళ బీజేపీ సారథిగా పగ్గాలందుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌ చేతిలో ఓడారు. కేరళ చరిత్రలో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం నెమోమ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 

    ఆసక్తికర నేపథ్యం 
    రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వస్థలం కేరళలో త్రిసూర్‌ జిల్లాలోని దేశమంగళం. 1964లో అహ్మదాబాద్‌లో మలయాళీ నాయర్‌ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్‌ వైమానిక దళంలో ఎయిర్‌ కొమొడోర్‌గా పనిచేశారు. దాంతో రాజీవ్‌ బాల్యం దేశమంతటా భిన్న సంస్కృతుల మధ్య గడిచింది. ఆయన మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. స్టార్టప్‌ల గురించి కనీసం వినని 1981లో ఢిల్లీకి చెందిన ఓ ఐటీ స్టార్టప్‌లో ఉద్యోగం సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి ఇలినాయీ వర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశారు. ఇంటెల్‌లో డిజైన్‌ ఇంజనీర్‌గా చేసి భారత్‌కొచ్చారు. బీపీఎల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు నంబియార్‌ కుమార్తె అంజును పెళ్లాడారు. 2005లో జుపిటర్‌ క్యాపిటల్‌ అనే పెట్టుబడి సంస్థను స్థాపించారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడే ఏషియానెట్‌ కమ్యూనికేషన్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో యాంకర్‌ అర్నాబ్‌ గోస్వామితో కలిసి రిపబ్లిక్‌ టీవీని స్థాపించారు.

    ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

    జేబులో పెన్సిల్‌ : ముఖ్య విషయాలు నోట్‌ చేసుకోవడానికి రాజీవ్‌ చంద్రశేఖర్‌ జేబులో నిత్యం పెన్సిల్‌ ఉంచుకుంటారు. ‘‘ప్రతిదాన్నీ తిరగరాయడం ఆయనకిష్టం. చివరకు చరిత్రను కూడా’’అని విపక్ష నేతలు  చమత్కరిస్తుంటారు!  

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

  • సాక్షి, హైదరాబాద్‌  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికీ భూయాన్‌ శర్మపై ఆరోపణల కేసులో అస్సాం పోలీసులు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా నివాసంలో సోదాలు చేపట్టారు.  ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న పవన్ ఖేరా,  ఆయన భార్య నీలిమ ఇంటి బయట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి,  భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమను అస్సాం పోలీసులు ఇంకా సంప్రదించలేదని నగర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అస్సాం పోలీసులు వచ్చి నోటీసు ఇస్తే తాము సహకరిస్తామని వారు తెలిపారు.

    మరోవైపు పవన్ ఖేడా ఆచూకీ కోసం తాము ఇంకా ప్రయత్నిస్తున్నామని అస్సాం పోలీసులు  బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఖేడా నివాసంలో నిజాముద్దీన్ ఈస్ట్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి ఇంటికి అస్సాం పోలీసుల బృందం దాదాపు రెండు గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం, పోలీసులు "కొన్ని నేరారోపణ సాక్ష్యాలు" ఎలక్ట్రానిక్ పరికరాలతో వెనుదిరిగారు.  హిమంత భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని ఖేడా తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేడాపై గువాహటిలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా అస్సాం పోలీసులు మంగళవారం ఢిల్లీలో పవన్‌ ఖేడా నివాసానికి చేరుకొని సోదాలు చేశారు.

    అయితే, ఆ సమయంలో ఇంట్లో పవన్‌ ఖేడా లేరని, ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని అస్సాం డీజీపీ దేబజిత్‌ నాథ్‌ చెప్పారు. ఎక్కడున్నా అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఖేడాపై నేరారోపణలకు దారితీసే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. అస్సాం పోలీసులు ఉదయం 11 గంటలకు పవన్‌ ఖేడా నివాసానికి చేరుకున్నారు. రెండు గంటల తర్వాత వెళ్లిపోయారు. ఈ సోదాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో హిమంత ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. హిమంత భార్యపై ఖేడా చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్థించారు. సీఎం భార్యపై ఈడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖేడాపై కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. హిమంత, ఆయన కుటుంబ తప్పిదాలను బయటపెడతామన్నారు.

    ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

    పరారైన ఖేడా: హిమంత  
    తనపై, తన కుటుంబంపై ఆరోపణలకు ఆధారమైన పత్రాలను కాంగ్రెస్‌ సరిచూసుకోలేదని హిమంత ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. వృద్ధాప్యంతో ఆయన పిచి్చగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘మాపై ఆరోపణలు చేసిన పవన్‌ ఖేడా హైదరాబాద్‌ పారిపోయారు. ఆయన పాతాళంలో దాక్కున్నా పట్టుకోవడం తథ్యం’’ అని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, వాటిని కాంగ్రెస్‌ నాయకత్వం సమర్థించడం ఏమిటని సీఎం నిలదీశారు. ‘‘ఆరోపణల డాక్యుమెంట్లను ఖేడాకు రాహుల్‌ గాంధీ ఇచ్చి ఉంటారు. కనుక ఈ కేసులో రాహుల్‌ గాందీని చేర్చాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

    ఇదీ సంగతి : సీజ్‌ఫైర్‌ : పాక్‌ మార్కెట్లు ఫైర్‌, ట్రేడింగ్‌ నిలిపివేత!

     

  • బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్  ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్‌ స్పేస్‌లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్‌ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది.  పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

    ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్‌సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్‌ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్‌ఫామ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్‌ఇన్‌లో 65,000 మందికి పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం.

    "నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్‌ఇన్‌లో  పోస్ట్‌లో వెల్లడించింది.

    నెటిజన్ల స్పందన  
    ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా  స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు.  సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని  సూచించడం గమనార్హం.

    ఇదీ చదవండి: షార్ట్‌కట్‌ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి

  • ముంబై: ఒక బిడ్డ దూరమైందన్న శోకం ఒకవైపు.. మరో బిడ్డ జైలు పాలవుతుందన్న భయం మరోవైపు.. ఆ రాత్రి ముంబై హైవేపై జరిగిన ప్రమాదం ఆ కుటుంబానికి 13 ఏళ్ల పాటు నరకాన్ని చూపింది. అయితే ఈ కేసులో చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పోలీసుల రికార్డుల్లో నేరస్తురాలిగా ముద్రపడిన సోదరిని ఆమె సోదరుడే కాపాడాడు.

    2012, అక్టోబర్ 14న వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఆ ఘోర ప్రమాదం ఖురానా కుటుంబంలో తీరని ఆవేదనను నింపింది. ఆస్పత్రిలో అక్క గుంజన్ ప్రాణాలు వదలగా, నాడు కారు నడిపిన చెల్లెలు పారుల్ ఖురానా నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత అక్క మరణానికి కారణమయ్యానన్న అపరాధభావం ఒకవైపు, పోలీసుల విచారణ మరోవైపు పారుల్‌ను కుంగదీశాయి. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగింది.

    ఈ కేసులో అత్యంత కీలక మలుపు వారి సోదరుడి వాంగ్మూలం. పోలీసులు చెబుతున్నట్లు పారుల్ కారు నడపలేదని, ప్రమాద సమయంలో స్టీరింగ్ గుంజన్ చేతిలోనే ఉందని అతను కోర్టులో  వెల్లడించాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘బెస్ట్’ బస్సు ఢీకొట్టడం వల్లే కారు నియంత్రణ కోల్పోయిందని సాక్ష్యం ఇచ్చాడు. ‘చనిపోయిన ఒక సోదరిని కాదని, తప్పు చేసిన మరో సోదరిని కాపాడటానికి ఏ తమ్ముడూ అబద్ధం చెప్పడు’ అని మేజిస్ట్రేట్ ఏ.ఎం. ముజావర్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించాయి.

    పోలీసుల దర్యాప్తులోని వైఫల్యాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కారు నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టిందని పోలీసులు వాదించగా, కారు వెనుక భాగం ధ్వంసమైన ఫోటోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. బస్సు ఢీకొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా, ఆ కోణంలో కనీసం విచారణ చేయకపోవడం దర్యాప్తు అధికారి నిర్లక్ష్యమేనని కోర్టు తేల్చి చెప్పింది. చివరకు వాస్తవాలను, ఫోటో సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న బోరివలి కోర్టు, పారుల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.

Movies

  • గతేడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫుల్ ఫ్యామీలీ కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు.

    తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తాజాగా ప్రకటించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(ఐఎన్‌సీఏ) అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ డైరెక్టర్‌తో పాటు బెస్ట్ యాక్టర్ కామెడీ రోల్ విభాగంలో అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి అవార్డ్ సొంతం చేసుకోగా.. కామెడీ రోల్ బెస్ట్ యాక్టర్‌గా రేవంత్(బుల్లిరాజు) దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ప్రత్యేక పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ గుడ్‌ న్యూస్‌ పంచుకుంది. ఐఎన్సీఏ అవార్డులు ప్ర‌క‌టించ‌డం ఇదే మొదటిసారి కావడం విశేషం. 
     

     

  • మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్‌ వివాదానికి దారితీశాయి. ఇటీవల భోలేబాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్‌ షూటింగ్‌లో నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించడంపై మాజీ క్రికెటర్ గంగూలీ మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇదంతా షూటింగ్ కోసమే అయినా.. ‍అతను నీటిలోకి ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ  ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.

    బాధలో ఉన్న ఆ కుటుంబంపై ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని సౌరవ్ గంగూలీని స్వాస్తిక బెనర్జీ తప్పుపట్టింది. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఆయన మాటలు తమ వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తమ పని విలువను తగ్గిస్తాయని స్వాస్తిక ముఖర్జీ అన్నారు.

    అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్వాస్తిక పేర్కొన్నారు. గంగూలీ లాగా.. రాహుల్ లాంటి వాళ్లకు మద్దతు లభించదన్నారు. ఒకవేళ రాహుల్ నీటిలోకి దిగకపోయి ఉంటే.. అతని స్థానంలో మరో నటుడు వచ్చేవారని ఆమె తెలిపారు. ప్రస్తుత ఘటన చూస్తుంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను వేలేత్తి చూపుతోందన్నారు. కాగా.. బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతితో ఏప్రిల్ 7 నుంచి సినీ పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది.
     

  • ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు గాని వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబసభ్యులైనా అంతెందుకు కట్టుకున్న భాగస్వామికి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి అనే సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్యా. దివి నిథి శర్మ ఆలోచనకు శశాంత్ సింగ్ దర్శకత్వం వహించి తెర రూపమిచ్చిన సిరీసే ఈ చిరయ్యా. చాలా సున్నితమైన అంశాన్ని చక్కటి డ్రామాతో 6భాగాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు.

    పెళ్ళైతే చాలు కట్టుకున్న పెళ్ళాం ఇష్టం తో పని లేకుండా తనని తన సొంత ఆస్తిలా భావించే ప్రబుద్ధులకు ఈ సిరీస్ ఓ గుణపాఠమనే చెప్పాలి. హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతున్న ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే. కాని చూసిన ప్రతి ప్రేక్షకుడి మనస్సు చివుక్కుమనడం ఖాయం.  పెళ్లైన ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్‌ ఇది.  అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓసారి చూద్దాం. 

    పెద్దలు కుదిర్చిన సంబంధంతో పూజ అరుణ్ ని పెళ్ళి చేసుకుని అత్తింట్లో అడుగుపెడుతుంది. అత్తమామలు ఇద్దరితో పాటు మిగతా కుటుంబసభ్యులంతా ఎంతో అపురూపంగా చూసుకుంటారు పూజని. ఆ కుటుంబంలో అరుణ్ వదిన దివ్య మొదట్లో పూజని కాస్త బెట్టుగా చూసినా తరువాత కలిసిపోతుంది. అందరూ బాగున్నా అరుణ్ తో పూజకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య గురించి తాను ఎవ్వరితో చెప్పుకోలేదు. అప్పుడు దివ్యకి పూజ సమస్య తెలుస్తుంది. 

    కన్నబిడ్డ కన్నా ఎంతో అనురాగఆప్యాయతలతో పెంచిన అరుణ్ అసలు స్వరూపం తెలుసుకున్న దివ్య పూజకి ఎలాంటి పరిష్కారం చూపుతుందో చిరయ్యా సిరీస్ చూసే తెలుసుకోవాలి. నిజానికి ఈ సిరీస్ లోని పాయింట్ చాలా సున్నితమైన అంశం. దర్శకుడు ఎక్కడా అశ్లీలతకు ఎక్కువగా తావివ్వకుండా ఎంతో హుందాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అంతే ధీటుగా ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా ఉందీ సిరీస్. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పరిష్కారం సూపర్ అని చెప్పాలి.  పెద్దలు మాత్రమే చూడదగ్గ ఈ సిరీస్ వీకెండ్ కు మంచి కాలక్షేపం.

  • టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్‌తో పాటు  రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

    ఈ టైటిల్‌ గురించి టాలీవుడ్‌లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే ‍అర్థం వచ్చేలా టైటిల్‌ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్‌ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.

    మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు.  పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్‌పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.

     

  • వచ్చే జన్మలో అయినా ఆడపిల్లగా కాకుండా మగాడిగా పుట్టాలని అంటోంది జబర్ధస్త్‌ ఫైమా. పటాస్‌ షోతో వెండితెరకు పరిచయం అయిన ఈ లేడి కమెడియన్‌.. జబర్దస్త్‌ కామెడీ షోతో బాగా పాపులర్‌ అయింది. ఇక బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో దూసుకెళ్తుంది. అయితే కెరీర్‌ ప్రారంభంలో మాత్రం ఫైమా చాలా అవమనాలను ఎదుర్కొందట. నల్లగా ఉందంటూ కొంతమంది ట్రోల్‌ చేశారట. తాజాగా ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొన్న ఫైమా.. తన కెరీర్‌ గురించి.. పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

    అమ్మ ఘోరంగా ఏడ్చింది..
    కెరీర్‌ ప్రారంభంలో చాలా అవమనాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్లకు నాకు హైప్‌ వచ్చింది. అందరూ ‘వీ వాంట్‌ ఫైమా’ అని అంటుంటే..కొందరు మాత్రం ‘ఏముంది దీనిలో అంత పొడుగుతున్నారు. గలీజ్‌గా, నల్లగా ఉంది’ అని ట్రోల్‌ చేశారు.  నాతో పాటు మా అక్కలు కూడా అవి చూసి బాధపడ్డారు. ఒక రోజు నేను మా అమ్మకు ఫోన్‌ చేసి ‘ఎందుకు అమ్మ నన్ను ఇంత నల్లగా కన్నావు’ అని అడిగా. అప్పుడు అమ్మ ఘోరంగా ఏడ్చింది.

    కొత్త డ్రెస్‌ కోసం ఏడ్చేదాన్ని
    మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. వేసుకోవడానికి సరైన డ్రెస్‌లు కూడా ఉండేవి కాదు. ఇంటి పక్కనవాళ్లు కొత్త డ్రెస్‌ వేసుకుంటే ఏడ్చేదాన్ని. మేం మొత్తం నలుగురం అక్కాచెల్లెళ్లం.నేనే అందరికంటే చిన్నదాన్ని. వాళ్లు వేసుకున్న డ్రెస్సులే నాకు ఇచ్చేవాళ్లు. ఎప్పుడైనా డ్రెస్‌ కొనుక్కోవాల్సి వస్తే.. నలుగురు అక్కలకు కొనుక్కున్న డ్రెస్‌ ముక్కల నుంచి ఒక్కొక్కటి ఇచ్చి నాకు కొత్త డ్రెస్‌ కుట్టించేవాళ్లు. ఇప్పుడు అలా కుట్టించుకుంటే ఫ్యాషన్‌ అంటున్నారు(నవ్వుతూ..).

    గడ్డి మందు ఇచ్చి చంపాలి..
    ఇక చిన్న పిల్లలపై జరుగున్న అఘాయిత్యాల గురించి ఫైమా మాట్లాడుతూ..‘అలాంటి పనులు చేసినవాళ్లను గడ్డి మందు ఇచ్చి చంపాలి.  చనిపోయే ముందు అయినా ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియాలి. నాను పవర్స్‌ ఇస్తే అలానే చేస్తా. ఒక ఆడపిల్లగా జీవించడం చాలా కష్టం. ఆడపిల్లగా పుట్టినందుకు నేను అస్సలు హ్యాపీగా లేను. మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్లగా బతకడం. చాలా కష్టాలు ఉంటాయి. వచ్చే జన్మలోనైనా నేను మగాడిలా పుట్టాలని కోరుకుంటున్నాను’ అని ఫైమా అన్నారు.

  • అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్‌ రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

    తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్‌ఎస్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. 

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

    స్క్రిప్ట్ కాపీ కొట్టారు..

    దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్‌ తనదేనని.. ఆదిత్య ధర్‌ నా స్క్రిప్ట్‌ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని..  పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఆదిత్య ధర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్‌ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్‌కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉపశమనం లభించింది.

    కాగా.. 'ధురందర్ 2' రిలీజ్  తర్వాత  తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  

    దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
     

  • అమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దంగల్‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా.  ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలు, షోలలో కనిపించింది. గతేడాది  సన్నీ సంస్కారీ కి తులసి కుమారి,  బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీలో సినిమాలు చేస్తూ బిజీ ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ  టోస్టర్, సుందర్ పూనమ్ ‍అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే రిలీజ్ కానున్నాయి.

    అయితే తాజాగా సన్యా మల్హోత్రాకు సంబంధించి బాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ఏడాదిగా డేటింగ్‌లో ఉన్న సన్యా తన ప్రియుడు రిషబ్ రిఖిరామ్ శర్మ బ్రేకప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో బాలీవుడ్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. సన్యా మల్హోత్రా గతేడాది నుంచి ప్రముఖ సితార్ ప్లేయర్ రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి సందడి చేసేవారు. ‍అయితే వీరిద్దరి రిలేషన్‌పై ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు. తాజాగా వీరిద్దరు ఏడాదిలోనే తన రిలేషన్‌కు గుడ్‌ బై చెప్పేశారు. రిషబ్ వేరొకరితో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అందుకే సన్యా బ్రేకప్ చెప్పేసినట్లు బీటౌన్‌లో లేటేస్ట్ టాక్. గతంలోనూ ఓసారి తనకు బ్రేకప్ అయినట్లు సన్యా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాలుగేళ్ల లాంగ్‌ రిలేషన్‌ తర్వాత బ్రేకప్ అయినట్లు తెలిపింది.

    రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?

    రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ  ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.
     

  • సుడిగాలి సుధీర్‌.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్‌ అయ్యాడు. కామెడీ కంటే ఎక్కువ ఆ షో హోస్ట్‌ రష్మితో నడిపిన లవ్‌ట్రాక్‌ సుధీర్‌ని మరింత ఫేమస్‌ చేసింది. ఆ ఫేమ్‌లో పలు షోలకు హోస్ట్‌గా చేసే అవకాశం వచ్చింది. అవి కూడా సక్సెస్‌ కావడంతో సుధీర్‌కు వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన పలు షోలకు హోస్ట్‌గా చేస్తున్నాడు. అందులో ఒకటి సర్కార్‌ సీజన్‌ 6. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది.ఇక ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌లో 'పాపం ప్రతాప్' మూవీ టీమ్ సందడి చేసింది. ఇందులో సుధీర్‌ తన బ్రేకప్‌ స్టోరీని చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు.

    14 ఏళ్ల పాటు ప్రేమలో..
    సుడిగాలి సుధీర్‌ పెళ్లి గురించి సోషల్‌ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఒకనొక దశలో యాంకర్‌ రష్మితో ప్రేమలో ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాళ్లిద్దరు కేవలం షో కోసం మాత్రమే లవ్‌ట్రాక్‌ నడిపామని చెప్పడంతో ఆ పుకార్లకు బ్రేక్‌ పడింది.  అయితే రష్మితో కానీ మరో అమ్మాయితో  సుధీర్‌ 14 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడట. చివరి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్నాడట. 

    బ్రేకప్‌.. నెక్లెస్‌ రోడ్‌పై పరుగెత్తా..
    సర్కార్‌ సీజన్‌ 6 లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో సుధీర్‌ బ్రేకప్‌ స్టోరీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘14 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాం. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. విషయం తెలిసి..ఏంటి ఇదంతా అని అడిగితే..‘ ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నా..డిస్ట్రబ్‌ చేయకు’ అని చెప్పింది. చాలా బాధపడ్డా. నెక్లెస్ రోడ్డులో పరిగెడుతున్నా, అరుస్తున్నా.. ఏంటేంటో చేసేశా.. అంటూ బ్రేకప్‌ చెప్పిన రోజు జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ఎమోషల్‌ అయ్యాడు.  పక్కనే ఉన్న కో హోస్ట్‌ విష్ణు ప్రియ.. సుధీర్‌ని హగ్‌ చేసుకొని ఓదార్చింది. 

  • రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌ డ్రాప్‌లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్‌ లుక్‌ హైలెట్‌గా నిలిచింది.  ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

    m

    తాజాగా టాలీవుడ్‌లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్‌ అయితే ఈ పాట మరింత హైలెట్‌ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. ‍‍అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  
     

  • టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ ఈ మధ్య చెప్పి మరీ హిట్‌ కొడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో విజయం అందుకున్నాడు. ఇప్పుడు సమ్మర్‌లో 'బైకర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్‌ తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. శర్వానంద్‌ మాట్లాడుతూ.. నేనెప్పుడూ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయలేదు. 

    పెద్ద ప్రమాదం
    కేవలం కథల్ని మాత్రమే నమ్ముకుంటూ ముందుకు వెళ్లాను. జాను మూవీ కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్‌ చేస్తూ పెద్ద ప్రమాదానికి గురయ్యాను. అది కేవలం సినిమా కోసమే చేశాను.. నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇండస్ట్రీలో ఎవరూ స్పందించలేదు. అది చూసి బాధ పడ్డాను. అసలు నాకు ప్రమాదం జరిగిందని కూడా కొందరికి తెలియనే తెలియదు. అంటే నేను అంత తక్కువవాడినా? నేను సరిగా కష్టపడట్లేదా? నా పనైపోయిందా? అని చాలా ఫీలయ్యాను. బైకర్‌తో నేనేంటో నిరూపించుకోవాలనుకున్నాను, నిరూపించుకున్నాను అని శర్వానంద్‌ తెలిపాడు. ఇది విన్న అభిమానులు శర్వా మనసులో ఇంత బాధ ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: ఆ స్టార్‌ హీరో వల్లే ఇండస్ట్రీలో ఉన్నా: మృణాల్‌ ఠాకూర్‌

  • బాలీవుడ్ హీరోయిన్‌, జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు. దీంతో జరీన్ శోకసంద్రంలో మునిగిపోయింది.  సోషల్‌ మీడియా ద్వారా  పలువురు సెలబ్రిటీలు,సహనటులు ఆమెకు సానుభూతి ప్రకటించారు.

    తన దుంఖాన్ని నటి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.  ఇటీవలే పెంపుడు పిల్లి రాంబోను కోల్పోయిన జరీనా తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  తరచు తన తల్లి  ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను  పంచుకుంటూ ఉంటుంది జరీనా. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు.

    "మా ప్రియ  పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్‌ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  దీంతో ఈ విషాద సమయంలో ఆమెకు సానుభూతిని, అండను తెలియజేస్తూ సందేశాలు పంపుతున్నారు.

    హిందీ మూవీ 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్‌ మరణం చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికి గురిచేసింది.  టాలీవుడ్‌ యాక్షన్ థ్రిల్లర్  హీరో గోపీచంద్ సరసన చాణక్య మూవీలో కనిపించింది జరీన్ ఖాన్. అలాగే రామ్‌గోపాల్‌  దర్శకత్వంలో 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్  నటించింది. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్  చివరి సినిమా 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే'.

    ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్‌... ఎలాగో తెలిస్తే షాకవుతారు!

  • ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్‌ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.

    ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అ‍ల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. ‍అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు. 
     

     

  • తెరపై అవకాశాలు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక్క ఛాన్స్‌ రావడానికి కొందరికి ఏళ్లకు యేళ్లు పడుతుంది. మరికొందరికి వెంటనే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అందులోనూ బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్‌ అయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్‌ను దాటుకుని బుల్లితెర నటి అన్న ట్యాగ్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది మృణాల్‌ ఠాకూర్‌. 

    సీరియల్‌ నుంచి సినిమాల్లోకి..
    2012లో ముజ్‌సే కుచ్‌ కేటి.. యే ఖామోషియాన్‌ సీరియల్‌లో నటించింది. తర్వాత అర్జున్‌, కుంకుమ భాగ్య సీరియల్‌లో యాక్ట్‌ చేసింది. ఆ తర్వాత మరాఠిలో ఒకే ఏడాది (2014) మూడు సినిమాలు చేసింది. అయినా మృణాల్‌ ఠాకూర్‌కు బ్రేక్‌ రాలేదు. మళ్లీ సినిమా చేయడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఓ హీరోతో చేసిన యాడ్‌ వల్ల తన కెరీర్‌ మలుపు తిరిగిందంటోంది మరాఠి బ్యూటీ.

    ఆ హీరో వల్లే..
    మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో సీతారామం, హాయ్‌ నాన్న సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెకాయిట్‌. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్‌ మాట్లాడుతూ.. హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నా లక్కీ చార్మ్‌. నేను చిత్రపరిశ్రమలో ఉండటానికి ఆయనే కారణం. కెరీర్‌ తొలినాళ్లలో మోడల్‌గా ఆయనతో కలిసి ఓ హెయిర్‌బ్రాండ్‌ యాడ్‌లో నటించాను. ఆ వాణిజ్య ప్రకటన రిలీజైన తర్వాతే చాలామంది దర్శకనిర్మాతలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఆయనే ఇస్తాను. ఆయన నాకెంతో సాయం చేశారు. తనెప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటాడు. 

    సినిమా
    ధురంధర్‌ మూవీలో అయితే నాకు రణ్‌వీర్‌ కనిపించలేదు, హంజా మాత్రమే కనిపించాడు. అంత అద్భుతంగా నటించాడు. ఆయన ఇలాంటి బ్లాక్‌బస్టర్స్‌ మరెన్నో అందుకోవాలి అని చెప్పుకొచ్చింది. కాగా రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్‌ మూవీ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవగా.. ఈ ఏడాది మార్చి 19న దానికి సీక్వెల్‌ వచ్చింది. అదే ధురంధర్‌: ద రివేంజ్‌. రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది.

    చదవండి: అల్లు అర్జున్‌- అట్లీ సినిమా టైటిల్‌ ఇదే.. గుండుతో కనిపించిన బన్నీ

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నెక్లెస్ రోడ్‌ జలవిహార్ సమీపంలో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ఈ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు ధాటికి పరికరాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    కంప్రెషర్‌లో అధిక ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఖైరతాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పేలుడు కారణాలపై విచారణ చేపట్టారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు (Natural Death) కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.

    యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. ఏప్రిల్ 1 నుండి అమలు: ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది. గతంలో ఉన్న రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది. దాదాపు 38వేలపైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.

  • అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ ఓ యువకుడు పెళ్లికి రెండ్రోజుల ముందు పరారయ్యాడు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది. తమకు న్యా యం చేయాలంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆ యువకుడి ఇంటి ఎదుట అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో మంగళవారం చోటు చేసుకుంది.

    బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన వీరబోయిన రాజయ్య రెండో కుమారుడు కిరణ్‌కు, ఎల్కతుర్తి మండలం దండేపల్లికి చెందిన పొన్నాల రాజయ్య కూతురితో వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా రూ.26 లక్షలు, రెండున్నర తులాల బంగారం ఇచ్చే ఒప్పందంతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 6న వివాహ ముహూర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్థ సమయంలో రూ.10 లక్షల నగదు, అరతులం బంగారు ఉంగరం, రూ.72 వేల విలువ గల గొర్రెలు ముట్టజెప్పారు. ఆ తర్వాత తనకు అదనంగా మరో రూ.9 లక్షలు కావాలని కిరణ్‌ డిమాండ్‌ చేశాడు.

    తాము అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో పెళ్లికి రెండ్రోజుల ముందు మార్చి 4న కిరణ్‌ పరారయ్యాడని అతడి తల్లిదండ్రులు తమకు చెప్పడంతో మార్చి 6న జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసమే కిరణ్‌ను తల్లిదండ్రులే దాచిపెట్టారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, మార్చి 4న కిరణ్‌పై కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ తెలిపారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

    చ‌ద‌వండి: పిట్ట ముట్టడం లేదని.. చెట్టును పెంచాడు! 

  • కుమురం భీం ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్‌  పెద్దవాగు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం చోటు చేసుకుంది.  థర్డ్ లైన్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బాక్స్ బ్రిడ్జ్ లో పనులు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఇద్దరు కార్మికులు బ్రిడ్జిలో ఇరుక్కపోయారు. దీంతో వారిలో ఒకరిని బయిటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరోకరు మాత్రం అందులోనే చిక్కుకోగా సహాయక చర్యలు అందిస్తున్నారు. వైద్యుల సమక్షంలో అక్కడే ఆక్సిజన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతనిని తీవ్ర రక్త స్రావమై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • సాధారణంగా మనిషి చనిపోయి అంత్యక్రియలు ముగిసిన తర్వాత బంధువులు 3, 5, 10 రోజుల్లో మృతి చెందిన వారికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసి పిట్టకు పెట్టడం ఆనవాయితీ. అయితే ఓ గ్రామంలోని శ్మశానవాటికలో చెట్లు లేక పిట్టలు రాక వాటిని ముట్టడం లేదు. దీంతో ఓ వ్యక్తి స్వయంగా ఓ చెట్టు నాటాడు. అది పెద్ద వృక్షంగా మారి పిట్టలు, కాకులకు ఆవాసంగా మారడంతో వెంటనే పిట్ట ముడుతోంది. వరంగల్‌ జిల్లా గీసుకొండలో పదేళ్ల కిందట మృతిచెందిన వారికి పిట్టకు పెట్టడానికి వెళితే శ్మశానవాటిక వద్ద చెట్లు లేకపోవడంతో కాకులు, ఇతర పక్షులు వచ్చేవి కావు.

    పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన వీరగోని రాజ్‌కుమార్‌ (ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌) 2015లో మర్రిచెట్టును నాటాడు. ఆ తర్వాత అది పెరిగి పెద్దదయ్యే వరకు నీరు పోయిస్తూ వచ్చాడు. దీంతో ఆ మొక్క పెద్ద వృక్షంగా మారి ఊడలు దిగింది. ఆ వృక్షంపై కాకులు, ఇతర పిట్టలు వాలి మృతుల కుటుంబాల వారు పెట్టే ఆహార పదార్థాలను పిట్ట తింటుండటం (ముట్టడం)తో వారు సంతృప్తి చెందుతున్నారు.

    మంగళవారం తమ కులపెద్ద పొగాకు కిష్టయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో శ్మశానవాటిక వద్దకు వెళ్లిన రాజ్‌కుమార్‌ తాను పెంచి పెద్ద చేసిన మర్రి చెట్టును ఆప్యాయంగా హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు. 

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్‌కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్‌కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

    కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

    అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్‌కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

     

     

     

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు  వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

    ‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి  ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

    ‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల‌ స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్‌, జగన్‌ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు

    ..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్‌లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్‌.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు

    చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం

    ..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్‌చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు.

     

     

Family

  • సమ్మర్‌ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..

    వేసవిలో చాలామంది డీహైడ్రేషన్‌కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..

    రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్‌కు గురైందో తెలుస్తుంది. 

    అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.

    కొబ్బరి నీరు: 
    ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. 

    మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

    కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

    సబ్జా గింజలు:
    సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

    కొబ్బరి నీరు సబ్జా గింజల కలయిక
    కొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
    కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి  వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..)

     

     

  • రిలయ‍న్స్‌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్‌ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. 

    ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్‌ని మరింత హైలెట్‌ అ‍య్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్‌తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. 

    అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్‌టెయిల్ రింగ్, స్టేట్‌మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

    ఆలయం విశిష్టత..
    మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడా

    తన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు.  ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. 
     

     

    (చదవండి: మొట్టమొదటి డైనోసార్‌ లెదర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌..! ధర ఎంతో తెలుసా..)
     

  • దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్‌ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్‌డోస్‌ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్‌ కేన్సర్‌ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్‌ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ గురించి అవగాహన కోసం...

    హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... 
    ఇది (హెచ్‌పీవీ) మహిళల్లో సర్వైకల్‌ కేన్సర్‌కు దారితీస్తుంది. సెక్స్‌ ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే హెచ్‌పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్‌ కేన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది  కేన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్‌ పార్ట్‌నర్స్‌తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ.  

    సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్‌ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. 

    ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

    సర్వైకల్‌ కేన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్‌ ఫాక్టర్‌ హెచ్‌పీవీ వైరస్‌... 
    హెచ్‌పీవీ వైరస్‌ సోకడం సర్వైకల్‌ కేన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్‌ ఫ్యాక్టర్‌ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్‌పీవీ వైరస్‌ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్‌కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్‌ కేన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.

    నివారణ ఎలా? 
    నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్‌స్మియర్‌ అనే వైద్యపరీక్ష. సర్వైకల్‌ కేన్సర్‌ నిర్ధారణలో పాప్‌స్మియర్‌ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక.  ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవడం అవసరం. 

    అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించుకోవడం మంచిది. సర్వైకల్‌ కేన్సర్‌ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్‌ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్‌. అంటే అసలు కేన్సర్‌ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్‌గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్‌’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. 

    హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఎప్పుడు ఇవ్వాలంటే... 
    గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్‌ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించాలి.  తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్‌ ఇప్పించవచ్చు. 

    అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్‌ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్‌ కేన్సర్‌ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళలకు ఉంటుంది.

    హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో ఇతరత్రా ప్రయోజనాలివే... 

    • హెచ్‌పీవీ వ్యాప్తినిఅరికట్టడం

    • యోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్‌ వార్ట్స్‌) సమస్య నుంచి రక్షణ 

    • గర్భాశయ క్యాన్సర్‌ నుంచి రక్షణ

    • యోని క్యాన్సర్‌ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ 

    • దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది

    • మహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్‌ ఇమ్యూనిటీ) కలగడం

    • చికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడం

    • తద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటం

    డాక్టర్‌ సాయిలక్ష్మి డయానా, సీనియర్‌ కన్సల్టెంట్‌, గైనిక్‌ ఆంకాలజిస్ట్‌ 

    – యాసీన్‌

    చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..

  • మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్  సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్‌కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.

    65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్‌లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్‌తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.

    ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ  కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది.  

    ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. 

    సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.
    యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్‌

    (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్‌ హ్యాబిట్స్‌)