Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

    ఈ విజయంలో ముకుల్ చౌదరిది కీలక పాత్ర. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్‌ప్లేలోనే ఓపెనర్లు మార్‌క్రమ్‌(22), మార్ష్‌(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్‌(10), నికోలస్ పూరన్‌(13), సమద్(2) కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయూశ్ బదోని మాత్రం కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బదోని(54) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు.

    ముకుల్‌ సంచలనం
    కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 6 పరుగులు చేసిన ముకుల్‌.. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. ముకుల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 

    కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 6, 4, 6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. తొలి బంతికి అవేష్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ముకుల్‌ చౌదరికి ఇచ్చాడు. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి, ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. 

    చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్ల డగౌట్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతిని ముకుల్‌ సిక్సర్‌గా బాది స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్‌ కీపర్‌ రఘువంశీ డైరెక్ట్‌ త్రో చేయడంలో విఫలమయ్యాడు.

    ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, అనుకుల్ రాయ్ త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. సునీల్ న‌రైన్‌, గ్రీన్‌, త్యాగీ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

    అంతకముందు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్‌(32), రావ్‌మన్‌ పావెల్‌(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, సిద్దార్ధ్‌, దిగ్వేష్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్‌ స్టార్‌ అవుతాడు'
     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్బుత బ్యాటింగ్‌తో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ వైభవ్ సత్తాచాటాడు .ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. 

    ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్‌గా మలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ను "అసలైన సూపర్ స్టార్"గా స్మిత్‌ అభివర్ణించాడు.

    నేను ఊహించినట్లే ఫ్లాట్ పిచ్‌లు, అధిక స్కోరింగ్ మ్యాచ్‌లతో ఐపీఎల్ ప్రారంభమైంది. ఎప్ప‌టిలాగే రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియ‌ర్ సూప‌ర్ స్టార్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం అంద‌రికంటే ఎక్కువగా న‌న్ను ఆక‌ట్టుకున్నాడు. 

    మొదటి బంతి నంచే త‌న ప‌వర్‌ను అత‌డు చూపిస్తున్నాడు. అత‌డి బ్యాటింగ్ టెక్నిక్ నిజంగా అద్భుతం. ఈ టోర్నమెంట్ ముగిసేలోపు వైభ‌వ్‌ ఒక సూపర్ స్టార్ అవుతాడు. భార‌త క్రికెట్‌కు కూడా అత‌డు భ‌విష్య‌త్తు బ్యాటింగ్‌ స్టార్ అవుతాడ‌ని స్మిత్ పేర్కొన్నాడు.
    చదవండి: భారత లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత
     

  • ఐపీఎల్ 2026లో అంపైరింగ్ నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుటైన‌ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ పట్టిన క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

    ఏమి జరిగిందంటే?
    కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో ల‌క్నో పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్ వేసిన నాలుగో బంతిని ఫిన్ అలెన్ లెగ్ సైడ్‌ భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని  డీప్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న దిగ్వేష్ రాఠీ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో రాఠీ కాలు బౌండరీ లైన్‌కు తాకిన‌ట్లు క‌న్పించింది.

    సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్‌ను నేరుగా అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత రిప్లేలో అతడి కాలి బౌండరీ రోప్‌కు తాకినట్లు అన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

    ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్‌, అభిషేక్ శర్మ క్యాచ్‌లు కూడా వివాదస్పదమయ్యాయి.


     

     

  • భార‌త క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) మరణించారు.  చెన్నైలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 1952లో ఇంగ్లండ్‌పై భార‌త్ సాధించిన తొలి టెస్ట్ విజ‌యంలో గోపీనాథ్ కీల‌క పాత్ర పోషించారు.

    భారత్ ఇన్నింగ్స్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చారిత్ర‌త్మ మ్యాచ్‌లో గోపీనాథ్ 35 పరుగులు చేశారు. తొలి టెస్టు విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టులో ఇప్పటివరకు జీవించి ఉన్న ఏకైక క్రికెట‌ర్ గోపీనాథ్ కావ‌డం విశేషం. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణంతో భార‌త క్రికెట్‌లో ఒక శ‌కం ముగిసింది.

    1951లో ఇంగ్లండ్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ త‌న కెరీర్‌లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌ద్రాస్‌ త‌ర‌పున ఆడ‌న 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు.  తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయ‌న 8 మ్యాచ్‌ల‌లో 242 ప‌రుగులు చేశారు. ఆయ‌న మృతి పట్ల పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
    చదవండి: IPL 2026: డేవిడ్‌ మిల్లర్‌ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే?

  • అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఊహకందని ఓ అద్భుతం జరిగింది. మహిళల విభాగంలో ఓ బౌలర్‌ ఏకంగా 9 వికెట్లు తీసి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కలహరి మహిళల టీ20 టోర్నీ-2026లో భాగంగా లెసోథోతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ బౌలర్‌ లారా కార్డోసో ఈ చారిత్రక ఫీట్‌ సాధించింది. 

    ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన ఆమె.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ హ్యాట్రిక్‌ సహా 9 వికెట్లు పడగొట్టింది. ఫలితంగా 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లెసోథో జట్టు 13 పరుగులకే ఆలౌటై (6.2 ఓవర్లలో), 190 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయంపాలైంది.

    అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో లారా కార్డోసో నమోదు చేసిన ఈ గణాంకాలు (3-0-4-9) ఏ విభాగంలో (పురుషులు, మహిళల) అయినా అత్యుత్తమంగా నిలిచిపోనున్నాయి. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు భూటాన్‌ బౌలర్‌ సోనమ్‌ యెషే పేరిట ఉండేవి. గతేడాది డిసెంబర్‌లో మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో యెషే కేవలం 7 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. 

  • KKR vs LSG Live updates: కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముకుల్‌ చౌదరి(27 బంతుల్లో 54) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించాడు. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి అవేష్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ ముకుల్‌ చౌదరికి ఇచ్చాడు. 

    ముకుల్‌ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. చివరి రెండు బంతులకు 7 పరుగులు అసవరమయ్యాయి. 

    మళ్లీ ఐదో బంతికి ముకుల్‌ సిక్సర్‌ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్‌ కీపర్‌ రఘువంశీ డైరెక్ట్‌ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి చేధించింది.

    దుమ్ములేపుతున్న ముకుల్‌ చౌదరి
    కేకేఆర్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి. ముకుల్‌ చౌదరి అద్భుతంగా ఆడుతున్నాడు.

    18 ఓవర్లకు లక్నో స్కోర్‌: 152/7
    18 ఓవర్లు ముగిసేసరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ముకుల్‌ చౌదరీ(26) దూకుడుగా ఆడుతున్నాడు.

    కేకేఆర్‌ ఆరో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 54 పరుగులు చేసిన ఆయూశ్‌ బదోని.. అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు లక్నో స్కోర్‌: 125-6

    లక్నో నాలుగో వికెట్‌ డౌన్‌
    లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    లక్నో మూడో వికెట్‌ డౌన్‌
    రిషబ్‌ పంత్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌.. కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74-3

    లక్నో రెండో వికెట్‌ డౌన్‌
    లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌.. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    లక్నో తొలి వికెట్‌ డౌన్‌
    41 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

    4 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?
    4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్‌ మార్‌క్రమ్‌(22), మిచెల్‌ మార్ష్‌(22) ఉన్నారు.

    రాణించిన కేకేఆర్‌ బ్యాటర్లు.. లక్నో టార్గెట్‌ ఎంతంటే?
    ఈడెన్ గార్డెన్స్  వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్‌(32), రావ్‌మన్‌ పావెల్‌(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌, సిద్దార్ధ్‌, దిగ్వేష్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

    17 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 144/4
    17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. క్రీజులో పావెల్‌(25), గ్రీన్‌(15) ఉన్నారు.
    కేకేఆర్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    రింకూ సింగ్‌ రూపంలో కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్‌.. అవేష్ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 

    కేకేఆర్‌ మూడో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన రఘువంశీ.. సిద్దార్ధ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    అజింక్య రహానే రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రహానే.. దిగ్వేష్‌ సింగ్‌ రాథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 102/2

    7 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 65/1
    7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.

    కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
    కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్‌.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 16/1

    ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గ‌త మ్యాచ్‌కు దూర‌మైన కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ నరైన్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

    దీంతో బ్లెస్సింగ్ ముజ‌ర్‌బానీ బెంచ్‌కే ప‌రిమిత‌య‌మ్యాడు. అయితే స్టార్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మాత్రం త‌న చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన టీమ్‌నే కొనసాగించింది.

    జట్లు:
    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్‌), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్‌), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి

    ఇంపాక్ట్ సబ్‌లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్

    లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్‌), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

    ఇంపాక్ట్ సబ్‌లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, 

  • ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ క్రిస్‌ గ్రీన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రీన్‌.. లాహోర్‌ ఖలందర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా (4-0-13-3) బౌలింగ్‌ చేయడంతో పాటు 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్దిని దారుణంగా దెబ్బకొట్టాడు. ఫలితంగా అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా లభించింది.

    గ్రీన్‌తో పాటు షాదాబ్‌ ఖాన్‌ (4-0-18-2), ఇమాద్‌ వసీం (4-0-13-2), రిచర్డ్‌ గ్లీసన్‌ (3-0-13-2), ఫహీమ్‌ అష్రఫ్‌ (2.3-0-21-1) సత్తా చాటడంతో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ లాహోర్‌ను 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్‌ చేసింది. లాహోర్‌ ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన సికందర్‌ రజా టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్‌ (19), అబ్దుల్లా షఫీక్‌ (10), ఆసిఫ్‌ అలీ (15) రెండంకెల స్కోర్లు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్‌ 10.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. డెవాన్‌ కాన్వే (59 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. అతనికి మొహమ్మద్‌ ఫైక్‌ (34 నాటౌట్‌) సహకరించాడు. ఇస్లామాబాద్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ (సమీర్‌ మిన్హాస్‌ (5)) లాహోర్‌ కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిదికి దక్కింది.

    ఎవరీ క్రిస్‌ గ్రీన్‌..?
    32 ఏళ్ల కుడి చేతి వాటం ఆఫ్‌ స్పిన్నర్‌ క్రిస్‌ గ్రీన్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌లో సుపరిచితుడు. సౌతాఫ్రికాలో పుట్టి ఆస్ట్రేలియా తరఫున ఓ టీ20 ఆడిన గ్రీన్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెట్‌ లీగ్‌లో ఆడాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇతనికి మంచి పేరు వచ్చింది. అయితే బౌలింగ్‌ శైలి వివాదాస్పదంగా ఉండటం అతని కెరీర్‌ను సజావుగా సాగనివ్వలేదు. ఈ గ్రీన్‌ ఐపీఎల్‌లోనూ ఓ మ్యాచ్‌ ఆడాడు. 

    యాదృచ్చికంగా ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న కెమరూన్‌ గ్రీన్, ఈ క్రిస్‌ గ్రీన్‌ కేకేఆర్‌ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించారు. క్రిస్‌ గ్రీన్‌ను కేకేఆర్‌ 2020 ఎడిషన్‌లో రూ. 20 లక్షలకు సొంతం చేసుకోగా.. కెమరూన్‌ గ్రీన్‌ను 2026 వేలంలో కేకేఆర్‌ ఏకంగా రూ. 25. 20 కోట్లకు కొనుగోలు చేసింది. 

    ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా కెమరూన్‌ గ్రీన్‌ రికార్డుల్లోకెక్కాడు. అయితే తనపై పెట్టిన పెట్టుబడికి గ్రీన్‌ న్యాయం చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతూ, అస్సలు బౌలింగే చేయడం లేదు. 

  • ఐపీఎల్‌-2026లో బుధ‌వారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్ల‌ర్ సినిమాను త‌లపించిన సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది.

    అద్భుతమైన ఇన్నింగ్స్‌తో హీరోగా మారుతాడు అనుకున్న డేవిడ్ మిల్ల‌ర్ ఒక్క త‌ప్పిదంతో విల‌న్‌గా మారిపోయాడు.  ప్ర‌సిద్ద్ కృష్ణ చివ‌రి ఓవ‌ర్‌లో ఢిల్లీ విజ‌యానికి 13 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. తొలి బంతిని విప్ర‌జ్ నిగ‌మ్ బౌండ‌రీకి త‌రలించాడు. ఆ త‌ర్వాతి బంతికి విప్రజ్ ఔటయ్యాడు.

    మూడో బంతికి కుల్దీప్ మిల్లర్‌కు సింగిల్ తీసి ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. అయితే ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. మిల్లర్ స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు. 

    కానీ మిల్లర్ అనుకున్నది జరగలేదు. ఆఖరి బంతి ప్రసిద్ద్ బౌన్సర్‌గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సింది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్‌నే కోల్పోవల్సింది. ఓటమి అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు మిల్లర్‌ను ఓదార్చారు.

    అయితే ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అసలేంటి ఆ రూల్‌?  ఢిల్లీ ఓట‌మికి ఎలా కార‌ణ‌మైందో ఓసారి ప‌రిశీలిద్దాం.

    ఏమి జరిగిందంటే?
    ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవ‌ర్‌లో నిస్సాంక ఔట‌య్యక నితీశ్ రాణా క్రీజులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో 10వ ఓవ‌ర్ వేసిన ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండో బంతి నితీష్ రాణా ప్యాడ్లకు తగిలింది. అప్పీల్ చేయ‌గా అంపైర్ వెంటనే వేలెత్తి అవుట్ అని ప్రకటించాడు. అప్ప‌టికే రాహుల్‌, నితీశ్ పరుగు పూర్తి చేశాడు. నితీష్ రాహుల్‌తో చ‌ర్చించి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియ‌ర్‌గా బ్యాట్ ఎడ్జ్ తాకిన‌ట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. అయితే నితీశ్ తీసిన ర‌న్‌ను మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

    ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్‌ను అవుట్ అని ప్రకటించిన మరుక్షణమే ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది.  ఆ తర్వాత బంతి బౌండ‌రీకి వెళ్లినా లెక్క‌లోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ విష‌యంలో అదే జ‌రిగింది. నిర్ణయం మారినప్పటికీ అప్పటికే బాల్ డెడ్ కావ‌డంతో బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును అంపైర్లు నిరాకరించారు. ఆఖ‌రికి ఢిల్లీ జట్టు కేవలం 1 పరుగు తేడాతోనే ఓడిపోవాల్సి వ‌చ్చింది. ఒకవేళ ఆ పరుగు ఇచ్చి ఉంటే మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లేది.
    చదవండి: PSL 2026: డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్‌?
     

  • దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మకు సంబంధించి ఓ బిగ్‌ న్యూస్‌ అందుతుంది. హిట్‌మ్యాన్‌పై బయోపిక్‌ రాబోతుందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్‌ 9) రోహిత్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.

    రోహిత్‌ షేర్‌ చేసిన క్రిప్టిక్‌ పోస్ట్‌లో నెట్‌ఫిక్స్‌ లోగో కలిగిన డ్రాఫ్ట్‌ #45 అనే స్క్రిప్ట్‌ డాక్యుమెంట్‌ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్‌మార్క్‌ ఉండటంతో, హిట్‌మ్యాన్‌ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్‌ Netflix‌తో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది.  

    వీటన్నిటినీ బట్టి హిట్‌మ్యాన్‌పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్‌ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌-రోహిత్‌ బ్యాక్‌డ్రాప్‌లో డాక్యూ–సిరీస్‌ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్‌ స్పోర్ట్స్‌–థీమ్‌ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2026లో హిట్‌మ్యాన్‌ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. 

    తొలి మ్యాచ్‌లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆర్సీబీతో తలపడుతుంది.

  • పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో వరుస విజయాలతో దూసుకు పోతున్న కరాచీ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ కింగ్స్ గురువారం పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కరాచీ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.

    డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు డ్రండ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వార్నర్ ఏప్రిల్ 7న కరాచీ కింగ్స్ జట్టుతో తిరిగి చేరాల్సింది.

    కానీ అతడు ఇంకా పాకిస్తాన్‌కు రానిట్లు తెలుస్తోంది. ఈరోజు పెషావర్ జల్మీతో జరగనున్న కీలక మ్యాచ్‌కు వార్నర్ అందుబాటులో లేకపోవడంతో, కరాచీ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్‌గా పేసర్ హసన్ అలీ వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    అసలేమి జరిగిందంటే?
    కరాచీ కింగ్స్ జట్టుకు వారం రోజులు విశ్రాంతి లభించడంతో వార్నర్ తన  కుటుంబంతో సమయం గడపడానికి పాక్‌ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ క్రమంలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లో వార్నర్ దొరికిపోయాడు.

    వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్ణీత పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.  దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాతి అతడిని విడిచిపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాగా పెషావర్ జల్మీతో మ్యాచ్‌కు దూరంగా ఉన్నప్పటికి కరాచీ ఆడే తదుపరి మ్యాచ్‌కు వార్నర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
    చదవండి: IPL 2026: 'ఎంత మంది వ‌చ్చినా అత‌డే నా ఫేవ‌రేట్ కెప్టెన్‌'

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో టీమిండియా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు కెప్టెన్‌గా మూడో టైటిల్‌ను అందించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. గతేడాది పంజాబ్ కింగ్స్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. ఐపీఎల్‌-2026లో కూడా పంజాబ్‌ను అయ్య‌ర్ విజ‌యప‌థంలో న‌డిపిస్తున్నాడు.

    ఈ ఏడాది సీజ‌న్‌లో పంజాబ్ ఇప్ప‌టివ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజ‌యాల‌ను న‌మోదు చేసింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్ కింగ్స్ ప్ర‌స్తుతం రెండో స్ధానంలో కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై ఆ జ‌ట్టు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్‌సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయక‌త్వంలో ఆడాడు. కానీ త‌న ఫేవ‌రేట్‌ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప్ర‌భ్‌సిమ్రాన్ ఎంచుకున్నాడు.

    శ్రేయ‌స్ అయ్య‌ర్ నాకు ఎంతో స‌పోర్ట్‌గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్‌ల‌లో సరిగ్గా ఆడకపోయినప్ప‌టికి, శ్రేయ‌స్ నా ద‌గ్గ‌రకు వ‌చ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవ‌ద్ద‌ని చెప్పేవాడు. నా ఆట న‌న్ను ఆడ‌మ‌ని మ‌ద్ద‌తు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్‌. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్‌గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్‌సిమ్రాన్ పేర్కొన్నాడు.
    చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

  • ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మోసస్‌ హెన్రిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్‌కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్‌ క్రికెటర్‌ సిరాజ్‌ ఉల్లా ఖదెమ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్‌ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్‌బాష్‌ లీగ్‌ ప్లేయర్‌ జాయిన్‌ కాబోతున్నాడని హింట్‌ ఇచ్చాడు.

    హెన్రిక్స్‌ పోర్చుగల్‌కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్‌కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్‌కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్‌ పౌరసత్వం కూడా ఉంది.

    హెన్రిక్స్‌ 1989లో పోర్చుగల్‌లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌. చిన్న వయసులోనే హెన్రిక్స్‌ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్‌ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హెన్రిక్స్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు.  

    బిగ్‌బాష్‌ లీగ్‌లో హెన్రిక్స్‌కు ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్‌ (2019/20, 2020/21) గెలిపించాడు.  

    అసోసియేట్‌ దేశాలు అంతర్జాతీయ క్రికెట్‌లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్‌ లాంటి ఆటగాడు పోర్చుగల్‌కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్‌ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.

    అసోసియేట్‌ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు
    - ఉన్ముక్త్‌ చంద్‌ (భారత్‌) – యూఎస్‌ఏ  
    - రోల్ఫ్‌ వాన్‌ డెర్‌ మెర్వే – నెదర్లాండ్స్‌  
    - కోరె ఆండర్సన్‌ – యూఎస్‌ఏ  
    - డేవిడ్‌ వీస్‌ – నమీబియా  
    - వేన్‌ మాడ్సన్‌ – ఇటలీ  
    - రాస్‌ టేలర్‌ – సమోవా  
     

  • భారత క్రికెట్‌ చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ (2007)లో భారత్‌ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర.

    అదే విధంగా.. సొంతగడ్డపై భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2011 టైటిల్‌ గెలవడంలో యువీదే ముఖ్య భూమిక. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అద్భుత ప్రదర్శన కారణంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో యువీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

    ఆటకే ప్రాధాన్యం
    అయితే, ఇంతటి సంతోషకర సమయంలోనే ఓ చేదు వార్త యువరాజ్‌ సింగ్‌కు తెలిసింది. తనకు క్యాన్సర్‌ సోకిందనే విషయం బయటపడింది. అదే సమయంలో టెస్టు జట్టులో యువీకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని అతడు భావించాడు. అయితే, డాక్టర్‌ హెచ్చరికల తర్వాత యువీ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.

    అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్‌ సింగ్‌.. మహమ్మారిని జయించి యువరాజ్‌ సింగ్‌ మరికొన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగాడు. అయితే, చేదు అనుభవాల గురించి అతడు తాజాగా మనసు విప్పాడు. ‘‘ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకున్న వేళ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది.

    అప్పుడు మేము ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంగూలీ రిటైర్‌ అయిన కారణంగా నాకు టెస్టు జట్టులో అప్పుడే చోటు దక్కింది. ఏడేళ్ల నిరీక్షణ ఫలించబోతున్న తరుణం. నేను చచ్చిపోయినా పర్లేదు.. ఆ స్థానం నాకు కావాల్సిందే అని మనసులో గట్టిగా అనుకున్నాను.

    ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు
    అయితే, అప్పుడు డాక్టర్‌ నితేశ్‌ రోహత్గి నాకో భయంకర నిజం చెప్పారు. ‘నీ గుండె, ఊపిరి తిత్తులకు మధ్య ట్యూమర్‌ ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్లి క్రికెట్‌ ఆడితే గుండెపోటు వచ్చినా రావొచ్చు. కీమోథెరపీ ఇప్పుడు గనుక మొదలుపెట్టకపోతే ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం’ అని కుండబద్దలుకొట్టేశారు.

    అప్పుడే నాకు సమస్య తీవ్రత అర్థమైంది. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నా. నేనిక ఆడలేను అన్న బాధ మానసికంగా నన్ను కుంగదీసింది. కానీ అసలు క్రికెట్‌ లేకపోతే నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు పాత క్రికెట్‌ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని.

    ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు
    నేను అమెరికాలో ఉన్నపుడు అనిల్‌ కుంబ్లే వచ్చాడు. లాప్‌టాప్‌లో మ్యాచ్‌లు చూస్తుంటే.. ‘ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు. ఇవన్నీ పక్కన పెట్టు’ అని మందలించాడు. ఇంగ్లండ్‌లో ఉన్నపుడు సచిన్‌ పాజీ వచ్చి ‘నువ్వు త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’ అని ధైర్యం నింపాడు’’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తో యూట్యూబ్‌ చాట్‌లో యువీ పంచుకున్నాడు.
    చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్‌ ఇక్బాల్‌ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్‌ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్‌పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. 

    గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్‌ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్‌ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

    ఏప్రిల్‌ 7న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్‌ను 11 మంది సభ్యులతో కూడిన అడ్‌–హాక్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 

    37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్‌.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.

    మహిళా క్రికెటర్లకు భారీ ఊరట  
    తమీమ్‌ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్‌ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్‌కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్‌కు 15000 టాకాలు, ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌కు 20000 టాకాలుగా మారాయి. 

    టాప్‌ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది.  

    పురుష క్రికెటర్లకు జాక్‌పాట్‌
    తమీమ్‌ నిర్ణయంతో బంగ్లాదేశ్‌ పురుషు క్రికెటర్లకు జాక్‌పాట్‌ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్‌ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్‌ల వారీగా విభజన జరిగి, గ్రేడ్‌ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్‌ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. 

    అలాగే ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు.  
     

  • ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, తన అంతర్జాతీయ కెరీర్‌పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్‌ 8) ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన అతను.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.

    మ్యాచ్‌ అనంతరం రషీద్‌ మాట్లాడుతూ.. టెస్ట్‌ క్రికెట్‌ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఇకపై టెస్ట్‌లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు.  

    కాగా, రషీద్‌ ఖాన్‌ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్‌ గతేడాది జింబాబ్వేపై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.  

    రషీద్‌ 2023 వన్డే వరల్డ్‌ కప్‌ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించాడు. 

    రషీద్‌ టెస్ట్‌ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ 2017లో టెస్ట్‌ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడగా, రషీద్‌ కేవలం 6 టెస్ట్‌ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 6 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీశాడు. 
     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్‌ మిల్లర్‌ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్‌ సింగిల్‌కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. 

    ఆఖరి బంతిని మిస్‌ చేయడంతో కుల్దీప్‌ యాదవ్‌ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్‌లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్‌ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 

    ఓటమి అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్‌ను కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌, హెడ్‌ కోచ్‌ హేమాంగ్‌ బదానీ ఓదార్చారు. మిల్లర్‌ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్‌కు మద్దతు తెలిపింది.  

    ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్‌ను తిట్టిపోశారు. 19వ ఓవర్‌ ఐదో బంతిలో సింగిల్‌ తీసుంటే కనీసం సూపర్‌ ఓవర్‌కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్‌దే అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్‌కు చీవాట్లు పెట్టారు.

    నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్‌ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్‌ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్‌ ఫైర్‌ అవడం సహజమే. ఇందులో మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు.

    ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్‌లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్‌ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్‌లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్‌రేట్‌ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.

    ఢిల్లీ-గుజరాత్‌ మ్యాచ్‌ హైలైట్స్‌  
    - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.
    - గిల్‌ (70), బట్లర్‌ (52), సుందర్‌ (55) అర్ద సెంచరీలతో రాణించారు.  
    - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌  (92), నిస్స​ంక (41) చెలరేగి ఆడారు. 
    - గాయపడిన చేతితో డేవిడ్‌ మిల్లర్‌ (41 నాటౌట్‌) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. 
    - రషీద్‌ ఖాన్‌ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్‌ను కుదిపేశాడు.  
     

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా ప్రాచుర్యం పొందింది ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). భారత్‌లో టీ20 ఫార్మాట్లో 2008లో మొదలైన ఈ టోర్నీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఐపీఎల్‌ ప్రసార హక్కులు రూ. 40 వేల కోట్లకు పైగా అమ్ముడుపోవడం ఈ లీగ్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనం. అయితే, ఆరంభంలో ఐపీఎల్‌ ప్రసారాలకు అసలు బ్రాడ్‌కాస్టర్లే దొరకలేదట.

    ప్రతి చోటా ‘నో’ అనే సమాధానమే 
    దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలు ఐపీఎల్‌ ఐడియాను తిరస్కరించారట. ఐపీఎల్‌ వ్యవస్థాపక చైర్మన్‌, ఆర్థిక నేరగాడు లలిత్‌ మోదీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అప్పట్లో బ్రాడ్‌కాస్టర్లందరి దగ్గరికి మేము వెళ్లాము. కానీ ఒక్కరు కూడా మా మాట వినలేదు.

    ప్రతి ఒక్కరి నుంచి ‘నో’ అనే సమాధానమే వచ్చేది. దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలకు నేను ప్రజెంటేషన్‌ ఇచ్చాను. అందులో 90 శాతం మందికి అసలు నేనేం చెబుతున్నానో అర్థమయ్యేదే కాదు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను.

    అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసేవారిని మళ్లించాలి
    టీవీలో వచ్చే అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసే ప్రేక్షకులను టార్గెట్‌ చేయాలనుకున్నా. అక్కడే మనం ఊహించనంత డబ్బు ఉంటుంది. నిజానికి భారత ప్రచార మార్కెట్లో ఎనిమిది గంటల స్లాట్‌ అత్యంతముఖ్యమైనది.

    కాబట్టి నైట్‌ క్రికెట్‌ వైపు మొగ్గుచూపితే బాగుంటుందనిపించింది. సంగీతం, డ్యాన్సులతో ఎనిమిది గంటలకు మ్యాచ్‌ ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చాము. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల్ని ఆకర్షించడం మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రేక్షకుల వల్లే డబ్బు ఎక్కువగా వస్తుంది.

    భారత్‌ పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో
    ఇక మొట్టమొదటి, టీ20 ప్రపంచకప్‌-2007 ఫైనల్లో భారత్‌ పాకిస్తాన్‌ను చిత్తు చేయడం మాకు కలిసి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లను హీరోలుగా కీర్తిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశాము. వారిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఐపీఎల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది’’ అని లలిత్‌ మోదీ స్పోర్ట్‌స్టార్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

    చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!

Movies

  • ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్‌తో చాలామంది నటీనటులు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులోనే నటించి ఐరిష్ నటుడు ఇప్పుడు చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఐర్లాండ్‌కి చెందిన మైకేల్ పాట్రిక్(35) గత మూడేళ్లుగా మోటార్ న్యూరోన్ అనే వ్యాధితో పోరాడుతున్నాడు. పదిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన పాట్రిక్.. చికిత్స పొందుతూ మంగళవారం(ఏప్రిల్ 7) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి భార్య ధ్రువీకరించింది.

    తన ఆరోగ్యం గురించి గత కొన్నాళ్లుగా మాట్లాడుతూనే ఉన్న పాట్రిక్.. ఫిబ్రవరి 6న చివరగా ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన పరిస్థితి గురించి వివరంగా చెప్పిన వైద్యులు.. మరో ఏడాది మాత్రమే తనకు మిగిలుందని చెప్పినట్లు రాసుకొచ్చాడు.
    ట్రాచియోస్టమీ సర్జరీ గురించి ఆలోచించినప్పటికీ, దాని తర్వాత చాన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందనే కారణంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపాడు.

    మోటార్ న్యూరోన్ అనేది శరీర కండరాల పనితీరును నియంత్రించే నాడీ కణాలను దెబ్బతీసే తీవ్రమైన నరాల వ్యాధి. దీని వల్ల నడవడం, మాట్లాడటం, మింగడం, గాలి పీల్చడం లాంటివి క్రమంగా క్షీణిస్తాయి. ఇకపోతే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌తో పాటు బెల్ ఫెస్ట్ సినిమాలోనూ నటించాడు. టీవీ, థియేటర్ రంగంలోనూ ప్రతిభ చాటుకున్నాడు.

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త హడావుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్‌లో అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న డకాయిట్, కోలీవుడ్ నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి ఎల్‌ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో డకాయిట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎల్‌ఐకే మూవీపై కూడా కాస్తా బజ్ ఏర్పడింది.

    ఇక ఓటీటీల్లోనూ ఫ్రైడే సినిమాల సందడి ఉంటుంది. ఈ శుక్రవారం పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటిలో తాయ్ కిజవి, తూ యా మైన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు ఆసక్తిని పెంచుతున్నాయి.  ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్

    • తు యా మై (హిందీ సినిమా) - ఏప్రిల్ 10
    • త్రాష్ (ఇంగ్లీష్ చిత్రం) - ఏప్రిల్ 10
    • టర్న్ ఆఫ్‌ ది టైడ్- సీజన్-3-(హాలీవుడ్ సిరీస్) ఏప్రిల్ 10

    అమెజాన్ ప్రైమ్

    •    క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ మూవీ) - ఏ‍ప్రిల్ 10
    •   ఓ రోమియో(హిందీ సినిమా)- ఏప్రిల్ 10

    జియో హాట్‌స్టార్

    • తాయ్ కిజవి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10
    • హ్యాక్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 10

    సోనీ లివ్

    •  తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 10

    జీ5

    • ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్) - ఏప్రిల్ 10
    • ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్‌ హండా(హిందీ మూవీ)- ఏప్రిల్ 10


    సన్ నెక్స్ట్

    •  హాళ్(మలయాళ సినిమా) - ఏప్రిల్ 10
    •  కనిమంగళం కొవిలకమ్ (మలయాళ చిత్రం) - ఏప్రిల్ 10

    ఆపిల్ టీవీ ప్లస్

    •    ఔట్‌కమ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 10

    లయన్స్ గేట్ ప్లే

    •    వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 10

     

  • బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దురంధర్‌ మూవీపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఈ సినిమా చూశానని.. చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో విమర్శకులపై తన స్టైల్లో ఇచ్చిపడేశారు. రచయితలు, నటులు అనేవాళ్లు ప్రాపగండతోనే తమ కెరీర్ నిర్మించుకున్నారని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం పిల్లుల్లా సైలెంట్ అయిపోయిందన్నారు.

    ఇప్పుడదే వర్గం దురంధర్‌ను ఎగతాళి చేస్తోందని సందీప్ రెడ్డి వంగా విమర్శించారు. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే.. మిమ్మల్ని మీరు ఉదారవాదులు అని పిలిపించుకోలేరని రాసుకొచ్చారు. నిజానికి ప్రాపగండ అనే ముద్ర ఎప్పుడు పడిందో తెలియదన్నారు. ఈ విషయంలో ఆదిత్య ధర్‌, రణ్‌వీర్ సింగ్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. దురంధర్‌ మూవీకి ఈ నల్ల దృష్టి ఇలా వెళ్లదు... గుప్పెడు మిరపకాయలతో పని జరగదు.... మొత్తం పొలం తగలబెట్టాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    కాగా.. కొందరు దురంధర్ రిలీజైనప్పటి నుంచి ప్రాపగండ ముద్ర వేస్తూ విమర్శలు చేస్తున్నారు. వారికి తన ట్వీట్‌తో ఇచ్చిపడేశారు యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. 
     

     

  • ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దు గుమ్మ రష్మిక మందన్నా. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండతో సీక్రెట్‌ రిలేషన్‌లో కన్నడ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లాడింది. ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. ఇటీవలే తన పెళ్లి తర్వాత తొలి బర్త్ ‍డేను సెలబ్రేట్ చేసుకుంది. విజయ్‌తో పెళ్లి తర్వాత చేసుకున్న తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ ‍‍అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ఈ ఏడాది 30వ పుట్టినరోజు ఇంతకుముందు కంటే భిన్నంగా చేసుకున్నానంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది రష్మిక. చాలా రోజుల తర్వాత ఇంటికెళ్లానని.. అంతే కాకుండా చిన్నప్పటి నుంచి వెళ్తున్నా గుడికి కూడా వెళ్లానని ఆనందం వ్యక్తం చేసింది. సమయం లేకపోవడం వల్ల నా స్కూల్‌ను బయటి నుంచే చూశా.. అలా కాసేపు నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని చెప్పింది. ఈ రోజు నాకు ఎప్పటికీ తోడుగా ఉండబోయే వారి మధ్య కేక్ కట్‌ చేశానని సంతోషాన్ని పంచుకుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను ఆశీర్వదిస్తున్న వారిని.. నా పెళ్లికి రాలేకపోయిన నా కుటుంబ సభ్యులను చిన్న డిన్నర్ పార్టీలో కలిశానని తెలిపింది. ఈ రోజు వరకు నా ప్రతి విషయంలో భాగమైన నా స్కూల్ ఫ్రెండ్స్..  కుటుంబంలా మారిన నా స్నేహితుల వరకు నా లైఫ్‌లో ప్రతీదీ ఒక మంచి కోసమే జరుగుతుందని నేను భావిస్తున్నానంటూ రష్మిక ట్వీట్ చేసింది. నా జీవితంలో ప్రతిదీ సార్థకమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చింది. 
     

     

  • ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లోనే ఎంచక్కా నచ్చిన సినిమాలు తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రైమ్ స్టోరీస్, హారర్, థ్రిల్లర్‌ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. వీటితో పాటు మలయాళ మూవీస్‌ సైతం ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడ హిట్ అయినా సినిమాలు డబ్బింగ్‌ చేసి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. 

    తాజాగా మరో మలయాళ క్రైమ్‌ అండ్ మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. మలయాళంలో సూపర్ హిట్ ‍అయిన సంభవం అధ్యాయం ఒన్ను ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్‌స్టార్‌ వేదికగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. 

    కాగా.. ఈ సినిమాకు జీతూ సతీషన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మాల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. మార్చి  మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్ట‌రీ హార‌ర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్‌ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు.

     

  • టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో  కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్‌లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్‌ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. 

     

  • దేశముదురు చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన బ్యూటీ  హ‌న్సిక. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ నటించిన ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగానే 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ నాలుగేళ్లకే వీరి బంధం పటాపంచలైంది. ఈ ఏడాది మార్చి 11న ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

    ఆ తర్వాత హన్సిక తీరుపై మాజీ వదిన ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ విమర్శలు చేసింది. హన్సిక విడాకులను ఉద్దేశించి అంతా ఫేక్ ప్రపంచం అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్‌ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్‌ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక  వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    తాజాగా హన్సిక మాజీ వదినపై పరువునష్టం దావా వేసింది. తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తోందని ముస్కాన్‌పై రూ.2 కోట్లకు పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ముస్కాన్‌.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి పబ్లిక్ స్టేట్‌మెంట్స్ చేయకూడదని ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు సూచించింది. ఇటీవలే విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా మరోసారి వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ టాపిక్ కాస్తా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

    సినిమా కెరీర్.. 

    హన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్‌, దేనికైనా రెడీ, పవర్‌.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్‌ చేసింది.

     

  • చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ మూవీ ‘విశ్వంభర’. విడుదల తేదీ గురించి నెట్టంట ఒక వార్త వైరల్‌ అవుతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో  చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్ (VFX)పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో ఆలస్యమైంది.

    తాజా అంచనాల ప్రకారం విశ్వంభర చిత్రం  2026 జూలై 10న థియేటర్లలోకి రావచ్చన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు తేదీలు ప్రచారంలో ఉండగా.. ఈ తేదీపైనే అందరి చూపు ఉంది. అయితే, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయినందున, విడుదల తేదీ ప్రకటనను వీడియో కంటెంట్‌తో చేస్తే మరింత బజ్‌ క్రియేట్‌ అవుతుందని ఆశిస్తున్నారు.  ఆ విధంగా, కొత్త తేదీ ప్రేక్షకుల మనసుల్లో బలంగా నాటుకుపోతుందని చెప్పుకొస్తున్నారు.

    ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న చిరంజీవి మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీతో మరో సినిమాను పట్టాలెక్కించారు. త్వరలో షూటింగ్‌లో కూడా చిరు పాల్గొననున్నారు.

  • కోలీవుడ్ స్టార్ కపుల్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు పండితులు ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన నయన్ దంపతులు తిరుమల స్వామివారికి మొక్కులు చెల్లించకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దర్శనం అనంతరం అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. 

    నయన్ భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ ఎల్‌ఐకే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 10న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ తిరుమలలో పూజలు చేశారు. ఈ  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించగా. నయనతార, విఘ్నేష్ శివన్‌, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు.

     

  • ది మమ్మీ చిత్రం గురించి పేర్కొంటూ ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథా చిత్రం అన్నారు. ఒక జర్నలిస్ట్‌ కూతురి ఎడారిలో అదృశ్యం అయ్యి.. 8 ఏళ్ల తరువాత దొరుకుతుందన్నారు. అయితే ఆ తరువాత ఆ పాప శరీతంలో, ప్రవర్తనతో చాలా మార్పు కలుగుతుండటంతో ఆ కుటంబం భయభ్రాంతులకు గురౌతుందన్నారు. దానికి కారణాలు ఏమిటి? వంటి పలు ఆసక్తికరమైన ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో చిత్రం సాగుతుందన్నారు. 

    ఈ చిత్రంలో మాన్‌స్టర్‌ రూపకల్పనను దర్శకుడు లీ క్రొనిన్ చాలా కొత్తగా మలిచారు. సాధారణ హారర్‌ చిత్రాల మాదిరిగా కాకుండా కొంచెం కొంచెం భయపెట్టే విధంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా మాన్‌స్టర్‌ను పగటివేళల్లో చూపుతూ కొత్త అనుభూతికి గురి చేస్తారన్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.

  • శ్రీలీల.. తక్కువకాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ హీరోల సరసన సినిమాలు చేసింది. సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ తన డ్యాన్స్‌ స్టెప్పులతో మరింత ట్రెండ్‌ అయింది. అయితే తాను నటించిన చాలా పాటలు పీరియడ్స్‌లో ఉండగానే చిత్రీకరణ జరిగాయంటోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో శ్రీలీల మాట్లాడుతూ.. 'నేను చాలా పాటలకు డ్యాన్స్‌ చేశాను. అందులో హిట్‌ సాంగ్స్‌ అన్నీ దాదాపు నెలసరి సమయంలో చేసినవే! సమానత్వం కోరుకున్నప్పుడు మనం పీరియడ్స్‌ను సాకుగా చూపించకూడదని నా అభిప్రాయం. 

    సాకుగా చూపించొద్దు
    మనం శారీరకంగా, మానసికంగా అన్నింటిని అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపించి వెనక్కు తగ్గడం కరెక్ట్‌ కాదు. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆమె కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరిలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, దాన్ని ఎవరూ కావాలని సాకుగా చూపించరని కామెంట్లు చేస్తున్నారు.

    తప్పేముంది?
    డాక్టర్‌ చదివిన శ్రీలీలకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు ఎంతమంది లేరు, ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పిందే తప్ప.. తప్పుగా ఏం మాట్లాడిందని మరికొందరు శ్రీలీలను సమర్థిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల చివరగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటించింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

    చదవండి: నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు: నటుడు

  • రణవీర్‌ సింగ్‌- ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌ మూవీ 'ధురంధర్‌-2'.. ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అనుకున్న తేదీకంటే మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు రావచ్చని సమాచారం. హౌస్‌ఫుల్‌ థియేటర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ. 1700 కోట్లకుపైగానే కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం  స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మారిందని తెలిసింది. ఈ చిత్రం హక్కులు జియోహాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు టాక్‌ ఉంది.

    సాధారణంగా బాలీవుడ్‌ చిత్రాలు 8వారాల థియేటర్‌ రన్‌ తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తారు. ఈ క్రమంలో ధురంధర్‌-2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లెక్కన మే 20లోపు ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈసారి లెక్కలు మారిపోయాయని టాక్‌. ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రం  ఓటీటీ విడుదల తేదీని  జూన్ మొదటి వారానికి వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుపుతున్నారు. 

    మే నెల మధ్యలో టోర్నమెంట్ ఉత్కంఠభరితమైన తుది దశకు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో  క్రికెట్ సందడి పతాక స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ షెడ్యూల్‌ ధురంధర్‌-2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తే వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఐపీఎల్ ముగియగానే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని  జియోహాట్‌స్టార్ వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తోంది.  త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు.

  • చిరయ్యా.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్‌ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్‌ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్‌ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్‌లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. 

    బండబూతులు
    ముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్‌గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్‌ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్‌, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. 

    బెడ్‌రూమ్‌ సీన్స్‌
    నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్‌ (బెడ్‌రూమ్‌) సన్నివేశాలు షూట్‌ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్‌రూమ్‌ సీన్స్‌ షూట్‌ చేశారు. ఫస్ట్‌ సీన్‌ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్‌ షూట్‌ చేసేటప్పుడు టెన్షన్‌తో బిగుసుకుపోయాను. 

    తీవ్ర సంఘర్షణ
    నా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్‌ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్‌. హనీమూన్‌ సీన్‌ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: అత్తామామకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనిక రెడ్డి

International

  • నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్‌ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.

    మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్‌లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. 

    భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు.

  • అమెరికాతో ఇరాన్‌ చర్చలకు అంగీకరించిన నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిపై ఇప్పటివరకూ కొనసాగిన హీట్‌ కాస్త చల్లారింది. హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి తాత్కాలికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఇరాన్‌.. తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్‌ జలసంధిని దాటే నౌకలు తమను తప్పకుండా సంప్రదించాలని స్పష్టం చేసింది. హర్మూజ్‌లో వాటర్‌ మైన్స్‌ ముప్పు పొంచి ఉందని, ఎలా పడితే అలా నౌకలు ఆ జలసంధిని దాటే ప్రయత్నం చేయద్దొన హెచ్చరించింది.  నౌకల రాకపోకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)తో సమన్వయం చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలని తెలిపింది. 

    రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి..
    రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హోర్ముజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ రోజుకు 15 నౌకల  మాత్రమే అనుమతిస్తుంది. ఈ జలమార్గాన్ని దాటడానికి ఆ నౌకలకు ఇరాన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి కూడా అవసరం. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, పది కంటే తక్కువ నౌకలు మాత్రమే హోర్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతిస్తున్నాయి.

    సీజ్‌ఫైర్‌  ఒప్పందం ప్రకారం.. ‘ హోర్ముజ్ జలసంధి గుండా రోజుకు 15కు మించి నౌకలు మించి ప్రయాణించడానికి లేదు. ఈ రాకపోకలు ఇరాన్ ఆమోదం, ఒక నిర్దిష్ట నియమావళి అమలుపై మాత్రమే ఆధారపడి ఉంటాయి’ అని ఒక సీనియర్ ఇరాన్ అధికారి చెప్పినట్లు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.

    యుద్ధానికి ముందున్న యథాస్థితికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, కొత్త హోర్ముజ్ నియంత్రణ చట్రాన్ని సంబంధించి ప్రాంతీయ పక్షాలకు తెలియజేయడం జరిగిందని ఇరాన్ వర్గాల సమాచారం.

  • మనం రోజూ ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో వనరులను వాడుతున్నాం. స్విచ్ వేస్తే వెలిగే కరెంట్, కుళాయి తిప్పితే వచ్చే నీరు, మనం కొనే బట్టలు, వాడే ప్లాస్టిక్.. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మనం వాడుతున్న ఈ వనరులు భూమి మీద శాశ్వతంగా ఉంటాయా? రీసెంట్ గా జరిగిన ఒక భయంకరమైన స్టడీ మనల్ని హెచ్చరిస్తోంది. మనం గడుపుతున్న ఈ విలాసవంతమైన జీవనశైలి ఇలాగే కొనసాగితే, మన అవసరాలు తీరడానికి ఒక భూమి సరిపోదు.. మనకి ఇంకో భూమి కావాలి! అవును, మీరు విన్నది నిజం. "వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్". అసలు ఈ స్టడీ ఏం చెబుతోంది? మన భవిష్యత్తు ఏంటి? 

    శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, భూమి తన వనరులను తిరిగి ఉత్పత్తి చేసే వేగం కంటే, మనం వాటిని వాడే వేగం చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీనినే 'ఎకలాజికల్ ఫుట్ ప్రింట్' అంటారు. మనం ఏటా భూమి మనకి ఇచ్చే కోటాను ఆగస్టు నెల నాటికే వాడేస్తున్నాం. మిగిలిన నాలుగు నెలలు మనం భవిష్యత్తు తరాలకు చెందాల్సిన వనరులను అప్పుగా వాడుకుంటున్నాం. మనం వాడే నీరు, మనం పారవేసే వ్యర్థాలు, గాలిలోకి వదులుతున్న కార్బన్.. ఇవన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. 

    నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంట్లో ఏసీ, బయట కారు.. ఉంటున్నాయి. ఇవి మనకి సౌకర్యాలే కానీ, భూమికి మాత్రం భారాలు. ఒక్క ఐఫోన్ తయారీకి ఎన్ని వనరులు కావాలో తెలుసా? మనం వాడే ఫాస్ట్ ఫ్యాషన్ బట్టల వల్ల ఎన్ని కోట్ల లీటర్ల నీరు వృధా అవుతుందో ఊహించగలరా? ఈ రిపోర్ట్ ఏం చెబుతుందంటే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా అమెరికా లేదా యూరోపియన్ దేశాల స్థాయి జీవనశైలిని పాటిస్తే, మనకు కనీసం రెండున్నర గ్రహాలు అవసరమవుతాయి. కానీ మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క గ్రహం.. మన భూమి! వనరుల తరుగుదల అంటే కేవలం నీరు, ఆహారం అయిపోవడం మాత్రమే కాదు. 

    దీని వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. దీనివల్ల సముద్ర మట్టాలు పెరిగి భవిష్యత్తులో ముంబై, న్యూయార్క్ లాంటి తీర ప్రాంత నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అకాల వర్షాలు, భయంకరమైన కరువులు ఇవన్నీ ప్రకృతి మనకు ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. మనం భూమిని రక్షించకపోతే, భూమి మనల్ని శిక్షించడం మొదలుపెడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఆదిమానవుల్లా అడవుల్లోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు.

     
    కానీ మన అలవాట్లను మార్చుకోవాలి. వాటిలో ప్రధానంగా  అవసరమైన దానికంటే ఎక్కువ వనరులను వాడటం ఆపేయాలి. 'నీరు' , 'విద్యుత్తు' విషయంలో పొదుపుగా ఉండాలి. అలాగే వాడి పారేసే సంస్కృతి నుండి వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడే అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అంతేకాదు విదేశీ వస్తువుల కంటే స్థానికంగా దొరికే ఆహారం, వస్తువులను ప్రోత్సహించడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటన్నిటికన్నా ప్రధానంగా కనీసం మన వంతుగా మొక్కలు నాటడం, ప్రకృతిని గౌరవించడం నేర్చుకోవాలి.

    .మనకి నివసించడానికి 'ప్లాన్ బి' లేదు. ఎందుకంటే మనకి ఇంకో గ్రహం లేదు. మార్స్ మీద ఇల్లు కట్టుకోవచ్చని మనం కలలు కనవచ్చు కానీ, కోట్లాది మంది సామాన్యులకు ఈ భూమే ఆధారం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు మాత్రమే కాదు.. వారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి స్వచ్ఛమైన నీరు. ఆ బాధ్యత మనందరిదీ.ఈ రోజే మీ జీవనశైలిలో ఒక చిన్న మార్పు చేయండి. భూమిని రక్షించండి.. అది మనల్ని రక్షిస్తుంది.

  • డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్షునిగా కాసేపు యుద్ధం అంటారు.. మరి కాసేపు శాంతి గెలిచింది అంటారు.  అమెరికా పరిపాలన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ప్రతీ అంశంలోనూ  ఏదొక వివాదం లేకుండా ఆయనకు పూట ముందుకెళ్లడం లేదు.   అమెరికాతో యుద్ధంలో భాగంగా చర్చలకు ఇరాన్‌ సిద్ధమవ్వగానే ప్రపంచ శాంతి గెలిచిందంటూ ఒక గంభీరమైన ప్రకటన ఇచ్చేశారు. ఇరాన్‌ చర్చలకు ఒప్పుకున్న  మాట అత్యంత సంకట స్థితిలో ఉన్న  ట్రంప్‌కు ఊపిరినిచ్చినట్లయ్యింది. అంతకుముందు వరకూ ఇరాన్‌ను అది చేస్తాం. ఇది చేస్తాం అన్న ట్రంప్‌ నోట శాంతి మాట వినిపించింది.

    అయితే అది కేవలం శాంతి చర్చలకు మాత్రమే ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది..  అంటే ఇక్కడ యుద్ధానికి బ్రేక్‌ మాత్రమే వచ్చింది..  పూర్తిగా యుద్ధాన్ని ముగించేందుకు కాదనే విషయం ఇరానే తెలపడం ద్వారా చర్చలు తర్వాతే అసలు విషయం ఏమిటన్నది తెలుస్తుందని చెప్పేసింది. 

    చర్చల్లో లెబనానే హాట్‌ టాపిక్‌..?
    ఇజ్రాయెల్‌ బుధవారం 100 మిస్సైళ్లను ప్రయోగించడంతో లెబనాన్‌లో 250 వరకూ మరణించారు. ఇది ఇరాన్‌ అత్యంత అసహనం తెప్పించింది. ఒకవైపు పాకిస్తాన్‌ వేదికగా  ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైన తరుణంలో ఇజ్రాయెల్‌ మాత్రం ఇంకా లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉండటం ఏంటని ప్రశ్నించింది. 

    అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో  ఆ దేశానికి సాయం చేసిన వారిలో హెజ్‌బుల్లా దళం ఒకటి. మరి వారిపై దాడులు చేస్తే ఇరాన్‌ ఊరుకుంటుందా?, తమతో చర్చలు అంటూ తమకు మద్దతిచ్చిన వారిపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తే  ఉండదు.

    సీజ్‌ఫైర్‌ అనేది కేవలం అమెరికా- ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య మాత్రమేనని అది లెబనాన్‌ విషయంలో కాదని అంటున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇజ్రాయెల్‌ ప్రధాని కూడా ఇదే మాట అంటున్నారు. 

    ఒకవేళ లెబనాన్‌ను సీజ్‌ఫైర్‌ అంశంలో చేర్చకపోతే ఇరాన్‌ ఒప్పుకుంటుందా? అనేదే ఇప్పుడు  ట్రంప్‌ ముందున్న ప్రశ్న. అలా జరగని పక్షంలో ట్రంప్‌ ముందున్నది ఏమిటి అనే చర్చ మొదలైంది.  ఇరాన్‌ పెట్టే ఈ షరతకు ఒప్పుకోవాలంటే.. అందుకు ముందుగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూను ట్రంప్‌ ఒప్పించాలి. మరి నెతన్యాహూ ఇందుకు ఒప్పుకుంటారా? అనేది మరో ప్రశ్న. 

    నెతన్యాహూపై ఒత్తిడి తేగలరా?
    లెబనాన్‌పై యుద్ధాన్ని ఆపమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూపై ట్రంప్‌ ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. లెబనాన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్‌.. ఆ దాడిని ఆపాలని చర్చలకు ముందే చెప్పింది. వాటిపై అమెరికా-ఇజ్రాయెల్‌ పెద్దలు నో అంటున్నారు.  శాంతి చర్చల్లో కూడా అదే మాట అంటే మాత్రం.. అదే సమయంలో ‘‘లెబనాన్‌పై దాడులు ఆపకపోతే చర్చలు లేవు.. ఏమీ లేవు’’  అని ఇరాన్‌ అంటే మాత్రం ట్రంప్‌ నోట్లో వెలక్కాయపడినట్లే. ఆ సమయంలో ట్రంప్‌ ముందున్నది మళ్లీ యుద్ధానికి దిగడమే. అంటే  ఇక్కడ పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలని కోరుకుంటే మాత్రం నెతాన్యాహూను ముందుగా ఒప్పించాలి ట్రంప్‌. 

    పాక్‌కు జేడీ వాన్స్‌..!
    ఇరాన్‌ చర్చలకు వచ్చినా తాము పెట్టే ఆంక్షలకు ఒప్పుకోదనే నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడే.. రేపు(శుక్రవారం) పాకిస్తాన్‌కు వస్తున్నారు. పాకిస్తాన్‌ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి  కాబట్టి.. కచ్చితంగా అమెరికా పెద్ద తలకాయలు ఉండాల్సిందేనని ఇరాన్‌ పట్టుబట్టిన నేపథ్యంలో జేడీ వాన్స్‌ను పాకిస్తాన్‌ పర్యటన దాదాపు ఖరారైంది.  తమతో చర్చల్లో భాగంగా అమెరికా పరిపాలన విభాగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థాయి తప్పితే మరే అధికారులు తమకు అవరసం లేదని ఇరాన్‌ పంతం పట్టుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో  ట్రంప్‌ నమ్మదగిన జేడీ వాన్స్‌ ను పాక్‌కు పంపించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది.

    మరి జేడీ వాన్స్‌.. ఇరాన్‌ను ఎంతవరకూ ఒప్పిస్తారనేది చూడాలి. లెబనాన్‌ను పక్కకు పెట్టి ఈ శాంతి చర్చలు సాగుతాయా?, ఇరాన్‌ పెట్టే పలు కండిషన్స్‌కు అమెరికా ఊ కొడుతుందా? అనేది చూడాలి. 

    కొసమెరుపు ఎలా ఉండబోతుంది..?
    ఇరాన్‌తో కచ్చితంగా అమెరికా సుదీర్ఘ చర్చలే జరపనుంది. ఇప్పటివరకూ  యుద్ధంలో అమెరికాకు ఇరాన్‌ అంతు చిక్కకపోవడం ఒకటైతే..  ఈ యుద్ధంలో అమెరికాలో ప్రజల నుంచి ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత  వచ్చింది. ఈ తరుణంలో ఇరాన్‌తో  చర్చల ద్వారానే వారిపై గెలవాలనే భావనలో ఉన్నారు ట్రంప్‌. 

    జేడీ వాన్స్‌ చర్చల తర్వాత ‘ ప్రపంచ శాంతి వెల్లివిరిసింది’ అంటూ ట్రంప్‌ మళ్లీ తనదైన శైలిలో ఓ ప్రకటన ఇవ్వనున్నారా?.. .. లేక ‘‘ఇరాన్‌కు చుక్కలు చూపించబోతున్నాం’’ అనే మాట ట్రంప్‌ నోట  మళ్లీ వినబడుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి.

  • టెహ్రాన్‌: అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అంటూ ఇరాన్‌ అణు సంస్థ అధిపతి మహ్మద్‌ ఎస్లామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ హక్కుల పరిరక్షణకు అత్యవసరమంటూ ఇరాన్‌ స్పష్టం చేసింది. టెహ్రాన్‌లోని దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా.. మొహమ్మద్ ఎస్లామీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    కాగా, అమెరికా- ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్‌ ఘాటు హెచ్చరికలు చేసింది. చర్చలు విఫలమైతే దీర్ఘ కాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్‌ తేల్చి చెప్పింది. దీర్ఘకాలిక యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ పేర్కొంది. హర్మూజ్‌ తెరవకపోతే మళ్లీ దాడులుచేస్తామంటూ ఇప్పటికే ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే..

    మరోవైపు.. కాల్పుల విరమణ నేపథ్యంలో.. నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్‌ పోటాపోటీగా ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించగా.. ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్‌ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పలు పోస్టులు చేశారు.

     

  • బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. హజ్బొల్లా చీఫ్‌ పర్సనల్‌ సెక్రటరీ అలీ యూసఫ్‌ హర్షీను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ గురువారం ప్రకటించింది. రాత్రి బీరుట్‌పై జరిపిన దాడ్లుల్లో అలీ యూసఫ్‌ చనిపోయారని.. హెజ్బొల్లా ఆయుధ రవాణా మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. సౌత్‌ లెబనాన్‌లో 10 ఆయుధ డిపోలు నాశనం నాశనమైనట్లు పేర్కొంది. హర్షీ.. ఖాసిమ్‌కు అత్యంత నమ్మకస్థుడైన సలహాదారు మాత్రమే కాకుండా.. అతని కార్యాలయ నిర్వహణ, భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేవారని తెలిపింది.

    అంతకుముందు, అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హజ్బొల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని హజ్బొల్లా పేర్కొంది. శత్రువు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిగా.. సరిహద్దు సమీపంలోని మనారా అనే ఇజ్రాయెల్ కిబ్బట్జ్‌పై గురువారం తెల్లవారుజామున రాకెట్లతో దాడి చేశాం" అని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.

    లెబనాన్‌పై కేవలం ఒక్క రోజులోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మంది మరణించగా.. 1,165 మందికి పైగా గాయపడ్డారు. దీంతో లెబనాన్ ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మేము అటువంటి వాగ్దానం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు.

  • ఖాట్మండు: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో మాజీ ప్రధాని అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నేత షేర్ బహదూర్ దేవుబాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన భార్య, మాజీ విదేశాంగ మంత్రి ఆర్జూ రాణా దేవుబాపై కూడా వారెంట్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

    కాగా, నేపాల్‌లో ఇటీవలే బాలేంద్ర షా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగా.., నేపాల్‌ నూతన ప్రధానిగా బాలెంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుటి రోజే కె.పి.శర్మ ఓలీ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జెన్‌ జెడ్‌ ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారంటూ కె.పి.శర్మ ఓలీపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, మనీ లాండరింగ్‌, అవినీతి కేసుల్లో మరో మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన మనీ లాండరింగ్‌ ఆరోపణలను ఖండిస్తున్నానని.. నా కుటుంబ ఆస్తులకు సంబంధించి అసత్య ప్రచారం జరుగుతోందని బహదూర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

    ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలేంద్ర షా నేపాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన సంగతి తెలిసిందే బాలెన్‌గా పాపులర్‌ అయిన బాలేంద్రషా గత ఏడాది జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది.


     

Telangana

  • సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంచలనాత్మకంగా వెలుగులోకి వచ్చిన జీతాల కుంభకోణం కలకలం రేపుతోంది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.1 కోటి 40 లక్షల రూపాయల మేర నిధులు కాజేయబడినట్లు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది.  

    ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో ఆర్థిక వ్యవహారాలపై పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

Andhra Pradesh

  • భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన సేత రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడింది.  జనసేన నేత జయప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో బాధితురాలిగా అండగా నిలవాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ నాయకులకు కొమ్ముకాస్తున్న వైనం కొట్టొచ్చినట్లు కనబడింది. 

    రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు.  భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ, ఎస్సైలు ఉన్నా జయప్రకాశ్‌పై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితురాలని నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. 

    ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జనసేన నేతపై కేసు నమోదు చేయకుండా ఉండటమే కాకుండా, చివరకు బాధితురాలని నాలుగు గంటలపైగా స్టేషన్‌లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధితులకి న్యాయం జరగకపోవడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. 

     

  • విశాఖ : మరో ఐదుగురు మావోయిస్టులు లొంగుపోయారు. ఇప్పటికే మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రాగా, తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్‌ఘడ్‌ క్యాడర్‌కు చెందిన ఐదుగురు మావోయిస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 

    గతేడాది కర్రెగుట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న ఈ  మావోయిస్టులు.. తాజాగా అడవుల్ని  వదిలి బయటకొచ్చేశారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ వెల్లడించారు. వీరిపై రూ. లక్ష నుంచి రూ. 8 లక్షల వరకూ రివార్డు ఉన్నట్లు  ఎస్పీ తెలిపారు. 

  • విశాఖ. దివంగత నేత వైఎస్సార్‌ పాలన అంతా కూడా ఒక స్వర్ణయుగమన్నారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్ర దశాదిశను మార్చిన నాయకుడు వైఎస్సార్‌ అని గుర్తుచేసుకున్నారు.  తండ్రి అడుగుజాడల్లో వైఎస్‌ జగన్‌ నడుస్తు‍న్నారని, వైఎస్సార్‌కు నిజమైన వారసుడు జగనేనన్నారు. ఆయన వారసుడిగా ప్రజలకు జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు వరుదు కళ్యాణి. 

    మావిగన్‌కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని, ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్‌పై షర్మిల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  వారసత్వం అనేది నీకు నువ్వు అనుకుంటే రాదని, ప్రజలివ్వాలని షర్మిలకు చురకలంటించారు. మావిగన్‌కు వస్తున్న విశేష స్పందన ఓర్వలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా షర్మిల ఈ విమర్శలు చేస్తున్నారన్నారు. 

    చంద్రబాబు స్క్రిప్ట్‌ మేరకే వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అవసరం వచ్చిన ప్రతీసారి షర్మిల బయటకొచ్చి మాట్లాడతారని విమర్శించారు. 

  • సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూలగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు.

    ‘‘ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

     

  • సాక్షి, విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్సార్‌ గురించి మాట్లాడుతూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ బొత్స మండిపడ్డారు. వైఎస్సార్‌ మరణంపై అచ్చెన్న దిగజారి మాట్లాడారు. ​​కావాలనే వైఎస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘వైఎస్‌ జగన్ మాట్లాడిన మావిగన్.. కూటమి నేతలకు నిద్రలో కూడా గుర్తుకు వస్తుంది. మావిగాన్ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. రాజకీయ అవసరాలు కోసం అచ్చెన్నాయుడు జగన్ పై మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు బొక్క లేదు అనే మాటలను మర్చిపోయావా?. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. వైఎస్సార్‌ మరణం వెనక జగన్ ఉన్నాడని నేను నీతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతావా?’’ బొత్స ధ్వజమెత్తారు.

    ‘‘మాకు వైఎస్సార్‌కు విడదీయరాని సంబంధం ఉంది. రాజకీయాలు కోసం పదవుల కోసం నీచమైన రాజకీయాలు చేయకు.. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చేయి. అచ్చెన్నాయుడు పదవులు కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు వైఎస్సార్‌ గురించి మాట్లాడావు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. వైఎస్సార్‌ చనిపోయినప్పుడు వైఎస్‌ జగన్ అక్కడే ఉన్నారు. నేను నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాము. చనిపోయిన వైఎస్సార్‌ను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు.

    కంటతడి పెట్టిన బొత్స

    ..సభ్యత సంస్కారం లేని వ్యక్తి అచ్చెన్నాయుడు. మా చరిత్ర మీకు తెలుసు. మీ చరిత్ర మాకు తెలుసు. మావిగన్ అంటే అందుకు అంత ఉలిక్కి పడుతున్నారు.. మావిగన్ ఎందుకు నోరు మెదపడం లేదు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నాను. మావిగన్‌కు వస్తున్న స్పందన చూసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేను బాధపడను. వైఎస్ మరణం తరువాత జరిగిన సంతకాలకు జగన్‌కు సంబంధం లేదు. ఈ విషయం రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు తెలుసు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

     

Business

  • ఇతర వాహన తయారీ సంస్థల మాదిరిగానే.. హ్యుందాయ్ కంపెనీ కూడా తన మొత్తం మోడల్ లైనప్‌లో ధరల అప్డేట్ ప్రకటించింది. 2026 మే 1 నుంచి కొత్త ధరలు (1 శాతం పెరుగుదలతో) అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ధృవీకరించింది.

    హ్యుందాయ్ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చుల కారణంగా ధరలను పెంచడం జరిగిందని తెలుస్తోంది. అయితే వినియోగదారులను అధిక ప్రభావం పడకుండా.. ఖర్చులలోని హెచ్చుతగ్గులను తామే భరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ఆ భారాన్ని కొంతమేరకు స్వల్ప ధర పెంపు ద్వారా వినియోగదారులపై మోపవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.

    ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయం కంపెనీ వెల్లడించలేదు. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. కాగా హ్యుందాయ్ కంపెనీ వాహనాల ధరలను పెంచడం 2026లో రెండవసారి. గత జనవరిలో.. తన అన్ని మోడళ్లపై 0.6 శాతం వరకు ధరలను పెంచింది. ఇటీవలే.. మార్చిలో ప్రారంభ ధర ముగిసిన తర్వాత, కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ధరను రూ. 20,000 మేర సవరించింది.

  • కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    గురుగ్రామ్‌కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.

    నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్‌లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్‌ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.

    ''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్‌లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.

    నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.

    రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.

    మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.

    ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.

    చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.

    కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?
    ➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. 
    ➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. 
    ➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.
    ➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.
    ➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.

    మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.

    ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!

  • రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్‌అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.

    రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.

    ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్‌కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.

    జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రెండ్స్‌లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.

    ఈ రిపోర్ట్‌లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి.

  • కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.

    ఒక్క మెసేజ్‌తో మొదలైన చర్చ
    'స్పైసీ మార్గరిటా' అనే ఎస్‌ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు.

    "నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.

    బర్న్ అవుట్ నేర్పిన పాఠం
    తానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.

    బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలు
    వారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.
    వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.
    నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.
    అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్‌ను దాటవేసే స్వేచ్ఛ.

    సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
    బెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.

    బెన్ గూడీ నేపథ్యం
    లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్‌గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు.

  • ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్‌ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.

    ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్‌కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.

    మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.

    హిలరీ మ్యాక్సన్‌ ఒరాకిల్‌లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్‌లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.

    కంపెనీ భారీ లేఆఫ్స్
    ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్‌లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.

    ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!

  • సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్‌తో కూడిన స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్‌ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..

    2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..

    సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.

    సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.

    పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.

    నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.

    కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.

    మంత్లీ ఇన్‌కమ్‌మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.

    టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లు
    బ్యాంకు ఎఫ్‌డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

    కాలపరిమితివడ్డీ రేటు (%)
    ఏడాది టైమ్ డిపాజిట్6.9
    రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0
    మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1
    ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.5
    5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7

    సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి.

  • మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.

    ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్‌టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ భారత మార్కెట్లో ఎట్టకేలకు టైగన్ ఫేస్‌లిఫ్ట్‌ ఆవిష్కరించింది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటేస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీలోని కొత్త హెడ్‌లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్‌డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది. అల్లాయ్ వీల్స్‌కు కూడా ఒక కొత్త డిజైన్ ఉంది.

    కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్‌లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్‌ను కూడా అందిస్తుంది.

    వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ 'హలో వోక్స్‌వ్యాగన్' వాయిస్ అసిస్ట్‌ను కూడా పొందుతుంది, ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్ మరియు మరిన్ని ప్రాథమిక ఫంక్షన్‌లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ ఎస్‌యూవీ ధరలు తెలియాల్సి ఉంది.

    ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!

    పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్‌వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్‌ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్‌లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల మధ్య ఎంపికలను అందిస్తుంది.

  • భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

    వేరియంట్లు, ధరల వివరాలు
    ఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్‌లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.

    కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!
    డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.

    EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్‌షేడ్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.

    S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్‌ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.

    SX ప్రీమియం: టాప్ వేరియంట్‌లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

    ఇంజిన్, పెర్ఫార్మెన్స్
    హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్‌మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు.

National

  • బిహార్‌లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని  రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్‌ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.

    పోలీసుల కథనం ప్రకారం,  అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్‌ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్‌గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్‌గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్‌గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్‌పై దాడి చేసి, అతని తల నరికి,  అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు. 

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

    ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు,  స్థానికులు కూడా ఇంటి దగ్గర  దాక్కున్న  నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు.  ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు  మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
    ఇదీ చదవండి: కాంగ్రెస్‌ విత్‌ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!

  • దేశాన్ని కాపాడేది కనబడే సైనికులు, సైనిక వ్యవస్థ. అలాగే కనిపించని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేసి తమ ఉనికి కూడా చరిత్రలో లేకుండా పోరాడిన యోధులు ఎంతో మంది ఉన్నారు.  హెడ్‌లైన్స్‌లో కనిపించని లెజెండ్ RAW పుట్టుక వెనుక, సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన భారత స్పైమాస్టర్ కథ ఇది. 

    ఇవాళ సినిమాల్లో దూరందర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బ తీసి, దేశాన్ని కాపాడుతున్నట్టు... ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఎవరో తెలుసా? ఆయనే రమేశ్వర్ నాథ్ కౌ (R.N. Kao).

    భారతదేశ గూఢచారి వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు… యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కూడా కాదు…కానీ ఆయన తెలివి, ఆయన ప్లాన్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి.

    రీసెర్చ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (R&AW) అనే భారత విదేశీ గూఢచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి ఆయనే. అసలు ‘రా’ ఎలా పుట్టిందో ఓసారి చూద్దాం. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్థాన్ యుద్ధం ఈ రెండు సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి: బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే. అప్పుడు అప్పటి ప్రభుత్వం, 

    అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి. ఆ బాధ్యత ఒక్కరికి అప్పగించారు… అతనే ఆర్‌ ఎన్‌ కౌ 1968లో ఆయన స్థాపించిన సంస్థేనే ‘రా’ ఇది కేవలం ఒక సంస్థ కాదు… భారతదేశం ప్రపంచ వేదికపై కనిపించని బలంగా మారిన క్షణం.

     

    1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో R&AW పాత్ర చరిత్రలో ప్రత్యేకం.  ఆర్‌. ఎన్‌. కౌ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్థాన్‌లో రహస్య గూఢచారి నెట్‌వర్క్ నిర్మించారు. ముక్తి బాహిని యోధులకు శిక్షణ ఇచ్చి పాకిస్థాన్ సైన్యం కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించారు. ఫలితంగా  ప్రపంచ చరిత్రలో అతి వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 93,000 వేలమంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటు.దాంతోపాటు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది. యుద్ధంలో సైన్యం కనిపించింది… కానీ విజయానికి పునాది వేసింది మాత్రం  కౌ ఇంటెలిజెన్స్. 

    ఈయన  స్పైమాస్టర్ స్టైల్ ఏంటంటే శబ్దం లేకుండా ప్రభావం చూపించడం ఆర్‌ ఎన్‌ కౌ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన ఫోటోలు చాలా అరుదు, ఇక ఇంటర్వ్యూలు దాదాపుగా లేవు, అలా అని ఆయన పబ్లిక్ స్పీచ్‌లు కూడా చేయలేదు. ఆయన నమ్మకం ఒక్కటే “Real intelligence works in silence.” ఆయన ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో లేరు కాని ఆ హెడ్ లైన్స్ రావడానికి కారణం ఆయనే. 

    అయితే  ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉండేది.  సీఐఏ, ఎమ్‌ 16 వంటి ప్రపంచ గూఢచారి సంస్థలు కూడా కౌ వ్యూహాలను గౌరవించేవి. అణు కార్యక్రమ రహస్యాలను రక్షించడం, విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అంచనా వేయడం, శత్రు దేశాల వ్యూహాలను పసిగట్టడం...ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి.

    దేశం కోసం పని చేసిన రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు. సైనికులు యుద్ధ గాథల్లో ఉంటారు. కానీ… దేశాన్ని కనిపించకుండా కాపాడిన గూఢచారులు మాత్రం కనిపించకుండా కదిలే కాలంలో కలిసిపోతారు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం  ఆర్‌ ఎన్‌ కౌది.

    ఆయన ఎప్పుడూ పేరు కోసం పని చేయలేదు. పతకాలు కోసం జీవించలేదు. దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. ఆ లక్ష్యాన్ని మరింత బలంగా చేసి, ముందుకు తీసుకెళ్తున్న మరో గొప్ప మనిషి  ప్రస్తుత భారత ఇంటెలిజెన్స్ అధినేత అజిత్ దోవల్ గారు. దాదాపు 
    దోవల్ గారు కూడా కౌ సాబ్ బాటలోనే నడిచారు... కానీ తన స్టైల్‌లో మార్చేశారు.  ఐపీఎస్‌ అధికారిగా 1968లో జాయిన్ అయిన ఆయన, తర్వాత ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చాలా ఏళ్లు పని చేసి, రహస్య ఆపరేషన్లలో లెజెండ్ అయ్యారు. 

    గోల్డెన్ టెంపుల్‌లోకి ISI ఏజెంట్‌గా దూసుకెళ్లి, మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి, ముఖ్యమైన సమాచారం సేకరించారు.  ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్స్‌ (Operation Black Thunder)కు పునాది వేశారు. పాకిస్థాన్‌లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి (కొన్ని కథనాల ప్రకారం 7+ ఏళ్లు), శత్రు భూమిలో భారత్ కోసం పని చేశారు. మిజోరం, పంజాబ్, కాశ్మీర్‌లో తిరుగుబాట్లను అడ్డుకున్న ఆపరేషన్లు... అన్నీ ఆయన ప్లాన్ల వల్లే సాధ్యమయ్యాయి. ఇవాళ NSAగా దోవల్ గారు కౌ సాబ్ వారసత్వాన్ని “రక్షణ + దాడి” స్ట్రాటజీగా మలిచారు. 

    సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ (2019), డోక్లాం స్టాండ్-ఆఫ్, కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు — ఇవన్నీ ఆయన తంత్రాల వల్లే జరిగాయి. సినిమాల్లో చూసే “దూరందర్” లాంటి థ్రిల్... దోవల్ గారి జీవితంలో నిజంగా జరిగింది, కానీ ఆయన ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు.

    అటు కౌ సాబ్ కి ఇటు దోవల్‌కి కావలసింది ఒక్కటే — దేశం సురక్షితంగా ఉండాలి. అయితే కౌ సాబ్ రహస్యంగా పునాది వేశారు. దోవల్ ఆ పునాదిని భారత బలంగా మార్చేశారు. ఇలాంటి తెలియని హీరోలు ఉన్నంత కాలం... భారతదేశం ఎప్పుడూ అజేయమే!

  • ఎండ వేడికి తట్టుకోలేక  ఐస్‌క్రీం తినాలనింపించడం, ఆన్‌లైన్‌లోఆర్డర్‌ పెట్టుకోవడం ఈ సమ్మర్‌ సీజన్‌లో చాలా కామన్‌. అయితే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. జమ్మూకి చెందిన ఒక వ్యక్తి  బ్లింకిట్ నుండి ఐస్ క్రీమ్‌లను ఆర్డర్ చేశాడు. రాత్రి భోజనం తరువాత తిందామని తీరిగ్గా ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఏమైంది అంటే..

    తేజిందర్ సింగ్ సోధి  అనే యూజర్‌ తన కెదురైన అనుభవాన్ని  ఎక్స్‌లో షేర్‌ చేశాడు. దీనికి సంబంధించిన  వీడియోను కూడా షేర్‌ చేశాడు. దీని ప్రకారం  ఇటీవల జమ్మూలోని బ్లింకిట్ నుంచి  కోన్‌ ఐస్ క్రీమ్ ఆర్డర్‌ పెట్టాడు. డెలీవరీ  తీసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. రాత్రి భోజనం తర్వాత హాయిగా ఐస్‌ క్రీం ను ఆస్వాదిద్దామని  ప్యాకెట్‌ ఓపెన్‌ చేశాడు. తీరా చూస్తే  లోపల సగం తిన్న ఐస్ క్రీమ్ కనిపించడంతో షాక్‌అయ్యానని  తెలిపాడు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ఇది పొరపాటుగా జరిగిన సంఘటన కాదని కూడా పేర్కొన్నాడు. అయితే దీనికి స్పందించిన బ్లింకిట్ రీఫండ్ ఆఫర్ చేసినప్పటికీ,తేజిందర్ దానిని తిరస్కరిస్తూ, పారేయడానికి కాదు. జవాబుదారీతనం ముఖ్యం, కదా అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశాడు.

    >  

     

    ఈ విషయాన్ని వినియోగదారుల కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు చెబుతూ,  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , జాగో గ్రాహక్ జాగో వంటి అధికారులను కూడా ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఈ సంఘటనను చూసిన తర్వాత తన కుమార్తె ఎంతగానో కలత చెందిందని, ఇకపై బ్లింకిట్‌ను ఎప్పటికీ నమ్మనని చెప్పిందని అతను పంచుకున్నాడు.

    ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో బ్లింకిట్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, ఈ సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించడానికి వీలుగా అతని ఆర్డర్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంచుకోమని కోరింది. 

    నెటిజన్ల స్పందన
    దీనిపై చాలామంది వినియోగదారులు స్పందించారు. ఇందులో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిం దేమీ లేదని కమెంట్స్‌  చేయడం విశేషం. “నాకు కూడా ఇలాగే జరిగింది. నేను అముల్ చాక్లెట్ ఆర్డర్ చేశాను, అది సగం తిన్నది, కానీ దానికి నాకు రీఫండ్ వచ్చింది.” ఒక యూజర్‌ పేర్కొన్నారు. అలాగే కోన్‌లు లేదా కుల్ఫీలను ఆర్డర్ చేయవద్దని మరొకరు ప్రజలను హెచ్చరించారు. ఆర్డర్‌లలో వస్తువులు మిస్ అవ్వడం సర్వసాధారణమని,పూర్తి మొత్తంపై జీఎస్టీ వసూలు చేయడం వల్ల రీఫండ్స్‌తో న్యాయంజరగదని మరికొందరు విమర్శించారు.  మరికొంతమంది డెలివరీ ఏజెంట్లపై విమర్శలు గుప్పించారు.

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

  • ఆరోగ్యంగా ఉండాలంటే  ఆహారంలో పళ్లను ఎక్కువగా  తీసుకోవాలి.  అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. అయితే డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినడానికి కాస్త భయపడుతుంటారు. మరి షుగర్‌ వ్యాధితో బాదపడుతున్న వారు బొప్పాయి పండ్లను తీసుకోవచ్చా? పచ్చి బొప్పాయి తినాలా? పండిన బొప్పాయి తినాలా?  బొప్పాయిలోని పోషక విలువలు, వాటిని తినేటప్పుడు  పాటించాల్సిన నియంత్రణ ఎలా పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

    బొప్పాయి, అది పచ్చిగా ఉన్నా లేదా పండినా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెరను నియంత్రించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, రోమ్ జె డయాబెటిస్ న్యూట్రిషన్ మెటాబ్ డిస్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, బొప్పాయిలోని లక్షణాలు రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గిస్తాయి.ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు , సపోనిన్ లాంటివి ఉన్నాయి. అయితే పక్వానికి వచ్చిన పండు తింటే దానిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని ప్రభావితం చేస్తుంది. మధుమేహంతో జీవిస్తున్న 101 మిలియన్ల (10 కోట్ల) మంది పెద్దలు, తమ రక్తంలో చక్కెర స్థాయిలకు ఏ రకం బొప్పాయి మంచిదో అనే విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. దీనిని కచ్చితంగా అర్థం చేసుకోవడానికి, వాటి ప్రత్యేక పోషక విలువలు, పీచుపదార్థం (ఫైబర్) శాతం, జీర్ణశక్తి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ వంటివి ముఖ్యమైనవి.

    ఇదీ చదవండి: 11 రోజుల్లో పెట్టుబడి రెట్టింపు : వైద్యుడికి దిమ్మదిరిగింది!

    పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరలు తక్కువగా , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరలు పండిన బొప్పాయి కంటే తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ప్రీ-డయాబెటిక్ లేదా టైప్-1 లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

    ఇదీ చదవండి: కాంగ్రెస్‌ విత్‌ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!

    మరోవైపు, పండిన బొప్పాయిలో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి దారితీస్తుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినే పరిమాణాన్ని నియంత్రించుకోవాలి.

    100 గ్రాముల పచ్చి బొప్పాయిలో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయి

    శక్తి: 32 కేలరీలు
    కార్బోహైడ్రేట్లు: 5.5 గ్రా
    మొత్తం చక్కెరలు: 1.2 గ్రా
    పీచుపదార్థం: 2.6 గ్రా
    ప్రోటీన్: 0.6 గ్రా
    కొవ్వు: 0.1 గ్రా
    విటమిన్ సి: 58 మి.గ్రా
    విటమిన్ ఎ: 225 మైక్రోగ్రాములు
    పొటాషియం: 190 మి.గ్రా
    కాల్షియం: 23 మి.గ్రా
    గ్లైసెమిక్ లోడ్: తక్కువ

    పండిన బొప్పాయి ద్వారా పోషక విలువలు మీ శరీరానికి విటమిన్లు ,ఖనిజాలు లభిస్తాయి

    శక్తి: 43 కేలరీలు
    కార్బోహైడ్రేట్లు: 10.8 గ్రా
    మొత్తం చక్కెరలు: 7.8 గ్రా
    పీచుపదార్థం: 1.7 గ్రా
    ప్రోటీన్: 0.5 గ్రా
    కొవ్వు: 0.1 గ్రా
    విటమిన్ సి: 61 గ్రా మి.గ్రా

    విటమిన్ ఎ: 270 మైక్రోగ్రాములు

    పొటాషియం: 182 మి.గ్రా
    కాల్షియం: 20 మి.గ్రా
    గ్లైసీమిక్ లోడ్: మధ్యస్థం
     

    బొప్పాయితో ఇతర ప్రయోజనాలు

    • బొప్పాయిలో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. 

    • ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  

    • అలాగే ఇందులో లభించే విటమిన్ సి, బీటా-కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖంపై ముడతలు తగ్గించి సహజమైన మెరుపును ఇస్తాయి. 

    • తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

    • పచ్చి బొప్పాయిలో లభించే అన్ని పోషకాలు  పేగు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. 

    • పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు.

    నోట్‌ : బొప్పాయితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ ఏదైనా మితంగా తీసుకోవడం మంచిది. మీరు ఇంతకు ముందు పచ్చి బొప్పాయిని ఎప్పుడూ తినకపోతే, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడటానికి దానిని సరిగ్గా ఎలా పరిచయం చేయాలో తెలుసుకోవడానికి మీరు పోషకాహార నిపుణుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం ఉత్తమం.

    ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్‌

  • ప్రతీకాత్మక చిత్రం

    సాక్షి, పుణే : దురాశ దుఃఖానికి  చేటు అన్నట్టు   ఒక 75 ఏళ్ల  పుణే  వైద్యుడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి  పెడితే తన డబ్బు 11 రోజుల్లో రెట్టింపు అవుతుందన్న  అత్యాశకు  పోయి ఒకటీ రెండూ కాదు,  ఏకంగా రూ. 12 కోట్లు పోగొట్టుకున్నాడు.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెడివతే భారీ లాభాలొస్తాయని సైబర్ నేరగాళ్లు నమ్మ బలికారు. తమ ద్వారా పెట్టుబడి పెడితే, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా రూ. 54 కోట్ల వరకు రాబడి వస్తుందని బాధిత వైద్యుడిని నమ్మించారు. ఆయన ఆసక్తి చూపిన తర్వాత, ఆ సైబర్ మోసగాళ్లు ఆయనను "VIP Stock 24" అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్ ద్వారా, నిందితులు ఎంతో ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించే పెట్టుబడి పథకాలను పంచుకున్నారు. దీంతో మోసపోయిన వైద్యుడు తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయన్న ఆశతో, బాధితుడు అనేక వారాల పాటు డబ్బును బదిలీ చేస్తూనే వచ్చారు. అలా 12.31 కోట్లకు  దోచేశారు కేటుగాళ్లు.

    అసలు ఏం జరిగింది?
    ఈ ఏడాది జనవరిలో బాధితుడికి ఒక తెలియని నంబర్ నుండి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయనే సందేశం వచ్చింది. దీనికి వైద్యుడు ఆసక్తి చూపడంతో, నిందితులు ఆయన్ని "VIP Stock 24" అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు.   అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఒక సంస్థ పేరుతో ఉన్న ఒక నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఆయన చేత డౌన్‌లోడ్ చేయించారు. ఆ యాప్‌లో ఆయన పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు తప్పుడు గణాంకాలను చూపించారు.  మరి కొంతమందికి లాభాలు వచ్చినట్టుగా  చూపించారు. దీంతో మార్చి 7 నుండి మార్చి 18 మధ్య కేవలం 8 లావాదేవీల ద్వారా డాక్టర్   12 కోట్లకు పైగా నిందితులు చెప్పిన  8 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. సుమారు మూడు నెలల పాటు  లాభాలొస్తాయని ఆశతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తూనే వచ్చారు. 

    ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్‌

    బెదిరింపులు 
    ఒకానొక దశలో డాక్టర్ మరిన్ని నిధులు పంపడానికి నిరాకరించగా, నిందితులు ఆయన ఆస్తులను సీజ్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఆయన మరిన్ని నిధులు బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో పాటు, ఇంకా డబ్బు కావాలని వారు వేధించడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు మొదలు పెట్టారు.

    ఇదీ చదవండి: కాంగ్రెస్‌ విత్‌ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!

     

    నోట్‌ :  స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న  వ్యవహారం.  ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే తగినంత అవగాహన నిపుణుల సలహాలు అవసరం. అతి తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని చెప్పే స్కీములను నమ్మి పోసపోవద్దు. తెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.సెబీ (SEBI) గుర్తింపు లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం అని గురించాలి.

  • కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగించడం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తాను మళ్లీ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని తెలిపారు. మమతా బెనర్జీ ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో వాదించారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. బుధవారం హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. బెంగాల్‌ను బీజేపీ, ఎన్నికల సంఘం టార్గెట్‌ చేశాయని, అందుకే ఓట్లు తొలగించారని మండిపడ్డారు. 

    సుప్రీంకోర్టులో వాదించిన తొలి ముఖ్యమంత్రిని తానేనని వెల్లడించారు. ఓట్లు తొలగించినంత మాత్రాన తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరని తేల్చిచెప్పారు. ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తొలగించిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చట్టపరంగా పోరాడుతామని ప్రకటించారు. ఎస్‌ఐఆర్‌ అంశం ట్రిబ్యునల్‌ ఎదుట పెండింగ్‌లో ఉండగానే మొదటి దశ ఓటర్ల జాబితాను ఎలా ఖరారు చేశారంటూ ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితి ఉంటే ఇక ట్రిబ్యునల్స్‌తో ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టాలని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయలేనని వ్యాఖ్యానించారు. 

    బీజేపీ గెలుపు కోసం ఈసీ ఆరాటం 
    ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదార్లు తొక్కుతోందని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీకి పొరపాటున ఓటు వేస్తే చేపలు, మాంసం తినడం, బెంగాలీ భాష మాట్లాడడం మానుకోవాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను గుడ్లు, చేపలు, మాంసం తిననివ్వడం లేదని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే అదే పరిస్థితి బెంగాల్‌లోనూ వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో బెంగాల్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బెంగాల్‌ను విడదీసి మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆక్షేపించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి గోదీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

    ఇదీ చదవండి: కాంగ్రెస్‌ విత్‌ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!

    భవానీపూర్‌లో మమత నామినేషన్‌ 
    సీఎం మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్‌ నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగానని మమతా బెనర్జీ అన్నారు. తన జీవితం ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందన్నారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.    

    ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్‌       

  • సాక్షి, ముంబై:  మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ఎన్‌పీసీనేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  దివంగత అజిత్ పవార్ భార్య  సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలుపొందనున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో, ఏప్రిల్ 23న జరగాల్సిన బారామతి ఉప ఎన్నికలో   సునేత్ర ఎంపిక ఏకగ్రీవం కానుంది.  

    గురువారం ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌కు ఫోన్ చేసి, తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో అజిత్ పవార్‌కు గౌరవ సూచకంగా కాంగ్రెస్ గురువారం మధ్యాహ్నం పోటీ నుంచి వైదొలగడంతో ఈ  పరిణామం చోటు చేసుకుంది.  ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆకాష్ మోర్‌ను పోటీలో నిలిపింది.

    ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్‌

    కాగా జనవరి 28న బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో అజిత్‌ పవార్‌  ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మరణించిరు. 1991 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటి నుండి ఈ ఏడాది ఆయన మరణించే వరకు ఈ స్థానాన్ని అజిత్ పవార్ దక్కించుకున్నారు. అంతకుముందు, 1967 నుండి  ఆయన మామ శరద్ పవార్ ఈ  నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా  భావిస్తారు.  అజిత్‌ మరణం తరువాత  తన దివంగత భర్త స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా  సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

  • బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్‌ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

    దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్‌ఫారమ్‌లను వాడకుండా, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్‌లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు.

    నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్‌లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్‌ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

  • విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్‌  సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోహన్‌ వారసుడు కార్తీక్‌ మోహన్‌కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న  ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్‌ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్‌ఆర్‌ విజయకుమార్‌ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్‌టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.

    సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్‌ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్‌ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం  రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో  ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్‌(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి.  ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్‌తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి  

    ఆధవ్‌ను ఆదరించేనా.. 
    విజయ్‌ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్‌ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్‌ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్‌కు మద్దతు గణం ఇక్కడ  ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్‌ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్‌ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో  తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్‌ దూసుకెళ్తున్నారు.  

    విజయకుమార్‌ ఎదురీత  
    అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్‌ఎస్‌ఆర్‌ విజయకుమార్‌ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో  ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్‌ నాన్‌ తమిళర్‌ కట్చి( ఎన్‌టీకే  ) అభ్యరి్థగా  సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్‌ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.

    హోరాహోరీ సమరం... 
    విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్‌ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్‌కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంకే మోహన్‌ కుమారుడు కార్తీక్‌ మోహన్‌ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్‌ గెలుపు కిరీటాన్ని కార్తీక్‌ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్‌ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్‌బాబుతో పాటూ చెన్నై మేయర్‌ ఆర్‌ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్‌ కోసం స్వయంగా సీఎం స్టాలిన్‌ అల్లుడైన శబరీషన్‌ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.

    ఓటరు ఎటో  
    ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా  ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్‌ , నాడార్‌ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై  వ్యతిరేకత అన్నది ఇక్కడ  పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ  వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్‌ పార్టీ ’విజిల్‌’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు  వేచి చూడాల్సిందే. 

  • హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్  రావు ఇందర్‌జీత్ యాదవ్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు. 2024లో హర్యానాలో  ఒక వ్యాపారి హత్య ఆరోపణలతో మధ్యప్రాచ్యానికి పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్ అధికారులు యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన నేర చరిత్ర పత్రాలను దుబాయ్ పోలీసులు కోరారు. త్వరలోనే అతడిని భారత్‌కు రప్పించే (Extradition) ప్రక్రియ పూర్తి చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

    యాదవ్‌పై  బిజినెస్‌ మ్యాన్‌ హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి బలవంతంగా రుణాలు తీసుకోవడం, ఆయుధాలతో బెదిరించడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా కమీషన్ సంపాదించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అతనిపై హర్యానా , ఉత్తర ప్రదేశ్ పోలీసులు 15కు పైగా కేసులు మరియు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. గత సంవత్సరం ఒక వ్యాపారవేత్త హత్య తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ గ్యాంగ్‌స్టర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.

    ఎవరీ రావు ఇందర్‌జీత్ యాదవ్?
    2006లో స్థాపించిన 'జెమ్ రికార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' (Gems Tunes) అనే సంస్థను స్థాపించాడు. రావు ఇందర్‌జీత్ యాదవ్ కేవలం ఒక నిందితుడు మాత్రమే కాదు, సంగీత ప్రపంచంలో కూడా సుపరిచితుడయ్యాడు.  ఈ సంస్థ హర్యానా, పంజాబీ, హిందీ భాషల్లో పాటలను నిర్మిస్తూ, OTT ప్లాట్‌ఫారమ్‌గా కూడా  ఉండేది.  దీంతో  బాలీవుడ్ సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. 2024 డిసెంబర్‌లో ఫైనాన్షియర్ మంజీత్ దిఘల్ హత్యలో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. మరోవైపుఇన్‌స్టాగ్రామ్‌లో ఇతనికి 15 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

    ప్రధాన ఆరోపణలు
    యాదవ్‌పై హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు సుమారు 15కి పైగా కేసులు నమోదు చేశారు.  ఈడీ  ఆరోపణల  ప్రకారం వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేయడమే ఇతని పని. హత్య, దోపిడీ, ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఇచ్చిన రుణాలను బలవంతపు వసూళ్లు మోసం, వంచన, అక్రమ భూకబ్జా, హింసాత్మక నేరాలు వంటి నేర కార్యకలాపాలలో పాలుపంచు కున్నాడు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల లోన్లను దౌర్జన్యంగా సెటిల్ చేయడం. ఇతను వందల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాలను పరిష్కరించే 'స్ట్రాంగ్‌మ్యాన్'గా వ్యవహరించేవాడు. సింగర్ రాహుల్ ఫాజిల్పురియా ఇంటిపై కాల్పులు, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనల్లో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈడీ  దాడులు,  పరారీ
    మనీ లాండరింగ్ కేసులో భాగంగా గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 5 లగ్జరీ కార్లు, రూ. 17 లక్షల నగదు. కీలకమైన డాక్యుమెంట్లు మరియు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయలను ప్రైవేట్ రుణ లావాదేవీలు మరియు ఆర్థిక వివాదాలను బలవంతంగా పరిష్కరించుకోవడానికి సహకరించేవాడు.  కార్పొరేట్ సంస్థలు , ప్రైవేట్ ఫైనాన్షియర్ల మధ్య రుణ పరిష్కారం కోసం యాదవ్ ఒక వెబ్‌సైట్ పోర్టల్‌ను అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్నట్లు కూడా తేలింది.

    ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్‌

    2024 డిసెంబర్‌లో, ఫైనాన్షియర్ మంజీత్ దిఘాల్ హత్య  తరువాత భారత్ నుండి దుబాయ్‌కి పారిపోయాడు. ఈ హత్యకు హిమాంశు భావు అనే ముఠా బాధ్యత వహించింది.  ఆ తరువాత గత ఏడాది జూలైలో, గాయకుడు రాహుల్ ఫాజిల్పురియా నివాసంపై జరిగిన కాల్పుల ఘటనలో యాదవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గురుగ్రామ్‌లో ఫాజిల్పురియా సహాయకుడు రోహిత్ షౌకీన్ హత్యకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్‌స్టర్, అతని అనుచరులు ప్రకటించుకున్నారు. ఆ మరుసటి నెలలోనే, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసంపై జరిగిన కాల్పులకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులలో యాదవ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే  తాను  గ్యాంగ్‌స్టర్‌ని కాదని, కుట్రకు బలైయ్యానని, తనపై కుట్ర జరుగుతోందని  ఇటీవల దుబాయ్‌లో చెప్పుకొచ్చాడు.

    ఇదీ చదవండి: మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?

Politics

  • జగిత్యాల: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిబద్ధత గల నాయకుడు కాబట్టే ఇంతకాలం కాంగ్రెస్‌లో కొనసాగారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందే జీవన్‌రెడ్డిని కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 9వ తేదీ) జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించేందుకు తమ సహోదరులందరితో కలిసి ఆయన వద్దకు వచ్చామన్నారు. దీనిలో జీవన్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

    ‘2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ, నిబద్ధత గల నాయకుడిగా ఆయన కాంగ్రెస్‌తోనే కొనసాగారు. కేసీఆర్, జీవన్‌రెడ్డిల బంధం ఈనాటిది కాదు. జూన్ 2, 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి సారి జగిత్యాలకు వచ్చారు. ఆరోజు బోర్నపల్లి బ్రిడ్జి గురించి జీవన్ రెడ్డి.. కేసీఆర్‌ అడిగారు. ఆయనడిగిందే తడవుగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సాంక్షన్ ఇచ్చారు

    షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డి ఫైట్ చేశారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మహారాష్ట్ర తరహా కో ఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో పెడదామన్నారు. పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి చేరిక బాగుంటుందని జగిత్యాల నాయకత్వం కూడా మద్దతు తెలిపింది’ అని తెలిపారు

    కాలం నెట్టుకొచ్చే ప్రభుత్వం ఇది
    కాంగ్రెస్‌ సర్కారుపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఇది కాలం నెట్టుకొచ్చే సర్కారు అంటూ ధ్వజమెత్తారు. ‘ మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. రూ. 70 లక్షల కోట్లు రైతులకు బకాయి పడ్డారు. బాసరలో ముఖ్యమంత్రి భాష అసహ్యంగా ఉంది. నిఖార్సైన జీవన్‌రెడ్డి వంటి నేతలను అవమానపరుస్తోంది ఈ కాంగ్రెస్

    నేను భట్టి ఇంటికి పెళ్లికి పోయినప్పుడు కూడా వంద మంది రాబోయేది మీ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్‌ను కూడా కలిసి తన నిర్ణయం ప్రకటిస్తామన్నారు జీవన్‌రెడ్డి. జీవన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది.’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

    వారికి ధన్యవాదాలు: జీవన్‌రెడ్డి
    కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ మా ఇంటికి పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. కాంగ్రెస్ నుంచి రాజీనామా భావోద్వేగానికి గురి చేసింది. ఇవాళ బీఆర్‌ఎస్‌తో కలవడం సంతోషంగా ఉంది. గత 20 మాసాలుగా అవమానాలు తట్టుకుని ఓపిక పట్టా. ఎందరి ప్రభుత్వాలో చూశాను.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో ఉంది. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం. కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం సంతోషంగా ఉంది
     

  • సాక్షి, అమరావతి: మావిగన్‌పై తెలుగుదేశం పార్టీ డైవర్షన్‌ కుట్రలకు తెరలేపింది. ప్రజలు పాజిటివ్‌గా చర్చిస్తుంటే అధికార పక్షం ఓర్వలేకపోతోంది. ఎలాగైనా మావిగన్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర తీసింది. వైఎస్‌ జగన్‌.. మావిగన్‌ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే సైకో అంటూ టీడీపీ నేత పట్టాభి చిందులు తొక్కారు. జగన్‌ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. వైఎస్సార్‌సీపీ నేతల భార్యల గురించి పచ్చపత్రిక అధినేత ఆర్కే రాతరోతలు రాశారు.

    ఇలా.. రోజుకో డైవర్షన్‌ స్కీంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని తిడుతూ మావిగన్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ కుట్రలు తెరతీసింది. ఇప్పుడు వైఎస్సార్‌ మరణంపై అచ్చెన్నాయుడు నీచపు మాటలు మాట్లాడుతూ.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై అభాండాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. మహానేత కుమారుడిపై అభాండాలను తట్టుకోలేక బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొత్స.. భావోద్వేగానికి గురయ్యారు.

    అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలపై బొత్స మండిపడ్డారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్సార్‌ ఒకరని.. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నానని బొత్స అన్నారు.

     

     

  • తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూ ఆర్‌ కోడ్‌ పెట్టింది వైఎస్‌ జగన్‌ అని, ల్యాండ్‌ రీ సర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.  ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ ఎన్నికలు ముందు ఈ సర్వేలు వద్దన్నారు. నేనొస్తే రద్దు చేస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మళ్లీ రీ సర్వే మొదలుపెట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. 

    మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టింది.  అసలు తెచ్చిన అప్పు అంతా ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం. మావిగన్ అంటే వాటికన్ అంటున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. రెండు లక్షల కోట్ల అప్పులభారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. 

    మూడు ప్రాంతాలు కలిపితే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుంది. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అచ్చెన్నాయుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో సంతకాల సేకరణ చేశారు అంటున్నారు. సంతకాల సేకరణతో సంబంధం లేదని అనేక సందర్భాల్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, రఘువీరారెడ్డి అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేశారా? అంటూ నిలదీశారు. 

    మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!
  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కుంభకోణంలో తెలుగు దేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. బాధితుడు ఎల్లయ్య కుటుంబ సభ్యుడొకరు తమకు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు కిందే అతని ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి రూ. 8 లక్షలు తీసుకున్నామని ఇప్పుడు కవరింగ్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

    రాజంపేట కుందా నెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్‌లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. 

    ఇంటికొచ్చాక ఫోన్‌ చూసి ఎల్లయ్యకు మతిపోయే విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఎల్లయ్య అకౌంట్‌కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ అకౌంట్‌కేనని తెలిసింది. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. 

    ఫేక్‌ ప్రామిసరీ నోట్‌తో?
    విషయం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన కొందరు నేతలే ఈ స్కాంను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్రమార్కులు కొత్త డ్రామాకు దిగారు. బాధితుడు ఎల్లయ్యకు బావమరిది అయిన శశికుమార్‌కు అప్పు ఇచ్చామని, ఆ సొమ్మునే వడ్డీతో సహా తాము తీసుకున్నామని చెబుతూ ఓ ప్రామిసరీ నోటును చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బాధితుడితోనే బలవంతంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని.. తన బావమరిది నిజంగానే అప్పు తీసుకున్నాడంటూ చెప్పించే ప్రయత్నం చేశారు.   అయితే.. శశికుమార్‌ వివరణతో టీడీపీ నేతల చిల్లర వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి అప్పు చేయలేదని.. పైగా ఆ ప్రామిసరీ నోట్‌లో సంతకం తెలుగులో ఉందని.. తాను ఇంగ్లీష్‌లో సంతకం చేస్తానని.. ఆ నోట్‌ ఫేక్‌ అని శశికుమార్‌ వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.  దీంతో తెలుగు తమ్ముళ్లు తప్పు మీద తప్పు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

    చంద్రబాబుకు సీపీఐ లేఖ
    రాజంపేటలో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అక్రమాల సంగతి తేల్చాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖ రాశారు. టీడీపీ నేతలకు సీఎం సహాయక నిధి ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ‘‘మీ పార్టీలో ఒక టీం ఇదే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకుంటున్నారు.  ఆర్థిక సహాయం ఎంత అందినా.. రూ.6 లక్షలే ఇస్తామని టీడీపీ నేతలు చెబుతుండడం దోపిడీకి పరాకాష్ట. తమకు ఖర్చులు ఉంటాయని.. అందరికీ పర్సంటేజ్‌లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.  ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్న మీ పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’’ అని చంద్రబాబును ఈశ్వరయ్య లేఖలో కోరారు.

  • హాల్దియా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్‌లో మార్పుల రాబోతుందని చెప్పారు. మోదీ గురువారం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

    2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈ సారి భవానీపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

    "రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను ఓడించాలని బెంగాల్‌ ప్రజలు నిర్ణయించారు. అని నేను చూశాను. ఈ ఉత్సాహం, ఉత్తేజంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. ఇది మార్పును తీసుకువచ్చే తుపాను. ఇది టీఎంసీ సర్కారుకు వీడ్కోలు. ఐదు సంవత్సరాల క్రితం మేదినిపూర్, నందిగ్రామ్ మార్పునకు మార్గాన్ని చూపాయి. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే దారిలో నడవడం ప్రారంభించింది.

    ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించింది. బెంగాల్‌లో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. బెంగాల్‌ను అభివృద్ధి వైపుగా తీసుకెళ్లడానికి పునాదిని శక్తిమంతంగా వేసే ఎన్నికలు ఇవి. టీఎంసీ సర్కారును గద్దె దించడం అవసరం. ఇప్పుడు భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో వృద్ధి వేగవంతంగా ఉందంటే  అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. కానీ దేశం ముందుకు వెళ్తుండగా, టీఎంసీ సర్కార్ బెంగాల్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

    చొరబాటుదారుల పరిశ్రమలు పెరిగాయి.. 
    ఒకప్పుడు భారత పురోగతికి పునాది వేసిన తయారీ, వాణిజ్యాన్ని బలపరిచిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని అభివృద్ధి సూచికల్లో దిగజార్చిందని మోదీ చెప్పారు. ‘ఈ పరిస్థితి మేదినిపూర్, హాల్దియా ప్రజల కంటే ఎవరికి బాగా ఎవరు తెలుసు? శతాబ్దాల క్రితమే చారిత్రక తమ్రలిప్త (Tamralipta Kingdom)తో వాణిజ్యం జరిగిన పోర్ట్ నగరం. హాల్దియా ఆధునిక భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. 

    కానీ ఇటీవల దశాబ్దాల్లో హాల్దియాలో కర్మాగారాలు మూతపడ్డాయి. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు హాల్దియాకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి యువత ఉద్యోగాల కోసం అండమాన్, ఒడిశాకు వలస వెళ్తున్నారు. టీఎంసీ సర్కార్‌లో చొరబాటుదారుల పరిశ్రమలు మాత్రమే పెరిగాయి. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువుల అక్రమ రవాణా వంటి రంగాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది.

  • సాక్షి, జగిత్యాల జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే పార్టీతోనే జత కట్టాలని భావించానని.. అందుకే, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్ రాబోతున్నారు. ఆయన వచ్చాక ఎప్పుడు జాయిన్ కావడమనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

    కేసీఆర్ పాలన కంటే కాంగ్రెస్ బెటర్ అని భావించి అధికారం ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ కంటే కేసీఆర్ పాలన వందరెట్లు బెటర్ అనిపిస్తోంది. మొక్కజొన్న కొనుగోళ్లు లేవు, రైతుబంధు సమయానికి పడదు, ఆరు గ్యారంటీల అమలూ సరిగా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. నేను తుమ్మిడిహట్టి దగ్గర కట్టాలని కోరానేగానీ.. కాళేశ్వరంపై విమర్శలు చేయలేదు. ప్రజాభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నా ఫైట్ కొనసాగుతుంది’’ అంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    కేసీఆర్ పాలనే బెస్ట్...సీఎం రేవంత్ పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Family

  • అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్‌ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్‌ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

    ఈ పోస్ట్‌ని గ్రెయిల్‌మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్‌ని బుక్‌ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్‌ అయ్యింది. డ్రైవర్‌ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్‌  ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు.  ఆ రైడ్‌ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్‌ వచ్చింది. 

    తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్‌కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్‌లో ఏదో టైప్‌ చేస్తున్నట్లుగా ఓపెన్‌ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్‌ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్‌ మెసేజ్‌ పంపింది. ఆ ఉబర్‌ డ్రైవర్‌ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది. 

    ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్‌కి నిజంగా ఐదు స్టార్‌లు అంటూ పోస్ట్‌ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.

    (చదవండి: ఆ ఐపీఎస్‌ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!)

     

  • హిందూ ధర్మంలో దేవతా ఆరాధనకు, క్షేత్ర సందర్శనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శక్తిపీఠం’, ‘సిద్ధపీఠం’ అనే పదాలను తరచుగా వింటుంటారు. సామాన్య భక్తులకు ఇవి రెండూ ఒకేలా అనిపించినప్పటికీ, వీటి వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వేర్వేరు. శక్తిపీఠాలు మాతా సతీదేవి త్యాగానికి చిహ్నాలైతే, సిద్ధపీఠాలు ఋషులు, మునులు సాధించిన తపఃఫలానికి నిదర్శనాలు. శరీర భాగాలు పడినచోట శక్తి ఆవిర్భవిస్తే.. తపస్సు పండిన చోట సిద్ధి చేకూరుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న పౌరాణిక, ఆధ్యాత్మిక వ్యత్యాసాలేమిటో తెలుసుకుందాం..!

    భారతీయ ఆధ్యాత్మిక భూమికలో శక్తిపీఠాలు, సిద్ధపీఠాలు రెండూ అత్యంత మహిమాన్వితమైనవిగా పరిగణించినప్పటికీ, వాటి ఆవిర్భావం వెనుక భిన్నమైన పౌరాణిక నేపథ్యాలు ఉన్నాయి. శక్తిపీఠాలు ప్రధానంగా మాతా సతీదేవి దేహ త్యాగానికి చిహ్నాలు; శివుడు ఆమె భౌతిక కాయాన్ని మోసుకెళ్తున్న తరుణంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఖండించగా, భూమిపై ఆ శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు కొన్ని పురాణాల ప్రకారం..108 శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. 

    ఇవి దేవి భౌతిక అవశేషాల శక్తిని కలిగి ఉండి, భక్తులకు పాప ప్రక్షాళనను, దేవి సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. ఈ శక్తిపీఠాలలో ఆ దేవి ప్రత్యక్షంగా, తన నిజ స్వరూపంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శక్తితోపాటు భైరవుడు అంటే శివుడు కూడా ఉంటాడని భావిస్తారు.

    తపఃఫల సిద్ధి క్షేత్రాలు..
    సిద్ధపీఠం అంటే ఒక ఋషి, సాధువు, సిద్ధుడు లేదా సాక్షాత్తు ఒక దేవత సుదీర్ఘకాలం పాటు కఠోరమైన తపస్సు ఆచరించి, పరమాత్మ అనుగ్రహాన్ని ΄÷ందిన ప్రదేశం. ఇక్కడ దేవత ఆవిర్భావం దైహికమైన భాగాల వల్ల జరగదు. కేవలం సాధన, ధ్యానం, మంత్రబలం ద్వారా జరుగుతుంది. సిద్ధపీఠాలలో ఆధ్యాత్మిక తరంగాలు అత్యంత బలంగా ఉంటాయి. 

    సాధకులు ఇక్కడ సాధన చేయడం వల్ల త్వరగా ’సిద్ధి’ అంటే జ్ఞానం లేదా శక్తులు పొందుతారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరే ప్రదేశాలుగా వీటిని భావిస్తారు. ఉదాహరణకు, మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటో లేదా మాతా వైష్ణోదేవి లాంటి క్షేత్రాలను సిద్ధపీఠాలుగా పరిగణించవచ్చు.సిద్ధపీఠాలు దైహికమైన అవశేషాలతో సంబంధం లేకుండా, కఠోరమైన తపస్సు, సాధన ద్వారా ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రాలు. 

    ఒక ఋషి, ముని లేదా దేవత ఏ ప్రదేశంలోనైతే సంవత్సరాల తరబడి ధ్యానం చేసి దైవత్వాన్ని సిద్ధింపజేసుకుంటారో, ఆ ప్రదేశమే సిద్ధపీఠంగా విరాజిల్లుతుంది. వీటికి నిర్ణీత సంఖ్య అంటూ ఉండదు. తపస్సు పండిన ఏ చోటైనా ఇది సాధ్యమే. ఇక్కడ కేంద్రీకృతమై ఉండే తపఃశక్తి, సంకల్ప బలం భక్తులకు అపారమైన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, వారు తలపెట్టిన కార్యాలు త్వరితగతిన సిద్ధించేలా అనుగ్రహిస్తాయి. క్లుప్తంగా చె΄్పాలంటే, శక్తిపీఠం దైవస్వరూపాన్ని దర్శింపజేస్తే, సిద్ధపీఠం ఆ దైవత్వాన్ని పొందే మార్గాన్ని సాధనను గుర్తుచేస్తుంది.

    శక్తిపీఠమైనా, సిద్ధపీఠమైనా అంతిమంగా లభించేది ఆ జగన్మాత అనుగ్రహమే. శక్తిపీఠాలు మనకు ‘త్యాగాన్ని’, ‘భక్తిని’ గుర్తుచేస్తాయి. ఒక దేహాన్ని త్యజించినా ఆ శక్తి అక్షయంగా ఉంటుందని చాటిచెబుతాయి. సిద్ధపీఠాలు మనకు ’క్రమశిక్షణను’, ‘సాధనను’ బోధిస్తాయి. మనం కూడా ఏకాగ్రతతో తపస్సు  చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. ఈ క్షేత్రాలను సందర్శించేటప్పుడు భౌతికమైన ఆడంబరాల కంటే, ఆధ్యాత్మిక చింతనతో వెళ్లడం ముఖ్యం. అప్పుడే ఆ పీఠాల నుంచి వెలువడే దివ్యశక్తి మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది.
    – పసుపులేటి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్‌ 

    (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్‌-రాధిక)

  • మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్‌ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్‌ పిలాయ్‌ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.

    రాజస్థాన్‌లోని భార్మర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి బిష్ణోయ్‌ మార్చి 29న జోధ్‌పూర్‌ ఐపీఎస్‌ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

    ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్‌ అధికారి దూద్‌ పిలాయ్‌ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. 

    ‘దూద్ పిలాయ్’ అంటే..
    దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం.  

    ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. 

    ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. 

     

    (చదవండి: ఐఐటీ,గేట్‌లలో టాపర్‌, పీహెచ్‌డీ పట్టభద్రుడు కానీ..!)
     

  • ఉన్నత చదువులు చదివితే కచ్చితంగా లక్షల ప్యాకేజ్‌లతో పనిచేసే ఉద్యోగాలు చేస్తుండటమో లేదా వ్యవస్థాపకులుగా కోట్లు గడించే రేంజ్‌లోనో ఉంటారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్‌లన్నింటిలో ఆల్‌ ఇండియా టాపర్‌ సాధించిన వ్యక్తులు అంటే కచ్చింతంగా చాలా పెద్ద పొజిషన్‌లోనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వ్యక్తి అత్యంత విరుద్ధంగా ఆ మార్గాన్ని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే..విస్తుపోతారు. ఇలా ఎలా ఇంత పెద్ద అనుహ్య మార్గాన్ని ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. పైగా అతడి కథ ఆలోచింపచేసేలా ఉండటమే గాక విజయానికి అసలైన అర్థం ఏంటో చాటి చెప్పారు.

    ఆయనే శ్రీష్‌ జాదవ్‌. 1968లో జన్మించిన జాదవ్, చిన్న వయస్సు నుంచే విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. 1985లో, భారతదేశంలోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌(ఐఐటీ జేఈఈ))లో ఆయన ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించారు. అలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) చదువుకున్నారు. సోషియాలజీ మినహా అన్నింటిలోనూ 'A' గ్రేడ్‌లు సాధించి, అద్భుతమైన విద్యా ప్రతిభను కనబరిచారు. అతని పదునైన మేధస్సు, నిలకడైన ప్రతిభ అతన్ని తన కాలంలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరిగా నిలబెట్టింది. 

    ఆ తర్వాత 1989లో కంప్యూటర్ సైన్స్‌లో గేట్ (GATE) పరీక్షలో 99.92 అద్భుతమైన పర్సంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక అక్కడితో చదువుని ఆపలేదు, పీహెచ్‌డీ కూడా చేశారు. ఆ తర్వాత సంప్రదాయ ఉద్యోగాలతో సంపాదన బాట పట్టకుండా సమాజ సేవ కోసం సర్వస్వం త్యాగం చేశారు. నిరుపేద విద్యార్థులకు విద్యనందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన సమాజ సేవకు మించింది లేదనే భావంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని నరోత్తమ్‌నగర్‌లో ఉన్న రామకృష్ణ మిషన్ పాఠశాలలో రెసిడెంట్ గౌరవ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 

    ఆ తర్వాత 1996, 1997ల మధ్య రామకృష్ణ మిషన్ శిల్పమందిరంలో గౌరవ లెక్చరర్‌గా సేవలందించారు. అలాగే 1997-2006 వరకు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ రంగంలో లెక్చరర్‌గా, కో ఆర్డినేటర్‌గా సేవలందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత పెద్ద బాధ్యతలు స్వీకరించి, చివరికి రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి డీన్ ఆఫ్ రీసెర్చ్ మరియు కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆయన సమాజానికి చేసిన విశేష సేవలకు గానూ  2009లో ఆయనకు ఐఐటీ కాన్పూర్‌ 'విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం ప్రదానం చేసింది. 

    అంతేగాదు ఆయన సేవ మార్గాన్నే ఎంచుకున్నా.. విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. కంప్యూటేషనల్ జ్యామితి, గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి వాటిలో పరిశోధనలు చేశారు. అంతేగాదు ఆయన బీటెక్‌ ప్రాజెక్టు ఓ ప్రముఖ కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధన సంస్థచే ప్రచురణ కోసం ఎంపిక అవ్వడం విశేషం. కాగా, శ్రీష్‌ జాదవ్‌ కథ నిజమైన విజయం సంపాదనలో లేదని, తెలివిగా ఎంచుకోవడంలోనే ఉందని చెబుతోంది. అంతేగాదు సక్సెస్‌ అంటే సంపద, గుర్తింపు కానే కాదని, ఒక లక్ష్యంతో స్పష్టతతో జీవించడం గురించని చెప్పకనే చెప్పారు శ్రీష్‌ జాదవ్‌.

    (చదవండి: 'బుజ్జి' ఫొటోగ్రాఫర్‌'..! జస్ట్‌ 18 నెలల వయసుకే..)