Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • టాస్‌ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా బౌలింగ్‌ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్‌మైర్‌ బ్యాటింగ్‌కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్‌ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్‌నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్‌లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్‌–8’లో విండీస్‌కు భారీ విజయాన్నిచ్చింది.  

    ముంబై: వెస్టిండీస్‌ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్‌కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన వెస్టిండీస్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెట్‌మైర్‌ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్‌గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్‌ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. గుడకేశ్‌ మోతీ (4/28), హోసిన్‌ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్‌–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌; అదేరోజు భారత్‌తో జింబాబ్వే ఆడతాయి.  

    హెట్‌ ‘ఫైర్‌’ 
    ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (9), షై హోప్‌ (14) వికెట్లను కోల్పోయిన విండీస్‌ హెట్‌మైర్, పావెల్‌ ధనాధన్‌ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్‌ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్‌... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన కరీబియన్‌ బ్యాటర్‌గా రికార్డును నెలకొల్పాడు. హెట్‌మైర్‌ బాదిన మొత్తం 7 సిక్స్‌ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్‌మైర్‌ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్‌ను రెండోసారి క్యాచ్‌ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్‌ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్‌ఫోర్డ్‌ (13 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫర్డ్‌ (10 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), హోల్డర్‌ (4 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) దంచేయడంతో విండీస్‌ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. 

    హెట్‌మైర్

    జింబాబ్వే విలవిల 
    ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్‌–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్‌ (5), బర్ల్‌ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్‌ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్‌ (28), కెప్టెన్‌ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్‌ ఎన్‌గరవ (7 నాటౌట్‌) అండతో బ్రాడ్‌ ఇవాన్స్‌ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.

    స్కోరు వివరాలు 
    వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రాండన్‌ కింగ్‌ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవ 9; షై హోప్‌ (సి) బెనెట్‌ (బి) ఇవాన్స్‌ 14; హెట్‌మైర్‌ (సి) బెనెట్‌ (బి) క్రిమర్‌ 85; పావెల్‌ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 31; షెఫర్డ్‌ (సి) బర్ల్‌ (బి) ఎన్‌గరవ 21; హోల్డర్‌ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. 

    బౌలింగ్‌: ఎన్‌గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్‌ 4–0–46–1, క్రిమర్‌ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్‌ 1–0–19–0. 
    జింబాబ్వే ఇన్నింగ్స్‌: మరుమని (సి) హెట్‌మైర్‌ (బి) ఫోర్డ్‌ 14; బెనెట్‌ (బి) హోసిన్‌ 5; మైయెర్స్‌ (బి) మోతీ 28; బర్ల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోసిన్‌ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్‌ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్‌ (సి) హోసిన్‌ (బి) ఫోర్డ్‌ 43; క్రిమర్‌ (సి అండ్‌ బి) హోల్డర్‌ 0; ముజరబాని (సి) జోసెఫ్‌ (బి) హోసిన్‌ 0; ఎన్‌గరవ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్‌: హోసిన్‌ 4–1–28–3, ఫోర్డ్‌ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్‌ 3–0–35–0, హోల్డర్‌ 3–0–25–1.   

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

    ఓపెన‌ర్లు బ్రాండెన్ కింగ్‌(9), షాయ్ హోప్(14) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్‌మైర్ అయితే జింబాబ్వే బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్‌మైర్ కేవ‌లం  బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అత‌డితో పాటు రావ్‌మ‌న్ పావెల్(59), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(31), షెఫ‌ర్డ్‌(21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌల‌ర‌ల్లో నగార‌వ, ముజ‌ర్‌బానీ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..  క్రీమ‌ర్‌, ఎవెన్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం.

     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్  ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.

    జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఏకంగా మూడు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హెట్‌మైర్ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్‌ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.

    వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్‌మైర్‌ స్కాట్లాండ్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.

    ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు హెట్‌మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్‌లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబా‍బ్వే భారీ మూల్యం చెల్లించుకోంది.

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా యువ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. అభిషేక్ శ‌ర్మ వ‌రుస‌గా మూడు డకౌట్లు కాగా.. తిల‌క్ కూడా త‌న జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.

    ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. అభిషేక్ 13 ప‌రుగులు చేయ‌గా, తిల‌క్ డ‌కౌట‌య్యాడు.  ఇప్పటివరకు తిల‌క్‌ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.

    అతని స్ట్రైక్ రేట్ 119 కంటే త‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రిపై భార‌త మాజీ క్రికెట‌ర్ సదాగోపన్ రమేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫ‌లితాలే ఎదుర‌వ‌తాయ‌ని అత‌డు హెచ్చ‌రించాడు.

    "అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవ‌లం గార్డెన్ మాత్ర‌మే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బ‌లి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. దానిని త‌ట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

    ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ త‌మ తొలి సూప‌ర్‌-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం చేసుకుంది. భార‌త్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో భారీ తేడాతో విజ‌యం సాధించాలి.

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ మొన్‌జురుల్‌ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.

    అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్‌-2022 సందర్భంగా మొన్‌జురుల్‌ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్‌ జట్టు నాటి కెప్టెన్‌ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. 

    స్వతంత్ర విచారణ కమిటీ
    ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్‌-ఏ- బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.

    జహనారా ఆరోపించినట్లుగానే మొన్‌జురెల్‌కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్‌ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.

    నిషేధం విధిస్తున్నాం
    ఈ క్రమంలో మొన్‌జురుల్‌ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.

    కాగా బంగ్లాదేశ్‌ మహిళల జట్టు సెలక్టర్‌, మేనేజర్‌గా మొన్‌జురుల్‌ వ్యవహరించాడు. గతేడాది జూన్‌ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్‌ ఘాజి ఆష్రఫ్‌ హొసేన్‌ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    చారిత్రాత్మ​క ముందుడుగు
    బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చారిత్రాత్మక​ ముందడుగు వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్‌కు ఏప్రిల్‌ 4- 14 వరకు షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

    చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

  • టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

    హ్యాట్రిక్‌ డకౌట్లు
    లీగ్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో ఆడిన మ్యాచ్‌లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అభిషేక్‌ బ్యాటింగ్‌ శైలిని విమర్శించాడు. కేవలం పవర్‌ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్‌ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్‌’గా అభివర్ణించాడు.

    పరుగులు చేయాలనే తొందరలో వికెట్‌ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్‌తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్‌ అయ్యారు. అభిషేక్‌ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ అని.. ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.

    మరోసారి విఫలం
    ఇక సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో కార్బిన్‌ బాష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

    ఆమిర్‌ యూటర్న్‌!
    ఈ నేపథ్యంలో మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి అభిషేక్‌ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్‌ తీసుకున్నాడు. ‘‘బౌలర్‌ వైపు నుంచి నేను అభిషేక్‌ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్‌ గురించి మాత్రమే నేను మాట్లాడాను.

    కానీ నేను స్లాగర్‌ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్‌ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్‌ చేయగలరు.

    అద్భుతమైన నైపుణ్యాలు.. కానీ
    తాజా మ్యాచ్‌లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్‌ మొదలుపెట్టాగానే.. అభిషేక్‌ శర్మ తెల్లముఖం వేశాడు.

    సీనియర్‌ ఆటగాడిగా నేను అభిషేక్‌ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్‌ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.

    అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ చెప్పుకొచ్చాడు. 

    చదవండి: కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా ముంబై వేదిక‌గా వెస్టిండీస్‌, జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూప‌ర్‌-8 పోరులో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి.

    జింబాబ్వే జ‌ట్టులోకి నగరవ రాగా.. విండీస్ జ‌ట్టులోకి రొమారియో షెపర్డ్ వ‌చ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జ‌ట్లు కూడా అజేయంగా నిలిచాయి. మ‌రి సూప‌ర్‌-8లో ఎవ‌రు బోణీ కొడ‌తారో వేచి చూడాలి.

    తుది జ‌ట్లు
    జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీ

    వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చ‌తిక‌ల ప‌డింది. ల‌క్ష్య చేధ‌న‌లో మెన్ ఇన్ బ్లూ 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్, స‌ఫారీ సూప‌ర్ స్టార్ డేవిడ్ మిల్ల‌ర్ మ‌ధ్య వాగ్వ‌దం చోటు చేసుకుంది.

    అసలేమి జ‌రిగిందంటే?
    సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవ‌ర్ వేసేందుకు కెప్టెన్ సూర్య‌కుమార్ స్పిన్న‌ర్ సుంద‌ర్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్‌ఫీల్డ్ గ్రాస్ కాస్త త‌డిగా ఉండ‌డంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్ల‌ర్ క్రీజు లైన్ అంచున నిల‌బ‌డ్డాడు.

    దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్‌కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్ల‌ర్ అస‌హనం వ్య‌క్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత కూడా వారిద్ద‌రి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.


     

     

    మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియ‌స్‌గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో సుంద‌ర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ ఓట‌మితో భార‌త్ త‌మ సెమీస్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది.

     

  • పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్‌కప్‌-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్‌-8 కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.

    ఊహించని షాక్‌
    ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ కూడా స్పందించాడు.

    తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్‌. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.

    కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ ఏం చేస్తున్నారు?
    ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు అటాక్‌ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.

    అహంకారం వద్దు
    నెట్‌ రన్‌ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్‌ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్‌ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    కాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

    చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఖ‌చ్చితంగా గెలవాల్సిందే.

    ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ను తిరిగి జ‌ట్టులోకి తీసుకోవాల‌ని పార్ధివ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అక్ష‌ర్ స్ధానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను ఆడించ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

    అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న అక్ష‌ర్‌ను ఎలా ప‌క్క‌న పెట్టార‌ని మాజీలు మండిప‌డ్డాడు. ఈ కీల‌క మ్యాచ్‌లో సుంద‌ర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫ‌ల‌మయ్యాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు ప‌టేల్ తిరిగి జ‌ట్టులోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది.

    "అక్ష‌ర్ పటేల్‌ను తిరిగి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చూడాల‌నుకుంటున్నాను. అక్ష‌ర్ లాంటి ఆల్‌రౌండ‌ర్ జ‌ట్టులో ఉండ‌డం చాలా ముఖ్యం. అత‌డు కేవ‌ల బంతితోనే కాకుండా క్లిష్ట సమయాల్లో బ్యాట్‌తో కూడా రాణించ‌గ‌ల‌డు. మ్యాచ్-అప్‌ల ప‌రంగా కూడా అత‌డు మంచి ఎంపికే" అని స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్'లో పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి సంజూ శాంస‌న్ కూడా వచ్చే అవ‌కాశ‌ముంద‌ని పార్ధివ్ తెలిపాడు. సంజూ లాంటి ప్లేయ‌ర్లు ఆఫ్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటార‌ని ప‌టేల్ చెప్పుకొచ్చాడు.
    చ‌దవండి: మా వాళ్లు అద్భుతం.. విండీస్‌ ప్రమాదకర జట్టు: మార్క్రమ్‌
     

  • టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే తన ప్రేయసి, మోడల్‌ మహీక శర్మ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు ఈ బరోడా క్రికెటర్‌.

    ప్రేయసికి 25 కానుకలు
    మహీక 25వ బర్త్‌డే సందర్భంగా ఆమెను కానుకలతో ముంచెత్తాడు. ఈ విషయాన్ని మహీక స్వయంగా వెల్లడించింది. తనకు హార్దిక్‌ పాండ్యా 25 బహుమతులు ఇచ్చాడని.. ఈ పుట్టినరోజును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది.

    కాగా గత కొంతకాలంగా మహీకతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హార్దిక్‌ పాండ్యా.. తన కుమారుడు అగస్త్యను మాత్రం దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని ట్రోల్‌ చేశారు. మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌తో పాటు.. కుమారుడు అగస్త్యను కూడా పూర్తిగా మర్చిపోయాడని నిందించారు.

    రూ. 4 కోట్ల విలువైన కారు
    అలాంటి వాళ్లకు దిమ్మదిరిగేలా హార్దిక్‌ పాండ్యా తన చేష్టలతో కౌంటర్‌ ఇచ్చాడు. నటాషాతో విడిపోయినప్పటికీ ఆమె పట్ల ఆప్యాయతను కనబరిచాడు. నటాషా, అగస్త్య కోసం ఖరీదైన కారును హార్దిక్‌ పాండ్యా కొనుగోలు చేశాడు. రూ. 4 కోట్ల విలువైన లాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను అగస్త్య, నటాషాలకు బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    కాగా సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించిన హార్దిక్‌ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ఆ తర్వాత కుమారుడి సమక్షంలో హిందూ, క్రిస్టియన్‌సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు.

    తల్లి దగ్గరే ఎక్కువగా..
    అయితే, అనూహ్య రీతిలో 2024లో తాము విడిపోయినట్లు ప్రకటించారు నటాషా- హార్దిక్‌. ఆ తర్వాత మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశాడు. అయితే, విడిపోయినప్పటికీ అగస్త్యకు తల్లిదండ్రులుగా ఉంటామని నటాషా- హార్దిక్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే కుమారుడి బాధ్యతను ఇద్దరూ పంచుకుంటున్నారు. అయితే, తల్లి దగ్గరే అగస్త్య ఎక్కువగా ఉంటున్నాడు.

    ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్నాడు. చివరగా నిన్న (ఆదివారం) సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాండ్యా టీమిండియా తరఫున బరిలో దిగాడు. అటు బౌలర్‌గా.. ఇటు బ్యాటర్‌గా అతడు విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 45 పరుగులు ఇచ్చిన హార్దిక్‌.. బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు.

    చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో సౌతాఫ్రికా త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఆదివారం అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను ప్రోటీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది.

    తొలుత బ్యాటింగ్‌లో 187 ప‌రుగులు భారీ స్కోర్ చేసిన ద‌క్షిణాఫ్రికా, అనంత‌రం బౌలింగ్‌లోనూ అద‌ర‌గొట్టింది. మార్కో జాన్సెన్ నాలుగు, కేశ‌వ్ మ‌హారాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి టీమిండియా ప‌తనాన్ని శాసించారు. లుంగీ ఎంగిడీ కూడా అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

    ఎంగిడీ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకపోయినా,  కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంగిడీ ఒక్క బౌండ‌రీ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా ఈ స‌ఫారీ స్పీడ్ స్టార్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

    భార‌త్‌పై టీ20ల్లో ఒక పేసర్ బౌండరీ ఇవ్వకుండా నాలుగు ఓవర్లు వేయడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. 2019లో బెంగళూరు వేదిక‌గా భార‌త్ జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో స‌ఫారీ ఫాస్ట్ బౌల‌ర్ బ్యూరాన్ హెండ్రిక్స్ బౌండ‌రీ ఏమీ ఇవ్వ‌కుండా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాను పూర్తి చేశాడు. అయితే అప్పుడు హెండ్రిక్స్ 14 ప‌రుగులు ఇవ్వ‌గా.. ఎంగిడీ ఇప్పుడు 15 పరుగులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
     

  • టీమిండియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో తమను ఓడించి ట్రోఫీ గెలుచుకున్న భారత్‌కు.. తాజా ఎడిషన్‌లో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 వరల్డ్‌కప్‌-2026 సూపర్‌-8లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేనను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

    మా వాళ్లు అద్భుతం
    పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో టీమిండియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (Aiden Markram) హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత రీతిలో రాణించారని ప్రశంసలు కురిపించాడు. గొప్ప ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేశామని సంతోషం వ్యక్తం చేశాడు.

    ‘‘ఈ వికెట్‌ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మా వాళ్లు పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని.. అద్భుతమైన నైపుణ్యాలతో వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతం చేశారు.

    ఆ  భాగస్వామ్యం అత్యంత కీలకం
    ఇక మిల్లర్‌, బ్రెవిస్‌ నెలకొల్పిన భాగస్వామ్యం అత్యంత కీలకం. మ్యాచ్‌ను మా వైపు తిప్పేసింది వాళ్లే. లుంగి ఎంగిడి వంటి ప్రమాదకర బౌలర్‌ మా జట్టులో ఉన్నాడు. మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకం. జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడు బౌలింగ్‌ చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడు.

    టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి
    తదుపరి మేము వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆ జట్టు టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి. కాబట్టి టీమిండియాపై విజయాన్ని ఆస్వాదిస్తూనే తదుపరి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్దమవుతాము. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న ఫలితం రాబడతాము’’ అని మార్క్రమ్‌ పేర్కొన్నాడు.

    కాగా టీమిండియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి.. 187 పరుగులు సాధించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29 బంతుల్లో 45), డేవిడ్‌ మిల్లర్‌ (35 బంతుల్లో 63) యాభై బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

    కుప్పకూలిన టీమిండియా
    ఇక లక్ష్య ఛేదనలో భారత్‌ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు విజయవంతమయ్యారు. మార్కో యాన్సెన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్‌ మహరాజ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్‌ బాష్‌ రెండు, మార్క్రమ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఎంగిడి నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

    ఈ క్రమంలో 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఫలితంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో జయభేరి మోగించి సెమీస్‌ దిశగా తొలి అడుగు వేసింది. ఇక భారత్‌ తదుపరి గురువారం జింబాబ్వేతో.. సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడతాయి.

    చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 లీగ్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. కీల‌కమైన సూప‌ర్‌-8లో మాత్రం త‌మ జోరును కొన‌సాగించ‌లేక‌పోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘోర ఓట‌మి చ‌విచూసింది.

    సూర్య‌కుమార్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు బౌలింగ్‌లో కాస్త ఫ‌ర్వాలేద‌న్పించిన‌ప్ప‌టికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మైంది. 188 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు.

    భార‌త బ్యాట‌ర్ల‌లో శివ‌మే దూబే(42) ఒక్క‌డే రాణించాడు. ఈ ఓట‌మితో భార‌త్ సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనే భారీ విజ‌యం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో ఉంటుంది. ఈ ఘోర ఓట‌మితో టీమిండియా ర‌న్‌రేట్‌(-3.800) భారీగా ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    "ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అస‌లు రూపం బట్టబయలైంది. ఈ టోర్నీలో భారత్ ఛేజింగ్‌కు దిగడం ఇదే మొదటిసారి. ల‌క్ష్యాన్ని చేధించే క్ర‌మంలో టీమిండియా ఒత్తిడి త‌ట్టుకోలేక చిత్తైంది. ఛేజింగ్‌లో భార‌త్ త‌డ‌బ‌డుతుంద‌ని నాకు ముందే తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వంటి సీనియ‌ర్ ఆట‌గాడు లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది"అని జియో న్యూస్‌కు వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు. 

    కాగా టోర్నీకి ముందే భారత్ సెమీఫైనల్‌ చేరడం కష్టమని అమీర్ జోస్యం చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా ఈ టోర్నీలో భార‌త ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కూడా అట్ట‌ర్ ప్లాప్ అవుతాడ‌ని అమీర్ ఇటీవ‌ల చాలా ఇంట‌ర్వ్యూలలో  చెప్పుకొచ్చాడు. అందుకు త‌గ్గ‌ట్టే అభిషేక్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. 

    ఇప్పుడు మ్యాచ్ ఫ‌లితం కూడా అతడు అంచ‌నా వేసిన‌ట్లే రావ‌డం అత‌డు టౌక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాడు. భార‌త్‌-సౌతాఫ్రికా మ్యాచ్ అనంత‌రం అమీర్ జియో న్యూస్  చానల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ ప‌గ‌ల‌బ‌డి నవ్వుతూ “దేవుడా నన్న క్షమించు, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు. 

    దీంతో అత‌డికి భార‌త్ అభిమానులు గ‌ట్టిగా కౌంట‌రిస్తున్నారు. టీమిండియా వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో గెలిచి సెమీస్‌కు క‌చ్చితంగా వ‌స్తుంద‌ని పోస్టులు పెడుతున్నారు. కాగా టీమిండియా త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో గురువారం జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది.

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్‌ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను సైతం విమర్శిస్తున్నారు.

    ఇదే అతిపెద్ద పరాజయం
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌కు బదులు వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.

    వారిద్దరు సూపర్‌
    ‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis), డేవిడ్‌ మిల్లర్‌ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్‌ పారేసుకున్నారు.

    టీ20 క్రికెట్‌లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్‌ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.

    తిలక్‌ వర్మ నిరాశపరిచాడు
    ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్‌ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్‌. కానీ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.

    తిలక్‌ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్‌ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్‌ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

    దూబే ఒక్కడే
    కాగా అహ్మదాబాద్‌ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. 

    తిలక్‌ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్‌ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్‌ వంద పరుగుల మార్కు దాటగలిగింది.

    చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌ తర్వాత భారత క్రికెట్‌ వర్గాల్లో కలకలం రేగింది. హ్యాట్రిక్‌ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ (15) విఫలమైన అభిషేక్‌ శర్మ గాయంతోనే ఈ మ్యాచ్‌లన్నీ ఆడాడని వైభవ్ భోలా అనే క్రీడా జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టే కలకలానికి కారణమైంది.

    వైభవ్‌ భోలా పోస్ట్‌ ప్రకారం.. అభిషేక్‌ శర్మ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌కు ముందే గాయపడ్డాడు. టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన అధికారిక ఫోటోషూట్ కార్యక్రమంలో అభిషేక్‌ చేతికి గాయమైంది. దీని వల్ల అతనికి కుట్లు కూడా పడ్డాయి. అయినా, భారత మేనేజ్‌మెంట్‌ దాన్ని దాచి అభిషేక్‌ను యూఎస్‌ఏతో మ్యాచ్‌లో ఆడించింది. ఆ మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌటయ్యాడు. 

    ఆ తర్వాత అతనికి కడుపు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పటి వరకు మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ వరుస వైఫల్యాల బాట పట్టడానికి ఇదే కారణమా అని వైభవ్‌ తన పోస్ట్‌ ద్వారా టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. 

    ఈ పోస్ట్‌కు అభిషేక్‌ చేతికి బ్యాండ్‌ ఎయిడ్‌ ఉన్న ఫోటోను జోడించాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అభిషేక్‌ శర్మకు నిజంగానే గాయమైందా.. దాన్ని దాచిపెట్టే భారత మేనేజ్‌మెంట్‌ అతన్ని బరిలోకి దించుతుందా అని భారత క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ పోస్ట్‌లో నిజానిజాలు ఎంతో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై భారత మేనేజ్‌మెంట్‌ తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

    ఒకవేళ అభిషేక్‌కు నిజంగా గాయమై ఉంటే, కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు. దీని మూల్యం జట్టు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు.

    ఈ సంచలన వార్తలో నిజానిజాలను పక్కన పెడితే.. ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ ఇబ్బంది పడుతున్నాడన్నది కాదనలేని సత్యం. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న అభిషేక్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. భారీ అంచనాలు ఆ ఒత్తిడిని మరింత అధికం చేశాయి. ఇదే అతని వైఫల్యాలకు ప్రధాన కారణమయ్యుండవచ్చు. 

    అభిషేక్‌ ఫామ్‌ కోల్పోవడంపై తాజాగా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అయిన అభిషేక్‌ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని.. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే అతను ఆత్మవిశ్వాసం లేకుండా కనిపిస్తున్నాడని.. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఆతృత పక్కన పెట్టి, సింగిల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు.  

    గవాస్కర్‌ విషయాన్ని  కూడా పక్కన పెడితే.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో అభిషేక్‌ 15 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్‌కు ఈ ఘోర పరాభవం తప్పేది. అప్పటికి అభిషేక్‌ ఆచితూచి ఆడాలనే ప్రయత్నం చేసినా, సౌతాఫ్రికా బౌలర్ల ఎత్తుగడల ముందు నిలబడలేకపోయాడు. ఏదిఏమైనా సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం భారత సెమీస్‌ అవకాశాలను మాత్రం సంక్లిష్టం​ చేసేసింది. ఈ ఓటమి తర్వాత భారత రన్‌రేట్‌ -3.80కి పడిపోయింది. జింబాబ్వే, విండీస్‌తో జరిగే మిగతా రెండు సూపర్‌-8 మ్యాచ్‌ల్లో నెగ్గినా టీమిండియా తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్‌-8 దశలో మొదటి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

    అహ్మదాబాద్‌ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్‌ సేన.. 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.

    ధనాధన్‌ దంచికొట్టి..
    డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29 బంతుల్లో 45), డేవిడ్‌ మిల్లర్‌ (35 బంతుల్లో 63), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (24 బంతుల్లో 44 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టి ప్రొటిస్‌ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    దారుణంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా
    ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్‌ బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన హార్దిక్‌.. 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.

    చప్పట్లు కొట్టిన మహీక
    సఫారీ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో.. భారీ షాట్‌కు యత్నించి స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చిన హర్దిక్‌ పాండ్యా పెవిలియన్‌ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్‌ ప్రేయసి మహీక శర్మ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. హార్దిక్‌ అవుట్‌ కాగానే లేచి నిలబడిన మహీక చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

    గర్ల్‌ఫ్రెండ్‌ బర్త్‌డే వేడుకలలో..
    ఈ నేపథ్యంలో మహీకకు అసలు క్రికెట్‌ గురించి తెలుసా? అంటూ ట్రోల్స్‌ వస్తున్నాయి. అయితే, హార్దిక్‌ అభిమానులు మాత్రం.. అతడిని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్‌ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్‌ పాండ్యా వెల్లడించాడు.

    ఆమె వల్లే గొప్పగా ఆడుతున్నా
    ఇక అప్పటి నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహీక వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని.. ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్‌ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం.

    ఈ మ్యాచ్‌కు ముందు మహీక బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్‌. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    చదవండి: T20 WC 2026: టీమిండియా కొంప‌ముంచిన గంభీర్‌.. నెటిజ‌న్లు ఫైర్

National

  • రాంచీ: జార్ఘాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రాంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ అంబులెన్స్‌ జార్ఘాండ్‌ ఛత్రా జిల్లాలో కూలింది. విమానంలో సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి.  

    ప్రమాదాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో ఇద్దరు పైలట్లు, ఒక రోగి, ఇద్దరు అటెండెంట్లు, ఒక డాక్టర్, ఒక పారామెడిక్ ఉన్నట్లు తెలిపింది.  

    ఈ విమానం బీచ్‌క్రాఫ్ట్ C90 మోడల్‌ది. రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన ఎయిర్‌ అంబులెన్స్‌ రాంచీ విమానాశ్రయం నుండి సాయంత్రం 7:11 గంటలకు టేకాఫ్ అయింది. 7:34 గంటలకు కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సుమారు వారణాసి దక్షిణ-తూర్పు దిశలో 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్  కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయింది.

    దీంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఛత్రా జిల్లా ప్రభుత్వయంత్రాంగానికి సమాచారం అందించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  

  • చెన్నై: తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్ తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 70 లక్షల ఓట్లను తొలిగించగా 27.53 లక్షల కొత్త ఓట్లను తుది జాబితాలో చేర్చినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం SIR  చేపట్టింది.

    అయితే ఎస్‌ఐఆర్ పూర్తైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తుది ఓటరు జాబితాను ఈ రోజు (సోమవారం) ప్రకటించనున్నట్లు  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌ నేతృత్వంలోని అధికార వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. కాగా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియక డిసెంబరు రెండో వారం వరకు సాగింది. ఇందులో 97 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం చర్చకు దారి తీసింది. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించారు. జనవరి నెలాఖరు వరకు తొలుత, ఆతర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో మరో పది రోజులు ఈ ప్రక్రియ గడవు పొడిగించారు.

    ఈ కారణంగా ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 16వ తేదీన జాబితాను విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. సుమారు 35 లక్షల మేర కొత్త  దరఖాస్తులు రావడంతో వీటన్నింటినీ పరిశీలించేందుకు మరికొంత సమయం తీసుకోవాల్సిన అవశ్యం ఎన్నికల కమిషన్‌కు ఏర్పడింది. ఆదివారంతో ఓటరు జాబితా పనులు ముగించారు. ఈ నేపథ్యంలో  తుది ఓటరు జాబితాను ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేశారు.

     

  • ఉత్తరాఖండ్‌లో గుంపునుంచి 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడిని కాపాడి సంచలనంగా మారిన దీపక్ కుమార్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సోమవారం కలిశారు. త్వరలో తన జిమ్‌కు వెళ్తానని రాహుల్‌ దీపక్‌కు  హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

    ఉత్తరాఖండ్‌ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన  దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. 

    రాహుల్ గాంధీ , సోనియా గాంధీలను కలిసిన తర్వాత విలేకరులతో  దీపక్ మాట్లాడుతూ, “రాహుల్ జీ ఫోన్ చేసి, తన కుటుంబంతోమాట్లాడారు. ఏం జరిగినా దాని గురించి చింతించ వద్దని చెప్పారనిగుర్తు చేసుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ,చేసింది మంచిదేనని రాహుల్‌ చెప్పారన్నారు.  కోట్ద్వార్‌ను సందర్శించి తన జిమ్‌లో సభ్యత్వం తీసుకుంటానని చెప్పారనీ, రాహుల్ జీ  జిమ్‌ సభ్యత్వం తీసుకుని వర్కౌట్స్‌ చేస్తే చాలా సంతోషిస్తానని కూడా చెప్పారు. ఇంతకు ముందు తనకు వస్తున్న బెదిరింపులు ఆగిపోయాయని కూడా దీపక్ అన్నారు.

     ఈ ఏడాది  జనవరి 26న, 38 ఏళ్ల దీపక్, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న వ్యక్తుల గుంపును ఎదిరించి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా  భజరంగ్ దళ్ కార్యకర్తలుపేరు అడిగినపుడు‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.కాగా వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తర్వాత, దీపక్ నిర్వహిస్తున్న హల్క్ జిమ్‌లో సభ్యత్వ సంఖ్య 150 నుండి 15కి పడిపోయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్  ఆ తరువాత కొన్ని ఇబ్బందుల నెదుర్కున్నాడు. అయితే ‘‘ఇండియా హీరో’’ అంటూ దీపక్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. అలాగే సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్  మెంబర్ షిప్‌ తీసుకున్నారు.

     

     

  • స్నేహితులతో బీచ్‌లో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి విధి తీవ్ర విషాదం మిగిల్చింది. శనివారం చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌  ప్రాణాలు కోల్పోయింది. మరొకరు ఆచూకీ ఇంకా దొరకలేదు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. 

    మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వారిలో 22 ఏళ్ల మయూరి హరిశ్చంద్ర చౌదరిగా ప్రాణాలు కోల్పోయింది. 24 ఏళ్ల మరొకరు కనిపించకుండా పోయారు.మూడో వ్యక్తిని జాలర్లు రక్షించారు. ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సిరుసేరి క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్  చేస్తున్న ట్రైనీలు  26 మంది  శనివారం సెలవు కావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (పుదుచ్చేరి రోడ్) వెంబడి ఉన్న బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అధిక ఆటుపోట్ల కారణంగా  ప్రశాంతంగా ఉన్న సముద్రంలో దాదాపు 10 -15 అడుగుల ఎత్తులో అలలు రావడంతో  ముగ్గురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరి ఆచూకీ తెలియరాలేదు. మహారాష్ట్రకు చెందిన పదిహేను మంది ఇంటర్న్‌షిప్ కోసం  చేరిన  వారిలో వీరు ముగ్గురు కూడా ఉన్నారు.

    మృతురాలిని భండారా జిల్లాలోని మోహది తాలూకాలోని వర్తి గ్రామానికి చెందిన మయూరి హరిశ్చంద్ర చౌదరిగా గుర్తించారు. జల్గావ్ జిల్లాలోని జామ్నేర్‌కు చెందిన జై పాటిల్ ఆచూకీ కనిపించడం లేదు.  ఒడ్డుకు దూరంగా నిలబడి ఉన్న పూణేకు చెందిన రాజ్ కేదారి చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కసారిగా అల విరుచుకుపడటంతో ముగ్గురం కొట్టుకు పోయామని, ఈత కొడుతూ మయూరిని బయటకు లాగగలిగాను కానీ జైని కనుగొనలేకపోయాను అని కేదారివిచారం వ్యక్తం చేశాడు. మయూరి చౌదరిని ఇంజంబక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని గుర్తుచేసుకున్నాడు.

    సంఘటన జరిగిన వెంటనే కనత్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది గాలింపు, రక్షణ చర్యను ప్రారంభించారు.జై పాటిల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ప్రకటనలో తెలిపింది. జై పాటిల్ బంధువులు ,మయూరి చౌదరి కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.

  • గుజరాత్‌లోని ద్వారకలోని గోమతి ఘాట్ సమీపంలో అద్భుతమైన నెమలి లాంటి తోక ఉన్న అరుదైన  చేప ఆసక్తికరంగా మారింది. ద్వారకలోని గోమతి నది పవిత్ర జలాలు సాధారణంగా యాత్రికులతో కళకళలాడుతుంటాయి. సోషల్ మీడియాలో ఒక వింత చేప అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడినెమలి పింఛాన్ని పోలిన చేప అంటూ ఇటు భక్తి పారవశ్యాన్ని, ఇటు శాస్త్రవేత్తలలో  ఉత్సుకతను రేకిత్తించింది. అసలేంటీ నెమలి పింఛం పోలిన తోకతో ఉన్న 'నీడిల్ ఫిష్' (Needlefish) కథ తెలుసుకుందాం.

    దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. చూసేందుకు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుని తలపైన ఉండే నెమలి పింఛంలాగే ఉందని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే, అద్భుతంతో పాటు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక చేప నెమలి పింఛంతోకతో కనిపించిన అసాధారణ దృశ్యం  సముద్ర జీవవైవిధ్యంలో వస్తున్న మార్పులకు ఇది ఒక సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

    చేప తోకలోని రంగురంగుల విసనకర్ర లాంటి తోకను చూసి స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తాయని నిపుణుల అంచనా.శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఒక అరుదైన జన్యుపరమైన మార్పు లేదా పర్యావరణ ప్రభావం వల్ల కలిగిన శారీరక మార్పు అయి ఉండవచ్చు 

    ఈ నీడిల్ ఫిష్ శరీరం పొడవుగా, సూదిలా ఉండి,  తోక విసనకర్ర ఆకారంలో ఉండి, నెమలి ఈకల వలె మెరిసే నీలం, పచ్చ రంగులతో కూడి ఉండటం విశేషం. సాధారణంగా నీడిల్ ఫిష్‌లు (Needle Fish) పొడవైన శరీరాలు, పదునైన దవడలు కలిగి ఉంటాయి, కానీ వాటికి ఇంత అందమైన, రంగురంగుల తోకలు ఉండటం చాలా అరుదు. 

    ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

    ఈ చేప ప్రత్యేకత ఏమిటి?
    సాధారణంగా ఈ జాతి చేపలకు తోక రెక్కలు (Fins) చాలా చిన్నవిగా, రంగు లేకుండా ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన చేపకు తోక భాగం చాలా వెడల్పుగా, స్పష్టమైన రంగులతో ఉంది. కాంతి పడినప్పుడు ఆ తోక నెమలి పింఛంలా మెరుస్తూ కనిపిస్తోంది. గోమతి నది అరబిక్ సముద్రంలో కలిసే చోట (Brackish water) మంచినీరు, ఉప్పునీరు కలిసి ఉంటాయి. వాతావరణ మార్పులు, నీటిలోని లవణీయత (Salinity) మారడం లేదా సముద్ర ప్రవాహాల వల్ల ఇలాంటి అరుదైన సముద్ర జీవులు అప్పుడప్పుడు తీరానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం వల్ల కొన్ని జీవుల ఆవాసాలు మారుతుంటాయి. జన్యుపరమైన మార్పులు (Mutation) లేదా స్థానిక పర్యావరణ ప్రభావం వల్ల ఈ చేప తోక ఇలా భిన్నంగా తయారై ఉండవచ్చు.  దీనిపై సరైన పరిశోధన జరిగితే, భారత తీర ప్రాంతాల్లోని సముద్ర జీవుల పరిణామ క్రమం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.ఇది తెలిసిన జాతిలో ఒక కొత్త రకమా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా అనేది పక్కన పెడితే, ఈ "నెమలి తోక చేప" మాత్రం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. 

    ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

    గోమతి ఘాట్: ఈ ఘాట్ సుమారు 100 సంవత్సరాలకు పైగా భక్తులచే పూజించబడుతోంది, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ స్నానం చేసినట్లు నమ్మకం. గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే పవిత్రమైన ప్రదేశం. దీనిని గోమతి సంగమ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం చేసి, తమ పాపాలలన్నీ హరిస్తాయని   భక్తుల విశ్వాసం.
     

  • న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం హఠాత్తుగా హై అలర్ట్ ప్రకటించారు. చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి (అసెంబ్లీ) బాంబు బెదిరింపులు రావడంతో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా పంపిన హెచ్చరికలతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపు ఈమెయిల్ ఒక ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు పేరుతో వచ్చినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

    రాజధానిలోని అత్యంత కీలకమైన ఎర్రకోట, సచివాలయం ప్రాంతాలను బాంబులతో పేల్చివేస్తామన్న సందేశం అందగానే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ సచివాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గమనిస్తున్నారు.

    ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగానే, మరోవైపు ఈ-మెయిల్ మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నాయి. ఖలిస్థానీ సానుభూతిపరుల పేరిట వచ్చిన ఈ బెదిరింపుల వెనుక అసలు కుట్రదారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Crime

  • సాక్షి,తిరుపతి: రేణిగుంట నారాయణ జూనియర్‌ కాలేజీలో విద్యార్థిని మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

    ఇంజక్షన్‌ ఇవ్వడంతో విద్యార్థిని చర్మంపై వాపై వచ్చింది. తిరుపతి రుయా ఆస్పత్రికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే తమ కుమార్తె మరణించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

International

  • ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రారంభించారన్నారు. మాస్కో దండయాత్రను అడ్డుకోవడం ద్యారా ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.

    ఉక్రెయన్- రష్యా యుద్ధం ప్రారంభమై ఇటీవలే నాలుగు సంవత్సరాలు పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని నిరోధించడానికి పెద్ద ఎత్తున యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి జెలెన్‌స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

    యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుని నుంచి స్పష్టమైన హామీలు ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. కేవలం అధ్యక్షుని మాట పూర్వక హామీ కాకుండా దానికి రాజ్యాంగ పరమైన అనుమతి ఉండాలని కోరారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పుడు ఉన్న సరిహద్దులే తమ అంతిమ లక్షమని అయితే ఇప్పుడు రష్యా సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్నందున అది సాధ్యం కాదని జెలెన్‌స్కీ ఒప్పుకున్నారు.

    అయితే రష్యా తమ భూభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని విషయం తనకు తెలుసన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రష్యా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని జెలెన్‌స్కీ తన అభిప్రాయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలే నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహారించిన మహ్మద్‌ యూనస్ ఆ బాధ్యతలనుంచి వైదొలిగారు. అయితే యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో అస్థిరత నెలకొనడానికి యూనస్‌ ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా అధ్యక్షుడిగా ఉన్న తనను అనధికారికంగా తొలిగించే కుట్రపన్నారని  పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్‌లో ఇంతకాలం పాటు రాజకీయ అస్థిరత నెలకొంది. షేక్ హసీనా దేశాన్ని వదలిన మెుదలు ఆ దేశంలో రాజకీయ ‍అస్థిరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహరించిన మహ్మద్ యూనస్ ఈ పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. ఆయన కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించి రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తేవడానికి యత్నించారన్నారు.

    బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ మాట్లాడుతూ " ఆయన పదవిలో ఉన్నంత కాలం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదు. నన్ను పదవిలోంచి తొలగించే కుట్రలు జరిగాయి. అదేవిధంగా చాలాసార్లు దేశంలో అస్థిరత, అశాంతి సృష్టించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించే యత్నాలు జరిగాయి. అని ఆదేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.

    అదేవిధంగా మహ్మద్ యూనస్ తన పదవి కాలంలో ఎటువంటి రాజ్యాంగంగా నిర్వహించాల్సిన తుంగలో తొక్కారని తన విదేశీ పర్యటనల సమయంలో దేశ అధ్యక్షునికి తెలపాల్సిన కనీస సమాచారం ఇవ్వలేదన్నారు.  విదేశీ పర్యటనల వివరాలు అధ్యక్షునితో పంచుకోవాల్సి ఉండగా దానిని సైతం పాటించలేదని తెలిపారు. అంతే కాకుండా తన పదవికాలంలో ఒక్కసారి కూడా తనను కలవడానికి అధ్యక్షుని నివాసానికి రాలేదని షహబుద్దీన్ తెలిపారు.

    ఏడాదిన్నర కాలం పాటు యూనస్ ప్రభుత్వం తనను ప్యాలెస్ ఖైదీగా బంధించిందని కోస్వో, ఖతార్ దేశ పర్యటనలను చేయాల్సి ఉండగా తనకు అనుమతులివ్వలేదని తెలిపారు. అయితే ఒకానోక సమయంలో తన స్థానంలో మాజీ న్యాయమూర్తిని అధ్యక్షున్ని చేద్దామని భావించగా రాజ్యాంగ నియమాలు సహకరించవని ఆ న్యాయమూర్తి చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు.

    2024 అక్టోబర్ 22న జరిగిన సంఘటన తానిప్పటికి మరిచిపోనని ఆ సమయంలో అల్లరిమూక అధ్యక్ష భవనంపై దాడికి యత్నించిందని అయితే మిలిటరీ తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం బీఎన్‌పీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని నమ్మకముందని షహబుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • టెహ్మాన్ : ప్రస్తుతం ఇరాన్-యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఏ క్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ ఏ విధంగా నైనా తక్షణమే ఇరాన్‌ని వదిలేయాలని ఆదేశించింది.

    ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ దేశంపై ఏ క్షణానైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉండడంతో తమ పౌరులను తమ స్వస్థలాలకు తిరిగిరావాలని ఆదేశిస్తున్నాయి. తాజాగా భారత్‌ సైతం ఈ జాబితాలో నిలిచింది. ఇరాన్‌లో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా ఆదేశాన్ని వదలాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

    "ఇరాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, వర్తకులు, పర్యాటకులు ఇలా ఎవరు ఆదేశంలో ఉన్న వెంటనే ఇరాన్‌ని వీడాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ రవాణా మార్గన్నైనా వాడి  అక్కడి నుండి బయిటపడండి.  ప్రయాణానికి  కావాల్సిన ధృవపత్రాలు ఐడీకార్డులు మీతో ఉంచుకొండి. ఏదైనా అవసరముంటే అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించండి" అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

    అయితే ఇరాన్‌లో ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో భారత పౌరులు గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని భారత్ సూచించింది. కాగా ప్రస్తుతం ఆ భూభాగాన్ని వీడాలని ఆదేశాలు జారీ చేసింది. 

    అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య వచ్చే గురువారం అణు ఒప్పందం విషయంలో చర్చలు జరగనున్నాయి. ఈ వివరాలను ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి బదర్ అల్ బుసైదీ తెలిపారు. అయితే ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ట్రంప్  ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. 

  • ప్రధాని  మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ కీలక ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్ రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ, డ్రోన్లు ఇతరాత్ర ఆధునాతన ఆయుధాలకై దాదాపు 93.5 బిలియన్ డాలర్లతో ఇజ్రాయెల్‌తో భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్‌తో జరిగే అతిపెద్ద డీల్‌గా ఇది చరిత్రకెక్కనుంది.

    ఇజ్రాయెల్  దేశం సాంకేతికత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విస్తీర్ణంపరంగా చిన్న దేశమైనా తన ఆధునాతన సాంకేతికతో అత్యాధునికి డ్రోన్లు, రక్షణవ్యవస్థ ఇలా ఎంతో మెరుగైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ మోసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరొందింది. అయితే ప్రధాని మోదీ ఫిబ్రవరి 25 న ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

    భారత్, ఇజ్రాయెల్‌తో 93.5 బిలియన్‌ డాలర్లతో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు ఇతరాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక వేశ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణపరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.

    అయితే ఇజ్రాయెల సైతం గతంలో ఎన్నడూ లేనివిధంగా  తన అత్యంత రహస్యమైన, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్‌తో పంచుకోవడానికి అంగీకరించంది. గత నవంబర్‌లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి. 

    ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిషన్ సుదర్శన్'లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం.

      
     

  • గాజాలోని రఫాలో హమాస్‌ ఉగ్రవాదుల సొరంగాలను ఇజ్రాయిల్‌ రక్షణ దళాలు(ఐడీఎఫ్‌) పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ ఉగ్రవాదులను నిర్మూలించి, సొరంగాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.  హమాస్‌ ఉగ్రవాదులు తమ ఆయుధాలను సొరంగాల్లో దాచారనే సమాచారంతో వాటిని పూర్తిగా నిర్వర్యం చేయడానికి రంగంలోకి దిగి, విజయవంతంగా ముగించినట్లు తెలిపింది.

    రఫాలో ఒక కిలోమీటర్ పొడవైన హమాస్ సొరంగాన్ని ధ్వంసం చేసిన వీడియోలను ఐడీఎఫ్ సోమవారం విడుదల చేసింది.. ఈ సొరంగంలో హమాస్ ఉగ్రవాదులు దాగి ఉండే గదులు, అలాగే ఆయుధాలు కూడా కనుగొన్నారు. ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ సొరంగాన్ని యహలోమ్ ఎలైట్ ఇంజినీరింగ్ యూనిట్ పూర్తిగా కూల్చివేసినట్లు పేర్కొంది. 2025 అక్టోబరు 28న జరిగిన దాడిలో మాస్టర్ సర్జెంట్ (రిజర్వ్) యోనా ఎఫ్రైమ్ ఫెల్డ్‌బౌమ్ వీరమరణం పొందిన చోటుగా గుర్తించబడిన సొరంగాన్ని కూడా ధ్వంసం చేశారు.

    గత వారం రఫాలోని మరో సొరంగ ద్వారం వద్ద తొమ్మిది మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ దళాలు నిర్మూలించాయి. వారు సొరంగం నుంచి బయటకు వచ్చి కాల్పులు జరిపినప్పుడు వీరిని హతమార్చాయి ఐడీఎఫ్‌ దళాలు. రఫా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదుల మౌలిక వసతులను పూర్తిగా కూల్చివేయడమే లక్ష్యంగా ఐడీఎష్‌ దళాలు తమ దాడులు ముమ్మరం చేశాయి. 
     

Movies

  • టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్‌ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్‌ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్‌లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.

    ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్  సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్‌లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. 

    కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్‌ను సీక్రెట్‌గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత  టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. 
     
     

  • అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా  చిత్రం కాక్‌రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం.  మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.

    డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్‌కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు.

     

  • హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.

    తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని  జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్‌ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది.

     

     

  • సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్‌లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్‌ నిర్మించారు. 

    ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్‌ పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


     

  • గ్లామరస్ పోజులతో సరికొత్త సమంత హంగామా

    లంగా ఓణీలో అందంగా 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి

    దుబాయిలో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష‍్మి

    క్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌లో ఆషికా రంగనాథ్

    అందం చూపిస్తూ రచ్చ లేపుతున్న అంజలి

    రాణీ ముఖర్జీ, రేఖతో కలిసి కీర్తి సురేశ్ ఫొటోలు

  • ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. దాదాపు ప్రతి భాషకు చెందిన సినిమాలని డబ్బింగ్ రూపంలో తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. అలాంటిది ఈ కాలంలోనూ రీమేక్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పొచ్చు. ఆ సాహసం చేసి తీసిన చిత్రమే 'ఓం శాంతి శాంతి శాంతిః'. థియేటర్లలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పోస్టర్ కూడా వదిలారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పుడప్పుడు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. అలా హీరోగా చేసిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈషా రెబ్బా హీరోయిన్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. 2022లో మలయాళంలో వచ్చిన 'జయ జయ జయహే' చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయినా సరే ఈ సినిమా నిర్మాతలు సాహసం చేశారు. కానీ అది బెడిసికొట్టింది.

    ఒరిజినల్ సినిమా నుంచి సీన్ టూ సీన్ దింపేశారు. కాస్త నేటివిటీ మార్చినప్పటికీ మరీ స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా థియేటర్లలోకి రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మార్చి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.

    'ఓం శాంతి శాంతి శాంతిః' విషయానికొస్తే.. మంచిగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకునే మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి(ఈషా రెబ్బా). కాలేజీలో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు ఆపేసి ఈమెని ఓంకార్ నాయుడు(తరుణ్ భాస్కర్) అనే చేపల వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత కూడా చదువుకోవచ్చనే ఆలోచనతో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కానీ అత్తారింట్లో ఊహించనివి జరుగుతాయి. భర్త తన అహంకారాన్ని, కోపాన్ని ఈమెపై చూపిస్తుంటాడు. ప్రతిసారీ చెంపపగలగొట్టేస్తుంటాడు. ఓ రోజు కోపం పట్టలేక ప్రశాంతి, భర్తకు ఎదురుతిరుగుతుంది. భర్తని కుక్కని కొట్టినట్లు కొడుతుంది. తర్వాత ఏమైంది? భార్యభర్తలిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 8 ఏళ్ల తర్వాత గడ్డం తీసేసిన 'కేజీఎఫ్' యష్.. ఇలా ఉన్నాడేంటి?)

  • టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్‌స్పోర్ట్స్ టీమ్‌ హైదరాబాద్ బ్లాక్‌ బర్డ్స్‌కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్‌లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్‌  తర్వాత సరికొత్త మైథలాజికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్‌సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. 
     

     

  • కాలేజీ డేస్‌లో చాలామంది ప్రేమలో పడతారు. కొందరిది వన్‌సైడ్‌ లవ్‌ అయితే మరికొందరిది టూసైడ్‌ లవ్‌. అలా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడట! ఈ విషయాన్ని 'ద వీల్‌ ఆఫ్‌ ఫార్చ్యూన్‌' షోలో వెల్లడించాడు. తాజాగా ఈ షోలోని లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

    అమ్మాయి ఇంటి ముందు
    తన కాలేజీ డేస్‌లోని లవ్‌ స్టోరీని గుర్తు చేసుకున్నాడు. 'ఇది 40 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాను. తనకోసం ప్రత్యేకంగా ఒక పాట నేర్చుకున్నాను. నా ఫ్రెండ్‌ ఒకరికి గిటార్‌ వాయించడం తెలుసు. కాబట్టి వాడిని వెంటేసుకుని నేరుగా అమ్మాయి ఇంటి ముందు నిలబడ్డాను. 

     తన్నులు తిన్నాం
    అతడు గిటార్‌ వాయిస్తుంటే నేను పాట పాడటం మొదలుపెట్టాను. నా పాట విని అమ్మాయి వస్తుందనుకుంటే చుట్టుపక్కలవాళ్లు వచ్చి మమ్మల్ని చితక్కొట్టారు. వారి చేతిలో చచ్చామనుకున్నాం. ఎవరినో ఇంప్రెస్‌ చేద్దామని వెళ్లి మేమే తన్నులు తిని వచ్చాం' అని గుర్తు చేసుకున్నాడు.

    పర్సనల్‌ లైఫ్‌
    కాగా సినిమాల్లో స్టార్‌ హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్న అక్షయ్‌ ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌ ఫోటోషూట్‌లో హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నాను కలిశాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసింది. 2001లో అక్షయ్‌, ట్వింకిల్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2002లో కుమారుడు ఆరవ్‌ జన్మించాడు. 2012లో కూతురు నితారా పుట్టింది.

    చదవండి: విడాకుల తర్వాత బాధలో.. ఎవర్నీ నమ్మొద్దనుకున్నా..: సమంత

  • సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్‌ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

    తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్భంగా  కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్‌ స్పందించారు. అనురాగ్‌కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.

    కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఫిల్మ్‌ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

     

  • 'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 2025 డిసెంబర్‌ 1న బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్‌.

    అతడి వల్లే ఇలా ఉన్నా
    తాజాగా వోగ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్‌ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్‌ వల్లే నేనిప్పుడు బెటర్‌ పర్సన్‌గా మారాను. 

    ఈ మధ్యే ఫ్రెండ్‌ను కలిశా..
    ఇటీవలే నా పాత ఫ్రెండ్‌ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్‌ అని మెసేజ్‌ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్‌ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్‌. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

     

     

    చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్‌ నటుడు

  • పాన్ ఇండియా ట్రెండ్ కలిసొచ్చిన హీరోల్లో ఇతడు ఒకడు. చేసింది రెండే సినిమాలు అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇతడికి అభిమానులయ్యారు. 2022లో చివరగా పలకరించిన ఈ హీరో.. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఓ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే గత 8-9 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు.. ఎట్టకేలకు కొత్తగా కనిపించాడు. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    పైన కనిపిస్తున్నది 'కేజీఎఫ్' ఫేమ్ యష్. సడన్‌గా చూస్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమాల కోసం చాలా గడ్డం పెంచేసిన ఇతడు.. దాన్ని అలానే ఉంచేశాడు. తర్వాత 'టాక్సిక్' మూవీ చేసినప్పటికీ అందులో గడ్డం లుక్‌తోనే ఓ పాత్ర ఉంది. ఇది కాకుండా మరో రోల్‌‌లో క్లీన్ షేవ్‌తో కనిపించాడు. కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్ చివరలో కనిపించి కనిపించకుండా లుక్ చూపించారు. దాన్ని ఏఐతో క్రియేట్ చేశారని చాలామంది కామెంట్స్ చేశారు.

    ఆ ట్రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన స్టైలిష్ట్.. యష్ క్లీన్ షేవ్ లుక్ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. 'నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది' అని సదరు హెయిర్ స్టైలిష్ట్ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఇన్నాళ్లు గడ్డంతోనే యష్‌ని చూసిన ఫ్యాన్.. ఈ లుక్ చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. వాళ్లకు ఈ యష్.. ఎవరో కొత్త వ్యక్తిలా కనిపిస్తుండటం విశేషం.

    'టాక్సిక్' విషయానికొస్తే 1970ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీసింది. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి తదితరులు హీరోయిన్లుగా నటించారు. మార్చి 19న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. టీజర్ రిలీజ్ తర్వాత యష్ సొంత భాషలో పెద్దగా సౌండ్ లేదు. తెలుగులోనే కాస్తంత ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. దానికి తోడు.. మార్చి 19నే 'ధురంధర్ 2' రిలీజ్ కానుంది. యష్ మూవీతో పోలిస్తే దీనిపైనే ఎక్కువ హైప్ ఉంది.

    (ఇదీ చదవండి: అన్న అని పిలవను.. రాజీవ్ కనకాల నాకు బావ!: గాయత్రి భార్గవి)

  • ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ అలీ. ఎఫ్‌ఐఆర్‌ అనే టీవీ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టాడు.

    నా పని అయిపోయిందనుకున్నా
    అతడు మాట్లాడుతూ.. నేను టీవీలో ఫస్ట్‌ సీరియల్‌ చేసినప్పుడు అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు బుల్లితెరపై కనిపించాలని లేదు. టీవీలో కనిపిస్తే సినిమా యాక్టర్‌గా నా పనైపోయినట్లేనని నా అభిప్రాయం. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే కొన్ని సినిమాలు చేశాను.. కానీ, అవి రిలీజ్‌ కాకుండానే ఆగిపోయాయి. దాంతో నాకివ్వాల్సిన డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. 

    చేతిలో చిల్లిగవ్వ లేక..
    ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తినడానికి తిండి లేక, ఫుడ్‌ కొనుక్కోవడానికి సరిగా డబ్బు కూడా ఉండేది కాదు. ఇంటి బాధ్యత మొత్తం నాపైనే ఉంది. అప్పటికే నేను రెండు మూడు సినిమాలు చేయడంతో ఇక్కడ కెరీర్‌ సెట్టయిందన్న భావనతో ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అయిష్టంగా టీవీ ఇండస్ట్రీకి వెళ్లాల్సి వచ్చింది. 

    సీరియల్స్‌ ఎందుకు అనగానే..
    అప్పుడు ప్రతిరోజు నేను నా వ్యాన్‌లో కూర్చుని ఏడ్చేవాడిని. నాతో సినిమాలు చేసినవారందరూ ఎందుకు సీరియల్స్‌ చేస్తున్నావని అడగ్గానే దుఃఖం తన్నుకొచ్చేది. అరగంటపాటు ఆపకుండా ఏడ్చేవాడిని. 2019లో చాలామంది దర్శకనిర్మాతలను కలిశాను. నువ్వు హీరోవి, నిన్ను సైడ్‌ క్యారెక్టర్స్‌లో ఎలా చూస్తారు? 

    ఇప్పటికీ ఇబ్బందులే..
    ఒకవేళ అలాంటి పాత్ర ఏదైనా ఉంటే చెప్తాం అంటూ మాట దాటేసేవారు. 2017లో టీవీ ఇండస్ట్రీని వదిలేసినప్పటికీ నాపై బుల్లితెర నటుడు అనే ముద్ర అలాగే ఉండిపోయింది. అంత ఈజీగా నాకెవరూ అవకాశాలివ్వరు అని ఆమిర్‌ అలీ చెప్పుకొచ్చాడు. ఆమిర్‌ అలీ.. ఐ హేట్‌ లవ్‌ స్టోరీస్‌, ఫరాజ్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

    చదవండి: బుల్బుల్‌ తర్వాతే క్రేజ్‌.. యానిమల్‌తో సెన్సేషన్‌

  • మలయాళ నటి నిలీన్‌ సాండ్రా గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. దర్శకుడు శ్యామిన్‌ గిరీశ్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. దేవుడు ఒక స్త్రీని ఆశీర్వదించాలనుకున్నప్పుడు తనను ప్రేమగా చూసుకునే ఓ వ్యక్తిని తన జీవితంలోకి పంపుతాడు. 

    పెళ్లి చేసుకోబోతున్నా..
    అలా 2017లో నాకోసం నిన్ను పంపాడు. ప్రేమికుడిగా కాదు బెస్ట్‌ ఫ్రెండ్‌గా! ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడదే బెస్ట్‌ ఫ్రెండ్‌తో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను. దేవుడు నాకోసం పంపిన వ్యక్తిని పెళ్లాడబోతున్నాను అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోలో నిలీన్‌.. శ్యామిన్‌తో కలిసి సరదాగా గడిపిన క్షణాలున్నాయి.

    ప్రియురాలి కోసం..
    ఒకరికోసం ఒకరు నిలబడటం, విహారయాత్రకు వెళ్లడం, కలిసి భోజనం చేసిన క్లిప్పింగ్స్‌ ఉన్నాయి. అలాగే శ్యామిన్‌.. నిలిన్‌కు చీర సర్దడం, కాలికి మెహందీ వేయడం, కాలికి మసాజ్‌ చేయడం, తనకోసం ఇల్లు తుడవడం ఇలా ఎన్నో చేశాడు. మలయాళ నటి నిలీన్‌ సాండ్రా.. 2018, ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ వంటి చిత్రాల్లో నటించింది. అలా సామర్థ్య శాస్త్రం, రాక్‌ పేపర్‌ సిజర్స్‌ వెబ్‌ సిరీస్‌లలో కనిపించింది.

     

     

    చదవండి: విజయ్‌- రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?

  • సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రి భార్గవి.. తర్వాత తెలుగులోనూ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. లేటెస్ట్‌గా ఈమె.. 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' అనే వెబ్ సిరీస్ చేసింది. జీ5 ఓటీటీలో ఇది ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రీమియర్ ఈవెంట్ జరగ్గా, ఇందులో మాట్లాడిన నటి గాయత్రి భార్గవి.. నటుడు రాజీవ్ కనకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈయనే నాకు తొలి క్రష్ అని అప్పటి సంగతులని గుర్తుచేసుకుంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    'ఈ అమ్మాయి టీవీకి పనికొస్తుందని అప్రూవ్ చేసింది రాజీవ్ కనకాల ద్వారానే. నాకు బాగా గుర్తు. ఓసారి రాజీవ్, బెన్నం ఓ బైక్‌పై.. నా కాలేజీకి వచ్చారు. నా ఫొటో, నన్ను చూసి వెళ్లిపోయారు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఓ యాడ్‌లో నటించే అవకాశం దక్కింది. అప్పటినుంచి రాజీవ్ నాకు తెలుసు. ఈయనే నాకు ఫస్ట్ క్రష్. మేం దూరదర్శన్ లో రకరకాల ప్రోగ్రామ్స్ చూసిన రాజీవ్.. మా అందరికీ మొదటి క్రష్. అందుకే సుమ అక్క, రాజీవ్ బావగారు అంటాం. అసలు అన్న గిన్న అని మేం పిలవం' అని గాయత్రి భార్గవి చెప్పుకొచ్చింది.

    అయితే గాయత్రి భార్గవి చెబుతున్నప్పుడు రాజీవ్ కనకాల తెగ సిగ్గుపడిపోయాడు. పక్కనే ఉన్న ఉదయభానుతో సహా అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు. ఇక సిరీస్ విషయానికొస్తే.. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. నటి వాసంతిక టైటిల్ రోల్ చేసింది. రాజీవ్ కనకాల.. ఈమెకు తండ్రిగా నటించాడు. కనిపించకుండా పోయిన కూతురిని వెతికేందుకు తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకప్పటి యాంకర్ ఉదయభాను.. పోలీస్ పాత్ర చేయడం విశేషం.

    (ఇదీ చదవండి: నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య)

  • టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి  తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్‌' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫ్యాన్స్‌ తమలో ఒక భాగం అంటూ..  వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్‌ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ లేదనే విషయం తెలిసిందే.

    విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్‌ ఉంది. విజయ్‌​ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని టాక్‌. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.

    గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్‌లో మార్చి 4న వివాహ రిసెప్షన్‌ కార్యక్రమం జరగనుంది.
     

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

    తొలుత ఈ నెల 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. ఆ తేదీని కాస్త వెనక్కు జరిపింది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి తుది మెరుగులు దిద్దే క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కాస్త వెనక్కు జరపాల్సి వచ్చినట్లు సమాచారం. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీ ప్రవేశపెడతారు.  గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 

  • సాక్షి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  హైదరాబాద్ ఎల్‌ అండ్‌ టీ మెట్రోను పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు తెలంగాణ వైద్య విధాన పరిష‍త్ పేరు మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్‌ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చింది. 

    అదే విధంగా ఇకపై టీవీవీపీ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానున్నట్లు తెలిపింది.  ఈ రోజు  కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబీనెట్ సమావేశమయ్యింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించదలచిన జనగణనపై కేబీనెట్ భేటీలో కీలక చర్చ జరిపారు. రాష్ట్రంలో జనగణనను అ‍త్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు 89వేల సిబ్బంది పని చేయననున్నట్లు తెలిపారు. ప్రజల వివరాల కోసం  34 ప్రశ్నలతో కేంద్రం రూపొందించిన సమగ్ర సర్వే పత్రాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

    మే 11న ఇండ్ల గణన ప్రక్రియను ప్రారంభించి జూన్ 9 వతేదీ వరకూ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలిదశ జనగణన పూర్తైన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండోదశ జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • హైదరాబాద్‌:  నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హౌసింగ్ బోర్డు స్థలాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.  తాజాగా జరిగిన వేలంపాటల్లో ఈ స్థలాలకు ఊహించని స్థాయిలో పోటీ కనిపించింది. గచ్చిబౌలిలో 263 గజాల ఫ్లాట్‌కు రికార్డు ధర పలికింది.  ఈ ప్లాట్‌కు సంబంధించి చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది. 

    ఇక కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షల ధరకు అమ్ముడుపోయింది. చింతల్‌లో గజానికి రూ.84 వేలు, రూ.74 వేలు ధర పలకగా, నిజాంపేట సిద్ధి ఫ్లాట్ రూ.17.70 లక్షలకు విక్రయించారు. బౌరంపేట 2600 గజాల భూమి గజానికి రూ.61 వేల అమ్ముడుపోగా, ఎంఐజి, హెఐజి ప్లాట్లకు కొనుగోలుదారుల పోటీ నెలకొంది. 

    ఇలా బహిరంగ వేలం ద్వారా రూ. 34. 27 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 14 భూములను వేలం ద్వారా విక్రయించగా, వాటికి రికార్డు ధరలు పలికాయి. ఈ వేలాన్ని కెపిహెచ్‌బి కమ్యూనిటీ హాల్‌లో  నిర్వహించారు. ఇందులో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. 

     

  • సాక్షి హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులతో పాటు వాహనదారులు కాసేపు సేదతీరారు. కొద్దిరోజులుగా ఎండవేడిమి బాగా పెరిగిపోవడంతో  చల్లటి వాన జల్లులకు పట్టణవాసులకు కొంత ఉపశమనం లభించింది. అయితే నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ ఎగ్జామ్స్  జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలు సిద్దం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

    ఈ నెల 25 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18తో ఇవి ముగుస్తాయి. అయితే పరీక్షల సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మెుత్తంగా 9,97,075 మంది పరీక్షలకు హాజరవుతుండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది కాగా ద్వితీయ సంవత్సరం 5,07,949 మంది అని ఇంటర్ బోర్టు తెలిపింది.

    ఎగ్జామ్స్‌ కోసం ప్రత్యేకంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందు గానే చేరుకోవాలని తెలిపింది. పరీక్షలు పకడ్బందీగా జరగడానికి 7,500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థుల కోసం ప్రతి పరీక్షా కేంద్రాలలో ప్రత్యేకంగా తాగునీరు, ఫర్నీచర్, గోడ గడియారాలు అధికారులు తెలిపారు.

    మానసిక ఒత్తిడికి టెలిమానస్

    పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు లోనయితే సైకాలజిస్టుల సలహాలు తీసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. అందుకోసం 14416 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేయాలని పేర్కొంది. ఈ సేవలు నిరంతరాయంగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Business

  • సాధారణంగా రోడ్డుపై కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్స్ వైట్, ఎల్లో, గ్రీన్ గంగులలో ఉండటం చాలామంది గమనించి ఉంటారు. అయితే అరుదుగా బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ కూడా చూసి ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి కలర్ నెంబర్ ప్లేట్ ఎందుకు అరుదుగా కనిపిస్తుంది?, దీనిని ఎవరికి కేటాయిస్తారు? అని ఆలోచించారా.. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

    బ్లూ కలర్ నెంబర్ ప్లేట్.. ప్రధానంగా విదేశీ దౌత్యవేత్తలు & రాయబార కార్యాలయాలకు చెందిన వాహనాలకు కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ రంగును బట్టి దౌత్య సిబ్బందికి చెందిన వాహనాలు అని.. అధికారులు గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, అధికారిక ప్రయోజనానికి మాత్రమే.

    బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం సభ్య దేశాలు దౌత్య సంబంధాల విషయంలో కొన్ని నియమాలను పాటిస్తాయి. భారతదేశం కూడా ఆ ఒప్పందానికి సభ్యదేశం కావడంతో ఈ విధానం అమలులో ఉంది.

    నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెలుపు అక్షరాలు ఉండటం వల్ల ఈ వాహనాలు సులభంగా గుర్తించవచ్చు. సాధారణ వ్యక్తిగత వాహనాలకు తెలుపు నెంబర్ ప్లేట్లు, కమర్షియల్ వాహనాలకు పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ పోలీసులు దౌత్య వాహనాలను త్వరగా గుర్తించగలుగుతారు.

    ఈ వాహనాల నెంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో అక్షరాలు & సంఖ్యలు ఉంటాయి. కొన్ని ప్లేట్లపై CD లేదా CC వంటి గుర్తులు కనిపిస్తాయి. CD అంటే దౌత్యవేత్తలకు చెందిన వాహనం, CC అంటే కాన్సులేట్ అధికారులకు చెందిన వాహనం.

    దౌత్యవేత్తలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. కొన్ని ప్రత్యేక హక్కులు. వారికి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అనే సదుపాయం కూడా లభిస్తుంది. అయితే.. దీని అర్థం వారు చట్టానికి అతీతులు కాదు. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే.. సంబంధిత దేశం ఆ వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రకటించి దేశం విడిచి వెళ్లమని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తప్పకుండా రహదారి నియమాలు & భద్రతా ప్రమాణాలను పాటించాలి.

    ఇదీ చదవండి: 'అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయ్': నిర్మలా సీతారామన్

  • ఈక్విటీలలో థీమ్యాటిక్‌/సెక్టోరల్‌ ఫండ్స్‌ అన్నవి కొంచెం రిస్క్‌ ఉన్నా సరే, రాబడులు కూడా బలంగా ఉండాలని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇవి తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ మాత్రం భిన్నమైన, మెరుగైన పనితీరుతో ఆకర్షిస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వైవిధ్యం కోసం కేటాయించుకోవాలని భావించేట్టు అయితే.. ఈ ఫండ్‌ను పరిశీలించొచ్చు.

    రాబడులు
    ఈ పథకం 2021 జనవరిలో ప్రారంభమై.. ఐదేళ్ల ట్రాక్‌ రికార్డును పూర్తి చేసింది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే అది రూ.2.51లక్షలుగా మారి ఉండేది. ఐదేళ్లలోనూ ఏటా 20.56 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇదే కాలంలో నిఫ్టీ 500 టీఆర్‌ఐ రాబడి 15.47 శాతమే ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో పెట్టుబడులపై 18 శాతం రాబడిని అందించింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడి 22.82 శాతంగా ఉంది. ఇక ఇదే విభాగంలో ఇతర పథకాలతో పోలి్చతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిజినెస్‌ సైకిల్‌ ఫండ్‌ ట్రాక్‌ రికార్డు పటిష్టంగా ఉంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే రూ.6.10 లక్షలు ఐదేళ్లలో రూ.9.74 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 18.47 కాంపౌండెడ్‌ రాబడి (సీఏజీఆర్‌)కి సమానం.

    పెట్టుబడుల విధానం..
    బిజినెస్‌ సైకిల్స్‌ అంటే.. కొన్ని వ్యాపారాలకు ఒక్కో సమయంలో డిమాండ్‌ బలంగా ఉంటుంది. ప్రస్తుతం మెటల్స్‌లో బంగారం, వెండి, అల్యూమినియం, రాగి ధరలు గణనీయంగా పెరగడం, ఈ రంగాల్లోని కంపెనీలు బలంగా లాభాలు ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైకిల్స్‌ను ఈ ఫండ్‌ ముందే గుర్తించి ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. స్థూల ఆర్థిక పరిస్థితులకు (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వృద్ధి గమనం, ద్రవ్య పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు) అనుగుణంగా ప్రయోజనం పొందే రంగాలను, థీమ్యాటిక్‌ అవకాశాలను ముందే గుర్తించి, ఆయా రంగాల్లోని బలమైన కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. తద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులను వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. పరిస్థితులకు అనుగుణంగా విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది.

    పోర్ట్‌ఫోలియో
    ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,808 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 97.88 శాతం మేర ఈక్విటీలకు కేటాయించగా, డెట్‌ సాధనాల్లో 0.75 శాతం, నగదు రూపంలో 1.37 శాతం కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను గమనించగా.. లార్జ్‌క్యాప్స్‌ కంపెనీల్లో 73.54 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 9.6 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 5.51 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 84 స్టాక్స్‌ ఉన్నాయి. రంగాల వారీ కేటాయింపులను పరిశీలిస్తే.. అత్యధికంగా 32.28 శాతం మేర బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్‌ కంపెనీల్లో 17.52 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రిషినరీ కంపెనీల్లో 12.90 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది.

  • భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులే.. బంగారం ధర పెరుగుదలకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. ఫిబ్రవరి 23న ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారంలో ఎక్కువ భాగం కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరుగుదలకు కారణం అవుతోందని అన్నారు.

    ఇతర కారణాలు
    కేంద్ర బ్యాంకుల కొనుగోలు మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు & సుంకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. డాలర్ విలువ, పెట్టుబడిదారుల ఆసక్తి కూడా గోల్డ్ రేటు అమాంతం పెంచేస్తున్నాయి. డిమాండుకు తగ్గ సరఫరా ఉన్నప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. సరఫరా తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి.

    ఈ రోజు ధరలు
    భారతదేశంలో ఈ రోజు బంగారం ధరలు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. దీంతో తెలుగు రాష్ట్రల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,61,350 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,47,900 వద్ద ఉంది.

  • ,

    2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధరలు రూ. 25.50 లక్షల నుంచి రూ. 30.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ 4x2 ఆప్షన్ నిలిపివేయడంతో.. ఈ పికప్ ట్రక్ 4x4 ఎంపికలో మాత్రమే లభిస్తుంది. టయోటా హైలక్స్ ప్రత్యర్థిగా నిలిచే ఈ కారు 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 161 bhp & 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    పరిమాణంలో పెద్దగా ఉండే ఈ పికప్ ట్రక్ డిజైన్ గంభీరంగా ఉంటుంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఉంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అయితే ఇందులో బ్లాక్ వీల్ ఆర్చ్ & సైడ్ క్లాడింగ్ లేదు. లోపలి భాగంలో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ స్థానంలో పెద్ద 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. రూఫ్-మౌంటెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ కూడా ఉన్నాయి.

    360-డిగ్రీల కెమెరా సెటప్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఇసుజు వీ-క్రాస్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏంటీ జెడ్ ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4 డబ్ల్యుడీ ఏటీ జెడ్ ప్రెస్టీజ్.

  • ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్‌ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.

    గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. “భారత్‌ అమెజాన్‌కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.

    ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్‌ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది.

  • స్నేహితుడికి సాయం చేద్దామని బ్యాంక్ ఖాతా వివరాలు పంచుకున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ మోసం కేసులో చిక్కుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు ఖాతాల విషయంలో యువతకు పెద్ద హెచ్చరికగా మారింది. బ్యాంక్ ఖాతా వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది

    బెంగళూరులోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో దాదాపు ఏడాది కాలంగా స్నేహం ఉంది. 2025 నవంబర్‌లో ఆయుష్ బ్యాలెన్స్ లేకపోవడంతో తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, తాత్కాలికంగా విద్యార్థి ఖాతాను ఉపయోగించుకుంటానని అభ్యర్థించాడు.

    స్నేహితుడిని పూర్తిగా నమ్మిన విద్యార్థి.. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (Karnataka Gramin Bank) ఖాతాకు లింక్ అయిన ఏటీఎం కార్డ్‌తో పాటు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో సహా అన్ని యాక్సెస్ వివరాలను పంచుకున్నాడు. ఈ వివరాలను పోస్ట్ ద్వారా పంపగా.. అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్‌లో ధ్రువీకరించాడు కూడా.

    అయితే, కొన్ని నెలల తర్వాత షాకింగ్ నిజం బయటపడింది! బ్యాంకు అధికారులు సదరు విద్యార్థిని సంప్రదించి.. అతడి ఖాతా ద్వారా భారీ అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని తెలిపింది. దాదాపు రూ.7 కోట్లు ఈ ఖాతా ద్వారా బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లోనే ఈ మొత్తం లాండరింగ్ జరిగినట్లు సమాచారం.

    తన ఖాతా సైబర్ నేరస్థుల 'మ్యూల్ అకౌంట్'గా దుర్వినియోగం అయినట్లు తెలిసిన విద్యార్థి వెంటనే ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయుష్‌తో పాటు ఇతరులపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది ఓ హెచ్చరికే!
    స్నేహితులు అయినా.. బ్యాంక్ డీటెయిల్స్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అత్యంత నమ్మకమైన వ్యక్తుల నుంచే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బ్యాంక్ లేదా పోలీసులు అడిగినా.. ఫోన్‌లో ఇలాంటి వివరాలు ఇవ్వవద్దు. జాగ్రత్తలు తీసుకోండి.. సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండండి!

    బ్యాంక్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    • ఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్, ఖాతా వివరాలు స్నేహితులు/బంధువులు అయినా ఎవరికీ ఇవ్వవద్దు. బ్యాంకులు కూడా ఎప్పుడూ ఇలాంటివి ఫోన్‌ ద్వారా అడగవు.
    • "తాత్కాలికంగా ఖాతా ఉపయోగించుకోవాలి", "ఈజీ మనీ", "కమిషన్ ఇస్తాం", "జాబ్ ఫ్రమ్ హోమ్" అని ఎవరైనా అడిగితే నిరాకరించండి. ఇవి మనీ మ్యూల్ స్కామ్‌లే!
    • స్ట్రాంగ్ పాస్‌వర్డ్ (అప్పర్+లోయర్+నంబర్+స్పెషల్) పెట్టుకోండి. దీన్ని  రెగ్యులర్‌గా మారుస్తూ ఉండండి. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ (SMS/ఈమెయిల్) ఆన్ చేసుకోండి. దీని వల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే తెలుస్తాయి.
    • అన్‌నోన్ SMS/వాట్సాప్ లింకులు క్లిక్ చేయవద్దు. బ్యాంకు యాప్/వెబ్‌సైట్ నేరుగా టైప్ చేసి వెళ్లండి. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ చేయవద్దు.
    • ఖాతా స్టేట్‌మెంట్ తరచూ చెక్ చేయండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపిస్తే వెంటనే బ్యాంకుకు, 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.
  • అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల (టారిఫ్స్)కు బ్రేక్ పడింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చింది. దీంతో టారిఫ్స్ వసూళ్లు రేపటి (మంగళవారం) నుంచి నిలిపివేస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా వెల్లడించింది.

    ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ (IEEPA) కింద విధించిన సుంకాలను, వసూలు చేయడాన్ని అమెరికా మంగళవారం ఉదయం 12:01 EST (0501 GMT) నుంచి నిలిపివేయనుంది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని US సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. దీంతో సంబంధిత కోడ్లు సాఫ్ట్‌వేర్‌ నుంచి డియాక్టివేట్ చేయనున్నారు.

    అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడలేదు. రేపటి నుంచే అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే.. ఆదేశాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు, వాటిని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

    యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు
    టారిఫ్‌లను విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై పూర్తి అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకూ వసూలు చేసిన వందల బిలియన్‌ డాలర్ల సుంకాలను.. దిగుమతి దారులకు తిరిగి ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది.

    ట్రంప్ అసంతృప్తి
    గ్లోబల్ టారిఫ్ విధానాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను తీవ్ర నిరాశ‌ప‌రిచింద‌ని ఆయ‌న అన్నారు. అదేవిధంగా కొంతమంది న్యాయమూర్తులు విదేశీ శక్తుల ప్ర‌భావానికి లోన‌య్యార‌ని ట్రంప్ ఆరోపించారు.

    ఇదీ చదవండి: 2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!

  • ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ టెక్నాలజీ ఫండ్‌: సంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధికి మించి విస్తరిస్తున్న టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అందించే దిశగా ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా టెక్నాలజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మార్చి 6తో ముగుస్తుంది. సెమీకండక్టర్‌ ఆధారిత కంపెనీలు, డేటా సెంటర్‌ ఆపరేటర్లు, డిజిటల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలు, ఇంటర్నెట్‌ బిజినెస్‌లు, వర్ధమాన టెక్నాలజీ సంస్థలు సహా సాంకేతికతతో ముడిపడి ఉన్న వివిధ రంగాల సంస్థల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి బీఎస్‌ఈ టెక్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. సిప్‌ రూపంలోనైతే వ్యవధిని బట్టి రూ.100 నుంచి కట్టొచ్చు. కరణ్‌ దోషి, జైప్రకాశ్‌ తోషి్నవాల్‌ దీనికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.  

    ‘బరోడా బీఎన్‌పీ’ ఈఎస్‌జీ స్ట్రాటజీ ఫండ్‌  
    పర్యావరణహితంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బరోడా బీఎన్‌పీ పారిబా మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా ఈఎస్‌జీ బెస్ట్‌–ఇన్‌–క్లాస్‌ స్ట్రాటెజీ ఫండ్‌ని ఆవిష్కరించింది. దీనికి నిఫ్టీ100 ఈఎస్‌జీ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది. సెబీలో నమోదు చేసుకున్న రేటింగ్‌ కంపెనీలు ఇచ్చే ఈఎస్‌జీ రేటింగ్స్, అలాగే, కంపెనీ అంతర్గతంగా నిర్వహించే ఫండమెంటల్‌ రీసెర్చ్, అనాలిసిస్‌ ఆధారంగా ఎంపిక చేసిన సంస్థల్లో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టే విధంగా ఈ ఫండ్‌ ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడేళ్ల పాటు నిఫ్టీ 100 టీఆర్‌ఐకి మించి నిఫ్టీ 100 ఈఎస్‌జీ టీఆర్‌ఐ మెరుగైన పనితీరు కనపర్చిందని సంస్థ సీఈవో సంజయ్‌ గ్రోవర్‌ తెలిపారు.  

    బజాజ్‌ లైఫ్‌ బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ 
    జీవిత బీమా సంస్థ బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా బీఎస్‌ఈ 500 క్వాలిటీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 15 వరకు ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌లో (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్ట్‌ చేయొచ్చు. స్థిరంగా ఆదాయాలు ఆర్జిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. కంపెనీకి చెందిన యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పథకాలైన (యులిప్స్‌) బజాజ్‌ లైఫ్‌ స్మార్ట్‌ వెల్త్‌ గోల్, బజాజ్‌ లైఫ్‌ సుప్రీం, బజాజ్‌ లైఫ్‌ గెయిన్‌లతో దీన్ని తీసుకోవచ్చు. ఇటు జీవిత బీమా కవరేజీని పొందుతూనే అటు దీర్ఘకాలంలో సంపదను కూడా పంచుకునేలా ఇది రెండిందాల ప్రయోజనాలు అందిస్తుందని కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రావు రావూరి తెలిపారు.

    వెల్త్‌ కంపెనీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ 
    ఈక్విటీ, డెట్‌ సాధనాల్లో క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని పెంచుకునే అవకాశం కల్పించేలా ది వెల్త్‌ కంపెనీ మ్యుచువల్‌ ఫండ్‌ ..తాజాగా బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. మార్కెట్‌ పరిస్థితులు, వేల్యుయేషన్లు, రిస్క్‌ ఇండికేటర్లను బట్టి ఈక్విటీ, డెట్‌ సాధనాల మధ్య పెట్టుబడులను సర్దుబాటు చేస్తూ మెరుగైన రాబడులు అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. కనీసం 65 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, 35 శాతం భాగాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లోను ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50+50 మోడరేట్‌ ఇండెక్స్‌ టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది.

  • సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.95 పాయింట్ల లాభంతో 83,294.66 వద్ద, నిఫ్టీ 132.70 పాయింట్ల లాభంతో 25,703.95 వద్ద నిలిచాయి.

    అక్మే ఫిన్‌ట్రేడ్ (ఇండియా) లిమిటెడ్, మోర్పెన్ లాబొరేటరీస్ లిమిటెడ్, అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండో టెక్ ట్రాన్స్‌ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, యూపీఎల్ లిమిటెడ్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఈ2ఈ నెట్‌వర్క్స్ లిమిటెడ్, 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు భారీ షాక్..!

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఈవై ఇండియా విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ పే నివేదిక ప్రకారం.. ఈ ఏడాది (2026) కార్పొరేట్ ఇండియా సగటు జీతం 9.1 శాతం ఉంటుంది. ఇది ఉద్యోగ విఫణిలో చోటుచేసుకుంటున్న మార్పులను, ముఖ్యంగా నైపుణ్యాల ఆధారిత వేతన విధానాల పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తోంది.

    జీతాల పెరుగుదల విషయంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ముందంజలో ఉండనున్నాయి. ఇవి గరిష్టంగా 10.4 శాతం వరకు జీతాలను హైక్ చేయనున్నాయి. ఆ తరువాత ఆర్థిక సేవల రంగం సుమారు 10 శాతం, ఈ-కామర్స్ రంగంలో 9.9 శాతం, జీవవిజ్ఞాన శాస్త్రాలు & ఔషధ రంగాల్లో 9.7 శాతం వరకు జీతాల పెరుగుదల ఉంటుంది.

    ఉద్యోగాల తొలగింపులు విషయానికి వస్తే.. 2024లో ఇది 17.5 శాతం ఉంది, ఇది 2025కి 16.4 శాతానికి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగలు తొలగింపులు సంఖ్య కొంత తగ్గినట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగాలను స్వచ్చందంగా వదిలిపెట్టి రాజీనామా చేస్తున్నవారి సంఖ్య 80 శాతం ఉందని నివేదిక చెబుతోంది. అంటే వీరు తొలగింపుల కారణంగా కాకుండా, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలను మార్చుతున్నారు. ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన రంగాల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ & ఐటీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి.

    నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని వేతనం చెల్లించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి అదనపు వేతనం లభిస్తుంది. ఇదే సమయంలో వేరియబుల్ పే ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. 2025లో స్థిర వేతనంలో వేరియబుల్ పే వాటా 16.1 శాతానికి పెరిగింది. 2024లో ఇది 14.8 శాతం మాత్రమే ఉండేది. అంటే కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి.

  • ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్‌లోని ఒక శాఖలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. హరియాణా ప్రభుత్వ రంగానికి చెందిన సుమారు రూ.590 కోట్ల నిధులకు సంబంధించి జరిగిన మోసపూరిత వ్యవహారంపై బ్యాంక్ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉదంతంపై స్పందించిన బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    అసలేం జరిగింది?

    హరియాణా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్‌కు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌కు మధ్య రూ.590 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కుమ్మక్కై ఈ అనధికార లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

    బ్యాంక్ తక్షణ చర్యలు

    ఈ మోసంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు బ్యాంకు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, రికవరీ ప్రక్రియ ప్రారంభమైనట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ కుంభకోణం మూలాలను, పూర్తి స్థాయి దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర సంస్థ కేపీఎంజీని ఫోరెన్సిక్ ఆడిటర్లుగా నియమించారు.

    అన్నీ తెలుసుకుంటాం: వి.వైద్యనాథన్

    సోమవారం ఉదయం జరిగిన కాన్‌కాల్‌లో వైద్యనాథన్ మాట్లాడుతూ.. బ్యాంక్ విలువలకు, పారదర్శకతకు కట్టుబడి ఉందన్నారు. ‘గత ఐదేళ్లలో 1,050 పైగా శాఖలను ప్రారంభించాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇది దురదృష్టకరం. వ్యవస్థలోని లోపాలను లేదా ఉద్యోగుల కుమ్మక్కును గుర్తించడానికి బ్యాంక్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. బోర్డు మార్గదర్శకత్వంలో ఈ సమస్యను అత్యంత నైతికంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాం’ అని చెప్పారు.

    నిన్న రాత్రి దేశవ్యాప్తంగా తమ బ్యాంకు ఉద్యోగులతో మాట్లాడానని, బ్యాంక్ కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎవరికీ ఇందులో ప్రమేయం లేదని, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

    ఆర్థిక ప్రభావం అంచనా

    ఈ మోసం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నిర్ధారించే పనిలో బ్యాంక్ ఉంది. ఇతర బ్యాంకుల్లో ఉన్న మోసపూరిత లబ్ధిదారుల ఖాతాలను గుర్తించడం, చట్టపరమైన రికవరీల ద్వారా వచ్చే నిధుల ఆధారంగా తుది ప్రభావాన్ని నిర్ణయిస్తారు. ఈ నష్టాన్ని బ్యాంక్ తన ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ ఖాతా ద్వారా సర్దుబాటు చేయనుంది.

    డిసెంబర్ 2018లో క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం తర్వాత వి.వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంక్ వేగంగా వృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ మోసం బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా చట్ట ప్రకారం బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తేల్చి చెప్పింది.

    ఇదీ చదవండి: పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు

  • భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి భారీ మోసం కలకలం రేపింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇది కేవలం ఈ ఒక్క బ్యాంకుకే  పరిమితమా.. లేక అన్ని ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లపై భద్రతా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా!! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు డిపాజిట్లు ఎందుకు చేస్తున్నాయి? ఎంత మొత్తం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో వివరంగా చూద్దాం.

    మోసం బయట పడిందిలా..
    ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోని తమ ఖాతాలు మూసివేయాలని హర్యానా ప్రభుత్వ విభాగం ఒకటి కోరగా, బ్యాంకు రికార్డుల్లోని బ్యాలెన్స్‌లు వాస్తవ ఖాతాలతో సరిపోలలేదు. దీంతో బ్యాంకు అంతర్గత ఆడిట్‌లో రూ.590 కోట్ల మోసం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కలిసి ఈ అవకతవకలకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. ఫలితంగా బ్యాంకు షేర్లు 20% పడిపోయి, మార్కెట్ విలువలో రూ.14,438 కోట్ల నష్టం జరిగింది.

    బ్యాంకు సీఈవో వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇది ఒక్క బ్రాంచ్‌కు పరిమితమైన విషయం. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు సాధారణంగా సాగుతున్నాయి" అని చెప్పారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించారు. "ఇది సిస్టమిక్ సమస్య కాదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం" అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై చర్చను రేకెత్తించింది.

    ప్రైవేటు బ్యాంకుల్లో ప్రభుత్వ డిపాజిట్లు ఎంత?
    దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి విభాగాలు ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం గురించి ఖచ్చితమైన లెక్కలు బహిరంగంగా అందుబాటులో లేవు. అయితే, ఆర్‌బీఐ, ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదికల ప్రకారం..  మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్‌లో డిపాజిట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.241.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు బ్యాంకుల వాటా సుమారు 37% (రూ.89 లక్షల కోట్లు) కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 55 శాతం.

    ప్రభుత్వ డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎంతో చెప్పాలంటే, ఐడీఎఫ్‌సీ మోసం కేసులోనే హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్లు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర విభాగాలు కలిపి ఈ మొత్తం వేల కోట్లలో ఉండవచ్చు. ఇండియాస్టాట్ డేటా ప్రకారం.. ప్రైవేటు బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2024-25లో వివిధ రకాలుగా (కరెంట్, సేవింగ్స్, ఫిక్స్‌డ్) విభజించబడ్డాయి, కానీ ప్రభుత్వ స్పెసిఫిక్ డేటా లేదు. ఆర్‌బీఐ అంచనాల ప్రకారం.. 2025-26లో డిపాజిట్ గ్రోత్ 11-12%. ఇందులో ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయి.

    ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ప్రైవేటులో ఎందుకు?
    ప్రభుత్వ రంగ బ్యాంకులు సార్వభౌమ గ్యారెంటీతో భద్రత కల్పిస్తున్నప్పుడు, ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ముందుగా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లు, టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తాయి. గత 10 ఏళ్లలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్ మార్కెట్‌లో పీఎస్‌యూబీల వాటాను తగ్గించాయి. డిపాజిట్లు డిజిటల్ పేమెంట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నా, ప్రైవేటు బ్యాంకులు మెరుగైన కస్టమర్ రిలేషన్‌షిప్‌లతో డిపాజిట్లు సమీకరిస్తున్నాయి.

    రెండవది డైవర్సిఫికేషన్: ప్రభుత్వాలు రిస్క్ తగ్గించడానికి డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజిస్తాయి. పీఎస్‌యూబీలు ఫిస్కల్ డెఫిసిట్, ఎన్‌పీఏలతో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు మెరుగైన ఎఫిషియన్సీ, డిజిటల్ సర్వీసెస్‌తో ఆకర్షిస్తాయి.

    మూడవది, రెగ్యులేటరీ సపోర్ట్: ఆర్‌బీఐ లిక్విడిటీ మేనేజ్‌మెంట్, సీఆర్‌ఆర్ తగ్గింపులతో డిపాజిట్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే, పీఎస్‌యూబీలు ప్రైవేటు బ్యాంకులతో పోటీ పడుతూ, డిపాజిట్ గ్రోత్‌లో ముందున్నాయి. గత 6 నెలల్లో పీఎస్‌యూబీల మార్కెట్ క్యాప్ రూ.5.75 లక్షల కోట్లు పెరిగింది.

    ఐడీఎఫ్‌సీ మోసం ప్రభుత్వ డిపాజిట్ల భద్రతపై హెచ్చరికలా మారింది. ప్రభుత్వాలు డిపాజిట్లు చేసేటప్పుడు బ్యాంకు ఆంతరిక నియంత్రణలు, ఆడిట్ సిస్టమ్‌లను పరిశీలించాలి. ఆర్‌బీఐ మరిన్ని రెగ్యులేషన్లు తీసుకురావాలి. ప్రభుత్వ సొమ్ములంటే ప్రజల సొమ్ములే. వీటి భద్రత అత్యవసరం.

Andhra Pradesh

  • పాట్నా:  ప్రస్తుతం బిహార్‌లో పని చేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని  పాట్నా  కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌, కేస్‌ డైరీ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.  హైకోర్టు రక్షణ ఉన్నప్పటికీ సునీల్‌ నాయక్‌ను బలవంతంగా అరెస్ట్‌ చేయడాన్ని నిలదీసింది.

    పాట్నా హైకోర్టు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు రావడమేంటని ప్రశ్నించింది. 30 రోజుల వరకూ సునీల్‌ నాయక్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రఘురామకృష్ణరాజు కేసు విషయానికి సంబంధించి సునీల్‌ నాయక్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌ను పాట్నా సివిల్‌ కోర్టు  తిరస్కరించింది. 

    ఏపీ పోలీసులపై బిహార్‌ లాయర్ల ఆగ్రహం
    ఇలా బలవంతపు అరెస్టును బిహార్‌ లాయర్లు తీవ్రంగా ఖండించారు. ఏపీ పోలీసులు గోడదూకి మరీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బిహార్‌ పోలీసులు సైతం.. ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఏపీలో రెడ్‌బుక్‌ పాలన అంటే ఇదేనా అని బిహార్‌ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

    సునీల్‌ నాయక్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటేషన్‌లో పని చేశారు.  ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా సునీల్‌ నాయక్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సునీల్‌ నాయక్‌ నివాసానికి వెళ్లి అరెస్ట్‌ చేశారు. దీన్ని బిహార్‌ డీజీపీ కూడా తీవ్రంగా ఖండించారు. గోడదూకి వచ్చి తమ అధికారిని ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ప్రశ్నించారు.  ప్రధానంగా సిట్‌ చీఫ్‌ దామోదర వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
     

  • సింహాద్రిపురం:  వైఎస్సార్‌ జిల్లాలోని సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌పై ఏసీబీ జరిపిన దాడుల్లో సీఐ కేవీ రమణ, ఎస్‌ఐ అనిల్‌లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో బాధితుడిని నుంచి రూ. 3 లక్షల లంచం డిమాండ్‌ చేయడంతో అతను ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. దాంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో సీఐ, ఎస్‌ఐలను పట్టుకున్నారు. 

    బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికాలు దాడులు చేశారు. పులివెందుల రూరల్‌ సీఐ, సింహాద్రిపురం ఎస్‌ఐలను ఈ దాడుల్లో ఏసీబీకి దొరికేశారు. పులివెందులలో అత్యంత వివాదాస్పద సీఐగా కేవీ రమణకు పేరుంది. తాజాగా పోలీస్‌ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం కేవీ రమణను మరింత ఇరకాటంలోకి నెట్టింది. 

    విజయనగరం: జిల్లాలోని చాకివలస ఇంచార్జ్‌ వీఆర్వో ఏసీబీకి చిక్కారు. రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇంచార్జ్‌ వీఆర్‌ఓ చిట్టిబాబు.

  • తాడేపల్లి : వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌ వెనుక హెరిటేజ్‌ ఫిన్‌లీజ్‌ ఉందన్నారాయన. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడుతూ.. 

    చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్‌వేనన్నారు. ఆ విమానాల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్‌ కొన్నారన్నారు. దాన్ని చంద్రబాబు అద్దెకు తీసుకున్నట్టుగా లెక్కలు చూపించి వాడబోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును  చంద్రబాబు రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని వెంకటరెడ్డి విమర్శించారు. 

    విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్
  • విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కారణంగా పలువురు మృతిచెందిన అనంతరం జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పాలతోనే డయాలసిస్‌ సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు.  

    ఈ ఘటన కారణంగా నలుగురు చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. 

  • విజయవాడ:  రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ  మానటరింగ్‌ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. 

    శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 23వ తేదీ) మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. 

    గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు
    పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బొత్స మరోసారి స్పష్టం చేశారు. బీఏసీలో మూడు అంశాలపై ప్రస్తావించామని, అందులో రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూడా చర్చ జరగాలని కోరామని,  కారు చౌకగా భూములు కేటాయింపులపై కూడా చర్చకు పట్టుబట్టునట్టి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం సభ్యలు.. యూనివర్శిటీ పేరుతో విశాఖలో భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

    వీడియో ఫుజేట్‌ను మాకు ఇవ్వాలని కోరాం
    సభలో వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్‌ చూపించిన ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్‌ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్‌ను కోరామన్నారు బొత్స.

    తిరుపతి నెయ్యి.. రాజమండ్రి పాల ఘటనపై బొత్స స్ట్రాంగ్ రియాక్షన్

Politics

  • గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్‌ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. 

    ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎ‍స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.

    నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు  నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్‌ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.

    అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.

    ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు ‌అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.

    మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్‌, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని‌ అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. 

     

Family

  • కొన్ని ఘటనలు చాలా సిల్లీగా ఉంటాయి. మనుషులు కూడా..చిన్న చిన్న  విషయాలను పెద్దవిగా చూడటం వల్లనో అపార్థం చేసుకోవడం వల్లనో.. క్షణాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడి..చంపుకునేంత వరకు వెళ్లిపోతోంది పరిస్థితి. ఇక్కడ కూడా అచ్చం అలానే చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో సరదాగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం జస్ట్‌ ఓ కుక్క కారణంగా ఘర్షణ వాతావరణంగా మారి ఏకంగా పెళ్లే ఆపేసేందుకు దారితీసింది. 

    అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో జరిగిన వివాహ వేడుక కుక్క కారణంగా హింసాత్మక ఘర్షణకు దారితీసింది. దివంగత సునీల్ కుమార్ , సరోజ్‌ గుప్తాల కుమార్తె తాన్య కేషర్వాణి, దివంగత రాకేష్‌ చందా, బాబ్లీదేవి కుమారుడు సుమిత్‌లు ఇంటి నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల ఫిబ్రవరి 18న ఫతేపూర్‌ అధికారిక వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. 

    పెళ్లి తంతులో భాగంగా బంధువులు, శ్రేయోభిలాషులు నడుమ తెల్లవారుజామున 4 గంటలకు ఆభరణాలు సమర్పించే ఆచారం సాగుతోంది. ఆ సమయంలో వధువు కుటుంబం పెంపుడు కుక్క దూకుడుగా మొరగడం ప్రారంభించింది. విసుగుతో వరుడు కుటుంబానికి చెందిన యువకుడు ఆ కుక్కను కొట్టడంతో మొదలైన గొడవ..చూస్తుండగానే క్షణాల్లో ఘర్షణకు దారితీసింది. ఈ ఉద్రిక్త ఘటనలో మహిళలతో సహా సుమారు ఎనిమిది మంది దాక తీవ్రంగా గాయపడ్డారు. 

    వధువు తరుఫు కుటుంబంలో ముగ్గురి తలలకు తీవ్ర గాయలయ్యినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పోలీస్టేషన్‌కు చేరుకున్నాయి. అక్కడ వివాహాం అధికారికంగా రద్దు చేశారు. ట్విస్ట్‌ ఏంటంటే వధువు తాన్య దీన్ని నిరాకరించింది. తమ పెళ్లి ఎప్పుడో జనవరిలో అయిపోయిందని, ఇది అధికారికంగా నిర్వహించిన తంతు అని స్పష్టం చేసింది. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడ తన భర్తతో కలసి ఉన్న వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మరి వివరణ ఇవ్వడం విశేషం.

    (చదవండి: కూతురు గ్రాడ్యుయేషన్‌ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!)

     

  • ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్‌ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్‌ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్‌గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..

    కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. 

    ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్‌ని ప్లీజ్‌ రెండు స్టెప్‌లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్‌ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

     

    (చదవండి: రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్‌..! ఎంత ఖర్చు అవుతుందంటే..)

     

     

     

  • కేరళలోని మున్నార్, సమ్మర్‌లో ఒక ప్రత్యేక ప్రదేశంగా మారిపోతుంది. పర్వత శ్రేణుల మధ్య పచ్చని టీ తోటలు తరంగాలా విస్తరించి ఉంటాయి. ప్రతి ఉదయం మెల్లగా తిరిగే ఫాగ్‌ కొత్త ఆకారంలో మన ముందుకు వస్తుంది. సూర్యకాంతి టీ ఆకులపై సౌమ్యంగా పడుతూ, పచ్చని రంగులను ప్రాణం పోస్తుంది.

    టీ తోటలు
    టీ తోటల మధ్య నడిచే మార్గంలో, భూమిపై ఏర్పడిన చిన్న రహదారులు ఒక రిథమ్‌లో ఉన్న మ్యూజికల్‌ నోట్స్‌లా అనిపిస్తాయి. ఆకుల మధ్య గాలి చిమ్మే సున్నితమైన శబ్దం, ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మధ్యాహ్నం వెలుగు బంగారు వర్ణంతో పరిసరాలను చిత్రకళలా మార్చేస్తుంది. ప్రతి అడుగు ఒక కొత్త దృశ్యాన్ని తెస్తుంది, ప్రతి మూలలో కొత్త సుగంధం కనిపిస్తుంది.

    చిన్న గ్రామాల్లో...
    మున్నార్‌ ఇరుకులోని చిన్న గ్రామాల్లో వెళ్తే, అక్కడి సుగంధం మన మనసుకు నిలువరించకుండా చేరుతుంది. చెట్ల మధ్య కనిపించే నివాస గృహాలు, పర్వతాల దృశ్యాలు చూస్తే, ఇక్కడి జీవితం ఎంత ప్రశాంతంగా, సహజంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. సాయంత్రం విస్తరించే ఫాగ్, ఎండాకాలాన్ని మరచి΄ోయేలా చేస్తుంది. జీవితాన్ని మరో కోణంలో చూసే, అంతులేని ప్రకృతిలో లీనమయ్యే అవకాశం ఇక్కడ లభిస్తుంది. 

    (చదవండి: ’స్విస్‌ ఆల్ఫ్స్‌’ : వేసవిలో మంచు పరిమళం)

  • సూర్య కిరణాలు పర్వతాల మీదుగా పయనిస్తుండగా మంచు కాంతిమంతంగా కనువిందు చేసే చోటు ఏది అని అడిగితేవెంటనే ‘స్విస్‌ ఆల్ఫ్స్‌’ అని చేప్పేయవచ్చు.సమ్మర్‌లో కూడా యూరప్‌ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్‌ ఛాయిస్‌..స్విట్జర్లాండ్‌లో ఎండాకాలం కూడా మంచు ఆకర్షణ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆకాశం నీలంగా, గడ్డి పర్వతాల మీద పచ్చగా, దూరంగా మంచుపై వెలిగే చంద్రప్రభలా కనిపిస్తుంది. ఎండలో కూడా చల్లని గాలి మనసును మేల్కొలుపుతుంది..

    సరోవరాల సౌందర్యం
    స్విస్‌లో సరస్సులు ఎండాకాలంలో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటాయి. లేక్‌ జెనీవా తీరం దగ్గర మధ్యాహ్నం నిశ్శబ్దంగా ఉంటుంది. నీళ్లు నీలం రంగులో మెరుస్తూ, పర్వతాల ప్రతిబింబాలను తమలో కలిపేసుకుంటాయి. ఇంటర్లేకన్‌ అనే ప్రదేశంలో రెండు సరోవరాల మధ్య నిలిచిన ఊరిలో నడవడంతో పాటు, స్థానికంగా ఉన్న గడ్డి మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గడపాలని అనిపిస్తుంది.

    పర్వతాల మధ్య సూర్యోదయం
    స్విస్‌ ఆల్ఫ్స్‌లో ప్రతీ సూర్యోదయం ఒక గీతంలా మొదలవుతుంది. చర్చి గంటలు దూరంగా వినిపిస్తాయి. పర్వతాల నుంచి దిగే సూర్యోదయం నీలి ఆకాశాన్ని మెల్లిగా బంగారు రంగులో మెరిపిస్తుంది. జెర్మాట్‌ లాంటి అందమైన గ్రామ వీధుల్లో నడుస్తుంటే, చుట్టూ వుడెన్‌ హౌసెస్, వరండాల్లో సందడి చేసే పువ్వులు, వెనకాలే మ్యాటర్‌ హోర్న్‌ లాంటి శిఖరం చూస్తుంటే జీవితం ఎంత అందమైనదో అనిపిస్తుంది.

    సందర్శనీయ స్థలాలు
    ఈప్రాంతంలో జెర్మాట్‌ నుంచి మేటర్‌హార్న్పపర్వత దర్శనం అనేది ఒక నిశ్చలమైన క్షణంలా అనిపిస్తుంది. ఇంటర్లేకన్‌లో సరోవరాల మధ్య సాయంత్రం గడపడం ఒక అందమైన పెయింటింగ్‌లో మనం భాగమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే జుంగ్‌ఫ్రౌ ఉండే ప్రదేశంలో మంచు రేఖలు ఎండాకాలంలో కూడా తెలుపు వర్ణంతో జిగేలుమనిపిస్తాయి.లూసెర్న్‌ వీధిలో కెపెల్‌బ్రూక్‌ బ్రిడ్జిపై నడిచే సమయంలో ప్రాచీన కథల్లో కథానాయకులమయ్యాం అనిపిస్తుంది. లేక్‌ జెనీవా తీరంలో సాయంత్రం ఆకాశం నీలం నుంచి గులాబీ రంగులోకి మారడం ఒక లైఫ్‌టైమ్‌ మెమరీగా నిలుస్తుంది.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి జూరిచ్‌ వరకు విమాన ప్రయాణం చేసి యూరోప్‌ హదయం లాంటి స్విట్జర్లాండ్‌లోని ఈ అందమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. జూరిచ్‌ నుంచి రైలులో ప్రయాణిస్తూ పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఈ యాత్రలో కనిపించే సీనరీలు యూరోప్‌ అంటే ఏంటో చూపిస్తాయి.

    ఎక్కడ ఉండాలి? 
    స్విస్‌ గ్రామాల్లో వుడెన్‌ చాలెట్స్‌లో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవం. బాల్కనీ నుంచి కనిపించే పర్వత శ్రేణులను చూస్తూ ప్రతీ ఉదయాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న గెస్ట్‌ హౌజుల్లో కూడా ఆత్మీయ అనుభవాన్ని పొందవచ్చు.

    ఏం చూడాలి?
    పర్వతాల వద్ద వాక్‌ చేయడం, సరస్సుల తీరంలో నిశ్శబ్దంగా కూర్చొని పుస్తకాలు చదవడం, కేబుల్‌ కార్లలో శిఖరాగ్రానికి చేరడంం ఇలా అనేక మరుపురాని ప్రదేశాలను చూస్తూ జీవితాంతం గుర్తుండే మెమోరీస్‌ సష్టించుకోవచ్చు.

    ఏం తినాలి?
    స్విస్‌లో బ్రెడ్, చీజ్‌ పరిమళం, చాక్లెట్‌ మధురిమలు చల్లని గాలిలో మరింత రుచిగా అనిపించేలా చేస్తాయి. చిన్న కేఫేలో కాఫీ సిప్‌ చేస్తూ బయట మంచు శిఖరాలను చూడడం ఇవన్నీ ఎంజాయ్‌ చేయడానికి ఫుడ్‌ లవర్‌ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్‌ నేచర్‌ను ఆస్వాదించే మనసు ఉంటే చాలు.

    చేయాల్సిన పనులు
    సూర్యోదయం సమయంలో మార్నింగ్‌ వాక్‌ చేయడం, సరస్సుల తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్‌ చేయడం, కేబుల్‌ కార్‌లో ప్రయాణించడం, స్థానిక గ్రామాల్లో నిశ్శబ్దంగా సంచరించడం, అక్కడి వెరైటీ ఫుడ్‌ను ఆస్వాదించడం ఇలా మీరు ఎన్నో యాక్టివిటీస్‌ ΄్లాన్‌ చేసుకోవచ్చు.

    మంచును ఇష్టపడే మనసుకు.. ప్రశాంతతనిచ్చే మంచి ప్రదేశం. ఎండాకాలం అంటే వేడి అని మాత్రమే అనుకుంటాం. కానీ స్విస్‌ ఆల్ఫ్‌స్‌లో సమ్మర్‌ అంటే ఒక ఎవర్‌గ్రీన్‌ కూల్‌ మెమోరీని సొంతం చేసుకునే సమయం. ఇక్కడ సూర్యుడూ నేచర్‌ను ఎంజాయ్‌ చేస్తూ కూల్‌గా కనిపిస్తాడు. అందుకే యూరోప్‌ ఒక ఎవర్‌గ్రీన్‌ ట్రావెల్‌ డెస్టినేషన్‌గా నిలిచింది.
    – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు  

  • టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్‌ హోటల్‌. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.

    రష్మిక-విజయ్‌లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్‌ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్‌ సెంటర్‌, అందంగా రూపొందించిన లాంజ్‌లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్‌టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.

    ఈ హోటల్‌లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్  అండ్‌ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్‌ కాక్‌టెయిల్‌ వరకు అన్నిరకాల టేస్ట్‌లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. 

    ఆరోగ్యం పరంగా ఫిట్‌నెస్ సెంటర్‌ని అధునాతన యంత్రాలతో సెట్‌ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్‌ను మిస్ అవ్వకండి. 

    చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే  అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్‌పూర్‌ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం  ప్రకృతి సహజ సౌందర్యానికి,  సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట.

     

    (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్‌ వెల్నెస్‌ సీక్రెట్‌..! ఆయిల్‌ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..)

     

NRI

  • న్యూయార్క్‌ మేయర్‌గా  భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు  భారత్‌కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్  మేయర్‌ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్‌  ఎవరు? ఆ వివరాలు మీకోసం.

    లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు.  ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. 

    కేరళలోజన్మించారు నిత్య రామన్.  ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య‌  కుటుంబం,  అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల  నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.

    ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

    రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు.  2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

    కరెన్ బాస్‌కు గట్టి పోటీ
    ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. 

    ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!