Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. 

    అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. 

    రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

  • హైదరాబాద్‌ : జైల్‌భవన్‌లో ఈ రోజు (శుక్రవారం) వరల్డ్ బుక్‌ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. జైళ్లశాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో సత్కరించారు. ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ విక్రమ్ త్రివేదీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సౌమ్యా మిశ్రాకు అందజేశారు.

    జైళ్ల శాఖలో సౌమ్యామిశ్రా చేసిన సంస్కరణలకు గానూ ఆమెకు ఈ అవార్డు అందజేసినట్లు వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. జైళ్ల ఆధునీకరణ, సంక్షమే కార్యక్రమాలు, సంస్కరణాత్మక విధానాల ప్రోత్సాహం తదితర రంగాలలో ఆమె విశిష్ట సేవలు అందించినట్లు పేర్కొన్నారు.

    డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ వంశీ మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను వరల్డ్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు డా. ఉలాజీ ఎలియాజర్ (కోఆర్డినేటర్), ఆకాంక్ష షా (ప్రతినిధి)తో పాటు ఇతరులు హాజరయ్యారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్‌ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్‌చాట్‌లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్‌ ట్యాపింగ్‌ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

    ‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్  ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్‌ చెప్పారు.


     

  • జగిత్యాల:  అదొక అన్న ఆత్మ వేదన.. చెల్లెలు ఇక తిరిగిరాదని తెలిసినా ఆమె సమాధి వద్దే పడుకుని కన్నీళ్లు ఇంకిపోయేలా విలపిస్తున్న రోదన. ఇటీవల యూట్యూబర్‌ వైష్ణవి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది.  ఆ హృదయ విదారక ఘటనను తలుచుకుని వైష్ణవి అన్న సంతోష్‌ కుమిలిపోతున్నాడు. చెల్లెలు సమాధి వద్దే  నిద్రిస్తున్నాడు. తన చెల్లెలకు ఏమి ఇష్టమో దాన్ని తినిపించడానికి సమాధి వద్దే ఉంటున్నాడు. 

    జీవితం ముగిసినా బంధం మాత్రం శాశ్వతం. నిద్రలోనూ చెల్లి జ్ఞాపకాలు.. అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చెల్లి సమాధి వద్ద అన్న నిద్రపోవడం అనేది కేవలం శరీర విశ్రాంతి కాదు, అది హృదయపు ఆవేదనకు ప్రతిరూపం. మట్టి కింద నిశ్శబ్దంగా ఉన్న చెల్లి జ్ఞాపకాలతో, అన్న కన్నీటి చుక్కలు రోదిస్తున్న తీరు వారి  మధ్య అనురాగపు బంధానికి నిదర్శనం.

    చెల్లెలు ఇక రాదని తెలుసు. సమాధిలో ఉన్న చెల్లెలు పైకి లేచి రాదని తెలుసు. కానీ  చెల్లెలు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైష్ణవి ఇష్టంగా తినే అహారం సమాధివద్ద పెడుతున్నాడు సంతోష్‌. ఈ  హృదయ విదారక ఘటనను చూసి చుట్టపక్కల వారు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.

    వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
    కోరుట్ల మండలం మాదాపూర్‌లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూ బర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి ఆశో క్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

    వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధు వులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తర లివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. 

    నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త 


     

International

  • అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్‌.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్‌ నూతన సంవత్సరం "నౌరూజ్‌" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

    మా తూర్పు దేశాలు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

    మొజ్తబా ఖమేనీ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయ్యాక పాక్‌-ఆఫ్ఘన్‌ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్‌వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.  

    కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్‌ ప్రకటించింది.

    అయితే పాక్‌ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే,  సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి.  

     

     

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్‌ నూతన సంవత్సరం "నౌరూజ్‌" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.

    ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.

    శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి.  

    ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్‌పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.

    ఆఫ్ఘనిస్తాన్‌–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌-పాక్‌ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌-పాక్‌ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.  

     

  • లెబనాన్‌లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ‍ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్‌ అక్కడే పేలింది.

    ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్‌కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్‌ అటాక్‌ జరిగిన ‍ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్‌లో రికార్డయ్యింది. లెబనాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.

  • పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్‌ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంత మందిని అక్కడికి పంపుతామని జెలెన్‌ స్కీ ప్రకటించారు.  

    పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ను ఇరాన్‌కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈనేపథ్యంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ" ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం మాకు దూరమైందేమి కాదు. రష్యా, ఇరాన్‌కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు మాకుందని మేము భావించడం లేదు. అని కొద్దిరోజుల క్రితం లండన్‌ పార్లమెంటులో జెలెన్‌స్కీ మాట్లాడారు. కాగా అంతకు ముందే ఉక్రెయిన్‌పై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్‌ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. అయితే వీటిని జెలెన్‌స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.


    షాహిద్ డ్రోన్ల ప్రత్యేకత

    షాహిద్  డ్రోన్లను  ఇరాన్  తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన 'షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ,ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ (HESA) వీటిని సంయుక్తంగా వీటిని రూపొందిస్తాయి.  'సూసైడ్' డ్రోన్లుగా ఇవి ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతట అవే పేలిపోతాయి.

    అయితే రష్యా సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్లోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్‌ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇదివరకూ ఉక్రెయిన్ 44,700కు పైగా షాహెద్ తరహా డ్రోన్‌లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహెద్ తరహా డ్రోన్‌లను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలని రక్షించడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంది. అయితే వీటికోసం జెలెన్‌స్కీ తగిన మెుత్తంలో డబ్బు డిమాండ్ చేశారు.

  • అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్‌ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా,  అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. 

    ఈ విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా ఆయన వెల్లడించారు.  ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. 

    ‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్‌ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం.  ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. 

    జిబౌటి బేస్‌ నుండి ఎనిమిది యాంటీ-షిప్‌ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను  లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 

    ఇదీ చదవండి:

    ఇరాన్‌ ‘ఉండేలు’ దెబ్బ
     

  • ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన జగదేకవీరుడు... ఇంటి ముందు మురుగు కాల్వలో పడి దిక్కుమాలిన చావు చచ్చినట్టుంది... ప్రస్తుతం ఎఫ్-35 యుద్ధవిమానం దుస్థితి! ఎఫ్-35ల చరిత్రలో ఇదే ఘోరాతి ఘోరం. ఇంత ఘోరం మునుపెన్నడూ లేదు. ఈ వార్త విన్నాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మాట వచ్చి ఉండదు. ఎఫ్-35... అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధవిమానం. శత్రు రాడార్లకు సైతం చిక్కదు-దొరకదని అమెరికా ఘనంగా చెప్పే ఈ ‘స్టెల్త్’ ఫైటర్ జెట్ ఒక్కోదాని ధర వేరియంట్ ఆధారంగా రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది.

    యుద్ధవిమానాల పోరాట చరిత్రలో దీని సరిసాటి మరో విమానం నేటి వరకు లేదని చెబుతారు. ఎఫ్-35ను చూసుకుని అమెరికాకు మహా గర్వం. అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేసిన ఇతర దేశాలు కూడా రక్షణ పరంగా ఎంతో భరోసాతో కనిపిస్తాయి. నిజమే గానీ... అదంతా నిన్నటిదాకా మాత్రమే. ఇరాన్ వైమానిక బలగాలను వెంటాడి, వేటాడి నిర్వీర్యం చేసినట్టు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ అదే దుర్బల ఇరాన్ రక్షణ దళాలు కొట్టిన ఉండేలు దెబ్బకు ‘ఎఫ్-35 లైట్నింగ్ 2’ అంతటి గండభేరుండం సైతం గతీదారి లేక పశ్చిమాసియాలోని ఓ స్థావరంలో అత్యవసరంగా కిందికి దిగాల్సొచ్చింది. పైలట్ క్షేమనేనని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. 

    కాదు కాదు... తమ ప్రతాపానికి ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోయిందనేది ఇరాన్ వాదన. ప్రపంచంలో ఎఫ్-35ను దెబ్బకొట్టిన తొలి దేశం తామేనని ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా క్షీణదశలో, పతనావస్థలో ఉన్న ఇరాన్ వైమానిక దళం అత్యంత అధునాతన ఎఫ్-35ను పిట్టను కొట్టినట్టు ఎలా కొట్టగలిగింది? ఇప్పుడిదే అందరిలో మెదులుతున్న సందేహం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పనైపోయిందని భావించి అతి ధీమాతో సదరు ఎఫ్-35 ఫైటర్ జెట్ మధ్య ఇరాన్ మీదుగా ఎగురుతుండగా ఈ నెల 19న ఆ ఘటన చోటుచేసుకుంది. 

    దీనిపై అమెరికా నుంచి ప్రకటన వెలువడేలోపే... పుండు మీద కారం చల్లినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెంటనే ప్రతిస్పందించింది. ఎఫ్-35ను తాము ఎలా ట్రాక్ చేసింది, ఎలా అడ్డుకున్నదీ తెలిపే ఫుటేజిని ప్రదర్శించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 15 దేశాలు ఎఫ్-35 యుద్ధ విమానానికి చెందిన పలు వేరియంట్లను వినియోగిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధ సందర్శన సందర్భంగా... వీటిని మన దేశానికి కూడా విక్రయిస్తామని ట్రంప్ ప్రతిపాదించారు. దానిపై భారత్ ఇంతవరకు సుముఖత తెలుపలేదు.

    స్టెల్త్ ఆధునికతకు నాటు దెబ్బ!
    శత్రు దేశాల రాడార్లు పసిగట్టకుండా ప్రయాణించడానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినవే స్టెల్త్ విమానాలు. ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టిందనే అంశంపై రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ స్పందించారు. ‘స్టెల్త్ సాంకేతికత’ను ఆ పేరుతో పిలవటమే సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాడారుకు స్టెల్త్ విమానం అస్సలు కనిపించదని కంపెనీ బ్రోచర్లు చెబుతాయి గానీ... ఆ విమానాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని, గురువారం ఎఫ్-35 విషయంలో అదే జరిగిందని సందీప్ చెప్పారు. ఎఫ్-35 లక్ష్యంగా ఇరాన్ ఏ క్షిపణులు ప్రయోగించిందో కచ్చితంగా తెలియనప్పటికీ... అది ప్రత్యేకించి ‘358 విమాన విధ్వంసక క్షిపణి’ గానీ లేదా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి గానీ అయివుండొచ్చని అభిప్రాయపడ్డారు. 

    ‘358 క్షిపణి’ని ‘ఎస్ఏ-67’గా కూడా వ్యవహరిస్తారు. ఇది పరారుణ సెన్సర్ అమర్చిన ఓ మిసైల్. తక్కువ ఎత్తులో నిదానంగా ప్రయాణించే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఎఫ్-35 నిదానంగా ప్రయాణించే జెట్ కాదు. ఇరాన్ గతంలో అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని ‘358 క్షిపణి’ని ప్రయోగించింది. యెమెన్ హౌతీలకు కూడా ఇరాన్ ఈ క్షిపణులను సరఫరా చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన గత నెల 28 నుంచి ఇప్పటివరకు అమెరికా డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ‘358 క్షిపణి’లోని పరారుణ సెన్సర్... ఎఫ్-35 జెట్ వెలువరించే వేడిని గుర్తించి ఉంటుందని, తద్వారా దాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటుందని సందీప్ ఉన్నితన్ విశ్లేషించారు. 

    రాడార్ కంటపడకపోయినా పరారుణ వర్ణపటం (ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్) రీత్యా ఎఫ్-35 తప్పించుకోలేదని అన్నారు. ఎఫ్-35 అనేది ఒకేఒక ఇంజిన్ ఉండే జెట్. ఎగిరేటప్పుడు అది అమిత వేడిని వెలువరిస్తుంది. రాడార్ వాడకుండానే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ) వ్యవస్థ సాయంతో వేడిని గుర్తించి దాని ఆధారంగా విమానాన్ని ట్రాక్ చేయవచ్చని వివరించారు. గురువారం బహుశా అదే జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. 20 రోజుల పోరాటం తర్వాత తాము ఇరాన్ వైమానిక బలగాల వెన్ను విరిచినట్టు అమెరికా, ఇజ్రాయెల్ చాటుకుంటున్నాయి. ఆ ప్రాతిపదికనే అమెరికా తమ బి-1, బి-2 బాంబర్లను మోహరించింది. ‘స్టెల్త్’ సామర్థ్యం లేని ఈ బాంబర్లను శత్రు దేశపు గగనతలంపై సంపూర్ణ ఆధిక్యం లభించినట్టు తెలిశాక మాత్రమే అమెరికా సహజంగా మోహరిస్తుంది. ఎఫ్-35ను సైతం దెబ్బ కొట్టగలిగాయంటే ఇరాన్ వైమానిక బలగాలు క్రియాశీలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. 
    - జమ్ముల శ్రీకాంత్

Business

  • టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్‌ జెడ్‌ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.

    ➤న్యూ గ్లోబల్‌ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. 
    ➤భారతదేశంతో సహా గ్రేట్‌ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. 
    ➤నేటి యువకులు జెండర్‌ రోల్స్‌కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్‌ సర్వే.
    ➤జెన్‌ జెడ్‌ యువకులు బేబీ బూమర్‌ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.
    ➤కెరీర్‌లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్‌ జడ్‌ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. 
    ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. 
    ➤బేబీ బూమర్స్‌ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు.

  • షియోమి చైనాలో అప్‌డేటెడ్ SU7 సెడాన్‌ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్‌వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్‌లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.

    కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్‌లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్‌ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.

    ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్‌ఫేస్ డిజైన్‌తో క్యాబిన్‌ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్‌ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్‌పిట్ సిస్టమ్‌కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.

  • ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్‌లో బలహీనమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.

    భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్‌లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్‌లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.

    ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్‌లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.

    బంగారం ధరల పెరుగుదల ఎప్పుడు
    బంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.

  • ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.

    చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

    ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.

    వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

  • పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.

    ''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.

    ఐపీఓ లక్ష్యంగా..
    2025 డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్‌కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేసింది.

  • సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

    'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..
    ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్‌ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల టెస్టింగ్‌, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్‌ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.

    రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'
    పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'  అప్‌డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్‌ను రన్ చేస్తుంది.

    మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్‌ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్‌ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.

    క్షణాల్లో పరిష్కారం:  డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లోనే పరిష్కరించేలా ఈ టూల్‌ను రూపొందించారు.

  • ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్‌కు ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.

    చివరిసారిగా ప్లాట్‌ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్‌కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది

    ఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.

    ఫుడ్ డెలివరీ ఆర్డర్‌లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్‌ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి.

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.

    వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్‌కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • భారత్‌లో ప్రీమియం పెట్రోల్‌ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

    ఇక హైదరాబాద్‌లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.

    సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..
    సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్‌పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్‌పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా విజ్ఞప్తి చేసింది.

    ఏమిటీ ప్రీమియం పెట్రోల్?
    ప్రీమియం పెట్రోల్‌ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.

    డీజిల్‌ ధర కూడా పెంపు 
    హెపీసీఎల్‌ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర..  తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.

    పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం
    బల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు,  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.

    వచ్చేవారం పెట్రోల్ మోత?
    పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్‌పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.

    ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..

  • జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ​కీలక అప్‌డేట్‌ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

    కొత్త ధరల వివరాలు

    ప్రస్తుతం చలామణిలో ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా దీన్ని రూ.3,075కు పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే నేరుగా రూ.75 భారం పడనుంది. నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ, వసూలు) నిబంధనలు, 2008 ప్రకారం ఈ వార్షిక ధరల సవరణ జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

    వార్షిక పాస్ ప్రయోజనాలు.. నిబంధనలు

    ఈ వార్షిక పాస్ ముఖ్యంగా తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

    రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌వేలు (ఉదాహరణకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వంటివి) ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.

    పాస్ ఎలా పొందాలి?

    వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్‌కే ఈ వార్షిక పాస్‌ను లింక్ చేసుకోవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ వార్షిక పాస్ సేవలను వినియోగించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

  • ఆటోమేటెడ్ ఆన్‌లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్‌ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్‌లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.

    AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్‌సైట్‌లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్‌సైట్‌లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్‌లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.

    బాట్స్ అంటే
    బాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్‌సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్‌సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.

    కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్‌సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.

    ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!

    ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు.

  • దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన జల సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 40 శాతానికి పైగా రిజర్వాయర్లు వాటి పూర్తి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలోని అన్ని ఆనకట్టల సగటు నీటి మట్టం 51 శాతానికి పడిపోయింది.

    ప్రస్తుత పరిస్థితి

    కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం, ఈ 166 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 183.565 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా, ప్రస్తుతం కేవలం 94.063 బీసీఎం (51 శాతం) మాత్రమే నీరు నిల్వ ఉంది. వాటిలో..

    • 39 జలాశయాలు: 40 శాతం కంటే తక్కువ నిల్వ.

    • 33 జలాశయాలు: 50 శాతం కంటే తక్కువ నిల్వ.

    • కేవలం 1 జలాశయం: ఝార్ఖండ్‌లోని జఖేత్ హిల్ రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం 100 శాతం నిండి ఉంది.

    • 18 జలాశయాలు: 80 శాతానికి పైగా నిల్వను కలిగి ఉన్నాయి.

    లోటు వర్షపాతం

    ఈ జల సంక్షోభానికి ప్రధాన కారణం.. లోటు వర్షపాతమని నివేదికలు చెబుతున్నాయి. ఐఎండీ అందించిన 726 జిల్లాల డేటా ప్రకారం, మార్చి 1 నుంచి దేశంలోని 78 శాతం ప్రాంతాల్లో వర్షపాతం అసలు లేకపోవడం అధిక భారీ లోటు నమోదైంది. ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతంలో 70 శాతానికి పైగా లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

    ఈ పరిణామాలకు దారితీసిన కారణాలు

    రుతుపవనాల అనంతర కాలంలో, ఈ ఏడాది ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్-ఫ్లో నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడంతో బాష్పీభవనం పెరిగి నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. వేసవి పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరగడంతో నిల్వలు వేగంగా ఖర్చవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపి వర్షపాతాన్ని తగ్గించాయి.

    ప్రాంతంజలాశయాల సంఖ్యప్రస్తుత నిల్వ శాతంస్థితిగతులు
    దక్షిణ భారతం4241%తెలంగాణ (35% దిగువకు), కర్ణాటక (40% కంటే తక్కువ) ఆందోళనకరంగా ఉన్నాయి.
    ఉత్తర భారతం1145.5%హిమాచల్‌ప్రదేశ్‌ 40% లోపు ఉండగా, పంజాబ్, రాజస్థాన్లలో 55% పైగా ఉంది.
    తూర్పు భారతం2750%అస్సాం (20%), పశ్చిమ బెంగాల్ (25%) కనిష్ట స్థాయిలో ఉన్నాయి.
    పశ్చిమ భారతం5362%గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
    మధ్య భారతం2857%ఛత్తీస్‌గఢ్‌ (71%) మెరుగ్గా ఉండగా, ఉత్తరాఖండ్ (43%) తక్కువగా ఉంది.

     

    గడిచిన 10 ఏళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త నీటి నిల్వలు సాంకేతికంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ (గత ఏడాది కంటే 13.5 శాతం పాయింట్లు ఎక్కువ), లోటు వర్షపాతం రాబోయే రోజుల్లో సవాలుగా మారనుంది. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దాంతో రిజర్వాయర్ల మట్టం తగ్గే వేగం కొంత నిమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Sports

  • ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌ రాయల్స్‌ కొలంబియా పసిఫిక్‌ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్‌ డాలర్ల) బిడ్డింగ్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. 

    వాస్తవానికి రాజస్థాన్‌కు ఇప్పుడొచ్చిన బిడ్‌ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్‌ను కాదనుకొని రాజస్థాన్‌ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్‌ రాయల్స్‌ కోసం పెద్ద మొత్తంలో బిడ్‌ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.

    రాజస్థాన్‌ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్‌ మీడియా వెంచర్స్‌ అధినేత మనోజ్‌ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. 

    ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రంజన్‌ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్‌ డాలర్లకు పైగానే బిడ్‌ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌  తొలి సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్‌ గెలుచుకుంది. 

    షేన్‌ వార్న్‌ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్‌ వాట్సన్‌, యూసఫ్‌ పఠాన్‌ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్‌ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్‌ చేరిన రాజస్థాన్‌ ఆ తర్వాత 2015, 2018 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌ చేరింది. 2022లో శాంసన్‌ సారథ్యంలో రన్నరప్‌గా నిలిచింది. 2025 సీజన్‌లో రాజస్థాన్‌ 9వ స్థానంలో నిలిచి లీగ్‌ దశకే పరిమితమైంది.

    చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’

  • పోలండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్‌ ఓడిపోవడం తనను మానసిక వేదనకు గురి చేస్తోందని, ఓటములతో కోర్టులో ఆటపై పట్టు కోల్పోతున్నట్లుగా అనిపిస్తుందని తెలిపింది. గురువారం ప్రారంభమైన మియామి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో స్వియాటెక్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. 

    మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 50వ ర్యాంకర్‌ మగ్డా లినెట్టె 6-1, 5-7, 6-3తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన స్వియాటెక్‌ను మూడు సెట్లలో చిత్తు చేసింది. ఒక డబ్ల్యూటీఏ టూర్‌లో భాగంగా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో 73 మ్యాచ్‌ల్లో  వరుస విజయాల తర్వాత తొలి రౌండ్‌లో ఓడిపోవడం స్వియాటెక్‌కు ఇదే తొలిసారి. 

    మ్యాచ్‌ ఓటమి అనంత‌రం స్వియాటెక్‌ మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు. రాను రాను టెన్నిస్ ఆట క‌ష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మాన‌సికంగా మ‌నం ఎలా ఉంటామ‌నేది చాలా కీల‌కం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మ‌ళ్లీ నా ప‌నిలో మునిగిపోతా. 

    ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. నా ఆట‌ను మెరుగుప‌ర‌చుకుంటా’ అని స్వియాటెక్ పేర్కొంది. కాగా స్వియాటెక్‌ తన టెన్నిస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు గ్రాండ్‌స్లామ్‌లు సాధించగా ఇందులో నాలుగుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ ఒక్కోసారి నెగ్గడం విశేషం. ఒక దశలో స్వియాటెక్‌ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 125 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడం విశేషం.

    చదవండి: ‘సంజూకు మామయ్యలాంటి వాడిని’

  • భారత జట్టు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్‌ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్‌తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. 

    ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్‌ ముఖ్యంగా సెమీఫైనల్‌, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌ సంజూ శాంసన్‌తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. 

    ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్‌ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్‌కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్‌తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్‌ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. 

    ఇవాళ గంభీర్‌ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్‌ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. 

    శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్‌కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. 

    ఇంతకాలం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్‌ ఈ సీజన్‌ నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. తన ఫెవరెట్‌ క్రికెటర్‌ అయిన ఎంఎస్‌ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్‌ ఇటీవలే సీఎస్‌కే ప్రాక్టీస్‌లో జాయిన్‌ అయిన సందర్భంగా వెల్లడించాడు.

    చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా?

  • భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కామెంట్రీ ప్యానెల్‌ నుంచి వైదొలిగినట్లు తెలిపాడు. ఇకపై బీసీసీఐ కామెంట్రీలో తాను కనిపించబోనంటూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

    శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా
    ఈ సందర్భంగా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. తన శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా వివక్ష చూపారని.. అందుకే తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆరోపించాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ 1980వ దశకంలో టీమిండియాకు ఆడాడు.

    సంచలన ప్రదర్శనలు
    అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో ఒక్క వికెట్‌ కూడా తీయని ఈ స్పిన్‌ బౌలర్‌.. 1984లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును గెలిపించి వార్తల్లో నిలిచాడు.

    అంతేకాదు 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్‌ గావస్కర్‌ కెప్టెన్సీలో బెన్సన్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ గెలవడంలోనూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో నాటి ఫైనల్లో ప్రత్యర్థిని 176 పరుగులకే కట్టడి చేయడంలో సహకరించి.. భారత్‌ విజయానికి కృషి చేశాడు.

    ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ 2000 సంవత్సరంలో కామెంటేటర్‌గా కెరీర్‌ ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్‌ కమిటీలో ప్లేయర్‌ రిప్రజెంటేటివ్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో శుక్రవారం కామెంట్రీకి రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ సోషల్‌ మీడియా వేదికగా చర్చకు తెరలేపాడు.

    శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ
    ‘‘బీసీసీఐ కామెంట్రీకి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. 23 ఏళ్ల కాలంలో టాస్‌లు వేయడానికి, ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి నేను పనికిరాలేదు. కానీ కొత్త వాళ్లు వచ్చి పిచ్‌ రిపోర్టులు ఇస్తూ. టాస్‌ ప్రజెంటేషన్లు ఇచ్చారు. శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ నాకు అవకాశం రాలేదు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?’’ అంటూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ వరుసగా ట్వీట్లు చేశాడు.

    వర్ణ వివక్ష
    ఇందుకు ఓ నెటిజన్‌.. ‘‘మీరు రంగు తక్కువ కాబట్టి’’ అని కామెంట్‌ చేయగా.. ‘‘సరిగ్గా చెప్పారు’’ అని శివరామకృష్ణన్‌ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్‌ కూడా ఇలాగే కామెంట్‌ చేయగా.. ‘‘అవును.. మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్ష’’ అని పేర్కొన్నాడు. అయితే, మరికొంత మంది మాత్రం ఉన్నన్ని రోజులు బోర్డును వాడుకుని.. ఇలా నిందించడం కొందరికి అలవాటేనంటూ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ను విమర్శించారు.

    అవునా?
    ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ పోస్ట్‌పై స్పందించాడు. ‘‘ఓహ్‌.. ఇలా ఎందుకు? ఈసారి ఐపీఎల్‌కు ముందే ఎందుకిలా?’’ అని కామెంట్‌ చేశాడు. అయితే, అశూ వ్యంగ్యంగానే ఇలా స్పందించాడని అభిమానులు అంటున్నారు. 

    గతంలో అశూను లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టాడు. అశ్విన్‌ భారత్‌లో మాత్రమే రాణించగలడని.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బౌలింగ్‌ రికార్డు ఘోరంగా ఉందంటూ విమర్శించాడు.

    చదవండి: అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
     

  • పాకిస్తాన్‌ పేస్‌ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్‌ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ 136 వికెట్లు కూల్చాడు.

    తద్వారా పాక్‌ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్‌ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

    పదకొండేళ్ల తర్వాత
    ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనలో పాక్‌ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్‌ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్‌ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్‌ బంగ్లాకు వన్డే సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ సైతం షాహిన్‌ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.

    జట్టులో చోటుకే దిక్కులేదు
    ‘‘పాకిస్తాన్‌ టీ20, వన్డే జట్ల కెప్టెన్‌గా షాహిన్‌ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్‌ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్‌ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.

    నిజానికి పాక్‌ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్‌ ఖతమైపోయింది’’ అని రషీద్‌ లతీఫ్‌ షాహిన్‌ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.

    మామ అలా
    మరోవైపు.. బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ ఓటమి తర్వాత షాహిన్‌ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్‌ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌, బంగ్లా సిరీస్‌లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ లతీఫ్‌ పైవిధంగా స్పందించడం గమనార్హం.

    చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్‌ బోర్డు!

  • భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 

    మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్‌ను రిపీట్‌ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్‌ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. 

    సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ టీమ్‌తో హర్మన్‌ బృందం వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్‌ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్‌  ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.

    2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్‌ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్‌ (52), కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా (80), మిథాలీరాజ్‌ (55), హేమలతా కలా (64), మమతా మబెన్‌ (50) అర్థసెంచరీలతో రాణించారు. 

    ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్‌ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్‌ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.

    సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..

    • డిసెంబర్‌ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ జట్టుతో వార్మప్‌మ్యాచ్‌

    • డిసెంబర్‌ 9: తొలి వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్
      డిసెంబర్‌ 12: రెండో వన్డే, బ్లోమ్‌ఫోంటైన్
      డిసెంబర్‌ 15: మూడో వన్డే, కేప్‌టౌన్‌

    • డిసెంబర్‌ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్‌, గెబెర్హా

    చదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీని విజయవంతంగా ముగించుకున్న భారత ఆటగాళ్లు తదుపరి ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌తో బిజీ కానున్నారు. మార్చి 28న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత జూన్‌ 6-20 మధ్య టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య సిరీస్‌ జరుగుతుంది.

    ముందుగా ఐర్లాండ్‌ టూర్‌కు!
    ఇందులో భాగంగా భారత్‌- అఫ్గన్‌ జట్లు ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడతాయి. అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందు భారత జట్టు ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

    ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ గ్రాహమ్‌ వెస్ట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగనుందని సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఐర్లాండ్‌ కనీసం సూపర్‌-8 దశకు కూడా చేరుకుండానే నిష్క్రమించింది.

    మంచి బూస్ట్‌
    ఇందుకు బాధ్యత వహిస్తూ పాల్‌ స్టెర్లింగ్‌ కెప్టెన్‌ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2028 సన్నాహకాల్లో భాగంగా పాల్‌ స్టెర్లింగ్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో వచ్చే కొత్త కెప్టెన్‌కు జూన్‌లో టీమిండియాతో జరిగే సిరీస్‌తో మంచి బూస్ట్‌ లభిస్తుంది’’ అని గ్రాహమ్‌ వెస్ట్‌ ప్రకటన విడుదల చేశాడు. తద్వారా భారత్‌- ఐర్లాండ్‌ సిరీస్‌ విషయాన్ని ఖరారు చేశాడు.

    కాగా గత ఏడేళ్లలో ఇప్పటి వరకు టీమిండియా ఐర్లాండ్‌లో మూడుసార్లు (2018, 2022, 2023)లో పర్యటించింది. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ముగించుకున్న తర్వాత టీమిండియా జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లేలా ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది. జూలై 1- 19 వరకు ఇరుజట్ల మధ్య ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.

    మరింత బిజీగా
    అయితే, తాజాగా ఐర్లాండ్‌ టూర్‌తో భారత జట్టు షెడ్యూల్‌ మరింత బిజీగా మారింది. దీంతో తమకు ఈ ఏడాదంతా పండుగేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తద్వారా స్వదేశంలో మొట్టమొదటిసారి, వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

    చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీసీసీఐ?

  • వైభవ్‌ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్‌-19 క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. 

    ఇంతకాలం అండర్‌-19 క్రికెట్‌లో దుమ్మురేపిన వైభవ్‌ సూర్యవంశీ ఇక ఐపీఎల్‌లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రియాన్‌ పరాగ్‌ వైభవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్‌ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్‌ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ ద్వారా వైభవ్‌ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్‌ ఓపెనర్‌ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్‌-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. 

    ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్‌గా వైభవ్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్‌ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్‌ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. 

    జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్‌లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. 

    కాగా గతేడాది వరకు రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్‌ ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రియాన్‌ పరాగ్‌ రాజస్థాన్‌ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్‌ స్థానంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌లు చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చారు.

    చదవండి: ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా!

  • ఫిఫా ప్రపంచకప్‌ 2026లో తమ మ్యాచ్‌ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్‌ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు. 

    ఇరాన్‌ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. 

    ‘గత డిసెంబర్‌లోనే ఫిఫా మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ విడుదల చేశాము. దీంతో మ్యాచ్‌ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్‌ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్‌ మ్యాచ్‌ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

    ఇజ్రాయెల్‌ ఫుట్‌బాల్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. 

    ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్‌ ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది.  అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌ జూన్‌ 11న ప్రారంభమై  జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్‌-జిలో ఉన్న ఇరాన్‌.. బెల్జియం,న్యూజిలాండ్‌, ఈజిప్ట్‌లతో తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

    అయితే ఇరాన్‌ తన మూడు మ్యాచ్‌లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్‌ఏంజిల్స్‌ వేదికగా రెండు, మరో మ్యాచ్‌ను సియాటెల్‌లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ తమ లీగ్‌ మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్‌ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్‌ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్‌ ఫిఫా ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయి.

    చదవండి: అదరగొట్టిన ఓపెనర్‌.. కివీస్‌ ఘన విజయం

  • టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు తానే చీఫ్‌ సెలక్టర్‌గా ఉంటానని అగార్కర్‌ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

    అతడికి ఆ అవసరం లేదు
    ఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్‌ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ ప్యానెల్‌లోని సబ్‌ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.

    అజిత్‌ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్‌ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.

    బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్‌ సెలక్టర్‌ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్‌లో మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

    సాహసోపేత నిర్ణయాలు 
    సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్‌ అగార్కర్‌ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో ఆసియా టీ20 కప్‌, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిళ్లను భారత్‌ గెలుచుకుంది.

    ఇక అజిత్‌ అగార్కర్‌కు తోడుగా హెడ్‌కోచ్‌గా మరో మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను కాదని.. సూర్యకుమార్‌ యాదవ్‌ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్‌కప్‌ గెలిచాడు. 

    సీనియర్ల రిటైర్మెంట్‌
    ఇక వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్‌ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 

    ఇక 2024లో వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్‌ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.

    చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీసీసీఐ?

  • సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (55 బంతుల్లో 63 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్‌ రోల్‌ పోషించాడు. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

    అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ప్రొటీస్‌ బ్యాటర్లలో టెయిలెండర్‌ కొబాని మొకినా (26 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జార్జ్‌ లిండే (23) పర్వాలేదనిపించాడు. అయితే సౌతాఫ్రికా టాపార్డర్‌, మిడిలార్డర్‌ పూర్తిగా విఫలం కావడంతో సఫారీలు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌, మిచెల్‌ సాంట్నర్‌, బెన్‌ సియర్స్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. 

    అయితే తొలి రెండు టీ20 మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఛేదనలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. కాన్వే, టామ్‌ లాథమ్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కాన్వే ఔటైనా లాథమ్‌ చివరి వరకు నిలిచి జట్టుకు స్పష్టమైన విజయాన్ని అందించాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన లోకీ ఫెర్గూసన్‌ను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది.

    ఈ మ్యాచ్‌ విజయంతో న్యూజిలాండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.

    చదవండి: IPL 2026: బోల్తా కొట్టిన విరాట్‌ కోహ్లీ!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోని ఆయా జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో తలపడనుంది. 

    ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఇప్పటికే లండన్‌ నుంచి భారత్‌ చేరుకొని తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్‌ సందర్భంగా టీమిండియా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన యార్కర్‌ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్‌ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్‌ కోహ్లీ లెగ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. 

    దీంతో షాక్‌ తిన్న కోహ్లీ ‘వాట్‌ ఏ బాల్‌ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్‌ నవ్వుతోనే రియాక్షన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్‌ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్‌ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్‌ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. 

    ఈ సీజన్‌లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్‌ దళాన్ని భువనేశ్వర్‌ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్‌ యశ్‌ దయాల్‌ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్‌ సలామ్‌, మంగేశ్‌ యాదవ్‌లకు భువనేశ్వర్‌ మెంటార్‌గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్‌ 2025 మెగావేలంలో భువనేశ్వర్‌ కుమార్‌ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.

    చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్‌ ప్లాన్‌.. షార్ట్‌లిస్టులో ఇరవై పేర్లు!

  • ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్‌-2024, చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026లలో చాంపియన్‌గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్‌ వేచి ఉంది.

    షార్ట్‌లిస్టులో ఇరవై పేర్లు!
    ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.

    ప్రణాళికలు సిద్ధం
    చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సహా ఎస్‌ఎస్‌ దాస్‌, ఆర్పీ సింగ్‌, అజయ్‌ రాత్రా, ప్రజ్ఞాన్‌ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్‌ ఐపీఎల్‌లో వారానికి ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.

    తద్వారా వారానికి ఐదు మ్యాచ్‌లు కవర్‌ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్‌లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్‌పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.

    వారికి చోటు ఉందా?
    ఐపీఎల్‌లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్‌ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్‌ అత్యంత కీలకం కానుంది. 

    గతేడాది దేశీ వన్డే క్రికెట్‌ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

    చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్‌ బోర్డు!

Movies

    • హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్‌ లుక్స్..
    • బాలిలో చిల్‌ అవుతోన్న లక్ష్మీ రాయ్..
    • రెడ్ డ్రెస్‌లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్‌ అందాలు..
    • శారీలో దిల్‌ రాజు సతీమణి తేజస్విని పోజులు..
    • మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..

     

     

     

     

     

     

     

     

  • రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్‌ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్‌ మరో అద్బుతమైన కంటెంట్ ‍అందించారని.. రణ్‌వీర్ సింగ్‌ ‍అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్‌ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు.  ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్‌ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్‌ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అంతకుముందు ప్రకాశ్ రాజ్‌ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. నేను దురంధర్‌కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని  'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.

    కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. 
     

     

  • రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్‌ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్‌-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్‌వీర్‌ సింగ్  అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

    రామ్ చరణ్ తన ట్వీట్‌లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్‌ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్‌వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్‌తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, ‍అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్‌ మ్యూజిక్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి  నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

    ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

     

     

  • ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.

    (ఇదీ చదవండి: 'దురంధర్‌-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి')

    'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్‌నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇ‍న్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్‌వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్‌లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.

    'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్‌తో చేసిన సిక్స్ ప్యాక్‌లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.  

    ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ  చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.

    (ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)

  • జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్‌ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో  ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్‌రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు.
     

  • పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. 

    వైభవంగా పెళ్లి
    దేవరకొండ ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్‌లో మార్చి 4న గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్‌ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. 

    లడ్డూలు ఇవ్వొచ్చు కదా!
    నేను కూడా విజయ్‌కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్‌గా రిక్వెస్ట్‌ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్‌ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్‌, స్వీట్స్‌.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! వి

    ప్రేమతో ముద్దుల వర్షం
    రోష్‌ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్‌ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్‌, విరోష్‌ను కలిశావ్‌ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు.

     

     

    చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్‌ ఆన్సరిదే!

  • సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నటీనటుల్ని తీసుకుంటారు. వాళ్లతో బోలెడన్ని రోజులు పనిచేయించుకుంటారు. కానీ చివరకొచ్చేసరికి ఏమైనా జరగొచ్చు. దర్శకుడు లేదా హీరో అనుకున్న ఔట్‌పుట్ బయటకొస్తుంది. సినిమా రిలీజైన తర్వాత కొందరు నటీనటుల.. ఇలా ఎడిటింగ్‌లో తన పాత్రని తగ్గించడం లేదా తీసేయడం గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ దివి కూడా 'పుష్ప 2' విషయంలో తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది.

    (ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)

    'నాకు చెప్పినప్పుడు చాలా పెద్ద రోల్. నా క్యారెక్టర్‌పైనే టీజరే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుందని నేను అలానే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ సినిమా వచ్చే టైంకి అన్ని ఉండవు. నేను చాలా బ్యాడ్‌గా ఫీలయ్యాను. కానీ ఎవరు వింటారు? ఇప్పుడు మన బాధ ఎవరు పట్టించుకుంటారు? దాని నుంచి మూవ్ అయిపోవాల్సిందే. నా పది మంది ఫ్రెండ్స్‌ని థియేటర్‌కి తీసుకెళ్లా. షూటింగ్ 20 రోజులు చేస్తే డబ్బింగ్ 10 రోజులు చెప్పాను. చాలా బాగా చేశామని నాకు తెలుసు. కానీ సినిమా చూసిన తర్వాత షాకయ్యాను' అని నటి దివి చెప్పింది.

    ఈ సినిమా నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు అందులో దివి పాత్రనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ టీజర్‌లో చూపించిన ఏ సీన్ కూడా సినిమాలో లేదు. కేవలం ఒకటి రెండు సన్నివేశాల్లో రిపోర్టింగ్ చెబుతున్నట్లు మాత్రమే దివి కనిపిస్తుంది. తనేం మోసపోయానని చెప్పలేదు గానీ ఇలా చేయడం మాత్రం తనని చాలా బాధపెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)

  • కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్‌పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్‌.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

    తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్‌వీర్‌ సింగ్‌ దురంధర్‌-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్‌లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.

    మొదటి పార్ట్‌లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్‌-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది.  మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని  మేకర్స్‌ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. 

    దివ్య తన ‍ట్వీట్‌లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను.  మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్‌లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్‌-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్‌గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా  నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్‌వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. 


     

     

  • స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ హ్యాపీరాజ్. ఈ చిత్రానికి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై  జైవర్ద నిర్మించారు. ఈ మూవీతోనే సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.  

    తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఫ్యామిలీ అండ్‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ పెద్దింటి అమ్మాయిని మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటనే కోణంలో తీసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరో అబ్బాస్ నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. 
     

  • తమిళ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్‌. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్‌ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్‌టుడే సినిమాకు ప్రదీప్‌ రంగనాథన్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్‌ (మరియ ఇళంజెళియన్‌) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    తెలుగు హీరోలపై కోపం?
    ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్‌ తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్‌గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్‌గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.

    నేనేమైనా కంకణ కట్టుకున్నానా?
    ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్‌లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్‌ చేస్తున్నారు అని బదులిచ్చింది.

    సినిమా
    తెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్‌, మ్యాడ్‌, మెయిల్‌ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్‌ మూవీలో ఈమె.. హీరో రామ్‌ నితిన్‌ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్‌స్టోరీ చిత్రాలున్నాయి.

    చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్‌ కపుల్‌

  • ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్‌ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)

    అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్‌డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.

    ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.

    ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.

    (ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • హనుమాన్ మూవీతో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించకున్న టాలీవుడ్ తేజ సజ్జా. ఆ తర్వాత మిరాయ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ ప్రకటించిన ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గతంలో బాలీవుడ్‌లో సక్సెస్ అయిన ఈ షోను తెలుగులోనూ తీసుకొస్తున్నారు.

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోకు తేజ సజ్జా హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఓటీటీలోనూ హనుమాన్ హీరో సందడి చేయనున్నాడు. ఇలాంటి ఇంటర్నేషనల్‌గా క్రేజ్‌ ఉన్న షోకి హోస్ట్‌గా వ్యవహరించడం వల్ల అతని క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి తేజ సజ్జా వేదికపై సందడి చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన షో ట్రైటర్స్. ఈ షోలో కేవలం చాలా ఇంటలిజెన్స్‌తో ఉన్నవాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ గ్లోబల్ షో తెలుగు వర్షన్‌ ప్రైమ్ వీడియోలో రానుంది రాబోతోంది. అయితే ఈ అప్‌ కమింగ్ షోకి మన టాలీవుడ్ యంగ్ స్టార్ తేజ హోస్ట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. గతేడాది హిందీలో వచ్చిన ఈ ట్రైటర్స్ షోను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఈ రియాలిటీ షో జరగనుంది.
     

  • మలయాళ స్టార్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌, హీరోయిన్‌ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్‌-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి చెవిలో పడింది.

    సంతోషంలో మమ్ముట్టి
    మమ్ముట్టి.. ప్రియదర్శన్‌ డైరెక్షన్‌లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్‌ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్‌ ప్రధాన కారణమని తెలుస్తోంది. 

    పెళ్లి
    అయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్‌ అనేది కేవలం సర్టిఫికెట్‌ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్‌ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.

    సినిమా
    కాగా ప్రియదర్శన్‌, లిస్సీ.. 1990 డిసెంబర్‌ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్‌ సంతానం. కల్యాణి ప్రియదర్శన్‌ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్‌ సృష్టించింది. ప్రియదర్శన్‌.. హిందీలో అక్షయ్‌కుమార్‌ హీరోగా భూత్‌ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

    చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 

    తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్‌. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్‌ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. 

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్‌ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్‌ పూర్తైన రోజు రణ్‌వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు.‌ ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్‌ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్‌లో రణ్‌ వీర్‌సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్‌లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ ‍అని తెలిపారు. కాగా..  ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. 

    రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు..

    జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ  రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్‌వీర్‌ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర  ప్రభావం, అలాగే సెట్‌లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది.   కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి  ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్‌ రాబట్టింది.
     

Politics

  • ప్రొద్దుటూరు: షర్మిలకు మేలు చేయడానికి.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అన్యాయం చేయడానికే వారి తల్లి విజయమ్మ ప్రకటన విడుదల చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. జగన్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, కోట్లాది మంది ఆడబిడ్డలు ఆయన్ని దేవుడిచ్చిన అన్నగా ఆరాధిస్తుంటే... రక్తసంబంధం కలిగిన షర్మిల శత్రువులు కూడా ఇలా ఉండరు అనడం బాధాకరమని ఆయన అన్నారు. షర్మిల మాటలు విజయమ్మకు బాధ కలిగించి ఉండాలి, కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

    విజయమ్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కు నోటరీ చేయించి మరీ విడుదల చేయడం వెనుక వ్యూహం ఉందన్నారు. వైఎస్సార్‌ భార్యగా, ఆమె ఏమి చెప్తే అది ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయంతో నోటరీ చేసి మరీ లేఖ విడుదల చేశారన్నారు. ఈ లేఖ మొదటగా టీడీపీకి చెందిన సోషల్‌ మీడియా గ్రూపుల్లో కనిపించిందని, దీన్ని బట్టి స్క్రిప్ట్‌ ఎవరు రాస్తున్నారు?, ఎక్కడ తయారవుతుంది? అన్నదానిపై ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. విజయమ్మ అనేక సందర్భాల్లో తాను షర్మిలవైపే అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారన్నారు. 

    విజయమ్మ రాసిన లేఖలో మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల కుమార్తెకు, కుమారుడుకి జగన్‌ తీవ్రమైన అన్యాయం చేశాడంటూ పేర్కొనడం చాలా బాధాకరమన్నారు. నిజంగా ఈ మాట ఎవరైనా నమ్మితే.. మీ కుమారుడు జగన్‌ ఇంత అన్యాయస్తుడని భావించరా? మీ కుమార్తె షర్మిలను రక్షించే ప్రయత్నంలో  కుమారుడి గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కింద స్థాయికి తీసుకుని పోయే విధంగా మాట్లాడ్డం తగునా? అంటూ విజయమ్మను రాచమల్లు ప్రశ్నించారు. 

    జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్‌ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యాయమన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో పాలుపంచుకుంటూ తమ నాయకుడిని వ్యక్తిత్వహననం చేస్తుంటే, దానినుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయమ్మ ఒక తల్లిగా తన కుమారుడి కోసం పడాల్సిన ఆరాటం, పార్టీ నాయకులుగా తాముపడుతున్నామని, తమతోపాటు జగన్‌ని అభిమానించే లక్షలాది కుటుంబాలు ఆరాటపడుతున్నాయన్నారు. 

     

    తాము ఇంత ఇంత బాధ పడుతుంటే.. కుమారుడి ప్రతిష్టను కాపాడేందుకు ఆరాటపడకపోగా, షర్మిల కోసం జగన్‌ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. షర్మిల, జగన్‌ తమకు రెండు కళ్లతో సమానమని, ఏ కంటిని కూడా గాయపర్చే పని చేయబోమని, కానీ జగన్‌పై అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి తాము స్పందించాల్సి వస్తోందన్నారు.  ఆయన ఇంకా ఏమన్నారంటే...

    వారు చంద్రబాబు చేతిలో.. మీరు షర్మిల చేతిలో..
    చంద్రబాబు స్వార్థ రాజకీయాలకోసం, ఆయన చేతిలో షర్మిల, సునీత పావులుగా మారి, మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటంతో, మనసుకు బాధ కలిగి, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో కొన్నిరోజులుగా నేను మీడియా ముందుకు వస్తున్నా. 

    రాజశేఖరరెడ్డిగారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల  గురించికాని, ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా మేం ఎన్నడూ  అనుకోలేదు, ఊహించలేదు. కానీ మాట్లాడే ఆ పరిస్థితులను సృష్టిస్తున్నది ఎవరని విజయమ్మగారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారితే, షర్మిల పెట్టే ఒత్తిళ్లకు, ఆమె ప్రభావానికి లోనై.. షర్మిల చేతిలో విజయమ్మ పావులాగ మారారనేది స్పష్టం అవుతోంది. 

    స్క్రిప్టు ఎక్కడ తయారవుతోందో ఎవరికి తెలియదు?
    చంద్రబాబు ఆదేశాల మేరకు, ఆయనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, డైవర్షన్‌ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా, షర్మిల, సునీత ఇద్దరూ  హద్దులు దాటి, చులకనగా మాట్లాడి, కోట్లమంది  అభిమానుల మనసు గాయపరిచేలా, వ్యక్తిత్వ హననం చేస్తుంటే.., అబద్ధాలను, అసత్యాలను చెప్తుంటే.. మేం మాట్లాడమా తల్లీ. అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? మీరు మాట్లాడవద్దంటూ పరోక్షంగా మా పార్టీ నాయకులను ఉద్దేశించి చేతులు జోడిస్తున్నామంటూ బహిరంగ లేఖలో ప్రస్తావించడం మాకు ఆవేదన కలిగిస్తోంది. 

    అసలు మాట్లాడే పరిస్థితి కల్పిస్తున్నది షర్మిల కాదా? సునీత ప్రజలకు తెలిసి చంద్రబాబును రెండుసార్లు కలిశారు. ఎవరికీ తెలియకుండా 19 సార్లు కలిశారు. ఇలా కలిసిన ప్రతిసారీ ఈ కుటుంబంలో జరిగిన ప్రతి విషయం చంద్రబాబుకు చెబుతున్నారు. షర్మిల ఒక్కరోజు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించరు. జగన్‌ను మాత్రం టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ ఇవన్నీ తెలుసు.

    అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న షర్మిలను కట్టడి చేయలేరా?
    మంగళవారం ఎన్‌సీఎల్టీలో కౌంటర్‌ దాఖలు చేయడం, ఆ మరుక్షణంలో చంద్రబాబు ఆఫీసుకు అది చేరడం, మరుసటిరోజు ఆ కౌంటర్లను అడ్డుపెట్టుకుని బుధవారం ఎల్లోవీుడియా ప్రధాన పత్రికలో అందులోని అంశాలు రావడంం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి వీటిని ఒక తల్లిగా మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? 

    మొన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సొంత అన్నను పట్టుకుని, కోట్లమంది అభిమానిస్తున్న నాయకుడ్ని పట్టుకుని.. ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదని, పైగా అన్న అనే పదానికి కళంకం అంటూ షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాలాంటి వాళ్లు మాట్లాడకుండా.. ఎలా ఉంటారు? అసలు అలాంటి మాటలు అనకుండా, తప్పమ్మా .. అని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?

    జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో షర్మిల వాటాలు కోరిన దగ్గరనుంచి.. ఈ వ్యవహారంలో జగన్‌ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా? రచ్చ చేయలేదు కదా? కించపరిచి మాట్లాడటమో, తక్కువచేసి మాట్లాడటమో, అలాంటి పనులు ఏనాడూ చేయలేదు కదా? కానీ షర్మిల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోతున్నారు? రచ్చచేస్తున్నా, కుటుంబ పరువును దెబ్బతీసేలా వ్యవహరిçస్తున్నా ఎందుకు ఆమెను నియంత్రించలేకపోతున్నారు.

    ఎన్‌సీఎల్‌టీ తీర్పు అర్థమేమిటి?
    న్యాయాన్యాయాలు తేల్చమని జగన్‌  ఎన్‌సీఎల్‌టీ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని అర్థం ఏంటి? ఆయన పక్కన న్యాయం ఉన్నట్టే కదా? మళ్లీ దీన్ని సవాల్‌ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్లారు. వాదనలు జరుగుతున్నాయి. మరి ఈ కేసు తేలేంతవరకూ ఎందుకు ఆగలేకపోతున్నారు? జగన్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేదు కదా? కానీ షర్మిల కట్టుబడి లేరు కదా? తప్పు ఎవరిది? 

    మీరు ఒక సైడ్‌ తీసుకోవడం న్యాయమా?
    చంద్రబాబు ఆదేశాల మేరకు షర్మిల అయినా, సునీత అయినా హద్దులు దాటి, పరుష పదాలతో మాట్లాడతారు. చంద్రబాబుకు అవసరమైనప్పుల్లా రంగంలోకి దిగి డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా అటాక్‌ చేసూ్తనే ఉన్నారు. మేం వాటికి స్పందిస్తే.. మాకు చేతులు జోడించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా?  సరస్వతీ పవర్, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉండగా, వాటికి సంబంధించిన ఒరిజనల్‌ షేర్‌ సర్టిఫికెట్లు జగన్‌ దగ్గరే ఉన్నా, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కంపెనీ షేర్లను బదలాయిస్తే జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదం ఉన్నా తప్పుడు అఫిడవిట్‌తో షేర్‌ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి మీరు షేర్లు బదిలీ చేశారంటే దీని అర్థం ఏంటి? 

    షర్మిల ప్రభావం మీమీద ఎంత ఉందో తెలుస్తుంది.  చట్ట విరుద్ధంగా చేసిన ఈపని వల్ల జగన్‌ బెయిల్‌ రద్దుకు దారితీస్తుందని తెలిసికూడా, మీ చేత సంతకాలు పెట్టించడం భావ్యమా తల్లీ? మీ కొడుకు అక్రమ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసీ, మిమ్మల్ని నాశనం చేయాలని చంద్రబాబు లాంటి వ్యక్తులు కాసుకు కూర్చున్నాడని తెలిసి కూడా మీచేత సంతకాలు చేయించడం, మీరు సంతకాలు చేయడం దీని అర్థం మీరు వన్‌సైడ్‌ తీసుకున్నారనేగా తల్లీ. 

    కుటుంబ విలువలు తెలుసా చంద్రబాబుకు?
    బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి చంద్రబాబుకు ఏం తెలుసు? ఆస్తులు కాదు కదా ఏనాడైనా అక్కకు గానీ, చెల్లెకు గానీ ఏ చిన్న సాయమైనా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? అసలు చంద్రబాబు సోదరీమణుల పేర్లయినా తెలుసా ఈ రాష్ట్రంలో ఎవరికైనా? సొంత తమ్ముడిని సైతం అన్యాయం చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబు చేసిన ద్రోహాల గురించి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకమే రాశారు. అలాంటి చంద్రబాబు పంచన చేరతారా షర్మిల, సునీత? 

    అవాస్తవాలు ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాం..
    విజయమ్మ తల్లిగా, కుటుంబ పెద్దగా కొడుకు, కుమార్తెను కూర్చోబెట్టి ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా అని షర్మిలకు చెప్పవచ్చు. నీకు ఫలానా ఆస్తి కావాలని అడిగితే అన్నగా నీకు ఇస్తాడని చెప్పవచ్చు. జగన్‌కు చెప్పి ఏదైనా కూతురుకు ఇప్పించాలి. ఇది చేయకుండా వైఎస్సార్‌ శత్రువు ఇంటికి వెళ్లి, ఇంటి వ్యవహారాలు చంద్రబాబుకు చెబితే ఏ అన్నకైనా ప్రేమ ఎలా ఉంటుంది? ప్రజలంతా ఆలోచించాలి.’’ అని రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.

    ఇంతకన్నా అన్యాయం, దుర్మార్గం ఉంటుందా?
    షర్మిల వాదనను నిలబెట్టేందుకు కొడుకును పూర్తి అన్యాయస్తుడిగా చూపేందుకు ఇవాళ విజయమ్మ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనల్లుడు, మేనకోడలుకు జగన్‌ అన్యాయం చేస్తున్నాడని విజయమ్మ ప్రకటన ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం, దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలకు మేలు చేసేందుకు జగన్‌ను దెబ్బతీయడం అన్యాయం కదా? అయినా కూడా ఒక్కరోజు కూడా జగన్‌ మాట్లాడలేదు. షర్మిలకు ఆపద కలిగిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి షర్మిల తరఫున సాక్ష్యం ఇస్తారు. 

    ఎందుకంటే రాజశేఖరరెడ్డి భార్యగా మీ సాక్ష్యాన్ని ప్రజలంతా నమ్ముతారు. మీరు చెబితే ప్రజలు నమ్ముతారని అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే సమయంలో మీరు ఆమెను నిరోధించాల్సిన అవసరం మీకు లేదా? వైఎస్సార్‌ చనిపోయిన సందర్భంలో గుండె ఆగిపోయిన ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని జగన్‌ చెబితే అంగీకరించని సోనియా పార్టీలోకి మీ కూతురు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? కడపలో మీ కుమారుడు పోటీ చేస్తుంటే అమెరికా నుంచి కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయమని ప్రకటన చేశారు. 

    మీ బిడ్డను ఓడించమని చెబుతారా? ఎంతటి పక్షపాతం తల్లీ! కుమారుడి గౌరవాన్ని సర్వనాశనం చేస్తారా? అయినా జగన్‌ భరించారు. సరస్వతి పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లు బదలాయింపు చేస్తే కొడుకు జైలుకు వెళ్తాడని తెలిసి కూడా నా కూతురుకు ఆస్తి రావాలి, కొడుకు జైలుకు వెళ్లినా ఫర్వాలేదనేంత కాఠిన్యమా తల్లీ? షర్మిలకు ఆస్తి రావాలి, జగన్‌ జైలుకు వెళ్లినా ఫర్వాలేదా?

    ఇవన్నీ పంచి ఇచ్చిన ఆస్తులు కావా?
    2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడానికి ముందే ఆస్తుల పంపకం జరిగిందని మేం చాలాసార్లు చెప్పాం. తాజా లేఖలో మీరు కూడా దాన్ని అంగీకరించారు. షర్మిల పేరు మీద రాజశేఖరరెడ్డి ఏ ఆస్తులైతే రిజిస్టర్‌ చేశారో అవి ఆమెకు ఇచ్చినట్లే అని మీరు అంగీకరించారు. కాకపోతే పంపకం కాదు అంటున్నారు. బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబరు–2లో ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్‌ఆర్‌ఎస్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు,  22.5 మెగావాట్ల స్వస్తిక్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఇచ్చారని ఈ లేఖలో మీరూ అంగీకరించారు. 

    విజయవాడ యువరాజ్‌ సినిమా «థియేటర్‌ లో 35 శాతం, పులివెందులలో 7.60 ఎకరాల విలువైన స్థలం, విజయలక్ష్మి మినరల్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ 100 శాతం ఇచ్చారని అంగీకరించారు. కోడురులో రాజారెడ్డి ఆఫీసు స్థలం, కోడూరులో శెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారంటే దాన్ని కూడా అంగీకరించారు. కానీ ఇవన్నీ పంపకం కాదని విజయమ్మ చెప్పడం ఎంతవరకు సబబు? ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్‌ కు ఒకటి చొప్పున తమాషాగా ఇచ్చిన ఆస్తులా అవి? మరోవైపు షర్మిలమ్మకు ఇచ్చినట్లే జగన్‌కు కూడా ఇచ్చారని చెప్పారు. 

    మేం కూడా అదే మాట చెప్పాం. జగన్, షర్మిల ఎవరి ఆస్తులు వారివి. ఎవరి వ్యాపారాలు వారివి. ఆ తర్వాత ఎవరైనా పెరగొచ్చు, తరగొచ్చు. దేవుడి దయ లేకపోతే ఇద్దరివీ తరగొచ్చు. మంచి పిల్లలైతే  పెరిగిన వారు తరిగిన వాటికి సహాయం చేస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఉత్తమ సంతానంలో భాగంగా జగన్‌ జన్మించారు కాబట్టి వంశానికి మంచి కీర్తి తెచ్చారు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేశాడు. ఇంతమంది పేద ప్రజలకు వెలుగై ఉన్నాడు. అదే సందర్భంలో చెల్లెలు మీద ప్రేమతో ఇవ్వాల్సిన దానికన్నా అధికంగా డబ్బు, ఆస్తి కూడా ఇచ్చాడు. 

    షర్మిల వివాహమయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత.. 2009 మొదలు... 2023 వరకు జగన్‌ తన సొంత వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న దానిలో నుంచి చెల్లెలన్న ప్రేమ అభిమానాలతో షర్మిలకు పలు దఫాలుగా అడిగినప్పుడల్లా రూ.230 కోట్లు వైట్‌ మనీ ఇచ్చారు. 2009లో వైఎస్సార్‌ మరణం తర్వాత ఎవరి ఆస్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ కూడా జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి వ్యాపారాలు వారు నిర్వహించుకున్నారు.   2019 ఆగస్టులో జగన్‌ ఎన్నికల అనంతరం సీఎం అయిన తర్వాత తన చెల్లెలు మీద ప్రేమ, మమకారంతో తన ఆస్తుల్లో నుంచి ఎంఓయూ రాశారు. 

    ఈడీ కేసులలో ఆయన ఆస్తులు అటాచ్‌ మెంట్‌ కారణంగా ఆస్తుల బదలాయింపునకు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2023 నాటికి షర్మిలమ్మ కాంగ్రెస్‌ పార్టీని భుజాన ఎత్తుకోవడం, వైఎస్‌ జగన్‌ కు వ్యతిరేకంగా వీధిలోకి వచ్చి రచ్చ చేయడం వంటి ఘటనలన్నీ జరిగాయి. అప్పుడు జగన్‌ తన పట్ల షర్మిల ప్రవర్తన సక్రమంగా లేనందున, తనతో విభేదిస్తున్నందున  తాను ప్రేమతో ఇవ్వాలనుకున్న వాటిని రద్దు చేసుకున్నారు.

    ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మగారూ?
    వైఎస్సార్‌గారు బతికి ఉన్న నాటికే షర్మిల పెళ్లి అయి 15 సంవత్సరాలు అయ్యింది. జగన్‌కు పెళ్లి అయి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది. ఆ మధ్య కాలంలో ఎవరి వ్యాపారాలు వారివి.. ఎవరి కుటుంబాలు వారివి.. వైఎస్సార్‌ గారు సంపాదించిన ఆస్తులు ఆయన ఎవరికైనా ఇచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. కానీ ఆయనకు సంబంధంలేని.. ఆయన కొడుకు సంపాదన కానీ, లేకపోతే ఆయన కూతురు సంపాదన అయినా కానీ తను ఎవరికైనా ఎలా ఇవ్వగలుగుతారు?

    తాను బతికి ఉన్నంతకాలం ఉన్న ఏ ఆస్తి అయినా కూడా, అది ఎవరిదైనా కూడా మీ ప్రకారం ఇవ్వాలని అంటే.. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి ఉంది. ఇప్పటికీ చంద్రబాబు బతికే ఉన్నాడు. చంద్రబాబు పేరుమీద ఉన్న ఆస్తి, చంద్రబాబు భార్య సంపాదించిన ఆస్తి, చంద్రబాబు కొడుకు సంపాదించిన ఆస్తి, వారిపేరు మీద ఉన్న ఆస్తిలో చంద్రబాబు చెల్లెలు రాజ్యలక్ష్మి చంద్రబాబు ఆస్తిలో భాగం అడిగితే అది సబబే అవుతుందా? అంతెందుకు వైఎస్సార్‌గారి చెల్లెలు విమలమ్మగారు ఇంకా బతికే ఉన్నారు. ఆమె కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్‌గారు బతికి ఉన్నంతవరకు సంపాదించిన ఆస్తి, ఎవరు సంపాదించినా.. అది ఎవరిపేరు మీద ఉన్నా దాంట్లో నాకూ భాగం ఉందని అంటే మీరు షర్మిల విషయంలో ఆలోచన చేసినట్లుగానే విమలమ్మగారి విషయంలోనూ ఆలోచన చేస్తారా?

    ఎవరైనా ఎవరి ఆస్తిలోనైనా లేదా ఎవరి వ్యాపారాలలోనైనా భాగం లేదా వాటా ఎప్పుడు అడగగలుగుతారు? జగన్‌ కంపెనీలలో మీలో ఎవరైనా పెట్టుబడులు పెట్టారా? ఆ కంపెనీలు చేసిన అప్పులకు పర్సనల్‌ గ్యారెంటీలు ఇచ్చారా? ఆ కంపెనీలు నష్టాలలో ఎపుడైనా పాలు పంచుకున్నారా? ఆ కంపెనీల నష్టాలలోనూ, కోర్టు కేసులలోనూ ఏ రోజైనా పాలు పంచుకున్నారా? ఏ రోజైనా భాగం అయ్యారా? కేసులు ఎపుడైనా పట్టించుకున్నారా? మీ ఆస్తులను ఎపుడైనా సీబీఐ లేదా ఈడీ అటాచ్‌ చేసిందా.. ఉమ్మడి ఆస్తులు కాదు కాబట్టే.. 
    అవి జగన్‌ ఆస్తులు కాబట్టే దర్యాప్తు సంస్థలు అటాచ్‌ చేశాయి.. మరి ఇవేవీ లేకుండా వేరేవారి కంపెనీలలో మనం ఎలా వాటాలు ఆశించగలం?.. అలా ఎవరైనా ఆశించడం ధర్మమేనా?

    రాజశేఖరరెడ్డి గారు 2004 ఎలక్షన్‌ కమిషన్‌కు అప్లై చేసిన అఫిడవిట్, 2009 లో అప్లై చేసిన అఫిడవిట్‌ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మధ్య కాలంలో ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయన పంపకాలు చేశారని తెలుస్తుంది. ఆయన ఆస్తులు, ఆయన సంపాదించిన ఆస్తులు కాబట్టి ఆయన పంపకం చేయగలిగినారు. కానీ ఆయనకు సంబంధంలేని ఆయన కొడుకు ఆస్తిలో, కొడుకు కంపెనీలో లేక కూతురు ఆస్తులో లేక కూతురు కంపెనీలో ఆయన పంపకాలు చేయలేరు కదా?

    ఒక పిల్లాడు బాగున్నాడని, ఒకరు అంతగా బాగోలేరని, బాగున్న పిల్లాడి ఆస్తిని బాగోలేని పిల్లాడికి పంపకాలు చేయించాలని భావోద్వేగంతో ఏ తల్లి అయినా అనుకోవచ్చు కానీ అలా ఇవ్వాలి అంటే అటువైపున అభిమానంతో ప్రేమలు, ఆప్యాయతలు ఉంటే అంతో ఇంతో ఇస్తారేమో కానీ ఇలా హక్కుగా ఆశించడం తప్పు కాదా? 

    ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న కంపెనీ షేర్స్‌ బదలాయించకూడదని, అలా బదలాయిస్తే జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదముందని, సుప్రీంకోర్టు జడ్జిలు లిఖితపూర్వక ఒపీనియన్‌ ఇచ్చినప్పటికీ దానిని బేఖాతరు చేసి... జగన్‌ దగ్గరే ఉన్న షేర్స్‌ సర్టిఫికెట్స్‌ పోయినట్లుగా ఏకంగా తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి మరీ షేర్స్‌ బదలాయించారు. షర్మిల ఒత్తిడి ప్రభావం మీమీద ఎంత వరకు ఉందో దీనిని బట్టి తెలియడం లేదా?

    మీరు అఫిడవిట్‌ ఇచ్చిన తర్వాత ఎన్‌సీఎల్‌టీలో వాదనలు జరిగాయి. ఆ తరువాత జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా మేలుకోకుండా రాజకీయంగా దుమారం రేపడం కోసం షర్మిల ఆధ్వర్యంలో మీరు మళ్లీ కోర్టును అప్రోచ్‌ అయ్యారు. ఇపుడు తెలిసిపోతుంది కదా? ఈలోగా మీరే దీనిని దుమారం చేస్తూ షర్మిల ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. దానివీుద మేము సహజంగానే స్పందిస్తాం. మేం స్పందించకూడదా?

    జగన్ ఓర్పుగా ఉన్నాడని.. శత్రువులతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు

    అసలు మీడియాకు ఎక్కుతున్నది ఎవరు? ఆస్తుల వ్యవహారానికి సంబంధించి మొదటిసారిగా చంద్రబాబు ద్వారా, టీడీపీ మీడియా ద్వారా షర్మిల తన అన్నకు రాసిన లేఖను ఎవరు లీక్‌ చేశారు? షర్మిల కాదా? మరి ఆ లేఖను అడ్డుపెట్టుకుని, మా నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తుంటే.. వాస్తవాలను చెప్పడం తప్పవుతుందా తల్లీ?

    విజయమ్మగారు.. మీరు పెద్దవారు. మేం ఏమీ అనలేం. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు మొదటనుంచీ వన్‌సైడ్‌ తీసుకున్నారు. షర్మిల సైడ్‌ తీసుకున్నారు. షర్మిల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని మీరు అమెరికా నుంచి వీడియో మెసేజ్‌ ద్వారా పిలుపునివ్వడం నిజం కాదా? ఏ కాంగ్రెస్‌ పార్టీ అయితే జగన్‌ను ఇబ్బంది పెట్టిందో, వైఎస్సార్‌గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిందో అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వమని జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల కోసం మీరు పిలుపు ఇచ్చారు.

    టీటీడీ కల్తీనెయ్యి, హెరిటేజ్‌ తప్పులు, బీఆర్‌ నాయుడు తప్పులు, పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ విషయం నేపథ్యంలో టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి షర్మిలతో చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టిస్తారు. దానివీుద మేము రియాక్ట్‌ అయితే మీరు రంగంలోకి దిగుతారు. కోర్టులలో ఇప్పటికే సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌లలో భాగంగా మరో తప్పుడు అఫిడవిట్‌ మీరు రిలీజ్‌ చేస్తారు. కానీ అది కోర్టుకు పోదు. కోర్టుకన్నా ముందు టీడీపీ ఆఫీస్‌లోని వెబ్‌సైట్‌లకు వెళుతుంది. అదే ఎల్లో మీడియాలో చూపిస్తారు. ఈ కుట్రలలో భాగంగా మీరు బురద వేస్తూ మమ్మల్ని రెస్పాండ్‌ కావద్దని మళ్లీ విన్నవిస్తారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? 

     

     

  • కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి  బండి సంజయ్‌ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్‌. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్‌ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు 

    ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?

    బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు.  ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. 

  • మహారాష్ట్ర రాజకీయాల్లో మరో రాజకీయ దుమారం చెలరేగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్‌ ఖారత్‌తో  ఆ రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్‌  రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ వివాదం చెలరేగింది.  

    మహిళా చైర్‌పర్సన్స్‌ పదవికి రూపాలి రాజీనామా చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.  చైర్‌పర్సన్‌ పదవికి చకాంకర్‌ తక్షణమే రాజీనామా చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

    ప్రస్తుతం మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రుపాలి చకాంకర్..  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో  ఉన్నారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన నాయకురాలు.  మహారాష్ట్ర అధికార పార్టీలో బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్‌ షిండే), అజిత్‌ పవార్‌ ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. 

    ఇదిలా ఉంచితే, ఆ రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌ అశోక్‌ ఖారత్‌.. ఓ మహిళను ఆస్ట్రాలజీ పేరుతో మోసం అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె బెదిరించి, భయపెట్టి గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

    దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక పెన్‌డ్రైవ్‌లో 58 వీడియోలు, అందులో కొన్ని అభ్యంతరకరమైన క్లిప్స్ కూడా ఉన్నట్లు కనుగొన్నారు. తన రాజకీయ-సామాజిక సంబంధాలను ఉపయోగించి, ఆధ్యాత్మిక కర్మకాండల పేరుతో వారిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం, బెదిరింపు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, మహారాష్ట్రలో అమలులో అఘోరి ఆచారాలు, నల్లమంత్రికలు వంటి అమానుష పద్ధతుల నిర్మూలన చట్టం కింద కూడా అతనిపై కేసులు పెట్టారు.

    అయితే ఇప్పుడు మహిళా చైర్‌పర్సన్‌ రూపాలి ..  ‘కెప్టెన్‌’ అని చెప్పుకునే సదరు ఆస్ట్రాలజర్‌ అశోక్‌తో దిగిన ఫోటోలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  

  • సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ జాబ్ కేలండర్‌ని జోక్ కేలండర్‌గా మార్చారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆ కేలండర్‌లో డేట్‌లు ఉన్నాయి.. గానీ ఉద్యోగాల డేటా లేదు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపున్నారు. లోకేష్, చంద్రబాబే కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గతంలో చాలాసార్లు చెప్పారు. మాటల్లో మాత్రం గ్లోబల్ లెవల్లో మాట్లాడతారు. చేతల్లో మాత్రం ఏమీ ఉండదు’’ అంటూ తాటిపర్తి ధ్వజమెత్తారు.

    ‘‘నారా వారు కాదు.. నీరో వారని నిరూపించుకున్నారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదు.. చదువుకొన్న వ్యక్తి. అందుకే నిరుద్యోగుల కష్టాలు ఆయనకు తెలియవు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ చేస్తున్నది లేదు. అర్హత లేని లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రులు అయ్యారుగానీ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్

    ..వైఎస్‌ జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను చంద్రబాబు తీసేశారు. ఔట్ సోర్సింగ్‌లోనే 9 వేల ఉద్యోగాలు తొలగించారు. ఏపీ ఫైబర్‌లో 2 వేల మంది ఉద్యోగులను  తొలగించారు. రేషన్ వాహనాల్లో పని చేసే 2,900 ఉద్యోగులను తొలగించారు. బేవరేజ్ కార్పొరేషన్‌లోని 18 వేల మందిని తొలగించారు. తొలగించటమే తప్ప చంద్రబాబు ఇచ్చేదేమీ ఉండదు. గ్రూప్-2 కోసం ఏళ్లుగా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. నిరుద్యోగుల జీవితాలతో లోకేష్ బంతాట ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి పేరుతోనూ మోసం చేశారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి కేటాయింపుల్లేవ్. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసే లేదు. వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదు’’ అంటూ తాటిపర్తి చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

    నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి

     

  • సాక్షి, హైదరాబాద్‌: భట్టి బడ్జెట్‌ బోగస్‌ బడ్జెట్‌ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్‌లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.

    ‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్‌ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్‌లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్‌,ప్యూర్‌,రేర్‌ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్‌ అంతా బోగస్‌ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా
  • తిరుపతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ నాడు కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. 

    ‘జగనన్న పాలనలో ప్రతి పేదవాడు,ఉద్యోగి, రైతు, సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు నుంచి  సూపర్ సిక్స్ అని ,మ్యానిఫెస్టోలో పెట్టారు. సూపర్‌ సిక్స్‌తో సూపర్‌ మోసం చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇస్తామని,మోసం చేశారు. రైతులుకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చారా..? ఏవిధంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎవరు సంతోషంగా లేరు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

    సిగ్గులేని  బీఆర్‌ నాయుడు.. చైర్మన పదవి నాకు ఏమైనా అన్నం పెడుతుందా అంటాడు.. హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నాయి అంటాడు.. అర్హత లేని వాళ్లకు గౌరవం ఇస్తే ఇలానే ఉంటుంది.. రాజీనామా చెయ్..  బీఆర్‌ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి తరమి కొట్టాలి’ అని ఆర్‌కే రోజా విమర్శించారు. 

    YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన
  •  

    సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్‌లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.

    ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్‌సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..  ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు.

    బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్
  • తెలుగు రాష్ట్రాల్లో తరచూ వినిపించే వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు తమిళనాట ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళ రాజకీయంగా ఒంటరయ్యారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా నిలిచిన ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ ఇప్పుడు అదే శశికళ వ్యూహాలకు బలవుతున్నారా? ఆనాడు అండగా నిలిచిన ఉదయ్ ఓటమికి శశికళ పావులు కదుపుతున్నారా? అందుకే ఆమె తిరుమంగళం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారా? ఇప్పుడు దక్షిణ తమిళనాడులో.. ఇంకా చెప్పాలంటే మదురైలో ఇదే చర్చ జరుగుతోంది.

    మదురై జిల్లాలోని తిరుమంగళం నియోజకవర్గానికి వీఐపీ అసెంబ్లీ సెగ్మెంట్‌గా పేరుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. శశికళ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై దృష్టిసారించడం ఇందుకు ప్రధాన కారణం. శశికళ శిష్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష ఉపనేత అయిన ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ని ఓడించేందుకు శశికళ వ్యూహాలకు పదునుపెడుతున్నారనే చర్చ తిరుమంగళంలో జరుగుతోంది. నిజానికి ఉదయ్‌కి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు రెండుసార్లు అప్రతిహతంగా విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్నారు.

    జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతుగా నిలిచిన వారిలో ఉదయ్ ముందంజలో ఉంటాడు. అయితే.. ఆ తర్వాత వీరి మధ్య దూరం ఎందుకు పెరిగింది?? ఈ ప్రశ్నకు తదనంతర పరిణామాలే ప్రధాన కారణమనే సమాధానం వస్తోంది. జయ మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు. దాంతో.. ఉదయ్ ఆయన వర్గానికి దగ్గరయ్యారు. అయితే.. ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. సొంతపార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారు. అంతేకాదు.. పొత్తుధర్మంలో భాగంగా ఈ సీటును ఎన్డీయేకు ఇవ్వడానికి కూడా పళనిస్వామి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ తనకే టికెట్ దక్కినా.. ఉదయ్‌ని ఓడించడమే లక్ష్యంగా శశికళ పావులు కదుపుతున్నారు. దీంతో.. ఉదయ్ విజయం అంత సులభమేమీకాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా.. ఇక్కడ దళపతి విజయ్ పార్టీ టీవీకే చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరాక.. తిరుమంగళంలో కూడా పరిణామాలను అంచనావేసే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

    జయలలితకు నెచ్చెలిగా ఉంటూ.. రాజకీయాలను బాగా వంటబట్టించుకున్న శశికళ.. ఇప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు వస్తున్నారు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్ జీవా నాచియార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవా నాచియార్‌ ముక్కులత్తోర్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే వర్గానికి చెందిన ఉదయ్‌కుమార్‌కు ఇది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా ఉదయ్ వర్గీయులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు. ఉదయ్ మద్దతుదారులను డీఎంకేలో చేర్చుకున్నారు. ఈ పరిణామాలు పళనిస్వామి వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది.

    ఒకప్పుడు ఉదయ్ మద్దతుదారులుగా ఉన్నవారు ఇప్పుడు పళనిస్వామికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ పరిణామాలను తట్టుకుని ఉదయ్ విజయం సాధించి, హ్యాట్రిక్‌ను నమోదు చేసుకుంటారా? శశికళ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి, విజయం సాధిస్తుందా? పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా.. వీరి వివాదం మూడో వ్యక్తి విజయానికి బాటలు వేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! 

National

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీదీకే వచన్ పేరుతో ప్రజలకు పది హామీలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. దీదీకే వచన్ దువారో చికిత్స ( ప్రజలకు ఇంటి వద్దకే వైద్యసేవలు) నిరుద్యోగులకు ప్రతినెల రూ.1,500, మహిళలకు ప్రతినెల రూ. 1,500,ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1,700 అందజేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని సంక్షేమ ఫలితాలను ప్రకటించింది. బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్‌ 23, 29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.

    కాగా ఇటీవలే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు,కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి.మెుత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు.  ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. సీఎం మమతా బెనర్జీ పేచీలో ఉ‍న్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించి వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది. 

    అయితే పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సారి 226 కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా నాలుగవ సారి అధికారం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ ఏడాది భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపింది. దీంతో బీజేపీ సైతం మమత పోటీ చేస్తున్న స్థానంలో తమ అభ్యర్థిగా సువేందు అధికారిని నిలపనుంది.  

    2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన మమత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. దీంతో భవానీపూర్‌ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 2021లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021లో 77 స్థానాలు చేజిక్కించుకొని ‍ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

  • ట్రెండింగ్‌లో ఉండాలనే పిచ్చి ప్రజలను ఏ పనికైనా ఉసిగొలుపుతుంది. కొందరేమే సెన్షేషన్ పేరుతో రీల్స్‌ చేసి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరేమే కొత్తదనం కోరుకుంటూ నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాన్ని ముగించినట్లు ఫోటోషూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకొని నూతన జీవితం ప్రారంభించాల్సిన జంట నీటిలో పడి తేలియాడతూ వీడియో తీశారు. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

    ప్రస్తుతం కాలంలో సంప్రదాయాలు ఏ విధంగా మారుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఆధునికత పేరుతో తమకు నచ్చిన ట్రెండ్‌ను యువత ఫాలో అవుతున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఫేమస్‌ అయ్యాయి. రకారకాల లోకెషన్లలో ఫోటోలు దిగుతూ సాంగ్స్ షూట్ చేస్తూ మ్యారేజ్‌ని సెలబ్రేట్‌ మోడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక జంట తమ వెడ్డింగ్ షూట్‌ని వెరైటీగా ప్లాన్ చేసింది.

    తెల్లబట్టలు ధరించిన యువతీ యువకులు బురద గుంటలో నీటిలో తేలియాడుతూ నటించారు. దీనిని ఆ ఫోటో గ్రాపర్‌ సినిమాటిక్ రేంజ్‌లో షూట్ చేస్తున్నట్లు హంగామా చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు."వన్యప్రాణి ఫోటో గ్రాఫర్‌ను కాస్త పెళ్లళ్ల ఫోటో గ్రాఫర్ చేశారు" అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. మరోకరు టైటానిక్ మరియు గంగమ్ స్టైల్‌ కలయిక అని కామెంట్ పెట్టారు.  మరోకరు ఇది పెళ్లికి ముందు ఫోటో షూటా లేక పెళ్లి తర్వాతదా అని సరదాగా ప్రశ్నించారు.

    అయితే ఇటీవల కాలంలో ప్రజలు సెన్షెషన్‌ల కోసం తెగబడిపోయి ఇష్ఠారీతిన వ్యవహరిస్తున్నారు. కొందరేమే రీల్స్ మోజులో పడి ప్రాణాల పైకి తెచ్చుకుంటే మరి కొందరేమో ఇలా శుభకార్యం జరిగే ముందు సెన్షేషన్ కోసం ఇలా ఇబ్బందికర షూట్‌లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి కల్చర్ అసలు ఎటు వైపు వెళుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

  • సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డు సాధించింది. టికెట్‌ తనిఖీల్లో భాగంగా అక్రమంగా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి వారికి పెద్ద మెుత్తంలో జరిమానా విధించింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 223 కోట్లకు పైగా ఫైన్‌ల ద్వారా ఆదాయం పొంది ఇండియాలోనే మెుదటి స్థానంలో నిలిచింది.

    టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం అని అందరికి తెలుసు. అయినా కొంతమంది అత్యుత్సాహంతో టికెట్ లేకుండా ప్రయాణించి రైల్వేను బురిడి కొట్టిద్దామని చూస్తారు. అయితే అలా చేస్తూ ఇరకాటంలో పడతారు. దొరికిన అనంతరం పెద్ద మెుత్తంలో జరిమానా చెల్లించి లబోదిబోమంటారు. తాజా నివేదికలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దక్షిణమధ్య రైల్వేకు ఏకంగా రూ. 223 కోట్లకు పైగా  టికెట్ లేకుండా ప్రయాణించడం ద్వారా వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 221.08 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపుకు 14 రోజులు ఉండగానే రికార్డు స్థాయిలో రూ. 223.60 కోట్లు జరిమానాల ద్వారా రైల్వేకు వచ్చాయి. టికెట్‌ లేకుండా ప్రయాణించడం, అత్యధిక లగేజ్‌ కలిగి ఉండడం తదితర చట్టరీత్యా వ్యతిరేకమైన ప్రయాణాలకు జరిమానాలు వేయడం ద్వారా ఇంత పెద్ద మెుత్తంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా 2025 అక్టోబర్‌ 18 ఒక్కరోజే రూ. 1.85 కోట్లు జరిమానాల ద్వారా వసూలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇండియాలో ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఇదే అత్యధిక జరిమానాల వసూలని పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ " గతంలో ఏ ఆర్థిక సంవత్సరం ఇంతపెద్ద మెుత్తంలో రైల్వేకు ఆదాయం రాలేదన్నారు. రైల్వేశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేసి నేరపూరిత ప్రయాణాన్ని అరికట్టారని వారందరికీ అభినందనలని తెలిపారు.  

     

  • చెన్నై: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు సభ్యులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. వీరితో పాటు మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్‌ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు. 

    ‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాల‌ని బీజేపీ నాయ‌కుల‌ను వ్య‌క్తిగ‌తంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి బీజేపీ నాకు అవకాశం క‌ల్పిస్తే బెంగాల్‌లో త‌ణ‌మూల్ ప్ర‌భుత్వాన్ని ఓడించి మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించడానికి ప్ర‌య‌త్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుద‌ల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.

    క‌చ్చితంగా టికెట్ వ‌స్తుంది
    బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. త‌న భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయ‌న్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే త‌న భార్య‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌ని వెల్ల‌డించారు. త‌మ‌కు క‌చ్చితంగా పోటీ చేసే అవ‌కాశం బీజేపీ క‌ల్పిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే త‌న భార్య ప్ర‌త్య‌క్ష‌ రాజకీయాల్లోకి వ‌స్తోంద‌ని చెప్పారు. 

    112 మందితో బెంగాల్లో బీజేపీ రెండో జాబితా  
    న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ శాసనసభలో పోటీచేసే 112 మంది అభ్యర్థులతో బీజేపీ తమ రెండో జాబితాను గురువారం విడుదలచేసింది. హింగాల్‌గంజ్‌లో రేఖా పాత్రాను, సోనార్‌పూర్‌ దక్షిణ్‌లో రూపా గంగూలీని బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇతాహర్‌లో సబితా బర్మన్, నబగ్రామ్‌లో దిలీప్‌ సాహా, ఖర్‌గ్రామ్‌లో మిథాలీ మాల్, కండీలో గర్గీదాస్‌ ఘోష్‌ను పోటీకి నిలబెడుతున్నట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

    భరత్‌పూర్‌ నుంచి అనామికా ఘోష్, బొంగావ్‌ దక్షిణ్‌ నుంచి స్వపన్‌ మజూందర్, కమర్‌హాతిమ్‌ నుంచి అరూప్‌ చౌదరీ, సందేశ్‌ఖాలీ నుంచి సనత్‌ సర్దార్, మందిర్‌బజార్‌ నుంచి మల్లికా పైక్, ఎంటలీ నుంచి ప్రియాంకా తిబేరేవాల్, బాలాగఢ్‌ నుంచి సుమనా సర్కార్‌ పోటీకి నిలబడుతున్నారు. 

    చ‌ద‌వండి: కేరళ సీఎం విజయన్‌ ఆస్తులు ఎంతో తెలుసా? 

Family

  • చిన్న స‌మ‌స్య అయితే రూ. 250, పెద్ద స‌మ‌స్య అయితే ఐదు వంద‌ల రూపాయ‌లు.. ఇవేమీ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి పెట్టిన ధ‌ర‌లు కావు. బ్యాంకుల్లో స‌ర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మ‌రేంటి? సాటి మ‌నుషుల బాధ‌ల‌ను విన‌డానికి ఓ వ్య‌క్తి నిర్ణ‌యించిన‌ ధ‌ర‌లు ఇవి. ఏంటి స‌మ‌స్య‌లు విన‌డానికి డ‌బ్బులు ఇవ్వాల‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? పూర్తి వివ‌రాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్‌కు వెళ్లాల్సిందే.

    ముంబై మ‌హాన‌గ‌ర‌ స‌ముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అత‌డు ప‌ట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధ‌లు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అత‌డి రెండు ఫోన్‌ నంబ‌ర్ల‌తో పాటు ఏ స‌మ‌స్య‌కు ఎంత మొత్తం తీసుకుంటాడ‌నే వివ‌రాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆస‌క్తిగా అనిపించి ఓ వ్య‌క్తి అత‌డితో మాట క‌లిపాడు. దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ మారింది.

    క‌లిసి ఏడ‌వ‌డానికి రూ. 1000!
    చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్ల‌మ్స్ అయితే రూ. 500 తీసుకుంటాన‌ని అత‌డు చెప్పాడు. స‌మ‌స్య‌లు విన‌డ‌మే కాకుండా కలిసి కూర్చుని త‌నివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయ‌లు ఇవ్వాల‌ని తెలిపాడు. డ‌బ్బు చెల్లించి ఇలా ఎవ‌రైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయ‌రు'' అంటూ ప్ర‌శ్నించాడు. త‌న సేవ‌ల‌కు మ‌న్నన ద‌క్కుతుంద‌ని చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడ‌త‌ను. త‌న పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra)  అని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకే తానిక్క‌డ ఉన్నాన‌ని చెప్పాడు. త‌న‌కు ఇన్‌స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉంద‌ని వెల్ల‌డించాడు. 

    భావోద్వేగ మద్దతు కోసం
    పృథ్వీరాజ్ వీడియో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌నుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొంత మంది అత‌డి సేవ‌ల‌ను మెచ్చుకుంటే, మ‌రికొంద‌రు డ‌బ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమ‌ర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మ‌హాన‌గ‌రాల్లో ఒంట‌రి జీవితాలు వెళ్ల‌దీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవ‌స‌రమ‌న్న వాద‌న‌తో అంద‌రూ ఏకీభ‌విస్తున్నారు. క‌ష్ట‌సుఖాలు పంచుకునేందుకు, మ‌నుసులోని భావాలు పంచుకునేందుకు మ‌నుషులు క‌ర‌వవుతున్న న‌గ‌ర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వార‌ని పేర్కొంటున్నారు.

    చ‌ద‌వండి: ‘నంబర్‌ 1’ ఎప్పటికీ ఒంటరే!

    కాగా, ఈ వైర‌ల్ వీడియో తీవ్ర‌మైన స‌మ‌స్య‌ను వెలుగులోకి తెచ్చింద‌ని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కార‌ణంగా న‌గ‌ర జీవులు మాన‌సిక స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నార‌ని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేక‌పోవ‌డంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. త‌మ బాధ‌ల‌ను ఎవ‌రితో పంచుకోవాలో తెలియ‌క పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని వివ‌రించారు. 

    నెటిజ‌నుల స్పంద‌న‌
    పృథ్వీరాజ్ బోహ్రా వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్‌లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒక‌రు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మ‌రొక‌రు పేర్కొన్నారు. ఇలాంటి సేవ‌ల‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామ‌ని కొంద‌మంది స‌ర‌దాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మ‌హా న‌గ‌రాల్లో మ‌నుషుల‌ను ఒంటిత‌నం ఎంత‌గా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని, ఇక్క‌డ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజ‌నులు అంటున్నారు. అయితే మ‌నుషుల బాధ‌ల‌ను అలుసుకుగా తీసుకుని మోస‌గించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

     

  • ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. 

    నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్‌ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్‌ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.

    ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!

    వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. 

    కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. 

    టైమ్‌ పావర్టీ
    భూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్‌ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు.  

    ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì  దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్‌ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. 

    కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. సోలార్‌ పంపులు  వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు.   

    వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు.  చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.

    పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 

    2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.

    లింగ సమానత్వానికి అడ్డంకులు
    మన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.

    సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు.  

    మహిళల మహా శ్రమ

    ప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). 

    భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్‌ సీడబ్ల్యూఎంఐ 2018). 

    ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).

    ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్‌ ఉమెన్, 2024).

    ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్‌ ఉమెన్‌/యూఎన్‌డిఈఎస్‌ఏ, 2023).

    సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్‌ సీడబ్ల్యూఎంఐ).

    మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్‌ / ప్రపంచ బ్యాంకు). 

    ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్‌ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్‌ ఉమెన్, 2025).

    నీటిపారుదల సామర్థ్యం
    వ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్‌ అంచనా.

    సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్‌లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్‌కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్‌ / ఎఫ్‌ఏఓ తేటతెల్లం చేశాయి.

    ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.

    భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్‌/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  

    మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం 
    నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. 

    జల్‌ జీవన్‌ మిషన్‌ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్‌ భారత్‌ లక్ష్యం కూడా తద్వారా 
    నెరవేరుతాయి. 
    – మర్ది కరుణాకర్‌ రెడ్డి, ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త


    – నిర్వహణ: 
    పంతంగి రాంబాబు
    సాక్షి సాగుబడి డెస్క్‌ 

    (చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!)

  • చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్‌ నూనె వంటి ఎన్నో ఆయిల్స్‌ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్‌గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్‌..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..

    ఆ ఆయిల్‌ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్‌(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. 

    ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్‌ గురించి నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈ తైలం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్‌ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్‌కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్‌ పట్ల ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. 

    తయారీ..
    నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్‌, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.

    మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. 

    మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్‌ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!.

     

     (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!)
     

     

  • చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్‌లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్‌గా ఉండాలంటే ఈ ఫిట్‌నెస్‌  అండ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్‌ జమ్మాల్‌ టిప్స్‌ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.

    టాటాప్లే ఫిట్‌నెస్‌లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్‌నెస్‌ నిపుణుడు విద్యుత్‌ జమ్వాల్‌ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్‌కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. 

    అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్‌టైబుల్‌ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.

    వాకింగ్‌ ఒక్కటి చాలా..!?
    దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్‌నెస్‌ కోసం వాకింగ్‌ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. 

    దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్‌ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్‌ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు.

     

    (చదవండి: మా మాష్టారే పేషెంట్‌గా..!)

     

Guest Columns

  • విమానయాన రంగంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఒక దేశ గగనతలంలో ప్రయాణించే ప్రతి విమానాన్నీ సమన్వయం చేయడం వారి బాధ్యత. ఒక్క చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదిగా గుర్తించాలి. అయినా విమానయాన సంస్థలు వీరికి తగిన వేతనాలు, పని గంటల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని అనేక ఉద్యమాలు వచ్చాయి. అందులో 2026 మార్చి 7న ఇటలీ రాజధాని రోమ్‌లో 1,500 మంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె ఒకటి. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం కలిగించింది. ముఖ్యంగా రోమ్‌లోని ‘ఫ్యూమిచినో’ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్తంభించాయి.

    ఇటలీ గగనతలం యూరప్‌లో ప్రధాన మార్గాలలో ఒకటి. యూరప్‌ నుండి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వైపు వెళ్లే అనేక విమానాలు ఇటలీ గగనతలాన్ని దాటుతాయి. అందువల్ల రోమ్‌లో జరిగే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సమ్మె కేవలం స్థానిక సమస్యగా కాకుండా అంతర్జాతీయ విమాన రవాణాపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఉద్యోగులు తమ పని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

    గత దశాబ్దంలో ప్రపంచ విమానయాన రంగం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదలతో పోలిస్తే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల సంఖ్య తగినంతగా పెరగలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కో కంట్రోలర్‌పై పని ఒత్తిడి పెరిగింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య పరిమితంగా  ఉంటుంది. ఇటలీలో కొన్ని కంట్రోల్‌ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల్లో కొత్త నియామకాలు లేవు. ఈ సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు అదనపు షిఫ్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    చ‌ద‌వండి: ‘నంబర్‌ 1’ ఎప్పటికీ ఒంటరే!

    మరోపక్క ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు తగినంతగా పెరగడం లేదు. ఈ సమ్మెను యూరప్‌లో పెరుగుతున్న కార్మిక ఉద్యమాలలో భాగంగా చూడాలి. 2025 చివరి నుండి 2026 ప్రారంభం వరకు యూరప్‌లో రైల్వేలు, విమానయాన, ప్రజా రవాణా వంటి రంగాలలో కార్మిక అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాల్లో ఇదే సమయంలో రవాణా కార్మిక సమ్మెలు జరగడం గమనార్హం. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరగడం వంటి అంశాలు ఈ ఉద్యమాలకు కారణమయ్యాయి.

    – యాటల సోమన్న
    సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు 

Andhra Pradesh

  • తాడేపల్లి :  రేపు రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా..అల్లాహ్‌ స్మరణలో తరించే ఈ రంజాన్‌ పండగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. 

    అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

     

  • సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్‌ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్  భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

NRI

  • అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్‌ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.

    అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

    గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

    అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

    (చదవండి: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు)