ఢాకా: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.
బంగ్లాదేశంలో జరుగుతున్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో 35 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు జరిగాయి. ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
2026 జనవరి 5, ఒకే రోజులో రెండు హత్యలు
జనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.
ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం
జనవరి 3న మూక దాడి, సజీవ దహనం
షరియత్పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో, ఢాకాలో మరణించాడు.
డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేత
అన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను మైమెన్సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా అనుకోకుండా జరిగి ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.
డిసెంబర్ 24, 2025: మాబ్ లించింగ్
అమృత్ మండల్ను రాజ్బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.
డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడి
మైమెన్సింగ్లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.
ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
డిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్లను రంగ్పూర్లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్ను ఫరీద్పూర్లో నరికి చంపారు.
మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.
భారతదేశం ఖండన
భారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.