Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బాలీవుడ్ నటుడు అక్షయ్  ఖన్నా నెగిటివ్ రోల్స్‌లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్‌గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు.  


    ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు.  


    'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు.  ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్‌లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్‌కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు.  

    మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్‌తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  

  • మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ తమిళ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. అందువల్లే ఆ సినిమాకు నేను నో చెప్పేశానని లావణ్య త్రిపాఠి పేర్కొంది.

    ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్ట్ కూడా లేదని లావణ్య తెలిపింది. ఆ తర్వాత నన్ను టార్గెట్‌గా చేసి వేధించారని అన్నారు. నాపై కేసు పెట్టడమే కాకుండా.. తప్పుడు కథనాలు కూడా రాసుకొచ్చారని ఆవేదన వ్యక్తం తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య త్రిపాఠి వివరించింది.

    లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..'ఒకప్పుడు నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు' అని చెప్పుకొచ్చింది. 

     

  • హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌  నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్‌-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 
     

  • వివాదాస్పద లిరిసిస్ట్‌ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. దీంతో ఆయనకు తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సీఎం స్టాలిన్‌, హీరో కమల్ హాసన్ సైతం వైరముత్తుకు అభినందనలు తెలిపారు. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ అవార్డ్‌తో జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు.

    చిన్మయి చురకలు..

    వైరముత్తుకు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డ్ రావడంపై సింగర్ చిన్మయి స్పందించింది. కమల్ హాసన్‌ వైరముత్తును ప్రశంసించడంపై ట్విటర్ వేదికగా మండిపడింది. కమల్ హాసన్‌ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం,  తన మామ-గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని  ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలని సూచించింది. 

    ఇక్కడ  ట్విస్ట్ ఏంటంటే తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని.. మహిళలను ఎవరు పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు భారతీయ సాహిత్యానికి చేసిన కృషికి జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో ఇచ్చిపడేసింది.
     

     

  • కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ ‍అట్లూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈనెల 16న సాయంత్రం 04:06 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్‌ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టాండన్‌, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. 
     

     

  • టాలీవుడ్ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్‌ ఆడియన్స్‌ను మెప్పించింది.

    అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్‌ ప్రారంభించారని నెట్టింట మీమ్స్‌ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.

    తాజాగా తనపై వచ్చిన మీమ్స్‌పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు.  తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.  కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ ‍చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 
     

  • గంపెడాశలతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని వస్తున్న ఎంతోమంది తప్పుదారి పడుతున్నారంటోంది బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. అవకాశాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నవారిని కొన్ని అదృష్య శక్తులు నిలువునా ముంచేస్తున్నాయంటోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తనుశ్రీ దత్తా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మొదట అందానికి ప్రాధాన్యతనిస్తారు. వారికి టాలెంట్‌ ఉందా? లేదా? అనేది ఆలోచించరు. అందాన్ని చూసి పొగడ్తలు కురిపిస్తారు. కానీ అది విని మీరు బోల్తా కొట్టకూడదు. 

    ముందు పొగడ్తలు
    నా చిన్నతనంలో నా తల్లి అపరిచితులతో మాట్లాడకూడదని, వారిచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని చెప్పేది. ఇండస్ట్రీలో అలాంటి అపరిచితులు, వారిచ్చే చాక్లెట్లు చాలా రకాలుగా ఉంటాయి. వారి కోరిక తీర్చుకునేందుకు ముందు మిమ్మల్ని పొగుడుతారు. తర్వాత మీ కలల్ని, ఆశయాల్ని ఆసరా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటారు. ఈ క్రమంలో అవకాశాలు అందుకుని ముందడుగు వేసిన కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు బాధతో ఇంటికి తిరిగెళ్లిపోతారు. 

    నన్ను నేను అమ్ముకోను
    ఇంకొంతమందైతే ముందుకు వెళ్లలేక, వెనక్కూ వెళ్లలేక వ్యభిచారంలోకి నెట్టబడతారు. ఇలాంటి రహస్యాలు బయటకు ఎప్పుడూ రావు. ఎందుకంటే సక్సెస్‌ స్టోరీలు మాత్రమే బయటకు వస్తాయి, వాటి గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మాటల వల్ల నలుగురు అలర్ట్‌ అయి వారిని వారు కాపాడుకున్నా అదే నాకు సంతోషం. ఇండస్ట్రీలో కాంప్రమైజ్‌ సాధారణమే అని ఓ నటి అన్నందుకు ఆమెతో స్నేహాన్నే తెంచుకున్నాను. నేను ఆర్టిస్ట్‌ను.. ఒకరికి నా జీవితాన్ని అమ్ముకునేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది.

    మీటూ
    మీటూ ఉద్యమం సమయంలో తను కూడా బాధితురాలినేనంటూ మీడియా ముందుకు వచ్చింది తనుశ్రీ దత్తా. నానాపటేకర్‌ లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. 2008లో 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సినిమాలోని ఓ పాట షూటింగ్‌లో నానా పటేకర్‌ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. అయితే ఘటన జరిగిన మూడేళ్లలోపు ఫిర్యాదు చేస్తేనే విచారిస్తామని, ఇది పదేళ్ల కిందటినాటి ఘటన కావడంతో విచారణ కుదరదని న్యాయస్థానం కేసు కొట్టివేసింది. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన తనుశ్రీదత్తా.. తెలుగులో వీరభద్ర చిత్రంలో యాక్ట్‌ చేసింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

    చదవండి: తెలుసు కదా.. షూటింగ్‌లోనే తేడా కొట్టింది: రాశీ ఖన్నా

  • టాలీవుడ్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్‌కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్‌, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.

    ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్‌ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై ‍అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్‌ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది.  

  • ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్‌ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా ‍‍అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో  ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట చర్చకు దారితీసింది.

    ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..

    సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ నిర్ణయం మొదటి అడుగుగా భావిస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయాలతో సినిమాపై ప్రేక్షకుడి దృష్టిని మరల్చినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన హిందీ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఎందుకని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. కింద ఉన్న పదాలు ప్రేక్షకుడి దృష్టిని మరల్చడం, కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ ‍అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు  ఈ కొత్త నియమం అన్ని భారతీయ భాషలు, ప్రాంతాలలోని చిత్రాలకు వర్తిస్తుందని సెన్సార్‌ బోర్డ్ స్పష్టం చేసింది. 
     

  • తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది. చివరగా తెలుగులో తెలుసు కదా మూవీతో అలరించింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.

    సినిమా రిజల్ట్‌ ముందే ఊహించిన రాశీ
    ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించానంది. ఆమె మాట్లాడుతూ.. తెలుసు కదా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్‌ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్‌ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్‌ కాదనిపిస్తుందన్నాను. అదే సమయంలో ఇది దర్శకుడి విజన్‌ అని గౌరవించాను. 

    అదే నేర్చుకున్నా
    కానీ, షూట్‌ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను.. ఇదెక్కడో కొడుతోంది, క్లైమాక్స్‌ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, కాబట్టి ఆపరేషన్‌ సీన్‌ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్‌ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్‌ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

    చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

  • సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు వివరాలు ప్రభుత్వం 90 రోజుల ముందే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

    ప్రముఖ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్‌ శుక్రవారం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు రాష్ట్రంలో విడుదల కాబోయే అన్ని సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఎస్‌.నిరంజన్‌రెడ్డిలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
     

  • ఈ రోజుల్లో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. చిన్న సినిమాలకు సైతం ఐదారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 33 వేల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాడు ఓ దర్శకుడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. వందశాతం నిజం. షార్ట్‌ ఫిలిమ్స్‌ సైతం లక్షల బడ్జెట్‌తో తీస్తున్న ఈ రోజుల్లో..దర్శకుడు రాహి అనిల్ ఈ ప్రయోగం చేశాడు. కేవలం 33 వేలతోనే 80 నిమిషాల నిడివి ఉ‍న్న సినిమాను తెరకెక్కించాడు. 

    రాహి అనిల్ ఎవరో కాదు.. తుంబాడ్, మంఝా, మాయాసభ లాంటి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ దర్శకుడే. ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. మార్చి 18న ఈ మూవీ యూట్యూబ్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు.

    ఈ మూవీలో కేవలం ఇద్దరు నటులు(యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే) మాత్రమే ఉన్నారు. ఐఫోన్‌ కెమెరాతో వీడియో తీసి.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి  అతి తక్కువ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘ఇది నా కొత్త ప్రయోగం. సాంకేతికత ఎలా సినిమాలను మారుస్తుందో చూపించాలని కోరాను’ అని డైరెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ‍ప్రభావం సినిమా రంగంపై ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న ఆయన అతిథిగృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఫామ్‌ హౌస్‌లో భారీగా డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. పార్టీలో రోహిత్‌ రెడ్డి, అతడి సోదరుడు రితేష్‌ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్, రాజస్తాన్‌ మాజీ ఎమ్మెల్యే నితీశ్‌ శర్మ (జైపూర్‌) సైతం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే, ఎనిమిది మంది వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

    వీరిలో రోహిత్‌ రెడ్డి, అతడి సోదరుడితోపాటు మరో ఐదుగురు కొకైన్‌ తీసుకున్నట్టుగా నిర్ధారించారు. మిగిలిన వారిని పరీక్షల కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఈగల్‌ టీమ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వీరికి డ్రగ్స్‌ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. జైపూర్‌ మాజీ ఎమ్మెల్యే నితీశ్‌ శర్మను టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ పార్టీకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నితీశ్‌ శనివారం సాయంత్రమే హైదరాబాద్‌కు వచ్చారు. 

     
    అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌ హౌస్‌
    పోలీసులపైకి కాల్పులు 
    ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ పోలీసులు ఫాంహౌస్‌లోకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న యువకులు సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి, ఎవరో వచ్చారన్న ఆందోళనతో తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమిద్‌ మిశ్రా కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ తుపాకీ రితేష్‌ రెడ్డిదిగా గుర్తించారు. కాల్పులతో ఫాంహౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిక్షణాల్లోనే పోలీసులు ఫాంహౌస్‌ను చుట్టుముట్టారు. లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పారీ్టలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే, మద్యం బాటిళ్లతోపాటు కాల్పులు జరిపిన తుపాకీ, బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నారు.  

     

     

    రహస్యంగా విచారణ 
    విందులో పాల్గొన్న వారిలో పేరున్న నాయకులు కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగింది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌ హౌస్‌ కావడం, గతంలోనూ ఇక్కడ ఇలాంటి పెద్ద కేసే నమోదు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నవారెవరు, పరోక్షంగా ఉన్నవారెవరనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని సమాచారం.

    స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌ 

    పట్టుబడింది వీరే..  
    1) ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ 
    2) బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి  
    3) రాజస్తాన్‌ మాజీ ఎమ్మెల్యే నితీశ్‌ శర్మ 
    4) వర్గనేని రమేష్‌  
    5) వి.శ్రవణ్‌ కుమార్‌  
    6) రితీశ్‌రెడ్డి  
    7) నల్లపునేని విజయకృష్ణతోపాటు మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.

  • హైదరాబాద్‌:  తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది.  మార్చి 13, 2026 న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది.

    మార్చి 13, 2026న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజున రాష్ట్రం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, గత రికార్డు అయిన 335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025) ను అధిగమించింది. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. 

    ఉష్ణోగ్రతలు పెరగడం మరియు వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం మరియు గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. 

    భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ
    రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయి. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం మరియు సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్ మరియు సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది.

    ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.. 

  • కామారెడ్డి:  గోసంగి కాలనీలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతమైంది. పట్టణంలోని రాజానగర్‌ కాలనీలోని ఒక బావిలో ఆ ఇద్దరు చిన్నారులు శవాలై తేలారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లారు విజయ్‌(10), సింహాద్రి(9) అనే ఇద్దరు చిన్నారులు. అప్పటి నుంచి చిన్నారుల ఆచూకీ లభించలేదు. 

    దాంతో చిన్నారుల మిస్సింగ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తొమ్మిదిరోజులుగా చిన్నారుల కోసం ఆశగా ఎదురు చూశారు కుటుంబ సభ్యులు. చివరికి కుంటలో విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

  • హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓఘా హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ అండ్ రీజెనరేటివ్ సెంటర్‌ను ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నానుడిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. రోగాలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన చికిత్స, సంరక్షణ పొందడం ఎంతో అవసరమని తెలిపారు.

    ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి లైఫ్ స్టైల్ మార్పులు ఆరోగ్యానికి కీలకం అని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ చికిత్సలు అందించే ఈ కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా మహిళలు తరచూ ఎదుర్కొనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణకు ఒలింపిక్ పతకాలు సాధించిన ఈషా సింగ్ వంటి యువ మహిళా క్రీడాకారులు ఈ తరం అమ్మాయిలకు ఆదర్శమని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, బిగ్ బాస్ ఫేమ్ భరణితో పాటు పలువురు పేజ్-3 ప్రముఖులు పాల్గొన్నారు.

    ఓజిహెచ్‌ఏ హెల్త్ (OGHA Health) ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అడ్వాన్స్‌డ్ ఫిజియో & రీజెనరేటివ్ సెంటర్ ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిజియోథెరపీ, రీజెనరేటివ్ కేర్ మరియు రిహాబిలిటేషన్ సేవలను అందిస్తూ, శరీర చలనం మెరుగుపరచడం, నొప్పి తగ్గించడం మరియు మొత్తం శారీరక పనితీరును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

    ఈ కేంద్రాన్ని ముఖ్య అతిథి శైలజా రామయ్యర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఒలింపిక్ స్పోర్ట్ షూటర్ ఈషా సింగ్, డెలాయిట్ సంస్థ చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరిరంగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓజిహెచ్‌ఏ హెల్త్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ డా. సంధ్య గోలి మాట్లాడుతూ, ఆధునిక వైద్యం కేవలం వ్యాధులను చికిత్స చేయడానికే పరిమితం కాకుండా, వ్యక్తులలో శక్తి, చలనం మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

  • భూపాలపల్లి:  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది.  క్రేన్‌ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది.  క్రేన్‌తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. 

    ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్‌(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి  మోహన్‌ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

     


     

  • రాజన్న సిరిసిల్ల జిల్లా: కథలాపూర్‌ మండలం ఇప్పపెల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శుక్రవారం పెళ్లి జరిపించారు. గ్రామశివారులో ముదిరాజ్‌ సంఘం తరఫున 5 ఎకరాల మామిడితోట నిర్వహిస్తున్నారు. మామిడిచెట్లకు పెళ్లి జరిపిస్తే కాయలు బాగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడిచెట్లకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. అనంతరం సంఘం సభ్యులు సామూహిక భోజనాలు చేశారు. అర్చకులు పులికాంత ప్రమోద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
     

  • సాక్షి, మంచిర్యాల జిల్లా: హృదయ విదారక స్థితిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చనిపోయిన ఆమె చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతిన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన రెండో కుమారుడు సమేందర్ దగ్గర ఉంటున్నారు. అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.

    ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడం.. అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు  రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిచూడగా కదల్లేని స్థితిలో ఆమె ఉండడం చూసి కుమారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఆమె చనిపోయి ఉన్నారు.

    అయితే, ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లలు ఆమె చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. సీఐ పర్స రమేష్, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో జనగణనపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ వెల్లడించారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు.

    16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. కాగా జనగణన  ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్‌ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం.

    దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా కోవిడ్‌–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్‌–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్‌ తన మొబైల్‌ ఫోన్‌లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్‌/పోర్టల్‌ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు.

International

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్త యుద్ధం. ఇది గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో  ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ సహకరిస్తున్న అరబ్‌ దేశాలపై ఇప్పటికే ఇరాన్‌ విరుచుకుపడుతూ ఉంది.  తమతో యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వారు తమ శత్రువులేనని ఇప్పటికే ఇరాన్‌ స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే వారిపై భీకరమైన దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.  

    విదేశాలకు సరఫరా అయ్యే చమురు విషయంలో కూడా ఇరాన్‌ కఠినంగానే ఉంది.  ఇరాన్‌కు నచ్చిన దేశాలను మినహాయించి మిగతా దేశాలను కట్టడి చేస్తోంది. ప్రధానంగా హర్మూజ్‌ జలసంధి నుంచి వచ్చే చమురు నౌకల విషయంలో ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దీన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లో ఆందోళన మొదలైంది. 

    ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. ప్రపంచ ఇంధన భద్రతకు కీలకమైన చోక్‌పాయింట్‌గా చెప్పుకుంటారు. మరి దీన్ని ఇరాన్‌ పూర్తిగా క్లోజ్‌ చేస్తే ఏంటనేది పరిస్థితి. ఇదే ఇప్పుడు ట్రంప్‌లో మొదలైన భయం. 

    మీ నౌకలను పంపండి
    హర్మూజ్‌ జలసంధి భద్రతపై తీవ్ర ఆందోళనలు నడుమ ట్రంప్‌..  ప్రపంచ దేశాలకు ఒక పిలుపునిచ్చారు. హర్మూజ్‌ జలసంధి భద్రతకు సంబంధించి పలు ఇతర దేశాల నౌకలను పంపమని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా, యూకేలకు ఆయన తన సందేశాన్ని పంపారు. ఈ జలసంధితో ఇబ్బంది తలెత్తితే ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆయా దేశాలేనని అందుచేత ముందస్తు జాగ్రత్తగా ఆ జలసంధి భద్రతకు నౌకాదళాన్ని సిద్ధం చేసుకుని పంపాలన్నారు.  ఇలా చేస్తే ముప్పు ఉండదని, లేకపోతే అతి తీవ్రమైన సంక్షోభాన్ని కూడా చూడాల్సి రావచ్చన్నారు. వారంతా హర్మూజ్‌ జలసంధి అంశంలో ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు.

  • వాషింగ్టన్‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశంలోని పలువురు ఉన్నతాధికారుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 మిలియన్ డాలర్లు (రూ.92,47,48,000) బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. యుద్ధం మరింత ముదురుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాన్ని అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించే “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా ప్రకటించింది.

    రివార్డు ఉన్న వ్యక్తుల జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు కీలక నేతలు, అధికారులు అలీ అస్గర్ హిజాజీ, యాహ్యా రహీమ్ సఫవి, అలీ లరిజాని, ఎస్మాయిల్ ఖతీబ్ ఎస్కందర్ మొమెని ఉన్నారు. ఈ నాయకులపై సమాచారం ఇచ్చే వారికి అమెరికా బహుమతి ప్రకటించింది.

    అమెరికా ఈ నాయకులకు వేర్వేరుగా కచ్చితమైన మొత్తాన్ని బహుమతిగా ప్రకటించలేదు. అమెరికా చెప్పింది ఒక్కటే.. ఎవరైనా తమకు ఇచ్చే సమాచారం ఉపయోగపడితే “గరిష్ఠంగా $10 మిలియన్ (సుమారు రూ.92-93 కోట్లు) వరకు” బహుమతి ఇవ్వవచ్చు.

    రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం అంటే అమెరికా మీద ఉగ్రదాడులు చేసినట్లు అనుమానించే వ్యక్తులను గుర్తించేందుకు సమాచారం ఇచ్చిన వారికి డబ్బు బహుమతి ఇచ్చే కార్యక్రమం. మొజ్తబా ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులను “ఇరానియన్ టెర్రరిస్టులు”గా పేర్కొంటూ అమెరికా ఒక ప్రకటనలో వివరాలు తెలిపింది.

    “ఈ వ్యక్తులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)లో వివిధ విభాగాలను నడిపిస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర చర్యలకు ప్రణాళికలు వేసి, అమలు చేస్తుంది” అని చెప్పింది.

    “ఈ ఐఆర్‌జీసీ నాయకులు లేదా దాని విభాగాలపై సమాచారం తెలిసినవారు ఆ విషయాన్ని టోర్ ఆధారిత టిప్‌లైన్ లేదా సిగ్నల్ ద్వారా మాకు పంపండి. సమాచారం ఇచ్చిన వారికి బహుమతి లభించే అవకాశం ఉంటుంది” అని తెలిపింది.

    టోర్ అంటే ఇంటర్నెట్‌లో గుర్తింపును దాచుతూ సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ. సిగ్నల్ అంటే గోప్యంగా సందేశాలు పంపే ఎన్‌క్రిప్షన్ ఆధారిత మెసేజింగ్ యాప్.

  • US-Israel War on Iran day 15:  భీకర దాడులతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌  యుద్ధం 15  రోజు కూడా తీవ్రంగా  కొనసాగుతోంది.  ప్రధానంగా ఇరాన్‌లోని కీలకమైన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దళాలు (CENTCOM) అత్యంత శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

    మరోవైపు ఖార్గ్ ద్వీపం బాంబు దాడి తర్వాత  అమెరికా మద్దతు ఉన్న చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ గట్టి కౌంటరిచ్చింది.2,500 మంది అమెరికన్ మెరైన్‌లు, నౌకలు గల్ఫ్‌కు పయనమవుతుండగా టెహ్రాన్ ‘మరింత విధ్వంసక’ క్షిపణులను సిద్ధం చేస్తోంది.

    ఇరాన్ నుండి వస్తున్న క్షిపణులను గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శనివారం ఇజ్రాయెల్‌రాజదాని నగరం జెరూసలేం మీదుగా భారీ పేలుళ్లు వినిపించాయని AFP నివేదించింది. 

    ఇది  ఇలా ఉంటే యుఎఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వైమానిక  రక్షణ దళాలు మార్చి 13న  7 బాలిస్టిక్ క్షిపణులు , 27 యుఎవిలను అడ్డుకున్నాయి. UAE ఈ రోజు 9 క్షిపణులు , 33 డ్రోన్‌లను అడ్డుకుంది. దీంతో వీటి సంఖ్య 285 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు , 1,567 యుఎవిలకు చేరుకున్నాయి. ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని యుఎఇ కాన్సులేట్ జనరల్‌ను లక్ష్యంగా చేసుకుని వారం రోజుల్లో రెండవసారి జరిగిన ఉగ్రవాద డ్రోన్ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడగా, కాన్సులేట్ భవనం దెబ్బతింది.

    45 మంది అరెస్ట్‌ 
    మరోవైపు యుఎఇలో, తప్పుదారి పట్టించే లేదా ఏఐ  వీడియోలను ఆన్‌లైన్‌లో పంచుకున్నందుకు 10 మంది నిందితులకు భారీ షాక్‌ తగలనుంది. వీరిపై విచారణణు  వేగవంతం చేశారు.  సంఘటనాస్థలాలను చిత్రీకరించడం, లేదా  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 45 మందిని అబుదాబి అధికారులు అరెస్టు చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమని అక్కడి అధికారులు తెలిపారు. 

    కాగా ఫిబ్రవరి 28న  మొదలైన యుద్ధం మధ్యప్రాచ్య వివాదం మూడవ వారంలోకి ప్రవేశించింది. దాదాపు 43,000 నివాస, వాణిజ్య యూనిట్లు దెబ్బతిన్నాయని ఇరాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ వెల్లడించారు. ప్రభుత్వ నిర్వహణలోని IRNA వార్తా సంస్థ ప్రకారం, దెబ్బతిన్న నిర్మాణాలలో 36,469 నివాసాలు, 6,179 వాణిజ్య సౌకర్యాలు ఉన్నాయి..

    అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని, 223 మంది మహిళలు , బాలికలు మరణించారని మరియు 2,129 మంది గాయపడ్డారని మొహజెరానీ చెప్పారు. ఆమె మొత్తం మరణాల సంఖ్యను ప్రకటించలేదు  కానీ గతంలో అధికారులు 1,230 మంది మరణించారని చెప్పారు.సైనిక నష్టం గురించి ఇరాన్ ఎటువంటి సమాచారం అందించలేదు.

     

  • తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్‌స్టైల్‌, ఫుడ్‌ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం.   ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే  జిన్ బావోలింగ్‌ (Jin Baoling).

    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్  కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి.  దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.

    తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.

    జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.

    ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్‌లో సమృద్ధిగా ఉండే ఇది  చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట.  జిన్‌ దీన్ని దాదాపు ప్రతిరోజూ  తింటుంది. 

    ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.

    ప్రతీ పూట మందు ఉండాల్సిందే 
    ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.

    కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్‌కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్‌సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం  అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.

    నెటిజన్లు స్పందన
    తమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. 

    “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన  సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం.  నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు. 
     

  • ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధంలో ఉన్నాయి. ఇరాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకునే వరకూ యుద్ధం ఆపేది లేదంటోంది అమెరికా. అదే సమయంలో ఇరాన్‌ కూడా తాము కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఈ యుద్ధం ఎంతవరకూ వెళుతుందో అనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

    ఇప్పటికే ఇరాన్‌ గగనతలం తమ గుప్పిట్లోకి వచ్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ చెబుతున్నా.. పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. ఇరాన్‌ సైతం అంతే ధీటుగా బదులిస్తూ ఉండటంతో అటు గల్ఫ్‌ దేశాలతో పాటు అమెరికాలో కూడా ఆందోళన చాయలు కనిపిస్తూనే ఉన్నాయి.   ట్రంప్‌ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇంకా ఇరాన్‌ లొంగిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    ఇదిలా ఉంచితే, ఒక లైవ్‌ షోలో ఉండగా అమెరికా ఆర్థికశాఖ కార్యదర్శి స్కాట్‌ బీసెంట్‌కు ఉన్నపళంగా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి కాల్‌ రావడం చర్చనీయాంశమైంది.  బీసెంట్‌  స్కై న్యూస్‌ స్టూడియోలో లైవ్‌ ప్రోగ్రామ్‌లో ఉండగా పిలుపు వచ్చింది.  ఆ స్టూడియోకు ట్రంప్‌ నుంచి కాల్‌ రావడంతో  ఉన్నపళంగా బీసెంట్‌ మధ్యలోనే వెళ్లిపోయారు.

    ఆ కాల్‌ సారాంశం ఏంటంటే.. ‘ఇంటర్వ్యూ ఆపండి.. మీకు ట్రంప్‌ నుంచి కాల్‌ వచ్చింది.. మిమ్మల్ని ట్రంప్‌ వెంటనే కలవాలట. వైట్‌హౌస్‌ సిట్యువేషన్‌ రూమ్‌కి రమ్మన్నారు’ అని లైవ్‌ ప్రోగ్రామ్‌ మధ్యలో సందేశం వెళ్లింది. దాంతో బీసెంట్‌ తన ఇంటర్వ్యూను  అక్కడే వదిలేసి పరుగు పరుగున వెళ్లి ట్రంప్‌ను కలిశారు. 

    అయితే   ఆ తర్వాత బీసెంట్‌ తన లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు బీసెంట్‌ ప్రోగ్రామ్‌ వాయిదా పడిన తర్వాత కొనసాగించారు. దీనిలో భాగంగా బీసెంట్‌ మాట్లాడుతూ..  ‘అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇరాన్ మిషన్ షెడ్యూల్‌కి ముందుగానే విజయవంతంగా కొనసాగుతోంది.  అలాగే  ప్రభుత్వ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ట్రంప్‌ను కొనియాడారు.

     

    ఇదీ చదవండి: 

    ఏకంగా 10 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన కిమ్‌

  • Iran war ఇరాన్‌పై  అమెరికా ఇజ్రాయెల్‌  భీకరదాడులు, ఇరాన్‌ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్‌కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్‌ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్‌ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో  తెగ వైరల్‌ అవుతోంది. అసలు  వాస్తవం ఏంటి?

    ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి  పోస్ట్‌ కావడంతో ఒక్కసారిగా  గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన  స్క్రీన్‌షాట్‌లు వైరల్‌గా మారాయి. అంతేకాదు  ఇటీవల ఆయన మీడియాతో  మాట్లాడిన  వీడియో ఏఐతో రూపొందించారనే  ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్‌ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.

    నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? 
    నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్  అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది  ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు   వ్యాపించాయి. అసలు ఆయన బతికే  ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది  సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.

    అసలు  నిజం ఏమిటంటే
    ఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్‌లైన్‌లో వ్యాపించిన పుకార్లను అనేక  ఫ్యాక్ట్‌ చెక్‌ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ,  సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో  AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్‌ వీడియోలు అని ఫ్యాక్ట్‌ చెక్‌ నిపుణులు తేల్చారు.

    ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్‌షాట్‌లు, తప్పుడు దృశ్యాలు.  తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో  ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా  రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.

    ఇదీ చదవండి: షాకింగ్‌ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష

    అలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్‌ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్‌ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.

    (మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌)

  • అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన  భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్‌ సవానీ(60), అరుణ్‌ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు.  మనీలాండరింగ్‌, హెచ్‌1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్‌ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు.  అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.

    US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన  సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను  అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్‌ ద్వారా  30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు
     
    ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...

    హెచ్-1బి (H-1B) వీసా  స్కాం
    వీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్‌బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

    మెడికేడ్ (Medicaid) కుంభకోణం
    భాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం  ‘మెడికేడ్‌’ను  ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.

    మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేత
    వచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.

    దారుణమైన వైద్య ప్రయోగాలు
    అంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్‌ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.

    మనీలాండరింగ్‌ ద్వారా కార్పొరేట్‌ బ్యాంక్‌ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత,  భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని  కూడా దోషిగా  తేల్చింది కోర్టు.

    శిక్షలు  ఇలా  ఉండబోతున్నాయి
    భాస్కర్‌కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు  విధించింది.  ఈ ఏడాది  జూలో (2026) లో శిక్ష  అమలు కానుంది. 

  • టెహ్రాన్: ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో రెండు వారాల యుద్ధానికే అమెరికా పనైపోయిందని తెలిపారు. వాషింగ్టన్‌ ఇప్పుడు భారత్‌తో పాటు అనేక దేశాలను రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయాలని అడుక్కుంటుందని ఆరోపించారు.

    పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. హార్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేయడం చమురు వాణిజ్యానికి ఆటంకం తలెత్తింది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్  స్థావరాలపై దాడులు చేయడంతో క్రూడాయిల్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ గతంలో విధించిన ఆంక్షలు సడలించారు. ప్రపంచ దేశాలు తాత్కాలికంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కౌంటరిచ్చారు,

    ఆయన మాట్లాడుతూ " గత కొద్ది నెలలుగా అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దంటూ ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో 15 రోజులు యుద్ధం చేయగానే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్‌తో సహా ఇతర దేశాలని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని యాచిస్తుంది. యూరప్ సైతం ఈ అక్రమ యుద్ధంలో మద్దతు ఇవ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా యుఎస్ సపోర్టు లభిస్తోందని భావిస్తోంది" అని అన్నారు. వారి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉందని తెలిపారు.

    కాగా ఇంతకాలం రష్యాతో చమురు కొనుగోలు ఇతర దేశాలను అమెరికా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మాస్కో నుంచి పన్ను కొనుగోలు చేసిన వారిపై అధిక పన్నులు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌పైన తొలుత పన్నులు పెంచి అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేశారని ప్రకటించింది. అయితే ఇటీవలే రష్యా నుంచి తాత్కాలికంగా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని ఆదేశించినట్లు తెలిపింది. కాగా దీనిపైఇరాన్ విదేశాంగమంత్రి స్పందించారు.

    కాగా ప్రస్తుతం ఇరాన్ భారత్ విషయంలో సానూకులంగా ఉంది. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్  ఇరాన్ విదేశాంగశాఖ మంత్రితో చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలో భారత్ వెళ్లే చమురు నౌకలకు ఇరాన్ అనుమతి తెలిపింది. ఇటీవల భారత్ పతాకంతో ఉన్న రెండు నౌకలు హార్మూజ్ గుండా ఇండియాకు చేరుకున్నాయి.

Sports

  • పశ్చిమాసియాలోని ఇరాన్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్‌కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌ 2028కు హాజరవ్వకుండా ట్రంప్‌పై నిషేధం పడే అవకాశముంది. 

    ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్‌ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. 

    ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. 

    కాబట్టి.. ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.

    చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ మొదలవ్వడానికి మరో రెండు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్‌ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 

    త్వరలో ఇంగ్లండ్‌ ప్రధాన కోచ్‌గా పీటర్సన్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు. ‘నేను ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదు. ఆ బాధ్యతలకు కావాల్సినంత సమయం కేటాయిం చలేకపోతున్నా. 

    అయితే ఈ సీజన్‌లో ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మిమ్మల్ని (ఫ్యాన్స్‌) కామెంట్రీ బాక్స్‌లో నుంచి చూస్తా. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌ ఐపీఎల్‌. కొత్త సీజన్‌ కోసం వేచి చూడలేకపోతున్నా’ అని పీటర్సన్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపాడు. 

    బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ వరకు చేరుకున్న ఇంగ్లండ్‌ నాకౌట్‌లో భారత్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మెక్‌కల్లమ్‌ కోచ్‌గా వచ్చిన కొత్తలో బజ్‌బాల్‌ ఆటతో ఇంగ్లండ్‌ దూకుడు ప్రదర్శించింది. 

    కానీ క్రమంగా బజ్‌బాల్‌ ఆటే ఇంగ్లండ్‌ కొంపముంచింది. దీంతో మెక్‌కల్లమ్‌ను కోచ్‌ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్‌ ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడడం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ లీగ్‌ స్టేజీకే పరిమితమైన సంగతి తెలిసిందే.

    చదవండి: రోహిత్‌ బాటలో రిషబ్‌ పంత్‌!

  • టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఐపీఎల్ 18వ సీజన్‌లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పంత్‌ బరువు తగ్గే విషయమై భారత స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మను అనుసరిస్తున్నాడు. గతంలో రోహిత్‌ శర్మ కూడా తన బరువు తగ్గే క్రమంలో కఠినమైన డైట్‌ పాటించాడు. 

    తాజాగా పంత్‌ కూడా బరువు తగ్గేందుకు మిత ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక పంత్‌ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పంత్‌  వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

    ‘పంత్‌.. మీరు ఎంత బరువు తగ్గారో చెప్పగలరా?’ అని మీడియా ప్రశ్నించింది. అందుకు పంత్‌ ‘ఆ విషయం మాత్రం అడగొద్దు’ అంటూ బదులిచ్చాడు. ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్‌లేమీ పంత్‌ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ద్వారా తిరిగి గాడిలో పడేందుకు టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సలహాలు తీసుకున్నాడు. 

    ఈ సందర్భంగా యూవీ పంత్‌కు పలు సలహాలు, బ్యాటింగ్‌ నైపుణ్యానికి సంబంధించి మెలుకువలు అందించాడు. అయితే గతంలో సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మలు కూడా ఇదే తరహాలో ఫామ్‌ కోల్పోయినప్పుడు యూవీ ఇలాగే సాయం చేశాడు. 2025 ఐపీఎల్‌లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం ఈ ఏడాది అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. 

    టీ20 ప్రపంచకప్‌కు ముందు వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కోసం బీసీసీఐ పంత్‌ను పరిగణలోకి తీసుకుంది. కానీ అనూహ్యంగా పంత్‌ గాయపడడంతో జితేశ్‌ శర్మ పేరు తెర మీదకు వచ్చింది. కానీ అతను కూడా గాయంతో బాధపడుతుండడంతో ఆ అవకాశం ఇషాన్‌ కిషన్‌ను వరించింది. 

    గతేడాది ఐపీఎల్‌లో పంత్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ తరఫున 14 మ్యాచ్‌లాడి 269 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్‌ 18వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

    చదవండి: బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

  • పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సెలెక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను పాక్‌ వివాదాస్పద బౌలర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్‌ జావేద్‌ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్‌. అతని బౌలింగ్‌ యాక్షన్‌ కూడా భిన్నంగానే ఉంటుంది. 

    బుమ్రా బౌలింగ్‌ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్‌ బౌలర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్‌ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్‌ తారిఖ్‌ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్లు పడగొట్టాడు. 

    ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్‌ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్‌ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడు’ అని పేర్కొన్నాడు. 

    కాగా ఆకిబ్‌ జావేద్‌ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్‌ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్‌ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.

    ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్‌ తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

    చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌

  • పాకిస్థాన్‌ క్రికెటర్‌ సల్మాన్‌ అఘా రనౌట్‌ క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపుతుంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్‌ ఔటైన తీరు క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తనను ఔట్‌ చేశాడన్న కోపంతో సల్మాన్‌ అఘా తన హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను నేలకేసి కొట్టడమే గాక కెప్టెన్‌ మిరాజ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌తో గొడవపడ్డాడు.  

    అఘా ఔటైన తీరు వివాదాస్పదమే అయినప్పటికీ అతడి చర్య మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ పలువురు క్రీడా నిపుణులు పేర్కొన్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా సల్మాన్‌ అఘాపై చర్యలు తీసుకుంది. ఔట్‌ నిర్ణయం రాగానే మైదానంలో అనుచిత ప్రవర్తనకు దిగడమే గాక మ్యాచ్‌ రిఫరీ నీయముర్‌ రషీద్‌ ఫిర్యాదు మేరకు లెవల్‌ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.

    ‘క్రికెట్‌ పరికరాలను అగౌరవపరిచినట్లు పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతను హెల్మెట్‌, గ్లౌవ్స్‌, బ్యాట్‌ను విసిరేసినట్లు తేలింది. గతంలో సల్మాన్‌ అఘా నుంచి ఇలాంటి ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఘా చేసిన పనిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 

    ఇప్పటికే అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేశాం. అయితే బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌తో జరిగిన వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకుంటూనే ఇలాంటి తీర్పును ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.మాజ్‌ సదాఖత్‌ (75), సల్మాన్‌ అఘా (64) రాణించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 243 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్‌ 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం ఇరుజట్లు చెరో వన్డే గెలవగా, మూడో వన్డే ఆదివారం జరగనుంది.

    చదవండి: ఐదేళ్ల ప్రయాణం.. దిగ్గజాల సరసన సూర్యా భాయ్‌!

  • క్రికెట్‌ అభిమానులంతా అతడిని ముద్దుగా మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని పిలుస్తుంటారు. ప్రత్యర్థి బౌలర్‌ ఏ యాంగిల్‌లో బంతి వేసినా బౌండరీ లేదా సిక్సర్‌ బాదడం అతడి నైజం. దూకుడైన ఆటతీరుకు మారుపేరు. ఐదేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన టీమిండియా జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇందులో ఒకసారి కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ అందుకొని దిగ్గజాల సరసన నిలిచి అరుదైన ఘనత సాధించాడు. అతడే భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. మార్చి 14 (శనివారం)తో సూర్యకుమార్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో ఐదేళ్ల ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. 

    ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియాతో ఐదేళ్ల ప్రయాణాన్ని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. ‘ఐదేళ్ల ఏళ్ల క్రితం టీమిండియాకు ఆడాలన్న ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడమనేది ఇప్పటికీ నేను మాటల్లో పూర్తిగా వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి. ఈ నేపథ్యంలో ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్‌గా నేను పొందిన జ్ఞాపకాలను మరోసారి పంచుకుంటున్నా.’ అంటూ ట్వీట్‌ చేశాడు.

    టీ20 క్రికెట్‌లో భారత తరఫున అత్యుత్తమ ఆటగాడిగా పేరు పొందిన సూర్యకుమార్‌ యాదవ్‌ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం విశేషం. మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా సూర్య తన కెరీర్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. సూర్యకుమార్‌ ఇప్పటివరకు టీమిండియా తరఫున 113 టీ20 మ్యాచ్‌లు ఆడి 162.94 స్ట్రైక్‌రేట్‌తో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 25 అర్థసెంచరీలున్నాయి.

    ప్రస్తుతం సూర్యకుమార్‌ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రెండు స్థానాల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఉన్నారు. ఈ ఇద్దరు 2024 టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 

    2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్‌ ఆ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్‌లో బౌండరీ వద్ద క్యాచ్‌ అందుకోవడం ఎన్నటికీ మరిచిపోలేని సంఘటన. సూర్య క్యాచ్‌ అందుకోవడంతో మ్యాచ్‌ భారత్‌వైపు తిరగడం, ఆ తర్వాత టీమిండియా టైటిల్‌ గెలవడం చకచకా జరిగిపోయాయి.

    రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అనంతరం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్‌ జట్టును విజయపథంలో నడిపించడంలో విజయవంతమయ్యాడు. ఇప్పటివరకు సూర్య సారథ్యంలో 40 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఎనిమిదింట మాత్రమే ఓడిపోయింది. అంతేకాదు టీ20 క్రికెట్‌లో సూర్య చేసిన నాలుగు సెంచరీలు నాలుగు వివిధ దేశాల్లో (భారత్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌) రావడం విశేషం. 

    2022 ఏడాదిలో సూర్యకుమార్‌ టీమిండియా తరఫున 31 మ్యాచ్‌ల్లో 187 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. 

    చదవండి: తూచ్‌.. అదంతా ఉత్తిదే!

  • పాకిస్తాన్‌ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్‌ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్‌ కాదని.. అదొక ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.

    కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్‌ వెళ్లిన పాకిస్తాన్‌ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్‌ 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

    రనౌట్‌పై వివాదం
    ఇదిలా ఉంటే.. పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ ఆఘా రనౌట్‌ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో మొహ్మద్‌ రిజ్వాన్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడగా.. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సల్మాన్‌కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్‌కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్‌ బంతిని వికెట్లకు గిరాటేశాడు.

    మాటల యుద్ధం
    ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ రనౌట్‌కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్‌ హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్‌తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్‌ దాస్‌ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్‌ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.

    క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని 
    అయితే, సల్మాన్‌ రనౌట్‌ అయిన విషయంపై పాక్‌ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్‌ ఆఘా మిరాజ్‌ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.

    ఇక పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్‌ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్‌ బౌలర్‌కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్‌ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్‌ తీరును విమర్శించాడు.

    ఇదేమీ చారిటీ లీగ్‌ మ్యాచ్‌ కాదు
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్‌ మ్యాచ్‌ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్‌.

    క్రీడాస్ఫూర్తికి భంగమా?
    నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్‌ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్‌ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్‌ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు.

    కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్‌ ఓడిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31), మాజ్‌ సదాకత్‌ (75)లతో పాటు రిజ్వాన్‌ (44), సల్మాన్‌ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్‌ ఆలౌట్‌ అయింది.

    బంగ్లా బౌలర్లలో రిషాద్‌ హొసేన్‌ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ మిరాజ్‌ రెండు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, నహీద్‌ రాణా తలా ఒక వికెట్‌ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్‌ను డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    చదవండి: SRH: బెస్ట్‌ ప్లేయింగ్‌ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!

  • ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చెత్త ఆటతీరుతో సూపర్‌-8లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పాక్‌ జట్టుపై ఆగ్రహంతో ఊగిపోయిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఒక్కో ఆటగాడికి పీకేఆర్‌ 50 లక్షలు (భారత కరెన్సీలో సుమారు రూ.16.5 లక్షలు) జరిమానా విధిస్తున్నట్లు కొన్ని రోజుల కిందట ఆ దేశ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. 

    ఈ కఠిన నిర్ణయం స్వయంగా పీసీబీ చైర్మన్‌ మొహసీన్‌ నఖ్వీనే తీసుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానాల్లో నిజమెంత అనే దానిపై పీసీబీ ప్రతినిధి ఆమిర్‌మిర్‌ స్పందించారు. 

    ‘టీ20 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన కనబరిచినందుకు పాక్‌ ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా సోషల్‌ మీడియా ప్రచారం చేస్తున్న గాసిఫ్‌ మాత్రమే. అలాంటి నిర్ణయాలు పీసీబీ ఎప్పుడూ తీసుకోదు. ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనకుగానూ పాకిస్థాన్‌ ఆటగాళ్లను, కోచ్‌, సిబ్బందిని హెచ్చరించిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆటగాళ్లపై మాత్రం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు గానీ జరిమానా కానీ విధించలేదు.’ అని చెప్పుకొచ్చారు.

    ఇక సల్మాన్‌ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై తడబడి గెలిచింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌ ఎలాగోలా సూపర్‌-8లో అడుగుపెట్టింది. 

    అయితే సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. కానీ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 2024లోనూ పాక్‌ జట్టు సెమీస్‌ చేరడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా నాసిరకం ఆటతీరుతో నాకౌట్‌కు చేరకుండానే పాకిస్థాన్‌ వరుసగా రెండోసారి సూపర్‌-8 దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. 

    అయితే టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం కారణంగా ఆటగాళ్లకు జరిమానా విధించారన్న విషయంపై వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ స్పందించాడు. పాక్‌ ఆటగాళ్లకు విధించిన జరిమానా మొత్తాన్ని తాను కడుతానని, కానీ ఆ డబ్బులు జట్టును మళ్లీ మంచి ట్రాక్‌లోకి తెచ్చేందుకు ఉపయోగించాలని కోరడం గమనార్హం. 

    ఇటీవలే బంగ్లాదేశ్‌లో మొదలైన వన్డే సిరీస్‌ను కూడా పాక్‌ ఓటమితోనే ప్రారంభించింది. తొలి వన్డేలో పాకిస్థాన్‌ 114 పరుగులకే కుప్పకూలింది. అయితే రెండో వన్డేలో మాత్రం బంగ్లాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.

    చదవండి: ధోనీ ఆ విషయం అప్పుడే చెప్పాడు!

     

  • ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్రారంభానికి మరో 15 రోజుల సమయం మిగిలి ఉంది.ఇప్పటికే లీగ్‌లోని ఆయా జట్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధం చేస్తున్నాయి. అయితే సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్‌గైక్వాడ్‌ పేరును ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. 

    దీంతో ధోనీకి ఈ సీజన్‌ చివరిదని భావిస్తున్న అభిమానులు కెప్టెన్‌గా ఒక్క మ్యాచ్‌కైనా నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ధోనీ కెప్టెన్సీ విషయమై వేరే వాళ్లకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని మేనేజ్‌మెంట్‌కు ఇది వరకే స్పష్టం చేశాడు. దీంతో ధోనీని ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. 

    అయితే ఈసారి ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదంటే కొన్నింటికే పరిమితమవుతాడా అన్నది చూడాలి. కాగా ధోనీ కెప్టెన్సీ విషయమై ఇది వరకే తనకు ఒక సందేశాన్ని పంపించాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.‘ఐపీఎల్‌ ప్రారంభమవు తుందంటే అందరి కళ్లు సీఎస్‌కే మీదకే మళ్లుతాయి. ఎందుకంటే భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అంతే సక్సెస్‌ రేట్‌ను కలిగి ఉన్నాడు. 

    ఈసారి కెప్టెన్సీకి ధోనీ దూరమైనప్పటికీ అతడి సలహాలు మాత్రం జట్టుకు ఉంటాయనడంలో సందేహం లేదు. కెప్టెన్‌గా కొనసాగడానికి బదులు ఆటగాడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నట్లు ధోనీ ఇది వరకే నాతో పేర్కొన్నాడు.’ అని పఠాన్‌ తెలిపాడు. ఇక ధోనీకి ఇదే చివరి సీజన్‌ అని భావిస్తున్న తరుణంలో అటు సీఎస్‌కే యాజమాన్యం కూడా మాజీ వికెట్‌కీపర్‌ విషయంలో భారీగానే ప్లాన్‌ చేస్తుంది. ఎలాగైనా టైటిల్‌ కొట్టి ధోనీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. 

    మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026లో భాగంగా తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఐపీఎల్‌ యాజమాన్యం పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

    చదవండి:  IPL 2026: ‘ప్రపంచం అతడిని మర్చిపోయింది’

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌-2026 ప్రయాణాన్ని మార్చి 28న మొదలుపెట్టనుంది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తొలుత తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 2న కోల్‌కతాతో, ఏప్రిల్‌ 5న లక్నోతో, ఏప్రిల్‌ 11న పంజాబ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

    తొలి విడతలో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌కు సంబంధించి ఈ నాలుగు మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సన్‌రైజర్స్‌ తుదిజట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

    టాప్‌-3లో వీరే
    ‘‘నా దృష్టిలో సన్‌రైజర్స్‌ అత్యుత్తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే. ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ టాప్‌-3లో ఆడతారు. నితీశ్‌ రెడ్డిని నాలుగో స్థానంలో ఆడించాలన్నది నా అభిప్రాయం.

    టీ20 క్రికెట్‌లో అత్యుత్తమంగా ఫినిషింగ్‌ ఇవ్వగల ఆటగాడు అతడు. లేదంటే హెన్రిచ్‌ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో ఆడించి.. నితీశ్‌ను ఐదో ప్లేస్‌లో పంపవచ్చు.

    ఇక అనికేత్‌ వర్మ గతేడాది అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. అతడు ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడించాలి. వీరితో పాటు ఓ అన్‌క్యాప్డ్‌ ఇండియన్‌ బ్యాటర్‌కూ స్థానం దక్కుతుంది.

    కమిన్స్‌ ఎనిమిదో స్థానంలో
    బౌలర్ల విభాగానికి వస్తే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఎనిమిదో స్థానంలో వస్తాడు. బ్యాట్‌తోనూ అతడు అద్భుతం చేయగలడు. ఇక ఆ తర్వాత క్రియాన్స్‌ ఫులేట్రా, జీషన్‌ అన్సారీ, ఇషాన్‌ మలింగలు ఉండాలి.

    భారత ఫాస్ట్‌బౌలర్లను తీసుకోవాలనుకుంటే జయదేవ్‌ ఉనాద్కట్‌, హర్షల్‌ పటేల్‌ బెటర్‌’’ అని సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు. కాగా మినీ వేలంలో సన్‌రైజర్స్‌ అనూహ్య రీతిలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

    అయితే, బంగర్‌ మాత్రం అతడికి తుదిజట్టులో చోటే దండగ అన్న రీతిలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా గతేడాది ఆర్సీబీ తరఫున లివింగ్‌స్టోన్‌ విఫలమయ్యాడు.

    ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ జట్టు
    సలీల్ అరోరా, ట్రవిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్‌, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివమ్ మావి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్‌), అమిత్ కుమార్, క్రియాన్స్‌ ఫులెట్రా, ప్రఫుల్‌ హింజ్‌, ఇషాన్‌ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనాట్కట్‌, జీషన్ అన్సారీ.

    సంజయ్‌ బంగర్‌ ఎంచుకున్న బెస్ట్‌ ప్లేయింగ్‌ XII
    ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, ఆర్ స్మరణ్‌, ప్యాట్ కమిన్స్, క్రెయిన్స్ ఫులెట్రా/జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనాద్క ట్‌, హర్షల్ పటేల్.

    చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

  • ఇంగ్లండ్ ది హాండ్ర‌డ్ లీగ్ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్‌క్ర‌మ్‌పై కాసుల వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. సుమారు రూ. 2.5 కోట్ల భారీ ధ‌ర‌కు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఓవర్సీస్ ప్లేయర్‌గా మార్‌క్ర‌మ్ నిలిచాడు.

    అయితే మార్‌క్ర‌మ్ ఇప్ప‌టికే ఐపీఎల్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల‌లో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు హాండ్ర‌డ్ లీగ్‌లోనూ సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో జ‌త‌క‌ట్టాడు. మొత్తం మూడు లీగ్‌ల‌లో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.

    ఇక ఇది ఇలా ఉండ‌గా.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా మార్‌క్ర‌మ్‌ను నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఐడైన్ ఇప్ప‌టికే సౌతాఫ్రికా లీగ్ డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. మార్‌క్ర‌మ్ కెప్టెన్సీ స్కిల్స్‌పై మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

    "మా మూడు జ‌ట్ల‌లోనూ మార్‌క్ర‌మ్ ఉండ‌డం చాలా సంతోషంగా ఉంది. అత‌డొక అద్బుత‌మైన ఆట‌గాడు. ఐడైన్‌లో గొప్ప నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అత‌డిని వేలంలో ద‌క్కించుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాము" ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. కాగా గ‌త సీజ‌న్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు మార్‌క్ర‌మ్ రాక‌తో మాంచెస్ట‌ర్ కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకోనుంది.

  • ఒకప్పుడు సచిన్‌ టెండుల్కర్‌ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు ముంబై క్రికెటర్‌ పృథ్వీ షా. చిన్న వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకర్షించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించాడు.

    ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన పృథ్వీ షా (Prithvi Shaw) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ముంబై జట్టులోనూ అతడి స్థానం గల్లంతైంది. దీంతో పొరపాట్లు సరిచేసుకున్న పృథ్వీ షా.. తిరిగి గాడిలో పడ్డాడు.

    రూ. 75 లక్షల కనీస ధర
    దేశీ క్రికెట్‌లో మరోసారి బ్యాట్‌తో మెరిసి తనను తాను నిరూపించుకున్నాడు. ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరి సత్తా చాటాడు పృథ్వీ షా. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 75 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.

    ఒకప్పుడు ఐపీఎల్‌లో కోట్లు పలికిన పృథ్వీని.. అదే జట్టు ఇలా బేస్‌ ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం. నిజానికి ముందు రౌండ్లలో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా ఆఖర్లో ఢిల్లీ కనికరించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

    ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఈసారి
    ‘‘పృథ్వీ షాకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఇప్పుడతడు మునుపటి ఆటగాడే. కఠిన శ్రమతో తనను తాను సరిదిద్దుకుని పరుగులు రాబడుతున్నాడు.

    అందుకే ఇక్కడిదాకా చేరుకోగలిగాడు. ఒకవేళ తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆకాశ్‌ చోప్రా పృథ్వీకి సూచించాడు. కాగా పృథ్వీ షా ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మోడల్‌, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. 

    ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ మార్చి 28 నుంచి మొదలుకానుంది. కాగా అక్షర్‌ పటేల్‌ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్‌ చేరకుండానే నిష్క్రమించింది.

    చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?

  • ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 128 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో యువ సంచ‌ల‌నం మాజ్ సదాకత్‌ది కీల‌క పాత్ర‌. ఈ  మ్యాచ్‌లో స‌దాక‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు.  కెరీర్‌లో రెండో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడిన స‌దాక‌త్ త‌న అద్భ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.

    తొలుత బ్యాటింగ్‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌దాక‌త్.. బంగ్లా బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. కేవ‌లం 46 బంతుల్లోనే  6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అనంత‌రం బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో స‌దాక‌త్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

    బంగ్లాదేశ్‌పై వ‌న్డే మ్యాచ్‌లో ఆర్ధ సెంచ‌రీతో పాటు మూడు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా మాజ్ సదాకత్ రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం 20 ఏళ్ల 302 రోజుల‌ వ‌య‌స్సులోనే స‌దాక‌త్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్ గేల్(23) పేరిట ఉండేది. 

    తాజా మ్యాచ్‌తో గేల్‌ను స‌దాక‌త్ అధిగ‌మించాడు. ఓ ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఒకే వ‌న్డే మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన 14వ ఆట‌గాడిగా స‌దాక‌త్ నిలిచాడు. పాకిస్తాన్ నుంచి మాత్రం ఈ రికార్డు సాధించిన ఐదో ప్లేయ‌ర్‌గా స‌దాక‌త్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు హిద్ అఫ్రిది, అబ్దుల్ రజాక్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
    చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ చరిత్రకెక్కింది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.

    ఆరో టైటిల్‌ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై (MI) ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. కాగా గతేడాది పద్నాలుగింట ఎనిమిది గెలిచిన ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

    హార్దిక్‌కు పగ్గాలు
    ఇదిలా ఉంటే... 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)ను ముంబై తమ కెప్టెన్‌గా నియమించింది. దీంతో రోహిత్‌ శర్మను తొలగించి అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల సొంతజట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్‌ను మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేశారు.

    ఈసారి మంచి మార్కులే
    ఆ ఏడాది ముంబై మరీ దారుణంగా పద్నాలుగుకు నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానానికే పరిమితమైంది. అయితే, గతేడాది ప్లే ఆఫ్స్‌ చేర్చిన హార్దిక్‌ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు.. గత సీజన్లో రోహిత్‌ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలో దిగాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్‌లో కలిపి 418 పరుగులు సాధించాడు.

    రోహిత్‌ శర్మకు హార్దిక్‌ పాండ్యా వార్నింగ్‌!?
    ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా- రోహిత్‌ శర్మకు సంబంధించి ఓ వదంతి పుట్టుకొచ్చింది. రోహిత్‌ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న హార్దిక్‌ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడని దాని సారాంశం. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్‌.. ‘‘ఐపీఎల్‌ 2026 ఆరంభానికి ముందు హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ శర్మకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    ఒకవేళ ఈసారి రోహిత్‌ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోతే.. తాను సహించే ప్రసక్తే లేదని మేనేజ్‌మెంట్‌కు తేల్చి చెప్పాడు. యాజమాన్యం కూడా గత 10-12 ఏళ్లుగా రోహిత్‌ బ్యాటింగ్‌తో విసిగిపోయి ఉంది. అతడి స్ట్రైక్‌రేటు 120 కూడా దాటడం లేదు. ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఆటగాడి నుంచి ఈ ప్రవర్తన మేము ఊహించలేదని వాపోతోంది’’ అని పేర్కొన్నారు.

    స్పందించిన ముంబై
    ఈ ట్వీట్‌ వైరల్‌ కాగా.. ముంబై ఇండియన్స్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ నుంచి స్వయంగా స్పందించింది. ‘‘అవునా.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జోడించి.. ఎవరికిష్టం వచ్చినట్లు వారు రాస్తారు అన్న అర్థంలో రూమర్లను కొట్టిపారేసింది. 

    చదవండి: IPL 2026: సీఎస్‌కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్‌!

National

  • చెన్నై: కరూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లియానై సమీపంలో ఓ ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సు రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తూ దానిమీదే  ఆగిపోయింది. అదే సమయంలో ప్రైవేట్ సిమెంట్ కర్మాగారం కోసం గ్రావెల్‌ స్టోన్స్‌ తీసుకెళ్తున్న గూడ్సు రైలు దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ ప్రైవేట్ కళాశాల బస్సులోని 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

    ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ జ్యోతిమణి స్వయంగా కలిసి, వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

  • ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు పవిత్ర స్నానం చేయడానికి సరిపడా నీటి లభ్యతను నిర్ధారించేందుకు వలియంబలం ప్రాంతంలోని వలియ తోడ్ వద్ద కొత్త చెక్ డ్యామ్ నిర్మాణానికి 75 లక్షల రూపాయల నిధిని కేటాయించినట్లు పూన్జార్ ఎమ్మెల్యే Sebastian Kulathunkal ప్రకటించారు.

    ఇప్పటికే ఉన్న చెక్ డ్యామ్ పాతదై దెబ్బతిన్న కారణంగా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

    ఈ కొత్త చెక్ డ్యామ్ 16 మీటర్ల వెడల్పు, 14.1 మీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

    అదనంగా , ఈ చెక్ డ్యామ్‌లో మొత్తం 8 షట్టర్లు ఉంటాయి. వాటిలో 6 FRP షట్టర్లు, 2 యాంత్రిక (మెకానికల్) షట్టర్లు ఉంటాయి.

    ఈ మెకానికల్ షట్టర్ల వాడకం వల్ల యాత్రాకాలంలో అయ్యప్ప భక్తులకు అవసరమైన నీటి లభ్యతను నిర్ధారించడం మాత్రమే కాకుండా, నీటి ప్రవాహాన్ని నియంత్రించడమూ సులభం అవుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.

    (చదవండి: భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు)

  • న్యూఢిల్లీ: గ్యాస్‌ కొరత వేళ కేంద్ర సర‍్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలు వాడుకోవచ్చని ప్రకటించింది. 

    ఢిల్లీలో కాలుష్యం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా ప్రభుత్వం ఎన్నో నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్‌ కొరత నెలకొనడంతో ఇప్పుడు కట్టెల పొయ్యి వాడక తప్పడం లేదు. దీంతో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 

    కమర్షియల్‌ సిలిండర్ల కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా  కొన్ని రెస్టారెంట్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో జిల్లాలోనూ గ్యాస్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు హోటళ్లకు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలుపుదల చేశాయి. కొందరికి మాత్రం పాత స్టాక్‌ ఉండడంతో ఎలాగోలా రెండు రోజులు నెట్టుకొచ్చారు. స్టాక్‌ లేని వారు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం ప్రారంభించారు. ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి గ్యాస్‌ తెచ్చుకొని రెస్టారెంట్లను నడుపుతున్నారు.

    మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటివి మూడపడకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్‌ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రకటన చేశారు.

    తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్‌ సెక్టార్‌ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ‘గ్యాస్‌ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

  • చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్‌ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్‌ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

    తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్‌ సెక్టార్‌ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ‍్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

    ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

    ‘గ్యాస్‌ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.

    అదనంగా ఎస‍్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్‌జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని  ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి.
     

  • తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.

    ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక  ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం  మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

    కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్‌కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్‌కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ

  • చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా నానాటికీ తీవ్రతరమవుతున్న వాణిజ్య సిలిండర్ల (Commercial LPG cylinder) కొరత పలు గమ్మత్తైన పరిణామాలకు కూడా దారి తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో బ్లాక్‌ మార్కెటింగ్‌ జోరుగా సాగుతోంది. దాంతో పలు హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ‘గ్యాస్‌ చార్జీ’ పేరిట కస్టమర్ల నుంచి బిల్లులో అదనంగా వసూలు చేసేస్తున్నాయి! అలా చెన్నైలోని ఒక హోటల్‌ ఇచ్చిన బిల్లు ఇప్పుడు వైరల్‌గా మారింది. 

     ఇదీ చదవండి: మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!

    బెంగళూరులో కూడా ఒక హోటల్‌ తన కస్టమర్‌ నుంచి గ్యాస్‌ బిల్లు రూపంలో ఏకంగా 30 రూపాయలు వసూలు చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్‌ ఆ బిల్లును సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. నగర పోలీస్‌ కమిషనర్‌ను కూడా ట్యాగ్‌ చేస్తూ, ఈ వసూళ్ల దందాను కట్టడి చేయాల్సిందిగా కోరాడు. బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు పి.సి.రావు దీనిపై వెంటనే స్పందించారు. 

    సదరు హోటల్‌ యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెంగళూరు తదితర నగరాల్లో సిలిండర్ల చోరీలు కూడా పెరిగి పోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

    ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌

  • సిల్చార్ (అస్సాం): ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, దేశ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అస్సాంలోని సిల్చార్ వేదికగా శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
     

    భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కొన్ని అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కీలుబొమ్మగా మారుతోందని ప్రధాని ఆరోపించారు. ‘ప్రస్తుతం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటువంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలపై ఆ ప్రభావం పడకుండా తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్.. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దేశం ఇబ్బందుల్లో చిక్కుకోవాలని, తద్వారా మోదీని నిందించవచ్చని వారు ఆశిస్తున్నారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీని మెరుగుపరిచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 22,860 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న 'షిల్లాంగ్-సిల్చార్ కారిడార్'కు  భూమిపూజ చేశారు. 166 కిలోమీటర్ల మేర సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ ఫోర్-లేన్ హై స్పీడ్ కారిడార్ పూర్తయితే, గౌహతి నుంచి సిల్చార్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8.5 గంటల నుండి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఇదేవిధంగా ప్రధాని మోదీ సిల్చార్‌లోని NH-306 పై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు భూమిపూజ చేశారు.అలాగే కరీంగంజ్ జిల్లాలోని పత్తర్‌కండి వద్ద కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అస్సాంలో వ్యవసాయ విద్య, పరిశోధనలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, విపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాయని ప్రధిన మోదీ అన్నారు.

Andhra Pradesh

  • అల్లూరి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో నిర్వహించిన మాటామంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడి మోసం బయటపడింది. వితంతువులకు భర్త చనిపోయిన నెల రోజుల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నట్లు వివిధ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమని మరోసారి స్పష్టమైంది. 

    తనకు పెన్షన్‌ రాలేదని పవన్ కల్యాణ్ సభలో వితంతు మహిళ స్పష్టం చేసింది. తన భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్‌ అందలేదని ఓ గిరిజన మహిళ తెలిపింది. పెన్షన్‌ కోసం చాలా దూరం నడిచి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తనకు ఏ ఆధారమూ లేదని వివరించింది. 

  • సాక్షి, కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా ఇటీవల నమోదైన పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్‌ ఎదురైంది. పిల్లల విక్రయంలో కీలక సూత్రధారి జనసేన నేత తల్లిగా గుర్తించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో  ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. గర్భిణీగా రిజిస్టర్ కాకుండా పిల్లలను తెచ్చి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై ఆరా తీశారు. 

    ఇద్దరు పిల్లల్ని విక్రయించినట్లు విచారణలో ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డెమ్మ, ఫరీనా పిల్లల విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై కైకలూరు రూరల్ పోలీసులు  కేసు నమోదు చేశారు. 

    పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ (@వీరాకుమారి, @ఈడేపల్లి ఆంటీ) ఉన్నారు. 2024లో ఇద్దరు పిల్లల్ని అబ్బిశెట్టి వీరమ్మ విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పది రోజుల క్రితం ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన ఆకేటి మోక్షిత్ (రెండున్నరేళ్లు) అదృశ్యమయ్యాడు. ఆకేటి మోక్షిత్ అదృశ్యం వెనుక అబ్బిశెట్టి వీరమ్మ ముఠా హస్తం ఉందేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • శ్రీకాకుళం:  పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొనడం నిజంగా సిగ్గుచేటన్నారు. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ధర్మాన మీడియాతో మాట్లాడారు. 

    ‘వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతును ఆదుకోండి.  కనీస మద్దతు ధర చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టండి. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోండి. పంటకు  అవసరం అయిన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు 28 వేల రూపాయలు నష్టం వస్తుంది. 

    దళారీల వల్ల మొక్కజొన్న రైతు దోపిడీ గురవుతున్నాడు. మొక్కజొన్న  క్వింటాకు రెండు వేల 400 రూపాయలు చెప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్లో క్వింట 1500 రూపాయలకు దళారీలు కొనడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొన్నాయి. వెంటనే కొనుగోలు  కేంద్రాల ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్నీ ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు.

    హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్‌బీఐ నుంచి తెచ్చింది అప్పుకాదా? తాత్కాలికంగా చేసిన అప్పు తిరిగి కట్టాల్సిన పనిలేదా? రాజధాని అమరావతి కోసం రూ.47,837 కోట్ల అప్పు చేశారు. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప‍్పులు చేసింది వాస్తవం కాదా? ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అ‍ప్పులు తెచ్చారు’ అని చెప్పారు. 

    ‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2024-25 సీఏసీ రిపోర్ట్ పై మాట్లాడారు. ఆయన మాట్లాడితే టీడీపీ నేతల్లో వణుకు ఎందుకు? సీఏసీ రిపోర్ట్ లోని అంశాలను  ప్రస్తావించడమే తప్పు అన్నట్లుగా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. కూటమి భాధ్యతను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ పుట్టిందే సినిమా బేస్ మీద. అందుకే ఎన్నికల హామీలు కూడా సినిమా టైటిల్స్ లా ఉన్నాయి.

    రాష్ట్రంలో గ్యాస్ కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. 2024-25లో రూ.60 వేల కోట్లు అప్పు చేశామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. సీఏజీ రిపోర్ట్ ప్రకారం రూ.80 వేల కోట్లకు పైగా అప్పు చేశారు’ అని అన్నారు.

    ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
  • సాక్షి, విశాఖ: వాలంటీర్ హబీబ్‌ కుమార్తెకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఆ చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేశ్‌ కుమార్ అందించారు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో విశాఖకు వచ్చిన సందర్భంగా ఆయనను హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు.

    అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను ఆదుకోవాలని హబీబ్‌ విజ్ఞప్తి చేశారు. చిన్నారిని చూసి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన కుమార్తెకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయం అందించారని హబీబ్‌ గుర్తు చేసుకున్నారు. 
     

  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. హహిళలపై ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారో అందరికీ తెలుసని లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన నాయకుడని ఆమె మండిపడ్డారు. 

    ‘రాష్ట్రం అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడటం సిగ్గుచేటు. పాపాలను పంచుకోవటంలో  జనసేన కూడా భాగం పంచుకుంటోంది. పోలీసులను పనికిమాలిన వారిగా మార్చేశారు. కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్.. ఇలా చెప్పుకుంటే ఎంతోమంది మహిళలను వేధించారు. 

    దేవుడే లేడన్న చంద్రబాబు సీఎం అయ్యారు. పూజ దీపం దగ్గర సిగరెట్ ముట్టిస్తాడంటూ తన తండ్రి గురించి చెప్పిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇలాంటి వారి చేతిలో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. మహిళలకు అన్యాయం చేసిన వారు ఏమయ్యారో చరిత్ర చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మేకతోలు కప్పుకుని స్తోత్రాలు మాట్లాడవద్దు.

    టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? ఒక మహిళ స్వయంగా లేఖ రాసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? దేవునితో కూడా ఆటలు ఆడుకోవటం‌ సరికాదు. జగన్ హయాంలో దిశ యాప్, దిశా పీఎస్ లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించారు. ఇలాంటి మేలు చేయటం చంద్రబాబు చరిత్రలో లేదు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో బయటకు వస్తే తెలుస్తుంది. ఆడపిల్లలను స్కూల్‌కి పంపాలన్నా కూడా ఇప్పుడు పేరెంట్స్ భయపడుతున్నారు.

    ఛీ ఛీ సిగ్గుండాలి.. BR నాయుడు వీడియోపై లక్ష్మీ పార్వతి రియాక్షన్

     

  • పార్వతీపురం రూరల్‌ : మాయమాటల గారడీ.. మాటల వెనుక మర్మం.. వెరసి మీ కష్టార్జితం మాయం! ఆపదలో ఉన్నామంటూ అపరిచితులు అడిగే సాయం, మీ బ్యాంక్‌ ఖాతాకు శాపంగా మారే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ కేటుగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారని, ముఖ్యంగా కాల్‌ ఫార్వర్డింగ్‌ ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని  సూచిస్తున్నారు.

    అడగడమే ఆలస్యం.. అరచేతిలో వైకుంఠం! 
    రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి..  అర్జంటుగా ఇంట్లో మాట్లాడాలి, ఫోన్లో ఛార్జింగ్‌ అయిపోయింది.. ఒక్క నిమిషం మీ ఫోన్‌ ఇస్తారా? అంటూ ప్రాధేయపడతారు. ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో ఫోన్‌ ఇస్తే, వారు ఫోన్‌ చేసే నెపంతో 21, 61 లేదా 67తో ప్రారంభమయ్యే రహస్య కోడ్లను డయల్‌ చేసి, చివరన వారి మొబైల్‌ నంబరును జత చేస్తారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ నంబరుకు వచ్చే ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ అన్నీ వారి ఫోన్‌కు మళ్లించబడతాయి.

    ఓటీపీల చోరీ.. నిలువు దోపిడీ!   
    కాల్‌ ఫార్వర్డింగ్‌ సక్రియం కాగానే అసలు ఆట మొదలవుతుంది. బ్యాంకులు, కొరియర్‌ సంస్థలు లేదా ఇతర సేవల నుంచి వచ్చే ధ్రువీకరణ కాల్స్‌  నేరుగా దుండగుడి చేతికి వెళ్తాయి. మీ మొబైల్‌కు ఎలాంటి సమాచారం రాదు, కానీ సైలెంట్‌గా మీ అకౌంట్ల నుంచి నగదు మాయమవుతుంది. ముసుగులో గుద్దులాట లేకుండా, నిలువు దోపిడీకి ఇదొక సులువైన మార్గంగా నేరగాళ్లు ఎంచుకున్నారని పోలీసులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సైతం అవగాహన కల్పిస్తున్నారు.

    చ‌ద‌వండి: ఏసీ క్లీనింగ్‌ ఇలా ఈజీ!

    అప్రమత్తతే రక్ష.. కోడ్‌లతో శిక్ష! 
    సైబర్‌ దొంగల బారిన పడకుండా ఉండాలంటే అపరిచితులకు ఫోన్‌ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఫోన్‌ ఇచ్చి ఉంటే లేదా మీ కాల్స్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయని అనుమానం కలిగితే, వెంటనే మొబైల్‌ నుంచి ##002# కోడ్‌ను డయల్‌ చేసి కాల్‌ ఫార్వర్డింగ్‌ సేవలను నిలిపివేయాలి. సైబర్‌ నేరాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ ఫ్రీ నంబరుకుగానీ లేదా సైబర్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌లోగానీ ఫిర్యాదు చేయాలి. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి  ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 
    – బి.వెంకట్రావు, పార్వతీపురం పట్టణ సీఐ  

  • భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇండియన్‌ బ్యాంక్‌ విజయవాడ జోన్‌ ఆధ్వర్యాన మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ ఎం.రాజేష్, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ ఎం.శేషగిరిరావు లబి్ధదారులకు రూ.260 కోట్ల విలువైన రుణాల మంజూరు పత్రాలను అందజేశారు.

     అదేవిధంగా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పలువురు లబ్ధిదారులకు రూ.1,422 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వ్యవసాయం ఇతర రంగాలకు చెందిన లబి్ధదారులకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇండియన్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ జీఎంఓ పరిధిలో ఉన్న ఎనిమిది జోన్లలో ఈ మెగా క్రెడిట్‌ అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించినట్లు తెలిపారు. 

     

Politics

  • జగిత్యాల:  తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్‌ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

    ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్‌రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల  సోషల్‌ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్‌రెడ్డి సోషల్‌ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్‌ కూడా మారిపోతున్నాయి. 

    తాను కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉండి కూడా  ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా  ఎమ్మెల్యే సంజయ్‌ వర్గానికి కాంగ్రెస్‌ అధిక ప్రాధాన్యత ఇచ్చి..  ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్‌రెడ్డి వేరే స్టెప్‌ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా 

    జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి  ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్‌పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా.   ఇదే జీవన్‌రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. 

    ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్‌రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

    ‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు.

    ..చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు

    ..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే  మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్‌పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్‌కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్‌లో ఉన్నారు

    ..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్‌కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Family

  • ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.

    మీనమాస పూజల షెడ్యూల్
    నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.

    నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).

    శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026
    వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.

    మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)

    మార్చి 24: ఉత్సవ బలి

    మార్చి 31: పళ్ళివేట (రాజవేట)

    ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.

    ముగింపు: ఏప్రిల్ 1, 2026.

    ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.

    (చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్‌ భగవతి)

  • పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? 

    వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్‌ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.

    ఇదీ చదవండి: షాకింగ్‌ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష

    అయితే అమెరికాలోని ఇలినాయిస్‌లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో  6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు.  

    ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్‌చల్‌
    (మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌)

  • సాధారణంగా పెద్దలు మనకు నవరసాల చాతుర్యం గురించి చెబుతుంటారు. సంధ్య రాణి లింగ చెప్పే 40 రసాల మాధుర్యం గురించీ తప్పక తెలుసు కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ రసాల తయారీ గురించి ‘ఫ్రమ్‌ మై కిచెన్‌ టు యువర్స్‌’ బుక్‌ ద్వారా వివరించారు సంధ్య రాణి లింగ. ఐదు తరాల నుంచి వచ్చిన వారసత్వ వంటలు, వాటి వెనక వెనక దాగి ఉన్న సాంస్కృతిక కథనాలనూ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్‌ వాసి సంధ్య లింగ చెబుతున్న తెలుగింటి వారసత్వ వంటకాల పరిచయం గురించి ఆమె మాటల్లోనే... 

    ‘‘వంట చేయడం, వడ్డించడమే కాదు కొత్త రుచులను సృష్టించడమూ చాలా ఇష్టం. పుట్టింటి–అత్తింటివారసత్వ వంటకాలను, మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలన్నది నా ఆలోచన. ఆ ప్రయత్నమే ఇలా మీ అందరి ముందుకు వచ్చేలా చేసింది.  

    రోజూ పండగే! 
    రసం అనేది భోజనంలోకి ఉపయోగించే వంటకం మాత్రమే కాదు. అనారోగ్యంలో ఉపశమనం ఇచ్చే ఔషధం కూడా. రసాలు, వాటిలో ఉపయోగించే మసాలాలు కూడా విభిన్నమే. సికింద్రాబాద్‌లోని లింగ పేరుతో ఉండే ఉమ్మడి కుటుంబం మాది. మా మామయ్య వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు. అందరూ కుటుంబాలతో కలిసే ఉండేవారు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేనాటికి యాభైమందికి పైగా ఉండేవాళ్లు. అందరికీ కలిపి ఒకే వంటగది. అక్కడ ఉదయం లేచింది మొదలు రోజూ పదిహేను మంది వంటల తయారీలోనే ఉండేవారు. మా అత్తగారు వారి పుట్టింటి నుంచి నేర్చుకున్న వంటకాలతోపాటు, మిగతా కోడళ్లందరమూ కలిసి వంటలలో ఎన్నో వెరైటీలు చేసేవాళ్లం. ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉండేది. కొబ్బరి చారు, కట్టుచారు, చుక్కకూర, బలుసాకు, పాలక్, క్యాలీఫ్లవర్, పప్పులతో రసాలు, నిమ్మ, ఉసిరి, ఉల్లి, టొమాటో ... ఇలాంటి ఒక్కోప్రత్యేక కూరగాయలు, ఆకుకూరలతో 40 రకాల రసాలు ఉంటాయి. వీటిని నేరుగా సూప్‌గా సేవించవచ్చు.  

    ప్రయోగాల వంటిల్లు... పిల్లల చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం నుంచి మేం విడిగా జూబ్లీహిల్స్‌కు వచ్చేశాం. అప్పటివరకు నేర్చుకున్నవే చేసేదాన్ని. అయితే, పిల్లలు కూరగాయలతో చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో ప్రతి కూరగాయ, ఆకుకూరతో రసాలు చేయడం మొదలుపెట్టాను. వాటిలో మా అత్తగారు, అమ్మ చెప్పిన దినుసులను నోట్‌ చేసుకున్నాను. నెలలో నేను 40 రసాలు చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టపడేవారు. దూరంగా ఉండే బంధువులు కూడా ఈ రసాల తయారీ గురించి అడిగేవారు. మా కూతురు నిఖిత ‘చాలా హెల్తీగా, కొత్తగా వంటలు చేస్తావు కదా, బుక్‌ తీసుకురావచ్చు కదమ్మా’ అనేది. బంధువులు కూడా చెప్పేవారు. కానీ, పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, వారి జీవితాల్లో స్థిరపడటంలో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. 

    ఇదీ చదవండి: 

    కోడలు వచ్చాక, తను నా వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు వంటల బుక్‌ ఆలోచనను తీసుకువచ్చింది. మొత్తం రాసుకున్నాక, రెండు రోజులు ఫోటోషూట్‌ చేశాం. దీని నిర్వహణ అంతా ప్రియే చూసుకుంది. ఈ తరం వాళ్లకు ఇన్ని రసాలు ఉంటాయని తెలియదు. వారు స్వయంగా తెలుసుకొని, చేసుకునే విధంగా సిద్ధం చేశాం. దీనిని కిందేటేడాది తీసుకువచ్చాం.

    పండగకు ప్రత్యేకం... తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకరసాలు, వంటకాల తయారీలు ఉంటాయి. ఇక ఊరగాయలు, రోటి పచ్చళ్లు, పులావ్, బిర్యానీలలో విభిన్న రుచులు ఉన్నాయి. అలాగే, తెలుగు ప్రాతాల్లోని మూలాల్లోకి వెళితే చాలా వైవిధ్యమైన వంటకాలు పరిచయం అవుతాయి. వాటిని అందించడానికి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను’’ అని వివరించారు ఈ పాకశాస్త్ర నిపుణురాలు.


    వంటే ఔషధంగా...
    ‘మా అత్తమ్మ ఆలోచనలు చాలా మోడర్న్‌గా ఉంటాయి. తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని, వారసత్వ వంటకాలు ముందు తరాలకు పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. సోషల్‌ మీడియాలో చూస్తే చాలా వంటకాలు కనిపిస్తాయి. కానీ, వాటిలో వారసత్వ వంటకాల గురించి, వంట మెడిసిన్‌లా ఎలా ఉపయోగపడుతుందో అంత వివరంగా చెప్పలేక΄ోతున్నారు. అందుకే, మేం కలిసి ఈ ప్రయత్నం చేశాం. – ప్రియ, కోడలు 
     

    – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

     

     

  • సినిమా అసోసియేషన్‌ ఫర్‌  చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్‌! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్‌ ఫర్‌ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్‌సెక్ట్స్‌ అసోసియేషన్‌ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్‌ మీట్‌లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి...  

    రిపోర్టర్‌ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్‌ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్‌ పెట్టాయి? 

    అసోషియేషన్‌ ప్రసిడెంట్‌ దోమ (స్పీచ్‌ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్‌హిట్టుపాముల మూవీస్‌ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్‌హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్‌బస్టర్‌లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి  పొట్టేలు పున్నమ్మల్లో  పొట్టేలు సైతం తెగ పెర్‌ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్‌ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్‌ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? 

    రిపోర్టర్‌ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? 

    చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్‌? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్‌ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఏకంగా ఓ లవ్‌సాంగ్‌ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...

    చీమ చీమ చిమ చీమా చీమా 
    చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... 
    చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! 

    రిపోర్టర్‌ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?
    బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్‌లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్‌... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది).  అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్‌బోర్డులోని హిట్‌ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).

    బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ...  పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్‌,ఫోర్‌ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్‌ గారు తన బాత్‌రూమ్‌లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్‌’ అనీ! 

    చ‌ద‌వండి: కూర‌గాయ హీరోల 'పోకిరి' కిరి

    రిపోర్టర్‌ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌ ఎలా అయ్యారు సార్‌?  

    దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ అండ్‌ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్‌ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్‌ వరల్డు ఐశ్వర్యారాయ్‌ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్‌గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్‌? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ  కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్‌సెక్ట్స్‌ అసోసియేషన్‌ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్‌’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్‌మీట్‌ నుంచి వాకౌట్‌ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్‌సెక్ట్స్‌ కూడా!


    – యాసీన్‌

  • పిల్లలూ... పేపర్లలో, న్యూస్‌పేపర్లలో యుద్ధాలు చూస్తున్నాం. ఈ యుద్ధాలు పైకి ఏ కారణంతో జరిగినా చాలా మటుకు వీటి వెనుక ‘పెట్రోల్‌’ ఉంటుంది. పెట్రోల్‌ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ఇంధనం. అది కొన్నిచోట్లే దొరుకుతుంది. అందుకని దాని కోసం చాలా పోరాటాలు సాగుతూ ఉంటాయి. మనం రోజూ బయటకు వెళ్లాలంటే ఏదో ఒక వాహనం కావాలి. అది నడవాలంటే పెట్రోల్‌ కావాల్సిందే!  రోజూ లక్షలాది కార్లు, మోటార్‌ సైకిళ్ళు, యంత్రాలు పెట్రోల్‌ సాయంతో నడుస్తాయి. 

    వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో పెట్రోల్‌ నిక్షేపాలు ఏర్పడ్డాయి. ΄ప్లాంక్టన్, ఆల్కే వంటి చిన్న సముద్ర జీవులు మహాసముద్రాలలో నివసించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు, వాటి అవశేషాలు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు సముద్రపు అడుగుభాగంలోని బురద, ఇసుక అవక్షేపాలతో కలిసిపోయాయి. ఆ పోరలు మరింతగా పేరుకుపోవడంతో అవశేషాలు భూమి ఉపరితలం కింద మరింత లోతుగా ఏర్పడ్డాయి. అలా ఇంధన నిక్షేపాలు తయారయ్యాయి. 

    భౌగోళిక పరిస్థితులను బట్టి, పెట్రోల్‌ ఏర్పడటానికి దారితీసే ముడి చమురు ఏర్పడటానికి 10 మిలియన్ల నుండి 300 మిలియన్‌ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే పెట్రోల్‌ నేరుగా తయారు కాదు. భూమి అడుగులోని ముడిసరుకును బయటకు తీసి, కర్మాగారాల్లో దాన్ని రిఫైన్‌ చేసి పెట్రోల్‌గా మారుస్తారు. కొన్ని దేశాలలో పెట్రోల్‌ని ‘గ్యాసోలిన్‌’ అని కూడా పిలుస్తారు. 

    కార్బన్‌  డై ఆక్సైడ్‌ నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమైతే పెట్రోల్‌ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఛార్జ్‌ చేసి వాడటం ద్వారా పెట్రోల్‌ ఖర్చు తగ్గించడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది.  

Business

  • సాక్షి, హైద‌రాబాద్‌: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.

    శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ‘తెలంగాణ - టాంజానియా' మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు.

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు. ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్ షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అక్కడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్‌ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.

    ‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ్’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహాం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్నర్’గా వ్యవహరిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై మార్గనిర్దేశం చేస్తామన్నారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంభిస్తోన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసి... తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

    ‘డిజిటల్ ఎకానమీగా మారాలన్న మా లక్ష్య సాధనలో తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకం. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన సంస్కరణలు మాకు స్ఫూర్తిదాయకం. అందుకే.. తెలంగాణతో కలిసి పని చేసేందుకు త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకుంటాం’ అని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈవో శుకూరు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్స్ డెలివరీ బ్యూరో - హెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు.

  • ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్‌ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్‌.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

    ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
    IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.

    చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్‌బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.

    సాధించిన పురస్కారాలు
    దేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్‌బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్‌షాప్‌లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

  • సాధారణంగా పెద్దలు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుండటారు. ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి లెక్కేలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ.. చాలామంది భూములను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    స్వాప్నిల్ కొమ్మావర్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. ఒక విషయం వెల్లడించారు. 1990లో నా మామ ఏకంగా 15000 రూపాయల చొప్పున, నాలుగు ఎకరాలను రూ. 60వేలుతో కొన్నారు. క్రమంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు అది ఒక జిల్లా స్థాయికి చేరింది. రిటైల్ దిగ్గజం డీమార్ట్ రెండు ఎకరాలు భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. భూమిపై పెట్టే పెట్టుబడి ఎంత లాభదాయకంగా ఉంటుందో తెలుస్తుందని పేర్కొన్నారు

    భూమిని అమ్మగా వచ్చిన డబ్బును నా మామ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టారు. ఇప్పుడు ప్రతి నెలలో రూ. 14.5 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. ఇంకా, ఆయన దగ్గర రెండు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రూ. 60,000 నుంచి రూ. 25 కోట్లకు ఎంత అద్భుతమైన ప్రయాణం! అని ఒకరు కామెంట్ చేయగా, అన్ని భూములకు ఒకే విలువ ఉంటుందని దీని అర్థం కాదు; ఇది ప్రాంతం మరియు అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు.

  • భారతదేశంలో అత్యంత విజయవంతమైన, అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఇందులో ఒకటి మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి 30 లక్షల సేల్స్ సాధించింది. అదే మారుతి సుజుకి డిజైర్.

    2008లో మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోడల్.. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఒక్క 2025లోనే ఇది 2.14 లక్షల సేల్స్ సాధించి.. అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, CNG రూపాల్లో అందుబాటులో ఉంది.

    మారుతి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్ & CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. మంచి మైలేజ్ కోసం ఇప్పుడు కూడా ఎక్కువమంది ఈ కారునే కొనుగోలు చేస్తున్నారు.

  • దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న అపార్ట్‌మెంట్ల నుంచి ఆకాశహర్మ్యాలను నిర్మించే స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మన నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోంది.

    సాధారణంగా అపార్ట్‌మెంట్లకు అప్‌డేట్‌ వెర్షన్‌గా అపార్ట్‌మెంట్ల పోకడను బిల్డర్లు ప్రమోట్‌ చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల్లోని యువ ఐటీ ప్రొఫెషనల్స్, చిన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మిస్తున్నారు. ‘యూ’ అంటే అప్‌గ్రేటెడ్‌ అని అర్థం వచ్చేలా ఈ కొత్త కాన్సెప్ట్‌నకు శ్రీకారం చుట్టారు. సాధారణ ఫ్లాట్లలో ఉండే రొటీన్‌ సౌకర్యాల కంటే కాస్త భిన్నంగా హోటల్‌ తరహాలో లగ్జరీ, స్మార్ట్‌ ఫీచర్లను కలిపి అందించడమే ఈ కొత్త కాన్సెప్ట్‌ ‘అప్‌’ర్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల ప్రధాన లక్ష్యం.

    ‘అప్‌’ర్ట్‌మెంట్‌ అంటే?
    విల్లాలో నివాస అనుభూతిని అపార్ట్‌మెంట్లలో కల్పించడమే ఈ ‘అప్‌’ర్ట్‌మెంట్ల ప్రత్యేకత. గ్రీనరీతో పాటు వెల్‌నెస్‌ ఆధారిత వసతులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నేటి ఆహారపు, జీవనశైలి నేపథ్యంలో నివాసితులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం వీటి ఉద్దేశం. ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలు..ఈ తరహా ప్రాజెక్ట్‌లలో ప్లగ్‌ అండే ప్లే తరహాలో సదుపాయాలుంటాయి.

    కేవలం దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల్ని తీసుకెళ్తే చాలు.. ఫ్లాట్‌లోనే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్‌ కిచెన్, అత్యాధునిక ఎల్రక్టానిక్‌ గాడ్జెట్ల్‌తో ఈ గృహాలు మీకు స్వాగతం పలుకుతాయి. అంతేకాకుండా సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండీషనర్, వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే లైటింగ్‌ సిస్టమ్, ఫ్యాన్లు వంటి స్మార్ట్‌ హోమ్‌ టెక్నాలజీని అమరుస్తారు. వీటితో పాటు చాలా చోట్ల కామన్‌ వర్క్‌ ప్లేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీస్‌లను కూడా బిల్డర్లు ఈ నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తారు.

    అధిక కార్పెట్‌ ఏరియా..
    ప్రస్తుతం ఈ కొత్త ట్రెండ్‌ బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా స్టార్టప్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, మోడ్రన్‌ యువ బిల్డర్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో లే–అవుట్, ఫ్లాట్ల డిజైనింగ్‌ ప్రతి అంశంలోనూ లోతైన అధ్యయనం ఉంటుంది. ఇంటి లోపల కార్పెట్‌ ఏరియా సామర్థ్యం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. సంప్రదాయ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఈ తరహా యూనిట్లలో కార్పెట్‌ ఏరియా 4 శాతం అధికంగా ఉంటుంది.

    ధర ఎక్కువే అయినా..
    లేఅవుట్‌ విస్తీర్ణంలో పెద్దగానే ఉన్నప్పటికీ అపార్ట్‌మెంట్లను పరిమిత సంఖ్యలో నిర్మిస్తారు. నివాసితులకు ప్రైవసీతో పాటు అధిక వసతులను అనుభవించేందుకు వీలు కల్పిస్తారు. అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లు ఒకదానికొకటి దూరంగా ఉండటంతో ఫ్లాట్లకు విస్తారమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తుంది. అలాగే కిటికీలో నుంచి చూస్తే కనుచూపు మేర పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంటుంది. దీంతో నివాసితులకు మానసిక, శారీరక సంతృప్తి చేకూరుతుంది.

    సాధారణ అపార్ట్‌మెంట్లు, ఆకాశహర్మ్యలతో పోలిస్తే ఈ తరహా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వీటికి అద్దె డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఉండి ఆధునిక సదుపాయాలు అనుభవించాలని కోరుకునే వారికి ఈ ఫ్లాట్లు అమితంగా నచ్చుతాయి. ఇందులో నిర్వహణ బాధ్యతలను చాలా వరకు బిల్డర్లే చూసుకుంటారు.

  • ఇరాన్‌తో.. అమెరికా-ఇజ్రాయెల్ వివాదం కారణంగా దుబాయ్‌లో కొంతకాలం చిక్కుకుపోయిన ప్రముఖ నటుడు & రేసర్ 'అజిత్ కుమార్' ఈ వారం ప్రారంభంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత.. కొత్త ''మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ'' కారును సొంతం చేసుకున్నారు. దీనిని మహీంద్రా అండ్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్.. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో BE 6 ఫార్ములా E కారుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ధరలు రూ. 23.69 లక్షల నుంచి రూ.24.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. అజిత్ కుమార్ టాంగో రెడ్ వేరియంట్‌ BE 6 ఫార్ములా E కొనుగోలు చేశారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 202 కిమీ అని తెలుస్తోంది.

    మహీంద్రా ఫార్ములా కారుతో ఉన్న అజిత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ''సూపర్ స్టార్ అజిత్ కుమార్ & మహీంద్రా BE 6 ఫార్ములా E ఎడిషన్ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ వెల్లడిస్తూ.. త్వరలో ఒక రోజు నేను ఆయనకు వ్యక్తిగతంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఎదురు చూస్తున్నాను'' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.