Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

    ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్‌ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్‌లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. 

    ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్‌మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం.

  • అల్లు అర్జున్‌ పెద్ది రివ్యూకు రామ్ చరణ్ స్పందించారు. మీరు మాకు శుభాకాంక్షలు చెప్పడం మాకు టీమ్‌కు చాలా ప్రత్యేకమన్నారు. మీ సినిమా రాకా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. మీరు మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    ఇటీవల పెద్ది వీక్షించిన అల్లు అర్జున్‌ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు.  నిన్న రాత్రి సినిమా చూసిన ఆయన ఈ రోజు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రామ్‌ చరణ్‌ నటన మైండ్‌ బ్లోయింగ్‌. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, నటన,అదిరిపోయే స్టెప్పులతో అలరించాడని అన్నారు. నా బ్రదర్‌ని చూసి నిజంగా ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి చరణ్‌ నిజమైన అర్హుడని ప్రశంసించారు. జాన్వీ కపూర్‌, జగపతి బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా బాగా నటించారు. చరణ్‌ను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టేలా చేసిన దర్శకుడు బుచ్చిబాబుకి ప్రత్యేక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు.

    ఇక పెద్ది సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 
     

     

  • తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు సంచలనాలే వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ‍అనూహ్యంగా విజయం సాధించారు. ఏకంగా సీఎం కుర్చీపై కూర్చున్నారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని రుజువైంది. ద్రవిడ రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు మంచి క్రేజ్ ఉంది. గతంలో ఎంజీఆర్‌ కూడా సినీ రంగ నుంచే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ సైతం ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈనెల 12న పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేయనున్నారు. 

    అయితే తాజాగా సూపర్‌స్టార్, తలైవా అల్లుడు  వైశాగన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో కలిసి అడుగులు వేయనున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కె. అన్నామలై కొత్తగా ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమంలో  వైశాగన్ పాల్గొంటారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్‌ తమిళనాడుతో ఆసక్తికరంగా మారింది. ఇది రజినీకాంత్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం అన్నామలై ద్రవిడ నాట సరికొత్త రాజకీయశక్తిగా అవతరించనున్నారు. 

    రజినీకాంత్ అల్లుడు వైశాగన్ అన్నామలే ఉద్యమంతో చేరడంపై తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆయనకున్న సంబంధం.. తమిళనాడులో వారి కుటుంబానికి ఉన్న పలుకుబడి వల్ల ఆయన రాజకీయ ఎంట్రీపై ప్రజల్లో చర్చ మొదలైంది. యువ ఓటర్లను ఆకర్షించేందుకు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలకు వైశాగన్ చేరిక బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. గతంలో రజనీకాంత్ స్వయంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాగన్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

  • సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్‌ సంజీవ్‌ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  డబ్బులు తీసుకుని సినిమా ప్రమోషన్స్‌కు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిర్మాతల బాధలు తనకు తెలుసని అన్నారు. ఈ బాధ ఆమెకు కూడా తెలుసన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్‌కు రాకుండా ఆపేశారని ఆరోపించారు.

    డబ్బులు తీసుకుని ప్రెస్‌మీట్‌కు రాకపోవడమేంటని సంజీవ్ ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నానని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూవీ షూటింగ్‌కు ఆమె సహకరించారు.. కానీ ప్రమోషన్స్‌ ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. ఆమెకు షూటింగ్‌లో చేతికి గాయం అయితే కూడా మేమే కాంప్రమైజ్ అయ్యామని తెలిపారు.

    రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పెద్ది మూవీ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. మీడియా ముందుకొచ్చి రామ్ చరణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు చాలా గ్రేట్.. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని అన్నారు. మీరెందుకు రారు వరలక్ష్మి శరత్‌కుమార్‌ గారు అని ఆమెను డైరెక్టర్‌ ప్రశ్నించారు. డబ్బుల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు కాల్ చేస్తాడని.. ఆమె మాత్రం ప్రమోషన్స్‌కు రాదన్నారు. కాగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో పోలీస్ కంప్లైంట్‌ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ చరణ్ పెద్ది వివాదం హాట్ టాపిక్‌గా మారింది. జాన్వీ కపూర్ సీన్స్‌పై అభ్యంతరాలు రావడంతో మూవీ టీమ్ ఇప్పటికే వాటిని తొలగించింది. దీనిపై డైరెక్టర్ బుచ్చిబాబు సైతం క్షమాపణలు కోరారు. అభ్యంతరకర సీన్స్‌ను తొలగించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నిత్యామీనన్, జయా బచ్చన్ లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా ది కేరళ స్టోరీ ఫేమ్ ఆదా శర్మ కూడా స్పందించింది.

    హీరోయిన్లు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఆదా శర్మ సూచించింది. అయితే తాను ఇంకా పెద్ది సినిమా చూడలేదని తెలిపింది. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడడం సరికాదని పేర్కొంది. కానీ పాత్రల ఎంపిక అనేది మనపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ  బాధ్యత కేవలం నటీమణులదే కాదని.. నటులు, దర్శకులు, నిర్మాతలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆదా శర్మ అభిప్రాయపడింది.

    కాగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ది మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం జాన్వీ కపూర్‌ రోల్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆమెను కేవలం గ్లామర్‌ చూపించేందుకు మాత్రమే పెట్టారా? అని విమర్శించారు. అంతేకాకుండా కొన్ని సీన్స్‌ మరింత ఓవర్‌గా ఉండడంతో మరింత వ్యతిరేకత వచ్చింది. దీంతో మేకర్స్ ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించారు.

  • ‘సమానత్వం ఉందని చెప్పుకునే మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీవ్రమైన వివక్ష ఎదురవుతోంది. ట్రాన్స్ జెండర్స్ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అవి పోలీస్ స్టేషన్స్ లో కేసులుగా నమోదు కావడం లేదు. కోర్టుల దాకా వెళ్లి జడ్జిమెంట్ పొంది శిక్షలు పడటం లేదు. ఇప్పటిదాకా ఒక్క ట్రాన్స్ జెండర్ కేసు కూడా ఏ కోర్టులోనూ తుది తీర్పు వచ్చి శిక్ష పడలేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఫస్ట్ టైమ్ ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్ సినిమాలోనే ఒక ట్రాన్స్ జెండర్ కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు చూపిస్తున్నాం’ అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఎల్ జి బీ టీ ఏ లీగల్ బ్యాటిల్. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ నటించారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.

    సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఒక కొత్త తరహా కంటెంట్ చూడాలనుకునే ప్రేక్షకులు మా సినిమాకు రావొచ్చు. పుణెలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో  మా సినిమాకు బెస్ట్ ఫిలిం అవార్డ్ దక్కింది. ఫిలిం ఫెస్టివల్స్ కు మాత్రమే ఇలాంటి సినిమాలు పరిమితం కావొద్దు. జనాల మధ్యలో డిస్కషన్ కు రావాలి అనేది మా ఉద్దేశం. గే అండ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి నేను చేసిన చిత్రమిది. సెన్సార్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం’ అన్నారు

    తెలంగాణ స్టేట్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ - మా హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాం కానీ మాకు సరైన వేదిక ఎక్కడా లభించలేదు. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు మా సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించడం హ్యాపీగా ఉంది. మేము నటులము కాము. కానీ మా జీవితంలో మేము ఎలా ఉంటామో అలాంటి పాత్రలనే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ చిత్రంలో తెరకెక్కించారు. మేము ఈ సినిమాలో మా నిజ జీవిత పాత్రలనే పోషించాం. ఈ సినిమా ద్వారా మేము సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అన్నారు.

    గే కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. గే కమ్యూనిటీ కోసం దాదాపు 12 ఏళ్లుగా పోరాడుతున్నాను. మన సినిమాల్లో గే క్యారెక్టర్స్ ను కామెడీ కోసం ఉపయోగించడం చూశాం. కానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు వచ్చే అనేక చిత్రాల్లో ఎంతో డెప్త్ గా గే కమ్యూనిటీ సమస్యలను తెరకెక్కించడం నేను గమనించాను. ఇతర రాష్ట్రాల్లో  గే లైఫ్ మీద ఇన్ డెప్త్ మూవీస్ సీరియస్ అప్రోచ్ తో వచ్చాయి. ఆ సినిమాల వల్ల అక్కడి సమాజం గే కమ్యూనిటీని చూసే విధానం మారిపోయింది. తెలుగులో ఫస్ట్ టైమ్ అలాంటి ప్రయత్నం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన మాతో ట్రావెల్ చేసి మా జీవితాన్ని దగ్గరగా గమనించారు. ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు మీ సపోర్ట్ దక్కాలి. ఈ చిత్రంతో మా జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాము. అన్నారు.

    ట్రాన్స్ జెండర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సనా ఖాన్ మాట్లాడుతూ..మా జీవితాలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. బయట ప్రపంచం చూడని మా జీవిత ప్రయాణాన్ని, మా సమస్యలు, భావోద్వేగాలను ఈ చిత్రంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డిగారు చూపించారు. మేము ఏంటి అనేది కాకుండా మా ప్రతిభ అందరికీ తెలియాలి. ఇంకా మాకు మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
     

  • నందమూరి బాలకృష్ణ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని ఎన్‌బీకే111 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇవాళ బాలయ్య బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్‌బీకే111 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో నోట్లో సిగరెట్ పెట్టుకుని బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ఈ ఫైట్ సీన్ చూస్తుంటే మరో యాక్షన్‌ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీతో ఫైట్‌ సీన్‌ మరి ఓవర్‌గా అనిపిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ కంపోజ్ చేస్తున్నారు. 
     

  • తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభంజనం తర్వాత మరో స్టార్ హీరో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్‌లో తన ఎంట్రీపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఇప్పటికే రాఘవ లారెన్స్ వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే దర్శకుడు భారతీ రాజా మరణంతో తన సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.

    రాఘవ లారెన్స్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'అందరికీ నమస్కారం.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ భరతిరాజా మృతికి సంతాపం ప్రకటించింది. ఈ నష్టం మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత వ్యక్తిగతంగా నన్ను బాధ కలిగిస్తోంది. భరతిరాజా చిత్ర పరిశ్రమకు చేసిన అపారమైన సేవ పట్ల గౌరవంతో.. నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నా. ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నా నిర్ణయం ప్రకటిస్తా' అని పోస్ట్ చేశారు.

    కాగా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ప్రకటనపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. 
     

  • దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్‌ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు. 

    ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్‌లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో  స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.

    అనారోగ్యంతోనే షూటింగ్..

    తుడరుమ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.

    భారతిరాజా కెరీర్..

    దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్‌ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది.  ఆయన  1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్‌లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు.

     

  • దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.

    కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్‌కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు. 
     

     

  • బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్‌ రావేల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    తాజాగా రిలీజైన టీజర్‌లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్‌గా ఉండనుంది. స్పై యూనివర్స్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిల్మ్స్‌ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్‌ కీలక పాత్ర పోషించారు. 
     

  • మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్ నటించిన థ్రిల్లర్ మూవీ దృశ్యం-3. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. మే 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో రిలీజైన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

    అయితే దృశ్యం-3 మాత్రం తెలుగులో డబ్బింగ్ చేసి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ రీమేక్ చేయకపోవడంపై సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రీమేక్‌ చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. 

    దృశ్యం-3 మూవీని తెలుగులో రీమేక్ చేయడం లేదని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇతర భాషల్లోని హీరోల ఇమేజ్‌‌ దృష్ట్యా ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం రీమేక్ జరుగుతోందని తెలిపారు. ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారని.. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ మార్చుకుంటామని మర్యాదపూర్వకంగా అడిగారని వెల్లడించారు. అందుకే తాను రీమేక్‌ చేసేందుకు అంగీకరించినట్లు జీతూ వెల్లడించారు. దీంతో తెలుగు రీమేక్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

     

     

  • దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్‌.. కవర్‌ సాంగ్స్‌, డబ్‌ స్మాష్‌తో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్‌ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.

    టైంపాస్‌ చేస్తున్న దీప్తి
    ఇటీవలే షణ్ముఖ్‌ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్‌ సాంగ్‌ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్‌ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.

    ఏం చేశానని ఇంత ప్రేమ?
    'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్‌లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.

    ఆ ప్రయత్నంలోనే ఉన్నా..
    నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్‌' అని దీప్తి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్తున్నారు.

    చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల

  • దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్‌ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.

    భారతీరాజా దర్శకత్వం వహించిన  తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్‌ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్‌ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్‌పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్‌ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.

    కావేరీ జలవివాదంతో మొదలు.. 
    రజనీకాంత్‌, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్‌ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్‌గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్‌ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్‌ స్టార్‌గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్‌ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.

    రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా.. 
    ఇక రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్‌స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్‌ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్‌ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు.  

    చివరిదశలో ఇలా.. 
    భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్‌ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్‌. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్‌ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా చెక్కులను తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌ ఖుస్రో పాషా, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి, టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి బి. షఫీయుల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఉన్నతాధికారుల బృందం సౌదీ అరేబియాకు వెళ్లి బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించిందని పేర్కొన్నారు.

    బాధితుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భారత కాన్సులేట్, సౌదీ అధికారులతో సమన్వయం చేసి అంత్యక్రియలతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ విషాదం తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడటంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
     

  • సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలలో భాగంగా బోర్ హోల్స్ పనులను పరిశీలించారు.

    దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలోనే రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టామని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.

    కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వానికి పేరు రావద్దని.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరపైకి తీసుకువచ్చారన్నారు. చేవెళ్ల నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్పు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు లక్ష 45 వేల కోట్లు ఖర్చు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు.

    బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సంస్థల చేత బ్యారేజ్ కొంగుబాటుపై దర్యాప్తు జరిపించడం జరిగిందన్నారు. ఆఫ్రి సంస్థ ఆధ్వర్యంలో రీ డిజైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. జూలై మొదటి వారంలోపు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: భార‌త్ ఫ్యూచ‌ర్‌ సిటీలో  ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ( FCDA) భ‌వ‌నాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్ది ప్రారంభించారు. ఎఫ్‌సీడీఏ లోగో, వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేం న‌రేంద‌ర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్‌ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ‘‘నిన్న 2 గంటల వానకే హైదరాబాద్‌లో నీరు నిలిచిపోయింది. అంతర్జాతీయ నగరం అన్ని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి?. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత?. ఈ వరద పరిస్థితి మీ కబ్జాల పుణ్యమే కదా’’ అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

    ‘‘పదేళ్లు అభివృద్ధి చేశామన్న వాళ్లు వరదపై మాట్లాడాలి. ఫ్యూచర్‌ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ  సంకల్పాన్ని అడ్డుకోవాలని రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారు. భవిష్యత్‌ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు’’ అంటూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు.

     

     

  • సాక్షి ,హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అన్నారు. అయితే సాధారణ ప్రజలను గౌరవిస్తామని రౌడీల, గుండాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.ఈ రోజు (బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.   రాష్ట్రంలో మావోయిజం అంతమైందని అందుకే దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గ్రేహౌండ్స్‌ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

    గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్న 1700 మంది సిబ్బందిని అత్యవసర విభాగాలైన సైబర్‌ క్రైమ్‌, నార్కోటిక్‌ శాఖలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్‌క్రైమ్‌ ప్రస్తుతం పోలీసులకు సవాల్‌గా మారిందని అందుకే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సైబర్‌ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ సిబ్బందికి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

    యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయ్‌,డ్రగ్స్‌ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నాం. మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లను త్వరలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని ప్రకటించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈగల్‌ ఫోర్స్‌ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కిరాణా షాపు మాటున నీతూ భాయ్‌ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూ భాయ్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు పీడీ యాక్ట్‌ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్‌ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది.

    రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్‌రాంగూడలో గంజాయి డాన్‌ నీతూ భాయ్‌ కోసం నిఘా పెట్టిన ఈగల్‌ ఫోర్స్‌.. గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్‌ ఫోర్స్‌ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్‌ పరారైంది.

     

     

Politics

  • కోల్‌కతా: టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా, కాకోలి ఘోష్ దస్తిదార్, సయోనీ ఘోష్ సహా 19 మంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి మద్దతు ఇస్తున్నామన్న తమ నిర్ణయాన్ని అందులో వెల్లడించినట్టు సమాచారం.

    కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో రెబెల్‌ ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేసి, ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించినట్టు జాతీయ మీడియా తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టీఎంసీ సంస్థాగత సంక్షోభం బయటపడింది. తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రారంభమైన తిరుగుబాటు ఇప్పుడు పార్లమెంట్ వరకు విస్తరించింది.

    అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. అంతర్గత అసంతృప్తిగా మొదలైన వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్యేల, ఎంపీల సంఖ్యాబలం, సంస్థాగత నియంత్రణ, రాజకీయ చట్టబద్ధతపై పోరాటంగా మారింది.

    శాసనసభలో మొదలైన చీలిక పార్లమెంట్ వరకు విస్తరించింది. సీనియర్ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


    తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు

    1. శత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్)
    2. కాకోలి ఘోష్ దస్తిదార్ (బరాసత్)
    3. జగదీశ్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)
    4. ఖలీ ఉర్ రెహ్మాన్ (జంగీపూర్)
    5. యూసుఫ్ పఠాన్ (బెహ్రంపూర్)
    6. అబూ తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)
    7. పార్థ భౌమిక్ (బారక్‌పూర్)
    8. బాపి హల్దార్ (మథురాపూర్)
    9. సాయోని ఘోష్ (జాదవ్‌పూర్)
    10. మాలా రాయ్ (కోల్‌కతా దక్షిణ)
    11. మితాలి బాగ్ (ఆరాంబాగ్)
    12. దీపక్ అధికారి (ఘటాల్)
    13. కాలీపద సోరెన్ (ఝార్‌గ్రామ్)
    14. జూన్ మాలియా (మెదినీపూర్)
    15. అరూప్ చక్రవర్తి (బాంకురా)
    16. షర్మిలా సర్కార్ (వర్ధమాన్ తూర్పు)
    17. అసిత్ కుమార్ మాల్ (బోల్‌పూర్)
    18. శతాబ్ది రాయ్ (బీర్‌భూమ్)
    19. రచనా బెనర్జీ (హుగ్లీ)
  • బెంగాల్ రాజ‌కీయాలు ఫాలో అయ్యే వారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స‌యోనీ ఘోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాక్క‌ర్లేదు. త‌మ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీని ఎవ‌రైనా ఒక్క మాట అంటే సివంగిలా విరుచుకుప‌డే స‌యాని తాజాగా సంచ‌ల‌నానికి కేంద్ర బిందువ‌య్యారు. తిరుగుబాటు ఎంపీల‌తో చేతులు క‌లిపి మ‌మ‌తను ఒంటరి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్న‌టికీ మ‌మ‌త వెంటే ఉంటాన‌ని కొద్ది రోజుల క్రిత‌మే బాస చేసిన స‌యాని ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకున్నారు. క‌ష్ట‌కాలంలో అధినేత్రిని ఒంట‌రి చేసి త‌న దారి త‌ను చూసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారుకు స‌లాం కొట్టారు!

    మొన్న ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌యోనీ ఘోష్ (Saayoni Ghosh) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ త‌ర‌పున రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించి ఎన్నికల ప్ర‌చారం నిర్వ‌హించారు. న‌టి, గాయ‌ని అయిన ఆమె త‌న వాగ్దాటి, మేన‌రిజంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. దీంతో ఆమె స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తారు. మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆమెను ఎంతో ప్రోత్స‌హించారు. పార్టీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి నెత్తిన పెట్టుకున్నారు. జాద‌వ్‌పూర్ నుంచి లోక్‌స‌భ‌కు పంపి అక్కున చేర్చుకున్నారు. స‌యాని కూడా పార్టీకి ఎంతో విధేయంగా ఉంటూ మ‌మ‌త న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డుతూ పార్టీలో కీలకంగా మారారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో స‌మ‌యం దొరికిన‌ప్పుల్లా త‌న వాగ్ధాటితో ఎన్డీఏ స‌ర్కారును ఏకీపారేసి దేశ ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆక‌ర్షించారు.

    ప‌రిస్థితి తారుమారు
    మ‌మతా బెన‌ర్జీని ప్ర‌ధాన‌మంత్రిగా చూడాల‌నుకుంటున్న‌ట్టుగా ఒకాకొక సంద‌ర్భంలో ప్ర‌క‌టించారు. మ‌మత పీఎం అయితే ఆమె బెంగాల్ సీఎం అవుతారు అన్నంత‌గా ప్ర‌చారం సాగింది. ఇదంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోని ముచ్చ‌ట‌. ఇప్పుడు ప‌రిస్థితి తారుమారయింది. మ‌మ‌తా బెన‌ర్జీ కోట బ‌ద్ద‌ల‌యింది.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. అధికారం పోవ‌డం కాదు ఏకంగా పార్టీయే మ‌మ‌తా బెన‌ర్జీ చేతుల్లోంచి జారిపోయే ప‌రిస్థితులు త‌లెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేస్తే, తాజాగా ఎంపీలు.. మ‌మ‌త‌కు చేయిచ్చారు. ఎన్డీఏకు మ‌ద్ద‌తుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఇచ్చిన లేఖ‌లో సంత‌కాలు చేసిన 20 మంది తృణమూల్ రెబ‌ల్ ఎంపీల్లో సయోనీ ఘోష్ ఉన్నార‌న్న సంగ‌తి తాజాగా వెలుగులోకి రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది.

    అప్పుడ‌లా.. ఇప్పుడిలా..
    తాను ఎన్న‌టికీ బీజేపీ పంచ‌న చేర‌నంటూ రాఘ‌వ్ చ‌ద్దా పార్టీ మారిన సంద‌ర్భంలో వ్యాఖ్యానించిన‌ సయోనీ ఘోష్.. ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించ‌డం సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. త‌మ‌కు అండ‌గా హ‌వాయి చెప్పులు, తెల్ల‌చీర ధ‌రించిన మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నార‌ని.. ఆ స‌మ‌యంలో స‌యోనీ చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌నం గుర్తు చేసుకుంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అప్పుడు అలా మాట్లాడిన ఆమె.. ఇంత‌లోనే ఎలా ఎన్డీఏకు ఎలా జై కొడుతుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీకి అత్యంత స‌న్నిహితురాలిగా మెలిగిన సయోనీ ఘోష్.. తిరుగుబాటు ఎంపీలతో చేతులు క‌లుపుతార‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని జ‌నం అంటున్నారు. ఎన్నిక‌ల్లో తేడా కొడితే ముందుగా జంప్ అయ్యేది ఈలాంటి వారే అంటూ సోష‌ల్ మీడియాలో ఆమెపై కొంత‌మంది చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.

    కొస‌మెరుపు: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు సయోనీ ఘోష్. "మేము ఓడిపోలేదు. ఓట్ల దోపిడీ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా భావించే ఎంపీ మాలా రాయ్ కూడా రెబల్ శిబిరంలో చేరిపోయారు. 

  • న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.

    ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

    ఈ సందర్భంగా ఎన్‌డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్‌డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. 

    అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్‌డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. 

    ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.

    దేశ అవసరాలే మా విధానాలకు పునాది 
    ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్‌సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.

    దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. 

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

    టీఎంసీ అంతర్గత అసంతృప్తి, ప్రముఖ నేతల నిష్క్రమణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.

    జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనను సోనియా గాంధీ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుందని ఆమె సూచించినట్టు చెబుతున్నారు.

    ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ, మమతా బెనర్జీ మధ్య చర్చ జరిగినట్టు సోర్సెస్‌ పేర్కొన్నాయి. టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి, వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.

    మమత ఏమన్నారు? 
    మమతా బెనర్జీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరిగితే అనుసరించాల్సిన విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. ఆ ప్రతిపాదన ప్రకారం.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వవచ్చని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.

    అయితే, ఇలాంటి ప్రతిపాదన నిజంగా ఉందా? లేదా? అన్న విషయంపై కాంగ్రెస్, టీఎంసీ నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. పార్టీ భవిష్యత్ దిశ, అభిషేక్ బెనర్జీ పాత్రపై టీఎంసీలో అసంతృప్తి ఉన్నట్టు వస్తున్న వార్తల మధ్య ఈ ఊహాగానాలు వెలువడ్డాయి.

    అభిషేక్ బెనర్జీ-రాహుల్ గాంధీ భేటీపై ఆసక్తి
    ఈ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి రేపేలా అభిషేక్ బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం సానుకూలంగా సాగిందని తెలుస్తోంది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశం గంటన్నర కంటే అధిక సమయం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

  • న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

    ఎన్‌డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.

    అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

    కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్‌లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్‌సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది.

  • సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.

    రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి..

    ..పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి  ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్‌కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

  • ఒకే ఒక్క ఓటమి.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఆ తర్వాతి నుంచి పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్‌బై చెబుతుండడంతో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది.  

    తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కంటే మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తిరుగుబాట్లు, వలసలు పెరగడంతో ఆ బలహీనత బయటపడింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన టీఎంసీ.. ఇప్పుడు నిజమైన రాజకీయ పార్టీగా తిరిగి నిలబడుతుందా? లేక క్రమంగా విచ్ఛిన్నమవుతుందా?

    తృణమూల్ కాంగ్రెస్ సాధారణ రాజకీయ పార్టీలా ఎదగలేదు. అది ముందుగా ఒక భావోద్వేగంగా రూపుదిద్దుకుంది. మమతా బెనర్జీ చుట్టూ ఆవేదన, ప్రతిఘటన, వామపక్ష వ్యతిరేక భావన, వీధి పోరాట స్ఫూర్తి, ప్రాంతీయత వంటి అంశాలు చేరి ఒక రాజకీయ శక్తిగా మారాయి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలు విజయవంతమైంది. మమతా ప్రజల అసంతృప్తిని ఉద్యమంగా మార్చి, దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. బెంగాల్‌లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు 2011లో ముగింపు పలికారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

    అయితే 2026 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించగా, తృణమూల్ సుమారు 80 స్థానాలకు పరిమితమైంది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. ఓటమి ఒక్కటే సమస్య కాదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత బలహీనతలు బయటపడ్డాయి.

    పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకున్నా పార్టీ నియంత్రణ బలహీనంగా కనిపించింది. మమతా నిర్వహించిన సమావేశాలకు తక్కువ మంది నేతలు రావడం, పలు కమిటీలను రద్దు చేయడం వంటి పరిణామాలు సంస్థాగత సంక్షోభాన్ని సూచించాయి.

    పార్లమెంటులో తృణమూల్ స్థితి కూడా అస్థిరంగా మారింది. రాష్ట్ర అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ బలం, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం లేకపోవడంతో ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించడం ప్రారంభించారు. తిరుగుబాటు వర్గం నిజమైన తృణమూల్‌గా నిలిస్తే, చాలామంది తమ రాజకీయ మనుగడ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన నాయకురాలు. కానీ ఆమె చుట్టూ పెరిగిన నాయకత్వంలో చాలామంది అధికార రాజకీయాలకు మాత్రమే అలవాటు పడ్డారు. అధికారం ఉన్నప్పుడు విశ్వాసంగా కనిపించిన నాయకులు, ఓటమి తర్వాత వైఖరి మార్చుకోవడం దీనికి ఉదాహరణ.

    చేయాల్సినవి ఇవే.. 
    ప్రస్తుతం మమతా ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీపై నియంత్రణ కొనసాగించడం, తిరుగుబాటు వర్గంతో రాజీకి రావడం, కింది స్థాయి నుంచి తిరిగి నిర్మాణం చేపట్టడం, లేక కాంగ్రెస్‌-వామపక్షాలతో పెద్ద కూటమి ఏర్పాటుపై ఆలోచించడం. ఇవి అంత ఈజీ కాదు. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలిగితేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.

    తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ నిజమైన రాజకీయ పార్టీగా నిలిచి పునర్నిర్మాణం చేసుకోగలదా? లేక నాయకురాలి వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడిన వ్యవస్థగా క్రమంగా విచ్ఛిన్నమవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

Business

  • న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం ‘బీవైడీ’ భారత అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా, దేశీయ మార్కెట్లో తన తొలి ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ ‘సీల్‌ యూ’ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కంపెనీ అభివృద్ధి చేసిన డీఎం–ఐ (డ్యూయల్‌ మోడ్‌ ఇంటెలిజెంట్‌) సాంకేతికత ఆధారంగా రూపొందిన తొలి వాహనం ఇదేనని తెలిపింది. దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను లాంచ్‌ సమయంలోనే వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.

    ‘ఎలక్ట్రిక్‌–ఫస్ట్‌ విధానంలో పనిచేసే డీఎం–ఐ 
    సాంప్రదాయ హైబ్రిడ్‌ వాహనాల్లో పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రధానంగా ఉండి, బ్యాటరీ కేవలం అదనపు సపోర్ట్‌ ఇస్తుంది. కానీ, బీవైడీ పరిచయం చేస్తున్న డీఎం–ఐ టెక్నాలజీ దీనికి భిన్నంగా ‘ఎలక్ట్రిక్‌–ఫస్ట్‌’ విధానంలో పనిచేస్తుంది. అంటే, రోజువారీ ప్రయాణాల్లో కారు గరిష్టంగా బ్యాటరీతోనే నడుస్తుంది. దూర ప్రయాణాల్లో లేదా బ్యాటరీ అయిపోతున్న సమయంలో మాత్రమే మైలేజ్‌ పెంచడానికి పెట్రోల్‌ ఇంజిన్‌ సహాయపడుతుంది. ఈ సరికొత్త ‘సీల్‌ యూ ఎస్‌యూవీ’ని విదేశాల నుండి నేరుగా భారత్‌కు దిగుమతి చేయనున్నారు. భారత్‌లోనే బ్యాటరీల తయారీపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

    పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ 
    అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల కారణంగా ఈ మే నెలలో ఇంధన ధరలు నాలుగు సార్లకు పైగా పెరగడంతో భారత్‌లో ఈవీల పట్ల ఆసక్తి పెరిగిందని రాజీవ్‌ చౌహాన్‌ తెలిపారు. ‘వాహన్‌’ డేటా ప్రకారం.. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 25,000 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఇప్పటికే 14,000 మందికి పైగా బీవైడీ కస్టమర్లు ఉన్నారు. పూర్తి ఎలక్ట్రిక్‌ కార్లకు మారే ముందు కస్టమర్లకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చౌహాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

    1,200 కి.మీ పరిధి 
    ‘‘ఒక్కసారి పూర్తి ఛార్జింగ్, ఫుల్‌ పెట్రోల్‌ ట్యాంక్‌తో ఈ కారు ఏకంగా 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. రోజూ సిటీలో 50 కిలోమీటర్లు తిరిగే వారు, ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఛార్జ్‌ చేసుకుంటే నెలల తరబడి పెట్రోల్‌ అవసరం లేకుండా కేవలం ఈవీ మోడ్‌లోనే దీనిని నడపవచ్చు’’ అని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహిక ల్స్‌ బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా మెరుగైందన్నారు. కేవలం హైవేలపై మాత్రమే ప్రణాళిక అవసరమన్నారు.

  • దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం​ (24 క్యారెట్లు) ఏకంగా రూ.4300 క్షీణించి రూ.1,49,010లకు దిగివచ్చింది. అలాగే ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,950 తగ్గి రూ.1,36,600లకు వచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాటపట్టిన బంగారం ధరలు క్రితం ఒక్కసారిగా ఎగిసి మళ్లీ ఈరోజు అంతకు మించి భారీగా పతనమమ్యాయి. ఒక్కరోజులో పసిడి ధరలు ఈ స్థాయిలో పతనమవడానికి ప్రధాన కారణాలు ఏంటన్నది ఈ కథనంలో చూద్దాం.

    తాజా మార్కెట్‌ డేటా పరిశీలిస్తే, ఈరోజు (జూన్‌ 10) బంగారం ధరలు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడమే అని స్పష్టంగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో కూడా అదే ప్రభావం ప్రతిబింబించింది.

    ఎందుకు పడిపోయాయి?

    గ్లోబల్‌ గోల్డ్‌లో భారీ అమ్మకాలు
    అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ధరలు 2%–3% వరకు పడిపోయాయి. దీంతో భారత మార్కెట్లో ఎంసీఎక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా దాదాపు 2% క్షీణించి రూ.1.49 లక్షల స్థాయికి దిగివచ్చాయి.

    అమెరికా ద్రవ్యోల్బణ డేటాపై ఆందోళన
    అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల ముందు ట్రేడర్లు భారీగా ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్‌ వడ్డీ రేట్లను ఎక్కువకాలం పైనే ఉంచవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడి తెచ్చాయి.

    డాలర్‌, ట్రెజరీ ఈల్డ్స్‌ బలపడటం
    అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ బలపడటంతో వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఈ అంశం కూడా ధరల పతనాన్ని వేగవంతం చేసింది.

    రికార్డు స్థాయిల తర్వాత ప్రాఫిట్‌ బుకింగ్‌
    ఇటీవలి వారాల్లో బంగారం చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకుంది. దీంతో పెద్ద ఫండ్‌లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

  • ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ రియల్‌మీ భారత  మార్కెట్లో కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మీ పీ4ఆర్‌ 5జీ’ (Realme P4R 5G) విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రధాన ఆకర్షణగా చేసుకుని P4 సిరీస్‌లో తాజా మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్‌లో ఏకంగా  8,000mAh ‘టైటాన్’ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చిన ఫోన్లలో ఇది ఒకటిగా కంపెనీ పేర్కొంటోంది. పూర్తి ఛార్జ్‌పై మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని రియల్‌మీ చెబుతోంది.

    ఫోన్‌ ప్రధాన ఫీచర్లు

    • స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో కెమెరా, చిప్‌సెట్‌ల కంటే ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రియల్‌మీ ఈ ఫోన్‌ను రూపొందించింది. 8,000mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌ను దీర్ఘకాలం కాపాడే టెక్నాలజీ కారణంగా ఏడు సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరు నిలకడగా ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.

    • ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల సన్‌లైట్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌కు శక్తినిచ్చే మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై ఇది పనిచేస్తుంది.

    • గేమింగ్ సమయంలో హీట​్‌ సమస్యను తగ్గించేందుకు 5,300mm² ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, వన్-ట్యాప్ కూలింగ్ వంటి ఫీచర్లను అందించారు.

    • ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందించారు. AI Portrait Glow, AI Eraser 2.0, AI Ultra Clarity, AI Unblur వంటి AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

    • భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.8 మిల్లీమీటర్లు మాత్రమే. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, 400 శాతం అల్ట్రా వాల్యూమ్ సపోర్ట్ చేసే సూపర్ లీనియర్ స్పీకర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    ధరలు, ఆఫర్లు

    రియల్‌మీ పీ4ఆర్‌ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 4GB + 128GB వేరియంట్‌  రూ.18,999లకు, 6GB + 128GB మోడల్‌ రూ.20,999లకు, 6GB + 256GB వేరియంట్‌ రూ.22,999లకు లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం లభించనుంది. దీంతో ప్రారంభ ధర రూ.16,999కు తగ్గనుంది.

    ఈ ఫోన్ టైటానియం గ్లేర్‌, సిల్వర్‌ గ్లేర్‌, లావండర్‌ గ్లేర్‌ అనే రంగుల్లో లభించనుంది. తొలి విక్రయాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

    ఇదీ చదవండి: బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్‌

  • ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్‌ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్‌ ట్రావెల్‌–టెక్‌ యూనికార్న్‌ ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్‌’, వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులున్న ‘ట్రూహోమ్‌ ఫైనాన్స్‌’, ‘వీగాలాండ్‌ డెవలపర్స్‌’, ‘అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌’, ‘మెహతా హైటెక్‌ ఇండస్ట్రీస్‌’ల పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచి్చంది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్‌ 1–5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. 

    ప్రిజమ్‌ (ఓయో) భారీ ఇష్యూ 
    గ్లోబల్‌ ట్రావెల్‌–టెక్‌ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న ‘ప్రిజమ్‌’ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7–8 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్‌ ప్రి–ఫైలింగ్‌ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్‌ ‘ఒరవెల్‌ స్టేస్‌’ 2025 సెప్టెంబరులో ‘ప్రిజమ్‌’గా పేరు మార్చుకుంది. 

    ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ ఇష్యూ  @ రూ.3,000  
    ట్రూహోమ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. అలాగే  ప్రమోటర్‌ సంస్థ ‘మ్యాంగో క్రెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ రూ.1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేసుకోవడానికి, రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, ఆర్‌బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగించనుంది.  

    వీగాలాండ్‌ డెవలపర్స్‌ 
    వీ–గార్డ్‌ గ్రూప్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘వీగాలాండ్‌ డెవలపర్స్‌’ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, రానున్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది.  

    అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌ 
    అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్‌ అందించే ఈ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉంటుంది. ప్రమోటర్‌ యూపీఎల్‌ లిమిటెడ్‌తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు మెల్‌వుడ్‌ హోల్డింగ్స్‌– ఐఐ, కేఐఏ ఈబీటీ స్కీమ్‌–2 కలిపి 3.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. 

    మెహతా హైటెక్‌ ఇండస్ట్రీస్‌
    అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా గరిష్టంగా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేయనుంది.

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగవంతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ఖాళీ స్థలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో, నగర పశ్చిమ కారిడార్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ కూడా ఇదే మార్గంలో పయనించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ మాత్రం విభిన్నమైన దృక్పథంతో రూపుదిద్దుకుంది.

    సుమారు 28.6 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పది నివాస టవర్లను స్థలానికి చుట్టుపక్కల భాగంలో ఏర్పాటు చేశారు. ఫలితంగా.. ఈ ప్రాజెక్ట్ మధ్యభాగం విశాలమైన పచ్చదనంతో కూడిన ఓపెన్ స్పేస్‌గా నిలిచింది. చాలా ప్రాజెక్టులు నిర్మాణ విస్తీర్ణాన్ని గరిష్టంగా పెంచడంపై దృష్టి పెడితే, ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ మాత్రం ప్రకృతి, పచ్చదనం, ఖాళీ ప్రదేశాలను రోజువారీ జీవనంలో కీలక భాగంగా మార్చింది.

    ఆలోచనాత్మక ప్రణాళికతో రూపుదిద్దుకుంది
    ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్‌ను టవర్ల మధ్య విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని వల్ల ప్రతి ఇంటికి పుష్కలమైన సహజ కాంతి అందడమే కాకుండా.. మధ్యలోని ల్యాండ్‌స్కేప్ విస్తృతంగా, అడ్డంకులు లేకుండా ఉంటుంది. సహజ గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా ఉండటం వల్ల ఇళ్లలో క్రాస్ వెంటిలేషన్ మెరుగుపడి, ఆరోగ్యకరమైన.. సౌకర్యవంతమైన జీవన వాతావరణం ఏర్పడుతుంది.

    అంతే కాకుండా.. ప్రతి నివాసాన్ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. విశాలమైన ముఖ ద్వారాలు, ఆలోచనాత్మక లేఅవుట్లు, పుష్కలమైన సహజ కాంతి ప్రవేశించేలా చేసిన నిర్మాణం వల్ల ప్రతి ఇల్లు ప్రకాశవంతంగా, గాలితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

    సమతుల్య జీవనశైలికి అత్యాధునిక సౌకర్యాలు
    ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్‌లో రెండు ప్రత్యేక క్లబ్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రతి ఒక్కటి ఆధునిక జీవనంలోని విభిన్న అవసరాలను తీర్చే విధంగా రూపుదిద్దుకుంది.

    క్లబ్‌హౌస్ సఫైర్ ప్రధానంగా ఆరోగ్యం, ఫిట్‌నెస్, వినోదాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో జకుజీతో కూడిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక జిమ్, యోగా, ఏరోబిక్స్ స్టూడియోలు, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, స్పా వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

    క్లబ్‌హౌస్ ఎమరాల్డ్ విశ్రాంతి, సామాజిక కార్యక్రమాలు, వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో బాంకెట్ హాల్, మినీ థియేటర్, కో-వర్కింగ్ స్పేస్‌లు, కేఫ్, క్లినిక్, అలాగే సమావేశాలు, వేడుకలకు అనువైన రూఫ్‌టాప్ BBQ డెక్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

    అన్ని వయసుల వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు
    ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్‌లోని అవుట్‌డోర్ సౌకర్యాలు కూడా నివాసితులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ అండ్ పాడిల్ కోర్టులు, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, స్పెషల్ సైక్లింగ్, జాగింగ్ ట్రాక్‌లు, సెన్సరీ పార్క్, యాంఫీథియేటర్, స్కేటింగ్ రింక్, మినీ గోల్ఫ్ ఏరియా, పెట్ పార్క్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తరానికి అనువైన సమాజాన్ని నిర్మించాలనే ప్రాజెక్ట్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.

    నగరంతో అనుసంధానం
    ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ ప్రశాంతమైన, పచ్చదనంతో నిండిన జీవన వాతావరణాన్ని అందిస్తూనే.. హైదరాబాద్‌లోని ప్రధాన వ్యాపార, జీవనశైలి కేంద్రాలకు కనెక్టివిటీని కలిగి ఉంది.

    ఇది ORR సమీపంలో ఉండటంతో.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు సుమారు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 35 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. ప్రముఖ పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలు, వినోద ప్రదేశాలు కూడా సమీపంలో ఉండటం నివాసితులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

    వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్
    గత కొన్ని సంవత్సరాలుగా తెల్లాపూర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం.. నేడు హైదరాబాద్‌లో అత్యంత ఆశాజనకమైన నివాస గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది.

    మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న సామాజిక సౌకర్యాలతో.. తెల్లాపూర్ ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్ వంటి స్థిరపడిన ప్రాంతాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అంతేకాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడి విలువను కూడా అందిస్తోంది.

    స్థిరపడటానికి సరైన సమయం
    ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ కేవలం ఒక నివాస ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది పచ్చదనం, విశాలమైన ఖాళీ ప్రదేశాలు, ఆధునిక సౌకర్యాలు, నగర కనెక్టివిటీని సమతుల్యం చేస్తూ రూపొందించిన సమగ్ర జీవన సముదాయం. ఇక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మధ్య ప్రశాంత జీవనం, విశాలమైన దృశ్యాలు, అలాగే ఆధునిక నగర జీవనానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి.

    హైదరాబాద్ అభివృద్ధి ప్రస్థానం కొనసాగుతున్న ఈ సమయంలో.. తెల్లాపూర్, నగరంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా వేగంగా ఎదుగుతోంది. ఆ ప్రాంతం నడిబొడ్డున నిలిచిన ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్, కేవలం నివాసం కోసం మాత్రమే కాకుండా, జీవన నాణ్యతను మరింత మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేక నివాస సముదాయంగా నిలుస్తోంది.

    మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి:
    https://www.prestigeconstructions.com

    గమనిక: పైన పేర్కొన్న ప్రాజెక్ట్ వివరాలు, ఆదాయ మార్గాలు, వసతులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.

  • బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్‌–VII కింద జారీ చేసిన ఎస్‌జీబీల ముందస్తు రిడెంప్షన్‌ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.

    ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్‌ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.

    రూ.లక్షకు రూ.4 లక్షలు!

    ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్‌ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.

    రిడెంప్షన్‌ ధర ఎలా నిర్ణయించారు?

    ఎస్‌జీబీ రిడెంప్షన్‌ ధరను ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్‌ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

    ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణ

    సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్‌కు జూన్‌ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్‌ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.

    పన్ను ప్రయోజనాలు ఏమిటి?

    వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్‌జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్‌ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్‌ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్‌ ప్రయోజనాలు వర్తిస్తాయి.

    ఏమిటీ ఎస్‌జీబీ పథకం?

    భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.

    అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.

    ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 27.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 73,983.18 వద్ద ముగిసింది.

    హెచ్ యూఎల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.49 శాతం, 1.33 శాతం నష్టపోయాయి

    రంగాల వారీగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ కెమికల్ మెరుగైన పనితీరు కనబరిచాయి.

  • హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా వ్యవస్థలను ప్రభావితం చేస్తూ కొత్త యుగానికి నాంది పలుకుతున్న వేళ, ఈ సాంకేతికతను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సూపర్ AI అకాడమీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ ఇప్పటికే 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు AI శిక్షణ అందించి ప్రత్యేక గుర్తింపు పొందింది.

    "AI Mission Million" పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఈ సంస్థ, 2027 ఏప్రిల్ నాటికి లక్ష మంది, 2030 నాటికి 10 లక్షల మందిని AI ద్వారా సాధికారత చేయాలని సంకల్పించింది.

    సూపర్ AI నెక్స్ట్‌జెన్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ మాట్లాడుతూ, “AI అనేది ఇకపై భవిష్యత్ టెక్నాలజీ కాదు. ఇది ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగమైంది. ఈ మార్పులో తెలుగు ప్రజలు వెనుకబడకుండా, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.

    సంస్థ డైరెక్టర్ నికీలు గుండా మాట్లాడుతూ, “AI విద్యను కేవలం టెక్నికల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. AIను అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే వ్యక్తిగత అభివృద్ధి, ఉపాధి, వ్యాపార వృద్ధి వంటి అనేక అవకాశాలు తెరుచుకుంటాయి” అని పేర్కొన్నారు.

    మహిళా సాధికారతకు AI అండ

    మహిళల ఆర్థిక స్వావలంబనకు AI కీలక సాధనంగా మారుతుందనే నమ్మకంతో సూపర్ AI అకాడమీ SUPER AI Women's Club కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గృహిణులు, మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినులు AI ఆధారిత సేవలను అందించడం, డిజిటల్ వ్యాపారాలను ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.

    2030 నాటికి 10 వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.

    వ్యాపార వృద్ధికి AI

    చిన్న, మధ్య తరహా వ్యాపారాలు AIను వినియోగించి తమ ఉత్పాదకతను పెంచుకోవడం, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడం, అమ్మకాలను పెంచుకోవడం, కస్టమర్ సేవలను మెరుగుపరచుకోవడం వంటి అంశాలపై సూపర్ AI అకాడమీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

    AI ఆధారిత మార్కెటింగ్, లీడ్ జనరేషన్, కంటెంట్ క్రియేషన్, సేల్స్ ఆటోమేషన్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి అంశాల్లో ఇప్పటికే వందలాది మంది వ్యాపారవేత్తలకు శిక్షణ అందించినట్లు సంస్థ తెలిపింది.

    కళాశాలల్లో AI క్లబ్‌లు

    భవిష్యత్ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో AI Student Clubs ఏర్పాటు చేయడానికి సూపర్ AI అకాడమీ ప్రణాళిక రూపొందిస్తోంది.

    ఈ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI రీసెర్చ్ టూల్స్, కెరీర్ అప్లికేషన్స్, AI ఆధారిత స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడం, భవిష్యత్ టెక్నాలజీ నాయకులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.

    త్వరలో AI Creator Club

    AI ఆధారిత కంటెంట్ క్రియేషన్, వీడియో ప్రొడక్షన్, డిజైనింగ్, డిజిటల్ బ్రాండింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, యువత మరియు క్రియేటర్ల కోసం AI Creator Club ను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

    ఈ క్లబ్ ద్వారా సోషల్ మీడియా క్రియేటర్లు, యూట్యూబర్లు, డిజైనర్లు, మార్కెటర్లు మరియు డిజిటల్ ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

    1000 మంది AI కోచ్‌ల తయారీ

    దేశవ్యాప్తంగా AI అవగాహనను మరింత విస్తరించేందుకు 1000 మంది AI Coaches ను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.

    ఉపాధ్యాయులు, ట్రైనర్లు, కన్సల్టెంట్లు, కోచ్‌లు AIలో నైపుణ్యం సాధించి తమ ప్రాంతాల్లో వేలాది మందికి AI విద్యను అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడుతోంది.

    Microsoft – Certiport భాగస్వామ్యం

    సూపర్ AI అకాడమీ ఇటీవల మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Microsoft మరియు Certiport అధికారిక సర్టిఫికేషన్ భాగస్వామిగా సంస్థ ఎంపికైంది.

    దీంతో అంతర్జాతీయ ప్రమాణాల డిజిటల్ మరియు AI సర్టిఫికేషన్ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం లభించిందని సంస్థ పేర్కొంది.

    ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచన

    సూపర్ AI అకాడమీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనల్లో ఒకటి సంస్థ డైరెక్టర్ నికీలు గుండా యొక్క గత దశాబ్ద కాల అనుభవం. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, బ్రాండింగ్, వ్యాపారాభివృద్ధి రంగాల్లో పని చేసిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే నైపుణ్యాల కొరత సమాజంలో ఎక్కువగా ఉందని గుర్తించారు.

    ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.

    గతంలో డిజిటల్ లిటరసీ, వ్యాపారాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, యువత సాధికారత వంటి అంశాలపై వేలాది మందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ప్రస్తుతం AI Mission Million రూపకల్పనకు దోహదపడిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

    AI కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారుతుందని భావించిన నికీలు గుండా, AI విద్యను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమాలు నేడు వేలాది మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీగా ఎదిగాయి.

    వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ట్రైనర్లు వంటి విభిన్న వర్గాలకు AIను చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మిషన్, భవిష్యత్లో లక్షలాది మందికి ఉపయోగపడే సామాజిక ఉద్యమంగా మారుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

    AI Literacy నుండి AI Leadership వరకు

    AI గురించి అవగాహన కల్పించడం నుంచి AI ఆధారిత వ్యాపారాలు, కెరీర్ అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి వరకు సమగ్ర ప్రయాణాన్ని రూపొందించడమే సూపర్ AI అకాడమీ లక్ష్యంగా చెబుతోంది.

    AI Literacy, AI Productivity, AI Entrepreneurship, AI Leadership అనే నాలుగు ప్రధాన దశల ద్వారా వ్యక్తులను అభివృద్ధి చేసి, భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలని సంస్థ భావిస్తోంది.

    25 వేల మంది మైలురాయిని దాటిన సూపర్ AI అకాడమీ, ఇప్పుడు AI Mission Million ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా AI విద్యా విప్లవానికి దోహదపడే దిశగా అడుగులు వేస్తోంది.

    "AI భవిష్యత్తు కాదు... ఇది వర్తమానం. ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అనే సందేశంతో సంస్థ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది.

    మరిన్ని వివరాలకు Super AI Academy అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు : 
    www.superaiacademy.com

    గమనిక: పైన పేర్కొన్న వివరాలు, సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.

  • ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌  'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌తో పాటు మరో కీలక పాత్రలో నటించిన  హీరోయిన్‌ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో  క్రేజ్‌ సంపాదించుకుకున్న ఈ నటి  కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన  ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో  సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

    IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని  ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల  బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్‌గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే  ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు),  డెకర్ ఎలిమెంట్స్‌తో కూడిన 'మినిమలిస్ట్' లుక్‌తో ‍ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్‌ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్‌గా  ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు.  

     గ్లాస్ ఎలిమెంట్స్  స్పెషల్‌  ఎట్రాక్షన్‌  
    ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్‌డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా  పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు.  పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్'  లాంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీల్లో నటించిన  తృప్తి దిమ్రి  ఈ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన  తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది.  

  • ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్‌) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.

    బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిన ప్రముఖ కంపెనీలు

    అమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్‌బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్‌లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.

    అమెరికా చట్టం ఏం చెబుతోంది?

    పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.

    కంపెనీలు ఏం చేయబోతున్నాయి?

    అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.

    ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

  • ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.

    భారత్‌పై సబ్సిడీ భారం

    యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్‌ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.

    రైతాంగానికి ఊరట

    ప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.

    ఆయిల్ కంపెనీలకు మద్దతు

    గత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.

    బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటు

    ఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.

    రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధి

    ఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్‌ఎన్‌జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.

    ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి

    అదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్‌) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.

    ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

National

  • ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి లాగేందుకు ఎద్దు స్థానంలో ఉపయోగించిన దృశ్యాలు కనిపించాయి. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, కీలకమైన విత్తనాల సీజన్ కోల్పోతామనే భయంతో ఆ దంపతులు కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయడం కొనసాగించేందుకు ఈ సాహసం చేశారు.

    మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, దేవోని తహసీల్ పరిధిలోని బోంబ్లీ ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే లాతూర్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి కుటుంబ పరిస్థితిపై సమగ్ర నివేదిక కోరారు. రైతుకు ఆలస్యం లేకుండా ప్రత్యామ్నాయ ఎద్దు అందించాలని, అత్యవసర సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

    ముఖ్యమంత్రి జోక్యం తర్వాత జిల్లా యంత్రాంగం స్థానిక గోశాల నుంచి ఒక ఎద్దును వెంటనే ఏర్పాటు చేసింది. దీంతో ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది. కాశీనాథ్, హౌసాబాయి గైక్వాడ్ దంపతులు ఎన్నో ఏళ్లుగా పంటలో వాటా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరో ఎద్దు కొనుగోలు చేసే స్థితిలో లేకపోయింది.

    జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎద్దు మరణంపై అధికారిక అంచనా ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి త్వరలో రూ.32,000 పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

    పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇచ్చి కొత్త ఎద్దు కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పశుసంవర్ధక శాఖ ప్రత్యామ్నాయంగా ఎద్దును ఏర్పాటు చేసి గైక్వాడ్ కుటుంబానికి అప్పగించింది.

  • చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్‌ ఇచ్చిన టికెట్‌ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్‌ని టికెట్‌ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్‌ టికెట్‌ ఇచ్చారు. తీరా టికెట్‌ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్‌ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.

    అసలేం జరిగిందంటే?
    దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు.  వారు తమిళనాడులోని హుసూరు  ప్రాంతానికి వెళ్లడానికి టికెట్‌ అడిగారు. దీంతో కండక్టర్‌ టికెట్‌ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్  ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్‌కు గురయ్యాడు.

    అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని  అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్‌ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్‌ ధర ఉంటుంది.

    సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

    అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్‌ను ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి?  అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.

    అధికారుల వివరణ
    ఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్‌లో  ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్‌పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్‌పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు.

     

     

  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన  ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్‌మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్‌చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్‌పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

    గోదావరి (38) , నేత్రపాల్ సింగ్‌ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్‌పై దూకేసింది. ఆమె బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా  100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి  అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు.  కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.

    ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

     భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్‌కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది.  ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను  బోనెట్‌పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.  ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.

    అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.

    ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

    భమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్  స్పందిస్తూ,  నేత్రపాల్ సింగ్, సాధనలపై  ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద  కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని,  విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

    ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా

  • లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్‌. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా?  దీనికి సంబంధించి పుదుచ్చేరిలో  జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.

    ‘లైవ్‌లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్‌లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు  తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్‌తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్‌ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్‌లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు.  

    ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

    ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.

    ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.

    ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

    వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్‌కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం  వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్‌కు  10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.

    అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన  విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ  కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.

    ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
     

  • ఢిల్లీ: మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్‌లో ఆర్‌వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్‌ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్‌ మన్వు సంఘ్వీ అన్నారు.

    కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.

    కాంగ్రెస్‌ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్‌లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్‌ మాత్రమే ఉందని చెబుతున్నారు.

     

     

     

     

  • భారత మామిడి రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అధిక స్థాయిలో రసాయన పురుగుమందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది. ఇటీవల జపాన్‌ ఇండియన్‌ మామిడి పండ్ల దిగుమతులను నిషేధించగా ఇపుడు నేపాల్ కూడా  ఆ బాటలో నడిచింది.

    అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని బాలెన్ షా ప్రభుత్వం నిషేధించింది.నేపాల్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ విధించిన ఈ ఆంక్షలు ఏప్రిల్-మే నెలల  మధ్య  అమలు చేసిందని సమాచారం. నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ, ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్‌నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.

    ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

    నేపాల్ కూడా  పరిమితంగానైనా  మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే, స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు.  మే మధ్య నుండి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.  మధేష్ ప్రావిన్స్‌లోని సిరహా, సప్తరి , ధనుషా జిల్లాలు దేశంలో ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నేపాల్ అధికారులు అంటున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో సుమారు 32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతి  చేస్తుండగా,  మిగిలినవి దేశీయ వినియోగానికే.   

    ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా

Sports

  • ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.

    ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ వికెట్‌కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.

    ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్‌ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ వికెట్‌కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్‌వర్త్‌ లూయిస్‌) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆరో నంబర్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ (86 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.

    బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్‌ (10-1-37-2) బౌలింగ్‌లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం​ అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు.

    36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.

     

  • నైట్‌క్లబ్‌ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు అతడితో పాటు నైట్‌క్లబ్‌ వివాదంలో మరో నిందితుడు గస్‌ అట్కిన్సన్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.

    లార్డ్స్ టెస్ట్‌లో విజయానంతరం స్టోక్స్, అట్కిన్సన్‌లు లండన్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. వీరిద్దరు జట్టుకు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడ ఉండగా, ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ECB విచారణ చేపట్టిన తర్వాత ఇద్దరినీ రెండో టెస్ట్‌కు ఎంపిక చేయలేదు.

    దీంతో 2022లో స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించిన మాజీ సారథి జో రూట్‌ మళ్లీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన రూట్‌వైపే ECB మొగ్గుచూపింది.

    స్టోక్స్ స్థానంలో జోర్డన్‌ కాక్స్‌, అట్కిన్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్‌ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

    కాగా, నైట్‌ఫైట్‌ తర్వాత స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడనే ప్రచారం​ జోరుగా సాగుతోంది. అతడు ఇప్పటికే వన్డే, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజా ఉదంతం తర్వాత స్టోక్స్‌ క్రికెట్‌ కెరీర్‌ మొత్తానికే గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

    ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 115 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌ జూన్‌ 17 నుంచి కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా మొదలుకానుంది.

    న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు..
    రూట్ (C), డకెట్, గే, బేతెల్, బ్రూక్, స్మిత్ (WK), రూ, కాక్స్, రెహాన్, రాబిన్సన్, జోఫ్రా, టంగ్, ఫిషర్, బేకర్, బషీర్


     

  • మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (జూన్‌ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. 

    తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్‌ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

    భారత్‌ను గెలిపించేందుకు రిచా ఘోష్‌ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం​ లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్‌ తీసి రిచాకు స్ట్రయిక్‌ ఇచ్చింది. అప్పటికే జోష్‌లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్‌కు తరలించి భారత్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.

    అయితే తొందరగా మ్యాచ్‌ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్‌కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్‌ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్‌ కూడా ఔట్‌ కావడంతో భారత్‌ ఆలౌటై, మ్యాచ్‌ను చేజార్చుకుంది.  

    ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ (64), కెప్టెన​ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్‌ (30 నాటౌట్‌) బ్యాట్‌ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

    భారత ఇన్నింగ్స్‌ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్‌ (17), భారతి (18), రాధా యాదవ్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లిన్సే స్మిత్‌ 3, డీన్‌, కోల్‌మన్‌, గిబ్సన్‌ తలో 2, వాంగ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

    కాగా, ఈ ప్రపంచకప్‌ రెగ్యులర్‌ మ్యాచ్‌లు జూర్‌ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-శ్రీలంక తలపడనున్నాయి. భారత్‌ జూన్‌ 14న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. 

  • అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్‌ లాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.

    ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదా
    కాగా 2001లో ఐసీసీ అఫిలియేట్‌ మెంబర్‌గా ఉన్న అఫ్గనిస్తాన్‌.. 2013లో అసోసియేట్‌ మెంబర్‌ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్‌తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.

    తాజాగా ముల్లన్‌పూర్‌లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్‌ జట్టు.. ఇన్నింగ్స్‌ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ అఫ్గన్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ఎందుకు అనుమతిస్తున్నారు?
    ‘‘అసలు అఫ్గనిస్తాన్‌ను టెస్టు క్రికెట్‌ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్‌ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.

    నిజానికి అఫ్గనిస్తాన్‌ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్‌ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.

    అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యం
    భారత్‌తో మ్యాచ్‌లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్‌ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్‌లో అవి శూన్యం. అఫ్గన్‌ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.

    అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్‌కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్‌ లాల్‌ న్యూస్‌18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.

    చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు!

  • గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్‌ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో చాంపియన్‌గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

    ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12 టీ20 మహిళా ప్రపంచకప్‌-2026 మొదలుకానుంది.

    ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్‌ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్‌ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

    ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!

    షెడ్యూల్‌
    👉రౌండ్‌- రాబిన్‌ ఫార్మాట్‌
    👉జూన్‌ 12న వరల్డ్‌కప్‌ టోర్నీ మొదలు (ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక)
    👉భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌- జూన్‌ 14
    👉సెమీ ఫైనల్‌-1: జూన్‌ 30
    👉సెమీ ఫైనల్‌-2: జూలై 2
    👉జూలై 5న ఫైనల్‌తో ముగింపు.

    వేదికలు
    👉గ్రూప్‌, సూపర్‌-8 దశ: ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, మాంచెస్టర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, బ్రిస్టల్‌, హెడింగ్లీ, లీడ్స్‌, హాంప్‌షైర్‌ బౌల్‌, సౌతాంప్టన్‌, ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హామ్‌.
    👉సెమీ ఫైనల్‌- ది ఓవల్‌, ఫైనల్‌- లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌.

    జట్లు
    ఆస్ట్రేలియా
    సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తాహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్.

    బంగ్లాదేశ్‌
    నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్‌), నహిదా అక్తర్‌ (వైస్‌ కెప్టెన్‌), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్‌, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్‌, తాజ్‌ నెహర్‌.

    ఇండియా
    హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్‌

    నెదర్లాండ్స్‌
    బాబెట్ డి లీడే (కెప్టెన్‌), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్

    పాకిస్తాన్‌
    ఫాతిమా సనా (కెప్టెన్‌), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్‌, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.

    సౌతాఫ్రికా
    లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్‌సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్

    ఇంగ్లండ్‌
    నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.

    ఐర్లాండ్‌
    గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్‌బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్

    న్యూజిలాండ్‌
    మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్‌మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.

    స్కాట్లాండ్‌
    కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్‌కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్

    శ్రీలంక
    చమరి ఆటపట్టు (కెప్టెన్‌), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.

    వెస్టిండీస్‌
    హేలీ మాథ్యూస్ (కెప్టెన్‌), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్‌బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్‌హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్‌, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్‌.

    ప్రత్యక్ష ప్రసారం
    👉స్టార్‌ స్పోర్ట్స్‌ (టీవీ), జియోహాట్‌స్టార్‌ (డిజిటల్‌).

    మ్యాచ్‌ ఆరంభ సమయాలు
    భారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.

    చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు!

  • భారత టెస్ట్‌ జట్టు షెడ్యూల్‌లో మరో విదేశీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డపై (టెస్ట్‌ సిరీస్‌ కోసం) అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో జరగనుంది.

    బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీలంకలోని ప్రముఖ వేదిక అయిన గాలే అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, అది కొలంబోలోని సింహలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ గ్రౌండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.

    భారత్‌ చివరిగా లంక గడ్డపై ఆడిన టెస్ట్‌ సిరీస్‌ను విరాట్‌ కోహ్లి నేతృత్వంలో 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టూర్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

    టెస్ట్ సిరీస్‌తో పాటు లంక టూర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సిరీస్‌ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌పై కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పైన అనుకున్న షెడ్యూల్‌ ఖరారైనట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి ప్రకటించారు. 

  • పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి షాన్ మ‌సూద్‌ను తొల‌గించే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. షాన్ మ‌సూద్‌తో పాటు హెడ్ కోచ్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్న‌తాధికారులు వారాంతంలో స‌మావేశం కానున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో బంగ్లా చేతిలో పాకిస్తాన్‌ 0-2తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావ‌డంతో షాన్ మ‌సూద్ కెప్టెన్సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

    అత‌డిని కెప్టెన్సీ నుంచి తొల‌గించిన స‌ల్మాన్ అలీ అఘాకు బాధ్య‌త‌లు అప్ప‌గించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో షాన్ మ‌సూద్‌, కోచ్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌లు రాబోయే ఇంగ్లండ్‌, వెస్టిండీస్ టూర్ వ‌ర‌కు కొన‌సాగుతారా లేక తొల‌గిస్తారా అనేది మీటింగ్‌లో తేలిపోనుంది. ఇదే విష‌యంపై పీసీబీ సెలెక్ట‌ర్ ఒక‌రు స్పందించారు. 

    ‘పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌గా స‌ల్మాన్ అలీని నియ‌మించడానికి బోర్డు అధికారులు ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చార‌ని, త్వ‌ర‌లోనే దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకోనున్నాం. ఇక స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ హెడ్‌కోచ్‌ను కూడా మార్చే అవ‌కాశాలైతే మెండుగా ఉన్నాయి. స‌ర్ఫ‌రాజ్ స్థానంలో మాజీ క్రికెట‌ర్ యూనిస్ ఖాన్ హెడ్‌కోచ్‌గా వ‌చ్చే చాన్స్ ఉంది’ అని ఆయ‌న పేర్కొన్నారు. 

    ఇప్ప‌టికే స‌ల్మాన్ అలీ అఘా ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా కొన‌సాగుతున్నాడు. టెస్టు జ‌ట్టుకు కూడా అత‌డే నాయ‌క‌త్వం వ‌హించ‌నుండ‌డం లాంఛ‌నం కానుంది. అయితే హెడ్‌కోచ్ ప‌ద‌వికి యూనిస్‌ఖాన్‌తో పాటు మ‌రో మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ పేరు కూడా ప‌రిశీలన‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శనివారం జ‌రిగే మీటింగ్‌లో ఈ విష‌యాల‌పై పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

    చదవండి: ఫిఫా ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

  • భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్‌ బ్యాటర్‌.

    వైభవ్‌ విఫలం
    ఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్‌ షిరాజ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.

    రుతురాజ్‌ గైక్వాడ్‌  సెంచరీ
    సాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ప్రియాన్ష్‌ ఆర్య లంకతో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్‌ విఫలమైనా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌  సెంచరీ(101)తో రాణించడంతో భారత్‌ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.

    అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్‌ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.

    బౌలర్ల విజృంభణతో..
    కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్‌ ఖాన్‌, అనుకుల్‌ రాయ్‌, ఆయుశ్‌ బదోని, విప్రాజ్‌ నిగమ్‌ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్‌ కాంబోజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్‌ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.

    ఇక తమ రెండో మ్యాచ్‌లో భాగంగా భారత్‌- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్‌-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్‌, ప్రభ్‌సిమ్రన్‌ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్‌ అఫ్గన్‌తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.

    అఫ్గనిస్తాన్‌-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)
    వైభవ్‌ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ప్రియాన్ష్‌ ఆర్య, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ (కెప్టెన్‌), ఆయుశ్‌ బదోని, అనుకుల్‌ రాయ్‌, సూయాన్ష్‌ షెడ్గే, అన్షుల్‌ కాంబోజ్‌, అర్షద్‌ ఖాన్‌, విప్రాజ్‌ నిగమ్‌.

    చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

  • ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సరికొత్త నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా అవతరించాడు. సహచరుడు జో రూట్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అర్ద సెంచరీ సాధించి నంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన రూట్‌ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.

    తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్‌ పాయింట్లు కలిగిన గిల్‌.. ప్రస్తుతం భారత్‌ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

    ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ర్యాంక్‌లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్‌తో పాటు టాప్‌-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్‌గా తాజా ర్యాంకింగ్స్‌లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్‌గా గ్లెన్‌ ఫిలిప్స్‌ ఉన్నాడు. ఫిలిప్స్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.

    బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ టెస్ట్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్‌ టెస్ట్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ తొలిసారి టాప్‌-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన సుతార్‌ 272 రేటింగ్‌ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.

    మిగతా భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఓ స్థానం​ మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్‌ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్‌ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్‌ ప్లేస్‌ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. 

  • ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. 

    మ్యాచ్‌ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్‌లు, క్వారర్ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్‌మనీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


    2022 ఫిఫా ప్రపంచకప్‌ విజేత అర్జెంటీనా

    అయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్‌మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ విలువ 655 మిలియన్‌ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రైజ్‌మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం. 

    ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్‌తో క్రికెట్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ విలువ కావడం గమనార్హం. 


    2026 టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

    అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విలువను ఫిఫా ప్రపంచకప్‌ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్‌గా నిలిచే జట్టు నుంచి లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ: 655 మిలియన్ డాలర్లు
    చాంపియన్స్‌: 50 మిలియన్‌ డాలర్లు
    రన్నరప్‌: 33 మిలియన్‌ డాలర్లు
    మూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్‌ డాలర్లు
    5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్‌ డాలర్లు
    9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్‌ డాలర్లు
    17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్‌ డాలర్లు 
    33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్‌ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్‌ డాలర్లు అదనంగా లభిస్తాయి.

    మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 మొత్తం ప్రైజ్‌మనీ విలువ 11.25 మిలియన్‌ డాలర్లు.
    చాంపియన్స్‌ (భారత్‌): 2.6 మిలియన్‌ డాలర్లు
    రన్నరప్‌ (న్యూజిలాండ్‌): 1.42 మిలియన్‌ డాలర్లు
    మూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్‌ డాలర్లు
    నాలుగో స్థానం (ఇంగ్లండ్‌):  974,423 డాలర్లు
    5 నుంచి 8వ స్థానం వరకు
    వెస్టిండీస్ - 538,269 డాలర్లు
    పాకిస్తాన్ - 522,692 డాలర్లు
    జింబాబ్వే -  491,538 డాలర్లు
    శ్రీలంక - 475,962 డాలర్లు

    చదవండి: చతికిలపడ్డ బాలీవుడ్‌ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!

  • తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్‌ సుతార్‌కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోని ప్రముఖ జట్టైన వార్విక్‌షైర్‌ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది.

    సుతార్‌కు ఈ డీల్‌ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్‌ ఇంగ్లండ్‌ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం​ చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్‌ పిచ్‌లపై సుతార్‌ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్‌లో రాణిస్తే సుతార్‌ భవిష్యత్తుకు తిరుగుండదు.

    అశ్విన్‌ రిటైర్మెంట్‌, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.

    దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ ట్రాక్‌ రికార్డు (30 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్‌.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. 

    రెండో ఇన్నింగ్స్‌లోనూ సుతార్‌ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్‌లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. 

  • భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌లను తొలిసారిగా భారత్‌లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.

    ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్‌ రెగ్యులర్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

    తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్‌బాష్‌ లీగ్‌ భారత ఎంట్రీపై  "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ  నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.

    ఒకవేళ బిగ్‌బాష్‌ లీగ్‌ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్‌లు పరస్పర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్‌తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

     

  • అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్‌-2026 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్‌ సేన స్వదేశంలో అఫ్గన్‌తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

    మరోవైపు.. లెజెండరీ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్‌- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

    గంభీర్‌, అగార్కర్‌ విముఖత?
    వన్డే ప్రపంచకప్‌-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్‌కప్‌ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.

    తలవంచను
    అయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్‌రూమ్‌లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.

    ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, అగార్కర్‌లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.

    గంభీర్‌తో మాకు సంబంధం లేదు
    ‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్‌ గిల్‌ ప్రతీ విషయంలో డ్రెసింగ్‌రూమ్‌ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్‌ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.

    అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్‌- గిల్‌ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్‌రూమ్‌లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.

    చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్‌తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

    చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

  • భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్‌నెస్‌, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్‌డమ్‌ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్‌ను మరోసారి చాటుకున్నాడు.

    భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

    క్రికెటర్ల ఆధిపత్యం
    ఈ ర్యాంకింగ్స్‌లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.

    విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్‌నెస్ ఐకాన్‌గా ఆయనకున్న ఇమేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. 

    ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌డం, ఫైనల్‌లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.

    చదవండి: సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు!

  • టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలతో పాటు.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి ప్రకటించిన టీ20 జట్టులో అర్హులకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్‌ రాణా వంటి ఆటగాళ్లు కేవలం హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ వల్లే జట్టులో ఉన్నారని పెదవి విరుస్తున్నారు.

    ఇంతకంటే ఇంకేం చేయాలి?
    గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో సత్తా చాటుతూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి వరుసగా రెండుసార్లు టైటిల్‌ అందించిన రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టులో పాటిదార్‌కు చోటిచ్చేందుకు ఆస్కారం లేదని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన జట్టు నుంచి చాలా మందిని తప్పించారని.. పాటిదార్‌ కోసం ఈ సంఖ్యను మరింత పెంచలేరని పేర్కొన్నాడు.

    ఆవేదన అర్థం చేసుకోగలను!.. కానీ
    ఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులో రజత్‌ పాటిదార్‌ ఎందుకు లేడు? అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి కదా!.. ఇంతకంటే గొప్పగా ఏ ఆటగాడైనా ఏం చేయగలడు?.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

    భజ్జీ (హర్భజన్‌ సింగ్‌) కూడా ఇలాగే ట్వీట్‌ చేశాడు. భజ్జీతో నేనూ ఏకీభవిస్తాను. అందరి మనసుల్లోనూ ఇదే భావన ఉంది. అర్హుడైనా అతడికి స్థానం దక్కలేదన్న ఆవేదనను నేనూ అర్థం చేసుకోగలను.

    అయితే, ఇక్కడ భావోద్వేగాల కంటే కూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రజత్‌ పాటిదార్‌కు చోటివ్వాలంటే ఎవరో ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. మరి అతడి కోసం ఎవరిని బలి చేయాలంటారు?

    వాళ్లకే దిక్కులేదు.. అతడికి చోటు ఎలా?
    ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పైనే వేటు వేశారు. అతడితో పాటు రింకూ సింగ్‌నూ తప్పించారు. వీరిద్దరి స్థానంలో కొత్త సారథిగా శ్రేయస్‌ అయ్యర్‌, ఆటగాడిగా వైభవ్‌ సూర్యవంశీ జట్టులోకి వచ్చారు.

    ఇంతకంటే ఇంకెన్ని మార్పులు చేయాలి? ప్రపంచకప్‌ గెలిచిన జట్టు నుంచి ఇంకెంత మంది సభ్యులను నిర్దాక్షిణ్యంగా తప్పించాలి?’’ అని ఆకాశ్‌ చోప్రా విమర్శకులను ప్రశ్నించాడు.

    సారథిగా సరైనోడు
    ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌ సారథిగా సరైనోడని.. అందుకే మూడేళ్ల తర్వాత ఏకంగా కెప్టెన్‌గా టీ20 జట్టులో పునరాగమనం చేశాడని ఆకాశ్‌ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్‌ గెలిచిన 35 ఏళ్ల సూర్యతో పాటు రింకూ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.

    మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయితే, బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. కొత్తగా శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్రిన్స్‌ యాదవ్‌లకు కూడా చోటు దక్కింది.

    చదవండి: ‘అతడు పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో చోటు దండగ’

International

  • ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    ఒమన్ గల్ఫ్‌లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్‌ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్‌లోని సోహార్‌ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.

    కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్‌ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్‌ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్‌ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

    హర్ముజ్‌ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్‌ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

  • వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమతో ఒప్పందానికి రాకుండా, గ్రేట్‌ డీల్‌ను మిస్‌ చేసుకుంది అంటూ ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని పదే పదే ప్రకటించే ట్రంప్‌ తాజాగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సైన్యం పూర్తిగా ఓడిపోయింది, అన్నీ ఉత్తమాటలే, చేతలేమీ లేవు అంటూ  తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్  ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఇరాన్ సైనిక సామర్థ్యం దారుణంగా క్షీణించిందని, మంచి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాన్ని ఇరాన్ నాయకత్వం చేజేతులా వృధా చేసుకుందన్నారు. ఇరాన్ సైన్యం పూర్తిగా అతలాకుతలమైంది. అసలు నౌకాదళం, వాయుసేన వంటి చాలా విభాగాలు ఉనికిలోనే లేవు, పూర్తి ఓటమి పాలయ్యారంటూ అని ట్రంప్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు అంతా మాటలే.. చేతల్లో ఏమీ లేదు. మిడిల్ ఈస్ట్  పెత్తందారు కథ ముగిసింది!!! అంటూ ఇరాన్‌పై ధ్వజమెత్తారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన గడువును ప్రస్తావిస్తూ చర్చలను  తెగనీయకుండా  సాగదీశారని  ఇరాన్‌ నేతలను విమర్శించారు. ఎంతో మేలు చేకూర్చే ఒప్పందంపై చర్చలకు చాలా సమయం తీసుకున్నారు,ఇప్పుడు దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!!!" అని ఆయన హెచ్చరించారు. 

    >  

    ఇదీ చదవండి: భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్‌ వీడియో

    ఇరాన్ లక్ష్యాలపై అమెరికా ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌తో చర్చల భవిష్యత్తుపై తాము పునఃసమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ స్పందిస్తూ.. అమెరికా పరస్పర విరుద్ధమైన వైఖరిని అవలంబిస్తూ, కాల్పుల విరమణ అవగాహనలను పదేపదే ఉల్లంఘిస్తూ దౌత్య ప్రక్రియను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

    అయితే మధ్యప్రాచ్యంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, గత కొన్ని వారాలుగా చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో  గ్రీట్‌ డీల్‌కి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పదేపదే చెబుతూ వస్తున్నప్పటికీ, దీన్ని ఇరాన్‌ ఖండిస్తూ వస్తోంది.  సైనిక దాడులు కొనసాగుతున్నంత కాలం దౌత్యం విజయవంతం కాలేదని స్పష్టం చేస్తూ మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

    ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త

    కాగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికాకు చెందిన 'అపాచీ' దాడి హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, నిఘా కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ తాజా ఘర్షణల తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. జోర్డాన్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసింది. ఇది మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళనలను పెంచింది.

    ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

  • పీవోకేలో  ఘోర విషాదం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన Mi-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది సైనికులు మృతిచెందారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. 

    ప్రస్తుతం పీవోకోలో తీవ్ర నిరసనలు తలెత్తిన నేపథ్యంలో నీలమ్ వ్యాలీ సెక్టార్‌కు అదనపు బలగాలను తరలిస్తుండగా టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ అది విఫలమై కూలిపోయిందని పాక్ మీడియా తెలిపింది.

    పీఓకే ప్రాంతాల్లో నిరసనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ భారీ ప్రమాదం సంభవించడంతో హెలికాప్టర్‌పై దాడులు జరిగాయా అనే అనుమానం తలెత్తింది. బలూచ్ ఆర్మీ దాడులు చేసిందని వార్తలు రావడంతో  తీవ్ర ఆందోళనలు రేకేత్తాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగిందని ఆర్మీ నిర్ధారించింది.

     

  • వాషింగ్టన్‌, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్‌ అపాచీపై దాడి చేసింది ఇరాన్‌ అని ఆరోపించారు.  ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్‌ ఇంకా స్పందించలేదు.    

    ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్‌ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది.

    అయితే డొనాల్ట్‌ ట్రంప్‌ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఇరాన్‌ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు.  యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో  ఇరాన్‌పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో  చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్‌ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. 

    మరోవైపు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజిమిన్‌ నెతన్యాహు సైతం ఇరాన్‌పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్‌ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

     

  • కాబూల్‌: పాకిస్థాన్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నిన్న ( మంగళవారం)  రాత్రి తాలిబన్ల భూభాగంపై పాక్‌ వైమానిక దాడులతో విరుచుకపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నట్లు అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. చిన్నారులు నిద్రపోతున్న సమయంలో దాడులు చేయడంతో వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ దేశ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.

    గత కొద్ది కాలంగా అఫ్గానిస్థాన్‌- పాక్‌ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి ని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నాయని పాక్‌ వైమానిక దళం విరుచుకపడింది. అయితే ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    ఆయన మాట్లాడుతూ "నిన్న రాత్రి, పాకిస్తానీ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, కునార్, ఖోస్ట్ మరియు పక్తికా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై బాంబులు వేసింది. దీని ఫలితంగా  11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారు.మరో 14 మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.బాధితులు నిద్రిస్తున్న సమయంలో రాత్రిపూట దాడులు జరిగాయి., దీంతో బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి వారికి ఏమాత్రం అవకాశం లభించలేదు. ఇది పూర్తిగా అమానవీయం" అని అన్నారు

    అదే విధంగా గత కొద్దికాలంగా పాక్‌ దాడుల్లో మృతిచెందిన చిన్నారులతో కూడిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. కాగా పాక్‌ జరిగిన దాడుల్లో మెుత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
     

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి  బేతపూడి విజయ్‌ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ  మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని  చేశాడని పేర్కొంది. ఆ  మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ  చెబుతోంది.

    2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్‌ శేఖర్‌ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్‌శేఖర్‌ దాడి చేశారు.

    బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్‌తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా విజయ్‌శేఖర్‌కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు

    ..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్‌కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది.

  • సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడుతారు.  
       
       

  • సాక్షి, విజ‌య‌వాడ‌: ఏపీలో కూటమి ప్రభుత్వం పతనమవ్వడానికి డిప్యూటీ స్పీక‌ర్‌ రఘురామకృష్ణంరాజు కారణమవుతారంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్య‌క్షుడు జడ శ్రవణ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దళితులు, క్రైస్తవులపై ఆర్ధిక ఉగ్రవాది దాడిచేస్తున్న రఘురామకృష్ణంరాజును తక్షణమే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయ‌న‌ను బర్తరఫ్ చేసే వరకూ త‌న‌ పోరాటం ఆగద‌ని ప్ర‌క‌టించారు. బ్యాంకులను కొల్లగొట్టిన ఈ దొంగను కూట‌మి ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమ‌ర్శించారు. బాయ్‌కాట్ రఘురామకృష్ణంరాజు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు.

    ''భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఈ దేశంలో అందరూ సమానమేనని చెప్పింది. ఎవరి మతాలు వారిని పూజించుకోవడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వేచ్ఛను ఇచ్చాయి. కానీ మతసాంప్రదాయాల మీద రఘురామకృష్ణంరాజు దాడి చేస్తున్నాడు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అమలవుతుందని అనక తప్పడం లేదు. దళితులు, క్రైస్తవులపై రఘురామకృష్ణంరాజు అర్ధిక ఉగ్రవాదిలా దాడిచేస్తున్నాడు. దళితులు, క్రైస్తవుల ఓట్లు తనకు వద్దని చెప్పిన రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. సిగ్గు, శరం, లజ్జా , అభిమానం ఉంటే త‌న‌ పదవికి రాజీనామా చేయాలి. దళితులు, క్రైస్తవులు కట్టే పన్నుల నుంచి జీతం తీసుకోనని ప్రకటించాలి. మేకుల దేవుడు అని దైవాన్ని కించపరుస్తున్న నీకు అదే మేకులతో సమాధానం చెప్పే రోజు వస్తుంది.

    తెలుగువీర లేవరా పేరుతో ఎస్సీ ఉద్యోగులపై నిఘా పెట్టారు. చర్చిలకు వెళుతున్న ఎస్సీ ఉద్యోగులను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. ఎస్సీ ఉద్యోగుల తల్లిదండ్రుల సమాధులను ఫోటోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టకుని క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పడం నీచమైన పని. రఘురామకృష్ణంరాజు దళం ఇస్తున్న ఫిర్యాదులను తీసుకుని అధికారులు షోకాజ్ నోటీసులిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకూ సమంజసం? అధికారులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కనిపించడం లేదు. రఘురామకృష్ణంరాజు పంపించిన సూట్ కేసులో డబ్బు మాత్రమే కనిపిస్తోంది.

    రఘురామకృష్ణంరాజు పంపించిన 6.5 కోట్ల రూపాయలు తీసుకుని ఆకువీడులో నిర్మాణాలకు అనుమతిలిచ్చారు. బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బు ఆయ‌న వ‌ద్ద‌ వద్ద దండిగా ఉన్నాయి. ఐదేళ్లూ ఢిల్లీలో కూర్చుని పిజ్జాలు, బర్గర్లు , కేఎఫ్‌సీ చికెన్లు తిన్నప్పుడు శ్రీరాముడు గుర్తుకురాలేదా? కాక్ టెయిల్ పార్టీలకు వెళ్లినప్పుడు జై శ్రీరామ్ నినాదం మీకు గుర్తుకు రాలేదా? తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి వనవాసం చేసిన ఆ శ్రీరాముడు ఎక్కడ, బ్యాంకులను లూటీ చేసిన నువ్వెక్కడ? జై శ్రీరామ్ నినాదం పేరుతో నీ మెడలో వేసుకున్న కండువా కూడా నిన్ను చూసి సిగ్గుపడుతోంది.

    రఘురామకృష్ణం రాజు చెప్పాడని 50 ఏళ్ల నుంచి ఉన్న చర్చిలను కూల్చేస్తామంటున్నారు అధికారులు. 40, 50 ఏళ్ల నుంచి చర్చిలు ఉన్నప్పుడు అధికారులు నిద్రపోయారా? చర్చిలపై ఉన్న మైకులు తొలగించాలని డీజీపీకి రఘురామకృష్ణంరాజు లేఖరాయడం దుర్మార్గం. జూన్ 28న ఏలూరు బహిరంగ సభలో బాయ్‌కాట్ రఘురామ పిలుపునివ్వబోతున్నాను. ఆ రోజుతో రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితం ముగియనుంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కోటి 10 లక్షల మంది దళిత, క్రైస్తవులపై దాడి చేయడం సమంజసమేనా? రఘురామకృష్ణంరాజు మాటలు కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరిచాయి. నీ జీవితంలో అశాంతి మొదలైంది.. నీ రాజకీయ, ఆర్ధిక పతనం ప్రారంభమైంది. 

    నీకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కోర్టులో గుంజీలు తీయిస్తా. రఘురామకృష్ణంరాజు చెప్పగానే గొంతేనమ్మ ఆలయాన్ని కూల్చేయించారు. కలెక్టర్‌ను నేను ఇదే హెచ్చరిస్తున్నా.. మీ సర్వీసంతా వెంటాడుతూనే ఉంటా. లంచం తీసుకుని రఘురామకృష్ణంరాజుకు కలెక్టర్ సాయం చేశారు. కలెక్టర్.. మీరు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టను. చదువుకుంటున్న పిల్లలపై కూడా కేసులు పెట్టించి వేధించారు.

    మొన్నటి వరకూ తాను క్రిస్టియన్ అని హోంమంత్రి అనిత చెప్పారు. ఎప్పుడూ తన చేతిలో బైబిల్ ఉంటుందని చెప్పారు. కానీ హోంమంత్రి అనిత ఇప్పుడు హిందువు ముసుగు వేసుకున్నారు. తన హోంమంత్రి పదవి పోతుందనే భయంతో బైబిల్ తీసి అటకపై పెట్టారు. బైబిల్ చదవడం మీకు అంత తప్పుగా కనిపిస్తుందా? మనల్ని అసహ్యించుకుంటున్నప్పుడు అనితకు, రఘురామకృష్ణంరాజుకు మనం ఓటెందుకు వేయాలి? 

    చ‌ద‌వండి: మా బిడ్డ‌ల‌ కాపురాలు కూలిపోతున్నాయి

    జూన్ 28వ తేదీ నుంచి ఎవరైనా మతాలను కించపరిచేలా యూట్యూబ్‌లలో ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. మీ ఛానల్స్ మూతవేయిస్తామని హెచ్చరిస్తున్నా. వెయ్యి మందితో ఒక ఫోర్స్ తయారు చేస్తున్నాం. మతాలను టార్గెట్ చేసుకుని ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రఘురామకృష్ణం రాజు తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. మ‌రోసారి క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తూ ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేసే వరకూ నా పోరాటం ఆగదని జ‌డ శ్ర‌వణ్ కుమార్ అన్నారు. 

  • న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ దోపిడీ మరోసారి బట్టబయలైంది. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో చంద్రబాబు బండారం బయటపడింది. అమరావతిలో కేంద్ర సర్కారు సెంట్రల్‌ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది. అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు మంజూరు చేసింది కేంద్రం. 

    ఉద్యోగ నివాసాలకు చదరపు అడుగుకు రూ.3,945 నిర‍్ధారించింది. మొత్తం  23.25 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం కోసం 1,299 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం మొత్తం 31.3 లక్షల చదరపు అడుగులకు 1,235 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. చదరపు అడుగుకు 5 వేల రూపాయలలోపే ఖర్చు చేయనుంది.

    చంద్రబాబు సర్కార్‌ మాత్రం.. 
    కేంద్ర సర్కారు అమరావతిలో ఇంత చవకగా బిల్డింగులు కడుతుంటే చంద్రబాబు సర్కార్‌ మాత్రం ఎందుకు చదరపు అడుగుకు 20 వేల ఖర్చు చేస్తుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు 20 వేల రూపాయలపైనే ఖర్చు చేస్తోంది. కేంద్రం కట్టే బిల్డింగుల ఖర్చు కంటే చంద్రబాబు సర్కార్‌ ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. 

  • సాక్షి, విశాఖపట్నం:  వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.  మరికొద్ది సేపట్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షం కురవనుందని పేర్కొంది. ది. వీటితో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

    విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అరకు, గజపతినగరం, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.

    భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందునవ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ  సంస్థ ఎండీ ప్రఖర్ జైన్  విజ్ఞప్తి చేశారు. 

  • సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. 

    వైఎస్సార్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. 

    మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. వీఆర్‌ఎస్‌ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. 

    కూటమి హయాంలో.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు లింకు పెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్‌ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్‌ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్‌ను వదిలిపోయేలా చేశారు. బోనస్‌, మెడికల్‌ ఫెసిలిటీస్‌ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్‌ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

    ఇంత దారుణమా?
    స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్‌ మెటల్‌ బ్లాస్ట్‌ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్‌ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్‌ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది.

    నువ్వు ఇచ్చింది ఏందయ్యా బోడే? లోకేష్ పై జగన్ ఫైర్ 

    లోకేశ్‌ అసలు మనిషేనా?
    ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్‌ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్‌ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్‌ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్‌గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్‌ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్‌ ఇన్సూరెన్స్‌.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.

    ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!

    మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాం
    గతంలో.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్‌లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్‌ప్లాంట్‌ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.