Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సౌత్‌లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది.  

    అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్‌ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.

    ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

  • ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

    సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు.

    ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. పర్సంటేజీ సమస్య ఎ‍ట్టకేలకు కొలిక్కి వచ్చింది గానీ ఇదంతా జరగడానికి ముందు అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు.. మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలని చెప్పుకొన్నారు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడీ విషయంపై టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

    (ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)

    ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు. సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి 'సమస్యలు… సమస్యలు…' అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది! ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు!'

    'సిన్సియర్‌గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి. వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి. మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్‌గా సినిమాలు తీయండి. ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది' అని మధుర శ్రీధర్ చెప్పుకొచ్చారు.

    స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలని డైరెక్ట్ చేసిన ఈయన.. తర్వాత నుంచి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. గతేడాది ఈయన నుంచి మోతవరి లవ్ స్టోరీ, సంతాన ప్రాప్తిరస్తు మూవీస్ వచ్చాయి.

    (ఇదీ చదవండి: చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం)

  • అందంతో రచ్చ లేపుతున్న కాజల్ అగర్వాల్

    ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కామ్నా గ్లామర్ డోస్

    మోడ్రన్ డ్రస్‌లో మాయ చేసేలా ఐశ్వర్య రాజేశ్

    పొడుగు కాళ్ల సుందరి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

    ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సంయుక్త

    జపాన్ ట్రిప్ లో హీరోయిన్ రష్మిక ఎంజాయ్

  • కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో మొదలైన సినిమా 'లఫూట్ గ్యాంగ్'. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బీవీఎస్ రవి, రాజ్ తరుణ్, ఆకాష్ పూరీ తదితరులు విచ్చేశారు.

    (ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)

    ఇందులో నటిస్తున్న అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా 'జాతిరత్నాలు' తరహాలో అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. 1990ల్లో ఓ హాస్టల్‌లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే యువకుల గ్యాంగ్.. హాస్టల్లో ఎలా ఉంటారు? వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

    (ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. చిరు జోక్యంతో సద్దుమణిగింది)

  • 'పెద్ది' సినిమాకు పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు.. లేదు ఎప్పటిలానే రెంట్ మాత్రమే ఇస్తామని నిర్మాతలు పట్టుబట్టుకుని ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి ఈ వివాదం అలా నడుస్తూనే ఉంది. ఇప్పుడు దీనికి ఎట్టకేలకు ఓ పరిష్కారం దొరికింది. చిరంజీవి మరోసారి కలిసిన తెలంగాణ ఎగ్జిబిటర్లకు ఓ పరిష్కారం దొరికింది.

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

    చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ  వివాదం సర్దుమణిగింది. 'పెద్ది' చిత్రాన్ని  రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల నిర్ణయించుకున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్‌తో పాటుగా 7.5 శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత విడుదలయ్యే సినిమాలని పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ నిర్ణయాలను చిరంజీవికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వివరించగా.. ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు.

    (ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)

  • తెలుగులో ప్రతివారం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏవీ హిట్ అవ్వట్లేదు. ఒకటిరెండు రోజుల మెరుపులు తప్పితే బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తా కొట్టేస్తున్నాయి. కానీ చాలామంది దర్శకనిర్మాతలకు ఈ నిజం ఒప్పుకోవడానికి ఇప్పటికీ మనసు రావట్లేదు. అంతకుముందు రివ్యూయర్లపై నెపం నెట్టేసేవారు. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. నవ్వుతూ నిజాలు చెప్పేస్తున్నారు. అసలు తెలుగు సినిమాల పరిస్థితి ఇలా ఎందుకు తయారైందో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు.

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

    'యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్ కొనేస్తున్నాం. ట్విటర్‌లో నెగిటివిటీ ఉంటే దాన్ని పాజిటివ్‌గా మార్చేస్తున్నాం. ఏది నిజం? ఏది అసలు కంటెంట్? ఏది కావట్లేదు? ఏది జనాలకు ఎక్కుతుంది? ఏది ఎక్కదు? అసలు ఏం జరుగుతుందనేది తెలియక లోపల ప్యాక్ అయిపోతోంది. పాట బాగుందా? ఓపెనింగ్ వస్తాదా రాదా అని అందరికీ ఫోన్లు చేయడం. జనాలకు కూడా ఇండస్ట్రీ అంటే విరక్తి వచ్చేసింది. చాలా భయమేస్తోంది. ఇలా చేసుకుంటూ పోతే ఏం కథలు రాయాలి? ఏం సినిమాలు తీయాలి? ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. రొమ్ కామ్, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి కొన్ని జానర్లని మనం చంపేశాం. నేను నమ్మకంగా చెబుతున్నా 'బేబి'ని ఇప్పుడు రిలీజ్ చేస్తే సగం షేర్ కూడా రాదు. ఈ రెండేళ్లలో అంత మార్పులొచ్చేశాయి' అని 'బేబి' దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు.

    నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ ప్రస్తుతం కష్టకాలంలో ఉందని చెప్పడానికి చాలామంది భయపడతారు. కానీ నేను ధైర్యంగా చెబుతున్నా. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకురావడమే మనందరికీ పెద్ద సవాల్. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత హెల్తీగా ఉంటుంది' అని చెప్పారు.

    పైన ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవాళ్లే. వీళ్లు ఇప్పుడు ఈ విషయాల్ని చెబుతున్నారు గానీ జనాలకు వీటి గురించి ఎప్పుడో అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నా పెద్దా ఏ సినిమా రిలీజైనా సరే అసలు టాక్ రావడం కంటే ముందే సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులని చాలామంది దర్శకనిర్మాతలే ప్రోత్సాహిస్తున్నారు. వచ్చిన కలెక్షన్స్‌కి సంబంధం లేకుండా పోస్టర్లపై పెద్ద పెద్ద నంబర్లు వేసి ప్రేక్షకుల్ని మభ్యపెడుతూ వచ్చారు. ఫలితంగా ఇప్పుడు టాలీవుడ్ దాని పర్యవసనాలని అనుభవిస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు!

    (ఇదీ చదవండి: తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్)

  • తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల మూవీస్ దగ్గర నుంచి పిల్లల చిత్రాల వరకు అన్ని రకాలవి వచ్చేవి. ప్రస్తుతం మాత్రం కమర్షియల్, రెగ్యులర్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వీటికి మొహం మొత్తేసిన ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చే ఆసక్తి చూపించట్లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఓ పిల్లల మూవీ వచ్చేస్తోంది. దాని పేరు 'సమ్మర్ హాలీడేస్'. తాజాగా దీని టీజర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)

    ఇప్పుడంటే వేసవి వస్తే పిల్లలందరూ సమ్మర్ క్యాంపుల పేరిట బిజీ అయిపోతున్నారు గానీ ఒకప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్లేవాళ్లు. ఆ జ్ఞాపకాలని గుర్తుచేసేలా ఈ సినిమాని తీసినట్లు తెలుస్తోంది. పట్నంలో ఉండే ఓ పిల్లాడు.. వేసవిలో అమ్మమ్మ ఉండే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఈ పిల్లాడికి మరో అల్లరి పిల్లాడు పరిచయమవుతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి సందడి చేశారనేదే స్టోరీ అనిపిస్తుంది. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

  • కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజైపోతుంటాయి. సాధారణంగా ఇలాంటి వాటిపై చిన్నచూపు ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ బాగోలేకపోవడం వల్లే ఇలా ఇచ్చేశారా అని సందేహం కలుగుతుంది. కొన్నిసార్లు మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. ఇప్పుడు అలానే వచ్చిన ఓ కోర్ట్ రూమ్ డ్రామా ఆకట్టుకుంటోంది. దాని పేరు 'సిస్టమ్'. జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

    కథేంటి?
    ఢిల్లీకి చెందిన సీనియర్ లాయర్ రవి రాజవంశీ(అశుతోష్ గోవారికర్) కూతురు నేహ(సోనాక్షి సిన్హా). తండ్రిలానే లాయర్ వృత్తిని ఎంచుకున్నప్పటికీ మరో సీనియర్ దగ్గర పనిచేస్తుంటుంది. కానీ ఒక్క కేసు కూడా గెలవలేకపోతూ ఉంటుంది. 10 కేసులు గెలిస్తేనే తన లా ఫార్మ్‌లో చేర్చుకుంటానని నేహాకి తండ్రి షరతు పెడతాడు. అనుకోని విధంగా నేహాకు.. కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సారిక(జ్యోతిక) పరిచయమవుతుంది. సారిక చేసిన చిన్న చిన్న సాయాల వల్ల నేహా వరసగా కేసుల్లో విజయం సాధిస్తుంది. ఒకానొక టైంలో తండ్రీ కూతురు ఒకే కేసులో పరస్పరం తలపడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైంది? ఇంతకీ ఆ కేసు ఏంటి? అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    పైపైన చూస్తే ఇదో రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామానే. అందరికీ నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు ఇందులో ఏం లేవు. కానీ తరచి చూస్తే మన న్యాయవ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో మగ్గుతుందో కనిపిస్తుంది. ధనం, అధికారం ఉన్నోడిదే న్యాయం అని అర్థమవుతుంది. గుండెల్లో ధైర్యం తప్పితే ఏమి లేని సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా ఎలా తయారైందనే విషయాన్ని పచ్చిగా చూపించారు.

    చట్టంలో న్యాయం చేయడానికి సెక్షన్లు ఉన్నట్లే తప్పించుకోవడానికి అంతకు మించిన లొసుగులు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కొందరు నేరస్తులు తప్పించుకుంటున్నారు. డబ్బుకు ఆశపడే కొందరు లాయర్లు ఇలాంటి వాళ్లకు సాయం చేస్తున్నారు. తమకు న్యాయం జరగదనే ఆలోచనతో బాధితులు ఎలా మారుతున్నారు? నిజం ఎప్పటికైనా నిరూపితం అవుతుందనే నమ్మకాన్ని వాళ్లలో కలిగించేదెవరు? అనే అంశాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

    డబ్బు కోసమే వాదించే ఓ సీనియర్ లాయర్. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని లాయర్‌గా స్థిరపడాలనే ఆయన కూతురు. కోర్టులో రోజూ పదుల సంఖ్యలో వాదప్రతివాదనలు వింటూ అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకునే ఓ స్టెనోగ్రాఫర్. ఈ మూడు పాత్రల చుట్టూ కోర్టు రూమ్‌లోనే కథంతా సాగుతుంది. ప్రారంభంలో స్టోరీ సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది గానీ ఎప్పుడైతే నేహా,సారిక పాత్రలు కలుస్తాయో, తండ్రిని ఎదిరించి నేహా ఇల్లు వదిలి బయటకొచ్చేస్తుందో అప్పటినుంచి స్టోరీలో కదలిక వస్తుంది. విక్రమ్ బజాల్ కేసుకి సంబంధించిన ఆధారాలని సేకరించడం కోసం సాగే అన్వేషణ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినప్పటికీ చివరి అరగంట చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

    నేహా పాత్రతో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందో చూపించిన డైరెక్టర్.. సారిక పాత్రతో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. కథ, కథనం పర్లేదనిపించినప్పటికీ జనాలకు మాత్రం కొన్ని ప్రశ్నలు అలానే మిగిలిపోతాయి. 'వ్యవస్థ' మనిషిని నడిపిస్తోందా? లేదంటే కొందరు 'పెద్దోళ్లు' వ్యవస్థని నడిపిస్తున్నారా అనే విషయాల్ని సామాన్యుడిగా అర్థమయ్యేలా చూపించారు.

    ఈ మూవీలో హీరో, విలన్ అంటూ ఎవరూ ఉండరు. దానికంటే పరిస్థితులు మనుషులని ఎలా మార్చేస్తాయి అనే విషయాన్ని చూపించడంలో దర్శకురాలు అశ్విన్ అయ్యర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. 'మన భుజాల మీద నుంచి భారం దింపేసుకున్నాం అనుకుంటాం కానీ భుజాలు మాత్రమే మారతాయి భారం కాదు', 'న్యాయస్థానానికి నేరం ఎవరు చేశారు అనేది అనవసరం ఎవరిపై ఆధారాలు ఉన్నాయి అనేదే ముఖ్యం' లాంటి డైలాగ్స్ ఈ సినిమాపై గౌరవాన్ని పెంచుతాయి. పూర్తయిన తర్వాత మన బుర్రలోనే తిరుగుతాయి.

    ఇందులోనే నేహా, సారిక పాత్రలతో ఫెమినిజంకు అసలైన అర్థం కూడా చూపించారు. భర్తకు కాలు చచ్చుబడి ఇంటికే పరిమితమైనప్పటికీ ఇంటిని చూసుకునే సారిక పాత్ర కావొచ్చు, తండ్రినే ఎదిరించి కేసు గెలిచే నేహా పాత్ర కావొచ్చు భలే అనిపిస్తాయి. ఆయా పాత్రల్లో జ్యోతిక, సోనాక్షి చాలా సహజంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఎంత ఉండాలో అంతే వినిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేశారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు. 

    -చందు డొంకాన

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)

  • ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలానే జెట్ లీ, కర, లీడర్, ఫేసెస్ అనే స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవలా ఉండగానే ఓ తెలుగు మూవీ చాన్నాళ్ల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

    (ఇదీ చదవండి: ముమైత్ ఖాన్ ఇప్పుడేం చేస్తోంది? పాక్‌తో ఈమెకు సంబంధమేంటి?)

    ధర్మ మహేశ్, ఐశ్వర్య శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'డ్రింకర్ సాయి'. 2024 డిసెంబరు చివరి వారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఘోరమైన డిజాస్టర్ అయింది. టీజర్, ట్రైలర్ లాంటివి పర్లేదనిపించినప్పటికీ.. అసలు సంగతి తేలిపోయింది. ఇప్పుడీ చిత్రం దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది.

    'డ్రింకర్ సాయి' విషయానికొస్తే.. తల్లిదండ్రులు కట్టించిన ఆస్పత్రి నుంచి వచ్చే డబ్బులతో సాయి(ధర్మ).. జల్సా చేస్తూ ముఖ్యంగా రోజంతా తాగుతూ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ని వెనకేసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. తనకు యాక్సిడెంట్ చేసిన భాగి(ఐశ్వర్య శర్మ)ని ఇష్టపడి ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. భాగికి సాయి అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ ఎక్కడ వయలెంట్ అయిపోతాడో అనే భయంతో ప్రేమని భరిస్తూ ఉంటుంది. ఈ బలవంతపు ప్రేమగాథ ఎక్కడివరకు సాగింది? చివరకు భాగి.. సాయిని మార్చుకోగలిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

  • టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ(LLP) ప్రపంచవ్యాప్తంగా మే 28న  విడుదల చేస్తోంది.

    ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

    ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…‘ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు.

    నిర్మాతలు మాట్లాడుతూ…‘మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.  

Sports

  • ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆరెంజ్‌ ఆర్మీ ప్రత్యర్దికి భారీ స్కోర్‌ సమర్పించుకుంది. వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు) ఊచకోత కోయడంతో రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    వైభవ్‌తో పాటు ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్‌ స్కోర్‌.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది.

    12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు సాకిబ్‌ హుసేన్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రఫుల్‌ హింగే (4-0-54-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. 

    ఓ పక్క సహచరులంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా శివాంగ్‌ కుమార్‌ (2-0-19-1), నితీశ్‌ కుమార్‌ (2-0-12-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కమిన్స్‌ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఎషాన్‌ మలింగ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్‌ తీయగా.. సాకిబ్‌ హుసేన్‌ 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.

    రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో వైభవ్‌, జురెల్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జైస్వాల్‌ 29, కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 26, ఫెరియెరా 12, షనక 5, రవీంద్ర జడేజా 12 (నాటౌట్‌), ఆర్చర్‌ 4, బర్గర్‌ 1, సుషాంత్‌ మిశ్రా 1 (నాటౌట్‌) పరుగు చేశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఒత్తిడికి లోనైన ఆ జట్టు వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆర్చర్‌ (4-0-58-3), బర్గర్‌ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్‌ రాజ్‌ పూనియా (4-0-39-1), సుషాంత్‌ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై, 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

    ఈ గెలుపుతో రాజస్థాన్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరింది. 

  • ఐర్లాండ్‌తో ఇవాళ (మే 27) మొదలైన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 4 పరుగులకే తొలి వికెట్‌ (టామ్‌ లాథమ్‌), 21 పరుగులకే రెండో వికెట్‌ (డెవాన్‌ కాన్వే), 85, 86 పరుగులకే మూడు (కేన్‌ విలియమ్సన్‌), నాలుగు (డారిల్‌ మిచెల్‌) వికెట్లు కోల్పోయినా, మరో వికెట్‌ పడకండా జాగ్రత్తగా ఆడుతూ 300 పరుగుల మార్కును తాకింది.

    రచిన్‌ రవీంద్ర (121) కెరీర్‌లో ఐదో టెస్ట్‌ సెంచరీతో కదంతొక్కగా.. వికెట్‌ కీపర్‌ టామ్‌ బ్లండెల్‌ (126) ఏడో టెస్ట్‌ సెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రచిన్‌-బ్లండెల్‌ ఐదో వికెట్‌కు ఏకంగా 217 పరుగులు జోడించారు. 79 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 306-5గా ఉంది. బ్లండెల్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

    ఐర్లాండ్‌ పేసర్‌ మార్క్‌ అదైర్‌ ఆదిలో న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ కొట్టాడు. టామ్‌ లాథమ్‌ను డకౌట్‌ చేసి, ఆతర్వాత డెవాన్‌ కాన్వేను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత డారిల్‌ మిచెల్‌కు ఒక్క పరుగుకే ఔట్‌ చేశాడు. కేన్‌ విలియమ్సన్‌ను (36) లియామ్‌ మెక్‌కార్తీ.. రచిన్‌ రవీంద్రను హ్యారీ టెక్టార్‌ ఔట్‌ చేశాడు.

  • ఎస్‌ఆర్‌హెచ్‌తో ఇవాళ (మే 27) జరుగుతున్న ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మహోగ్రరూపం​ దాల్చాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్‌ అయినా ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.

    16 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ (నాకౌట్స్‌)లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును సురేశ్‌ రైనాతో కలిసి షేర్‌ చేసుకున్నాడు.

     ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ (నాకౌట్స్‌)లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీస్‌
    16 - సురేశ్‌ రైనా vs PBKS, వాంఖడే, 2014
    16 - వైభవ్‌ సూర్యవంశీ vs SRH, ముల్లాన్‌పూర్, 2026*
    17 - ఆడం గిల్ క్రిస్ట్ vs DC, సెంచూరియన్, 2009
    20 - ఎంఎస్‌ ధోని vs MI, బెంగళూరు, 2012
    21 - డ్వేన్ స్మిత్ vs CSK, ఢిల్లీ, 2013
    21 - వీరేంద్ర సెహ్వాగ్ vs CSK, వాంఖడే, 2014
    21 - రజత్‌ పాటిదార్ vs GT, ధర్మశాల, 2026

    ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు
    61* - వైభవ్ సూర్యవంశీ (2026)
    59 - క్రిస్ గేల్ (2012)
    52 - ఆండ్రీ రస్సెల్ (2019)
    51 - క్రిస్ గేల్ (2013)
    45 - జోస్ బట్లర్ (2022)

    ఐపీఎల్‌ సీజన్‌లో ఒక అన్‌క్యాప్డ్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు
    680 - వైభవ్ సూర్యవంశీ (RR, 2026)*
    625 - యశస్వి జైస్వాల్ (RR, 2023)
    616 - షాన్ మార్ష్ (PBKS, 2008)
    573 - రియాన్ పరాగ్ (RR, 2024)
    549 - ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (PBKS, 2025)

    ఐపీఎల్‌లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక 50లు
    6 - అభిషేక్ శర్మ
    5 - నికోలస్ పూరన్
    5 - వైభవ్ సూర్యవంశీ*

    ఐపీఎల్‌ పవర్‌ ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక 50+ స్కోర్లు
    6 - డేవిడ్ వార్నర్
    5 - వైభవ్ సూర్యవంశీ
    4 - ట్రావిస్ హెడ్

    ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో (1-6) మధ్య ఓవర్లలో 50+ స్కోర్లు
    87 - సురేష్ రైనా vs PBKS, 2014
    74 - ఆడమ్ గిల్ క్రిస్ట్ vs DD, 2009
    60 - వైభవ్ సూర్యవంశీ vs SRH, 2026*

    ఐపీఎల్‌లో 1-6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు
    8 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026 ELM*
    7 - సనత్ జయసూర్య (MI) vs CSK, ముంబై WS, 2008
    7 - జోస్ బట్లర్ (RR) vs DC, ఢిల్లీ, 2018 (వర్షం కుదించిన గేమ్)
    7 - జానీ బెయిర్‌స్టో (PBKS) vs RCB, బ్రబౌర్న్, 2022
    7 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, ముల్లన్‌పూర్, 2026
    7 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026

    ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పవర్‌ప్లే (1-6 ఓవర్లు) పరుగులు
    490 - వైభవ్ సూర్యవంశీ (2026)*
    467 - డేవిడ్ వార్నర్ (2016)
    402 - ట్రావిస్ హెడ్ (2024)
    402 - సాయి సుదర్శన్ (2025)
    382 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2009)

    ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు
    4 - క్రిస్ గేల్
    4 - వైభవ్ సూర్యవంశీ*
    2 - అభిషేక్ శర్మ
    2 - ఫిన్ అలెన్

    ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
    11* - V సూర్యవంశీ vs SRH, జైపూర్, 2026*
    10 - S గిల్ vs MI, అహ్మదాబాద్, 2023
    9 - R పాటిదార్ vs GT, ధర్మశాల, 2026

    ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు)
    12 - వి సూర్యవంశీ (RR) vs SRH, 2026
    12 - V సూర్యవంశీ (RR) vs SRH, 2026 ELM
    11 - మురళీ విజయ్ (CSK) vs RR, 2010
    11 - వి సూర్యవంశీ (RR) vs GT, 2025

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌ 13.5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. యశస్వి జైస్వాల్‌ 29 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రియాన్‌ పరాగ్‌ (12), ఫెరియెరా క్రీజ్‌లో ఉన్నారు. 
     

  • ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ అభిమానుల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను (@hardikpandya93) డీయాక్టివేట్‌ చేసుకున్నాడు.

    ఈ చర్యతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల అతడు తన ఇన్‌స్టా స్టోరీలో "07:07" అని పోస్ట్‌ చేశాడు. ఇది అతని ఫోన్‌ లాక్‌స్క్రీన్‌లో కనిపించిన టైమ్‌. దీన్ని చూసి అభిమానులు ఎంఎస్‌ ధోనితో లింక్‌ చేస్తూ.. హార్దిక్‌ సీఎస్‌కేకు మారనున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఇన్‌స్టా ఖాతా డీయాక్టివేట్‌ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.

    ధోని జెర్సీ నంబర్‌ 7, జన్మదినం జూలై 7 (7/7) కావడంతో.. హార్దిక్‌ వచ్చే సీజన్‌లో సీఎస్‌కేలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై హార్దిక్‌, ముంబై ఇండియన్స్‌ లేదా సీఎస్‌కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

    హార్దిక్‌ విషయంలో ఇలా జరగడం ఈ సీజన్‌లో ఇది మొదటిసారి కాదు. మే 11న కూడా అతడి సోషల్‌మీడియా యాక్టివిటీ పెద్ద వివాదానికే దారి తీసింది. అప్పట్లో అతడు ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాడని, జట్టును అన్‌ఫాలో చేశాడని వార్తలు వచ్చాయి. 

    కొందరు అభిమానులు అయితే హార్దిక్‌ తన సహచర ఆటగాళ్లను కూడా అన్‌ఫాలో చేశాడని పేర్కొన్నారు. దీంతో హార్దిక్‌ అప్పుడే ముంబై ఇండియన్స్‌ నుంచి తప్పుకుంటున్నాడన్న ప్రచారం జరిగింది.

    అయితే కొద్ది సేపటికే పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో అది సోషల్‌మీడియా గ్లిచ్ అని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే రావడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఊపందుకున్నాయి.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శనలు చేసి, ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే (9వ స్థానం) నిష్క్రమించింది. హార్దిక్‌ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై సొంత ఫ్రాంచైజీ అభిమానులే భారీ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. జట్టు నుంచి, కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. 
     

  • ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్థాన్‌ గెలుపు
    ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

    ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌..  వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు), ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    అనంతర​ం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్చర్‌ (4-0-58-3), బర్గర్‌ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్‌ రాజ్‌ పూనియా (4-0-39-1), సుషాంత్‌ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.

    ఈ గెలుపుతో రాజస్థాన్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరింది. 

    ఓటమి దిశగా సాగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌
    6.5వ ఓవర్‌- 81 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి దిశగా సాగుతోంది. యశ్‌రాజ్‌ పూనియా బౌలింగ్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (18) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 

    నిప్పులు చెరుగుతున్న ఆర్చర్‌
    4.4వ ఓవర్‌- 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ పోరాడకుండానే చేతులెత్తేశేలా ఉంది. 57 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (17) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ వికెట్‌ ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌కు మూడవది.

    పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌
    3.3వ ఓవర​్‌- భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి స్మరణ్‌ రవిచంద్రన్‌ (1) ఔటయ్యాడు. హెడ్‌, క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

    రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    2.5వ ఓవర్‌- 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. 

    ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌
    244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో బంతికే భారీ షాక్‌ తగిలింది. ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ డకౌటయ్యాడు.

    రాజస్థాన్‌ భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ భారీ స్కోర్‌ చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97), ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 

    ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్‌ స్కోర్‌.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో సాకిబ్‌ హుసేన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
    15.2వ ఓవర్‌- 207 పరుగుల వద్ద రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (26) ఔటయ్యాడు.  

    మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
    13.5వ ఓవర్‌- 192 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసిన అనంతరం ధృవ్‌ జురెల్‌ ఔటయ్యాడు. 

    రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
    10.2వ ఓవర్‌- 137 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శివాంగ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ (29) ఔటయ్యాడు. 

    వైభవ్‌ సెంచరీ మిస్‌
    7.6వ ఓవర్‌- 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ప్రఫుల్‌ హింగే బౌలింగ్‌లో స్మరణ్‌ రవిచంద్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 125-1గా ఉంది. 

    6 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 80-0
    వైభవ్‌ సూర్యవంశీ 60 (20 బంతుల్లో, 2 ఫోర్లు, 8 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌ 19 (16 బంతుల్లో 3 ఫోర్లు)

    దూకుడుగా ఆడుతున్న వైభవ్ 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(36), యశస్వి జైస్వాల్(8) పరుగులు చేశారు.

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌
    ఐపీఎల్‌ 2026లో ఇవాళ జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలిమినేటర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

    తుది జట్లు..
    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

  • రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ క్రేజ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్‌ను తాకింది. ఆ ఈవెంట్‌ సూపర్‌ స్టార్‌ డ్రూ మెక్‌ఇన్‌టైన్‌ (Drew McIntyre) వైభవ్‌పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. 

    వైభవ్‌ ఐపీఎల్‌ జెర్సీతో జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్‌కు వచ్చిన క్రేజ్‌ చూసి భారత క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

    బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్‌, ధోని, విరాట్‌ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్‌ క్రేజ్‌ చూసి ఔరా అంటున్నారు.

    డ్రూ మెక్‌ఇన్‌టైన్‌ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ స్పందించడం మరింత వైరల్‌గా మారింది. "2K గేమ్‌లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ అధికారిక సోషల్‌మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్‌ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.

    ఇదిలా ఉంటే, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

    ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతనాడిన  14 మ్యాచ్‌ల్లో 232.27 స్ట్రయిక్‌రేట్‌తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్‌ ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు.

    పైగా వైభవ్‌కు ప్లే ఆఫ్స్‌లో (నాకౌట్స్‌) మరింత ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్‌ ఆడిన 8 నాకౌట్స్‌లో 209.62 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్‌ ఫ్యాన్స్‌ ధీమాకు మరో కారణం​ కూడా ఉంది. ఇదే సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లో వైభవ్‌ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.

    ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్‌ ఏం చేస్తాడో చూడాలి. 

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌న్న డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే ఈ యువ సంచలనం అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమయ్యాడని అభిమానులు,మాజీలు అభిప్రాయపడుతున్నారు. 

    దీంతో ఈ ఏడాది జూన్ ఆఖరిలో ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు. అయితే అంత‌కంటే ముందు వ‌చ్చే నెలలో శ్రీలంక వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ముక్కోణ‌పు సిరీస్‌లో భార‌త్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున వైభ‌వ్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. తిల‌క్ వ‌ర్మ సార‌థ్యంలో అత‌డు ఆడ‌నున్నాడు. ఈ సిరీస్‌లో కూడా అత‌డు మెరుగ్గా రాణిస్తే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌వుతోంది.

    ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ భ‌విష్య‌త్తుపై ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని.. అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత రాజస్తాన్ రాయల్స్‌, బీసీసీఐపై ఉందని ధుమాల్ అన్నారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 583 పరుగులు సాధించి ఆరెంజ్‌క్యాప్ రేసులో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.

    "వైభవ్ సూర్యవంశీ టెంపరామెంట్ దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ, రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం అతడికి అండగా నిలబడాలి. అతడికి సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత బోర్డుతో పాటు రాయల్స్‌పై కూడా ఉంది. క్రీడలు అంటే కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం కూడా ముఖ్యమే.

    అతడు భవిష్యత్తులో సుదీర్ఘ కాలం  ప్రాతినిథ్యం వహించేలా మా వందు మద్దతు అందిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ పేర్కొన్నాడు. కాగా చిన్నవయస్సులోనే స్టార్‌డమ్ రావడం వల్ల ఆటగాళ్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వైభవ్‌కు సరైన గైడెన్స్ ఇవ్వాలని ధుమాల్ సూచించారు.
    చదవండి: IPL 2026: రాజస్తాన్‌తో ఎలిమినేటర్‌.. సన్‌రైజర్స్‌ తుది జట్టు ఇదే!

  • ఐపీఎల్‌ 2026లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన సౌతాఫ్రికా ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌).. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగాడు. హ్యాంప్‌షైర్‌ తరఫున అరంగేట్రంలోనే ఇరగదీశాడు. ఫలితంగా ఆ జట్టు ఎసెక్స్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందింది.

    తొలుత బ్యాటింగ్‌ చేసిన హ్యాంప్‌షైర్‌.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (42 బంతుల్లో 69 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హిల్టన్‌ కార్ట్‌రైట్‌ (21 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జో వెథర్లీ (34 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

    హ్యాంప్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో టాబీ అల్బర్ట్‌ (13), కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ (8), టామ్‌ ప్రెస్ట్‌ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఎసెక్స్‌ బౌలర్లలో ఛార్లీ బెన్నెట్‌ 2, మాథ్యూ క్రిచ్లీ, కెప్టెన్‌ సైమన్‌ హార్మర్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 201 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఎసెక్స్‌.. స్కాట్‌ కర్రీ (4-0-18-4) ధాటికి  170 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితమై, ఓటమిపాలైంది. కర్రీతో పాటు క్రిస్‌ వుడ్‌ (4-0-33-2), ఆండ్రూ జాన్‌ నీల్‌ (4-0-36-1) కూడా వికెట్లు తీశారు. 

    ఎసెక్స్‌ ఇన్నింగ్స్‌లో లూక్‌ బెన్‌కెన్స్టైన్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో హార్మర్‌ (36 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా ప్లేయర్లలో మైఖేల్‌ పెప్పర్‌ (25), వియాన్‌ ముల్దర్‌ (14), నోవా థైన్‌ (18) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

    ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2026లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 14 మ్యాచ్‌ల్లో రెండు అర్ద సెంచరీలు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ గుజరాత్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరింది. ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌-రాజస్థాన్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. 
     

  • ఐపీఎల్‌-2026 తొలి ఫైనలిస్టు ఖరారైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో మట్టికరిపించి.. ఫైనల్లో అడుగుపెట్టింది.

    అయితే, ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ  గుజరాత్‌కు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం మిగిలే ఉంది. ఇక బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌తో గుజరాత్‌తో తలపడేది ఎవరన్న అంశం తేలిపోనుంది.

    రిజర్వ్‌ డేలు ఉండవు
    ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. మరి ఈ నాకౌట్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఒకవేళ వాన వల్ల మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏమిటి?.. కాగా ఐపీఎల్‌లో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలు ఉండవు.  

    కాబట్టి వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్‌ రద్దైతే.. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ నేరుగా క్వాలిఫయర్‌-2లో అడుగుపెడుతుంది. కాగా సన్‌రైజర్స్‌ లీగ్‌ దశలో పద్నాలుగింట తొమ్మిది గెలిచి మూడో స్థానంలో ఉండగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఎనిమిది విజయాలు సాధించి నాలుగో స్థానంతో ముగించింది.

    వాతావరణం ఎలా ఉందంటే?
    అయితే, చండీగఢ్‌లో మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. సగటుల 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదువుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇక సాయంత్రం వేళ కూడా దాదాపు 32 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. కాబట్టి ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వేదికైన ముల్లన్‌పూర్‌లో వర్షం పడే సూచనలైతే దాదాపుగా లేవు.

    చదవండి: వైభవ్‌ మాపై శతక్కొట్టవచ్చు.. కానీ: కమిన్స్‌

  • అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) తాజాగా ప్ర‌క‌టించిన బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు సత్తాచాటారు. ఇటీవ‌ల సొంత‌గ‌డ్డ‌పై పాకిస్తాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సీనియ‌ర్ బ్యాట‌ర్లు ముష్ఫికర్ రహీమ్, బ్యాటర్ లిట్టన్ దాస్ త‌మ ర్యాంక్‌ల‌ను భారీగా మెరుగు ప‌రుచుకున్నారు. 

    ముష్పిక‌ర్ తాజా ర్యాంకింగ్స్‌లో 10 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 16వ స్థానానికి చేరుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రహీమ్‌ 259 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదేవిధంగా ఈ సిరీస్‌లో 239 పరుగులు చేసిన లిట్ట‌న్ దాస్  14 స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 

    అదేవిధంగా పాక్‌తో తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన బంగ్లా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తైజుల్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 11వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మ‌రోవైపు స్టార్ స్పిన్న‌ర్ మెహిదీ హసన్ మిరాజ్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 25వ ర్యాంకుకు చేరగా, యువ ఫాస్ట్ బౌలర్ నహీద్ రాణా 10 స్థానాలు ఎగ‌బాకి 54వ స్థానంలో నిలిచాడు. 

    బ్యాట‌ర్ల టాప్ ర్యాంక్‌లో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్ కొన‌సాగుతుండ‌గా.. బౌల‌ర్ల విభాగంలో జ‌స్ప్రీత్ బుమ్రా అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. ఇక వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో ఆస్ట్రేలియా 131 రేటింగ్‌తో టాప్‌లో ఉంది. త‌ర్వాతి రెండు స్ధానాల్లో సౌతాఫ్రికా, భార‌త్ ఉన్నాయి.

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 27) జరుగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ డూ ఆర్‌ డై మ్యాచ్‌కు ముందు అందరి చూపు రాజస్థాన్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపైనే ఉంది. ఎందుకంటే ఈ బుడ్డోడు ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు.

    ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 232.27 స్ట్రయిక్‌రేట్‌తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. వైభవ్‌ ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ తప్పక చెలరేగుతాడని భారీ అంచనాలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో వైభవ్‌ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం. ఈ బిహారి చిన్నోడు అన్ని విభాగాల్లో ఇప్పటివరకు 8 నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 209.62 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే నాకౌట్‌ మ్యాచ్‌ల్లో వైభవ్‌ దూకుడు ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతుంది.

    కాబట్టి నేటి మ్యాచ్‌లో అతడు చెలరేగడం​ ఖాయమని అంతా అనుకుంటున్నారు. పవర్‌ ప్లేలోనే అతడు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అంచనా వేయడానికి బలమైన కారణాలు లేకపోలేదు. 

    ఈ సీజన్‌ పవర్ ‌ప్లేలో వైభవ్‌ 231కు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో ఏకంగా‌ 430 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మ్యాచ్‌ ప్రారంభం కాగానే వైభవ్‌ పని పట్టకపోతే పెను ముప్పు తప్పదని వారు ఓ అంచనాకు వచ్చేశారు.

    ఈ నేపథ్యంలో వారు వైభవ్‌ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ సీజన్‌లోనే జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో వైభవ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ఇబ్బందిపడిన అంశాలను ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు టార్గెట్‌ చేసే అవకాశం ఉంది.

    గత మ్యాచ్‌లో అతడు ఎడమ భుజం వైపు గుడ్‌ లెంగ్త్‌ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. కమిన్స్‌, సాకిబ్‌ హుసేన్‌ ఈ ఏరియాలోనే వైభవ్‌ను టార్గెట్‌ చేసేందుకు వ్యూహరచన చేసుకొని ఉంటాయి.

    నాకౌట్‌ మ్యాచ్‌ల్లో వైభవ్‌ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు..
    2024 అండర్‌-19 ఆసియా కప్‌ సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు 
    2026 అండర్‌-19 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 33 బంతుల్లో 68 పరుగులు
    2026 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు

  • రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఐపీఎల్‌-2026లో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన‌ క్వాలిఫ‌య‌ర్-1లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 92 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన ఆర్సీబీ.. వ‌రుసగా రెండోసారి త‌మ ఫైన‌ల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెంగ‌ళూరు ఫైన‌ల్‌కు చేర‌డంలో ఆ జ‌ట్టు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్‌ది కీల‌క పాత్ర‌.

    గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫ‌య‌ర్‌-1లో పాటిదార్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనూ సీజ‌న్ మొత్తం పాటిదార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

    వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు కెప్టెన్సీ ప‌రంగా కూడా అత‌డు వంద‌కు వంద మార్క్‌లు కొట్టేశాడు. ఈ నేప‌థ్యంలో పాటిదార్ బ్యాటింగ్‌, కెప్టెన్సీ స్కిల్స్‌పై భార‌త మాజీ స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. 17 ఓవ‌ర్‌లో ఓవర్‌లో కగిసో రబాడా బౌలింగ్‌లో పాటిదార్‌ ఆడిన షాట్‌ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ మ్యాచ్‌లో పాటిదార్ 281.82 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

    "కగిసో ర‌బాడ వేసిన ఓ ఫాస్ట్ డెలివరీని రజత్ బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి కొట్టిన సిక్స్.. “షాట్ ఆఫ్ ది డే” అని చెప్పవచ్చు. బహుశా టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ షాట్‌గా ఇది నిలుస్తుంది. ఆ పొజిషన్ నుండి అతను అంత పవర్‌ను ఎలా జనరేట్ చేయగలిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.

    ఈ ఇన్నింగ్స్‌కు ముందు వరకు కెప్టెన్సీ, బ్యాటింగ్ పరంగా పాటిదార్ కంటే శ్రేయస్ అయ్యర్ కాస్త బెటర్‌గా కన్పించాడు. ​కానీ ఈ మ్యాచ్‌తో పాటిదార్‌ శ్రేయస్‌ను వెనక్కి నెట్టి ఆ స్ధానానికి చేరుకున్నాడు. పాటిదార్ స్పిన్‌కు బాగా ఆడుతాడని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు అతడు ఫాస్ట్ బౌలర్లను ఆడిన తీరు అద్భుతం.

    రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను అతడు ఎదుర్కొన్న తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఫ్రంట్‌ఫుట్‌పైకి వచ్చి, బంతి పిచ్‌ను అంచనా వేసి రషీద్‌ను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టే బ్యాటర్లు చాలా అరుదుగా ఉంటారు" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.

    కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ప్ర‌స్తుత భార‌త టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను టీమిండియా కెప్టెన్ చేయాల‌ని పలువురు సూచించారు. ఇప్పుడు అనుహ్యంగా పాటిదార్ పేరు కూడా తెరపైకి వ‌చ్చింది.
    చదవండి: '100 వికెట్లు తీసినా నో ఛాన్స్.. ఇక రంజీ ట్రోఫీని మూసేయండి'
     

  • ఐపీఎల్‌-2026 ఎలిమినేటర్‌లో భాగంగా చండీగఢ్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో అమీతుమీ తెల్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించాలని ఎస్‌ఆర్‌హెచ్ పట్టుదలతో ఉంది. ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ రెండు కీల‌క మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

    మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ యోచిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. స్మ‌ర‌ణ్‌కు గ‌త కొన్ని మ్యాచ్‌ల‌లో అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికి స‌ద్వినియోగప‌రుచుకోలేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ప‌క్క‌న పెట్టి ఫినిష‌ర్ అనికేత్ వ‌ర్మ‌ను  తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని స‌న్‌రైజ‌ర్స్ భావిస్తుందంట‌. 

    అనికేత్ కూడా అంచ‌నాలకు త‌గ్గ‌ట్టు రాణించ‌లేక‌పోయాడు. 2025 సీజ‌న్‌లో దుమ్ములేపిన అనికేత్‌.. ప్ర‌స్తుత సీజ‌న్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. 8 ఇన్నింగ్స్‌ల‌లో కేవ‌లం 79 ప‌రుగులు చేశాడు. కానీ అత‌డిపై న‌మ్మ‌కం ఉంచిన ఎస్ఆర్‌హెచ్ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఎస్ఆర్‌హెచ్ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఆడిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను కూడా తిరిగి బెంచ్‌కే ప‌రిమితం చేయ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అత‌డి స్ధానంలో యువ పేస‌ర్‌ ప్ర‌పుల్ హింగేకు అవకాశ‌మివ్వ‌న్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

    ఎస్ఆర్‌హెచ్‌దే పై చేయి
    ఈ సీజన్ లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు, జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆర్‌ఆర్‌ను మ‌ట్టిక‌రిపించింది. ఇప్పుడు అదే జోరును ఎలిమినేట‌ర్‌లో కొన‌సాగించాల‌ని క‌మ్మిన్స్ సేన ఉవ్విళ్లూరుతోంది. 

    రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్,  నితీష్ కుమార్ రెడ్డి,  సలీల్ అరోరా, అనికేత్ వ‌ర్మ‌, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.
    ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
    చదవండి: IPL 2026: గుజ‌రాత్ కొంప‌ముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే?

  • వ‌చ్చే నెల‌లో అఫ్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేరు లేక‌పోవ‌డం తీవ్ర చర్చనీయాంశమైంది.

    రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌లో లీడింగ్ వికెట్ టేక‌ర్ నిలిచిన న‌బీని జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది మాజీలు త‌ప్పుప‌డుతున్నారు. క‌నీసం శ్రీలంక‌-ఎతో జ‌ర‌గనున్న‌ సిరీస్‌ల‌కు కూడా న‌బీని అజిత్ అగార్క‌ర్ అండ్ కో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఆకిబ్ న‌బీ బ‌దులుగా పంజాబ్ పేస‌ర్ గుర్నూర్ బ్రార్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

    తాజాగా ఇదే విష‌యంపై భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న అకిబ్ నబీని జట్టులోకి తీసుకోకపోవడం అత్యంత హాస్యాస్పదమని అత‌డు మండిపడ్డాడు.

    "అకిబ్ న‌బీని అఫ్గాన్‌తో టెస్టుల‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డం న‌న్ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇది కేవ‌లం న‌బీకి మాత్ర‌మే జ‌రిగిన అన్యాయం కాదు, రంజీ ట్రోఫీకి ఆస్తిత్వానికి జ‌రిగిన అవమానం. గ‌తంలో ఇలాంటి అన్యాయం జ‌రిగితే నాలు ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపేవారు. ఇప్పుడు ఆ వ్యతిరేకత కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది.

    మహమ్మద్ సిరాజ్, బుమ్రా వంటి సీనియర్ బౌలర్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు కూడా దేశవాళీ క్రికెట్‌లో అగ్రస్ధానంలో ఉన్న బౌలర్ ఎంపిక చేయకపోవడం అత్యంత హాస్యాస్పదం. అలాంటప్పుడు రంజీ ట్రోఫీని నిర్వహించడం ఎందుకు? ఆ టోర్నీ ఆపేయడం మంచిది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 

    కాగా నబీ రెడ్ బాల్‌తో ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి నబీ ఏకంగా 100 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. గత సీజన్‌లో నబీ 10 మ్యాచ్‌లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.
    చదవండి: IPL 2026: గుజ‌రాత్ కొంప‌ముంచిన రబాడ.. లేదంటే నేరుగా ఫైనల్‌కే?
     

  • సీనియర్‌ అథ్లెట్‌ దివ్యారెడ్డి బొల్లారెడ్డి తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకున్నారు. నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన హైదారాబాద్‌ సిటీ స్లామ్‌ 10కె సమ్మర్‌ రన్‌-2026లో 40-49 మహిళల విభాగంలో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఇతర వయో విభాగాల్లో సునిమా, వెంకట్‌, విపిన్‌ గెలుపొందారు.


     పతకాల పంట పండిస్తున్న దివ్యారెడ్డి
    ఇటీవల ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌-2025లో దివ్యారెడ్డి నాలుగు పతకాలు సాధించారు. నలభై ఐదేళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 1500 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచిన దివ్యారెడ్డి.. 4*400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు.

  • న్యూఢిల్లీ: భారత స్టార్‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్‌... ఆర్చరీ ప్రపంచకప్‌ను ఆసియా క్రీడల సన్నాహకంగా భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనుండగా... దాని కోసం ప్రకటించిన 12 మంది భారత జట్టులో ఈ ఇద్దరు తెలుగు ఆర్చర్లు చోటు దక్కించుకున్నారు. 

    అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా ఫలితాలు సాధిస్తున్న ఈ ఇద్దరూ... ఆసియా క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. ‘ఆసియా క్రీడలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలనుకుంటున్నా. దానికి ముందు జరగనున్న ప్రపంచకప్‌లో గురిని పరిశీలించుకుంటా. చాన్నాళ్లుగా నేను వాడుతున్న బాణాల ఉత్పత్తి ఆగిపోయింది. 

    ఇప్పుడు కొత్తవాటితో ప్రాక్టీస్‌ చేస్తున్నా. వాటినే ప్రపంచకప్‌లో వినియోగిస్తా. తద్వారా ఆసియా క్రీడలకు ముందు వాటిపై నాకొక అవగాహన వస్తుంది. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కొత్త పరికరాలను పరీక్షించుకునేందుకు వరల్డ్‌కప్‌ సరైన వేదిక’ అని మంగళవారం కేంద్ర క్రీడా శాఖ నిర్వహించిన ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో జ్యోతి సురేఖ వెల్లడించింది. 

    ఇప్పటి వరకు మూడుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్న జ్యోతి సురేఖ మూడు స్వర్ణాలు సహా ఐదు పతకాలు గెలిచింది. వచ్చే నెల 9 నుంచి 14 వరకు అంటాల్యా వేదికగా... జూలై 7 నుంచి 12 వరకు మాడ్రిడ్‌ వేదికగా రెండు ప్రపంచకప్‌ టోర్నీలు జరగనున్నాయి. 

    ప్రయోగాలు చేయాలనుంది.. 
    మరోవైపు ధీరజ్‌ కూడా తన విల్లు సెట్టింగ్‌లు సర్దుబాటు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘మెరుగైన ఫలితాల కోసం ప్రతి మూడు నెలలకోసారి విల్లు సెట్టింగ్‌లు మారుస్తుంటా. గత డిసెంబర్‌ నుంచి కొత్త విల్లును వినియోగిస్తున్నా. దాన్ని పరీక్షించేందుకు తగినంత సమయం దొరకలేదు. ప్రపంచకప్‌లలో ప్రయోగాలు చేయాలనుకుంటున్నా’ అని ధీరజ్‌ చెప్పుకొచ్చాడు.  

    మెక్సికోలో ప్రత్యేక శిబిరం..
    ఈ ఏడాది జరిగిన తొలి ఆర్చరీ ప్రపంచకప్‌నకు ముందు మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 5 వరకు మెక్సికోలో క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జ్యోతి, ధీరజ్‌తో పాటు అతాను దాస్‌ వంటి పలువురు భారత అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్నారు. దాని కోసం స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా (సాయ్‌) రూ. 57.42 లక్షలు వెచి్చంచింది. 

    ఈ క్యాంప్‌లో భారత ఆర్చర్లకు తొలిసారి అధునాతన సాంకేతిక పరికరాలను పరీక్షించే వీలు చిక్కింది. ‘సీజన్‌ తొలి వరల్డ్‌కప్‌నకు ముందు అక్కడ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్‌ ఆర్చర్లు ఉపయోగిస్తున్న బాణాలను పరిశీలించాం. వాటిని ఉపయోగించే అవకాశం మాకు తొలిసారి లభించింది. మా ప్రదర్శననను విశ్లేíÙంచుకోవడానికి అక్కడ ఒక బంకర్‌ కూడా అందుబాటులో 
    ఉంది. ప్రపంచకప్‌నకు ముందు ఇది మంచి  అనుభవం’ అని జ్యోతి చెప్పింది.  

    దీపిక, అతాను లేకుండానే..
    సీనియర్‌ ఆర్చర్ల జోడీ దీపిక కుమారి, అతాను దాస్‌ ఆసియా క్రీడలకు సెలక్షన్‌ ట్రయల్స్‌లో విఫలమయ్యారు. దీంతో వారిని ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేయలేదు. ‘ఆ ఇద్దరూ ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో లేరు. కానీ వారు చాలా కాలంగా జట్టులో భాగంగా ఉన్నారు. శిక్షణ సందర్భంగా వారి అనుభవం మాకు ఎంతో ఉపయోగపడింది. మాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించారు. 

    ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయనే వాటిని కూడా వివరించారు. ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వారిచ్చిన సలహాలను ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు రాబ్టటేందుకు ప్రయతి్నస్తాం’ అని ధీరజ్‌ అన్నాడు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) కోర్‌ గ్రూప్‌లో భాగంగా ఉన్న జ్యోతి, ధీరజ్‌లపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా రూ. 24.56 లక్షలు, రూ. 66.28 లక్షలు ఖర్చుపెట్టింది.    

    చదవండి: 'ప‌నికొచ్చే ప్ర‌శ్న‌లు వేయండి'.. గుజరాత్‌ బ్యాటర్‌ ఆగ్ర‌హం!

  • ఐపీఎల్‌-2026లో ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం అమీతుమీ తేల్చుకుంటాయి. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌ ఇందుకు వేదిక.

    లీగ్‌ దశలో హైదరాబాద్‌ తొమ్మిది విజయాలు.. సాధించగా రాజస్తాన్‌ ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ముఖాముఖి పోరులో ఈ సీజన్‌లో రెండుసార్లూ హైదరాబాద్‌ జట్టే రాజస్తాన్‌పై పైచేయి సాధించింది.

    తొలుత సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్‌.. జైపూర్‌లో ఆతిథ్య జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌ పోరులో రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ కీలకం కానున్నాడు.

    36 బంతుల్లోనే శతక్కొట్టి..
    ఉప్పల్‌ మ్యాచ్‌లో ప్రఫుల్‌ హింగే వైభవ్‌ను గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపగా.. జైపూర్‌లో వైభవ్‌ అతడి బౌలింగ్‌లో చితక్కొట్టాడు. అంతేకాదు.. 36 బంతుల్లోనే శతక్కొట్టి.. లీగ్‌లో తన రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు.

    ఈ నేపథ్యంలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చెప్పడం విశేషం. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఒక బౌలర్‌గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను.

    వైభవ్‌ కోసం  ప్లాన్‌ బి, సి కూడా
    ఓ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని భావిస్తే.. అతడి కోసం ప్లాన్‌ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్‌ కోసం కచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్‌లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు.

    అయితే, అంతకంటే ముందు మ్యాచ్‌లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్‌.. మరికొన్నిసార్లు బ్యాటర్‌ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

    ఇక గ్రూప్‌ దశలో రాయల్స్‌ను రెండుసార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని.. అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్‌ తెలిపాడు. 

    ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. ఇక ఎలిమినేటర్‌ విజేతతో క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఆర్సీబీతో టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది.

    చదవండి: మూడు కీలక యుద్ధాలు గెలిచిన ఆర్సీబీ!

International

  • టెహ్రాన్‌: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.  హర్ముజ్‌ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.

    ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి,  ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.

    అయితే  ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం  ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని  ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.

    అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ తన అధికారిక వైట్‌హౌస్‌ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొంది

    దిగొచ్చిన ధరలు

    హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు  ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి.

  • న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 

     కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్‌’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్‌వర్క్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. 

    ఇదీ చదవండి: బైజూస్‌ ఫౌండర్‌కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్‌ స్పందన ఇదీ!

    పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలకు తాజా ఒప్పందమే ఒక ఉదాహరణ అని వెల్లడించారు. మన ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు(ఇన్నోవేషన్‌ ఎకానమీ) ఖనిజాలు, సప్లై చైన్లు చాలా ముఖ్యమని తెలిపారు. 

    ఇదీ చదవండి: 11 రోజుల్లోనే ... హమాస్‌ కీలక నేత హతం

  • గాజాలో యుద్ధ ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందాలను ఇరుపక్షాలూ తుంగలో తొక్కడంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. కేవలం పదకొండు రోజుల క్రితమే హమాస్ సైనిక చీఫ్‌గా నియమితుడైన మొహమ్మద్ ఒదేహ్ తాజా ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. హమాస్ ఇంకా దీనిపై స్పందించలేదు.


    అక్టోబర్ 7 మారణకాండ సూత్రధారులలో ఒకడు,  హమాస్ సైనిక విభాగం నాయకుడు,మహమ్మద్ ఒడెహ్‌ను గాజాలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు,ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఒక సంయుక్త ప్రకటనలో బుధవారం తెలిపారు. అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించినందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF)  షిన్ బెట్‌కు కాట్జ్  అభినందనలు తెలిపారు. ఇస్లాం ముఖ్యమైన పండుగలలో ఒకటైన ఈద్ అల్-అధాకు ముందు మంగళవారం రాత్రి గాజా నగరంలో ఇజ్రాయెల్ రెండు వైమానిక దాడులు జరిపింది, ఈ దాడుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు.

    ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఇంతకుముందున్న కమాండర్‌ ఎజ్జెడిన్ అల్-హద్దాద్‌ని ఖతం చేసింది.  ఇతని స్థానంలో కొత్త  చీఫ్‌గా మొహమ్మద్ ఒదేహ్‌ ఎన్నికైరెండు వారాలు కూడా గడవకముందే ఐడీఎఫ్ (IDF) జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.  గాజా ఉగ్రవాద నెట్‌వర్క్ గుండెకాయపై దెబ్బకొట్టి, అగ్రస్థానంలో ఉన్న వ్యక్తిని ఇజ్రాయెల్ మరోసారి మట్టుబెట్టింది. 11 రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఏ సురక్షిత స్థావరమూ అతడిని రక్షించలేకపోయింది. సంస్థాగతంగా చేసిన మార్పులేవీ అతడిని కాపాడలేకపోయాయి. అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్న కాల్పుల విరమణ ఒత్తిడి ఇజ్రాయెల్‌ను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతోంది.

    ఇజ్రాయెల్ భద్రతా అధికారుల ప్రకారం... హోలోకాస్ట్ (యూదుల మారణహోమం) తర్వాత యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన అనాగరికం, అక్టోబర్ 7, 2023 నాటి ఊచకోత సమయంలో మొహమ్మద్ ఒదేహ్ హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశాడు. 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకుని, వారి ఇళ్లలోనే కుటుంబాలను ముక్కలు ముక్కలుగా నరికి, బందీలను గాజా భూగర్భ సొరంగాల్లోకి లాక్కెళ్లిన ఉగ్రవాద ఆపరేషన్ మాస్టర్‌మైండ్స్‌లో ఇతను కూడా ఒకడు. ఆ దాడిని ప్లాన్ చేసిన లేదా అమలు చేసిన ప్రతి సీనియర్ కమాండర్‌ను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ చేపట్టిన ప్రచారంలో భాగంగా, గత వారం అతడిని హమాస్ మొత్తం సైనిక విభాగానికి నాయకుడిగా నియమించింది. ఒక మంగళవారం నాడు నియమితుడైన అతను, తదుపరి నెల రాకముందే శవమయ్యాడు.

    మహ్మద్ ఒదెహ్ ఎవరు?
    మహమ్మద్ ఒదే 1974లో ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో జన్మించాడు.  హమాస్ ఉగ్రవాద సంస్థలో ఒక సీనియర్ నాయకుడు.  తన సన్నిహితుడు మాజీ కమాండర్  హద్దాద్ హత్య తర్వాత, 2026 మే నెలలో అతను అల్-ఖస్సాం బ్రిగేడ్స్ అధిపతిగా , గాజాలో హమాస్ నాయకుడిగా బాధ్యతలు చేపట్టాడు.

    రెండవ ఇంతిఫాదా సమయంలో 2000లో ఖస్సాం బ్రిగేడ్స్‌లో చేరాడు. యహ్యా సిన్వార్ మరియు మహమ్మద్ డీఫ్ సహా హమాస్ సీనియర్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలపై నిఘా సమాచారం సేకరించడంలో, బలహీనతలను గుర్తించడంలో ఒడెహ్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఉత్తర గాజాలోని యూనిట్లకు నాయకత్వం వహించి, ఉత్తర బ్రిగేడ్ కమాండర్‌గా (2017–2019) పనిచేశాడు. కీలక నాయకులు హతమయ్యాక గాజాలో హమాస్ నాయకుడిగా  ఎదిగాడు..
     

Politics

  • బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే తెలిపారు. దేశ్‌పాండే ప్రస్తుతం పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు.  దేశ్‌పాండే బుధవారం సిద్ధరామయ్య నివాసంలో ఆయనను కలిశారు. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని కోరగా, తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన వెల్లడించారు.

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు. రాజీనామా చేయొద్దని వారు కోరారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానంతో మాట్లాడతామని తెలిపారు.

    కొన్ని నివేదికల ప్రకారం.. ఈ అంశంపై శాసనసభ పక్ష సమావేశంలో చర్చ జరపాలని కొందరు సూచించారు. అయితే సిద్ధరామయ్య అలాంటి సూచనలకు సానుకూలంగా స్పందించలేదు. “నేను ముఖ్యమంత్రితో ఉన్నాను. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని సిద్ధరామయ్య చెప్పారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారో నేను అడగలేదు” అని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య గురువారం లేదా ఆ తర్వాతి రోజు రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు.

    “ఈ నిర్ణయం మాకు ఆశ్చర్యంగా అనిపించిందని మేము చెప్పాం. అయితే ‘లేదు, నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆయన కొనసాగాలని కోరారు. కానీ తాను అధిష్ఠానానికి మాట ఇచ్చానని, ఆ మాటను గౌరవిస్తానని ఆయన చెప్పారు. ఆయన కొనసాగితే మంచిదని నేను చెప్పాను. కానీ అధిష్ఠానానికి హామీ ఇవ్వడంతో రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు” అని ఆయన తెలిపారు.

    సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేస్తున్నారని తాను అడిగితే, ఢిల్లీలో చర్చలు జరిగాయని ఆయన చెప్పారని దేశ్‌పాండే వెల్లడించారు. “సీఎంగా కొనసాగాలని నేను చెప్పాను. కానీ నిర్ణయం ఆయనదే” అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే తెలిపారు.

    కొత్త మంత్రివర్గంలో డీకే శివకుమార్‌ నేతృత్వంలో మంత్రి పదవి దక్కుతుందా? అని అడిగితే.. శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎంపికైతే అది ఆయన, అధిష్ఠానం నిర్ణయిస్తారని దేశ్‌పాండే చెప్పారు. ముఖ్యమంత్రి నిరాశలో ఉన్నారా అని అడిగితే, “లేదు… ఎందుకు నిరాశ?” అని ఆయన స్పందించారు.

    బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు మహదేవప్ప, అహ్మద్‌ ఖాన్‌, నంజేగౌడ, బి నాగేంద్ర, ఉమేశ్ మేటి, ఎ ఎస్ పొన్నన్న, సలీమ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.

    సిద్ధరామయ్య మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య గవర్నర్‌ను కలిసేందుకు సమయం కోరినట్టు సమాచారం. గురువారం తన అధికార నివాసంలో మంత్రివర్గ సహచరులతో అల్పాహార సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను కోరిందన్న వార్తల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  

  • బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పుకునేలా చేసి డీకే శివకుమార్‌కు ఆ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రచారానికి బలాన్నిస్తున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడతానని సిద్ధరామయ్య అన్నారు. ఆయనను కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.

    సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ షాక్‌! 
    తాజాగా, న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం తర్వాత సిద్ధరామయ్య వర్గానికి షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసానికి వెళ్లి తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో చర్చించారు. ఆ సమయంలో శివకుమార్‌కు ఇచ్చిన హామీ గుర్తుచేసిన సోనియా గాంధీ దాన్ని అమలు చేసే సమయం వచ్చిందని సూచించినట్టు తెలుస్తోంది. శివకుమార్‌కు ఎప్పటి నుంచో మద్దతుగా నిలిచిన ప్రియాంక గాంధీ కూడా పార్టీకి ఆయన చూపిన విధేయత దృష్ట్యా ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వాదించినట్టు సమాచారం.

    లంచ్‌ బ్రేక్‌ తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, శివకుమార్ మరోసారి సమావేశమైన వేళ రాహుల్ గాంధీ లోపలికి వచ్చి నేరుగా సిద్ధరామయ్యను చూస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. ఆ వార్త విన్న వెంటనే సిద్ధరామయ్య ముఖంలో షాక్ స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని, మిగతావన్నీ ఊహాగానాలేనని మీడియాకు చెప్పారు. 

    1992లోనూ ఇలాంటి పరిణామాలు 
    తాజాగా, చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ 1992 ఘటనను గుర్తుచేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఎస్.బంగారప్ప ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి బంగారప్పపై ఫిర్యాదులు చేసేవారు.

    అప్పుడు ప్రధానమంత్రి పీవీ నరసింహరావు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఒక రోజు బంగారప్పను ఢిల్లీకి పిలిపించారు. ప్రధానమంత్రి నివాసానికి వెళ్లిన బంగారప్ప ఎదుట పీఎంవో సిద్ధం చేసిన భారీ ఫైల్ ఉంచిన నరసింహరావు, కొన్ని ఫిర్యాదులు చదివి ఆయన స్పందన అడిగారని ప్రచారం జరిగింది. బంగారప్ప మౌనంగా ఉండటంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నానని తెలిపారు. బెంగళూరులో రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించాలని చెప్పినట్టు అప్పట్లో ఢిల్లీలో పనిచేసిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    చేసేది ఏమీలేక బంగారప్ప రాజీనామా 
    బంగారప్ప బయటకు రాగానే మీడియా ఆయనను రాజీనామా చేస్తారా? అంటూ పలు ప్రశ్నలు అడిగింది. సమాధానం చెప్పకుండా బంగారప్ప చాణక్యపురిలోని కర్ణాటక భవన్‌కు వెళ్లి తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వెంటనే బెంగళూరుకు ఫోన్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వేలాది మంది మద్దతుదారులను విమానాశ్రయానికి రప్పించాలని ఆదేశించారు.

    వెనుకబడిన వర్గాల ప్రజలు అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తారని, ఎమ్మెల్యేల మద్దతుతో రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రధానమంత్రి నిర్ణయాన్ని మార్చగలనని బంగారప్ప భావించారు. అయితే మరుసటి రోజు ఆయన విమానం బెంగళూరు విమానాశ్రయానికి చేరేసరికి అక్కడ కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, కొన్ని వందల మంది మద్దతుదారులే కనిపించారు. ఆ తర్వాత బంగారప్ప ఆలస్యం చేయకుండా రాజ్ భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత వీరప్ప మొయిలీ ముఖ్యమంత్రిగా 1992 నవంబర్‌ 19న బాధ్యతలు స్వీకరించారు.

    సిద్ధరామయ్య కర్ణాటకలో వెనుకబడిన వర్గాల నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నాయకుడిగానూ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం చెబితే ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో..? 

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్‌ మండిపడ్డారు.

    వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..

    బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు
    2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?

    ఆనాడు వైఎస్‌ జగన్‌ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు.  బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.

    బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్‌
    రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్‌ జగన్‌ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.

    బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.

    బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజని
    బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్‌ జగనే.

    మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే  జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.

    బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావు
    రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్‌ జగన్‌ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.

    రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.

    బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుక
    బీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు  50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

    ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.

    బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్
    బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. బరాసత్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాజకీయ కన్సల్టెన్సీ ఐపాక్‌పై దస్తిదార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర నేతలతో కూడా దూరం పెరిగింది. దీనితో తాత్కాలికంగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉండాలని మమతా ఆదేశాలు జారీ చేశారు.

    అయినప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన పరిపాలనా సమీక్ష సమావేశానికి దస్తిదార్ హాజరయ్యారు. పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆమె పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఈ నేపథ్యంలో బుధవారం దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్‌లోని జిల్లా అధ్యక్షురాలు పదవి, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల పరాజయాల తరువాత పలువురు నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తోంది.

     

  • సాక్షి, తాడేపల్లి: ఇవాళ పార్టీ సమావేశంలో వైఎస్‌ జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని.. బాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ వల్ల నష్టాలు జరగకుండా చూడాలన్నారు.

    ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలి. చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలు అందరూ చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌కు వంగి దండాలు పెట్టడమే తెలుసు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారు.. జగన్‌తో చంద్రబాబు  చర్చకు రావాలి. ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు. సింగిల్ వచ్చే సింహం జగన్. గుంపులు గుంపులుగా వచ్చేది వాళ్లు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.

    సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో: పేర్ని నాని
    మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు. హామీల పేరుతో బాండ్లు ఇచ్చి మోసం చేసింది. రెండేళ్లలో ప్రజలను ఎలా మోసం చేశారో జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలు చేపడుతున్నాం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ షో. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. సర్ పై అప్రమత్తంగా ఉండాలి. ఒక్క వైఎస్సార్‌సీపీ ఓటు కూడా పోకుండా చూడాలి. గొడ్డలి పార్టీ అని చంద్రబాబు డైవర్షన్ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

  • సాక్షి, వైఎస్సార్‌: టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే మహానాడు ఈసారి భిన్నమైన చర్చకు దారి తీసింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల కంటే… సభకు జనాన్ని నిలబెట్టుకోవడమే స్థానిక నేతలకు పెద్ద సవాలుగా మారిన పరిస్థితి కనిపించింది. చివరకు కార్యకర్తలు, స్థానికులను ఆకట్టుకునేందుకు రికార్డింగ్‌ డాన్సుల వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

    మహానాడును విజయవంతం చేయాలనే ఉద్దేశంతో బద్వేల్‌ టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆర్పీల ద్వారా మహిళలకు ప్రత్యేక ఆడియో మెసేజ్‌లు పంపిస్తూ సభకు హాజరుకావాలని కోరినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనసమ్మర్థం కనిపించకపోవడంతో నిర్వాహకులు కొత్త మార్గాలను వెతికినట్లు చెబుతున్నారు.

    ఈ క్రమంలోనే కార్యక్రమ ప్రాంగణంలో రికార్డింగ్‌ డాన్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకవైపు రాజధానిలో పార్టీ అగ్రనేతలు మహానాడు వేదికపై ప్రసంగాలు చేస్తుండగా, మరోవైపు బద్వేల్‌లో భారీ స్క్రీన్ ముందు డాన్సులు కొనసాగడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు వచ్చిన వారు మధ్యలో వెళ్లిపోకుండా ఉంచేందుకే ఈ ఏర్పాట్లు చేశారన్న చర్చ సాగుతోంది.

    ఇది చూసిన కొందరు స్థానికులు, పార్టీ సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహానాడు వంటి రాజకీయ కార్యక్రమంలో ఈ తరహా వినోద కార్యక్రమాలు అవసరమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే… బద్వేల్‌లో మహానాడు రాజకీయ సభ కంటే వినోద కార్యక్రమాల కారణంగానే ఎక్కువ చర్చకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ‘‘అదిరిందయ్యా చంద్రం’’ అనే కామెంట్‌ బలంగా వినిపిస్తోంది.

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు.

    మాజీ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. మహానాడు అంటూ దగానాడు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ ఎలాగో చెప్పాలి. అందుకే బాబు మోసాల మానిఫెస్టోపై ప్రజల్లోకి వెళ్తున్నాం. జూన్ 4 నుంచి మా పార్టీ కార్యాచరణ మొదలవుతుంది. వైఎస్‌ జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ రెండేళ్లలో మీరు ప్రారంభించి పూర్తి చేసిన పనులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

    నారా లోకేష్ విద్యా శాఖ మంత్రి కాగానే విద్యా వ్యవస్థ కుంటుపడింది. ఇవాళ ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేశారు. వైఎస్‌ జగన్ చేసిన అభివృద్ధి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తుంటే పట్టించుకోరు.. మీరు మంత్రిగానే పనికి రారు.. మిమ్మల్ని పార్టీ అధ్యక్షుని ఎలా చేశారు?. ప్రశ్నిస్తా అన్న నాయకుడు ఏం చేస్తున్నారో తెలియదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు గతంలో ఎందుకు అమలు చేయలేదు?. మీకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలి కదా. ఇప్పుడే ఎందుకు అన్నీ గుర్తు వస్తున్నాయి’ అని ప్రశ్నించారు. 

    సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

Business

  • బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బెర్క్‌షైర్ హాత్వే నూతన సీఈఓ గ్రెగ్ అబెల్, అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బఫెట్ చూపిన వ్యూహాత్మక మార్గంలోనే నడుస్తానని ప్రకటించిన అబెల్.. తాజాగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ‘13F’ ఫైలింగ్‌లో సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. టెక్నాలజీ, బ్యాంకింగ్, కన్స్యూమర్ గూడ్స్‌లో ఆయన చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

    అమెజాన్‌కు గుడ్‌బై..

    సాధారణంగా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులకు వారెన్ బఫెట్ దూరంగా ఉంటారు. కానీ, మార్కెట్ లీడర్ల వ్యూహాలను గమనించి 2019లో ఆయన అమెజాన్ షేర్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి గత ఏడాది ముగింపు నాటికి ఈ స్టాక్ ఏకంగా 160% లాభాలను తెచ్చిపెట్టింది.

    అయితే, ప్రస్తుత సీఈఓ గ్రెగ్ అబెల్ అనూహ్యంగా అమెజాన్‌లోని కంపెనీ మొత్తం వాటాను (ఇది బెర్క్‌షైర్ పోర్ట్‌ఫోలియోలో 0.2% కంటే తక్కువ) విక్రయించారు. అదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న మరో దిగ్గజం గూగుల్ మాతృసంస్థ 'ఆల్ఫాబెట్'లో తన పెట్టుబడులను భారీగా పెంచారు.

    ఆల్ఫాబెట్ క్లాస్-A షేర్లు: ఈ వాటాను ఏకంగా మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వద్ద 5.42 కోట్లకు పైగా క్లాస్-A షేర్లు ఉన్నాయి. ఇది వారి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5.9 శాతానికి సమానం.
    ఆల్ఫాబెట్ క్లాస్-C షేర్లు: ఓటింగ్ హక్కులు లేని ఈ విభాగంలో కొత్తగా 35.8 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది పోర్ట్‌ఫోలియోలో 0.4% వాటాగా ఉంది.

    దిగ్గజ కంపెనీల నుండి పూర్తిగా నిష్క్రమణ

    మార్కెట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రెగ్ అబెల్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దాదాపు 12 ప్రధాన కంపెనీల నుండి బెర్క్‌షైర్ హాత్వే పూర్తిగా తప్పుకుంది. అందులో ముఖ్యమైనవి చార్టర్ కమ్యూనికేషన్స్, డియాజియో,  అలెజియన్.

    కీలక రంగాలలో వాటాల తగ్గింపు

    ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అబెల్ నేతృత్వంలో బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లోని కొన్ని కీలక షేర్లను తగ్గించుకున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చెవ్రాన్, న్యూకోర్, కాన్ స్టెలేషన్ బ్రాండ్స్ లలో వాటాలను కొంతమేర విక్రయించారు. ఆర్థిక, ఫుడ్ రంగాలకు చెందిన ఇతర ప్రధాన షేర్లను కూడా భారీ మొత్తంలో వదిలించుకున్నారు.

  • హైదరాబాద్: రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులను తయారుచేసేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ కీలక అడుగు వేసింది. దేశంలోనే ప్రముఖ శిక్షణ సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)తో నరెడ్కో తెలంగాణ బుధవారం ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

    హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి అర్బన్ హబ్‌గా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణ రంగంలో నిపుణులైన శ్రామిక శక్తిని (టాలెంట్ పూల్) అభివృద్ధి చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందంపై నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ రాబోయే దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో సరికొత్త వృద్ధిని సాధించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎస్‌సీఐ భాగస్వామ్యంతో సాంకేతికంగానే కాకుండా, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు తెలిసిన తరం నిర్మిస్తామన్నారు. ఈ చొరవ నగర నిర్మాణ రంగంలో స్థిరమైన నాణ్యతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

    సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో తమకున్న అనుభవంతో, రియల్ ఎస్టేట్ రంగానికి సరిపోయే ప్రత్యేక కోర్సులను డిజైన్ చేసి అందిస్తామని ఈఎస్‌సీఐ ప్రతినిధి డాక్టర్ జి. రామేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా నిర్మాణ రంగంలోని వివిధ స్థాయిల నిపుణుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికతలు, పర్యావరణ అనుకూల పద్ధతులు, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలపై ఈ శిక్షణ కేంద్రీకృతమవుతుంది.

  • బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఇండ్ల అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగుల మాట దేవుడెరుగు... నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే టెక్కీలు సైతం ఇక్కడి అద్దెలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలో ఓ 3బీహెచ్‌కే (3BHK) ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, నగరంలో నివాస వ్యయంపై మరోసారి తీవ్ర చర్చ నడుస్తోంది.

    రూ. 1.1 లక్షల అద్దె.. 4 లక్షల డిపాజిట్!
    నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ ‘ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ పార్క్’కు అత్యంత సమీపంలో, డోమ్లూర్ - ఇందిరానగర్ పరిసరాల్లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. సుమారు 1,800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ సెమీ-ఫర్నిష్డ్ కార్నర్ ఫ్లాట్ నెలవారీ అద్దె అక్షరాలా రూ. 1.1 లక్షలు. ఇది చాలదన్నట్టు దీనికి రూ. 4 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు, ప్రతి నెలా అదనంగా రూ. 6,000 మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెర్రస్, పూజా గది, మాడ్యులర్ కిచెన్, ఉచిత స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్టు వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఈ ఫ్లాట్‌లో ఉన్నాయట.

    వామ్మో అంటున్న నెటిజన్లు
    ఈ అద్దె వివరాల స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ కావడంతో ఐటీ ఉద్యోగులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "బెంగళూరులో ఒక 3 BHK ఫ్లాట్ అద్దె రూ. 1.1 లక్షలా? నిజానికి ఇది ఒక సగటు ఉద్యోగి నెలవారీ జీతం" అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు దగ్గరగా ఉండాలంటే జీతాన్నంతా అద్దెలకే తగలేయాలి, లేదా ట్రాఫిక్‌లో గంటల తరబడి నరకం చూడాలి.. ఐటీ నిపుణుల పరిస్థితి ‘ముందు నయ్యం.. వెనుక గొయ్యి’లా తయారైందని పలువురు వాపోతున్నారు.

    ఇటువంటి పిచ్చి అద్దెలను డిమాండ్ చేసినా చెల్లించేందుకు కొందరు సిద్ధపడటం వల్లే యజమానులు మరింతగా రెచ్చిపోతున్నారని, ఒకే ఫ్లాట్‌ను నలుగురైదుగురు కలిసి పంచుకోవడం వల్లే ఈ ధరలు అదుపు తప్పాయనే విమర్శలు వస్తున్నాయి.

    అయితే, ఈ స్థాయి అద్దె ధరలు మార్కెట్ పరంగా సమర్థనీయమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణ ముంబై లాంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పోల్చదగ్గ ఇందిరానగర్ వంటి లొకేషన్లలో ఈ మాత్రం రేట్లు ఉండటం సహజమేనని వాదిస్తున్నారు. ఇక్కడ నివసించే వారి వార్షిక ఆదాయాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల పైమాటేనని గుర్తు చేస్తున్నారు.

    మరోవైపు రియల్ ఎస్టేట్ సమీకరణాలను తెరపైకి తెస్తూ.. "ప్రస్తుతం ఈ ఫ్లాట్ మార్కెట్ విలువ రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చే అద్దె, కనీసం బ్యాంక్ వడ్డీ రేటులో సగం కూడా ఉండదు. అలాంటప్పుడు యజమానులు అద్దెలు పెంచడంలో తప్పు లేదు" అని ఇన్వెస్టర్ల కోణాన్ని కొందరు విశ్లేషించారు.

    మొత్తానికి బెంగళూరుతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గృహాల కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఐటీ కారిడార్లలో అద్దెలు సామాన్యుల నియంత్రణ తప్పుతున్నాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం.

    ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ టికెట్‌ బుకింగ్‌లో కొత్త పద్ధతి!

  • హైదరాబాద్: నగరంలోని ప్రముఖ వినోద కేంద్రం 'వండర్‌లా హైదరాబాద్' 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016లో ప్రారంభమైన ఈ అమ్యూస్‌మెంట్‌ పార్కు, గడిచిన దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో 68 లక్షల మందికి పైగా సందర్శకులను ఆకర్షించడమే కాకుండా.. ఏకంగా 13.6 కోట్ల రైడ్ అనుభవాలను అందించింది. 31 ఎకరాల నుంచి 50 ఎకరాలకు విస్తరించిన వండర్‌లా, రైడ్ల సంఖ్యను 42 నుండి 51కి పెంచింది.

    ఈ దశాబ్ది ఉత్సవాలు, వేసవి సీజన్‌ను పురస్కరించుకుని జూన్ 14 వరకు ఆన్‌లైన్ బుకింగ్స్‌పై వండర్‌లా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టిక్కెట్లపై 31% వరకు, టికెట్-ప్లస్-బఫే కాంబోలపై 33% వరకు ప్రత్యేక తగ్గింపులు ఇస్తోంది. వారపు రోజుల్లో రూ.1,219, వీకెండ్స్‌లో రూ.1,249 ప్రారంభ ధరలతో (పన్నులు అదనం) ఇవి లభిస్తాయి. అంతేకాదు, వండర్లా ప్రారంభమైన 2016 సంవత్సరంలో జన్మించిన పిల్లలకు వయోపరిమితి గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

    వండర్‌లా హైదరాబాద్ సంస్కృతిలోనూ భాగమైంది. బతుకమ్మ, సంక్రాంతి, రంజాన్ వంటి పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో ఇక్కడికి వచ్చిన వారు ఏకంగా 750 టన్నుల బిర్యానీని ఆస్వాదించడం విశేషం. ఏటా 2,600 పాఠశాలలు, 1,100 కార్పొరేట్ ఈవెంట్లకు ఇది ఆతిథ్యమిస్తోంది.

  • ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, మార్కెట్లోకి సరికొత్త 'హీరో సూపర్ స్ల్పెండర్ ఎక్స్ టెక్ 2.0' (Super Splendor XTEC 2.0) బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 86,500 గా నిర్ణయించారు. యువతను, రోజువారీ ప్రయాణికులను ఆకర్షించేలా రిఫ్రెష్డ్ డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, 3D ఎంబ్‌లమ్, స్పోర్టీ రిమ్ టేపులతో ఈ బైక్‌ను మరింత ప్రీమియం లుక్‌లో డిజైన్ చేశారు.

    ఇందులో అమర్చిన 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 10.7 బీహెచ్‌పీ పవర్, 10.6 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, i3S టెక్నాలజీల సహాయంతో ఇది లీటరుకు ఏకంగా 72 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

    సాంకేతికత విషయానికి వస్తే.. ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైడర్లు ప్రయాణంలోనే ఇన్‌కమింగ్ కాల్స్, SMS నోటిఫికేషన్లు, మిస్డ్ కాల్ అలర్ట్లు, ఫోన్ బ్యాటరీ స్టేటస్‌ను నేరుగా స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం 2A USB టైప్-సి పోర్ట్‌ను కూడా ఇందులో జతచేశారు.

    భద్రత, రైడింగ్ కంఫర్ట్‌కు ఈ సరికొత్త మోడల్‌లో పెద్దపీట వేశారు. సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లోనే మొదటిసారిగా ఇందులో 'హజార్డ్ లైట్లను' ప్రవేశపెట్టారు. మెరుగైన బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హ్యాండిల్‌బార్‌పైనే ఇంజన్ కిల్ స్విచ్‌ను అందించారు. లాంగ్ రైడింగ్‌లోనూ సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా విశాలమైన సీటు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్‌ను అమర్చారు. ప్రస్తుతం ఈ బైక్ గ్లోసీ బ్లాక్, మ్యాట్ నెక్సస్ బ్లూ సహా ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంది.

  • అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో తదుపరి దశకి సారథ్యం వహించేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కోర్‌ఏఐ) జయ్‌ పారిఖ్‌ తెలిపారు. దేశీయంగా డెవలపర్ల లభ్యత భారీ స్థాయిలో ఉండటం, కంపెనీలు ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం మొదలైనవి సానుకూలాంశాలని వివరించారు. భారత్‌లో రూపొందిన హైపర్‌స్విచ్, ఈఆర్‌పీనెక్ట్స్, టూల్‌జెట్, బ్రూనో లాంటి ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఓ బ్లాగ్‌పోస్ట్‌లో పారిఖ్‌ పేర్కొన్నారు.

    ‘ఏఐ తదుపరి దశ అనేది అత్యుత్తమ మోడల్స్‌ని ఎవరు రూపొందిస్తున్నారనే అంశంపై కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా పని చేసేలా, విశ్వసనీయతతో, వేగవంతంగా ఎవరు వినియోగంలోకి తేగలగుతారనే విషయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తనకి సారథ్యం వహించడానికి భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది‘ అని తెలిపారు. డెలాయిట్‌ నిర్వహించిన 2026 సర్వే ప్రకారం విస్తృత స్థాయిలో ఏఐ వినియోగిస్తున్న 15 దేశాల జాబితాలో భారత్‌కి అగ్రస్థానం దక్కడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 40 శాతం ఎంటర్‌ప్రైజ్‌లు ఏఐని గణనీయంగానో లేదా పూర్తి స్థాయిలోనో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఇది సగటున 28 శాతంగా ఉంది.  

    పటిష్టంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు.. 
    దేశీయంగా డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం భారత్‌కి మరో సానుకూలాంశమని పారిఖ్‌ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పటిష్టంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ, చెల్లింపుల వ్యవస్థ, డేటా ప్లాట్‌ఫాంలను భారత్‌ విస్తృత స్థాయిలో తీర్చిదిద్దింది. డిజిటల్‌ చెల్లింపుల విధానమైన యూపీఐ ప్రస్తుతం నెలకు 2,000 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా జరిగే రియల్‌ టైమ్‌ చెల్లింపుల్లో దాదాపు సగం. డీపీఐతో ఏఐ అనుసంధానమవుతున్న నేపథ్యంలో ఆర్థిక సేవల నుంచి వైద్యం, విద్య వరకు అన్నింటా కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది. తద్వారా ప్రపంచంలోనే తొలి భారీ ఏఐ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా వ్యవస్థగా భారత్‌ ఎదగనుంది‘ అని పారిఖ్‌ తెలిపారు. 

  • న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ ఈసీవో, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని తాజాగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తెరతీశారు. వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) సంస్థ ఫండమెంటమ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ద్వారా ప్రత్యేకించిన ఫ్రంటియర్‌ టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఇందుకు ప్రాథమికంగా రూ. 3,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నారు.

    దేశీయంగా ఏఐ, డీప్‌టెక్‌ కంపెనీల దన్నుతో ఫండమెంటమ్‌ ఫ్రంటియర్‌ అడ్వయిజర్స్‌(ఎఫ్‌2ఏ)ను ఏర్పాటు చేశారు. సెబీ అనుమతించిన తొలి ఫండ్‌.. ఫండమెంటమ్‌ 3– ఏఐ, డీప్‌టెక్‌ రూ. 2,000 కోట్లు సమకూర్చనున్నాయి. వీటికి అదనంగా ఎఫ్‌2ఏ మరో రూ. 1,000 కోట్ల సహపెట్టుబడులను సమీకరించనుంది. ఎఫ్‌2ఏ టెక్నాలజీ ఆధారిత బిజినెస్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా కన్జూమర్, ఎంటర్‌ప్రైజ్, ఫిజికల్‌ ఏఐను లక్ష్యంగా చేసుకోనుంది. 

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలహీన పనితీరుతో బెంచ్‌ మార్క్‌ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ తగ్గాయి. నిఫ్టీ 6.55 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టపోయి 23,907.15 వద్ద, సెన్సెక్స్ 141.90 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టపోయి 75,867.80 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.15 శాతం లాభపడ్డాయి.
     
    రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.

  • పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, కార్యాచరణ వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్' తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు జూన్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ స్పష్టం చేసింది.

    వాహనాల మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు గరిష్టంగా రూ.12,800 వరకు ఉంటుందని సంస్థ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవలె మరో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సైతం తమ కార్లపై రూ.30,000 వరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

    ధరల పెంపు నిర్ణయానికి తోడు, కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నాయి. ఆటోమోటివ్ రంగంలో తీవ్రమైన పోటీ, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో హ్యుందాయ్ ఇండియా నాలుగో త్రైమాసికంలో (Q4FY26) నికర లాభంలో 22.2% తగ్గుదలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఎబిటా మార్జిన్లు సైతం 14.1% నుండి 10.4% కి పడిపోయాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాతి కాలంలో విక్రేతలకు ఉన్న విపరీతమైన డిమాండ్ ఇప్పుడు కాస్త చల్లబడటం, మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి భారీగా డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడం కంపెనీ నిర్వహణ లాభాలపై ప్రభావం చూపింది.

    అయితే, లాభాల పరంగా ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కంపెనీ ఆదాయం మాత్రం ఆశాజనకంగానే ఉంది. మార్కెట్లో ఎస్‌యూవీలు (SUVs), హై-వాల్యూ మోడళ్లకు కస్టమర్ల నుండి లభించిన బలమైన ఆదరణ కారణంగా హ్యుందాయ్ ఆదాయం 5.4% వృద్ధిని సాధించింది. కానీ, ఈ వృద్ధి పెరిగిన వ్యయాల వల్ల పూర్తిస్థాయి లాభాలుగా మారలేకపోయింది. కాగా, బాటమ్ లైన్ దెబ్బతిన్నప్పటికీ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తూ, ఆర్థిక సంవత్సరం 2026 (FY26) కి గాను ప్రతి షేరుకు రూ.21 తుది డివిడెండ్‌ను హ్యుందాయ్ కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.

  • భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలికింది. సామాన్యుడికి సైతం ప్రీమియం వినోదాన్ని చేరువ చేస్తూ.. కేవలం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క 28 రోజుల ప్యాక్‌తో 15 టాప్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 30 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ సేవలను అందిస్తూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది.

    నేటి (మే 27, 2026) నుంచే ఈ సరికొత్త పాస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా దీనిని పొందవచ్చని కంపెనీ తెలిపింది.

    రూ.1,500 విలువైన ప్రయోజనాలు..

    ప్రస్తుత డిజిటల్ కాలంలో విడివిడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాలంటే నెలకు వందల రూపాయల భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలిగించేలా జియో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పాస్‌ను డిజైన్ చేసింది. కేవలం రూ.200లకే లభించే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు నెలకు సుమారు రూ.1,500 విలువైన ప్రయోజనాలను ఉచితంగా పొందడం విశేషం. వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ కనెక్టివిటీల కలయికగా ఈ ప్లాన్ నిలుస్తోందని కంపెనీ చెప్పింది.

    15 ప్రీమియం ఓటీటీలు..

    యూట్యూబ్‌ ప్రీమియం: టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేని (యాడ్స్‌ ఫ్రీ) స్ట్రీమింగ్‌, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ సౌకర్యం.

    జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ ప్లస్‌ హాలీవుడ్‌: లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఒరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్ వీక్షించే అవకాశం.

    అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(మొబైల్‌ ఎడిషన్‌): మొబైల్ పరికరాల్లో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్.

    జీయో టీవీ ద్వారా మరో 12 ప్రముఖ ఓటీటీలు..

    SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay, Tarang Plus.

    150+ పెయిడ్ ఛానెల్స్ ఉచితం!

    వినోదంతో పాటు సమాచారాన్ని అందించేందుకు జియో టీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను ఈ ప్యాక్‌లో చేర్చారు. ఇందులో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు చెందిన 150కు పైగా ప్రీమియం పెయిడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వాటిలో కొన్ని ప్రముఖ ఛానెళ్లు.. స్టార్‌ప్లస్‌ హెచ్‌డీ, కలర్స్‌ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెట్‌ హెచ్‌డీ, సోనీ సాబ్‌ హెచ్‌డీ, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, కేటీవీ హెచ్‌డీ, వార్నర్‌ బ్రోస్‌, డిస్కవరీ.. వంటివి ఉన్నాయి.

    అపరిమిత 5జీ యాక్సెస్

    వినోదానికి నెట్‌వర్క్ అంతరాయం కలగకుండా ఈ పాస్ ద్వారా 30 జీబీ హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అంతేకాదు, వినియోగదారుడి యాక్టివ్ బేస్ ప్లాన్ చెల్లుబాటు కాలం వరకు అపరిమిత 5జీ కనెక్టివిటీని జియో ఆఫర్ చేస్తోంది. ఈ పాస్ గరిష్టంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

  • కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్‌కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

    ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్‌సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.

    ఎవరు అర్హులు?

    ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్‌సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.

    ఈ ఏడాది మార్చిలో శామ్‌సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.

    కేవలం బోనస్‌ల కోసమే 26.5 బిలియన్‌ డాలర్లు

    శామ్‌సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్‌ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.

    ఓటింగ్‌లో భారీ మెజారిటీ

    యూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్‌లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.

    తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం

    ఈ ఒప్పందం కేవలం శామ్‌సంగ్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్‌సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

  • భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఏప్రిల్‌లోనూ ముందు నిలిచింది. 34.82 లక్షల కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇందులో 31.39 లక్షలు వైర్‌లెస్‌ (మొబైల్‌) విభాగం నుంచి ఉన్నారు. ఇదే నెలలో జియో 30.84 లక్షల కొత్త కస్టమర్లను ఆకర్షించి రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 29.42 లక్షల మంది మొబైల్‌ చందాదారులు ఉన్నారు. ఏప్రిల్‌లో టెలికం చందాదారులు నికరంగా 69.5 లక్షలు పెరిగి 133.75 కోట్లకు చేరినట్టు ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

    వొడాఫోన్‌ ఐడియా 53,257 మంది కొత్త కస్టమర్లను తన నెట్‌వర్క్‌ పరిధిలో చేర్చుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ కిందకు కొత్తగా 76,175 మంది వచ్చి చేరారు. వైర్‌లైన్‌ కస్టమర్ల సంఖ్య మార్చి చివరికి 4.82 కోట్లుగా ఉంటే,  ఏప్రిల్‌ చివరికి 4.85 కోట్లకు పెరిగింది. ఇక మొత్తం మీద 52.69 కోట్ల చందాదారులతో పరిశ్రమలో రిలయన్స్‌ జియో నంబర్‌–1 స్థానంలో ఉంది. 37.3 కోట్ల మంది చందాదారులతో ఎయిర్‌టెల్, 12.8 కోట్ల మంది చందాదారులతో వొడాఫోన్‌ ఐడియా, 2.7 కోట్ల మంది చందాదారులతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ కనెక్షన్‌ను ఒక సబ్‌స్క్రయిబర్‌గా పరిగణిస్తుంటారు.  

    ‘ప్రయారిటీ’ వల్ల ప్రీపెయిడ్‌ సేవల నాణ్యత తగ్గదు: ఎయిర్‌టెల్‌  

    పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ప్రయారిటీ’ సర్వీస్‌ వల్ల ప్రీపెయిడ్‌ యూజర్లకు అందించే సేవల నాణ్యత తగ్గదని టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తెలిపింది. నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలకు ఇది విరుద్ధం కాదని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో కంపెనీ ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెరుగైన సేవలను అందించడానికి 5జీ ఫీచర్లను ఉపయోగించకపోనివ్వడం వల్ల రాబోయే 6జీ సేవలకు విఘాతం కలుగుతుందని సంస్థ పేర్కొంది. అధికంగా చెల్లించే పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు నెట్‌వర్క్‌లోని కొంత భాగాన్ని ప్రత్యేకంగా కేటాయించేలా మే 19న ఎయిర్‌టెల్‌ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

    ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు.   

    నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదం
    నెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.  వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు  తెప్ప బోటులో  నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

  • సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘త్యాగాల పండుగ బక్రీద్‌. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్‌ పండగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనం. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

     

  • నాయుడుపేట టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్‌ఎం మధుసూదన్‌ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌.మధుసూదన్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్‌ఎం ముందుగా హామీ ఇచ్చారు.

    దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్‌ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్‌ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్‌ ఉపాధ్యాయులు హెచ్‌ఎంకు అభినందనలు తెలిపారు.

    చ‌ద‌వండి: ట్రాఫిక్‌ చలానా ఉంటే పిల్లనివ్వను

  • పెళ్లికాని అబ్బాయిల‌కు అల‌ర్ట్‌. మీ బండిపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా? అయితే మీకు పెళ్లి కాక‌పోవ‌చ్చు. వెడ్డింగ్‌కు, ట్రాఫిక్ చలానా సంబంధంమేంట‌ని బుర్ర గోక్కుంటున్నారా? పెళ్లి సంబంధాల్లో స‌హ‌జంగా అమ్మాయి త‌ల్లిదండ్రులు చూసేది అబ్బాయి గుణ‌గ‌ణాలు, ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు. కానీ ఇప్పుడు అబ్బాయి బండికి సంబంధించిన ట్రాఫిక్ చ‌లానాలు కూడా చూస్తున్నారు. న‌మ్మ‌కం క‌ల‌గట్లేదా? అయితే ఇది చ‌ద‌వండి.

    ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయనది కాకినాడలోని రాయుడుపాలెం.. ఈయనకు ఒక్కగానొక్క కూతురు. భార్య చనిపోవడంతో కూతురిని కంటికి రెప్పలా పెంచి పెద్దచేశాడు. ఎంబీఏ వరకు చదివించాడు. ఇప్పుడు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అయితే అబ్బాయి గుణగణాలతోపాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత, భవిష్యత్తు దృష్ట్యా అతడి ట్రాఫిక్‌ క్రమశిక్షణపైనా ఆరా తీయాలని సంకల్పించాడు.

    కాకినాడ ట్రాఫిక్‌–2 సీఐ దానేటి రామారావు వద్దకు వచ్చి తనకు కాబోయే అల్లుడి కారు, ద్విచక్రవాహనాల నంబర్లు చీటిపై రాసిచ్చి వాటిపై ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులేమైనా ఉన్నాయేమోనని చెప్పాలని కోరాడు. చలానాలు ఉంటే పిల్లనివ్వనని స్పష్టం చేశాడు. కూతురి భవిష్యత్తుపై పెద్దాయన చూపిస్తున్న తాపత్రయానికి ముగ్దుడైన సీఐ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.              
    – కాకినాడ క్రైం

    చ‌ద‌వండి: కొత్త అల్లుడికి ప‌సందైన విందు   

  • సాక్షి, అమరావతి: మంగళగిరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. నేలపై కూర్చుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎమ్మెల్సీల ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పని అధికారులు.. అంతా సక్రమంగా ఉన్నట్టు బుకాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి ర్యాంకు వచ్చింది నిజామా? కాదా?. మెరిట్‌ లిస్ట్‌లు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటూ నిలదీసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.


     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. బ్యారేజీ ఎత్తు, నిర్మాణంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.’’ అని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

    ‘‘మొదటి ప్రతిపాదనలో 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మాణం. 2016లో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 148 మీటర్ల ఎత్తు ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల సాగు, తాగునీటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ (FRL) పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం చాలా తక్కువ. ఎత్తు పెంచితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుంది’’ అని లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌: గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కలకలం చెలరేగింది. నాంపల్లి కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ ఖాన్‌ను కార్వాన్‌ ఇన్‌చార్జ్‌ ఉస్మాన్‌ ఆల్‌ హాజ్రీ ఉస్మాన్‌ తోసేశారు. ప్రొటోకాల్‌ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ గల్లాలు పట్టుకున్నారు.

    మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్‌ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతుంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలని పొన్నం ప్రభాకర్‌ చెప్పినా ఫిరోజ్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలుకావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. 

    క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్  
    గొడవపై కార్వాన్ ఇన్‌చార్జి ఉస్మాన్ స్పందిస్తూ... ‘‘ఫిరోజ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాను. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవకు జరుగుతూ ఉంటాయి. నేను తోసేసింది చూశారు. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి’’ అని అన్నారు.

    అందుకే గొడవ: ఫిరోజ్ ఖాన్ 
    గొడవపై ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజీపైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టాడు’’ అని చెప్పారు. 


     

  • సాక్షి, హైద‌రాబాద్‌: అంతర్జాతీయ ప్రమాణాలు, విమానాశ్రయం తరహా సదుపాయాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముస్తాబవుతోంది. చారిత్రక సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పదో నంబర్‌ ప్లాట్‌ఫాం వైపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి.  ప్రయాణికులకు కేవలం రైల్వే సదుపాయాన్ని అందజేయడంతో పాటు విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే రెస్టారెంట్‌లు, కాఫీషాపులు ఏర్పాటు కానున్నాయి.

    కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్స్, బర్గర్‌కింగ్‌ వంటి షాపులు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణాది ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మద్రాస్‌ కాఫీ హౌస్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి షాపింగ్‌మాల్స్‌ కొలువుదీరనున్నాయి. ప్రయాణికుల బస కోసం అన్ని సదుపాయాలతో కూడిన విశ్రాంతి గదులు అందుబాటులోకి రానున్నాయి. 

    వందకు పైగా ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు.. 
    కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందజేస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా 100కుపైగా ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులతో పాటు సాధారణ వాహనదారులు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మరోవైపు సౌరవిద్యుత్‌ వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నారు. 500 కిలోవాట్‌ల సామర్ధ్యం కలిగిన సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. స్టేషన్‌ ఉత్తరం వైపు మల్టీలెవల్‌ పార్కింగ్, దక్షిణం వైపు టన్నెల్‌  పార్కింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకేసారి 600 నుంచి 1000 వాహనాలను పార్కింగ్‌ చేసే సదుపాయం ఉంటుంది.

    రూ.714 కోట్లతో పునరాభివృద్ధి.. 
    ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను  ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించేందుకు 2022 సెప్టెంబర్‌లో రూ.714.73 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సగటున 180 రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1.5 లక్షల మంది పయనిస్తున్నారు. స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ పూర్తయితే  రైళ్ల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది.

    చ‌ద‌వండి: ఆటా మహాసభలకు సీఎం రేవంత్‌రెడ్డి

    జీ ప్లస్‌ 3 అంతస్తులతో స్టేషన్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌ మెట్రోస్టేషన్‌లు, రెతిఫైల్‌ బస్‌స్టేషన్‌తో సికింద్రాబాద్‌స్టేషన్‌ను అనుసంధానం చేసేలా స్కైవాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. 64 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిగా వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్‌లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొండాపూర్‌తో పాటు నాగోల్, ఉప్పల్, పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకధాటిగా సోదాలు చేపట్టింది. మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

    హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర వాహన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

    ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు విచారిసుత్న్నారు. అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. లైసెన్స్‌ల జారీ, రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

     

     

Crime

  • గాంధీనగర్‌: గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠాను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు గుట్టు రట్టుచేశారు. కచ్‌లో సుమారు రూ.1180 కోట్ల విలువైన 118 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు.

    రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్‌ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్, పలు లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కరాచీ (పాకిస్థాన్‌) మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి ఓ ఓడ చేరుకుంది. ముంద్రా తీరానికి సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ ఓడ నుంచి అనుమానాస్పదంగా ప్యాకెట్లు సముద్రంలోకి విసురుతున్నట్లు కోస్ట్‌ గార్డులు గుర్తించారు. వెంటనే గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు సమాచారం అందించగా.. ఏటీఎస్‌–కోస్ట్‌ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు.

    ఆపరేషన్‌ సమయంలో ఓడలో ఇద్దరు నైజీరియన్‌ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరిని క్లావిన్‌ చుక్వుమా (టాంజానియా పౌరుడు), బ్యారుహంగా జేమ్స్‌ (ఉగాండా పౌరుడు)గా గుర్తించారు. కంటైనర్ల ద్వారా తెచ్చిన కొకైన్‌ను భారత్‌లో ఎవరికి అందించాలనుకున్నారు. ఏ ప్రాంతానికి తరలించాలనుకున్నారు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డ్రగ్స్‌ను ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరికి అందజేయాల్సి ఉందని నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

    గత ఏడాది ఏప్రిల్‌ 13న పోర్‌బందర్‌లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 12 రాత్రి జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డ్‌ బృందం, పోర్‌బందర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది.

    గుజరాత్‌ ఏటీఎస్‌ సమాచారం మేరకు, కోస్ట్‌ గార్డ్‌ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) వద్దకు గాలింపు నౌకను పంపింది. కోస్ట్‌ గార్డ్‌ బృందం ఒక పడవను గుర్తించి, అందులోని వారి వ్యక్తిగత వివరాల గురించి ఆరా తీసింది. దీంతో భయపడిన స్మగ్లర్లు మత్తుమందు ప్యాకెట్లను సముద్రంలోకి విసిరేసి, అంతర్జాతీయ సరిహద్దు దాటి పారిపోయారు.

National

  • చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు(వేలుమణి వర్గం) పళనిస్వామితో సమావేశమయ్యారు. పళనిస్వామితో రాజీపడ్డ తిరుగుబాట ఎమ్మెల్యేల వర్గం.. అన్నాడీఎంకేలో చీలిక లేదంటూ ప్రకటించారు. పళనిస్వామికి వేలుమణి బృందం పూర్తి మద్దతు తెలిపింది. పళనిస్వామితో సమావేశం అనంతరం స్పీకర్‌ను కలిసిన రెబల్‌ ఎమ్మెల్యేలు(వేలుమణి బృందం) తామంతా పార్టీగా మళ్లీ ఒకటిగా ఉన్నామంటూ స్పష్టం చేశాయి.

    తాము ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటామంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. పళనిస్వామి పట్ల తమ విధేయతను చాటుకున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అన్నాడీఎంకేలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ వర్గం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించగా.. పళనిస్వామి తిరస్కరించారు. అయితే, తిరుగుబాటు వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి మాటను పక్కనబెట్టి.. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ వ్యవహారం ముదరడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పళనిస్వామి స్పీకర్‌కు లేఖ కూడా రాశారు.

    స్పీకర్ కార్యాలయంలో అనర్హత వేటు ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో ఆ వర్గానికి పెద్ద షాక్ తగిలింది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతున్నందున ఈ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఈపీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

    ఈ క్రమంలో ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నివాసంలో ఆయన్ను కలిసి సంధి ప్రకటించారు. ఈ సమావేశం అనంతరం పళనిస్వామి తమ నాయకుడని వారు స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే ఈ తిరుగుబాటు జరిగిందంటూ పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని.. తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు వెల్లడించారు. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు.

     

  • సాక్షి, న్యూఢిల్లీ : 8వ వేతన సంఘం (8th Pay Commission) జీతాల పెంపు విషయంలో కీలక ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. 8వ వేతన సంఘంతో సంప్రదింపులలో పాల్గొంటున్న ఒక కీలక ఉద్యోగుల సంఘం ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) ప్రతిపాదించిన కొత్త ఐదు-అంచెల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ చర్చకు కేంద్ర బిందువుగా ఉంది.

    దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘంపై చర్చలు మరింత ఆసక్తికరంగా మారాయి.  దీంతోపాటు కొంతమంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతానికి పైగా జీతాల పెంపును ప్రతిపాదించడం మరో విశేషం. కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములాసాధారణంగా గత పే కమిషన్లలో (ఉదాహరణకు 7వ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉండేది) అందరు ఉద్యోగులకు ఒకే ఒక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసేవారు. కానీ ఈసారి IRTSA ఒక వినూత్న  ప్రతిపాదన చేసింది. 

    దీని ప్రకారం
    Levels 1 నుండి 5 వరకు ఉన్నవారికి 2.92 ఫిట్‌మెంట్ కారకం లభిస్తుంది.
     6- 8 వరకు ఉన్నవారికి 3.50 లభిస్తుంది.
     9 నుండి 12 వరకు ఉన్నవారికి 3.80 లభిస్తుంది.
     13 నుండి 16 వరకు ఉన్నవారికి 4.09 లభిస్తుంది.
     17 నుండి 18 వరకు ఉన్నవారికి 4.38 లభిస్తుంది.

    ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, జీతాలపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకు,  17-18  లెవల్స్‌లో పరిధిలో రూ. 2.5 లక్షల బేసిక్ పే పొందుతున్న ఒక ఉద్యోగికి, ప్రతిపాదిత 4.38 కారకం ప్రకారం సవరించిన మూల వేతనం దాదాపు రూ. 10.95 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యస్థాయి ఉద్యోగులు (లెవెల్ 6-8): ప్రస్తుతం  రూ. 45 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగి జీతం, ప్రతిపాదిత 3.50 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ1.57 లక్షలకు పెరుగుతుంది.8వ వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలతో సహా 1.1 కోట్లకు పైగా లబ్ధిదారులను ప్రభావితం చేస్తాయని అంచనా.

    అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మధ్య  ఈ ప్రతిపాదనలు ఒకవైపు ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ ఖజానాపై పడే భారం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

    ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
    ఈ చర్చకు కేంద్రబిందువుగా ఉన్నది ఒక సాంకేతిక పదం, అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఒక వేతన సంఘం కింద జీతాలను సవరించడానికి ఉపయోగించే గుణకం. దీని సూత్రం చాలా సులభం (కొత్త మూల వేతనం = ప్రస్తుత మూల వేతనం X ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్).  ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.00 ఉంటే,  ఉద్యోగి ప్రస్తుత బేసిక్ జీతం మూడు రెట్లు పెరుగుతుంది.

    7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు, వివిధ రంగాలలోని ఉద్యోగ సంఘాలు అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలను డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కోరాయి. మరికొన్ని అంతకు మించి కూడా వెళ్ళాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కనీస మూల వేతనం రూ. 69,000గా ఉండాలని డిమాండ్ చేయగా, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ కూడా ఇదే డిమాండ్ చేసినట్లు సమాచారం.

    ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ

    8వ వేతన సంఘం: సంప్రదింపులు
    ఇదిలా ఉండగా, 8వ వేతన సంఘం స్వయంగా విస్తృత సంప్రదింపుల దశలోకి  ఎంట్రీ ఇచ్చింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు ఇతర ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించింది. ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల బృందాలు, ప్రభుత్వ సంస్థలతో దేశవ్యాప్తంగా జరిపే సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా, జూలై 6, 7 తేదీలలో భువనేశ్వర్‌లో పర్యటించనున్నట్లు ఇప్పుడు ప్రకటించింది. లక్నో, హైదరాబాద్, శ్రీనగర్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్‌లలో కూడా సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయించింది. 1946లో ప్రారంభమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రభుత్వం 2025 నవంబర్ 3న అధికారికంగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది.
    ఇదీ చదవండి: ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్‌, పెల్లుబుకిన ఆగ్రహం

  • న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విజయ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంగీకారం లేకుండా అనుమతి ఇవ్వొద్దని విజయ్ కోరారు. దీనిపై తమిళనాడు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్‌ కలవనున్నారు.

    తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాలపై విజయ్‌ చర్చిస్తారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఇతర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతోనూ విజయ్‌ సమావేశమవుతారు. 

  • ఢిల్లీ: సీబీఎస్‌ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో 9,10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణకు అంగీకరించిన సుప్రీం కోర్టు.. కేంద్రం, ఎన్‌సీఈఆర్టీ( NCERT)కి నోటీసులు ఇచ్చింది.

    ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్‌మల్య బాగ్చీ, విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

    అయితే, 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్‌ఈ ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్‌ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్‌ పరీక్ష కూడా నిర్వహించారు.

    ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్‌ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది.
     

  • పూణే పోర్షే (PunePorsche) కారు ప్రమాదం, ఇద్దరు ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలైన  కేసు గుర్తుందా? ఈ కేసులో నిందితులకు  ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో నిందితుడైన మైనర్ బాలుడి తండ్రి, వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఓ స్థానిక రెస్టారెంట్‌లో జరుపుకున్న సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై బాధిత కుటుంబాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


    డబ్బుల దండలు, డ్యాన్స్‌లతో సంబరాలు
    సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోలో అగర్వాల్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు కలిసి నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు. మార్చి 10న సుప్రీంకోర్టు విశాల్ అగర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 1977 నాటి ప్రసిద్ధ బాలీవుడ్ పాట “బంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలామ్ కరో” ప్లే అవుతుండగా కుటుంబం మొత్తం డ్యాన్స్ చేసింది.

    విశాల్ అగర్వాల్ మెడలో గులాబీ రంగు పూల దండతో పాటు కరెన్సీ నోట్లతో చేసిన పెద్ద దండ కూడా ఉంది. అతని భార్య కూడా నోట్ల దండ వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వేడుకల సమయంలో విశాల్ అగర్వాల్‌ను అతని కుమారుడు, మరో వ్యక్తి భుజాలపైకి ఎత్తుకోగా, చుట్టూ ఉన్న అతిథులు చప్పట్లు, కేరింతలు కట్టారు. 

    నెటిజన్ల ఆగ్రహం
    ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాణాలు తీసిన ఇంతటి తీవ్రమైన కేసులో, జైలు నుండి బెయిల్‌పై వస్తూనే ఇలా బాధ్యతారాహిత్యంగా సంబరాలు చేసుకోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    వీడియో వైరల్ కావడంపై మృతులలో ఒకరైన అశ్విని తండ్రి సురేష్ కోష్టా  ఆగ్రహం  వ్యక్తం చేశారు.  హైకోర్టు ఒకరికి శిక్ష విధిస్తే, సుప్రీంకోర్టు వారిని వదిలేస్తుంది. ఇది నేరాలను ప్రోత్సహిస్తుంది. ముస్లిం దేశాలలో ఉన్నటువంటి 'రక్తానికి రక్తం' అనే చట్టాలు భారతదేశంలోకి తీసుకువచ్చే వరకు పరిస్థితి బాగుపడదు అంటూ మండిపడ్డారు.  ఇద్దరిని చంపి, ఆ తర్వాత సంబరాలు చేసుకోవడం వారికి పారిపాటేమోఅన్నారు.  చట్టాల పట్ల భయలేదని పెదవి విరిచారు.  చట్టం కఠినంగా లేకపోతే ఎలా ప్రశ్నించారు.   నిందితుడి బెయిల్‌ను రద్దు చేసి, అతని తల్లిదండ్రులను జైలుకు పంపాలి. ఒకవేళ ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వస్తే, వారికి బెయిల్ మంజూరు చేయకూడదని వ్యాఖ్యానించారు.

    కేసు నేపథ్యం ఏమిటి?
    2024 మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో  లగ్జరీ కారు పోర్షే  నడుపుతున్న ఒక మైనర్ బాలుడు మితిమీరిన వేగంగా అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆధారాల ట్యాంపరింగ్ ఆరోపణలుతో ప్రమాదానికి తానే కారణమని ఈ అలాగే ఈ నేరం ఒప్పుకోవాలని తమ కుటుంబ డ్రైవర్‌పై విశాల్ అగర్వాల్ ఒత్తిడి తెచ్చినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసులో విశాల్ అగర్వాల్ దాదాపు 22 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడని సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్) పేర్కొంది. అతనికి బెయిల్ పొందే అర్హత ఉందని భావించిన కోర్టు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క సాక్షినీ సంప్రదించడానికి లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

     

    ఇదీ చదవండి: డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ
     

  • న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకం 2031 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. రూ.80 కోట్ల మంది ప్రజలకు రేషన్ సరఫరా అవుతుంది. ఈ పథకాన్ని అంబ్రెలా స్కీమ్‌గా కొనసాగించనున్నారు.  ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరఫరా జరుగుతుంది. 

    రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా, నిర్వహణ ఖర్చులు, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర సహాయ నిధుల విధానాన్ని కొనసాగించనున్నారు.

    ఈ పథకం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు పథకాలను ఏకీకృతం చేశారు. వాటిలో ఒకటి జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర సంస్థలకు ఆహార ధాన్యాల రవాణా, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ సహాయం. రెండోది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో సాంకేతిక ఆధునికీకరణ, సంస్కరణల పథకం.

    సార్థక్-పీడీఎస్ పథకం లక్ష్యాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్‌కు స్థిర ఆర్థిక సహాయం అందించడం ఒకటి. ప్రజలకు చివరి దశ వరకు సేవలు సమర్థంగా చేరేలా, లీకేజీలు తగ్గేలా, ఆహార భద్రత బలోపేతం అయ్యేలా సమగ్ర, ప్రజాకేంద్రీకృత, సమన్వయ పీడీఎస్ వ్యవస్థను నిర్మించడం రెండోది.

    సార్థక్-పీడీఎస్ పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతికతలతో పీడీఎస్ కార్యకలాపాలను ఆధునికీకరించనున్నారు.

    రియల్‌టైమ్ పర్యవేక్షణ, కృత్రిమ మేధస్సు ఆధారిత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు, విశ్లేషణ వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రక్రియలతో పీడీఎస్‌లో పారదర్శకత, భద్రత, స్థిరత్వం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

    దేశ ప్రజలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించి ఆహార, పోషక భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ సామాజిక, చట్టబద్ధ బాధ్యత అని కేంద్రం తెలిపింది. గత దశాబ్దంలో టీపీడీఎస్ పూర్తి కంప్యూటరీకరణ, ఐఎం-పీడీఎస్, స్మార్ట్ పీడీఎస్ వంటి డిజిటల్ కార్యక్రమాలను కేంద్రం అమలు చేసింది. 

    “మేరా రేషన్”, “అన్న మిత్ర”, “రైట్‌ఫుల్ టార్గెటింగ్ డ్యాష్‌బోర్డ్”, “అన్న సహాయత” వంటి ప్రజా సేవా యాప్‌లను కూడా ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్న స్మార్ట్ పీడీఎస్ పథకం ద్వారా రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ-పీఓఎస్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్‌ల ఆటోమేషన్, ఆన్‌లైన్ కేటాయింపులు, కంప్యూటరీకృత సరఫరా వ్యవస్థలు 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లోకి వచ్చాయి.

    కాగా, దేశంలో కొనసాగుతున్న తీవ్ర వడగాలులపై క్యాబినెట్లో చర్చించారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

  • కర్ణాటకలో అధికార మార్పిడి, ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే రాజకీయ పరిణామాలు మళ్లీ  ఊపందుకున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో డీకే శివకుమార్‌ సీఎం పదవిని స్వీకరించేది ఎపుడు అనేది ఉత్కంఠగా మారింది.

    ‘‘మంచి రోజులు వస్తాయి," అని తన పదోన్నతి గురించిన వార్తలపై గతవారం ఉప ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ చమత్కరించారు. ఇప్పుడు, కర్ణాటక అధికార మార్పిడి దాదాపు ఖరారు కావడంతో, ఆయన అనుకున్న సమయం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రశ్న... ఇది ఎప్పుడు జరుగుతుంది?

    2023 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడువు (రెండున్నరేళ్లు) ముగియడంతో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు సీఎం పీఠాన్ని అప్పగించేందుకు హైకమాండ్ పచ్చజెండా ఊపింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెండు రకాల అవకాశాలు కనిపిస్తున్నాయి.

    తక్షణమే? జూన్‌ 18?

    అందులో మొదటిది  సిద్ధరామయ్య గురువారం (మే 28) లేదా శుక్రవారం లోపు తన రాజీనామాను సమర్పించవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారాంతంలోనే (శని లేదా ఆదివారం) డి.కె. శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

    రెండోది అంశం విషయానికి వస్తే ఒకవేళ సిద్ధరామయ్య రాజీనామాను  కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తే, రాబోయే రాజ్యసభ ఎన్నికల (జూన్ 18) వరకు ఈ ప్రక్రియ ఆగవచ్చు. అంతర్గత విభేదాలు ఎన్నికలపై ప్రభావం చూపకూడదని హైకమాండ్ భావిస్తే, జూన్ 18 తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

    సిద్ధపరామయ్య పదవీ త్యాగానికి హైకమాండ్‌ ఇచ్చిన ఆఫర్‌ ఏంటి అనేది కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల నుండి సిద్ధరామయ్యను గౌరవప్రదంగా సాగనంపడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు భారీ ఆఫర్లనే ప్రకటించినట్టు సమాచారం. ఇందులో రాజ్యసభ సీటు, ఢిల్లీ రాజకీయాల్లో ప్రాధాన్యతఅనే అంశాలు కీలకంగా మారనున్నాయి.  

    జూన్ 18న జరిగే ఎన్నికల్లో సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు, ఏఐసీసీ (AICC) లో కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు, కొత్తగా ఏర్పడే  డీకే శివకుమార్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యత కల్పించడం.  అయితే సిద్ధరామయ్య వర్గం ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎం పదవులను డిమాండ్ చేస్తోంది. అయితే శివకుమార్ మాత్రం కేవలం ఒక్క డిప్యూటీ సీఎం పదవికి మాత్రమే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇన్ని అంచనాల నడుమ  డీకే క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొనగా, సంబరాలు వెల్లివిరుస్తుండగా, సిద్దరామయ్య మాత్రం ఇంకా తన వ్యూహాలను గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం.

    గురువారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
    బుధవారం బెంగళూరుకు చేరుకున్న తర్వాత, ఢిల్లీ సమావేశాలు, అధికార మార్పిడి వార్తలపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. విలేకరుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఏకైక సమాధానం, "నేను రేపు(గురువారం) మాట్లాడతాను." అని. గురువారం ఉదయం అల్పాహారం కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్యను కలవనున్నారు. ఇడ్లీ, సాంబార్, వడలతో పాటు ముఖ్యమంత్రి శివకుమార్‌కు మరో తీపి కబురు అందిస్తారా లేక  ఈ ఇడ్లీ, సాంబార్, వడల చర్చల తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా, లేక మరికొంత కాలం ట్విస్ట్ ఇస్తారా అనేది వేచి చూడాలి!

  • తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి విజయన్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారుల వాహనంపై విజయన్‌ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరువనంతపురంలో ఆందోళనకారులను అదుపు చేసే సమయంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. విజయన్‌పై ఈడీ దాడి బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలో భాగమని సీపీఎం ఆరోపణలు చేస్తోంది. 

    బుధవారం తెల్లవారుజాము నుంచి తిరువనంతపురం, కన్నూరులో విజయన్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో పినరయి విజయన్ ఇళ్లు సహా కేరళంలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.

    వందలాది పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, మాజీ మంత్రులు విజయన్ ఇంటి ఎదుట గుమిగూడారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. 

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు కాంగ్రెస్-బీజేపీ ఒప్పందంలో భాగమని అన్నారు. సీపీఎంను బలహీనపర్చే ప్రయత్నాలను ఆందోళనలు, న్యాయ పోరాటాలతో ఎదుర్కొంటామని చెప్పారు.

  • బికనెర్‌: సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆరు నెలల్లోగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మన భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ల జాడ కనిపెట్టి అందులోని వస్తువులు, సరుకులు ఎవరు అందుకుంటున్నదీ గుర్తించడం అత్యంత ముఖ్యమన్నారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు, పౌర యంత్రాంగం మెరుగైన సమన్వయంతో ఇలాంటి ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనవచ్చని మంత్రి వివరించారు. సరిహద్దు సమగ్ర భద్రతకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌), సాయుధ బలగాలు, స్థానిక యంత్రాంగం, పౌరుల మధ్య బహుళ అంచల ‘ఫోర్‌ పాయింట్‌ సెక్యూరిటీ గ్రిడ్‌’ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి సమన్వయం వల్లనే సంపూర్ణ సురక్షిత సరిహద్దు అనే సంకల్పం నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే బిహార్, గుజరాత్, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో చర్యలు ప్రారంభించామని వివరించారు. 

    డ్రోన్లు, ఇతర మార్గాల్లో దొంగచాటుగా జరిగే మాదకద్రవ్యాలు, ఆయుధాలను రవాణాను అడ్డుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం మన బాధ్యతని అన్నారు. మంగళవారం అమిత్‌ షా రాజస్తాన్‌లోని బికనెర్‌ జిల్లా సాంచులోని బోర్డర్‌ పోస్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్‌ఎఫ్‌ జవాన్లనుద్దేశించి మాట్లాడారు. సరిహద్దులకు 50 కిలోమీటర్ల పరిధిలో వెలిసే అక్రమ నిర్మాణాలు, అసాధారణమైన మార్పులు, అనుమానాస్పద కార్యకలాపాలపై బీఎస్‌ఎఫ్‌ యంత్రాంగం ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం ఔట్‌పోస్ట్‌ వద్ద మహిళా బ్యారెక్‌లను ప్రారంభించారు. 2030కల్లా అన్ని బోర్డర్‌ పోస్టుల్లోనూ మహిళా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. మహిళా సిబ్బంది విధుల్లో అంచనాలకు మించి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారంటూ కొనియాడారు. 1965 యుద్ధంలో మన జవాన్లు పాకిస్తాన్‌ బలగాల దాడులను ఎదుర్కొంటూ సాంచు ఔట్‌పోస్ట్‌ను కాపాడుకోవడంలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ వారి త్యాగాలను స్మరించుకున్నారు.       

  • న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర రైల్వే జోన్‌ పరిధిలోని జింద్‌–సోనిపట్‌ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించనుంది. డీజిల్, విద్యుత్‌ ద్వారా కాకుండా హైడ్రోజన్‌ బ్యాటరీల నుంచి అందే శక్తితో ఇది నడుస్తుంది.

    భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి మూడు నెలల పాటు నిపుణులైన సిబ్బంది రైలులోనే అందుబాటులో ఉంటారని రైల్వే శాఖ తెలిపింది. అయితే, రైల్వే శాఖ అనుమతితో ఈ రైలు వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. పలు నిబంధనల అమలు ప్రక్రియలు, ధ్రువీకరణ దశలను దాటాల్సి ఉందని వివరించారు.

    హైడ్రోజన్‌ రైలు న‌డిచేదిలా..
    సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్‌ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.

    చ‌ద‌వండి: కేంద్రం నిర్ణ‌యంపై అన్నామ‌లై అభ్యంత‌రం

    దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్‌ను గ‌తేడాది జూలైలో చెన్నైలోని ఐసీఎఫ్‌ వద్ద రైల్వే శాఖ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భారత్‌ 1,200 HP పేరుతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలు ప‌నితీరును కూడా ప‌రీక్షించేందుకు తాజాగా సిద్ధ‌మైంది రైల్వే శాఖ. హైడ్రోజన్ రైలు అందుబాటులో వ‌స్తే కాలుష్యం త‌గ్గ‌డంతో పాటు భార‌తీయ రైల్వే టెక్నాలజీ పరంగా మ‌రో మైలురాయిని అందుకుంటుంది. 

  • చదువుకోవాలంటే గంటల తరబడి క్లాసులు వినాల్సిన రోజులు మారిపోతున్నాయి. ఇప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాల చిన్న వీడియోలతోనే కొత్త నైపుణ్యాలు నేర్పిస్తున్న యాప్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ సంపాదన, చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉన్నవారిలో “సీకో” (Seekho) అనే యాప్‌ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.

    బెంగళూరుకు చెందిన కీరో ఎడుటెక్‌(Keyaro Edutech సంస్థ రూపొందించిన ఈ యాప్‌.. తక్కువ సమయంలో ఉపయోగపడే విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. యూట్యూబ్‌ ఛానల్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? సోషల్‌ మీడియాలో వీడియోలు ఎలా వైరల్‌ చేయాలి? చిన్న మొత్తాలతో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మార్గాలేమిటి? వంటి అంశాలను చిన్న చిన్న వీడియోల రూపంలో అందిస్తోంది.

    అంతేకాదు.. పాన్‌ కార్డు, ముద్ర రుణాలు వంటి ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసే విధానాలను కూడా ఇందులో వివరిస్తున్నారు. దీంతో చదువు మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో ఉపయోగపడే సమాచారం కూడా ఒకేచోట దొరుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు.

    “సబ్‌స్క్రైబర్లు తగ్గిపోకుండా ఎలా చూసుకోవాలి?”, “కృత్రిమ మేధతో చిత్రాలు, కోట్స్‌ తయారు చేసి ఎలా సంపాదించాలి?”, “పాత చెప్పుల అమ్మకాల ద్వారా ఆదాయం ఎలా పొందాలి?” వంటి కోర్సులు యువతలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోర్సులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని సంస్థ చెబుతోంది.

    ఈ యాప్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే… నేర్చుకునేవారే తర్వాత బోధించేవారిగా మారే అవకాశం ఉండటం. తమకు తెలిసిన విషయాలను వీడియోల రూపంలో ఇతరులతో పంచుకుని ఆదాయం పొందే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తోంది. అందుకే చాలామంది దీన్ని కేవలం చదువు చెప్పే యాప్‌గా కాకుండా, “సంపాదనకు దారి చూపే వేదిక”గా చూస్తున్నారు.

    ప్రస్తుతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇలాంటి డిజిటల్‌ వేదికల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలో ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలనుకునే కొత్త తరానికి “సీకో”లాంటి యాప్‌లు భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని చరిత్రాత్మక ఈద్గా, జమా మసీదులో ఈద్ ప్రార్థనలను నిర్వహించేందుకు స్థానిక అధికారులు ఈసారి కూడా అనుమతి నిరాకరించారు. వరుసగా ఎనిమిదో ఏడాది కూడా ఈ ఆంక్షలు కొనసాగాయి. మరోవైపు ఈద్ పండుగ రోజున తనను గృహ నిర్బంధం చేశారని మత పెద్ద మీర్వాజ్ ఉమర్ ఫరూక్ వెల్లడించారు. ప్రార్థనల కోసం బయటకు వెళ్లేందుకు కూడా అధికారులు అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, గత ఎనిమిది ఏళ్లుగా కశ్మీరీ ముస్లింలు తమ సంప్రదాయబద్ధమైన ప్రార్థనా స్థలాలను వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    బారికేడ్లు, తాళాలు.. ఆంక్షల నీడలో పండుగ
    పండుగ వేళల్లో ప్రార్థనల కంటే భద్రతాపరమైన ఆంక్షలే కనిపిస్తున్నాయని మీర్వాజ్ విమర్శించారు. మసీదుల ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం, తాళాలు వేయడం ద్వారా ప్రజలను అడ్డుకోవడం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఇది పరిపాలన కాదని, ప్రజల మతపరమైన హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా ఆయన అభివర్ణించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల కశ్మీర్‌లోని పిల్లలు, యువత పండుగలోని అసలైన ఆధ్యాత్మిక అనుభూతికి దూరమవుతున్నారని మీర్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్గా వంటి చారిత్రక ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనల సంప్రదాయం కనుమరుగవుతుండటం బాధాకరమని అన్నారు. 

  • న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు.

    హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.

    పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుండి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.

    ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు.‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

    ఇది కూడా చదవండి: మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు

YSR News

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బీటెక్‌ రవిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్‌ రవి పులివెందుల ప్రజలకు కన్నం వేశారు. బైరెటీస్‌ డంపులను అక్రమంగా అమ్ముకున్నారు. రాత్రికి రాత్రే ముగ్గురాయిని తవ్వుకుని దోచుకున్నారు. మూడు టన్నుల బైరెటీస్‌ దోచుకుంటే కనీసం కేసు పెట్టలేదు. బీటెక్‌ రవిని చట్టం ముందు నిలబెడతాం. ఉల్లిమెల్ల తోటకు ఎందుకొచ్చాడో బీటెక్‌ రవి చెప్పాలి. ఎంపీటీసీ పదవి కోసం ఒక ప్రతిపాదనతో బీటెక్‌ రవి వచ్చాడు. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరాలనుకున్నాడు’అని వ్యాఖ్యానించారు. 

Family

  • హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ – పిల్‌) కేసు వేయాలి అంటే ఎలాంటి సందర్భాలలో వేయొచ్చు?
    –  చంద్రహాస్, విజయవాడ

    సమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై, అక్రమాలపై, ప్రభుత్వానికి – ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి అంశాలపై ప్రతి ఒక్క పౌరుడూ హైకోర్టును అలాగే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగలిగే హక్కు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా కల్పించింది అత్యున్నత న్యాయస్థానం. 

    ఐతే ఏ విషయాన్ని పిల్‌ వేయాలి అనే అవగాహన ఉండాలి. లేకపోతే కోర్టు జరిమానా వేసే ఆస్కారం కూడా ఉంటుంది. సాధారణ కేసులలో అయితే మీకు, మీరు వేసిన వ్యాజ్యానికి సంబంధం ఏమిటో కోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పక్షంలో మీ కేసును కోర్టు పరిగణించవలసిన అవసరం లేదు. కానీ మీకు నేరుగా వ్యక్తిగత సంబంధం – లబ్ధి లేని అంశాలపై – సమాజానికి/ప్రజా ప్రయోజనం ఉన్నది అని చూపించగలిగిన అంశాలపై పిల్‌ దాఖలు చేయవచ్చు. మీకు నేరుగా ఎటువంటి లబ్ధి లేదు అని కూడా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించవలసి ఉంటుంది. 

    అంతేకాక కేసు దాఖలు చేసే ముందు మీరు పూర్తిగా అధ్యయనం చేశారు అని, ఎలాంటి పరిణామాల మధ్య మీరు ఆ కేసు వేయవలసిన అవసరం వచ్చిందో వివరించాలి. అలాగే కేసుకు అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నట్లు చెప్తూ మీ పాన్‌ కార్డు కూడా సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటి వెనుక గల ఉద్దేశం: వ్యక్తిగత కారణాలవల్ల కాకుండా నిజమైన ప్రజాప్రయోజనం కోసం మాత్రమే మీరు కోర్టును ఆశ్రయించారు అని కోర్టు పరిశీలిస్తుంది.

    పనిచేసే ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 రావడానికి కారణమైన ‘విశాఖ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌’, రోడ్డు ప్రమాదాలు / ప్రాణాపాయం వంటి అత్యవసర సమయాలలో ΄ోలీసు వారికోసం వేచి చూడకుండా హాస్పిటల్‌ వారు చికిత్స అందించాలి అని చెప్పిన ‘పరమానంద కట్టారా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ వంటి ఎన్నో కేసులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వచ్చినవే! ఇది మనకు రాజ్యాంగం – సుప్రీం కోర్టు కల్పించిన ఒక బలమైన హక్కు.
    శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది 

    (మీ కున్న సమస్యల కోసం sakshifamily3@gmail.com మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం కు మెయిల్‌ చేయవచ్చు.  )

  • ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్‌ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్‌ ప్లాన్‌ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్‌ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.

    రేమండ్‌ జెంగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్‌ రెండేళ్లపాటు డల్లాస్‌లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్‌లు, స్టాక్‌లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు. 

    అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్‌లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్‌గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్‌ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు. 

    అయితే జెంగ్‌ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్‌ స్పెడ్‌షీట్‌ని మెయింటైన్‌ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్‌ చేసుకుంటాడట. అంటే జాంగ్‌ అనుకున్న ప్రకారం.. ప్లాన్‌ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్‌ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్‌ స్ట్రాటజీ.

    (చదవండి: టెన్త్‌ డ్రాపౌట్‌..ఆయుధాలు, డ్రోన్‌ సాంకేతికత అందించే కంపెనీ..!)
     

  • మనం కొత్త విషయాలను తెలుకోవాలంటే ఎంతో ఆసక్తిని చూపుతాం కదూ..! అలాగే, ఈ మారుతున్న ప్రకృతికనుగుణంగా జీవులలో అయినా, వస్తువులోనైనా మార్పులు రావడం సహజం. అలాంటి వింతైన మార్పులు, సరికొత్త విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

    అంబులెన్స్‌..
    మీకు అంబులెన్స్‌ తెలుసు కదా ఫ్రెండ్స్‌! ఆపదలో ఉన్న వారిని వైద్యం కోసం ఆసుపత్రికి చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది ఇది. మరి ఈ అంబులెన్స్‌ సేవలు ఎప్పటినుంచి, ఎలా ్రపారంభమయ్యాయో తెలుసుకుందామా! లాటిన్‌ భాషలో ‘అంబులేర్‌’ అంటే ‘నడవడం’ లేదా ’కదలడం’ అని అర్థం.

    పూర్వకాలంలో యుద్ధంలో గాయపడిన సైనికులను నడిపించుకుంటూ లేదా మోసుకుంటూ చికిత్స కోసం తీసుకెళ్లేవారు. అలా కదిలే ఒక చిన్న ఆసుపత్రి లాంటి దాన్నే ‘అంబులెన్స్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత 1487 లో స్పెయిన్‌లో జరిగిన ఒక యుద్ధ సమయంలో మొదటిసారిగా అంబులెన్స్‌ అనే ఆలోచన వచ్చింది. అప్పట్లో ఇప్పటిలా కార్లు, వ్యాన్లు లేవు కదా! అందుకని గుర్రపు బండ్లనే అంబులెన్సులుగా మార్చేశారు.

    యుద్ధంలో గాయపడిన సైనికులను ఆ గుర్రపు బండ్లలో పడుకోబెట్టి వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లేవారు. అలా సమయం గడుస్తున్న కొద్దీ అంబులెన్స్‌ రూపం పూర్తిగా మారిపోయింది. 1832 లండన్‌ నగరంలో కలరా వ్యాధి వచ్చినప్పుడు మొదటిసారి అంబులెన్స్‌ వాడారు. అలా 1970 తర్వాత అంబులెన్స్‌ లోపల కేవలం రోగిని పడుకోబెట్టడమే కాకుండా, ఆక్సిజన్‌ సిలిండర్లు, డాక్టర్లు, మందులు ఉంచడం మొదలుపెట్టారు.

    గద్దలు.. వీటికి ముక్కే ముఖ్యం..!
    మనం భోజనం చేశాక చేతులు, మూతి శుభ్రంగా కడుక్కుంటాం కదా ఫ్రెండ్స్‌! గద్దలు కూడా అలానే చేస్తుంటాయి. వాటికి చేతులు లేవు కదా అంటారా.. అవి ముక్కు ద్వారా ఆహారం తీసుకుంటాయి కదా.. అందుకే నిత్యం ముక్కును శుభ్రంచేసుకుంటూ ఉంటాయి. 

    ఇందుకోసం అవి తమ ముక్కును చెట్ల కొమ్మలకు లేదా గరుకుగా ఉండే రాళ్లకు అటు ఇటు గట్టిగా రుద్దుతాయి. ఇలా చేయడం వల్ల అవి వేటాడినపుడు వాటి ముక్కుకు అంటివుండే మాంసం ముక్కలు, రక్తం తొలగిపోతాయి. లేదంటే అక్కడ బ్యాక్టీరియా చేరి వాటికీ జబ్బులు వస్తాయి.

    అంతేకాకుండా గద్దల ముక్కు మన గోళ్లలాగే ‘కెరాటిన్‌’ అనే పదార్థంతో తయారవుతుంది. ఇది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, గరుకు రాళ్లకు రుద్ది.. ముక్కు అంచులను ఎప్పుడూ కత్తిలా పదునుగా ఉంచుకుంటాయి. అప్పుడే అవి వేటాడిన జంతువుల చర్మాన్ని ఈజీగా చీల్చగలవు.

  • ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్‌ సాంకేతికత అందించే కంపెనీని రన్‌ చేసే స్థాయికి చేరుకున్నాడు.

    అతడే రాజస్థాన్‌కి చెందిన సత్యనారాయణ్‌ నువాల్‌. రాజస్థాన్‌లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్‌ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

    ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్‌ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. 

    వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..
    ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి  లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్‌లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు. 

    ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్‌పూర్‌లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది. 

    రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..
    నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందిన తొలి ప్రైవేట్‌ భారతీయ సంస్థగా ఇది నిలిచింది. 

    ఆ లైసెన్స్‌ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్‌ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా.  

    2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్‌ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్‌ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్‌ సింధూర్‌లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన​ కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.

    (చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్‌పర్ట్‌ రేంజ్‌కి..! పేదింటి అమ్మాయి విజయగాథ)