సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో శనివారం సాయంత్రం ఓ ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. నకిరేకల్లోని ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న స్కూటీ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్కూటీకి మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన స్కూటీ ఓలా కంపెనీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.
మంటలు చెలరేగిన సమయంలో రహదారిపై వాహనాలు, పాదచారులు ఉండటంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ పెద్దగా గాయాలు కానీ కాలేదు. సదరు ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.
Telangana
సాక్షి,హైదరాబాద్: నమస్తే ఫ్రెండ్స్. నాపేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్లతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని’ అంటూ ప్రపంచ దేశాల్లో వింతలు, విశేషాల గురించి వివరించే యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వరుస వివాదాలు, క్షమాపణలు, సబ్స్కైబర్ల సంఖ్య భారీ పడిపోయింది.
ఈ క్రమంలో గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్పై తెలంగాణ మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా, అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు రూపొందించడమే కాకుండా, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఆ ఛానల్లో ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులపై.. సమాజంలో నైతిక విలువలు, సామాజిక సమతుల్యతకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
సంబంధిత వీడియోల లింకులు, ఖాతా వివరాలను సేకరించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ అంశాలు ప్రజా నైతికతకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు అవసరమని స్పష్టం చేసింది. విచారణలో సంబంధిత ఇన్ఫ్లుయెన్సర్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW)కు పంపినట్లు తెలంగాణ మహిళా కమిషన్ వెల్లడించింది.
మహిళల గౌరవాన్ని కాపాడటంలో, బాలల హక్కులను రక్షించడంలో ఇలాంటి చర్యలు అత్యవసరమని కమిషన్ పేర్కొంది. ఎన్సీడబ్ల్యూ ఈ కేసుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ విజ్ఞప్తి చేసింది.
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు.
తీర్మానాల ఫలం.. జిమ్కు బలం..
సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది.
ఇంట్లోనే వర్కవుట్స్..
‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు.మధ్య వయసువారే అధికం..
ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు.చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు
స్లో.. స్టడీ.. విన్..
అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్లో, ఫిట్నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఓ జింక.. కారును ఢీకొట్టింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన జింక కారును ఢీకొనడంతో గాయపడింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న యూనిమల్ ప్రొటెక్షన్ టీమ.. జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
తెలిసిన సమాచారం మేరకు.. గచ్చిబౌలి లో కారును ఢికోన్న జీంక.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.
సాక్షి, హైదరాబాద్/వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో శనివారం ఈగల్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది. అనంతరం, సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. డీఅడిక్షన్ సెంటర్కు పంపించారు.
ఈ క్రమంలో సుధీర్తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.


సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా లొంగిపోయారు. దేవాతో పాటు తెలంగాణ కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు. మరో 48 మంది మావోయిస్టులు వీరి బృందంలో ఉన్నారు. తాజాగా మావోయిస్టుల లొంగుబాటు కారణంగా 41 మంది కేంద్ర కమిటీ సభ్యులతో ప్రారంభమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు నలుగురికి చేరింది.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క రాష్ట్ర కమిటీ సభ్యుడు మాత్రమే మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సమకూర్చడంతో బర్సె దేవా కీలకంగా పనిచేశారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువయ్యాయి. వీరంతా అంతర్గత కలహాలకు తోడు ఆరోగ్య సమస్యలతో లొంగిపోయారు అని చెప్పుకొచ్చారు. ఈ లొంగుబాటుతో పీజీఎల్ఏ బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తాం. తక్షణ సాయంగా రూ.25వేల చెక్కలను అందిస్తాం. ఉన్న 66 మందిలో లొంగిపోయిన వారు కాకుండా మిగిలిన వారంతా మరణించారు’ అని తెలిపారు.
కాగా, బర్సె దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. బర్సె దేవా లోంగిపోవడంతో ఇక కేంద్ర కమిటీలో కేవలం నాలుగు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇక, హిడ్మా, బర్సె దేవా ఛత్తీస్గఢ్లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. నిన్న తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి బర్సె దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు.. అసెంబ్లీని ముట్టడించారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతూ..‘అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంట నష్టం జరిగింది. రంగు మారిందని సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు నాయకులు, రైతులు అందరం.. మంత్రిని కలవడానికి వచ్చాం. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తాం అని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు రైతులను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.

కాగా, రైతుల వద్ద నిలువ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల వద్ద నుంచి 2,80,000 క్వింటాళ్లకు పైగా సోయాబీన్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది.. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇప్పటి వరకు 6280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటళ్ల పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో, రైతులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్, సాక్షి : ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, లూపస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు తదితర రుమటాలజీ సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రకాల చికిత్సా పద్ధతులు వస్తున్నాయని, వీటి గురించి రుమటాలజిస్టులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రోగులకు సాంత్వన కలిగించేందుకు ప్రయత్నించడం ముదావహమని కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 (సీఆర్సీ 2026) సదస్సును ఆయన ప్రారంభించారు.
దేశం నలుమూలల నుంచి 400 మందికి పైగా రుమటాలజిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ సదస్సులోఅనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అత్యంత సంక్లిష్టమైన కేసులకు ఎలా చికిత్స చేశారన్న విషయాన్ని కేసుల వారీగా చర్చించిన తరువాత, తద్వారా సదస్సులో పాల్గొన్న అందరికీ ఈ తరహా కేసులకు ఎలా చికిత్స చేయాలన్న విషయాలను వివరించారు.
సదస్సు ప్రారంభోత్సవంలో కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, డా. బి. శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డా. వినోద్ రవీంద్రన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్, సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్రమౌళి, హైదరాబాద్ రుమటాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, సీఆర్సీ 2026 సైంటిఫిక్ ఛైర్ డాక్టర్ వినోద్ రవీంద్రన్, నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, వాస్కులైటిస్, బాల్య ఆర్థరైటిస్, అరుదైన రుమాటిక్ కండిషన్ల వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో ట్రైనీల కోసం రుమటాలజీ క్విజ్ కూడా నిర్వహించారు.
సీఆర్సీ 2026 ప్రత్యేకతలలో ఒకటి కొత్తగా చేర్చిన ఇమేజ్ పోటీ. సదస్సులో పాల్గొన్న పలువురు ఈ అంశంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. సదస్సుకు తమ సృజనాత్మక కోణాన్ని జోడించారు. అదనంగా, భారతదేశం నలుమూలల నుండి 269 కేసు సారాంశాలను సమర్పించారు. ప్రతి కేటగిరీలో ఎంపిక చేసిన ముఖ్యమైన కేసులను కాన్ఫరెన్స్ సెషన్లలో చర్చించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “సీఆర్సీ 2026 విజయవంతం కావడం, దేశవ్యాప్తంగా ఉన్న రుమటాలజిస్టులు ఉత్సాహభరితంగా భాగస్వామ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ సదస్సులో హాజరైన అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులు అందరూ తమ తమ విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడం, అత్యంత సమస్యాత్మకమైన కేసుల గురించి చర్చించడానికి ఈ సదస్సు ఒక విలువైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో ప్రధానంగా రుమాటిక్, కండరాలు, లూపస్ వ్యాధులపై అవగాహన పొందగలిగాము” అన్నారు.
భారతదేశంలో రుమటాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ 2026 ఒక ప్రముఖ వేదికగా తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించింది. రుమటాలజీలో విజ్ఞాన భాగస్వామ్యం, వృత్తిపరమైన అభివృద్ధి సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న సీఆర్సీ తదుపరి ఎడిషన్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపండి అంటూ వంట మనుషులతో మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో, సదరు హాస్టల్ వార్డెన్పై పేరెంట్స్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్లో తమ సమస్యలపై విద్యార్థులు ధర్నా చేశారు. దీంతో, హాస్టల్ వార్డెన్ కిషన్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. బూతులతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడుతూ.. విద్యార్థులు తినే అన్నంలో విషయం కలిపి చంపండి అని వంట మనుషులకు చెప్పాడు. అంతటితో ఆగకుండగా హాస్టల్ భవనంపై నుంచి విద్యార్థులను తోసేసి చంపేస్తా అంటూ హెచ్చరించారు. దీంతో, వార్డెన్ కిషన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ విషయాన్ని హాస్టల్ విద్యార్థులు తమ పేరెంట్స్కు చెప్పడం ఈ విషయంలో చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేరెంట్స్.. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో, కలెక్టర్ వార్డెన్ కిషన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఆపించా : రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్సులు
మూడోసారి దొరికాడు... సుధీర్ రెడ్డి పనైపోయింది ఈసారి పడే శిక్ష..
జగన్ దంపతులను అనరాని మాటలు అన్నావ్ ఎగిరావ్.. ఎగిరావ్...బొక్క బోర్లా పడ్డావ్
ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్ నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్
Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం
గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సుధీర్రెడ్డి
స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి
Drugs Case: పదేళ్లు జైలు శిక్ష! అడ్వకేట్ షాకింగ్ కామెంట్స్
TS: సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికా బలగాల అదుపులో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో
బర్సె దేవాతో పాటు లొంగిపోయిన మరో 20 మంది మావోయిస్టులు
East Godavari: రైస్ మిల్లర్ల భారీ మోసం... పవన్.. దమ్ముంటే ఇప్పుడు సీజ్ చెయ్
కూతురి సర్జరీ కోసం వెళితే.. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇది
బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
హిందూపురం ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
International news: వెనెజువెలాపై అమెరికా ఎయిర్ స్ట్రైక్?
AP: సెల్ టవర్ ఎక్కిన పాస్టర్ చంద్రబాబుకి దండం పెట్టి అడుకుంటున్న..
Sambasiva Reddy: ఏపీ అభివృద్ధి YS జగన్ తోనే సాధ్యం..!
ఒక్క రూపాయి కూడా రాలేదు... ఎంతో కొంత ఇవ్వండి సార్ ఉల్లి రైతుల ఆవేదన
Malladi Vishnu: శాస్త్రంతో సంబంధం లేదా! శివలింగ పునః ప్రతిష్ట ఇలాగేనా?
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల ప్రయత్నం
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం చేసింది: పొంగులేటి
Andhra Pradesh
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పరిపాలన కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. జిల్లా కేంద్రం రాయచోటుగానే కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రాన్ని మార్చడం చట్ట విరుద్ధమని పిల్లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. జిల్లా కేంద్ర మార్పుకు సంబంధించిన జీవో, గెజిట్ నోటిఫికేషన్లను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. కార్యాలయాలు, రికార్డులను మదనపల్లికి మార్చకుండా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో అభ్యర్థించారు.
ప్రతివాదులుగా రెవెన్యూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ను చేర్చిన పిటిషనర్. చట్ట నిబంధనల ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కోటా వినుత భర్త కోట చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కోటా చంద్రబాబు తాజాగా వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చెన్నై పోలీసులకంటే ముందే సుధీర్ రెడ్డి.. మా రిమాండ్ రిపోర్టును ఎలా బయటపెట్టారు?. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు?. మమ్మల్ని అనవసరంగా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇరికించారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సీఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పీఎస్లో మంతనాలు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్తో మాట్లాడించారు. మాపై ఎఫ్ఐఆర్ నమోదు కాక ముందే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు. మా ఇష్యూపై మీడియాతో మాట్లాడారు.
మీరు అర్దం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చక ముందే చెన్నై పోలీసు కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్మీట్ పెడితే.. హత్య, ఆత్మహత్య అని తేల్చక ముందే మాపై నిందారోపణలు చేశారు. శ్రీకాళహస్తిలో హత్య జరిగి ఉంటే చెన్నై వరకు మృతదేహం తీసుకెళ్లడం సాధ్యమా?. ఈ హత్య కేసులో నిర్దోషులుగా బయటపడిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కీలకంగా ఎదుగుతున్న తరుణంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారు.
ఒక మహిళపై కుట్రలా?
తన రాజకీయ ప్రత్యర్ది ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే చేశారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతున్న వినుత కోటను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా ఈ హత్య కేసులో ఇరికించారు. 19 రోజుల్లో కోర్టులో ఈ కేసును నిరూపించలేకపోయారు. మేము ధైర్యంగా ఈ కేసులో నిర్దోషులం అని బయటపడతాం. హత్యకేసులో మాపై ఆరోపణలు నిరూపితం కాలేదు. డ్రైవర్ రాయుడు సెల్పీ వీడియోలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు, కోర్టుకు అన్ని విషయాలు అందించాం. ఒక మహిళపై కుట్రలు చేసి ఇరికించారు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో కొన్ని విషయాలే బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి.సుధీర్ రెడ్డి పాత్రే కీలకం..
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలి. మేము రిమాండ్కు వెళ్లక ముందే మాపై మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడటం గుమ్మడికాయలు దొంగ అన్నట్లుగా ఉంది. అన్ని విషయాలు మేము బయటపెడతాం. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికీ తెలుసు. మమ్మల్ని చంపాలని నువ్వు కుట్రలు చేశావు. శ్రీకాళహస్తి సీఐ గోపీని చెన్నై పంపించి మాపై కుట్ర చేయించావు. మహిళలు రాజకీయాలు ముందుకు రాకుండా ఇబ్బందులు పెట్టినా ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది, సత్యమేవ జయతే’ అంటూ కామెంట్స్ చేశారు.
సాక్షి, అనకాపల్లి: అచ్చుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలడంతో కార్మికులు పరుగలు తీశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపు చేశారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎస్వీఎస్ ఫార్మా ప్రమాద సమయంలో బీ-షిఫ్ట్లో 18 మంది కార్మికులు ఉన్నారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని ఫార్మా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తొలిత మంటలు వ్యాపించి.. రియాక్టర్ పేలినట్టు సమాచారం.
Politics
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి మరణశాసనం లిఖించారని.. ‘సీమ’ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం బట్టబయలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు బలిపెట్టారని శనివారం ‘ఎక్స్’లో ఆ పార్టీ మండిపడింది. ‘నేను కోరినందువల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలో నేను కోరగానే ఆయన ఒప్పుకున్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. కావాలంటే నిజనిర్ధారణ కమిటీ కూడా వెళ్లి చూసుకోవచ్చు’.. అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక విషయాలు వెల్లడించారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది.
సీమ అంటే గిట్టని చంద్రబాబు
రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు తొలి నుంచీ చిత్తశుద్ధి లేదు. ఆ విషయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన బృహత్తర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచి చంద్రబాబు మోకాలడ్డుతూనే ఉన్నాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయడం సరికాదు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. రాయలసీమ ప్రజలు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి.
– సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక, కర్షక సమితిఇది ఏపీ ప్రజల హక్కులపై దాడి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలపై ఏపీ సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలి. చంద్రబాబు ఏపీ ప్రజల హక్కులపైన దాడి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు ఎత్తిపోతల పథకం చాలా అవసరం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రూ.7వేల కోట్లతో తీసుకొచ్చారు. ఇందులో పైపులైన్ పనులు చాలావరకు పూర్తయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తానే నిలిపేయించానని చెప్పడమే కాకుండా కమిటీ వేస్తానంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రేవంత్ రెడ్డి ప్రకటనను ఖండించాలి. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి ఎమ్మెల్యే స్పందించాలి. లేదంటే రాయలసీమ చరిత్రలో ఒక మాయని మచ్చగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది.
– మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరంసీమకు అన్యాయం చేసేందుకే కుట్ర
రాయలసీమకు నీరు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం బయటపెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు చెప్పడం చూస్తుంటే ఆ కుట్ర బహిర్గతమైంది. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బలోపేతానికి కృషి చేశారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు.
– ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుసీమకు చంద్రబాబు అన్యాయం
నిత్యం కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇదే విషయం శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టడంతో చంద్రబాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది. ఇద్దరు సీఎంలు చర్చించుకున్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని చెప్పడంతో పనులు ఆగిపోయిన విషయం రేవంత్ రెడ్డే చెప్పారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు అన్యాయం చేస్తే వారికి భవిష్యత్లో రైతులే గుణపాఠం చెబుతారు.
– గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసీమ ద్రోహి చంద్రబాబు
రాయలసీమ ప్రాజెక్టులకు తాగునీరు అందించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని రుజువు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాము ఏపీ చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించానని సాక్షాత్తు తెలంగాణ సాక్షిగా కుండ బద్దలుకొట్టారు. సీఎం చంద్రబాబు తక్షణం నోరు విప్పాలి. చంద్రబాబుకు రాయలసీమ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి.
– పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడురాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీకి దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణకు తరలించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం రాస్తున్నారన్నది మరోసారి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపాలని తాను అడిగానని, చంద్రబాబు ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆపించానని రేవంత్ రెడ్డి పేర్కొనడం ద్వారా రాయలసీమ రైతులకు చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారన్నది రుజువైంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
– అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురంసీమ అంటే చులకన భావం
రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కోరగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం ఇక్కడి రైతులను దగా చేయడమే. సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికంగా కృష్ణా జలాలు ఆంధ్రాకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డే చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు స్వార్థం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోంది.
– సాకే శైలజానాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేతప్రతిసారి రాయలసీమకు ద్రోహమే
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశాడు. సీమపై బాబు వైఖరి మరోసారి బట్టబయలైంది. తన శిష్యుడైన రేవంత్రెడ్డి ఏకంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని.. కావాలంటే అసెంబ్లీ వేదికగా నిజనిర్ధారణ కమిటీ వేసి చంద్రబాబును అడగండి అన్నారంటే సీమకు గురుశిష్యులు కలిసి ఏ స్థాయిలో ద్రోహం చేస్తున్నారో అర్థమవుతోంది. వెంటనే రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. లేదంటే ఆయన్ను రాయలసీమ ద్రోహిగా భావించాల్సి వస్తుంది. రాయలసీమలో పుట్టి, ఈ ప్రాంతంలోని రాయలసీమ లిఫ్ట్ను ఒకరు చెబితే నువ్వు నిలిపేశావంటే ఇంతకంటే ద్రోహం సీమకు మరొకటి ఉండదు.
– కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడుసీమ ద్రోహి చంద్రబాబు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబుచరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను సీమ ప్రాంతానికి రాకుండా తాను చంద్రబాబుతో కలిసి అడ్డుకున్నానని తెలంగాణ సీఎం చెప్పడం గమనార్హం. ఏనాడూ చంద్రబాబు సీమ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అమరావతి తప్ప సీమ ప్రాంతానికి నిధులు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన నిజాయితీని నిరూపించుకోవాలి. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడైనా నిధులు రాబట్టాలి.
– ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుఇద్దరు సీఎంలూ మోసం చేశారు..
రాయలసీమకు సాగునీటిని అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే ఇదే టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి నిలుపుదల చేయించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమ ప్రజల జీవనాడిగా చెప్పుకునే కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నారు.
– ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, హిందూపురం పార్లమెంటరీ వైఎస్సార్సీపీ పరిశీలకుడుతన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమకు మరణ శాసనం రాశారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట జల వనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తన స్వార్థం కోసం తెలంగాణ సీఎంతో లాలూచీపడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ను చంద్రబాబు ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్రెడ్డే తెలంగాణ అసెంబ్లీలో వెల్లడించారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కమీషన్ల కోసమే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఇలా దెబ్బతీసూ్తనే ఉన్నాడు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రిశిష్యుడికి గురువు దక్షిణ ఇచ్చినట్లుగా ఉంది..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు తెలంగాణ సీఎం చేసిన ప్రకటన తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని ఇంతకాలం చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని ఆపేయడానికి చంద్రబాబు అంగీకరించారన్నది నిర్ధారణైంది. గురువుకు శిష్యుడు దక్షిణ ఇవ్వడం చూశాంగానీ.. ఇప్పుడు గురువు శిష్యుడికి దక్షిణ ఇచ్చినట్లు ఉంది.
– రాంభూపాల్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడురాయలసీమకు మరణశాసనం రాసిన చంద్రబాబు
చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ద్రోహి అనేది ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మాటలతో తేటతెల్లమైంది. దీనిబట్టి చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాసినట్లు రుజువైంది. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తే చంద్రబాబు ఆలోచన అందుకు విరుద్ధంగా ఉంది.
– కేవీ రమణ, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడుచంద్రబాబు, రేవంత్ ఇద్దరూ తోడుదొంగలు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు. ఓటుకు కోట్లు కేసులో ఇద్దరూ ఉన్నారు. చంద్రబాబుకు నీటి ప్రాజెక్టులు ఏమాత్రం పట్టవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు చంద్రబాబు పూర్తి వ్యతిరేకం. కాబట్టే ఆపేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం చెబుతున్నాడు. రాయలసీమకు ఇంతకంటే ద్రోహం చేసేవారు మరొకరు ఉండరు.
– ఇమాం, కదలిక ఎడిటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టర్లపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్టర్లు మారడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ..‘ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అయినా సేమ్ కాంట్రాక్టర్లు కొనసాగుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయినప్పుడు కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుంది. కాంట్రాక్టర్లకు సైతం నిబంధనలు వర్తించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వాలు మారిన కాంట్రాక్టర్లు మాత్రం వాళ్లే ఉంటున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలల్లో పెయింటింగ్, బెంచీల కాంట్రాక్టర్లు ఇప్పుడు సైతం కొనసాగుతున్నారు. కాంట్రాక్టర్లపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లపై సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే సమయంలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. సభకు రాని కేసీఆర్ అజెండా డిసైడ్ చేస్తున్నారు. ఆయనే సభకు వస్తున్నాను.. ఇరిగేషన్ మీద చర్చ చేస్తా అంటారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించారు అని వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు రాలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సభకు వచ్చి కేసీఆర్ తన దగ్గర ఉన్న సమాచారం ఇస్తారనుకున్నామని.. సూచనలు ఇస్తే తీసుకుందామనుకున్నమన్నారు. కృష్ణా నీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై ఒక రోజు చర్చ పెడదామనుకున్నామంటూ చెప్పుకొచ్చారు.
‘‘రెండేళ్లుగా ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు. సభకు వచ్చి మీ అనుభవాలు మాతో పంచుకోవాలని నేను పదేపదే కేసీఆర్ను కోరుతున్నా.. గతంలో జానారెడ్డి, భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించమని కోరా. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారు. బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దాం. కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని మేము అడగలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అడిగారు. అందుకే అసెంబ్లీ పెట్టి చర్చింస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదు. హరీష్ రావుకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇచ్చారు. అయినా మేము సభకు రామని వెళ్లిపోయారు. మీరు సభ పెట్టండి మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు ,తొలు తీస్తామని ఒకరు మాట్లాడారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఊడదీయాలో ప్రజలు తేల్చుకునేవారు.’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
‘‘బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1)అవార్డు ప్రకారం కృష్ణాజలాల్లో 75 శాతం నీటిలభ్యత అంచనాల ప్రకారం మొత్తం 2130 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 811 టీఎంసీలు.. కేటాయించారు. పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేసుకోవాల్సి ఉండేది. నికర జలాలు, మిగులు జలాల వేర్వేరుగా నీటి కేటాయింపులు జరిపారు. కృష్ణా నదిపై ఉన్న వివిధ రాష్ట్రాల ఫిర్యాదుల కారణంగా 2004 ఫిబ్రవరి 2వ తేదీన అప్పటి కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది.
..బచావత్ ట్రిబ్యునల్ పంపిణీచేసిన 2130 టీఎంసీల నీటి కేటాయింపులను కొనసాగిస్తూనే, అదనపు నీటి లభ్యత అంచనాలతో 2578 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా పరివాహకంలో ఉన్న రాష్ట్రాలకు పంపిణీచేసింది. దీని ప్రకారం మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీల నీటి వాటాలు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇదే బ్రిజేష్ కుమార్ట్రిబ్యునల్కు (KWDT2) అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని పునర్విభజన చట్టంలో ఉంది.
..ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసింది. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది. 2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసింది. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… కేసీఆర్, హరీష్ రావు బాధ్యతలు చేపట్టాక తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు. 2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారు.
..21.09.2016 న జరిగిన అపెక్స్ మీటింగ్ లోనూ మనకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ తాత్కాలిక నీటి వాటాలకు ఒప్పుకొని వచ్చారు. 06.10.2020లో జరిగిన రెండో అపెక్స్ మీటింగ్లోనూ ఈ కేటాయింపులే కొనసాగించండి.. అని శాశ్వతంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కేసీఆర్, హరీష్ ను ఆహ్వానించాం. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారు.’’ రేవంత్ పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.
కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.
సభలో కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
సాక్షి, తాడేపల్లి: 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు.. పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు. దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం మొద్దునిద్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు.సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగం
ఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.
ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు గొలికొదిలిన ప్రభుత్వం..
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్థమవుతోంది.హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.
జీవో 46తో సంక్షేమ హాస్టళ్లను ఆదుకున్న వైఎస్ జగన్
జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండగా జీవో నంబర్ 46 తెచ్చింది. వీటిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఈ చక్కటి జీవోను తెచ్చింది. ఇందులో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్ధుల భద్రత, ఆహారం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఇందులో మరో గొప్ప అంశం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి క్షేత్రస్దాయిలో ఇబ్బందుల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని జీవోలో చెప్పాం.అందుకే ఇలాంటి ఘటనలు అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ జీవో నంబర్ 46ను పూర్తిగా పక్కనబెట్టేశారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణమైన పాలన చేస్తున్నారో అర్దమవుతోంది. విద్యార్ధుల డైట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో తక్కువగా ఉంటే మా హయాంలో పౌష్టికాహారం ఇవ్వాలని వాటిని సమూలంగా మార్చి చక్కడి డైట్ ప్లాన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలకు నీళ్ల పప్పు, ఉడకని అన్నం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే కారణంతో ఈ జీవోను పక్కనబెట్టేశారు.

ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఈ భోజనాలు తినలేక ఆకలితో నీరసించిపోతున్నారు. చలి వణికిస్తున్నా కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ప్రశ్నిస్తే వార్డెన్ కొడతారో, ఇంటికి పంపేస్తారనే భయంతో పిల్లలు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ వసతి గృహానికి నిర్వహణ, రిపేర్ల కోసం 20-30 వేలు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచే వాళ్లం.ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. వార్డెన్లు వస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్లం. పిల్లల భవిష్యత్తు, హాస్టళ్లలో పారిశుద్ధం, పౌష్టికాహారం అందించే విషయంలో నిరంతరం సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి. అలాగే ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని వైయస్.జగన్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు, పర్యవేక్షణ లేదు.
వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడుతో మారిన స్కూళ్లు
వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ స్కూల్స్కు సైతం రికమండేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి వాటిని తెచ్చారు. కార్పోరేట్ స్కూల్స్ లా మార్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటస్థలాల్ని అభివృద్ధి చేసి ఇచ్చారు. గోరు ముద్ద పేరుతో మంచి మెనూతో పౌష్టికాహారం అందించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం ఓ నిధి ఏర్పాటు చేసి పూర్తి పారిశుద్ధ్యంగా ఉండేలా చూశారు. ప్రతీ పేద విద్యార్దికీ కార్పోరేట్ స్కూల్ అన్న ఫీలింగ్ తెచ్చారని విడదల రజిని స్పష్టం చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికల మీద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్ధితి ఉండేదని.. కానీ ఇప్పుడు కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగిన త్యాగశీలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్రం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో వలసల నివారణ కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించింది. 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.
ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఒక తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల విలువైన పని దినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం. పెట్రోల్, డీజిల్ రేటు మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుంది’ అని కామెంట్స్ చేశారు.
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. బొమ్మనహాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘటన జరిగింది. ఈనెల 5వ తేదీన బొమ్మనహాల్ ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుండగా.. బలం లేకపోయినా ఎంపీపీ పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ కుట్రలకు తెరతీసింది.
బీఫాం, అనెక్జర్ పత్రాలు అందజేసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పై టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధుల సెల్ ఫోన్లను టీడీపీ నేతలు లాక్కున్నారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వహించారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్లో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని మెట్టు గోవిందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఏపీ నేతలకు విదేశాల నుండి డ్రగ్స్ ఎలా దొరుకుతోంది? అని ప్రశ్నించారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్రగ్స్ మాఫియా చేతుల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్లిపోయింది. నెల్లూరులో డ్రగ్స్ మాఫియా పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేసింది. హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్తో దొరికారు. విదేశాల నుండి డ్రగ్స్ ఏపీ నేతలకు ఎలా దొరుకుతోంది?. డ్రగ్స్ మీద అవగాహన కల్పించామని హోంమంత్రి అనిత చెప్తున్నారు. మరి మీ కూటమి నేతలు డ్రగ్స్ తీసుకుంటూ ఎలా దొరికారు?
ఒకప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవారు. ఇప్పుడు ఏపీ అంటే అడ్డా ఫర్ పెడ్లర్స్ అనే పేరు తెచ్చిపెట్టారు. కూటమి నేతలు ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారో? డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారో తేల్చాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వమో, ఇంటర్ పోలో విచారణ జరపాలి. గంజాయి, డ్రగ్స్ మాఫియా నుండి ఏపీని కాపాడాలి. సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
సాక్షి, నెల్లూరు జిల్లా: కూటమి సర్కార్ 19 నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడులు ఆకర్షించడంలో దిట్టలు అన్నట్టుగా బాకాలు ఊదుతున్నారు. రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారాలు, ట్వీట్లు ఏ ప్రాంతం నుండి చేస్తున్నారో చెప్పలేరా? మీరు ఉంది.. ఏమైనా రహస్య ప్రదేశమా?. తెలియపరచకూడదా?. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి పేర్కొన్నారు.
‘‘వారం రోజులు నుండి లోకేష్ పత్తాలేడు, చంద్రబాబు నాలుగు, ఐదు రోజులుగా జాడ లేదు. మీకు వున్న అనుకూల ఎల్లో మీడియాకు కూడా పాపం సమాచారం లేదు. ప్రజల్లో మీ జాడ ప్రస్తావన వస్తుందంటూ ఈ ట్వీట్ల డ్రామా చేస్తున్నారు. గతంలో కుమార్తెను చూడటానికి వైఎస్ జగన్ లండన్కు వెళ్తే బాబు హంగామా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.
‘‘నేడు రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు మాత్రం మొదటి స్థానం అని ఓ పత్రిక రాసింది. ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి అంటే ఐదు శాతం కూడా లేదు. 2014-19 మధ్యన 1761 కంపెనీలతో ఎంవోయూలు, 18.87 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. అందులో కార్యరూపం దాల్చింది 10 శాతం మాత్రమే, అంటే 90 శాతం అబద్ధాలే.
..అమరావతి నుండి విశాఖకు హైపర్ లూప్ అన్నాడు.. ఎక్కడ..?. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అన్నాడు.. ఎక్కడ ?. ఏవియేషన్, విమానాల తయారీ అన్నాడు.. ఎక్కడ బాబు..?. ఏయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్ రకరకాల పేర్లు చెప్పాడు. 2023 మా హయాంలో 394 ఒప్పందాలు చేసుకున్నాము. 13.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అంచనా వేశాం. తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. మొదటి సంవత్సరంలోనే 20 శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయి. జగన్ నిర్ణయాలు, సంస్కరణలతో 91.6 శాతం కార్యరూపం దాల్చాయి. కరోనా విపత్కర పరిస్థితిల అనంతరం 17.700 లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం చేశాం. వాస్తవాలు దాచి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి.. పాలమూరులో బీఆర్ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదని మండిపడ్డారు. వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ఉత్తమ్.. పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు.. పాలమూరు కు కేవలం 27వేల కోట్లు మాత్రమే. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి. పాలమూరకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు. పాలమూరు ప్రాజెక్టును కావాలనే బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
‘‘కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోం. తెలంగాణ హక్కులను కాపాడటంతో రాజీపడం. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంతకాలు చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్రావు సంతకాలు చేశారు. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పారు. కూర్చువేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్ల బడ్జెట్ల ఇరిగేషన్కు కేటాయిస్తే అందులో 16 వేల కోట్లు ఇంట్రెస్ట్కే వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను 2నుంచి 3టీఎంసీ లకు పెంచారు... పాలమూరు ప్రాజెక్టును 1.5 నుంచి 1టీఎంసీకి పంపారు’’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
National
క్రీడల విషయంలో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కోల్కతా నైట్రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ని తొలగించడంపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఈ విధంగా స్పందించడం సరికాదన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ని జట్టు నుంచి విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఆయనను జట్టు నుంచి విడుదల చేసింది. అయితే ఇది సరైన చర్య కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ మాట్లాడుతూ " క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం బుద్ధిహీనమైన చర్య ఒకవేళ ఆస్థానంలో బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్ లిట్టన్ దాస్, సౌమ్యాసర్కార్ ఉంటే ఈ విధంగానే చేసేవారా మీరు ఎవరిని శిక్షిస్తున్నారు, దేశాన్నా? మతాన్నా? వ్యక్తులనా? అని శశిథరూర్ అన్నారు. మైనార్టీలపై దాడులను మోయడానికి క్రికెట్ను వాడకూడదు. బంగ్లాదేశ్ క్రికెటర్ రహ్మన్ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిపైనా దాడి చేయలేదు. ఈ ఘటనలతో ఎటువంటి సంబంధం లేదు" అని అన్నారు. ఆయన కేవలం ఒక ఆటగాడని అతనిని ఈ ఘర్షణలతో ముడిపెట్టడం సరికాదన్నారు.
అంతేకాకుండా పొరుగుదేశాలతో ఏ దేశం క్రీడలు ఆడకుండా ఏకాకి చేయడం సరికాదని ఈ విషయంలో భారత్కు పెద్ద హృదయం ఉండాలని సూచించారు. అయితే బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను భారత్ తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధపడుతోంది. సోషల్ మీడియా వేదికగా తనప్రియుడు ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ వార్తను అధికారికంగా ప్రకటింది. దీంతో ఈఫోటోలు నెట్టింట సందడిగామారాయి. 2023 నుండి డేటింగ్లో ఉన్న ఈ జంట జనవరి 3న తన రిలేషన్ షిప్ను అధికారికంగా ప్రకటించాయి. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో అత్యంత ఘనంగా జనవరి 11 పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సందర్బంగా నూపుర్ తన నిశ్చితార్థపు విశేషాలు ఆసక్తికరంగా మారాయి. నూపుర్ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. స్టెబిన్ తన ప్రియురాలు నూపుర్ కోసం ఉత్తమమైన ఉంగరం కోసం పెద్ద రీసెర్చే చేసి ఉంటాడని భావిస్తున్నారు.
నూపుర్ సనన్ భారీ నిశ్చితార్థపు ఉంగరం ధర ఎంత?
ఎప్పటిలాగా రౌండ్గా గాకుండా ఉన్న క్లాసీ మార్క్విస్ ఉంగరం హాట్టాపిక్గా నిలిచింది. ఎంగేజ్మెంట్ కోసం కాబోయే వధువుకు సాధారణంగా గుండ్రని, ప్రిన్సెస్-కట్ డైమండ్ ఉంగరాలతో నిండిన ఈ ప్రపంచంలో, స్టెబిన్ బెన్ ఒక మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాన్ని ఎంచుకోవడం విశేషం. కొన్ని నివేదికల ప్రకారం మధ్యలో ఉన్న వజ్రం 0.8 అని కొందరు వాదిస్తున్నప్పటికీ, 4 క్యారెట్లు అని పలు నివేదిలు పేర్కొంటున్నాయి. అన్నట్టు మార్క్విస్-కట్ నిశ్చితార్థపు ఉంగరాలకు రాయల్ లుక్కి ప్రతీకగా నిలుస్తాయి. యూరోపియన్ రాజరిక కాలంలో ఇవి ప్రాచుర్యం పొందాయి. దీంతో స్టెబిన్ సౌందర్య ప్రియత్వంపై ప్రశంసలు లభిస్తున్నాయి.ఇదీ చదవండి: జంక్ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!

మధ్యలో ఉన్న వజ్రానికి ఇరువైపులా రెండు క్లాసీ వజ్రాలు కూడా ఉన్నాయిజ ఈ ఉంగరం ఖచ్చితంగా ప్రకృతి మూలకాల నుండి ప్రేరణ పొంది తయారు చేశారని అంచనా. మిస్మాలిని ప్రకారం, మధ్యలో ఉన్న వజ్రం 4 క్యారెట్ల బరువు ఉంటే, ఆ ఉంగరం ధర సుమారు రూ. 8,32,000 ఉండవచ్చని భావిస్తున్నారు.
నుపుర్- బెన్
నుపుర్ సనన్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' (2023) సినిమాతో నుపుర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. బి ప్రాక్ పాడిన 'ఫిలాల్' వంటి సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో కనిపించడంతోపాటు ఒక ఆంట్రప్రెన్యూర్గా రాణిస్తోంది. రొమాంటిక్ సాంగ్స్కు ఇతను పెట్టింది పేరైన స్టెబిన్ బెన్ బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరిగా ఖ్యాతి గడించాడు.ఇదీ చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు
సాక్షి చెన్నై:తమిళనాట పొలిటికల్ హీట్ వేడెక్కింది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలన్నీ గెలుపుకోసం ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ స్టార్ విజయ్ స్థాపించిన విజయ్ తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పొత్తులపై ఆపార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.
టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ "సెక్యులరిజం భావజాలంలో కాంగ్రెస్, టీవీకే సహజంగానే మిత్రులు, మతతత్వానికి రెండు పార్టీలు వ్యతిరేకులు, ఆ విషయాలలో రెండు పార్టీలు సహజంగానే భాగస్వామ్యులు అంతేకాకుండా రాహుల్ గాంధీ, విజయ్ ఇద్దరు మంచి మిత్రులు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్, టీవీకే రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయి". అని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల అక్కడి కాంగ్రెస్ నేతలు పొత్తుకు అంగీకరించకపోవచ్చు అని తెలిపారు.
ఒకవేళ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేఖ ఓట్లను చీల్చకుండా ఒకే పార్టీ పొందవచ్చు అన్నారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుల గురించి మాట్లాడడం ఇప్పుడు సరైన పద్ధతి కాదని అన్నారు. అయితే కాంగ్రెస్-టీవీకే మధ్య ఇది వరకే మంచి సయోధ్య కుదిరిందని గతేడాది డిసెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హజరయ్యారని ఆయన తెలిపారు.
అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్యా ఈ పొత్తు దాదాపు అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రధాన భాగస్వామి అంతేకాకుండా రాహుల్ గాంధీకి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.
తమిళనాడులో యాక్టర్ విజయ్కు చాలా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ ఫాలోయింగ్ని క్యాచ్ చేయడానికి 2024లో తమిళిగ వెట్రి కజగం (టీవీకే) అనే పార్టీని స్థాపించారు. స్టార్డమ్కు అనుగుణంగానే లక్షల మందితో సభలు నిర్వహించి అందరిదృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందారు. ఈ తొక్కిసలాట ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు విస్తరణ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనే విధంగా రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు గడ్కరీ స్వయంగా వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో, నెటిజన్లు స్పందిస్తూ.. నితిన్ గడ్కరీ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్ తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్లో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫరా ఖాన్ వంటమనిషి దిలీప్.. నితిన్ గడ్కరీకి ఒక విజ్ఞప్తి చేశారు. తన ఊరిలో రోడ్డు వేయమని గడ్కరీని కోరగా.. ఫరా తమాషాగా దిలీప్ ఇంటి మీద నుంచే రోడ్డు వేయండి సార్ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. దీనిపై గడ్కరీ భార్య కాంచన్ స్పందిస్తూ.. అప్పుడు దిలీప్కు ఇల్లు ఉండదు.. మా నాన్నగారికి జరిగినట్లే జరుగుతుంది అని గుర్తుచేశారు.
ఇంతలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనుల కోసం తన మామగారి ఇంటిని కూల్చివేసినట్లు తెలిపారు. అనంతరం, ఫరా స్పందించి.. మరి ఆయనకు కొత్త ఇల్లు కట్టించారా? అని ప్రశ్నించగా.. ‘లేదు, కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రమే ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఇదే సమయంలో గడ్కరీ మరో ఉదంతం గురించి మాట్లాడారు. తాను ఇటీవల కోల్కతా వెళ్లినప్పుడు ఒక రెస్టారెంట్లో చైనీస్ ఫుడ్ ఆయనకు బాగా నచ్చింది. ఆ వంటకాన్ని తన వ్యక్తిగత చెఫ్కు నేర్పించమని ఆయన కోరగా.. అది తమ పాలసీకి విరుద్ధమని రెస్టారెంట్ యాజమాన్యం తిరస్కరించింది. అప్పుడు గడ్కరీ..‘ఈ రెస్టారెంట్ ఎవరి భూమిలో ఉందో తెలుసా?. ఇది కోల్కతా పోర్ట్ ట్రస్ట్ భూమి.. నేను షిప్పింగ్ మంత్రిని. మీరు నేర్పించకపోతే మీ లీజు రద్దు చేస్తాను’ అని సరదాగా హెచ్చరించడంతో వారు దిగొచ్చారని చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో మరో అరుదైన చిరుతపులి దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో, హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ (HNF) వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్ గుబ్బి, బృందం తొలిసారిగా అత్యంత అరుదైన చిరుతపులిని గుర్తించారు. చేశారు. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంజయ్ గుబ్బి అన్వేషణకు సంబంధించి ఇది కర్ణాటకలో తొలి రికార్డు. ట్రాప్ కెమెరాకు చిత్రాల ఆధారంగా పరిశోధకులు చిరుతపులిని నిర్ధారించారు.
అంతర్జాతీయంగా దీన్ని స్ట్రాబెర్రీ చిరుత ( strawberry leopard) అని పిలుస్తారు. సాధారణ చిరుతపులిలా ముదురు నల్ల రంగు మచ్చలు కాకుండా అసాధారణమైన లేత గోధుమ రంగు మచ్చలు లేత ఎరుపు గులాబీ రంగు కోట్, గంధపు చెక్కరంగును పోలిన చర్మంతో ఉంది. ఇది చాలా అరుదైన అద్భుతమైన చిరుత అని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయని చెబుతున్నారు.

అంతర్జాతీయంగా దీనిని 'స్ట్రాబెర్రీ చిరుత’గా చెబుతున్నప్పటికీ సంజయ్ గుబ్బి దీనికి 'గంధపు చిరుత' (sandalwood leopard) అని పేరు ప్రతిపాదించారు. కర్ణాటక గంధపు చక్కలకు ప్రసిద్ధి కాబట్టి, ఈ పేరు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుందని ఆయన అభిప్రాయం.
అరుదైన రంగు-శాస్త్రీయ కారణాలు
జన్యు మార్పు కారణంగా వాటికి రంగు వస్తుందని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఇది ఎరిథ్రిజం (Erythrism) లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన స్థితి వల్ల సంభవిస్తుంది. దీనివల్ల శరీరంలో ఎరుపు వర్ణద్రవ్యం (Red pigment) పెరిగి, నలుపు వర్ణద్రవ్యం తగ్గుతుంది.ఇటువంటి లక్షణాలు అడవి క్షీరదాలలో సహజంగా సంభవిస్తాయి. దీని ఖచ్చితమైన స్థితిని తెలుసుకోవడానికి DNA పరీక్షలు, విశ్లేషణ అవసరమని గుబ్బి భావిస్తున్నారు.శాస్త్రవేత్తలు ఫోటోగ్రాఫిక్ మరియు దృశ్య ఆధారాలపై ఆధారపడతారు కనుక ఈ చిరుతపులిని అరుదైన మార్ఫ్గా వర్ణించారు.వయస్సు , లింగం : కెమెరా ట్రాప్ చిత్రాల ద్వారా ఇది 6 ఏళ్ల వయస్సున్న ఆడ చిరుత అని నిర్ధారించారు.
భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి చిరుతపులి ఒకటి మాత్రమే నమోదైంది. 2021 నవంబరులో రాజస్థాన్లోని రణక్పూర్ ప్రాంతంలో ఇలాంటి చిరుత కనిపించింది. ఇప్పుడు కర్ణాటకలో కనిపించడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికా , టాంజానియా వంటి దేశాల్లో మాత్రమే అక్కడక్కడా ఇవి కనిపించాయి.
ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటకలో ఉంది. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ ఈ డాక్యుమెంటేషన్కు నాయకత్వం వహించింది. ఈ బృందంలో సంజయ్ గుబ్బి, సందేశ్ అప్పు నాయక్, శ్రావణ్ సుతార్, పూర్ణేష హెచ్.సి. రుమా కుందార్కర్, రవిచంద్ర వెలిప్ పాల్గొన్నారు.
చదవండి: ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి
చిరుతపులుల సంఖ్యను లెక్కించడం, గుర్తించడం వీరి లక్ష్యం. ఇది కీలకమైన పరిరక్షణ ప్రకృతి దృశ్యాలను కూడా గుర్తిస్తుంది. ఈ ప్రాంతం భారతీయ బూడిద రంగు తోడేలు వంటి జాతులకు కేంద్రం. చారల హైనా, బెంగాల్ ఫాక్స్ కూడా నివసిస్తాయి. కర్ణాటకలో దాదాపు 2,500 చిరుతపులులు ఉన్నాయని ఫౌండేషన్ అంచనా వేసింది. ఇలాంటి ఆవిష్కరణలు నాలెడ్జ్ గ్యాప్ను హైలైట్ చేస్తాయని, అడవులపై పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్
లక్నో: మైనర్లపై లైంగిక దాడుల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మానవ మృగాలు మారడం లేదు. అభం శుభం తెలియని పసిపిల్లలను తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. ఇటువంటి మృగాలను ఏలా శిక్షించాలి వారిని ఏవిధంగా మార్చాలి అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలకు సైతం పెద్ద సవాలుగానే మారింది. ఇక, తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని ఆరేళ్ల పసికందుని మానవమృగాలు వేటాడాయి. చిన్నారిపై ఇద్దరు కిరాతకులు అత్యాచారం చేశారు. ఆపై ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి కిందకి విసిరారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారి ఆస్పత్రికి వెళ్లే లోపే కన్నుమూసింది.
ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బులందషహర్లో ఒక ఇంటి మేడపై రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు యువకులు అద్దెకుంటారు. అయితే అదే మేడపై ఓ ఆరేళ్ల చిన్నారి ఆడుకోవడానికి వెళ్లింది. అప్పుడే అక్కడే ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు పసికందుకై కిరాతకంగా అత్యాచారం చేశారు. అనంతరం అనుమానం రాకుండా ఉండడానికి మేడపై నుంచి తోసేసారు. దీంతో ఆ చిన్నారి భవనం వెనక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఎంతసేపైనా తమ పాప రాకపోవడంతో తన కోసం వెతికిన తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను చూసి దిగ్బ్రాంతికి గురయ్యారు. తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా పాపను పరీక్షించిన వైద్యులు తను అప్పటికే మృతిచెందిందని తెలిపారు.
దీంతో పైనున్న ఇద్దరు యువకులపై అనుమానం వచ్చి పాప తల్లిదండ్రులు పోలీసులకు సమచారమిచ్చారు. అయితే నిందితులు అప్పటికే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వారి కోసం పోలీసులు ఆపరేషన్ ప్రారంభించి వారున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై ఆ దుండగులు కాల్పులు జరపగా, పోలీసులూ ఎదురుకాల్పులు జరిపి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో వారిద్దరూ నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతున్నామని పేర్కొన్నారు.
కాళ్లు లేని వారికి చక్రాల కుర్చీ ఓ వరం. దీన్ని ఇంగ్లీషులో ’గిజ్ఛి్ఛ∙ఇజ్చిజీట’ అంటారు. కాళ్లు లేనివారు ఇందులో కూర్చుని ముందుకు సాగుతారు. వారికే కాకుండా రోగులు, వృద్ధులు, ఎక్కువ దూరం నడవలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరుల సాయం లేకుండా సొంతంగా ముందుకు సాగేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన ఈ చక్రాల కుర్చీ గురించి మీకు తెలుసా?
క్రీ.పూ. 5వ శతాబ్దంలో సంస్కృత వ్యాకరణవేత్త పాణిని తన అష్టాధ్యాయిలో ’పర్ప’ అనే సంస్కృత పదాన్ని ప్రస్తావించారు. అదే నేటి చక్రాల కుర్చీ అని భావిస్తారు. మంచానికి, కుర్చీలకు చక్రాలు బిగించిన ఆధారాలు చైనాలో ఒక రాతి పలకపై లభించాయి. ఇవి క్రీ.పూ. 6వ, 5వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి.
యూరప్లో వీల్చైర్ 1595 వరకు ఉనికిలో లేదు. స్పెయిన్కు చెందిన ఒక వ్యక్తి ఫిలిప్ రాజు ఐఐ కోసం ఒక కుర్చీని తయారు చేశాడు. డిజైన్లో లోపాల కారణంగా దీన్ని నడపడం ఇబ్బందిగా మారింది.
1655లో స్టీఫన్ ఫార్ఫ్లర్ అనే వ్యక్తి 22 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ, తను నడిచేందుకు మూడు చక్రాల చట్రంపై ఓ కుర్చీని తయారుచేశాడు. ఇది వీల్చైర్ కన్నా హ్యాండ్సైకిల్ను పోలి ఉంటుంది. 1760 ప్రాంతంలో ఇన్వాలిడ్ క్యారేజ్ /బాత్ చైర్ సాధారణ వాడుకలోకి వచ్చింది. 1887లో అట్లాంటిక్ నగరానికి వీల్చైర్లు వచ్చాయి. 1933లో హ్యారీ సి. జెన్నింగ్స్ సీనియర్, అతని దివ్యాంగ స్నేహితుడు హెర్బర్ట్ ఎవరెస్ట్ కలిసి మొదటిసారిగా ఉక్కుతో తయారు చేసిన పోర్టబుల్ వీల్చైర్ను కనుగొన్నారు. అనంతరం అనేక మార్పులు చెంది ప్రస్తుతం మనం చూస్తున్న వీల్చైర్ అందుబాటులోకి వచ్చింది. తోసే అవసరం లేకుండా కంట్రోల్ ద్వారా నడిచే వీల్చైర్లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు
తల్లిదండ్రుల మీద కోపంతోనో, చదువుకోవడం నచ్చకో, ఇతరేతర కారణాలతో చిన్నపిల్లలు ఇల్లు వదిలి పారితుంటారు. మరికొందరు ప్రయాణాల సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంటారు. అటువంటివారు ఎక్కడెక్కడో తిరిగి రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. వారిలో కొందరు తిరిగి సొంతవారిని చేరుకుంటే, చాలామంది అక్కడే జీవిస్తుంటారు. సొంతవారిని చేరుకోలేక దూరమయ్యేవారు కొందరైతే, అసాంఘిక శక్తుల చేతిలో పడి బాలకార్మికులుగా, బిచ్చగాళ్లుగా మారేవారు చాలామంది ఉంటారు. మరి వారికి ఎవరు రక్షణ కల్పిస్తారు? అలాంటి వారి కోసం ఓ సంస్థ ఉందని మీకు తెలుసా? అదే ‘రైల్వే చిల్డ్రన్’.
‘రైల్వే చిల్డ్రన్ ఇండియా’ (railway children india) అనేది 2013లో ప్రారంభించిన ఎన్జీవో. ’ఏ బిడ్డ కూడా వీధుల్లో నివసించాల్సిన అవసరం లేని ప్రపంచాన్ని సృష్టించడం’ అనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లవాడు రైల్వే స్టేషన్ కు ఒంటరిగా వస్తున్నాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటివారు దోపిడీదారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్నట్లు గుర్తించిన కొందరు ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది రైల్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది పిల్లలను రక్షించింది. వారంతా ఇంట్లో సురక్షితంగా ఉన్నారు. చదువుకుంటూ తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.ముందుగా వీరు రోడ్ల మీద, స్టేషన్ ప్లాట్ఫాంల మీద ఒంటరిగా ఉన్న చిన్నారుల్ని గుర్తిస్తారు. వారితో మాట్లాడతారు. వారి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తారు. వారు వచ్చేలోగా పిల్లలకు తిండి, బట్టలు అందిస్తారు. వారు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చాక వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పిల్లల్ని అప్పగిస్తారు. ఇలా నిత్యం వందలాది మంది చిన్నారుల్ని రక్షిస్తున్నారు. స్టేషన్ లో తప్పిపోయిన పిల్లలెవరైనా వీరిని సంప్రదిస్తే వారు వివరాలు వెతికి పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. దీంతోపాటు నిరుపేద చిన్నారులకు చదువు చెప్పడం, వారి హక్కుల కోసం పోరాడటం, వారి ఆరోగ్య కోసం పాటుపడటం చేస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల ద్వారా వారు సేవలందిస్తున్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సంస్థను నడుపుతున్నారు. వారి వల్ల ఎంతోమంది చిన్నారులు చెడ్డవారి నుంచి తప్పించుకొని అమ్మానాన్నల్ని చేరుకున్నారు.
ఒక్కోసారి అంతే. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అనుకోని విధంగా ఏదైనా జరిగితే జీవితం తలకిందులవుతుంది. అంతా చీకటి అవుతుంది. రేష్మ జీవితంలోనూ అలాగే జరిగింది. ఊహించని విధంగా భర్త చనిపోవడంతో ఆమె బాగా కుంగిపోయింది. తన భర్త మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విరక్తితో తాను కూడా అర్థాంతరంగా తనువు చాలించింది. ఎవరీ రేష్మ, ఆమె కథేంటి?
అసలేం జరిగింది?
కేరళ (Kerala) వయనాడ్లోని కొలయాడి గ్రామానికి చెందిన 32 ఏళ్ల రేష్మ విషం తాగి బుధవారం (డిసెంబర్ 31) మరణించింది. 5 నెలల క్రితం ఆమె భర్త జినేష్ సుకుమారన్ (38) ఇజ్రాయెల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గత జూలైలో జెరూసలేంకు సమీపంలో ఉన్న మెవాస్సెరెట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. అక్కడే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా కత్తి గాయాలతో చనిపోయి కనిపించింది. మంచాన పడిన ఆ మహిళ భర్తను చూసుకోవడానికి సంరక్షుడిగా జినేష్ ఉద్యోగం చేసేవాడు. కాగా, వృద్ధురాలిని చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను రేష్మ తోసిపుచ్చింది.వీడని మిస్టరీ..
తన భర్త మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు రేష్మ శతవిధాలా ప్రయత్నించింది. జినేష్ మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించాలని పలుమార్లు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి స్వయంగా విన్నవించుకుంది. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉందని ఆమెకు సమాధానం వచ్చేది తప్పా ఎటువంటి పురోగతి లభించలేదు. జినేష్ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించగా, ఆ వృద్ధురాలు కత్తిపోట్ల గాయాలతో మరణించినట్టు మాత్రమే ఆమెకు రాయబార కార్యాలయం తెలిపింది. వయనాడ్కు తిరిగి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంతో పాటు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో నిరాశతో రేష్మ బలవన్మరణానికి పాల్పడింది. తల్లితండ్రులు ఇద్దరూ చనిపోడంతో పదేళ్ల వారి కుమార్తె అనాథగా మిగిలింది.ఇజ్రాయెల్కు వెళ్లిన 2 నెలలకే..
ఊహించని విధంగా భర్త ప్రాణాలు కోల్పోవడంతో రేష్మ బాగా కుంగిపోయిందని కొలయాడి పంచాయతీ మాజీ సభ్యురాలు సుజా జేమ్స్ తెలిపారు. “జినేష్ మరణం తర్వాత రేష్మ తీవ్ర నిరాశకు గురైంది. వృద్ధురాలిని చంపిన తర్వాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అస్సలు నమ్మలేదు. తన భర్త హత్య చేసేంత కర్కోఠకుడు కాదని ఆమె నమ్మకం. అసలేం జరిగిందో కనిపెట్టాలని అధికారులకు చాలా ఆమె ఈ-మెయిళ్లు పంపింది, కానీ ప్రయోజనం లేకపోయింది” అని మీడియాతో చెప్పారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!
ఇజ్రాయెల్కు వెళ్లడానికి ముందు మెడికల్ రిప్రజెంటేటివ్గా జినేష్ పనిచేశాడని, గ్రాడ్యుయేట్ అయిన రేష్మ ఇంట్లోనే ఉండేదని సుజా జేమ్స్ తెలిపారు. కొలయాడిలో కట్టుకున్న ఇల్లు అప్పులు తీర్చడానికే జినేష్ ఇజ్రాయెల్కు వెళ్లినట్టు వెల్లడించారు. వీసా కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాడని కూడా తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి రేష్మకు ఎటువంటి పరిహారం అందలేదు. జినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడి అధికారులు నమోదు చేశారు. జినేష్ ఇజ్రాయెల్కు వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే అవడంతో ఎటువంటి పరిహారం దక్కలేదని వివరించారు.
మకరవిలక్కు: కేరళలోని శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం(శుక్రవారం) వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం చేసుకున్నారు. జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరికి చేరుకునే అవకాశం ఉంది.
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటుచూసినా భక్తజనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి అయ్యప్ప నామస్మరణతో శబరిమల ఆలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తున్నారు.
ఇక, డిసెంబర్ 30న మకరవిలక్కు తెరిచినప్పుడు 57,256 మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. అలాగే, జనవరి ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి జనవరి రెండో తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు 75,267 మంది భక్తులు ఆలయ దర్శనం చేసుకున్నారు. మొత్తంగా మకరవిలక్కు మహోత్సవ సందర్భంగా డిసెంబర్ 30న నుంచి నిన్న సాయంత్రం వరకు 2,92,555 మంది అయ్యప్ప భక్తులు ఆలయానికి విచ్చేశారు.
మకరజ్యోతి దర్శనం..
ఇదిలా ఉండగా.. శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..
మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలు
సన్నిధానం
పాండితావళం
మాలికాపురం ప్రాంతం – అట్టతోడు
నీలిమల
పుల్మేడు
శరణ్ గుత్తి
మరకూట్టం
భక్తులకు సూచనలు..
మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.
బెంగళూరు: బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులో నిద్ర మాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఓ ఫాం హౌస్ లో ఆత్మహత్య యత్నం చేసిన ఎస్పీ పవన్ నిజ్జూర్. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు.
ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్పీ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది.

తమిళనాడు: సెంగం సమీపంలో గుడిసెలో గాఢ నిద్రలో ఉన్న రైతుతోపాటు ఆయన రెండో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పక్రిపాళ్యం గ్రామానికి చెందిన శక్తివేల్(51) వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి, ఇద్దరి మద్య మనస్పర్థల కారణంగా గత మూడు సంవత్సరాల క్రితం విడి పోయారు. దీంతో శక్తివేల్ తీర్థాండపట్టు గ్రామానికి చెందిన అమృదం(44)ను రెండవ వివాహం చేసుకొని జీవిస్తున్నారు.
భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వ్యవసాయ భూమిలో గుడిసెను వేసుకొని వాటిలోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శక్తివేల్, అమృదం ఇద్దరూ గురువారం రాత్రి వ్యవసాయ భూమిలోని గుడిసె ఇంటిలో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిసె ఇంటికి ముందు పక్కన ఉన్న తలుపులు మూసి వేసి గుడిసెపై పెట్రోల్ను పోసి నిప్పు పెట్టారు. పెట్రోల్ పోయడంతో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి.
గాఢ నిద్రలో ఉన్న శక్తివేల్ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచినప్పటికీ తలుపులు మూసి వేయడంతో బయటకు వచ్చేందుకు కుదరలేదు. దీంతో మంటల్లో చిక్కుకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికులు గమనించగా గుడిసె మంటల్లో చిక్కుకొని దంపతులు ఇద్దరూ కాలి బూడిదగా మారి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సెంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. గుడిసె ఇంటికి ఎవరు నిప్పు పెట్టారు, ఎందుకు పెట్టారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Business
గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ ఈ విలువైన లోహాలపై పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడులుగా భావించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో 2026 నాటికి బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.2 లక్షలకు, వెండి కిలో ధర రూ.3 లక్షలకు చేరుతాయా? అనే ప్రశ్న మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇప్పటికే రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1.35 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ట్రేడవుతోంది. అదే విధంగా వెండి ధర కిలోకు సుమారు రూ.2.3 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంది. ఈ ధరలు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు భవిష్యత్ ధరలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 వరకు బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొందరు ఊహిస్తున్నట్లుగా అత్యధిక స్థాయిలైన రూ.2 లక్షలు, రూ.3 లక్షలను తాకడం మాత్రం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాముల ధర రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా వెండి ధర కిలోకు రూ.2.3 లక్షల నుంచి రూ.2.6 లక్షల పరిధిలోనే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
బంగారం, వెండి ధరలు పెరగడానికి పలు అంతర్జాతీయ కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటం, అమెరికన్ డాలర్ బలహీనపడే సూచనలు కనిపించడం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి.
మరోవైపు వెండికి సంబంధించిన డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల అవసరాల కోసం వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కారణాల వల్ల వెండి ధరలు బలంగా నిలబడుతున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం, వెండి భవిష్యత్తులో పెట్టుబడిదారులకు స్థిరమైన లాభాలు అందించే అవకాశాలు ఉన్నప్పటికీ, అతిగా అంచనాలు వేసుకోవడం కంటే మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్లో తన పేరిట ఉన్న ఫ్లాట్కు సంబంధించిన అద్దె డబ్బులను ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న రాజు ప్రతినెలా అందుకుంటున్నాడు. విద్యుత్తు, ఆస్తి పన్ను బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ‘ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (పీఎంఎస్)తో ఇది సాధ్యమే. మీ చిన్నచిన్న పనుల్ని దగ్గరుండి చేసి పెట్టడానికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఒకటో రెండో సంస్థలే ఇలాంటి సేవల్ని అందించేవి. ప్రస్తుతం డజనుకు పైగా నిర్మాణ సంస్థలు ఈ తరహా సేవల్ని అందిస్తున్నాయి.
ఈ బాధ్యతలు వీరివే..
పీఎంఎస్ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజనం అంతాఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. నెల వచ్చేసరికి అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారుడికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే.. అద్దెదారులు పాటించాల్సిన రూల్స్ను మీ తరఫున సంస్థనే ఖరారు చేస్తుంది. క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమచేయడం వీరి సేవలో భాగమే.నిర్వహణ భారం కూడా..
మీది ఫ్లాట్ అయితే అపార్టుమెంట్ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. విద్యుత్, ఆస్తి పన్ను బిల్లులను చెల్లిస్తారు.వివాదం తలెత్తితే..
మీకు అద్దెదారుడికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే.. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేది కూడా వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతో కొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్) చైన్లు దేవయాని ఇంటర్నేషనల్, శాఫైర్ ఫుడ్స్ ఏకంకానున్నాయి. దీంతో 3,000 స్టోర్లతో దేశీయంగా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం అవతరించనుంది. ఫలితంగా సుప్రసిద్ధ బ్రాండ్లు కేఎఫ్సీ, పిజ్జా హట్, టాకో బెల్ ఒకే గొడుగు(నిర్వాహక సంస్థ) కిందకు చేరనున్నాయి.
దేవయాని ఇంటర్నేషనల్తో విలీనమయ్యేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శాఫైర్ ఫుడ్స్ పేర్కొంది. మరోపక్క ఈ విలీనానికి బోర్డు అనుమతించినట్లు దేవయాని ఇంటర్నేషనల్ సైతం ప్రకటించింది. లీడింగ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీ సంస్థలు దేవయాని, శాఫైర్ విలీనం కారణంగా రూ. 8,000 కోట్ల టర్నోవర్తో సరికొత్త దిగ్గజం ఊపిరిపోసుకోనుంది.
విలీనం కంపెనీ భారత్సహా.. నైజీరియా, నేపాల్, థాయ్లాండ్, శ్రీలంకకు కార్యకలాపాలను విస్తరించనుంది. అంతేకాకుండా ఆయా మార్కెట్లలో కోస్టా కాఫీ, టీ లైవ్, న్యూయార్క్ ఫ్రైస్, శనూక్ కిచెన్ తదితర క్యూఎస్ఆర్ బ్రాండ్లను సైతం నిర్వహించనుంది. దేశీయంగా క్యూఎస్ఆర్ చైన్లు వృద్ధి మందగమనం, మార్జిన్లలో క్షీణత, డిమాండ్ పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారీ విలీనానికి తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విలీన ప్రాతిపదిక
క్యూఎస్ఆర్ దిగ్గజాలు దేవయాని, శాఫైర్ ఫుడ్స్ తాజాగా విలీన పథక వివరాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం శాఫైర్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 177 దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు జారీకానున్నాయి. ప్రస్తుతం శాఫైర్ ప్రమోటర్లు 25.35 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీనిలో దేవయాని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్క్టిక్ ఇంటర్నేషనల్ 18.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది.మిగిలిన వాటా దేవయాని షేర్ల జారీతో స్వాప్ చేయనున్నారు. దేశీయంగా ప్రస్తుతం జూబిలెంట్ ఫుడవర్క్స్ క్యూఎస్ఆర్ చైన్ విభాగంలో లీడర్గా నిలుస్తోంది. భారత్తోపాటు.. టర్కీ, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్బైజాన్, జార్జియా మార్కెట్లలో కార్యకలాపాలు కలిగి ఉంది. డోమినోస్, పాపైయిస్, డంకిన్ బ్రాండ్ల కంపెనీ సుమారు 3,480 స్టోర్లను నిర్వహిస్తోంది.
దేశంలో పొగరాయుళ్లకు ఖర్చు మరింత పెరగనుంది. పొగాకు ఉత్పత్తులు (సిగరెట్లు), పాన్ మసాలాపై జీఎస్టీ, పరిహారం సెస్, ఆరోగ్య సుంకాలు పెంచనున్నట్లు ఇదివరకే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఫిబ్రవరి 1 నుంచి వాటిని అమలు చేయనున్నట్లు నోటిఫై చేసింది.
ప్రస్తుతం సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ, వివిధ రేట్లతో పరిహార సెస్ వసూలు చేస్తున్నారు. 2017 జూలైలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి సిగరెట్లపై పన్నులు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ, అంతకు మించి ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, ఎక్సైజ్ సుంకం అమలుకానున్నాయి. ఇక బీడీల విషయానికి వస్తే 18 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తుంది.
పొగాకు ఉత్పత్తుల కోసం కొత్త ఎంఆర్పీ ఆధారిత వాల్యుయేషన్ మెకానిజంను ప్రవేశపెట్టారు. అంటే ఉత్పత్తి ప్యాకేజీపై పేర్కొన్న రిటైల్ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్టీని నిర్ణయిస్తారు. ఇక గుట్కాపై 91 శాతం, నమిలే పొగాకుపై 82 శాతం, జార్దా ఘాటు పొగాకుపై 82 శాతం అదనపు ఎక్సైజ్ సుంకం విధించనున్నారు.
సిగరెట్లపై జీఎస్టీ, సుంకాలు ఇలా..
ఇప్పటి వరకు, సిగరెట్లపై ప్రధానంగా జీఎస్టీ, విలువ ఆధారిత లెవీ ద్వారా పన్ను విధించేవాళ్లు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై ఈ కింది ప్రమాణాలను బట్టి 1,000 సిగరెట్లరకు రూ .2,050 నుండి రూ .8,500 వరకు పన్ను విధించనున్నారు.65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న నాన్ ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ .2.05 పెరుగుదలను చూస్తుంది.
65 మిమీ వరకు ఉండే ఫిల్టర్ సిగరెట్ల ధర సుమారు రూ.2.10 పెరుగుతుంది.
మీడియం పొడవు (65 నుంచి 70 మిల్లీమీటర్లు) సిగరెట్ల ధర రూ.3.6 నుంచి రూ.4 వరకు పెరుగుతుంది.
70 నుండి 75 మిమీ పొడవు ఉన్న పొడవైన, ప్రీమియం సిగరెట్ల ధర సుమారు రూ .5.4 పెరుగుదలను చూస్తుంది.
కమీషన్లకు ఆశ పడి గృహ కొనుగోలుదారులకు ఏవేవో మాయమాటలు చెప్పి ప్లాట్, అపార్ట్మెంట్ విక్రయించేశామా.. చేతులు దులిపేసుకున్నామా? అంటే కుదరదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు, బ్రోకర్లు టీజీ రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం నేరం.
గృహ కొనుగోలుదారులకు సరైన సమాచారం అందించి వారు మోసాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులది. రెరా నిబంధనలు పాటించని ఏజెంట్లకు రోజుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, పెట్టుబడులకు భద్రత కల్పించడమే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) ప్రధాన లక్ష్యం. ఏజెంట్లు, మధ్యవర్తులు ఆదాయ పన్ను చట్టం 1961లోని నిబంధనలకు 43 ఆఫ్ 1961 ప్రకారం తన ఖాతా పుస్తకాలు, రికార్డులు, ఇతరత్రా పత్రాలను నిర్వహించడంతో పాటు తరచూ
సమీక్షించాలి.ప్రాజెక్ట్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, డీటీసీపీ, యూడీఏ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లు రెరా అథారిటీ ఆమోదం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు, అపార్ట్మెంట్ల అమ్మకం, బుకింగ్, ఆఫర్లు, మార్కెటింగ్, ఇతర ప్రచారాలు చేయకూడదు. రెరా నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాజెక్ట్లు, బిల్డర్లకు రెరా చట్టంలోని సెక్షన్–59 ప్రకారం అపరాధ రుసుములు విధిస్తుంది.ఇది చదివారా? రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!
10,408 ప్రాజెక్ట్ల నమోదు..
ఇప్పటి వరకు టీజీ రెరాలో 10,408 ప్రాజెక్ట్లు నమోదయ్యాయి. 4,729 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 10 మంది ప్రాజెక్ట్లు/ఏజెంట్ల రిజి్రస్టేషన్లను రద్దు చేశారు. జయాస్ ప్లాటినం, బీఆర్ మోడోల్యాండ్ అపార్ట్మెంట్స్, కేసినేని నార్త్స్కేప్, సిగ్నిఫా సిగ్నేచర్, లక్ష్మీ ఇన్ఫోబాన్ టవర్–23, ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ–ఫేజ్ 2, వియాన్ వన్80, గంగిడీస్ రాయల్ అడోబ్, స్పెక్ట్రా టెక్ టవర్స్ వీటిల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు టీజీ రెరాలో 2,619 ఫిర్యాదులు నమోదు కాగా.. 1,709 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి.
విదేశీ మారకం నిల్వలు డిసెంబర్ 26తో ముగిసిన వారంలో 3.29 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో మొత్తం విదేశీ మారకం నిల్వలు 696.61 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ అంతకు ముందు వారంలో విదేశీ మారకం నిల్వలు 4.36 బిలియన్ డాలర్లు పెరిగి 693.31 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
డిసెంబర్ 26తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో నిల్వలు (మొత్తం నిల్వల్లో అధిక భాగం) 184 మిలియన్ డాలర్లు పెరిగి 559.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఎస్ డాలర్లతోపాటు యూరో, పౌండ్, యెన్ తదితర రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. అయినప్పటికీ వీటి విలువను యూఎస్ డాలర్ల రూపంలో ప్రకటిస్తుంటారు.
బంగారం నిల్వల విలువ 2.95 బిలియన్ డాలర్లు పెరిగి 113.32 బిలియన్ డాలర్లకు చేరింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 60 మిలియన్ డాలర్లు పెరిగి 18.80 బిలియన్ డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు 93 మిలియన్ డాలర్ల వృద్ధితో 4.87 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.
భారతదేశంలో అత్యంత సంపన్నులైన అంబానీ ఫ్యామిలీ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈ కుటుంబంలో ఎవరు ఎంత చదువుకున్నారు?, అనే విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ధీరూభాయ్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ, 1933 డిసెంబర్ 28న గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ధీరూభాయ్ హీరాచంద్ అంబానీ. ధీరూభాయ్ ఉన్నత పాఠశాల వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తరువాత డబ్బు సంపాదించడానికి.. యెమెన్కు వెళ్లారు. ఇక్కడ పెట్రోల్ పంప్లో పనిచేశారు. రిలయన్స్ గ్రూప్కు పునాది వేసిన ధీరూభాయ్కు అంతకు ముందు పూర్వీకుల నుంచి వచ్చిన సంపద లేదు.
ముఖేష్ అంబానీ: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఎంబీఏ కోసం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. కానీ ఎంబీఏ పూర్తి చేయకుండానే.. తన చదువును మధ్యలో వదిలివేసి 1980లో రిలయన్స్లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు.
అనిల్ అంబానీ: ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ముంబైలోని హిల్ గార్డెన్ స్కూల్ నుంచి పాఠశాల విద్య, ఆ తరువాత, కిషన్ చంద్ చెల్లారం కళాశాల నుంచి సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత 1983లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
నీతా అంబానీ: ముఖేష్ అంబానీ భార్య.. నీతా అంబానీ ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈమెకు నృత్యం, బోధన అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే నీతా అంబానీ.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు.
టీనా అంబానీ: అనిల్ అంబానీ భార్య.. నటి టీనా అంబానీ ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. అంతే కాకుండా ఈమె లాస్ ఏంజిల్స్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేయారు.
ఆకాష్ అంబానీ: ఆకాష్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను.. ఆ తర్వాత, 2013లో అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆకాష్ ఇప్పుడు తన తండ్రికి తన వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు.
శ్లోకా మెహతా అంబానీ: ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా.. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో పట్టభద్రురాలైంది. అంతే కాకుండా ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
ఇషా అంబానీ: ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.. 2014లో అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ.. ఆ తరువాత కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
అనంత్ అంబానీ: అనంత్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, తరువాత బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు అనంత్ అంబానీ జియో ప్లాట్ఫామ్స్ బోర్డులో అదనపు డైరెక్టర్గా ఉన్నారు.
రాధిక మర్చంట్ అంబానీ: ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ ముంబైలోని ఎకోల్ మోండియేల్ వరల్డ్ స్కూల్, బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్య.. తరువాత 2017లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయాలు & ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు.
జై అన్మోల్ అంబానీ: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను, ఆ తరువాత యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.క్రిషా షా అంబానీ: జై అన్మోల్ భార్య.. అనిల్ అంబానీ కోడలు క్రిషా షా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. దీనితో పాటు, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ కూడా పొందారు.
జై అన్షుల్ అంబానీ: అనిల్ అంబానీ చిన్న కుమారుడు జై అన్షుల్ అంబానీ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత, అతను NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందాడు.
Sports
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్ స్టార్ హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్, సైనీ తలా వికెట్ సాధించారు. సర్వీసెస్ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్ స్కోరర్గా నిలవగా.. పుల్కత్ నరాంగ్ 22 పరుగులు చేశాడు.
రాణా, పంత్ మెరుపులు..
అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 72 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 67 పరుగులు చేశాడు.ఈ ఏడాది సీజన్లో పంత్కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పంత్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Rishabh Pant when people start doubting him. pic.twitter.com/mnXCLPxp5p
— Vaibhav (@spideynation_) January 3, 2026
టీమిండియా స్టార్ మహ్మద్ షమీకి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో షమీకి చోటు దక్కలేదు. కివీస్తో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం షమీని పరిగణలోకి తీసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లకు చోటు దక్కింది.
అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏమి చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్టర్లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికి, షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని అతడు ఫైరయ్యాడు. షమీ చివరగా భారత్ తరపున గతేడాది మార్చిలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం క్రమం తప్పకుండా ఆడుతున్నాడు.
షమీకి అన్యాయం..
సెలక్షన్ కమిటీ మరోసారి మహమ్మద్ షమీకి అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమీ అంత పట్టుదలతో దేశవాళీ క్రికెట్ ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికి సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం నిజంగా సిగ్గు చేటు అని రేవ్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా పేర్కొన్నాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో సీజన్లో దుమ్ములేపుతున్నాడు.రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
అయితే షమీ ఫామ్ లేదా ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్లను సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే షమీకి అవకాశమివ్వడం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు.
న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్. రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
"బంగ్లాదేశ్ టూర్ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.
ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్లు భారత్లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు.
కాగా భారత్-బంగ్లా జట్టు వైట్బాల్ సిరీస్ షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది.
ముస్తాఫిజుర్ ఔట్..
అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్కతా నైట్ రైడర్స్ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్ను సూచించింది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్.. అంబరీష్తో కలిసిఐదో వికెట్కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్(65), కన్షిక్ చౌహన్(32), ఖిలాన్ పటేల్(26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్గా తన తొలి మ్యాచ్లో సూర్యవంశీ విఫలమయ్యాడు.
తుది జట్లు
భారత్ అండర్19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సింది.
జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్తో వన్డే సిరీస్లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వెళ్లనున్నాడు.
రుతురాజ్పై వేటు..
ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో సత్తాచాటినప్పటికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.షమీకి నో ఛాన్స్..
ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్తో సిరీస్కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.పంత్కే ఓటు..
అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్తో వన్డే సిరీస్కు పంత్ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్నెస్కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్దీప్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీల(147, 124)తో సత్తాచాటిన పడిక్కల్.. తర్వాత తమిళనాడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు.
మళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటకు త్రిపుర బౌలర్లు గట్టి షాకిచ్చారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(5), కరుణ్ నాయర్(0) ఆరంభంలోనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ నిలకడగా ఆడి తన 13వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.
సెలక్టర్లకు హెడ్ ఎక్..
అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పడిక్కల్ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో పడిక్కల్కు ఓపెనర్గా మంచి రికార్డు ఉంది. అయితే భారత జట్టులో ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు.రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ భారత జట్టు ఓపెనర్లగా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో గిల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్కే పరిమితం కానున్నాడు.
అలా అని మిడిలార్డర్లో చూసుకున్నా ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఒకవేళ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే రుతురాజ్, తిలక్ వర్మలపై కూడా వేటు పడే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.
లిస్ట్-ఎ క్రికెట్లో అదుర్స్..
లిస్ట్-ఏ క్రికెట్లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. పడిల్క్ భారత తరపున ఇప్పటివరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికి.. వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇకఇక కివీస్తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేటు వేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చదవండి: IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్తో టీ20 సిరీస్కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.
వన్డేల్లోనూ పునరాగమనం!
అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
సెలక్షన్ రోజు విఫలం
కివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.
ఏకంగా ప్రపంచకప్ జట్టులోకి
జార్ఖండ్ సారథిగా.. బ్యాటర్గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్ను కాకుండా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్కు బ్యాకప్ కీపర్, ఓపెనర్గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు.కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు.
చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్లోనే శతక్కొట్టాడు. రాజ్కోట్ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్లు అమన్ రావ్(13), తన్మయ్ అగర్వాల్(16) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.
కివీస్తో వన్డేలకు తిలక్కు చోటిస్తారా?
కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ కూడా సెంచరీలో మోత మోగిస్తున్నాడు. అతడు కూడా సెలక్టర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచాడు. భారీ అంచనాల నడుమ సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. గతేడాది ఐపీఎల్లో సంచలన సెంచరీతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)... ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు.
సెంచరీల మోత
ఓపెనింగ్ బ్యాటర్గా బరిలోకి దిగి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో సెంచరీల మోత మోగించాడు. ఇటీవల ఆసియా అండర్-19 వన్డే కప్లోనూ రాణించిన వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుత ప్రదర్శనలకు గానూ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. ఇక అంతకు ముందే విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలో బిహార్ తరఫున వైస్ కెప్టెన్ హోదాలో భారీ శతకం బాదాడు.తాత్కాలిక కెప్టెన్గా
అనంతరం సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో (IND U19 Vs SA U19) యూత్ వన్డేలతో వైభవ్ సూర్యవంశీ బిజీ అయ్యాడు. కొత్త ఏడాదిలోని ఈ తొలి టూర్లో భాగంగా భారత అండర్-19 జట్టు సౌతాఫ్రికా యువ జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. తొలి మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే దూరం కాగా.. వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.బెనోని వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత యువ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇటీవలి కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతూ ఫామ్లో ఉన్న ఆరోన్ జార్జ్ (5) ఓపెనర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో.. తన దూకుడైన శైలికి భిన్నంగా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.
11 పరుగులు చేసి
అయితే, 12 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసిన వైభవ్.. జేజే బాసన్ బౌలింగ్లో లెథాబోకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఇలా వైభవ్ విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి వన్డౌన్లో వచ్చిన వేదాంత్ త్రివేది (21), వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (21) కూడా చేతులెత్తేశారు. ఈ క్రమంలో 15 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 68 పరుగులే చేసి కష్టాల్లో కూరుకుపోయింది.
చదవండి: టీ20 ప్రపంచకప్-2026: అభిషేక్ శర్మపై కూడా వేటు వేస్తారా?
International
దేశంలోని తీహార్ జైలులో UAPA అంటే Unlawful Activities Prevention Act కింద ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తికి అమెరికాలోని న్యూయార్క్ మేయర్ లేఖ రాయడం విచిత్రంగా ఉంది కదూ.. కానీ అది వాస్తవం.. ఆ లేఖలో.. మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాం అని రాశారు. అసలు జైల్లో ఉన్న వ్యక్తికి... మేయర్ మధ్య స్నేహం, బంధుత్వాలు లేవు.. అసలు ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు. అయినా జైలులో ఉన్న వ్యక్తి అమెరికా, యూరప్లలో చర్చలకు కేంద్ర బిందువయ్యాడు.
జైల్లో ఉన్న వ్యక్తితో పాటు.. అదే కేసులో జైల్లో ఉన్న మరికొందరిని బెయిల్ ఇవ్వకుండా UAPA చట్టం కింద బంధించడం మానవ హక్కులను హరించినట్టేనని... వారిని విడుదల చేయాలని ప్రపంచదేశాల నుంచి సందేశాలు రావడం గమనార్హం... అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. మనం ఓ సారి 2020లోకి వెళ్లి రావాల్సిందే..
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదే సమయంలో 2020 ఫిబ్రవరిలో ఉత్తర–తూర్పు ఢిల్లీలో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ గొడవల్లో53 మంది మరణించగా.. వందలాది సంఖ్యలో గాయపడ్డారు. ఆ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఈ కుట్రలో ఉమర్ ఖాలిద్ కూడా భాగస్వామి అని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టారు. జామియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా... అల్లర్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారని... రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసను ప్రేరేపించారంటూ UAPA, IPC ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉమర్ ఖాలిద్ను, ఆయనతో పాటు షర్జీల్ ఇమాంలను 2020 సెప్టెంబర్లో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అదే జైలులో ఉన్నారు.
బెయిల్ కోసం వారి తరపు న్యాయవాదులు తొలుత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్దారులు అకస్మాత్తుగా అల్లర్లకు పాల్పడలేదని.. పూర్తి ప్రణాళికతోనే అల్లర్లు జరిగాయని.. కోర్టుకు నివేదించారు.
నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రాలు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్.., అంజారియాల ధర్మా సనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, ప్రభుత్వాన్ని విమర్శించే స్వరాలను అణచివేయడమే లక్ష్యం అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మానవ హక్కుల సంస్థలు దీన్ని ప్రజాస్వామ్య సంక్షోభంగా అభివర్ణిస్తున్నాయి.
ఐదేళ్ల నుంచి బెయిల్ దొరక్క.. జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్కు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి అందుతోంది. ఆధారాల్లేకుండానే ఉమర్ ఖాలిద్ ఇండియన్ జైల్లో మగ్గుతున్నాడని... న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ఢిల్లీ అల్లర్ల కేసులో తీహార్ జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన “మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని పేర్కొంటూ.. ఖాలిద్కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాశారు.
తన లేఖలో ఖాలిద్కు మానసిక ధైర్యం ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన “మీరు ఒంటరిగా లేరు, మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని రాశారు.ఈ లేఖతో ఖాలిద్ కేసు అంతర్జాతీయ వేదికపై మరింత చర్చకు వచ్చింది. అమెరికాలోని రాజకీయ నాయకులు కూడా భారతదేశంలో మానవ హక్కుల అంశాల గురించి చర్చిస్తున్నారనడనికి ఈ లేఖ ఓ ఉదాహరణ.
జోహ్రాన్ మమ్దానీ ఉగాండా దేశంలోని కంపాలలో 1991 అక్టోబర్ 18, జన్మించారు. 2021 నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2025 ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇతర దేశానికి చెందిన ఓ ఉన్నత స్థాయి నాయకుడు జైల్లో ఉన్న వ్యక్తికి లేఖ రాయడంతో.. ఉమర్ ఖాలిద్కు మరింత గుర్తింపు తెచ్చిఇచ్చింది.
లేఖ సాధారణమే.. అయినప్పటికీ.. రాసిన లేఖ ఎఫెక్ట్ ప్రపంచంపై పడే అవకామంది. ఖాలిద్ వంటి కార్యకర్తలకు ఇది మానసిక ధైర్యం ఇస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్- అమెరికాల సంబంధంపైనా ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా మాత్రమే కాకుండా... అమెరికా, యూరప్లోని కొన్ని రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు ఖాలిద్కు మద్దతు తెలుపుతూ... ఆయనపై కేసు రాజకీయ ప్రయోజనాలకోసం పెట్టారని ఆరోపించారు.
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో తగ్గినట్లు అక్కడి నివేదికలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై కఠిన ఆంక్షలు విధించిన దేశాల్లో ఇరాన్ టాఫ్ ప్లేసులో ఉందని అక్కడి సర్వేలు పేర్కొన్నాయి.
ఇరాన్లో ప్రస్తుతం ఆర్థికసంక్షోభం, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పతనం, మానవహక్కుల ఉల్లంఘన తదితర కారణాలతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. సోషల్ మీడియాలతో పాటు ఇతర సాధనాలపై బ్యాన్ విధించింది.
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు ఉండడంతో ప్రధాన సోషల్ మీడియా సాధనాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర వాటిపై పూర్తిస్థాయిలో నిషేదం విధించింది. అదే ఇరాన్- ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో దాదాపు పూర్తి స్థాయిలో దాదాపు 90 నుంచి 97శాతం ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కంటెంట్పై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్లను ప్రసారం కాకుండా ఆంక్షలు విధించింది.
డిజిటల్ అపార్థైడ్
అంతేకాకుండా ఇరాన్లో ఇప్పుడు అనుమతి ఉన్న వ్యక్తులు, సంస్థలకు మాత్రమే వైట్ సిమ్ కార్డులు ఇస్తున్నారు. ఇవి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇంటర్నెట్కు ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు పొందగలరు. సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ వాడకంపై కొన్ని పరిమితులు కల్పించబడ్డాయి. దీంతో ఈనియమంపై అక్కడ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.
ఇలా నిరంతరంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతో ఆదేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ ట్రెండ్ నడస్తున్న నేపథ్యంలో రోజువారీ దైనందిన అవసరాలకు ఇంటర్నెట్ అవసరమైన నేపథ్యంలో ఆంక్షలు నేపథ్యంలో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అంతేకాకుండా ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ నుండి దేశాన్ని వేరుచేసి ఇరాన్కు చెందిన ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ అంటూ.. తేనీటిపై పాటలు విన్నాం..! ఛాయ్ వాలా ప్రధాని కావడం.. ఆపై ‘ఛాయ్ పే చర్చా’తో దేశ ప్రజలను ఆకట్టుకోవడం చూశాం..! కానీ, ఆ ఛాయ్ ఇప్పుడు పాకిస్థాన్ కొంప ముంచిందంటే నమ్ముతారా?? మీరు ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం..! పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి..! అంటే.. పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా.. ఆ దేశం టీపొడి, చక్కెరను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవడానికి కారణమైతే.. చక్కెర ఎక్కువగా వాడితే ఏమౌతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడీపీ నేలచూపులు చూడడం గమనార్హం..!
పాకిస్థానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా.. ఛాయ్ తాగాల్సిందే..! ఇంటికి చుట్టమొచ్చినా.. మిత్రులొచ్చినా.. టీతో ట్రీట్ జరగాల్సిందే..! పని ప్రదేశంలో ఛాయ్.. రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్.. ఇలా పాకిస్థానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే.. 600 మిలియన్ డాలర్ల విలువైన టీపొడి పాక్కు నిత్యం దిగుమతి అవుతుంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో.. ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీపౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..! అంటే సగటున ఒక పౌరుడు రోజుకు నాలుగైదు సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట..! ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు.
పాకిస్థాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరుకు సాగు ఉన్నా.. గడిచిన ఐదేళ్లుగా అయితే అకాల వర్షాలు, లేదంటే కరువుకాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దోగొప్పో సింధూ, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్నా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ నీటిని నిలిపివేసింది. దీంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు 4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పాక్ పత్రిక ‘ద డాన్’ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది. 2030కల్లా ఇది 7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా..! ఛాయ్తోపాటు.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, జ్యూస్లలో సోడాలు అవసరం. ఏదైనా సంతోషం వచ్చినా.. శుభవార్తను విన్నా.. ‘‘ఆప్ కే మూమే గీ-చక్కర్’’.. అనడం పాకిస్థానీల ఆనవాయితీ..! ఇలా ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 25 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇందులో సింహభాగం ఛాయ్, స్వీట్లలోనే వాడుతారు. పాకిస్థాన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించే బడ్జెట్కు 100 రెట్లు అధికంగా చక్కెర, టీపొడిలపై పౌరులు వెచ్చిస్తుండడం గమనార్హం..! ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. 2025లో పాకిస్థాన్లో తేయాకు దిగుమతి 40% కంటే ఎక్కువగా పెరిగింది.
ఇక పాకిస్థాన్లో డయాబెటిక్ రోగులకు కొదువ లేదు. గత ఏడాది వీరి సంఖ్య 31.4శాతం మేర పెరిగినట్లు.. ఇది ప్రపంచంలోనే వేగవంతమైన పెరుగుదల రేటు అని పాక్ వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెబుతున్నాయి. చక్కెరకు తోడుగా పాక్ ప్రజలు అయితే నెయ్యి లేదంటే డాల్డాను ఎక్కువగా వాడుతారు. స్వీట్లతోపాటు.. బిర్యానీ వంటి వంటకాల్లో వీటి వినియోగం తప్పనిసరి. ఇవన్నీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు దారితీస్తాయనే విషయం తెలిసిందే..! ఇప్పటికే డయాబెటిస్లో పాక్ మొదటిస్థానంలో ఉండగా.. 50 ఏళ్లు పైబడిన వారిలో 30% మంది బీపీతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు మధుమేహం బారిన పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధుల చికిత్సలకు పౌరులు వెచ్చించే మొత్తం.. ప్రభుత్వం సర్కారీ దవాఖానాలకు అందజేయడం మామూలే. ఈ కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పాకిస్థాన్ తన జీడీపీలో 2 నుంచి 3 శాతాన్ని కోల్పోతోందంటే.. తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఇక పాకిస్థాన్లో చక్కెర, టీపొడికి డిమాండ్ పెరగడంతో.. అక్రమ వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయని ‘ద డాన్’ తన కథనంలో పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయానికి గండిపడుతోంది. ఓ అంచనా ప్రకారం ఏటా 4.6 బిలియన్ డాలర్ల మేర అక్రమ రవాణాలు, ఆహార కల్తీలు జరుగుతున్నాయి. సింధూ నాగరికత ఆనవాళ్లు పాకిస్థాన్ మొహంజోదారోలోనే ఉన్నాయి. అప్పట్లో సింధూ ప్రజలు విరివిగా బెల్లం ఉత్పత్తి చేసేవారని, లోథాల్ ఓడరేవు మీదుగా విదేశాలకు నౌకలద్వారా ఎగుమతి చేసేవారని మనం చదువుకున్నాం. ఇప్పుడు పరిస్థితి రివర్సయింది. దిగుమతులపైనే ఆధారపడడం పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది.::: హెచ్.కమలాపతిరావు
ఢాకా: బంగ్లాదేశ్లో ఆందోళనకారులు చేసిన దాడిలో గాయపడ్డ హిందూ వ్యాపారి ఖోకాన్ దాస్ మృతిచెందాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(జనవరి 3వ తేదీ) కన్నుమూశాడు. భర్త కన్నుమూయడంతో భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరవుతుంది.
తన భర్తపై దాడి ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు ఈ ప్రాంతంలో ఎవరూ శత్రువులు లేరని, కానీ తన భర్తపై దారణంగా దాడి చేసి చావుకు కారణం కావడం తనకు అంతులేని ఆవేదన మిగిల్చిందన్నారు.
కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. రెండు రోజల క్రితం ఖోకాన్ దాస్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్ దాస్కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్ దాస్.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్ పూర్ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్ విసురుతోంది.
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూర్చింది.
Movies
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?
సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి రెడీ)
వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.
ఏప్రిల్లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.
ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.
పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.
మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?
(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా)
బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న నిధి అగర్వాల్
ఫ్రాక్లో మైమరిపించేస్తున్న రిద్ధి కుమార్
కొంటె చూపులతో మాయ చేస్తున్న ఫరియా
అందానికే అసూయపుట్టేలా శ్రద్ధా కపూర్
తమ్ముడితో కలిసి మంచు కొండల్లో సారా
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సక్సెస్ మీట్
పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు.మందు తాగి లొల్లి పెడదాం
కానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది.
అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది.
'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా పెట్టి ఓ మూవీ తీస్తున్నాడు. అదే 'జెట్లీ'. ఇప్పుడు న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జనరల్ కంపార్ట్మెంట్ హీరో అని సత్య చివరలో చెప్పిన డైలాగ్ ఫన్నీగా ఉంది.
సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని పూర్తిగా ఫ్లైట్లోనే తీసినట్లు గ్లింప్స్ చూస్తే అనిపించింది. హైజాక్ లాంటిది జరిగితే విమానంలోని ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తించారు, తద్వారా ఎలాంటి కామెడీ వచ్చిందనే పాయింట్తో మూవీ తీశారనిపిస్తుంది. వెన్నెల కిశోర్ పాత్ర.. నువ్వు హీరోవా? టైర్ 1? టైర్ 2? అని సత్య పాత్రని అడిగితే.. జనరల్ కంపార్ట్మెంట్ అని బాగుంది. బహుశా వేసవిలో దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో?
గత కొన్నేళ్ల కాలంలో భర్తల్ని భార్యలు రకరకాలుగా చంపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ మహిళ.. తన భర్త శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్లో దాచిపెడితే, మరో భార్య హనీమూన్కి తీసుకెళ్లి భర్తని చంపించింది. ఈ వార్తలని మీరు చూడటమో చదవడమో చేసే ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటనలపై ఏకంగా వెబ్ సిరీస్ తీశారు. దాన్ని స్ట్రీమింగ్కి సిద్ధం చేశారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఏ ఓటీటీలోకి రానుంది?
భర్తల్ని భార్యలు హ*త్య చేయించడం లాంటి సంఘటనలు గతేడాది ఎక్కువగా విన్నాం, చూశాం. అలాంటి ఓ ఐదింటిని తీసుకుని ఇప్పుడు 'హనీమూన్ సే హత్య' పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్గా తీశారు. జీ5 ఓటీటీలో ఈనెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఇందులో నీలం రంగు డ్రమ్ కేసు, హనీమూన్ కేసుతో పాటు పాటు మరో మూడు కేసుల్ని కూడా చూపించబోతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లూ డ్రమ్ కేసు విషయానికొస్తే.. మర్చంటే నేవీ ఆఫీసర్ సౌరభ్, ముస్కాన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు భర్తని కాదనుకున్న ముస్కాన్.. ప్రియుడి సాహిల్తో కలిసి సౌరభ్ని కిరాతకంగా చంపేసింది. ఆపై శరీర భాగాల్ని నీలం రంగు డ్రమ్లో పెట్టి సీల్ చేసింది. తన తండ్రి డ్రమ్లో ఉన్నాడని సౌరభ్ కుమార్తె.. ఇరుగు పొరుగువాళ్లకు చెప్పడం వల్లే ఈ ఉదంతం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్, సాహిల్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు.
హనీమూన్ హత్య విషయానికొస్తే మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ.. సోనమ్ని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. తర్వాత వీళ్లిద్దరూ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో హత్య అని అనుమానించారు. భార్య సోనమ్ కోసం గాలించగా.. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపుర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించినట్లు ఒప్పుకొంది.
(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)
It looked like a happily ever after until… it wasn’t.#HoneymoonSeHatya premiering on 9th January, on #ZEE5#HoneymoonSeHatyaOnZEE5 #GreytIndianWedding pic.twitter.com/7UoWCeU1MT
— ZEE5Official (@ZEE5India) January 2, 2026
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.
శత్రువుల్లేరు
ట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగు
పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లు
బాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్
సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: సింగర్తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)
సల్మాన్ ఖాన్కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.
చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు.
కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.
తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు.
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.
యాక్సిడెంట్
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమా
ఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు.
సినిమా ఇలానే తీయాలి, స్టోరీ ఇలానే ఉండాలి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు, రచయితలు డిఫరెంట్ కథలతో మూసధోరణికి భిన్నంగా మూవీస్ తీస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్ టైంలో అలా దక్షిణాదిలో హాట్ టాపిక్ అయిపోయిన మలయాళ చిత్రం 'ఎకో'(Eko Movie). థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)
కథేంటి?
కేరళలోని కాట్టుకున్న అటవీ ప్రాంతంలో ఎత్తయిన ఓ కొండపై మిలాతీ(బియానా మోమిన్) అనే వృద్ధురాలు నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్ పీయూస్(సందీప్ ప్రదీప్). ఈ కుర్రాడిని మిలాతీ కొడుకులు నియమిస్తారు. అలానే మలేసియా జాతికి చెందిన పదుల కుక్కలు.. ఈమెని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాయి. అయితే ఈమె భర్త కురియాచన్ (సౌరభ్ సచ్దేవ్) కోసం ఓ నేవీ అధికారి(నరైన్), కురియాచన్ స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) తదితరులు వెతుకుతూ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపిన తర్వాత నుంచి కురియాచన్ కనిపించకుండా పోతాడు. ఇతడు తన కుక్కల సాయంతో దట్టమైన అడవిలో దాక్కున్నాడనేది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కురియాచన్ ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఇంతమంది ఇతడి కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఇందులో కుక్కల పాత్రేంటి? మలేసియాకు చెందిన మిలాతీ.. కేరళ వచ్చి ఎందుకు బతుకుతోంది? అనేది అసలు కథ.
ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫార్మాట్ అంటూ ఏం ఉండదు. చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా సాదాసీదా స్టోరీలా అనిపించాలి. ఒక్కో ట్విస్ట్ బయటపడుతుంటే ఆశ్చర్యపోవాలి. 'ఎకో' కూడా అలాంటి ఓ మూవీనే. గతంలో 'కిష్కిందకాండం' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు దింజిత్ అయ్యతన్- రచయిత బహుల్ రమేశ్ కాంబో.. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చారు. మరోసారి హిట్ కొట్టారు. ఆ మూవీలో కోతులు కీలక పాత్ర పోషించగా.. ఇందులో కుక్కలు కీ రోల్ ప్లే చేశాయి.సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి, చివరకు దొరికాడా లేదా? అనేదే మెయిన్ పాయింట్. కాకపోతే ఈ కథకు మలేసియా కుక్కల జాతిని లింక్ చేసి, కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని అడవుల్ని చూపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్లే జోడించారు. ప్రారంభంలో ఏం జరుగుతుందో అర్థం కాక తికమకగా అనిపిస్తుంది కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అప్పటికీ ఏదో అర్థం కాలేదే అనిపిస్తుంది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే క్లైమాక్స్ నుంచి స్టోరీని వెనక్కి అనాలసిస్ చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు అరె భలే తీశార్రా అనిపిస్తుంది.

సైకో కిల్లర్స్ని చూసి మనం భయపడతాం. కానీ చాలా సాదాసీదా బతుకుతూ తమ పనికి అడ్డం వచ్చేవారిని తెలివిగా తప్పించే వారి గురించి తెలిసినప్పుడు మనకు ఒళ్లు జలదరిస్తుంది. ఇది కూడా అలాంటి పాయింట్తో తీసిన సినిమా. చాలా మలయాళ చిత్రాల్లానే ఇందులోనూ స్లో నెరేషన్ ఉంది. కాకపోతే అడవుల విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. మెయిన్ స్టోరీకి మలేసియాకు చెందిన కుక్కల జాతికి ఉన్న లింక్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్టోరీలో ఉన్న ట్విస్టులు చాలా చిన్నవే కానీ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ వల్ల అవి డిఫరెంట్గా అనిపిస్తాయి.
సినిమాల్లో టెక్నికల్ విషయాలు బాగా కుదిరాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతోనూ చూడొచ్చు. సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్దేవ్, బియానా మోమిన్, వినీత్, నరైన్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీళ్లందరి సంగతి పక్కనబెడితే అసలు కుక్కలతో ఇంత బాగా ఎలా యాక్టింగ్ చేయించగలిగారా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడారో లేదో తెలీదు గానీ మూవీ అంతా చాలా సహజంగా.. మనం కూడా కొండపై, అడవుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. స్టోరీ నెమ్మదిగా ఉన్నాసరే పర్లేదు డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం 'ఎకో' బెస్ట్ ఆప్షన్.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)
ఫైమా.. లేడీ కమెడియన్గా చాలా పాపులర్. పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్.. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. బిగ్బాస్ హౌస్లో ఉండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న తల్లికి ఓ ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యం అని చెప్పింది.
ప్రియుడిని పరిచయం చేసిన కమెడియన్
అనుకున్నట్లుగానే బిగ్బాస్ నుంచి బయటకు రాగానే తల్లి కోసం ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. కమెడియన్ ప్రవీణ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫైమా.. ఒకానొక సమయంలో తమది స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. 2024లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడి పేరు కూడా ప్రవీణ్ కావడం గమనార్హం. తాజాగా ప్రవీణ్ నాయక్ బర్త్డే సందర్భంగా అతడికో సర్ప్రైజ్ ఇచ్చింది.బర్త్డే సర్ప్రైజ్
షాపింగ్ పేరుతో మాల్కు తీసుకెళ్లి అక్కడ అతడిపై బెలూన్ల వర్షం కురిపించింది. ప్రియుడితో కేక్ కట్ చేయించింది. తర్వాత ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చి అతడితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో నేను చేసిన ఫస్ట్ సెలబ్రేషన్.. హ్యాపీ బర్త్డే ప్రవీనూ..' అని క్యాప్షన్ జోడించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)
కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.
ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)


కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మార్క్’.డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దీప్శిఖ చంద్రన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీప్శిఖ చంద్రన్.. ఈ చిత్రంలో బలమైన పాత్రలో కనిపించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఆమె యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె ధీరవనిత పాత్రకు మహిళా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు దీప్శిఖను "మార్క్ క్వీన్", "క్వీన్ ఆఫ్ మార్క్" అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పరిమితంగా ఉంటాయి కానీ, ‘మార్క్’లో దీప్శిఖ పాత్ర బలంగా నిలిచి సినిమాకు మరింత బలం చేకూర్చింది.
పాజిటివ్ మౌత్ టాక్, థియేటర్ స్పందనతో ‘మార్క్’ కన్నడ మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ విజయం దీప్శిఖ చంద్రన్ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడ ప్రేక్షకులకు కొత్త క్రష్గా మారిన దీప్శిఖకు గుర్తింపు, ఆదరణ పెరుగుతున్నాయి.
తమిళ నటుడు విజయ్ సేతుపతి దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఏస్, తలైవన్ తలైవి లాంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు సడన్గా ఓ మూకీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.
'గాంధీ టాక్స్' పేరుతో తీస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానని విజయ్ సేతుపతి.. అప్పుడెప్పుడో 2021లో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. 2023 నవంబరులో గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత మళ్లీ సైలెంట్. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజరో ట్రైలరో తెలీదు గానీ 80 సెకన్ల వీడియోని రిలీజ్ చేసి థియేటర్లలోకి ఎప్పుడొస్తుందనే విషయాన్ని ప్రకటించారు. మూకీ సినిమాని ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనేది చూడాలి?
సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్బీ భావోద్వేగానికి లోనయ్యాడు.
అంతా నిన్ననే..
కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.థాంక్యూ సో మచ్
నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’ . సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీ జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కృష్ణా జిల్లాలోని చౌటపల్లికి చెందిన ఘంటసాల(అతులిత్/కృష్ణ చైతన్య) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. ఎప్పకైనా గొప్ప సంగీత విద్వాసుడు అవుతానంటూ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు విజయనగరం వెళ్తాడు. అక్కడ ఓ సంగీత పాఠశాలలో చేరాలనుకుంటాడు.కానీ అతని ప్రయత్నం ఫలించదు. చివరకు పట్రాయని సీతారామశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరతాడు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే..పొట్టకూటి కోసం రోడ్డు మీద భిక్షాటన చేస్తాడు. తన శిక్షణ పూర్తయ్యాక తిరిగి సొంతూరుకు వెళ్తాడు.తనకు వరసైన పార్వతమ్మ (మృదుల)ని పెళ్లి చేసుకుంటాడు. ఆపై సముద్రాల రాఘవాచారి (జె.కె. భారవి) ప్రోద్బలంతో మద్రాసుకి వెళ్తాడు. ఇక మద్రాసుకి వెళ్లిన తరువాత ఘంటసాలకు ఎదురైన అనుభవాలు ఏంటి? రోడ్డు మీద భిక్షాటన చేసే స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వేదికలపై కచేరీలో చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? చివరి దశలో ఆయనకు వచ్చిన కష్టాలేంటి? ఆయన చివరి కోరిక ఏంటి? అది నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఘంటసాల గొప్ప గాన గంధర్వుడు అని అందరికి తెలిసిందే. ఎన్నో వేల పాటల్ని పాడి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన..జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నేటి తరానికి పెద్దగా తెలియని ఘంటసాల వ్యక్తిగత జీవితాన్ని తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల వ్యక్తిగత కష్టాలు, గొప్ప మనసును ప్రేక్షకులకు తెలియజేయడం లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఘంటాల బాల్యం, ఆర్థిక ఇబ్బందులు, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎదురైన అవమానాలను చూపించారు. ఘంటసాలను వేధించే పీడకల ప్రవేశంతో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ను డిజైన్ చేశారు. ఇక సెకండాఫ్లో ఘంటసాల వైభవం, ప్రఖ్యాతిని చూపించారు. ఆయన ఇండస్ట్రీలోకి రావడం.. తన సంగీతంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం.. ఘంటసాల సూపర్ హిట్ పాటలతో కాస్త ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి దిగ్గజాల ప్రశంసల సీన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. బడే గులాం అలీ ఖాన్తో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చక్కగా వివరించారు. ఘంటసాల పర్సనల్ లైఫ్ని నేటి తరానికి తెలియజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ.. ఓ పూర్తి స్థాయి సినిమాగా, కమర్షియల్గా చూసుకుంటే మాత్రం ఘంటసాల అందరినీ అంతగా మెప్పించకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే..
చిన్నప్పటి ఘంటసాల పాత్రలో బాల నటుడు అతులిత్ బాగా నటించాడు. ఇక పెద్ద ఘంటసాల పాత్రలో కృష్ణ చైతన్య జీవించేశాడు. ఆయన నడక, హావభావాలు అన్ని తెరపై నిజమైన ఘంటసాను చూసినట్లుగానే అనిపిస్తాయి. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఓ కీలక పాత్రలో బడే గులాం అలీ ఖాన్గా సుమన్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఘంటసాల వారి గురువు పట్రాయని సితారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి, ఇంద్రుడి పాత్రలో సాయి కిరణ్, ఘంటసాల తల్లిగా జయ వాణి తో మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం.చాలా వరకు ఘంటసాల వారు పాడిన పాటల్నే వాడారు. ఇక ఘంటసాల థీమ్ మ్యూజిక్, బడే గులాం అలీ ఖాన్ పాడిన పాటలు, నేపథ్య సంగీతం అన్నీ కూడా ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ మాత్రం తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
రేటింగ్: 2.5/5
NRI
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.

శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.

తదుపరి కార్యక్రమానికి హాల్ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
Family
ఈ నూతన సంవత్సరంలో సోడాను తగ్గించి ఆరోగ్యకరమైన మార్గంలో వెళ్లాలనుకుంటే మీరు టెపాచే (tepache) తయారు చేసుకోవాలి. ఇది తేలికగా పులియబెట్టిన మెక్సికన్ పానీయం, ఇది పైనాపిల్ తొక్కలు, నీటిని ఉపయోగించి తయారు చేసిన బంగారు రంగు పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా శరీరానికి అద్భుతమైన రిఫ్రెషింగ్ కూడా!
టెపాచే అనే ఈ సంప్రదాయిక పానీయాన్ని మెక్సికోలో వీధి వ్యాపారులు మట్టి ముంతలలో విక్రయిస్తారు. ఈ పానీయాన్ని పైనాపిల్ తొక్కలు, కొద్దిపాటి గుజ్జు, పైనాపిల్లోమనం తినలేక వదిలేసే గట్టి కండలాంటి వ్యర్థాలకు బ్రౌన్సుగర్ను, కొద్ది సుగంధ ద్రవ్యాలను కలిపి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇది పూర్తి ప్రొబయోటిక్. అంతేకాదు, ఏ వాతావరణానికైనా అనువైన స్వదేశీ పానీయంగా చెప్పుకోవచ్చు.
ఇదీ చదవండి: జంక్ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!
జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా ఎదిగే వయసులో పిల్లలకు పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు పోషకాహార నిపుణులు. తక్కువ ఖర్చులోనే పుష్కలంగా పోషకాలు లభించే లడ్డూల తయారీ గురించి..న్యూట్రిషనిస్ట్ చెప్పే హెల్దీ వాల్యూస్ గురించి... తెలుసుకుందాం.
అవిసె గింజల లడ్డు
కావలసినవి: అవిసె గింజలు – కప్పు (100 గ్రాములు); బాదం పప్పు – 30; రాగి పిండి – అరకప్పు; ఎండుకొబ్బరి ముక్కలు – అర కప్పు; ఖర్జూరం – 15; నెయ్యి – సరిపడా.తయారీ: స్టౌ పైన కడాయి పెట్టి, అవిసెగింజలు దోరగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, అదే పాన్లో బాదం పలుకులు వేయించుకోవాలి. బాదం పప్పుకు బదులుగా పల్లీలు కూడా ఉపయోగించవచ్చు. బాదం పప్పులు తీసి, తర్వాత అరకప్పు ఎండుకొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి, తీయాలి. ∙పాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. దాంట్లో అరకప్పు రాగిపిండి వేసి, కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీజార్లోకి వేయించుకున్న బాదం, ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇందులో వేయించిన రాగిపిండి పోసి గ్రైండ్ చేసుకొని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్లో అవిసెగింజలు వేసి, పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాగి పిండిలో కలపాలి. ∙అలాగే మిక్సీజార్లో గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి, గ్రైండ్ చేయాలి ∙ఖర్జూరం మిక్సర్ని పిండిలో వేసి, చేతితో మిశ్రమం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి ∙చేతికి నెయ్యి రాసుకొని, కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని, చిన్న చిన్న లడ్డూలు కట్టుకోవాలి ఈ అవిసె గింజల లడ్డూలు పిల్లలకు రుచిని, బలాన్ని ఇస్తాయి.
నువ్వులు – బెల్లం లడ్డు
కావలసినవి: తెల్ల నువ్వులు – కప్పు; బెల్లం – కప్పు; వేరుశెనగలు – కప్పు; యాలకుల పొడి - అర టీ స్పూన్; నెయ్యి – తగినంత.తయారీ: ∙నువ్వులను సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టాలి. ∙బెల్లం తరుగును గిన్నెలో వేసి, కరిగించి, మెత్తటి మిశ్రమం అయ్యే వరకు ఉడికించాలి. దాంట్లో వేయించిన నువ్వులు, ఇతర పదార్థాలు కలపాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
కొబ్బరి లడ్డు
కావలసినవి: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం తరుగు – అరకప్పు; యాలకులు – 4 ( పొడి చేయాలి); నెయ్యి – తగినంత.తయారీ: ముందుగా పచ్చి కొబ్బరి తురుమును పాన్లో కొద్దిగా నెయ్యి వేసి, వేయించు కోవాలి. తర్వాత బెల్లం తరుగు, యాలకుల పొడి కలిపి, వేడి చేయాలి ∙ఈ మిశ్రమం ముద్దలా తయారైన తర్వాత, చిన్న ఉండలుగా చుట్టాలి. కొబ్బరి లడ్డుకావలసినవి: మినప పప్పు – కప్పు; నెయ్యి – తగినంత; తరిగిన బెల్లం – కప్పు; జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష; యాలకుల ΄పొడి – తగినంత.
మినప లడ్డు
తయారీ: మినప పప్పు దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి. ∙ఒక గిన్నెలో బెల్లాన్ని కరిగించి, దాంట్లో మినపపిండి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి, కలిపి ఉండలు చుట్టాలి.తక్షణ శక్తి: పదేళ్లలోపు పిల్లల్లో ఎముకల వృద్ధి, మెదడు పనితీరు వేగంగా ఉంటుంది. దీనికి తగిన విధంగా పోషకాలు గల ఆహారాన్ని అందిస్తే వారి శక్తి స్థాయులు బాగుంటాయి. చదువు, ఆటలతో త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే పోషకాహారం వారిని వెంటనే రీచార్జ్ చేస్తుంది. పంచదార, మైదాతో తయారైన జంక్ఫుడ్కు బదులు రాగి పిండి, ఇతర చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నట్స్, డ్రై ఫ్రూట్స్, అవిసెగింజలు, నువ్వులు, కొబ్బరితో పిల్లలకు చిరుతిండ్లు తయారు చేసి ఇవ్వచ్చు. దీనివల్ల వారికి తగినంత ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు లభిస్తాయి. బాల్యదశ శక్తిమంతంగా ఎదగడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్
