Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. సెమీఫైనల్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది.

    టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. 75 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన కివీస్, కొద్ది సమయంలోనే 84/6కి కుప్పకూలింది. వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మళ్లినట్టే అనిపించింది.

    అయితే, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్‌కాంచీ (31 నాటౌట్) కీలకమైన 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును గట్టెక్కించారు. మిచెల్‌,కోల్‌  అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది.

    169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచే కష్టాల్లో పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి లంకన్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరికి శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది.

    ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ల చక్కటి లైనప్‌, అలాగే సాంట్నర్-మెక్‌కాంచీ భాగస్వామ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు, పేలవమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో శ్రీలంక ఓటమి చవిచూసింది. 

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా లీగ్‌ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్‌ సేన చేతులెత్తేసింది.

    అతిపెద్ద పరాజయం
    సూపర్‌-8 గ్రూప్‌-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్‌లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.

    అందనంత ఎత్తులో విండీస్‌
    మరోవైపు.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్‌ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్‌ (+5.350)నెట్‌రన్‌రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్‌గా ఉంది.

    మరోవైపు భారత్‌ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో.. అదే విధంగా ఆదివారం విండీస్‌తో మ్యాచ్‌లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది.

    గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనా
    అయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో నెట్‌రన్‌రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్‌లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్‌రన్‌రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.

    ఏదేమైనా ఇప్పుడు నెట్‌రన్‌రేటు పరంగా వెస్టిండీస్‌ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్‌లో జింబాబ్వే, వెస్టిండీస్‌ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్‌రన్‌రేటు గురించి ఆలోచించాలి.

    ఇంత చెత్తగా ఆడతారా?
    సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మూడు విభాగాల్లో భారత్‌ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్‌ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. 

    ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్‌, సౌతాఫ్రికా నెట్‌రన్‌రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.

    చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు!

  • శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్‌ కకావికలమైనా లోయర్‌ ఆర్డర్‌ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 మ్యాచ్‌లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక.. కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

    ఈ క్రమంలో కివీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (13 బంతుల్లో 23)ను మహీశ్‌ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

    పెవిలియన్‌కు క్యూ
    అయితే, టాపార్డర్‌ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్‌ బ్యాటర్లు మాత్రం పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్‌ ఫిలిఫ్స్‌ (18), డారిల్‌ మిచెల్‌ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్‌ చాప్‌మన్‌ డకౌట్‌ అయ్యాడు.

    సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
    ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 47 పరుగులు సాధించాడు. 

    రాణించిన మెకాంచీ
    ఇక జేమ్స్‌ నీషమ్‌ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోల్‌ మెకాంచీ సాంట్నర్‌కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్‌ వెల్లలగే ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. 

    తుదిజట్లు
    శ్రీలంక
    పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

    చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్‌-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

    ఇషాన్‌ హిట్‌.. అభిషేక్‌ ఫ్లాప్‌
    కాగా ఓపెనింగ్‌ జోడీగా ఇషాన్‌ కిషన్‌- అభిషేక్‌ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇషాన్‌ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు.

    ఇక సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్‌ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.

    తిలక్‌ వర్మపై విమర్శలు
    ఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్‌ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్‌ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. 

    ముగ్గురూ లెఫ్టాండర్లే
    ఇక ఓపెనర్లు ఇషాన్‌- అభిషేక్‌.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్‌.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్‌ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.

    లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం
    ఇలాంటి తరుణంలో లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.

    సంజూ వస్తాడని సంకేతం
    జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్‌ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్‌ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్‌ తెలిపాడు.

    ఎవరిపై వేటు?
    ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్‌ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్‌ చేయడం ఓ ఆప్షన్‌. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్‌ తెలిపాడు.

    రింకూ, తిలక్‌, అభిషేక్‌!
    అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్‌ అయ్యేందుకు.. లెఫ్ట్‌-రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    మరోవైపు.. అభిషేక్‌- ఇషాన్‌ జోడిని కొనసాగిస్తే.. తిలక్‌ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్‌ చెప్పినట్లు మ్యాచ్‌ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. 

    కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

    చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

  • న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్య సూపర్‌-8 మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సూపర్‌-8 దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో కివీస్‌-లంక తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరజట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.

    అయితే, కొలంబోలో ప్రస్తుతం వర్ష సూచన లేదు. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ కాగా.. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇక కివీస్‌తో మ్యాచ్‌లో లంక తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. 

    ఒక మార్పుతో బరిలోకి
    కమాల్‌ మిశారా స్థానంలో చరిత్‌ అసలంకకు అవకాశం ఇచ్చింది. టాపార్డర్‌ను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్‌ దసున్‌ షనక వెల్లడించాడు. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

    మా జట్టులోనూ ఓ మార్పు
    మరోవైపు.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ.. శ్రీలంకతో మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు వెల్లడించాడు. లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపాడు. జిమ్మీ నీషమ్‌ స్థానంలో కోల్ మెకాంచీ తుదిజట్టులోకి వచ్చినట్లు సాంట్నర్‌ తెలిపాడు. మధ్య ఓవర్లలో అదనపు స్పిన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

    తుదిజట్లు
    శ్రీలంక
    పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

    చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

    సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం
    ఫలితంగా పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో పాక్‌ ఓటమికి సల్మాన్‌ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్‌ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.

    అంతేకాదు.. పాక్‌ గనుక సెమీస్‌ చేరకుంటే సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. 

    ఇలా అయితే పాక్‌ వరల్డ్‌కప్‌ గెలవదు
    ఈ నేపథ్యంలో సల్మాన్‌ అలీ ఆఘా భార్య సబా మంజర్‌ ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్‌ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

    కాగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్‌తో పాటు పాక్‌ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్‌ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్‌ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్‌ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.

    సెమీస్‌లో తొలి అడుగు ఇంగ్లండ్‌దే
    ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్‌-2026లో సూపర్‌-8 దశ నడుస్తోంది. గ్రూప్‌-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక బరిలో ఉన్నాయి.

    సూపర్‌-8లో భాగంగా పాక్‌ తొలుత న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్‌ పడకుండానే మ్యాచ్‌ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్‌ వచ్చింది. 

    ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై.. తాజాగా పాక్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌.

    చదవండి: NZ vs SL: కివీస్‌, శ్రీలంకలకు భారీ షాక్‌!.. పాక్‌కు గుడ్‌న్యూస్‌?

  • టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఊరట లభించింది. పాటియాలా హౌజ్‌ కోర్టు అతడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా నివాసి ఆయేషా ముఖర్జీతో ధావన్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారితీశాయి.

    ఆయేషాతో విడాకులు
    డివోర్సీ, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఆయేషా (Ayesha)ను ధావన్‌ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జొరావర్‌ జన్మించాడు. అయితే, కొంతకాలం తర్వాత ధావన్‌- ఆయేషా మధ్య తలెత్తిన విభేదాలు విడాకులకు దారితీశాయి. ఢిల్లీ కోర్టు 2023లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.

    సోఫీతో ఇటీవలే వివాహం 
    ఈ క్రమంలో చాన్నాళ్లు ఒంటరిగా ఉన్న శిఖర్‌ ధావన్‌.. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే (ఫిబ్రవరి 22) అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలా శిఖర్‌ ధావన్‌ కొత్త జీవితం ఆరంభించిన సమయంలో.. మాజీ భార్య విషయంలో న్యాయస్థానం నుంచి అతడికి గొప్ప ఊరట లభించింది.

    రూ. 5.7 కోట్లు తిరిగి చెల్లించాలి
    శిఖర్‌ ధావన్‌ నుంచి ఆయేషా తీసుకున్న రూ. 5.7 కోట్లను అతడికి తిరిగి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాగా ఆయేషా- ధావన్‌ల ఆస్తులకు సంబంధించి ఆస్ట్రేలియా కోర్టు ఆయేషాకు 15 శాతం కేటాయించింది. దీని ప్రకారం.. రూ. 7.46 కోట్లతో పాటు ధావన్‌ నుంచి అదనంగా రూ. 15.95 కోట్లు, దీనితో పాటు కొంత ఆస్తి ఆయేషా పేరిట రాయాలని ఆదేశించింది.

    ఈ మేరకు ఆస్తులకు సంబంధించి 2021-2024 మధ్య ఆస్ట్రేలియా కోర్టు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసింది. అయితే, భారత వివాహ చట్టాల ప్రకారం తాను ఆస్ట్రేలియా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పనిలేదని ధావన్‌ వాదించాడు. ఇందుకు సంబంధించి పాటియాలా హౌజ్‌ కోర్టులో వివరాలు సమర్పించాడు.

    కట్టుకథలు అల్లి
    పెళ్తైన కొన్ని నెలల తర్వాత నుంచే ఆయేషా.. కట్టుకథలు అల్లి తన కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించిందని ధావన్‌ కోర్టుకు చెప్పాడు. అంతేకాదు.. తన కష్టార్జితంతో కొనుగోలు చేసే ప్రతి ఆస్తిని ఇద్దరి పేరిట లేదంటే.. ఆయేషా ఒక్కదాని పేరిటే కొనాలని ఆమె ఒత్తిడి చేసేదని వాపోయాడు.

    ఇందుకు తగ్గట్లుగానే ఒకానొక సమయంలో ధావన్‌ కొన్న ఆస్తులలో దాదాపు 99 శాతం ఆయేషా పేరిటే ఉన్నట్లుగా కోర్టుకు ఆధారాలు సమర్పించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పాటియాలా హౌజ్‌ కోర్టు జడ్జి జస్టిస్‌ దేవేందర్‌ కుమార్‌ గార్గ్‌.. ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ధావన్‌ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

    బెదిరించి డబ్బు గుంజాలనే యత్నం
    సెటిల్‌మెంట్‌ సమయంలో ధావన్‌ను బెదిరింపులకు గురిచేసి డబ్బు గుంజాలనే ప్రయత్నం జరిగినట్లు గుర్తించామన్నారు. కాబట్టి ఆయేషా ధావన్‌ నుంచి పొందిన రూ. 5.7 కోట్లను తిరిగి ఇచ్చేయాలని గార్గ్‌ ఆదేశించారు.

    అంతేకాదు.. ధావన్‌ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆయేషాను న్యాయస్థానం ఆదేశించింది. మాజీ దంపతుల వివాదంలో ఆస్ట్రేలియా కోర్టుకు ఎలాంటి అధికారం లేదని.. ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ విలువలేదని కొట్టిపారేసింది. దీంతో ధావన్‌కు ఉపశమనం దక్కింది.

    కుమారుడికి దూరం
    కాగా కుమారుడు జొరావర్‌ కస్టడీ తనకు కావాలని ధావన్‌ కోరగా.. న్యాయస్థానం అతడికి శాశ్వత ప్రాతిపదికన కుమారుడిని అప్పగించలేమని తెలిపింది. అయితే, ఇండియా, ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో వీడియో కాల్స్‌ ద్వారా కుమారుడిని చూడవచ్చని పేర్కొంది. 

    అయితే, ఆయేషా మాత్రం కుమారుడితో తనకు ఎలాంటి సంబంధం లేకుండా చేసేందుకు సోషల్‌ మీడియాతో సహా అన్ని కనెక్షన్‌లను కట్‌ చేసిందని ధావన్‌ వాపోయాడు. కుమారుడిని ఎంతగానో మిస్‌ అవుతున్నట్లు సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ధావన్‌ తరచూ వెల్లడిస్తూ ఉంటాడు.

    చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

  • సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్‌-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.

    ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ల గురించి కొటక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    సంజూకు మొండిచేయి
    కాగా ఇషాన్‌ కిషన్‌ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లలో అభిషేక్‌ శర్మ- ఇషాన్‌ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్‌ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.

    తిలక్‌ వర్మ ఆట తీరుపై విమర్శలు
    మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

    తిలక్‌ గురించి బాధ లేదు
    ఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్‌ మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.

    అభిషేక్‌ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.

    సంజూ రావొచ్చు
    ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. 

    అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్‌ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.

    సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో
    ఇదిలా ఉంటే.. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్‌ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్‌-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. 

    సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

    చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. లీగ్‌ దశలో పల్లెకెలె వేదికగా ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌ వాన కారణంగా టాస్‌ పడకుండానే రద్దైంది. ఇక సూపర్‌-8 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ కూడా వర్షం వల్ల మొదలుకాకుండానే ముగిసిపోయింది.

    ఫలితంగా సెమీస్‌ రేసులో కీలకమైన సూపర్‌-8 దశలో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

    కివీస్‌, లంకకు భారీ షాక్‌!
    సూపర్‌-8 గ్రూప్‌-2లో భాగంగా కివీస్‌ బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీస్‌ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. 

    ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం..  మ్యాచ్‌ ఆరంభ సమయం (రాత్రి 7 గంటల) నుంచి తొమ్మిది గంటల వరకు వాన పడేందుకు 14 శాతం అవకాశాలు ఉన్నాయి.

    రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వర్షం పడేందుకు 49- 58 శాతం అవకాశాలు ఉన్నాయి. దీంతో కివీస్‌- శ్రీలంక మ్యాచ్‌ రద్దయిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. 

    ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కివీస్‌ జట్టుకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే.. తదుపరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్‌తో పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.

    పాక్‌కు ఒక రకంగా శుభవార్తే!
    కాగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించి ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్‌, పాక్‌ మధ్య పోటీ నెలకొంది. కివీస్‌ శ్రీలంకతో పాటు ఇంగ్లండ్‌ను కూడా ఓడిస్తే నేరుగా సెమీస్‌ చేరుకుంటుంది.

    అలా కాక ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. పాక్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. శ్రీలంక, ఇంగ్లండ్‌ చేతుల్లో న్యూజిలాండ్‌ తప్పక ఓడిపోవాలి. అదే విధంగా శ్రీలంకపై పాక్‌ గెలవాల్సి ఉంటుంది. 

    అలా కాకుండా.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ తదుపరి ఒక్కో మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్ల సంఖ్య (3) సమానం అవుతుంది. అలాంటపుడు నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు.. శ్రీలంక రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌లపై భారీ విజయాలు సాధించాలి.

    కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొన్నిరోజులుగా కొలంబో, పల్లెకెలెలో వర్షం పడటం.. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే జట్లకు ఇబ్బందికరంగా మారింది. 

    చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

  • అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్‌ వరకు అఫ్గన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ జొనాథన్‌ ట్రాట్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.

    ట్రాట్‌ స్థానంలో
    ఈ క్రమంలో ట్రాట్‌ స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించినట్లు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి పైబస్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. 

    ‘అఫ్గనిస్తాన్‌ జాతీయ జట్టుకు రిచర్డ్‌ పైబస్‌ను కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించాం. శ్రీలంకతో సిరీస్‌ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. 

    కోచ్‌గా మంచి రికార్డు
    ఇక ఇంగ్లండ్‌కు చెందిన పైబస్‌ ఒకే ఒక్క లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్‌గా మంచి రికార్డు ఉంది. పైబస్‌ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు విండీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా ఉన్న సమయంలోనే కరీబియన్‌ జట్లు పురుషుల, మహిళల, అండర్‌–19 వరల్డ్‌కప్‌ ట్రోఫీలు సాధించాయి. 

    సూపర్‌-8 చేరకుండానే
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్‌.. నాలుగింటికి రెండే మ్యాచ్‌లు గెలిచింది. తద్వారా సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో అఫ్గన్‌ జట్టు అనూహ్య రీతిలో సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.

    చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

  • టీ20 ప్రపంచకప్‌ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని​ ఉండింది.

    అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్‌ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్‌ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్‌ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్‌ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్‌మెంట్‌ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

    ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 

    రింకూ లేని పక్షంలో మరో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్‌మెంట్‌ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.

    కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.

    సంజూ శాంసన్‌ పరిస్థితి ఏంటి..?
    రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్‌తో పాటు సంజూను ఓపెనర్‌గా పంపి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. 

    రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం​ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే మాత్రం తిలక్‌ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్‌-సంజూ ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ను కూడా పక్కకు పెట్టి, అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

    తుది జట్టు (అంచనా)..
    అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి

Movies

  • టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో  మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష గ్లింప్ల్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. వచ్చేనెల ఐదో తేదీన వృషకర్మ గ్లింప్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు నాగచైతన్య ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
     

     

  • టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ ‍స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్‌కు రామ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. 

    కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

     

  • టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్‌ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్‌ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ ‍లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.

    ముహుర్తం ఫిక్స్..

    ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్‌ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ జరగనుంది. 
     

  • టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్‌లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.

    అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్‌వీర్ సింగ్‌ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్‌గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది.  స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అని పిలుస్తారు.

    అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అంటే..?

    అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్‌ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్‌ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు.  పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే  అన్‌ప్లగ్‌డ్‌ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది.

    ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్‌ప్లగ్‌డ్‌ ట్రెండ్‌ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్‌వీర్‌ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా  ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌-రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు.  తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. 
     

  • బాలీవుడ్‌ నటుడు కరణ్‌ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్‌ నిండి ఉంది. ఆమె అంటే కరణ్‌కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.

    టాటూ నిజమైనదా?
    ఈ క్రమంలో కరణ్‌ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్‌గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.

    బిగ్‌బాస్‌ షోలో మొదలైన లవ్‌
    హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో కరణ్‌- తేజస్వి ప్రకాశ్‌ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్‌ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్‌ బంధమని కరణ్‌-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.

    చదవండి: ప్రేయసితో బిగ్‌బాస్‌ షణ్ను ఎంగేజ్‌మెంట్‌

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్‌ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. 
     

     

  • ఒకప్పుడు కవర్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా యూట్యూబ్‌లో సెన్సేషన్‌ అయ్యాడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి మరింత పాపులర్‌ అయ్యాడు. తర్వాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. అమ్మాయి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రమే వెల్లడించాడు.

    ఎంగేజ్‌మెంట్‌
    తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తనొక ఇన్‌ఫ్లుయెన్సర్‌ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తన నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్‌ చేశాడు. దేవుడు ఈ రకంగా ప్లాన్‌ చేశాడు.. అయిపాయె అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్‌ - వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    కెరీర్‌
    షణ్ముఖ్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాడో అంతా తలకిందులైంది. ఈ రియాలిటీ షోలో నటి సిరి హన్మంత్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపాడు. ఇది జనాలకు మింగుడుపడలేదు. ఎందుకంటే అప్పటికే షణ్ను.. దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఆల్‌రెడీ ప్రేమలో ఉండగా మళ్లీ ఈ పిచ్చిపనులేంటి? అని అందరూ విమర్శించారు.

    తీరా షో నుంచి బయటకు వచ్చాక దీప్తితో బ్రేకప్‌ కూడా అయింది. ఇంతలో డ్రగ్స్‌ కేసులో చిక్కుకున్నాడు. మరోపక్క అమ్మకు క్యాన్సర్‌.. చాలాకాలం పాటు డిప్రెషన్‌తో కుంగిపోయాడు. కానీ నెమ్మదిగా దాన్నుంచి బయటపడి తిరిగి కెరీర్‌పై ఫోకస్‌ పెట్టాడు. అలా ప్రేమకు నమస్కారం అని ఓ సినిమా చేస్తున్నాడు.

     

     

    చదవండి: రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి

  • నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్‌ మూవీ హనీ.  ఈసినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈనెల 27 నుంచి సన్‌ నెక్ట్స్‌లో ప్రసారం కానుందని వెల్లడించారు.

    తాజాగా మరో ఓటీటీలోనూ హనీ సందడి చేయనుందని నవీన్‌చంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. దీంతో ఓకే రోజు రెండు ఓటీటీల్లో హనీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో  దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు.
     

     

  • సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.

    ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్‌ (విజయ్‌- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్‌ వేడుకలో విజయ్‌ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్‌ లవ్‌ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..

    2018లోనే పెళ్లి
    గీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్‌- రష్మిక జంటగా నటించారు. ఆన్‌ స్క్రీన్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్‌లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్‌కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్‌ కామ్రేడ్‌ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్‌ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. 

    అందరి ముందు..
    కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్‌ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్‌ను డార్లింగ్‌ ఫ్రెండ్‌ అని అభివర్ణించింది రష్‌. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్‌ అని వెల్లడించింది. ది గర్ల్‌ఫ్రెండ్‌ ఈవెంట్‌లో తొలిసారి విజయ్‌.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.

    ఆ ఒక్క మాటతో..
    జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ తర్వాత విజయ్‌.. కింగ్డమ్‌తో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్‌ క్రష్‌. మనం హిట్‌ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్‌ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సినిమా ఈవెంట్స్‌కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్‌ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.

    పెళ్లి పత్రికలోనూ..
    విజయ్‌- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్‌ (#Viorsh) అనే ట్యాగ్‌ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్‌ అనే పేరు ఈ లవ్‌బర్డ్స్‌కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్‌ జంటకు అడ్వాన్స్‌ కంగ్రాచ్యులేషన్స్‌!!

    చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్‌

  • మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను ‍అలరిస్తోంది.

    తాజాగా ఈ సినిమా టీవీల్లోనూ రానుంది. ఈనెల 28న టెలివిజన్ ప్రేక్షకులను అలరించనుంది. జీ తెలుగు ఛానెల్‌లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్‌గా అఫీషియల్‌గా ప్రకటించింది. మెగా పండగ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్రకటనతో టీవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
     

     

  • లిటిల్ హార్ట్స్, అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు, హే బలవంత్ తదితర సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం.. రీసెంట్‌గా ఊహించని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామి దర్శనభాగ్యం దక్కిందని కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో సామాన్య భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఐదు సెకన్ల దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతుందేంటి అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోపై స్వయంగా సదరు హీరోయినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

    (ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)

    'కొన్నిరోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. యాంకర్ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి విషయాలు, సినిమా జర్నీ, భక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాను. నా స్పిరిట్యూల్ జర్నీ గురించి పంచుకున్నా. అందులో తిరుపతి గురించి మాట్లాడాను. 15 నిమిషాల దర్శనం అనే మాట హైలైట్ అవుతోంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. 2025 అక్టోబరులో విమానాశ్రయంలో నేను, మా అమ్మ.. లైనులో నిల్చుని శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాం. తర్వాత దర్శనం చేసుకున్నాం. లైన్‌లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంతవరకు కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. ఆ మొత్తం సమయం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను తప్పితే పావుగంట పాటు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు'

    'సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా రూ.300 టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు స్వామిని చూశాను. నా జీవితంలో తొలిసారి 13 ఏళ్ల తర్వాత స్వామిని అంత దగ్గరగా చూశాను. ఇది నేను సంతోషంగా భావించి ఆత్రుతతో ఆ విషయాన్ని పంచుకున్నాను అంతే. అది కొంచెం మిస్ లీడింగ్‌గా వెళ్తోంది. మీలో ఎవరైనా శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుని వెళ్తే స్వామి దర్శనం మీకు కూడా అలానే దక్కుతుంది' అని హీరోయిన్ శివానీ నాగారం వివరణ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు)

  • వైష్ణవి చైతన్య.. యూట్యూబ్‌ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్‌దే, టక్‌ జగదీశ్‌ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్‌ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా మారి ఫస్ట్‌ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. 

    కోలీవుడ్‌ ఎంట్రీ
    ప్రస్తుతం ఎపిక్‌: ద సెమిస్టర్‌ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. జీవీ ప్రకాశ్‌ హీరోగా విఘ్నేశ్‌ కార్తీక్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే 'హాట్‌స్పాట్‌ టూ మచ్‌'తో సక్సెస్‌ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్‌ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

    సినిమా
    ఈ క్రమంలో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాశ్‌ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్‌ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్‌ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్‌లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.

    చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్‌- లావణ్య.. ఎక్కడంటే?

  • దురంధర్‌ మూవీతో రణ్‌వీర్ సింగ్‌ బాక్ బస్టర్‌ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో ‍అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.

    తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు.  సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు.  బ్యాంకాక్, థాయిలాండ్‌లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఏకైక వ్యక్తి రణ్‌వీర్ సింగ్ అని  అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

    కాగా.. ధురంధర్‌ మూవీలో రణ్‌వీర్ సింగ్  హంజా అలీ మజారి పాత్ర పోషించారు.  ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్,  అక్షయ్  అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్‌గా మెప్పించారు.  ప్రస్తుతం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

     

     

  • హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు  అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ ‍తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్‌లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.

    తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్‌లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు  లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే  డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్‌ను మాస్ ఎంటర్‌టైనర్‌లతో ప్రారంభించానని తెలిపింది.  దక్షిణాదిలో నా కెరీర్‌ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్‌తో జరిగిందని పేర్కొంది.

    కాగా.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్‌ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
     

  • ఈ ఏడాది సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమాతో వచ్చిన దర్శకుడు మారుతి.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. విడుదలకు ముందు ఇంటి అడ్రస్ కూడా చెప్పేసరికి.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు. తీరా మూవీ చూసి పూర్తిగా డిసప్పాయింట్ అ‍య్యారు. సోషల్ మీడియాలో మారుతిపై ఘోరంగా ట్రోల్స్, విమర్శలు చేశారు. దీంతో ఈ దర్శకుడి నుంచి తర్వాత మూవీ ఏం వస్తుందా అనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు)

    'రాజాసాబ్' ఫ్లాప్ అయినప్పటికీ మారుతి.. మెగాహీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని కొన్నిరోజుల క్రితం రూమర్ వినిపించింది. వరుణ్ తేజ్‌తో ఇది ఉండొచ్చని అన్నారు. హీరో రామ్ పేరు కూడా వినిపించింది గానీ ఇవి ఫేక్ అని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఏకంగా మూవీ టైటిల్ కూడా బయటకొచ్చింది. 'హ్యాపీ పొంగల్' పేరుతో మారుతి.. ఓ కామెడీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని, దీనికి తగ్గ హీరోని వెతికే పనిలో ప్రస్తుతం ఉన్నారని టాక్ వినిపిస్తుంది. టైటిల్‪‌కి తగ్గట్లే వచ్చే సంక్రాంతికి దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి?

    మరోవైపు 'రాజాసాబ్' ఫెయిలైనప్పటికీ హీరో ప్రభాస్, మారుతికి భరోసా ఇచ్చారట. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మీడియం రేంజ్ హీరోలతో ఓ మాదిరి కామెడీ సినిమాలు తీసిన మారుతి.. పర్లేదనిపించే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే 'రాజాసాబ్' చేశాడో అటు సమయం, ఇటు సినిమా రెండు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లోనే ఓ మిడ్ రేంజ్ హీరోతో మూవీ చేసి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)

  • నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ వీడియోలు చేసే అన్వేష్.. తెలుగు రాష్ట్రాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇతడు అప్పుడప్పుడు అసభ్యకర భాష ఉపయోగిస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే హిందూ దేవుళ్లని కించపరిచేలా మాట్లాడి వివాదంలోనూ చిక్కుకున్నాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్‌గానే ఇతడి ఇన్ స్టా ఖాతా.. ఒకటి రెండు రోజులు కనిపించలేదు. ఇప్పుడు ఈ కేసులో కాస్త పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇన్ స్టాతో పాటు యూట్యూబ్‌కి కూడా అన్వేష్ అకౌంట్ గురించి పంజాగుట్ట పోలీసులు లేఖ రాయనున్నట్లు సమాచారం.

    (ఇదీ చదవండి: 'కోర్ట్' సినిమా టైంలోనే చదువు ఆపేశాను)

    యూట్యూబర్‌ అన్వేష్‌పై పంజాగట్టు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. గతేడాది పంజాగుట్టలో ఇతడిపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొంది. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈమేరకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్‌.. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా హిందూ దేవుళ్ల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.

    (ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)

  • టాలీవుడ్‌ స్టార్‌ జంట వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అయితే మీరనుకున్నట్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి వేడుకలో కాదు, లావణ్య సోదరుడు సిద్దాంత్‌ వివాహ వేడుకలో అని తెలుస్తోంది. కుమారుడు వాయువ్‌తో కలిసి వరుణ్‌- లావణ్య ఈ శుభకార్యంలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ
    ఈ పెళ్లి డెహ్రాడూన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అటు నిహారిక సైతం మెహందీ సెలబ్రేషన్స్‌ అంటూ చేతులకు చందమామ పెట్టుకున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ తర్వాత మేనల్లుడిని జాగ్రత్తగా చూసుకుంటున్న వీడియో షేర్‌ చేసింది. ఇదంతా చూస్తుంటే ఇది లావణ్య ఇంటి ఫంక్షన్‌లాగే అనిపిస్తోంది.

    సినిమా
    సినిమాల విషయానికి వస్తే.. వరుస అపజయాలతో సతమతమవుతున్న వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం కొరియన్‌ కనకరాజు మూవీ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ హారర్‌ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

     

     

  • Wedding of ViRosh నేషనల్‌ క్రష్‌, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ  పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్‌ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్‌కు వెళ్లారు.  తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.  తాజా నివేదికల ప్రకారం  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు  జోరుగా సాగుతున్నాయి.

    విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతి
    సంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో సంగీత నైట్‌  ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట.  తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు.  సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుంది

    విరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులు
    మరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు.  పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన  స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్‌బస్టర్‌ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్‌లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్‌ లవ్‌బర్డ్స్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..
  • హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్‌పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?

    (ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)

    కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.

    మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.

    (ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

Business

  • చైనాలోని ప్రముఖ క్రేన్ తయారీ సంస్థ  హెనాన్ కువాంగ్షాన్ క్రేన్ కో, లిమిటెడ్ (Henan Kuangshan Crane Co., Ltd) తమ ఉద్యోగుల పట్ల చూపిన అపూర్వ ఉదారత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 270 మిలియన్ యువాన్ల నికర లాభాల్లో 180 మిలియన్ యువాన్లు (సుమారు 26 మిలియన్ డాలర్లు లేదా రూ.237 కోట్లు) ఉద్యోగులకు వార్షిక బోనస్‌లుగా పంచి అందరి దృష్టిని ఆకర్షించింది.

    వార్షిక వేడుకలో నగదు వర్షం
    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 13న నిర్వహించిన కంపెనీ వార్షిక గాలా వేడుకలోనే 60 మిలియన్ యువాన్లు (సుమారు 8.7 మిలియన్ డాలర్లు) నగదును అక్కడికక్కడే పంపిణీ చేశారు. సుమారు 7,000 మంది ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమానికి 800 విందు టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పొడవైన టేబుళ్లపై నోట్ల కట్టలు పేర్చిన దృశ్యాలు కనిపించాయి. ఉద్యోగులను వేదికపైకి ఆహ్వానించి, వారు లెక్కించగలిగినంత మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించారు. కొందరు చేతుల్లో భారీ నోట్ల కట్టలతో కనిపించగా, మరికొందరు నగదు కుప్పలను ఎత్తుకునేందుకు కష్టపడిన దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.

    లాభాల్లో 70 శాతం ఉద్యోగులకే..
    ఆన్‌లైన్ పంపిణీతో కలిపి మొత్తం బోనస్ చెల్లింపులు 180 మిలియన్ యువాన్లను మించాయి. 2025లో కంపెనీ సంపాదించిన 270 మిలియన్ యువాన్ల లాభంలో దాదాపు 70 శాతం మొత్తాన్ని సిబ్బందితో పంచుకోవడం విశేషం.

    ‘డబ్బు ఇవ్వడానికి ఇష్టపడే బాస్’
    సంస్థ చైర్మన్ కుయి పీజున్ (Cui Peijun) ఈ కార్యక్రమంలో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రణాళికాబద్ధంగా ఇవ్వాల్సిన ఉపకరణ బహుమతులను రద్దు చేస్తూ, “వాషింగ్ మెషీన్లు ఎందుకు? గతంలో బంగారు ఆభరణాలు ఇచ్చాం. ఈసారి ప్రతి ఉద్యోగికి అదనంగా 20,000 యువాన్లు నగదు ఇవ్వండి,” అని ఆర్థిక విభాగాన్ని ఆదేశించారు.

    2002 సెప్టెంబర్‌లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం 130 దేశాల్లో క్రేన్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల తయారీ, సర్వీసులు అందిస్తోంది. ఉద్యోగులకు భారీ రివార్డులు ఇవ్వడంలో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ, 2024లో 260 మిలియన్ యువాన్ల లాభాల్లో 170 మిలియన్ యువాన్లను సిబ్బందికి పంచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా 2,000 మంది మహిళా ఉద్యోగులకు సుమారు 1.6 మిలియన్ యువాన్ల బోనస్ ప్రకటించారు.

    “నేను డబ్బు ఇవ్వడం ఇష్టపడతానని కాదు. యువత కారు రుణాలు, గృహ రుణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేము చేయగల సహాయం చేస్తే వారికి ఉపశమనం లభిస్తుంది,” అని కుయి వ్యాఖ్యానించారు.

  • న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లు, ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణ వితరణకు వీలుగా ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌తో ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ చేతులు కలిపింది. 108 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.983 కోట్లు) సీనియర్‌ సెక్యూర్డ్‌ డెట్‌ ఫైనాన్సింగ్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

    తక్కువ ఆదాయ వర్గాలు కొనుగోలు చేసే ఇళ్లు, రుణ సాయం అంతగా విస్తరించని రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈలు) సంస్థలకు రుణ వితరణ కోసం ఈ నిధులను ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ వినియోగించనుందని ఏడీబీ ప్రకటించింది. సొంతంగా నిర్మించుకునే ఇళ్లు, పర్యావరణ అనుకూల ఆమోదిత ఇళ్లు, ఇంధన ఆదా పరిష్కారాలతో నిర్మించిన ఇళ్ల కోసం రుణాలను అందించనుంది.

    మహిళలకు ప్రాధాన్యం
    గృహ రుణాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యంగా ఏడీబీ అందించే సాయంలో 70 శాతం మేర తక్కువ ఆదాయ వర్గాల ఇళ్ల కొనుగోళ్లకు రుణాలుగా అందించనున్నారు. 50 శాతం మేర రుణాలను మహిళలకే ఇవ్వనున్నారు. మిగిలిన 30 శాతం నిధులను ఎంఎస్‌ఎంఈలకు అందించనున్నారు. 8 మిలియన్‌ డాలర్లను రాయితీ రేటుపై అందించడం కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది.

  • న్యూయార్క్‌: సెక్స్‌ కుంభకోణం సూత్రధారి, అమెరికా ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే, చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్‌ ఫౌండేషన్‌’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

    ఎప్‌స్టీన్‌ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్‌ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఫౌండేషన్‌ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఒక నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలపై మంగళవారం జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో బిల్‌ గేట్స్‌ వివరణ ఇచ్చారని పేర్కొంది.  ‘‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. 

    ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్‌స్టీన్‌ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్‌స్టీన్‌ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్‌స్టీన్‌ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్‌స్టీన్‌ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. అతడితో సమావేశాలకు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులను కూడా తీసుకెళ్లడం ఇంకా పెద్ద తప్పు.

     మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్‌స్టీన్‌ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్‌స్టీన్‌తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్‌స్టీన్‌తో కలిసి ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్‌లో అతడితో సమావేశమయ్యా. కానీ, ఎప్‌స్టీన్‌ ఐలాండ్‌లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్‌ ఫౌండేషన్‌కు మచ్చ రావడం బాధగా ఉంది. 

    నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్‌ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్‌స్టీన్‌ను కలిశా. ఎప్‌స్టీన్‌ విషయంలో నా భార్య మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్‌స్టీన్‌తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్జ్‌ ప్లేయర్‌. బ్రిడ్స్‌ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌. బిజినెస్‌ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం’’అని బిల్‌ గేట్స్‌ వ్యాఖ్యానించిట్లు వార్తా సంస్థ స్పష్టంచేసింది. 

    లక్షలాది పత్రాలు విడుదల  
    ఎప్‌స్టీప్‌ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా మెలిగారని తెలియజేసింది. ఎప్‌స్టీన్‌తో బిల్‌ గేట్స్‌కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈ దస్త్రాల్లో తేలడంతో సంచలనాత్మకంగా మారింది. 
     

    ఇదీ చదవండి: భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’.. 126% టారిఫ్‌!

  • పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ (Enforcement Directorate) బుధవారం (ఫిబ్రవరి 25) వెల్లడించింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.473.17 కోట్ల విలువైన ఆస్తులపై అమల్లో ఉన్న తాత్కాలిక అటాచ్‌మెంట్‌కు కొనసాగింపుగా తాజా ఉత్తర్వు జారీ అయ్యింది.

    సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి, 406, 420తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1989 నిబంధనల కింద రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (Reliance Communications (ఆర్‌కామ్)), అనిల్ అంబానీ, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయి.

    దర్యాప్తులో ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు, అందులో సుమారు రూ.40,185 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ముంబై పాలి హిల్‌లోని ఆస్తితో పాటు ఇతర ఆస్తులను అనిల్ అంబానీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్ అయిన రైజ్‌ ఈ ట్రస్ట్‌లో సమీకరించినట్లు గుర్తించింది. కుటుంబ సంపదను రక్షించుకునేందుకు, బ్యాంకుల రికవరీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది.

    ముంబైలోని ప్రముఖ పాలి హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 216 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ భవనం నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.

  • భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్‌తోపాటు ఇండోనేషియా, లావోస్‌ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్‌లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

    భారత్‌కు 126% సుంకాలు
    భారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యం
    యూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్‌ మాడ్యూల్స్‌లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.
    (ఇదీ చదవండి: అఫైర్లు నిజమే.. అంగీకరించిన బిల్‌గేట్స్‌)

    భారత ఎగుమతిదారుల్లో ఆందోళన
    అమెరికా ప్రధాన మార్కెట్‌గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్‌ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్‌కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  • న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్‌ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్‌ సీ) వేసే కేబుల్‌ నెట్‌వర్క్‌ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్‌ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్‌ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.

    సబ్‌మెరీన్‌ కేబుల్‌ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్‌ సీ కేబుల్, డిజిటల్‌ క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు డిజిటల్‌ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు.  ఈ నేపథ్యంలో క్లౌడ్‌ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్‌ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు.  

    రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. 
    దేశీయంగా డిజిటల్‌ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్‌ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్‌ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు.
     

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడే లాభాలను వదులుకున్నప్పటికీ భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాలతో ముగియగలిగాయి. మెటల్, ఐటీ స్టాక్స్ లో లాభాలు మొత్తంగా నష్టాలను తగ్గించాయి. 

    నిఫ్టీ 57.85 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 25,482.50 వద్ద, సెన్సెక్స్ 0.06 శాతం లేదా 50.15 పాయింట్లు లాభపడి 82,276.07 వద్ద ముగిశాయి.

    సెన్సెక్స్ లోని 30 షేర్లలో  టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, సుఫార్మా, టీసీఎస్  ఎగిశాయి. 2 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.14 శాతం, స్మాల్ క్యాప్ 100 0.45 శాతం లాభపడ్డాయి. ఇండియా బీఐఎక్స్ 5 శాతానికి పైగా తగ్గి 14.15 వద్ద ముగిసింది.

    రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడగా, ఆటో, ఐటీ ఇండెక్స్ ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి. విస్తృత మార్కెట్లో, అమెరికా దిగుమతి సుంకాల ప్రకటన తరువాత సోలార్‌ సంబంధిత స్టాక్స్ 14 శాతం వరకు పడిపోయాయి.

  • ముంబై: ప్రముఖ ఆటో మోబైల్‌ దిగ్గజం వోక్స్‌ వ్యాగన్‌ సరికొత్త కారును మార్కెట్‌ లోకి లాంచ్‌ చేసింది. వ్యాగన్‌ టేరాన్‌ ఆర్‌–లైన్‌ పేరుతో వచ్చిన ఈ 7 సీటర్‌ ఎస్‌యూవీ ధర రూ.46.99 లక్షలుగా (ప్రారంభ ఎక్స్‌-షోరూం ధర) కంపెనీ నిర్ణయించింది.

    డిజైన్‌ పరంగా ఈ వాహనం ముందుభాగంలో ఐక్యూ లైట్‌తో కూడిన హెడ్‌ మ్యాట్రిక్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లున్నాయి.ఈ టేరాన్‌ ఆర్‌–లైన్‌లో 2.0–లీటర్‌ టీఎస్‌ఐ ఈఏ888 ఈవోఓ4 పెట్రోల్‌ ఇంజిన్‌ అందించారు. ఈ శక్తివంతమైన ఇంజిన్‌ గరిష్టంగా 204 పీఎస్‌ పవర్, 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7–స్పీడ్‌ డీఎస్‌జీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ జతచేశారు. 4మోషన్‌ ఆల్‌–వీల్‌ డ్రైవ్‌ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్‌ వాహనానికి మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తుంది.

    టెక్నాలజీ విషయానికి వస్తే, రెండు హై–పవర్‌ యూఎస్‌బీ–సీ (45డబ్ల్యూ) పోర్ట్‌లు, రెండు మొబైల్‌ ఫోన్‌ల కోసం వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఇవ్వడం ద్వారా కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదనంగా, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ(ఏఆర్‌) హెడ్‌–అప్‌ డిస్‌ప్లే ద్వారా నావిగేషన్, వేగం వంటి ముఖ్యమైన సమాచారం డ్రైవర్‌కు నేరుగా విండ్‌స్క్రీన్‌పై ప్రొజెక్ట్‌ అవుతుంది.

  • భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.

    రంగాల వారీగా వేతనాల జోరు

    ఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.

    ప్రధాన రంగాల అంచనాలు

    పరిశ్రమ2025 వాస్తవ పెంపు (%)2026 అంచనా (%)
    ఎన్‌బీఎఫ్‌సీ9.710.1
    రియల్టీ / ఇన్‌ఫ్రా10.510.2
    ఆటోమోటివ్‌9.89.9
    రిటైల్‌9.09.5
    టెక్నాలజీ7.06.6

     

    తగ్గిన వలసలు

    గడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.

    2023: 18.7%

    2024: 17.7%

    2025: 16.2%

    ప్రస్తుతం ఈ రేటు కొవిడ్‌ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.

    ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.

    ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?

Telangana

  • సాక్షి, నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నకిలీ కంటి డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఐదుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. ధనార్జనే ధ్యేయంగా వైద్యుల ముసుగులో కంటి ఆపరేషన్లు  చేస్తున్నారు. ఓ మహిళ  ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

    కాగా, ఇటీవల భద్రాచలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఎటువంటి  వైద్య విద్యార్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో గత కొంతకాలంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌  చేసిన సంగతి తెలిసిందే. వైద్య అధికారులకు ఫిర్యాదు అందడంతో ఆయూషి నర్సింగ్ హోమ్‌లో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు.. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆయుషి నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేశారు. ​అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యాధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
     

  • సాక్షి, నాగర్‌ కర్నూల్: కుమ్మెరలో జరిగిన ఘటన అమానవీయం అని  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దేవుడి దర్శనం కోసం వెళ్తే దాడికి పాల్పడటం దారుణమన్నారు. కుమ్మెర ఘటన మానవత్వానికి మచ్చ.. తెలంగాణ సమాజం తలదించుకునే దుర్మార్గమైన ఘటనగా కేటీఆర్‌ అభివర్ణించారు. కులాలు మతాలు పేరిట అవమానించటం.. హత్య రాజకీయాలు చేస్తోన్నవారికి అండగా నిలిచిన వారిది కూడా తప్పేనని కేటీఆర్‌ అన్నారు.

    గణేష్‌పై అమానుషంగా దాడి చేశారు. మౌనిక ప్రాధేయపడిన కూడా వినకుండా పసిపాపను కాలుతో  తన్నితే చనిపోయింది. శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?. ఇక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. ఇక్కడి పోలీసులు రాజ్యాంగాన్ని ఖననం చేస్తున్నారు. దుర్ఘటనలో 8 మంది నిందితులను తక్షణమే హత్యానేరం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌  డిమాండ్‌ చేశారు. పసిగుడ్డు మృతికి కారకులైన దుండగులను ఉరితీసినా తప్పులేదు. ప్రభుత్వం కూడా స్పందించాలి. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.

  • గచ్చిబౌలి: ఏటీఎంలోని డబ్బుల ట్రంక్‌ పెట్టెతో పరారైన నిందితుడు అజిత్‌ కుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్‌ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో  ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం బొమ్మనహాల్‌కు చెందిన బడిగేరి అజిత్‌ కుమార్‌ అలియాస్‌ శివ (34) సికింద్రాబాద్‌ డైమండ్‌ పాయింట్‌ వద్ద నివాసం ఉంటూ ఆరు నెలల క్రితం సంగం సెక్యూ రిటీ సొల్యూషన్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. ఆ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ల ఏటీఎంల్లో క్యాష్‌ మెయింటెనెన్స్‌ చేస్తోంది. ఈ నెల 12న గోపన్‌పల్లిలో క్యాష్‌ లోడ్‌ చేసేందుకు కస్టోడియన్స్‌ రామకృష్ణ, మాలిక్‌లు ఏటీఎం లోపలికి,  గార్డు పెరుమాళ్‌ బాత్రూంకు వెళ్లారు. ఇదే అదనుగా అజిత్‌ కుమార్‌ డబ్బులున్న వాహనం తీసుకొని ఉడాయించాడు.

    టీ తాగుతున్నట్లు నమ్మించి.. 
    బయటకు వచ్చిన సిబ్బంది ఫోన్‌ చేయగా పక్కనే టీ తాగుతున్నానంటూ అజిత్‌ కుమార్‌ నమ్మించాడు. దాదాపు 3 గంటలవుతున్నా అతడి ఆచూకీ లేకపోవడంతో కస్టోడియన్‌ రామకృష్ణ గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించాడు. ట్రంక్‌ పెట్టెను తీసుకొని వాహనాన్ని తెల్లాపూర్‌ గద్దర్‌ క్రాస్‌ రోడ్డులో వదిలి అజిత్‌ ఆటోలో పారిపోయాడు. లాడ్జీలో పెట్టెను యాక్సెల్‌ బ్లేడ్‌తో కోసి జొమాటో బ్యాగ్‌లో రూ. 57 లక్షల నగదును సర్దాడు. మియాపూర్‌లో పుణె వెళ్లే బస్సు ఎక్కాడు. డ్రైవర్‌ బ్యాగ్‌ చెక్‌ చేయాలనడంతో బస్సు దిగి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి మరో బస్సులో అనంతపురం వెళ్లాడు.

     వైజాగ్‌ సబ్బవరంలో ఉండే ప్రేమికురాలికి అజిత్‌ ఫోన్‌ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ యువతిపై ఆరా తీశారు. దీంతో తనను పోలీసులు వెతుకుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతపురం నుంచి బళ్లారి, హోస్‌పేట్‌ నుంచి బెంగళూర్‌కు వెళ్లాడు. అనంతరం  అక్కడి వెళ్లి పుణె, ముంబైల్లో గడిపాడు. రాత్రి సమయంలో ఖరీదైన మద్యం తాగుతూ.. జల్సాలు చేస్తూ విలాసవంతంగా గడిపాడు. మంగళవారం శంషాబాద్‌ సమీపంలో బ్యాగ్‌తో ఉన్న అజిత్‌ కుమార్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.34,90,000 నగదు, సెల్‌ ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, డీఐ నరేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.

    జీతం ఇవ్వలేదని కసి పెంచుకుని..  
    ప్రతి రోజూ లక్షల్లో డబ్బు రవాణా చేసే సెక్యూరిటీ సంస్థ.. నాలుగు నెలలుగా జీతం ఇవ్వక పోవడంతో నిందితుడు అజిత్‌ కుమార్‌ కసి పెంచుకున్నాడు. డబ్బు కొట్టేసి విలాసవంతంగా గడపాలకున్నాడు. 20 రోజులుగా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాదాపు 11 రోజుల పాటు ఆయా నగరాలు తిరుగుతూ జల్సాలు చేస్తూ సగటున రోజుకు 2.లక్షల చొప్పున రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులను తికమకపెట్టేందుకు దాదాపు ఏడు ఫోన్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఉన్న అజిత్‌ అనంతపురంలోని తన బావకు ఫోన్‌ చేసి కేర్‌ టేకర్‌గా పని చేసి బాగా సెటిల్‌ అయ్యానని, కారు కొనుక్కొని విహారయాత్రలకు వెళదామని చెప్పాడు. ఎక్స్‌యూవీ కారును కొనుగోలు చేద్దామని చెప్పాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.     

  • నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర త్రిబుల్ ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

    అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా ? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

International

  • టెహ్రాన్: "ట్రంప్ ది స్టేట్ ఆఫ్ ది యూనియన్" ప్రసంగంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ చేసిన వాఖ్యలన్నీ పెద్ద అబద్దాలనీ తెలిపింది. అణుకార్యక్రమంపై అమెరికా చేస్తున్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదని వెల్లడించింది. జోసఫ్ గ్లోబల్స్ తరహాలో ట్రంప్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇరాన్ మండిపడింది.  అణుచర్చల పేరుతో ట్రంప్ దాడులకు దిగితే అస్సలు సహించేది లేదని తెలిపింది. 

    ఇటీవల  ఇరాన్‌లో జరిగిన  నిరసనల్లో ట్రంప్ చెప్పిన మరణాల సంఖ్య పూర్తిగా కల్పితమే అని తెలిపింది.  మధ్యప్రాచ్యంలో అమెరికా తన బలగాలు మోహరించడంపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా త్వరలో అమెరికా- ఇరాన్ మధ్య అణు చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేసే అవకాశాలే అధికంగా ఉ‍న్నాయి. ఈ నేఫథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాపై మండిపడింది.

  • ఆ వ్యక్తి పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ ఏవో పనులు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు.  అయితే అతని కష్టాలు చూసిన లక్ష‍్మీ దేవీ అతనిపై కృప చూపింది. సరదా కోసం కొనుగోలు చేసిన లాటరీ టికెట్టు తనకు తాకేలా చేసింది. ఇంకేంటి అప్పటి వరకూ కష్టాలు పడుతూ కాలం వెళ్లదీస్తున్న వ్యక్తి.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.

    భారత్‌కు చెందిన మురుగనాథ్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లారు. అక్కడ వివిధ పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓఘటన అతని జీవితాన్నే మార్చి వేసింది. అతని స్నేహితునితో కలిసి యూఏఈ లాటరీ వైబ్‌సైట్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా జరిగిన లక్కీ డ్రాలో ఆ టికెట్‌ రెండవ బహుమతి గెలుచుకుంది. దీంతో అతనికి 50 లక్షల దిర్హామ్‌లు భారత కరెన్సీలో దాదాపు రూ.11.35 కోట్లు ఆయన సొంతమయ్యాయి.

    ఈ లాటరీ దక్కడంపై మురుగనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను కొన్న తొలిటికెట్ కే లాటరీ తాకడం సంతోషంగా ఉందన్నారు. తన ఆర్థిక కష్టాలు పరిష్కారిద్దామని ఇక్కడికి వస్తే దేవుడు తనను ఇంత త్వరగా కరుణించాడని ఆనందం వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని ఈ డబ్బులతో ఇప్పుడు తన కుటుంబం స్థిరపడుతుందన్నారు. తన స్నేహితునితో కలిసి ఈ టికెట్‌ కొనుగోలు చేశానని వచ్చే డబ్బులని ఇద్దరం సమానంగా పంచుకుంటామని తెలిపారు. కాగా ఈ లాటరీలో తొలి ఫ్రైజ్ 30 మిలియన్‌ దిర్హామ్‌లు.

  • ఆయనో హైకోర్టు న్యాయ‌మూర్తి. ఉన్న‌త న్యాయ‌స్థానం జ‌డ్జిగా ఐదేళ్ల పాటు నిరాటంకంగా తీర్పులు కూడా ఇచ్చేశారు. తీరా చూస్తే ఆయ‌న న‌కిలీ లా డిగ్రీతో ప‌ద‌విలోకి వ‌చ్చార‌ని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందానా.. ఇప్పుడు ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకున్నారు. న్యాయ‌మూర్తి ప‌ద‌వి నుంచి తొల‌గించి ఇంటికి పంపించారు. ఈ ఘ‌ట‌న పాకిస్థాన్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

    డాన్ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. జస్టిస్ తారిఖ్ మహమూద్ జహంగిరి ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఐదేళ్ల పాటు ప‌నిచేశారు. 2020, డిసెంబ‌ర్‌లో ఆయ‌న హైకోర్టు జ‌డ్జి అయ్యారు. అయితే న‌కిలీ డిగ్రీ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఆయ‌న‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో న్యాయ‌మూర్తి ప‌దవి నుంచి త‌ప్పించారు. జస్టిస్ జ‌హంగిరిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సోమవారం (ఫిబ్ర‌వ‌రి 23) ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా 16 పేజీల తీర్పు వెలువ‌రించింది. న‌కిలీ డిగ్రీతో మోసానికి పాల్ప‌డ‌డ‌మే కాకుండా, శిక్ష పడ‌కుండా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని న్యాయ‌స్థానం ధ్రువీక‌రించింది.

    కరాచీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అందించిన అసలు రికార్డుల ఆధారంగా హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. జహంగిరి 1988లో నకిలీ నమోదు సంఖ్యను ఉపయోగించి లా పరీక్షకు హాజ‌రైయ్యాడు. మ‌రుస‌టి ఏడాది అంటే 1989లో ప‌రీక్ష‌ల్లో కాపీ కొడుతూ ప‌ట్టుబ‌డ‌డంతో క‌రాచీ యూనివ‌ర్సిటీ ఆయ‌నపై మూడేళ్ల నిషేధం విధించింది. అయినా అత‌డి బుద్ధి మార‌లేదు. ఇంతియాజ్ అహ్మద్ అనే విద్యార్థికి కేటాయించిన ఎన్‌రోల్‌మెంట్ నంబ‌ర్‌తో మ‌ళ్లీ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. మ‌రోవైపు జహంగిరి త‌మ కాలేజీలో చ‌ద‌వ‌లేద‌ని ప్రభుత్వ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపారు.

    కాగా, ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు స‌మ‌ర్పించాల‌ని, రాత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వాల‌ని ఎన్నిసార్లు అడిగినా ఏవేవో సాకులు చెప్పి స్పందించ‌లేద‌ని హైకోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. లా డిగ్రీకి సంబంధించిన అస‌లు ధ్రువ‌ప‌త్రాలు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. 

    చ‌ద‌వండి: మోదీ ఇజ్రాయెల్ ప‌ర్య‌ట‌న‌.. అక్క‌సుతో పాకిస్థాన్ తీర్మానం

  • 2026 సంవత్సరం.. ప్రపంచం ఇప్పటికే యుద్ధాలు, సాంకేతిక సమస్యలు, రాజకీయ అస్థిరతల మధ్య కంపిస్తోంది. కానీ ఒక వ్యక్తి ఇంకా భయంకరమైన భవిష్యవాణులు చెబుతున్నాడు. అతని పేరు క్రెయిగ్ హామిల్టన్-పార్కర్. ప్రపంచవ్యాప్తంగా "కొత్త నాస్ట్రడామస్" అని, "డూమ్ ప్రవక్త" అని పిలుస్తారు. రాణి ఎలిజబెత్ మరణం, కోవిడ్ మహమ్మారి వంటి ఘటనలను ముందుగా చెప్పినట్లు అతను దావా వేస్తాడు. ఇప్పుడు అతను పురాతన భారతీయ "నాడీ జ్యోతిష్యం" ఆధారంగా 2026కి 5 భయానక హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇవి నిజమైతే... మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి!

    మొదటి భవిష్యవాణి.. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావచ్చు!
    పార్కర్ చెబుతున్నారు.. 2026లో ప్రపంచ యుద్ధాలు లేదా పెద్ద సంక్షోభాలు అమెరికా ఎన్నికల వ్యవస్థను తలకిందులు చేస్తాయి. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారాలు ఉపయోగించి తన అధ్యక్ష పదవిని మూడోసారి పొడిగించే ప్రయత్నం చేయవచ్చు. చైనా-తైవాన్ ఉద్రిక్తతలు లేదా రష్యా-చైనా మైత్రి వల్ల పెద్ద యుద్ధం మొదలై, అమెరికా లోనికి లాగబడి ప్రపంచ శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం రాజకీయం కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది!

    రెండవ భవిష్యవాణి.. జపాన్‌పై భయానక వాయు మేఘం!  
    ఆగస్టు 2026లో జపాన్ ఉత్తర భాగాలను ఒక రహస్యమైన, విధ్వంసకరమైన "వాయు మేఘం" (gas cloud) కప్పేస్తుందని పార్కర్ హెచ్చరిస్తున్నారు. ఇది సహజంగా జరిగేది కాదేమో... బదులుగా రహస్య దాడి కావచ్చు. బాంబుల ద్వారా అగ్నిపర్వతాలను పేల్చి ఇలాంటి వాయువులు విడుదల చేయవచ్చని అంటున్నారు. దీని పరిణామాలు జపాన్ మొత్తానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఊహించండి... ఆకాశం ముదురుగా మారి, ప్రజలు భయంతో బయటకు రా లేకుండా!

    మూడవ భవిష్యవాణి.. ఇరాన్‌పై బలమైన దాడి!  
    మార్చి 2026లో ఇరాన్ అణు సౌకర్యాలపై ఖచ్చితమైన, శక్తివంతమైన దాడి జరుగుతుందని చెబుతున్నారు. దీని లక్ష్యం ఇరాన్ అణు శక్తిని పూర్తిగా నాశనం చేయడం. "ఎరుపు, పసుపు జెండాలు" మరియు "సింహం చిహ్నం" వంటి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని అంటున్నారు. కానీ ఆశాకిరణం ఉంది – ఈ అల్లర్లు ఇరాన్‌లో ప్రజాస్వామ్యం పెరగడానికి, ముఖ్యంగా మహిళల హక్కులకు దారితీయవచ్చు.

    నాలుగవ భవిష్యవాణి.. సైబర్ దాడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం!  
    2026లో భారీ సైబర్ దాడి జరిగి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు, క్రిప్టోకరెన్సీలు, AI వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. బ్యాంకులు, కంపెనీలు, వ్యక్తుల డేటా దెబ్బతింటుంది. పార్కర్ సలహా – ముఖ్య డేటాను బ్యాకప్ చేయండి, క్లౌడ్‌పై మాత్రమే ఆధారపడకండి. బంగారం ధరలు తీవ్రంగా ఊగిసలాడతాయి. డిజిటల్ ప్రపంచం కూలిపోతే... మన జీవితాలు ఎలా మారతాయో ఊహించండి!

    ఐదో భవిష్యవాణి.. ప్రపంచ సంస్థలు బలహీనపడటం!  
    NATO వంటి అంతర్జాతీయ సంస్థలు బలహీనపడతాయి. భౌగోళిక రాజకీయ పోటీలు, వనరుల కోసం పోరాటాలు పెరుగుతాయి. అమెరికా గ్రీన్‌లాండ్ సహజ వనరులపై ఎక్కువ ఆర్థిక నియంత్రణ కోరుకోవచ్చు. ప్రపంచ శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. ఇవి కేవలం భవిష్యవాణులే... నిజమవుతాయా లేదా? ఎవరికీ తెలియదు. కానీ ఈ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

  • ఇస్లామాబాద్‌: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ పాకిస్థాన్ తన అక్కసు వెళ్లగక్కింది. ఇజ్రాయెల్‌- భారత్ మైత్రికి వ్యతిరేకంగా ఆ దేశ చట్టసభలో తీర్మానం చేసింది. ఈ షడ్బుజ కూటమిని యాంటీ ముస్లిం- ఉ‍మ్మాబ్లాక్‌ గా అభివర్ణించింది.  ఆ దేశ మంత్రి పాల్వాశా మహ్మద్ జియా ఖాన్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆ దేశ చట్టసభలు ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి.

    నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆ దేశ ‍ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మోదీకి సాధరంగా స్వాగతం పలికారు. అయితే ఇదిలా ఉండగా.. బెంజిమిన్ నెతన్యాహూ భారత్‌ మరియు ఇతర దేశాలతో కలిసి "హెక్సాగన్ అలయెన్స్" ( ఆరుభుజాల కూటమి) ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు ‍ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై పాకిస్థాన్ మండిపడింది. ఈ కూటమి ముస్లిం దేశాలకు వ్యతిరేక బ్లాక్‌గా పాక్ అభివర్ణించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ పల్వాషా మహమ్మద్ జై ఖాన్ ఈ కూటమికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశ పెట్టారు.

    ఈ తీర్మాణంలో "ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఈ కూటమి "యాంటీ- ముస్లిం ఉమ్మా (సమూహం)". ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీనాలోని చారిత్రక ప్రాంతాలను మార్చే యత్నం చేస్తే సహిందేది లేదు. పాలస్తీనాకు స్వతంత్రంగా వ్వవహరించే అంశానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది". అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను స్వతంత్ర్య దేశంగా గుర్తించడాన్ని పాకిస్థాన్ సెనేట్ తిరస్కరించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకమని తెలిపింది.

    మరోవైపు, నెతన్యాహూ ప్రతిపాదించిన “హెక్సాగన్ అలయన్స్”లో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు సోమాలిలాండ్ (ఆఫ్రికా ప్రాంతం) ఉన్నాయి.  ఈ కూటమి లక్ష్యం “రాడికల్ షియా” మరియు “రాడికల్ సున్నీ” భావజాలలకు వ్యతిరేకంగా  వ్యవహరించేడమేనని తెలిపారు.

  • టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి  ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. 

    ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్‌కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు  భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు. 

    అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ  "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్‌ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.  ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.

    ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

    పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్‌- అమెరికా ఉద్రిక్తల వేళ  పశ్చిమాసియాలో  మోదీ పర్యటించడం ప్రాధాన్యత   సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి,  నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్‌ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి. 

Politics

  • సాక్షి, తాడేపల్లి: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్‌ కుటుంబమని  తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్ ముద్ర ఉందని  ఆయన స్పష్టం చేశారు.

    2004 అక్టోబరు 27న దివంగత నేత వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ.3581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే... 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సొరంగాలను పూర్తి చేసిన మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ (సహాయ పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా..  ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు.

    సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 7300 కుటుంబాలకు రూ.1000 కోట్లు అవసరం కాగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి డీఆర్సీ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ ఎప్పుడిస్తారని మేము అడిగితే 2-3 నెలల్లో చెల్లిస్తామని చెప్పి  20 నెలలు గడుస్తున్నా... నేటికీ వారికి పరిహారం అందలేదని నిలదీశారు. మరోవైపు నిర్వాసితులకు   పరిహారం పూర్తిగా చెల్లించామన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధమని.. నిజంగా చెల్లిస్తే ప్రాజెక్టును ప్రారంభించకుండా, కేవలం కెనాల్‌ను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

    ప్రకాశం జిల్లా అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే
    ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైఎస్‌ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైఎస్‌ జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

    లడ్డూ వివాదం - ఫేక్ వీడియోల బాగోతం
    శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు చెప్పులతో స్వామివారిని అవమానించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము చెప్పులతో ఉన్న వీడియోలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఆ వీడియోలు ఫేక్ అని ఒప్పుకున్న ప్రభుత్వం, వాటిని ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఏ చర్యలు తీసుకున్నారని తూమటి మాధవరావు  నిలదీశారు.

  • సాక్షి, తాడేపల్లి: పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరుమెదపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:

    అసెంబ్లీలో చర్చించండి బాబూ..:
    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక మాట చెప్పదలిచాను. చంద్రబాబు గారూ.. రాయలసీమకు కష్టం వచ్చింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీటి సమస్య ఎదురైంది. మేం లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించండి. అలాగే నీటి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయండి.

    ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదు?:
    1996 వరకు ఆల్మట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని చంద్రబాబు చెప్పుకునే రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్‌ 120 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పెద్ద జలాశయంగా మారింది.

    తాజాగా ఈ డ్యామ్‌ ఎత్తును 524.24 మీటర్లకు పెంచి అదనంగా మరో 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళికలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అనేక అంశాలపై గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత భవిష్యత్‌పై భయం నెలకొంది.

    నీరు రాకపోతే సీమ ఎడారే:
    ఆల్మట్టి డ్యామ్‌ వద్ద 120 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే జూన్, జులైలో రావాల్సిన వరద నీరు ఆలస్యమై ఆగస్టులో వస్తోంది. రాబోయే రోజుల్లో అదనంగా మరో 100 టీఎంసీలు నిల్వ చేస్తే సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కూడా వరద నీరు దిగువ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉండదు. ఎగువ నుంచి నీరు రాకపోతే  రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుంది. అప్పర్‌ తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 5.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు ప్రాజెక్టుల ద్వారా కలిపి 20.90 టీఎంసీల నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2018లోనే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీడబ్ల్యూసీ) అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ప్రభావంతో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. తుంగభద్ర డ్యామ్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఎల్‌ఎల్‌సీ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. వేదావతి నదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించకూడదనే నిబంధనలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి నీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించాలి.

    చంద్రబాబు మౌనం!:
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులం మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశామని చెప్పారు. ఈ పథకాన్ని ఆపేయడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులు, దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా లేకుండా పోయే ప్రమాదం ఉంది.

    కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, చివరకు శ్రీశైలం డ్యామ్‌కు నీరు వస్తుందా లేదా అన్న ఆందోళన నెలకొంది.  చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవాలంటే 841 అడుగుల నీటి మట్టం అవసరం. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాం. బనకచర్ల ఎత్తిపోతల సహా ప్రత్యామ్నాయ నీటి సరఫరా మార్గాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు రాయలసీమ బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించాలని మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ సూచించారు.

  • సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ని చూసి ఊసరవెళ్లి కూడా ఉరేసుకుంటుందన్నారు. ఇక లోకేష్ పులకేసిని తలపించారని.. ఈ ముగ్గురు సొంత డబ్బా కొట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారంటూ చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

    ‘‘కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు ట్యాంకర్లను తిరిగి ఎందుకు తీసుకున్నారు?. వైష్ణవి డెయిరీ సంగం డెయిరీ లోగోతో మజ్జిగ అమ్ముతున్నారు. వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి?. ఈ రాష్ట్రంలో పాలు, నీళ్లు అన్నీ కల్తీనే. పాలల్లో ఏం కలిసిందో ఎల్లో మీడియా ముందుగానే ఎలా రాస్తుంది?. లడ్డూ ఇష్యూలో కూడా ఇదే విధంగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసింది. సీబిఐ రిపోర్టును కూడా తప్పుదారి పట్టించిన ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాది’’ అంటూ చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘హెరిటేజ్ డెయిరీ ఎప్పుడూ ఆలయాలకు నెయ్యి సరఫరా చేయలేదని టీటీడీ నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు. 2002లో రూ.117లకు టిన్‌ల ద్వారా హెరిటేజ్ నెయ్యి సరఫరా చేసింది.. కానీ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారు. బోలేబాబాతో సహా అందరు బాబాలకు చంద్రబాబే పెద్ద దిక్కు. ఇందాపూర్ డెయిరీని మ్యానుఫ్యాక్చరింగ్‌ నుండి కో-మ్యానిఫాక్చరింగ్ యూనిట్‌గా ఎలా మార్చారు?. వైష్ణవి డెయిరీ గేట్లకు రంగు మార్చితే మీ బాగోతాలన్నీ కనుమరుగు అవుతాయా?

    ..హెరిటేజ్ భాగోతం బయట పడగానే నేషనల్ సేల్స్ మేనేజర్‌ని మార్చేశారు. తిరుమల కొండ మీద ఎలాంటి ఎన్నికలు జరగకూడదని వైఎస్సార్ హయాంలో జీవో తెచ్చారు.. కానీ దాన్ని కూడా రెండు కొండలకే వెంకటేశ్వర స్వామిని పరిమితం చేశారంటూ చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేశారు. తిరుమలకు ఏడు కొండలు కాదు రెండు కొండలేనంటూ జీవో ఉంటే అది చంద్రబాబు బయట పెట్టాలి. తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవటానికి అనుమతి ఇస్తానని బైబిల్ మిషన్ సభలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారం చేయటానికి చంద్రబాబే జీవో ఇచ్చారు.

    అందరి బాబాల వెనుక ఉన్న ఏకైక బాబా మన చంద్ర "బాబా"

    నెల్లూరు జోన్‌లో ముద్రించిన టిక్కెట్ రోల్స్‌ని తిరుమలకు కూడా పంపారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన ఘనుడు చంద్రబాబు. నీచమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లు. చంద్రబాబు జీవితంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించ లేదు. అలాంటి వ్యక్తి వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు’’ అంటూ చంద్రశేఖర్‌ మండిపడ్డారు.

Family

  • పదిహేను సంవత్సరాల క్రితం... కాలేజీ ఫంక్షన్‌లో ‘యూ ఆర్‌ మై సోనియా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు యశ్, గరీమా.
    తాజా విషయానికి వస్తే... స్నేహితులు కాస్తా వధూవరులు అయ్యారు.

    హైలెట్‌ ఏమిటంటే ఆనాటి డ్యాన్స్‌ వీడియోను పెళ్లివేడుకలో ప్రదర్శించడం. పెళ్లికి వచ్చిన అతిథులు మాత్రమే కాదు నెట్‌వాసులు కూడా ‘బ్రహ్మాండమైన ఐడియా’ అంటున్నారు.

    ‘ఎన్నో జ్ఞాపకాలను మోసుకొచ్చి మనసును ఉల్లాసపరిచిన వీడియో ఇది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది గరీమ.‘‘కాలేజీ డ్యాన్స్‌ను రీక్రియేట్‌ చేయాలనే ఐడియా అనుకోకుండా వచ్చింది. ఇంత స్పందన వస్తుందనుకోలేదు’ అన్నాడు యశ్‌. ‘చిన్ననాటి స్నేహితులు, కాలేజీ రోజుల నాటి స్నేహితులు పెళ్లి చేసుకుంటే వారి పాత వీడియోలు, ఫొటోలను పెళ్లి వేడుకలో ప్రదర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది’ అని సూచించాడు ఒక నెటిజనుడు.

    చ‌ద‌వండి: ఈ వ‌ధూవ‌రుల‌ది ఎంత గొప్ప మ‌న‌సు!

    పెళ్లివేడుకలో మరో హైలైట్‌ ఏమిటంటే ‘యూ ఆర్‌ మై సోనియా’ పాటకు వధూవరులు స్టేజీపై డ్యాన్స్‌ చేశారు.
    ‘అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు!’ అంటారా?
    ప్రేమకు ఉన్న పవర్‌ అదే కదా! 

     

  • సోషల్‌ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్‌ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్‌ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్‌ మొత్తం తీసి ..రీల్స్‌ చేసినా..క్లిక్‌ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్‌ కాదు. ఫ్యాషన్‌ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్‌లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్‌తో సెన్సేషన్‌గా స్టార్‌గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్‌గా, చాలా క్యాజువల్‌గా ఫ్యాషన్‌ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..

    ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్‌తో ఆమె షేర్‌ చేసిన ఫ్యాషన్‌ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్‌గర్ల్‌ అని చర్చలకు తెరతీసేలా..హాట్‌టాపిక్‌గా మారిందామె. ఆ రీల్‌లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్‌ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్‌ ప్రదర్శనకు ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్‌ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. 

    తన డిజైనర్‌వేర్‌లతో చాలా స్మార్ట్‌గా మార్కెటింగ్‌ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్‌ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం ఆమె ఫ్యాషన్‌ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్‌ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్‌ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    కాగా, నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్‌లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్‌వేర్‌లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. 

    ఈ వీడియో ఇంతలా క్లిక్‌ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్‌గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్‌ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్‌ అయ్యి..అంతలా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి ఆ వీడియోకి.  ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్‌తో దియా సెన్సేషన్‌గా మారింది కదూ..!.

     

    (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్‌ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్‌ బ్రదర్స్‌..!)

     

  • కార్పొరేట్‌ ప్రపంచంలో పెద్ద స్థాయిలో వెలిగిన మహిళ... లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తోలుబొమ్మలాటనే కెరీర్‌గా ఎంచుకుంటుందా? మహానగరాలను కాదనుకొని మారుమూల పల్లెల్లోకి వెళుతుందా? ‘అవును’ అని చెప్పడానికి కచ్చితమైన సమాధానం... కలిత 

    అసోంలోని హజో అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ద్రిషన కలిత చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాటను చూస్తూ పెరిగింది. అసోంలో ‘పుటోల నాస్‌’ అని పిలవబడే తోలుబొమ్మలాట తరతరాలుగా మగవాళ్లకే పరిమితం అయింది. ‘తోలుబొమ్మలాట మగవాళ్లు మాత్రమే ఆడాలి’ అనే సంప్రదాయాన్ని కలిత బ్రేక్‌ చేసింది. 

    ‘తోలుబొమ్మలాట నేర్చుకోవడం కష్టమే. అయితే నాకు ఉన్న ఆసక్తి కారణంగా కష్టమైనా సరే....ప్రతి అంశం గురించి వివరంగా నేర్చుకున్నాను’ అంటుంది కలిత. ఆరేళ్ల వయసు నుంచే అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు మాట్లాడే కలిత దిల్లీలో కార్పొరేట్‌ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమెకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తి ఇవ్వలేదు.

    తన మాతృరాష్ట్రం కోసం ఏదైనా చేయాలనిపించి సామాజిక మార్పు కోసం తోలుబొమ్మలాటను ఉపయోగించుకోవాలి’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన కలిత తనలాంటి తోలుబొమ్మలాట అభిమానులతో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసింది. ‘ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు తగాదా పడుతుంటారు. 

    అయితే ఆ ప్రభావం పిల్లలపై ఎంత ప్రతికూలంగా పడుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు’ అంటున్న కవిత తోలుబొమ్మలాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం మొదలు పెట్టింది. మరోవైపు అసోం అపురూప జానపద కథలను ఈతరం పిల్లలకి తోలుబొమ్మలాట ద్వారా పరిచయం చేయడం ప్రారంభించింది. జానపదానికి సామాజిక అంశం జోడించింది.

    కలిత బలం... మహిళలు. ఎన్నో గ్రామాల్లోని మహిళలు కలితకు అభిమానులుగా మారారు. తమ గ్రామాలలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఒక గ్రామానికి చేరుకోగానే కలిత బృందం చేసే పని....ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల గురించి తెలుసుకోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా తోలుబొమ్మలాటను మార్చేది కలిత.

    మద్యపానం వల్ల జరిగే నష్టం నుంచి అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాల వరకు ఎన్నో అంశాలపై మారుమూల పల్లెల్లో సైతం తోలుబొమ్మలాట ద్వారా ప్రచారం చేస్తోంది కలిత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. పనిచేస్తున్న చోట ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయి. 

    వారి సమస్యలను తోలుబొమ్మలాట ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం తోలుబొమ్మలాట మాత్రమే కాకుండా తన థియేటర్‌ గ్రూప్‌ ద్వారా రకరకాల సామాజిక అంశాలపై స్ట్రీట్‌ ప్లేలు, స్కిట్స్‌ ప్రదర్శిస్తోంది. యువత కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ అందరి చేతా శభాష్‌ అని అనిపించుకుంటోంది.

    (చదవండి: టెర్రస్‌.. కామన్‌ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది!  )

  • ఐదు సంవత్సరాల క్రితం మేము ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొన్నాము. మొత్తం తొమ్మిది ఫ్లాట్లు ఉంటాయి. నాలుగు అంతస్తులు, 8 ఫ్లాట్లు + పెంట్‌ హౌస్‌. భూమి యజమాని బిల్డర్‌తో ఒప్పందం చేసుకొని రెండు ఫ్లాట్లు – పెంట్‌హౌస్‌ని తనకోసం కేటాయించుకున్నారు. మేడ పైకి మాకు ఎవరికీ ప్రవేశం లేకపోయినప్పటికీ, కొంతమంది సోలార్‌ ప్యానల్స్, డిష్‌ టీవీ యాంటినాలు, ఇంటర్నెట్‌ కేబుల్‌ బాక్స్‌ వగైరా ఉండటం వల్ల అవసరమైనప్పుడు మేడ పైకి రావడానికి అనుమతి ఇస్తుంటారు. ఇప్పుడు కొన్ని ఫ్లాట్‌ ఓనర్లతో విభేదాలు రావడంతో సోలార్‌ ప్యానల్‌ తో సహా సామాగ్రి అంతా తీసేయమంటున్నారు. అదేమని అడిగితే పెంట్‌హౌస్‌తోపాటు ఐదవ అంతస్తు మొత్తం అతనిదే అని, అలాగే డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌లో కూడా రాసి ఉందని అంటున్నాడు. మేము మా సామాగ్రి తీసేయవలసినదే అంటారా? 
    – రమేష్‌ రెడ్డి, హైదరాబాదు

    బాల్కనీలు, మెట్లు, వరండా, మేడ/టెర్రస్‌ వంటివి కామన్‌ ఏరియా అంటే అందరికీ హక్కు ఉన్న సాధారణ ప్రదేశం కిందకి వస్తాయి. టెర్రస్‌ అనేది ఇంటిని/బిల్డింగును కాపాడుతుంది కాబట్టి అది ఏ ఒక్కరి సొంతము కాకూడదు. రెరా చట్టం, 2016లో కూడా టెర్రస్‌ (మిద్దెపై ఖాళీ ప్రదేశం) ను కామన్‌ ఏరియాగా మాత్రమే పరిగణిస్తారు. కామన్‌ ఏరియాను అందరికీ ఉపయోగపడేలాగా ఉంచాలి తప్ప ఏ ఒక్కరికి ప్రత్యేకంగా ఇవ్వడానికి వీల్లేదు అని చాలా సందర్భాలలో పలు కోర్టులు తేల్చి చెప్పాయి. కాబట్టి పెంట్‌హౌస్‌ ఉంది అన్న నెపంతో మిమ్మల్ని మేడపైకి రానివ్వను – మీ సోలార్‌ ప్యానల్స్, డిష్‌ టీవీ బాక్సులు ఉండనివ్వను అనటం కుదరదు. ఒకవేళ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌లో ఇలాంటి నిబంధన ఏదైనా ఉన్నప్పటికీ అది చట్టరీత్యా చెల్లదు: 

    ఎందుకంటే చట్టంలో కామన్‌ ఏరియాను చట్టంలో చెప్పిన విధంగానే వాడవలసి ఉంటుంది కాబట్టి. అయితే మంచో చెడో, అగ్రిమెంట్‌ పత్రాలలో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి –ఎవరైనా చట్టం తెలిసిన మధ్యవర్తులను నియమించుకుని ఆ టెర్రస్‌లో ఉండే వారితో సంధి కుదుర్చుకుని వారికి అర్థమయ్యేలాగా చెప్పి చూడండి.  పరిస్థితి తీవ్రం అవుతోందని అనుకుంటే సివిల్‌ కోర్టు నుంచి తగిన రక్షణ కోరవచ్చు. అయితే మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం. అలాంటి ప్రయత్నాలు విఫలమైతే కోర్టు ఉండనే ఉంది! 
    – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    (మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

    (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్‌ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్‌ బ్రదర్స్‌..!)

  • సోషల్‌ మీడియాలో ఓ పెళ్లి వేడుక అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా పెళ్లి వేడకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటేనే బంధుమిత్రులు మురిసిపోతారు. అలాంటిది ఒకేలా ఉండే ఇద్దరు వరులు అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు వధువులను పెళ్లి చేసుకుంటే ఆ సందడి, హడావిడే వేరు. అచ్చం అలానే ఇక్కడ ఒకేలా ఉండే ఇద్దరు కవల సోదరిమణులు..ఒకేలా ఉండే కవల సోదరులను పెళ్లాడారు. 

    ఇది తెలంగాణలోని కామారెడ్డిలో జిల్లా ఘన్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఒకే పోలికలతో ఉన్న ఈ రెండు జంటలు, మూడు ముళ్ల బంధంతో ఒకటవ్వడం అక్కడున్నవారందర్నీ ఆకట్టుకుంటోంది. వారే ట్విన్‌ బ్రదర్స్‌ అయిన దుంపటి విజయ్‌, వినయ్‌లు, ట్విన్‌ సిస్టర్స్‌ అయిన కుమ్మరి కీర్తన, కీర్తీలను పెళ్లాడారు. 

    ఆ ఇరు జంటలు పెళ్లిపీటల మీద కూర్చున్న దృశ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా ఇద్దరు కవలలు, మరో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతంది. అక్కడి గ్రామస్తులు ఇలాంటి పెళ్లి ఘట్టాన్ని కనులారా వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతుండటం విశేషం. 

    (చదవండి: జస్ట్‌ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌..)

     

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు.. 2018 రిక్రూట్‌మెంట్‌ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మందిని సాధారణ పరిపాలన శాఖ (GAD)కి సీఎస్‌ అటాచ్‌ చేశారు.

    ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఎస్‌.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి.. జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

     

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగింది. భాకరాపురంలో క్యాంప్ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.

    వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు.

    ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

    ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ సూచించారు.

    ఆపన్నులకు అండగా..
    వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన  వైఎస్‌ జగన్‌.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

    దీంతో పాటు పులివెందుల పర్యటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్‌ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె ఉంటున్న జీసస్‌ ఛారిటీస్‌కు వెళ్ళి వైఎస్‌ జగన్‌ పరామర్శించారు, కమలమ్మ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్‌ విండో మాజీ ఛైర్మన్‌ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు( ఫిబ్రవరి 26, గురువారం) నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు వైఎస్సార్‌ కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

    9 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గంలో గొలగమూడి రోడ్డులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు 10.20 గంటలకు చేరుకుంటారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుగు పయనమవుతారు.

     

  • సాక్షి విజయవాడ: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకు కూటమి నేతలు కుట్ర పన్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నేత కుట్ర జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. దేవుడి పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కుటిల‌య‌త్నం చేశార‌ని విమ‌ర్శించారు. తిరుప‌తి ల‌డ్డు వివాదంలో వీరిద్ద‌రే దోషులని వ్యాఖ్యానించారు. ఎన్డీడీబీ రిపోర్టును అడ్డుపెట్టుకుని రాజ‌కీయంగా ల‌బ్ది పొందాల‌న్న దుర్బుద్ధితో ఇదంతా చేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

    విజ‌య‌వాడ‌లో బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ మాట్లాడారని మండిప‌డ్డారు. ప్రజల సంపదతో నడిచే శాసనసభ పూర్తి అవాస్తవాలు, అబద్ధాలతో జరిగిందన్నారు. దుర్మార్గమైన, జుగుప్సాక‌రమైన, ప్రజలను తప్పు దోవ పట్టించే చర్చ అసెంబ్లీలో నిన్న జరిగిందని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.

    ''కన్ను ఆర్పకుండ అబ‌ద్దాలు ఆడే వ్యక్తి చంద్రబాబు. అబద్దాలు ఆడడంలో చంద్రబాబుతో  పవన్ పోటీ ప‌డుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ స్వార్థం కోసం తిరుపతి లడ్డుపై మాట్లాడారు. 164 మంది ఎమ్మెల్యేలు చెప్పినా అబద్ధం అబద్ధమే. పోయే కాలం వ‌చ్చినప్పుడు దేవుడు చెప్పినా వినరు. శ్రీవారి ప్రతిష్టని దెబ్బ తీసింది ఎవరు? దెబ్బ తీస్తుంది ఎవరు? మీ ప్రభుత్వంలో శాంపిల్స్ తీసి గత ప్రభుత్వం మీద నెట్టమని ఏం ధర్మం చెప్పింది?

    2024 జూలై 12న నెయ్యి శాంపిల్ తీశారు. శాంపిల్స్ తీసినపుడు ఏ ప్రభుత్వం అధికారంలో వుంది? 5 రోజుల పాటు శాంపిల్ మీ దగ్గర పెట్టుకొని క‌ల్తీ చేశారు. కస్టమర్ ఇచ్చిన శాంపిల్‌నే తాము పరీక్షించామ‌ని ఎన్డీడీబీ తెలిపింది. మీరు ఏవిధంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పారో.. అదే మేము రిపోర్ట్‌లో పేర్కొన్నాం త‌ప్పా  మాకు ఎటువంటి సంబంధం లేదని ఎన్డీడీబీ పేర్కొంది. ఈ రిపోర్ట్‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త లేద‌ని.. దీన్నిఎక్క‌డా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదని చెప్పింది. మరి ఈ రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకుని కూట‌మి నేత‌లు ఎలా మాట్లాడారు? దేవుడిని రాజ‌కీయాల‌కు వాడాల‌నే ఉద్దేశంతో రిపోర్ట్ ఇప్పించుకుని కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌లు చేసింది.

    తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో కూటమి వొదిలిన బాణం హెరిటేజ్‌కే గుచ్చుకుంది. హెరిటేజ్ షేర్లు భారీగా ప‌త‌న‌మ‌యి, వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింది. శీవారిని అప్ర‌దిష్ట పాలు చేసినందుకు రాజ‌కీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మాన‌సికంగా న‌ష్టపోతారు. హెరిటేజ్, కొన్ని సంస్థలు సప్లే చేస్తున్న పాలు కల్తీనే. దేవుడి పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాదు. కూట‌మి ప్ర‌భుత్వం మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. రాజ్యాంగం బద్ధమైన పదవుల్లో ఉన్న‌వారు కుల‌మ‌తాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాలి. కూట‌మి నేత‌ల బెదిరింపుల‌కు నేను భ‌య‌ప‌డ‌నని'' జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ అన్నారు.

    ఈ నీచుడికా మనం ఓటేసింది.... ఇలాంటి ఉప ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా..?

National

  • ఢిల్లీ: ఎన్‌సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సిలబస్‌ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇలాంటి సిలబస్‌తో పిల్లలపై  చెడు ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది.

    కాగా, సుప్రీం వార్నింగ్‌తో ఎన్సీఈఆర్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే సెక్షన్‌ను ఎనిమిదో తరగతి పాఠ్యాంశం నుంచి ఎన్సీఈఆర్టీ తొలగించనుంది. న్యాయవ్యవస్థపై ప్రతికూల అంశాల కంటే, స్ఫూర్తిదాయక  అంశాలు రాయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థను కించపరిచే ప్రయత్నాలను సహించమంటూ ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై తగ్గిన చర్యలు తీసుకుంటామని సీజేఐ వెల్లడించారు. న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద సవాళ్లు  అవినీతి, న్యాయమూర్తుల ఖాళీలంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకం పేర్కొంది.

    న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమంటూ  సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్వి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచేందుకు  ఉద్దేశపూర్వకంగా చేశారని, తీవ్రంగా పరిగణిస్తున్నానని.. తగిన చర్యలు తీసుకుంటామని సీజేఐ  తెలిపారు.

  • పాట్నా: ఆ వధువు మరికొద్దిసేపట్లో పెళ్లి చేసుకొని నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అయితే అంతలోనే ఊహించని ఘటన జరిగింది. పెళ్లి చేసుకొని నవ జీవితాన్ని ప్రారంభించాల్సిన వధువు పెళ్లి పీటలపైనే కాల్పులకు గురైంది. తనను ప్రేమించి వేరే వారిని పెళ్లి చేసుకుంటుందని కోపంతో పెళ్లికూతురి బాయ్‌ ఫ్రెండ్ ...వివాహ వేడుకలోనే ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో  ఆర్తీ అక్కడే  కుప్పకూలింది.

    బిహార్ బక్సర్‌లోమంగళవారం ఉదయం  ఆర్తీ అనే 18 ఏళ్ల యువతికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరుగుతుంది. వారి కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తన సోదరి పెళ్లికూతురుకు నుదుట సిందూరం పెడుతుంది. ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. బంధుమిత్రుల మధ్యలోనుంచి అకస్మాత్తుగా వచ్చిన యువకుడు ఆర్తీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులోకి వెళ్లడంతో ఆమె పెద్దగా అరుస్తూ పెళ్లిమండపంలోనే కుప్పకూలింది.

    దీంతో పెళ్లికూతురు బంధువులు హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వారణాసిలోని ట్రామా సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం ఆర్తీ పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఆర్తీకి పరిసర ప్రాంతంలోనే ఉండే వ్యక్తి దీనబంధుగా పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే కాల్పులు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుడిపై గతంలోనూ పోలీసు కేసు నమోదైనట్లు తెలిపారు.

  • జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  సొరేన్‌ 19 ఏళ్ల మనవడు వీర్ సోరెన్  హఠాత్తుగా కన్నుమూశారు. ఫఙబ్రవరి 24, మంగళవారం, హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో స్నేహితులతో ట్రిప్‌లో ఉండగా అనుమానాస్పదంగా మరణించడంతో విషాదం అలుముకుంది.

    తన మనవడి విషాద వార్తనుస్వయంగా  చంపాయ్ సోరెన్ ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు.
    వీర్ నిష్క్రమణతో, తమ కుటుంబం ఛిన్నాభిన్నమైందంటూ విచారం వ్యక్తంచేశారు.

    పోలీసుల నివేదికల ప్రకారం  సిమ్సా ప్రాంతంలోని హోమ్‌స్టేలో బస చేసింది. ఫిబ్రవరి 23న హమ్తా పాస్ సమీపంలోని సోలాంగ్ వ్యాలీ ,సేథాన్ గ్రామాన్ని సందర్శించి సాయంత్రంతిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24 ఉదయం, తిరిగి  బైటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా,  వీర్  తన గదిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి వచ్చినప్పుడు, తలనొప్పిగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే పరిస్థితి విషాదకరంగా మారింది. మంచం మీదనుంచి పడిపోయి, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నోటిలోంచి నురుగు   కూడా వచ్చింది. వెంటనే మనాలిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు CPR చేసి అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.

    మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి అనే విషయం ఇంకా దర్యాప్తులో ఉన్నప్పటికీ, సీనియర్ పోలీసు అధికారులు హైపోక్సేమియా కారణంగా ఉండవచ్చని సూచించారు. హమ్తా పాస్ మార్గంలోని ఎత్తైన ప్రదేశాలకు వెల్లడం, పర్వత గాలికి అలవాటు పడని ప్రయాణికులలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ,తలనొప్పి వస్తుంది అని చెబుతున్నారు.

    ఇదీ చదవండి: ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్‌, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్‌

     

  • ప్రశాంత జీవనం వాళ్లకు సహజ సిద్ధం. ప్రకృతి సంపద వాళ్లకు వారసత్వ ఫలం. ఖనిజ సంపద వాళ్ల జన్మహక్కు..! ఐనా శతాబ్దాలుగా వెంటాడుతున్న వెనుకబాటు తనం... పేదరికం... మావోయిస్ట్‌ ఉద్యమానికి కేంద్ర స్థావరంగా మారిన తరువాత వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నలిగి సమిధలుగా మారిన దుస్థితి..! అయినా తమదైన జీవన విధానాన్ని, సంస్కృతిని ఆస్వాదించడం దండకారణ్యం ఆదివాసీల ప్రత్యేకం.

    తుపాకీ తుటాల మోతతో.. ఖాకీ బూట్ల సవ్వడులతో అడవిలో అలజడి చెలరేగి.. వారి బతుకులు అగమ్యగోచరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో నక్సలిజం తగ్గిపోవడం.. మావోయిస్టు బడా నాయకులు నేలకొరగడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దండకారణ్యంలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటున్నాయా? గిరిజనులు అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నారా?

    దండకారణ్యం ప్రకృతి ఇచ్చిన ఓ సంపద. కొండలు, లోయలు, సెలయేళ్లు ఎటు చూసినా పచ్చదనం మైదానాలు.. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు.. ఇవన్నీ ఆదివాసీ తెగలకు పుటిల్లు. గోండులు, మారియా, బగత, కోయ, గొత్తికోయ, ముఖ, హల్బా లాంటి తెగలతో పాటు అతి పురాతన ఆదివాసీ తెగ మురియాలకు దండకారణ్యంలోని అబుజ్‌మఢ్‌ జన్మస్థానం..! గడిచిన రెండుమూడు దశాబ్దాలుగా ఈ తెగలన్నీ అటు మావోయిస్టులు.. ఇటు పోలీసుల మధ్య నలిగిపోయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.

    సల్వాజులుం కనుమరుగు
    దండకారణ్యంలో ఇన్ని తెగలున్నా.. అడవుల్లో జీవించే గొత్తికోయలు మావోయిస్టులకు.. మైదాన ప్రాంతాల్లో ఉండే కోయలు పోలీసులకు మద్దతిస్తారనే అపవాదులు ఉండేవి. దీంతో.. కేంద్ర ప్రభుత్వం 2005 నుంచే గొత్తికోయల్లో మార్పు తేవాలని ప్రయత్నాలను మొదలు పెట్టింది. అప్పట్లోనే ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ మొదలైంది. పోలీసు యాక్షన్ కంటే.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని అప్పట్లో ప్రభుత్వాలను ఆచరణలో పెట్టాయి. దాంతో.. సల్వాజులుం పేరుతో శాంతి సేన ఏర్పాటైంది. ఈ చర్య అప్పట్లో కోయల మధ్య విభేదాలను సృష్టించిందనే వాదనలున్నాయి. మైదానాల్లో ఉండే కోయలు అడవుల్లో ఉండే గొత్తికోయలను టార్గెట్‌గా చేసుకున్నారనే అపవాదులున్నాయి. 

    అయినా.. ఎప్పుడు.. ఏ క్షణంలో.. ఎక్కడి నుంచి తుపాకీ మోత మోగుతుందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులుండేవి. ఆహ్లాదకర వాతావరణంలో తమ పండుగలను జరుపుకునే పరిస్థితులు ఉండేవి కాదు. వస్తుమార్పిడి విధానంలో సరుకులు కొనుగోలు చేసే సంతల్లోనూ తుపాకీమోత మోగుతుందేమోననే భయం ఉండేది. బుల్లెట్ల కారణంగా ఆదివాసీల ఉనికి ప్రమాదంలో పడుతోందని అప్పట్లో హక్కుల సంఘాలు ఆరోపించేవి. పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఆదివాసీలు సమిధలుగా మారుతున్నారనే ఆందోళనలు కొనసాగేవి. మహేంద్ర కర్మ హత్యతో సల్వాజులుం క్రమంగా కనుమరుగైంది. తర్వాత క్రమంగా మావోయిస్టులు మళ్లీ దండకారణ్యంపై పట్టుసాధించారు.

    ఆపరేషన్ కగార్‌తో  ఉక్కుపాదం
    కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరాక.. మావోయిస్టు ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర బలగాలను మోహరించింది. బస్తర్ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఐదారు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపులు ఏర్పాటయ్యాయి. ఫలితంగా ఆదివాసీల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు తరచూ ఆదివాసీలను టార్గెట్‌గా చేసుకునేవారు. ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, పూజారి కాంకేర్ వంటి ప్రాంతాల్లో ప్రజాకోర్టులను నిర్వహించి, స్థానిక సర్పంచ్‌లను హతమార్చేవారు. 

    ఆదివాసీల కిడ్నాప్‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో.. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో.. డీఆర్జీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లొంగిపోయిన మావోయిస్టులను రిక్రూట్ చేసుకుని, కూంబింగ్ నిర్వహించడం మొదలు పెట్టింది. సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలకు దీటుగా డీఆర్జీ తయారైంది. అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్ అయినా.. బీజాపూర్ అయినా.. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలిన ప్రతీచోట.. డీఆర్జీ ఆధిపత్యం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లే.. 2026 మార్చి చివరికల్లా.. మావోయిజాన్ని ఖతం చేయడంలో దాదాపుగా సఫలమైంది. మావోయిస్టు పెద్దదిక్కుగా ఉన్న తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోవడంతో.. ఇప్పుడప్పుడే ఉద్యమం తిరిగి కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

    ఆదివాసీల జీవితాల్లో వెలుగురేఖలు!
    దండకారణ్యంలో ఇప్పుడు అన్నల అలజడి లేదు..! తుపాకీ మోతలు లేవు..! మరి ఇప్పుడు ఆదివాసీల జీవితాల్లో మార్పు మొదలైందా? ఈ ప్రశ్నకు దాదాపుగా ఔననే సమాధానం వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు కరెంట్ అనేది ఎరగని గ్రామాల్లోనూ ఇప్పుడు విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఈ కోవలో ధర్మారం, జీడిపల్లి, కొండపల్లి, గుండం, తిమ్మిరాల, కోమటిపల్లి, భీమారంపాడు, చిన్న ఉట్లపల్లి, పూజారి కాంకేర్ వంటి గ్రామాలు ఈ ఘనతకు వేదికయ్యాయి. అంతేకాదు.. ప్రయాణం అంటే కేవలం కిలోమీటర్ల కొద్దీ కాలినడకే మార్గంగా ఉండేది. 

    అత్యవసర సమయాల్లో ఎవరినైనా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే.. వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటేలోగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలుండేవి. చిన్నపిల్లలకు చదువు ఆమడ దూరంలో ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మార్పు మొదలైంది. రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కరెంటుతోపాటు.. కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇక్కడి ప్రజలు వాడుతున్నారు. గడిచిన 75 ఏళ్లుగా బస్సు ముఖం ఎరగని గూడేలకు ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాయి. మావోయిస్టులు జనతన సర్కారు పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహించిన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజాపాలన మొదలైంది. పిల్లలు బడికి వెళ్తున్నారు. పోషకాహారం వారికి అందుతోంది. ఈ ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను ప్రారంభించాయి.

  • కర్ణాటక: పాండవపుర తాలూకా డింకా గ్రామంలో యువతి అదృశ్యం అయ్యేందుకు వ్యక్తి కారణమని ఆరోపిస్తూ దుండగులు దాడి చేశారు. వివరాలు.. కె.ఆర్‌.పేట తాలూకాలోని బొమ్మలాపూర్‌ గ్రామానికి చెందిన నింగన్న కుమార్తె ఒక యువకుడిని ప్రేమించి అదృశ్యమైంది. అదే గ్రామానికి చెందిన ప్రకాష్‌ ఆమెకు సహాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కె.ఆర్‌.పేట గ్రామీణ పోలీసులు ప్రకాష్‌ పై కేసు నమోదు చేశారు. 

    ఈ విషయంపై అమ్మాయి సోదరుడు సంజయ్‌ అడగడంతో నవీన్‌ వర్గం సంజయ్‌పై దాడి చేసిందని చెబుతున్నారు. ఈ విషయంపై రెండు వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. గిరీష్, సంజు, మంజు, జీవన్, శశికుమార్, మదన్, ముద్దప్ప, పవన్, మాదప్ప, నింగన్న, రవి, శివన్న అనే నిందితులు మైసూరుకు చెందిన నవీన్‌ అతడి బావమరిది ప్రకాష్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రకాష్‌ రెండు కాళ్లు విరిగిపోయియి. ప్రకాష్‌ ను వెంటనే పాండవపుర ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం మైసూర్‌లోని కె.ఆర్‌.ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు నిందితుడు గిరీష్‌ ను అదుపులోకి తీసుకుని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 

  • న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ పార్లమెంటు ‘నెసెట్’లో గాజాలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై  మాట్లాడాలని వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి ప్రారంభమైన ప్రధాని రెండు రోజుల అధికారిక పర్యటన నేపథ్యంలో ఆమె సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి ఈ సూచన చేశారు.

    గాజాలో వేలాది మంది  బలైపోతున్న తీరును ‘మారణకాండ’గా అభివర్ణించిన ఆమె ఈ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించి, బాధితులకు న్యాయసాయం అందించాలని కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో అనాదిగా మనం అనుసరిస్తున్న సత్యం, శాంతి, న్యాయం వైపు నిలబడే సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె ఈ సందర్భంగా ప్రధానికి గుర్తు చేశారు.

    ప్రధాని నరేంద్ర మోదీ తన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం అక్కడికి చేరుకున్నారు. 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ, తొమ్మిదేళ్ల అనంతరం మళ్లీ ఆ దేశ గడ్డపై అడుగుపెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు సాగుతున్న ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరగనుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, నీటి యాజమాన్యం, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
     

    ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ కావడంతో పాటు, నెతన్యాహుతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొంటారు. కాగా గాజా అంశంపై ప్రియాంకా గాంధీ మొదటి నుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలకు హాజరైన సమయంలోనూ ఆమె పాలస్తీనాకు మద్దతుగా  తన గళం వినిపించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన 'సమగ్ర శాంతి ప్రణాళిక' ఒప్పందం తర్వాత యుద్ధం తగ్గుముఖం పట్టినప్పటికీ, గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.

    ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ సైతం గాజాలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ తన నైతిక బాధ్యతను చాటుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పాలస్తీనా విషయంలో భారత్ ఎప్పుడూ ‘ద్వి-దేశ పరిష్కారాన్ని’ సమర్థిస్తూనే, అక్టోబర్ 7 నాటి ఉగ్రదాడులను ఖండించింది. అదే సమయంలో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది.

    ఇది కూడా చదవండి: విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం