Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఖమేనీ కుటుంబ మూలాలు ఉన్న గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.  

    ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి చెందినవారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలో జన్మించారు. 1830లో ఇరాక్‌లోని నజాఫ్‌కు మతపరమైన ప్రయాణంలో వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో ‘హిందీ’ అనే పదాన్ని తన పేరులో ఖమేనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  

    భారత్‌తో ఖమేనీ అనుబంధం  
    1986లో ఖమేనీ భారత్ పర్యటనలో అలిపురాను సందర్శించారు. ఈ క్రమంలో ఖమేనీ గౌరవార్థం ఆయన పేరిట ఓ ఆస్పత్రిని నిర్మించారు. అలిపురాలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కొంతమంది గ్రామస్థులు విద్య, ఉపాధి కోసం ఇరాన్‌లో స్థిరపడ్డారు.  

    అలిపురాలో విషాద వాతావరణం  
    కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా అలిపురా గ్రామంలో ఖమేనీ మరణంతో సంతాప దినాలు ప్రకటించారు. గ్రామంలోని షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  మూడు రోజులపాటు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు.  అలిపురా జనాభా దాదాపు 30,000 కాగా, వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలే.  

    ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భారత్‌తో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు మరింతగా వెలుగులోకి వచ్చింది.  

  • టెహ్రాన్‌: అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ చైనా..ఇరాన్‌ కొంప ముంచింది. అణు చర్చల తర్వాత ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు తెగబడ్డాయి. ప్రతి చర్యగా ఇరాన్‌ ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న హెచ్‌-9బీ (HQ-9B)ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (SAM) వ్యవస్థను ఉపయోగించింది. అయితే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. తద్వారా ఇరాన్‌లో భారీ ఆస్తినష్టం, ప్రాణం నష్టం జరిగినట్లు సమాచారం.

    ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది క్షిపణుల ఆధారిత రక్షణ కవచం. నేల మీద గాని, నౌకల మీద గాని ఏర్పాటు చేసి, ప్రత్యర్థి విమానాలు లేదా క్షిపణులను గగనతలంలోనే కూల్చివేయడం దీని పని. ఇరాన్‌ శత్రు దేశాల నుంచి సురక్షితంగా ఉండేలా చైనా నుంచి ఆయిల్ ఫర్ వెపన్ ఒప్పందం కింద హెచ్‌క్యూ-9బీని తెచ్చుకుంది. గతేడాది ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో రష్యా తయారు చేసిన ఎస్‌-300పీఎంయూ-2 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సరిగా పనిచేయలేదు. అందుకు అప్‌గ్రేడ్‌గా ఈసారి రష్యా  నుంచి కాకుండా చైనా నుంచి ఎయిర్‌ డిఫెన్స్‌ దిగుమతి చేసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల వేళ ఇరాన్‌ హెచ్‌క్యూ-9బీని ఉపయోగించింది. కానీ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ విఫలమైంది.

    ఇరాన్‌లో నాటంజ్ అణు కేంద్రం,ఫోర్డో ఎన్‌రిచ్‌మెంట్ ఫెసిలిటీ, ఐఆర్‌సీజీ మిసైల్,యూఏవీ బేస్‌లు, అలాగే టెహ్రాన్, ఇస్ఫహాన్ సమీపంలో ఎయిర్‌బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్‌బేస్‌లపై శత్రు దాడుల నుంచి రక్షించేలా హెచ్‌-9బీ ఎయిర్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎస్‌-300పీఎంయూ-2, బావర్-373, ఖోర్దాద్-15,రాద్‌, టోర్‌-ఎం2, పాంటిసిర్‌-ఎస్‌1 వంటి ఇతర రక్షణ వ్యవస్థల్ని మోహరించింది.  

    అయితే అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అణుకేంద్రాలను రక్షించడంలో హెచ్‌క్యూ-9బీ ఆధారిత రక్షణ పూర్తిగా విఫలమైంది. 31 ప్రావిన్స్‌లో 20కి పైగా ప్రాంతాలు అమెరికా,ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్ర ప్రభావితమయ్యాయి.  

    ఒక్క ఇరాన్‌ మాత్రమే కాదు..గతంలో పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌ను తిప్పికొట్టేలా చైనా నుంచి పాకిస్థాన్‌ తెచ్చుకున్న హెచ్‌క్యూ-9బీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్‌లో సైతం చైనా డిఫెన్స్‌ ఎయిర్‌ సిస్టం విఫలం కావడంతో ప్రపంచ దేశాల ఎదుట చైనా భంగపాటుకు గురైంది.

  • ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఒక దేశ సుప్రీం లీడర్‌ను ఆయన దేశంలోనే అంత మెుందించడంతో మహాసంగ్రామానికి తెరలేసింది. ఒవైపేమో ఇజ్రాయెల్, అమెరికా దాడులు వాటికి ప్రతిగా ఇరాన్‌ సైతం విరుచుకపడుతుండడంతో మూడో ప్రపంచయుద్ధం ఆరంభం కానుందా అనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది.  ఇదిలా ఉండగా సుప్రీం లీడర్ మృతితో ఆయనకు చెందిన లక్షల కోట్ల ఆస్తుల పరిస్థితి ఏంటా అనే చర్చ మెుదలైంది.

    ప్రస్తుతం ఇరాన్‌లో విషాద చాయలు అలుముకున్నాయి.  ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో ఆ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆయన మృతి కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యావత్‌ షియా ముస్లిం వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నారు. 1939లో  మషద్‌లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. అనంతరం 1979లో  జరిగిన నాటి ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించి అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీని కూల దోయడంలో కీలకంగా వ్యవహారించారు. అనంతరం ఆదేశ అధ్యక్షుడిగా, సుప్రీం లీడర్‌ గా ఎదిగారు.

    అయితే అనంతర కాలంలో ఇరాన్‌లో తిరుగులేని శక్తిగా ఆయతుల్లా ఖమేనీ వ్యవహారించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్ని శాసించడంతో పాటు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రక్షణ రంగాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో ఆయతుల్లా ఖమేనీ పెద్దమెుత్తంలో ఆస్తులు సైతం సంపాదించినట్లు సమాచారం. ఖమేనీ ఆస్తుల విలువ 2013లో వచ్చిన ఓ పత్రికా కథనం ప్రకారం 93 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 9 లక్షల కోట్లు అది ప్రస్తుత లెక్కల ప్రకారం మరింతగా పెరిగి ఉండవచ్చని తెలుస్తోంది.  ప్రస్తుతం వీటి పరిస్థితి ఎంటా అని తెలియాల్సి ఉంది. అయితే ఆయన కుమారుడికి సైతం పెద్ద మెుత్తంలో ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 

    అయితే ఖమేనీ మృతితో ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ ఎన్నుకుంది. ఇదివరకూ ఇరాన్ సెమిసరీ సిస్టమ్ అధిపతిగా పనిచేసిన అలిరెజా అరాఫీని సుప్రీంగా ఎన్నుకున్నారు. కాగా ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్‌ పై విరుచుకపడుతుంది. తన సమీప దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. టెహ్రాన్‌పైనా ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్త దాడులు జరుపుతున్నాయి.

  • ఒట్టావా: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణంతో ఆస్ట్రేలియా,కెనడా,లండన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఇరాన్‌ శరాణార్ధులు సంబరాలు చేసుకున్నారు. రోడ్లమీదకు వచ్చి కాకర్లు కాల్చతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇరాన్‌ ప్రజలు సైతం డిక్టేటర్‌ మృతి అంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల ఖమేనీ విగ్రహాల్ని కూల్చేశారు.

    ఈ క్రమంలో ఓ యువతి వార్తల్లో నిలిచింది. ఆ యువతే గతంలో ఖమేనీ చిత్రాన్ని కాల్చి ఆ మంటతో సిగరెట్ వెలిగించిన వీడియోతో వైరల్‌గా మారారు. తాజాగా, ఖమేనీ మరణంపై ఆమె స్పందించారు.‘నా పేరు మోర్టీషియా అడామ్స్. కెనడాలో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థి. కెనడాలో జరిగిన ఇరాన్ వ్యతిరేక ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమేనీ టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఆమె ప్రస్తావించారు. 

    మరోవైపు, ఖమేనీ మృతిపై ఇరాన్ వ్యతిరేక వర్గాల్లో చర్చనీయాంశమవుతుండగా ఖమేనీ అనుచరులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవైపు టెహ్రాన్‌లో సంతాప సభలు జరుగుతుండగా..మరోవైపు విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్ శరణార్థులు ఆయన మరణాన్ని సంబరంగా జరుపుకోవడం హాట్‌టాపిగ్గా మారింది. ఈ పరిణామం ఇరాన్ భవిష్యత్తు రాజకీయ దిశపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

  • టెహ్రాన్‌: ఇరాన్‌లో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యంత సన్నిహిత వర్గంలో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. ఈ నియామకం తర్వాత అరాఫీ ముగ్గురు సభ్యుల లీడర్‌షిప్ కౌన్సిల్‌లో చేరారు.

    అరాఫీ ప్రస్తుతం ఇరాన్ మదర్సా వ్యవస్థకు అధిపతిగా, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. మతపరమైన విద్యా వ్యవస్థలో ఆయనకు ఉన్న అనుభవం, శియా సమాజంలో ఆయనకు ఉన్న ప్రభావం కారణంగా ఈ పదవికి ఎంపికయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఈ పరిణామం ఇరాన్ రాజకీయ, మతపరమైన వర్గాల్లో కీలకంగా పరిగణించబడుతోంది. కొత్త నాయకత్వం దేశంలో శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో అన్నది అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

    సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ
    అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించారని ఇరాన్ మీడియా ఆదివారం (మార్చి 1,2026)నివేదించింది.

    అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. 2026 ఫిబ్రవరి 28న ఆయనను లక్ష్యంగా చేసుకుని అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. ఈ దాడులు టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్నాయి. 86 ఏళ్ల వయసులో ఖమేనీ మరణం ఇరాన్‌లో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన నాయకత్వానికి ముగింపు పలికింది.
     

  • ఇస్లామాబాద్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ఎఫెక్ట్‌ పాకిస్తాన్‌ను తాకింది. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై పాకిస్తానీలు దాడి చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

    వివరాల మేరకు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నిరసనకారులు.. పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్‌పై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. కాన్సులేట్‌ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పాకిస్తాన్‌ సైన్యం, పోలీసులు.. నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. మరోవైపు.. అమెరికా సైన్యం కాల్పుల జరపడంతో ఎనిమిది పాకిస్తానీలు మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

     

     

  • టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు, మాటల యుద్ధం నడుస్తోంది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు పెంచింది. దీంతో, ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం, అమెరికాకు ఇరాన్‌ అదిరిపోయే కౌంటరిచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ జారీ చేసింది. ఇక, ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌-4 పేరుతో ఇరాన్‌ దాడులు చేస్తోంది. 

    అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలపై తాజాగా ఇరాన్‌ స్పీకర్‌, అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఇరాన్‌..‘సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మా జవాబు చూసి శత్రువులు ఏడ్వాల్సిందే, వేడుకోవాల్సిందే. అమెరికా, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మేము దాడులు చేస్తే శత్రువులు కూడా బెంబెలెత్తిపోవాల్సిందే. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తాం. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క’ అని డైరెక్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది.

    ట్రంప్‌ హెచ్చరికలు.. 
    అంతకుముందు ఇరాన్‌ను ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తోపాటు మిడిల్‌ ఈస్ట్‌లోని అమెరికా స్థావరాలపై ఎడతెరిపి లేకుండా చేస్తున్న ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకు ముందెన్నడూ చూడని బలంతో ప్రతిదాడులు చేస్తామని ట్రంప్‌ స్పష్టంచేశారు. చాలా తీవ్రంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాడులు చేయనున్నట్లు ఇరాన్‌ ప్రకటించిందని ట్రంప్ గుర్తుచేశారు. వారు అలా చేయకపోవడమే మంచిదని, ఒక వేళ చేస్తే వారు కూడా ఇంతకు ముందు చూడని శక్తితో విరుచుకుపడతామని వార్నింగ్‌ ఇచ్చారు.

     

    దుబాయ్‌ విలవిల.. 
    మరోవైపు.. సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్‌ సైన్యం.. ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల మోగిన సైరన్లు మోగాయి. ఇరాన్‌ డ్రోన్లు మరోసారి దుబాయ్‌ ఎయిర్‌పోర్టును మరోసారి తాకాయి. దీంతో, దుబాయ్‌ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. యూఏఈ, ఖతార్‌లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును ఇరాన్‌ క్షిపణి తాకింది. అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. బుర్జ్‌ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలను ఇరాన్‌ మీడియా విడుదల చేసింది. పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్‌ సైన్యం తెలిపింది. ఇరాన్‌ దాడులతో బహ్రెయిన్‌, కువైట్‌లలో సైరన్ల మోత మోగిపోయాయి. 

  • ప్రతీకారానికి దిగకపోవడం ఇరాన్‌కు మంచిదంటూ ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రతీదాడులు చేస్తే మరింత తీవ్ర పరిణామాలు  తప్పవన్నారు. మరోవైపు, ఇరాన్‌ కూడా దీటుగా బదులిస్తోంది. అమెరికా హద్దు మీరిందని.. మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొంది. యూఎస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్‌ హెచ్చరించింది.

    సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన అనంతరం ఇవాళ (ఆదివారం) ఉదయం ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ హత్యకు నిరసనగా ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్‌ దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్‌ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఖమేలీ మృతిపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్‌ స్పష్టం చేసింది.

    ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారంటూ ట్రంప్‌ నిన్న(శనివారం) ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖమేనీని చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరిగా ఆయన అభివర్ణించారు. ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.

     

  • టెహ్రాన్: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో యావత్ ప్రపంచం మరోసారి తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టాయి. ఈ నేపధ్యంలో దివంగత బల్గేరియన్ ప్రవక్త ‘బాబా వంగ’ గతంలో చెప్పిన సంచలన భవిష్యవాణి నిజమవుతున్నదంటూ ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.

    2020వ దశకంలో ప్రపంచం పెను మార్పులకు లోనవుతుందని, తీవ్రమైన దౌత్య సంక్షోభాలు  తలెత్తి, అవి పెను యుద్ధానికి దారితీస్తాయని ‘బాబా వంగ’  అప్పట్లో పేర్కొన్నట్లు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 1996లోనే ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యత్‌ ప్రపంచ పరిణామాలను నిజమవుతున్నాయని  ఆమె అనుచరులు నమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతను మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతంగా వారు అభివర్ణిస్తున్నారు.

    కాగా ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవడమే లక్ష్యంగా భారీ యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడుల నేపథ్యంలో యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ వంటి పొరుగు దేశాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండగా, మరోవైపు పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

    అయితే బాబా వంగ భవిష్యవాణికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రాతపూర్వక ఆధారాలు లేవని చరిత్రకారులు, పరిశోధకులు  అంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు సందర్భానుసారంగా అన్వయించుకున్నవేనని వారు కొట్టిపారేస్తున్నారు. భౌగోళిక రాజకీయ విశ్లేషకులు సైతం ప్రస్తుత పరిస్థితులను ‘ప్రపంచ యుద్ధం’గా పిలవలేమని, ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పోరాటాలని  అంటున్నారు. సంక్షోభ సమయాల్లో జనం ఇలాంటి ప్రతీకాత్మక లేదా ప్రాచీన జోస్యాలపై మొగ్గు చూపడం సహజమేనని, దౌత్యపరమైన చర్చలు, సంయమనం ద్వారానే ఈ పెను ముప్పును తప్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: ‘ప్రతిజ్ఞ నెరవేర్చా’.. ఖమేనీ చివరి సందేశం?

Sports

  • ‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.

    ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.

    విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.

    చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్‌లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు.

    అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.

    భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లు
    వేదిక- ఈడెన్ గార్డెన్స్‌, కోల్‌కతా
    టాస్‌- భారత్‌.. తొలుత బౌలింగ్‌
    వెస్టిండీస్ స్కోరు- 195/4(20)
    భారత్ స్కోరు- 199/5 (19.2)
    ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌
    ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్‌).

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సూపర్‌-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND Beat WI)ను ఓడించి టైటిల్‌ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    195 పరుగులు
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్‌ షాయీ హోప్‌ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) రాణించాడు.

    మిగిలిన వారిలో షిమ్రన్‌ హెట్‌మైర్‌ (12 బంతుల్లో 27) ధనాధన్‌ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.

    నిరాశపరిచిన అభిషేక్‌, ఇషాన్‌
    భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.

    సంజూ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌
    కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిల‌క్ వ‌ర్మ (15 బంతుల‌లో 27) వేగంగా ఆడే క్ర‌మంలో అవుట‌య్యాడు. ఇలాంటి ద‌శ‌లో ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు న‌డిపాడు. 

     

    అయితే విజ‌యానికి 10 బంతులలో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతుల‌లో 17) రూపంలో భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో శివం దూబే సంజూకు జ‌త‌య్యాడు. దూబే 4 బంతుల‌లో 8 ప‌రుగులు చేయ‌గా.. సంజూ ఆఖ‌రి ఓవ‌ర్లో సిక్స‌ర్‌, ఫోర్ బాది టీమిండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. 

    సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో
    ఈ  మ్యాచ్‌లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. ఇక మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది.

  • కోల్‌కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్‌కు 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది.  ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు,  1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.  ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు.  

    బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్‌; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు  ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.  వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

    భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్‌ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్‌ 43 పరుగులు, వరుణ్‌ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.

    పావెల్‌ అరుదైన ఘనత
    ఈ మ్యాచ్‌లో  రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్‌మాన్‌ పావెల్‌ అరుదైన ఘనతను సాధించాడు.  విండీస్‌ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్‌ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్‌ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్‌ పూరన్‌ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా,  వెవిన్‌ లూయిస్‌ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్‌ గేల్‌ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్‌,  హెట్‌మెయిర్‌లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగుతుంది. కోల్‌కతా వేదికగా జరుగనున్న  ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

    అత్యంత ​కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ ఓ మార్పు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ స్థానంలో అకీల్‌ హొసేన్‌  తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు..
    భారత్‌: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్

    వెస్టిండీస్‌: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్‌, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీకి రెడీ అయ్యింది.

    ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్‌ క్లైవ్‌ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.

    అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. 

    ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0) విఫలమైనా.. రికెల్టన్‌ (31), బ్రెవిస్‌ (42), మిల్లర్‌ (22), స్టబ్స్‌ (21 నాటౌట్‌), లిండే (30 నాటౌట్‌) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3-0-22-1) వికెట్లు తీశారు. 

    ఈ ఓటమితో ప్రపంచకప్‌లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

    87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా, క్లైవ్‌ మదండే (26 నాటౌట్‌) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్‌ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

    వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.

    అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0)ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 30-2గా ఉంది. రికెల్టన్‌ (19), బ్రెవిస్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.

     

  • మహిళల వన్డేల్లో విశ్వవిజేత అయిన భారత్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జగజ్జేతగా అవతరించిన తర్వాతి సిరీస్‌లోనే మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

    హోబర్ట్‌ వేదికగా ఇవాళ (మార్చి 1) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే దీనికి ముందు ఆసీస్‌లోనే జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

    ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. 

    జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్‌ చేతులెత్తేసింది. అలానా కింగ్‌ (10-1-33-4), జార్జియా వేర్హమ్‌ (1.1-0-3-2) ధాటికి 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నికోలా కేరీ, సదర్‌ల్యాండ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో వికెట్‌ తీశారు. 

    భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్‌ డకౌట్‌ కాగా.. ప్రతీకా రావల్‌ 27, జెమీమా 42, కెప్టెన్‌ హర్మన్‌ 25, హర్లీన్‌ డియోల్‌ 14, దీప్తి శర్మ 29, రిచా ఘోష్‌ 18, శ్రీ చరణి 11 పరుగులు చేశారు. ఓటమి ఖరారయ్యాక స్నేహ్‌ రాణా (44) ప్రతిఘటించింది. 

    కాగా, ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ ప్రారంభం కానుంది. పెర్త్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన ముగుస్తుంది.
     

  • భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ కోసం దుబాయ్‌ మీదుగా లండన్‌కు బయల్దేరింది.

    దుబాయ్ ట్రాన్సిట్‌లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్‌స్పేస్‌లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. 

    తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ‍ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. 

    ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్‌లో పేర్కొంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.

    కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్‌  ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

    ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్‌స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

     

  • అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్‌ షాహీన్స్‌తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్‌ దాడులతో అట్టుడికిపోతుంది.

    అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ అమెరికా ఎయిర్‌బేస్‌ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్‌ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్‌ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.

    అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్‌ కోచింగ్‌ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ సహా విధ్వంసకర వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో ఉన్నట్లు తెలుస్తుంది.

    కాగా, ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్‌ 3-0 తేడాతో ఆ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది.

     

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అతి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా కెప్టెన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 409 పరుగులు చేసింది. 

    కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌​ అలైస్సా హీలీ (మిచెల్‌ స్టార్క్‌ భార్య) (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. 

    జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. 

    భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. రేణుకా, రాణా మినహా మిగతా ముగ్గురు భారత బౌలర్లను ఆసీస్‌ ప్లేయర్లు చెడుగుడు ఆడుకున్నారు. కశ్వీ గౌతమ్‌ 10 ఓవర్లలో 83, దీప్తి శర్మ 10 ఓవర్లలో 90 పరుగులు ఇవ్వగా.. శ్రీచరణి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకుంది. రేణుకా, రాణా తలో 10 ఓవర్లలో చెరో మెయిడిన్‌ వేసి 64, 66 పరుగులు ఇచ్చారు.

    కాగా, ఆసీస్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ఇదివరకే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్‌ తొలి రెండు వన్డేల్లో గెలవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.    

     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026 నుంచి పాక్‌ సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. నిన్న (ఫిబ్రవరి 28) తమ చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా, న్యూజిలాండ్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్‌ లేని కారణంగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ సాధించగా.. పాక్‌ శ్రీలంకపై గెలిచినా, మెరుగైన రన్‌రేట్‌ సాధించలేకపోవడంతో న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. 

    మరోవైపు గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు చేరుకోగా.. రెండో బెర్త్‌ కోసం భారత్‌, వెస్టిండీస్‌ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 1) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు సెమీస్‌కు చేరకుంటుంది. సెమీస్‌లో గ్రూప్‌-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. వెస్టిండీస్‌, భారత్‌ మ్యాచ్‌లో విజేత గ్రూప్‌-2 టాపర్‌ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడుతుంది.

    ఇదిలా ఉంటే, పాక్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన గంటల వ్యవధిలో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ కొడుకు, పాక్‌ మాజీ స్పిన్నర్‌ అయిన ఉస్మాన్‌ ఖాదిర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన, ఇప్పుడు మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఉస్మాన్ ఖాదిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పాకిస్తాన్ క్రికెట్‌లో సంచలనంగా మారింది.

    32 ఏళ్ల ఉస్మాన్‌ ఖాదిర్‌.. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ లాంటి వారు జట్టులోకి రాక ముందు పాక్‌ టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్నారు. అయితే యువ స్పిన్నర్ల రాకతో అతనికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో 2024లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పాక్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి వైదొలిగాక ఉస్మాన్‌ ఖాదిర్‌ తన మనసు మార్చుకున్నాడు.

    రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కారణాలు
    ఉస్మాన్‌ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు 41 వికెట్లు తీశాడు. అలాగే స్థానిక లీగ్‌లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో రాణించాడు. ఇంటాబయటా మంచి స్పందన రావడంతో ఉస్మాన్‌కు అంతర్జాతీయ వేదికపై తిరిగి రాణించగలనన్న నమ్మకం కలిగింది. 

    కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, తన తండ్రి అబ్దుల్ ఖాదిర్ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఎక్స్‌ వేదికగా.. “నా ప్రయాణం ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ క్రికెట్ కోసం మళ్లీ సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించాడు.

    తండ్రి తరహాలోనే రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ స్పిన్నర్‌ అయిన ఉస్మాన్‌ ఖాదిర్‌ పాక్‌ తరఫున 25 వన్డేల్లో 31 వికెట్లు.. ఒక వన్డే ఓ వికెట్‌ తీశాడు. 2020లో జింబాబ్వేపై టీ20తో పాక్‌ తరఫున అరంగేట్రం చేసిన ఉస్మాన్‌.. 2023 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్‌పై తన చివరి మ్యాచ్‌ ఆడాడు. 
     

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: అంగన్వాడీ ఉద్యోగుల "చలో విజయవాడ" కార్యక్రమంపై చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడకు తరలివస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.  

    నంద్యాల రైల్వే స్టేషన్‌లో అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు నిర్భంధించారు. అంగన్వాడీ లీడర్స్‌కి సిడిపివోలు ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి తెస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు చేస్తున్నారని యూనియన్ నేతలు వెల్లడించారు.  ప్రభుత్వ నిర్భంధంపై సీఐటీయూ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.  

    అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు భారీగా తరలి వస్తున్నారు. చలో విజయవాడ కి వెళ్ళొదంటూ స్థానిక ఎమ్మెల్యేలు బెదిరింపులు.

  • సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం  కొడాలి నాని, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు.

    అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి వైఎస్సార్‌సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు.   

  • తాడేపల్లి: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మూర్తి చెప్పినట్లే బీఆర్‌ నాయుడు చాలాకాలం యాది ఉంటారంటూ పేర్ని నాని చమత్కరించారు.  

    అవి ఫేక్‌ వీడియోలని, తమద 30 ఏళ్ల బంధమని బీఆర్‌ నాయుడి చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని స్పందిస్తూ .. ‘ఒకవైపు ఫేక్‌ వీడియోలు అంటారు.. మరొకవైపు వారిది 30 ఏళ్ల బంధమని బీఆర్‌ నాయుడే చెప్పినట్లే మీరు అంటున్నారు. సాధారణంగా ఏడేళ్ల బంధమే బలమైనది అనేది లోకరీతిన అంటుంటాం. మరి వారిది 30 ఏళ్ల బంధమైతే అది చాలా బలమైనదే’ అంటూ సెటైర్లు వేశారు. 

    ‘సోషల్‌ మీడియాలో తిరిగేవి ఫేక్‌ వీడియోలు అయితే..  ఒరిజినల్‌ వీడియోలను బీఆర్‌ నాయుడు విడుదల చేయాలి.  ఆ ఒరిజినల్‌ వీడియోలతో సమాజం నోరు  మూయించండి. ఆ దేవ దేవుడు కాళ్ల దగ్గర కూర్చున్పప్పుడు ఈ బంధాలు, రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలని సమాజం చెబుతుంది. బీఆర్‌ నాయుడు కొండ దిగే టైమ్‌ దగ్గర్లనే ఉన్నట్లు ఉంది’’ అంటూ పేర్ని నాని మరో సెటైర్‌ వేశారు.

    ఇదీ చదవండి:
    వాత్సాయనుడికి వారసుడు బీఆర్‌ నాయుడు: భూమన

     

  • కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.   వైఎస్‌ జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.78 అడుగులు నిర్మిస్తుంటే.. చంద్రబాబు వచ్చి దాన్ని 41 అడుగులకు కుదించారని మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం ఎత్తు కుదిస్తుంటే చంద్రబాబు కిమ్మనలేదన్నారు. ప్రతీ రైతు దీని గురించి ప్రశ్నించాలి.. ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి.. ఇది రాజకీయ సమస్య కాదని సజ్జల తెలిపారు. 

    ‘మన హక్కును మనం రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం ఇది.  ప్రతి ఒక్కరూ కింది స్థాయి టీడీపీ నాయకుడి నుంచి చంద్రబాబు వరకూ వారిని ప్రశ్నించాలి. కూటమిలో సభ్యులైన జనసేన, బీజేపీ నాయకులను సైతం ప్రశ్నించాలి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను చంద్రబాబు వెంటనే మొదలు పెట్టాలి. పక్క రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చట్టపరంగా అడ్డుకోవాలి.  అడ్డగోలుగా కడుతున్న ప్రాజెక్టులను ఆపించే ప్రయత్నం చేయాలి. కేంద్రంలో భాగస్వామిగా ఉంటే అదనంగా తీసుకురావాల్సింది పోయి...ఉన్నవాటిని కట్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఆనాడు కేంద్రంలో భాగస్వామి కాకపోయినా పోలవరాన్ని 45 మీటర్లకు నిర్మిస్తే..భాగస్వామిగా ఉండి చంద్రబాబు 41 మీటర్లకు కుదించేందుకు ఒప్పుకోవడం దారుణం.  చంద్రబాబు 2014–19 మధ్య పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తే.. జగన్‌ వచ్చాక పోరాడి నిధులు సాదించి 45 మీటర్ల మేర పనిచేశారు. 

    నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడాన్ని వదిలేసి..ఎప్పుడో దశాబ్ధాలు పట్టే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్‌..దాన్ని నిలబెట్టుకోవడం తక్షణ కర్తవ్యం. రాష్ట్ర రైతాంగంపై చంద్రబాబు  కొట్టబోతున్న దెబ్బ ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రాలు అడ్డగోలు ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదో అర్ధం కావడం లేదు. కనీసం ఖండించడమో.. అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా ఉపక్రమించడం లేదు. రాయలసీమ లిఫ్ట్‌ కోసం ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా మేం ముందుకు అడుగులు వేస్తాం. ఆ దిశగా నేడు గ్రేటర్‌ రాయలసీమ నేతలమంతా సమావేశమయ్యాం. 

    ప్రజల్లో చైతన్యం పెంచి...వారిని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలని నిర్ణయించాం. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలన్నిటిని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చంద్రబాబు ద్రోహంపై చర్చ జరిగేలా చైతన్యవంతులను చేస్తాం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, కూటమి నేతలపై ఒత్తిడి తీసుకొస్తాం. కళాశాలలు, యూనివర్సిటీల్లోనూ యువతలో చర్చ జరిగే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా ఉద్యమంలో పాల్గొంటారు. ఇది రాజకీయ అంశం కాదు...అందరం కలిసి పోరాడదాం’ అని సజ్జల స్పష్టం చేశారు.

  • సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, అంజాద్ బాషా, సాకే శైలజానాథ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం కార్యాచరణ నేతలు చర్చించారు. 

    చంద్రబాబు.. రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతున్న వైఎస్సార్‌సీపీ.. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది.

     

  • సాక్షి, తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్‌కి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు.

     

     

Movies

  • ఇటలీలో డిఫరెంట్ లుక్‌తో హీరోయిన్ శ్రీలీల

    వింటేజ్ కెమెరాతో ఫొటోలు తీస్తున్న సంయుక్త

    గ్లామర్‌తో హడల్ పుట్టించేస్తున్న నేహా శెట్టి

    ఫిబ్రవరి జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్

    ప్రెట్టీగా యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్

    అందాలు చూపించేస్తున్న బ్యూటీ లక్ష‍్మిరాయ్

  • రీసెంట్‌గానే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్‪‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్‌టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు.

  • 'మ్యాడ్' రెండు సినిమాలతో నటుడిగా ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక ఈ చిత్రాన్ని నిర్మించింది. మానస శర్మ అనే దర్శకురాలు ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)

    టీజర్ బట్టి చూస్తే హీరో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా ఓ ఊరికి వెళ్తాడు. అయితే ఆ ఊరిని ఏళ్లుగా ఓ శాపం ఉంటుంది. పాడుబడ్డ భవంతి కూడా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఊరివాళ్ల సమస్యలోకి హీరో ఎంటర్ అవుతాడు. హీరోయిన్, మరో వ్యక్తి కూడా ఇతడికి తోడవుతారు. మరి బూత్ బంగ్లా నుంచి హీరో అండ్ గ్యాంగ్ బయటపడ్డారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తోంది.

    టీజర్ బట్టి చూస్తుంటే రెగ్యులర్ హారర్ కామెడీ టెంప్లేట్ స్టోరీలానే అనిపిస్తుంది కానీ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయిపోవచ్చు. ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి 'రాజాసాబ్' అనే హారర్ కామెడీ వచ్చింది. కంటెంట్ సరిగా లేకపోవడంతో ఫ్లాప్ అయింది. మరి 'రాకాస' టీమ్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

  • విజయ్‌ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది  సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం  హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్‌ జోడి తమ ఫ్యాన్స్‌కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.  మార్చి 4న  సాయంత్రం జరిగే రిసెప్షన్‌ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.

    విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది.  మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.

  • టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.

    (ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)

    పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. 

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)

  • మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)

    'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్‌ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్‌లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తోంది.

    'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

    (ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

  • సాధారణంగా యాంకర్స్, సీరియల్ నటులు.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. వీళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊహించని అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వాళ్లలో హరితేజ ఒకరు. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన యాంకర్‌గానూ పలు ఈవెంట్స్ హోస్టింగ్ చేసింది. బిగ్‌బాస్ తొలి సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరసగా పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడంతో తను ఎలాంటి సాహసం చేశానో బయటపెట్టింది.

    (ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

    'అల్లు అర్జున్ పక్కన స్లిమ్, ఫెర్ఫెక్ట్‌గా కనిపించాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. 'డీజే'(దువ్వాడ జగన్నాథం)లో అవకాశం వచ్చిన తర్వాత స్లిమ్‌గా కనిపించాలని వరసగా 15 రోజులు ఆహారం తినడం మానేశాను. కేవలం లిక్వ్‌డ్ డైటే తీసుకున్నాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను. షూటింగ్ రేపు ఉందనగా ముందురోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదు. ఇక సెట్‌లో జరిగిన సంఘటన అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. సెట్‌కి వెళ్లగానే అల్లు అర్జున్,నా దగ్గరకు వచ్చి 'బిగ్‌బాస్'లో నీ ఫెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది' అని అన్నారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను' అని హరితేజ.. బన్నీతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

    బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అఆ, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు హరితేజ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిగ్‌బాస్ 8వ సీజన్‪‌లో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా మళ్లీ వచ్చింది గానీ పెద్దగా మెప్పించకలేకపోయింది. ఏదేమైనా బన్నీ గురించి చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్)

  • సాధారణంగా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్‌ పెద్ద సినిమాలేం రిలీజ్ పెట్టుకోవు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల ముందే సంక్రాంతి ఉంటుంది. ఆ టైంలో స్టార్ హీరో తమ మూవీస్ విడుదల చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. దీంతో ఫిబ్రవరిలో దాదాపుగా మిడ్ రేంజ్ లేదా చిన్న చిత్రాలే విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా అలానే వచ్చాయి కానీ ఓ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌)

    ఫిబ్రవరి తొలివారంలో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కాస్తోకూస్తో చెప్పుకదగ్గది అంటే గుణశేఖర్ తీసిన 'యుఫోరియా'నే. చాన్నాళ్ల తర్వాత తన స్టైల్ మార్చి, ట్రెండీ యూత్ సబ్జెక్ట్‌తో మూవీ తీసినప్పటికీ ఫ్లాప్ అయింది. కమ్ బ్యాక్ ఇద్దామనుకున్నా సీనియర్ దర్శకుడికి నిరాశే ఎదురైంది. ఇవి కాకుండా విత్ లవ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్, ఎర్రచీర తదితర మూవీస్ రిలీజయ్యాయి కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి.

    రెండోవారం విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' రిలీజ్ కాగా.. వీటిలో హిట్ అవుతుందనుకున్న ఫంకీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఏ మాత్రం అంచనాల్లేని 'కపుల్ ఫ్రెండ్లీ' సక్సెస్ అందుకుంది. హిట్ అనిపించుకుని ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగాగనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా మారి, కూతురినే హీరోయిన్‌గా పెట్టి తీసిన 'సీతా పయనం' కూడా ఫ్లాప్ అయింది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే కూడా ఏ మాత్రం నిలబడలేకపోయాయి.

    (ఇదీ చదవండి: హీరో విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)

    మూడోవారంలో సుహాస్ 'హే బలవంత్', నవాబ్ కేఫ్ మూవీస్ వచ్చాయి. వీటిలో సుహాస్ సినిమా బాగుందని అన్నారు గానీ జనాలు ఎందుకో దీన్ని లైట్ తీసుకున్నారు. ఇక నవాబ్ కేఫ్ అయితే తొలిరోజుకే ఫ్లాప్ టాక్ ముద్ర వేయించుకుంది. చివరి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' అనే కామెడీ మూవీ రిలీజైంది. సోలో విడుదల కావడంతో ఏమైనా కలిసొస్తుందేమో అనుకున్నారు. ఇందులో కామెడీ ఏ మాత్రం నవ్వేలా లేకపోవడంతో జనాలు దీన్ని కూడా రిజెక్ట్ చేసినట్లే కనిపిస్తున్నారు. రేపటికల్లా దీని అసలు రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.

    ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో 20 సినిమాలు, థియేటర్లలోకి వస్తే ఒక్క 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే ఆకట్టుకుంది. కానీ ఇది మరీ అంత సూపర్ హిట్ అయితే కాలేకపోయింది. గత కొన్నాళ్ల నుంచి తీసుకుంటే 2020లో భీష్మ, 2021లో ఉప్పెన, 2022లో డీజే టిల్లు, 2023లో సర్, 2024లో ఊరిపేరు భైరవకోన, 2025లో తండేల్.. సక్సెస్ కావడంతో పాటు మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ ఏ సినిమా విషయంలోనూ జరగలేదు. తద్వారా కొన్నేళ్ల పాటు సాగిన సెంటిమెంట్ బ్రేక్ అయింది!

    (ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)

  • బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ధురంధర్‌.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్‌టైమ్‌ గురించి సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. పార్ట్‌-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్‌టైమ్‌ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్‌ రన్‌టైమ్‌ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.

    'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.  ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్‌-1కు మించే సీక్వెల్‌ రన్‌టైమ్‌ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు  17ఏళ్ల తర్వాత ఈ రేంజ్‌ నిడివితో బాలీవుడ్‌లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్‌ రోషన్ నటించిన ‘జోథా అక్బర్‌’ (3.50గంటలు) రన్‌టైమ్‌తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్‌ తుది రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్‌టైమ్‌ ఎక్కువగానే ఉందని సమాచారం.

    ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది.  ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.

  • ప్రముఖ నటుడు శరత్‌ కుమార్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్‌. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా..విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్‌కుమార్‌కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్‌ వదంటూ ఆమెపై  సీరియస్‌ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్‌ కుమార్‌ సతీమణి రాధికా చెప్పారు. 

    వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్‌ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్‌? నువ్వు యాక్ట్‌ చేయకూడదు’ అంటూ సీరియస్‌ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. 

    దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్‌లో ఉన్న శరత్‌ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా.  ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు. 

  • ఇండస్ట్రీలో చాలామంది హీరోలు గానీ నటీనటులు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే భార్యకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమెతో పెద్దగా సంబంధాలు ఉండవు. కలిసే, మాట్లాడే లాంటివి కూడా ఉండకపోవచ్చు. కానీ తమిళ నటుడు శరత్ కుమార్ మాత్రం వీటన్నింటికీ అతీతుడులానే కనిపిస్తున్నాడు. తాజాగా ఇతడి మొదటి భార్య ఛాయాదేవి.. రెండో భార్య అయిన రాధికని ప్రశంసలతో ముంచెత్తించారు.

    (ఇదీ చదవండి: హీరో విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)

    ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష‍్మి ప్రధాన పాత్ర పోషించి, తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'సరస్వతి'. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. ఈ శుక్రవారమే(మార్చి 06) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వరలక్ష‍్మి తల్లి, శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    'తొలినాళ్లలో దూరదర్శన్‌లో యాంకర్‌గా పనిచేశాను. ఓసారి రాధికని ఇంటర్వ్యూ చేశాను. దీపావళి సందర్భంగా అది రిలీజైంది. కుటుంబానికి అండగా నిలబడినందుకు థ్యాంక్స్. అలానే 'థాయ్ కెలవి' మూవీ హిట్ అయినందుకు శుభాకాంక్షలు. అందులో మీరు యాక్టింగ్ అద్భుతంగా చేశారు' అని ఛాయాదేవి.. రాధికని ప్రశంసలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నటుడు శరత్ కుమార్.. ఛాయాదేవిని 1984లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు వరలక్ష‍్మి, పూజా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2000లో ఈమెకు విడాకులు ఇచ్చేసిన శరత్ కుమార్.. తర్వాత ఏడాది నటి రాధికని వివాహమాడాడు. వీళ్లకు రాహుల్ అనే కొడుకు పుట్టాడు. ఛాయాదేవి ప్రస్తుతం శరతు కుమార్‌తో కలిసి ఉండట్లేదు. కాకపోతే వరలక్ష‍్మి మాత్రం రాధికతో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తోంది. వరలక్ష‍్మి పెళ్లి కూడా రాధికనే దగ్గరుండి జరిపించింది.

    (ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌)

  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందర్భంగా రణబాలి నుంచి ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో నెట్టింట  వైర‌ల్ అయింది. పోస్టర్‌లో వారిద్దరి లుక్‌ చాలా ఓల్డ్‌ గెటప్‌లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, దీని వెనుక దాగిన ఆసక్తికరమైన స్టోరీని చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ షేర్‌ చేశారు. రణబాలి నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ కేవలం ఒక సినిమాకు సంబంధించినది మాత్రమే కాదని తెలిపారు.  ఈ పోస్టర్ రూపకల్పనలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. 

    పాత కాలపు ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టమని దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మన పూర్వీకులు కెమెరా ముందు ఎలాంటి కృత్రిమమైన ఫోజులు లేకుండా చాలా సహజంగా ఫోటోలు దిగేవారని చెప్పారు. అలాంటి కృత్రిమమైన లుక్‌ను రణబాలి పోస్టర్‌లో తీసుకురావాలని తాము ప్రయత్నించినట్లు రాహుల్ సాంకృత్యన్  తెలిపారు.

    రణబాలి పోస్టర్‌ గురించి దర్శకుడు ఇలా చెప్పారు. '1800ల కాలం నాటి నేపథ్యంలో  ‘రణబాలి’ మూవీ ఉండనుంది. కాబట్టి, ఆ కాలపు గాంభీర్యం, మట్టి వాసన కనిపించేలా ఈ చిత్రంలో వివాహ వేడుకను డిజైన్ చేశాం. ఈ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో వచ్చినప్పుడు వారిద్దరూ నిజంగానే మన పూర్వపు కాలంలోకి వెళ్ళిన వ్యక్తుల్లా కనిపించారు. ఫోటో లుక్‌లో కూడా వారిద్దరూ ఎలాంటి  స్టైలిష్ ఫోజులు ఇవ్వలేదు. కేవలం  సాధారణ వ్యక్తుల్లా వారిద్దరినీ కెమెరాతో బంధించాం. ఇదే ఈ పోస్టర్‌ ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్‌ విడుదల నాటికి వారిద్దరూ నిజ జీవితంలో ఒక్కటి కావడం ఆశ్చర్యంగా అనిపించింది.  ఒక్కోసారి సినిమా, నిజ జీవితం రెండూ పలకరించుకుంటాయ్‌. ఈ పోస్టర్‌ చూస్తుంటే వారి గత జన్మకు సంబంధించిన పెళ్లి ఫోటోలా అనిపిస్తుంది.' అని రాహుల్ సాంకృత్యన్ ఎమోషనల్‌ స్టోరీ రాసుకొచ్చారు.

  • తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

    విజయ్‌ను అన్‌ఫాలో కొట్టిన జేసన్‌
    ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దళపతిని అన్‌ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్‌.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్‌ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

    పెళ్లి - విడాకులు
    ఏదేమైనా జేసన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్‌- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై ఏప్రిల్‌ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్‌ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.

    చదవండి: ఓటీటీలో విత్‌ లవ్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

  • హీరో శ్రీవిష్ణు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన తాజాగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓ మెస్తరు అంచనాల మధ్య ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్‌ బాగానే వచ్చాయి. 

    తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు అంతకు మించిన జోరును ప్రదర్శించింది. మొదటి రోజుతో పోలిస్తే..రెండో రోజు ఏకంగా 54 శాతం పైగా బుకింగ్స్‌ని నమోదు చేసుకున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 9.1 గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు.వీకెండ్‌లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ మూవీకి బాగా కలిసి వస్తోంది. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే..వీకెండ్‌లో కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండుతులు అంచనా వేస్తున్నారు. 

  • కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్‌. ఇటీవలే టీజర్‌, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్‌ మరింత బోల్డ్‌గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి.  కేజీఎఫ్‌ 2 వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యష్‌  నటిస్తున్న  పాన్‌ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.

    కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
     

  • ‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా  ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఫిబ్రవరి 27న విడుదలైంది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ఓపెనింగ్ కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. కేర‌ళ హైకోర్టు ఈ చిత్రాన్ని  ఆపివేయాల‌ని ఆదేశించినప్పటికీ డివిజ‌న్ బెంచ్ ద్వారా అనుమ‌తి పొంది విడుద‌లైంది. అయితే రంజాన్ మాసంలో ఈ మూవీ విడుదల కావడంతో ముస్లిమ్స్‌ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేరళ రాష్ట్రం అన్ని మతాల ఐఖ్యతకు మూలం అని ఈ చిత్రం ఒక కల్పితం మాత్రమే అంటూ  పలు వీడియోలను నెటిజన్లు షేర్‌ చేశారు.

    'ది కేరళ స్టోరీ 2' మొదటి రెండురోజుల్లో కేవలం రూ. 5.4 కోట్లు మాత్రమే రాబట్టింది. అత్యధికంగా ముంబైలో సుమారు 800 స్క్రీన్స్‌లలో ఈ మూవీని ప్రదర్శించగా కేవలం 12 శాతం మాత్రమే టికెట్ల అమ్మకాలు జరిగాయి.  దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించడంతో మేకర్స్‌ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 836 షోలకు గాను 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. హైదరాబాద్ 11.75%, బెంగళూరు 12%, చెన్నై 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. 2023లో వచ్చిన  'ది కేరళ స్టోరీ'  ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, సీక్వెల్‌ కలెక్షన్స్‌ ఆ రేంజ్‌ మార్క్‌ను అందుకోవడం అసాధ్యమైన పని అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

  • కోలీవుడ్‌ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌- సంగీత విడాకులు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్‌ త్రిష పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, అందుకే విడాకులు ఇప్పించాలంటూ సంగీత కోర్టుని ఆశ్రయించింది. 

    దీంతో సంగీత ఆరోపిస్తున్న నటి త్రిషనే అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా త్రిష, విజయ్‌ కలిసి  కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, తిరుప్పాచ్చి, గిల్లి వంటి సినిమాల ప్రమోషన్ సమయంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ వైరల్‌ చేస్తున్నారు. దీంతో పాటు పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    వీడియోలో ఏముంది?
    త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఇలా మాట్లాడింది.  ‘మీ పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. ఎందుకంటే.. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసే నిర్ణయం కాదు. జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటే మళ్లీ విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను.  

    నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని, అఇష్టంగా జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ, నేను అలాంటిది జీవితాన్ని కోరుకోవడం లేదు. సరైన వ్యక్తి కోసం వేచి ఉంటాను. అలాగే.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. నేను ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి. అలాంటి వ్యక్తి కావాలి’ అని త్రిష అన్నారు. 

  • దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్‌ అయ్యాడు అభిషన్‌ జీవింత్‌. ఇతడు టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్‌ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్‌ డైరెక్టర్‌ హీరోగా మారాడు. విత్‌ లవ్‌ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.

    ఓటీటీలో విత్‌ లవ్‌
    అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్‌ జంటగా నటించిన ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్‌ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్‌ లవ్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్‌ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.

    కథేంటంటే?
    సత్య (అభిషన్‌ జీవింత్‌) ఆర్కిటెక్ట్‌.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్‌లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్‌). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివామని, ఇద్దరూ సీనియర్‌- జూనియర్‌ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!

     

     

    చదవండి: దుబాయ్‌లో చిక్కుకున్నా.. నన్ను భారత్‌కు తీసుకురండి: బాలీవుడ్‌ నటి

  • ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్‌ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్  ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.

    తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, ‍అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్‌ టీమ్‌ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్‌ టీమ్‌ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు  యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం ‍వ్యక్తం చేస్తున్నారు.

    కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. 
     

Business

  • ఇటీవల కాలం తప్పుడు వార్తల ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇవన్నీ నిజమేనేమో అని నమ్మి, చాలామంది భయపడుతుంటారు. ఇలాంటి మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    SBI పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మెసేజ్, వినియోగదారులు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని పేర్కొంది. ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే, SBI YONO యాప్ బ్లాక్ చేయబడుతుందని కూడా ఇది పేర్కొంది.

    మీరు మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే మీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) YONO యాప్ బ్లాక్ అవుతుందనే వార్త తప్పు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. యోనో యూజర్లు ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు. అంతే కాకుండా మీరు వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ & ఆధార్ వివరాలను షేర్ చేసుకోవద్దు అని వెల్లడించింది.

  • సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్‌లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.

    మొదటి జీతం
    దిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణికులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందారు. ఇదే అతని మొదటి జీతం.

    ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించారు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. తాను చేసిన పనికి యజమాని తన జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచారు.

    రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయం
    కున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసారు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నారు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.

    1700 మందికి ఉపాధి
    1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.

    ఇదీ చదవండి: అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు!

  • భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్‌ను గూగుల్ రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) ప్లాట్‌ఫామ్ & స్పామ్ ఫిల్టరింగ్‌తో కలపడం ద్వారా వినియోగదారులకు మెరుగైన రక్షణ కలిగిన మెసేజింగ్ సేవలను అందించనున్నారు.

    గత 1.5 సంవత్సరాలుగా.. ఎయిర్‌టెల్ స్పామ్ కాల్స్ అండ్ డిజిటల్ మోసాలపై పోరాడుతోంది. ఏఐ బేస్డ్ విధానాలను ఉపయోగించి కంపెనీ ఇప్పటి వరకు 71 బిలియన్ స్పామ్ కాల్స్, 2.9 బిలియన్ స్పామ్ SMSలను అడ్డుకుంది. దీంతో సంస్థ ఆర్ధిక నష్టాల విలువ 68.7 వరకు తగ్గాయి. ఇది వినియోగదారుల పట్ల కంపెనీకున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.

    అయితే.. టెలికాం నెట్‌వర్క్‌లకు ఉన్న భద్రతా ప్రమాణాలు ఇతర మెసేజింగ్ యాప్స్‌లో పూర్తిగా అమలు కావడం లేదు. దీనిని అదనుగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. స్పామ్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఎయిర్‌టెల్.. గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మొత్తం మీద వినియోగదారుల భద్రతకు సంస్థ గొప్ప నిర్ణయం తీసుకుంది.

    ఉపయోగాలు
    ➤సందేశం పంపిన వారి గుర్తింపును చెక్ చేయవచ్చు.
    ➤వినియోగదారుల డీఎన్‌డీ సెట్టింగ్స్‌కు అనుగుణంగా మెసేజ్‌లను ప్రకటన లేదా అవసరమైన మెసేజ్‌లుగా వేరు చేసుకోవచ్చు.
    ➤స్పామ్ బిజినెస్ మెసేజ్‌లు మీ ఫోన్‌కు రాకుండా చేసుకోవచ్చు.
    ➤హానికరమైన లేదా మోసపూరిత లింకులను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసుకోవచ్చు.

  • భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. అయితే ఎక్కువ పవర్, టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తూ.. మెరుగైన ఇంధన సామర్థ్యం కావాలనుకునేవారు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగిన వేరియంట్స్ ఎంచుకుంటారు. కాబట్టి ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే.. ఐదు బెస్ట్ టర్బో-పెట్రోల్ కార్లను గురించి తెలుసుకుందాం.

    టాటా నెక్సాన్
    రూ.7.31 లక్షల ధర వద్ద అందుబాటులో ఉండే.. టాటా నెక్సాన్ చెప్పుకోదగ్గ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన అత్యంత సరసమైన కాంపాక్ట్ SUV. ఇందులోని 1.2 లీటర్ యూనిట్ 120 హార్స్ పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మాన్యువల్ AMT & DCTతో సహా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. రోజువారీ వినియోగానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

    స్కోడా కైలాక్
    కైలాక్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 115hp & 178Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ మధ్య ఎంచుకోవచ్చు. ఇంజిన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. దీని ధర రూ. 7.59 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

    టాటా పంచ్
    టాటా పంచ్ టాప్ ట్రిమ్‌.. నెక్సాన్ కంటే శక్తివంతమైన 120hp టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. నెక్సాన్ మాదిరిగా కాకుండా, ఈ సెటప్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇంజిన్ సరళంగా ప్రతిస్పందించేలా అనిపిస్తుంది. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    కియా సిరోస్
    సిరోస్ కారు.. వెన్యూ, ఐ20 & సోనెట్ మాదిరిగానే అదే టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. రూ.8.67 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది కేవలం టర్బో పెట్రోల్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    నిస్సాన్ మాగ్నైట్
    రూ. 8.70 లక్షల ధర వద్ద లభించే నిస్సాన్ మాగ్నైట్ కారు.. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది నగర ప్రయాణానికి, హైవేపై వెళ్లడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమయంలో కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్మూత్‌గా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

  • మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.

    సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం.

  • బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.

    చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.

    ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది.

  • తమ పోర్ట్‌ఫోలియో నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌)ను తప్పించనున్నట్లు నార్వేకు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ నార్జెస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇలాంటి ఆరోపణలతోనే 2024 మే నెలలోనూ సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేర్లను వదిలించుకుంది.

    నార్జెస్‌ బ్యాంక్‌ 2020 జూలైలో తొలిసారి ఏజీఈఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 341 ధరలో వీటిని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం షేరు రూ. 944 వద్ద కదులుతోంది. కాగా.. గతంలోనూ నార్వేజియన్‌ వెల్త్‌ ఫండ్‌ వివిధ కారణాలతో దేశీ బ్లూచిప్స్‌ ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, వేదాంతాలను పోర్ట్‌ఫోలియో నుంచి తప్పించింది.

    మార్కెట్ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంనుంచి నార్జెస్‌ బ్యాంక్‌ 4.39 కోట్ల డాలర్ల విలువైన ఏజీఈఎల్‌ షేర్లను విక్రయించగా.. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.

  • బంగారం, వెండి, స్టాక్‌ మార్కెట్లు, బిట్‌ కాయిన్‌, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్‌ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.

    కియోసాకి తన ట్వీట్‌లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

    అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.

    ఇదే ట్వీట్‌లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ హయాంలో మొదలైన ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.

    తర్వాత చేసిన మరో ట్వీట్‌లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్‌, గవర్నర్ టిమ్‌ వాల్జ్‌ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్‌ పీటర్‌సన్‌ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.

  • ముంబై: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (జేఎఫ్‌ఎస్‌) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్‌ను మార్కెట్‌ప్లేస్‌ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్‌ స్కోర్‌ మొదలైనవి కూడా ఇవ్వనుంది.

    ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్‌లో జోడిస్తున్నట్లు జేఎఫ్‌ఎస్‌ ఎండీ హితేష్‌ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్‌ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్‌ సిఫార్సు చేస్తుంది.

    దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్‌కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్‌ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

  • దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ దారుణంగా పెరిగాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండివైపు మళ్లడంతో డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు కాస్త పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

     

Telangana

  • సాక్షి హైదరాబాద్‌: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరా బాద్ సీపీ VC సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా  ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ఖాతాలో సజ్జనార్ పోస్ట్ చేశారు.

    చలాన్ల రాయితీ తప్పంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీస్ శాఖ ఇదివరకూ అధికారికంగా ఎటువంటి రాయితీలను ప్రకటించలేదని తెలిపారు.కనుక ప్రజలు దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి అని సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ తెలిపారు.

  • సాక్షి,హైదరాబాద్‌: మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా-ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్ని భారత్‌ ఖండించాలని ఎంఐఎం చీఫ్‌ అసద్దుదీన్‌ ఓవైసీ అన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులపై ఓవైసీ స్పందించారు.  

    ‘ఇరాన్‌పై దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ  హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై దాడుల్ని తక్షణమే ముగియాలని,ఈ విషయంలో  భారత ప్రభుత్వం  తన పాత్ర పోషించాలని కోరారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. 

     దాడుల్ని కేంద్రం ఖండించాలి. అంతర్జాతీయ స్థాయిలో దేశం శాంతి ప్రయత్నాలకు ముందడుగు వేయాలి. గల్ఫ్‌ దేశాల్లో దాదాపు కోటి (10 మిలియన్) మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధం కొనసాగితే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కల్లోలం తప్పదు. భారతీయులు అక్కడ చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

     

Family

  • రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్‌లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.

    కుటుంబం మీదే ఎందుకు?
    ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్‌ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్‌కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.

    నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.

    కుటుంబానికి విముక్తి ఎలా? 
    1.    Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.
    2.    Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్‌తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.
    3.    ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.
    4.    "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.
    5.    కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.

    మీ కోసం ఒక చిన్న పరీక్ష...
    ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"

    కెరీర్‌లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.

    సైకాలజిస్ విశేష్
    కెరీర్ & మైండ్‌సెట్ కోచ్
    8019 000066
    www.psyvisesh.com

  • పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్‌ స్పెషలిస్ట్‌ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణ

    పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్‌ ఏవీ బ్లాక​ కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్‌ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు  గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్‌ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.

    ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..
    25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్‌మేకర్ అవసరం. 

    ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్‌ నుంచి బాత్రూమ్‌ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్‌మేకర్‌ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్‌ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు  ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్‌మేకర్లు, మూడు అబ్లేషన్‌ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. 

    ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్‌డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె  ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. 

    ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్‌పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.

    (చదవండి: ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..)

     

  • నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఇలాంటి హత్యోదంతాలు సమాజంలో భయాందోళనలు 
    కలిగిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు చినికి చినికి గాలివానగా మారి హత్యలకు దారితీస్తున్నాయి. కలకాలం కలిసిమెలిసి బతుకుతామని ప్రమాణం చేసిన వారే, కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నారు. 

    సోషల్‌ మీడియా ఇప్పుడు ఒక మేనియాగా మారింది. మద్యం, డ్రగ్స్‌ వంటి మత్తుపదార్థాల మాదిరిగా ఈ మహమ్మారి నిండుజీవితాలను కబళిస్తోంది. సామాజిక మాధ్యమ వేదికలపై ఏర్పడే పరిచయాలు, సరికొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలకు ఇవి వాహకాలుగా పనిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన భార్యాభర్తలు క్రమంగా భావోద్వేగాలు పంచుకోలేక క్రమంగా ఆ బంధానికి దూరమవుతున్నారు. 

    దీంతో ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులు చేరుతున్నారని, దాంపత్య జీవితాల్లో కల్లోలం మొదలవుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సంహిత చెబుతున్నారు. ‘నేను, నా సుఖ సంతోషాలు, నా ఆనందం, నేను కోరుకున్న, నాకు ఇష్టమైన జీవితం.. అనే భావన ఒక నార్సిస్ట్‌ ధోరణికి దారితీస్తోంది. ఈ తరహా మానసిక ప్రవర్తన కారణంగానే కొత్త వ్యక్తులకు దగ్గరై సొంత మనుషులను దూరం చేసుకుంటున్నారని, అవసరమైతే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదని చెప్పారు. 

    అస్తిత్వ పోరాటం.. 
    మరోవైపు ఈ ప్రవృత్తి ఉన్నవారిలో ఐడెంటిటీ క్రైసిస్‌ భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. 
    ఇతరులు తమను గుర్తించాలనే సంక్షోభంలో కొట్టుకుపోతున్నారు. ‘నిరంతరం తాము ఇతరులను ఆకర్షించాలని కోరుకుంటారు. తమను చూసినప్పుడు ఎదుటివారిలో ఎగ్జైట్‌మెంట్‌ కలగాలని భావిస్తారు. సోషల్‌ మీడియాలోని ఫాంటసీ కంటెంట్, థ్రిల్లర్‌ కంటెంట్‌ అలాంటి భ్రమలను సృష్టిస్తాయి. 

    దీంతో కొత్త వ్యక్తులకు దగ్గరైన కొద్దీ సొంతవాళ్లకు దూరమవుతున్నారు.’ అని మరో మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా ఒక రహస్య జీవితానికి అవకాశం కల్పిస్తోంది. ఆ రహస్య జీవితంలోపడి చాలా దూరమే కొట్టుకుపోతున్నారు. ఇది క్రమంగా హింసా ప్రవృత్తికి దారితీస్తుందని పేర్కొన్నారు. 

    రెడ్‌ఫ్లాగ్స్‌’ ధోరణి.. 
    వివాహేతర సంబంధాలతో రహస్య జీవితానికి అలవాటుపడిన వాళ్లు కుటుంబం నుంచి విడిపోయేందుకు ‘రెడ్‌ఫ్లాగ్స్‌’ ధోరణిని అనుసరిస్తారు. అంటే తమ రహస్య జీవితంలోకి ఇతరులు ప్రవేశిస్తారేమోనన్న అభద్రతా భావంతో భార్యాభర్తలు ఒకరినొకరు దూరం పెట్టేస్తారు. చివరకు తమ వస్తువులను తాకినా, ఫోన్‌ ముట్టుకున్నా భరించలేరు. 

    ఒకరిపై మరొకరికి ద్వేషం పెరుగుతుంది. ఎలా అయినా వాళ్ల నుంచి దూరం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలనే మానసిక నిపుణులు ‘రెడ్‌ఫ్లాగ్స్‌’గా పరిగణిస్తున్నారు. నచ్చిన చాక్లెట్‌ తిన్నట్లుగా, నచ్చిన సినిమా చూసినట్లుగా ‘ఐ నో వాట్‌ ఐ వాంట్‌’ అనే భ్రమలో ఎలాంటి దుస్సాహసానికైనా తెగిస్తున్నారు. కట్టుకున్నవారిని కడతేర్చడం ద్వారా ఫ్రీడమ్‌ లభిస్తుందనే భావనతో జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు. 

    పెళ్లి కాంట్రాక్ట్‌ కాదు.. 
    భార్యాభర్తల బంధాల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిని ఒక కాంట్రాక్ట్‌గా భావించే స్వభావం వల్లనే ఇలాంటి పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. అనైతిక సంబంధాలను సమర్థించే విధంగా వస్తున్న సినిమాలు, రీల్స్, వెబ్‌సిరీస్‌లు సమాజాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం కొరవడుతోంది. మితిమీరిన అహం వల్ల హత్యలకు పాల్పడుతున్నారు. 
    – మమతా రఘువీర్, సామాజిక కార్యకర్త 

    సానుకూల దృక్పథం ఉండాలి.. 
    నార్సిస్ట్‌ ప్రవృత్తి తొలగిపోవాలంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని, చక్కటి సాంస్కృతిక, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా పాటించవలసిన ధర్మాన్ని, బాధ్యతలను గుర్తించాలి. మొదట అన్ని రకాల సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి, పెడధోరణుల నుంచి బయటపడేందుకు సొంతవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. సోషల్‌ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. కానీ అడిక్ట్‌ కావొద్దు. 
    – డాక్టర్‌ సంహిత, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌  

    (చదవండి: తరచుగా కళ్లను రుద్దితో..డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయా..?)

  • నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఉద్యోగం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తోంది. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌తో పాటు స్వల్పంగా వాపు కూడా వస్తోంది. అలాగే నాకు అలర్జీ సమస్య ఉంది. తరచుగా కళ్లను రుద్దుకుంటూ ఉంటాను.
    కవిత, విశాఖపట్నం

    ఈ రోజుల్లో కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్, వాపు చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ అంటే ఆ భాగంలో చర్మం రంగు మారడం, నీడలా కనిపించడం లేదా లోతుగా కనిపించడం వల్ల ముఖం అలసినట్టు లేదా వయస్సు ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. ఇవి సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల వస్తాయి. 

    మీ విషయంలో రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, మొబైల్, ఇతర స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వంటి జీవనశైలి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా అలర్జీ సమస్య ఉండటం, తరచుగా కళ్లను రుద్దుకోవడం కూడా డార్క్‌ సర్కిల్స్‌ను పెంచుతాయి. ముక్కు అలర్జీ లేదా సైనస్‌ సమస్యల వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మారి నీలం లేదా ఊదా రంగులో వలయాలు కనిపించవచ్చు. 

    తరచు రుద్దుకోవడం వల్ల చర్మంలో మెలనిన్‌ పెరిగి గోధుమరంగు పిగ్మెంటేషన్‌ ఏర్పడుతుంది. కొందరిలో కుటుంబ చరిత్ర, చర్మం పలుచగా ఉండటం లేదా కళ్లు లోతుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజెన్‌ తగ్గి చర్మం వదులుగా మారుతుంది. దాంతో లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించి కళ్ల కింద నీలి ఛాయ పెరుగుతుంది.

    కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ అన్నీ ఒకే రకంగా ఉండవు. కొందరిలో గోధుమరంగు పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చర్మం పలుచగా ఉండడం వల్ల నీలం లేదా ఊదా రంగు రక్తనాళాలు కనిపిస్తాయి. మరికొందరిలో కంటి కింద లోతు ఉండటం వల్ల నీడలా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొవ్వు నిల్వ కావడం వల్ల వాపు లేదా బ్యాగ్స్‌ రూపంలో కనిపిస్తుంది. చాలా మందిలో ఇవన్నీ కలిసిన రూపం ఉంటుంది. అందుకే సరైన చికిత్స కోసం ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవటం అవసరం. 

    ఈ పరీక్షల్లో చర్మం రంగు, లోతు, వాపు, అలర్జీ లక్షణాలు వంటి అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే హీమోగ్లోబిన్, ఐరన్, విటమిన్‌ బి12, థైరాయిడ్‌ పరీక్షలు కూడా సూచిస్తాం. అయితే, చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయటం అవసరం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట అవసరం లేకుండా మేల్కొని ఉండకూడదు. కళ్లను రుద్దుకోవడం మానుకోవాలి. అలర్జీకి సరైన చికిత్స తీసుకోవాలి. చల్లని కంప్రెషన్‌ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యాహారం తీసుకోవడం వల్ల మంచి మెరుగుదల కనిపిస్తుంది. 

    అయినప్పటికీ సమస్య ఎక్కువగా ఉంటే పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్సలు సూచిస్తాం. సన్‌స్క్రీన్, విటమిన్‌ సి, తక్కువ శక్తి గల రెటినాయిడ్‌ను రాత్రిపూట వాడటం, కొజిక్‌ లేదా అజెలాయిక్‌ ఆమ్లం వంటి పిగ్మెంటేషన్‌ తగ్గించే క్రీములు ఉపయోగించడం చేస్తాం. అవసరమైన సందర్భాల్లో కెమికల్‌ పీల్స్‌ చేస్తాం. లోతు ఎక్కువగా ఉన్నవారిలో హయాలురోనిక్‌ ఆమ్ల ఫిల్లర్లు లేదా పీఆర్‌పీ చికిత్స ఉపయోగపడుతుంది. 

    పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉంటే లేజర్‌ చికిత్సలు, రక్తనాళాలు స్పష్టంగా ఉంటే ప్రత్యేక లేజర్‌ విధానాలు, చర్మం వదులుగా ఉంటే చర్మాన్ని గట్టిపరచే చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు మాత్రమే పూర్తిగా సరిపోవు. స్టెరాయిడ్‌ కలిగిన ఫెయిర్‌నెస్‌ క్రీములను తప్పకుండా నివారించాలి. 

    ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ ఒకే ఒక్క వ్యాధి కాదు, అనేక కారణాల సంకేతం. పూర్తిగా మాయం కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోయినా, సరైన నిర్ధారణతో వ్యక్తిగతంగా అనుకూలమైన చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. 
    డా. ఇందిర పవన్‌
    ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌ 

    (చదవండి: స్మార్ట్‌ ఫోన్‌లు వద్దు..ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే ముద్దు..!: పేరెంట్స్‌)

  • ప్రస్తుతం తల్లిదండ్రులకు ఈ జెనరేషన్‌ పిల్లలను పెంచడం బహుకష్టం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లకు చిన్నప్పటి నుంచి అడిక్ట్‌ అయిపోతున్నారు ఈ తరం పిల్లలు. జస్ట్‌ మూడేళ్ల పిల్లలే స్మార్ట్‌ఫోన్‌ అంటూ పేచీలు, మారాంలు..అది ఇస్తే గానీ కుదురుగా ఉండరు. పైగా సాంకేతిక ప్రభావం చిన్నప్పటి నుంచి వారిపై ఉండటంతో సరిగా చదువుతారనే బెంగ ఎక్కువైపోతోంది తల్లిదండ్రుల్లో. పైగా రీల్స్‌ పిచ్చిలో..ఇన్‌ఫ్లుయెన్స్‌ర్‌ అవుతాననే అంటున్నారు తప్ప..ఇదివరకటి పిల్లల్లా ఇంజనీర్‌, డాక్టర్‌ అని చెప్పడం లేదు. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు అమెరికాలోని తల్లిదండ్రులు ఎలాంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారో తెలుసా..!?..అదేంటో తెలిస్తే కంగుతింటారు. 

    చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలో చాలా కుటుంబాలు తిరిగి ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాయట. సోషల్‌మీడియాఎక్స్‌పోజర్‌, ఆన్‌లైన్‌ భద్రత, పట్ల తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ధోరణి ఎక్కువైంది అక్కడ. కొన్ని కుటుంబాలు పిల్లల్లో మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఈ ల్యాంఢ్‌లైన్‌ టెలిఫోన్‌ మంచివని, యాప్‌లు, ఇంటర్నెట్‌ వంటి వాటి సాయం లేకుండా మంచిగా నేర్చుకోగలరని ప్రగాఢంగా నమ్ముతున్నారట. 

    ఇలా అయితేనే పరధ్యానం లేకుండాం మంచి సంభాషణా చాతుర్యం పెరుగుతుందంటున్నారు. ఈ ఫోన్‌లు  కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలరిని, తల్లిదండ్రలులు అంటున్నారు. అంతేగాదు ఈ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారానే మర్యాదగా సంభాషించడం, సమాధానం ఇవ్వడం తెలుసుకోగలరని, ఎవరితోనైనా మాట్లాడటానికి జంకరని చెబుతుండటం విశేషం. అదీగాక ఈ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ల వల్ల సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వరు, బాధ్యతయుతమైన డిజిటల్‌ ఉపయోగం ఎలా అనేది కూడా తెలుసుకుంటారని అంటున్నారు. 

    అంతేగాదు అక్కడ సైకాలజిస్టులు సైతం తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు ఉపయోగకరమైన మీడియా ప్లాన్‌ రూపొందిచాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతుండటం విశేషం. పైగా ఈ ధోరణిని భద్రత తోపాటు మంచి అర్థవంతమైన కమ్యూనికేషన్‌ పిల్లలలో ఉండాలని ఆకాంక్షిస్తూ చేస్తున్న వినూత్న ప్రయోగమని అక్కడి నిపుణులు సైతం దీనికి మద్దతు తెలుపుతున్నారట. మరి ఇదెంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే కదూ..!.

    (చదవండి: బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!)

     

  • ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ను (ఏఆర్‌సీఎఫ్‌) ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చిన అమీర్‌ రజా ఖాన్‌ పాకిస్తాన్‌లో ఉంటూ ఇక్కడ కథ నడిపించాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎంలో రియాజ్‌ భత్కల్‌ కీలక పాత్ర పోషించాడు. ఇతడికి ఖయాముద్దీన్‌ కపాడియా కుడిభుజంగా వ్యవహరించాడు. 2008లో అహ్మదాబాద్‌ పేలుళ్లు తర్వాత ముంబైలో దొరికిన వాహన చోరుల తీగ లాగితే ఢిల్లీలో బాట్లాహౌస్‌ ఎన్‌కౌంటర్‌ డొంక కదిలింది. దీంతో ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో రియాజ్, కపాడియాలతో పాటు అనేక మంది ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. ఎందుకు? ఇక్కడ ఎవరిని కలిశారు?...

    దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఐఎం ఉగ్రవాద సంస్థ చెక్క పెట్టెలతో పడవల మాదిరిగా తయారు చేసిన షేప్డ్‌ బాంబ్స్‌ వాడారు. టైమర్‌ ఆధారంగా పేలే సర్క్యూట్‌ ఉన్న వీటిలో ఓ ఎలక్ట్రానిక్‌ మైక్రోచిప్‌ అత్యంత కీలకంగా పని చేసింది. వీటిని కేరళలోని మలప్పురం నుంచి వచ్చి హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో స్థిరపడిన షయనుద్దీన్‌ అలియాస్‌ సత్తార్‌ తయారు చేశాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌ అయిన ఇతడికి కేరళలో ఉండగానే స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ) ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1995లో కేరళ ముఖ్యమంత్రి ఈకే నయనార్‌ను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయ్యాడు. సిమీ ద్వారానే రియాజ్‌ భత్కల్‌తో ఇతడికి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో 2005 నుంచి ఎలక్ట్రానిక్‌ మైక్రోచిప్స్‌ తయారీ బాధ్యతల్ని రియాజ్‌ భత్కల్‌ ఇతడికి అప్పగించాడు.

    సత్తార్‌ అందించిన మైక్రోచిప్స్‌ను రియాజ్‌ భత్కల్‌ గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు వినియోగిస్తాడు. 2008 జూలైలో అహ్మదాబాద్, సూరత్‌లను ఐఎం టార్గెట్‌ చేసింది. ‘ది పూల్‌ ఆఫ్‌ ఆల్‌ టెర్రరిస్టు’ పేరుతో పెద్ద సంఖ్యలో వరుస పేలుళ్లకు పథకం వేస్తుంది. దీనికోసం తయారు చేసే దాదాపు 70 బాంబుల్లో ఉంచాల్సిన మైక్రోచిప్స్‌ తయారు చేసి ఇవ్వాల్సిందిగా రియాజ్‌ నుంచి సత్తార్‌కు ఆదేశాలు అందాయి. అన్నింటినీ తక్కువ సమయంలో తానొక్కడే తయారు చేయలేనని భావించిన సత్తార్‌... తన భార్య, కుమారులకు విషయం చెప్పకుండా ఈ పని అప్పగించాడు. వారికీ ఈ రంగంలో ప్రవేశం ఉన్నా, పరిపక్వత లేదు. వీరు తయారు చేసిన మైక్రోచిప్స్‌ను రియాజ్‌ ఆదేశాల మేరకు మరో ఐఎం ఉగ్రవాది నౌషాద్‌ వచ్చి తీసుకువెళ్లాడు. అహ్మదాబాద్‌లో పెట్టిన బాంబుల్లో సత్తార్‌ తయారు చేసిన చిప్స్, సూరత్‌ బాంబుల్లో అతడి భార్య, కుమారుడు తయారు చేసిన చిప్స్‌ వాడారు. ఈ కారణంగానే సూరత్‌లో ఒక్క బాంబు కూడా పేలకుండా దొరికాయి. 

    బాట్లా హౌస్‌లో సజీవంగా దొరికిన ఉగ్రవాది ఆరిజ్‌ ఖాన్‌ విచారణ తర్వాత వివిధ ఏజెన్సీలు వరుసపెట్టి ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 2008 అక్టోబరు 3న ఒకేసారి అరెస్టయిన 15 మందిలో సయ్యద్‌ నౌషాద్‌ ఒకడు. ఇతడి విచారణలోనే మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్, సత్తార్‌ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయి. అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సత్తార్‌ సమీప బంధువు రహీంతో పాటు ఫయాజ్, ఫయీజ్‌ అనే ఉగ్రవాదులు చనిపోయారు. వారిద్దరూ 2008 సెప్టెంబరులో ఉగ్రవాద శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చి, సత్తార్‌ వద్ద ఆశ్రయం పొందారనే ఆరోపణ ఉంది. నౌషాద్‌ విచారణలోనే చిప్స్‌ను రియాజ్‌ ఆదేశాల మేరకు సత్తార్‌ తయారు చేసి ఇచ్చినట్లు, తాను హైదరాబాద్‌ వెళ్లి వాటిని తీసుకువచ్చినట్లు అంగీకరించాడు.

    ఐఎం మిస్టరీని ఛేదించిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు 2008 సెప్టెంబరు, అక్టోబరుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్‌ మొత్తానికీ హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టిన, జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్‌ భత్కల్‌ కీలకమని గుర్తించి వేట ప్రారంభించి, 2008 అక్టోబరు 6న ఐఎం మీడియా సెల్‌ ఇన్‌చార్జ్‌ మహ్మద్‌ మన్సూర్‌ అస్ఫర్‌ పీర్భాయ్‌ను పుణేలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. ఆ సమయంలో రియాజ్‌ భత్కల్‌ అక్కడి ఖాండ్వాలోని డాక్టర్‌ అన్వర్‌ అలీ భగ్వాన్‌ ఫ్లాట్‌లో ఉన్నాడు. పీర్భాయ్‌ అరెస్టు సమాచారం అందుకున్న భత్కల్‌ తన అనుచరుడు ఖయాముద్దీన్‌ కపాడియాతో కలిసి అక్కడ నుంచి పరారై హైదరాబాద్‌ వచ్చి సత్తార్‌ను కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అయితే హైదరాబాద్‌ నగరంలో ఉండటం అంత మంచిది కాదని అతడు చెప్పడంతో కర్ణాటకలోని కర్వార్‌కు పారిపోయారు. 2009 జనవరిలో తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో సత్తార్‌ చిక్కాడు.  

    అక్కడ నుంచి తన సోదరుడు ఇక్బాల్‌తో పాటు మరికొందరితో కలిసి రియాజ్‌ భత్కల్‌ దేశం దాటేశాడు. పాకిస్తాన్‌ చేరిన వీళ్లు ఐఎస్‌ఐ రక్షణలో అక్కడి నుంచే అమీర్‌ రజా ఖాన్‌తో కలిసి ఇక్కడ మరికొన్ని విధ్వంసాలు చేయించారు. రియాజ్‌ సమీప బంధువైన యాసీన్‌ భత్కల్‌ ఐఎంకు కో–ఫౌండర్‌గా మారాడు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఇతడే చేయించాడు. అదే ఏడాది ఆగస్టులో నేపాల్‌లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేపట్టిన ఆపరేషన్‌లో యాసీన్‌ చిక్కాడు. ఈ కేసులో ఇతడితో పాటు మిగిలిన వారికీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. యాసీన్‌ సహా ఉగ్రవాదులపై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ పూర్తి కావడంతో పాటు ఇతర ఫార్మాలిటీస్‌ పూర్తి అయితే ఇది అమలయ్యే అవకాశం ఉంది.

  • ‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం  వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు.  కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు  కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్‌ బిహారి.  

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖలీలాబాద్‌కు చెందిన లాల్‌ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు.  దీంతో బిహారి ‘లీగల్‌’గా చనిపోయాడు. 

    ఎలా బయటపడింది
    అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్‌ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్‌ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. 

    భయం.. భయంగా
    బిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. 

    న్యాయ పోరాటం  
    తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్‌ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. 

    కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో  ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్‌’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్‌ బిహారి మృతక్‌’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ,  వీపీ సింగ్‌లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు.  ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. 

    ‘మృతక్‌’ సంఘం ఆవిర్భావం
    ఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్‌లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్‌ సంఘం’(అసోసియేషన్‌ ఆఫ్‌ ది డెడ్‌) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు.  జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. 

    మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్‌’ సర్టిఫికెట్‌  జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. 

    లాల్‌ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు.  సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.

    తెరకెక్కిన ‘కాగజ్‌’
    లాల్‌ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్‌ కౌశిక్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడు ‘కాగజ్‌’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. 
    దిలీప్‌ మాదిరెడ్డి 

    (చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టా‍ల్సిందే..)

  • సన్నగా తెల్లగా ఉండే ఇరవై ఆరేళ్ళ సప్తపర్ణి ఎప్పుడూ తెల్ల నూలు చీరలే కడుతుంది. నల్లటి స్టికర్‌ బొట్టు పెట్టుకుంటుంది. ఆ రోజు ప్రభంజన్‌ లంచ్‌ అవర్‌లో తన బ్రేకప్‌ గురించి చెప్పాడు.‘‘బ్రేకప్, నల్లటి వెన్నెల. అవి రెండు రంగులూ కలిసి ఉంటాయి.’’‘‘అవును. మనిద్దరి బ్రేకప్‌లు ఒకే రోజు జరిగాయి!’’ ఆమె చెప్పింది.‘‘అమ్మ నన్ను పెళ్ళి చేసుకోమని పోరుతోంది. మీ అమ్మ కూడా నిన్ను పోరుతూండచ్చు. కలిసి ప్రయాణించినా, కలిసి ఉన్నా ఓ మనిషి గురించి ఇంకో మనిషి ఎక్కువగా అర్థం చేసుకోగలడు. మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. పాంజిమ్‌కి వెళ్దాం. అక్కడ ఒకరి ముందు మరొకరం లోదుస్తులని మాత్రం విప్పద్దు.’’ఆమె సరే అనడానికి కొన్ని రోజులు తీసుకుంది.సెలవులు రాగానే ఇద్దరూ ప్రయాణమయ్యారు. 

    మాలాలోని ఏర్‌ బీఎన్‌బీకి చేరుకున్నాక, అతని ఐడీని చెక్‌ చేసి, స్టుడియోని హేండ్‌ ఓవర్‌ చేశారు. ఆమె మొహం కడుక్కోగానే పెర్క్‌లేటర్‌లో కాఫీ కలిపి ఇచ్చాడు. ఆమె స్నానం చేశాక చెప్పాడు.‘‘కూరగాయలు తెచ్చాను. ఇద్దరం కలిసి వంట చేద్దాం. నేను సాంబార్‌ మాస్టర్‌ని.’’సైట్‌ సీయింగ్‌ నుంచి తిరిగి వచ్చాక సోఫాలో కూర్చుని టీవీ ఆన్‌ చేశారు. అతను యూట్యూబ్‌లో రాజేష్‌ ఖన్నా ఇన్‌స్ట్రుమెంటల్‌ మెలోడీస్‌ పెట్టాడు. ‘ఓ మెరే దిల్‌ కె చెయిన్‌’... ‘రూప్‌ తెరా మస్తానా’...‘‘ఇఫ్‌ యు డోంట్‌ మైండ్‌...’’ కొద్దిసేపాగి చెప్పాడు.

    ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఆమె మెళ్ళోని బంగారు గొలుసుతో ఆడుకోసాగాడు. ఆ ఆడియో అయ్యాక ‘జెంటిల్‌మేన్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ పెట్టి, ఆమె పొత్తి కడుపుకి తలని ఆనించి, ఆమె నడుం చుట్టూ చేతులు వేసి చెప్పాడు.‘‘బద్ధకపు బ్రహ్మ! నేను పుట్టిన రోజే నువ్వు మా పక్కింట్లో పుడితే, ఇంతకాలం నిన్ను మిస్‌ అయ్యేవాడిని కానుగా.’’ఇద్దరూ రాత్రి ‘ఎయిటీన్‌ జూన్‌’లోని ‘యాంగ్రీ సర్దార్జీ’ హోటల్‌లో భోజనం చేశారు. తను వంట ఎందుకు నేర్చుకుంది, ఏడాది పెద్దయిన అన్నయ్యతో సమష్టిగా నీవి, నావి అనే తేడా లేకుండా బట్టలు వాడటం... చాలా చెప్పాడు. ఆ రాత్రి ఆపిల్‌ని నిలువు ముక్కలు కోసి ఆమె నోటికి అందించాడు.

    ‘‘నువ్వు నాకు కావాలి డకీ.’’ మంచం మీద చేరాక చెప్పాడు.అతను కుడిచేతి చూపుడువేలితో ఆమె జుట్టుని, కనుబొమలని, కళ్ళని, చెంపలని, ముక్కుని, చెవుల్ని, చిటికెన వేలుతో చెవుల్లోని భాగాన్ని, గడ్డాన్ని మృదువుగా మిల్లీమీటర్‌ మిస్‌ అవకుండా స్పర్శించాక అడిగాడు.‘‘నోరు తెరు.’’ ఆమె తెరిస్తే, వేలితో నాలికని, నాలిక కింద భాగాన్ని, దవడ లోపలి, పై భాగాన్ని స్పర్శించాక, ఆమె చేతుల్ని, చేతివేళ్ళ మధ్య భాగాన్ని, మెడ, నడుము, కాలి వేళ్ళ మధ్యని... అరిపాదాల దాకా స్పర్శిస్తూంటే ఆమె దాన్ని అనుభవించింది. వేలిని తన నాలికతో నాకి చెప్పాడు.‘‘చేదనేదే లేదు. అంతా తీపే. ఓ చోట చక్కెర, ఇంకోచోట తేనే, మరోచోట మకరందం. చిన్నప్పుడు పూలని కోసి కాడని నోట్లో ఉంచుకుని తాగిన మకరందం.’’ఆ రాత్రి సప్తపర్ణి తన బాల్యం గురించి చెప్పింది. ఆమె కాసేపటికి అటు తిరగగానే చెప్పాడు.

    ‘‘ఇటు తిరుగు డకీ. నువ్వు అటువైపు తిరిగితే నాకు దూరమయ్యావు అనిపిస్తోంది.’’ఆమె మళ్ళీ అతనివైపు తిరిగాక, ఆమె నడుము మీద చేతిని, ఆమె కాలు మీద తన కాలుని వేసి, కళ్ళు మూసుకుని చెప్పాడు.‘‘ఇప్పుడు ఎంతో భద్రంగా ఫీల్‌ అవుతున్నాను.’’ఒకవైపే తిరిగి పడుకోవటం అసౌకర్యంగా ఉండటంతో అతను నిద్రపోయాక, అతని నుదుటి మీద చుంబించి, అవతలివైపుకి తిరిగి పడుకుంది. ‘డకీ’ అంటే ‘ప్రియమైన, ముద్దుల’ అని గూగుల్‌ చేసి తెలుసుకుంది.‘‘ఇది నీ మొహానికి నప్పుతుంది. బ్లాక్‌ స్టికర్‌ బాలేదు.’’ప్రభంజన్‌ మర్నాడు ఎడమ చేత్తో ఆమె చుబుకం పట్టుకొని, తనతో తెచ్చిన సింగార్‌ ఎర్ర తిలకం ట్యూబ్‌లోంచి పుల్లని తీసి, చిన్న పిల్లలు కదలకుండా అటెన్షన్‌ కోసం ‘ళో, ళో, ళో’ అన్నట్లుగా అంటూ ధనియం గింజంత బొట్టుని దిద్ది జుట్టుని దువ్వాడు.

    లంచ్‌లో కేబిన్‌లో ్రౖఫై డ్‌ రైస్, మష్రూమ్‌ కర్రీని ఆమెకి స్పూన్‌తో తినిపించాడు. ఆమె మనసు తడైంది. తన తాత తర్వాత మొక్కజొన్న గింజలని వొలిచి ఇచ్చింది, జడవేసింది, బొట్టు పెట్టింది, నోటికి తినిపించింది ఇతనే అనుకుంది.ఆ మూడు రోజులు అతను తన స్పర్శని వదలలేకపోవడం గుర్తించింది. ఇంట్లో జుట్టు కొసలని నిమురుతూ, భుజానికి తన తలని ఆనించి, తన నడుం చుట్టూ, లేదా భుజం మీద చేతిని వేసి, బయట చేతిని పట్టుకునే ఉంటాడు.ఆ రాత్రి మెలకువ వచ్చిన ప్రభంజన్‌ చేత్తో తడిమితే ఆమె ఒళ్ళు తగల్లేదు. కళ్ళు తెరిచి చూస్తే, కాళ్ళు మడిచి, మోకాళ్ళల్లో తల ఉంచుకొని ఏదో ఆలోచించే ఆమె కనిపించింది. అతను నిద్రమత్తులో ఆమె తలని తన ఛాతీ మీదకి జరిపి ‘పడుకో’ అని ఆమె వీపు మీద చిచ్చి కొడుతూ నిద్రపోయాడు.

    రైలు కాచిగూడ స్టేషన్‌కి చేరుకోడానికి ముందు సప్తపర్ణి అతనితో చెప్పింది.‘‘ప్రభూ. ఈ మూడు రోజుల్లో నన్ను నేను తెలుసుకున్నాను. ఈ మూడు రోజులూ నీ ప్రేమని అనుభవిస్తూంటే నా మనసు ఉక్కిరిబిక్కిరైంది. నీలో మా తాతని, ప్రేమికుడిని, తల్లి దూరమైపోతుందని భయపడే పిల్లవాడిని చూశాను. నిన్ను కోల్పోతే, తాతని కోల్పోయి నేను అనుభవించిన క్షోభకి ఎన్నో రెట్లు... అది తట్టుకోలేను. సామాన్య ప్రేమని తప్ప నువ్విచ్చిన లాంటి ప్రేమని కోల్పోవడం తట్టుకో... నన్ను నీలా ఎవరూ ప్రేమించలేరు. మనం పెళ్ళి చేసుకోవద్దు.’’అతను ఆమెవైపు విభ్రాంతిగా చూశాడు. ఇద్దరూ ఒకరి కన్నీటిని మరొకరు తుడిచారు. స్టేషన్‌లోంచి బయటికి వచ్చాక, చెరో ఆటో ఎక్కేముందు ప్రభంజన్‌ ఆమె చేతిలో ఎర్ర తిలకం ట్యూబ్‌ని ఉంచాడు. 
     ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

  • ఉదయం 5 గంటలు.. పేపర్‌ బాయ్‌ ప్రతి ఇంటి గుమ్మానికి పేపర్‌ వేసుకుంటూ సైకిల్‌ మీద వెళ్తుంటే, మరోపక్క ఒక ఫేమస్‌ కోచింగ్‌ సెంటర్‌ బయట పెద్ద లైన్స్‌ . ఆ లైన్స్‌ లో వయసుపైబడిన వందలాది మంది ఆడవాళ్లు.తలపై బట్టలు కట్టుకుని, చేతిలో ఫైళ్లు పట్టుకుని, కళ్లల్లో పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఉండే టెన్షన్స్‌ తో నిల్చున్నారు! ఆ లైన్స్‌  మధ్యలో యాభై ఐదేళ్ల ఇన్నోసెంట్‌ మామ్‌ టైప్‌ మహిళ లలిత. మిగతా వాళ్లంతా భయంతో, టెన్షన్స్‌ తో ఉంటే, ఆమె మాత్రం కూల్‌గా, ఎగ్జామ్‌ పేపర్‌ ముందే తెలిసిన స్టూడెంట్‌లా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. ఆ నవ్వులు చిందిస్తున్న ముఖాన్ని గమనించిన వెనుక నిల్చున్న మహిళ ఓపిక పట్టలేక అడిగింది: ‘‘నువ్వెన్నిసార్లు ఈ ఎగ్జామ్‌ రాశావు?’’లలిత నవ్వుతూ ‘‘ఇదే ఫస్ట్‌ టైమ్‌!’’ అంటే, వెంటనే ఆమె వంకరగా నవ్వుతూ ‘‘ఓహో! అందుకేనా, ఇంత కాన్ఫిడెన్స్‌.

    నాకిది పదోసారి!’’లలిత ఆశ్చర్యంగా ‘‘ఏమయ్యింది? ఎందుకు అన్నిసార్లు ఫెయిల్‌ అయ్యావు?’’అంటే ఆమె ‘‘నా పేరు సూర్యకాంతం.’’లలిత ఒక్కసారిగా ‘‘అయ్యో! అందుకేనా పాస్‌ కాకుండా ఉన్నావు? నా పేరు లలిత. నేను చాలా మంచి అత్తను అబ్బా! అందుకే నాకు ఇంత కాన్ఫిడెన్స్‌. పైగా మా మేనకోడలు కూడా నన్ను మెచ్చుకుంది. ఈ కోచింగ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ తీసుకుని సర్టిఫికెట్‌ తీసుకుంటే, ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేదని చెప్పింది!’’సూర్యకాంతం బాధగా ‘‘నా పేరు చెప్పగానే, నన్ను ‘గయ్యాళి అత్త’ లిస్ట్‌లో పెడతారు. వచ్చిన సంబంధాల్లో సగం ఇంటివరకు కూడా రాకుండానే ఆగిపోతుంటాయి. వచ్చినవి కూడా నేను సమాధానం సరిగా చెప్పలేదని పోతున్నాయి.’’లలిత నవ్వుతూ ‘‘ఏం చేస్తాం! ఇంతకాలం పెళ్లి చూపుల్లో అత్తలే ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కోడళ్ల రాజ్యం కదా! అందుకే కోడళ్లే అత్తలను ప్రశ్నలు అడుగుతున్నారు!’’అది విని సూర్యకాంతం తన గోడు చెప్పుకోవడం మొదలుపెట్టింది. 

    ‘‘ఇప్పుడున్న కోడళ్లు ప్రతి ఒక్కరు పరీక్షలు, షరతులు, రౌండ్స్‌. ఇలా వచ్చిన సంబంధాలన్నింట్లోనూ నేను ఫెయిల్‌. అందుకే మా వాడు ఈ ‘ఉత్తమ అత్త ట్రైనింగ్‌ సెంటర్‌’లో చేర్పించాడు. ఇక్కడ పెళ్లి చూపుల్లో పాస్‌ అయ్యేలా ట్రైనింగ్‌ ఇస్తారట!’’లలిత ‘‘అంటే ఇప్పటివరకు ఎంతమంది కోడళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పావ్‌?’’సూర్యకాంతం తల పట్టుకుని ‘‘మొదట సైలెంట్‌ కోడలు. ఆ అమ్మాయికి మాట్లాడటం ఇష్టం లేదు. నన్ను ఐదు నిమిషాలు నోరు మూసుకోమంది. నేను కిచెన్స్‌ లో మాడు వాసన వచ్చిందని, ‘పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయావమ్మా?’ అన్నా. అంతే, ఆ సంబంధం క్యాన్సిల్‌!’’లలిత ‘‘ఆహా! రెండోసారి?’’‘‘రెండోసారి మోడ్రన్స్‌  కోడలు. ‘నా పుట్టినరోజుకి ఏఐ యానిమేటెడ్‌ వీడియో చేసి రీల్‌ పెడతావా?’ అంది. నాకు అవి రాదనగానే ఆ సంబంధం కూడా ఫెయిల్‌.’’ఇంతలో లైన్‌ ముందుకు కదిలింది. ఇద్దరూ కూడా నడుస్తూనే మాటలు. 

    సూర్యకాంతం ఎమోషనల్‌ ఫ్లోలో చెప్తూ.. ‘‘మూడోసారి వచ్చిన కోడలైతే వరుస ప్రశ్నలు:మీకు కొడుకు, కోడలును విడదీసే ప్లాన్స్‌ ్స ఏమైనా ఉన్నాయా?మీకు కాళ్లు చేతులు బాగానే పనిచేస్తున్నాయా? లేదా కోడలు వచ్చాక మంచాన పడతారా?మీకు చాడీలు చెప్పే అలవాటు ఉందా? మీ కూతురుతో నన్ను కంపేర్‌ చేస్తారా?నేను సంతోషంగా ఉంటే మీ మూతి వంకరపోతుందా?  మీకు పెళ్లి అయిన రెండో నెలలోనే కోడలికి కడుపు రావాలని కోరుకుంటారా? మీ పని మీరు చూసుకుంటారా? లేదా అన్ని పనులూ మీరు చెప్పినట్లే చేయాలని అంటారా? మీ కోడలు బంగారం, కారు లేదా ఖరీదైన వస్తువులు ఏమైనా కొంటే, మీ బీపీ పెరిగిపోతుందా?మీ కూతురుకి పుట్టిన పిల్లలు అబ్దుల్‌ కలాంలానూ, కోడలికి పుట్టిన పిల్లలు ఆవారాగానూ కావాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? అని వరుస ప్రశ్నలతో నన్ను ఆసుపత్రికి పంపించింది!’’సూర్యకాంతం ఇవన్నీ  చెప్తుంటే, లలిత ముఖం చిన్నబోయింది.

    ‘‘ఇన్ని అడుగుతారా?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.సూర్యకాంతం ‘‘ఇంకా ఏం! ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కూడా చెక్‌ చేస్తారు! అత్తమామలకు షుగర్, బీపీ ఉంటే ముందే రిజెక్ట్‌ చేస్తారు. నాకు షుగర్‌ లేదు కానీ బీపీ ఉంది!’’ అనగానే లలిత నవ్వు ఆపుకోలేకపోయింది.వెంటనే, సూర్యకాంతం ‘‘ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా బాగుంది. మా వాడు ఎలాగైనా పాస్‌ అవ్వమ్మా అని రోజూ బతిమాలుతున్నాడు. ఆ సంబంధానికి మూడు రౌండ్ల పరీక్ష మెయిన్స్‌ ్స, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్స్‌ అంట!’’లలిత ‘‘ఏంటీ ప్రాక్టికల్స్‌?’’సూర్యకాంతం ‘‘పెళ్లికూతురు రెండు రోజులు మా ఇంటికి వచ్చి నన్ను గమనిస్తుందట!’’పక్కనే మరో మహిళ వచ్చి ‘‘అప్పుడు నువ్వు ఉదయం లేవగానే ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ టీ ఇచ్చేసి మచ్చిక చేసుకో! సెట్టయిపోతుంది!’’ వారిద్దరూ నవ్వుకున్నారు.

    సూర్యకాంతం మరోసారి విషయానికి వచ్చి ‘‘పాతకాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు.’’వెంటనే, వెనుక నిల్చున్న రాధ స్పందిస్తూ, ‘‘అవునమ్మా! మా అత్త నన్ను పెళ్లి చూపుల్లోనే నడవమని చెప్పి, ఇంట్లో పనులకు బాగా పనికి వస్తానా లేదా చెక్‌ చేసుకుంది! ఇక పెళ్లి తర్వాత అయితే, కూర్చోవడం నుంచి ఎలా నవ్వాలో, ఏడ్వాలో కూడా డైరెక్షన్స్‌ ఇచ్చేది!’’వెంటనే మరో మహిళ ‘‘ఇక ఏ రోజు అయినా, నేను కాస్త ఆరోగ్యం బాగోలేక మంచం మీద వాలితే చాలు, మా అత్త ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతుండేది. ‘ఈ కోడల్ని నేనే చూసుకోవాలేమో!’ అన్న భయంతో!’’మళ్లీ మరో మహిళ వాయిస్‌– ‘‘మా అత్త అయితే, మా ఆడపడుచుతో ఫోన్స్‌  మాట్లాడేటప్పుడు సిగ్నల్‌ బాగోలేదంటే నా దగ్గరే అన్స్‌ లిమిటెడ్‌ కాల్‌ రీచార్జ్‌ చేయించుకునేది!’’సూర్యకాంతం నవ్వుతూ ‘‘అదేమిటి! సీరియల్స్‌ చూసి స్ట్రాటజీలు నేర్చుకోవడానికి అన్స్‌ లిమిటెడ్‌ నెట్, డిష్‌ రీచార్జ్‌లు కూడా నీతోనే చేయించుకునేదని మర్చిపోయావా?’’వెంటనే అందరి దగ్గర నవ్వులు ‘‘అవునవునూ’’ అని అందరూ ఒకటేసారి రెచ్చిపోయారు.

    మరొక మహిళ ‘‘ఇంతకు ముందు అత్తలు కట్నాల కోసం మాత్రమే కష్టపెట్టేవారు. మన అత్తలు కట్నాలతో పాటు కోడళ్ల జీతాలు అడిగితే లోకం మారదూ!’’సూర్యకాంతం కాస్త ఊపిరి వదిలి ‘‘అందుకే పాత అత్తల వేషాలు చూసి అప్పటి కోడళ్లు అమ్మాయిలనే కనేసి ఈ బాధను రివర్స్‌ చేశారు.’’లలిత ‘‘కాని, ఇప్పుడు కూడా బాధితులం మనమే అయ్యాం కదా!’’సూర్యకాంతం పెదవి తిప్పేస్తూ, ‘‘అవును, కాని, మేం కూడా బాధితులమే. అయినా మేం మా అత్తల్లాగా చేయం. కావాలంటే ఏ వృద్ధాశ్రమంలో అయినా చేరుతాం. కావాలంటే సపరేట్‌గానైనా ఉంటామని చెప్పినా కూడా ‘పరీక్ష పాస్‌ అయితేనే పెళ్లి!’ అని పెళ్లికూతుళ్లు, వాళ్ల తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు.’’లలిత ‘‘అంటే అప్పుడు, ఇప్పుడు కూడా కష్టాలు పడాల్సింది మనమేనా?’’సూర్యకాంతం ‘‘అవునమ్మా, నాకు అబ్బాయి పుట్టిన రోజు.. ఎంత ఊపిరి పీల్చుకున్నానో! నాకు కూతురు పుట్టలేదు, హమ్మయ్య అని. పైగా అబ్బాయి పుట్టినందుకు శివయ్యకు వెయ్యి టెంకాయలు కొట్టి, మొక్కు చెల్లించుకున్నా.’’వెంటనే వెనక ఉన్న మరో ఫెమినిస్ట్‌ బామ్మ యాంగ్రీ బర్డ్‌ ఫేస్‌ పెట్టి.. ‘‘అదేంటీ? అమ్మాయి పుట్టకూడదని అనుకున్నావా? ’’ అని కాస్త గట్టిగానే అడిగింది. 

    పాత కాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు. 

    అందరూ ఒక క్షణం అయిష్టంగా చూడగా.. సూర్యకాంతం చాలా శాంతంగా ‘‘నువ్వు కాస్త ఆగుతావా.. మొదట మా అత్త వేసే వేషాలు చూసి, నా మాదిరే మా కూతురు కూడా కష్టపడి చదువుకొని, సంపాదించి చివరికి ఇంట్లో ఇలా ప్రతిక్షణం పరీక్షలు రాసుకుంటూ బతకాలి అనిపించి. అలా అనుకున్నానమ్మా!’’ అదంటూనే క్యూలో ఉన్న అత్తలందరూ సేమ్‌ ఫీలింగ్‌తో తల ఊపారు.‘‘ఇప్పుడిలా అమ్మాయిల జీవితాలు స్మార్ట్‌గా, స్వేచ్ఛగా మారి, అబ్బాయిల తల్లులకే ఇలాంటి శిక్షలు వస్తాయని తెలిసుంటే, అప్పుడే ఆ టెంకాయలన్నీ నా తల మీదే కొట్టుకునేదాన్ని!’’అని సూర్యకాంతం ముఖం చిట్లించగానే, మొత్తం క్యూలో నిల్చున్న అత్తలందరూ, ‘సాడ్‌ ఫేస్‌’ పెట్టుకున్నారు. అప్పుడే పక్కన ‘‘సమోసాలమ్మా! సమోసాలు!’’ అని ఓ అబ్బాయి అటుగా వెళ్తుంటే, సూర్యకాంతం అతన్ని ఆపి, ‘‘ఓ బాబు, నాలుగు సమోసాలు పెట్టమ్మా. కాస్త కడుపు నింపుకుందాం.’’ అని డబ్బు అతని చేతికి ఇచ్చింది. అతను కూడా ఓ పేపర్‌లో సమోసాలు ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

    సూర్యకాంతం ఒకటి గబగబా కొరికేసి, పేపర్‌ వైపు చూసింది.‘‘అయ్యో! ఇది ఇవాళ్టి పేపరే కదా? అప్పుడే ఉదయం పేపర్, బజ్జీల బండికి  వచ్చేసిందా?’’ అని తలపైకెత్తి చూస్తూ, ‘‘ఏంటీ? నా బాధ చెప్పేలోపే సాయంత్రం అయిపోయిందా?’’ అని కోచింగ్‌ సెంటర్‌ గేట్‌ దగ్గరకు పరుగులు తీసింది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు క్లోజింగ్‌ బోర్డ్‌ గేటుకు తగిలిస్తూ.. ‘‘ఇవాళ్టి అడ్మిషన్స్‌ అయిపోయాయి! రేపు ఉదయం మళ్లీ ట్రై చేయండి! ’’ అని చెప్పి, సూర్యకాంతం బ్యాచ్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. సూర్యకాంతం మూడు సమోసాలు చేతిలో, నాల్గోది నోట్లో పెట్టుకుని నడుస్తూ ‘‘అమ్మో! ఈ కోచింగ్‌ సెంటర్‌ అడ్మిషన్స్‌  దక్కలేదంటే నా కొడుకు ఎంత ఫీల్‌ అవుతాడో! పాపం!’’అంటూ కాస్త భయంగా, ఇంకాస్త సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న వెంటనే, సూర్యకాంతం ఎదుట అప్పటికే ఒక గ్లాస్‌ ‘ఎమోషనల్‌ జ్యూస్‌’ను కళ్లల్లోంచే కార్చేసిన కొడుకు కనిపించాడు. కొడుకు చేతులు జోడించి ‘‘అమ్మా, ప్లీజ్‌! పెళ్లికూతురి తల్లి సర్టిఫికేట్‌ తప్పకుండా కావాలంది. లేకపోతే పెళ్లి కాదు!’’ అన్నాక, సూర్యకాంతం ఏం మాట్లాడకుండా, కళ్లతోనే ‘‘రేపు తప్పకుండా సాధిస్తా’’అనే భరోసా ఇచ్చి, నిద్రపోవడానికి గదిలోకి వెళ్లిపోయింది.

    కోడళ్ల పుట్టింటి ఇష్యూస్‌ చాలా సెన్సిటివ్‌.. పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు.  

    అమ్మను తిట్టలేక, మరీ మరీ బతిమాలలేక, కొడుకు కూడా గదిలోకి వెళ్లిపోయాడు.తర్వాతి రోజు ఉదయం 5 గంటలు.. ఈసారీ అందరికంటే ముందే సూర్యకాంతంతో పాటు లలిత, రాధ, జానకి, విశాలాక్షి అలా ఆమె మొత్తం ‘అత్తల బ్యాచ్‌’ క్యూలో ఫస్ట్‌లోనే నిలబడ్డారు.ఉదయం ఎనిమిది గంటలకు అడ్మిషన్స్‌  తీసుకుని, తొమ్మిదికల్లా క్లాస్‌లోకి బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చేశారు!తర్వాత ఫుల్‌ జోష్‌తో ఆ ఒక నెల కోర్సు: కోడళ్ల సైకాలజీ,ఫ్యామిలీ రిలేషన్స్‌  మేనేజ్‌మెంట్,కోడళ్ల మూడ్‌ స్వింగ్స్‌ డీకోడ్‌ టెక్నాలజీ,అత్తగా నడుచుకోవాల్సిన విధానాలు, అత్త ఎప్పుడెప్పడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు?ఏ పనులు మాత్రమే అత్త చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదు! ఇలాంటివన్నీ బాగా నేర్చుకుని, ప్రాక్టీస్‌ చేసి, చివరికి మొత్తం బ్యాచ్‌ ‘సర్టిఫైయిడ్‌ అత్తగార్లుగా’ బయటికి వచ్చేశారు.

    సరిగ్గా ఒక నెల తర్వాత సూర్యకాంతం ఎగ్జామ్‌ డే వచ్చేసింది. ఆ రోజు సూర్యకాంతం అలారం పెట్టుకుని, ఉదయం త్వరగా లేచింది. కోచింగ్‌లో నేర్పించిన పాఠాలన్నీ రివైజ్‌ చేసి, ‘ముఖ్యమైన ప్రశ్నల’ సమాధానాలను బట్టీకొట్టి రెడీ అయింది. ‘‘పట్టుచీర కట్టుకుంటే, పెళ్లికూతురు ఫీల్‌ అవుతుందేమో’’ అని అనుకుంటూ, తన ఫేవరెట్, అన్నయ్య కొనిచ్చిన సెంటిమెంట్‌ చీర కట్టుకుంది. దేవుడికి దండం పెట్టుకుని, ఫ్యామిలీతో కలిసి కొడుకు పెళ్లిచూపులకు బయలుదేరింది. సూర్యకాంతం మాత్రం టెన్షన్స్‌ తో వణుకుతుండగా, ఆమె కోచింగ్‌ బ్యాచ్‌ ఫ్రెండ్స్‌ సైలెంట్‌ సపోర్ట్‌గా పక్కనే కూర్చున్నారు. టేబుల్‌పై టీ గ్లాసులు, పూలదండలు, కొబ్బరికాయలు ఇలా సంప్రదాయ పెళ్లిచూపుల ఆంబియన్స్‌తో పెళ్లి సంబంధం వాళ్ల ఇల్లు ఉంది. పక్క గదిలోనే, అమ్మాయితో పాటు, ప్రశ్నపత్రం తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా కూర్చున్నారు. 

    అమ్మాయి నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది.సూర్యకాంతాన్ని చూసి ‘‘మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అని అడిగింది. సూర్యకాంతం భయంతో తల ఊపింది.అమ్మాయి చిన్నగా నవ్వుతూ, ఆమె తల్లి చేతిలోని పేపర్‌ తీసుకుని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్న: ‘‘ఉదయం మీ అబ్బాయి ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత, మీరు ఎంతసేపు నాకు ‘తలనొప్పి ఉంది’ అని చెప్పి, గదిలోకి వెళ్లకుండా ఉండగలరు?’’సూర్యకాంతం కంగారు పడుతూ ‘‘చాలాసేపు ప్రయత్నిస్తా!’’ అని చెప్పింది.రెండో ప్రశ్న: ‘‘కోడలు చేసిన చపాతీ రౌండ్‌గా లేకపోతే ఏం చేస్తారు?’’ సూర్యకాంతం ‘‘వాట్‌ ఏన్‌ అమీబా చపాతీ! అనుకుంటూ తినేస్తా!’’ వెంటనే, సూర్యకాంతం ఫ్రెండ్స్‌ క్లాప్స్‌ కొట్టి ధైర్యం నింపారు. మూడో ప్రశ్న: ‘‘కోడలు పుట్టింటికి వెళ్తే ఎన్ని రోజులకు మీరు ఫోన్స్‌  చేస్తారు?’’ ఈ ప్రశ్నకు సూర్యకాంతం చాలాసేపు ఆలోచించింది.

    ఇది ఒక ట్రికీ ప్రశ్న అని వెంటనే గ్రహించి, కోచింగ్‌ సెంటర్‌లో నేర్పిన ‘క్రిటికల్‌ థింకింగ్‌ మోడ్‌’ని యాక్టివేట్‌ చేసింది.అమ్మాయి ఇంటిని ఒక్కసారి పూర్తిగా గమనించింది. ‘కోడళ్ల పుట్టింటి ఇష్యూస్‌ చాలా సెన్సిటివ్‌... పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. ‘అదే పుట్టింటి కంటే అత్తింట్లోనే ఆ అమ్మాయికి బాగుంటే వెంటనే పిలవాలి.’ అని తనలో తాను అనుకుంది. అలా కోచింగ్‌లో నేర్పినట్లే సిచ్యుయేషన్స్‌ ను అంచనా వేసి, చాలా తెలివిగా ‘‘ఒక గంటకే ఫోన్స్‌  చేస్తా. జాగ్రత్తగా చేరావా? అని తెలుసుకుంటా. తర్వాత తీరిక దొరికినప్పుడు నిన్నే తిరిగి కాల్‌ చేయమని చెప్తా.’’ అని సమాధానం చెప్పింది.
    అది విన్న వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్‌ కళ్లతోనే ‘‘అద్భుతం! టాప్‌ ఆన్సర్‌!’’ అని అభినందనలు కురిపించారు.అప్పుడే అమ్మాయి లేచి, అత్తగారిని హత్తుకుంది. అబ్బాయి సగం ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, అందరూ చప్పట్లతో పెళ్లి గంటలు  మోగించారు.

    సూర్యకాంతం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెల తిరగకముందే నిశ్చితార్థం, పెళ్లి, అన్ని పనులూ చకచకా పూర్తి చేసి, వారిద్దరినీ హనీమూన్స్‌ కి పంపించేసింది. నూతన దంపతులను హనీమూన్స్‌ కి పంపిన వెంటనే, సూర్యకాంతం కూడా ‘‘నాకు కూడా కాస్త బ్రేక్‌ కావాలి!’’ అంటూ, తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది.అలా దేవుడిని దర్శించుకుంటూ, కొంచెం మానసిక ప్రశాంతత, కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఆనందం ఇవన్నీ ఆస్వాదిస్తూ, రెండు నెలల తర్వాత  తిరిగి ఇంటికి చేరుకుంది.ఇంటికి వచ్చిన వెంటనే కోడలు ఆప్యాయంగా పలకరిస్తూ ‘‘అత్తగారూ, ఒక గుడ్‌ న్యూస్‌! మీరు వెంటనే ‘ఉత్తమ నాన్నమ్మగా మార్చే కోచింగ్‌ సెంటర్‌’లో జాయిన్స్‌  కావాలి. నేను తల్లి కాబోతున్నా!’’ అని చెప్పగానే, సూర్యకాంతం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.‘‘అయ్యో దేవుడా! ఇప్పుడే అత్త పరీక్ష పాస్‌ అయ్యా, ఇప్పుడు మళ్లీ నాన్నమ్మ పరీక్షా?!’’ అని ఏడుస్తూ దేవుడిని ప్రశ్నించింది. ఆమె వెనకనే వచ్చిన కోడలి తల్లి సత్య, సూర్యకాంతాన్ని చూస్తూ, ‘‘నీకు బాగా అయ్యింది!’’ అంటూ పకపకా నవ్వుతూనే ఉంది.

    ఇంతలో ఒక మహిళ వాయిస్, ‘‘అమ్మాయి సత్యా, సత్యా.. నిద్ర లేయ్‌! ఎందుకలా నిద్రలోనే నవ్వుకుంటున్నావ్‌?’’ అని గట్టిగా పిలిచింది.సత్యా ఒక్కసారిగా నిద్రలేచి చూసింది. ఎదురుగా ఆమె అత్తగారు. ఆమె చేతులు నడుముపై పెట్టుకుని ‘‘అమ్మాయి సత్యా! నీకు ఆఫీస్‌కి టైమ్‌ అవుతోంది. వెళ్లి త్వరగా నాకు టీ పెట్టి, లంచ్‌ చేసుకుని, ఆఫీస్‌కి రెడీ అవ్వు!’’ అంటూ సత్యను కిచెన్‌ వైపు పంపింది. సత్యా మనసులో ‘‘అయ్యో! ఇదంతా కలా?’’ అనుకుంటూనే, తన స్నేహితురాలు సూర్యకు ఫోన్స్‌  చేసింది. ‘‘ఓసేయ్‌ సూర్య! నిన్న నన్ను ‘నీకు ఇద్దరూ ఆడపిల్లలేనా?’ నేను ఎంత అదృష్టవంతురాలినో! నాకు అబ్బాయి పుట్టాడు! అని నన్ను అవమానించావుగా.. ఒక ఇరవై ఏళ్లు ఆగు. ఎవరి అదృష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది!’’ అని చెప్పి ఫోన్స్‌  కట్‌ చేసింది.ఫోన్స్‌  అవతల సూర్యా ఇంకా అయోమయంలో ఉండగా, ఇవతల సత్య మాత్రం శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కంటే ఎక్కువ గర్వంతో, చిన్న చిరునవ్వుతో తన రోజును ప్రారంభించింది.  

    -దీపిక కొండి 

National

  • శ్రీనగర్‌: ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతితో జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడటంతో ఆదివారం కశ్మీర్ లోయతో పాటు జమ్మూలోని పలు ప్రాంతాల్లో  నిరసనలు మిన్నంటాయి. షియా సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రజలందరూ సంయమనం పాటించాలని,  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

    అయతొల్లా అలీ ఖమేనీ మృతి దరిమిలా శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని మెజారిటీ ప్రాంతాలు, జమ్ము శివారులోని భటిండి, రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఇరాన్‌లో ఉన్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఇతరుల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని భరోసా అన్నారు.

    శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై బలప్రయోగం చేయవద్దని, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం నిగ్రహంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ‘ఎక్స్’ వేదికగా కోరారు. మరోవైపు ఈ ఆకస్మిక నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.  

    ఇది కూడా చదవండి: పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు 

  • శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోమారు తన కవ్వింపు చర్యలను ప్రదర్శించింది. ఆదివారం  పూంచ్‌ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక అనుమానాస్పద డ్రోన్‌ భారత గగనతలంలోకి చొరబడటంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్‌ల వద్ద పహారా కాస్తున్న సైనికులు  ఆకాశంలో డ్రోన్‌ అసాధారణ కదలికలను గుర్తించారు. అది పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్‌గా నిర్ధారించుకున్న వెంటనే సైన్యం దాన్ని కూల్చివేసేందుకు పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. 

    భారత బలగాల కాల్పుల ధాటికి తాళలేక ఆ డ్రోన్‌ వెంటనే తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 27న కూడా పూంచ్‌ సెక్టార్‌లోనే సరిహద్దు రేఖ వెంబడి ఒక డ్రోన్ కనిపించగా, అప్పుడు కూడా భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది.

    వరుసగా డ్రోన్లు చొరబడుతుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించాయి. ఈ డ్రోన్ చొరబాటు వెనుక భారత భూభాగంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను చేరవేసే కుట్ర ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా తాజా ఘటనలో డ్రోన్ ద్వారా ఏవైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచారా అనే కోణంలో అణువణువూ గాలిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సరిహద్దుల వెంబడి భారత్ తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది.
     


     

     

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. ముఖ్యంగా అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన వ్యూహాలకు పదును పెడుతూ, దక్షిణ తమిళనాడులో పార్టీ పట్టును మరింత సుస్థిరం చేసుకునే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని సమాచారం.  

    ఎంపీ కనిమొళిని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం  యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే  పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ స్థానంలో కనిమొళిని బరిలోకి దింపేలా అంతర్గత చర్చలు సాగుతున్నాయని సమాచారం. అనారోగ్య కారణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు రాధాకృష్ణన్ ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి తెలియజేశారని సమాచారం.

    ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ మార్పును బలపరుస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది కనిమొళి రాకకు సంకేతమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
    దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోదరి అయిన కనిమొళి ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో డీఎంకే తరఫున  చురుకుగా కనిపిస్తున్నారు.

    ఇటీవల మీడియా ప్రతినిధులు తిరుచెందూర్ నుంచి పోటీ చేసే విషయంపై ప్రశ్నించగా, ఆమె ఆ అవకాశాన్ని కొట్టిపారేయకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దక్షిణ తమిళనాడు జిల్లాల్లో డీఎంకే ప్రాబల్యాన్ని పెంచడానికి కనిమొళి లాంటి అగ్రశ్రేణి నాయకురాలు అసెంబ్లీ బరిలో ఉండటం వ్యూహాత్మకంగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనిమొళి రంగ ప్రవేశం ఖాయమన్న వార్తలు తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

    ఇది కూడా చదవండి: ‘బాబా వంగ’ భవిష్యవాణిపై ఊపందుకున్న చర్చలు
     

  • నాగ్‌పుర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారీ పేలుడు సంభవించింది. కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్‌బీఎల్‌ (SBL) కంపెనీలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు.

    ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

Politics

  • సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి.. బీఆర్‌ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

    టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్‌ మీడియా కనిపిస్తున్న నిన్నటి దృశ్యాలతో హిందువుల హృదయాలు మండిపోతున్నాయి. 94 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించారు. ఘటన తర్వాత మౌనంగా టీటీడీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సింది. ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలనే కుట్ర మీలో కనిపిస్తోంది. రాసలీలల వీడియోలతో హిందువులంతా నిర్ఘాంతపోయారు.. నివ్వెరపోయారు. వాత్సాయనుడికి వారసుడు ఈ నాయుడు. మా హయాంలో జస్ట్‌ వాయిస్‌ బయటికి వస్తేనే పృథ్వీతో రాజీనామా చేయించాం. 

    మా నాయకుడు వైఎస్‌ జగన్‌ గురించి బీఆర్‌ నాయుడు దారుణంగా మాట్లాడాడు. వైఎస్‌ జగన్‌ గురించే కాదు.. ఆయన కుటుంబంపై కూడా దారుణంగా మాట్లాడాడు. దీనికి ప్రతిఫలంగా దేవుడే.. బీఆర్‌ నాయుడికి శిక్ష వేశారు. వీడియోలు, ఫొటోలు బయటికి రావడం భగవంతుడి వేసిన శిక్షే. విజయనగర కాలంలో ప్రధాన అర్చకుడు తప్పు చేస్తే తల నరికేశారు. పాపాల ఊబిలో చిక్కుకున్న బీఆర్‌ నాయుడిని చంద్రబాబు ఏం చేస్తారు?. చంద్రబాబుకు భక్తి అనేది ఒక నాటకమే. బీఆర్‌ నాయుడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. దేవుడితో ఆటలొద్దు.. ఇది భగవంతుడు వేసిన అత్యంత భయానక శిక్ష ఇది. టీటీడీ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారా? అని సోషల్‌ మీడియా బీఆర్‌ నాయుడిని అడుగుతోంది. పవనానంద స్వామి, ఓ మహా పురుషా.. దీనిపై స్పందించండి. బీఆర్‌ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

    బీఆర్‌ నాయుడు కాదు.. కామ నాయుడు..
    ఆయన కామ క్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని టీటీడీకి చైర్మన్‌గా నియమించారు. ఆయన బీఆర్ నాయుడు కాదు.. కామ నాయుడుగా మారాడు.  ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్న మాట అబద్దం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడాను. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదు. బీఆర్ నాయుడు హిందూ ధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారన్న అనుమానం కలుగుతోంది’ అని వ్యాఖ్యలు చేశారు.