Archive Page | Sakshi
Sakshi News home page

International

  • పశ్చిమాసియా యుద్ధంతో సతమతమువుతున్న ట్రంప్‌కు  ఇండోనేషియా షాక్ ఇచ్చింది. ఇటీవల  గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన 'బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌' మిషన్‌కు ఎటువంటి ఆర్థిక మద్ధతు అందించలేదని తెలిపింది.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం అనేక సమస్యలు వేదిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం కొద్దిరోజుల్లోనే ముగిద్దామనుకున్న ట్రంప్‌కు చుక్కెదురైంది. ఇరాన్ ఎంతకూ లొంగకపోవడంతో చేసేదేం లేక తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇ‍ప్పుడు ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. ఇటీవల ట్రంప్‌ ఏర్పాటు చేసిన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ మిషన్‌లో చేరడానికి సభ్యత్వ రుసుమును చెల్లించేది లేదని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్పష్టం చేశారు.

    ఆదివారం ఇండోనేషియా అధ్యక్షుడి ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ కోసం జకార్తా కేవలం ఎనిమిది వేల మంది శాంతి పరిరక్షక దళాలను మాత్రమే కేటాయించిందని ఎటువంటి సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని తెలిపారు. కాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్‌లో చేరినందుకు ఇండోనేషియా ముస్లిం ప్రజల నుంచి ప్రభోవో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ రుసుము చెల్లించడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

    డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో   గాజా ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం  బోర్డ్‌ ఆఫ్ పీస్ మిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

     

  • ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్‌ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్‌ జలసంధి దాటించడమే కాదు.. భారత్‌కు తీసుకొచ్చాడు. 

    లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.

    అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని  మరీ అక్కడ నుంచి దాటి యావత్‌ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఇప్పుడు ఈ టాపిక్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

    అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. 

    ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. 

    ముంబైలో ఓడ నిలిచిపోయింది
    అయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. 

    అంతా డార్క్‌ మోడ్‌..
    అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.

    శభాష్‌ భారత నావికుడా..
     ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. 

  • ప్రపంచదేశాలు తనకు వ్యతిరేకమైతే.. ఇరాన్ ఉపయోగించే ఆయుధం ఒక్కటే.. అదే హార్మూజ్ జలసంధిని మూసివేయడం..! చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే.. ఇది ఎన్నోమార్లు పునరావృతమైంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా తనపై దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మూజ్‌ని ఇరాన్ మూసివేసింది. దీంతో.. దక్షిణాసియా దేశాలు చమురు కోసం అతలాకుతలమవుతున్నాయి. భారత్‌లో కూడా ఎల్‌పీజీ కొరత తారస్థాయికి చేరుకుంది. అయితే.. ఉన్నఫళంగా హార్మూజ్‌ నుంచి భారత నౌకలను ఇరాన్ అనుమతించడానికి కారణమేంటి? దీని వెనక ఉన్న రహస్య అజెండా ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్‌ను కాదని ఇరాన్‌కు భారత్ ఆ స్థాయిలో సహాయం చేసిందా?? ఈ ప్రశ్నలపై ఇప్పుడు ప్రపంచదేశాల్లో చర్చ సాగుతోంది.

    ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే.. హిందూమహాసముద్రంలోని ఆ దేశ నౌకలను సైతం అమెరికా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో శ్రీలంక తీరంలో ఉన్న ఓ ఇరాన్ నౌకను అమెరికా ధ్వంసం చేయగా.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షతగాత్రులకు శ్రీలంక సర్కారు ఆశ్రయం కల్పించింది.

    అయితే.. అదే సమయంలో భారత్‌లోని కొచ్చి తీరంలో కూడా ఓ ఇరాన్ నౌక ఉందనే విషయం ఎంతమందికి తెలుసు?? అప్పటికే కొచ్చి తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ లావన్ అనే ఇరాన్ నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక లంగర్ వేసింది. అమెరికా కూల్చేసిన ఐరిస్ దేనా అనే నౌకతోపాటు.. ఐరిస్ లావన్ గత నెల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నాయి. 

    కొచ్చి తీరానికి ఐరిస్ లావన్ 
    అవి తిరిగి వచ్చే క్రమంలో ఐరిస్ దేనాను అమెరికా ధ్వంసం చేయగా.. ఐరిస్ లావన్ మాత్రం కొచ్చి తీరానికి చేరుకుంది. ఈ నెల 13న ఆ నౌకలోని సిబ్బంది భారత్‌ను శరణు కోరారు. స్వతహాగా శరణన్న వారికి ఆశ్రయం కల్పించే నైజమున్న భారత్ అందుకు ఓకే చెప్పింది. అంతేకాదు.. ఐరిస్ లావన్ నౌకలోని నావికులను ఇరాన్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. అప్పట్లోనే ఈ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందని తెలుసుకున్న అమెరికా నేవి, బ్రిటన్ రాయల్ నేవీ.. ఆ నౌక జోలికి వెళ్లకపోవడం గమనార్హం..! అదే సమయంలో తన నావికులకు ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ రాయబారి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    నౌకకు భారత్ భద్రత 
    ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐరిస్ లావన్ యుద్ధ నౌకలో ఏకంగా 140 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది, సహాయకులు ఉన్నారు. వారందరినీ ఇరాన్ యుద్ధ విమానాల్లో వారి దేశానికి సురక్షితంగా తరలించారు. పరిస్థితులు సద్దుమణిగేవరకు కొచ్చి తీరంలో ఉన్న యుద్ధ నౌకకు భద్రత కల్పించాలని ఇరాన్ కోరగా.. తమ వంతు ప్రయత్నం చేస్తామని భారత్ సమాధానమిచ్చింది. లంగరు వేసిన ఐరిస్ లావన్‌ను చిత్రీకరించిన ఓ జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

    దీన్ని బట్టి ఆ నౌకకు భారత్ ఎంతలా భద్రత కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్‌కు ఇది ఓ పెద్ద సాయం. నౌకాదళాన్ని కాపాడుకోవడానికి భారత్ భారీ సహకారం అందించినట్లు ఇరాన్ భావించింది. అంతే.. భారత్ కూడా తన అవసరాల కోసం ఇరాన్‌ ముందు డిమాండ్లు పెట్టింది. శాంతియుతంగా ఉండే తమ దేశానికి వస్తున్న నౌకలను హార్మూజ్‌లో అనుమతించాలని కోరింది. దాంతో.. ఇరాన్ వెంటనే ఓ ప్రకటన చేసింది. భారత్‌తో పాటు.. ఈ యుద్ధంలో పాల్గొనని దేశాల నౌకలకు హార్మూజ్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటికి మాత్రం భారత్ నౌకలు మాత్రమే హార్మూజ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి.  -వెబ్‌డెస్క్‌
     

  • ‘ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్‌ ఇస్తున్నాం. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం. గత కొన్ని రోజులుగా వారితో చర్చలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం’  ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన.

    ‘అదేమీ లేదు.. ట్రంప్‌ మాతో చర్చలు జరపలేదు.. అమెరికా భయపడింది.  మాతో అమెరికా ఎటువంటి చర్చలు జరపలేదు. వారికి వారే యుద్ధం ఆపేశారు’ అని వెనువెంటనే ఇరాన్‌ ప్రకటన

    అంతకుముందు చూస్తే.. ‘ 48 గంటలే ఇరాన్‌కు గడువు. ఇరాన్‌ లొంగిపోవాల్సిందే’ అంటూ ట్రంప్‌ ప్రకటన.  ఈ మాట యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ ఏదొక సందర్భంలో అమెరికా నోట వస్తూసే ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ కానీ, రక్షణమంత్రి పీట్‌ హెగ్సెత్‌ కానీ ఇరాన్‌ను వదిలే ప్రసక్తే లేదంటూ గాంభీర్యం ప్రకటించారు. వేటాడుతాం. మా శత్రువులు ఎవరైనా వదిలి పెట్టం. వెంటాడి వేటాడి చంపుతాం. ఎక్కడున్నా తుద ముట్టిస్తాం’ అంటూ రెచ్చిపోయి మాట్లాడారు.  అదే సమయంలో ఇరాన్‌ కూడా ధీటుగానే బదులిస్తూ వచ్చింది.  ‘ అంత సీన్‌ లేదు. లొంగిపోయే ప్రసక్తి అసలే లేదు. మేము ఆరు నెలల కాదు.. ఆరేళ్లైనా యుద్ధం చేస్తాం. ఆ సత్తా మాకు ఉంది. అమెరికా-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే వరకూ మా పోరాటం ఆగదు’ అని ఇరాన్‌ స్ట్రాంగ్‌గానే కౌంటర్ల ఇస్తూ వచ్చింది. అంతే ధాటిగా యుద్ధం కూడా చేసింది.

    ఆ రెండూ ట్రంప్‌కు భయం పుట్టించాయా?
    ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఇందులో ఒకటి అమెరికా అధునాతన టెక్నాలజీ కల్గిన ఎఫ్‌-35  విమానాన్ని ఇరాన్‌ డ్రోన్‌ కూల్చేయగా, మరొకటి 4000 కి.మీ రేంజ్‌తో ఒక బాలిస్టిక్‌ మిసైల్‌ను అమెరికా నావికా స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించడం. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. ఆ రెండు ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కచ్చితంగా భయం పుట్టించే ఉంటాయి. 

    మనం ఎంతో అధునాతనం అనుకున్న ఎఫ్‌ 35 విమానం ఎలా కూలిపోయిందనేదనే విషయంపై అమెరికా కచ్చితంగా చర్చలు జరిపే ఉంటుంది. అదే సమయంలో నాలుగువేల కిలోమీటర్ల రేంజ్‌తో క్షిపణిని ఇరాన్‌ ప్రయోగించడమే అమెరికాను డైలమాలో పడేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. 

    ఈ రెండు సందర్భాలు కూడా ఇరాన్‌ సైనిక శక్తిని అమాంతం పెంచేశాయి. ఇరాన్‌ బహిరంగంగా ప్రకటించిన దానికి, వాస్తవానికి భిన్నంగానే యావత్‌ ప్రపంచానికి అనిపించింది.  అయితే ఇప్పుడు ట్రంప్‌ ప్రకటనతో వాటికి బలం చేకూరనట్లయ్యింది. 

    ఏమాత్రం ఇష్టం లేని యుద్ధం
    అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేసిన యుద్ధం.. అమెరికా పౌరులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ అమెరికా పౌరులకే కాదు.. యావత్‌ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో ఎవరు గెలిచినా.. నష్టపోయేది ప్రజలే కాబట్టి.. దీన్ని ఎవరూ స్వాగతించలేదు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కన పెడితే, దీని వల్ల  ఎన్నో కుటుంబాలు ప్రభావితం అవుతాయనేది అందరికి తెలుసు కానీ, మూడు దేశాల్లో(అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌) జరగాల్సిన విధ్వంసం ఇప్పటికే జరిగిపోయిన తర్వాత ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ  ఆ  యుద్ధానికి దిగిన ఆ మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతే..  ప్రపంచ దేశాలపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది. 

    మళ్లీ శాంతి మంత్రం..
    మూడు వారాలకు పైగా భారీ విధ్వంసానికి కారణమైన ట్రంప్‌.. ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నారు.  పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తాం అంటూ ప్రకటించేశారు.  అంటే అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడమనేది ట్రంప్‌ నైజమనేది మరోసారి రుజువైంది. అప్పుడు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చిన ట్రంప్‌.. ఇప్పుడు ఇరాన్‌ విషయంలో ఆయనకు ఆయనే తగ్గిరనేది వాస్తవం. అంటే ఇరాన్‌ యుద్ధ సామర్థ్యం ఏమిటో ట్రంప్‌కు చిక్కలేదు. మరొకవైపు ఇరాన్‌ ప్రకటనలు కూడా భయం పుట్టించేంతగానే ఉన్నాయి. 

    ఈ క్రమంలో ట్రంప్‌ వెనక్కి తగ్గారనేది వాస్తవం. ఇక్కడ ట్రంప్‌ వెనక్కి తగ్గారనడం కంటే కూడా అమెరికా తేలిపోయింది అనుకోవడం ఇప్పుడు మన వంతైంది. ఎప్పుడూ ప్రపంచ దేశాలకు బిల్డప్‌లు మీద బిల్డప్‌లు ఇచ్చే అమెరికా శక్తి ఏపాటిదో కూడా అందరికీ తెలిసిపోయింది.  అమెరికాకు గట్టి కౌంటర్‌ ఇస్తే వాళ్లను వెనక్కి తగ్గేలా చేయడం పెద్ద కష్టమేం కాదు అనే విషయం ఇరాన్‌ రుజువు చేసిందనేది  కాదనక తప్పదు. చివరకు చేసేదేమీ లేక ట్రంప్‌ ఇలా చేతులెత్తేసే.. మళ్లీ శాంతి మంత్రం జపిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.  అందుకు ఇరాన్‌ ప్రకటన కూడా బలం చేకూరుస్తుంది. తమతో చర్చలు ఏమీ జరపలేదని ఇరాన్‌ ప్రకటించడం కూడా ట్రంప్‌ డబుల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది.  

  • ఇరాన్‌పై దాడులకు అయిదు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించడంపై ఇరాన్‌ స్పందించింది. ఇంధన వసతులపై దాడులు, చర్చలు అంటూ ట్రంప్‌ ప్రకటనపై  ఇరాన్‌ సంచలన  సంచలన వ్యాఖ్యలు చేసింది.  ట్రంప్ తాజా పోస్ట్‌పై స్పందిస్తూ, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్‌ వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

    టెహ్రాన్ గట్టి హెచ్చరికల నేపథ్యంలోనే  ఇరాన్‌ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసే ప్రణాళికల నుండి  డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు అసలు అమెరికా ఎలాంటి చర్చలు జరగలేదని  ఇరాన్‌ ప్రకటించడం గమనార్హం. ఇటీవలి అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం, తమ విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారని, ఈ సందర్భంగా మారుతున్న ప్రాంతీయ పరిస్థితి మరియు సమన్వయంపై చర్చించారని రష్యా తెలిపింది.

    మధ్యప్రాచ్యంలో మన శత్రుత్వానికి సంపూర్ణ పరిష్కారం కోసం గత రెండు రోజులుగా  అమెరికా, ఇరాన్ దేశం మధ్య చాలా మంచి, ఫలవంతమైన సంభాషణలు జరిగాయని, చర్చలు ముగిసేవారు దాడులుండవని ట్రూత్ సోషల్‌లో చేసిన ఒకపోస్ట్‌లో ట్రంప్ ప్రకటించారు. 

    ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ

    కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై, అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా భీకర దాడులను  ప్రారంభించాయి. మిస్పైళ్లతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్‌  సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబంలో చాలామంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇరాన్‌ తీవ్ర ప్రతిఘటనకు దిగింది. అలా గత 24 రోజులుగా  భీకర యుద్ధం సాగుతోంది. ఇంతలో మూసివేసిన హర్మోజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్‌కు డెడ్‌లెన్‌ విధించారు ట్రంప్‌. ఈగడువు మంగళవారం ఉదయంతో ముగియనుంది. ఇంతలోనే యుద్దానికి విరామం ప్రకటించడం దిగ్బ్రాంతి రేపింది.

  • వాషింగ్టన్‌: ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనా‍ల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నామన్నారు. టెహ్రాన్‌తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో మీడియాలో పోస్టు చేశారు.

    ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ట్రంప్ వాయిదా వేశారు. టెహ్రాన్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. 

    ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా.. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు. 

     

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ ప్రతిదారులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థిలా ఆందోళన కరంగా పరిణమిస్తోంది. సముద్ర మార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు, భారత కాలమానం ప్రకారం మంగళవారం  ఉదయం 5.14 గంటలకు ముగుస్తుంది. 

    హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్‌ను కోరారు.  అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

    ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీ

    మరోవైపు ట్రంప్‌ 48 గంటల గడుపు, చమురు కేంద్రాలపై దాడులు హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ తమ తీరాలపై లేదా ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో నావికా మందు పాతరలను మోహరిస్తామని  ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.

    ఈ నేపథ్యంలో ఈ దేశాల మధ్య శాంతి సంధి, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్‌కు ధరల పరంగా మరిన్ని షాక్‌లు తగిలే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే  బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 110 డాలర్ల వద్ద ఉంది.

    ఇండియా పరిస్థితి
    ఒకవేళ టెహ్రాన్, యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 50 శాతంతోనైనా ట్యాంకర్లను హోర్ముజ్ గుండా అనుమతిస్తే, కోట్లాది భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, కోట్లాది మంది పేదలకు ఊరట లభించినట్టే.  ఇది ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలలో జరగబోయే అత్యంత కీలకమైన ఎన్నికలకు సిద్ధమవుతున్న  బీజేపీకి కూడా ఇది ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది.  

    ట్రంప్‌ హెచ్చరికను ఇరాన్‌ లక్ష్య పెట్టకపోతే, వివిధ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాను, మొదటగా అతిపెద్ద ప్లాంట్‌తో ప్రారంభిస్తాను అన్న ట్రంప్‌  అదే పాటిస్తే యుద్ధం మరింత ముదిరి హోర్ముజ్ గుండా రవాణా అయ్యే చమురు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయి.

    మరోవైపు శత్రువులు కాని దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇందుకోసం టెహ్రాన్‌తో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి ఆదేశించినట్లు బీబీసీ నివేదించింది. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో 22 దేశాలు చేరాయి

    నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని నిర్ధారించేందుకు కనీసం 22 దేశాలు  అంగీకారానికి వచ్చాయి. నాటో సైనిక కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించిన ప్రకారం, నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వంటి భాగస్వామ్య దేశాలతో సహా 22 దేశాలు ఈ ఇరుకైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛనునిర్ధారించడానికి తమ చర్యలను సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి. 

    యుద్ధం ముగింపు గురించి మాట్లాడిన 24 గంటలలోపే ట్రంప్ ఈ బెదిరింపునకు పాల్పడటం,  ఇరాన్‌ వైఖరితో ఈ యుద్ధం నుండి బయటపడే మార్గం లేదని భౌగోళిక రాజకీయ సైనిక నిపుణులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
     

Politics

  • తాడేపల్లి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌పై  చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దీనికి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు హాజరయ్యారు. 

    రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌పై  చంద్రబాబు ద్రోహాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జిల్లాల స్ధాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలి. వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం, పది రోజులకోసారి జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించాలి. 

    విద్యార్ధి, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలి. రాయలసీమ జిల్లాలలో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై వివరించాలి. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లలో కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్ళాలి. అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, రైతాంగానికి వచ్చే సమస్యలు తదితర అంశాలపై ఆయా జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. 

  • విశాఖపట్నం:  తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయనపై షర్మిల, సునీతలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇదంతా మీరు చంద్రబాబు డైరక్షన్‌లోనే చేస్తున్నారని,. సొంత అన్నని దెబ్బ తీయడానికి ఎదుటి పార్టీతో చేతులు కలుపుతారా? అంటూ మండిపడ్డారు. 

    ఈరోజు( సోమవారం, మార్చి 23వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వరుదు కళ్యాణి..  వైఎస్‌ జగన్‌ను కోట్లాది మంది ఆడబిడ్డలు అన్నగా భావిస్తారని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా  ఉన్నారన్నారు. కానీ మీరు మాత్రం వైఎస్‌ జగన్‌పై అభాండాలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు..
    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత సహనంగా ఉన్నా అబాండాలు వేస్తూనే ఉన్నారు. అసత్యాలు చెబుతూ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా మారారు. ప్రెస్‌మీట్లు పెట్టి అసత్యాలు చెబుతున్నారు. సొంత అన్నను దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ చేతులు కలుపుతారా?,ఇంత ప్రేమగా చెల్లెళ్లను చూసుకొనే అన్న ఎవరైనా ఉన్నారా?, మీపై ప్రేమతో జగన్‌ రూ. 236 కోట్లు ఇచ్చింది నిజం కాదా? , బాబు సంపాదించిన ఆస్తులను తన అక్కా చెల్లెళ్లకు ఇచ్చారా? అని  ప్రశ్నించారు.

    వైఎస్సార్‌ వీలునామా అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌ను ద్వేషించే చంద్రబాబుతో మీరు స్నేహం చేస్తున్నారు.చంద్రబాబు డైరక్షన్‌లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. వైఎస్సార్‌ పేరు మీద నడుస్తున్న పార్టీ నేతలను పట్టుకుని కుక్కలని అంటారా?, మీకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా?, తెలంగాణ పార్టీ పెట్టి కడదాకా అక్కడే ఉంటా అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణను విడిచిపెట్టేది లేదన్నారు. కానీ అక్కడ పార్టీ మూసేసి ఇక్కడకు వచ్చారు’ అని మండిపడ్డారు వరుదు కళ్యాణి.

    జగన్‌ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడగండి.. 
    వైఎస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం ఏంటో చంద్రబాబును అడిగితే చెబుతారని వరుదు కళ్యాణి సవాల్‌ చేశారు. ‘ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ  ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. మీ తప్పుడు ఆరోపణలకు మేం సమాధానం చెబుతున్నాంఆయన సహనాన్ని మీరు బలహీనతగా తీసుకుంటున్నారు. 

    వైఎస్‌ జగన్‌ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. వైఎస్‌ జగన్‌ చెల్లెలు కదా అని సహనంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నాం. ఎవరి డైరక్షన్‌లో మీరు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే షర్మిల, సునీతలు నడుస్తున్నారని ప్రజలకు తెలుసు. అవినాష్‌రెడ్డి, రాచమల్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలేవి?, వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత మీకు లేదా?, వైఎస్‌ జగన్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? నిలదీశారు. 

     

  • తాడేపల్లి :  రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేయడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి శైలజానాధ్‌. రాయలసీమ మీద చంద్రబాబుకు ఎందకంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. ‘ వైఎస్‌ జగన్‌ రూ. 900 కోట్లతో 90 శాతం ఆల్రెడీ పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారు. తెలంగాణాకు మేలు చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆల్మట్టి నిర్మాణంతో ఇప్పటికే ఏపీకి, రాయలసీమకు అన్యాయం జరిగింది. 

    ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. పోలవరంలో వంద టీఎంసీల కంటే తక్కువ నీటిని నిల్వ చేస్తున్నారు. రాష్ట్రమంతటా నీటి కొరత ఏర్పడుబోతోంది. రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారు. ఏయిమ్స్, గ్రామీణ బ్యాంకు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ చంద్రబాబు తరలించుకుపోయారు. రాయలసీమ మీద చంద్రబాబుకు ప్రేమ లేదనటానికి ఇదే నిదర్శనం. 

    అసలు చంద్రబాబు రాయలసీమకు ఏం న్యాయం చేశారో చెప్పాలి?, వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు రైతులన్నా ప్రాజెక్టులన్నా ఎందుకంత ద్వేషం?, పొరుగు రాష్ట్ర సీఎం వద్దన్నారని రాయలసీమ లిఫ్టును ఆపటం ఏంటి?, తెలంగాణ, కర్నాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలి’ అని డిమాండ్‌ చేశారు.

National

  • ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ఓ ఆయుధం. దాన్ని డబ్బుకు అమ్ముకుంటుంటారు చాలా మంది. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తాం’ అని చెబుతుంటారు కొందరు. ఓట్లు వేసే వేళ తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగుతున్న వారు కూడా కనపడుతుంటారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉంటారు. ఓటుకు ఇంతగా అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్న ఈ కాలంలో.. తాము ఓటు వేసేందుకు డబ్బు వద్దని చెబుతున్నారు. రెండు గ్రామాల ప్రజలు. 

    ‘అభ్యర్థులు డబ్బు ఇవ్వకూడదు, ఓటర్లు డబ‍్బు తీసుకోకూడదు’ అని బోర్డు పెట్టి మరీ, ఆచరణాత్మకంగా సందేశం ఇస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలోని తీర గ్రామ ప్రజలు ఓటుకు డబ్బు ఇచ్చే అభ్యర్థులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 

    ఈ మేరకు హెచ్చరిస్తూ గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ, స్థానిక ప్రజల తరఫున తీసుకున్నారు. డబ్బు లేదా బహుమతులు ఇచ్చే అభ్యర్థులను గ్రామం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే గ్రామం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

    “మా ఓటుకు ధర నిర్ణయించవద్దు, మా జీవనోపాధికి మార్గం చూపండి” అని బ్యానర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ సాధారణంగా జరుగుతుండటంపై గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ అభ్యర్థుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.

    డబ్బులు తీసుకోంగానీ 100% ఓటేస్తాం
    మరోవైపు, ‘మా ఓటు అమ్మకానికి లేదు’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఆలంపట్టు పెరియర్ నగర్‌ గ్రామ యువకులు. అంతేగాక, తమ గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదవుతుందని హామీ ఇస్తున్నారు. పెరియర్ మరుమలర్చి డాక్టర్ అంబేద్కర్ యువ నర్పణి మండలి సభ్యులు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. పలు పోస్టర్లను బస్ స్టాండ్ ప్రయాణికుల షెల్టర్ వంటి పబ్లిక్‌ ప‍్లేసుల్లో అతికించారు.

    దీనిపై ఆలంపట్టు పెరియర్ నగర్ యువకులు మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో అందరం ఓటుకు డబ్బు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి రావద్దని గ్రామ సరిహద్దులోనే ప్రకటన బ్యానర్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. 

  • కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్‌ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదని, కానీ ఈసారి ఆ పొత్తు విజయం సాధించదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, సీపీఎం, ఎల్‌డీఎఫ్‌లకు అర్థమైందని, అందుకే వారు తమ చివరి ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.

    ఆదివారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న లావ్లిన్‌ కేసు వాయిదా పడటం, కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం, పీఎం–శ్రీ వంటి అంశాలు.. కేంద్ర ప్రభుత్వం, వామపక్ష పార్టీ సంబంధాలేంటో స్పష్టమవుతున్నాయని కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాల్లోనూ ఇదే సంబంధం ప్రతిబింబించిందని, ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వేణుగోపాల్‌ ఆరోపించారు. కానీ ఈ ఒప్పందాన్ని పార్టీ కార్యకర్తలు తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.  

    త్వరలో మేనిఫెస్టో... 
    రాష్ట్రం కోసం నిర్దిష్ట ప్రాజెక్టులు, ప్రణాళికలతో మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఎఫ్‌ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. కొబ్బరి పీచు, జీడిపప్పు, మత్స్య, చేనేత రంగాల్లో, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ, పూటగడవడమే ఇబ్బందిగా ఉన్న మహిళల జీవితాల్లో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.

    చ‌ద‌వండి: కేరళ సీఎం విజ‌య‌న్ ఆస్తులు ఇవే..

    ఈ పథకం కేఎస్‌ఆర్టీసీపై ఆర్థిక భారం మోపుతుందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కర్ణా­టక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రవాణా సంస్థలో­ని సమస్యలను పరిష్కరించడానికి యూడీఎఫ్‌ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ వంద స్థానాలను గెలుచుకుంటుందననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  • పండుగ సెలవుల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో  కీలక ప్రకటన,చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారతీయులు క్షేమంగా దేశానికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఇరాన్ నుంచే సుమారు 1,000 మంది భారతీయులు తిరిగి వచ్చారని తెలిపారు. అలాగే గల్ఫ్‌ దేశాలలో, కోటిమందికి పైగా నివసిస్తున్నారు. వారి కోసం 24/7 కంట్రోల్‌ రూమ్స్‌, హెల్ప్‌లైన్స్‌ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. ఈ సంక్షోభ సమయంలో విదేశాలలో ఉన్న భారతీయుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత నిచ్చినట్టు ప్రధాని స్పష్టం చేశారు

    గృహ అవసరాల ఎల్‌పీజీకే ప్రాధాన్యత
    గృహ అవసరాల ఎల్‌పీజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, దేశీయంగా వంట గ్యాస్‌ ఉత్పత్తిని పెంచామని మోదీ స్పష్టం చేశారు. హార్మోజ్ జల సంధిలో ఇరుక్కున్న భారత్ నౌకలను  సురక్షితంగా తీసుకు వచ్చామని మోదీ తెలిపారు.  41 దేశాల నుంచి చమురు, గ్యాస్, ఫర్టిలైజర్స్ తెప్పిస్తున్నామనీ. సురక్షిత నౌకా మార్గాలపై దృష్టిసారించామన్నారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ఇంధనం రిజర్వుగా ఉందని ఈ సందర్బంగా మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హర్మూజ్‌ జలసంధి ద్వారా గ్యాస్‌, క్రూడాయిల్‌ సరఫరా ఇబ్బందిగా మారింది. అయితే ఇంధన సమస్యలను అధిగమించేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తోందని మోదీ వెల్లడించారు. సాధ్యమైన ప్రతి చోటి నుంచీ చమురు, గ్యాస్ సరఫరాలను సేకరించ డానికి భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టేలా కఠిన చర్యలు తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోదీ సూచించారు. 

    యుద్ధం ముగించి,శాంతిని నెలకొల్పాలి: మోదీ
    యుద్ధం ముగించి,శాంతిని నెలకొల్పాలని కోరుతున్నాని మోదీ తెలిపారు.శాంతియుత సమాధానాన్ని తీసుకొచ్చేందుకు అందరు ప్రయత్నించాలని, దౌత్య,  చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశామనీ,  గల్ఫ్ దేశాధినేతలతో   స్వయంగా మాట్టాడినట్టు మోదీ వెల్లడించారు. చమురు,మౌలిక వసతుల ప్రాజెక్టులపై దాడులను ఖండించామ‍న్నారు. అలాగే ఈ సంక్షోభ పరిస్థితులను దుర్వినియోగం చేసే శక్తులపై చర్యలు తీసుకునేందుకు  భద్రత బలగాలను అప్రమత్తం చేశామన్నారు. ఈ యుద్ధం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు అందరం ఐకమత్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. 


    కోవిడ్‌ లాంటి సంక్షోభం : మోదీ ప్రధాని ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలు

    • ప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా, ఎరువుల కోసం ఏర్పాట్లు.
    • కీలకమైన ముడిసరుకుల విషయంలో నిల్వలను పెంచుకుంది.
    • యుద్ధం, భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో విద్యుత్ అవసరం పెరుగుతుంది 
    • ప్రస్తుతం, దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. 
    • వరుసగా రెండో ఏడాది కూడా  ఒక  బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. 
    • విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
    • మన పునరుత్పాదక బొగ్గు శక్తి 140 గిగావాట్లుగా ఉంది.
    •  గోవర్ధన్ యోజన కింద 40 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు
    • ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగాఉంటుందని మోదీ హెచ్చరిక
    • కోవిడ్  లాంటి సంక్షోభం, దీన్నిఅధిగమించడానికి  దేశం మరోసారి ఏకం కావాలి
    • గతంలో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం.  ఎప్పటిలాగానే ఐక్యంగా ఉండాలి.
       

    కాగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ఇంధన భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత  మోదీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో వంటగ్యాస్‌ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్న‌ట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు 10 కిలోల గ్యాస్‌ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ దిగుమతుల‌కు అంతరాయం క‌లుగుతోంది. భారత్‌ వినియోగించే ఎల్‌పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్‌ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 

    చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్‌ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్‌ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.

    ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్‌ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్‌ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. 

  • సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్‌లో ఇరాన్‌పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ  ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది.   

    పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.

    ఈ రోజు పార్లమెంట్‌లో సీసీఎస్‌ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.

    ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్‌ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్‌ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్‌, ఎంఎస్‌ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్‌, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. 

  • సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ  నియోజకవర్గం తాజాగా  హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. 

    డీఎంకేలో స్టాలిన్‌ సమక్షంలో ఇంటర్వ్యూ: 
    చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం  కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్‌.ఎస్‌.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్‌ కార్తీక్‌ సెల్వరాజ్‌ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్‌ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు  వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో  స్టాలిన్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

    కాంగ్రెస్‌ పార్టీలోనూ అదే సీన్‌ 
    డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్‌లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్‌) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్‌ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. 

    కమల్‌ ఖాతాలో పడేనా.. 
    గత ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యం అధినేత, నటుడు కమల్‌ హాసన్‌ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం  గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్‌ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్‌ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్‌ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్‌ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్‌ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి.  

     

Movies

  • మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌లో దృశ్యం-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మూవీకి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

    తాజాగా దృశ్యం-3 మేకర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడినట్లు మోహన్ లాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది మే 21 దృశ్యం-3 విడుదల కానుందని హీరో ట్వీట్ చేశారు. కాగా.. మొదట ఏప్రిల్ 02న విడుదల కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

    అంతేకాకుండా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా కనిపించనుండగా.. హిందీలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు.  హిందీ దృశ్యం3 కూడా షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. కాగా..ఈ చిత్రాన్ని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు.
     

     

  • గతేడాది బాలీవుడ్ స్టార్‌ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ  సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు.

    అయితే ఈ సినిమా దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 03 నుంచి సోనీ లివ్ వేదికగా అందుబాటులోకి రానుంది. కాగా..అమిర్ ఖాన్ గతంలో ఓటీటీలో రిలీజ్‌ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

     

     

    రూ.120 కోట్ల డీల్‌కు నో..

    అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్‌ డీల్‌ను అమిర్ ఖాన్‌ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్‌ స్పష్టం చేశారు. కానీ అమిర్ ఖాన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.  కాగా.. ఈ చిత్రంలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

  • దురంధర్.. దురంధర్‌.. దురంధర్‌.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్‌ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన దురంధర్‌ ది రివెంజ్‌ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

    ఈ నేపథ్యంలో అసలు దురంధర్‌ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్‌ ఎవరినీ తెగ నెటిజన్స్‌ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్‌కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా?‍ అయితే ఈ స్టోరీ చదివేయండి.

    రియల్‌ ధురంధర్‌ ఆయనే..

    రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్‌ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్‌ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్‌ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్‌గా పాకిస్తాన్‌ వెళ్లిన రవీంద్ర కౌశిక్‌.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.

    భారత్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్‌లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి  సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.

    23 ఏళ్ల వయసులోనే..

    రవీంద్ర కౌశిక్‌ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు. ‍అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో  న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.

    అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్‌ను కలవాల్సిన ముల్తాన్‌లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్‌ను సియాల్‌కోట్‌లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్‌వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్‌వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.

    r

    రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? 

    రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పట్టణం.  1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్‌లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.

    అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు.  ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడు.

  • టాలీవుడ్ హీరో శ్రీకాంత్ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను తన భార్య, నటి ఊహతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం వెళ్లిన శ్రీకాంత్ ‍దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికారు.

    అనంతరం మల్లిఖార్జున, భ్రమరాంబ అమ్మవార్లను హీరో శ్రీకాంత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వీరికి వేద ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే శ్రీకాంత్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సంబరాల ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఇవాళ శ్రీకాంత్‌ బర్త్‌ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. 
     

     

  • టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న జరిగిన ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు, కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా భోజనాలు, స్వీట్స్‌ పంపిణీ చేసింది విరోష్ జంట.

    అయితే ఇటీవల ఓ చిన్నారి అభిమాని పెళ్లికి పిలవలేదని అలిగింది. నేను మీ ఫ్యాన్‌నే నన్ను ఎందుకు పిలవలేదు? ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవలే ఆ చిట్టి అభిమానిని ఇంటికి పిలిచి లంచ్‌ ఏర్పాటు చేశారు. ఆ చిన్నారికి ఇష్టమైన స్వీట్స్‌ కూడా వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

    ‍అయితే అలాగే తాజాగా తమను పెళ్లికి పిలవలేదని మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లు చిట్టి అభిమానులు మాత్రం కాదండోయ్. గబ్బర్‌ సింగ్ చిత్రంలో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ గ్యాంగ్. వీరంతా విజయ్ దేవరకొండకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. మేము కూడా ఆర్టిస్తులమే కదా అన్నా.. మమ్మల్ని ఎందుకు పెళ్లి పిలవలేదు అన్న అంటూ వీడియోలో వేడుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ దురంధర్‌-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

     

  • టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తనకు అమెరికా వీసా మూడు సార్లు తిరిస్కరణకు గురైందని తెలిపారు. కానీ ఆ తర్వాత 2009లో మరో చరిత్ర షూటింగ్‌ టైమ్‌లో నాకు వీసా లభించిందని అన్నారు. అప్పుడే తొలిసారి యూఎస్ వెళ్లానని వెల్లడించారు. వీసా రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని యాంకర్ దిల్ రాజును ప్రశ్నించారు.

    దీనికి దిల్‌ రాజు బదులిస్తూ.. తొక్కా.. వాళ్లేంటి ఇచ్చేది.. వీసా వచ్చినప్పుడే పోదాం లే అనుకున్నా అని అన్నారు. ‍అప్పటికే నేను ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలను నిర్మించానని దిల్ రాజు తెలిపారు. కాగా.. తరుణ్‌ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం గాయపడ్డ సింహం. ఈ మూవీకి కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌కు నిర్మాత ముఖ్య ‍అతిథిగా దిల్‌రాజు హాజరయ్యారు. 

    రిలీజ్ డేట్ మారొచ్చు..

    అనంతరం ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ గురించి దిల్ రాజు మాట్లాడారు. వీళ్లు మే 1వ తేదీకి రిలీజ్‌ చేస్తామని అంటున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్‌ కానుంది. అలాంటి టైమ్‌లో వీళ్లు వన్‌ వీక్ వెనక్కి వెళ్లే అవకాశముందని అన్నారు. కాకగా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఓ యువకుడి జీవితం ఎలా మారింది? అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో తరుణ్‌ భాస్కర్‌కు జంటగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
     

     

  • సత్యవతి అలియాస్ ప్రముఖ సింగర్ మంగ్లీ పేరుతో కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంగ్లీ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి కోట్లు వసూలు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించి ఓ లాయర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించగా.. ఈ కేసులో మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్‌లో ఏకంగా రూ.150 కోట్ల మేర క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ విషయమై స్వయంగా మంగ్లీనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది)

    'మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న వార్తలని ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు, వాళ్లకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలామంది సంప్రదిస్తుంటారు. ఆ ఈవెంట్‌కి సంబంధించిన ఇన్విటేషన్ వివరాలవరకే గానీ, వాళ్ల వ్యక్తిగత వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సంబంధం లేని విషయం. ఇలాంటి మోసపూరిత విషయాల్లో నా పేరుని వాడుకోవడం, నన్ను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం' 

    'కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలని, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మొద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని కోరుతున్నాను' అని మంగ్లీ పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)

  • మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా సహాయ నటిగా రాణిస్తోంది నటి మంజు పాత్రోస్‌. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్‌ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన వర్క్‌ గురించి కాకుండా పర్సనల్‌ లైఫ్‌ గురించి వార్తల్లో నిలుస్తోంది. భర్త సునిచన్‌తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది.

    అవును, విడిపోయాం
    తాజాగా ఈ వ్యవహారంపై మంజు పాత్రోస్‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా విడిపోలేదు కానీ కొంతకాలంగా వేర్వేరుగానే జీవిస్తున్నాం. సునిచన్‌తో నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్‌ చేసి నా కొడుకుతో మాట్లాడుతుంటాడు. వాడిని చూసేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు కూడా! దాన్ని నేనేమీ అడ్డుకోను. మేమింకా చట్టపరంగా విడిపోలేదు. అలా అని మళ్లీ కలిసే ఆలోచనలు కూడా చేయడం లేదు.

    ఎంతో ఏడ్చా..
    ఇతరులకు నచ్చినట్లుగా ఎక్కువకాలం బతకలేం. మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. వాటిని కూడా గౌరవించాలికదా! ఇకపోతే ఇలా విడిపోతామని ఎన్నడూ అనుకోలేదు. నా భర్త లేకుండా ఎలా బతకాలని ఎంతగానో ఏడ్చాను. ఒంటరిగా ఎలా జీవిస్తానని భయపడ్డాను. కానీ, ఇప్పుడా భయం పోయింది.. చేతిలో డబ్బుంది కాబట్టి నిర్భయంగా జీవిస్తున్నారని మీరంటారేమో! ఇక్కడ విషయం డబ్బు కాదు.. అలాగైతే నా అకౌంట్‌లో ఇప్పటికీ చాలా తక్కువ మొత్తమే ఉంది. 

    చిల్లి గవ్వ లేని స్థితిలో..
    ఓపక్క అప్పు తీరుస్తున్నాను, మరోపక్క కొడుకును చదివిస్తున్నాను. ఒకానొక సమయంలో ముక్కుపుడక తప్ప నా చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయాను. అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లు నాకు మద్దతుగా నిలబడ్డారు, సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. మంజు మలయాళంలో జిలేబి, కమ్మటిపాదం, స్కూల్‌ బస్‌, కల్యాణం, ప్రేమసూత్రం, తోటప్పన్‌, మై సాంటా, హెవెన్‌, క్వీన్‌ ఎలిజబెత్‌, ఎఎమ్‌ఐ, భూతకాలం వంటి పలు సినిమాల్లో నటించింది. మలయాళ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లోనూ పాల్గొంది.

    చదవండి: జూన్‌లో ధురంధర్‌ 3? నిజమెంత?

  • ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్‌, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్‌ క్రియేట్‌ చేసుకుని సీక్వెల్‌లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్‌ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.

    ధురంధర్‌ బ్లాక్‌బస్టర్‌
    రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్‌ మూవీ 2025 డిసెంబర్‌లో విడుదలైంది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్‌ కోసం జనం వెయిట్‌ చేశారు.

    ధురంధర్‌ 3 రాబోతోందా?
    అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్‌ 2ని తీసుకొచ్చారు మేకర్స్‌. మార్చి 19న ధురంధర్‌: ది రివేంజ్‌ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్‌ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.

    ఫేక్‌ ఫోటో
    అది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్‌ సృష్టించారు. జూన్‌ 14న ధురంధర్‌: ద ఫైనల్‌ చాప్టర్‌ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్‌గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.

    సినిమా
    సినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్‌ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్‌ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్‌ న్యూస్‌ అని అర్థమవుతోంది.

     

     

    చదవండి: కరుప్పు ఫస్ట్‌ ఛాయిస్‌ సూర్య కాదా?

  • అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా తీస్తున్న సినిమా 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)

    తెరచాప ట్రైలర్ చూస్తుంటే సముద్రతీరంలో జరిగే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడమూ సహజమే. అలాంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితులపై ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ. 

    (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయిన ధురంధర్ 2)

  • ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    (ఇదీ చదవండి: ధురంధర్‌ 2 సక్సెస్‌: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్‌)

    తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.

    మరోవైపు బాలీవుడ్‌లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్‌ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)

  • స్టార్‌ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్‌ సూర్య కంటే ముందు దళపతి విజయ్‌ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ కెరీర్‌లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 

    2023లోనే..
    అలాంటి ఒక ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్‌ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్‌ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్‌గా చేసేస్తాడు. తన స్క్రీన్‌ ప్రజెన్స్‌ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. 

    విజయ్‌కు కథ చెప్పా..
    ఈ కథకు బలమైన స్టార్‌ ఉంటే బాగుంటుందనిపించింది.  అలా హీరో విజయ్‌ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్‌కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్‌ వంటి స్టార్‌ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. 

    నచ్చింది కానీ..
    అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.

    సినిమా
    కరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్‌, యోగిబాబు, శివదా, సుప్రీత్‌ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్‌ డేట్‌ ప్రకటించాల్సి ఉంది.

    చదవండి: ధురంధర్‌ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్‌

Sports

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నలుగురు సభ్యులతో కూడిన నూతన సెలక్షన్ క‌మిటీ ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్‌ను బీసీబీ నియ‌మించింది. గ‌తంలో బంగ్లా సెల‌క్ష‌న్ క‌మిటీలో కేవ‌లం ముగ్గురు స‌భ్యులు మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు మ‌రొక‌రిని ప్యాన‌ల్‌లోకి బీసీబీ చేర్చింది. ఈ కొత్త క‌మిటీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 వర‌కు త‌మ బాధ్య‌త‌ల్లో కొన‌సాగ‌నుంది.

    కాగా 53 ఏళ్ల బాషర్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో త‌నంక‌టూ ప్ర‌త్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 3000 ప‌రుగులు దాటిని మొద‌టి బంగ్లాదేశ్ ఆట‌గాడు కూడా ఆయ‌నే కావ‌డం విశేషం. అదేవిధంగా గ‌తంలో పురుషుల, మహిళల జట్లకు సెలక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా అత‌డికి ఉంది.

    ఇక ఈ ప్యాన‌ల్‌లో అత‌డితో పాటు మాజీ పేసర్ హసిబుల్ హొస్సేన్, నయీమ్ ఇస్లాం, నదీఫ్ చౌదరి ఉన్నారు. 39 ఏళ్ల నయీమ్ పేరిట‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ త‌ర‌పున అత్య‌ధిక సెంచ‌రీలు(34) సెంచ‌రీలు చేసిన రికార్డు ఉంది. ఈ సీనియ‌ర్ సెల‌క్ష‌న్ ప్యాన‌ల్ బంగ్లాదేశ్ క్రికెట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తుంద‌ని బీసీబీ భావిస్తోంది. బంగ్లా జ‌ట్టు ఇటీవ‌లే పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

  • పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అరోరా ప్రాతినిథ్యం వహించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన ఆరోరా.. ఇప్పుడు ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఎలా రాణిస్తాడో అందరూ అతృతగా ఎదరుచూస్తున్నారు.

    గతేడాది జరిగిన వేలంలో పోటీపడి మరి రూ. 1.50 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంట్రాస్క్వాడ్  మ్యాచ్‌లో కూడా అరోరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తాచాటాడు. అతడు వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.

    ప్రధాన టోర్నీలోనూ ఇదే జోరును కొనసాగించాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సలీల్‌ ఆరోరాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో అరోరాను ప‌ఠాన్ పోల్చాడు. కాగా అభిషేక్‌, అరోరా ఇద్ద‌రూ పంజాబ్‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

    "స‌లీల్ అరోరా కూడా పంజాబ్ క్రికెట్ నుంచే వ‌చ్చాడు. ఇప్ప‌టికే దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న స‌త్తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ‌, నమన్ ధీర్, రమన్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పంజాబ్ నుండి వ‌చ్చి త‌మకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలీల్ కూడా అదే జాబితాలో చేరేలా క‌న్పిస్తున్నాడు. 

    వేలంలో అత‌డిని ఎస్ఆర్‌హెచ్ ఒక బ్యాక‌ప్ ఆట‌గాడిగా తీసుకుంది. కాబ‌ట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఫామ్‌లో లేకపోయినా, లేదా అనికేత్ వర్మ సరిగ్గా ఆడకపోయినా సలీల్‌కు అవ‌కాశం ద‌క్కుతుంది.  బెంచ్‌పై సలీల్ వంటి ప్రతిభావంతుడు ఉన్నందున.. నితీశ్‌, అనికేత్‌పై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది" అని ప‌ఠాన్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?

  • ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు భారత పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడా? అంటే అవునానే  సమాధానం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికి బుమ్రా ఇంకా ముంబై ఇండియ‌న్స్ శిబిరంలో చేర‌లేదు.

    టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం ప్ర‌కారం.. బుమ్రా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్‌నెస్ పరీక్షల కోసం మాత్ర‌మే బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు సీఓఈకు ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసమా వెళ్లాడా అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

    ముంబై ఇండియ‌న్స్ నుంచి కూడా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే ఇటీవ‌ల మాట్లాడుతూ.. ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టుతో చేరుతారని చెప్పాడు.

    కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్లకు హాజరుకాలేదు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రికెట్ వ‌ర్గాల్లో చర్చానీయాంశ‌మైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియ‌న్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
    చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

  • ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్‌, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ తన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్  'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) మంజూరు చేసింది.

    మలింగ ఒకట్రెండు రోజుల్లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలవనున్నాడు. మలింగకు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 19వ సీజన్ కూడా దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. గత వారం శ్రీలంక క్రికెట్ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో  దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్ ఉ‍త్తీర్ణత సాధించినప్పటికి.. మలింగ మాత్రం క్లియర్ చేయలేకపోయాడు.

    దీంతో అతడు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలలో మాత్రం అతడు పాసయ్యాడు. మలింగ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. మలింగ గత సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ లేని లోటును మలింగ భర్తీ చేయనున్నాడు. 

    మలింగ వెన్ను గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్), మతీష పతిరణ (కోల్‌కతా నైట్ రైడర్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇంకా ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: PSL 2026: చంపేస్త‌మంటూ వార్నింగ్‌.. అయినా పాక్‌కు వ‌చ్చిన స్మిత్‌

  • ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా 2026-27 కాలానికి గానూ ఆస్ట్రేలియా షెడ్యూల్‌కు సంబంధించిన అంతర్జాతీయ క్యాలెండర్‌ను సీఏ ప్రకటించింది.

    ఇందులో భాగంగా ఆగష్టు నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ద్వారా ఆసీస్‌ హోం సీజన్‌ మొదలుకానుంది. ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్టుతో 2027 మార్చితో ఈ సీజన్‌ ముగియనుంది. ఇక సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో నాలుగు వారాల పాటు సిరీస్‌లు ఆడనున్న ఆసీస్‌.. అక్టోబరు చివరలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

    ఆ తర్వాత నవంబరులో ఇంగ్లండ్‌తో ఎనిమిది మ్యాచ్‌ల వైట్‌బాల్‌ సిరీస్‌ ఆడనుంది. ఇక వచ్చే ఏడాది జనవరి మధ్య లేదంటే చివరి వారంలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టు.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.

    వారికి ఇదే ఆఖరి సిరీస్‌
    ఈ నేపథ్యంలో.. ‘‘భారత్‌లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవని కమిన్స్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌ వంటి ఆటగాళ్లకు ఇదే ఆఖరి సిరీస్‌ కావొచ్చు’’ అని సీఏ తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

    ఇదిలా ఉంటే.. ఒకవేళ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2027 ఫైనల్‌కు అర్హత సాధిస్తే జూన్‌లో ఇంగ్లండ్‌ వేదికగా ఆసీస్‌ ప్రత్యర్థితో తలపడుతుంది. అనంతరం జూన్‌- ఆగష్టు మధ్య కాలంలో ఇంగ్లండ్‌ గడ్డ మీద ఐదు టెస్టులు ఆడుతుంది.

    ఆస్ట్రేలియా టెస్టు షెడ్యూల్‌ 2026-2027
    👉ఆగష్టు: బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్టులు
    👉అక్టోబరు- సౌతాఫ్రికాతో మూడు టెస్టులు
    👉డిసెంబరు- జనవరి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై నాలుగు టెస్టులు
    👉జనవరి- మార్చి: టీమిండియాతో ఐదు టెస్టులు
    👉మార్చి 11-15: ఇంగ్ల​ండ్‌తో సొంతగడ్డపై 150వ వార్షికోత్సవ టెస్టు
    👉జూన్‌: డబ్ల్యూటీసీ ఫైనల్‌ (అర్హత సాధిస్తే)
    👉జూన్‌- ఆగష్టు: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు.

    చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

  • ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో ఆడేందుకు ల‌హోర్‌కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధ దళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వ‌చ్చిన‌ప్ప‌టికి.. స్మిత్ మాత్రం పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టాడు. ల‌హోర్ ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య అత‌డు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బ‌స చేసే హోట‌ల్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.

    చంపేస్త‌మంటూ వార్నింగ్‌!
    కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్ర‌క‌ట‌న‌లో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయిన‌ప్ప‌టికి విదేశీ ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా పాక్‌కు చేరుకుంటున్నారు.

    పీసీబీ కీల‌క నిర్ణ‌యం..
    ఈ హెచ్చరిక‌ల‌ నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవ‌లం రెండు వేదిక‌ల‌లో ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

  • ఐపీఎల్‌-2026 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆకాష్ దీప్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి సుమారు 8 నుంచి 12 వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విదర్భ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబేతో కేకేఆర్ భర్తీ చేసింది.

    ఐపీఎల్‌-2022లో దూబేను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసినప్పటికి, గాయం కారణంగా అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సీజన్ మినీ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికి ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకాష్ దీప్ గాయం బారిన పడడంతో లక్కీగా ఐపీఎల్‌లో ఆడే అవకాశం దూబేకు దక్కింది.

    ఈ విద‌ర్భ పేస‌ర్‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే స‌త్తా అత‌డి ఉంది. అంతేకాకుండా బౌన్సీ పిచ్‌ల‌పై బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్ట‌గ‌ల‌డు. 2019 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భార‌త అండ‌ర్‌-23 జ‌ట్టు త‌ర‌పున దూబే అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఒకే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.

    ఆ స‌మ‌యంలో భార‌త అండ‌ర్‌-23 జ‌ట్టు కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ఉండ‌డం విశేషం. ద్ర‌విడ్ వంటి దిగ్గ‌జం నుంచి కూడా అత‌డు పాఠాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మ‌హా వేదిక‌పై స‌త్తాచాటేందుకు సౌర‌భ్ సిద్ద‌మ‌య్యాడు.

    కాగా కేకేఆర్‌ను గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే హ‌ర్షిత్ రాణా, ఆకాష్ దీప్ దూరం కాగా.. శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరానా ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఐపీఎల్‌-19వ సీజ‌న్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్‌..!
     

  • భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అత్యంత ప్రత్యేకమైన రెండు ఇళ్లను పిల్లలకు పంచి ఇచ్చేశానని తెలిపాడు. పంజాబ్‌కు చెందిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు 1983- 1999 వరకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు.

    తన కెరీర్‌లో మొత్తంగా 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిన సిద్ధు.. టెస్టుల్లో 3202, వన్డేల్లో 4413 పరుగులు సాధించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా కొనసాగుతున్న సిద్ధు.. టీవీ షోల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఇక రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు రెండుసార్లు ఎంపీగా పనిచేశాడు.

    ఓ కుమారుడు, కుమార్తె
    వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. డాక్టర్‌, రాజకీయ నాయకురాలు నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధును పెళ్లాడిన సిద్ధుకు.. కుమారుడు కరణ్‌ సిద్ధు, కుమార్తె రబియా సిద్ధు సంతానం. ఇదిలా ఉంటే.. తాజాగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. తాను బతికి ఉండగానే తన పిల్లలకు ‘విలువైన’ ఆస్తులను పంచి ఇచ్చినట్లు తెలిపాడు.

    ఇద్దరికి చెరో ఇల్లు
    ‘‘పార్వతీ దేవి అమ్మవారి అనుగ్రహంతో అమృత్‌సర్‌లో నేను కట్టుకున్న ఇల్లు.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎక్కువగా ఇక్కడ నివసించలేకపోయాను. బిగ్‌బాస్‌ నుంచి స్టార్‌ టీవీలో హిందీ కామెంట్రీ, కపిల్‌ శర్మ షో.. ఇలా ఒక్కో ఆదాయ మార్గం

    అయితే, రాజకీయాల ద్వారా ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు. నా కష్టార్జితంతోనే కొన్ని ఆస్తులు కూడబెట్టగలిగాను. పటియాలాలో మా నాన్నగారు కట్టించిన పూర్వీకుల ఇల్లు కరణ్‌కు వారసత్వంగా లభిస్తుంది. 

    అమృత్‌సర్‌లో నేను కట్టిన ఇల్లు రబియాకు ఇస్తున్నాము’’ అని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా కూతురుతో కలిసి దిగిన ఫొటోలు, శివలింగానికి పూజ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

    రూ. 25 కోట్లు!
    కాగా అమృత్‌సర్‌లో ప్రీమియర్‌ లొకాలిటీలో సిద్ధు కట్టిన ఇల్లు 49,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం, 2014-15 మధ్య కాలంలో నిర్మించిన ఈ ఇంటి విలువ దాదాపు రూ. 25 కోట్లు అని తెలుస్తోంది. స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, స్పా వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయట.

    అంతేకాదు.. ఈ విలాసవంతమైన ఇంటిలో ప్రత్యేకంగా శివుడి కోసం చిన్న ఆలయం కూడా నిర్మించినట్లు కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రతిష్టించిన శివలింగం దాదాపు రూ. 2.5 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. శివుడితో పాటు ఇతర దేవతా విగ్రహాలు, శ్రీ గురు గ్రంథ్‌ సాహిబ్‌ కూడా ఇందులో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. 

    అమృత్‌సర్‌ ఇల్లు, పటియాలా నివాసం వద్ద కూతురితో సిద్ధు

    చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

  • టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్‌లో లుకలుకలు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

    న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్‌ను ప్రారంభించాలని సోమవారం నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసింది.

    ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నాష్ తన పదవి నుంచి వైదొలగి అందరికి షాకిచ్చాడు. "బోర్డు తీసుకున్న నిర్ణయాలకు నేను మద్దతు ఇవ్వలేను. అందుకే నా పోస్ట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను" అని నాష్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

    మొన్న స్కాట్‌.. నేడు నాష్‌
    కాగా ఇదే టీ20 లీగ్ వివాదం కారణంగా గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు నాష్ ఈ జాబితాలోకి చేరాడు. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయానికి సోఫీ డివైన్‌, అమీలియా కేర్ వంటి స్టార్ ఉమెన్స్ క్రికెటర్లు మాత్రం మద్దతు తెలుపుతున్నారు.

    కాగా  భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్‌కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ యోచిస్తోంది.
    చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌, అమెరికా పేస‌ర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌లను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.

    ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం దుమ్ములేపాడు. ఒక్క భారత్‌పై తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలతో అతడు చెలరేగాడు.

    తద్వారా ఒకే టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

    ఫర్హాన్ కంటే ముందు బాబర్ ఆజం,  ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాక్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్‌కు అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. 

    ఇక మహిళల విభాగంగాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర.
    చదవండి: వైభవ్‌పై డివిలియర్స్‌ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్‌ షాకింగ్‌ కామెంట్స్‌
     

  • పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలో అద్భుతాలు చేశాడు వైభవ్‌ సూర్యవంశీ. ఇటు ఐపీఎల్‌లో.. అటు భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు తరఫునా సత్తా చాటాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో విధ్వంసకర శతకంతో అతి పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.

    తద్వారా భారత్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు.

    అతడొక గొప్ప ఆటగాడు
    ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ చేసిన వ్యాఖ్యలు.. అందుకు ప్రతిగా టీమిండియా స్టార్‌, ఆర్సీబీ ఆటగాడు జితేశ్‌ శర్మ (Jitesh Sharma) బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘‘అతడొక గొప్ప ఆటగాడు. అండర్‌-19 క్రికెట్‌లో అతడి ఆట తీరును నేను గమనించాను.

    ఐపీఎల్‌లాంటి పెద్ద టోర్నీలో ఆడిన తర్వాత అదే స్థాయిలో.. అవే ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగడం అందరికీ సాధ్యం కాదు. అయితే, వైభవ్‌ సూర్యవంశీ మాత్రం వరల్డ్‌కప్‌ టోర్నీలో అంతే ప్రొఫెషనల్‌గా, భయం లేకుండా ఆడటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

     ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు
    ఆ వయసుకే అతడు అంతగా పరిణతి చెందిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఎక్కడ ఆడుతున్నా తన గేమ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉంటాడు. తను తనలాగే ఆడతాడు. వేరే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేయడు. బౌలర్లను గౌరవిస్తాడు. చెత్త బంతుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టడు. అతడొక గొప్ప ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు’’ అని డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు.

    అయితే, ఇందుకు జితేశ్‌ శర్మ బదులిస్తూ.. ‘‘అతడు అస్సలు ప్రొఫెషనల్‌ కాదు. నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను’’ అంటూ సరాదాగా కామెంట్‌ చేశాడు. ‘‘అందరూ అతడిని ప్రొఫెషనల్‌ అనుకుంటారు. మైదానంలో అతడు ఎలా ఉంటాడన్నది పక్కనపెడితే.. మైదానం వెలుపల మాత్రం అస్సలు చెప్పిన మాట వినడు. రాత్రివేళ ఐస్‌క్రీమ్‌ తినొద్దని నేను ఎంతగానో మొత్తుకున్నా.

    చెప్పిన మాట అసలే వినడు
    అయినా అతడు నా మాట వినలేదు. ఈ విషయంలో అతడు ఎప్పుడూ ఎవరి మాటా వినడు’’ అని జితేశ్‌ శర్మ వైభవ్‌కు ఉన్న అలవాటు గురించి డివిలియర్స్‌కు చెప్పాడు. కాగా చిన్న వయసు కాబట్టి ఐస్‌క్రీమ్‌ పట్ల వైభవ్‌కు ఆ మాత్రం ఇష్టం ఉండటం సహజమే. 

    అయితే, ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో డైట్‌ పాటిస్తూ జీవనశైలిని మెరుగుపరచుకుంటేనే ఫిట్‌గా ఉండి.. అనుకున్న శిఖరాలకు చేరుకోగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏసీసీ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌లో భారత జట్టుకు జితేశ్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. వైభవ్‌ సూర్యవంశీ అందులో సభ్యుడిగా ఉన్నాడు.

    చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

  • పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్వాహకులకు మరో తలనొప్పి వచ్చి పడింది. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ సహా చాలా మంది విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధదళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. 

    విదేశీ ఆటగాళ్లను హెచ్చరిస్తూ తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌కు చెందిన జమాత్‌ ఉల్‌ అహ్రార్ పంచుకున్న లేఖను ఇస్లామాబాద్‌ పోస్ట్‌ తన ‘ఎక్స్‌’లో పంచుకుంది. ‘కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కైబర్‌ పంక్తున్వా, బెలూచిస్థాన్‌ ఫ్రావిన్స్‌కు చెందిన అమాయక ప్రజలపై పాకిస్థాన్‌ అమానుష దాడులకు పాల్పడుతుంది. 

    మా ప్రజలపై వారు చేస్తున్న దాష్టీకాలన్నింటిని గమనిస్తూనే ఉన్నాం. త్వరలోనే పాకిస్థాన్‌కు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లకు ఇదే మా హెచ్చరిక. పీఎస్‌ఎల్‌ ఆడేందుకు పాకిస్థాన్‌కు రావొద్దు. ఇక్కడి పరిస్థితులు అంతగా బాలేవు. కాబట్టి ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. నిజానికి మేము క్రికెట్‌కు వ్యతిరేకులం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీఎస్‌ఎల్‌ నిర్వహించడం మంచిది కాదు. 

    పీఎస్‌ఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు అవనసరంగా ఇబ్బంది పడడం ఇష్టం లేదు. కాబట్టి పాకిస్థాన్‌కు రాకపోవడమే మంచిది. ఒకవేళ వస్తే పాక్‌ విడిచి వెళ్లిపోతే మంచిదని మా అభిప్రాయం.’ అని లేఖలో పేర్కొంది. పశ్చియాసియా యుద్ధం, అఫ్గానిస్థాన్‌తో వైరం కారణంగా పీఎస్‌ఎల్‌లో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆదివారం పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ ఒక ప్రకటన విడుదల చేశారు. 

    ఇంతలో పాకిస్థాన్‌ వ్యతిరేక శక్తుల నుంచి లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భద్రతా, ఇతర కారణాల రీత్యా చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌కు గుడ్‌బై చెబుతున్నారు. షనక, ముజరబానీ, స్పెన్సర్‌ జాన్సన్‌ తదితరులు జాబితాలో ఉన్నారు. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్‌ఎల్‌లో ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్లు సహా మొయిన్‌ అలీ (ఇంగ్లండ్‌), డెవన్‌ కాన్వే (న్యూజిలాండ్‌) ఇలా చాలా మందే ఉన్నారు. కానీ తాజా బెదిరింపులతో అసలు పీఎస్‌ఎల్‌ సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

    చదవండి: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!

  • తనకు 60 ఏండ్లు వచ్చే వరకు ఐపీఎల్‌ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పేర్కొనడం చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం 44 ఏండ్లు ఉన్న ధోనికి ఐపీఎల్‌ 2026 సీజన్‌ ఆఖరిదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. 

    ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విషయంలోకి వెళితే.. ఆదివారం సీఎస్‌కే ఫ్యాన్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ హీరో శివకార్తికేయన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోని రిటైర్మెంట్‌ విషయమై శివకార్తికేయన్‌ మాట్లాడాడు. 

    ‘ధోని సార్‌ మీరు రిటైర్‌ అవ్వొద్దు. అలా చేస్తే చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులు బాధపడతారు. 44 ఏళ్ల వయసులోనూ మీరు యంగ్‌గానే కనిపిస్తున్నారు.కనీసం 60 సంవత్సరాల వరకైనా క్రికెట్‌ ఆడి మమ్నల్ని అలరించాలి’ అని పేర్కొన్నాడు. దీనిపై మహేంద్ర సింగ్‌ ధోని వెంటనే స్పందించాడు. 

    ‘రోజురోజుకు ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ కూడా తగ్గుతూ వస్తోంది. అయినా సరే 60 ఏళ్లు వచ్చే వరకు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని ధోని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే యాజమాన్యం తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న ధోనికిది 19వ సీజన్‌. 

    ఇప్పటివరకు ధోని ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లాడి 5,349 పరుగులు సాధించాడు. 2024లో సీఎస్‌కే కెప్టెన్‌గా వైదొలగడానికి ముందు ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్స్‌ అందించి జట్టు ప్రయాణంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ధోని పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మున్ముందు తేలనుంది. అయితే సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ మాత్రం ఈ సీజన్‌కు ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. 

    అయితే ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో సంజూ శాంసన్‌ సీఎస్‌కేకు రావడంతో కీపింగ్‌ బాధ్యతలు అతడే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ధోనికిది చివరి సీజన్‌ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సీఎస్‌కే ట్రేడింగ్‌లో ఏరికోరి శాంసన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

    చదవండి: Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’

  • డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌తో మార్చి 28న ఐపీఎల్‌-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.

    కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌
    ఇక ఆరంభ మ్యాచ్‌లకు ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్‌ నెట్‌ ప్రాక్టీస్‌, ఇంట్రాస్వ్కాడ్‌ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది.

    ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్‌ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    సెలక్టర్లు వింటారు!
    టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్‌.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్‌ అడుగగా నితీశ్‌ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. 

    ఈ క్రమంలో ఇషాన్‌ కిషన్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్‌తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.

    కాగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన నితీశ్‌ రెడ్డిని.. హార్దిక్‌ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో హార్దిక్‌ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్‌.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

    అది సాధ్యం కాదు!
    ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్‌ కిషన్‌ నితీశ్‌ రెడ్డికి కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో బ్యాటింగ్‌ చేయడం ఇష్టమా? లేదంటే డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ ఇష్టమా? అని హోస్ట్‌ అడుగగా.. నితీశ్‌ రెడ్డి పవర్‌ ప్లే అని సమాధానం ఇచ్చాడు.

    దీంతో మరోసారి ఇషాన్‌ కిషన్‌ కౌంటర్‌తో ముందుకు వచ్చాడు. నితీశ్‌ రెడ్డి రెగ్యులర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్‌ ప్లేలో బ్యాటింగ్‌ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. 

    టెస్టు జట్టులో స్థానం సుస్థిరం
    కాగా సన్‌రైజర్స్‌ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్‌ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

    మరోవైపు ఇషాన్‌ కిషన్‌ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్‌-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

    చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Business

  • ''ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్‌ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.

    బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్‌కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.

    అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు  అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.

    అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్‌కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.

  • ఓ 26 ఏళ్ల యువకుని చేతిలో మిలియన్ డాలర్ల డబ్బు ఉంటే.. ఏం చేస్తాడు. లగ్జరీ కారు కొంటాడు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇంకా అయితే దుబారా ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది. కానీ 'అమన్ గోయల్' మాత్రం వీటన్నింటికీ పూర్తిగా విరుద్ధం. తనకు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేశాడనే విషయాన్ని అతడు వివరంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    2021 నవంబర్‌లో, నేను నా స్టార్టప్‌ను ఒక పెద్ద కంపెనీకి మిలియన్ డాలర్లకు అమ్మాను. ఇది జరిగినప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. ఆ వయసులో చాలా మంది ఆడంబరమైన కార్లు, వాచీలు లేదా ఇతరులను ఆకట్టుకునే జీవనశైలి కోసం విపరీతంగా ఖర్చుపెట్టేవారు. నేను మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నాను. సౌకర్యం, సంతోషం, దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛను సమతుల్యం చేసుకుంటూ, ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించుకున్నానని అమన్ గోయల్ పేర్కొన్నారు.

    కుటుంబానికి మొదటి ప్రాధాన్యత
    స్టార్టప్‌ను అమ్మిన తరువాత.. అదే సంవత్సరం, నేను నా తల్లిదండ్రులను ముంబైలో నాతో పాటు నివసించడానికి తీసుకువచ్చాను. మన సంపదను మనకు అత్యంత ముఖ్యమైనవారితో పంచుకోకపోతే.. దానికి అర్థం లేదని అన్నారు. వారు ఇప్పటికీ నాతోనే నివసిస్తున్నారు, నిజం చెప్పాలంటే, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే.

    ఆరోగ్యం
    డబ్బు వచ్చింది కదా అని ఊరికే ఉంటే సరిపోదు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద వహించాను. నేను 15 కేజీలకు పైగా బరువు తగ్గాను. దీనికోసం ఒక ఫిట్‌నెస్ కోచ్‌ను నియమించుకున్నాను. నేను, నా భార్య కూడా సంవత్సరానికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాము. మీరు కూడా ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోతే.. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

    ఆహారం
    నేను బయటి ఆహారం, షుగర్, వేయించిన పదార్థాలను చాలా వరకు తగ్గించాను. ఆరోగ్యం వంటగదిలో మొదలవుతుంది, జిమ్‌లో కాదు అని అమన్ పేర్కొన్నారు.

    ఇల్లు
    నేను 2022లో మొత్తం డబ్బు చెల్లించి ఒక ఇల్లు కొన్నాను. ఎలాంటి లోన్స్ తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అద్దెకు ఉండటమే తెలివైన పని అని చాలా మంది అంటారు. ఒకరకంగా అది నిజమే కావచ్చు.. కానీ నా తల్లిదండ్రులు స్థిరపడి, సంతోషంగా ఉండటానికి సొంత ఇల్లు అవసరం.

    అప్‌గ్రేడ్‌లు అంటే విపరీతమైన ఖర్చు అని అర్థం కాదు. వాటి అర్థం శాంతి, ఆరోగ్యం. మీరు ప్రేమించే వారితో గడిపే సమయం. మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీరు కొనవలసిన నిజమైన విలాసాలు ఇవే అని అమన్ తన ట్వీట్ పూర్తి చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు అతని నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు.

  • సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

    సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.

    స్టాక్‌ల విషయానికొస్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్‌క్యాప్100, నిఫ్టీ మిడ్‌క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి.

  • జెరోధా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్‌ 50:50 ఇండెక్స్‌ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఫండ్‌ను కేదార్‌నాథ్‌ మిరాజ్‌కార్‌ నిర్వహించనున్నారు. ఈ ఫండ్‌ అధిక రిస్క్‌ కిందకు వస్తుంది.

    నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్‌ 400 50:50 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.

    జియో బ్లాక్‌రాక్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ 
    జియో బ్లాక్‌రాక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా జియో బ్లాక్‌రాక్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్‌ 7న ముగుస్తుంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్‌ఈ 100 ఇండెక్స్‌ (టీఆర్‌ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.

    తన్వి కచేరియా, సాహిల్‌ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్‌ప్లాన్‌ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

  • భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్  రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.

    ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!

  • సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్‌జీ (CNG), ఇళ్లలో పైప్‌లైన్ ద్వారా వచ్చే పీఎన్‌జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్‌ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.

    వంటగదిలో రారాజు.. ఎల్‌పీజీ
    కోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్‌పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.

    సీఎన్‌జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్
    కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్‌జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.

    పీఎన్‌జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్
    నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG).  ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్‌లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.

    ఎల్ఎన్‌జీ.. భారీ పరిశ్రమల ఇంధనం
    లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్‌జీని తిరిగి గ్యాస్‌గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు.

  • జైప్రకాష్‌(జేపీ) అసోసియేట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తీర్పును సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను వేదాంత ఆశ్రయించింది.

    జేపీ అసోసియేట్స్‌ ఆస్తులకు రూ.14,535 కోట్లతో అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడం తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ ఆస్తుల కోసం అదానీతోపాటు వేదాంత, దాల్మియా భారత్‌ సైతం పోటీ పడ్డాయి. కానీ, రుణదాతల కమిటీ మాత్రం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్‌కు అంగీకారం తెలిపగా.. దీనికి మార్చి 17న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. దీన్ని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో వేదాంత సవాల్‌ చేసింది. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టనుంది.

  • న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రధాన వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంక్‌లో పబ్లిక్‌కు 5.29 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం బ్యాంక్‌లో 60.72 శాతం వాటా విక్రయానికి బిడ్స్‌ను ఆహ్వానించింది.

    అయితే ఇందుకు సరైన స్పందన లభించకపోవడంతో ఓఎఫ్‌ఎస్‌ అవకాశాలనుప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్‌ ధర కంటే దిగువన అదికూడా రెండు సంస్థలు మాత్రమే వాటా కొనుగోలుకి ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం, బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే.

    పబ్లిక్‌ వాటా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ పరిమితంగానే నమోదవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్‌కు కనీసం 10–15 శాతం వాటా కల్పిస్తే బ్యాంక్‌ షేరుకి తగిన ధర నమోదయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో ఓఎఫ్‌ఎస్‌ ద్వారా వాటా విక్రయానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది.

  • నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.

    హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్‌ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.

    యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.

    ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.

    గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.

    భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.

  • భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్‌ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.

    నివేదికలోని ముఖ్యాంశాలు

    • క్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.

    • టీమ్, లీగ్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.

    • క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.

    ‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్‌) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.

    ఎదురులేని రారాజు క్రికెట్

    భారత మార్కెట్‌లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్‌షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.

    ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?

    క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.

    ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్‌ ఎంతంటే..

  • కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్‌ మల్టీ టాస్కింగ్‌ ల్యాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌(ఎంఎంఎల్‌యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్‌ఎల్‌ఈ). ఎంఎంఎల్‌యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్‌మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిన హెచ్‌ఎల్‌ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.

    ఏమిటీ హెచ్‌ఎల్‌ఈ? ఎందుకంత కఠినం?

    ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్‌ఎల్‌ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్‌లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్‌ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.

    గెలుపు ఎవరిది?

    ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.

    ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)
    GPT-4o2.7%-
    OpenAI o18.0%-
    DeepSeek-R18.5%-
    GPT-5-25.3%
    Gemini 2.5 Pro-21.6%
    Gemini 3 Pro (Live)-38.3%

     

    ఆందోళన కలిగిస్తున్న అంశాలు

    ఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.

    కొలమానమే కరిగిపోతోందా?

    ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్‌స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్‌ఎల్‌ఈ రోలింగ్‌’ పేరుతో నిరంతరం అప్‌డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.

    ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

  • ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించారు.

    నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!
    తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

    యువతకు విలువైన హెచ్చరిక
    ఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.

    తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.

    ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!
    ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.

    (ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్‌ రిపీట్‌)

    "వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.

  • తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్‌ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్‌ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    ఆర్థిక క్రమబద్ధీకరణ

    ప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్‌) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

    సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే హెచ్‌ఓబీసీ ఫ్యుయెల్‌లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

    సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి

    ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..

    ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)
    పెట్రోల్రూ. 266.17రూ. 321.17
    డీజిల్రూ. 280.86రూ. 335.86

     

    విమాన ప్రయాణికులకు షాక్

    ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్‌లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.

    ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

  • మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.

    సెలవుల వివరాలు ఇవే...

    • మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.

    • మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.

    • మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

    • మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.

    • నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.

    డిజిటల్ సేవలు యథాతథం
    బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

    • ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.

    • డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

    • ఇతర సేవలు: ఫిక్స్‌డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.

    మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

  • ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం.  

    ఆన్‌లైన్‌లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్‌ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్‌కి ఫోన్‌ చేశారు.

    ‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్‌ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.

    మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.

    2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్‌ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్‌ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్‌ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి. 

    అయినా నోటీసు. వెంటనే ఆడిటర్‌గారికి ఫోన్‌ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్‌ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది.  

    ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్‌లో వివరాలు మిస్‌ మ్యాచ్‌ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్‌ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది.  

    తన జ్యూరిస్‌డిక్షన్‌ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు.  

    ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్‌డేట్‌ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్‌ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు.

Telangana

  • పశ్చిమాసియాలో యుద్ధం జరిగిందన్న విషయం తెలిసిందే. దానివల్ల నిన్నటివరకు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దాని ప్రభావం వల‍్ల భారతదేశంలోని చాలా వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్ బ్యాగ్స్. మనం మార్కెట్‌ నుంచి ఎన్నో వస్తువులను తీసుకెళ‍్లడానికి వాడుతుంటాము. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ధర కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఈ విషయంపై మరిన్ని వివరాలను ‘సాక్షి’కి వివరించారు మాన్ సరోవర్ అగ్రోసాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని భగవంత్ పన్సారి.

    ఇప్పుడు ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఎన్నడూలేనంత రేట్ ఉంది. ఇలా పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఇది క్రూడాయిల్‌కు సంబంధించిన ప్రొడక్ట్‌. రైస్ మిల్స్‌, ఫ్లోర్ మిల్స్‌, సిమెంట్ ఫ్యాక్టరీస్‌ అన్నింట్లో ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉంది. వేరే ప్యాకింగ్ ఏది లేదు. అన్నింట్లోనూ ప్లాస్టిక్ ఉంది. మీరు గుట్కా తీసుకుంటే కూడా, నీళ్ల పాకెట్ తీసుకుంటే కూడా ప్లాస్టికే. ప్లాస్టిక్ యూసేజ్‌ ఇంకా పెరుగుతుంది. మాకే దానా దొరకడంలేదు. మాకు రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోని టై అప్ ఉంది. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మేము ట్రేడ్ లో ఉన్నాం. 

    ఇక ప్రజలు ఏం చేస్తారు? ఏ రేట్ ఉన్నా వాళ్లకు బ్యాగ్ కావాల్సిందే. 10 రూపాయల బ్యాగును మేము 18 రూపాయలకు అమ్ముతున్నాం ఇప్పుడు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. వచ్చేనెల సమస్య ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ ప్లాస్టిక్‌ బ్యాగులు తక్కువనే ఉత్పత్తి అవుతున్నాయి.

    డైలీ 3-4 లక్షలు అమ్మేవాళ్లం. 1,50,000కి వచ్చేశాం. సమీప భవిష్యత్తులో లక్ష బ్యాగులు కూడా ఇవ్వలేము. రా మెటీరియల్ మనకు దొరకదు. మన ఫ్యాక్టరీలు నడవవు. ఫ్యాక్టరీలు నడవకుంటే మనం సప్లై చేయలేము. పెట్రోల్ లేకుంటే బండి నడవదుకదా? పాల పాకెట్ కూడా ప్లాస్టిక్ ఉంటేనే మీ ఇంటికి చేరుతుంది. ప్లాస్టిక్‌ కొరత ఇంకా పెరుగుతుందన్న సమాచారం మా వద్ద ఉంది. మాల్ చాలా షార్టేజ్ ఉంది’ అని తెలిపారు.

    గోనె సంచులకు డిమాండ్‌ ఎందుకు తగ్గింది?
    ప్రస్తుతం గన్ని బ్యాగ్స్ (గోనె సంచులు)కు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. వీటిని కేవలం వరి పండించిన తర్వాత ఆ వడ్ల కోసం మాత్రమే వాడుతున్నారు. ఇంకా దేనికీ వాడట్లేదు. గతంలో బియ్యానికి కూడా గోనె సంచులు వాడేవారు. కానీ ఈ కాలంలో బియ్యానికి కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. అసలు గోనె సంచులకు ఎందుకు డిమాండ్ తగ్గింది? గన్నీ బ్యాగ్స్ బిజినెస్ చేసే మధు సురేష్ వివరాలు తెలిపారు.

    ‘నేను 40 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాను. డిమాండ్ ఎందుకు తగ్గిందంటే ప్రాపర్‌గా జూట్ దొరకట్లేదు ఒకటి. ఆ జూట్‌ను ప్రొడక్షన్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇస్తే దాని గురించి ఎంతో మంది ఫార్మర్స్ ప్రొడక్షన్ చేస్తారు. రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ అయిపోయి జూట్‌ను బంద్‌ చేసేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో ఏమవుతుంది? మొత్తం ప్లాస్టిక్ అంతా వేడి వస్తుంది. అంత కవర్ వేస్తారు.. దానివల్ల క్యాన్సర్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని పట్టించుకోవట్లేదు’ అని చెప్పారు.   -వెబ్‌డెస్క్‌

    పూర్తి వివరాలు

  • సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌ గరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్, పాల్గొన్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసు కోవాల్సిన చర్యలపై చర్చించారు.

    2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపు కోవాలని కోరారు. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

    ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

    శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.  ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి,ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) అందరూ శోభాయాత్ర సందర్భంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా, అన్నింటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్‌ను పరిశీలించారు.

    ఈ సమావేశంలో అడిషనల్ సీపీ  తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్,ఎన్. శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

  • సాక్షి,  హైదరాబాద్:- కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.

    “Childrens Bank” పేరుతో   ఉన్న రూ. 100, 200, 500  నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

  • హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.

    ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.

    ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్‌లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. 

    ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్‌ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్‌ ఆపలేదు. మేము ఒక్క సీజన్‌ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.

    నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్‌ రావు అన్నారు.

  • సాక్షి, హైద‌రాబాద్‌: రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది తానేన‌ని మేడ్చ‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామ‌కూర‌ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న‌స‌భ లాబీలో సోమ‌వారం మీడియా ప్ర‌తినిధులతో ఆయ‌న చిట్‌చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ''రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ తప్ప ప‌వ‌ర్‌ఫుల్‌ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం మీటింగ్‌లో నేనే చెప్పాను. ఎవరు అవునన్నా కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేన‌''ని మ‌ల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

    ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ క్యారెక్టర్ త‌న‌దేన‌ని మ‌ల్లారెడ్డి వెల్ల‌డించారు. దర్శకుడు హరీష్ శంకర్ విలన్ పాత్ర చేయ‌మ‌ని త‌న‌ను అడిగితే నో చెప్పానని అన్నారు. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉందంటూ త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు.

    విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ
    మల్లారెడ్డి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స‌ర‌దాగా స్పందించారు. ''మల్లారెడ్డి నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ'' అంటూ త‌ల‌సాని హాస్య‌మాడారు. దీంతో అక్క‌డ నవ్వులు విరిశాయి. కాగా, ఇటీవ‌ల 50వ పెళ్లిరోజు మ‌ల్లారెడ్డి ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. 

    చ‌ద‌వండి: దానం నాగేంద‌ర్‌కు హైకోర్టు నోటీసులు

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌ శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు.. రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రసంగించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌ రద్దీని నివారించే  ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌ నగరానికి నలువైపులా నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సిటీలోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వరకు సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు. 

    మరోవైపు మూసీ అభివృద్ధి  ప్రణాళికల అమలుకు తాము ప్రయత్నిస్తుంటే అడ్డు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తయారు చేసిన ప్రణాళికలు తాము అమలు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే అప్పటి ప్రభుత్వం మూసీకి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. నల్లగొండ ప్రజల కష్టాలను చూసైనా మూసీ అభివృద్ధి కి సహాకరించాలని కోరారు.

    మూసీ ప్రక్షాళన ఆపండి అని కాకుండా, ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వాలన్నారు. ఒక వేళ సూచనలు తనతో పంచుకోవడానికి ఇబ్బందైయితే... శ్రీధర్ బాబు, పొన్నం నేతృత్వంలో కమిటీ వేస్తానని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

    అలాగే మధుపార్క్ అపార్ట్‌మెంట్‌ వాసులు ఆందోళన చేస్తున్నారని.. కానీ దీన్ని నాలా నిబంధనల ప్రకారం నిర్మించారని పేర్కొన్నారు. అయితే  ఇప్పుడు అది బఫర్ జోన్ అయిన నేపథ్యంలో  అది ఆ  అపార్ట్‌మెంట్‌ మధ్యలో నుంచి వెళుతుందని వివరించారు. అయితే మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ వాసులకు నష్టం జరగకుండా చూస్తామని, నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎవ్వరినీ నిరాశ్రయులను చెయ్యం, పునరావాసం కల్పిస్తామంటూ అక్కడి వారికి భరోసా ఇచ్చారు. అలాగే  మధుపార్క్ అపార్ట్‌మెంట్‌కు తమ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వచ్చినపుడు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు.

  • హైదరాబాద్‌ : బాపూఘాట్‌ వద్ద గాంధీ విగ్రహం కోసం మా ఇండ్లు కూలగొట్టకండి అంటూ రాహుల్‌ గాంధీకి  1000కి పైగా పోస్టు కార్డులు రాసి నల్లటి రిబ్బన్‌పై అతికించిన మధుపార్క్‌ అపార్ట్‌మెంట్‌ చిన్నారులు  
    – బండ్లగూడ


    ఖైరతాబాద్‌లో అరుదైన పక్షి 
    పంజగుట్ట: ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలోని మొగల్‌ మస్కాన్‌ అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటున్న చిన్నారులకు శనివారం రాత్రి ఓ పక్షి కనిపించింది. అప్పుడే అటువైపు వచి్చన ఓ వ్యక్తి గమనించి పంజరంలో ఉంచి  యానిమల్‌ వారియర్స్‌ సొసైటీకి ఫోన్‌ చేశాడు. వారువచి్చ.. అది అరుదైన గుడ్లగూబ జాతికి చెందినదని చెప్పి తీసుకెళ్లారు. ఆ పక్షిని అడవిలో వదిలేస్తామని పేర్కొన్నారు.   

  • సాక్షి,హైదరాబాద్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్‌ పార్టీ మారలేదన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వ్యాఖ్యలకు సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.  అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం,స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.    

  • సాక్షి, హైదరాబాద్‌ :  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కోర్టులకు బాంబు బెదరింపుల రావడం రేపింది.  తెలంగాణాలోని ములుగు జిల్లాకోర్టుకు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్టాజిల్లా, మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు  బాంబు  బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

    ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
    ములుగు జిల్లా కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు  ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులకు  పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన  కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో  బాంబ్‌  స్క్వాడ్‌తో  వచ్చిన  పోలీసులు కోర్టుతోపాటు పరిసరాలను తనిఖీ శారు. ఈ సందర్బంగా లాయర్లు, ఉద్యోగులు, కక్షిదారులను బయటకు పంపించివేశారు.

    కృష్ణాజిల్లా : మచిలీపట్నం జిల్లా కోర్ట్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. జిల్లా జడ్జి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు.

    ఇదీ చదవండి: రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి

Andhra Pradesh

  • అనకాపల్లి:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు నిలువునా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. రాజయ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ నిర్మాణం జరగదని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోలేదని విమర్శించారు. 

    బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దని 76 రోజుల పాటు ఉద్యమం చేశామని,  బల్క్‌ డ్రగ్‌ పార్క‌పై చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు. తమకు చంద్రబాబు హామీ ఇచ్చి 93 రోజులైందని, అయినా  ఇప్పటికీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌పై చంద్రబాబు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు మత్స్యకారులు. 

  • ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించడాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో పైనాన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దన్నారు. ‘ కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. కానీ వాస్తవానికి  పోలవరం ఒరిజినల్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం పోలవరం నిర్మించాలి. పోలవరం నిల్వ సామర్థ్యాన్ని 190 టీఎంసీల నుంచి 120 కి తగ్గించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు  అన్యాయం చేయడమే. ఆంధ్రప్రదేశ్ అప్పు రెండేళ్లలో 3 లక్షల 36,000 కోట్ల రూపాయలు దాటింది. ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. 

    ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం  జోక్యం చేసుకోవాలి. ఏపీలో అత్యధిక 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ సగటు 5.2 ఉంటే ఏపీ ది అత్యధికంగా 8 శాతం ఉంది. మహిళల్లో నిరుద్యోగ రేటు 10% గా ఉంది. వైఎస్‌ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 32 లక్షల పట్టాలు ఇచ్చి .. ఇల్లు మంజూరు చేశారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో 14 లక్షల 20 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2024 నుంచి 26 మధ్య టిడిపి ప్రభుత్వం రూ. 1165 కోట్ల రూపాయలను ఇల్ల నిర్మాణానికి  వినియోగించకుండా వదిలేసింది. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది

    చాలామంది ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటకీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాలు పక్కన పెట్టి పోలవరం కోసం  పనిచేసేందుకు ముందుకు వస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  వ్యతిరేకిస్తున్నాం. కొత్త స్టీల్ ప్లాంట్ కు సంబరాలు చేస్తున్న ప్రభుత్వం.... ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు చంపుతుంది?, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలి. చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బకాయిలకు చిన్న వ్యాపారులను శిక్షించొద్దు. ఎంఎస్ఎమ్ఈలకు జీఎస్టీ ఇన్‌కమ్ టాక్స్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

  • సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

    ‘ఏపీలో అభివృద్ధి పనులు చేయకుండా... అప్పులు చేస్తున్నారు. ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. కేవలం 22 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం 3 లక్షల 18 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా భవిష్యత్తు తరాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ అప్పులపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలి.

    చేస్తున్న అప్పులతో ఫలితాలు వస్తున్నాయా? అని పరిశీలన జరగాలి. అప్పులతో తెచ్చిన నిధులతో ఆస్తులు నిర్మించి, జీవన స్థితిగతులను మెరుగుపరచాలి. విద్యారంగానికి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం నిధులను కేంద్ర బడ్జెట్లో పెంచారు. ఏపీలో 60 శాతం ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆలస్యం అవుతుంది.

    దీనివల్ల బలహీన వర్గాల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. మత్స్య సంపద ఎగుమతులు 60% ఏపీ నుంచే జరుగుతున్నాయి. 1,60,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. వేలాదిమంది దీనిపై ఆధారపడ‍్డారు. కోస్తా తీరంలో మత్స్యకారులు ఉపాధికి చర్యలు తీసుకోవాలి. గోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్బర్ ఆధునికీకరణ జరగాలి.

    కోస్తా ప్రాంతంలో మెరైన్ ప్రాసెస్  క్లస్టర్ ఏర్పాటు చేయాలి. సెస్, సర్ చార్జీల వల్ల రాష్ట్రాలు తగిన వాటా పొందలేకపోతున్నాయి. దీనిపై పునః పరిశీలన జరగాలి. వైద్యరంగంపై తగిన దృష్టి సారించాలి. ఆరోగ్య పథకాలకు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్దేశిత గడువుతో రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. మేజర్ రైల్వే ప్రాజెక్టులను జవాబుదారీతనంతో పూర్తి చేయాలి’ అని అన్నారు. 
     

  • అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి...  ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు.  ఇందుకు అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్ల  ఖర్చే నిదర్శనం.

    అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట.  ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్‌  కాంప్లెక్స్‌ డిజెన్లకే  వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. 

    ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం.  ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు  అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు..  అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని  నవ్వుకోక మానరు.

    రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..
    మరి ఆనాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.  230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్‌లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా  తక్కువ. 

    మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్‌ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.

    ఆ భవనాలపై వికృత రాజకీయం
    రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభు­త్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా  వైఎస్‌ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.

    తన చేతకానితనాన్ని  కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో  రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా..  రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్‌ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన  ఐకానిక్‌ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు.  అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.

    చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు..  ఇప్పుడొక కవరింగ్‌. ఇది బాబుగారి రాజనీతి పాలన.

    మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.

    అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్‌
    ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్‌ జగన్‌. ఏ విషయంలోనైనా జగన్‌ మార్క్‌ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్‌ జగన్‌ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్‌ అంటూ మెచ్చుకున్నది మీరే.   ఇది కూటమి పెద్దల తీరు. 

    అయితే, మరి  ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్‌ భవనాలను పోల్చి చూస్తే..  కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్‌ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది.  నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. 

    మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?
    అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్‌లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు  ఏంటని చర్చించుకుంటున్నారు. 

  • గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో హింసించడంపై విచారణ చేపట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.

    ‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణ అధికారిని మార్చాలి. నల్లపాడు పీఎస్‌లో టార్చర్‌ వ్యవహారంలో పూర్తి విచారణ చేయాలి. మా ఇంటిపై ఏడున్నర గంటలపాటు దాడి చేసి హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడికి పోలీసులు సహకరించారు. ఇలాంటి ఘటనలో పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేయాలి. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు దారుణంగా వ్యవహరించారు. న్యాయం జరగకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తా. దాడులకు పాల్పడినవారిని, ప్రేరేపించినవారిని వదిలేదే లేదు’ అని అంబటి రాంబాబు అన్నారు. 

     


     

  • బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే సైబర్‌ నేరస్తుల బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాల­రాజు మొబైల్‌ ఫోన్‌కు ఆర్టీఏ చలానా పేరిట ఒక లింక్‌తో కూడిన మెసేజ్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేయగానే ఆయన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.12 లక్షలు డ్రా చేసినట్టు మెసేజ్‌లు రావడంతో షాక్‌­కు గురయ్యారు. 

    వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యా దు చేశారు. జీలుగుమిల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలిపా రు. ప్రభుత్వ, అధికారిక సంస్థల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని, సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

  • మార్కాపురం జిల్లా: ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కర్ణాటక డిపోకు చెందిన సిబ్బంది, ప్రయాణికులు దాడి చేశారు. అనంతరం ఏపీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి, తమ బస్సులోకి నెట్టి..45 కిలోమీటర్ల పాటు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల ఎస్‌ఐ వెంకట రమణయ్య తెలిపిన వివరాలు..

    రాత్రి వేళల్లో శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో ప్రయాణానికి అనుమతులు లేకపోవడంతో ఆదివారం ఉదయం 6 గంటలకు వాహనాలన్నీ నంద్యాల జిల్లా శిఖరేశ్వరం చెక్‌పోస్టు గేట్‌ వద్ద ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన విజయపురి ఆర్టీసీ బస్సు వరుసగా లైనులో ఉన్న బస్సులను వేగంగా దాటి చెక్‌పోస్టు గేటు వద్దకు వచ్చేసింది. 

    ఈ క్రమంలో అక్కడే ఉన్న పీలేరు డిపో డ్రైవర్‌ చాంద్‌బాషాకు, కర్ణాటక బస్సు సిబ్బంది మధ్య మాటామాటా పెరిగింది. దీంతో చాంద్‌బాషాపై కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది దాడి చేసి అతడిని తమ బస్సులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇది చూసిన మరో డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెద్దదోర్నాలలోని గణపతి చెక్‌పోస్టు వద్ద కర్ణాటక బస్సును నిలిపేశారు. బస్సులో బందీగా ఉన్న చాంద్‌బాషాను విడిపించారు. కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని వారిని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు.

     

Family

  • ఎండాకాలం మొదలవ్వగానే పర్యటనల పట్ల ఆసక్తి గలవారిలో వివిధ రకాల ఆలోచనలు మదిలో మెదలుతుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని ప్రదేశాల ఉష్ణోగ్రతలు పెరిగి హాట్‌ హాట్‌గా ఉంటే..మరికొన్ని చల్లగా ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. కొండల మధ్య దోబూచులాడే మేఘాలు, సరస్సులపై తేలియాడే ప్రభాత వెలుగులు, వాటిని ఆనుకుని ఉండే పట్టణ వీధుల్లో నడక ప్రయాణం .. ప్రకృతి –మనిషి కలిసి చేసిన అద్భుతం కళ్ల ముందు నిలిచి, వేసవి ప్రయాణాన్ని ఒక ప్రత్యేక అనుభూతిగా మార్చేస్తాయి. అలాంటి వాటిలో ప్రపంచంలోనే పేరొందినవి స్విట్జర్లాండ్‌లో లేక్‌ టౌన్‌గా పిలిచే లూసెర్న్, ఐస్‌లాండ్‌లో రేక్యావిక్, కెనాడలోని బ్యాన్ఫ్, ఇండియాలో లేహ్, జపాన్‌లోని హాంకొనె. ఎందుకు ఇవి మాత్రమే అంతటి ప్రత్యేకతను నింపుకున్నాయో తెలుసుకుందాం. ఈ వేసవి ప్రయాణాన్ని అత్యద్భుతంగా మార్చుకుందాం..

    హిమాలయాల మధ్య..
    లేహ్‌ భారతదేశంలోని లడఖ్‌లో ఉన్న ఒక హిమాలయన్‌ ప్రాంతం. ఎండాకాలంలో ఇక్కడ లోయలు, కొండల మధ్య ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. హిమాలయాల్లోని మఠాలు, ప్రశాంత గ్రామాలు ఈ ప్రాంత జీవనశైలిని ప్రత్యేకంగా చూపిస్తాయి. ఉదయం సమయంలో పర్వతాలపై పడే వెలుగు వ్యాలీస్‌ను గోల్డెన్‌ రంగులో మార్చేస్తుంది. లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ లేక్‌ అనేది ప్రకృతి అద్భుతం.
    రాక్‌ సౌందర్యం

    బ్యాన్ఫ్‌ కెనడాలోని ఒక అందమైన హిల్‌ టౌన్‌. బ్యాన్ఫ్‌ నేషనల్‌ పార్క్‌ మధ్యలో ఉన్న ఈ ప్రదేశం బ్లూ లేక్స్, పచ్చని అడవులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎండాకాలంలో కొండలపై పడే వెలుగు, లేక్స్‌లో కనిపించే ప్రతిబింబాలు ప్రయాణికులకు గుర్తుండి΄ోయే అనుభవాన్ని ఇస్తాయి. బాన్ఫ్‌లోని లేక్‌ లూసీ నీలి నీటితో ప్రసిద్ధి చెందింది.

    వెలుగు కథలు
    రేక్యావిక్‌ ఐస్లాండ్‌ దేశ రాజధాని. ఎండాకాలంలో ఇక్కడ పగటి సమయం ఎక్కువగా ఉండటంతో నగరం మొత్తం వెలుగుతో నిండి΄ోతుంది. సముద్రం పక్కన ఉన్న ఈ నగరంలో రంగురంగుల ఇళ్లు, చిన్న చిన్న, సన్నని స్ట్రీట్స్, ప్రశాంతమైన కేఫ్స్‌ కనిపిస్తాయి. ఉదయం వెలుగు సముద్రంపై పడితే నగరం మొత్తం మృదువైన కాంతితో మెరుస్తుంది.

    ఆల్ఫ్స్‌ మధ్య లేక్‌ టౌన్‌
    లూసెర్న్‌ అనే నగరం స్విట్జర్లాండ్‌లో ఉన్న ఒక అందమైన లేక్‌ టౌన్‌. స్విస్‌ ఆల్ఫ్స్‌ కొండల మధ్య విస్తరించిన లూసెర్న్‌ సమ్మర్‌లో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ సరస్సు పక్కన నడిచేందుకు సన్నని వీధులు, పాత వుడెన్‌ బ్రిడ్జ్‌లు ఈ నగరానికి ప్రత్యేక వాతావరణాన్ని ఇస్తాయి. ఉదయ సమయంలో సరస్సు పై పడే సూర్య కిరణాలు నీటిపై బంగారు కాంతిని వెదజల్లుతుంటాయి. కొండల నీడలు, మేఘాల ప్రతిబింబాలు కలిసి ఒక పెయింటింగ్‌లా కనిపిస్తాయి. లూసెర్న్‌లోని చాపెల్‌ బ్రిడ్జి నగర చరిత్రను మన ముందు ఆవిష్కరింప జేస్తుంది.

    సమ్మర్‌ ట్రావెల్‌ అనుభవం
    ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం చూడటం మాత్రమే కాదు. ప్రకృతి రిథమ్‌ను అనుభవించడం కూడా. కొండల మధ్య మేఘాల ప్రయాణం, లేక్స్‌పై పడే వెలుగు, గ్రామాల ప్రశాంత జీవనంం ఇవన్నీ ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండి΄ోయే అనుభవంగా మార్చేస్తాయి.

    ఫుజీ కొండల దృశ్యాలు
    హాంకొనే  జపాన్‌లోని ఒక నేచురల్‌ డెస్టినేషన్‌. అడవులు, సరస్సులు, కొండల మధ్య ప్రయాణించే రోడ్లు 
    ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. దూరంలో కనిపించే మౌంట్‌ ఫూజీ దృశ్యం ఈ ప్రదేశానికి 
    అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. హంకొనేలోని లేక్‌ ఆషీ పక్కన ఫుజీ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.

    – ఎం.జి.కిశోర్, పర్యాటకుడు 

    (చదవండి: ఇండియాలోనే స్విట్జర్లాండ్‌)

  • లడఖ్‌ ప్రాంతం సమ్మర్‌లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్‌ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.

    గ్రామాల మధ్య జీవనం
    చిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్‌తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్‌ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్‌ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.

    హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్‌ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌ వెళ్లవచ్చు. లేహ్‌ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్‌ జర్నీ ఒక అద్భుత 
    అనుభవాన్ని అందిస్తుంది. 

    జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్‌ హిమాలయాస్‌ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్‌లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్‌ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్‌ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్‌ కాన్వాస్‌లా మార్చేస్తాయి. 

    ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్‌ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్‌ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.

    అపాతాని సంస్కృతి
    జీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్‌ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్‌ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్‌ మధ్య ఉన్న ఫుట్‌పాత్స్‌ ఈ ప్రదేశంలో లైఫ్‌ రిథమ్‌ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్‌ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్‌ సీజన్‌లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.

    హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్‌ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్‌ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. 

    ఈస్టర్న్‌ హిమాలయాస్‌ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్‌ జర్నీగా మార్చేస్తాయి. 

    (చదవండి: లాంజ్‌లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి)

  • ప్రస్తుతం బియ్యం, గోధుమలే అధికంగా వాడుతున్నాం గానీ ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. ఏవో రెండు, మూడు కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఊదల వంటి ఆరేడు రకాల చిరుధాన్యాలు తినేవారు. అయితే నలబైల్లో వచ్చిన క్షామం, పెరుగుతున్న జనాభా అవసరాలు తిండి గింజల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. శాస్త్రీయ పరిశోధనలు.. హరిత విప్లవం పుణ్యమాని గోధుమ, వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. 

    దాంతో మన ఆహారపు అలవాట్లు సమూలంగా మారిపోయాయి. ముఖ్యంగా చిరుధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? పోషకాలు అందుతున్నాయా, లేదా? అనే విచక్షణే లేకుండా పోయింది. మరోవైపు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఫలితంగా జీవనశైలితో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్లు వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. వీటితో సంభవించే మరణాలూ ఎక్కువవుతూ వస్తున్నాయి. 

    ఇవన్నీ మన ఆహార అలవాట్లను ఒక్కసారి సమీక్షించుకోవాలనీ, చిరుధాన్యాలకు పట్టం కట్టాలనీ నిర్దేశిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారమూ సంపూర్ణంగా ఉండాలి. వాటిల్లో సింహభాగం ధాన్యాలదే. అలాంటి చిరుధాన్యాల వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో సవివరంగా చూద్దామా..!.

    చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. 

    అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసకృత్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరుధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. 

    బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్‌ ఈ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. 

    బియ్యం, గోధుమల్లో ఐరన్‌ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్‌ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, జింక్‌ వంటివీ వీటిల్లో ఎక్కువే. 

    ఇన్సులిన్‌ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్‌ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్‌ తక్కువగా ఉంటుంది. నైసిస్‌, పెరిడాక్సిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్‌ ఏ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.

    (చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్‌చేస్తే..)

  • చాలామంది యువత కలలుగనే లగ్జరీ లై​ఫే ఈ వ్యక్తిది. ఎంతో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ హాయిగా సాగిపోతున్న జీవితానికి సడెన్‌గా స్వస్తి పలికి..ఏదో గొప్పజీవితం కోసం అన్వేషిస్తూ దేశాలు పర్యటించడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతడి లైప్‌ ఏవిధంగా యూటర్న్‌ తీసుకుని ఫ్యామిలీ మ్యాన్‌గా మారాడో తెలిస్తే అవాక్కవుతారు. పైగా ఆ తర్వాత కూడా తన నిర్ణయంలో మార్పు లేకపోగా..ఇలా బతకాలి అనేపించేలా రాజులా బతుకుతుండటం విశేషం. 

    ఆ వ్యక్తి తన కథను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  షేర్‌ చేయడంతో..అందర్నీ అమితంగా ఆకర్షించేలా ఆలోచింపచేసింది. వ్యక్తిగత విజయం కంటే సంతృప్తి మిన్నా అనే చర్చలకే తెరలేపింది. ఆ పోస్ట్‌ ప్రకారం  ఆవ్యక్తి ఐఐటీ చేసి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అతను విజయవంతమైన కార్పొరేట్‌ కెరీర్‌ని నిర్మించుకున్నాడు. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి, అతను ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో డైరెక్టర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగి, చాలామంది కోరుకునే లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేశాడు. 

    కానీ అవేమి తనకు సంతృప్తినివ్వక పోవడమే గాక వివిధ హోదాల వెంట తిరుగుతూ ఓ చట్రంలో ఇరుక్కుపోయిన ఫీలింగి కలిగింది అతడికి. దాంతో ఈ కార్పొరేట్‌ లైఫ్‌ నా వల్ల కాదు అని డిసైడ్‌ అయ్యి..2013లో ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు. కేవలం ప్రాథమిక అవసరాలతో సోలోగా పర్యటించడం మొదలు పెట్టాడు. అలా 18 నెలల్లో ఏకంగా 35 దేశాలను అన్వేషించాడు. విభిన్న సంస్కృతులు, అనుభవాల్లో మునిగిపోయాడు. కార్పొరేట్‌ బోర్డురూమ్‌ల నుంచి ప్రయాణ జీవితానికి మారడం, ఒక సరికొత్త దృక్పథాన్ని అందించింది. ఎలాంటి టార్గెట్‌లు లేని సరికొత్త లైఫ్‌ని గడుపుతున్నట్లు అనిపించింది అతడికి. 

    సరిగ్గా మాంటెనెగ్రోలో పర్యటన అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అక్కడ అతను ఆస్ట్రియాకు చెందిన సామాజిక కార్యకర్త అయిన క్యాథీని కలిశాడు. ఒక చిన్న పరిచయంగా మొదలైనది త్వరలోనే ఒక గాఢమైన బంధంగా మారింది. కేవలం 10 నిమిషాల సంభాషణ.. పది రోజుల పాటు విడిచి ఉండలేని విధంగా బలపడింది వారి బంధం. అలా వారిద్దరూ  చివరికి 2016లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

    వారు సాంప్రదాయాల కన్నా, అనుభవాలు, స్వేచ్ఛ, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే జీవనశైలిని స్వీకరిస్తూ..ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి సొంతంగా ఇల్లుగానీ, కారు గానీ లేవు. జస్ట్‌ హోమ్‌స్టే లేదా అద్దెంటిలో నివశిస్తోంది ఆ కుటుంబం. భారత్‌లో పెట్టిన పెట్టుబడుల సాయంతో లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. తమ పిల్లలకు వేదాలు, ఉపనిషత్తుల తోపాటు ఎన్‌సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను ఉపయోగించి ఇంట్లోనే విద్యను అందిస్తున్నారు. అతను తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. 4 BHK ఇంటిని వదులుకుని మొత్తం ప్రపంచాన్ని పొందానని సగర్వంగా చెబుతున్నాడు. 

    అంతేకాదండోయ్‌ ఇప్పుడే "జీవితాన్ని రాజులా గడుపుతున్నాను" అని పేర్కొన్నాడు. ఈ పర్యాటనలలోనే ఆ ముగ్గురు పిల్లలను కన్నారట. వారంతా సాధారణ ప్రసవం ద్వారానే పుట్టారట. డైపర్లు, ఆధునిక వైద్యం వంటివి లేకుండా పెంచారట. పైగా జీవితం అంటే ఏమవుతారని కాకుండా..మీరు ఎవరు అని తెలుసుకునేలా బోధిస్తున్నామని చెబుతోంది ఈ జంట. 

     

    (చదవండి: ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం..)
     

  • అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకొంది. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరుకావడం విశేషం. 

    నాలుగు తరాల కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు నిర్వహించుకోవడం అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి,  కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను  సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో పండుగ సందడి కనిపించింది.

     

     

     

  • ఎయిర్‌పోర్టులో లాంగ్‌ వెయిటింగ్‌ టైమ్‌ ఉంటే లాంజ్‌ యాక్సెస్‌ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్‌ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్‌తో ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మరింత బెటర్‌ అవుతుంది. కానీ అందరికీ లాంజ్‌ యాక్సెస్‌ ఉచితంగా 
    లభించదు. కొన్ని స్మార్ట్‌ ట్రిక్స్‌ ఫాలో అయితే ఈజీగా యాక్సెస్‌ పొందవచ్చు.

    క్రెడిట్‌ కార్డ్‌ బెనిఫిట్స్‌
    చాలా ప్రీమియం కార్డుల్లో కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది. కొన్ని కార్డుల్లో సంవత్సరానికి లిమిటెడ్‌ ఫ్రీ ఎంట్రీస్‌ ఇస్తారు. ట్రావెల్‌కు ముందు మీ కార్డ్‌ బెనిఫిట్స్‌ చెక్‌ చేసుకుంటే ఈజీగా ఫ్రీ యాక్సెస్‌ పొందవచ్చు.

    ఎయిర్‌లైన్‌ లాయల్టీ ప్రోగ్రామ్స్‌
    ఫ్రీక్వెంట్‌ ఫ్లైయర్స్‌ కోసం ఎయిర్‌లైన్స్‌ స్పెషల్‌ లాయల్టీ ప్రోగ్రామ్స్‌ ఇస్తాయి. పాయింట్స్‌ కలెక్ట్‌ చేసి ఫ్రీ లాంజ్‌ యాక్సెస్‌ పొందవచ్చు. రెగ్యులర్‌గా అదే ఎయిర్‌లైన్‌తో ట్రావెల్‌ చేస్తే ఛాన్సెస్‌ ఎక్కువగా ఉంటాయి.

    ఎర్లీ ఫ్లైట్‌ అప్‌గ్రేడ్స్‌
    కొన్నిసార్లు బిజినెస్‌ క్లాస్‌కి లాస్ట్‌ మినిట్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్స్‌ వస్తాయి. కొంచెం ఎక్స్‌ట్రా పే చేసి అప్‌గ్రేడ్‌ తీసుకుంటే లాంజ్‌ యాక్సెస్‌ కూడా ఇన్‌క్లూడ్‌ అవుతుంది.

    ట్రావెల్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌
    కొన్ని ట్రావెల్‌ మెంబర్‌షిప్‌ సర్వీసెస్‌లో లాంజ్‌ యాక్సెస్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి. యాన్యువల్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే మల్టిపుల్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో లాంజ్‌ యూజ్‌ చేయవచ్చు.

    స్పెషల్‌ ఆఫర్స్‌ అండ్‌ డీల్స్‌
    ఫెస్టివ్‌ సీజన్‌ లేదా ట్రావెల్‌ డీల్స్‌ సమయంలో కొన్ని కార్డ్స్‌ లేదా బుకింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ స్పెషల్‌ లాంజ్‌ యాక్సెస్‌ ఆఫర్స్‌ ఇస్తాయి. అలెర్ట్స్‌ ఫాలో అయితే ఈజీగా యూజ్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ ఉచితంగా పొందడం కష్టం అనిపించినా, కరెక్ట్‌ ట్రిక్స్‌ ఉపయోగిస్తే సాధ్యమే. కొంచెం ప్లానింగ్‌తో మన ట్రావెల్‌ అనుభవాన్ని కంఫర్టబుల్, ప్రీమియంగా మార్చుకోవచ్చు.  

  • ఎంతటి ప్రేమలో అయినా..చిన్న చిన్న మనస్పర్థలు సహజం. కానీ పరిస్థితులు తలకిందులైనప్పుడు కూడా అదే ప్రేమ కొనసాగితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు. ఆ బంధం ఎన్నటికీ అత్యంత బలమైనది..స్వచ్ఛమైనది కూడా. అలాంటి గొప్ప ప్రేమనే పొందాడు ఈ యువకుడు. ఆమె ఆ రోజు అండగా నిలిచి ధైర్యం ఇచ్చి ఉండకపోతే తాను బతికి ఉండేవాడిని కాదంటున్నాడు అశ్విన్‌. వారి ప్రేమ కథ అమరం, అఖిలం అనొచ్చు. అంత అందమైన ఆ క్యూట్‌ లవ్‌ స్టోరీ ఏంటో చూద్దామా..

    కేరళకు చెందిన ఆదిత్య అనే అమ్మాయి తన లవ్‌స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది. తమ ప్రేమ కథ పాఠశాల రోజుల్లో 2014లో మొదలైందంటూ చెప్పుకొచ్చింది ఇలా. "ఆమెకు 14 ఏళ్లు, అశ్విన్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు..కలిసి నవ్వుకోవడం, రోజువారి చదువు ఒత్తిళ్లు గురించి మాట్లాడుకోవడంతో స్నేహంగా మొదలైంది. క్రమంగా మా బంధం బలపడటం మొదలైంది. మొదటగా అశ్విన్‌ తన భావాలను వ్యక్తపరిచినప్పుడు..ఆదిత్య దిగ్బ్రాంతికి గురై..దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది". 

    అయితే ఆ దూరంలోనే తనకు అశ్విన్‌ ఎంత ఇంపార్టెంట్‌ అనేది అర్థమైందని చెబుతోంది. దాంతో మళ్లీ తనని కలిసి తమ రిలేషన్‌ కొనసాగించినట్లు చెప్పుకొచ్చింది. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడం మొదలైంది కూడా. ఇక అశ్విన్‌ ఇంజనీరింగ్‌ చదవడానికి తమిళనాడుకి మారాడు. ఇద్దరి మధ్యం దూరం పెరిగినా..ఏదోలా కలుసుకుంటూ తమ బంధాన్ని నిలబెట్టుకున్నారు. అలా హాయిగా సాగుతున్న తరుణంలో తమ ప్రేమను ఓ కుదపు కుదిపేసింది ఆ రోడ్డు ప్రమాదం.

    అమాంతం అన్నింటిని మార్చేసిన ప్రమాదం..
    మే 2017లో మద్యం సేవించిన డ్రైవర్‌ కారణంగా జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదం అశ్విన్‌ దారుణంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా, అక్కడ అతని కాలుని కాపాడటానికి సుదీర్ఘ వైద్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు అతని ప్రాణాలు కాపాడేందుకు ఆ కాలుని తొలగించక తప్పని పరిస్థితి. ఈ విషయాన్ని ఆదిత్య, అశ్విన్‌ తల్లి ద్వారా తెలుసుకుని కుంగిపోయింది. 

    మానసిక మద్దతు అవసరమైన సమయంలో ఆదిత్యకు కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి. వైకల్యంతో జీవిస్తున్న అతడితో భవిష్యత్తు గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. దూరంగా ఉండాలని సూచించారు కూడా. ఈ ఒత్తిడి ఏ  స్థాయిలో పెరిగిపోయిందంటే..ఆదిత్య తీవ్రంగా కుంగిపోయే స్థితికి చేరుకుంది. ఆమె ఆవేదన, తీవ్రమైన ప్రేమను చూసి..తల్లిదండ్రులే దిగొచ్చి అర్థం చేసుకున్నారు. 

    ఇక అశ్విన్‌ సైతం ఆ ప్రమాదం తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా పోరాటం చేశాడు. తాను ఒక భారంగా మారిన జీవితంలోకి రావద్దని ఆదిత్యకు సూచించాడు అశ్విన్‌. ఈ సంబంధాన్ని ముగించమని చెప్పాడు. కానీ ఆమె అదే ప్రమాదం తనకు జరిగితే నువ్వే ఏం చేస్తావు అని అడిగి.. అశ్విన్‌ని మారుమాట్లాడకుండా చేసింది. తమ బంధాన్ని పునరుద్ధరించుకుని..తమ జీవితాలను తీర్చిదిద్దుకునే వైపుగా అడుగులు వేశారు ఇద్దరు. 

    ఈలోగా అశ్విన్‌ తన ఇంజనీరింగ్‌ చదువుని పూర్తి చేసి ఉద్యోగం సంపాదించగా, ఆదిత్య కూడా తన చదువుని పూర్తి చేసింది. ఒకరికొకరు అందించే అచంచలమైన మద్దతులో పాతుకుపోయిని వారి వ్యక్తిగత ఎదుగుదల తోపాటు వారి సంబంధం కూడా పరిణితి చెందింది. అలా 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారిద్దారు. 

    అయినా అప్పటికే ఇరు కుటుంబాలు వారి ప్రేమలో బలాన్ని చూసి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాయి. ప్రస్తుతం వారిద్దరూ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏ బంధమైన నిరంతర శ్రద్ధ, గౌరవంతో బలోపేతమవుతుందని చెబుతున్నారు ఈ దంపతులు. సరదాగా స్నేహంగా మొదలై ప్రేమగా చిగురించిన ప్రేమను..చిన్న చితకా సమస్యలు, గాలి వానలా వచ్చిన కష్టాలకు తట్టుకుని పోరాడి..విజయవంతంగా పెళ్లిపీటలు ఎక్కేలా చేసుకున్నారు. 

    ఈ కేరళ జంట ప్రేమ నెటిజన్లను ఆకర్షించడమే కాదు పెద్ద ఎ‍త్తున్న ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి కూడా. అయితే ఆదిత్య ఇది త్యాగం వల్ల నిలిచిన ప్రేమ కాదు..అవగాహన, నిబద్ధతపై నిలిచిన శాశ్వతమైన ప్రేమ అని  బలంగా చెప్పడం విశేషం.

     

    (చదవండి: భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి రేంజ్‌కు..!)

     

Crime

  • నాసిక్: అతనొక రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్.. ఇప్పుడు నకిలీ బాబాగా అవతారమెత్తాడు. ఆధ్యాత్మికత పేరుతో మహిళలను వంచించి, భక్తుల బలహీనతలతో డబ్బులు దండుకుని, కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అశోక్ ఖారత్ అనే ఈ దొంగ బాబా గుట్టు  ఎట్టకేలకు బయటపడింది. చేతబడులు, వశీకరణ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ, లైంగిక  వాంఛలు తీర్చుకుంటున్న ఈ మాయగాడి లీలలు ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.

    టెక్నాలజీతో మాయాజాలం
    అశోక్ ఖారత్ తన ఆఫీసును ఒక క్షుద్ర పూజల కేంద్రంలా తీర్చిదిద్దాడు. భక్తులను భయపెట్టడానికి రిమోట్ కంట్రోల్‌తో నడిచే నకిలీ పాములను, పులి చర్మాలను, ఇతర వన్యప్రాణి అవశేషాలను ఉపయోగించేవాడు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి, ఐదు రూపాయలకు కూడా విలువ చేయని చింత పిక్కలను, నకిలీ రత్నాలను ‘మంత్రించినవి’ అని చెప్పి, రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయించేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే ‘వశీకరణం’ చేస్తానని, కీడు జరుగుతుందని భయపెట్టేవాడు.

    గర్భిణీ అని చూడకుండా..
    ఈ కేసులో ఇప్పటికే పలువురు మహిళలు ఖారత్‌పై ఫిర్యాదు చేశారు. ఒక బాధితురాలిని మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఈ నిందితుడు, ఇటీవల మరో గర్భిణిపై కూడా అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. పూజల పేరుతో ఆమె భర్తను బయట కూర్చోబెట్టి, లోపల ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితులకు మత్తు పానీయాలు ఇచ్చి, తన కోరికలు తీర్చుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది.

    రాజకీయ ప్రకంపనలు
    ఖారత్ ఆధ్యాత్మిక ముసుగులో నేరాలు చేయడమే కాకుండా, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇప్పటివరకు 150 సార్లు విదేశీ పర్యటనలు చేసిన ఈయనకు సుమారు 52 విలువైన ఆస్తులు ఉన్నట్లు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. నాసిక్ సమీపంలోని ఒక దేవాలయ ట్రస్ట్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది. ఖారత్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది.

Guest Columns

  • కాంగ్రెస్‌ పార్టీలో సెక్యులర్‌ భావాలతో తిరుగులేని నాయకుడిగా ఉన్న బారిస్టర్‌ మహమ్మద్‌ అలీ జిన్నా ప్రాముఖ్యత... మహాత్మా గాంధీ, జవహర్లాల్‌ నెహ్రూ ప్రవేశంతో అనూహ్యంగా తగ్గింది. తర్వాత రాజకీయాలు వదులుకుని ఆయన లండన్‌కెళ్లి వకాలతు మొదలెట్టారు. కానీ, ముస్లిం లీగ్‌ నాయకులు ఆయన్ని తిరిగి ఇండియాకు రప్పించారు. యునైటెడ్‌ ప్రావిన్స్‌లో ముస్లిం లీగ్‌ – కాంగ్రెస్‌ కలిసి బ్రిటిష్‌ రాజ్‌ను ఎదుర్కోవటానికి జిన్నా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ పెద్దలు పట్టించుకోలేదు. 

    1936లో బాంబేలో జరిగిన సదస్సులో ముస్లిం లీగ్‌ పార్టీ పగ్గాలు జిన్నా కైవసం చేసుకున్నారు. 1937 ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించటంతో, భవిష్యత్తులో అధికారం చేజిక్కించుకోవటం దుర్లభం అని భావించిన లీగ్‌ ప్రాథమిక చర్యగా, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న క్రియాశీల ముస్లిం నాయకులను క్రమంగా లీగ్‌ లోకి చేర్చుకుంది. ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం కేవలం ముస్లిం లీగ్‌ ద్వారానే సాధ్యమని ప్రచారం చేశారు జిన్నా.  అప్పటివరకూ ముస్లిం ధనిక, జమీందారులకే పరిమితమైన లీగ్‌లోకి నిమ్నవర్గం ముస్లింలను సైతం చేర్చి, ఇరవై లక్షల సభ్యులతో జాతీయ నాయకుడిగా, ముస్లింల ‘మసీహా’ అయ్యారాయన.

     కాంగ్రెస్‌ అధ్యక్షుడు నెహ్రూ, ముస్లిం మెంబర్‌షిప్‌ డ్రైవ్‌  ఆరంభించారు కానీ హిందువుల కోసమే కాంగ్రెస్‌ అనే అభిప్రాయం ప్రబలంగా ఉండటంతో అనుకూల స్పందన రాలేదు. దేశ రాజకీయంలో రిలిజి యస్‌ పోలరైజేషన్‌ మొదటి సారి అలా జరిగిందన్నమాట. ఇక లీగ్‌ నాయకులు, ముస్లింలకు అధికార ప్రాతినిధ్యం కోసం బ్రిటిష్‌ పాలకులతో చేసిన ప్రయత్నం కొలిక్కి వచ్చే తరుణంలో, దేశ విభజనకు ఊతమిస్తూ మార్చి 1940లో లాహోర్‌లో ముస్లిం లీగ్‌ సదస్సు నిర్వహించారు. ఇదే అదనుగా, ఇండియన్‌ ముస్లింలకు ‘సెపరేట్‌ హోమ్‌ ల్యాండ్‌’ అజెండాను నాటకీయంగా తెరపైకి తెచ్చారు జిన్నా. 1940 మార్చి 22–24 మధ్య జరిగిన సదస్సులో, భారత ఉపఖండంలో ‘ముస్లిం జోన్స్‌’ గుర్తించి వేర్పాటు చేసే తీర్మానాన్ని మార్చి 23 నాటి సమావేశంలో చేశారు. 

    ఈ లాహోర్‌ రిజొల్యూషన్‌ వార్తను మరుసటి ఉదయం వార్తా పత్రికలు ‘పాకిస్తాన్‌ రిజొల్యూషన్‌’ శీర్షికతో ప్రచురించాయి. అలా మార్చి 23 ‘పాకిస్తాన్‌ డే’గా రూపు దిద్దుకుంది. ఈ సదస్సుకు ప్రతీకగా తర్వాత లాహోర్‌లో ‘మినార్‌–ఎ–పాకిస్తాన్‌’ నిర్మించు కున్నారు. 1947లో దేశ విభజన జరిగి పాక్‌ ఏర్పడ్డాక, ఇండియన్‌ ముస్లింలకు ప్రత్యేక హోమ్‌ ల్యాండ్‌ అని ప్రగల్భాలు పలికిన ముస్లిం లీగ్‌... రెండు నెలలకే అదే ఇండియన్‌ ముస్లింలను నిషేధిస్తూ సరిహద్దులు మూసి వేయడం గమ నార్హం.  (జస్వంత్‌ సింగ్‌ ‘జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్‌ ’ ఆధారంగా)
    – జిల్లా గోవర్ధన్‌ ‘ విశ్రాంత పీఎఫ్‌ కమిషనర్, ముంబై