Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • హైదరాబాద్‌ అంటే ఐటీ, ఫార్మా, బిర్యానియే కాదు.. దేశస్థాయిలో సినీపరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రంగా రాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. జపాన్‌, కొరియా లాంటి దేశాల్లో ఫిలిం ఇండస్ట్రీ కోసం ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయని, అదే తరహాలో మన ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన గద్దర్‌ అవార్డుల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 

    ఆ నలుగురే కారణం
    ఈ వేడుకలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో ఉన్న సినీపరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కృష్ణ.. ప్రధాన కారణం. సినీ కార్మికులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభాకర్‌ రెడ్డి తన సొంత స్థలాన్ని దానం చేశారు. సినీపరిశ్రమలో ఏ సంక్షోభం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు వాటిని పరిష్కరించి.. శాశ్వతంగా ఇండస్ట్రీని హైదరాబాద్‌ నగరంలో నిలిపేందుకు కృషి చేశారు.

    సంతోషం
    బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి, పుష్ప వంటి సినిమాలు జాతీయ స్థాయిలో మన సినీ పరిశ్రమను నిలబెట్టాయి. అలాంటి ఇండస్ట్రీ కోసం ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గతేడాది గద్దర్‌ పురస్కారాలను ప్రవేశపెట్టాం. వరుసగా రెండోసారి ఈ అవార్డులను అందించాం. ఈ కార్యక్రమానికి ఖుష్బూ, జయసుధ వంటి వారు రావడం సంతోషం. నాగచైతన్య, రష్మిక అందరూ యంగ్‌స్టర్స్‌. వీళ్లకు అవార్డులు ఇచ్చేందుకు వచ్చిన సీనియర్స్‌ అందరినీ అభినందిస్తున్నాను.

    సూచన
    హైదరాబాద్‌లో.. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేవారికి అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని తీసుకొస్తుంది. ఆన్‌లైన్‌లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్‌ చేయాలని డిప్యూటీ సీఎంని కోరుతున్నాను. ఇకపోతే గద్దర్‌ ఒక ప్రజాయుద్ధ నౌక.. ఆయన పేరు కోట్లాదిమందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించింది.

    సమాజంలోని సమస్యలపై సినిమా
    ఆయన గళం తెలియనివారు దేశంలో లేరు. గద్దర్‌ ఒక చైతన్యం, స్ఫూర్తి. అందుకే ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టాం. సినిమా అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సమాజంలోని సమస్యలపై పోరాడేందుకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలి అని రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

    అవార్డుల వేడుక
    'గద్దర్‌ ఫిలిం అవార్డ్స్‌ 2025'  కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్‌ హాసన్‌, నాగార్జున, రాంచరణ్‌, ఖుష్బూ, నాగచైతన్య, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

  • ప్రతి ఉగాదికి ఫ్యామిలీతో కలిసి ఉండేవాడిని, కానీ ఈసారి దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నాడు హీరో మనోజ్‌ మంచు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. నేను ఎప్పటినుంచో ఒకటి బలంగా నమ్ముతాను.. సనాతన సాంప్రదాయం, మనకు చిన్నప్పుడు నేర్పించిన విలువలు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లవు.

    ఉగాది అంటే..
    మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విలువలు మనలో, మనతోనే ఉంటాయి. ఈరోజు కూడా నా రాబోయే సినిమా డేవిడ్‌ రెడ్డి షూటింగ్‌ కోసం దూరంగా ఉండాల్సి వచ్చింది. బాధ్యతలతో బిజీగా ఉన్నా.. ఆ అనుబంధం మాత్రం అలాగే ఉంది. నాకైతే ఉగాది అంటే నూతన సంవత్సరానికి నాంది మాత్రమే కాదు, అది మనలో జరిగే నిశ్శబ్ధ పునరుజ్జీవనం, ఋతువుల మార్పు, ధర్మం మళ్లీ మేల్కొనడం, కాలపురుషుడి ఆవిర్భావం.

    నాన్న పేరుపై అర్చన
    ఈ చైత్ర శుక్ల ప్రతిపద రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని నెలకొల్పి, యుగాల చక్రాన్ని ప్రారంభించాడని నమ్ముతారు. అదే మనం ఉగాదిగా జరుపుకుంటాం. నేను ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గుడిలో ఉన్న నా కుటుంబాన్ని వీడియో కాల్‌ ద్వారా చూశాను. ఆ ఆధ్యాత్మికతను నేనూ ఫీల్‌ అవుతున్నాను. మౌనిక, ధైరవ్‌, చిట్టి దేవసేన.. నాన్న (మోహన్‌బాబు) పేరుమీద అర్చన చేయించారు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన మనవళ్లకెప్పుడూ ఆయన ఆశీస్సులుంటాయి.

    ఇలా తొలిసారి
    ఓపక్క పనిలో బిజీగా ఉంటూనే నా మూలాలను మర్చిపోకుండా ఉండగలగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మార్చి 19 అంటేనే నాకు పండుగ.. ఇది నాకు చిన్నప్పటినుంచి సెలవురోజు, ఎందుకంటే ఈరోజు నా తండ్రి పుట్టినరోజు. ఆయనతో కలిసి గడిపే ప్రత్యేకమైన రోజు. కానీ, తొలిసారి ఆ సెలవురోజు పనిదినంగా మారింది. నాకు కుటుంబం తర్వాత అత్యంత ఇష్టమైనది పని! నేను ఏం చేసినా, అందరితో ప్రశంసలు అందుకునేలా పని చేస్తున్నా.. అదంతా మీకోసమే నాన్న.. హ్యాపీ బర్త్‌డే అని రాసుకొచ్చాడు.

     

     

    చదవండి: రొమాంటిక్‌ సాంగ్‌.. డైరెక్టర్‌కు కాజోల్‌ వార్నింగ్‌

  • తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, టీఎఫ్‌డీసీ దిల్‌ రాజు హాజరయ్యారు. ఈ వేదికపైనే జ్యూరీ సభ్యులకు మెమొంటోలతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు.

    కాగా.. ఇ‍ప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 విజేతలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పొందిన చిత్రాలకు అవార్డ్స్‌ ప్రకటించారు. తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా  అవార్డులను అందజేశారు. గద్దర్‌ -2025 ఫిల్మ్‌ అవార్డ్స్‌లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్‌ సినిమాలు అత్యధికంగా అవార్డ్స్‌ సొంతం చేసుకున్నాయి. 

    తండేల్‌ సినిమాకు గాను నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా అవార్డ్‌ దక్కింది. రష్మిక  (ది గర్ల్ ఫ్రెండ్ ) మూవీకి గాను ఉత్తమ నటిగా ఎంపికైంది. ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం దక్కింది. నటుడు కమల్‌ హాసన్‌కు పైడి జయరాజ్‌ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజకు సినారే అవార్డు వరించింది.
     

  • క, కె- ర్యాంప్‌ సినిమాలు కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్స్‌గా నిలిచాయి. అయితే వీటి మధ్యలో వచ్చిన దిల్‌రూబా మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడీ హీరో. ఓపక్క వెండితెరపై సినిమాలు చేసుకుంటూనే ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

    వెబ్‌ సిరీస్‌
    ఈసారి సినిమాతో కాకుండా వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్లాన్‌ చేశాడు. తాజాగా ఆ వెబ్‌ సిరీస్‌ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ కూడా వదిలారు. డియర్‌ కామ్రేడ్‌ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వం వమిస్తున్న ఈ సిరీస్‌కు గువ్వల చెరువు ఘాట్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌ పొలిటికల్‌ డ్రామాతో ఈ సిరీస్‌ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 

    సిరీస్‌
    ఇందులో తిరువీర్‌, సంయుక్త మీనన్‌, తేజస్వి రావు, సిద్ధిఖి, ఆడుకాలం నరేన్‌ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ చూస్తుంటే ఇంట్రస్టింగ్‌గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. రిలీజ్‌ డేట్‌ ఇంకా ప్రకటించలేదు.

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

    తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్‌లో దురంధర్‌-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్‌ ప్రీమియర్స్‌లో ‍అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో  ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
     

  • ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌, కాజోల్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్‌ అంధురాలిగా యాక్ట్‌ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్‌ కోహ్లి పంచుకున్నాడు. 

    హీరోయిన్‌ వార్నింగ్‌
    ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్‌కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్‌లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్‌ షూటింగ్‌ మొదటిరోజే కాజోల్‌ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్‌లో పెట్టుకో అని వార్నింగ్‌ ఇచ్చింది. 

    అంధురాలు ప్రేమలో పడకూడదా?
    అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్‌ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.

    చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా

  • ఐకాన్ స్టార్ అల్లు ‍అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ రేసు గుర్రం. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ మూవీతో రవి కిషన్‌ టాలీవుడ్‌లో ఫేమస్‌ అయిపోయారు. విలన్‌గా సెన్సేషన్‌ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం రోల్‌ ఎప్పటికీ గుర్తుంటుంది. చివరి 30 నిమిషాల్లో బ్రహ్మనందం అదరగొట్టేశారు. ఈ మాస్ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

    ఈ ఏడాది ఏప్రిల్ 8న రేసుగుర్రం 4కె వర్షన్‌లో థియేటర్లో రీ రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్‌ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరోసారి మద్దాలి శివారెడ్డి విలనిజం, బ్రహ్మనందం ఫుల్ యాక్షన్‌ మోడ్‌ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. ఇవాళ ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
     

     

  • కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్‌లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్‌ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.

    అప్పట్లో..
    కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్‌ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్‌ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

    చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే..

  • ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనూ శెభాష్ ‍అనిపించుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.

    తాజాగా తాను ఇచ్చిన మాటను అల్లు అర్జున్‌ నిలబెట్టుకున్నారు.  తండ్రిని కోల్పోయిన దుర్గ అనే యువతికి రూ.7,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన స్క్రీన్‌షాట్‌ను బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌  సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు  మరణించారు. అంతేకాకుండా ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది.   మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ  ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు.

    అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్‌ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను  వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్‌ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌  తెలిపారు.
     

     

  • మెగాస్టార్‌ చిరంజీవి మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన.. ఇప్పుడు నిరుపేదలకు ఉచితంగా విద్య అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 

    అందుకే బ్లడ్‌ బ్యాంక్‌
    ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ..  ప్రజలే. నన్ను ఇంతటివారిని చేశారు. అలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సమయానికి రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించాను. అక్కడితోనే ఆగిపోవడం నాకిష్టం లేదు. ఇంకా సేవ చేయాలనుంది. 

    నన్ను స్ఫూర్తిగా తీసుకుని..
    నిరుపేద చిన్నారులకు ఉచితంగా విద్య ఎలా అందించాలని ఆలోచిస్తున్నాను. పిల్లలకు మంచి విద్య అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాను. తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్‌ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉచిత విద్య అందించారు. 

    ఇప్పుడు తనే నాకు ఇన్‌స్పిరేషన్‌
    అలా ఆయన చేస్తున్న విద్యాదానం నన్నెంతగానో మోటివేట్‌ చేసింది. ఒకప్పుడు ఆయనకు నేను ఇన్‌స్పిరేషన్‌.. కానీ ఇప్పుడు నేను సూర్య నుంచి స్ఫూర్తి పొందుతున్నాను. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే నా భవిష్యత్తు కార్యాచరణ అని చిరంజీవి పేర్కొన్నారు.

    చదవండి: 32 ఏళ్ల తర్వాత.. మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్‌ వీడియో

  • టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తెలుసు కదా మూవీతో ప్రేక్షకులను అలరించాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక కొత్త ఏడాదిలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేయలేదు మన యంగ్ హీరో.

    తాజాగా ఇవాళ ఉగాది సందర్భంగా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ అఫీషియల్‌ అనౌన్స్ చేశారు. కొత్త చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ మూవీకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాలు బ్యానర్సపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు.  

  • టాలీవుడ్‌ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్‌. విలక్షణ నటుడు మోహన్‌బాబు విలన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు. నేడు (మార్చి 19న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. అందులో మోహన్‌బాబు 32 సంవత్సరాల తర్వాత నేను విలన్‌గా యాక్ట్‌ చేస్తున్నాను. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ నన్ను మాయ చేశాడు అని పేర్కొన్నారు. ఆయనను షికంజి పాత్ర కోసం ఎలా సన్నద్ధం చేస్తున్నారనేది చూపించారు.

    మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్‌  గ్లింప్స్‌
    చివర్లో మోహన్‌బాబుకు ఎలివేషన్‌ ఇచ్చాడు శ్రీకాంత్‌ ఓదెల. ఈ జనరేషన్‌కు మోహన్‌బాబు సర్‌ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ, ప్యారడైజ్‌తో ఆయనేంటో చూపిస్తాం అన్నాడు. అయితే ఈ గ్లింప్స్‌ నిడివి కేవలం 46 సెకన్లు మాత్రమే కలిగి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎల్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

     

    చదవండి: 41 ఏళ్ల వయసులో తల్లయిన బుల్లితెర నటి

  • టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌ జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి పేరుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహానికి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

    అయితే ఇవాళ ఉగాది కావడంతో సామ్ సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ సుమ, డైరెక్టర్‌ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్‌లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. నువ్వు చేశావా? అంటూ రాజ్‌ ‍అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని నవ్వు ఆపుకోలేపోయారు. అంతకుముందు సామ్.. హాయ్‌ బాబు అని రాజ్‌ను ముద్దుపేరుతో పిలవడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

    Viral Video: ఉగాది పచ్చడి చేసిన సమంత..

    కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ‍ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. 

  • ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్‌ దహియా గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    అంతా అయిపోయిందనుకునేలోపు..
    'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్‌ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్‌ క్యాప్షన్‌ జోడించింది.

    ఇంకా షాపింగ్‌ మొదలుకాలేదు
    ఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్‌ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్‌గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్‌ మొదలుపెట్టలేదు.

    2016లో పెళ్లి
    జూన్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్‌.. యే హై మొహబ్బతే సీరియల్‌ సెట్‌లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్‌ బలియే 8వ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.

    సీరియల్‌
    దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్‌, యాంకర్‌ కూడా! 2005లో మిస్‌ భోపాల్‌ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్‌ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్‌ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్‌ నటిగా రికార్డు సృష్టించింది.

     

     

    చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

    ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్‌కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. మొదటి పార్ట్‌లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.

    మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్‌గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?)

  • ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయింది.

    (ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)

    తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్‌ ఎలిమెంట్స్‌ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

    'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా  పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెల‌బ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?)

  • టైటిల్‌ : ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
    నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్‌ తదితరులు
    నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
    నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
    రచన, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌
    స్క్రీన్‌ప్లే: కె. దశరథ్, రమేష్ రెడ్డి
    సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
    నేపథ్య సంగీతం: తమన్‌
    సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
    ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌
    విడుదల తేది: మార్చి 19, 2026

    ‘గబ్బర్‌ సింగ్‌’తర్వాత పవన్‌ కల్యాణ్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చన రెండో చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. వాస్తవానికి 2020లోనే హరీష్‌-పవన్‌ సినిమా ఫిక్స్‌ అయింది. మైత్రీ మూవీస్‌ సంస్థలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పవన్‌ రాజకీయాలలో బిజీ కావడంతో షూటింగ్‌ ఆలస్యం అయింది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన సినిమా ఉగాది పండగ సందర్భంగా నేడు(మార్చి 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    తెలంగాణాలొని లింగయ్య గూడెం గ్రామానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌(కేఎస్‌ రవికుమార్‌).. చిన్నయ్య అనే కుర్రాడినికి చేరదీసి పెద్ద చదువులు చదివిస్తాడు.  చిన్నయ్య ప్రవర్తన, లక్షణాలను చూసి చిన్నప్పుడే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అని నామకరణం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మాస్టరు  రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. భగత్‌ సింగ్‌ ఐపీఎస్‌ అధికారి అవుతాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో సీఎంపై దాడి జరుగుతుంది. ఆ దాడి వెనుక మంత్రి నాగప్ప (పార్తిపన్)  ఉన్నట్లు తెలుస్తుంది.  తన గురువుని కాపాడుకునేందుకు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఏం చేశాడు? నాగప్పతో ఉస్తాద్‌కు ఉన్న వైర్యం ఏంటి? ఆర్జే లీలా(శ్రీలీల) తో ఉస్తాద్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఐపీఎస్‌గా విధులు నిర్వహించాల్సిన ఉస్తాద్‌.. సీఎంపై దాడి తర్వాత అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? భగత్‌ సింగ్‌ గతమేంటి? శ్లోక(రాశీ ఖన్నా) ఎవరు?  తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే..
    ఈ రోజుల్లో బలమైన కంటెంట్‌ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు.  ఎంత పెద్ద స్టార్‌ ఉన్నా సరే.. కథలో కొత్తదనం లేకుంటే ఆ సినిమాను ఆదరించడం లేదు. ఇలాంటి రోజుల్లో దర్శకుడు హరీష్‌ శంకర్‌ రొటీన్‌ కథతో ‘ఉస్తాద్‌ భగన్‌ సింగ్‌’ తెరకెక్కించాడు. కథ, కథనం ఏమాత్రం కొత్తగా అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాల సన్నివేశాలన్నీ కళ్లముందు కదులుతాయి. స్క్రీన్‌ప్లే అయితే మరీ దారుణంగా ఉంది. ఒక్కచోట కూడా ఆసక్తికరంగా కథనం సాగదు. పైగా పవన్‌తో చేయించిన కామెడీ ట్రాక్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. నార్మల్‌ ఆడియన్స్‌ని పక్కన పెట్టు..కనీసం అభిమానులు ఆశించిన అంశాలు కూడా ఇందులో ఉండకపోవడం గమనార్హం. 

    ఫ్యాన్స్‌ కోసమే అన్నట్లుగా పవన్‌లో స్టెప్పులు వేయించారు. కానీ కథలో అది ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. డ్యాన్స్‌..డ్యాన్స్‌ అంటూ హీరోకి హైప్‌ ఇచ్చి.. ఆ సందర్భంలో పెట్టిన పాటకు సరైన స్టెప్పులే వేయించలేదు. అలాంటి అప్పుడు అంత హైప్‌ ఇవ్వడం ఎందుకో? మరోవైపు ‘ధేఖ్‌ లేంగే సాలా’సాంగ్‌  మిస్‌ప్లేస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

    ఇక ఈ కథకి టెర్రరిజం, సనాతన ధర్మం అంశాలను యాడ్‌ చేయడం కూడా ఇరికించినట్లుగానే అనిపిస్తుంది. హీరోని దృష్టిలో ఉంచుకోనే ఆయా సన్నివేశాలను యాడ్‌ చేశారనిపిస్తుంది. ఎలివేషన్‌ ఇస్తూ..ఏదో చెప్పేస్తే చాలు ఫ్యాన్స్‌ కనెక్ట్‌ అయిపోతారని భావించారేమో. అప్పుడే హీరో కామెడీ చేస్తాడు.. కాసేపటికే సీరియస్‌ అవుతాడు. ఆ లోపే మరో కొత్త పాయింట్‌ తెరపై వస్తుంది. వాటిలో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునేలా ఉండడకపోవడమే మైనస్‌. ఇక ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా ఈ కథ ‘తెరి’ సినిమాకు పూర్తిగా రీమేక్‌ కాకపోయినా.. హీరో పాత్రతీరుతో పాటు ఒకటి రెండు సీన్లు ఆ సినిమాను గుర్తు చేస్తాయి. 

    సీఎంపై దాడి చేసే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. హీరో బాల్యం చూపిస్తే.. సీఎంతో అతనికి ఉన్న అనుబందాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.  ఆ తర్వాత  శ్లోకగా రాశీ ఖన్నా ఎంట్రీ అయినప్పటి నుంచి కథనం రొటీన్‌గానే సాగుతుంది.  ఇంటర్వెల్‌ సీన్‌ కూడా రొటీన్‌గానే  ఉంటుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే హీరో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. శ్రీలీల-పవన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొలి ప్రేమలో సినిమాలోని ‘ఈ మనసే..’ పాట రీమేక్‌ ఫ్యాన్స్‌కి అలరిస్తుంది.  ఆ తర్వాత మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది.  ఫస్టాఫ్‌తో పోలిస్తే.. సెకండాఫ్‌ కాస్త బెటర్‌. మొత్తంగా మాత్రం ఉస్తాద్‌ .. రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.  కొత్తదనం ఆశించి వెళితే..అభిమానులకు సైతం నిరాశ తప్పదు. 

    ఎవరెలా చేశారంటే.. 
    నటనపరంగా మెప్పించేందుకు ఇందులో పవన్‌  కొత్తగా చేసిందేమి లేదు.  ఈ తరహా పోలీసు పాత్రను ఆయన ఆల్రేడీ చేసేశాడు. ఓ పాటకు స్టెప్పులు వేయడం ఫ్యాన్స్‌కి కిక్‌ ఇస్తుంది.  శ్రీలీల పాత్ర ఎంట్రీ సెకండాఫ్‌లో ఉంటుంది. అయినప్పటికే తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా పాత్రకు నిడివి తక్కువే. అంతగా ప్రాధాన్యత కూడా లేదు.  పార్తీబన్‌ విలనిజం జస్ట్‌ ఓకే.  కేఎస్ రవికుమార్, కిల్లి క్రాంతి, శ్రీనాథ్ మాగంటితో పాటు మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఓకే . తమన్‌ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల సన్నివేశాలతో సంబంధం లేకుండా ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

International

  • దుబాయ్‌లోని కార్మికులకు ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (రంజాన్‌) వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఆధ్వర్యంలో మార్చి 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ‘ఈద్ అల్ ఫితర్… లెట్స్ సెలబ్రేట్ టుగెదర్’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమం కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.  

    ఈ వేడుకల్లో పాల్గొనే వారికి కార్లు, బంగారు బార్లు, విమాన టికెట్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించబడుతోంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. 

    ఈ కార్యక్రమం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతగా, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.  

    కార్మికులు విస్తృతంగా పాల్గొనేలా ‘బ్లూ కనెక్ట్’ అనే ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వేడుకలు ప్రసారం చేయబడతాయి. ఇందులో వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్, పోటీలు వంటి విభిన్న వినోదాత్మక కంటెంట్ అందుబాటులో ఉంటుంది.  

    GDRFA దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా కార్మికుల కృషిని గౌరవించడం, వారి దైనందిన సహకారాన్ని గుర్తించడం మా లక్ష్యం. ఈద్ ఆనందాన్ని వారితో పంచుకోవడం ద్వారా దుబాయ్ స్థిరమైన అభివృద్ధి ప్రయాణంలో వారి పాత్రను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు.  

     

  • పశ్చిమాసియాలో యుద్దం పతాకస్థాయికి చేరిన వేల జపాన్ ప్రధాన మంత్రి సనాఏ తకాఇచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశానికెత్తారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 

    ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో శాంతి సాధనకు అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం ట్రంప్ వద్ద మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం తరఫున ఈ సందేశాన్ని ట్రంప్‌కు అందిస్తున్నట్లు తెలిపారు.

    ఇదే సందర్భంగా తకాఇచి ఇరాన్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.  

    ఈ సమావేశం ద్వారా జపాన్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. జపాన్, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ప్రధాన మిత్రదేశంగా ఉంది. పెరుగుతున్న చైనా ప్రభావం, ఉత్తర కొరియా అణు పరీక్షలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాల నడుమ రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. 

    తకాఇచి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీశాయి. ప్రపంచ శాంతి సాధనలో ట్రంప్‌ను ఏకైక నాయకుడిగా అభివర్ణించడం అమెరికా వ్యతిరేకులకు మింగుడుపడటం​ లేదు. ఈ వ్యాఖ్యలు ఇతర ప్రపంచ నాయకుల పాత్రను తగ్గించి చూపుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి.  

    జపాన్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ స్పందించారు. రెండు దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం ప్రపంచ శాంతి సాధనలో కీలకమని అన్నారు. జపాన్ ఎల్లప్పుడూ అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని పేర్కొన్నారు. మేము కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు. 

  • అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన తరుణంలో మరో కొత్త అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. . ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్‌ విసురుతుండగా, ఇప్పుడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను కత్తిరిస్తే ఏమటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్‌ కలపడానికి ఇంటర్నెట్‌ కేబుళ్లు హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్తాయి. 

    చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం  ఇరాన్‌పై దాడులు సాగిస్తున్న తరుణంలో మరి ఆ దేశం హోర్ముజ్‌ జలసంధి ఇంటర్నెట్‌ కేబుళ్లను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటి? అనేది పలుదేశాలను పట్టి పీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్‌ను నిలిపివేస్తుందా? అనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.

    మరొకవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మండేబ్‌పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు ఉన్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. ఇది యూరప్‌-ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇక్కడ కేబుల్స్‌ను కట్‌ చేస్తే ఆ ప్రాంతాల వాణిజ్యంతో పాటు ఇంటర్నెట్‌కు కూడా విఘాతం ఏర్పడుతుంది. అటు హోర్ముజ్‌ జలసంధి, ఇటు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్‌ కేబుల్స్‌ను ఇరాన్‌ కానీ, ఇరాన్‌కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్‌ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. 

    ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రంలో యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపులు ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుపుతుండటంతో, ఆ ఇరుకైన జలమార్గం కూడా ప్రమాదకర ప్రాంతంగా మారింది.

    పూర్తిగా ఆగదు.. కానీ 
    ఇరాన్ హోర్ముజ్ సముద్ర మార్గంలోని అండర్‌సీ కేబుల్స్‌ను కత్తిరిస్తే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్‌ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, గ్లోబల్ డేటా ట్రాఫిక్‌కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, హోర్ముజ్,  బాబ్ ఎల్-మండెబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తంగా, ఇరాన్ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్-మండెబ్ వద్ద కేబుల్స్‌ను దెబ్బతీస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది,

    హోర్ముజ్ అండర్‌సీ కేబుల్స్ ప్రాముఖ్యత
    హోర్ముజ్ సముద్ర మార్గం: ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యాన్ని కలిపే ప్రధాన ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ ఇక్కడ గుండా వెళ్తాయి.
    95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు కేబుల్స్ ద్వారానే జరుగుతుంది.
    భారతదేశం: పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో మూడో వంతు హోర్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది.

  • పశ్చిమాసియా యుద్ధం మొదలై ఇప్పటికే మూడు వారాలు కాగా, ఈ పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుట లేదు.  అటు అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి తీవ్రతను పెంచగా, ఇరాన్‌ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఏ ఒక్క వర్గము వెనక్కి తగ్గడానికి ఆసక్తి చూపడం లేదు. 

    ఆ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఇప్పటికే పలు రకాల సంక్షోభ పరిస్థితులు చోటు చేసుకోగా, ఇంకా యుద్ధ తీవ్రత ముదిరితే ఎటువైపుకు వెళుతుందోననే  ఆందోళన ప్రజల్లో కనబడుతోంది. అయితే   నాయకుల్లో మాత్రం  ఎటువంటి భయం కనపడకపోగా, యుద్ధాన్ని మేము ముగిస్తాం( మేమెంటో చూపిస్తాం) అంటే మేము ముగిస్తాం అని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా  అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    ఇరాన్‌కు మరొకసారి తామేంటో చూపిస్తామని, అందుకు సిద్ధంగా ఉండాలని ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈరోజు(గురువారం) ఇరాన్‌  మరో భీకర యుద్ధాన్ని చూడబోతోంది. అది కూడా ఒక భారీ యుద్ధ ప్యాకేజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.  ఇరాన్‌లో 7,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై అమెరికా దాడి చేసింది. గురువారం అత్యంత పెద్ద యుద్ధ ప్యాకేజ్‌ను ఇరాన్‌కు చూపించబోతున్నాం. అది మునుపటి దానితో సమానంగా ఉంటుంది. కానీ అది మీ ఊహకు అందదు. మా సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఇరాన్‌వి తగ్గుతున్నాయి,  ఇప్పటికే ఇరాన్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు సమూలంగా ధ్వంసమయ్యాయి’అని పేర్కొన్నారు. 

  • ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ (South Pars) గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్  దాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. ప్రపంచ ఇంధన సరఫరా , ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత రాజేస్తోంది. అసలు సౌత్ పార్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత కీలకం?  తెలుసుకుందాం.

    ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  "నియంత్రించలేని పరిణామాలు" ఉంటాయని  హెచ్చరించిన ఇరాన్  అన్నంత పనీ చేస్తోంది.ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

    ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపం
    అరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిక్షేపాల్లో ఒకటి. దీనిని ఇరాన్, ఖతార్ దేశాలు పంచు కుంటున్నాయి. అయితే ఇరాన్‌లో ఉన్న భాగాన్ని 'సౌత్ పార్స్' అని పిలుస్తారు. అలాగే ఖతార్ భాగాన్ని 'నార్త్ ఫీల్డ్' అని పిలుస్తారు.

    ఈ రెండింటి సామర్థ్యం సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్. ఇది ప్రపంచం మొత్తానికి పదేళ్ల పాటు సరిపోయేంత భారీ నిక్షేపం. సౌత్ పార్స్ కేవలం ఇంధన వనరు మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక వంటిది. అందుకే ఇరాన్‌కు  అంత ముఖ్యం.  అంతేకాదు ఇరాన్ ఉపయోగిస్తున్న మొత్తం సహజ వాయువులో సుమారు 80శాతం ఈ ఒక్క ఫీల్డ్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, గృహాలు, పరిశ్రమల నిర్వహణకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ వినియోగించే దేశాల్లో ఇరాన్ ఒకటి.

    ఇదీ చదవండి: నో జీన్స్‌, నో టీషర్ట్స్‌, నో పార్టీవేర్‌ : ఉద్యోగులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

    ప్రభావం ఎంత?
    ఈ గ్యాస్ ఫీల్డ్‌కు ఏదైనా అంతరాయం కలిగితే, ఇరాన్ అంతటా విద్యుత్  సంక్షోభం ఏర్పడటమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఇప్పటికే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ దాడి అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది.  ఇంతపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం  తప్పదనే ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం గమనార్హం.  ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కూడా  కుదిపేస్తున్నాయి.

    ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు

  • పశ్చిమాసియా యుద్ధం అప్‌డేట్స్‌
     

    ఇరాన్‌కు ఈరోజు చుక్కలు చూపెడతాం

    • ఇరాన్ మరోసారి భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది
    • పశ్చిమాసియా యుద్ధాన్ని మేమే ముగిస్తాం
    • మేము  మా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం
    • అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్

    దేశంలో ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది: కేంద్రం

    • ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
    • బ్లాక్‌ మార్కెటింగ్‌ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం
    • నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాల్లో తనిఖీలు
    • తెలంగాణలో వెయ్యి ప్రాంతాల్లో దాడులు, 2300 సిలిండర్లు సీజ్‌
    • ప్రజలు ఎల్పీజీకి బదులు పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకోవాలి
    • కిరోసిన్‌, బొగ్గు పొయ్యిలను కూడా వాడాలని కేంద్రం సూచన

     

    ఇరాక్‌లోనూ దాడులు చేస్తున్న ఇరాన్‌   

    • ఇరాక్‌లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు 

    • ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాపై అమెరికా దాడులు

    సుల్తాన్‌ ఆఫ్‌ ఒమన్‌కు భారత ప్రధాని మోదీ ఫోన్‌

    • ఒమన్‌పై ఇరాన్‌ దాడులను ఖండించిన మోదీ
    • పశ్చిమాసియా యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం
       

    గల్ఫ్‌లోని చమురు కేంద్రాలే లక్ష్యం 

    • గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్‌ భీకర దాడులు 

    • ఇరాన్‌ పార్స్‌ గ్యాస్‌ క్షేత్రంపై ఇజ్రాయెల్‌ దాడి 

    • దీంతో రగిలిపోతోన్న ఇరాన్‌ సైన్యం

    • గల్ఫ్‌లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు

    మినాఅల్‌-అహ్మదీ రిఫైనరీపై దాడి

    • కువైట్‌లోని మినాఅల్‌-అహ్మదీ రిఫైనరీపై డ్రోన్‌ దాడి

    • పక్కనే ఉన్న మినా అబ్దుల్లా రిఫైనరీకి అంటుకున్న మంటలు

    • ఖతార్‌లోని రాస్‌ లాఫాన్‌ చమురు కేంద్రంపై ఇప్పటికే దాడి

    • అమెరికా స్థావరాలపైనా ఇరాన్‌ దాడులు

  • టెహ్రాన్: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ భూగర్భ కాంప్లెక్స్‌లో ఇరాన్ కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రాన్ని (uranium enrichment site) అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే, ఈ కొత్త కేంద్రం పని చేస్తోందా? లేదా? అది కేవలం ఒక "ఖాళీ ప్రదేశమా" అన్నది నిర్ధారించలేకపోతున్నామని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) తెలిపింది. ఆ కేంద్రం ఎంత ఆధునికమైనదో స్పష్టంగా తెలియదన్న ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ.. పలు సందేహాలున్నాయన్నారు.

    పర్యవేక్షణ సంస్థకు అక్కడ తనిఖీ చేసే అవకాశం దక్కితేనే వీటికి సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు. అది భూగర్భంలో ఉందని.. కానీ మేము ఇంకా ఆ ప్రదేశాన్ని పరిశీలించలేదని తెలిపారు. ట్రంప్ పరిపాలన అధికారులతో చర్చలు జరపడానికి వాషింగ్టన్ సందర్శించిన గ్రోసీ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. ఒకవేళ ఇది పూర్తయితే, ఇరాన్‌లో ఇది నాలుగో యురేనియం సుసంపన్నత ప్లాంట్ అవుతుందన్నారు.

    ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 440 కిలోల 60 శాతం సుసంపన్నం చేసిన యురేనియం ఉన్నట్లు IAEA అంచనా వేస్తోంది. దీనిని 90 శాతానికి (ఆయుధాల తయారీకి అవసరమైన స్థాయికి) చేర్చగలిగితే, అది అణు ఆయుధ తయారీకి సిద్ధమైనట్లే.. ఇది సుమారు 10 అణు బాంబుల తయారీకి సరిపోతుంది. అయితే దీనికి పట్టే కాలాన్ని లెక్కించడం కష్టమని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు.

    గత ఏడాది 2025 జూన్‌లో ఐక్యరాజ్యసమితి బృందం దానిని పరిశీలించడానికి ఇస్ఫహాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం ప్రారంభమైన తరుణంలో ఆ అణు కాంప్లెక్స్‌పై దాడి జరగడంతో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఐఏఈఏ బృందం తమ పర్యటనను రద్దు చేసుకోవాల్సి రావడంతో, అక్కడ సెంట్రిఫ్యూజ్‌ల అమరిక మొదలైందా? లేదా? అన్నది తెలియడం లేదు. "మేము అక్కడికి తిరిగి వెళ్లగలిగినప్పుడు మాత్రమే స్పష్టత లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

    తమకు అణుబాంబు తయారీ ఉద్దేశం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అది బాంబు తయారీకి చాలా దగ్గరగా చేరుకుందనే కారణంతో అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాయని అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించినప్పటికీ, ఐఏఈఏ మాత్రం అణు ఆయుధ కార్యక్రమంపై తమ వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపింది.

National

  • ఢిల్లీ: నగరంలోని పాలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  ఆప్‌,  బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు  ఇరు పార్టీల నేతలు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్‌పై దాడికి యత్నించారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఇక  ఆప్‌ అధినేత, మాజీ అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ బందోబస్తు నడుమే అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. 

    దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాలం ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు.  ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని లేన్ నంబర్2లోని ఒక నాలుగు అంతస్తుల భవనంలో మంటలు అంటుకుని ఈ  ప్రమాదం చోటు చేసుకుంది. 

  • ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 11 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఐదుగురు సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. 11 మంది మావోయిస్టులు తూర్పు గడ్చిరోలిలో పోలీసులు, కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాల ముందు లొంగిపోయినట్లు పోలీసులు వివరించారు.

    ఆ మావోయిస్టులపై మొత్తం కలిపి రూ.68 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలో వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) దాదాపు ముగింపునకు వచ్చిందని తెలిపారు.  

    కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు, అడవుల్లో చాలా మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. 

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ దాఖలు చేయబోయే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే పట్టుదలతో విజయ్ ఉండగా.. అయితే, ఆయన అసలు ఎన్నికల్లో నిలబడగలరా? అంటూ డీఎంకేలోని న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో అప్రమత్తమైన విజయ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించేంత తీవ్ర వ్యవహారంగా మారింది

    ఎన్నికల కేసుల్లో అనుభవం ఉన్న కొందరు డీఎంకే న్యాయవాదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి తన ఆస్తుల వివరాలను దాచకూడదు. సమగ్రమైన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఆ అఫిడవిట్‌లో అభ్యర్థి తన పేరుతో ఉన్న చరాస్తులు, స్థిరాస్తులే కాకుండా.. భార్య, కుమారులు, కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిల్వలు, ఆదాయపు పన్ను వివరాలన్నింటినీ సమర్పించాలి.

    ఇందులో ఎలాంటి తప్పులు ఉండకూడదు. ఈ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఎవరైనా ఇందులో తప్పుడు సమాచారం, ఆస్తులను దాచడం వంటివి గుర్తిస్తే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. అయితే, ప్రస్తుతం.. విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం విజయ్ నామినేషన్ దాఖలు చేయడంలో అడ్డంకిగా మారవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆమె పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయి? బ్యాంకు నిల్వలు ఎంత? ఏవైనా అప్పులు ఉన్నాయా? వంటి ప్రశ్నలకు విజయ్ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉన్నాయా? అనే సందేహాలు న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

    విజయ్, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ కాలంలో ఆమె తన పేరు మీద, పిల్లల పేరు మీద గానీ ఏవైనా ఆస్తులు కొన్నారా? అప్పులు చేశారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టారా? వంటి వివరాలు విజయ్‌కు తెలిసే అవకాశం లేదు. తన భార్యతో సంప్రదిస్తేనే విజయ్ తన నామినేషన్‌లో సరైన వివరాలను పొందుపరచగలరు. కానీ, ప్రస్తుతం వారద్దరూ మాట్లాడుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది.

    అందుకే విజయ్ నామినేషన్ చట్టపరమైన చిక్కులు కలగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్‌ నామినేషన్ దాఖలును మా సీనియర్ లాయర్లు నిశితంగా గమనిస్తారు, దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి’’ అని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దీనిపై విజయ్‌కు చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?. భార్యతో విడిగా ఉంటున్నందున కొత్తగా కొన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేనని చెప్పడానికి చట్టపరమైన వెసులుబాటు ఉందా? అని దానిపై విజయ్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
     

  • సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు   కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. అధికారులు, ఉద్యోగులు జీన్స్, టీ–షర్టులు, తదితర ఫ్యాన్సీ దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ఆదేశాలు జారీ చేసింది.జి మ్‌కు సంబంధించిన  ఒక ప్రొడక్ట్‌ను ప్రచారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్‌తో ప్రభుత్వ అధికారులపై చర్చ, షిమ్లా అర్బన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఓషిన్ శర్మకు సంబంధించిన ఇటీవలి వివాదం నేపథ్యంలో ఈ ఆదేశం వెలువడింది.

    మార్చి 16న పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఈ ఉత్తర్వులను  జారీ చేసింది.   ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ తెలిపారు. ఈ నిబంధనలను పాటించనివారిపై కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. అంతేకాదు వీటిని కఠినంగా అమలు చేసేలా పరిపాలనా కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా అధికారులందరికీ  కొత్త మార్గదర్శకాలను జారీ  చేశారు. 

    ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు

    తాజా ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు , కోర్టు విచారణలతో సహా అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు, లాంఛనప్రాయంగా , హుందాగా కనిపించాలని రాష్ట్రం ఆదేశించింది.  లేత రంగుల్లో ఉండే ఫార్మల్‌ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజా సేవతో ముడిపడి ఉన్నసిబ్బంది హుందాతనాన్ని, గౌరవాన్ని ప్రతిబింబించాలని  ఆదేశించింది. అలాగే  పార్టీ వేర్‌ను కూడా ప్రభుత్వం నిషేధించింది. పురుష ఉద్యోగులు కాలర్‌ ఉన్న షర్టులు, ఫార్మల్‌ ప్యాంట్లు, ట్రౌజర్లు ధరించడం తప్పనిసరి. మహిళలు చీరలు, ఫార్మల్‌ సూట్లు, సల్వార్‌ కమీజ్, చుడీదార్‌ లేదా చున్నీ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. ప్యాంట్లు, షర్టులు వేసుకోవచ్చు. అలాగే తగిన  పాదరక్షలు ధరించాలి. 

    రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ నీరజ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులో, ఉద్యోగులు సోషల్ మీడియా, ఇతర బహిరంగ వేదికలపై బాధ్యతా యుతంగా, హుందాగా  ఉండాలని ఆదేశించారు. ఉద్యోగులు ఏదైనా వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, అవి తమ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొనాలని  వివరించింది. 

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

  • మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను స్వయంగా తల్లే రైలు కిందకి తోసేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది.  సీసీటీవీలో రికార్డైన ఈ భయంకరమైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

    టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనం  ప్రకారం నర్మదాపురంలోని మలఖేడి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి బాధిత మహిళ. భర్త మరణం తర్వాత ఆమెకు కాంపెన్సేటరీ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నుంచి వారిద్దరూ ఒంటరిగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రైల్వే స్టేషన్‌కు వెళ్లి, ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను ఎదురుగా వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి తోసివేసింది. దీంతో బాలిక తల, నడుము, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయిపోయింది.  ఆమెను కాపాడిన  రైల్వే సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచిన చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని మరో ఆసుపత్రికి  తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. 

    ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!

    ఆందోళన కలిగించిన విషయం  ఏమిటంటే..
    ఈ ఘటన జరగడానికి దాదాపు మూడు గంటల ముందు నుంచి తల్లీకూతుళ్లు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉన్నారని నర్మదాపురం ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్‌చార్జి సంజీవ్ చౌక్సే  వెల్లడించారు. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నెం. 1 వైపు వస్తుండగా, ఆ మహిళ అకస్మాత్తుగా చిన్నారిని పట్టాలపైకి తోసేసింది. లోకోమోటివ్ ఢీకొనడంతో ఆ బాలిక ప్లాట్‌ఫారమ్ అంచుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలుతో నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో చుట్టుప క్కల వారు, రైల్వే సిబ్బంది ఆ చిన్నారి సహాయానికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను బయటకు లాగిఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి పరుగులు తీస్తున్నసందర్భంలో రైలుకిందకి బిడ్డను తోసేసిన ఆ మహిళ,  బిడ్డను రక్షించవద్దని పదే పదే వేడుకుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో  నిందిత మహిళ మానసిక ఆరోగ్య కోణం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. ఆ మహిళ చికిత్స చరిత్రను ధృవీకరించే ప్రక్రియలో ఉన్నామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామనీ,  తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.
    ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

  • సాక్షి, ఢిల్లీ:  'కేడీ: ది డెవిల్'(KD: The Devil) పాట వివాదంలో  మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అశ్లీల సాహిత్యం అంటూ   రేగిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) మహిళా కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది.

    ఎన్‌సీడబ్ల్యూ సమన్లు
    ఈ పాటలో అశ్లీలత ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్‌సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ చిత్రం బృందంతోపాటు, బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్, నోరా ఫతేహికి  జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.ఈ పాటలో అభ్యంతరకరమైన ,అశ్లీల సాహిత్యం, అలాగే వీక్షకులను, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అనుచితమైన అవాంఛనీయ చిత్రాలు ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన అనేక ఫిర్యాదుల  నేపథ్యంలో ఎన్‌సీడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. పాట రచయితలు, నిర్మాతల నుండి వివరణ కోరింది.

    ఈ సాంగ్‌  విడుదల కాగానే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు  సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పాటలోని సాహిత్యం, కొరియోగ్రఫీ చాలా అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పిల్లలపై ఇలాంటి కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతుందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పాటను యూట్యూబ్ నుండి తొలగించారు. అటు బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించారు. అశ్లీలతలో బాలీవుడ్  అన్ని హద్దులు దాటేసిందని తీవ్రంగా మండిపడ్డారు.

    మరోవైపు, చిత్ర దర్శకుడి భార్య రక్షిత ఈ పాటను సమర్థించారు. గతంలో కూడా ఇలాంటి మాస్ సాంగ్స్ వచ్చాయని, ఇది కేవలం సినిమా సృజనాత్మకతలో భాగమేనని  దీన్ని సమర్ధించుకున్నారు.

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

    ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వినోద రంగంలో సృజనాత్మక స్వేచ్ఛ ,బాధ్యతల పరిమితులపై చర్చను రేకెత్తించింది.ఈ పాటలు భారతీయ సినిమాలో దీర్ఘకాలంగా ఉన్న ధోరణులలో భాగమని కొందరు వాదిస్తుండగా, హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్‌ను నిరోధించడానికి మరింత కఠినమైన నిబంధనలు అవసరమని మరికొందరు భావిస్తున్నారు. మరోవైపు ఎన్‌సీడబ్ల్యూ (NCW) చర్య వల్ల వినోద రంగంలో కంటెంట్ నియంత్రణపై విస్తృత పరిణామాలు చోటుచేసుకోవచ్చని మరికొందరి అంచనా.

  • న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. 

    అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్‌ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఫ‍్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 

    ప్రపంచంలో అత్యధికంగా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్‌పై ఇరాన్‌ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. 

    ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.

    ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్‌లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.

    భారత్‌పై ప్రభావం 
    ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.

    “భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్‌ఎన్‌జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.

    ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.

    గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్‌ఎన్‌జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి.

  • బెంగళూరులో ఓ సీనియర్ ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారిని మోసం చేసి లక్షల్లో దోచుకున్నాడో మోసగాడు. ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ నమ్మబలికిన చిలుక జ్యోతిష్యాన్ని నమ్మి దారుణంగా మోసపోయిన వైనం విభ్రాంతి రేపింది. చదువుకున్న వారు, ఉన్నత హోదాల్లో ఉన్నవారు కూడా మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి మోసపోవడం ఆశ్చర్యం అంటూ నెట్టింట చర్చకు దారితీసింది.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలు  ఇలా ఉన్నాయి.

    బెంగళూరులో చిలుక జోస్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్నతమిళనాడుకు చెందిన శేఖర్ (59) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను శాఖలో పరిపాలనా అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను నిందితుడు ముఖం చూసి భవిష్యత్తు చెబుతానంటూ  నమ్మించాడు. కెరీర్ ఎదుగుదల, బదిలీలు వంటి ఆశలు చూపించాడు. ఇందుకు పూజలు, క్రతువు చేయాలని ఆ అధికారిని ఒప్పించాడు. ఇందుకోసం రూ. 50,000 చెల్లించేలా చేశాడు.

    ఆ తరువాత మరింత శక్తివంతమైన పూజలు చేస్తేనే దోషాలు తొలగిపోతాయని నమ్మించాడు.  ఇలా సుమారు రూ. 35 లక్షల విలువైన 194 గ్రాముల బంగారం, 1.3 కిలోల వెండి వస్తువులను కాజేశాడు. చివరికి అనుమానం వచ్చి విలువైన తన వస్తువులను తిరిగి ఇవ్వమని అడగడంతో చిలుక జ్యోతిష్యుడి అసలు బండారం బయట పడింది. అధికారి వెండి, బంగారు వస్తువులను తిరిగి ఇవ్వలేదు సరికదా ఎదురు బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు భారతీనగర్ పోలీసులను ఆశ్రయించాడు.

    మార్చి5 న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 12న కాంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు.  విలువైన వస్తువులను హలసూరులోని ఒక జ్యువెలరీ షాపులో అమ్మేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని సమాచారం ఆధారంగా, పోలీసులు 124 గ్రాముల బంగారం, 796 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 20.60 లక్షలు.

    మార్చి 17న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతోనే తాను ఈ మోసానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. విచారణలో భాగంగా, నిందితుడు జ్యోతిష్యం, చిలుక జ్యోతిష్య సేవలను అందిస్తానని చెబుతూ, ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసం ద్వారా సేకరించిన డబ్బు మరియు బంగారాన్ని నిందితుడు ఎక్కడికి తరలించాడనే విషయంపై అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్‌ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.

    రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..
    ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.

    పోలీసుల జోక్యం
    సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.

    పార్టీ స్పందన
    ఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

Sports

  • గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం  వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్‌ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!

    ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్‌ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్‌  చెబుతున్నాడు.

    ఇటీవల  తన మాజీ ఐపీఎల్‌ సహచరుడు ఏబీ డివిలియర్స్‌ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ షోలో చహల్‌ ఈ విషయం గురించి మాట్లాడాడు.  ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.

    తరచూ ఆరోగ్య సమస్యలు
    గతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు  ఎదుర్కున్నానని చహల్‌ చెప్పాడు.  మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. 

    ‘‘కొన్ని సార్లు నా మీద నాకే  నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్‌ మ్యాచ్‌ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్‌లో నేను నా సరైన లెగ్‌–స్పిన్‌ బౌలింగ్‌ చేయలేకపోయాను’’ అని చహల్‌ గుర్తు చేసుకున్నాడు.

    ‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్‌ వెల్లడించాడు. 

    మద్యం మానేశాను
    దీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ...  తాను మద్యం మానేసినట్లు తెలిపాడు.  దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్‌ కింగ్స్‌ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని  చహల్‌ ఈ సందర్భంగా చెప్పాడు.

    ‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం  ఇవ్వాలనుకుంటున్నాను. 

    ఒక సీనియర్‌ ఆటగాడిగా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్‌ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.

    ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్‌పై కూడా చహల్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. 

    యాన్సెన్‌ లేకపోవడం వల్లే
    ఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్‌ ఆల్‌–రౌండర్‌ మార్కో యాన్సెన్‌ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్‌ 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు.

    సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్‌ జూన్  నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్‌ క్యాంప్‌ విడిచిపెట్టి, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌  ఫైనల్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.

    ‘ఫైనల్‌లో మార్కో యాన్సెన్‌ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్‌ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్‌ అంతటా అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్‌లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్‌ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్‌ చెప్పాడు.

    చదవండి: IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!

  • టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్‌లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో పొట్టి క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా
    దేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్‌ ఆశపడతాడనటంలో సందేహం లేదు.

    ప్రతిభ ఉన్న యువ, అన్‌క్యాప్డ్‌ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్‌కు టాప్‌-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.

    ఫ్రాంఛైజీ క్రికెట్‌ లీగ్‌లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్‌’ లీగ్‌కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు రెండో ర్యాంకు ఇచ్చింది. 

    క్యాష్‌ రిచ్‌.. కానీ బెస్ట్‌ కాదు!
    క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్‌బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లకు టాప్‌-5లో చోటు ఇచ్చింది.

    ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్‌/ఏజెంట్‌ అప్రూవల్‌ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.

    ఈ అంశాలలో మెరుగుపడాలి!
    ఇందులో భాగంగా ది హండ్రెడ్‌కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్‌కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్‌కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్‌ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది.  

    పాక్‌ పరిస్థితి ఇదీ
    ఇక బిగ్‌బాష్‌ లీగ్‌కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026 సీజన్‌ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.

    అంతటా మనోళ్లదే పైచేయి
    కాగా WCA ప్రకటించిన టాప్‌-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్‌’, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అత్యధిక జట్లు ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.

    చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

  • ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్‌ ఎల్లిస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్‌-2026 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

    పతిరణను వదిలేసి..
    కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్‌, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్‌ మతీశ పతిరణను సీఎస్‌కే విడిచిపెట్టింది. దీంతో పేస్‌ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్‌ పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌ (Nathan Ellis)ను మాత్రం సీఎస్‌కే అట్టిపెట్టుకుంది.

    అయితే, సీజన్‌ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్‌ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్‌ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ ధ్రువీకరించారు.

    మాకు ఇది భారీ ఎదురుదెబ్బ
    ‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్‌ జట్టులో కీలక బౌలర్‌. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్‌ స్పోర్ట్స్‌స్టార్‌కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్‌ రీప్లేస్‌మెంట్‌ను సీఎస్‌కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.

    ఇదిలా ఉంటే.. సీఎస్‌కే పేస్‌ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్‌ బౌలర్లు ఉన్నారు. మ్యాట్‌ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్‌ను రూ. 75 లక్షలకు సీఎస్‌కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ కూడా ఈ జట్టులో ఉన్నాడు.

    ఐపీఎల్‌-2026 టోర్నీకి సీఎస్‌కే జట్టు
    MS ధోని (వికెట్‌ కీపర్‌), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్‌ ద్వారా, వికెట్‌ కీపర్‌), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), ఖలీల్‌ అహ్మద్‌, అకీల్‌ హొసేన్‌, ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మ, మాథ్యూ షార్ట్‌, అమన్‌ ఖాన్‌, జాక్‌ ఫౌల్క్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ చహర్‌, మ్యాట్‌ హెన్రీ.

    చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

  • ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను కేకేఆర్‌ జట్టు నుంచి తొలగించింది.

    పతిరణకూ గాయం!
    ఇక కేకేఆర్‌ మరో ఆటగాడు, టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్‌ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్‌ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.

    ఫిట్‌గా ఉన్నా అనుమతి లేదు?
    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్‌నెస్‌ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    పతిరణ ఫిట్‌నెస్‌ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్‌ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.

    విమాన టికెట్లు బుకింగ్‌, రద్దు
    మేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్‌ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.

    చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలు
    ఇప్పటి వరకు 32 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్‌ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్‌ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్‌ కొనసాగడం కేకేఆర్‌కు తలనొప్పిగా మారింది.

    మరోవైపు.. పతిరణ మేనేజర్‌ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీని కేకేఆర్‌ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.

    చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్‌

  • ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండుల్కర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్‌.

    ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమే
    ఇక సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ కూడా తండ్రి బాటలో ‍క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌. దేశీ క్రికెట్‌లో తొలుత  ముంబైకి ఆడిన అర్జున్‌.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

    ఇక ఐపీఎల్‌లో తండ్రి సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్‌. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు అర్జున్‌ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)కు అతడిని ట్రేడ్‌ చేసింది.

    ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌తో అర్జున్‌ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో పంత్‌.. అర్జున్‌ టెండుల్కర్‌ బ్యాట్‌ బరువు గురించి అడుగగా..

    మా నాన్నలా కాదులే!.. 
    ‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్‌తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్‌ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్‌ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్‌ సమాధానం ఇచ్చాడు.

    పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?
    ఇక ఆట పట్ల అర్జున్‌ టెండుల్కర్‌ అంకిత భావం గురించి రిషభ్‌ పంత్‌ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్‌ సింగ్‌ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్‌ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్‌కి వచ్చేశావు. క్రికెట్‌ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.

    కాగా మార్చి 5న సానియా చందోక్‌తో.. అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

    చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!

  • టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్‌ఫేక్స్‌ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.

    హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లుగా
    సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్‌ఫేక్స్‌ పెరిగిపోయాయని గంభీర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్‌ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్‌ రావడం గమనార్హం.

    ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్ట
    ఇక మరో వీడియోలో గంభీర్‌ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్‌ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్‌ కోర్టును ఆశ్రయించాడు.  తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

    చట్టబద్ధంగా రక్షణ కల్పించాలి
    తన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్‌ఫేక్‌ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్‌ కోరాడు.

    కాగా 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు గంభీర్‌. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్‌-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా గంభీర్‌ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.

    చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్‌ రిక్వెస్ట్‌!

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్‌ క్రికెట్‌ నాశనమైపోయిందని మండిపడ్డాడు.

    వరుస వైఫల్యాలు
    కాగా గత కొంతకాలంగా పాకిస్తాన్‌ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్‌.. టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది.

    తాజాగా 2026 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టు.. వన్డే సిరీస్‌లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.

    ఐదారు మందిపైనే ఫోకస్‌
    ఈ పరిణామాల నేపథ్యంలో పాక్‌ వెటరన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెబాజ్‌ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్‌ జట్టు, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్‌ చేస్తున్నారు.

    పీఎస్‌ఎల్‌, పాక్‌ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్‌ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్‌ఎల్‌లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్‌ క్రికెట్‌ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

    కనక వర్షం
    కానీ వాళ్లు పాక్‌ క్రికెట్‌ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్‌ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్‌ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.

    జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.

    కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీని ఉద్దేశించి అహ్మద్‌ షెబాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

    చదవండి: T20 WC 2026: జోస్ బ‌ట్ల‌ర్ రిటైర్మెంట్‌..?

  • టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది.

    ఇక దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ను కూడా రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.

    సాహసోపేత నిర్ణయాలు
    ఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్‌ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్‌ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.

    ఫలితంగా జూన్‌, 2023లో అజిత్‌ అగార్కర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్‌. ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌పై కూడా విమర్శలు వచ్చాయి.

    రో-కో ఆడటం కష్టమంటూ
    అంతేకాదు వన్డే వరల్డ్‌కప్‌-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్‌ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్‌పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

    అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్‌ గిల్‌ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ చెలరేగడం అగార్కర్‌పై సానుకూలత వచ్చేలా చేశాయి. 

    పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.

    మరోసారి..
    ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025కి ముందే అగార్కర్‌ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్‌ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.

    వన్డే వరల్డ్‌కప్‌-2027 ముగిసే వరకు తనను చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగించాలని అగార్కర్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్‌జోన్‌ నుంచి ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్‌ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

    చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్‌ కార్తీక్‌

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. బుధ‌వారం ఆర్సీబీ జ‌ట్టుతో చేరిన కోహ్లి.. త‌న తొలి నెట్ ప్రాక్టీస్ సెష‌న్‌లో తీవ్రంగా శ్ర‌మించాడు. గురువారం చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌లో కోహ్లి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు.

    ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మ‌రి భారీ షాట్ల‌తో విరుచుప‌డ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవ‌లం వ‌న్డేల‌కు ప‌రిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు.

    విరాట్ త‌ను చివ‌ర‌గా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 151 స‌గ‌టుతో 302 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, ఒక హాఫ్ సెంచ‌రీ ఉంది. ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌పై కూడా త‌న ఫామ్‌ను కొన‌సాగించాడు. 

    3 మ్యాచ్‌ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్‌లో కూడా కొన‌సాగించాల‌ని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గ‌త సీజ‌న్‌లోనూ కోహ్లి అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 657 ప‌రుగులు చేసి ఆర్సీబీ త‌ర‌పున టాప్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

    ఆర్సీబీ తొలి టైటిల్ గెల‌వ‌డంలో కోహ్లిది కీల‌క పాత్ర‌. కోహ్లి మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆర్సీబీకి టైటిల్‌ను అందించాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
    చదవండి: IPL 2026: 'అత‌డితో జాగ్ర‌త్త‌.. స్టార్ బ్యాట‌ర్ల‌ను సైతం భ‌య‌పెట్ట‌గ‌ల‌డు'


     

     

  • క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్‌ మహమ్మద్ ఇజార్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్‌ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.

    కాగా  గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో బిహార్‌కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్‌.. దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది.

    "ముంబై ఇండియన్స్‌లో ఇప్పటికే ట్రెంట్‌ బౌల్డ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చాహర్‌ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్‌ ఇజార్‌ రూపంలో మరో పేస్‌ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. ఇజార్‌ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు.

    అతడి బౌలింగ్ యాక్షన్‌ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్‌, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్‌నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.

    గతసీజన్‌లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్‌ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.  ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.
    చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్‌ కార్తీక్‌
     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లింలు రేపు ఉపవాస ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎల్లుండి(మార్చి 21, శనివారం) రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం (30 రోజులు) శుక్రవారంతో పూర్తి కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు.

  • హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ విప్‌లను నియమించింది. శాసనసభ విప్‌లుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ రమణారావు, వేముల వీరేశంను తెలంగాణ సర్కారు నియమించింది. అలాగే, శాసన మండలి విప్‌లుగా అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

    యెన్నం

    యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

     

    వేముల వీరేశం

  • సిద్ధిపేట: జిల్లాలోని నర్మెట్ట ఆయిల్‌ ఫ్యాక్టరీ వద్ద   ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు(గురువారం, మార్చి 19వ తేదీ)  ఇక్కడ ఏర్పాటు చేసిన రైతుమేళా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ శ్రేణుల  మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకుంది.  ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ప్రధాన కార్యక్రమంగా ఈ రైతుమేళాను ఏర్రాటు చేయగా, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

    ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. 

    బీఆర్‌ఎస్‌ శ్రేణులను హరీష్‌రావు వారించగా, కాంగ్రెస్‌ కార్యకర్తలను మంత్రులు పొన్నం, తుమ్మలలు వారించారు. గొడవ చేస్తున్న వారిని బయటకు పంపించేయాలని పొన్నం సూచించారు. 

    రైతుమేళా ఉద్దేశ్యం
    ఆధునిక వ్యవసాయ సాంకేతికత ప్రదర్శన
    పంటల వైవిధ్యం (వరి నుండి ప్రత్యామ్నాయ పంటలకు మార్పు)
    వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు ప్రదర్శన
    హార్టికల్చర్, పశుసంవర్ధక, కోళ్లు, వెటర్నరీ సేవలు
    ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ (IFS) పై అవగాహన

    ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్
    నిర్మాణ వ్యయం:  రూ. 300 కోట్లు
    ప్రయోజనం: రైతులకు ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం
    ప్రభుత్వ లక్ష్యం: పంటల వైవిధ్యం పెంచడం, ఎగుమతులు ప్రోత్సహించడం

    రైతుమేళా రైతులకు కొత్త సాంకేతికతలు, పంటల మార్పు అవకాశాలు చూపించడానికి వేదిక.
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 22వ తేదీన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.
     

  • Ramadan 2026 విభిన్న ఆచారాలు, సంస్కృతుల నిలయం మన నగరం.. ఏ మంచి సంప్రదాయమైనా మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది.. అది హలీమ్, ధమ్‌కా రోట్‌ వంటి వంటకాలు కావొచ్చు.. రంజాన్‌ తోఫా వంటి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే పద్ధతులు కావొచ్చు.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారిని ఒక చోట చేరుస్తున్న కార్పొరేట్‌ కల్చర్‌.. భౌగోళిక  సరిహద్దులను మాత్రమే కాదు మతాల సరిహద్దులనూ తిరగరాస్తోంది. -సాక్షి, సిటీ బ్యూరో   

    రంజాన్‌ నెలలో ఉపవాసాలు పాటించి ఈద్‌–ఉల్‌–ఫిత్ర్‌ పండుగ సందర్భంగా పెద్దలు, పిల్లలకు తోచిన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవ డాన్ని ‘రంజాన్‌ తోఫా’ లేదా ‘ఈది’ గా పిలుస్తారు. ప్రేమ, కృతజ్ఞత, స్నేహ బంధాలను బలపరిచే ఒక చక్కని సంప్రదాయంగా స్థిరపడింది. నగదు రూపంలోనో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆట వస్తువులు, గాడ్జెట్లు వంటి బహుమతులు ఇవ్వడం ఒకరిని ఒకరు కలుసుకొని ‘ఈద్‌ ముబారక్‌’ చెప్పుకుంటూ బహుమతులు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల ఈ రంజాన్‌ తోఫా సందడిలో భాగంగా కొత్త గిఫ్ట్‌ ఐడియాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈ–కామర్స్‌ వృద్ధితో ఈద్‌ సమయంలో గిఫ్ట్‌ల ఎంపికలో విపరీతమైన మార్పులు చేర్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని  కార్పొరేట్‌ ఆఫీసులు తమ ఉద్యోగుల కోసం కూడా తోఫాలను అందిస్తుండటంతో మరిన్ని కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి.  

    ట్రెండింగ్‌ రంజాన్‌ గిఫ్ట్‌లు.. 

    • చాక్లెట్లు, అత్తర్, ప్రార్థనా మాలలతో తయారు చేసిన ప్రత్యేక గిఫ్ట్‌ బాక్స్‌లు ఇప్పుడు చాలా ప్రాచుర్యం 
      పొందుతున్నాయి.

    •  పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఖర్జూరాలను అందంగా ప్యాక్‌ చేసి 
      బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. 

    • పేరు లేదా ఈద్‌ ముబారక్‌ మెసేజ్‌తో ఉన్న కప్పులు, ఫొటోఫ్రేమ్స్, కస్టమ్‌ గిఫ్ట్‌ బాక్స్‌లకు నగరంలో బాగా డిమాండ్‌ ఉంది.  

    • కుర్తాలు, హిజాబ్‌లు, అబాయాలు, షాల్స్‌ వంటి ఫ్యాషన్‌ వస్తువులు కూడా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు.

    • ఇస్లామిక్‌ సంప్రదాయంలో సువాసనలు ముఖ్యమైనవి కావడంతో అత్తర్‌ లేదా అరబిక్‌ పరిమళాలు కూడా ప్రముఖ గిఫ్ట్‌ ఎంపికలుగా మారాయి.  (Ugadi 2026 ‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!)

    • చంద్రతార డిజైన్లతో ఉన్న లాంతర్లు, వాల్‌ హ్యాంగింగ్స్, ఖురాన్‌ ఆయతుల్లా కాలిగ్రఫీ ఫ్రేమ్స్‌ వంటి డెకరేటివ్‌ ఐటమ్స్‌ కూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. 

    • రంజాన్‌ తోఫా కేవలం బంధువుల మధ్య బహుమతులు పంచుకోవడం మాత్రమే కాదు. కొన్ని ప్రాంతాల్లో పేద ముస్లిం కుటుంబాలకు ‘రంజాన్‌ తోఫా’ పేరుతో ఆర్థిక చేయూత అందిస్తుంటారు. 

    ఈ పండుగ సీజన్‌లో ఆలోచనాత్మకంగా రూపొందించిన గిఫ్ట్‌ బాక్సులు సిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలో ఒకటిగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా ఇప్పుడు విభిన్న అభిరుచులు  ప్రాధాన్యతకు అనుగుణంగా ఈద్‌–థీమ్‌ హ్యాంపర్లను వ్యాపార సంస్థలు ఆన్‌లైన్‌ వేదికలు రూపొందిస్తున్నాయి. కొన్ని డెజర్ట్‌లు పండుగ ప్రత్యేక వంటకాలతో నిండిన ఆహార–ఆధారిత బహుమతులపై దృష్టి సారిస్తుండగా, మరికొన్ని యాక్సెసరీలు వ్యక్తిగతీకరించిన వస్తువులతో కూడిన ఆహారేతర హ్యాంపర్లను అందిస్తున్నాయి. అందంగా ప్యాక్‌ చేసిన స్వీట్ల నుంచి సొగసైన మెమెంటో బాక్సుల వరకు, హ్యాంపర్లు ఈ సందర్భాన్ని జరుపు కోవడానికి  అందుబాటులో ఉన్నాయి. ప్రేమ, సహానుభూతి, పంచుకునే భావనను ప్రతిబింబించే చిన్న బహుమతి అయినా పెద్ద ఆనందాన్ని పంచుతుంది. రంజాన్‌ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తుంది. 

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

  • హైదరాబాద్: దేశంలోనే ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి ముంబైపర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాపరిధిలో ఉన్న “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించాలని రాష్ట్రపతిని ఆయన ఆహ్వానించారు.

    డా. సేథి రాష్ట్రపతికి తెలిపిన ప్రకారం ఈ పాఠశాల ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాలో ఉండి, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తోంది. అలాగే క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ప్రస్తుతం సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, వివిధ క్రీడా కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా అందిస్తున్నారు. 

    “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను డా. ప్రదీప్ కుమార్ సేథి తన సంస్థ ద్వారా నిర్వహిస్తూ, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణాన్నిఅందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్నిప్రశంసిస్తూ, సమయం లభించినప్పుడు పాఠశాలను తప్పక సందర్శించి పిల్లలను కలసి ప్రోత్సహిస్తానని తెలిపారు. 

    డా. ప్రదీప్ సేథి ప్రపంచంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిపుణుల్లోఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన Eugenix Hair Sciences ద్వారా దేశ, విదేశాల్లోవేలాది మంది రోగులకు విజయవంతమైన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సినీ నటులు, అంతర్జాతీయ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, అనేక ప్రముఖులకు సేవలు అందిస్తున్నారు. 

    వైద్య రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు కూడా విశేష గుర్తింపు లభించింది. డా. సేథి రాసిన అనేక పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. Step to Step Hair Transplant అనే పుస్తకాన్నిరచించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సను నేర్చుకునే వైద్యులకు మార్గదర్శకంగా నిలిచారు. ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాల్లోని అనేక మంది వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. 

    డా. సేథి తన వైద్య ప్రయాణాన్నిఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవభూమి ప్రాంతంలో ప్రారంభించారు. న్యూఢిల్లీలోని AIIMS  నుంచి డెర్మటాలజీలో MD పూర్తిచేసిన అనంతరం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో తన తొలి కేంద్రాన్నిస్థాపించారు. ప్రస్తుతం Eugenix Hair Sciences  విదేశాలతో పాటు, ముంబై, గురుగ్రామ్, భువనేశ్వర్, హైదరాబాద్ వంటి పలు నగరాల్లోకేంద్రాలను కలిగి ఉంది.

    గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. ప్రదీప్ సేథి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైద్య రంగంలో విశేష విజయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. 

    Eugenix Hair Sciences గురించి:
    Eugenix Hair Sciences  భారతదేశంలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హెయిర్ రీస్టోరేషన్ బ్రాండ్ గా ప్రసిద్ధిచెందింది. శాస్త్రీయ విధానాలతో ఆధునిక పరిష్కారాలను అందిస్తూ, విశ్వసనీయతను సంపాదించింది. ప్రముఖ సర్జన్లుడా. ప్రదీప్ సేథి మరియు డా. అరికా బన్సాల్ స్థాపించిన ఈ సంస్థ, 30 సంవత్సరాలకుపైగా కలిపిన అనుభవంతో క్లినికల్ నైపుణ్యం, నైతిక వైద్య విధానం, అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తోంది. 

    Eugenix లో హెయిర్ రీస్టోరేషన్ సాధారణ ట్రాన్స్ ప్లాంట్ ను మించి, అత్యంత క్లిష్టమైన బాల్డ్నెస్ కేసులను కూడా ఖచ్చితత్వంతో చికిత్స చేస్తారు. ఇక్కడ అభివృద్ధిచేసిన Direct Hair Transplant (DHT) టెక్నాలజీ సంప్రదాయ ఊ్ఖఉ పద్ధతితో పోలిస్తేమెరుగైన గ్రాఫ్ట్సర్వైవల్ ను అందిస్తుంది. శాస్త్రం మరియు కళను సమన్వయం చేసిన ఈ విధానం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నాణ్యతను గణనీయంగా పెంచింది. 

    18,000కుపైగా విజయవంతమైన ప్రొసీజర్లు, 50 మిలియన్ గ్రాఫ్ట్ల ఇంప్లాంటేషన్ తో Eugenix విశ్వాసం, పారదర్శకత, ఫలితాలపైఆధారపడి మంచి పేరు సంపాదించింది. కఠినమైన మెడికల్ ప్రోటోకాల్స్, పేషెంట్ఫస్ట్విధానం, వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు మరియు నిరంతర ఆవిష్కరణ సంస్థ విజయానికి మూలం. 

    Eugenix పురుషులు మరియు మహిళలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, హెయిర్ లైన్ రీ కన్సస్ట్రాక్షన్, గడ్డం, కనుబొమ్మల పునరుద్ధరణ, కరెక్టివ్ ప్రొసీజర్లు, ఆఫ్రో, బాడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి విస్తృత సేవలను అందిస్తుంది. ఆధునిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన వైద్య బృందం ద్వారా అత్యున్నత నాణ్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది. 

    భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన Eugenix అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తూ, ఆధునిక సాంకేతికతను అభివృద్ధిచేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ క్రికెటర్లు, సంగీత విద్వాంసులు సహా అనేక మంది రోగులకు విజయవంతమైన సేవలను అందించింది. 

    Eugenix హెయిర్ రీస్టోరేషన్ రంగంలో నైతిక వైద్య విధానాలకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శక కన్సల్టేషన్, నిజాయితీ గల గ్రాఫ్ట్అంచనా, వాస్తవిక ఫలితాల నిర్ధారణ ద్వారా రోగులలో దీర్ఘకాల విశ్వాసాన్నిఏర్పరచుకుంది. ప్రతి చికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులు పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో వైద్య బాధ్యతను నిర్ధారిస్తున్నారు.  

  • హైదరాబాద్: ప్రేమ విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించానని వెంటపడ్డ యువకుడు దాడిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బుధవారం ధర్నా, రాస్తారాకో నిర్వహించారు. చిలకలగూడ ఠాణా పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన గుడిసె కోటేశ్వరరావు, రమాదేవి దంపతులు సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌లో ఉంటూ పద్మారావునగర్‌లో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

    వీరికి ఓ కుమారుడు,  ఇంటర్‌ చదువుతున్న కుమార్తె జెనిమా (19) ఉన్నారు.  జగదీష్‌ అనే యువకుడు, జెనిమా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జెనిమా కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతోంది. మంగళవారం ఉదయం జెనిమా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో జగదీష్‌ ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత  యువతి తల్లి రమాదేవికి ఫోన్‌ చేసి .. మీ కుమార్తె లోపల నుంచి తలుపు గడియపెట్టుకుంది. మీరు త్వరగా రావాలని చెప్పాడు. జెనిమా తల్లి రావడంతో స్థానికులతో కలిసి జగదీష్‌ తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా  కనిపించింది. ద్విచక్ర వాహనంపై గాం«దీఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.  

    హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు..  
    తమ కుమార్తెను జగదీష్‌  హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని  తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఉద్దేశపూర్వకంగా జెనిమాపై దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని  ఆరోపించారు.  బుధవారం మధ్యాహ్నం చిలకలగూడ గాంధీ చౌక్‌ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.  
    నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు 
    మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం పెద్దపుడుమూరుకు చెందిన  నిందితుడు జగదీష్‌ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ రామకృష్ణ తెలిపారు.  మృతురాలి ఇంట్లో సూసైడ్‌నోట్‌ స్వాదీనం చేసుకున్నామని, అందులో ప్రేమ విషయమై మానసిక ఒత్తిడికి గురైనట్లు ఉందని స్పష్టం చేశారు. మృతురాలి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు.   

Business

  • పదే పదే రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, ఒక్కసారి రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం రిలయన్స్ జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3,599 ధరతో కూడిన ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుండటం విశేషం.

    జియో రూ. 3,599 ప్లాన్ పూర్తి వివరాలు

    ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. 365 రోజులు (పూర్తిగా ఒక సంవత్సరం) వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా పొందే అవకాశం ఉంటుంది.

    సాధారణ బెనిఫిట్స్‌తో పాటు, ఈ ప్లాన్ ద్వారా లభించే ఎక్స్‌ట్రా ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్ట్ సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.

    అలాగే ఈ ప్లాన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్‌. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఆఫర్ చేస్తోంది. ఫోన్ మెమరీ సమస్యను అధిగమించేందుకు 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది.

  • న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలిపిన స్టాక్‌ బ్రోకర్లపై పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్‌మెంట్‌ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.

    దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్‌ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్‌ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్‌ బ్రోకర్‌ సంస్థలకు 2025 జూన్‌ 16 నుంచి సెపె్టంబర్‌ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్‌వరకూ గడువును పొడిగించింది.

  • దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

    అసలేం జరిగింది?
    మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

    "నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

    ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

    మార్కెట్‌లో ప్రకంపనలు
    చక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.

    రంగంలోకి దిగిన ఆర్‌బీఐ
    పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.

    బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

    ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు

  • దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.

    హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.

    అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.

    ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్‌ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)




     


     

  • దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

    బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై  74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.

    మార్కెట్‌ను ముంచేసిన 5 ప్రధాన కారణాలు

    పతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభం
    అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్‌లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.

    భగ్గుమన్న ముడిచమురు
    యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కుదుపు
    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను భారీగా కిందకు లాగింది.

    అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరి
    అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

    రూపాయి పతనం- ఎఫ్‌ఐఐల అమ్మకాలు
    అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి.

  • న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్‌కి విశిష్ట స్థానం ఉందని టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ చీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ బాబక్‌ హోద్జాత్‌ తెలిపారు. డిజిటల్‌ సిస్టమ్‌లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.

    ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్‌ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్‌పుట్‌ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.

    వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్‌ ఇప్పుడు ఏఐ బిల్డర్‌ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్‌ చెప్పారు.

    ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్‌ జనరేషన్‌లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. 

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.

    ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.

    సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.

    విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.

    మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 11 శాతం పెరిగింది.

  • న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి అన్ని కమర్షియల్‌ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. 

    ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 180 బిలియన్‌ డాలర్ల టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్‌అప్‌ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది.

  • రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్‌) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.

    నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టి

    తెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్‌కామ్‌కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.

    ముగిసిన ‘జై అన్మోల్’ విచారణ

    ఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.

    ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

  • కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.

    ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్‌స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్‌కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.

    నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

    ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు.

  • దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

    గందరగోళానికి తెరదించిన ఆర్‌బీఐ

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ, బ్యాంక్ మేనేజ్‌మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్‌బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్‌మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

    తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీ

    అతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.

    కేకీ మిస్త్రీ

    గురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.

    అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..

    మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Politics

  • కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్‌ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.

    పెరుంబవూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన‍్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్‌షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. 

    మొదట రోడ్‌ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన‍్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్‌ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.

    లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.

    లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..
    లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

    వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది.

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: గత మూడు, నాలుగేళ్లుగా షర్మిల, సునీత.. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయన్నారు. కనీస ఆలోచన లేకుండా హద్దులు దాటి సొంత అన్నపై వ్యక్తిత్వ దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

    ‘‘వైఎస్సార్‌ కుమార్తె, జగన్‌కు చెల్లెలు కదా అని మేం చాలా వరకూ మిన్నకుండిపోయాం. ఆమె నిన్న మాట్లాడుతూ అన్న అనే పదానికే నువ్వు కలంకం అన్నారు. ఈ మాట మమ్మల్ని చాలా బాధించింది. బట్ట కాల్చి మసి మీ అన్న ముఖాన వేసి తుడుచుకో అంటే ఒప్పుకోరు తల్లీ. అన్న అనే పదానికే ఆయన అనర్హుడు అన్న తర్వాత మీ అన్న మీకు చేసిన అన్యాయం ఏంటో మీరు చెప్పాలి. నువ్వు ఏదేదో మాట్లాడి బురద జల్లి పోతానంటే కుదరదు. నీ పట్ల మీ అన్న చేసిన అన్యాయం ఏంటో స్పష్టంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.’’ అని రాచమల్లు పేర్కొన్నారు.

    ‘‘మీ అన్నపై ఇంతటి విషాన్ని చిమ్మడానికి ఏం కారణం..? ఏమి నీకు అన్యాయం జరిగింది..?. నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాల్సింది. పోయి పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌లో పరిచినారు. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకుంటే మరుసటి రోజే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వస్తుంది. ఇవన్నీ వారికి ఎవరు చెప్తున్నారు. షర్మిల, సునీతల ఫోన్లు పరిశీలిస్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ, చంద్రబాబుతో టచ్‌లో ఉన్న విషయం ఇట్లే బయటపడుతుంది.  మీ తండ్రి చనిపోతే సంతోషించిన చంద్రబాబు లాంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా?. అన్న అనే పదానికే కళంకం తెచ్చాడంటున్న నీవు నీకు ఏ విషయంలో అన్యాయం చేశాడు..?’’ అంటూ రాచమల్లు ప్రశ్నించారు.

    ‘‘ఆస్తి విషయంలో చేశాడా..? అధికారం విషయంలో అన్యాయం చేశాడా..?. వైఎస్సార్‌ 2004లో అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు 2009లో లేవు. ఈ మధ్య కాలంలో రాజశేఖరరెడ్డి తన ఆస్తులను నీకు, జగన్‌కు పంచేశారు. మీ తండ్రి చట్ట ప్రకారం మీ అన్నకు, నీకు సమానంగా ఆస్తులు పంచారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఇళ్లు షర్మిలమ్మకే ఇచ్చారు. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని షర్మిల పేరుతో రిజిస్టర్‌ చేయించారు. 15 మెగావాట్ల ఎస్సారెస్‌ స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టు ఆమెకే ఇచ్చారు. స్వస్తిక్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టునూ ఆమెకే ఇచ్చాడు.

    ..విజయవాడ యువరాజ్‌ థియేటర్‌లో 36 శాతం భాగం షర్మిలమ్మకే రాసిచ్చాడు. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఆమెకే రాసిచ్చారు. విజయలక్ష్మి ట్రేడ్‌ అండ్‌ మినరల్స్‌ వంద శాతం వాటా ఆమెకే ఇచ్చేశారు. రాజారెడ్డి గారి హయాం నుంచి రైల్వే కోడూరులో ఉన్న ఇంటిని కూడా ఆమెకే రాసిచ్చాడు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమెకే ఇచ్చారు. ఇలా నీకు సగం వాటాను ఇస్తుంటే అంగీకరించడం అనేది జగన్‌ గొప్పతనం. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టారు కాబట్టి మీ అన్న ఒప్పుకున్నాడు అంటే సరే.. మీ వదిన ఎలా ఒప్పుకుంది..?

    ..సమాజంలో ఏ ఇంటి కోడలూ ఆడబిడ్డకు సమాన ఆస్తి ఇస్తే అంగీకరిస్తుందా..?. అయినా భారతమ్మ ఒప్పుకున్నారు అంటే మీ తండ్రి, మీ అన్న కంటే వెయ్యి రెట్లు ఆమె గొప్పది. ఇన్ని ఆస్తులు తీసుకున్నందుకేనా వైఎస్‌ జగన్‌ అన్న అనే పదానికి కళంకం...?. వైఎస్సార్‌ మరణించినప్పటి నుంచీ నువ్వు జగన్‌తో విభేదించే వరకూ తాను సంపాదించుకున్న దాంట్లో జగన్‌ నీకు రూ.236 కోట్లు ఇచ్చారు.

    ..అయినా మీరు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మా అన్న దుర్మార్గుడు అంటున్నారు. మీ అన్న ముఖ్యమంత్రిగా చేసిన పనులకు దేశమంతా పొగుడుతుంటే నువ్వు విమర్శలు చేశావు. అవన్నీ చాలవన్నట్లు వివేకానందరెడ్డి హత్య రక్తపు మరకలను జగన్‌ నెత్తిన వేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ఇంత నిందలు వేస్తావా..?. ఇవన్నీ చాలవన్నట్లు చంద్రబాబుతో చెలిమి చేస్తూ.. ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఉప్పందించి బజారుకీడుస్తావా...?. నీకు ఎక్కడ న్యాయం ఉంది.. ఎక్కడ కృతజ్ఞత ఉందమ్మా నీకు..?. నీ స్థానంలో ఏ చెల్లి ఉన్నా జగన్‌ లాంటి అన్నను గుండెల్లో పెట్టుకుని ఉండేవారు.

    ..నువ్వు కొంగుపట్టుకుని జగన్‌కి, అవినాష్‌కి ఓటు వేయవద్దని పులివెందుల పూలఅంగళ్ల సర్కిల్లో అర్థించావు. అవినాష్‌ రెడ్డి వివేకాను చంపి ఉంటే నాకు ఓటు వేయండి.. లేదంటే అవినాష్‌కు ఓటు వేయండి అని కొంగుపట్టి మరీ అడిగావు. నువ్వు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారా? అవినాష్‌రెడ్డి గెలిచాడు. నువ్వు చెప్పిన తప్పుడు మాటల వల్ల జిల్లాలో మేం ఐదుమంది ఎమ్మెల్యేలం ఓడిపోయాం. నీ లెక్క ప్రకారం వివేకా హత్యలో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని ప్రజలు నమ్మారు కాబట్టే ప్రజలు ఆయన్ను గెలిపించారు.

    ..అంతటితో ఆగకుండా చంద్రబాబు ఏ కీ ఇస్తే దాన్ని సునీతమ్మ మాట్లాడుతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత మీరొచ్చి అవే మాటలు మాట్లాడతారు. జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేదే మీ లక్ష్యం. నీకు ఆస్తి పంపకానికి ఒప్పుకుని, సొంతంగా డబ్బిచ్చి.. తన సొంత ఆస్తుల నుంచి కూడా నీకు భాగాలిస్తే.. నీకు సంతృప్తి లేదు. సరస్వతి భూముల విషయంలో ఆమె చేసిన వ్యవహారం వింటే చాలా బాధ కలుగుతుంది.

    ..జగన్‌పై కేసుల కారణంగా ఆ భూములు అటాచ్‌మెంటులో ఉంటే.. దానిలోని విజయమ్మ పేరుపై ఉన్న భూములను తన పేరుపై రాయించుకోవాలని చూశారు. దాని కోసం ఆ షేర్‌ కాగితాలు పోయాయని కేసు పెట్టి.. ఆ తర్వాత విజయమ్మ ఆస్తిని తన పేరుపై బదలాయింపు చేసుకుంది. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తిని బదలాయింపు చేయకూడదని అందరికీ తెలుసు. అలా చేస్తే వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అవుతుందని కూడా అందరికీ తెలుసు. అయినా బదలాయింపు చేశావంటే.. మీ అన్న మళ్లీ జైలుకు పోవాలనేగా..?

    ..పగోడు పదహారు నెలలు జైల్లో పెడితే.. చెల్లెలు 32 నెలలు జైల్‌లో పెట్టాలనుకుంది. వైఎస్‌ జగన్‌ ఆ విషయం తెలుసుకుని ఎన్సీఎల్టీకి వెళ్లి జాగ్రత్త పడ్డాడు. ఆ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. మళ్లీ విజయమ్మతో చెన్నై కోర్టులో కేసు వేయించింది. ఆ కేసు కాగితాలు చెన్నై కోర్టులో వేయించిన గంటకే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలకు తెలుసు. షర్మిల, సునీతలు జగన్‌కు ఒక్క చెల్లెల్లే. కానీ రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఆయనకు ఓటేశారు. వారంతా వైఎస్‌ జగన్‌ మాకు దేవుడిచ్చిన అన్న అంటున్నారు.

    ..వాళ్లంతా దేవుడిచ్చిన అన్న అంటుంటే రక్త సంబంధం కలిగిన నీకు మాత్రం కళంకితుడా..?. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ, సునీతలను చూసిన తర్వాత చెల్లెల్లు అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. నీలాంటి చెల్లెలు కావాలని ఏ అన్నా కోరుకోడు. వారి వారి స్థాయిని బట్టి నువ్వొక్కదానివే కాదు. .మేమంతా పార్టీ కోసం కష్టపడ్డాం. షర్మిలమ్మ జగన్‌తో గొడవ పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవినే పంచాలి. అప్పుడే ఆమె శాంతిస్తుంది. ఇప్పుడు జగన్‌ పెట్టుబడులు, ఆస్తులు మొత్తం ఊడ్చి షర్మిలకు ఇస్తే అప్పుడు శాంతిస్తుందేమో..?. ఎక్కడన్నా జగన్‌ వ్యాపారాల్లో నువ్వు పెట్టుబడి పెట్టావా..? ఏమీ లేకపోయినా తన సొంత సంపాదనలో నీకు వాటా ఇచ్చాడు.

    ..మీరు టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. సైకిల్‌ ఎక్కకపోయినా మీరు మాత్రం టీడీపీనే. వైఎస్సార్‌ కూతురు ఇలా టీడీపీకి వెళ్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ఇన్ని తప్పులు చేస్తున్నా, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఆమె ఒక్క మాట కూడా విమర్శించదు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ప్రశ్నించాల్సిన నువ్వు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నావు. ఇక మీదట మీరు జగన్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎన్ని సార్లైనా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇక మా దృష్టిలో మీరు రాజశేఖరరెడ్డి కూతురు అని కానీ, జగన్‌ చెల్లెలు అని కాని ఉండదు. నాకైతే నువ్వు ఒక చెడ్డ చెల్లెలు అనే అభిప్రాయం మాత్రమే ఉంది. ఇంత మేలు చేసిన అన్నను పట్టుకుని అన్ననే పదానికే కళంకం అంటావా..?

    ..చంద్రబాబుకు ఒక చెల్లెలు ఉందన్న విషయమే ప్రపంచానికి తెలియదు. అలాంటి చంద్రబాబు వద్దకు మాకు న్యాయం చేయండి అని ఈ చెల్లెల్లు వెళ్లారు. ఇదిగో నా చెల్లెలు షర్మిల.. నేను వదిలిన రామబాణం అని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్‌. నువ్వు ఇన్ని మాటలు ఆయన్ను మాట్లాడుతున్నా ఒక్క రోజు కూడా జగన్‌ నీపై నోరెత్తలేదు. అది ఆయన సంస్కారం.. నా చెల్లిపై మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు జగన్‌. కానీ మీరు ఒకే సారి వంద ఈటెలు తీసుకుని పొడిచినట్లు చేస్తున్నారు.

    ..తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ అసలు నీ చెల్లెలు ఎవరో ఈ సమాజానికి తెలుసునా..?. చంద్రబాబుకు తమ్ముడున్నాడని తెలుసు.. ఆయన ఎలా చనిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు కుటుంబ వ్యవస్థపై గౌరవం ఉందా..? అలా ఉంటే హరికృష్ణకు, ఆయన పిల్లలకు అన్యాయం చేస్తాడా?. సొంత వారినే మోసం చేసిన చంద్రబాబు.. షర్మిలమ్మ, సునీతమ్మలకు న్యాయం చేస్తాడా..?. మీ ఇద్దరిని నడి ఏట్లోకి తీసుకెళ్లి ముంచేస్తాడు.. గుర్తుంచుకోండి.

    ..5 కోట్ల మంది ప్రజలను, సొంత కుటుంబ సభ్యులను మోసం చేసిన చంద్రబాబుకు షర్మిల, సునీతలను మోసం చేయడం ఒక లెక్కా?. ఆ చంద్రబాబు చేతిలో మోసం పోయి చిట్టచివరకు మళ్లీ ఆ అన్న వద్దకే మీరిద్దరూ చేరతారు. అన్నా.. తప్పయిందని ప్రాయశ్చిత్తం మీ అన్నా, వదిలనల వద్దకే వచ్చే రోజు ముందుంది. షర్మిలమ్మ.. అన్నతో సమానంగా వైఎస్సార్‌ ఆస్తులు పంచిన విషయంపై సమాధానం చెప్పాలి. నీకు అవసరం అయినప్పుడల్లా రూ.236 కోట్లు ఇచ్చినది నిజమా? కాదా? అనేది షర్మిల చెప్పాలి. జగన్, భారతీలు వివేకాను చంపారని మీరు మీ పిల్లలపై ఒట్టేసి చెప్పగలరా?. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా.. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా సునీత, షర్మిల తెరమీదకు వస్తారు.

    ..నిజంగా షర్మిలమ్మకు చిత్తశుద్ధి ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మాట్లాడితే నీ సైతాన్‌ సైన్యం అంటున్నారు.. కానీ నువ్వు జగన్‌కు రక్తం పంచుకుపుట్టిన చెల్లివి అయినా.. మేం రక్తం పంచుకోకపోయినా చివరికి వరకూ ఆయన కోసం, ఆయన వెంటే ఉంటాం. ఆస్తులకు మీరు భాగస్థులు.. కానీ మేం అభిమానానికి భాగస్థులం.. సైతాన్‌ సైన్యం కానే కాము. జగన్‌ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మమ్మల్ని పట్టుకుని సైతాన్‌ అంటారా..?. మన ఇంటి గుట్టును ఏబీఎన్‌ రాధాకృష్ణకు, చంద్రబాబుకు ఇస్తున్న మీరు తప్పు చేసిన మనుషులు. అన్ననే పదానికి కళంకం అన్నందుకు బాధతో మేం మాట్లాడుతున్నాం. అన్న అనే పదానికి, వదిన అనే పదానికి అర్థం చెప్పిన వాళ్లు జగన్, భారతమ్మలు. షర్మిలమ్మ ప్రెస్‌మీట్‌ పెట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.

  • చెన్నై: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు ఎన్నికల వేళ కూడా ఆయనకు పలువురి రూపంలో షాక్‌ తగులుతోంది. మొదట కరూర్‌ తొక్కిసలాట, ఆ తర్వాత భార్యతో విడాకులు, హీరోయిన్‌ త్రిష ఇష్యూ. ఇప్పుడు నటి రంజనా నాచియార్ కూడా టీవీకే పార్టీకి గుడ్‌బై చెప్పారు. 

    అంతేగాక, ఆ పార్టీపై రంజనా తీవ్ర ఆరోపణలు చేశారు. “విజయ్ పార్టీలో మహిళలకు ఎల్లప్పుడూ అవమానం జరుగుతూనే ఉంటుంది” అని తెలిపారు. ఇవాళ రంజనా నాచియార్ టీవీకే నుంచి డీఎంకేలో చేరారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆమె డీఎంకే కండువా కప్పుకున్నారు. 

    “టీవీకే అగ్ర నాయకులను ఎవరూ కలవలేకపోతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల బాధను పట్టించుకోరు. పార్టీలో మహిళలకు నిరంతరం అవమానం జరుగుతోంది’’ అని రంజనా అన్నారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఆమె గతంలో బీజేపీలో సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో ఆ పార్టీని ఆమె వీడారు. ఆ తర్వాత టీవీకేలో చేరారు. ఇప్పుడు టీవీకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.

    మరోవైపు, నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి శంకర్ డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డీఎంకే కమల్ హాసన్ పార్టీని, చిన్న మిత్ర పార్టీలన్నింటిని మింగేసింది... అవన్నీ తమ గుర్తులను వదిలి డీఎంకే గుర్తుపై పోటీ చేస్తున్నాయి. ఇటువంటివి బీజేపీలో జరగవు...”  అని అన్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికలు వచ్చేనెల 23న జరగనున్నాయి.

  • సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో వెన్నుపోటు రాశిలో ఏర్పడిందని.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి నేతల ఆదాయం పెరిగింది.. పేద ప్రజల ఆదాయం పెరగలేదు. కూటమి మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్యపూజ్యం.. ప్రజలకు అవమానం. నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులను కూటమి మోసం చేసింది’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.

    ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడిసాయం లేదు.. గిట్టుబాటు ధర లేదు. మహిళలకు ఎన్నోహామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదు. మహిళల రక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. ఉద్యోగుల పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టు ఉంది. కూటమి పాలన అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు మోసానికి మరోసారి గురికావద్దని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం’’ అని వరుదు కల్యాణి పేర్కొన్నారు.

    ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు: కల్పలతారెడ్డి
    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏవర్గం ప్రజలు పండగ చేసుకోలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఉగాది కాదు దగాదిగా భావిస్తున్నారు. ఈ ఉగాదికి అయినా మేలు జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు. పీఆర్సీ, ఐఆర్, డీఏకి సంబంధించిన జీవోలు విడుదల చేస్తారని ఆశించారు. వెయ్యి రూపాయిలు కూడా ప్రభుత్వం వేతనం పెంచలేదు

    ..అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి చేస్తామని చెప్పారు. మంచి ఐఆర్ అన్నారు, పెండింగ్ బకాయిలు అని ఉద్యోగులను మోసం చేసింది. ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి పండగకి ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నారు. పండగ వచ్చి పొతుంది తప్ప ఒక్క మేలు మాత్రం జరగడం లేదు. గతంలో వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కరోనా సమయంలో 23శాతం పిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగస్తులు రోడ్డెక్కుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీ కమిషన్‌ని నియమించాలని కోరుతున్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పిఆర్సీ కమిషన్‌ని త్వరగా నియమించాలి. పిఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ప్రకటించాలి. 29 శాతం పిఆర్సీని అమలు చేయాలి. ఉద్యోగస్తులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి’’ అని కల్పలతారెడ్డి డిమాండ్‌ చేశారు.

    అబద్దంలా నక్షత్రం.. వెన్నుపోటు రాశి.. చంద్రబాబుకు వరుదు కళ్యాణి కౌంటర్
  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలను ఎల్లో మీడియా హైలైట్‌ చేస్తోందన్నారు  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో‌ షర్మిల, సునీత పావులు అని విమర్శించారు. జగన్‌తో యుద్ధం చేయలేక చంద్రబాబు.. షర్మిల, సునీతను వాడుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే అని వ్యాఖ్యలు చేశారు.

    వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలకు ఏనాడూ ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. వైఎస్‌ జగన్‌ను షర్మిల విమర్శిస్తే మాత్రం పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తారు. వైఎస్సార్ బతికున్నప్పుడే  షర్మిలకు ఆస్తి రాసిచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఇల్లు, ఇడుపులపాయలో భూమి, హైడ్రో ప్రాజెక్టు, స్వస్తి హైడ్రో ప్రాజెక్టులో వాటా.. ఇలా అనేక ఆస్తులు రాసిచ్చారు. కొడుకు కన్నా షర్మిలకే వైఎస్ఆర్ ఎక్కువ ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు జగన్ సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా కావాలని అడగటం అన్యాయం. గత ఎన్నికలలో షర్మిల ఖర్చు పెట్టిన ప్రతీ పైసా చంద్రబాబు ఇచ్చినదే. షర్మిల లాంటి చెల్లెలు తమకు వద్దని సామాన్యులు కూడా అనుకుంటున్నారు.

    దస్తగిరి అనే వ్యక్తి వివేకానంద రెడ్డిని హత్య చేశారు. వివేకానందరెడ్డికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇమేజ్‌కి దెబ్బ తగలకూడదని అవినాష్ భావించారు. ఇప్పటికీ సునీతక్క, వివేకం పెదనాన్న అనే అవినాష్ మాట్లాడతారు. అవినాష్ అంత ప్రేమను చూపిస్తుంటే సునీత మాత్రం వివేకా పేరును చెడగొడుతోంది. సీబీఐతో విచారణ కావాలని పిటిషన్ వేసిందే సునీత. ఆమె కోరిక ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఒక భూమి విషయంలో ఎర్ర గంగిరెడ్డి, వివేకానందరెడ్డికి వివాదాలు వచ్చాయని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిపై దాడి చేశాడని దస్తగిరి చెప్పాడు. వివేకానందరెడ్డిని హతమార్చే సమయంలో కొన్ని పేపర్ల కోసం వెతికారని కూడా చెప్పాడు

    మిమ్మల్ని వదిలిపెట్టరు.. షర్మిల, సునీతకు ఓపెన్ ఛాలెంజ్

    ఆ పేపర్లు ఏంటి? వివేకానంద రెడ్డికి ఇతర మహిళలతో ఉన్న సంబంధాలు ఏంటి?. అవినాష్‌ రెడ్డి జీవితంలో చిన్న మరక కూడా లేదు. కానీ అవినాష్‌ను అభాసు పాలు చేసేలా సునీత వ్యవహరిస్తున్నారు. ఎంపీ సీటు కోసం హత్య చేశారన్న షర్మిల మాటలు అవివేకం. వివేకా హత్య జరిగే సమయానికే అవినాష్ రెడ్డికి జగన్ సీటు ఇచ్చారు. వివేకా కూడా అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేశారు. సునీత, చంద్రబాబు, షర్మిల, దస్తగిరి ఒక్కటే. వారందరికీ కోర్టులో వాదించేది ఒక్కరే న్యాయవాది. ఈ విషయాలపై చర్చించేందుకు మేము సిద్దమే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఎందుకు వదిలేశారు?. ఏపీలో జగన్‌ను ఓడించటానికి చంద్రబాబు ఆడిన నాటకంలో షర్మిల పాత్రధారి. తాను చెప్పినట్టే సీబీఐ, సుప్రీంకోర్టు వినాలి అన్నట్టుగా సునీత వ్యవహరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాతృమూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ(89) మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మలిరెడ్డి నాగసుందర మణిమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం, ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు.

  • ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగిందని లోక్‌సభలో కేంద్ర మంత్రి తోకన్‌ సాహు ప్రకటించారు. జగన్‌ హయాంలో ఐదేళ్లలో 6 లక్షల 85 వేల 864 ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. 

    లోక్‌సభలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ సమాధానం ఇచ్చారు. వైఎస్‌ జగన్ హయాంలో ఐదేళ్లలో 6,85,864 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. 

    ఇళ్ల నిర్మాణానికి అప్పటి జగన్‌ సర్కారు రూ.22,744 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పీఎంఏవై పథకానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. 

    నీతి ఆయోగ్‌ సైతం కితాబు 
    కాగా, ఇటీవలే.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యంతో కొనసాగిందని నీతి ఆయోగ్‌ కితాబు ఇచ్చింది. ఏపీ వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని ఆ నివేదిక తెలిపింది. 2023-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.

    రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్‌టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.

    జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

    గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్‌డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023-24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది.

  • సాక్షి, అమరావతి: ఏపీలో రానున్న మూడు రోజుల్లో కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల క్రింద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.

    కాగా కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నిన్న(బుధవారం) నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్ర­కా­శం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెర­వలి వనజ మృతి చెందింది. వైఎస్సార్‌ కడప జిల్లా  చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి­వాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర­బెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది.

     

Crime

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే రాష్ట్రంలో రాజకీయ హింస పడగ విప్పింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బూత్ ప్రెసిడెంట్‌ను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో బెంగాల్‌లో మరోసారి ఎన్నికల ముందే 'రక్తపాతం' మొదలైందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    హరోవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుజుర్‌గాచా గ్రామంలో గురువారం ఉదయం టీఎంసీ నేత మొషీయుర్ కాజీ (38) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. దేగంగాలోని చపాతల పంచాయతీ పరిధిలో గల గంగ్నియా నివాసి అయిన కాజీ బూత్ నంబర్ 178కి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దుండగులు కాజీ రెండు చేతులను నరికివేసి, శరీరంపై కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచారు. మృతుడిని గుర్తించకుండా ఉండేందుకు ముఖంపై యాసిడ్ పోసినట్లు ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

    కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కాజీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన వెంటనే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ లభించలేదు. చివరకు గురువారం ఉదయం ఆయన శవమై కనిపించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని కాజీ సోదరుడు ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని టీఎంసీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, హరోవా రూరల్ ఆస్పత్రి నుంచి పోస్టుమార్టం  కోసం బసిర్‌హాట్ జిల్లా  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పాత కక్షలా లేక రాజకీయ విరోధాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ..

Family

  • Ugadi 2026 తెలుగువారు జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అంటే ‘యుగమునకు ఆది’ అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని  ప్రాంభించిన రోజుగా దీనిని మనం జరుపుకుంటాం. కాలగమనంలో వచ్చే  60 సంవత్సరాలలో ‘పరాభవ’ నామ సంవత్సరం (Sri Parabhava Nama Samvatsara ugadi) ఒకటి.

    సాధారణంగా ‘పరాభవం’ అంటే అవమానం అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా దీనికి లోతైన అర్థం ఉంది. ‘పరా’ అంటే గొప్పదైన, ‘భవ’ అంటే పుట్టుక లేదా స్థితి. అంటే, అహంకారాన్ని విడిచిపెట్టి, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన స్థితిని  పొందడమని దీని అంతరార్థం. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, ధర్మబద్ధమైన జీవనం సాగించాలని పంచాంగకర్తలు చెబుతుంటారు. అంటే మనిషి తనలోని అహంకారాన్ని చంపుకుని, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని  పొందడమే ఈ సంవత్సర సందేశం. ధర్మబద్ధమైన జీవనం సాగించే వారికి ఏ పరాభవమూ కలగదని పెద్దల మాట. ‘పరాభవ’ నామ సంవత్సరం మనకు ఒక హెచ్చరికను, అదే సమయంలో ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. పాత కక్షలు, కార్పణ్యాలను విడిచిపెట్టి, ప్రకృతితో మమేకమై సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగడమే ఈ ఉగాది ఆగమన ఉద్దేశం.  

    మన  పొరబాట్లను మనం తెలుసుకొని, వినమ్రతతో కొత్త పాఠాలు నేర్చుకోవడం ద్వారా ‘విజయం’ వైపు అడుగులు వేయవచ్చని ‘పరాభవ’ సంవత్సరం సూచిస్తుంది. ఆకు రాలడం చెట్టుకు ‘ఓటమి’ (పరాభవం) లా అనిపించవచ్చు, కానీ అది కొత్త చిగురు రావడానికి (వసంతం) సిద్ధమవ్వడం మాత్రమే.  చీకటి పడటం వెలుగుకు ఓటమి కాదు, అది మరో ఉదయానికి పునాది. అలాగే, మనిషి తనలోని అహంకారాన్ని, పాత ఆలోచనలను పరాభవించి (ఓడించి), సరికొత్త వ్యక్తిత్వంతో ఉదయించడమే ఈ సంవత్సరపు అసలైన అంతరార్థం. 

    ఒక రచయితకు విమర్శలు ఎలాగైతే తన రచనను మరింత పదును పెడతాయో, ఈ సంవత్సరం కూడా మన వ్యక్తిత్వాన్ని అలా తీర్చిదిద్దుతుంది.  మనం గడిచిన కాలపు అనుభవాలను చేదు పచ్చడిలా కాకుండా, జీవితాన్ని పదును పెట్టేపాఠాలుగా స్వీకరించాలి. సమయం విలువ తెలిసిన వాడు చరిత్రను నిర్మిస్తాడు. అక్షరం విలువ తెలిసిన వాడు కాలాన్ని శాసిస్తాడు. ఈ పరాభవ నామ సంవత్సరం పాఠకుల మనసుల్లో ఒక కొత్త ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది.  ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, మానవ సంబంధాలలోని సున్నితత్వాలను, మనుషుల మధ్య పెరిగే అగాధాలను పూడ్చేలా ఈ ’పరాభవ’ కాలం ఒక గొప్ప ప్రేరణ కాగలదు. 

    ప్రతి ఉగాది మన జీవితంలో కొత్త ఆశలను, ఆశయాలను నింపుతుంది. ‘పరాభవ’ నామ సంవత్సరం పేరులో కఠినత్వం ఉన్నప్పటికీ, అది మనల్ని క్రమశిక్షణతో ఉండమని హెచ్చరిస్తుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడమే ఉగాది యొక్క అసలైన సందేశం.

    ఉగాదికి కొన్ని రోజుల ముందే ప్రకృతి లో మార్పులు మొదలవుతాయి. ఎండి΄ోయిన చెట్లు ఆకులు రాల్చి, సరికొత్త లేలేత చిగురుటాకులతో నిండుగా కనిపిస్తాయి. వేప చెట్లు పూత పూస్తాయి, మామిడి చెట్లు పిందెలు వేస్తాయి. ముఖ్యంగా, మధురమైన కంఠంతో కోయిల పాడే పాటలు ఉగాది ఆగమనాన్ని మనకు తెలియజేస్తాయి.

    ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకునే సమయం. మన మనస్సులోని చెడు ఆలోచనలను వదిలి, కొత్త ఆశయాలతో జీవితాన్ని మొదలు పెట్టడానికి ఈ ఆగమనం ఒక చక్కని అవకాశం.

    ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వొగరు, చేదు ఈ ఆరు రుచుల సమ్మేళనం జీవితంలోని సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని బోధిస్తుంది. గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఎవరికి ఆదాయం మెండుగా ఉంది? ఎవరికి అరిష్టాలు ఉన్నాయి? వంటి విషయాలను ఉగాది  పంచాంగ శ్రవణం తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తెలుగు భాషా సౌందర్యాన్ని చాటిచెప్పేలా కవులు కవి సమ్మేళనాలతో కొత్త సంవత్సరానికి వన్నె తెస్తారు.

    ‘పరాభవ’ అంటే ఈ పేరు ఉన్నంత మాత్రాన అందరికీ చెడు జరుగుతుందని కాదు. ఈ సంవత్సరంలో పుట్టిన వారు సాహసవంతులుగా, పట్టుదల గలవారుగా ఉంటారని చెబుతుంటారు.  ఈ సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని, ప్రజల్లో కొంచెం అసహనం లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని సూచించబడింది. 

    తెలుగు పంచాంగ చక్రంలో ఇది 40వ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాక్షస గణాధిపతి కాలపురుషుడు అధిపతిగా ఉంటారు. ఈ ఏడాది ఉగాది గురువారం రావడం వల్ల గురు గ్రహ అనుగ్రహం విశేషంగా ఉంటుందని ఒక నమ్మకం. కొత్త పనులు ప్రారంభించడానికి, అక్షరాభ్యాసాలకు గృహ ప్రవేశాలకు ఈ సంవత్సరం అనుకూలమైన ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి.

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

    ఉగాది ఆగమనం ఒక చైతన్యానికి ప్రతీక. మనిషి తన గతంలోని ΄÷ర΄ాట్లను విడిచిపెట్టి, నూతన ఉత్సాహంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ పండుగ మనకు దిశానిర్దేశం చేస్తుంది. ప్రకృతితో కలిసి మనం కూడా కొత్తగా వికసించడమే ఉగాది పండుగలోని పరమార్థం.
    – రామలక్ష్మీ సదానందమ్‌ 

  • సూర్యుడు అస్తమించగా, మఘ్రిబ్‌ అజాన్‌ మృదువుగా గాలిలో మార్మోగగా, రమజాన్‌ నెలలో ప్రతి ముస్లిం ఇంట్లో ఒక పవిత్ర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. తాళాలు అమర్చబడతాయి, గ్లాసులు నింపబడతాయి, ఖర్జూరాలు మధ్యలో ఉంచబడతాయి. కుటుంబ సభ్యులు చేరుతారు. చేతులు దువా కోసం ఎత్తబడతాయి. ఆ క్షణంలో ప్రపంచం కాస్తా నిశ్శబ్ద మవుతుంది.

    రమజాన్‌ కేవలం ఆకలి, దాహాన్ని సహించడమే కాదు. ఇది ఆత్మకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ఒక ఆధ్యాత్మిక శిబిరం. ఉదయం నుండి సాయంత్రం వరకు మనం శరీరాన్ని నియంత్రిస్తూ హృదయాన్ని మేల్కొలుపుతాము. ఆకలి ఒక గురువు అవుతుంది. దాహం ఒక జ్ఞాపకం అవుతుంది. మౌనం మనల్ని ఆలోచనలోకి నడిపిస్తుంది. నియంత్రణ మన కోరికలపై విజయం సాధించడానికి మార్గం చూపుతుంది.

    కానీ మన ఉద్దేశ్యం, ఆచరణ మధ్య ఎక్కడో ఒక సూక్ష్మమైన మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు కృతజ్ఞత, సరళతకు ప్రతీకగా ఉన్న ఇఫ్తార్‌ దస్తర్‌ఖ్వాన్, కొన్ని చోట్ల ప్రదర్శన వేదికగా మారుతోంది. ఆధ్యాత్మిక విరామంగా ఉండాల్సిన ఈ సమయం, సామాజిక ప్రదర్శనగా మారే ప్రమాదంలో ఉంది. అనేక రకాల వంటకాలు, ఖరీదైన ΄ానీయాలు, అలంకారాలు, సుందరంగా అమర్చిన ప్లేట్లు ఇప్పుడు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. నమాజ్‌కు ముందే ఫోటోలు తీస్తారు. సోషల్‌ మీడియా పేజీలు మెరిసే సమోసాలు, మిఠాయిలు, విలాసవంతమైన అలంకరణలతో నిండిపోతాయి.

    ఇక్కడ మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి:
    మన ఆత్మను పోషిస్తున్నామా? లేక ప్రదర్శనను పెంచుతున్నామా? ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్‌ మనకు ఒక స్పష్టమైన దారిని చూపిస్తుంది. ఆయన ఖర్జూరం, నీటితో ఉపవాసాన్ని విరమించేవారు. ఆ సరళతలోనే గౌరవం ఉంది. ఆ నియంత్రణలోనే నిజమైన సమృద్ధి ఉంది. వంటకాల పరిమాణం కాదు కృతజ్ఞత తాలూకు గాఢతే ముఖ్యమైనది.

    ఇస్లాం మితవ్యయాన్ని బోధిస్తుంది. ఖురాన్‌లో  అల్లాహ్‌ వృథా చేసే వారిని ఇష్టపడడని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ, నియంత్రణకు ప్రతీక అయిన రమజాన్‌లోనే కొన్ని సందర్భాల్లో అతిశయ ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇది ఆలోచించాల్సిన విషయం.

    ఇది పేదరికాన్ని మహిమ పరచడం కాదు, కుటుంబంతో మంచి భోజనం పంచుకోవడాన్ని నిరాకరించడం కాదు. అతిథి సత్కారం ఇస్లామీయ సంస్కృతిలో భాగమే. ప్రేమతో తయారు చేసిన భోజనం అనురాగానికి సంకేతం. కానీ ఆతిథ్యం ΄ోటీగా మారినప్పుడు, ఔదార్యం ప్రదర్శనగా మారినప్పుడు, సమృద్ధి వృథాగా మారినప్పుడు అక్కడ అసలు ఆత్మార్థం మసకబారుతుంది.

    మన పట్టణాల్లో ఎన్నో కుటుంబాలు సాయంత్రం ఒక్క సంతృప్తికరమైన భోజనం కోసం పోరాడుతున్నాయి. కూలీలు, భర్తృహీనులు, శరణార్థులు, పేదలు మనతో పాటు ఉపవాసం ఉంటున్నారు. వారి ఇఫ్తార్‌ కేవలం రొట్టె, నీరు మాత్రమే అయి ఉండవచ్చు. మన ఒక రాత్రి మిగిలిన ఆహారం వారి అనేక రోజుల అవసరాన్ని తీర్చగలదు. ఇది అపరాధ భావన కోసం కాదు... మనస్సాక్షిని మేల్కొలిపేందుకు.

    రమజాన్‌ మనకు ఆకలి అనుభూతి ద్వారా ఆకలితో జీవించే వారిని గుర్తు చేస్తుంది. ఇఫ్తార్‌ దస్తర్‌ఖ్వాన్‌ మహిమ వంటకాల సంఖ్యలో కాదుఅందులో కూర్చునే çహృదయాలలో ఉంది. ఉపవాసదారుడికి ఇఫ్తార్‌ పెట్టే వారికి అ΄ారమైన ప్రతిఫలం ఉందని హదీస్‌ చెబుతుంది.. ఆహారం వల్ల కాదు, ఆత్మస్ఫూర్తి వల్ల.

    మరి మీ పక్కింటి ఒంటరి వ్యక్తికి చోటుందా? ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థికి స్థలముందా? కుటుంబానికి చేరుకోలేని కార్మికుడికి ఆహ్వానముందా? ఇస్లాంలో ఉద్దేశ్యం (నియత్‌) కార్యానికి విలువను నిర్ణయిస్తుంది.

    సహృదయంతో పంచుకున్న ఒక ఖర్జూరం, చప్పట్ల కోసం ఏర్పాటు చేసిన విందుకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. హలాల్‌ సంపాదనతో సిద్ధమైన సాధారణ భోజనం, అతిశయ ఖర్చుతో చేసిన విలాస విందుకన్నా ఎక్కువ బరఖత్‌ కలిగి ఉంటుంది. మన రమజాన్‌ విలువ, వంటకాల పరిమాణంలో కాదు...మన హృదయ స్థితిలో ఉంది.

    ఇఫ్తార్‌ టేబుల్‌ మనకు అద్దంలా ఉంటుంది. అది మన  ప​ రాధాన్యాలను చూపిస్తుంది. ధనంతో మన సంబంధాన్ని బహిర్గతం చేస్తుంది. మనం ఆహారాన్ని అవసరంగా చూస్తామా? వరంగా భావిస్తామా? లేక ఫ్యాషన్‌ గా చూపిస్తామా? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.

    రమజాన్‌ అందం దాని నిశ్శబ్ద విప్లవంలో ఉంది. సాధారణ కార్యాలను తినడం, తాగడం, పంచుకోవడం ఇబాదత్‌గా మారుస్తుంది. వంటగదిని దానం చేసే స్థలంగా, భోజన పట్టికను స్మరణ స్థలంగా మార్చుతుంది. అయితే ఈ మార్పు మన అవగాహనపై ఆధారపడి ఉంటుంది.

    రమజాన్‌ ముగిసే సమయానికి మనకు మిగిలేది వంటకాల రుచి కాదు– మన విశ్వాస ముద్ర.
    రమజాన్‌ మనను ఎంత తిన్నామో అడగదు.
    ఎంత లోతుగా ఆలోచించామో అడుగుతుంది.
    ఎన్ని వంటకాలు వడ్డించామో కాదు
    ఎలాంటి ఉద్దేశ్యంతో వడ్డించామో లెక్కిస్తుంది.
    చివరికి, రమజాన్‌ అసలు విందు టేబుల్‌పై కాదు
    మన హృదయంలో ఉంటుంది. 
    – ముహమ్మద్‌ ముజాహిద్‌  

     

    ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి


     

  • ఆడపిల్లలంటేనే గాజులు.. చెవి రింగులు, ముక్కెర, కాళ్ల పట్టీలు.. ఇలా వివిధ అలంకరణ వస్తువులను ఇష్టంగా ధరిస్తారు. ఈ ఆసక్తి సామాన్యులకే కాదు.. లోకాలనేలే అమ్మలగన్న అమ్మకు కూడా ఉంటుందని మీకు తెలుసా? అంతేకాదు.. స్వయంగా ఆండాల్ అమ్మవారు ఓ చిన్నపాప రూపంలో గాజుల విక్రేత వద్ద ఎంతో ఇష్టంగా గాజులు వేయించుకున్నారు. అంతేకాదు.. అక్కడే కొలువుదీరిన అమ్మవారికి పెళ్లిళ్లు జరగాలని, పిల్లలు పుట్టాలని ముడుపుకడితే.. ఇట్టే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న గోదా సమేత మన్నారు రంగనాథ స్వామి ఆలయం విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.. 

    రంగనాథస్వామి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ... గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదు. అలాంటిదే తెలంగాణలోని ఘట్‌కేసర్ సమీపంలో ఏదులాబాద్‌లో ఉన్న గోదాదేవి సహిత రంగనాథస్వామి ఆలయం. దాదాపు ఆరువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పల దేశీకుడు అనే భక్తుడు కట్టించాడనీ, అప్పటినుంచీ ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారనీ అంటారు. ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి స్వామివార్లను దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. దీంతో శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది.

    హైదరాబాద్-వరంగల్ హైవేలో ఘట్‌కేసర్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని ఎదులాబాద్‌లో శ్రీ గోదా రంగనాయక స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవస్థానం ప్రాచీనమైనది. ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం రాయపురం అని పిలిచేవారు. ఆలయ స్థల పురాణం ప్రకారం.. శ్రీ వత్సస గోత్రీకులైన తిరువనంతపురం వాసి శ్రీనివాస దేశీకుడు.. ఈయన భార్య పేరు అలివేలమ్మ. ఈమె గర్భం దాల్చిన కొద్ది రోజులకే శ్రీనివాస దేశీకుడు మరణించారు. దీంతో అలివేలమ్మ శ్రీ వల్లిపుత్తూరుకు చెందిన తన తండ్రి గారి ఇంటికి చేరుకుంది. అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరు అప్పల దేశీకుడు. పిల్లాడు ఎదుగుతున్న సమయంలో సోదరుల సహకారం లేకపోవడంతో.. అలివేలమ్మ తన కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అలా అప్పటి నిజాం రాజ్యమైన ప్రస్తుత తెలంగాణాలోని రాయపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ రాయుడు పంతులు అనే రాజు ఆమెను ఆదరించి కావలసిన వసతులు కల్పించారు. అలా అలివేలమ్మ గ్రామంలోని ఏకాంగుల ఇంటిలో ఆశ్రయం పొందుతుంది.

    అలివేలమ్మ కుమారుడైన అప్పల దేశీకుడు మంచి దైవ భక్తి కలవాడు. గ్రామంలోని వేణుగోపాల స్వామి సన్నిధికి ఎదురుగా ఓ చిన్న గుడిని నిర్మించుకుని అందులో ఆండాలు అమ్మవారిని ప్రతిష్ఠించి ధూప, దీప నైవేద్యాలతో, తిరు నక్షత్రాలను జరిపించేవాడు. కొన్ని రోజులకు తమ స్వగ్రామం వెళ్ళి అక్కడి నుంచి శ్రీ రంగమన్నార్, గోదా ఆండాళ్ విగ్రహాలను తెచ్చి ప్రతిష్టించాడు. ఐతే.. వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ గుడి చిన్నదిగా ఉందని.. స్వామివారు కాళ్లు చాచుకోడానికి కూడా సరిపోవడం లేదని భావించి.. ఆ పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. ఐతే అమ్మవారే స్వయంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారనే కథ కూడా ప్రచారంలో ఉంది.

    అమ్మవారు తిరిగిన అన్ని ప్రాంతాల్లో ప్రసాదం నిండుకునేది. కానీ ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతంలో మాత్రం ప్రసాదం మిగులుతూ ఉండేది. దీంతో దీన్ని శుభ పరిణామంగా భావించి, తన నివాసానికి ఇదే అనువైన ప్రదేశంగా అమ్మవారు అప్పల దేశీకుడితో చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ దిక్కున ఉన్న గరుడాద్రి అనే స్థలంలో వెలసి ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతారు. ఐతే ఆ ప్రాంతమంతా అడవి జంతువులు, విషసర్పాలతో నిండిపోయి ఉండడాన్ని చూసి అప్పల దేశీయుడు సంశయిస్తాడు. కానీ.. అమ్మవారు మాత్రం.. ముందు నువ్వెళ్లి పుష్కరిణిలో స్నానమాచరించి, సంధ్యావందనం చేసి రా..! అప్పటికి ఈ ప్రాంతమంతా మారిపోతుంది అని చెప్పారు. అలా అమ్మవారు చెప్పినట్లు సంధ్యావందనం చేసుకుని, తిరిగి వచ్చిన దేశీకుడు పూర్తిగా మారిపోయిన గరుడాద్రి ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి సన్నిధిని నిర్మించాడు.

    ఇక్కడ కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టం. దీని వెనక ఓ కథ ఉంది. ఓ రోజు సాయంత్రం అమ్మవారు స్థానికంగా ఉన్న గాజుల వ్యాపారి వద్దకు ఓ చిన్నపిల్ల రూపంలో వెళ్లింది. తాను అప్పల దేశీకుడి కుమార్తెనని చెప్పుకొని, గాజులు వేయించుకుంది. తన తండ్రి వద్ద డబ్బులు తీసుకోవాలని చెప్పి.. అక్కడి నుంచి వచ్చేసింది. దాంతో మర్నాడు ఆ వ్యాపారి డబ్బుల కోసం అప్పల దేశీకుడి వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. దానికి ఆశ్చర్యపోయిన అప్పల దేశీకుడు.. తనకు ఇంకా సంతాన భాగ్యం కలగలేదని చెప్పాడు. దాంతో ఆ వ్యాపారి ఆ చిన్నారి ఆనవాళ్లు చెప్పడంతో.. ఆలయంలోకి వెళ్లి.. అమ్మవారి వద్ద ఉన్న గాజులతో బయటకు వచ్చాడు. అవే గాజులా? అని అడగ్గా.. సదరు వ్యాపారి ఔనని సమాధానం చెప్పాడు. స్వయంగా అమ్మవారు చిన్నారి రూపంలో వచ్చి, గాజులు వేయించుకోవడంతో ఆ గాజుల వ్యాపారి జన్మ ధన్యమైందని దేశీకుడు ఉబ్బితబ్బిబైపోయాడు. అప్పటి నుంచి ఆండాల్ అమ్మవారికి గాజులమ్మ అని పేరు వచ్చింది. 
     

    ఈ ఆలయంలో ఏటా నాగుల పంచమి రోజున అమ్మవారికి మట్టి గాజులను సమర్పించడం ఇక్కడ ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆలయంలో రోజువారీ జరిగే పూజలు ఒకెత్తయితే.. నెలలో మొదటి ఆదివారం నిర్వహించే సుదర్శన హోమం మరో ఎత్తు. ఏటా ఇక్కడ శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన భక్తులు తరలివస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు అధ్యయనోత్సవాలూ, నమ్మాల్వార్‌ పరమపద ఉత్సవాలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజు గోదాదేవి కల్యాణం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలూ నిర్వహిస్తారు. నేటికీ అప్పలా చార్యులవారి ఏడో తరం వారు ఈ ఆలయంలో అర్చకులుగా ఉన్నారు.

    ఈ ఆలయంలో ఉత్సవాలకు ఎప్పుడూ ఏ లోటూ రాదట. ఉత్సవాలకి కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటవ్వడం వల్ల నిర్వఘ్నంగా సాగుతాయని భక్తులు చెబుతుంటారు. ఇదంతా అమ్మవారి సంకల్పంగా భావిస్తుంటారు. ధనుర్మాసంలో తప్పక సందర్శించవలసిన గొప్ప మహిమ గల ఆలయం ఇది. ఇక్కడ భక్తులు తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భావిస్తారు. ముఖ్యంగా సంతానం కావాల్సిన వారు.. గ్రహదోషాలతో వివాహాలు జరగని వారు ఇక్కడ ముడుపు చెల్లిస్తే.. ఏడాది తిరిగేలోగా శుభవార్త వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మొక్కులు తీరినవారు విధిగా ఇక్కడకు వచ్చి, తమ ముడుపులను విప్పి.. అమ్మవారికి వడిబియ్యం పెడతారు.

    ఇంకెందుకు ఆలస్యం.. ఉప్పల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటున్నారా? ఉప్పల్ నుంచి ఇక్కడకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. క్యాబ్‌లలో వెళ్లేవారు ఘట్‌కేసర్ వైపు నుంచి వెళ్లవచ్చు. ఒకవేళ.. హయాత్‌నగర్ పరిసరాల్లో ఉండేవారు.. దేశ్‌ముఖీ మీదుగా ఏదులాబాద్ చేరుకోవచ్చ.