Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఓ మహిళకు పెద్దపల్లి మండలం అప్పన్న పేటలో నివసించే అరవింద్‌తో స్నాప్ చాట్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే అతడికి 22, ఆమెకు 35 సంవత్సరాలు. అంతే కాదు ఆమె ఓ వివాహిత. తనకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.

    వీరి ప్రేమ వ్యవహారం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.  విషయం తెలియడంతో భార్యను ఇంటి నుంచి గెంటేశాడు ఆ మహిళ భర్త. ఏం చేయాలో పాలుపోక ప్రియుడు అరవింద్ ఇంటి ముందు బైఠాయించి పెళ్లి చేసుకోవాలని వేడుకున్న ప్రియురాలు. 

    12 సంవత్సరాల వయసు గల పిల్లలున్న మహిళతో పెండ్లి ఎలాగని తలలు పట్టుకుంటున్న అరవింద్‌ కుటుంబ సభ్యులు. ఇరు కుటుంబాల్లో చిచ్చు పెట్టిన  స్నాప్ చాట్ వ్యవహారం. 

    పోలీస్ స్టేషన్‌కు చేరిన స్నాప్ చాట్ ప్రేమ పంచాయతీ. ఇరు కుటుంబాలను కౌన్సిలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

  • సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (CIA)-చర్లపల్లి నోటిఫైడ్ మునిసిపల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ (CNMIASS) సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ (బుధవారం) సాయంత్రం ‘‘ప్రోగ్రెసివ్ డిఫెన్సె ఇండస్ట్రీ-ప్రోగ్రెస్ అఫ్ డిఫెన్సె ఇండస్ట్రీ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ హైదరాబాద్” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత ప్రాముఖ్యత గురించి వివరించారు. స్వదేశీ రక్షణ రంగ బలోపేతం ద్వారానే దేశ భద్రత, సాంకేతిక స్వావలంబన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

    అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భాన్ని స్మరించుకుంటూ, తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమల పాత్రను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీఐఏ అధ్యక్షులు డీఎస్‌ రెడ్డి, సీఎన్‌ఎంఐఏఎస్‌ఎస్‌ ఛైర్మన్‌ డా.కే గోవిందరెడ్డి, ప్రొఫెసర్ డా. కాశిరెడ్డి వెంకటరెడ్డి, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.


     

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఫిల్మ్నగర్‌, టోలీచౌకీ, గచ్చిబౌలి, మియాపూర్‌, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్లాపూర్‌, హఫీజ్పేట్‌, సరూర్నగర్‌, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్‌, షేక్‌‌పేటలో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్స్తంభించింది.

    నగరంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. మ్యాన్హోల్స్దగ్గర అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్‌ 9.7 సెం.మీ, లింగంపల్లి 8.2, హెచ్‌సీయూ 8.1, గచ్చిబౌలి 6.6, చందానగర్‌ 6.4, హఫీజ్పేట్‌ 5.6, ఫతేనగర్‌ 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

    ఏపీకి అలర్ట్‌.. 
    విజయవాడలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ కోస్తాంధ్ర  మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

    దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

     

    మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్‌ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 64.5మిమీ, కె.ఉప్పలపాడులో 53.5మిమీ, వేములపాడు 47మిమీ, చిలకపాడులో 45మిమీ,  విజయనగరం జిల్లా రాజాంలో 40.2మిమీ, కాకినాడలో 39మిమీ వర్షపాతం రికార్డు అయిందన్నారు.

     

     

     

     

     

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో డ్రైవర్స్ ,శ్రామిక్‌లు (Shramiks) పోస్టులు ఉన్నాయి. వాటి వివరాల‍్ని పరిశీలిస్తే..

    డ్రైవర్స్ పోస్టులు – 1000 ఖాళీలు
    అర్హతలు: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్‌ఎస్‌ఈ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.
    పురుషులు,మహిళలు ఇద్దరూ అర్హులు.
    వయస్సు పరిమితి: సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాలు.

    వయస్సు సడలింపు:
    ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌: 5 సంవత్సరాలు
    మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు

    ఎంపిక విధానం:
    ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్
    డ్రైవింగ్ టెస్ట్
    వెయిటేజ్ మార్కులు
    కనీస అర్హత మార్కులు

    శ్రామిక్ పోస్టులు – 743 ఖాళీలు
    అర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత 
    పురుషులు,మహిళలు అర్హులు.
    వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు.

    వయస్సు సడలింపు:
    ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌: 5 సంవత్సరాలు
    మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు

    ఎంపిక విధానం:
    వెయిటేజ్ మార్కులు
    కనీస అర్హత మార్కులు

    దరఖాస్తు వివరాలు: 
    ఆన్‌లైన్ దరఖాస్తు: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్
    దరఖాస్తు ప్రారంభ తేదీ:అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటలకు
    దరఖాస్తు ముగింపు తేదీ :అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలకు

    ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అర్హతలు కలిగిన అభ్యర్ధులు అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిపై మరి కొంతమంది విద్యార్థులు దాడిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్త్‌డే వేడుకలో విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. విద్యార్థికి రక్తం కారుతున్నా వదలని క్లాస్‌మేట్స్‌.. దాడికి పాల్పడ్డారు. ఆగస్టు 29న 9వ తరగతికి చెందిన విద్యార్థి పుట్టినరోజున పాఠశాల వచ్చాడు. తరగతి గదిలో మరో ముగ్గురు స్నేహితులు 'బర్త్ డే బంప్స్' అనే ఆట ఆడారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు.

    కొంతమంది తనపై దాడి చేశారని సదరు విద్యార్థి వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబస భ్యులు పలు ఆస్పత్రులలో చిక్సిత నిమిత్తం డాక్టర్‌ను సంప్రదించారు. పరీక్షించిన వైద్యులు మరో 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

     

  • హైద‌రాబాద్: రోబోటిక్‌ స‌ర్జ‌రీల గురించి మ‌న‌కు తెలుసు, టెలి స‌ర్జ‌రీల గురించి కూడా విన్నాం. కానీ ఈ రెండింటినీ క‌లిపి చేసి, ఎక్క‌డో సుదూర ప్రాంతంలో ఉన్న రోగుల‌కు ఊర‌ట క‌లిగించిన ఘ‌ట‌న‌లు తాజాగా జ‌రిగాయి. పూర్తిగా భార‌త‌దేశంలోనే త‌యారు చేసిన ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోటిక్ సిస్ట‌మ్‌ను ఉప‌యోగించి ఈ టెలి రోబోటిక్ స‌ర్జ‌రీలు చేయ‌డం విశేషం. న‌గ‌రానికి చెందిన ప్రీతి కిడ్నీ హాస్పిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, చీఫ్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ వి. చంద్ర‌మోహ‌న్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

    ‘‘పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత జ‌న్యుస‌మ‌స్య ఉన్న 16 నెల‌ల బాలుడికి శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. మూత్ర‌పిండాల‌లో గ‌రాటు ఆకారంలో ఉండే రీన‌ల్ పెల్విస్ అనే భాగం మూత్ర నాళాల‌ను, మూత్ర‌పిండాల‌ను క‌లుపుతుంది. స‌రిగ్గా అక్క‌డ ఆ బాబుకు ఒక అడ్డంకి ఏర్ప‌డింది. దాన్ని యూరేట‌రోపెల్విక్ అబ్‌స్ట్ర‌క్ష‌న్ అంటారు. దానివ‌ల్ల మూత్ర‌పిండం నుంచి మూత్ర‌కోశంలోకి మూత్రం వెళ్ల‌డం లేదు. దాంతో ఆ బాబుకు శ‌స్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకిని తొల‌గించాల్సి వ‌చ్చింది. అయితే బాబు వ‌య‌సు కేవ‌లం 16 నెల‌లే కావ‌డంతో రోబోటిక్ శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించారు.

    బాబును కొండాపూర్‌లోని ప్రీతి కిడ్నీ హాస్పిట‌ల్‌కు తీసుకురాగా.. డాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ గుర్‌గ్రామ్‌లోని ఎస్ఎస్ఐ మంత్ర కార్యాలయంలో ఉన్న క‌న్సోల్ వ‌ద్ద కూర్చుని ఈ శ‌స్త్రచికిత్స చేశారు. రెండు న‌గ‌రాల మ‌ధ్య 1600 కిలోమీట‌ర్ల‌కు పైగా దూరం ఉన్నా, అక్క‌డి నుంచి ఇక్క‌డి రోబోతో శ‌స్త్రచికిత్స చేశాం. ఇందుకు గంట స‌మ‌యం ప‌ట్టింది. ఇదంతా 5జి టెక్నాల‌జీ, రోబోటిక్ స‌ర్జ‌రీ వ‌ల్ల సాధ్య‌మైంది. గ‌తంలో చైనాలో 8 ఏళ్ల వ‌య‌సున్న వారికే ఇలా టెలిస‌ర్జ‌రీ చేశారు. దీంతో దేశంలో, ప్ర‌పంచంలో అతి చిన్న వ‌య‌సున్న 16 నెల‌ల బాబుకు  విజ‌య‌వంతంగా టెలిస‌ర్జ‌రీ చేసి, మ‌ర్నాడే డిశ్చార్జి కూడా చేసిన‌ట్ల‌యింది.

    మ‌రో కేసులో.. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్ న‌గ‌రంలో ఒక మ‌హిళ‌కు హిస్ట‌రెక్ట‌మీ (గ‌ర్భ‌సంచి తొల‌గింపు) శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత మూత్రం లీకేజి కావ‌డం మొద‌లైంది. దాంతో ఆమెకు అత్యాధునిక రోబోటిక్ స‌ర్జ‌రీ ద్వారా న‌యం చేయాల‌ని భావించారు. అయితే, అక్క‌డున్న వైద్యుల‌కు ఓపెన్ శ‌స్త్రచికిత్స అల‌వాటు ఉంది గానీ రోబోటిక్ శ‌స్త్రచికిత్స చేయ‌లేరు. దాంతో ఇక్క‌డ మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌గా, 5జి ఇంట‌ర్‌నెట్ ప్లాట్‌ఫాం, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్ట‌మ్, టెలిస‌ర్జ‌రీ సాయంతో ఆమెకు ఇక్క‌డినుంచే శ‌స్త్రచికిత్స చేశాం. గంటా 20 నిమిషాల్లో ఇది పూర్త‌యింది. రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌రిగిన తొలి శ‌స్త్రచికిత్స ఇదే అవుతుంది.

    ఈ శ‌స్త్రచికిత్స‌ల‌కు ఆస్ప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రూప‌, సీఈఓ డాక్ట‌ర్ రంగ‌ప్ప‌, సీనియ‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ యూరాల‌జిస్టులు డాక్ట‌ర్ హేమంత్, డాక్ట‌ర్ సౌంద‌ర్య‌, పీడియాట్రిక్ ఎన‌స్థ‌టిస్ట్ డాక్ట‌ర్ దేవేంద‌ర్‌, పీడియాట్రీషియ‌న్ డాక్ట‌ర్ వంశీ, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు రాజేంద‌ర్, గ‌ణేశ్‌, అనిల్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్ శ్రీ‌ధ‌ర్‌, రోబోటిక్ ఇంజినీర్లు దుర్గేష్‌, ఇషాన్ ప్ర‌శాంత్‌, ఎస్ఎస్ఐ మంత్ర డైరెక్ట‌ర్ విశ్వ‌, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్స్ సీఈఓ డాక్ట‌ర్ సుధీర్ శ్రీ‌వాస్త‌వ త‌దిత‌రుల స‌హ‌కారం ఎంత‌గానో ఉప‌క‌రించింది.  ఈ భార‌తీయ బృందం అంతా క‌లిసి శ‌స్త్రచికిత్స‌లు చేయ‌డానికి దూరం అనేది అడ్డం కాద‌ని నిరూపించారు.

    భార‌త‌దేశం చాలా సువిశాల‌మైన దేశం. అన్నిచోట్లా ఇంత నిపుణులైన వైద్యులు ఉండ‌డం సాధ్యం కాదు. అందువ‌ల్ల న‌లుగురైదుగురు వైద్యులు క‌లిసి ఒక స‌ర్జిక‌ల్ రోబో కొనుక్కుంటే.. ఇక్క‌డినుంచి దాంతో స‌ర్జ‌రీ చేయ‌గ‌లం. ఒకే క‌న్సోల్‌తో ఒకే స‌మ‌యంలో ప‌ది రోబోల‌కు క‌నెక్ట్ చేయొచ్చు. ఈ విధానం అక్క‌డి వైద్యుల‌కు శ‌స్త్రచికిత్స విధానాలు నేర్ప‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది’’ అని డాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ వివ‌రించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ 1 అంశంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీజీపీఎస్సీ(TGPSC) బుధవారం ఆశ్రయించింది. ఇంతకు ముందు సింగిల్‌ బెంచ్‌ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. గ్రూప్‌ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

    గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకులను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది. 

    ఒకటి.. మెయిన్స్‌ జవాబు పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా రీవాల్యూయేషన్‌ చేయాలి. సంజయ్‌సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్‌(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఆ రీవాల్యూయేషన్‌లోనూ పొరపాట్లు జరిగితే పరీక్ష నిర్వహణకు కోర్టే ఆదేశిస్తుంది. 

    రెండోది.. 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి, పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి అని హైకోర్టు స్పష్టంచేసింది.  మరోవైపు ఈ తీర్పుపై గ్రూప్‌-1 ర్యాంకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈక్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Business

  • చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్‌కు అలా కాదు.. బెస్ట్‌ కార్‌ తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్‌స్టర్‌ను జోడించారు.

    అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌

    ఎంజీ సైబర్‌స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.

    ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్‌స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.

    బటర్‌ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్‌, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ బ్యాటరీతో కార్580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.

    ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది.

  • సోలార్‌ ఫొటొ వోల్టాయిక్‌ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్‌ గ్రీన్‌ ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.

    ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్‌ సోలార్‌ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఒడిషాలోని గోపాల్‌పూర్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌లో 4 గిగావాట్ల సోలార్‌ పీవీ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్‌30కల్లా 3.8 గిగావాట్ల సోలార్‌ ఫొటొవోల్టాయిక్‌ మాడ్యూల్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్‌ ప్రాజెక్టులకు ఎండ్‌టుఎండ్‌ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.

    జీకే ఎనర్జీ @ రూ. 145–153 
    సౌర విద్యుత్‌(సోలార్‌ పవర్‌) ఆధారిత వ్యవసాయ నీటి పంప్‌ సిస్టమ్స్‌ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.

    ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్‌ పవర్‌ వ్యవసాయ పంప్‌ సిస్టమ్స్‌కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కమిషనింగ్‌(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్‌స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

  • రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్‌ అసోసియేట్స్‌(జేపీ) కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ను అనుమతించింది. దీంతో దివాలా చట్ట చర్యలలో భాగంగా జేపీని సొంతం చేసుకునేందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాకు దారి ఏర్పడనుంది. దివాలా పరిష్కారంకింద దాఖలు చేసిన బిడ్‌ గెలుపొందే వీలుంది.

    తద్వారా జేపీలో కనీసం 95 శాతం, గరిష్టంగా 100 శాతం వాటా కొనుగోలుకి సీసీఐ.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ లేదా భవిష్యత్‌లో పూర్తి అనుబంధ సంస్థగా ఎస్‌పీవీ ఏర్పాటు ద్వారా జేపీలో వాటాను సొంతం చేసుకునేందుకు అనుమతించింది. వెరసి జేప్రకాష్‌ అసోసియేట్స్‌ కొనుగోలుకి పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినట్లు సీసీఐ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

    కాగా.. జేపీ రుణ పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించే సంస్థకు సీసీఐ అనుమతి తప్పనిసరంటూ ఐబీసీ నిబంధనల సమీక్ష తదుపరి సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో జేపీ రుణ పరిష్కార ప్రణాళికకు బిడ్‌ దాఖలు చేసే సంస్థ సీసీఐ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.

  • ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్‌ న్యూస్‌ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్‌ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

    ట్రంప్‌ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్‌మెంట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ అద్భుతమంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాబర్ట్‌ కియోసాకి ఓ పోస్ట్‌ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.

    మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు
    ‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.

    కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్‌ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.

  • న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో భారత్‌లోకి రూ. 80 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ తెలిపారు. 1.5 కోట్ల పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. దేశీయంగా మారిటైమ్‌ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ మారిటైమ్‌ సూపర్‌పవర్‌గా భారత్‌ ఎదగనుందని పేర్కొన్నారు.

    కేంద్రం తలపెట్టిన సాగరమాల ప్రోగ్రాంతో 2035 నాటికి రూ. 5.8 లక్షల కోట్ల విలువ చేసే 840 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని సోనోవాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ. 1.41 లక్షల కోట్ల విలువ చేసే 272 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న వాధ్వాన్‌ పోర్టు అంతర్జాతీయంగా టాప్‌ 10 కంటైనర్‌ పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని సోనోవాల్‌ వివరించారు. దీనితో 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు.

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ ప్రయాణానికి ప్రకటన విడుదలైంది. రీజెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" పేరుతో 140 రోజుల క్రూయిజ్ ప్రయాణాన్ని ప్రకటించింది. మియామి నుండి న్యూయార్క్ వరకు వెళ్లే ఈ ‍సెవెన్‌ సీస్‌ స్ల్పెండర్‌ క్రూయిజ్‌ 6 ఖండాలు, 40 దేశాలు, 71 ఓడరేవులను కవర్ చేస్తుంది. ఈ విలాస సాగర యాత్ర 2027 జనవరి 11న ప్రారంభం కానుంది.

    టికెట్‌ ధరలు ఇలా..
    "వరల్డ్ ఆఫ్ స్ల్పెండర్" క్రూయిజ్‌ ఎక్కడం సామాన్యుల తరం కాదు. ఎందుకంటే అంతలా ఉన్నాయి టికెట్‌ ధరలు. ఎంట్రీ లెవల్ వరండా సూట్ల ఛార్జీలే ఒక్కొక్కరికి సుమారు రూ .80 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇక టాప్-ఎండ్ రీజెంట్ సూట్ కావాలంటే దాదాపు రూ .7.3 కోట్లు అవుతుంది. వాణిజ్య క్రూయిజ్ మార్కెట్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం.

    ఏమిటి ప్రత్యేకతలు?
    సముద్ర ఉపరితలంపై అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు అందించడంలో రీజెంట్ సూట్‌లకు సుదీర్ఘ ఖ్యాతి ఉంది.  ప్రతి పోర్ట్ లోనూ ప్రైవేట్ కారు, డ్రైవర్, ఇన్-సూట్ స్పా, క్యూరేటెడ్ ఫైన్ ఆర్ట్, 4,000 చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్‌ వంటి అల్ట్రా-ఎక్స్ క్లూజివ్ వసతులను అతిథులకు కల్పిస్తుంది.

    రీజెంట్ 2026లో సెవెన్ సీస్ ప్రెస్టీజ్ లో ఇంకా పెద్ద స్కైవ్యూ రీజెంట్ సూట్ ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. దీని ధర ఒక్క రోజుకి సుమారు రూ .20-22 లక్షలు. ఇది అత్యంత ఖరీదైన సూట్ రేటుగా రికార్డుకెక్కింది.

    ఆరు ఖండాలలో ప్రయాణం
    2027 "వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్" క్రూయిజ్ అతిథులు లాస్ ఏంజిల్స్, సిడ్నీ, సింగపూర్, మాలిబు,  ముంబై వంటి ప్రధాన నగరాల్లో రాత్రి బస చేసి ఆరు ఖండాల గుండా 35,668 నాటికల్ మైళ్ళు (66,057 కిమీ) ప్రయాణిస్తారు.

    మార్గం వెంట 486 కాంప్లిమెంటరీ షోర్ విహారయాత్రలు, మూడు ప్రత్యేకమైన తీరప్రాంత గాలా ఈవెంట్ లు, ఇంటర్‌కాంటినెంటల్‌ బిజినెస్‌ లేదా ఫస్ట్-క్లాస్ విమానాలు, లగ్జరీ హోటల్ బసలు, లగేజ్‌ సర్వీస్‌, ప్రీమియం బేవరేజీలు, స్పెషాలిటీ డైనింగ్, వాలెట్ లాండ్రీ, వై-ఫై, 24 గంటల ఇన్-సూట్ డైనింగ్ వంటివెన్నో ఈ విలాస ప్రయాణంలో ఉన్నాయి.

    ఈ ‍క్రూయిజ్‌కు భారత్‌లో నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ముంబై, మంగళూరు, కొచ్చి, గోవాలో ఈ క్రూయిజ్‌ను యాత్రికులు ఎక్కొచ్చు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.

    బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్ ​​వెనుకబడి ఉన్నాయి.

    విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది.

  • స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ నుంచి ప్రైవేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ నిష్క్రమించింది. కంపెనీలో తనకున్న మొత్తం 1.15 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా సుమారు రూ. 299 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌ డీల్‌ డేటా ప్రకారం అనుబంధ సంస్థ ఎంఐవో స్టార్‌ ద్వారా మాడిసన్‌ ఇండియా 67.72 లక్షల షేర్లను సగటున రూ.441.01 రేటుకు విక్రయించింది.

    ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లో భాగమైన పీఐ ఆపర్చూనిటీస్‌ ఏఐఎఫ్‌ 45.35 లక్షల షేర్లను (0.77 శాతం వాటా) రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 మే నెలలో మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ సహా మూడు సంస్థలు స్టార్‌ హెల్త్‌లో సుమారు 7.06 శాతం వాటాను రూ. 2,210 కోట్లకు విక్రయించాయి.

    కాగా నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. స్టార్‌ హెల్త్‌ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్‌పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.

  • దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్‌ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.

    8వ పే కమిషన్

    8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.

    నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.

    కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్‌ ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.

    డీఏ పెంపు

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: కస్టమర్‌ సర్వీస్‌ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!?

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులతోపాటు దేశంలోని వ్యాపార ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. స్వాతంత్ర్య భారతానికి 100 ఏళ్లు వచ్చే వరకు నరేంద్రమోదీ దేశానికి సేవ చేస్తూనే ఉండాలని అందులో తెలిపారు.

    ‘ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 145 కోట్ల మందికి ఇదో పండగ రోజు. భారతదేశంలోని మొత్తం వ్యాపార సమాజం తరఫున, రిలయన్స్, అంబానీ కుటుంబం తరఫున, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం అమృత్ కాల్‌లో మోదీ అమృత్ మహోత్సవ్ రావడం యాదృచ్ఛికం కాదు. స్వతంత్ర భారతదేశానికి 100 ఏళ్లు నిండిన నాటికి కూడా మోదీ భారతదేశానికి సేవ చేస్తూనే ఉండాలనేది కోరిక’ అని చెప్పారు.

  • బెంగళూరుకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిషా ఇటీవల ఓ ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఓ ప్రొడక్ట్‌ను ఆర్డర్‌ చేశారు. అందులో సమస్యల కారణంగా ఆమె కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలని ప్రయత్నించారు. సంస్థ కస్టమర్‌ సపోర్ట్‌ కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఏర్పాటు చేసినా తన సమస్య పరిష్కారం కాలేదు. నేరుగా కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడాలంటే కంపెనీ ప్రిమియం తీసుకోవాలని సూచిస్తూ.. డబ్బు చెల్లిస్తేనే కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌కు కాల్‌ కనెక్ట్‌ అవుతుందనేలా పాప్‌అప్‌ వచ్చింది.

    ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా క్విక్‌ కామర్స్‌ కంపెనీలు తమ కస్టమర్‌ సపోర్ట్‌ కోసం చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పటివరకు కాల్‌ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇస్తున్నాయి. ఒకవేళ వినియోగదారుడు నేరుగా ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలనుకుంటే మాత్రం అదో లగ్జరీ సర్వీస్‌లాగా మారుస్తున్నాయి. దాంతో కొన్ని కంపెనీలు రియల్‌టైమ్‌లో ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే రిజర్వ్ చేసిన టైర్డ్ మెంబర్‌షిప్‌లను తీసుకోవాలని సూచిస్తున్నాయి.

    కంపెనీలు ఈ అంతర్లీన సాంకేతిక మార్పు ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. దాంతో ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుందని నమ్ముతున్నాయి. ఏఐ చాట్‌బాట్‌లు వస్తువుల రిటర్న్‌లు, డెలివరీ సమస్యలు, లాగిన్ పరిష్కారాలు.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. కానీ, కస్టమర్లకు భావోద్వేగ భరోసా ఇచ్చేందుకు మాత్రం ఎగ్జిక్యూటివ్‌లు కావాల్సిందేనని కొందరు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: నేపాల్‌లో ఉద్యమానికి ‘డిస్‌కార్డ్‌’ సహకరించిందా?

Movies

  • సినీ ఇండస్ట్రీలో పారితోషికాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్హీరోలకైతే ఏకంగా వంద కోట్లు ముట్టజెప్పాల్సిందే. కొందరు బిగ్స్టార్స్ఏకంగా వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్ల విషయానికొస్తే పారితోషికాలు అంత ఎక్కువగా ఉండవు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో పదిశాతం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది ఒక హీరోయిన్కు వందల కోట్ల రూపాయలు ఆఫర్చేస్తే ఎలా ఉంటుంది? అది మన బాలీవుడ్సినిమాలో ఇంతలా భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే స్టోరీ చదివేయండి.

    ప్రముఖ హాలీవుడ్హీరోయిన్ సిడ్నీ స్వీనీ కోసం బాలీవుడ్ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. 'యుఫోరియా', 'ది వైట్ లోటస్' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న సిడ్నీ త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి బిగ్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.

    ఓ నివేదిక ప్రకారం 28 ఏళ్ల సిడ్నీ స్వీనికి ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు రూ. 530 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చేందుకు సంప్రదించిందని టాక్. ఒకవేళ ఆమె డీల్ అంగీకరిస్తే బాలీవుడ్సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో షూటింగ్మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్ న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ జరగనుందని సమాచారం. మొదట ఈ ఆఫర్ చూసి సిడ్నీ స్వీనీ ఆశ్చర్యపోయిందని నివేదికలో వెల్లడించింది. అయితే బిగ్డీల్కు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విషయంపై సిడ్నీ తరఫున ప్రతినిధులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    ప్రస్తుతం సిడ్నీ స్వీనీ 'క్రిస్టీ' అనే మూవీలో నటిస్తోంది. చిత్రంలో యూఎస్ పోరాట యోధురాలు క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. తర్వాత సిడ్నీ నటించిన మరో చిత్రం 'ది హౌస్‌మెయిడ్' డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

  • పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.

    సింగిల్ స్క్రీన్థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ సినిమా కావడంతోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     

  • ఏడాది సూపర్హిట్గా నిలిచన రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. మోహిత్‌ సూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేర్ చేసింది. చిత్రం ద్వారా అహాన్‌ పాండే (Ahaan Panday), అనీత్‌ పడ్డా (Aneet Padda) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. జులై 18న విడుదలైన ఈ సినిమా సంచనాలు క్రియేట్‌ చేసింది. కేవలం మౌత్‌ టాక్‌ పవర్‌తో బాక్సాఫీస్‌ రికార్డ్‌లను తిరగరాసింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో అనేక చిత్రాల కలెక్షన్స్‌ను దాటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది బాలీవుడ్‌ హిట్‌ సినిమా ఛావా రికార్డ్‌ను కూడా దాటేసింది.

    యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సైయారా ఓటీటీలోనూ తగ్గేదేలే అంటోంది. ఓటీటీకి వచ్చిన తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగాఅత్యధిక వ్యూస్సొంతం చేసుకున్న నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో సైయారా కొనసాగుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ చిత్రం 'ఫాల్ ఫర్ మీ', హిందీ మూవీ 'ఇన్‌స్పెక్టర్ జెండే'లను అధిగమించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకుంది, 'ఫాల్ ఫర్ మీ' మూవీతో సహా అనేక చిత్రాలను దాటేసింది.

    ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర చిత్రాల జాబితాలో సైయారా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రం 3.7 మిలియన్ల వ్యూస్తో పాటు 9.3 మిలియన్ గంటల వీక్షణలతో దూసుకెళ్తోంది. జర్మన్ థ్రిల్లర్ మూవీ 'ఫాల్ ఫర్ మీ' 6.5 మిలియన్ గంటల వ్యూస్తో రెండో స్థానంలో ఉంది. తర్వాత మనోజ్ భాజ్‌పాయ్ నటించిన 'ఇన్‌స్పెక్టర్ జెండే' 6.2 మిలియన్ గంటల వీక్షణలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. జాబితాలో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' 2.5 మిలియన్ గంటల వ్యూస్తో తొమ్మిదో స్థానంలో ఉంది.

  • ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.

    నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో పాటను టీ సిరీస్మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం స్పెషల్ సాంగ్ను చూసేయండి.

  • సోలోగా ట్రిప్ వేసిన యాంకర్ అనసూయ

    క్యూట్ జ్ఞాపకాల్ని షేర్ చేసిన నివేతా థామస్

    జిమ్‌లో కష్టపడుతూ అలా.. మరోవైపు సమంత ఇలా

    చీరలో వయ్యారాలు పోతున్న అనుపమ పరమేశ్వరన్

    పొద్దుతిరుగుడు పువ్వుతో గ్లామర్ చూపిస్తున్న రకుల్

    అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న అనన్య నాగళ్ల

  • బాలీవుడ్ భామ జాన్వీ కపూర్వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే పరమ్ సుందరిగా మెప్పించిన ముద్దుగుమ్మ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా జాన్వీ కపూర్‌ మరో మూవీలో కనిపించనుంది. ఇషాన్‌ కట్టర్, విశాల్‌ జైత్య ప్రధాన పాత్రల్లో వస్తోన్న హోమ్‌ బౌండ్లోనూ హీరోయిన్గా మెప్పించనుంది. సినిమాను నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు.

    తాజాగా మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాను కరణ్‌ జోహార్, అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రనిర్మాత మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా వ్యవహిరించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

    హౌమ్ బౌండ్కథేంటంటే..

    నార్త్‌ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్‌ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరిద్దరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్‌ బౌండ్‌’ సినిమా కథను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

  • సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను.అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను’ అన్నారు నిర్మాత విజయ్‌ పాల్‌ రెరడ్డి అడిదల.ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా..  జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత విజయ్‌ పాల్‌రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    ‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్‌గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.

    ఈ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.

    ‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్‌ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.

    ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.
     

  • లేటెస్ట్ తెలుగు సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వర్తి వాఘని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. మొన్నమొన్ననే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

    గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న నారా రోహిత్.. ఈ ఏడాది 'భైరవం' మూవీతో వచ్చాడు. కానీ ఫలితం డిసప్పాయింట్ చేసింది. గత నెల 27న 'సుందరకాండ' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కామెడీ వర్కౌట్ అయింది అనే టాక్ వచ్చింది గానీ దీన్ని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 23 నుంచి హాట్‪‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అందుబాటులోకి రానుంది.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'జూనియర్' సినిమా)

    'సుందరకాండ' విషయానికొస్తే.. సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటిపోయి చాన్నాళ్లయినా సరే పెళ్లి చేసుకోడు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమెలోని కొన్ని లక్షణాలు ఇతడికి నచ్చుతాయి. పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనకు తానే రూల్ పెట్టుకుంటాడు. సంబంధాలు వస్తుంటాయి, అమ్మాయిల్ని చూస్తుంటాడు కానీ అందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు.

    ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయిలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని సిద్దార్థ్ ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. మరి ఈ ప్రేమకథ సుఖాంతమైందా? సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది మిగతా స్టోరీ. అయితే ఇందులో హీరో.. తల్లికూతురిని ప్రేమించడం అనే కాన్సెప్ట్ కాస్త విడ్డూరంగా ఉంటుంది. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. ఈ కాన్సెప్ట్ ఓకే అనుకుంటేనే దీన్ని చూడండి.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)

  • మనదేశ ప్రధాని నరేంద్రమోదీకి టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషెస్ తెలిపారు. ఇవాళ మోదీ బర్త్డే కావడంతో ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. వరల్డ్వైడ్గా బలమైన స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శక్తి, ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నానని వీడియోను పోస్ట్చేశారు.

    టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ నిబద్ధత, జీవితం గురించి చూస్తే రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. దేశం కోసం మీరు చేస్తున్న కృషి ప్రతి భారతీయుడని గర్వపడేలా చేసిందన్నారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని.. మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాని వీడియో రిలీజ్ చేశారు.

    కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది.

     

     

  • చిత్రపరిశ్రమలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ..హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. 30-35 ఏళ్లు దాటితే చాలు చాన్స్‌లు తగ్గుతాయి. అలా పట్టుమని పదేళ్లు కూడా హీరోయిన్‌గా రాణించలేరు. వయసు ఉన్నా.. ఖాతాలో హిట్‌ లేకపోతే అంతే సంగతి. వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే.. ఇక ఆమె వెండితెరపై మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు చాలా తక్కువే ఉన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్‌ స్పాన్‌ 20 ఏళ్ల వరకు ఉండేది. భారీ హిట్స్‌ వస్తే..ఆమెను నెత్తినపెట్టుకొని ఆరాధించేవాళ్లు. హీరోలతో సమానంగా వాళ్లకు అభిమానులు ఉండేవాళ్లు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె హీరోయిన్‌గా నటించింది.

    13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్‌ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. . మె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). చిరంజీవి,నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజేంద్రప్రసాద్‌..ఇలా అప్పటి స్టార్‌ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఆమె పేరిట ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు అఖిల్‌ వరకు.. మూడు తరాలతో రమ్యకృష్ణ కలిసి నటించింది.

    అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది. ఇక నాగార్జునతో ఆమె 10కి పైగా సినిమాలు చేసింది. అందులో హల్లో బ్రదర్‌, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కూడా ఉన్నాయి. 

    ఇక అక్కినేని మూడో తరం.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది. 

     నాగ్‌ చిన్న కొడుకు అఖిల్‌ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్‌గా రమ్యకృష్ణ నిలిచింది. సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో నటించింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పాలి.

     

  • కొన్నాళ్ల క్రితం వైరల్ వయ్యారి అంటూ శ్రీలీల పాట ఒకటి తెగ వైరల్ అయిపోయింది. ఇది 'జూనియర్' అనే సినిమాలోనిది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధనరెడ్డి కొడుకు కిరీటి ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా సరే ఇంకా ఓటీటీలోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

    కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అంతంత మాత్రంగానే ఆడింది. యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. లెక్క ప్రకారం ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ గురించి ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు ఆహా ఓటీటీ ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)

    అయితే ఈ శుక్రవారం(సెప్టెంబరు 19) నుంచే 'జూనియర్'.. ఆహా ఓటీటీలోకి రానుందని సమాచారం. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే మాత్రం వచ్చే వారం పక్కా. ఈ సినిమా విషయానికొస్తే.. జ్ఞాపకాలే ముఖ్యమనుకునే కుర్రాడు అభి(కిరీటి). కాలేజీలో నాలుగేళ్లు సరదాగా గడిపేస్తాడు. మంచి జ్ఞాపకాల్ని పోగుచేసుకుంటాడు. చదువు పూర్తయిన తర్వాత తాను ప్రేమించిన స్ఫూర్తి (శ్రీలీల‌) ప‌నిచేసే కంపెనీలోనే జాబ్‌లో జాయిన్ అవుతాడు. 

    కానీ అక్కడ బాస్ విజ‌య సౌజ‌న్య (జెనీలియా)కి అభి అంటే నచ్చదు. విజ‌య‌న‌గ‌రం అనే ఊరు కూడా ఈమెకు నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని అభితో కలిసి విజయ్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ విజయనగరానికి, విజయకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. మరి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోకి సినిమా ఒకేసారి వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

  • అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్అయిన కమెడియన్‌ సుమన్‌ శెట్టి (Suman Shetty). నితిన్హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్‌ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.

    తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి సైట్కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్అంటూ నా కాళ్లను టచ్చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.

    తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.

    కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్‌ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు.

  • ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ టీమిండియా క్రికెటర్యుజ్వేంద్ర చాహల్ను పెళ్లాడారు. 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరు మనస్పర్థలు రావడంతో ఏడాది తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేశారు. ఫిబ్రవరి అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి యుజ్వేంద్ర చాహల్ ప్రముఖ ఆర్జే మహ్వశ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి.

    అయితే ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. సందర్భంగా విడాకుల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. చాహల్ను తాను మోసం చేశానంటూ పలు కథనాలొచ్చాయి. తాజాగా వీటిపై ధనశ్రీ వర్మ రియాక్ట్ అయింది. ఇదంతా నెగెటివ్ పీఆర్లో భాగంగానే చేశారని విమర్శించింది. ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్అర్బాజ్ పటేల్ చాహల్ను ధనశ్రీ మోసం చేసిందని తాను విన్నానని ఆమెతో చెప్పాడు.

    దీనిపై ధనశ్రీ స్పందిస్తూ.. 'అలాంటి వాళ్లు నా గురించి ఇలాంటి చెత్త మాటలు వ్యాప్తి చేస్తారు. నేను నోరు తెరుస్తానేమోనని భయపడుతున్నాడు. నా నోరు మూయించడానికే ఇదంతా చేస్తున్నారు.అసలేం జరిగిందో నిజమైన వివరాలు చెబితే.. ఈ షో మీకు మరోలా అనిపిస్తుంది. ఆర్జే మహ్వశ్తో రిలేషన్పై ధనశ్రీ మాట్లాడింది. నాకు చాహల్తో విడాకులు అయిపోయాయి. అతని గాసిప్స్ గురించి నాకు అక్కర్లేదు. నా లైఫ్లో అదొక ముగిసిన అధ్యాయం. పెళ్లి అనే బంధంలో ఉన్నప్పుడు బాధ్యాతాయుతంగా ఉండాలి. ఇతరుల గౌరవాన్ని కూడా మనం కాపాడేలా వ్యవహరించాలి. మన ఇమేజ్ కోసం మరొకరిని ఎందుకు తక్కువ చేయాలి? మీరు నా గురించి ఎంత నెగెటివ్గా మాట్లాడినా దాంతో మీకెలాంటి ఊపయోగం లేదు. మీ టైమ్ వేస్ట్ తప్ప' అని పంచుకుంది.

  • ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్‌ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్‌ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్‌ స్టోరీ బీటౌన్‌లో సంచనలంగా మారింది. 

    సల్మాన్‌తో బ్రేకప్‌
    తాజాగా దర్శకుడు ప్రహ్లాద్‌ కక్కర్‌.. ఐష్‌- సల్మాన్‌ల బ్రేకప్‌ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్‌తో బ్రేకప్‌ అయ్యాక బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్‌ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్‌ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు. 

    తల గోడకేసి బాదుకునేవాడు
    నేనూ అదే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్‌? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్‌ క్రియేట్‌ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్‌బీ కుమారుడు, నటుడు అభిషేక్‌ బచ్చన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.

    చదవండి: ఒక్క డైలాగ్‌తో ఫేమస్‌.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!

  • ఈమె తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్. దాదాపు 20 ఏళ్ల పాటు స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మీడియాకు కూడా కనిపించలేదు. కొన్నాళ్ల క్రితం తిరుమలలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా?

    (ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్‌ని పక్కనబెట్టేశారా? నెక్స్ట్ 'ఖైదీ 2')

    పైన ఫొటోలో కనిపిస్తున్నది రవళి. తెలుగులో సూపర్ హిట్ సినిమా 'పెళ్లి సందడి' హీరోయిన్. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఈమె వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగమ్మాయి అయిన ఈమె.. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది. తొలుత మలయాళంలో 'జడ్జిమెంట్' అనే మూవీతో నటిగా మారింది. తర్వాత సంవత్సరం 'జయభేరి' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. 'పెళ్లి సందడి' ఈమెకు ఓవర్ నైట్ స్టార్‌డమ్ తీసుకొచ్చింది.

    రవళి చేసిన వాటిలో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు తదితర తెలుగు సినిమాలున్నాయి. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా 2011లో 'మాయగాడు'లో నటించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2007లో నీలికృష్ణ అనే అతడిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. ఈమె సోదరు హరిత కూడా నటినే. ఈమె ప్రస్తుతం తెలుగు సీరియల్స్ చేస్తోంది.

    (ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)

  • లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్. ఇతడితో సినిమా చేసేందుకు ఇతర భాషల హీరోలు కూడా రెడీ అంటున్నారు. కానీ 'కూలీ' దెబ్బకు మొత్తం పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రజినీకాంత్ హీరోగా చేసిన 'కూలీ'పై బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోవడంలో ఈ చిత్రం కాస్త విఫలమైంది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని సైడ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?

    దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్.. స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి ఈ మూవీ తీయబోయేది లోకేశ్ కనగరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్‌గా విమానాశ్రయంలో కనిపించిన రజినీకాంత్‌ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా.. కమల్‌తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని పేర్కొన్నారు.

    (ఇదీ చదవండి: 'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్)

    అయితే లోకేశ్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు కాదని తెలిసి కొందరు తమిళ ఫ్యాన్స్ బాధపడుతుండగా.. మరికొందరు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోకేశ్ తీసిన వాటిలో చాలా గుర్తింపు తెచ్చుకున్న సినిమా 'ఖైదీ'. దీని సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిటింగ్. ఒకవేళ లోకేశ్ గనక.. కమల్-రజినీ మూవీ తీస్తే ఈ సీక్వెల్ రావడం లేటు అయిపోతుంది. మరోవైపు లోకేశ్ కాకుండా ఈ మల్టీస్టారర్ హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరున్నారా అనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.

    ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్.. హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాతేశ్వరన్ అనే డైరెక్టర్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఖైదీ 2'ని లోకేశ్ మొదలుపెట్టే అవకాశముంది. మరి 'కూలీ' రిజల్ట్ చూసి.. కమల్-రజినీ ప్రాజెక్ట్ నుంచి లోకేశ్‌ని పక్కనబెట్టేశారా? లేదంటే నిజంగానే లోకేశ్ పేరుని పరిగణలోకి తీసుకోలేదా అనేది తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

  • కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ 'బీస్ట్‌' సినిమాతోనే తెలుగులో ఫుల్‌ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్‌ (VTV Ganesh). టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్‌ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. కెవిన్‌, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌ సతీశ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 19న విడుదల కానుంది.

    ఒక్క డైలాగ్‌తో పాపులర్‌
    ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో గణేశ్‌ మాట్లాడుతూ.. బీస్ట్‌ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌ అనే ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్‌ సర్‌కు థాంక్స్‌ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్‌ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్‌ మూవీ తెలుగు ట్రైలర్‌లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్‌ కాదు. 

    ఈజీగా తప్పించుకుంటారు
    నాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్‌ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్‌ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్‌ అయ్యుంటే సరే, నేను చెక్‌ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్‌ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్‌.. తెలుగులో భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్‌ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్‌', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్‌' మూవీస్‌తోనూ అలరించాడు.

    చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్‌'

  • విజయ్‌ దేవరకొండ ఖాతాలో ఈ మధ్య సరైన హిట్‌ అయితే లేదు కానీ..అవకాశాలకు మాత్రం కొదవ లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాదు..బడ్జెట్‌ విషయంలోనూ తగ్గడం లేదు. వందల కోట్ల పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన కోసం హాలీవుడ్‌ నటులను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ‘లైగర్‌’లో మైక్‌ టైసన్‌తో తలపడిన విజయ్‌..ఇప్పుడు ‘మమ్మీ’ విలన్‌తో పోరాడబోతున్నాడు.

    రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రానికి నిర్మిస్తుంది. ఇందులో విలన్‌గా హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ( Arnold Vosloo) నటిస్తున్నాడు.

    ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్‌’ లాంటి హాలీవుడ్‌ సినిమాలతో విలన్‌గా నటించిన ఆర్మాల్డ్‌.. విజయ్‌ చిత్రంతో తొలిసారిగా ఇండియన్‌ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అందర్ని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట. విజయ్‌ సైతం కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్‌ని మార్చేశాడు.
     

  • గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్‌ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

    (ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)

    సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్‌గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.

    'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)

  • టాలీవుడ్‌లో 'థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌తో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్... కెరీర్ ప్రారంభంలో విలన్ తరహా పాత్రలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతడు దర్శకుడిగా మారి తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశాడు. గతేడాది ఇది థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

    (ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)

    పృథ్వీరాజ్ దర్శకుడిగా తీసిన సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. ఇతడి కూతురు శ్రీలు హీరోయిన్. క్రాంతి కృష్ణ హీరోగా నటించాడు. హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. గతేడాది జనవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు దీన్ని కనీసం పట్టించుకోలేదు. తర్వాత అందరూ ఈ మూవీ గురించి పూర్తిగా మరిచిపోయారు. అలాంటిది దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అయితే అద్దె విధానంలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

    'కొత్త రంగుల ప్రపంచం' విషయానికొస్తే.. షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు డైరెక్టర్ పృథ్వీ తన బృందంతో వెళ్తాడు. ఈయన తీసే సినిమాలో శ్రీలు, క్రాంతి కృష్ణ హీరోహీరోయిన్లు. ఫామ్ హౌస్‌కి గురువయ్య అనే మేనేజర్ ఉంటాడు. అయితే షూటింగ్ టైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. హీరోయిన్ శ్రీలు నటించేటపుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గమనించిన పృథ్వీ.. ఓ గురువు దగ్గరకు వెళ్తే శ్రీలుని ఓ ఆత్మ ఆవహించిందని చెబుతాడు.  అసలు ఆత్మ ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)

    అమెజాన్ ప్రైమ్‌లో ఈ రోజు నుంచే 'కన్యాకుమారి' అనే తెలుగు సినిమా కూడా స్ట్రీమింగ్‪‍‌లోకి వచ్చేసింది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు మూడు వారాల్లోకి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చింది. ఉచితంగానే చూడొచ్చు.

  • హను-మాన్‌ మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్‌' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్‌ మూవీలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించాడు. రితికా నాయక్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. 

    సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్‌ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. టికెట్‌ రేట్లు పెంచకుండానే మిరాయ్‌ ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు.

     

     

    చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌.. మహేశ్‌బాబు రిక్వెస్ట్‌

  • సంగీత దర్శ‍కుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అజిత్‌ కుమార్‌ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్‌ వేశారు. కాపీరైట్‌ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో   నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్‌ చేయకుండా వదిలేస్తారో చూడాలి.

    కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. 

    ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్‌గా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించారు.  

  • యూట్యూబర్‌, మీమర్‌ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్‌ హార్ట్స్‌ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించగా సినిజిత్‌ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.

    సెలబ్రిటీల ప్రశంసలు 
    సినిమా బాగుందంటూ గోపీచంద్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సినిజిత్‌ మహేశ్‌కు పెద్ద ఫ్యాన్స్‌. ముఖ్యంగా సినిజిత్‌.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్‌ వేస్తే చాలు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్‌బాబు లిటిల్‌ హార్ట్స్‌ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 

    దయచేసి ఎక్కడికీ వెళ్లకు
    'లిటిల్‌ హార్ట్స్‌ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్‌.. నువ్వు దయచేసి ఫోన్‌ ఆఫ్‌ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్‌.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్‌ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్‌బాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్‌ చూడగానే సినిజిత్‌ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు.

     

     

    చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్‌' జంట.. శ్రీదేవి నోట బూతులు

Sports

  • అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్‌ 17) పసికూన ఐర్లాండ్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు.

    మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సాల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్‌ ఝులిపిస్తూ విధ్వంసం​ సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.

    సాల్ట్‌ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్‌ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ అంచనాలకు మించి భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ టెక్టార్‌ (36 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్‌ టక్కర్‌ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (34), రాస్‌ అదైర్‌ (26) కూడా సత్తా చాటారు.

    ఐరిష్‌ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్‌, డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ మాత్రం తలో వికెట్‌ తీశారు.

    197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్‌ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్‌ (10 బంతుల్లో 28), జేకబ్‌ బేతెల్‌ (16 బంతుల్లో 24), సామ్‌ కర్రన్‌ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్‌ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్‌ అహ్మద్‌ 8, టామ్‌ బాంటన్‌ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్‌ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. 

    ఐరిష్‌ బౌలర్లలో హంఫ్రేస్‌, హ్యూమ్‌ తలో 2, హ్యారీ టెక్టార్‌, గెరాత్‌ డెలానీ చెరో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్‌ 19న డబ్లిన్‌లోనే జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.

     

     

     

     

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.

    ఓపెనర్‌ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్‌ (29), ప్రతిక​ రావల్‌ (25), స్నేహ్‌ రాణా (24) పర్వాలేదనిపించారు.

    హర్లీన్‌ డియోల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17), రాధా యాదవ్‌ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. 

    ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌ 3, ఆష్లే గార్డ్‌నర్‌ 2, మెగాన్‌ షట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.

    అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్‌ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (6.3-0-28-1), స్నేహ్‌ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్‌ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్‌ (45), ఎల్లిస్‌ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

    ఈ గెలుపుతో భారత్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌ 20న జరుగనుంది.

     

     

  • నో హ్యాండ్‌షేక్‌ ఉదంతంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్‌ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. 

    పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మ్యాచ్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్‌ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.

    దీంతో ఆసియా కప్‌లో పాక్‌ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్‌ క్రికెట్‌ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్‌ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్‌ అఫీషియల్స్‌ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

    దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్‌ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్‌-యూఏఈ మ్యాచ్‌ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. 

    కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్‌ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్‌.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

    అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. పైక్రాఫ్ట్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.

    పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్‌ ఉదంతంలో పైక్రాఫ్ట్‌ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది.

     

     

  • తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం అధ్య‌క్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు న‌కిలీ ప‌త్రాలు, ఫోర్జ‌రీ సంతకాల‌తో తమ సంఘాన్ని క‌బ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. 

    తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్‌హక్‌ కమిటీకి చైర్మన్‌గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్‌రాజ్‌తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

    సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు ర‌ద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.

    జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్‌లోని ఓ డిప్యూటీ డైరెక్టర్‌, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్‌ యాదవ్‌ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి​ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు. 
     

  • ఆసియా కప్‌-2025లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్‌ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్‌ క్రికెట్‌ టీమ్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్‌ సహా ఆసియా కప్‌ మొత్తాన్ని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

    యూఏఈతో మ్యాచ్‌ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్‌ క్రికెటర్లు ఇంకా హోటల్‌ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్‌ వివాదంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ కాసేపట్లో పాక్‌ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. 

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్‌ 14న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్‌.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. 

    అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. పైక్రాఫ్ట్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.

    పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్‌ ఉదంతంలో పైక్రాఫ్ట్‌ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.

    ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

    ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్‌-4) వెళ్లాలంటే పాక్‌ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్‌-ఏలో పాక్‌ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.

    ప్రస్తుతం పాక్‌, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్‌ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్‌-4కు చేరుకుంటుంది. 

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్‌ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.

    ఓ దశలో భారత్‌ 350కి పైగా స్కోర్‌ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్‌ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్‌ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్‌ రాణా (24) బ్యాట్‌ ఝులిపించిడంతో భారత్‌ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.

    అంతకుముందు టాపార్డర్‌ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్‌ ప్రతిక​ రావల్‌కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.

    ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్‌ కావడంతో భారత్‌ స్కోర్‌ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్‌ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్‌ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు.  

    డార్సీ బ్రౌన్‌ 3, ఆష్లే గార్డ్‌నర్‌ 2, మెగాన్‌ షట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ తీశారు. వీరిలో గార్డ్‌నర్‌ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.

    అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జార్జియా వాల్‌ను రేణుకా సింగ్‌ డకౌట్‌ చేసింది. రేణుకా బౌలింగ్‌కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్‌ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్‌ బౌల్డ్‌ అయ్యింది. 

    భారత్‌కు ఐదో ఓవర్‌ ఐదో బంతికి మరో బ్రేక్‌ లభించింది. మరో ఓపెనర్‌ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్‌ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్‌ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

     

     

  • స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం లభించింది. ఓపెనర్లు అభిమన్యు ఈశర్వన్‌ (44), ఎన్‌ జగదీసన్‌ (50 నాటౌట్‌) తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అనంతరం అభిమన్యు ఈశ్వరన్‌ను లియామ్‌ స్కాట్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

    ఈశ్వరన్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సాయి సుదర్శన్‌ (20 నాటౌట్‌) జగదీసన్‌తో కలిసి బాధ్యతగా ఆడుతున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయమైన 28 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ దశలో వర్షం దంచికొట్టడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత-ఏ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 116 పరుగులుగా ఉంది.

    అంతకుముందు ఆస్ట్రేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌ను 532 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (109), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (123 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్‌ కెల్లావే (88), కూపర్‌ కన్నోల్లీ (70), లియమ్‌ స్కాట్‌ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. 

    భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్‌ బ్యాటర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియాకు ఆడిన ప్రసిద్ద్‌ కృష్ణ (16-0-86-0), ఖలీల్‌ అహ్మద్‌ను (15-0-80-1) ఆసీస్‌ బ్యాటర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. తనుశ్‌ కోటియన్‌కు (21-2-119-0) చుక్కలు చూపించారు. హర్ష్‌ దూబే (27-1-141-3), గుర్నూర్‌ బ్రార్‌ (19-2-87-2) వికెట్లు తీసినా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొత్తంగా భారత బౌలర్లను ఆసీస్‌ బ్యాటర్లు ఆటాడుకున్నారు.

     

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. మంధన మెరుపు శతకంతో చెలరేగింది. 

    కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టి, భారత్‌ తరఫున వన్డేల్లో సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేసింది. భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ రికార్డు కూడా మంధన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.

    తాజా సెంచరీ మంధనకు వన్డేల్లో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్‌ బ్యాటర్‌గా సూజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), ట్యామీ బేమౌంట్‌ (ఇంగ్లండ్‌) సరసన చేరింది. మంధన, బేట్స్‌, బేమౌంట్‌ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. 

    అయితే బేట్స్‌, బేమౌంట్‌ కంటే మంధననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్‌కు 130, బేమౌంట్‌కు 113 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్‌లోనే 12 సెంచరీల మార్కును తాకింది.

    చరిత్ర సృష్టించిన మంధన
    తాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి, ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా.. మంధన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లనే 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.

    చరిత్రలో తొలి క్రికెటర్‌
    తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో రెండు వేర్వేరు క్యాలెండర్‌ ఇయర్స్‌లో 3కు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో 4 సెంచరీలు చేసిన మంధన.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసింది.

    తాజా శతకంతో మంధన రెండు వేర్వేరు దేశాలపై (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారత ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్‌తో పాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మెగ్‌ లాన్నింగ్‌ (15) అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్‌ (13), బేమౌంట్‌ (12), మంధన (12) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4  సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటైంది. తొలి అర్ద సెంచరీకి 45 బంతులు తీసుకున్న మంధన, ఆతర్వాత అర్ద సెంచరీని కేవలం 32 బంతుల్లోనే పూర్తి చేసింది. హాఫ్‌ సెంచరీ మార్కును సిక్సర్‌తో, సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 38 ఓవర్ల తర్వాత  4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మంధన (117), ప్రతిక రావల్‌ (25), హర్లీన్‌ డియోల్‌ (10), హర్మన్‌ప్రీత్‌ (17) ఔట్‌ కాగా.. రిచా ఘోష్‌ (19), దీప్తి శర్మ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 2, తహ్లియా మెక్‌గ్రాత్‌ ఓ వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

  • ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ (NZ vs AUS)కు ముందు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైట్‌బాల్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner) సర్జరీ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ ధ్రువీకరించింది.

    విజయవంతమైన కెప్టెన్‌.. మరోసారి
    ఆస్ట్రేలియాతో చాపెల్‌- హెడ్లీ టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా కివీస్‌ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. సాంట్నర్‌ గైర్హాజరీలో మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (Michael Bracewell) న్యూజిలాండ్‌ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఈ ఆల్‌రౌండర్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం ఇదే తొలిసారి కాదు.

    ఆ ఇద్దరి రీ ఎంట్రీ
    ఇప్పటి వరకు పది టీ20 మ్యాచ్‌లలో బ్లాక్‌క్యాప్స్‌కు నాయకత్వం వహించిన బ్రాస్‌వెల్‌ ఆరు విజయాలు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ద్వారా కివీస్‌ పేసర్లు కైలీ జెమీషన్‌, బెన్‌ సియర్స్‌ జట్టులోకి తిరిగి వచ్చారు. తొలి సంతానానికి స్వాగతం పలికే క్రమంలో జెమీషన్‌ జింబాబ్వేతో సిరీస్‌కు దూరం కాగా.. సియర్స్‌ పక్కటెముకల నొప్పితో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

    అయితే, తాజాగా వీరిద్దరు ఆసీస్‌తో సిరీస్‌ నేపథ్యంలో పునరాగమనం చేయనున్నారు. జెమీషన్‌, సియర్స్‌ రాకతో పేస్‌ దళం మరింత పటిష్టంగా మారింది. వీరితో పాటు మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ కూడా పేస్‌ విభాగంలో సేవలు అందించనున్నారు.

    తప్పుకొన్న కేన్‌ విలియమ్సన్‌
    ఇదిలా ఉంటే.. కెప్టెన్‌ సాంట్నర్‌తో పాటు ఫిన్‌ అలెన్‌, లాకీ ఫెర్గూసన్‌, ఆడమ్‌ మిల్నే, విలియమ్‌ ఒరూర్కీ, గ్లెప్‌ ఫిలిప్స్‌ తదితరులు అనారోగ్య కారణాలు, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యారు. 

    మరోవైపు.. సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ తానే స్వయంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో బ్రాస్‌వెల్‌ కెప్టెన్‌గా మరోసారి రంగంలోకి దిగనున్నాడు. కాగా కివీస్‌ సొంతగడ్డపై అక్టోబరు 1- 4 మధ్య ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

    ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు
    మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, డెవాన్‌ కాన్వే, జేకబ్‌ డఫీ, జాక్‌ ఫౌల్క్స్‌, మ్యాట్‌ హెన్రీ, బెవాన్‌ జేకబ్స్‌, కైలీ జెమీషన్‌, డారిల్‌ మిచెల్‌, రచిన్‌ రవీంద్ర, టిమ​ రాబిన్సన్‌, బెన్‌ సియర్స్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇష్‌ సోధి.

    న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    👉అక్టోబరు 1- తొలి టీ20- బే ఓవల్‌, మౌంట్‌ మౌంగనీయ్‌
    👉అక్టోబరు 3- రెండో టీ20- బే ఓవల్‌, మౌంట్‌ మౌంగనీయ్‌
    👉అక్టోబరు 4- మూడో టీ20- బే ఓవల్‌, మౌంట్‌ మౌంగనీయ్‌.

    చదవండి: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి.. పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని భారత్‌
     

  • కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 తుది దశకు చేరింది. భారతకాలమానం ప్రకారం ఇవాల్టి నుంచి (సెప్టెంబర్‌ 17) ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇవాళ జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌పై ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించి, క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిన ఫాల్కన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    రేపు జరుగబోయే క్వాలిఫయర్‌-1లో సెయింట్‌ లూసియా కింగ్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్‌ 22న జరిగే ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు సెప్టెంబర్‌ 20న జరిగే క్వాలిఫయర్‌-2లో నైట్‌రైడర్స్‌తో పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

    ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఫాల్కన్స్‌పై నైట్‌రైడర్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌.. ఆమిర్‌ జాంగూ (55), ఆండ్రియస్‌ గౌస్‌ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 

    ఆఖర్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (9 బంతుల్లో 26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ 3 వికెట్లు, ఉస్మాన్‌ తారిఖ్‌, ఆండ్రీ రసెల్‌ తలో 2, సునీల్‌ నరైన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌.. అలెక్స్‌ హేల్స్‌ (54 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (53 బంతుల్లో 90 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆడుతుపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆ జట్టు 17.3 ఓవర్లలో కొలిన్‌ మున్రో (14) వికెట్‌ మాత్రమే కోల్పోయి అద్భుత విజయం సాధించింది. పూరన్‌ సిక్సర్ల సునామీ సృష్టించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. 

  • ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాడు. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతున్న వరుణ్‌.. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీను అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు. 

    గత వారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉండిన వరుణ్‌.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తద్వారా భారత్‌ తరఫున నంబర్‌ వన్‌గా అవతరించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరుణ్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ నంబర్‌ వన్‌ టీ20 బౌలర్లుగా చలామణి అయ్యారు.

    2021లో టీ20 అరంగేట్రం చేసిన వరుణ్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో మొత్తం 20 టీ20లు ఆడిన అతను.. 2 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 35 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసియా కప్‌ ఆడుతున్న వరుణ్‌ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. యూఏఈపై, పాక్‌పై పొదుపుగా బౌలింగ్‌ చేసి తలో వికెట్‌ తీశాడు. 

    వరుణ్‌ అగ్రస్థానానికి చేరుకోవడంతో టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం సంపూర్ణమైంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలిచినప్పటి నుండి టీమిండియా నంబర్‌ వన్‌ టీ20 జట్టుగా చలామణి అవుతుంది. బ్యాటర్ల విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్‌ శర్మ నంబర్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్‌కే చెందిన హార్దిక్‌ పాండ్యా నంబన్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా వరుణ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించడంతో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో టాప్‌ ప్లేస్‌ సాధించినట్లైంది.

    ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం టీ20లకే పరిమితం కాలేదు. వన్డేల్లోనూ భారత్‌ నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా టీమిండియాకే చెందిన శుభ్‌మన్‌ గిల్‌ చలామణి అవుతున్నాడు. 

    టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లోనూ భారత హవా కొనసాగుతుంది. నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. నంబర్‌ వన్‌ టెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. 

  • పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మొహ్మద్‌ యూసఫ్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్‌ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

    నో- షేక్‌హ్యాండ్‌
    దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్‌ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్‌ పెట్టుకోలేదు.

    టాస్‌ సమయంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. పాక్‌ సారథి సల్మాన్‌ ఆఘాకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్‌.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.

    సూర్యకుమార్‌ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలు
    ఈ క్రమంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ మొహ్మద్‌ యూసఫ్‌.. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ  ‘ఆ పంది’ కుమార్‌ అంటూ చీప్‌ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్‌ గెలిచిందంటూ ఆరోపించాడు.

    పాకిస్తాన్‌ క్రికెటర్ల క్యారెక్టరే అంత
    ఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్‌ విజేత మదన్‌ లాల్‌ మొహ్మద్‌ యూసఫ్‌ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్‌ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.

    సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.  ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.

    పబ్లిసిటీ కోసమే 
    ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్‌ కోసం యూట్యూబ్‌ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్‌ లాల్‌ ANIతో పేర్కొన్నాడు.

    అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్‌కు మదన్‌ లాల్‌ కౌంటర్‌ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.

    చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్‌ సూపర్‌-4కు అర్హత సాధించాలంటే..

  • బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్‌.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, హాంకాంగ్‌లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది.

    ఈ క్రమంలో తొలుత హాంకాంగ్‌తో తలపడిన అఫ్గన్‌ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టిన రషీద్‌ ఖాన్‌ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్‌ చేసింది.

    తప్పక గెలిస్తేనే.. 
    నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్‌ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్‌ సూపర్‌-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్‌ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్‌లో తప్పక గెలిస్తేనే.. రషీద్‌ బృందానికి సూపర్‌-4 ఆశలు సజీవంగా ఉంటాయి.

    మా స్థాయి ఇది కాదు
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం రషీద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్‌ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.

    చెత్త బ్యాటింగ్‌ వల్లే ఓటమి
    అనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్‌ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.

    టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్‌ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్‌ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమైనదే.

    శ్రీలంకతో మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్‌ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్‌ పోరుకు అబుదాబి వేదిక.​

    బంగ్లాదేశ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ స్కోర్లు
    బంగ్లాదేశ్‌: 154/5 (20)
    అఫ్గనిస్తాన్‌: 146 (20)

    చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్‌ సూపర్‌-4కు అర్హత సాధించాలంటే..

  • భారత్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. 

    సెంచరీతో కదంతొక్కిన కొన్‌స్టాస్‌
    టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్‌ కొన్‌స్టాస్‌ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్‌బెల్‌ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్‌ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

    తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్‌ అవుట్‌ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (1), ఒలీవర్‌ పీక్‌ (2)ను వెంట వెంటనే ఔట్‌ చేశారు. 

    దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్‌ కనొల్లీ, లియామ్‌ స్కాట్‌ (79 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదల కనబర్చారు.

    దూబే... ఒక్కడే 
    ఈ జంట ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్‌ కృష్ణ (0/47), ఖలీల్‌ అహ్మద్‌ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్‌ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్‌ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్‌ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్‌నూర్‌ బ్రార్‌ ఒక వికెట్‌ తీశాడు.

    జోష్‌ ఫిలిప్‌ అజేయ సెంచరీ
    ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్‌ స్కాట్‌తో పాటు జోష్‌ ఫిలిప్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

    ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్‌ స్కాట్‌ (81) అదరగొట్టగా.. వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత బౌలర్లలో హర్ష్‌ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్‌ బ్రార్‌ రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్‌-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ 2, నారాయణ్‌ జగదీశన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

    శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో..
    ఒకవైపు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్‌ పడిక్కల్, ధ్రువ్‌ జురెల్, ప్రసిద్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. 

    చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు

National

  • సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిశాపఠానీ ఇంటిపైకి కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠా సభ్యులైన ఈ ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

    సెప్టెంబర్‌ 12న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీ నగర సివిల్‌ లైన్స్‌ ఏరియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ రోజు తెల్లవారు జామున సరిగ్గా 3.45 నిమిషాలకు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ముఠాకు చెందిన రవీంద్ర, అరుణ్‌లు ఈ కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనను యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులు ఎక్కడున్నా వారిని పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు.

    ఆ మరుసటి రోజే ఘాజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి తుపాకీ,బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) అమితాబ్ యష్ తెలిపారు.
     
    ఇటీవల,దిశా పటానీ సోదరి,మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. 

  • కార్పొరేట్‌ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం...

    అతడో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్‌ పెట్టాడు. పైనున్న మేనేజర్‌.. ఆ పైనున్న హెచ్‌ఆర్‌ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్‌.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.

    ‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్‌ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్‌ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్‌ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్‌ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.

    పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్‌ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్‌ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్‌ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు?

  • పట్నా: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నడుంబిగించింది. ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం) బ్యాలెట్‌ పేపర్‌ లేఔట్‌లో ఆధునిక మార్పులు తేనున్నట్లు ఈసీ ప్రకటించింది. 

    గతంలో ఈవీఎం లేఔట్‌పై అభ్యర్థుల ఫొటోలు నలుపు,తెలుపు రంగులో ఉండేవి. కొందరి ఫొటోలైతే అస్సలు ముద్రించకపోయేవాళ్లు. ఇకపై కలర్‌ ఫొటోలను ముద్రించి ఓటర్లు సులభంగా తమ అభ్యర్థులను గుర్తించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫొటో కోసం కేటాయించిన మొత్తం ప్రదేశంలో ముప్పావువంతు సైజులో ఫొటో పెద్దగా కని్పంచనుంది. దీంతో కంటి సమస్యలున్న ఓటర్లు సైతం తమ అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా చూశాకే ఓటేసే అవకాశమొచ్చింది. 
     
    కొత్తగా వచ్చిన   మార్పులేంటి? 
    → అభ్యర్థి సీరియల్‌ నంబర్‌తోపాటు ‘ఎవరికి ఓటు వేయబోము(నన్‌ ఆఫ్‌ ది ఎబో–నోటా) అనే ఆప్షన్‌ సైతం పెద్ద సైజులో ఉండనుంది.  

    → అంతర్జాతీయ భారతీయ అంకెల విధానమైన లక్షలు, కోట్లు వంటి వాటిని సైతం ఉపయోగించనున్నారు. ఈ అంకెలను 30 నంబర్‌ ఫాంట్‌సైజులో ముద్రిస్తారు.  

    → స్పష్టంగా కనిపించేందుకు మందంగా బోల్డ్‌లో ప్రింట్‌చేస్తారు.  

    → అభ్యర్థుల అందరి పేర్లు ఒకే పరిమాణంలో కన్పించేలా ఒకే నంబర్‌ ఫాంట్‌ సైజును ఉపయోగించనున్నారు. నోటాకు సైతం ఇదే వర్తించనుంది. లిపి(ఫాంట్‌) రకాలు వేర్వేరుకాకుండా ఒకే రకం ఫాంట్‌ను వాడనున్నారు 

    → చదరపు మీటర్‌కు 70 గ్రాముల బరువు ఉండే 70 జీఎస్‌ఎం గ్రేడ్‌ పేపర్‌ను ఈవీఎం బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ కోసం ఉపయోగిస్తారు. శాసనసభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీరంగు పేపర్‌ను ఉపయోగిస్తారు. అందులోనూ పింక్, రెడ్, గ్రీన్‌లను ప్రత్యేకంగా వాడనున్నారు. 

    → బిహార్‌లోనే తొలిసారిగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. 
     

  • ప్రపంచం మొత్తమ్మీద ఏ గొడవకైనా రెండే రెండు కారణాలు ఉంటాయిట. మొదటిది నగదు. రెండోది మగువ అంటారు. కించపరచడం ఉద్దేశం కానే కాదు కానీ..మహిళలపై పురుషులకున్న వ్యామోహమనండి, వాంఛ అనండి.. ఇంకోటి అనండి అనేకానేక గొడవలకు కారణమవుతుందన్నది సత్యం. 

    అసోమ్‌(అస్సాం) సివిల్‌ సర్వీసెస్‌ అధికారి నూపుర్‌ బోరా విషయమే తీసుకుందాం. అవినీతి ఆరోపణలతో ఆమెపై ఇటీవలే విజిలెన్స్‌ దాడులు జరిగాయి. సుమారు 92 లక్షల రూపాయల నగదు, రెండు కోట్ల రూపాయల విలువైన నగలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కేసుకు సంబంధించి నూపుర్‌ బోరా బాయ్‌ఫ్రెండ్‌, రెవెన్యూ ఆఫీసర్‌ సుర్జీత్‌ డేకాను కూడా విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మూడు రోజుల పోలీస్‌ రిమాండ్‌కు పంపారు. ఇక్కడితో స్టోరీ ఖతమైపోలేదు. షురూ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే..

    నూపుర్‌పై విజిలెన్స్‌ దాడులు జరగడంలో ముఖ్య పాత్ర ఆమె రెండో మాజీ భర్త.  ఆయనిచ్చిన టిప్‌తోనే విజిలెన్స్‌ వాళ్లు ఆమెపై రెయిడ్‌ చేశారని తెలుస్తోంది. ఈయనతోపాటు అంతకుముందు ఇంకొకరితో నూపుర్‌కు వివాహం, విడాకులు రెండూ అయ్యాయి. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది. బోరా పాపంలో ఇప్పుడు అతగాడి వాటాను తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. 

    2019లో అసోమ్‌ సివిల్‌ సర్వీసెస్‌లో చేరిన నూపుర్‌ కార్బీ అంగ్‌లాంగ్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత బార్పేట, కామ్‌రూప్‌ జిల్లాల్లో సర్కిల్‌ ఆఫీసర్‌గానూ సేవలందించారు. సివిల్‌ సర్వీసెస్‌లోకి చేరే ముందు ఇంగ్లీషు టీచర్‌గా పని చేసిన అనుభవమూ ఉంది.

    అవినీతి ఆరోపణలేమిటి?
    ప్రభుత్వ భూములను బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వలసదారులకు అక్రమంగా బదిలీ చేసిందన్నది నూపుర్‌పై ఉన్న అనేకానేక ఆరోపణల్లో ఒకటి. భూమికి సంబంధించిన విషయాలను సెటిల్‌ చేసేందుకు రూ.1500 నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసేదని చెబుతున్నారు. క్రిషిక్‌ ముక్తి సమితి అనే స్వచ్ఛంద సంస్థ, ఎమ్మెల్యేల అఖిల్‌ గొగోయ్‌ వంటివారు నూపుర్‌ అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు కూడా. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యవేక్షణలో ఉండే.. సీఎం స్పెషల్‌ విజిలెన్స్‌ సెల్‌ ఆర్నెలుగా నిఘా ఉంచింది.  ఆఖరికు ఆకస్మిక తనిఖీలతో అరెస్ట్‌ చేసింది. నగదు, నగలతోపాటు నూపుర్‌ అవినీతికి ఆనవాళ్లుగా గౌహతిలో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల రూపాయల విలువైన నగల్లో పద్నాలుగు బంగారు గొలుసులు, 15 వజ్రపుటుంగరాలు, మూడు వజ్రాల గాజులు ఉన్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే.. నూపుర్‌ ఇరువురు మాజీ భర్తలు కూడా రెవెన్యూ ఆఫీసర్లే కావడం.

  • ముంబై: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతబలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

    బుధవారం ఉదయం మహరాష్ట్ర పోలీసులు,భద్రత బలగాలకు గడ్చిరోలి జిల్లాలోని దండకారణ్యంలో ఎటపల్లి తాలూకాలోని మోదస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్‌ నిర్వహించాయి.  

     గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీ-నక్సల్ కమాండో దళం  సీ-60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుండి పోలీసులు వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. సీ-60 దళం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోల ఎదురు కాల్పులు పోలీసులు తిప్పికొట్టారు. ఇద్దరు మహిళా నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే-47 రైఫిల్, అధునాతన పిస్టల్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

  • ధార్: ‘ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.

    తన 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు ‘రిటర్న్ గిఫ్ట్’ను అందజేశారు. ధార్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పార్క్‌ మూడు లక్షల మందికి  ఉపాధి అందించనుంది. అలిగే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధార్‌ చేరుకున్న ప్రధాని మోదీని ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తోపాటు పలువురు సీనియర్ నాయకులు స్వాగతించారు. కేంద్ర సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రధాని మోదీని సాంప్రదాయ తలపాగా, శాలువా లతో సత్కరించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆయనకు జ్ఞాపికను అందజేశారు.
     

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. అమరవీరులైన సైనికులకు నివాళులర్పించారు. భారత సైనికుల  ధైర్యం, పరాక్రమాలను ప్రశంసించారు. ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు.. తిరిగి ఎదురు దాడి చేస్తుందని పాక్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ప్రజల శక్తి, కృషి సహకారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ మోదీ నాయకత్వం భారతదేశాన్ని మార్చివేసిందని, పీఎం మిత్రా పార్క్ ద్వారా నిమార్ మాల్వా ప్రాంతంలో ఒక ప్రధాన మార్కెట్ ఏర్పడబోతున్నదని దీనికి ఈరోజు పునాది రాయి పడిందని అన్నారు. 

    	మధ్యప్రదేశ్‌లోని ధార్ లో ప్రధాని మోదీ పర్యటన
  • కర్ణాటక: రాష్ట్రంలో అక్రమంగా కలిగిఉన్న బీపీఎల్‌ కార్డులను రద్దు చేయడంపై బుధవారం ఉదయం ముఖ్యమైన సమావేశం జరుగుతుందని ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్‌.మునియప్ప చెప్పారు. రేషన్‌ కార్డుల సమస్యల పరిష్కారం గురించి అందులో మాట్లాడుతానని మంగళవారం బెంగళూరులో తెలిపారు. రేషన్‌ పంపిణీ భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది.  

    6 లక్షల కార్డులకు ఈకేవైసీ లేదు 
    రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బీపీఎల్‌ కార్డులు రద్దు అయ్యే అవకాశముందని తెలిసింది. పేదలు కాకపోయినా ఈ కార్డులను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం కనుగొంది.  

    • సర్కారు సర్వేలో మొత్తం 12,68,097 అనుమానాస్పద రేషన్‌ కార్డులు బయటపడ్డాయి. 

    • 19,690 మంది నియమాలకు విరుద్ధంగా బీపీఎల్‌ కార్డులు కలిగిఉన్నారు  

    • ఏటా రూ.25 లక్షలకు పైగా లావాదేవీలు కలిగినవారు 2,684 మందికి కార్డులు ఉన్నాయి.  

    •  6,16,196 మంది కార్డుదారులు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. 

    • ఏటా రూ.1.20 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన కార్డుదారులు 5,13,613 మంది ఉన్నారు.  

    • అంతర్రాష్ట్ర కార్డుదారులు 365 మంది, 7.5 ఎకరాల కంటే అధిక భూమి ఉన్న 33,456 కుటుంబాలు రేషన్‌ తీసుకుంటున్నాయి.  

    • ఆరు నెలల నుంచి రేషన్‌ పొందని కార్డుదారులు 19,893 మందిగా తేలింది. 

    • 1,146 కార్డులు మృతుల పేర్లతో ఉన్నాయి.  

    • 119 మంది కార్డుదారులకు సొంత కార్లు, జీప్‌లు ఉన్నాయి. 

    • ఇలా అనేక అవకతవకలు బయటపడడంతో ఆ కార్డులను  రద్దు చేయాలని ప్రభుత్వం  భావిస్తోంది.
       

  • పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్‌ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది.

    వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్‌ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ‌పై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించారు.

    బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్‌ కాంగ్రెస్‌ విభాగం నేరుగా సోషల్‌ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్‌ కలలో అమ్మ ..  ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్‌.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.

    ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్‌ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్‌ గాంధీ సూచన మేరకే బీహార్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్‌ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్‌ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. 

  • ఈరోజు (సెప్టెంబర్‌ 17) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ  పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే 75 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ ఏం తింటుంటారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. కాగా ప్రధాని మోదీ రాబోయే నవరాత్రి రోజుల్లో కఠినమైన ఉపవాస దీక్షను అనుసరిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకుండా,  గోరువెచ్చని నీటిని మాత్రమే తాగుతారు.

    ఈ  ఏడాది మొదట్లో లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రదాని మోదీ తన దినచర్యను తెలిపారు. ఉపవాసంతో తనకు కలిగిన అనుభవాలను ఆయన వివరించారు. ఆహారం మానేయడం,  ఎక్కువసేపు నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల ఇంద్రియ జ్ఞానం ఏ విధంగా  పెరుగుతుందో ప్రధాని తెలియజెప్పారు. ఉపవాసం అందించే మానసిక స్పష్టత, పదునుపెట్లే ఆలోచన ప్రక్రియలను ఆయన వివరించారు.  ఉపవాసం అనేది వినూత్న ఆలోచనలతోపాటు ప్రత్యేకమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

    ఉపవాసం అంటే కేవలం ఒక క్రమశిక్షణ మాత్రమే కాదని, అది పంచేంద్రియాలను మరింత చురుకుగా మారుస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉపవాసం చేసే సమయంలో మన ఇంద్రియాలైన వాసన, స్పర్శ, రుచి వంటివి చాలా సున్నితంగా మారతాయి. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ అనుభవంలోని రాని వాసనను అనుభవించగలుగుతారు. ఒకరు టీ కప్పుతో వెళ్తున్నా దాని సువాసనను పసిగట్టగలుగుమని ప్రధాని మోదీ తెలిపారు.

    ఉపవాసం వల్ల ఆలోచనల్లో స్పష్టత, కొత్తదనం వస్తుందని, అది వినూత్నంగా ఆలోచించడానికి, భిన్నమైన కోణంలో విషయాలను చూడటానికి సహాయపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరమంతా పలు రకాల ఉపవాస దీక్షలను మోదీ పాటిస్తారు.

    పురాతన భారతీయుల సంప్రదాయమైన 'చాతుర్మాస దీక్ష' ను ప్రధాని మోదీ పాటిస్తారు. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే కాలంగా దీనిని భావిస్తారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ సమయంలో తాను 24 గంటల్లో ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని మోదీ తెలిపారు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుందని, అందుకే ఈ పద్ధతి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారన్నారు. ప్రధాని మోదీ సంవత్సరానికి రెండు సార్లు వచ్చే నవరాత్రులను చాలా కఠినంగా పాటిస్తారు.

    ఈ తొమ్మిది రోజులలో రోజుకు ఒకసారి, అదికూడా ఒకే రకం పండును మాత్రమే తింటానని మోదీ తెలిపారు. ఒకవేళ తాను బొప్పాయిని ఎంచుకుంటే, ఆ తొమ్మిది రోజులు బొప్పాయి తప్ప మరేమీ ముట్టుకోనని మోదీ తెలిపారు. శారదా నవరాత్రులలో ప్రధాని మోదీ పూర్తిగా ఆహారాన్ని నిలిపివేసి, 9 రోజుల పాటు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతారు. వేడి నీళ్లు తాగడం తన దినచర్యలో ఎప్పటి నుంచో భాగమని, కాలక్రమేణా తన జీవనశైలి కి అది అలవాటు అయిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Politics

  • సాక్షి, తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్సార్‌సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది.

    ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్‌లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్‌ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

    ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైఎస్సార్‌సీపీ  ట్వీట్‌ చేసింది.

  • సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నడపడం లేదని సర్కస్‌ నడుపుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. బుధవారం కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌ జరిపారు. 

    ఈ చిట్‌చాట్‌లో.. త్వరలోనే పాదయాత్ర ఉంటుంది. పబ్లిక్‌లోకి కేసీఆర్‌ ఎప్పుడు రావాలో.. అప్పుడే వస్తారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు.  సీఎం రేవంత్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే పెట్టుకొనివ్వని వారు నియంత.సర్కార్ నడపడం లేదు సర్కాస్ నడుపుతున్నారు. మంత్రులది ఓమాట సీఎంది మరో మాట.  కోర్ట్ చెప్పిన సీఎం వినరు. సృజన్‌రెడ్డికి సింగరేణిలో రూ.300 కోట్ల టెండర్లు ఇచ్చారు. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారు.  

    ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్‌ చేసిన పనినీ చెప్పలేక పోయాం కాబట్టే ఓడిపోయాం. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చాం.. కేటీఆర్ పైన కోపం సిరిసిల్ల పైన చూపిస్తున్నారు. నేతన్నపై జీఎస్టీ వేసీని ఘనత సీఎం రేవంత్‌దే. 

    పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు పోవాలి. బీసీ బిల్లుతో బీసీలను కాంగ్రెస్‌ మోసం చేస్తుంది.  ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారు.. సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారు. అలైన్ మెంట్ మార్చితే ఆర్‌ఆర్‌ఆర్‌కి డబ్బులు ఇవ్వం అని కేంద్రం చెప్పింది.

    సౌత్ సైడ్ ఆర్‌ఆర్‌ఆర్‌ మేమే కడతామని రేవంత్ కేంద్రానికి చెప్పారు. సౌత్ సైడ్ ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బంధువుల భూములు రెట్లు పెంచేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డు అలైన్మెంట్ మార్చారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, వారి బంధువుల డ్రామాలు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. ఎల్‌అండ్‌టీ వాళ్ళని ముడుపుల కోసం సీఎం రేవంత్‌ ప్రయత్నించాడు.  అందుకే మెట్రో నడపం​ అని వెళ్ళిపోతాం అంటున్నారు.

    ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటుంది. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నది. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్అండ్‌టీ తప్పుకుంటుంది.  గతంలో ఆ  సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయి.

    రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటాయి.  గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. రేవంత్ పీసీసీ పదవి కొన్నాడు.సీఎం  సీట్ కొన్నాడు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను బీజేపీకి అమ్మారు. రేవంత్ అన్నిట్లో దిట్ట. 8మంది ఎంపీలను అమ్మాడు. హైడ్రా కాస్త హైడ్రామా అయింది. హైడ్రాకు పెద్ద వాళ్ళ ఇళ్ళు కనిపించవు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలి

    రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఎవరూ అనుకోవడం లేదు, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డిని పొగుడాలంటే బట్టి విక్రమార్కని తొక్కేయాలా..?
    ప్రజా పాలనా అంటూ కోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం లేదు కానీ ఎనుముల ఫ్యామిలీలో మాత్రం వికాసం ఉంది’

  • సాక్షి, తాడేప‌ల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేని కూటమి ప్రభుత్వం సూపర్‌ హిట్ పేరుతో విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవంతో సంపద సృష్టించి, ప్రజలకు పంచుతానంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చివరికి ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునే దుస్థితికి తన పాలనను తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో అత్యంత కీలకమైన మార్పులు తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరాదత్తం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారని, ఇటువంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

    సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ఫ్లాప్
    అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో కూట‌మి నాయ‌కులు ప్ర‌జ‌ల్ని ఇప్ప‌టికీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో వైఎస్‌ జ‌గ‌న్ ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్ర‌మే కాకుండా ఇంకా రెట్టింపు ఇస్తామ‌ని 143 హామీల‌తో న‌మ్మ‌బ‌లికి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం, ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమ‌లు చేయ‌కుండానే దాదాపు రూ.2 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ప్ర‌జ‌లు త‌న‌ని తిట్టుకుంటున్నార‌ని తెలిసి కూడా ఏదో బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్టు చంద్ర‌బాబు 'సూప‌ర్ సిక్స్ సూప‌ర్ హిట్' పేరుతో అనంత‌పురంలో హ‌డావుడి చేశాడు.

    సూప‌ర్ సిక్స్‌లో సుఖీభ‌వ పేరుతో రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తాన‌ని హామీఇచ్చాడు. ఈ ప‌థ‌కానికి రూ.10,800 కోట్లు అవ‌స‌రం అనుకుంటే, గ‌తేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు. ఈ ఏడాది కేవ‌లం రూ.5 వేలిచ్చి చేతులు దులిపేసుకున్నాడు. నిరుద్యోగ యువ‌తకు నిరుద్యోగ భృతి కింద నెల‌కు రూ.3 వేలు ఇస్తామ‌ని చెప్పి రెండేళ్ల‌లో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన‌పోలేదు. ఆడ‌బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామ‌ని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌కుండా 1.80 కోట్ల మంది మ‌హిళ‌ల‌ను వంచించాడు.

    ఆ లెక్క‌న ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి ఏడాదికి రూ.32,400 కోట్లు చొప్పున అవ‌స‌రం అవుతాయి. అమ్మ ఒడి ప‌థ‌కానికి పేరు మార్చి త‌ల్లికి వంద‌నం పేరుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా అమ‌లు చేస్తామ‌ని చెప్పి, గ‌తేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు. ఈ ఏడాది మాత్రం అర‌కొర‌గా అమ‌లు చేశాడు. ఆఖ‌రుకి స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌కు ఫ్రీ బస్సు ప‌థ‌కాన్ని మొద‌లుపెట్టి కేవ‌లం 5 ర‌కాల బ‌స్సుల‌కే ప‌రిమితం చేసి ఆంక్ష‌లు విధించాడు. దీపం-2 ప‌థ‌కం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని చెప్పి గ‌తేడాది ఒక్క సిలిండ‌ర్ ఇచ్చాడు.

    ఈ ఏడాది ఒక్క సిలిండ‌ర్ కూడా ఇచ్చింది లేదు. ఆ ఆరు సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు సూప‌ర్ హిట్ కావాలంటే ఏడాదికి రూ.70 వేల కోట్లు కావాలి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చి నేటికి 15 నెల‌లు గ‌డిచిపోయాయి. వారిచ్చిన హామీ మేర‌కు సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయాలంటే దాదాపు రూ. 90 వేల కోట్లు కావాలి. కానీ రూ. 12 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. గ‌త వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ప‌థ‌కాల ల‌బ్ధిదారుల వివ‌రాలను గ్రామ స‌చివాల‌యాల్లోనే ప్ర‌ద‌ర్శించేవాళ్లం. ఆ విధంగానే ఆయా గ్రామాల్లో ఏ ప‌థ‌కానికి ఎంతెంత ఖ‌ర్చు చేశారో ఆ వివ‌రాలు గ్రామ స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించే ద‌మ్ము చంద్ర‌బాబుకి ఉందా?

    50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల‌కు పింఛ‌న్ ఇస్తామ‌ని హామీ ఇచ్చాడు. ఆ ఊసే ఎత్త‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఒక్క కొత్త పింఛ‌న్ ఇవ్వ‌క‌పోగా 15 నెల‌ల్లో దాదాపు 5 ల‌క్ష‌ల పింఛ‌న్లు పీకేశాడు. ఇది కాకుండా మ‌రో 7 నుంచి 10 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ల‌కు అర్హులై ఉండి ద‌ర‌ఖాస్తు చేసుకున్నా వారికి పింఛ‌న్లు మంజూరు చేయడం లేదు. విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కింద దాదాపు రూ.6400 కోట్లు చెల్లించాల్సి ఉంది. పీజుల కోసం కాలేజీలు విద్యార్థుల‌ను వేధిస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన‌పోవ‌డం లేదు.

    ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర రూ. 4500 కోట్లు లేవా?
    నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న‌ చంద్ర‌బాబు రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజి కూడా తీసుకురాలేదు. వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల‌ను మాత్రం కుట్ర పూరితంగా ప్రైవేటుప‌రం చేసి పేద‌ల‌కు దూరం చేస్తున్నాడు. పేద‌ల‌కు ఉచితంగా సూప‌ర్‌ స్పెషాలిటీ వైద్య సేవ‌లందించాల‌ని వైఎస్‌ జ‌గ‌న్ కోరుకుంటే చంద్ర‌బాబు మాత్రం ప‌ప్పుబెల్లాల‌కు త‌న వారికి ధారాద‌త్తం చేసేస్తున్నాడు. వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌ణాళిక ప్ర‌కారం 17 మెడిక‌ల్ కాలేజీలు పూర్త‌యితే 2550 మెడిక‌ల్ సీట్లు వ‌చ్చేవి. కానీ మెడిక‌ల్ కాలేజీల‌ నిర్మాణ ప‌నుల‌ను ఏడాది కాలంగా ఆపేసి, సేఫ్ క్లోజ్ పేరుతో వాటిని మూసేశాడు.

    డాక్ట‌ర్లు కావాల‌నుకునే పేద విద్యార్థుల క‌ల‌ను చిదిమేశాడు. వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికే 5 మెడిక‌ల్ కాలేజీలు నంద్యాల‌, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రిలో పూర్తయి క్లాసులు జ‌రుగుతున్నాయి. రెండో విడ‌త‌లో పాడేరులో 50 సీట్ల‌తో క్లాసులు జ‌రుగుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ మీద కోపంతో పులివెందుల మెడిక‌ల్ కాలేజీకి సీట్లు వ‌ద్దంటూ నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ కి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్ర‌బాబు. వాస్తవ ప‌రిస్థితులు ఇలా ఉంటే అస‌లు ప‌నులే జ‌ర‌గలేదంటూ పిల్ల‌ర్ల ద‌శ‌లో ఉన్న భ‌వనాల వ‌ద్ద‌కు పోయి వీడియోలు తీసి దుష్ప్ర‌చారం చేస్తున్నారు.

    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత  మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖ‌ర్చు పెట్ట‌కుండా ప‌క్క‌న‌పెట్టేశాడు. ఎందుక‌ని అడిగితే వాటిని పూర్తి చేయాలంటే రూ. 4500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని, ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని బీద అరుపులు అరుస్తున్నాడు. చంద్ర‌బాబు చేసిన రూ. 2 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం కోసం రూ. 4500 కోట్లు ఖ‌ర్చు చేయ‌లేక‌పోతున్నారంటే ఈయ‌న్ను విజ‌న‌రీ అని ఎలా అనాలో అర్ధం కావ‌డం లేదు. సంప‌ద సృష్టిస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కుట్ర‌పూరితంగా ప్రైవేటుప‌రం చేసే విధానాల‌ను చూసి అస‌హ్యించుకుంటున్నారు. గ‌త ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌తో చంద్ర‌బాబు పాల‌న‌న‌ను పోల్చి చూస్తూ అస‌లైన విజ‌న‌రీ జ‌గ‌నా, చంద్ర‌బాబో ప్ర‌జ‌లు నిర్ణ‌యానికొచ్చేశారు.

    రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు
    కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక చంద్ర‌బాబు వ్య‌వ‌సాయాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. రైతుల‌ను చిన్న‌చూపు చూస్తున్నాడు. అన్న‌దాత సుఖీభ‌వ పేరుతో పెట్టుబ‌డి సాయం ఇవ్వ‌కుండా మోసం చేసిందే కాకుండా వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో అమ‌లు చేసిన ఉచిత పంట‌ల బీమా, ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి, ఆర్బీకే వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసేశాడు. గ‌తంలో ఎప్పుడూ లేనిది రైతులు యూరియా బ‌స్తా కోసం గంట‌ల కొద్దీ క్యూలైన్ల‌లో నిల‌బ‌డే ప‌రిస్థితులు తీసుకొచ్చాడు. యూరియా ఏద‌ని అడిగిన రైతులకు రాజకీయాలు ఆపాదించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

    వైఎస్సార్‌సీపీ హ‌యాంలో కిలో ఉల్లి రూ.40ల ధ‌ర ప‌లికితే నేడు రూ.3 ల‌కు అమ్ముకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. కిలో ట‌మాట రూపాయిన్న‌రకి అమ్మాల్సి వ‌స్తుంది. రైతుల‌కు క‌నీసం రవాణా ఖ‌ర్చులు కూడా రావ‌డం లేదు. అర‌టి, పొగాకు, మిర్చి, మామిడి, చీనీ, వ‌రి, శెన‌గ‌, వేరుశెన‌గ‌.. ఇలా రైతులు పండించే ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఉండ‌టం లేదు. వైఎస్‌ జ‌గ‌న్ ధ‌ర‌ల ప‌త‌నంపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే సమీక్ష‌ల పేరుతో రెండురోజులు హ‌డావుడి చేసి చేతులు దులుపుకోవ‌డం త‌ప్పించి రైతుల‌కు మేలు చేయాల‌న్న ఆలోచ‌న చేయ‌డం లేదు. చంద్ర‌బాబు అధికారంలో ఉంటే వ్య‌వ‌సాయం అధోగ‌తే అని మ‌రోసారి రుజువైంది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు రైతు స‌మ‌స్య‌ల‌పై దృష్టిపెట్టాలి.

    వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారు
    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తుంటే స‌మాధానం చెప్పుకోలేక సంద‌ర్భం లేక‌పోయినా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు గురించి అనుకూల మీడియాలో ప‌తాక శీర్షిక‌ల్లో వార్తలు రాయించి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్‌ జ‌గ‌న్ వ్య‌క్తిత్వ హ‌ననం చేయ‌డం, వైఎస్సార్‌సీపీని రాజ‌కీయంగా లేకుండా చేయాల‌నే కుట్రలు చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లిలా బుర‌ద రాజ‌కీయాలు చేస్తారో చంద్ర‌బాబు నిర్ణ‌యించుకోవాలి. ష‌ర్మిల‌, సునీత‌ల‌ను అడ్డం పెట్టుకుని వైఎస్‌ జ‌గ‌న్ మీద విష ప్ర‌చారం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ విచార‌ణ పూర్తి చేసి చార్జిషీట్ వేసిన త‌ర్వాత కూడా పున‌ర్విచార‌ణ కావాల‌ని కోర‌డం వెనుక ఎవ‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో అర్థం చేసుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్ర‌జ‌లు లేరు.

    అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

    కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చ‌ల‌విడిగా అవినీతి చేస్తున్నార‌ని టీడీపీ భ‌జ‌న ప‌త్రిక ఆంధ్రజ్యోతిలో పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారికి ఆ ధైర్యం ఇచ్చింది చంద్ర‌బాబు కాదా? అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న ఒక్క సంఘ‌ట‌న కూడా లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, లోకేష్ సైతం అవినీతి సంపాద‌న‌కి డోర్లు తెరిచారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో క‌లెక్ష‌న్ కోసం ఏకంగా ఒక ఫ్లోర్‌నే కేటాయించారు. చంద్ర‌బాబు ఇచ్చిన 143  హామీల‌న్నింటికీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ్యారంటీ సంత‌కాలు చేశాడు. కానీ వాటి అమ‌లు గురించి మాత్రం ఆయ‌న మాట్లాడ‌టం లేదు. స్పెష‌ల్ హెలికాఫ్టర్లలో తిరిగే ఆయ‌న‌కి ప్ర‌జా స‌మ‌స్య‌లు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌కు ఇప్పుడు చేస్తున్న ప‌నుల‌కు పొంత‌న ఉండ‌టం లేదు.

    చంద్ర‌బాబుకి రాజ్యాంగం మీద గౌర‌వం లేదు..
    చంద్ర‌బాబుకి ప్ర‌జాస్వామ్యం మీద‌, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల మీద గౌర‌వం లేదు కాబ‌ట్టే 40 శాతం ఓటింగ్ ఉన్న పార్టీకి ప్ర‌తిప‌క్ష గుర్తింపు ఇవ్వడం లేదు. స‌మ‌స్య‌ల మీద చ‌ర్చ జ‌రిగితే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ప్ర‌జ‌ల‌కు తెలుస్తాయ‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డిపోతున్నారు. 11 మంది వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను చూసి 164 మంది భ‌య‌ప‌డిపోతున్నారు. 15 నెల‌ల కాలంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ అనేక ప్రెస్‌మీట్ల ద్వారా ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ప్ర‌శ్నించారు. కానీ ఒక్క‌దానికి కూడా సూటిగా స‌మాధానం చెప్పే ద‌మ్ము అధికార పార్టీకి లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తుంటే వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెడుతున్నారు. అలాంటి వ్య‌క్తి అసెంబ్లీలో మాట్లాడనిస్తారంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?

  • సాక్షి,తిరుపతి: టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్‌ నాయుడు చేతకానితనం వల్ల తిరుమలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదైంది. 

    ఆ అక్రమ కేసుపై భూమా అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడు భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వరుస వైఫల్యాలకు కారణం విజిలెన్స్ అధికారుల వైఫల్యమే. మీ పాలక మండలి చైర్మన్ బీఆర్‌ నాయుడు చేతకానితనం వల్లే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మీ తప్పుడు కేసులకు భయపడే వ్యక్తి కాదు భూమన కరుణాకర్‌రెడ్డి. మీ తప్పులు సవరించుకోవాలి, మీరు మాపై ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజా గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారని’ ధ్వజమెత్తారు.

  • సాక్షి, తాడేపల్లి: యూరియాను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌క తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున నిలదీశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్‌ అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు

    ‘‘అసలు మెడికల్ కాలేజీల‌ కోసం చంద్రబాబు, జగన్‌లలో ఎవరు కృషి చేశారో చర్చించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. చివరికి జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేసే ఆలోచన చేయటం సిగ్గుమాలిన చర్య. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు?. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ లేదు. తన గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సంక్షోభంలో ఉన్న రైతులను అందుకోవటానికి ఏం చర్యలు తీసుకున్నారు?’’ అంటూ మేరుగ నాగార్జున ప్రశ్నించారు.

    ‘‘యూరియా కొరత నుండి గిట్టుబాటు ధరల వరకు అన్నివిధాలా రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. ముఖ్యమైన కలెక్టర్ల సమావేశం అంటే పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు లెక్కలేదు. పవన్ ఒకసారి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తే, లోకేష్‌  డుమ్మా కొట్టారు. ఉల్లి, టమోటా రైతుల గురించి చర్చే జరగలేదు. జగన్ ఆందోళనలకు దిగితే తప్ప చంద్రబాబు రైతుల గురించి ఆలోచించటం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. టమోటా, ఉల్లి రైతులను ఆడుకోవడానికి కర్నూలు కలెక్టర్ కి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి’’ అని మేరుగ డిమాండ్‌ చేశారు. 

    రైతుల సమస్యలను వెలుగులోకి తెస్తే మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?. ’మెడికల్ కాలేజీలను అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలను కోత కోసి పేదల నడ్డి విరిచారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారు?. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి’’ అని మేరుగ నాగార్జున నిలదీశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ‍ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

    నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్‌లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్‌పార్క్‌ దగ్గర రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్‌సుఖ్‌నగర్‌కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి  న్యాయం జరగలేదు  

    తెలంగాణ యువత కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు  పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల  కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి

    ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు. 

    Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు
  • అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్‌ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఓ ఏఐ వీడియోను రిలీజ్‌ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్‌ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. 

    తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్‌ డిజిటల్‌ వార్‌’ ఇప్పుడక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్‌ మీడియాలో పోస్టులకు అదనంగా   అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్‌ ప్రమోషన్‌ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. 

    విజయ్‌ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో  డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్‌ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. 

    ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్‌ వీడియోలతో విజయ్‌ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్‌ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్‌ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. 

    విజయ్‌ టీవీకే పార్టీ పెరియార్‌ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్‌ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్‌ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్‌ వీడియోతో

    తద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్‌ క్యాంపెయిన్‌ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.

  • సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుంది.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. కవిత ఎపిసోడ్‌పై కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

    తెలంగాణలో సెప్టెంబర్ 17పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం?. రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా?. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని చూసి యువత ఏం నేర్చుకోవాలి. నెహ్రు సూచనల మేరకే పటేల్ సైన్యాన్ని పట్టుకొని వచ్చాడు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్రనే లేదు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.. సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు.

    కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది?. బీజేపీ కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఇది. గుజరాత్‌లోని జునాఘడ్ కూడా సెప్టెంబర్ 17న ఇండియాలో విలీనం అయింది. జునాఘడ్ గురించి ఒక్క మాట మాట్లాడని బీజేపీ హైదరాబాద్ గురించి మాట్లాడడం రాజకీయం కాదా?. మోదీ వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనలు ఎన్నికల ముందే జరిగాయి. ఎన్నికల ముందు జరిగిన ఘటనలపై  అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలే ముఖ్యం అన్నట్టు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక వచ్చిన ఘటనలపై చర్చ జరిగి నిజాలు నివృత్తి కావాలి. పహల్గాం వద్ద మిలిటరీ ఫోర్స్ ఎందుకు తొలగించారు. పహల్గాం ఘటనలో మోదీ, అమిత్ షా ఫెయిల్యూర్.

    కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. కోమటిరెడ్డి ఫ్యామిలీ బోల్డ్‌గా మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై నాకు కూడా ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. కవిత ఎప్పుడు పుట్టారు?. కవిత పుట్టిన తేదీ ఎప్పుడు?. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది. జరిగింది విలీనం కాబట్టే కవిత విలీన దినోత్సవం చేస్తోంది. కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్‌లో కవిత ఉంది’ అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ చివరి రోజుల్లో అద్వానీ, వాజ్‌పేయి లాంటి వాళ్లు ఆయన గురించి  ఆరా తీశారని.. కానీ, ఎన్టీఆర్ వల్ల లబ్ది‌ పొందిన వెంకయ్యనాయుడు మాత్రం కనీసం పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. తాజాగా సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలపై ఆమె బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయం నుంచి మాట్లాడారు. 

    ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. తిరిగి పొగడటం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబుకు వెయ్యి నాలుకలు ఉన్నాయి. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయనపై గొప్పగా పుస్తకాలు రాస్తున్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్యం విధ్వంసం అని‌ పుస్తకం రాస్తే బాగుండేది.  ఎన్టీఆర్ ని‌ పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తొలగించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాయాలి. చివరి రోజుల్లో జరిగిన పరిణామాలు, ఆస్తులు‌ లాక్కోవటం, వైశ్రాయ్ హోటల్ పరిణామాలు కూడా రాయాలి. ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆరే చెప్పారు కదా. 

    జగన్ పాలన గురించి వెంకయ్యనాయుడు విమర్శలు చేయటం దారుణం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారు. పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్న చంద్రబాబుతో ఎలా స్నేహం చేస్తున్నారు?. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన గురించి అద్వానీ, వాజ్ పేయి లాంటి వారు  ఆరా తీశారు. కానీ ఎన్టీఆర్ వలన లబ్ది‌ పొందిన వెంకయ్య నాయుడు చివర్ల కనీసం పట్టించుకోలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, వెంకయ్య నాయుడుకు‌ లేదు. 

    తెలుగు భాషకు పట్టం కట్టిన  జగన్‌ను విధ్వంసకారుడు అని అనటానికి నోరెలా వచ్చింది?. రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే చంద్రబాబు పాలన‌ బాగుందని వెంకయ్య ఎలా అంటారు?. రైతులు రోడ్డు మీద పడితే పట్టించుకోని చంద్రబాబు విధ్వంసకారుడు కాదా?. అబద్దాలు చెప్తూ వెన్నుపోటు పొడిచే చంద్రబాబును భుజాల మీద మోయవద్దు. 

    ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తామంటున్న టీడీపీ నేతలు సిగ్గుపడాలి. గతంలో వాజ్ పేయి, గుజ్రాల్, దేవగౌడలాంటి వారు భారతరత్న ఇస్తానంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ భారతరత్న పేరు ఎత్తుతున్నారు? అని ఆమె మండిపడ్డారామె.

    Lakshmi Parvathi: వెన్నుపోటు చంద్రబాబును వెంకయ్య నాయుడు వెనకేసుకొస్తున్నారు

Family

  • వరి, చిరుధాన్యాలు పండించే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలను అయినకాడికి అమ్మేసుకుంటే మిగిలేది అరకొర లాభాలు లేదా నికర నష్టాలే! అవే ధాన్యాలను కొని, మరపట్టించి అమ్ముకునే వ్యాపారులు బాగుపడతారు. రైతే ఈ పని కూడా చేసుకుంటే నికరంగా లాభాలు పొందడానికి అవకాశం ఉందని రుజువు చేసే విజయగాథలు ఎక్కడ వెతికినా కనిపిస్తాయి. అయితే, మన దేశంలో వ్యవసాయం చేసే వారిలో 80–90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు లేదా కౌలు రైతులే. ధాన్యాలను పండించి అలాగే అమ్మేసుకోవటం వల్ల రావాల్సినంత ఆదాయం రావటం లేదు. 

    ఇటువంటి రైతుల నికరాదాయం పెరగాలంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్మాలి. పెద్ద రైస్‌ మిల్లులు చాలా దూరంలో ఉంటాయి. రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత లాభదాయకం కాదు. వారికి కావాల్సింది చిన్న రైస్‌ మిల్లు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చిన్న మిల్లులు కావాలి. విద్యుత్తు కట్‌ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందుకే వారికి కావాల్సింది సౌర విద్యుత్తుతో నడిచే చిన్న/మధ్య తరహా రైస్‌ మిల్లు!

    చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడానికి ఇదొక్కటే మార్గమని సరిగ్గా గుర్తించిన బెంగళూరుకు చెందిన ‘సెమా ఆల్టో’ అనే వ్యాపార సంస్థ సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్‌ మిల్లును, ఇతర అనుబంధ యంత్రాలను రూపొందించింది. సెల్కో ఫౌండేషన్‌ సహకారంతో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 150 సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్‌ మిల్లులను దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొల్పి సత్ఫలితాలు సాధిస్తోంది. సౌరశక్తితో పనిచేసే ఆవిష్కరణలతో వ్యవసాయోత్పత్తుల వ్యాపార చిత్రంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తోందీ సంస్థ. సోలార్‌ మినీ రైస్‌ మిల్లుల ద్వారా రైతులకు (ధాన్యం: బియ్యం నిష్పత్తి) నికర బియ్యం దిగుబడి 30 శాతం పెరిగింది. ఆదాయం రెట్టింపైందని సెమ ఆల్టో చెబుతోంది. ప్రకృతిని కలుషితం చేయని సౌర విద్యుత్తు ద్వారా ఈ సంస్థ గ్రామీణ జీవనోపాధిని విజయవంతంగా పునర్నిర్మిస్తోంది.

    2017లో ప్రారంభం
    ‘సెమ(ఎస్‌ఈఎంఏ)’ అంటే ‘సోలార్‌ పవర్డ్‌ ఎఫిషియంట్‌ మెషినరీ ఫర్‌ అగ్రికల్చర్‌’. వరి ధాన్యం, చిరుధాన్యాలను మరపట్టటం, బియ్యాన్ని మార్కెట్‌కు అందించడానికి అవసరమైన అనేక పనులు చెయ్యటం ఒక్క యంత్రంతో అవ్వదు. ధాన్యాలను శుభ్రపరచటం, మర పట్టటం, పాలిష్‌ చెయ్యటం, గ్రేడింగ్‌ వరకు మొత్తం 4 వేర్వేరు యంత్రాలు అందుకు కావాలి. వీటన్నిటినీ సెమ ఆల్టో సంస్థ రూపొందించింది. 

    సౌరశక్తితో పనిచేసే మల్టీ–స్టేజ్‌ మినీ మిల్లు ఎండ్‌–టు–ఎండ్‌ బియ్యం ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తోంది. 3.7–5 కిలోవాట్ల విద్యుత్తుతో ఇది నడుస్తుంది. 2017లో బెంగళూరులో అసద్‌ జాఫర్‌ ఈ కంపెనీని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో గ్రామీణులు తమ వ్యవసాయోత్పత్తులను రూపం మార్చి అధిక ధరకు విక్రయించుకునే మార్గాన్ని సుగమం చెయ్యటమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెమ రైస్‌ మిల్లులు 150 యూనిట్ల వరకు ఏర్పాటయ్యాయి.

    65% రికవరీ రేటు
    పాతకాలపు డీజిల్‌తో నడిచే పెద్ద రైస్‌ మిల్లుల్లో 500 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 275–300 కిలోల బియ్యం వస్తే, ఇప్పుడు అది 320–350 కిలోలకు పెరిగింది. ఈ సోలార్‌ మినీ రైస్‌ మిల్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నికర బియ్యం దిగుబడి 30% పెరిగింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఆదాయం రెట్టింపైంది. పదెకరాల్లో వరి పండించినా అప్పట్లో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా ఆదాయం సరి΄ోయేది కాదు. ఇప్పుడు ఈ మిల్లుతో బియ్యం నాణ్యత, రికవరీ రేటు, ఆదాయం పెరిగింది..’ అని తమిళనాడుకు చెందిన సేంద్రియ వరి రైతు గోపి చెబుతున్నారు. 

    సోలార్‌ మినీ రైస్‌ మిల్లులో 100 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 65 కిలోల బియ్యం రైతుల చేతికి వస్తున్నాయి. మిల్లు సామర్థ్యం మెరుగ్గా ఉండటం వల్ల రైతులకు ఎక్కువ బియ్యం వస్తున్నాయి, వృథా తగ్గింది. ధాన్యాన్ని కిలో రూ. 45–50కి అమ్మే రైతు గోపి ఇప్పుడు సోలార్‌ రైస్‌ మిల్లులో మరపట్టి బియ్యాన్ని రూ. 80–100లకు కిలో అమ్ముతున్నారు. తద్వారా ఆదాయం రెట్టింపైందని గోపి తెలిపారు. వరి ధాన్యంతోపాటు చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, గోధుమలను కూడా సౌర రైస్‌ మిల్లుల్లో మరపట్టే అవకాశం ఉండటం విశేషం.

    సోలార్‌ రైస్‌ మిల్లులను రైతుల దగ్గరకు తీసుకెళ్లే కృషిలో సీఈఈడబ్లు్య, విల్‌గ్రో సంస్థలతో కలసి సెమ ఆల్టో పనిచేస్తోంది. ఆస్తిపాస్తులు లేని పేద రైతులకు రుణ సదుపాయం కల్పించడం ద్వారా అందుబాటు బడ్జెట్‌లో ఈ మిల్లులను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ వంటి ప్రభుత్వ పథకాలతో ఇటువంటి యంత్రాలను అనుసంధానం చేయగలిగితే రుణ సంబంధిత సబ్సిడీలను గ్రామీణ చిరువ్యాపారులకు అందించటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు.

    (చదవండి: పొలం పంటల కన్నా ఇంటి పంటలతో ప్రయోజనాలున్నాయా?)
     

  • ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్‌ను బహుకరించారు. 

    ఆ పగ్డిపై(తలపాగ)  క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్‌పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు  ధార్‌ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్‌ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్‌ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్‌ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్‌లో మధ్యప్రదేశ్‌ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. 

    ఆయన ఈ పుట్టినరోజుని  పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్‌ ఇన్‌ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. 

    వికసిత్‌ భారత్‌కు మార్గం వేసి, ఆత్మనిర్బర్‌ భారత్‌గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. 

    ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్‌లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .

    (చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్‌ మంత్రి..! ఎందుకోసం అంటే..)

     

  • ఈ ఫొటో చూడ‌గానే అర్థ‌మ‌య్యే ఉంటుంది ఇదో విషాద సంద‌ర్భ‌మని. స్నేహితుడి లాంటి భ‌ర్త‌కు చివ‌రిసారిగా భార్య క‌న్నీటి వీడ్కోలు చెబుతున్న విషాద ఘ‌ట్ట‌మిది. ఊహించ‌ని ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన‌ పెనిమిటి చివ‌రి చూపు కోసం స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చింది ఆమె. మ‌రో స్ట్రెచ‌ర్‌పై నిర్జీవంగా ఉన్న భ‌ర్త‌ను చూసి బోరున విలపించింది. రెండు రోజుల క్రితం వ‌ర‌కు త‌న‌తో ఎంతో సంతోషంగా గ‌డిపిన భ‌ర్త.. శాశ్వ‌తంగా తిరిగిరాడ‌న్న బాధ‌తో ఆమె ప‌డిన వేద‌న‌కు అక్క‌డున్నారంతా క‌దిలిపోయారు. ఢిల్లీ ద్వారక ప్రాంతంలోని వెంకటేశ్వర్ ఆస్ప‌త్రి మంగళవారం మధ్యాహ్నం ఈ విషాద ఘ‌ట్టానికి వేదిక‌యింది.  

    ఢిల్లీ బీఎండ‌బ్ల్యూ కారు ప్ర‌మాదంలో (Delhi BMW Accident) ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ అంత్య‌క్రియలు మంగ‌ళ‌వారం నాడు ముగిశాయి. ఇదే దుర్ఘ‌ట‌నలో ఆయ‌న భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయ‌ప‌డి చిక్సిత పొందుతున్నారు. అంత్య‌క్రియ‌ల‌కు ముందు నవజ్యోత్ పార్థీవ‌దేహాన్ని చివ‌రి చూపు కోసం సందీప్ కౌర్ ఉన్న ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. లేవ‌లేని స్థితిలో ఉన్న ఆమె.. స్ట్రెచ‌ర్‌పై నుంచే త‌న చేతుల‌తో భ‌ర్త ముఖాన్ని త‌డిమి క‌డ‌సారిగా క‌న్నీటి వీడ్కోలు చెప్పింది. త‌న కొడులిద్ద‌రి పుట్టిన‌రోజు నాడే భ‌ర్తకు చివ‌రి వీడ్కోలు చెప్పాల్సిరావ‌డంతో ఆమె బాధ వ‌ర్ణ‌ణాతీతం.

    గురుద్వారా, లంచ్‌.. విషాదం
    టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న సందీప్ కౌర్ (Sandeep Kaur) త‌న భ‌ర్త‌తో క‌లిసి బైకుపై ఆదివారం బ‌య‌ట‌కు వెళ్లారు. ఆ రోజు ఉదయం సెంట్రల్ ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించిన త‌ర్వాత ఆర్కే పురంలోని కర్ణాటక భవన్‌లో భోజనం చేశారు. అక్క‌డి నుంచి ప్రతాప్ నగర్‌లోని తమ ఇంటికి వెళుతుండగా బీఎండ‌బ్ల్యూ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిద్ద‌రినీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే నవజ్యోత్ చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు. అయితే ద‌గ్గ‌ర‌లో కాకుండా 19 కిలోమీట‌ర్ల దూరంలోని ఆస్ప‌త్రి తీసుకెళ్ల‌డంతోనే త‌న భ‌ర్త మ‌ర‌ణించార‌ని సందీప్ కౌర్ ఆరోపించారు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత 40 నిమిషాలు ప్ర‌యాణించి జీటీబీ న‌గ‌ర్‌లో ఉన్న న్యూలైఫ్ ఆస్ప‌త్రికి వీరిని త‌ర‌లించారు.

    అన్యాయంగా పొట్టన‌పెట్టుకున్నారు
    కొడుకు మ‌ర‌ణంతో నవజ్యోత్ త‌ల్లి గుర్పాల్ కౌర్ శోక‌సంద్రంలో ముగినిపోయారు. త‌న కుమారుడిని అన్యాయంగా పొట్టన‌పెట్టుకున్నార‌ని క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. త‌న కోడ‌లు కూడా తీవ్రంగా గాయ‌ప‌డి ఇంకా ఆస్ప‌త్రిలో ఉంద‌ని వాపోయారు. ప్ర‌మాద‌స్థ‌లికి ద‌గ్గ‌రలో ఉన్న ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ఉంటే త‌న తండ్రి బ‌తికివుండేవార‌ని నవజ్యోత్ కుమారుడు నవనూర్ సింగ్ అన్నాడు. త‌న త‌ల్లికి కూడా తీవ్ర గాయాల‌యిన‌ట్టు వైద్యులు చెప్పార‌ని, హెల్మెట్ (Helmet) ధ‌రించిన‌ప్ప‌టికీ త‌ల‌కు గాయ‌మైంద‌ని బాధ ప‌డ్డాడు.

    కొడుకుల పుట్టిన‌రోజు నాడే..
    నవజ్యోత్ సింగ్ (52) మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు, స‌హోద్యోగులు విషాదంలో మునిగిపోయారు. నవజ్యోత్ మ‌ర‌ణం ఆయ‌న కుటుంబానికే కాదు, దేశానికి లోట‌ని స‌హోద్యోగులు అన్నారు. ఆయ‌న ఇద్ద‌రు కొడుకుల పుట్టిన‌రోజు నాడే నవజ్యోత్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌పాల్సి రావ‌డం విషాదమ‌ని ఆవేద‌న చెందారు. నవజ్యోత్ అంత్య‌క్రియ‌లు మంగ‌ళ‌వారం బేరి వాలా బాగ్ శ్మశానవాటికలో జ‌రిగాయి. అంత‌కుముందు ఉత్తర ఢిల్లీలోని ప్రతాప్ నగర్ నుంచి బేరి వాలా బాగ్ శ్మశానవాటిక సాగిన అంతిమ‌యాత్ర‌లో నవజ్యోత్  సింగ్ కుటుంబ స‌భ్యులు, బంధువులు, స‌హ‌చ‌రులు పాల్గొన్నారు.

    కావాల‌ని చేయ‌లేదు..
    నిర్ల‌క్ష్యంగా కారు న‌డిపి నవజ్యోత్ సింగ్ (Navjot Singh) మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నిందితురాలు గగన్‌ప్రీత్ కౌర్, ఆమె భ‌ర్త పరీక్షిత్‌ మక్కర్‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌మాద స‌మ‌యంలో వారిద్ద‌రి పిల్ల‌లు కూడా కారులో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. వారి కారును స్వాధీనం చేసుకున్నామ‌ని.. ప్ర‌మాదంలో కౌర్‌, ఆమె భ‌ర్త‌కు స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్టు స్థానికి డీసీపీ చెప్పారు. కాగా, సోమ‌వారం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన గగన్‌ప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 2 రోజుల పాటు జ్యుడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. తాను కావాల‌ని యాక్సిడెంట్ చేయ‌లేద‌ని, ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిపోయింద‌ని పోలీసులతో ఆమె చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాన‌ని, అందుకే త‌న‌కు తెలిసిన ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ట్టు వెల్ల‌డించింది. కోవిడ్ స‌మ‌యంలో త‌న పిల్ల‌లు అక్క‌డే చికిత్స పొందార‌ని తెలిపారు.

    చ‌ద‌వండి: టికెట్ బుకింగ్‌.. రైల్వేశాఖ కొత్త రిజ‌ర్వేష‌న్ విధానం

    ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
    ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రింగ్ రోడ్‌లో నవజ్యోత్ సింగ్ మోటార్ సైకిల్‌ను బీఎండ‌బ్ల్యూ కారు (BMW Car) ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఆయ‌న భార్య సందీప్ కౌర్ తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్ నివాసి గగన్‌ప్రీత్ కౌర్‌, ఆమె భ‌ర్త పరీక్షిత్ మక్కర్, వారి ఇద్ద‌రు పిల్ల‌లు, ప‌నిమ‌నిషి ప్ర‌మాద స‌మ‌యంలో కారులోనే ఉన్నారు. పరీక్షిత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గగన్‌ప్రీత్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్ష‌న్‌ 281 (బహిరంగ మార్గంలో వేగంగా వాహనం నడపడం), 125B (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), 105 (హత్యతో సమానం కాని నేరపూరిత హత్య), 238 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం లేదా నేరస్థుడిని త‌ప్పించ‌డానికి తప్పుడు సమాచారం ఇవ్వడం) కింద కేసు న‌మోదు చేశారు. 

  • ఇంతవరకు ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్థిక రంగం, ఎంటర్‌టైన్‌మెంట్‌, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్‌పవర్‌తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..

    అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్‌లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్‌ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్‌ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్‌టాపిక్‌గా మారింది.

    అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..
    ఒకానొక సమ్మర్‌లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్‌ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్‌ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా  ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు. 

    ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.

    సింపుల్‌గా చెప్పాలంటే అ‍ల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్‌  కమాండ్‌ల ద్వారా బ్యూరోక్రాటిక్‌ అభ్యర్థనలను ప్రాసెస్‌ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్‌ సేవల పోర్టల్‌ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. 

    కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్‌మెంట్‌ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చ​ర్చనీయాంశంగా మారింది.

    (చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!)

     

  • పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.

    అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్‌ హాట్‌పాట్‌ రెస్టారెంట్‌లో టాంగ్‌ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. 

    సమీపంలోని టైబుల్‌ ఎక్కి సంప్రాదాయ చైనీస్‌ హాట్‌పాట్‌ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్‌ సూప్‌లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. 

    అందుకుగానూ సదరు బ్రాంచ్‌ హైడిలావ్‌ రెస్టారెంట్‌ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్‌ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్‌ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. 

    ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్‌వేర్‌ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్‌ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్‌ని సందరు రెస్టారెంట్‌కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. 

    అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్‌కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్‌ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.

    (చదవండి: రండి.. ఫొటో దిగుదాం’)

     

  • గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్‌ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..

    ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్‌ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 

    ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.


    సెప్టెంబర్‌ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం

    సెప్టెంబర్‌ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారం

    సెప్టెంబర్‌ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం

    సెప్టెంబర్‌ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం

    సెప్టెంబర్‌ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం

    సెప్టెంబర్‌ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం

    సెప్టెంబర్‌ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారం

    సెప్టెంబర్‌ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం

    సెప్టెంబర్‌ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారం

    అక్టోబర్‌ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం

    అక్టోబర్‌ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం

    గమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. 
     

    (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు)

Andhra Pradesh

  • దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో విజయవాడ  పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైళ్లే ప్రధానంగా ఉన్నాయి. 

    దసరా నేపథ్యంలో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో విజయవాడ-దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది.

    రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేశారు.

    కాకినాడ పోర్టు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17267ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే రైలు నంబర్17268 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 12718 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. వీటితో పాటు.. 
     
    సీఎస్ఎంటీ ముంబై నుంచి భువనేశ్వర్ కు ప్రయాణించే రైలు నంబర్ 11019ను నవంబర్ 21న 180 నిమిషాల పాటు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. ధన్ బాద్ నుంచి అలప్పుజకు వెళ్లే రైలు నంబర్ 13351ను నవంబర్ 24న 180 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. అలాగే హతియా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలు నంబర్ 22837ను కూడా 160 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు.
  • సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలైయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజూ ట్రిప్పులు వేస్తున్నారు. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడికి చెందిన టిప్పర్‌గా సమాచారం. ఇసుక టిప్పర్‌.. రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్‌ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.

    కారు నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రెండున్నర గంటలపైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రం వారి వీధికి చెందిన తాళ్లూరు రాధ(38), శ్రీనివాసులు (40), సారమ్మ(40), వెంగయ్య(45), లక్ష్మి(30), డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.

    ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

  • సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారి సైతం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇసుక టిప్పర్‌ లారీ.. రాంగ్‌ రూట్‌ వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కారును టిప్పర్‌ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. 

    ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

International

  • బీజేపీ అగ్రనేత, భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ, అభిమానులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయంగా ఆయనకున్న పాపులారిటీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వివిధ దేశాల అధినేతలు సైతం ఆయనకు విషెస్‌ తెలియజేశారు. అయితే.. 

    అందులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సందేశం ప్రత్యేకంగా నిలిచింది. మీ శక్తి, సంకల్పం, నాయకత్వం లక్షలాది మందికి ప్రేరణ అంటూ మెలోనీ, మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి కలగాలని.. తద్వారా ఆయన భారత్‌ను ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు నడిపిస్తూ, మా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచగలుగుతారు అని ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారామె. 

    మోదీ ప్రధాని అయ్యాక ఇటలీ-భారత్‌ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర  సహకారం పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో.. 

    ఇరు దేశాల అధినేతల మధ్య స్నేహం గురించి కూడా సోషల్‌ మీడియా ప్రత్యేకంగా చర్చించుకుంటుంది. జీ7, జీ20, సీవోపీ28.. ఇలా  ఏ సదస్సు, భేటీలో కలుసుకున్నా.. వెంటనే #Melodi (Meloni + Modi) అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యేది. చివరకు ఆ హ్యాష్‌ట్యాగ్‌తోనే మెలోనీ సైతం ట్వీట్లు చేయడం నెటిజన్స్‌ను మరింత ఆకర్షించింది. 2023లో సీవోపీ-28 సందర్భంగా.. “Melodi టీమ్ నుంచి హాయ్” అంటూ మెలోనీ పోస్ట్ చేయగా.. దానికి జై హో ఇండియా–ఇటలీ స్నేహం! అని మోదీ స్పందించారు. అప్పటి నుంచి  వీరిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీలు, హాస్యభరిత సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. 

    జార్జియా మెలోనీ 1977 జనవరి 15న ఇటలీ రాజధాని రోమ్‌లో జన్మించారు. 2022 అక్టోబర్ 22న ఇటలీ అధ్యక్ష బాధత్యలు చేపట్టి.. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. మెలోనీకి వివాహం కాలేదు, కానీ 2015 నుంచి ఆండ్రియా జియాంబ్రూనో అనే టెలివిజన్ జర్నలిస్టుతో సహజీవనం చేశారు. వీళ్లకు ఓ పాప ఉంది. ఓ టీవీ షోలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2023 అక్టోబర్‌లో జియాంబ్రూనోతో మెలోనీ విడిపోయారు. తన కుమార్తె భద్రత, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమయంలో ఆమె ప్రకటించారు.