Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీకి సౌత్‌ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.

    అప్పట్లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాలు బాక్సాఫిస్‌ వద్ద నిరాశపరిచాయి. తాజాగా పాన్‌ ఇండియా రాకింగ్‌ స్టార్‌ యశ్‌ సరసన నటించిన ‘టాక్సిక్‌’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్‌ వస్తోంది. దీంతో ‘భరత్‌ అనే నేను’ మినహా సౌత్‌లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.

    ఇక త్వరలోనే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే దాని గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్‌ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్‌ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  • టాలీవుడ్‌లో ఇప్పుడంతా ఇరుముడి మానియా నడుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.

    భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ఇరుముడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మౌత్‌ టాక్‌తో ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి నటుడు అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్‌కు వెళ్లిన సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
     

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫ్రైడే టాలీవుడ్‌లో కికు చిరంజీవి అనే మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలియా భట్ ఆల్ఫా మూవీతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ఆకలిరాజ్యం -2026 ఓటీటీల్లో సందడి చేయనుంది. వీటితో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్‌ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    •  ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28

    •  న్యూటన్స్ థర్డ్ లా(తెలుగు సినిమా)- ఆగస్టు 28

    •   చుంబక్ (హిందీ సిరీస్) - ఆగస్టు 28

    •   గ్రేవ్ యార్డ్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - ఆగస్టు 28

    •   ద విస్పర్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28

    •   ఆల్ఫా (హిందీ మూవీ) - ఆగస్టు 28

    •  గ్రాండ్ థెఫ్ట్ ఆటో యాన్ ఎక్సెండెడ్ లుక్(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 28

    •  మౌస్ ట్రాప్(కొరియన్ సిరీస్)- ఆగస్టు 28

    •  సీక్రెట్ ఉమెన్(హాలీవుడ్ మూవీ)- ఆగస్టు 28

    •  ఫోర్ హ్యాండ్స్- టు సోనాటాస్(హాలీవుడ్ సిరీస్)- ఆగస్టు 29


    జియో హాట్‌స్టార్..

    •    పార్ట్ టైమర్స్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 28

    •    మైఖేల్ (హిందీ డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 29

    అమెజాన్ ప్రైమ్

    • బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 28

    •    బెట్టి లా ఫియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28

    సోనీ లివ్

    •    అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఆగస్టు 28

    జీ5

    •   బందర్ (హిందీ మూవీ) - ఆగస్టు 28

    ఆహా

    •    ఆకలిరాజ్యం 2026 (తెలుగు సిరీస్) - ఆగస్టు 28

    ఆపిల్ టీవీ ప్లస్

    •    డార్క్ మేటర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28

    లయన్స్ గేట్ ప్లే

    •    హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28
       

  • గెలుపుకి కారణాలు వెతుకుతారో లేదో కానీ ఓటమికి మాత్రం కచ్చితంగా నిందితులను వెతుకుతారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్‌ అయితే.. ఆ నింద హీరో కంటే ఎక్కువగా  దర్శకుడిపైనే పడుతుంది. ‘టాక్సిక్‌’విషయంలోనూ అదే జరిగింది. యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్‌ టాక్‌ని సంపాదించుకుంది.

    యశ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నా..  కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, నెమ్మదైన నేరేషన్‌, ఎమోషనల్‌ కనెక్ట్‌ విషయంలో మాత్రం  తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ గతంలో చెప్పిన ఓ మాటలకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

    తను సినిమా తీసిన విధానం గురించి మాట్లాడుతూ.. ‘నేను రాసింది ఒకటి. తీసింది మరొకటి. ఎడిటింగ్‌ చేసింది ఇంకొకటి. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ’ అని గీతూ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. సినిమా తెరకెక్కించే క్రమంలో స్క్రిప్ట్‌ రాసిన విధానం, షూటింగ్‌లో వచ్చిన మార్పులు, చివరగా ఎడిటింగ్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఒకేలా ఉండకపోవచ్చని ఆమె వ్యాఖ్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘టాక్సిక్‌’ విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న వేళ ఈ పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.

  • కేజీఎఫ్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్‌ నుంచి సాంగ్స్‌, ట్రైలర్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయినా కూడా మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేసింది.

    ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్‌ మూవీకి తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. యశ్ యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కథలో ఎలాంటి బలం లేదని నెటిజన్స్‌ తేల్చేశారు. మొదటి రోజే నెగెటివ్ టాక్ రావడంతో టాక్సిక్‌ మేకర్స్‌కు బిగ్‌ షాక్ తగిలినట్లైంది. నాలుగేళ్ల తర్వాత వచ్చిన మూవీ కావడంతో యశ్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మూవీకి డిజాస్టర్‌ టాక్‌తో డైరెక్టర్ ‍గీతూపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే గీతూ మోహన్‌దాస్ పాత వీడియో నెట్టింట తెగ వైరవుతోంది. గీతూ 2021లో ఈ సినిమా గురించి మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నేను స్క్రిప్ట్ ఒకటి రాస్తాను.. ఇంకొకటి చిత్రీకరిస్తానని ఈ వీడియోలో మాట్లాడింది. నా రచనలో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు.. ఒక స్క్రిప్ట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి పనిచేస్తున్నప్పుడు పరిస్థితి గందరగోళంగా ఉంటుందని తెలిపింది. కొందరు విమర్శలు చేసి వెళ్లిపోతారు.. కానీ నేను వాటిని పట్టించుకోనని వెల్లడించింది. తన టీమ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటామని గీతూ పేర్కొంది.

    ఈ చిత్రాన్ని స్త్రీ దృష్టికోణంతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఆమె అభివర్ణించారు. నేను రాసిన స్క్రిప్టులన్నీ నా సొంతంగానే రాశానని తెలిపారు. నా తర్వాతి సినిమా కోసం రైటర్స్ రూమ్ ఉండటం ఇదే మొదటిసారని అన్నారు. నేను ఒకటి రాస్తాను.. మరొకటి చిత్రీకరిస్తాను.. ఇంకొకటి ఎడిట్ చేస్తాను.. ఆ తర్వాత సినిమా విడుదల అవుతుందన్నారు. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటా.. అందుకే నేను ఎప్పుడూ స్క్రిప్ట్‌కు కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ తెలిపింది. ఈ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు.

     

  • అల్లరి నరేష్‌ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు.

    ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ ఫన్‌గా అనిపించింది.  తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ చూస్తుంటే ఈ మూవీలో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. భారీస్థాయిలో ఈ పాటను షూట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాటకు సురేశ్ బనిశెట్టి లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ సీపన, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ టైటిల్ సాంగ్ మీరు కూడా చూసేయండి. 
     

     

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోర్బ్స్ కవర్‌ పేజీపై ఆయన కనిపించారు.  వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ -2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో బన్నీ కూడా స్థానం దక్కించుకున్నారు. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు రామ్‌ చరణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, మోహన్‌ లాల్‌, రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్, ఏఆర్‌ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్‌ సల్మాన్‌, మాధవన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రిషబ్‌ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్‌, కంగనా రనౌత్‌ కూడా ఉన్నారు.

    ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మువీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని మరో టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం కనిపించనుందని లేటేస్ట్ బజ్. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
     

     

  • శివ కుమార్,శ్వేతా లక్ష్మణ్ జంటగా వస్తోన్న చిత్రం సహ. ఈ సినిమాకు నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. ఈ మూవీని రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి.

    తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ మూవీ గురించి ఫుల్ అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఈ మూవీ కంటెంట్ అద్భుతంగా ఉందని అన్నారు. సెప్టెంబర్‌ 4న రిలీజయ్యే ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్‌పేట్‌ సెంటర్‌లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ శ్వేతా ఛాలెంజ్ విసిరారు. ఈ మూవీ చూసి ఎవరు కూడా నిరాశకు గురికారని వెల్లడించింది. మీ అందరూ థియేటర్స్‌కు వచ్చి మా సినిమా చూడాలని కోరారు.

    అదేవిధంగా హీరో శివకుమార్ సైతం ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూవీ మీరు ఆశించినదాని కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నంబర్‌కు ఫోన్‌ చేసి బూతులు తిట్టండని హీరో సవాల్ చేశారు. ఈ మూవీ కంటెంట్‌ మీకు నచ్చితే ఒకరికి బాగుందని చెప్పండి చాలు అంటూ రిక్వెస్ట్ చేశారు. మా సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇప్పించాలని నిర్మాత బన్నీ వాసును కోరారు. మొత్తానికి సహా మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత వీళ్లిద్దరి ఛాలెంజ్‌పై ఓ క్లారిటీ రానుంది. ఈ ఈవెంట్‌కు నిర్మాత బన్నీవాసు కూడా హాజరయ్యారు. 

     

  • ప్రస్తుతం టాలీవుడ్‌ అంతా ఒకటే పేరు వినిపిస్తోంది. అందరూ ఆ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. యశ్ టాక్సిక్‌ రిలీజైనా కూడా ఇరుముడి గురించే ఆడియన్స్‌ ఆరా తీస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ కూతురి తండ్రి ఎలా పెంచాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారని అంటున్నారు. ఈ మూవీ రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్‌ను సైతం దాటేసింది.

    అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆడియన్స్‌ క్యూ కడతారు. అందులోని మైనస్‌ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరుముడికి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవీ పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఈ మూవీ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు ఓ ప్రముఖ వైద్యుడు ఉప్పలపాటి రామ్ వర్మ. ఇరుముడి డైరెక్టర్‌ తీరును ఆయన తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

    డాక్టర్ తన ట్వీట్‌లో రాస్తూ..'ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే... సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి.. అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరో పక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటాడు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి.. మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల' అంటూ రాసుకొచ్చారు.

    అసలు ఇరుముడి మూవీతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు?  ఈ సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్‌లో నిజం మాట్లాడినా.. బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..? ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా.. ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి అంటారు.. కానీ సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి కదా? అని పోస్ట్ చేశారు. మరి దీనిపై దర్శకుడు శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

  • ఇరుముడి.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై రష్మిక, విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌ ఎక్స్‌ వేదికగా తమ రివ్యూని ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించానన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సుధీర్ఘమైన పోస్ట్‌ పెట్టాడు. 

    (చదవండి: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు)

    ‘ఇరుముడి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్‌ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను భావోద్వేగంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్ర(ఈ చిత్రంలో రవితేజ కూతురుగా నటించింది)కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చిరంజీవి ట్వీట్‌పై రవితేజ కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్‌’ అని రీట్వీట్‌ చేశాడు. 

    (చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..!)

    ఇరుముడి విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది.
     

  • షకీలా పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఒకప్పుడు చిత్రసీమలో ఆమెకు ఉండే క్రేజ్‌ అలాంటిది. నిజానికి ఈమె మలయాళి యాక్టర్‌ అయినా.. సీమశాస్త్రీ, అల్లరి పిడుగు, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ మరింత దగ్గరయ్యారు. ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో భారీ క్రేజ్‌ సంపాదించిన ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    బాధగా ఉంది..
    ‘నేను ఎప్పుడు తప్పు చేయలేదు. కానీ బాధ పడుతున్నాను. నా సినిమాలు చూడమని ఎవరినీ బ్రతిమలాడలేదు. ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను కాకుండా నా డబ్బునే కోరుకున్నారు. దాదాపు రూ.4 కోట్లు సంపాదించా. అయితే ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. పెద్ద అక్క దగ్గర భద్రంగా ఉంది. దాంతో ఆమె చాలా మంచిగా సెటిల్‌ అయ్యారు’అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    ఆమె రాకపోవడమే మంచిది..
    మీకు నమ్మించి మోసం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ..‘నా పెద్దక్క నన్ను చూసి చాలా ఏళ్లు అయింది. ఆమె నా దగ్గరకి రావడం లేదని చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు రాకపోతేనే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకి ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులేదు’ అని షకీలా చెప్పుకొచ్చారు. తన కెరీర్‌ను కొందరు స్టార్‌ హీరోలు నాశనం చేశారన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. 
    ఐపీఎస్‌ అవుతా..
    తన జీవితాన్ని మరోసారి ప్రారంభించే అవకాశం వస్తే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఐపీఎస్‌ కావాలని కోరుకుంటానని షకీలా తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లడం తనకు నచ్చేది కాదని ఉపాధ్యాయులు కొట్టడంతో చదువుపై ఆసక్తి పోయిందని చెప్పారు.

    ఇటీవలే ఆసుపత్రిలో..
    కాగా ఇటీవలే మెడ నొప్పికారణంగా ఆసుపత్రిలో చేరారు. అతిగా ఫోన్‌ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్‌ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు సూచించారు.

    ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్‌డేట్‌ వచ్చేసింది..

Telangana

  • వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని, 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని అన్నారు.

    ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు. అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

    ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.

    • తాము వెళ్లే క్లినిక్‌లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి.

    • అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.

    • వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే onlinetsmc.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.

    • చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి.

    • ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నానని సజ్జనార్ పేర్కొన్నారు.

  • వికారాబాద్‌: తన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వ్యక్తి పెడుతున్న లైంగిక వేధింపులు, బెదిరింపులను భరించలేకున్నానని బాధిత మహిళ బుధవారం పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. 

    దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఊరికి చెందిన కర్రె సుధాకర్‌ నెల రోజులుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈవిషయమై బాధితురాలు ఈనెల 15న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 18న కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయకపోగా, కేసు వాపస్‌ తీసుకోవాలని ఎస్‌ఐ తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. 

    వెంటనే స్పందించిన ఆయన ఎస్‌ఐ బాలవెంకటరమణతో ఫోన్‌ మాట్లాడి, నిందితున్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించినట్లు కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు.   

     

     

Business

  • బంగారం ధరల వరుస తగ్గుదల నమోదైంది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.770 తగ్గి 1,63,130 రూపాయలకు చేరింది. అంతకు ముందు రోజు ఈ రేటు రూ.1,63,900 వద్ద ఉంది. అయితే వెండి మాత్రమే స్థిరంగా ఉండటంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.

    రాఖీ పండుగకు ముందు
    శుక్రవారం రాఖీ పండుగ జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాఖీ పండుగ సమయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. అందువల్ల పండుగకు ఒక రోజు ముందు బంగారం ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.

    బంగారం ధర తగ్గడానికి కారణం
    బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అమెరికాలో అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో అమెరికా డాలర్‌తో పాటు ట్రెజరీ బాండ్ యీల్డ్స్ కూడా పెరిగాయి. సాధారణంగా బాండ్ యీల్డ్స్ పెరిగినప్పుడు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరపై ఒత్తిడి కనిపించింది.

    వెండి మాత్రం స్థిరం
    బంగారం తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగింది. ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ తర్వాత వెండి ధర నిలదొక్కుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం వెండి కొంత మెరుగైన ప్రదర్శన చేసింది. స్పాట్ సిల్వర్ ధర 0.31 శాతం పెరిగి ఔన్స్‌కు 68.32 డాలర్లకు చేరింది.

    అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి
    ప్రపంచ మార్కెట్‌లో కూడా స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్‌కు 4,585.88 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల తర్వాత డాలర్ సూచీ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఉండవచ్చనే అంచనాలు బంగారం ధరను ప్రభావితం చేశాయి. అయితే వెండికి మాత్రం సురక్షిత పెట్టుబడుల కోసం ఉన్న డిమాండ్ కొంత మద్దతు ఇచ్చింది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి బంగారం కంటే మెరుగ్గా నిలిచింది.

    కెవిన్ వార్ష్ ప్రసంగంపై మార్కెట్ దృష్టి
    ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ కెవిన్ వార్ష్ శుక్రవారం చేయనున్న జాక్సన్ హోల్ ప్రసంగంపై ఉంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఫెడ్ వైఖరి ఎలా ఉండబోతోందనే విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు మార్కెట్‌కు ముఖ్యమైన సంకేతాలు ఇవ్వవచ్చు. ఫెడ్ కఠినమైన వైఖరిని సూచిస్తే డాలర్, ట్రెజరీ యీల్డ్స్ మరింత బలపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధరపై మరింత ఒత్తిడి రావచ్చు.

  • న్యూఢిల్లీ: పర్పుల్‌ స్టైల్‌ ల్యాబ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 546–575 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 31న ప్రారంభమై సెప్టెంబర్‌ 2న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 28న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇష్యూలో భాగంగా పెర్నియాస్‌ పాపప్‌ షాప్‌ మాతృ సంస్థ రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.

    మల్టీబ్రాండ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ ఓమ్నీ చానల్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వాహక కంపెనీ ఐపీవో నిధులలో రూ. 371 కోట్లు సొంత అనుబంధ సంస్థ పీఎస్‌ఎల్‌ రిటైల్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. వీటిని ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల లీజ్‌ చెల్లింపులతోపాటు.. దేశీయంగా బ్యాకెండ్‌ ఆఫీసుల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 139 కోట్లు సేల్స్, మార్కెటింగ్‌ వ్యయాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

    లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 4,600 కోట్లుగా నమోదయ్యే వీలుంది. కంపెనీ రిటైల్‌గా పెరి్నయాస్‌ పాపప్‌ షాప్‌ల ద్వారా సంప్రదాయ దుస్తులు, వ్యక్తిగత విలాసవంత వస్తువులు తదితరాలను విక్రయిస్తుంది. కంపెనీలో ఇప్పటికే సెలబ్రిటీలు షారుఖ్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, మాధురీ దీక్షిత్, సచిన్‌ తెండూల్కర్, మహేష్‌ బాబు తదితరులు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!

  • టోక్యో: భారత్‌–జపాన్‌ అంకుర సంస్థలను అనుసంధానం చేసేందుకు ’షార్క్‌ ట్యాంక్‌’ తరహా సిరీస్‌ను చేయొచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుుష్‌ గోయల్‌ తెలిపారు. తద్వారా ఇరు దేశాల స్టార్టప్‌లను ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములతో కలిపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

    డిజిటల్‌ కనెక్టివిటీని ఉపయోగించుకుని ఇలాంటి సెషన్లను వర్చువల్‌గా ఏర్పాటు చేయొచ్చని స్టార్టప్‌లతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రి వివరించారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్య అవకాశాలను దక్కించుకునేందుకు వీటి ద్వారా భారత్, జపాన్‌ స్టార్టప్‌లు ఇరు దేశాల ఇన్వెస్టర్లకు తమ ఐడియాలను వివరించవచ్చని చెప్పారు. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు కూడా మరింత బలోపేతమవుతాయని తెలిపారు.

    భారత్‌తో కలిసి పని చేయాలంటూ జపాన్‌ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లను మంత్రి ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం అయితే సమగ్రాభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని గోయల్‌ చెప్పారు. అలాగే, యూనివర్సిటీలు, ఇన్‌క్యుబేటర్లు, వెంచర్‌ ఫండ్స్‌ మధ్య కూడా పరస్పర సహకారం మరింత పెరగాలని పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: సోలార్‌ తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను సిద్ధం చేసింది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వీటిని దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 7,600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 1,600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.

    మరో రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ అవాడా వెంచర్‌ విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌కు పెట్టుబడులున్న అవాడా గ్రూప్‌ ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,200 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ తొలుత 2025 అక్టోబర్‌లో గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. 2026 ఏప్రిల్‌లో అనుమతి పొందింది.  

    కంపెనీ వివరాలివీ 
    2021లో ఏర్పాటైన అవాడా ఎలక్ట్రో ప్రధానంగా సోలార్‌ సెల్స్, మాడ్యూల్స్‌ తయారీని చేపడుతోంది. వీటిని ఎన్‌ల్యూమ్, ఇంటెగ్లో బ్రాండ్లతో వీటిని మార్కెటింగ్‌ చేస్తోంది. 2026 జూలై31కల్లా కంపెనీ 8.5 గిగావాట్ల సోలార్‌ మాడ్యూల్‌ నిర్వహణా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా మరో 3 గిగావాట్ల నిర్వహణా టాప్‌కాన్‌ సోలార్‌ సెల్‌ తయారీని సైతం చేపడుతోంది. 2027–28కల్లా సోలార్‌ మాడ్యూల్‌ సామర్థ్యాన్ని 13.6 గిగావాట్లకు, సోలార్‌ సెల్‌ సామరŠాధ్యన్ని 12 గిగావాట్లకు పెంచుకునే యోచనలో ఉంది.

    ఈ బాటలో 3 గిగావాట్ల ఇన్‌గాట్, వేఫర్‌ సామర్థ్యాలను అందుకోవాలని భావిస్తోంది. తద్వారా సమీకృత తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్‌)కు తెరతీసే లక్ష్యంతో ఉంది. వీటితోపాటు అవాడా హాలో బ్రాండుతో ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లు అందించే ప్రణాళికల్లో ఉంది. ఈపీసీ, ఓఅండ్‌ఎం కార్యకలాపాలలోకి సైతం ప్రవేశించాలని చూస్తోంది.

    యూపీలోని దాద్రిలో, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) ఆదాయం రూ. 5,304 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 889 కోట్లను తాకింది. ఏడాది కాలంలోనే కంపెనీ మాడ్యూల్‌ సామర్థ్యం 1.5 గిగావాట్ల నుంచి 8.5 గిగావాట్లకు జంప్‌చేయగా.. ఆర్డర్‌బుక్‌ 7 రెట్లు ఎగసి 2,555 మెగావాట్ల నుంచి 19,106 మెగావాట్లకు చేరింది.

     

  • శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ప్రముఖ స్విస్ వాచ్‌ తయారీ సంస్థ స్వాచ్‌ గ్రూప్‌ ఏజీకి శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. స్వాచ్‌ గ్రూప్‌కు చెందిన బ్రెగ్యూట్, బ్లాంక్‌పెయిన్, ఒమేగా, లాంగిన్స్, టిస్సోట్‌ వంటి లగ్జరీ వాచ్‌ బ్రాండ్ల డిజైన్లను పోలిన స్మార్ట్‌వాచ్‌ వాచ్‌-ఫేస్‌ యాప్‌లను తన గెలాక్సీ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచినందుకు శామ్‌సంగ్‌ 11.6 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.16 కోట్లు) చెల్లించాలని లండన్‌ హైకోర్టు ఆదేశించింది.

    ఈ వివాదం 2015 అక్టోబర్‌ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించినది. స్వాచ్‌ గ్రూప్‌ వాచ్‌ల డయల్స్‌, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌లను పోలిన డిజిటల్‌ వాచ్‌ ఫేస్‌ యాప్‌లను శామ్‌సంగ్‌ గెలాక్సీ యాప్‌ స్టోర్‌లో థర్డ్‌ పార్టీ డెవలపర్లు అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లు శామ్‌సంగ్‌ స్వయంగా రూపొందించినవి కాకపోయినా, వాటిని యాప్‌ స్టోర్‌లో అనుమతించడం, ప్రదర్శించడం ద్వారా ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘనకు శామ్‌సంగ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తేల్చింది.

    ఈ కేసులో స్వాచ్‌ గ్రూప్‌ తొలుత సుమారు 170 మిలియన్‌ డాలర్ల  నష్టపరిహారం కోరింది. అయితే శామ్‌సంగ్‌ మాత్రం నష్టం చాలా స్వల్పమని, గరిష్ఠంగా సుమారు 300 డాలర్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వాదించింది. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. న్యాయమూర్తి మార్కస్‌ స్మిత్‌ ప్రకారం, స్వాచ్‌ బ్రాండ్లను తక్కువ లేదా ఎలాంటి ధర లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌ల రూపంలో శామ్‌సంగ్‌ యాప్‌ స్టోర్‌లో ప్రదర్శించడం ఆ బ్రాండ్ల విలువకు గణనీయమైన నష్టం కలిగించింది.

    మొత్తం నష్టపరిహారంలో సుమారు 10 మిలియన్‌ డాలర్లు శామ్‌సంగ్‌ యాప్‌ స్టోర్‌లో స్వాచ్‌ బ్రాండ్లను ప్రదర్శించడం వల్ల కలిగిన నష్టానికి కేటాయించినట్లు నివేదికలు వెల్లడించాయి. అదనంగా, ఉల్లంఘనకు సంబంధించిన వాచ్‌-ఫేస్‌ యాప్‌లు యూకే, యూరోపియన్‌ యూనియన్‌లో సుమారు 1.6 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ అయిన అంశాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

    తాజా తీర్పుపై శామ్‌సంగ్‌ స్పందిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అప్పీల్‌తో సహా అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తామని తెలిపింది. మరోవైపు, శామ్‌సంగ్‌ ఉల్లంఘన తీవ్రతను పదేపదే తగ్గించి చూపేందుకు ప్రయత్నించిందని స్వాచ్‌ గ్రూప్‌ విమర్శించింది. ఇదే 10 స్వాచ్‌ బ్రాండ్లు శామ్‌సంగ్‌పై అమెరికాలో దాఖలు చేసిన ప్రత్యేక కేసు కూడా పెండింగ్‌లో ఉంది.

    ఇదీ చదవండి: రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు!

  • జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ మాజీ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునే రీపేమెంట్ ప్లాన్‌ను ట్రిబ్యునల్ ఆమోదించింది. దీంతో రుణదాతలు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది. అంటే క్లెయిమ్ చేసిన ప్రతి రూ.100కు సుమారు 3 పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి.

    అందరూ ఒప్పుకొన్నారు కానీ..

    సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్‌కు 2024 నవంబర్‌లో జరిగిన రుణదాతల ఓటింగ్‌లో 80.814 శాతం ఓటింగ్ షేర్ మద్దతు లభించింది. అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్ వాటా మాత్రం 20 శాతం కంటే తక్కువగా ఉంది.

    ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు ఎంత రావాలి?

    ఈ వ్యవహారం​లో అత్యంత నష్టపోతోంది ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఈ సంస్థకు సుమారు రూ.1,322.39 కోట్ల ఆమోదిత క్లెయిమ్ ఉండగా, రీపేమెంట్ ప్లాన్ ప్రకారం దానికి అందేది కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే. అంటే దాని క్లెయిమ్‌లో దాదాపు 0.028 శాతం మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రతిపాదనను సంస్ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.

    ప్లాన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఎందుకు ఆమోదించింది?

    ఈ కేసులో మొదటి ఇద్దరు ఎన్‌సీఎల్‌టీ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో విషయం మూడో సభ్యుడు నీలేశ్ శర్మ వద్దకు వెళ్లింది. ఆయన ఐబీసీలోని సెక్షన్ 114 కింద రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. రుణదాతలు మెజారిటీతో తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని, అది చట్టపరమైన నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు, ట్రిబ్యునల్ తన సొంత అంచనాతో భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

    ట్రిబ్యునల్ పరిశీలనలో మరో కీలక అంశం సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ. రీపేమెంట్ ప్లాన్‌లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే ఆయన ఆస్తుల నుంచి వచ్చే రికవరీ పరిమితంగానే ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ప్లాన్‌ను తిరస్కరించి చంద్రను దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల రుణదాతలకు మరింత తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉందని కూడా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.

    నాకు మాత్రం అన్యాయం: విజయ్‌ మాల్యా

    సుభాష్‌ చంద్ర రుణాల రీపేమెంట్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం వార్తలపై వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా స్పందించారు. అదే నిజమైతే సుభాష్‌ చంద్రకు అభినందనలు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి.. దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా.. రూ.6203 కోట్ల బకాయిలకు గానూ  బ్యాంకులు, ప్రభుత్వం తన దగ్గర నుంచి 14,100 కోట్లు వసూలు చేశాయన్నారు. చాలామంది రుణగ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి, తమ రుణాలను పరిష్కరించుకుంటున్నారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, సిమెంట్ షేర్లు క్షీణించడంతో బెంచ్ మార్క్ సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 539.35 పాయింట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76,933.59 వద్ద, నిఫ్టీ 50 116.90 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి.

    హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ 50 ఇండెక్స్‌లో  టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.1 శాతం, 0.13 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ సిమెంట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.

  • జపాన్‌లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.

    అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులు

    జపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.

    కొత్త ఫీజుల వివరాలు ఇవే..

    • మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లు

    • ఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లు

    • మూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లు

    • ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లు

    • శాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లు

    అంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.

    ఆన్‌లైన్ దరఖాస్తులకు కొంత తక్కువ

    కౌంటర్‌లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్‌లైన్‌లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్‌లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్‌లైన్‌లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.

    ఫీజుల పెంపునకు కారణమేంటి?

    జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.

    అందరికీ ఒకే భారం కాదు

    ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.

    ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.

    ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్‌..

  • ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో ప్రవాస భారతీయుల (ఎన్నారై) డిపాజిట్లు 2.775 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 23.2 శాతం క్షీణించినట్లు వివరించింది.

    2025–26 తొలి త్రైమాసికంలో 3.614 బిలియన్‌ డాలర్ల ఎన్నారై డిపాజిట్లు వచ్చినట్లు పేర్కొంది. తాజా డిపాజిట్లు నెమ్మదించినప్పటికీ ఎన్‌ఆర్‌వో, ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బి) డిపాజిట్ల దన్నుతో మొత్తం ప్రవాసుల డిపాజిట్ల పరిమాణం 168.327 బిలియన్‌ డాలర్ల నుంచి 168.506 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ వివరించింది.

    ఇదీ చ‌ద‌వండి: చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!

  • వాహనదారులకు బీమా అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో రక్షణ కవచం. అయితే వివిధ కారణాల వల్ల చాలా వరకు వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్‌ చేయించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బిజీ లైఫ్‌స్టైల్ లేదా నిర్లక్ష్యం వల్ల రెన్యూవల్ గడువు ముగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    గడువు దాటితే ఎదురయ్యే సమస్యలు

    • పాలసీ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే బీమా రక్షణ నిలిచిపోతుంది. ఆ తర్వాత వాహనానికి ప్రమాదం జరిగినా, దొంగతనానికి గురైనా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు.

    • మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. లేకపోతే తొలిసారి రూ.2,000, పునరావృతమైతే రూ.4,000 వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.

    • ఇన్సూరెన్స్ లేనప్పుడు మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి నష్టం వాటిల్లితే కోర్టు నిర్ణయించే లక్షల రూపాయిల నష్టపరిహారాన్ని మీ సొంత జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

    • క్లెయిమ్ చేయనందుకు ప్రీమియంలో లభించే 20% నుంచి 50% నో క్లెయిమ్‌ బోసన్‌ డిస్కౌంట్‌, గడువు దాటిన 90 రోజులలోపు రెన్యూ చేయకపోతే పూర్తిగా రద్దవుతుంది.

    • లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించాలంటే ఇన్సూరెన్స్ సంస్థలు భౌతిక లేదా డిజిటల్ వాహన తనిఖీని నిబంధనగా పెడతాయి.

    తక్షణమే ఏం చేయాలి?

    ఇన్సూరెన్స్ లేనప్పుడు డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇన్సూరెన్స్ పోర్టల్స్ లేదా యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభించండి. ప్రస్తుతం చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇన్‌స్పెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రీమియంలో స్వల్ప పొదుపు కోసం చూడకుండా గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవడం లేదా ఆటో-రెన్యూవల్ ఎంచుకోవడం శ్రేయస్కరం.

    ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

National

  • కోల్‌కతా: టిబెట్ సరిహద్దు సమీపంలోని నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తిన వేళ గల్లంతైన వారిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాంశు రాయ్ బిజ్‌పూర్‌ భార్య కూడా ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో నివసించే శర్మిష్ఠ భౌమిక్ రాయ్‌కు ఆగస్టు 25 రాత్రి నుంచి తన భర్తతో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేకుండా పోయింది. 

    రాయ్ బిజ్‌పూర్ తృణమూల్ మాజీ ఎమ్మెల్యే. ఆయన మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కుమారుడు. శుభ్రాంశు రాయ్‌ భార్య ఒక ప్రయాణ సంస్థ ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా ఆగస్టు 21న నేపాల్‌కు వెళ్లారు. ఆమె ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. కోల్‌కతా నుంచి కైలాస పర్వతం, మానస సరోవరం వైపు వెళ్లిన 32 మంది బృందం కూడా గల్లంతైన వారిలో ఉంది. 

    ఈ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు యాత్ర నిర్వాహకులు ఉన్నారు. ఆగస్టు 21న కోల్‌కతా నుంచి బయలుదేరిన బృందం మరుసటి రోజు నేపాల్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువాగఢికి బృందం చేరుకుంది. ఉదయం 8.30 గంటల సమయంలో సభ్యులు ఓ కార్యాలయంలో ఉన్నారు.

    వరదల మధ్య నేపాల్‌లోని నివాస ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ కేంద్రాలు సహా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది మృతి చెందినట్లు సమాచారం. 750 మందికి పైగా ఇంకా గల్లంతయ్యారు. వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. బుధవారం ఉదయం 8.37 గంటలకు టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. మూడు నిమిషాల తర్వాత ఆకస్మిక వరదలు వచ్చినట్లు సమాచారం అందిందని చెప్పారు.

    ఈ ప్రకంపనలు హిమనదం అకస్మాత్తుగా కరిగి భారీగా నీరు విడుదల కావడానికి కారణమై ఉండవచ్చని నేపాల్ అధికారులు తెలిపారు. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో పాటు సమాచార వ్యవస్థలు స్తంభించిపోవడంతో తీవ్రంగా ప్రభావితమైన కొన్ని ప్రాంతాలకు చేరుకోవడంలో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

  • ‘‘ఆలస్యం అమృతం విషం’’ అని అంటారు. ఆలస్యం చేస్తే అమృతమైనా విషంలా మారుతుందని, అందుకే మంచి ఫలితం రావాలంటే ఆ పనినైనా సరే ఆలస్యం చేయకూడదని అంటుంటారు. దీన్ని రాజకీయ నేతలు బాగా ఒంట బట్టించుకున్నారు. పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ప్రజలకు దగ్గర కావడానికి పండుగలను బాగా వాడేసుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీలు తమ ఐక్యత, సంస్థాగత బలం, ప్రజల్లో ఉన్న పట్టును ప్రదర్శించుకోవాలని చూస్తున్నాయి.

    రక్షాబంధన్‌ను కేవలం పండుగగా కాకుండా రాజకీయంగా కూడా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో బీజేపీ ‘రాఖ్రీ మహా సమ్మేళన్’ నిర్వహించి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. రక్షాబంధన్ సందర్భంగా జరిగే కార్యక్రమాలు పార్టీలు తమపై ఉన్న ప్రతికూల భావనలను తగ్గించుకుని, ప్రజల్లో తమ ఇమేజ్‌ను మెరుగుపరుచుకునే వేదికలుగా మారుతున్నాయి. 

    అదే సమయంలో ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమంపైనా రాజకీయ పార్టీల దృష్టి ఉంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని జరిగే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పంజాబ్ రాజకీయ పార్టీలు ముందుగా తమ కార్యకర్తలను ఏకం చేసి, తమ ఇమేజ్‌ను సరిచేసుకుని, 2027 ఎన్నికలకు ఇంటి నుంచే సిద్ధమవుతున్నాయి.

    రాఖర్ పున్నియాకు రాజకీయ ప్రాధాన్యం
    రక్షాబంధన్ సందర్భంగా పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు తమ రాజకీయ బలాన్ని, కార్యకర్తల ఐక్యతను చాటుకునేందుకు ఈ పండుగను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. 

    ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం ఈ సందర్భంగా భారీ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, వారిస్ పంజాబ్ దే వంటి పార్టీలు ఒకే ప్రాంతంలో తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ పంజాబ్‌లో తన సంస్థాగత విస్తరణను చూపించాలనుకుంటుండగా, ఆప్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. అకాలీ దళ్ తన కార్యకర్తల బలాన్ని తిరిగి ప్రదర్శించాలని భావిస్తుండగా, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానాన్ని బలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.

    అయితే ఈ దశలో పార్టీలు నేరుగా ఓటర్లను ఆకట్టుకోవడం కంటే ముందుగా తమ కార్యకర్తలను చైతన్యపరచడం, క్రమశిక్షణలోకి తీసుకురావడం, విభేదాలను పరిష్కరించడం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నాయి. బూత్ స్థాయి సమావేశాలు, ర్యాలీలు, సంస్థాగత భేటీలు పెరుగుతున్నాయి. 

    బీజేపీ పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పలు జిల్లాల్లో పర్యటించి బూత్ స్థాయి నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు. గతంలో శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుపై ఆధారపడిన బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో తన సొంత సంస్థాగత బలం పెంచుకోవడం కీలకంగా మారింది. అయితే బీజేపీ-అకాలీదళ్ మధ్య భవిష్యత్ పొత్తుపై ఊహాగానాలు కొనసాగుతుండటం పార్టీకి అంతర్గత పరీక్షగా మారింది.

    కాంగ్రెస్‌కు సంస్థాగత బలం ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు ప్రధాన సమస్యగా ఉన్నాయి. భూపేష్ బఘేల్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పలువురు కీలక నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. కాంగ్రెస్ ముందుగా తనలో తాను ఐక్యతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషణ పేర్కొంటోంది.

    ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు 
    అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు ఉంది. 2022లో 117 స్థానాల్లో 92 గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు మార్పు కోసం హామీలు ఇచ్చే పార్టీగా కాకుండా, తన పాలనను సమర్థించుకోవాల్సిన అధికార పార్టీగా ఎన్నికలను ఎదుర్కోనుంది. ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు శిరోమణి అకాలీదళ్ గత ఎన్నికల పరాజయాల తర్వాత తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సాధించేందుకు ‘పంజాబ్ బచావో’ ర్యాలీలను నిర్వహిస్తోంది.

    ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రయ్యాలో జరగనున్న రఖర్ పున్నియా కార్యక్రమం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ తన విస్తరణను చూపించేందుకు, ఆప్ తన ప్రభుత్వాన్ని ప్రదర్శించేందుకు, అకాలీదళ్ తన కార్యకర్తల బలాన్ని చాటేందుకు, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే భారీ ర్యాలీలు ఓట్లుగా మారవు. చివరకు కార్యకర్తల చురుకుదనం, స్థానిక సంస్థాగత బలం, ప్రజలతో నిరంతర సంబంధమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది.

  • ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు యువకులు పోస్ట్‌ చేసిన ఓ వీడియో బాగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఉడుమును చంపి, వండి తింటున్నట్లు కనిపించింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను గురువారం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

    వీడియో వైరల్ అయిన తర్వాత అటవీ శాఖ అధికారులు ఆ ముగ్గురి ఆచూకీని గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన మోటార్‌సైకిల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగింది. బచేలి రేంజర్‌ ప్రితేశ్‌ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను హుంగా (30), కోసా పాయం (39), నంద రామ్‌ ఓయామి (36)గా గుర్తించారు. వీరంతా జిల్లాలోని కువకొండ ప్రాంతంలోని ఖుటేపాల్‌ గ్రామానికి చెందినవారు.

    అటవీ శాఖ అధికారుల ప్రకారం.. వారం రోజుల క్రితం ఈ ముగ్గురు పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లారు. అక్కడ వారికి ఉడుము కనిపించింది. దానిని పట్టుకుని చంపినట్లు, వేట దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

    వీడియో తమ దృష్టికి వచ్చిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఆ ఖాతాను అనుసరించి నిందితులను గుర్తించే ప్రయత్నం ప్రారంభించారు. వేటలో ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న 3 బండ తుపాకులు, 2 విల్లంబులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ ముగ్గురిపై 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టంలోని షెడ్యూల్‌ 1లో ఉడుమును చేర్చారు. రక్షిత జాతిని వేటాడితే 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

    షెడ్యూల్‌ 1 అంటే అత్యధిక రక్షణ కల్పించే వన్యప్రాణుల జాబితా. ఈ జాబితాలో ఉన్న జంతువులను వేటాడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. నిందితులను గురువారం దంతేవాడ కోర్టులో హాజరుపరిచారు.

  • న్యూఢిల్లీ: నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల్లో తమ సంస్థకు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారని భావోద్వేగంతో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రకటించడంతో టిబెట్‌లోని ఈశా ఫౌండేషన్‌ శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టిబెట్‌లోని సాగాలో ఉన్న శిబిరంలో వాతావరణం విషాదభరితంగా మారింది.

    కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ, సద్గురు చేతులు వణుకుతుండగా భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. భారీ విధ్వంసం జరిగిన టిబెట్‌లోని గ్యిరోంగ్‌కు వెళ్లి సహాయక చర్యలు, యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని భారత, చైనా రాయబార కార్యాలయాలను కోరారు.

    సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం సాగాలో ఉన్నారు. కైలాస యాత్ర నుంచి తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందానికి జరిగిన విషాదాన్ని వివరిస్తూ ఆయన తీవ్రంగా కలత చెందినట్లు కనిపించారు. “విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇది భయంకరమైన, అసాధారణమైన ఘటన” అని సద్గురు అన్నారు.

    తన అనుచరులను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ.. గురువారం ఉదయం తాను స్వయంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే విపత్తు కారణంగా అక్కడికి వెళ్లే దాదాపు అన్ని మార్గాలు తెగిపోయాయని తెలిపారు. “ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు... కానీ విధ్వంసం స్థాయిని చూస్తే పరిస్థితి ఏమాత్రం బాగున్నట్లు కనిపించడం లేదు” అని ఆయన అన్నారు.

    సందేశం వచ్చిన 9 నిమిషాల్లోనే సంబంధాలు కట్‌
    బృందం గ్యిరోంగ్‌లోని ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలో మొత్తం భవనం కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కొట్టుకుపోయిందని సద్గురు తెలిపారు. వరద నీరు భవనాన్ని తాకిన క్షణాన్ని చూపించే భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితమే తాను అదే ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్నానని సద్గురు గుర్తుచేసుకున్నారు. “వారం రోజుల క్రితం మేము ఇమ్మిగ్రేషన్‌ కోసం ఉన్న అదే భవనం... ఆ భవనం మొత్తం కొట్టుకుపోయింది” అని ఆయన అన్నారు.

    ఉదయం 9.05 గంటలకు బృందం నాయకుడు ఇషంగా ప్రవీణ్‌ నుంచి ఫౌండేషన్‌కు సందేశం వచ్చిందని సద్గురు తెలిపారు. “వారు ఇమ్మిగ్రేషన్‌కు చేరుకున్నారని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత 9.14 గంటలకు ఇది జరిగింది” అని సద్గురు చెప్పారు.

    మరోసారి భావోద్వేగం
    ప్రవీణ్‌ 20 ఏళ్లకు పైగా ఈశా ఫౌండేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పేటప్పుడు సద్గురు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రవీణ్‌ నేపాల్‌ ఫోన్‌ నంబర్‌ ఆ రోజు పనిచేయడం ప్రారంభించలేదని తమ బృందం గుర్తించిందని సద్గురు తెలిపారు. “అతను సరిహద్దు దాటి ఉంటే, అతని నేపాల్‌ ఫోన్‌ పనిచేయాలి. కానీ అది పనిచేయలేదు” అని సద్గురు అన్నారు.

    మంచు చరియలు విరిగిపడటం వల్ల ఈ విషాదం సంభవించి ఉండొచ్చని, విపత్తు తీవ్రత ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సద్గురు హెచ్చరించారు. ప్రభావితమైన వారి సంఖ్య 1,500 లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అన్నారు.

    అయితే సద్గురు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఫౌండేషన్‌కు బృందం నుంచి చివరిసారిగా సమాచారం వచ్చి దాదాపు 12 గంటలు గడిచాయని ఆయన తెలిపారు. దీని ఆధారంగా అన్ని ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని మాత్రం ఆయన చెప్పలేదు. టిబెట్‌లోని గ్యిరోంగ్‌లో ప్రభావిత ప్రాంతానికి సద్గురు, చిన్న బృందం వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యలకు మద్దతు ఇవ్వాలని సద్గురు కోరుతున్నారు.

    “ఈ విషయంలో భారత, చైనా, అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. కొంతమంది వ్యక్తులతో కలిసి నేను అక్కడికి వెళ్లి మనం ఏం చేయగలమో చూసేందుకు అనుమతిస్తారేమో చూస్తున్నాం” అని ఆయన అన్నారు. సద్గురు తన ప్రసంగాన్ని ముగించినా ఈశా శిబిరంలో విషాద వాతావరణం అలాగే కొనసాగింది. నేపథ్యంలో వినిపించిన రోదనలు ఆగలేదు.

    నేపాల్ లో జరిగిన విధ్వంసంపై కళ్లనీళ్లు పెట్టుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్

    ఇదీ చదవండి: పాకిస్థాన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు

    టిబెట్‌కు సరిహద్దుగా ఉన్న నేపాల్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో సుమారు 300 మంది మరణించగా, 1,500 మంది గల్లంతయ్యారు. వరద నీరు వల‍్ల ఇళ్లు, వాహనాలు, వంతెనలను కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు 300 మంది భారతీయులు గల్లంతయ్యారని నేపాల్‌ విదేశాంగ మంత్రి తెలిపారు.

    ఈశా సేక్రెడ్‌ వాక్స్‌ సమన్వయకర్త స్పందన
    నేపాల్‌లో వరద పరిస్థితుల కారణంగా ఈశా ఫౌండేషన్‌ ‘సేక్రెడ్‌ వాక్స్‌’ (కైలాస మానస సరోవర్‌ యాత్ర)కు వెళ్లిన పలువురు యాత్రికులు, స్వచ్ఛంద సేవకులు గల్లంతు కావడం/చిక్కుకుపోవడంపై ఈశా సేక్రెడ్‌ వాక్స్‌ సమన్వయకర్త మా గంభీరి స్పందించారు “ఊహించని పరిస్థితి ఎదురైంది. బృందం కాఠ్మాండూకు తిరిగి వస్తుండగా చైనా ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉంది. ఉదయం 9.05 గంటలకు వారితో చివరిసారిగా మాట్లాడినప్పుడు, బృందం నాయకుడు ప్రవీణ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రానికి ఇప్పుడే చేరుకున్నామని, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించబోతున్నామని చెప్పారు. 10 నిమిషాల్లోనే మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, వారి ఫోన్లు అందుబాటులోకి రాలేదు. 

    ఇదీ చదవండి: పాకిస్థాన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు

    ఆ 10 నిమిషాల్లోనే ఈ మొత్తం విషాదం జరిగింది. మొత్తం సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో బృందంలోని అందరితో సంబంధాలు తెగిపోయాయి. మేము సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. నేపాల్‌ వైపు అన్ని సమాచార వ్యవస్థలు పనిచేయలేదు. సమాచారం తెలుసుకునేందుకు కొన్ని హెలికాప్టర్లను పంపేందుకు ప్రయత్నించారని అనుకుంటున్నాను. నేపాల్‌ వైపు మా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు ఉన్న పట్టణం పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 80 మంది ఈ ఘటనతో ప్రభావితమయ్యారు. చైనా అధికారులు త్వరలో, ఆశాజనకంగా రేపు ఉదయం నాటికి ఏదైనా సమాచారం ఇస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. మంచి వార్త వింటామనే ఆశతో ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు.

    నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 77 మంది యాత్రికుల గురించి ఆమె మాట్లాడుతూ.. “వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూరప్‌లోని వివిధ దేశాలు, బ్రిటన్‌ నుంచి వచ్చారు. కొన్ని ఆసియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మొత్తం 19 దేశాల నుంచి పాల్గొన్నవారు ఉన్నారు. వారిలో చాలామంది భారతీయ మూలాలు ఉన్నవారు. భారత్‌, నేపాల్‌లోని మొత్తం 19 రాయబార కార్యాలయాలను సంప్రదించాం. వారితో మేము నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాం. మాకు ఎలా సహాయం చేయాలి, ఏదైనా సమాచారం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను వారు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషాదం చాలా మారుమూల ప్రాంతంలో, భారీ స్థాయిలో చోటుచేసుకోవడంతో సమాచారం అందడానికి చాలా ఆలస్యం అవుతోంది” అని తెలిపారు.

     

  • న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు కస్టడీలో జరిగిన ఓ యువకుడి మరణం కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024లో ఓ యువకుడు కస్టడీలో మృతి చెందగా, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి 2 సంవత్సరాల 7 నెలలు ఆలస్యం కావడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతమ్‌ను కోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఇలాంటి కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ఇంత సమయం ప‍ట్టడం ఏంటని, ఇక పోలీసు అధికారులకు శిక్షణ అవసరమా? అని ప్రశ్నించింది.

    విచారణ సందర్భంగా.. ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ పూర్తిగా అసమర్థుడిగా కనిపిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును నిర్వహించే సామర్థ్యం ఛత్తీస్‌గఢ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు లేదని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో మరణం వంటి తీవ్రమైన కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టు ప్రశ్నించింది.

    మరో అంశంపై కూడా సుప్రీంకోర్టు డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించకుండానే తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టును మోసం చేయడమేనని, కేసులోని ప్రతి అంశంపై కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది.

    మృతుడి మరణానికి మద్యం మానేయడం వల్ల వచ్చిన ఉపసంహరణ లక్షణాలు కారణమని పేర్కొన్నప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదికలో తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు నమోదై ఉండటాన్ని కోర్టు ప్రస్తావించింది. నివేదికలో తలకు గాయం స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది.

    న్యాయ విచారణ నివేదిక తమకు అందలేదని డీజీపీ చెప్పినప్పుడు కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ నివేదిక జూలై 2024లోనే సమర్పించారని, అంతేకాకుండా డీజీపీ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లోనే ఆ నివేదిక భాగంగా ఉందని కోర్టు గుర్తు చేసింది.

    ఈ కేసులో కస్టడీ మరణానికి రూ.లక్ష పరిహారం చెల్లించిన విషయంపైనా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక మనిషి ప్రాణానికి విలువ కేవలం రూ.లక్షేనా అని ప్రశ్నిస్తూ, అది భయంకరమైన విషయం అని వ్యాఖ్యానించింది.

    తన వాదనలో డీజీపీ.. న్యాయ కస్టడీలో జరిగే ప్రతి మరణంపై న్యాయ విచారణ తప్పనిసరి అని చెప్పారు. న్యాయ విచారణలో అది నేరంగా పరిగణించాల్సిన కేసు అని నిర్ధారణ అయ్యే వరకు పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేరని వాదించారు. న్యాయ విచారణ నివేదిక రెండేళ్ల పాటు పోలీసు శాఖకు అందలేదని, అది బిలాస్‌పూర్‌ కేంద్ర జైలు లేదా జైళ్ల శాఖకు పంపినట్లు తెలిపారు.

    మరణం హత్యా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో న్యాయ విచారణ ద్వారా దాన్ని తేల్చాల్సి వచ్చిందని డీజీపీ కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పటికే చెల్లించామని చెప్పారు. న్యాయ విచారణకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత జూలై 30న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఓ గెజిటెడ్‌ అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

    5 సార్లు క్షమాపణలు
    విచారణ సందర్భంగా డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతమ్‌ 5 సార్లు క్షమాపణలు చెప్పారు. న్యాయ విచారణ నివేదికపై జరిగిన చర్చ, నివేదిక తమకు అందకపోవడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం, నివేదికల విషయంలో ఏర్పడిన గందరగోళం వంటి అంశాలపై ఆయన క్షమాపణలు కోరారు. చివర్లో కోర్టు తనను పూర్తిగా అసమర్థుడిగా పేర్కొన్న తర్వాత కూడా క్షమాపణలు చెప్పారు.

    కేసును సీబీఐకి అప్పగింత
    కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు కథనం పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదికలో మృతుడి తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు, కొన్ని చోట్ల రక్తస్రావం జరిగినట్లు నమోదైంది. న్యాయం కోసం మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మొత్తం మీద, కస్టడీలో జరిగిన మరణంపై ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, పోస్ట్‌మార్టం నివేదికను సరిగా పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్‌ పోలీసు, పరిపాలనా వ్యవస్థను తీవ్రంగా తప్పుబట్టింది.

    ఇదీ చదవండి: పాకిస్థాన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు

  • నేపాల్‌ వరదల్లో మృతుల సంఖ్య 332కి పెరిగింది. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్‌కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్‌ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్‌ సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 సభ్యులు వరదల్లో గల్లంతయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది.

    గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే 42 టన్నుల సహాయ సామాగ్రిని నేపాల్‌కు భారత్‌ ప్రభుత్వం పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు: 011-23089718, వాట్సాప్ నెంబర్ : 9968291988. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించామని కేంద్రం పేర్కొంది.

    కాగా, నేపాల్‌లో ఇషా ఫౌండేషన్‌ సేక్రెడ్ వాక్స్ పేరుతో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టగా.. వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, వాలంటీర్లు కనిపించకుండా పోయారు. దీంతో ఇషా ఫౌండేషన్‌లో విషాదం నెలకొంది. ‘‘మా బృందం ఖాట్మండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో ఉన్నారు. ఉదయం 9:05కి గ్రూప్ లీడర్ ప్రవీణ్‌తో చివరిగా మాట్లాడాం. ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 10 నిమిషాల్లోనే సంప్రదింపులు తెగిపోయాయి. 10 నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డౌన్‌ అయ్యింది. నేపాల్ వైపు కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. నేపాల్ వైపు మా వాలంటీర్లు ఉన్న పట్టణం పూర్తిగా కొట్టుకుపోయింది.’’ అని ఇషా ఫౌండేషన్ తెలిపింది.

    ‘‘చైనా అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం… రేపు ఉదయం వరకు ఆశిస్తున్నాం. 77 మంది భక్తులు చిక్కుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్, యూకే, ఆసియా దేశాలవారు ఉన్నారు.19 ఎంబసీలతో సహాయం, సమాచారం కోసం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రిమోట్‌ ప్రాంతం, భారీ విపత్తు కారణంగా సమాచారం నెమ్మదిగా వస్తోంది’’ ఇషా ఫౌండేషన్ పేర్కొంది.

    ఇదీ చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్‌ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?



     

  • ఢిల్లీ: ‘నా బూట్లు నీతోనే కడిగిస్తా.. నువ్వు ఎంతటివాడివైనా సరే’ అంటూ గ్రేటర్ నోయిడాలోని ఓ హై-ప్రొఫైల్ సొసైటీలో సెక్యూరిటీ గార్డులను ఉద్దేశించి ఓ మహిళ బెదిరింపులకు దిగింది. డెలివరీ బాయ్‌ని గేట్ వద్దే ఆపారన్న చిన్న కారణంతో ఆ మహిళ కోపంతో ఊగిపోయింది. 

    విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషిస్తూ ఆమె సృష్టించిన వీరంగం తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బుందనే అహంకారంతో సామాన్య సిబ్బందిపై ప్రదర్శిస్తున్న ఈ దౌర్జన్యానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

    గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘సెంచూరియన్ పార్క్ టెర్రస్ హోమ్స్’ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకుంది. అయితే భద్రతా దృష్ట్యా నిబంధనల ప్రకారం విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది డెలివరీ బాయ్‌ను గేట్ వెలుపలే ఆపారు.

    కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ రాకపోవడంతో మహిళ గేటు వద్దకు వచ్చి పరిశీలించింది. డెలివరీ బాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు గమనించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కాస్తా తీవ్ర వివాదంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా దూషించడమే కాకుండా పోలీసులకు ఫోన్ చేస్తారా? చేసుకోండి అంటూ దురుసుగా వ్యవహరించింది.

    బెదిరింపులు.. దాడి యత్నం
    ఒకానొక సమయంలో కుర్చీలో కూర్చున్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసేందుకు యత్నించగా, మరో సిబ్బందిని వెనక్కి తోసేసింది. నాతో పోలిస్తే నీ స్థాయేంటో తెలుసా? నీతో నా షూస్‌ను క్లీన్ చేయించుకుంటా అంటూ బెదిరింపులకు దిగింది. గార్డుల ఆర్థిక పరిస్థితిని కించపరిచేలా ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి.

    డెలివరీ బాయ్‌ని ఎందుకు ఆపారనే కచ్చితమైన కారణం, ఈ ఘర్షణకు దారితీసిన ఇతర పరిస్థితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది పట్ల సదరు మహిళ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

     

  • నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

    కుంభకోణానికి చెందిన సూపర్‌ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్‌ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

    ఏం చర్యలు తీసుకున్నారు?
    ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్‌ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

    అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ పంపాలని కోరింది.

    57 కాదు.. 106 మంది
    తమిళనాడు మంత్రి రాజ్‌మోహన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.

    చివరి ఫోన్‌ కాల్‌.. నో రెస్పాన్స్‌
    తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్‌ కాల్‌ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్‌ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.

    విజయ్‌ అత్యవసర సమావేశం
    అసెంబ్లీలో నేపాల్‌ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్‌ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

    ఆచూకీ కోసం ప్రయత్నాలు
    నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్‌ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

    ఇదీ చదవండి: విపత్తుల నేపాల్‌.. ఆ ట్రాక్‌ రికార్డు అంత ఘోరం మరి!

  • న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ పోస్టులో ఆయన ఉపయోగించిన ఒక పదంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించినప్పటికీ, ఈ పెను ప్రకృతి విపత్తును ‘డ్రామా’ అని సంబోధించడం చాలామందిని తీవ్రంగా కలచివేసింది. కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘భారీ వినాశనాన్ని సృష్టించిన కొండ ప్రాంతాల్లోని ఆ డ్రామా గురించి ఏమాత్రం తెలియకుండానే నిన్న ఖాట్మండుకు విమానంలో ప్రయాణించాను’ అని రాసుకొచ్చారు. ఇంతటి తీవ్ర విషాదాన్ని వర్ణించేందుకు థరూర్ ‘డ్రామా’ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గొప్ప పదసంపద కలిగిన వ్యక్తి ఇంతటి సున్నితత్వ లేని పదాన్ని ఎలా ఉపయోగిస్తారని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

    నిఘంటువులోని క్లిష్టమైన పదాలు తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని, సమయోచితంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటనలోని సానుభూతే ఒక నాటకంలా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నుంచి ఇలాంటి పదజాలాన్ని ఊహించలేమని వ్యాఖ్యానిస్తూ, వెంటనే ఆ పోస్టును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీషు భాషా సం‍స్కృతిలో డ్రామా అనే పదాన్ని తీవ్ర ఉత్కంఠ కలిగించే సంఘటనల విషయంలో కూడా వాడుతుంటారు. అయితే దీనిని ‘నాటకీయం’గా పలువురు భావించడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా శశిధరూర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

     

Sports

  • భారత-ఎ మహిళల జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌ ఆడనుంది. తొలుత మూడు టీ20ల సిరీస్‌ సెప్టెంబర్‌ 12 నుంచి 15 వరకు జరగనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్‌ సెప్టెంబర్‌ 20న ప్రారంభం కానుంది. ఈ వైట్‌బాల్‌ సిరీస్‌లు ముగిసిన వెంటనే ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ పర్యటన కోసం భారత-ఎ జట్లను బీసీసీఐ ప్రకటించింది.

    అనధికారిక వన్డే, టెస్టు సిరీస్‌లలో భారత-ఎ జట్టు కెప్టెన్‌గా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ యస్తిక భాటియా ఎంపికయ్యారు. యస్తిక గత నెలలో జరిగిన చారిత్రాత్మక లార్డ్స్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో సత్తాచాటింది. ఇప్పుడు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించేందుకు భాటియా సిద్ధమైంది. ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా చెత్రీ వంటి ఆటగాళ్లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక శుభ సతీష్, సుశ్రీ దివ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, మమత మడివాలలను ప్రత్యేకంగా టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఎంపిక చేశారు.

    మరోవైపు టీ20 జట్టుకు యంగ్ ప్లేయర్ అనుష్క శర్మ నాయకత్వం వహించనుంది. ఈ టీ20 జట్టులో 22 ఏళ్ల సుజాత డేకి సెలక్టర్లు చోటు కల్పించారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుజాత, బెంగాల్‌ టీ20 లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

    టీ20ల కోసం భారత ఎ జట్టు: అనుష్క శర్మ (కెప్టెన్‌), సయాలీ సత్‌ఘరే (వైస్ కెప్టెన్‌), వృందా దినేష్, సుజాతా డే, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, షిప్రా గిరి , శ్వేతా సెహ్రావత్, ఉమా చెత్రీ (వికెట్‌కీపర్‌), తనుజా కన్వెర్, తనుజా కన్వెర్, షణ్మనీల్ మణి, శనిభ్‌నమ్‌ మణి, వైష్ణింబ్‌ మణి, శనినమ్‌ మణి, జె. దిల్ బహదూర్

    వన్డేల కోసం భారత ఎ జట్టు: యాస్తిక భాటియా (కెప్టెన్‌), అనుష్క శర్మ (వైస్ కెప్టెన్‌), వృందా దినేష్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, ఉమా చెత్రీ (వికెట్‌కీపర్‌), మిన్ను మణి, అమన్‌దీప్ కౌర్, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, జింటిమణి కలితా, షబ్నం షకీల్, అక్షితా భగత్

    నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత ఎ జట్టు: యాస్తిక భాటియా (కెప్టెన్‌), అనుష్క శర్మ  శుభా సతీష్, ప్రియా పునియా, తనీషా సింగ్, తేజల్ హసబ్నిస్, నిక్కీ ప్రసాద్, మమతా మడివాలా (వికెట్ కీపర్‌), సుశ్రీ దిబ్యదర్శిని, శుచి ఉపాధ్యాయ్, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, జింటిమణి కలితా, షబ్నం షకీల్, అక్షితా భగత్
     

  • కొలంబో వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జ‌ట్టు అద్భుతం చేసింది. ఓటమి ఖాయమనుకున్న వేళ లంక బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా ముగించారు. ముఖ్యంగా శ్రీలంక యువ బ్యాటర్‌ సోనల్ దినుష అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన దినుష.. దాదాపు 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇక​ ఈ కీల‌క మ్యాచ్ డ్రా కావ‌డంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. 

    "ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మేము మా శాయశక్తులా ప్రయత్నించాము. వరుసగా మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాము. అయిన‌ప్ప‌టికి వారు అద్భుతంగా ఆడారు. క‌చ్చితంగా శ్రీలంక బ్యాట‌ర్ల‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా వారికి కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చింది. 

    మేము అక్క‌డ ఇంకా కొత్త ప్ర‌యోగించాల్సింది ఏమి లేదు. అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశాం. ఈ సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు నుంచి మేము చాలా విష‌యాలు నేర్చుకున్నాం. ఒత్తిడిలో శ్రీలంక పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. 

    లంచ్, టీ విరామ సమయంలో కూడా మేము దీని గురించే చర్చించాం. ఇక దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ అద్భుతంగా ఆడాడు.కేఎల్ రాహుల్ మ‌రోసారి త‌న క్లాస్ చూపించాడు.  మ‌రోవైపు మాన‌వ్ సుతార్ గురుంచి ఎంత చెప్పుకొన్న త‌క్కువే. ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నాడు. అతడు కచ్చితంగా సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో కొనసాగుతాడు. ఈ మ్యాచ్‌లో మా పేస్ బౌల‌ర్లు కూడా తీవ్రంగా శ్ర‌మించారు" అని గిల్ పేర్కొన్నాడు.

    అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు గురుంచి గిల్ మాట్లడుతూ.. "మేము నవంబర్‌లో  న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తున్నాం. అక్కడ మ్యాచ్‌లను గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్నాం. ఈ రెండు సిరీస్‌ల‌లోనూ గెలిచి ఫైన‌ల్స్‌కు చేరుకుంటామ‌న్న న‌మ్మ‌కం ఉందని" చెప్పుకొచ్చాడు.
    చదవండి: WTC 2025-27: డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు బిగ్ షాక్

  • మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టు.. ఇప్పుడు ఐదో స్దానం సాధించి టోర్నీని ముగించింది. గురువారం ఐదో స్థానం కోసం జ‌ర్మ‌నీతో జ‌రిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భార‌త్  3-1 తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 

    ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జ‌ట్లు గోల్ కోసం తీవ్రంగా శ్ర‌మించాయి. ఫస్ట్ హాఫ్ స‌మ‌యానికి  ఏ జట్టూ గోల్ నమోదు చేయలేకపోయింది. అయితే మూడో క్వార్ట‌ర్‌లో మాత్రం భార‌త ప్లేయ‌ర్లు స‌త్తాచాటారు. మ్యాచ్ 43వ నిమిషంలో ఈషిక అద్భుతమైన గోల్‌తో భార‌త్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది.

    ఆ తర్వాత స్ట్రైకర్ నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్‌తో మెరిసి జ‌ట్టును 3-0 ఆధిక్యంలో తీసుకెళ్లింది. మ్యాచ్ ముగిసే సమయానికి జర్మనీ తరఫున లిన్ క్రింగ్స్ ఒక ఫీల్డ్ గోల్ సాధించి ఖాతా తెరిచిన‌ప్ప‌టికి.. భార‌త్ 3-1 తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
    చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?
     

  • శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌నుకున్న భార‌త జ‌ట్టుకు నిరాశే ఎదురైంది. కొలంబో వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఐదో రోజు ఆట‌లో శ్రీలంక బ్యాట‌ర్లు అద్భుత‌మైన పోరాటం క‌న‌బ‌రిచారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు ప‌డ‌గొట్టిన భారత బౌల‌ర్లు.. చివ‌రి రోజున మిగిలిన‌ 4 వికెట్లు సాధించి ఆలౌట్ చేయలేకపోయారు.

    యువ ఆట‌గాడు సోన‌ల్ దినుష (264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్), లంక టెయిలాండర్ల పోరాటం ముందు మన బౌలర్లు తేలిపోయారు. దీంతో శ్రీలంక 429/9 స్కోరు వద్ద ఉన్నప్పుడు మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో టీమిండియా ఫైనల్ ఆశలపై ప్రభావం చూపింది.

    ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకునేది. కానీ ఇప్పుడు డ్రా కావడంతో ఐదో స్ధానానికే పరిమితమైంది. అంతేకాకుండా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది. ప్రస్తుత సైకిల్‌లో గిల్ సేన ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో ఐదు విజయాలు, రెండు డ్రాలు చేసింది. మరో నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (80), దక్షిణాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (55.56) జట్లు భారత్ కంటే ముందున్నాయి.

    భారత్ ఫైనల్‌కు చేరాలంటే?
    ఈ డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా ఇంకా 7 టెస్టులు ఆడ‌నుంది. ఇందుకు న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ల‌లో త‌ల‌ప‌డ‌నుంది. భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరాలంటే.. ఈ ఏడు మ్యాచ్‌ల‌లో ఐదింట అయినా గెలుపొందాలి. అంతేకాకుండా ఇతర జ‌ట్ల ఫ‌లితాల‌పైన కూడా ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో కివీస్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు వెళ్ల‌నుంది.
    చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?
     

  • కొలంబో వేదిక‌గా భారత్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో శ్రీలంక పేస్ బౌలర్ లాహిరు కుమార బ్యాట్‌తో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఈ మ్యాచ్‌ను శ్రీలంక డ్రా చేసుకోవ‌డంలో కుమారది కీల‌క పాత్ర‌.  ఫాలో ఆన్‌లో ఆతిథ్య జ‌ట్టును త్వరగా ఆలౌట్ చేయాలని భావించిన భారత జ‌ట్టు ఆశలపై అత‌డు నీళ్లు జల్లాడు. 

    పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార.. అసాధారణ డిఫెన్స్‌తో టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. భారత స్పిన్నర్లను అలోవకగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అప్ప‌టికే టీమిండియాకు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సునాల్ దినుష‌తో క‌లిసి లహిరు తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 

    ఏకంగా 90 బంతులు ఎదుర్కొన్న కుమార కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. చివరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక టెయిలెండర్ అయి ఉండి భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఆ తరహా బ్యాటింగ్‌ చేయడం నిజంగా గ్రేట్‌ అని కొనియాడుతున్నారు. 

    కాగా ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు విరోచిత పోరాటం కనబరిచారు. ముఖ్యంగా యువ ఆటగాడు సోనల్‌ దినుష(133 నాటౌట్‌) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టి భారత్‌కు కీలక విజయాన్ని దూరం చేశాడు.

    అతడికి సపోర్ట్‌గా లంక టెయిలాండర్లు కూడా నిలిచారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ డ్రా ముగిసినప్పటికి, రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది.

    సంక్షిప్త స్కోర్లు..
    భార‌త తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్‌
    శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్‌
    శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్‌
    చదవండి: IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్‌ భారత్‌దే

     

  • కొలంబో వేదిక‌గా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్‌ చేయలేకపోయారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు ప‌డ‌గొట్టిన మన బౌల‌ర్లు.. చివ‌రి రోజున మిగిలిన‌ 4 వికెట్లు తీయ‌లేక‌పోయారు.

    లంక బ్యాటర్‌ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్‌ కోసం భారత్‌ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్‌) వీరోచిత పోరాటం కనబరిచారు.

    తొమ్మిదో వికెట్‌గా కుమార అవుట్‌ కావడంతో శ్రీలంకను భారత్‌ త్వరగా ఆలౌట్‌ చేసి బ్యాటింగ్‌కు వస్తుందని అంతా భావించారు. కానీ పదకొండో నంబర్‌ బ్యాటర్‌ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్‌ కోసం ఆఖరికి కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌ కూడా బౌలింగ్‌ చేశారు.

    అయినా చివరి వికెట్‌ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్‌ బ్యాటింగ్‌కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

    బెడిసి కొట్టిన టీమిండియా ప్లాన్‌
    ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(117), ధ్రువ్‌ జురెల్‌(115) సెంచరీలతో సత్తాచాటగా.. గిల్‌(50), పంత్‌(63) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా సోనల్‌ దినుష(103) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పసిందు సూరియబండార(80) కూడా రాణించాడు.

    మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో సునాయస విజయం సాధించవచ్చనే నమ్మకంతో భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ లంక జట్టుకు ఫాలో-ఆన్‌కు ఆహ్వానించాడు. గిల్‌ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫాలో ఆన్‌లో శ్రీలంక అద్భుతమైన పోరాటం కనబరిచి మ్యాచ్‌ను డ్రా ముగించింది.

    సంక్షిప్త స్కోర్లు..
    భార‌త తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్‌
    శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్‌
    శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్‌
    చదవండి: చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్‌ దినుష
     

  • శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఆరోజు ఆటలో లంకను త్వరగా అవుట్‌ చేయాలన్న భారత జట్టు ఆశలపై సొనాల్‌ దినుష నీళ్లు చల్లాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి శ్రీలంకకు ఊపిరిలూదాడు.

    ఈ క్రమంలోనే సొనాల్‌ దినుష సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాపై ఇంత వరకు ఏ ఆసియా క్రికెటర్‌కూ సాధ్యంకాని ఓ అరుదైన ఘనత సాధించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-26లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది.

    శతక్కొట్టిన దినుష
    గాలె వేదికగా తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో లంక ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆల్‌రౌండర్‌ దినుష మాత్రం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా శతకం సాధించిన ఈ 25 ఏళ్ల లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు.

    ఇక కొలంబో వేదికగా రెండో టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో భారత్‌కు 213 పరుగుల ఆధిక్యం లభించగా శ్రీలంకను ఫాలో ఆన్‌ ఆడమని చెప్పింది.

    వరుసగా రెండో సెంచరీ
    ఇదిలా ఉంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల స్కోరు చేయడంలో సొనాల్‌ దినుషదే కీలక పాత్ర. ఏడో స్థానంలో వచ్చిన అతడు 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇక ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లంక తేలిగ్గానే తలవొంచుతుందని భావించిన టీమిండియా దినుష ఊహించని షాకిచ్చాడు.

    తొలి ఆసియా బ్యాటర్‌గా..
    ఆఖరిదైన గురువారం రోజు ఆటలో ఏడు పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన దినుష.. అనూహ్య రీతిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్‌ తర్వాత తొలి బంతికే రెండు పరుగులు తీసి వంద పరుగుల మార్కు అందుకున్న అతడు.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.

    ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన సొనాల్‌ దినుష.. టీమిండియాతో టెస్టుల్లో ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. గాలె టెస్టులో 100, 84.. కొలంబోలో 103, 100* స్కోర్లు సాధించి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.

    చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌ కుమారుడికి చోటు

  • తమిళనాడు ప్రీమియర్‌ లీగ్-2026 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. బుధవారం చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో ట్రిచీ గ్రాండ్ చోలాస్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన విడా కోవై కింగ్స్‌. తమ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. 

    కోవై కింగ్స్‌ పేసర్‌ దీబన్‌ లింగేష్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన కోవై కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

    అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిచీకి ఆరంభంలోనే లింగేష్‌ షాకిచ్చాడు. మొదటి మూడు బంతుల్లోనే కె. రాజ్‌కుమార్‌, ఎస్‌. శ్యామ్‌ సుందర్‌, జగన్నాథన్‌ కౌశిక్‌లను లింగేష్‌ ఔట్‌ చేశాడు. దీంతో గోల్డెన్‌ హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

    ఈ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. ట్రిచి ఇన్నింగ్స్‌లో జాఫర్‌ జమాల్‌, డేవిడ్‌సన్‌ కూడా గోల్డెన్‌ డకౌటయ్యారు. భారత టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌ కావడం ఇదే తొలిసారి. లింగేష్‌తో పాటు మణిమారన్ సిద్ధార్థ్ కూడా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా ట్రిచీ జట్టు 15.4 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది.



     

     

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బ్యాటర్ ఆసిఫ్ ఖాన్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. డోపింగ్ పరీక్షలో విఫలమైనందుకు అత‌డిపై 15 నెల‌ల నిషేధాన్ని ఐసీసీ విధించింది. 2025 సెప్టెంబర్ 8న ఆసిఫ్ డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో అతడు నిషేధిత పదార్దం అయిన మ్యాస్టెరోలోన్ మెటాబోలైట్ తీసుకున్న‌ట్లు తేలింది. 

    దీనిపై స్పందించిన ఆసిఫ్‌, తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. అయితే ఈ పదార్థాన్ని తాను మ్యాచ్‌లు లేని సమయంలో (అవుట్-ఆఫ్-కాంపెటీషన్) తీసుకున్నానని అత‌డు చెప్పుకొచ్చాడు. అయిన‌ప్ప‌టికి నిబంధ‌న‌లు ప్ర‌కారం క్రీడాకారులు నిషేధిత డ్ర‌గ్స్ తీసుకోవ‌డం నేరం కావ‌డంతో ఐసీసీ ఈ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. 

    అత‌డిపై నిషేధం 2025 సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 7 త‌ర్వాత ఆసిఫ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తారు. అయితే ఈ నిషేధిత స‌మ‌యంలో అత‌డు సాధించిన వ్యక్తిగత రికార్డులు, ప్రైజ్‌మ‌నీని ర‌ద్దు చేస్తారు. 

    కాగా పాకిస్తాన్‌లో జ‌న్మించిన ఆసిఫ్ ఖాన్‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మాత్రం యూఏఈకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు యూఏఈ త‌ర‌పున 38 వ‌న్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 2572 ప‌రుగులు చేశాడు. అత‌డు చివ‌ర‌గా 2025లో యూఏఈ త‌ర‌పున ఆడాడు.
    చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులకు చోటు

  • అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) సంచలన ప్రకటన జారీ చేసింది. భారత్‌లో టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన ప్రసార హక్కులను పాకిస్తాన్‌కు చెందిన సంస్థకు అప్పగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సిరీస్‌ నిర్వహణపై ముందుకు సాగుతుందా? లేదంటే నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా? అన్న చర్చ మొదలైంది.

    కాగా తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొంతంగా ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించే అవకాశం లేదు. దీంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లేదంటే భారత్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అఫ్గాన్‌ బోర్డు ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబరులో భారత్‌ వేదికగా టీమిండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.

    ఇందులో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో టీమిండియాతో సెప్టెంబరు 13-17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించిన మీడియా హక్కులను పాక్‌కు చెందిన టీజీ (ట్రాన్స్‌ గ్రూప్‌)నకు అప్పగించినట్లు అఫ్గాన్‌ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

    ‘‘ఏసీబీ గ్లోబల్‌ మీడియా హక్కుల సిండికేషన్‌ భాగస్వామిగా టీజీ ఉంటుంది. టీపీటీ360 మీడియా ప్రొడక్షన్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తుంది. ఇండియాలో ఫ్యాన్‌ కోడ్‌ ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేస్తుంది’’ అని అఫ్గాన్‌ బోర్డు తెలిపింది.

    కాగా ట్రాన్స్‌ గ్రూపునకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో సత్సంబంధాలు ఉన్నాయి. పీసీబీ అంతర్జాతీయ మీడియా హక్కులు కలిగి ఉండటంతో పాటు.. ఆసియా, మధ్యప్రాచ్యంలో ఈ గ్రూపు మేజర్‌ ఈవెంట్లను ప్రసారం చేస్తోంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు కూడా ఈ సంస్థవే.

    ఈ నేపథ్యంలో బీసీసీఐ అఫ్గాన్‌ బోర్డు ప్రకటనపై ఎలా స్పందిస్తుందోనని క్రీడా వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాగా భారత్‌- పాక్‌ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌-2026 మేజర్‌ టోర్నీల్లో ఇరుజట్ల ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.

    మరోవైపు.. ఆసియా కప్‌ ఫైనల్లో పాక్‌ను ఓడించి భారత్‌ టైటిల్‌ గెలిచింది. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించగా.. నక్వీ ట్రోఫీని ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకున్నాడు.  

    ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌ జట్టు ఇటీవల భారత్‌లో పర్యటించింది. శుబ్‌మన్‌ గిల్‌ సేనతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడి ఓడిపోయి ఇంటిబాటపట్టింది.

    చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులకు చోటు

  • శ్రీలంక ఆటగాడు సొనాల్‌ దినుషపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్‌ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్‌ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.

    కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.

    దినుష అద్భుత ప్రదర్శన
    అయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్‌ సొనాల్‌ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.

    ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్‌ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్‌స్లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్‌ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.

    పసిందుతో కలిసి..
    అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్‌ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్‌ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్‌ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.

    ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్‌ శుక్లా సొనాల్‌ దినుషపై ప్రశంసలు కురిపించాడు.

    సొనాల్‌ అత్యద్భుతమైన ఆటగాడు
    ‘‘శ్రీలంకకు చెందిన సొనాల్‌ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్‌లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్‌ శుక్లా ఎక్స్‌ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్‌ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్‌ శుక్లాను విమర్శిస్తున్నారు.

    కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్‌ టెండుల్కర్‌ తన రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

    చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులకు చోటు

International

  • నేపాల్‌-చైనా సరిహద్దులో మెరుపు వరదలు సృష్టించిన బీభ‌త్సం.. అంతా ఇంతా కాదు. నేపాల్‌ను జ‌ల ప్ర‌ళ‌యం కకావికలం చేస్తున్న వేళ.. ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ భీకర జల ప్రళయం నేర్పిన పాఠాలు ఏంటి?  వీటన్నిటిని తట్టుకునేలా పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాల భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలనే దానిపై చర్చ నడుస్తోంది.

    ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్‌ సాంకేతిక ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో ప్రముఖ ఆర్కిటెక్చర్‌ నిపుణులు డాక్టర్‌ ప్రదీప్‌కుమార్ విశ్లేషించారు. నేపాల్‌లో జ‌ల విల‌యానికి అసలు కారణాలు ఏంటి?. ఏం జ‌రిగింది? భ‌విష్య‌త్‌లో ఏం జ‌రగ‌బోతుంది? ప‌లు షాకింగ్‌ విష‌యాల‌ను సాక్షి ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పూర్తి వివ‌రాలు కోసం కింది వీడియోను చూడండి.

  • మరో సరస్సుతోనూ ప్రమాదం పొంచి ఉందంటూ చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. టిబెట్–నేపాల్ సరిహద్దులోని బ్యారియర్ సరస్సు 72 గంటల్లో పొంగిపొర్లే ప్రమాదం ఉందని చెబుతోంది. భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని బీజింగ్ అధికారులు మరో హెచ్చరికను జారీ చేశారు.

    చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరులు గల్లంతైనట్లు తెలిపారు. టిబెట్‌లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకురావడంతో ముగ్గురు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ ఘటన కారణంగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో దిగువ ప్రాంతాల్లో ఈ వరదల కారణంగా 177 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. టిబెట్ వైపు ప్రమాద ప్రాంతాల్లోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇద్దరు గ్రామస్థులను రక్షించారు.

    ఇదిలా ఉండగా.. మరో ప్రమాదాన్ని చైనా మీడియా గుర్తించింది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా పెంచింది. ఈ సరస్సు విపత్తు ప్రాంతానికి ఈశాన్య దిశలో, చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఉంది. గురువారం నాటికి ఈ బ్యారియర్ సరస్సులో సుమారు 20 లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా. సరస్సు ఇప్పటికే పొంగిపొర్లుతోంది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది.

    ఇదిలా ఉండగా.. సహాయక చర్యల కోసం చైనా బీజింగ్, చెంగ్డూ నుంచి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలను పంపించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించారు. అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు ఇంకా నిలిచిపోయినట్లు సీసీటీవీ తెలిపింది.

    ఇదీ చదవండి: నేపాల్‌ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్‌

  • వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన క్రైస్తవ మహిళను అపహరించి, ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు రావడంతో ఆమె ప్రాథమిక హక్కులను కాపాడాలని 11 మంది అమెరికా చట్టసభ సభ్యులతో కూడిన ద్వైపాక్షిక బృందం ఇస్లామాబాద్‌ను కోరింది. 18 ఏళ్ల పాకిస్థానీ క్రైస్తవ మహిళ నెహా ఫకీర్‌ను మార్చిలో అపహరించినట్లు, ఆ తర్వాత ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. టామ్ లాంటోస్ మానవ హక్కుల కమిషన్ సహాధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యుడు క్రిస్ స్మిత్.. ఫకీర్ భద్రత, ప్రాథమిక హక్కులను పాకిస్థాన్ ప్రభుత్వం కాపాడాలని కోరారు.

    “నెహా ఫకీర్ అదృశ్యం కావడం, ఆ తర్వాత ఆమె మతం మార్చుకోవడం వెనుక ఉన్న పరిస్థితులు ఆమె భద్రత, మత స్వేచ్ఛ, బలవంతం లేదా బెదిరింపులు లేకుండా తన హక్కులను వినియోగించుకునే సామర్థ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి” అని స్మిత్ అన్నారు.

    కేసు ఎలా వెలుగులోకి వచ్చింది?
    క్రైస్తవ సాలిడారిటీ ఇంటర్నేషనల్ జూన్ 10న ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేయడంతో అమెరికా స్పందన వచ్చింది. మార్చి 24న ఓ శిక్షణ తరగతికి హాజరైన తర్వాత ఆమె కనిపించకుండా పోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఫకీర్ లాహోర్‌లోని ఒక మదర్సాలో కనిపించారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. అయితే, ఆమెను తిరిగి తమ వద్దకు పంపించాలని కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను పాకిస్థాన్ కోర్టు తిరస్కరించింది.

    అమెరికా చట్టసభ సభ్యులు లేఖలో ఏమన్నారు?
    స్మిత్‌తో పాటు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన మరో 10 మంది సభ్యులు ఆగస్టు 20న పాకిస్థాన్ ఫెడరల్ న్యాయ, న్యాయవ్యవహారాల మంత్రి ఆజమ్ నజీర్ తారర్‌కు లేఖ రాశారు. ఫకీర్ కేసుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. స్మిత్‌తో పాటు ప్రతినిధులు జేమ్స్ పి. మెక్‌గవర్న్, ఫ్రెంచ్ హిల్, గస్ బిలిరాకిస్, ఆండీ హారిస్, మారియా ఎల్విరా సలాజర్, రిలే మూర్, రాండీ వెబర్, మైఖేల్ క్లౌడ్, బ్రాడ్ షెర్మన్, బ్లేక్ మూర్ లేఖపై సంతకాలు చేశారు.

    ఫకీర్ శారీరక భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు పాకిస్థాన్ అధికారులు తమ న్యాయ వ్యవస్థ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర న్యాయవాదిని గోప్యంగా సంప్రదించే అవకాశం ఆమెకు కల్పించాలని చట్టసభ సభ్యులు కోరారు.

    ఫకీర్ తన కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా, వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. భవిష్యత్తులో జరిగే ఏదైనా న్యాయపరమైన విచారణలో ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా, బెదిరింపులు లేదా అనుచిత ప్రభావానికి గురికాకుండా పరిస్థితులు ఉండేలా పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

    పాకిస్థాన్ రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలను కూడా సభ్యులు ప్రస్తావించారు. ఇందులో మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ 20, చట్టం ముందు సమానత్వానికి హామీ ఇచ్చే ఆర్టికల్ 25 ఉన్నాయి.

    “పాకిస్థాన్ రాజ్యాంగం మత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వానికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఒక యువతి తన విశ్వాసాలను సురక్షితంగా, స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతే దీనికి అర్థం ఉండదు” అని స్మిత్ అన్నారు. పాకిస్థాన్‌లోని మతపరమైన మైనారిటీలకు ఈ కేసు ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. “ఈ కేసు పాకిస్థాన్‌లోని మతపరమైన మైనారిటీలకు ప్రత్యేకంగా ముఖ్యమైనది. వారు అపహరణ, బలవంతపు మతమార్పిడి, బలవంతపు వివాహాలకు గురవుతున్నారు” అని స్మిత్ అన్నారు.

    మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో ప్రముఖంగా పనిచేస్తున్న స్మిత్.. మతపరమైన మైనారిటీ మహిళలు, బాలికలను అపహరించడం, బలవంతంగా మతం మార్చడం, అలాగే నిందితులను బాధ్యులుగా చేయడంలో అధికారులు విఫలమవుతున్న అంశాలపై చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

  • టిబెట్‌: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు,మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ జి. సతీష్‌ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు.

    హైదరాబాద్‌ నుంచి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్‌ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్‌ యాత్రకోసం సతీష్‌ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్‌ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్‌ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ‘మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్‌లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్‌కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం’ అని ఆయన తెలిపారు.

Andhra Pradesh

  • విజయవాడ: అమరావతిలో మరో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. మోతడక భూ సమీకరణకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీని ద్వారా 1,654 ఎకరాలు రైతుల నుంచి సమీకరిస్తారు. 

    ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

  • పల్నాడు: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి  వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసిన మృతుని బంధువులతో వినతిపత్రం  ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 

    దాంతో కంగుతిన్న మృతుని బంధువులు దేనికి వినతిపత్రం ఇవ్వాలంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయల తీరుపట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేశారు ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసకున్నాయి. ఈ ఘటనను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తూ నిరసన చేపట్టారు. రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

    అలా జరగకపోయి ఉంటే.. సాధిక్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరంటే?

     

     

  • తాడేపల్లి.  రేపు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) రాఖీ పండుగను పురస్కరించుకుని ఏపీలోని మహిళలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    రక్షాబంధనం అన్నది ఆత్మీయతలూ అనురాగాల పండుగ అని గుర్తు చేసిన వైఎస్‌ జగన్‌.. అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: 
    పంచదార్ల కొండపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

  • సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.

    నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్‌రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్‌రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

    తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్‌లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్‌ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్‌ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్‌రెడ్డి అన్నారు.

    ఇదీ చదవండి: సాధిక్‌కు ఆ కెమికల్‌ ఎక్కడి నుంచి వచ్చింది?

  • విజయవాడ: వైఎస్సార్‌సీపీ పోరాటంతో ప్రభుత్వం దొగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. పంచదార్ల కొండను కూటమి నేతలు తవ్వేసిన విషయం తెలిసిందే. 

    చారిత్రక పంచదారలను కూటమి నేతలు ధ్వంసం చేశారు. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై వైసీపీ పోరాటం చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

    పంచదార్లను నోమైనింగ్‌ జోన్‌గా చేపట్టాలని వైఎస్సార్‌సీపీ చాలా కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. లేదంటే మరింత పెద్దఎత్తున పోరాటం చేపడతామని సర్కారు హెచ్చరించింది. దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.

    ఇదీ చదవండి: పాకిస్థాన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కేబినెట్‌ విస్తరణ, ప్రక్షాళనతోనే ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్‌ వేసే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. వారంలో తెలంగాణ కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశముందని సమాచారం. విస్తరణలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పు.. ఇద్దరు, ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాముందని చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

    ఇదిలా ఉండగా.. శాఖల మార్పు సంకేతాలతో తమ శాఖలో పూర్తయిన పనులకు రిబ్బన్‌ కటింగ్‌ చేసేందుకు మంత్రులు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, వరంగల్‌లో రాజకీయ ఉత్కంఠత  కొనసాగుతుంది, వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో అనధికార పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కొండ సురేఖ.. నో పొలిటికల్ కామెంట్స్ అంటూ ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అదే రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే, ఒక వైపు 
    ఏం జరుగుతుందోన్న ఆందోళనలో వరంగల్‌ ఈస్ట్ కొండా క్యాడర్ ఉంటే.. మరో వర్గం సంబరాలు చేసుకుంటున్నారు.

    రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న కొండా మురళి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత మూడు రోజులుగా ఎక్కడ కనిపించని సుస్మిత పటేల్  హడావుడి లేకుండా సైలెన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. మరో వైపు, మాజీ ఓఎస్డీ సుమంత్‌ జాడ కోసం వరంగల్‌లో కూడా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని రాష్ట్రవాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • జ‌డ్చ‌ర్ల‌: మహిళలంటే త‌నకు చాలా గౌరవం, వారిపై తాను ప్రెస్ మీట్లు పెట్టనని జడ్చర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారంపై స్పందిస్తూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 'ఇంట్లో మా అమ్మ తిట్టినా తల వంచుకుంటానే తప్ప ఎదురు మాట్లాడను. మహిళల ఒక్క చుక్క కంటనీరు నేలపై పడ్డా అది సునామీ అయిపోయి మనం అందులో కొట్టుకుపోతామ‌'ని వ్యాఖ్యానించారు.

    కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోంద‌ని అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. కొండా సురేఖ అంశంలో ఎమ్మెల్యేలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు త‌న‌ను ఎవరూ ఆహ్వానించలేదని వెల్ల‌డించారు. చిన్నారెడ్డి చాలా సీనియర్ నాయకుడ‌ని, ఆయ‌న విషయంలో తానేమి మాట్లాడబోనని అన్నారు.

    ప్రశ్నిస్తూనే ఉంటా
    త‌న నియోజ‌క‌వ‌ర్గ‌ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం ప్ర‌భుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాన‌ని చెప్పారు. పెండింగ్ బిల్లుల కోసం అవ‌స‌ర‌మైతే భట్టి విక్రమార్కతో కొట్లాడుతాన‌ని, ఈయకపోతే దీక్షకు దిగుతాన‌ని వ్యాఖ్యానించారు. కాగా, కొండా సురేఖ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నివేదిక ఇచ్చిన నేప‌థ్యంలో కాంగ్రెస్ హైక‌మాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. 

    ఇదీ చ‌ద‌వండి: ఇంకా బెంగ‌ళూరులోనే భ‌ట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్‌!

  • వరంగల్‌: పాలిటెక్నిక్‌ విద్యార్థులపై రేవంత్‌ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్‌కు పట్టవా?అని నిలదీశారు హరీష్‌రావు.

    ‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. 

    డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.

    ఇదీ చదవండి: 
    వేటేస్తారా?.. వదిలేస్తారా?
     

  • సాక్షి, తాడేపల్లి : ఏపీ గంజాయి స్టేట్‌గా మారిపోయిందని.. పోలీసులతోనే గంజాయిని రవాణా చేసే దుస్థితికి తెచ్చారంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. లిక్విడ్ రూపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడింది. గంజాయి డాన్ సోహెల్‌ని పోలీసుల నుంచి తప్పించిందెవరు?’’ అంటూ నాగ మల్లీశ్వరి ప్రశ్నించారు.

    ‘‘హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. హోంమంత్రితో పోలీసులతో కూడా తప్పు చేయిస్తున్నారు. అత్యంత అసమర్థ మంత్రిగా హోంమంత్రి చరిత్రలో నిలిచిపోయారు. వైఎస్‌ జగన్ హయాంలో గంజాయి సాగుపై యుద్ధం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు నడిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది’’ అంటూ మలీశ్వరి ధ్వజమెత్తారు.

    ‘‘గంజాయిని నిర్మూలించామంటున్న హోంమంత్రి మాతో చర్చకు రాగలరా?. హోంమంత్రికి నిత్యం వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మటం తప్ప మరో పనిలేదు. సోహెల్ పోలీస్ స్టేషన్ నుండి పారిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఇదీ హోంమంత్రి పనితీరు. హోంమంత్రి అనిత దగ్గరకు ఫైల్ వెళ్తే ఐదు రోజులపాటు చూడరు. ఇది ప్రభుత్వమే చేయించుకున్న సర్వేలో తేలిన అంశం. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకేం బాగుపడుతుంది?’’ అంటూ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం

     

Family

  • కాలం తాలూకు ఓ ముక్కను మన చేతిలో వదిలిపోతే ఎలా ఉంటుంది? మన కంటే వందల రెట్లు కనిపించే ప్రపంచం మన అరచేతిలో చాటుగా వచ్చి చేరిపోతే ఎలా ఉంటుంది? ఫొటో ఇచ్చే కిక్కే అదే కదా..? ఫొటో తీసే ముందు వచ్చే క్లిక్‌మనిపించే శబ్దానికి అక్షరాలా రెండు శతాబ్దాలు నిండాయంటే నమ్మశక్యం కాదు.. అయినా ఇది నిజం..

    ఫ్రెంచ్‌ ఆవిష్కర్త జోసెఫ్‌ నిసెఫోర్‌ నీప్స్‌ 1820లలో కాంతిని ఉపయోగించి ఒక చిత్రాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాల ఫలితమే వ్యూ ఫ్రమ్‌ ద విండో అట్‌ లి గ్రాస్‌. 1826లో అతని ప్రయోగాల ఫలితంగా తొలిఫొటోను తీయగలిగాడు. ఆ ఫొటోలో నీప్స్‌ ఇంటి కిటికీ బయట ఉన్న భవనాలు, పైకప్పులు కనిపిస్తాయి. 

    విశేషమేమిటంటే ఇప్పుడు ఫొటో తీయడానికి కెమెరాలో బటన్‌ నొక్కితే క్షణంలో ఫొటో తీయొచ్చు.. కాని ఆ రోజుల్లో నీప్స్‌ అదే పని చేయడానికి సూర్యకాంతి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇంటి కిటికీ నుంచి మొదలైన ఆ చిన్నప్రయోగమే నేడు డిజిటల్‌ కెమెరాలు, మొబైల్‌ కెమెరాల నుంచి ఐమాక్స్‌ కెమెరాల వరకు అభివృద్ధి చెందింది. 

    ఇదే ఫస్ట్‌ సెల్ఫీ
    ఫొటోగ్రఫీ మీద నీప్స్‌ తర్వాత చాలామంది పరిశోధనలు చేశారు. 1839లో అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన రాబర్ట్‌ కార్నీలియస్‌ తన కుటుంబానికి చెందిన గ్యాస్‌ లైటింగ్‌ వ్యాపార ప్రాంగణంలో కెమెరాను ఏర్పాటు చేశాడు. అప్పటి కెమెరాలు నేటి ఫోన్‌ కెమెరాల్లా ఉండేవి కావు. ఫొటో తీయడానికి లెన్స్‌ క్యాప్‌ తొలగించి, వెంటనే కెమెరా ముందు కూర్చోవాలి. తిరిగి వెళ్లి లెన్స్‌ను మూసేయాలి. అలా కార్నీలియస్‌ తీసుకున్న స్వీయచిత్రాన్నే ప్రపంచంలోనే తొలి సెల్ఫీగా పరిగణిస్తున్నారు.  

    (చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..)

  • క్రీడాకారుల సౌందర్యం వారి రూపంలో కాదు, మైదానంలో వారు చూపే ఆత్మస్థైర్యం, సహనంలో ఉందనే దిశగా ‘వేర్‌ యువర్‌ స్కార్స్‌’ సరికొత్త చర్చకు తెరలేపింది. కాప్రి స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలోని ది స్పోర్ట్స్‌ ఉమెన్‌ సంస్థ, భారత హాకీ సమాఖ్యతో కలిసి ‘‘మీ గాయాలను గర్వంగా ప్రదర్శించండి’’ అంటూ ఒక ప్రత్యేక డిజిటల్, సోషల్‌ మీడియా ఫొటో సిరీస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. క్రీడారంగంలో సమాజం చెప్పేటువంటి సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలకు ఎటువంటి స్థానం లేదని ఈ ప్రచారం గట్టిగా చెబుతోంది. 

    మహిళా అథ్లెట్లు మైదానంలో ఆడేటప్పుడు తగిలే గాయాలు, కుట్లు, కట్‌ మార్క్స్, కందిపోయిన గుర్తులను దాచడం లేదా ఫొటోల్లో రీటచ్‌ చేసి తొలగించడం సాధారణం. కానీ, ‘వేర్‌ యువర్‌ స్కార్స్‌’ ఈ గాయాలను దాచడానికి నిరాకరించింది. పదహారవ మహిళల ప్రపంచ కప్‌ హాకీ టోర్నీని పురస్కరించుకొని చేస్తున్న ఈ ప్రచారం మహిళల శరీర రూపురేఖలు, అందంపై సమాజంలో ఉన్న పాతబడిన ఆలోచనలను గట్టిగా ప్రశ్నిస్తోంది. మహిళలు ఎప్పుడూ నాజూగ్గా, మచ్చలు లేకుండా ఉండాలనే సామాజిక ఒత్తిళ్లకు, సౌందర్య ప్రమాణాలకు క్రీడా ప్రపంచం లో స్థానం లేదని అంటోంది. 

    మైదానంలో ఆడే మహిళల శరీరాలపై పడే ప్రతి గాయం వారి అసాధారణ పోరాటానికి, విజయానికి నిజమైన ఆభరణమని చాటిచెబుతోంది. ఈ క్యాంపెయిన్‌లో అథ్లెట్లు తమ శరీరాలపై ఉన్న గాయాలను రత్నాభరణాల రీతిలో దర్పంగా ప్రదర్శించారు. ఒంటిమీద ధరించే మెరిసే ఆభరణాల్లా ఈ గాయాలపై కూడా కాంతి ప్రసరించేలా చిత్రీకరించారు. 

    క్రీడా మైదానంలో తగిలే గాయాలు వైకల్యాలు కావు, అవి క్రీడాకారుల పట్టుదలకు, ఆత్మస్థైర్యానికి సజీవ సాక్ష్యాలని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాషన్‌ గ్లామర్‌కూ, మైదానంలో అథ్లెట్లు చిందించే చెమట–రక్తాలకు మధ్య ఉన్న ఒక విభిన్నమైన వ్యత్యాసాన్ని ఈ ప్రచారం కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.  

     

    (చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..)

  • భాతీయ వంటకాల రుచి పడిపోవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆహా ఇదేమి రుచి తినరా మైమరచి..అంటూ లొట్టలేసుకుంటూ విదేశీయులు సైతం ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మన వంటకాల కోసం మన భారత్‌లో పర్యటించేవాళ్లు కూడా ఉన్నారు. ఇదెంతా ఎందుకంటే మన వంటకాల టేస్ట్‌కి ఫిదా అవ్వుతూ ఓ అమెరికన్‌ వ్యక్తి తన ఆవేదనంత గక్కేశాడు. స్వతహాగా మాంసహార ప్రియుడినైనా తాను భారతీయ వంటకాల దెబ్బకు..మరో రుచి చూడలేకపోతున్నానంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇదేంటి మన వంటకాల టేస్ట్‌ నచ్చలేదా? అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ అమెరికన్‌ వ్యక్తి మన వంటకాల తోపాటు మన వెటకారం కూడా వంటబట్టించుకుని మరి ఇలా వ్యగ్యంగా చెబుతున్నాడు. ఇంతకీ ఏంటంటే అసలు కథ..!.

    స్నాక్‌ మాస్టర్‌ జనరల్‌గా అభివర్ణించే స్నాక్‌ డిటెక్టివ్‌ ఎడ్‌ నాథన్సన్‌ అనే అమెరికన్‌ వ్యక్తి భారతీయ వంటకాలు గురించి సోషల్‌మీడియా వేదికగా ఇలా చెప్పుకొచ్చాడు. ఆ వంటకాలు తన రుచి మొగ్గలను పాడు చేశాయట. భారతీయ వంటకాల్లోని అద్భుత రుచి, విభిన్నమైన రెసిపీల మాధుర్యానికి మరో వంటకం టేస్ట్‌ నాథన్సన్‌కి తెలియడం లేదట. మన వంటకాల రుచి ఆ రేంజ్‌లో ఉందని, అందులో ఉపయోగించే 47 మసాలాలే ఇందుకు కారణం అని అంటున్నాడు. ఆ కారణంగానే  అతడి నాలుకు మరో టేస్ట్‌ని క్యాచ్‌ చేయలేక వాటి జోలికే పోవడం లేదంటూ చమత్కరిస్తున్నాడు. 

    భారత వంటకాల రుచితో తనకు గొప్ప చిక్కొచ్చి పడిందంటూ వ్యగ్యంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నాడు. ఇది అక్షరాల మిగతా వంటకాల రుచి పాడుచేస్తోందని ఆరోపణలు చేస్తున్నాడు. తాను సుమారు నాలుగైదు ఏళ్ల నుంచి భారతీయ ఆహారం ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు. ఒకరోజు స్వర్గంలోంచి దేవుడే తనను ఆహ్వానిస్తూ..ఈ భారతీయ వంటకాల రుచి చూడమన్నాడని ఆసువుగా కథ కూడా చెప్పేస్తున్నాడు. అంతేగాదు అస్సలు ఈ వంటకాలు టేస్ట్‌ చూడాలని దిగారో..మళ్లీ వెనక్కి వెళ్ల మరో వంటకం వైపుకి చూడను కూడా చూడరని శపథం చేసి మరి చెబుతున్నాడు. 

    ఇంకా.. మన రెసిపీ పేర్లు ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు. పారీ పూరీ తిన్నారో..మళ్లీ మళ్లీ తినాలనే కోరిక చావను కూడా చావదు, ఆ చికెన్‌ కర్రీ టేస్ట్‌ చేశారో..మదిలో గుర్తుకొచ్చినప్పుడల్లా నోటిలో నీళ్లూరిపోతుంటాయని, ఇక ఆ కాలీఫ్లవర్‌ చూస్తే..భారతీయ వంటకం గోబీ మంచూరియన్‌ మనసుని తాకుతుందని..అందువల్ల నాలుకని కట్టడి చేయడం అసాధ్యం అంటూ ఇండియన్‌ వంటకాలపై ప్రేమనంత ఒలకపోశాడు నాథన్సన్‌. 

    అంతేగాదు తాను స్వతహాగా మాంసాహార ప్రియుడినైనా తనని శాకాహార వంటకాల వైపుకి మళ్లేలా చేసిందని అంటున్నాడు. అంతేగాదు తొలిసారిగా భారతీయ వంటకాలను ట్రై చేసే ముందు ఓసారి ఆలోచించుకోండి. లేదంటే దాని రుచికి బానిసైపోతారు, మళ్లీ దాన్నుంచి బయటపడటం అంత ఈజీ కాదు సుమీ అని హాస్యంగా హెచ్చరిస్తున్నాడు నాథన్సన్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

     

    (చదవండి: మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్‌..! ప్రత్యేకత ఇదే)

     

  • మెరికా అంటేనే భారీ రహదారులు, కార్లు, ట్రాఫిక్‌ గుర్తుకొస్తాయి. కానీ అదే అమెరికాలో కార్లు లేకుండానే ప్రజలు హాయిగా జీవించే ఓ ఆధునిక ప్రాంతం ఉంది. నడక, సైక్లింగ్‌, ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్‌ నగరాలకు ఓ కొత్త నమూనాగా మారుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడి ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!

    అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టెంపేలో ఉన్న కల్డెసాక్‌ (Culdesac) ప్రాంతం ఇప్పుడు వినూత్నమైన నగర నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా అమెరికా నగరాల్లో కార్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద రహదారులు, ట్రాఫిక్‌, కాలుష్యం, పార్కింగ్‌ కోసం భారీగా స్థలం అవసరమవుతుంది. అయితే కల్డెసాక్‌ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటి నుంచే కార్ల రహిత ఆధునిక నివాస ప్రాంతంగా దీన్ని రూపొందించారు. ప్రజలు కార్లకు బదులుగా నడక, సైక్లింగ్‌, ప్రజా రవాణాను ఉపయోగించేలా ఇక్కడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.

    కల్డెసాక్‌ వాతావరణం, నిర్మాణ శైలి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడ రోడ్లపై కార్ల రద్దీ కనిపించదు. అందమైన భవనాలు, నడకదారులు, పూల మొక్కలు, అలంకరణ దీపాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతాన్ని చూసిన కొందరు పర్యాటకులు ‘ఇది అమెరికాలో ఉన్నట్టుగా అనిపించడం లేదు.. గ్రీస్‌లోని ఏదో ప్రాంతంలా ఉంది’ అని చెబుతుంటారు.

    సుమారు 17 ఎకరాల్లో విస్తరించిన కల్డెసాక్‌ ప్రాంతం మధ్యలో ఓ విశాలమైన ప్లాజాను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ తక్కువ ఎత్తున్న తెల్లని భవనాలు, సన్నని నడకదారులు, గోడలపై చరిత్రకు సంబంధించిన రంగురంగుల చిత్రాలు, పూల మొక్కలు, అలంకరణ దీపాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణ శైలికి ఇటలీ, ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతాలు, తీర గ్రామాల నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆర్కిటెక్ట్‌ డేనియల్‌ పరోలెక్‌ తెలిపారు.

    ఇక్కడ కార్ల వినియోగం లేకపోయినా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు నడవడానికి అనువైన ఫుట్‌పాత్‌లు, సైకిళ్ల కోసం ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, దుకాణాలు, కొరియన్‌ కన్వీనియన్స్‌ స్టోర్‌, వైద్యుల కార్యాలయం, డాగ్‌ పార్క్‌, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ఇవి కూడా చదవండి: ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ

    కల్డెసాక్‌ వెలుపలే లైట్‌ రైల్‌ స్టేషన్‌ ఉండటంతో డౌన్‌టౌన్‌ ఫీనిక్స్‌, విమానాశ్రయం వంటి ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఎలక్ట్రిక్‌ వేమో రోబోటాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ-బైక్‌లను అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడు షేర్డ్‌ ఎలక్ట్రిక్‌ కార్లను గంటకు సుమారు 5 డాలర్లకు అద్దెకు తీసుకోవచ్చు.

    అలాగే, కార్లు లేకుండా జీవించే విధానంతో పాటు ఎడారి వాతావరణంలో వేడిని తగ్గించేలా కల్డెసాక్‌ను రూపొందించడం మరో ప్రత్యేకత. భవనాల గోడలు, పైకప్పులకు తెల్లటి రంగు వేయడం ద్వారా సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబించేలా చేశారు. భవనాలను ఒకదానికొకటి దగ్గరగా నిర్మించడంతో అవి పరస్పరం నీడనిచ్చేలా ఉన్నాయి. గాలి నగరంలోకి సులభంగా వచ్చేలా ప్రజలు నడిచే దారులను, భవనాల మధ్య ప్రాంతాలను ప్రత్యేకంగా రూపొందించారు.

    దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే కల్డెసాక్‌లో నేల ఉపరితల ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల ఫారన్‌హీట్‌ (సుమారు 17 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌) వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

    కల్డెసాక్‌ జీవన విధానం పర్యావరణానికే కాకుండా అక్కడి ప్రజల సామాజిక సంబంధాలకు కూడా ఉపయోగపడుతోందని నివాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 21 చిన్న వ్యాపారాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మెక్సికన్‌ రెస్టారెంట్లు, సిరామిక్స్‌, కొవ్వొత్తుల తయారీ స్టూడియోలు, బైక్‌ షాప్‌, పర్యావరణహిత దుస్తుల దుకాణాలు వంటి వ్యాపారాలు ప్రాంతాన్ని సందడిగా ఉంచుతున్నాయి.

    కార్ల రాకపోకలు లేకపోవడంతో పొరుగువారు, వ్యాపారులు, సందర్శకులు తరచూ ఒకరినొకరు కలుసుకునే అవకాశం పెరిగిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. దీంతో ఒంటరితనం తగ్గడంతో పాటు కమ్యూనిటీ భావన బలపడుతోందని వారు అంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ప్రశాంతంగా నడుచుకుంటూ ప్రాంతాన్ని ఆస్వాదించగలగడం ప్రత్యేక అనుభూతిగా చెబుతున్నారు.

    కార్ల వినియోగాన్ని తగ్గించి నడక, సైక్లింగ్‌, ప్రజా రవాణాను ప్రోత్సహించడం వల్ల వాయు కాలుష్యం, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. కల్డెసాక్‌ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏడాదికి సుమారు 3,000 టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని అంచనా.

    ప్రస్తుతం కల్డెసాక్‌లో సుమారు 760 నివాస యూనిట్లు, దాదాపు 1,000 మంది నివసించేలా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ కార్ల వినియోగాన్ని తగ్గించి, నడకకు అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. దీంతో కల్డెసాక్‌ భవిష్యత్‌ నగరాల రూపకల్పనకు కొత్త నమూనాగా మారుతోంది. ప్రజలు కార్లపై ఆధారపడకుండా నడక, సైక్లింగ్‌, ప్రజా రవాణాతో సౌకర్యవంతంగా జీవించేలా నగరాలను ఎలా రూపొందించవచ్చో ఈ ప్రాంతం చూపిస్తోంది.

    ఇవి కూడా చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్‌ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?

  • బాలీవుడ్‌ బ్యూటీ, బీజేపి ఎంపీ..కంనా రనౌత్‌ రాజీకీయాల్లోకి వచ్చినప్పటికీ అందమైన చీరలతో తన ఫ్యాషన్‌ శైలి ఏంటో చెప్పకనే చెబుతుంటుందామె. పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్నా లేదా బహిరంగ కార్యక్రమానికి హాజరవుతున్నా..సదా చేనేత చీరలతో తళుక్కుమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుందామె. అలానే ఈసారి కూడా సరికొత్త విలక్షణమైన చీరతో అందర్నీ ఆకట్టుకున్నారామె. 

    ఆ చీర అలాంటి ఇలాంటి శారీ కాదు. అత్యంత విభిన్నమైన పట్టుచీర అది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇది నా మొదటి మేఘాలయ చీర అంటూ తారా వేదా బ్రాండ్‌ను ట్యాగ్‌ చేస్తూ రాశారు. తారా వేదా బ్రాండ్‌ కూడా కంగనా రనౌతా ధరించిన పట్టుచీరకు సంబంధించిన వీడియోని షేర్‌చేస్తూ పోస్ట​్‌లో ఆ చీర పత్యేకతను వివరించింది. 

     

    అహింసాయుతమైన పట్టు చీర..
    "ఇది సహసిద్ధమైన ఊదారంగు చీర . దీన్ని నేయడానికే దాదాపు రెండున్నర నెలలపైనే పట్టిందట. ఇనుపపొడి, దానిమ్మపండు నుంచి తీసిన రంగు ఈ చీర రంగు అట. దీన్ని ఎరిసిల్క్‌(అహింసా సిల్క్‌) అని కూడా పిలుస్తారు. ఈ వస్త్రం అత్యంత మన్నికైనది. 

    ఇది ఈశాన్య భారతదేశంలో కనిపించే 'ఫిలోసామియా రిసినీ' అనే చిమ్మట నుంచి లభిస్తుందట. ఇతర రకాల పట్టు చీరలా కాకుండా చిమ్మటాలు(ఒక రకమైన పట్టుపురుగుల్లాంటివి) గూళ్ల నుంచి బయటకు వచ్చాక దాన్నుంచి పొందిన పట్టుదారాలతో దీన్ని తయారు చేస్తారు. పత్తి లాంటి ఆకృతికి చెందిన వస్త్రం ఇది. 

    ఇది వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది." అని పేర్కొది. అంతేగాదు ఆ  పోస్ట్‌లో కంగనా ఎందుకు ఈ చీను ఎంచుకుందో కూడా తెలిపింది. "ఇది స్వచ్చంగా గర్వించే క్షణం. అందంగా ఉండే కంగనా రనౌతా తన ప్రత్యేక కార్యక్రమాల కోసం చేతితో తయారు చేసి ప్రీమియం మేఘాలయ ఎరిసిల్క్‌ చీరును ధరించారు. ఎరిసిల్క్‌లోని ప్రతి దారం ఓర్పు, శాంతితో కూడిన విలాసాన్ని ప్రదర్శిస్తుంది. 

     

    ఈ చీర అందానికి ప్రతిరూపం అని క్యాప్షన్‌ ఇచ్చి మరి నటి కంగనా వీడియోని పంచుకుంది తారా వేద బ్రాండ్‌. సరిగా కృతి సనన్‌ కంగనా రనౌత్‌ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగిన కొద్ది రోజులకే ఆమె ఈ చీరతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం విశేషం.

     

  • నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన భారతీయ యాత్రికుల్లోనూ పలువురి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన యాత్రికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే..

    ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పేరొందిన కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు భారత్‌తో పాటు నేపాల్‌, చైనా, అమెరికా, యూరప్‌ తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ యాత్రపై భక్తుల్లో ఉన్న విశ్వాసం అసాధారణం.

    శివుని నివాసంగా..
    హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస్‌ పర్వతం పరమశివుడి నివాసంగా భావిస్తారు. మంచుతో కప్పుకున్న ఈ పర్వతాన్ని భక్తులు కేవలం ఓ పర్వతంగా కాకుండా.. దైవ స్వరూపంగా దర్శిస్తారు. శివుడు, పార్వతీదేవి ఇక్కడ నివసిస్తారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కైలాస్‌ పర్వతం పక్కనే ఉన్న మానస సరోవర్‌ సరస్సు కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం.

    ప్రపంచంలోనే ప్రత్యేకమైన సరస్సు
    సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడతాయి. ఉదయం సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుందని యాత్రికులు చెబుతారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలిసే అరుదైన ప్రదేశంగా మానస సరోవర్‌కు గుర్తింపు ఉంది.

    ఎందుకు ఈ సమయంలోనే యాత్ర?
    కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు కూడా ఓ ప్రత్యేకమైన కాలం ఉంటుంది. సాధారణంగా మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఈ యాత్రకు అనుకూల సమయంగా భావిస్తారు. శీతాకాలంలో మంచు తీవ్రత పెరిగి పర్వత మార్గాలు మూసుకుపోవడంతో యాత్ర దాదాపు అసాధ్యంగా మారుతుంది. వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు మంచు కరుగుతుంది.. మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మలమైన వాతావరణంలో కైలాస్‌ పర్వత దర్శనం, మానస సరోవర్‌ అందాలను ఆస్వాదించేందుకు వేలాది మంది భక్తులు ఈ కాలంలోనే యాత్రకు బయల్దేరుతారు. అయితే హిమాలయ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అనుకూలమైన సీజన్‌లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి.

    కఠినమైన ప్రయాణం.. అయినా తగ్గని భక్తి
    మానస సరోవర్‌ యాత్ర సాధారణ ప్రయాణం కాదు. అత్యంత ఎత్తైన పర్వత మార్గాలు, తక్కువ ఆక్సిజన్‌, ప్రతికూల వాతావరణ పరిస్థితులు యాత్రికులకు సవాళ్లుగా నిలుస్తాయి. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నవారే ఈ యాత్రను పూర్తి చేయగలరు. భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక మార్గాల ద్వారా ఈ యాత్రను నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌ మార్గం, నేపాల్‌ మార్గాల ద్వారా యాత్రికులు టిబెట్‌లోని కైలాస్‌ ప్రాంతానికి చేరుకుంటారు.

    అనేక మతాలకు పవిత్ర స్థలం
    కైలాస్‌ పర్వతం కేవలం హిందువులకే కాదు.. జైనులు, బౌద్ధులు, టిబెటన్‌ సంప్రదాయాలను అనుసరించే వారికి కూడా పవిత్రమైన ప్రాంతం. జైన సంప్రదాయం ప్రకారం తొలి తీర్థంకరుడు రిషభదేవుడు ఈ ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్నారని విశ్వసిస్తారు. బౌద్ధులు కూడా కైలాస్‌ను పవిత్ర పర్వతంగా గౌరవిస్తారు.

    సైన్స్‌కు అర్థం కాని కైలాస రహస్యం..

    ప్రకృతి సవాళ్లు.. పెరుగుతున్న ఆందోళనలు
    ఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. ఆకస్మిక వర్షాలు, మంచు కరుగుదల, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు యాత్రికులకు ప్రమాదంగా మారుతున్నాయి. అయినప్పటికీ.. జీవితంలో ఒక్కసారైనా కైలాస్‌ మానస సరోవర్‌ను దర్శించాలనే ఆకాంక్షతో భక్తులు ఈ సాహస యాత్రను కొనసాగిస్తున్నారు.

    కైలాస్‌ మానస సరోవర్‌ యాత్ర కేవలం ఓ ప్రయాణం కాదు.. అది భక్తి, నమ్మకం, ప్రకృతి మధ్య జరిగే ఓ ఆధ్యాత్మిక అనుభవం. అందుకే ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ యాత్రకు ప్రత్యేక స్థానం కొనసాగుతోంది.