Archive Page | Sakshi
Sakshi News home page

Crime

  • సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌: మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం..  మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నితిన్ శర్మ గన్‌తో కాల్పులు జరిపినట్లు సమాచారం. 

    ఈ ఘటన నేపథ్యంలో అర్మ్స్ ఆక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు అధికారులు వెల్లడించనున్నారు.  

     

  • సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు.  

    డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    కాగా హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ‍్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్‌ ఘటనపై పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు.  

    పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్‌ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్‌, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్‌ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్‌. 

Andhra Pradesh

  • గోపాలపట్నం(విశాఖ): విశాఖపట్నం నడి బొడ్డున ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఓ భవనం పై అంతస్తులో బాణసంచా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. పేలుడి ధాటికి భవన శిథిలాలు ఎగిరి వీధుల్లో పడ్డాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. ఓ మహిళ మాత్రం అస్వస్థతకు గురయ్యా­రు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖలోని గోపాలపట్నం ఆదర్శనగర్‌ ప్రాంతంలో రెండస్తుల భవనంలోని పై అంతస్తును బాంబుల కృష్ణ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని అక్కడ బాణసంచా తయారు చేస్తున్నాడు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ కార్యకలాపాలు జరిగేవి. 

    అయితే ఆదివారం సాయంత్రం 5.30 గంటలు, ఆరు గంటల మధ్య సమయంలో ఇక్కడ పేలుడు సంభవించింది. మంటలు తీవ్రంగా ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భవన శిథిలాలు వీధుల్లో ఎగరి పడడంతో భవనం వెనుకవైపు ఉన్న రేకుల షెడ్డు తీవ్రంగా దెబ్బతింది. అక్కడే ఉన్న ఓ ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పక్క భవనంలో ఉంటున్న దివ్య అనే మహిళ శబ్ద కాలుష్యం, వ్యాపించిన దట్టమైన పొగకు అస్వస్థతకు గురైంది. ఆమెను గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.  


    హెచ్చరించినా.. వినని నిర్వాహకుడు! 
    ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోటలో బాణసంచా పేలుడు సంభవించి 20 మంది మరణించడంతో విశాఖ గోపాలపట్నం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదర్శనగర్‌లోని ఈ బాణసంచా తయారీ కేంద్రాన్నీ తనిఖీ చేశారు. అప్పట్లో కొంత మందుగుండు సామగ్రిని స్వాదీనం చేసుకుని తయారీ ఆపేయాలని హెచ్చరించారు. బాణసంచా తయారు చేస్తున్న బాంబుల కృష్ణ దుకాణాన్ని తనిఖీ చేశారు. 

    అయినా నిర్వాహకుడు తయారీ ఆపలేదని, నిల్వ భారీగా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.  సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు, ఎస్‌ఐ రామారావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాణసంచా తయారీదారుడు ‘బాంబుల కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

  • విజయవాడ:  ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ)  నుండి ప్రారంభం కానున్నాయి.  ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం గం. 9.30 ని.లు నుండి  మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం ఉంటుంది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు.  6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. 6,22,074 మంది రెగ్యులర్ విధానంలో పరీక్షలు రాస్తుండగా,, 18,842 మంది ప్రైవేటు విధానంలో పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షలు రాసేవారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

    విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని, 10 గంటల తర్వాత ఎవ్వరిని లోనికి అనుమతించబోమని  పరీక్షల విభాగం పేర్కొంది. పరీక్షల నిర్వహణ కి 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీసు అరికట్టేందుకు 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. ఫోన్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లను  పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

  • మచిలీపట్నం:  ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఎక్సైజ్‌ చట్టాలను తుంగలో తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పందిర్ల కింద బార్ లైసెన్స్ మంజూరు చేసి, మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్నారు కృష్ణాజిల్లా ఎక్సైజ్ అధికారులు. రాష్ట్రం మొత్తం ఒక రూల్‌.. మచిలీపట్నం మరొక రూల్‌ అన్నట్లు ఇక్కడ మద్యం అమ్మకాల నిర్వహణ సాగుతోంది. ‘ ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్‌ గీల్స్‌ జాన్తా నై’ అన్నట్లుగా సాగుతున్నాయి మద్యం విక్రయాలు. 

    బార్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఖాళీ స్థలంలో టెంట్లు, పందిర్లు వేసి మచిలీపట్నం బీచ్‌ రోడ్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు నిర్వహకులు. నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దాంతో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. టెంట్లు, పందిళ్ళ కింద బార్ లైసెన్సులు ఎలా  మంజూరు చేశారని ప్రశ్నిస్తున్న స్థానికులు.

    గుడారాల్లోనే బార్లు
    జనసేనకు చెందిన కొరియర్‌ శ‍్రీను గుడారాల్లోనే బార్‌ నిర్వహిస్తున్నారు. తన అనుచరులతో బార్‌ టెండర్లు పొందిన మచిలీపట్నంకు చెందిన జనసేన నేత కొరియర్‌ శ్రీను.. భవన నిర్మాణాలు చేపట్టకుండానే గుడారాలు వేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు.ఇది ఆబ్కారీ శాఖ వింతపోకడలకు అద్దం పడుతోంది. ఇలా గుడారాల్లో బార్‌ నిర్వహించడం రూల్స్‌కి విరుద్ధమైనా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

    అబ్కారీశాఖ మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు..
    కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

  • తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో మంగళస్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దానికి ఆధునిక హంగులు అద్దుతూ కొత్తగా హల్దీ ఫంక్షన్‌ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక అని కూడా పిలుస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్‌ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది.   

    కొత్త పుంతలు 
    పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్‌గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్‌లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు.   

    ప్రత్యేక సెట్టింగ్‌లు 
    హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్‌లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్‌గా మారింది.

    డ్రెస్‌ కోడ్‌ 
    హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్‌ కోడ్‌తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్‌ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్‌లో ఫొటో, వీడియో షూట్‌ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్‌ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్‌ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు.  

    చెప్పలేని ఆనందం
    ఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్‌లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. 
    – కె.సాయికుమార్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, కాకినాడ 

    ఉత్సాహాన్నిస్తాయి
    కొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్‌ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
    – కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం  

    ప్రత్యేక ఆకర్షణ
    పెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్‌ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్‌లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. 
    – కె.సతీష్, ఎన్‌కేఎస్‌ ఈవెంట్‌ మేనేజర్,రాజమహేంద్రవరం   

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను  ప్ర‌త్యేకంగా క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆహ్వానించారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాకు పుష్ప‌గుచ్ఛం అందించి.. శాలువాతో స‌త్క‌రించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.  ఉప ముఖ్య‌మంత్రితో పాటుగా గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లిసిన వారిలో ఆర్థిక శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్-ప్లానింగ్ సెక్రెట‌రి గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి స్కితా ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులున్నారు.

    కాగా,  రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

    తొలుత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. ఆ తేదీని కాస్త వెనక్కు జరిపింది తెలంగాణ ప్రభుత్వం.  రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి తుది మెరుగులు దిద్దే క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కాస్త వెనక్కు జరపాల్సి వచ్చినట్లు సమాచారం. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీ ప్రవేశపెడతారు.  గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 

  • హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో  రైతు భరోసా నిధులు జమ చేయనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం.  

    ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . తొలి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.  ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.  మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.

    డైలమాకు తెర..!
    గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమైంది. చెందుతున్నారు.  ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో రైతుల డైలమాకు తెరపడింది.

    ప్రస్తుత యాసంగి సీజన్‌ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు.  తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది.

  • సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డ్రగ్స్‌ టెస్టులు చేయించుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

    ‘మాదకద్రవ్యాలు మనుషులుని రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. రాజకీయంగా ఎంతటి వారైనా మాదక ద్రవ్యాల్ని వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే డ్రగ్స్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నాను. డ్రగ్స్ కేసును బీఆర్‌ఎస్‌పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం మీ రాజకీయాల ప్రతిబింబం. నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అలాగే, ప్రతి డ్రగ్స్‌ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం’అని హెచ్చరించారు.

     

    హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ కలకలం సృష్టించింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో వీకెండ్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్‌ తీసుకుని ఏపీ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాం హౌస్‌ జరిగిన డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్‌ స్పందించారు. 

  • సాక్షి,నల్లగొండ: చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని హైదరాబాద్‌కు తరలించారు.

    మరణించిన వారిలో ఇద్దరు బీహార్‌కు చెందినవారిగా, మరో ఇద్దరు బొత్య తండాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు రోడ్లపై లారీలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్‌ టీం పోలీసులు దాడులు జరిపే సమయంలో ఫాంహౌస్‌లో ధ్వంసమైన రెండు ఐఫోన్‌ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రెండు ఫోన్‌లు పైలెట్‌ రోహిత్‌రెడ్డి అతని పీఏ శ్రవణ్‌దేనని తెలుస్తోంది.

    అయితే, ఆ ఫోన్‌లను ధ్వంసం చేసింది పైలెట్‌ రోహిత్‌రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంపై పైలెట్‌ పీఏ శ్రవణ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణతో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  

    బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి తన ఫాంహౌస్‌ జరిగిన వీకెండ్‌ పార్టీలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి,అతడి సోదరుడు రితేష్‌ రెడ్డి  ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికాడు. వీరితో పాటు పలువురు సైతం డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.  

    ఈగల్‌ టీం పోలీసులు ఫాం హౌస్‌పై దాడులు జరిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా డ్రగ్స్‌ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్‌ టీం, ఎస్‌ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్‌ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్‌ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్‌ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్‌ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్‌ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు.

     

     

     

     

International

  • ఇరాన్‌ తమకు లొంగిపోతుందని అమెరికా అనుకుంది. ఇరాన్‌ వద్ద ఆయుధాలు లేకుండా చేస్తే తమకు ఏ ముప్పూ ఉండబోదని ఇజ్రాయెల్‌ భావించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించాయి. అయితే, ఊహించని విధంగా ఇరాన్‌ ఎదురు నిలుస్తోంది. ప్రతీకారదాడులతో విరుచుకుపడుతోంది.  ఇరాన్ ప్రతిస్పందన అమెరికా-ఇజ్రాయెల్ అంచనాలను ఎలా తారుమారు చేసింది? ఇరాన్‌ దాడులు, ఇజ్రాయెల్‌ తీరుతో  గల్ఫ్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

    అమెరికా ప్రకటించిన అంచనాలు, లక్ష్యాల ప్రకారం ఇరాన్‌పై సైనిక చర్యలు ఇప్పటికే ముగిసి, ఇజ్రాయెల్-అమెరికా విజయం సాధించాల్సింది. ఇరాన్‌లో పాలనావ్యవస్థ ఇప్పటికే కూలిపోవాలి. అణు మౌలిక వసతులు మళ్లీ ఎప్పటికీ కోలుకోలేని విధంగా ధ్వంసం కావాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్ర నాయకులను లేకుండా చేయడంతో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించిన సమయంలోనే అసాధ్యమైన పనిని సాధించినట్టు చాలామంది భావించారు. వారి అంచనాల ప్రకారం ఇది ముయామ్మర్ గడాఫీ, సద్దాం హుస్సేన్ పట్టుబడిన ఘటనలకన్నా పెద్ద విజయం.

    ఊహించని విధంగా ఇరాన్‌ పోరాటం 
    అయితే, కొన్ని గంటల్లోనే వందల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ లక్ష్యాలు, సమీప గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేశాయి. వాటిలో అధిక శాతం క్షిపణులు లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్, అమెరికా ముందుగానే ఇలాంటి సైనిక ఘర్షణను ఊహించి ఉండొచ్చు. కానీ, పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఆస్తులను లక్ష్యాలుగా ప్రకటించడంతో ఇరాన్ ఈ చర్యను సంప్రదాయ ఆపరేషన్ నుంచి అస్థిరత సృష్టించే ప్రాంతీయ యుద్ధంగా మార్చింది. 

    గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వలేదు. గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలు ఆయా దేశాలకు ప్రమాదంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ చర్చలు జరపాలంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా స్థావరాలు తొలగించాలని ఇరాన్ షరతు పెట్టింది.

    మరింత ఆయుధీకరణ వైపు ఇరాన్‌? 
    యుద్ధం ప్రారంభమైన 2 వారాల్లోనే ఒక విషయం స్పష్టమైంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్‌ను మరింత ఆయుధీకరణ వైపు నడిపించనున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ సహజ వనరులను ఆయుధంగా వినియోగించే అవకాశమూ ఉంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్‌ ఓ ఆయుధంగా వాడుతోంది. అంటే గల్ఫ్ ప్రాంత సముద్రం నుంచి ప్రపంచానికి చమురు సరఫరా వెళ్లే కీలక సముద్ర మార్గంలో ఆటంకాలు కల్పిస్తోంది.

    చూస్తుంటే ఇప్పట్లో ఇరాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలే అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమాసియా భద్రత, స్థిరత్వం మాత్రమే కాదు ప్రపంచ ఇంధన సరఫరా కూడా ప్రభావితమైంది. ఇరాన్‌లో పాలనా మార్పు, అణు నిరాయుధీకరణ చేస్తామని ప్రజలకు ఇజ్రాయెల్, అమెరికా వాగ్దానాలు చేశాయి. ఆ లక్ష్యాలు ఎన్నటికి నెరవేరతాయో ఎవరూ చెప్పలేరు. 

    ఇప్పట్లో ముగిసే యుద్ధం కాదిది! 
    కొందరు ఇజ్రాయెల్ నేతలు ఇరాన్‌పై భూతలంలో భీకర దాడులు చేయాలని భావిస్తున్నారు. అమెరికా నేతల్లో అసహనం పెరుగుతోంది. “షాక్ అండ్ ఆ” వ్యూహం ప్రకారం యుద్ధం ముగియదని విశ్లేషకులు చెబుతున్నారు. షాక్ అండ్ ఆ వ్యూహం అంటే శత్రువును ఒక్కసారిగా భారీ సైనిక దాడులతో మానసికంగా కుదేలు చేయడం.

    యుద్ధ లక్ష్యాలు సమయ పరిమితితో ఉంటాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకూడదని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఈ లక్ష్యానికి అంతర్జాతీయ మద్దతు ఉంది. ఇరాన్ పొరుగు దేశాలు, టర్కీ, రష్యా, చైనా కూడా దీనికి ఒప్పుకున్నాయి. ఈ అంతర్జాతీయ ఒత్తిడి ఇరాన్‌ను అణ్వాయుధ ప్రోగ్రాం  కొనసాగించకుండా నిరోధించింది. 

    అదే సమయంలో 2015లో జరిగిన  జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందుకు సంబంధించిన ఒప్పందానికి అంగీకరించేందుకు కారణమైంది. ఇది ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం.

    ఇరాన్ మతపరమైన వాదనను కూడా వినిపిస్తుంది. అణ్వాయుధ తయారీ ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని చెబుతుంది. అయితే యురేనియం శుద్ధి స్థాయి పెరుగుతుండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం తన అణు విద్యుత్ కార్యక్రమం హక్కును గుర్తిస్తేనే యరేనియం శుద్ధిని ఆపుతామని చెబుతోంది. అణు విద్యుత్ కార్యక్రమాన్ని విదేశాలకు మార్చాలన్న ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. భారతదేశం సహా అనేక దేశాలు ఇరాన్‌కు అణు విద్యుత్ కార్యక్రమం నిర్వహించే హక్కు ఉందని గుర్తించాయి.

    అయితే ఇజ్రాయెల్ దృక్కోణం పూర్తిగా వేరేలా ఉంది. ఇరాన్ ను పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలని, భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఆయుధాలు కూడా ఆ దేశం వద్ద​ ఉండొద్దని కోరుతోంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి.

    ఈ యుద్ధంలో ఇరాన్ ఒక అంశంలో విజయవంతమైంది. ఇజ్రాయెల్ సైనిక శక్తి కేవలం ఇరాన్‌కే కాక గల్ఫ్ దేశాలకు కూడా ముప్పుగా మారవచ్చని గల్ఫ్ దేశాలను నమ్మించింది.

    గల్ఫ్‌పై ప్రభావం
    గల్ఫ్ దేశాల్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినప్పటికీ ఆయా దేశాలు శాంతియుత వైఖరితో ఉన్నాయి. అమెరికా సెనేటర్ లిన్డే గ్రాహం సహా పలువురు నాయకులు సౌదీ అరేబియాను యుద్ధంలో చేరాలని కోరారు. కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో ఘర్షణను పెట్టుకోలేదు. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు గల్ఫ్ ప్రజల్లో మద్దతు కనిపించలేదు. 

    అయితే, గల్ఫ్ దేశాలను ఇజ్రాయెల్ భద్రతకు కవచంగా ఉపయోగిస్తున్నారని చాలా మందిలో అసంతృప్తి పెరుగుతోంది. ప్రాంతీయ నాయకులు కూడా గల్ఫ్ భద్రతను పట్టించుకోలేదని విమర్శించారు. 2023లో జరిగిన సౌదీ అరేబియా-ఇరాన్‌ సయోధ్య తర్వాత ఇజ్రాయెల్‌ కఠిన విధానాలకు సౌదీ అరేబియా మద్దతు ఇవ్వడం లేదు. ఇజ్రాయెల్-గల్ఫ్ భద్రతా వ్యవస్థను నిర్మించేందుకు రూపొందించిన అబ్రహం ఒప్పందాలు ఇప్పుడు అమలులో లేవు. సౌదీ సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రాంతీయ భద్రతా వ్యవస్థపై దృష్టి పెట్టాయి. 

  • టెహ్రాన్‌: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.

    పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం  నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.

    ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్  తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో  ఇరాన్‌లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.

    అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

  • వాషింగ్టన్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్‌ ఐలాండ్‌పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు.

    అదే సమయంలో హర్మూజ్‌ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్‌ దాడుల్ని మరింత   ముమ్మరం చేసింది. 

    తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్‌ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్‌ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్‌తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్‌తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. 

    ఇరాన్‌ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్‌ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్‌ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్‌బీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్‌ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్‌ తన డిమాండ్‌లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్‌ ఖార్గ్‌ ఐలాండ్‌పై పడినట్లు సమాచారం.

    ఖార్గ్‌ ఐలాండ్‌పై దాడులు జరగడం వల్ల ఇరాన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధికి సమీపంలో ఖార్గ్‌ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్‌ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆ దేశం అతలాకుతలంగా మారింది.  సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో రాజకీయంగా సైతం సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలోనే ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంచలన ప్రకటన చేశారు.

    టెహ్రాన్‌ మునుపెన్నడూ లేని సంక్షోభాలని చూస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతమవుతున్న ఆ దేశం రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి అణుచర్చల విఫలంతో  పాటు ఆ దేశంలో ప్రజలు జరిపిన నిరసనలు సైతం ఒక కారణం. ఇస్లామిక్ ప్రభుత్వ కఠిన చట్టాలు, అవినీతిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలతో రోడ్లెక్కారు. దీంతో ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో వారిని అణిచివేసింది. వేలాది మందిని కాల్చి చంపింది. ఈ విషయంలో మెుదటి నుంచి ఇరాన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇదే సాకుగా  భావించి  యుద్ధాన్ని ప్రకటించారు.

    అయితే యుద్దం ప్రారంభంలోనే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని హతమార్చారు. ప్రస్తుతం సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీని సైతం లేపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బహిష్కృత యువరాజు రెజాపహ్లవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ"ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే వెను వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. నా నాయకత్వంలో ఇరాన్‌ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉంది. కొద్దికాలంలోనే ఇరాన్‌లో శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తాం." అని ప్రకటనలో తెలిపారు.

    దేశంలో తిరిగి శాంతిని పునరుద్ధరించడానికి స్థానికంగా ఉన్న వారితో పాటు విదేశాలలో ఉన్న నిపుణులను నియమించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశ అభివృద్ధి కోసం   “ఇరాన్ ప్రాస్పెరిటీ ప్రాజెక్ట్” అనే కార్యక్రమం కూడా రూపొందించబడిందని ఇస్లామిక్ ప్రభుత్వం పడిపోయిన  మొదటి 180 రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, కొత్త రాజ్యాంగం రూపకల్పన, ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య పాలనతోనే ఇరాన్‌లో అభివృద్ధి సాధ్యం అని రెజా పహ్లవీ పేర్కొంటున్నారు.

    రెజా పహ్లవీ నేపథ్యం

    కాగా ప్రస్తుతం రెజా పహ్లవీ అమెరికాలో నివాసం ఉంటున్నారు. 1979లో  మెుహమ్మద్ రెజా షా పహ్లవీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో పెద్దఎత్తున ఉద్యమం జరిగింది.దీంతో ‍అక్కడ రాజరిక వ్యవస్థ రద్దై రెజా షా పహ్లవీ దేశాన్ని విడిచి పారిపోయాడు. అనంతరం అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆసమయంలో రెజా పహ్లవీ అమెరికాలో ఫైలట్ శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు.

  • అమెరికా రాజకీయ రంగంలో ‘ట్రంప్’ అనేది ఒక బ్రాండ్‌. ఇప్పుడు ఆ కుటుంబం నుండి మరో శక్తివంతమైన గొంతు ప్రపంచానికి వినిపిస్తోంది. ఆమెనే లారా ట్రంప్. కేవలం డోనాల్డ్ ట్రంప్ కోడలిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న లారా గురించి ఇప్పుడు ప్రపంచమంతటా చర్చ జరుగుతోంది. ఫోక్స్ న్యూస్ హోస్ట్‌గా, రాజకీయ విశ్లేషకురాలిగా ఆమె ప్రస్థానం దూసుకుపోతోంది. ఆమెకు సంబంధించిన ఐదు షాకిచ్చే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం..

    ట్రంప్ కుటుంబంలో కీలకం
    లారా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మూడవ కుమారుడు ఎరిక్ ట్రంప్‌ను 2014లో వివాహం చేసుకున్నారు. అలా ట్రంప్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన ఆమె, అనతి కాలంలోనే ఆ కుటుంబంలో అత్యంత కీలకమైన,  నమ్మకస్తురాలైన  మనిషిగా మారారు.

    రాజకీయాల్లో చక్రం తిప్పుతూ..
    కేవలం ఇంటికే పరిమితం కాకుండా, రిపబ్లికన్ పార్టీలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2024లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్‌ఎన్‌సీ) కో-చైర్‌గా బాధ్యతలు చేపట్టి, పార్టీ నిధుల సేకరణలో, ఎన్నికల వ్యూహరచనలో తనదైన ముద్ర వేశారు.

    ఫోక్స్ న్యూస్ స్టార్ హోస్ట్‌గా..
    మీడియా రంగంలోనూ లారా తన సత్తా చాటుతున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆమె ఫోక్స్ న్యూస్‌లో ‘మై వ్యూ విత్ లారా ట్రంప్’ (My View with Lara Trump) అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షోలో జాతీయ భద్రత, రాజకీయ పరిణామాలపై ఆమె చేసే విశ్లేషణలకు విపరీతమైన క్రేజ్ ఉంది.

    పబ్లిక్ లైఫ్ ఒత్తిడిపై ఓపెన్ కామెంట్స్
    రాజకీయాల్లోకి రాకముందు ఉన్న సాధారణ జీవితాన్ని తాము అప్పుడప్పుడు మిస్ అవుతుంటామని లారా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగిన తర్వాత తమ కుటుంబంపై పెరిగిన నిఘా, విమర్శల  కారణంగా తమ పాత రోజులను గుర్తుచేసుకుంటామని ఆమె చెబుతుంటారు.

    వ్యక్తిగత జీవితం
    లారా, ఎరిక్ దంపతులకు ల్యూక్, కరోలినా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ట్రంప్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లారా ట్రంప్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా కనిపిస్తున్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?

Sports

  • ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) దారుణ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలకు మాత్రమే పరిమితమయిన కేకేఆర్‌ 8వ స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా అజింక్యా రహానే వ్యవహరించాడు. నాయకుడిగా జట్టును నడిపించడంలో విఫలైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రహానే సూపర్‌ సక్సెస్‌అయ్యాడని చెప్పొచ్చు. 

    37 ఏళ్ల రహానే 13 మ్యాచ్‌లాడి 390 పరుగులు సాధించాడు. కేకేఆర్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా రహానేనే కావడం విశేషం. గత సీజన్‌లో ఎక్కువగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించే స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. 

    అందుకే ఈసారి కూడా రహానేకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే కృతనిశ్చయంతో కేకేఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి మరో 13 రోజులు సమయం ఉండడంతో ఈలోగా కేకేఆర్‌ కెప్టెన్‌ పేరును ఖరారు చేయనుంది. అయితే రహానే ఈ సీజన్‌లోనూ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు రానున్నాడు. 

    ఐపీఎల్‌లో రెండు పర్యాయాలు (2012, 2014) గంభీర్‌ సారధ్యంలో ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించిన కేకేఆర్‌ 2024లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలో మూడో టైటిల్‌ అందుకుంది. అయితే అనూహ్యంగా గతేడాది సీజన్‌ ప్రారంభానికి ముందు జరిగిన వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌ సహా పలు కీలక ఆటగాళ్లను వదులుకొని కేకేఆర్‌ మూల్యం చెల్లించుకుంది. 

    కానీ ఈసారి మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో తమ బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేసుకుంది. ఇటీవలే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఫిన్‌ అలెన్‌ సహా టిమ్‌ సీఫెర్ట్‌, రచిన్‌ రవీంద్ర, కామెరున్‌ గ్రీన్‌లను సొంతం చేసుకుంది. 

    అయితే ఇప్పటికే విదేశీ కోటాలో సునీల్‌ నరైన్‌, బ్లెస్సింగ్‌ ముజరబాని, రోవ్‌మెన్‌ పావెల్‌, పతిరానా ఉన్నారు. మరి ఇంతమందిలో ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. ఇక పేసర్‌ హర్షిత్‌ రాణా గాయంతో ఈ సీజన్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్‌  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌ మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.

    చదవండి: కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్‌ అతడే!

  • టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్‌లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్‌ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నాడు. 

    తాజాగా కోహ్లీ తన బెస్ట్‌ టీ20 ఓపెనర్‌గా విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్‌ టీ20 ఓపెనర్‌గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్‌ కోహ్లీని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రశ్న వేసింది. 

    అయితే మొదట సచిన్‌, సెహ్వాగ్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్‌ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్‌’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్‌ చాయిస్‌లో రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్‌ను కాదని ఆర్‌సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్‌కే ఓటేశాడు. 

    రోహిత్‌, సెహ్వాగ్‌ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్‌గా గేల్‌ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలవాలన్న కోరిక గేల్‌లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్‌ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్‌ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. 

    ఇక గతేడాది ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌ల్లో 132 స్ట్రైక్‌రేట్‌ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్‌ సెంచరీలున్నాయి. 2025 సీజన్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్‌ కింగ్స్‌పై విజయం సాధించి తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.

    చదవండి: ‘అభిషేక్‌ను అందుకే వెనుకేసుకొచ్చా’

  • ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్‌ వరకు అభిషేక్‌ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మాత్రం అభిషేక్‌కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. 

    మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్‌ మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్‌ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. 

    ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్‌ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్‌ సమయంలో నేను చాలా బ్యాడ్‌ఫేస్‌ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. 

    ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్‌ కంటే ఫామ్‌ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్‌ అక్కడ ఫామ్‌ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్‌ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. 

    కానీ ఒక బ్యాటర్‌  20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్‌ను అంచనా వేయగలం. అయితే అభిషేక్‌ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్‌గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్‌ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్‌ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.

    అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు డకౌట్‌ అయిన అభిషేక్‌ శర్మ న్యూజిలాండ్‌ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియా కప్‌ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. 

    చదవండి: అభిషేక్‌ను చూసి అసూయపడేవారు!

  • పాకిస్థాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు సాధించింది. ఢాకా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమిమ్‌ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. 

    చివర్లో తౌహిద్‌ హృదోయ్‌ (44 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు),లిటన్‌ దాస్‌ (51 బంతుల్లో 41) రాణించారు. పాకిస్థాన్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 3 వికెట్లతో రాణించాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌కు మొగ్గు చూపిన పాకిస్థాన్‌ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  బౌలింగ్‌తో బంగ్లాను కట్టడి చేయాలని భావించిన పాకిస్థాన్‌కు ఆది నుంచే హంసపాదు ఎదురయ్యింది. 

    ఓపెనర్లు తంజిద్‌, సైఫ్‌ హసన్‌లు తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడింది. 36 పరుగులు చేసిన సైఫ్‌ హసన్‌ షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత నజ్ముల్‌ హసన్‌ (27)తో కలిసి తంజిద్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ దశలో 107 బంతుల్లో తంజిద్‌ తన వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆఖర్లో లిటన్‌ దాస్‌, తౌహిద్‌ హృదోయ్‌ ధాటిగా ఆడడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే చెరో వన్డే మ్యాచ్‌ గెలవడంతో మూడో వన్డే సిరీస్‌ విజేత ఎవరో తేల్చనుంది.

    చదవండి: 12 కోట్ల కారుతో తళుక్కుమన్న హార్దిక్‌

  • టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొత్త కారుతో దర్శనమిచ్చాడు. 12 కోట్ల విలువ చేసే ఫెరారీ 12 సిలిండ్రీ కారును తన గ్యారేజీలోకి తీసుకొచ్చాడు. నలుపు రంగులో ఉన్న ఫెరారీ కారును తానే సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. 

    కారులో అతడి పక్కనే తన గర్ల్‌ఫ్రెండ్‌ మిహికా శర్మ కూడా ఉండడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ అభిమాని తన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా హార్దిక్‌ పాండ్యా వద్ద ఇప్పటికే రోల్స్‌ రాయ్స్‌ ఫాంటమ్‌, లంబోర్గిని హురాకాన్‌ ఈవీవో, లంబోర్గిని యూరస్‌, మెర్సిడెస్‌ -ఏజీఎం జీ63, రేంజ్‌ రోవర్‌., ఆడీ ఏ6 కార్లు ఉన్నాయి.

    తాజాగా వీటి సరసన ఫెరారీ కారు వచ్చి చేరింది. ఇక హార్దిక్‌ పాండ్యా టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో 160 స్ట్రైక్‌రేట్‌ 217 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చూపిన హార్దిక్‌ 9 వికెట్లు పడగొట్టి తన పాత్రకు న్యాయం చేశాడు. 

    అయితే టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత టీమిండియా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో హార్దిక్‌ పాండ్యా జాతీయజెండాను శరీరానికి కప్పుకొని ఉన్న సమయంలోనే అతడి ప్రేయసి మిహికా శర్మ అతని చెంపపై ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడ‌ని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వ‌కేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

    చదవండి: తంజిద్‌ తొలి శతకం.. బంగ్లా భారీస్కోరు!

     

  • టీమిండియా స్టార్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ వేదికగా శాంసన్‌ అభిషేక్‌తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్‌ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్‌ పేర్కొన్నాడు.

    అభిషేక్‌ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్‌ అండ్‌ ఫైర్‌ కాదు.. ఫైర్‌ అండ్‌ ఫైర్‌. ఒకసారి అభిషేక్‌ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్‌ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్‌షిప్‌ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. 

    మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్‌ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్‌ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్‌ సిక్స్‌ కొట్టడం జరిగిపోతాయి. 

    పెళ్లి చేసుకో భాయ్‌..
    అభిషేక్‌ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్‌తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్‌ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్‌.. అభిషేక్‌ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్‌ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్‌స్టార్‌. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్‌ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. 

    ఇక టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించడంతో భారత్‌ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్‌ 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.

    ఇద్దరి కథ ఒకటే..
    అయితే టీ20 ప్రపంచకప్‌ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్‌ కోల్పోయి అభిషేక్‌ శర్మ సతమతమవ్వగా, శాంసన్‌ కూడా అభిషేక్‌ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. 

    అయితే సూపర్‌-8లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్న శాంసన్‌ దానిని ఫైనల్‌ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్‌పై నమ్మకంతో జట్టు మేనేజ్‌మెంట్‌ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్‌ శర్మ తన మార్క్‌ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

  • స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది. ఇండియానా వెల్స్‌ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదెవ్‌ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్‌ ఓటమి చవిచూశాడు. 

    కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్‌లో మెద్వదెవ్‌ను అల్కరాజ్‌ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్‌ను మెద్వదెవ్‌ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో అల్కరాజ్, మెద్వదెవ్‌ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. 

    అయితే టైబ్రేక్‌లో మెద్వదెవ్‌ మరోసారి తన స్ట్రోక్‌ పవర్‌ చూపించి అల్కరాజ్‌ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్‌ ఇండియన్‌ వెల్స్‌  టోర్నీ సెమీఫైనల్‌ వరకు వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఒక టైటిల్‌ ఫెవరెట్‌గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్‌ కాలిఫోర్నియన్‌ డెసెర్ట్‌లో వరుసగా మూడో టైటిల్‌ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్‌ గండి కొట్టాడు. 

    మరోవైపు మెద్వదెవ్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్‌ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్‌ విజయం సాధించాడు. ఇక ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో మెద్వదెవ్‌ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్‌ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితమయ్యాడు. 

    తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్‌ సాధించాలనే కసితో మెద్వదెవ్‌ ఉన్నాడు. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ జానిక్‌ సిన్నర్‌ 6-2, 6-4తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సిన్నర్‌తో మెద్వదెవ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

    చదవండి: ‘పాక్‌, బంగ్లా నాటకం ఫలించలేదు’

  • ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది. 

    అయినా కూడా బంగ్లాదేశ్‌ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ ఆడబోమని పాకిస్థాన్‌ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. 

    తాజాగా టీ20 ప్రపంచకప్‌ ముంగిట పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్‌ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం.  పాక్‌, బంగ్లాదేశ్‌ నాటకాలు ఫలించలేదు.

    ఐసీసీ చైర్మన్‌గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్‌ వ్యూయర్‌షిప్‌ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్‌ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. 

    భారత్‌కు అమెరికా, పాకిస్థాన్‌కు నెదర్లాండ్స్‌ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు నేపాల్‌ ఓటమి భయం చూపించింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు ప్రత్యేక మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

  • న్యూజిలాండ్‌ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

    మార్‌క్రమ్‌, డికాక్‌, రబాడ, ఎంగిడి వంటి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్‌ మహారాజ్‌ సారథ్యంలో ప్రోటీస్‌ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ల దాటికి కివీస్‌ బ్యాటర్లు విల్లవిల్లాడారు. 

    కివీస్‌ బ్యాటర్లలో నీషమ్‌(26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్‌ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్‌, కేశవ్‌ మహారాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

    అనంతరం 92 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమించింది. కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హైజెన్(45) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఫలితంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17న జరగనుంది.
    చదవండి: మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

  • మౌంట్ మౌంగానుయ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సఫారీ బౌలర్ల దాటికి బ్లాక్‌ క్యాప్స్‌ బ్యాటర్లు విల్లవిల్లాడారు.

    దీంతో న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. స్టార్‌ బ్యాటర్లు ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫెర్ట్‌, రచిన్‌ రవీం‍ద్ర, మిచెల్‌ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అయితే డెవాన్‌ కాన్వే(1), టామ్‌ లాథమ్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికి తమ మార్క్‌ చూపించలేకపోయారు.

    ప్రోటీస్‌ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్‌, కేశవ్‌ మహారాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. మౌంట్ మౌంగానుయ్‌ వేదికలో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఇంతకుముందు ఈ వేదికలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌ 105 పరుగులకు ఆలౌటైంది.

    తుది జట్లు
    దక్షిణాఫ్రికా: కానర్ ఎస్టర్‌హుయిజెన్(వికెట్‌ కీపర్‌), జోర్డాన్ హెర్మాన్, టోనీ డి జోర్జీ, రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫారెస్టర్, జార్జ్ లిండే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్‌), న్కోబాని మోకోనా, ఓట్నీల్ బార్ట్‌మన్

    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్‌కీపర్‌), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కోల్ మెక్‌కాంచీ, కైల్ జామిసన్, బెన్ సియర్స్
    చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు టీమిండియా స్టార్‌, రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దిగ్గ‌జం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఈ కొత్త లుక్‌ను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడి​యోను జార్డన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

    దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. కోహ్లి దాదాపు ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లోనూ కొత్త లుక్‌తో బరిలోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన న్యూ లుక్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కాగా విరాట్‌ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నాడు.  కోహ్లి త్వరలోనే ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు.

    ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌ 19వ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

    తొలిసారి ఛాంపియన్స్‌
    కాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ గతేడాది తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్‌ కోహ్లిది కీలక పాత్ర. గత సీజన్‌లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఈ ఏడాది సీజన్‌లో కొనసాగించాలని చేజ్‌ మాస్టర్‌ ఉవ్విళ్ళూరుతున్నాడు. తను చివరిగా ఆడిన న్యూజిలాండ్‌ సిరీస్‌లోనూ కోహ్లి దుమ్మలేపాడు.
    చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌
     

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో శనివారం దేవిశా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    దీంతో సూర్య- దేవిశా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికి 2010లో ముంబైలోని ఆర్‌.ఎ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఈ జంట 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

    ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. దేవిషా వృత్తిరీత్యా భరతనాట్యం కోచ్. ఆమె సూర్య కెరీర్ ఆరంభం నుంచి అతడికి అండగా ఉంటూ వస్తోంది. ఎన్నో సందర్బాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. కాగా సూర్య ఇటీవల కెప్టెన్‌గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే.


    చదవండి: సన్‌రైజర్స్‌కు పాక్‌ ప్లేయర్‌ ఆడడం కష్టమే?

     

Movies

  • బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ.  బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో ‍అదరగొట్టేసింది. ఈ షో ద్వారా టాలీవుడ్‌లో మరింత ఫేమస్ ‍అయింది.  ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది.

    తాజాగా అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన మొహానికి గాయాలైనట్లు వెల్లడించింది. ఉదయాన్నే కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తుంటే కిందపడ్డానని బిగ్‌బాస్ బ్యూటీ తెలిపింది. ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదని ‍అశ్విని బాధను వ్యక్తం చేసింది. ఫేస్‌కు తగలడంతో చాలా నొప్పిగా ఉందని తన బాధను పంచుకుంది. మీరంతా నాకోసం ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     

     

  • ఇండియన్‌ బిగ్‌స్క్రీన్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్‌ వండర్‌గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.

    రామాయణ సినిమా
    ఈ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్‌ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్‌ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.

    కుంభకర్ణుడిగా..
    అతడే ఫైజల్‌ మాలిక్‌. పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్‌ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్‌సైడ్‌ వర్గాల టాక్‌! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్‌ చేయనున్నారు.

    సినిమాలు, సిరీస్‌లు
    ఫైజల్‌ మాలిక్‌.. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ సినిమాలో కామెడీ పోలీస్‌గా నటించాడు. పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌లో డిప్యూటీ ప్రధాన్‌ ప్రహ్లాద్‌చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్‌లు చేశాడు. చివరగా హారర్‌ కామెడీ మూవీ థామాలో పోలీస్‌గా కనిపించాడు.

    చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్‌

  • ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.

    ప్రస్తుతం ఈ మూవీపై పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కోలీవుడ్ ప్రమఖులు ముఖ్యంగా ప్రియాంక మోహన్‌ నటనను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ట్వీట్ చేశారు. మనసుకు నచ్చే అద్భుతమైన కథనం, దృశ్యాలు, ప్రియాంక మోహన్ పాత్రలోని అమాయకత్వం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రియాంక మోహన్‌ చాలా అద్భుతంగా నటించారని అన్నారు. డైరెక్టర్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు చెబుతూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

    నంబర్‌వన్‌గా ట్రెండింగ్..

    ఈనెల 12న స్ట్రీమింగ్‌ వచ్చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నంబర్‌వన్‌గా ట్రెండ్ ‍అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 
     

     

  • సల్మాన​ ఖాన్‌ 'వీర్‌' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్‌ ఖాన్‌. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌ చేసింది. అయితే హేట్‌ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్‌ ఖాన్‌.

    ముందో మాట చెప్పి..
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. హేట్‌ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్‌ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్‌ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్‌ మహదేవన్‌ అక్సర్‌ 2 సినిమా ఆఫర్‌ చేశారు. అయితే ఇందులో బోల్డ్‌ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్‌ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. 

    చెప్పిందొకటి.. చేసిందొకటి
    కానీ, సెట్‌కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్‌ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్‌ ఒకరకంగా చెప్పి షూటింగ్‌ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.

    ఎంత అన్యాయం?
    నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్‌కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్‌ చెప్పుకొచ్చింది.

    చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్‌.. నాకు లాభమే లేదు: విజయ్‌ సేతుపతి

  • ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 

    అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్‌తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్‌లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్‌ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

     

  • సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ కాలేదంటున్నాడు తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి.

    ఆ నాలుగు ఫ్లాప్‌
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్‌లో సంగుతేవన్‌ అనే సినిమా స్టార్ట్‌ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్‌ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. 

    సినిమా
    బాక్సాఫీస్‌ లెక్కలపరంగా అవి ఫ్లాప్‌ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్‌ దర్శకత్వంలో ట్రైన్‌ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్‌ నోవెల్‌, జైలర్‌ 2, అరసన్‌తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.

    చదవండి:  నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్‌

  • ఇటీవలే టాలీవుడ్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. ఇరువురి సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో ‍అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే సందడి చేశారు.

    తాజాగా ఇవాళ విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్‌ డే కావడంతో వదినమ్మ రష్మిక స్పెషల్ విషెస్ తెలిపింది. మరిది ఆనంద్‌ దేవరకొండతో కలిసి డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్‌ దేవరకొండతో పెళ్లి తర్వాత ఆనంద్ జరుపుకుంటోన్న తొలి పుట్టనరోజు కావడం మరో విశేషం. 

     

  • మలయాళ టాప్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్‌ 1 చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించింది.

    కలలో కూడా అనుకోలే
    అయితే ఆమె హీరోయిన్‌ అవడానికి కింగ్‌ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్‌. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్‌కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్‌ చదివింది. ఆ‍ర్కిటెక్ట్‌ అవ్వాలనుకుంది. 

    నాగార్జున ఫోన్‌ చేయడంతో..
    కానీ, సడన్‌గా ఒకసారి నాగార్జున ఫోన్‌ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్‌ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. 

    సినిమా తప్ప..
    ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్‌ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్‌కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్‌  చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్‌ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్‌ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.

    చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్‌ పవన్‌

  • ప్రియదర్శి, ద్రిషిక చందర్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం సుయోధన. ఈ సినిమాకు వైఎస్ మాధవరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అసలు ఈ స్టోరీ నీకు ఎక్కడ దొరికింది? అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. టీజర్ చూస్తుంటే దుర్యోధనుడిలా కనిపించే ఓ వ్యక్తి వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తుకు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్వీట్‌ చేయడంపై చిన్మయి మండిపడింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తుకు అభినందనలు చెప్పడంపై చిన్మయి అభ్యంతరం వ్యక్తం చేశారు.

    తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్ కల్యాణ్‌ గారికి ఆ కవి గురించి ఏమీ తెలియదని నాకు కచ్చితంగా తెలుసు.. ఎంతోమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆయనకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం నుంచి అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్‌ చేసింది. ‍అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

    కాగా.. మీటూ ఉద్యమ సమయంలో ప్రముఖ లిరిసిస్ట్ అయిన వైరముత్తుపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. చిన్మయితో పాటు పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ చిన్మయి తన వాదన వినిపిస్తూనే ఉంది.

  • సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్‌ (Oscar Awards 2026) అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌ ఈ వేడుకకు వేదికైంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ రోజు(మార్చి 15) సాయంత్రం ఈ వేడుక జరుగుతుంది.టైమ్ జోన్ వ్యత్యాసం కారణంగా, ఇండియాలో మనం మార్చి 16 (సోమవారం) ఉదయం చూడాల్సి ఉంటుంది. రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్‌ సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రధాన అవార్డుల వేడుక ఉదయం 4:30 గంటలకు మొదలవుతుంది.

    లైవ్‌ ఎక్కడ చూడొచ్చు?
    టీవీలో లేదా మొబైల్‌లో ఆస్కార్ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఓటీటీ విషయానికొస్తే.. జియోస్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టెలివిజన్‌ ప్రసారం విషయానికి వస్తే... ఈ అవార్డుల వేడుకను స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్, కలర్స్ ఇన్ఫినిటీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నారు. ఒకవేళ మీరు ఉదయాన్నే లైవ్ మిస్ అయితే, అదే రోజు (సోమవారం) రాత్రి 9 గంటలకు కు ఈ ఛానెల్‌లలో మళ్లీ ప్రసారం చేస్తారు.

    హోస్ట్‌ ఎవరు?
    ప్రముఖ కమెడియన్ కోనన్ ఓ'బ్రియన్ (Conan O'Brien) ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ ఏడాది అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా పాల్గొంటున్నారు.

    ఇండియాకు నిరాశే..
    98వ ఆస్కార్‌ అవార్డ్సులో భారత్‌కు నిరాశే ఎదురైంది. మనదేశం నుంచి ఒక్క చిత్రం కూడా అవార్డు రేసులో నిలవలేదు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్‌’ను పంపింది. కానీ నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సారి ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్‌ డికాప్రియో, ఈథన్‌ హాక్, మైఖేల్‌ బి జోర్డాన్, వాగ్నర్‌ మౌరా పోటీ పడుతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి.

  • బిగ్‌బాస్‌ షోలో కొందరు ఎంత బాగా ఆడినా సరే ఎక్కువ హైలైట్‌ అవరు. అండర్‌ రేటెడ్‌ కంటెస్టెంట్‌గానే మిగిలిపోతారు. డిమాన్‌ పవన్‌ కూడా అదే కోవకి చెందుతాడు. అగ్నిపరీక్షను నెగ్గి తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. కానీ రీతూతో ఫ్రెండ్‌షిప్‌ కాస్త హద్దులు దాటడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. 

    బిగ్‌బాస్‌తో గుర్తింపు
    వీరి లవ్‌ ట్రాక్‌ను కొందరు ఇష్టపడితే మరికొందరు అసహ్యించుకున్నారు. ఫలితంగా అతడి లవ్‌ ట్రాక్‌ తన కష్టాన్ని కప్పేసింది. మాటల్లో మెచ్యూరిటీ చూపించే అతడు రీతూ ఎలిమినేట్‌ అయ్యాక ఫుల్‌ హుషారుగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో సీజన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. తన తండ్రి టంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పటికీ, ఎన్నడూ అది చెప్పి సింపతీ సాధించాలనుకోలేదు.

    తొలిసారి విమానం
    ఫైనల్స్‌లో మాత్రం తండ్రి చికిత్స కోసం రూ. 15 లక్షల క్యాష్‌ప్రైజ్‌ అందుకుని బయటకు వచ్చాడు. కానీ పవన్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవలే పవన్‌ తండ్రి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్ట్‌ పెట్టాడు. జీవితంలో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు తెలిపాడు. ఇది నా జీవితంలో ఫస్ట్‌ ఫ్లైట్‌.. అమ్మానాన్నతో లేదా బెస్ట్‌ఫ్రెండ్స్‌తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనే విమానం ఎక్కాలనుకున్నాను. 

    దేవుడు నాకిలా రాసిపెట్టాడు
    ఎందుకంటే అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడు.. మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్‌ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం అని పవన్‌ పేర్కొన్నాడు.

     

     

    చదవండి: పురుషులే బాధితులా? హీరో భార్య కౌంటర్‌

  • విరాట్‌ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్‌ ప్రధానపాత్రల్లో వస్తోన్న తాజా నాగబంధం. ఈ మూవీకి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ చేశారు. నమో రే నమోరే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్‌ అందించగా.. జునైద్‌ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి
    ఆలపించారు. 

    ఈ మూవీని ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన నమో రే పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ  సాగే ఈ ఆధ్యాత్మిక పాటకు వెయ్యి మంది డ్యాన్సర్స్‌ పాల్గొనగా.. భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించేలా అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 


     

  • ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్‌ కెనీషా ఫ్రాన్సిస్‌) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్‌ జంట రవి మోహన్‌- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.

    పురుషులే అసలైన బాధితులు
    ఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్‌ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.

    పిల్లల్ని ఎవరు పెంచారు?
    అతడి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!

    ఎందుకీ దొంగ ఏడుపు?
    నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్‌. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్‌ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? 

    అదే పని ఆర్తి చేస్తే..
    ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌ను ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది.

     

     

    చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్‌బాబు

  • దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్‌ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్‌ లైఫ్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన  పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ  చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

    ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో  ఫేక్‌ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.

    వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్‌ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్‌ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక  వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ'  కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్‌ను గత సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.

    ముస్కాన్‌ నాన్సీ విషయానికొస్తే..  ఈమె ఒక బుల్లితెర నటి.  తొడి ఖుషి తొడె ఘమ్‌ సీరియల్‌లో సహాయక నటిగా యాక్ట్‌ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్‌, ఫియర్‌ ఫైల్స్‌, క్రైమ్‌ పెట్రోల్‌ షోలలో పాల్గొంది. భారత్‌ కా వీర్‌ పుత్ర: మహారాణ ప్రతాప్‌, ఏజెంట్‌ రాఘవ్‌- క్రైమ్‌ బ్రాంచ్‌ షోలలో నటించింది.  2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.

  • సినీ చిత్రపరిశ్రమలో 50 ఏళ్ల నటజీవితాన్ని ఊహించలేదంటున్నారు విలక్షణ నటుడు మోహన్‌బాబు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెండేళ్లకే మళ్లీ ఊరిబాట పడతాననుకున్నానని, కానీ సుదీర్ఘకాలంగా నటుడిగా కొనసాగుతున్నానన్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975 నవంబర్‌ 22న నా మొదటి సినిమా స్వర్గం- నరకం విడుదలైంది. 

    50 ఏళ్లలో..
    ఏడాదో, రెండేళ్లు ఇక్కడుంటాను.. తర్వాత సినిమాలుండవు, ఊరికెళ్లిపోవాల్సిందే అనుకున్నాను. అలాంటిది 50 ఏళ్లలో 560 సినిమాలు చేశాను. విభిన్న పాత్రలు.. ఒకదాన్ని మించి మరొకటి చేశాను. తల్లిదండ్రులు, భగవంతులు, నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇదంతా సాధ్యమైంది.

    అది చూసి ఆశ్చర్యపోతుంటా..
    విద్యార్థులారా.. మీకన్నీ తెలుసు.. ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఎలా బతకాలి? అన్నీ మీకు తెలుసు. మీ వయసులో నేనున్నప్పుడు ఈ కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు సెల్‌ఫోన్లు.. అవి తల్లిదండ్రుల సంపాదనతో కొన్నవే! అది చూసి ఆశ్చర్యపోతుంటాను. ఒక పూట భోజనం చేసి, గంజి తాగి పిల్లల్ని స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులెంతోమంది!

    ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
    అలాంటివాళ్లెందరికో మేము సాయం చేశాం, చేస్తూనే ఉన్నాం. మీరందరూ ఏది మంచిదారి, ఏది చెడుదారి ఆలోచించుకుని ముందుకెళ్లాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. వారి పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం? కాబట్టి మంచి మార్గంలో ప్రయాణించండి అని విద్యార్థులకు మోహన్‌బాబు సూచించారు.

    చదవండి: ఉస్తాద్‌ కోసం శ్రీలీల అంత పారితోషికం తీసుకుందా?

Family

  • రాజు గురువు: ద్విజులు సత్కర్మ నిరతులై ఉందురు. రాజులు, ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి  బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి ప్రదర్శించెదరు.

    మంత్రి  కుజుడు: కలహములు, యుద్ధ, చోర, అగ్ని, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికము. వర్షము మధ్యమముగా ఉండును. పంటలకు తెగుళ్ళు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగును. 

    సేనాధిపతి  చంద్రుడు: ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండును. సస్యములు బాగుగా ఫలించును. పశువులు క్షీరసమృద్ధి కలిగి ఉండును.

    సస్యాధిపతి  శుక్రుడు: పంటలు బాగుగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉండును.

    ధాన్యాధిపతి  బుధుడు: మధ్యస్థాయి వర్షములు పంటలు మధ్యస్థాయిగా ఫలించును. జనులకు భయము కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును.

    అర్ఘాధిపతి రవి: సువృష్టి సస్యాభివద్ధి కలుగును. ధరలు అధికం అవుతాయి. రాజులు సుఖించెదరు. ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. నిత్యావసర సరుకులు ధరలు పెరుగును.

    మేఘాధిపతి చంద్రుడు: సర్వదేశములందు సువృష్టి. ధాన్యజాతులు అన్నియు ఫలించును. గోవులు విశేషంగా పాలిచ్చును.

    రసాధిపతి రవి: నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రస జాతుల ధరలు లేనట్లుండును. ‘‘కార్పాస తైలేక్షు గుడాదికానాః’’ అని పాఠాంతరం ఉన్నది.

    నీరసాధిపతి శుక్రుడు: కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును.

    -పంచాంగ కర్త
    శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు

    ఫోన్లు: 08676 2414336 /98485 20336

  • ∙డొల్లు కర్తరీ ప్రారంభం: ది.04–05–2026 రా.12:59లకు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ సోమవారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం. ∙పెద్ద కర్తరీ ప్రారంభం: ది.11–05–2026 రా.11:00లకు వైశాఖ బహుళ నవమి తత్కాల దశమి సోమవారం నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. ∙కర్తరీ త్యాగం: 29–05–2026 ఉ.7:57 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ శుక్రవారం రోజు కర్తరీ త్యాగం అవుతుంది. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మల ప్రారంభానికి కర్తరీ కాలంలో చేయరాదు. 

    దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్‌లు, పెంకుటిళ్ళు, పైకప్పు పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ∙రాబోవు ప్లవంగ నామ సంవత్సరం (2027–28) కర్తరీ నిర్ణయము ∙ది.05–05–2027 ప్లవంగ చైత్ర బహుళ చతుర్దశీ బుధవారం డొల్లు కర్తరీ ప్రారంభం. ∙ది.12–05–2027 వైశాఖ శుద్ధ సప్తమీ మంగళ/బుధ నిజ కర్తరీ ప్రారంభం.

    ∙ది.29–05– 2027 వైశాఖ బహుళ నవమీ శనివారం కర్తరీ త్యాగం. (సౌరమానం, చాంద్రమానం బార్హస్పత్య మానం అన్ని పంచాంగాలలోనూ కేవలం మాసం యొక్క ఆరంభం మార్పు తీసుకుంటుంది. చాంద్రమానం వారికి అమావాస్య వెళ్ళిన మరునాడు మాసం ప్రారంభం అవుతుంది. సౌరమానం వారికి రవి సంక్రమణం మరునాటి నుండి మాసం ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని అంశాలలోనూ తిథి, వార నక్షత్రాలు ఒక్కటే ఉంటాయి.)

    -పంచాంగ కర్త
    శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు
    ఫోన్లు: 08676 2414336 /98485 20336

  • ఒక కంటితో చూపు.. ఏం మాట్లాడినా వినపడదు.. ఏది చెప్పాలన్నా మాటలేదు.. ఆలోచనా శక్తి లేదు.. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడినే ఓ తల్లి ‘ప్రేరణ’గా మార్చుకుంది. తన కుమారుడి వంటి ఎంతో మంది పిల్లలను అమ్మగా లాలిస్తోంది. వారి ఆలనా పాలనా చూస్తోంది. వారి సంక్షేమమే తప్ప ఎలాంటి లాభాపేక్ష  లేకుండా దాదాపు 22 ఏళ్లుగా స్పెషల్‌ స్కూల్‌ నడుపుతోంది. ఇలాంటి పిల్లలంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన ఈ అమ్మ..

    మలక్‌పేటకు చెందిన తొగరుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్‌బాగ్‌ పల్టాన్‌లో నలుగురితో ‘ప్రేరణ స్పెషల్‌ స్కూల్‌’ ప్రారంభించింది. వయసు భేదం లేకుండా 22 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది, టీచర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో ఓ స్కూల్‌ నడిపిస్తోంది.  

    పిల్లలకు స్వశక్తిలో శిక్షణ.. 
    ఇక్కడ ఎక్కువ మంది సెరిబ్రల్‌ పాల్సీ, స్పాస్టిక్‌ చి్రల్డన్స్‌ ఉన్నారు. మెంటల్లీ చాలెంజ్‌ పిల్లలకు స్వీయరక్షణ, మాట్లాడటం, ఫిజియోథెరపీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ రకరకాల వాటితో పాటు కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్, పేరంటల్‌ గైడెన్స్‌ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. మైనంతో దీపాలు, గ్రీటింగ్‌ కార్డులు, స్క్రీన్‌ ప్రింటింగ్, ఆఫీస్‌ ఫైల్స్‌ చేయించడంలో తరీ్ఫదు ఇస్తున్నారు. 

    పప్పుల ప్యాకింగ్, బుక్‌ బైడింగ్, ఆడపిల్లలకు వంటింటి పనులు నేర్పిస్తున్నారు. నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్లి తిరిగి రావడం, రైలు, బస్సు రిజర్వేషన్లు చేయించడం, అక్షరాలు చదవగలగడం వంటి తదితర వాటిని నేర్పిస్తారు.

    ఆత్మవిశ్వాసంతో.. 
    మెంటల్లీ చాలెంజ్‌డ్‌ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి.. వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో వారికి శిక్షణ అందిస్తే ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఆ పనిని సవాల్‌గా తీసుకుంటే ఎవరిపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఒక కన్నుతోనే చూసి.. వినపడని, మాట్లాడలేని, మానసికంగా ఎదగని నా కొడుకు వంశీ నాకు ‘ప్రేరణ’. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మాది.
    తొగరుచేడు విజయలక్ష్మి, ప్రేరణ స్పెషల్‌ స్కూల్‌ నిర్వాహకురాలు  

    (చదవండి: డెలివరీ బాయ్‌గా 78 ఏళ్ల వ్యక్తి..!)

  • జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా స్పందించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అది చెప్పినంత సులువు కాదు. ఒక్కోసారి ఈ వయసులో ఇంత కష్టమా అని తల్లడిల్లిపోతాం. కానీ కొందరే ధైర్యంగా ఎదురెళ్లతారు. అలాంటి వాళ్లకు ఆ దేవుడు సదా తోడుగా ఉంటాడనేందుకు ఈ తాతగారే ఉదాహరణ.

    అమెరికాలోని టేనస్సీలోని మాంచెస్టర్‌కు చెందిన రిచర్డ్ పుల్లీ అనే 78 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ వయసులో ఆ తాతగారి ఏం కష్టం వచ్చిందో అనిపిస్తుంది అతడు పడుతున్న తపన చూస్తే. వస్తువులను డెలివరీ చేసేందుకు వెళ్తున్నప్పుడూ.. వయసురీత్యా జారిపోయే అవకాశం ఉండటంతో ఎంతో జాగ్రత్తగా డెలివరీ చేస్తుంటాడు. నిజం చెప్పాలంటే అతడు తీసుకుంటున్న శ్రద్ధను చూస్తే ముచ్చటేస్తుంది. ఇంతలా కష్టపడుతూ డెలివరీ చేయడం ఎందుకని బాధ కూడా కలుగుతుంది. 

    అలానే అనుకుంది బ్రిటనీ స్మిత్ అనే మహిళ కూడా స్టార్‌బక్స్‌ ఆర్డర్స్‌ డెలివరీ చేస్తున్న రిచర్డ్ పుల్లీని చూసి. అతడు డెలివరీ చేస్తున్న విధానానికి ఫిదా అయ్యి అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ..ఆ తాతగారి గురించి వివరించింది. ఆయన ఏడుపదుల వయసులో ఎందుకు ఇంకా పనిచేస్తున్నాడో కూడా తెలిపింది. ఫుల్లీ తన భార్య వైద్య ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుపుతాడు. తన భార్య ఆమె తప్పిదం లేకుండానే ఉద్యోగం కోల్పోయిందని చెప్పుకొచ్చాడు ఫుల్లీ. 

    దాని ఫలితంగా ఆమె ఆరోగ్య భీమా కూడా కోల్పోయింది. అందువల్ల తాను తమ జీవన ఖర్చుల తోపాటు మందులు, వైద్య ఖర్చులకు లెక్క చూస్తే..నెలాఖరుకి ఏమి ఉండదు. అందువల్ల ఇలా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు ఫుల్‌. తమది 56 ఏళ్ల వైవాహిక బంధమని చెప్పాడు. తన భార్య ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి ఒక ఏడాదికిపైగా ఇలా డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

    దాంతో బ్రిటనీ స్మిత్‌ ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో GoFundMe ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు అండగా నిలిచేందుకు, వారి ఖర్చుల నిర్వహణలో సహాయపడేందుకు వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చారు. ఏకంగా రూ. 4.5 కోట్లు దాక విరాళం రావడం విశేషం. 

    (చదవండి: రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు టర్నోవర్‌..)
     

  • ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్‌లో పైల్స్‌ అనీ, హిమరాయిడ్స్‌ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 

    మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. 

    ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు  ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...

    కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)

    స్థూలకాయం 

    హై΄ో థైరాయిడిజం 

    మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్ల

    శారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతో

    దీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు 

    నివారణ / చికిత్స... 
    మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి.  అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

    ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్‌ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. 

    ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్‌ ప్రోసీజర్‌ ఫర్‌ హీమరాయిడ్స్‌ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్‌’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. 

    లక్షణాలు... 
    మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... 

    మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) 

    కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడం

    కొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం 

    మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.

    కొందరిలో అరుదుగా నొప్పి... 
    పైల్స్‌ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్‌తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్‌) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.
    డాక్టర్‌ ఆసిఫ్‌ మెహరాజ్‌, సీనియర్‌ కోలోరెక్టల్‌ సర్జన్‌ 

    (చదవండి:  జీఎస్‌ఎమ్‌’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!)

  • మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్‌గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్‌ ఆఫ్‌ మెనోపాజ్‌’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్‌ఎమ్‌’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్‌ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్‌... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్‌గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.

    సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్‌ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్‌ వచ్చివారిలో 50% మంది జీఎస్‌ఎమ్‌ సమస్యతో బాధపడుతున్నారు. 

    ఇక మెనోపాజ్‌ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్‌ఎమ్‌ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్‌ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్‌ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్‌ఎమ్‌ కనిపిస్తోంది. 

    పేరును బట్టి కేవలం మెనోపాజ్‌ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్‌ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్‌ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.

    తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... 
    సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్‌కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.

    గుర్తించడమెలా (డయాగ్నసిస్‌) 
    జీఎస్‌ఎమ్‌కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్‌ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్‌) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్‌ దగ్గర చెప్పుకుంటే చాలు.

    చికిత్స  
    ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్‌ / ఇన్‌ఫ్లమేషన్‌ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్‌ సూచించడం వంటివి. 

    అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్‌ హార్మోనల్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీగా హార్మోన్‌లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్‌ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.

    సమస్య ఎందుకొస్తుందంటే... 
    సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్‌... వారి ప్రైవేట్‌ పార్ట్స్‌ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్‌ తర్వాత ప్రైవేట్‌ పార్ట్స్‌  పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్‌గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.

    డాక్టర్‌ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌ – గైనకాలజిస్ట్‌ 

  • సింగల్‌ మదర్‌ సక్సెస్‌ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్‌ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్‌ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్‌కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..

    చైనాలో డాంగ్‌ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌలో నిర్మించిన డాంగ్‌ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్‌ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. 

    ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. 

    అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్‌. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్‌ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్‌ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. 

    బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్‌ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. 

    అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్‌తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ను నిర్మించింది. ఈ బ్రాండ్‌కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది.  నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. 

    (చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!)
     

  • బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్‌లాస్‌ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్‌ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్‌చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్‌ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!

    పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్‌ ప్రాక్టీషనర్‌ డాక్టర్‌ సయాజిరావ్‌ గైక్వాడ్‌ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్‌లాస్‌ కోసం వచ్చారని అన్నారు.  సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్‌ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. 

    ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి  వాపు, ఎల్‌డీఎల్‌ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్‌డైట్‌ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.

    రెండుపూటలా తినడం..
    ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.

    ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి
    నిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్‌ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్‌ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.

    శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తొలగించారు
    తరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.

    ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..
    నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

    ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి
    బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు  చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని,  అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.

    రోజుకు 30-40 నిమిషాలు నడవండి
    నిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.

    స్థిరంగా ఉండండి
    బరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్‌ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్‌లాస్‌ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్‌ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్‌ సయాజిరావ్‌ గైక్వాడ్‌. 

     

    (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..)
     

Business

  • భారతదేశం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి దిక్సూచిగా మారుతోందని ఎన్‌ఎక్స్‌టీ ఫౌండేషన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ‘భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025-26’ పేరుతో విడుదలైన విశ్లేషణలో గడిచిన ఏడాది కాలంలో దేశం సాధించిన 101 చారిత్రాత్మక విజయాలను ఆవిష్కరించింది. డిజిటల్ విప్లవం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, మౌలిక సదుపాయాల కల్పన నుంచి హరిత ఇంధనం వరకు భారత్ వృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని చెప్పింది.

    జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..

    ఎన్‌ఎక్స్‌టీ నివేదిక ప్రకారం.. 2025లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 4.18 ట్రిలియన్ డాలర్ల నామమాత్రపు జీడీపీతో జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2 శాతం బలమైన వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే వేగం కొనసాగితే అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నివేదిక విశ్లేషించింది.

    విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 1.15 ట్రిలియన్ డాలర్లను దాటాయి. దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిబింబించేలా పలు కీలక సూచీలు రికార్డులను సృష్టించాయని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేని విధంగా రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ పొదుపు సంస్కృతి పెరగడంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.80 లక్షల కోట్లను దాటింది.

    ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

    నివేదికలోని కొన్ని అంశాలు..

    • యూపీఐ నెలవారీ లావాదేవీల విలువ రూ.21 లక్షల కోట్లు దాటడం దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యాప్తికి అద్దం పడుతోంది.

    • ఒక బిలియన్ మార్కును దాటిన ఆధార్ అప్‌డేషన్‌లు ప్రభుత్వ సేవలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేయడంలో పారదర్శకతను పెంచాయి.

    • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన (చీనాబ్ బ్రిడ్జ్) పూర్తి కావడం భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం.

    • దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వందే భారత్ రైళ్లు రవాణా ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.

    • జాతీయ రహదారుల విస్తరణతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి సరఫరా గొలుసు బలోపేతమైంది.

    • ఇస్రో నిర్వహించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ విజయవంతం కావడంతో అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటు దిశగా భారత్ కీలక అడుగు వేసింది.

    • చైనాకు ప్రత్యామ్నాయంగా ‘గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా ఎదిగే క్రమంలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తోంది.

    • సౌర, పవన, హైడల్ పవర్ రంగాల్లో భారత్ అసాధారణ వృద్ధిని కనబరిచింది.

  • ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్, క్యాప్‌కట్ వంటి యాప్‌లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్‌డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

    వివాదానికి కారణం ఇదే..

    సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్‌ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్‌ క్లిప్‌లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.

    దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.

    హాలీవుడ్ దిగ్గజాల ధ్వజం

    ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్‌డ్యాన్స్‌కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్‌డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.

    సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

  • భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేసే ప్రధాన అంశాల్లో గ్యాస్ ధర ఒకటి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నేరుగా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద గ్యాస్‌ ఉత్పత్తిదారులు అని భావిస్తారు. కానీ అసలు వాస్తవం ఏమిటో.. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా వంటగ్యాస్‌ ఉత్పత్తి చేస్తుందో కింద చూద్దాం.

    గ్యాస్ సరఫరాకు ​కీలకంగా హార్మూజ్‌ జలసంధి

    ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాకు హార్మూజ్‌ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఈ షిప్పింగ్ కారిడార్‌లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.

    అమెరికానే నంబర్‌ వన్‌

    చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద ఉత్పత్తిదారులు అని భావిస్తారు, కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఎల్‌పీజీ ఉత్పత్తిదారుగా అవతరించింది. అమెరికా ఏటా సుమారు 84 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 26% వాటా ఒక్క అమెరికాదే.

    చైనా 32 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా 26 మిలియన్ టన్నులతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నాలుగో స్థానంలో ఉంది. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

    ఎల్‌పీజీ అసలు ఎలా తయారవుతుంది?

    ఎల్‌పీజీ అంటే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది ప్రధానంగా రెండు మార్గాల్లో లభిస్తుంది. భూమి లోపలి నుంచి సహజ వాయువును వెలికితీసేటప్పుడు ప్రొపేన్, బ్యూటేన్‌లను వేరు చేస్తారు. ఇతర మార్గాల్లో రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియలో ఎల్‌పీజీ ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది.

    భారత్‌ పరిస్థితి ఏమిటి?

    భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌పీజీ వినియోగదారుల్లో ఒకటి. ఉజ్వల యోజన వంటి పథకాలతో గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ మన దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు సరిపోవడం లేదు. భారత్ తన అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం నేరుగా దేశీయ సిలిండర్ ధరలపై పడుతోంది.

    ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

  • పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.

    జైశంకర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలు

    ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్‌ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.

    ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..

    బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్‌లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్‌తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.

    భారత్‌ సారథ్యం

    బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్‌లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

  • ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య భారత క్యాపిటల్ మార్కెట్లు బలంగా ఉన్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లు లోతుగా విస్తరిస్తున్నాయని, సూచీలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ మార్కెట్‌ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

    స్వల్పకాలిక అలజడి.. దీర్ఘకాలిక లక్ష్యం

    గత రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు పాండే కీలక సూచన చేశారు. ‘మార్కెట్ ఒడిదొడుకులు చూసి ఆందోళన చెందకుండా, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండాలి. రిటైల్ పెట్టుబడిదారులు ఓపికగా ఉండటమే అత్యుత్తమ వ్యూహం. గతంలో కూడా ఇలాంటి అంతరాయాల తర్వాత మార్కెట్లు తిరిగి బలంగా కోలుకున్నాయి’ అని ఆయన గుర్తుచేశారు. గత 18 నెలలుగా బెంచ్ మార్క్ సూచీలు పరిమిత రాబడిని అందించడం వల్ల ఇన్వెస్టర్లలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని ఆయన విశ్లేషించారు.

    ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

    భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మన క్యాపిటల్ మార్కెట్లు కూడా పరిమాణం, సంక్లిష్టతలో అభివృద్ధి చెందుతున్నాయని పాండే హైలైట్ చేశారు. ‘సమర్థవంతమైన మార్కెట్లు కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, అవి పారదర్శక ధరల ఆవిష్కరణకు, ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితులను గ్రహించడానికి సహాయపడతాయి. నమ్మకమే ఆర్థిక వ్యవస్థకు పునాది. అది లేకపోతే మూలధనం తగ్గిపోతుంది’ అని హెచ్చరించారు.

    ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం

  • కారు అందంగా.. మిలమిల మెరిసిపోతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. కారు మెరిసిపోవాలంటే.. దాన్ని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. కానీ కొంతమంది కారు కడిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    తప్పుడు సాధనాల వినియోగం
    మనం చేతిలో పట్టుకునే స్పాంజ్ లేదా గుడ్డే.. కారు పెయింట్‌కు నష్టం కలిగిస్తుంది. చాలా మంది ఏ స్పాంజ్ అయినా సరిపోతుందని అనుకుంటారు. కానీ తప్పు రకం స్పాంజ్ లేదా టవల్ వాడితే కారు పెయింట్‌పై ఉన్న క్లియర్ కోట్‌పై చిన్న చిన్న గీతలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉపయోగించే పాత గుడ్డలు లేదా క్లీనింగ్ క్లాత్‌లు వాడకపోవడం మంచిది. బకెట్ల వినియోగం కూడా ముఖ్యమే. ఒకటి సబ్బు నీటికి, మరొకటి మిట్‌ను కడగడానికి ఉపయోగించాలి. ఇలా రెండు బకెట్లు వాడటం వల్ల మురికి నీరు తిరిగి కారు మీద పడకుండా ఉంటుంది.

    డిష్ సోప్ ఉపయోగించకూడదు
    కారును కడుక్కోవడానికి షాంపూ లేదా కిచెన్‌లో ఉన్న డిష్ సోప్ వంటివి వినియోగించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇది మంచి నిర్ణయం కాదు. డిష్ సోప్ తరచుగా వాడితే కారు మీద ఉన్న వాక్స్, రక్షణ పొర తొలగిపోతాయి. దాంతో కారు పెయింట్ సూర్యరశ్మి, ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతుంది. కాబట్టి కారు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆటోమోటివ్ షాంపూ మురికిని మెల్లగా తొలగిస్తూ, పెయింట్‌పై ఉన్న రక్షణ పొరను కాపాడుతుంది. అందువల్ల కారు రంగు ఎక్కువకాలం నిలుస్తుంది.

    ఎక్కువ ప్రెషర్ కూడా ప్రమాదమే
    కొంతమంది హై-ప్రెషర్ హోస్ లేదా ఆటోమేటిక్ కార్ వాష్ వాడటం వేగంగా పూర్తవుతుందని అనుకుంటారు. కానీ అవి కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే ఎక్కువ ప్రెషర్‌తో నీరు చిమ్మితే కారు ట్రిమ్ లేదా పెయింట్‌కు నష్టం కలగవచ్చు. అందువల్ల చేతితో కడిగేటప్పుడు మోస్తరు నీటి ఒత్తిడితో, కొంచెం దూరం ఉంచి కడగడం మంచిది.

    ఆరబెట్టే సమయంలో జాగ్రత్త
    కారు బాగా కడిగిన తర్వాత దాన్ని ఆరిపోవడానికి వదిలేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఆలా చేస్తే నీటి మరకలు పడతాయి. అప్పుడు నీటిలో ఉన్న ఖనిజాలు పెయింట్‌పై నిలిచిపడి గట్టిగా అతుక్కొని శాశ్వత మచ్చలుగా మారవచ్చు. అందుకే ఎప్పుడూ శుభ్రమైన మైక్రోఫైబర్ టవల్‌తో కారు తుడవాలి.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' క్యాష్, ట్రాష్, క్రాష్ అంటూ.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలను గురించి వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    క్రాష్‌లో క్యాష్ అంటే ట్రాష్ కాదు అని ట్వీట్ ప్రారంభించిన కియోసాకి.. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ స్టాక్స్, బాండ్స్ వంటివి విక్రయించి ఎందుకు బిలియన్ల కొద్దీ నగదుతో కూర్చున్నారు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ''keeping his powder dry'' అనే వ్యూహం. అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత మంచి కంపెనీలు లేదా విలువైన ఆస్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని కొనడానికి చేతిలో డబ్బు ఉండాలి.

    నా వ్యూహం ఏమిటంటే.. నా దగ్గర ఉన్న డబ్బును మరిన్ని ఆయిల్ వెల్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పెట్టుబడుల్లో పెట్టాను. అంటే ప్రతి వ్యక్తి లేదా పెట్టుబడిదారుడు.. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపించవచ్చు. కానీ పెట్టుబడుల్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని వివరించారు.

    ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు

    మార్కెట్ పడిపోయినప్పుడు మీ వద్ద స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే, ఏమీ చేయకుండా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయం కావచ్చు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని కియోసాకి స్పష్టం చేశారు.

  • ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ, శాంతి మంత్రం కన్నా శతఘ్నుల మోతకే ప్రాధాన్యత పెరుగుతోంది. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, అంతర్యుద్ధ భయాలు సామాన్యుడిని భయపెడుతుంటే.. ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా 2021-2025 మధ్య కాలానికి సంబంధించి ఎస్‌ఐపీఆర్‌ఐ(స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజాగా వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్ ఏ విధంగా అగ్రరాజ్యాల గుప్పిట్లోకి వెళ్తోందో స్పష్టమవుతోంది.

    అమెరికా ఏకఛత్రాధిపత్యం

    ప్రపంచ ఆయుధ విక్రయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం ఎగుమతుల్లో 42% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు రెట్లు అధికంగా ఆయుధాల వ్యాపారం చేస్తోంది. అమెరికా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కొన్ని కారణాలున్నాయి.

    • అత్యాధునిక యుద్ధ విమానాలు (ఎఫ్‌-35 వంటివి), క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలో అమెరికాకు సాటిలేదు.

    • నాటో దేశాలతో పాటు ఆసియా, మిడిల్‌ఈస్ట్‌ దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలు అమెరికా ఆయుధాలకు నిరంతర డిమాండ్‌ను కల్పిస్తున్నాయి.

    • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ వ్యాపారంలో మరింత వృద్ధి నమోదైంది.

    ఎస్‌ఐపీఆర్‌ఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతుల వాటా (2021–25)

    దేశంఎగుమతుల వాటా (%)
    యూఎస్‌42
    ఫ్రాన్స్10
    రష్యా7
    జర్మనీ6
    చైనా6
    ఇటలీ5
    ఇజ్రాయెల్4
    యూకే3
    దక్షిణ కొరియా3
    స్పెయిన్2
    ఇతర దేశాలు12

     

    చైనాను వెనక్కి నెట్టిన జర్మనీ.. యూరప్ జోరు

    ఆయుధ ఎగుమతుల్లో జర్మనీ చాలా పురోగతి సాధిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మొత్తంగా 6% వాటాతో జర్మనీ ఇప్పుడు చైనాను అధిగమించి నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్‌లో భద్రతా ఆందోళనలు పెరగడం, నాటో దేశాలు స్వదేశీ (యూరోపియన్) పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జర్మనీకి కలిసొచ్చింది. మరోవైపు, చైనా తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్‌ దేశాలకే పరిమితం చేస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు చైనా ఆయుధాల పట్ల విముఖత చూపడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

    దక్షిణ కొరియా

    ప్రస్తుతం ఆయుధ మార్కెట్లో దక్షిణ కొరియా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా కేవలం 3% వాటా ఉన్నప్పటికీ అది వేగంగా వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల కంటే తక్కువ సమయంలో ఆయుధాలను డెలివరీ చేయగల సామర్థ్యాన్ని ఇది సొంతం చేసుకుంటోంది. అత్యాధునిక ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలను తక్కువ ధరకు అందిస్తోంది. తూర్పు యూరప్‌, ఆగ్నేయాసియా దేశాలు దక్షిణ కొరియా ఆయుధాల కోసం ఆర్టర్లు పెడుతున్నాయి.

    ఆయుధాల ఎగుమతి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక దేశం భౌగోళిక రాజకీయ ప్రాబల్యానికి నిదర్శనం. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుండగా, దక్షిణ కొరియా వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధ ఒప్పందాలే వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ‘మారణాయుధాల వ్యాపారం’ ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.

    ఇదీ చదవండి: ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

  • బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.

    చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది.

Politics

  • సాక్షి, విజయవాడ: టీడీపీలో డ్రగ్స్‌ కలకలం చెలరేగుతోంది. హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ‍్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్‌ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

    పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్‌ ఘటనపై పుట్టా మహేష్‌ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు.  

    పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్‌ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్‌, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్‌ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్‌ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్‌. 

    ఇవీ చదవండి: 

    పుట్టా మహేష్‌, ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు  


    పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు 

  • హైదరాబాద్‌: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్‌కు  అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు

    స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. 

    పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. 

  • హైద‌రాబాద్‌ శివారులోని మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన వీకెండ్‌ పార్టీలో డ్రగ్స్‌ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్‌ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్ర‌క‌టించారు. పుట్టా మహేష్‌, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. 

    మరోవైపు, శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పైలట్‌ రోహిత్‌ రెడ్డి, రితేష్‌రెడ్డి, నితిన్‌ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్‌లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైడ్స్‌ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. 

     

  • తిరుపతి: డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  డ్రగ్స్‌ కేసులో పుట్టా మహేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్‌రెడ్డి. టీడీపీ అంటే  క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా?  అని నిలదీశారు. ఈ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక,  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. 

    ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి.  ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయి

    టిటిడి చైర్మన్‌గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్‌ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. 

    ఎంపీ డ్రగ్స్‌ తో పట్టుబడటం హేయమైన చర్య
    విజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్‌తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి  ఈ తరహా పనులు చేయడమేంటి?,  భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం.  కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. 

    ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై  కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో  ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది.  టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి.  టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. 

  • తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్‌పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్‌ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

    తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్‌లైన్ సంబంధాలు ఉన్నాయి.  రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.

    పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్‌తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి.  గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. 

    ఇదీ చదవండి:  పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు 

  • హైద‌రాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్‌ పార్టీలో డ్రగ్స్‌ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్‌ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్ర‌క‌టించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్‌ తీరుపై మండిపడ్డారు.

    ‘చంద్రబాబు బ్రాండ్‌.. డ్రగ్స్‌ బ్రాండ్‌. డ్రగ్స్‌ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్‌.. ఎంపీకి మరో రూల్‌ ఉండకూడదు. పుట‍్టా మహేష్‌ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్‌ పార్టీలో డ్రగ్స్‌ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  

  • సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్‌ పార్టీలో దొరికారు‌. ఇప్పటి వరకు దీనిపై  చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.

    ‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి  లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్‌తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది.

    ..పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

     

  • సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌  చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్‌ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్‌ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్‌సభకు పంపారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్‌కు లేదు’’ అంటూ టీజేఆర్‌ మండిపడ్డారు.

    ‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్‌ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు.

    ..తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్‌గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    ..ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్‌ సంబంధం ఉంది.

     

     

    కాబట్టి రేవంత్‌తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు.

     

     

     

National

  • గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అసోం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్రంలోని గువాహటిలో పర్యటించిన అమిత్‌ షా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. భారత్‌కు, మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు అపకీర్తి తెచ్చిపెట్టేలా రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారని అమిత్‌ షా ఆరోపించారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్ మెట్లపై కూర్చుని “టీ, పకోడీలు” తింటారని పేర్కొన్నారు.

    “ఒక్కోసారి ఆయన పార్లమెంట్ ద్వారం వద్ద కూర్చొని టీ తాగుతారు, పకోడీలు తింటారు. అల్పాహారం తినే చోటు ఏది? ఈ విషయం ఆయనకు తెలియదా? భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వ్యవస్థ. అక్కడ కూర్చొని నిరసనకు దిగడం కూడా ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కానీ, మీరు అక్కడ నిరసనకు దిగడమే కాకుండా మరో రెండు అడుగులు వేసి టీ తాగుతూ, పకోడీలు కూడా తింటున్నారు. దీనివల్ల ప్రపంచం ముందు భారత్ అపకీర్తి పాలవుతుంది” అని అమిత్‌ షా అన్నారు.

    ఏఐ సదస్సులో ఇలాగేనా చేసేది?  
    మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్‌ గాంధీ ఇప్పుడు భారత్ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారని అన్నారు. పార్లమెంట్ చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం లేదని విమర్శించారు. ఇటీవల ఢిల్లీ నగరంలో జరిగిన కృత్రిమ మేధస్సు సదస్సు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించారని చెప్పారు. ఆ కార్యక్రమానికి 80 దేశాల కంపెనీల ప్రధాన కార్యనిర్వాహక అధికారి స్థాయి అధికారులు హాజరయ్యారని తెలిపారు.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సదస్సును ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కృత్రిమ మేధస్సు సదస్సని పేర్కొన్నారని అమిత్‌ షా అన్నారు. ఆ కార్యక్రమంలో అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు నిర్వహించి భారతదేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సదస్సు సమయంలో అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వారికి రాహుల్ గాంధీ మద్దతు పలికారని కూడా విమర్శించారు.

    ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు భారత శక్తిని, యువత సామర్థ్యాన్ని చూడటానికి వచ్చే ఇటువంటి సదస్సుల్లో నిరసన ప్రదర్శలు చేస్తే.. ఇటువంటి వాటిల్లో మనకు అవకాలు తగ్గుతాయని చెప్పారు. భారత ప్రజలు అలాంటి చర్యలను క్షమించరని అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఈశాన్య ప్రాంతం, అసోంలో ఆరోగ్య వ్యవస్థ చాలా దయనీయ స్థితిలో ఉందని చెప్పారు. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కన్నా తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు.

  • జెట్‌పూర్‌: గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో శనివారం రాత్రి జరిగిన  కారు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అ వధ్ తివారీ, మరొక స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఇద్దరు హుండాయ్‌ వెర్నా కారును అత్యంత వేగంగా డ్రైవ్‌ చేస్తూ రీల్స్‌ షూట్‌ చేస్తున్నారు. 

    డ్రైవింగ్ చేస్తున్న అవధ్ తివారీ ప్రమాదానికి కొద్దిసేపటి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా కారును నడుపుతున్న వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన ఎడమ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రీల్ రికార్డ్ చేస్తూ, మరో చేతితో స్టీరింగ్ పట్టుకున్నట్లు వీడియోలో ఉంది.  కారు సుమారు 120 కిమీ వేగంతో వెళ్తుండగా, పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కూడా వీడియో తీశాడు. 

    అనంతరం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తివారీ అక్కడికక్కడే మృతి చెందగా, అతని 20 ఏళ్ల స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  ఆ కారులో ఉన్న మరో యువయుడు అక్షయ్ ప్రవీణ్‌భాయ్ వాఘెలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తివారీకి కార్లలో ఫీట్లు చేస్తూ వీడియోలుఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం హాబీగా మారిపోయింది. ఇప్పుడు ఆ హాబీనే అతని ప్రాణం తీసింది. 

     

  • న్యూఢిల్లీ: ఎల్‌పీజీ,పీఎన్‌జీ గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్‌ కనెక్షన్‌ మాత్రమే ఉండాలని సూచించింది. రెండో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. 

    పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో గ్యాస్‌, చమురు,ఎరువుల రంగాలను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు సంక్షోభాన్ని తగ్గించేలా ఆయా రంగాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. తాజాగా భారత్‌ సైతం ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

    గ్యాస్‌ వినియోగదారులు ఏదైనా ఒక గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగించుకోవాలి. రెండో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే వెంటనే సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని  
    కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్‌పీజీ నియమాలలో మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

    పిప్డ్ నేచురల్ గ్యాస్‌ (PNG) పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ (LPG) కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఎల్‌పీజీ కనెక్షన్‌ను తిరిగి సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ఇంధన వినియోగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక గృహాలు పీఎన్‌జీ కనెక్షన్‌తో పాటు ఎల్‌పీజీ కనెక్షన్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులకు సౌకర్యంగా ఉన్నప్పటికీ, సబ్సిడీ లబ్ధి విషయంలో గందరగోళం, దుర్వినియోగం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

    పీఎన్‌జీ గ్యాస్‌ కనెక్షన్ ఉన్న గృహాలు వెంటనే ఎల్‌పీజీ కనెక్షన్‌ను సమర్పించాలి. ఈ ప్రక్రియను ఆలస్యం చేయకుండా సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. ఇకపై సబ్సిడీ లబ్ధి ఒకే కనెక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్‌పీజీ సబ్సిడీ పొందలేరు. ఎల్‌పీజీ కనెక్షన్‌ను సమర్పించిన తర్వాత పీఎన్‌జీ ద్వారా గ్యాస్‌ నిరంతర సరఫరా కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. అక్రమ గ్యాస్‌ కనెక్షన్లు తగ్గనున్నాయి.

    ఈ నిర్ణయంపై గ్యాస్‌ వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు ఎల్‌పీజీ అవసరం లేదని భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎల్‌పీజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరమవుతుందని మరికొందరు అంటున్నారు.  

    కాగా, పెట్రోలియం అండ్‌ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ (MoPNG), అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) ద్వారా విడుదలైన గణాంకాల ఆధారంగా దేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ (LPG) కనెక్షన్‌ 33.2కోట్ల మందికి.. పిప్డ్ నేచురల్ గ్యాస్‌ (PNG) కనెక్షన్‌1.36కోట్ల మంది వినియోగిస్తున్నారు. 

     

  • న్యూఢిల్లీ:  ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది  ఈ మేరకు సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌  ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాంతో ఇక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలుపుకుని మొత్తం 17. 4 కోట్ల మంది ఓటర్లు ఉ న్నట్లు జ్ఞానేష్‌ కుమార్‌ తెలిపారు. 

    ఆయా రాష్ట్రాలకు సంబంధించి సీఎస్‌, డీజీ, నోడల్‌ అధికారులు, ఎన్నికల అధికారులతో సమావేశమైనట్లుస్పష్టం చేశారు.  ఈ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తునపాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 2.18 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

    మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌
    ఒకే విడతలో  తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ  కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో ఏప్రిల్‌ 9వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు.  ఇక ఏప్రిల్‌ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందన్నారు.ఇక వెస్ట్‌ బెంగాల్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్‌ 23వ తేదీన తొలి విడత, 29వ తేదీన రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు.   ఎన్నికలు జరిగే ఈ ఐదు రాష్ట్రాల్లో మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందన్నారు. 

     

    రాష్ట్రాల వారీగా ఎలక్షన్ షెడ్యూల్

    • అసోం- పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4
    • తమిళనాడు – పోలింగ్: ఏప్రిల్ 23, కౌంటింగ్: మే 4
    • పశ్చిమ బెంగాల్ – పోలింగ్: ఏప్రిల్ 23 (1వ దశ), ఏప్రిల్ 29 (2వ దశ), తదుపరి దశ, కౌంటింగ్: మే 4
    • కేరళ – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4
    • పుదుచ్చేరి – పోలింగ్: ఏప్రిల్ 9, కౌంటింగ్: మే 4

    కాగా, ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న..కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది.

  • షిర్డీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఇంధన సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్.

    ఏమిటీ సోలార్ మాహాత్మ్యం?
    షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్‌ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. కానీ ఈ సోలార్ సిస్టమ్ వల్ల రోజుకు భారీగా గ్యాస్ ఆదా అవుతోంది.

    కోట్లలో ఆదా.. పర్యావరణానికి మేలు
    2009 నుంచి 2026 మధ్య కాలంలో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా గ్యాస్‌ను ట్రస్ట్ ఆదా చేసింది. దీనివల్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. కేవలం వంటకే కాకుండా, భక్తుల సౌకర్యార్థం సాయి ఆశ్రమం తదితర వసతి గృహాల్లో 10 వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా వేడి నీటిని అందించేందుకు కూడా సౌర శక్తిని వాడుతున్నారు.

    దేశానికే ఆదర్శం
    రోజుకు సగటున 80 వేల మంది భక్తులు సాయి దర్శనానికి వస్తుండగా, అందులో సగం మంది ప్రసాదాలయంలో భోజనం చేస్తున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో షిర్డీ ట్రస్ట్ అవలంబిస్తున్న ఈ విధానాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఒక ‘యూనిక్ మోడల్’గా గుర్తించి గౌరవించింది. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షిర్డీ సాయి సంస్థాన్ నిరూపిస్తోంది.

    ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్‌.. దిక్కుతోచని బీజేపీ?

  • తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసింది. ‘ఇండియా టుడే’  పేర్కొన్న సమాచారం ప్రకారం విజయ్ పార్టీతో బీజేపీ జరుపుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.

    బంపర్ ఆఫర్.. కానీ మెలిక!
    ఈ పొత్తులో భాగంగా విజయ్‌కి బీజేపీ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో చేరితే విజయ్‌కి ఏకంగా ‘డిప్యూటీ సీఎం’ పదవితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 80 సీట్లు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం నేరుగా ‘ముఖ్యమంత్రి’ పీఠంపైనే కన్నేసినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు కంటే సీఎం కుర్చీ కారణంగా చర్చలు ప్రస్తుతం ఒక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.

    రంగంలోకి పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం..
    విజయ్‌ను ఎన్డీయే కూటమిలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రిని మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు సమాచారం. విజయ్‌తో నేరుగా మంతనాలు జరిపే బాధ్యతను సదరు నేతకు అప్పగించినట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు మారిపోయే తమిళనాడు రాజకీయాల్లో, విజయ్ క్రేజ్ తమకు కలిసొస్తుందని బీజేపీ వ్యూహకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.

    విజయ్ క్యాంపులో అంతర్మథనం
    మరోవైపు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విజయ్ సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని స్థాపించిన కొత్తలోనే ఒక జాతీయ పార్టీతో చేతులు కలిపితే, స్వతంత్ర ప్రత్యామ్నాయంగా తాము నిర్మించుకున్న ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కొత్త మార్గంలో మొదలుపెట్టిన తరుణంలో, ఈ కూటమి నిర్ణయం పార్టీ విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ‘దళపతి’ వేసే తదుపరి అడుగు తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

    ఇది కూడా చదవండి: ట్రంప్ కోడలా మజాకా.. షాకిస్తున్న ఐదు సంచలనాలు..