Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. 

    రియాన్‌కు కాసేపు జురెల్‌ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్‌ ఫెరియెరా గత మ్యాచ్‌ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

    రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4), షుభమ్‌ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (62), కేఎల్‌ రాహుల్‌ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్‌ రాణా (33), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (26 నాటౌట్‌) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

    19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. 

  • భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్‌ రాణా, ఆకాశ్‌దీప్‌. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.

    హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్‌దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్‌, ఆకాశ్‌దీప్‌ ఐపీఎల్‌కు కూడా దూరమయ్యారు.

    కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే.
     

  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏకంగా 6 పరాజయాలు చవిచూసి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.

    ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లక్నోకు ఓ ఊరట కలిగించే వార్త అందింది. ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ తాజాగా జట్టులో చేరాడు.

    ఇంగ్లిస్‌ను లక్నో ఈ సీజన్‌ వేలంలో రూ. 8.6 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ.. వివాహం కారణంగా అతను సీజన్‌ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేకపోయాడు. ఇంగ్లిస్‌ పెళ్లి ఏప్రిల్‌ 18న స్వదేశంలో జరిగింది. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన ఇంగ్లిస్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 162.57 స్ట్రయిక్‌రేట్‌తో 278 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

    ప్రస్తుతమున్న డూ ఆర్‌ డై పరిస్థితుల్లో ఇంగ్లిస్‌ సత్తా చాటితే లక్నోకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. లక్నో మే 4న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లిస్‌ అందుబాటులో ఉంటాడు.

    బ్రీట్జ్కే నిష్క్రమణ
    ఓ పక్క ఇంగ్లిస్‌ జట్టుకు అందుబాటులో రాగా.. మరో లక్నో ఆటగాడు జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రీట్జ్కే తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది.

    లక్నో ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ, సీఎస్‌కే (2 సార్లు), రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఇలాంటి దశలో ఇంగ్లిస్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ జట్టుకు అందుబాటులోకి రావడం లక్నోకు శుభపరిణామం.

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది.

    ఆదిలోనే షాక్‌లు
    తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాజస్థాన్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4) బంతుల వ్యవధిలో ఔటయ్యారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదిన జైస్వాల్‌.. మూడో బంతికి స్టార్క్‌ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    7 బంతుల తర్వాత వైభవ్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదిన వైభవ్‌.. ఆతర్వాత బంతికే జేమీసన్‌ వేసిన అద్భుతమైన యార్కర్‌కు దొరికాడు. ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న వైభవ్‌ను ఔట్‌ చేసిన ఆనందంలో జేమీసన్‌ ఓవరాక్షన్‌ చేశాడు.

    ముఖానికి దగ్గరగా వెళ్లి ఆరుస్తూ, చప్పట్లు కొట్టాడు. జేమీసన్‌ చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. 15 ఏళ్ల పిల్లాడి పట్ల ఈ ప్రవర్తన సరికాదని అంటున్నారు.

    బీసీసీఐ చర్య తీసుకుంటుందా..?
    ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ప్రత్యర్థిని రెచ్చగొట్టేలా లేదా బెదిరించేలా ప్రవర్తిస్తే మ్యాచ్ రిఫరీ చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది సాధారణ ఆగ్రహావేశ సెలబ్రేషన్‌గా పరిగణిస్తారా, లేక కోడ్ ఉల్లంఘనగా భావిస్తారా అన్నది మ్యాచ్ అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న రాయల్స్‌ 10.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును తాకింది. జైస్వాల్‌, సూర్యవంశీ ఔట్‌ కాగా.. జురెల్‌ (35), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (54) క్రీజ్‌లో ఉన్నారు.

    తుది జట్లు..

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

  • అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. పసికూన జర్మనీ.. ఇంగ్లండ్‌, భారత్‌ను సైతం వెనక్కు నెట్టి మూడో అత్యధిక టీమ్‌ స్కోర్‌ను నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రియాతో ఇవాళ (మే 1) జరిగిన తొలి టీ20లో జర్మనీ రికార్డు స్థాయిలో వికెట్‌ నష్టానికి 308 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇది మూడో అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది.

    అంతర్జాతీయ టీ20ల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన టీమిండియా కూడా ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకలేదు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న జర్మనీ ఈ ఘనత సాధించడం చరిత్రాత్మకం.

    అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్లలో ఇంగ్లండ్‌ ఒక్కటే ఇప్పటివరకు 300 పరుగుల మార్కును తాకింది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. జర్మనీ ఈ రికార్డును సైతం అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

    భారత్‌కు పలు మార్లు 300 పరుగుల మార్కును తాకే అవకాశం వచ్చినా, ఒక్కసారి కూడా తాకలేదు. 2024లో బంగ్లాదేశ్‌పై చేసిన 297 పరుగులే టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ విభాగంలో అత్యధిక స్కోర్‌ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 

    2024లో ఈ జట్టు గాంబియాపై ఏకంగా 344 పరుగులు చేసింది. జింబాబ్వే తర్వాత అత్యధిక స్కోర్‌ చేసిన రికార్డు నేపాల్‌ పేరిట ఉంది. నేపాల్‌ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 314 పరుగులు చేసింది.

    అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్లు
    * జింబాబ్వే – 344
    * నేపాల్‌ – 314
    * జర్మనీ – 308
    * ఇంగ్లండ్ – 304
    * భారత్ – 297

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జర్మనీ.. ఓపెనర్లు బెన్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (58 బంతుల్లో 133 నాటౌట్‌; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), ముసద్దిక్‌ అహ్మద్‌ (48 బంతుల్లో 122; 11 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 308 పరుగులు చేసింది. ముసద్దిక్‌ ఔటయ్యాక వచ్చిన షాహిద్‌ అఫ్రిది (34 నాటౌట్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

    అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రియా 15.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై, 162 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆ జట్టు తరఫున ఓపెనర్‌ కరణ్‌బీర్‌ సింగ్‌ (84) ఒక్కడే రాణించాడు.  

    యూరప్‌లో కొత్త శక్తి
    అంతర్జాతీయ టీ20ల్లో 300 పరుగుల మార్క్ తాకిన తొలి జట్టుగా జర్మనీ చరిత్ర సృష్టించింది. ఇది కేవలం జర్మనీ క్రికెట్‌కే కాదు, యావత్‌ యూరోపియన్ క్రికెట్ అభివృద్ధికి గొప్ప సంకేతం.

    బెన్ ఎవరు..?
    ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బెన్ కొహ్లెర్ కాడ్‌మోర్, ఇంగ్లండ్ క్రికెటర్ టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌కు సోదరుడు. తల్లి జర్మనీ దేశస్థురాలు కావడం చేత బెన్‌ ఆ దేశం తరఫున ఆడే అర్హత సాధించాడు.

     

  • రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు
    226 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (62), కేఎల్‌ రాహుల్‌ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్‌ రాణా (33), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (26 నాటౌట్‌) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

    19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. 

    నిస్సంక హాఫ్‌ సెంచరీ
    6 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 70-0గా ఉంది. నిస్సంక (50), కేఎల్‌ రాహుల్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. 

    రాజస్థాన్‌ భారీ స్కోర్‌
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. రియాన్‌కు కాసేపు జురెల్‌ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్‌ ఫెరియెరా గత మ్యాచ్‌ తరహాలో చెలరేగిపోయాడు. 

    కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4), షుభమ్‌ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు. 

    రియాన్‌ పరాగ్‌ (90) ఔట్‌
    16.4వ ఓవర్‌- సెంచరీకి చేరువైన తరుణంలో భారీ షాట్‌ ఆడబోయి రియాన్‌ పరాగ్‌ (90) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 173-5గా ఉంది.

    జురెల్‌ (42) ఔట్‌
    11.4వ ఓవర్‌- 114 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి జురెల్‌ (42) ఔటయ్యాడు.

    సూర్యవంశీ (4) ఔట్‌
    1.5వ ఓవర్‌- జేమీసన్‌ బౌలింగ్‌లో వైభవ్‌ సూర్యవంశీ (4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    మూడో బంతికే వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ మూడో బంతికే వికెట్‌ కోల్పోయింది. మిచెల్‌ స్టార్క్‌ అద్భుతమైన బంతితో యశస్వి జైస్వాల్‌ను (6) క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే జైస్వాల్‌ సిక్సర్‌ బాదాడు. 

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరుగుతున్న 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది. 

    తుది జట్లు..

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

  • ఐపీఎల్‌ 2026 నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఇవాళ (మే 1) ఓ కీలక ప్రకటన చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్‌ శివమ్‌ మావి స్థానాన్ని అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 హీరో, యువ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబ్రిష్‌తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. 

    18 ఏళ్ల అంబ్రిష్‌ ఈ ఏడాది భారత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో 11 వికెట్లు తీసి భారత తరఫున సంయుక్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. కుడిచేతి మీడియం పేసర్ అయిన అంబ్రిష్, ఎడమచేతితో బ్యాటింగ్‌ చేస్తాడు. 

    లోయర్‌ ఆర్డర్‌లో అతను ఉపయోగకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఎస్‌ఆర్‌హెచ్‌కు అదనపు బలంగా మారనుంది. ఇప్పటికే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి దేశీయ యువ పేసర్లతో కలకలలాడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌కు అంబ్రిష్‌ మరో అస్త్రంగా మారే అవకాశం ఉంది.

    మావి విషయానికొస్తే.. ఈ సీజన్‌ వేలంలో ఇతన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.75 లక్షల బేస్‌ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతను గజ్జలో గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఎస్‌ఆర్‌హెచ్‌ అంబ్రిష్‌ను ఎంపిక చేసుకుంది (రూ. 30 లక్షలకు).

    ఇదిలా ఉంటే, సీజన్‌ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్‌ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, రన్‌రేట్‌ (0.832) కూడా మెరుగ్గానే కలిగి ఉంది. తాజాగా ముంబైపై 244 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్‌ఆర్‌హెచ్‌.. మే 3న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది.

     

     

  • అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఇవాళ (మే 1) వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌ను నిలబెట్టుకోగా.. భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. పాక్‌ జట్టు ఓ స్థానం మెరుగుపర్చుకొని, ఆరో స్థానానికి ఎగబాకింది.

    సౌతాఫ్రికా రెండో స్థానంలో.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ నాలుగు, ఐదు స్థానాల్లో నిలువగా.. శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు వరుసగా 7 నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.

    అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా
    ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ గతేడాది అద్భుత ప్రదర్శన చేసింది. 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించి నంబర్‌వన్‌గా నిలిచింది.

    సౌతాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయంతో ప్రోటీస్ తమ స్థాయిని మరింత పెంచుకుంది.

    భారత్ మూడో స్థానం
    గతేడాది నుంచి భారత్ 10 టెస్టులు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. అయినప్పటికీ, 104 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కాపాడుకుంది. ఇంగ్లండ్ 102 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

    పాకిస్తాన్‌కు లబ్ది
    షాన్‌ మసూద్‌ నేతృత్వంలోని పాకిస్తాన్, ఇటీవల పెద్దగా రాణించకపోయినా పాత ఫలితాల వెయిటేజ్ తగ్గడంతో శ్రీలంకను అధిగమించింది. దీంతో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది.

    ఐసీసీ మహిళల వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌ను కూడా ఇదే సందర్భంగా విడుదల చేసింది. ఈ విభాగంలోనూ ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్‌, భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే, పపువా న్యూగినియా, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

     

     

  • ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి రాజస్తాన్‌కు శుభారంభాలు అందిస్తున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది ఇన్నింగ్స్‌ ఆడిన వైభవ్‌ సూర్యవంశీ.. 400 పరుగులు సాధించాడు.

    ఫాస్టెస్ట్‌ సెంచరీలు
    తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-3లో కొనసాగుతున్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. ఈసారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ప్రత్యర్థి బౌలర్‌ ఎవరన్న అంశంతో పనిలేకుండా బంతిని బాదడమే తన పని అంటున్న వైభవ్‌.. వరల్డ్‌క్లాస్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు కూడా చుక్కలు చూపించాడు.

    బుమ్రాను వదల్లేదు
    ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బుమ్రాకు సిక్సర్‌తో స్వాగతం పలికిన 15 ఏళ్ల వైభవ్‌.. అతడి బౌలింగ్‌లోనే మరో సిక్స్‌ కూడా పిండుకున్నాడు. దీంతో మహామహ బౌలర్లు సైతం వైభవ్‌ విధ్వంసానికి అడ్డుకట్ట వేడయం ఎలా? అంటూ తలలు పట్టుకుంటున్నారు.

    వైభవ్‌ సూర్యవంశీ బలహీనత అదే.. 
    ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ ఆట తీరును ఉద్దేశించి వెస్టిండీస్‌ దిగ్గజం, క్రిక్‌ఇన్ఫో కామెంటేటర్‌ ఇయాన్‌ బిషప్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ బ్యాటింగ్‌ బలహీనత ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టెక్నికల్‌గా చెప్పాలంటే... అతడి బ్యాట్‌ స్వింగ్‌ అయ్యే విధానం యూనిక్‌గా ఉంటుంది. బేస్‌బాల్‌ మాదిరి స్వింగ్‌ అని చెప్పవచ్చు.

    బ్యాటింగ్‌లో అతడి బలహీనత ఏమిటో కచ్చితంగా ఇదీ అని చెప్పడం కష్టం. అయితే, బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌ డెలివరీ (సాధారణంగా బ్యాటర్‌కు 7-8 మీటర్ల దూరంలో బాల్‌ను సంధిస్తే.. బంతి ఎక్కువగా బౌన్స్‌ అయి బ్యాటర్‌ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది)తో అతడిని బోల్తా కొట్టించవచ్చు.

    పొరపాటున మిస్సయిందో!
    అయితే, బంతి త్వరగా టాప్‌ ఎడ్జ్‌కు గనుక రాకపోతే.. అతడు ఆ బాల్‌ను సిక్సర్‌గా మలచడం ఖాయం. అందుకే వైభవ్‌ బ్యాటింగ్‌ బలహీనత ఏమిటో కచ్చితంగా చెప్పలేమని ముందే చెప్పాను’’ అని ఇయాన్‌ బిషప్‌ పేర్కొన్నాడు. 

    కాగా కేవలం టీ20లలోనే కాకుండా వైభవ్‌ భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఇటీవల వరల్డ్‌కప్‌ గెలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. 

    చదవండి: శ్రేయస్‌, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

  • ఐపీఎల్‌ 2026 మధ్యలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్‌ మధుషంక, ఎషాన్‌ మలింగ, కమిందు మెండిస్‌) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్‌ 29న ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. 

    లంక క్రికెట్‌ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.

    శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్‌లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.

    వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్‌కు వచ్చి ఎస్‌ఆర్‌హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక​ సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.

    ఈ ముగ్గురు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్‌ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడింది.

    దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్‌ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు మలింగ లాంటి బౌలర్‌ ఒక్క మ్యాచ్‌కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.

    మలింగ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్‌లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్‌కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.

    కాగా, సీజన్‌ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్‌ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్‌, ఆర్సీబీ టాప్‌-2లో ఉన్నాయి.

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు గుజరాత్‌ టైటాన్స్‌ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గురువారం గుజరాత్‌- ఆర్సీబీ తలపడ్డాయి.

    కోహ్లి, గిల్‌ స్కోర్లు ఎంతంటే?
    ఇందులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, విరాట్‌ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

    అనంతరం గుజరాత్‌ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్‌లు పట్టిన జేసన్‌ హోల్డర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

    పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. 
    ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్‌ కోహ్లి- గుజరాత్‌ కెప్టెన్‌, ప్రిన్స్‌ గిల్‌ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్‌ అవుతున్నాయి. మ్యాచ్‌ సమయంలో గిల్‌ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్‌ చేశాడు. ఇందుకు గిల్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు.

    ఏడిపించిన కోహ్లి.. 
    భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకోగా.. గిల్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్‌ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్‌ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్‌ చేశాడు.

    ఇచ్చిపడేసిన గిల్‌!
    ఇందుకు గిల్‌.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్‌ వేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్‌- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.

    అయితే, ఆ తర్వాత కూడా గిల్‌ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్‌ హోల్డర్‌.. ప్లే హోల్డ్‌ బోల్డ్‌.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఇచ్చిన క్యాచ్‌ను హోల్డర్‌ పట్టాడు.

    అయితే, ఇది క్లీన్‌ క్యాచ్‌ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్‌ అంపైర్‌ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్‌కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్‌ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్‌ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

    చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్‌ మాస్‌ వార్నింగ్‌!

     

  • భువనేశ్వర్‌ కుమార్‌... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్‌. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్‌‍ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.

    చోటే లేదు!
    అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్‌ బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.

    అయితే, భారత మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ మాత్రం భువనేశ్వర్‌ కుమార్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్‌-2025లో ఆర్సీబీని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్‌లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ ఈ రైటార్మ్‌ పేసర్‌ అదరగొట్టాడు.

    అత్యధిక వికెట్ల వీరుడిగా
    నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్‌ క్యాప్‌ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ భువీపై ప్రశంసలు కురిపించాడు.

    తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండి
    క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.

    అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్‌ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్‌లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్‌ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

    చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

  • మహిళల టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోనే తమ మహిళా జట్టుకు బ్రిటీష్ ఆర్మీతో కలిసి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది.  

    తమ క్రీడాకారుల్లో మానసిక స్థైర్యాన్ని, నిర్ణయాత్మక శక్తిని పెంచేందుకు ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందారు.

    ఇప్పుడు అదే బాట‌లో ఇంగ్లండ్ క్రికెట్ కూడా న‌డ‌వ‌నుంది. దాదాపు 15 రోజుల పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ ట్రైనింగ్ క్యాంపులో పాల్గోనున్న‌ట్లు తెలుస్తోంది. విస్డెన్ ప్రకారం.. ఈ ఆర్మీ క్యాంప్ కారణంగా ప్ర‌పంచ‌క‌ప్‌ జట్టులోని 15 మంది సభ్యులు మే 2 నుంచి ప్రారంభం కానున్న  వన్డే కప్ సెకెండ్ రౌండ్‌కు దూరంగా ఉండ‌నున్నారు.

    బ్రిటీష్ ఆర్మీ వ‌ద్ద శిక్ష‌ణ పొందేందుకు వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టును పంప‌డం మాకు ల‌భించిన‌ గొప్ప అవ‌కాశం. అక్కడ నేర్చుకునే విషయాలు మైదానంలో పోరాడేందుకు వారికి ఎంతో సహాయపడతాయి అని ఈసీబీ మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లేర్ కానర్ ధీమా వ్య‌క్తం చేశారు. కాగా 2010-11 యాషెస్ సిరీస్ సమయంలో ఇంగ్లండ్ పురుష‌ల జ‌ట్టు కూడా ఇలాంటి ఆర్మీ తరహా శిక్షణ (బాక్సింగ్, అటవీ ప్రాంతాల్లో లాంగ్ హైకింగ్) పొందింది.

    కాగా జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 12 జట్లు రెండు గ్రూప్‌లుగా (ఏ, బీ) విడిపోయి పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి. 

    ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు ఇదే
    నాట్ సైవర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, ఏమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హెథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వైట్-హాడ్జ్.
     

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాల్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.

    414 పరుగులు
    ఇప్పటికి ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి క్లాసెన్‌ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్‌.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

    తదుపరి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్‌ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్‌ పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్‌ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.

    నేను చెప్పేది జాగ్రత్తగా విను
    ఇందుకు క్లాసెన్‌ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్‌ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్‌.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.

    ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్‌.

    అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!
    ఈ వీడియోపై ఆరెంజ్‌ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్‌ స్టైల్లో వార్నింగ్‌ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

    సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. 

    చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

  • ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్ ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గుజ‌రాత్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. మొద‌ట ఆర్సీబీని 155 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన గుజ‌రాత్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ స‌త్తాచాటింది.

    15.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన త‌మ బౌల‌ర్ల‌ను గిల్ కొనియాడాడు.

    "కీల‌క మ్యాచ్‌లో విజ‌యం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఇలాంటి వికెట్‌పై ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును 160 ప‌రుగులలోపు క‌ట్డ‌డి చేయ‌డం అంత సులువు కాదు. కానీ మా బౌల‌ర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 

    ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవ‌ర్‌లో విరాట్ భాయ్ వ‌రుస బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. 

    అత‌డి వికెట్‌తో తిరిగి మేము గేమ్‌లోకి వ‌చ్చాము. నేనేమి ఈ మ్యాచ్‌లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల‌తో బ‌రిలోకి దిగ‌లేదు. నేను ఒక రిథ‌మ్‌లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్‌లో ప‌డింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.

    అందుకే బౌల‌ర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జ‌ట్టులో కీల‌క స‌భ్యుడు. ఈ రోజు అత‌డు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడ‌నుకున్నా. కానీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్య‌త‌ను తెవాటియా తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 43 ప‌రుగులు చేశాడు.
    చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

  • గుజరాత్‌ టైటాన్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో సొంతగడ్డపై ‘రిటర్న్‌’ మ్యాచ్‌తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్‌ సేనపై గెలుపొందింది.

    రీప్లేలో స్పష్టంగా కనిపించింది
    అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్‌ బౌలింగ్‌లో ఆర్సీబీ సారథి రజత్‌ పాటీదార్‌ (19) పుల్‌ షాట్‌ కొట్టగా... డీప్‌ స్క్వేర్‌లెగ్‌ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్‌ అందుకున్నాడు.

    అయితే హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్‌ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.

    రిజర్వ్‌ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం
    అయినప్పటికీ.. థర్డ్‌ అంపైర్‌ అభిజిత్‌ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్‌ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి, కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ రిజర్వ్‌ అంపైర్‌ పరాశర్‌ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.

    ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. పాటీదార్‌ అవుట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్‌ పట్టింది అసలు క్యాచ్‌ కానేకాదు. క్రికెట్‌ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..

    అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే!
    బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్‌తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అ‍స్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.

    జేసన్‌ హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్‌ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్‌బాల్‌ కానేలేదు.

    కాబట్టి ఆ క్యాచ్‌ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్‌ తప్పుచేశాడు. బ్యాటర్‌(పాటీదార్‌)ను నాటౌట్‌గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

    రూల్‌ ఇదే
    కాగా మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియ‌మం 33.2.2.1 ప్రకారం..  ఫీల్డ‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు, అత‌డి చేతి వేళ్ల మ‌ధ్య నుంచి బాల్‌ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్‌గానే ప‌రిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్‌ అంపైర్‌ పాటీదార్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.

    చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Andhra Pradesh

  • విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్‌ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. డీజిల్‌ లేకపోవడంతో జనరేటర్‌ ఆన్‌ కాలేదు. భక్తులకు ఎదురైన ఇబ్బందులపై అధికారులు పట్టించుకోలేదు. 45 నిమిషాల తర్వాత కరెంట్‌ రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. 

  • ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల నత్త నడకపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కేంద్రం ప్రశ్నించింది. నిర్మాణ పనులకు డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జవాబు ఇవ్వడంతో అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. 

    పోలవరం పనుల పురోగతిపై  కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగ్గా ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.

     

  • విశాఖ : ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమిలి, తగరపువలస, అనకాపల్లి, మాడుగులలో కుండపోత వాన పడింది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పద్మనాభంలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో  వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఫలితంగా వర్షాలు పడుతున్నాయి.  ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.

    ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు.

     

     

  • సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్‌ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.  గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్‌లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్‌ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. 

    తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.

    పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్‌ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. 

  • విజయనగరం: దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల పండగకు మేనమామ ఇంటికి  వచ్చిన ఓ బాలి క తిరుగు ప్రయాణంలో బస్సులో మహిళల మధ్య జరిగిన గొడవలో దాడికి గురై తీవ్ర అస్వస్థత పాలైంది. దీంతో స్థానికులు బాలిక ను సీహెచ్‌సీకి 108లో తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగ రం కేంద్రాస్పత్రికి తరలించారు. వివరాలు.. 

    విశాఖకు చెందిన బెజ్జుపల్లి భార్గవి(14) తల్లి దండ్రులతో కలసి బొబ్బిలిలోని గొల్లవీధిలోని తన మేనమాన ఇంటికి పండగల నిమిత్తం వచ్చింది. పండగ పూర్తయిన సందర్భంగా గురువారం సాయంత్రం తిరిగి విశాఖ వెళ్లేందు కు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లి తల్లిదండ్రులు, తమ్ముడితో కలసి ఆర్టీసీ బస్‌ ఎక్కింది. ఈ సమయంలో సీట్ల కోసం పడుతున్న ఆదుర్దాలో మరో మహిళకు భార్గవి కాలు తగిలింది. దీంతో ఆమె కోపోద్రిక్తురాలై గొడవ పడింది. ఈ గొడవ రెండు సమూహాల మధ్య గొడవగా మారి తోసుకున్నారు. 

    ఈ క్రమంలోనే భార్గవిపై ఓ మహిళ పిడిగుద్దులు కురిపించిందనీ, దీంతో బాలిక కిందపడటంతో పలువురు మీది నుంచి వెళ్లిపోయారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడని పరిస్థితుల్లో 108 ద్వారా స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఏఎస్సై సన్యాసిరావు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారని భార్గవి బంధువులు తెలిపారు.   

     

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మ‌హ‌నీయుడు చెప్పిన మాట‌లు నేటికీ ఆచ‌ర‌ణీయం. గౌత‌మ బుద్ధుడి జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ  బుద్ధ‌పూర్ణిమ శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

     

  • సాక్షి, తాడేపల్లి: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

    ‘‘సీతంపేట ఘాట్‌ రోడ్‌లో  ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరం. మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా అని ఓ సందేశం విడుదల చేశారు.

    పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఓ ఆటో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తుండగా.. పాలకొండ-సీతంపేట రూట్‌లోని ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను సీతంపేట ఏజెన్సీకి చెందిన రమణ(ఆటో డ్రైవర్‌), ప్రయాణికులు లక్ష్మి, శాంతి, శ్రావణిలుగా గుర్తించారు. ఐదుగురు చిన్నారులు సహా తొమ్మిదిమందికి గాయాలయ్యాయి.  క్షతగాత్రులకు పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

     

  • తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

    ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. 

    తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

    ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది.  అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. 

    మరో మూడు రోజులపాటు..
    ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో..  ఈ సీజన్‌లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. 

    చల్లటి కబురు
    వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది. 

Movies

  • బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన విమాన ప్రయాణానికి ముందు ఓ సీక్రెట్ నోట్ పంపుతానని తెలిపారు. ఒకవేళ ఏదైనా జరిగిన నేను చనిపోతే రన్నింగ్‌లో ఉన్న సినిమాను ఆపొద్దని దర్శకుడు మన్సూర్‌ ఖాన్‌కు పంపుతానని వెల్లడించారు. నేను చనిపోయినా కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని చెప్తానని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.

    అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. 'ఏదైనా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయి చివరి దశలో ఉన్నప్పుడు నేను విమాన ప్రయాణం చేయాల్సి వస్తే  మన్సూర్‌కు ఓ సీక్రెట్‌ నోట్‌ పంపుతా.  ఒకవేళ తాను ప్రయాణించే ఫ్లైట్ కూలిపోయి చనిపోతే.. ఆ సినిమా పనులు నువ్వే చూసుకో అని రాసి పంపిస్తా. అంతేకాకుండా దర్శకులతో కూడా ఇదే విషయాన్ని చెబుతా. నాకు ఏ ఆపద వచ్చినా సినిమాను ఆపొద్దని.. మన్సూర్‌తో కలిసి మూవీని విడుదల చేయాలని కోరతా' అని అన్నారు. ఫ్లైట్‌ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆపద వస్తుందనే భయం నాలో ఉందన్నారు. కాగా.. దర్శకుడు మన్సూర్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ఇద్దరు బంధువులు కావడం విశేషం. వీరిద్దరి కాంబోలో ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహీ సికందర్ లాంటి సూపర్ హిట్‌ సినిమాలు చేశారు.
     

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్‌ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్‌ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్‌ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్‌ సార్‌పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్‌ సార్‌కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్‌మీట్‌కు దర్శకుడు సుకుమార్‌, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు కూడా హాజరయ్యారు. 
     

  • టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్‌లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ ‍అయింది.

    రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత ‍మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉ‍న్నాం.  మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్‌లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.

    నిన్న కూడా ఫస్ట్‌ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్‌ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది.

     

     

     

  • ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పుట్టినరోజును పురస్కరించుకుని, మే 15న "అరేయ్ ఆపండ్రా" చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో అశోక్ నిమ్మల ఈ కామెడీ సస్పెన్స్ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకుంది.

    నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ, "ఈ వేసవిలో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించే ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించబోతున్నాం. అనుకున్న బడ్జెట్‌లో మా దర్శకుడు సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. సుదర్శన్, భద్రం, తల్లాడ సాయికృష్ణల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ" అని తెలిపారు.

    సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరో సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ షూటింగ్ ఖమ్మం, హైదరాబాద్ పరిసరాల్లో జరిగిందని, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.
    న్యాచురల్ కామెడీతో పాటు మంచి సందేశం

    దర్శక-నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ.. "నేటి సామాజిక పరిస్థితులను సహజమైన కామెడీతో జోడించి, ఒక మంచి సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి రామ్ అన్న పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన పుట్టినరోజున సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉంది. అలాగే 'ఒంగోలు గిత్త'లో రామ్ అన్నతో నటించిన కిషోర్ దాస్ గారు మా సినిమాలో ఉండటం మాకు పెద్ద ప్లస్" అని అన్నారు.

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.

    ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 
     

  • ప్రముఖ నటి ఎవలీన్ శర్మ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. తమ ఐదేళ్ల వివాహా బంధానికి గుడ్‌ బై చెప్పనుంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయంపై ఓ ఛానెల్‌లో మాట్లాడిన ఆమె.. అవును మేమిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. పిల్లల విషయంలో ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి మేము గోప్యతను కోరుకుంటున్నామని అన్నారు. 

    కాగా.. నటి ఎవలిన్ శర్మ 2021 మే 15న డెంటల్ సర్జన్ అయిన తుషాన్ బిందీని పెళ్లాడారు. వీరికి కుమార్తె ఆవా, కుమారుడు ఆర్డెన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పెళ్లైన ఐదేళ్లకే ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. స్నేహపూర్వకంగా తమ బంధానికి ముగింపు పలుకుతున్నామని ఎవలీన్ తెలిపారు. తమ పిల్లలను మాత్రం కలిసే పెంచుతామని కూడా స్పష్టం చేశారు. కాగా.. ఎవలీన్ శర్మ 2012లో హిందీ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. 2019 వరకు పలు హిందీ చిత్రాలలో కనిపించారు. ఆమె 2013లో విడుదలైన 'యే జవానీ హై దీవానీ' మూవీలో మెప్పించింది. అంతేకాకుండా 2014లో విడుదలైన 'యారియాన్', 'మై తేరా హీరో' చిత్రాల్లో కూడా నటించింది. తెలుగులో ప్రభాస్ మూవీ సాహోలో ఐషా పాత్రలో ఆకట్టుకుంది. 

  • టైటిల్‌ : గాయపడ్డ సింహం
    నటీనటులు: తరుణ్‌ భాస్కర్‌, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, శుభలేఖ సుధాకర్‌, విష్ణు తదితరులు
    నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ 
    రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
    సమర్పణ: పవన్ సాదినేని
    సంగీతం: స్వీకర్ అగస్తీ
    ఎడిటర్: విప్లవ్ నిషాదం

    కథేంటంటే..
    దరహాస్‌(తరుణ్‌ భాస్కర్‌), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్‌ పెట్టడంతో.. దరహాస్‌ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.  ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల వెన‌క్కి వ‌చ్చిన (డిపోర్ట్) భార‌తీయ విద్యార్థుల్లో దరహాస్‌ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్‌పై దరహాస్‌ పగపడతాడు. ఎలాగైన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్‌ టార్చర్‌ భరించలేక ఫ్రెండ్‌ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్‌పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్‌ పగకు మాఫియా డాన్‌ బ్రూటల్‌ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్‌(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చేతబడి.. ప్రాక్టికల్‌గా ఇది అసంభవం. ఇలాంటి పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే గాయపడ్డ సింహం. లైన్‌ వింటేనే నవ్వొస్తుంది. కథగా మలిస్తే ఎలా ఉండాలి? థియేటర్స్‌లో నవ్వులు వర్షం కురవాలి. కానీ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీ పండించడంలో పూర్తిగా సఫలం కాలేదు. చేతబడి కాన్సెప్ట్‌, బ్లాక్‌ బస్టర్‌ సినిమాల స్పూఫ్‌.. ఇవన్నీ సినిమాలో ఉన్నాయి కానీ..అవేవి పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అని పూర్తిగా బోర్‌ కొట్టించదు. కథ ఓకే కానీ..కథనం విషయంలోనే దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. బొమ్మరిల్లు, కేజీఎఫ్‌, అర్జున్‌ రెడ్డి, సలార్‌ లాంటి సినిమాల స్పూఫ్ సీన్లను మరింత బలంగా రాసుకోని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. 

    డ్ర‌గ్స్ మాఫియాపై ఐజి విజ‌య‌కాంత్ (శుభ‌లేఖ సుధాక‌ర్‌) టీమ్‌ మెరుపు దాడులు చేసే సన్నివేశాలతో కథను సీరియస్‌గా ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ఫరియా, తరుణ్‌ భాస్కర్ల పెళ్లి చూపులు సీన్‌తో కథ కామెడీ వైపు టర్న్‌ తీసుకుంటుంది. ఇక దరహాస్‌తో తన తండ్రికి ముందే పరిచయం ఉందని శాలిని గ్రహించి.. నిజం చెప్పమని కోరడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. దరహాస్‌, గాయత్రి లవ్‌ స్టోరీని లైట్‌గా చూపించి..అమెరికాకు వెళ్లే ముందు హీరో ఇచ్చే బిల్డప్పులను హైలెట్‌ చేశాడు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. 

    అయితే హీరో అమెరికా నుంచి తిరిగి వచ్చి.. పగతీర్చుకునేందుకు చేసే ప్రయత్నాల వరకు కథనం సోసోగానే నడుస్తుంది. ఎప్పుడైతే శ్రీవిష్ణు పాత్ర ఎంట్రీ ఇస్తుందో..అప్పటి నుంచి  కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎలాంటి సంబంధం లేని బ్రూటల్‌ ధర్మ పాత్రను ట్రంప్‌ చేతబడికి ముడిపెట్టిన విధానం బాగుంది. కానీ ఆయా సన్నివేశాలను మరింత కామెడీగా చూపించాల్సింది.  ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కాస్త బెటర్‌. కథనం కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది.  బొమ్మరిల్లు, కేజీఎఫ్‌ సినిమాల స్పూఫ్‌ కొంతవరకు నవ్విస్తుంది. మిగతా సినిమాల స్పూఫ్‌ జస్ట్‌ ఓకే.  ఇక ఆర్జీవీ, జేడీ చక్రవర్తిల కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘సత్య’ మూవీకి ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే క‌థ‌నం పూర్తిగా  నెమ్మ‌దించ‌డంతో ముందుకు పోకుండా అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్న‌ట్టు అనిపిస్తుంది.  క్లైమాక్స్‌లో శ్రివిష్ణు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా  వెళితే ‘గాయపడ్డ సింహం’ కొంతవరకు ఎంటర్‌టైన్‌ చేస్తుంది. కామెడీ ఆశించి వెళ్తే మాత్రం.. ప్రేక్షకుడి మనసు గాయపడక తప్పదు. 

    ఎవరెలా చేశారంటే.. 
    దరహాస్‌ పాత్రకు తరుణ్‌ భాస్కర్‌ న్యాయం చేశాడు.  ఆయన అమాయకత్వం, డైలాగులు కీడాకోల సినిమాను గుర్తు చేస్తాయి. బ్రూటల్‌ ధర్మగా జేడీ చక్రవర్తి బాగానే చేశాయి. అయితే ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా అద్భుతంగా అయితే లేదు. ఫస్టాఫ్‌లో డాన్‌లా కనిపించే సన్నివేశాలు బాగున్నాయి కానీ.. కామెడీ మాత్రం అంతగా వర్కౌట్‌ కాలేదు. తండ్రితో ప్లాష్‌బ్యాక్‌ని గంభీరంగా చెప్పించ‌డం త‌ప్ప ఫ‌రియా అబ్దుల్లాకి పెద్ద‌గా న‌టించే అవ‌కాశం రాలేదు.  శ్రీవిష్ణు తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు ఆయన పాత్రే ప్లస్‌ అని చెప్పాలి.  సినిమా చూసిన వాళ్లకు భైరవ దాస్‌ పాత్ర గుర్తుండిపోతుంది.  శుభలేఖ సుధాకర్‌, హర్ష, విష్ణుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్వీకర్ అగస్తీ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

  • ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ గురించి ఆయన మాట్లాడారు. షారూక్‌తో వచ్చిన విభేదాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సూపర్‌స్టార్ క్షమాపణ చెప్పకపోవడం వల్లే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. షారూక్ ఖాన్‌కు ఉన్న అహం వల్లే వృత్తిపరంగా ఆయన సినిమాలకు పనిచేయడం లేదని అన్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన షారూక్‌తో విభేదాలపై స్పందించారు. 

    విభేదాలకు ‍అదే కారణం..

    పాడ్‌కాస్ట్‌లో అభిజీత్ మాట్లాడుతూ.. 'షారుఖ్ ఖాన్‌కు అహం ఎక్కువ. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అందే మా మధ్య విభేదాలకు కారణమైంది. షారుఖ్ నా కంటే చిన్నవాడు.. అయినా ఫరా ఖాన్ భర్త అతన్ని అంతగా దూషించినప్పుడు కూడా షారుఖ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఒక కుక్కకు షారూఖ్ అని పేరు కూడా పెట్టాడు.. అయినా వారిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అయినా మీరు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పలేకపోవడం నన్ను బాధించింది. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ నాకు క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. ఇదే తనపై భావోద్వేగమైన ప్రభావం చూపిందని పేర్కొన్నారు.

    షారూఖ్ తాను చేసిన తప్పును అంగీకరించకపోవడమే తనను ఎక్కువగా బాధించిందని అభిజిత్ అన్నారు. అందుకే షారూక్ ప్రాజెక్టులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. అయితే తన నిర్ణయం అహంకారంతో కాదని.. వ్యక్తిగత నిరాశతోనే తీసుకున్నానని సింగర్ స్పష్టం చేశారు. ఒకానొక సమయంలో షారూక్ కోసం తాను ఇతర నటుల కోసం కూడా పాడటం మానేశానని అన్నారు. 

    షారుక్‌ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్నప్పటికీ తనను పట్టించుకోవడం లేదని అనిపించేదని అభిజీత్ భట్టాచార్య అన్నారు. నాకు సరైన గుర్తింపు, క్రెడిట్ లేకపోవడం వల్లే షారూక్‌తో విభేదాలు తలెత్తాయని గతంలో అభిజీత్ చాలాసార్లు వెల్లడించారు.  కాగా.. సింగర్ అభిజిత్‌   'బాద్షా', 'మై హూ నా' వంటి చిత్రాలలోని పాటలకు తన గాత్రం అందించారు. మై హూ నా మూవీ టైమ్‌లో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. అభిజిత్ చివరిసారిగా షారూక్ బిల్లు చిత్రానికి పనిచేశారు.

     

  • డ్యూడ్‌, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

    తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మూవీ రిలీజై 43 రోజులైనా వసూళ్లు సాధిస్తూనే ఉంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన దురంధర్‌-2 మరో క్రేజీ రికార్డ్‌పై కన్నేసింది.

    ఇప్పటి వరకు దురంధర్‌-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,783.66 కోట్ల వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 1358.51 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం.. ఓవర్‌సీస్‌లో రూ. 425.15 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోన్న ఈ మూవీ బాహుబలి-2 రికార్డ్‌కు ‍అత్యంత చేరువలో ఉంది. రాజమౌళి బాహుబలి-2 కంటే కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వెనకబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వసూళ్లు కొనసాగితే బాహుబలి-2ను సైతం అధిగమించేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆరో వారంలో రూ.12.40 కోట్ల వసూళ్లు రాబట్టింది.

    గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఆదిత్య ధర్ రచన, దర్శకత్వం  వహించగా.. రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రాకేష్ బేడి, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

     

  • ఏదైనా పని ఫలానా సమయానికల్లా పూర్తి చేస్తానని చెప్పి.. చేయకపోతే ఎలా ఉంటుంది? కచ్చితంగా కోపం వస్తుంది. ఒకవేళ ఇలా రెండు మూడుసార్లు జరిగితే నిజంగా పని పూర్తయినా సరే చేయలేదేమో అనే అనుమానం కలుగుతుంది. అలానే పని ఫెర్ఫెక్ట్‌గా చేసినా ఇంప్రెసివ్‌గా అనిపించకపోవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తెలుగులో కొన్ని సినిమాల పరిస్థితి ఇలానే తయారైంది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రేక్షకులకే చిరాకు తెప్పిస్తున్నారు. దీనికి కారణమేంటి? పరిష్కారం లేదా?

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అంటే ప్రతిఒక్కరూ కమిట్‌మెంట్‌లా ఫీలయ్యేవారు. ఒకవేళ చెప్పిన తేదీకి రిలీజ్ చేయకపోతే నెగిటివ్ సెంటిమెంట్‌లా భావించేవారు. కానీ ఇప్పుడు వాయిదాలు అనేవి చాలా సాధారణం అయిపోయాయి. టెక్నికల్ అంశాల వల్ల ఇలా చేస్తున్నామని దాదాపు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కరోనా టైంలో షూటింగ్స్ సరిగా నడవక ఈ వాయిదాల పర్వం మొదలైంది. తర్వాత కరోనా వెళ్లిపోయింది గానీ వాయిదాలు మాత్రం అలానే ఉండిపోయాయి.

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ సరైన్ ప్లానింగ్ లేకపోవడంతో షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం తదితర అంశాలు విడుదల తేదీలని పదేపదే మార్చేందుకు కారణమవుతున్నాయి. కొన్ని సినిమాలైతే అంతా సిద్ధమైపోయినా సరే ఎందుకో వాయిదా వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

    గతం గురించి అక్కర్లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితి ఓసారి చూసుకుంటే.. రామ్ చరణ్ 'పెద్ది'ని తొలుత మార్చి 27న రిలీజ్ చేస్తామని అన్నారు. ఆపై ఏప్రిల్ 30 అన్నారు. ఇప్పుడేమో జూన్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రాన్ని తొలుత మే 01న రిలీజ్ అని ప్రకటించారు. 'పెద్ది' కారణంగా జూన్ 26కి వాయిదా వేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీని లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం వెల్లడించారు. తీరా చూస్తే ఏకంగా ఏడాది వాయిదా వేసి వచ్చే జూన్ అని పోస్టర్ వదిలారు. కన్నడ డబ్బింగ్ చిత్రం 'టాక్సిక్' అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

    సరే పైన చెప్పినవన్నీ స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి వాటి వల్ల ఆలస్యమైందిలే అనుకోవచ్చు. కానీ సమంత లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'ని మే 15 నుంచి జూన్ 4కి మార్చారని టాక్ వినిపిస్తోంది. నిఖిల్ చేసిన పీరియాడిక్ మూవీ 'స్వయంభు' అయితే ఫిబ్రవరి నుంచి అప్పుడు ఇప్పుడు అని చెబుతున్నారు గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నారు. నాని 'ప్యారడైజ్' అయితే తొలుత మార్చి అన్నారు. తర్వాత ఆగస్టు అన్నారు. ఇప్పుడసలు ఈ ఏడాది రాకపోవచ్చని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అయితే అనుకున్న బడ్జెట్ దాటేసిందని, షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని అంటున్నారు. ఎప్పుడో విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

    ఇలా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోతే సదరు సినిమాలపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిపోతుంది. థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత నచ్చితే పర్లేదు. ఒకవేళ అలా కాకపోతే మాత్రం ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు వేశారా అని ముఖం మీదే అనేస్తారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇది కేవలం ఆ ఒక్క సినిమాపైనే ప్రభావం చూపడం కాదు. మొత్తం టాలీవుడ్ వ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అదే జరిగితే తెలుగు ప్రేక్షకుడు ఇంకా థియేటర్‌కి దూరమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.

    మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉండొచ్చు. స్టార్ హీరోల చిత్రాల్ని ప్రకటించేటప్పుడు ఆర్భాటంగా డేట్స్ కూడా ప్రకటించేయకుండా ఔట్‌పుట్ రెడీ అయిన దానిబట్టి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తే బెటర్. 

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • మలయాళ సినిమాలకు తెలుగులోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఓటీటీల్లోకి రావడం లేటు చూసేస్తుంటారు. రీసెంట్ టైంలో 'సంభవం అధ్యాయం ఒన్ను' చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే అదరగొట్టేందుకు మరో మూవీ రెడీ అయిపోయింది. గతవారం తెలుగులోనూ విడుదలైన ఓ స్కూల్ ఏజ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

    2024లో థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న 'వాలా' చిత్రానికి కొనసాగింపుగా.. 'వాలా 2' తీశారు. ఇన్ స్టాలో పాపులర్ అయిన కుర్రాళ్లు నలుగురిని లీడ్ రోల్స్‌గా పెట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.200 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది.

    ఏప్రిల్ 2న మలయాళంలో రిలీజ్ కాగా.. ఏప్రిల్ 26న తెలుగులో విడుదలైంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం(మే 08) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మిస్ అవ్వొద్దు.

    'వాలా 2' విషయానికొస్తే.. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలకు చెందిన హాషిర్, అల‌న్‌, అజిన్‌, వినాయ‌క్ అనే న‌లుగురు కుర్రాళ్లని త‌ల్లిదండ్రులు ఎన్నోక‌ష్టాలు ప‌డుతూ కాలేజీకి పంపుతుంటారు. కానీ వీళ్లు చ‌దువుల్లో కంటే గొడ‌వ‌ల్లోనే ముందుంటారు. గొడ‌వ‌ల వల్ల ఓ ద‌శ‌లో కాలేజీ నుంచి బ‌య‌ట‌కు పంపించే ప‌రిస్థితులు వస్తాయి. ఓ పోలీస్ ఆఫీస‌ర్ (ఆల్ఫోన్స్ పుత్రన్‌) క‌ల‌గ‌జేసుకుని వీళ్ల‌ని కాపాడ‌తాడు. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం వ‌స్తుంది. ఉన్న‌త చ‌దువుల కోసం, ఉపాధి కోసం యూకే వెళ్లాల‌నుకున్న ఈ న‌లుగురూ త‌మ క‌ల‌ని నిజం చేసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

  • ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా ఆకట్టుకున్న సత్య.. హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'జెట్‌లీ'. వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దీనికి దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్‌తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? కమెడియన్ సత్య.. హీరోగా హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా)

    కథేంటి?
    ప్రజాపతి(అజయ్) బ్యాంక్ స్కామ్  చేసి రూ.15,000 కోట్లతో దుబాయికి పారిపోతాడు. అతన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలని కాపాడకునేందుకు తనే లొంగిపోతాడు. ఏజెంట్ శివాని (రియా సింఘా) తన టీంతో కలిసి ప్రజాపతిని విమానంలో ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరుతారు. అదే విమానాన్ని తన మనుషులతో హైజాక్ చేయించి పారిపోవాలని ప్రజాప్రతి ప్లాన్ వేస్తాడు. మరి ఇది సక్సెస్ అయ్యిందా? అదే విమానంలో ఉన్న వేదవ్యాస్(సత్య)ఎవరు? అంధ వైద్యుడిగా ఎందుకు నటించాడు? ప్రజాపతిని చంపడానికి ప్రయత్నించేది ఎవరు? హోం మంత్రి  మేల్కోటే (సాయి శ్రీనివాస్)కి బ్యాంక్ స్కాంతో ఉన్న సంబంధమేంటి? హరిచంద్ర (శుభలేఖ సుధాకర్), వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే?
    ఇన్నాళ్లు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన సత్య.. హీరోగా సినిమా చేస్తున్నాడని ప్రకటించిన రోజు నుంచే 'జైట్లీ'పై అంచనాలు ఏర్పడ్డాయి. సత్య హీరో కాబట్టి హాయిగా రెండున్నర గంటలపాటు నవ్వుకోవచ్చు అని థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. కామెడీ ఏమో గానీ కనీసం చెప్పుకోవడానికి కథ కూడా లేని మూవీ ఇది. బ్యాంకు స్కామ్ మర్డర్‌తో కథని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు.. కాసేపటికి అర్థంపర్థం లేని డైలాగులు సాగదీత సన్నివేశాలతో నీరసం తెప్పించాడు. కథ మొత్తం విమానంలోనే జరుగుతుంది.

    ఫస్టాప్ అంతా ప్రజాపతి పాత్ర గురించి చూపించి తను దుబాయి నుంచి ఇండియాకి తిరిగి రావడం, ఫ్లైట్‌లో ఉండడం, ఫ్లైట్‌లో ఉన్న జనాలు, వాళ్ల పాత్రల గురించి చూపిస్తారు. సత్య తనని తాను మర్చిపోయినట్టు, తనపై దాడి జరిగినట్టు, అతను ఎవరో గుర్తుతెచ్చుకునే ప్రాసెస్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అక్కడక్కడ కామెడీ డైలాగ్స్‌తో, స్పూఫ్ సీన్‌ తో సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఈ బ్యాంక్ స్కామ్ ఏంటి? సత్య అసలు ఎలా వచ్చాడు? సత్య ఎవరు? వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి? అని కథతో పాటు అక్కడక్కడ కామెడీ నడిపించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకులు భావించేలా ఉండడం మైనస్ పాయింట్. ఫస్టాఫ్ కొంతవరకు నవ్విస్తుంది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోదు. కావాలని రాసుకున్న కొన్ని ట్విస్టులు పేలకపోగా, ఎబ్బెట్టుగా అనిపించాయి.

    ఎవరెలా చేశారు?
    లీడ్ రోల్ చేసిన సత్య.. తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్ కూడా కనిపించిన ప్రతిసారి నవ్వించాడు. హీరోయిన్ రియా సింఘా, అజయ్ కూడా పర్లేదనిపించారు. కాకపోతే స్టోరీలో సరైన కంటెంట్ లేకపోవడంతో పని జరగలేదు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఉన్న రెండు పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ కూడా వర్కౌట్ కాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి విమానంలో వాతావారణాన్ని బాగా సృష్టించారు. అవి రియలస్టిక్‌గా అనిపించాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'జెట్‌లీ'.. వర్కౌట్ కాలేదు!

    (ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రియురాలు కావ్యని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుమల వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న నూతన వధూవరులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకునే సరికి చిన్నపాటి ఆటపట్టించడం లాంటివి జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)

    హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ తమ పేర్లు చెప్పే ఇంట్లోకి అడుగుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి కూడా అలానే చేశారు. ముందుగా కొత్త కోడలు కావ్య మాట్లాడుతూ.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని చెప్పింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ .. మా ఇంటికి మా ఆవిడని తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి' అని నవ్వేశాడు. కావ్య కూడా తన భర్తను 'చెప్పు శ్రీని' అడగడంతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టేసరికి.. నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను అని అనేశారు.

    ఇకపోతే నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు గానీ చెప్పుకోదగ్గ హిట్స్ ఏం లేవు. గతేడాది 'కిష్కింధపురి'తో వస్తే ఇది యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం హైందవ, టైనస్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

International

  • టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్‌ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్‌ వెల్లడించింది.

    యాక్సియోస్‌ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్‌ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్‌ యూనైటెడ్‌ స్టేట్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారి బ్రాడ్‌ కూపర్‌, రక్షణ మంత్రి, జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్‌కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్‌ లైట్‌ టాక్టికల్‌ వెహికల్‌ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్‌, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.

    ‘ఆపరేషన్‌ రోరింగ్‌ లయన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్‌లిఫ్ట్స్‌, 10 సీలిఫ్ట్స్‌ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు.

     

  • టెహ్రాన్‌: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్‌లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ప్రస్తుతం అమెరికా- ఇరాన్‌ మధ్య  సీజ్‌ఫైర్‌ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.

    ఇరాన్‌ అధ్యక్షుడు మాసూద్‌ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్‌ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్‌ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .

    మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్‌ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్‌ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్‌ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.

  • 2025లో లాస్ ఏంజిల్స్‌లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్‌ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్‌ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. 

    ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..

    జోనాథన్ రిండర్‌క్నెచ్  అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో  న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో  ప్రయాణికులను దించాడు. అనంతరం  కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్‌తో  ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.  

    అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా  వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

    అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు. 

  • టెహ్రాన్‌: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్‌ సుప్రీమ్ లీడర్‌గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?

    ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్‌ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.

    అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్‌పై ఓ టేప్‌రికార్డ్‌ పెట్టాడు. దానిని ఆన్‌ చేశాడు. ఇరాన్‌లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్‌ గ్రూప్‌ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది.  

    ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్‌, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.

    ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్‌ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.

    కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్‌గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసం బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించవచ్చు కదా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన వింత సమాధానమే ఇచ్చారు. 

    నాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించడం ఇష్టం లేదు. అది వేసుకుంటే లావుగా కనిపిస్తా అని అన్నారాయన. ‘‘ మరో 20 పౌండ్లు ఎక్కువ బరువును నేను మోయగలనో లేదో నాకైతే తెలియదు. కానీ, అలా లావుగా ఉన్నట్లు కనిపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే అది వేసుకోను. 

    ..బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకోవాలని భద్రతా సిబ్బంది కోరారు.  కానీ దాన్ని వేసుకుంటే.. దుష్ట శక్తుల ముందు నేను లొంగిపోయినట్లే అవుతుంది. అది నాకు అంతగా ఇష్టం లేదు’’ అని ట్రంప్‌ చెప్పారు. ఏప్రిల్‌లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం.. 79 ఏళ్ల వయసున్న ట్రంప్‌ బరువు 102 కేజీలు. డైట్‌ విషయంలో ఓ పద్దతీ లేకుండా అన్నీ లాగించేస్తుంటారాయన. 

    గత రెండేళ్లలో ట్రంప్‌పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. చివరగా.. హిల్టన్‌ హోటల్‌లో జరిగిన వైట్‌హౌజ్‌ కరస్పాండెంట్స్‌ అసోషియేషన్‌ మీటింగ్‌లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని..  ట్రంప్‌ దంపతులతో పాటు వీవీఐపీలందరినీ రక్షించగలిగారు. పిరికిపందలా పరిగెత్తడం కంటే.. ప్రజల మధ్య ధైర్యంగా కనిపించడం నాకు ముఖ్యం అని ట్రంప్‌ తరచూ చెబుతుంటారు.

Business

  • ట్రైన్లలో ప్రయాణించే చాలామందికి.. రైల్వే వ్యవస్థ గురించి బహుశా తెలిసి ఉండక పోవచ్చు. ట్రైన్‌పై ఉండే బోర్డుల దగ్గర నుంచి నెంబర్ల వరకు అనేక విషయాలు వెనుక ఒక సరైన అర్థం ఉంటుంది. అయితే టికెట్స్ మీద కూడా మీరు గమనించినట్లయితే.. ఇక్కడ కూడా H1, H2, A1, B1 అని ఉండటం కనిపిస్తుంది. ఈ కథనంలో వీటి గురించి తెలుసుకుందాం.

    టికెట్ మీద H1, H2అని ఉంటే.. అది ఏసీ ఫస్ట్ క్లాస్ అని అర్థం. దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ కోచ్ మీద ఇలాంటి గుర్తు ఉంటుంది. ఇందులో చాలా సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ టికెట్ ధర విమానం టికెట్ ధరకు సమానంగా ఉంటుంది. భోజన సదుపాయం, ఛార్జింగ్ పాయింట్లు, బెల్ సిస్టం, బెడ్ షీట్స్ మొదలవునవి ఉంటాయి. H1, H2 అంటే రెండు కోచ్‌లు అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచుల్లో కూపే, క్యాబిన్ అనేవి ఉంటాయి. కూపే అంటే ఇద్దరు ప్రయాణికులకు ప్రత్యేకంగా కంపార్ల్‌మెంట్ ఉంటుంది. ఇక క్యాబిన్ అంటే నలుగురు ప్రయాణికులు ఉంటారు.

    మీ టికెట్ మీద A1, B1 అని ఉంటే.. టూ టైర్ ఏసీ కోచ్‌లని అర్థం. ఇందులో కర్టెన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 6 బెర్త్‌ల వరకు ఉంటాయి. ఇక B1, B2, B3 అని ఉంటే అవి ఏసీ త్రీ టైర్ కోచ్‌లని అర్థం. S1, S2 అంటే సాధారణ స్లీపర్ కోచ్‌లన్నమాట. CC అంటే ఏసీ చైర్ కార్. ఏసీ సౌకర్యం ఉంటుంది, కూర్చుని ప్రయాణించాలి.

    ఇదీ చదవండి: భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!

  • గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.

    చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

    ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!

  • ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన ఓబెన్ ఎలక్ట్రిక్.. సరికొత్త రోర్ ఈవీఓ లాంచ్ చేసింది. మొదటి 10,000 మంది కస్టమర్లు దీనిని రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. తరువాత దీని ధర రూ. 1,24,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

    కేవలం రూ. 777తో బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, దేశవ్యాప్తంగా ఉన్న 150 షోరూమ్‌లలో టెస్ట్ రైడ్‌లు, కస్టమర్ డెలివరీలు జూన్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. మంచి డిజైన్ కలిగిన ఈ ఓబెన్ రోర్ ఈవీఓ ముందు భాగంలో సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది.

    రోర్ ఈవీఓ గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్ రేంజ్ 180 కిమీ (సింగిల్ ఛార్జ్). రియల్ వరల్డ్ రేంజ్ కొంత తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 90 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. రోజువారీ ఛార్జింగ్ కోసం ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉపయోగపడుతుంది.

    ఈ మోటార్‌సైకిల్‌కు IP68-రేటెడ్ మోటార్ శక్తిని అందిస్తుంది. రోర్ ఈవీఓలో ఓబెన్ వారి సొంత 3.4 kWh అధిక-పనితీరు గల LFP బ్యాటరీని అమర్చారు. ఇది సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే 50% అధిక ఉష్ణ నిరోధకతను కలిగి ఉండటమే కాకుండా.. రెండు రెట్లు జీవితకాలాన్ని అందిస్తుంది.

    ఇదీ చదవండి: బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!

    రోర్ ఈవీఓ 5 ఇంచెస్ కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్‌లను అందిస్తుంది. Oben Electric యాప్ ద్వారా, రైడర్‌లు రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నోస్టిక్స్, 'ఫైండ్ మై Rorr', 24x7 సర్వీస్ సపోర్ట్‌ను పొందవచ్చు. దీనితో పాటు 68,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ కూడా లభిస్తుంది.

  • ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. 2026 ఏప్రిల్‌ 29 నాటికి తమ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య 70 కోట్లు దాటినట్లు సంస్థ తెలిపింది. 

    తొలి 10 లక్షల మంది యూజర్ల స్థాయిని చేరడానికి 136 రోజులు పట్టగా, ప్రస్తుతం ప్రతి 6 రోజులకు ఈ మైలురాయిని దాటేస్తున్నామని పేర్కొంది. 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో యూజర్ల సంఖ్య వార్షికంగా 56.25 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ నిగమ్‌ తెలిపారు. మరిన్ని ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.

  • మాజీ ట్విట్టర్‌ సీఈఓ పరాగ్ అగర్వాల్.. టెక్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. ట్విటర్ (ఎక్స్)లో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. ఆయన స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోంది. తాజా నిధుల సమీకరణ తర్వాత 2 బిలియన్ డాలర్ల (రూ. 19,020 కోట్లు) విలువను చేరుకుంది.

    సీక్వోయా క్యాపిటల్ నేతృత్వంలో జరిగిన సిరీస్ బీ రౌండ్‌లో.. ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ 100 మిలియన్ డాలర్లు (రూ. 951 కోట్లు) సమీకరించింది. ఈ రౌండ్‌లో క్లైనర్ పెర్కిన్స్, ఇండెక్స్ వెంచర్స్, ఖోస్లా వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్, స్పార్క్ క్యాపిటల్, టెర్రైన్ క్యాపిటల్ వంటి పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు.

    ఐదు నెలల క్రితం, ఈ స్టార్టప్ 740 మిలియన్ డాలర్ల (రూ.7,037 కోట్లు) వాల్యుయేషన్‌తో సిరీస్ ఎ ఫండింగ్‌లో 100 మిలియన్ డాలర్ల (రూ.951 కోట్లు) నిధులను సమీకరించింది. కాగా తాజా పెట్టుబడితో, కంపెనీ సమీకరించిన మొత్తం నిధులు ఇప్పుడు 230 మిలియన్ డాలర్లకు (రూ.2,187 కోట్లు) చేరాయి.

    ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ అనేది AI ఏజెంట్ల కోసం రూపొందించిన సాధనాలను నిర్మిస్తుంది, ఆటోమేటెడ్ సిస్టమ్‌లకు అనుగుణంగా వెబ్ సెర్చ్‌, రీసెర్చ్‌ APIలను అందిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే నోషన్, ఓపెన్‌డోర్, క్లే, హార్వే వంటి ప్రముఖ క్లయింట్లను ఆకర్షించింది. ఇది బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లకు కూడా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే నిర్దిష్ట పేర్లను వెల్లడించలేదు.

    తమ ప్లాట్‌ఫామ్‌ను లక్షకు పైగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ అని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో.. ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ ఎకోసిస్టమ్‌లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ

    2022లో ట్విటర్ (ఎక్స్) సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత.. పరాగ్ అగర్వాల్ తన సీఈఓ పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయనతో పాటు ఇతర మాజీ అధికారులు 128 మిలియన్‌ డాలర్ల పరిహారం కోసం కేసు వేశారు. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇది గోప్యంగా పరిష్కారమైంది. కాగా.. ఇప్పుడు ఓ స్టార్టప్ కంపెనీతో పరాగ్ దూసుకెళ్తున్నారు.

  • న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రెండు కీలక సంస్థలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జెనెరిక్‌ ఔషధాల తయారీ సంస్థ హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌, స్టీల్‌ పైపుల ఉత్పత్తిదారు ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ప్రాథమిక పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి పొందాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను పరిశీలించిన సెబీ, ఏప్రిల్‌ 27న తుది అనుమతులు (అబ్జర్వేషన్స్‌) మంజూరు చేసింది.

    హిందుస్థాన్‌ లాబొరేటరీస్‌: ఫార్మా రంగంలో సేవలందిస్తున్న హిందుస్థాన్‌ లా»ొరేటరీస్‌ ఐపీఓలో భాగంగా 50 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు మరో 91 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ స్థాయిలో జెనెరిక్‌ మందులను సరఫరా చేసే (బీ2బీ) వ్యాపారంలో కొనసాగుతోంది.

    ఆర్‌కే స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌: స్టీల్‌ ట్యూబ్‌లు, పైపుల తయారీలో ఉన్న ఆర్‌కే స్టీల్‌ సుమారు 2 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను పబ్లిక్‌ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ల వాటా విక్రయం (ఓఎఫ్‌ఎస్‌) ఏమీ లేదు. సేకరించిన నిధులను ప్రధానంగా సంస్థకున్న రుణాల చెల్లింపులకు, మూలధన నిర్వహణ, వ్యాపార విస్తరణ అవసరాలకు కేటాయించనుంది.  పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో లిస్ట్‌ కానున్నాయి.

  • విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

    ఢిల్లీలో కొత్త ధరలు

    దేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్‌మార్క్‌గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.

    దేశీయ సంస్థలకు ఊరట

    ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

    ఎందుకు ఈ పెంపు?

    ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.

    దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్‌లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.

    ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

  • అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.

    కేసు నేపథ్యం

    ఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్‌) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.

    న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలు

    ఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్‌) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్‌దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్‌సీఐఎస్‌ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.

    న్యాయ నిపుణుల స్పందన

    ఈ తీర్పును పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్‌సీఐఎస్‌ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.

    ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

  • ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సుమారు రూ.12,600 కోట్ల (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) సంపదకు అధిపతి అయినప్పటికీ ఆయన అనుసరించే సరళమైన జీవనశైలి, క్రమశిక్షణ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తులు తమ రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ కోణంలో సుందర్ పిచాయ్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

    ఉదయాన్నే స్పష్టమైన ఆలోచనలు

    చాలామంది మేల్కోగానే స్మార్ట్‌ఫోన్‌ల్లో నోటిఫికేషన్లను తనిఖీ చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. కానీ, పిచాయ్ శైలే వేరు. ఆయన రోజూ ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండడం ఆయనకు ఇష్టం. మేల్కొన్న వెంటనే ఆయన చేసే మొదటి పని వార్తాపత్రికలు చదవడం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా తన మేధస్సును పదును పెడుతుంటారు. ఈ అలవాటే ఆయనకు సమాచార విశ్లేషణలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.

    పోషకాహారం

    సుందర్ శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ, తన రోజువారీ అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఉదయం పూట తీసుకునే ప్రోటీన్ మెదడుకు, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందని ఆయన నమ్ముతారు. ఆయన ఉదయం అల్పాహారంలో సాధారణంగా ఒక కప్పు టీ, ఆమ్లెట్, టోస్ట్ ఉంటాయి. ఇందులో ఆమ్లెట్ ప్రోటీన్ కోసం, టోస్ట్ కార్బోహైడ్రేట్ల కోసం దోహదపడతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించినా పోషక విలువల పరంగా ఇది ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్. భారతీయ మూలాలున్న పిచాయ్‌కు టీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉదయాన్నే వేడివేడి టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కొత్త ఉత్సాహంతో డే ప్రారంభించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడతారు.

    విజయానికి అసలైన సూత్రం

    సుందర్ పిచాయ్ జీవితం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే.. విజయం అంటే సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కాదు, ఉన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణతో ఆచరించడం.

    • ఉదయాన్నే ప్రశాంతంగా రోజును ప్రారంభించడం.

    • వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడం.

    • సరళమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం.

    రూ.12,600 కోట్ల ఆస్తులున్న ఒక వ్యక్తి తన దినచర్య పరంగా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే ఆ క్రమశిక్షణను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకోవడం యువతకు ఒక పాఠం. భవిష్యత్తుపై స్పష్టత, సమకాలీన అంశాలపై పట్టు ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుందర్ పిచాయ్ జీవనశైలి నిరూపిస్తోంది.

    ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

  • దేశంలోనే సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న కర్ణాటక మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్ పరికరాల తయారీ దిగ్గజం ‘అప్లైడ్ మెటీరియల్స్ ఇంక్’ కోసం బెంగళూరులో 140 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ‘బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్’ (బీఎస్‌బీపీ)లో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భూ కేటాయింపు ద్వారా రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగం మరింత బలోపేతం కానుంది.

    కేటాయింపు ముఖ్యాంశాలు

    ప్రాజెక్టు స్థలం: కెంపెగౌడ విమానాశ్రయ సమీపంలోని బెంగళూరు సిగ్నేచర్ బిజినెస్ పార్క్.

    కేటాయింపు భూమి: 140 ఎకరాలు.

    నిబంధన: లీజు-కమ్-సేల్ ప్రాతిపదికన కేటాయింపు.

    ధర: చదరపు అడుగుకు రూ.1,288 చొప్పున, మొత్తం రూ.780 కోట్ల విలువైన భూమిని కంపెనీకి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    వ్యూహాత్మక ప్రాధాన్యత

    రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, రాష్ట్రంలో చిప్ తయారీకి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని పేర్కొన్న తరుణంలో ఈ వార్త వెలువడింది. కర్ణాటక ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), గ్లోబల్ క్యాబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అప్లైడ్ మెటీరియల్స్ రాకతో ఈ రంగంలో రాష్ట్రం తన పట్టును మరింత పెంచుకోనుందని మంత్రి చెప్పారు.

    పారదర్శకతకు పెద్దపీట

    ఈ భూ కేటాయింపు చట్టబద్ధమైన అనుమతులు, ధరల నిర్ణయానికి లోబడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, బీఎస్‌బీపీలో మిగిలి ఉన్న 267 ఎకరాల భూమిని ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారదర్శకత కోసం పోటీ బిడ్డింగ్, నిపుణుల సలహాల మేరకు తదుపరి విధివిధానాలను రూపొందించనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది.

    ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Telangana

  • సాక్షి,హైద‌రాబాద్ : అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం , చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం  స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం  రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రిగారు సొసైటీ  స‌భ్యులు అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాథమికంగా గుర్తించారు.

    జ‌ర్న‌లిస్టులు అంద‌రూ ఒకేతాటిపై ఉంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సులువు అవుతుంద‌ని, అన్ని సొసైటీలు క‌లిపి ఒకే వేదిక‌పైకి వ‌చ్చి జేఏసీ  ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. జ‌ర్నలిస్టు సంఘాల‌లో స‌భ్యులు కాని అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ళ స్ధ‌లాలు ఇస్తామ‌ని చెబుతూ ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావు లేకుండా ఇళ్ల స్ధ‌లాల మంజూరు జ‌రిగేలా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ‌తంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌దేన‌ని తేల్చిచెప్పారు.

    ఇప్పటి ప్రజా ప్ర‌భుత్వం వ‌చ్చాక  18 ఏళ్లుగా ప‌రిష్కారం కాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ  ఇళ్ల స‌మ‌స్య‌ను కొలిక్కి తీసుకువ‌చ్చి  ర‌వీంద్ర భార‌తిలో  జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి భూమి  అప్ప‌గించిన‌ప్ప‌టికీ న్యాయ‌వివాదాల కార‌ణంగా స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు. జ‌ర్న‌లిస్ట్‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ద‌శాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల సమ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకొని జూన్ 2వ తేదీ నాటికి కొలిక్కి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. 

    ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు సానుకూల దృక్ప‌ధంతో ఉన్నార‌ని ఫ్యూచ‌ర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ల స్ధ‌లాలు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు.18 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇంటి స్ధ‌లాల కోసం ప్ర‌తిస‌భ్యుడు రెండు ల‌క్ష‌ల రూపాయిల చొప్పున చెల్లించార‌ని  దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాల కేటాయింపులో త‌మ సొసైటీకి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు మంత్రికి విన్నవించారు. 
     

    ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వారికి సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని సూచించారు. సమావేశంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, సమాచార పౌర‌సంబంధాల శాఖ ప్ర‌త్యేక క‌మీష‌న‌ర్ జి. ముకుంద రెడ్డి, సిపీఆర్‌వో మ‌ల్సూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ బీ.సుమతి ఈ రోజు ( శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ లోని సిటిజన్స్ యొక్క ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే తమ ప్రధాన ప్రయారిటీ అని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ తో నేరాలకు చెక్.. క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్  పై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. .

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మల్కాజ్‌గిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని సీపీ సుమతి పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని  ధీమా వ్యక్తం చేశారు.

    సాంకేతికతతో నేరాలకు చెక్
    నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ తెలిపారు. AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

    మాదకద్రవ్యాల కట్టడి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
    సమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

    "మహిళా పోలీస్ కమిషనర్‌గా నన్ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు.

  • సాక్షి, హైదరాబాద్:పెండింగ్‌ చలాన్ల విషయంలో రాష్ట్ర హైకోర్టు డీజీపీ, మాజీ డీజీపీ, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీలకు నోటీసులు అందజేసింది. ట్రాఫిక్‌ చలాన్లు ఉంటే వాహనాలను సీజ్‌ చేయెుద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ ట్రాఫిక్‌ పోలీసులు సదరు వ్యక్తికి చెందిన వాహనాన్ని సీజ్‌ చేశారు. దీంతో సదరు వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు డీజీపీతో పాటు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  

    అయితే గతంలో హైకోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది. వాహనదారులు చలాన్‌లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయవద్దని. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్‌లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు. అంతేకానీ.. పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దు అని అధికారులని కోర్టు ఆదేశించింది. 

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇతర ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

    ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానన్నారు.

    సీవీ ఆనంద్ నేపథ్యం

    ఐపీఎస్‌ 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌.. నక్సలైట్‌ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా, ట్రాఫిక్‌ కమిషనర్‌గా, సైబరాబాద్‌ కమిషనర్‌గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది.

    తన సర్వీస్‌ ఆరంభంలోనే వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్‌ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్‌ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు పోలీసుశాఖలో మరెన్నో కీలక పదవులు అధిరోహించారు.

    ప్రముఖ పదవులు

    కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, హైదరాబాద్‌

    కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, సైబరాబాద్‌

    ట్రాఫిక్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రారంభించారు)

    డైరెక్టర్ జనరల్‌, యాంటీ-కరప్షన్ బ్యూరో

    స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ
     

    సంస్కరణలు-ఆవిష్కరణలు

    ఈ-చలాన్, స్పీడ్‌ గన్స్‌, రివర్సిబుల్‌ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్‌" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.

    సైబరాబాద్‌లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్‌, షీ టీమ్స్‌, షీ షటిల్స్‌ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.

    పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (PDS): ఆధార్‌ ఆధారిత రేషన్‌ వ్యవస్థ, GPS ట్రాకింగ్‌, ఆన్‌లైన్‌ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు.

    అవార్డులు

    పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ

    ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌ ఫర్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్

    పోలీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్

    తెలంగాణ స్టేట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు

  • నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం పిట్టపల్లిలో నోష్‌ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 3వ బ్లాక్‌లో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలింది. తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో పేలుడు. ఇదే ఫ్యాక్టరీలో గత నెల 9న రియాక్టర్‌ పేలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.

     

National

  • ఢిల్లీ: దేశ వ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి.

    జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం.

    ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్‌ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది.  

    దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్‌ 24 పరగణాల జిల్లాలోని  డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్‌లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.

    142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్‌ చెల్లదని కమిషన్ ప్రకటించింది.

    అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

  • మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్‌  జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు కొన్ని  క్షణాల ముందుసంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  

    రాజేష్‌ సాహూ అనే  ఎక్స్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ‘‘జబల్‌పూర్‌లో క్రూయిజ్ బోల్తా పడటానికి ముందు తీసిన వీడియో ఇది. వాతావరణం అకస్మాత్తుగా మారి, బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజలు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎవరూ లైఫ్ సపోర్ట్ జాకెట్ ధరించలేదు. అయితే, తరువాత ప్రజలు వాటిని ధరించారు. దీనివల్ల సుమారు 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

     పడవ బోల్తా పడటానికి ముందు చివరి క్షణాలను చూపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది. బలమైన గాలులను ఎదుర్కొంటూ, కల్లోలభరితమైన నీరు దానిని తీవ్రంగా కుదిపేస్తుండగా, ఆ పడవ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి. క్షణాల్లోనే అది అదుపు తప్పి బోల్తా పడటంతో, ప్రయాణికులు నీటిలో పడిపోయిన దృశ్యాలు కలకలంరేపాయి. 

     మరోవైపు సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ  ప్రమాదంలో ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు.  మిగిలిన వారి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది.

     

     

  • సాక్షి,  చెన్నై: తమిళనాడులో అధికారం పీఠం దక్కించుకోబోతోందన్న వార్తల మధ్య . నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆఫీసుకు నిప్పు పెట్టారన్న వార్త సంచలనంగా మారింది.  తిరుచిలోని టీవీకే కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని న్యూస్18 నివేదిక తెలిపింది. శ్రీరంగం నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఈ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.

    ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయం పూర్తిగా కాలిపోయిందని, ఓటర్ల జాబితాలు, పత్రాలు, బ్యానర్లు, రోజువారీ ఎన్నికల కార్య కలాపాలకు ఉపయోగించే పరికరాలు వంటి కీలకమైన ప్రచార సామగ్రి నాశనమైనట్టు తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి రమేష్, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎన్నికల కార్యాలయానికి నిప్పు పెట్టారని, దీంతో కార్యాలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో తగిన భద్రత కల్పించాలని కోరారు.

     కాగా  అయిదు  రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.  ఈ ఫలితాల్లో డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే  మాత్రం విజయ్‌ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. 

     

  • ఒక గృహిణి తలచుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగగలదని నిరూపించిన లలితా పాటిల్   స్ఫూర్తి దాయక కథ ఇది.  కేవలం రూ. 2,000 పెట్టుబడితో ప్రారంభించి, ఏడాదికి ఒక కోటి టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు థానేకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త లలితా పాటిల్. పదండి ఆమె సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

    మహారాష్ట్రలోని థానేకు చెందిన లలితా పాటిల్‌కు 20 ఏళ్లకే వివాహమైంది.  వేణ్ణీల్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు భర్తకు ఆసరాగా ఉండేందుకు, ఆర్థిక స్వతంత్రత కోసంట్యూషన్లు చెప్పడం, మందులు అమ్మడం లాంటి పనులు చేసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. లలిత భర్త గ్యాస్ ఏజెన్సీ నడిపేవారు, కానీ ప్రభుత్వ పైప్‌లైన్ పథకం వల్ల ఆ వ్యాపారం దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫిజిక్స్‌లో పట్టభద్రురాలైన లలిత, తాను ఎప్పుడూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించేవారు. ఈ నేపథ్యంలోనే సమయం చూసి ఆమె  పెద్ద సాహసం చేశారు.

    ఇదీ చదవండి: భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం

    టిఫిన్ సర్వీస్ ప్రస్థానం
    ఆ క్లిష్ట పరిస్థితుల్లో లలిత 2016లో కేవలం రూ. 2,000లతో టిఫిన్ బాక్సులు కొని, మరో రూ. 500లతో పాంప్లెట్లు ముద్రించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. తన సంస్థకు 'ఘరాచి ఆఠవణ్' (Gharachi Athavan) అంటే 'ఇంటి జ్ఞాపకం' అని పేరు పెట్టారు. థానేలోని ఉద్యోగులు, విద్యార్థులనుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఇక్కడితో ఆమె పయనం ఆగిపోలేదు.

    టర్నింగ్‌ పాయింట్‌ 
    ఒక ఏడాది తర్వాత, తనను కేవలం గృహిణిగా కాకుండా ఒక బిజినెస్ ఉమెన్‌గా నిరూపించుకోవాలని ఆమె తపించారు. కానీ పెట్టుబడికి డబ్బు లేదు. 2019లో బ్రిటానియా ఇండస్ట్రీస్ నిర్వహించిన స్టార్టప్ పోటీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ పోటీలో విజేతగా నిలిచి రూ. 10 లక్షల ప్రైజ్ మనీని (పన్నుల తర్వాత రూ. 7 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు.

    చిన్న టిఫిన్‌ సెంటర్‌ నుంచి రెస్టారెంట్ దాకా
    2019, జూలైలో థానేలోని కోప్రి ప్రాంతంలో ఆమె సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించారు. ఇంటి రుచులతో కూడిన భోజనం, కేటరింగ్ మరియు టిఫిన్ సర్వీసులతో ఆమె వ్యాపారం శరవేగంగా విస్తరించింది.  ఆమె విజయప్రస్థానాన్ని చూసి, భర్త కూడా తన పాత ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో తోడుగా చేరారు. మరో 10 మంది ఉపాధి కల్పించారు.  ఫలితంగా ఆమె ఆదాయం  నెలకు రూ. 6-7 లక్షలు సంపాదిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 1 కోటికి చేరుకుంది.

    "ఇంటి నుండి పనిచేసే మహిళను ఎప్పుడూ గృహిణిగానే చూస్తారు. ఆమె ఇంటి గడప దాటి బయటకు అడుగుపెట్టి, సమాజం 'ముఖ్యమైనది'గా భావించే ఏదైనా సాధించినప్పుడే ఆమె కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి" -లలితా పాటిల్ 

  • మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా జరిగిన పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆయనకు ఆల్కహల్‌  టెస్ట్ చేయాలని పట్టుబట్టాయి.

    ముఖ్యమంత్రి మద్యం మత్తులో సభకు వచ్చారని ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా  రాష్ట్ర అధినేతపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున సభలోని సభ్యులందరికీ అల్కాహాల్‌ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక దినోత్సవం నాడు ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం "అత్యంత సిగ్గుచేటు" అని మండిపడ్డారు. ఆయన ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డోప్ పరీక్ష డిమాండ్ ను స్పీకర్ తిరస్కరించారు.

    అయితే ప్రతిపక్షాల నిరసనలతో సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశమని దయచేసి సభ్యులంతా సభామర్యాదలు పాటించాలని కోరారు.  మేడే సందర్బంగా పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాన్ని కార్మికులకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసింది.

    అయితే గత నెల ఏప్రిల్‌లో  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు, [రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్‌  బీజేపీలో విలీనమయ్యారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ చర్యతో రాజ్యసభలో బీజేపీ బలం 113కి పెరగగా, ఆప్ బలం 3కి పడిపోయింది, దీనిని 'రాజ్యాంగ విరుద్ధం' అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖండించింది.

  • బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ మహిళ పెళ్లిరోజుకు ముందే ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె రాసిన సూసైడ్ నోట్ భర్తకు లభించింది. ‘ఆ వ్యక్తి మీ అమ్మను చాలా హింసించాడు. తనను డిజిటల్ అరెస్ట్ పేరుతో వేధించారు’’ అని తెలిపింది. అయితే, వేధింపులకు పాల్పడిన వ్యక్తి పేరును లేఖలో ఆమె పేర్కొనలేదు. ప్రతి జన్మలోనూ మీలాంటి కుటుంబమే రావాలని కోరుకుంటున్నాను. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. నన్ను క్షమించు.. అమ్మ చనిపోవాల్సి వస్తోందంటూ ఆమె ఆ నోట్‌లో రాసింది.

    ఆమె మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, రెండు మూడు అనుమానాస్పద నంబర్ల నుండి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ నంబర్లకు తిరిగి కాల్ చేయగా, ఒక్కరూ కూడా స్పందించలేదు. కానీ ఒక నంబర్ నుండి మాత్రం వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులను బెదిరించారు. బిజ్నోర్ ఎస్పీ అభిషేక్ ఝా మాట్లాడుతూ మహిళ మరణించిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 30న పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, అనుమానాస్పద నంబర్ నుండి వచ్చిన వీడియో కాల్‌ను ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

  • ప్రముఖ ఐటీ సేవల సంస్థ  కాగ్నిజెంట్ టెక్నాలజీ  కార్మికుల దినోత్సవం రోజు చేదు వార్త తెలిపింది. తన ఉద్యోగులలో సుమారు 1శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనివల్ల 4,000కు పైగా ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది.  AI , డిజిటల్ ఆఫరింగ్‌లపై ఖర్చును పెంచుతూనే, కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మించాలని చూస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ లీప్ ద్వారా ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతోంది.


    లైవ్ మింట్ నివేదిక ప్రకారం, తగ్గుతున్న డిమాండ్, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడం వృద్ధిపై భారం మోపుతున్న తరుణంలో ఈ నిర్ణయం వెలుడుతుంది. ముఖ్యంగా  కంపెనీ తన పూర్తి-సంవత్సర అంచనాలను తగ్గించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

    కంపెనీ  ప్రకటించిన 'ప్రాజెక్ట్ లీప్'లో  భాగంగా ఏఐ (AI), సమీకృత డిజిటల్ సేవలు మరియు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై అధిక పెట్టుబడి పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి 230 మిలియన్ల  డాలర్లనుంచి  320 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో ఉద్యోగుల తొలగింపు , ఇతర సిబ్బంది సంబంధిత ఖర్చుల కోసం200 మిలియన్ల డాలర్లనుంచి  270 మిలియన్ల డాలర్ల వరకు ఉంటాయని, అదే సమయంలో ఈ ఏడాది 300 మిలియన్ల డాలర్ల వరకు ఆదా అవుతుందని కాగ్నిజెంట్ తెలిపింది.

    ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారో కాగ్నిజెంట్ స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఆదాయాల ప్రకటన తర్వాత జరిగిన విశ్లేషకుల సమావేశంలో యాజమాన్యం మాట్లాడుతూ, ఈ ఏడాది 20,000 మందికి పైగా ఫ్రెషర్లు చేరతారని, దీనిని బట్టి ఈ కోతలు మధ్య-స్థాయి ఉద్యోగాలపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని సూచించింది.

    ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్‌ ఫిదా!

    ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, మార్చి 2026 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగి 357,600కు చేరుకుంది.  2023 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్. రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగాల కోతలలో ఇది రెండవ విడత. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల తర్వాత, మే 2023లో కాగ్నిజెంట్ నాన్-బిల్లబుల్ పాత్రలలో సుమారు 3,500 మంది ఉద్యోగులను తొలగించింది.  

    ఇదీ చదవండి : నో లైఫ్‌ జాకెట్స్‌, పట్టించుకోలేదు : బోట్‌ విషాదంలో సంచలన ఆరోపణలు


     

  • Jabalpur boat tragedy  మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్‌  జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.  సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు.

    ది టైమ్స్ ఆఫ్ ఇండియా'  కథన ప్రకారం  ఈ విషాదానికి కారణం కేవలం వాతావరణం మాత్రమే కాదు. వరుస వైఫల్యాలు ఉన్నాయని ప్రాణాలతో బయటపడినవారు ఆరోపించారు. వాతావరణం మారుతున్నట్లు కనిపిస్తున్నా, వెనక్కి వెళ్ళమని ప్రయాణికులు కోరినా ఆపరేటర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవ మునిగిపోవడం ప్రారంభమైన తర్వాతే సిబ్బంది లైఫ్ జాకెట్లు పంచారని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం మొదలైనప్పుడు కనీస భద్రతా చర్యలు లేవని ఆయన ఆరోపించారు.

     కాగా సిబ్బందితో సహా సుమారు 43 మంది ప్రయాణికులతో వెళుతున్న ఈ పడవ, అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫాను మధ్య జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బర్గీ డ్యామ్ వద్ద లో బోల్తా పడింది. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 60 నుండి 70 కిలోమీటర్ల  వేగంతో వీచిన అత్యంత తీవ్రమైన గాలులు, అల్లకల్లోల వాతావరణ పరిస్థితుల కారణంగానే పడవ అస్థిరపడి, అదుపు తప్పి బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొమ్మిది మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
     

    ఇదీ చదవండి : 4 వేలకు పైగా టెకీలను తొలగించనున్న కాగ్నిజెంట్‌

     

  • అన్నాడీఎంకే(ఎన్డీయే కూటమి)- టీవీకే పొత్తు చర్చల వేళ.. బీజేపీ సీనియర్‌ నాయకుడు అన్నామలై గతంలో చేసిన వ్యాఖ్యలు.. మళ్ళీ చర్చనీయాంశంగా మారాయి. అన్నామలై.. విజయ్ పార్టీతో (TVK) పొత్తు అసాధ్యమని గతంలో స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాఫీ, టీ కలిసిపోవు.. మేము సిద్ధాంతపరంగా విరుద్ధమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీగా వస్తే, అన్నాడీఎంకే.. విజయ్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    గతంలో ఓ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో ఒకవేళ అవసరమైతే విజయ్‌తో కలిసి పనిచేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా?" అని అడగ్గా.. అన్నామలై ఘాటుగా స్పందించారు. "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని నేను చాలాసార్లు చెప్పానంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎడప్పాడి కె. పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఘనవిజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం, టీవీకే 98 నుండి 120 స్థానాలను గెలుచుకుని.. అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నాయి.

    ఒక సర్వే టీవీకేకు సుమారు 35 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇది అధికార డీఎంకేతో సమానంగా ఉందని.. అదే సమయంలో ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి 23 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. జేవీసీ (JVC) ఎగ్జిట్ పోల్ ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమికి స్పష్టమైన మెజారిటీని అంచనా వేయగా.. మెజారిటీ సర్వేలు మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని సూచిస్తున్నాయి. వివిధ పోల్స్ సారాంశం ప్రకారం, డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ 86 నుండి 103 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. 

    తుది ఫలితాలు దగ్గరగా ఉంటే, టీవీకే 'కింగ్ మేకర్'గా మారే అవకాశముందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. పాత ప్రత్యర్థులు, కొత్త శక్తులు తమ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

  • సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరాకు భారీ ఊరట లభించింది. అస్సాం సీఎం సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో శుక్రవారం సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని చూస్తున్న అస్సాం పోలీసులకు భంగపాటు కలిగింది. 

    వ్యక్తిగత స్వేచ్ఛ (Article 21)ను తేలికగా ప్రమాదంలో పడేయరాదని ముందస్తు బెయిల్‌ తీర్పు సందర్భంగా జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ అతుల్‌ చందుర్కర్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఒకవేళ అరెస్ట్‌ గనుక జరిగితే కచ్చితంగా ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అస్సాం పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో.. విచారణలో సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పవన్‌ ఖేరాకు కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ బెయిల్‌లో అవసరమైతే అదనపు షరతులు కూడా విధించవచ్చని ట్రయల్‌ కోర్టుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

    వాదనలు ఇలా.. 

    👉ఖేరా తరఫున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మనూ సింఘ్వీ వాదించారు. ‘‘ఇది పరువు నష్టం కేసు మాత్రమే. కస్టడీ విచారణ అవసరం లేదు. అరెస్ట్‌ అవమానకరం. అలాగే ఈ కేసు అనూహ్యమైంది. సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

    👉అస్సాం పోలీసుల తరఫున సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ.. ‘‘పవన్‌ ఖేరా మీడియా సమావేశంలో చూపించిన పాస్‌పోర్ట్‌ పత్రాలు నకిలీ, కల్పితమైనవి. వాటిలో ఉన్న సర్కారీ ముద్రలు, QR కోడ్లు, అధికారిక గుర్తులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి విచారణ అవసరం. అందుకు కస్టడీ తప్పనిసరి. ఈ పత్రాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు. 

    👉కోర్టు తీర్పు.. కస్టడీ అవసరం లేదు. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నాం. విచారణకు ఖేరా పోలీసులకు సహకరించాలి

    ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రింకీ భూయాన్‌ శర్మపై పవన్‌ ఖేరా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఆమెకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించకుండా దాచి పెట్టారని పలు పత్రాలకు మీడియాకు ప్రదర్శించారాయన. అయితే.. 

    ఈ వ్యవహారంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పరువు నష్టం దావాకు వెళ్లడంతో గువాహతి పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన తెలంగాణ హైకోర్టులో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ అత్యవసర పిటిషన్‌ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వారంపాటు మధ్యంతర ఊరట ఇస్తూ.. ముందస్తు బెయిల్‌ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే.. 

    అస్సాం పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటపై సుప్రీం కోర్టు స్టే విధించింది. గువాహతి హైకోర్టు(అస్సాం)లో పిటిషన్‌ వేయాలని ఖేరాకు సూచించింది. దీంతో ఆయన స్టే తొలగించాలంటూ మరోసారి పిటిషన్‌ వేయగా.. మరోసారి చుక్కెదురైంది. ఈ తరుణంలో.. 

    పవన్‌ ఖేరా అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోందన్న ప్రచారం ఉధృతంగా సాగింది. ఈలోపు ఆయన గువాహతి కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో కచ్చితంగా అరెస్ట్‌ అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టగా.. కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Politics

  • తాడేపల్లి:  ముఖ్యమంత్రి చంద్రబాబుది దాపరికం లేని బహిరంగ దోపిడీ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిలో చిన్న చిన్న పనులకు వందల కోట్లు ఖర్చు చేయడం బహిరంగ దోపిడీకి నిదర్శమన్నారు. తన సంపద సృష్టికోసమే అమరావతినే చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. 

    ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ట్విన్‌ టవర్స్‌ పేరుతో మరో రూ. 12 వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం అసెంబ్లీ సచివాలయం భవనాల అద్దాల కోసం రూ. 3 వ వేల కోట్లు ఖర్చా?, చిన్న చిన్న పనులకే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టెండర్లకు కేబినెట్‌ ఆమోదం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. 

    కేబినెట్‌ ఎప్పుడు జరిగినా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు ఉండవు. భూముల కేటాయింపులు, రాజధాని నిధులపైనే నిర్ణయాలు ఉంటున్నాయి. అమరావతిని తన సంపద సృష్టికోసం వాడుకుంటున్నారు. 

    తనకు కావాల్సిన వాళ్లు లే ఔట్లకు అనుమతులు ఇస్తున్నారు. అమరావతి అద్భుత నగరం కాబోతుందని నమ్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే దళారీ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు బాబు హయాంలో దళారీ వ్యవస్థ తారాస్థాయికి చేరింది.  ఈ దుబారా ఖర్చు తప్పితే ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర లేదు’ అని విమర్శించారు. 

     

    సజ్జల ఏమన్నారంటే.. 

    • మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో సానుకూలత వచ్చింది
    • ఎల్లీ బ్యాచ్ దీన్ని తట్టుకోలేక  జగన్, ఆయన కుటుంబ సభ్యులను  దూషించారు
    • మావిగన్ మొదటి రోజు నుండే రాజధానిగా మారుతుంది
    • అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదని అందరికీ తెలిసిపోయింది
    • అందుకే టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేశారు
    • అమరావతిలో సెక్రటరియేట్ భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లా?
    • దీనికి  క్యాబినెట్ ఆమోదం తెలపటమా?
    • ఇది చూసి జనం బిత్తరపోతున్నారు
    • బిల్డింగుల నిర్మాణమే అడుగుకు ప్రస్తుతం రూ.12 నుంచి రూ 14 వేలు అయింది
    • ఈ అద్దాలకు అయ్యే ఖర్చు అదనం
    • ఇదంతా కలుపుకుంటే రూ.18 వేలకు ఒక్కో అడుగుకు ఖర్చు అవుతోంది
    • ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో కూడా ఇంత ఖర్చు కాదు
    • పాలవాగు డిజైన్ త్వరలోనే రూపొందిస్తారట
    • బిల్డింగుల చుట్టూ తిరుగుతూ పాలవాగు వెళ్తుందంట
    • దానికి ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదు
    • ట్విన్ టవర్ పేరుతో మరో రూ.12 వందల కోట్లు ఖర్చు
    • నగిషీలు, డిజైన్లు, అద్దాలు.. ఖర్చులు ఇది నిరంతరమైన ప్రక్రియ
    • ప్రజల సొమ్మును అమరావతిలో కృష్ణానదిలా పారిస్తున్నారు
    • అమరావతి పూర్తికాకూడదు, అది నిరంతర ప్రక్రియలా ఉండాలని చూస్తున్నారు
    • దీని ద్వారా సంపద సృష్టించుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్
    • టెండర్లకు క్యాబినెట్ అప్రూవల్ ఏంటో అర్థం కాదు
    • గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా చేయలేదు
    • ప్రజలకు పనికి వచ్చే ఏ పని గురించి క్యాబినెట్ లో చర్చించలేదు
    • అమరావతిలో దోచుకోవటానికి అవకాశం కల్పించినందున అక్కడి రైతులు అదృష్టవంతులంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు
    • రెండో దశ ల్యాండ్ పూలింగ్ 13వ తేదీనుంచి ప్రారంభించారు
    • దానికంటే ముందే ఆరో తేదీన లే అవుట్లకు అనుమతులు ఎలా ఇస్తారు?
    • రైతులు భూములు ఇచ్చిన వారికి ఏం ప్రయోజనం చేయలేదు
    • కానీ తనకు కావాల్సిన వారి లేఅవుట్లకు ఎలా అనుమతులు ఇస్తారు?
    • ఇంత బరితెగింపు దేశంలో ఎక్కడా జరగటం లేదు
    • ఈదోపిడీకి దేవతల రాజధాని అని అందమైన పేరు పెట్టుకున్నారు
    • మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇవ్వట్లేదు
    • రైతులకు మద్దతు ధర లేదు
    • ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు లేవు
    • కానీ అమరావతిలో దోచుకునేందుకు మాత్రం భారీగా నిధుల విడుదల చేస్తున్నారు
    • ఇంధన సంక్షోభం సృష్టించి మరీ దోపిడీ చేశారు
    • ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ దోపిడీ చేస్తూనే ఉన్నారు
    • రాజధానిలో పేదలకు యాభై వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది
    • పేదల స్థలాలను నిర్దాక్షిన్యంగా లాగేసుకున్నారు
    • చంద్రబాబు చేసే దోపిడీని అడ్డుకుంటున్నందుకు మమ్మల్ని విలన్ లాగా చూస్తున్నారు
    • వారిని ప్రశ్నించిందుకు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు
    • మేము అలాంటి వాటిపై స్పందించం
    • ప్రజా సమస్యలు, అవినీతిపై నిలదీస్తాం
    • అసలు అద్దాల కోసం రూ.2,540 కోట్లు ఖర్చు చేయటం ఏంటి?
    • అమరావతిలో మీడియా వాళ్లు వెళ్లే పరిస్థితే ఎందుకు లేదు?
    • అక్కడేమైనా అణుకేంద్రాలు కడుతున్నారా?
    • ప్రజల సంక్షేమాన్ని వదిలేసి వారిని జలగల్లాగ పట్టి రక్తం పీల్చుతున్నారు
    • పూడి శ్రీహరిపై ప్రభుత్వం వేధింపులకు దిగింది
    • ఒకే ఇష్యూ మీద ఎన్ని కేసులు పెడతారు?
    • దీనిపై హైకోర్టు ఒకటి కంటే ఎక్కవ ఎఫ్ఐఆర్ లు పెట్టవద్దని కూడా చెప్పింది
    • ఐనప్పటికీ పోలీసులు బరితెగింపుకు నిదర్శనమే
    • ఆటోలో, అంబులెన్సులో ఎక్కించుకుని శ్రీహరిని తిప్పారు
    • ఇలాంటి బెదిరింపులకు ఎవరూ లెక్కచేయరు
    • చంద్రబాబు, లోకేష్ గుర్తు పెట్టుకోండి.. మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తాం
    • ఆ శక్తి వైఎస్సార్‌సీపీకి ఉంది
    • తిరుమల లడ్డూపై చేసింది కల్పిత గాధ
    • దేవుని సొమ్ముని దోచుకోవటానికి అల్లిన కథ ఇది
    • దినేష్ కుమార్ కమిషన్ రిపోర్టులో మాపై ఆరోపణలు చేయలేదు
    • నెయ్యి కాంట్రాక్టును పెంచుకోవటానికే ఈ మొత్తం కథ నడిపారు
    • ఒక్క సంవత్సరంలోనే డబుల్ రేటు చేశారు
    • ధర పెంచి దేవుని సొమ్ము దోచుకోవటానికి పన్నిన కుట్ర
    • అందుకోసం భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు
    • అంత ఘోరాన్ని, నీచానికి చంద్రబాబు పాల్పడ్డారు
  • తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు.  కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్‌ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.

    ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. 

    పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్‌సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం  ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌లు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మే డే సందర్బంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

    రూపాయి విలువ పాతాళానికి.. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. హోటల్‌ కార్మికులకు మే డేన మోదీ ఇచ్చిన గిఫ్ట్‌ ఇది. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్‌ సిలిండర్ల ధరలు పెంచారు. ఎన్నికలయ్యాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

    కార్మికుల సంక్షేమం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కోసం మంచి చేయాలనే ఆలోచన రేవంత్‌ రెడ్డికి ఏ కోశాన కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు దానవీర శూరకర్ణ.. ఎన్నికల తర్వాత కుంభకర్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే.. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. దిగజారి బూతులు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు జేమ్స్‌ బాండ్‌ లెక్క బాండు పేపర్లు ఎందుకు రాశారు? అంటూ రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Crime

  • సాక్షి,హైదరాబాద్‌: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌-16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు సిరిసిల్ల పట్టణానికి చెందినవారు.

    పోలీసుల వివరాల ప్రకారం.. ఒకే కుటుంబసభ్యులు యాదగిరి గుట్ట నుంచి వస్తుండగా శంషాబాద్ వైపు వెళ్తున్న కారు (నంబర్‌ TS 23 F 2298) అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది.

    కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులున్నారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రయాణికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

     

Family

  • మనిషిలోని క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, భయం వంటి దుర్గుణాలను ప్రోత్సహిస్తున్న కొద్దీ అవి పేట్రేగి పోతుంటాయి. వాటిని అదుపు చేయడానికి ధ్యానం ఒక మార్గం. ధ్యానమంటే మనలోకి మనం ప్రయాణించడం.మన గురించి మనం అలోచించుకోవడం. మంచి మనిషిగా బతుకుతూ మనుషులందరినీ సమానత్వ భావనతో ప్రేమించడం. 

    పాప ప్రక్షాళన ఎలా సాధ్యం? 
    ఒక పండితుడు తెల్లవారు జామున చలికాలంలో నదిలో మళ్ళీ మళ్ళీ మునుగుతున్నాడు. వణికిపోతూ కూడా మునిగి లేస్తున్నాడు.
    బుద్ధుడు:: అంతగా వణికి పోతున్నారు. అలా నీళ్ళలో మునుగుతూ ఉంటే జబ్బు పడతారుకదా?
    పండితుడు: నేను తెలియక చాలా పాపాలు చేశాను. ఈ పవిత్ర గంగలో 108 సార్లు మునిగితే, పాపాలు ప్రక్షాళనమవుతాయి. చేసిన పాపాలకు పరిహారం చేసుకుంటున్నాను. 
    బుద్ధుడు: పాప ప్రక్షాళన తర్వాత, ముందు జబ్బు పడిమంచాన పడతారు. అయినా, మీ కాలి కింద కప్ప ఉంది. చూసుకున్నారా? దాన్ని చంపుతూ పాపాలు ఎలా కడుక్కుంటారూ?
    పండితుడు: అయ్యో చూసుకోలేదు మహాత్మా! – అంటూ, కాలు తీసి పక్కకు జరిగాడు.
    బుద్ధుడు: పాప ప్రక్షాళన మీరు చెప్పినట్టే జరిగితే, గంగలో ఉండే చేపలు, తాబేళ్ళూ వంటి నీటి జంతువులకు ఎప్పుడో మోక్షం దొరికేది కదా? మీ వివేకాన్ని తట్టి లేపండి! మీరు ఏమి తప్పులు చేశారో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోండి! అంతే!! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడే వెతకాలి! నీటిలో మీరు ఎన్నిసార్లు మునిగి లేచినా, మీరు చేసిన తప్పులు ఒప్పులు కావు. తప్పు జరిగిన చోటే సరి చేసుకునే మార్గముంటుంది. దాన్ని అన్వేషించండి.

    పండితుడు: మహాత్మా! నిజమే మీరు చెప్పిన విధంగా చేస్తాను. నా కళ్ళు తెరిపించారు. మీకు నమస్సులు.
    బుద్ధుడు: అన్ని అనర్థాలకు అజ్ఞానమే కారణం. పూజల వల్ల, వ్రతాల వల్ల, ఉపవాసాల వల్ల, బలుల వల్ల అజ్ఞానం దూరం కాదు. మనిషి, తనలోని వివేచనను తట్టి లేపాలి. అప్పా దీపోభావ! మనిషి తనకుతాను దీపంగా వెలిగితే, అజ్ఞానాంధకారం దరిదాపుల్లోకి రాదు.

    దైవ ప్రార్థన దేనికీ? 

    వేద వేదాంగాలు మధించిన ఒక రుషి పుంగవుడు బుద్ధుణ్ణి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ‘పూజలు, నోములు, ప్రార్థనలకు ఫలితం ఏమీ ఉండదని చెపుతున్నారట. ఇది అన్యాయం కదా బుద్దా!’
    బుద్ధుడు పక్కన ఉన్న నది వైపు తిరిగి ఇలా అన్నాడు– ‘మనం నదికి ఇటువైపు ఒడ్డున ఉన్నాం. అటువైపు ఒడ్డుకు చేరాలంటే ఏం చేయాలో చెప్పండి’ అన్నాడు.
    రుషి: నదిలో నీళ్ళు తక్కవగా ఉంటే, నడిచిపోవచ్చు. లోతుగా ఉంటే ఈదుతూ వెళ్ళొచ్చు. లేదా పడవతో నది దాటొచ్చు.
    బుద్ధుడు: సరే మీరు అన్నట్టు ఒకతను ఉన్నాడనుకోండి. అతను అంత దూరం నడవలేడు. ఈత రాదు. సమయానికి పడవ కూడా లేదు. అప్పుడు, దైవ ప్రార్థన మొదలు పెట్టి, ఆ అవతల ఒడ్డే తన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాడనుకోండి. ఫలితం ఉంటుందా చెప్పండి?
    రుషి: ఫలితం ఎలా ఉంటుంది? వాడంతటి మూర్ఖుడు మరొకడు ఉండడని అర్థం! ఎలాగో ప్రయత్నించి నది దాటడానికి ఉపాయం ఆలోచించాలి తప్ప, అలాంటి సమయంలో దైవప్రార్థన ఎందుకు పనికొస్తుంది?
    బుద్ధుడు:: అయితే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నను మరొకసారి గుర్తు చేసుకోండి.
    రుషి: అవును బుద్దా! నిజమే – మీరు చెప్పిన విషయం ఆలోచిస్తే నాకు సమాధానం దొరుకుతూ ఉంది. ప్రార్థనలతో, విశ్వాసాలతో పని జరగదు. పని జరగడానికి ఏది చేయాలో అది చేయకుండా ఊరికే చేసే దైవ ప్రార్థనలతో ఏ పనీ జరగదు. నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చినందుకు ఇవే నా నమస్సులు!

    -ప్రొ.దేవరాజు మహారాజు , వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

  • ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన ఫిట్‌నెస్‌ మంత్రాతో అందర్నీ అశ్చర్య పరుస్తున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా చాలా సునాయాసంగా ట్రైసెప్ డిప్స్ (Tricep Dips)  చేస్తూ అటు ఫిట్నెస్‌ ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. దీనికి వీడియో ఒకటి వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది

    ప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్‌  ప్రొడ్యూసర్ అతుల్ కస్బేకర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నానా సాహెబ్.. మీరు నా ఫిట్‌నెస్ లక్ష్యాలను మార్చుకునేలా చేశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఆయన 15 రెప్స్ చేశారు, నేను రికార్డింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాను" అంటూ  అతుల్  ఈవీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో నానా పటేకర్ తెల్లటి బనియన్, షార్ట్స్ ధరించి, మెడలో గమ్చా వేసుకుని బార్‌పై ఎంతో అలవోకగా ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించారు. దీనిపై నటీమణులు శిల్పా శెట్టి, రాహుల్ దేవ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం.

    నెటిజన్లు ఫిదా
    ఈ వయసులో కూడా నానా పటేకర్ తన క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌, పవర్‌  చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నానా సార్.. మీరు ఒక స్ఫూర్తి" అని కొందరు, "నిజమైన బలం అంటే ఇదే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, క్రమశిక్షణ ఉంటే ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండవచ్చని నానా పటేకర్ మరోసారి నిరూపించారు.

    ఇక నానా పటేకర్‌ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'ఓ రోమియో' (O'Romeo) సినిమాలో నానా పటేకర్ కనిపించారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రను పోషించారు.