Archive Page | Sakshi
Sakshi News home page

International

  • పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్‌తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరికీ తెరుస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు.

    ఇరాన్‌ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘బరాన్‌ హుస్సేన్‌ ఒబామా ఇరాన్‌తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్‌ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్‌ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్‌తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.

    ఇరాన్‌ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్‌తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్‌ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్‌లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.

    అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్‌ విమానాలతో ఇరాన్‌ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్‌తో, యావత్‌ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

    ]

    24 గంటల్లోనే: షెహబాజ్‌ షరీఫ్‌
    యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగీ్చలను ట్యాగ్‌ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్‌ విధానంలో అమెరికా, ఇరాన్‌లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్‌లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్‌ తెలిపారు.

    వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!
    ఇస్లామాబాద్‌: ఇరాన్‌ దివంగత సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

    ట్రంప్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్‌ 
    ఒమన్‌ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్‌ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్‌ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్‌పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది.  

  • డ్రగ్స్‌ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్‌ హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్‌పై అమెరికా కీలక ఆపరేషన్‌ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్‌ షేర్‌ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది.

    "ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ  ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.

    “నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    గెర్రెరో తలపై ఐదు మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్‌ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

  • టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్‌, ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.

    పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్‌ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్‌ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.

    అబ్బాస్‌ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అ‍న్నారు.

    ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్‌ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్‌ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • "యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్‌ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్‌లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న  అల్-ఖాఖా  మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 

    యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో  ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. 

    ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్‌లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అ‍క్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు.  ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.  ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.

     

    అన్తార్ యెమెన్‌లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా  అయ్యేవారు.  దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్‌ కావడంతో  "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.

    అన్తార్ అకాల మరణంపై యెమెన్‌లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     

Movies

  • హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి.  

    దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది.  

    గతేడాది తన సూపర్‌ హిట్‌ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్‌మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు.  

  • బాలీవుడ్ నటుడు సోనూసూద్ భారతీయ రైల్వేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వందేభారత్ రైల్లో ప్రయాణించిన ఆయన ఇండియన్ రైల్వేస్ అభివృద్ధిని ప్రశంసించారు. ఇంత నాణ్యమైన ప్రయాణాన్ని అందిస్తున్నందుకు భారతీయ రైల్వేకు ధన్యవాదాలు తెలిపారు. నాణ్యమైన ఆహారం అద్భుతమైన సిబ్బంది సేవలు ఉన్నాయని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    గతంలో తాను టికెట్ బుక్ చేసుకోవడానికే ఇబ్బందులు పడేవాడినని సోనూ సూద్ వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి ముంబయి వెళ్లేటప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని తెలిపారు. తాను న్యూస్‌ పేపర్ కింద పరచుకుని రైళ్లలో ప్రయాణించిన రోజులు కూడా ఉన్నాయని సోనూసూద్ అన్నారు. భారతీయుల ప్రయాణంలో క్వాలిటీ చూసి గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రైల్వేశాఖను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ మాటలతో రైల్వే ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
     

     

  • రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.

    తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు.  

     

  • అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది.  మే 1న రిలీజ్‌ కావాల్సి ఉండగా.. జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.

    తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు.  

    కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా..  కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్‌ చేశారు.
     

     

  • హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక లైవ్ కన్సర్ట్‌ రద్దయింది. భారీ వర్షాల కారణంగా బీజీఎం కింగ్ తమన్ ఆధ్వర్వంలో జరగాల్సిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కాన్సర్ట్‌ను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఈవెంట్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తమన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

    భారీ వర్షంతో వేదిక వద్ద పెద్దఎత్తున నీరు నిలిచి ఉందని నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా ఈవెంట్‌కు సంబంధించిన సామగ్రి, పరికరాలు కూడా తడిసి ముద్దైపోయాయని తెలిపారు. అందుకే ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌ హిల్స్‌లో జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్‌ నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 
     

     

     

     

  • ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. అదే సమయంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలు క్రియేట్ సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటితో బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించారు.

    ఈ నకిలీ ఖాతాలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించింది. ఇటీవల తన పేరు, ఫొటో, ఫేక్‌ నంబర్‌తో మోసం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని అభిమానులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్‌తో వస్తే కాల్ రిపోర్ట్ చేయాలని సూచించింది. అది తన అకౌంట్ కాదని.. ఈ సమాచారాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది.

    ఇక సినిమాల విషయానికొస్తే గుంటూరు కారంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన వృషకర్మ కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    m
     

  • సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం ‘హిట్ అండ్ రన్’. ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని  సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో హీరోయిన్ నటాషా సింగ్  రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు.  తాజాగా రిలీజైన హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

     

  • బాలీవుడ్ భామ మౌనీ రాయ్ బాలీవుడ్‌లో సుపరిచమైన పేరు. ఇటీవలే ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కానీ ఆ తర్వాత మౌనీ రాయ్‌పై పెద్దఎత్తన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి.  చాలా దారుణంగా కొందరు కామెంట్స్ చేశారు. ఆమెను గే అంటూ రూమర్స్ సృష్టించారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మౌనీ రాయ్ తనపై వచ్చిన రూమర్స్‌, ట్రోల్స్‌పై స్పందించింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తనపై గే అన్న రూమర్‌పై రియాక్ట్ అయింది. తాను విన్న వాటిలో అత్యంత అసంబద్ధమైన రూమర్‌ ఇదేనని మౌనీ రాయ్‌ వెల్లడించింది.

    విడాకుల ప్రకటన తర్వాత తన చుట్టూ బలమైన మద్దతుగా నిలబడే వాళ్లు ఉండడం తన అదృష్టమని మౌనీ రాయ్ చెప్పింది. నాకు ఎల్లప్పుడూ ఒక కొండంత అండగా నిలిచే స్నేహితులు, కుటుంబం ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కష్ట సమయాల్లో నాకు సహాయం చేయడంలో నా స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషించారని మౌని చెప్పుకొచ్చింది.  నా ఫ్రెండ్స్ మంచి, చెడు సందర్భాల్లోనూ నాకు తోడుగా నిలిచారని మౌనీ రాయ్ పంచుకున్నారు.

    కాగా.. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత 2022లో సూరజ్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే 2026లో అతనితో విడిపోయారు. మౌని, సూరజ్ ఇద్దరూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే  'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (2026) చిత్రంలో కనిపించారు.

     

  • టైటిల్‌ : దృఢం
    నటీనటులు: షేన్‌ నిగమ్‌, శోభి తిలకన్‌, కొట్టాయం రమేశ్‌, నందన్‌ ఉన్ని తదితరులు
    దర్శకత్వం : మార్టిన్‌ జోసెఫ్‌
    ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: జియో హాట్‌స్టార్‌

    తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్‌లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.


    కథేంటంటే..
    కుజినీలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెద్దగా క్రైమ్‌ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కి ఎస్సైగా వస్తాడు విజయ్‌(షేన్‌ నిగమ్‌). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్‌లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్‌ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.

    దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్‌లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్‌ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్‌ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.

    ఎలా ఉందంటే..
    సాధారణంగా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్‌ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్‌లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్‌లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్‌ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ చూశామనే ఫీలింగ్‌ కచ్చితంగా కలుగుతుంది.

    సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్‌గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్‌స్టేషన్‌కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్‌ కేసులు వస్తే సాల్వ్‌ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్‌గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. 

    ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్‌ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్‌ జరగడంతో ఎస్సై విజయ్‌ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్‌ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్‌లో ఉండగానే మరో ట్విస్ట్‌ రివీల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్‌ సన్నివేశాలు థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా, రొటీన్‌గా సాగినా.. సెకండాఫ్‌ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. 

    ఎవరెలా చేశారంటే..
    షేన్‌ నిగమ్‌ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. 
    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

    ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, రన్నర్‌గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్‌ను మేకర్స్ తొలగించారు. 

    కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
     

     

  • తిరువీర్, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క నిజం దాచి పెట్టి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న పాయింట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే... ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దానర్ధం" అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీగా ఉండనుందని తెలిసిపోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్‌గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు.

Politics

  • హైదరాబాద్‌: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శనకు సమాయత్తమవుతోంది. రేపు( ఆదివారం, జూన్‌ 14వ తేదీ) ఇందిరా పార్క్‌ దర్నా చౌక్‌ వద్ద ఆందోళనకు ప్లాన్‌ చేసింది. నీట్‌ పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలపై నిరసన చేపట్టనుంది. 

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కాక్రోచ్‌ జనతా పార్టీ. దీనిలోభాగంగా ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ ఆందోళనలో సోనమ్‌ వాంగ్‌ చుక్ పాల్గొంటుండగా, దీనికి యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.

  • ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పర్ఫార్మన్స్‌ను మెరుగుపరచిన సామాజిక సమీకరణ వ్యూహాన్ని మళ్లీ అమలు చేయాలనే లక్ష్యంతో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) పనిచేస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పలు జనరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

    దీని ద్వారా పార్టీ తన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సామాజిక కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. అలాగే ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) సాంప్రదాయ దళిత ఓటు బ్యాంకులోకి మరింత చొచ్చుకుపోవాలని ఎస్‌పీ భావిస్తోంది.

    ఈ వ్యూహాన్ని తొలిసారిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరీక్షించారు. అప్పట్లో ఎస్‌పీ జనరల్‌ ఫైజాబాద్ స్థానంలో షెడ్యూల్డ్ కుల నేత అవదేశ్ ప్రసాద్‌ను, జనరల్‌ మీరట్ నియోజకవర్గంలో సునితా వర్మను బరిలోకి దింపింది.

    ఈ ప్రయోగం పార్టీకి సక్సెస్‌ను ఇచ్చింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో రామాలయం అధికార పార్టీ బీజేపీకి ప్రధాన ప్రచార అంశంగా నిలిచినా, అవదేశ్ ప్రసాద్ తన భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థిపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మీరట్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్ సుమారు 10,000 ఓట్ల తేడాతో గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

    ఎస్‌పీ ఆధిక్యం 
    అయితే, ఆ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ విభాగాల్లో 4 చోట్ల ఎస్‌పీ ఆధిక్యం సాధించింది. ఆ ఫలితాల జోరుతో పార్టీ ఇప్పుడు అదే విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని యోచిస్తోంది. ఎస్‌పీ జాతీయ ప్రతినిధి రాజేంద్ర చౌధరి ఈ వ్యూహాన్ని గత ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేశామని ధ్రువీకరించారు.

    “2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మేము పలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను జనరల్‌ స్థానాల నుంచి బరిలోకి దింపాం. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అదే మోడల్‌ను మళ్లీ అమలు చేయవచ్చు” అని చౌధరి చెప్పారు.

    ఈ ప్రయోగానికి గుర్తించిన చాలా నియోజకవర్గాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 2012 తర్వాత బీఎస్‌పీ బలహీనపడటంతో దూరమైన దళిత ఓటర్లను ఆకర్షించాలని ఎస్‌పీ ఆశిస్తోంది. అలాగే, దళిత ఓటర్లలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడమూ ఈ వ్యూహంలో భాగమే.

    సమాజ్‌వాదీ పార్టీకి 2019లో 5 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 2024లో 37 స్థానాలకు చేరుకుంది. అసెంబ్లీ విభాగాల వారీ ఫలితాల ప్రకారం.. ఎస్‌పీ 184 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే ముందంజలో నిలిచింది. 2024 ఫలితాల ఆధారంగా, పీడీఏ కూటమి మద్దతును 2027 ఎన్నికల నాటికి మరింత పెంచుకోవచ్చనే నమ్మకం ఎస్‌పీ నాయకత్వంలో పెరిగింది.

    లక్నోలోని గిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ‍స్టడీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు నోమిత కుమార్‌ మాట్లాడుతూ.. సాధారణ స్థానాల నుంచి షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దింపాలన్న సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం నియోజకవర్గ స్థాయిలో దళిత ఓటర్లను బాగా సమీకరించేలా ప్రభావం చూపవచ్చని అన్నారు.

    “సాధారణ స్థానాల్లో ఎస్‌సీ అభ్యర్థులను నిలబెట్టడం ఆ నియోజకవర్గాల్లో దళిత ఓటర్లను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా స్థానిక పోటీల్లో గుర్తింపు ప్రాతినిధ్యం కీలక అంశంగా మారినప్పుడు ఇది ప్రభావం చూపుతుంది. అయితే ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులను పీడీఏ రూపకల్పన కింద ఎంత సమర్థంగా ఏకం చేయగలదన్నదే ఎస్‌పీ  ఎన్నికల బలాన్ని నిర్ణయిస్తుంది. ఉత్తరప్రదేశ్ అంతటా పోటీతత్వాన్ని నిర్ణయించేది ఈ సమీకరణే” అని ఆమె అన్నారు.
     

  • సాక్షి, తాడేప‌ల్లి: తిరుపతిలో ఈ నెల 12న కూట‌మి ప్ర‌భుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ వాస్తవానికి విజయాలను చెప్పుకునే సభ కాదని, ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిప‌డ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

    రాష్ట్రంలో ప్రస్తుతం "క్యాష్–రాజేష్–లోకేష్" ఫార్ములాతో పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన, డీఎస్సీ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ఏమ‌న్నారంటే..

    అది వెన్నుపోటు పొడిచిన సభ
    తిరుపతిలో ఈ నెల 12న‌ జరిగినది కూట‌మి ప్ర‌భుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్‌లో వెతికినా కనిపించవు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా విజయోత్సవాలు జరుపుకోవడం పరీక్ష రాయకుండానే పాస్ అయినట్లు ఉంది. ఆ రోజు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు, ఈ రోజు సూపర్ సైలెంట్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోను మూసేసి ఎర్రబుక్ పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పని జరగాలన్నా 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే కొత్త ఫార్ములానే అమలవుతోంది. రాజేష్ స్కెచ్ వేస్తే, లోకేష్ దాన్ని అమలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.

    డీఎస్సీపై సమాధానం చెప్పలేని మంత్రి రాష్ట్రాన్ని నడిపిస్తారా?
    డీఎస్సీ -2025 వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మంత్రి ఎలా అవుతారు? డీఎస్సీ అక్రమాలపై వివరణ ఇవ్వలేని స‌క‌ల విఫ‌ల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారా? అలాంటి వ్యక్తి విజయోత్సవ సభ వేదికపై నిలబడి వైఎస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. దూకుడు సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎలా ఉపయోగించారో, అలాగే చంద్రబాబు–లోకేష్‌లు పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకుంటున్నారు.

    ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా పవన్‌ను రంగంలోకి దింపుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రత్యర్థులను దూషించడానికే పరిమితమయ్యారు. పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. తిరుపతిలో నిర్వహించిన సభ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ అని వారి ప్రసంగాలే నిరూపించాయి.

    సింగిల్ విండో పాలన
    రాష్ట్రంలో ప్రస్తుతం 'క్యాష్–రాజేష్–లోకేష్' అనే సింగిల్ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడే రాష్ట్ర తిరోగమనం మొదలైంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు అప్పగించారు.

    ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి, ఫలితాలు పడిపోయాయి, పేపర్ లీకులు పెరిగాయి. ఉద్యోగాలు సూట్‌కేసులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డీఎస్సీలో విద్యాశాఖ ఉద్యోగులకే మొదటి ర్యాంకులు రావడం, గోల్డ్ మెడలిస్టులకు ఉద్యోగాలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలకు మంగళం పాడారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులను అర్హుల జాబితా నుంచి తొలగించారు. ఒకవైపు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని సినిమా డైలాగులు చెబుతుంటే, మరోవైపు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. సొంత పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

    కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపించ‌గ‌ల‌రా?
    తిరుపతి విజయోత్సవ సభలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

    వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమం, పారదర్శకత, గ్రామ స్వరాజ్యం కనిపించాయి. కానీ రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, రైతులు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేసింది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలి.

    ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, అప్పులు–అవినీతితో పాలన సాగిస్తున్నారు. తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించి తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చ‌రించారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత సీన్‌ నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు చెలరేగుతోన్న విషయం తెలిసిందే. 19 మంది ఎంపీలు సంతకం చేసిన ఓ లేఖ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీలో టెన్షన్‌ పుట్టిస్తోంది. అయితే ఆ లేఖలోని ఒక చిన్న అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి ఇప్పటివరకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ రెబల్‌ ఎంపీల జాబితా ఉన్న లేఖలో 1 నుంచి 20 వరకు సంఖ్యలు ఉన్నాయని, అయితే 13వ సంఖ్య వద్ద ఎలాంటి సంతకం లేదని సోర్సెస్‌ చెబుతున్నాయి. ఆ ఖాళీ స్థానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. తెర వెనుక ఏం జరుగుతోందో చూద్దాం..

    అసలు విషయం ఏంటి?
    టీఎంసీ నాయకత్వంపై కొందరు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ పంపి, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని, పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు కల్పించాలని కోరినట్లు చెప్పుకున్నారు. ఇద్దరు ఎంపీలు ఈ లేఖపై తాము సంతకం చేసినట్లు బహిరంగంగానే అంగీకరించారు. అయితే ఆ లేఖ అందిన విషయాన్ని స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

    ‘నంబర్ 13’ ఎందుకు అంత ఉత్కంఠ రేపుతోంది?
    జాతీయ మీడియాలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. లోక్‌సభ స్పీకర్‌కు పంపిన లేఖలో 1 నుంచి 20 వరకు వరుస సంఖ్యలు ఉన్నాయి. అందులో 19 మంది ఎంపీలు ఇప్పటికే సంతకాలు చేశారు. అయితే 13వ సంఖ్య పక్కనున్న స్థలం పూర్తిగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం "నంబర్ 13" ఎవరో అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. టీఎంసీ రెబల్‌ ఎంపీల 13వ సంఖ్య వద్ద సంతకం లేకుండా ఖాళీగా ఉంచారని జాతీయ మీడియా చెబుతోంది. ఆ 13వ సంఖ్య వద‍్ద ఎవరైనా మరో ఎంపీ సంతకం చేస్తే రెబల్స్‌ సంఖ్య 20 అవుతుంది. 

    రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం.. ఆ స్థానం పార్టీలో అత్యంత సీనియర్‌, పలుసార్లు ఎంపీగా గెలిచిన ఒక ప్రముఖ నేత కోసం ఉద్దేశపూర్వకంగా 13వ సంఖ్య వద్ద ఏ పేరూ రాయకుండా ఖాళీగా ఉంచినట్లు భావిస్తున్నారు. సరైన సమయంలో ఆ నేత రెబల్‌ వర్గంలో చేరి సంతకం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు రెబల్‌ వర్గం ఆ నేత పేరును వెల్లడించలేదు. టీఎంసీ కూడా ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు. జాతీయ మీడియా కథనాలు కూడా ఆ వ్యక్తిని కేవలం "సీనియర్ ఎంపీ" లేదా "పలుసార్లు ఎన్నికైన ఎంపీ"గానే పేర్కొంటున్నారు.

    అందువల్ల "నంబర్ 13" ఎవరనే విషయంలో ప్రస్తుతం వస్తున్న పేర్లన్నీ ఊహాగానాలే. ఆ ఎంపీ బహిరంగంగా ముందుకు రావడం లేదా లేఖపై సంతకం చేయడం జరిగితేనే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.

    తిరుగుబాటు ఎంపీల డిమాండ్ ఏంటి?
    తిరుగుబాటు వర్గం తామే లోక్‌సభలో నిజమైన టీఎంసీ ప్రతినిధులమని చెబుతోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తించాలని కోరుతోంది. ఇప్పుడు తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉంది. నిబంధనల ప్రకారం పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎంపీలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.

    అభిషేక్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
    ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఎన్నికల్లో ఓటమి. తమ అభిప్రాయాలు, సూచనలను పార్టీ పట్టించుకోలేదని పలువురు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీల ఆగ్రహం చాలావరకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపైనే.

    పశ్చిమ బెంగాల్‌లో తర్వాత ఏమి జరగవచ్చు?
    పార్టీ, ఎన్నికల గుర్తుపై ఆధిపత్యం కోసం పోరాటం జరగవచ్చు. ఈ 19 మంది ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌, ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తే, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాల తరహాలో వీరే “నిజమైన టీఎంసీ”గా గుర్తింపు పొందవచ్చు. అలా జరిగితే రాజీనామా చేయకుండానే పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించే అవకాశం ఉంటుంది.

    పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి మినహాయింపు పొందాలంటే ఎంపీలలో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. 28 మంది ఎంపీలు ఉన్న టీఎంసీలో రెబల్స్‌ సంఖ్య మనకు తెలిసినంతవరకు 19. ఈ వర్గం కోరుకుంటే నేరుగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వవచ్చు. లేదా భారతీయ జనతా పార్టీలో విలీనం కావచ్చు. తిరుగుబాటు నేతలు ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రి  భూపేందర్‌ యాదవ్‌ను కలిశారని సమాచారం.

  • విశాఖ: ఏపీలోని రెండు కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ పథకానికి తూట్లు పొడిచారన్నారు. తిరుపతి సభకు వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. 

    ‘తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. సీబీఎన్‌ అంటే చీటింగ్ బోగస్‌ నాయుడు. దైర్యం ఉంటే ప్రజలు ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పాలి. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. లోకేష్ నీ గల్లా పట్టుకొని నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపు మహిళలను పవన్ మోసం చేశారు.సూపర్ సిక్స్ అమలు చేసే వరకు పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు.

  • చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరిగే అవకాశం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. బఠిండాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్‌... 2027 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు 2026 నవంబర్‌లోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు.

    అయితే ముందస్తు ఎన్నికలకు కారణం ఏంటనే విషయాన్ని ఆయన వివరించలేదు. అయినప్పటికీ, ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధం కావడానికి కొన్ని నెలలే మిగులుతాయని చెబుతూ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

    భగవంత్‌ మానే ఆప్‌ సీఎం అభ్యర్థి
    తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార‍్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మానేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడంపైనే పార్టీ దృష్టి ఉండాలని చెప్పారు. గత నాలుగు ఏళ్లలో పంజాబ్‌ ప్రభుత్వం చూపిన పనితీరు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును సంపాదించిందని కేజ్రీవాల్‌ అన్నారు. 

    ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సీనియర్‌ ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా, పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు అమన్‌ అరోరాతో కలిసి కేజ్రీవాల్‌ బఠిండాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బఠిండా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆప్‌ కౌన్సిలర్లు మేయర్లుగా ఎన్నికయ్యారని, ఇది పార్టీ పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.

    ప్రతిపక్షంపై కేజ్రీవాల్‌ విమర్శలు
    ప్రత్యర్థి పార్టీల పేర్లు ప్రస్తావించకుండా కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీని "చిట్టా పార్టీ", మరో పార్టీని "ఫైటింగ్‌ పార్టీ", ఇంకో పార్టీని "ఈడీ పార్టీ"గా పేర్కొంటూ, మాదకద్రవ్యాల సమస్యతో సంబంధం ఉండటం, అంతర్గత కలహాలు, ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర సంస్థలను వినియోగించడం వంటి పనులు చేస్తున్నాయని ఆరోపించారు.

    దీనికి భిన్నంగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన పార్టీగా ఆప్‌ను ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ పనితీరును సమర్థిస్తూ, పంజాబ్‌ ప్రజలు చూసిన అత్యంత నిజాయితీ నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. గత ప్రభుత్వాలపై అవినీతి, కుంభకోణాల ఆరోపణలు వచ్చేవని, అయితే మాన్‌ పదవీకాలంలో అలాంటి ఆరోపణలు ఏవీ రాలేదని కేజ్రీవాల్‌ చెప్పారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుని ఉండేవని ఆయన వాదించారు.

    పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ అందిస్తున్నామని చెప్పారు. అలాగే జులై నుంచి మహిళలకు ఆర్థిక సాయం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000, షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని తెలిపారు.

  • విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై నాని ఘాటుగా స్పందిస్తూ.. ఈ చర్యను “రాజకీయ పిరికితనం” అని మండిపడ్డారు.

    సాక్షి, విజయవాడ: తనపై కేసు నమోదు కావడం, ఎల్లో మీడియా దానిని హైలైట్‌ చేస్తుండడంపై సోషల్‌ మీడియా వేదికగా కేశినేని నాని స్పందించారు. ఉర్సా భూ కేటాయింపుల వ్యవహారంపై తాను ఇప్పటికే ఏడాది క్రితమే ముఖ్యమంత్రికి లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ భూ కేటాయింపుల్లో ఎంపీ చిన్ని ప్రమేయం ఉందని పేర్కొంటూ, 2025 ఏప్రిల్‌ 22న చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా ఇచ్చినట్లు తెలిపారు.

    దాదాపు 14 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అకస్మాత్తుగా తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని నాని విమర్శించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కార్పొరేట్ వ్యవహారాలపై ప్రశ్నించడం తన ప్రాథమిక హక్కు అని, ప్రజల పక్షాన మాట్లాడటం మాజీ ఎంపీగా తన బాధ్యత అని నాని స్పష్టం చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కాలయాపన చేసి, ఇప్పుడు అధికార బలంతో కేసులు పెట్టడం సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇక మరోవైపు పోలీసుల సమాచారం ప్రకారం.. ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సోషల్‌ మీడియాలో తనపై అసత్య, పరువు నష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని చిన్ని ఆరోపించారు. 

    తాజా పరిణామాలతో కేశినేని బ్రదర్స్‌ మధ్య రాజకీయ విభేదాలు మరో దశకు చేరినట్లు స్పష్టమవుతోంది. చిన్ని అధికార కూటమి ఎంపీగా ఉండగా, నాని గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయాలపై అలాగే చిన్ని అవినీతి బాగోతంపై సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. 

Telangana

  • హైదరాబాద్‌: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికి విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా... రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే... ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్

    రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో... క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు... హైదరాబాద్ ను ఒక ల్యాంచ్ ప్యాడ్ తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా... కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 

    ఆవిష్కరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్ కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్ ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ బైక్‌ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా స్పందించారు.

    రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్‌.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌, ఖమ్మం, మెదక్‌, మేడ్చల్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌.. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. సిద్ధిపేట్‌, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.

    శంషాబాద్‌ అతలాకుతలం..
    హైదరాబాద్‌లోని కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్‌ అతలాకుతలమైంది. శంషాబాద్‌ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. శంషాబాద్‌లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

    సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
    భారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు హై అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీస్‌, ట్రాఫిక్‌ పోలీస్‌, మున్సిపల్‌, హైడ్రా, విద్యుత్‌, వాటర్‌ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను అలర్ట్‌గా ఉంచాలని సీఎం ఆదేశించారు.

    సంగారెడ్డిలో ఈదురుగాలుల బీభత్సం
    సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొండాపూర్‌ మండలంలో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. సదాశివపేట వద్ద రహదారిపై భారీ వృక్షం గాలికి విరిగిపడింది. సదాశివపేట చౌరస్తాలో బలమైన ఈదురుగాలులకు పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ షెడ్డు నేలకూలింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.

    చౌటుప్పల్‌లో భారీ వర్షం 
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
     

    16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్‌లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్‌నీలో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉంటుందన్నారు. ఎల్‌నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు.

    రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు

     

  • హైదరాబాద్‌: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్‌, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్‌కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు. 

    ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.

    భారత్‌లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.

    పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

    పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.

  • సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేశారు. 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల ఫోన్‌ ట్యాప్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల్ని కూడా సిట్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తర్వాత సిట్‌కు బదిలీ అయింది.

    తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు జరిగిన తర్వాత.. అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB)లో పనిచేసిన కొందరు అధికారులు కీలక డేటాను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నివాసానికి వెళ్లిన అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

     

     

     

     

     

  • నల్గొండ: ప్రసూతి, స్త్రీరోగ వైద్య నిపుణురాలు డాక్ట‌ర్‌ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్‌స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.

    డాక్ట‌ర్‌ శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్గొండలో ప్రసూతి, స్త్రీరోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

    ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్గొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

  • నిజాంసాగర్‌: సాగర తీరంలో ఘోరం పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి ‘‘ నాన్నా.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మమ్మల్ని పిక్నిక్‌కు వెళ్దామని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తీసుకొచ్చావు. హోటల్‌ నుంచి బిర్యానీ తెచ్చి ఆప్యాయంగా తినిపించావు. నీళ్లలో సరదాగా ఆడించావు. ఫోన్‌లో సెల్ఫీ ఫొటోలు తీశావు. తెప్పపై జలాశయం మధ్యలోకి తీసుకొచ్చావు. అప్పటి వరకు మాతో బాగానే ఉన్నావు. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు. నోట్లోకి నీళ్లు పోతున్నాయ్‌ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. అమ్మకు, నీకు మధ్య గొడవలైతే మేమేం పాపం చేశాం.. నీ దగ్గర డబ్బులు లేకపోతే కారం బువ్వ పెట్టినా తింటాం..మీ కడుపున పుట్టడమే మేము చేసిన నేరమా?’’ అని ఎంత వేడుకున్నాయో ఆ పసి హృదయాలు. వారి వేదన వినిపించుకోలేని స్థితిలో ఉన్నా ఆ తండ్రి.. క్షణికావేశంలో తాను సైతం నీళ్లలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

    పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి..
    నిజాంసాగర్‌ ప్రాజెక్టు 20 గేట్ల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి, తండ్రి సైతం తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పిల్లల ఆలనా, పాలన చూసుకోవాల్సిన తండ్రి తనతోపాటు తన పేగుబంధం లేకుండా చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు కుమారుడు రక్షిత్‌(9), కూతురు అనన్య(5) ఉన్నారు. సరైన ఉపాధి లేక దంపతులిద్దరూ పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం రామచంద్రాపురానికి వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్‌లో లేబర్‌ పనిచేస్తోంది. కృష్ణ మద్యం సేవించడం, సరిగా పనిచేయకపోవడంతో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారు.


    ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. గురువారం పిల్లలను పిక్నిక్‌కు వెళ్దామని బైక్‌పై నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చాడు. మత్స్యకారులు ఉపయోగించే తెప్పపై ప్రాజెక్టు మధ్యభాగంలోకి వెళ్లి పిల్లలను తోసేసి, తాను సైతం నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వరకు పిల్లలతోపాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్‌ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. నిజాంసాగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శివకుమార్‌ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూటీం, జాలర్లు కలిసి నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలు బయటికి తీశారు.

    ప్రాజెక్టు నీటిలో నుంచి పిల్లలు, తండ్రి మృతదేహాలను బయటికి తెస్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసెలా విలపించారు. ఆత్మహత్యకు ముందు పిల్లలతో కలిసి తండ్రి తీసిన సెల్ఫీ ఫొటోలు, మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

  • సాక్షి, హైద‌రాబాద్‌: కూకట్‌పల్లి ప్రజలు ఏం పాపం చేశారో తెలియదు కానీ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ వార్డు కార్యాలయంలో వివిధ విబాగాల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.

    నియోజకవర్గంలో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 20 ఏళ్ల కిందటి సమస్యలను రెండున్నర ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ చూస్తున్నారన్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి తమ హయాంలో 9 రిజర్వాయర్లను నిర్మించామన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు.

    నియోజకవర్గంలోని డివిజన్లను మూడు ముక్కలు చేసి మాల్కాజ్‌గిరి  ఎంఎంసీలో కలపడంతో బోయిన్‌పల్లి సర్కిల్‌ కార్యాయం ఎక్కడుందో తెలియక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్కిల్‌ అదికారులెవరో ఎమ్మెల్యేగా తనకే తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను  మెరుగు పర్చాల్సి ఉందన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం మల్కాజ్‌గిరి జోనల్‌ కమిషనర్‌ నుంచి ఎమ్మెలేకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.  

    చ‌ద‌వండి: హెచ్‌ఎండీఏ భూ వేలంపై నీలినీడలు

    సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ ముద్దం నర్సింహయాదవ్‌. గజ్జెల నాగేశ్‌, సతీష్‌గౌడ్, డిప్యూటి కమిషనర్‌ డాక్‌నాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సౌందర్య, వరుణ్‌దేవ్, శానిటేషన్‌ డీఈ సందీప్, వాటర్‌ వర్క్స్‌ జీఎం సునీల్, డీజీఎం కృష్ణమాచారి, మేనేజర్‌ నవీన్, టీపీఎస్‌ కుర్మయ్య, ఆర్‌ఐ నాగమణి సర్వేయర్‌ అనిత నాయకులు హరినాథ్, నరేందర్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, కర్రె జంగయ్య, మక్కాల నర్సింగ్‌రావు మాక్కల సత్యనారాయణ, సయ్యద్‌ ఏజాజ్‌ లలితా, ఉదయ్‌రాణి, సరోజదేవి కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Andhra Pradesh

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని పేర్కొంటూ.. పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేక వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వార్‌రూమ్‌లలో సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, కేంద్ర కార్యాలయ స్థాయిలో మూడు దశల్లో వార్‌రూమ్‌లు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు అమలు చేసిన వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

    పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

  • సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ  ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి పాపికొండలు విహారయాత్రకు 89 మంది పర్యాటకులతో బోటు బయలుదేరింది. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు నిలిపివేశారు.

    మరో బోటులో పర్యాటకులను బోటు యజమానులు తీసుకెళ్లారు. శ్రీలక్ష్మి బోటు ఆగిపోవడంతో జలశ్రీ బోటులో పర్యాటకులను వెళ్లారని నిర్వాహకులు చెబుతున్నారు. బోట్ నిలిచిపోవడంతో పాపికొండల బోట్లు ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లో వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాత్కాలికంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేశారు.

  • తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జన సైనికులు ఓవరాక్షన్‌ చేశారు. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రదర్శన చేసి హంగామా సృష్టించారు. పవన్‌ కళ్యాణ్‌ అనే నేను పుస్తకాన్ని శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించారు. ఆలయం ముందు పుస్తకాన్ని వీడియోలు తీశారు జనసేన నేతలు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

    తిరుమలలో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నా ఉల్లంఘనలకు తెరలేపారు జనసేన నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విదంగా చేసిన జనసేన వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ఉన్నా ఈ ఘటన ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఈ  ఉల్లంఘన ఎపిసోడ్‌తో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యంపై చర్చ నడుస్తోంది.  

     

  • విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ‍ప్రభుత్వ వైఫల్యాలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని తెలిపారు.

    ‘‘విద‍్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్‌కు ఆ శాఖ అప్పగించారా? ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ‍్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉందా? కూటమి ‍ప్రభుత్వ వెన్నుపోట్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. 

    భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. రెండేళ్లలో ఏదో సాధించినట్లు వెన్ను పోటీ పార్టీ చెప్పుకుంటోంది. ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో ఒక్కటైనా నెరవేర్చారా? సూపర్‌-6, సూపర్‌-7 పథకాలు అన్నారు.. ఏమయ్యాయి?’’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

    ‘‘ఏపీలో ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు చాలా బేల మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడపమంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు మా నాయకులు, ప్రజలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోరాటంలో పాల్గొన్నారు.. పార్టీ నాయకులు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. 

    ఆడబిడ్డ నిధి పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. బంగారు కుటుంబం అన్నారు.. ఇత్తడి కుటుంబం కూడా లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలకు ఇంతటి ప్రజాధరణ వచ్చింది. అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న దళారులు బాగుపడుతున్నారు.

    సామాన్యులు కొనే నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లోకేశ్‌ ఛాలెంజ్ లు దేనికి విద్యా శాఖను బాగు చెయ్యడానికా? నాశనం చెయ్యడానికా..? పాఠశాలల ప్రారంభం నాటికే పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ రంగానికీ మంచి జరగడం లేదు. 

    రైతుకు మద్దతుగా ధర లేదు. జొన్న, మామిడి వంటి వాటికి కూడా ధర లేదు. మా హయాంలో ఆక్వా రంగానికి ఇబ్బంది లేకుండా చేశాం. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది.. ఆక్వా రంగంలో ఉన్న వారు కూడా రోడ్డెకుతున్నారు. ఇది వెన్నుపోటు పార్టీ విధానం’’ అన్నారు.

    మాధవ్‌వి తప్పుడు వ్యాఖ్యలు.. ఇక పవన్‌వి..
    ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘మీ కేంద్ర మంత్రే మా వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి మాటలు అబద్దమా..? లక్షలాది మంది ప్రజల సాక్షిగా ప్రధానిని స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడిగారు.. పవన్ కల్యాణ్.. ఒకరోజు తెలంగాణ.. మరో రోజు ఏపీ అంటారు.

    పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మీరు రెండేళ్లలో చేశారు. మా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు. మళ‍్లీ నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేదు. డీఎస్సీని నిర్వహించలేని ప్రభుత్వం ఇది. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పాదర్శకంగా ఇచ్చాం.. నేనే మానిటరింగ్ మినిస్టర్ గా ఉన్నాను గర్వంగా చెబుతున్నా. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా యూరియా దొరకడం లేదు. 

    ఒడిశా నుంచి యూరియా తెచ్చుకొని దాచుకుంటున్నారు. అది కూడా అధిక ధర రూ. 600 కు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైతులు చెప్పిన వాస్తవాలు ఇవి. భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగిపోతుందని రైతులు భయపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం.. టీడీపీది వెన్నుపోటు పార్టీ’’ అని తెలిపారు. 

  • కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి,. చిన్నారి అన్వేషణలో కీలకంగా మారిన కుక్క ఎపిసోడ్‌ విషాదాంతమైంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.

    గాలింపు ఇలా..!
    సుమారు వారం రోజుల నుంచి పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ పర్యవేక్షణలో పోలీస్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అటవీ శాఖ, ఏఎన్‌ఎస్‌, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్‌ ట్రాకర్‌ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్‌ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.

    ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్‌ మెటల్‌ డిటెక్టర్లను వినియోగించారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

    అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్‌ టవర్‌ డంప్‌ డేటా, కాల్‌ డిటైల్‌ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతున్న సమయంలో కుక్క చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

    కుక్క మృతి.. అసలు దానికి ఏమైందంటే? ట్విస్ట్..

    కుక్కలో వింత ప్రవర్తన..!
    ఈనెల 6 వ తేదిన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి అదృశ్యమైన పెంపుడు కుక్క... *మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ కుక్కలో వింత ప్రవర్తన మొదలైంది. జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని మొరుగుతూ కరిచే ప్రయత్నం చేసింది.  ఈ క్రమంలోనే రెండోసారి కూడా అదృశ్యమై, మళ్లీ ఇంటికి వచ్చింది. ఈసారి కుక్కకు జీపీఎస్‌ అమర్చి.. చిన్నారి ఆచూకీ కోసం కుక్కను కీలకంగా చేసుకున్నారు అధికారులు. అయితే ఇది కూడా ఉపయోగం లేకుండానే పోయింది. తిరిగి, తిరిగి ఇంటికి చేరిన కుక్క.. అనూహ్యంగా మృత్యువాత పడింది. చిన్నారి ఆచూకీ మాత్రం కుక్కకు తెలిసే ఉండవచ్చని, కుక్క వింతగా ప్రవర్తించడం వెనుకు ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

    మరొకవైపు గ్రామస్థులు, బంధువులు కూడా కుక్క వింత ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించకపోగా, ఇప్పుడు కీలకం అనుకున్న కుక్క మృతి చెందడంతో చిన్నారి మిస్సింగ్‌  కేసులో ఏం జరుగుతుంది? అనే చర్చ మొదలైంది. 

  • లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యాపార అవసరాల కోసం 2017 నుంచి 2023 వరకూ విడతల వారీగా కాల్‌మనీ వ్యాపారి వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నానని, అందుకు గాను రూ.21 కోట్లు తిరిగి చెల్లించినట్లు గాయత్రినగర్‌కు చెందిన చాగర్ల గాయత్రి చెప్పారు. ఇంకా రూ.5 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, లేదంటే హామీగా పెట్టిన ఖాళీ చెక్‌లు, ప్రామిసరీ నోట్లు, ల్యాండ్‌ డాక్యుమెంట్లు ఇవ్వనని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    గాయత్రినగర్‌లోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు తెలిపారు. తాను వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటానని, కాల్‌మనీ వ్యాపారి వద్ద నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. అందుకు గాను ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్‌ పేపర్లు, ఆస్తుల ఒరిజనల్‌ డాక్యుమెంట్‌ ఇచ్చినట్లు తెలిపారు.

    అప్పుకు గాను ఇప్పటికే వడ్డీతో కలిపి రూ.21 కోట్లు చెల్లించానని, ఇంకా రూ.5 కోట్లు బాకీ ఉందని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అతని వద్ద ఉన్న పత్రాలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలని, లేదంటే కోర్టు కేసులతో ఇబ్బందులు పెడతామంటున్నారని గాయత్రి వాపోయారు. తన చిన్న కుమార్తెతో పాటు తన వ్యాపార భాగస్వామి నుంచి కూడా ఖాళీ చెక్కులు, పత్రాలు తీసుకున్నట్లు తెలిపారు.

    చ‌ద‌వండి: మ‌హిళ‌ల‌కు మ‌రో షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు!

    ఈ వివాదం కొనసాగుతుండగానే మే 27న ఇంటికి వచ్చి తనపై, తన కుమార్తెలపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. తనకు సంబంధించిన ఆస్తి పత్రాలను వేరొకరికి బదలాయించే ప్రయత్నాలు కూడా జరిగాయని, అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే నిలుపుదల చేయాలని అధికారులను వేడుకున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.

  • సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ అయ్యింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్  ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్‌పై చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు నేతలు ఫిర్యాదు చేశారు.

    వైఎస్సార్‌సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో  మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది.

     

  • సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డి.సూరిబాబు అనే స్టీల్‌ ప్టాంట్‌ ఉద్యోగి మృతిచెందారు. కాగా ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడి తొమ్మిది మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.

    కాగా (సోమవారం) సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్‌ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో ఎనిమిది మంది కార్మికులు ఘటనా స్థలంలో మృతిచెందారు, చికిత్స పొందుతు మరోకరు, తాజాగా  సూరిబాబు అనే కార్మికుడు మృతిచెందారు. 

    ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేశారు.  ప్రమాదానికి కారణం మెటల్‌ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్‌ లిక్విడ్‌ పేలడం వల్ల ప్రమాదం జరిగింది. 

    గతంలోనూ  పలుమార్లు స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్‌ మెల్టింగ్‌ మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతిచెందారు. 

    స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

Sports

  • ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేర్వేరుగా అరుదైన రికార్డులు సాధించారు. రోహిత్ శర్మ విషయానికొస్తే మ్యాచ్‌లో రోహిత్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 16 వేల పరుగుల మార్క్‌ను దాటడం విశేషం. అయితే మంచి ఈజ్‌తో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్‌తో సమన్వయం లోపం వల్ల రనౌట్‌గా వెనుదిరిగాడు.  

    మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఓపెనర్ గిల్ కూడా వన్డేల్లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ 67 ఇన్నింగ్స్‌లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక షై హోప్, ఇమామ్ ఉల్ హక్‌, ఫఖర్ జమాన్‌లు 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.

     

     

  • అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

    భారత బ్యాటింగ్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్‌) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్‌, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.

    ఆఫ్గన్‌ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26),  భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.

  • అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్‌ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్‌లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్‌ అందుకున్న స్టన్నింగ్‌ క్యాచ్‌కు గజన్‌ఫర్‌ నోరెళ్లబెట్టాడు.

    అయితే గిల్ పట్టిన క్యాచ్‌ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్‌టైమ్‌లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్‌లు చేసిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

    మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్‌ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.

     

     

  • టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శతకంతో అదరగొట్టాడు. వర్షం అంతరాయంతో 25 ఓవర్లకు కుదించిన ఆటలో ఆఫ్గన్ ఓపెనర్ ఆరంభం నుంచే టీ20 ఆటను ప్రదర్శించాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ఒక ఎండ్‌లో బ్యాటింగ్ కొనసాగించిన గుర్బాజ్‌ బౌలింగ్‌కు వచ్చిన ప్రతీ భారత బౌలర్‌ను ఉతికారేశాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్ 48 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా గుర్బాజ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.

    👉అఫ్గానిస్తాన్ తరఫున వన్డే‍ల్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ తొలి స్థానంలో నిలిచాడు. 48 బంతుల్లోనే గుర్బాజ్ ఈ ఫీట్ అందుకున్నాడు. అంతకముందు మహ్మద్ షెహజాద్ (2010లో స్కాట్లాండ్‌పై 72 బంతుల్లో), కరీమ్ సాదిక్ (2012లో నెదర్లాండ్స్‌పై, 72 బంతుల్లో), నౌరోజ్ మంగల్ (2013లో స్కాట్లాండ్‌పై, 85 బంతుల్లో), మహ్మద్ షెహజాద్ (2019లో ఐర్లాండ్‌పై, 85 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    👉ఇక వన్డేల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ల జాబితాలో రహ్మనుల్లా గుర్బాజ్ రెండో స్థానంలో నిలిచాడు. 2005లో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్కనర్ (57 బంతుల్లో), ఏబీ డివిలియర్స్ (57 బంతుల్లో), మైఖెల్ బ్రాస్‌వెల్ (57 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

    👉వన్డేల్లో గుర్బాజ్‌కు ఇది తొమ్మిదో సెంచరీ. ఆఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు గుర్బాజ్ పేరిటే ఉంది. ఇబ్రహీం జర్దన్‌, మొహమ్మద్ షెహజాద్‌లు చెరో ఆరు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

    👉వన్డేల్లో ఆఫ్గన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదడం రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఇది నాలుగోసారి. టీమిండియాతో మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్‌.. గతంలో 2021లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్సర్లు, 2023లో బంగ్లాదేశ్‌పై 8 సిక్సర్లు, 2024లో బంగ్లాదేశ్‌పై 7 సిక్సర్లు కొట్టాడు.

  • ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్‌ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.

  • ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో ఒకడిగా పేరుగాంచాడు పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రొనాల్డోకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నింటిలో కలిపి దాదాపు బిలియన్‌ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

    దిగ్గజ ఫుట్‌బాలర్‌ రొనాల్డోను ఒక్కసారి నేరుగా కలిస్తే చాలు అని తపించిపోయేవారు కోకొల్లలు. సెలీనే డెప్‌ కూడా అలాంటి వారిలో ఒకరు. రొనాల్డోను కలవడమే కాదు.. అతడిని ఏకంగా హగ్‌ చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది. దీంతో.. ‘నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి.. మా కలను నువ్వు నెరవేర్చుకున్నావు’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

    ఇంతకీ ఎవరీ సెలీనే?
    సెలీనే బెల్జియం దేశానికి చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్‌. తొలుత ఆమె కూడా ఓ ఫుట్‌బాలర్‌. అయితే, ఆ తర్వాత ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. యూట్యూబ్‌లో ఆమెకు దాదాపు 60 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లోనూ 16 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు.

    ఇక 26 ఏళ్ల సెలీనే గతంలోనూ ఫుట్‌బాలర్లు కెలియన్‌ ఎంబాపే, ఎర్లింగ్‌ హాలాండ్‌, నెయ్‌మార్‌ వంటితో వీడియోలు చేసింది. అయితే, తనకు అత్యంత ఇష్టమైన రొనాల్డోను మాత్రం ఇప్పుడే కలుసుకుంది.

    కాగా రొనాల్డో ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రొనాల్డోను కలిసేందుకు వెళ్లిన సెలీనేకు మధురానుభూతి లభించింది. రొనాల్డోను చూడగానే సెలీనే తీవ్ర భావోద్వేగానికి లోనై.. కన్నీటి పర్యంతమైంది.

    నువ్వు ఏడవద్దు
    ఇంతలో అక్కడికి చేరుకున్న రొనాల్డో సెలీనేను హత్తుకుని.. ‘నువ్వు ఏడవద్దు’‌ అంటూ అనునయించాడు. అనంతరం  ‘స్పానిష్‌ వచ్చా.. లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడతావా?’ అని అడిగాడు. అందుకు ఆమె.. ఇంగ్లిష్‌ మాత్రమే అనడంతో.. ఎలా ఉన్నావు? అని పలకరించాడు. 

    ఇందుకు బాగున్నానని సమాధానం ఇచ్చిన సెలీనే రొనాల్డో బాగోగుల గురించి అడిగింది. అనంతరం అతడికి ధన్యవాదాలు చెప్పి.. ఫొటో దిగి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    చదవండి: జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు!

  • టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ తన బౌలింగ్‌తో బెంబెలె త్తిస్తు‍న్నాడు. ఆఫ్గన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. 

    ఆఫ్గన్‌పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్‌షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. 

    మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్‌మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్‌టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్‌షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు.

    ఇలా అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్‌లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్‌టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్‌మన్ అర్థసెంచరీ సాధించారు. 

    మానవ్ సుతార్‌, ఈతన్ బాంబర్‌, ఎడ్ బెర్నాడ్‌లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ​ ఆరంభించిన వార్విక్‌షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి వన్డేతో టీమిండియా త‌ర‌ఫున గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబేలు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. హ‌ర్ష్‌దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించ‌గా, గుర్నూర్ బ్రార్‌కు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేప‌థ్యంలో టీమిండియా త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్‌ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కీలకపాత్ర పోషించాడు.

    గిల్‌ మెచ్చిన క్రికెటర్‌..
    పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెట‌ర్‌. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌ను అచ్చుగుద్దిన‌ట్లు అనుక‌రించ‌డంలో గుర్నూర్ బ్రార్ సుప్ర‌సిద్ధుడు. అయితే గుర్నూర్  చిన్న వ‌య‌సులో క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌, టెన్నిస్ ఆట‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కార‌ణంగా క్రికెట్‌లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన స‌ల‌హాతో గుర్నూర్ బ్రార్ త‌న‌నుత తాను ప‌రీక్షించుకోవ‌డానికి క్రికెట్ ట్ర‌య‌ల్స్‌కు వెళ్లాడు. 

    ఆ త‌ర్వాత రెండేళ్ల‌లోనే ఇండియా అండ‌ర్‌-19 టీమ్‌కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్క‌డే గుర్నూర్ బ్రార్‌కు ప్ర‌స్తుత టీమిండియా టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌డి టాలెంట్‌ను గ‌మ‌నించిన గిల్ కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండ‌ర్‌-23 జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్‌-ఏతో పాటు ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌కు నెట్‌బౌల‌ర్‌గా వ‌చ్చిన గుర్నూర్ బ్రార్‌కు అనుకోకుండా జ‌ట్టుకు ఆడే అవ‌కాశం వ‌చ్చింది. 

    అప్ప‌టి పంజాబ్ కింగ్స్ జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్ గాయంతో టోర్నీకి దూర‌మ‌వ్వ‌డంతో అత‌డి స్థానంలో ఎంపిక‌యిన గుర్నూర్ బ్రార్ ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ త‌ర్వాత గిల్ మ‌రోసారి గుర్నూర్‌కు అండ‌గా నిల‌బ‌డి నెట్‌బౌల‌ర్‌గా తీసుకోవాల‌ని గుజ‌రాత్ టైటాన్స్‌కు సూచించాడు. ఈ స‌మ‌యంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌల‌ర్ ర‌బాడ ఇచ్చిన స‌ల‌హాలు గుర్నూర్‌కు చాలా ఉప‌యోగ‌ప‌డ్డాయి. 

    అలా ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు జ‌రిగిన వేలంలో గుర్నూర్ బ్రార్‌ను గుజ‌రాత్ టైటాన్స్ రూ.30 ల‌క్షల‌కు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌న‌ప్ప‌టికీ విజ‌య్ హ‌జారే ట్రోఫీలో సెమీస్‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డిన గుర్నూర్ బ్రార్‌ను గ‌తేడాది ఇండియా-ఏ జ‌ట్టుకు ఎంపిక చేయ‌డంతో అత‌డి కెరీర్ మ‌లుపు తిరిగింది.

    నిఖార్సైన ఆల్‌రౌండర్‌
    విద‌ర్భ‌కు చెందిన హ‌ర్ష్ దూబే నిఖార్సైన ఆల్‌రౌండ‌ర్‌, 2024-25 రంజీ సీజ‌న్‌లో విద‌ర్భ టైటిల్ గెల‌వ‌డంలో హ‌ర్ష్ దూబేది కీల‌క‌పాత్ర‌. ఆ సీజ‌న్‌లో హ‌ర్ష్‌దూబే మొత్తం 69 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌కు మెచ్చిన బీసీసీఐ త‌ర్వాతి ఏడాది ఇండియా-ఏ జ‌ట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్ర‌ద‌ర్శ‌న‌కు గానూ హ‌ర్ష్‌దూబే బెస్ట్ ఆల్‌రౌండ‌ర్ (లాలా అమ‌ర్‌నాథ్‌) అవార్డు గెలుచుకున్నాడు. 

    ఇక విజయ్ హ‌జారే ట్రోఫీలో కెప్టెన్‌గా విద‌ర్భ‌ను న‌డిపించిన హ‌ర్ష్‌దూబే ఆ జ‌ట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశ‌వాలీ క్రికెట్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌తో హ‌ర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హ‌ర్ష్‌దూబే ఆ సీజ‌న్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజ‌న్‌కు ఎస్ఆర్‌హెచ్ అత‌డిని రిటైన్ చేసుకుంది.ఈ సీజ‌న్‌లో 8 మ్యాచ్‌లాడిన హ‌ర్ష్‌దూబే 8 వికెట్లు తీశాడు.

    నిజానికి ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు ద్వారానే హ‌ర్ష్‌దూబే అరంగేట్రం చేయాల్సింది. ర‌వీంద్ర జ‌డేజాకు విశ్రాంతి క‌ల్పించ‌డంతో మాన‌వ్ సుతార్‌, హ‌ర్ష్‌దూబే పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ మాన‌వ్ సుతార్‌ను తుదిజ‌ట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన మాన‌వ్ సుతార్ అంద‌రి చేత ప్ర‌శంస‌లు అందుకున్నాడు. 

    చదవండి: ‘అతడు వంద టెస్టుల గురించి ఆలోచించలేదు’

  • ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్‌ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.

    అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్‌ పడింది. టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

    ఆ ఇద్దరి అరంగేట్రం
    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్‌ పాత బడే కొద్ది బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్‌ తెలిపాడు. అదే విధంగా హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌ ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. 

    కాగా విరాట్‌ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ జోడీగా గిల్‌- రోహిత్‌ శర్మ కొనసాతుండగా.. వన్‌డౌన్‌లో కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ సేవలు అందించనున్నాడు. 

    మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్‌కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రెడ్డి ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇక సీనియర్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్‌ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్‌ దళంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణతో కలిసి గుర్నూర్‌ బ్రార్‌ బరిలోకి దిగుతున్నాడు.

    భారత తుదిజట్టు
    శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

    అఫ్గనిస్తాన్‌ తుదిజట్టు
    ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్‌ ఘజన్‌ఫర్‌, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.

  • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. స్కాట్లాండ్ స్టిస్ట‌ర్స్ కెప్టెన్ కేథ‌రిన్ బ్రైస్‌, సారా బ్రైస్‌లు త‌మ బ్యాటింగ్‌తో అభిమానులను అల‌రించారు. ఈ ఇద్దరు స్వయానా అక్కాచెల్లి కావడం విశేషం. టోర్నీలో భాగంగా గ్రూప్‌-బిలో శనివారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. 

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మ‌హిళ‌లు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు ఇద్ద‌రు విఫ‌ల‌మైన వేళ అక్క కేథ‌రిన్ బ్రైస్‌, ఆమె చెల్లి సారా బ్రైస్‌ ఐర్లాండ్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు. ఇద్ద‌రు క‌లిసి మూడో వికెట్‌కు శ‌త‌క భాగ‌స్వామ్యం (106 ప‌రుగులు) న‌మోదు చేయ‌డం విశేషం. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ సిస్ట‌ర్స్ త‌మ బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రించ‌డ‌మే గాక ఆ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్‌లో శ‌త‌కం భాగ‌స్వామ్యం న‌మోదు చేసిన తొలి జంట‌గా చరిత్ర సృష్టించారు.

    39 బంతుల్లో 60 ప‌రుగులు చేసిన కేథ‌రిన్ బ్రైస్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఇక 35 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఒక్క ప‌రుగు తేడాతో అర్థ‌సెంచ‌రీ చేజార్చుకున్న సారా బ్రైస్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి.

    కాగా పురుషుల క్రికెట్‌లో బ్రదర్స్ కలిసి ఆడిన జట్టు ఏదైనా ఉందంటే ఐర్లాండ్ జట్టు మాత్రమే. ఈ జట్టులోనే ఎక్కువగా అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఓబ్రియన్ బ్రదర్స్ (కెవిన్‌, నీల్‌), టెక్టర్ బ్రదర్స్ (హ్యారీ, టిమ్, జాక్‌), అడెయిర్ బ్రదర్స్ (మార్క్‌, రాస్‌)లు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 

    చదవండి: పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్‌!

  • టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సారథిగా, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. మైదానంలో ప్రశాంతంగా ఉంటూనే ప్రత్యర్థుల ఎత్తులు చిత్తు చేసిన ఘనత ఈ ‘మిస్టర్‌ కూల్‌’ సొంతం.

    అయితే, ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించినా.. రికార్డుల కోసం మాత్రం ఎప్పుడూ ఆడలేదు. ముఖ్యంగా వంద టెస్టులకు చేరవవుతున్న వేళ అకస్మాత్తుగా ఈ దిగ్గజ ఆటగాడు సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

    అవకాశం ఉన్నా..
    ఆస్ట్రేలియాతో 2014-15లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ జరుగుతున్న సమయంలో మూడో టెస్టు తర్వాత ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటికి మొత్తంగా కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన ధోని.. 4876 పరుగులు సాధించాడు. ఇంకొంత కాలం వేచి ఉంటే.. 100 టెస్టుల మైలురాయిని చేరడంతో పాటు.. ఐదు వేల పరుగుల మార్కు అందుకునే అవకాశం నాడు ధోనికి ఉంది.

    కానీ అతడు జిడ్డులా పట్టుకుని వేలాడలేదు. తన రిటైర్మెంట్‌కు అదే సరైన సందర్భమని భావించి హుందాగా తప్పుకొన్నాడు. అయితే, కెరీర్‌ను పొడిగించుకునే అవకాశం ఉన్నా వదులుకునే వాళ్లు కొంతమందే ఉంటారని.. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

    ధోని నుంచి నేర్చుకోవాల్సిన జీవితం పాఠం
    ఈ మేరకు.. ‘‘జీవితంలో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే, ధోని గురించి తెలుసుకోవడం అన్నింటికంటే ఉత్తమమైన విషయం అని నేను చెప్పగలను. మనకు ఏదైనా లభిస్తే.. దానిని పట్టుకుని ఉండటం సులువే.

    ఒకవేళ మన వల్ల ఇక కుదరని తెలిసినా దానినే పట్టుకుని జిడ్డులా వేలాడుతూనే ఉన్నామనుకోండి.. అది జరగదని తెలిసినా వదిలివేయబుద్ధికాదు. కానీ కొంతమంది తమకు ఆ విషయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా సులువుగా దానిని వదులుకుంటారు.

    సూపర్‌స్టార్‌ అయినా..
    ముఖ్యంగా సూపర్‌స్టార్లుగా ఉన్న వ్యక్తులు అంత తేలికగా దేనినీ వదులుకోలేరు. కానీ ధోని అలా కాదు. అతడు దేనినైనా సులువుగా త్యజించగలడు. నాడు అతడు టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడిని ఎవరూ ఏమీ అనలేదు. అప్పుడతడు అంతటి పటిష్ట స్థితిలో ఉన్నాడు.

    అయినా సరే సిరీస్‌ మధ్యలోనే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది వదిలేస్తున్నా’ అని ప్రకటించాడు. అతడు 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇంచుమించుగా ఐదు వేల టెస్టు పరుగులకు దగ్గరగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతడు మైలురాళ్ల గురించి ఆలోచించలేదు. 

    తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. ప్రయోజనం లేదనుకుంటే ఏ విషయాన్నైనా పొడిగించడం సరికాదనే సందేశాన్ని ఇచ్చాడని తన ఫాలోవర్లతో పేర్కొన్నాడు.

    దిగ్గజ సారథి
    కాగా 2004లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ధోని.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డేల్లో 10773, టెస్టుల్లో 4876, టీ20లలో 1617 పరుగులు సాధించాడు.

    సారథిగా టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013 టైటిళ్లు గెలిచిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడి సూపర్‌ సెంచరీ!

  • బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్, ఆఫ్-స్పిన్నర్ మొహమ్మద్‌ నయీమ్ హసన్ పోలీసుల చేతిలో చావుదెబ్బలు తినడం సంచలనం కలిగించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాను క్రికెటర్ అని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బంగ్లా క్రికెటర్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నయీమ్ హసన్‌పై దాడిని ఖండిస్తూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    పోలీసు కమిషనర్‌ క్షమాపణ..
    కాగా క్రికెట‌ర్ న‌యీమ్ హ‌స‌న్‌పై పోలీసుల దాడి విష‌యాన్ని తెలుసుకున్న‌ చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ పోలీస్ (సీఎంపీ) కమిషనర్ హసన్ మహమ్మద్ షౌకత్ అతడి నివాసానికి వెళ్లాడు. నయీమ్ హసన్‌ను వేధించారనే ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై నయీమ్‌ హసన్‌కు క్షమాపణ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

    అసలేం జరిగిందంటే..
    బంగ్లాదేశ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ముగించుకుని నయీమ్ హసన్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్తుండగా, శుక్రవారం రాత్రి సుమారు 11:25 గంటల సమయంలో లంకన్ బజార్ ఫ్లైఓవర్ కింద పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోను ఆపారు. ఆ తర్వాత నయీమ్ హసన్‌ను ఆటో నుంచి బలవంతంగా దించి పోలీసు వాహనం ఎక్కించారు. 

    తాను క్రికెటర్‌ను అని చెప్పినప్పటికీ మాట వినిపించుకోకుండా తనపై దౌర్జన్యంగా దాడి చేశారని నయీమ్ హసన్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ..‘వారు డ్రైవర్ నుంచి పత్రాలు తీసుకున్నారు. అవసరమైతే నా బ్యాగ్ కూడా తనిఖీ చేసుకోమని నేను వారితో చెప్పాను. కానీ వారు నా గొంతు పట్టుకుని.. 'కారు ఎక్కు' అంటూ వారి వాహనంలోకి తీసుకెళ్లారు. ఎందుకు నా గొంతు పట్టుకున్నారు? అని నేను ప్రశ్నించగా, వారు నన్ను బయటకు తోసేసి, కొట్టి, అసభ్యకరంగా తిట్టారు. 

    నేను దేశం తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడే జాతీయ క్రికెటర్‌ను అని చెప్పినా మొదట వినిపించుకోలేదు.  ఆ తర్వాత నేను బోర్డుకు సమాచారం అందించడం, వాళ్లకు పై అధికారుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వదిలేశారు’ అని నయీమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇక త్వరలో జింబాబ్వేతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులో నయీమ్ హసన్‌కు చోటు దక్కింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2018లో బంగ్లాదేశ్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మొహమ్మద్‌ న‌యీమ్ హ‌స‌న్ 14 టెస్టుల్లో 235 ప‌రుగులు చేయ‌డంతో పాటు త‌న ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 48 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

    చదవండి: సెమీస్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం

  • ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ 2026 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధూ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శ‌నివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీఫైన‌ల్లో సింధు 20-22, 12-20తో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, జపాన్‌కు చెందిన అకానే య‌మాగుచి చేతిలో ఓట‌మి చ‌విచూసింది. మ్యాచ్‌ను సింధూ మంచి ఈజ్‌తోనే ప్రారంభించింది. 

    43 నిమిషాల పాటు సాగిన ఆటలో.. తొలి గేమ్‌లో సింధూ దూకుడుకు ఒక ద‌శ‌లో 12-6తో య‌మాగుచి వెనుక‌బ‌డింది. అయితే బ్రేక్ త‌ర్వాత వ‌రుస‌గా ఆరు పాయింట్లు సాధించిన య‌మాగుచి సింధూను దాటేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివ‌ర‌కు 20-22తో య‌మాగుచి గేమ్‌ను సొంతం చేసుకుంది. 

    ఇక రెండో గేమ్‌లో సింధూ పూర్తిగా తేలిపోయింది. 13-6తో య‌మాగుచి స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలిచింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఏడు పాయింట్లు సాధించి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ ఓట‌మితో 2026 సీజ‌న్‌లో తొలి బీడ‌బ్ల్యూఎఫ్ టైటిల్ అందుకోవాల‌న్న సింధూ క‌ల తీర‌లేదు. కాగా ఈ సీజ‌న్ బీడ‌బ్ల్యూఎఫ్ టూర్‌లో సింధూకు ఇది రెండో సెమీఫైన‌ల్ ఓట‌మి కావ‌డం కావ‌డం గ‌మనార్హం.

    జ‌న‌వ‌రిలో జ‌రిగిన మ‌లేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలోనూ సింధూ సెమీస్‌లో చైనా ష‌ట్ల‌ర్ వాంగ్ జియి చేతిలో ఓడి ఇంటిబాట ప‌ట్టింది. ఇక బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ టైటిల్ కోసం సింధూ రెండేళ్లుగా చ‌కోర ప‌క్షిలా ఎదురుచూస్తూనే వ‌స్తోంది. చివ‌ర‌గా పీవీ సింధు 2024లో ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన స‌య్య‌ద్ మోదీ ఇంట‌ర్నేష‌న‌ల్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌ వరకు మంచి ప్రదర్శనలు చేయడంతో ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు టాప్-10లో కొనసాగుతోంది.

    చదవండి: ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

  • భారత దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన ఈ రన్‌మెషీన్‌.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.

    వన్డే జట్టులోకి జైస్వాల్‌ 
    కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్‌ కిషన్‌కు కూడా అఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్‌డౌన్‌లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.

    ఓపెనర్లుగా జైసూ, ఇషాన్‌కు అనుభవం ఉంది. ఇక ఇషాన్‌ వన్‌డౌన్‌లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఆ ముగ్గురికీ అవకాశం
    ఈ విషయంపై టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్‌ లేదా కేఎల్‌ రాహుల్‌.. లేదంటే యశస్వి జైస్వాల్‌ ఎవరైనా ఆడవచ్చు.

    వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్‌ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్యా లేదని.. అతడు మ్యాచ్‌ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్‌ తెలిపాడు.

    చదవండి: వైభవ్‌ తమ్ముడి సూపర్‌ సెంచరీ

Business

  • సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని  జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.

    అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్‌బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

    ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్‌, టీమ్‌ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

    ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది.

  • గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం బంగారం ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఈ పెరుగుదల రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రెండేళ్లలో కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. తాజా నివేదిక ప్రకారం 2026 నాల్గవ త్రైమాసికంలో బంగారం సగటు ధర ఔన్స్‌కు 6,000 డాలర్లకు చేరుకుంటుందని, 2027 చివరి నాటికి 6,300 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని పేర్కొంది.

    ఇటీవలి నెలల్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ దీర్ఘకాలిక ధోరణి మాత్రం బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారుల ఆసక్తి కొంత తగ్గినట్లు కనిపించినా, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఆందోళనలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలపై అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి ‘సేఫ్‌ హెవెన్‌’ డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

    ఈ ర్యాలీకి కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ మారక నిల్వలను డాలర్‌పై ఆధారపడకుండా వైవిధ్యపరచడానికి బంగారం నిల్వలను పెంచుతున్నాయి. జేపీ మోర్గాన్‌ అంచనాల ప్రకారం కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వచ్చే ఏడాదిలో కూడా బలంగానే కొనసాగనున్నాయి.

    ప్రస్తుత ధరలు
    ప్రస్తుతం (జూన్‌ 13 నాటికి) అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ కమోడిటీ మార్కెట్ (COMEX)లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్స్‌కు సుమారు 4,238 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230 పలుకుతోంది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి. అలాగే ఇక్కడ నిపుణులు, విశ్లేషకులు పేర్కొన్న అంచనాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. పాఠకులు స్వయంగా పరిశీలించుకున్న మీదటే పెట్టుబడుల నిర్ణయం తీసుకుకోవాల్సినదిగా సూచన.)

  • సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్‌ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

    ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్‌ 12న జరిగిన ‘స్పేస్‌ఎక్స్‌’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్‌ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.

    అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్‌ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్‌ఎక్స్‌ స్టార్‌బేస్‌ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్‌ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్‌ హౌసింగ్‌ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.

    చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్‌ ఏరియా, బెడ్‌రూమ్‌, కిచెన్‌, బాత్రూమ్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్‌, బిల్ట్‌-ఇన్‌ స్టోరేజ్‌, శక్తి పొదుపు డిజైన్‌ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్‌ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.

    2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్‌, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్‌షిప్‌ రాకెట్‌ అభివృద్ధి, స్టార్‌లింక్‌ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్‌బేస్‌కు సమీపంలోనే మస్క్‌ నివసిస్తున్నారు.

    స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్‌ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లకు చేరువై, మస్క్‌ సంపద సుమారు 1.1 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.

    చ‌ద‌వండి: ల‌క్ష రూపాయ‌ల ఫోన్‌.. ఇప్పుడు స‌గం ధ‌ర‌కే

  • సాక్షి, హైద‌రాబాద్‌: అమెరికా ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్‌ సిటీలో తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. మన దేశంలో టెస్లాకిది ఐదో సెంటర్‌.

    కాగా.. హైద‌రాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలోని ఆక్టేవ్‌ బ్లాక్‌లో రానున్న ఈ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో 6 సీటింగ్‌ కెపాసిటీ టెస్లా వై ఎల్‌ (లాంగ్‌– వీల్‌ బేస్‌) మోడల్‌ కారును ప్రదర్శించనున్నారు. 88 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ మోటార్‌ ఏడబ్ల్యూడీ సిస్టమ్‌ ఫీచర్స్‌తో ఉన్న ఈ కారు.. 5 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీట‌ర్ల‌ వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరులో కొలువుదీరిన టెస్లా షోరూమ్‌లు.. తాజాగా భాగ్యనగరానికి రానున్నాయి.

    చ‌ద‌వండి: ల‌క్ష రూపాయ‌ల ఫోన్‌.. ఇప్పుడు స‌గం ధ‌ర‌కే

  • అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్‌ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది.  ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.

    ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్‌ 
    ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్‌ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్‌ఆర్, పేరోల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్‌ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్‌ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్‌ గోయల్‌ పేర్కొన్నారు.

    ఏఐతో ఉద్యోగాలు పోవు..
    ‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్‌ఆర్, పేరోల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు.  దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్‌’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్‌ అట్‌ వర్క్‌ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్‌ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ సర్వేను నిర్వహించింది.

  • ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు వారి బడ్జెట్‌ సహకరించదు. ఎందుకంటే వాటి ధరలు రూ.లక్ష వరకు ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు శామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) ఇప్పుడు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారత్‌లో ఈ ఫోన్‌ను గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్‌సంగ్, ప్రస్తుతం ఈ మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది.

    ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్‌లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు (Samsung S25 Edge Discount) లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    గెలాక్సీ S25 ఎడ్జ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్. కేవలం 5.8 మిల్లీమీటర్ల మందం, 163 గ్రాముల బరువుతో ఇది శామ్‌సంగ్ గెలాక్సీ S సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్‌గా గుర్తింపు పొందింది. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ప్రీమియం లుక్‌తో పాటు మన్నికను కూడా అందిస్తోంది.

    స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 12GB ర్యామ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే గేలాక్సీ ఏఐ ఫీచర్లు, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఉన్నాయి.

    అయితే ఈ ఫోన్‌లో 3,900mAh బ్యాటరీ మాత్రమే ఉండటం కొంతమందికి ప్రతికూల అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ, స్లిమ్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ పనితీరు, 200MP కెమెరా కలయికను ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు ధరలో పరిశీలిస్తే, గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ నుంచి ‘వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్‌షిప్’ కేటగిరీలోకి మారినట్లే కనిపిస్తోంది.

National

  • అహ్మదాబాద్‌, సాక్షి:  గుజరాత్‌లో కస్టమ్‌ అధికారుల నిర్వహించిన తనిఖీల్లో  భారీగా బంగారం దొరికింది. అధికారులు రెగ్యూలర్‌ తనిఖీల్లో భాగంగా సోదాలు జరుపుతుండగా ప్లాస్టిక్‌ టేపులతో చుట్టిన రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. దానిని విప్పి చూడగా అందులో పెద్ద మెుత్తంలో బంగారు బిస్కెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.  

    దుబాయి నుండి అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో ఫ్లైట్ నెం. 6E-1478లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంలో విమానం ముందు భాగంలోని టాయిలెట్‌ స్పీకర్‌ బాక్స్‌లో రెండు నల్లరంగు పర్సులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇంజినీర్ల సాయంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటిని తెరిచారు. రెండు పర్సులలో దాదాపు 2,799.3 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల స్వచ్ఛతగల బంగారు బిస్కెట్లను గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ రూ. 4,26,89,325 గా తెలిపారు.

    అయితే భారత్‌లోకి బంగారం అక్రమంగా రవాణా చేసే భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసే ఉద్దేశ్యంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి బంగారాన్ని దాచి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం చట్టబద్ధమైన యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో 1962 కస్టమ్స్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం దానిని ఎవరూ హక్కు కోరనిదిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 

  • తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్‌లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.

    ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.

    ‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.

    జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.

    వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్‌ టైమ్‌లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. 

    జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్‌ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్‌ పేర్కొన్నారు. 

    ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్‌ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో  కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.

    తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు.  ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.

    ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.

    ‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’  అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’  అని ఆయన అన్నారు.

  • సాక్షి,ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమించింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ కాలం జూన్ 30 నుంచి ముగుస్తుంది. ఆరోజే ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ సేథ్‌ బాధ్యతలు స్వీకరిస్తారించనున్నట్లు తెలుస్తోంది.

    ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా ఆయనకు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్‌గా  లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ సేవలందిస్తున్నారు, ఖడక్ వాస్లాలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) పూర్వ విద్యార్థి. ఆయన డిసెంబర్ 1986లో ఆయన భారత సైన్యంలో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలందిస్తున్నారు. విస్త్రతశ్రేణి కమాండ్, స్టాఫ్‌,లాంటి పలు వ్యూహత్మక బాధ్యతలు నిర్వహించారు.  

    గతంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్‌ సేథ్‌ గతంలో సాయుధ రెజిమెంట్‌కు, సాయుధ బ్రిగేడ్‌ తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా పనిచేశారు. ప్రతిష్టాత్మక సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌ జీవోసీగా పని చేశారు. కాగా ప్రస్తుత ఆర్మీ చీఫ్  జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 2024 లో బాధ్యతలు స్వీకరించారు.

  • చెన్నై: త‌మిళ‌నాడులో అధికార పార్టీ త‌మిళ‌గ వెట్రీ క‌ళ‌గం (టీవీకే)లోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు.. సీఎం విజ‌య్ పార్టీలో చేరేందుకు క్యూ క‌డుతున్నారు. తాజాగా బీజేపీ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ విజయధరణి, అన్నాడీఎంకే నేత‌ బాలగంగ త‌దిత‌రులు శ‌నివారం టీవీకేలో చేరారు. వీరికి పార్టీ కండువాల‌తో మంత్రులు ఎన్‌. ఆనంద్‌, ఆధవ్ అర్జున స్వాగ‌తం ప‌లికారు.

    టీవీకే చేర‌డం సంతోషంగా ఉంద‌ని ఎస్ విజయధరణి ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "తమిళనాడులో టీవీకే మార్పును తీసుకువచ్చింది. జోస‌ఫ్ విజ‌య్ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం అవినీతిని రూపుమాపుతూ, మహిళలకు భద్రతను కల్పిస్తోంది. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాన్ని టీవీకే నాకు కల్పించింది, ఆ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.

    మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..
    విజయధరణి ఇటీవ‌ల జ‌రిగిన శాన‌స‌స‌భ ఎన్నిక‌ల్లో కన్యాకుమారి జిల్లాలోని విలవంకోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి పరాజ‌యం పాల‌య్యారు. అంత‌కుముందు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప‌నిచేశారు. 2016లో ఆమె కర్ణాటక వ్యవహారాల బాధ్యతతో కూడిన అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

    చ‌ద‌వండి: రంగ‌స్వామితో విజ‌య్ దూత ర‌హ‌స్య భేటీ!

    2011లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత వ‌రుస‌గా 2016, 2021లోనూ గెలిచారు. 2024, ఫిబ్ర‌వ‌రిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. క‌న్యాకుమారి లోక్‌స‌భ టికెట్ కోసం ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేసి క‌మ‌లం పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అయితే ఆమెకు బీజేపీ లోక్‌స‌భ టికెట్ ఇవ్వ‌లేదు. తాజాగా ముగిసిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజ‌యం ద‌క్క‌లేదు. దీంతో బీజేపీని వీడి టీవీకే పార్టీలోకి  వ‌చ్చారు. 

  • పురుషులు ప్రైవేట్‌ పార్ట్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై కేఈఎమ్ (KEM) హాస్పిటల్ వైద్య విద్యార్థిని సేజల్ పవార్ భారీ షాక్‌ తగిలింది. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ‘పురుషుల శవాల’ (Male Cadavers) పై వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.  

    ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలే, కేఈఎమ్ హాస్పిటల్‌లో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న సేజల్ పవార్‌ను హాస్పిటల్ యాజమాన్యం 15 రోజుల పాటు నిర్బంధ సెలవుపై పంపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అంతర్గత కమిటీ, సేజల్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని  తేల్చింది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. నిర్బంధ సెలవు అనేది తాత్కాలిక నిర్ణయం మాత్రమే. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం సేజల్ తల్లిదండ్రులను హాస్పిటల్‌కు పిలిపించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు.

    అసలు వివాదం ఏమిటి?
    దాదాపు మూడు నెలల క్రితం రికార్డ్ అయిన ప్రణీత్ మోరే కామెడీ షోకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షోలో ప్రేక్షకురాలిగా ఉన్న సేజల్ పవార్, తన అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) శిక్షణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, మృతదేహాల పురుషాంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం తీవ్రమవ్వడంతో సేజల్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ సేజల్‌, ప్రణీత్‌ మోరే, అదే షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమాన్షు జంగ్రాపై కూడా మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇదీ చదవండి: విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

    ఎన్‌సీడబ్ల్యూ: మరోవైపు కనీస మర్యాద లేకుండా, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా మాట్లాడినందుకు గాను జాతీయ మహిళా కమిషన్ (NCW),  కమెడియన్ ప్రణీత్ మోరే , హిమాన్షు జంగ్రాలకు సమన్లు జారీ చేసింది.

    ఇదీ చదవండి: మైనర్‌పై ఫుట్‌బాల్‌ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

    రెసిడెంట్ డాక్టర్ల సంఘం  స్పందన
    కేఈఎమ్ హాస్పిటల్‌కు చెందిన మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సేజల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మాటలు వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అలాగే సోషల్‌మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి , వ్యక్తిగత దూషణలను ఆపాలని కోరింది.

    ఇదీ చదవండి: డేంజరస్‌ స్టంట్‌ : యెమెన్‌ స్పైడర్ మ్యాన్ దుర్మరణం

  • శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్‌ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్‌ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది.

    "నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్‌ వారియర్స్‌ జమ్మూ కశ్మీర్‌ పోలీసులతో కలిసి జూన్‌ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్‌ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప‍్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది" అని చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ ద్వారా పోస్టు చేసింది.

    నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) అంటే భారత్‌, పాకిస్థాన్‌ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.  

  • పాల్ఘర్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్‌బాల్ కోచ్, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక  దాడికి పాల్పడిన  వైనం కలకలం రేపింది. అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను 36 ఏళ్ల అభిజిత్ మెండల్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.

    పోలీసుల కథనం ప్రకారం దిగ్భ్రాంతికరమైన కేసు  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వసాయిలోని తన ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు.  గత మూడేళ్లుగా, పలుమార్లు  లైంగిక దాడిచేయడంతోపాటు  కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను తీసి,  బెదిరించి, తద్వారా తన కోరికలను తీర్చుకునేవాడు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక, చివరకు తన కుటుంబం సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా  ప్రాథమిక విచారణ అనంతరం మెండల్‌ను అరెస్టు చేశారు.

    ఫుట్‌బాల్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రలోభపెట్టాడని బాధితురాలు వాపోయింది. వేధింపులతో విసిగి, అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. దీంతో వీడియోలు, ఫోటోలతో తనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించింది. తనకు లొంగకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననిబెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి, కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: డేంజరస్‌ స్టంట్‌ : యెమెన్‌ స్పైడర్ మ్యాన్ దుర్మరణం

  • బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎన్నో అపసోపాలు పడి ఎట్టికేలకు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన డీకే శివకుమార్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తనకు కీలక శాఖ కేటాయించలేదని పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా అనంతరం అది సద్దుమణగడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోనేత డీకే శివకుమార్‌పై అసమ్మతి గళం వినిపిస్తున్నారు.

    కన్నడ మంత్రి కృష్ణ బైరేగౌడకు ఇటీవల జరిగిన క్యాబినేట్ విస్తరణలో బెంగళూరు డెవలఫ్‌మెంట్‌ ఫోర్ట్‌ పోలియో కేటాయించారు. అయితే అందులో కీలకమైన గ్రేటర్‌ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్‌డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలో ఉండడంతో ఆయనకు అధికార విభజనపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణబైరే గౌడ స్పందించారు. తనకు కేటాయించిన ఫోర్ట్‌ పోలియోపై స్పష్టతనివ్వాలని సీఎం శివకుమార్‌ను కోరారు.

    కృష్ణబైరే గౌడ మాట్లాడుతూ " నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బెంగళూరు అభివృద్ధిని పర్యవేక్షించే కష్టమైన బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఇది చాలా కఠినమైన పని. నేను దీనిని అధికార సమస్యగా చూడటం లేదు. ఇలాంటి బాధ్యత తీసుకునేటప్పుడు స్పష్టత ఉండాలి, ఎందుకంటే నేను ఏ బాధ్యత తీసుకున్నా నా వైపు నుండి జవాబుదారీతనం ఉంటుంది. స్పష్టత ఉన్నప్పుడే మనం ఫలితాలను అందించగలం," అని గౌడ అన్నారు.నాకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దానిపై స్పష్టత ఆశిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

    కాగా ఈ అంశంమై కృష్ణబైరే గౌడ ఇదివరకే అదిష్ఠానంతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో  గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

     

  • కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేవలం స్వల్పవిభేదాలకే కోర్టుకెక్కుతున్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఈ విడాకులు అనేది కేవలం తల్లిదండ్రులుగా వారికే కాదు.. ఇరు కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేమాభిమానాలకు, భావోద్వేగ బంధాలకు భంగం కలిగిస్తాయి.  ఈ క్రమంలో ఒక విడాకుల స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

    మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది శిఖా సింగ్‌. ఆమెకు 2020లో సౌరభ్‌తో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు దాదాపు ఐదేళ్లపాటు కొనసాగింది.  ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలిచి ఆమె తండ్రి  న్యాయపరమైన ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు  చేసేశాడు. అటు కుమార్తె భవిష్యత్తు, ఇటు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో  ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. 

    మామగారి అనారోగ్యం గురించి తెలుకున్న శిఖా భర్త  మెరుగైన వైద్యం కోసం అతడిని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆ ఖర్చులన్నింటినీ స్వయంగా భరించాడు. ఎంతో సపోర్ట్‌గా  నిలిచాడు. ఇక్కడే అల్లుడు.. కన్న కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. 

    దీంతో శిఖా మనసులో భర్త మీదున్న ద్వేషం పోయింది. మళ్లీ ప్రేమాభిమానాలు చిగురించాయి. ఇంతలో విడాకుల కేసు విచారణకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి. తాను కష్టకాలంలో ఉన్నపుడు సౌరభ్ చూపిన ప్రేమ, మానవత్వాన్ని చూసి శిఖా చలించిపోయింది.  అంతే విడాకుల పత్రాలను చింపేసి భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లతోనే భర్తను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. 

     

  • పుదుచ్చేరి: పుదుచ్చేరి రాజకీయాల్లో అర్ధరాత్రి వేళ జరిగిన ఒక రహస్య సమావేశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాబోయే తట్టంచావడి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో, తమిళనాడు మంత్రి ఎన్ ఆనంద్ (బుస్సీ ఆనంద్) గురువారం రాత్రి జరిపిన ముఖాముఖి భేటీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆనంద్.. నేరుగా సీఎం నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడం కొత్త పొలిటికల్ ఈక్వేషన్లకు దారితీస్తోంది.

    ఉపఎన్నికల వేళ వ్యూహాత్మక భేటీ
    ముఖ్యమంత్రి రంగస్వామి గత ఎన్నికల్లో మంగళం, తట్టంచావడి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. అయితే, ఆయన తట్టంచావడి స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. శాసనసభలో తమ బలాన్ని 12 స్థానాలకు పెంచుకోవాలని భావిస్తున్న అధికార పక్షం ఏఐఎన్‌ఆర్‌సీ, ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇలాంటి కీలక సమయంలో పుదుచ్చేరి మూలాలు ఉన్న బుస్సీ ఆనంద్.. పెళ్లి వేడుక కోసం వచ్చి, అర్ధరాత్రి సీఎం రంగస్వామిని కలవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది.

    విజయ్ దళపతి దూతగా బుస్సీ ఆనంద్?
    బుస్సీ ఆనంద్ కేవలం తమిళనాడు మంత్రి మాత్రమే కాదు.. గతంలో 2006లో పుదుచ్చేరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నటుడు, సీఎం విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు. రంగస్వామితో ఆయనకు పాత వ్యక్తిగత, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. గతంలో పుదుచ్చేరి వచ్చినప్పుడు ఆలయ దర్శనం చేసుకుని వెళ్లిపోయిన ఆనంద్, ఈసారి మాత్రం నేరుగా సీఎం రంగస్వామితో  చర్చలు జరపడం వెనుక సీఎం విజయ్ రాయబారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    మారుతున్న పొత్తుల సమీకరణలు
    తమిళనాడులో టీవీకే  నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ, పుదుచ్చేరిలో పొత్తులపై ఇంకా ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. ఒకవేళ పుదుచ్చేరి ఉపఎన్నికలో టీవీకే, కాంగ్రెస్ చేతులు కలిపితే అధికార ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, గత ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నేయం మక్కల్ కజగం పార్టీ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బుస్సీ ఆనంద్‌ను సంప్రదించడం ఈ సీటు చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది.

Crime

  • చంఢీగడ్‌: మెడికల్‌ షాప్‌లోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటన చంఢీగఢ్‌లో చోటు చేసుకుంది. మెడికల్‌స్టోర్‌లోకి ప్రవేశించిన పలువురు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఒక్కసారిగా మెడికల్‌ షాప్‌లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డారు.  బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిపారు.

    ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్యాషియర్‌ మృత్యువాత పడ్డారు. మెడికల్‌ షాపులో చొరబడి కాల్పులు జరపడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  అయితే మెడికల్‌ షాపులోకి చొరబడి కాల్పులు జరపడం వెనుక పాత విభేదాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పాత గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

NRI

  • సాక్షి, హైదరాబాద్‌: జాగర్లమూడి మధుకర్‌, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్‌లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.

    యూకేలో సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌ ఇచ్చే అర్హతను నందూస్‌ వరల్డ్‌ కిచెన్‌ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌ ఇవ్వకుండా బ్రేక్ పడింది.

    యూకే వీసా కేసులో నందూస్‌ వరల్డ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి.  

Family

  • అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్‌ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్‌తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారాయి. సాధారణ ఫ్రీజింగ్ పద్ధతుల కంటే ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఆహారపదార్థాలను భిన్నంగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల వాటికి విభిన్నమైన చిక్కదనం, ఆకృతి రావడంతో పాటు, ఒక ప్రత్యేకమైన ఆవిరి కూడా వెలువడుతుంది. ఈ ఆవిరిని చెఫ్‌లు "డ్రాగన్ బ్రీత్" స్నాక్స్ కోసం ఉపయోగిస్తారు. 

    ఎవరైనా డ్రాగన్ బ్రీత్ స్నాక్‌ను కొరికినప్పుడు, అది ఒక ఆవిరి మేఘాన్ని విడుదల చేస్తుంది. అంటే..ఇది వారి నోటి నుంచి పొగ వస్తున్నట్లుగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీన్ని డ్రాగన్‌ శ్వాస లేదా స్వర్గపు శ్వాస వంటి ట్రెండ్‌లుగా పిలుస్తారు. అలాంటి ఆహారాలకు కేరాఫ్‌ బెంగళూరులోని వివి పురం ఫుడ్‌ స్ట్రీట్‌. పాపం ఓ పెళ్లైన కొంత జంట అక్కడకువెళ్లి ఆ ట్రెండ్‌ ఫుడ్‌ని సరదాగా ట్రైం చేయడంతో ఏం జరిగిందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఇలాంటి ఆహారం తినేటప్పుడు జాగురకతతో తినాలంటూ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    అసలేం జరిగిందంటే..జస్ట్‌ పెళ్లై నాలుగురోజులైంది. ఆమె సరదాగా భర్తతో కలిసి ఈ స్మోకీ ట్రెండ్‌ ఫుడ్‌ని టేస్ట్‌ చేయాలని వి.వి.పురం ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ ద్రవ నైట్రోజన్‌తో పూత పూసి.. పొగలు వెలువరించే బిస్కెట్లు తిన్నారు. అంతే ఆ నవవధువుకి నోటి నుంచి రక్తస్రావం, ఎండోస్కోపీలో అన్నవాహిక , జీర్ణాశయ శ్లేష్మ పొర గణనీయంగా క్షీణించినట్లు తేలింది. ఆ తర్వాత రెండు చేతులు, కాళ్లలో బలహీనత మొదలై..ఒక నెల వరకు మంచానికే పరిమితమైంది. వైద్య పరీక్షల్లో నరాల ప్రసరణ పరీక్షలలో అక్యూట్ మోటార్ ఆక్సోనల్ న్యూరోపతి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరదాగా తిన్న ఆహారం ఆటోఇమ్యూన్ న్యూరోపతికి దారితీసింది. 

    తినేటప్పుడు తస్మాత్‌ జాగ్రత్త..
    ద్రవనైట్రోజన్‌తో కూడిన ఆహారాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. అవి పూర్తిగా ఆవిరైకపోక ముందే తింటే నోరు, అన్న వాహిక, కడుపుకి తీవ్రమైన క్రయోజెనిక్‌ కాలిన గాయలు ఏర్పడి, కోతలు, రక్తస్రావం, చిల్లులు పడటానికి దారితీస్తుందట. ఆ నేపథ్యంలోనే ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దీనిపై స్పష్టమైన హచ్చరికలు జారీ చేసింది. పైగా ఆహారాన్ని ప్లేట్‌లో వడ్డించేటప్పుడు లేదా కస్టమర్లకు నేరుగా అందించే ముందు ద్రవ నైట్రోజన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించింది. 

    కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో లేదా ఐస్‌క్రీంల తయారీలో మాత్రమే దీనిని శీతలీకరణ (cooling) ఏజెంట్‌గా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఒకవేళ సరదాగా ఇలాంటి క్రయోజనిగ్‌ ఫుడ్‌ని ప్రయత్నించాలనుకుంటే..ఆ పొగ అంతా అయిపోయేదాక వెయిట్‌ చేసి అప్పుడు ఆరగించాలని అంటున్నారు. నేరుగా అలానే తింటే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

    (చదవండి: జస్ట్‌ ఒక్క గవర్నమెంట్‌ జాబ్‌ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..)

     

     

  • కొందరు సక్సెస్‌కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్‌ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్‌ అలాంటి ఘనతనే సాధించింది.

    ఆ అమ్మాయే రాయ్‌పూర్‌కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. 

    ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్‌ గవర్నెమెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్‌ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్‌, ఎస్‌ఎస్సీ సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌, ఎంటీఎస్‌ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె  చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. 

    ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. 

    తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్‌ టీచర్‌ లేదా లెక్చరర్‌ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్‌ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్‌!)