Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బుల్లితెర నటుడు గౌరవ్‌ ఖన్నా హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్‌గా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!

    ఇదెప్పుడూ ఉండేదే..
    ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్‌లో వెల్లడించాడు. గౌరవ్‌ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్‌మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. 

    రెండు నెలల్లో..
    కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్‌.. సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. ఆ వెంటనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.

    చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్‌

  • భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లోని ఒక ప్రత్యేక స్క్రీన్‌లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.  

    దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.  
     

  • టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉన్నాడు.

    విలువైన సలహా
    తాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్‌ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. 

    ఇవే జీవితంలో మధుర క్షణాలు
    కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్‌లో కరెక్ట్‌ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.

    లవ్‌స్టోరీ
    తన లవ్‌స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్‌ వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్‌ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్‌. 

    సీరియస్‌ కాదేమోనని అనుమానం
    నావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్‌ను, నేను సీరియస్‌గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్‌ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్‌లో డేటింగ్‌ మొదలుపెట్టాం అని శిరీష్‌ చెప్పుకొచ్చాడు.

     

     

  • ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు! ఇటీవల ఒక సినిమా వినూత్నమైన ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

    వినూత్న ప్రమోషన్స్‌
    రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతోపాటు సినిమా ప్రమోషన్స్‌ కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.

    ఆరోజు కూడా..
    అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు, రైతులు మూవీ స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.

    ప్రధాన ఉద్దేశం
    వ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. అలాగే దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్‌తో నవ్వులు పంచేలా రూపొందించారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేయనున్నారు.

     

  • తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్‌ కిళవి' బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రాధికా శరత్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    చేయి చాచి అడుగుతా
    ఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్‌లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్‌ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. 

    వాళ్లందరికీ సినిమా అంకితం
    తను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్‌ శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించిన తాయ్‌ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్‌ దాస్‌, బాల శరవణన్‌, ముత్తుకుమార్‌, రేచల్‌ రెబెకా, జార్జ్‌ మరియణ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించాడు.

    చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్‌ హన్సిక

  • కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన యువతి మోనాలిసా భోస్లే ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ఈ వేడుకకు హాజరైనట్లు కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమలో.. 
    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌ ఫేస్‌ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.   అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 

    మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ పెళ్లిని  తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా,  తండ్రి కూడా అక్కడకు వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు.  తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులొ పేర్కొంది.  

    పోలీసుల సమక్షంలో పెళ్లి..
    తాను మేజర్‌ని అని..ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మోసాలిసా చెప్పడంతో భద్రత కలిపించామని పోలీసులు చెప్పారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.  మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
     

  • హీరోయిన్‌ హన్సిక మొత్వానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్త, వ్యాపారవేత్త సోహెల్‌ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం!

    రెండేళ్ల నుంచే వేర్వేరుగా
    తమ మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్‌లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా హన్సిక 2022 డిసెంబర్‌ 4న సోహెల్‌ను పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం! హన్సిక - సోహెల్‌ వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్యాలెస్‌ వేదికగా నిలిచింది. పెళ్లయి రెండేళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చాలాకాలంగా వేర్వేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు.

    సినిమా
    హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్‌, దేనికైనా రెడీ, పవర్‌.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది.

    చదవండి: సర్జరీ ఫెయిల్‌, దేవుడి ముందు మోకరిల్లి: కమెడియన్‌

  • మలయాళ సింగర్‌ అమృత సురేశ్‌కు ప్రేమ కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (నటుడు బాల) కూతురు పుట్టాక విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న తనకు మ్యూజిక్‌ కంపోజర్‌ గోపీ సుందర్‌ దగ్గరయ్యాడు. కానీ, ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ జంట కొంతకాలానికే బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే గోపీ సుందర్‌ తాను జీవితంలో మర్చిపోలేని ఓ పని చేశాడంటోంది.

    ప్రియుడి తల్లిని..
    అమృత సురేశ్‌ మాట్లాడుతూ.. కొన్నేళ్లపాటు నరకం, బాధ అనుభవించిన సమయంలో గోపీ సుందర్‌ నాకు సపోర్ట్‌గా నిలబడ్డాడు. మేము ఎంతో బాగా కలిసిపోయాం. ఎంతలా అంటే అతడి తల్లిని కూడా నేను నా తల్లిగానే భావించాను. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఇప్పటికీ అతడి కుటుంబంపై ప్రేమ అలాగే ఉంది. మా రిలేషన్‌షిప్‌ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకున్నాం. కానీ, అది జరగలేదు. అలా అని అతడెప్పుడూ నన్ను బాధపెట్టలేదు. 

    అల్లుడి స్థానంలో నిలబడి
    మా నాన్న చనిపోయినప్పుడు ఒక కొడుకులా ముందు నిలబడి అంత్యక్రియలు జరిపించాడు. మా నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ రానురానూ మేము కలిసి ఉండటం కష్టమని అర్థమైంది. గొడవపడుతూ కలిసుండటం కన్నా అర్థం చేసుకుని విడిపోవడమే మంచిదని భావించాం. ఇద్దరం విడిపోయాం. బర్త్‌డే, పండగల సమయంలో మాత్రం ఒకరినొకరం విష్‌ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.

    పెళ్లి
    అమృత సురేశ్‌ గతంలో నటుడు బాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో వివాహం చేసుకున్న వీరిద్దరికీ 2012లో కూతురు అవంతిక జన్మించింది. 2015లో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. చివరకు అవే నిజం చేస్తే 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.

    చదవండి: చేసిన రెండు మూవీస్‌ ఫ్లాప్‌.. అయినా మరో బంపరాఫర్‌

  • సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్‌ దిన్‌’. ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్‌ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు.  ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో  సాయిపల్లవి నటించారు. 

    మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్‌ తర్వాత ఎమోషనల్‌గా సాగింది. సునీల్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

  • వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్‌ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్‌తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్‌ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

    కవర్‌ చేసేందుకు..
    ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్‌లో ఉండగా వాడికి ట్యూమర్‌ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్‌ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్‌ చేయడం కోసం డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్‌లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.

    రెండుసార్లు సర్జరీ
    జెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్‌ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌, హౌస్‌ఫుల్‌ 4, భూత్‌ పోలీస్‌ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

    చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు

  • జగపతి బాబు, లయ, హృతిక ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ్‌, కిశోర్‌ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘నీ ఫ్యామిలీ నుంచి నేను ఒకరిని తీసేసుకుంటా.. ఎవరు అడ్డుపడినా చంపేస్తా’ అంటూ ఓ లేడీ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లుగా గ్లింప్స్‌లో చూపించారు. మరి ఆ లేడి ఎవరు? ఎవరిని, ఎందుకు బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది అనేది తెలియాలంటే సినిమా చూల్సిందే. మొత్తంగా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతుంది. 

  • పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకొనే అతి కొద్దిమంది నటుల్లో మంచు మనోజ్‌ ఒకరు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బాక్సాఫీస్‌ వద్ద ఫలితం ఎలా ఉన్నా సరే.. ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమైన మనోజ్‌.. మిరాయ్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మనోజ్ చేసిన ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకుల‌తో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి.

    ఇప్పుడు మంచు మ‌నోజ్ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే డేవిడ్‌ రెడ్డి. తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఇది రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హ‌నుమ రెడ్డి యెక్కంటి తెర‌కెక్కిస్తున్నారు. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం మనోజ్‌ తన లుక్‌ని మార్చేస్తున్నాడు. యోధుడిలా కనిపించేందుకు మూడు వారాలుగా క‌ఠినంగా శ్ర‌మిస్తున్నానంటూ వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

    ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న‌ నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండ‌టానికి సాకులు వెత‌కకుండా వాటిని ప‌క్క‌కు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయ‌న పేర్కొన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాల‌ని అనుకోవ‌టం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్ర‌మంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ న‌టించ‌లేరు. ప్రతి పంచ్, దెబ్బ త‌గిలిన‌ప్పుడు ప‌డిపోవ‌టం, ప్రతి దెబ్బకు మీ శ‌రీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు.

     

    ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడ‌మైన‌ వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియ‌జేశారు.

    డేవిడ్‌ రెడ్డి విషయానికొస్తే..  1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు.  అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది.

  • మెగాస్టార్ చిరంజీవి చేసిన భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. లెక్క ప్రకారం గతేడాదిలోనే థియేటర్లలోకి రావాలి కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దీని తర్వాత చిరు చేసిన 'మన శంకరవరప్రసాద్' రిలీజై నెలలు గడిచిపోతోంది గానీ దీని అప్‌డేట్ ఏంటనేది ఇప్పటివరకు తెలియట్లేదు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు గానీ అదెప్పుడనేది తెలియట్లేదు. ఇకపోతే ఇప్పుడీ చిత్రం గురించి, ఇందులో గ్రాఫిక్స్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కెమెరామ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందో బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)

    'సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్లేదు. సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్)వాళ్లు ఇప్పుడు చాలా ముఖ్యం. వాళ్లు ఎంత బాగా ఇస్తే కెమెరామ్యాన్ అంత బాగా చేయగలడు. సీజీ ఉన్న సినిమాలు హిట్, ఫ్లాప్ అవ్వడానికి కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకేం కావాలో అడిగి.. వాళ్లకు నచ్చినట్లే చేస్తున్నాం. నేను కూడా! నేనో పెద్ద పుడింగి, 'అంజి' చేశాను, 'ఢమరుకం' చేశాను నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లే. మా ఇగోలని పక్కనబెట్టి వాడు అడిగిందే ఇస్తాం. వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోలేకపోతే కెమెరామ్యాన్ సహకరించలేదని వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి చెడ్డపేరు రావడం ఆ ప్రాజెక్టుకి మంచిది కాదు ఆ కెమెరామ్యాన్‌కి కూడా మంచిది కాదు. అందుకని వాళ్లకు ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే వాడి ఖర్మ. మా తప్పయితే ఏం లేదు. ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకోవట్లేదు గానీ ఏదైనా తేడా జరిగితే కెమెరామ్యాన్ చెడగొట్టేశాడని మాట్లాడుకుంటున్నారు. కానీ కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు సీజీ కంటూ వేరేగా ఓ టెక్నీషియన్ కొత్తగా వచ్చాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అతడు మా దగ్గరే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. అతడు చెప్పకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేం తీయం. ఇప్పుడు రూల్ ప్రకారం తీయకూడదు. నేనైతే అతడు లేకుండా కెమెరా ఆన్ చేయట్లేదు'

    ఇక 'విశ్వంభర' ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''అంజి' అయితే తలెత్తుకు పనిచేశాం. 'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాను. ఎందుకంటే 'విశ్వంభర' అనేదానిలో చాలా సీజీలు ఉన్నాయి. అక్కడికి పోయి నేను, చోటా కె నాయుడు. నాకు చాలా తెలుసు అని అంటే కుదరదు. చాలా బాగుండాలి. ఎందుకంటే ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అక్కడికి పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! అక్కడే ఏం కావాలో అదే చేశాం. బాగా జరుగుతుంది. అందుకే బాగా టైమ్ తీసుకుంటున్నాం. ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్)

  • సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటుంది నటి సమీరా రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందని, తాను కూడా ఇది ఫేస్‌ చేశానని చెబుతోంది. తెలుగులో `నరసింహుడు`, `అశోక్‌` ‘జై చిరంజీవా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో..సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్‌ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఈ ట్రోల్స్‌ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించింది.

    ‘సినిమా ఇండస్ట్రీలో  అందానికే ఎక్కువ ప్రాధాన్యత. టాలెంట్‌ గురించి పట్టించుకోరు. తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. సాధారణంగా ఓ నటిగా, మహిళగా ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించాను. కానీ మరింత అందంగా కనబడాలంటూ నాకు మేకప్‌ వేసేవాళ్లు. ముఖానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా మేకప్‌ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. అలా చెప్పడం నన్ను చాలా బాధించింది. నిజంగానే నేను అందంగా లేనేమో అనే భావన నాలో కలిగింది. 

    అంతేకాదు, నేను స్లిమ్‌గా లేనని బాధపడేదాన్ని. నేను చాలా పొడుగ్గా ఉండడంతో.. వయసులో పెద్దదిగా చూసేవాళ్లు. అది నా మైండ్‌లో అలా ఉండిపోయేది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నా బాడీ సైజు గురించే మాట్లాడేవాళ్లు కానీ.. టాలెంట్‌, యాక్టింగ్‌ గురించి చర్చ జరిగేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. 'అసలు వాళ్లు చెప్పినట్లు ఎందుకు చేశాను. అలా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్‌. అలా చేయకతప్పదు’ అని సమీరా(Sameera Reddy) చెప్పుకొచ్చింది.

    ఇక బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడుతూ.. ‘పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరంలో మార్పు వచ్చింది. వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను'
     

  • అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా మరికొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని, అల్లు స్నేహ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇదికాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్)

    అల్లు అర్జున్ సంతానంలో కొడుకు అయాన్ పెద్దోడు కాగా కూతురు అర్హ చిన్నది. అర్హ ఇదివరకే 'శాకుంతలం' మూవీలో నటించేసింది. పర్లేదు ఓకే ఓకే అనిపించింది. అయితే అయాన్.. ఏ సినిమాలోనూ కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయాన్ మోడల్ అనే ట్యాగ్‌తో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాడు కూడా. మరి తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎప్పుడొస్తాడో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: ఏపీలో వంట గ్యాస్ కొరత పొంచి ఉంది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. ఇక 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు.

    రాష్ట్రంలో 1.61 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉండగా గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మంత్రుల కమిటీలో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులు ఉన్నారు.

     

     

  • సాక్షి తాడేపల్లి: రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30గంటలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్.0 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైఎస్సార్సీపీ. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో అనేక పోరాటాలు, విజయాల మధ్య ప్రజల ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ పార్టీ ఎంతో గొప్పగా ఎదిగింది. ఎన్నో సంఘర్షణలు, ఆటుపోట్లు ఎదుర్కొని విజయవంతంగా 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపింది.     

     

     

  • సాక్షి, తాడేపల్లి: విజయవాడ భవానీపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలు రేపటి  నుంచి  (గురువారం) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని దర్గా ముజావర్ల కమిటీ ఆహ్వానించింది. సయ్యద్‌ గాలిబ్‌ షాషీద్‌ బాబాకు చాదర్‌, చందనం, శాండిల్‌ ఆయిల్‌ సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఆయనను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్‌ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ కూడా ఉన్నారు.

  • లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణాన్ని వైఎస్సార్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని పార్టీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) పార్లమెంటులో స్పీకర్ ఓంబిర్లాపై జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పార్టీ తరపున ఆయన పాల్గొన్నారు. తాము ఎన్డీఏతో సహా ఎవరి మిత్రపక్షం కాదని అయితే దేశ అత్యున్నత పదవిలో ఒకటైన స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవం కాపాడాలనే తమ పార్టీ అభిమతం అని తెలిపారు. ప్రజలకు మేలు కలిగే ఏ అంశాలు చేపట్టినా ప్రభుత్వానికి మద్ధతిస్తామని పార్లమెంటు సజావుగా జరగాలంటే అందరూ సహకరించాలని కోరారు.

    ఏపీకి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించేందుకు స్పీకర్ తమకు సమయం ఇచ్చారని అందుకు కృతజ్ఞతలని ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి అన్నారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు. 

  • సాక్షి, కోనసీమ:  ద్రాక్షరామ  గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిల్లీపాల్ అనే విద్యార్థిపై తోటి 10 మంది విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన బిల్లీపాల్ సూసైడ్ నోట్ రాసి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థి క్షేమంపై తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • సాక్షి, తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు కుటుంబ సభ‍్యులకు సంతాపం తెలిపారు. సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Business

  • దుబాయ్‌లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం  లక్ష్యాలు.

    కీలక నిబంధనలు ఇవే..

    •  ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్‌ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం.

    •  అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి.

    •  భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి.

    •  అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్‌లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్‌కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం.

    •  భాగస్వామ్య వసతి మార్కెట్‌పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.

    భారీ జరిమానాలు
    ఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్‌ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.

    ఎందుకీ కొత్త చట్టం?
    గతంలో దుబాయ్‌లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్‌ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్‌ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు.

  • ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్  తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం,  సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.

    ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవం
    ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్‌ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.

    క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపు
    మూడో రోజు అసైన్‌మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్‌గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.

    మానసికంగా తీవ్ర ప్రభావం
    ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.

    మళ్లీ ప్రయాణం ప్రారంభం
    అయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.

    ఏడాదిలో భారీ మార్పు
    ఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.

    నెటిజన్ల స్పందనలు
    మౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్‌ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు.

  • ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌లు.. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.

    పాలనలో వేగం.. పనిలో పారదర్శకత

    సెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.

    అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.

    ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

  • ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్‌ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.

    భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..

    భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్‌కు సవాలుగా మారింది.

    లెక్కలివే..

    భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్‌ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్‌ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.

    ఆహార భద్రతపై ప్రభావం

    భారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.
    అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.

    ‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగ

    ఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్‌) సరఫరా ఇప్పుడు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.

    ప్రత్యామ్నాయ మార్గాలు

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్‌ఈస్ట్‌ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).

    ప్రభుత్వ ధీమా

    పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్‌లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.

    అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.

    సూచీల పతనానికి ప్రధాన కారణాలు

    ఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్‌ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.

    ఎనర్జీ సెక్టార్‌లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.

    ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.

    రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.

    కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్‌లో ట్రేడయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.

    ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్‌ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

  • మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

    అంచనాలు తలకిందులు

    ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.

    గత తప్పిదాల నుంచి పాఠాలు

    2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్‌ బ్యాంకులు భావిస్తున్నాయి.

    బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితి

    యూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.

    ఇదీ చదవండి: చికెన్‌, పిజ్జా, బర్గర్‌.. కంపెనీలకు కష్టాలు

  • దేశీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్‌ఆర్‌) విభాగంపై గ్యాస్ సెగ ముసురుతోంది. వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్‌లో ప్రధాన క్యూఎస్‌ఆర్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన సమస్యలు మరో రెండు వారాలకు పైగా కొనసాగితే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

    సరఫరా గొలుసులో సంక్షోభం

    ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తాజా నివేదికలో క్యూఎస్‌ఆర్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించింది. ప్రధాన క్యూఎస్‌ఆర్ చైన్‌లో దాదాపు 60-65 శాతం వంట ప్రక్రియ పూర్తిగా ఎల్‌పీజీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలు కేవలం ఒకటి నుంచి రెండు వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. సరఫరా లోటు కారణంగా మార్చి నెలలోనే వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర 8 శాతం మేర పెరిగింది. ఇది నేరుగా రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది.

    ఆదాయం, మార్జిన్లపై ప్రభావం

    ఒకవేళ సరఫరా నిలిచిపోయి, రెస్టారెంట్లు ఐదు రోజుల పాటు మూతపడితే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రతి స్టోర్ ఆదాయం 6 శాతం తగ్గే అవకాశం ఉంది. రెస్టారెంట్ స్థాయి ఎబిటా మార్జిన్లు సాధారణం కంటే 14-20 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో వాణిజ్య వినియోగదారులపై రేషనింగ్(ప్రాధాన్యత క్రమంలో పరిమితంగా పంపిణీ చేయడం) విధించడం రెస్టారెంట్లకు శాపంగా మారింది.

    ముంచుకొస్తున్న ముప్పు.. ప్రత్యామ్నాయం తప్పదా?

    పెద్ద సంస్థల కంటే చిన్న, స్వతంత్ర రెస్టారెంట్లు ఈ సంక్షోభానికి త్వరగా ప్రభావితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి వంటి కీలక షిప్పింగ్ మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రెస్టారెంట్ విభాగం ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (విద్యుత్ ఆధారిత వంట పరికరాలు) లేదా సెంట్రలైజ్డ్ కిచెన్ మౌలిక సదుపాయాల వైపు మళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

    ఐఆర్‌సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.

    అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

    సంక్షోభానికి కారణాలు

    భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.

    • ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

    • గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.

    • గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్‌లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ముందుచూపుతో..

    రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్‌పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్‌సీటీసీ భరోసా ఇచ్చింది.

    ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

  • పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

    మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?

    గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.

    ‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.

    హోటల్ పరిశ్రమలోనూ ఆందోళన

    హాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    25 రోజుల వెయిటింగ్ పీరియడ్

    మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Telangana

  • పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్‌కి వెళ్లే ముందు  మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి  ప్రి్రస్కిప్షన్‌పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్‌ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్‌ కోసం.. పిల్లలు  మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్‌ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది.    – సాక్షి, సిటీబ్యూరో

    హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్‌ యాప్స్‌ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్‌ఫోన్‌ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

    డిజిటల్‌ ‘డీలా’.. 
    ఓ వైపు చాట్‌ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్‌ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్‌ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్‌ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌ పరిచయం చేస్తూ.. ఆన్‌లైన్‌ క్లాసులు, హోమ్‌వర్క్‌ పేరుతో క్రమంగా స్క్రీన్‌ టైమ్‌ సోషల్‌ మీడియావైపు దారి మళ్లుతోంది.

    ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్‌ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్‌ స్ట్రీమ్‌.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్‌ ఫ్రెండ్‌షిప్, లైక్స్, ఫాలోవర్స్‌ ఆధారంగా రిలేషన్స్‌ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.  

    పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. 
    సోషల్‌ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్‌ టైమ్‌ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్‌ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్‌ బుల్లీయింగ్‌తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

    ఈ అడిక్షన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్‌ఫోన్‌ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్‌ అల్గారిథమ్స్‌ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్‌ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్‌ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్‌ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్‌గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.

    సర్వే చెబుతోందేంటి? 
    హైదరాబాద్‌లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్‌ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్‌ జీ తరం కన్నా.. జెన్‌ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్‌ లిటరసీ, హెల్దీ స్క్రీన్‌ హ్యాబిట్స్‌ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

    కట్టడి సాధ్యమేనా? 
    దేశంలో చిన్నారుల ఆన్‌లైన్‌ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్‌ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్‌సైట్లు, ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్, కథలు, సైన్స్‌ వీడియోలు, క్రియేటివ్‌ ఆర్ట్స్‌ వంటి కంటెంట్‌ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. 

  • సాక్షి హైదరాబాద్: గ్యాస్ బుకింగ్‌ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

    ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సిలిండర్ బుకింగ్ లేదా ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు.

    వీరు ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

  • పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎన్నెన్నో వదంతులు వ్యాపిస్తున్నాయి. గ్యాస్‌ అయిపోతుందంటూ.. సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలంటూ యుద్ధం మొదలైన తొలినాళ్లలో వచ్చిన వదంతులు ఇప్పుడు నిజమవుతున్నాయి. 

    అదేవిధంగా లిక్విడ్‌ క్యాష్‌ దాచుకోవాలని, ఇంట్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని సోషల్‌ మీడియాలో ఎలాంటి నిర్ధారణ లేని వార్తలు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది నిజం? ఏది రూమర్‌? అనే అంశంపై వాస్తవాలను పాఠకుల ముందు పెట్టేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. 

    ఈ క్రమంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత సీతారాంబాబును ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలను ఆయన వెలుగులోకి తీసుకువచ్చారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) విడుదల చేసిన లిక్విడ్‌ క్యాష్‌లో దాదాపు రూ.40 లక్షల కోట్లు ఇప్పటికీ బయటే ఉన్నాయని, ఆ మొత్తాన్ని ఎవరూ కూడా ఏ బ్యాంకులోనూ జమ చేయడం లేదని వివరించారు. ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..

  • హైదరాబాద్‌: అపరిశుభ్రమైన మాంసాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా మంగళ్‌హాట్ పరిధిలో ఆకస్మిక దాడులు చేయడంతో ఇటువంటి మరో ఘటన బయటపడింది. 

    తాజా మాంసం అని నమ్మిస్తూ నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున‍్నారు. మంగళ్‌హాట్ లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ‘ఏ టూ జెడ్‌ షీప్‌ అండ్‌ గోట్‌ ఆఫ్ఫాల్’ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

    నిందితుడు గతంలో కూడా ఇటువంటి నేరానికి పాల్పడగా, అప్పట్లో జీహెచ్‌ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించారు. మళ్లీ అలాంటి పనులే చేస్తున్నాడు. అతడి షాపులో నుంచి పోలీసులు సుమారు 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. అఫ్రోజ్‌ అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసాన్ని సేకరించేవాడు.

    అలా సేకరించిన మాంసాన్ని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో రోజుల తరబడి ఉంచేవాడు. మాంసం కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయించేవాడు. అతి షాపులో ఉన్న 300 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు పారేశారు.

    అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని పౌరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అక్రమ నిల్వలు, కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
     

  • ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత్‌లో ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై తీవ్రంగా పడింది. నిన్న బెంగళూరు, విశాఖ, ముంబై నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడగా.. ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు సిలిండర్ బండలతో రోడ్డెక్కారు. కొన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెళ్లిళ్లు వాయిదాపడే పరిస్థితులు నెలకొన్నాయి. 

    దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు మొదలయ్యాయి. అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌తో పాటు.. బిహార్‌లో పోలీసుల బందోబస్తు నడుమ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల్లో ఒకట్రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లో ఎల్‌పీజీ బ్లాక్ మార్కెటింగ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై దృష్టి సారించాయి.

    రోజురోజుకీ పరిస్థితి తీవ్రం
    ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యప్రదేశ్‌లో ఆ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే వారం రోజుల్లో ఒక్క భోపాల్‌లోనే వెయ్యికి పైగా పెళ్లిళ్లు షెడ్యూల్ అయినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం ఉండడంతో.. పెళ్లింట భోజనాలు ఉంటాయా? అనే ఆందోళనలు వధువు, వరుడి తరఫు వారిలో నెలకొంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు, హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు పెళ్లిళ్ల సీజన్ దాటిపోతోందని, అడ్వాన్సులు తీసుకున్న తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవిధంగా ఇది అత్యయిక స్థితిని తలపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    యూపీలో పోలీసుల బందోబస్తు నడుమ..
    యూపీలో గడిచిన నాలుగైదు రోజులుగా ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లు పెరిగాయి. బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ అనే నిబంధన కొనసాగుతున్నప్పటికీ.. అసాధారణంగా బుకింగ్‌లు పెరుగుతున్నాయని ఎల్‌పీజీ డీలర్లు చెబుతున్నారు. గోరఖ్‌పూర్, సిద్ధార్థనగర్ ప్రాంతాల్లో పౌరులు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూకట్టారు. 

    సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరినట్లు ఇప్పుడు యూపీలో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఏజెన్సీల వద్ద క్యూకట్టారు. అయితే.. వారందరికీ సిలిండర్లు సర్దుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, టోకెన్లు ఇచ్చి, రాబోయే రోజుల్లో పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు దుర్గా..

    బిహార్‌లో బుకింగ్‌ల నిలిపివేత?
    రెండ్రోజులుగా బిహార్‌లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్‌లను చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో.. బెంగళూరు మాదిరిగానే హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు బంద్‌కు సిద్ధమవుతున్నారు. డొమెస్టిక్ బుకింగ్‌లు కొనసాగుతున్నప్పటికీ.. బ్లాక్‌మార్కెటింగ్ భయాలు ఉండడంతో ప్రజలే ఏజెన్సీల వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుంటున్నారు. దీంతో.. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా గోపాల్ గంజ్, ఖగారియా, ఔరంగాబాద్, పట్నా నగరాల్లో తెల్లవారుజాము నుంచే ప్రజలు సిలిండర్ బండ కోసం క్యూలైన్లలో నిలబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. డీలర్లు తమపై దాడులు జరిగే ప్రమాదాలున్నాయనే భావనతో ఏజెన్సీలను తెరవడం లేదు.

    రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటింగ్?
    కమర్షియల్ సిలిండర్ ధర 19 వందల రూపాయలదాకా ఉండగా.. ఇప్పుడు రాజస్థాన్‌లో బ్లాక్ మార్కెటర్లు దాన్ని 2,500 నుంచి మూడువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ ఓ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, అక్రమార్కుల దందాను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించారు. లూథియానా, ఫరీద్‌కోట్, హోషియార్‌పూర్, పటియాలా ప్రాంతాల్లో చమురు సంస్థల వెబ్‌సైట్లు డౌన్ కావడంతో.. కొత్త బుకింగ్‌లు జరగడం లేదని తెలుస్తోంది దుర్గా..

    కేంద్ర ప్రభుత్వం చర్యలు  
    పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిన్ననే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చమురు కంపెనీల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సరఫరాను ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే నిబంధనను నిక్కచ్చిగా అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ బాయ్స్ దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తోంది. మరోవైపు ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. - సాక్షి వెబ్‌డెస్క్‌

  • సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పాలనలో అవమానం జ‌రిగింద‌ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ ఫిరాయింపుదారుల వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ ప్ర‌సాద్‌కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వ‌డంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం హాస్యాస్పదమ‌ని బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌నలో పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీక‌ర్ వ్య‌వ‌హారశైలి ఉంద‌ని విమ‌ర్శించారు.

    ''దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. బీఆర్ఎస్ – కాంగ్రెస్ ఒకే తీరుతో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌పై వేటు వేయకపోవడం అప్రజాస్వామికం. ఫిరాయింపులను అరికట్టాల్సిన స్పీకర్.. క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఫిరాయింపులను ప్రోత్సహించినట్టే. ప్రజా తీర్పును కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాలరాస్తున్నాయి. అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజల ఆగ్రహాన్ని కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తార''ని కిష‌న్‌రెడ్డి హెచ్చరించారు.

    తెలంగాణ రాష్ట్రానికి మచ్చ: డాక్టర్ లక్ష్మణ్
    పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, చీకటి రోజని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమ‌ర్శించారు. స్పీకర్ ఇచ్చిన తీర్పు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని మండిప‌డ్డారు. శాసన సభ స్పీకర్ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా వ్యవహరించారని దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యేల క్లీన్‌చిట్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. 

    ''పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కిందికిరారు అంటున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు నిర్వహాచనం ఏంటి? ఒకరు ఎంపీగా పోటీ చేశారు, ఇంకొకరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. గతంలో నైతిక విలువలతో అటల్ బీహార్ వాజపేయి రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలిచారు. గతంలో బీఆర్‌ఎస్‌ హోల్‌సేల్‌గా ఎమ్మెల్యేల‌ను చేర్చుకుంటే,  రిటైల్‌గా కాంగ్రెస్ వ్యవహరించింది. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధానంపై జవాబు చెప్పాలి. దేశం మొత్తం తలవంపులు తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఉంద‌''ని డాక్టర్ లక్ష్మణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

    చ‌ద‌వండి: లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్

  • సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అయిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్ర బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘మా తమ్ముడు కృష్ణ దేవరాయలు మంచిగా మాట్లాడాలని కోరుతున్నా. తెలంగాణపై ఏడుపు బంద్ చేయాలి’ అని అన్నారు. కాగా, లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అనడంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

    శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు?
    తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. ఆయన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? 

    స్పీకర్ కార్యాలయం ఆర్డర్ కాపీ ఇవ్వడానికి భయపడుతోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ అద్భుతంగా పని చేసి ఉంటే ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయం? రాహుల్ గాంధీ ఎలా చెప్తే అలా స్పీకర్ నడుస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారే, ఆయనపై మాకు గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై స్పందించాలి. కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: శాంతిభద్రతల అడిషనల్‌ డీజీగా అత్యంత కీలకమైన పోస్టులో కొనసాగుతున్నా.. సీనియర్‌ ఐపీఎస్‌ మహేశ్‌ భగవత్‌ సివిల్స్‌ గురువుగా తన సత్తా చాటుతూనే ఉన్నారు. యూపీపీఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు మార్గదర్శనం చేస్తూ వారి విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

    తాజాగా వెలువడిన సివిల్ సర్వీసెస్‌ పరీక్ష–2025 ఫలితాల్లోనూ దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేశ్‌ భగవత్‌ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూ దశకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సంపాదించడం విశేషం. ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్‌–100 ర్యాంకుల్లో నిలిచారు. మహేశ్‌ భగవత్‌ శిష్యురాలు తేజస్వినీ సింగ్‌ 62వ ర్యాంకు సాధించడంతో పాటు ఇంటర్వ్యూలో అత్యధికంగా 225 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ టాపర్‌గా గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించగా, ఆమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు.

    అలాగే దైనెంపల్లి ప్రవీణ్‌ 793వ ర్యాంకు సాధించి ట్రైనీ డీఎస్పీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ టాపర్‌గా జస్వంత్‌ జెన్ను 23వ ర్యాంకు సాధించగా, రాష్ట్రం నుంచి మరో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా టాప్‌–10లో 3, 4, 6, 7 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా మహేశ్‌ భగవత్‌ బృందం నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకత్వం పొందినవారే కావడం గమనార్హం. అభ్యర్థులు కష్టపడి సాధించిన ఈ విజయానికి మెంటర్ల సహకారం కూడా ఎంతో తోడ్పడిందని మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: విమెన్ సివిల్ ప‌వ‌ర్‌

  • కామారెడ్డి జిల్లా: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. అరబ్‌ దేశాలలో రకరకాల పనులు చేసుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక్కడి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. అనుక్షణం టీవీలలో యుద్ధవార్తలను చూస్తూ తమ వారు ఉండే ప్రాంతాలలో ఏమైనా దాడులు జరుగుతున్నాయా అని ఆందోళనగా పరిశీలిస్తున్నారు. రోజుకు నాలుగు సార్లు వాట్సాఫ్‌లో ఫోన్లు చేస్తూ తమ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. 

    యుద్ధం నేపథ్యంలో యూఏఈ, ఖతార్, కువైట్, దుబాయ్‌ దేశాలు విమాన రాకపోకలను నిలిపి వేసింది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, ఇండిగో విమాన సంస్థలు గల్ఫ్‌ దేశాలకు తమ సరీ్వసులను నిలిపి వేసింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదబి,దోహా, జెడ్డా, సౌదీ అరేబియా,కువైట్, మస్కట్, మక్కా వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో డబ్బుల గురించి పట్టించుకోకుండా కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వద్దామన్నా వారికి కుదరడం లేదని వారు వాపోతున్నారు. 

    ఖతర్, అబూదాబీలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారతీయ రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయని వారు తెలిపారు. తమ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తున్నాయని అవసరమైతే ఖ తార్‌లో ఉంటున్న వారు 00974 55647502 , అబుదబీలో టోల్‌ ఫ్రీ నంబర్‌ 800–46342, వాట్సాఫ్‌ నంబర్‌ 972543090571 నంబర్లకు ఫోన్‌ చేసి కానీ మెయిల్‌ ద్వారా గాని తమకు కలిగిన ఇబ్బంది గురించి తెలియజేయ వచ్చని రాయబార కార్యాలయ అధికారులు తెలిపినట్లు అక్కడి వారు తెలిపారు. 

    భారతీయులు ఖతార్‌ అధికారులు అధికారిక ఛానెళ్ల ద్వారా జారీ చేసే వార్తలు, సూచనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలని భారత ఎంబసీ అధికారులు తెలిపినట్లు వారు తెలిపారు. సోషల్‌ మీడియాపై ఆంక్షలు ఉన్నందున వాట్సాఫ్, ఫేస్‌ బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర మాధ్యమాలలో వచ్చే వార్తలను నమ్మ వద్దని , వాటిలో యుద్ధ వార్తలు పోస్టింగ్‌లు పెట్టవద్దని వారు సూచించిన ట్లు తెలిపారు. యుద్ధం కారణంగా గల్ఫ్‌లోని 14 దేశాలపై డ్రోన్లు, క్షిపణుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున ఆయా దేశాల్లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ ఉద్యోగులు సూచిస్తున్నట్లు వారు తెలిపారు.  యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేనట్లు కనబడుతున్నందున తమ పరిస్థితి ఏమిటా అని వలస జీవులు గాబరా పడుతున్నారు.

    ‘‘ఇప్పటికైతే బాగానే ఉన్నాం. ఉ ద్యోగాలకు సెలవులు ప్రకటించారు. రూముల్లోనే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. ఇక్కడి యుద్ధ వాతావరణం ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడితే అరెస్టులు చేస్తున్నారు. క్షణ క్షణం..భయం భయంగా బతుకుతున్నాము..’’ అరబ్‌ దేశానికి వలస వెళ్లిన ఒక మిత్రుడు ఫోన్లో అక్కడి పరిస్థితిని వివరించారు.

     

     

Sports

  • మహిళల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్‌ ఏప్రిల్‌ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

    వాస్తవానికి ఈ లీగ్‌ టీ20 ప్రపంచకప్‌కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్‌ వరకు బంగ్లాదేశ్‌ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్‌లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్‌ 14న నెదర్లాండ్స్‌తో జరిగే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

    ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. 

    ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్‌లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్‌ ఎగ్గొట్టాయనే టాక్‌ ఉంది. పురుషుల బీపీఎల్‌కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్‌ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది.

     

  • తమ తొలి సీజన్‌లోనే (2022) టైటిల్‌ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్‌ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్‌ విన్నింగ్‌ కోచ్‌ విజయ్‌ దాహియాతో ఒప్పందం చేసుకుంది. 

    రానున్న సీజన్‌ కోసం అతన్ని అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్‌ కోచ్‌ మాథ్యూ హేడెన్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్‌ టైటిల్‌ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. 

    దాహియా తన ఐపీఎల్‌ కెరీర్‌లో కేకేఆర్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా పని చేశాడు. అతని కోచింగ్‌లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  

    కాగా, హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్‌లోనే టైటిల్‌ గెలిచిన గుజరాత్‌.. ఆతర్వాత సీజన్‌లో కూడా ఫైనల్‌కు చేరినా, సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్‌ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్‌లో చేరడంతో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

    గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ తొలి సీజన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్‌కు చేరలేకపోయింది. రాబోయే సీజన్‌లో మరోసారి గిల్‌ నేతృత్వంలో గుజ.రాత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

    ఇదిలా ఉంటే, 2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ (20 మ్యాచ్‌లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్‌ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

    గుజరాత్‌ టైటాన్స్‌ తొలి విడత షెడ్యూల్‌..  
    - మార్చి 31: GT vs PBKS 
    - ఏప్రిల్‌ 4: GT vs RR  
    - ఏప్రిల్‌ 8: GT vs DC  
    - ఏప్రిల్‌ 12: GT vs LSG  

    • దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

     

     

  • ఐపీఎల్‌ 2026 తొలి విడత షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను బీసీసీఐ ఇవాళ (మార్చి 11) ప్రకటించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

    దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

    తొలి విడతలో మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. 

    ఈ విడతలో అన్ని జట్లలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.  టోర్నీ ఓపెనర్‌లోనే ఆరెంజ్‌ ఆర్మీ ఆర్సీబీతో తలపడనుంది. సన్‌రైజర్స్‌ రెండో మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగనుంది. మూడో మ్యాచ్‌ ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. నాలుగో మ్యాచ్‌ ఏప్రిల్‌ 11న ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరుగనుంది. 

    తొలి విడతలో సన్‌రైజర్స్‌ తమ హోం గ్రౌండ్‌ హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ (ఏప్రిల్‌ 5, లక్నోతో) ఆడనుంది. ఆర్సీబీ, కేకేఆర్‌ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. లక్నో, పంజాబ్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి.

    ఐపీఎల్‌ 2026 కోసం సన్‌రైజర్స్‌ జట్టు..
    సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అమిత్ కుమార్, క్రియాన్స్‌ ఫులెట్రా, ప్రఫుల్‌ హింజ్‌, ఎషాన్‌ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ
     

  • టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సమర్థించాడు. డారిల్‌ మిచెల్‌ విషయంలో అర్ష్‌దీప్‌ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్‌ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్‌ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

    మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతి
    అహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్‌ పోరులో క్రీజులో ఉన్న కివీస్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌కు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్‌ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్‌ కోపంగా అర్ష్‌దీప్‌ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్‌‌ సూర్యకుమార్‌ సముదాయించడంతో చల్లబడ్డాడు.

    అనంతరం  అర్ష్‌దీప్‌ కూడా మిచెల్‌ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ  అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  

    అందులో అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదు
    ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా  అర్ష్‌దీప్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.

    బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్‌ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.

    అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. 

    అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్‌  అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. 
     

  • క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదలైంది. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగానే తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది.

    ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.

    తొలి విడతలో 20 మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి.

    తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 4న జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 5న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. 

     

  • ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ది హండ్రెడ్‌ క్రికెట్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్‌ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్‌ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్‌, డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.

    ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 

    శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, కశ్వీ గౌతమ్‌, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్‌ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొనడం లేదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్‌ చేసుకున్నాయి.

    ఫ్రాంచైజీలు రీటైన్‌, ప్రీ సైనింగ్‌ చేసుకున్న ప్లేయర్లు..

    మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్‌) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్‌)

    లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్‌), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్‌)

    బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్‌), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్‌)

    ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్‌)

    సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్‌), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్‌)

    సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్‌)

    ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్‌), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్‌)

    వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్‌)

    కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది.  

     

  • జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

    ముఖ్యంగా వరల్డ్‌కప్‌ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్‌ (Sanju Samson), జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్‌ హీరోలను కూడా ఫ్యాన్స్‌ హైలైట్‌ చేస్తున్నారు. 

    ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.

    ఓపెనింగ్‌ జోడీ ఇదే
    ఓపెనర్లుగా టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌, న్యూజిలాండ్‌ పవర్‌ హిట్టర్‌ టిమ్‌ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్‌ వీరుడు షిమ్రన్‌ హెట్‌మైర్‌, భారత ఆల్‌రౌండర్‌ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్‌.. టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా, ఇంగ్లండ్‌ డేంజరస్‌ ప్లేయర్‌ విల్‌ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.

    పన్నెండో ఆటగాడిగా
    ఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్‌ విభాగంలో ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్‌ వీరుడు జేసన్‌ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్‌ చక్రవర్తితో కలిసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్‌ సీఫర్ట్‌ (326 పరుగులు) ఉన్నాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 చిక్కా టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌
    సంజూ శాంసన్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇషాన్‌ కిషన్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, విల్‌ జాక్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

  • టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉండినట్లు నటించి, చివరికి హ్యాండిచ్చిన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ జట్టు తగిన బుద్ది చెప్పింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి, 'మిత్రధర్మాన్ని' నిలబెట్టుకుంది. ఫ్రెండ్‌, ఫ్రెండ్‌ అంటూ.. బంగ్లాదేశ్‌ పాక్‌ను ఇంటి​కి పిలిచి మరీ దెబ్బ​కొట్టింది.

    పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌..  నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

    పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. 22 ఏళ్ల పేసర్‌ నహిద్‌ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో పాకిస్తాన్‌పై ఓ బంగ్లాదేశ్‌ బౌలర్‌ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (5-24) ఇవే.

    పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు.

    ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీ​ం​ జూనియర్‌ డకౌటయ్యారు.

    అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (42 బంతుల్లో 67 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశాడు. 

    మరో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 4 పరుగులకే ఔటైనా.. నజ్ముల్‌ హసన్‌ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనంతరం లిటన్‌ దాస్‌ (3 నాటౌట్‌) సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ వసీం జూనియర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే వేదికగా మార్చి 13న జరుగనుంది.

     

  • టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.

    ఇక ఈ టోర్నీలో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్‌ ఖాన్‌తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.

    3rd ఏసీ టికెట్లు దొరికాయి
    ‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్‌ చేసుకున్నాం.

    నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్‌ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.

    అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.

    పోలీసులకు ముందుగానే సమాచారం
    అందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్‌లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్‌ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.

    నాలుగేళ్ల కుమారుడు అయాన్‌, రెండేళ్ల కుమార్తె మెవిష్‌లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్‌ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్‌ హీరో ట్రైన్‌లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.

    చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

  • జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. డునెడిన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ అమ్మాయిలు 200 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కెప్టెన్‌ అమెలియా కెర్‌ (106 బంతుల్లో 80), మ్యాడీ గ్రీన్‌ (73 బంతుల్లో 94) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చటోన్వాజ 2 వికెట్లు తీయగా, మకుశా, అడెల్‌, మరంగేలు తలా ఒక వికెట్‌ తీశారు. 

    అనంతరం బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే మహిళల జట్టు 27.1 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. లోరీన్‌ షుమా 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, చిపో టిరిపానో 22 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో అమేలి కెర్‌ 5 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరవగా.. రోస్‌మేరీ మెయిర్‌ 2 వికెట్లు పడగొట్టింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన అమెలియా కెర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకుంది. 

    చదవండి: భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు!

  • టీ20 ప్రపంచకప్‌ 2026 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బొక్కబోర్లా పడింది. పసికూన బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న పాక్‌.. ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

    పేసర్లు నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), స్పిన్నర్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విలవిలలాడిపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. 

    తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 

    మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీం​ జూనియర్‌ డకౌటయ్యారు.

    బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచకప్‌ నుంచి వైదొలిగే విషయంలో బంగ్లాదేశ్‌కు అండగా ఉండినట్లు నటించి, చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పాక్‌కు కూడా ప్రపంచకప్‌ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. పాక్‌ ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

    ఈ సిరీస్‌కు పాక్‌ సీనియర్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ లేకుండా బరిలోకి దిగింది. పాక్‌ జట్టుకు షాహీన్‌ అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. జట్టు మారినా, ప్లేస్‌ మారినా పాక్‌ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. ప్రపంచకప్‌తో పోలిస్తే ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. టీ20 జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అఘా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కితే అద్భుతమే.

     

     

  • కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 2001లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ చిరస్మరణీయం. నిజానికి భారత టెస్టు క్రికెట్‌లో మరిచిపోలేని కీలక ఘట్టానికి ఆవిష్కరణ జరిగిన రోజు (మార్చి 11) ఇదే కావడం విశేషం. అప్పటికే సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. 

    కోల్‌కతా వేదికగా ఆరంభమైన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరిచింది. తొలి రోజు ఆటను 236/3తో ఘనంగా ముగించిన ఆస్ట్రేలియా రెండో రోజు కూడా అదే జోరు కనబరిచింది. కానీ ఆస్ట్రేలియా ఆటలు 72వ ఓవర్‌ వరకు మాత్రమే సాగింది. 72వ ఓవర్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన హర్భజన్‌ సింగ్‌ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. వరుస బంతుల్లో పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, షేన్‌ వార్న్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

    భజ్జీ హ్యాట్రిక్‌..
    అప్పటికీ హర్భజన్‌ తన కెరీర్‌ మొదలుపెట్టి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది జరిగి 25 ఏళ్లవుతున్నా ఆ సంఘటనను మాత్రం గిల్‌క్రిస్ట్‌ ఇప్పటికీ మరిచిపోలేదనిపిస్తుంది. ‘ట్రూ కలర్స్‌’ పేరిట గిల్‌క్రిస్ట్‌ రాసిన పుస్తకంలో ఆనాటి అనుభవాలను పంచుకున్నాడు.

     ‘ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు దాదాపు 90వేల మంది ప్రేక్షకులు వచ్చారు. తొలిరోజు పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ మిచెల్‌ సాల్ట్‌, హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌ త్రయం పరుగులు రాబట్టారు. కానీ రెండోరోజు ఆటలో మాత్రం హర్భజన్‌ సింగ్‌ మాపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. పాంటింగ్, వార్న్‌లతో పాటు నా వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ నమోదు చేసిన భజ్జీ (హర్భజన్‌) మొత్తంగా మా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.

    అంపైర్ నిర్ణయంతో షాక్‌!
    కానీ ఆరోజు నేను ఎల్బీగా ఔటైన విధానం ఇప్పటికీ నా మనసు నుంచి పోవడం లేదు. హర్భజన్‌ వేసిన తొలి బంతి లెగ్‌స్టంప్‌ వెలుపల తగిలి నావైపు టర్న్‌ అయింది. అయితే దానిని నేను ఆన్‌సైడ్‌లోకి తిప్పే ప్రయత్నం చేశాను. కానీ బంతి నా ప్యాడ్‌లకు తాకి పక్కకు వెళ్లింది. నేను ఔట్‌ కాలేదన్న ధీమాతో ఉన్నప్పటికీ, హర్భజన్‌ సహా మిగతా భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఎస్‌కె బన్సల్‌ ఔట్‌ ఇచ్చాడు. 

    కానీ అంపైర్‌ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బంతి ప్యాడ్‌కు తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో చేసేదేమీ లేక వెనుదిరిగాల్సి వచ్చింది. ఇప్పుడున్న డీఆర్‌ఎస్‌ టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో ఉండుంటే కచ్చితంగా నాటౌట్‌ అనే ఫలితం వచ్చి ఉండేది.’ అని రాసుకొచ్చాడు.

    చారిత్రక విజయం..
    కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 171 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేయడమే గాక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకోవడం విశేషం. ఆనాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ వా సెంచరీతో చెలరేగగా.. హెడెన్‌, లాంగర్‌ అర్థసెంచరీలతో రాణించారు. 

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌ డబుల్ సెంచరీకి తోడు రాహుల్‌ ద్రవిడ్‌ సెంచరీతో రికార్డు స్థాయిలో 376 పరుగులు జోడించడంతో 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పని పట్టిన హర్భజన్‌  రెండో ఇన్నింగ్స్‌ లోనూ 6 వికెట్లతో దుమ్మురేపడంతో 212 పరుగులకే చాపచుట్టింది. దీంతో భారత్‌ చారిత్ర్మక విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు అటు లక్ష్మణ్‌.. ఇటు హర్భజన్‌లు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. 

    చదవండి: ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

  • భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్‌ తరఫున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. 

    మిగతా బ్యాటర్లలో తిలక్‌ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ హీరో సంజూ శాంసన్‌ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్‌-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. 

    బౌలింగ్‌ విభాగంలో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. 

    ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా, భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్‌ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.

    చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌

  • భారత మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడతారని.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవడంలో అర్థం లేదన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

    అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. తద్వారా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఐసీసీ చైర్మన్‌ జై షా స్టేడియానికి సమీపంలో ఉన్న హనుమాన్‌ ఆలయాన్ని దర్శించారు.

    కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌
    ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ‘‘టీమిండియా సిగ్గుపడు!.. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచినపుడు.. ఆ జట్టులో హిందు, ముస్లిం, సిక్కు ఉన్నారు. నాడు మేము ఆ ట్రోఫీని మాతృభూమి భారత్‌=హిందుస్థాన్‌= ఇండియాకు తీసుకువచ్చాము.

    కానీ ఇప్పటి క్రికెట్‌ జట్టు ట్రోఫీని ఎందుకిలా చేస్తోంది. మసీదు లేదంటే చర్చి లేదంటే గురుద్వారకు తీసుకువెళ్లవచ్చు కదా!.. ఈ జట్టు ఇండియా మొత్తానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇదేమీ సూర్యకుమార్‌ యాదవ్‌ లేదంటే జై షా కుటుంబానికి చెందినది కాదు.

    సిరాజ్‌ ఎప్పుడూ ట్రోఫీని మసీదుకు తీసుకువెళ్లలేదు. విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ చర్చికి తీసుకువెళ్లలేదు. ఇది 140 కోట్ల భారతీయులకు చెందినది. అంతేగానీ ఓ మతానికి చెందినది కాదు’’ అని కీర్తి ఆజాద్‌ పోస్టు చేశాడు.

     ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు
    ఈ విషయంపై స్పందించాల్సిందిగా ANI గంభీర్‌ను కోరగా.. ‘‘అలాంటి వాళ్ల మాటలకు స్పందించడం కూడా దండగే. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అతి పెద్ద సంబరం ఇది. వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన జట్టును అందరూ అభినందిస్తున్నారు.

    కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు ఆ విజయాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడతారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా జట్టులోని ఆటగాళ్లు వీటిని సీరియస్‌గా తీసుకోరు.

    సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత మా వాళ్లు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజేతలుగా నిలిచారు. అయితే, కొంతమంది మాత్రం సొంత దేశ ఆటగాళ్లను, జట్టును కించపరుస్తున్నారు. ఇది సరికాదు’’ అని గంభీర్‌ కీర్తి ఆజాద్‌కు చురకలు అంటించాడు.

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు భారీ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. శ్రీలంక స్టార్ పేస‌ర్ మ‌తీషా ప‌తిరానా గాయం కార‌ణంగా ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానాను రూ.18 కోట్ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

    అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 మ‌ధ్య‌లో గాయ‌ప‌డిన అత‌డు ఇంకా కోలుకోలేదు. పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూపు స్టేజ్ మ్యాచ్‌లో ప‌తిరాన కాలిపిక్క గాయానికి గురయ్యాడు. దీంతో అత‌డు ప్రపంచకప్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఈ జూనియ‌ర్ మలింగ తాజాగా త‌న గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.

    తాను ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నానని, కోలుకోవ‌డానికి మ‌రింత స‌మయంప‌డుతుంద‌ని బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను ప‌తిరాన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ త‌క్కువ స‌మ‌యంలో ప‌తిరాన పూర్తి ఫిట్‌నెస్ సాధించి కేకేఆర్ క్యాంపులో చేరే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. 

    ఒక‌వేళ ఇదే జ‌రిగితే కేకేఆర్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. గ‌తంలో సీఎస్‌కే త‌ర‌పున ఆడిన అనుభవం ఉన్న ప‌తిరానను, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించి కేకేఆర్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఇప్పుడు టోర్నీ ఆరంభ స‌మ‌యానికి అత‌డు కోలుకోక‌పోతే ప్రత్యామ్నాయ బౌలర్ కోసం కేకేఆర్ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఐపీఎల్‌-2026కు కేకేఆర్ జట్టు
    అజింక్య రహానే, రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, క్యామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మతీష పతిరానా , వైభవ్ అరోరా 
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్‌ కోసం నెట్స్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.  ‘ఐపీఎల్‌ 2026’ అని క్యాప్షన్‌ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్స్‌లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్‌, తలకు హెల్మెట్‌ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది. 

    కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచినప్పటికీ భారత్‌ మాత్రం 1-2 తేడాతో కివీస్‌కు సిరీస్‌ కోల్పోయింది. ఇక ఐపీఎల్‌ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో కోహ్లీ 144 స్ట్రైక్‌రేట్‌తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్‌ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్‌ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. 

    మార్చి 28 నుంచి ఐపీఎల్‌ 18వ సీజన్‌ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్‌ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్‌ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.

    చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

     

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్‌–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్‌ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.

    పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు
    కానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్‌ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్‌ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

    చార్టర్‌ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్‌ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.

    చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫ్లయిట్‌లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

    ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం 
    ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ, ప్లేయర్‌ ఆకీల్‌ హొసేన్‌ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. 

    ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.

    మేము అర్థం చేసుకోగలం
    ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.

    వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్‌ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.

    మా ఆధీనంలో లేవు
    ఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్‌ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్‌ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.

    ఇక ఐసీసీ వర్గాలు మైకేల్‌ వాన్‌ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్‌ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్‌ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.

    వారు మాత్రం ఇక్కడే
    ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ సీజన్‌ కోసం పలువురు వెస్టిండీస్‌ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్‌మన్‌ పావెల్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), రూథర్‌ఫర్డ్‌ (ముంబై ఇండియన్స్‌), హెట్‌మైర్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), రొమారియో షెఫర్డ్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.

    చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

  • టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్‌.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రం తిరుగులేని కోచ్‌ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ గెలిచిన భారత్‌.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.

    తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్‌ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌ విజయవంతమైన కోచ్‌ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

    క్రెడిట్‌ గంభీర్‌ ఒక్కడిదే కాదు!
    అయితే, భారత జట్టు వరుస విజయాల్లో..  ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంలో క్రెడిట్‌ గంభీర్‌ ఒక్కడికే కాకుండా.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్‌.

    అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్‌ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్‌ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.

    హార్దిక్‌ స్థానంలో సూర్యను ఎంపిక చేసి
    అయితే, అనూహ్య రీతిలో అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సూర్యకుమార్‌ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్‌ ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్‌ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.

    అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్‌ జోడీగా సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ అద్భుతంగా రాణించారు.

    సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్‌-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్‌ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శల వర్షం కురిసింది.

    గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం
    గిల్‌ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్‌ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్‌ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.

    ఈ విషయంలో గంభీర్‌- అగార్కర్‌ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. గంభీర్‌ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.

    కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్‌. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్‌ వాదించినట్లు తెలుస్తోంది.

    ఇషాన్‌ విషయంలోనూ..
    అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్‌ కిషన్‌.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్‌ బాల్‌ క్రికెట్‌లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.

    మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్‌ పంత్‌. ధ్రువ్‌ జురెల్‌ కారణంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్‌ కన్విన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్‌ సెలక్టర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఇటు ఇషాన్‌.. అటు సంజూ
    ఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్‌ కిషన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్‌ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్‌ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.

    ఇదిలా ఉంటే.. భారత్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత గంభీర్‌ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్‌ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

    చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

  • జస్‌ప్రీత్‌ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌తో డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ స్పెషలిస్ట్‌గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలవడమే గాక జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ సందర్భంగా డెత్‌ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.

    అహ్మదాబాద్‌ వేదికగా కిషోర్‌ త్రివేదీ క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్‌ సెంటర్‌కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్‌ పట్ల ఇంట్రెస్ట్‌ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్‌లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్‌కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్‌ వేసేవాడు. దీంతో కిశోర్‌ త్రివేది కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్‌ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. 

    కోచ్‌ మాటలు పాటించి..
    బౌన్సర్లు తగ్గించి స్వింగ్‌, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్‌గా ఎదిగే అవకాశముంటుందని కోచ్‌ కిశోర్‌ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్‌ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్‌లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్‌ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో  బౌలింగ్‌తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.

    తొలి పరిచయం!
    బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌పై అతని చిన్ననాటి కోచ్‌ కిశోర్‌ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్‌లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్‌గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్‌ బౌలింగ్‌ యాక్షన్‌. స్లో ఆర్థడాక్స్‌ను మీడియం బౌలింగ్‌కు మిక్స్‌ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్‌ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.

    ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 8మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా  బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్‌లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఘోర ప‌రాభావం త‌ర్వాత పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (PCB) క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగాంగానే బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజంను సెలెక్ట‌ర్లు త‌ప్పించారు. వ‌న్డే జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉన్న బాబ‌ర్‌ను త‌ప్పించ‌డం పెద్ద చ‌ర్చానీయంశ‌మైంది.

    దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా ఇటీవ‌ల ముగిసిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో బాబ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడుటీమ్ మేనేజ్‌మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.

    బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 22.75 స‌గ‌టుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్ర‌మంలోనే పీసీబీ సెలెక్ష‌న్ క‌మిటీ అత‌డిపై వేటు వేసింది. ఇక జ‌ట్టు నుంచి ఉద్వాస‌నకు గురైన బాబ‌ర్ ఆజం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ నుండి అత‌డు తప్పుకున్నాడు.

    కొన్నాళ్లపాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు 'జియో న్యూస్‌' తమ కథనంలో పేర్కొంది. బాబర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

    బాబర్‌ను తిరిగి మళ్లీ పాకిస్తాన్ సూపర్‌-2026 సీజన్‌లో చూసే అవకాశముంది. ఈ టోర్నీలో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఆజం వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది పీఎస్‌ఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

National

  • ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అప్పీలును జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ బెంచ్‌ నుంచి మరో బెంచ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖ రాశారు. ఈ కేసు జస్టిస్‌ శర్మనే కొనసాగిస్తే నిష్పాక్షిక విచారణ జరగకపోవచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

    ఫిబ్రవరి 27న ట్రయల్‌ కోర్టు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మరో 22 మందికి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. వారిపై ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చింది. ఆ ఉత్తర్వును సీబీఐ సవాలు చేసింది. ప్రస్తుతం ఆ విషయంపైనే జస్టిస్‌ శర్మ విచారణ జరుపుతున్నారు.

    మార్చి 9న జస్టిస్‌ శర్మ ఓ నోటీసు జారీ చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారిపై శాఖాపర చర్యలు చేపట్టాలని ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేశారు.ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులో చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పుగా ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

    అదే సమయంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఉన్న పీఎంఎల్‌ఏ కేసు విచారణను వాయిదా వేయాలని కూడా ట్రయల్‌ కోర్టుకు ఆమె ఆదేశించారు.  

    రివిజన్‌ పిటిషన్‌లో సాధారణంగా స్పందన దాఖలు చేయడానికి కనీసం 4 నుంచి 5 వారాలు సమయం ఇస్తారని కేజ్రీవాల్‌ తెలిపారు. ఇంతకు ముందు కూడా అదే న్యాయమూర్తి ఎక్సైజ్‌ పాలసీ అంశాలపై విచారణ చేసి అదే అంశాలపై ప్రాథమిక అభిప్రాయాలు వ్యక్తం చేశారని కేజ్రీవాల్‌ తెలిపారు.

  • లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. కాగా నిన్న మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడం, 8మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం, విపక్ష మహిళా ఎంపీలపై ఆరోపణలు చేయడం తదితర కారణాలతో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి మద్దతుగా 118 మంది ఎంపీలు సంతకం చేశారు. అయినప్పటీకీ అవిశ్వాస తీర్మాణానికి కావాల్సిన సభ్యుల బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు. 

  • గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు (బుధవారం) కేరళలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను కాంగ్రెస్‌ రాజకీయంగా వాడుకుంటుందని దుయ్యబట్టారు.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ  ఈ గడ్డు పరిస్థితులనూ రాజకీయం చేస్తుందన్నారు. వీటిని సైతం రాజకీయంగా వాడుకుంటుందన్నారు. యుద్ధంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని గల్ఫ్‌లో భారతీయులు చిక్కుకోవాలని కాంక్షిస్తుందని ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ బాధ్యతాయుతంగా మట్లాడుతున్నారని.. దేశ యువతపై రాహుల్‌ గాంధీకి సరైన అవగాహన లేదని మోదీ ఆరోపించారు.  

    ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దంతో భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు. మోదీ మాట్లాడుతూ " మన దేశ ప్రజలు సమస్యల్లో ఉన్న ప్రతీసారి వారిని కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇరాక్‌ సంక్షోభంలో భారతీయ నర్సులను క్షేమంగా తీసుకవచ్చాం. యెమెన్‌లో ఉగ్రవాదుల చెర నుంచి ఫాదర్‌ టామ్‌ను రక్షించాం " అని అన్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో జరుగుతున్న సంక్షోభం స్వయం సమృద్ధితి అవసరాన్ని మరింత నొక్కిచెబుతుందన్నారు.

    ఆత్మనిర్భర్‌ అవసరం 
    కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఎంత అవసరమో  ఇటీవల కాలంలో జరిగిన సంక్షోభాలు తెలియజేస్తున్నాయన్నారు. కరోనా , ఉక్రెయిన్- రష్యా యుద్దం, ఇరాన్ వార్  దాని అవసరాన్ని తెలియజేశాయన్నారు. ఆత్మనిర్భర్ ప్రారంభ సమయంలో కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు  దానిని ఎగతాళి చేశాయని ప్రస్తుతం దాని విలువ అందరికీ అర్థమైందని తెలిపారు. దేశం ఇతర దేశాలపై ఆదారపడేలా చేసిందని  ఈ రెండు పార్టీలే ఇంతకాలం భారత్‌ను వేరే దేశాలపై ఆధారపడేలా చేశాయన్నారు.  

    ఇంధన కొరతపై   
    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆదారపడడం చాలావరకూ తగ్గించుకున్నామన్నారు. ప్రత్యామ్నయ ఇంధన వనరులపై ఫోకస్ పెట్టామని తెలిపారు. పెట్రోల్, డీజీల్ దిగుమతులు తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందుకే కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులకు, వాహనాలకు ప్రోత్సహాకాలు అందిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఆయా దేశాలు తగిన రక్షణ కల్పిస్తున్నాయని అందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపారు.
     

     

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు, ఇరాన్‌ ప్రతి దాడుల మధ్య మధ్యప్రాచ్యంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది.  భారత విమాన యాన సంస్థలు , గల్ఫ్ విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాలను రద్దు చేశాయి.  

    ఫిబ్రవరి 28-మార్చి 5 మధ్య భారతదేశం-మధ్యప్రాచ్య మార్గాల్లో 1,770 విమానాలు రద్దయ్యాయి. అనేక మంది ప్రయాణీకులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్‌కు చెందిన యువ పైలట్, 23 ఏళ్ల దీపిక అధానా, UAEలో చిక్కుకున్న 169 మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రయాణీకులను సురక్షితంగా ఢిల్లీకి తిరిగి తీసుచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇంత ఉద్రికత్తతల మధ్య  విమానం బయలుదేరే ముందు "అమ్మా, బై బై. నేను తిరిగి వస్తానో లేదోనాకు తెలియదు"  అని చెప్పి మిషన్‌కు బయలు దేరడంమాత్రమే కాదు ఎన్నో సవాళ్ల మధ్య   అత్యంత సాహసంగా వ్యవహరించి సురక్షితంగా ఢిల్లీకి  చేరడం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది.  

    ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌ క్రూ రీల్‌, ఎయిరిండియా విచారణ

    ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో బాధితుల బంధువులు, అదికారులు అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.  క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన తన కూతురిని చూసి దీపికా తల్లి కూడా తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దీపికా అధానా, కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సభ్యుల బృందం ఉన్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) విమానాశ్రయం నుండి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయిన 169 మంది భారతీయ ప్రయాణికులను సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు.

    ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటీ అంటే ఈ విమానాన్ని తొలుత స్నేహితురాలు నడపాల్సి ఉంది, కానీ బయలుదేరడానికి  అకస్మాత్తుగా కేవలం రెండు గంటల ముందు, దీపికను ఆమె స్థానంలోకి  రావాలని ఆదేశాలందాయి.  ఈ బాధ్యతను అత్యంత  సాహసోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.

    ఎదురైన సవాళ్లు :  ఈ రెస్క్యూ మిషన్‌ సమయంలో ఒక దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపు నెట్‌వర్క్ ఫెయిల్యూర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది, కానీవెంటనే సంబంధాలు పునరుద్ధరించబడటంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.

    ఎవరీ దీపిక అధానా
    హర్యానాలోని ఫరీదాబాద్ (తిగావ్ ప్రాంతం) చెందిన వారు దీపిక. తండ్రి యోగేష్ అధానా (ఆర్కిటెక్ట్), తల్లి బబ్లీ అధానా.  ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా కోరిక మేరకు దీపికా పైలట్ కావాలని నిర్ణయించుకుంది. 2020లో 12వ తరగతి పూర్తి చేసిన ఆమె, కరోనా కష్టకాలంలోనూ పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది.

    ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌, యూజర్లు గగ్గోలు

  • ఎయిరిండియా విమానం గాలిలో ఉన్నప్పుడు, మాజీ క్యాబిన్ క్రూ సభ్యురాలు ఒకరు కాక్‌పిట్‌లో కూర్చోని రీల్‌ చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్  అయింది.   ప్రయాణీకుల భద్రతపై  ఆందోళన లేవనెత్తింది. దీనిపై ఎయిరిండియా  స్పందించింది. ఈ ఘటనపై  అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే..

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక మహిళ పైలట్ సీటులో కూర్చున్నట్లు కనిపిస్తుంది. కెమెరాను అద్దం (విండ్‌స్క్రీన్ )వైపు తిప్పినప్పుడు బయట మేఘాలు కనిపిస్తుండటంతో, విమానం గాలిలో ఉన్నప్పుడే ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది. విమానయాన భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.క్లిప్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ, “విమానం గాలిలో ఉంది, ఒక ఎయిర్ హోస్టెస్ కాక్‌పిట్‌లో కూర్చుని రీల్స్ తయారు చేస్తోంది. ఇది నిజంగా దీనికి అనుమతి ఉందా? ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారిని చూడటం చాలా బాధగా ఉంది అంటూ ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. అలాగే ఈ వీడియో భద్రతా నిబంధనల ఉల్లంఘనేనంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. 

    ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌, యూజర్లు గగ్గోలు

    ఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి కఠినమైన ప్రోటోకాల్‌ ఉంది. దీన్ని అధిగమించడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని క్యారియర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఎపుడు, ఎలా చిత్రీకరించారు, దీని యథార్థతను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని ఎయిరిండియా తెలిపింది, కాక్‌పిట్ ప్రవేశంపై ఎయిర్ ఇండియాకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని  ఎయిరిండియా స్పష్టం చేసింది.


    డీజీసీఏ  నిబంధనలేంటి?
    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడు కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి.ఒకవేళ పైలట్‌లలో ఒకరు విరామం కోసం లేదా అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయంలో ఒక క్యాబిన్ క్రూ సభ్యుడిని లోపలికి పిలుస్తారు. రెండవ పైలట్ తిరిగి వచ్చే వరకు ఆ క్రూ సభ్యుడు అక్కడే ఉండాలి. కొందరు నెటిజన్లు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ, బహుశా పైలట్ బయటకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారమే ఆమె లోపలికి వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై ఎయిరిండియా దర్యాప్తులో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే. 

     

  • న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో రాజకీయ సెగలు మరింతగా రాజుకున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు పదేపదే తన పేరును ప్రస్తావించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని ఆయన మండిపడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

    సభాపతి ఓం బిర్లా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఫిబ్రవరిలోనే సుమారు 118 మంది ఎంపీలు సంతకాలు చేయగా, దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు సాధారణ మెజారిటీ అవసరం. అయితే, స్పీకర్ ఎన్నడూ పక్షపాతంగా వ్యవహరించలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విపక్షంలోని 50 మందికి పైగా ఎంపీలు వ్యక్తిగతంగా తనను కలిసి, ఈ తీర్మానంతో తాము ఏకీభవించడం లేదని, కేవలం ఒత్తిడి మేరకే సంతకాలు చేశామని చెప్పారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    వంట గ్యాస్ కొరతపై..
    దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సామాన్యులకు సిలిండర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. 2019 నుంచి లోక్‌సభలో ‘డిప్యూటీ స్పీకర్’ పదవి ఖాళీగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో స్పీకర్‌పై తీర్మానం ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ సభను నడిపించేవారని, కానీ ప్రస్తుతం ఆ వ్యవస్థే లేకుండా పోయిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కాగా ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా చిక్కుకుపోయిన వెయ్యి మందికి పైగా భారతీయ మత్స్యకారులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ డిమాండ్‌ చేశారు.

    ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?
     

  • ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్‌స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో యాప్‌ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్‌స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో సందేశాలు, మీమ్స్‌తో హల్‌ చల్‌ చేస్తున్నారు.

    ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో  వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.

    యూజర్ల ఫిర్యాదులు 
    యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్‌షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్‌స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు.  మరికొతమంది నెటిజన్లు ట్విటర్‌లో తమ సమస్యను రిపోర్ట్‌ చేశారు.  “ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.

    ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట

International

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగిస్తామని అ‍న్నారు. ఇప్పటికే ఇరాన్‌లోని అన్ని లక్ష్యాలను ఛేదించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా టార్గెట్‌ చేయడానికి ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదని అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగుతుందని చెప్పారు.

    కాగా, ఇరాన్ నౌకాదళం పనిచేస్తున్న పోర్టుల దగ్గరకు వెళ్లవద్దని అమెరికా సైన్యం పౌరులను హెచ్చరించింది. ఆ ప్రాంతాల్లో భద్రతకు హామీ ఇవ్వలేమని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇరానీ డాక్ కార్మికులు, పరిపాలనా సిబ్బంది, వాణిజ్య నౌకల సిబ్బంది ఇరాన్ నేవీ నౌకలు దగ్గరికి, సమీప సైనిక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది. అమెరికా దళాలు ఇరాన్ నౌకాదళ ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్న సమయంలో యూఎస్‌ ఈ హెచ్చరిక చేసింది. ఇప్పటివరకు సుమారు 60 ఇరానీ నౌకలు ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది.

    మరోవైపు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ భీకరదాడులు చేసింది. దాడుల్లో కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ కాలికి ఫ్రాక్చర్‌, ఎడమ కంటి వద్ద గాయాలైనట్లు సమాచారం. అయితే, గత ఏడాది జరిగిన హత్యాప్రయత్నంలోనే ఖమేనీ గాయపడ్డారని ఇజ్రాయెల్‌ అంటోంది. ఇప్పటి వరకు ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ రాలేదు.  
     

  • వాషింగ్టన్‌: ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం సంక్షోభం కొనసాగుతుండగానే బుధవారం (మార్చి 11, 2026) తెల్లవారుజామున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద తీవ్ర కలకలం రేగింది. వైట్ హౌస్ సమీపంలో భద్రతా బారికేడ్లను దాటి ఒక వ్యాన్ దూసుకు వచ్చింది. పర్యాటకులు, ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని భద్రతా గేటును వ్యాన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా  ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ప్రాంతాన్ని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.

    వైట్ హౌస్‌కు ఉత్తరాన ఉన్న లఫాయెట్ స్క్వేర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని అధ్యక్ష భద్రతను నిర్వహించే సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వివరాలను పరిశీలిస్తున్నామని సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు  చెప్పారు. 

    ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌ క్రూ రీల్‌, ఎయిరిండియా విచారణ

    వైట్ హౌస్ చుట్టూ ఉన్న అనేక ప్రధాన వీధులను పోలీసులు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, నగర కార్మికులు తమ కార్యాలయాలకు రాకుండా చేశారు. ట్రాఫిక్ రద్దీ ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. పర్యాటకులు, నివాసితులు వీధులు తిరిగి తెరవడానికి వేచి ఉన్నారు. 

    ఇదీ చదవండి: అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్‌ పైలట్ ఆవేదన వైరల్‌


     

  • పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. థాయి వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దుబాయి నుంచి భారత్ వస్తున్న నౌకపై అటాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మెుత్తం 23 మంది సిబ్బంది ఉండగా ముగ్గురు గల్లంతైనట్లు తెలుస్తోంది. మయూరి బ్యాంకాక్‌ పేరుతో నౌక ఉంది. ఈ నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ నౌకలో ఏం సరఫరా జరుగుతుంది.  అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని యుఎఇలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. ఈ నౌకథాయ్ కంపెనీ ప్రెషియస్ షిప్పింగ్ పిసిఎల్‌కు చెందింది. భారతదేశంలోని కాండ్లా పోర్టుకు వెళుతూ హార్ముజ్ జలసంధిని దాటుతుండగా ఈ నౌకపై అటాక్ జరిగింది. గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వస్తుండగా ఈ దాడి జరుగగా అందులో ఉ‍న్న 20 మంది సిబ్బందిని కాపాడినట్లు ఒమన్ నౌకాదళం ప్రకటించింది.

    వ్యుహాత్మక హర్ముాజ్ జలసంధిలో లైబీరియా జెండా ఎగరేస్తూ ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఎక్స్‌ప్రెస్ రోమ్, థాయ్ బల్క్ క్యారియర్, మయూరీ నరీ అనే ఓడలు ప్రయాణిస్తున్నాయని.. వాటికి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వాటిపై దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే ఏ నౌక అయినా ఇరాన్ అనుమతి పొందాలని ఐఆర్‌జీసీ కమాండర్ అలిరేజా టాంగ్‌సిరి స్పష్టం చేశారు.  

     

     

    అయితే ఇటీవల ఇరాన్‌ నౌకలకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయినప్పటీకీ భారత్‌కు వస్తున్న నౌకలపై దాడి చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయం. కాగా హర్మూజ్ జలసంధి గుండా దాదాపు 20 శాతం చమురు రవాణా జరుగుతుంది.దీనిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. తాజాగా ఇరాన్ ఆ మార్గం గుండా ప్రయాణించిన నౌకపై దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి
     

  • టెహ్రాన్‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ భద్రతకు ఆ దేశ అధికారులు ఒక ఎలైట్ కౌంటర్‌టెర్రరిజం యూనిట్‌ను నియమించినట్లు సమాచారం. మొజ‍్తాబా తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో హతమైన విషయం తలిసిందే. ఆ తర్వాత ఎవరైనా సుప్రీం లీడర్‌ పదవిలో నియమితమైతే వారిని కూడా ఖతం చేస్తామంటూ ఇజ్రాయెల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో మొజ్తాబా భద్రత విషయంలో ఇరాన్‌ మరిన్ని చర్యలు తీసుకుంటోంది.  

    కొత్త సుప్రీం లీడర్‌ భద్రతకు ‘నోపో’
    అమెరికా మీడియా నివేదికల ప్రకారం.. బ్లాక్‌ దుస్తులు ధరించే కౌంటర్‌టెర్రరిజం స్పెషల్ ఫోర్స్ ‘నోపో‘ను మొజ్తబా భద్రత కోసం నియమించారు. “అలీ ఖమేనీ లేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మొజ్తబా ఖమేనీ రక్షణ బాధ్యతలను నోపో చేపడుతుంది” అని అమెరికా మీడియా తెలిపింది. పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ విదేశాంగ కమిటీ అధికారి అలీ సఫావీ వ్యాఖ్యలను కూడా ఆ నివేదికలో పేర్కొంది.

    నోపో అంటే?
    నోపో అనేది ఫార్సీ సంక్షిప్త రూపం “నిరూయె విజెహ్ పాస్దారాన్ వెలాయత్”. దీని అర్థం “సుప్రీం లీడర్ రక్షణ ప్రత్యేక దళం”. ఇరాన్‌లో నోపో ఫోర్స్ 1991లో ఏర్పడింది. ఇది స్పెషల్ యూనిట్స్ కమాండ్ అధీనంలో పనిచేసే ఇరానీ ఎలైట్ రయట్ పోలీస్ యూనిట్. ఇరాన్ పోలీసింగ్ వ్యవస్థలో అత్యుత్తమ ప్రత్యేక దళంగా భావిస్తారు.

    బాగా శిక్షణ పొందిన దళంగా దీనికి గుర్తింపు ఉంది. 1999లో విద్యార్థుల నిరసనలు, 2019లో అల్లర్లు, మహ్సా అమినీ నిరసనల సమయంలో వాటిని బలవంతంగా అణచివేయడంలో నోపో కీలక పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు కూడా వచ్చాయి. 

    కాలక్రమంలో ఈ దళం మరింత ప్రత్యేక శిక్షణ పొందిన యూనిట్‌గా నోపో మారింది. ఇది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దళంలో కాకుండా వేరుగా పనిచేస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ రక్షణకు ఏర్పాటు చేసిన సైనిక దళం. నోపోలో మొత్తం 6 బ్రిగేడ్లు ఉన్నాయి. వాటిలో 4 టెహ్రాన్‌లో, ఒకటి మష్హద్‌లో, ఒకటి ఇస్ఫహాన్‌లో ఉన్నాయి.

    ఈ దళం ఐఆర్‌జీసీ కంటే మరింత బాగా పనిచేస్తుంది. ఖమేనీ రక్షణకు ఈ దళాన్ని వాడుతున్నారు. ఇతర భద్రతా దళాలపై ఆయనకు నమ్మకం లేదని అమెరికా మీడియా పేర్కొంటోంది. అలీ ఖమేనీ హత్య సమయంలో నోపో సభ్యుల్లో కొందరు మరణించి ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆ దళం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. సంక్షోభ సమయంలో, జనవరి తిరుగుబాటు సమయంలో నిరసనకారులపై కాల్పులు జరిపిన దళం ఇదే.
     

  • ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుండి పుకెట్‌కు బయిలుదేరిన ఎయిర్‌ఇండియా విమానం పుకెట్‌ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. రన్‌వే పై దిగుతుండగా విమానం యెుక్క ముందు చక్రం ఊడింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

    విమాన ప్రమాదంతో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. బోయింగ్ 737 మాక్స్ 8 అయితే విమానం హర్డ్ ల్యాండింగ్ అవడంతోనే ప్రమాదం జరిగిఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 133 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందరిని క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు

    అయితే ఈ ప్రమాదంపై ఎయిర్‌ఇండియా స్పందించింది. " హైదరాబాద్-ఫుకెట్ విమానంలో ముందుభాగంలోని చక్రంలో సమస్య ఎదురైంది. అనంతరం సిబ్బంది తక్షణమే స్పందించి ప్రయాణికులను విమానం నుండి దింపారు. ఈ ప్రమాద సమయంలో సహకరించినందుకు, ప్రయాణికులతో పాటు ఫుకెట్ విమానాశ్రయ అధికారులకుకృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటనలో  విడుదల చేసింది.

    అయితే ఇటీవల తరచుగా విమాన ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాయాన సంస్థలు ప్రయాణానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

  • బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్‌)తన దాడులను మరింత ఉధృతం చేసింది. బుధవారం ఉదయం బీరుట్‌లోని దహీహ్‌ ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండ్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులను విజయవంతంగా పూర్తి చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

    దీనికిముందు బీరుట్‌తో పాటు లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో కూడా ఐడిఎఫ్ మెరుపు దాడులు చేపట్టింది. అక్కడి హిజ్బుల్లా ప్రధాన కమాండ్ సెంటర్‌ను వైమానిక దాడుల ద్వారా ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ భూభాగంపై  దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద ముఠాల ఆటకట్టించడమే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

    ఈ దాడుల సమయంలో పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఐడిఎఫ్ గరిష్ట జాగ్రత్తలు తీసుకుంది. దాడులకు ముందే పౌరులను హెచ్చరించడం,  లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మందుగుండు సామగ్రిని ఉపయోగించడం, నిరంతర వైమానిక నిఘా తదితర చర్యల ద్వారా పౌర హానిని తగ్గించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బుల్లా వ్యూహాలను తిప్పికొట్టేలా ఈ దాడులు సాగాయని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

    ఇజ్రాయెల్ పౌరుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, దేశవాసులకు హాని కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించబోమని ఐడిఎఫ్ పునరుద్ఘాటించింది. ఇరాన్ పాలన ప్రోద్బలంతో హిజ్బుల్లా తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఉగ్రవాద నిర్మూలనపై తాము గట్టి సంకల్పంతో ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరోమారు స్పష్టం చేశాయి. 

    ఇది కూడా చదవండి: ‘ఎన్‌సీఈఆర్‌టీ’ వివాదంలో మరో మలుపు

Family

  • ఈరోజుల్లో కూడా అమ్మాయి పెళ్లి విషయంలో కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి ఏవిధంగా ఉందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి శిరోముండనం చేయించుకుంది. కాజల్స్‌ మూవ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో తన ఆవేదనను పంచుకుంది. 

    ‘అందరు అమ్మాయిల్లాగే నాకు కూడా నా జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ, ప్రతిరోజూ ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి వస్తున్న ఒత్తిడి, చుట్టుపక్కల వారి మాటలు భరించలేకపోయాను. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని ఆమె తెలిపింది. 

    ఈ సందర్భంగా ఆ యువతి సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై, వివక్షపై గళమెత్తింది. మగవారు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే పట్టించుకోని ఈ సమాజం, ఒక మహిళ తన రూపం గురించి, తన జీవితం గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఎందుకు వేలెత్తి చూపుతుంది.. 

    పెళ్లి ప్రస్తావన లేకుండా ఒక మహిళను తన స్వంత కాళ్లపై నిలబడనివ్వరా.. ప్రతిదానికీ ఒక టైమ్‌ లైన్‌ ఉండాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం.. అంటూ ప్రశ్నించింది. తాను ఈ వీడియోను ఎవరి సానుభూతి కోసం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తనలాగే పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేలాది మంది యువతుల్లో ధైర్యం నింపడమే తన ఉద్దేశమని తెలిపింది. ‘జీవితం ఒక్కటే.. అది చేజారిపోయాక ఎవరూ వచ్చి మనకేం కావాలని అడగరు. 

    కాబట్టి, మీ కలల కోసం, మీ జీవితం కోసం పోరాడండి’ అని ఆమె పిలుపునిచ్చింది. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొంతసమయానికే 3.7 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తమ జీవితాలను తామే శాసించుకోవాలనుకునే మహిళలకు నువ్వు ఒక స్ఫూర్తి, అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, సమాజంపై ఒక తిరుగుబాటు అని మరొకరు రాసుకొచ్చారు. 

     

    (చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

  • కర్నాటకలో కదలిక మొదలయ్యింది. సినీ వేడుకలలో, ప్రయివేట్‌ ఫంక్షన్స్‌లో మహిళా సెలబ్రిటీలను, హీరోయిన్‌లను అభ్యంతరకరమైన యాంగిల్స్‌లో వీడియోలు తీసి రీల్స్‌గా సొమ్ము చేసుకుంటున్న పాపరాజిల మీద ప్రతిఘటన ప్రారంభమైంది. ‘మమ్మల్ని ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్దేశిస్తున్న వారు మా శరీరాన్ని అభ్యంతరకరంగా చూపుతున్నపాపరాజిలను ఎందుకు నిరోధించడం లేదు?’ అని అడుగుతున్నారు. కన్నడ తారలు రుక్మిణి వసంత్, సప్తమి గౌడ, అషిక రంగనాథ్‌ ఈ చర్చను లేవదీశారు. వివరాలు...

    ఒక వృత్తిని సక్రమంగా చేసేవారు ఎందరో ఉంటారు. అదే వృత్తిని వక్రమార్గంలో చేస్తూ డబ్బు గడించాలని చూసేవారు కొందరు ఉంటారు. ఇలాంటి వారి వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వచ్చే సందర్భం ఉంటుంది. సినీ ప్రపంచంలో తారల కార్యక్రమాల ప్రచారానికి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అవసరం. వారు తీసే ఫొటోలు, వీడియోల వల్ల తారలు పాల్గొన్న కార్యక్రమాలు తెలుస్తాయి. తమ అభిమాన తారలను ఆ విధంగా చూసి జనం సంతోషపడతారు.

    ఇక్కడి వరకు ఎవరికీ అభ్యంతరం లేదు.
    అయితే ఇటీవల తారల కార్యక్రమాల కవరేజ్‌కు వచ్చేవారి కన్నా వారు తమ కెమెరాలకు ఎక్కడ దొరుకుతారా ఏ అసభ్య యాంగిల్‌లో వారిని తీసి ఆ వీడియోను సొమ్ము చేసుకుందామా అనేవారు ఎక్కువగా తయారయ్యారు. వీరిని పాపరాజిలు అంటారు. ఇటీవల ఫోన్లలో రీళ్లు చూస్తున్నవారికి ఈ అసభ్య వీడియోలు తెలియనివి కావు. తారలు నడిచి వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వేదికలు ఎక్కుతున్నప్పుడు లేదా డాన్సులు చేస్తున్నప్పుడు కెమెరాను అనవసర భంగిమల్లో ఉంచి వారి శరీర కదలికలను స్లోమోషన్‌ చేసి రీల్స్‌గా విడుదల చేస్తున్నారు. 

    వీటికి వ్యూస్‌ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు తారలు జిమ్, యోగా, ఎక్సర్‌సైజులు చేయడానికి వచ్చే సెంటర్‌ల దగ్గర కాపుకాచి వారు అందుకై వేసుకు వచ్చే దుస్తుల్లోనే వారిని అనుమతి లేకుండా వారి ఫొటోలు షూట్‌ చేసి వదులుతున్నారు. రాను రాను ఈ పాపరాజి బెడద ముదిరి బాలీవుడ్‌లో జయభాదురి లాంటి వాళ్ళు బహిరంగంగా నిరసన తెలుపుతుంటే ఇప్పుడు శాండల్‌వుడ్‌ (కన్నడ పరిశ్రమ)లో ఆ నిరసన మొదలైంది.

    గతంలో నిరసనలు
    2014లో దీపికా పడుకోన్‌ ఛాతీని ఒక దినపత్రిక అసభ్యరీతిలో ప్రచురిస్తే ఆమె ఎక్స్‌లో ప్రతిస్పందించారు. ‘నేను స్త్రీని. నాకు వక్షం ఉంటుంది. మీకేంటి సమస్య’ అని రాశారు. నోరా ఫతేహి, నేహా భాసిన్‌ వంటి తారలు కూడా పాపరాజిలను వ్యతిరేకించారు. అయితే పాపరాజిలు కూడా ఎదురు బెదిరింపులు చేస్తారు. ‘మీ కవరేజ్‌కు రాము’ అని బాయ్‌కాట్‌కు సైతం వెనుకాడటం లేదు. వీరి బెడద ఎక్కడి దాకా వెళ్లిందంటే ‘సంసారపక్షంగా దుస్తులు వేసుకొని తారలు వచ్చే వేడుకకు మేము వచ్చి చేసేదేముంది’ అనేవరకు వెళ్లారు. దాంతో సినిమాల పబ్లిసిటీ కోసం ట్రెండీ దుస్తులు వేసుకొని తారలు రావడం, పాపరాజిలు వారిని వక్రంగా చిత్రీకరించడం కొనసాగుతోంది.

    సప్తమి గౌడ ప్రశ్న
    ‘బహిరంగ కార్యక్రమాలలో నటీమణుల వీడియోలు, చిత్రాలను అనుచిత యాంగిల్స్‌లో తీయడం ఏం పద్ధతి?’ అని  కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్‌ సప్తమి గౌడ తాజాగా ప్రశ్నించారు. అలా తీసిన చిత్రాలను వైరల్‌ చేసి, వారి శరీరాలను ప్రదర్శించే హక్కు ఎవరిచ్చారని అడిగారు. ‘ఇటువంటి పని చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. కొందరు పోటీ పడి మరీ ఇటువంటివి చేస్తున్నారు. వీటిని ఇప్పుడే ఖండించకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈవెంట్‌లను కవర్‌ చేసే వారు వారి మర్యాదను కాపాడుకుంటే బాగుంటుంది’ అని ఆమె అన్నారు. 

    సప్తమి గౌడ మాటలకు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమెకు సపోర్టుగా కన్నడ పరిశ్రమకు చెందిన ఇద్దరు తారలు రుక్మిణి వసంత్, అషిక రంగనాథ్‌ కూడా ముందుకొచ్చి మాట్లాడారు. ‘సెలబ్రెటీలు మార్నింగ్‌ వాక్, జిమ్, బంధువుల ఇళ్లు, ఫంక్షన్లు, ఎయిర్‌పోర్ట్‌... ఇలా ఎక్కడికి వెళ్లినా వారిని అనుసరిస్తూ, వెంటపడుతూ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. సెలబ్రెటీల చిత్రాలకు సోషల్‌ మీడియాలో పాపులారిటీ దక్కడం, వాటిని కొన్ని పేజీలు డబ్బులిచ్చి కొనుగోలు చేయడం వంటి కారణాలతో ఈ ‘పాపరాజీ’ల పని కొనసాగుతోంది’ అని వారన్నారు. 

    ‘మమ్మల్ని ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్తున్నారుగానీ వీరెందుకు ఇలా మమ్మల్ని అసభ్యంగా తీస్తున్నారో ప్రశ్నించరేం?’ అని నిలదీస్తున్నారు. కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈ విషయమై స్పందించాలని, కెమెరామెన్‌లకు నియమ నిబంధనలు విధించాలని కోరుతున్నారు. ఇలాంటి వీడియోలు ఫేక్‌ అకౌంట్స్‌ను నుంచి చలామణి అవుతుండటం వల్ల విచ్చలవిడితనం ఎక్కువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
     

    (చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

  • ఇళ్లల్లో రోజువారీ వంటచేసేది మహిళలే అయినా, బయట మాత్రం పాకనిపుణులుగా పురుషులే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ షెఫ్‌లుగా పేరుపొందిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నా, నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి.  ఈ రంగంలోకి మహిళలు మరింతగా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు షెఫ్‌లుగా రాణిస్తూ ఉన్నా, ఈ రంగంలో మహిళా షెఫ్‌ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌ని అయినా, అమెరికాలో ఉన్నప్పుడు అనివార్యంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

    క్రమంగా వంటలపై ఆసక్తి పెరిగి, షెఫ్‌గా మారాను. మాది అనకాపల్లి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఆర్క్, ఐఐటీలో ఎంఆర్క్‌ చేశాను. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి నాకు వంటపై ఆసక్తి పెరిగింది. ఇండియాకి తిరిగి వచ్చేశాక ఒకవైపు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తూనే, మరోవైపు హోమ్‌ షెఫ్‌గా షెరటాన్, మేరియట్‌లాంటి హోటళ్లలో; ఇంట్లో ఓనం సధ్యలాంటివి హోస్ట్‌ చేయడం మొదలుపెట్టాను. 

    పలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో తెలుగు వంటల ఈవెంట్స్‌ చేశాను. ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అమ్మాయినని చిన్నచూపు చూసేవారు. వెళ్లిన ప్రతిచోటా అమ్మాయిలు షెఫ్‌గా ఉన్నా, తొక్కేయాలనే చూస్తారు. అయితే, నా ప్రతిభా సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది.
    మీరా గిరిజ తాడిమేటి షెఫ్‌

    వివక్ష ఇంకా పోలేదు..
    అది 2000 సంవత్సరం. నేను వరంగల్‌లో ఒక గవర్నమెంట్‌ స్కూల్‌లో ఆడపిల్లలకు క్లాస్‌ చెబుతున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నా క్లాస్‌లోకి అడుగుపెట్టింది. ఏమైందని అడిగితే, కాలి మీద కాల్చిన వాత చూపించింది. గిన్నెలు కడగలేదని వాళ్ల నాన్న పొయ్యిలోని కట్టె తీసి కాల్చాడని చెప్పింది. వెంటనే అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆడపిల్లను అలా కాలుస్తావా?’ అని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన చాలా క్యాజువల్‌గా ‘తప్పేముంది, పని చేయకపోతే ఆడపిల్ల ఎందుకు?’ అని అడిగాడు. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో వివరంగా చెప్పాను. చివరకు తప్పయిందని ఒప్పుకున్నాడు. ఇకపై స్కూలుకు పంపిస్తానని చెప్పాడు. 

    ఈమధ్య నేను గోవాకు వెళ్లాను. అక్కడ బీచ్‌కి వెళ్లాం. నాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తండ్రి పదేళ్ల పాపను తిడుతూ, కాళ్లతో వెనకవైపు తంతున్నాడు. నేను వెళ్లి ఆ తండ్రిని అడిగేలోపే జనంలో కలిసిపోయారు. ఇన్నాళ్లలో ఆడపిల్లల జీవితాలు ఏమీ మారలేదు కదా అనిపించింది.
    నేను గత 26 సంవత్సరాలుగా ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నా సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లలపై వివక్ష, భ్రూణహత్యలు, ఎనీమియా, పౌష్టికాహార లోపం, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆడపిల్లలపై అత్యాచారాలు తదితర ఎన్నో అంశాలపై పనిచేయాల్సి వచ్చింది. 

    ఆడపిల్లలను వద్దనుకుని, చెత్తకుండీలలో పడేస్తున్నప్పుడు ఆస్పత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ‘తరుణి’ ఊయలలు పెట్టి, ఆడపిల్లలను రక్షించగలిగాం. ఎన్నో వేల బాల్యవివాహాలను ఆపగలిగి,ఆ ఆడపిల్లలను మళ్లీ చదువులో పెట్టగలిగాం. మేం 2004లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో వేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా బాల్యవివాహ నిరోధక చట్టం–2006 వచ్చింది. 

    బాలికలపై లైంగిక అత్యాచారాలను నిరోధించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ పోలీసులతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగాం. హైదరాబాద్‌లో మొదలైన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు 33 జిల్లాలకూ విస్తరించాయి. అత్యాచార బా«ధితులైన బాలికల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం చూసి, వారి కోసం తరుణి స్వావలంబన రీహాబిలిటేషన్, స్కిల్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో రెండేళ్లుగా నడుపుతున్నాం.

    మహిళల్లో కూడా దురలవాట్లు, సంపాదించగలమనే ధైర్యంతో బాధ్యతారాహిత్యం పెరిగాయి. మహిళల్లో పెరిగిన దురలవాట్లను మాన్పించడానికి ‘సాంత్వన’ డీఅడిక్షన్‌ సెంటర్, అలాగే చంచల్‌గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీఅడిక్షన్‌ సెంటర్‌ నడుపుతున్నాం. లింగవివక్షను రూపుమాపడానికి మా సంస్థ తరఫున ‘సమదృష్టి’ అనే వేదికను నిర్వహిస్తున్నాం. తరుణి సంస్థ పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులలో ఎక్స్‌టర్నల్‌ మెంటర్‌గా అంతర్గత కమిటీలలో పనిచేస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 
    డాక్టర్‌ ఆచంట, మమతా రఘువీర్‌, తరుణి స్వచ్ఛంద సంస్థ 

    వంటల పుస్తకం రాసిన తొలి మహిళ 
    అనా వెకర్‌. జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన అనా, 1596లో ‘న్యూ డిలైట్‌ఫుల్‌ అండ్‌ యూజ్‌ఫుల్‌ కుక్‌బుక్‌’ రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇళ్లలో రోజువారీ వండుకునే వంటకాలు, ప్రత్యేక వంటకాలు, వంటకాల రుచిని పెంచే చిట్కాలను ఇందులో విపులంగా రాశారు. వంటకాల రచన మాత్రమే కాకుండా, అనా వెకర్‌ అరుదుగా కొన్ని కవితలు కూడా రాశారు.

    నిర్మలా రెడ్డి

    (చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!)

  • స్త్రీవాదం ఒక ఉద్యమంగా మొదలై దశాబ్దాలు గడచి, స్త్రీలు ఓటింగ్‌ హక్కు సంపాదించుకుని శతాబ్దం దాటి, ప్రపంచమంతా స్త్రీల సాధికారతపై ప్రతి ఏటా మార్చి 8 న గొంతులు చించుకునే సందర్భంలో– ఈ 21 వ శతాబ్దంలో, జెన్‌ జీల  కాలంలో– ఫ్రాన్స్‌లో ఒక భర్త తన భార్యకు మత్తుమందిచ్చి, తను రేప్‌ చెయ్యడమే కాక మరెందరో స్నేహితుల చేత ఆమెను కొన్ని ఏళ్ల పాటు రేప్‌ చేయిస్తాడు; 

    ఒక మాజీ భర్త, తనకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుని 4 నెలల గర్భం దాల్చిన భార్యను నరికి చంపేస్తాడు. ప్రపంచనాయకత్వం ప్రకటించుకునే దేశంలో, మరింత గొప్ప వలసాధిపత్య దేశం రాజకుమారుడు, బాలికలపై ఏళ్ల తరబడి అత్యాచారం చేస్తాడు. అక్కడిదాకా ఎందుకు? యూట్యూబ్‌ ఛానెల్‌ నడిపే ఆడపిల్లలను ట్రోలింగ్‌తో మానసిక హింసకు గురిచేయడం తన జన్మహక్కు అనుకుంటాడు సగటు తెలుగు మగోడు; ఇక మన అగ్రేసర తెలుగు నటుడు, ‘థప్పడ్‌’ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా నాయికను లాగి చెంపదెబ్బ కొడతాడు; ఇంకో సూపర్‌ స్టార్‌ కొడుకు కమ్‌ అందాల హీరో దాదాపు ప్రతి సినిమాలోనూ తన నాయికను చెంపదెబ్బలు కొట్టందే ప్రేమించలేడు.

    జీవితంలోనూ, కళలోనూ కూడా అదే హింస. కాని, మనం మాత్రం స్త్రీలు చాలా చాలా ప్రగతి సాధించారు. రాజ్యాలేలుతున్నారు; బిజినెస్‌ టైకూన్లు అయ్యారు; పార్లమెంటులో గొంతు వినిపిస్తున్నారు. పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు; అంతర్జాతీయ సమావేశాల నుంచి తమకు నచ్చకపోతే వాకౌట్లు చేస్తున్నారు– అని పొంగిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే, స్త్రీలకట... స్వేచ్ఛ ఎక్కువైంది. కనక భర్తలను హతమారుస్తున్నారు; యూట్యూబ్‌లో రెచ్చిపోయి మగవాళ్లను ఆడిపోసుకుంటున్నారు. 

    ‘అసలు స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది’ అని బాధపడిపోయే జనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? 19 వ శతాబ్దిలో మొదలైన స్త్రీల అస్తిత్వ పోరాటాలు సత్ఫలితాలను ఇచ్చాయని, అందుకే ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనీ పొంగిపోదామా? ఎందరో స్త్రీలు గృహహింసకు ఇప్పటికీ గురవుతూండగా, దొంగ కట్నం కేసులతో అత్తారింటివారిని జైళ్ళకు పంపుతున్న కొంతమంది స్త్రీల అవివేకానికి ఎక్కువ ప్రచారం వస్తోందని బాధపడదామా? ఎందరో భర్తలు అతి చిన్న కారణాలకు భార్యలను హతమారుస్తున్న రోజుల్లో, కొందరు భార్యలు భర్తలను, తాగుడు భరించలేకో, మరెందుకో హతమారుస్తున్నందుకు వారిపై తీర్పులు చెప్దామా? మరోవైపు, తమ తల్లులు ఊపిరాడనివ్వని బంధనాల నుంచి విముక్తి కోసం ఎంతగా పోరాడారో తెలిసి కూడా, తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్న ఆడపిల్లలను చూసి జాలి పడదామా? ఈ రోజున మహిళా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవడం ఎప్పటికంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. 

    రోజురోజుకీ ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి, సమాధానాలు అంత సులభంగా దొరకడం లేదు. ప్రపంచమంతా స్వార్థపూరితమైపోతున్న వేళ, ప్రపంచమంతా ఒక మార్కెట్‌గా, లాభనష్టాలే అసలైన విలువలవుతున్న వేళ, ఎవరికీ తమ ప్రయోజనాలు తప్ప, ఏ విలువల పట్లా ఏ నిబద్ధతా, ఏ అంకితభావమూ లేకుండా పోతున్న వేళ– సమాజాన్ని కాస్తంత మానవీయం చేయడానికి స్త్రీలు మాత్రమే కాదు; వారితో పాటు పురుషులు ఏం చెయ్యగలరో ఆలోచించడం ఇప్పటి అవసరం.
    మృణాళిని, సాహితీవేత్త

    తొలి నవలా రచయిత్రి
    ప్రపంచ సాహిత్యంలో తొలి నవలా రచయిత్రి మూరాసాకీ షీకీబు. జపాన్‌ రాజాస్థానంలో రాచ మహిళలకు సహాయకురాలిగా పనిచేసేది. పదకొండో శతాబ్దిలోనే ఆమె ‘గెంజీ మోనోగటారి’ (ది టేల్‌ ఆఫ్‌ గెంజి) నవల రాసింది. ఆమె ఈ నవల రాసేనాటికి ప్రపంచంలోని మరే భాషలోనూ నవలా పక్రియ రూపుదిద్దుకోలేదు. ఈ నవలను మూరాసాకీ షీకీబు క్రీస్తుశకం 1010–1021 కాలంలో రాసి ఉంటుందని చరిత్రకారుల అంచనా. 

    అప్పట్లో జపాన్‌లో చైనీస్‌ భాష రాచభాషగా ఉండేది. హెలాన్‌ రాచమహిళలు చైనీస్‌ భాషను నేర్చుకోరాదనే నిషేధం ఉండేది. అయినా మూరాసాకీ తన తండ్రి ద్వారా చైనీస్‌ భాషను నేర్చుకుని, ఆ భాషలోని మేలి రచనలు చదువుకుంది. చైనీస్‌ సాహిత్యాధ్యయనం వల్ల అబ్బిన పరిజ్ఞానానికి తన సృజనాత్మకతను జోడించి, జపానీస్‌ భాషలో నవల రాసింది. ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలి నవలగా పరిశోధకులు పరిగణిస్తారు.

    నిలదీతలో పదునెక్కుతున్నామా?
    ఏటా జరుపుకొనే మహిళా దినోత్సవమే. ఆ ప్రాతిపదికన మహిళలుగా మన ఆలోచనలను మెరుగుపరచుకునే దిశగా చూస్తున్నామా? సమాజంలో గుర్రపుడెక్కలా అల్లుకుపోయిన మూఢత్వాన్ని, అశ్లీలతనీ, హింసను నిలదీయటంలో పదునెక్కుతున్నామా? మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇటువంటి ప్రశ్నలకు ‘అవును’ అని చెప్పుకోవాలంటే అందుకు భూమికలు ఏవి; కాదు అని తలవాల్చుకునేట్లయితే, కారణాలు వెతికి పట్టుకుని పరిష్కారాలు ఏవి అని ఆలోచించవలసి వుంటుంది.

    భిన్న రంగాల్లో దూసుకుపోతున్న అమ్మాయిల తెలివితేటల్ని, చొరవను, ఆర్థికస్వేచ్ఛను– వీటన్నిటి ఫలితమైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, నిర్ణయాత్మకతను– మగపిల్లలు సహించలేకపోతున్న స్థితి రాజ్యమేలుతున్నది. భారతదేశానికి గర్వకారణమైన క్రీడాకారిణి మిథాలీ ఏమన్నదో గుర్తున్నదా! తనకు ఎదురైన పెళ్ళి ప్రతిపాదనలలో ఒకరు ‘అత్తగారిని చూసుకోవాలి’ అన్నారు. (అది తప్పు కాదు– కానీ ఒక రంగంలో శిఖరస్థాయికి చేరిన వ్యక్తిని, కేవలం మహిళ అయిన కారణంగా, షరతులతో బంధించాలని చూడటం నేరం.) మరొకరు, ‘వేరే వ్యాపకం వద్దు– ఇల్లు, పిల్లల్ని చూసుకోవాలి‘ అన్నారని చెప్పిన మిథాలీ, ‘కనీసం ముందే చెప్పినందుకు వాళ్ళకి థాంక్స్‌‘ అన్నది. ఇటువంటి అనుభవాలే ఎందరో మహిళా డాక్టర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలవి! అంటే తమకు ఏమి కావాలో నిర్ణయించుకోగల స్థాయిలో ఆధునిక యువతులు వుండగా, న్యాయమైన వారి ఆశలు ఆకాంక్షల్ని సహించలేని యువకులూ మన ముందే కనిపిస్తున్నారు.

    ప్రేమ, పెళ్ళి వంటి సొంత వ్యవహారాలలో తమ ఎంపిక, తమ నిర్ణయమే చెల్లాలనే అబ్బాయిల ధోరణి వల్ల తెల్లవారి లేస్తే దినపత్రికల నిండా ఏకపక్షపు ప్రేమ(!)వంటివాటి దుష్ఫలితాల్ని చూస్తున్నాం. అయితే స్వార్జన, స్వేచ్ఛ వల్ల అందరమ్మాయిలలోనూ వ్యక్తిత్వ పటిష్ఠత ఏర్పడటం లేదు. ఇప్పటికీ ప్రేమ పేరిట వంచనకు, అఘాయిత్యాలకు, ఆధునిక సాంకేతికత పుణ్యమా అని బ్లాక్‌ మెయిలింగ్‌ వంటి ద్రోహాలకూ అమ్మాయిలు ఆస్కారం ఇస్తుండటం విషాదకరం. తన ప్రేమికుడు వేరొక అమ్మాయితో సాన్నిహిత్యం వెలగబెడుతుంటే అతన్ని ఛీత్కరించి దూరంపెట్టవలసింది పోయి, ‘అతను నావాడు... నువ్వు పో’ అంటూ ఆ రెండో అమ్మాయి మీద దాడి చేయటం చూస్తున్నాం. 

    మరోపక్క ఆధునిక ఉద్యోగ జీవితాలు, నిరంతరం కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక సౌకర్యాల వల్ల వెర్రితలలు వేస్తున్న ప్రలోభాలు మనుషుల్ని నిలవనివ్వక వ్యామోహాలపాలు, తత్ఫలితంగా నేరాలపాలు చేస్తున్నాయి. సరైన పెంపకం, మొక్కగానే వంచి బుద్ధులు చెప్పే సంస్కృతి నానాటికీ కొరవడుతున్నప్పుడు ఆడ, మగపిల్లలు శారీరక ఉద్వేగాలకు, ఉద్రేకాలకు,  మానసిక ఘర్షణలకు లోనుకావటమే జరుగుతుంది. ఇరవైల వయసులోనే ఉద్ధృతమైన సంపాదనలతో విలసిల్లుతున్న నేటి అమ్మాయిలు, అబ్బాయిలకు మందలింపులు అటువుంచి– సలహాలు ఇచ్చేందుకూ పెద్దలు భయపడుతున్నారు కదా! 

    ఈ సామాజిక సామూహిక విషమస్థితికి అంతర్జాల విషాలగాలం ముఖ్యకారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి. యువతీ యువకులకే కాక, కౌమార దశలో వున్న పిల్లలకు– ముఖ్యంగా బాలికలకు అంతర్జాలపు కత్తిఅంచు ప్రాణాంతకమవుతున్నది. గర్భాలతో ప్రాణాల మీదకు తెచ్చే అశాస్త్రీయ గర్భస్రావాలతో మన నగరాలు, పల్లెలు ఒక్కలాగే అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పూర్ణ వంటి అట్టడుగు సామాజిక స్థాయినుంచి వచ్చిన బాలికలు పర్వతారోహణ, క్రీడలు, శాస్త్రవిజ్ఞానం, కళలు, అంతరిక్షయానాల వంటి విభిన్న రంగాల్లో వజ్రాల్లా ప్రకాశిస్తుంటే, మరోవైపు జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న బాలికలు, యువతులు, మహిళలు కొల్లలుగా కనిపిస్తూండటం బాధాకరం.

    ఇప్పటికీ మహిళలు గృహహింసకు గురవుతూనే వున్నారు. భార్యా పిల్లల్ని, ‘ఎముకలు విరిగేలా లేదా రక్తస్రావ మయ్యేలా కొడితే మాత్రమే‘ నేరమని, అదైనా ‘నిరూపించబడితేనే శిక్షార్హ’మని, ఆ శిక్ష కూడా గరిష్టంగా పదిహేనురోజులని చట్టం చేసిన తాలిబన్‌ రాజ్యం మన పొరుగునే ఉన్నది. ‘శారీరకంగా చొరబడకుండా కేవలం స్ఖలనం జరిగితే అత్యాచారం కాదు’ అని వాకృచ్చే న్యాయస్థానాలు మన దేశంలోనే ఉన్నాయి! ఇప్పటికీ కొందరు రాజకీయనాయకుల దృష్టిలో ‘రేప్‌’ అంత పెద్ద నేరం కాదు!

    మౌలికంగా మన ఇళ్ళలో ఆడ, మగ పిల్లల పట్ల సమదృష్టి, సమధోరణిలో వాళ్ళ పెంపకం, లింగవైవిధ్యం పట్ల శాస్త్రీయదృష్టి ఏర్పరచుకునే దిశగా ప్రోత్సాహం, విజ్ఞానం సద్వినియోగం పట్ల అవగాహన పెంపుదల, మనుషుల మధ్య లింగవివక్షతో సహా– ఎటువంటి విభజనలైనా కేవలం కృతకమైనవనే వాస్తవాలను బోధించే సంస్కారం, వివేచన పాదుకున్నప్పుడే నేటి సామాజిక రుగ్మతలబారి నుంచి తల్లులు, చెల్లెళ్ళు, యావత్‌ మానవజాతి బయటపడేందుకు దారులు ఏర్పడతాయి. 
    ఘంటశాల నిర్మల కవయిత్రి, సీనియర్‌ జర్నలిస్ట్‌

    ఆఖరి మైలు వరకు నడవాలి
    నన్ను నేను కచ్చితంగా ఒక మహిళగా భావిస్తాను, అలాగే ఒక ప్రచురణకర్తగా  కూడా భావిస్తాను, కాని ఎప్పుడూ నన్ను నేను ఒక మహిళా ప్రచురణకర్తగా మాత్రం చూసుకోలేదు. ఒక మహిళగా నాకు అదనపు గౌరవం లభించిందని, అందువల్ల నేను వివక్షకు గురికాలేదని చెప్పడం సులభమే. కాని, ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి పని స్వభావం వల్ల ఎదురైనవే తప్ప, నేను చేస్తున్న ప్రచురణ వల్ల కాదు. ఉదాహరణకు, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు కనీసం పబ్లిక్‌ టాయిలెట్‌లు కూడా ఉండేవి కావు. 

    బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలోనూ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండేవి. పుస్తకాలు అమ్మడానికి రోజంతా స్టాల్‌ వద్దే నిలబడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో పక్కనే ఉన్న ఇళ్లకు వెళ్లి వారి అనుమతి కోరడం లేదా వేరే దారి లేనప్పుడు మొహమాటాన్ని వదిలేసి పని పూర్తి చేయడమే ముఖ్యం అని నాకు తోచేది. పురుషులతో పని చేసేటప్పుడు వారు నాతో మాట్లాడటానికి సంకోచించేవారు. నేను పని మీద ఒకరి ఇంటికి వెళ్తే, వారు నన్ను నేరుగా చూడటానికి భయపడేవారు. ‘ఇంట్లోకి వెళ్లి మా ఆవిడతో మాట్లాడు’ అని వంటగది వైపు చూపించేవారు. కానీ నేను పని మీద వచ్చింది మిమ్మల్ని కలవడానికేనని స్పష్టంగా చెప్పేదాన్ని. 

    సమాజంలో మార్పే లక్ష్యంగా..
    నక్సలైట్‌ ఉద్యమ స్ఫూర్తితో, సమాజంలో మార్పు తీసుకురావాలనే పట్టుదలతో 26 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందరో మహానుభావుల మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఆ రోజుల్లో ప్రజలు సమయాన్ని డబ్బుతో కొలిచేవారు కాదు, నిస్వార్థంగా పని చేసేవారు. ఆర్థిక సరళీకరణల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

    పాఠకుల నమ్మకమే...
    మహిళనైనందుకు నాకు కొన్ని ప్రయోజనాలు కూడా కలిగాయి. వయసులో పెద్దవారైన రచయితలు, మేధావులు నన్ను ఎంతగానో ఆదరించారు. పాఠకులు మహిళలను ఎక్కువగా నమ్మేవారు. ఈ నమ్మకమే ఈ రంగంలో రాణించడానికి నాకు ఎంతగానో సహాయపడింది. కేవలం సాయంత్రం వేళల్లో జరిగే మందు పార్టీల చర్చలకు మాత్రం నేను దూరంగా ఉండాల్సి వచ్చేది. కీలక నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఒక మహిళగా ఆ వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. అక్కడ నాకు ప్రవేశం కూడా ఉండేది కాదు. 

    కొత్త తరం అమ్మాయిలు..
    నేడు చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడం సంతోషకరం. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం), పూర్ణిమ తమ్మిరెడ్డి (ఎలమి) వంటి వారు ముందు వరుసలో ఉంటే, జ్యోతి వలబోజు (జేవీ పబ్లికేషన్స్‌), శ్వేత (అజూ పబ్లికేషన్స్‌), ఉష ప్రత్యూష (బాలా బుక్స్‌), మానస ఎండ్లూరి, అపర్ణ తోట వంటి వారు ప్రస్తుతం ఈ రంగంలో రాణిస్తున్నారు. 

    ప్రచురణ నా ప్యాషన్‌
    దశాబ్దాల కాలంలో పుస్తక విక్రేతలు, రచయితలు, అనువాదకులు, సమీక్షకులతో ఏర్పడిన అనుబంధం వెలకట్టలేనిది. ఈ రంగం అనుకున్నంత ఆడంబరంగా ఉండదు. దీనికి గుండె ధైర్యం, అంతులేని ఓపిక కావాలి. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు. 

    ప్రూఫ్‌ రీడింగ్‌ కోసం గంటల తరబడి కళ్లు కాయలు కాచేలా చూడటం, ప్రింటర్ల వెనుక పడటం, అనువాదకులను ఒప్పించడం, పుస్తక విక్రేతల నుంచి బాకీలు వసూలు చేయడం– ఇవన్నీ తెర వెనుక అలసటతో కూడిన పనులు. కొందరు రచయితల్లో అహం ఎక్కువగా ఉంటుంది. అనువాదకులు మాత్రం అణకువతో ఉండి పుస్తకాలను ప్రేమిస్తారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ మళ్ళీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ప్రచురణనే ఎంచుకుంటాను కానీ మరే వృత్తినీ ఎంచుకోను.

    డబ్బుతో ముడిపెట్టలేనిది
    ప్రచురణ  రంగం కేవలం పుస్తకం మీద ఉన్న మమకారంతో, ఆఖరి మైలు వరకు నడిచే సత్తా ఉన్నవారికి మాత్రమే! ప్రైవేట్‌ కంపెనీలకు కూడా ఈ రంగంలో వచ్చే లాభాలు చాలా తక్కువ. అవినీతి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటేనో లేదా పాఠ్యపుస్తకాలు అమ్ముకుంటేనో తప్ప, ఇందులో ఆర్థికంగా స్థిరపడటం కష్టం. ఇది కేవలం ప్యాషన్‌తో చేసే అక్షర యజ్ఞం.
    గీతా రామస్వామి, ప్రచురణ కర్త
    జంబుల రమాదేవి

    (చదవండి: నేను... ఉమన్‌ జర్నలిస్ట్‌)

     

  • జర్నలిస్ట్‌గా 1980లో ప్రయాణం ప్రారంభించినప్పుడు నన్ను నేను ‘మహిళా జర్నలిస్ట్‌’ అని ఎప్పుడూ అనుకోలేదు. వేరే లేబుల్స్‌ లేకుండా నేను జర్నలిస్ట్‌ను. దిల్లీలో క్రైమ్‌బీట్‌ చూశాను. క్రైమ్‌బీట్‌ అంటే ‘ఇది పురుషులకు మాత్రమే’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. తరువాత చెన్నైలో ఒక జాతీయ పత్రికకు కరస్పాండెంట్‌గా పనిచేశాను.

    గతతరం జర్నలిస్ట్‌లు ద్వారాలు తెరిచి, ఈ వృత్తిని ఎంచుకున్న మా తరం మహిళలకు పునాది వేశారు. అయినప్పటికీ శ్రీలంక, పాకిస్తాన్‌లలో విదేశీ కరస్పాండెంట్‌గా నా పోస్టింగ్‌ను అసాధారణంగా, ఆశ్చర్యంగా చూశారు. అయితే హైప్రొఫైల్‌ అసైన్‌మెంట్స్‌కు నా జెండర్‌ అడ్డు కాదనిపించింది. పాకిస్తాన్‌లో నేను మొదటి మహిళా జర్నలిస్ట్‌ అయ్యే అవకాశం వచ్చింది. భారతదేశాన్ని వదిలి పాక్‌కు వెళ్లే ముందు...

    ‘నీకు అప్పగించిన బాధ్యత పురుషులకు కూడా కష్టమైనది. ఒంటరిగా ఉన్నందున ఆ అపాయింట్‌మెంట్‌ను తిరస్కరించడం మంచిది’ లాంటి సలహాలు వినిపించాయి. నేను ఆ సలహాలు పాటించనందుకు సంతోషంగా ఉంది. అక్కడి (పాక్‌) నుంచి రిపోర్టింగ్‌ చేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఒకటి నేను పురుషుడినై ఉంటే ఇంత కంటే బాగా చేసేదాన్ని అని చెప్పలేను కాని, జర్నలిజంలో నా పనికి గుర్తింపుగా రెండు అవార్డులు వచ్చాయి.

    రెండవది, ఆ దేశంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ, పాకిస్తాన్‌లో నియమితురాలినైన మొదటి మహిళా జర్నలిస్ట్‌ నేనే అని చెప్పడం ప్రారంభించారు. మూడవది,  ‘మహిళా జర్నలిస్ట్‌’ అనే మాటకు అర్థం ఏమిటో నాకు పాకిస్తాన్‌లో అర్థమైంది. నేను భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు నా స్థానంలో వేరొకరిని నియమించడానికి అన్వేషణ మొదలైంది. ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా మహిళ లేదా అవివాహితుడు అయితే బాగుంటుందని అనుకున్నారు.

    పూర్వకాలంలో  పాక్‌లో పోస్ట్‌ చేసిన పురుషుల పిల్లలు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో చదవడానికి అయ్యే ఖర్చును ప్రచురణ సంస్థే భరించేది. ఎందుకంటే భారతీయ  పిల్లలకు స్థానిక పాఠశాలల్లో చదవడం కష్టంగా ఉండేది. ఒక పురుష జర్నలిస్ట్‌ను ఇస్లామాబాద్‌లో నియమించారు. దీంతో ఆయన భార్య ఇక్కడ తాను చేసే ఉద్యోగాన్ని వదులుకొని భర్తతో వెళ్లాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకున్నందుకు సంస్థ ఆమెకు పరిహారం కూడా చెల్లించింది.
    కాని, కాలం మారిపోయింది. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు.

    పాక్‌ను వదిలి భారత్‌కు వచ్చే ముందు ఇస్లామాబాద్‌లోని నా స్నేహితులకు నా స్థానంలో వచ్చే మహిళ గురించి చెప్పాను. అప్పుడు వారి స్పందన ఇలా ఉంది... ‘వోహ్‌! వచ్చేది కూడా మహిళా జర్నలిస్టేనా? ఇక్కడ మాత్రమే మహిళలను ఎందుకు పోస్ట్‌ చేస్తున్నారు? హానీ ట్రాప్‌లుగా మహిళలను పంపాలనేది మీ నిఘా సంస్థల వ్యూహం అయి ఉండాలి’– అపోహల అద్దాలతో చూస్తున్నప్పుడు, అలాంటి సమయంలో వివరణ ఇవ్వడం అర్థరహితం అనిపించింది.

    ‘మహిళా జర్నలిస్ట్‌లు మరింత ముందుకు సాగాలి. వారు గొప్ప కథనాలెన్నో రాయగలరు. అదే సమయంలో సంస్థ వారి దీర్ఘకాలిక కెరీర్‌ పురోగతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ఒక అగ్ర సంపాదకుడు రాశారు. ఎందుకంటే చాలామంది మహిళా జర్నలిస్ట్‌లు వివాహం కాగానే రెండు, మూడు సంవత్సరాల్లోనే ఫీల్డ్‌ను వదిలిపెట్టారు. ఈ రకంగా ఆయన నిజం మాట్లాడారు.

    ఈరోజుల్లో ఎక్కువగా కనిపించే బైలైన్‌లను చూడండి. వారందరూ మహిళా జర్నలిస్ట్‌లే. కాని ఎడిటర్‌లు ఎవరో చూడండి. గత ఇరవయ్యేళ్లుగా మీడియాలో వచ్చిన మార్పుల కారణంగా కొంతమంది మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు(బ్రాడ్‌కాస్ట్‌ మీడియా), ఆన్‌లైన్‌ వార్తా సంస్థలలో గ్రాఫ్‌ ఇప్పటికీ పురుషులకు అనుకూలంగానే ఉంది. 

    జర్నలిజం స్కూల్స్‌లో పురుషులతో పోల్చితే మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. నేను క్లాస్‌ చెప్పే ఒక జర్నలిజం స్కూల్‌లో పదిహేనుమంది విద్యార్థులలో ముగ్గురు మాత్రమే పురుషులు. వార్త సంస్థలలో మహిళల నాయకత్వానికి సంబంధించిన ఆశ బహుశా భవిష్యత్తులోనే ఉంటుంది.
    నిరూపమా సుబ్రమణియన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

    (చదవండి: హెల్త్‌కేర్‌’లో నారీశక్తి)

  • హెల్త్‌కేర్‌ రంగంలో మహిళల భూమిక రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆరోగ్యరంగంలో మహిళల ఆరోగ్యం కోసం కృషిచేయాల్సిన రంగాలు నిజానికి చాలా ఎక్కువే ఉన్నాయి. ఇటీవల తమ సాధికారతలో భాగంగా మహిళా డాక్టర్లు కేవలం చికిత్సకే పరిమితం అయిపోవడం లేదు. దాంతోపాటు కొత్త స్టార్టప్‌ల ఏర్పాటు; హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యతలూ; మహిళలకు పీరియడ్స్‌ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత; ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌; సురక్షితంగా ప్రసవం జరపడం, హోమ్‌ సర్వీసెస్, పాలియేటివ్‌ కేర్‌ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. 

    ఈ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అందివస్తున్న కొత్త టెక్నాలజీ సహాయంతో మహిళలకు ఉపయోగపడే స్టార్టప్స్‌ ఏర్పాట్లు చేయడం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటున్నారు. హస్పిటల్స్‌/ క్లినిక్స్‌ నిర్వహణ, స్టార్టప్స్, పబ్లిక్‌ హెల్త్, టెక్నాలజీ వంటి కీలకమైన నాలుగు అంశాల్లో మహిళల బాగు కోసం అనునిత్యం శ్రమించడంతో పాటు ఈ అంశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మహిళా వైద్యులు విశేషంగా కృషిచేస్తున్నారు.  

    ఆ నాలుగింటినీ విపులీకరిస్తే, తొలి అంశంగా– తాము ఎవరి కోసమో పనిచేయకుండా కేవలం తమ కోసం తామే సంస్థను ఏర్పాటు చేసుకోదలచుకున్న వారు... ఉదాహరణకు చూసినప్పుడు గైనకాలజీ రంగంలో సొంతంగా ఐవీఎఫ్‌ వంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడమూ, కాస్మెటిక్‌ గైనకాలజీ, ఈస్తటిక్‌ గైనకాలజీ రంగాలలో విస్తృతంగా తమవైన క్లినిక్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే పీడియాట్రీ, డెర్మటాలజీ, యూరోగైనకాలజీ వంటి స్పెషాలిటీ క్లినిక్స్‌ కూడా ప్రారంభిస్తున్నారు. 

    ఇక పెద్ద పెద్ద హాస్పిటల్‌ సెటప్స్‌ కష్టం అనుకుంటే పొద్దున్నే సర్జరీ చేసేసి, పేషెంట్‌ను సాయంత్రానికల్లా ఇంటికి పంపించే ‘డే కేర్‌’ సెంటర్స్‌ మొదటి కేటగిరీలోకి వస్తాయి. ఇక రెండో అంశానికి వస్తే, ఇందులోనే హెల్త్‌ యాప్స్‌ రూపొందించి, మెంటల్‌ హెల్త్‌ వంటి విభాగాల్లో బాధితులకు అవసరమైన మార్గదర్శకాలు చెప్పడం; ప్రెగ్నెన్సీ సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై సలహా, సూచనలందించడం వంటి స్టార్టప్స్‌ యాప్‌ల రూపకల్పన అనుకోవచ్చు. వీటిల్లో భాగంగానే డయాగ్నస్టిక్‌ సేవలందించే సంస్థలనూ ఏర్పాటు చేస్తున్నారు. 

    ఇక మూడో విభాగంలో వెల్‌నెస్‌తో పూర్తి సమగ్ర ఆరోగ్యం పొందడం కోసం అనుసరించాల్సిన యోగా, ధ్యానం వంటి ప్రక్రియల గురించి వివరించేందుకు అవసరమైన ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేయడం. జీవనశైలి కారణంగా అందరిలోనూ వచ్చే లైఫ్‌స్టైల్‌ జబ్బులైన డయాబెటిస్‌ వంటివి మొదలుకొని మహిళల్లోనే వచ్చే పీసీఓఎస్‌ (పాలీ సిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), ఎండోమెట్రియాసిస్‌ వంటి వాటి విషయంలో అవసరమైన మేనేజ్‌మెంట్‌ గురించి అవగాహన కల్పించే కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇక్కడ సమగ్ర చికిత్స అంటే... సమస్యకు ప్రిస్క్రిప్షన్‌ సూచించడం ఒక్కటే కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలూ, చేయాల్సిన వ్యాయామాలు... ఇలా 360 డిగ్రీలలో అవసరమైనవన్నీ అందేలాంటి సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 

    ఇక నాలుగో విభాగంలోకి వస్తే హోమ్‌ హెల్త్‌కేర్‌ సేవలు. ఇటీవల హాస్పిటల్‌ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఒకరోజు హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తే లక్షల్లో ఖర్చు. 
    కాని, అంతే క్వాలిటీ సేవలు ఇంట్లోనూ అందితే? ఈ కొత్త కాన్సెప్ట్‌తో పేషెంట్‌ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి సర్జరీ అనంతర సేవలూ, వృద్ధులకు అవసరమైన కేర్, జీవిత చరమాంకంలో ఉన్నవారికి అవసరమైన పాలియేటివ్‌ కేర్‌ లాంటి అత్యంత కీలకమైన రంగంలోనూ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌కు అవకాశాలు చాలా విస్తృతంగా పెరిగాయి. 

    ఇవే కాకుండా, సాంకేతికత పెరుగుతున్న కొద్ది, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందు బాటులోకి వస్తున్న కొద్ది అందివస్తున్న కొత్త సాంకేతికత సహాయంతో ఈ రంగాలను మరింత విస్తృతపరచే అవకాశం ఎంతో ఉంది. దానికి ఆకాశమే హద్దు. మరి మహిళలంటేనే ఆకాశంలో సగం అంటూ చెబుతుంటారు. ఇలా చూసినప్పుడు వారికి మరింత విశాలమైన అవకాశాలున్నాయో ఊహించవచ్చు. అంతేకాదు, వీటిలో మరింతగా విస్తరించడానికి మహిళల్లో సహజంగా ఉండే ఆర్ద్రత, దయ, సానుభూతి, సహానుభూతి, మల్టీ టాస్కింగ్‌ సామర్థ్యాల వంటి సహజ లక్షణాలు వారికి మరింతగా అవకాశమిస్తుంటాయి. అందుకే మహిళలు తమ సహజ లక్షణాలతో మరింతగా ముందుకు దూసుకుపోవాలనేది ఓ మహిళగా నా అభిలాష.
    డాక్టర్‌ మంజుల అనగాని, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత
    యాసీన్‌

    పరిష్కారాలు మనమే వెతుక్కోవాలి
    యంగ్‌ జనరేషన్‌ గమనించాల్సింది ఏమిటంటే, మన చాయిస్‌ పట్ల మనం ప్యాషనేట్‌గా ఉండాలి. మన ప్రొడక్టివిటీని మగవాళ్లతో సమానంగా, చెప్పాలంటే కాస్తంత ఎక్కువగానే రిజల్ట్స్‌ చూపించాలి. మనం చేసే పని ప్యాషనేట్‌గా చేస్తూ, ఇతరులకు సహాయం చేయగలిగితే, పరిశోధనారంగంలో సక్సెస్‌ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మాయిలు తమ అభిరుచి ఎందులో ఉందో గుర్తించి, మనస్ఫూర్తిగా ఆ రంగంలో పనిచేస్తూ పోవాలి. అయినా అందులోనూ ఆటంకాలు, అపజయాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారని ఎదురుచూడకూడదు. మనకు మనమే ధైర్యంగా ముందుకు సాగాలి. 

    సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలకు పరిష్కారాలను మనమే వెతుక్కోవాలి. నేను అలాగే పనిచేశాను. మనం ఎవరికన్నా తక్కువ కాదు. మనం అందరితోనూ సమానం, సమానం కంటే మనం ఎక్కువ అనే భావనతో మనం పనిచేసినప్పుడే ఆనందంగా ముందుకు సాగిపోగలం.

    నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ, జేఎన్టీయూ నుంచి బయోటెక్నాలజీలో ఎంటెక్‌ పూర్తి చేశాను. అప్పట్లో నాకు యూజీసీ ఫెలోషిప్‌ వచ్చినా, సెంటర్‌ ఫర్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో పీహెచ్‌డీ చేయాలని మా ప్రొఫెసర్స్, పేరెంట్స్‌ ఒత్తిడి చేయడంతో ఇందులో చేరాను. అలాగని సీసీఎంబీలో చేరడం పట్ల నాకు ఎలాంటి విచారం లేదు. 

    కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిధిలో పనిచేసే సీసీఎంబీ హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంది. సీసీఎంబీ ఫౌండర్‌ డైరెక్టర్‌ పుష్పమిత్ర భార్గవ, ప్రొఫెసర్‌ లాల్జీ సింగ్‌ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన వద్దనే ఏడాదిన్నర పాటు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ వర్క్, తర్వాత డాక్టర్‌ ఎం.ఆర్‌.దాస్‌ వద్ద బ్రెస్ట్‌ ట్యూమర్స్, హెపటైటిస్‌–బి వైరస్‌ పరిశోధనలు సాగించాను. ఆ తర్వాత 1996లో ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీకి మారి, అక్కడి పరిశోధనల్లో కొత్త వరివంగడాలను కనుగొనడం చాలా సంతోషకరమైన కాంట్రిబ్యూషన్‌. 

    మన దేశంలోని రైతులకు ఉపయోగపడే వరివంగడం కనుగొనడంలో కీలక పాత్ర పోషించాను. వరి పంటకు ఎక్కువగా సోకే ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్‌ లీఫ్‌ బ్లైట్‌) తట్టుకునే వరివంగడాన్ని నాటి గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా 2008లో నల్లగొండ జిల్లా గడ్డపల్లిలో విడుదల చేయించాం. మా సూపర్‌వైజర్‌ డాక్టర్‌ రమేష్‌ శొంఠి. ఆయన ఆధ్వర్యంలో ఈ వర్క్‌ అంతా నేనొక్కదాన్నే చేశాను. నిజానికి ఇది ముగ్గురు మనుషులు చేయాల్సిన పని. మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అనేదే నా సందేశం. మహిళల్లో మల్టీ టాస్కింగ్‌ టాలెంట్‌ ఎక్కువగా ఉంటుంది. 

    వరి వంగడాలపై నా పరిశోధన
    వరి పండించే రైతులకు ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్‌ లీఫ్‌ బ్లైట్‌) పెద్ద సమస్య. ఈ తెగులును తట్టుకునే రోగనిరోధక శక్తిగల జన్యువులను సన్నబియ్యం దిగుబడిని ఇచ్చే వరిలోకి ‘ఇంట్రోగ్రెస్‌’ చేసి, 2008లో ‘ఇంప్రూవ్డ్‌ సాంబ మసూరి’ రకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు దాని మీద మరిన్ని పరిశోధనలు సాగి స్తున్నాం. ‘స్టీల్త్‌ బ్లైట్‌’, ‘బ్రౌన్‌ ప్లాంట్‌ హోపర్‌’ వంటి వ్యాధులను తట్టుకోవడమే కాకుండా, ఫాస్ఫరస్‌ లోపం, పొలంలో నీరు నిల్వ చేరడం, నీటిలో అధిక లవణీయత వంటి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేలా దీనిని రూపొందించడానికి కొన్ని జన్యువులను ఇదే వరి వంగడంలోకి చొప్పించి, మూడు కొత్త వంగడాలను సృష్టించాం. 

    ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు రకాల వంగడాలను జాతికి అంకితం చేశారు. వీటి విత్తనాలను త్వరలోనే రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌’ సహకారంతో సీసీఎంబీ వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది. సీసీఎంబీ రూపొందించిన వంగడాలను ఐఐఆర్‌ఆర్‌ బ్రీడింగ్‌ చేస్తోంది. మా పరిశోధనల ఫలితంగా రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చి, వారికి గిట్టుబాటు ధర లభించి, వారి జీవితాల్లో కొంతైనా మార్పు తేగలిగినందుకు మాకు సంతృప్తిగా ఉంది.
    డాక్టర్‌ విష్ణుప్రియ, శాస్త్రవేత్త, సీసీఎంబీ 
    గోపాలకృష్ణ మయ్యా

    (చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!)

  • ఓ ప్రఖ్యాత కవి అంటారు... ‘‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’’!.  అంటే మీరు ఇలా ఇవ్వడం మొదలుపెట్టగానే దాన్ని కొనసాగించడం కోసమైనా ప్రకృతి మీకూ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దాంతో మీకు ఇచ్చే సామర్థ్యం ఎప్పుడూ  ఉండనే ఉంటుంది.  

    మహిళ విషయంలో కూడా ఎప్పుడూ ఇంతే. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ప్రతిసారీ ఆమె తన తల్లిదండ్రులకో, భర్తకో, పిల్లలకో, కుటుంబసభ్యులకో చెబుతూనే ఉంటుంది. ఇక భర్త విషయంలోనైతే ‘మీ యాన్యువల్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకోండి’ అంటూ పోరుతూ ఉంటుంది. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం... వాళ్లు వేళకు మందులు తీసుకుంటున్నారా అంటూ చెక్‌ చేస్తూ ఉంటుంది. 

    ఇక హాస్పిటల్‌ విషయానికి వస్తే... ఆ పని చేసేది కూడా ‘నర్స్‌’ రూపంలోని మహిళే. ఇక లేడీ డాక్టర్, లేడీ టెక్నీషియన్‌ రూపంలో మరిన్ని సేవలు అందిస్తూనే ఉంటుంది. భారతీయ ఆరోగ్య 
    సంరక్షణ వ్యవస్థలో మహిళ ఎప్పుడూ ఓ భాగమే. కాని, ఇంతటి కీలకమైన ఆ మహిళ తన ఆరోగ్యం విషయానికి వచ్చేప్పటికీ ‘ఆ... రేపు చూసుకుందాం లే’ అనుకుంటుంది. తన ఆరోగ్య సంరక్షణను ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉంటుంది. దీనికి చెల్లించాల్సిన మూల్యం ఒక్కోసారి గణనీయంగానే ఉండవచ్చు. 

    ప్రస్తుతం మన దేశంలో జీవనశైలి జబ్బులైన ‘నాన్‌ కమ్యూనికబుల్‌’ వ్యాధులు దాదాపు 65 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. వీటిల్లోనూ ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికి గుండెజబ్బులే కారణంగా మారుతున్నాయి. ఇక క్యాన్సర్‌ విషయానికి వస్తే ప్రతి ఏటా 1,70,000 కొత్త కేసులు జాబితాకు జతవుతున్నాయి. సర్వైకల్‌ క్యాన్సర్‌ ఏటా వేలాది మహిళల ప్రాణాలను బలి తీసుకుంటోంది. 

    సమయానికి చిన్న స్క్రీనింగ్‌ పరీక్ష చేయిస్తే, ఆ మరణాలను దాదాపుగా పూర్తిగా నివారించడం సాధ్యం. ఇక దేశంలోని మొత్తం మహిళల్లో సగం మందికి రక్తహీనత ఉంది. అది వారిని నిస్సత్తువగా, నీరసంగా మార్చేస్తోంది. దీర్ఘకాలంలో వాళ్ల వ్యాధినిరోధకతను బలహీనంగా మార్చేస్తోంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ కేసులు గంటగంటకూ డజన్ల సంఖ్యలో పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... వీటిల్లో చాలా వాటి నివారణ పూర్తిగా సాధ్యం. టైముకు కనుక్కుంటే మరికొన్నింటికి పూర్తి చికిత్సగాని, లేదా మేనేజ్‌మెంట్‌గాని సాధ్యమే. 

    అయినప్పటికీ మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే, మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. 

    ఇక ఇప్పుడు అందివచ్చిన కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో ఇంకాస్త కచ్చితంగా మహిళల ఆరోగ్యాన్ని అంచనావేసి, రానున్న ముప్పును తప్పించవచ్చు. అందుకే ఆమె కోసం సగౌరవంగా వైద్యపరీక్షల స్లాట్‌ బుక్‌ చేసి హైబీపీ, చక్కెర, కొలెస్ట్రాల్‌ పరీక్షల వంటివి చేయించాలి. లేదంటే మహిళల ఆరోగ్యం చెడిపోయే ముప్పు నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. 

    ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌ ఏమిటంటే... ‘గివ్‌ టు గెయిన్‌’! మహిళ తన కుటుంబానికీ, ఈ సమాజానికీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలో ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్స్‌ ద్వారా ఆమెకు దక్కాల్సింది దక్కేలా చేయడమే ఇప్పుడు మనముందూ సమాజం ముందూ ఉన్న బాధ్యత. అప్పుడే మన భారత్‌లోని కుటుంబాల్లో ఆరోగ్యం నిండుతుంది. కార్యాలయాల్లో ఉత్పాదకత పెరుగుతుంది. దేశం ముందుకు పురోగమిస్తుంది. 

    మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే... మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. 
    డాక్టర్‌  సంగీతారెడ్డి
    జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్‌  
    యాసీన్‌

    (చదవండి: ఆత్మవిశ్వాసమే అసలు బలం)

  • నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చాను. వారు సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఫస్ట్‌ అప్పీల్‌ దాఖలు చేశాను. ఇప్పుడు వారు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా ఒక లేఖ పంపి, 7 రోజులలోపల విచారణకు హాజరు కావాలని చెప్పారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ విచారణకు హాజరు కావాలా? లేదా ఏమీ చేయకుండా సెకండ్‌ అప్పీల్‌ సమయం వచ్చిన తర్వాత నేరుగా రెండవ అప్పీల్‌ వేయాలా లేక కమిషన్‌కుపోవాలా? 
    – నరేష్, నందిగామ

    ఆర్టీఐ చట్టం ప్రకారం, కోరిన సమాచారం సాధారణంగా రాతపూర్వకంగా లేదా మీరు కోరిన రూపంలో ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, మొదటి అప్పీల్‌కు ప్రజా సమాచార అధికారి ఇచ్చిన సమాధానం వుంటే ఆ సమాధానం ఆధారంగా లేదా అప్పీల్‌లో పేర్కొన్న కారణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అప్పీల్‌ అధికారి తన విచక్షణ ప్రకారం అప్పీల్‌దారుని విచారణకు పిలవవచ్చు కానీ మీరు హాజరు కావడం తప్పనిసరేమీ కాదు. రాతపూర్వక రికార్డుల ఆధారంగానే అప్పీల్‌ను నిర్ణయించవచ్చు. చాలా అప్పీలు దరఖాస్తులు అప్పీలు దారుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే నిర్ణయించబడుతాయి.

    మీరు హాజరు కావాలనుకోకపోతే, రాతపూర్వకంగా కేసును పరిశీలించి రికార్డు ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థించవచ్చు. విచారణకు పిలవడం ద్వారా ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వక (లేదా మరే ఇతర విధానంలో కోరితే అలాగ) సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతను కాదనలేరు. అందువల్ల, మీ ఆర్టీఐ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మీరు కోరడం పూర్తిగా చట్టబద్ధమైనది.

    మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, అప్పీల్‌ను రాతపూర్వక రికార్డుల ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారని లేఖ రాయండి. పోస్టల్‌ స్లిప్పులు భద్రపరచుకోండి. మీకు సమాచారం లేదా పరిష్కారం దొరక్కపోతే, 90 రోజుల్లోగా కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు విచారణ నోటీసును పూర్తిగా పట్టించుకోలేదని ఎవరూ చెప్పలేరు. సంబంధిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందితే సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందితే స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ – వద్ద అప్పీల్‌ చేయాలి.

    – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    (మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. ) 

    (చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

  • చాలామంది అప్పటి వరకు సామాన్యులుగా కనిపించినవాళ్లు..జీవితం పెట్టిన పరీక్షలతో ఒక్కసారిగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలుస్తారు. ప్రపంచమే జైజైలు పలికేలా ఆకామంత ఎత్తున నిలుస్తారు. అంతేగాదు కష్టం వస్తే కాళ్లు మునగదీసి ఏడుస్తూ కూర్చొవడం కాదు..కన్నెర్రజేసేలా హీరోలా బతికి చూపించాలి..మార్గదర్శకంగా ఉండాలని చేతలతో చూపిస్తారు. అలాంటి మాటలకు నిలువెత్తు అర్థం ఈ మహిళ. భయంకరమైన అనారోగ్య సమస్య ఆమెను భయపెట్టలేదు కదా..మరింత బలోపేతమై గొప్ప విజయాన్ని అందుకునేందుకు పురిగొల్పింది.  

    ఆ మహిళే జయశ్రీ విజయ్ మోహన్. చెన్నైకి చెందిన జయశ్రీ కొన్ని నెలల క్రితం టాంజానియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారామె. ఇది అత్యంత కఠినమైన పర్వత శిఖరాగ్రం. ఎందుకంటే శిఖరాగ్రం సమీపం చేరుకునే రోజున అస్సలు విశ్రాంతి తీసుకోకుండా సుమారు వెయ్యి మీటర్లు దాక 15 గంటల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టంలో సాధారణంగా లభించే ఆక్సిజన్ స్థాయిలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైన పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అదికూడా 6.5 గంటల్లో అవలీలగా అధిరోహించింది. 

    అలాగే వెనక్కి(అవరోహణ) 10.26 గంటల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ వచ్చేశారామె. ఈ అరుదైన ఘనతతో జయశ్రీ ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్‌ రికార్డుల నెలకొల్పింది. ఇలా అతి తక్కువ సమయంలో మహిళల విభాగంలో కిలిమంజారోని అధిరోహించి.. వెనక్కి వచ్చేసిన తొలి మహిళగా నిలిచారామె. ఇంతటి ఘనతను సృష్టించిన జయశ్రీ నిజానికి ఆరోగ్యవంతమైన మహిళ కాదు. ఆమె ఒక స్ట్రోక్‌ బాధితురాలు. తన రికార్డు ఇతర మహిళలను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపారామె. 

    ఆమె ఒక తల్లిగా, విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా హాయిగా సాగిపోతున్న జీవితాన్ని స్ట్రోక్‌ ఒక్క కుదుపుతో దబాలున కిందపడేసినట్లయ్యింది. జయశ్రీ ఎడమవైపు మొత్తం పక్షవాతానికి గురై ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నా..తనకేమైందన్నది అర్థం గాక, తన శరీరం తనమాట వినక పడిన బాధ అంత ఇంత కాదు. పిల్లల కళ్లలో ఆందోళన ఒక్కటే తనకేదో అయ్యిందని అనిపిస్తోంది కానీ తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. 

    వివిధ ఆస్ప్రతులు తిప్పుతూ తన వాళ్లు పడుతున్న బాధ అర్థమవుతున్నా..ఏం చేయలేని ఆ నిస్సహాయత ఎప్పటికీ మర్చిపోలేనంటోంది జయశ్రీ. ఆ తర్వాత వైద్యులు తన వద్దకు వచ్చి..ఆమె గతంలోలా మాములు మనిషి  అవ్వలేదని, నాడీ సంబంధిత పూర్తి నష్టాన్ని తిప్పికొట్టలేమని తేల్చి చెప్పేశారు. అప్పుడే తేలిసిందామెకు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేయాలనేది.. అయితే తన స్థితిని మార్చలేకపోవచ్చు గానీ, ధైర్యాన్ని పోగొట్టుకోనక్కర్లేదని అంటోంది జయశ్రీ. 

    అంతేగాదు ఆ సమయంలోనే అసలైనవి "బలం", "సంయమనం" అని తెలసుకున్నానని చెబుతోంది. అప్పుడు అర్థం చేసుకున్నా.. శరీరం మాట వినడం, దాని పరిమితులు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఎలా అని పూర్తిగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. 

    కోలుకోవడం మొదలయ్యాక..ఏదో అనారోగ్య బాధితురాలిలా ఉండిపోవడం నచ్చక ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాగే తనలాంటి మహిళల్లో స్థైర్యం నింపాలన్న ఆకాంక్ష ఈ సాహసానికి పురిగొల్పిందని చెప్పుకొచ్చింది జయశ్రీ. నిజానికి ఈ పర్వత ట్రెక్కింగ్‌ కోసం ముందుగా ఆమె శారీరకంగా మానసికంగా ప్రిపేరయ్యేందుకు ఎంతగానో శిక్షణ, ట్రీట్‌మెంట్‌ల తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని భేఖాతరు చేయకపోగా..రికార్డులు మీద రికార్డులు నెలకొల్పడం అంటే మాటలు కాదుగదా..!.

     

    (చదవండి: ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ ప్యాక్‌ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్‌ సోమన్‌)

     

  • భారతదేశంలో గ్లామర్‌ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్‌ సోమన్‌ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్‌ మెంట్‌ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన  యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్‌ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు.  

    మిళింద్‌ సోమన్‌ 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్,, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి  చిత్రాలు  సిరీస్‌లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్‌ ట్రాక్‌పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు  సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు  అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్‌ చేశాడు.

    మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్‌  ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి పింక్‌థాన్‌ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్‌  భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.

    చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు.  శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు.  ఇది సిక్స్‌ ప్యాక్స్‌ లేదా బైసెప్స్‌ గురించి అవి అందించే  లుక్స్‌ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.

    తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని,  కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే  మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్‌ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు.  ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం  క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు.  

    చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్‌ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు  ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు.

    (చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Politics

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైఎస్‌ జగన్‌ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.

    ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పుకొచ్చారు. 

     

  • సాక్షి, తాడేపల్లి: మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసిన వారి తాట తీస్తామని చంద్రబాబు చెప్పారు.. మరి ఎంత మందిపై యాక్షన్‌ తీస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్య‌లేవి? అని నిల‌దీశారు. వీడియోలతో అడ్డంగా దొరికిన టీటీడీ చైర్మన్‌పై చర్యలేవి?. మంత్రులు, ఎమ్మెల్యేలు కాదు, కనీసం పీఏలు తప్పులు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే ప్రతి జంట కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని చంద్రబాబు కనమంటున్నాడు. పెళ్లిచేసుకున్న ప్రతి జంటకూ చంద్రన్నపెళ్లికానుక కింద రూ. లక్ష ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకూ ఒక్క జంటకూ ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు మాటలను ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్ కాదా?. మహిళల జోలికి వస్తే, తాటతీస్తానని చంద్రబాబుగారు డైలాగులు మీద డైలాగులు చెప్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నాడు. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి?’ అని ప్రశ్నించారు.

    లిస్ట్‌ ఇదే.. 

    • రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు?
    • KGBV మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?
    • మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌మీద  ఏం చర్యలు తీసుకున్నారు?
    • టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడితే, ఈ చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?
    • మంత్రి సంధ్యారాణి పీఏ మీద చంద్రబాబుగారు ఏం చర్యలు తీసుకున్నారు?. బాధితురాలి మీదే  తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపారు.
    • ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌, ఒక మహిళను మోసంచేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయారు, అయినా చంద్రబాబు ఏం చేశాడు.
    • తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసింది.

    దేవుడి పట్ల భయం, భక్తి, నిష్ట కలిగినవారే, టీటీడీ ఛైర్మన్‌ లాంటి పోస్టులో పెట్టాలని తెలిసి కూడా చంద్రబాబునాయుడు.. బీఆర్‌ నాయుడికే అప్పగించాడు. దేవుడి గురించి, పవిత్రత గురించి, ఆడవాళ్ల గురించి, వారి రక్షణ గురించా వీరు మాట్లాడేది? వీళ్లకి అసలు ఆ అర్హత ఉందా. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శ్రద్దలేదు. తిరుపతి, సింహాచలం, పలాసలో భక్తులు చనిపోయినా ఏం చర్యలు తీసుకున్నారు. కదిరి రథోత్సవంలో భక్తులు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందన్నారు. 

    బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చావే.. 
    రెండేళ్లలో అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు గజం స్థలం ఇచ్చారా? పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా హయాంలో అక్కచెల్లమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. బాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా చనిపోతున్నారు. స్కూల్స్‌, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లీనిక్‌లను రద్దు చేశారు. పది లక్షల మంది ప్రభుత్వ స్కూల్స్‌ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం గాలికెగిరిపోయింది. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంతో చంద్రబాబు దిట్ట. చంద్రన్న పెళ్లి కానుక ఏమైంది?. పెళ్లి కానుక గురించి మాట్లాడరు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలట!. మహిళలపై దారుణాలపై పాల్పడ మీ ఎమ్మెల్యేలపై చర్చలేవి? అని ప్రశ్నించారు.

    లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.. పది లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగతా ఇళ్లకు నిధులు కేటాయించడం లేదు. చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేసి రీసర్వేలు మేము మొదలుపెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ ఎక్కడ?. ఉద్యోగులకు పెండింగ్‌ డీఏలు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఓఆర్‌ఐ, పాస్‌బుక్‌ క్యూఆర్‌ కోడ్‌ భూమలు జియో ట్యాగింగ్‌ తెచ్చింది మేమే. సచివాలయాలతో డిజిటల్‌ అసిస్టెంట్‌ వ్యవస్థను బలోపేతం చేశాం. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులను వేధిస్తున్నారు’ అని మండిపడ్డారు.