Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ళుమరి సమీపంలోని త్రిమూర్తి ఆగ్రో ఫార్మ్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనలో క్యాంపురం గ్రామానికి చెందిన ఆది (30), మహేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు టిల్లు (24) తీవ్ర గాయాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు.

    ఈ ప్రమాదంతో మడకశిర ప్రాంతంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ, గాయపడిన యువకుడి ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్ పేజీని భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

    ‘‘ఇది కేవలం వైఎస్సార్‌సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.

    అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.

    ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

     

  • కాకినాడ:  చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.  ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్‌ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం, జూన్‌ 14వ తేదీ) పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. 

    కుక్కకు పోస్టుమార్టం నిర్ర్వహించిన అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. దాంతో ల్యాబ్‌ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా..? విష ప్రయోగమా? అనేది ల్యాబ్‌ రిపోర్ట్‌ అనంతరం తేలనుంది. 

    కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో  క్లూ అనుకున్న కుక్క మృతిచెందడంతో ఇప్పుడు టాపిక్‌ అంతా కుక్కపైకి డైవర్ట్‌ అయ్యింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది. 

    అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు

  • సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరు వద్ద కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం విషాదకరమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    ఓ కుటుంబ వేడుకకు హాజరైన బంధువులు పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు గల్లంతవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

    గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. సహాయక బృందాలు, అధికారులు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.

  • సాక్షి, అమరావతి: రాగల మూడు గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

    నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది.

    కర్నూలు రూరల్‌లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్‌లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్‌ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది.  

     

     

  • సాక్షి,పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కుంకలగుంట నుంచి కోనూరులోని ఒక ఫంక్షన్‌కు వచ్చిన 10 మంది నది దాటేందుకు పడవ ఎక్కారు. మధ్యలో పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి మృత దేహం కోసం ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

    పడవ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 



    ఇసుక కోసం తవ్విన గుంతలు పడవకు అడ్డంకిగా మారి ప్రమాదానికి కారణమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసం తవ్వకాలు జరగకపోయి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఇలాంటి తవ్వకాలను అధికారులు  నియంత్రించకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
     

  • సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వానికి డీఎస్సీ బాధితుల సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇవాళ(ఆదివారం, జూన్‌ 14) వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ బాధితులు.. టీడీపీ నేతలు ఫేక్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను బాధితులు వివరించారు. అధికారులు చెప్పేవన్ని అబద్ధాలేనని మండిపడ్డారు.

    ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో అవకతకవలు జరిగాయని.. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీస్తుందన్నారు. యువత భవిష్యత్‌తో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆయన మండిపడ్డారు. బెదిరింపులను అడ్డుకోవడానికి అండగా ఉంటామని.. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సజ్జల డిమాండ్‌ చేశారు.

    ‘‘డీఎస్సీలో కుట్ర పూరితంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని సీబీఐ విచారణ జరిపించాలి. డీఎస్సీ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇవ్వాలి. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంలో న్యాయ సహాయం అందిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

     

  • సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. అక్రమాలపై ప్రతిపక్షంగా తాము నిరంతరం పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం, మంత్రులు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులను ముందుకు నెడుతున్నారని విమర్శించారు. అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

    వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ తాడేపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏపీలో డీఎస్సీ పరీక్ష రాసిన 3.50 లక్షల మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం, మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అధికారులను ఎందుకు ముందు పెడుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై మంత్రులు కాకుండా అధికారులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్‌సీఈఆర్టీ (SCERT)లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు రావడం, అలాగే టీజీటీ తెలుగులో ఆరో ర్యాంకు సాధించడం అనేక అనుమానాలకు కారణమైంది.

    ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో నవీన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నవీన్ ద్వారానే అనేక మందికి ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఈ అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ఈవిషయం కోర్టులో ఉంది, చెప్పలేం అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాటవేత ధోరణి ఉంది. ఆయన ఎప్పుడూ స్పోర్ట్స్ డీఎస్సీ గురించి మాట్లాడ్డానికి ఇష్టపడడం లేదు. ఫలితాలు మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలోనే అనేక అవకతవకలు జరిగాయి. రిజర్వేషన్ల ఉల్లంఘన వల్ల వేలాది మంది అర్హులైన అభ్యర్థులు నష్టపోయారు. సీబీఎస్ఈ, నవోదయ ఇంగ్లిషు మీడియం విద్యార్థులను డీఎస్సీకి దూరం పెట్టడం అన్యాయం.

    టెట్ రాసినా కూడా వేలాది మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే నార్మలైజేషన్ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు. జిల్లా స్థాయి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నార్మలైజేషన్ ప్రక్రియను ఎందుకు తెచ్చింది?. నార్మలైజేషన్ పేరుతో నచ్చిన సెషన్స్‌లో 7, 8 మార్కులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై నిరుద్యోగుల పొట్టకొట్టారు. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ నిరుద్యోగులపై రకరకాల ముద్రలు వేస్తూ అవమానిస్తోంది. కష్టపడి చదువుకున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మానసిక వ్యధకు గురిచేస్తున్నారు.

  • సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల కేటాయింపుపై మరోసారి వివాదం చెలరేగింది. తుళ్లూరు మండలంలోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన భూములను దేవాలయానికి తిరిగి కేటాయించాల్సి ఉండగా, వాటిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారు.

    వివరాల ప్రకారం.. తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 161లో సుమారు 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమరావతి భూసమీకరణ (Land Pooling)లో భాగంగా తీసుకున్న అధికారులు, అనంతరం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను దేవాలయానికి కాకుండా ఇతరులకు కేటాయించారు. దేవాలయ భూములకు సంబంధించి ఫామ్-8 రికార్డుల్లో "నో ట్రాన్స్‌ఫర్" అనే స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయి. ఈ భూములకు బదులుగా రావాల్సిన 21 రిటర్నబుల్ ప్లాట్లు దేవాలయానికి అందకుండా, టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లపై నమోదు చేశారు.

    ప్రస్తుతం ఈ ప్లాట్ల విలువ రూ.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పల్నాటి వీరుల దేవాలయ నిర్వహణ, నిత్యకైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం దాదాపు ఆరు దశాబ్దాల క్రితం దాతలు ఈ భూములను దానం చేసినట్లు సమాచారం. అలాంటి భూములకు సంబంధించిన హక్కులను విస్మరించి కేటాయింపులు చేయడం దేవాదాయ ఆస్తుల రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల వెలగపూడి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు పల్నాటి వీరుల దేవాలయ భూముల అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. 
     

Telangana

  • ఖరీఫ్ సన్నద్ధతపై ఈ రోజు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.

    వరి పంటలపై అధికంగా ఆధారపడకుండా రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విత్తనాల కొరత తలెత్తకుండా ఈ ఖరీఫ్ సీజన్‌కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని, ముఖ్యంగా కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు మంత్రి వివరించారు.

    రాష్ట్రంలోని రైతులకు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేయడం, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా వ్యవసాయశాఖ పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రబీ సీజన్‌లో రైతుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో పలు మెరుగుదలలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు.

    వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున వ్యవసాయశాఖ ముందస్తుగా పంటల ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. వర్షపాతంలో అనిశ్చిత పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతులకు సాంకేతిక సూచనలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయశాఖ సూచనలను పాటించాలని కోరారు.

    రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు వ్యవసాయ శాఖ “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం”ను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర వాతావరణ వివరాలు రైతులకు నేరుగా వాట్సాప్ సందేశాల ద్వారా చేరుతున్నాయని చెప్పారు. రైతులు విత్తనాలు వేయడం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ వంటి అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

    తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలు పంపించినట్లు చెప్పారు. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • హైదరాబాద్ , జూన్ 14 : హైదరాబాద్‌లోని బాగలింగంపల్లి లొ గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI) విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్ లో వాటా,రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా “హిస్సా – ఇజ్జత్ – హుకూమత్” నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

    గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక , సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, రాజ్యాధికారం లేకుండా ఏ సమాజమైనా తన అస్తిత్వాన్ని, అభివృద్ధిని కాపాడుకోలేదని అన్నారు.

    ఈ సమావేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి తదితరులు పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

    ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు, ఎర్రమాడ వెంకన్న, లింగేష్ యాదవ్‌లకు నియామక పత్రాలు ప్రదానం చేశారు. అదేవిధంగా  prof బెనర్జీ ని రాష్ట్ర వైస్ చైర్మన్ గా ,prof విజయ్ బాబు ను పొలిటికల్ అడ్వైజర్ గా నియామక పత్రాలు అందజేశారు.

    సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు మరియు రాబోయే కాలంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

    – విడుదలకర్త
    బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCI)
    తెలంగాణ రాష్ట్ర కమిటీ

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

    ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి(ఆది,సోమ, మంగళ) పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.

    ఏపీలో ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..
    ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: మీనాక్షి నటరాజన్‌కు రేవంత్‌ వెన్నుపోటు పొడిచారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌పై రేవంత్‌ దొంగ కేసులుపెట్టించారని.. ఇక్కడి కేసు విషయాలు రేవంత్‌.. బీజేపీ నేతలకు చెప్పారంటూ ఆరోపించారు.

    ‘‘రేవంత్‌ పాలనకు సగం సమయం ముగిసింది. రేవంత్‌ సినిమాకు ఇంటర్వెల్‌ అయిపోయింది. ఇక శుభం కార్డే. మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. త్వరలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పదవి పోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘శనివారం, ఆదివారం వస్తే హైడ్రా పేరుతో వందలాది ఇళ్లు కూలగొడుతున్నారు. మొదటి ఏడాదిలో రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చి చాయ్ తాగుతూ ఫోజులు కొట్టి నిరుద్యోగుల ముందు చెప్పారు. రేవంత్ సర్కార్‌.. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. రేవంత్‌రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్‌కి చెప్పింది.’’ అంటూ కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

  • మహబూబాబాద్‌ రూరల్‌ : టిప్పర్‌ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్‌ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్‌, నవీన్‌ (22) గణేష్‌ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్‌ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు.

    ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్‌ వైపు నుంచి కోర్టు సెంటర్‌ వైపు బైక్‌ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్‌ వద్దకు నవీన్‌ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్‌ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నవీన్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం గదికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.

Politics

  • హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు. బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్‌ పెట్టిన గురుకులాలే కారణమన్నారు. కాంగ్రెస్‌ పోవాలని, కేసీఆర్‌ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. 

    హనుమకొండలో  హరీష్ రావు పర్యటించారు. బీఆర్‌ఎస్‌ యువనేత రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలలో హరీష్‌రావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు చేయూత, స్కూల్‌ బాగ్స్‌ పంపిణీ కార్యక్రమం ఉంటుంది,. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 

  • ముంబై: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ‘ఆపరేషన్ టైగర్’పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తమ పార్టీ చెక్కుచెదరకుండా, ఐక్యంగా, బలంగా ఉందని స్పష్టం చేశారు.

    ఇటీవల ‘ఆపరేషన్ టైగర్’పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను తమవైపు లాగేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారాన్ని ప్రతిపక్షం "ఆపరేషన్ టైగర్"గా పేర్కొంటోంది. శివసేన పార్టీ ప్రచార చిహ్నం పులి (టైగర్‌) కావడంతో ఈ పేరును వాడుతున్నారు.

    ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం.. శివసేన (యూబీటీ)కి చెందిన కొందరు ఎంపీలు షిండే క్యాంప్‌లోని నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. శివసేన (యూబీటీ) నాయకులను షిండే వర్గంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలకు పెట్టిన రాజకీయ పేరే "ఆపరేషన్ టైగర్".

    9 మంది ఎంపీల్లో ఏడుగురు.. 
    కొన్ని కథనాల ప్రకారం.. యూబీటీ శివసేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఏడుగురు షిండే శివసేనతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారంతా ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తమ ఎంపీలతో సమావేశం నిర్వహించిన తర్వాత సంజయ్‌ రౌత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఐక్యతను చాటేందుకు “ఆపరేషన్ వుల్ఫ్” ప్రారంభిస్తామని చెప్పారు.

    “మీరు ఏ ఆపరేషన్ టైగర్ గురించి అడుగుతున్నారు? మేమంతా పులులమే. మేము ఆపరేషన్ వుల్ఫ్ ప్రారంభించబోతున్నాం. మేము భయపడబోము. మా ఎంపీలంతా, పార్లమెంటరీ పార్టీ పూర్తిగా ఐక్యంగా, బలంగా ఉన్నాయి. అలాగే కొనసాగుతాయి” అని అన్నారు.

    అంతకుముందు రోజున శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆదివారం ముంబైలో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో శివసేన (యూబీటీ)కి చెందిన 9 మంది పార్లమెంట్ సభ్యులంతా పాల్గొన్నారని చెప్పారు. పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరతారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.

    సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రౌత్.. నలుగురు ఎంపీలు ప్రత్యక్షంగా హాజరయ్యారని, మరో ఐదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశం పార్టీ సాధారణ సంస్థాగత కార్యక్రమంలో భాగమని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

    ఇదిలా ఉండగా, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ దినా పాటిల్, మాతోశ్రీలో జరిగిన శివసేన యూబీటీ ఎంపీల సమావేశానికి హాజరుకాలేదన్న ప్రచారాన్ని ఖండించారు.

    మరోవైపు, శివసేన జాతీయ ప్రతినిధి షైనా ఎన్‌సీ, సంజయ్ రౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “మునిగిపోతున్న ఓడ”లాంటి రాజకీయ పార్టీలో చేరితే రాజకీయంగా దిగజారడమే జరుగుతుందని అన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

    ‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్‌సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్‌సీపీ మాత్రమే. వైఎస్సార్‌సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్‌ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

    ‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్‌కు దక్కింది.  స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్‌ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్‌ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్‌ది
    మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్‌లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్‌లపై వైఎస్‌ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్‌లపై ఆర్య వైశ్యులకే వైఎస్‌ జగన్ హక్కులు కల్పించారు.

    ..గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్‌ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు.

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ రెబల్‌ ఎంపీలు స్పీకర్ వద్ద “నిజమైన టీఎంసీ” హోదా కోరేందుకు వేసుకున్న ప్రణాళికపై ఓ రాజ్యాంగ నిపుణుడు పలు ప్రశ్నలు లేవనెత్తారు. పార్టీ నుంచి విడిపోయిన వర్గానికి అలాంటి హోదా ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానిదేనని ఆయన చెప్పారు.

    రెబల్‌ ఎంపీల బృందం తమకు 19 మంది లోక్‌సభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించింది. “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరుతూ సోమవారం స్పీకర్ ఓం బిర్లాను కలుస్తామని తెలిపింది.

    మాజీ లోక్‌సభ ప్రధాన కార్యదర్శి, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీఎంసీలో నెలకొన్న పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్‌కు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.

    “నిజమైన టీఎంసీ ఏదో నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదే. సుభాష్ దేశాయ్ కేసులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ స్పష్టంగా చెప్పారు. పార్టీకి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలు తమదే అసలు పార్టీ అని చెప్పిన సందర్భంలో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన వ్యవహారం పరిష్కరించే సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు” అని అభిప్రాయపడ్డారు.

    రెబల్‌ వర్గం తమ వద్ద అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని, పార్టీ సంస్థాగత విభాగంపై తమ నియంత్రణ ఉందని పేర్కొంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం రెండు వర్గాల వాదనలు విని కేసును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయం న్యాయపరమైన పరిశీలనను తట్టుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

    ప్రత్యేక వర్గంగా పరిగణించలేం 
    పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం వారిని ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని ఆచార్య చెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఇప్పటికే లోక్‌సభలో స్థానాలు కేటాయించారని అన్నారు. ప్రస్తుతం తిరుగుబాటు వర్గానికి గుర్తింపు పొందిన ప్రత్యేక వర్గ హోదా లేకపోవడంతో వారు వేరుగా కూర్చునే ఏర్పాట్లు చేయలేమని ఆయన చెప్పారు.

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేయడంతో టీఎంసీ సంక్షోభంలో పడింది. లోక్‌సభలో పార్టీకి 28 మంది సభ్యులు, రాజ్యసభలో 13 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ముగ్గురు రాజీనామా చేశారు.

    టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ సహచరుల్లో ఒకరైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ కూడా శనివారం రెబల్‌ వర్గంలో చేరారు. “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరే ప్రయత్నాలకు ఆ వర్గం సిద్ధమవుతోంది.

    పార్లమెంట్‌లో బెనర్జీకి విశ్వసనీయ సహచరుడిగా దీర్ఘకాలంగా గుర్తింపు పొందిన సీనియర్ పార్లమెంటేరియన్ బంద్యోపాధ్యాయ్.. రెబల్‌ ఎంపీ శతాబ్దీ రాయ్‌తో కలిసి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిశారు. 

    పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సవాలు మరింత పెంచుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు. రెబల్స్‌కు చెందిన వర్గాలు.. లోక్‌సభలో ఆ బృందానికి బంద్యోపాధ్యాయ్ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాయని తెలిపాయి. తిరుగుబాటు ఎంపీలు సోమవారం బిర్లాను కలిసి “నిజమైన టీఎంసీ” పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు కోరనున్నట్లు ప్రకటించారు.

Sports

  • మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ  జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

    ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) మంధనకు సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. 

    మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

    దీప్తి మాయాజాలం
    అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. దీప్తి శర్మ మాయాజాలానికి (4-0-10-5) కుదేలైంది. ఆమె శ్రీ చరణి (4-0-21-3), షఫాలీ వర్మ (3-0-22-1) కూడా తోడవ్వడంతో పాక్‌ 17 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసింది. 

    ఆ జట్టు తరఫున ఓపెనర్‌ మునీబా అలీ (41) మాత్రమే ఓ మోస్తరు స్కోర్‌ సాధించింది. మిగతా ప్లేయర్లలో గుల్‌ ఫెరోజా (12), ఆయేషా జాఫర్‌ (2), ఆలియా రియాజ్‌ (18) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు సాధించగా.. సైరా జబీన్‌ (2), నతాలియా పర్వేజ్‌ (7), రమీన్‌ షమీమ్‌ (4), నష్రా సంధు (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌ డకౌట్లయ్యారు.  ఈ గెలుపుతో భారత్‌ తమ ప్రపంచకప్‌ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లైంది. 
     

  • టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరుగుతున్న స్టేజీ-3 ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇవాళ (జూన్‌ 14) రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. స్టార్ ఆర్చర్ ధీరజ్‌ బొమ్మదేవర అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు గెలిచి భారత్‌కు చారిత్రక విజయాలు అందించాడు. తొలుత మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కుమ్‌కుమ్‌ మొహద్‌తో కలిసి స్వర్ణం సాధించిన ధీరజ్‌, ఆతర్వాత పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలోనూ విజేతగా నిలిచి భారత కీర్తిపతాకాన్ని ఎగురవేశాడు.

    పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ ఫైనల్లో ధీరజ్ 7-3 తేడాతో దక్షిణ కొరియా ఒలింపిక్‌ కాంస్య పతక విజేత లీ వూ సియోక్‌ను ఓడించాడు. అంతకుముందు సెమీఫైనల్లో జర్మనీకి చెందిన మోర్టిగజ్‌ వీసర్‌పై 1-3తో వెనుకబడి కూడా 6-4తో విజయం సాధించి అద్భుత పోరాటపటిమ ప్రదర్శించాడు.

    ధీరజ్‌కు ఇది ఆర్చరీ వరల్డ్‌కప్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం. మొత్తంగా నాలుగో పతకం. గతంలో అతను సాధించిన మూడు పతకాలు కాంస్యాలే. 2021లో అతాను దాస్‌ స్వర్ణం గెలిచిన తర్వాత వరల్డ్‌కప్‌ స్థాయిలో భారత పురుషుల రికర్వ్‌ విభాగానికి లభించిన తొలి వ్యక్తిగత స్వర్ణం ఇదే. భారత తరఫున వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో వరల్డ్‌కప్‌ స్వర్ణం గెలిచిన మూడో ఆటగాడిగానూ ధీరజ్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు జయంత తాలుక్‌దార్‌, అతాను దాస్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.
     

  • ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-పాక్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది.

    ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించగ.. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. 

    పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

    చరిత్ర సృష్టించిన హర్మన్‌ 
    ఈ మ్యాచ్‌లో హర్మన్‌ ఓ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టింది. భార‌త్ త‌ర‌ఫున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు (762) చేసిన బ్యాట‌ర్‌గా అవతరించింది. ‌ఇప్పటివ‌ర‌కు ఈ రికార్డు మిథాలీరాజ్ ( 726) పేరిట ఉండింది. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో హ‌ర్మ‌న్, మిథాలీ త‌ర్వాతి స్థానాల్లో స్మృతి మంధాన (592), జెమీమా రోడ్రిగ్స్ (408), పూనమ్ రౌత్ (375) ఉన్నారు.
     

  • 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ తమ ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇవాళ (జూన్‌ 14) జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి, టోర్నీ చరిత్రలో తమ అత్యధిక లక్ష్య ఛేదనను నమోదు చేసింది. అరంగేట్రం బ్యాటర్‌ ఫిర్దౌస్‌ (50) మెరుపు అర్ద శతకంతో బంగ్లా గెలుపుతో ప్రధానపాత్ర పోషించింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మరుఫా అక్తర్‌ (4-0-31-2), ఫరిహా త్రిస్న (4-0-32-1) చక్కటి బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ బార్బెట్‌ డి లీడ్‌ 45 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. 

    లీడ్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ కారణంగా నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది. ఆఖర్లో ఐరిస్‌ జ్విల్లింగ్‌ (13 నాటౌట్‌), సిల్వర్‌ సీగర్స్‌ (10 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

    140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఫిర్దౌస్, దిల్హర అక్తర్‌ (26) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు. ఫిర్దౌస్‌ కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

    అంతా సజావుగా సాగుతున్న వేల, నెదర్లాండ్స్ బౌలర్లు అనూహ్య పోరాట పటిమ కనబరిచారు. కరోలిన్‌ డి లాంజ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను  ఆసక్తికరంగా మార్చింది. ఫిర్దౌస్‌ అర్ధశతకం అనంతరం ఔట్ కాగా, కెప్టెన్ నిగార్‌ సుల్తానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. 

    అనంతరం సిల్వర్ సీగర్స్ దిల్హరాను ఔట్ చేయగా, ఫ్రెడెరిక్ ఓవర్‌డైక్ అద్భుత డైరెక్ట్ హిట్‌తో శోభన మోస్తరీను రనౌట్‌ చేసింది. దీంతో బంగ్లా స్కోర్‌ 67/0 నుంచి 85/4కు పడిపోయి ఒత్తిడిలో పడింది.

    ఈ దశలో అనుభవజ్ఞురాలు షర్మిన్‌ అక్తర్‌ (37 నాటౌట్‌), యువ బ్యాటర్ షోర​ఆన అక్తర్‌ (18 నాటౌట్‌) జాగ్రత్తగా ఆడి, మరో 5 బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్‌ను (4 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేర్చారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లాంజ్‌ 2, సిల్వర్‌ ఓ వికెట్‌ తీశారు. 

  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భార‌త్ త‌ర‌ఫున టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా హ‌ర్మ‌న్ నిలిచింది. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 స‌గ‌టుతో 726 ప‌రుగులు సాధించింది. 

    తాజాగా హ‌ర్మ‌న్‌ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్లో బౌండ‌రీ కొట్ట‌డం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టి అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇక హ‌ర్మ‌న్, మిథాలీ రాజ్ త‌ర్వాత స్మృతి మంధాన 524 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉండ‌గా, జెమీమా రోడ్రిగ్స్ 407 పరుగులతో నాలుగో స్థానంలో, పూనమ్ రౌత్ 375 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. 

    మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122  పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (36), రిచా ఘోష్ (7) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులు చేసింది.

    చదవండి: బాస్కెట్‌బాల్‌ చ‌రిత్రలో సంచ‌ల‌నం.. 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

  • బాస్కెట్‌బాల్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. న్యూయార్క్ నిక్స్‌ 53 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ చాంపియ‌న్‌షిప్ (ఎన్‌బీఏ) చాంపియ‌న్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్‌బీఏ చ‌రిత్ర‌లో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెల‌వ‌డం ఇది మూడోసారి. 

    శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన ఫైన‌ల్లో న్యూయార్క్ నిక్స్ 94-90 తేడాతో సాన్ ఆంటోనియో జ‌ట్టుపై విజ‌యం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో మొద‌ట సాన్‌ ఆంటోనియో ఆదిపత్యం చెలాయించ‌గా, న్యూయార్క్ నిక్స్ ఆఖ‌ర్లో అద్భుతంగా ఫుంజుకోవ‌డం విశేషం. 

    చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచిన నిక్స్ జట్టు, మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను ముద్దాడటంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. పటిష్టమైన సాన్ ఆంటోనియో జట్టుపై మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూయార్క్ నిక్స్, ఫైనల్ సిరీస్‌లో తిరుగులేని ఆటతీరుతో చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

    అభిమానుల ఓవ‌రాక్ష‌న్‌..


    న్యూయార్క్ నిక్స్ గెలుపుతో అమెరికాలోని న్యూయార్క్ వీధులు జ‌న‌సంద్రంగా మారిపోయింది. న్యూయార్క్ నిక్స్ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంతో న్యూయార్క్‌లోని ప్ర‌ఖ్యాత టైమ్‌స్క్వేర్ వ‌ద్ద వేల సంఖ్య‌లో గూమిగూడిన జ‌నం సంబ‌రాల్లో మునిగితేలారు. అయితే ఈ వేడుక‌లు శ్రుతి మించాయి. కొంద‌రు అభిమానులు బ‌స్సుల‌కు మంట‌లు పెట్టి సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో అల్ల‌ర్లు చెల‌రేగాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు టైమ్‌స్క్వేర్ వ‌ద్ద జ‌నాల‌ను చెద‌ర‌గొట్టేందుకు  లాఠీచార్జీ చేశారు. దీంతో ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింది.

    చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్‌.. 71 ఏళ్లుగా చెక్కుచెద‌ర‌ని రికార్డు!

  • డిఫెండింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్స్‌, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్‌ విన్నర్‌ అస్ట్రేలియా బంగ్లాదేశ్‌ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్‌ తేడాతో గెలుపొందింది. 

    ఫలితంగా బంగ్లాదేశ్‌ ఆధిపత్యాన్ని 1-2కు తగ్గించి, క్లీన్‌ స్వీప్‌ పరాభవాన్ని తప్పించుకుంది. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఇదివరకే సిరీస్‌ను చేజార్చుకున్న ఆసీస్‌.. నేటి మ్యాచ్‌లోనూ మరో ఘోర పరాభవాన్ని తృటిలో తప్పించుకుంది.

    275 పరుగుల లక్ష్య ఛేదనలో కూపర్‌ కన్నోల్లీ (149) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే గెలుపుకు అతి చేరువలో 5 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి, మరో ఘోర ఓటమికి చేరువైంది. 

    నానా కష్టాలు పడ్డ అనంతరం చివరి ఓవర్‌ మూడో బంతికి ఆడమ్‌ జంపా (4 నాటౌట్‌) బౌండరీ సాధించి, ఆసీస్‌ను మరో ఘోర పరాభం నుంచి తప్పించడంతో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ అయ్యే అవమానం నుంచి కూడా గట్టెక్కించాడు. చివర్లో జంపాకు మెరిడిత్‌ (2 నాటౌట్‌) సహకరించాడు. 

    ఫలితంగా ఆసీస్‌ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్‌ సెంచరీ అనంతరం కన్నోల్లీ గెలుపు వాకిట ఔటై ఆసీస్‌ శిబిరంలో ఉత్కంఠ రేపాడు.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ .. తౌహిద్‌ హృదోయ్‌ (83), లిటన్‌ దాస్‌ (58 నాటౌట్‌), మొసద్దెక్‌ హొసేన్‌ (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 

    ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, రెన్షా తలో 2 వికెట్లతో రాణించారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కన్నోల్లీ ఒంటరిపోరాటం​ చేశాడు. అతడికి లబూషేన్‌ (29), గ్రీన్‌ (27), పీక్‌ (27) కాసేపు అండగా నిలబడ్డారు. గెలుపు ఖరారయ్యాక బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో ఆసీస్‌ బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. 

    కాస్త అటుఇటు అయ్యుంటే ఈ మ్యాచ్‌ కూడా ఆసీస్‌ చేజారేది. షోరిఫుల్‌ ఇస్లాం (10-1-48-6) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆసీస్‌ శిబిరంలో రైళ్లు పరిగెట్టించాడు. ఈ పర్యటనలో ఆసీస్‌ తదుపరి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌ చట్టోగ్రామ్‌ వేదికగా జూన్‌ 17న జరుగనుంది. 
     

  • ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ క్రేజ్ న‌డుస్తోంది. అభిమానులంతా సాక‌ర్ ఫీవ‌ర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆట‌లో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆట‌లో ఎవ‌రెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆట‌గాడు ఎన్ని గోల్స్ కొట్టాడు.. ఇలా అభిమానులు కౌంట్ చేసుకుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో ఒక్క గోల్‌తోనే మ్యాచ్‌లు గెలిచిన సంద‌ర్భాలున్నాయి. 

    అస‌లు గోల్ న‌మోదు కాకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు కోకొల్ల‌లు. ఇక 1930లో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 2,700 గోల్స్ చేయ‌డం విశేషం. అయితే ఒకే మ్యాచ్‌లో అత్య‌ధిక గోల్స్ న‌మోదు అయిన మ్యాచ్‌లు అరుదుగా ఉంటాయి. అయితే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌లో 12 గోల్స్ న‌మోదు కావ‌డం ఇప్ప‌టికీ రికార్డుగా ఉంది. 

    1954లో ఆస్ట్రియా, స్విట్జ‌ర్లాండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అంతేకాదు ఫిఫా చ‌రిత్ర‌లో 71 ఏళ్లుగా ఈ రికార్డు ఇప్ప‌టికీ చెక్కెచెద‌రలేదు. మూడు సంద‌ర్భాల్లో ఈ రికార్డుకు చేరువ‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ 12 గోల్స్ రికార్డును మాత్రం అందుకోలేక‌పోయాయి. వాటి వివ‌రాలు ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

    1954 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌: ఆస్ట్రియా వర్సెస్‌ స్విట్జ‌ర్లాండ్‌
    👉ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఆస్ట్రియా, స్విట్జ‌ర్లాండ్‌లు త‌ల‌ప‌డ్డాయి. జూన్ 26న జ‌రిగిన మ్యాచ్‌లో మొద‌టి 23 నిమిషాల్లో స్విట్జ‌ర్లాండ్ మూడు గోల్స్ కొట్ట‌గా, త‌ర్వాతి 25 నిమిషాల్లో ఆస్ట్రియా 5 గోల్స్ కొట్ట‌డం విశేషం. మొద‌టి హాఫ్ ముగిసేస‌రికే ఇరుజ‌ట్లు క‌లిపి 9 గోల్స్ కొట్ట‌డం విశేషం. ఆ త‌ర్వాతి హాఫ్ టైమ్‌లో మ‌రో మూడుగోల్స్ న‌మోద‌య్యాయి. 

    ఇందులో ఆస్ట్రియా రెండు, స్విట్జ‌ర్లాండ్ ఒక‌టి ఉన్నాయి. అంతిమంగా 90 నిమిషాల ఆట ముగిసేస‌రికి ఆస్ట్రియా 7-5తో స్విట్జ‌ర్లాండ్‌పై విజ‌యాన్ని అందుకుంది. ఒక ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక గోల్స్ న‌మోద‌యిన మ్యాచ్‌గా రికార్డుల‌కెక్కింది. అంతేకాదు ఈ రికార్డు ఏడు ద‌శాబ్దాలుగా చెక్కుచెద‌ర‌లేదు.

    1982 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్: హంగేరి వ‌ర్సెస్ సాల్వ‌డార్‌
    👉హంగేరి, సాల్వ‌డార్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ న‌మోద‌య్యాయి. అయితే ఇందులో హంగేరి 10 గోల్స్ కొడితే, సాల్వ‌డార్ ఒక గోల్‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో బిగ్ మార్జిన్ (9 గోల్స్ తేడాతో) తో విజ‌యం సాధించిన మ్యాచ్‌గా చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో హంగేరి నుంచి స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన లాజ్లో కిస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెర‌వ‌డం విశేషం. ఒక స‌బ్‌స్టిట్యూట్ ప్లేయ‌ర్‌ హ్యాట్రిక్ గోల్స్ కొట్ట‌డం ఫిఫా చ‌రిత్ర‌లో అదే తొలిసారి.

    1938 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌: బ్రెజిల్ వ‌ర్సెస్ పోలండ్‌
    👉1938 ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పోలండ్‌, బ్రెజిల్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 11 గోల్స్ న‌మోద‌య్యాయి. ఇందులో బ్రెజిల్ ఆరు గోల్స్ కొడితే, పోలండ్ ఐదు గోల్స్ కొట్టింది. నెక్ టూ నెక్ జ‌రిగిన పోరులో బ్రెజిల్ ఒక్క గోల్ తేడాతో విజ‌యం సాధించింది. అయితే పోలండ్ కొట్టిన ఐదు గోల్స్‌లో నాలుగు గోల్స్ ఎర్నెస్ట్ విల్లిమోస్కీవే కావ‌డం విశేషం.

    👉1954 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లోనే హంగేరి, వెస్ట్ జ‌ర్మ‌నీ మ‌ధ్య మ్యాచ్‌లో 11 గోల్స్ న‌మోదయ్యాయి. ఇదే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫ్రాన్స్‌, ప‌రాగ్వే మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 10 గోల్స్ న‌మోద‌య్యాయి. ఇదే ప్ర‌పంచ‌క‌ప్‌లో 26 మ్యాచ్‌ల్లో 140 గోల్స్ న‌మోద‌వ్వ‌డం ఇప్ప‌టికీ ఒక రికార్డుగా ఉంది.

    👉ఇక 1938 నుంచి 1982 వ‌ర‌కు జ‌రిగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో ప్ర‌తీ ఐదు మ్యాచ్‌ల్లో క‌నీసం 10 గోల్స్ చేసిన దాఖ‌లాలున్నాయి. అయితే నాలుగు ద‌శాబ్దాలుగా మ‌ళ్లీ ఆ ఫీట్ న‌మోద‌వ్వ‌క‌పోవడం గ‌మ‌నార్హం.

    చదవండి: పాక్‌తో మ్యాచ్‌.. అగ్గి రాజేసిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

  • పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌
    మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ  (4-0-10-5) మాయాజాలానికి పాక్‌ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌ తరఫున బ్యాటింగ్‌లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. 

    ఓటమి దిశగా పాక్‌
    75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్‌.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్‌ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 83-6గా ఉంది. ఆలియా రియాజ్‌ (4), రమీన్‌ షమీమ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

    మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌
    7.4వ ఓవర్‌- 58 పరుగుల వద్ద పాక్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్‌ ఇచ్చి సైరా జబీన్‌ (2) ఔటైంది. 

    రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌
    6.3వ ఓవర్‌- 53 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధనకు క్యాచ్‌ ఇచ్చి అయేషా జాఫర్‌ (12) ఔటైంది.

    ఇండియాకు తొలి బ్రేక్‌
    171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌కు మెరుపు ఆరంభం​ లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్‌ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్‌లో భారత్‌కు తొలి బ్రేక్‌ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఇది జరిగింది. 

    గౌరవప్రదమైన స్కోర్‌ సాధించిన టీమిండియా
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) సహకరించింది. 

    ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. ఆపఖ​ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

    ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    16.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్‌లో నతాలియాకు క్యాచ్‌ ఇచ్చి హర్మన్‌ప్రీత్‌ (36) ఔటైంది. 

    👉 సాదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్‌ ఔట్‌ కావడంతో 110 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

    మంధాన (68) ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
    ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. రమీన్‌ సమీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. 

    హాఫ్‌ సెంచరీ బాదిన  మంధాన
    పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్‌ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.

    9 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ ఎంతంటే..?
    18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ‍స్మృతి మంధన (28), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 54-2గా ఉంది. 

    రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
    3.2వ ఓవర్‌- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. తస్మియా రుబాబ్‌ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్‌ క్యాచ్‌ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్‌ (1) పెవిలియన్‌కు చేరింది. 

    తొలి బంతికే సిక్సర్‌.. ఐదో బంతికి వికెట్‌
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆర​ంభం లభించింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో షఫాలీ వర్మ సిక్సర్‌ కొట్టింది. అయితే అదే ఓవర్‌ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత, పాక్‌ కెప్టెన్లు నో హ్యాండ్‌ షేక్‌ ఆనవాయితీని కొనసాగించారు. 

    తుది జట్లు:
    భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

    పాకిస్తాన్‌: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్

  • ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్‌ స్మిత్‌ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్‌ ఫ్రీడం 2026 సీజన్‌ కోసం స్టీవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. స్టీవ్‌ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2024 సీజన్‌లో వ్యక్తిగతంగానూ సత్తా చాటి టైటిల్‌ గెలిపించాడు.

    గత సీజన్‌లో ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వాషింగ్టన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఈసారి ఆ బాధ్యతలు స్మిత్‌కు అప్పగించారు. వాషింగ్టన్‌ బృందం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. ఈ జట్టుకు రికీ పాంటింగ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

    టోర్నీ విషయానికొస్తే.. 2026 సీజన్‌ జూన్ 18న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో టెక్సాస్‌ కింగ్స్‌, సీయాటిల్‌ ఓర్కాస్‌ తలపడనున్నాయి. వాషింగ్టన్‌ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 20న సియాటిల్‌తో ఆడనుంది. 

    కాగా, ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. ఎంఐ న్యూయార్క్‌ రెండు సార్లు, వాషింగ్టన్‌ ఓసారి టైటిల్‌ సాధించాయి. గత ఎడిషన్‌లో ఎంఐ న్యూయార్క్‌ విజేతగా నిలువగా.. వాషింగ్టన్‌ ఫ్రీడం రన్నరప్‌గా నిలిచింది. 

  • ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్‌ ఛాంపియన్లు అయిన సౌత్‌ కొరియాపై భారత్‌ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌ రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కైవసం​ చేసుకుంది. 

    ఇవాళ (జూన్‌ 14) జరిగిన ఫైనల్లో భారత జోడీ (బొమ్మదేవర-కుమ్‌కుమ్‌ మోహోద్‌) కొరియా ద్వయం ​కిమ్‌ జే-డియోక్‌, ఓ యే జిన్‌ను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి, గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది.

    మ్యాచ్‌ మొత్తం భారత ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి బాణాన్నీ అత్యంత కచ్చితత్వంతో సంధించారు. ముఖ్యంగా 17 ఏళ్ల కుమ్‌కుమ్‌ మోహోద్‌ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో జరిగిన షాంఘో వరల్డ్‌కప్‌లోనూ కుమ్‌కుమ్‌.. దీపికా కుమారి, అంకిత భకత్‌తో కలిసి సెమీస్‌లో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా అదే జోరు వరల్డ్‌కప్‌ స్టేజ్-3 టోర్నీలోనూ కొనసాగింది. ఈ గెలుపు ఆసియా క్రీడలకు ముందు భారత రికర్వ్‌ జట్టులో విశ్వాసాన్ని మరింత పెరిగింది.

    ధిరజ్‌ విషయానికొస్తే.. అతడికి ఇది తొలి వరల్డ్‌కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణం. గతంలో అతను కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధిరజ్‌ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు.
     

  • ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్‌, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన మాటలతో అగ్గి రాజేసింది. 

    పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్మన్ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. తాము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి మాత్రమే వచ్చామని, ఎవరితో చేతులు కలపడానికి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. హర్మన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాము. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. 

    క్రికెట్ మినహా అనవసర విషయాల గురించి మాట్లాడదలచుకోలేము. అయినా నేను క్రికెట్ తప్ప దేని గురించి ఆలోచించడం లేదు. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ అనేది మా కల. దాని గురించే మాట్లాడుకుంటాం.  మీరు హైవోల్టేజ్ మ్యాచ్ అని చెబుతున్న ప్పటికీ నా దృష్టిలో మాత్రం పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను ఒక సాధారణ గేమ్‌గానే చూస్తున్నాను. 

    అయితే పాక్‌తో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తాను. పాక్ ఒక్కటే కాదు తాము ఆడబోయే ప్రతీ మ్యాచ్‌లోనూ ఒ‍త్తిడి సహజం. కానీ దానిని జయిస్తేనే విజయం మనల్ని వరిస్తుంది. ఎవరితో మ్యాచ్ అయినా మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాలని అనుకుంటాము.’ అని చెప్పుకొచ్చింది.

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఇరుజట్లు తలపడితే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు. కానీ పహల్గాం ఘటన తర్వాత పాక్‌తో ఆడే ఎలాంటి మ్యాచ్ అయినా సరే ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. బీసీసీఐ కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆసియా కప్ నుంచి పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకు రాలేదు. 

    మహిళల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ హర్మన్ సేన పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. కాబట్టి నేటి మ్యాచ్‌లోనూ భారత మహిళా ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం లేదు. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ సేన తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది. 2009లో మొద‌లైన టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్నీలో భార‌త్ కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఫైన‌ల్ చేరింది. 2020 ఎడిష‌న్‌లో ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది. 

    చదవండి: ఇండియా-ఏకు భారీ షాక్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి గాయం!

  • ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జూన్‌ 13) జరిగిన తొలి వన్డేలో అజేయమైన 84 పరుగులు చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. ఈ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో పలు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న అతడు..  ఈ ఘనత (కనీసం 3000 పరుగులు) సాధించిన బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్ ఆజం‌ (53.43), ఏబీ డివిలియర్స్‌ (53.50), మైఖేల్‌ బెవాన్‌ (53.58) లాంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి (58.71) మాత్రమే గిల్‌ (57.30) కంటే ముందున్నాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో గిల్‌ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌లు) 3000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు శిఖర్‌ ధవన్‌ (72 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (75 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే, ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటర్‌ హషిమ్‌ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్‌ (102) మెరుపు శతకంతో చెలరేగాడు. అతడు మినహా ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (26) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే తలో 3 వికెట్లు తీయగా.. అర్షదీప్‌ సింగ్‌, నితీశ్‌ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టాడు.

    అనంతరం 195 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. గిల్‌ (84 నాటౌట్‌) సత్తా చాటడంతో 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గిల్‌కు ఇషాన్‌ కిషన్‌ (34), కేఎల్‌ రాహుల్‌ (39 నాటౌట్‌) సహకరించగా.. రోహిత్‌ శర్మ (16), శ్రేయస్‌ అయ్యర్‌ (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో జరగనుంది.

  • ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్యవంశీకి గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సోమ‌వారం శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెష‌న్‌కు వ‌చ్చిన వ‌చ్చిన వైభ‌వ్ సూర్య‌వంశీ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

    దీంతో వైభ‌వ్‌ ప్రాక్టీస్ మ‌ధ్య‌లోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదిక‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. ఇక రేపు శ్రీలంక‌-ఏతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు వైభ‌వ్ దూర‌మైతే అత‌డి స్థానంలో నిశాంత్ సింధును జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది. 

    ఎలాగూ టాపార్డ‌ర్‌లో ప్ర‌భ్‌సిమ్ర‌న్‌, ప్రియాన్ష్ ఆర్య‌, రుతురాజ్ ఉండ‌డంతో వీరిలో ఇద్ద‌రు ఓపెన‌ర్లుగా వ‌స్తే, ఒక‌రు వ‌న్‌డౌన్‌లో రావ‌డం ఖాయం. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభ‌వ్ సూర్య‌వంశీ తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, రెండో మ్యాచ్‌లో మాత్రం 22 బంతుల్లో 44 ప‌రుగులతో త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.

    అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ గాయం అప్‌డేట్‌పై ఎలాంటి స‌మాచారం లేన‌ప్ప‌టికీ  రాబోయే ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్ల‌తో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జ‌ట్టులో వైభ‌వ్ చోటు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. వైభవ్‌కు గాయం తీవ్ర‌త ఎక్కువగా లేక‌పోతే రాబోయే ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియాకు ఆడే సువ‌ర్ణావ‌కాశం ల‌భిస్తుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సంచ‌ల‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్ల‌తో పాటు ఆసియా గేమ్స్‌కు కూడా వైభ‌వ్ సూర్య‌వంశీ టీమిండియాలో చోటు ద‌క్కించుకున్నాడు. 

    ఒక‌వేళ ఐర్లాండ్‌తో ప‌ర్య‌ట‌న‌కు ముందే సూర్య‌వంశీ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో భార‌తదేశం త‌ర‌ఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వ‌య‌స్కుడిగా నిలిచే అవ‌కాశ‌ముంది.


     

  • టీ20 ముంబై లీగ్ 2026 విజేత‌గా ఎమ్‌ఎస్‌సి మరాఠా రాయల్స్ నిలిచింది. శ‌నివారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్క్స్ అంధేరిపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన మ‌రాఠా రాయ‌ల్స్ డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాను నిలుపుకుంది. అయితే మ్యాచ్ ముగిశాకా ఇరుజట్ల ఆట‌గాళ్లు మైదానంలోనే గొడ‌వ‌కు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు దాడి చేసుకునే వరకు వెళ్లారు. 

    దీంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విష‌యంలోకి వెళితే మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జతార్ సిక్స్ కొట్టాడు. 

    అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, గౌరవ్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. 

    మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్‌, గౌరవ్‌లకు సర్ది చెప్పడంతో వివాదం ముగిసింది.

    ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌రాఠా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఎమ్‌ఎస్‌సి బ్యాట‌ర్ల‌లో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్‌(33) కాస్త దూకుడుగా ఆడాడు.  వీరిద్ద‌రూ మిన‌హా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

    అంధేరి బౌల‌ర్ల‌లో అర్జున్ టెండూల్క‌ర్ రెండు, శివ‌మ్ దూబే, ముషీర్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం ఏఆర్‌సీఎస్ అంధేరి 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దివ్యాన్ష్ స‌క్సేనా (51) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మ‌రాఠా బౌల‌ర్ల‌లో ఆదిత్య ధుమాల్‌, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమెర్ త‌లా రెండు వికెట్లు తీశారు. తుషార్ దేశ్‌పాండేను ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ వ‌రించ‌గా, సువేద్ పార్క‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

    చదవండి: 24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌!

  • ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఆరంభ మ్యాచ్‌లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. 

    మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్‌కుందా సరికొత్త రికార్డు సృష్టించాడు.

    ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్‌కాఫ్ బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన లో-షాట్‌తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. 

    ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్‌కీపర్ పాట్రిక్ బీచ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుని క్లీన్ షీట్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో పరాగ్వేపై 4-1తో గెలిచిన అమెరికా జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.

    చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన వెస్టిండీస్‌!

  • మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం  సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది.  గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.

    ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్‌(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్‌(35) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది.

    అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్‌ షెమైన్ కాంప్‌బెల్‌ది కీలక పాత్ర. కాంప్‌బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి  తన జట్టును గెలిపించింది.

    ఆమె టీ20 కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం.
     

  • ముంబై లీగ్ టీ20 లీగ్‌-2026 విజేత‌గా ఎమ్‌ఎస్‌సి మరాఠా రాయల్స్ నిలిచింది. శ‌నివారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్క్స్ అంధేరిపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన మ‌రాఠా రాయ‌ల్స్‌.. వ‌రుస‌గా రెండో ఎంటీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

    ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌రాఠా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఎమ్‌ఎస్‌సి బ్యాట‌ర్ల‌లో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్‌(33) కాస్త దూకుడుగా ఆడాడు.  వీరిద్ద‌రూ మిన‌హా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అంధేరి బౌల‌ర్ల‌లో అర్జున్ టెండూల్క‌ర్ రెండు, శివ‌మ్ దూబే, ముషీర్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు.

    కొంప‌ముంచిన అర్జున్‌
    అయితే 155 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆర్క్స్ అంధేరి సునాయ‌సంగా ఛేదిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానా మ‌రాఠా రాయ‌ల్స్ కంటే అంధేరి బ్యాట‌ర్లు దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఆరంభంలోనే స్టార్ ఓపెన‌ర్ ముషీర్ ఖాన్(0) వికెట్‌ను ఆర్క్స్ జ‌ట్టు కోల్పోయింది. ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అర్జున్ టెండూల్క‌ర్ అంధేరి కొంప‌ముంచాడు. జిడ్డు బ్యాటింగ్ చేస్తూ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచాడు.

    క‌నీసం స్ట్రైక్ కూడా రోటేట్ చేయ‌లేక‌పోయాడు. అత‌డు 12 బంతులు ఎదుర్కొని కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అంధేరి విజ‌యానికి కావాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ప్ర‌సాద్ ప‌వార్ అవుటైన‌ప్ప‌టికి, ఓపెన‌ర్‌ దివ్యాన్ష్ సక్సేనా( 38 బంతుల్లో 50 పరుగులు) నిల‌కడ‌గా ఆడుతూ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. 

    అయితే దివ్యాన్ష్ ఔట‌య్య‌క అంధేరి వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. ప్రగ్నేష్ కన్పిల్లెవార్(21 బంతుల్లో 28), కెప్టెన్ శివ‌మ్ దూబే(15) వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. చివరిలో వేగంగా ఆడిన గౌరవ్ జాతర్ కూడా (17 బంతుల్లో 23 పరుగులు)  కూడా 19 ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు చెరాడు.

    ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో అంధేరి విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. మరాఠా బౌలర్‌ రాజే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మరాఠా రాయల్స్‌ ఛాంపియన్స్‌గా నిలవగా.. అంధేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
    చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్‌

Movies

  • కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

    ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్‌గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.

    నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉ‍న్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.

    (ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన)

  • మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా.. ఉపాసన ఓవైపు తన పనులు, మరోవైపు ముగ్గురు పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన నుంచి చిన్నపాటి సర్‌ప్రైజ్ వచ్చింది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)

    రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. ఆ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇకపోతే ఈ ఏడాది జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పాప, బాబు ఉన్నారు. బాబుకి శివరామ్, పాపకు అన్వీరా దేవి అని పేరు పెట్టారు. పుట్టిన తర్వాత ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన.. తన పిల్లలు చేతులున్న ఫొటోని పోస్ట్ చేసి మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కి పలువురు సెలబ్రిటీలు లవ్ ఎమోజీలతో తన ప్రేమని చూపిస్తున్నారు.

    (ఇదీ చదవండి: లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?)

  • కొంటెగా చూస్తూ అనన్య నాగళ్ల ‍గ్లామర్

    చీరలో కనువిందు చేస్తున్న కోమలి ప్రసాద్

    ఒంపుసొంపులు వయ్యారాలతో దిశా పటానీ

    మెరుపు తీగలా మెరిసిపోతున్న మానస

    షూటింగ్ వీడియో పోస్ట్ చేసిన దివి

    కలర్‌ఫుల్ డ్రస్‌లో సలార్ ఫేమ్ శ్రియారెడ్డి

  • రామ్ చరణ్ 'పెద్ది' ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. దీంతో సందడి మరికొన్నిరోజులే ఉంటుంది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటనేది చూడాలి. మరోవైపు చరణ్ తర్వాత మూవీ గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. సుకుమార్‌తో చేయబోయే చిత్రం ఎప్పుడు మొదలవ్వొచ్చు? అనేది మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

    రామ్ చరణ్, సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీళ్ల కాంబోలోని రెండో మూవీ గురించి చాన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు 'పెద్ది' రిలీజైపోవడంతో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులకు కుతుహలం కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు.

    'పెద్ది' షూటింగ్ చివరిదశలో చరణ్ చేతికి గాయమైంది. కట్టుతోనే ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు సదరు గాయానికి సర్జరీ చేయనున్నారు. అలా దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమా కోసం స్టోరీ ఇంకేం సిద్ధం చేయలేదు. దసరా లోపు స్టోరీ, స్క్రీన్ ప్లే ఓ కొలిక్కి రావొచ్చని అంటున్నారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం ఆరాటపడే సుక్కు.. దసరా కల్లా పూర్తి చేస్తాడా అనేది చూడాలి?

    'పుష్ప' సినిమాల తర్వాత చరణ్ ప్రాజెక్ట్‌పైనే సుకుమార్ పనిచేస్తున్నప్పటికీ.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాదిలో పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముంటుంది. లేదంటే మాత్రం మరో ఏడాది పట్టేసిన ఆ‍శ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే రామ్ చరణ్‌కి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి సుకుమార్‌కి తప్పితే మరో దర్శకుడికి చరణ్ కమిట్‌మెంట్ ఇవ్వలేదు. అలానే పాన్ ఇండియా దర్శకులు కూడా ఎవరూ ఖాళీ లేనట్లే ఉన్నారు.

    (ఇదీ చదవండి: 'పెద్ది' ఐటం సాంగ్ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)

  • రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 378 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌ అయిన రోజు నుంచి జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో ఆమెను చూపించిన తీరు, డైలాగ్స్‌ పై సామాన్యులే కాదు సినీ తారలు కూడా అభ్యంతరం చెప్పారు.

     చివరకు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి ఆ సీన్లను తొలగించారు కూడా. అయినా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్‌ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబే చెప్పారు.‘పెద్దిలో కొత్తగా మూడు సీన్లను యాడ్‌ చేయబోతున్నాం. అందులో జాన్వీ కపూర్‌కి సంబంధించి రెండు సీన్లు ఉన్నాయి. మరొకటి జగపతి బాబు సన్నివేశం. ఈ మూడు సీన్లను బుధవారం నుంచి యాడ్‌ చేయబోతున్నాం’ అని బుచ్చిబాబు చెప్పాడు.  మరి కొత్త సన్నివేశాలు యాడ్‌ చేసిన తర్వాత అయినా జాన్వీ కపూర్‌ పాత్రపై పాజిటివ్‌ టాక్‌ వస్తుందో లేదో చూడాలి.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది కానీ దానికి తగ్గట్లే ఫెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. సినిమాలోని హీరోయిన్ జాన్వీ కపూర్‌ని చూపించిన విధానం దగ్గర నుంచి హీరో పాత్ర పలికే డైలాగ్స్, చేసే పనులపై కూడా విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఐటం సాంగ్ లిరిక్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయనే ట్రోల్స్ కనిపించాయి. ఇప్పుడీ విషయంపై సదరు లిరిక్ అనంత శ్రీరామ్ స్పందించాడు. ఆదివారం 'పెద్ది' సక్సెస్ మీట్‌లో విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)

    'పీహెచ్‌డీలు, పట్టభద్రులు.. వాళ్ల ఆలోచన విధానమే సరైనది అనేది ఎక్కువైపోవడం వల్ల, సోషల్ మీడియాలో కొందరు తన అభిప్రాయాన్ని రుద్దేశారు. అలా ప్రభావితం అవ్వడం తప్ప.. దర్శకుడికి ఓ పాత్ర ఇలా ప్రవర్తిస్తాది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకు ఏం చేసినట్లు? ముట్టేస్తానని హీరో పాత్రధారి తన ట్రైబ్ భాషలో మట్లాడితేనేమో వల్గారిటీ అంటారు. ఇలా చేస్తే సృజనాత్మకతకని తొక్కినట్లే. ఎవరినీ బాధపెట్టకూడదనే ఉద్దేశంతో బుచ్చిబాబు సారీ చెప్పి ఉండొచ్చు. ఇలా జరుగుతూపోతే రాబోయే రోజుల్లో డాక్యుమెంటరీలో తప్పితే కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం' అని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చెప్పారు.

    అలానే ఐటమ్ సాంగ్‌లోని వారానికి వెయ్యి, నాకోసం దాయి లాంటి లిరిక్స్‌పై వస్తున్న విమర్శలకు బదులిస్తూ.. ఐటమ్ సాంగ్ ఆస్వాదించలేని వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు అని అనంత్ శ్రీరామ్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

  • ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)

    2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

    'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్‌సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!)

  • ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు  సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.

    కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్‌లో 'ఖుబూల్ హై' అనే సీరియల్‌తో బాగా ఫేమస్ ‍అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్‌కమ్ చెప్పింది. ఆమె  తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని  ఆహానా రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది.

    కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్‌ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు.  పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్‌లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. 
     

  • యోగిత భోసాలె ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతోన్న మ‌హిళా సాధికారిక చిత్రం ‘అభ‌య‌’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్‌.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు యూస‌ఫ్ ముజామ్మిల్ సుర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మ‌రాఠీ, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే మ‌హిళా సాధికారిత‌పై రూపొందుతోన్న ప‌వ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

    ఈ సంద‌ర్భంగా గ్రాండియెంటె ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత డా.విమ‌ల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ ‘‘‘అభ‌య‌’ కేవలం సినిమా మాత్ర‌మే కాదు..స‌మాజానికి బ‌ల‌మైన సందేశం. ఈ మూవీ ద్వారా త‌ర‌త‌రాలుగా ఎంద‌రికో ప్రేర‌ణ‌గా నిలుస్తోన్న మ‌హిళ‌ల శ‌క్తి, ప‌ట్టుద‌ల‌ను సెబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా నాలుగు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ రోజు పోస్ట‌ర్‌ను విడుదల చేయ‌టం ఆనందంగా ఉంది. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

    RDG ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత‌, నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ‘‘‘అభయ’ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆనందంగా ఉంది.  ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా, బలమైన కథనం, అద్భుతమైన నటీన‌టుల‌తో రూపొందింది. ఈ ప్రేరణాత్మక సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

    ఈ చిత్రంలో యోగిత భోసాలె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమాలో ఇంకా మోహ‌న్ జోషి, గ‌ణేష్ యాద‌వ్‌, క‌మ‌లేష్ సావంత్‌, అనికేత్ కేల్‌క‌ర్‌, రోహిత్ కోక‌టి, ఉమేష్ బోల్కె, డా.సంజీవ్ కుమార్ పాటిల్‌, హ‌ర్ష్ నిక‌మ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

  • రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్‌ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్‌ అని యాడ్‌ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు.  కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్‌ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు. 

    అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్‌ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.

    ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్‌, సెండర్‌ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.

    అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి.

  • ఓటీటీకి వచ్చేందుకు మరో సినిమా రెడీ అయిపోయింది. సన్నీ డియోల్, అక్షయే ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఇక్కా. ఈ చిత్రాన్ని సస్పెన్స్ కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. జూలై 10 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది.

    దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు సన్నీ డియోల్, అక్షయే ఖన్నా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దియా మీర్జా, తిలోత్తమా శోమే, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కపూర్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.
     

     

National

  • సోలాపూర్‌: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్‌ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

    డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్‌.. రహదారి పక్కనే ఉన్న పొలంలోని బావిలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పండరపూర్ తాలూకాలోని రంజని గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

  • మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా స్టేషన్‌ దగ్గర రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందుకు రైలులో వ్యాపించిన వదంతులే కారణం. 

    ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అగ్నిప్రమాదం జరిగిందన్న వదంతులతో ఓ ప్రయాణికుడు చైన్‌ లాగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు రైలు నుంచి దూకారు.  పట్టాలపై ఎదురుగా వస్తున్న పాతాళ్‌కోట్ రైలు వారిలో పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటన హేతంపూర్ సమీపంలో జరిగింది. 

     

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు సీఎం యోగి ఆధిత్యనాథ్‌ అండగా నిలిచారు. అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెపై జరిగిన ట్రోలింగ్‌ ,ఆమె ఫోటోల మార్ఫింగ్‌ వ్యవహారంలో న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. అందుకు కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలతో కాన్పూర్‌ కమిషనరేట్‌లో సైబర్‌ విభాగం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

    జూన్‌ 9న భారత్‌ కుమార్‌ పటేల్‌ అనే వ్యక్తి తన సోషల్‌ మీడియా అకౌంట్లలో అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తె మార్ఫింగ్‌ ఫోటోల్ని షేర్‌ చేశాడు. ఆమెపై దొంగతనం, క్రిమినల్‌ కార్యకలాపాలకు అనుసంధానం చేస్తూ ఓ ఫొటో ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో రూ. 955 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న సీఎం యోగి మాట్లాడారు.  

    ఇటీవల సోషల్ మీడియాలో అఖిలేష్ యాదవ్ కుమార్తెపై కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం నా దృష్టికి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను పోలీసులను ఆదేశించానని అన్నారు. కూతురు అంటే అందరికి కూతురే. సోదరి అంటే  అందరి సోదరియేననే విలువల మధ్యే మనం పెరిగాం. మేము ఎప్పుడూ ఇందులో ఎలాంటి వివక్ష చూపించలేదు’అని ఆయన పేర్కొన్నారు.

    తాను ఆదేశాలు జారీ చేసిన వెంటనే పోలీసులు సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు ఎవరు పెట్టారో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నిందితులపై వేగంగా తీసుకున్న పోలీసుల చర్యను సమర్థించారు. 

    అదే సమయంలో అఖిలేష్ యాదవ్‌కు ఒక సలహా కూడా ఇచ్చారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, సీనియర్ నాయకుల పట్ల దుర్భాషలాడకుండా తన సొంత పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను నియంత్రించుకోవాలని సూచించారు. అఖిలేష్ జీ.. మీరు ఇతరులకు సలహాలు ఇస్తుంటారు. కానీ మీ అనుచరులు, కార్యకర్తలు కూడా వారి భాషను అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి’ అని సూచించారు. వారికి మీరే అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది, ఒకవేళ వారు వినకపోతే, వారిని మాకు అప్పగించండి. వారికి ఎలా బుద్ధి చెప్పాలో మేము సరిగ్గా చెప్తాం’అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

  • న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.

    తుగ్లకాబాద్‌లోని టీకేడీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.

    మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    నిప్పు ఎందుకు అంటించింది? 
    దర్యాప్తు సమయంలో గోవింద్‌పురిలోని నవజీవన్ క్యాంప్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్‌పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.

    “5వ అంతస్తులో నివసించే దీపక్‌కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.

    తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్‌కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.

    నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

    కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. 

    దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.

    అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్‌లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

    మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు.

  • తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన వ్యాఖ్యలు  రాజకీయ దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై విజయన్‌తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్‌ ఏమన్నారంటే..

    ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్‌. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

    పినరాయి ఘాటు స్పందన..
    రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.

    సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..
    రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్‌ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.

    కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులే
    ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్‌డీఎఫ్‌కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.

    కూటమికి కొత్త తలనొప్పి..
    ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది.

  • పాట్నా: బిహార్‌ రాష్ట్రం పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రౌషన్ ఆనంద్ (రౌషన్ సర్) సోదరుడు ప్రిన్స్ యాదవ్ నేపాల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆయనపై ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌పై దాడి, విధ్వంస్వం కేసు ఆరోపణలు ఉన్నాయి.

    రౌషన్ ఆనంద్ పాట్నాలోని జ్ఞాన్ బిందు జీఎస్‌ అకాడమీ డైరెక్టర్. ఆయన ప్రత్యర్థి ఫైసల్ ఖాన్ (ఖాన్ సర్), ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ రెండు సంస్థల మధ్య పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల సంఖ్య, క్యాంపస్ నియంత్రణ వంటి అంశాలపై కొన్నేళ్లుగా తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో ఈ రెండు ఇనిస్టిట్యూట్‌ల మధ్య ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించి కేసులో రౌషన్‌ ఆనంద్‌ అరెస్టు కాగా ప్రిన్స్‌ యాదవ్‌ దాడి కేసులో అభియోగం ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు. 

    ఈ క్రమంలో ప్రిన్స్‌యాదవ్‌ నేపాల్‌లోని బిరాట్నగర్‌లోని హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. అదే హోటల్‌లో ప్రిన్స్‌ యాదవ్‌తో పాటు తన ఆరుగురు స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్‌ యాదవ్‌ స్నేహితులు, ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రిన్స్‌ మరణంపై స్పష్టత రాలేదు.  

    ప్రిన్స్‌ యాదవ్‌ మృతి వార్త తెలిసిన వెంటనే రౌషన్ ఆనంద్ కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరారు. ఈ ఘటనతో పాట్నాలోని కోచింగ్ హబ్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికంగా పోలీస్ బలగాలను పెంచి అప్రమత్తం చేశారు. ఈ ఘర్షణ విద్యార్థుల మధ్య కూడా హింసాత్మక రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

    ఆరోపణలు
    2021నుంచి రౌషన్‌ ఆనంద్‌ సోదరుడు ప్రిన్స్ యాదవ్‌పై పలు ఆరోణలు కొనసాగుతున్నారు. 2021 ఖాన్ సర్ కోచింగ్ సెంటర్‌లోకి దూసుకెళ్లి హింసాత్మక దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2న విధ్వంసం ఘటనకు సంబంధించిన కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రిన్స్‌ పేరును చేర్చారు. ఈ కేసులో రౌషన్ ఆనంద్ ఇప్పటికే పాట్నా జైలులో ఉన్నారు. కాగా ఖాన్ సర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రౌషన్‌ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద మృతితో పరిస్థితులు మరింత దిగజారాయి.  

    బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు
    గత మే 27న బిహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ కానిస్టేబుల్ , బిహార్ అధికారికంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించింది. మొత్తం 19,838 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే ఈ ఫలితాలు కోచింగ్‌ హబ్‌గా పేరొందిన పాట్నాలోని ముసల్లాపూర్‌ కిసాన్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ క్యాంపస్‌లో ఖాన్ సార్ (ఖాన్‌ సార్‌) కోచింగ్ సెంటర్, జ్ఞాన్ బిందు జీఎస్ అకాడమీ (రౌషన్ సార్) మధ్య చిచ్చు రాజేసింది. ఇద్దరూ తమ ఇన్స్టిట్యూట్‌ నుంచి వేలాది మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించడంతో పోస్టర్లు చించుకోవడం, హింసాత్మక దాడులు, కేసులు వరకు వివాదం పెరిగింది.

    ఖాన్‌ సార్‌పై ఆరోపణలు
    ఖాన్ సార్ తన ఇనిస్టిట్యూట్‌ నుంచి 12,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. రౌషన్ ఆనంద్ తన జ్ఞాన్ బిందు అకాడమీ నుంచి 10,000 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రకటించారు. ఇద్దరూ టాపర్ అభిషేక్ పటేల్ తమ విద్యార్థి అని ప్రకటించడం, అభిషేక్ పటేల్.. ఖాన్ సార్‌ని కలవడం, ఆయన బ్లెసింగ్స్‌ తీసుకోవడంతో రౌషన్ ఆనంద్‌ను ఆగ్రహానికి గురి చేసింది. అభిషేక్‌ పటేల్‌ను ఖాన్ సర్ రూ.10 లక్షలతో కొనుగోలు చేశారని ఆరోపించారు. అభిషేక్ పటేల్ ఈ ఆరోపణలను ఖండించారు.

    అయితే జూన్ 2న జ్ఞాన్ బిందు అకాడమీకి చెందిన సుమారు 20 మందివారు ఖాన్ సర్ ఇనిస్టిట్యూట్‌పై దాడి చేశారు. ఇనిస్టిట్యూట్‌లో వస్తువుల్ని ధ్వంసం చేయడం,రాళ్లు రువ్వారు. దీంతో ఖాన్‌ సార్‌ బాడీగార్డులు గాల్లో కాల్పులు జరపడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జ్ఞాన్ బిందు డైరెక్టర్ రౌషన్ ఆనంద్, ఆయన సోదరుడు ప్రిన్స్ యాదవ్‌తో పాటు ఇతరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖాన్‌ సార్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రౌషన్‌ ఆనంద్‌పై జైలు శిక్ష పడింది. ప్రిన్స్‌ యాదవ్‌ బెయిల్‌ మీద విడుదలయ్యారు. ఖాన్‌ సార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ప్రిన్స్‌ యాదవ్‌ అనుమానాస్పద మృతితో బిహార్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 

International

  • గల్ఫ్‌ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నారని  ఇరాన్‌లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల ఒమన్‌ తీరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృత్యువాత పడగా, ఆ భయానక వాతావరణం ఇంకా కొనసాగుతుందని పలువురు భారత నౌకాదళ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

    భారతీయ నావికులను తీసుకువెళ్తున్న నౌకలపై పదేపదే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తూ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. కొనసాగుతున్న దాడుల మధ్య తాము ఆ ప్రాంతంలో చిక్కుకుపోయామని, అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఆపదలో ఉన్న భారతీయ నావికుల పరిస్థితిని వివరించారు. 

    ‘ మేము ఇరాన్‌లో ఉన్నాము, ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మమ్మల్ని మాకు సంబంధంలేని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు? మేము సైనిక సిబ్బంది కాదు. మేము కాంట్రాక్టులపై పనిచేస్తున్న నావికులం. మేము చమురును తీసుకువస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు సహాయం చేస్తున్నాం’ అని వీడియో రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

    ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. ‘ మేము సైనికులం కాదు. మేము కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి వస్తాం. అలాంటప్పుడు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు? మా తప్పేంటి?" అని ప్రశ్నించారు.  ఇటీవల దాడికి గురైన ఒక నౌకలో తాను గతంలో పనిచేశానని, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆ నౌకాదళంలోని మరో కాంట్రాక్ట్‌ కార్మికుడు ప్రస్తావించాడు. 


     

     

     


     

  • ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది. బీరూట్‌ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. పేలుడు సంభవించడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

    లెబనాన్ అధికారిక నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియేలోని ఘోబెయరీ పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ దాడిలో ఏవైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనేదానిపై స్పష్టత లేదు.

    ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే.. తాము దక్షిణ బీరూట్‌పై దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా పలువురు అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి వాషింగ్టన్ మద్దతు కూడా ఉందని వారు పేర్కొన్నారు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న మూడు డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై వేర్వేరు ఘటనల్లో దాడి చేశాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం ఇవాళ తెల్లవారుజామున తెలిపింది

    ఇజ్రాయెల్ భద్రతకు, ఐడీఎఫ్ దళాలకు ముప్పుగా ఉన్న ఏ లక్ష్యాన్నైనా నిర్వీర్యం చేసేందుకు మేము చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది. హిజ్బుల్లా మాత్రం దక్షిణ లెబనాన్‌లోకి చొరబడ్డ ఇజ్రాయెల్ దళాలపై పలు దాడులు జరిపినట్లు ప్రకటించినప్పటికీ.. ఉత్తర ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
     

     

  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న  బాటసారులను  డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.

    ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.

    ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.

    సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.

    తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

  • పారిస్‌: ఫ్రాన్స్‌లో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. రెండు దేశాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు.

    భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం భద్రత నుంచి స్థిరమైన అభివృద్ధి వరకు విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. “ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌దే. ఈ ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ ఆగదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. భారత్‌తో కలిసి పనిచేయండి. 

    ప్రపంచం కోసం సాంకేతికను అభివృద్ధి చేయండి. భారత్ వేగంగా, విస్తృత స్థాయిలో ఆవిష్కరణలు చేస్తోంది. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణలు చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తోంది.

    సాంకేతికత, ఆవిష్కరణలు, విధానాలు అన్నీ మనుషుల అవసరాలు, సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. ఆవిష్కరణ భారత్ డీఎన్‌ఏలో ఉంది. గత 12 ఏళ్లలో భారత్ బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించింది.

    భారత్-ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. ఇందులో నమ్మకం, ఆవిష్కరణ, స్ఫూర్తి, ఉమ్మడి దార్శనికత ఉన్నాయి. భారత్ యువ ఆవిష్కర్తలు మానవాళి మొత్తానికి ఉపయోగపడే వాటిని కనుగొంటున్నారు” అని ప్రధాని మోదీ చెప్పారు.

    భారత్‌పై మెక్రాన్‌ ప్రశంసల జల్లు
    ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ భారత్ ఆవిష్కరణ వ్యవస్థను ప్రశంసించారు. భారత్ తమ దేశంలో నిర్వహించిన తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

    “భారత్ ఆవిష్కరణలు చేస్తోందా లేదా అన్నది ప్రశ్న కాదు. భారత్‌తో కలిసి ఎవరు ఆవిష్కరణలు చేస్తారు అన్నదే అసలు ప్రశ్న” అని మాక్రాన్ అన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు ఆతిథ్యం ఇవ్వడం ఫ్రాన్స్‌కు గర్వకారణమని చెప్పారు.

    భారత్ సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ చంద్రయాన్‌ - 3 ల్యాండింగ్‌ విజయాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ మిషన్ భారత్ ఆవిష్కరణ శక్తి, అమలు సామర్థ్యం, పారిశ్రామిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిందని అన్నారు. “పరిశోధన, ఆవిష్కరణ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రపంచ ఆవిష్కరణ నాయక దేశంగా అవతరిస్తోంది” అని మాక్రాన్ చెప్పారు.

    కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు వంటి కీలక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య నిజమైన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర అణుశక్తి రంగంలో, ముఖ్యంగా చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్ల విషయంలో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు.

  • టెహ్రాన్‌: అమెరికాతో  శాంతి ఒప్పందంపై ఇరాన్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  ఆ దేశంలోని అతివాదుల వర్గం చర్చలు అవసరం లేదంటూ ధర్నాలు  చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అక్రమ చొరబాటుదారుడిగా అభివర్ణిస్తూ వాషింగ్టన్‌తో ఆయన రాజీ పడుతున్నారని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

    ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టంతా ఇరాన్‌- అమెరికా చర్చలపైనే.. ఈ భేటీలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఈ యుద్ధానికి శాశ్వతంగా తెరపడుతుందా అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని అతివాద వర్గం మాత్రం చర్చలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పై టెహ్రాన్ నియంత్రణ, ప్రభావం తగ్గుతుందని వాదిస్తున్నారు.

    ఈ మేరకు ( శనివారం) ఆ దేశంలోని అతివాద గ్రూపులకు చెందిన మద్దతు దారులు రాజధాని టెహ్రాన్‌తో పాటు మషహాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అబ్బాస్ అరాగ్చీ నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. 

    విదేశాంగ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గౌరవం లేని, రాజీపడే అరాగ్చీ నశించాలి, అరాగ్చీ, సిగ్గు తెచ్చుకో... లొంగిపోవడం ఆపు, దేశద్రోహి, చొరబాటుదారుడైన అరాగ్చీ నశించాలి" అంటూ తీవ్ర పదజాలంతో అరాగ్చీపై మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఏ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ  పూర్తి అంగీకారం లేకుండా జరగదని స్పష్టం చేశారు.

    అయితే ఈ నిరసనల నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. హర్ముజ్ అనేది ఇరాన్ యొక్క ప్రధాన రక్షణ ఆయుధాలలో ఒకటని ఆయన  స్పష్టం చేశారు. ఈ రాబోయే ఒప్పందం వల్ల ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం  తొలగిపోతుందని పేర్కొన్నారు.

    కాగా అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌లోని అతివాదులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇరాన్ మరింత దూకుడుగా అణు విధానాన్ని అవలంబించాలని 'అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం' నుండి ఇరాన్ వైదొలగాలని, నేరుగా అణుబాంబు తయారీ వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు
     

Business

  • ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

    జియో పేటెంట్ పోర్ట్‌ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్‌లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.

    ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ, భారత్‌ను సాంకేతికతను సృష్టించే, ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 2025లో కేవలం 0.7% మాత్రమే పెరిగినప్పటికీ జియో టాప్-20లోకి ప్రవేశించడం విశేషమని డబ్ల్యూఐపీవో వెల్లడించింది. హువావే, శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల సరసన జియో చేరడం భారత డీప్‌టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.

  • భారతదేశంలో టూవీలర్‌ కొనడమంటే.. అదో పెద్ద కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే ఓ వేడుక లాంటిది. ఓ మంచి రోజు చూసి కుటుంబ సభ్యులంతా షోరూంకి వెళ్లి పదుల సంఖ్యలో వాహనాలను పరిశీలించి, రంగులు, హంగులూ అన్నీ చూసి ఓ బండిని కొనుక్కుంటారు. దీనికి ఓ పూటంతా పడుతుందంటే ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. బట్టలు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ కొంటున్నట్టుగా టూవీలర్లను కూడా ఆన్‌లైన్‌లో కొనేవాళ్లు ఎక్కవయ్యారు.

    ఆన్‌లైన్ టూవీలర్ అమ్మకాలు రెట్టింపు

    ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తమ వేదికపై ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల కంటే టయర్-2, టయర్-3 పట్టణాల నుంచే ఎక్కువ డిమాండ్ నమోదవుతోంది. కంపెనీ ప్రకారం, ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వస్తున్నారు.

    ఎలక్ట్రిక్, ప్రీమియం బైక్‌లకు భారీ డిమాండ్

    రోజువారీ ప్రయాణాల కోసం కమ్యూటర్ బైక్‌లతో పాటు ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 20కిపైగా బ్రాండ్లకు చెందిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఆన్‌లైన్ కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.

    తెలుగు నగరాల్లో బుకింగ్స్ జోరు

    దక్షిణ భారతదేశంలో కాకినాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ద్విచక్ర వాహన బుకింగ్స్ 12 రెట్లు పెరిగినట్లు అమెజాన్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని నాగౌర్, జింద్, అలాగే పశ్చిమ ప్రాంతంలోని రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి నగరాల్లో కూడా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

    తొలిసారి ఆన్‌లైన్‌లో కొనేవాళ్లూ ఎక్కువే..

    గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా టయర్-3 పట్టణాలకు చెందిన 2,300కు పైగా వినియోగదారులు అమెజాన్ ద్వారా తొలిసారిగా టూవీలర్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. షోరూంకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ధరలు పోల్చుకోవడం, ఫైనాన్స్ ఆప్షన్లు చూడటం, డిజిటల్ పేమెంట్లతో బుకింగ్ చేయడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

    భారత టూవీలర్ మార్కెట్‌లో కొత్త ధోరణి

    దేశీయ టూవీలర్ మార్కెట్‌లో కూడా ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2025లో భారత టూవీలర్ విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 2.14 కోట్ల యూనిట్లకు చేరి 13%కు పైగా వృద్ధి నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం మోటార్‌సైకిళ్లు ఈ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి.

    భవిష్యత్తులో మరింత విస్తరణ

    ప్రస్తుతం ఆన్‌లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు మొత్తం మార్కెట్‌లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న పట్టణాల్లో డిజిటల్ అవగాహన పెరగడం, విస్తృత బ్రాండ్ ఎంపికలు, ధరల్లో పారదర్శకత కారణంగా భవిష్యత్తులో టూవీలర్ కొనుగోలు అనుభవం పూర్తిగా ఆన్‌లైన్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.

  • న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్‌’ మినహాయింపునిచ్చింది.

    అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జూన్‌ 18న విచారించనుంది.

  • పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే.

    అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది.

    అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి ఎవరికి?

    టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది:

    🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు
    🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు
    🔹 స్వయం ఉపాధి నిపుణులు
    🔹 వ్యాపారులు
    🔹 అద్దె ఆదాయం పొందేవారు
    🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారు

    అంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది.

    సీనియర్ సిటిజన్లకు మినహాయింపు

    60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.

    తొలి వాయిదాలో ఎంత చెల్లించాలి?

    సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది:

    🔹జూన్ 15: మొత్తం పన్నులో 15%
    🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45%
    🔹డిసెంబర్ 15: మొత్తం పన్నులో 75%
    🔹మార్చి 15: మొత్తం పన్నులో 100%

    ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

    ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ సులభంగా చెల్లించవచ్చు. ప్రక్రియ ఇలా ఉంటుంది:

    🔹ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
    🔹e-File → e-Pay Tax ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
    🔹New Payment ఎంచుకోవాలి.
    🔹Income Tax కేటగిరీలో Advance Tax ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
    🔹సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.
    🔹Minor Head 100 (Advance Tax) ఎంపిక చేయాలి.
    🔹చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయాలి.

    గడువు దాటితే జరిమానా తప్పదు

    అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో సెక్షన్ నంబర్లు మారినప్పటికీ, నిబంధనల సారాంశం దాదాపు యథాతథంగా ఉంది. పాత చట్టంలోని సెక్షన్లు 234B, 234Cలకు సమానమైన నిబంధనలు కొత్త చట్టంలో వర్తిస్తున్నాయి.

    🔹 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం పన్నులో 90% కన్నా తక్కువ చెల్లిస్తే నెలకు 1% వడ్డీ విధిస్తారు.
    🔹 వాయిదా వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోయినా నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది.

  • ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.

    మూడు సంస్థలు కలిసి..

    తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్‌ క్లీన్‌ ఎనర్జీ క్యారియర్స్‌, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్‌ రెజిస్టర్‌ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్‌లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్‌సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.

    డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?

    భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.

    50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లు

    శామ్‌సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.

    సర్వర్లకు సముద్రం సవాలే!

    అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్‌వేర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్‌సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్‌మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

    షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలు

    ఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.

    మరిన్ని సముద్ర డేటా సెంటర్లు

    ఈ రంగంలో శామ్‌సంగ్ ఒక్కటే కాదు. జపాన్‌కు చెందిన మిత్సుయి ఒ.ఎస్‌.కె. లైన్స్‌ (MOL), టర్కీకి చెందిన కర్పవర్‌షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్‌ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్‌ డేటా టెక్నాలజీస్‌ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది.

    ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’

NRI

  • అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ ,  గౌరవ అతిథిగా వి. ప్రకాశ్,  తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్,  తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్‌సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.

    తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన  ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

    (చదవండి: న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు)
     

Family

  • ఈ ఏడాది సాంగ్‌రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలో పాప్‌ గాయని, గేయ రచయిత్రి టేలర్ స్విఫ్ట్ ప్రదాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస పరంగానే కాకుండా చేతికి ధరించి ఉంగరం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అంతేగాదు ఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా చరిత్ర సృష్టించిందామె. 

    ఈ ప్రత్యేక వేడుక కోసం పాప్‌ ఐకాన్‌ టేలర్‌ స్విఫ్ట్‌ హుందాగా బ్లాక్‌ కలర్‌ పూల గివెన్చీ గౌనులో రెడ్‌కార్పెట్‌పైకి అడుగుపెట్టింది. దూరం నుంచి చూస్తే ఆ గౌను చాలా సింపుల్‌గా క్లాసిక్‌గా ఉన్నా..దగ్గరకు వస్తే..ఆ డ్రెస్‌పైనే కనిపిస్తున్న ఎండ్రాయిడరీ పూల లుక్‌ హైలెట్‌గా నిలవడం విశేషం. 

    ఈ డిజైనర్‌వేర్‌కి అనుగుణంగా చేతిక ధరించి ఆభరణంతో..భారతీయతను జోడించింది. టేలర్‌ స్విఫ్ట్‌ చేతికి భారతీయ లగ్జరీ ఆభరణాల సంస్థ అమ్రపాలి జ్యువెల్స్‌ రూబీ డైమండ్‌ ఉంగరం ధరించింది. రాజస్థాన్‌ 18 క్యారెట్‌ డైమండ్‌ అండ్‌ రూబీ రింగ్‌గా పిలిచే ఆభరణం ప్రత్యేకంగా నిలవడమే గాక, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ ఉంగరం 18-క్యారెట్ బంగారంలో పొదిగిన 2.41-క్యారెట్ల అండాకారపు రూబీ రత్నం. దాని చుట్టూ పూల వలయం ఆకారంలో మెరిసే రోజ్-కట్ వజ్రాలు అమర్చబడి ఉన్నాయి. 

    ముదురు గులాబీ-ఎరుపు రంగు రూబీ ఈ ఆభరణానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, వజ్రాలు పాతకాలపు శోభను, పురాతన హస్తకళా నైపుణ్యాన్ని హైలెట్‌ చేశాయి. దీన ధర వచ్చేసి భారత కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 9.4 లక్షలట. ఈ మేరకు అమ్రపాలి జ్యువెల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో ఇది భారతీయ రాజరిక హస్తకళకు నిజమైన నివాళిగా పేర్కొనడం గమనార్హం. అలాగే మరో చేతి వజ్రాల బ్రాసెలెట్‌, సున్నితమైన సిట్రిన్‌ డ్రాప్‌చెవిపోగులను జతచేస్తూ..చాలా సింపుల్‌గా లగ్జరీయస్‌గా సందడి చేసింది టేలర్‌ స్విఫ్ట్‌. 

    (చదవండి: పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్‌ సివిల్స్‌ విజయగాథ..! తొలి ప్రయత్నంలోనే సఫలం కానీ..)
     

  • ఎన్నో సివిల్స్‌ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్‌ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్‌ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 

    ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్‌ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. 

    అలా సివిల్స్‌ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్‌ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్‌ఎస్‌కు ఎంపికైంది. అయితే కాజల్‌ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్‌లోనే ఓటమిని చవి చూసింది. 

    నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్‌కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్‌లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి  మెరుగుపరుచుకుని ఐఏఎస్‌ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్‌కి రైల్వే సర్వీస్‌ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్‌ అత్యంత సవాలుగా మారింది. 

    ఈ రెండిటిని బ్యాలెన్స్‌ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్‌ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్‌ని, ప్రిపరేషన్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని  సివిల్స్‌ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.

    (చదవండి:  92 ఏళ్ల టీచరమ్మ ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..)

     

  • ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి.

    బాంబే ఐస్‌ హల్వా..
    కావలసినవి:
    పాలు: ఒకటిన్నర కప్పు,
    పంచదార: కప్పు,
    కార్న్‌ ఫ్లోర్‌:  1/4 కప్పు,
    నెయ్యి: 1/4 కప్పు,
    ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: టీ స్పూన్,
    ఏలకుల పొడి: కొద్దిగా, 
    బాదం ముక్కలు: టేబుల్‌ స్పూన్,
    పిస్తా ముక్కలు: టేబుల్‌ స్పూన్‌.

    తయారీ:

    • ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్‌ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి.

    • స్టవ్‌ ఆన్‌ చేసి మంటను సిమ్‌లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్‌గా కలుపుతుండాలి.

    • ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్‌లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌తో పాటుగా నెయ్యి వేయండి.

    • మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్‌ ఏలకుల పొడి వేసి బాగా కలపండి.

    • మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి.

    • ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి.

    • ఇప్పుడు ఒక బటర్‌ పేపర్‌ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్‌ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్‌ పేపర్‌ షీట్‌ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి.

    • ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్‌ పేపర్‌ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

    • హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్‌ పేపర్‌తో సహా ముక్కలుగా కట్‌ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్‌ హల్వా సిద్ధం!

    మసాలా చీజ్‌ టోస్ట్‌..
    కావలసినవి:
    ఉల్లిపాయ, క్యాప్సికమ్,
    క్యారట్‌: కప్పు (సన్నగా తరిగినవి),
    కారం: 1/2 టీస్పూన్,
    మిరియాల పొడి: 1/2 టీస్పూన్,
    ధనియాల పొడి: 1/2 టీస్పూన్,
    ఉప్పు: రుచికి సరిపడా,
    బ్రెడ్‌ స్లైసెస్‌: 2,
    చీజ్‌: తగినంత

    తయారీ:

    • ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్‌ ముక్కలను తీసుకోండి.

    • అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి,  రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.

    • ఈ కూరగాయల మిశ్రమాన్ని ముక్కలు కాస్త మెత్తబడే వరకు పాన్‌ పై లైట్‌గా వేయించి పక్కన పెట్టుకోండి.

    • ఆ తర్వాత ఒక బ్రెడ్‌ ముక్కను తీసుకుని, ఒక వైపు మాత్రమే లైట్‌గా కాల్చండి. 

    • ఇప్పుడు బ్రెడ్‌ కాల్చిన వైపున మనం తయారుచేసి పెట్టుకున్న వెజిటబుల్‌ మసాలా మిశ్రమాన్ని సమానంగా పరచండి.

    • ఆ మసాలా పైన తగినంత చీజ్‌ వేసి, దానిని కరగనివ్వండి.

    • బ్రెడ్‌ కింద వైపు చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత, అలాగే పైన చీజ్‌ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయండి. అంతే వేడివేడి సువాసనలతో కూడిన మసాలా చీజ్‌ టోస్ట్‌ సిద్ధం.

    ఖట్టా మూంగ్‌..
    కావలసినవి:
    పచ్చ పెసలు: 2 కప్పులు (నానబెట్టినవి),
    పుల్లటి పెరుగు: కప్పు,
    శనగపిండి: 3 టేబుల్‌ స్పూన్లు,
    కారం: 2 టీస్పూన్లు,
    పసుపు: 2 టీస్పూన్లు,
    ధనియాల పొడి: 2 టీస్పూన్లు,
    జీలకర్ర: టీస్పూన్,
    ఆవాలు: టీస్పూన్,
    పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి),
    కరివేపాకు: 5–6 ఆకులు,
    అల్లం ముక్కలు (సన్నని తరుగు): 5–6,
    కొత్తిమీర: 1/2 కప్పు (సన్నగా తరిగినది),
    నూనె: సరిపడినంత, నీళ్లు.

    తయారీ:

    • ముందుగా నానబెట్టిన పెసలను ప్రెషర్‌ కుక్కర్‌లోకి తీసుకోండి.

    • అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

    • పెసలు ఉడికేలోపు, ఒక గిన్నెలో శనగపిండి, పుల్లటి పెరుగు, కారం, పసుపు, ఒక కప్పు నీరు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించండి.

    • తాలింపు వేగాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును పాన్‌లో వేసి, తాలింపు అంతా పప్పుకు పట్టేలా బాగా కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించండి.

    • ఆ తర్వాత, మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి–పెరుగు మిశ్రమాన్ని, ధనియాల పొడిని ఇందులో వేసి బాగా కలపండి.

    • మంటను సిమ్‌లో పెట్టి 3–4 నిమిషాల పాటు ఉడకనిచ్చి, స్టవ్‌ ఆఫ్‌ చేయండి.

    • చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుజరాతీ స్పెషల్‌ ఖట్టా మూంగ్‌ రెడీ! ఇది చపాతీలు, పూరీలు, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.

  • ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్‌ నిజంగానే ఫ్యూచర్‌ వైబ్స్‌ ఇస్తాయి!

    చేతికి కట్టుకునే స్పేస్‌ ల్యాబ్‌! 
    మీ మణికట్టుపై టైమ్‌ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్‌ వాచ్‌ 2.0!’ చంద్రయాన్‌  కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్‌ వాచ్‌ చూడటానికి స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్‌ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్‌ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్‌ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్‌ చేసుకోవచ్చు. కొత్త వాచ్‌ ఫేస్‌లు డిజైన్‌  చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్‌లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్‌ ల్యాబ్‌లా పనిచేస్తుంది. ధర రూ. 10,700.

    మాట్లాడే బుజ్జి రోబో! 
    కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్‌ టేబుల్‌పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్‌ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్‌ ఫన్‌ ను తీసుకొచ్చే గాడ్జెట్‌ ఇదే. ఏఐ వాయిస్‌ ఇంటరాక్షన్‌  కంపానియన్‌  రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్‌ వాయిస్‌ ఇంటరాక్షన్‌  ఫీచర్‌తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్‌ అవుతుంది. దీని చిన్న డిస్‌ప్లేలో కనిపించే క్యూట్‌ యానిమేటెడ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్‌ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్‌ అవుతూ, టేబుల్‌పై కూర్చున్న చిన్న డిజిటల్‌ పెట్‌లా ఫీల్‌ ఇస్తుంది. మాగ్నెటిక్‌ మౌంట్‌కు సపోర్ట్‌ ఉండటంతో కార్‌ డ్యాష్‌బోర్డ్‌పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000.

    మెడలోనే చిన్న ఏసీ, చిన్న హీటర్‌!
    వేçసవిలో ఎండలు మండిపోతుంటే ‘చల్లని గాలి తగిలితే బాగుండు!’ అనిపిస్తుందా? లేదా చలికాలంలో ‘కొంచెం వెచ్చదనం ఉంటే చాలు!’ అని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ వేరబుల్‌ కూలింగ్‌–హీటింగ్‌ పరికరం!

    ఇది కేవలం ఒక గాడ్జెట్‌ కాదు, మీ వ్యక్తిగత ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం. మెడకు వేసుకునే పట్టీతో దీనిని మెడకు లేదా ఛాతీ దగ్గర ధరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో ఉన్న మూడు చల్లదనం స్థాయులు, మూడు వెచ్చదనం స్థాయులు ఎంచుకుని క్షణాల్లో మీకు కావాల్సిన సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో లేదా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మీతో పాటు ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్టీల్, సిలికాన్‌ తో తయారైన దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ధర రూ. 16,760.

  • తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్‌ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్‌లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

    ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్‌ సైన్స్‌ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్‌. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. 

    వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్‌ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్‌నెస్‌ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే  మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. 

    ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్‌ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్‌నెస్‌ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్‌, తేలికపాటి జాగింగ్‌, లక్షిత స్ప్రింట్‌ల శ్రేణి, వాకింగ్‌, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్‌ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.

    ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలు
    ఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్‌ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. 

    అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్‌నెస్‌కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. 

     

    (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్‌! భావోద్వేగంలో ఓ నాన్న..)

     

  • ఆరోజు వాట్సప్‌లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్‌ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్‌ నుంచి వచ్చిన నోటీస్‌. కారణం ఇన్‌ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్‌ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్‌ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్‌ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’

    ‘‘ఇన్‌ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్‌ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు.
    ‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు.

    ‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్‌ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’

    ‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’

    ‘‘ఫైనాన్స్‌ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’  ‘‘లేవు. మా అత్తమామలు వచ్చి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మా మామగారి డామినేషన్‌ భరించలేను. ఏ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పూట ఏది వండాలి, ఇలా అన్నీ ఆయన శాసించినట్లే జరగాలి.’’ ‘‘అవును. పెళ్ళిలోనే అది గమనించాను.’’ అరగంట తర్వాత ఆయన కూతురికి ఫోన్‌ చేసి చెప్పాడు.

    ‘‘మాట్లాడానమ్మా. కారణం ఇదని స్పష్టంగా చెప్పలేదు. ‘మోస్ట్‌ ఇన్‌కంపాటిబుల్‌ వైఫ్‌తో జీవించలేను’ అన్నాడు. ‘మా నాన్న కోతా కాఫీ పౌడర్‌ని కొనమంటే బ్రూక్‌బాండ్‌ కొన్నది లాంటి అన్నీ సిల్లీ కారణాలే. అతని మనసులో అసలు కారణం ఏదో ఉంది. అది దాస్తున్నాడు. అతను ఇంకెవరితోనైనా క్లోజ్‌గా ఉండటం నీకు తెలుసా?’’‘‘లేదు. నాకా అనుమానమే లేదు. అతను అలాంటివాడు కాదు. నేనంటే చాలా చాలా ప్రేమ నాన్నగారు.’’కూతురి కంఠంలోని దుఃఖాన్ని ఆయన పసిగట్టాడు.

    ‘‘నేను వీకెండ్‌కి వచ్చి పర్సనల్‌గా మాట్లాడతానని చెప్పాను. ‘మాది ప్రేమ వివాహం. మీ ప్రమేయంతో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ప్రమేయం వద్దు’ అన్నాడు. రాజీమార్గాలన్నీ ఖండించాడు. నాకు అంతా అయోమయంగా ఉంది.’’ ఆయన బాధగా చెప్పాడు. ఆయన భార్య మాత్రం తొణకలేదు. కూతురికి ధైర్యం చెప్తూ చెప్పింది.

    ‘‘ఈరోజుల్లో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా మామూలు. మీకు పిల్లల కూడా లేరు. కాబట్టి మళ్ళీ పెళ్ళి తేలిక. ఈ కాలం పిల్లలు జీవితాన్ని వృథా చేసుకోవడం లేదు. నీకు వచ్చే జీతం తక్కువేం కాదు. తన మీద నువ్వు ఆధారపడి లేవు. ’’బయటకి చెప్పకపోయినా ఆవిడ మనసులో బాధగానే ఉంది.

    ‘‘ఏం జవాబు చెప్పావు? లాయర్‌ నోటీస్‌ వస్తే మనం జవాబు ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లు అవుతుంది అని విన్నాను.’’ ఆవిడ అడిగింది. ‘‘అతను కచ్చితంగా డైవర్స్‌ కోరుకుంటే నేను అతన్ని పట్టుకుని వేలాడను. మళ్ళీ లాయర్‌ ఖర్చు కూడా ఎందుకు? కామ్‌గా ఉందాం. ఇదే ఫైనల్‌ డెసిషన్‌.’’

    తల్లిదండ్రులకి కూతురు సంగతి తెలుసు కాబట్టి ఆమె మనసు మార్చటానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఆమె విపుల్‌ నుంచి వ్యక్తిగత మెసేజ్‌ కోసం ఎదురు చూసింది. కాని రాలేదు. రెండు వారాల తర్వాత కోర్ట్‌ నించి విడాకుల కేసుకి నోటీస్‌ వచ్చింది. అప్పటికే అందుకు సిద్ధపడ్డ ఆమె విచారించలేదు. వరసగా మూడు వాయిదాలకి సమన్‌ వచ్చినా ఆమె కోర్ట్‌కి హాజరు కాలేదు.
    ∙∙ 
    విపుల్‌ నుంచి ఆమెకి ఓ రోజు మెసేజ్‌ వచ్చింది. ‘ఇప్పుడే విడాకులు మంజూరయ్యాయి. ఎందుకో నీకు చెప్పాలి. ఐ లవ్‌ యు. అందులో మార్పు లేదు. మరి ఈ విడాకులు దేనికి? నేను మరణించాక నా ఆస్తి, పి.ఎఫ్‌. బెనిఫిట్స్‌ నా తల్లితండ్రులకి అందడానికి. భార్యగా నువ్వు హక్కుగా అవి వాళ్ళకి వెళ్ళకుండా కోర్ట్‌కి ఎక్కుతావని నాకు తెలుసు. వాళ్ళు ఆస్తిని పోగొట్టుకుంటారు తప్ప నీతో కోర్ట్‌లో ఫైట్‌ చేయరు. 

    దాన్ని నివారించడానికి విడాకులని ఎన్నుకున్నాను. నీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. నువ్వు నామీద ఆధారపడిలేవు. నీ ఉద్యోగం, నీ ఆస్తి నీకు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత నేను నీకు, నా తల్లిదండ్రులకి, అసలు ప్రపంచానికే కనిపించను. ఫోర్త్‌ స్టేజిలోని నా కేన్సర్‌ ఐదారు నెలలు మించి నన్ను బతకనివ్వదని డాక్టర్‌ చెప్పాడు. గెట్‌ మేరీడ్‌ డార్లింగ్‌. ఐ లవ్‌ యు అండ్‌ గుడ్‌లక్‌.’’ 

    మల్లాది వెంకట కృష్ణమూర్తి

    (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు)
     

  • మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.

    ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.

    అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్‌ స్క్రీనింగ్‌ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 
    1.    పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?
    2.    కంటి చూపు బాగా కలుపుతాడా?
    3.    నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?
    4.    కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?
    5.    చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?
    6.    ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?
    7.    మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?
    8.    ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?
    9.    నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?

    ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

    ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్‌ యాసిడ్, ఐరన్, అయోడిన్‌ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్‌ చెకప్స్‌ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్‌ టైమ్‌ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్‌’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్‌ కుమార్‌, సీనియర్‌ పీడియాట్రిషియన్‌ , పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌

Cartoon