Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత చైనా టూర్‌కు వెళ్లేందుకు సిద్ద‌మ‌య్యారు.  ట్రంప్ ఈ ఏడాది మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయ‌న భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చితిని, తైవాన్ చుట్టూ ఉన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంగా ఈ భేటీ జ‌ర‌గ‌నుంది.

    తాజాగా  వాషింగ్టన్‌లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ ఈ పర్యటన గురించి మాట్లాడారు. నేను ఏప్రిల్‌లో చైనాకు వెళ్తున్నాను. ఈ ప‌ర్య‌ట‌న అద్భుతంగా ఉండ‌నుంది అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చివ‌రిసారిగా  2017లో అధ్య‌క్ష హోదాలో చైనా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

    కాగా శుక్ర‌వారం అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల పెంపు పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పు చైనాకు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. గ‌త కొంతకాలంగా యూఎస్‌-చైనా మ‌ధ్య ట్రేడ్ వార్ న‌డుస్తోంది. చైనాపై ట్రంప్ స‌ర్కార్ అడ్డ‌గోలుగా టారిఫ్‌లు వేయ‌డం వాటికి ప్ర‌తిగా బీజింగ్ సైతం సుంకాల‌తో ఎదురుదాడికి దిగింది. 

    మ‌రోవైపు తైవాన్ విష‌యంలో ఇరు దేశాల మ‌ధ్య తైవాన్ విష‌యంలో కూడా వివాదం కొన‌సాగుతోంది. తైవాన్ తమ భూభాగమేనని వాదించే చైనా, అమెరికా చేస్తున్న ఆయుధ విక్రయాలపై ఆగ్రహంగా ఉంది. ఇటీవలే అమెరికా 11 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందానికి ఆమోదం తెలపడం జిన్‌పింగ్‌కు మింగుడుపడటం లేదు.

    తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. ఈ ఉద్రిక్త‌ల మ‌ద్య ట్రంప్‌-జిన్‌పింగ్ భేటికి ప్రాధ‌న్య‌త సంత‌రించుకుంది. ఈ ఏడాది చివ‌రిలో జిన్‌పింగ్ కూడా అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే అవ‌కాశముంది.

  • కన్నతల్లి ప్రేమకు పరిమితులు ఉండ‌వు, ఆమె ప్రేమకు మరేదీ సాటిరాదు. ఎంతటి కష్టమొచ్చినా తాను పస్తులుండైనా కన్న బిడ్డలను ఆకలితీర్చే అమృత మూర్తి అమ్మ. కానీ కొంత‌మంది మహిళలలు అమ్మతనానికే మాయని మచ్చను తీసుకొస్తున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో కన్న బిడ్డల పట్ల  కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. 

    తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలోని శాన్ ఆంటోనియోలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక తల్లి..  తన 12 ఏళ్ల కుమారుడిని ఏకంగా 19 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్లు) దూరంలో ఉన్న పాఠశాలకు ఒంటరిగా నడిచి వెళ్లాలని ఆదేశించింది. లూసియా విక్టోరియా మేరీ క్రూజ్ (35) అనే మహిళ ఈ అమానుషానికి ఒడిగట్టింది.

    ఏమి జరిగిందంటే?
    విక్టోరియా మేరీ క్రూజ్ భ‌ర్త‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటుంది. ఆమెకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఘటనకు ముందు రోజు రాత్రి లూసియా తన ప్రియుడితో గొడవపడి, పూటుగా మద్యం సేవించి మ‌త్తులోకి వెళ్లిపోయింది.  మరుసటి రోజు ఉదయం బాలుడు ఆమెను నిద్రలేపి స్కూలుకు వెళ్లాలని కోరగా, ఆమె అతడిని ఒంటరిగానే నడిచి వెళ్లమని చెప్పింది. 

    దీంతో పిల్లోడు చేసేదేమి లేక 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌న స్కూలుకు న‌డిచివెళ్ల‌డం ప్రారంభించాడు. అయితే అత్య‌వ‌స‌ర వాహ‌నాలు వెళ్లే ట్రాఫిక్ లైన్ల పక్కనే ఆ బాలుడు న‌డ‌వ‌డం ఒక‌రు గ‌మ‌నించారు. వెంట‌నే అనుమానం వ‌చ్చి స‌ద‌రు వ్య‌క్తి పోలీసులుకు స‌మాచార‌మందించాడు. వెంట‌నే స్పందించిన పోలీసులు బాలుడిని త‌న చ‌దివే పాఠాశాల‌కు తీసుకువెళ్లారు.

    పాఠశాల రిసోర్స్ అధికారి బాలుడిని ప్ర‌శ్నంచిగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న త‌ల్లి సూచ‌న మేర‌కే ఒంటరిగా న‌డిచివ‌చ్చాన‌ని చెప్పాడు.  పోలీసులు లూసియా ఇంటికి వెళ్లి విచారించగా, తన కుమారుడు ఒంటరిగా నడిచి వెళ్తున్న విషయం తనకు తెలుసని ఆమె అంగీకరించింది. దీంతో బిడ్డ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌ర‌ప‌రిచారు. అనంత‌రం 15,000 డాలర్ల (సుమారు రూ. 12.5 లక్షలు) వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో ఆమెకు బెయిల్ ల‌భించింది. 

  • న్యూయార్క్‌: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పలు దేశాలపై ఇష్టారీతిన సుంకాలు పెంచుకుంటూ పోతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు షాకిస్తూ కీలక తీర్పును వెల్లడించింది. టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ లేదని ప్రకటించింది. ఫలితంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల పెంపు పిటిషన్‌ను కొట్టేసింది.   ఈ మేరకు తొమ్మిది మంది కూడని అమెరికా సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది. ముగ్గురు జడ్జిలు మాత్రం టారిఫ్‌లను సమర్ధించగా,  అత్యధిక శాతం 6 మంది జడ్జిలు వ్యతిరేకించారు.

    సుంకాలు విధించే అధికారం దేశాధ్యక్షుడికి లేదని వారు స్పష్టం చేశారు. సుంకాలు విధించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని సుప్రీం తన తీర్పులో పేర్కొంది.  వాణిజ్యం, పన్నులకు సంబంధించిన అంశాలపై అధికారం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది.  ఇప్పటివరకూ వసూలు  చేసిన వందల బిలియన్‌ డాలర్ల సుంకాలు దిగుమతి దారులకు ఇవ్వాల్సి రావొచ్చని కూడా సుప్రీం తెలిపింది. భారత్‌పై విధించిన 18 శాతం సుంకాలు కూడా అనధికారమేనని సుప్రీం పేర్కొంది.

    ఫలితంగా ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. భారీగా సుంకాలు పెంచుతూ ట్రంప్‌ దూకుడుకు ఈ తీర్పుతో చెంపదెబ్బ తగిలింది. భారత్‌పై 18 శాతం సుంకాలు విదించిన ట్రంప్‌.. చాలా దేశాలపై అధిక శాతం సుంకాలు విధిస్తూ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు.  తాజా అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో  ట్రంప్‌ వైఖరి సరైనది కాదనే విషయం తేటతెల్లమైంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. 

    ట్రంప్‌ అసంతృప్తి..
    సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు సరికాదంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు. తన వద్ద ప్లాన్‌-బీ కూడా ఉందంటూ పరోక్షంగా తన వైఖరి మారదనే సంకేతాలిచ్చారు ట్రంప్‌..  తన అమలు చేయబోయే ప్లాన్‌ బి అనేది త్వరలోనే చూస్తారంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు.

  • ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్‌ సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కిడ్మాప్‌ చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పాక్‌ సైనికులు బీఎల్‌ఏ నుంచి తమని సురక్షితంగా కాపాడమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    ఈ అంశం దాయాది దేశంలో చర్చకు దారి తీసింది. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో.. పలువురు పాక్ సైనికులు తమ సైనిక గుర్తింపు కార్డులను చూపిస్తూ.. ‘‘మమ్మల్ని రక్షించండి’’ అని కన్నీళ్లు పెట్టుకుని, పాక్ సర్కారును వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే,‘మీ సైనికుల్ని మేం కిడ్నాప్‌ చేశాం’ అంటూ బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోల్ని పాక్‌ సైన్యం ఖండించింది. మా సైనికులు సురక్షితంగా ఉన్నారు. మీరు మా సైనికుల్ని కిడ్నాప్‌ చేయలేదు’అని ఖండించింది.   

    బలోచ్ లిబరేషన్‌ ఆర్మీ కిడ్నాప్‌ చేసిన ఎనిమిది మంది పాక్‌ సైనికుల కిడ్నాప్‌ అనంతరం పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు అల్టిమేటం జారీ చేసింది. పాక్‌ కిడ్నాప్‌ చేసిన బీఎల్‌ఏ ప్రతినిధుల్ని వారంలో విడుదల చేయాలని ఆదేశించింది. ఆ గడువు ముగిసేలోపు చర్యలు తీసుకోకపోతే తాము కిడ్నాప్‌ చేసిన సైనికులను హత మారుస్తామని హెచ్చరించింది.

    అయితే,ఆ హెచ్చరికల్ని పాక్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు కిడ్నాప్‌ చేసింది మా సైనికుల్ని కాదని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం తీరుపై కిడ్నాప్‌కు గురైన పాక్‌ సైనికుల అసహనం వ్యక్తం చేశారు.బలోచ్‌ మమ్మల్ని కిడ్నాప్‌ చేసింది. అయినా మీరు  మమ్మల్ని పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాదని ఎలా చెబుతారని పాక్‌ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలోచ్‌ మీడియా ప్రతినిధి హక్కాల్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆర్మీ దుస్తులు ధరించిన ఎనిమిది మంది ఆర్మీ సైనికులు ఉన్నారు.

    ఆ వీడియోలో ఓ పాక్‌ ఆర్మీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాక్‌ ఆర్మీ ఐడీ కార్డు కెమెరాకు చూపిస్తూ .. ఇదిగో చూడండి. ఇది దేశ ఆర్మీ నాకు జారీ చేసింది. నా తండ్రి వికలాంగుడు. నేనే మా ఇంట్లో పెద్దవాడిని. మేము మీ సిబ్బంది కాదని చెప్పి అన్యాయం చేయోద్దు. మేం మీ సిబ్బంది కాదని మీరు చెప్పినట్లయితే.. మీరు నన్ను ఎందుకు నియమించారు? వీడియో నకిలీదని మీరు ఎందుకు చెబుతున్నారు?’అని ప్రశ్నించాడు. పాక్‌ సైనికులు ఇలా ప్రశ్నించడంతో షరీఫ్‌ ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.  

    పాక్‌ సైన్యం ఇచ్చిన వివరణపై బలోచ్‌ ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సైనికులు సురక్షితంగా ఉంటే.. మేం ఎవరిని కిడ్నాప్‌ చేశాం?. వీడియోల్లో ఉన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. 
     

     

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల  ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు.  ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.

    అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.

    ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ బాధితురాలి నోట సంచలన విషయాలు

    ఇండియాపై ప్రశంసలు
    పన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.  

    ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

  • ప్రపంచంలోనే అతిపెద్ద  భూనత్త (LandSnail) గురించి తెలుసా? గీ జోరోనిమో అనే పెద్ద ఆఫ్రికన్ భూనత్త  అతిపెద్ద నత్తగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇంతవరకూ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది ఆసక్తికరంగా. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.

    సాధారణంగా నత్తచాలా చిన్న ప్రాణి.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 1978లో పశ్చిమ ససెక్స్ (West Sussex) లో కొలవబడిన 'గీ జెరోనిమో' (Gee Geronimo) అనే 27.3 సెంటీమీటర్ల పొడవుతో 'జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నేయిల్' ప్రపంచంలోనే అతిపెద్ద భూచర నత్తగా గుర్తింపు పొందింది. అయితే, సముద్రపు జాతులతో పోలిస్తే ఇది చాలా చిన్నది.

    జెయింట్ ఆఫ్రికన్ భూ నత్త రికార్డు
    భూ నివాస జాతులలో జెయింట్ ఆఫ్రికన్ భూమినత్తలు ప్రత్యేకం. ఇందులో రికార్డ్‌ కొట్టేసిన గీ జెరోనిమోను పెంపుడు జంతువుగా పెరిగింది. దీని యజమాని ఇంగ్లాండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌కు చెందినవాడు. ఈ నత్త షెల్ 27.3 సెంటీమీటర్ల పొడవు. బరువు దాదాపు కిలోగ్రాము బరువు. ఈ నత్తలకు మందపాటి, శంఖాకారంలో ఉండే చిప్పలు ఉంటాయి. వేడి వాతావరణం, నియంత్రిత పరిస్థితులను బట్టి వీటి పరిమాణం ఉంటుంది. అయినప్పటికీ, గీ జెరోనిమో ఇప్పటికీ ఒక అద్భుతంగానే మిగిలి ఉంది.

    మూడేళ్ల పిల్లాడంత నత్త
    అయితే సముద్ర నత్తలు ఇంకా పెద్దవిగా పెరుగుతాయి. ఆస్ట్రేలియన్ ట్రంపెట్ షెల్ వంటి సముద్ర జాతులు సాధారణ  నత్తలతో పోలిస్తే భారీ పరిణమాణంలో ఉంటాయి.దాదాపు  72.2 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అంటే  దాదాపు మీటరు పొడవు, మూడేళ్ల పిల్లాడంత బరువు అన్నమాట. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లోని ఇసుక పొరలలో నివసిస్తాయి. వీటి పొడవైన చిప్పలు చాలా ప్రత్యేకం.

    నత్తలు 'మొలస్కా' (Mollusc) అనే విభిన్న సమూహానికి చెందినవి. వీటి పెరుగుదల ఆహారం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉండే నత్తలు ఊపిరితిత్తుల వంటి కుహరం ద్వారా గాలిని పీల్చుకుంటాయి, కానీ సముద్రపు నత్తలు నీటి నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి.
     

  • అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా అమెరికా దళాలు.. ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌.. ఇరాన్‌ను టార్గెట్‌ చేసి దాడులు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి తరలించారు. ఇంతలో యూకే రూపంలో ట్రంప్‌ వ్యూహానికి ఎదురుదెబ్బ తగిలింది.

    ఇరాన్‌పై దాడి చేసే ప్లాన్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన RAF Fairford (స్విండన్ దగ్గర), హిందూ మహాసముద్రంలో ఉన్న డియాగో గార్షియా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రత్యేక అనుమతి కోరింది. ఇరాన్‌పై దాడి సమయంలో అవసరమైతే ఉమ్మడి ఎయిర్‌బేస్ వాడుకునేందుకు ట్రంప్‌‌ సర్కార్‌.. బ్రిటన్‌ పర్మిషన్ అడిగింది. కానీ, ట్రంప్‌ అభ్యర్థనకు ఝలక్‌ ఇస్తూ.. యూకేలోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని పేర్కొంది.

    దీంతో, ఈ వ్యవహారమే అమెరికా-బ్రిటన్‌ మధ్య ఉద్రిక్తతలు తలెత్తేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు చాగోస్ దీవులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే.. డియెగో గార్షియాలో అమెరికా-యూకేకు ఉమ్మడి సైనిక స్థావరం ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక కీలకమైన వ్యూహాత్మక స్థావరం. ఇక్కడే చాగోస్ దీవులు ఉన్నాయి. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం. అయితే, బ్రిటన్ చాగోస్ దీవుల పరిపాలనా హక్కులను మారిషస్‌కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి అంగీకరించింది. ఈ ఒప్పందం కింద మారిషస్‌కు బ్రిటన్ ఏటా సుమారు 101 మిలియన్ పౌండ్లు (రూ. 1,160 కోట్లకు పైగా) చెల్లిస్తూ.. డియాగో గార్షియా దీవిలోని కీలక సైనిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. నిఘా సమాచార సేకరణ, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ నిర్ణయంపై పెద్ద తప్పుగా ట్రంప్‌ అభివర్ణించారు. మారిషస్‌తో బ్రిటన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాగోస్‌ దీవులను వదుకోవద్దని బ్రిటన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో కంటే బ్రిటన్‌తోనే ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

    దీవుల చరిత్ర ఇదే.. 
    1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1965లో మారిషస్‌కు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు దీవులను వేరు చేసింది. అనంతరం, 1968–73 మధ్య స్థానిక ప్రజలను బలవంతంగా తరిమేశారు. 2019లో అంతర్జాతీయ కోర్టు దీవులను విడగొట్టడం చట్టవిరుద్ధమని.. వాటిని వెనక్కి ఇచ్చేయాల్సిందే అని తీర్పు వెల్లడించింది. అందుకే బ్రిటన్‌.. దీవులను మారిషస్‌కి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఈ ఒప్పందానికి వెళ్తున్నారు.

    యూకేలో వ్యతిరేకత.. 
    యూకే పౌరుల నుంచి భారీ వ్యతిరేకత నేపథ్యంలోనే బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఖచ్చితమైన ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు, మారిషస్‌కు చైనాతో ఉన్న బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమీ బడెనాక్ ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రధాని కియర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘బ్రిటిష్ భూభాగాన్ని అప్పగించడమే కాకుండా ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది’ విమర్శించారు. మరోవైపు.. అధికారికంగా ఈ ఒప్పందంలో చైనా ప్రస్తావన లేదు. కానీ చైనా.. హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచేందుకు పోర్టులు, లీజులు, అప్పుల వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. ఇదే సమయంలో మారిషస్‌తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. రేపటి రోజున మారిషస్‌పై చైనా ప్రభావం ఇంకా పెరిగితే? డియాగో గార్షియాపై ఒత్తిడి వస్తే? పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    చాగోసియన్ల ఉద్యమం..
    1968–1973 మధ్య బ్రిటన్, అమెరికా ఒత్తిడితో చాగోస్‌ దీవుల ప్రజలను బలవంతంగా తరలించారు. డియాగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం ఏర్పాటుకు ఇది ప్రధాన కారణంగా అని చెప్పుకోవచ్చు. దీంతో, సుమారు 2,000 మంది చాగోసియన్లు మారిషస్‌, సెషెల్స్‌, యుకేలో స్థిరపడ్డారు. అయితే, చాగోసియన్లు దశాబ్దాలుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు కోసం పోరాడుతున్నారు.

    యూఎస్‌ యుద్ధ విమానాలు.. 
    ఇదిలా ఉండగా.. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్‌. ఈ దీవులు భౌగోళికంగా చిన్నవే అయినా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి. ఇవి అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా–బ్రిటన్–మారిషస్ సంబంధాల్లో ఒక ప్రధాన అంశంగా మారాయి. డియాగో గార్షియాకు అమెరికా ఇటీవలే ఆరు బీ-2 స్టెల్త్‌ బాంబర్‌ విమానాలను తరలించింది. అమెరికాకు మొత్తం 20 బీ-2 బాంబర్లు ఉండగా, వాటిలో ఆరింటిని ఇక్కడే మోహరించడం దీని ప్రాధాన్యం తెలియజేస్తోంది. హిందూ మహాసముద్రంలో తమ పట్టు నిలబెట్టుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రిటన్‌ నిర్ణయంపై ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మొదలైంది. బ్రిటన్‌ను టార్గెట్‌ చేస్తారా? అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Telangana

  • హైదరాబాద్‌: ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

    ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి మెదక్‌చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్‌ఓలు) ఆన్‌లైన్‌ శిక్షణ నిర్వహించారు.

    మొత్తం 195 మంది ఏఈఆర్‌ఓలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణ అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.

    రాబోయే ఎస్‌ఐఆర్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహకాలను సమయానికి పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడటంలో ఏఈఆర్‌ఓల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు.

  • ములుగు:  మావోయిస్టుల వేరివేతలో భాగంగా కగార్‌ ఆపరేషన్‌-2 చేపట్టిన సీఆర్పీఎఫ్‌కు భారీ ప్రమాదం తప్పింది. కర్రెగుట్టలో కగార్‌-2 ఆపరేషన్‌లో భాగంగా మందుపాతర పేలింది. కర్రెగుట్టలో అమర్చిఉన్న మందుపాతరపై  ఓ జవాన్‌ కాలి వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దాంతో తీవ్ర గాయాలైన జవాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గాయపడ్డ జవాన్‌ను హెలికాప్టర్‌లో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. 

    సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా మందుపాతర పేలింది. ఈ ఘటనలో 39  బెటాలియన్‌కు చెందిన జవాన్‌ గాయపడ్డారు. గాయపడ్డ జవాన్‌ను నవజీత్‌ పటాకుగా గుర్తించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 20వ తేదీ) ఉదయం నుంచి 11 ఐఈడీ(మందుపాతరలు) లను గుర్తించి నిర్వీర్యం చేశాయి సీఆర్పీఎఫ్‌ బృందాలు. 

    కాగా,  తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో నిన్న(గురువారం, ఫిబ్రవరి 19వ తేదీ)భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.  మృతిచెందిన వారిలో అగ్రనేత దేవ్‌జీ  ఉన్నట్లు తెలుస్తోంది.

    కర్రెగుట్టలో ఆపరేషన్‌-2లో భాగంగా 5 వేల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం కూంబింగ్ చేపట్టగా.. మరో వైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ మిగిలి ఉంది.

  • మెదక్‌: జిల్లాలోని రేగోడ్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న(గురువారం, ఫిబ్రవరి 19వ తేదీ) మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు విద్యార్థినులు. 

    అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. తద్వారా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పది విద్యార్థులు తిరిగి కోలుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

  • సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనంపై ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

    వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

    క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి :
    క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.

    కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహ‌న‌సేవ‌లో ఎల్ ఏసీ ప్రెసిడెంట్ శ్రీ ఏ వి రెడ్డి, అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi)కి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సవాల్‌ విసిరారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘15నిమిషాలు సమయం ఇస్తే హిందువులకు తన సత్తా ఏంటో చూపిస్తానని ఓవైసీ చెప్తున్నాడు. నీకు 15 నిమిషాలు కావాలేమో.. మా కార్యకర్తలకు ఐదు నిమిషాలు చాలు అని వ్యాఖ్యానించారు. ప్లేస్‌ నువ్వే చెప్పు.. నీ అడ్డాకు రమ్మంటే వస్తా’ అని సవాల్‌ విసిరారు.   

Family

  • సమకాలీనులైన ప్రముఖుల జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం... తెర మీదైనా, వేదిక మీదైనా ఎప్పుడూ కత్తి మీద సామే. ఒక బయోగ్రఫీని బయోపిక్ సినిమా, లేదా డ్రామాగా మలచాలంటే... అప్పటి సాంఘిక వాతావరణాన్ని పునఃసృష్టించడంలో చిక్కులతో సహా దర్శక, రచయితలకు సవాలక్ష సవాళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడంలోనే సృజనశీలురైన ప్రయోక్తలు, నటులకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవం మిగులుతుంది. సరిగ్గా అలాంటి నాటకమే... శతవసంత సేవామూర్తి, సాంస్కృతిక దీప్తి మండలి వెంకట కృష్ణారావు జీవితకథగా రంగభూమిపై ప్రదర్శితమైన ‘మహాపురుషుడు... మండలి’.

    చిన్ననాటి నుంచి చివరి వరకు విలువలతో కూడిన జీవితం గడిపిన మండలి వెంకట కృష్ణారావు జీవన ప్రస్థానాన్ని రంగస్థలంపై చూపేందుకు చేసిన అద్భుత ప్రయత్నం ఇది. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ ఈ అపూర్వ నాటక రచన చేశారు. ప్రసిద్ధ నటుడు – నాటక ప్రయోక్త ‘గంగోత్రి’ సాయి ఈ ప్రదర్శనలో కీలకమైన మండలి వారి పాత్రను పోషించడమే కాక, సమర్థంగా దర్శకత్వం వహించారు. సాయి దర్శకత్వంలో విజయవాడ సమీపంలోని తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ నాటక సమాజం వారు ఈ నాటకాన్ని మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి కె.వి. రమణాచారి సారథ్యంలోని ప్రసిద్ధ ‘రసరంజని’ నాటక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. దాదాపు రెండు గంటల పైచిలుకు నిడివి గల నాటకం నిలబడి మరీ చూసిన ప్రేక్షకులతో ఆద్యంతం అలరించింది.

    రంగభూమిపై తొలిసారి ఏఐ వినియోగం
    సినిమాలోని ‘స్టార్ట్... కట్’ లకు భిన్నంగా అక్కడికక్కడ ఆగకుండా సాగే నాటకంలో దృశ్యాలను పండించాలంటే రంగాలంకరణ కీలకం. మరి, వందేళ్ళ క్రితం నాటి పరిస్థితుల్ని వేదికపై మళ్ళీ సృష్టించాలంటే ఎంతో శ్రమ. అందుకే, ‘మహాపురుషుడు... మండలి’లో ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇప్పటి దాకా మనం తెర మీదే చూస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)ను రంగస్థలంపై వినియోగించుకోవాలనే ఆలోచన చేశారు. రంగస్థలంపై వేదిక నేపథ్యంలో కట్టిన తెరపై చూపుతున్న అప్పుడెప్పుడో ఆ కాలానికి చెందిన ఫోటోలు – దృశ్యాలు - పాటల చలనచిత్రాన్నీ, వేదికపై నటీనటులు ఇప్పటికిప్పుడు చూపుతున్న హావభావాల రంగస్థల ప్రదర్శననూ తెలివిగా మిళితం చేశారు. చలనచిత్రాన్నీ, రంగస్థలాన్నీ... ఒకదానికొకటి పరిపూరకంగా మార్చారు. ఆ రకమైన వినూత్న ప్రయోగంతో... ప్రదర్శన పద్ధతుల్లో తెలుగు నాటకరంగాన్ని మరో కొత్త పుంత తొక్కించారు. ప్రేక్షకుల మనఃఫలకంపై వేదికను అపూర్వంగా వెలిగించారు.

    నాటకంగా... తెలుగు వెలుగుల జీవితం
    రచన విషయానికొస్తే – గాంధీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకులపై నాటక రచనలు, ప్రదర్శనలు కొత్త కాదు. అయితే, తెలుగు సమాజంలోని త్యాగపురుషులు, జాతీయోద్యమ నాయకులపై మాత్రం అవి చాలా అరుదే. ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులుపై చాలాకాలం క్రితం ఆచార్య మొదలి నాగభూషణశర్మ ‘ప్రజానాయకుడు ప్రకాశం’ అంటూ నాటక రచన చేశారు. అప్పట్లో ‘రసరంజని’ సంస్థ దాన్ని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావుపై తాజా నాటకం ‘మహాపురుషుడు... మండలి’ ఆ అరుదైన ప్రయత్నాల వరుసలో తాజా చేర్పు. తెలంగాణ ప్రాంతం నుంచి సుప్రసిద్ధులైన తెలుగు తేజాలు సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి లాంటి ప్రసిద్ధులపై నాటక రచన చేసిన అనుభవం దీర్ఘాసి విజయభాస్కర్‌ది. ఆ అనుభవంతో పాటు మండలి వారిపై అభిమానం, ఆయన సేవాతత్పర జీవితంపై లోతైన అవగాహనతో ఆనాటి పరిస్థితుల్ని అక్షరాక్షరంలో నింపుకొని విజయభాస్కర్ ఈ రచన చేశారు. అది ఈ నాటక ప్రదర్శనలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతుంది.

    ‘మండలి’ వంశ చరిత్ర మొదలు కృష్ణారావు బాల్యం, స్వాతంత్ర్యోద్యమ కాలప్రభావం, బ్రిటీషు పాలకులపై సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం, రైతుల పక్షాన చేపట్టిన పోరాటాలు, స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో అవిస్మరణీయమైన కాంగ్రెస్ నేతగా కృష్ణారావు ఎదిగిన తీరు, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాకా చేపట్టిన పదవులు, చేసిన సత్కార్యాలు, తెలుగు అధికార భాషా సంఘం – ఉర్దూ అకాడెమీ – బాలల అకాడెమీ – వివిధ కార్పొరేషన్లు ఆదిగా అనేక మౌలిక సంస్థల ఏర్పాటులో ఆయన కృషి, అవనిగడ్డలో ‘గాంధీ క్షేత్రం’ స్థాపన, పులిగడ్డ వంతెన సహా చివరి వరకు ప్రజాక్షేమం కోసమే పలవరించిన తీరు, రాజకీయాల్లో ఆయన తాత్విక భావధారకు కొనసాగింపుగా మండలి బుద్ధప్రసాద్‌ ముందుకు రావడం... ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమీప కాలపు సమకాలీన చరిత్రను ఈ నాటకంలో కళ్ళ ముందుకు తెచ్చారు రచయిత. ముఖ్యంగా, తెలుగు భాషా, సాంస్కృతిక వికాసానికి మండలి వారు చేసిన కృషి, 1977 నవంబర్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సాగించిన అనుపమానమైన సేవను ఈ నాటకం మరోసారి గుర్తు చేసింది. మళ్ళీ ఈ తరానికి పరిచయం చేయడంలో అన్నివిధాలా కృతకృత్యమైంది.

    విజయవంతమైన రచనా భాస్వరం
    పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు లాంటి రాజకీయ ఉద్దండుల పాత్రలు నాటకంలో కనిపించడం, కీలక సందర్భాల్లో వారు మండలి వారికి ఇచ్చిన తోడ్పాటును చూపించడం ప్రేక్షకులలో పురా జ్ఞాపకాల పేటికలను తెరుస్తుంది. ప్రధాన నాటక అంశాన్ని నేపథ్యంగా తీసుకొని, ఆ పరిధిని దాటకుండానే సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పటికీ వెంటాడే డైలాగులు కొన్ని రాశారు. “మనసులో మలినం లేని ప్రతి మనిషీ మాధవుడే...”, “భాష చచ్చిపోతే... జాతి సగం చచ్చినట్టే”, “జనంతో కలసి నడిచేవాడు మామూలు మనిషి, జనానికి ముందుండి నడిపించేవాడు నాయకుడు”, “శ్వాస కన్నా ఆశ పెద్దది”, “అటు శవాలు... ఇటు జీవచ్ఛవాలు” లాంటి అనేక సంభాషణలే అందుకు ఉదాహరణ. అలాగే, నాటకాన్ని నడిపే సూత్రధారుల సంభాషణల్లో సందర్భానుసారం సమకాలీన కలుషిత రాజకీయ వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ, బలంగా మాటల కొరడా ఝళిపించడం మరో విశేషం.

    రచనతో పాటు ప్రదర్శనలోనూ వివిధ పాత్రధారులు, నేపథ్య సంగీతం సహా పలువురు సాంకేతిక నిపుణుల సాయంతో రక్తికట్టిన నాటక ప్రదర్శన ఇది. సామాన్య రైతుల పాత్రల నుంచి మండలి వారి సహధర్మచారిణి పాత్ర దాకా అందరూ బాగా చేయడంతో చిన్నపాటి లోపాలేవీ కనిపించకుండా పోయాయి. గరిష్ఠ భూపరిమితి చట్టం కింద భూములు ఇవ్వబోమన్న కామందుల సందర్భంలో ఓ పాత్ర పదే పదే చెప్పే ఒక్క డైలాగుతో హాస్యం పండితే... స్వాతంత్ర్య కాలంలో సాగుభూములను ఇతర అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయ వేళ భూమికీ – రైతుకూ మధ్య అనుబంధాన్ని చెబుతూ బడుగు రైతులు బాధపడే సందర్భం మనసును మెలిపెడుతుంది. ఏడున్నర ఎకరాల భూమిలో అయిదున్నర ఎకరాలను నిరుపేదలకు అందించిన మండలి వారి త్యాగనిరతిని చూసినప్పుడు మన కాలంలో మన మధ్యనే ఇలాంటి ఓ నిస్వార్థ జీవి నడయాడాడనే భావనతో తీయటి బాధతో గుండె అంతా నిండిపోతుంది.  

    కన్నీరు పెట్టించిన అపూర్వ అభినయం
    ఇంత నాటకంలోనూ దాదాపుగా ద్వితీయార్ధమనిపించే చివరి గంట హైలైట్. మధ్యవయసు మండలి పాత్రను పోషించిన ‘గంగోత్రి’ సాయి అక్కడ నాటకాన్ని పూర్తిగా తన భుజాలపై నడిపించారని చెప్పక తప్పదు. తమిళ రాజకీయ నేత కామరాజ్‌ను తలపించే పొడుగు చేతుల హాఫ్ హ్యాండ్స్ ఖాదీ చొక్కా నుంచి హిట్లర్ మీసకట్టు, ఎడమ చేతితో పంచె చెరగును పట్టుకొని నడిచే నడక, నిరాడంబరమైన నడత, మాట తీరులో మార్దవం, మానవీయత... వీటన్నిటితో అక్షరాలా మండలి కృష్ణారావును అణువణువునా శరీరంలో ఆవాహన చేసుకొని ‘గంగోత్రి’ సాయి నటించారు. అందులోనూ, 1975 నాటి ‘తొలి ప్రపంచ తెలుగు మహాసభల’ నిర్వహణ – ప్రసంగ సందర్భం, అలాగే 1977 నాటి ప్రకృతి విలయతాండవ వేళ తల్లడిల్లిన ఆ మానవతా మూర్తి హృదయాన్ని రంగస్థలంపై అభినయించిన తీరు, నాటక పతాక సన్నివేశం లాంటివి మరీ ప్రత్యేకం. చిమ్మచీకటిలో టార్చిలైటు వేసుకొని, శవాల దిబ్బల మధ్య కొన ఊపిరితో కొట్టుకుంటున్న అభాగ్యుల కోసం మండలి వారు అన్వేషించే సన్నివేశం, కాళ్ళకు పుండ్లు అయినా కట్లు కట్టుకొని మరీ తిరుగాడే దృశ్యం లాంటివి ఎంతటివారినైనా కన్నీళ్ళు పెట్టించక మానవు. “మండలి వారి పాత్ర పోషించిన ‘గంగోత్రి’ సాయి కాళ్ళకు దణ్ణం పెట్టాలనుంది” అని కవి – గాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ సభ్యుడు గోరటి వెంకన్న అన్నారంటే వేదికపై వెలిగిన అభినయ దీప్తిని అర్థం చేసుకోవచ్చు.

    జీవితపు చివరి క్షణాల ఘట్టంలో... ఇటు భార్యాబిడ్డలతోనూ, అటు ప్రజాక్షేమం కోసం రాజకీయ నాయకులతోనూ మండలి వారి పాత్ర సంభాషించే సందర్భం నాటకాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అటు రచయిత రచనా సామర్థ్యం, ఇటు ప్రధానపాత్రధారి అభినయ నైపుణ్యం... పరస్పరం పోటీ పడ్డాయి. ఒకటికొకటి జతకలసి, ప్రేక్షక హృదయాలను తడిపేశాయి. సాత్వికాభినయంతో, నెమ్మదిగానే అయినా స్థిరంగా సాగే సంభాషణా శైలితో, శాంత - కరుణ రసాలను ‘గంగోత్రి’ సాయి పండించిన తీరు ప్రేక్షకులు కళ్ళారా చూసి అనుభవించదగ్గ వైయక్తిక అనుభూతి. “అనేక సందర్భాల్లో ఈ నాటకం అప్రయత్నంగా కన్నీరు పెట్టించింది. ఇది మరిచిపోలేని అనుభవం” అని ప్రముఖ రంగస్థల – సినీ రచయిత తనికెళ్ళ భరణి లాంటి వారు అభిప్రాయపడింది అందుకే! ఒక రకంగా ఈ నాటక ప్రేక్షకులందరి సార్వజనీన అనుభవం కూడా అదే!!

    అక్షరాలా... అంతిమ పరమార్థం
    నిజాయతీ, నిరాడంబరత, నిస్వార్థం, కార్యదీక్ష, ప్రజాసంక్షేమమే పరమావధి తదితర సుగుణాలు రాశి పోసిన ఇలాంటి నాయకుల జీవితాలు వర్తమాన సమాజానికీ, సందర్భానికీ అత్యంత అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని సొంత ఖర్చుతో డాక్యుమెంటరీగా చిత్రీకరించడానికి మాజీ ఎమ్మెల్యే వి. ప్రభాకర చౌదరి ముందుకు వస్తానన్నది. మరో అడుగు ముందుకేసి, “ఈ ప్రదర్శనను నేటి తరం రాజకీయ నాయకులు చూసేలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభ, శాసన పరిషత్తుల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. ఈ నాటకం చూసి కనీసం 20 మంది రాజకీయ నాయకులు మారినా ఈ దేశం బాగుపడుతుంది" అని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్న మాటలు ఆలోచించాల్సినవి. తప్పకుండా ఆచరించి తీరాల్సినవి. ఇప్పటికే అవనిగడ్డలో మొదలుపెట్టి విశాఖపట్నం మీదుగా ముచ్చటగా మూడో ప్రయత్నంగా హైదరాబాద్‌లో అలరించిన ‘మహాపురుషుడు... మండలి’ లాంటి రచన, ప్రదర్శనల అంతిమ పరమార్థం అదే కదా!
    -  రెంటాల జయదేవ

  • బిహార్‌లోని గయకు చెందిన శుభం కుమార్‌ జేఈఈ మెయిన్‌ 2026లో 100 పర్సంటైల్‌ సాధించి ‘వావ్‌’ అనిపించుకున్నాడు. కుమార్‌ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. తండ్రి శివ్‌ కుమార్‌ హార్ట్‌వేర్‌ షాప్‌ యజమాని. తల్లి కాంచన్‌దేవి గృహిణి. శుభం కుమార్‌ ఆల్‌ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. దేశస్థాయిలో టాప్‌ 10లో ఉన్న ఏకైక బిహారి యువకుడిగా ఘనత సాధించాడు. బిహార్‌ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించిన సందర్భంగా... ‘శుభం కుమార్‌ విజయం రాష్ట్రానికి గర్వకారణం’ అని స్పీకర్‌ డాక్టర్‌ ప్రేమ్ కుమార్‌ అని ప్రశంసించారు. శాసనసభ్యులు చప్పట్లు కొట్టారు.

    ‘రాష్ట్రానికి ప్రేరణ ఇచ్చే విజయం ఇది’ అని శుభం కుమార్‌ను ప్రశంసించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ చౌదురి.

    శిక్షణా కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటకు వెళ్లడానికి ముందు ఇంట్లోనే పరీక్షలకు ప్రిపేరయ్యాడు కుమార్‌. కోటకు (Kota) వచ్చిన కొత్తలో కుమార్‌ కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉంది. కుమార్‌ కోటలో ఉండలేని పరిస్థితి వచ్చింది. అయినా తల్లిదండ్రులు వెనకడుగు వేయకుండా, ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి కుమార్‌ తీసుకునే కోచింగ్‌కు అంతరాయం కలగకుండా చూశారు. దాని ఫలితం ఊరకే పోలేదు. కుమార్‌ దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. ఒకవైపు తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నా.. తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. రోజుకు పది నుంచి పన్నెండు గంటలు ప్రిపేరయ్యేవాడు. ప్రాక్టీస్‌ పరీక్ష దశలో 14 గంటల వరకు చదివాడు.

    ‘నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, కష్టపడి చదవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’ అంటున్నాడు శుభం కుమార్‌ (Shubham Kumar).

    చ‌ద‌వండి: విభాగాల వారీగా జేఈఈ మెయిన్‌ టాప‌ర్లు వీరే

  • గత రెండు దశాబ్దాల్లో డ్రోన్‌ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. మన దేశం కూడా ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వ్యవసాయం, పాలన, అభివృద్ధి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా డ్రోన్ల వాడకం చిన్నగా ప్రారంభమైనా ఇప్పుడు ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది. నమో డ్రోన్‌ దీదీ కార్యక్రమం కింద 1,094 డ్రోన్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను, జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. న్యూఢిల్లీలో ఏఐ సమ్మిట్‌ జరుగుతున్న సందర్భంగా డ్రోన్ల హవాపై ఫోకస్‌...

    మన దేశంలో ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంతో పాటు భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల తనిఖీ, విపత్తు నిర్వహణ, రైల్వే, హైవేల పర్యవేక్షణ వంటి పనుల కోసం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల తయారీదారులు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, ధ్రువీకృత పైలట్‌ల కృషితో డ్రోన్ల వినియోగం ప్రభుత్వ నిబంధనలకు లోబడి నానాటికీ విస్తరిస్తోంది.

    కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026 నాటికి దేశంలో 38,500కు పైగా నమోదిత డ్రోన్‌లు(యూఐఎన్‌) వాడుకలో ఉన్నాయి. 39,890 డీజీసీఏ–ధ్రువీకృత పైలట్లు సేవలందిస్తున్నారు. 244 శిక్షణా సంస్థలు డ్రోన్‌ సంబంధిత నైపుణ్యాలను అందిస్తున్నాయి. స్వమిత్వ పథకం కింద డ్రోన్‌లను ఉపయోగించి 3.28 లక్షల గ్రామాలను సర్వే చేశారు. 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను రూపొందించారు.

    సరళీకృత విధాన నిర్ణయాలు డ్రోన్‌ వ్యవస్థ విస్తరణకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ రంగం ఇంతగా అభివృద్ధి చెందింది. సరళీకృతమైన డ్రోన్‌ నియమాలు, ‘డిజిటల్‌ స్కై’ సింగిల్‌ విండో ప్లాట్‌ఫారమ్, తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, లక్షిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్‌ వినియోగాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో డ్రోన్‌లను చేర్చడం వల్ల పనులు మరింత వేగంగా, పారదర్శకగా జరుగుతున్నాయి.

    నమో డ్రోన్‌ దీదీ సేవలు
    నవంబర్‌ 2023లో ప్రారంభించిన ‘నమో డ్రోన్‌ దీదీ’ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.

    డ్రోన్‌ దీదీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ ఎరువుల కంపెనీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నమో డ్రోన్‌ దీదీ పథకం కింద అందించినవి 500కు పైగా డ్రోన్లు ఉన్నాయి.

    నమో డ్రోన్‌ దీదీ పథకం (Namo Drone Didi Scheme) శ్రమతో కూడిన పాత పిచికారీ పద్ధతులకు స్వస్తి చెప్పి.. కచ్చితమైన ఫలితాలు సాధించే కృషి దిశగా వ్యవసాయంలో గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టింది.

    ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఒక డ్రోన్‌ దీదీ మాట్లాడుతూ డ్రోన్‌ శిక్షణ తనను శక్తివంతం చేసిందన్నారు. స్వయం సహాయక సంఘం తరఫున నానో ఎరువులు, పురుగు మందుల పిచికారీ సేవలను అందిస్తూ ఆదాయం పొందుతున్నానని వివరించారు.

    డ్రోన్ల నిబంధనలు మీకు తెలుసా?
    దేశంలో డ్రోన్ల వినియోగం వేగవంతంగా విస్తరిస్తోంది. డ్రోన్ల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, ఆర్థిక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి, స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది.

    డ్రోన్‌ రూల్స్‌ 2021ను 2022, 2023లలో సవరించారు. ఈ సవరణలు మన దేశ డ్రోన్‌ వ్యవస్థను సరళీకరించాయి.

    నియంత్రణ విధానాలు సులభతరమయ్యాయి. ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5కి తగ్గించారు. అనుమతుల అవసరాలను 72 నుంచి కేవలం 4కు తగ్గించారు.

    ఫీజుల హేతుబద్ధీకరణ జరిగింది. డ్రోన్‌ పరిమాణంతో సంబంధం లేకుండా ఫీజుల నిర్ణయం జరిగింది.

    పౌర డ్రోన్‌ కార్యకలాపాల్లో 500 కేజీల బరువు వరకు ఉన్న డ్రోన్ల వాడకానికి అనుమతి లభించటంతో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగం పెరిగింది.

     గగనతలంలో దాదాపు 90%ను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ప్రభుత్వం అనుమతిస్తున్నది.

    ‘సాంప్రదాయ పైలట్‌ లైసెన్స్‌కు బదులుగా డీజీసీఏ జారీ చేసే ‘రిమోట్‌ పైలట్‌ సర్టిఫికేట్‌’ను ప్రవేశపెట్టారు.
    పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ, అడ్రస్‌ ప్రూఫ్‌ ఉంటే డ్రోన్లను నడపడానికి సరిపోతుంది.

    మొత్తంగా ఈ సంస్కరణలు డ్రోన్‌ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి గల అడ్డంకులను గణనీయంగా తగ్గించాయి. డ్రోన్‌ సేవల అందుబాటును గ్రామాల్లో పెంచడానికి దోహదపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

    డ్రోన్లు, డ్రోన్‌ విడిభాగాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి పీఎల్‌ఐ పథకానికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించింది. అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, దేశీయ డ్రోన్‌ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది.

    సెప్టెంబర్‌ 2025లో డ్రోన్లపై జీఎస్టీని ఏకరీతిగా 5 శాతానికి తగ్గించారు. అంతకుముందు 18%, 28% పన్ను రేట్లు ఉండేవి.

    డ్రోన్‌ రిజిస్ట్రేషన్, రిమోట్‌ పైలట్‌ సర్టిఫికేషన్, టైప్‌ సర్టిఫికేషన్, ఆర్టీపీఓ అధికారాల వంటి నియంత్రణ సేవలు డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫారమ్‌ నుంచి ఈజీసీఏకి మార్చారు. విమాన ప్రణాళిక, ఎయిర్‌స్పేస్‌ మ్యాప్‌ వంటి కార్యాచరణ సేవలు డిజిటల్‌ స్కై ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానితమై కొనసాగుతున్నాయి.

    చ‌ద‌వండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?

    మన దేశంలో డ్రోన్‌ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టుల స్థాయి నుంచి ఆవిష్కరణ–ఆధారిత ప్రధాన స్రవంతి రంగంగా ఎదిగింది. మహిళా సాధికారత, గ్రామీణ సదుపాయాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో ప్రభుత్వం సాంకేతిక ఆవిష్కరణలను, విస్తృత డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయం, భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు అంచనా, పౌర సేవల పంపిణీ వంటి కీలక రంగాలలో భాగమయ్యాయి. 

    పంట నష్టాల సేకరణ సులువు
    దేశంలో అనేక రంగాల్లో డ్రోన్లు వివిధ రంగాలలో సామాజిక–ఆర్థిక అభివృద్ధి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయంలో వీటి వినియోగం మహిళా రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా పంట నష్టాల అంచనా పనులను మెరుగుపరిచింది. మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలో ఇవి చురుకైన పర్యవేక్షణ, మెరుగైన వనరుల నిర్వహణకు వీలు కల్పించాయి. 

    భూ వివాదాల పరిష్కారానికి డ్రోన్లు
    సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రువైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌(స్వమిత్వ) పథకంలో డ్రోన్‌ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్‌ 2020లో ప్రారంభించారు. దీన్ని పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడానికి, బ్యాంకు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్‌ ఆధారిత మ్యాపింగ్‌ చేపట్టారు.

    డిసెంబర్‌ 2025 నాటికి 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ హెచ్‌ఏఐ) అన్ని హైవే ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా డ్రోన్‌–వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరి చేసింది.

    విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ యూఏవీలు/డ్రోన్లను ఉపయోగిస్తోంది. అదేవిధంగా, దేశ రక్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

    – నిర్వహణ: 
    పంతంగి రాంబాబు
    సాక్షి సాగుబడి డెస్క్‌ 

  • భారత్‌ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దిగ్గజ సీఈవోలు, ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రముఖ నాయకులు విచ్చేసిన ఈ సదస్సులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అందరి ప్రసంగాలు పూర్తి అయ్యాక ఎనిమిదేళ్ల రణ్‌వీర్ సచ్‌దేవా అతి పిన్న వయస్కుడైన ‘కీ నోట్ స్పీకర్’గా వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా గది అంతా నిశబ్దంగా మారిపోయింది. 

    విప్లవాత్మక అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి తన వయసుకి మించిన జ్ఞానంతో అలవోకగా మాట్లాడి అందర్ని నిశ్చేష్టులయ్యేలా చేశాడు. ఆ బాలుడి ప్రసంగం అక్కడున్న వారందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే భారతీయ తత్వశాస్త్రం కృత్రిమ మేధస్సు (AI)తో ఎలా జతకడుతుంది, AI పట్ల తనకున్న తన ప్రత్యేక ఆసక్తిని, దృక్పథాన్ని పంచుకున్నాడు. ఈ ఏఐ సాంకేతికతకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడుతూ..సాంకేతికత పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

    ఈ శిఖరాగ్ర సమావేశంలో రణవీర్‌  గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్‌ ఏఐ  సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌లను కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కాగా, ఈ ఏఐ విప్లవం వెనుకున్న ఇద్దరు ప్రముఖులతో ఎనిమిదేళ్ల బాలుడు కలిసి పనిచేయడం, అ‍క్కడున్న టెక్‌ దిగ్గజాలతో సంభాషించడం తదితరాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

    ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లలో ఒకదానిలో మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. అయితే రణ్‌వీర్ టెక్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతను మూడేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు, గతంలో ప్రపంచవ్యాప్తంగా కీనోట్స్‌లో మాట్లాడాడు. తన వయస్సుకు మించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను అధ్యయనం చేశాడు. 

    అప్పటి నుండి అతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్షలాది మందికి ప్రేరణగా మారుతున్నాడు. పైగా టెక్నాలజీకి వయోపరిమితి లేదని రణ్‌వీర్ ప్రపంచానికి చాటి చెప్పాడు.

     

    (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర!)

     

  • కార్బోహైడ్రేట్స్‌ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్‌గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్‌లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్‌) : 1 గ్రాము ప్రోటీన్‌ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్‌గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.

    తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్‌స్టాంట్‌ నూడుల్స్‌ వంటి రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్స్‌లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్‌గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది.  వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 

    5:1:1 రూల్‌ అంటే... 
    ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్‌  ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్‌ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్‌తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 

    1 గ్రాము పీచుతో... 
    పీచు (ఫైబర్‌) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్‌ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్‌ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

    ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్‌) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 

    1 గ్రాము ప్రోటీన్‌తో 
    ప్రోటీన్‌ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్‌ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్‌ ఈటింగ్‌) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్‌ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. 

    మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... 

    • దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్‌) లోప్రోటీన్‌ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. 

    • పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. 

    • అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్‌) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్‌) ఉంటాయి. 
      వీలైనంతవరకు 

    • పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. 

    దూరం ఉంచాల్సినవి... 
    బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్‌ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్‌డ్‌ జ్యూస్‌లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.

    5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్‌ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.  
    డాక్టర్‌ శ్రీలత సీనియర్‌ క్లినికల్‌ డైటీషియన్‌ అండ్‌ న్యూట్రీషనిస్ట్‌ 

    (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర!)

  • ‘పిల్లలు పుట్టుకతోనే ఆర్టిస్ట్‌లు’ అంటారు పికాసో. ఈ అన్నా చెల్లెళ్లను చూస్తే నిజమేననిపిస్తుంది. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఇఎల్‌లో ఉంటున్న ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్, మహతి శ్రీమణి ప్రవీణ్‌లు ఆరు, నాలుగు తరగతులు చదువుతున్నారు. అన్న ‘మై చిర్పింగ్‌ థాట్స్‌’ అని కథల పుస్తకం రాస్తే, చెల్లెలు ‘ది ఫ్లోయింగ్‌ పెన్‌’ పేరుతో  కవితా సంపుటం తీసుకువచ్చింది...

    చిన్ననాటి ‘అన్నాచెల్లెలు’ అనగానే మనకు టామ్‌ అండ్‌ జెర్రీ కార్టూన్‌ షోలోని క్యారెక్టర్లు గుర్తుకువస్తాయి. పదకొండేళ్ల ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్, తొమ్మిదేళ్ల మహతి శ్రీమణి ప్రవీణ్‌లు కూడా ఈ పాత్రలకు ఏ మాత్రం తీసిపోరు అన్నట్లుగా పోటీ పడేవాళ్లు. తెగ అల్లరి చేసేవారు.

    ఫస్ట్‌ క్లాస్‌లో స్టోరీ..
    అనంత్, మహతీల ప్రతిభ, అల్లరి గురించి తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన కస్తూరి ప్రవీణ్‌కుమార్‌కు చెప్పారు. ‘అన్నింటిలోనూ ఒకరికన్నా ఒకరు ముందు ఉండాలని పోటీపడుతుంటారు. ఈ విషయంలో ముందుగా మహతి ఉంటుంది’ అని కూతురు గురించి వివరించారు శకుంతల. మహతి ఫోర్త్‌ క్లాస్‌ చదువుతోంది. అన్నయ్య కథలు రాస్తుండటం చూసి తనూ ఫస్ట్‌ క్లాస్‌లో ఒక కథ రాసింది. ఆ తర్వాత తన ఆలోచనను కవిత్వం మీదకు మళ్లించింది. తను రాసిన కవితలన్నింటినీ కలిపి తల్లిదండ్రులు ఇ–బుక్‌గా తీసుకువచ్చారు.

    ఇందులో కవితల గురించి ప్రస్తావిస్తూ ‘ఫ్లైయింగ్‌ హై’ అనే కవిత తనకు ఎందుకు బాగా నచ్చుతుందో తెలిపింది మహతి. ‘ఈ కవితలో ఈగల్‌ – ఫాల్కన్స్‌ అనే రెండు గ్రూప్‌ ఆఫ్‌ బర్డ్స్ పోటీ పెట్టుకుంటాయి. ఆ పోటీలో ఒక చిన్న ఫాల్కన్‌ బర్డ్‌ కూడా పాల్గొంటుంది. కానీ, అది పెద్ద బర్డ్స్‌తో పోటీపడలేకపోతుంది. ఆ బర్డ్స్‌ అన్నీ కలిసి కోచ్‌ దగ్గర ట్రైన్‌ అవుతుంటాయి.

    చిన్న ఫాల్కన్‌ బర్డ్‌కి ట్రైనింగ్‌ అంటే కష్టంగా ఉండి, ఒక పొద దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది. అప్పుడు మదర్‌ ఫాల్కన్‌ వచ్చి ఏదైనా కష్టపడితేనే వస్తుంది, ఏడుస్తూ కూర్చుంటే రాదు అని చెప్పిన మాటలను గుర్తుకుపెట్టుకొని, కష్టపడి ట్రైనింగ్‌ తీసుకొని, చిన్న ఫాల్కన్ పోటీలో పాల్గొంటుంది. ముందు ఆ చిన్న బర్డ్‌ ఈగల్స్‌ని, బ్రదర్‌ ఫాల్కన్‌ని, మదర్‌ ఫాల్కన్‌ని క్రాస్‌ చేసి. చివరికి అతి కష్టమ్మీద ఫాదర్‌ ఫాల్కన్‌ని కూడా క్రాస్‌ చేసి గెలుస్తుంది. అందరితో పోటీ పడటానికి, నన్ను నేను మోటివేట్‌ చేసుకోవడానికి కవిత్వం ఉపయోగపడింది. అందుకు బర్డ్స్‌ని ఉదాహరణగా తీసుకున్నాను’ అని చెప్పింది మహతి. సైన్యంలో పనిచేసే శునకాల గురించి కూడా రాసింది మహతి.

    ‘సైన్యంలో పనిచేసే వారికి అవార్డులు ఇస్తారు. కానీ, అక్కడ పనిచేసిన చేసిన డాగ్స్‌కి మాత్రం ఏమీ ఇవ్వరు..’ ఈ ఆలోచనతో శునకాలకు కూడా అవార్డులు ఇవ్వాలని కవిత రాసింది. పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే అంశంపై రాసిన  ‘డైట్‌’ కవిత జాతీయ దిన పత్రికలో ప్రచురణ అయింది.

    సిరీస్‌ స్టోరీస్‌...
    ఎ.ఆర్‌.అనంత్‌ భరద్వాజ్‌ ప్రవీణ్‌ మూడేళ్లుగా కథలు రాస్తున్నాడు. ఇంటి దగ్గర, పార్క్‌ ఏరియాలో కనిపించే పాముల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై  స్వీయ అనుభవాలను కథల రూపంలో తీసుకువచ్చాడు.

    ‘మా పాప ఒకసారి క్లాస్‌లో బి+ గ్రేడ్‌ వచ్చింది. దాంతో బాగా ఫీలయిపోయి రాసిన పోయెమ్‌ ఫ్లైయింగ్‌ హై. బాబు గురించి చెప్పాలంటే స్కూల్‌కి లంచ్‌ బాక్స్‌ పెట్టిస్తే సరిగా తినేవాడు కాదు. ఇంట్లోనూ అంతే. మేం పదే పదే తినమని చెబుతుండేవాళ్లం. దీంతో రోబో స్పూన్‌ తినిపించడం గురించి ఒక కథ. పాము ఇంటికి వస్తే ఏం చేయాలి? డ్రోన్‌ ద్వారా వాటిని ఎలా కనిపెట్టవచ్చు అని మరో కథ రాశాడు. హోమ్‌ వర్క్‌ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో రోబో పెన్‌ పేరుతో ఒక క్రియేటివ్‌ పెన్‌ గురించి, అది బ్లైండ్‌ పీపుల్‌కి ఉపయోగించినట్లు ఒక సొల్యూషన్‌లా చూపెట్టాడు. ఇలా ఏదైనా సమస్యగా అనిపిస్తే దానిని కథగా తీసుకొని, పరిష్కారం కూడా కనిపెట్టి నోట్‌ చేస్తాడు. ప్రతి స్టోరీలోనూ ఇంత ఆలోచిస్తాడా అనిపించింది’ అని వివరించారు శకుంతల.

    చ‌ద‌వండి: నిజ‌మైన వ్య‌క్తిత్వ వికాసం మొద‌ల‌య్యేది అప్పుడే..!

    ‘నాకు వచ్చిన చిన్న చిన్న ఆలోచలను కథల రూపంలో పెట్టాను. నా వయసు ఉన్న అబ్బాయి ఎదుర్కొనే సమస్యలు, పరిష్కారం గురించి ఈ కథలు ఉంటాయి’ అంటున్నాడు భరద్వాజ్‌. ఈ పుస్తకాలను ప్రింట్‌లో తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుందని, ఇద్దరి బుక్స్‌ని డిజిటల్‌గా తీసుకువచ్చారు.

    ఏడువందల శ్లోకాలు ఏకధాటిగా
    బీహెచ్‌ఇఎల్‌ భారతీయ విద్యాభవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఈ అన్నాచెల్లెళ్లు కథలు, కవిత్వాలు రాయడంలోనే కాదు భగవద్గీత శ్లోకాలను కంఠతా చేయడంలోనూ సాటిలేరని నిరూపిస్తున్నారు. కర్ణాటకలోని శృంగేరి శారదా మఠం వాళ్లు మార్చిలో నిర్వహిస్తున్న భగవద్గీత శ్లోకాల కాంపిటీషన్‌లో వీరిద్దరూ పాల్గొంటున్నారు. అన్నయ్య నేర్చుకుంటున్నాడని చెల్లెలు మహతి భగవద్గీత కాంపిటీషన్‌లో పాల్గొనడానికి 700 శ్లోకాలు నేర్చుకుంది. ఏడాది పాటు చేసిన ఈ ప్రయత్నం వీరిని పోటీలో పాల్గొనేలా చేసింది. ఇద్దరికీ మొదట తెలుగు వచ్చేది కాదు. కానీ, భగవద్గీత శ్లోకాల ద్వారా తెలుగు కూడా సులువుగా నేర్చేసుకున్నారు. నేటి పిల్లలు టీవీలు, మొబైల్‌ స్క్రీన్‌కే  పరిమితం అవుతున్నారని  పెదవి విరిచేవారికి రచనలతో, శ్లోకాలతో సమాధానం చూపుతున్నారు ఈ అన్నాచెల్లెళ్లు.  

    – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

  • టాలీవుడ్‌ నటి స్నేహ, తమిళ నటుడు ప్రసన్న వేంకటేశన్‌ దంపతులు 2012లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమారుడు విహాన్‌, కూతురు ఆధ్యంత అనే ఇద్దరు పిల్లలు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ ఇద్దరు పిల్లలు పెంపక విషయంలో అత్యంత కేరింగ్‌ తీసుకుంటారు. 

    ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, తల్లిదండ్రులుగా వాళ్లతో గడిపేందుకే ఇష్టపడతామని ఈ దంపతులు పలు ఇంటర్వ్యూల్లో తరుచుగా చెబుతుంటారు. అయితే ఈ జంట పిల్లల పెంపకం విషయంలో మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌కే ప్రాధాన్యత ఇస్తారట. సెలబ్రిటీ పిల్లలు అనే భావన దరిచేరనీకుండా.. సాధారణ పిల్లలు మాదిరిగానే పెంచుతాం గానీ..అది అత్యంత మైండ్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు ఈ దంపతులు. అదెలాగంటే..

    పిల్లలకు తమ తల్లిదండ్రులు సంరక్షణలోనే ఉన్నాం అనే ఫీల్‌ కలిగేలా పెంచాలి. అంటే తల్లిదండ్రలుకు పిల్లలకు మధ్య దూరం రాకూడదు. అంటే బాధ్యతలు, ఉద్యోగాల పరంగానైనా సరే, తల్లిదండ్రుల సాన్నిహిత్యం దూరం కాకుడదట. కలిసి భోజనం చేయడం, వారితో కలిసి ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి అన్ని కూడా ఉండాలి. అలాగే మనపిల్లలు అన్నివేళలా ప్రతిదాంట్లో టాలెంటెడ్‌గా ఉండాలని ఆశించొద్దంటున్నారు ఈ దంపతులు. 

    వారి సామర్థ్యాలకు అనుగుణంగా సాధ్యమైనది చేయనివ్వండి. అభినందిస్తూ..మరింత ుముందుకు లక్ష్యం చేరుకోవడం ఎలాగో మార్గనిర్దేశం ఇచ్చేలా ప్రోత్సహించండి. ఒకవేళ్ల సక్సెస్‌ కాకపోతే..దాన్ని అధిగమించడం ఎలాగో వివరించండి తప్ప..భయపెట్టొద్దు. ఆందోళన, ఒత్తిడిలను హ్యాండిల్‌ చేయగలిగేలా చేయండి. ముఖ్యంగా వారితో స్నేహపూర్వకంగా మెలగండి. 

    ఏ విషయమైన నిర్భయంగా చెప్పగలిగే స్వేచ్ఛను ఇవ్వండంటున్నారు. ఎప్పటికీ పిల్లలు దృష్టిలో తల్లిదండ్రులే తమ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనేలా బాండింగ్‌ ఉంటే..కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో విలువలు నేర్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని నొక్కి చెప్పారు. 
     

Movies

  • టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌పై రెబల్ స్టార్ ప్రశంసలు కురిపించారు. బుజ్జిగాడు మూవీకి రాసి క్యారెక్టరైజేషన్‌ చూసి నాకు పిచ్చెక్కిపోయిందని అన్నారు. ఎలా చేయాలిరా బాబు.. నేనెప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదన్నారు. ఆయనలా క్యారెక్టర్‌కు డైలాగ్స్ రాయడం మన ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనూ లేరని ప్రభాస్ కొనియాడారు.

    ప్రభాస్ మాట్లాడుతూ.. 'పూరి జగన్నాధ్‌లా క్యారెక్టరైజేషన్ రాయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయనలా క్యారెక్టర్ డిజైనింగ్‌ మన ఇండియాలోనే కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ రాయలేరు. బుజ్జిగాడు మూవీలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎవరితో మాట్లాడిన బుజ్జిగాడి గురించే మాట్లాడేవాణ్ని. అంత స్ట్రాంగ్ డైలాగ్స్ రాయడం ఆయనకే సాధ్యం. ఎక్ నిరంజన్‌లో నాకు అది చాలా ఫేవరేట్. ఏంటి మగాళ్లు ఏడుస్తారా? ఏంటి ఎవరైనా ఏడుస్తారని రాయడం నాకు భలే అనిపించింది. ఈ డైలాగ్‌ను హిందీలో దబాంగ్‌ సినిమాలో కూడా అడిగి మరీ వాడుకున్నారు' అని అన్నారు. 

     

  • రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వెయిట్ చేయడం లేదని ప్రముఖ నటుడు ప్రమోద్‌ శెట్టి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా రక్షిత్‌ శెట్టిని.. తనను ఆమె వివాహానికి పిలుస్తారని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి‌ పూర్తిగా సినిమాలతో  బిజీగా ఉన్నాడని ప్రమోద్‌ శెట్టి తెలిపారు. హీరోయిన్‌ రష్మికతో వివాహం కానందుకు రక్షిత్‌ శెట్టి బాధపడడం లేదని వెల్లడించారు.

    కాగా.. గతంలో రష్మికకు కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. అంతకుముందు రష్మిక, రక్షిత్ కిరిక్‌ పార్టీ మూవీలో జంటగా నటించారు. రష్మిక ఈ మూవీతోనే కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రమోద్‌శెట్టి  కీలక పాత్రలో కనిపించారు.

    కాగా.. ఈ నెల 26న టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ- రష్మిక వివాహం జరగనుంది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు.

  • టాలీవుడ్ డైరెక్టర్  రాఘవ్ ఓంకార్ శశిధర్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త ప్రయాణం చాలా గర్వంగా ఉందన్నారు. నా ఫ్యామిలీలోకి మెర్సిడెజ్ ఈ క్లాస్ కారును సాదరంగా ఆహ్వనిస్తున్నానంటూ పోస్ట్ చేశారు. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఓర్పు, కృషి, విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ముందుకు నడిపిస్తాయని గుర్తుచేస్తుందని రాసుకొచ్చారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

    కాగా.. రాఘవ్ ఓంకార్ శశిధర్ ది 100 మూవీకి దర్శకత్వం వహించారు. 2024లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు నిర్మించారు. అంతేకాకుండా డైరెక్టర్ శశిధర్.. ఓంకారం, నన్ను క్షమించండి, లడ్డు ఏ స్వీట్ మెమొరీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

     

  • హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌, భర్త అపూర్వ పడ్‌గోయంకర్‌ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    హ్యాపీ యానివర్సరీ మై లవ్‌
    నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్‌.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.

    అసలేమైంది?
    దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్‌ భవ్య సింగ్‌.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్‌ రాగా వాటిని నటి టీమ్‌ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

     

     

  • అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సీతా పయనం. ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య ‍అర్జున్ జంటగా నటించారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.8.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

    ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. కేవలం మౌత్ టాక్‌తో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగడం విశేషం. త వారం విడుదలైన చిత్రాల పరంగా చూస్తే సీతా పయనం టాప్‌లో కొనసాగుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ మూవీలో అర్జున్, ధృవ్ సర్జాలు సైతం స్పెషల్ కేమియో రోల్స్‌లో మెప్పించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. 

    s
     

  • బాలీవుడ్‌ నటి అర్చన పూరణ్‌ సింగ్‌ అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవేవీ కాకుండా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తోంది. ఎటువంటి మొహమాటం లేకుండా పర్సనల్‌, ప్రొఫెషనల్‌.. అన్ని విషయాలను పంచుకుంటోంది. 

    ఐ లవ్యూ చెప్పుకోవడం కాదు
    తాజాగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ అనేది ఐ లవ్యూ చెప్పుకోవడంలో కాదు, దాన్ని చూపించడంలో ఉంటుంది. అయితే పెరుగుతున్న వయసును బట్టి ఈ ప్రేమ రూపాలు కూడా మారుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఎదిగిపోయారు. కాబట్టి మరోసారి మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకునే వీలు దొరికింది. నాకు ఆలస్యంగా పడుకోవడం అలవాటు. తనేమో త్వరగా నిద్రపోతాడు. 

    చిన్న పనులే..
    అతడికి డిస్టర్బ్‌ అవకూడదని నేను ఎటువంటి శబ్ధాలు చేయను. హెడ్‌ఫోన్స్‌ పెట్టుకునే పాటలు వింటాను. పొద్దున ఆయన త్వరగా లేస్తాడు. అప్పుడు నేనింకా నిద్రలోనే ఉంటాను కాబట్టి తను కూడా నన్ను డిస్టర్బ్‌ చేయడు. సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటాడు. ఈ చిన్నచిన్న పనులే ప్రేమను సూచిస్తాయి.

    ఈ లెక్కన విడాకులైనట్లే!
    నా భర్తకు గురక అలవాటు ఉంది. నాకేమో చిన్న అలికిడి అయినా చటుక్కున లేస్తాను. మళ్లీ నిద్రలోకి జారుకోవడం చాలా కష్టం. అందుకే భర్త పక్కన నేను పడుకోలేను. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని స్లీప్‌ డివోర్స్‌ అంటారు. ఐదు నుంచి ఏడేళ్లపాటు మేమిద్దరం ఇలాగే విడివిడిగానే నిద్రపోయాం. ఈ లెక్కన విడాకులు తీసుకున్నట్లే! (నవ్వుతూ)

    జీవితం చాలా చిన్నది
    గత 10-15 ఏళ్లలో మా మధ్య ఇగో పూర్తిగా నశించిపోయింది. ముందు నువ్వే సారీ చెప్పాలన్న వాదన అనేదే మా మధ్య లేదు అని చెప్పుకొచ్చింది. అర్చన భర్త, నటుడు పర్మీత్‌ మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎన్ని పండుగలు, బర్త్‌డేలు ఉన్నాయని? ప్రతిదానికి గొడవపడుతూ కూర్చుంటే జీవితమే చేజారిపోతుంది. అన్నింటినీ పక్కనపెట్టి సంతోషంగా బతికేయాలి అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: అజిత్‌, విజయ్‌ మధ్య శతృత్వం? క్లారిటీ ఇచ్చిన షాలిని

  • టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

    అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు క్రేజీ ‍అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

    తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్‌ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.
     

     

  • కోలీవుడ్‌ స్టార్స్‌ అజిత్‌, విజయ్‌ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్‌ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.

    షాలిని ఆసక్తికర వ్యాఖ్యలు
    హీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్‌ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో షాలిని మాట్లాడుతూ.. అజిత్‌, విజయ్‌.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్‌ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. 

    అప్పుడు కూడా వివాదం
    ఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్‌ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది. అప్పుడు విజయ్‌ అజిత్‌కు కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్‌ స్పందిస్తూ.. . అజిత్‌ సర్‌కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్‌ ఒకరు. 

    సినిమా
    ఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్‌ సర్‌కు విజయ్‌ విషెస్‌ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్‌ చివరగా నటించిన సినిమా జన నాయగణ్‌. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్‌ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్‌.. ప్రస్తుతం కార్‌ రేసింగ్‌ పోటీల్లో బిజీగా ఉన్నాడు.

    చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్‌పై వివాదం

  • యంగ్ రెబల్ స్టార్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. తన చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవీ కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి రెబల్ స్టార్ ఓకే చెప్పిన సంగతి తెలిసింది.

    ఇన్నీ భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రభాస్ చేతిలో ఉండగా.. ప్రశంతా వర్మతో సినిమా చేసేందుకు టైమ్‌ కేటాయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ రద్దైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ వినిపించింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌ గురించి తెగ ఆరా తీస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అని షాకవుతున్నారు.

    ప్రశాంత్ వర్మ క్లారిటీ..

    ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్ స్వయంగా స్పందించారు.  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్‌తో ప్రాజెక్ట్ రద్దు కాలేదని.. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఆలస్యం కానుందని తెలిపారు. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతే తప్ప తమ ప్రాజెక్ట్‌ రద్దు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. 

    కాగా.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్‌, కల్కి-2 సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, అతను ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఇక రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ చిల్ అవుతూ అప్‌డేట్స్ కోసం వేచి చూడటమే. 

    జై హనుమాన్‌తో బిజీగా ప్రశాంత్ వర్మ

    మరోవైపు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో జై హనుమాన్‌ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని సమాచారం. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

     

  • టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీ చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

    ప్రభాస్ అన్న ప్రశంసలు తమ చిత్రానికి రావడంపై సంతోశ్ శోభన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్న రివ్యూతో మా మూవీ సక్సెస్ అయినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోశ్ శోభన్‌కు ప్రభాస్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అన్న ఫోన్ నంబర్ నా వద్ద లేదని.. నీకు నేను అభిమానిని మాత్రమేనని శోభన్ చెప్పగా.. ప్రభాస్‌ తన నంబర్ ఇచ్చాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చెయ్.. అనవసరంగా చేస్తే తంతా అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

    చెన్నై నుంచి ఫుడ్‌ ఆర్డర్..

    ఈ చిట్‌ చాట్‌లో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ఆదిపురుష్‌ షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటనను వివరించారు.  ఆ రోజు ఓం రౌత్‌కు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తానని చెప్పానన్నారు. చెన్నై నుంచి ఆహారం ఆర్డర్‌ చేసి ముంబయికి ఫ్లైట్‌లో తెప్పించినట్లు వెల్లడించారు. మన హైదరాబాద్‌ బిర్యానీ ఓకే కానీ.. చెన్నై ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ప్రభాస్ అన్నారు. ఇది విన్న ఔం రౌత్‌  నీలాంటోడిని ఎక్కడా చూడలేదని అన్నారని గుర్తు చేసుకున్నారు. 
     

     

  • హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడినుంచో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.  రెండు సెకన్ల దర్శనభాగ్యం కోసం కొన్ని గంటల తరబడి లైన్‌లో నిలబడి వేచి చూస్తారు. అయితే తాను మాత్రం 15 నిమిషాలు వెంకటేశ్వరస్వామివారిని తనివితీరా దర్శించుకున్నానంటోంది హీరోయిన్‌ శివానీ నగరం. 

    15 నిమిషాల దర్శనం 
    కాకపోతే అక్కడ తనను చూసిన కొందరు భక్తులు దేవుడితో పాటు తననూ కీర్తించారని కామెంట్లు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివానీ నగరం మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్లాను. దాదాపు 13 ఏళ్ల తర్వాత.. లిటిల్‌ హార్ట్స్‌ సక్సెస్‌ అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లాను. నన్ను కాసేపు ద్వారం దగ్గర నిల్చోబెడతామని చెప్పారు. ఏకంగా 15 నిమిషాలు గర్భగుడి ఎదుట నిల్చోబెట్టి దర్శనం చేయించారు. 

    దేవుని గుడిలో నాగురించి..
    ఎవరూ నన్ను వెళ్లిపోమని తొందరపెట్టలేదు. ఒకవైపు నుంచేమో భక్తులు గోవిందా.. గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. మరోవైపు నుంచి కాత్యాయని, భోం చేశావా? అంటున్నారు. అది వినగానే నేను షాకయ్యాను. దేవుడా.. ఇంక నాకేం వద్దు అనిపించింది. అదే సమయంలో అమ్మ కూడా.. 'నీవల్ల 15 నిమిషాల దర్శనం దొరికింది. థాంక్యూ బేటా.. నీకు తల్లినయినందుకు గర్వంగా ఉంది' అని కామెంట్‌ చేసింది. ఆ మాట వినగానే జీవితానికి ఇది చాలు అని ఉప్పొంగిపోయానంది. 

    హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత దేనికి?
    ఇది చూసిన నెటిజన్లు.. ఒకటీరెండు సినిమాలు చేసిన హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత, అదే సామాన్య భక్తులను మాత్రం తోసేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివానీ డప్పు కొట్టుకుంటోందని సెటైర్లు వేస్తున్నారు. కాగా శివానీ నగరం.. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. లిటిల్‌ హార్ట్స్‌ చిత్రంతో క్రేజ్‌ అందుకుంది. తాజాగా మరోసారి సుహాస్‌తో జతకట్టింది. అతడికి జంటగా నటించిన హే బలవంత్‌ మూవీ నేడే (ఫిబ్రవరి 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

     

     

    చదవండి: ఎందుకిలా బాధపెడుతున్నారు? కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా

  • సీతారామం, హాయ్ నాన్న తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మృణాల్ ఠాకుర్.. అంతకు ముందు హిందీ సీరియల్స్‌తో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె గ్లామర్ గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అలాంటిది గత కొన్నిరోజుల నుంచి మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె బంధం గురించి తెగ రూమర్స్ వచ్చాయి. ఏకంగా పెళ్లి చేసుకుంటారని కూడా మాట్లాడుకున్నారు. అంతకు ముందు మృణాల్ చేసిన ఓ ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడమే దీనికి కారణం. అయితే ఆ రోజు ధనుష్ ఎందుకు వచ్చాడనేది ఇప్పుడు మృణాల్ బయటపెట్టింది.

    (ఇదీ చదవండి: లెస్బియన్ పాత్రలో రష్మిక?)

    'నేను ధనుష్ సర్‌కి పెద్ద అభిమానిని. ఆయన చేసిన రాయన్, మారి, రాంఝానా, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చూశాను. ముఖ్యంగా 'అసురన్' అయితే ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ఆయన నటన అద్భుతం. మిగతా యాక్టర్స్ నుంచి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ రాబట్ట గల సత్తా కూడా ఆయన సొంతం. నటుడిగానే కాకుండా గీత రచయిత, సింగర్, డ్యాన్సర్, డైరెక్టర్ కూడా. 'తేరే ఇష్క్ మే' షూటింగ్ జరుగుతున్న టైంలో సర్.. మా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్క్రీనింగ్‌కి వస్తారా? అని అడిగాను. ఆయన వస్తారని అస్సలు అనుకోలేదు. నిజంగానే ఆయన రావడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అని ఓ ఎఫ్ఎమ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

    అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో పెళ్లి రూమర్స్ గురించి మాట్లాడిన మృణాల్.. అసలు ఇదంతా ఎవరు మొదలుపెట్టారో కూడా నాకు తెలియదు. ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా నా పేరు మీద ఏవేవో రాశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఇష్టమైతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని, కాకపోతే అంతలోపు తాను నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి కొన్ని ఉన్నాయని పేర్కొంది. ఈమె హీరోయిన్‌గా చేసిన హిందీ మూవీ 'దో దివానే షెహర్ మే' ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.

    (ఇదీ చదవండి: ఆ హీరోని చూసి నా ఎక్స్‌ భాయ్‌ఫ్రెండ్‌ భయపడ్డాడు: మృణాల్‌)

  • టైటిల్‌: నవాబ్‌ కేఫ్‌
    నటీనటులు: శివ కందుకూరి, రాజీవ్‌ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, చైతన్య కృష్ణ తదితరులు
    నిర్మాణ సంస్థ: హర్షిక ప్రొడక్షన్స్‌
    దర్శకుడు : ప్రమోద్‌ హర్ష
    నిర్మాత: రాధా వి పపుడిప్పు
    సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి
    విడుదల తేది: ఫిబ్రవరి 20, 2026

    టాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్‌ అయిన మరో చిన్న సినిమా ‘నవాబ్‌ కేఫ్‌’. మొదటి ఈ సినిమాకు చాయ్‌ వాలా అని టైటిల్‌ పెట్టారు. కానీ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం తెలపడంతో ‘నవాబ్‌ కేఫ్‌’గా మార్చారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ని క్రియేట్‌ చేశాయి. పాతబస్తీ ఇరానీ చాయ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన రంగనాథ్ (రాజీవ్ కనకాల) వారసత్వంగా వచ్చిన ‘నవాబ్ కేఫ్’ని రన్‌ చేస్తూ ఉంటాడు. అది కేవలం టీ కొట్టుగా కాకుండా కుటుంబ లెగసీగా ఫీలవుతాడు. తాత, తండ్రి లాగే రంగనాథ్‌ ‘టీ’కి కూడా అభిమానులు ఉంటారు. అయితే ఆయన కొడుకు రాజా(శివ కందుకూరి)కి మాత్రం ఆ కేఫ్‌లో పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అమెరికాకు వెళ్లి భారీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటాడు. 

    పెదనాన్న కొడుకు కుమార్‌(చైతన్య కృష్ణ) సలహాతో కేఫ్‌ని అమ్మేయాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో తండ్రి, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతుంది. అదేరోజు రాత్రి రంగనాథ్‌ గుండెపోటుతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజాలో వచ్చిన మార్పు ఏంటి? తన కలలను నెరవేర్చుకోవడం కోసం ‘నవాబ్ కేఫ్’ అమ్మేశాడా? లేదా తండ్రి విలువ తెలుసుకొని కేఫ్‌ని రన్‌ చేశాడా? ‘నవాబ్ కేఫ్’ కోసం కుమార్‌ చేసిన కుట్ర ఏంటి? రాజా తీసుకున్న నిర్ణయానికి ప్రియురాలు సఖీ( తేజు అశ్విని) ఎలా తోడుగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    హీరో మొదట్లో అల్లరి చిల్లరగా తిరగడం.. ఓ విషాద ఘటన తర్వాత పూర్తిగా మారిపోయి..తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం.. ఆ బిజినెస్‌ని దెబ్బతీసేందుకు విలన్‌ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి.. చివరిలో ఆ రంగంలో రికార్డు సృష్టించడం..ఈ లైన్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘నవాబ్ కేఫ్’ కూడా ఇలాంటి కథే. కథ-కథనం రెండూ.. ఇటీవల ధనుష్‌ నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమాను గుర్తు చేస్తాయి. అక్కడ ఇడ్లీ దుకాణం.. ఇక్కడ టీ కొట్టు.. అంతే తేడా. తండ్రి-కొడుకు ఎమోషన్‌ చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటుంది. ప్రమోద్‌ హర్ష ఎంచుకున్న పాయింటే రొటీన్‌ అంటే.. స్క్రీన్‌ప్లే కూడా అలానే ఉంది.  కథనం ఎక్కడ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్‌ సీన్‌ ఒక్కటి కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. మిగతా కథంతా ఊహకందేలా.. నిదానంగా సా..గుతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. 

    నవాబ్‌ కేఫ్‌ హిస్టరీని తెలియజేస్తూ కథను ప్రారంభించారు దర్శకుడు.  ఆ తర్వాత హీరో ఎంట్రీ.. హీరోయిన్‌తో పరిచయం.. వారిద్దరి మధ్య సాగే లవ్‌ట్రాక్‌.. ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించదు.  సినిమాలో హీరోయిన్‌ ఉండాలి కాబట్టి.. సఖీ పాత్రను క్రియేట్‌ చేశారు కానీ..కథతో ఆమెకు ఎలాంటి సంబంధమే ఉండదు.  హీరో అమెరికాకు వెళ్లాలని ఫిక్స్‌ అయినప్పుడే..తర్వాత కథనం ఎలా సాగుతుందనేది అర్థమైపోతుంది. ముందుగా చెప్పినట్లుగా ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఎమోషనల్‌ సీన్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం కథనం మరింత సాగదీతగా సాగుతూ..  ఇడ్లీ కొట్టు,  కీర్తి సురేశ్‌ మిస్‌ ఇండియా తో పాటు పలు సినిమాలను గుర్తుకు చేస్తుంది.  ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. 

    ఎవరెలా చేశారంటే.. 
    రాజా పాత్రకు శివ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రిగా రాజీవ్‌ కనకాల రొటీన్‌ పాత్రే చేసినా.. ఎమోషనల్‌ సీన్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  హీరోయిన్‌ తెజు అశ్విని పాత్రకు కథలో ప్రాధాన్యత లేదు.  తెరపై కనిపించేది కూడా తక్కువే.  రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తనదైన కామెడీతో కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

     సాంకేతికంగా కూడా సినిమా యావరేజ్‌గానే ఉంది. సినిమా మొత్తం ఏదైనా పాజిటివ్‌ పాయింట్‌ ఉందంటే..అది ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అని చెప్పాలి. ఆయన అందించిన పాటలతో పాటు బీజీఎం కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమా మొత్తంలో చాలా వరకు సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని సీన్లను కట్‌ చేసినా.. కథకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అజిత్‌, చిరంజీవి, వెంకటేశ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

    రెండో పెళ్లంటూ ప్రచారం
    తీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్‌ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్‌ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్‌ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్‌ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.

    ఒంటరి ఆడదాన్ని అనేకదా!
    ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్‌ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. 

    మంచివాటిపై ఫోకస్‌ చేస్తా..
    తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్‌ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్‌ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.

    చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక

National

  • ఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వాహనదారులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా టోల్‌ ప్లాజాలలో నగదు లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఈ కొత్త విధానం ఈ ఏడాది  ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.  

    దేశవ్యాప్తంగా 1,150కి పైగా టోల్‌ ప్లాజాలలో ఫాస్టాగ్‌లు,నగదు చెల్లింపులు ద్వారా జరుగుతున్నాయి. తద్వారా టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ రద్దీతో పాటు పారదర్శకత లోపిస్తుండడంపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టిసారించింది. ఇందులో భాగంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని భావిస్తోంది. యూపీఐ,ఫాస్టాగ్‌ ద్వారా వాహనదారులు టోల్‌ ఛార్జీలు చెల్లించే వెసలు బాటు కల్పించనుంది.  

    గతంలో, ఫాస్ట్‌ట్యాగ్‌ల స్వీకరణ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో టోల్ ప్లాజాలలో సగటు వేచి ఉండే సమయం 734 సెకన్ల నుండి 47 సెకన్లకు తగ్గిందని ఎన్‌హెచ్‌ఏ తెలిపింది. 

  • వాహనాల్లో వెళుతూ ఆడియోలో పాటలు వినడం కొత్త కాదు. కానీ  ఒక రోడ్‌ మీదకు వెళ్లగానే టైర్లు రహదారిని తాకగానే సంగీతం వినిపించడం ఎక్కడైనా కనీ విన్నామా? దేశపు తొలి మ్యూజికల్‌ రోడ్‌ మీదుగా వెళితే ఆ అనుభవం మన స్వంతమవుతుంది. ముంబై  కోస్టల్‌ రోడ్‌  దీనికి తొలి అడ్రెస్‌గా నిలిచింది. దక్షిణ దిశగా ఉన్న కోస్టల్‌ రోడ్‌  500 మీటర్ల పొడవు అధికారికంగా భారత దేశపు మొట్టమొదటి సంగీత రహదారి అనే ఘనతను దక్కించుకుంది.  ఈ రోడ్‌ మీదుగా వాహనదారులు నిర్ణీత వేగంతో  డ్రైవ్‌ చేస్తున్నప్పుడు సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ పాట జై హోను ఉప్పొంగే దేశభక్తితో పాటు వినవచ్చు.

    ఈ ప్రత్యేకమైన ఇన్ స్టాలేషన్స్ ను ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రారంభించారు, ఇది పట్టణ మౌలిక సదుపాయాలు, సాంకేతికత సాంస్కృతిక వ్యక్తీకరణల  అరుదైన కలయికను సూచిస్తుంది. ఈ సంగీత విస్తరణ ప్రియదర్శిని పార్క్‌ అమర్స న్స్ గార్డెన్‌ మధ్య, నారిమన్‌ పాయింట్‌ నుంచి వర్లి కి ఉత్తరం వైపు,  క్యారేజ్‌వేలో, వాహనాలు కోస్టల్‌ రోడ్‌ సొరంగం నుంచి నిష్క్రమించే చోటుకు దగ్గరలో ఉంది.

    హంగేరియన్‌ రోడ్‌ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్‌... రోడ్డు ఉపరితలంపై ఖచ్చితమైన ఇంజనీరింగ్‌ గ్రూవ్‌లను ఉపయోగిస్తుంది. వీటిని రంబుల్‌ స్ట్రిప్స్‌ అని కూడా పిలుస్తారు. వాహనాలు ఈ గ్రూవ్‌ల మీదుగా గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు, టైర్ల ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు సంగీత ప్రకంపనలను సృష్టిస్తాయి, ప్రస్తుతం ఇవి స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రం లోని గుల్జార్‌ సాహిత్యంతో ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన జై హో పాటను వీనుల విందుగా వినిపిస్తున్నాయి.

    వాహనాల లోపల కూడా ఈ ట్యూన్‌ స్పష్టంగా వినిపిస్తూ వాహనదారులు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు అనూహ్యమైన  శ్రవణ అనుభవాన్ని అందిస్తుందని అధికారులు అంటున్నారు.  భద్రతను నిర్ధారించడానికి, బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సొరంగం లోపల సహా మ్యూజికల్‌ స్ట్రెచ్‌ ముందు 500 మీటర్లు, 100 మీటర్లు 60 మీటర్ల వద్ద ముందస్తు హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది, దీని వలన డ్రైవర్లు ఆకస్మిక బ్రేకింగ్‌ లేకుండా క్రమంగా వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.

    మన దేశంలో ఫస్ట్‌.. ప్రపంచంలో ఫిఫ్త్‌...
    ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్‌ రోడ్‌ కాగా ప్రపంచవ్యాప్తంగా  ఐదవది. మ్యూజికల్‌ లేదా మెలోడీ రోడ్‌ వరుసలో  మొదటిది 2007లో జపాన్ లో ప్రారంభించారు.   అప్పటి నుంచి హంగేరీ, దక్షిణ కొరియా యుఎఇ  వంటి దేశాలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది  ‘వాహనదారులకు సంతోషకరమైన అనుభవం‘ అని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలకు మించి ప్రయాణికుల అనుభవాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఈ ప్రాజెక్ట్‌  ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇతర రహదారులపై కూడా వీటిని చూడవచ్చునని  ఆశాభావం వ్యక్తం చేశారు

  • తిరునంతపురం: కేరళ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా వైకోమ్‌ పట్టణంలో సోలార్‌తో నడిచే పడవల్ని అందుబాటులోకి తెచ్చింది.  తద్వారా కేరళ ప్రభుత్వం పర్యావరణహిత రవాణా రంగంలో కీలక అడుగు వేసినట్లైంది.  

    కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి. అదే సమయంలో  కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం  నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి. రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా  ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది. 

    ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్‌తో నడిచే పడవల్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి’అని పేర్కొన్నారు.

    ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు. 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి. రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది. 2017లో వైకోమ్‌లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. 

  • న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో  మరో  అంశం నెట్టింట చర్చకు దారి తీసింది. ఉచిత క్యాలెండర్‌లు పంపిణీ చేప్పడంతో  ఒక్కసారిగా సందర్శకులు ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

    ఇండియా AI సమ్మిట్‌లో భారత్ మండపం వద్ద ఉన్న కౌంటర్ చుట్టూ పెద్ద సంఖ్యలో  జనం గుమిగూడారు. ఉచితంగా అందిస్తున్న క్యాలెండర్ల కోసం క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకున్న వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు.  ఈ వీడియోను ఎక్స్‌ యూజర్‌ డాక్టర్ రంజన్ షేర్‌ చేయడంతో చర్చకు తెరలేచింది. హై-ప్రొఫైల్ టెక్‌ ఈవెంట్‌లో కనీస మర్యాద పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూ కమెంట్‌ చేశారు. క్యాలెండర్‌లో ఉపయోగకరమైన సమాచారం ఉండి ఉండవచ్చు,అలాంటి బహుమతులు కంపెనీలకు బ్రాండింగ్‌గా కూడా పనిచేస్తాయి కదా అన్నారు. 

    మరోవైపు వీడియోలో కనిపించే వారిలో చాలామంది నిజమైన AI నిపుణులు లేదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవచ్చు అని కమెంట్‌ చేయడం గమనార్హం.

  • న్యూఢిల్లీ:  ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో భాగంగా చివరిరోజున కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐ సదస్సులో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు లేకుండా నిరసన చేపట్టారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ .. ఇది ఎటువంటి మేధస్సులేని, భావోద్వేగంలేని చర్యగా అభివర్ణించింది. 

    ఈ సమ్మిట్‌ ఐదవరోజు శుక్రవారం(ఫిబ్రవరి 20వ తేదీ) భారత్ అధికారికంగా అమెరికా ప్రధాన ఏఐ ప్రాజెక్ట్ Pax Silicaలో చేరింది. ఇది అమెరికా యొక్క కృత్రిమ మేధస్సు-సరఫరా గొలుసు భద్రతకు సంబంధించిన ప్రధాన కార్యక్రమం. అయితే దీనిపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. భారత మండపం (ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ)లో ఆఖరిరోజు సదస్సులో భాగంగా యూత్ కాంగ్రెస్ సభ్యులు చొక్కాలు విప్పి  నినాదాలు చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్‌ ప్రయోజనాలే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువైపోయాయంటూ పలువురు నిరసనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 10 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా ధ్వజమెత్తింది.  ఇది చొక్కాలు లేని నిరసనే కాదు.. బుర్రలేని నిరసన అంటూ కౌంటర్‌ ఇచ్చింది బీజేపీ. 

    చివరి రోజు సమ్మిట్‌లో భాగంగా భారత విద్యా వ్యవస్థపై పునరాలోచించడం, అమెరికా-భారత్ భాగస్వామ్యం ద్వారా AI యుగానికి శక్తినివ్వడం,  చర్చలు-రాజనీతిలో  ఏఐ వినియోగం తదితర అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కను కొట్టిన కారణంతో రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా రెండేళ్ల ప్రేమను, బంధాన్ని కాదనుకుంది వధువు. అసలు ఏమైంది అంటే..

    ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా కొత్వాలి ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.  నిజానికి  అ‍ప్పటికే రెండేళ్లుకుగా ప్రేమలో ఉన్న  సుమీత్‌, తాన్య  జంట  పారిపోయి కాన్పూర్‌లోని ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. అయితే  విషయం తెలిసిన పెద్దలు వీరి ప్రేమను అంగీకరించి, ఫతేపూర్‌లో  బంధువుల సమక్షంలో మరోసారి ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.

    పెళ్లి గ్రాండ్‌గా నిర్వహించేందు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వధూవరుల కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. బారాత్‌, జైమాల వేడుక సంతోషంగా పూర్తైంది. ఇక తెల్లవారుజామున ముహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రగడ మొదలైంది. పూజామందిరంవద్ద ఆభరణాల సమర్పణ ఆచారాలు జరుగుతుండగా, వధువు పెంపుడు కుక్క అవిశ్రాంతంగా మొరగడం మొదలు పెట్టింది. దీంతో అసహనానికి గురైన వరుడు తరపు బందువు ఒకరు ఆ కక్కను కొట్టాడు. దీంతో వధువు, ఇతర బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఫలితంగా ఒక్కసారిగా అక్కడి వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది. బంధువులంతా కర్రలు, కుర్చీలతో తలలు పగిలేలా కొట్టుకోవడంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. దీంతో వధువు వైపు ముగ్గురు, వరుడి వైపు ఇద్దరు గాయపడ్డారు. వధువు వేలు కూడా విరిగింది.

    ఇదీ చదవండి: గ్లోబల్‌ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌ డేంజర్‌లో : IMF చీఫ్
     

    ఈ విషయం ఖాగా పోలీస్ స్టేషన్‌కు చేరడంతో  అధికారులు జోక్యం చేసు కున్నారు.  గాయపడిన వారిని సెంట్రల్ హెల్త్ సెంటర్ (CHC)లో చికిత్స చేసి, ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి పంపించారు. అనంతరం ఇరు వర్గాల సీనియర్ సభ్యుల మధ్య చర్చించారు.  ఈ క్రమంలో వధువు తాను ఇకపై తానీ పెళ్లిని కొనసాగించ లేనని వధువు స్పష్టం చేసింది. చివరికి కట్నకానులు తిరిగి ఇచ్చి పుచ్చు కునేందుకు రాజీ కుదిరింది. ఏ పక్షమూ అధికారికంగా ఫిర్యాదేమీ లేదు కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.

    ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

Sports

  • టీ20 ‍ప్రపంచకప్‌ 2026 చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా పసికూన ఒమన్‌పై ప్రతాపం చూపింది. తొలుత బౌలింగ్‌లో 104 పరుగులకే (16.2 ఓవర్లలో) ఒమన్‌ను ఆలౌట్‌ చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని 9.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.  ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.

    ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. 

    ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ చెలరేగిపోయాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 64 పరుగులు చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి ట్రవిస్‌ హెడ్‌(32), ఇంగ్లిస్‌ (12 నాటౌట్‌) సహకరించారు. హెడ్‌ వికెట్‌ షకీల్‌ అహ్మద్‌కు దక్కింది.

     

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా జట్టు అంతా అయిపోయాక లైన్‌లోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో ఇదివరకే నిష్క్రమించిన ఈ మాజీ ఛాంపియన్‌.. ఇవాళ (ఫిబ్రవరి 20) పసికూన ఒమన్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సామర్థ్యం మేరకు సత్తా చాటింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆసీస్‌.. ఒమన్‌ను 104 పరుగులకే (16.2 ఓవర్లలో) కుప్పకూల్చింది.

    ఒమన్‌ పతనాన్ని స్పిన్నర్లు ఆడమ్‌ జంపా (3.2-0-21-4), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (3-0-13-2) శాశించారు. పేసర్లు జేవియర్‌ బార్ట్‌లెట్‌ (4-0-27-2), నాథన్‌ ఇల్లిస్‌ (2-0-14-1), మార్కస్‌ స్టోయినిస్‌ (2-0-16-1) కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఒమన్‌ ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. 

    ఆ జట్టులో వసీం అలీ (32) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ (17), హమ్మద్‌ మీర్జా (16), కరణ్‌ సోనావాలే (12) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్‌ కెప్టెన్‌ జతిందర్‌ ఆసీస్‌కు చుక్కలు చూపిస్తామని బీరాలు పలికి ఏమీ చేయలేకపోయాడు. ఈ టోర్నీ నుంచి ఆసీస్‌తో పాటు ఒమన్‌ కూడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ గ్రూప్‌ దశ మొత్తంలో చివరిది. ఈ టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ ఇదివరకే సూపర్‌-8కి చేరాయి.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్‌ రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ శివసేన రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.

    రికార్డు స్థాయిలో దరఖాస్తులు 
    - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా  5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు.  
    - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్‌కు అర్హత సాధించారు.  
    - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి.  

    చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ ప్రధాన ఉద్దేశం.. 
    - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం.  
    - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం.  
    - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం.  
    - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.
    -  భవిష్యత్తులో ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం.

  • ఇటీవలికాలంలో టీమిండియా క్రికెటర్లు (శిఖర్‌ ధవన్‌, మహ్మద్‌ షమీ, యుజ్వేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా) వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత క్రికెటర్‌ కూడా చేరాడు.

    26 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌, మరో టీమిండియా ఆటగాడు దీపక్‌ చాహర్‌ సోదరుడు అయిన రాహుల్‌ చాహర్‌ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్‌ ఓ భావోద్వేగపూర్వక నోట్‌తో ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

    చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, అది తనకు జీవిత పాఠాలు నేర్పిందని చాహర్‌ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలు అనుకోని పాఠాలు నేర్పాయని, గత పదిహేను నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచాయని  వివరించాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని అన్నాడు. ఈ అధ్యాయం ఇప్పటికి ముగిసిందని.. ఇకపై స్వాభిమానంతో, శాంతితో, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని తెలిపాడు.

    ప్రేమించి పెళ్లి చేసుకొని..!
    - రాహుల్‌–ఇషానీ జోహర్‌ 2019 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.  
    - 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్‌ వేడుకలో వీరి వివాహం జరిగింది.  
    - ఇషానీ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ, తరచూ రాహుల్‌ మ్యాచ్‌లకు హాజరై మద్దతు ఇచ్చేది.  
    - వారి బంధం సోషల్‌ మీడియాలో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది.
    - స్పష్టమైన కారణాలేమో తెలియరాలేదు కానీ, చాహర్‌ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    విడాకుల తర్వాత రాహుల్‌ చాహర్‌ తిరిగి క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించనున్నాడు. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన చాహర్‌.. తిరిగి ఫామ్‌లోకి రావాలని కృషి​ చేస్తున్నాడు. చాహర్‌ను 2026 ఐపీఎల్‌ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి టీమిండియా రీఎంట్రీ ఇవ్వాలని చాహర్‌ భావిస్తున్నాడు. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు రేపటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌ నిపుణులు కూడా ఈ టాపిక్‌పై తమ అంచనాలను షేర్‌ చేశారు.

    స్టార్‌ స్పోర్ట్స్‌ ప్యానెల్‌లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్‌, ఛతేశ్వర్‌ పుజారా, మొహమ్మద్‌ కైఫ్‌, వరుణ్‌ ఆరోన్‌, సబా కరీం, సంజయ్‌ బాంగర్‌ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా కలిగి ఉన్నారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదే టీమిండియా. ఈ ఆరుగురు సెమీస్‌కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు.

    చహల్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు ఛాన్స్‌ ఇచ్చాడు.

    కైఫ్‌ భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. వరున్‌ ఆరోన్‌ పై ముగ్గురికి భిన్నంగా భారత్‌తో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు.

    సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయని గెస్‌ చేస్తున్నాడు. మాజీ టీమిండియా ఆల్‌రౌండర్‌ బాంగర్‌.. భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఈ నిపుణుల అంచనాల్లో ఎవరి అంచనాలు కరెక్ట్‌ అవుతాయో కామెంట్‌ చేయండి. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా గ్రూప్‌ స్టేజీలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఓ రేంజ్‌లో బీరాలు పలుకుతున్నారు. ఆసీస్‌ వైదొలిగితే పాక్‌కు కలిగే లాభమేమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

    పేరుకు జెంటిల్మెన్‌ క్రీడనే అయినా, క్రికెట్‌ లాంటి రియలిస్టిక్‌ గేమ్‌లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. తాజాగా పాక్‌ అభిమానులు హడావుడి చేయడానికి ఈ సెంటిమెంటే కారణం. ఏంటా సెంటిమెంట్‌ అంటే..?

    ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సందర్భాల్లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలో పాక్‌ విజేతగా నిలిచి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది.  

    2009 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలోనూ పాకే విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది.

    2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే వైదొలగగా.. ఆ టోర్నీలోనూ పాక్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

    తాజాగా ఆసీస్‌ టీ20 ప్రపంచకప్‌ 2026లోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో పాక్‌ అభిమానులు సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. 

    వాస్తవానికి పాక్‌ సూపర్‌-8కు చేరడమే అతికష్టం మీద జరిగింది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాక్‌ అభిమానులు తాము ప్రపంచకప్‌ గెలుస్తామని బీరాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఏ జట్టైనా ఛాంపియన్‌గా నిలవాలంటే కనీస అర్హతలు ఉండాలి.

    ప్రస్తుత పాక్‌ జట్టుకు ఆ అర్హతలు లేవనే విషయం అందరికీ తెలుసు. గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ లాంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. సూపర్‌-8లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లను దాటుకొని ముందుకెళ్లాలి. 

    వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఇది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే పాక్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచేంత గొప్పగా ఏమీ లేదు. ఆ జట్టులో మ్యాచ్‌ విన్నర్‌ వెతికితే కూడా కనపడడు. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్‌లో లేక మడతమంచం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ప్రపంచకప్‌ గెలవడం​ జరిగే పని కాదు. పాక్‌ అభిమానులు సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతుంటే, జింబాబ్వే లాంటి చిన్న జట్టు టాలెంట్‌ను నమ్ముకొని ముందుకు సాగుతుంది.  

  • జోనాథన్‌ ట్రాట్‌.. ఈ పేరు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రనే మార్చేసింది. ఈ మాజీ ఇంగ్లీష్‌ ఆటగాడు 2022లో ఆఫ్ఘనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో ఊహించని అద్భుతాలు చేశాడు. అప్పటివరకు పసికూనగా ఉన్న జట్టును లెజెండ్‌ కిల్లర్‌గా తీర్చిదిద్దాడు. ఆఫ్ఘన్‌తో పోటీ అంటే ఎంతటి జట్టైనా ఉలిక్కిపడే స్థాయికి తీసుకెళ్లాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇకపై ఎంతమాత్రం చిన్న జట్టు కాదు.. ప్రపంచంలో ఏ జట్టైనైనా ఓడించగలిగే సత్తా ఉన్న జట్టు అని అనుకునేలా చేశాడు.

    ఆఫ్ఘన్‌ కోచ్‌గా ట్రాట్‌ పదవీకాలం పూర్తైన నేపథ్యంలో అతను సాధించిన విజయాలు, అతని హయాంలో ఆఫ్ఘన్‌ జట్టు సాధించిన పురోగతిపై ఓ లుక్కేద్దాం.

    వాస్తవానికి ట్రాట్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ కోచింగ్‌ బాధ్యతలు అనుకోకుండా దక్కాయి. ఆ స్థానాన్ని మరో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ గ్రహం థోర్ప్‌ భర్తీ చేయాల్సి ఉండింది. అయితే థోర్ప్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటంతో ట్రాట్‌కు లక్కీగా ఈ ఛాన్స్‌ వచ్చింది. ఈ అఫర్‌ను ఒడిసిపట్టుకున్న ట్రాట్‌.. మొదటి రోజు నుంచే తన పని మొదలుపెట్టాడు.

    ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారిలో స్పూర్తిని రగిల్చడం ప్రారంభించాడు. 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గన్‌ జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకొని ఉంది. ఆ సమయంలో ట్రాట్‌ వారికి ఆశాకిరణంలా మారాడు. ఆయన రాకతో జట్టులో క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచన, మానసిక దృఢత్వం పెరిగింది. ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడటం మొదలుపెట్టారు.

    ట్రాట్‌ బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం ఎదురైంది. ఐర్లాండ్‌ చేతిలో ఆ జట్టు 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ట్రాట్‌ క్రమశిక్షణకు తొలి ఫలితం 2022 ఆసియా కప్‌లో వచ్చింది. ఆ టోర్నీలో ఆఫ్ఘన్‌ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు ఊహించని షాకిచ్చింది.

    ట్రాట్‌ మార్గదర్శకత్వంలో ఆఫ్ఘన్‌ జట్టు ఆ మురుసటి ఏడాది (2023) మరింత రాటుదేలింది. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం, పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ గెలుపు, శ్రీలంకపై ఆధిపత్యం.. ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధ్యమయ్యాయి. ఈ మధ్యలో చిన్న జట్లపై ఆధిపత్యం కూడా తారాస్థాయికి వెళ్లింది. 

    2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్‌ చేరిన క్షణం ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.  పొట్టి ప్రపంచకప్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘన్‌ జట్టు ఆతర్వాత సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును కూడా మట్టికరిపించింది. 

    ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు సంచలనాలు నమోదు చేస్తుందని అంతా ఊహించారు. అయితే దురదృష్టవశాత్తు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతుల్లో ఓడి సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. 

    అయితే ఈ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం (రెండు సూపర్‌ ఓవర్లు) కొదమసింహాల్లా పోరాడాయి. అంతిమంగా సౌతాఫ్రికాదే పైచేయి అయినప్పటికీ.. ఆఫ్ఘన్‌ పోరాటం​ క్రికెట్‌ ఉనికిలో ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. 

    ఆఫ్ఘనిస్తాన్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో కెనడాపై ఘన విజయం సాధించి, గెలుపుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచే ట్రాట్‌కు ఆఫ్ఘన్‌ కోచ్‌గా చివరి మ్యాచ్‌. మూడేళ్లపై పైగా పదవీకాలంలో ట్రాట్‌ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఆఫ్ఘన్‌ ఆటగాడు భావోద్వేగానికి గురయ్యాడు. ట్రాట్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మున్ముందు మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆశిద్దాం. 

  • బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. భారత్‌-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫహీమా ఖాతూన్‌ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్‌ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్‌ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ 2, వహీదా అక్తర్‌, మొమినా రియాసత్‌, అనోషా నాసిర్‌, ఒమైమా సొహైల్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్‌ పతనాన్ని శాశించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావాల్‌ జుల్ఫికర్‌ (14), యుస్రా ఆమిర్‌ (11), హఫ్సా ఖలీద్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

    కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో బంగ్లా-పాక్‌ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 

  • పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మాద్‌ బట్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

    ఒకప్పుడు తోపు
    కాగా పాక్‌ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్‌ విజేత, మూడు ఒలింపిక్‌ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. 

    అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భాగంగా పాక్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్లో ఆడిన మ్యాచ్‌లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.

    ప్లేట్లు కడిగి మ్యాచ్‌కు వెళ్లాం
    ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్‌ అమ్మాద్‌ బట్‌ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్‌లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్‌ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.

    స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌)పై అమ్మాద్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్‌ఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్‌లు కడిగి కిచెన్‌ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.

    బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది
    దాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్‌ను బుక్‌ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్‌కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్‌ బట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

    రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం
    ఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు  పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్‌ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

    నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
    ఈ క్రమంలో పాక్‌ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ బ్యూరోక్రాట్‌ ముహుయుదీన్‌ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్‌ తొలుత అమ్మాద్‌ గురించే ప్రకటన చేశారు. 

    అమ్మాద్‌పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.

    చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

  • ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో తొలిసారి కనిపించబోతున్నాడు. ఆ లీగ్‌లో కొత్త ఫ్రాంచైజీ 'హైదరాబాద్‌ హ్యూస్టన్‌ కింగ్స్‌మన్‌ బోల్‌స్టర్‌' 2026 ఎడిషన్‌ కోసం మ్యాక్సీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.

    తమతో జతకట్టిన సందర్భంగా హైదరాబాద్‌ ఫ్రాంచైజీ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇంగ్లీష్‌లో పెద్దపెద్ద పదాలు (విధ్వంసకర బ్యాటింగ్‌కు సంబంధించి) ఉపయోగించి ఆకాశానికెత్తింది. అసాధ్యం అనే పదం మ్యాక్సీ నిఘంటువులో లేదు. అతని ప్రవేశంతో పీఎస్‌ఎల్‌లో అతిపెద్ద షో మొదలవుతోందంటూ తమ సోషల్‌మీడియా అకౌంట్‌లో డప్పు కొట్టింది.

    వాస్తవానికి సదరు ఫ్రాంచైజీ ఇస్తున్న హైప్‌కు ప్రస్తుత మ్యాక్సీ ఫామ్‌కు అస్సలు పొంతన లేదు. మ్యాక్స్‌వెల్‌ ఇటీవలికాలంలో కెరీర్‌లో ఎన్నడూ లేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 

    ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న అతను.. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శనలు కొనసాగించాడు. ఈ మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. జట్టు పరంగా, వ్యక్తిగతంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో మ్యాక్స్‌వెల్‌కు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ బంపరాఫర్‌ ఇచ్చింది.

    ఐపీఎల్‌లో పట్టించుకునే నాథుడే లేడు
    ఎటూ ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకునే ఆవకాశం లేకపోవడంతో మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ 2026 వేలంలో పాల్గొనలేదు. గత కొన్ని ఎడిషన్లుగా అతను ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని ఫ్రాంచైజీలు మారినా అదే పరిస్థితి. 

    పేలవ ఫామ్‌, వయసు మీద పడటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాక్స్‌వెల్‌ శకం  ముగిసిందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న మ్యాక్సీ.. పీఎస్‌ఎల్‌లోనైనా రాణిస్తాడో లేక కెరీర్‌కు ముగింపు పలుకుతాడో వేచి చూడాలి. కాగా, పీఎస్‌ఎల్‌ 2026 ఎడిషన్‌ మార్చి 26 నుంచి మే 3 వరకు జరుగుతుంది. 

  • జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అటు సారథిగా.. ఇటు ఆటగాడిగా అతడు సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. ‘అండర్‌డాగ్‌’గా ఈ టోర్నీ బరిలో దిగిన జింబాబ్వే.. అనూహ్య రీతిలో సూపర్‌-8 దశకు చేరుకుంది.

    మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మార్గం సుగమం చేసుకున్న జింబాబ్వే.. శ్రీలంకను కూడా ఓడించి గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వే విజయంలో సికందర్‌ రజాదే కీలక పాత్ర. కొలంబో వేదికగా లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

    లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 63 నాటౌట్‌), తాడివనాషే మరుమాని (34) శుభారంభం అందించగా.. రజా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 45)తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    ప్రపంచ రికార్డులు
    అంతర్జాతీయ టీ20లలో అత్యధికంగా ఇరవైసార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఫుల్‌ మెంబర్‌ జట్టు ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా అత్యంత పెద్ద వయసులో ఐసీసీ టోర్నీలో ఈ పురస్కారం పొందిన ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రజా బద్దలు కొట్టాడు.

    కాగా 2025 చాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా రోహిత్‌ 37 ఏళ్ల 335 రోజుల వయసులో POTM పొందగా.. రజా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో తాజాగా 39 ఏళ్ల 301 రోజుల వయసులో  అవార్డు పొందాడు.

    టెస్టు హోదా ఉన్న జట్ల (ఫుల్‌ మెంబర్‌) తరఫున అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు POTM పొందిన ఆటగాళ్లు
    సికందర్‌ రజా- జింబాబ్వే- 20సార్లు
    సూర్యకుమార్‌ యాదవ్‌- ఇండియా- 17సార్లు
    విరాట్‌ కోహ్లి- ఇండియా- 16సార్లు
    మహ్మద్‌ నబీ- అఫ్గనిస్తాన్‌- 14సార్లు.

    చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Business

  • శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.

    ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.

    వెండి ధరలు
    వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.

    ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

  • సాధారణంగా ఒక కారును నిశితంగా పరిశీలిస్తే.. దాని ముందు, వెనుక బ్రాండ్ లోగో లేదా అక్షరాలు, సైడ్ డోర్స్ మీద కొన్ని స్టిక్కర్స్, వెనుక బీఎస్ 6 లేదా బీఎస్ 4 మోడల్స్ అని తెలిపే గుర్తులు వంటివి కనిపిస్తాయి. అయితే వెనుక భాగంలోనే 1.2, 1.5, 2.4 వంటి నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీటి అర్థం కొందరికి తెలిసి ఉన్నా.. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    కారు వెనుక కనిపించే ఈ నెంబర్స్.. మోడల్ నెంబర్స్ అనుకుంటే పొరపాటే. నిజానికి ఇవి ఇంజిన్ కెపాసిటీని సూచిస్తాయి. బైకులలో ఇంజిన్ కెపాసిటీని సీసీ అంటారు. ఉదాహరణకు 100 సీసీ ఇంజిన్, 150 సీసీ ఇంజిన్ ఇలా. ఇక్కడ సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్ల అని అర్థం.

    ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు

    కారు ఇంజిన్.. బైక్ ఇంజిన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి కారు ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో కొలుస్తారు. లీటర్ నెంబర్‌ను 1000తో గుణించడం ద్వారా.. కారు ఇంజిన్ సీసీ కెపాసిటీ తెలుస్తుంది. అంటే.. 1.2 అనేది 1200 సీసీ ఇంజిన్‌ను, 1.5 అనేది 1500 సీసీ ఇంజిన్‌ను సూచిస్తుంది. కారు వెనుక ఉన్న నెంబర్ ఎంత పెద్దది అయితే.. ఇంజిన్ పరిమాణం కూడా ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రీమియం కార్లలో ఇంజిన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

  • భారత వైమానిక దళానికి సరఫరా చేసే సీ-390 మిలీనియం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా బ్రెజిలియన్‌ సంస్థ ఎంబ్రేయర్‌తో దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌ చేతులు కలిపింది. లోకలైజేషన్‌ వ్యూహంలో భాగంగా నెలకొల్పే ఈ కేంద్రంలో టెస్టింగ్, తనిఖీ, విడిభాగాల రిపేర్, శిక్షణ తదితర సర్వీసులన్నీ అందిస్తుందని ఎంబ్రేయర్, మహీంద్రా తెలిపాయి.

    ఎంబ్రేయర్‌కి చెందిన సీ-390 మిలీనియం మల్టీ-మిషన్‌ మిలిటరీ రవాణా విమానాలను భారత్‌లో తయారు చేసేందుకు ఇరు సంస్థలు గతేడాది అక్టోబర్‌లో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇతర మధ్యస్థాయి మిలిటరీ రవాణా విమానాలతో పోలిస్తే సీ-390 అత్యధిక వేగం, రేంజి, 26 టన్నుల వరకు పేలోడ్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. సరుకు, బలగాల రవాణా, సెర్చ్‌ ఆపరేషన్లు మొదలైన అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

  • ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గుతున్నాయని పసిడి ప్రియులు సంబరపడుతున్నారు. ఈ తరుణంలో గోల్డ్ రేటు మళ్లీ రూ. 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై కొనసాగుతున్న అనిశ్చితి వంటివి కారణాలు అని వెల్లడించారు.

    అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా యుద్ధ వాతావరణం లేదా రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు.. పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు చూస్తారు. ఇలాంటి సమయంలో.. బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. ఇదే జరిగితే.. గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతాయి.

    ఇక మరో అంశం.. వడ్డీ రేట్లు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? లేదా?.. అనేది చాలాకాలంగా పెట్టుబడిదారుల్లో నిలిచిపోయిన ఒక ప్రశ్న. వడ్డీ రేట్లు తగ్గితే.. బంగారం వంటి ఆస్తులు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఎందుకంటే వడ్డీ వచ్చే పెట్టుబడులపై లాభం తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు.

    రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగితే.. ధరలు ఎగిసే అవకాశం ఉంది. అదే విధంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు ప్రకటిస్తే కూడా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకు.. మార్కెట్‌లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు.

    ప్రస్తుతం తగ్గిన ధరలు!
    2026 జనవరిలో రూ. 1.80 లక్షలకు చేరిన తులం బంగారం.. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఇంత తక్కువ వ్యవధిలో రేటు ఎంత తగ్గిందో చూడవచ్చు. వెండి రేటు కూడా దాదాపు భారీగా తగ్గి కేజీ రేటు రూ. 2.70 లక్షలకు చేరింది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.

    ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.

    యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్‌లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.

    మూడు నెలల్లో 11000 మంది!
    యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.

    ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

  • శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్ల (0.38 శాతం) లాభంతో 82,814.71 వద్ద, నిఫ్టీ 116.90 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 25,571.25 వద్ద నిలిచాయి.

    VL E-గవర్నెన్స్ & IT సొల్యూషన్స్ లిమిటెడ్, BLB లిమిటెడ్, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, సకార్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. విక్రమ్ సోలార్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్, కెఎన్ అగ్రి రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్‌గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.

    సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్‌లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.

    పరిశోధనలే పునాదిగా..

    రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్‌తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్‌ చాయిస్‌’ అన్నారు.

    ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్‌లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.

    ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

  • టాటా మోటార్స్ కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరలు రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభమవుతాయి.

    టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 468 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేసింది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ 355 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఈ కారు 65 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

    టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మూడు డ్రైవ్ మోడ్‌లు (ఎకో, సిటీ, స్పోర్ట్), డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, కొత్త విండో కంట్రోల్ బటన్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మొదలైనవి ఉన్నాయి.

    ఇదీ చదవండి: కారు లైఫ్ టైమ్ పెరగాలంటే.. ఇదిగో 5 జాగ్రత్తలు

    డిజైన్ పరంగా, రిఫ్రెష్డ్ ఫాసియా, చుట్టూ బూడిద రంగు బాడీ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. మిగిలిన డిజైన్ దాదాపు సాధారణ ఏవీ పంచ్ మాదిరిగానే ఉంటుంది.
     

  • న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్‌లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్‌జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్‌ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.

    ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?

    ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్‌లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.

    కంప్యూటింగ్‌ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.

    ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్‌ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌..), చైనా (డీప్‌సీక్‌) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్‌ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.

    ప్లాట్‌ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్‌ఫారమ్స్ లేవు.

    అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్‌కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.

    గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?

    అమెరికా కంపెనీలు భారత్‌పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్‌గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్‌ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్‌నే వాడాలని కోరుకుంటున్నారు.

    భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..

    భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.

    డేటాపై పూర్తి అధికారం

    భారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.

    స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పన

    చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్‌లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.

    నైపుణ్యం కలిగిన మానవ వనరులు

    ఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.

    ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

Crime

  • జైపూర్‌: రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిట్లో విషాదం ఛాయలు నెలకొన్నాయి. డిగ్‌ జిల్లా నియామత్‌పూర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపు డీజేలో విద్యుత్‌ షాక్‌ సంభవించింది. విద్యుత్‌ షాక్‌ గురై ఐదుగురు మృతి చెందారు. 11కే విద్యుత్‌వైర్లకు డీజే వాహనం తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

  • గాంధీనగర్‌: గుజరాత్‌లో వలసాడ్ జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. లారీ - కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

    పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వలసాడ్ జిల్లా కప్రాడా ప్రాంతంలోని కుంభఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు,లారీ  ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న వెంటనే కారులో ఉన్న పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే క్షతగాత్రులు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

     ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

     

     

Politics

  • తిరుపతి: వేంకటేశ్వరస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని, న్యాయస్థానాలను అవహేళన చేస్తూ ఏకసభ్య కమిషన్‌ నియమించారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ, సిట్‌ విచారణలు తమ కనుసన్నల్లో జరపలేదని, తాను ఆశించిన విధంగా విచారణ జరగలేదు కాబట్టే.. మళ్లీ ఏకసభ్య కమిషన్‌ నియమించారని భూమన విమర్శించారు. 

    ‘గులాం చేసే వాళ్లతో ఏకసభ్య కమిషన్‌ వేయడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సమయంలో ఏకసభ్య కమిషన్ నియమించి ఏం చేశారో మనం చూశాం.  ఇప్పుడు మళ్లీ ఏకసభ్య కమిషన్‌ వేశారు. దీన్ని పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం.  ఇది ఆశ్చర్యం కల్గిస్తుంది.  45 రోజుల పాటు వన్‌మేన్‌ కమిషన్‌ నియమించారు. 

    రాజకీయ డ్రామా ఆడటానికి కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. 45 రోజల పాటు తాను అనుకున్న మీడియా ద్వారా అసత్య కథనాలు నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు.  మమ్మల్ని దోషులుగా ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. వన్‌మేన్‌ కమిషన్‌ చైర్మన్‌గా చంద్రబాబు మీరే ఉంటే సరిపోతుంది కదా.. ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

     ప్రలోభాలకు లోనై ఫిరాయించారనే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్‌ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి.

    వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయగా, వారికి తాజాగా నోటీసులు జారీ చేశారు. 

  • తాడేపల్లి: కూటమి సర్కారు వల్ల ప్రజలకు ఎటువంటి  ఉపయోగం లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ ద్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరగడానికే సరిపోతుందని, ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పసిపిల్లపై అఘాయిత్యాల జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు జూపూడి. టీటీడీ లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది కాస్తా భూమ్‌రాంగ్‌ అయ్యి హెరిటేజ్‌ దగ్గర ఆగిందన్నారు. లడ్డూ విషయంలో తప్పంతా చంద్రబాబుదేనని తేలిపోయిందన్నారు. 

    టీడీపీ కూటమి ప్రభుత్వం గాడి తప్పి అస్తవ్యస్తంగా పరిపాలన చేస్తోంది. చంద్రబాబు పరిపాలన పబ్లిసిటీ పీక్..పర్ఫార్మెన్స్ వీక్‌గా ఉంది. కూటమి నేతలు నిత్యం జగన్ నామ స్మరణ, వైఎస్సార్‌సీపీ నేతలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు ఎప్పుడు అడిగినా కేసులు, అరెస్టులు, డైవర్షన్ చేస్తున్నారు. కూటమి పాలన గురించి వైఎస్‌ జగన్‌ సుదీర్ఘంగా వివరించారు.  జగన్ ప్రెస్ మీట్‌ను ప్రజలు క్షుణ్ణంగా వినాలని, నిజాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో గవర్నెన్స్ ఉందా లేదా అని  వైఎస్‌ జగన్‌​ ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు సమాధానం లేదు.

    జగన్‌ను తిట్టడానికే మంత్రులకు శాఖలు కేటాయించారు. గిరిజన పాఠశాలలు, హాస్టల్స్, ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 900 మంది పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. లోకేష్ నేతృత్వంలో విద్యా  వ్యవస్థ నాశనమైంది.

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానంపైనే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదే విషయాన్ని పరకాల ప్రభాకర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఒకే అబద్దాన్ని పదే పదే చెబుతూ గ్లోబల్ ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. 

    పరిపాలన గాలికి వదిలేసి హెలికాప్టర్, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు నిత్యం ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు, విదేశీ విహార యాత్రలకు ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తున్నారు. ఎవరి ఖర్చులతో తిరుగుతున్నారు అని అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. 99 పైసలకే భూములు తీసుకున్న వారు స్పెషల్ ఫ్లైట్స్ పెడుతున్నారా అని ప్రశ్నిస్తున్నాను.ఆకాశంలో విహరించడం మానేసి భూమి మీదకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అని జూపూడి డిమాండ్‌ చేశారు.

    Jupudi: ఎవడి డబ్బుతో క్రికెట్ మ్యాచ్ కు వెళ్ళావ్?
  • సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో సీపీఐ,సీపీఎం వంటి వామపక్షాలతో పాటు పదికిపైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం (ops)..సీఎం స్టాలిన్‌తో భేటీ అ‍యారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.

    ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(aiadmk)నుంచి బహిష్కరణకు గురైన సీఎం ఓ.పన్నీరు సెల్వం శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిశారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశం చివరి రోజున ఓపీఎస్‌తో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్‌తో కలిసి స్టాలిన్‌ను కలిశారు.  

    స్టాలిన్‌ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు  
    అనంతరం, డీఎంకే పాలనపై ఓపీఎస్‌ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్‌ చేసిన ఈ పొలిటికల్‌ కామెంట్స్‌ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది.

    ఒకప్పుడు సీఎం.. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగి
    ఏఐఏడీఎంకే హయాంలో ఓపీఎస్‌ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో విభేదాలు, ఓపీఎస్‌ అనుచరులు డీఎంకే, ఏఐఏడీఎంకేలో చేరిపోయారు. ఏఐఏడీఎంకేలో బహిష్కరణకు గురైన ఓపీఎస్‌ తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్‌డీఏలో తిరిగి చేరాలన్న యత్నం కూడా ఫలించలేదు. గత ఏడాది బీజేపీతో విభేదాల కారణంగా ఆయన ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఓపీఎస్‌ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ క్రమంలో స్టాలిన్‌ను ఓపీఎస్‌ కలవడం ఆసక్తికరంగా మారింది.

    ఒకే దెబ్బకు రెండు పిట్టలు
    అయితే,ఓపీఎస్‌,ఎంకే స్టాలిన్‌ సమావేశంపై విశ్లేషకులు భవిష్యత్తు రాజకీయాల్ని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అన్నది విశ్లేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓపీఎస్‌ను చేర్చుకోవడం ద్వారా డీఎంకే, ఏఐడీఎంకేలోని అసంతృప్తుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు. ఓపీఎస్‌కు ఉన్న వ్యక్తిగత మద్దతు, ఆయన అనుచరుల ఓటు బ్యాంక్ డీఎంకేకి చేరితే వచ్చే ఎన్నికల్లో అదనపు బలం లభిస్తుంది. ఓపీఎస్‌ను కూటమిలో చేర్చుకోవడం డీఎంకేకి వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో డీఎంకేతో చేరితే ఓపీఎస్‌కు ఆయన కుమారుడికి రాజకీయ పునరావాసం లభిస్తుంది. ఓపీఎస్‌కు ఇది ఒక కొత్త మార్గం, కొత్త అవకాశంగా మారొచ్చు.

    ఓపీఎస్‌-డీఎంకే భేటీ ప్రతిపక్ష ఏఐఏడీఎంకి పెద్ద దెబ్బ. ఇప్పటికే ఓపీఎస్‌ అనుచరులు డీఎంకే, ఏఐడీఎంకేలలో చేరిపోయారు. ఓపీఎస్‌.. డీఎంకేతో కూటమి కుదుర్చుకుంటే, ఏఐఏడీఎంలోని విభేదాలు మరింత పెరుగుతాయి. ఇది ఏఐడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.

    ఓపీఎస్‌.. ఎన్‌డీఏ నుంచి బయటకు రావడం బీజేపికి నష్టం. ఓపీఎస్‌.. డీఎంకేలో చేరితే, బీజేపీకి తమిళనాడులో మిత్రపక్షం కోల్పోయినట్టే. ఇది ఎన్డీయే వ్యూహానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది.

    మొత్తానికి సీఎం ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసింది. అదే సమయంలో ఏఐఏడీఎకే, బీజేపీలకు నష్టం. ఓపీఎస్‌ డీఎంకేలో చేరుతారా? లేక ఎన్డీయే కూటమితో చర్చలు జరుపుతారా? అన్న అంశంపై స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ పరిణామం రాబోయే ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. 

  • సాక్షి,మచిలీపట్నం: నారా లోకేష్‌ క్రికెట్ మ్యాచ్‌ ట్వీట్‌పై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ‘సినిమా డైలాగులు ట్విటర్‌లో పెట్టడం కాదు. దమ్ముంటే ఫ్లైట్‌,బోర్డింగ్‌ వివరాలు బయట పెట్టాలి.మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్‌ వివరాలు తెలపండి. ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు.     

    లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్.. పుష్ప డైలాగ్ తో పేర్ని నాని కౌంటర్
  • సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్‌ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్‌ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

    టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు మీడియా ద్వారా  తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీ లోనే ఉన్నాడు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్‌ పెద్దలు చొరవ చూపాలి. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, జీవన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్‌ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

     

  • సాక్షి, అమరావతి: చంద్రబాబు దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేశారని.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన శాసన మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం తమ సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారన్నారు.

    ‘‘సీబీఐ ఇచ్చిన రిపోర్టులో చాలా విషయాలు బయటికి వచ్చాయని.. హెరిటేజ్‌తో ఒప్పందం చేసుకున్న ఇందాపూర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. 2015-19 మధ్య కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఇందాపూర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇందాపూర్‌ను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారు. అవే ట్యాంకర్లను దాచి మళ్లీ వినియోగించారు. గోవిందా కూటమి నేతలకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరాం. సభలో చర్చించమని కోరాం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

    ‘‘సభలో టీడీపీ మంత్రులు అవాకులు, చవాకులు మాట్లాడారు. టీడీపీ నేతలకు కావాల్సింది స్వామివారి ఔన్నత్యం పెంచడం కాదు. కూటమి నేతలకు కావాల్సింది రాజకీయం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చర్చకు రండి. చెప్పులు, బూట్లు వేసుకుని మేం దేవుడి ఫోటోలను పట్టుకుని ఉన్నట్లు నిరూపించండి. కెమెరాలు ఉన్నాయిగా మీకు వీలైతే ఆధారాలు చూపించండి. టీడీపీ నేతల వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సభలో మేం ప్రదర్శించిన పేపర్లను నేనే స్వయంగా కలెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టా. చంద్రబాబు లాగా మేం వేంకటేశ్వరస్వామి ఫోటోలను బూట్లు వేసుకుని పట్టుకోలేదు. వాళ్లలాగా మాది నీచబుద్ధి కాదు.

    ..మాకు దేవుడంటే ఎంతో విశ్వాసం.. దేవుడి పవిత్రత పట్ల మాకు గౌరవం ఉంది. టీడీపీ నేతలు డైవర్షన్ కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు టీడీపీ నేతల దుర్భుద్ధిని గమనించాలి. ఇందాపూర్‌తో హెరిటేజ్‌కు ఉన్న సంబంధాలపై చర్చకు కోరాం. మేం రెండు ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడాం. ఆ సంస్థల బదులు ఇంత మంది టీడీపీ మంత్రులు మాట్లాడాల్సిన అవసరమేంటి? టీడీపీ మంత్రులంతా ఆ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారా?. మంత్రులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా హెరిటేజ్ కంపెనీని నడుపుతున్నారు. పదేపదే మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుగా లేదా?. మాకు సభ పట్ల గౌరవం ఉంది. మేం సభలో రాజకీయం చేయలేదు

    ..లడ్డూలో జంతువుల కొవ్వు కలిపామని మేం చెప్పలేదు కదా. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్ ద్వారా దేవదేవుడి కానుకలను కాజేయాలనేది వారి ఆలోచన. మేం ఎందుకు క్షమాపణ చెప్పాలి. దేవుడి పవిత్రతను మేం ఏనాడూ దెబ్బతీయలేదు. బూట్లు వేసుకుని దేవుడు ఫోటోలు పట్టుకుని పవిత్రత దెబ్బతీసింది వాళ్లు. ఇందాపూర్‌పై సభలో కచ్చితంగా చర్చించాల్సిందే

    ఏం సమాధానం చెబుతారు?: తోట త్రిమూర్తులు
    దేవుడిని అవమానించారని ఊగిపోయిన జనసేన, బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోను పట్టుకున్నది మీకు కనిపించడం లేదా?. మేం దేవుడి ఫోటోలను సభలో చెప్పులతో పట్టుకున్నట్లు నిరూపించండి. దేవుడి ఫోటోలను చించి, విసిరేశారని మాట్లాడుతున్నారు. మేం ఫోటోలను చించినట్లు రుజువు చేయండి. దేవుడిని రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. దేనికి సభలో మంత్రులు  ఊగిపోతున్నారు

    చర్చకు రమ్మంటే పారిపోతున్నారు: బొమ్మి ఇజ్రాయిల్
    డిప్యూటీ సీఎం దుర్గగుడి మెట్లు కడిగారు. కులమతాల మధ్య చిచ్చు రేపేలా మాట్లాడారు. ఈ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. నాలుగు రోజుల నుంచి చర్చకు రమ్మంటే పారిపోతున్నారు. ఇప్పకైనా సభలో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం

    సీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్: తూమాటి మాధవరావు
    సీబీఐ రిపోర్టుపై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్నటి వరకూ తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఇప్పుడు అన్ని ఆలయాల్లోని ప్రసాదాలపై నిందలు వేస్తున్నారు. కులదైవం అని నీతులు చెప్పే చంద్రబాబు బూట్లు వేసుకుని ధరించి వెంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకున్నారు. మేం దేవుడి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకున్నామని మాట్లాడటానికి మంత్రులకు సిగ్గుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తిరుపతి మెట్లు కడిగి క్షమాపణ చెప్పాలి. మేం సభలో చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకున్నట్లు నిరూపించండి. నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే కూటమి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా?. అన్నీ భగవంతుడు చూస్తున్నాడు.. కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు

    Botsa : రండి చర్చకు అంటే తోక ముడిచి పారిపోయారు

    దమ్ముంటే చర్చకు రావాలి: లేళ్ల అప్పిరెడ్డి
    తిరుపతి లడ్డూ ఎలా తయారు చేశారో చంద్రబాబుని ఎవరు అడిగారు. టీడీపీ కార్యకర్తల మీటింగ్‌లో తిరుపతి లడ్డూ గురించి చంద్రబాబు మాట్లాడాడు. దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా? లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారన్నావ్. లడ్డూలో బాత్ రూమ్ కెమికల్స్ కలిపారన్నావ్. మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి అని మాట్లాడావ్. చంద్రబాబు నీ వయసుకి ఇది తగునా? వైఎస్సార్‌సీపీపై బురద జల్లడానికి దేవుడిని అడ్డంపెట్టుకోవడానికి సిగ్గులేదా?. సోము వీర్రాజు క్షమాపణ చెప్పమని మమ్నల్ని అడగడం కాదు. చంద్రబాబు, పవన్‌ను సోము వీర్రాజు క్షమాపణ కోరాలి. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై సభలో చర్చిస్తేనే కోట్లాది మంది భక్తులకు వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సభను తప్పుదోవ పట్టించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దమ్ముంటే చర్చకు రావాలి

    ఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి: మొండితోక అరుణ్ కుమార్
    నాలుగు రోజుల నుంచి సభలో ఇందాపూర్‌పై చర్చించాలని కోరుతున్నాం. నాలుగు రోజుల నుంచి వాయిదా తీర్మానాన్ని అంగీకరించడం లేదు. మంత్రి లోకేష్ మూడు రోజుల నుంచి సభలో లేడు. ఈ రోజు సభలో హెరిటేజ్ అనే మాట వినగానే లోకేష్ ఊగిపోయాడు. వైఎస్సార్‌సీపీ హిందువుల వ్యతిరేకి అని లోకేష్ మాట్లాడుతున్నారు. ఏ కల్తీ లేకపోయినా పవన్ దుర్గగుడి మెట్లు కడిగాడు. ఇప్పుడు ఏమైపోయాడయ్యా పవన్ కళ్యాణ్. 42 ఆలయాలు కూల్చిన చంద్రబాబు.. సోము వీర్రాజుకి ఇప్పుడు హిందూ రక్షకుడిగా కనిపిస్తున్నాడా?. ఇదే సెక్రటేరియట్‌కు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో పూజ చేసింది చంద్రబాబు. ఇదేనా చంద్రబాబుకి ఉన్న దైవభక్తి. వెంకటేశ్వరస్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా తలనీలాలు అర్పించారా?

    కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు? వరుదు కళ్యాణి
    ఈరోజు సభలో మంత్రులు సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగింది ఎవరు?. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి ఫ్లెక్సీలు వేసింది ఎవరు?. చంద్రబాబు, కూటమి నేతలు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీబీఐ రిపోర్టు వచ్చాక బాత్ రూమ్ కెమికల్స్ కలిపారని మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్, బోలేబాబాకు హెరిటేజ్‌తో సంబంధం ఉందని మేం చెప్పడం లేదు.

    వాళ్ల వెబ్‌సైట్ లోనే చెప్పారు. దేవుడి సొమ్ముని తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారు కాబట్టే భయపడుతున్నారు. వైఎస్‌ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి హోంమంత్రి అనితకు ఉందా?. ఇసుక, పశువుల రవాణా వాహనాల వద్ద పీఏలను పెట్టుకుని వసూళ్లు చేసుకునే స్థాయి మీది. ప్రజల్లోకి రావాలంటేనే జగన్ భయపడుతున్నారంటున్నారు. మీకు తెలియకపోతే మీ పోలీసులను అడగండి. వైఎస్‌ జగన్ రోడ్డు మీదకు వస్తే జన సముద్రం ఎలా ఉంటుందో?

    అధికార మదం, దురహంకారం అని సెర్చ్ చేస్తే అనిత పేరు వస్తుంది. వెన్నుపోటు అని సెర్చ్ చేస్తే టిడిపి, చంద్రబాబు పేరు వస్తుంది. వెన్నుపోటు అని గూగుల్ సెర్చ్ చేస్తే ఎవరిపేరు వస్తుందో హోంమంత్రి తెలుసుకోవాలి. ఇందాపూర్‌పై చర్చకు అంగీకరిస్తే మొత్తం అన్నీ తేలుతాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. నెయ్యి టెండర్ల ద్వారా హెరిటేజ్‌కు లబ్ధి చేకూర్చుకున్నారు కాబట్టే డైవర్షన్ కు తెరతీశారు. మేం చెప్పులు విడిచి కౌన్సిల్‌లో దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి. ఇందాపూర్ పై చర్చకు అంగీకరించాలి

    క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి
    లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆధారాలు లేని అవాస్తవాలు ప్రచారం చేశారు. తప్పు చేయనపుడు ఎందుకు చర్చకు భయపడుతున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన మీరు ముందు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా టీడీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలి. మేం చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను పట్టుకోలేదు. మీకు వీలైతే ఆధారాలతో నిరూరించాలి. ఇందాపూర్‌పై కచ్చితంగా చర్చ జరగాల్సిందే. చర్చ జరిగే వరకూ మేం పోరాడుతూనే ఉంటాం

    చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
    తిరుపతి లడ్డూ పై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. చంద్రబాబు చేసిన పాపాన్ని క్షమించి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరాం. మేం చెప్పులు విడిచి దేవుడి ఫోటోలను పట్టుకున్నాం. టీడీపీ నేతలు చాలా నీతులు చెబుతున్నారు. సభలో బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గతంలో ఏం చేశారో మర్చిపోయినట్లున్నారు. సభకు తాళబొట్లతో వచ్చిన విషయాన్ని లోకేష్‌కు గుర్తులేదా?. దేవుడి ఫోటోని బూట్లు వేసుకుని పట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. మేం వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకోలేదు. మేం దేవుడి ఫోటోలను చించి విసిరేయలేదు. క్షమాపణ చెప్పాల్సింది మేం కాదు.. మీరు.

West Godavari

  • ఉండిలో రగులుతున్న దేశం

    సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

    ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్లు

    ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్‌టాఫిక్‌గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్‌ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

    ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్‌ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్‌చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్‌కు పోస్టింగ్‌లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం.

    డిప్యూటీ స్పీకర్‌పై ధిక్కార స్వరం

    టీడీపీ కేడర్‌ తిరుగుబాటు

    రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి

    తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం

    అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు

    నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు

  • పసలదీవిలో పోస్టల్‌ కుంభకోణం

    పోస్ట్‌ మాస్టర్‌ చేతివాటం

    పొదుపు సొమ్ములు పక్కదారి

    నరసాపురం రూరల్‌: పసలదీవి పోస్టాఫీస్‌లో ఖాతాదారుల పొదుపు సొమ్ము పక్కదారి పట్టడంతో కలకలం రేగింది. సుమారు 20 ఏళ్లుగా బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న రాయప్రోలు ప్రసాద్‌ వందలాది మంది ఖాతాదారులను నమ్మించి వారి నగదును సొంతానికి వాడుకు న్నట్టు తెలిసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అవకతవకలు జరిగినట్టు సమాచారం. విచారణ పూర్తయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోస్టాఫీస్‌ పరిధిలో పసలదీవి, చామకూరిపాలెం, కొండవీటి కొడప గ్రామాలకు చెందిన సుమారు 2,500 మంది ఖాతాదారులు ఉన్నారు. వీరంతా వివిధ పథకాలు, ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో దాచుకున్న సొమ్మును ప్రసాద్‌ కాజేసినట్టు తెలిసింది. ఖాతాదారులు పోస్టాఫీస్‌కు వచ్చినపుడు నగదు తీసుకుని పాస్‌బుక్‌లు తన వద్దే ఉంచుకునేవాడని, ఈ నగదును డిజిటల్‌ రికార్డుల్లో నమోదు చేయకుండా సొంతానికి వాడుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మరికొందరి ఖాతాల్లో వేయమని ఇచ్చిన డబ్బును సైతం రికార్డుల్లో రాయకుండా మాయం చేసినట్టు విచారణలో తేలింది. పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారి ఏఎస్‌పీ నరసింహారావు నేతృత్వంలో సిబ్బంది మూడు రోజులుగా పోస్టాఫీసులో వి చారణ చేస్తుండగా బాధితులు క్యూ కడుతున్నా రు. తనిఖీ సిబ్బంది ఖాతాల ఆడిట్‌, లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణ అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

    తాను గురువారం పో స్టాఫీస్‌కు వచ్చి ఆరా తీయగా తన ఖాతాల్లో రూ.1,000 మాత్రమే ఉన్నాయనడంతో ఏం చేయాలో తెలియలేదు. మా కుమార్తెల వివాహ సమయానికి వచ్చేలా రూ.లక్ష, రూ.40 వేలు డిపాజిట్‌ చేయమని పోస్ట్‌మాస్టర్‌ ప్రసాద్‌కు ఇచ్చాను. నన్ను నమ్మించి నిండా మోసం చేశాడు.

    – గన్నాబత్తుల సత్యచంద్రకళ, బాధితురాలు

  • బాబు మోసాన్ని ప్రజలు పసిగట్టారు

    పెనుగొండ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు, మోసాలను, దుష్ప్రచారాలను ప్రజ లు పసిగట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ అ డ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అప్పు లు, పథకాలపై దుష్ప్రచారం చేశారన్నారు. తాజా గా తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని సైతం దుష్ప్రచారానికి వాడుకుని చివరకు బోర్లా పడ్డారన్నారు. తిరిగి చంద్రబాబు కుటుంబం పైకే లడ్డూ వ్యవహరం వెళ్లిందన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు దాడులు, కక్ష సాధింపులకు పాల్పడుతు న్నారని విమర్శించారు. పార్టీ పటిష్టత కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. గ్రామస్థాయి వరకూ కమిటీలు విస్తరించాలని, ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యకర్తలకు పూర్తిస్థాయి గుర్తింపు ఉంటుందని, రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్ర మౌళీశ్వర రెడ్డి, మండల కన్వీనర్‌ నల్లిమిల్లి వెణుప్రతాపరెడ్డి (బాబీ), ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌ పలివెల శ్రీను, పంచాయతీ సభ్యులు ఆదిరెడ్డి సన్యాసిరావు, వెలగల శ్రీనివాస రెడ్డి, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు ఆసు నగరి, నాయకులు పాల్గొన్నారు.

    మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

  • అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

    కామవరపుకోట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన గురువారం మంకెనపల్లి శివారులో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై పి.చెన్నా రావు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట యానాదుల కాలనీకి చెందిన చేవూరి జ్యోతి (35), భర్త నాగయ్యతో కలిసి మంకెనపల్లి సమీపంలో ఆయిల్‌పామ్‌ తోటలో కాపలాగా ఉంటున్నారు. బుధవారం భార్యాభర్తలిద్దరూ తోటలో నుంచి కామవరపుకోట ఇంటికి వెళ్లారు. తిరిగి తోటకు వస్తుండగా ఇద్దరూ మద్యం సేవించి ఉండగా వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో నాగయ్య భార్యను స్థానిక పశువుల ఆస్పత్రి వద్ద వదిలేసి తోటలోకి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం లేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో వెతికాడు. అన్నదేవర చెరువు సమీపంలో మంకెనపల్లి బస్సు స్టేజీ వెనుక జ్యోతి మృతి చెందినట్టు తెలిసింది. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమైపె గుర్తుతెలియని వ్యక్తులు లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.

Eluru

  • ఉండిలో రగులుతున్న దేశం

    సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

    ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్లు

    ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్‌హాట్‌గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్‌టాఫిక్‌గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్‌ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

    ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్‌ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్‌చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్‌కు పోస్టింగ్‌లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం.

    డిప్యూటీ స్పీకర్‌పై ధిక్కార స్వరం

    టీడీపీ కేడర్‌ తిరుగుబాటు

    రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి

    తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం

    అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు

    నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు

  • శ్రీవారి దర్శనం టికెట్ల గోల్‌మాల్‌

    రీప్రింట్‌ చేసి సొమ్ములు స్వాహా

    ‘సాక్షి’ కథనంతో బట్టబయలు

    ఆలయ చైర్మన్‌ తక్షణ చర్యలు

    ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనం టికెట్ల రీప్రింట్‌ వ్యవహారం సంచలనం రేపింది. అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లను కొందరు పెద్ద మొత్తంలో రీప్రింట్‌ చేసి, రూ.లక్షల సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ల దందాపై ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంపై దేవస్థానం చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్‌ నివృతరావు చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పలువురు అధికారుల విధులను ఆలయ ఈఓ వై.భద్రాజీ మార్పు చే శారు. సూపరింటెండెంట్‌ ఐవీ రామారావును ఆలయంలో సమస్యలు, ఫీడ్‌బ్యాక్‌ కౌంటర్‌, రూ.100, రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్లు, మరికొన్ని విభాగాలపై పర్యవేక్షణాధికారిగా నియమించారు. అయితే రూ.500 టికెట్ల రీప్రింట్‌ వ్యవహారంపై విచారణ జరిపితే పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని భక్తులు అంటున్నారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

    అంతరాలయ దర్శనం టికెట్ల ద్వారా..

    గత నవంబర్‌ 27న శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం పునః ప్రారంభించింది. ఈ మేరకు రూ.500 టికెట్లను విక్రయిస్తోంది. కొందరు సిబ్బంది ఆన్‌లైన్‌లో టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి, వా టిని రీప్రింట్లు చేసి, టికెట్లు స్కానింగ్‌ చేసే సిబ్బందిని మేనేజ్‌ చేయడం ద్వారా భక్తులకు దర్శనాలకు పంపి కాసులు దండుకున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందిస్తారు. ఇటీవల శని, ఆదివారం రోజుల్లో ఈ టికెట్లకు సంబంధించి 250 లడ్డూ ప్రసాదాలు తగ్గాయి. అంటే ఆయా రోజుల్లో 125 టికెట్లు రీప్రింట్‌ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ ఒక్క ఉదంతంలోనే రూ.62,500 స్వాహా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనివ్వకుండా మళ్లీ లడ్డూ ప్రసాదాలను తీసుకొచ్చి, అందులో కలిపి మేనేజ్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొందరు సిబ్బంది లడ్డూ ప్రసాదాలను సొంతంగా కొని తీసుకొచ్చి మరీ, రీప్రింట్‌ టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇస్తున్నట్టు సమాచారం. పలువురు సిబ్బంది సాఫ్ట్‌వేర్‌ ఆగిందని చెప్పి, తమ ఫోన్‌పేలకు నగదును బదిలీ చేయించుకుని, ఈ రీప్రింట్‌ టికెట్లు ఇవ్వడం ద్వారా దందాకు పాల్పడినట్టు తెలిసింది.

    మా నోటీసుకు రాగానే సీట్లు మార్చాం..

    ఆలయ ఈఓ వై.భద్రాజీ వివరణ ఇస్తూ టికెట్లు రీప్రింట్‌ జరగడం కాదు గానీ, విషయం మా నోటీసుకు రాగానే ట్రస్టుబోర్డులో చర్చించి, టెంపుల్‌ స్టాఫ్‌ సీట్లు మార్చామని చెప్పారు.

  • కూటమిది కక్ష సాధింపుల పాలన

    ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను పక్కనపెట్టి, వైఎస్సార్‌ సీపీ నాయకులపై కక్ష సాధింపు పాలన సాగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల కారణంగా జైలుకెళ్లిన ఆయన బెయిల్‌పై విడుదలై గురువారం ఉదయం రాజమండ్రి నుంచి భారీ కార్ల ర్యాలీతో గుంటూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో భీమడో లు మండలం పోలసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో భీమవరం, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరు పార్టీ ఇన్‌చార్జులు చినమిల్లి వెంకటరాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తలారి వెంకట్రావు, ద్వారకాతిరుమల మండల పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు తనపై చూ పుతున్న ఆధరాభిమానాలను మరువలేనన్నారు. అనంతరం వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం సాధారణంగా మారిందన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో ఇదో భాగమైందని, కేసులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరని అన్నా రు. నాయకులు దాకారపు బంగారమ్మ, తాండ్ర రమేష్‌బాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్‌, బొండాడ వెంకన్నబాబు, దాసరి రాంబాబు, ప్రత్తిపాటి యో హాను, గుమ్మడి శ్రీను, ఉక్కుర్తి వెంకట్రావు, చి లుకూరి చంద్రం తదితరులు ఉన్నారు.

    మాజీ మంత్రి అంబటి రాంబాబు

Andhra Pradesh

  • పోలవరం:  రంపచోడవరం మండలం రంప శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చారిత్రక ప్రాధాన్యత కల్గిన ఆలయ ప్రాంగణంలో రికార్డింగ్‌  డ్యాన్స్‌లు నిర్వహించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, ఆమె భర్త మఠం భాస్కర్‌ సహకారంతో ఈ కార్యాక్రమం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

    రికార్డింగ్‌ డ్యాన్స్‌ ఏర్పాట్లను ఎమ్మెల్యే భర్త పర్యవేక్షించారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, యువత ఆనందం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాట చేసినట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతారణాన్ని కాపాడటాన్ని పక్కకు పెట్టేసి ఇలా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర ప్రాంగణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

  • సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ఏబీవీపీ ప్రయత్నించగా.. ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఏబీవీపీ నిరసనకు దిగింది. ఇంతవరకు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ వారిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నిచింది. ఏయూలో ఏబీవీపీ శాఖ కొనసాగుతుంది. ఏబీవీపీని ఎవరు అడ్డుకోలేరని ఏబీవీపీ విద్యార్థి సంఘాలు నేతలు అన్నారు.

     ఎస్ఎఫ్ఐ  నేతలు.. వీసీకి ఫిర్యాదు చేశారు. ఏయూలో బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందని.. ఏబీవీపీ విద్యార్థుల పేరుతో బయట వ్యక్తులు ఏయూలోకి ప్రవేశిస్తున్నారన్నారు. వారిని కట్టడి చేయాలంటూ వీసీకి ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫిర్యాదు చేశారు. ఏయూలో భారీగా పోలీసులు మోహరించారు.