Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పొట్టిలంకలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కలిసి మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఎన్జీటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్ 147లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ గర్భానికి తూర్పు పొడుస్తూ తవ్వకాలు జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

    దొంగ పట్టాలు సృష్టించి మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీ మట్టి ఒక్కొక్కటి రూ.14,000కి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మట్టి మాఫియా ఇంతగా చెలరేగిపోతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం మౌనంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే దిశగా తక్షణ చర్యలు అవసరమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

  • విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు చేసింది. ఇవాళ (మార్చి 24న) రూ.3,900 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరణ చేసుకుంది. గత మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. 

    వారం తిరగకుండానే మళ్లీ రూ.3,900 కో అప్పు తెచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ వన్‌గా ఏపీ తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పు రూ.3,37,221 కోట్లకు చేరింది. 22 నెలల్లోనే ఇన్ని కోట్ల అప్పు చేసింది. రూ.1,86,164 కోట్ల బడ్జెటరీ అప్పులు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.1,03,670 కోట్లు అప్పు, అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పులు తీసుకుంది.

  • తాడేపల్లి:  రూరల్‌ డెవలప్‌ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ)కి ఎఫ్‌సీఆర్‌ఏ((ఫారీన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యుల‌ర్ యాక్ట్‌) పర్మిషన్లు రెన్యువల్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు  కృతజ్ఞతలు తెలియజేశారు.

    ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో  కూడా చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్‌ జగన్‌. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

    చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్‌ జగన్‌.  క్రెడిట్‌ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.


     ఇదీ చదవండి:

    ఫలించిన వైఎస్సార్‌సీపీ పోరాటం

  • తాడేప‌ల్లి: వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించింది.. రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారీన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యుల‌ర్ యాక్ట్‌) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్‌సీపీ అనంత‌పురం జిల్లా నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌రువు జిల్లా అనంత‌పురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్ప‌ష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ  మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో అనంత‌పురం జిల్లా నేత‌లు ఇంకా ఏమ‌న్నారంటే..

    వైఎస్‌ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ప్ర‌జా ఉద్య‌మం: వెంక‌ట్రామిరెడ్డి
    కరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్‌ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవ‌లు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేర‌కు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. 

    ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన క‌ళ్యాణ‌దుర్గం నుంచి పోరాటం మొద‌లు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాద‌యాత్ర‌కు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండ‌గా నిలిచిన‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి, స‌హ‌క‌రించిన ప్ర‌జా సంఘాలు, జిల్లా ప్ర‌జ‌ల‌కు అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

    క్రెడిట్‌ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్
    రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్‌ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్‌ చోరీ వారికి అలవాటైందని చ‌ర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్‌ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్న‌ది కూట‌మి నేత‌లు మ‌ర‌చిపోయారు.  ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

    కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం
    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాల‌ని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్‌ చోరీకి పాల్పడటం విడ్డూరం.  ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని సాకె శైల‌జ‌నాథ్ స్ప‌ష్టం చేశారు.

    వైఎస్‌ జ‌గ‌న్ ఆశీస్సులు..ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో విజ‌యం: తలారి రంగయ్య
    రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్‌లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్‌ జగన్‌ ఆశీస్సుల‌తో పోరాటాన్ని కొన‌సాగించి విజ‌యం సాధించాం.  అనంత‌పురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్‌లో పార్టీ ఎంపీల‌తో క‌లిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.

    ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని త‌లారి రంగ‌య్య‌ పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయ‌న స్పష్టం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: రేపు(మార్చి 25, బుధవారం) అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. ప్రజా‌ సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

  • ఢిల్లీ: రాజమండ్రి కల్తీ పాలన ఘటనను రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రస్తావించారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో కల్తీ పాలతో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాల కల్తీని అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌ఏఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. కల్తీ పాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. లాలాపేటలో కల్తీ పాల వల్ల 16 మంది చనిపోయారని ఆయన తెలిపారు. నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్‌ ల్యాబ్‌లకు పంపించాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

    శ్వేత విప్లవం మన దేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఏదైనా వస్తువు కొరత ఉన్నప్పుడే కల్తీ జరుగుతుందని, అది సమృద్ధిగా ఉన్నప్పుడు కాదని మనందరికీ తెలుసు. కానీ, ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతికరంగా, భారీ ఉత్పత్తి ఉన్నప్పటికీ, మన దేశంలో పాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది.

    ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యం, ఎందుకంటే శారీరక పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడే 10 రకాల పోషకాలు వాటిలో ఉన్నాయి. అంతేకాకుండా, మన శరీరం ఉత్పత్తి చేయలేని 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా వాటిలో ఉంటాయి. ప్రతి ఏడాది పలు కల్తీ కేసులు నమోదవుతున్నాయన్నారు.

    కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

International

  • పశ్చిమాసియా యుద్ధంలో చర్చల అంశం నడుస్తున్న వేళ ఇరాన్‌ ట్రంప్‌నకు భారీ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతుందని నూతన సైనిక సలహాదారు మెుహ్సెన్‌ రెజాయీ అన్నారు.   కంటికి బదులు తల తీసుకోవాల్సి వస్తుందని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

    ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య చర్చలు జరగనున్నాయని  దానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైనిక సలహాదారు మెుహ్సెన్‌ రెజాయి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు సమీపిస్తోంది: అమెరికాను రక్షించుకోవడానికి ఉన్న చివరి గడువు ముగిసిపోతోందని, ఈ ఊబి నుండి బయటపడటానికి ట్రంప్‌కు ఎక్కువ సమయం లేదని రెజాయీ పేర్కొన్నారు.

    అక్కడి ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ  "మీరు మా దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే, మా స్పందన 'కంటికి కన్ను' అన్నట్టుగా ఉండదు. కంటికి తలతీసే విధంగా ఉంటుంది  అమెరికా యుద్ధనౌకలను అరేబియా గల్ఫ్‌లో ముంచివేస్తాం, అమెరికా మెుత్తాన్ని స్తంభింపజేస్తాం " అని  హెచ్చరించారు.

    అమెరికాని ఇజ్రాయెల్ కుట్రపన్ని పావులా వాడుకుందని  'గ్రేటర్ ఇజ్రాయెల్' కల కోసం  ట్రంప్‌ను ఈ అక్రమ యుద్ధంలోకి నెట్టిందన్నారు, ప్రస్తుతం ట్రంప్ తన సైనిక కమాండర్లు మరియు ఇజ్రాయెల్ మధ్య అయోమయంలో ఉన్నారని విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడున్న యుద్ధం ముగియాలంటే ఇరాన్‌పై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇరాన్‌పై ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ చట్టపరమైన గ్యారెంటీ ఇవ్వాలని ఆయన తేల్చిచెప్పారు. 

  • ఇరాన్‌పై అమెరికా  ఇజ్రాయెల్‌  మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్‌ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సంచలనం  రేపింది.  అయితే ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్‌ తీసుకున్న యూ టర్న్‌కు  ముందు   ఏం జరిగింది అనేది ప్రపంచ  వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ‌ ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో  వార్‌కు బ్రేక్‌ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?

    20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్
    ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని  ట్రంప్‌ ప్రకటనకు కేవలం  15 నిమిషాల ముందే మార్కెట్‌లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్‌ రియాక్షన్‌ కేవలం  20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.

    న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.

    ట్రంప్‌ వార్‌ బ్రేక్‌ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్‌కు 88.70 డాలర్లను తాకింది.

    ఇరాన్‌పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.

    ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్‌ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.

    'అన్‌యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు.  మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్‌ను కొనుగోలు చేశారు.

    రెండో బెట్‌ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్‌ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.

    ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు
    ట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్‌తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం  ఎక్స్‌లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు   ఏం జరిగింది అనేదానిపై   కచ్చితంగా  ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.

    నికోలస్ మదురో అరెస్ట్‌కు ముందు కూడా
    అలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి  అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.

    కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే  దీని వెనుక  ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. 

    ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్‌ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్‌ మిస్టరీ

  • ప్రపంచంలోనే అత్యాధునిక అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35ను కూల్చివేసినట్టు ఇరాన్ ఈ నెల 19న ప్రకటించింది. ఈ వాదనే నిజమైతే ప్రపంచంలో ఆ ‘ఘనకార్యం’ చేసిన తొలి దేశం ఇరానే అవుతుంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఎఫ్-35 ఫైటర్ జెట్... అమెరికా మిలిటరీ పరాక్రమానికి రెండు దశాబ్దాల ప్రతీక. శత్రువులు కనుగొనలేని, ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా గుర్తించలేని స్టెల్త్ సామర్థ్యంతో దూసుకెళుతూ దాడులు జరిపేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

    రాడార్ సైతం గుర్తించలేని, శత్రువుల కంటబడని ఓ అమేయ ‘అదృశ్య శక్తి’గా విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఎఫ్-35 విమానానికి సంబంధించి కీలక బలహీనతను తాము కనిపెట్టినట్టు ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది. తాము సొంతంగా అభివృద్ధి చేసుకున్న ‘మాజిద్’  స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి ద్వారా అమెరికన్ ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చినట్టు పేర్కొంది.

    గమనంలో ఎఫ్-35 జెట్ వెలువరించే వేడి లేదా పరారుణ వికిరణం ఆధారంగా ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశామని తెలిపింది. రాడార్లకు దొరక్కుండా తప్పించుకునే సామర్థ్యం ఎఫ్-35కు ఉంటే ఉండొచ్చుగాక... ఇంజిన్ విడుదల చేసే వేడి పరంగా (హీట్ సిగ్నేచర్) మాత్రం అది పూర్తిగా శత్రువుల కళ్లుగప్పలేదని తేటతెల్లమైంది.

    ఎఫ్-35ను దెబ్బకొట్టడానికి తమ ‘తలాష్’ గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్టు తొలుత పేర్కొన్న ఇరాన్... వాస్తవానికి ‘మాజిద్’ (ఏడీ-08) స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో కేవలం ఒకేఒక క్షిపణితో ఆ కార్యం సాధించినట్టు తుది పరిశీలన అనంతరం ప్రకటించింది. శత్రు రాడార్ల సంకేతాలను నిలువరించేలా లేదా వాటిని చెల్లాచెదురు చేసేలా ఎఫ్-35లోని ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కానీ ఈ సందర్భంలో అవేవీ అక్కరకు రాలేదు. ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ 2021లో తొలిసారి ఆవిష్కరించింది. ఇది రాడార్ బదులు పరారుణ సాంకేతికతపై ఆధారపడుతుంది.

    ఎఫ్-35లపై స్పెయిన్ వెనుకంజ!
    ఎఫ్-35ను ఇరాన్ కూల్చివేసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సైనిక,  రక్షణ రంగాల నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గగనతలంలో ఎఫ్-35కు ఎదురేలేదని ఇన్నాళ్లూ కొనసాగిన ఏకధాటి భావనను తాజాగా సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’కు ఎఫ్-35 సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిణామం పలు దేశాలను ఇప్పుడు పునరాలోచనలో పడవేయనుంది. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ లాక్ హీద్ మార్టిన్ తయారుచేసిన ఐదో తరం ఎఫ్-35 స్టెల్త్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను స్పెయిన్ ప్రభుత్వం ఏడాది క్రితమే అటకెక్కించింది.

    2030 నాటికి తమ హారియర్ ఏవీ8బీ ఫైటర్లను తప్పించి వాటి స్థానంలో నేవల్ వెర్షన్ అయిన ఎఫ్-35బి జెట్స్ మోహరించేందుకు స్పెయిన్ నౌకాదళం తొలుత ఆసక్తి చూపినా చివరకు వెనకడుగు వేసింది. ఎఫ్సీఏఎస్ (ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్) రూపొందించే ఆరో తరం యుద్ధవిమానాల కోసం నిరీక్షించాలని, అవి అందుబాటులోకి వచ్చేవరకు తమ మెక్ డానెల్ డగ్లస్ ఎఫ్/ఏ-18 హార్నెట్స్ స్థానంలో ఎఫ్-35ఏ యుద్ధవిమానాలను తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని స్పెయిన్ వైమానికదళం కూడా భావించింది.

    తమ నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాల రీత్యా పాత విమానాలను డీకమిషన్ చేసి వాటి బదులు ఎఫ్-35లను ప్రవేశపెట్టడానికి స్పెయిన్ తన 2023 బడ్జెట్లో 6.25 బిలియన్ యూరోలను (సుమారు రూ.68 వేల కోట్లు) ప్రాథమికంగా కేటాయించింది. ప్రస్తుతం ఆ ప్రణాళికలు మూలనపడ్డాయి. ఎఫ్-35ల బదులు ఎయిర్ బస్ నేతృత్వంలోని సంస్థలు తయారుచేసే ‘యూరోఫైటర్’ జెట్స్ కొనాలని స్పెయిన్ తలపోస్తోంది.

    ఫ్రెంచ్ రఫేల్ వైపే భారత్ మొగ్గు!
    ఇరుదేశాల రక్షణ బంధం బలోపేతం దిశగా ఎఫ్-35 యుద్ధవిమానాలను ఇండియాకు అమ్ముతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఆఫర్ ఇచ్చారు. వేరియంట్ ఆధారంగా ఒక్కో ఎఫ్-35 ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఎఫ్-35లో ఎ, బి, సి అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్-35ఎ రకం జెట్ టేకాఫ్, ల్యాండింగ్ సాధారణ విమానాల మాదిరిగా ఉంటుంది. దీనికి పొడవైన రన్ వే కావాలి.

    ఎఫ్-35బి వెర్షన్ అయితే అతికొద్ది రన్ వేతో పైకి లేచి నిట్టనిలువుగా కిందికి దిగగలదు. ఇక ఎఫ్-35సి అనేది... విమాన వాహక నౌకల (నేవీ క్యారియర్ బేస్డ్) కార్యకలాపాల్లో వాడే వేరియంట్. ఎఫ్-35లను కొనబోమని భారత్ గతంలోనే స్పష్టీకరించింది. తమ వైమానిక దళ అవసరాల కోసం రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధవిమానాలను సేకరించే ప్రతిపాదనను భారత్ ఇటీవల ఆమోదించింది.

    అదే బాటలో స్విట్జర్లాండ్, కెనడా!
    అమెరికన్ ఎఫ్-35 జెట్స్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ స్విట్జర్లాండులోనూ నిరుడు  డిమాండ్లు ఊపందుకున్నాయి. 36 ఎఫ్-35ఎ విమానాలను కొనాలని స్విట్జర్లాండ్ మొదట్లో భావించింది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర కారణాల రీత్యా ధర పెరిగినందున అన్ని జెట్స్ కొనలేమని, ఆరు విమానాలను తగ్గించి 30 మాత్రమే ఎఫ్-35లను కొనుగోలు చేస్తామని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ ఈ నెల 6న వెల్లడించింది.

    ఇక కెనడా విషయానికొస్తే 16 ‘ఎఫ్-35ఏ లైట్నింగ్ 2’ విమానాల కోసం తొలుత ఆర్డర్ ఇచ్చింది. అవి త్వరలో అందుతాయి. అదనంగా మరో 14 ఎఫ్-35ల కొనుగోలుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. అయితే విమానాల ధర పెరగడం, అమెరికాతో రాజకీయ-వర్తక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని కెనడా ప్రభుత్వం మరిన్ని ఎఫ్-35లను కొనాలా? వద్దా? అని ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతోంది. ‘హీట్ సిగ్నేచర్’ బలహీనతను కనిపెట్టి ఇరాన్ కొట్టిన ఉండేలు దెబ్బకు భవిష్యత్తులో ఎఫ్-35లకు గిరాకీ తగ్గి కొనుగోలు మార్కెట్ డీలా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భలే మంచి చౌక బేరం తప్పదా?!
    - జమ్ముల శ్రీకాంత్

    (Credits: The Wall Street Journal, MSN, Reuters, Politico, The Hill)

  • టోక్యో: జపాన్‌లో ఇటీవలి  కొత్త ఆవిష్కరణ విశేషంగా నిలుస్తోంది. 1982 తర్వాత జపాన్‌లో గుర్తించిన  మొట్ట మొదటి కొత్త పక్షి జాతిగా శాస్త్రవేత్తలు టోకారా లీఫ్ వార్బ్లర్‌ను గుర్తించారు దాదాపు 45 ఏళ్ల తర్వాత జపాన్‌లో గుర్తించిన మొదటి కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. పక్షుల శాస్త్రీయ అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అంటూ కొత్త అతిథి రాకపై హర్షం  వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలు చూద్దామా...

    శాస్త్రవేత్తలు జపాన్‌లోని టోకారా దీవుల్లో 'టోకారా లీఫ్ వార్బ్లర్' (Phylloscopus tokaraensis) అనే కొత్త పక్షి జాతిని కనుగొన్నారు. డాక్టర్ కెంటా మోరిషిత నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణ చేసింది. ఆధునిక సాంకేతికత (జన్యు పరిశోధన) అందుబాటులోకి రావడంతో ఎప్పుటినుంచో మన కళ్ల ముందే ఉన్నా గుర్తించ లేక పోయిన జీవులను ఇప్పుడు కనిపెట్టడం సాధ్యమవు తోందని నిపుణులు చెబుతున్నారు.

    టోకారా లీఫ్ వార్బ్లర్ (Tokara Leaf Warbler) విశేషాలు
    జన్యు అధ్యయనాలు దీనిని ఒక కొత్త జాతిగా నిర్ధారించాయి. ఈ పక్షి కేవలం మారుమూల టోకారా దీవులలో మాత్రమే, అక్కడి దట్టమైన అడవుల్లో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది చూడటానికి 'ఇజిమాస్ లీఫ్ వార్బ్లర్' (Phylloscopus ijimae) అనే పక్షిని పోలి ఉంటుంది. ఇవి చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి.  ఈ పక్షి  పొడవు సుమారు 10–12 సెంటీమీటర్లు, బరువు కేవలం 6–9 గ్రాములు మాత్రమే ఉంటుంది.

    జన్యు పరిశోధన ఒక గేమ్-ఛేంజర్
    సాధారణంగా, పక్షుల గుర్తింపు వాటి రూపాన్ని బట్టి ఉంటుంది.  ఈ పక్షి చూడటానికి పాత జాతిలాగే ఉన్నప్పటికీ, DNA (జన్యు)  సీక్వెన్సింగ్  అది పాడే పాట విధానం (Song patterns) ద్వారా ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  ఈ పక్షుల జనాభా చాలా తక్కువగా ఉంది. అడవుల నరికివేత మరియు వాతావరణ మార్పుల వల్ల వీటికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

    జపాన్‌లోని ద్వీపాలు  జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయని, జాగ్రత్తగా చేసే పరిశోధనలతో వాటిని కనుక్కోవచ్చు అనేది మనకు గుర్తు చేస్తుందని ఈ కొత్త పక్షి జాతి ఆవిష్కరణలో ప్రముఖ పరిశోధకులలో ఒకరైన డాక్టర్ కెంటా మోరిషితా అన్నారు.
     

Family

  • ఒకప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు తహతహలాడేవారు. అయితే ఇప్పుడు ఎండల్ని తప్పించుకోవడానికి చల్లని చోటుతో పాటు అక్కడ రద్దీ కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఊటీ, కొడైకెనాల్, మునార్‌ తదితర పేరొందిన హిల్‌ స్టేషన్లు విపరీతమైన పర్యాటక రద్దీని ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో... అంతగా ప్రాచుర్యం లేని సరికొత్త గమ్యస్థానాలు  ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం...

    పర్వ‘తవాంగ్‌’...
    అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని తవాంగ్‌ తూర్పు హిమాలయాలలో ఎతై ్తన ప్రదేశంలో ఉన్న ఒక అద్భుతమైన, ఏకాంతమైన, ప్రశాంతమైన ప్రాంతం. ఏప్రిల్‌ నాటికి, ఈ ప్రాంతంపై శీతాకాలపు పట్టు క్రమంగా సడలుతుంది. మంచు కరగడం, చుట్టుపక్కల కొండలను కప్పివేసేలా రోడోడెండ్రాన్‌ పువ్వులు విపరీతంగా పూయడంతో, నిర్మలమైన ఆకాశం సందర్శకులకు పర్వతాల సౌందర్యాన్ని కళ్లు ముందుకు తెస్తుంది.  ఎతై ్తన ప్రదేశంలో ఉన్న సేలా కనుమ గుండా ప్రయాణిస్తున్నప్పుడు, గడ్డకట్టిన సరస్సులు  ఎడమ, కుడి వైపులా దర్శనమిచ్చి తవాంగ్‌కు చేసే ప్రయాణాన్ని మరువలేనిదిగా మారుస్తాయి. భారతదేశంలోనే అతి పెద్దదైన, లోయ అంచున ఉన్న తవాంగ్‌ మఠం ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, తగిన అనుమతితో, తవాంగ్‌ను సందర్శించేవారు భారత్‌/చైనా సరిహద్దులోని బుమ్లా పాస్‌కు రమణీయమైన ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది, మార్గమధ్యంలో అద్భుతమైన మాధురి సరస్సు అందాలను ఆస్వాదించవచ్చు.

    ‘కల్ప’ న కాదు...కమనీయం...
    హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కిన్నౌర్‌ ప్రాంతంలోని ఒక చిన్న హిమాలయ గ్రామమైన కల్పలో జీవనశైలి చాలా నిదానంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలతో నిండిన కిన్నౌర్‌ కైలాష్‌ శ్రేణి   ఈ ప్రదేశాన్ని అద్భుతంగా మార్చే అంశాలలో ఒకటి. వసంతకాలం రాకతో, లోయ అంతా ఆపిల్‌ పూలతో నిండిపోతుంది, ఏప్రిల్‌ నెల కల్పలో గడపడానికి చాలా చాలా సరైన సమయం. అక్కడ ఉన్నప్పుడు,  ప్రశాంతమైన గ్రామ వీధుల్లో నడవవచ్చు, నారాయణ నాగిని ఆలయాన్ని (ఒక చారిత్రక ప్రదేశం) సందర్శించవచ్చు,  సంగ్లా లోయ, చిత్కుల్‌ వంటి స్థానిక లోయల గుండా ప్రయాణించవచ్చు. ఇక్కడ అద్భుతమైన ఆల్పైన్‌ ప్రకృతి దృశ్యాలు, అందమైన నదులు  సాంప్రదాయ చెక్క ఇళ్ళు ఆకట్టుకుంటాయి.

    అందమైన దృశ్యమ్‌...యుక్సోమ్‌...
    యుక్సోమ్‌ ఒక ప్రశాంతమైన పర్వత పట్టణం, ఇది ఒకప్పుడు సిక్కింకు మొదటి రాజధానిగా ఉండేది. నేడు, ఇది హిమాలయాల్లోని అనేక ట్రెక్కింగ్‌  రూట్లకు ప్రారంభ స్థానంగా ప్రసిద్ధి చెందింది. ఏప్రిల్‌ నెలలో, కొండ వాలుల వెంబడి రోడోడెండ్రాన్‌ పువ్వులు వికసించడంతో పట్టణం చుట్టూ ఉన్న అడవులు రంగుల మయంగా మారిపోతాయి,  చల్లని వాతావరణం బహిరంగ ప్రదేశాల సందర్శనను మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఆ రాష్ట్రంలోని పురాతన మఠాలలో ఒకటైన చారిత్రాత్మక దుబ్ది మఠాన్ని సందర్శించవచ్చు  ప్రశాంతమైన జలపాతాలకు దారితీసే అటవీ మార్గాలలో విహరించవచ్చు. చాలా మంది ట్రెక్కర్లు ప్రసిద్ధ గోయెచా లా ట్రెక్‌కు యుక్సోమ్‌ను బేస్‌గా కూడా ఉపయోగిస్తారు, ఇది కాంచన్ జంగాకు చెందిన అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది.

    పచ్చని తివాచీ..జీరో వ్యాలీ..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఉన్న జీరో లోయ హిమాలయాల్లోని చాలా ప్రదేశాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎతై ్తన పర్వతాలకు బదులుగా, ఇది చుట్టూ ఉన్న కొండలు  పొడవైన పైన్‌ చెట్లతో కూడిన విశాలమైన వరి పొలాలను కలిగి ఉంది. ఇక్కడ అపటాని అనే గిరిజన తెగ నివసిస్తుంది, వీరికి సుస్థిర వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది.  సమీప గ్రామాలకు వెళ్లడానికి, చెక్క వంతెనలను దాటడానికి పరుచుకున్న పచ్చదనాన్ని  చూడటానికి ఇక్కడ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఏప్రిల్‌ నెలలో సగటు ఉష్ణోగ్రత మితంగా ఉండి, పచ్చిక బయళ్ళు సమృద్ధిగా కనిపిస్తాయి.

    హిమ‘ఆలయ’పట్టణం..చోప్టా
    ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చోప్టా  చెట్లు  పొడవైన మంచుతో కప్పబడిన శిఖరాలతో కూడిన ఒక చిన్న హిమాలయ పట్టణం. ఏప్రిల్‌లో వసంతకాలం సమీపిస్తున్న కొద్దీ, నిర్మలమైన నీలాకాశం చౌఖంబా శిఖరాల మీద అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.  చాలా మందికి, ఈ యాత్రలో అత్యంత ఆకర్షణీయమైన భాగం, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివాలయాలలో ఒకటైన తుంగనాథ్‌ ఆలయానికి చేసే ట్రెక్కింగ్‌. ఆలయానికి చేరుకోవడానికి ట్రెక్కింగ్‌ ఎక్కువ దూరం ఉండదు; అయినప్పటికీ, ఆలయానికి వెళ్లే మార్గంలో దట్టమైన అడవులు  పచ్చని ఆల్పైన్‌ పచ్చిక బయళ్ల గుండా వెళుతుంది కాబట్టి, ఇది అద్భుతమైన ట్రెక్కింగ్‌గా పేరొందింది.

    ఈశాన్య పుష్ప..జుకౌ లోయ
    మణిపూర్‌–నాగాలాండ్‌ జుకౌ లోయ  ఎగుడుదిగుడుగా ఉండే పచ్చని కొండలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి విశాలమైన ప్రదేశాలు ప్రకృతి తరంగాలు భూభాగంపై కదులుతున్నట్లుగా అనిపిస్తాయి. ఈ లోయకు వెళ్లే ప్రయాణంలో బేస్‌ విలేజ్‌ నుంచి ఒక చిన్న, నిటారుగా ఉండే ట్రెక్కింగ్‌ కూడా ఉంటుంది, ఇది మార్గమధ్యంలో అదనపు సాహసాన్ని జోడిస్తుంది.  జుకౌ లోయకు చేరుకున్న తర్వాత, పచ్చని పొలాలు, ప్రశాంతమైన సెలయేళ్లు  చుట్టుపక్కల పర్వత శ్రేణులతో ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతాయి. ‘ఈశాన్య పుష్ప లోయ‘గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, ఏప్రిల్‌ నెలలో సందర్శించడానికి అత్యంత అనువైనది.

    నుబ్రా లోయ, లడఖ్‌
    లడఖ్‌లోని నుబ్రా లోయ అత్యంత విశిష్టమైన ప్రకృతికి నిలయంగా  చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మోటారు వాహనాలు వెళ్ళడానికి వీలైన అత్యంత ఎతై ్తన కనుమలలో ఒకటైన ఖార్దుంగ్‌ లా కనుమ మార్గం ద్వారా నుబ్రా లోయను చేరుకోవచ్చు. నుబ్రా లోయలో చల్లని ఎడారి దిబ్బలు, మంచుతో కప్పబడిన శిఖరాలు  ష్యోక్‌ నది ఒడ్డున పచ్చని గ్రామాలు ఉన్నాయి.  లోయను వీక్షిస్తున్నట్లుగా ఉండే మైత్రేయ బుద్ధుని పెద్ద విగ్రహం గల డిస్కిట్‌ మఠాన్ని సందర్శించడం ఓ వినూత్న అనుభూతి. డు్ర¯Œ లో  హండర్‌ ఇసుక దిబ్బను కనుగొనవచ్చు. మరో ప్రత్యేకత ఏమిటంటే, రెండు మూపురాలు గల బాక్ట్రియన్‌ ఒంటెలు ఈ ఎడారి ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతాయి.

  • కేకు కావచ్చు.. పూతరేకు కావచ్చు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఆధునిక చెఫ్స్‌. తినిపించడానికి ముందు కనిపించే విధానంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. నోరూరించే రుచులను చూడగానే ఆకట్టుకునే కళా నైపుణ్యాన్ని అద్దుతున్నారు. అదే విధంగా తాను సృష్టించిన పేస్ట్రీలకు అచ్చమైన పండ్ల రూపాలను అందిస్తూ అంతర్జాతీయంగా వైరల్‌ అయ్యాడు పారిస్‌కు చెందిన ఓ ప్రముఖ చెఫ్‌. ఇప్పుడు ఆయన సృష్టించిన పండ్ల తరహా డిజర్ట్స్‌ భాగ్య నగరానికి కూడా వచ్చేయడం విశేషం. 

    సోషల్‌ మీడియా పుణ్యమాని ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. దుబాయ్‌లోని కునాఫా చాక్లెట్‌ నుంచి టోక్యోలోని మెత్తటి పాన్‌కేక్స్‌ వరకు ఖండాలను దాటి తరలివస్తున్న ఆహార ధోరణులను  మనం నగరంలోనూ చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలో సిటీకి వచ్చేసింది పారిస్‌ డిజర్ట్‌. పండ్ల ఆకారాన్ని పోలిన ఇవి చూసేందుకు కూడా పండ్లలా కనిపిస్తాయి. పేస్ట్రీ కళలోని నైపుణ్యాన్ని మనసుకు హత్తుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. 

    ఫ్యాషన్‌ క్యాపిటల్‌ నుంచి.. 
    పారిస్‌ అనగానే ఫ్యాషన్‌ ప్రియుల కలల చిరునామా అని తెలిసిందే. మన డిజైనర్లకు అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం అంటే జీవితకాలపు కల సాకారం కావడమే. అలాంటి వస్త్రశైలి గురించి మాత్రమే చర్చలు చేసే సిటీ.. తొలిసారి అక్కడి డిజర్ట్స్‌ గురించి కూడా మాట్లాడుతోంది. దీనికి కారణం అక్కడి ప్రసిద్ధ పేస్ట్రీ మేకింగ్‌ చెఫ్‌ సెడ్రిక్‌ గ్రోలెట్‌ సృష్టించిన పండ్ల ఆకారపు స్వీట్లు.ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

    డిజర్ట్‌ ట్రెండ్‌.. 
    నిమ్మకాయలు, ఆపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్‌.. ఇలా అనేక రకాల పండ్ల రూపాలకు ప్రతి సృష్టి చేస్తున్నారు. అచ్చం ఆయా ఫలాలను పోలిన రూపంలో సృష్టించిన డిజర్ట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా మారడానికి కారణం నిజమైన పండ్లలా అనిపించే వాటి రూపం మాత్రమే కాదు, రుచి కూడా. ఈ డిజర్ట్స్‌లో మూస్, కంపోట్, స్పాంజ్, చాక్లెట్‌ పొరలు రుచికరమైన ఆకృతులను సమతుల్యం చేశాయి. తద్వారా ఆధునిక పేస్ట్రీ వైవిధ్యానికి అంతర్జాతీయ చిహ్నంగా ఇవి  మారాయి.

    నగరానికి వచ్చేశాయ్‌.. 
    అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకున్న ఈ పండ్ల ఆకారపు డిజర్ట్స్‌ ఇప్పుడు నగరంలోనూ సందడి చేస్తున్నాయి. బహుళ పొరలను ప్రదర్శించే ఈ స్వీట్‌ శిల్పాలను తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్‌లోని నోమ్‌ కేఫ్‌ వంటి పేరున్న కేఫ్స్‌ అందిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా పర్షియన్‌ చెఫ్‌లను సైతం తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్‌ డిజర్ట్స్‌ మెనూలో రాస్‌బెర్రీ, ఆర్కిటిక్‌ బ్లిస్‌ బెర్రీ, హాజెల్‌నట్, గ్రీన్‌ ఆపిల్, కొబ్బరి, బొప్పాయి, క్రౌన్‌ పియర్‌ వంటి రుచులు నగరంలో కొలువుదీరాయి.  

    (చదవండి: అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్‌..! కానీ 17 కిలోమీటర్లు..)

  • మనుషులే కాదు జంతువులు కూడా తమ ప్రాణాలు కోసం ఎంతలా పోరాడతాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. సినిమాని తలపించే ట్విస్ట్‌లు, ఛేజ్‌లతో ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ పెంపుడు కుక్కల కథ వింటే..విస్తుపోతారు. అంతేగాదు ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యం కలుగకమానదు. 

    అసలేం జరిగిందంటే..చైనాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ ఏడు పెంపుడు కుక్కలు..తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చేసిన సాహనం నెట్టింట వైరల్‌గా మారి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆ ఏడు కుక్కలు..కుక్కల మాంసం విక్రయించే కొందరు వ్యక్తుల ముఠా నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాయి. ఓ ట్రక్కు సాయంతో తీసుకుపోతున్న ఆ వ్యక్తుల బారీ నుంచి చాలా తెలివిగా బయటపడటమే కాకుండా..అవి ఒక బృందంగా వచ్చిన తీరు అమితంగా ఆకట్టుకుంటుంది. 

    ఆ కుక్కలను ఒకతాటిపై నడిపించేలే కోర్గి జాతీ కుక్క నాయకత్వం వహించగా మిగతా కుక్కలా దాని బాటలో నడవడం గమనార్హం. హైవేల మీదుగా..సుమారు 17 కిలోమీటర్లు నడిచి తమ ఓనర్‌ ఇంటికి నేరుగా వచ్చేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

    అయితే వాటిలో ఒక జర్నమ్‌ షెపర్డ్‌ కుక్క గాయపడగా..దానికి రక్షణ కల్పించేలా గుంపుగా నిలబడి హైవేల గుండా జాగ్రత్తగా రోడ్డుదాటుతూ తమ ఇంటికి తిరిగి వెళ్లిపోవడం విశేషం. అయితే స్థానికులు మాత్రం అవన్నీ ఎక్కడకు వెళ్లినా..కలిసే వెళ్తాయని వెల్లడించడం గమనార్హం.

     

    (చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)

     

  • కొన్ని వెయిట్‌లాస్‌ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.

    అరుణాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్‌ సోకి యెకర్‌ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. 

    సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్‌ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్‌కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్‌గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. 

    అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్‌గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్‌గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్‌ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్‌ అనేశారు. 

    పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్‌లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్‌గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల  నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్‌ప్రదేశ్‌ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్‌ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్‌. 

    ఫిట్‌నెస్‌ జర్నీ మొదలైందిలా..
    తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్‌లాస్‌ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్‌గా మారానని సంతోషంగా చెబుతోందామె. 

    సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్‌డ్‌గా కనిపిస్తున్నావ్‌.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్‌ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్‌ అనుహ్యమైన టర్న్‌ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్‌ సోకి యెకర్‌.

     

    (చదవండి: దంపతుల ఫిట్‌నెస్‌ కోసం..! మిలింద్‌ సోమన్‌ టిప్స్‌)
     

  • సోషల్‌ మీడియా పుణ్యామా కొన్ని హాస్యభరితమైన సన్నివేశాలు, సంఘటనలు క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇదేం విడ్డూరం అని అంతా అనుకునేలా ఆ ఘటనలు కాసింత ముఖంపై నవ్వులు మెరిపిస్తున్నాయి. అలాంటి ఫన్నీ వైరల్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదికూడా ఓ వధువుకి సంబంధించింది కావడంతో ఏమ్మా ఆ టైంలో కూడా ఇదేంటని అంతా తలోమాట అనుకునేలా చేసిన ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు.

    ఈ వీడియోని సాంచి-శివం అనే దంపతులు నెట్టింట పంచుకున్నారు. ఆ వీడియలో వధువు పూర్తి పెళ్లి కూతురి దుస్తులో కారులో కూర్చొని కనిపిస్తుంది. ఆమె ఫోన్‌తో ఉద్యోగ దరఖాస్తు కోసం ఈమెయిల్‌ని పంపుతూ కనిపిస్తోంది. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం జరుగుతున్న రోజునే ఆమె ఈ పనిలో బిజీగా ఉండటం కాసింత ఆగ్రహం, నవ్వు తెప్పించేలా ఉంటుంది. 

    కానీ ఆ వధువు మాత్రం పెళ్లి దుస్తుల్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో జాబ్‌కి దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇది జీవితంలోని ముఖ్య ఘట్టాలను, వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకోవడానికి తరుచుగా ఇబ్బందిపడే చాలామంది యువనిపుణులకు ఈ ఘటన ఓ చక్కటి సందేశానిచ్చేలా ఉంది కదూ.!. 

    అంతేగాదు సాధారణంగా పెళ్లిళ్లు అంటే అట్టహాసమైన ఆచారాలు, వేడుకలతో ముడిపడి ఉన్నప్పటికీ..జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో కొన్నిసార్లు ఉద్యోగ బాధ్యతలు ఎలా ప్రాధాన్యత సంతరించుకుంటాయో ఈ క్లిప్‌ హాస్యభరితంగా చూపిస్తోంది. ఈ వీడియోకి "పెళ్లికూతురి మోడ్ ఆన్, హస్టల్‌ మోడ్ నెవర్ ఆఫ్" అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

     

    (చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!)
     

Telangana

  • హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి  లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు  925.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్‌లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 

    ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

    ఈవి పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై  ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్  వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

    రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవి వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు.ఈవి వాహనాలకు  ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో  వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

    సీఎస్‌ రామకృష్ణ రావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సీఎస్‌ పేర్కొన్నారు. నగరం లో ఈవిబిబస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.EVS

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మియాపూర్‌, చందనగర్‌లో కుండపోత వర్షం పడింది. కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, షాపూర్‌, చింతల్‌లో భారీ వర్షం కురవగా, మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన పడింది. వానవెలిసే వరకు మెట్రో పిల్లర్ల కింద కొందరు వాహనాలను కాసేపు ఆపే ప్రయత్నం చేశారు.

    కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో గాలివానతో పాటు పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. 

  • హైదరాబాద్‌: డిలిమిటేషన్‌లో మహిళా రిజర్వేషన్‌ అనేది 33 శాతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. జనగణన అనంతరం డిలిమిటేషన్‌ జరుగుతుందన్నారు. జనాభా , ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని, ఒకవేళ అలా జరిగితే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల సీట్లు పెరగవన్నారు రాంచందర్‌రావు. 

    ‘ఇక్కడ 8 వేలు ,10 వేలు జనాభా ఉన్న సీట్లు ఉన్నాయి.  జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని కాంగ్రెస్ చేసే ఆరోపణలో నిజం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు. ఉత్తరాదికి పెరిగిన ప్రపోషన్ ఆధారంగా దక్షిణాదిన సీట్లు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ లు మతం మార్పిడి చేస్తే రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 

    ప్రలోభాలకు గురి చేసి మతం మార్చుకుంటున్నారు. మత మార్పిడిల వల్ల ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ తో ఎస్సీ ఎస్టీ లకు అందాల్సిన సరైన ఫలాలు అందుతాయి’ అన్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును కేబినెట్‌ ఆమోదించింది.

    తెలంగాణ కేబినెట్‌ నిర్ణయంపై  సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఎక్స్‌ వేదికగా కొనియాడారు.

    ‘చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.

    ‘దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్‌లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.

    వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.

    ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని పేర్కొన్నారు. 
     

     

     

     

Politics

  • తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.

    ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.

    స్వాతంత‍్య్రానంతరం వేగంగా అభివృద్ధి  
    రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత‍్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. 

    ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.

    ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. 

    ప్రతికూల అంశాలు ఇవే.. 
    పవర్‌లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.

    ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్‌కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్‌లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది.  -వెబ్‌డెస్క్‌

     

  • తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?

    అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. 

    కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.

    అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. 

    ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.

    అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు.  -వెబ్‌డెస్క్‌

     

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. 

    కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది.

    "పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  

    మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

    • ఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం"    

    • రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలు

    • ఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటన

    • మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం 

    • ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు 
       

  • ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్‌లో పత్తర్‌గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్‌ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్‌లో ముక్కోణపు పోరు మొదలైంది.

    ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్‌కు ప్రతికూలాంశంగా మారుతోంది.

    ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్‌లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..!

     

  • హైదరాబాద్‌: నియోజకవర్గాల డిలిమిటేనేషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. డిలిమిటేషన్‌ అనేది ఎప్పుడో జరగాలని, ఇ‍ప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ  పునర్విభజన హామీ ఉందన్నారు కేటీఆర్‌. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ పార్లమెంట్‌లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. 

    కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్‌తో ఈ వ్యత్యాసం పోతుంది’ అని అన్నారు కేటీఆర్‌

    ఇక ఫార్ములా రేస్‌ కేసు గురించి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల డైవర్షన్‌ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్‌షీట్‌. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్‌షీట్‌ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్‌ కేసు లొట్టపీస్‌ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్‌ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. 

    కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి‌ చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్‌ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్‌కు పంపేది కోర్టులు.. రేవంత్ రెడ్డి కాదు’ అని పేర్కొన్నారు. 

  • విజయవాడ:  తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. 

    జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. 

  • తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్‌లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

    ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్‌ పేర్కొంది. అఫిడవిట్‌లో రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

    ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.

    కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి. 

     

  • ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్‌లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?

    ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్‌లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.

    బ్లాకులో గ్యాస్‌ను కొనే స్తోమతలేదు
    టీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్‌ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్‌ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

    మెనూలోంచి  దోశ, బోండా ఔట్
    మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్‌ పరిధిలో ఉన్న మావూర్ రోడ్‌లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.   - వెబ్‌డెస్క్‌

     

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్‌ మండిపడ్డారు.

    ‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్‌ఛార్జ్‌ తలారి రంగయ్య అమిత్‌షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.

  • సాక్షి, విశాఖపట్నం: తాము చేయని పనుల్ని కూడా చేశామంటూ అబద్ధాల ప్రచారాలు చేసుకోవడం కూటమి సర్కార్‌కు అలవాటుగా మారిపోయిందని.. నిన్న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, పరిశ్రమలశాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆక్షేపించారు. గతంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ వంటి పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకు రావడానికి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తే.. పరిశ్రమల్ని తరిమేస్తున్నారంటూ దుష్ప్రచారాలు చేసిన కూటమి పార్టీలు.. ఇప్పుడు 24 నెలల్లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలపై శ్వేతపత్రం ప్రకటించగలరా? అంటూ గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏమన్నారంటే..:

    కూటమి ప్రభుత్వం మరో క్రెడిట్‌ చోరీ:
    మనం సాధించలేని ఘనత గురించి మనమే సాధించినట్లు చెప్పుకోవచ్చనే దానికి నిన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ శంఖుస్ధాపనే ఉదాహరణ. చంద్రబాబు, లోకేష్, మంత్రులు పరస్పరం భజన చేసుకున్నారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ ఈ రాష్ట్రానికి రావడానికి పునాదులు వేసింది 2022లో నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అనేది ఒకసారి వీళ్లంతా గుర్తుచేసుకోవాలి. విశాఖలో ఆర్సెలార్‌ మిట్టల్‌ టేకోవర్‌ చేసుకున్న ఎస్‌ఆర్‌ ప్లాంట్‌ విస్తరణ కోసం దావోస్‌లో జగన్‌గారితో లక్ష్మీ మిట్టల్‌ కుమారుడు ఆదిత్యమిట్టల్‌ ఒప్పందం చేసుకున్నారు.

    దీంతో పాటు కర్నూలులో గ్రీన్‌ కో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకూ అదే సమయంలో ఒప్పందం జరిగింది. ఆ విద్యుత్‌ ప్రాజెక్టులో ఆర్సెలార్‌ భాగస్వామి అయింది. ఈ పెట్టుబడులతో పాటు కొత్త స్టీల్‌ ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేయాలని జగన్‌గారు కోరడంతో మిట్టల్‌ సముద్ర తీరం వెంట భూములు కేటాయిస్తే తప్పకుండా ప్లాంట్‌ పెడతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, నేను కూడా ఉన్నాం. మిట్టల్‌ సంస్థకు భూమి కేటాయించాలని జగన్‌ చెబితే.. మేం కాకినాడ, మూలపేట పోర్టు, నక్కపల్లి రూపంలో మూడు ఆప్షన్లు వారికి ఇచ్చాం. ఇందులో కంపెనీ ప్రతినిధులు 2024 ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల మధ్య నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉంటుందని ఎంచుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం.

    నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సంగతేంటో చెప్పండి?:
    అదే సమయంలో నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడినా.. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. వారు భూములు కావాలంటే అందుబాటులో ఉన్న భూములు ఇవ్వొచ్చు. కానీ, అలా కాకుండా భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించారు. దానివల్లే బల్క్‌డ్రగ్‌ ముందుకు సాగలేదు.

    ఇంకా బల్డ్‌ డ్రగ్‌ పార్క్‌ వల్ల జబ్బులు వస్తాయని కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో చేసిన దుష్ప్రచారం వల్ల కూడా అది ముందుకు సాగడం లేదు. కేంద్రం, రాష్ట్రాలతో పోరాడి తెచ్చిన ఈ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ రెండున్నర  సంవత్సరాలు అవుతున్నా ముందుకెళ్లకపోవడానికి కూటమి పార్టీలే కారణం.  ఇప్పుడు ఆర్సెలార్‌ మిట్టల్‌ స్లీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దీనికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎందుకు శ్రద్ధ లేదు?:
    అధికారంలోకి రావడానికి మీరు  ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఉపాధి కల్పించలేకపోతే నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఎన్ని? అవి కల్పించిన ఉద్యోగాలు ఎన్ని? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీ పచ్చ మీడియాలో 20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

    ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మీరు అధికారంలోకి వచ్చాక 20 నెలల్లోనే 10 వేల మంది ఉపాధి పోయింది. దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు? స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌లు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలని చెప్పి, ఇప్పుడు మాత్రం వచ్చే ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. అప్పటివరకూ మీరు అధికారంలో ఉండాలి కదా..

    రాష్ట్రం వదిలి పారిపోతున్న పరిశ్రమలు:
    గతంలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయని, అవి ఇప్పుడు తిరిగి వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అచ్యుతాపురంలో కోకా కోలా కంపెనీ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులకు ఓ దండం అని చెప్పి భూమి వెనక్కి ఇచ్చి వెళ్లిపోయింది. ఇలా ఈ 20 నెలల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం ఈ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు పెడుతున్న ఇబ్బందులే. అల్ట్రాటెక్, ఎల్‌ అండ్‌ టీ, భారతీ సిమెంట్స్‌.. ఇలా  రాయలసీమలో ఏ సిమెంట్‌ ఫ్యాక్టరీతో సక్రమంగా పని చేయించుకునే పరిస్ధితి లేదు.

    అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

    పక్కనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో యూబీ బీర్‌ ఫ్యాక్టరీని స్కిట్లు వేసుకునే ఎమ్మెల్యే తనకు కప్పం కడితే తప్ప పని చేయకుండా అడ్డుకుంటున్నారు. జిందాల్‌ సంస్ధ కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలని వస్తే, ఊరూపేరు లేని ఓ సినీ నటిని తీసుకుని వాళ్లను వెళ్లగొట్టారు. మీ పాలనలో మీ భూములు వద్దని వెనక్కి వెళ్లిపోయిన కంపెనీల లిస్ట్‌ నేను బయటపెడతా, దానిపై సమాధానం చెప్పండి. జగన్‌గారి హయాంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ తీసుకొస్తే, అది వదిలేసి పారిపోయిన కంపెనీల గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీ హయాంలో పారిపోయిన కంపెనీల సంగతేంటో చెప్పండి.

    పరిశ్రమలు తెచ్చిన జగన్‌పై దుష్ప్రచారాలు:
    విశాఖలో రహేజాతో కలిసి ఇనార్బిట్‌ మాల్‌కు నాడు జగన్‌ శంకుస్థాపన చేశారు. దాన్నే నిన్న (సోమవారం) ప్రారంభించారు. అదీ మా కమిట్‌మెంట్‌. విశాఖకు ఇనార్పిట్‌ మాల్‌ ఓ ల్యాండ్‌ మార్క్‌. విశాఖలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇనార్పిట్‌ మాల్‌ ప్రత్యేకత వేరు. దానికి శంకుస్థాపన చేసింది జగన్‌. ఈ ప్రభుత్వం తరుచూ మా చిన్నప్పటి నుంచి వింటున్న లులూ మాల్‌ను ప్రస్తావిస్తుంది. ఈ లులూ మాల్‌ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. మేం చేసిన పనులు చెప్పుకోవడం లేదు అంటే, అదే వారికీ మాకూ తేడా. అందుకే ఇప్పటికైనా నిరుద్యోగ యువతపై ఫోకస్‌ పెట్టి వారికి ఉద్యోగాలు కల్పించడం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వడమో చేయాలని ప్రభుత్వాన్ని గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, వైఎస్సార్ జిల్లా: కాంగ్రెస్‌ నాయకురాలు షర్మిలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశం సాక్షిలోనే కాదు.. అన్ని మీడియా చానల్స్‌లోనూ వచ్చింది. షర్మిల ఎల్లో మీడియా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

    ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం లేక వేరే వారితో మాట్లాడించారని షర్మిల అన్నారు. దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్. వివేకానంద రెడ్డికి గుండెపోటు అన్న అంశంపై అన్ని మీడియా చానల్స్‌లోనూ వచ్చింది. ఎల్లో మీడియాలో కూడా గుండె పోటు అనే వచ్చింది. దాని గురించి ఎందుకు మాట్లాడం లేదు?. వివేకా మరణం గురించి ముందుగా ఆయన బావమరది శివప్రకాష్ రెడ్డే అందరికీ సమాచారం అందించారు. సంస్కారం, కుటుంబ గౌరవంతో వైఎస్‌ జగన్‌ ఈ అంశంపై స్పందించడం లేదు. మీరు తప్పుడు విమర్శలు చేస్తే మేం స్పందించకూడదా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి.

    సంస్కారవంతుడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు.. షర్మిలకు రాచమల్లు కౌంటర్

Sports

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్‌ కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌, టీ20 ప్రపంచకప్‌ విజేత రింకూ సింగ్‌ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్‌ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్‌ అయినప్పటికీ కేకేఆర్‌ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి.

     కెప్టెన్‌గా రహానే
    ఇక మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేకేఆర్‌ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.

    గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్‌ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్‌ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.

    భవిష్య కెప్టెన్‌ రింకూనే
    నిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్‌ భవిష్య కెప్టెన్‌ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.

    కాగా 2018 నుంచి రింకూ సింగ్‌ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.

     పేద కుటుంబం
    ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్‌ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.

    లోక్‌సభ ఎంపీతో నిశ్చితార్థం
    వరల్డ్‌కప్‌ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్‌ ప్రియా సరోజ్‌తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.

    చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?

  • ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.

    రూ. 2 కోట్లు
    కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్‌ ఆప్షన్‌గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి డకెట్‌ ఓపెనింగ్‌ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.

    ఢిల్లీ క్యాపిటల్స్‌ నెత్తిన పిడుగు
    అయితే, తాజాగా బెన్‌ డకెట్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.

    క్షమించండి
    అందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.

    ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్‌ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్‌ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.

    నా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే అంకితం
    నా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సమ్మర్‌ షెడ్యూల్‌ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

    కాగా డకెట్‌ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్‌లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. 

    రెండేళ్ల నిషేధం
    అలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్‌ ప్లేయర్‌ డకెట్‌ ఈ జాబితాలో చేరనున్నాడు.

    కాగా డకెట్‌ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. 

    ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్‌ షెడ్యూల్‌లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్‌ ఇటీవల పేర్కొన్నాడు.

    చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం
    ఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌

  • క్రికెట్‌ ఐర్లాండ్‌ ఇటీవలే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్‌- అఫ్గనిస్తాన్‌ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.

    కాగా గతంలో ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్లు అఫ్గనిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్‌లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్‌ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.

    అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్‌ అఫ్గన్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్‌ ఆడింది. ఇక ఐర్లాండ్‌ తాజాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్ డైరెక్టర్‌ గ్రేమ్‌ వెస్ట్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్‌తో సిరీస్‌ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.

    ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్‌ పేర్కొన్నాడు.

    ఇదిలా ఉంటే.. క్రికెట్‌ ఐర్లాండ్‌ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్‌ అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్‌ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.

    తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్‌కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలమైంది. 

    కనీసం సూపర్‌-8 దశ చేరకుండానే లీగ్‌ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్‌ పదవికి పాల్‌ స్టిర్లిండ్‌ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బ్రీడీ, బెల్‌ఫాస్ట్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

  • ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నెలల కాలం తన కెప్టెన్సీ కెరీర్‌లో అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు.

    ఘోర పరాభవం
    ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ 2025-26లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో 4-1తో ఓడిపోయిన స్టోక్స్‌ బృందం.. ఈ కీలక టెస్టు సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చిన ఒకే ఒక్క అంశం మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు గెలవడం మాత్రమే.

     రాజీనామా డిమాండ్లూ
    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు ఆట తీరుపై.. ముఖ్యంగా బజ్‌బాల్‌ పేరిట టెస్టు క్రికెట్‌లోనూ దూకుడుగా ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) మాత్రం వీరిపై నమ్మకం ఉంచింది.

    అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు
    ECB చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గుడ్‌ ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘అంతర్గతంగా యాషెస్‌ వైఫల్యంపై సమీక్ష జరిపాము. కొన్నిసార్లు నాయకత్వ బృందాన్ని మార్చడం తేలికైన పని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు.

    అదృష్టవశాత్తూ మా నాయకత్వ బృందానికి అంకితభావం, లక్ష్య సాధనకై శ్రమించే తత్వం ఎక్కువ. యాషెస్‌ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు’’ అని పేర్కొన్నాడు. 

    అత్యంత క్లిష్టమైనది
    ఈ మేరకు రిచర్డ్‌ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి స్టోక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా ఉండటం అత్యంత గొప్ప గౌరవం. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.

    కొన్నిసార్లు నవ్వితే.. మరికొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు. గత మూడు నెలల కాలం నా కెప్టెన్సీ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైనది. బజ్‌ (మెకల్లమ్‌), రాబ్‌ కీ (సెలక్టర్‌), నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాము.

    జట్టును విజయపథంలో నడిపించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మేము కొన్ని తప్పులు చేశామని మాకు తెలుసు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. అపజయాలను విజయాలుగా మారుస్తాము. 

    సమ్మర్‌ టెస్టు షెడ్యూల్‌తో జూన్‌లో మిమ్మల్ని కలసుకుంటాను’’ అని స్టోక్స్‌ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా బజ్, రాబ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.

    చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్‌-2008 విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్‌ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్‌ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    రూ. 15 వేల కోట్లకు సొంతం!
    జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్‌మార్ట్‌ కుటుంబానికి చెందిన రాబ్‌ వాల్టన్‌, హ్యాంప్‌ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.

    ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్‌ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్‌ మీడియా వెంచర్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు యజమానిగా ఉంది. రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌, లాచ్‌లాన్‌ ముర్దోచ్‌ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.

    అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌, అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌ ఇన్వెస్టర్‌ డేవిడ్‌ బిల్ట్జర్‌ రాయల్స్‌ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.

    ఎవరీ కల్‌ సోమానీ?
    ఎడ్‌ టెక్‌, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్‌ సంస్థలు ఇంట్రాఎడ్జ్‌, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్‌ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

    కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో రాజస్తాన్‌ రాయల్స్‌ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్‌ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

    చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్‌ దిగ్గజం

  • పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్‌లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్‌పై పాక్‌ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.

    ప్రేక్షకులు లేకుండానే..
    ఆరంభ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్‌లలో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయని పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రీడా శాఖా మంత్రి అమినుల్‌ హక్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.

    పాకిస్తాన్‌ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్‌ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.

    బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం
    ఈ విషయం గురించి బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి క్రిక్‌బజ్‌తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్‌లో ఉన్న మా హై కమిషన్‌ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.

    కాగా మరోసారి ఐపీఎల్‌కు పోటీగా పాక్‌ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్‌ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్‌ రహమాన్‌, పర్వేజ్‌ హొసేన్‌ ఇమాన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, నహీద్‌ రాణా, తాంజిద్‌ హసన్‌ తమీమ్‌, రిషాద్‌ హొసేన్‌ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.

    చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్‌ దిగ్గజం

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జోష్ హాజిల్‌వుడ్‌,  శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషార‌లు ఇంకా జ‌ట్టుతో చేర‌లేదు. తొడ‌కండ‌రాల గాయంతో బాధ‌పడుతున్న‌ నువాన్ తుషారకు ఒక‌ట్రెండు రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌రించ‌నుంది.

    ఒక‌వేళ అందులో అత‌డు పాసైతే లంక క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ జారీ చేయ‌నుంది. అత‌డు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ హాజిల్‌వుడ్ మాత్రం కోలుకోవ‌డానిని మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ ఏడాది సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌ల‌కు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ధ్రువీక‌రించారు.

    "జోష్ హేజిల్‌వుడ్ గాయాల కార‌ణంగా ఇటీవ‌ల పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ విష‌యం మ‌నందరికీ తెలుసు. అత‌డు ప్ర‌స్తుతం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అత‌డు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.

    క్రికెట్ ఆస్ట్రేలియా  (CA) వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై సీఏ వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే భారత్‌కు వచ్చేందుకు అనుమతి లభిస్తుంది.  క్రికెట్ ఆస్ట్రేలియాతో మేము నిరంతరం టచ్‌లో ఉన్నాము.

    అయితే మా జట్టులో అభినందన్‌, రషిక్ ధార్ వంటి అద్భుతమైన డొమాస్టిక్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్‌, జాకబ్ డ‌ఫీ వంటి అనుభ‌వం ఉన్న బౌల‌ర్లు కూడా ఉన్నారు" అని బోబాట్ పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్‌?

  • ఆరంభ సీజన్‌ 2008 నుంచి ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. అత్యుత్తమంగా 2014లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఈ జట్టు.. సుదీర్ఘ విరామం తర్వాత గతేడాది మరోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి చాంపియన్‌గా నిలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.

    మరోవైపు.. ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడి తమ ఖాతాలో తొలి టైటిల్‌ జమచేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ మార్చి 31న తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.

    పటిష్టంగా మిడిలార్డర్‌
    ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ మిడిలార్డర్‌ గురించి టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, శశాంక్‌ సింగ్‌, నేహాల్‌ వధేరాలతో పంజాబ్‌ మిడిలార్డర్‌ పటిష్టంగా ఉందన్నాడు. వీరిలో శశాంక్‌ సింగ్‌ టీమిండియాలో చోటుకు అర్హుడని పేర్కొన్నాడు.

    టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు
    ‘‘పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో శశాంక్‌ సింగ్‌ కూడా ముఖ్య ఆటగాడు. కానీ అతడి గురించి అంతగా చర్చ జరగడం లేదు. నిజానికి టీమిండియాలో అరంగేట్రానికి అతడు అర్హుడు. ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు.

    PC: PBKS
    పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఎంచుకుని మంచి పనిచేసింది. రిటెన్షన్‌ జాబితాలో కూడా అతడు ఉన్నాడు. అతడు మంచి ఫినిషర్‌. శ్రేయస్‌ అయ్యర్‌, నేహాల్‌ వధేరాలతో కలిసి మిడిలార్డర్‌ను పటిష్టంగా మార్చాడు. పంజాబ్‌ కింగ్స్‌ ఈ ముగ్గురు ప్రధాన బలం’’ అని అశూ అభిప్రాయపడ్డాడు.

    ముగ్గురూ ముగ్గురే
    కాగా శశాంక్‌ సింగ్‌ గతేడాది 17 మ్యాచ్‌లలో కలిపి 350 పరుగులు చేయగా.. నేహాల్‌ వధేరా 16 మ్యాచ్‌లలో భాగమై 369 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 17 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 604 పరుగులతో దుమ్ములేపాడు. తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చి సత్తా చాటాడు.

    ఫామ్‌లేమి.. మరేం పర్లేదు
    ఇదిలా ఉంటే.. శశాంక్‌ సింగ్‌ ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. 34 ఏళ్ల ఈ ఛత్తీస్‌గఢ్‌ ఆటగాడు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 101 పరుగులే చేశాడు. అయితే, హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ మార్గదర్శనంలో శశాంక్‌ ఐపీఎల్‌-2026లో ఫామ్‌ అందుకుని.. అదరగొట్టగలడని అశూ ధీమా వ్యక్తం చేశాడు.

    చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి 300 వికెట్ల వీరుడు

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్ కోసం సిద్ద‌మ‌వుతోంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకుండానే ఇంటిముఖం ప‌ట్టిన ముంబై ఇండియ‌న్స్‌.. ఈసారి ఎలాగైనా ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇప్ప‌టికే  హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై జ‌ట్టు వాంఖ‌డే స్టేడియంలో తీవ్రంగా శ్ర‌మిస్తోంది.

    అయితే ముంబై శిక్ష‌ణ శిబిరంలో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఇంకా చేర‌క‌పోవ‌డం అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్ స‌మ‌యానికి మాత్రం బుమ్రా అందుబాటులో ఉంటాడ‌ని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టును భార‌త మాజీ క్రికెట‌ర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఎంచుకున్నాడు.

    ఓపెన‌ర్ల‌గా రోహిత్ శ‌ర్మ‌, క్వింట‌న్ డికాక్‌ల‌కు అత‌డు అవ‌కాశ‌మిచ్చాడు. అదేవిధంగా ఫ‌స్ట్ డౌన్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, త‌ర్వాతి ఆర్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌కు చోటు ద‌క్కింది. ఇక ఆల్‌రౌండ‌ర్ల కోటాలో విల్ జాక్స్‌, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్న‌ర్‌ల‌ను బ‌ద్రీనాథ్ ఎంపిక చేశాడు. ఫినిష‌ర్‌గా న‌మ‌న్ ధీర్‌కు ఛాన్స్ ల‌భించింది.

    ఇక ఫాస్ట్ బౌల‌ర్ల‌గా దీప‌క్ చాహ‌ర్‌, జ‌స్ప్రీత్ బుమ్రా,ట్రెంట్ బౌల్ట్ త్ర‌యంతో బ‌ద్రీనాథ్ వెళ్లాడు. అయితే ఈ జ‌ట్టులో వెస్టిండీస్ హిట్ట‌ర్ షెర్ఫేన్ రూథ‌ర్‌ఫోర్డ్‌కు మాత్రం అత‌డు అవ‌కాశం ఇవ్వ‌లేదు. రూథ‌ర్‌ఫోర్డ్ ట్రేడ్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియ‌న్స్‌కు వ‌చ్చాడు. అత‌డు ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. జాతీయ జ‌ట్టుతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో కూడా మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు.

    బ‌ద్రీనాథ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టు ఇదే
    రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కీలక ప్రకటన చేసింది. తమ పేసర్‌ యశ్‌ దయాళ్‌ ఐపీఎల్‌-2026లో పాల్గొనడం లేదని తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడిని పక్కనపెట్టామని.. అయితే, కాంట్రాక్టు మాత్రం కొనసాగిస్తామని వెల్లడించింది.

    సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ తొలిసారి గతేడాది ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. ఇందులో యశ్‌ దయాళ్‌ (Yash Dayal) కూడా తన వంతు పాత్ర పోషించాడు. సీజన్‌ మొత్తం కలిపి 13 వికెట్లతో రాణించి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తోడ్పడ్డాడు.

    సంచలన ఆరోపణలు
    అయితే, అనూహ్య రీతిలో యశ్‌ దయాళ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్‌ స్టేషన్‌లో గతేడాది జూలైలో అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఐదేళ్లు తనతో రిలేషన్‌షిప్‌లో ఉండి.. పెళ్లి పేరిట మోసం చేశాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా తనను హింసించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.

    పోక్సో కేసు కూడా
    ఆ తర్వాత ఓ టీనేజర్‌ తెరమీదకు వచ్చింది. 2023 నుంచి తనపై యశ్‌ దయాళ్‌ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద జైపూర్‌లో మరో కేసు నమోదైంది. ఐపీఎల్‌-2025 సందర్భంగానూ హోటల్‌ గదిలో దయాళ్‌ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సదరు టీనేజర్‌ ఆరోపించింది. క్రికెట్‌లో తనకు కెరీర్‌ ఆశ చూపి ఇలా చేశాడని వాపోయింది.

    అయితే, మొదటి కేసులో అలహాబాద్‌ హైకోర్టు యశ్‌ దయాళ్‌ అరెస్టు కాకుండా స్టే విధించగా.. రెండోకేసులో జైపూర్‌లోని పోక్సో కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను 2025 డిసెంబరులో తిరస్కరించింది. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవలే యశ్‌ దయాళ్‌ ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

    అతడిని ఈ సీజన్‌లో ఆడించము.. కానీ
    కాగా యశ్‌ దయాళ్‌ను కొనసాగించడంపై ఆర్సీబీపై విమర్శలు రాగా.. ఆర్సీబీ క్రికెట్‌ డైరెక్టర్‌ మొ బొబాట్‌ తాజాగా స్పందించాడు. ‘‘యశ్‌ దయాళ్‌ ఈసారి జట్టుతో చేరడం లేదు. వ్యక్తిగతంగా అతడు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి వరకు మేము అతడికి మద్దతుగానే నిలబడ్డాము.

    అతడిపై నమ్మకం ఉంది కాబట్టే రిటైన్‌ చేసుకున్నాము. అతడి కాంట్రాక్టు కొనసాగుతుంది. అతడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు కూడా అతడిని సంప్రదించిన తర్వాతే జట్టుతో చేర్చకూడదనే నిర్ణయానికి వచ్చాము. 

    అతడితో పాటు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము. అతడికి మా మద్దతు ఉంటుంది’’ అని మొ బొబాట్‌ పేర్కొన్నాడు. కాగా మార్చి 28న ఐపీఎల్‌-2026 టోర్నీకి తెరలేవనుండగా.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ తలపడతాయి. ఇందుకు చిన్నస్వామి స్టేడియం వేదిక.

    చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?

  • న్యూఢిల్లీ: బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో పోటీపడే భారత మహిళల టెన్నిస్‌ జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన భారత నంబర్‌వన్‌ సహజ యామలపల్లి, భారత ఐదో ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

     వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి పిలుపు
    ఇటీవల బెంగళూరులో జరిగిన ఐటీఎఫ్‌–100 టోర్నీలో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన మహారాష్ట్ర ప్లేయర్‌ వైష్ణవి అడ్కర్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 391వ ర్యాంక్‌తో సహజ భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా కొనసాగుతుండగా... వైష్ణవి 397వ ర్యాంక్‌తో రెండో ర్యాంకర్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 7 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. 

    సహజ, రష్మిక, వైష్ణవిలతోపాటు రుతుజా భోస్లే, అంకిత రైనా కూడా భారత జట్టులో ఉన్నారు. వైదేహి చౌధరీని రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కెప్టెన్‌గా విశాల్‌ ఉప్పల్, కోచ్‌గా రాధిక కనిట్కర్‌ కొనసాగుతారు. 

    ఐదు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు ఇండోనేసియా, కొరియా, న్యూజిలాండ్, మంగోలియా, థాయ్‌లాండ్‌ పోటీపడతాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక టాప్‌–2లో నిలిచిన జట్లు బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ప్లే ఆఫ్స్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి.

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో గుజ‌రాత్ టైటాన్స్ ప్ర‌స్థానం 2022లో మొద‌లైంది. ఆ సీజ‌న్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ బ‌రిలోకి దిగిన తొలిసారే చాంపియ‌న్‌గా నిలవ‌డం విశేషం. ఆ మ‌రుస‌టి ఏడాది అంచ‌నాల‌ను అందుకుంటూ మ‌రోసారి ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ర‌న్న‌ర‌ప్‌కే ప‌రిమితమ‌యింది. 

    అయితే 2024 సీజ‌న్‌లో పేల‌వ ఆట‌తీరుతో లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైన గుజ‌రాత్ గ‌త సీజ‌న్‌లో మాత్రం మ‌రోసారి మంచి ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసింది. గిల్ కెప్టెన్సీలో గుజ‌రాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఐదో సీజ‌న్ ఆడ‌నున్న గుజ‌రాత్ టైటాన్స్ ఈసారి క‌ప్పు గెల‌వ‌డానికే బ‌రిలోకి దిగుతోంద‌ని ఆ జ‌ట్టు ప్ర‌ధాన‌ కోచ్ ఆశిష్ నెహ్రా ధీమా వ్య‌క్తం చేశాడు. 

    సోమ‌వారం రాత్రి గుజ‌రాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ  పూర్తిస్థాయి జ‌ట్టుతో శుభారంభ్-2026 కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు, ఫ్రాంచైజీ ఓన‌ర్లు, స‌హాయ‌క సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో నెహ్రా మాట్లాడాడు. ‘ఈ సీజ‌న్‌లో భిన్నంగా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నేను అనుకోవ‌డం లేదు. ఎందుకంటే నేను ఆలోచించ‌డానికేం లేదు. 

    ఎందుకంటే బ‌రిలోకి దిగ‌నున్న జ‌ట్టు మ్యాచ్ ఎలా ఆడాల‌న్న‌ది ఆలోచిస్తోంది, జ‌ట్టు ఆట‌గాళ్లు దీని గురించి ఆలోచిస్తారు. ఒక కోచ్‌గా నేను స‌ల‌హాలు మాత్ర‌మే అందివ్వ‌గ‌ల‌ను. ఈ శుభారంబ్ వేడుక సాక్షిగా ఒక విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నా. ఈ సీజ‌న్‌కు పూర్తి ఆత్మ‌విశ్వాసంతో వ‌స్తున్నాం. ఈసారి కేవ‌లం పాల్గొన‌డానికి రాలేదు, ఐపీఎల్‌లో క‌ప్పు గెల‌వ‌డానికే  వ‌స్తున్నాం. 

    కొత్త జ‌ట్టుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంతా అంటున్నారు. కానీ మా విధానాలు, ప్ర‌ణాళిక‌లు ఎప్పుడు రెండు అడుగులు ముందే ఉంటాయి. ఐదేళ్లుగా గుజ‌రాత్ జ‌ట్టుతోనే ఉన్నాను.  ఈ ఐదేళ్ల‌లో జ‌ట్టుతో ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయి.  ఈ శుభారంభ్ మా గుజ‌రాత్ టైటాన్స్‌కు కొత్త శోభ‌ను తీసుకొచ్చింది. ఇది ఇచ్చిన స్ఫూర్తి, ఐక్య‌త‌తో ముందుకు సాగుతాం’ అని చెప్పుకొచ్చాడు. ఇక గుజ‌రాత్ టైటాన్స్ ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్‌ను మార్చి 31 ముల్ల‌న్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది.

  • ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది.  గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ స్దానాన్ని ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేయిన్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ​మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

    ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్‌ను రూ.1.5 కోట్లకే సన్‌రైజర్స్ దక్కించుకుంది. కాగా 26 ఏళ్ల డేవిడ్ పేయిన్ ఇంగ్లండ్ తరపున కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ అతడికి టీ20ల్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు 233 టీ20లు ఆడి 304 వికెట్లు పడగొట్టాడు.

    బిగ్ బాష్ లీగ్‌, ది హాండ్రడ్, ఇంటర్ననేషనల్ టీ20 లీగ్‌, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభవం అతడికి ఉంది. ఈ క్రమంలోనే అతడిని ఆరెంజ్ ఆర్మీ జట్టులోకి తీసుకుంది. అతడి రాకతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది. 

    ఎషాన్ మలింగ, జయదేవ్ ఉనద్కట్‌తో పేయిన్ బంతిని పంచుకోనున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఫిట్‌నెస్ సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్‌కు ఇక తిరుగులేనిట్లే. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

    ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు
    బ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్

    ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి

    బౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి
     

  • క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌ ఆట తెలిసిన ప్రతీ ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. సమకాలీన ఫుట్‌బాల్‌ క్రీడలో మెస్సీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్‌ ప్లేయర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న రొనాల్డో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ 15 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ సంచలనాలు ఆటలో అనుకుంటే పొరబడినట్లే.

    తాజాగా 15 ఏళ్ల రొనాల్డో జూనియర్‌ 27 ఏళ్ల ‍బ్రెజిలియన్‌ మోడల్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? అబద్ధమా? అనేది తేలకముందే, ఈ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన మరుక్షణమే వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రొనాల్డో జూనియర్‌ దుబాయ్‌లో ఉంటున్నాడని, అక్కడే ఒక హోటల్‌లో బ్రెజిల్‌ మోడల్‌తో పరిచయం డేటింగ్‌కు దారి తీసినట్లు సోషల్‌ మీడియా కోడై కూసింది. 

    అయితే రొనాల్డో అభిమానులు మాత్రం ఈ వార్తలను ఖండించారు. రొనాల్డో జూనియర్‌ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అన్న విషయం గమనించాలని, అతనిపై వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కామెంట్‌ చేశారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ తాను ఎవరితోనూ డేటింగ్‌ చేయడం లేదని స్పష్టం చేశాడు. 

    తన తండ్రి క్రిస్టియానో ​​రొనాల్డో భాగస్వామి అయిన జార్జినా రోడ్రిగ్జ్‌ గురించి సరదాగా క్రిస్టియానో ​​జూనియర్‌ ఆమె తన 'క్రష్' అని ఒక సందర్భంలో  పేర్కొన్నాడు. కానీ ఆ తర్వాత ఆమెను కేవలం ఒక స్నేహితురాలిగా మాత్రమే చూశానని, గర్ల్‌ఫ్రెండ్‌గా చూడలేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆమెతో మాటలు లేవని బదులిచ్చాడు. గతంలోనూ బార్సిలోనా స్టార్‌ లూయిస్‌ సువారెజ్‌ కుమార్తె డెల్ఫినా సువారెజ్‌ తో రొనాల్డో జూనియర్‌  ప్రేమలో ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

    చదవండి: గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్‌లో అథ్లెటిక్స్‌ పోటీలు

     

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్న‌ర్‌, టీమిండియా స్టార్ క్రికెట‌ర్ రింకూ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌ (RSO)గా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం లక్నోలోని లోక్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకూకు ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ అందజేశారు.

    కాగా వరల్డ్‌కప్ సమయంలో రింకూ తండ్రి మరణించినప్పటికి.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకూ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లో 24 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అయితే చాలా మ్యాచ్‌ల‌లో అత‌డు ఆఖ‌రిలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. పాక్‌పై కేవ‌లం 4 బంతుల్లోనే 11 ప‌రుగులు చేశాడు.

    ఓ వైపు గుండె నిండా బాధ ఉన్న‌ప్ప‌టికి.. భార‌త్ సాధించిన చారిత్ర‌త్మ‌క విజ‌యంలో రింకూ భాగ‌మ‌య్యాడు. దీంతో అత‌డి అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగంతో స‌త్క‌రించింది. 

    ఉత్తరప్రదేశ్‌లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది. ఇ​‍క రింకూ సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.

    నియ‌మాక ప‌త్రాలు అందుకున్న వారు వీరే
    రింకూ సింగ్‌: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌

    రాజ్‌కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు సభ్యుడు రాజ్‌కుమార్ పాల్‌ను డీఎస్పీ గా నియమించారు.

    ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు.

    అజిత్ సింగ్,  సిమ్రాన్: పారాలింపిక్స్ పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్‌లను జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్లుగా నియమించారు.

    లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి పురస్కారాలు:
    ఉద్యోగాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే కొత్త పథకంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.
    చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన

Movies

    • కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..
    • బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..
    • బిగ్‌బాస్ దివి స్టన్నింగ్‌ పోజులు..
    • మాల్దీవుస్‌లో మాళవిక రాజ్ చిల్..
    • బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక..

     

     

     

     

     

     

     

  • దురంధర్‌లో రణ్‌వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్‌ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్‌ ‍‍అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.

    అయితే తాజాగా దురంధర్ హీరోయిన్‌ సారా అర్జున్‌ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.    తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్‌ను రాకేశ్‌ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.

    తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.

    ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్‌ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని  అన్నారు.

     

  • బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్‌-2 సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్‌ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో పార్ట్‌-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్‌ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. ‍అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

    కాంతార ఇమిటేషన్‌ కేసులో ఊరట..

    అయితే గతంలో రణ్‌వీర్‌ సింగ్‌ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌ వీర్‌ సింగ్‌ ఇమిటేట్ చేశారు.  ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్‌వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్‌ కావడంతో రణ్‌వీర్‌ సింగ్‌ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. 

    అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్‌లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వ‍చ్చి సారీ చెప్పాలని పిటిషన్‌లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్‌వీర్‌ సింగ్‌కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్‌వీర్ సింగ్‌ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.

    దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్‌వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.

    కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది.
     

  • టాలీవుడ్ నిర్మాత, నటి మంచు లక్ష్మీ ఇటీవలే తన కూతురి హాఫ్ శారీ వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొని సందడి చేశారు. తన మేన కోడలిని విద్యా నిర్వాణను చూసి మనోజ్ మురిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఎల్లప్పుడు నీ వెంటే ఉంటానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

    తాజాగా మంచు లక్ష్మీ తన కూతురిని తలచుకుంటూ మరో పోస్ట్ చేసింది. నువ్వు ఇంత అందమైన అమ్మాయిగా ఎదగడం చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయిందని ట్వీట్‌లో రాసుకొచ్చింది. నీ దయ, సౌమ్యత, ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత.. నిన్ను 'నువ్వు'గా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం అంటూ కుమార్తె విద్యా నిర్వాణపై తల్లిగా తన ప్రేమను చాటుకుంది.

    మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాస్తూ..'యాపిల్.. నిన్ను ఇంత అందమైన అమ్మాయిగా చూడటం నా హృదయాన్ని వర్ణించలేని ఆనందం. ఆ ఆప్యాయత, చిరునవ్వు, విశ్వసనీయత... నిన్ను నువ్వుగా నిలబెట్టే ఆ సహజమైన చలాకీతనం.. వీటన్నింటికీ నువ్వే ఒక ప్రత్యక్ష రూపం. నువ్వు ఎదుగుతుండగా గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత దూరాలకు వెళ్లినా సరే... నా హృదయంలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా చిట్టి తల్లివే... సదా ఎల్లప్పుడూ నా కంటి పాపవే' అంటూ భావోద్వేగానికి గురైంది. 
     

     

  • నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 

    ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్‌ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. 
     

     

  • బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు  ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

    ఆరేళ్ల క్రితమే విడాకులు.. 
    ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా.  హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  ఈ జంటకి ఓ  కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. 

    ఈషాతో డేటింగ్‌.. 
    విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది.  గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.

    పెళ్లి ఫోటోలు వైరల్‌.. 
    తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ఈ  కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

  • టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్‌టైన్‌ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్‌ యాక్షన్‌ చేసిన ఈ మూవీసో మాస్ అండ్‌ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

    అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్‌ కూడా సీక్వెల్‌పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్‌ అదుర్స్‌-2పై మాట్లాడారు.

    ఈ విషయంలో దర్శకుడు వినాయక్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు.

  • ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి ఇటీవలే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వివేక్‌ దహియాను పెళ్లాడిన ముద్దుగుమ్మ దాదాపు పదేళ్లకు శుభవార్త పంచుకుంది. తాము త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నట్లు వెల్లడించింది.  ఉగాది పండుగ రోజే ఫ్యాన్స్‌కు గుడ్ ‍న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దివ్యాంక తన బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    తాజాగా ఈ బ్యూటీ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను బేబీ షవర్‌ను సెలబ్రేట్ చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. తాజాగా తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో పాటు కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులతో చేసుకున్న ఈ గోధ్ బరాయి(సీమంతం) వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    2016లో ప్రేమ పెళ్లి..

    కాగా..  దివ్యాంక, వివేక్‌.. యే హై మొహబ్బతే సీరియల్‌ సెట్‌లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్‌ బలియే 8వ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.

    సీరియల్‌ నటిగా రికార్డ్..

    దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్‌, యాంకర్‌ కూడా! 2005లో మిస్‌ భోపాల్‌ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్‌ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్‌ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్‌ నటిగా రికార్డు సృష్టించింది.
     

     

  • శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

    ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగాచూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.

    హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది’ అన్నారు. సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.

  • ఈ మధ్య సూపర్‌ హిట్‌ సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్‌ని అమ్మేసుకొని.. టాక్‌తో సంబంధం లేకుండా నెలలోపే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. కానీ ఓ హారర్‌ చిత్రం మాత్రం రిలీజ్‌ అయినా ఏడాది తర్వాత ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. అది కూడా తమిళ్‌ భాషలోనే స్ట్రీమింగ్‌ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏ సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది?

    'వైశాలి’తో సూపర్‌ హిట్‌ అందుకున్న హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం’. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనం రొటీన్‌గా ఉన్నా,  టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్‌ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారనే టాక్‌ని సంపాదించుకుంది కానీ, కలెక్షన్స్‌ మాత్రం రాబట్టలేకపోయింది. 

    అన్ని సినిమాల మాదిరే నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఏడాది తర్వాత ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అది కూడా కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

    శబ్దం కథేమింటి?
    కేరళలోని ఓ మెడికల్‌ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్‌ అవంతిక(లక్ష్మీ మీనన్‌) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్‌) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
     

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదు రోజులైనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

    ఈ సారి ఏకంగా అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 వసూళ్లను దాటేసింది. పుష్ప-2 సాధించిన హిందీ వసూళ్లు రికార్డ్‌ను దురంధర్-2 బద్దలు కొట్టింది. పుష్ప-2 మూవీకి నాలుగు రోజుల్లో హిందీ వర్షన్‌కు రూ. 425.10 కోట్లు రాగా.. దురంధర్‌-2 ఏకంగా రూ.430 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డుతో పుష్పరాజ్‌ను వెనక్కి నెట్టేసింది. దురంధర్-2, పుష్ప-2 తర్వాత పఠాన్, జవాన్, స్త్రీ-2 చిత్రాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అన్ని భాషల్లో ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ పరిశీలిస్తే 'పుష్ప 2: ది రూల్' ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. హిందీ వెర్షన్‌లో 'ధురందర్: ది రివెంజ్' అధిగమించింది.

    ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఒక హిందీ చిత్రానికి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా  కీలక పాత్రలు పోషించారు. 

    హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన  టాప్-5  సినిమాలివే.. 

    • దురంధర్ ది రివెంట్: రూ. 430 కోట్లు (నాలుగు రోజులు)
    • పుష్ప-2 ది రూల్: రూ. 425.10 కోట్లు
    • పఠాన్: రూ. 351 కోట్లు
    • జవాన్: రూ. 346.98 కోట్లు
    • స్త్రీ-2: రూ. 291.65 కోట్లు
  • టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రొఫెషనల్‌ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్‌ లైఫ్‌పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, అల్లు శిరీష్‌ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. 

    ఆ సినిమా నుంచే లవ్‌
    ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్‌ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్‌ కావ్య కల్యాణ్‌రామ్‌తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఉస్తాద్‌ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది. 

    హింట్‌ ఇచ్చారా?
    అలా ఈ మూవీ సెట్‌లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్‌ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    సినిమా
    కావ్య కల్యాణ్‌ రామ్‌ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్‌ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్‌, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్‌గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. 

    కెరీర్‌
    కలర్‌ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్‌గా అతడికి మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది.

     

     

    చదవండి: బ్యాండ్‌మేళం కోసం చిరంజీవినే రిస్క్‌లో పడేసిన కోన వెంకట్‌

  • హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి, ‘సూపర్‌మ్యాన్' ఫేం  వాలెరీ పెర్రిన్ (82) కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో బెవర్లీ హిల్స్‌ సమీపంలో ఉన్న తన ఇంట్లో పెర్రిన్ మరణించినట్లు ఆమె స్నేహితుడు, ఆత్మీయ సహచరి అయిన స్టేసీ సౌథర్ ప్రకటించారు.  

    2015లో ఆమెకు పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని కారణంగా గతకొంతకాలంగా ఆమె మంచానికే పరిమితం అయింది. మాట్లాడే సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. అయినా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఇన్నాళ్లు జీవిందని సౌథర్ అన్నారు. ఫారెస్ట్ లాన్ స్మశానవాటికలో ఖననం చేయాలన్నది పెర్రిన్ చివరి కోరిక అని చెబుతూ, సౌథర్ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

    మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టిన పెర్రిన్, తన గ్లామర్‌,నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. 1978లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా  'సూపర్‌మ్యాన్'లో విలన్ లెక్స్ లూథర్ ప్రియురాలిగా, 'మిస్ టెష్‌మాకర్' పాత్రలో వాలెరీ పెర్రిన్ అద్భుత నటనను కనబరిచారు. ఈ పాత్ర ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది.  

    'సూపర్‌మ్యాన్ II'తో పాటు, 'లెన్నీ' (Lenny) అనే చిత్రంలో ఆమె నటనకు గానూ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు లభించింది. అంతేకాకుండా ఆమె ఆస్కార్ రేసులో కూడా నిలిచారు. పెర్రిన్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  • తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్‌ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.

    ఉత్తరాంధ్ర జానపదం
    కోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్‌ స్టెప్పులు వేసింది. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించగా అనన్య భట్‌, షకలక శంకర్‌, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది.

    ఆనంది కెరీర్‌
    ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్‌, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్‌లోనే హీరోయిన్‌గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది.

     

Business

  • భారతదేశంలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు లభ్యతను మరింత బలపరచడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.  ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సరఫరాను పెంచే నిర్ణయం తీసుకుంది.

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అదనంగా 20% కమర్షియల్ LPG సిలిండర్ల కేటాయింపును ఆమోదించింది. దీంతో మొత్తం కేటాయింపు సగటు నెలవారీ అవసరంలో 50%కి పెరిగింది. ఈ పెంపు వలన వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా మరింత స్థిరంగా, సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది.

    ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు వంటి రంగాలు గ్యాస్‌ కొరత నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్లను సమయానికి, సులభంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం వల్ల వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతాయి. అంతేకాకుండా, వినియోగదారులకు ఆహారం, ఇతర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. గ్యాస్ కొరత కారణంగా ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. ధరల స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

  • ఆన్‌లైన్ షాపింగ్‌లో లెక్కకు మించిన మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరోమారు తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    స్వగత్ నాయక్ అనే వ్యక్తి తన స్టార్టప్ కోసం సుమారు రూ. 2.9 లక్షల విలువ గల హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత అతను ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గ్రాఫిక్స్ కార్డ్ బదులుగా 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఉండటం చూసి షాకయ్యారు.

    'ఫుల్‌ఫిల్డ్ బై అమెజాన్' (FBA) పద్ధతిలో డెలివరీ జరిగింది. అంటే దీనిని అమెజాన్ గోదాములో నిల్వ చేసి నేరుగా అక్కడి నుంచే రవాణా చేశారని స్వగత్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆర్డర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ స్వయంగా స్టోర్ చేసి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంది.

    డెలివరీ ప్యాకేజింగ్‌పై అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లు స్వగత్ పేర్కొన్నారు. తయారీదారు పెట్టిన అసలు సీల్ కోసి మళ్లీ టేప్ చేశారు, అలాగే నకిలీ బార్‌కోడ్ కూడా అతికించారని అన్నారు. అదే విధంగా, ప్యాకెట్‌పై ఉన్న షిప్పింగ్ లేబుల్‌లో బరువు 1.56 కేజీలుగా చూపించారు. కానీ ఒక అసలు RTX 5090 గ్రాఫిక్స్ కార్డ్ ప్యాకేజింగ్‌తో కలిపి సుమారు 3 కిలోల వరకు ఉంటుంది.

    ఇవన్నీ గమనించిన స్వగత్ నాయక్, ఇది స్పష్టంగా మోసం అని పేర్కొన్నాడు. అతను తన అన్‌బాక్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను అమెజాన్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినప్పటికీ, కేవలం 15 నిమిషాల్లోనే అతని కంప్లైంట్‌ను మూసివేశారు. ప్రస్తుతం కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆన్‌లైన్ షాపింగ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

    ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్‌లైన్ రిటైలర్లతో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకోగా, మరికొందరు నాయక్ వాదనలను ప్రశ్నిస్తూ, ఆ అన్‌బాక్సింగ్ వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

  • వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.

    వెండి ధరలు ఇలా
    బంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

  • టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే రిలయన్స్ జియో 336 రోజుల వ్యాలిడిటీతో ఓ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    సంవత్సరం పొడవునా ఫోన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ ఒక అద్భుతమైన వరం. ఈ ప్లాన్ 336 రోజుల బలమైన వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, సుమారు 11 నెలల వరకు మళ్లీ స్టోర్‌కు వెళ్లడం గానీ, ఆన్‌లైన్ చెల్లింపు చేయడం గానీ అవసరం ఉండదు. కేవలం కాలింగ్ కోసం మాత్రమే ఫోన్ వాడే వాళ్లకు ఇది మంచి ఎంపిక.

    ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 0.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం 336 రోజులలో, మీకు 168 GB డేటా యాక్సెస్ లభిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత, మీ ఇంటర్నెట్ వేగం 64kbpsకి పడిపోతుంది, కానీ మీ కనెక్షన్ మాత్రం బలంగానే ఉంటుంది. అదనంగా.. మీకు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 ఉచిత SMS సందేశాలు లభిస్తాయి. వినోదం కోసం, జియోసావన్, జియోటీవీకి ఉన్న ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ఈ ప్యాక్‌ను పొందవచ్చు.

    గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జియో అందిస్తున్న రూ.1234 అద్భుతమైన ఆఫర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో లేదు. ఇది ప్రత్యేకంగా కంపెనీ అందిస్తున్న సరసమైన జియో భారత్ ఫోన్‌ను ఉపయోగించే కస్టమర్ల కోసం మాత్రమే.

    ఇదీ చదవండి: టెలికాం కంపెనీల దోపిడీ.. రాజ్యసభలో రాఘవ్ చద్దా వ్యాఖ్యలు!

  • సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్‌ను బట్టి డేటా, టాక్‌టైమ్‌ వేరుగా ఉంటాయి. టాక్‌టైమ్‌ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్‌పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

    రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.

    భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.

    ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

    పరిష్కార మార్గాలు
    డేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.

    డేటా రోల్‌ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.
    డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్‌లో తగ్గింపు ఇవ్వాలి.
    డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.

    ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!

  • మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.

    హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలైన జొమాటో, స్విగ్గీ వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. గత వారంలో జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. ఇప్పుడు స్విగ్గీ అదే బాటలో అడుగులు వేస్తూ.. ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌పై రూ. 14.99 నుంచి రూ.17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. అంటే సంస్థ తాజాగా రూ.2.59 పెంచిందన్నమాట.

    కొత్తగా పెంచిన ప్లాట్‌ఫామ్ ఫీజు.. స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడానికి మాత్రమే కాకుండా సంస్థ నిర్వహణకు సహాయపడుతుందని కంపెనీ వినియోగదారులకు తెలియజేసింది. ఈ సందేశం ఇప్పుడు చెక్అవుట్ సమయంలో యాప్‌లో కనిపిస్తుంది.

    జొమాటో కంపెనీ కూడా గత వారంలో ఒక్కో ఆర్డర్‌పై ఛార్జీలను రూ. 2.40 పెంచింది. దీంతో ఫీజు రూ. 12.50 నుండి రూ. 14.90కి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పన్నులతో కలిపి, స్విగ్గీ, జొమాటో రెండూ ఇప్పుడు దాదాపు ఒకే రకమైన ధరలను వసూలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రత్యర్థులు ఒకరి ధరల వ్యూహాలను మరొకరు అనుకరించే దీర్ఘకాలంగా కొనసాగుతున్న ధోరణి ఇప్పుడు కొనసాగుతోంది.

    ఫుడ్ డెలివరీ బిల్లులలో ప్లాట్‌ఫారమ్ ఫీజులు ఒక చిన్న భాగమే అయినా, అవి క్రమంగా పెరుగుతున్నాయి. అవి విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపించినప్పటికీ, తరచుగా వాడే వినియోగదారులు కాలక్రమేణా గణనీయంగా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సాంకేతిక ఖర్చులు, యాప్ నిర్వహణ మరియు మొత్తం కార్యకలాపాలను భరించడానికి ఈ ఛార్జీలు అవసరమని కంపెనీలు తరచుగా ధరలు పెంచినప్పుడల్లా సమర్ధించుకుంటూనే ఉన్నాయి.

  • ఆసియా బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడి, మరణశిక్ష పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రూంగ్ మై లాన్(69) ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్‌సీబీ) నుంచి ఆమె కొల్లగొట్టిన సుమారు 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.26 లక్షల కోట్లు) నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ భారీ వేలం ప్రక్రియను చేపడుతున్నారు.

    వేలం జాబితాలో ఏమేమున్నాయి?

    వియత్నాం సివిల్ జడ్జిమెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన వివరాల ప్రకారం, విలాసవంతమైన భవనాల నుంచి చిన్నపాటి వస్తువుల వరకు వేలంలో ఉంచనున్నారు. హో చి మిన్ సిటీలోని ఖరీదైన ఆఫీస్ స్పేస్‌లు, టే నిన్ ప్రావిన్స్‌లోని భారీ ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ హెర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగులు, 8,500 కంటే ఎక్కువ డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వేలం వేయనున్నారు. ఒక లగ్జరీ కారు, రెండు ట్రక్కులు, భారీ యంత్రాలతో పాటు లాన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన ‘రెవరీ సాయిగాన్’ యాచ్ (విహార నౌక) ఉంది. లగ్జరీ ఫర్నీచర్ కంపెనీకి చెందిన సుమారు 3,70,000 ఇన్వెంటరీ వస్తువులను కూడా ఈ వేలంలో విక్రయించనున్నారు.

    కేసు నేపథ్యం ఏమిటి?

    వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న ట్రూంగ్ మై లాన్ సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్‌లోని నిధులను దశాబ్ద కాలం పాటు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 2024లో బ్యాంక్ నుంచి 12.3 బిలియన్ డాలర్లను మళ్లించినందుకుగాను కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక నేరాల కింద రెండో దఫా విచారణలోనూ ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆమె చేసిన కుంభకోణం వల్ల కలిగిన మొత్తం నష్టం 27 బిలియన్ డాలర్లుగా తేల్చారు. దీన్ని రికవరీ చేసేందుకు ఆమె వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులను జప్తు చేశారు.

    ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

National

  • ప్రతీకాత్మక చిత్రం

    కోల్‌కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో  ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో  బెంగాల్‌లో ఎన్నికల నియమావళి అమల్లోకి  వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. 

    జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు  అధికారులు  వెల్లడించారు.  ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్‌ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్‌ మిస్టరీ

    ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి  కోల్‌కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్‌లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు.
     

  • న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్‌ చర్చించారు. హార్మూజ్‌ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ వివరాలు తెలిపారు.

    కాగా, అలీ లారిజానీ మృతితో కొత్త సెక్యూరిటీ చీఫ్‌ను నియమించింది ఇరాన్‌. మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించింది. దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’. 

    డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసినప్పటికీ ఇరాన్‌ దాడులు ఆపడం లేదు. ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను, 17 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ ఇవాళ ప్రకటించింది. 

    ఇరాన్ యుద్ధం కారణంగా ఫిలిప్పీన్స్ ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ ప్రకటన చేశారు. దేశీయ ఇంధన సరఫరాలు, ఎనర్జీ స‍్టెబిలిటీపై ఇరాన్ యుద్ధం వల్ల పడ్డ ప్రభావాన్ని ఆయన గుర్తు చేశారు.

    “పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో, దేశ ఎనర్జీ సరఫరా లభ్యత, స్థిరత్వానికి ప్రమాదం ఉండడంతో జాతీయ శక్తి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం,” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో తెలిపారు.
     

  • న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి  హరీష్ రాణా కన్నుమూశారు.  మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు.  దీంతో హరీష్‌ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది.  

    మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గౌరవప్రదమైన రీతిలో ప్రాణాలు విడిచేలా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ  ర్వాత  ఢిల్లీలోని ఎయిమ్స్‌లో  ఆయనకు అందిస్తున్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు.  దీంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. 

    పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా   కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో  రాణా జీవించారు. 

    నిపుణుల పర్యవేక్షణలో
    మార్చి 14న రానాను ఘాజియాబాద్‌లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం  ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.

    ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?
    కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది.
     

  • చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్‌ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.

    మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్‌లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల‌ 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో  షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్‌లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్‌వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.  

    రాజ్‌వీర్  13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద  ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

    అమ్మతో పాటే నేను
    తల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్‌వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 

    లక్షల అప్పు, భార్యతో విభేదాలు
    రాజ్‌వీర్‌కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే  భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.

    ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్‌వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్‌ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్‌వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం  తీసుకున్నట్టు భావిస్తున్నారు.

     

  • ఉత్తరాఖండ్‌లో, జోషిమఠంలోని జ్యోతిష్ పీఠాధిపతి, శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద (Avimukteshwaranand)  సంచలన ప్రకటన చేశారు. రెండు లక్షల మందితో కూడిన ఒక 'సైన్యాన్ని' ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించారు. వీరిలో పురుషులు, స్త్రీలు,తృతీయ లింగ (Third gender)  తో అన్ని కులాల  వారు ఉంటారని ప్రకటించారు.

    సంప్రదాయ , ఆధునిక ఆయుధాలతో సన్నద్ధమయ్యే ఈ 'సైన్యం', గో సంతతిని,  హిందూ ధర్మాన్ని రక్షిస్తుందని ప్రస్తుతం యూపీలోని వారణాసిలో ఉంటున్న ఈ మత గురువు, తెలిపారు. ' ధర్మాన్ని, సంస్కృతిని , సమాజాన్ని రక్షించే ఈ 'సైన్యంలో' అన్ని హిందూ కులాలకు చెందిన 2,18,000 మంది సైనికులుగా చేర్చుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఈ 'సైన్యం' ప్రారంభిస్తామని అవిముక్తేశ్వరానంద తెలిపారు. దీనికి 'చతురంగిణి సేన' అని పేరుకూడా పెట్టారు.

    'చతురంగిణి సేన'

    • 2.8 లక్షల మందితో కూడిన ఈ సైన్యం హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, గోవంశాన్ని రక్షిస్తుంది.

    • మహాభారత కాలంలోలాగా కాలబలం, అశ్వబలం, గజబలం, రథబలం అనే నాలుగు విభాగాలతో ఇది ఉంటుంది. 

    • అన్ని హిందూ కులాల నుండి పురుషులు, మహిళలు , థర్డ్ జెండర్‌కి చెందిన వారు ఈ సైన్యంలో ఉంటారు.

    వివాదాలు, చట్టపరమైన చిక్కులు
    'సైన్యం’ ఏర్పాటు  ప్రకటన వివాదాన్ని రేపింది. ముఖ్యంగా అవిముక్తేశ్వరానంద, ఆయన మద్దతు దారులు గొడ్డలి నమూనాలను ప్రదర్శించడంపై అధికార యంత్రాంగం నిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం. లైసెన్సు లేని ఆయుధాలను కలిగి ఉండటం చవాటిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

    యోగితో వైరం: మరోవైపు గత నెలలో, ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా సందర్భంగా,  పల్లకీలో 'సంగమం' వైపు వెళ్లడానికి అనుమతి లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్  సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించి అవిముక్తేశ్వరానంద వార్తల్లో నిలిచారు.

    ఇదీ చదవండి: జస్ట్‌ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్‌

    'పోక్సో'కేసు: ఆశుతోష్ బ్రహ్మచారి అనే మరో మత పెద్ద ఫిర్యాదు మేరకు గతంలో అవిముక్తే శ్వరానంద్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి 'బటుక్‌లు' అని పిలిచే యువ శిష్యులను ప్రయాగ్‌రాజ్‌లోని శంకరాచార్యుల ఆశ్రమానికి తీసుకువచ్చి,వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బ్రహ్మచారి ఆరోపించారు. అయితే, సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శంకరాచార్య కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్)

  • ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. అపరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్‌ను ఇష్టపడేవారికి షాకయ్యేలా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దుకాణదారుడు బంగాళా దుంపలను చేతులతో కాకుండా.. ఏకంగా కాళ్లతో.. అది కూడా చెప్పులు వేసుకుని కడుగుతున్న దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

    ఘాజీబాద్‌లోని డిఎల్ఎఫ్ అంకుర్ విహార్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో తీసిన మహిళ మాట్లాడుతూ.. ఓ ఆలూ టిక్కీ షాపులో ఈ దారుణం జరుగుతోందని.. తన తల్లి కూడా అక్కడ చాట్ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని మరీ బంగాళాదుంపలను కాళ్లతో కడగడం అత్యంత సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు.

    ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఘాజీబాద్‌ ప్రాంతం.. బంగాళాదుంపతో పరిశుభ్రతకు కొత్త అర్థాన్ని ఇస్తోందంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. "వావ్, అద్భుతమైన పరిశుభ్రత!" అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్స్‌ పెట్టారు. "మీకు ఇది చూసి అసహ్యం వేస్తోందా? అయితే ఒకసారి ఆవకాయ తయారీ ఫ్యాక్టరీకి వెళ్లి చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పటికీ పచ్చళ్లు తినరంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. "బయట తిండిపై నమ్మకం పోయింది.. ఇంట్లో వండిన ఆహారమే మిన్న అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.

    ఇలాంటి ఘటనలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు.. ఇదే నెలలో థానేలోని ఒక వీధి వ్యాపారి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి.. చేతులు కడుక్కోకుండానే తిరిగి వచ్చి పాప్‌కార్న్ అమ్మడం కనిపించింది. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే..

  • ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై ఇవాళ రాజ్యసభలో  ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఇరాన్ యుద్దానికి పరిష్కారమని, ఉద్రిక్తత తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కోగలమని తెలిపారు.

    ‘యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌కు ఆర్థిక, భద్రత, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు 3.75 లక్షల భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి సుమారు 1,000 మంది భారతీయులను తరలించాం. అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.

    విదేశాల్లోని భారత మిషన్లు 24/7 సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెల్ప్‌లైన్‌లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం కష్టతరం. అయినప్పటికీ ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి.

    ప్రస్తుతం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయి. ఎల్పీజీలో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాం. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చమురు దిగుమతులు తగ్గిస్తున్నాం. రైల్వే విద్యుతీకరణతో డీజిల్ వినియోగం తగ్గిస్తున్నాం.

    ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పురోగతి సాధించింది. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ ‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని మోదీ చెప్పారు. 
     

    భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..
  • ప్రముఖ బాలీవుడ్‌ నటిఅశ్విని కల్సేకర్‌ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్‌ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య.  పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్‌ కథ ఏంటో తెలుసుకుందాం.

    గోల్‌మాల్‌  అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్‌ మూవీలు, టీవీ షోలతో  తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా  నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్‌గా మారింది.

    దోసకాయ పచ్చడి రెసిపీ 
    ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ  పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ  ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన  దినుసులతో తయారు చేస్తారు.

    ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్

    అశ్విని షేర్‌ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు,  ఎండు,  పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్‌ ఆఫ్‌ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన  పెట్టి చల్లారనివ్వాలి.

    తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా  ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు  కూడా అశ్విని  అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.థ

    ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

  • భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఐటీ–ఆర్జీపీవీ) హాస్టల్ మెస్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్‌లో బల్లి కళేబరం (లిజార్డ్) కనిపించింది.

    దీంతో ఆ విద్యార్థి మెస్ సిబ్బందిని నిలదీశాడు. ‘అన్నా, ఇది ఏమిటో చూడండి. నాకు అనుమానం వస్తోంది’ అని ప్రశ్నించాడు. సిబ్బంది మాత్రం ‘ఇది బల్లి కాదు, సిమ్లా మిర్చి (క్యాప్సికమ్‌)’ అని సమాధానం ఇచ్చారు. 

    విద్యార్థి మాత్రం  ‘ఇది బల్లే.. గుడ్లు తేలేసింది’ అని వాదించాడు. ఈ మాటలతో అసహనానికి గురైన ఓ సిబ్బంది, ప్లేట్‌లో ఉన్న ఆ ముక్కను తీసుకుని తిన్నాడు. ‘ఇది బల్లి కాదు.. క్యాప్సికమే’ అని నిరూపించడానికి ప్రయత్నించాడు.

    ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో మెస్ పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. నెటిజన్లు సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్లేట్‌లో నిజంగా బల్లి కళేబరమేనా? లేక క్యాప్సికమ్‌ ముక్కనా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు.  

     

     

  • న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీపి కబురు అందించారు. మంగళవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ₹1,03,700 కోట్లతో భారీ బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగం చేసిన సీఎం, సామాన్యులపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒక ఉచిత ఎల్‌పీజీ సిలిండర్‌ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ. 260 కోట్లను కేటాయించారు.

    మౌలిక సదుపాయాలకు పెద్దపీట
    ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కోసం రూ.11,666 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నగర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. గతంలో (2018-2020 మధ్య) ఉచిత పథకాల సంస్కృతి వల్ల ఆదాయం తగ్గిందని, అయితే ఇప్పుడు ఢిల్లీ తలసరి ఆదాయం దేశంలోనే మూడవ స్థానంలో ఉందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఈ ఏడాది పన్నుల ద్వారా రూ.74,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

    బడ్జెట్‌లోని కీలక అంశాలు
    రవాణా - రోడ్లు: పీడబ్ల్యూడీ (పీడబ్ల్యూడీ)రూ. ₹5,921 కోట్లు, రోడ్ల కోసం రూ.1,352 కోట్లు కేటాయించారు. సుమారు 750 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విద్యుత్ రంగానికి రూ.3,942 కోట్లు, ఓవర్ హెడ్ వైర్ల తొలగింపుకు రూ. 200 కోట్లు కేటాయించారు. ఢిల్లీ జల బోర్డుకు రూ. 9,000 కోట్లు కేటాయిస్తూ, ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికీ నీరు అందించడమే లక్ష్యమని సీఎం చెప్పారు.

    అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.674 కోట్లు కేటాయించారు. యమునా ప్రాంతానికి ₹300 కోట్లు, గ్రామీణ వికాస బోర్డుకు ₹787 కోట్లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్లు, గిగ్ వర్కర్లు, కార్మికులతో ముందస్తుగా చర్చించి, వారి సూచనల మేరకు ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక రోడ్‌మ్యాప్ అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.

    ఇది కూడా చదవండి: సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్‌లాల్‌?

Social Media

  • విష సర్పాలతో ఆటలు చాలా ప్రమాదకరం.  స్నేక్‌ క్యాచర్స్‌ కూడా పాములను పట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందులోనూ అత్యంత విష సర్పమైన  కింగ్‌ కోబ్రాను పట్టుకోవడం చాలా ప్రమాదం. ఇక్కడొక వ్యక్తి కింగ్‌ కోబ్రాను బంధించిన వైనం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది. ఆ కోబ్రాను బంధించే క్రమంలో అది ఒకసారి చిక్కినట్లే చిక్కి మళ్లీ బుసలు కొట్టిన తీరు చూస్తే అమ్మో అనిపించకమానదు. 

    అయినా చివరకు అత్యంత చాకచాక్యంగా ఓ గొట్టం సాయంతో దాన్ని బంధించాడు ఆ స్నేక్‌ క్యాచర్‌.   ఒక గొట్టం, ఒక సంచి సాయంతో  దాన్ని ఎట్టకేలకు పట్టుకున్నాడు. కనీసం చేతికి గ్లౌజ్‌లు కూడా లేకుండానే పట్టుకోవడం  ఇది చూసిన నెటిజన్లకు మరింత కలవరాన్ని కలిగించింది. 

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏమాత్రం అటు-ఇటు అయినా ఇక ఆ కోబ్రా నుంచి తప్పించుకోవడం కష్టమనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 

    కింగ్‌ కోబ్రా ఎంత ప్రమాదమంటే ఒకే కాటు ద్వారా  400–500 mg వరకు విషం ఇంజెక్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఈ పరిమాణం 11 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగలదు అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది కూడా. మరి అటువంటి కింగ్‌ కోబ్రాతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పట్టుకోవడం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు.