పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజాసాబ్ గురించి పది ఆసక్తికరమైన విషయాలు..
ప్రభాస్కి తొలి సినిమా: ప్రభాస్ కెరీర్లో చేస్తున్న తొలి హారర్ ఫాంటసీ కామెడీ చిత్రమిది. బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్లో ఫ్యాన్స్ని అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో మొదటిసారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు . మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్కి జోడీగా నటించారు.
అతిపెద్ద సెట్: ఈ సినిమా కోసం హైదరాబాద్లోని అజీజ్ నగర్లో హవేలి సెట్ను నిర్మించారు. దాదాపు 40,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్గా రికార్డ్ సృష్టించింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నాయర్ ఈ సెట్ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు. ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిగిందట.
భారీ రన్టైమ్: ఈ సినిమా రన్టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు.
థ్రిల్ చేసేలా ఫాంటసీ ఎలిమెంట్స్: ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంది. సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ వెల్లడించారు.
23 కోట్లతో మొసలి సీన్ : ఈ సినిమాలో మొసలితో ప్రభాస్ చేసే ఫైట్ సీన్ అదిరిపోతుందట.ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కోసం హీరోయిన్ మాళవికా మోహనన్ 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందట. ‘ఒకవైపు చలికి చర్మం మొత్తం మొద్దుబారిపోతున్న ఫీలింగ్ కలిగేది. అదే సమయంలో మొసలి దాడి చేస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలన్నారు. ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అందరూ అందులోకి దిగి షూట్ చేస్తున్నారు. పెయింట్, కెమికల్స్, వాడిపారేసిన వస్తువులు అన్నీ అందులో ఉన్నాయి. ఆ నీటిలోనే 3 రోజులు షూట్ చేశాం. అదొక వింత అనుభవం’ అని ఓ ఇంటర్వ్యలో మాళవిక చెప్పుకొచ్చింది.
రూ.450 కోట్ల బడ్జెట్.. ప్రభాస్కి తక్కువే: ఈ సినిమా కోసం పిపుల్స్ మీడియా దాదాపు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేసిందట. ఇందులో అత్యధికంగా రెమ్యునరేషన్లకే కేటాయించాల్సి వచ్చిదంట. అయితే ప్రభాస్ మాత్రం గత సినిమాల కంటే తక్కువ పారితోషికం తీసుకొని ఈ సినిమా చేశాడు. ప్రతి సినిమాకు రూ. 120-150 కోట్లు తీసుకునే ప్రభాస్.. రాజాసాబ్కి మాత్రం రూ.100 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. ఇక విలన్గా నటించిన సంజయ్ దత్ రూ. 6 కోట్లు, డైరెక్టర్ మారుతి రూ. 18 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే.. మాళవికా రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్ రూ. 1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.
ఫస్ట్ టైటిల్ ఇదే: ఇది బామ్మ-మనవడి కథ. ఇందులో బామ్మ కూడా ఓ హీరోనే అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాసే ఈ సినిమా కథను రివీల్ చేశాడు. ఇందులో బామ్మ భర్త విలన్. అనుకోని పరిస్థితుల్లో హీరో పాడుబడ్డ మహల్కు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకనేది సినిమా చూడాలి.ఈ సినిమాకు ముందుగా రెండు, మూడు టైటిల్స్ అనుకున్నారట. రాజా డీలక్స్, రాజా అనే టైటిల్ అనుకున్నారట. రాజా అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పూర్తి చేసి.. చివరకు ‘ది రాజాసాబ్’ని ఫిక్స్ చేశారు. సినిమా అధికారిక టైటిల్ ని 2024 జనవరిలో ప్రకటించారు.
విలన్గా సంజయ్: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో ప్రభాస్ తాతగారి ఘోస్ట్ పాత్ర పోషించారు . ప్రభాస్తో ఆయన క్లాష్ సీన్స్ హైలైట్ అవుతాయని టాక్.
తమన్ సంగీతం: ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఉన్న సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బీజీఎం అయితే ఓ రేంజ్లో ఉంటుందట. తమన్ తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు మారుతితో పాటు ప్రభాస్ కూడా అన్నారు.
జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జోరుగా సాగుతున్నాయి .జనవరి 8న ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు భారీగా పెరిగాయి.ప్రీమియర్స్కి టికెట్ ధర ఏకంగా రూ. 1000 గా ఫిక్స్ చేశారు.