Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు.  

    “నేను అంత స్పీడ్‌గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు.  

    “గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు.  

  • ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్‌ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. 

    వీడియో వైరల్‌
    ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్‌కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్‌ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. 

    ఏదో ఒక రోజు కలుస్తా..
    చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.

    ఎంతో ప్రత్యేకం
    'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్‌గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్‌ డియర్‌ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో  ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్‌'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు.

     

  • చిన్నాపెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు సంపాదించుకున్నారు నర్రా వెంకటేశ్వరరావు. వెండితెరపైనే కాకుండా, రియల్‌ లైఫ్‌లోనూ ఠీవీగా ఉండే ఆయన జీవిత చరమాంకంలో మాత్రం  బిగుసుకుపోయాడు. చావును ముందే గ్రహించి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. 2009 డిసెంబర్‌ 27న క్యాన్సర్‌తో కన్నుమూశాడు.

    ఆలస్యంగా బయటపడ్డ క్యాన్సర్‌
    తాజాగా నటుడి ఫ్యామిలీ ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా నర్రా కూతురు వాసంతి ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నాన్నకు క్యాన్సర్‌ చాలా ఆలస్యంగా బయటపడింది. ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్‌ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ ఉందని తేలింది. అది కూడా చివరి స్టేజ్‌.. 

    25 కిలోలు తగ్గిన నటుడు
    కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడన్నారు. కీమోథెరపీ, సర్జరీలు చేయించడం వల్ల నాలుగేళ్లు బతికారు. క్యాన్సర్‌ వల్ల దాదాపు 25 కిలోలు తగ్గిపోయారు. కాకపోతే మొదటి సర్జరీ అయ్యాక పవిత్ర బంధం అని ఓ సీరియల్‌ చేశారు. ఇంట్లో ఉంటే ఏదో జబ్బుతో మంచానపడినట్లుందని పనితో బిజీ అయ్యారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంట్లో ఓపిక లేక షూటింగ్‌కు వెళ్లలేదు. 

    చివరి రోజుల్లో కంటతడి
    మనవళ్లతో ఎంజాయ్‌ చేయాలనుకున్న సమయంలో ఇలా ఆరోగ్యం దెబ్బతినేసరికి చాలా నిరాశపడ్డాడు. ఇంకేమైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? కనుక్కున్నారా? అని అడిగేవారు. మరోపక్క రేపు ఏదైనా జరిగినా నిన్ను పిల్లలు చూసుకుంటారు అని అమ్మకు ధైర్యం చెప్పేవారు. ఇక ఆయన చావుకు దగ్గరైనప్పుడు ఎంతో ఏడ్చారు. నాన్న చాలా ధైర్యవంతుడు, అలాంటి ఆయన్ను అలా చూడటం అదే మొదటి, ఆఖరిసారి! 

    సినిమా
    హీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా వల్లే నాన్న సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టేవాళ్లు. అలా ఎక్కువ ఆస్తులు సంపాదించాడు. కాగా నర్రా వెంకటేశ్వరరావు.. కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి వంటి పలు చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఎక్కువగా విలన్‌ తరహా పాత్రల్లో నటించాడు. దాదాపు మూడు దశాబ్దాల్లో 500కి పైగా సినిమాలు చేశాడు. 

    చదవండి: నాన్న ప్రతి ఆదివారం  అవే ఆర్డర్‌ పెడతాడు: నాగచైతన్య

  • టాలీవుడ్‌ హీరో నాగచైతన్య కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించాడు. ముఖ్యంగా జపనీస్‌ వంటకాలకు ఇది బాగా ఫేమస్‌. ఈ ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభం నుంచి విజయవంతంగా రన్‌ అవుతోంది. దాని గురించి తాజాగా చై మాట్లాడుతూ.. జపనీస్‌ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీస్‌ వంటకాలనే ఫస్ట్‌ ఆర్డర్‌ చేస్తాను. 

    రెస్టారెంట్‌ అనుకున్నాం
    ఆ వంటకాలను హైదరాబాద్‌కు తీసుకురావాలనిపించింది. నిజానికి ఏకంగా రెస్టారెంటే ప్రారంభించాలనుకున్నాను. కానీ, కరోనా వల్ల పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అప్పుడే క్లౌడ్‌ కిచెన్‌ ఆలోచన వచ్చింది. కస్టమర్లకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే ఆలోచన బాగుందనిపించింది. మా కిచెన్‌లో కొత్తగా ఏ వంటకం చేయాలన్నా ముందు ఇంట్లో టెస్ట్‌ చేయాల్సిందే!

    నాన్నకు పిజ్జా ఇష్టం
    ఇంట్లో వంటపై ప్రయోగాలు చేసినప్పుడు శోభిత దాన్ని టేస్ట్‌ చేసి ఎలా ఉందో చెప్తుంది. మెనూ తయారీలో తన సూచనలు ఉపయోగపడ్డాయి. నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు? నాకు పంపించు అని అడుగుతూ ఉంటారు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తుండగా బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు.

    చదవండి: 8 ఏళ్లుగా భరిస్తున్నా.. నావల్ల కాదు: రష్మిక మందన్నా

  • సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్‌ రిలీజ్‌ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో టీజర్‌ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. 

    రిచ్‌ కావాలంటే..
    ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. 

    సినిమా
    ఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

     

  • పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. తాజాగా ఈ మూవీ నుంచి కాలరే ఎత్తరా ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ పాటను సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు.
     

  • ‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు.  హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన  ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్‌, డి సురేష్‌ బాబు, బన్నీ వాస్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్‌కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్‌ పాత్ర ఐకానిక్‌గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్‌-2, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాలు ప్రదర్శించనున్నారు.
     

  • స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్‌పూర్‌లో తెలుగు హీరో విజయ్‌దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అన్నీభరించా..
    ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. 

    ఎంతదూరం వెళ్తారు?
    ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్‌ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్‌, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 

    24 గంటల్లో డిలీట్‌
    అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

    వివాదం ఏంటి?
    2016లో కిరిక్‌ పార్టీ మూవీ షూటింగ్‌లో రష్మిక, రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

     

     

  • ఇండస్ట్రీలో సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్‌ను బట్టే ఫలితం నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బడ్జెట్‌ పేపరుతో టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరం అవుతున్నారు. సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం వారంలోనే రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమకు నచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుతున్నారని  విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో  సీనియర్ నటి రాధిక శ‌ర‌త్ కుమార్ నటించిన  తాయి కిళ‌వై చిత్రం తక్కువ టికెట్‌ ధరలతోనే భారీ కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    తను నటించిన కొత్త సినిమా పదిరోజుల కలెక్షన్స్‌పై రాధికా శరత్‌కుమార్‌ ఇలా మాట్లాడారు.. ' రూ. 150 రూపాయల టికెట్ ధరతోనే మా సినిమా రూ. 60 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. స్టార్‌ హీరోల సినిమాలకు టికెట్ ధరలు రూ. 1500 నుంచి 2000  వరకు ఉంటున్న విషయం తెలసిందే. అయినప్పటికీ కలెక్షన్స్‌ పెద్దగా వచ్చిన దాఖలు లేదు. ఈ మూవీ కోసం బడ్జెట్‌ రూ. 9 కోట్లు మాత్రమే పెట్టారు.. బాక్సాఫీస్‌ లెక్కలు సరిగ్గా అంచనా వేసుకుంటే స్టార్‌ హీరోల కంటే మేము పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను చూస్తారు.' అని ఆమె చెప్పింది. అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని  తమ సినిమా చూపించిందని ఆమె గుర్తు చేశారు.

    రాధిక చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆలోచింపచేస్తున్నాయి. ఆమె మాట్లాడింది నిజమే కదా అంటూ పోస్టులు పెడుతున్నారు.  చాలా మంది స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్‌పై రాధిక ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్‌ ఇచ్చారని భావిస్తున్నారు. బారీ బడ్జెట్‌ సినిమాల పేరుతో టికెట్‌ ధరలు పెంచడంపై ప్రేక్షకులు అసంతృప్తితో వున్న విషయం తెలిసిందే.

    తమిళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా, ఒక హీరోయిన్ తాను తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటుగా లాభాల వాటాను  అందుకున్న నటిగా రాధికా రికార్డ్‌ క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విషయం ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంది. అన్ని పరిశ్రమలలో గేమ్-ఛేంజర్ అవుతుందని ఈ విషయంపై రాధికా అన్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు హీరోలకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేదని. తాజాగా తాయి కిళవి కొత్త ట్రెండ్‌కు తెరతీసిందని ఆమె అన్నారు. నిర్మాత శివకార్తికేయన్‌ను అభినందించాలని ఆమె కొనియాడారు.
     

  • చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది సీనియర్‌ నటి ముంతాజ్‌. ఖిలోనా, దో రాస్తే, ఆప్‌కీ కసమ్‌, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్‌ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

    హిందూ దేవుళ్లంటే ఇష్టం
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్‌ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.

    ఎందుకీ గొడవ?
    నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి ​కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.

    అది చాలా తప్పు
    భార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్‌ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్‌ నొక్కి చెప్పింది.

    చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్‌.. చెండాలమైన లిరిక్స్‌: నటి

  • సినిమాల్లో ఐటం సాంగ్స్‌ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్‌ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్‌ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్‌ అనగానే హీరోయిన్‌ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్‌ చేస్తున్నారు. 

    అవసరం లేకపోయినా..
    పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్‌ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్‌లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్‌ సాంగ్స్‌ను కావాలని ఇరికిస్తున్నారు.

    చిన్నపిల్లలు కూడా..
    ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్‌ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్‌ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్‌) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. 

    సినిమా
    ఎవరూ ఆ లిరిక్స్‌ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్‌లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్‌, అర్థ్‌, ఖాందార్‌, పార్‌, గాడ్‌ మదర్‌ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో మెరిసింది.

    చదవండి: పవన్‌ కల్యాణ్‌ డూప్‌గా హరీశ్‌ శంకర్‌? డైరెక్టర్‌ ఏమన్నారంటే?

  • విజయ్‌  నటిస్తున్న ‘జన నాయగన్‌’కు  సెన్సార్‌ చిక్కులు చిక్కులు తప్పడం లేదు. ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో వడ్డీల రూపంలో నిర్మాత వెంకట్‌ కె.నారాయణకు భారీ నష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు ఓటీటీ ఢీల్‌ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో చట్టపరమైన సమస్యలు రావడంతో ఈ సినిమా గత మూడు నెలలుగా ల్యాబ్‌కే పరిమితమైంది.

    జన నాయగన్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం సీబీఎఫ్‌సీ రివైజ్‌ కమిటీ మరోసారి సినిమా చూడాల్సి ఉంది. అయితే, ఈ కమిటీలో ఓ సభ్యుడి అనారోగ్య కారణంగా చివరి నిమిషంలో స్క్రీనింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసింది. ఇలా పలు కారణాలతో రివైజ్‌ కమిటీ దాటవేస్తుండటంతో వ్యాపారం పరంగా భారీ నష్టం తప్పడం లేదు. కనీసం ఎప్పుడు చూస్తారో కూడా వారు చెప్పకపోవడంతో విడుదలపై అనిశ్చిత నెలకొంది. దీంతో అమెజాన్‌తో కుదుర్చకున్న ఓటీటీ ఢీల్‌ రూ. 120 కోట్లు రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే,  ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

    విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో  జన నాయగన్‌ చివరి సినిమా అని ప్రకటించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.

  • మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్‌కి గ్యాప్‌ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్‌ దేవరకొండ పాటకు డ్యాన్స్‌ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక కలిసి డ్యాన్స్‌ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    సరదాగా ‘సంచారమే..’
    ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్‌ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

    నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్‌ చేస్తున్నారు.  ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. 

  • 'స్పిరిట్‌' అన్న పేరు వినిపిస్తే చాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్‌ స్పిరిట్‌ లుక్‌ అంటూ ఓ ఫోటో తెగ వైరలయింది. అందులో నటుడి ఫేస్‌ కనిపించకుండా వెనక నుంచి పిక్‌ తీశారు. దీంతో ఆయన ప్రభాస్‌ అని చాలామంది భావించారు.

    ఫోటో వైరల్‌
    కానీ ఆయన డార్లింగ్‌ ప్రభాస్‌ కాదని, ఆ ఫోటో తనది అంటున్నాడు నటుడు శివ గణేశ్‌. ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన శివ గణేశ్‌ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో వెనక నుంచి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది కాస్తా ప్రభాస్‌ ఫోటో అని వైరల్‌ అయింది.

    ఎందుకు వైరల్‌ అయిందో..
    దీనిపై శివ గణేశ్‌ స్పందిస్తూ.. నేను చేస్తున్న సినిమాలోని మేకింగ్‌ ఫోటో అది. మా డైరెక్టర్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌. అలా అని నన్ను ప్రభాస్‌లా చూపించాలనుకోలేదు. కానీ, అది అనుకోకుండా కుదిరింది. మూడురోజుల క్రితం నా ఫ్రెండ్‌ ఒకడు మెసేజ్‌ చేశాడు. ఇది ప్రభాస్‌ ఫోటో అని ట్విటర్‌లో వైరలవుతోంది, నువ్వే కదా? అని అడిగాడు. నేనే అని బదులిచ్చాను. కానీ, ప్రభాస్‌ ఫోటో అని ఎందుకు వైరల్‌ చేస్తున్నారో అర్థం కాలేదు.

    సినిమా
    నేను భీమవరంలో పుట్టిపెరిగాను. ప్రభాస్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నన్ను పోల్చినందుకు సంతోషంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2, ఖుషి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసినప్పటికీ ఎడిటింగ్‌లో తీసేశారు. ప్రస్తుతం ఇతడు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటిస్తున్నాడు.

  • రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మణికందన్.. కాకా ముట్టై, కడైసి వివసాయి వంటి సినిమాలతో జాతీయ అవార్డ్స్‌ అందుకున్న ఆయన ‘కాట్టాన్’ (ముత్తు అలియాస్ కాట్టాన్) అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించారు. మార్చి 27న జియోహాట్‌స్టార్‌లో విడుదల కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో హీరోగా విజయ్‌ సేతుపతి నటిస్తున్నడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    జియో హాట్‌స్టార్(JioHotstar) స్పెషల్ సిరీస్‌గా మార్చి 27, 2026న కాట్టాన్‌  (Kaattaan) ప్రీమియర్ అవుతుందని  అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ సేతుపతి తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.., రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి - మణికందన్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఆండవన్ కట్టలై, కడైసి వివసాయి వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు వచ్చాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాయి. తాజాగా వీరి కాంబినేషన్‌లో వెబ్‌ సిరీస్‌ రానున్నడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ వెబ్‌ సిరీస్‌ రా అండ్ రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో విజయ్‌ సేతుపతి పాత్ర గతంలో ఎన్నడూ చూడని  అత్యంత ఉగ్ర రూపంలో కనిపిస్తారని టాక్‌. ఇందులో హింస తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

  • హైదరాబాద్‌లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్ స్టూడియోస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సౌత్‌ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది.  30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.

    సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్‌ఆర్‌ఆర్‌ ,అరుంధతి  వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్‌పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా కల నిజం కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌  ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..

    ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..
    నెట్‌ఫ్లిక్స్‌ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో  పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు.

  • పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్‌పై స్పందించారు.

    పవన్‌ కాదు.. డూప్‌
    గబ్బర్‌ సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌, పవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్‌ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్‌ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్‌ పోస్టర్‌ని వదిలారు. అందులో పవన్‌ కల్యాణ్‌ ఖాకీ డ్రెస్‌లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్‌ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్‌ కల్యాణ్‌ కాదంటూ రూమర్స్‌ వచ్చాయి.  హరీశ్ శంకరే పవన్‌కు డూప్‌గా నటించారనే వార్తలు  వైరల్‌ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్‌గా నటించారని అన్నారు.

    బాధ ​కాదు.. హ్యాపీగా ఫీలయ్యా.. 
    ఈ రూమర్స్‌పై తాజాగా హరీశ్‌ శంకర్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్‌కు డూప్‌గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్‌ రిలీజ్‌ సమయంలో వచ్చిన రూమర్స్‌ చూసి బాధ పడలేదని, పవన్‌తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్‌ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్‌ని వాడతారని చెప్పారు. ఉస్తాద్‌ విషయానికొస్తే..హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

  • 'ధురంధర్‌-2' నుంచి పవర్‌ఫుల్‌ సాంగ్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా 'ధురంధర్‌: ది రెవెంజ్‌ ఆరి ఆరి..' సాంగ్‌ను షేర్‌ చేశారు. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
     

Andhra Pradesh

  • నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రం సమీపంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. పవిత్ర క్షేత్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవిలో మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అడవి సంపదతో పాటు వన్యప్రాణుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది.

    స్థానికుల సమాచారం ప్రకారం.. అడవిలోకి ఎండుకర్రల కోసం వెళ్లిన కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగిన బీడీలను ఆర్పకుండా అడవిలో పడేయడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

    ఎండ గాలులు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అడవిలో నివసించే జంతువులు తీవ్ర ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది.
     

  • ఏలూరు: జిల్లాలోని కైకలూరు కేంద్రంగా పసిబిడ్డలను విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. పసిబిడ్డలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు అకేటి మోక్షిత అదృశ్యమయ్యాడు.  గత 13 రోజుల నుంచి మోక్షిత్‌ ఆచూకీ కనిపించడం లేదు. 

    ఇంటిముందు ఆడుకుంటున్న మోక్షిత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 

    దీనిపై జనసేన నేత ఏఎన్‌ బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను విక్రయిస్తున్నడని ఏఎన్‌ బాబుపై ఆరోపణులు వస్తున్నాయి. దాంతో ఏఎన్‌ బాబు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏఎన్‌ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు. అయితే ఏఎన్‌ బాబు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

  • శ్రీకాకుళం:   గురజాడ గాయత్రి కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. పలువురి విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్‌ చేసిన ఘటన వెలుగుచూసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా పలువురి విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్‌కు పాల్పడ్డారు అక్కడే చదవుతున్న పలువురు విద్యార్థులు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజ్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. తమ కుమార్తెల ఫోటోలను  ఇలా మార్ఫింగ్‌ చేసి బయటకు అమ్మేశారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

    అయితే ఈ ఘటనకు పాల్పడిన సదరు విద్యార్థులను టీసీలిచ్చి పంపించేశామని యాజమాన్యం అంటోంది. దీనిపై కాలేజ్ ప్రిన్సిపాల్‌ కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ ఏఐ ద్వారా నిందితులు ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఫోటోలు మార్ఫింగ్‌కు సంబంధించి విద్యార్థిని తల్లిదండ్రుల కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే మాట్రిక్ పాల్పడిన ఐదుగురు విద్యార్థులకు టిసిలు ఇచ్చి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.  వారిని గుర్తించి టీసీలిచ్చి పంపించేశాం’ అని పేర్కొన్నారు.

  • విజయవాడ: ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతాన‌ని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జ‌డ శ్రావ‌ణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వాధినేత‌ల తీరుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను పప్పుబెల్లాల్ల అమ్మేస్తున్నార‌ని, ఇది అన్యాయ‌మ‌ని ప్ర‌శ్నించిన త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని వాపోయారు. 

    త‌మ బినామీల‌కు ప్ర‌భుత్వ భూముల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అవినీతిలో అతిపెద్ద భాగ‌స్వామి ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటూ ధ్వ‌జ‌మెత్తారు. మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన కూట‌మి నేత‌ల‌కు చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌ని శ్రావ‌ణ్‌కుమార్ నిల‌దీశారు.

    అలా చేయ‌క‌పోతే న్యాయ‌వాద వృత్తిని వదిలేస్తా
    చంద్రబాబు తన పై ఉన్న చాలా కేసులను కొట్టేయించుకుంటున్నారు. నేను చంద్రబాబు కేసులపై పోరాటం చేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు నేను మాటిస్తున్నా. చంద్రబాబు పై ఉన్న ప్రతీ కేసునూ రీ ఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను చంద్రబాబు కేసులను రీ ఓపెన్ చేయించలేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా. చంద్రబాబు తనపై ఉన్న నాలుగు కేసుల్లోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే. న్యాయస్థానాల్లో మ్యానేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. 2029లో నైనా ప్రతీ కేసును రీ ఓపెన్ చేయిస్తాన‌ని శ్రావ‌ణ్ కుమార్ అన్నారు. 

  • విజయనగరం జిల్లా: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఏమైందో తెలియదు.. ఎక్కడకు వెళ్లిందో అర్థంకావడం లేదు.. ఏ పరిస్థితుల్లో ఉందో ఆందోళనగా ఉంది.. అమ్మేశారేమోనని అనుమానంగా ఉంది.. మా కూతురును వెతికిపెట్టండి సారూ.. అంటూ 22 రోజులుగా చీపురుపల్లి పోలీస్‌ స్టేషన్‌ చుట్టు తిరుతున్నా పట్టించుకునే పాపాన పోవడం లేదు. 

    మా కూతురు కనిపించడం లేదని పుట్టెడు దుఃఖంలోఉంటే సీఐ, ఎస్‌ఐలు నిర్లక్ష్యంగా.. చులకనగా తమతో మాట్లాడుతున్నారంటూ అమాయకులైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  గొల్లలములగాం గ్రామానికి చెందిన పిసిని బాలాజీ తన భార్యతో కలిసి బుధవారం సాయంత్రం మీడియా ముందు తమ గోడు వినిపిస్తూ కన్నీరుపెట్టారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న బాలిక ఫిబ్రవరి 19న ఇంటి నుంచి వెళ్లి తిరిగి చేరుకోలేదన్నారు. 

    అదే రోజు  చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశామని చెప్పారు. తమ గ్రామానికి చెందిన మైలపల్లి అమ్మాజీ తమ బిడ్డను ఏదో చేసి ఉంటాడని పోలీసులకు చెప్పినప్పటికీ ఆ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి ఎందుకు విచారించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక... తల్లిదండ్రులకు ఓ లేఖ రాసి విడిచి వెళ్లింది. అందులో ‘సారీ నాన్న’ అంటూ రాసి ఉన్న లేఖ కలకలం సృష్టిస్తోంది.  

International

  • ఇరాన్‌ నిరోధక సామర్థ్యాన్ని ప్రపంచం ఇప్పటివరకు కేవలం కొంత భాగమే చూసిందని మాజీ సైనిక గూఢచారి విభాగ అధికారి మొహమ్మద్ హసన్ నామీ వ్యాఖ్యానించారు. ఆయన గతంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్మీలో గూఢచారి విభాగానికి ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

    ప్రాంతవ్యాప్తంగా అమెరికాకు చెందిన ఉగ్రవాద స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని చెప్పారు.

    ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడులతో శత్రు దేశాల సైనిక మౌలిక సదుపాయాలు వారి వ్యూహాత్మక లోతుల్లోనే ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న ఈ ఘటనలు ఇరాన్‌ నిరోధక శక్తిలో కేవలం ఒక భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.

    ఈ తీవ్రమైన ప్రతిస్పందన ఫలితంగా శత్రు స్థావరాల శిథిలాల నుంచి మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన సైబర్ విభాగం ప్రచారం చేసినట్లు సమాచారం.

  • టెహ్రాన్‌: యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తాబా ఖమేనీ మొట్టమొదటిసారి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగించాలని తమ అధికారులకు చెప్పారు. గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

    మొజ్తాబా ఖమేనీ నియామకం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మొట్టమొదటి ప్రకటనను ఆ దేశ టెలివిజన్‌లో గురువారం చదివారు. ఖమెనీ కెమెరా ముందు కనిపించలేదు. యుద్ధం ప్రారంభంలో ఆయన గాయపడ్డారని ఇజ్రాయెల్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా గల్ఫ్, అరబ్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.

    మరోవైపు, ఇవాళ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి జరిగింది. దీనిపై కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన చేసింది.  భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించిందని చెప్పింది. పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను అధికారులు పరిష్కరించారని చెప‍్పింది.

    అలాగే, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్‌ యత్నించింది. విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటోంది. దీంతో ఇరాక్‌ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసినట్లు ప్రకటించింది. 

    చమురు ధరలపై ఇవాళ ఉదయం ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 

  • అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ప్‌ ప్రాంతం కూడా తీవ్ర దాడులతో దద్దరిల్లుతోంది.  దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో  డ్రోన్‌  ఒకటి క్రాష్‌  అయిన ఘటన కలకలం రేపింది. 

    గల్ఫ్‌లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుండటంతో  13వ రోజు  దుబాయ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ క్రీక్ హార్బర్ సమీపంలోని భవనంపై డ్రోన్ పడిందని, స్వల్ప మంటలు చెలరేగాయని అధికారులు నిర్ధారించారు. అయితే దీనిని త్వరగా అదుపులోకి తేవడంతో  ప్రమాదం తప్పింది.  దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకారం, ఒక చిన్న డ్రోన్ కూలిన ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు గురువారం  ప్రకటించారు.  

    (ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్‌)

    సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత బృందాలు  వేగంగా స్పందించి మంటల్ని అదుపు చేశాయి. భవనంలోని నివాసితులకు ఎలాంటి ముప్పూ లేదన్నారు.

    (చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి)
     

  • అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే ప్రపంచంలోని మరో కీలక సముద్ర మార్గాన్ని కూడా నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి దాదాపు మూసుకుపోయిన పరిస్థితుల్లో… ఇప్పుడు బాబ్ ఎల్-మందెబ్ జలసంధి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇరాన్ సీనియర్ సైనిక అధికారి హెచ్చరించారు. ఇలా జరిగితే ప్రపంచ ఇంధన సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.

    అమెరికా తప్పు చేస్తే అంతే..
    అల్‌జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇరాన్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వ్యూహాత్మక తప్పు చేస్తే బాబ్ ఎల్-మందెబ్ జలసంధి పరిస్థితి కూడా హోర్ముజ్ లాగే మారవచ్చని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఈ ప్రాంతం పెద్ద ప్రాంతీయ యుద్ధంలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా అన్నారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. సాధారణంగా రోజుకు సగటున 138 నౌకలు వెళ్లే ఈ మార్గంలో… ఒక రోజులో కేవలం రెండు నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు సమాచారం.

    ప్రపంచ వ్యాపారానికి కీలకం
    ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మరింత కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు చెందిన నౌకలు వస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది. ఇప్పుడీ ఉద్రిక్తత బాబ్ ఎల్-మందెబ్ జలసంధి వరకు విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యెమెన్-జిబౌటి మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం వెడల్పు కేవలం 26 కిలోమీటర్లు మాత్రమే.

    కానీ ప్రపంచ వ్యాపారానికి ఇది అత్యంత కీలకం. ప్రతి సంవత్సరం దాదాపు 20 వేల నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. రోజుకు సుమారు 6.2 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ జలసంధి మూసుకుపోతే పర్షియన్ గల్ఫ్ నుంచి యూరప్‌కు వెళ్లే అత్యంత చిన్న సముద్ర మార్గం పూర్తిగా నిలిచిపోతుంది. అప్పుడు నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగం చుట్టూ ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో రెండు వారాల ఆలస్యం మరియు భారీ అదనపు ఖర్చు ఏర్పడుతుంది.

    బాబ్ ఎల్-మందెబ్ మార్గమే దిక్కు
    ప్రస్తుతం హోర్ముజ్ మార్గం దాదాపు నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాలు బాబ్ ఎల్-మందెబ్ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. ఈ మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న యెమెన్ హౌతి దళాలు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలవు. 2023 నుంచి ఇప్పటివరకు రెడ్ సీ ప్రాంతంలో వందకు పైగా నౌకలపై దాడులు జరిగాయి. 

    అయితే ఇప్పటివరకు ఈ యుద్ధంలో హౌతీలు పూర్తిగా రంగంలోకి దిగలేదు. కానీ అవసరమైతే ఎప్పుడైనా చర్యలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్‌తో పాటు బాబ్ ఎల్-మందెబ్ కూడా మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా గొలుసు పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి… మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపే పరిస్థితి కనిపిస్తోంది. -వెబ్‌డెస్క్‌
     

  • టెహ్రాన్ : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, జీ-7 దేశాలు ప్రత్యేక సమావేశం జరిపి అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన చమురు నిల్వలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలు చమురు ధరలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.

    మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెట్‌లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ అత్యవసర నిల్వల నుండి 4 మిలియన్ల బ్యారెళ్ల చమురును మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురావాలని  32 సభ్య దేశాలు నేడు ఏకగ్రీవంగా నిర్ణయుంచినట్లు సమాచారం.

    EA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్  మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా  తీవ్రమైన చమురు సంక్షోభం ఉందని కనుకటి IEA సభ్య దేశాలు తక్షణమే స్పందించి అధిక మెుత్తంతో చమురు నిల్వలువిడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. అయితే  మరోవైపు ఇరాన్ చమరు ధరల పెరుగుదలపై ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చింది.

    " బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు చెల్లించడానికి ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలి. 1970 తర్వాత ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి (IEA) పెద్ద మెుత్తంలో చమురు నిల్వలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని తెలిపింది. ప్రస్తుతం చమురు బ్యారెల్ ధర 90 -110 డాలర్లుగా ఉంది. అదే విధంగా హర్మూజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతులిచ్చేది లేదని ఒక వేళ తమని కాదని వెళితే నౌకలను పేల్చివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మూడుకు పైగా నౌకలను పేల్చివేసింది.

    కాగా ఇంత సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్‌ వెళ్లే నౌకలకు ఇరాన్ అనుమతిచ్చింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జరిపిన చర్చలు ఫలించి భారత నౌకలకు హార్మూజ్ జలసంధిలో రవాణాకు పచ్చ జెండా ఊపింది.. కాగా పశ్చిమాసియా యుద్దం ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకూ 2వేలకు పైగా ప్రజలు మృతిచెందారు. అయితే అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు తగ్గకపోవడంతో యుద్దం ఇంకా కొనసాగుతోంది.

  • ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు సముద్రపు మందుపాతరలు కీలకపాత్ర పోషించబోతున్నాయా? అమెరికా నౌకాదళం కోసం ఇరాన్ సముద్రంలో మైన్లు అమర్చిందా? హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ఈ నయా బాంబులపైనే ఆధారపడిందా? అందుకే ట్రంప్ ఇప్పుడు సముద్రపు మందుపాతరల గురించి మాట్లాడుతున్నారా?

    అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద 5,000 నుంచి 6,000 వరకు నౌకాదళ మైన్లు ఉన్నాయని ఈ రిపోర్ట్ బాంబు పేల్చింది. అవసరమైతే ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని ఆ నివేదిక చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడానికి ఇరాన్‌ క్షిపణుల కంటే నౌకాదళ మైన్లపైనే ఎక్కువగా ఆధారపడిందని తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి చాలా తక్కువ లోతుతో ఉండటంతో పాటు, అక్కడి నౌకాయాన మార్గాల వెడల్పు 2 మైళ్లు మాత్రమే. దీంతో ఈ మార్గంలో మందుపాతరలు అమరిస్తే.. నౌకల రాకపోకలు సులభంగా నిలిచిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

    మూడు రకాల సముద్రపు మందుపాతరలు
    అమెరికన్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం… ఇరాన్ వద్ద ప్రముఖంగా మూడు రకాల సముద్రపు మందుపాతరలు ఉన్నాయి. ఇందులో లింపెట్ మైన్లు ముఖ్యమైనవి. వీటిని నౌకల గోడలకు అతికిస్తారు. టైమర్ సెట్ చేస్తే ఇవి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక సముద్రంలో తేలియాడుతూ… నౌకలు తాకగానే పేలపోయే మూర్డ్‌ మైన్లు మరింతప్రమాదకరమైనవి. ఇవిఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి అంతకంటే చాలా చవకైనవి.

    ఇక నీటి అడుగు భాగంలో ఉండి… నౌక వీటిపైనుంచి వెళ్లగానే సెన్సార్‌ల సహాయంతో పేలిపోయేవి బాటమ్‌ మైన్లు. ఇవి శబ్దం, ఒత్తిడితో పాటు అయస్కాంతం తరంగాలను పసిగట్టి వెంటనే పేలిపోతుంది. వీటిని ఎలాంటి రాడార్‌లు పసిగట్టలేవు. వీటితో పాటు అత్యంత ప్రమాదకరమైన కొన్ని మైన్లు నౌక కింద నుంచి రాకెట్ వార్‌హెడ్‌ను పైకి కాల్చి నౌక బాడీని దెబ్బతీయగలవు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మూడు రకాల మైన్లతో హోర్ముజ్‌ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఇరాన్ యోచిస్తోంది.

    హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్లు
    ఈ మైన్లు చౌకగా తయారవుతాయి, గుర్తించడం చాలా కష్టం, తొలగించడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కీలక మార్గాల్లో కేవలం కొన్ని వందల మైన్లు వేస్తేనే ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురు రవాణాలో 20 నుంచి 30 శాతం వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొంతమేర మైన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడి చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అందువల్ల హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గంగా భావిస్తున్నారు.

    చ‌ద‌వండి: భార‌త జెండాల‌తో ఉన్న నౌక‌లకు ఇరాన్ అనుమ‌తి

    ఇక ఈ పరిస్థితిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు వేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందే అని హెచ్చరించారు.

     

  • టెహ్రాన్‌: హర్మూజ్ జలసంధి పరిధిని దాటి దాడులకు ఇరాన్ సిద్ధమైంది. సముద్రంలో నౌకలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను నేవల్‌ మైన్స్‌తో (సముద్రపు మందుపాతరలు)  పేల్చివేసింది. అమెరికాకు చెందిన ‘సేఫ్ సీ విష్ణు’ అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. 

    అయితే.. ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్‌ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే భారత్‌కు చెందిన ఓ నౌకపై హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే..! 

     

Telangana

  • హైదరాబాద్‌: 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో ఈ లక్ష్యసాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మొదట హోంశాఖ తదుపరి మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుతో కలిసి పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు వస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కీలకం అన్నారు. ఈ అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని, ప్రతి కదలిక మీ కను సన్నల్లో ఉండాలని సూచించారు. 

    విధుల నిర్వహణ క్రమంలో హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలో మేటి నగరంగా ఎదుగుతున్న క్రమంలో వేగంగా పలు సంస్కరణలు చేపడుతున్నామని ఇందులో భాగంగాపోలీస్ శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల (EV )వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర గణనీయంగా ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని చిన్న కదలికను సైతం వేను వెంటనే గుర్తించి నిఘాను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 

    2047 త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా లక్ష సాధనలో పబ్లిక్, ప్రైవేట్ (PP )మోడల్ అనివార్యమని ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని పరిశ్రమల శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

    CURE, PURE తో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి RARE (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) సమ ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. RARE రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.  మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్ (MSME)లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. ఎంఎస్‌ఈల ద్వారా రాష్ట్ర నలుమూలలోని యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి తో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్న రంగం  ఎంఎస్‌ఈ అని తెలిపారు. 

    41 జీసీసీలతో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఇదే వేగాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు అన్నారు. డాటా సెంటర్లలో AI  వినియోగాన్నిపెద్ద ఎత్తున చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  సీవీ ఆనంద్‌, TGIICC MD శశాంక, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

  • సూర్యాపేట: ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే సదరు గ్యాస్‌ ఏజెన్సీల డీలర్‌షిప్‌లు రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై మీడియాతో మాట్లాడారు ఉత్తమ్‌,.  ‘ గ్యాస్  కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. 

    కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయిల్ కంపెనీలకు రెఫరెన్స్ చేసి సామాన్య జన జీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ  గ్యాస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.  ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఎల్పీజీ డీలర్లు సామాజిక సామాన్య ప్రజానికం వద్ద అక్రమాలకు బ్లాక్ మార్కెట్‌లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని డీలర్ షిప్ రద్దు చేస్తాం’ అని వార్నింగ్‌ ఇచ్చారు.  

  • సాక్షి, నిజామాబాద్‌: ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణంగా రహదారులపై నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డవారి వాహనాలను ఆ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉంచుతారు. అలా పోలీసులు సీజ్‌ చేసి అక్కడ ఉంచిన బైక్‌లు, ఆటోలు, కార్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పోలీస్ స్టేషన్‌ పరిసరాల్లో చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకుంది.

    ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగితే అవకాశాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తుంటారు. అటువంటిది పోలీస్‌ స్టేషన్‌లోనే అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. 


     

  • హైదరాబాద్‌: మన దేశంలో కిడ్నీ వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది జబ్బు ముదిరేంత వరకు గుర్తించడమే లేదు. చిన్న వయస్సు నుంచే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ కిడ్నీ డే’ గా జరుపుకుంటున్నారు. 

    ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను సంబంధిత విభాగాల డాక్టర్లు వివరించారు.  

    ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్ డాక్టర్ ఎ.సంతోష్‌ కుమార్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. ‘కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తే.. ముందుగా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గాబరా పడి బీపీ. షుగర్లు పెంచుకుని వ్యాధులను ముదరనివ్వొద్దు. ఇలా వ్యవహరిస్తే సగం వరకు వ్యాధులను నయం చేయవచ్చు. కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే ఇక జీవితం అయిపోయినట్లుగా భావించొద్దు. అధునాతన చికిత్సల ద్వారా డయాలసిస్, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో విజయవంతంగా జీవితాన్ని గడపవచ్చు’ అని సూచించారు.  

    కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్‌ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొదటి, సులభమైన మార్గం సరైన హైడ్రేషన్. అది సరిగా లేకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. రోజుకు కనీసం 2, 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది. మంచి అలవాట్లు కిడ్నీలను దీర్ఘకాలం కాపాడుతాయి’ అని పేర్కొన్నారు. 
     

  • హైదరబాద్‌: గ్యాస్‌ కొరత కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్‌ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.  గ్యాస్‌ కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  

    ప్రధానంగా గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌ కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతోందని,  ఈ బ్లాక్‌ మార్కెట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్‌.  ఈ మేరకు సిలిండర్ల తీవ్ర కొరతను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. 

    ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై పారదర్శక సమాచారాన్ని అందించడానికి రియల్-టైమ్ పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను రూపొందించాలని ఆయన సిఫార్సు చేశారు  చిన్న వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై తాత్కాలిక ధరను నిర్ణయించి దానిని అమలు చేయాలన్నారు. 

  • హైదరాబాద్‌: తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. 

    ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. మధ్యాహ్న భోజనం సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు పెడతారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆ క్లాసుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. 

    పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు.. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని రోజుల్లో పరీక్షా ఆ స్కూళ్లు కూడా యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు పనిచేయాలి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOs) డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. 
     

  • వికారాబాద్: వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించగా.. ఆమెను చంపి, దూలానికి వేళాడదీశారని మృతురాలి భర్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి కుప్పగిరి గ్రామానికి చెందిన మదరప్ప, అశోక్‌ కుటుంబ సభ్యులకు నాలుగు రోజుల క్రితం భూ విషయంలో పంచాయితీ జరిగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకొని, ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం రాసుకున్నారు. 

    మారుమారు దాడి.. 
    అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూ విషయంలో మంగళవారం ఉదయం మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్‌ భార్య కృష్ణవేణి(31)పై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి, గాయపర్చారు. కాగా.. అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన సదరు మహిళ.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి, ఇలా ఉరి వేశారని మృతిరాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. 

    పరిసరాలను పరిశీలించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజుకుమార్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను  విరమింపజేశారు. మృతురాలి భర్త అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

Business

  • వేసవి కాలం దగ్గరపడుతున్న సమయంలో.. ప్రముఖ స్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో మోటోరోలా ఎయిర్ కండిషనర్ల కొత్త శ్రేణిని విడుదల చేసింది. ఈ ACలు వినియోగదారులకు సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. ఈ కొత్త శ్రేణి ధరలు సుమారు రూ.28,990 నుంచి ప్రారంభమవుతాయి.

    సాధారణంగా ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసిన తర్వాత ఇన్‌స్టాలేషన్ ఫీజులు, కాపర్ పైపింగ్, అవుట్‌డోర్ యూనిట్ స్టాండ్ వంటి అదనపు ఖర్చులు వస్తాయి. కానీ మోటోరోలా ఏసీలలో ఈ ఖర్చులన్నీ ముందుగానే ధరలో చేర్చారు. అందువల్ల వినియోగదారులకు కొనుగోలు తరువాత అదనపు ఖర్చులు ఉండవు. అంతే కాకుండా.. అదనంగా మూడు సంవత్సరాల పాటు గ్యాస్ రీఫిల్ కూడా లభిస్తుంది.

    ఈ ఎయిర్ కండిషనర్లు ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్‌తో రూపొందించారు. ఇవి భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

  • పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో గిఫ్ట్‌ సిటీ తొలి పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభంకానుంది. ఎగ్జిక్యూటివ్‌ లెర్నింగ్ సొల్యూషన్ల కంపెనీ ఎక్స్‌ఈడీ ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఐపీవో నిజానికి ఈ నెల 6న ప్రారంభంకావలసి ఉంది. అయితే యుద్ధ అనిశ్చితుల కారణంగా తేదీలో మార్పు చేసింది.

    ఐఎఫ్‌ఎస్‌సీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటైన దేశీ ఐఎఫ్‌ఎస్‌సీ నుంచి తొలిసారి ఐపీవోకు వస్తున్న కంపెనీ 1.2 కోట్ల డాలర్ల సమీకరణపై కన్నేసింది. ఇందుకు షేరుకి 10–10.5 డాలర్ల ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ముగియనుంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)సహా.. ఎన్‌ఆర్‌ఐలు తదితర అనుమతించిన ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.

    ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు లక్ష్యంగా ఈ షేర్లు డాలర్ల రూపేణా ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ ఎక్స్చేంజ్‍, ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్చేంజ్‍(గిఫ్ట్‌ సిటీ)లో లిస్ట్‌ కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సీనియర్‌ వృత్తి నిపుణులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ సరీ్వసులు అందిస్తోంది. భారత్‌సహా.. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు విస్తరించింది.

  • భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్‌లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.

    ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.

    నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్‌పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్‌లో ఎల్‌పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.

    14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.

    కొత్త ధరలు

    ఢిల్లీ
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913
    కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50

    ముంబై
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50
    కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836

    కోల్‌కతా
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00
    కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50

    చెన్నై
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50
    కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50

    హైదరాబాద్‌
    డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00
    కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50

    వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0

  • ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్ తన 2030 వృద్ధి వ్యూహంలో భాగంగా.. భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ తయారీ & ఎగుమతి కేంద్రంగా ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే EVలు, హైబ్రిడ్‌ల వాహనాలతో సహా స్థానికంగా అభివృద్ధి చేసిన నాలుగు కొత్త మోడళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది.

    రెనాల్ట్ 2025లో యూరప్ వెలుపల మార్కెట్లలో 6,20,000 వాహనాలను విక్రయించింది, ఇది మునుపటి సంవత్సరం కంటే 11 శాతం ఎక్కువ. ఇప్పుడు దాని ఐదు ప్రపంచ కేంద్రాలను (మొరాకో, టర్కియే, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా, భారతదేశం) మరింత విస్తరించడానికి కావలసిన పెట్టుబడులు పెడుతోంది.

    భారతదేశం నిస్సాన్ సహా పూర్తి శ్రేణి మోడళ్లను తయారు చేయడం ద్వారా.. స్థానిక & ప్రపంచ మార్కెట్లకు సేవలందించే కీలకమైన ఉత్పత్తి మరియు సరఫరా కేంద్రంగా మారుతుందని రెనాల్ట్ వెల్లడించింది. SUVలకు, ఈవీలకు పెరుగుతున్న బలమైన డిమాండ్ భారతదేశాన్ని ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా చేయనుందని పేర్కొంది.

    2030 నాటికి భారతదేశంలో కంపెనీ ప్రతిపాదించిన నాలుగు కొత్త మోడళ్లు, పూర్తిగా ఎలక్ట్రిక్ & పూర్తి-హైబ్రిడ్ వాహనాలు సహా, భారతీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా అనేక ఎగుమతి మార్కెట్లకు కూడా ఉపయోగపడతాయని రెనాల్ట్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా కంపెనీ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లకు పైగా వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

  • యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

    ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా  మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.

    పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

  • దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    హెచ్‌సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.

    అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

  • వాణిజ్య వాహన తయారీ హిందుజా గ్రూప్‌ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ తాజాగా గ్రీన్‌ఫీల్డ్‌ బ్యాటరీ ప్యాక్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకు చెన్నై సమీపంలో తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

    వెరసి కొత్త బ్యాటరీ ప్యాక్‌ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వీలుగా పిళ్లైపక్కం(చెన్నై)లో భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై రూ. 400–500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 2025 సెప్టెంబర్‌లోనే హిందుజా గ్రూప్‌ పెట్టుబడులలో భాగంగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

    ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రయాణంలో ఇది కీలక ముందడుగుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీయంగా పటిష్ట ఈవీ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో తమ కట్టుబాటుకు మరింత మద్దతివ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఈవీ బ్యాటరీ ప్యాక్‌ ఉత్పత్తికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు.

  • గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.

    ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా వస్తాయి. ముఖ్యంగా S&P 500 వంటి పెద్ద మార్కెట్ సూచీలు పడిపోయినప్పుడు (మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు) చాలా మంది పెట్టుబడిదారులు డబ్బు కోల్పోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో మీరు డబ్బు కోల్పోయారా? లేక డబ్బు సంపాదించారా? అని ప్రశ్నించారు.

    మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోవడం సాధారణం. అయితే కొందరు పెట్టుబడిదారులు మాత్రం సరైన వ్యూహాలు, మంచి జ్ఞానం & అనుభవం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాభాలు పొందగలుగుతారు. అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సరైన నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవడం లేదా కొన్నిసార్లు లాభాలు కూడా పొందటం సాధ్యమే.

    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మార్కెట్‌లో నష్టపోతే, అది కేవలం మార్కెట్ కారణంగా మాత్రమే కాదు. మనం నేర్చుకున్న విధానం, మనకు మార్గదర్శనం చేసిన వ్యక్తులు లేదా గురువులు కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో నేను అనుసరిస్తున్న గురువు లేదా నేర్చుకుంటున్న విధానం సరైనదేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

    ఇప్పుడు కూడా చాలా మంది పెట్టుబడిదారులు యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫైనాన్స్ & స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నారు. అక్కడ అనేక మంది ఫైనాన్స్ నిపుణులు, ట్రేడింగ్ గురువులు తమ అనుభవాలను & సూచనలను పంచుకుంటారు. కానీ అందరూ నిజంగా విజయవంతమైన పెట్టుబడిదారులే అని అనుకోవడం సరైంది కాదు. కొందరు ప్రసిద్ధ యూట్యూబర్లు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద నష్టాలు చవిచూసి ఉండవచ్చు.

    అలాగే కొందరు తమ లాభాలను గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నిజమైన పెట్టుబడి విద్య అంటే కేవలం లాభాలను చూపించడం కాదు. మార్కెట్ ప్రమాదాలను అర్థం చేసుకోవడం, నష్టాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బు కోల్పోయినట్లయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది ఒక పాఠంగా తీసుకుని, మీ పెట్టుబడి పద్ధతిని తిరిగి పరిశీలించాలి. అవసరమైతే మంచి గురువులను, విశ్వసనీయమైన విద్యను ఎంపిక చేసుకోవాలి.

    మొత్తానికి, మార్కెట్ క్రాష్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సరైన జ్ఞానం, సరైన మార్గదర్శనం ఉంటేనే పెట్టుబడుల్లో దీర్ఘకాల విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించడం చాలా అవసరం. మార్కెట్‌లో నష్టాలు కూడా ఒక గురువు లాంటివే.. ఎందుకంటే అవి మనకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తాయి.

  • జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన ఉత్పత్తుల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఏ మోడల్ ధర ఎంత అనేది త్వరలోనే తెలుస్తుంది.

    ధరల అప్డేట్ గురించి ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల ప్రభావాన్ని మా కస్టమర్లపై తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. ధరల పెరుగుదల భారతదేశంలో ఆడి యొక్క పూర్తి లైనప్‌ను ప్రభావితం చేస్తుంది, ఇందులో ఆడి A4, A5, A6, Q3, Q3 స్పోర్ట్‌బ్యాక్, Q5, Q7, Q8 & RSQ8 పెర్ఫార్మెన్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.

    2026 జనవరి నెలలో దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. బిఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు అధికారికంగా వెల్లడించాయి. ఇప్పుడు అదే బాటలో ఆడి ఇండియా కూడా అడుగులు వేసింది.

    ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు

  • దేశీ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియాకు కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఊరటనిచ్చింది. మార్కెట్‌పై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ వాటిపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసింది. రెండు సంస్థలు పోటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కాలేదని పేర్కొంది.

    వివరాల్లోకి వెళ్తే, ఈ కంపెనీలు చట్టవిరుద్ధంగా భారీ స్థాయిలో టికెట్ల క్యాన్సిలేషన్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఏకపక్ష నిబంధనలను కస్టమర్లపై రుద్దుతున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. అయితే, టికెట్ల రిఫండ్‌లకి ఎయిర్‌లైన్స్‌లో నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉన్నందున, అలాగే క్యాన్సిల్‌ చేసుకుంటే పెద్ద మొత్తంలో రిఫండ్‌ వచ్చేలా బుక్‌ చేసుకునే వీలు కూడా ఉన్నందున గుత్తాధిపత్య దురి్వనియోగం ఆరోపణలపై తదుపరి విచారణ అవసరం లేదని సీసీఐ పేర్కొంది.

    రిఫండ్, క్యాన్సిలేషన్‌ నిబంధనలను కంపెనీలు ముందుగానే ప్యాసింజర్లకు తెలియజేస్తాయని తెలిపింది. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వాటిని అమలు చేస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు సీసీఐ అభిప్రాయపడింది. అటు 2025 డిసెంబర్‌లో ఇండిగో పెద్ద ఎత్తున ఫ్లయిట్లను రద్దు చేయడంపై దాఖలైన కేసుతో కలిపి ఈ కేసును కూడా విచారణ చేయాలన్న మరో పిటీషన్‌ని తోసిపుచ్చింది. రెండూ వేర్వేరు అంశాలు కాబట్టి కలిపి విచారణ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. దేశీ ఏవియేషన్‌ మార్కెట్లో ఇండిగోకి 65 శాతం, ఎయిరిండియాకి 27 శాతం వాటా ఉన్నాయి.

    ఇదీ చదవండి: ట్రంప్‌ కోరిక నెరవేరుతుందా?

  • చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్‌విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు.

    ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్‌లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్‌లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్‌ ఫ్టాక్టరీలు, కంప్యూటర్‌ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే  అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు.  

    అయిదంచెల కేక్‌..  

    విద్యుత్, చిప్‌లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్‌’గా ఉంటుందని హువాంగ్‌ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్‌ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్‌ఫిట్టర్లు, స్టీల్‌వర్కర్లు, నెట్‌వర్క్‌ టెక్నీíÙయన్లు, ఇన్‌స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్‌ చెప్పారు.

    సంప్రదాయ కంప్యూటింగ్‌ మోడల్‌ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్‌ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్‌ సరీ్వసు, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్‌ చెప్పారు. డీప్‌సీక్‌–ఆర్‌1లాంటి ఓపెన్‌ సోర్స్‌ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.

    ఇదీ చదవండి: ట్రంప్‌ కోరిక నెరవేరుతుందా?

Sports

  • తొలిసారి నిర్వహించిన హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్‌పాట్‌ కొట్టాడు. క్రికెట్‌ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ను లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 

    75 వేల పౌండ్ల బేస్‌ప్రైజ్‌ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్‌ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌, మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్‌ రౌండ్ల అనంతరం లండన్‌ స్పిరిట్‌ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.

    లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ కమ్‌ డాషింగ్‌ బ్యాటర్‌ అయిన కోల్స్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో అతను టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్‌ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్‌.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

    చిన్న వయసులోనే 51 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ కలిగిన కోల్స్‌.. 82 ఇన్నింగ్స్‌ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్‌.. ఈ ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. 

    హండ్రెడ్‌ లీగ్‌లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్‌.. ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన కోల్స్‌.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్‌ లయన్స్‌ తరఫున భారత్‌, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్‌ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. 

    హండ్రెడ్‌ లీగ్‌లో జాక్‌పాట్‌ కొట్టడంతో, విదేశీ లీగ్‌ ఫ్రాంచైజీల కన్ను కోల్స్‌పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 వేలంలో కోల్స్‌ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్‌ లీగ్‌లో కోల్స్‌ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్‌ వేలంలో కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

    హెండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు))  ఎంపిక చేసుకుంది.

    ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.
     

  • న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో ప్రతి ఫ్రాంచైజీకి ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 

    ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్‌.. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన బౌల్ట్‌.. తాజాగా ద హండ్రెడ్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అయిన ఎంఐ లండన్‌కు ఎంపికయ్యాడు. 

    బౌల్ట్‌ను ఇవాళ (మార్చి 12) జరిగిన వేలంలో ఎంఐ లండన్‌ లక్ష స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.23 కోట్లు) సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌల్ట్‌ ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రతి ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో టైటిల్‌ నెగ్గాడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల తరఫున అతనాడిన ప్రతి ఫైనల్‌లోనూ అతని జట్టు నెగ్గింది.

    ఇదిలా ఉంటే, హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం​ జరుగుతుంది. ఈ సీజన్‌ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్‌ తరహా వేలం​ జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.

    ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

    ఈ వేలంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు))  ఎంపిక చేసుకుంది. 

    ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

  • గత పద్దెమినిదేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) కెప్టెన్‌గా.. ఆ జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక నలభై నాలుగేళ్ల వయసులోనూ తలా  ఐపీఎల్‌-2026 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.

    ఎనిమిదో స్థానంలో
    టోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడిన నేపథ్యంలో ధోని పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గా ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని.. 135కు పైగా స్ట్రైక్‌రేటుతో 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు.

    ఈ క్రమంలో గతంలో ఎ‍న్నడూ లేని విధంగా చెన్నై జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ ఛతేశ్వర్‌ పుజారా ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం అర్థం లేని విషయం అని అభిప్రాయపడ్డాడు.

    ధోని అలా బ్యాటింగ్‌ చేయడంలో అర్థం లేదు
    ‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఎంఎస్‌ ధోని (MS Dhoni) సొంతం. సీఎస్‌కే జట్టులోనూ ఎవరూ ఆయనకు సాటిరారు. అలాంటి ధోని ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థం లేదు.

    ఒకవేళ ఆయన కేవలం ఐదు లేదంటే పది బంతుల్లోనే పరుగులు రాబట్టగలిగినపుడు.. కనీసం 25 నుంచి 30 బంతులు ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోని మరీ లోయర్‌ ఆర్డర్‌లో రావడం ఏమాత్రం సరికాదు’’ అని పుజారా జియోస్టార్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

    విశ్వసనీయత ఎక్కువ
    అదే విధంగా సీఎస్‌కేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను గతంలో చెన్నైకి ఆడాను. ఆ జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారు. ఆటగాడిగా మన నుంచి ఫ్రాంఛైజీ ఏం కోరుకుంటుందో ప్రతీ ఆటగాడికి తెలసు.

    సీఎస్‌కే ఫ్రాంఛైజీకి విశ్వసనీయత ఎక్కువ. ఫ్రాంఛైజీ పట్ల ఆటగాళ్లకు అభిమానం మెండు. ధోని మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఆ జట్టుతో చాన్నాళ్లు కొనసాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆ జట్టులో మార్పులు జరుగుతున్నాయి. వెటరన్‌ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారు’’ అని పుజారా పేర్కొన్నాడు.

    కాగా ఐపీఎల్‌-2026 తొలి విడత షెడ్యూల్‌ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌కే మార్చి 30న రాజస్తాన్‌ రాయల్స్‌తో, ఏప్రిల్‌ 3న పంజాబ్‌ కింగ్స్‌తో, ఏప్రిల్‌ 5న ఆర్సీబీతో, ఏప్రిల్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

    ఐపీఎల్‌-2026 సీఎస్‌కే జట్టు
    ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (RR నుండి ట్రేడింగ్‌), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్✈️, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్✈️, నాథన్ ఎల్లిస్✈️, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్‌, జేమీ ఓవర్టన్✈️, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్✈️, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్‌ కీపర్‌), మాథ్యూ షార్ట్✈️, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ✈️, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్✈️

    చదవండి: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. షాహిన్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్వా మారన్‌ వివాదంలో చిక్కుకుంది. హండ్రెడ్‌ లీగ్‌-2026 వేలంలో పాక్‌ ఆటగాడిని కొనుగోలు చేసి, భారత క్రికెట్‌ అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. కావ్యా మారన్‌ నేతృత్వంలోని సన్‌ గ్రూప్‌ ఇటీవలే హండ్రెడ్‌ లీగ్‌లోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది.

    ఈ క్రమంలో తొలిసారి జరుగుతున్న వేలంలో పాల్గొన్న ఆమె.. పాక్‌ ఓవరాక్షన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను 1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. మరో ఫ్రాంచైజీతో (ట్రెంట్‌ రాకెట్స్‌) పోటీపడి మరీ అబ్రార్‌ను దక్కించుకుంది. ఈ చర్యతో కావ్వా భారత క్రికెట్‌ అభిమానుల పాలిట విలన్‌గా మారిపోయింది. 

    అబ్రార్‌ అహ్మద్‌ ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ల్లో ఓవరాక్షన్‌ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసి చాలా అతి చేశాడు. ఇందుకు భారత ఆటగాళ్లు కూడా తగిన కౌంటర్లు ఇచ్చినప్పటికీ భారతీయుల కసి తీరలేదు. అలాంటి అబ్రార్‌ను కావ్యా మారన్‌ జట్టులో చేర్చుకోవడం భారతీయులకు మింగుడుపడటం లేదు.

    దీనికి ముందే కావ్యా మరో పాక్‌ ఆటగాడు (హరీస్‌ రౌఫ్‌) వేలానికి రాగా, అతన్ని రిజెక్ట్‌ చేసింది. అప్పుడు శభాష్‌ అనుకున్న భారత క్రికెట్‌ అభిమానులు, అబ్రార్‌ తీసుకున్న వెంటనే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ ప్రారంభించారు. 

    ఇదే వేలంలో మరో పాక్‌ ఆటగాడు ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. వేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన పాక్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ తారిక్‌, అబ్రార్‌ అహ్మద్‌ మాత్రమే. మరో పాక్‌ ఆటగాడు షాదాబ్‌ ఖాన్‌ కూడా వేలానికి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. కాగా, కొద్ది గంటల ముందే పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది ఈ వేలం బరి నుంచి వైదొలిగాడు. ఈ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.

    ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్‌ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్‌ తరహా వేలం​ జరుగుతుంది. 

    నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.

    ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి రంగం సిద్దమైంది. మార్చి 28న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌కు తెరలేవనుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది.

    ఇరవై మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే
    ఓవైపు ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మరోవైపు.. తమిళనాడు, అసోం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.

    ఇందులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు తొలి మ్యాచ్‌లో మార్చి 28న డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఇందుకు బెంగళూరు వేదిక. 

    ఇక రెండో మ్యాచ్‌లో ఏప్రిల్‌ 2న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కోల్‌కతాలో.. తదుపరి ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. అనంతరం ఏప్రిల్‌ 11న పంజాబ్‌ కింగ్స్‌తో న్యూ చండీగఢ్‌లో తలపడనుంది.

    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సన్‌రైజర్స్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు సొంత మైదానం వెలుపల ఆడటం తలనొప్పిగా మారుతుందన్నాడు.

    సన్‌రైజర్స్‌కు కష్టమే!
    ‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్‌ తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు సొంత మైదానంలో కాకుండా.. ఇతర వేదికలపై ఆడాల్సి ఉంది. నాకైతే సన్‌రైజర్స్‌ గురించే బాధంతా!

    వాళ్లకు ఫ్లాట్‌ పిచ్‌లు కావాలి. కానీ ఆయా వేదికల్లో వీరి కోసం ఎవరూ ఇలాంటి పిచ్‌ను తయారు చేయలేరు. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్‌.. అది కూడా మధ్యాహ్నం షెడ్యూల్‌ చేశారు. నిజానికి సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్‌లో సీజన్‌ ఆరంభించడమే మంచిది.

    అక్కడైతే వారు శుభారంభం అందుకోగలరు. వారి విజయాలు, ఆత్మవిశ్వాసంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌లో అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి విధ్వంసకర వీరులు ఉన్న విషయం తెలిసిందే. 

    చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

  • హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న వేలంలో పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఇతన్ని బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. లక్ష పౌండ్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో నిలిచిన తారిక్‌ కోసం ట్రెంట్‌ రాకెట్స్‌ కూడా పోటీపడింది. ఫీనిక్స్‌, రాకెట్స్‌ రెండూ ఐపీఎల్‌ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కావు. 

    ఈ వేలంలో అమ్ముడుపోయిన తొలి పాకిస్తాన్‌ ఆటగాడు తారిక్‌. ఇతనికి ముందు హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఫ్రిది, రౌఫ్‌ మార్కీ ప్లేయర్లుగా వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

    తొలిసారి వేలం
    హండ్రెడ్‌ లీగ్‌లో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్‌ లీగ్‌ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.

    నిర్వహకులు భరోసా ఇచ్చినా..!
    ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ యాజమాన్యాలు పాకిస్తాన్‌ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్‌ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. 

    లీగ్‌ నిర్వాహకులు పాక్‌ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. దీంతో ఈ వేలంలో 63 మంది పాక​్‌ ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నాయి. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. ఈ 14 మందిలో ప్రస్తుతానికి ఉస్మాన్‌ తారిక్‌ ఒక్కడే అమ్ముడుపోయాడు.

    అనామక ఆటగాడిపై కనకవర్షం​
    ఇప్పటివరకు జరిగిన వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.  

  • బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్‌ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కనీసం సెమీస్‌ చేరకుండానే పాకిస్తాన్‌ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.

    మూడు వన్డేల సిరీస్‌
    ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది పాక్‌ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 

    114 పరుగులకే ఆలౌట్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిని పాక్‌.. 114 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌, అరంగేట్ర బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్‌ ఫాహీమ్‌ ఆష్రఫ్‌ 37 పరుగులతో పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

    బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహీద్‌ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ ‍బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    15.1 ఓవర్లలోనే ఫినిష్‌
    లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో విఫలమైన బాబర్‌ ఆజంను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ నుంచి తప్పించింది యాజమాన్యం.

    ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షామిల్‌ హుసేన్‌, మాజ్‌ సదాకత్‌ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్‌ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన సదాకత్‌ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షామిల్‌ 4 పరుగులకే అవుటయ్యాడు.

    ఓడినా పర్లేదు
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి అనంతరం పాక్‌ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.

    అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్‌లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్‌, బాల్‌.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్‌ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.

    అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి
    అయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్‌ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్‌ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్‌ స్టేడియం ఇందుకు వేదిక.

    చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

  • తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు టోర్నీలో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌కు ఘోర అవమానం జరిగింది. ఇవాళ (మార్చి 12) జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఈ వేలంలో టిమ్‌ టైర్‌-1 బ్యాటర్‌గా లక్షల పౌండ్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్నా, టిమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టిమ్‌ పేరు వేలంలో మరోసారి వచ్చే అవకాశం ఉంది.

    టిమ్‌ తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 166.33 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. ఈ టోర్నీలో టిమ్‌వే అత్యధిక హాఫ్‌ సెంచరీలు (4). టిమ్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2026 వేలంలో కేకేఆర్‌ రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ వేలానికి సరిగ్గా ముందు రోజు టిమ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేశాడు. 

    తాజాగా భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో మిగతా న్యూజిలాండ్‌ బ్యాటర్లంతా విఫలమైనా టిమ్‌ ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ టిమ్‌ అర్ద సెంచరీతో (58) సత్తా చాటాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన టిమ్‌ను హండ్రెడ్‌ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

    ఇదిలా ఉంటే, ప్రస్తుతం లండన్‌లో పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ వేలం జోరుగా సాగుతోంది. దేశ, విదేశాల ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ పద్దతిలో జరిగేది. 

    నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్‌ లీగ్‌ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.

     

  • భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తన చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమేనని చెస్‌ దిగ్గజం జుడిత్‌ పోల్గర్‌ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 2024 డిసెంబర్‌లో వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్‌తో త్వరలో చెస్‌ క్యాండిడేట్‌ టోర్నీ విజేతతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

    ఈ నేపథ్యంలో జుడిత్‌ పోల్గర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈసారి గుకేశ్‌ టైటిల్‌ నిలబెట్టుకోవడ కష్టమని, ఎందుకంటే క్యాండిడేట్‌ చెస్‌ టోర్నీ విజేత అతడిని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. 

    ‘గుకేశ్‌ ఈసారి విఫలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి చాంపియన్‌షిప్‌ తర్వాత మరోసారి గుకేశ్‌ చాంపియన్‌గా నిలుస్తాడా అనేది చెప్పడం సందేహమే. 2024లో చైనా దిగ్గజం డింగ్‌ లిరెన్‌ను ఓడించిన గుకేశ్‌ అత్యంత పిన్న వయస్సులో చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఈసారి గుకేశ్‌ ఆటతీరులో మార్పు కనిపిస్తుంది. 

    2024 నుంచి గుకేశ్‌ ఆడిన గేముల్లో డ్రాలతో పాటు ఓటములు కూడా ఉన్నాయి. దీంతో గుకేశ్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అతడు జాగ్రత్తగా ఆడితే తప్ప చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నిలబెట్టుకోలేకపోవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. 

    కాగా ఇటీవల కాలంలో జరిగిన టోర్నీల్లో గుకేశ్‌ కేవలం ప్రేగ్‌ మాస్టర్స్‌  టోర్నీలో మాత్రమే విజయాన్ని అందుకున్నాడు.2025లో విజ్‌ ఆన్‌ వేదికగా జరిగిన టాటా మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో పాల్గొన్నగుకేశ్‌ భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానందతో తలపడ్డాడు. చివరి రౌండ్‌ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో టైటిల్‌ను డిసైడ్‌ చేసేందుకు టైబ్రేకర్‌ వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ టైబ్రేక్‌ ప్రజ్ఞానంద విజయం సాధించడంతో గుకేశ్‌కు నిరాశే మిగిలింది.

    చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్టార్‌ ప్లేయర్‌ ఎం​ఎస్‌ ధోనికి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉల్లంఘించాడంటూ అతనిపై నమోదైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ కమిటీ కొట్టిపారేసింది. ఈ కేసులో ఎథిక్స్‌ కమిటీ అధికారి అరుణ్‌ మిశ్రా (రిటైర్డ్‌) ధోనికి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు.  

    టీమిండియా ఆటగాడిగా ఉంటూనే, 'ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే క్రికెట్‌ అకాడమీతో అనుబంధం (యజమానిగా) కొనసాగించడని ధోనిపై 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు నమోదైంది. ఇలా వ్యవహరించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొనబడింది. 2018లో సవరించిన రూల్‌ 38(4)(a), 38(4)(p) ప్రకారం ఇది తప్పు అని ఫిర్యాదుదారు వాదించారు. అదనంగా, ధోని తప్పనిసరి డిస్క్లోజర్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించలేదని ఆరోపించారు.

    ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జస్టిస్‌ మిశ్రా.. ధోని ఎలాంటి తప్ప చేయలేదని క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి విరుద్ధ ప్రయోజనాల కేసు నిలబడదని స్పష్టం చేశారు. ధోని 2017లో ఆర్కా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, బీసీసీఐ సవరించిన నిబంధనలు 2018 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. 

    అందువల్ల, ధోని ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని తేల్చారు. ఫిర్యాదుదారుడు వ్యక్తిగత కారణాలతోనే ఈ కేసు వేసినట్లు తీర్పులో పేర్కొన్నారు.  

    ఇదిలా ఉంటే, ధోనిని 2026 ఐపీఎల్‌ సీజన్‌ కోసం​ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే సీఈవో ఇటీవల చెప్పిన దాని ప్రకారం.. ధోని ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. వయసు పైబడిన రిత్యా ధోని ఈ సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా సీఈవోనే స్పష్టత ఇవ్వడంతో ఉహాగానాలకు తెరపడింది.

    2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే విడదల చేశారు. ఈ విడతలో అన్ని ఫ్రాంచైజీల్లాగే సీఎస్‌కే కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

    తొలి దశలో సీఎస్‌కే షెడ్యూల్‌  
    - మార్చి 30: CSK vs RR – గౌహటి  
    - ఏప్రిల్‌ 3: CSK vs PBKS – చెన్నై  
    - ఏప్రిల్‌ 5: CSK vs RCB – బెంగళూరు  
    - ఏప్రిల్‌ 11: CSK vs DC – చెన్నై  

    • కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. 

  • టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్‌.. 2024లో రోహిత్‌ కెప్టెన్సీలో టైటిల్‌ గెలిచింది. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.

    2024 మాదిరి కాదు
    అయితే, 2024లో నాటి కెప్టెన్‌ రోహిత్‌- హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్‌ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.

    వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..
    ‘‘2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్‌లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.

    ఈసారి సెమీ ఫైనల్‌ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్‌ రన్‌ స్కోరర్‌ లేదంటే లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.

    ప్రతి మ్యాచ్‌లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్‌లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.

    కోహ్లిపై విమర్శలు
    ఇక టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో రోహిత్‌, విరాట్‌, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.

    ఈసారి బుమ్రా, హార్దిక్‌ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్‌ ప్లాన్‌ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్‌ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.

    కానీ విరాట్‌ కోహ్లి యాంకర్‌ ఇన్నింగ్స్‌ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్‌, అభిషేక్‌ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్‌ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు.

    చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

  • క్రికెట్‌  చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు చిరకాలం గుర్తుండిపోతాయి. రెండు కొదమసింహాలు ఒకటిని మించి మరొకటి తలపడితే వచ్చే మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా క్రికెట్‌ అభిమానులను సైతం ఆద్యంతం మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌ కూడా ఒకటి ఉంది. 

    ఆఖరిదాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విజయం ఎవరిదన్నది పక్కనబెడితే అభిమానులకు మాత్రం చెప్పలేనంత జోష్‌ను ఇచ్చింది. అదే మార్చి 12, 2006లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌. టీ20లు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో మ్యాచ్‌లన్నీ వన్డే, టెస్టు ఫార్మాట్‌లోనే ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో వన్డేల్లో 400 పరుగులు చేయడం గొప్పగా చూసేవారు. కానీ ఒత్తిడి తట్టుకొని రెండో ఇన్నింగ్స్‌లో టార్గెను ఛేదించడమే గాక రెండు ఇన్నింగ్స్‌లకు కలిపి  800 పరుగులకు నమోదవ్వడం చిన్న విషయం కాదు. 

    తాజాగా మ్యాచ్‌కు నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి గుర్తుకు చేసుకుందాం.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోరు చేసింది. అప్పటివరకు వన్డే క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 164 పరుగులతో యాంకర్‌ పాత్ర పోషించగా, గిల్‌క్రిస్ట్‌ (55), సైమన్‌ కటిచ్‌ (79), మైక్‌ హస్సీ (81) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే కొండంత లక్ష్యం చూశాకా రెండో బ్యాటింగ్‌కు దిగే ఏ జట్టైనా భయపడాల్సిందే. 

    కానీ సౌతాఫ్రికా మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్‌ ఆడడం మొదలెట్టింది. కొండంత స్కోరు టార్గెట్‌గా ఉంచడంతో ఆస్ట్రేలియా కూడా మొదట్లో సఫారీల ఇన్నింగ్స్‌ను లైట్‌ తీసుకుంది. కానీ ఓపెనర్‌ హర్షలే గిబ్స్‌ (175 పరుగులు), గ్రేమీస్మిత్‌ (90 పరుగులు) మొదటి నుంచే ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు పరుగులెత్తింది. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోతు వచ్చింది. 

    అయితే మధ్యలో సౌతాఫ్రికా వికెట్లు కోల్పోయినప్పటికీ మార్క్‌ బౌచర్‌ (50 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఒక బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఇక క్రికెట్‌ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమంటే ఇదేనేమో అనిపించింది. అప్పటిదాకా వన్‌సైడ్‌ భారీ స్కోర్లు ఎక్కువగా కనిపించేవి. 

    కానీ ఈ మ్యాచ్‌ తర్వాత భారీ టార్గెట్లు కూడా అవలీలగా ఛేదించడం మొదలయ్యిందని చెప్పొచ్చు. క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక గొప్ప మ్యాచ్‌గా మిగిలిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ వరల్డ్‌కప్‌ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. దురదృష్టకరమైన జట్టుగా పేరు పొందిన సౌతాఫ్రికా ఇప్పటివరకు గెలిచిన ఏకైక ట్రోఫీ ఐసీసీ నాకౌట్‌ చాంపియన్స్‌ ట్రోఫీ మాత్రమే కావడం గమనార్హం.

    చదవండి: ‘గేమ్‌ప్లాన్‌ ఎవడిదో కానీ చంపేయాలి’!

  • టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. 2007‍ టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి.

    యువీదే కీలక పాత్ర
    ఇక ధోని కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచకప్‌ టోర్నీలు గెలిచిన టీమిండియాలో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఈ ఐసీసీ ఈవెంట్లో 363 పరుగులు చేయడంతో పాటు యువీ పదిహేను వికెట్లు కూడా తీశాడు.

    అదే సమయంలో యువీ క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలగా చాన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని రీఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019 వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

    తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. 
    ఈ పరిణామాల నేపథ్యంలో యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) ఎల్లప్పుడూ ధోనిని టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోని వల్లే తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. అతడే జట్టులో యువీకి స్థానం లేకుండా చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. యువీ మీద అసూయతోనే ధోని ఇలా చేశాడని ఆరోపించాడు.

    ఈ క్రమంలో యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపణలపై టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ తాజాగా స్పందించాడు. యువీ విషయంలో ధోని ఏనాడూ వివక్ష చూపలేదని.. అతడిని జట్టు నుంచి తప్పించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు.

    ధోని ఏనాడూ చెప్పలేదు..
    ఈ మేరకు విక్కీ లల్వాణీ షోలో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ కమిటీ సమావేశాలు.. లేదంటే విదేశీ పర్యటనలు.. అదీ కాదంటే మ్యాచ్‌ల సందర్భంగా .. ఇలా ఎప్పుడూ కూడా.. ఏ సందర్భంలోనూ యువరాజ్‌ సింగ్‌ను జట్టు నుంచి తప్పించమని మహేంద్ర సింగ్‌ ధోని ఏనాడూ చెప్పలేదు.

    నా మాటలను రికార్డు చేసి పెట్టండి. ధోని ఏనాడూ ఏ ఆటగాడి గురించి చెడుగా చెప్పలేదు. అతడికి సెలక్షన్‌ కమిటీ నిర్ణయంపై పూర్తి నమ్మకం ఉండేది’’ అని యువీ విషయంలో నాడు సెలక్టర్లదే తుది నిర్ణయం అని సందీప్‌ పాటిల్‌ పేర్కొన్నాడు. ఇక ఓ తండ్రిగా యోగ్‌రాజ్‌ ఆవేదనలో తప్పు లేదని.. అయితే, కుమారుడి మీద ప్రేమతో మరొకరిని నిందించడం తగదని హితవు పలికాడు.

    చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

  • పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేలం ఇవాళ (మార్చి 12) జరగాల్సి ఉంది. అయితే వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు అఫ్రిది తన పేరును ఉపసంహరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేలంలో పాల్గొంటున్న అతి కొద్ది మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లలో అఫ్రిది ఒకరు. అఫ్రిది లక్ష పౌండ్ల (రూ. 1.23 కోట్లు) బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

    అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకొని, తన కోసం ప్రణాళికలు వేసుకున్న ఫ్రాంచైజీలను భారీగా దెబ్బకొట్టాడు. అఫ్రిదితో పాటు  క్వింటన్‌ డికాక్‌, సునీల్‌ నరైన్‌, అల్లా ఘజన్‌ఫర్‌, పీటర్‌ సిడిల్‌ కూడా ఆఖరి నిమిషంలో హండ్రెడ్‌ లీగ్‌ వేలం నుంచి తమ పేర్లను వెనక్కి తీసుకున్నారు.  

    ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు దెబ్బ
    ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ యాజమాన్యాలు పాకిస్తాన్‌ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్‌ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ లీగ్‌ నిర్వాహకులు పాక్‌ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. 

    తొలిసారి జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ వేలానికి 63 మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. వీరిలో షాహీన్‌ అఫ్రిది కూడా ఉన్నాడు. 

    అఫ్రిది కోసం ఐపీఎల్‌ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కూడా పోటీపడే అవకాశం ఉండింది. అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి వైదొలగడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బ తగినట్లైంది. అఫ్రిది ఏ కారణం చేత వేలం నుంచి వైదొలిగాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

    ఇదిలా ఉంటే, మహిళల విభాగం హండ్రెడ్‌ లీగ్‌ వేలం​ నిన్ననే జరిగింది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది. 

  • టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో తిరుగులేని జట్టుగా టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. తాజాగా సూర్యకుమార్‌ కెప్టెన్సీలో సొంతగడ్డపై 2026 టైటిల్‌ గెలిచింది. ఈ రెండు సీజన్లలో కలిపి మొత్తంగా 17 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏకంగా 16 గెలిచింది.

    వరుసగా రెండోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్లో భారత్‌కు రెండు జట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

    రెండు జట్లు ఉంటే
    ‘‘ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉండి.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ కూడా అందుబాటులో ఉంటే భారత్‌ మరో జట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఓ జట్టు ఉండాలి. నిజానికి కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌ వంటి వాళ్లకు టీ20 ఫార్మాట్లో అవకాశాలే రావడం లేదు.

    అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు
    ఇక వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోని ఏ జట్టులోనైనా సరే అతడికి చోటు ఉంటుంది. శ్రేయస్‌ అయ్యర్‌ విషయాని​కి వస్తే.. ఇప్పటికీ అతడు భారత టీ20 జట్టులోకి రాలేకపోతున్నాడు. అతడికి అసలు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో నాకైతే ఇంత వరకు అర్థం కావడమే లేదు.

    అయ్యర్‌ విషయంలో యాజమాన్యం వైఖరి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక బౌలర్ల విషయానికొస్తే ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌లకు కూడా టీ20లలో ఆడే అవకాశం రావడం లేదు. లెక్కకు మిక్కిలి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి భారత్‌ రెండు టీ20 జట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అని గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.

    విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగా
    కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా టైటిల్‌ గెలిచిన అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

    ఇక ఈ రెండు సీజన్లలో కలిపి ఏకంగా దాదాపు 950 పరుగులు సాధించాడు. అయితే, టీ20 జట్టులో ఖాళీ లేకపోవడం వల్లే శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

    చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

  • సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ వేదిక‌గా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ చారిత్రత్మ‌క విజ‌యంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ది కీల‌క పాత్ర.

    వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌తో పాటు సెమీస్‌, ఫైన‌ల్లోనూ సంజూ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జ‌ట్టులోనే లేక‌పోయిన శాంస‌న్‌.. ఆ త‌ర్వాత వ‌రుస మ్యాచ్‌ల‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్‌ కేవ‌లం ఐదు మ్యాచ్‌ల‌లోనే 321 ప‌రుగులు చేశాడు.

    ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.

    ఈ మెగా ఈవెంట్‌లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.  ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ నేప‌థ్యంలోనే బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేద‌ని ఏబీడీ అన్నాడు.

    "సంజూ శాంస‌న్‌, బుమ్రాలో ఎవ‌రు ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీ అన్న‌ది నిర్ణ‌యించ‌డం చాలా కష్టం. ఈ టోర్నీలో  బుమ్రా అత్య‌ధిక వికెట్లు తీశాడు. కాబ‌ట్టి అత‌డు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వ‌ర‌కు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అత‌డు వేసిన కొన్ని కీల‌కమైన స్పెల్‌లు భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాయి.

    సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అత‌డొక్క‌డే వేరే గ్ర‌హంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అత‌డు భార‌త క్రికెట్‌కు అత‌డొక విలువైన ఆస్తి" అని డివిలియ‌ర్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

  • ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో భారత టాప్‌ డబుల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ అదరగొడుతున్నాడు. తన పార్టనర్‌ ఆండ్రీ గొరాన్‌సన్‌తో కలిసి టోర్నీలో బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ సెమీస్‌లో అడుగుపెట్టాడు. 

    గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ-ఆండ్రీ గొరాన్‌సన్‌ ద్వయం 6-3, 7-6తో అలెగ్జాండర్‌ (ఆస్ట్రియా)-వవస్సోరీ (ఇటలీ) జోడీని రెండు సెట్లలోనే కంగుతినిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. 

    గంటా 30 నిమిషాల పాటు సాగిన పోరులో ఇండో-స్వీడిష్‌ ద్వయం తొలి సర్వ్‌ నుంచే స్పష్టమైన ఆధిపత్యం చూపెడుతూ వచ్చింది. మ్యాచ్‌లో 29 విన్నింగ్‌ పాయింట్లు సాధించింది. ఇక సెమీస్‌లో ఆర్థర్‌ రిండర్‌నెక్‌( ఫ్రాన్స్‌)-వలెంటిన్‌ వచెరొట్‌ (మొనాకో) జోడీని ఎదుర్కోనుంది. 

    అంతకముందు బుధవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో బాంబ్రీ జోడీ 6-4, 6-4తో ఆరెండ్స్‌-లెహెక్కా జోడీపై విజయం సాధించింది. మ్యాచ్‌లో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా నమోదు చేయని బాంబ్రీ జోడీ ప్రత్యర్థి బ్రేక్‌ పాయింట్లను మాత్రం రెండుసార్లు బ్రేక్‌ చేయడం జరిగింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జోడీపై దూకుడు ప్రదర్శించిన యూకీ బాంబ్రీ జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని కంగుతినిపించింది.

National

  • న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇంధన కొరతతో హోటళ్ల మూసివేతలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది. కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని తెలిపింది. లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.

    అంతేకాదు, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలకు అదనంగా 40,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు కూడా చేశామని తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. రోజూ దాదాపు 50 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు.  ఎక్కడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.

    కానీ భయాందోళనల కారణంగా బుకింగ్‌లు అనేక రెట్లు పెరిగాయని సుజాత శర్మ చెప్పారు. భయంతో బుకింగ్ చేయవద్దని పౌరులను కోరారు. ప్రాధాన్యం ఆధారంగా కమర్షియల్ సిలిండర్లు పంపిణీ జరిగేందుకు లబ్ధిదారుల జాబితా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన పంపినట్టు తెలిపారు.

    ప్రతి త్రైమాసికంలో రాష్ట్రాలకు దాదాపు లక్ష కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపును ప్రభుత్వం చేస్తుందని ఆమె తెలిపారు. ఇవాళ ఉత్తర్వు విడుదల చేసి మరో 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తున్నామని చెప్పారు.

    ఇప్పుడు ఎల్పీజీ ఉత్పత్తి 28 శాతానికి పెరిగిందని శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు. దాదాపు లక్ష రిటైల్ అవుట్‌లెట్లు దేశంలో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ప్రజా రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధీనంలో ఉన్నాయని చెప్పారు. ఏ రిటైల్ అవుట్‌లెట్ వద్ద కూడా సరఫరా పూర్తిగా నిలిచిన ఘటన నమోదు కాలేదని తెలిపారు.

    భయంతో సిలిండర్ బుకింగ్‌లు
    ఎల్పీజీ కొరతపై భయాందోళనలు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. వినియోగదారులు భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి సిలిండర్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయ ప్రయత్నాలు అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు, గ్యాస్‌ కొరత కారణంగా దేశంలో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూసేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన కొరత లేదని ఇవాళ లోక్‌సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 

  • మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ  ఫ్యామస్‌ అయిన మోనాలీసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది.  ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్‌ పెళ్లాడి ఫ్యాన్స్‌ అందరికీ సర్‌ప్రైజ్‌  ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్'  నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ  ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.

    తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని  మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని  తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.

    తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన  తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై  స్పష్టత ఇస్తూ  "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతామన్నాడు.

    ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఖాన్,  ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

     

  •  సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్‌సభలో దుమారం రేగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా  ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో  నిరసన చేపట్టారు. గ్యాస్‌ సంక్షోభంతో దేశం  అల్లాడిపోతోందంటూ  ఆరోపించారు.  దీంతో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి. హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) వివరణ వచ్చారు.  

    దేశంలో ఎల్పీజీ సిలిండర్ల  సరఫరాపై ఆందోళన అవసరం లేదని తెలిపారు. గృహాసరాలకే మొదటి  ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆసుపత్రులు , విద్యా సంస్థలకు ఆటంకం లేకుండా  సరఫరా చేస్తామని మంత్రి అన్నారు.  గ్యాస్ సరఫరాపై రాష్ట్రాలకు ఎప్పటికపుడు సూచనలి స్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. విపక్షాల ఆందోళన మధ్యే మంత్రి ఈ వివరణ ఇచ్చారు. వదంతలను వ్యాప్తి చేయడానికి  ఇది సమయం కాదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో డీజిల్, పెట్రోల్ లేదా కిరోసిన్ కొరత లేదని హామీ ఇచ్చారు. సరఫరా గొలుసులు సజావుగా పనిచేస్తున్నాయన్నారు.

    మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  ఇంధన సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉందని కానీ, భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని,  హార్ముజ్ అందించే దానికంటే ఎక్కువ పరిమాణంలో లభించిందని చెప్పారు.90 మిలియన్ల మెట్రిక్‌  క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నాం. గల్భ్‌కు బదులుగా నార్వే  కెనడా నుంచి దిగుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఇంధన సరఫరాను నిర్ధారించేందుకు  కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు.

    ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ఉన్నప్పటికీ భారతదేశ ముడి చమురు సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు.కొన్ని ప్రాంతాలలో కనిపించే ఒత్తిడి ఏదైనా ఉత్పత్తి లేదా సరఫరా వైఫల్యం వల్ల కాదని, తాత్కాలిక డిమాండ్  కారణంగా ఉందని పూరి అన్నారు.

    LPG వినియోగదారులకు డెలివరీ ప్రామాణీకరణ కోడ్ కవరేజీని 50శాతం నుండి 90శాతానికి విస్తరిస్తున్నా మని, దీని కింద వినియోగదారు OTP నిర్ధారణ తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ అయినట్లు గుర్తిస్తామని ఇది మళ్లింపు అవకాశాలను తగ్గిస్తుందని ఆయన సభకు తెలియజేశారు. బుకింగ్-టు-డెలివరీ చక్రం దాదాపు 2.5 రోజులు కొనసాగుతుందని,  సిలిండర్ల బుకింగ్ , సరఫరా పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు , గ్రామీణ,  ప్రాంతాలలో 45 రోజుల గ్యాప్ ఉంటుందని ఆయన అన్నారు.

    వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి

    కాగా   గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ విపక్షాలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏ దేశానికైనా ఇంధన భద్రత ప్రాథమికమని నొక్కి చెబుతూ, భారతదేశం తన గ్యాస్‌ను ఎక్కడి నుండి కొనుగోలు చేస్తుందనే దానిపై నిర్ణయాలను ప్రభావితం చేయడానికి అమెరికాను ఎందుకు అనుమతించాలని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కోబోతోందని హెచ్చరించారు.ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రారంభమైన ఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సరఫరాను, ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.

  • న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్‌తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.  

    ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించటం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగటం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిది రణ్‌ధీర్‌ జైస్వాల్‌ చెప్పారు.

    ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపారు. “గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చలో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది” అని తెలిపారు.

    పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవలి జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయాలు కలుగుతున్నాయి.

    మరోవైపు, ఇవాళ సౌదీ ఆయిల్‌​ ట్యాంకర్‌ నౌక ముంబై చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్‌​ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్‌ దాటిన మొదటి నౌక ఇదే. 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల క్రూడాయిల్‌ దిగుమతి అయింది.

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన  ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో,  వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్‌ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.

    ‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలు
    పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు  ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.

    గ్యాస్ అప్పు ఇస్తారా?
    గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు  గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.

    పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.


    ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి

Family

  • గత కొంత కాలంగా నగరవ్యాప్తంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నిర్వహిస్తున్న వీధి శునకాల దత్తత కార్యక్రమం నెమ్మదిగా సత్ఫలితాలనిస్తోంది. ఈ శిబిరాలతో పాటు పలు మార్గాల ద్వారా స్ట్రీట్‌ డాగ్స్‌ను ఇంటికి తెచ్చి పెంచుకునేవారు పెరుగుతున్నారు. వాటితో తమకి చక్కని అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్స్‌గా ఎంచుకోవడానికి గొప్ప గొప్ప బ్రీడ్స్‌ మాత్రమే అవసరం లేదని, ఈ వీధి శునకాలు సైతం చక్కని తోడుగా మారతాయని అంటున్నారు.  

    పిల్లలకు బాధ్యత నేర్పింది.. 
    బషీర్‌బాగ్‌కు చెందిన డ్రైవర్‌ యాదగిరి జీహెచ్‌ఎంసీ (GHMC) వారాంతపు డ్రైవ్‌లో ఒక కుక్కని దత్తత తీసుకుని శంషాబాద్‌లోని తన మనవళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను వారికి అర్థవంతమైన బహుమతి ఇవ్వాలనుకున్నా. కేవలం కొన్ని రోజులు వాడి పడేసే బొమ్మ కాకుండా.. ప్రేమను నేర్పే కుక్కపిల్లని ఇచ్చాను. అప్పటి నుంచీ పిల్లలు దాంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి క్రమం తప్పకుండా పాలు, గుడ్లు తినిపిస్తున్నారు. అంతకు ముందు కన్నా చాలా బాధ్యతగా మారారు’ అని యాదగిరి అంటున్నారు. వీధుల్లో నుంచి ఆ శునకం సరాసరిగా తమ ఇంట్లోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని అంటున్నారాయన.

    గ్రహణశక్తి అమోఘం.. 
    ‘ఇది చాలా త్వరగా మమ్మల్ని అర్థం చేసుకుంది. మేం పెద్దగా శిక్షణ ఇవ్వకపోయినా మాతో పాటు మంచం మీద పడుకుంటుంది.. బాత్రూమ్‌ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తుంది’ అని శ్రీనివాస్‌ వెల్లడించాడు. 12 మంది కుటుంబ సభ్యులు ఉన్న శ్రీనివాస్‌ ఉమ్మడి కుటుంబంలో పప్పీ అందరికీ చేరువగా మారింది. ‘పిల్లలు వృద్ధులతో సహా మాలో ఎనిమిది మంది దాని బాగోగులు చూసుకుంటున్నాం. పాలు, పెరుగు అన్నంతో పాటు పెట్‌ ఫుడ్‌ అందిస్తున్నాం’ అంటూ శ్రీనివాస్‌ చెబుతున్నాడు.

    నీడనివ్వాలి అనుకున్నా.. 
    ‘చాలాసార్లు, దారినపోయే వీధి కుక్కలపై చిన్నా పెద్దా తేడా లేకుండా రాళ్లు విసరడం, వాటితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చూసి బాధ కలిగేది. కనీసం వాటిలో ఒకదానికైనా సురక్షితమైన నీడ ఇవ్వాలని అనిపించింది’ అని గుర్తు చేసుకున్నారు రాయ్‌. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఓ కుక్కని ఇస్నాపూర్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. ‘మొదట నెల పాటు సింబా (కుక్కకి పెట్టుకున్న పేరు) మాతో మమేకం కావడానికి సమయం తీసుకుంది. వీధుల్లో స్వేచ్ఛగా సంచరించేది కావడంతో.. నాలుగ్గోడల మధ్య సర్దుబాటు చేసుకోవడం కొంచెం కష్టమైంది.. క్రమంగా స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఇప్పుడు మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటోంది గొప్ప రక్షణగా మారింది. వచ్చే వరకూ మా కోసం తలుపు దగ్గర వేచి ఉంటుంది’ అని రాయ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

    ఆమెకు తోడు.. ముచ్చటగా మూడు.. 
    నగరంలో ఓ స్టార్టప్‌ నిర్వాహకురాలైన ఆశా టంపాకు, ఇండీ కుక్కలను దత్తత తీసుకోవడం ఒక జీవన విధానంగా మారింది. నా మూడు కుక్కలు ఒకప్పుడు వీధి కుక్కలే. వాటి సంరక్షణకు సురక్షితమైన స్థలం అవసరం’ అని ఆమె అంటున్నారు. అలా ఆశా దత్తత తీసుకున్న మూడో వీధి కుక్క పేరు ‘కూపర్‌’. దాదాపు సంవత్సరం క్రితం, ఓ ఎన్‌జీఓ నుంచి రెండు నెలల వయసున్న వీధి కుక్క.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం తెలిసింది. ఎవరు జోక్యం చేసుకోకపోయినా బ్రతికేది కాదు. దానికి వెంటనే వైద్య సహాయం సరైన చికిత్స అందించాను. ప్రస్తుతం కూపర్‌ ఆరోగ్యంగా, ఉల్లాసంగా మాతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. నా స్నేహితులతో కలిసిపోతూ ఆడుకుంటుంది’ అని కూపర్‌ ముచ్చట్లు పంచుకున్నారు.

    ఇవి గుర్తుంచుకోండి.. 
    వీధి కుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి భద్రత కలిగిన శాశ్వత నివాసాన్ని అందించడం ఓ సబబైన మార్గం. అదే విధంగా రోజువారీ పనుల ద్వారా వాటికి ఆసరా అందించాలి. 
    దయచేసి కుక్కలపై రాళ్లు రువ్వడం చేయవద్దు. మనం కేవలం కుక్కకు ఒక రొట్టె ముక్క, ఒక పిడికెడు అన్నం పెడితే చాలు, అవి మన కోసం తమ ప్రాణాలను ఇస్తాయి. 
    కారంగా ఉన్న, మనం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వాటికి తినిపించవద్దు. వాటి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందించాలి. 
    నగర వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర తేడాలు ఏర్పడినప్పుడు ప్రజలు వాటికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలి. 
    వీధికుక్కల సంఖ్య భారీగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సహకరించాలి. అలాగే వీధి కుక్కలను క్రిమిరహితం చేయడానికి కూడా. 
    జంతువుల పట్ల కరుణ చూపడాన్ని పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ డాగ్‌ షెల్టర్లకు తీసుకెళ్లాలని సుధామూర్తి (Sudha Murthy) సూచించారు.  

    వీధికుక్కల పట్ల నిర్దయ వద్దు.. 
    ‘జంతువులు సైతం మన సమాజంలో అంతర్భాగమే. వీధి కుక్కల పట్ల సానుభూతి చూపాలి. నా పెంపుడు శునకమైన గోపి గురించి అనేక పుస్తకాలు రాశా. నిరంతర సహచరుడైన గోపీకి, నాకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. శీతాకాలంలో గోపికి పలువురు చిన్నారులు శాలువాలు పంపుతారు. మైసూరు దసరా వేడుకల సమయంలో సన్మానిస్తారు.’ అంటూ గోపితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 
    – సుధామూర్తి, రచయిత్రి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌

    ఫిల్మ్‌ నగర్‌కు చెందిన పాఠశాల విద్యార్థి ఆర్‌ శ్రీనివాస్‌ గత శనివారం కేబీఆర్‌ పార్కులో (KBR Park) జరిగిన కార్యక్రమంలో ఒక ఇండీని దత్తత తీసుకున్నాడు. ‘మేం తొలుత దీన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, టీకా ప్రభావం కారణంగా నీరసంగా ఉంది. మొదటి రెండు రోజులు, చాలా ఎక్కువగా నిద్రపోయింది. కానీ మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకుని చురుకుగా మారింది. దాని గ్రహణ శక్తి తమని ఆశ్చర్యపరుస్తోంది’ అని అంటున్నాడు.  

    చ‌ద‌వండి: హైదరాబాద్‌లో మితిమీరిన సోష‌ల్ మీడియా వినియోగం

    బీరంగూడకు చెందిన ఐటీ ప్రొఫెషనల్‌ రాయ్‌ ఇటీవలే ఒక ఇండీ డాగ్‌ని దత్తత తీసుకున్నారు. ‘ఇండీ కుక్కపిల్లని దత్తత తీసుకోవడం మా ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. వాటికి ప్రేమ, సమయం మాత్రమే అవసరం. అవి మనల్ని విశ్వసించిన తర్వాత, మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే తిరిగి ఇస్తాయి’ అంటారాయన.  – సాక్షి, సిటీబ్యూరో  

Politics

  • తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

    ఈరోజు(గురువారం, మార్చి 12వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మల్లాది విష్ణు.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ‘ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఆలయాలకు వెళ్లిన భక్తులు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనే అనుమానం కలుగుతోంది. దసరా సమయంలో కనకదుర్గ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వంలో  స్పందన లేదు.

    శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఆలయాల్లో ఇలాంటి అపశృతులు జరగలేదు. తిరుమల పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో విపరీతంగా అపచారాలు జరుగుతున్నాయి. చివరకు దేవునికి కూడా సరైన నైవేద్యం కూడా పెట్టటం లేదు.

    కోటప్పకొండ ఆలయంలో నాసిరకం ప్రసాదాలు పెట్టి అపచారం చేశారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?, పంచారామాలలో సైతం అపచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ నాయుడు రాసలీల వీడియోలు బయటకు వచ్చాయి. అయినాసరే చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?, పైగా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తారా?, హిందూ ధర్మాన్ని కాపాడే వారైతే కచ్చితంగా బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

    కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి