సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ( ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన వైఎస్ జగన్.. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జంగిల్రాజ్ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని మండిపడ్డారు. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్రాజ్ను సూచిస్తున్నాయన్నారు. అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా..:
దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే పని చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, కుట్రపూరితంగా, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అంటూ.. రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబునాయడు, ఆయన కొడుకు లోకేష్, పవన్కళ్యాణ్.. ఉద్దేశపూర్వకంగా, శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్నారు.
వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ.. రెండు ల్యాబ్లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఆ రెండు ల్యాబ్లు వీరు పంపించిన నెయ్యిని పరీక్షించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపనూనె వంటి ఏ అవశేషాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ నివేదికా ఆధారంగా సీబీఐ, సిట్ ఛార్జ్షీట్ వేసింది.
వారు నిజంగా తప్పు చేసి ఉంటే..!:
ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే, ఆ ఛార్జ్షీట్లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి పేర్లు ఎందుకు లేవు? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?. ఎందుకంటే వారు తప్పు చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ల్యాబ్లు కూడా వాస్తవం చెప్పాయి. అసలు సీబీఐ ఎందుకు వచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని.. సీబీఐ దర్యాప్తు చేసి, వాస్తవాలు వెల్లడించింది.
క్షమాపణ కోరాల్సింది పోయి..:
కాబట్టి, చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్ చేసిన తప్పుకు చెంపలేసుకుని, క్షమాపణ కోరాల్సింది పోయి.. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తూ.. వాస్తవాలు వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టారు. తప్పుడు సమాచారంతో, రెచ్చగొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?. మేము కూడా ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది చంద్రబాబు?. సూపర్సిక్స్, సూపర్సెవెన్ అని చెప్పి మోసం చేశారని ఫ్లెక్సీలు పెడితే ఊర్కుంటారా?. అబద్దాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు.
ప్రశ్నిస్తే సహించడం లేదు!:
ఎవరైనా చంద్రబాబును గట్టిగా నిలదీస్తే, ప్రశ్నిస్తే..ఏం చేస్తున్నారు?. అంబటి రాంబాబు మీద దాడి చేశారు. ఆరోజు ఉదయం గుడికి వెళ్లి పూజ చేసి వస్తుంటే.. ఆ మార్గంలో కట్టెలు పట్టుకుని, పోలీసుల సమక్షంలో రాంబాబును అడ్డగించాలని చూశారు. (అంటూ ఆ ఫోటోలు చూపారు). పోలీసులను పక్కన పెట్టుకుని, కర్రలతో రాంబాబు కారును అడ్డగించి, కారును బాదారు. ఇంకా తనను బూతుల తిట్టి, ఆయన కారుపై దాడి చేస్తే.. రాంబాబుగారు స్పందించారు. తన ఒక్కడి మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే.. ఆయన స్పందించారు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి.. కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి. మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు.
మరి ఇదే చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్.. మీరు అంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఒకటి. రాంబాబు గారు మాట్లాడితే ఒకటినా? అయినా రాంబాబుగారు, ఇంటికి వచ్చిన తర్వాత, మీడియాతో మాట్లాడి, తాను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు. తాను ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. చాలా సంస్కారంగా వివరణ కూడా ఇచ్చారు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. వారు తన కారుపై దాడి చేశారు. తిట్టారు. దాంతో అలా స్పందించాడు. ఆయన క్షమాపణ చెప్పినా.. ఆయన మాటలు వక్రీకరిస్తూ.. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు.
స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. (అంటూ ఆ ఫోటోలన్నీ చూపారు) ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు.
వారు కుట్రలో భాగస్వాములే కదా?:
ఇది హత్యాయత్నం కాక మరేమిటి? పోలీసులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు కాదా?. పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేదా?. ఇక్కడికి ఎంత దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది. కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది. అక్కడ బెటాలియన్ ఉంటుంది. మా పార్టీ నాయకులు ఏ అధికారికి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. మరి ఇది కుట్ర కాదా? ఇది ధర్మమా? న్యాయమా?. మరోవైపు రాంబాబుగారిని అరెస్టు చేశారు. దానికి కారణం ఏం చెప్పారు? చంద్రబాబును తిట్టినందుకు అని చెప్పారు. మరి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి, 5 కార్లు ధ్వంసం చేసి, మొత్తం పగలగొడితే.. ఏం చేశారు?. ఎమ్మెల్యే, ఆమె భర్తను ఏం చేయలేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
అక్కడ జోగి రమేష్ ఇంటిపై దాడి:
అక్కడ కూడా పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఇంటిమీద దాడి చేసి, నిప్పంటించారు. అంతకు ముందు విడదల రజిని. ఆమె గుడిలో పూజ చేసి వస్తుంటే, గుడి బయట అడ్డుకుని, తిడుతూ.. పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరిగినా, ఆమెపైనే తిరిగి కేసు పెట్టారు.
బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్కళ్యాణ్కు జ్ఞానోదయం కలగాలని గుడిలో పూజ చేసి వస్తుంటే, ఆయనపైనా దాడి చేశారు. కాకాణి గోవర్థన్రెడ్డి పైనా అదే స్థితి. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.
స్వార్థ రాజకీయాల కోసం..:
తప్పులన్నీ చంద్రబాబు చేస్తున్నారు. కేసులు మా పార్టీ వారిపై పెడుతున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా చేస్తోంది ఏమిటి?. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ఎన్నికల ముందు ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలిచ్చి..ఏవీ చేయకుండా,అన్నీ చేశామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నాడు. అక్రమ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. చివరకు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వదలడం లేదు. ఇంకా దారుణంగా గంజాయి కేసులు కూడా పెడుతున్నారు.
అంతా అరాచకం. ఎక్కడికక్కడ దోపిడీ:
నకిలీ మద్యం దందా. తన పార్టీ వారికి మద్యం షాప్లు. వేలం పాట పాడి బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. మద్యం షాప్ల పక్కనే, పర్మిట్రూంలు నడుతున్నారు. అలా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైన్షాప్ల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. పర్మిట్రూమ్ల్లో పెగ్గుల వారీగా అమ్ముతున్నారు. ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం లేదు. అంతా వాళ్ల జేబుల్లోకి పోతోంది. ప్రతి 5 బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం. దాన్ని తయారు చేసింది తంబళ్లపల్లె నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి. అయినా మా పార్టీ నాయకుడు జోగి రమేష్పై అక్రమ కేసు పెట్టి, జైలుకు పంపారు. నకిలీ మద్యం తయారీ. సరఫరా, అమ్మకం అంతా టీడీపీ నాయకులదే. అంత దారుణంగా దోచుకుంటున్నారు.
జంగిల్రాజ్కు పరాకాష్ట:
అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడి. అంబటి రాంబాబు కాపు కులంలో మంచి నాయకుడు. ఆయన ఆ కులంలో ఒక టైగర్. అలాంటి ఆయన్ను దారుణంగా హత్య చేయాలని చూశారు. ఇంకా ఆయనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, నల్లపాడు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ముగ్గురు సీఐలు టార్చర్ చేశారు. ఒక మాజీ మంత్రిని అలా వేధిస్తారా?. దాదాపు 200 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్ లేదు. మీకు కావాల్సిన వారిని ఎంచుకుని, జంగిల్రాజ్ చేస్తున్నారు.
ఎవ్వరినీ వదిలిపెట్టబోము:
ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు. చూస్తుండగానే గడిచిపోతాయి. మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. ఇప్పుడు తప్పుడు పని చేస్తున్న పోలీసులను యూనిఫామ్తో బోనులో నిలబెడతాం. వడ్డీతో సహా బదులిస్తాం. విచారణ జరిపిస్తాం. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.

విషబీజాలు నాటుతున్నారు:
ఈ రోజు విషపూరిత విత్తనాలు నాటుతున్నారు. అవి రేపు వృక్షాలవుతాయి. అప్పుడు పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా వైఖరి మార్చుకొండి. ఇలాంటి పనులు ఆపండి. హమీలు నిలబెట్టుకొండి. పిల్లలకు ఫీజులు చెల్లించండి. ఆరోగ్యశ్రీ పక్కాగా అమలు చేయండి. 10 మెడికల్ కాలేజీల అమ్మకం ఆపండి. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టండి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి. పెట్టుబడి సాయం చేయండి.
ఎదుర్కొంటాం.. పోరాడుతాం.. ఎండగడతాం:
అడిగితే గొంతు పట్టుకోవడం సరికాదు. మీరు ఇలాగే కొనసాగిస్తే.. రాష్ట్ర బంద్కు పిలుపునిస్తాం. గట్టిగా పోరాడుతాం. ఢిల్లీలో కూడా మీ వ్యవహారాన్ని ఎండగడతాం. ఎన్హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలా చేస్తే, వైయస్సార్సీసీ కార్యకర్తలు భయపడతారనుకుంటే, చంద్రబాబు ఒక మూర్ఖుడు. బంతి నేలకు కొడితే, అంతే బలంతో లేస్తుంది. మా కార్యకర్తలు కూడా అంతే.
అంత దిగజారిన నాయకుడు ప్రపంచంలోనే ఉండడు:
చంద్రబాబు ఎంత తప్పుడు మనిషి అంటే, ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది. ఆయన చేసిన తప్పు ప్రజలందరికీ తెలిసింది. దీంతో తన అబద్దాలు నిజం అని చెప్పడానికి, ఆయన తనకు కావాల్సిన వారితో కమిషన్ వేసుకుంటాడట! అలా తనకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునే ప్రయత్నం. అందుకే చంద్రబాబు వంటి దిగజారిపోయిన నాయకుడు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు
అడుగడుగునా అంతులేని అభిమానం..
తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, జగన్ను చూసేందుకు పోటెత్తారు. దీంతో తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లో ఉన్న రాంబాబు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. కుంచనపల్లి క్రాస్రోడ్స్, ఖాజా టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి శ్రీ వైయస్ జగన్ చేరుకున్నారు.
మరోవైపు వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. ఎక్కడకక్కడ జగన్గారి వెంట వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టారు. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద అడ్డుగా పెట్టుకుని అడ్డుకున్నారు. అయినా జగన్గారి అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలి వచ్చారు. గుంటూరు నగరం జనసముద్రంగా మారింది.