Archive Page | Sakshi
Sakshi News home page

International

  • పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌ రాజధాని నియామేలోని డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఐదు నెలల వ్యవధిలో ఇదే విమానాశ్రయంపై జరిగిన రెండో దాడి కావడం గమనార్హం.

    ఉదయం ప్రార్థనలు ముగించుకుని వచ్చిన స్థానికులు భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది గంటల్లో పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భద్రతా బలగాలు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

    స్థానిక భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, కాల్పుల్లో 35 మంది మరణించినట్లు సమాచారం. కొందరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం కొంతమంది దుండగులు స్థానిక జనాల్లో కలిసిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

    ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇదే విమానాశ్రయంపై జనవరిలో జరిగిన దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌తో అనుబంధం ఉన్న ఓ సంస్థ బాధ్యత వహించింది.

    నైజర్‌, మాలీ, బుర్కినా ఫాసో కలిసి ఏర్పరచుకున్న Alliance of Sahel States భద్రతా వ్యవస్థలకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా ఉంది. అందువల్ల ఈ దాడి ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.
     

  • చిన్న సందేహం వచ్చినా చాలా మంది కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. అలా ప్రతిదానికీ కృత్రిమ మేధస్సుపై ఆధారపడితే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటి పనులను మనమే చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గవచ్చని చెబుతున్నారు. ఇది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

    అమెరికాలోని పొసిబిలిటీ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త, సిద్ధాంత న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. అయితే కృత్రిమ మేధస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు అంశమని ఆమె స్పష్టం చేశారు.

    వివియెన్ మింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజు చిన్న విషయాల గురించి కూడా కృత్రిమ మేధస్సుపై తరచుగా ఆధారపడటం వల్ల డిమెన్షియాను ఎదుర్కొనే మెదడు సహజ రక్షణ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి కారణం నిపుణులు "కాగ్నిటివ్ రిజర్వ్" అని పిలిచే సామర్థ్యం తగ్గిపోవడమేనని చెప్పారు. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే వయస్సు పెరగడం లేదా వ్యాధుల ప్రభావం వచ్చినా మెదడు పనితీరును కొనసాగించే సామర్థ్యం.

    కృత్రిమ మేధస్సు నేరుగా నాడీ సంబంధిత వ్యాధులను కలిగించదని వివియెన్ మింగ్ చెప్పారు. అయితే, ప్రజలు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఆందోళన కలిగించే అంశమని వివరించారు. అసలు సమస్య "క్రానిక్ సబ్‌స్టిట్యూషన్"లో ఉందని తెలిపారు. అంటే, కృత్రిమ మేధస్సు పని చేస్తోందనే కారణంతో యూజర్లు తమ ఆలోచనా శ్రమను మానేయడమేనని వివరించారు.

    క్రానిక్ సబ్‌స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు కృత్రిమ మేధస్సుకు పూర్తిగా అప్పగించే అలవాటు. కాలక్రమంలో ఈ అలవాటు వల్ల కాగ్నిటివ్ రిజర్వ్‌ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వయస్సు పెరగడం వల్ల వచ్చే నష్టాన్ని, డిమెన్షియాను ఎదుర్కోవడంలో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

    కాగ్నిటివ్ రిజర్వ్ అంటే శారీరక మార్పులు లేదా వ్యాధి వచ్చినా మెదడు పరిస్థితులకు అనుగుణంగా తన పనితీరును కొనసాగించే సామర్థ్యం. నిరంతర మానసిక శ్రమ, కొత్త విషయాల అభ్యాసం, చురుకైన మేధో కార్యకలాపాల వల్ల ఇది బలపడుతుంది.

    కృత్రిమ మేధస్సుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని వివియెన్ మింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక చురుకుదనం తగ్గిపోతే, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరించారు.

    మెక్‌గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. దారి తెలుసుకోవడానికి తరచుగా జీపీఎస్‌పై ఆధారపడిన వారిలో, స్వయంగా దారి గుర్తించే స్థల అవగాహన జ్ఞాపకశక్తి బలహీనంగా కనిపించింది.

    అలాగే, ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన చిన్న అధ్యయనంలో.. పెద్ద భాషా నమూనాలను ఉపయోగించి రచనలు చేసిన వారిలో, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారితో పోలిస్తే మెదడు నాడీ అనుసంధానం బలహీనంగా కనిపించిందని వెల్లడైంది. అంతేకాదు, తాము ఇప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారని అధ్యయనం తెలిపింది.

  • బ్రస్సెల్స్‌: అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని హామీలను ఇరాన్ పాటించకపోతే మళ్లీ సైనిక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ గురువారం తెలిపారు. నాటో రక్షణ మంత్రుల సమావేశం అనంతరం బ్రస్సెల్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

    ఒప్పందం అమలు, చర్చల సమయంలో ఇరాన్ నిబంధనలు పాటించకపోతే ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. "ఈ చర్చల గడువులో ఇరాన్ చెప్పినట్టు చేయకపోతే, మేము మళ్లీ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటామని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నిబంధనలు పాటించకపోతే, అత్యంత కఠినమైన సముద్ర దిగ్బంధనాన్ని మళ్లీ అమలు చేసే సామర్థ్యం మాకు ఉంది" అని పీట్ హెగ్‌సెత్ అన్నారు.

    అమెరికా-ఇరాన్‌ మధ్య 3 నెలలకు పైగా సాగిన ఘర్షణలకు ముగింపు పలికే లక్ష్యంతో ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆ ఒప్పందంలో శత్రుత్వానికి ముగింపు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభించడం వంటి అంశాలు ఉన్నాయి.

    ఇరాన్‌ బాధ్యతగా వ్యవహరిస్తేనే.. 
    ఇరు పక్షాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ ఒప్పందం ద్వారా లభించే ఆంక్షల సడలింపు, ఇతర ప్రయోజనాల వంటివి ఇరాన్ తన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే అమల్లోకి వస్తాయని అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

    తాజా వ్యాఖ్యలతో, ఒప్పందం అమలు సమయంలో ఇరాన్ చర్యలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా పరిశీలించనున్నట్టు మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ ఒప్పందాన్ని "పనితీరు ఆధారిత ఒప్పందం"గా పేర్కొంటున్నారు. ఇందులో ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల, ఇతర చర్యలు అన్నీ ఇరాన్‌ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటాయి.

    అయితే ఇరాన్ నిధుల విడుదల, సముద్ర ఆంక్షల సడలింపు వంటి హామీలను ఏ క్రమంలో అమలు చేయాలనే విషయంలో రెండు పక్షాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. ఘర్షణల సమయంలో హార్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయి. అనేక నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వచ్చింది.

    ఈ ఒప్పందంతో ఆ ప్రాంతంలో సముద్ర రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని వాషింగ్టన్ భావిస్తోంది. అదే సమయంలో ఇరాన్ ఒప్పంద నిబంధనలు పాటించకపోతే, సైనిక, ఆర్థిక ఒత్తిడిని మళ్లీ తీసుకురావచ్చని అమెరికా స్పష్టం చేసింది.

  • మాస్కో: సంవత్సరాలుగా దాడులు కొనసాగుతున్నా.. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. తాజాగా వందలాది డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో, పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ దాడులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.  

    గత నెల రోజులుగా ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులను తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటోంది. గురువారం మాస్కోలోని కపోట్న్యా రిఫైనరీపై అతి పెద్ద డ్రోన్ దాడి జరిగింది. క్రెమ్లిన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. డ్రోన్ శకలాలు భవనాలపై పడటంతో సమీపంలోని షాపింగ్ సెంటర్ తగలబడింది. అనేక నివాస భవనాలను ఖాళీ చేయించారు.

    రష్యా రాజధాని చుట్టూ దాదాపు 200 డ్రోన్లు దాడి చేశాయి. ఒక పేలుడు ధాటికి చమురు నిల్వ ట్యాంక్ మూత డజన్ల కొద్దీ మీటర్ల ఎత్తుకు ఎగిరింది. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ ప్రకారం, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి కారణంగా మాస్కో విమానాశ్రయాల్లో వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. 500కు పైగా విమానాలు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యమయ్యాయి.

    రష్యా ప్రతిస్పందన
    24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 1,000 డ్రోన్లు, నాలుగు ఉక్రెయిన్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ రోస్టోవ్ ప్రాంతంలోని ఒక చమురు డిపోపై దాడి జరగగా, ఒకరు మరణించారు.

     

     

    BIG: Ukraine launched its largest drone attack on Moscow in two years, with Russian officials saying air defenses intercepted 194 drones targeting the capital and 555 across Russia overnight. 

    The strikes damaged infrastructure, sparked fires, and temporarily disrupted flights… pic.twitter.com/4LGWeXGAfN

    — Clash Report (@clashreport) June 18, 2026

     ఉక్రెయిన్ సందేశం
    ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని, రష్యా దౌత్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌ స్కీ అన్నారు. గత వారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ భారీ డ్రోన్ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ దాడిలో ఒక ప్రధాన మతపరమైన ప్రదేశం అగ్నికి ఆహుతైందని తెలిపారు. ‘మాకు ఈ యుద్ధం వద్దు, ఎప్పుడూ వద్దు. ఉక్రెయిన్ తగలబడితే, మీ మాస్కో కూడా తగలబడుతుంది’అని జెలెన్‌స్కీ హెచ్చరించారు.

Movies

  • టాలీవుడ్‌లో పుకార్లకు కొదవలేదు. రోజూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అందులో చాలా వరకు తప్పులే అవుతాయి. తాజాగా మూడు పెద్ద సినిమాలపై ప్రచారాలు మొదలయ్యాయి. వాటిపై దాదాపు ఒకేసారి క్లారిటీ  కూడా వచ్చేసింది.  

    గతంలో మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్‌ సినిమాల తర్వాత రాజమౌళి- రామ్‌ చరణ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాజమౌళి సన్నిహిత వర్గాల ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి తదుపరి చేసే చిత్రంపై ఆలోచించే పరిస్థితిలో లేడట. సాధారణంగా తను చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌పై రాజమౌళి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి మహేష్‌ బాబుతో వారణాసి సినిమా పూర్తయిన తర్వాతే ఆయన నెక్ట్స్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక చరణ్‌తో సినిమా అనేది పూర్తిగా పుకారే.  


    బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన విశ్వంభరపై కూడా ఓ కొత్త రూమర్ మొదలైంది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే విశ్వంభర విడుదల అవుతుందనే ప్రచారం జరిగింది. దాంతో విశ్వంభర టీమ్ సభ్యులు దీన్ని ఖండించారు. డేట్ ఫిక్స్ చేయనప్పటికీ ఈ ఏడాదిలోనే విశ్వంభర విడుదల అవుతుందని వారు స్పష్టత ఇచ్చారు.  


    ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా కథ, స్క్రీన్‌ప్లేలో మార్పులు జరుగుతున్నాయని, ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. అయితే ఈ సినిమా యూనిట్‌లో కొందరు వ్యక్తులు ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని తెలిపారు.  

  • సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దివిజ సోదరుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు.

    (ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)

    ఈ చిత్ర నిర్మాత, ఫోక్ సింగర్ కోమలి మాట్లాడుతూ.. నాకంటూ ఒక  గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక  ధ్యేయంతో చాలా ఒడుదుడుకులని  ఎదుర్కొని వెంకట్రామయ్య గారి తాలూకా మూవీని పూర్తి చేసాం. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని కష్టాలు ఎదుర్కుని జులైలో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని చెప్పింది.

    సినిమా విషయానికొస్తే.. అందమైన పల్లెటూరులో వెంకట్రమయ్య అనే పరువు గల కుటుంబంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బుతో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా ఇది అని దర్శకుడు సతీష్ ఆవాల చెప్పాడు.

    (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు)

  • లవ్ సింబల్ పోజులిచ్చిన అనన్య నాగళ్ల

    చీరలో కనువిందు చేసిన మృణాల్ ఠాకుర్

    మేకప్ లేకుండా ఈషా రెబ్బా క్యూట్‌నెస్

    క్లాస్ లుక్‌లో మెస్మరైజ్ చేసిన మృణాల్

    వయ్యారాలు ఒలకబోస్తున్న సీరత్ కపూర్

    కలర్‌ఫుల్ డ్రస్‌లో రెజీనా సోయగాలు

  • మరో వీకెండ్ వచ్చేసింది. 'పెద్ది' జోష్ తగ్గిపోయింది. అందుకు తగ్గట్లే సమంత 'మా ఇంటి బంగారం', వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', దీవానా లాంటి తెలుగు సినిమాలతో పాటు బాలన్, వంద దేవుళ్లు, కాక్‌టెయిల్ 2 లాంటి డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజే 16కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

    (ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)

    ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే దృశ్యం 3 అందుబాటులోకి రాగా, అతిరథి, రేజర్, ధురంధర్ 2, ఎమ్4ఎమ్ చిత్రాలతో పాటు సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఏమైనా సడన్ సర్‌ప్రైజులు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?

    ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 19)

    హాట్‌స్టార్

    • సేవ్ ద టైగర్స్ 3 - తెలుగు డబ్బింగ్ సిరీస్

    • అతిరథి - తెలుగు డబ్బింగ్ మూవీ

    • తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 - హిందీ సిరీస్

    ఆహా

    • రేజర్ - తెలుగు సినిమా

    • థ్యాంక్యూ సుబ్బారావ్ - తెలుగు మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

    • ధైర్యే సాహసే అమృత - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

    అమెజాన్ ప్రైమ్

    • మనితన్ దైవమగళం - తమిళ మూవీ

    • గిన్నీ వెడ్స్ సన్నీ 2 - హిందీ చిత్రం

    • దృశ్యం 3 - తెలుగు డబ్బింగ్ సినిమా (‍ఆల్రెడీ స్ట్రీమింగ్)

    నెట్‌ఫ్లిక్స్

    • ధురంధర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా

    • వాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే - ఇంగ్లీష్ మూవీ

    • హస్బెండ్స్ ఇన్ యాక్షన్ - కొరియన్ సినిమా

    • ఒయాసిస్ - ఇంగ్లీష్ సిరీస్

    • ఐ విల్ ఫైండ్ యూ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

    సన్ నెక్స్ట్

    • ఆషాన్ - మలయాళ మూవీ

    లయన్స్ గేట్ ప్లే

    • ఎమ్4ఎమ్ - తెలుగు సినిమా

    • ఆలియా బసు గాయబ్ హై - హిందీ మూవీ

    • మ్యాచ్ పాయింట్ - ఇంగ్లీష్ సినిమా

    ఆపిల్ టీవీ ప్లస్

    • షుగర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

    మనోరమ మ్యాక్స్

    • గు - మలయాళ సినిమా

    ఎమ్ఎక్స్ ప్లేయర్

    • అబ్ హోగా హిసాబ్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

    (ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్)

  • 'సలార్' సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రస్తుతం మహేశ్-రాజమౌళి 'వారణాసి'లో విలన్‌గా చేస్తున్నాడు. ఇతడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చాన్నాళ్ల క్రితమే పూర్తయింది. అదొచ్చేలోపు పృథ్వీరాజ్ హీరోగా చేసిన ఓ మూవీ విడుదలకు సిద్ధమైంది. 'ఐ, నోబడీ' పేరుతో దీన్ని తీయగా.. వచ్చే నెల 9న తెలుగు, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.

    (ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)

    ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ బట్టి చూస్తే ఇది డబ్బు చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్. ప్రభుత్వ ఉద్యోగం చేసే రాజీవ్(పృథ్వీరాజ్) ఓ డబ్బు వివాదంలో ఇరుక్కుంటాడు. దీంతో విలన్, పోలీసులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? దీనికోసం అంతమంది ఎందుకు వెతుకున్నారు? ఇంతకీ రాజీవ్ ఎవరు? అనేది స్టోరీలా అనిపిస్తుంది. పార్వతి తిరువత్తు హీరోయిన్. నిషాం బషీర్ డైరెక్టర్. పృథ్వీరాజ్ భార్య సుప్రియ ఓ నిర్మాత. ట్రైలర్ చివరలో 'మీ నాన్నతో ఫైట్ చేసిన వాళ్లెవరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు' అనే డైలాగ్ మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.

    (ఇదీ చదవండి: 'పుష్ప' కాన్సెప్ట్‌తో ధనుష్ సినిమా.. టీజర్ రిలీజ్)

  • ఎర్రచందనం గుర్తుకురాగానే చాలామందికి 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే దీని స్మగ్లింగ్ గురించి చాలానే చూపించారు. ప్రేక్షకులకు అది నచ్చింది కూడా. ఇప్పుడు ఈ తరహా కథతో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టీజర్ లాంటి వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఆకట్టుకుంటోంది.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

    శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా 'అమరన్' సినిమా తీసిన రాజ్ కుమార్ పెరియసామి.. ప్రస్తుతం ధనుష్‌తో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఓం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడిస్తూ రెండున్నర నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎర్రచందనం కొట్టడానికి అడవిలోకి వెళ్లిన కొందరు కూలీలు.. ఫారెస్ట్ అధికారులకు దొరికిపోతారు. ధనుష్ వచ్చి వీళ్లని కాపాడుతాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి.

    'పుష్ప'తో పోలికేం లేదు గానీ ఎర్రచందనమే ఇందులోనే కీలకంగా ఉండనుందని అయితే అర్థమవుతోంది. ఓం: ఛాప్టర్ 1 (ఉదిరం: ద బ్లడ్ వుడ్) పేరుతో ఈ సినిమా రాబోతుంది. అంటే దీనికి మరిన్ని భాగాలు కూడా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఈ మూవీలో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబరు 16న మూవీ థియేటర్లలోకి రానుందని కూడా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)

  • మెగా ఫ్యాన్స్‌ని భయపెట్టిన దర్శకుల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు శంకర్. గతంలో ఒకే ఒక్కడు, జెంటిల్మన్, రోబో లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన ఈయన.. గత కొన్నేళ్లలో దారుణమైన డిజాస్టర్స్ అందుకున్నాడు. రామ్ చరణ్‌తో తీసిన 'గేమ్ ఛేంజర్', కమల్ 'ఇండియన్ 2' ఫలితాల దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాంటి ఈయన వారసుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

    డైరెక్టర్ శంకర్‌కి ముగ్గురు పిల్లలు. అందులో ఇదరమ్మాయిలు. పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఇప్పటికే పెళ్లయిపోయింది. తర్వాత పుట్టిన అదితీ ఇప్పటికే హీరోయిన్‌గా సినిమాలు చేసింది. కార్తీ, శివకార్తికేయన్ లాంటి హీరోలతో కలిసి పనిచేసింది. 'భైరవం' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. వీళ్ల తర్వాత పుట్టిన కొడుకు అర్జిత్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

    'లవర్ బాయ్' పేరుతో ఓ సినిమా ప్రారంభమైంది. కృతి శెట్టి హీరోయిన్. చెన్నైలో గురువారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అశోక్ కుమార్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. జన నాయగణ్, టాక్సిక్, చిరు-బాబీ సినిమాలని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    (ఇదీ చదవండి: 'సేవ్ ది టైగర్స్ 3' రివ్యూ.. ఈసారి కూడా నవ్వులే)

  • 'యాత్ర' సినిమాలు తీసిన మహి వి రాఘవ్ నుంచి వచ్చిన 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే రెండు సీజన్లు రిలీజ్ కాగా అవి బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సీజన్ తీసుకొచ్చేశారు. ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సీజన్ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    రాహుల్ (అభినవ్ గోమఠం) తనకు ఇష్టం లేకపోయినా బెంగళూరు వెళ్లి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇది పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కి వస్తాడు. జాబ్ పోయిన సంగతి తన భార్య మాధురి(పావని గంగిరెడ్డి)కి చెప్పకుండా దాచేస్తాడు. గంటా రవి (ప్రియదర్శి) ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృథాగా ఖర్చు పెట్టి ఇంట్లో తిట్లు తింటూ ఉంటాడు. భార్య హైమా (సుజాత) పోరు భరించలేక గేటెడ్ కమ్యూనిటీలోకి వస్తారు. రేఖ (దేవియాని శర్మ) తన భర్త విక్రమ్ (చైతన్య కృష్ణ) నుంచి విడాకులు కావాలని కోర్టుకి వెళ్తుంది. కోర్టులో విక్రమ్.. తన భార్య రేఖ నుంచి భరణం కోరుతుంటాడు. ఇలా ఈ ముగ్గురూ కుటుంబ సమస్యలతో సతమతం అవుతుంటారు.

    ఈ పెళ్లిళ్ల కాన్సెప్ట్ పెట్టింది ఎవరు? పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పింది ఎవరు? స్వర్గంలో పెళ్లిళ్లు నిర్ణయించబడతాయని చెప్పింది ఎవరు? అని ఫ్రస్ట్రేషన్‌లో నానా బూతులు తిడుతుంటారు. ఇవన్నీ స్వర్గంలో ఉన్న ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వింటాడు. ఈ ముగ్గురి బాధ ఏంటో కనుక్కోండి.. వారి సమస్యకు పరిష్కారం చూపించండని గుప్తా (గుండు సుదర్శన్)కి ఇంద్రుడు ఆదేశాలు ఇస్తాడు. దీంతో ఆ గుప్తా ఈ మొదటి లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌లను.. రెండో లోకంలో ఉన్న గంటా రవి, విక్రమ్, రాహుల్‌ని మార్చేస్తాడు. రెండో లోకంలోకి వెళ్లిన ఈ త్రయం ఏం చేసింది? మొదటి లోకం వచ్చిన ఆ ముగ్గురు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    గతంలో వచ్చిన రెండు సీజన్లు సహజంగా ఉంటాయి. మూడో సీజన్‌కి వచ్చేసరికి కల్పితం ఎక్కువైంది. రెండు లోకాలు అనే కాన్సెప్ట్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు. ఈ లోకంలో లేని మనశ్శాంతి, ప్రశాంతత వేరే లోకంలో ఉంటాయని ఈ త్రయం వెళ్లడం.. అక్కడికి వెళ్లిన మొదట్లో అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. అయితే మెల్లమెల్లగా అక్కడి సమస్యలు వారికి అర్థం అవుతాయి. అసలు ఈ మార్పిడి కాన్సెప్ట్‌కి ఆ ముగ్గురు ఎందుకు ఒప్పుకున్నారో.. ఈ ముగ్గురికి తెలుస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు ఒక ఫేజ్‌లో నడుస్తాయి.

    ఇక్కడ ఉండే గంటా రవికి వేరే లోకంలో ఉండే గంటా రవికి చాలా తేడాలు ఉంటాయి. రూపాలు ఒకేలా ఉన్నా గుణాల్లో మాత్రం చాలా వ్యత్యాసం చూపించారు. ప్రజల కోసం పాటు పడాలనే ఆలోచన గంటా రవికి ఉంటే.. ప్రజల్ని దోచుకోవాలనే దుర్బుద్ది రెండో ప్రపంచంలోని గంటా రవికి ఉంటుంది. అలా ప్రతీ పాత్రకు పాజిటివ్, నెగెటివ్ చూపించారు. అవన్నీ మనలోనే ఉన్నాయని, నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మాత్రమే తీసుకోవాలనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు.

    మహిళా సాధికారత గురించి చెప్పే సీన్లు, భార్య అంటే భర్తకు బానిస కాదు అని వివరించే సీన్లు చాలా బాగున్నాయి. ఎంతగా నవ్విస్తారో.. అంతగా ఆలోచింపజేస్తారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్యత ఉండాలనే దాన్ని కూడా అభినవ్-పావని, చైతన్య-దేవియాని శర్మ పాత్రలతో చూపించారు. కొన్ని చోట్ల డైలాగ్స్ మితిమీరినట్లు అనిపిస్తాయి కానీ ఓటీటీ కాబట్టి సమస్యలా అనిపించదు. ఒకటి రెండు చోట్ల తప్పితే మిగతా సిరీస్ అంతా ఫ్యామిలీ కలిసి చూసేలా ఉంటుంది. ఓటీటీ కంటెంట్ అయినా కూడా ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావివ్వకుండా తీశారు.

    ఎవరెలా చేశారు?
    భర్తలుగా అభినవ్, చైతన్య కృష్ణ, ప్రియదర్శిలు ఈసారి కూడా ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరికీ రెండు రకాలుగా యాక్టింగ్ చేసే అవకాశం దొరికింది. దానికి న్యాయం చేశారు. భార్యలుగా సుజాత, దేవయాని శర్మ, పావని అద్బుతంగా నటించారు. మిగిలిన పాత్రధారులు కూడా నవ్వించారు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. క్రియేటర్ మహి.వి రాఘవ్ మరోసారి అదరగొట్టేశారు. ప్రదీప్ అద్వైతంతో కలిసి మళ్లీ హిట్ కొట్టారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం కూడా బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి.

  • హాలీవుడ్ ప్రముఖ నటి డేవీ ఛేజ్ చనిపోయింది. 35 ఏళ్ల వయసుకే ఈమె నూరేళ్లు నిండిపోయాయి. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డేవీ మృతి చెందినట్లు ఈమె మేనేజర్ జాన్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. మెనింజైటిస్ కారణంగా వచ్చిన సెప్సిస్‌తో ఈమె చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణానికి ముందు పోషకాహార లోపంతో ఆస్పత్రిలో చేరినట్లు ఈయన పేర్కొన్నారు.

    (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

    డేవీ ఛేజ్.. నాలుగేళ్లకే యాక్టర్‌గా మారింది. ఏడేళ్ల వయసులోనే హాలీవుడ్‌లో తొలి అవకాశం దక్కించుకుంది. అమెరికన్ సిట్‌కామ్ 'సబ్రినా ది టీనేజ్ విచ్' షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం డోనీ డార్కో, ఎస్ డార్కో చిత్రాల్లో నటించింది. అయితే 2002లో రిలీజైన హారర్ మూవీ 'ద రింగ్' మూవీలో సమారా మోర్గాన్ అనే పాత్రతో భయపెట్టింది. టీవీ నుంచి బయటకొస్తూ భయపెట్టే ఆ పాత్ర చాలామంది ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.

    2002లో రిలీజైన యానిమేషన్ మూవీ 'లిలో & స్టిచ్'లో లిలో పాత్రకు డబ్బింగ్ చెప్పి డేవీ గుర్తింపు అందుకుంది. పలు అవార్డులు కూడా ఈమెని వరించాయి. తర్వాత కాలంలో చార్మ్డ్, ఈఆర్, టచ్డ్ బై యాన్ ఏంజెల్ తదితర వెబ్ సిరీస్‌ల్లో అతిథి పాత్రలు చేసింది. బిగ్ లవ్ సిరీస్‌లో రొండా వోల్మర్ పాత్రలో 32 ఎపిసోడ్‌ల పాటు కనిపించింది. 2015 తర్వాత నటనకు పూర్తిగా దూరమైన డేవీ ఛేజ్.. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో ఇలా అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేసింది.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)

  • సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ.. ఏ భాషలో అయినా సరే నటీనటుల ప్రేమ పెళ్లిళ్ల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక ఒక్కటయ్యారు. ఇప్పుడు వీళ్ల బాటలో తమిళ సీరియల్ జంట ఏడడుగులు వేశారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

    (ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్)

    తమిళంలో ప్రసారమవుతున్న అయలి సీరియల్ ఫేమ్ ఆనంద్ సెల్వన్.. ఒన్నా ఇరుక్కు కత్తుక్కణం సీరియల్ ఫేమ్ షియామంత కిరణ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కోయంబత్తూరులో గురువారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. తమిళ సీరియల్ నటీనటులు చాలామంది విచ్చేశారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.

    2019లో వచ్చిన ఆయుధ ఎళుత్త సీరియల్‌లో ఆనంద్, షియామంత కలిసి నటించారు. ఇందులో ఆనంద్ హీరో కాగా షియామంత ఓ సహాయ పాత్ర చేసింది. ఇది చేస్తున్నప్పుడు ఇద్దరు మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆనంద్ కంటే షియామంత ఏడేళ్ల పెద్ద అని తెలుస్తోంది. అయినా సరే వయసు.. ఈ వివాహానికి అడ్డంకి కాలేదని మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

  • ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలంటే యమ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు చాలావరకు హైప్ తగ్గిందనే చెప్పొచ్చు. అయినా సరే ఎప్పటికప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. వచ్చే నెల 30న థియేటర్లలో రాబోతున్న చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండాయా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)

    మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్‌లో నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించడం, స్పైడర్ మ్యాన్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణం లాంటివి చూపించారు. ఈసారి వచ్చిన ట్రైలర్‌లో మాత్రం హల్క్‌తో పాటు మరికొందరితో స్పైడీ చేసే ఫైట్స్ చూపించారు. ఇకపోతే ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన టామ్, జెండాయా నిజజీవితంలో పెళ్లి చేసుకోవడం విశేషం.

    స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్)

  • హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో  నటిస్తున్న సినిమా గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై  యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో  సోషల్ సెటైర్‌గా  డైరెక్టర్  వైభవ్ కౌండిన్య ఈ చిత్రం తీస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా సిప్పు సిప్పు అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.

    శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ మాళవిక పాడింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తీస్తున్నారు.

  • వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో మరో చిత్రం రానుంది.  ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ కల్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కీర్తి సురేశ్‌ను హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రోజే అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్‌ లాంఛ్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహుర్తపు షాట్‌కు అల్లు అరవింద్  క్లాప్ కొట్టారు.

    ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేసిన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. హీరోయిన్ కృతి శెట్టి భుజంపై తన చేయి పెట్టి మరి మాట్లాడుతూ కనిపించారు. దర్శకత్వం వరకు ఓకే కానీ.. యంగ్ హీరోయిన్‌ భుజంపై చేతులు వేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీంతో హీరోయిన్‌తో ఆయన వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్‌ పేరున్న డైరెక్టర్‌ ఇలా వ్యవహరించడం సరికాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. r
     

     

National

  • ఫ్రాన్స్‌లో జరుగుతున్న వివాటెక్‌ 2026 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ కృత్రిమ మేధ (AI) భవిష్యత్‌పై తన విజన్‌ను వివరించారు. సాంకేతికత కొద్ది మందికే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయోగపడాలన్నదే భారత లక్ష్యమని ఆయన అన్నారు.

    భారత్‌ పెవిలియన్‌లో ప్రదర్శించిన 3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌, AI ఆధారిత ఆరోగ్య సేవల పరిష్కారాలు వంటి ఆవిష్కరణలను సందర్శకులు తప్పక చూడాలని సూచించారు. ముఖ్యంగా Amul రూపొందించిన ‘సార్లాబెన్’ అనే AI అసిస్టెంట్‌ను ప్రస్తావిస్తూ, ఇది మహిళా పాల ఉత్పత్తిదారులకు రోజువారీ పనుల్లో సహాయపడుతోందని చెప్పారు.

    భారత్‌లోని స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌తో ప్రపంచ టెక్‌ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మోదీ, దేశ డిజిటల్‌ విజయాలను గుర్తు చేశారు. DigiLocker ద్వారా 70 కోట్ల మందికి పైగా సేవలు పొందుతున్నారని, UPI ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల వేదికల్లో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు, ప్రత్యేకించి చంద్రయాన్‌ మిషన్‌ పేరును ప్రస్తావించారు.

     

  • న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ ద్వారా ఈ విషయాలు తెలిశాయి. టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసులో ఈ అఫిడవిట్ దాఖలైంది. పరీక్షా ప్రశ్నపత్రాల లీకులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత, ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని టెలిగ్రామ్ కోర్టును ఆశ్రయించింది.

    ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ అఫిడవిట్ సమర్పించింది. టెలిగ్రామ్‌ను ఎందుకు ప్రమాదకర వేదికగా భావిస్తున్నామో వివరించేందుకు ఈ ఆరోపణలను అఫిడవిట్‌లో పొందుపరిచింది. ఇందులో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రచారం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పరీక్షా ప్రశ్నపత్రాల లీకులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను ప్రస్తావించింది.

    "కొత్త డార్క్ వెబ్"గా మారింది.. 
    టెలిగ్రామ్ "కొత్త డార్క్ వెబ్"గా మారిందని, నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సంస్థలు, ఇతర ముప్పు కలిగించే వర్గాలు చట్ట అమలు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయని పేర్కొంది.

    లీకైన ప్రశ్నపత్రాలను పంపడం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు సహా విస్తృత స్థాయిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ప్రధాన వేదికగా మారిందని కేంద్రం ఆరోపించింది.

    "టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్‌గా మారి, ముప్పు కలిగించే వర్గాలను ఒకచోటకు చేర్చుతోంది. నేరగాళ్లు టెలిగ్రామ్ ఛానళ్లలో డీప్ వెబ్ లింకులను పంచుతూ, డార్క్ వెబ్ ఫోరమ్‌లకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల నేరగాళ్లను గుర్తించడం, వారి ఆచూకీ కనుగొనడం అధికారులకు కష్టమవుతోంది" అని కేంద్రం తెలిపింది.

    అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టెలిగ్రామ్‌లోని గోప్యత, అజ్ఞాతంగా ఉండే సౌకర్యాలు నేర ముఠాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. గోప్యత సెట్టింగ్‌ల ద్వారా ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ గుర్తింపు వివరాలు వంటి సమాచారాన్ని వినియోగదారులు దాచిపెట్టగలుగుతున్నారని, దీనివల్ల ఖాతాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోందని కేంద్రం తెలిపింది.

    "మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, పిల్లల దోపిడీ, సైబర్ మోసాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వినియోగం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గోప్యత సౌకర్యాలే" అని అఫిడవిట్‌లో పేర్కొంది.

    తీవ్రవాద సంస్థలకు చెందిన ప్రచార సామగ్రి, హింసను ప్రోత్సహించే విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది.

    "ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వర్గాలు టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా హింసాత్మక తీవ్రవాద చర్యలు, ఇతర తీవ్ర భావజాల ప్రచారాన్ని వ‍్యాప్తి చేస్తున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం వీటి లక్ష్యం" అని అఫిడవిట్‌లో తెలిపింది.

    పిల్లలపై లైంగిక దోపిడీ దృశ్యాల ప్రసారం 
    అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో ఒకటిగా.. పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రసారం టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా జరుగుతోందని కేంద్రం పేర్కొంది. సైబర్ నేరాలకు టెలిగ్రామ్ ప్రధాన కేంద్రంగా మారిందని కూడా అఫిడవిట్‌లో కేంద్రం ఆరోపించింది. తప్పుడు గుర్తింపు వివరాలతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆర్థిక మోసాలు చేయడం, డేటా లీకులు ప్రచారం చేయడం, సైబర్ నేరాలను సమన్వయం చేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపింది. జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదుల పోర్టల్ గణాంకాలను ప్రస్తావిస్తూ, సైబర్ మోసాలకు టెలిగ్రామ్ వినియోగంపై ఫిర్యాదులు బాగా పెరిగాయని కేంద్రం తెలిపింది.

    సైబర్ నేరాలు, అక్రమ నగదు చలామణి ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడానికి, బదిలీ చేయడానికి వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల కొనుగోలు, అమ్మకాలకూ టెలిగ్రామ్ ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. ఒక సందర్భంలో.. హానికర ఏపీకే దస్త్రాలు భద్రతా వ్యవస్థలకు గుర్తుపట్టకుండా కనిపించేలా చేసే సాధనాలను ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రచారం చేసిందని కేంద్రం తెలిపింది. మరో ఛానల్‌లో ఆర్థిక, చెల్లింపు సేవల పేర్లతో కనిపించే హానికర సాఫ్ట్‌వేర్ ప్రచారం జరిగిందని ఆరోపించింది.

    ఇప్పటికే లీకైన సమాచార నిల్వల నుంచి సేకరించిన మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పౌరులకు అందించేలా టెలిగ్రామ్ బాట్లు పనిచేస్తున్నాయన్న ఆందోళనను కూడా అఫిడవిట్‌లో వ్యక్తం చేసింది.

    సైబర్ నేరాలే కాకుండా, పైరసీ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ ఉన్న విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ ఛానళ్లు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు నష్టం కలుగుతోందని, మేధోసంపత్తి హక్కులపై ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొంది.

  • ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది.  కొందరు తమ ఇరవైలలోనే  తమ సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన  తోడు కోసం దశాబ్దాల తరబడి  వేచి ఉంటారు.  కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది  60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్‌తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో  తన పెళ్లి  గురించి గుర్తుచేసుకున్నారు.

    “నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక  సినిమాల్లో రాణించిన సుహాసిని,  ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.

    పేట్‌ మార్చిన  ఫేస్‌బుక్  మెసేజ్‌
    ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్‌బుక్‌లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్‌ (LHC)  భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్‌బుక్‌లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్‌ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది.  

    ఒక్క మెసేజ్‌
    వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు.  అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే,  ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం.  క్యాన్సర్ బారిన పడ్డ తన  భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.

    అలా కొన్ని రోజులు ఆన్‌లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట.  అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. 

    జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన  ప్రేమే మిన్న అని చాటి చెప్పారు. 

    ఎవరీ సుహాసినీ ములే
    సుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్‌లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు.  1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్‌గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది.

  • ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్‌ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.

    ఏం జరిగింది?
    ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్‌హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్‌ను పిలిచారు ప్రత్యర్థులు.  అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్‌, నాగేంద్ర సింగ్‌ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. 

    ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్‌ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు

    గతంలో కాంగ్రెస్‌లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు.  భరత్‌ సింగ్‌కు ఇసుక మైనింగ్‌లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్‌హట్, కైలాష్‌పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా  రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ  (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి : ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

    ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు. 

  • ,

    కర్ణాటకలోని దావెణగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) జిమ్‌లో వర్కౌట్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలిన ఘటన కలకలం రేపింది. అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతున్న ఈ యువ ప్రతిభావంతుడి మరణం అతని కుటుంబానికి, క్రీడా సమాజానికి ,కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

     దావెణగిరిలో కేటీజే లేఅవుట్ నివాసి అయిన సుశీల్ కుమార్, అతను ప్రస్తుతం ఒక అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీకి సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లిన సుశీల్ కుమార్, రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు.  కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మార్గమధ్యలోనే గుండెపోటుతో అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.ఆసుపత్రిలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ తల్లి దేవమ్మ కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. శోక సంద్రంలో ముగినిపోయిన ఆమె  ఇక తనకు దిక్కెవరంటూ  గుండెలవిసేలా రోదించిన తీరున పలువురి కంట కన్నీరు తెప్పించింది.(రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)

    కాగా జిమ్‌ చేసే సమయంలో యువత  వైద్యుల సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కండలు పెంచే క్రమంలో మత్తుమందులు, స్టెరాయిడ్స్‌ లాంటి వాటి వాడకంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన ఆహారం, వైద్య పరీక్షలు, అధిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయడం ఉత్తమ మంటున్నారు.

     ఇదీ చదవండి : ఎస్‌ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్‌ ఎస్టేట్‌ కింగ్‌ అయ్యాడు!

  • మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్‌ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. 

    శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. 

    మొత్తం తొమ్మిది మంది UBT లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్‌ ఠాక్రే సీరియస్‌గా తీసుకున్నారు.  హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

    అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.  అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. 

    మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్‌కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్‌) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్‌’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.

    రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్‌ ఎంపీగా అదే లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్‌ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.

    ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్‌ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.

    మరోవైపు,  ఉద్దవ్‌ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్‌సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్‌గా మారిదంటున్నారు.

Andhra Pradesh

  • అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రేగుపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.యలమంచిలి బైపాస్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే ప్రయానికులంతా బస్సు నుంచి దిగిపోయారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ బయటపడ్డారు. బస్సు యలమంచిలి బైపాస్ చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

    మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ , సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది.  కాగా ఈ ప్రమాదంలో తులసీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.  

     

  • సాక్షి,కృష్ణలంక: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో పార్టీ తరుపున న్యాయపరంగా అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్‌18) సాయంత్రం కృష్ణ లంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ సాయి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. సాయి అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు. 

    ప్రతి ఒక్కరూ ఆలోచించాలి:
    ‘‘ విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే చంద్రబాబు నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీపరిధి. ఇదే పరిధిలోనే ఈ పోలీసు స్టేషన్‌ ఉంది. ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోనే నా పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెప్తూ రోదిస్తున్న దృశ్యం. ప్రతీ ఒక్కరినీ ఒకటో ఆలోచన చేయమని అడుగుతున్నా.

    చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. ఇదే పోలీసు స్టేషన్‌ కమిషనరేట్, ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకువస్తున్నారని చెప్పడానికి నిదర్శనం ఇది.

    మే నెలలోనే రెండు ఘటనలు:
    మే మాసంలో ఒక ఘటన కాదు. సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్‌ అనే మరో పిల్లాడిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్‌ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది.

    ‘నీ కొడుకు ఫోటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు:
    ఆరోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’.. అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి ప్రతీ రోజూ తనకు సమాచారం అందే కొద్దీ, ఆ స్టేషన్‌లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అర్దమై అదే పోలీసు స్టేషన్‌ కు ప్రతీ రోజూ వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. జరిగిన ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్‌ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్‌ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.

    సాయికృష్ణను చంపినట్లు ఒప్పుకున్నారు:
    అప్పుడు కచ్చితంగా నా కొడుకుకు ఏదో జరిగిందని ఆ తల్లికి అర్దమై జూన్‌ 2న హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది. నా కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని పిటిషన్‌ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకుని మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐని సస్పెండ్‌ చేశారు. ఆ సీఐని ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పగలరా? చంపేశాడనే కదా సీఐని సస్పెండ్‌ చేసింది. అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే ఆ సీఐ పరిధిలోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ ను కాపాడుతూ డీజీపీ.. మొత్తం అందరికీ తెలిసి స్టేషన్లో జరిగిన ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ, కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని, వీడియో ద్వారా తన మెసేజ్‌ ను తెలియజేసిన పరిస్ధితి. నేను ఒకటే చెప్తున్నాం. సస్పెన్షన్‌ అంటే ఏంటి?. టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే హత్య చేస్తే, గోళ్లు పీకి చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్‌ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.

    తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా?:
    ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే.. ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ ను, డీజీపీని మర్డర్‌ కేసు పెట్టి ఛార్జ్‌ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్‌ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది. ఆ పిల్లాడి వయసెంత 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో కొద్దో గొప్పో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్‌ చేయమని సమన్‌ చేసింది. వీళ్లు చేయాల్సింది ఏంటి ? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్‌మిట్‌ చేయడం. అది పోలీసులు చేయాల్సిన పని. ఆ పిల్లాడు తప్పు చేసాడా, లేదా అన్నది ఆర్గుమెంట్‌ చేసి నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది.

    సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే:
    కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమైన పరిస్ధితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పోలీసు అధికారులు వీళ్లకు వత్తాసు పలుకుతుంటే, సీఐ దగ్గరి నుంచి, ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్‌ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తురుపు చర్యలు చేపట్టి కేవలం సస్పెన్షన్‌ తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడుతుంది. ఫుల్‌ స్టాప్‌ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీదు ఎందుకు మీరు యాక్షన్‌ తీసుకోవడం డిలే జరిగింది, సస్పెన్షన్‌ మాత్రమే చేసి టెంపరరీగా ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇది ఒక్కరితో కాదు, సిస్టమేటికా జరుగుతున్న ఈ క్రై మ్‌ లో సీఐ ఒక్కడే కాదు ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్‌ అయి ఉన్నారు. అందుకే సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్‌ చేస్తున్నాం. డిమాండ్‌ చేయడమే కాకుండా న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.

    అసలు ఏ చర్యా లేదు.కేవలం కంటితుడుపు మాత్రమే:
    ఇదంతా ఎంత కంటితుడుపు చర్య అంటే, అసలు యాక్షనే తీసుకోలేదు. మే 9వ తారీఖు నుంచి రెండు మర్డర్‌ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్‌ లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారంటే, ఏ విధంగా వీళ్లంతా క్రై మ్‌ ను బయటికి రాకుండా చేస్తున్నారో, ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్‌ ఛార్జ్‌ లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట. కమిషనర్‌ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్‌ అయి ఈ క్రై మ్‌ చేయించారని కనిపిస్తా ఉన్న పరిస్ధితుల్లో ఓ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్లు ఎంక్వైరీ చేయడానికి బాధ్యత అప్పగించారంట. అంటే ఏ రకంగా వీళ్లు లా అండ్‌ ఆర్డర్‌ తో చెలగాటం ఆడుతున్నారు, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం.

    అందుకే సీబీఐ దర్యాప్తు కావాలి:
    నేను ఒకటే చెప్తున్నాను. ఇది కచ్చితంగా సీబీఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సీఐ దగ్గరి నుంచి ఏసీపీ దగ్గరి నుంచి, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి ఎలా కాపాడుతున్నారు, ఎందుకు రోటీన్‌ పద్ధతిలో ఇలాంటి లాకప్‌ డెత్‌ లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ రావాల్సిందే ’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 

  • సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.

    మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు. ఆధారాలతో సహా మేం చెబుతున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేపర్ సెట్ చేసిన దగ్గర్నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ అంతా అక్రమమే. డీఎస్సీని పూర్తయ్యాక మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం ఆవనాయితీ కానీ ఎక్కడా మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదు.ఆరోపణలు విమర్శలు వచ్చాక లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టారు. నేనే సాక్ష్యం. స్వయంగా నేను నలుగురు డీఈవోలతో మాట్లాడా.

    తప్పు జరగనప్పుడు దాపరికం దేనికి. ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇలా చేశారు. పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. క్లబ్‌లలో ఆడే పేకాట బ్రిడ్జి గేమ్‌ను కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారు. బ్రిడ్జి గేమ్‌ను గత ప్రభుత్వం పెట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయండి. అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. సీబీఐ విచారణతోనే అక్రమాలు బయటపడతాయి. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. సమగ్రవిచారణ జరిపించాలని గవర్నర్ ను కోరాం. విద్యార్ధుల భవిష్యత్, మనోభావాలాతో ఆడుకోవద్దని ఒక సెక్షన్ మీడియాను కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై ఎలాంటి నమ్మకం లేదు.

    అవసరమైతే అధికారులు రండి. మేం చర్చకు సిద్ధం. సిబిఐ విచారణ జరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తాం. లోకేష్‌వి పిల్ల చేష్టలు. మంత్రిగా ఉండి లోకేష్ మాట్లాడే మాటలు సరికాదు. మీ ఇంటికొస్తాం..మాకు 200 మీటర్లేనని లోకేష్ మాట్లాడుతున్నారు. గతంలో ఇదే మాట మాట్లాడిన జోగి రమేష్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు.

    గవర్నర్ ఇంటి ముందే మేం ఉన్నాం..రమ్మనండి లోకేష్‌ని. అవగాహనలేని మాటలతో చేసేవన్నీ పిల్లచేష్టలే.మేం మొదటి నుంచి మంత్రి లోకేష్ ను డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ పై స్పందించాలని కోరాం. ఇన్నాళ్లకు లోకేష్‌ గుర్తొచ్చిందా. 2004లో మంత్రిగా ఉన్న నాపై వోక్స్ వ్యాగన్ డబ్బులు తినేశారని ఆరోణలు వచ్చాయి. సీబీఐ విచారణ జరిపించాలని మేమే కోరాం. ఆరోజు సిబిఐ విచారణ జరిగింది కాబట్టే మేం ఆరోపణల నుంచి బయటపడ్డాం. అందుకే డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ కోరుతున్నాం. లాకప్ డెత్ ..విషయంలో పార్టీలు కాదు..మానవత్వం చూడాలి. ఒక అధికారిని బలిచేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఈ హత్యకు కారకులైన అందరినీ శిక్షించాలి. గాదె సాయికృష్ణ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి’అని డిమాండ్‌ చేశారు. 

  • సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

    అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును  చూపించమని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. 

    ..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్‌గా నిలబడ్డాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్‌ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్‌  చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం  అతన్ని కేవలం సస్పెండ్‌ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్‌కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్‌  చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ  పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై  సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌  చేశారు.

    ‘‘కంటితుడుపుగా సీఐ  నాగారాజును మాత్రమే సస్పెండ్‌ చేశారు. ఈ క్రైమ్‌లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్‌ కేసు  పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
     

    LIVE: YS Jagan గాదె సాయికృష్ణ ఇంటికి..
  • విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర‍్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్‌ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్‌తో పాటు కాల్‌డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. 

    కాగా, గాదె సాయి కృష్ణ లాకప్‌ డెత్‌కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. 

    ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు.

  • సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్‌లో సాయికృష్ణను పోలీసులు కొట్టారని, ఈ దారుణాన్ని తానే ప్రత్యక్షంగా చూశానంటూ మహంకాళి చందు అనే యువకుడు వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.  

    సాయిని లాకప్‌లో దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు నేను చూశాను. నేను లాకప్‌లో ఉన్నప్పుడే చిత్ర హింసలు పెట్టారు.అరెస్ట్ చేస్తే కోర్టులో పెట్టాలి. కానీ 6 టౌన్ పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. ఆ రోజు సాయితో వచ్చినవాళ్లందరిని బయటకు పంపించారు. ఎందుకు బయటకు పంపించారు. సాయిని ఏం చేయాలని పంపించారు’అని ప్రశ్నించారు. 

    నేను కూడా లాక్అప్లోనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షి షాకింగ్ నిజాలు
  • సాక్షి, విశాఖపట్నం: ఐదు రోజులపాటు ఏపీ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతుందని సముద్ర వాతావరణం అలజడిగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా తీరంలో ఐదు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వేపాడలో 9సెంమి అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

    మరోవైపు, భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్‌ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్‌ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

    ఎల్‌ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సూచించారు. ఖరీఫ్‌–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

    ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు

    వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్‌ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.   

     

  • సాక్షి,కృష్ణ: ప్రశాంతంగా ఉండే విజయవాడ నగరం.. గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంచలనం సద్దుమణగక ముందే.. కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుపై మరో తీవ్ర ఆరోపణ వెలుగులోకి వచ్చింది. 

    గతంలో క్రాంతికుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. తన ఆత్మహత్యకు సీఐ నాగరాజే కారణమంటూ క్రాంతికుమార్ మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒకే పోలీస్ అధికారిపై వరుసగా ఇద్దరు యువకుల మరణాలు, అదృశ్యాలకు సంబంధించిన ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. 

    సీఐ నాగరాజు నిరంతర వేధింపుల వల్లే క్రాంతికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలిచిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైన క్రాంతికుమార్.. విష గుళికలు మింగి తనువు చాలించాడు. ఈ ఘోరానికి సంబంధించి మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్పట్లోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    ఎవరీ సీఐ నాగరాజు
    విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు పనిచేశారు. ఇద్దరు యువకుల (గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్) అదృశ్యం, మరణం కేసులలో తీవ్రమైన వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    గాదె సాయికృష్ణ (25) అనే యువకుడిని మే 9, 2026న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆచూకీ పూర్తిగా గల్లంతైంది. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో దారుణంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ హింస భరించలేకే అతను కస్టడీలోనే మరణించి ఉంటాడని (లాకప్ డెత్) అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ వ్యవహారంపై బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, జూన్ 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

    ఇదే క్రమంలో క్రాంతికుమార్ అనే మరో యువకుడి మృతి కూడా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కృష్ణలంక పోలీసులు తనను స్టేషన్‌కు రావాలని పిలవడంతో తీవ్ర ఆందోళనకు గురైన క్రాంతికుమార్ విష గుళికలు (పురుగుల మందు) మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    చనిపోయే ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో ఇటీవల బయటపడింది. ఆ వీడియోలో క్రాంతికుమార్ స్పందిస్తూ... ‘కృష్ణలంక సీఐ నాగరాజు మూడు నెలలుగా నన్ను వేటాడుతూ, కొడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. నా చావుకు ఆయనే కారణం’ అని స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ రెండు వరుస ఘటనలకు సీఐ నాగరాజు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్‌ సమావేశమయ్యారు. 

    ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్‌ జగన్‌ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.

    మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే. క్యాలెండర్‌ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు. 

    మనం రాకముందు ఎలా ఉండేవి? 
    గత వైఎస్సార్‌సీపీ పాలనను వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం. 

    వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం. 

    కురుపాలంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం. 

    ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్‌ ఇచ్చేవేకావు.. జగన్‌కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.

    చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపు
    మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. 

    జగన్ 2.0 చీకటిపై దండయాత్ర..

    చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్‌ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.

    చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు.  రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్‌ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్‌ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు.  

    కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు.

  • సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్‌పై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారు. ఫోరెన్సిక్, డీఎన్‌ఏ సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు, సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు.

    కమాండ్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సీపీ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలి. విజయవాడలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి, మాఫియాల కొమ్ముకాస్తూ ప్రైవేట్ సెటిల్‌మెంట్ సిండికేట్ నడుపుతున్నారు. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, హత్యపై సెక్షన్ 176(1A) కింద తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరారు. 

  • సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్‌ చల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

    తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.

    మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

  • సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు గురువారం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    మృతిపై అనుమానాలు ఉన్నాయి..
    ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తల్లి సత్యవతి.. తమ కుమార్తె మరణానికి సంబంధించి తమకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత లేదని, అందుకే పోలీసుల జోక్యం కోరుతున్నామని తెలిపారు. తన అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమకు అందిన సమాచారం, శ్రీచరణ్‌ చెప్పిన కారణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరారు. తన కూతురుతో తమ అల్లుడు సరిగా కలిసి ఉండే వారు కాదని అన్నారు. తమ కూతురికి మద్యం సేవించే అలవాటు లేదు. గాయత్రిపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు. రిషికేశ్, హరిద్వార్ వెళ్తున్నామని చివరి సారిగా నాకు చెప్పింది. విహారయాత్ర ముగించుకొని విశాఖకు వస్తానని చెప్పింది. విశాఖకు రాకుండానే నా కూతుర్ని హతమార్చారు. విశాఖకు వచ్చిన తర్వాత రెండు నెలలు వర్క్‌ ఫ్రం హోం పెట్టి ఇక్కడే ఉంటాను అని చెప్పింది. మాది సాంప్రదాయమైన కుటుంబం అని ఆవేదన వ్యక్తం చేశారు

    అల్లుడిపైనే అనుమానం, రాధా గాయత్రి మృతిపై మరో ట్విస్ట్‌

    సీపీ కార్యాలయంలో ఫిర్యాదు..
    గాయత్రి తల్లిదండ్రులు సీపీ కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అవసరమైతే సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ముస్సోరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి మృతి వెనుక అసలు కారణాలేమిటి? కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆధారాలున్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కీలకంగా మారింది.

Telangana

  • సాక్షి, రంగారెడ్డి జిల్లా: పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతంలో నిర్వహించిన వనమహోత్సవం–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

    వనమహోత్సవాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం 1950లో ప్రజా ఉద్యమంగా ప్రారంభించిందని గుర్తు చేసిన మంత్రి, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వనమహోత్సవాన్ని మహా ప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గత రెండు సంవత్సరాలుగా వనమహోత్సవ కార్యక్రమాలకు అపూర్వ స్పందన అందించారని, "ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క" అనే ముఖ్యమంత్రి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ చైతన్యాన్ని పెంచి, పచ్చదనం పెంపు దిశగా సమాజాన్ని ప్రేరేపించిందని అన్నారు.

    మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కలలో 94 శాతం మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

    గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో సుమారు 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు లభించిందని, అనంతరం మొత్తం 424 ఎకరాల 31 గుంటల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించినట్లు తెలిపారు. ఇది తెలంగాణ అటవీ సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాగోల్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.

    రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. షెడ్యూల్ చేసిన సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు.

    సుమారు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ సర్వర్ నిర్వహణ పనుల ద్వారా సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం కావడం, సేవల నాణ్యత మెరుగుపడడం లక్ష్యమని ఐజీ వివరించారు.

    ప్రజలకు అసౌకర్యం తగ్గించేలా షెడ్యూల్
    జూన్ 26న మొహరమ్, జూన్ 28న ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో, మధ్యలో ఉన్న జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పని దినంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం అత్యల్పంగా ఉండేలా ఈ షెడ్యూల్ రూపొందించామని తెలిపారు.

    సేవలు పునఃప్రారంభం
    ప్రజలు తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

  • హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆశీర్వదిస్తేనే తాను సీఎం అయ్యానని రేవంత్‌ రెడ్డి అన్నారు. సీఎంగా ఎల్బీనగర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. తనకు తన సొంతూరు కొండారెడ్డిపల్లెలాగే ఎల్బీనగర్‌ అని చెప్పారు. ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో పార్క్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

    హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘కాలుష్య కోరల్లో ఢిల్లీ చిక్కుకుంది. హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావద్దనే మొక్కల పెంపకం చేపట్టాం. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే అడ‍్డుపడుతున్నారు. భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రాను తీసుకొచ్చాం. 

    పేదల జోలికి హైడ‍్రా వెళ్లదు, కబ‍్జాదారుల భరతం పడుతుంది. 2018 శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ కుట్ర వ‌ల్ల కొడంగ‌ల్‌లో ఓడిపోయిన‌ప్పుడు చాలా మంది ఇక ఏమీకాడ‌ని న‌వ్వుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ‌గా నిల‌బ‌డి మ‌ల్కాజ్ గిరి ఎంపీగా నాకు అవ‌కాశం ఇచ్చారు. ఆ నాడు ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు ఎల్‌బీ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 30 వేల మెజార్టీ ఇచ్చి ప్ర‌శ్నించే గొంతును నిల‌బెట్టారు. 

    పార్ల‌మెంటులో పార్టీ, ప్ర‌జ‌ల త‌రుపున గ‌ట్టిగా నిల‌బ‌డి కొట్లాడిన‌ప్పుడు సోనియా, రాహుల్ గాంధీ న‌న్ను గుర్తించి పీసీసీ అధ్య‌క్షుడిగా అవ‌కాశం ఇచ్చారు.ఈ ప్రాంతంలో రూ.2.400 కోట్ల‌తో 240 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. 

  • హైదరాబాద్‌: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు మూడు వారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వేలంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలికింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనని ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టలు స్టే విధించింది. 

    కాగా, రాయదుర్గం భూముల వివాదంపై ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ల్యాండ్ ఆక్షన్ చేసే సమయంలో SBIకి సమాచారం ఇచ్చామని తెలిపారు. మరో చోట ల్యాండ్ కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ ప్రపోజల్ కు SBI కూడా ఒప్పుకుందని అన్నారు. 7 రోజులు కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కావాలని అన్నారు. ఎకరానికి రూ.237 కోట్లు చొప్పున చెల్లించిన గౌరవ్ వెంచర్స్ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతుందని హైకోర్టు  ప్రశ్నించింది. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. నాలుగు దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. బీసీ సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

    పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని చేయాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. గత నాలుగు ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని.. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ నేతలు హెచ్చరించారు.

Politics

  • సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్‌ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.

    ‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్‌ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్‌ను ఇరికించాలని వైఎస్‌ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.

    రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్‌ డెత్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్‌ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని  కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.

  • సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.

    ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్‌ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే

    ..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్‌ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్‌బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి

    ..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్‌పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.

    ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Sports

  • వైభవ్ సూర్యవంశీ.. బిహార్ నుంచి వచ్చి తన సంచలన బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే బిహార్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం వెలుగులోకి వ‌చ్చింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించింది.

    ఈ చిచ్చర పిడుగు పేరు అక్షర గుప్తా. బిహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో అక్షర ఏకంగా అజేయ త్రిశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్‌లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధి బౌలర్లను అక్షర్ ఉతికారేసింది.  కేవలం 126 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 306 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

    తొలుత 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. మహిళల దేశీవాళీ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా అక్షర నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా (346) ఉంది. మరో 40 పరుగులు చేసి ఉంటే ఇరా గుప్తా రికార్డును అక్షర బ్రేక్ చేసి ఉండేది.

    ఎవరీ అక్షర గుప్తా?
    వైభవ్ సూర్యవంశీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అక్షర.. పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఆమె స్పెషాలిటి. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఆమె నాయకత్వం వహించింది. అంతేకాకుండా బిహార్‌ సీనియర్ జట్టుకు కూడా అక్షర్ ప్రాతినిథ్యం వహించింది. అయితే ఫిట్‌నెస్ పరంగా కూడా ఆమె కొంచెం మెరుగు పడాల్సి ఉంది.
    చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

  • టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కార‌ణం.

    అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌యాల‌నే చూసిన వైభ‌వ్.. కొన్ని సంద‌ర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

    కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భార‌త జ‌ట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా త‌న సేవ‌ల‌ను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయ‌న‌దే కీల‌క పాత్ర‌.

    "వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్ప‌టికే మైదానంలో చాలా సార్లు త‌న‌ స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట స‌మ‌యాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అత‌డికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయ‌ర్ కూడా త‌న కెరీర్ అంత‌టా ఒకే విధ‌మైన ఫామ్‌ను కొన‌సాగించ‌లేడ‌నే విష‌యాన్ని వైభ‌వ్ గ్ర‌హించాలి. 

    అతడు ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే..  తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. 

    ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్‌ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్‌ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్‌.

    ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.

    అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు
    గత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్‌గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్‌లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు.  వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. 

    దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. 

    ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. 

    ముఖ్యంగా ఫెయిలూర్స్‌ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్‌ను కేవలం టెక్నికల్‌గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు.
     

  • లండ‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలుత కివీస్‌ను బ్యాటింగ్ అహ్హానించాడు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వికెట్ కీపర్ బ్యాటర్‌ టామ్ బ్లండెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో కివీస్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్లండెల్ జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. ఆ తర్వాత నాథన్ స్మిత్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 

    280 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో న్యూజిలాండ్ కనీసం 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే రెండో రోజు ఆటలో మాత్రం ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు.  ఈ క్రమంలో 133 బంతుల్లో ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    అతడు సరిగ్గా 100 పరుగులు చేసి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు ఆటలో ఫిలిప్స్‌కు  కైల్ జేమీసన్ (41) కూడా  మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ జాకబ్‌ బెతల్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌,  మాథ్యూ ఫిషర్‌, బాకర్‌ తలా రెండేసి వికెట్లు చొప్పున సాధించారు.
    చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

  • భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 15 మంది స‌భ్యులతో కూడిన త‌మ జ‌ట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్ర‌కటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నాట్ స్లివర్-బ్రంట్ కెప్టెన్‌గా వ్యహరించనుంది.

    అదేవిధంగా అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, మాడీ విలియర్స్, గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్‌లకు తొలిసారి ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో చోటు దక్కింది.  వీరిలో గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఏ ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేయలేదు.

    142 ఏళ్లలో ఇదే తొలిసారి
    కాగా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుండి 13 వరకు లార్డ్స్ మైదానం వేదికగా జరగనుంది. అయితే లార్డ్స్‌ తన 142 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతకంటే ముందు ఇదే మైదానంలో జూలై 5న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. 

    ఈ చారిత్రత్మక టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ తమ జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశముంది. భారత్‌, ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్స్ చివరగా 2023లో రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి.

    భారత్‌తో ఏకైక టెస్టు కోసం ఇంగ్లాండ్ మహిళల జట్టు
    నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మాయా బౌచర్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, గ్రేస్ పాట్స్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్, మాడీ విల్లయర్స్, ఇస్సీ వాంగ్.
    చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

  • తెలంగాణలో ప్రతిష్టాత్మక టీ20 లీగ్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఆధ్వర్యంలో టీజీ20 పేరిట జూన్‌ 21 నుంచి జూలై 10 మధ్య షెడ్యూల్‌ ఖరారైంది. కరీంనగర్‌ డైమండ్స్‌, ఖమ్మం ఏసెస్‌, పాలమూరు స్ట్రైకర్స్‌, మెదక్‌ ఫాల్కన్స్‌, నల్గొండ నైట్స్‌, రంగారెడ్డి రైజర్స్‌, వరంగల్‌ వారియర్స్‌, హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.

    ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్‌ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

    ఏ జట్టులో ఎవరు? ధర ఎంత?
    కరీంనగర్‌ డైమండ్స్‌
    చందన్‌ సహానీ- రూ. 9.5 లక్షలు
    ఆశిష్‌ శ్రీవాస్తవ్‌- రూ. 9 లక్షలు
    తన్మయ్‌ అగర్వాల్‌- రూ. 8 లక్షలు
    రాహుల్‌ రాదేశ్‌- రూ. 4.5 లక్షలు
    రత్లావత్‌ దినేశ్‌- రూ. 4.5 లక్షలు
    హృషికేశ్‌ సింహ- రూ. 3.7 లక్షలు
    శుభం శర్మ- రూ. 3.5 లక్షలు
    మహ్మద్‌ అబ్దుల్‌ అద్నాన్‌- రూ. 3 లక్షలు
    ఎన్‌ సాత్విక్‌ రెడ్డి- రూ. 2 లక్షలు
    టీవీఎస్‌ నారాయణ తేజ- రూ. 2 లక్షలు
    అఖిల్‌ కుమార్‌ సంకోజు- రూ. 1.5 లక్షలు
    బి సతీశ్‌ కుమార్‌- రూ. లక్ష
    సాయి కార్తికేయ మల్లం- రూ. 95 వేలు
    నిహాల్‌ రెడ్డి- రూ. 75 వేలు
    ర్యాన్‌ బిన్‌ అబ్దుల్లా- రూ. 75 వేలు
    ఆశిష్‌ అభయ్‌- రూ. 75 వేలు
    రావూరి సాయి శరణ్‌- రూ. 75 వేలు
    పగడాల లోకేశ్‌- రూ. 75 వేలు
    యశ్‌ సత్వాలేకర్‌- రూ. 75 వేలు
    చిల్లకూరు లిఖిత్‌ రెడ్డి- రూ. 75 వేలు

    ఖమ్మం ఏసెస్‌
    చామా వ్రజేంద్ర మిలింద్‌- రూ. 17 లక్షలు
    హిమతేజ కొడిమెల- రూ. 8 లక్షలు
    మికిల్‌ జైస్వాల్‌- రూ. 6 లక్షలు
    అనంత్‌ ప్రతీక్‌ రెడ్డి- రూ. 3.75 లక్షలు
    సాకేత్‌ ధాత్రక్‌- రూ. 3.5 లక్షలు
    వఫీ కచ్చి- రూ. 3.25 లక్షలు
    ఖుష్‌ అగర్వాల్‌- రూ. 3 లక్షలు
    మయాంక్‌ గుప్త- రూ. 3 లక్షలు
    జీఎస్‌కే రెడ్డి- రూ. 1.8 లక్షలు
    విద్యానంద రెడ్డి ఎల్లాల- రూ. 1.7 లక్షలు
    మహేశ్‌ విప్రాలా- రూ. 1.3 లక్షలు
    షేక్‌ అజర్‌- రూ. లక్ష
    బద్ది విశాల్‌ యాదవ్‌- రూ. 85 వేలు
    సబవేత్‌ లోక్‌నాథ్‌ నాయక్‌- రూ. 75 వేలు
    మగవత్‌ సిద్ధు నాయక్‌- రూ. 75 వేలు
    పారస్‌ రాజ్‌- రూ. 75 వేలు
    వేద్‌ రెడ్డి అమిస్తాపురం- రూ. 75 వేలు
    వివేక్‌ సింగ్‌- రూ. 75 వేలు
    సహేంద్ర మల్లు- రూ. 75 వేలు
    ఆవేజ్‌ అహ్మద్‌- రూ. 75 వేలు

    పాలమూరు స్ట్రైకర్స్‌
    రవి కిరణ్‌ మేజేటి- రూ. 13 లక్షలు
    ప్రజ్ఞయ్‌ రెడ్డి- రూ. 11 లక్షలు
    రోహిత్‌ రాయుడు కొలగాని- రూ. 6.5 లక్షలు
    ప్రతీక్‌ పవార్‌- రూ. 4.25 లక్షలు
    పీఎస్‌ చైతన్య రెడ్డి- రూ. 3.25 లక్షలు
    అనుముల విజ్ఞేశ్‌ రెడ్డి- రూ. 3 లక్షలు
    ఎ. పృథ్వీ రెడ్డి- రూ. 3 లక్షలు
    నిశాంత్‌ సేన్‌ రెడ్డి సీఎహెచ్‌- రూ. 2.3 లక్షలు
    మహ్మద్‌ ఆఫ్రిది అహ్మద్‌- రూ. 2.3 లక్షలు
    రిషభ్‌ బస్లాస్‌- రూ. 2 లక్షలు
    ఎం సంహిత్‌ రెడ్డి- రూ. 2 లక్షలు
    షేక్‌ అబ్దుల్‌ జీషాన్‌- రూ. లక్ష
    అశ్వద్‌ రాజీవ్‌- రూ. 95 వేలు
    బూడిది రతన్‌ తేజ- రూ. 80 వేలు
    కరణ్‌ యాదవ్‌- రూ. 75 వేలు
    మణికంఠేశ్వర్‌ రెడ్డి- రూ. 75 వేలు
    మహ్మద్‌ షాదాబ్‌ అహ్మద్‌- రూ. 75 వేలు
    నిపుణ్‌ రెడ్డి షవ్వా- రూ. 75 వేలు
    జంబోజు పార్ధీపన్‌- రూ. 75 వేలు
    ఎండీ అజారుద్దీన్‌- రూ. 75 వేలు.

    మెదక్‌ ఫాల్కన్స్‌
    తిలక్‌ వర్మ- రూ. 33 లక్షలు
    రవితేజ టి- రూ. 12 లక్షలు
    విక్రం నాయక్‌ గుగులోత్‌- రూ. 1.1 లక్షలు
    శశాంత్‌ బుడ్తి- రూ. లక్ష
    నిమ్న నిమగడ్డ సూర్య తేజ- రూ. 85 వేలు
    హరి ఓం సింగ్‌- రూ. 75 వేలు
    ఇషాన్‌ శర్మ- రూ. 75 వేలు
    బన్నీ జగమ్‌- రూ. 75 వేలు
    జయదేవ్‌ రెండ్ల- రూ. 75 వేలు
    సాయి పూర్ణానంద్‌ రావు కాకులమర్రి- రూ. 75 వేలు
    కుంటా రాహుల్‌- రూ. 75 వేలు
    మధుకర్‌ మన్నె- రూ. 75 వేలు
    నమన్‌ అగర్వాల్‌- రూ. 75 వేలు
    నయని అనీశ్‌ రెడ్డి- రూ. 75 వేలు
    నొమన్‌ అహ్మద్‌- రూ. 75 వేలు
    సయ్యద్‌ ఘాజి అబ్బాస్‌- రూ. 75 వేలు
    సాయి వరుణ్‌ యెర్రమ్‌- రూ. 75 వేలు
    అశ్వినన్‌ రామ్‌ బూర్గుబావి- రూ. 75 వేలు
    శ్రుజిత్‌ రెడ్డి- రూ. 75 వేలు
    రంగనాథ్‌ బీకే- రూ. 75 వేలు

    హైదరాబాద్‌ ఈ చాంపియన్స్‌
    అభిరథ్ రెడ్డి మందాడి- రూ. 11 లక్షలు
    అజయ్ దేవ్ గౌడ్- రూ. 11 లక్షలు
    అఖిల్ రాథోడ్- రూ. 1.6 లక్షలు
    అన్విత్ రెడ్డి- రూ. 3.5 లక్షలు
    బాకి హిశాంత్ ప్రేమ్ చరణ్- రూ. 95 వేలు
    సి. అభినవ్ తేజ్- రూ. లక్ష
    దేవ్ మెహతా- రూ. 75 వేలు
    గణేష్ గడుగు- రూ. 3.25 లక్షలు
    గూడెల్లి జశ్వంత్- రూ. 75 వేలు
    మిర్యాల ప్రత్యుష్ కుమార్- రూ. 75 వేలు
    ఎం.ఎం. చరణ్- రూ. 75 వేలు
    నితిన్ నాయక్- రూ. 75 వేలు
    పి. అరవింద్- రూ. 1 లక్ష
    ప్రణవ్ వర్మ- రూ. 8. 5 లక్షలు
    సాయి వికాస్ రెడ్డి- రూ. 4.25 లక్షలు
    ఫణ్ముఖ అశ్విన్- రూ. 1.5 లక్షలు
    శ్రీనికేత్- రూ. 2.3 లక్షలు
    తరుణ్ రాజన్- 1.6 లక్షలు
    వైష్ణవ్ రెడ్డి ఎ- - రూ. 75 వేలు
    యశ్వీర్ గౌడ్- రూ. 3 లక్షలు

    నల్గొండ నైట్స్‌
    మహమ్మద్ అర్ఫాజ్ అహ్మద్- రూ. 11 లక్షలు
    ఏల్గాని వరుణ్ గౌడ్- రూ. 3.5 లక్షలు
    అనికేత్ రెడ్డి- రూ. 4.7 లక్షలు
    బీరవోలు నాగ సుధాంశ్ రెడ్డి- రూ. 75 వేలు
    చిన్నట్ల రక్షణ్‌ రెడ్డి- రూ. 6 లక్షలు
    చిన్నుగారి రుత్విక్- రూ. 75 వేలు
    దివేష్ సింగ్ - రూ. 75 వేలు
    గౌరవ్ రెడ్డి- రూ. 4.5 లక్షలు
    ఇల్యాన్ సథాని- రూ. లక్ష
    జశ్వంత్ మోటే- రూ. 75 వేలు
    జవ్వాజీ శ్రీకాంత్- రూ. 75 వేలు
    నిశాంత్ శరణు- రూ. 5.5 లక్షలు
    పట్కూరి నితీశ్‌ రెడ్డి- రూ. 5.5 లక్షలు
    ప్రణవ్ సూర్యదేవర- రూ. 2.5 లక్షలు
    రాహుల్ బుద్ధి- రూ. 8 లక్షలు
    షేక్ సమీర్- రూ. 75 వేలు
    షేక్ సోహైల్- రూ. 75 వేలు
    టి. హర్షవర్ధన్ సింగ్- రూ. లక్ష
    ఉర్వేష్ కక్కడ్- రూ. 75 వేలు
    విక్రాంత్ రెడ్డి ఎం- రూ. 75 వేలు

    రంగారెడ్డి రైజర్స్‌
    తనయ్ త్యాగరాజన్- రూ. 11 లక్షలు
    ఆరోన్ జార్జ్ వర్గీస్- రూ. 7.5 లక్షలు
    అడే సంతోష్- రూ. 90 వేలు
    ఆదిత్య జవ్వాజీ- రూ. 1.6 లక్షలు
    ఆదిత్య మల్హోత్రా- రూ. 85 వేలు
    అలంకృత్ రపోలే- రూ. 1.9 లక్షలు
    అరవెల్లి అవనీష్ రావు- రూ. 7 లక్షలు
    ఆర్యన్ కారియప్ప- రూ. లక్ష
    బబర్ ఖాన్ బర్కత్ ఖాన్- రూ. 75 వేలు
    భువనగిరి పున్నయ్య- రూ. 3 లక్షలు
    సి. హితేష్ యాదవ్- రూ. 2.3 లక్షలు
    చిమాట శ్రీనాథ్ యాదవ్- రూ. లక్ష
    జ్ఞాన ప్రకాశ్ రెడ్డి- రూ. 4 లక్షలు
    టి. అరుణ్ కుమార్- రూ. లక్ష
    నానావత్ రాకేష్- రూ. 90 వేలు
    నితిన్ సాయి యాదవ్- రూ. 9 లక్షలు
    రావుల ప్రణవ్ ఆదిత్యం- రూ. 75 వేలు
    ఎస్. వెంకట్ కార్తిక్- రూ. 75 వేలు
    సచేత్ బింజ్రాజ్కా- రూ. 4 లక్షలు
    తనయ్ జద్దు- రూ. 75 వేలు

    వరంగల్‌ వారియర్స్‌
    మహ్మద్‌ సిరాజ్‌- రూ. 14 లక్షలు
    ఆది మణి కిరణ్- రూ. 85 వేలు
    అమన్ రావు పేరాల- రూ. 12 లక్షలు
    అమ్గోత్ దివిన్- రూ. 85 వేలు
    అనిరుధ్ శ్రీవాత్స టి.పి.- రూ. 2 లక్షలు
    భావేష్ సేథ్- రూ. 5 లక్షలు
    హర్షిత్ చౌధరి- రూ. 3 లక్షలు
    కర్రి సాయి ధనుష్- రూ. 75 వేలు
    మహమ్మద్ అబ్దుల్ మాలిక్- రూ. 3 లక్షలు
    మహమ్మద్ ఆసిఫ్ మంసూరి- రూ. 75 వేలు
    మొహమ్మద్ ముదస్సర్ హుస్సేన్- రూ. 3 లక్షలు
    మురుగన్ అభిషేక్- రూ. 3 లక్షలు
    పల్లెపాటి క్రాంతి- రూ. 75 వేలు
    ఋషికేత్ సిసోడియా- రూ. 4.75 లక్షలు
    ఋషిత్ రావు- - రూ. 75 వేలు
    రిత్విక్ గౌడ్- రూ. 75 వేలు
    సల్మాన్ ఖాన్- రూ. 75 వేలు
    షౌనక్ కులకర్ణి- రూ. 1.6 లక్షలు
    శివ రామకృష్ణ తెర్లి- రూ. 75 వేలు
    వైష్ణవ్ విశ్వనాథ- రూ. లక్ష
     

  • ప్రస్తుత తరం క్రికెట్‌లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్‌లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. 

    అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్‌ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.

    అరంగేట్రంలో అదుర్స్‌
    పంజాబ్‌కు చెందిన  గుర్నూర్ బ్రార్.. ఇటీవ‌ల అఫ్గానిస్తాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన భార‌త త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. త‌న తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.

    దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధార‌ప‌డుతోంది. అత‌డికి స‌పోర్ట్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేస‌ర్లు ఉన్నారు. వీరు ముగ్గురు త‌ప్ప ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో నిల‌క‌డ‌గా రాణించే మ‌రొక ఫాస్ట్ బౌల‌ర్ లేడు.

    ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భార‌త్ పేస్ బౌలింగ్ క‌ష్టాలు తీరిన‌ట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అత‌డికి ఉంది.  6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. 

    దీంతో భార‌త క్రికెట్‌కు మ‌రో బుమ్రా దొరికాడ‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా త‌న కెరీర్‌లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే ప‌డ‌గొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.

    ఐపీఎల్‌లో నో ఛాన్స్‌!
    గుర్నార్ బ్రార్‌.. 2023లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున‌ ఐపీఎల్ అరంగేట్రం చేసిన‌ప్ప‌టికి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌-2024 నుంచి గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో స‌భ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు.  కానీ గ‌త మూడు సీజ‌న్ల‌లోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

    కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గ‌జ పేస‌ర్ పర్యవేక్షణలో అత‌డు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్‌, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చాడు.

    అదే ట‌ర్నింగ్ పాయింట్‌?
    కాగా గుర్నార్ బ్రార్ దేశ‌వాళీ క్రికెట్‌లో కూడా నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు.  పంజాబ్ త‌ర‌పున కేవలం 18 ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే గ‌తేడాది స్వ‌దేశంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్‌లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

    ఆ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అత‌డే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ త‌ర్వాత అత‌డికి భారత జట్టులో నెట్‌ బౌలర్‌గా అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్ర‌ధాన పేస‌ర్లకు విశ్రాంతి ఇవ్వ‌డంతో గుర్నూర్‌కు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు క‌ల్పించారు. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేస‌ర్ అందిపుచ్చుకున్నాడు.

     కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ గుర్నార్‌ను భార‌త జ‌ట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.
    చదవండి: టీమిండియాకు భారీ షాక్‌.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్‌ ప్లేయర్‌
     

  • మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బుధ‌వారం నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్ర‌మంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది.

    దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్‌ కోసం పాటిల్‌ను  అస్పత్రికి తరలించారు. 

    ఇంకా రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రీయాంక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది. కాగా శ్రీయాంకు గాయాలేమి కొత్త కాదు. 

    గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్‌-2026 సీజన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది.

    ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్‌ సేన గ్రూప్-ఎ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. ఇలాంటి సమయంలో శ్రేయాంక గాయం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
    చదవండి: ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

Business

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్స్ గురించి సంచనల ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఈ ఏడాది (2026) అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతోందని కియోసాకి హెచ్చరించారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక సంక్షోభం దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో అమెరికా హౌసింగ్ మార్కెట్ కుప్పకూలడంతో S&P 500 కూడా దాదాపు 50% వరకు పడిపోయింది. దీనివల్ల అనేక మంది పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటనను కొందరు 'గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్' అని కూడా పిలుస్తారు.

    ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా రిస్క్‌లో ఉందని, అప్పులు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ సమస్యల కారణంగా మరో పెద్ద క్రాష్ వచ్చే అవకాశం ఉందని కియోసాకి భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పెట్టుబడులపై మాత్రమే ఆధారపడకుండా.. బంగారం, వెండి లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన సూచిస్తారు.

    అయితే.. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే?, కియోసాకి చెప్పినది కేవలం ఒక అంచనా మాత్రమే. స్టాక్ మార్కెట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ విధానాలు, గ్లోబల్ ఎకానమీ, కంపెనీల పనితీరు, పెట్టుబడిదారుల భావోద్వేగాలు మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు చెప్పినా మార్కెట్ క్రాష్ ఖచ్చితంగా జరుగుతుందని ముందే చెప్పడం సాధ్యం కాదు.

    మార్కెట్ క్రాష్ అంటే?
    స్టాక్ మార్కెట్ క్రాష్ అంటే షేర్ల ధరలు చాలా తక్కువ సమయంలో భారీగా పడిపోవడం. ఇది ఆర్థిక మాంద్యం, కంపెనీల లాభాలు తగ్గడం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వల్ల జరుగుతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో షేర్లు అమ్మేయడం వల్ల మార్కెట్ మరింత పడిపోతుంది.

  • గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.

    చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది.

  • డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్‌)లలో కొత్త భద్రతా అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.

    మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్‌ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్‌ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.

    మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.

    టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్‌డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.

    తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.

    ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

  • ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్‌ల ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

    ఈపీఎఫ్‌వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.

    ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్‌ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్‌ ఖాతా ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్‌ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి వచ్చేది.

    ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్‌వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. 

  • భారతదేశంలోని ప్రతి రియల్ ఎస్టేట్ డెవలపర్ చివరకు ఒక ప్రశ్న అడుగుతారు: నా ప్రాజెక్ట్ అనుకున్న వేగంతో ఎందుకు అమ్ముడు పోవడం లేదు? చాలాసార్లు సమాధానం ప్రాజెక్ట్‌తో సంబంధం ఉండదు. లొకేషన్ అద్భుతంగా ఉండవచ్చు. స్పెసిఫికేషన్లు అత్యుత్తమంగా ఉండవచ్చు. ధర పోటీగా ఉండవచ్చు. అయినప్పటికీ విచారణలు నిదానంగా వస్తాయి, సైట్ విజిట్లు అరుదుగా ఉంటాయి, సేల్స్ టీమ్ అసంతృప్తి ఉంటుంది. కీలకమైన లోటు, దాదాపు ఎల్లప్పుడూ, ప్రాజెక్ట్ వెనుక ఉన్న డిజిటల్ మార్కెటింగ్ నాణ్యత.

    హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగి, దశాబ్దానికి పైగా పనిచేస్తున్న డిజిటల్ మోజో, ఈ సమస్యను పరిష్కరించడమే తన సంపూర్ణ గుర్తింపుగా నిర్మించుకుంది. నేడు, ఇది హైదరాబాద్‌లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా నిలబడింది మరియు భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా పేరు సంపాదించింది. తమ గురించి తామే చెప్పుకోవడం ద్వారా కాదు, వ్యాపార ప్రపంచంలో నిజమైన విలువ కలిగిన ఏకైక కరెన్సీ అయిన ఫలితాల ద్వారా నిరూపితమైన పనితీరు ఆధారంగా వారు తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు.

    మొదటి రోజు నుండి భిన్నమైన తత్వశాస్త్రం
    చాలా ఏజెన్సీలు లైక్‌లు, ఇంప్రెషన్లు మరియు రీచ్‌లో తమ విజయాన్ని కొలుస్తాయి. డిజిటల్ మోజో ఎల్లప్పుడూ విజయాన్ని భిన్నంగా కొలుస్తుంది. సంస్థాపకుడు మరియు సీఈఓ ధీరజ్ మేరానీ స్పష్టంగా వ్యక్తీకరించిన ఏజెన్సీ వ్యవస్థాపక తత్వం ఏమిటంటే, మార్కెటింగ్ P&L లో కనిపించాలి. మూడ్ బోర్డ్‌లో మాత్రమే కాదు. ఒక క్యాంపెయిన్‌ను ఆదాయానికి, అర్హత కలిగిన లీడ్‌లకు, వాస్తవ సైట్ విజిట్లకు మరియు బుకింగ్‌లకు ట్రేస్ చేయలేకపోతే, అది తన పనిని చేయలేదు.

    ధీరజ్ మేరానీ ఇరవై సంవత్సరాలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం, IIM నేపథ్యం మరియు US మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్‌ను ఈ తత్వశాస్త్రానికి అందిస్తారు. ఆయన విధానం విక్రేత కంటే వ్యాపార భాగస్వామిగా ఆలోచించే ఏజెన్సీని రూపొందించింది. ఒక వ్యవస్థాపకుడు చేసే అదే తీవ్రతతో క్లయింట్ సేల్స్ పైప్‌లైన్‌పై నిమగ్నమవుతుంది.

    రియల్ ఎస్టేట్ ఎందుకు? డిజిటల్ మోజో ఎందుకు?
    రియల్ ఎస్టేట్ డిజిటల్‌గా మార్కెట్ చేయడానికి అత్యంత సంక్లిష్టమైన రంగాలలో ఒకటి. టికెట్ పరిమాణాలు ఎక్కువగా ఉంటుంది. కొనుగోలుదారులు సందేహాస్పదంగా ఉంటారు, మరియు ఇంట్లో లేదా వాణిజ్య ఆస్తిలో పెట్టుబడి పెట్టే నిర్ణయం భావోద్వేగ మరియు హేతుబద్ధ లెక్కల పొరలను కలిగి ఉంటుంది, వాటిని చాలా డిజిటల్ క్యాంపెయిన్లు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవుతాయి.

    డిజిటల్ మోజో సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కొనుగోలుదారు యాత్రపై స్వయంగా అభివృద్ధి చేసిన అవగాహనను మరియు ఇప్పుడు AI సహాయంతో ఇన్-హౌస్ ప్రొడక్ట్ Mojo Cortex ను అభివృద్ధి చేసింది — Google లో మొదటి సెర్చ్ నుండి చివరి సైట్ విజిట్ వరకు. ఏజెన్సీ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వీడియో మార్కెటింగ్ మరియు డేటా అనలిటిక్స్ అంతటా పని చేస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లు మరియు బ్రాండ్‌ల కోసం, ఈ విభాగాలన్నింటినీ ఫలితాల ఆధారిత సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుతుంది.

    దేశవ్యాప్తంగా 50కి పైగా యాక్టివ్ క్లయింట్లు మరియు 70 మంది నిపుణుల బృందంతో, ఏజెన్సీ హైదరాబాద్‌లో బూటిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నుండి ముంబై, ఢిల్లీ మరియు టైర్ 2 నగరాలలో మార్కెట్ చేయబడిన పెద్ద-స్థాయి మిక్స్‌డ్ వ్యూస్ అభివృద్ధి వరకు ప్రతిదాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పుణే మరియు ఇతర నగరాలలో ప్రముఖ బిల్డర్లు క్లయింట్లుగా ఉన్నారు, వీరి క్యాంపెయిన్లు కాస్ట్ పర్ లీడ్, లీడ్ నాణ్యత మరియు కన్వర్షన్ రేట్లపై పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను నిరంతరం అధిగమించాయి.

    హైదరాబాద్ యొక్క అత్యుత్తమ రహస్యం — ఇప్పుడు బహిర్గతమవుతోంది
    హైదరాబాద్ యొక్క పోటీ మార్కెటింగ్ ల్యాండ్‌స్కేప్‌లో, డిజిటల్ మోజో నెమ్మదిగా సీరియస్ బ్రాండ్‌లు మొదట పిలిచే ఏజెన్సీగా మారింది. 233 Google రివ్యూలలో 4.7 స్టార్ రేటింగ్ మరియు రియల్ ఎస్టేట్, రిటైల్ మరియు హాస్పిటాలిటీ విస్తరించిన క్లయింట్ పోర్ట్‌ఫోలియోతో, ఏజెన్సీ దూకుడు స్వయం ప్రమోషన్ కంటే నిరంతర డెలివరీ ద్వారా హైదరాబాద్‌లో అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా తన స్థానాన్ని సంపాదించింది. వారు Google సెర్చ్ మరియు AI ఫలితాలలో నంబర్ 1 గా నిరంతరం ర్యాంక్ చేస్తున్నారు.

    నగరంలో డిజిటల్ మోజోను ప్రత్యేకతను చాటేది దాని పాడ్ మోడల్. ప్రతి క్లయింట్‌కు అంకితమైన నిపుణులను నియమించే నిర్మాణం, పెద్ద ఏజెన్సీలలో సాధారణంగా ఉండే రివాల్వింగ్-డోర్ అకౌంట్ మేనేజ్‌మెంట్ కంటే జవాబుదారీతనం మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. క్లయింట్లు ప్రతి కొన్ని నెలలకు కొత్త బృందానికి రీ-బ్రీఫ్ చేయాల్సిన అవసరం లేదు. వారి బ్రాండ్‌ను అర్థం చేసుకున్న వారు వారితోనే ఉంటారు.

    జాతీయ లక్ష్యం
    డిజిటల్ మోజో ఆశయాలు ఎప్పుడూ హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగం నిరంతరం వృద్ధి దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, మెట్రో నగరాలు, టియర్-1 మరియు టియర్-2 నగరాల్లోని డెవలపర్లు డిజిటల్ అవగాహన కలిగిన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, ఫలితాలను అందించగల నిపుణుల ఏజెన్సీ అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.

    ఈ దశను చేరుకోవడానికి డిజిటల్ మోజో ఎంతో ప్రణాళికాబద్ధంగా, లక్ష్యపూర్వకంగా తన ప్రయాణాన్ని నిర్మించుకుంది. నేడు సంస్థ యొక్క విజయగాథలు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అఫోర్డబుల్ హౌసింగ్, కమర్షియల్ ప్రాపర్టీలు, ప్లాటెడ్ డెవలప్‌మెంట్స్ మరియు మిక్స్‌డ్ యూజ్ ప్రాజెక్టులు వంటి విభిన్న రియల్ ఎస్టేట్ విభాగాలకు విస్తరించాయి.

    అదేవిధంగా, సంస్థ యొక్క అనలిటిక్స్ సామర్థ్యాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. అధునాతన అట్రిబ్యూషన్ మోడల్స్‌ను వినియోగించడం ద్వారా, డెవలపర్లు పెట్టుబడి పెట్టిన ప్రతి మార్కెటింగ్ రూపాయి ఏ ఫలితాన్ని తీసుకువస్తుందో స్పష్టంగా అర్థం చేసుకునేలా ఖచ్చితమైన విశ్లేషణలను అందిస్తోంది.

    భారతదేశంలో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా, డిజిటల్ మోజో ధరపై పోటీ పడటం లేదు. ఇది ఫలితాలపై పోటీ పడుతోంది.

    క్లయింట్లు నిజంగా ఏమి చెప్తున్నారు
    ఒక ఏజెన్సీ విలువకు అత్యంత నమ్మదగిన సూచిక దాని క్లయింట్ సంబంధాల వ్యవధి. డిజిటల్ మోజోలో, అనేక క్లయింట్లు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏజెన్సీతో ఉన్నారు. అసంతృప్తి మరియు మారడం సాధారణంగా జరిగే పరిశ్రమలో ఇది అరుదు. సంఖ్యలు అర్థమవుతూనే ఉన్నందున వారు ఉంటున్నారు.

    క్లయింట్ల నుండి పదే పదే వచ్చే అభిప్రాయం ఏమిటంటే, డిజిటల్ మోజో క్లయింట్ అకౌంట్లకు వ్యవస్థాపకుని మనస్తత్వాన్ని తీసుకువస్తుంది. బ్రీఫ్ బలహీనంగా ఉన్నప్పుడు ఏజెన్సీ వెనక్కి నెట్టుతుంది. క్లయింట్ గమనించే ముందే క్యాంపెయిన్ తక్కువ పనితీరు చేస్తున్నప్పుడు ఫ్లాగ్ చేస్తుంది. అడగకుండానే కొత్త ఆలోచనలను తెస్తుంది. సంక్షిప్తంగా, ఇది స్కిన్ ఇన్ ది గేమ్ ఉన్న భాగస్వామిలా వ్యవహరిస్తుంది.

    ముందున్న మార్గం
    భారత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన వృద్ధి కాలంలోకి ప్రవేశిస్తోంది. పట్టణీకరణ వేగవంతమవుతూ, గృహావసరాలు పెరుగుతూ, కొనుగోలుదారుల కొత్త తరం తమ మొత్తం ఆస్తి పరిశోధన యాత్రను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ,రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఇక సహాయక పాత్రలో కాకుండా, వ్యాపార వ్యూహంలో కీలక స్థానాన్ని సంపాదించుకుంది.

    డిజిటల్ మోజో ఈ తరంగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది — మరియు దాని క్లయింట్లు దాని కంటే వేగంగా పెరగడానికి సహాయం చేయడానికి. వ్యర్థ మెట్రిక్స్‌తో నిండిన డెక్స్‌లను డెలివరీ చేసే మరియు వాస్తవ సేల్స్ ప్రభావంపై తక్కువగా ఉండే ఏజెన్సీలతో అలసిన డెవలపర్లకు, డిజిటల్ మోజో ఒక భిన్నమైన సంభాషణను అందిస్తుంది: మీ ఆదాయ లక్ష్యంతో మొదలై మిమ్మల్ని అక్కడికి చేర్చే క్యాంపెయిన్ స్ట్రాటజీ వరకు వెనక్కు పనిచేసేది.

    చాలా ఏజెన్సీలు చేయగలవని మరియు నిరూపించగలవని వాగ్దానం చేయలేవు. డిజిటల్ మోజో చేయగలిగే కొద్ది సంస్థలలో ఒకటి.
    డిజిటల్ మోజో | digitalmojo.in | హైదరాబాద్

    గమనిక: పైన పేర్కొన్న అంశాలు, సమాచారం పూర్తిగా ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి సాక్షి మీడియా గ్రూప్‌ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.

  • ఉద్యోగం కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు, సదరు వ్యక్తి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది. చాలా మందికి జీవితంలో ఒక పెద్ద షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. అలాంటి అనుభవాన్నే ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.

    దాదాపు నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, తక్కువ జీతంతో కొనసాగుతున్నప్పటికీ.. సంస్థ పట్ల చాలా విధేయతతో వ్యవహరించాడు. అయితే కంపెనీ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.

    సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయాల ప్రకారం.. అతను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.70 వేల జీతం పొందేవాడు. నాలుగున్నరేళ్ల సేవ చేసినప్పటికీ సరైన వేతన పెంపులు లేకపోవడంతో అదే జీతం వద్ద కొనసాగాడు. ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఉద్యోగ విరమణ పరిహారం చెల్లింపు విషయంలో హెచ్‌ఆర్‌తో వాగ్వాదం కూడా జరిగిందని వెల్లడించాడు.

    అయితే ఆశ్చర్యకరంగా, తన చివరి పని రోజునే మరో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం కూడా నెలకు రూ.1.58 లక్షలు అని వెల్లడించాడు. దీంతో అతని ఆదాయం ఒక్కసారిగా రెండింతలకు పైగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తగ్గినట్లు పేర్కొన్నాడు. జీతం ఒక్కసారిగా అంత పెరుగుతుందని ఊహించలేదని ఉద్యోగి చెప్పాడు. ఇది కలలా అనిపిస్తోందని అన్నాడు.

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. వేలాది మంది దీనిపై స్పందిస్తూ ఉద్యోగికి శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది 'ఉద్యోగంలో విధేయత కంటే నైపుణ్యానికి సరైన విలువ దక్కే చోటుకు మారడం మంచిది' అని సూచించారు. ఒక నెటిజన్ 'ప్రతి రెండు లేదా రెండున్నరేళ్లకు ఉద్యోగం మార్చడం మంచిది. విధేయతకు ఈ రోజుల్లో పెద్దగా విలువ లేదు' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'నేను కూడా రూ.50 వేల జీతం నుంచి ఉద్యోగం మారి ఇప్పుడు రూ.1.1 లక్షలు పొందుతున్నాను' అని తెలిపారు.

    ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

  • పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, దాని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేయడం, ఉపయోగించడాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూఏఈ, ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల జాబితాలో చేరింది.

    యూఏఈ మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం ప్రకారం, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను తెరవడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా.. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని పూర్తి ఫీచర్లను కూడా ఉపయోగించకూడదు. పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, కంటెంట్ షేర్ చేయడం, పబ్లిక్ గ్రూపులు లేదా ఓపెన్ ఛానళ్లలో చేరడం వంటి కార్యకలాపాలకు కూడా అనుమతి ఉండదు.

    ఈ నిబంధనలను అమలు చేయడంలో సోషల్ మీడియా సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సృష్టించిన ఖాతాలను గుర్తించి, వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీలకు 12 నెలల గడువు ఇచ్చారు. ఒకవేళా నిబంధనలను పాటించకపోతే.. సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లపై హెచ్చరికలు, పరిమితులు లేదా పూర్తిస్థాయి నిషేధం వంటి చర్యలు తీసుకునే అధికారం యూఏఈ ప్రభుత్వ సంస్థలకు ఉంటుంది.

    సోషల్ మీడియా ద్వారా పిల్లలు అనుచిత కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ మోసాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను పెంచడం, ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇటీవల సోషల్ మీడియా వినియోగంపై పలు దేశాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు యూఏఈ కూడా అదే దారిలో అడుగులు వేయడంతో, భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?

  • భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.

    ఆర్ఏసీ (RAC)
    RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.

    జీఎన్‌డబ్ల్యుఎల్ (GNWL)
    GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

    టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)
    TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.

    యూటీఎస్ (UTS)
    UTS అంటే అన్‌ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

    ఈ-క్యాటరింగ్
    ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.

    ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
    LHB అంటే లింకే హోఫ్‌మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.

    వికల్ప్ పథకం
    వికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.

    భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ..

  • గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254.36 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 77,409.98 వద్ద, నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 24,168.00 వద్ద నిలిచాయి.

    ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, కేపీఆర్ మిల్ లిమిటెడ్, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్, డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ఐఎఫ్సీఐ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, డిబి (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • పోర్షే భారతదేశంలో కొత్త తరం 911 GT3ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    పోర్షే 911 జీటీ3 కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 503 బీహెచ్‌పీ పవర్, 470 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్లో స్టాండర్డ్‌గా పీడీకే గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.

    10 రంగులలో లభించే ఈ కారు 21 ఇంచెస్ అల్యూమినియం వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ సిల్వర్ థీమ్ పొందుతుంది. ప్రత్యేకమైన సీట్లు, రూఫ్ ఫినిష్, సీట్ బెల్ట్‌లు, వీల్స్ నుంచి కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. పనితీరు అద్భుతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

  • ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  

    కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్‌ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్‌ సేవర్స్‌" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు.  

    "గోల్డ్‌ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్‌ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు.  

    ఆయన ప్రకారం, గోల్డ్‌ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

Guest Columns

  • దశాబ్దాలుగా ‘అమెరికన్‌ డ్రీమ్‌’ భారత యువతను ఆకర్షిస్తోంది. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్నారు. అక్కడ మంచి ఉద్యోగాలు సాధించి, సాంకేతిక ఆవిష్కరణలతో రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అయితే, ఈ విజయగాథల వెనుక, కొన్ని విషాదాలూ ఉన్నాయి.

    మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి వెళ్ళిన తెలుగమ్మాయి ‘స్పందన’ మే 31న ఇల్లినాయిలోని మెట్రో స్టేషన్‌ పైనుండి కిందపడి, తీవ్ర గాయాలవ్వడంతో ఆమె తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. పాస్‌పోర్టు, వీసా, డబ్బు లేకపోవడంతో వేలాది మైళ్ల దూరంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భారతీయ విద్యార్థులు తరచుగా – రోడ్డు ప్రమాదాలు, అపార్టుమెంట్లలో అగ్ని ప్రమాదాలకు గురవ్వడం, ఈతకు వెళ్లి మునిగిపోవడం, తీవ్ర అనారోగ్యాలు, హింస, దాడుల బారిన పడటం జరుగుతోంది.

    ఉన్నత విద్య కోసం పిల్లలను అమెరికా పంపడం అనేది సగటు భారతీయ కుటుంబానికి జీవితకాల పొదుపు, ఆస్తుల అమ్మకం, భారీ విద్యా రుణాల కలబోత. ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా, గాయాల పాలైనా– సాకారం కాని భవిష్యత్తు కోసం కుటుంబాలు భారీ అప్పులు తీరుస్తూనే ఉండాల్సి వస్తుంది. అత్యవసర వీసాలు పొందడం, చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు కొనడం, విదేశీ ఆసుపత్రుల భారీ బిల్లులు చెల్లించడం అనేది ప్రభుత్వ సహాయం లేకుండా మధ్యతరగతి కుటుంబాలకు అసాధ్యం.

    బీమాతో ధీమా ఇవ్వాలి!
    ఈ విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తు న్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం సమగ్ర బీమా విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి బీమాకు నిధులు సమకూర్చడం భారం కాదు. భారతీయ ప్రవా సులు ప్రతి ఏటా సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి పంపుతున్నారు. ఈ బీమా పూల్‌ను సృష్టించడం భారత విదేశీ మారక నిల్వలను పెంచుతున్న ఈ వర్గంపై ప్రభుత్వం పెట్టే చిన్న పెట్టుబడి మాత్రమే.

    ఈ బీమా పాలసీలో అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు వెంటనే విదేశాలకు వెళ్లేందుకు కుటుంబ ప్రయాణ ఆర్థిక సదుపాయాలను చేర్చాలి. మరణించిన విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులకు పూర్తి కవరేజ్‌ అందించాలి. దీనికి తోడు, విద్యా రుణ రక్షణ కవచం కూడా ఉండాలి.

    ఇలాంటి విషాదాలను నివారించడానికి, వెంటనే స్పందించడానికి బహుముఖ వ్యవస్థాగత విధానం అవసరం. స్పందన కుటుంబం వంటివి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వీసా. కుటుంబ సభ్యులకు 24–48 గంటల్లో అత్యవసర వీసా మంజూరు చేసేలా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా లాంటి దేశాలతో ద్వైపాక్షిక ‘కారుణ్య వీసా’ ఫాస్ట్‌–ట్రాక్‌ ఒప్పందం చేసుకోవాలి. అలాగే, అత్యవసర సమయాల్లో స్థానిక కాన్సులేట్, పోలీసులతో పాటు స్థానిక ప్రవాస భారతీయ సంఘాలతో సమన్వయం చేసి తక్షణ సహాయం అందించే వ్యవస్థ ఉండాలి. 

    విదేశీ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థుల ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రతపై ఎలాంటి శ్రద్ధ వహించడం లేదు. ఆ యూనివర్సిటీలకు ప్రభుత్వం ‘సేఫ్టీ రేటింగ్‌’ ఇవ్వాలి. సరైన భద్రత ఉందని నిరూపించుకుంటేనే భారతదేశంలో అడ్మిషన్ల ప్రచారానికి అనుమతి ఇవ్వాలి.

    చ‌ద‌వండి: ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది?

    మన విద్యార్థులు నేరుగా సంక్లిష్టమైన, నేరాలు ఎక్కువగా ఉండే విదేశీ నగరాలకు వెళ్తుంటారు కాబట్టి, ప్రయాణానికి ముందే వారికి తప్పనిసరి ‘అర్బన్‌ సర్వైవల్‌’ శిక్షణ ఇవ్వాలి. రాత్రి పూట పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎలా వాడాలి, తీవ్రమైన వాతావరణాన్ని ఎలా తట్టుకోవాలి, అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పించాలి. ఆధునిక భారతదేశ సంకల్పానికి ఈ యువత ప్రతీక. కష్టాల్లో ఉన్నప్పుడు వారిని గాలికి వదిలేయ కూడదు.

    - శ్రీనివాస్‌ మాధవ్‌ 
    ‘51అ అభీ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు

NRI

  • అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బగ్గీ నుండి కింద పడి పోయిన తల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక భారతీయ యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం  అదుపు తప్పి ఒక్కసారిగా వేగంగా పరిగెత్తడంతో  ఈ ప్రమాదం జరిగింది.

    'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు మొదటిసారి విహారయాత్రకు వచ్చిన 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్‌కు బుధవారం జీవితంలోని మర్చిపోలేని శోకాన్ని మిగిల్చింది. కుటుంబ ఫోటో తీసుకోవడానికి డ్రైవర్ బండిని ఆపిన వెంటనే, గుర్రం ఒక్కసారిగా అదుపు తప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. అది వేగంగా దూసుకెళ్లి ఫుట్‌పాత్ ఎక్కి, గడ్డి ఉన్న ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ‘‘రక్షించండి, రక్షించండి’’ అని అరుస్తూనే ఉన్నామని రోమాంచ్ తండ్రి దీపక్ మహాజన్ వాపోయారు. అందరమూ ఒకర్నొకరు గట్టిగా పట్టుకున్నప్పటికీ తన భార్య ప్రియ బగ్గీ నుండి కింద పడి పోవడంతో, ఆమెను రక్షించడానికి రోమాంచ్ కిందకు దూకి  చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.

    కిందకు దూకిన రోమాంచ్ తల నేలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. బుధవారం రాత్రి న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో చికిత్సపొందుతూ చని పోయాడు.  రోమాంచ్‌ తండ్రి తల్లి , తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

     టావెర్న్ ఆన్ ది గ్రీన్ అనే హోటల్‌లో పనిచేసే టాటియానా బ్రెస్లర్ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, గుర్రం భయంతో  చాలా వేగంగా పరుగెత్తిందని, వెంటనే తాము 911కి ఫోన్ చేశారు. బగ్గీ బోల్తా పడకముందే ఒక ప్రత్యక్ష సాక్షి ఆ గుర్రాన్ని  కట్టడి చేశాడని బ్రెస్లర్ తెలిపారు.

    ఇదీ చదవండి :  60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ

    గుర్రపు బగ్గీలతో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో ఇది తాజాది. ఈ ప్రమాదంతో పార్కులో గుర్రపు బగ్గీలను నిషేధించాలనే డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బగ్గీ డ్రైవర్ల యూనియన్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. గత ఏడాది మే నుండి పార్క్ లేదా దాని పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన ప్రమాదాలు ఎనిమిది జరిగాయని, గత నెలలో కూడా ఒక గుర్రం మరో బగ్గీని ఢీకొట్టడంతో అది బోల్తా పడిందని పార్క్ కన్సర్వెన్సీ తెలిపింది. సదరు డ్రైవర్‌ను యజమాని నిరవధికంగా సస్పెండ్‌ చేశారు.

    ఇదీ చదవండి: మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ : తీవ్ర ఉద్రిక్తత

Family

  • పెళ్లైతే పిల్లల్ని కనాల్సిందేనా అనే అంశంపై ఓ 63 ఏళ్ల వ్యక్తి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి అవగానే పిల్లలు కనాలని అందరూ చెబుతుంటారు..కానీ ఇది అందరికీ సరిపడే అంశం కాదంటాడు 63 ఏళ్ల కె.ఎఫ్.  ఆయన విలియం రోసీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో జరిపిన సంభాషణలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. భార్యభర్తలు పిల్లల్ని కంటే సరిపోదు, దానితోపాటే వచ్చే అపారమైన బాధ్యతను గురించి ఎవ్వరూ ఆలోచించరు, చెప్పరు. అందువల్ల పేరెంట్స్‌గా విఫలమవుతున్నారని అన్నారు కె.ఎఫ్. 

    ముప్పైళ్ల దాంపత్య జీవితంలో తాను తను భార్య ఎంతో సంతోషంగా గడిపామని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎప్పుడూ పిల్లలను కనాలని అనుకోలేదని తెలిపాడు. తాము ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి తల్లిదండ్రులుగా ఉండగలం అనుకుంటేనే పిల్లలను కనాలని అన్నారు. ముందుగా పిల్లలకు జీవితంలోని సవాళ్లు, వాస్తవాలు గురించి నేర్పించాలి, కానీ తల్లిదండ్రులు భౌతిక సంపాదనపైనే దృష్టిపెడుతున్నారని, అందుకే విఫలమవుతున్నారని అన్నారు. 

    పిల్లల్ని కనడం అంటే.. మంచి ప్రయోజకులుగా తీర్చిద్దిదే బహృత్కార్యంగా అభిర్ణించాడు. అంతేగాదు పిల్లల్నలి పెంచిన విధానమే తల్లిదండ్రుల్ని ప్రతిబింబిస్తుందన్నారు. అలాxo పిల్లలతో పేరెంట్స్‌ ప్రవర్తించే తీరుని కూడా తప్పుపట్టారు. నాకు లేని సౌకర్యాలు ఇస్తున్నా అనేది చెప్పొద్దు..అవసరానికి మించి డబ్బు ఇవ్వొద్దు, ఇతరుల పట్ల గౌరవంగా మెలిగేలా పెంచండి చాలు అని అన్నాడు. అలా పెంచలేను అనుకుంటే కనొద్దని పరోక్షంగా చెప్పాడు. 

    అలాగే తమ 30 ఏళ్ల వైవాహిక బంధం గురించి కూడా మాట్లాడారు. ఒకరిపట్ల ఒకరికున్న నమ్మకం, నిబద్ధతతే ఇన్నేళ్లు ఇంతలా కలిసిసాగామని అన్నారు. రోజుకు కనీసం ఒక్కసారైన తనను నవ్వించాలి అనుకుంటా..ఇప్పటికీ ఇంద్దరం ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటామని అన్నారు. నెటిజన్లు పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం కాదని చెప్పిన తీరు బాగుందని అన్నారు. అలాగే భార్య నవ్వుతూ ఉండేలా చేస్తానన్న మాట బట్టే అతడేంటో తెలుస్తోందంటూ అభినందించారు. పిల్లలను సరిగా పెంచలేకపోవడం కంటే కనకపోవడమే మేలు అన్న ఆయన మాటలకు మద్దతిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. 

     

    (చదవండి: ‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..)
     

  • ఓ అమ్మాయి కెరీర్‌, అభిరుచుల పరంగా సక్సెస్‌ అయినా ఆమె అమ్మమ్మ మాత్రం తన కారణంగా ఏదో కోల్పోయానంటూ బాధపడిపోయిందంటూ షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పాపం ఆ అమ్మమ్మ చెప్పిన కారణం విని ఆమెకు చాలా హాస్యస్పదంగా ఉండటమే కాదు ఆ రెండు అక్షరాల పదం మందు ఆ అమ్మాయ్‌ విజయాలన్ని వృధాగా మారిపోవడం విచిత్రం. ఒక రకంగా ఈ పోస్ట్‌ మహిళల వ్యక్తిగత గుర్తింపుకి ఏ మాత్రం విలువ ఉండదా అనే విషయం తెరపైకి తీసుకొచ్చింది. అంతేగాదు ఆడపిల్లకు వివాహ బంధమే ముఖ్యమా అనే దానిపై ఆలోచింపచేసేలా క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో సంభాషణ. 

    ఆ అమ్మాయే భారత సంతతి మహిళ హేమాక్షి మోట్కా. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.ఆ వీడియోలో హేమాక్షి భారత దేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ తన గురించి వివరించారామె. భారత్‌లో ఒక కార్యక్రమానికి తన అమ్మమ్మ హాజరైందని అక్కడ కేవలం "పెళ్లైన కుమార్తెలకు" మాత్రమే సాంప్రదాయ బహుమతులుగా దుప్పట్లు లభించడంతో ఆమె అమ్మమ్మ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. 

    ఇదంతా ఎందుకంటే తనకింక పెళ్లికాకపోవడంతో అమ్మమ్మ ఆ దుప్పటి అందుకోలేకపోయానంటూ తన ఆవేదన వెలిబుచ్చిందని తెలిపింది. తనకు పెళ్లి కాలేదన్న కారణంగానే ఒక్క దుప్పటి కూడా అందుకోలేకపోయానని బాధపడుతోందామె. కానీ నాకు అది ఎంతో సిల్లీగా అనిపించింది. తాను అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో కోట్లాది రూపాయ కంపెనీ నిర్మించాను, సీఈవోని, పైగా 42 కిలోమీటర్ల  మారథాన్‌ని విజయవంతంగా పూర్తి చేశా. ఇంత సక్సెస్‌ని అందుకున్నా.. కానీ జస్ట్‌ ఒక లాంఛనప్రాయమైన దుప్పటి కోసం కోల్పోయాను కాబోలు అంటూ నవ్వేసిందామె. 

    అంతేగాదు ఇది తనపై అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధే కావొచ్చు..కానీ మహిళలకు వ్యక్తిగత గుర్తింపును త్యాగం చేయొద్దని హెచ్చరిస్తూ ఇలా పేర్కొంది. నాకు మా అమ్మమ్మ మాటలు నవ్వు తెప్పించినా.. మహిళలుగా మనం ఎంచుకున్న రంగంలోని విజయాలను జరుపుకోవాలి. పెళ్లి అనేది ఒక ప్రతిపాద, ఆమోదం అంతే. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని..మంచి కెరీర్‌ని నిర్మించుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, స్వంతంగా డబ్బు సముపార్జించాలి. గర్వపడే జీవితాన్ని సృష్టించుకోవాలి. అందుకు తగ్గట్టుగా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ న్యూయార్క్‌ కంపెనీ సీఈవో అంటూ తన సంభాషణను ముగించింది. 

    అంతేగాదు ఆ వీడియోలో మన హోదాకి విలువలేకపోవచ్చు, ఇతరుల అభిప్రాయాలు మారవచ్చు.. కానీ మీపై మీకు సడలని ఆత్మవిశ్వాసం ఉండాలి, దుప్పటి బాగుంటుందేమో..కానీ మీ వెంట వచ్చేది, మిమ్మల్ని నిలబెట్టేది ఆత్మవిశ్వాసమే. అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్‌ చేసింది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దదతిస్తూ.. ఆట మార్చేయండి. మీకు నచ్చిన పనులను మీ పద్ధతిలో చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం అంటూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి:  90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్‌ సాహసం..! ఇవాళ అదే..)


     

Cartoon