Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్‌లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది.  

    కంటిపైన ప్లాస్టర్‌తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్‌కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది.  

    ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్‌కి ఇది మాత్రమే కాదు, జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం.  

    ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్‌ రిలీజ్‌కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్‌ మూడో లుక్‌  ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

  • బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే.  ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్‌గా మారిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవలే మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్న శివ ‍జ్యోతి.. తాజాగా మరో వేడుక నిర్వహించింది. 

    తాజాగా తన ముద్దుల కూతురి నామకరణ వేడుక గ్రాండ్‌గా నిర్వహించింది. తమ గారాల పట్టికి వెన్నెల అని పేరు పెట్టింది. ఈ వేడుకకు  సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా వెన్నెల చుట్టాలు అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో టాలీవుడ్ బుల్లితెర సినీతారలు హాజరై సందడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

     


     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి మామూలే. ఈ వారంలో గోదారి గట్టుపైన, సతీ లీలావతి, రేజర్, స్పిరిట్ లాంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు 'రేజర్' మూవీస్‌పై ప్రేక్షకుల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. తెలుగు హిట్ మూవీ డెకాయిట్‌తో పాటు మలయాళ బ్లాక్‌బస్టర్స్ వాలా-2, భరతనాట్యం 2 ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    • భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

    • మై రాయల్ నెమిసిస్(కొరియన్ మూవీ)- మే 08

    • రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్(హాలీవుడ్ సినిమా)- మే 08


    అమెజాన్ ప్రైమ్

    •   డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08

    •   లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08

    • సతన్‌ ది డార్క్(తమిళ సినిమా)- మే 08

    • నో ప్లేస్ టు బీ సింగిల్(హాలీవుడ్ సినిమా)- మే 08

    జియో హాట్‌స్టార్

    • వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

    •  సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

    • ఎమ్‌ఐఏ(హాలీవుడ్ సినిమా)- మే 08

    జీ5

    •  లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08

    సన్ నెక్స్ట్

    •  ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08

    •  సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08

    ఆపిల్ టీవీ

    • అన్‌కండీషనల్(హాలీవుడ్ మూవీ- మే 08

  • తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్‌లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్‌ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.

    విజయ్- త్రిష పర్సనల్ లైఫ్‌పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది.  

    త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్‌గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు.  ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. 
     

  • బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కర్తవ్య. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి పుల్‌కిత్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో షారూఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

    ఇవాళ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సైఫ్‌ నిజాయితీ గల పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో క్రైమ్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో రసిక, సంజయ్, సౌరభ్ కీలక పాత్రల్లో నటించారు. 
     

  • భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటేమన తెలుగులో రాజమౌళికి మాత్రమే సాధ్యం. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ ప్రస్తుతం వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రాలపై అంతకుమించిన వసూళ్లు వస్తాయనే ఆశ మేకర్స్‌కు ఉంటుంది. దర్శకుడు, నటీనటులు, కథపై వసూళ్లు అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సరిపోదు. మేకింగ్‌ కూడా ఆ రేంజ్‌లో ఉంటేనే వర్కవుట్ అవుతుంది. కానీ ఈ విషయంలో మన రాజమౌళికి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన తీసిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి.

    అయితే పులికి చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనే సామెత మన వినే ఉంటాం. అలా ఇతర దేశాల్లాగే సినీరంగంలో తాము కూడా ప్రపంచస్థాయికి ఎదగాలని సౌదీ అరేబియా ఆశలు పెట్టుకుంది. అనుకోవడమే కాదు.. భారీ బడ్జెట్‌తో డెజర్ట్ వారియర్ ‍అనే మూవీని నిర్మించింది. ప్రపంచంలోనే ఫేమస్ అయిన స్టార్స్‌ను పెట్టి ఈ సినిమా కోసం ఏకంగా రూ.1400 కోట్ల ఖర్చు చేసింది. కట్ చేస్తే.. సీన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నది ఒక్కటీ.. అయిందొక్కటి అన్న తీరుగా మారిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కేవలం రూ.6 కోట్లు మాత్రమే సాధించింది. ఈ వసూళ్లతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా రికార్డ్ సృష్టించింది. మొత్తం బడ్జెట్‌లో కేవలం 0.4 శాతం వాటా మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే కొవిడ్ కారణంగా ఆలస్యం కావడం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో మూవీని తెరకెక్కించడంతో బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తోంది.

    ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సౌదీ అరేబియా పేరును తీసుకు రావాలని అనుకోవడం మంచిదే. అయితే భారీ బడ్జెట్‌ మాత్రమే కాకుండా కథపై కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేదని సినీ ప్రియులు అంటున్నారు. ఈ డిజాస్టర్‌ మూవీతో తమ దేశంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక నుంచైనా సౌదీ అరేబియా మన దర్శకధీరుడు రాజమౌళి సలహాలు తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

    కాగా.. సౌదీ అరేబియా ఏంబీసీ గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' లాంటి చారిత్రక వార్ మూవీని నిర్మించింది. దాదాపు 7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాకు రూపొందించారు. ఈ మూవీకి రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మార్వెల్ నటుడు ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.
     

  • టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అందరు కొత్తవాళ్లతో ఈ మూవీని తెరకెక్కించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో  కెమెరా అసిస్టెంట్‌ సాయితేజ్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.

    తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

    ఈ మూవీ కథేంటంటే..

    ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్‌(సాయి తేజ్‌).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్‌ని రెంట్‌కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్‌ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్‌)కు సతీష్‌ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు.  ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్‌తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్‌ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు.

    సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్‌ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్‌ సవాల్‌ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్‌ ఏం చేశాడు? సతీష్‌-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్‌ కీలపట్టు) వల్ల సతీష్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్‌ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
     

     

  • తమిళ హీరో, దళపతి విజయ్‌ సినిమాల్లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ హీరోగా నిలిచాడు. పాలిటిక్స్‌లో అడుగుపెట్టి తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. సీఎం కావడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ద్రవిడ రాజకీయాలను షేక్ చేశాడు. అన్ని స్థానాల్లో సింగిల్‌గా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. అయితే అధికారం చేపట్టేందుకు మాత్రం ఇంకా సీట్లు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లిస్ట్‌ అందజేశారు. ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం కావడంతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.

    తమ హీరో, నాయకుడు అత్యధిక సీట్లు గెలిచినా కూడా సీఎం కావడానికి మరింత సమయం పట్టడంపై ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని విజయ్ ఇంటి బయట పూజలు చేస్తూ కనిపించారు. తమ నాయకుడికి అడ్డంకులు రావడంతో అభిమాని ఆవేదనకు గురయ్యారు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 
     

     

  • కోలీవుడ్ నటి వనితా విజయ్‌కుమార్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. 1999లోనే దేవి మూవీలో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె కూతురు సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా పాల్గొన్న జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న అగధ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

    ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన ఎంఎస్ రాజు మాట్లాడారు. 1999లో వచ్చిన దేవి మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్‌లో వనిత విజయ్ కుమార్‌ను పాము కాటేసిందని తెలిపారు. అప్పుడు మేమంతా తెగ కంగారు పడిపోయామని వెల్లడించారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని ఎంఎస్ రాజు ప్రశంసలు కురిపించారు. కాగా.. 1999లో వచ్చిన దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా ఉన్నారు. 

    ఈ చిత్రాన్ని ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో మిస్టికల్‌ డివైన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో  కామాక్షీ భాస్కర్ల  మహాదేవి పాత్రలో కనిపించనుంది. 
     

  • ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది.

    ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ..‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు  నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా.

    ఈ సినిమాకు పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్ గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే..ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్ లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు’ అన్నారు. 

  • ‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడివికి రాజైన సింహం, తోడేలు మధ్య జరిగే పోటీలా ఈ సినిమాలో అడ్వంచర్స్ ఉంటాయని టీం హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

    ఈ పోస్టర్‌లోని ఓ బిడ్డ, ఖడ్గం, సింహం ఇవన్నీ చూస్తుంటే ఇదొక ఫారెస్ట్ అడ్వంచర్ చిత్రం అని అర్థం అవుతోంది. ఇక ఇందులో సింహంలాంటి యోధుడిగా సందీప్ కిషన్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఏ లెజెండ్ ఈజ్ బార్న్ అంటూ వదిలిన ఈ పోస్టర్ ఆడియెన్స్‌లో ఒక్కసారిగా అంచాల్ని రెట్టింపు చేసింది. ఈ ఫాంటసీ అడ్వంచర్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించారు. ఇక సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది.

  • రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్‌ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్‌తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.

    పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. 
     

     

  • తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు దళపతి విజయ్‌. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని(108 స్థానాలు) నమోదు చేసింది. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

    ప్రస్తుతం విజయ్‌ ఫోకస్‌ అంతా మేజిక్‌ ఫిగర్‌(118)కి కావాల్సిన సభ్యులను పోగు చేయడంపైనే పెట్టాడు. గవర్నర్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ రోజే విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి నెటిజన్స్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ త్రిషతో పెళ్లి ఎప్పుడు? వారిద్దరి లవ్‌ స్టోరీ ఎలా మొదలైంది? వయసు తేడా ఎంత? తదితర అంశాలపై నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

    ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందే విజయ్‌ సతీమణి సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఓ నటితో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినప్పటి నుంచి త్రిష పేరు నెట్టింట ట్రెండ్‌ అయింది. విజయ్‌-త్రిషలు ప్రేమలో ఉన్నారనే పుకార్లు ఎక్కువైయ్యాయి. అయితే అవి నిజమే అన్నట్లుగా అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.

    అప్పటి నుంచి విజయ్‌, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్రిష బర్త్‌డే (మే 4) రోజే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్‌ భారీ విజయం సాధించడంతో వీరిద్దరి బంధంపై రూమర్స్‌ మరింత ఎక్కువయ్యాయి. విజయ్‌ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి. మరికొంతమంది అయితే.. కొన్నాళ్ల పాటు పాలనపై దృష్టిపెడతాడని, ఐదారు నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. 

    ఏదేమైనా పెళ్లి మాత్రం చేసుకోవడం పక్కా అని తేలడంతో.. అందరూ విజయ్‌-త్రిషల వయసుపై గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంత అనేది చాలా మంది గూగుల్‌ని అడిగి తెలుసుకుంటున్నారు.  విజయ్‌ 1974 జూన్ 22న జన్మించాడు. ఆయనకు ప్రస్తుతం 51 ఏళ్లు.  త్రిష 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 9 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ తేడా ఉంది. 

    విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్)లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి, 'లియో' వంటి చిత్రాల్లో జంటగా నటించారు. వెండితెరపై వీరి జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు రావడమే కానీ.. అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటించలేదు.

Sports

  • టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. 

    దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు.  ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సూర్యకుమార్‌ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్‌ తెలిపారు. ‘ కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

    సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. 

    రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది.

     చదవండి: తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. త‌ద్వారా ల‌క్నో త‌ర‌ఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ బాదిన తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. రొమారియో షెప‌ర్డ్ వేసిన యార్క‌ర్ బంతిని బౌండ‌రీ త‌ర‌లించ‌డం ద్వారా ఐపీఎల్‌లో రెండో సెంచ‌రీ సాధించాడు. 

    49 బంతుల్లోనే సెంచ‌రీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. అయితే గ‌తంలో ల‌క్నో త‌ర‌ఫున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ రిష‌బ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శ‌త‌కం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచ‌రీతో ఆ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 

    ఓవ‌రాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచ‌రీ. తొలి సెంచ‌రీ కూడా ల‌క్నో త‌ర‌ఫునే సాధించాడు. గ‌తేడాది సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 ప‌రుగులు సాధించాడు. ఇక ల‌క్నో త‌ర‌ఫున రెండు సెంచ‌రీలు సాధించిన రెండో ఆట‌గాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్‌, స్టోయినిస్‌, పంత్‌లు త‌లా ఒక సెంచ‌రీ బాదారు.

    చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

  • టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ అతుల్ వ‌స్స‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. గంభీర్ దూకుడు స్వ‌భావం, అత‌డి కఠిన వైఖ‌రితో జ‌ట్టులోని కొంతమంది ఆట‌గాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వ‌స్స‌న్ ఆ ఆటగాళ్ల పేర్ల‌ను వెల్ల‌డించడానికి నిరాక‌రించాడు. 

    అతుల్ వ‌స్స‌న్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్న‌ప్ప‌టి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జ‌ర‌గాలి, ఇంకేమీ చేయ‌కూడ‌దు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. మొద‌టి నుంచి గంభీర్ స్వ‌భావం అలాగే ఉంటుంది. ధ‌నిక కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ గంభీర్ ఆట‌లో మంచి టెక్నిక్ ఉండ‌డంతో పాటు మంచి తెలివిమంతుడు. 

    అయితే అత‌నికి ఉండే ఈగో వేరే లెవెల్‌లో ఉంటుంది. అదెలా అంటే అత‌ను ఏదైనా అనుకుంటే అవ‌త‌లి వ్య‌క్తుల కూడా త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్‌లో అలాగే కొనసాగడం ఆట‌గాళ్ల‌తో గొడ‌వ‌లు ప‌డేలా చేసింది. 

    అందుకే ఐపీఎల్‌లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి ప‌ట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత‌మంది ఆట‌గాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. 

    వారి పేర్లు చెప్ప‌డం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్ర‌వ‌ర్త‌న‌తో క‌చ్చితంగా సంతోషంగా లేర‌ని చెప్ప‌గ‌ల‌ను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

    చదవండి: భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సూప‌ర్ ఫామ్ క‌న‌బ‌రుస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల‌క్నోతో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్ భువ‌నేశ్వ‌ర్‌కు 200వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఐపీఎల్లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి పేస‌ర్‌గా భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు సాధించాడు. 

    ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భార‌త ఆట‌గాళ్లే కావ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 199 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు. 

    2011లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్‌లు, ఎస్‌ఆర్‌హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్‌లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్‌లు ఆడాడు.

    అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా..
    మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్‌లు (2008-2025)
    రోహిత్ శర్మ: 277 మ్యాచ్‌లు (2008-2026)
    విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్‌లు (2008-2026)
    రవీంద్ర జడేజా: 264 మ్యాచ్‌లు (2008-2026)
    దినేష్ కార్తీక్: 257 మ్యాచ్‌లు (2008-2024)
    శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌లు (2008-2024)
    రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్‌లు (2009-2025)
    అజింక్య రహానే: 207 మ్యాచ్‌లు (2008-2026)
    సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు (2008-2021)
    రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్‌లు (2008-2022)
    అంబటి రాయుడు: 204 మ్యాచ్‌లు (2010-2023)
    భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్‌లు (2011-2026)

    చదవండి: దొరికిపోయిన చాహల్‌.. పంజాబ్ జట్టుకు శిక్ష త‌ప్ప‌దా?

  • గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది.

    టిమ్ డేవిడ్ ఔట్‌.. ఆరో వికెట్ డౌన్‌
    ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావ‌డంతో ఆర్సీబీ 158 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.  ఆర్‌సీబీ విజ‌యానికి 21 బంతుల్లో 55 ప‌రుగులు అవ‌స‌రం.

    ఒకే ఓవ‌ర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్‌
    ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో బౌలింగ్‌కు వ‌చ్చిన ప్రిన్స్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. ఓవ‌ర్ తొలి బంతికి ప‌డిక్క‌ల్ (34)ను పెవిలియ‌న్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 ప‌రుగుల వ‌ద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజ‌యానికి 48 బంతుల్లో 106 ప‌రుగులు అవ‌స‌రం.

    ప‌టీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ
    213 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ ఆర్సీబీ 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీదార్ (60) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, ప‌డిక్క‌ల్ 34 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

    7 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీ 60/2
    ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 2 వికెట్ల న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. ప‌డిక్క‌ల్ (26), ప‌టీదార్ (25) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
    210 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో కోహ్లీ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ జాక‌బ్ బెథెల్ 4 ప‌రుగులు చేసి ష‌మీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 2 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.

    ఆర్సీబీ టార్గెట్ 213 ప‌రుగులు
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌కు ప‌లుమార్లు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో ఆట‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించి ఆర్‌సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్‌ టార్గెట్‌ నిర్దేశించింది.

    రెండో వికెట్ కోల్పోయిన లక్నో
    111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

    • లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.

    మిచెల్ మార్ష్ సెంచ‌రీ.. ల‌క్నో 139/1
    ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శ‌త‌కం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. పూర‌న్ 14 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

    తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో
    వ‌ర్షం అంత‌రాయం త‌ర్వాత మొద‌లైన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన అర్షిన్ కుల‌క‌ర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ప‌టీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ల‌క్నో 11 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. 

    వరుణుడి అడ్డంకి 
    ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్‌ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్‌ మార్ష్‌ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్‌ మార్ష్‌ 76, అర్షిన్‌ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

    దంచుతున్న మిచెల్ మార్ష్‌
    ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 56 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

    4 ఓవర్లలో లక్నో 39/0
    4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 39 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం
    ల‌క్నో, ఆర్సీబీ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి ల‌క్నో 1.3 ఓవ‌ర్లలో వికెట్లు న‌ష్ట‌పోకుండా 12 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కుల‌కర్ణి (4) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    టాస్‌ నెగ్గిన ఆర్సీబీ
    టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జ‌ట్టు ఎలాంటి మార్పు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. మ‌రోవైపు ల‌క్నో జ‌ట్టు మాత్రం మూడు మార్పుల‌తో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కుల‌క‌ర్ణి, మ‌నిర‌మ‌న్ స్థానంలో షాబాజ్ అహ్మ‌ద్, మోసిన్‌ ఖాన్‌ స్థానంలో దిగ్వేష్‌ రాఠీ జ‌ట్టులోకి వ‌చ్చారు.

    ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్‌లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్‌ జె యింట్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

    తుది జట్లు:
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్‌వుడ్.

    లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.

  • టీమిండియా క్రికెట‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ త‌న చ‌ర్య‌తో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు మొత్తాన్ని చిక్కుల్లో ప‌డేసేలా క‌నిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్ర‌యాణం చేస్తున్న విమానంలో చాహ‌ల్..వేప్‌( ఈ-సిగ‌రేట్) తాగిన వీడియో ఫుటేజీ బ‌య‌టికి వ‌చ్చింది. వీడియోలో చాహ‌ల్ వేప్‌ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. 

    ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు అహ్మ‌దాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు విమాన ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ స‌హ‌చ‌ర క్రికెట‌ర్ అర్ష‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్లాగ్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే అస‌లు వ్లాగ్‌లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించిన‌ట్లు ఇన్‌స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. 

    అస‌లు వీడియోలో చాహ‌ల్ ఒక్క‌డే కాకుండా అత‌డి ప‌క్క‌న ఉన్న శ‌శాంక్ సింగ్‌, ఇత‌ర పంజాబ్ ప్లేయ‌ర్లు కూడా ఈ-సిగ‌రేట్ తాగే అవ‌కాశం లేక‌పోలేద‌ని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్ర‌యాణంలో సిగ‌రేట్ (ఈ-సిగ‌రెట్ అయినా) తాగ‌డం నిషేధం. సిగ‌రేట్ పొగ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగేందుకు ఆస్కార‌ముంది. చాహ‌ల్ ప్ర‌వ‌ర్త‌న విమాన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను ఉల్లంఘిస్తుంది. 

    ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌లోనే పంజాబ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ డ్రెస్సింగ్రూమ్‌లో వేప్‌ను ఉప‌యోగిస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెల‌కొంది. అయితే బీసీసీఐ మాత్రం ప‌రాగ్‌ను మంద‌లిస్తూ అత‌ని మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానాతో స‌రిపెట్టింది. కానీ ఈసారి చాహ‌ల్ వేప్ ఉప‌యోగించిన‌ట్లు తేలితే మాత్రం అత‌డితో పాటు పంజాబ్ జ‌ట్టు మొత్తానికి శిక్ష ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే చాహల్‌తో పాటు పంజాబ్‌ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.

    చాహల్‌ చర్య నిజమని తేలితే ఐపీఎల్‌ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహ‌ల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం కానీ ఇంకా స్పందించ‌లేదు. అయితే ఈ వీడియో న‌కిలీదా లేక నిజమైన‌దా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

    ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిన పంజాబ్‌ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పంజాబ్‌ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

    చదవండి: క‌మిన్స్‌కు ​‍క్రికెట్‌ ఆస్ట్రేలియా భారీ ఆఫ‌ర్‌!

  • ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.  ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ను ప్రైవేటు లీగ్‌లు ఆడ‌కుండా జ‌ట్టుతోనే ఎక్కువ‌గా అట్టిపెట్టుకోవాల‌ని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అత‌డికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించ‌నుంది. 

    ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌కు క‌మిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియ‌న్ డాల‌ర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఆడ‌డం మానేసి గ్లోబ‌ల్ టీ20 లీగ్‌ల్లో త‌మ‌కు ప్రాతినిధ్యం వ‌హించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ క‌మిన్స్‌కు 10 మిలియ‌న్ ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

    ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్‌బాష్‌, ఐపీఎల్‌, ఎంఎల్‌సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.

    ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఇతర లీగ్‌ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

    ఇదే విష‌య‌మై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్‌ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్‌, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్‌లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కట్టుబడి  ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.

    ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పాట్‌ కమిన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్‌కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్‌ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్‌లో భాగంగా బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌పై విజయంతో ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. 

    చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

  • ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో అన్ని జట్లకంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. 

    ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. సెకెండ్‌ బెస్ట్‌ రన్‌రేట్‌తో (0.737) 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ప్రత్యర్దులు గుజరాత్‌, సీఎస్‌కే, ఆర్సీబీ. ఈ మూడు మ్యాచ్‌లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌ వేదికలుగా జరుగనున్నాయి.

    ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణం తొలుత అంత సాఫీగా సాగలేదు. మొదటి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఢీలాగా ఉండింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది. 

    అయితే ఐదో మ్యాచ్‌ నుంచి తాత్కాలిక కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయపథంలో నడిపించసాగాడు. ఇషాన్‌ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన సన్‌రైజర్స్‌.. ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి గాడిలో పడింది.

    అయితే సన్‌రైజర్స్‌కు అసలు బ్రేక్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తిరిగొచ్చిన తర్వాతే వచ్చింది. అప్పటిదాకా బౌలింగ్‌లో బలహీనంగా ఉండిన సన్‌రైజర్స్‌ కమిన్స్‌ రాకతో ఒక్కసారిగా బలపడినట్లైంది. కమిన్స్‌ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్లకు మార్గదర్శంగా నిలిచాడు. 

    అప్పటికే సత్తా చాటుతున్న ఎషాన్‌ మలింగ కమిన్స్‌ సలహాలతో మరింత రెచ్చిపోసాగాడు. దేశీయ యువ పేసర్లు సాకిబ్‌ హుసేన్‌, ఫ్రఫుల్‌ హింగే కమిన్స్‌ మార్గదర్శకత్వంలో రాటుదేలారు. ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ సైతం కమిన్స్‌ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు. 

    ఈ ఐదురుగు నిలకడగా రాణిస్తుండటంతో సన్‌రైజర్స్‌ ప్రస్తుత ఎడిషన్‌లో అత్యంత ప్రమాదకర పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌గా మారిపోయింది. వీరికి స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ కూడా జతకలవడంతో సన్‌రైజర్స్‌ అత్యంత పటిష్టమైన బౌలింగ్‌ విభాగంగా తయారైంది.

    సీజన్‌ ప్రారంభంలో బ్యాటింగ్‌ అత్యంత పటిష్టంగా ఉన్నా, బౌలింగ్‌ విభాగం సరిగ్గా లేకపోవడం వల్లనే సన్‌రైజర్స్‌ అపజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్‌రైజర్స్‌ తిరుగులేని జట్టుగా మారిపోయింది. కమిన్స్‌ వచ్చాక సన్‌రైజర్స్‌ నాలుగింట మూడు విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందుకొచ్చింది.

    ఆరెంజ్‌ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్‌ ఖాయం. మొత్తంగా కమిన్స్‌ రాక సన్‌రైజర్స్‌లో కాకను మరింత పెంచింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జట్టులో అందరూ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టాపార్డర్‌ అంతా నిలకడగా రాణిస్తున్నారు. 

    ప్రస్తుతం టాప్‌-4 లీడింగ్‌ రన్‌ స్కోరర్లలో ముగ్గురు (క్లాసెన్‌, అభిషేక్‌, ఇషాన్‌) సన్‌రైజర్సే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్ది బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారారు. బౌలింగ్‌లో ఎషాన్‌ మలింగ చెలరేగిపోతున్నారు. ఇతనికి కమిన్స్‌ జతకలిశాడు. 

    కమిన్స్‌ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నటి పంజాబ్‌ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్‌ శిబిరంలో మరో అన్‌ సంగ్‌ హీరో కూడా ఉన్నాడు. 

    అతడే నితీశ్‌ కుమార్‌ రెడ్డి. నితీశ్‌ ఈ సీజన్‌లో చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.

    సీజన్‌ ప్రారంభంలో దారుణంగా విఫలమైన ట్రవిస్‌ హెడ్‌ కీలక దశలో ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు అదనంగా కలిసొస్తున్న అంశం. హెడ్‌ గత మూడు మ్యాచ్‌ల్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇలా ఒకరు కాకపోతే ఒకరు బాధ్యతలను భుజాన వేసుకుంటుండంతో సన్‌రైజర్స్‌ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఇది కొనసాగితే ఆ జట్టుకు మరో టైటిల్‌ ఖాయం. 

  • బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

    అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ  పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

    క్రికెట్‌తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్‌కీపర్‌, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.

    ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.
     

  • సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    ఓపెనర్‌గా ఐపీఎల్‌లో 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్‌ను సాధించి గేల్‌ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్‌ స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 269.23గా ఉండింది. 

    గత సీజన్‌ నుంచి అభిషేక్‌ ప్రత్యర్ది బౌలర్లను షేక్‌ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం ‍కూడా ఇవ్వడం లేదు.

    ఈ సీజన్‌లో అభిషేక్‌ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్‌ల్లో అతడు 210.18 స్ట్రైక్‌రేట్‌తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్‌ దూకుడు కారణంగా హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో బలంగా నిలిచింది. 

    నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్‌ భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.

     

Politics

  • బీజేపీ నేత సువేందు అధికారి వ‍్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్‌ దుండగుల కాల్పుల్లో ప్రాణాల కోల్పోయిన విషయం తెలిసిందే. సువేందు అధికారి తన సహాయకులను కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 13 ఏళ్లలో సువేందు అధికారి ముగ్గురు సహాయకులను కోల్పోయారు.

    ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. చంద్రనాథ్ రథ్‌ది రాజకీయ హత్య అని ఆయన అంటున్నారు. గతంలో మృతి చెందిన సువేందు అధికారి సహాయకుల వివరాలు చూద్దాం..

    2013: వ్యక్తిగత సహాయకుడి మరణం
    ఇలాంటి తొలి ఘటన 2013లో జరిగింది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బా మెదినిపూర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే, ఆ సమయంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారలేదు. దర్యాప్తు అధికారులు కూడా నేర కోణాన్ని నిర్ధారించలేదు.

    2018: విగత జీవిగా భద్రతా అధికారి
    సువేందుకు 2018లో వ్యక్తిగత భద్రతా అధికారి‌గా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీసు కానిస్టేబుల్ శుభబ్రత చక్రవర్తి.. పూర్బా మెదినిపూర్‌లోని కాంతి పోలీసు బ్యారక్‌లో విగతజీవిగా కనిపించారు. తన సర్వీస్ రివాల్వర్‌తో తానే కాల్చుకున్నారని చెబుతూ పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా పరిగణించారు. 2021లో చక్రవర్తి భార్య ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు కోరడంతో కేసు మరోసారి చర్చకు వచ్చింది. 

    ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన స్థలాన్ని పునర్నిర్మించి, మొదటి దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ పెరిగింది. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి.

    2021: వ్యక్తిగత సహాయకుడి మరణం
    సువేందుకు మరో వ్యక్తిగత సహాయకుడైన పులక్ లాహిరి 2021లో అసాధారణ పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం. నేరపూరిత కుట్ర జరిగిందని నిర్ధారించే తుది వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.

    2026: చంద్రనాథ్ రథ్ మృతి
    తాజా ఘటనలో సువేందుకు సన్నిహిత సహాయకుడైన చంద్రనాథ్ రథ్‌ను కాల్చిచంపారు. రాజకీయ లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెడితే మాతృభాష‌కు ద్రోహం చేస్తున్నార‌ని విమ‌ర్శించిన కూట‌మి నాయ‌కులు, ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం త‌ప్ప‌క ఉండాల‌ని హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించే ద‌మ్ముందా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

    నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పేద‌ల పిల్ల‌లు భ‌విష్య‌త్తులో ఉన్న‌త స్థానాల్లో ఉండాల‌న్న ఆకాంక్ష‌తో ప్ర‌భుత్వ బ‌డుల్లో ఐబీ, సీబీఎస్ఈ ప్ర‌వేశ‌పెడితే.. అధికారంలోకి వ‌చ్చాక కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించార‌ని గుర్తుచేసుకున్నారు. త‌మ పిల్ల‌ల‌ను ఇంగ్లిష్ మీడియంలో చ‌దివిస్తున్న కూట‌మి నాయ‌కులు పేద‌ల పిల్ల‌లు ఇంగ్లిష్ మీడియంలో చ‌దువుతుంటే ఓర్వ‌లేక క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక నారా లోకేష్ విద్యారంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని, ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన ఉత్తమ ఫ‌లితాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వేసిన ఫౌండేష‌న్ కార‌ణ‌మ‌ని చెప్పారు. కోట్ల రూపాయ‌ల ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లిచ్చి క్రెడిట్ చోరీకి పాల్ప‌డ‌టం సిగ్గుచేట‌ని మండిప‌డ్డారు.  జీతాలు త‌గ్గిస్తామ‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రభుత్వ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌కుండా త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల‌పై ఉద్యోగులంతా సంఘ‌టిత‌మై పోరాడాలని పిలుపునిచ్చారు.

    పీఆర్సీ, డీఏ, ఐఆర్‌ల‌పై ప్ర‌శ్నించ‌కుండా జీతాలు త‌గ్గిస్తామ‌ని ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తుంద‌ని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో జ‌ర‌గాల్సిన మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని ఉన్న‌ట్టుండి నెల్లూరు జిల్లాకు మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారని జ‌గన్‌పై విషం చిమ్మారు
    2019-24 మ‌ధ్య త‌న ఐదేళ్ల పాల‌న‌లో ముఖ్య‌మంత్రిగా వైఎస్‌ జగన్‌ విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు దేశానికే దిక్సూచిలా నిలిచాయి. ప్ర‌ధానంగా నాడు- నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్‌కి దీటుగా అభివృద్ధి చేయ‌డంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధ‌న ద్వారా పేద విద్యార్థుల‌కు ఖ‌రీదైన చ‌దువుల‌ను ఉచితంగా అందించారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ఎంతోమంది కూటమి నాయ‌కులు వైఎస్‌ జ‌గ‌న్ మీద విష ప్ర‌చారం చేశారు.

    ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగుభాష‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ప్ర‌జ‌ల్లో లేనిపోని అపోహ‌లు సృష్టించారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే స‌ర్కారు బ‌డుల్లో ఆనాడు అమ‌లవుతున్న ఐబీ, టోఫెల్ విధానాల‌పై కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించారు. విద్య ప్రభుత్వ బాధ్య‌త కాదు అని చెప్పిన చంద్ర‌బాబు మ‌నకి ముఖ్య‌మంత్రిగా ఉండ‌టం దౌర్భాగ్యం. అమ్మ భాష‌ను వైఎస్సార్‌సీపీ నుంచి కాపాడుకోవాల‌ని పిలుపునిచ్చారు.

    వైఎస్సార్‌సీపీ మాతృ భాష‌కి వ్య‌తిరేకి అని మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ వంటి వారు ప్ర‌చారం చేశారు. తెలుగుభాష‌ను విచ్చిన్నం చేస్తున్నామ‌ని అన్నారు. మాతృభాష‌కు ముప్పు ఉంద‌ని, మాతృ భాష‌లోనే బోధ‌న కొన‌సాగాల‌ని సుప్రీం మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ చెప్పుకొచ్చారు. ఇంగ్లిష్ మీడియం లేకుండా చేయ‌డానికి చివ‌రికి కోర్టుల‌ను కూడా ఆశ్ర‌యించారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత‌్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. కానీ పేద బిడ్డ‌ల‌కు ఇంగ్లిష్ మీడియం చ‌దువులు అందుతుంటే చూసి ఓర్వ‌లేని కూట‌మి నాయ‌కులు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చేయ‌ని కుట్ర‌లు లేవు.

    ఆనాడు క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్నారు
    పేద విద్యార్థుల‌కు ఇంగ్లిష్ మీడియం చ‌దువులు అందించాల‌ని ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి ప్ర‌భుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నేడు హైకోర్టు ధ‌ర్మాస‌నం కూడా స‌మ‌ర్థించింది. ఉన్న‌తంగా ఎద‌గాలంటే, నేటి స‌మాజంలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో ముఖ్య‌మని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని నాటి వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం అమలు చేసింది. తెలుగు స‌బ్జెక్టును త‌ప్ప‌నిచేస్తూ 202-21లో ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే మొద‌టిసారి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చారు.

    ఆ త‌ర్వాత ఒక్కో ఏడాది ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు పెంచుకుంటూ పోయారు. ఆరోజు ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ మీడియం బోధ‌న‌ను వ్య‌తిరేకించిన చంద్ర‌బాబు, లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కూట‌మి నాయ‌కులంతా వారి పిల్ల‌ల‌ను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చ‌దివిస్తున్నారు. పేదల పిల్ల‌లు ఇంగ్లిష్ మీడియంలో చ‌దువుతుంటే ఆనాడు క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకున్న‌వాళ్లంతా ఇప్పుడు త‌మ అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. హైకోర్టు తీర్పుతోనైనా క‌ళ్లు తెర‌వాలి.

    జ‌గ‌న్ పాల‌న‌లో విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌లు
    ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో స‌ర్కారు బడుల్లో వ‌చ్చిన మార్కుల‌తో ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు చేసి మొద‌టి పేజీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చింది. ఈ పిల్ల‌లు ఇంత‌టి విజ‌యాలు సాధించ‌డానికి వైఎస్‌ జ‌గన్ ఐదేళ్ల పాల‌న‌లో చేసిన క‌ష్టానికి ఫ‌లిత‌మేన‌ని కూటమి నాయ‌కులు ఒప్పుకుని తీరాలి. నాడు -నేడు ద్వారా 38 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు.

    తాగ‌డానికి నీరు కూడా దొర‌క‌ని ప‌రిస్థితుల్లో ఉన్న పాఠ‌శాల‌ల్లో ఆర్వీ వాట‌ర్ ప్లాంట్‌లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వ‌చ్చాక వాటి నిర్వ‌హ‌ణను పూర్తిగా గాలికొదిలేసింది. ఒక్కో ఐఎఫ్‌బీ ప్యాన‌ల్ బోర్డును ల‌క్ష రూపాయల‌తో కొనుగోలు చేసి 62 వేల బోర్డుల‌ను ప్ర‌తి క్లాసులోనూ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

    ప్రాథ‌మిక స్థాయి పాఠ‌శాల‌ల్లో 33,590 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. పిల్ల‌ల‌కు లెక్క‌లు బాగా రావాల‌ని పాల్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. సీబీఎస్ఈ, ఐబీ సిల‌బ‌స్‌ను ప్ర‌వేశ‌ పెట్ట‌డంతోపాటు 8వ త‌ర‌గ‌తి నుంచి పిల్ల‌ల‌కు ట్యాబ్‌ల‌తో పాఠాలు చెప్పించారు. జ‌గ‌న‌న్న విద్యాకానుక ద్వారా విద్యార్థుల‌కు స్కూల్ బ్యాగులు, యూనిఫాం, సాక్సులు, షూ, నోట్ బుక్కులు అందించే కార్య‌క్ర‌మానికి వైయ‌స్ జ‌గ‌న్ గారు శ్రీకారం చుట్టారు. 8 వేల మంది టీచ‌ర్ల‌కు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్ర‌మోష‌న్ ఇచ్చి  మూడో త‌ర‌గ‌తి నుంచే స‌బ్జెక్టు టీచింగ్ మొద‌లు పెట్టిన ఘ‌న‌త వైఎస్‌ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది.

    కార్పొరేట్ స్కూళ్ల‌కు చంద్ర‌బాబు దాసోహం
    కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆర్వో ప్లాంట్ల‌ నిర్వ‌హ‌ణ గాలికొదిలేశారు. ట్యాబ్‌లు పాడైనా ప‌ట్టించుకోలేదు. ఆఖ‌రుకి టాయ్‌లెట్ల నిర్వ‌హ‌ణ స‌రిగా లేదు. గోరుముద్ద ప‌థ‌కం ద్వారా నాణ్య‌మైన పౌష్టికాహారంతో కూడిన మెనూతో పిల్ల‌లకు భోజ‌నం పెడితే ఇప్పుడు దానికీ దిక్కులేదు.  ప్ర‌భుత్వ స్కూల్స్‌, విద్యారంగం గురించి కూట‌మి ప్ర‌భుత్వంలో ఒక్క  గొప్ప నిర్ణ‌యం తీసుకున్న పాపాన‌పోలేదు. ఇవేమీ చేయ‌కుండానే కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకోవ‌డం సిగ్గుచేటు.

    వైఎస్‌ జ‌గ‌న్ అమ్మ ఒడి పేరుతో అమ‌లు చేసిన ప‌థ‌కానికి త‌ల్లికి వంద‌నంగా పేరు మార్చి లోకేష్ మ‌దిలో నుంచి వ‌చ్చిన ఆలోచ‌న అని తండ్రికొడుకులు క్రెడిట్ చోరీకి పాల్ప‌డ్డారు. ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని కూడా కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది.  వైయ‌స్సార్సీపీ హ‌యాంలో 17 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే దాన్ని ప్రైవేటీక‌రించాల‌ని చూస్తున్న చంద్ర‌బాబుకి విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హ‌త లేదు. కార్పొరేట్ విద్యాసంస్థ‌ల‌కు దాసోహ‌మై వారి కోసం ప‌నిచేస్తున్నాడే కానీ ప్ర‌భుత్వ బ‌డుల‌ను తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

    హామీల‌పై ప్ర‌శ్నిస్తే ఉద్యోగుల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
    అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను చంద్ర‌బాబు వేధిస్తున్నాడు. ఉద్యోగులను కూట‌మి ప్ర‌భుత్వం తీవ్రంగా వంచిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం డీఏలు ఇచ్చినా చంద్ర‌బాబు మాత్రం 4 డీఏలు పెండింగ్‌లో పెట్టాడు. ఇంత‌వ‌ర‌కు పీఆర్సీ ఊసే లేదు. క‌నీసం పీఆర్సీ క‌మిష‌న‌ర్‌ని కూడా లేకుండా చేశారు. ఐఆర్ గురించి కూడా ఆలోచ‌న చేయ‌డం లేదు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులంతా విజ‌య‌వాడ‌లో ధ‌ర్నా చేశారు. ఉద్యోగులంతా ప్ర‌భుత్వంపై యుద్ధం చేస్తే త‌ప్ప వారికిచ్చిన హామీలు ఈ ప్ర‌భుత్వం నెర‌వేర్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

    పీఆర్సీ, ఐఆర్‌, డీఏల‌పై ఉద్యోగులు ఒత్తిడి చేయ‌డంతో శాల‌రీ కోత‌లంటూ కూట‌మి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్ప‌డుతోంది. ఏపీ హెచ్‌పీ అంటూ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మాదిరిగా ఉద్యోగాల జీతాల‌కు కోత‌లు విధిస్తామ‌న్న హెచ్చ‌రిక‌ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అంద‌రూ సంఘ‌టిత‌పై ప్ర‌భుత్వంపై పోరాడి హ‌క్కుల‌ను సాధించుకోవాలి. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఉద్యోగుల‌ను వైయ‌స్సార్సీపీ ఆదుకుంటుంది. కూట‌మి పాల‌న‌పై స‌ర్వేలు చేయించుకున్న చంద్ర‌బాబు నెల్లూరులో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేద‌ని తెలిసి షాక‌య్యాడు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో పెట్టాల్సిన మ‌హానాడును నెల్లూరు జిల్లాకు చంద్ర‌బాబు మార్చేశాడని ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆరోపించారు.

  • సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగింది. టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత సి.వి. షణ్ముగం (మరో ఏక్‌నాథ్‌ షిండేలా) అనుచరులైన 28 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టులో తిష్టవేయడంతో  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, ఇంకా ఐదు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఏఐఏడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలతో టీవీకే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    పుదుచ్చేరిలోని పూరంకుప్పం రిసార్టులో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం అనుచరులే. వీరిని టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం చేయడం కోసం వ్యూహాత్మకంగా తరలించినట్లు సమాచారం. చర్చల్లో షణ్ముగంకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించడం వంటి పవర్-షేరింగ్ ఫార్ములా చర్చలో ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి, టీవీకే అభ్యర్థి కె.ఏ. సెంగొట్టయన్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

    అయితే, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వడాన్ని అంగీకరించలేదని సమాచారం. దీంతో పార్టీ లోపలే విభేదాలు తలెత్తాయి. ఒకవైపు షణ్ముగం, ఓ.ఎస్. మణియన్ వంటి నేతలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని భావిస్తుండగా, మరోవైపు పళనిస్వామి వర్గం దీనికి వ్యతిరేకంగా ఉంది.

    గురువారం సాయంత్రం 4 గంటలకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌తో పళనిస్వామి భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసి, హుటాహుటిన పుదుచ్చేరి వెళ్లి రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో షణ్ముగంకు విజయ్ చేసిన ఆఫర్ వెలుగులోకి వచ్చింది.

    రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “చల్లటి గాలికోసం రిసార్ట్‌కు వచ్చాం” అని సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో “అసలైన రాజకీయ నాయకులు మీరే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    2021లో 66 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే, తాజా ఎన్నికల్లో కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. డి. జయకుమార్, పి. థంగమణి వంటి సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు జిల్లాలో పార్టీ బలమైన కోటగా ఉన్నప్పటికీ, ఈసారి కేవలం ఒకే సీటు (థొండముతూర్) గెలిచింది. దీంతో పార్టీ బలం రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.

    ఈ నేపథ్యంలో, గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేందుకు పావులు కదుపుతున్నారని సమాచారం. షణ్ముగంకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని మూడు రిసార్టులకు తరలించి, వ్యూహాత్మకంగా రిసార్టులు మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలుస్తోంది.

    ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ మాట్లాడుతూ.. విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి మేం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు. విజయ్ కేవలం సినిమా నటుడు మాత్రమే. సినిమాల ద్వారా వచ్చిన ఖ్యాతిని ఉపయోగించి ప్రజలను పాలించాలనుకోవడం సరైంది కాదు. ఏఐఏడీఎంకే ఎప్పటికీ విజయ్‌కు మద్దతు ఇవ్వదు. మా పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైలో వేడి తట్టుకోలేక పుదుచ్చేరి రిసార్ట్‌లో ఉన్నారు. పార్టీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో నడుస్తోంది. తమిళనాడులో 47, పుదుచ్చేరిలో ఒకరు మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వెంటే ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప‍్రభుత్వాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.

    కాగా, ఈవీఎంల మానిప్యులేషన్‌, హింస ద్వారా పశ్చిమ బెంగాల్‌లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.

    బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్‌ గవర్నర్‌ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్‌తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్‌ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్‌ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు.

  • కోల్‌కతా: ముందుగానే పథకం వేసి తన పీఏ చంద్రనాథ్ రాథ్‌ను హత్య చేశారని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్‌గ్రామ్‌లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. “ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చు” అని అన్నారు.

    హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. “నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై 4 బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం వేసి చేశారు” అని చెప్పారు.

    ఇది చంద్రనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. “ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు” అని అన్నారు.

    చంద‍్రనాథ్‌కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార‍్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. “ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య” అని అన్నారు.

    రాథ్‌ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. “ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమే” అని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు.

    “ప్రస్తుతం తూర్పు మేదినీపూర్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి వద్ద ఉన్నారు. ఆయన కుమార్తె, భార్యను చూసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేసి, వారికి ఉరిశిక్ష పడేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిని పర్యవేక్షించడం నా బాధ్యత. నా సహచరులంతా నాకు సాయం చేస్తారు” అని చెప్పారు.

    ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.

    “నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారు” అని సువేందు చెప్పారు.

    ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్‌ 
    ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్‌గ్రామ్‌లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు.

    ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్.. కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్‌గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు సంఖ్యాబలం తక్కువగా ఉండటం, ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేశారు.

    ఇందులో భాగంగా విజయ్‌ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్‌ జాయింట్‌ సెక్రటరీ సీటీఆర్‌ నిర్మల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం వామపక్షాలకు లేఖ రాసి మద్దతు కోరిన టీవీకే, ఇప్పుడు నేరుగా నేతలతో సమావేశమై మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది.

    మరోవైపు, వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. దీంతో వామపక్షాల నిర్ణయం కీలకంగా మారింది. రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగనుంది.

    ఇక కాంగ్రెస్ ఇప్పటికే ఐదుమంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించింది. సీపీఐ,సీపీఎం,వీసీకే వంటి వామపక్షాలు టీవీకేకు మద్దతు ఇస్తే సంఖ్య 118 దాటే అవకాశం ఉంది. అదే జరిగితే విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఏఐఏడీఎంకే మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించింది. టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. గవర్నర్ ఆలస్యంపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా  తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.

    234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. 

    ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.

    టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి.

     

     

National

  • చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్‌ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో  ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.

    తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్‌తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని  ఓ పత్రికకు గవర్నర్‌ ఇంటర్వూ ఇచ్చారు.

    విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్‌ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్‌.ఆర్‌ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు.  

    కాగా విజయ్‌కు జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్‌ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

  • ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. దీంతో పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్‌ను ఆ పుచ్చకాయ శాంపిల్‌లో గుర్తించారు.

    ఇంట్లో మృతిచెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు, విసెరా నమూనాల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు.

    జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి మరణాలకు అదే కారణమై ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్‌ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యంలోనూ ఉపయోగిస్తారు.

    ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ నివేదిక సమర్పించాం. రెండు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతిచెందిన నలుగురి విసెరా నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి, అందులో ఈ పొడి చల్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారు” అని అన్నారు.

    కాగా, గతనెల అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నసీమ్‌ (35), వారి ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనబ్‌ (13) ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోని వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ, అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు.

    ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. నివేదిక అందిందని, పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. “ఇది ఆత్మహత్య? లేక హత్య? లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా? అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు.  

  • చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు చాలా గంభీరంగా మారాయి. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు అభ్యర్థణను అక్కడి గవర్నర్ తిరస్కరించడంతో ఇప్పుడు అక్కడ ఏం జరగనుందా అనే టెన్షన్‌ మెుదలైంది. ఈ నేపథ్యంలోనే రకరకాల ఉహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌..ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి వార్త పత్రికలు కథనాలు ప్రచురించాయి.

    తమిళ తంబీల రాజకీయాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. టీవీకే మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. దానికోసం విజయ్‌ పలు చిన్న పార్టీల మద్దతుని అభ్యర్థించారు. వారు త్వరలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించినట్లు తమిళనాడు పత్రికలు పేర్కొన్నాయి. 

    ఆ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది " రాష్ట్రంలో మేము మంచి ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలనుకుంటున్నాం. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ కార్యవర్గ నాయకులతో సంప్రదించిన తర్వాత మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. డీఎంకే నాయకులంతా మే 10వ తేదీ వరకూ చెన్నైలోనే ఉండాలి. డీఎంకే ప్రణాళికలకు ఎటువంటి ఆటంకం తలెత్తవద్దు". అని వారికి తెలిపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    అయితే ఇది వరకే స్టాలిన్‌ టీవీకే అంశమై ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విజయ్‌ని తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాము అడ్డుకోమన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్టాలిన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  • తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్‌ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ..  లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.

    అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    అసలేం జరిగింది?
    వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

    ఒక్కసారిగా షాక్‌..
    బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఆమె ఒక ఎమ్మెల్యే..
    ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

     

  • కోల్‌కతా: సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్‌ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి భావోద్వేగ మద్దతు ప్రకటించారు. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వినూత్న రీతిలో పోరాటం చేసిందన్నారు. ఈ రోజు (గురువారం) కోల్‌కతాలోని ఆమె మమతా బెనర్జీ నివాసంలో ఆమెను పరామర్శించారు.

    ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ కేవలం  80 సీట్లకు  మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనని అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని పట్టుబడుతుంది. ఈ ఉ‍ద్రిక్తతల నేపథ్యంలో మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అఖిలేష్ యాదవ్ పరామర్శించారు.

    దీదీ మీరు ఓడిపోలేదు. మీరు, అభిషేక్ బెనర్జీ కలిసి అద్భుతమైన పోరాటం చేశారు అని అఖిలేష్ ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, బీజేపీ కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు  చేయడం ద్వారా లక్షలాది మంది ఓటు హక్కును తొలగించి, ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయన్నారు. బెంగాల్‌లో బీజేపీ హింసను ప్రేరేపిస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. కేంద్ర బలగాల సమక్షంలోనే ఎన్నో  అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

    బెంగాల్ వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని, మమతా బెనర్జీ ఆ కూటమిలో కీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. 

     

  • సాక్షి, చెన్నై: ప్రస్తుతం ఏ నోట చూసినా తమిళనాడు రాజకీయాల చర్చే.. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనేదే ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న.. తంబీల రాజకీయాలు ఇంత వేడిగా ఉ‍న్న సమయంలో ఇప్పుడు మరోక ఆసక్తికర ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్యా వీసీకే చీఫ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.

    తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వేళ వీసీకే ప్రధాన కార్యదర్శి  చింతనై సెల్వన్ సంచలన ప్రతిపాదన తెరమీదకి తెచ్చారు." ప్రస్తుత అనిశ్చిత రాజకీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్ పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలి" అని ఇరు పార్టీలను ఎక్స్‌ వేదికగా కోరారు.  

    కేవలం అభిమానుల బలంపై ఆధారపడిన పాపులరిజం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సెల్వన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అనుభవం ఉన్న, అవినీతి మరక లేని తిరుమావళవన్ వంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజకీయ స్థిరత్వం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని, ప్రజల్లో ఉన్న బలమైన భావన అని పేర్కొన్నారు.

    ఒకవేళ ప్రజలు నిజంగా మార్పు కోరుకుంటే, అది కొత్తగా వచ్చిన తారల ద్వారా కాకుండా, ప్రజల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న తిరుమావళవన్ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు.కాగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో సినీ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీకి మరో 10 సీట్ల దూరంలో ఆయన నిలిచిపోయారు. 

    దీంతో మిగతా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పుడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా వీసీకే పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ పార్టీకి ఎన్నికల్లో 2 స్థానాలు వచ్చాయి. 

  • చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను సీఎస్‌, డీజీపీ కలిశారు. విజయ్‌కు కాన్వాయ్‌ ఎలా ఇచ్చారంటూ డీజీపీని గవర్నర్‌ ప్రశ్నించారు. ఏ బేస్‌ చేసుకుని కాన్వాయ్‌, భద్రత కేటాయించారంటూ గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు. ప్రస్తుత శాంతి భద్రతలపై గవర్నర్‌కు డీజీపీ నివేదిక ఇచ్చారు.

    కాగా, తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్‌ కొనసాగుతుంది. సీఎం హోదాలో ఇచ్చే జెడ్‌ఫ్లస్‌ సెక్యూరిటీని విజయ్‌కు పోలీస్‌ శాఖ కేటాయించింది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్‌ కోరగా.. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

    తాజా పరిణామాలతో విజయ్‌ కాన్వాయ్‌ను తొలగించారు. మరో వైపు, రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్‌, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరనలు చేపట్టింది. తమిళనాడులో క్షణం క్షణం రాజకీయ పార్టీల వ్యూహాలు  మారుతున్నాయి. విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ నో చెప్పడంతో  పరిస్థితి మారిపోయింది.

    ఇవాళ పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో పళనిస్వామి భేటీ కానున్నారు. 30 మంది ఎమ్మెల్యేల కోసం అత్యంత విలాసమైన రిసార్ట్‌ను పళనిస్వామి బుక్‌ చేశారు. కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. టీవీకే వైపు చూస్తుండగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పళనిస్వామి ఉన్నారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం స్టాలిన్‌ కూడా సమావేశం కానున్నారు.


     

  • తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి  ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో  ఉన్న టీవీకే అధినేత విజయ్‌ సీఎం పీఠం అధిరోహించాలంటే  నెంబర్‌ గేమ్‌ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్‌ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే  కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించినప్పటికీ,  మ్యాజిక్‌ ఫిగర్‌ పూర్తికాని  నేపథ్యంలో ఆ మూడు  పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.

    నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు  విజయ్‌ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.

    విజయ్‌కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:
    విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్‌ను కలిసి, విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

    సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.

    సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే  అధినేత స్టాలిన్‌ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా  ఎన్నికలైన విజయ్‌ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.

    ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌

    మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు 

    • టీవీకే :  108

    • డీఎంకే :  59, ఏఐడీఎంకే : 47

    • కాంగ్రెస్: 5

    • సీపీఐ(ఎం), సీపీఐ,  బీసీకే :   తలా 2 స్థానాలు

    • బీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1
       

    ట్విస్ట్‌ ఏంటంటే..
    ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్‌. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది  జస్ట్‌  వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంతే.

    ఇదీ చదవండి: సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!

  • చెన్నై: త‌మిళ‌నాడులో టీవీకే ప్ర‌భుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుప‌డుతున్న గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్  అర్లేక‌ర్‌పై ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య్‌ను ముఖ్య‌మంత్రి కాకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌జాతీర్పును అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హరిస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోకుండా, బీజేపీ ఆడించిన‌ట్టు ఆడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రి ఇలాగే కొన‌సాగితే ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని చవి చూడాల్సి వ‌స్తుందని హెచ్చ‌రిస్తున్నారు.

    గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నార‌ని తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గురువారం చెన్నైలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి గ‌వ‌ర్న‌ర్ త‌లొగ్గార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ్‌భవన్‌లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గ‌వ‌ర్న‌ర్‌కు లేద‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొందిన టీవీకే విజ‌య్‌కు ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మెజారిటీ నిరూపించుకోవ‌డానికి త‌గిన స‌మ‌యం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

    ''గ‌వ‌ర్న‌ర్ అర్లేక‌ర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉంది. ​​నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడి కారణంగా.. గవర్నర్ రాజ్యాంగానికి, తమిళనాడు ప్రజలకు కాకుండా బీజేపీకి తలొగ్గుతున్నారు. ఇది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు. రాజ్‌భవన్‌లో మెజారిటీని నిరూపించుకోమని అడిగే అవకాశం గవర్నర్‌కు రాజ్యాంగం ఇవ్వ‌లేదు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ తప్పక గౌరవించాలి. మెజారిటీని నిరూపించుకోవడానికి రాజ్యాంగం నిర్దేశించిన వేదిక శాసనసభ. గవర్నర్ ముందు మెజారిటీని ఎందుకు నిరూపించుకోవాలి?

    విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం లేదు. ప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత బ‌ల‌నిరూప‌ణ‌కు సమయం ఇవ్వాలి. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతో తమిళనాడును పాలించడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ప్రజలు దీన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీకరించరు. గవర్నర్ దొడ్డిదారిన తన పాలనను రుద్దడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు. లౌకిక పార్టీల‌న్నీ ముందుకు వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారశైలిని ఎండ‌గ‌ట్టాలి. లౌకికవాదాన్ని విశ్వసించేవారు, తమిళనాడులో బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ పాలనను నిరోధించాలనుకునేవారు బయటకు వచ్చి ప్రజల తీర్పుకు మద్దతు ఇవ్వాల‌''ని గిరీష్ చోడంకర్ కోరారు. 

    చ‌ద‌వండి: విజ‌య్ కోసం గ‌ళ‌మెత్తిన క‌మ‌ల్‌, ప్ర‌కాశ్‌రాజ్

    బీజేపీ క‌నుక‌స‌న్న‌ల్లో గ‌వ‌ర్న‌ర్‌
    రాజ్యాంగానికి విరుద్ధంగా గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమ‌ర్శించారు. బీజేపీ ఆదేశాల‌కు అనుగుణంగా గ‌వ‌ర్న‌ర్ న‌డుచుకుంటున్నార‌ని ఆరోపించారు. సెల్వపెరుంతగై గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. ఆ తర్వాత బలపరీక్ష జరుగుతుంది. అయితే, ఆయన (గవర్నర్) భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామ‌''ని చెప్పారు. 

  • న్యూఢిల్లీ:  బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త,  సంజయ్ కపూర్‌ మరణం తరువాత  అతని భార్య  ప్రియా కపూర్, తల్లి రాణీ కపూర్‌ మధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  సోనా గ్రూప్ (Sona Group) వారసత్వ వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించేందుకు కోర్టు మధ్యవర్తిత్వాన్ని (Mediation) ఆశ్రయించాలని సూచించింది.


    మధ్యవర్తిగా మాజీ సీజేఐ
    సోనా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రాణి కపూర్- ఆమె కోడలు ప్రియా కపూర్ (దివంగత సంజయ్ కపూర్ భార్య) మధ్య నడుస్తోంది.  ఈ కేసులో విచారణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ గారిని ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించారు. ఇరు పక్షాలు సామరస్యపూర్వక పరిష్కారానికి అంగీకరించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

    వివాదం ఏమిటి?
    2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు,తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడు సంజయ్ కపూర్, కోడలు ప్రియా కపూర్ తన ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్‌కు బదిలీ చేశారని  తల్లి రాణి కపూర్‌ ఆరోపించారు. పరిపాలనాపరమైన ఫార్మాలిటీస్ అని చెప్పి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. గతేడాది జూన్‌లో సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైంది. ప్రియా కపూర్ సోనా గ్రూప్ సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆస్తిలో ఎటువంటి వాటా లేకుండా చేస్తున్నారని రాణి కపూర్ పిటిషన్ వేశారు. 

    ఈ పిటిషన్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ జె.బి. పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.  ఇది కుటుంబ వివాదం కనుక  కుటుంబానికే పరిమితం చేచాలని  ఇది ఇతరులకు వినోదంగా మారకూడదని హితవు పలికింది. అలాగే . 80 ఏళ్ల వయస్సులో ఉన్న పిటిషనర్ కోర్టుల చుట్టూ తిరగడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా అన్ని సమస్యలను (A to Z) ఒకేసారి పరిష్కరించు కోవడం శ్రేయస్కరం అంటూ  పెద్దావిడ రాణి కపూర్‌కి సూచించింది.

    కాగా సంజయ్‌ కపూర్‌ ఆకస్మిక మరణం తరువాత, ఆయన తొలి, మాజీ భార్య, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలలు  ఆస్తులు, వారసత్వ  హక్కులపై కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై  అంగీకరించిన ఢిల్లీ హైకోర్టు. సంజయ్ కపూర్ ఆస్తులపై ప్రియా కపూర్ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను సృష్టించకుండా కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది మరోవైపు ఈ వివాదం వార్తల్లోకి రావడంతో గురువారం ట్రేడింగ్‌లో సోనా బీఎల్ డబ్ల్యూ (Sona BLW) షేర్లు సుమారు 0.96శాతం బనష్టపోయాయి. 

    ఇదీ చదవండి: సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..!

  • చెన్నై: డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్‌.. టీవీకేకు మద్దతు అంశాన్ని  మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. కాగా, వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన టీవీకే అధినేత విజయ్‌.. లేఖ రాసిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో స్టాలిన్‌తో  మిత్రపక్షాల నేతలు భేటీ అయ్యారు. విడిగా పార్టీ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, తమ నిర్ణయం ఏంటన్నది ఈ భేటీల తర్వాత ప్రకటించే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. లోక్‌ భవన్‌లో గవర్నర్‌తో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా భేటీ కానున్నారు.

    ఇదిలా ఉండగా.. గవర్నర్‌, విజయ్‌ భేటీపై లోక్‌భవన్‌ వివరణ ఇచ్చింది. మెజార్టీపై టీవీకే పూర్తి వివరాలు ఇవ్వలేదని.. సంఖ్యాబలం  చూపించాలని విజయ్‌ను కోరామని లోక్‌ భవన్‌ తెలిపింది. మరో వైపు, లోక్‌సభ ఎదుట విజయ్‌ అభిమానుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

    విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మద్దతు ఇవ్వమని ఇదివరకే వీసీకే ప్రకటించింది. కాగా, విజయ్‌ లేఖ నేపథ్యంలో వీసీకే పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

     

     

  • చెన్నై: తమిళనాడు గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్ వైఖ‌రిని పలువురు సినిమా ప్ర‌ముఖులు త‌పుబ‌ట్టారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం (టీవీకే)ను ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించ‌డంలో తాత్సారం ప్ర‌ద‌ర్శించ‌డాన్ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాల్సిన బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌పై ఉంద‌ని అన్నారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌ వ్య‌వ‌హ‌రశైలిపై సీనియ‌ర్ న‌టుడు కమల్ హాసన్, విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఎక్స్‌లో స్పందించారు.

    ప్రభుత్వ ఏర్పాటుకు విజ‌య్‌ను గ‌వ‌ర్న‌ర్‌ ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమేన‌ని కమల్ హాసన్ పేర్కొన్నారు. ''శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. ఒంటరిగా  ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు. తమిళనాడు చరిత్రలో ఇది అపూర్వమైన నిర్ణయం. ప్రజల తీర్పును గౌరవించి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామ‌ని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తాను.

    ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నవారు కూడా అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తుచేయడం మాత్రమే. విజ‌య్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలి. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింద''ని క‌మ‌ల్ హాస‌న్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

    గ‌వ‌ర్న‌ర్ తీరుపై ప్రకాశ్‌రాజ్ ఫైర్‌
    త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ తీరుపై న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌వ‌ర్న‌ర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌వ‌రిస్తున్నార‌ని, ఆయ‌న వైఖ‌రి ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌న్నారు. ''విజ‌య్‌తో మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయ‌న‌కు అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చింది. అసెంబ్లీలో తన హక్కును వినియోగించుకోవడానికి విజ‌య్‌కు గ‌వ‌ర్న‌ర్‌ అవకాశం ఇవ్వాల‌''ని ప్ర‌కాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాల‌ని, ప్ర‌భుత్వ ఏర్పాటుకు విజ‌య్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. 

    చ‌ద‌వండి: టీవీకే ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌గ‌ల‌దా?

    త‌మిళ‌నాడులో టీవీకే ప్ర‌భుత్వం ఏర్పాటుకు అడ్డంకులు క‌లిగిస్తున్నార‌ని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌క్షపాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ విజ‌య్ సంయ‌మ‌నంతో వ్య‌వ‌హరిస్తున్నార‌ని అన్నారు. కాగా, అన్నివైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంలో గ‌వ‌ర్న‌ర్ మెత్త‌బ‌డ్డిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఇత‌ర పార్టీల‌ను ఆహ్వానించ‌బోమ‌ని విజ‌య్‌కు హామీయిచ్చిన‌ట్టు తాజా సమాచారం.

  • పుణె జిల్లాలోని దౌండ్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కేవలం స్కూల్ మార్కుల విషయంలో వచ్చిన గొడవ కారణంగా తొమ్మిదేళ్ల బాలికను ఆమె తండ్రే కిరాతకంగా హత్య చేసిన ఉదంతం  ప్రకంపనలు రేపింది.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  నిందితుడు శాంతారామ్ దుర్యోధన్ చవాన్ కుమార్తె అనామిక (9 ఏళ్లు). ఇటీవల స్కూల్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో అనామిక తమ్ముడు (సవతి తల్లి కుమారుడు) సంస్కార్‌కు  ఫస్ట్‌ ర్యాంక్ రాగా, అనామికకు రెండో ర్యాంక్ వచ్చింది. దీనిపై ఇంట్లో వాళ్లంతా  ఆమెను ఎగతాళి చేశారు. ఆ అవమానంతో అనామిక తన తమ్ముడి మార్కుల జాబితాను మార్చేసింది.   తద్వారా తనదే ఫస్ట్‌ ర్యాంక్‌ అని నిరూపించుకోవాలని చేసింది.  అంతే .. ఇది తెలిసి తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు.  తెలిసీ తెలియని వయసులో పిల్లలు  చేసిన తప్పులను అర్థం చేసుకొని, అవగాహన​ కల్పించాల్సింది పోయి, విచక్షణ మరిచి తండ్రి శాంతారామ్, చెక్క కోసే యంత్రం (wood-cutting machine)తో చిన్నారిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు, మృతదేహాన్ని వస్త్రంతో చుట్టి నిప్పంటించాడు.

    దీనిపై పోలీసులకు సమాచారం అందడంతోవారు ఘటనా స్థలానికి చేరుకుని, పాక్షికంగా కాలిపోయిన అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని డీఎన్‌ఏ పరీక్షలు, తదుపరి విచారణ నిమిత్తం పుణేలోని సాసూన్ ఆసుపత్రికి తరలించారు.

    ప్రధాన నిందితుడు తండ్రి శాంతారామ్ చవాన్‌తో పాటు, అతనితో కలిసి ఉంటున్న సవతి తల్లి చింకీ భోంస్లేను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరం గురించి తెలిసి కూడా అధికారులకు సమాచారం ఇవ్వనందుకు ఆమెపై కూడా కేసు నమోదైంది. చిన్నారి మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల కోసం పుణెలోని ససూన్ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొన సాగుతోంది.

    మరోవైపు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనల నేపత్యంలో పూణేలో పిల్లల భద్రతపై ఆందోళన తలెత్తింది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి విషాదాలను నివారించేందుకు కఠినమైన చట్టాల అమలు, జవాబుదారీతనం, తక్షణ చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు  ఊపందుకున్నాయి.

    ఇదీ చదవండి: కారూ, గోల్డూ లేదు, కేసులు మాత్రం.. ఎవరీయన?

     

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భవానీపూర్‌లో 15 వేల ఓట్ల తేడాతో ఓడించి, నందిగ్రామ్‌లో ముచ్చటగా మూడోసారి అఖండ విజయం సాధించిన ఆయన.. ఈ రెండు స్థానాల్లో దేనిని వదులుకుంటారన్నది ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది. తాజాగా నందిగ్రామ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

    పార్టీ నిర్ణయమే శిరోధార్యం
    ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి నందిగ్రామ్‌లో అడుగుపెట్టిన సువేందు అధికారికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ‘మీరు నందిగ్రామ్ ముద్దుబిడ్డ, మీరే మా సీఎం’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ నినాదాలపై స్పందించిన సువేందు.. అది తాను తీసుకునే నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ‘నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, అవసరమైతే నా అభిప్రాయం చెబుతాను.. కానీ సొంత నిర్ణయాలు తీసుకోను. మరో పది రోజుల్లో ఒక స్థానాన్ని వదులుకోవాల్సిందే. కానీ భవానీపూర్, నందిగ్రామ్ ప్రజల పట్ల నా బాధ్యతను ఎప్పటికీ విస్మరించను’ అని ఆయన పేర్కొన్నారు.

    పాత కేసుల రీఓపెన్.. కఠిన చర్యలు
    గత రెండు దశాబ్దాలుగా భూసేకరణ ఉద్యమాల నుండి నందిగ్రామ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన, తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులను సభలో ప్రస్తావించారు. ‘2011 మార్పులో నేను భాగమయ్యాను, ఇప్పుడు నిజమైన మార్పులో ఉన్నాను. మా 90 ఏళ్ల తండ్రిని సీఐడీ విచారణ పేరుతో వేధించారు. నా ఆఫీసుకు 150 మంది పోలీసులను పంపారు. గతంలో జరిగిన అకృత్యాలపై విచారణ కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సువేందు హెచ్చరించారు.

    ఆరు నెలల్లో నందిగ్రామ్ రూపురేఖలు మార్చేస్తా
    నందిగ్రామ్ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సువేందు హామీ ఇచ్చారు. నందిగ్రామ్-I లో ఏడాదికి రెండు పంటలు పండేలా చూస్తానని, హల్దియా-నందిగ్రామ్ వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గోకుల్‌నగర్‌లో పాఠశాల, సోనాచురాలో ఐటీఐ ఏర్పాటుతో పాటు వేరే ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితి లేకుండా నందిగ్రామ్ ఆసుపత్రిని ఆధునికీకరిస్తామన్నారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ, నూతన బెంగాల్‌ను నిర్మిస్తామని సువేందు అధికారి పేర్కొన్నారు.

Business

  • మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.

    ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.

    పేపర్ ఆస్తులు
    కియోసాకి ప్రకారం.. స్టాక్‌లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.

    ➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం
    ➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం
    ➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకం

    అంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట.

     
     

    రియల్ ఆస్తులు
    రాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.

    భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.

    ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

    ప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.

    ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు.

  • అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్  2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.

    అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.

    గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.

    పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్‌లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్‌ ‘స్కైరూట్‌’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్‌తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.

    సాధారణంగా ఒక స్టార్టప్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్‌గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    ఈ పెట్టుబడి రౌండ్‌కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్‌కో గ్రూప్‌ వ్యవస్థాపకులు, ఆర్కామ్‌ వెంచర్స్‌ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ ఇన్వెస్టర్‌, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్‌ శ్రీరామ్‌ కూడా ఇందులో చేరనున్నారు.

    కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్‌-1' రాకెట్‌ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్‌ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్‌-2' రాకెట్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.

    ఈ రాకెట్‌ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్‌ ఇంజిన్‌తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.

    ప్రస్తుతం స్కైరూట్‌ సంస్థ 'విక్రమ్‌-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్‌లో పూర్తిగా ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్‌ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్‌ లాంచ్‌ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

  • భారతీయ అతిపెద్ద వ్యాన్‌ తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్, తన ఐకానిక్‌ ట్రావెలర్‌ ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తూ కొత్త ‘ఫోర్స్‌ ట్రావెలర్‌ ఎన్‌’ సిరీస్‌ని ఆవిష్కరించింది. అంబులెన్స్‌లు, స్కూల్‌ బస్సులు, డెలివరీ వాహనాల కోసం రూపొందించిన ఈ కొత్త శ్రేణితో ‘షేర్డ్‌ ప్యాసింజర్‌’ మొబిలిటీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

    కొత్త ‘ట్రావెలర్‌ ఎన్‌’లో డిజిటల్‌ క్లస్టర్, 9–అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, మెరుగైన ఎన్‌వీహెచ్‌ (నాయిస్, వైబ్రేషన్, హార్‌‡్షనెస్‌) టెక్నాలజీ, అధునాతన హెచ్‌వీఏసీ సిస్టమ్, ఎర్గోనామిక్‌ సీట్లు వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచి్చంది. అలాగే రోబోటిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేటెడ్‌ డోర్‌ హెమ్మింగ్‌ టెక్నాలజీ ద్వారా బిల్డ్‌ క్వాలిటీ, స్ట్రక్చరల్‌ ఇంటిగ్రిటీని పెంచింది.

    ఈ వాహనాల్లో బీఎస్‌–4 స్టేజ్‌2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్‌ఎం 2.6 సీఆర్‌ ఇంజిన్‌ను అమర్చారు. వాహన యజమానుల కోసం ‘ఫోర్స్‌ కేర్‌’ కింద పొడిగించిన వారంటీ, ‘ఐ–పల్స్‌’ ద్వారా రియల్‌–టైమ్‌ వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి సేవలను సంస్థ అందిస్తోంది. ఈ నెల(మే) రెండోవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

  • మెమొరీ చిప్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 10–12 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఒక నివేదికలో తెలిపింది.

    ధరలపరమైన ఒత్తిళ్లు, డిమాండ్‌ నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. ‘డీఆర్‌ఏఎం, ఎన్‌ఏఎన్‌డీ ధరలు పెరగడంతో డివైజ్‌ల ధర పెరిగింది. దీనితో మాస్‌ సెగ్మెంట్‌కి సంబంధించిన ఉత్పత్తులు భారంగా మారాయి. వాటితో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్‌పై ప్రభావం తక్కువగా ఉంది‘ అని సీఎంఆర్‌ వీపీ ప్రభు రామ్‌ తెలిపారు. నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో షిప్‌మెంట్లు రెండు శాతం తగ్గాయి. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..

    • ట్రాన్షన్, వన్‌ప్లస్‌ అమ్మకాలు వరుసగా 30 శాతం, 28 శాతం క్షీణించాయి.

    • టాప్‌ 5 బ్రాండ్లలో వివో, ఒప్పో అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. శాంసంగ్, షావోమీ, రియల్‌మీ విక్రయాలు వరుసగా 8%, 7%, 12 శాతం క్షీణించాయి.

    • చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో 21 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాంసంగ్‌ (17 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (12 శాతం), రియల్‌మీ (10 శాతం) ఉన్నాయి.

    • ఐఫోన్‌ 16 దన్నుతో యాపిల్‌ షిప్‌మెంట్లు 6 శాతం పెరగ్గా, సంస్థ మార్కెట్‌ వాటా 9 శాతంగా నమోదైంది.

    • ఫీచర్‌ ఫోన్‌ సెగ్మెంట్లో చైనా బ్రాండ్‌ ఐటెల్‌ మొబైల్‌ అమ్మకాలు 26 శాతం పడిపోయినప్పటికీ 35 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత స్థానాల్లో లావా (34 శాతం వాటా), హెచ్‌ఎండీ (18 శాతం వాటా) ఉన్నాయి.

    • చిప్‌సెట్స్‌ తయారీ సంస్థల్లో భారత్‌లో మీడియాటెక్‌ 48 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 25,000 పైబడిన ఫోన్లు) క్వాల్‌కామ్‌ 36 శాతం వాటాను దక్కించుకుంది.

  • గురువారం ఉదయం స్వల్ప లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.00 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టంతో 77,844.52 వద్ద నిలిచాయి. నిఫ్టీ 4.30 పాయింట్లు లేదా 0.018 శాతం నష్టంతో 24,326.65 వద్ద నిలిచాయి.

    ఎంబసీ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వి విన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్, హెచ్‌బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, భిల్వారా టెక్నికల్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • జాతీయ రహదారులపై వాహనాలు వేచి ఉండే సమయాన్ని, రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పడికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో కూడా వాహనాలు టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. తద్వారా రోడ్డుపై కొంత ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిని కూడా నివారించడానికి ప్రభుత్వం ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టం తీసుకొస్తోంది.

    హైవేలపై రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. భారతదేశంలో త్వరలోనే టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టైమ్స్ డ్రైవ్ ఆటో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 చివరి నాటికి భారత రహదారులపై టోల్ ప్లాజాలను తొలగించే అవకాశం ఉంది.

    అయితే.. 2026 చివరి నాటికి ఎంఎల్ఎఫ్ఎఫ్ (మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో) అనే కొత్త టోల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని గడ్కరీ తెలిపారు. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రహదారిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాంట్రీలు, కెమెరాలు, సెన్సార్లు, ఫాస్ట్‌ట్యాగ్ రీడర్లు వాహనాలను గుర్తించి.. టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డిజిటల్ పద్ధతిలో వసూలు చేస్తాయి.

    ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద ఉండే భారీ క్యూలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. వాహనాలు ఆగకుండా ప్రయాణించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గి, హైవే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

    ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలు హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలకు అంతగా అనుకూలంగా లేవని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. చాలాసార్లు టోల్ చెల్లింపుల విషయంలో వాదనలు, సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటెడ్, బ్యారియర్‌లెస్ టోల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

    ఈ కొత్త విధానములో కూడా ఫాస్ట్‌ట్యాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాహనంలో సరైన ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే లేదా బ్యాలెన్స్ తక్కువగా ఉంటే వాహన యజమానికి యధావిధిగా ఈ-నోటీసులు అందుతాయి. నిర్ణీత సమయంలో టోల్ చెల్లించకపోతే రెట్టింపు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రతి వాహనదారుడు తన ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.

    ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

  • కార్పొరేట్ ప్రపంచంలో ప్రమోషన్ అనేది ఒక అపురూపమైన మైలురాయి. హోదా, భారీ వేతనం, సమాజంలో గుర్తింపు.. వీటి కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కానీ, ఆ ఊహల పల్లకీ ఒక్కోసారి ఊపిరి సలపని ఉచ్చుగా మారుతుందని హర్మన్ జోత్ కౌర్ ఉదంతం నిరూపిస్తోంది. ఏడాదికి రూ.28 లక్షల వేతనం వచ్చే సీనియర్ మేనేజర్ పదవిని తృణప్రాయంగా వదులుకుని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

    ఎనిమిదేళ్ల నిరీక్షణ.. తీరా చూస్తే?

    హర్మన్ జోత్ కౌర్ ఎనిమిదేళ్ల పాటు సంస్థ కోసం తీవ్రంగా పనిచేసింది. ఆమె కష్టానికి ఫలితంగా 2025లో ఆమెకు సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి లభించింది. రూ.28 లక్షల భారీ ప్యాకేజీ. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం, స్నేహితుల అభినందనలు. తను అనుకున్న గమ్యాన్ని చేరానన్న తృప్తి ఆమెలో ఉండేది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

    పదవి తెచ్చిన ప్రమోషన్ ట్రాప్

    కొత్త బాధ్యతలు పెరగడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. ఈ మార్పును వివరిస్తూ.. ‘రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పనిలోనే గడపాల్సి వచ్చేది. పని ఒత్తిడిలో పడి నా కుమార్తె మొదటి స్కూల్ ఫంక్షన్‌కు కూడా వెళ్లలేకపోయాను. నిరంతర ఆందోళన కారణంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. మీటింగ్‌లకు వెళ్లేముందు భయాందోళనలు మొదలయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి ప్రభావం వైవాహిక జీవితంపై పడి అది విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంది. ఒకరోజు ఆఫీస్ వాష్‌రూమ్‌లో ఒంటరిగా ఏడ్చేశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా అదే వారంలో రాజీనామా చేశాను’ అని కౌర్ తన ఆవేదనను పంచుకున్నారు.

    వెనక్కి తగ్గుదాం..

    రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లో సొంతంగా ఒక చిన్న ఏఐ సర్వీస్ స్టార్టప్‌ను నడుపుతున్నారు. ‘మునుపటి కంటే ఇప్పుడు సంపాదన తక్కువే కావచ్చు. కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నాను. నా కుటుంబంతో గడుపుతున్నాను. నేను వెంబడించిన ఆ ప్రమోషన్ నేను నిర్మించుకున్న ఒక పంజరంగా అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు.

    మనశ్శాంతి ముఖ్యం

    ఈ వార్తపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘అసలైన సంపద మీ ఆఫర్ లెటర్‌లో ఉండే అంకెలు కాదు.. మీ సమయం, మీ మనశ్శాంతిపై మీకు ఉండే నియంత్రణ’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చను హర్మన్ జోత్ కథ మరోసారి తెరపైకి తెచ్చింది. కెరీర్ ఎదుగుదల ముఖ్యమే, కానీ అది ఒక బంగారు పంజరం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా?

  • సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగుల కోసం ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు కోసం గతంలో లే-ఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు) చేపట్టిన కంపెనీ ఈసారి ఉద్యోగుల గౌరవప్రదమైన వీడ్కోలు కోసం భారీ ఆర్థిక ప్యాకేజీతో కూడిన ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.

    అర్హత ఎవరికి? (రూల్ ఆఫ్ 70)

    ఈ పథకం అందరికీ వర్తించదు. మైక్రోసాఫ్ట్ దీని కోసం రూల్ ఆఫ్ 70 అనే నిబంధనను విధించింది. దీని ప్రకారం.. ఉద్యోగి ప్రస్తుత వయస్సు + మైక్రోసాఫ్ట్‌లో వారు పనిచేసిన కాలం (సర్వీస్) కలిపి 70 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

    ఉదాహరణకు 50 ఏళ్ల వయస్సు ఉండి, కంపెనీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు లేదా 55 ఏళ్ల వయస్సు ఉండి 15 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7 శాతం మంది (సుమారు 8,750 మంది) ఈ ఆఫర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది.

    నగదు, బీమా, స్టాక్స్

    స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీని రూపొందించింది.

    ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగం వదులుకున్న తొలి ఏడాది మెడికల్, డెంటల్, విజన్, వెల్‌నెస్ ఖర్చులను కంపెనీయే 100% భరిస్తుంది. ఆ తర్వాతి నాలుగు ఏళ్ల వరకు (మొత్తం ఐదేళ్లు) ఉద్యోగులు స్వల్ప ప్రీమియంతో ఈ సౌకర్యాన్ని పొందే వెసులుబాటు కల్పించింది.

    నగదు చెల్లింపు: లెవల్ 64 వరకు ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనాన్ని అందిస్తారు. లెవల్ 65 - 67 (సీనియర్ హోదాలు) వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు రెండు వారాల వేతనాన్ని ఇస్తారు. అయితే, ఏ కేటగిరీలోనైనా గరిష్టంగా 39 వారాల వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు.

    స్టాక్ ప్రయోజనాలు: సాధారణంగా వచ్చే స్టాక్ రివార్డులకు అదనంగా మరో 6 నెలల వెస్టింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కల్పిస్తారు. ఒకవేళ 24 ఏళ్లు పైబడి సర్వీస్ ఉంటే ఏకంగా 12 నెలల వెస్టింగ్ ప్రయోజనం లభిస్తుంది.

    ఒక రోజు ఆదాయం.. ఉద్యోగుల కోసం!

    మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమం కోసం దాదాపు 900 మిలియన్ డాలర్లను (సుమారు రూ.7,500 కోట్లు) కేటాయించినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మొత్తం కంపెనీ కేవలం ఒక్క రోజు ఆదాయంతో సమానం. ఈ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోవడానికి అర్హులైన ఉద్యోగులకు 30 రోజుల సమయం ఇచ్చారు. ‘అర్హులైన ఉద్యోగులు కంపెనీ అందించే ఉదారమైన మద్దతుతో తమ తదుపరి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇదొక మంచి అవకాశం’ అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్‌) అమీ కోల్మన్ అన్నారు.

    అంతర్గత మార్పులు.. పనితీరుకే పట్టం

    రిటైర్మెంట్ ప్లాన్‌తో పాటు కంపెనీ తన అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా మార్పులు చేసింది. ఉద్యోగుల మూల్యాంకన కేటగిరీలను 9 నుంచి 5కి తగ్గించారు. దీనివల్ల పనితీరు అంచనా వేగంగా జరుగుతుంది. స్టాక్ రివార్డులను కేవలం నగదు బోనస్‌లతో ముడిపెట్టకుండా ప్రతిభావంతులను గుర్తించే విషయంలో మేనేజర్లకు అదనపు అవకాశాలు కల్పించారు.

    ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా?

Telangana

  • తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల బీట్ బజార్ వద్ద గంటపాటు కురిసిన భారీ వర్షంతో మక్కలు పూర్తిగా తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చిన మొక్కలు ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

    అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనతో భారీగా స్తంభించింది ట్రాఫిక్. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.

    నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్,ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన‍్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

    కోరుట్ల నియోజకవర్గంతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మెట్ పల్లి మార్కెట్ యార్డులో భారీ వర్షంతో మొక్కజొన్న, ధాన్యం తడిచింది. పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్నలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మామిడి నేలరాలింది.

    కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి శివారులో భారీ ఈదురు గాలులతో వెంకటేశ్వర రైసు మిల్ యంత్ర భాగాలు కూలడంతో భారీ నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. భైంసా మండలం మాటేగాం గ్రామం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యంతో అకాల వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిరసన తెలిపారు.

    కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ భారీ వర్షం కురిసింది. గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో.. ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది.

    ఏపీకి వర్ష సూచన
    ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వచ్చే వారం బంగాలాఖతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. 

  • సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎ‍మ్మెల్యేల కార్యాలయంపై దాడి చేయడాన్ని సమర్థించడం లేదని అయితే దాడుల కల్చర్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. మితీమిరిన అహంకారంతో వ్యవహరించొద్దనే ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

    అయితే కౌశిక్‌ రెడ్డిపై దాడికి నిరసనగా ఎల్లుండి కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ బంద్‌ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా అంతకు ముందు హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. 

    దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దానితో పాటు హైదరాబాద్‌లోని కౌశిక్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్‌ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

    దాడి ఎందుకు జరిగింది?

    కరీంనగర్‌లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్‌ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించాయి. 

  • సాక్షి, నల్లగొండ జిల్లా: హైడ్రా రాష్ట్రవ్యాప్త విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని.. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.

    ‘‘కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టాం. ఇప్పుడున్న దరఖాస్తులను పరిష్కరించడమే ముందు ప్రాధాన్యత. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. కబ్జా విషయంలో హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.

    కబ్జా కోరల నుంచి 2100 భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మరో సంవత్సర కాలంలో లక్ష కోట్లు విలువ చేసే భూములను హైడ్రా కాపాడుతుంది. హైడ్రా పరిధిలోనే 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం’’ అని రంగనాథ్‌ చెప్పారు.

     

  • సాక్షి, హుజురాబాద్:‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

    అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని కౌశిక్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆదాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్‌ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.


    అసలు గొడవ ఎందుకు..?

    కరీంనగర్‌లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్‌ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించాయి.

  • సాక్షి,హైదరాబాద్‌: అకారణంగా తనని, తన కుటుంబాన్ని తిడితే ఊరుకోనిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత గురువారం ప్రెస్‌మీట్‌లో పోసాని మాట్లాడారు.  

    నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. నాకు నచ్చిన పార్టీలన్నింటికీ సర్వీస్‌ చేశాను. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు ఆయనకూ సర్వీస్‌ చేశా. సినీ రంగానికి సేవల కోసమే నాకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. నిజం చెబితే ఎవరినైనా టార్గెట్‌ చేయడం సహజమే. అకారణంగా నన్ను, నా కుటుంబాన్ని తిడితే ఊరుకోను. నా కోపానికి ఎలాంటి హద్దులు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. 

    నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పలు అంశాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖలు రాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ లెవల్ ఆఫీసర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కోసం ఉపయోగించే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్లో అందించాలని మరొక లేఖ రాశారు.

    ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరో లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున బీఎల్ఎ ల నియామకానికి సంబంధించిన ఫారాలను ఈఆర్వోలు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.

  • సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.

    వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్‌ వేసింది.

    తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • తాడేపల్లి: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు వరుసబెట్టి కలెక్టర్‌లతో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని, కాన్ఫరెన్సుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేతలు శూన్యమని విమర్శించారు.

    ‘‘రైతులు ధాన్యం కొనాలని మొత్తుకుంటుంటే గోనె సంచులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు. అకాల వర్షాలు పడుతుంటే కలెక్టర్లను రైతులను అండగా పంపాలి. కానీ విజయవాడ పిలిచి కాన్ఫరెన్స్ ల పేరుతో సొల్లు మాటలు చెప్తున్నారు. ఏడుసార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టి రైతులకు ఏం న్యాయం చేశారు? గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవటం లేదు. 

    మార్కెట్ యార్డుల్లో రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. కలెక్టర్లతో రైతుల కష్టాలు చూడామని చంద్రబాబు చెప్పాలి. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనాలి. రైతులు కష్టాలు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ లో తిరుగుతున్నారు. చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి? రైతులకు గానీ, ఇతర ఏ వర్గానికైనా మేలు చేశారా? కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలయినా తీర్చారా? సినిమా డైలాగులు చెప్పటం తప్ప చంద్రబాబు ఇంకేం చేస్తున్నారు? 

    సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే సూపర్ సక్సెస్ అని ఎలా అంటారు? సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్. రైతులు అల్లాడి పోతుంటే కాన్ఫరెన్స్ లో సొల్లు కబుర్లు ఎందుకు? అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే కలెక్టర్లను విజయవాడ పిలిచి మీటింగులు ఎందుకు? ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీ పనిలో ఉన్నారు’’ అని ప్రశ్నించారు. 

    చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు
  • సాక్షి, తాడేపల్లి: తప్పుడు కథనం ప్రసారం చేసి పరువు పోగొట్టుకున్న జావా డిస్కవర్‌.. వెనక్కి తగ్గింది. ఆ ఛానల్‌.. ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది. డాక్యుమెంటరీలో జగన్ ఫోటోని ఆ ఛానల్‌ తప్పుగా చూపించగా.. దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్‌సీపీ నోటీసులు పంపింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించారు. 

    అయితే, జర్నలిస్ట్‌ సుధాకర్‌రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవర్ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్‌రెడ్డి.. లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్‌ డాక్యుమెంటరీని తొలగించింది. వైఎస్‌ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి టీడీపీ అభాసుపాలైంది.

    ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్‌ జగన్‌ను ఇరికించేందుకు పచ్చ పార్టీ కుట్రలు పారలేదు. తప్పుడు కథనాలు చేసిన జావా డిస్కవర్ ఛానల్‌.. ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ డాక్యుమెంటరీని మార్చడంతో పాటు వక్రీకరించింది. 2021లో ‘బ్లడ్‌ శాండర్స్‌’ పేరుతో ఉడుముల సుధాకర్‌ రెడ్డి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. అయితే తాను చెప్పని.. పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

     

  • సాక్షి, తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి,  భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయ‌న. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.

    మన్యం వీరుడికి YS జగన్ నివాళి

     

  • సాక్షి, విజయవాడ: పనీతీరు ర్యాంకుల్లో పవన్‌ కల్యాణ్‌ వెనుకబడ్డారు. ఆయన శాఖకి చిట్ట చివరి ర్యాంక్‌ లభించింది. కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంక్‌లలో అటవీ, పర్యావరణ శాఖ చివరి స్థానానికి పడిపోయింది. శాఖల వారీగా ర్యాంకులను ప్రకటించగా... కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

    ఏబీసీడీగా ర్యాంకులను వర్గీకరించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖకి ప్రథమ స్థానం లభించింది. 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ, పర్యావరణ శాఖ నిలిచింది. 90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు నిలిచాయి.

    పవన్ పరువు పాయే.. చిట్టచివరన అటవీ.. పర్యావరణ శాఖ

     

Family

  • Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు  ఎవర్ని అనుగ్రహిస్తాడు?  ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...

    అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.

    ‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..

    ‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.

    వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.

    ‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.

    ‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.

    ‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.
    ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...

    చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..

    ­– డా. కందాళ సత్యనారాయణ మూర్తి 

  • మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్లి వారి చిత్తాన్ని వారి శరీరంలోనే వున్న పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే మనిషి ఆధ్యాత్మికత పరిపక్వం చెంది, అతనిలో పరివర్తన వచ్చి చిన్నతనంలో తనలో స్వాభావికంగా వున్న దైవికమైన పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిర పరచవచ్చు, తద్వారా అతనిని సమతుల్యతలో ఉంచవచ్చు అని తలచారు మాతాజీ నిర్మలాదేవి.

    అదెలా సాధ్యపడుతుందంటే మన శరీరంలోనే అంతర్గతంగా భగవంతుని శక్తి ఒకటి నిక్షిప్తమై ఉంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో సుమారు 2–3 నెలల వయస్సు వున్న సమయంలో పసిపిల్లవాని తల మాడుభాగాన వున్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశించి వెన్నెముక భాగాన 3 నాడులుగాను, 7 చక్రాలుగాను ఏర్పడి మిగిలిన శక్తి వెన్నెముక చివరన వున్న త్రికోణాకారపు ఎముక (సాక్రమ్‌ బోన్‌)లో మూడున్నర చుట్లు చుట్టుకుని ఉంటుంది. 

    అదే కుండలినీ శక్తి. పిల్లలలోని ఆ శక్తి వారికి 9–10 సం. వయసు వరకు వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూవుంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలోనే వుంటారు. క్రమేపీ అది తిరిగి సాక్రమ్‌ బోన్‌ లోకి వెళ్ళి నిద్రాణ స్థితిలో వుండిపోతుంది.

    అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళి΄ోయిన ఈ కుండలినీ శక్తిని తిరిగి జాగృతి చేసి ఉత్థానపరచి శిరస్సుమీద వున్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాపిత పరమ చైతన్యశక్తితో అనుసంధానపరచగలిగితే మనిషి మరలా తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడిక మానవులు ఎదుర్కొనే ఈ శారీరిక, భౌతిక, మానసిక, భావోద్వేగ, సమస్యలకు తావే వుండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణా జ్ఞానం స్థిరపడి, వారి ఆలోచనలలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడి ప్రపంచమంతా మనం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం ఏర్పడి విశ్వనిర్మల ధర్మం స్థిరపడుతుంది అని శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక  నిర్ణయానికి వచ్చారు. మానవులు తమ మూర్ఖత్వం వలన లేక అంధ విశ్వాసాల వలన భగవంతుని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తే చాలా ప్రమాదానికి, భవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించి అందుకు ఒకే ఒక పరిష్కారం మనిషి లోని కుండలినీ శక్తిని తిరిగి జాగృత పరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి పాదుకొల్పడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు.  

    ఇంతకు పూర్వం కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి అడవులకో, హిమాలయాలకో వెళ్ళి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేగాని దొరకని భాగ్యం అది. ఈ ఆధునిక కాలంలో అది అసాధ్యం. మనిషి ఏ త్యాగమూ చేయనవసరం లేకుండా, దేనినీ పరిత్యజించనవసరం లేకుండా తన రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మసాక్షాత్కారం ΄÷ందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని శ్రీమతి నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. అది కూడా 1970వ సంవత్సరం మే 6వ తారీఖు లోపునే జరగాలని అనుకున్నారు. వెంటనే గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న నార్గోల్‌ సముద్రతీరాన ఓ సరుగుడు చెట్టు చెంతనకూర్చుని ఒక రాత్రంతా సుదీర్ఘ ధ్యానం (తపస్సు)లో వున్నారు. 

    అంతే! మే నెల 5వ తేదీ తెల్లవారు ఝామున శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూమినుండి ఒక్కసారిగా భూగర్భజలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగి మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతిపుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. శ్రీమాతాజీ  మాటల్లో చెప్పాలంటే ఒక రాకెట్టును అంతరిక్షంలోకి పంపినప్పుడు అది ఒక్కొక్క ఛాంబర్‌ను నెట్టుకుంటూ అత్యంత వేగంతో, నిప్పులు కక్కుకుంటూ, రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలోనికి ఎలా దూసు కెళుతుందో అలాంటి అనుభూతే కలిగిందన్నారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్వితీయ, అపురూప ఘట్టం. మానవ మాత్రులకు ఇది అసాధ్యం అనుకున్న కార్యం సుసాధ్యం అయ్యిందని శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు.

    ఇంతకుముందు చెప్పినట్లుగా 1970 మే 5 తేదీన ముంబైకి దగ్గరలో గుజరాత్‌ రాష్ట్రం పరిధిలో వున్న నార్గోల్‌ సముద్ర తీరాన శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరచిన సహస్రారధామ్‌ అనే ఆ స్థలాన్ని పుణ్యస్థలిగా భావించి ప్రతి ఏటా మే 5 తేదీన ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులందరు దీనిని సహస్రార దినోత్సవంగా జరుపుకుంటారు. సహజయోగ సాధన చేస్తున్నవారు తమ శారీరిక, మానసిక, భావోద్వేగ బాధలనుండి, సమస్యలనుండి సునాయసంగా స్వాంతన  పొందుతున్నారు. సహజయోగం పూర్తిగా ఉచితం.
    – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు

     

     

  • బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్‌కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే. 

    బెంగుళూరుకు చెందిన డానిష్‌ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్‌ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడయోని షేర్‌ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు. 

    మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు. 
     

     (చదవండి: ఆ రేంజ్‌లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!)

     

  • ఎలాంటి షార్ట్‌కట్‌లు లేకుండా త్వరిగతిన కిలోల కొద్ది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కంటెంట్‌ క్రియేటర్‌ చెప్పే సలహాలు, సూచనలు ఎంతగానో హెల్ప్‌ అవుతాయి. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్‌ తీసుకుంటూనే..సరైన జీవనశైలిని నిలకడగా పాటిస్తూ తగ్గానని చెబుతున్నారామె. అదెలాగో సోషల్‌ మీడియా వేదికగా ఆమెనే స్వయంగా వివరించారు. మరి ఆ టిప్స్‌ ఏంటో చూసేద్దామా..!.

    ఇటీవలకాలంలో అందరూ సంక్లిష్టమైన డిటాక్స్ ప్లాన్‌లు లేదా ఫ్యాన్సీ హెల్త్ ఫుడ్స్‌కు బదులుగా, చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తినడం, ఎక్కువగా నడవడం, చక్కెర తగ్గించడం, నిలకడగా ఉండటం వంటి సాధారణ మార్పులపై దృష్టిసారిస్తున్నారు. బహుశా అందుకే ఈ కంటెంట్‌ క్రియేటర్‌ అంజలి సచిన్‌ తన వెయిట్‌ జర్నీ అందర్నీ అమితంగా ఆక‌ర్షిస్తోంది. ఆమె చెప్పే ఆహారపు అలవాట్లు సైతం అందరు సులభంగా పాటించగలిగేవే కావడం విశేషం. ఆమె కేవలం రెండు నెలల్లోనే 20 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. 

    అందుకోసం ఏం చేశారో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె కేలరీ డెఫిసిట్‌ ప్రాధాన్యంగా తీసుకుని డైట్‌ని పాటించినట్లు పేర్కొన్నారు. అంటే శరీరం ఒక రోజులో ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువగా తీసుకోవడం. ఇక ఆమె తన దినచర్యలో అధిక ప్రోటీన​, అధిక ఫైబర్‌ ఉన్న భోజనం, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా మానుకోవడం తోపాటు స్వీట్లు, శీతల పానీయాలు, చిరుతిళ్లను రాత్రిపూట తీసుకోకుండా దూరంగా ఉండటం వంటివి చేసినట్లు తెలిపారు. 
    ​ఆ క్రియేటర్‌ క్రమం తప్పకుండా పాటించిన 12 కఠినమైన అలవాట్లు..

    అధిక ప్రోటీన్ + అధిక ఫైబర్ ఉన్న భోజనం
    తక్కువ కార్బోహైడ్రేట్ల విధానం
    చక్కెర వద్దు (స్వీట్లు, శీతల పానీయాలు వద్దు)
    తక్కువ నూనె + తక్కువ ఉప్పు
    రోజుకు 15,000 అడుగులు
    ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్)
    వెయిట్ ట్రైనింగ్/వెయిట్‌లిఫ్టింగ్
    సమయానికి నిద్రపోవడం
    కొన్నిసార్లు రోజుకు ఒక పూట భోజనం (అవసరమైనప్పుడు)
    సాయంత్రం 6 గంటల తర్వాత డిన్నర్ వద్దు
    చిరుతిళ్లు తినవద్దు / అనవసరమైన చిరుతిళ్లు వద్దు

    నెలకు 8-10 కిలోలు తగ్గాలనుకుంటే, ఈ నియమాలను క్రమశిక్షణతో పాటించండి. నిలకడ = పరివర్తన, అన్నింటకంటే ముఖ్యం అని అని అంజలి సచన్ పోస్ట్‌లో రాశారు. ఈ అలవాట్లతో పాటు, ఆమె శాకాహార, మాంసాహార భోజన ప్రణాళికలతో కూడిన 7-రోజుల తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్ డైట్ చార్ట్‌ను కూడా పంచుకున్నారు.

    శాకాహార ప్రణాళికలో పనీర్ భుర్జీ, టోఫు, సోయా చంక్స్, మొలకలు సలాడ్, గ్రీక్ పెరుగు, మూంగ్ దాల్ చిల్లా, బెసన్ చిల్లా, రాజ్మా, వెజిటబుల్ సూప్, సలాడ్‌లు వంటి ఆహారాలు ఉన్నాయి. మాంసాహార వెర్షన్‌లో గుడ్లు, చికెన్, చేపలు, వే ప్రోటీన్‌తో కూడిన ఓట్స్, చికెన్ సలాడ్, ఎగ్ బుర్జీలకు ప్రాధాన్యత ఇచ్చారు.

    ఈ ప్లాన్‌లో చాలా మందికి నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఖరీదైన “డైట్” ఉత్పత్తులకు బదులుగా సాధారణ ఇంటి వంటకాలను ఉపయోగించడం. ఈ భోజనాలు సరళంగా, ప్రోటీన్‌కు ప్రాధాన్యతనిస్తూ, తయారుచేయడానికి సులభంగా ఉంటాయి.

    అదే సమయంలో, వేగంగా బరువు తగ్గడం అనేది అందరిపై ఒకే విధంగా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి  శరీరాకృతి, జీవనశైలి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారం, వ్యాయామ దినచర్యలను ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయనేది గ్రహించాలి. 

     

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు ముగింపు..! ఆ కారణంతోనే..)
     

  • నిజంగా స్టేట్‌ ర్యాంక్‌ వస్తేనే సంబరాలు చేసుకుంటాం. అలాంటిది జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధిస్తే ఎగిరిగంతేస్తాం. తల్లిదండ్రలు ఇంట్లో ఓ పండుగలా వేడుక జరిపిస్తారు అలాంటిది ఈ తల్లి మాత్రం ఆ ఒక్క మార్కు అంటూ బాధుపడుతున్న తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. పైగా మరీ ఇంతలా పేరెంట్స్‌ ఉండకూడదు అంటూ తిట్టిపోశారు. 

    ఇంతకీ ఏం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌కి చెందిన దిబ్యేందు ప్రమణిక్‌ పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఐసీఎస్‌ఈ సిలబస్‌లో ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంత పెద్ద ఘనత సాధించినందుకు ఏ తల్లిదండ్రలకైన పట్టరాని సంతోషం కలుగుతుంది. కానీ అతడి తల్లి ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకోవచ్చు కదా అంటూ విచారం వ్యక్తం చేసింది. అతడికి 500కి ఒక్క మార్కు తేడాతో 499 మార్కులు సాధించాడు. 

    కానీ ఆ తల్లి బాగానే తెచ్చుకున్నాడు గానీ, ఇంకా కొంచెం కష్టపడితే ఆ ఒక్క మార్కు కూడా మిస్‌ అయ్యేది కాదు కదా అంటూ ఉసురుమనిపించేలా మాట్లాడింది. ఒక దిబ్యేందు కూడా తన తల్లిలా మాట్లాడాడు. ఆ ఒక్క మార్కు కోల్పోయినందుకు బాధగా ఉంది, కానీ పర్వాలేదు తన వరకు చాలా బాగా రాశానంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఇంజనీర్‌ కావాలనుకుంటున్నానని, ఐఐటీ వంటి అగ్రశ్రేణి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. 

    ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు వామ్మో ఇలాంటి తల్లిదండ్రులు నాకు లేనందుకు సంతోషం అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కొందరు ఆమె మాటలను చూస్తుంటే ఆ అబ్బాయిపై ఎంత ఒత్తిడి పెంచారో ఊహించగలను అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

     

    (చదవండి: ఎవరీ ర్యాన్‌ కోహెన్‌..? కాలేజీ డ్రాపౌట్‌ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..)
     

  • మనం మైసూర్‌ వెళ్తే 1008 మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని భక్తితో స్మరిస్తూ మెట్లు ఎక్కుతుంటారు భక్తులు. ఇలా మెట్లెక్కి దేవి దర్శనం చేసుకోవడం అనేది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ జరగదని భక్తుల నమ్మకం. అలాగే దేవి నవరాత్రులు రోజులు వస్తే దేశం అంతటా వినబడే పేరు మైసూరు చాముండేశ్వరి ఉత్సవాలు. విదేశాల నుంచికూడా యాత్రికులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ఏనుగు అంబారీ మీద మైసూరు రాజుల ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి. మైసూరు మహా నగరంలో చాముండా పర్వతం మీద కొలువై ఉన్నారు చాముండేశ్వరీ దేవి. 

    ఈ పర్వతాన్ని మొదట్లో మహాబల గిరి అని పిలిచేవారట. జగన్మాత చాముండేశ్వరి అవతారం ఎత్తి మహిషాసురుడిని వధించడంతో చాముండ పర్వతంగా పేరు పడింది. అమ్మచేతిలో మరణించే ముందు – ముందుగా తనకే దేవి భక్తులు పూజ చేసి దేవి దర్శనానికి వెళ్లాలని వరం పొందాడు మహిషాసురుడు. ఇప్పటికి జగన్మాత చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా మహిషాసురుని దర్శించుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తారు. చాముండేశ్వరి దేవాలయం పక్కనే మహిషాసురుడి భయంకరమైన ప్రతిమ ఉంటుంది.

    శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏడు అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళా వైభవంతో అద్భుతంగా ఉంటుంది. ఏడవ అంతస్థు అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. కలశ గోపుర ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రవేశ ద్వారం అంతరాలయం దాటి గర్భగుడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవిని చూడడానికి రెండు కన్నులు చాలవు. 

    దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు అరటి పండ్లు, పువ్వులు, పచ్చ రంగు చీర గాజులు కుంకుమ బియ్యం మల్లెపూల దండ దేవి సమర్పించి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ తరువాత ఉద్దనహళ్లి వెళ్లి చాముండేశ్వరి దేవి సోదరి జ్వాలాముఖి త్రిపుర సుందరీ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ దేవి ఉగ్రరూపిణిగా దర్శనం ఇస్తారు. శ్రీ చాముండేశ్వరి దేవాలయం దగ్గర మహా నందీశ్వరుని పెద్ద శిల్పం జీవ కళ ఉట్టి పడుతుంటుంది. దేవాలయాన్ని పెద్ద పెద్ద నల్లని రాతి పలకలతో నిర్మించారు. 

    సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. మొదట్లో రాజ వంశస్థులకి మాత్రమే దేవి దర్శనం ఉండేది. ఆ తరువాత ప్రజలకి జగన్మాత దర్శనం అనుగ్రహం లభించింది. మైసూరు రాజులూ చామరాజ, ఒడయార్‌ వంశస్థులు దేవి దాసులు అయ్యారు. ఇప్పటికి రాజవంశీకుల ఆధ్వర్యంలోనే దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆలయం ఇక్కడకు దగ్గర కూడా.
    – ఈఎస్‌ మాధవన్, విశాఖపట్నం 

    (చదవండి: సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..)

  • కాలేజ్‌ డ్రాపౌట్‌ కాలిఫోర్నియాలో శాన్‌హౌస్‌ కేంద్రంగా  పనిచేసే ఒక అమెరికన్ బహుళజాతి ఇ-కామర్స్ సంస్థ కొనడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అతడిపేరు  హాట్‌టాపిక్‌గా మారింది. ఎవ్వరూ కొనమని కోరకపోయినా..నేరుగా బిడ్‌ వేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతనెవరంటే..

    గేమ్‌స్టాప్ సీఈఓ ర్యాన్‌ కోహెన్‌ ఏకంగా 56 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లుపైనే) విలువ చేసే ఈబేను కొనడానికి బిట్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నగదు, స్టాక్‌ల  50-50 నిష్పత్తిలతో కలిపి ఒక్కో షేరుకు రూ. 11 వేలు చెల్లించేలా బంపర్‌ ఆఫర్‌ ఇస్తానంటూ ఈబే బోర్డుకు లేఖ రాశారు. దాంతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కాలేజ్‌ డ్రాపౌట్‌ బిలియనీర్‌ ఎవరా అంటూ అంత చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

    ర్యాన్‌ కోహెన్ ఎవరంటే..
    ఆయన స్వస్థలం కెనడాలోని మాంట్రియల్. ప్రస్తుతం సుమారు 4.2 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు) సంపద కలిగిన 40 ఏళ్ల పారిశ్రామికవేత్త.  కాలేజీ చదువును పూర్తిగా వదిలేసి, ఒక అసాధారణ మార్గంలో బోర్డు స్థాయికి చేరుకున్నారు. ఆయన రోవన్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ తర్వాత చదువు మానేశారు. డిగ్రీకి బదులుగా, అతను చ్యూయీని నిర్మించి, 2017లో దానిని పెట్‌స్మార్ట్‌కు 3.35 బిలియన్ డాలర్లు(రూ. 31 వేల కోట్లు)కు విక్రయించాడు. 

    ఆ తర్వాత అతను గేమ్‌స్టాప్ మీమ్-స్టాక్ పునరుద్ధరణలో కీలకంగా మారారు. ఆయన నాయకత్వంలోనే గేమ్‌స్టాఫ్‌ రూ. 3 వేల కోట్ల నష్టం నుంచి రూ 4 వేల కోట్లకు పుంజుకుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ కంపెనీ 2026 ప్రారంభంలో మొత్తం 470 యూఎస్ స్టోర్లను కలిగి ఉంది.  దాంతో ఇప్పుడు  అతను గేమ్‌స్టాప్ కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈబే కంపెనీని నడపాలని, దానిని అమెజాన్‌కు సరైన పోటీదారుగా మార్చాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.

    అంతేగాదు కోహెన్‌ తాను రాబోయే కొన్నేళ్లపాటు, గేమ్‌స్టాప్ పునరుద్ధరణలో ఎంతగా దృష్టి పెట్టానో, అలాగే ఈబేపై కూడా దృష్టి పెడతానుని అన్నారు. తాను ఈబేను వందల బిలియన్ల డాలర్ల విలువైన సంస్థగా మార్చాలని  చూస్తున్నా అని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈబే బోర్డు సోమవారం ఈ ఆఫర్‌ను సమీక్షిస్తానని తెలిపింది.  ఇక కోహెన్‌ మాత్రం ఈబేను తాను ఇంటి నుంచి కూడా నడపగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అది 1995లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే కనిపిస్తుందని విమర్శించారు. తాను మార్కెటింగ్, ఉత్పత్తి అభివృద్ధి,  ఇతర నిర్వహణ ఖర్చులను తగ్గించి లాభాల బాట పట్టించగలనని చెబుతుండటం విశేషం. 

    (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు ముగింపు..! ఆ కారణంతోనే..)