Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. 

    ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శ‌ర్మ (32), శివ‌మ్ దూబే (26) రాణించారు. స్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ 3 వికెట్లు తీయ‌గా, సాకిబ్ హుసేన్ 2, ప్ర‌ఫుల్ హింగే, ఇషాన్ మ‌లింగ చెరొక వికెట్ తీశారు.

    దుమ్ములేపిన ఇషాన్‌
    అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి బ్యాట్ ఝూలిపించాడు. కేవలం 47 బంతుల్లోనే 70 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

    అతడితో పాటు హెన్రిచ్ క్లాసెన్(26 బంతుల్లో 47) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి రెండు, అన్షుల్ కాంబోజ్‌, నూర్ అహ్మద్‌, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఓటమితో సీఎస్‌కే తమ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చెన్నై జట్టు 12 పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్ధానంలో ఉంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్భుతం జరగాలి.
    చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!
     

  • ఎంఎస్ ధోని.. ఈ పేరు సీఎస్‌కే ఫ్రాంచైజీలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. సీఎస్‌కేకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ధోని ఈ సీజ‌న్‌లో సొంత ఇలాఖాలో ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే అభిమానుల‌కు వీడ్కోలు ప‌లికాడు. 

    ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన ధోని (మధ్యలో సీఎస్‌కేపై నిషేధంతో రెండు సీజన్లు మినహాయింపు) సోమవారం సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడేశాడు. అదేంటి ధోని తుది జట్టులో లేడు కదా అన్న అనుమానం మీకు కలగొచ్చు. అయితే సీఎస్‌కేకు చెపాక్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ చివరిది. ఆ తర్వాత మే 21న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

    ఈ నేపథ్యంలో హోంగ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ కావడంతో ధోనికి సీఎస్‌కే జట్టు ఫేర్‌వెల్‌ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడనప్పటికీ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జట్టుతో ధోని గ్రూప్ ఫొటో దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జెర్సీ నెంబర్ 7తో స్టేడియంలోకి ధోని ఎంట్రీ ఇవ్వగానే మైదానం హోరెత్తిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణచివేసుకున్న ధోని జట్టుతో గ్రూప్ ఫొటో దిగాడు. 

    ఆ తర్వాత ఆటగాళ్లతో కాసేపు సంభాషించాడు. అనంతరం అభిమానుల వైపు ఒక లుక్ ఇచ్చిన ధోని చేతులూపుతూ డ్రెస్సింగ్ రూమ్ వైపు భారంగా అడుగులు వేయడం కనిపించింది. ధోని పెవిలియన్ వెళుతున్న క్రమంలో సీఎస్‌కే ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ఈ సమయంలో చెపాక్ స్టేడియంలో కాసేపు నిశబ్దం అలుముకుంది.  

    అభిమాన ఆటగాడైన ధోని సీఎస్‌కే సొంత స్టేడియంలో తన చివరి మ్యాచ్ ఆడకుండానే ఇలా సైలెంట్‌గా వీడ్కోలు పలకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓవ‌రాల్‌గా ధోని ఐపీఎ ల్‌లో 278 మ్యాచ్‌లాడి 5,439 ప‌రుగులు చేశాడు. ఇందులో 24 అర్థ‌సెంచ‌రీలు ఉన్నాయి.

    చదవండి: టెన్నిస్ దిగ్గ‌జం పేస్ ఇంట్లో విషాదం

  • భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పేస్ తల్లి, మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి జెన్నిఫర్ పేస్ (72) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. జెన్నిఫర్ 1972 మ్యూనిచ్ ఒలింపి క్స్‌లో భారతదేశానికి బాస్కెట్‌బాల్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1982లో బాస్కెట్‌ బాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహ రించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

    జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్‌కు స్వయానా ముని మనుమరాలు. 2025 ఆగస్టులో పేస్ తండ్రి వేస్ పేస్ మృతి చెందిన విషయం తెలిసిందే.  వేస్ పేస్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1971 హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో వేస్ పేస్ సభ్యుడిగా ఉన్నారు. 

    ఆ తర్వాతి ఏడాది 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులోనూ మిడ్‌ఫీల్డర్‌గా సేవలందించాడు. ఇద్దరు దిగ్గజాల కడుపున పుట్టిన లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో భారత టెన్నిస్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేస్ రికార్డులకెక్కాడు. 

    ఇక 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో 10 మిక్స్‌డ్ టైటిల్స్‌, 8 డబుల్స్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ కాంస్యం సాధించి తండ్రి తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఆటగాడిగా పేస్ ఖ్యాతిని గడించాడు.

    చదవండి: ధోనీ రిటైర్మెంట్‌పై రుతురాజ్ క్లారిటీ!

  • సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ప్ర‌స్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్ప‌ష్ట‌త‌నిచ్చాడు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌ సోమ‌వారం చెన్నైలోని సొంత మైదానంలో ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడ‌ని అభిమానులు ఆశించారు. టాస్ సమ‌యంలో ధోనీ ఆడుతున్నాడా లేదా అని ర‌విశాస్త్రి అడిగిన ప్ర‌శ్న‌కు రుతురాజ్ స‌మాధాన‌మిచ్చాడు. 

    ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేద‌ని, ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడ‌డం లేద‌ని తెలిపాడు. దీంతో అభిమానుల ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌యింది. అయితే ధోనీ మ్యాచ్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ జ‌ట్టుతో పాటు చెపాక్ స్టేడియానికి రావడం అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఎటూ ధోనీ మ్యాచ్ ఆడ‌డం లేదు కాబ‌ట్టి ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ముగిసిన అనంత‌రం సైలెంట్‌గా స్టేడియంలోకి వ‌చ్చి అభివాదం చేస్తూ సీఎస్‌కేకు గుడ్‌బై చెబుతాడేమోన‌ని అభిమానులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. 

    త‌మ అభిమాన క్రికెట‌ర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండా ఇలా సైలెంట్‌గా రిటైర్ అవ్వ‌డాన్ని తాము భ‌రించ‌లేమ‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఒక‌వేళ ధోనీ ఇవాళ త‌న రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌కపోతే మాత్రం మే 21 వ‌ర‌కు ఆగాల్సిందే. ఇక సొంత గ్రౌండ్‌లో చివ‌రి మ్యాచ్ ఆడుతున్న సీఎస్‌కే మే 21న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఈ సీజ‌న్‌లో చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుంది.

    దీంతో అహ్మ‌దాబాద్‌లోనే ధోనీకి సీఎస్‌కే ఘ‌నంగా సెండాఫ్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరితే అప్పటిక‌ప్పుడు ప్ర‌ణాళిక‌ల‌ను మార్చేందుకు సీఎస్‌కే యాజ‌మాన్యం సిద్ధ‌మ‌వుతోంది.

  • ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ టెస్టు కెప్టెన్‌ మైక్ స్మిత్ (92) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మైక్ స్మిత్ (ఎంజేకే స్మిత్‌) ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు వార్విక్‌షైర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ మేటి బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మైక్‌స్మిత్ 50 టెస్టులు ఆడాడు. ఇందులో 25 టెస్టులకు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

    1958లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మైక్ స్మిత్ 1972లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.  50 మ్యాచ్‌ల్లో 2,278 ప‌రుగులు చేసిన మైక్ స్మిత్ మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 637 మ్యాచ్‌లాడి 40వేలకు పైగా పరుగులు సాధించిన మైక్ స్మిత్ 72 సెంచరీలు బాదాడు. 

    అంతేకాదు 1991 నుంచి 2003 మ‌ధ్య వార్విక్‌షైర్ కౌంటీ బోర్డు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలోనే వార్విక్‌షైర్ కౌంటీల్లో చాలా టైటిల్స్ సాధించింది. మైక్ స్మిత్ కుమారుడు నీల్ స్మిత్ అప్పటి జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. క్రికెట‌ర్‌గానే గాక ర‌గ్బీ ప్లేయ‌ర్‌గానూ మైక్ స్మిత్ గుర్తింపు పొందాడు. 

    1956లో వేల్స్‌తో జ‌రిగిన ర‌గ్బీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ త‌ర‌ఫున క్యాప్ అందుకున్నాడు. ఇక మైక్ స్మిత్ మ‌ర‌ణంపై వార్విక్‌షైర్ నివాళి అర్పించింది. కౌంటీ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా గ్లామోర్గాన్‌తో మ్యాచ్‌కు ముందు వార్విక్‌షైర్ మైక్ స్మిత్ మృతి ప‌ట్ల రెండు నిమిషాలు మౌనం పాటించింది.

    చదవండి: బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం!

  • ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సీఎస్‌కే విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ 19 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఇషాన్‌ కిషన్‌(47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(26 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

    ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌
    ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు నితీశ్ కుమార్ రెడ్డి.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. సన్‌రైజర్స్ విజయానికి 17 బంతుల్లో 27 పరుగులు కావాలి.

    ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ డౌన్‌
    క్లాసెన్‌ రూపంలో సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన క్లాసెన్‌.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న కిషన్‌, క్లాసెన్‌
    హెన్రిచ్‌ క్లాసెన్‌(43), ఇషాన్‌ కిషన్‌(48) దూకుడుగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌: 126/2

    అభిషేక్ శ‌ర్మ (26) ఔట్‌.. రెండో వికెట్ డౌన్‌
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 56 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ అకిల్ హొసెన్ బౌలింగ్‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

    7 ఓవ‌ర్ల‌లో ఎస్ఆర్‌హెచ్ 53/1
    ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది. అబిషేక్ శ‌ర్మ (25), ఇషాన్ కిష‌న్ (22) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌
    181 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ ట్రావిస్ హెడ్ (6) రూపంలో 18 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముకేశ్ చౌద‌రీ బౌలింగ్‌లో హెడ్ కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

    ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ 181 ప‌రుగులు
    సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (44), కార్తిక్ శ‌ర్మ (32), శివ‌మ్ దూబే (26) త‌లా కొన్ని ప‌రుగులు చేయ‌డంతో సీఎస్‌కే గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మిన్స్ 3 వికెట్లు తీయ‌గా, సాకిబ్ హుసేన్ 2, ప్ర‌ఫుల్ హింగే, ఇషాన్ మ‌లింగ చెరొక వికెట్ తీశారు. టాపార్డ‌ర్ విఫ‌లం కావ‌డం సీఎస్‌కే కొంప‌ముంచింది.

    • 16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (35), శివ‌మ్ దూబే (16) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    4 వికెట్లు డౌన్‌
    చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో రెండు వికెట్లు కోల్పోయింది. కార్తీక్‌ శర్మ 32, రుతురాజ్‌ గైక్వాడ్‌ 15 పరుగులు తీసి ఔటయ్యారు. క్రీజులో బ్రెవిస్‌ 11, శివం దూబె 7 పరుగులతో ఉన్నారు. ​స్కోరు 13 ఓవర్లకు 105-4గా ఉంది

    9 ఓవర్ల‌లో సీఎస్‌కే 89/2
    9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే 2 వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది. కార్తిక్ శ‌ర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ (14) క్రీజులో ఉన్నారు.

    ఉర్విల్ క్లీన్‌బౌల్డ్‌.. రెండో వికెట్ డౌన్‌
    ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 48 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన ఉర్విల్ పటేల్‌ను సాకిబ్ హుస్సేన్‌ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియ‌న్ చేర్చాడు.

    తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై
    సంజూ శాంసన్‌ (27) రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ 31 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    టాస్ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గుర్జన్‌పీత్‌ సింగ్‌ స్థానంలో అకిల్‌ హొసేన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

    గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ తెలిపాడు. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది.

    తుది జట్లు:
    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే)కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌తో పోటీ ప‌డుతున్న సీఎస్‌కే త‌న చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. 

    మ‌రోవైపు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన‌ ఎంఎస్ ధోని మాత్రం ఈ సీజ‌న్‌లో పిక్క కండ‌రాల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం సీఎస్‌కే త‌మ సొంత హోంగ్రౌండ్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో సీజ‌న్‌లో చివ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ‌స్తున్న వేళ సీఎస్‌కే అభిమానులు అత‌డిని చివ‌రిసారిగా మైదానంలో చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. 

    అయితే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తాడా? లేదా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ఐదేళ్ల క్రితం ధోని త‌న రిటైర్మెంట్‌పై చేసిన ప్ర‌క‌ట‌న తాజాగా వైర‌ల్‌గా మారింది. 2021లో చాంపియ‌న్‌గా నిలిచిన సీఎస్‌కే టైటిల్ వేడుక సందర్భంగా అప్ప‌టి కెప్టెన్ హోదాలో ధోనీ మాట్లాడాడు. త‌న చివ‌రి టీ20 మ్యాచ్‌ను చెన్నైలో ఆడాల‌ని ఆశిస్తున్న‌ట్లు ధోనీ తెలిపాడు. 

    'నేను నా క్రికెట్‌ను ఎప్పుడూ ప్ర‌ణాళికబ‌ద్దంగానే ఆడాను. నా కెరీర్‌లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్‌ను సొంతఊరు రాంచీలో ఆడడం ఎన్న‌టికీ మ‌రిచిపోను. ఇక నాకు రెండో హోంగ్రౌండ్ అయిన చెన్నై స్టేడియంలో సీఎస్‌కే త‌ర‌ఫున చివ‌రి టీ20 మ్యాచ్ ఆడుతాన‌ని ఆశిస్తున్నా. అది వ‌చ్చే ఏడాదో లేక ఐదేళ్ల‌లోనా అనేది క‌చ్చితంగా తెలియ‌దు' అని ధోనీ ఐదేళ్ల క్రితం త‌న రిటైర్మెంట్ గురించి ముందే సూచించాడు. 

    చెన్నై వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్న‌ సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ధోని ఆడితే గ‌నుక అత‌ని ఐదేళ్ల ప్ర‌క‌ట‌న ఇవాళ నిజ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. సీఎస్‌కేతో త‌న సుదీర్ఘ ప్ర‌యాణం కూడా ముగియ‌నుంది. మ‌రి ధోనీ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడుతాడా లేదా అన్న‌ది మ‌రో రెండు గంటల్లో తేలిపోనుంది.

    ఇదే మంచి త‌రుణం: అశ్విన్‌
    ధోనీకి అనుచ‌ర గ‌ణంలో ఒకడిగా గుర్తింపు పొందిన భార‌త మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. పిక్క కండ‌రాల గాయం నుంచి కోలుకున్న ధోనీ సీఎస్‌కే త‌ర‌ఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడేందుకు ఇదే మంచి అవకాశ‌మ‌ని నాకు అనిపిస్తోంది. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి. 

    నేను విన్నంత వరకు, అతను గత రెండు మూడు మ్యాచ్‌లుగా మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 44 ఏళ్ల ధోని సీఎస్‌కే జ‌ట్టుకు దూరంగా ఉండ‌డం వెనుక ఒక ప్ర‌ణాళిక దాగుంది. ఈ సీజ‌న్‌లో ధోనీ లేకుండానే సీఎస్‌కే త‌మ ప్ర‌యాణాన్ని కొన‌సాగించింది. 

    ఇప్ప‌టికీ ప్లేఆఫ్స్ రేసులో స్థిరంగా కొన‌సాగుతున్న సీఎస్‌కే తుది జ‌ట్టులో మార్పులు చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మే. అయితే ధోనికి ఇది చివరి మ్యాచ్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌తో పోరులో ధోనీ ఫ్యాన్స్ అత‌డిని చివ‌రిసారి చూసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

    చదవండి: బంగ్లా బ్యాట‌ర్ చ‌రిత్ర‌.. పాక్‌కు క్లీన్‌స్వీప్‌ గండం!

  • తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (TAL) 2026 వేసవి క్రీడా సీజన్‌ను అధికారికంగా ప్రారంభించింది. లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఈలింగ్ హాన్‌వెలియన్స్ క్రికెట్ మైదానంలో జరిగిన TAL ప్రీమియర్ లీగ్ (TPL) 2026 17వ ఎడిషన్ ప్రారంభోత్సవాన్ని మే 16న ఘనంగా నిర్వహించింది.

    క్రికెట్, సమాజ స్పూర్తితో 
    కాగా 2009లో TAL క్రికెట్ లీగ్‌గా ప్రారంభమైన ఈ టోర్నమెంట్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ క్రీడా వేడుకలలో ఒకటిగా ఎదిగింది. ప్రతి వేసవిలో ఆటగాళ్లు, కుటుంబాలు, అభిమానులను క్రికెట్, సమాజ స్పూర్తితో ఒక్కచోట చేర్చుతోంది.

     ఆటగాళ్లకు శుభాకాంక్షలు
    ఈ ఏడాది టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. రాబోయే 15 వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీ ఫైనల్స్ నిర్వహించబడతాయి. చివరగా 2026 ఆగస్టు 16న స్లౌ క్రికెట్ క్లబ్‌లో గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానులను ఉద్దేశించి TAL ఛైర్మన్ రవి సబ్బా అన్ని జట్లకు, ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

    తెలుగు ప్రజలను ఒక్కటిగా చేర్చే సాంస్కృతిక మరియు క్రీడా కార్యక్రమాల నిర్వహణ ద్వారా TAL ఎప్పటికీ తెలుగు సమాజానికి కేంద్రబిందువుగా నిలిచిందని రవి సబ్బా పేర్కొన్నారు. కుటుంబాలు, స్నేహితులు కలుసుకునే అవకాశాలను సృష్టించడం TAL ముఖ్య లక్ష్యమని తెలిపారు.

    100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్
    టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కృషి చేసిన ట్రస్టీ సత్య పెద్ది రెడ్డి మరియు స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ సింధూర చెరుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని వాలంటీర్లకు ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రస్టీ బోర్డు సభ్యులు సత్య పెద్ది రెడ్డి, అశోక్ మధిశెట్టి, వెంకట్ నీలా, రవి మొచెర్ల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట గార్ల సహకారానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    క్రీడా కార్యక్రమాలతో పాటు, TAL “100 రోజులలో 1 మిలియన్ అడుగుల ఛాలెంజ్” పేరుతో ప్రత్యేక కమ్యూనిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనేవారు తమ ఆరోగ్యం , ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటూనే, తెలుగు సేవా సంస్థలు మరియు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నిధులు సమీకరించడానికి సహకరిస్తారు.

    ఈ కార్యక్రమాన్ని వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగే, సునీత అరిగే మరియు సింధూర చెరుకు సమన్వయం చేస్తూ, మరింత మంది సమాజ సభ్యులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.

  • బంగ్లాదేశ్ సీనియ‌ర్ క్రికెట‌ర్ ముష్ఫిక‌ర్ ర‌హీమ్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున‌ టెస్టుల్లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ మార్క్ అందుకోవ‌డం ద్వారా బంగ్లాదేశ్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితా లో ముష్ఫిక‌ర్ ర‌హీమ్ చోటు సంపాదించాడు. 39 ఏళ్ల ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచ‌రీ.

    త‌ద్వారా టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన బంగ్లా క్రికెట‌ర్‌గా ముష్ఫిక‌ర్ ర‌హీమ్ నిలిచాడు. 2005లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ముష్ఫిక‌ర్ ర‌హీమ్ బంగ్లాదేశ్ త‌ర‌పు 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి 6వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు డ‌బుల్ సెంచ‌రీలు, 14 సెంచ‌రీలు, 29 అర్థ‌సెంచ‌రీలు ఉండ‌డం విశేషం. 

    జింబాబ్వేతో టెస్టులో 219 ప‌రుగులు కెరీర్ బెస్ట్ స్కోరు సాధించిన ముష్ఫిక‌ర్ ర‌హీమ్ బంగ్లాదేశ్ త‌ర‌ఫున డ‌బుల్ సెంచ‌రీ సాధించిన తొలి క్రికెట‌ర్‌గా, అలాగే బంగ్లా త‌ర‌ఫున మూడు ద్విశ‌త‌కాలు బాదిన ఏకైక క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ త‌ర‌ఫున అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన జాబితాలో ముష్ఫిక‌ర్ ర‌హీమ్ త‌ర్వాత మోమినుల్ హ‌క్ (13 సెంచ‌రీలు), ప్ర‌స్తుత బీసీబీ తాత్కాలిక అధ్య‌క్షుడు, మాజీ క్రికెట‌ర్‌ త‌మీమ్ ఇక్బాల్ (10 సెంచ‌రీలు), న‌జ్ముల్ హొసేన్ షాంటో (9 సెంచ‌రీలు), లిట‌న్ దాస్ (6 సెంచ‌రీలు) ఉన్నారు. 

    బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ 437 ప‌రుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. అంత‌క‌ముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 390 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (137) సెంచ‌రీ చేయ‌గా.. ఓపెన‌ర్ మ‌హ్మ‌దుల్ హ‌స‌న్ జాయ్ (52), లిట‌న్ దాస్ (69) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. 

    పాక్ బౌల‌ర్ల‌లో ఖుర్ర‌మ్ షెహ‌జాద్ 4 వికెట్లు తీయ‌గా, సాజిద్ ఖాన్ 3, హ‌స‌న్ అలీ 2 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 278 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 232 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. త‌ద్వారా 56 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ క‌లుపుకొని ప్ర‌త్య‌ర్థి ముంగిట భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

    మూడో రోజుల ఆట ముగిసేసరికి పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు.  చేతిలో పది వికెట్లు ఉన్నప్పటికీ రెండు రోజులు ఆట మిగిలి ఉండ‌డంతో అద్భుతం జ‌రిగితే త‌ప్ప పాకిస్తాన్ ఓట‌మి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్ప‌టికే తొలి టెస్టును కోల్పో యిన పాక్ ఇప్పుడు రెండో టెస్టులోనూ ఓడిపోతే క్లీన్‌స్వీప్ అయిన‌ట్లే. 

    చదవండి: IPL: లిటన్‌ దాస్‌ సంచలన ఆరోపణలు

  • బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో తన ప్రయాణం గుర్తుంచుకోదగినది కాదన్నాడు. ఫ్రాంఛైజీ నుంచి తనకు ఎలాంటి మద్దతూ లభించలేదని ఆరోపించాడు.

    ఒక్క మ్యాచ్‌.. చేదు అనుభవం
    కాగా 2023 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రూ. 50 లక్షల కనీస ధరకు కేకేఆర్‌ లిటన్‌ దాస్‌ను కొనుగోలు చేసింది. చాన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితమైన అతడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.

    ఓపెనర్‌గా బరిలోకి దిగిన లిటన్‌ దాస్‌ (Liton Das).. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

    ఇక వికెట్‌ కీపర్‌గానూ లిటన్‌ దాస్‌ విఫలమయ్యాడు. రెండుసార్లు స్టంపింగ్‌ చేసే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమిపాలైంది.

    నాకెలాంటి మద్దతూ లభించలేదు
    ఆ తర్వాత లిటన్‌ దాస్‌కు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాల గురించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌​ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్‌కు నా అవసరం ఉందని అస్సలు అనుకోలేదు. ఆశించిన విధంగా జట్టు నుంచి నాకెలాంటి మద్దతూ లభించలేదు. ఒక మ్యాచ్‌లో ప్లేయర్‌ను ఆడిస్తున్నామంటే ముందుగానే సమాచారం ఇస్తారు.

    రాత్రి 11 గంటలకు మెసేజ్‌
    కానీ నా విషయంలో అలా జరుగలేదు. రెండు మ్యాచ్‌లలో నన్ను బెంచ్‌ మీదే కూర్చోబెట్టారు. అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకు నాకో మెసేజ్‌ వచ్చింది. ‘నువ్వు ఆడబోతున్నావు’ అని చెప్పారు. అప్పటికప్పుడు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాలేదు. 

    నా శాయశక్తులా బాగా ఆడేందుకు ప్రయత్నించా. అయితే, క్రికెట్‌లో ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరుగకపోవచ్చు. ఆరోజు నాది కాదంతే’’ అని లిటన్‌ దాస్‌ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కేకేఆర్‌ యాజమాన్యంపై ఆరోపణలు చేశాడు.

    కాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతా తదితరులు కేకేఆర్‌ సహ యజమానులు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

    హైడ్రామా
    అయితే, భారత్‌- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ తొలగించింది. దీంతో బంగ్లా బోర్డు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపలేదు. వేదిక మార్చాల్సిందిగా విజ్ఞప్తి చేయగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. 

    దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లా ప్రకటించింది. తద్వారా భారీ మూల్యమే చెల్లించింది. ఇక కొత్తగా వచ్చిన ప్రభుత్వం బీసీసీఐతో సంబంధాల పునరుద్ధణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా బంగ్లా ప్రపంచకప్‌ జట్టుకు లిటన్‌ దాస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

    చదవండి: ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ 

  • భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్‌ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.

    గతంలో అలా..
    కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్‌ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 2(​h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్‌ అథారిటీగా డిక్లేర్‌ చేశారు. బోర్డులో పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్‌ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.

    ప్రభుత్వ నియంత్రణలో లేదు
    గీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని  CIC తన తీర్పులో పేర్కొంది.

    ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదు
    బీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిపులు, ఐపీఎల్‌ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.

    అదే విధంగా.. క్రికెట్‌ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్‌ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది. 

    ప్రైవేటు సంస్థగా
    కాగా తమిళనాడు సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్‌ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.

    చదవండి: ఐపీఎల్‌ ఎక్కువైందా?.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • ఐపీఎల్‌-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

    బుమ్రాకు విశ్రాంతి
    ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు బౌలింగ్‌ విభాగంలో చోటు ఖాయం.

    ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ పేస్‌ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్‌ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.

    ఆకిబ్‌ నబీ ఎంపికపై చర్చ
    ఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్‌ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.

    పేస్‌ లేదు
    ‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్‌ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్‌ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.

    ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్‌ సర్కార్‌ అనే జర్నలిస్టు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

     ప్రిన్స్‌ యాదవ్‌కు అవకాశం!
    ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్‌ యాదవ్‌ పేరు తెరమీదకు వచ్చింది.

    హర్షిత్‌ రాణా ఇంకా ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్‌ తాజా సీజన్‌ ముగియనున్న సంగతి తెలిసిందే.

    భారత్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ సిరీస్‌ల షెడ్యూల్‌
    👉ఏకైక టెస్టు: జూన్‌ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్‌
    👉తొలి వన్డే: జూన్‌ 14, ధర్మశాల
    👉రెండో వన్డే: జూన్‌ 17, లక్నో
    👉మూడో వన్డే: జూన్‌ 20, చెన్నై.

    చదవండి: రిటైర్మెంట్‌పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నిన్న (మే 17) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీ (56) చేసిన అతడు.. ఈ ఐపీఎల్‌ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును (533) దాటాడు.

    తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎడిషన్లలో 500 ప్లస్‌ పరుగుల ఫీట్‌ను రెండు సార్లు నమోదు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలిసారి 2018 ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును తాకిన రాహుల్‌.. ఆతర్వాత వరుసగా 2019 (593), 2020 (670), 2021 (626), 2022 (616) ఎడిషన్లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.

    మధ్యలో 2023 ఎడిషన్‌లో గ్యాప్‌ ఇచ్చి తిరిగి 2024 (520), 2025 (539), 2026 (533) ఎడిషన్లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలాంటి ఫీట్‌ ఎవరూ నమోదు చేయలేదు. 19 ఎడిషన్ల చరిత్రలో రాహుల్‌ తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా రాహుల్‌ ఐపీఎల్‌లో ఎనిమిదో సారి 500 ప్లస్‌ మార్కును తాకి విరాట్‌ కోహ్లి (9) తర్వాతి స్థానంలో నిలిచాడు.

    ఇదే మ్యాచ్‌లో రాహుల్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో తన 50వ ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్‌ను నమోదు చేశాడు. తద్వారా విరాట్‌ కోహ్లి (76), డేవిడ్‌ వార్నర్‌ (66), శిఖర్‌ ధవన్‌ (53), రోహిత్‌ శర్మ (51) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ భీకర ఫామ్‌లో ఉన్న రాహుల్‌..  ఇప్పటికే ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ కోసం ప్రధాన పోటీదారుగా నిలిచాడు.

    మ్యాచ్‌ విషయానికి వస్తే.. రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాహుల్‌.. అభిషేక్‌ పోరెల్‌తో కలిసి తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఢిల్లీని గెలిపించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

     

     

     

     

International

  • అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ ల‌క్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) న‌గ‌దు బ‌హుమ‌తిని మొత్తం న‌లుగురు గెలుచుకున్నారు. 

    ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.

    లాట‌రీ గెలుచుకున్న భారతీయ‌లు వీరే
    కేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ న‌జీర్.. ఖ‌తార్‌లోని ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప‌నిచేస్తున్నాడు. అయితే  ఖతార్‌లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు అత‌డికి అదృష్టం వరించింది. 

    లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నాడు.

    గత ఐదేళ్లుగా బిగ్ టికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్‌లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది.

  • ఇస్లామాబాద్‌:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్‌తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.

    ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.

    సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్‌-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.

    ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.

    ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్‌పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది.

  • పాకిస్థాన్‌ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్‌ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్‌ భయపడుతుంది. భారత్‌లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్‌ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. 

    ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే, భారత్‌. ఇక ఇజ్రాయెల్‌ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్‌కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్‌ ప్రయత్నాలు జరిపింది.

    చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్‌ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్‌ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్‌ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.

    పాక్‌ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. 
    పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్‌ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. 

    ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్‌ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.

    ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్‌లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్‌ సైట్‌ న్యూస్‌’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.

    అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.

    ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్‌ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్‌కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్‌కు చైనా విక్రయించింది.

    ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.

    సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది.

  • టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.

    ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.

    యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్‌ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.

    చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.

    దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

    అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.

Andhra Pradesh

  • నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో జనసేన నేత కీచక పర్వం బయటపడింది. జనసేన నేత వెంకటరాజు.. బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆ బాలిక తప్పించుకుని గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. 

    అయితే ఆ మైనర్‌ బాలికను స్థానికులు రక్షించారు. దీనిపై పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై జేసీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు.

  • తాడేపల్లి: అమరావతి కోసం భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప‍్రశ్నించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కోసం ఏం చేశారు? అమరావతిలో అద్దాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు మీరు ఏం చేశారు? 

    కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టం తెలుసా? రైతులకు ఇచ్చిన ప‍్లాట్లలో పనులు జరుగుతున్నాయా? రైతుల కోసం నేను మాట్లాడితే యూట్యూబ్‌ నుంచి తొలగిస్తారా? చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా చమటలు పట్టిస్తోంది. అమరావతిలో మట్టి వ్యాపారం తప్ప మరేమీ జరగటం లేదు. నిత్యం వెయ్యి టిప్పర్లలో మట్టి తరలిపోతోంది. మట్టి మీదనే టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. 

    కానీ భూములు ఇచ్చిన రైతులు మాత్రం రోడ్డున పడ్డారు. ఆ రైతుల సమస్యలపై మాట్లాడితే నేరం అంట. అదే ఎల్లోమీడియా చర్చలు పెట్టినా, మంత్రి నారాయణ మాట్లాడితే బాగుంటుందంట. రైతుల సమస్యలు ఉన్నాయనే కదా త్రీమెన్ కమిటీ వేసింది? మాకు సమాధానం చెప్పలేక మాపై కేసులు నమోదు చేస్తున్నారు. 

    రాజధానిపై నేను మాట్లాడిన ప్రతి వీడియోనూ తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ ‌లకు లేఖలు రాశారు. సచివాలయం పునాదుల దశలోనే ఉంది. కానీ, అప్పుడే అద్దాలకు టెండర్లు పిలిచారు . ఈ రెండేళ్లలో సగమైనా కట్టిన బిల్డింగ్ ఒక్కటైనా ఉందా? రైతులను విపరీతంగా వాడుకుని ఊరూరా తిప్పారు. భూములు ఇచ్చిన రైతులు మంత్రి నారాయణ చుట్టూ రైతులు తిరగటమే సరిపోయింది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తిప్పుకుంటున్నారు. 

    ఇక కేంద్ర మంత్రి పెమ్మసానికైతే అసలు రైతుల కష్టాలే తెలియదు. ఎన్ఆర్ఐ మహిళ ఒకరు శ్రీకాళహస్తి ఆలయంలోని అవినీతి గురించి ప్రశ్నిస్తూ వీడియో పెడితే దాన్ని తొలగించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే ప్రతి వీడియోను తొలగిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను ఎందుకు ఇవ్వలేదు? బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల లేఅవుట్లకు అమరావతిలోని మట్టిని తరలిస్తున్నారు.

    రోజూ వెయ్యి టిప్పర్ల మట్టి బయటకు వెళ్తుంది. చంద్రబాబు మౌఖిక ఆదేశాలతో మట్టి వ్యాపారం జరుగుతోంది. దీని గురించి ప్రశ్నిస్తే  తప్పా? భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేశారు. అమరావతిలో ఎయిర్ పోర్ట్ కడితే మరి గన్నవరం ఎయిర్ పోర్ట్ సంగతేంటి? అశ్వనీ దత్, బ్రాహ్మణి, బలుసు శ్రీనివాసరావు, తదితరులకు ప్రైమ్ లొకేషన్ లో భూములు ఇచ్చారు. 

    భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. సీఆర్‌డీఏ ఆఫీసుకు అద్దాల ఖర్చే భారీగా ఉంది. హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో పెడుతున్నారా? ప్రజా సొమ్మును ఎందుకిలా వృధా చేస్తున్నారు? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది మట్టి వ్యాపారమే. 29 గ్రామాల రైతులు నరకం చూస్తున్నారు.

    పవన్ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం కూలిపోతుందని అర్థం అయింది. అందుకే కొత్త గెటప్ లోకి వెళ్తున్నారు. అందుకే జై అమరావతి కాకుండా జై ఆంధ్రా అనమంటున్నారు. జై అమరావతి అంటే ఆ 29 గ్రామాలకే పరిమితం అవుతామన్న భయంతో పవన్ ఉన్నారు. జనసేన కార్యకర్తలను టీడీపీ వారు కొడుతుంటే మాత్రం పవన్ కు కనపడటం లేదు’’ అని అన్నారు.

    15వ తేదీ, 25వ తేదీ పెమ్మసాని & నారాయణ అవినీతి చిట్టా ఇదే..
  • తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకులతో  పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాష్ట్రంలో ఎస్‌ఐఆర్(SIR) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పరిశీలకులతో సజ్జల సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఎల్ఏ(బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌లు) లు ఎలా వ్యవహరించాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారు.  

    దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ ప్రారంభమవుతోంది. ఈ సర్ ప్రక్రియ అత్యంత కీలకం. బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓల మధ్య సమన్వయం ఉండాలి.. బీఎల్ఏలకు వెంటనే శిక్షణ తరగతులు ఇవ్వాలి. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు. 

    ఎన్యూమరేషన్ పత్రాలకు ముందే బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలి. ఓటర్లను కూడా చైతన్యపరచాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే ఓటు ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ వరకు అన్ని టీమ్‌లు, సీనియర్ నేతలు, ఇన్‌ఛార్జ్‌లు నిరంతర పర్యవేక్షణ చేయాలి. సమర్థంగా పనిచేసే బూత్ ఏజెంట్లకు రాబోయే రోజుల్లో పార్టీ గుర్తింపు ఉంటుంది..

    SIRపై BLOకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం
  • కర్నూలు: తాను ఎమ్మెల్యే కావాలనే కోరిక త‌న‌కంటే మంత్రి టీజీ భరత్‌కే ఎక్కువగా ఉన్నట్టు క‌న‌బ‌డుతోంద‌ని వైఎస్సార్‌సీపీ యువ‌జ‌న రాష్ట్ర‌ విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయ‌కుల వేధింపుల‌ బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ తాము ధర్నాలు చేస్తే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ టీజీ కుటుంబంపై మండిప‌డ్డారు. టీజీ వెంకటేశ్ అంటే గౌరవం ఉండేదని.. కానీ తనపై చేసిన వ్యాఖ్యలు చూశాక, ఆయ‌న‌పై గౌరవం పోయింద‌న్నారు. త‌న తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నేత‌లు తిట్టినా స్పందించ‌ని ఎంపీ  బైరెడ్డి శ‌బ‌రి.. మంత్రి భరత్ గురించి తాను మాట్లాడితే పరుగెత్తుకుంటూ వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టడం విడ్డూరంగా ఉంద‌ని సిద్ధార్థ‌రెడ్డి అన్నారు.

    ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలంటూ త‌న‌పై మంత్రి భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు సిద్ధార్థ‌రెడ్డి. టీజీ భరత్ 48 సంవత్సరాల వ‌య‌సులో మంత్రి అయ్యార‌ని,  43 ఏళ్ల వ‌య‌సులో ఎమ్మెల్యేగా పోటీ చేశార‌ని.. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు ఇప్పుడు 50 ఏళ్లు అని చెప్పారు. 'నీ వయసుకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అప్పుడు అడగండి' అంటూ భ‌ర‌త్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 

    ''కర్నూలు మూడో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా, అక్ర‌మ కేసుల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 14న‌ మేము ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించాం. టీడీపీ నాయ‌కుల‌ వేధింపుల కార‌ణంగా క‌ర్నూలు ప‌ట్ట‌ణంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న స‌తీశ్ అనే కుర్రాడి కుటుంబానికి న్యాయం చేయాల‌న్న డిమాండ్‌తో ఆ రోజు  ధ‌ర్నా చేశాం. బాలు మ‌రో కుర్రాడిపై పోలీసులు వేధింపులు ఆగాల‌న్న ఉద్దేశంతోనూ ధ‌ర్నా చేప‌ట్టాం. మూడో ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కార్యాయ‌లం ద‌గ్గ‌ర ధ‌ర్నాకు దిగాం. ప్ర‌భుత్వాన్ని, మంత్రి టీజీ భ‌ర‌త్‌కు ప్ర‌శ్నించామ‌ని గ‌డ‌చిన 3 రోజులుగా టీడీపీ నేత‌ల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీజీ వెంక‌టేశ్ త‌దిత‌రులు మా గురించి ర‌క‌ర‌కాలు మాట్లాడారు. వారి మాట‌ల‌కు స‌మాధానం చెప్పాల‌నే మీడియా ముందుకు వ‌చ్చాను. 

    స‌తీశ్ కుటుంబానికి మంత్రి టీజీ భ‌ర‌త్ న్యాయం చేసివుంటే క‌ర్నూలు టౌన్‌లో ఆయ‌న స్థాయి వంద‌శాతం పెరిగేది. ఆయ‌న ఆ ప‌ని చేయ‌కుండా సిద్ధార్థ‌రెడ్డిని తిట్టిన‌వాళ్ల‌కు ప‌దివేల రూపాయ‌లు, సిద్ధార్థ‌రెడ్డిపైనా సెల్ఫీ వీడియో చేసిన వాళ్ల‌కు ఇర‌వై వేల రూపాయ‌లు, ప్రెస్‌మీట్ పెడితే కార్పొరేట‌ర్ సీటు, సిద్ధార్థ‌రెడ్డి ఇంటి మీద‌కు పోతే స్టోర్ బియ్యం వంటివి చేయ‌డంతో క‌ర్నూలు టౌన్‌లో టీజీ భ‌ర‌త్ స్థాయి 500 శాతం ప‌డిపోయింది. స‌తీశ్ కుటుంబానికి న్యాయం చేయ‌మ‌ని నేను అడిగితే ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి.. సిద్ధార్థ నువ్వు టికెట్ తెచ్చుకో. మూడు ఎల‌క్ష‌న్లు చేసినా ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వ‌లేద‌ని మాట్లాడారు. భ‌ర‌త్ వ‌య‌సు ఇప్ప‌డు 50 సంవ‌త్స‌రాలు. 48 ఏళ్ల వ‌య‌సులో ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏళ్ల వ‌య‌సులో మొట్ట‌మొద‌టిసారిగా ఎమ్మెల్యేగా నిలబ‌డ్డారు. నా వ‌య‌సు 33 సంవ‌త్స‌రాలు. మీ వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌డు నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడ‌గండి. నేను ఎమ్మెల్యే కావాల‌నే కోరిక నా క‌న్నా మీకు ఎక్కువ ఉండ‌డ‌మేంటి? 

    33 సంవ‌త్స‌రాల‌కు నేను శాప్ చైర్మ‌న్‌ను అయ్యాను. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిని అయ్యాను. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జిని అయ్యాను. నా వెంట తిరిగిన ఎంతో మందిని ఎంటీసీ, జెడ్పిటీసీ, స‌ర్పంచ్‌, మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్లుగా గెలిపించుకున్నాను. రాష్ట్రంలో ఎన్నో నియోజ‌క‌వర్గాల్లో పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశాను. ఎన్నో ప్రెస్‌మీట్లు, ర్యాలీలు, ధ‌ర్నాలు చేశాను. 33 ఏళ్ల‌కే ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అదే 33 సంవ‌త్స‌రాల‌కు మీరు ఉయ్యాల ఊగుతున్నారా? స‌తీశ్ కుటుంబానికి న్యాయం చేయ‌మ‌ని మేము అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నార‌''ని సిద్ధార్థరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.    

    ఏంటి ఈ చిల్లర వేషాలు.. భరత్ గారు మీ వయసెంత? సిద్దార్థ్ సీరియస్

     

National

  • గువాహటి: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సుమారు 2 కిలోమీటర్లు నడిచారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరు అధికారులతో కలిసి క్యాబ్‌లో వెళ్లారు.

    ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు పద్ధతులు అమలు చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై నిబద్ధత చూపిస్తూ తమాంగ్ ఇలా చేశారు. అధికారిక నివాసమైన మింటోక్‌గ్యాంగ్ నుంచి మనన్ కేంద్రా వరకు సుమారు 14 నిమిషాలు నడిచి కార్యక్రమానికి హాజరయ్యారు.

    అంతేకాదు మే 15న అదే వేదికలో జరిగిన మరో కార్యక్రమానికీ వెళ్లేటప్పుడు, తిరిగి వస్తున్నప్పుడూ నడిచారు. “ఇది కేవలం మొక్కుబడిగా చేసింది కాదు. నాయకత్వం వ్యక్తిగత క్రమశిక్షణ, చర్యలతో ప్రారంభం కావాలని సిక్కిం ప్రజలకు బలమైన సందేశం ఇచ్చింది” అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

    దేశం ఆర్థిక ప్రాధాన్యాలు, వనరుల సంరక్షణపై సమష్టిగా స్పందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం.. వ్యయాన్ని తగ్గించే చర్యలను ప్రభుత్వం కేవలం విధానాలకే పరిమితం చేయకుండా ఆచరణలోనూ అమలు చేస్తున్నట్లు తెలియజేస్తోందని సీఎంవో చెప్పింది.

    ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన వినియోగ నియంత్రణపై సిక్కిం ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇవి శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలకు వర్తిస్తాయి.

    ఈ చర్యల్లో ముఖ్యమైనది ముఖ్యమంత్రి వాహన బృందాన్ని 50 శాతం తగ్గించడం. అదనంగా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఆడ్-ఈవెన్ విధానం అమలు చేయనున్నారు. ట్యాక్సీలు, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

    మే 14 నోటిఫికేషన్‌లో ఉద్యోగులు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని, అవసరంలేని వాహన వినియోగం తగ్గించాలని, వర్చువల్ సమావేశాలు, డిజిటల్ సమన్వయంపై ఎక్కువగా ఆధారపడాలని ప్రభుత్వం సూచించింది. బాధ్యత, సమర్థత, క్రమశిక్షణతో కూడిన పాలనా సంస్కృతిని పెంపొందించడమే ఈ చర్యల లక్ష్యమని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 
     

  • బస్తర్‌: భారతదేశం ఇప్పుడు నక్సల్‌ రహిత(నక్సల్స్‌ లేని) దేశమని గర్వంగా చెబుతున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్‌ స్పష్టం చేశారు. నక్సలిజాన్ని నిర్మూలించడానికి నిర్దేశించిన మార్చి 31 గడువు తర్వాత చత్తీస్‌గడ్‌లోని బస్తర్‌లో అమిత్‌ షా తొలిసారి పర్యటించారు. దీనిలో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశంగా నేను గర్వంగా ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

    ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతాలతో సమాన స్థాయికి తీసుకురావడానికి, రాబోయే కాలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

    బస్తర్ జిల్లాలోని జద్గల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొన్న వివిధ భద్రతా దళాల సిబ్బందిని, అలాగే మావోయిస్టు దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులను, పౌరులను ఉద్దేశించి షా ప్రసంగించారు. @ ఇది బస్తర్‌కు చాలా పెద్ద రోజు. ఈ రోజు ఇక్కడ నిలబడి, భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని నేను గర్వంగా తల ఎత్తుకొని చెప్పగలను’ అని తెలిపారు.

    ‘ఈ విజయంలో మొత్తం క్రెడిట్‌ అంతా మన భద్రతా దళాలకు చెందుతుంది. నేను మీ ముందర తల వంచుతున్నాను. ఇది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి వేలాది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు’ అని ఉద్వేగ భరితంగా మాట్లాడారు.

  • లక్నో: స్కూటర్‌పై పద్మాసనం వేశాడు ఓ వ్యక్తి. హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై రైడింగ్ కాదు.. రిలాక్సింగ్ ఎక్సర్‌సైజ్‌ చేశాడు. స్కూటర్‌పై సన్యాసి పోజ్‌లో అతడు జనాలకు టెన్షన్ డోస్ పెంచేశాడు. అతడికి హెల్మెట్ లేదు.. భయం లేదు.. కామన్ సెన్స్ లేదు..

    లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫన్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై స్కూటర్ నడుస్తుండగానే ఆ వ్యక్తి బండిపై కాళ్లు మడిచి కూర్చున్నాడు. 

    అలాగే హ్యాండిల్‌పై నుంచి రెండు చేతులూ తీసేసి, చుట్టూ వాహనాలు వెళ్తుండగానే ప్రయాణం కొనసాగించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినట్టు కనిపించింది. దీంతో స్కూటర్ ఒకే వేగంతో ముందుకు సాగింది. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించలేదని సమాచారం.

    ట్రాఫిక్ మధ్య అతడు ఈ విన్యాసం చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతకూ ప్రమాదం తెచ్చాడని మండిపడ్డారు. చాలామంది నెటిజన్లు లక్నో పోలీస్, యూపీ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా, నిర్లక్ష్య డ్రైవింగ్, విన్యాసాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర తీరుకు ఎందుకు ఫుల్‌స్టాప్‌ పడడం లేదని చాలామంది ప్రశ్నించారు.

    “నంబర్ లేని స్కూటర్, భద్రతా పరికరాలు లేవు, అసలు బాధ్యత అన్నదే లేదు. సోషల్‌ మీడియాలో గుర్తింపు కోసం తన ప్రాణాలనే కాదు, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. లక్నో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కఠిన గుణపాఠం చెప్పాలి” అని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

    మరో వ్యక్తి స్పందిస్తూ.. “ఇది చక్రాలపై యోగా లాంటిదే.. కానీ, రోడ్డు జాగ్రత్త మాత్రం లేదు. ఒక్క గుంతనో, ఒక్కసారిగా బ్రేక్ వేయడమో, లేదా ఇతర వాహనం ఎదురైతే అంతే సంగతి. అతడికే కాదు, ఇతరులకూ ప్రమాదం. ఇలాంటి విన్యాసాలు చూసి ఇంకొందరు నేర్చుకోకుండా ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

  • ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్ ఛార్జీలు పెంచినప్పటికీ ఇంధన కంపెనీలు రోజూ వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ పేర్కొన్నారు. ధరల పెంపుకు ముందు ఆ నష్టం రోజుకు సూమారు రూ. 1,600 కోట్ల వరకు ఉండేదని తెలిపారు.

    హర్ముజ్‌ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమరు విషయమై తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో క్రూడాయిల్‌ బ్యారెళ్ ధర పెరగడంతో కేంద్రప్రభుత్వం సైతం పెట్రో, డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా దీనిపై పెట్రోలియం శాఖ జాయింట్‌ సెక్రటరీ సుజాత శర్మ మీడియా సమావేశం నిర్వహించారు.

    సుజాత శర్మ మాట్లాడుతూ.. ఇటీవల పెంచిన ఇంధన ధరలు చమురు కంపెనీల నష్టాలను కొంతవరకు తగ్గించగలిగాయి కానీ పూర్తి స్థాయిలో కాదు.  లీటరుకు దాదాపు రూ.3 పెంచిన తర్వాత ఇప్పుడు రోజుకు రూ. 750 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. కంపెనీల అండర్- రికవరీలు (ఆదాయ లోటు) ,ఆర్థిక నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి... అయినప్పటికీ ఈ దశలో చమురు కంపెనీలకు ఎటువంటి బెయిలవుట్ ప్యాకేజీని (ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని) అందించే విషయం పరిశీలించడం లేదు అని ఆమె అన్నారు.

    అమెరికా- ఇరాన్ యుద్ధం ప్రారంభం కాక ముందు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) నివేదిక ప్రకారం భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర బ్యారెల్‌కు 69.01 డాలర్లుగా ఉండగా... మే 15 నాటికి ఈ ధర బ్యారెల్‌కు 110.73 డాలర్లకు చేరుకుందన్నారు. అంటే యుద్ధ కాలంలో ఏకంగా 60.45 శాతం పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగి ఆయిల్‌ కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తెలిపారు.  

  • కోల్‌కతా : బెంగాల్ సీఎం సువేందు అధికారి అల్లరిమూకలపై రెచ్చిపోయారు.ప్రభుత్వ  ఆస్తుల ధ్వంసం, పోలీసు సిబ్బందిపై దాడుల పట్ల జీరో టాలరెన్స్ ప్రకటించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే "నాకంటే చెడ్డవాడు ఎవడూ ఉండరు" అంటూ  అల్లరిమూకలకు మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. 

    ఆదివారం కోల్‌కతాలోని పార్క్ సర్కస్-తిల్జాలా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై జరిగిన బుల్డోజర్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఆర్‌పీఎఫ్  జవాన్లు గాయపడ్డారు. ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశామని విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.

    కాగా ఈ ఘటనపై సీఎం సువేందు అధికారి స్పందించారు. "ఇలాంటి అ శాంతి, గూండాయిజం, దేశ వ్యతిరేక మరియు సామాజిక వ్యతిరేక కార్యకలాపాల పట్ల జీరో టాలరెన్స్ ఉంటుందని నేను స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఇలాంటి వాటిని మేము కొనసాగనివ్వం. నేను గాయపడిన పోలీసు సిబ్బందిని, సీఆర్‌పీఎఫ్ జవాన్లను చూడటానికి, వారి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నిన్న మన దళం మొత్తం శాంతిభద్రతలను కాపాడింది, పెద్ద ప్రమాదాన్ని నివారించి ప్రజలను రక్షించింది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను." అని అన్నారు.

    సువేందు మాస్ వార్నింగ్

    మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని రౌడీయిజం చేస్తే అస్సలు సహించేది లేదని తనకంటే చెడ్డవారు ఎవరూ లేరని హెచ్చరించారు. గతంలో మాదిరిగా పోలీసుల కాళ్లు, చేతులు కట్టవేసి పని చేయించే రోజులు లేవన్నారు. గతంలో పోలీసు బలగాలు పరిమితుల మధ్య పనిచేశాయని  పాత  నిబంధనలే ఇంకా కొనసాగుతాయని అనుకోవద్దు. " అని అన్నారు.

    కశ్మీర్‌తో పోలిక

    బెంగాల్ హింసపూర్వక ఘటనలను సువేందు కశ్మీర్‌ నిరసనలతో పోల్చారు. శ్రీనగర్, కాశ్మీర్‌లో పోలీసులపై రాళ్లు రువ్వడం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో కూడా ఇది ఆగుతుందని నేను నమ్ముతున్నాను.  అని సువేందు స్పష్టం చేశారు.
     

  • చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ ‘అమ్మ క్యాంటీన్లు’పై తన దృష్టి సారించారు.  తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను(ఉనవగామ్‌లు) ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఎం విజయ్‌ అమ్మ క్యాంటీన్లను పునరుద్దరించడంతో పాటు ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. 

    అమ్మ క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి, మెరుగుపరచాలని, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని విజయ్ అధికారులకు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అమ్మ క్యాంటీన్లలో అందించే ఆహారం నాణ్యత, రుచి సంతృప్తికరంగా లేవన్న అభిప్రాయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

    2011-16 ఏఐఏడీఎంకే ప్రభుత్వ హయాంలో  అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలచే ఆప్యాయంగా "అమ్మ" అని పిలుచుకునే అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత పుట్టినరోజున, 2013 ఫిబ్రవరి 24న ఈ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. మొదట ఇవి చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, వీటిని వివిధ పట్టణాలు, నగరాలకు విస్తరించారు. రాష్ట్రంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 383 అమ్మ క్యాంటీన్లు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణలో 237 అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్‌లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన గుర్తింపుల ఆధారంగా సంక్షేమ పథకాలు ఉండకూడదని సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుండి మతపరమైన వర్గీకరణ ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

    ఇప్పటివరకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖల ద్వారా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అవి వచ్చేలా మొదటి తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.

    2012లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇమామ్‌లకు నెలకు రూ. 2,500 గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తర్వాత ముయజ్జిన్‌లకు కూడా ఆర్థిక సహాయం అందించారు. 2020లో హిందూ పూజారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే పథకం ప్రారంభమైంది. మొదట రూ.1,000గా నిర్ణయించిన ఈ వేతనం 2026 ఎన్నికల ముందు రూ.2,000కి పెంచారు.

    అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపులపై ఆధారపడకూడదని స్పష్టం చేసింది. అందుకే ఈ పథకాలను నిలిపివేస్తూ, కోటా అర్హతను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.

    మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఒక నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

  • మహారాష్ట్ర: ఆ మిత్రుల బృందం స్నేహితుడి పెళ్లి వేడుకలో సరదాగా గడుపుదామని బయిలుదేరింది. అనుకున్న విధంగానే ఆడుతూపాడుతూ సాగుతున్న వారి ప్రయాణాన్ని ఒక్కసారిగా మృత్యువు కబలించింది. ముంబై- అహ్మదాబాద్‌ రహదారిపై జరిగిన ఘెర రోడ్డుప్రమాదంలో పెళ్లి వేడుకకు వెళుతున్న ఐషర్ ట్రక్కు- భారీ కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగా అవకాశం ఉంది.

    మహారాష్ట్రలోని దహను తాలూకాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధనివారి సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐషర్ వాహనాన్ని భారీ ట్రక్క ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ట్రక్కులో ఉన్న 30 నుంచి 35 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

    అయితే మరికొద్ది సేపట్లో వేడుకకు చేరుకునే వారిమని అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.  ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
     

  • తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు.  రూ. 11 లక్షల నగదు,  రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను  కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన  17 నెలలకే   తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల  కొత్త కోడలు  బలైపోయింది. దీంతో  అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్‌పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

    ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్‌పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని  దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా  నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    పడిపోయిందా? తోసేశారా? 
    ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి  బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా  మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.

    అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి  రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్‌ విశేష్ నాగర్‌ ఆరోపించారు

    మామ, భర్త అరెస్ట్
    సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్,  మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

     

  • బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. రెండు ఏనుగులు ఘర్షణపడుతున్న సమయంలో ఒక మహిళా టూరిస్టు వాటిని చూస్తూ అక్కడే ఉంది. ఈ ప్రమాద ఘటనలో ఒక ఏనుగు ఆ మహిళపై పడిపోయింది. దీంతో  ఆ మహిళ ఊపిరి ఆడక ప్రాణాలు వదిలింది.  కొడుగు జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ రోజు సోమవారం ఈ ఘటన జరిగింది.

    చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే అనే పర్యాటకురాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో  ఏనుగులకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా తిలకిస్తోంది. అయితే ఆ సమయంలో కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. కొంత సేపట్లోనే ఆ ఘర్షణ తీవ్రతరమైంది. దీంతో మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలోనే మార్తాండా అనే ఏనుగు జ్యూనేష్ దుబారేపై పడిపోయింది. వెంటనే జ్యునేష్ నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ  మరింతగా తొక్కివేసింది. దీంతో ఆ పర్యాటకురాలు అక్కడికక్కడే మృతిచెందింది. 
     

    అయితే ఈ మృతి పట్ల కర్ణాటక అడవీ శాఖ అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టమన్నారు. పర్యాటకులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోల కోసం దగ్గరగా నిలబడటం, ఏనుగులను కడగడం లేదా వాటికి ఆహారం పెట్టడం చేయకూడదన్నారు.

    కాగా ఇటీవల ఏనుగుల దాడులలో ప్రజలు మృతిచెందడం తీవ్ర కలవరం రేపుతోంది. గత నెలలో, ఛత్తీస్‌గఢ్‌లోని గౌరేలా-పెండ్రా-మార్వాహి జిల్లాలో ఒక అడవి ఏనుగు తొక్కడంతో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక ఏనుగు తొక్కడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది.ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.

  • ప్రముఖ యాసిడ్ దాడి బాధితురాలు, సామాజిక కార్యకర్త లక్ష్మీ అగర్వాల్ మళ్లీ వార్తల్లోనిలిచారు.  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ ఫోటో నిజమైనది కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటో అని నెటిజన్లు భావిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్రబిందువుగా నిలిచారు.

    లక్ష్మీ అగర్వాల్   షేర్‌ చేసిన ఫోటోలో ఆమె  ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని, ఏదో ఒక అధికారిక పత్రంపై సంతకం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఢిల్లీ సర్కార్’ (Delhi Sarkar) బోర్డు, భారత జాతీయ చిహ్నం, రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె  ముందున్న  టేబుల్‌పై "లక్ష్మీ అగర్వాల్" అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్ ఉంది. ఈ ఫోటోకు హిందీలో ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించారు: "ఒకప్పుడు ఏ గొంతునైతే నొక్కేయాలని చూశారో.. ఇప్పుడు అదే గొంతు మార్పును లిఖిస్తుంది. నన్ను బలహీనురాలిగా భావించిన వారు ఇకపై నా పేరు గుర్తుపెట్టుకోవాలి- లక్ష్మీ అగర్వాల్."   ఈ పోటోతోపాటు,  ఆ క్యాప్షన్‌  నెటిజన్లలో గందరగోళం నెలకొంది.

    ఇదీ చదవండి: విజయ్‌ సర్కార్‌ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్‌ నేత జోస్యం


    ఈ ఫోటో చూసి చాలా మంది లక్ష్మీ అగర్వాల్‌కు ఏదో ప్రభుత్వ పదవి లేదా అధికారిక నియామకం లభించిందని భావించి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. మరికొందరు ఆమె ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ఆ క్షణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మరి కొందరు నెటిజన్లు ఇది పూర్తిగా AI ఫోటోని గుర్తించారు.  దీనికి భిన్నంగా కొందరు లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఆమె ఆ పోస్ట్‌లో తనకు ఫలానా ప్రభుత్వ పదవి వచ్చిందని ఎక్కడా క్లెయిమ్ చేయలేదని, కేవలం ఒక ప్రతీకాత్మకమైన (Symbolic) సృజనాత్మకత కోసం మాత్రమే ఆ ఫోటోను వాడారని, నేమ్‌ప్లేట్‌పై కూడా ఎలాంటి హోదా రాయలేదని వారు వాదించారు. 

    ఇదీ చదవండి: నలుగుర్ని కనండి : డా.శివరంజని తీవ్ర ఆందోళన వీడియో వైరల్‌

    ఒక సెలబ్రిటీ అయి ఉండి, ఇలాంటి నకిలీ ఫోటోలను వాస్తవం లాగా ఎందుకు షేర్ చేస్తున్నారని, కనీసం ఇది AI ఫోటో అని డిస్క్లైమర్ (Disclamer) ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది  చట్టపరమైన వివాదం, ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగం అనే వ్యాఖ్యలు కూడా  కనిపించాయి.  భారతదేశ జాతీయ చిహ్నం, జాతీయ జెండాలు, మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయం లాంటి సెటప్‌ను AI ద్వారా సృష్టించి చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కొందరు వాదించారు. ఇది 'ది స్టేట్ ఎంబెల్మ్ ఆఫ్ ఇండియా (ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్, 2005' కింద చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని  పలువురు న్యాయవాదులతో సహా పలువురు వినియోగదారులు హెచ్చరించారు.

    లక్ష్మీ అగర్వాల్‌కు ప్రభుత్వ పదవి వచ్చినట్టుగా లాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. విమర్శలు ఎన్ని వస్తున్నప్పటికీ, లక్ష్మికి అభిమానుల నుండి మద్దతు మాత్రం లభిస్తూనే  ఉండటం గమనార్హం.

    ఎవరీ లక్ష్మీ అగర్వాల్
    ఈమె  భారతీయ యాసిడ్ దాడి బాధితురాలు, మహిళా హక్కుల కార్యకర్త , టీవీ హోస్ట్. యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరియు చట్టపరమైన సంస్కరణలు భారతదేశంలో ఆమెకు ఎంతో గుర్తింపునిచ్చాయి.  2005లో, ఆమెకు 15 ఏళ్ల వయసులో, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఒక వ్యక్తి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. కోలుకున్నతరువాత బాధితుల కోసం ఒక ప్రముఖ గళంగా మారి, 'స్టాప్ యాసిడ్ ఎటాక్స్' ప్రచారంలో చేరారు. సుప్రీంకోర్టులో ఆమె వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, భారతదేశంలో యాసిడ్ అమ్మకాలపై కఠినమైన నిబంధనలు రావడానికి దారితీసింది.  యాసిడ్ దాడుల బాధితులకు పునరావాసం, మద్దతు అందించే ఛన్వ్ ఫౌండేషన్ (Chhanv Foundation) కు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.ఆమె చేసిన సామాజిక సేవలకు గాను 2014లో అమెరికా ప్రభుత్వ ‘ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్’ అవార్డును అందుకున్నారు. ఆమె జీవిత  కథ ఆధారంగా  బాలీవుడ్‌లో దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో ‘ఛపాక్’ (Chhapaak) అనే చిత్రం కూడా రూపొందింది.
     

    ఇదీ చదవండి: మాజీ మిస్ పూణే అనుమానాస్పద మృతి : దిగ్భ్రాంతి పర్చే లాస్ట్‌ మెసేజెస్‌


     

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌ లిఖింపూర్‌లో  ఈ రోజు( సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిసైయా-లఖింపూర్ జాతీయ రహదారిపై  వ్యాన్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.  దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

    లిఖింపూర్‌ నుండి వ్యాన్‌  సిసైయా వైపు వ్యాన్ వెళ్తుండగా ఉంచ్‌గావ్‌, భరేహతా గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో తొమ్మిదిమంది అక్కడికక్కడే ‍ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కాగా మరణించిన వారిలో ఏడుగురిని ఇదివరకే గుర్తించామని మరో ముగ్గురిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.

    కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం, గుండెల్ని పిండేసే ఘటన. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.  మరణించిన వారి ఆత్మలకు ఆ శ్రీరాముడు తన దివ్య చరణాల చెంత స్థానం కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఆ  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సైతం ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. 

  • న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో సంచలనం రేకెత్తించేలా భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఒక కీలక తీర్పును వెలువరించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) అంటే ‘ఉపా’ (UAPA) చట్టం కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ పొందడం ఒక నియమం’ అని, విచారణ లేకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ముఖ్యంగా ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఉమర్‌ ఖాలిద్‌కు బెయిల్‌ దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. గతంలో ‘కేఏ నజీబ్’ కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది బెంచ్‌లు పట్టించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

    ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పులను న్యాయవ్యవస్థలో కీలక మార్గదర్శకాలుగా భావిస్తారు. అలాంటి తీర్పులు చట్టపరమైన స్పష్టతను తీసుకురావడమే కాదు, దిగువ బెంచ్‌లకు దిశానిర్దేశం చేస్తాయి. ఇద్దరు జడ్జిల బెంచ్‌ ఏదైనా అంశాన్ని విచారించే సమయంలో పెద్ద బెంచ్‌ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం న్యాయసూత్రాల్లో భాగం. పెద్ద ధర్మాసనం అభిప్రాయాన్ని పక్కన పెట్టి భిన్నంగా వ్యవహరించొద్దు. చిన్న బెంచ్‌లు పెద్ద ధర్మాసనం నిర్దేశించిన సూత్రాలను అనుసరించడం న్యాయపరమైన బాధ్యతగా భావిస్తారు. ఈ విషయాన్నే సుప్రీంకోర్టు కాస్త ఘాటుగా చెప్పింది.

    విస్తృత ధర్మాసనం తీర్పులను ధిక్కరిస్తారా?
    జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024లో వెలువడిన ‘గుర్విందర్ సింగ్’, ఉమర్ ఖాలిద్ కు సంబంధించిన ‘గుల్ఫిషా ఫాతిమా’ కేసుల్లో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021లో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘కేఏ నజీబ్’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందేనని, చిన్న బెంచ్‌లు వాటిని తక్కువ చేయడం న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఘాటుగా మందలించింది.

    ‘ఉపా’ కేసుల్లోనూ బెయిల్ ప్రాథమిక హక్కే
    ఉపా చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, ‘బెయిల్ ఇవ్వడమే నియమం.. జైలులో ఉంచడం మినహాయింపు’ అనే సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ 43D(5) కూడా అడ్డుకోలేదని పేర్కొంది. కేవలం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే సాకుతో, నిందితులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలులో ఉంచడం అనేది వారికి శిక్ష విధించినట్లే అవుతుందని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎంత తీవ్రమైనవో, విచారణ కూడా అంతే వేగంగా జరగాలని సూచించింది.

    ఆరేళ్ల జైలు జీవితం: సయ్యద్ ఇఫ్తిఖర్ కు విముక్తి
    మాదకద్రవ్యాల సరఫరా ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద అరెస్టై, ఆరేళ్లుగా జైలులో ఉన్న జమ్ముకశ్మీర్‌కు చెందిన సయ్యద్ ఇఫ్తిఖర్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టులు, హైకోర్టు ఇతనికి బెయిల్ నిరాకరించగా, సుప్రీంకోర్టు మాత్రం అతని సుదీర్ఘ జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఉపా కేసుల్లో నేరం రుజువయ్యే శాతం చాలా తక్కువగా ఉందని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా  గుర్తుచేయడం గమనార్హం.

    ఇది కూడా చదవండి: మణిపూర్‌లో టెన్షన్.. బందీల కోసం బలగాలు
     

Business

  • సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం) దిగ్గజం సేల్స్‌ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్‌ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

    ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్

    గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్‌కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.

    ‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్‌ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.

    2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, పెరుగుతున్న దిగుమతి బిల్లులను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. వ్యయాల హేతుబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు తక్షణమే కాఠిన్య చర్యలను అమలు చేయాలని స్పష్టం చేసింది.

    ఆంక్షల పరిధిలోకి వచ్చే సంస్థలు ఇవే..

    ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విస్తృత స్థాయిలో ప్రభుత్వ ఆర్థిక రంగాన్ని కదిలించనున్నాయి. ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలు, ఆర్థిక సేవల విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేసే అన్ని ఇతర ఆర్థిక సంస్థలు వీటి పరిధిలోకి రానున్నాయి.

    విదేశీ పర్యటనలకు కోత..

    కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల అధిపతులకు డీఎఫ్‌ఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విదేశీ ప్రయాణాలను నిర్ణీత పరిమితుల కంటే చాలా తక్కువగా ఉంచాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ పర్యటనలకు అనుమతించవద్దని, సాధ్యమైన ప్రతిచోటా భౌతిక పర్యటనల స్థానంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే సమీక్షలు, చర్చలు జరపాలని స్పష్టం చేసింది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా కలిసివస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

    ఈవీ వైపు వేగంగా అడుగులు

    వ్యాపార విస్తరణతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థలు ఇకపై కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే అద్దె వాహనాలను క్రమంగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వాటి స్థానంలో కాలక్రమేణా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించేలా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఎస్ ఆదేశించింది.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • భారతీయ ఐటీ దిగ్గజం జోహో తమ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని విస్తరించబోమని నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి బృందాల మధ్య ముఖాముఖి చర్చలు, ప్రత్యక్ష సహకారం ఉన్నప్పుడే ఆశించిన ఉత్పాదకత, వేగవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అంతర్గత సమీక్షలో తేలడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని జోహో వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా వెల్లడించారు.

    ప్రత్యక్ష సహకారంతోనే మెరుగైన పరిష్కారాలు

    కంపెనీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా సొంత డెవలప్‌మెంట్ టీమ్‌లో నేనే స్వయంగా ఈ వ్యత్యాసాన్ని గమనించాను. సమస్య పరిష్కారంలో భాగస్వాములైన వ్యక్తులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకోనప్పుడు వాటి పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అదే ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆలోచనల మార్పిడి మరింత సులువుగా సాగుతుంది. దీనివల్ల అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు లభిస్తున్నాయి. అందుకే ఆర్‌ అండ్ డీ విభాగంలో ఉత్పాదకతను దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోమ్‌ను విస్తరించకూడదని నిర్ణయించాం’ అని చెప్పారు.

    జోహో పునసమీక్ష

    పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి పద్ధతులను మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.

    ప్రధాని పిలుపునకు స్పందించిన శ్రీధర్ వెంబు.. మే 11న ఒక పోస్ట్‌లో ‘గత కొన్ని నెలలుగా మా సంస్థలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తున్నప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని పిలుపును గౌరవిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ పునసమీక్షిస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, సంస్థ ప్రయోజనాలు, సాంకేతిక ఉత్పాదకతను బేరీజు వేసుకున్న తర్వాత ఈ విస్తరణ సాధ్యం కాదని జోహో తేల్చిచెప్పింది.

    ఇంధన పొదుపునకు ప్రత్యామ్నాయ వ్యూహాలు

    వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనంత మాత్రాన పర్యావరణ స్పృహను విస్మరించబోమని వెంబు స్పష్టం చేశారు. ఇంధన వినియోగాన్ని, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జోహో ఇతర మార్గాలను అన్వేషిస్తోందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడం, కంపెనీ క్యాంటీన్లలో డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వంట సామగ్రిని ప్రవేశపెట్టడం వంటివి అమలు చేయబోతున్నట్లు చెప్పింది. ఇప్పటికే జోహో సంస్థ సోలార్ (సౌరశక్తి) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. క్యాంపస్‌ల్లో ఇప్పటికే ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో లక్షల రూపాయల ప్యాకేజీలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీతాలే అందరికీ హాట్ టాపిక్. కానీ, రోజువారీ శ్రమను నమ్ముకున్న ఒక సాధారణ ఇంటి పనిమనిషి నెలవారీ సంపాదన వివరాలు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నిపుణులను, విద్యావంతులను ఆలోచనలో పడేసాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ఇంటి పనిమనిషితో జరిపిన చిన్న సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

    బెంగళూరుకు చెందిన ఆదిత్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల తన ఇంటి పనిమనిషి పదేపదే ఆలస్యంగా రావడంపై ఆమెను ప్రశ్నించాడు. సాధారణంగా మొదలైన ఈ ప్రశ్న ఆమె ఇచ్చిన సమాధానంతో ఆదిత్య అవాకయ్యేలా చేసింది. ఆమె కేవలం ఒకరి ఇంట్లోనే కాకుండా ఒక పక్కా ప్రణాళికతో బహుళ ఆదాయ వనరులను సృష్టించుకుందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు. ఆదిత్య తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె తన దినచర్యలో భాగంగా..

    వేర్వేరు అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే నలుగురు బ్యాచిలర్స్‌కు రోజువారీ భోజనం వండి పెడుతోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.6,000 చొప్పున తీసుకుంటోంది. దాంతో ఆమెకు రూ.24,000 లభిస్తోంది. దీనికి అదనంగా, మరో రెండు కుటుంబాలకు పూర్తిస్థాయి ఇంటి పనిమనిషిగా ఉంటూ నెలకు రూ.20,000 సంపాదిస్తోంది. మొత్తంగా ఆమె నెలవారీ ఆదాయం అక్షరాలా రూ.44,000. అంటే సంవత్సరానికి ఆమె సంపాదన రూ.5.28 లక్షలు. దేశంలో సగటు కార్పొరేట్ ఎంట్రీ-లెవల్ ఉద్యోగి జీతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం.

    ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘ఇక్కడ వేలాది మంది చదువుకున్న యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కానీ సరైన నైపుణ్యం ఉంటే ఆదాయానికి కొరత లేదు’ అని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం ద్వారా తాను ఒక గొప్ప విషయాన్ని గ్రహించానని ఆదిత్య రాసుకొచ్చాడు. ‘ఈ రోజు ఒక విషయం స్పష్టమైంది. ఏ పనీ చిన్నది కాదు. నైపుణ్యం, స్థిరత్వం, కష్టపడే తత్వం ఎప్పుడూ సరైన ఫలితాన్ని ఇస్తాయి’ అని అతను స్పష్టం చేశాడు.

    కెరీర్ వృద్ధి వర్సెస్ శారీరక శ్రమ

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై నెటిజన్లు భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నారు. ‘డిగ్రీలు లేకపోయినా ప్రాక్టికల్ నైపుణ్యాలతో స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిరూపితమైంది’ అని కొందరంటున్నారు. ‘దేశంలో పట్టభద్రులైన యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్న వేళ ఇదొక ప్రత్యామ్నాయం’ అని కొందరు చెబుతున్నారు. డిగ్రీలు పూర్తి చేసినా అర్థవంతమైన ఉపాధి దొరకని దేశీయ ఉద్యోగ సంక్షోభాన్ని ఈ ఉదంతం ప్రతిబింబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

    విజయానికి కొలమానం ఏది?

    ఈ వైరల్ కథనం మారుతున్న భారతదేశ శ్రామిక శక్తి వాస్తవ రూపానికి అద్దం పడుతోంది. విజయాన్ని కేవలం నెలవారీ జీతం అంకెలతోనే కొలవాలా? లేక భవిష్యత్తు వృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన నాణ్యత ఆధారంగా అంచనా వేయాలా? అనే పెద్ద ప్రశ్నను ఇది సమాజం ముందుంచింది. ఏదేమైనా, విద్యావంతుల్లో పెరుగుతున్న నిరుద్యోగానికి, నైపుణ్య ఆధారిత పనులకు ఉన్న డిమాండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • ఫ్యాషన్‌ ప్రపంచంలో అంబానీ వారసురాలు, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. ఆధునిక హంగులతో వింటేజ్ గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, కార్ల్ లాగర్‌ఫెల్డ్ 1996 కలెక్షన్‌కు చెందిన అరుదైన ఆర్కైవల్ షానెల్ హాట్ కౌచర్ దుస్తులలో అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.

    వ్యాపార ప్రపంచం నుండి అంతర్జాతీయ కార్యక్రమాలలో రెడ్ కార్పెట్‌ దాకా, ఇషా అంబానీ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె తన విలక్షణమైన ఫ్యాషన్ అభిరుచికి మాత్రమే కాకుండా, తన రాజసం ఉట్టిపడే శైలికి కూడా ప్రసిద్ధి చెందారు.  ఇటీవల, ఇషా అంబానీ ధరించిన ఒక దుస్తులు చూసి అందరూ 'వావ్' అన్నారు. తాజాగా 90వ దశకపు హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తుచేసే ఒక అందమైన బంగారు రంగు వింటేజ్ దుస్తులను ధరించి  మోడ్రన్‌ మహారాణిలా మెరిసారు.

    2026లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. పాత తరం నాటి క్లాసిక్ డిజైన్లు (Vintage Couture) మళ్లీ రెడ్ కార్పెట్స్ పైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే  ఇషా అంబానీ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్‌ఫెల్డ్ రూపొందించిన 'చానెల్ (Chanel) ఆటమ్/వింటర్ 1996 హాట్ కోట్యూర్' కలెక్షన్ నుండి  గోల్డ్‌  కలర్‌ వింటేజ్ దుస్తులను ధరించారు.

    ఆమె హిప్స్ వరకు సాగే పూర్తి చేతుల బంగారు రంగు (Gold) 'బంధ్‌గలా' సూట్‌ను ధరించారు. నడుము భాగంలో రత్నాలతో పొదిగిన బెల్ట్‌తో దీనిని స్టైల్ చేశారు. బంగారు రంగు లేస్ క్విల్టెడ్ ప్యాంట్‌సూట్. దీనికి ఆమె టాబ్‌వింటేజ్ వారి సిగ్నేచర్ గ్రిపాయిక్స్ బెల్ట్‌ను జతచేసింది. ఈ బెల్ట్ ధర సుమారు  రూ.31,56,800 ఉంటుంది ఈ లుక్‌లో దాని అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులకు బంగారు రంగు డీటైలింగ్‌తో పాటు, రంగురంగుల రాళ్లను అమర్చారు.  

    ఈ లుక్ కోసం ఆమె చానెల్ క్రూయిజ్ 2025/26 కలెక్షన్‌కు చెందిన స్వెడ్ మినీ పౌచ్, మనోలో బ్లాహ్నిక్ శాండల్స్, సెయింట్ లారెంట్ సన్‌గ్లాసెస్‌ను ధరించారు. మేకప్ విషయానికి వస్తే బేక్డ్ న్యూడ్-టోన్డ్ మేకప్, వింగ్డ్ ఐస్,  లూజ్ హెయిర్‌తో సింపుల్‌గా కనిపించారు. 2011లో లేడీ గాగా   1996 నాటి అరుదైన షానెల్ గోల్డ్ ప్యాంట్‌సూట్‌ను ధరించారు.  

    అంతేనా  సెయింట్ లారెంట్ వారి SL M161 సన్‌గ్లాసెస్‌ మరో  ప్రత్యేకత.  వీటి ఖరీదు సుమారు దాదాపు రూ. 32,000 ఉంటుందని అంచనా. షానెల్ బ్రాండ్‌కు చెందిన క్రూజ్ 2025/26 కలెక్షన్‌లోని ఒక స్టైలిష్ స్వెడ్ మినీ పౌచ్‌ను ధరించారు. తన లుక్‌ను పూర్తి చేయడానికి, ఆమె లగ్జరీ బ్రాండ్ మనోలో బ్లానిక్‌కు చెందిన కల్లాస్లీ 90 లెదర్ స్లింగ్‌బ్యాక్ శాండల్స్‌ను ధరించారు. సుమారు రూ. 1,29,156 ఖరీదు చేసే ఈ స్టైలిష్ హీల్స్, ఆమె మొత్తం లుక్‌కు మరింత రాజసం ఉట్టిపడేలా చేశాయి.

    రాజసం ఉట్టిపడే, ఆకర్షణీయమైన లుక్‌ను చాలా హుందాగా తీర్చిదిద్దుకోవడంతోపాటు,  తన మొత్తం లుక్‌కు మరింత క్లాసీ లుక్‌ను జోడించారు.  ఇషా తన గ్లామరస్ దుస్తులకు తగ్గట్టుగాఎంచుకున్న  తేలికపాటి మేకప్‌ ఆమె లుక్‌కు చక్కగా సరిపోయింది. 

    ఇదీ  చదవండి: వివాదంలో యాసిడ్‌ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?


     

     

  • సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మేధోసంపత్తితో కూడిన వైట్-కాలర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే కార్పొరేట్ ప్రపంచంలో అకౌంటెంట్లు, న్యాయవాదులు, మార్కెటింగ్ నిపుణుల ఉద్యోగాలు కనుమరుగయ్యే లేదా పూర్తిగా ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్ హెడ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరిక చేశారు.

    మానవ మేధస్సుకు సవాల్‌

    గతంలో ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడీ వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్-కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు..

    • అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.

    • లీగల్ వర్క్ (న్యాయ విభాగం)లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్‌లను ఏఐ నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

    • మార్కెటింగ్, కంటెంట్‌పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళ్తుంది.

    • ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో వర్క్‌ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది.

    ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని ఆయన విశ్లేషించారు.

    సహాయకారి నుంచి ప్రత్యామ్నాయంగా!

    ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ, ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత పరిణామం చెందుతోందని సులేమాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

    పరిష్కారం ఏంటి?

    మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు, ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వైట్-కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.

    ఆరంభ పతనానికి కారణాలు

    • అమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

    • అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.

    • అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

    • గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.

    ముగింపులో రికవరీకి కారణాలు

    • రూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.

    • టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.

    • దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.

    • నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.

    ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.

    ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!

  • తాజాగా నెదర్లాండ్స్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సామూహిక పేదరికం తిరిగి రావడం’, ‘విపత్తుల దశాబ్దం’ (డికేడ్‌ ఆఫ్‌ డిజాస్టర్స్‌) అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే దేశీయంగా చమురు, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటం మానుకోవాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిపై కొంతమంది నిపుణుల మనోగతం కింది విధంగా ఉంది.

    ఈ వ్యాఖ్యలు వినగానే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన సంక్షోభంలోకి ప్రవేశించినప్పుడల్లా.. ప్రధానులు దేశభక్తిని మేల్కొలిపి విదేశీయుల నుంచి కొనుగోళ్లు తగ్గించుకోమని కోరడం పరిపాటిగా మారింది.

    70 ఏళ్లలో 9 సార్లు!

    మన ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. 1955, 1965, 1974, 1980, 1991, 1998, 2012, 2020.. ఇప్పుడు 2026. గడిచిన 70 ఏళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు దేశం ఇదే తరహా డాలర్ల కొరతను, చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశీయంగా ఉన్న సప్లై గ్యాప్ (సరఫరా లోటు)ను భర్తీ చేయడానికి అవసరమైన డాలర్లు మన వద్ద లేకపోవడమే వీటికి మూలకారణం.

    1972 వరకు ప్రధాన లోటు ఆహార ధాన్యాల్లో ఉండేది. ‍క్రమంలో దాన్ని అధిగమించే స్థాయికి చేరుకోగలిగాం. 1980 తర్వాత ఈ లోటు ఇంధనం (చమురు, గ్యాస్) రూపంలోకి మారింది. మన పొరుగు దేశమైన చైనాకు కూడా ఈ రెండు లోటూ ఉన్నాయి. కానీ, వారు ఈ డాలర్ల సంక్షోభాన్ని మనకంటే మెరుగ్గా నిర్వహించగలిగారు. ఈ పరిస్థితిలో.. మన దేశంలో ఈ సరఫరా లోటు దశాబ్దాలుగా ఎందుకు కొనసాగుతోంది? మనం ఈ డాలర్ల కొరతను ఎందుకు అధిగమించలేకపోతున్నాం? అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    హరిత విప్లవం విజయం.. పారిశ్రామిక రంగంలో ఎందుకు సాధ్యం కాలేదు?

    వ్యవసాయ రంగంలో ఉన్న లోటును మనం హరిత విప్లవం ద్వారా విజయవంతంగా అధిగమించాం. స్వయంసమృద్ధిని సాధించాం కాబట్టే, 1979లో వచ్చిన తీవ్ర కరువు ప్రభావం 1980 నాటికి దేశంపై పడకుండా నిలిచింది. కానీ, ఇంధన లోటును మాత్రం గత 45 ఏళ్లుగా మనం పరిష్కరించలేకపోయాం. చమురు కొనడానికి డాలర్లు కావాలి, ఆ డాలర్లు రావాలంటే ఎగుమతులు పెరగాలి. కానీ మన ఎగుమతులు ఎప్పుడూ అంతంత మాత్రమే.

    ఇంధన విధానంలో లోపం

    మన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పర్యావరణ కారణాల వల్ల దాన్ని పక్కనబెట్టి చమురు, గ్యాస్ వంటి ఇతర హైడ్రోకార్బన్లపై ఆధారపడ్డాం. ఇది మన ఇంధన సంక్షోభాన్ని మరింత పెంచింది. దీనికంటే ముఖ్యమైన మరో కారణం.. గత 60 ఏళ్లుగా మన పాలకులు అనుసరించిన అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సింది పోయి, వాటిని భారీగా దిగుమతి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఫలితంగా డాలర్ల సంపాదన తగ్గిపోయింది.

    సంక్షోభం రావడం.. మళ్లీ మర్చిపోవడం!

    ప్రతిసారీ సంక్షోభం తీవ్రమైనప్పుడు ప్రభుత్వం డాలర్లను పొదుపు చేయమని చెప్తుంది. ఆ సమయానికి ఆ నిర్ణయం సరైనదే అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది అత్యంత హాస్యాస్పదమైన వ్యూహం. సంక్షోభం తొలిగిపోగానే మనం ఆ సమస్యను పూర్తిగా మర్చిపోయి విజయం సాధించామంటూ వీధుల్లో వేడుకలు చేసుకుంటాం. మళ్లీ కొన్నాళ్లకు అదే తప్పు చేస్తాం. ఈ దుస్థితి చూసి చాలా మంది ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.

    ఈ సమస్య పరిష్కారానికి గతంలో డజనుకు పైగా ఉన్నత స్థాయి కమిటీలు వేయడంతో చాలా సిఫార్సులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. దీనికి ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులనా, బ్యూరోక్రాట్లనా, పారిశ్రామికవేత్తలనా, గత వ్యూహకర్తలనా? సమాధానం ఒక్కటే.. వ్యవస్థలో అందరూ భాగస్వాములే అయినప్పుడు ఎవరి ఒక్కరినో బాధ్యులను చేయలేం.

    ప్రజాస్వామ్యం వర్సెస్ ఆర్థిక వృద్ధి

    ఆర్థికవేత్త వాల్టర్ రోస్టో 1960లో తన ‘స్టేజెస్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ పుస్తకంలో రాజకీయ వ్యవస్థల గురించి ప్రస్తావించలేదు. కానీ, రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఆర్థిక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును మూటగట్టుకున్న దేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవు. అవి ప్రజాస్వామ్య దేశాలుగా మారిన మరుక్షణమే వాటి వృద్ధి రేటు మందగిస్తుంది.

    ఆర్థిక నమూనాప్రధాన లక్షణంవృద్ధి రేటు
    హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థప్రజల హక్కులు, ఉచితాలు, రాయితీలకు ప్రాధాన్యతతక్కువ, అస్థిరమైన వృద్ధి
    బాధ్యతల ఆధారిత ఆర్థిక వ్యవస్థజాతీయ ప్రయోజనాలు, ఉత్పత్తి, క్రమశిక్షణకు ప్రాధాన్యతస్థిరమైన, అత్యధిక వృద్ధి

    భారతదేశం ఎప్పటికీ ‘హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ గానే కొనసాగుతుంది. అలాంటప్పుడు గత 70 ఏళ్ల తప్పులను పునరావృతం చేయకుండా ఎలా ఉండాలన్నదే మన ముందున్న ప్రశ్న.

    ఆలోచన విధానం మారకపోతే..

    ఈ గందరగోళాన్ని ఎలా చక్కదిద్దాలో అందరికీ తెలుసు. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారాలు మన కళ్లముందే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మెజారిటీ సూచనలను పక్కనబెట్టాం. ఒకేసారి డజన్ల కొద్దీ భిన్నమైన లక్ష్యాలను పెట్టుకుని అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. కుక్క తన తోకను తాను పట్టుకోవడానికి తిరిగినట్లు ఉంది. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.

    ప్రస్తుత దశాబ్దం విపత్తులతోనే సాగుతోంది, మున్ముందు మరిన్ని సవాళ్లు రావచ్చు. కానీ, మన పాలకుల ఆలోచనా విధానం, ఆర్థిక విధానాలు సరైన దిశలో ఉండి ఉంటే.. ఈ విపత్తులు దేశాన్ని సామూహిక పేదరికం వైపు నెట్టేంత ప్రమాదకరంగా మారేవి కావు. ఇప్పటికైనా తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి ఎగుమతులను పెంచే దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన సంస్కరణలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో డాలర్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే మిగిలిపోతుంది.

    ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!

  • దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేపే) ఫేజ్-3 నిబంధనల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇథనాల్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక మార్పులు (E25 రీకాలిబ్రేషన్) జరిగినప్పటికీ ఈ నెల చివరి నాటికే తుది నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తుది ఫార్ములాను సిద్ధం చేస్తోంది.

    ప్రధాని కార్యాలయం పర్యవేక్షణ..

    భారతదేశ ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నేరుగా పర్యవేక్షిస్తుండటం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

    కేఫే నిబంధనల ఉద్దేశం

    వాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. సరళంగా చెప్పాలంటే ఒక వాహన తయారీ సంస్థ (ఉదాహరణకు మారుతి సుజుకి లేదా టాటా మోటార్స్) ఒక ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అన్ని కార్ల సగటు ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి.

    E20 నుంచి E25/E27 వైపు..

    ఇథనాల్ బ్లెండింగ్‌ను E20 (20% ఇథనాల్) నుంచి E25/E27 (25%-27% ఇథనాల్) స్థాయికి వేగంగా తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఫార్ములాను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పుల కేఫే-3 లక్ష్యాల్లో ఎటువంటి మార్పు ఉండదని కేవలం ఇంధన రసాయన లక్షణాల ఆధారంగా లెక్కించే పద్ధతిని మాత్రమే సవరించినట్లు నిపుణులు స్పష్టం చేశారు. దీనివల్ల ఇథనాల్ వాడకం వల్ల వాహన సామర్థ్య అంచనాలో ఆటోమొబైల్ కంపెనీలకు నష్టం జరగదు. ‘చర్చలన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకల్లా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాహన తయారీదారులు తమ భవిష్యత్తు ఇంజిన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది’ అని ఈ చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

    ఆటోమొబైల్ కంపెనీలకు 11 నెలల గడువు

    ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. మే చివరినాటికి నోటిఫికేషన్ వస్తే వాహన తయారీ కంపెనీలకు సన్నద్ధమవడానికి కేవలం 11 నెలల సమయం మాత్రమే మిగులుతుంది. ఈ నిబంధనల ఆధారంగానే ఈవీలు, హైబ్రిడ్‌, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇచ్చే కంప్లయన్స్ క్రెడిట్లను లెక్కిస్తారు. ఏ సాంకేతికత కలిగిన వాహనాల తయారీ చౌకగా మారుతుందో, ఏవి ఖరీదవుతాయో ఈ నిబంధనలే డిసైడ్ చేయనున్నాయి.

    స్పష్టత వస్తేనే పెట్టుబడులు

    వాహన తయారీదారులు ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2028కి సంబంధించిన ప్రొడక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారు. నిబంధనలపై స్పష్టత వస్తేనే సప్లయర్లతో ఒప్పందాలు, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు సాధ్యమవుతుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఆటోమొబైల్ రంగం ఏ దిశగా సాగాలో నిర్దేశించే ఈ రూల్‌బుక్ కోసం పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

    ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి!

  • అమెరికాలో పనిచేస్తున్న భారతీయ మహిళ శారికా యాదవ్‌.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భారతదేశం vs అమెరికా కార్పొరేట్‌ పని సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించింది.

    అమెరికాలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం, డాక్టర్‌ అపాయింట్‌మెంట్లు వంటి వ్యక్తిగత పనుల కోసం.. ముందుగానే తమ ఆఫీస్‌ క్యాలెండర్‌లో సమయం బ్లాక్‌ చేసుకుంటారు. ఆ సమయంలో ఇతరులు మీటింగ్స్‌ పెట్టకుండా గౌరవిస్తారు. ఒకవేళ మీటింగ్‌ అవసరం వచ్చినా, ముందుగా ఉద్యోగిని అడిగి సమయం ఖరారు చేస్తారు. అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం కంపెనీల పని సంస్కృతిలో భాగంగా మారిందని శారికా యాదవ్‌ పేర్కొన్నారు.

    భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడ సెలవు తీసుకోవాలంటే.. ఉద్యోగులు మేనేజర్లకు పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేక కంపెనీల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.

    ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. కొందరు అమెరికా వర్క్‌ కల్చర్‌లో వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంగీకరించగా, మరికొందరు ప్రతి దేశానికి ప్రత్యేకమైన పని విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు భారతదేశంలో ఉద్యోగులపై ఉండే ఒత్తిడి కారణంగా చాలామంది స్వంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు.

Movies

  • 'పెద్ది' ‍‍ట్రైలర్ వచ్చేసింది. కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తోంది. అదే టైంలో కంటెంట్ పరంగా మాత్రం స్టోరీపై రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంతకీ 'పెద్ది' స్టోరీ ఏమై ఉండొచ్చు? ఊహించని ట్విస్ట్ ఏంటి?

    (ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)

    ఇప్పటివరకు వచ్చిన 'పెద్ది' ప్రమోషనల్ కంటెంట్‌లో హీరో పాత్ర క్రికెట్, కుస్తీ ఆడతాడు అన్నట్లు మాత్రమే చూపించారు. కానీ ట్రైలర్‌లో రన్నర్ అని కూడా రివీల్ చేశారు. అయితే క్రికెట్, రెజ్లింగ్‌కి సంబంధించిన సీన్స్ చూపించారు గానీ రన్నింగ్‌కి సంబంధించిన ఒక్క షాట్ కూడా పెట్టలేదు. చివరలో రన్నింగ్ ట్రాక్‌పైకి పెద్ది వెళ్తున్న సీన్ చూపించారు. 'పెద్ది బ్యాక్ ఆన్ హిజ్ ఫీట్' అనే డైలాగ్ వినిపించారు. దీంతోనే డిస్కషన్స్ మొదలయ్యాయి.

    బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఎక్స్‌పర్ట్. కానీ అనుకోని సంఘటనల వల్ల 'పెద్ది'.. ఒంటి కాలి వ్యక్తి అవుతాడు. అయినా సరే తనకున్న ప్రతిభతో పారా ఒలింపిక్స్ వరకు వెళ్తాడు. ఇదే ట్విస్ట్ అనిపిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ఇందులో రామ్ చరణ్ పాత్రకు కాలు ఉండదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే దర్శకుడు బుచ్చిబాబు కూడా మూవీ చివరి 50 నిమిషాల ఎమోషనల్‌గా ఉంటుందని, చూస్తున్న ప్రతి ఒక్కరూ డిస్ట్రబ్ అవుతారని ఇంటర్వ్యూలో చెప్పాడు.

    డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలు.. ట్రైలర్ చివరలో పెద్ది పాత్ర కుంటుతూ నడుస్తున్నట్లు అనిపించడం లాంటివి చూస్తుంటే.. ఈ దర్శకుడి గత చిత్రం 'ఉప్పెన'లానే ఇందులో 'కటింగ్' గ్యారంటీనా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటి? అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

    (ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)

  • కొత్త హెయిర్ స్టైల్‌తో అక్కినేని కోడలు శోభిత

    చీరలో కనువిందు చేస్తున్న మానస వారణాసి

    ఒంపు సొంపులతో దివ్యభారతి అందాల విందు

    ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసిన శ్రీనిధిశెట్టి

    పాత హీరోయిన్ లుక్‌లో దుషారా విజయన్

  • తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వాళ్లలో పలువురికి గుర్తింపు అయితే వచ్చింది గానీ ఆ సీజన్ తర్వాత వాళ్లని జనాలు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ దగ్గర నుంచి లేటెస్ట్ సీజన్ విజేత కల్యాణ పడాల వరకు ఇదే తంతు. అలాంటిది గత సీజన్‌లో కొన్నిరోజులు మాత్రమే ఉన్న ఓ బ్యూటికీ సుడిగాలి సుధీర్ కొత్త మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది.

    (ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)

    'జబర్దస్త్' కమెడియన్‌గా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి మూవీస్ చేశాడు. వీటిని ఒక్కడు కూడా పట్టించుకోలేదు. కొన్నేళ్ల క్రితం చేసిన 'గాలోడు' మాత్రం ఊహించని హిట్ అయింది. ప్రస్తుతం 'గోట్' అనే మూవీ చేశాడు. ఈ మార్చిలోనే రిలీజ్ చేస్తామని అన్నారు గానీ దాని సంగతి ఏంటో తెలియట్లేదు. అదలా ఉండగానే 'సుధీర్ జోకర్' పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

    ఇందులోనే సుధీర్ సరసన ఆయేషా జీనత్ హీరోయిన్‌గా చేయనుంది. ఈమె తమిళ నటి. గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొంది. గతేడాది తెలుగులో ప్రసారమైన బిగ్‌బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. కానీ ఆరోగ్య సమస్యలతో మధ్యలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు సుధీర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. 

    (ఇదీ చదవండి: భరణం? విడాకుల్లో మూడో వ్యక్తి ప్రమేయం? నటి భర్త క్లారిటీ)

  • బాలీవుడ్ నటి మౌనీరాయ్ కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి అధికారికంగానే వెల్లడించింది. అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీనే కారణమని తెగ రూమర్స్ వస్తున్నాయి. అలానే భరణం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టిన సూరజ్.. ఇన్‌స్టా స్టోరీలో మొత్తం క్లారిటీ ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

    'మా విడాకుల విషయంలో వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నా. ఎలాంటి భరణం లేదు. మా మధ్య వివాదాలు ఏం లేవు. మూడ వ్యక్తి ప్రమేయం అసలు లేదు. మేం చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అవాస్తవాలు. రూమర్స్ గురించి స్పందించకపోవడం తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇస్తున్నా' అని సూరజ్ చెప్పుకొచ్చాడు.

    ప్రేమించుకుని 2022లో సూరజ్-మౌనీ రాయ్ పెళ్లి చేసుకున్నారు. సూరజ్ దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్. మలయాళీ, బెంగాలీ సంప్రదాయల్లో వీళ్ల వివాహం జరిగింది. కానీ నాలుగేళ్లకే విడిపోయారు.

    (ఇదీ చదవండి: చేతికైన గాయం గురించి క్లారిటీ ఇచ్చిన చరణ్)

  • రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

    'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

    'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్‌గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.

    స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్‌లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.

    (ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

    ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ‍ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

    సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?

    ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్‌లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.

    ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక

  • మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. లెక్క ప్రకారం మార్చిలోనే రావాలి కానీ రెండుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెల 4న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ మూవీపై అంచనాలని పెంచేస్తోంది.

    (ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)

    బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే పనోడు.. క్రికెట్, కుస్తీలో ఎలాంటి ప్రతిభ చూపించాడు. జీవితంలో ఇతడికి ఎదురైన సవాళ్లు ఏంటనేది కాన్సెప్ట్. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆ జోష్‌ని కొనసాగించేలానే ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

  • మరోవారం వచ్చేసింది. ఈసారి సతీ లీలావతి, సిస్టమ్, మధువిధు, మేం కాప్‌లం లాంటి తెలుగు మూవీస్, సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరోవైపు థియేటర్లలో 'దృశ్యం 3' రిలీజ్ కానుంది. ఈ వీకెండ్‌కి అయితే ఇదే ఎంటర్‌టైన్‌మెంట్. అయితే సడన్ గా ఓ రెండు తెలుగు చిత్రాలు ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. రిలీజైన 12 రోజులకే)

    గతేడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'డ్రీమ్ క్యాచర్'. ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రలు చేశారు. కలలో వచ్చిన సంఘటనలు నిజజీవితంలో ఒకవేళ జరిగితే హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కలలు రావడం అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా అనేది కాన్సెప్ట్. ఇప్పుడీ చిత్రం ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

    ఇకపోతే సుమన్, మహేశ్ పెగ్గర్ల, సిరి తదితరులు నటించిన 'భీంసేరి' అనే తెలుగు సినిమా కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఇది కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ క్రూరమైన లేడీ పోలీసాఫీసర్.. ఓ నిరుపేద కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేస్తుంది. కానీ ఆ కుటుంబంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడుతుంది. ఈమె సదరు లేడీ పోలీసాఫీసర్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక)

  • సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్‌ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్‌టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.

    ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. 

    (ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్‌ తల్లి)

  • టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్‌టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్‌టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. 
     

     

  • జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

    తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్‌ థియేటర్లతో పాటు డిజిటల్‌గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.  దీంతో జూనియర్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

Telangana

  • హైదరాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.

    గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్‌ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.

    సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.

    ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.

    నేరగాళ్ల నెట్‌వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

    ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.

    అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.

    అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ  వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.

    ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.

    ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది.

  • సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ జంట హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్‌ ప్లాన్‌ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

    తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్‌ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. 

    దీంతో వారిని  చంపేయాలని కరీమాబేగం, రెహమాన్‌ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్‌ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్‌ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.

    మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్‌ హౌస్‌కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్‌ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

    ఏం జరిగిందంటే?
     పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.

    బండి సాయి భగీరధ్‌ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.

    ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.

    ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్‌ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బండి భగీరథ్‌ కేసు విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ కేసులో ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో విషయమై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌ తండ్రి తప్పుచేయనప్పుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు.

    తెలంగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ..‘బండి భగీరథ్‌ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన తప్పుచేస్తే పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మా మంత్రి తప్పు చేస్తే మాది బాధ్యత. ముందస్తు బెయిల్‌ తీసుకోవడం హక్కు. ఆయన పారిపోలేదు.  బెయిల్‌ పెండింగ్‌లో ఉంది. అనంతరం, భగీరథ్‌ సరెండర్‌ అయ్యాడు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్‌, కేటీఆర్‌ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు చేసి భగీరథ్, ఆయన తండ్రికి‌ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

    బీఆర్ఎస్ నేతలకు ఏ పని లేనట్టు బండి భగీరథ్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడం సరికాదు. ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఉన్నాడని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసులో బీఆర్‌ఎస్‌ వాళ్లు ముందుగానే కోర్టుకు ఎందుకు వెళ్లారు?. ఈ కారు రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా?. మీ బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు ఎన్నో జరిగాయి. పబ్‌లో ఎంఐఎం నేత కొడుకు అత్యాచారం చేయలేదా? ఏం చేశారు. కొమురం భీం జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. గతంలో లంబాడా అమ్మాయి మీద కస్టోడియల్ డెత్ జరగలేదా?. గతంలో మీ పాలనలో అత్యాచారాలు జరిగితే మరి కేసీఆర్ రాజీనామా చేశారా?. కాళేశ్వరం, కారు రేసు కేసులో త్వరగా విచారణ జరిగేలా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవాలి. మోదీ సభ విజయంతో తెలంగాణ ప్రజల బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని వ్యాఖ్యలు చేశారు. 

Family

  • భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్  33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి   సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక​ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్‌ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.

    ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 

    'మరణపూర్వ గాయాలు' అంటే ..
    ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవి

    కోతలు లేదా రాపిడి గాయాలు
    వాపు
    ఎముకలు విరగడం
    అంతర్గత రక్తస్రావం
    బలహీనమైన దెబ్బలు
    ఆత్మరక్షణ గాయాలు తదితరాలు.
    వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.

    ఎలా గుర్తిస్తారంటే?
    మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం,  రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. 

    ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు.  

    మరణానంతర గాయాలు అంటే..
    మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.

    మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..

    మరణానికి ముందు గాయాలు
    మరణానికి ముందు సంభవిస్తాయి
    రక్తస్రావం, వాపును చూపుతాయి
    గాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయి
    మరణానంతర గాయాలు
    మరణం తర్వాత సంభవిస్తాయి
    సాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదు

    ఇది రవాణా సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్‌, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

    (చదవండి: సింగింగ్‌'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్‌​ విషయాలు)

  • ప్రయాణం అంటే ప్రపంచంలోని అన్ని ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో, చాలా మంది యువ ప్రయాణికులు ప్రయాణాన్ని ఒక విభిన్న కోణంలో అనుభవించడం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతిదీ చాలా నెమ్మదిగా, మరింత భావోద్వేగభరితంగా ఉండాలి వారికి. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే ఆస్ట్రోటూరిజం. దీని అర్థం నల్లని ఆకాశంలో మిలమిల్లాడే నక్షత్రాలను చూడటం, ఉల్కాపాతాలను వీక్షించడం, ఇతర చీకటి ఆకాశ ప్రదేశాలను సందర్శించడం.. అలాంటి విశాల ప్రదేశాల కోసం వెదుకులాట మొదలయ్యింది. 

    వాటి చుట్టూ సెలవులను ప్లాన్‌ చేసుకోవడం పెరిగింది. రోజువారీ జీవితంలోని టెన్షన్లకు దూరంగా ఉండి, సందర్శకులకు ఎంతో మనశ్శాంతిని అందించే మనదేశ ప్రదేశాలలో.. లడఖ్‌లోని ఖగోళశాస్త్ర శిబిరాలు, గుజరాత్‌ ఎడారులలోని రాత్రి ఆకాశ యాత్రలు వంటి ఇతర అనుభవాల పట్ల ప్రయాణికులు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. నక్షత్రాల కింద నిద్రించడం

    ఆస్ట్రోటూరిజం అనేది టెలిస్కోపిక్‌ పరిశీలన, నక్షత్రాల కింద నిద్రించడం, ఉల్కాపాతాలు, ఖగోళ శాస్త్ర పర్యటనలు వంటి కార్యకలాపాలపై కేంద్రీకృతమై ఉంటుంది. నేడు, పర్యాటకులు మరింత తీరికైన ప్రయాణాలను కోరుకుంటున్నందున, ప్రపంచవ్యాప్తంగానూ చీకటి ఆకాశ ప్రదేశాలకు డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణ పర్యాటక కార్యకలాపాల్లా కాకుండా, నక్షత్రాలను చూడటానికి సమయం తీసుకుని శ్రద్ధగా గమనించాలి. నిరంతరం వారిని పనిలో మునిగిపోయేలా చేసే ఈ సాంకేతిక యుగంలో, ముఖ్యంగా యువ పర్యాటకులు ఈ యాత్రలను ఎంతో ఆకర్షణీయంగా భావిస్తున్నారు. 

    ఎందుకు ఇష్టపడుతున్నారంటే.. 
    చాలా కాలంగా, ప్రయాణ సంస్కృతి సోషల్‌ మీడియా, స్పీడ్‌గా ఉండే పర్యటన ΄్లాన్స్, అత్యంత సౌందర్యాత్మక అనుభవాల ద్వారా బాగా ప్రభావితమైంది. 

    ఇటీవల భావోద్వేగపు అనుభవాన్ని కోరుకునే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆస్ట్రో టూరిజంలో సుదూర ప్రాంతాలు, కనెక్టివిటీ లేకపోవడం, నిశ్శబ్దం, నిర్మలమైన ఆకాశం అందించే ప్రశాంత భావన ఈ రకమైన పర్యాటకం యువతరానికి ఆకర్షణీయంగా మారింది. సోషల్‌ మీడియా కూడా ఇటువంటి విహారయాత్ర ప్రణాళికలకు మరింత ఆకర్షణను జోడించి, ఈ ప్రయాణ ధోరణి వైపు మరింత మందిని ఆకర్షిస్తోంది.

    డార్క్‌ స్కై టూరిజం ప్రాంతాలు
    మన దేశంలో తక్కువ కాంతి, కాలుష్యం ఉన్న ప్రాంతాలైన లడఖ్‌ , స్పితి లోయ, రాన్‌ ఆఫ్‌ కచ్, కూర్గ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు .. నక్షత్రాలను వీక్షించే పర్యటనలపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సాంప్రదాయేతర ప్రయాణ అనుభవాలను కోరుకునే యువ పర్యాటకులలో ఆస్ట్రోఫెస్ట్‌లు, పరిశీలన పర్యటనలు, ఆస్ట్రో క్యాంపులు, టెలిస్కోప్‌ టూరిజం వంటివి ప్రజాదరణ దుతున్నాయి. 

    కొత్త తరం ప్రయాణికుల కోసం పర్యాటక రంగం మారుతున్న స్వభావం నుండే ఆస్ట్రోటూరిజంకు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ రోజుల్లో పర్యటన అంటే ఆడంబరం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దం, ధ్యానంతో ఎక్కువగా ముడిపడి ఉంది. 

    (చదవండి: పెట్స్‌ని టూర్‌కి తీసుకువెళ్లాలంటే..!)

  • కుక్కలను పెంచుకునేవారికి పర్యటనలకు వెళ్లేటప్పుడు వాటిని ఎక్కడ ఉంచి వెళ్లాలో తెలియదు. తోడుగా తమతో పాటు తీసుకెళ్లాలనుకుంటారు. సాధారణంగా కారు ప్రయాణం అయితే తమతోపాటు తీసుకెళ్లే వీలుంది. కానీ, బస్సు, ట్రెయిన్, విమాన ప్రయాణాలలో పెట్స్‌ను తీసుకెళ్లడం కుదురుతుందా..?!

    ఏ వాహనంలోనైనా తమ పెంపుడు జంతువును తీసుకెళ్లే వీలుందా అనే విషయాన్ని ‘ముందస్తుగా బుక్‌ చేసుకున్నా’ కన్ఫర్మ్‌ చేసుకుంటూనే ఉండాలి. బడ్జెట్‌ తప్పనిసరిగా కేటాయించుకోవాలి. కొన్ని పెట్‌ రైలు ప్రయాణం కోసం నెలల తరబడి టైమ్‌ పట్టవచ్చు. టికెట్‌ రేట్లు కూడా ప్రయాణాన్ని బట్టి ఉంటాయి. హోమ్‌ స్టే కోసం రూ.600 నుంచి 10,000 వరకు ఉంటుంది. 

    సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత..
    సుదీర్గ రైలు ప్రయాణాలు, గంటల తరబడి కారు ప్రయాణాలు, విమానప్రయాణాలు జంతువులను గందరగోళాన్ని కలిగించవచ్చు. వాటి దినచర్య పెట్‌ యజమానికి తెలుసు కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు నుంచే కారులో వాటిని షికారుకు తీసుకెళ్లాలి. ప్రయాణాన్ని అలవాటు చేయాలి. తేలికపాటి భోజనం పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించడం చేయాలి. 

    అవసరమైనవి వెంట తీసుకెళితే..
    కుక్కలు విశ్రాంతి తీసుకునే పరుపులు, ఆడుకునే బొమ్మలు, వాటికి తెలిసిన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. ఇవి కొత్త పరిసరాలలో వాటి రోజువారీ జీవనాన్ని మొదలుపెట్టడానికి సహాయపడతాయి. ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు ఉన్నా, తెలిసిన వస్తువుల ద్వారా కొంత అలజడిని నివారించవచ్చు. 

    అనుకూలమైన ప్రదేశాలు
    కొన్నినగరాలలో క్యాట్‌ కేఫ్‌లు, డాగ్‌ పార్కులు ఉంటాయి. వాటికి మీ పెట్స్‌ను తీసుకెళ్లినంత మాత్రానా అవి అనుకూలంగా ఉండకపోవచ్చు. మన దేశంలో పెంపుడు జంతువులను సహించేవారు ఎక్కువే మందే ఉన్నారు. అలాగని అన్ని హోటళ్లు కుక్కలను అనుమతించవు. కొన్ని హోటళ్లు మార్కెటింగ్‌ కోసం పెట్స్‌కు ‘అనుమతి’ని ఇస్తున్నాయి. పెట్స్‌ తమతో పాటు ఉండాలంటే ప్రైవేట్‌ విల్లాలు, ఫామ్‌ హౌజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గోవా వంటి ప్లేసుల్లో రెస్టారెంట్లు, బీచ్‌లలో పెట్స్‌కు తగినంత స్వేచ్ఛ లభిస్తుంది. 

    మహాబలేశ్వర్‌లోని బీచ్, కొండ ప్రాంతాల్లో చేసే ట్రెక్కింగ్, ప్రశాంతమైన వీధుల గుండా పెట్స్‌తో ప్రయాణించవచ్చు. మీతో పాటు మీ కుక్క సముద్రపు అలలతో ఆడుకోవడం, రోజంతా కొత్త అనుభవాల కోసం అన్వేషించడం, తర్వాత మీతో పాటు ముడుచుకొని విశ్రాంతి తీసుకోవడం.. పెట్‌తో చేసే ప్రయాణంలో ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా నిలిచి΄ోతాయి. ఆందోళన అనిపించే ఎలాటి అడ్డంకి అయినా సులువుగా తొలిగిపోతుందన్న భావన మదిలో మెదులుతుంది. 

     

     

  • దట్టమైన అటవీ ప్రాంతంలో జీపు సఫారీ..బెంగాల్‌ పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లను దగ్గరినుంచి తిలకించడం, రిజర్వాయర్‌లో బోటు షికారు.. నదుల మధ్య కాటేజీలు, తాబేలు, మొసలి వంటి థీమ్‌ కాటేజీలు, ట్రెక్కింగ్‌  చేయాలన్నా.. చూడాలన్నా ఏ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలు వన్య్రప్రాణుల సహజసిద్ధమైన జీవన శైలిని కళ్లారా చూస్తూ..  ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ వేసవిలో పర్యాటకులకు మంచి అనుభూతిని మిగిల్చేందుకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి.

    ప్రకృతిని, వన్య ప్రాణులను దగ్గరి నుంచి చూడాలనుకునే వారికి సంతృప్తి పరిచేలా పలు పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడవులు, అటవీ జంతువులు, పక్షులు, నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్యలో కాటేజీలు ఇలా ఏ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనుకున్నా అందుకు తగిన ΄్ప్రాకేజీలు సిద్ధం అవుతున్నాయి.  తెలంగాణలోని ప్రధాన వన్య్ప్రాాణి పర్యాటక కేంద్రాలు ఇలా ఉన్నాయి. పర్యాటకులు తమ పర్యటనను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ముందుగానే బుక్‌ చేసుకోవడం మంచిది. వేసవి ఎండల దష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

    మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్‌ అటవీ ప్రాంతం టేకు చెట్లకు ప్రసిద్ధి. ఓపెన్‌ టాప్‌ జీపుల్లో అడవి లోపలికి తీసుకెళ్తారు. ఉదయం 6:30 గంటల నుంచి  8:30 గంటల వరకు, అలాగే  9:30 నుంచి 11:30 గంటలు; మధ్యాహ్నం 3:30 – 5:30 వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో జీపునకు (6 గురు వరకు) రూ.3,500, వారాంతాల్లో రూ.4వేల వరకు ఉంటుంది. ఏటూరునాగారం వన్య్రప్రాణి అభయారణ్యం (తాడ్వాయి)

    వరంగల్‌ సమీపంలోని ఏటూరు నాగారం వన్య్రప్రాణి అభయారణ్యంలో ’తాడ్వాయి హట్స్‌’ (కుటీరాలు), ’నైట్‌ వాచ్‌’ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జీపు సఫారీకి రూ.1,500లు, అటవీ ట్రెక్కింగ్‌కు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. అలాగే సైక్లింగ్‌ సౌకర్యం ఉంది. ఇక్కడ భారీ ఉడుతలు, అడవి దున్నలు కనిపిస్తాయి.

    అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (నల్లమల అడవులు)
    హైదరాబాద్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ‘టైగర్‌ స్టే‘ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో పర్యావరణ విద్యా కేంద్రం సందర్శన, సఫారీ, ట్రెక్కింగ్‌ ఉంటాయి. ఫరాహాబాద్‌ సర్క్యూట్‌లో ఈ సఫారీ సాగుతుంది.

    కృష్ణా నది అందాలను చూస్తూ గడపడానికి తాబేలు, మొసలి వంటి థీమ్‌ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్‌లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి.  ఫరాహాబాద్‌ సఫారీ మెుత్తం 16 కి.మీ. ప్రయాణం కాగా... 7 సీట్ల వాహనానికి రూ. 3 వేలు ఛార్జ్‌ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కి.మీ. ప్రయాణం కాగా.. వాహనానికి రూ. 5 వేలు, అక్కమహాదేవి గుహల సఫారీ 14 కి.మీ ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి.. 5 సీట్ల వాహనానికి రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు. 

    కిన్నెరసాని వన్య్రప్రాణి అభయారణ్యం (కొత్తగూడెం) 
    ఖమ్మం సమీపంలోని కొత్తగూడెంలో ఉన్న ఈ ప్రాంతం నీరు, పచ్చదనంతో అలరారుతుంటుంది. డీర్‌ పార్క్‌ (జింకల పార్క్‌), రిజర్వాయర్‌లో బోటింగ్‌ సౌకర్యం కలవు. ఇక్కడి ప్రకతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి కాటేజీలు అందుబాటులో ఉన్నాయి..  భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే సమయంలో వీటిని సందర్శించవచ్చు.  

    – బొల్లం శ్రీనివాస్‌, సాక్షి ప్రతినిధి, ఖమ్మం 

    (చదవండి: ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!)
     

  • పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్‌ నుంచి పెట్రోల్‌ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్‌లో ఉందో తెలసిందే హార్బూజ్‌ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్‌ పట్ల సముచితంగా ఇరాన్‌ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్‌లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్‌ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!

    బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం  ఉన్న వీడియోని నెట్టింట షేర్‌ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో  రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. 

    ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్‌ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్‌ షేర్‌ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. 

    ఆలయ చరిత్ర
    చారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో  నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. 

    ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు ‍నిదర్శనం ఈ కట్టడం. 

    స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక​ విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. 

    ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్‌లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ ,  బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.

    ఆ ఆలయంలో పాటలు..

    ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)
    ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)
    ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)
    దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)
    హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)
    నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)
    ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక)

     

    (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)

     

Politics

  • దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. 

    మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు.  ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే.  కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. 

    ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  కీలక మంత్రి లోకేశ్‌లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని  చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్‌ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు  పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే  కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర  సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ  ఆ ఊసే ఎత్తడం లేదు. 

    ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్‌ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు  లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. 

    ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం  వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు  చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. 

    అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి  ప్రాంతాలలో నివసిస్తున్న  మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం  హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. 

    ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్  స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల  వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు.  కేవలం ప్రభుత్వ  వాహనాల వినియోగం తగ్గించడం వల్ల  ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్  కనుక ఆయిల్ పై ఉన్న  పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది.  అప్పుడు ప్రభుత్వాన్ని కూడా  అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. 

    కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి.  ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం  ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు  వచ్చాయి కదా!. 

    తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు.  కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష  వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు  రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం  లేదని చంద్రబాబు  పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్,  ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త  భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో  రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు  వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. 

    అమరావతి నిర్మాణాలలో  భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్‌ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే  పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో  ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న  దుబారాను  అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. 

    :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.