Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • దుబాయ్‌లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు  వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు.  ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

    కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌  గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోయింది. 
     

     

  • రామ్‌ చరణ్‌ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్‌ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.

    తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌ పాడారు.  ఈ మోటివేషనల్‌ సాంగ్‌ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

     

     

  • స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ శుక్రవారం(మార్చి 06న) నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం(మార్చి 02) సాయంత్రం హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


     

  • రాధిక.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం తెలుగు, తమిళ స్టార్ హీరోలతో బోలెడన్ని సినిమాలు చేసింది. వయసు పెరిగిపోవడంతో తల్లి, పిన్ని తరహా పాత్రలు చేస్తూ వస్తోంది. అలాంటిది 63 ఏళ్ల వయసులో ఈమెని లీడ్ రోల్‍‌గా పెట్టి సినిమా తీస్తే కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చాలామంది యంగ్ హీరోలనే డామినేట్ చేస్తోందని చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

    తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మాతగా రాధిక ప్రధాన పాత్రలో తీసిన సినిమా 'తాయ్ కిళవి'. పూర్తిగా తమిళ నేటివ్ టచ్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌లో రాధిక లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పూర్తిగా డీ గ్లామర్ లుక్. చాలామంది ఈ తరహా పాత్రలు చేయడానికి సాహసిస్తారు. కానీ రాధిక డేర్ చేసింది. ఇప్పుడది వసూళ్ల రూపంలో కనిపిస్తుంది. కేవలం 3 రోజుల్లో రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.

    రీసెంట్ టైంలో అటు తెలుగులో గానీ తమిళంలో గానీ చాలామంది మిడ్ రేంజ్ హీరోలే వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లు తెచ్చుకోవడం అనేది కష్టంగా మారిపోయింది. అలాంటిది రాధికని పెట్టి ఓ సినిమా తీస్తే దానికి ఈ రేంజు వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పొచ్చు. అయితే 'తాయ్ కిళవి' చిత్రం సక్సెస్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదే తమిళనాడులో ఈ మధ్య కాలంలో సరైన మూవీస్ లేకపోవడం. లెక్క ప్రకారం సంక్రాంతికి 'జన నాయగణ్' రావాలి. కానీ నిరవధిక వాయిడా పడింది. వచ్చిన మిగతా మూవీస్ అన్ని తేలిపోయాయి. పెద్ద హీరోలు, మిడ్ హీరోల సినిమాలేం లేకపోవడం రాధిక చిత్రానికి కొంతవరకు ప్లస్ అయిందని చెప్పొచ్చు.

    'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక).. డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేస్తూ ఉంటుంది. ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి తరిమేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి బామ్మ మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి వస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

  • తమిళ హీరో, పార్కింగ్‌ ఫేమ్‌ హరీశ్‌ కల్యాణ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. 

    ఆనందంగా ఉంది
    తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్‌ చేశాడు. కాగా హరీశ్‌ కల్యాణ్‌- నర్మద ఉదయకుమార్‌ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

    సినిమా
    2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్‌, ప్యార్‌ ప్రేమ కాదల్‌, లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, పార్కింగ్‌, లబ్బర్‌ పండు, డీజిల్‌ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్‌, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్‌ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్‌ కల్యాణ్‌ నూరు కోడి వానవిల్‌ మూవీ చేస్తున్నాడు.

     

     

    చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ

  • ఇటలీ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల

    డిజైనర్ డ్రస్‌లో సోయగాలతో నిధి అగర్వాల్

    సాయిపల్లవితో ఫొటో షేర్ చేసిన నివేదా థామస్

    రాధలా అందంగా ముస్తాబైన నభా నటేశ్

    మెరుపుల ఔట్‌ఫిట్‌తో జాక్వెలిన్ జిగేల్ జిగేల్

    అవార్డ్ ఫంక్షన్ కోసం రకుల్ ఓ రేంజులో రెడీ

  • ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన లయ.. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. దాంతో సినిమాలకు దూరమైంది. కాకపోతే 2018లో వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోనిలో అతిథి పాత్రలో మెరిసింది. గతేడాది వచ్చిన తమ్ముడు చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. త్వరలో హాట్‌స్టార్‌లో రాబోతున్న మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే షోలో జడ్జిగా కనిపించనుంది.

    నాకు ఛాన్స్‌ ఇచ్చుంటే..
    ఈ షోలో పెళ్లయిన దంపతులతో పాటు ప్రేమలో ఉన్న జంటలు, సహజీవనం చేస్తున్న జంటలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో లవ్‌- మ్యారేజ్‌- సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా జనరేషన్‌లో లివింగ్‌ రిలేషన్‌షిప్‌ అన్న ప్రస్తావనే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఛాన్స్‌ ఇచ్చినా సరే నేనైతే ఆ పని చేయలేను. మారుతున్న కాలం ప్రకారం.. ఇప్పటి జనరేషన్‌వాళ్లు ఒకరి గురించి మరొకరు ముందే తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కొత్తగా వస్తున్న కాన్సెప్ట్‌.

    తప్పుపట్టను
    అంతకుముందు పెళ్లిలో ఇలాంటి విధానాలు లేవు. విడాకులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. కానీ, అన్నీ మారుతున్నాయి. కాబట్టి ఏది ఒప్పు? ఏది తప్పు? అని నేను చెప్పలేను. సహజీవనం చేస్తున్నవారిని నేను తప్పుపట్టలేను. వారి బంధం ధృడంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసుంటున్నారు. అది వారి వ్యక్తిగత విషయం అని లయ చెప్పుకొచ్చింది. 

    10 జంటలతో రియాలిటీ షో
    మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ విషయానికి వస్తే.. ఇందులో పది జంటలు పాల్గొననున్నాయి. వారిలో వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌, ప్రియాంక జైన్‌-శివకుమార్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మాస్క్‌ మ్యాన్‌- హరిత, అంజలి - పవన్‌, సాండ్రా- మహేశ్, నటరాజ్‌ మాస్టర్‌ - నీతూ, సోనియా, శుభ శ్రీ, నూకరాజు జంటలు కూడా పార్టిసిపేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విల్లాలో పది జంటల్ని పది వారాలు పెట్టి షో కొనసాగించనున్నారు. మరి ఇదెప్పుడు మొదలవుతుందో చూడాలి!

    చదవండి: లగ్జరీ కారులో సంపూర్ణేశ్‌ షికారు.. ఈ కార్‌ ధరెంతంటే?

  • హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)

    సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‍‌షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

    ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్‌కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. 

    (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

  • హృదయకాలేయం (2014) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేశ్‌బాబు. మొదటి సినిమాతోనే ఫుల్‌ వైరల్‌ అయిపోయాడు. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. మధ్యలో బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొన్నాడు. కానీ, పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోయాడు. నావల్ల కాదు నేనొచ్చేస్తానంటూ స్వతాహాగా బయటకు వచ్చేశాడు.

    స్పోర్ట్స్‌ కారులో తిరిగిన సంపూ
    అయితే ఇటీవల ప్యారడైజ్‌లో సంపూ లుక్‌ రిలీజ్‌ చేయగా మరోసారి నెట్టింట వైరల్‌ అయిపోయాడు. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గొడ్డలి పట్టుకుని రౌడీ అవతార్‌లో కనిపించాడు. తాజాగా సంపూర్ణేశ్‌బాబు స్పోర్ట్స్‌ కారులో కనిపించాడు. హైదరాబాద్‌ రోడ్లపై రెడ్‌ కలర్‌ స్పోర్ట్స్‌ కారు వేసుకుని తిరిగాడు. ఇది చూసిన అభిమానులు సంపూ ఈ కారెప్పుడు కొన్నాడని ఆశ్చర్యపోతున్నారు. 

    ఆ డబ్బుతోనే కొన్నాడా?
    ఈ కారు ఎంజీ సైబర్‌స్టర్‌ బ్రాండ్‌కు చెందినది అని తెలుస్తోంది. దీని ధర రూ.75 లక్షలపైనే ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు సైకిల్‌ మీద తిరిగే నటుడు ఇప్పుడు లగ్జరీ కారు నడుపుతుండటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యారడైజ్‌ సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్‌తోనే ఈ కారు కొని ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్యారడైజ్‌ సినిమా విషయానికి వస్తే.. నాని-శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది! 

    సినిమా
    గతంలో వీరిద్దరూ దసరా చిత్రంతో బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపించారు. ఈ సారి వినూత్న కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని జడల్‌ పాత్రలో నటిస్తుండగా మోహన్‌బాబు విలన్‌గా శికంజ మాలిక్‌గా, సంపూర్ణేశ్‌ బిర్యానీ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పోస్టర్స్‌, సాంగ్‌ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.

     

     

    చదవండి: దుబాయ్‌లో మెగా డాటర్‌ శ్రీజ

  • మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.

    మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.

    (ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)

    'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.

    కెరీర్‌లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? 

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌   దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్‌ చేశారు.

    దుబాయ్‌లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్‌ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్‌లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు.  దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్‌ చేశారు.  శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్‌లో  స్థిరపడినట్లు తెలుస్తోంది.

  • టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ‍్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

    అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.

    విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. 

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

  • పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేవాలపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగిస్తోంది. అటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులతో పలుచోట్ల ఎయిర్‌పోర్టులను మూసివేశారు. దాంతో ఎంతోమంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

    దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ
    వారిలో అజిత్‌, ఈషా గుప్తా, సోనాల్‌ చౌహాన్‌, మంచు విష్ణు వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. విష్ణు అయితే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి ఉండగా తనపై నుంచే క్షిపణులు వెళ్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసి తన చిన్నకూతురు భయపడిపోయిందని పేర్కొన్నాడు. ఈ వీడియో కింద అభిమానులు విష్ణు కుటుంబంతో సహా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

    మనసుకి కష్టం
    ఈ క్రమంలో మంచు విష్ణు సోదరి, నటి లక్ష్మీ మంచు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. దుబాయ్‌లో ఉన్న విష్ణు, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనకు బాగా కావాల్సిన వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తట్టుకోవడం చాలా కష్టం. మీ అందర్నీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను. ఆ దేవుడి దయ మీకు రక్షణగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమే గెలుస్తుంది అని రాసుకొచ్చింది.

    చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల జాబితా

  • పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రెండు దేశాలతో పాటు యుద్ధ ప్రభావం.. యూఏఈ, దుబాయి, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలపై కూడా పడింది. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్‌కి గురిచేస్తున్నాయి.

    'మన దేశం.. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేం సహించం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం' అని రష్మి తన ట్విటర్‌లో రాసుకొచ్చింది. రాడికల్ (అతివాద) ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్లని దయచేసి ఇరాన్‌కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్ల మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

    రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు రష్మి.. వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా వాటికి కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. 'నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నాసరే నా దేశంలో పూర్తి గౌరవంతో వ్యక్తిత్వంతో బతుకుతున్నాను' అని రష్మి చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. .

  • 2026లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 13కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్)

    ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. ఓం శాంతి శాంతి శాంతిః లాంటి తెలుగు చిత్రంతో పాటు విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ ఇదే వీకెండ్ అందుబాటులోకి వస్తాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఓటీటీలోకి వస్తుందేమో చూడాలి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రాలేదు. బహుశా ఈ వారం రావొచ్చేమో చూడాలి? ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 02 నుంచి 08 వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

    • హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06

    • వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06

    అమెజాన్ ప్రైమ్

    • తన్వి ద గ్రేట్ (హిందీ మూవీ) - మార్చి 03

    • యంగ్ షెర్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04

    • సుబేదార్ (హిందీ సినిమా) - మార్చి 05

    హాట్‌స్టార్

    • విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06

    ఆహా

    • ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు సినిమా) - మార్చి 04

    సోనీ లివ్

    • లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06

    సన్ నెక్స్ట్

    • డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06

    • గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06

    జీ5

    • గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06

    • జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06

    (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)

  • మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్‌ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ కెరీర్‌ గురించి ఓ సారి చూసేద్దాం..

    బాలీవుడ్‌ మూవీతో కెరీర్‌ మొదలు
    ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ సంస్థాపకుడు అల్లు అరవింద్‌ చిన్న కుమారుడే అల్లు శిరీష్‌. అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్‌ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్‌ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్‌' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 

    హీరోగా కంటే ముందు
    కొత్త జంట చిత్రంతో క్రేజ్‌ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్‌ బర్న్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్‌ మొదలవడానికే ముందే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. 

    ఆమిర్‌ ఖాన్‌కు అభిమాని
    ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్‌ మాట్లాడుతూ.. లగాన్‌, గులాం సినిమాలు చూశాక ఆమిర్‌ ఖాన్‌కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్‌ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.

    అదే ఎక్కువ ఇష్టం
    తమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్‌ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్‌ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.

    చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్‌ 

  • కన్నడ నటుడు యశ్  హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. యశ్‌, కియారా ఆద్వాణిల మధ్య సాగే 'తాబాహీ..' ఈ పాటను   విశాల్ మిశ్రా ఆలపించగా రామజోగయ్య శాస్త్రి తెలుగు సాహిత్యం రాశారు. టాక్సిక్‌లో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్న విషయం తెలిసిందే.

    టాక్సిక్‌ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఈ పాట మొదటిసారి వినగానే బాగుంది. కానీ, మరింత బలంగా ఆకర్షించేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. సినిమా నుండి  రొమాంటిక్ సాంగ్‌ను ఆశించిన వారు కొంచెం నిరాశ చెందవచ్చు. ఒకే పోస్టర్‌తో సాంగ్‌ను విడుదల చేశారు. కనీసం వీరిద్దరి స్టిల్స్‌, విజువల్స్‌ చేర్చకుండా పాటను విడుదల చేయడంతో ఇది అభిమానులను మరింత నిరాశపరచవచ్చు.  ఈ సినిమా మార్చి 19న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.

  • మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్‌ దర్శకుడు చిదంబరం వివాదంలో చిక్కుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. 2022లో కొచ్చి నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్ తనతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. శ్రీ చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75 (లైంగిక వేధింపుల నేరాలు) కింద అభియోగాలు మోపారు.

    2024లో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా చిదంబరం విపరీతమైన గుర్తింపు పొందారు. ఈ మూవీతో సినీ రంగంలో ప్రముఖ యువ దర్శకులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు.  2021లో ‘జాన్‌.ఈ.మ్యాన్‌’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

  • చెక్‌ బౌన్స్‌ కేసు కారణంగా కమెడియన్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్‌ జైలు నుంచి బెయిల్‌ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్‌, కామెడీ, మినీ సిరీస్‌.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. 

    విద్య కారణం కాదు
    ఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌పాల్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్‌ కాదు.

    కొన్నిసార్లు తప్పవు
    నేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్‌ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. 

    నీ కొడుకులాంటివాడిని
    ఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్‌ గోపాల్‌ వర్మ, డేవిడ్‌ ధావన్‌, ప్రియదర్శన్‌.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్‌లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్‌కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.

    సినిమా
    కాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రస్తుతం భూత్‌ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్‌పాల్‌ యాదవ్‌.. వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, హైవాన్‌, మరో రెండు సినిమాలు, రెండు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నాడు.

    చదవండి: వారణాసి అప్‌డేట్‌ ఇచ్చిన ప్రియాంక

  • సార్‌, లక్కీ భాస్కర్‌ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం (మార్చి 2న) రిలీజ్‌ చేశారు. సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. 

    ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా
    పోస్టర్‌లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్‌ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్‌ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్‌, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

    సినిమా
    మరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక.  మరోటి.. మలయాళ డైరెక్టర్‌ జిత్తు మాధవన్‌ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది.

     

     

    చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్‌.. ఫోటో వైరల్‌

International

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో ఖమేనీ కుటుంబ సభ్యులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆ దాడుల్లో ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడింది. దాంతో మన్సూరేని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మన్సూరే మృతిపై ఇరాన్‌ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    సోమవారం నాడు తను మరణించినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఇరాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మన్సూరే ఖోజాస్తే కూడా మరణించడంతో ఉద్రితకలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సామ్రాజ్యవాద శక్తుల దాడులను భీకరంగా తిప్పికొడతామని ఇప్పటకే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. 

  • వాషింగ్టన్‌: ప్రస్తుతం  జరుగుతున్న యుద్ధంపై అమెరికా రక్షణ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమతో పెట్టుకుంటే  ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని అమెరికా రక్షణమంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ హెచ్చరించారు. అమెరికాను బాధించినా, అమెరికన్లను బాధపెట్టినా క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఎంతటి వారైనా అమెరికా జోలికి వస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అమెరికా జోలికి వచ్చిన వారిని భూమిపై ఎక్కడున్నా, వేటాడి, వెంటాడి మట్టుబెడతామన్నారు. 

    యుద్ధం తాము ప్రారంభించలేదని, కానీ ముగింపు మాత్రం తామే ఇస్తామని హెచ్చరించారు. ‘యుద్ధం మేం ప్రారంభించలేదు.. మేము ముగింపును కచ్చితంగా ఇస్తాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్‌ అణ్వాయుధాల తయారీ కొనసాగించింది. 

    అమెరికా, ఇజ్రాయెల్‌కు చావేనని ఖమేనీ అన్నారు. కానీ యుద్ధంలో ఖమేనీ చనిపోయారు. మేము ఇరాన్‌ పాలకులను మార్చడానికి యుద్ధం చేయడం లేదు. ఆ దేశంలో  అణ్వాయుధాలను అంతం చేయడానికే యుద్ధం చేస్తున్నాం. ఇరాన్‌ దారికి రాకపోతే దాడులు తీవ్రతరం చేస్తాం. ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెబుతాం’ అంటూ అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా రక్షణశాఖ వ్యాఖ్యలతో యుద్ధం తీవ్రత మరింతగా ఉండబోతుందనే సంకేతాలను ఇచ్చింది. 

      

     

     

  • ఇరాన్‌పై దాడుల వెనక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి ఉందా? నిజానికి చర్చలతో ఇరాన్‌ను దారికి తీసుకువద్దామనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం నెతన్యాహు ఒత్తడికి తలొగ్గాడా? తాను సంయమనం పాటిద్దామనుకున్నా.. నెతన్యాహు ఆగేలా లేడని తెలిసి.. అతనికి జైకొట్టాడా? గడిచిన నెల రోజుల్లో మారిన పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఉన్నఫళంగా ఇరాన్‌పై ఉరుము ఉరిమినట్లుగా ఫైటర్ జెట్లు విరుచుకుపడడం.. సుప్రీంలీడర్ ఖమేనీని అంతమొందించడం వెనక అసలు వ్యూహం ఎవరిది? 

    నోబెల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్న ట్రంప్.. చర్చల ద్వారా ఇరాన్‌ను దారికి తీసుకురావాలనుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పుడు.. ట్రంప్ నిరసనకారులకు బేషరతుగా మద్దతిచ్చారు. నిరసనలను అణిచివేస్తే.. ఇరాన్‌పై దాడి చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ఫలితంగా.. ఉరిశిక్ష పడ్డ పలువురు ఆందోళనకారులకు ఆ శిక్ష నుంచి విముక్తి లభించింది. గత ఏడాది జూన్‌లో అమెరికా దళాలు ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే..! అదే సమయంలో ఇజ్రాయెల్‌తో కలిసి.. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్స్‌ను హతమార్చింది. ఈ నేపథ్యంలో.. ట్రంప్ కన్నెర్ర చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించిన పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాలు దౌత్యపరమైన పరిష్కారం కోసం ముందుకు వచ్చాయి.

    నిజానికి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన ఇరాన్‌లో ప్రజాందోళనలతో పరిస్థితులు దిగజారాయి. దాంతో.. ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి ఇటు అమెరికాకు గానీ, అటు ఇజ్రాయెల్‌కి గానీ ముప్పు లేదని ట్రంప్‌కు తెలుసు. అందుకే ట్రంప్ దౌత్య మార్గంలో వెళ్దామని భావించారు. ఇరాన్ నేతలు తెరవెనక నుంచి అమెరికాలో ట్రంప్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుయుక్తులు పన్నుతున్నా.. ఇజ్రాయెల్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్నఎన్నికల్లో నెతన్యాహును దింపేందుకు వ్యూహాలు చేస్తున్నా.. ట్రంప్ మాత్రం చర్చల వైపే మొగ్గుచూపారు. 

    గత నెల 26న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు కొంత వరకు పురోగతిని సాధించాయనే చెప్పవచ్చు. దీంతో.. వచ్చేవారం వియన్నాలో చర్చలకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇందుకు ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. 

    చర్చల వైపు ట్రంప్ మొగ్గుచూపుతూ.. ముందుకు సాగుతుంటే.. ఇజ్రాయెల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏ క్షణమైనా దాడి చేద్దామంటూ అమెరికాపై నెతన్యాహు ఒత్తిడి పెంచారు. ఇరాన్‌తో దౌత్యం సరికాదంటూ నచ్చజెబుతూ వచ్చారు. ఇరాన్ వైఖరిలో ఏమాత్రం మార్పు రాదని.. గత ఏడాది జూన్‌లో అణుకేంద్రాలపై దాడులు చేసినా.. ఇప్పుడు మళ్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లను కొనసాగిస్తోందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దూకుడుతో ట్రంప్ ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయెల్‌కు అండగా.. గత నెల 24న యూఎస్ నేవీ ఏవియేషన్‌ను ఇజ్రాయెల్‌కు పంపారు. యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలో మోహరించారు. 

    అమెరికా ఇంతలా సహకరించినా.. ఇజ్రాయెల్ మాత్రం తనకు ఇరాన్ బద్ధశత్రువని.. గుణపాఠం చెప్పాల్సిందేనని భీష్మించుకుంది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌లో యుద్ధాలు తగదని చరిత్ర చెబుతున్నా.. నెతన్యాహు తన మొండిపట్టును వీడలేదు. చివరికి శుక్రవారం అర్ధరాత్రి దాటాక.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ వాయుసేన భీకర దాడులు జరిపింది. ఆ తర్వాత పెద్దన్న అమెరికా కూడా యుద్ధంలో జతకట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఇజ్రాయెల్ దాడులు జరిపాకే.. అమెరికా ఈ యుద్ధంలో పాల్గొనడం గమనార్హం..! అయితే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మాత్రం.. అమెరికా వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ తొలి దాడి చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇరాన్ ప్రతిదాడి నేరుగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపైనే ఉంటుంది. 

    ఈ నేపథ్యంలో తప్పించక తానొవ్వక అన్నట్లుగా వ్యవహరించాలనేది ట్రంప్ వ్యూహమని వివరిస్తున్నారు. ఏది ఏమైనా.. అటు ఇజ్రాయెల్.. ఇటు అమెరికా ఆశించిన ఫలితాలను ఈ దాడులు అందజేశాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేనీతోపాటు.. మాజీ అధ్యక్షుడు అహ్మదీ నేజాద్, ఇతర మిలటరీ నాయకులు కూడా ఈ దాడులతో నేలకొరిగారు.

     

  • US-Iran War పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తల  నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ మరియానో గ్రాస్సీ (Rafael Mariano Grossi)   కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు జరిగితే, ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉందని, ఆ అవకాశాన్ని తాము తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు.


    ఇరాన్ సరిహద్దు దేశాలలో సాధారణ నేపథ్య స్థాయిలకంటే రేడియేషన్ స్థాయిలు పెరగనప్పటికి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ప్రధాన నగరాల కంటే పెద్దవిగా లేదా పెద్దవిగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరంతో సహా తీవ్రమైన పరిణామాలతో కూడిన రేడియోలాజికల్ విడుదల ప్రమాదం ఉందన్నారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండాలంటే గరిష్ట సంయమనం పాటించాలి. తిరిగి దౌత్య చర్చలు జరగాలని కోరారు.  (భీకర దాడుల వేళ, దుబాయ్‌ సంచలన నిర్ణయం)

    అణు ప్రమాదం లేకపోలేదు 
    ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై ప్రభావం పడిందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి అణుశక్తి విభాగం చీఫ్ రాఫెల్ గ్రోసీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం, ఇరాన్‌లోని ఏ అణు కేంద్రం కూడా దెబ్బతినలేదు" అని పునరుద్ఘాటించారు. ఒకవేళ అణు వికిరణం (Radiation) సంభవిస్తే, అది అత్యంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని గ్రోసీ హెచ్చరించారు. దీనివల్ల పెద్ద నగరాలు,  పెద్ద ప్రాంతాల నుండి ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ అణు నియంత్రణ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ వారి నుండి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని గ్రోసీ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ అనివార్య మైన కమ్యూనికేషన్ ఛానెల్‌ను పునరుద్ధరించగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    ముఖ్యంగా బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ లేదా ఇతర అణు ఇంధన చక్ర సౌకర్యాలు దెబ్బతిన్నట్లు తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేడియోధార్మిక విడుదల జరిగే అవకాశాన్నికొట్టిపారేయలేం, తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా గ్రోసీ హెచ్చరించారు.

    ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్‌ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!

  • అమెరికా-ఇజ్రాయిల్‌ లు సంయుక్తంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయుతుల్లా ఖమేనీ మృతిచెందిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత ముదిరింది. తన శత్రు దేశాలుగా భావిస్తున్న వాటిపై ఇరాన్‌ విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయిల్‌ను టార్గెట్‌ చేసి ఇరాన్‌ ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఈరోజు(మార్చి 2వ తేదీ) ఇజ్రాయిల్‌ ప్రధాని నెతాన్యాహూ టార్గెట్‌గా ఇరాన్‌ దాడులు క్షిపణులతో దాడులకు దిగింది. తాము ఇజ్రాయిల్‌ ప్రధాని టార్గెట్‌గా దాడి చేసిన విషయాన్ని  ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రకటించింది. ఇజ్రాయిల్‌ ప్రధాని ఆఫీస్‌పై క్షిపణులతో దాడి చేశామని, కానీ నెతాన్యాహూ ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదని స్పష్టం చేసింది. అయితే తాము జరిపిన దాడుల్లో  ఇజ్రాయిల్‌కు చెందిన పలువురు కమాండర్లు హతమయ్యారని ఐఆర్‌జీసీ వెల్లడించింది. 

    ఒమన్‌ మా లక్ష్యం కాదు..
    ఇదిలా ఉంచితే, ఇరాన్‌ చేస్తున్న యుద్ధంలో పలు దేశాలకు భారీ నష్టం వాటిల్లితోంది. అరబ్‌ దేశాలపై కూడా ఇరాన్‌ దాడులను తీవ్రతరం చేసింది. దానిలో భాగంగా ఒమన్‌పై కూడా ఇరాన్‌ దాడి చేసింది.  ఇరాన్‌ రెండు డ్రోన్లతో ఒమన్‌లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఒక డ్రోన్ కార్మికుల నివాస ప్రాంతాన్ని తాకగా, ఒక విదేశీయుడు గాయపడ్డాడు. మరొక డ్రోన్ ఇంధన నిల్వ ట్యాంకుల దగ్గర పడింది కానీ పెద్ద నష్టం జరగలేదు. 

    దీనిపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చీ మాట్లాడుతూ.. ‘  మా చాయిస్‌ ఒమన్‌ కాదు. కానీ దాడులు జరిగాయి. మేము మా సైనికులకు ఇప్పటికే చెప్పాం. మన లక్ష్యం మీద మాత్రమే మన గురి ఉండాలనే విషయం చెప్పాం. కానీ ఒమన్‌పై దాడి జరిగింది. మా సైనిక విభాగాలు ఇప్పుడు, వాస్తవానికి, స్వతంత్రంగా, మరొకవైపు వేరుపడిన స్థితిలో ఉన్నాయి. అవి ముందుగానే ఇచ్చిన సాధారణ సూచనల ఆధారంగా పనిచేస్తున్నాయి’ అని తెలిపారు. 

    వారిని హతమార్చాం:  ఇజ్రాయెల్‌
    ఇరాన్ ఇండిలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన కీలక అధికారులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఆ దేశ ఇంటిలిజెన్స్ డిప్యూటీ మంత్రి సయ్యద్ యాహ్యా హమీది, ఇంటెలిజెన్స్ చీఫ్ జలాల్ పౌర్ హుస్సేన్‌లతో పాటు ఇతర అధికారులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
     

  • US Iran War ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా  దాడులు,  ఇరాన్‌ ప్రతీకార దాడుల మధ్య మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో వైమానిక  సర్వీసులు తీవ్రంగా ప్రభావితమైనాయి. దీంతో ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దుబాయ్, అబుదాబి అధికారులు  మానవత్వాన్ని చాటు కున్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా బయలుదేరలేని టూరిస్టుల బసలను పొడిగించాలని హోటళ్లను ఆదేశించారు.

    ఇరాన్ ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్‌లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడులలో దుబాయ్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటళ్లు దెబ్బతిన్నాయి. అనేక విమానాలు నిలిపివేయడంతో, GCC దేశాలలో  వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ హోటల్ నిర్వాహకులకు అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది, అతిథుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి, వసతి కొనసాగించడం, ప్రయాణికులు బయలుదేరలేకపోతే , వారిని ఖాళీ చేయించకుండా ఉండాలని,  ఒక వేళ వెంటనే చెల్లించలేకపోతే వారి గదులను ఖాళీ చేయమని కోరవద్దని ఆదేశించింది. ప్రభావిత అతిథులు బసలను పొడిగించడానికి అనుమతించమని వారికి సూచించింది.  హోటల్ జనరల్ మేనేజర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. 

    ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్‌ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!

    ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంతమంది అతిథుల చెక్-అవుట్ సమయం ముగిసినా, వారు బయలుదేరే వరకు వారి బసను పొడిగించాలని దీనికి సంబంధించిన అదనపు బస ఖర్చులను DCT అబుదాబి భరిస్తుందని వారికి తెలిపింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

    చూసి నేర్చుకోండి! 
    పెట్టుబడిదారుడు సమీర్ అరోరా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతరిక్ష పరిశ్రమ శాస్త్రవేత్త హితేష్ మోదీ ఇలా రాశారు: "ఇది వేరే ప్రదేశం అయితే, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారు ధరలను మూడు రెట్లు పెంచేవారు." అని వ్యాఖ్యానించారు. ‘‘ఇతర ప్రపంచ నాయకులు  UAE నుండి నేర్చుకోవాలి. నేనుప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను, ఈ దేశ పాలన మానవాళి భద్రత కోసం అత్యున్నత స్థాయి శ్రద్దతీసుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మీ గురించి దయచేసి ఈ సందేశాన్ని మీ హోటల్ మేనేజర్‌కు చూపించండి" అని కతార్జినా కొమోరోవిచ్  ట్వీట్‌ చేశారు.
     

  • ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని టార్గెట్‌ చేసి అమెరికా, ఇజ్రాయెల్‌.. అగ్రనేతను మట్టుబెట్టాయి. ప్రత్యర్థి దాడిలో ఖమేనీ అత్యంత సులువుగా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయా?. ఇజ్రాయెల్‌, అమెరికా లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఇరాన్‌ ప్రాక్సీ గ్రూపుల సంగతేంటి?. ఖమేనీ మృతిపై పగ తీర్చుకునేందుకు ఇరాన్‌ ఎలాంటి ప్లాన్‌ చేస్తోంది. భవిష్యత్‌లో అమెరికా ఎదుర్కొవాల్సిన పరిస్థితులేంటి?. 2003 నాటి ఇరాక్‌ యుద్దం ఏం చెబుతోంది? అని సంగతులు తెలియాల్సిందే..  

    సుప్రీం లీడర్‌ ఖమేనీ దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన అగ్రనాయకుడు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (మత పెద్దల మండలి) అయతుల్లా అలీ ఖమేనీని ఎంపిక చేసింది. తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి. ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ టెహ్రాన్‌లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.

    1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి. 2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.

    అమెరికాతో వివాదాలు
    అమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్‌ను విమర్శించారు. ఖమేనీ వాషింగ్టన్‌తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు. అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక ‘ఫత్వా’ జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.

    2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్‌లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు. అలాగే, జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.

    ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. అనంతరం, ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు. దీంతో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతం, దాడుల్లో ఖమేనీ సహా కీలక నేతలు మృతి చెందారు.

    ట్రంప్‌ ప్లానేంటి? 
    ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్‌తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఖమేనీ మృతితో ట్రంప్‌ ఏం చేస్తారు. అక్కడి కొత్త ప్రభుత్వం దిశగా ప్లాన్‌ చేస్తారా? కొత్త నాయకుడిని ఏర్పాటు చేస్తారా?. అయితే, ఇరాన్‌లో నాయకత్వ మార్పు అకస్మాత్తుగా జరిగే అవకాశం లేదు. ఇరాన్‌ వ్యవస్థ కూలిపోవడం కష్టమే. మతపెద్దలు, IRGC (Islamic Revolutionary Guard Corps) ముందుగానే contingency plans సిద్ధం చేసుకోవడం వల్ల, నాయకత్వం మారినా వ్యవస్థ కొనసాగుతుంది. ఇరాన్‌ వ్యవస్థ వ్యక్తి ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా నిర్మించబడింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

    ఇరాన్‌ ఏం చేయనుంది?.
    ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాలను టార్గెట్‌ చేసింది. అమెరికాను సైతం హెచ్చరించింది. ప్రతి దాడులు చేస్తామని.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్‌.. ఇప్పటికే సౌదీ అరేబియా, దుబాయ్‌, ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్‌తోడు తాజాగా హెచ్‌బొల్లా దళాలు కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో​, ఇరాన్‌కు మద్దతు పెరిగి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.

    ఇరాన్‌ ప్రాక్సీ నెట్‌వర్క్‌లు
    ఇరాక్‌లోని మిలీషాలు, యెమెన్‌లోని హౌతీలు వంటి గ్రూపులు బలహీనపడినప్పటికీ ఇంకా చురుకుగా ఉన్నాయి. వీటి ప్రధాన పాత్ర.. అమెరికా బేస్‌లు, ఇజ్రాయెల్‌ లక్ష్యాలు, గల్ఫ్‌ ప్రాంతంలో అస్థిరత సృష్టించడం. హౌతీలు గతంలో కూడా రెడ్ సీ షిప్పింగ్ మార్గాలను దాడి చేశారు, ఇది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లనుంది.

    2003 ఇరాక్‌ యుద్ధం (Operation Iraqi Freedom)
    2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్ వంటి దేశాలు ఇరాక్‌పై దాడి చేశాయి. ఇరాక్‌ వద్ద Weapons of Mass Destruction (WMDs) ఉన్నాయని, అలాగే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది అనే ఆరోపణలతో దాడులు చేశాయి. కేవలం మూడు వారాల్లోనే అమెరికా నేతృత్వంలోని బలగాలు బగ్దాద్‌లోకి ప్రవేశించి, సద్దాం హుస్సేన్‌ 30 ఏళ్ల పాలనను ముగించాయి. ఏప్రిల్ 2003లో బగ్దాద్‌లోని సద్దాం విగ్రహాన్ని కూల్చడం యుద్ధానికి ప్రతీకగా నిలిచింది. దీంతో, సద్దాం హుస్సేన్‌ పాలన ముగిసింది. యుద్ధం తర్వాత ఇరాక్‌లో సెక్టారియన్ హింస, ఉగ్రవాదం, ISIS ఉద్భవం వంటి సమస్యలు పెరిగాయి. 2003–2011 మధ్య US బలగాలు ఇరాక్‌లో ఉండి, చివరికి వెనక్కి వెళ్లాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఇరాన్‌లో ఉండకపోవచ్చు.

    ఇరాక్‌ vs ఇరాన్‌ పోలిక
    ఇరాక్‌ (2003): వ్యక్తి ఆధారిత పాలన (సద్దాం హుస్సేన్‌). నాయకుడిని తొలగించగానే వ్యవస్థ కూలిపోయింది.
    ఇరాన్‌ (ప్రస్తుత వ్యవస్థ): వ్యక్తి ఆధారంగా కాకుండా, మతపెద్దల సంస్థాగత వ్యవస్థ. ఒక నాయకుడు లేకపోయినా, Assembly of Experts, Guardian Council, IRGC వంటి సంస్థలు పాలన కొనసాగిస్తాయి. అందువల్ల, ఇరాన్‌ను ఇరాక్‌లా త్వరగా కూల్చడం కష్టమవుతుంది.

  • రియాద్‌: గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్‌ డ్రోన్లు సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై విరుచుకుపడ్డాయి. తస్‌ తనారాలోని ఆరామ్‌కో ఆయిల్‌ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

    డ్రోన్‌లతో జరిగిన ఈ దాడుల కారణంగా రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్‌ ప్రాంతానికి ప్రధాన ఆదాయ మూలమైన ఆయిల్‌ సరఫరా తాత్కాలికంగా దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఇరాన్‌ ఈ దాడులతో గల్ఫ్‌ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్‌ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ–ఇరాన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ పరిణామం గల్ఫ్‌ ప్రాంత భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
     

  • వాషింగ్టన్: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు మిన్నంటుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది అగ్రశ్రేణి నేతలు ఒకేసారి హతమయ్యారని ట్రంప్‌ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే వేగంగా, అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఆ దేశ నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నూతన నాయకత్వం తమతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపిందని ట్రంప్‌ పేర్కొన్నారు.

    గతంలోనే చర్చలకు రావాల్సింది పోయి మొండిగా వ్యవహరించిన ఇరాన్.. ఇప్పుడు దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని అమెరికా బలగాలు నామరూపాల్లేకుండా చేశాయని అన్నారు. ఇరాన్‌కు చెందిన తొమ్మిది భారీ యుద్ధనౌకలను సముద్రంలో ముంచివేశామని, ఆ దేశ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా దాదాపుగా ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన నౌకలను కూడా త్వరలోనే నామరూపాలు లేకండా చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

    మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు.. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరంపై తమ దాడులు కొనసాగుతాయని, రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, మొసాద్ అధిపతితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఇజ్రాయెల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ ఉగ్రవాద పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. తమ పోరాటానికి అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ అందిస్తున్న సహకారానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా భారీగా పెరుగుతోంది. ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, టెల్ అవీవ్, బీట్ షెమెష్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారు. కాగా ప్రాంతీయ దౌత్యవేత్తలు శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి యుద్ధ విరమణను గట్టిగా కోరుతున్నారు. ఇరాన్ కూడా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. 

    ఇది  కూడా చదవండి: వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి

  • వాషింగ్టన్‌: ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరీ. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య. మిలటరీ ఆపరేషన్‌లో ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్‌ ప్రభుత్వంలోని ముఖ్య కేంద్రాల్లో భీభత్సం సృష్టించాయి. వెన్నులో వణుకు పుట్టించేలా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ వెనుక ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ ఏఐ మోడళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో నాడు తన మాట వినలేదని వెళ్లగొట్టిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అక్కరకు వచ్చింది’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

    యుద్ధంలో ఏఐ మోడళ్లు సైనికుల కళ్లూ, మెదడులా పనిచేస్తాయి. ఇవి నేరుగా ఆయుధం కాకపోయినా.. ఎక్కడ దాడి చేయాలి. ఎలా రక్షించుకోవాలి. శత్రువు కదలికలు ముందుగానే అంచనా వేస్తాయి. సైనికులకు సమాచారం అందిస్తాయి. అందుకు అనుగుణంగానే దాడి చేయొచ్చు. తాజాగా, ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఆంథ్రోపిక్ క్లాడ్‌ మోడల్స్‌ను వినియోగించాయి.  

    అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంథ్రోపిక్ సప్లయ్‌ చైన్‌ను ప్రమాదంగా భావించారు. ఆంథ్రోపిక్ సప్లయ్‌ చైన్‌ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనూహ్యంగా కొన్ని గంటల్లో ట్రంప్‌ తన నిర్ణయంపై యూటర్న్‌ తీసుకున్నారు. అమెరికా తన మిలిటరీ కార్యకలాపాల కోసం క్లాడ్‌ను ఉపయోగించింది. ఇరాన్‌లో తాను నిర్ధేశించిన లక్ష్యాల్ని ఛేదించగలిగింది.  

    అమెరికా ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌ను ఉపయోగించడం మానేస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌ అంటే అత్యంత రహస్యమైన, భద్రతా ప్రమాణాలు ఉన్న ప్రభుత్వ,సైనిక కంప్యూటర్ వ్యవస్థలు. వీటిలో సాధారణ సాఫ్ట్‌వేర్ లేదా టూల్స్‌ను సులభంగా అమలు చేయలేరు.

    కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్‌ ఏఐ క్లౌడ్‌ను ఉపయోగిస్తోంది. ఆంథ్రోపిక్‌ ఏఐ క్లౌడ్‌ను మార్చి వాటి స్థానంలో మరో ఏఐ క్లౌడ్‌ను మార్చాలంటే కనీసం ఆరునెలల సమయం పట్టనుంది. ఈలోపు సైనికులకు వాటిపై శిక్షణ, వినియోగం వంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది.

Andhra Pradesh

  • సాక్షి విజయవాడ: బిహార్‌ ఐజీ సునీల్‌ నాయక్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సునీల్‌ నాయక్‌ని అరెస్టు చేయెుద్దని కోర్టు ఆదేశించింది. చట్టానికి లోబడే విచారణ చేపట్టాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా కొద్దిసేపటి క్రితం  బిహార్‌ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

    ఈ కేసులో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్‌ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్‌ కోర్టును పోలీసుల ఆశ్రయించారు దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది.  గుంటూరు స్పెషల్‌ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్‌ నాయక్‌ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. 

  • సాక్షి రాజమండ్రి:  కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే కల్తీపాల ఘటనలో ఇది వరకే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • విజయవాడ:  తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టుకుని కూర్చొన్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా వారు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  రాత్రికి కూడా ధర్నా చౌక్‌లోనే  ఉంటామని వారు స్పష్టం చేశారు. 

    రేపటి వరకూ ప్రభుత్వంకు గడువు ఇస్తున్నామని, తమకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా తమ కార్యాచరణ ఉంటుందని అంగన్వాడీలు తెలిపారు.  సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికి వంటా వార్పు కార్యక్రమం చేపడతామన్నారు. 

  • బిహార్‌ ఐజీ సునీల్ నాయక్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. సునీల్‌ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు స్పెషల్ మెుబైల్‌ కోర్టును పోలీసుల ఆశ్రయించారు.

    దీంతో అరెస్ట్ చేసిన తర్వాత నాన్‌ బెయిలబుల్ వారెంట్ ఏంటి అని అధికారులను ప్రశ్నించింది.  గుంటూరు స్పెషల్‌ కోర్టు. దీంతో కోర్టు ప్రశ్నలకు కంగుతిన్న పోలీసులు, లాయర్లు సునీల్‌ నాయక్‌ నాన్ బెయిలబుల్ వారెంట్ ను విత్‌డ్రా చేసుకున్నారు. 

    కాగా అంతకు ముందు ఏపీ పోలీసు అధికారులు.. బిహార్‌ కేడర్‌ ఐజీ సునీల్‌ నాయక్‌ను అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర రాజధానిలో హంగామా చేశారు.  అయితే అక్కడ ఏపీ పోలీసులకు భంగపాటు తప్పలేదు. తమ  అధికారిని గోడదూకి ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ బిహార్‌ ప్రభుత్వం మండిపడింది. తమ రాష్ట్ర కేడర్‌కు చెందిన పోలీసు అధికారులపై ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ గత శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

    తమ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తాము అనుమతించాలంటే పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులకు వర్తించే అన్ని రకాల రక్షణ చర్యలు బిహార్‌ ప్రభుత్వ అధికారులకు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు బిఎన్ఎస్  సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ  నోటిఫికేషన్ జారీ చేసింది.

    దీంతో కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు  ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్‌ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో  బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతిపై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా కోర్టులు సైతం ఆయనకు నాన్‌ బెయిలబుల్ వారెంట్ తిరస్కరించింది.

  • తాడేపల్లి:  అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల యుద్ధం నేపథ్యంలో  గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.  యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్‌ జగన్‌ ప్రకటన చేశారు.

    ‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.  

    వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

     

  • జిల్లాలో కీలకమైన రెండు శాఖలకు కీలక అధికారిగా ఓ జూనియర్‌ ఎంపీడీఓను నియమించారు. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని ఒక జూనియర్‌ అయిన మహిళా అధికారికి జిల్లాస్థాయి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్‌ అధికారులను నియమించకుండా ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తుండటం దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

    అనంతపురం టౌన్‌: పేదరిక నిర్మూలన, గ్రామీణ ఉపాధి కల్పనతోపాటు గ్రామీణాభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతంలో కీలక పాత్ర పోషించే డీఆర్‌డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ)కు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా ఈ శాఖకు రెగ్యులర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ) లేరు. జిల్లాలో సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్లు, అత్యంత సీనియర్‌ ఎంపీడీఓలు చాలామంది ఉన్నారు. అయినా విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో ఏపీసీగా పని చేస్తున్న అధికారిణికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు.  

    ఇదీ.. ఆ అధికారి ఉద్యోగ ప్రస్థానం.. 
    సీనియర్లను కాదని జిల్లాస్థాయి రెండు కీలక అధికారిక బాధ్యతలు దక్కించుకున్న జూనియర్‌ మహిళా అధికారిణి ఉద్యోగ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే.. 2018లో ఉమ్మడి అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓగా నియమితులయ్యారు. నెలరోజుల అనంతరం సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ 2019 జనవరిలో విధుల్లోకి చేరారు. అలా ముచ్చటగా నెల రోజులు పనిచేయగానే మళ్లీ సెలవు పెట్టేశారు. 2021లో జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తి చేసుకున్నారు. 

    నిబంధనలు జాన్తా నై..  
    గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీడీఓలను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సదరు అధికారిణి కూడా చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అలా బదిలీ అయిన వారందరూ ఎన్నికల అనంతరం జిల్లాకు వచ్చి జిల్లా పరిషత్‌లో రిపోర్టు చేసుకొని.. అక్కడి నుంచి పోస్టింగ్‌ తెచ్చుకోవాలి. అయితే రాష్ట్రంలో అత్యంత జూనియర్‌ ఎంపీడీఓ అయిన ఆ మహిళా అధికారిణికి ఆ నిబంధనలేవీ వర్తించలేదు. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రావడం, ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండటంతో చిత్తూరు నుంచి వచ్చిన ఆమె మాతృ శాఖ అయిన జిల్లా పరిషత్‌ కార్యాలయంలో రిపోర్టు చేసుకోకుండా.. నేరుగా డ్వామాలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు    స్వీకరించారు. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే    అంటే 2025 జనవరిలో అనంతపురం సమగ్రశిక్ష ఏపీసీగా పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. మరో కీలక శాఖ అయిన డీఆర్‌డీఏ ఇన్‌చార్జ్‌ పీడీగానూ కొనసాగుతున్నారు. 

    భగ్గుమంటున్న సీనియర్లు.. 
    మూడేళ్ల కిందట ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తి చేసుకున్న జూనియర్‌ మహిళా అధికారిణికి రెండు జిల్లాస్థాయి పోస్టులు కట్టబెట్టడంపై సీనియర్‌ ఎంపీడీఓలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ అండదండలు ఉంటే నిబంధనలు పాటించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అర్హులైన సీనియర్లను విస్మరించి జూనియర్‌కు పట్టం కట్టడం సముచితం కాదని అంటున్నారు. అడ్డగోలుగా దక్కిన కీలక పోస్టులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. సీనియర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.    

  • సాక్షి,తిరుపతి: ‘బీఆర్‌ నాయుడు నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. బీఆర్‌ నాయుడు నీలాంటి వాడిని మనిషిలా కూడా చూడను’అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సోమవారం తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడారు.  ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు ఓ మహిళతో పలు ప్రాంతాల్లో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోల్ని మీడియా ఎదుట విడుదల చేశారు. 

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తనపై డీప్‌ ఫేక్‌ వీడియోతో సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ నాయుడు చేసిన వ్యాఖ్యలపై  భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  అది డీప్‌ ఫేక్‌ వీడియో కాదు. ఫ్యాక్ట్‌ చెక్‌ చేసిన తర్వాతనే మేం ఆ వీడియోలపై మాట్లాడాం. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలని అడిగాం.

    2019లో  వీడియోలోని మహిళ చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో బీఆర్‌ నాయుడు భయంకరమైన మహిళా వ్యసనపరుడని చెప్పారు. లెటర్‌లో రాసిన ప్రతి అక్షరానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆ లేఖతో బీఆర్‌ నాయుడు కంటతడి పెట్టుకుంటే నేను ఆయన్ను నమ్మాను. కానీ ఇప్పుడు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. విచారణ జరిపిస్తే అసలు రంగు బయటపడుతుంది. టీటీడీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలి.  రాజీనామా చేయకుంటే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.

Business

  • పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్‌తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్‌్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.

    రాబడులు
    ఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్‌ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.

    పెట్టుబడుల విధానం
    మంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్‌ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్‌కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్‌ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్‌లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.

    వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్‌కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్‌్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్‌ను తరచూ మార్చదు. ఒక కౌంటర్‌లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్‌ సెక్యూరిటీలు, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లలో (రీట్‌)నూ ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

    పోర్ట్‌ఫోలియో
    ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్‌ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

  • బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.

    ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.

    ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు.

  • యమహా కంపెనీ తన ఎక్స్ఎస్ఆర్155 బైకును మెటాలిక్ బ్లాక్ కలర్ ఎంపికలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్‌లు పొందుతుంది. కాగా ఈ బైక్ మెటాలిక్ బ్లూ, వివిడ్ రెడ్, మెటాలిక్ గ్రే మరియు గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

    కలర్స్ వారీగా ధరలు
    ➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లూ: రూ. 1.50 లక్షలు
    ➤ఎక్స్ఎస్ఆర్155 వివిడ్ రెడ్: రూ. 1.53 లక్షలు
    ➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ గ్రే: రూ. 1.57 లక్షలు
    ➤ఎక్స్ఎస్ఆర్155 గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్: రూ. 1.59 లక్షలు
    ➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లాక్: రూ. 1.59 లక్షలు

    2025 నవంబర్‌లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్ఎస్ఆర్155 బైక్.. 155 సీసీ విభాగంలో ప్రీమియం విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 155 సీసీ లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్‌ 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్155 కొత్త కలర్ బైక్.. రంగు కాకుండా.. ఇతర మార్పులు లేదని స్పష్టమవుతోంది.

  • కారు ఉపయోగించే చాలామంది.. లోపల అవసరం ఉన్న వస్తువుల కంటే, అనవసరమైన వస్తువులనే ఎక్కువ ఉంచుకుంటున్నారు. అయితే కారులో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి, ముఖ్యమైన 10 వస్తువులు ఏవి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

    జంపర్ కేబుల్స్: వాతావరణంలో జరిగే మార్పులు లేదా ఇతర పొరపాట్ల కారణంగా లైట్లు ఆఫ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో వదిలేస్తారు. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ డెడ్ కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో జంపర్ కేబుల్స్ ఉంటే సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చు.

    జాక్ & స్పేర్ టైర్: అనుకోని సందర్భాల్లో టైర్ పంక్చర్ అయితే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్పేర్ టైర్ & జాక్ వంటి వాటిని కారులోనే ఉంచుకోవడం వల్ల.. టైర్ పంక్చర్ సమయంలో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

    ఫస్ట్ ఎయిడ్ కిట్: కేవలం కారులో మాత్రమే కాకుండా.. ప్రతి వాహనంలో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అందులో బ్యాండేజీలు, యాంటిసెప్టిక్ వైప్స్, ట్వీజర్స్, పెయిన్ రిలీవర్స్ వంటి అవసరమైన వస్తువులు ఉండాలి.

    టైర్ ప్రెజర్ గేజ్: టైర్లు బయటికి సరిగానే కనిపించినా, లోపల గాలి ఒత్తిడి సరైన స్థాయిలో లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా టైర్ ప్రెజర్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది.

    అదనపు బ్యాటరీలతో ఫ్లాష్‌లైట్: కారులో తప్పకుండా ఫ్లాష్‌లైట్ ఉండాలి. దీనికి అదనపు బ్యాటరీలు కూడా చాలా అవసరం. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఫ్లాష్‌లైట్ ఉపయోగపడుతుంది. కారు బానెట్ క్రింద పరిశీలించాల్సినప్పుడు కూడా ఇది సహాయపడుతుంది.

    ఎమర్జెన్సీ బ్లాంకెట్: చలికాలంలో లేదా వాహనం ఆగిపోయినప్పుడు ఒక బ్లాంకెట్ తప్పకుండా అవసరం అవుతుంది. ఇది అత్యవసర సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది.

    మల్టీటూల్ (స్విస్ ఆర్మీ నైఫ్): చిన్న చిన్న పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చిన్నదే అయినా.. చాలా సందర్భాల్లో పనికొస్తుంది. దీనిని మీరు గ్లోవ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు.

    వాటర్ బాటిల్: వాటర్ బాటిల్ కేవలం నీళ్లు తాగడానికి మాత్రమే కాదు. అనుకోని సందర్భాల్లో గాయాలైనప్పుడు, వాటిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు కూడా నీళ్లు అవసరమవుతాయి. సీల్ చేసిన బాటిల్స్ ఉంచుకోవడం మంచిది.

    ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్: ఫోన్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ ఉండడం వల్ల మీ ఫోన్ ఎప్పుడూ ఆఫ్ కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు జీపీఎస్ న్యావిగేషన్ లేదా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి ఫోన్ చాలా అవసరం. కాబట్టి మీ దగ్గర ఉన్న ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ కాకుండా ఉంచడానికి ఫోన్ ఛార్జర్ & పవర్ బ్యాంక్ తప్పనిసరిగా మీతో ఉంచుకోవాలి.

    వెహికల్ రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్: కారుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా కారులో ఉంచుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర అధికారులు మీ కారును చెక్ చేసే సమయంలో వెంటనే చూపించడానికి ఇవి పనికొస్తాయి.

  • మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.

    ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు
    రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు,  హైదరాబాద్‌లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వెల్లడించాయి.

    గృహ ఎల్పీజీ రేట్లు యథాతథం
    ఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.

    కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.

  • ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందా.. అని ఎదురు చూసేవారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగానే నిర్ణయించారు. అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదన్నమాట.

    ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. సీబీటీ నిర్ణయం తర్వాత.. 2025-26 సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఏడు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

    నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!

  • అంతర్జాతీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాన్ని కల్పించే దిశగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ  ‘టాటా ఏఐఏ గ్లోబల్‌ ఈక్విటీ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ మార్చి 5 వరకు అందుబాటులో ఉంటుంది. జీవిత బీమా రక్షణ కల్పించడంతో పాటు గ్లోబల్‌ ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి కూడా దోహదపడేలా ఇది ఉంటుంది. టాటా ఏఐఏ శుభ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ లాంటి యూనిట్‌ లింక్డ్‌ పథకాల ద్వారా ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఈ ఫండ్‌ నిధుల్లో 70%–100% వరకు భాగాన్ని గ్లోబల్‌ ఈక్విటీల్లో, మిగతా భాగాన్ని డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు.

    ట్రస్ట్‌ ఎంఎఫ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 
    ప్రధానంగా మిడ్‌–క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ట్రస్ట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఇది మార్చి 13 వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా 101 నుంచి 250 ర్యాంకుల వరకు ఉండే సంస్థల షేర్లు, ఈక్విటీ సంబంధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీనికి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా తయారీ, ఆర్థిక సేవలు తదితర రంగాలకు చెందిన పలు మిడ్‌ క్యాప్‌ కంపెనీలు గణనీయంగా రాణిస్తున్నాయని సంస్థ తెలిపింది. గత అయిదేళ్లలో ఈ విభాగంలోని 37 కంపెనీలు మూడు రెట్లు రాబడులు అందించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మిడ్‌–క్యాప్‌ కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫండ్‌ ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో సందీప్‌ బాగ్లా తెలిపారు.  

    ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ 
    యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్‌) కింద ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా డివిడెండ్‌ లీడర్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. నిలకడగా డివిడెండ్లను చెల్లించే ట్రాక్‌ రికార్డుతో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. బీఎస్‌ఈ 500 నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల ఇండెక్స్‌ని ఇది ట్రాక్‌ చేస్తుంది. ఐసీఐసీఐ ప్రు సిగ్నేచర్‌ అష్యూర్, స్మార్ట్‌కిడ్‌ అష్యూర్, స్మార్ట్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ప్లస్‌ (సిప్‌ ప్లస్‌) తదితర పథకాలతో ఇది లభిస్తుంది.

  • బంగారం, వెండి వ్యాపార రంగంలో ఒకటైన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ అనుబంధ సంస్థ.. ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో తన కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 95వ శాఖ కాగా, హైదరాబాద్‌లో 6వది, తెలంగాణలో 9వ కేంద్రం ద్వారా సేవలు అందిస్తోంది.

    ఈ కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రం ద్వారా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు పారదర్శక, శాస్త్రీయ, బాధ్యతాయుత బంగారం రీసైక్లింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు తమ పాత, ఉపయోగించిన బంగారు ఆభరణాలను సురక్షితంగా విక్రయించవచ్చు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను కస్టమర్లు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పారదర్శక విధానాన్ని సంస్థ అమలు చేస్తోంది. రూ.10,000 వరకు విలువైన బంగారానికి తక్షణ నగదు చెల్లింపు లభిస్తుంది. అంతకుమించిన మొత్తాలు IMPS, NEFT లేదా RTGS ద్వారా సురక్షితంగా నగదు బదిలీ చేస్తారు.

  • ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి.

    జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, కృధాన్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, AKG Exim లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫింకుర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

    దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు
    ➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.
    ➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
    ➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.
    ➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.

    రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది.

  • దేశీయ విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడమే కాకుండా, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ (ఎన్‌ఈపీ) 2026’ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలు ఈ రంగాన్ని సమూలంగా మార్చనున్నాయి. జనవరిలో విడుదలైన ఈ ముసాయిదాపై మార్చి 19 వరకు ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న వినూత్న పద్ధతులను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.

    ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌) తాము ఒప్పందం చేసుకున్న ప్లాంట్ల నుంచే విద్యుత్ పొందుతున్నాయి. కానీ కొత్త విధానం ప్రకారం, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డెస్పాచ్ (ఎంబీఈడీ) అమలులోకి రానుంది. దీని ప్రకారం.. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి అంతా ఒకే పూల్‌కు చేరుతుంది. అత్యంత తక్కువ ధరకు విద్యుత్ అందించే ప్లాంట్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది.

    ఈ క్రమంలో వచ్చే ఆర్థిక లావాదేవీల చిక్కులను పరిష్కరించేందుకు ‘బైలేటరల్ కాంట్రాక్ట్ సెటిల్‌మెంట్’(బీసీఎస్‌)ను ప్రతిపాదించారు. ఉదాహరణకు, ఒక డిస్కమ్‌ యూనిట్‌కు రూ.4 చొప్పున ఒప్పందం చేసుకున్నా మార్కెట్ ధర రూ.3 ఉంటే.. డిస్కమ్‌ మార్కెట్ పూల్‌కు రూ.3 చెల్లించి మిగిలిన రూ.1 ఒప్పందం ప్రకారం సదరు ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది.

    కెపాసిటీ మార్కెట్స్‌తో నిరంతర సరఫరా

    సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు ప్రకృతిపై ఆధారపడతాయి. ఒకవేళ గాలి తగ్గినా లేదా ఎండ లేకపోయినా విద్యుత్ కొరత రాకుండా బ్యాకప్‌గా ఉండే ప్లాంట్లను సిద్ధం చేయడమే ‘కెపాసిటీ మార్కెట్స్’ ఉద్దేశం. ఎనర్జీ మార్కెట్‌లో సరఫరా చేసిన విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే, కెపాసిటీ మార్కెట్‌లో విద్యుత్‌ అందుబాటును అనుసరించి రిటైనర్ ఫీజు తరహాలో చెల్లింపులు జరుగుతాయి. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, గ్రిడ్ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

    క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్

    ఇప్పటివరకు విద్యుత్ నిల్వ అనేది కేవలం పెద్ద కంపెనీలకు, భారీ ప్రాజెక్టులకే పరిమితం. కానీ ఎన్‌ఈపీ 2026 ముసాయిదా క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ‘స్టోరేజ్-యాజ్-ఏ-సర్వీస్’ తరహాలో పనిచేస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే చిన్న వినియోగదారులు కూడా తమ వద్ద ఉన్న అదనపు విద్యుత్తును ఈ క్లౌడ్ వ్యవస్థలో నిల్వ చేసుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది రిటైల్ స్థాయిలో నిల్వ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.

    పీర్-టు-పీర్ ట్రేడింగ్

    మీ ఇంటి సోలార్ ప్యానెల్ ద్వారా తయారైన విద్యుత్తును పక్కింటి వారికో లేదా దగ్గర్లోని చిన్న దుకాణానికో నేరుగా అమ్ముకునే వీలు కల్పించడమే పీర్-టు-పీర్ ట్రేడింగ్. ఈ లావాదేవీల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రోటోకాల్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

    ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విద్యుత్ రంగం కేవలం ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థగా కాకుండా ఒక డైనమిక్ మార్కెట్‌గా మారుతుంది. ఇది వినియోగదారులకు చౌకగా విద్యుత్ అందించడంతో పాటు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.

    ఇదీ చదవండి: భారత చమురు మార్కెట్‌పై ‘యుద్ధ’ సెగ

  • ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్‌కాయిన్‌ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.

    బంగారం ధరలు
    బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు,  డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.

    వెండి, బిట్‌కాయిన్‌పై..
    కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్‌కాయిన్‌ను డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో (#IranWar) దుబాయ్‌ (Dubai) సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నప్పటికీ, పౌర ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa) వద్ద అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా టవర్‌ను ఖాళీ చేయించారు. ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు బుర్జ్‌ ఖలీఫా సమీపంగా వచ్చినప్పటికీ భవనం నేరుగా దెబ్బతినలేదని తెలుస్తోంది.

    బుర్జ్ ఖలీఫాకు బీమా ఉందా?
    ప్రస్తుతం జనంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం వెనుక బలమైన బీమా వ్యవస్థ ఉందని తెలుస్తోంది.

    బుర్జ్ ఖలీఫా డెవలపర్ అయిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం సమగ్ర ‘ఆల్ రిస్క్’ ప్రాపర్టీ పాలసీని రూపొందించారు. ఈ కోర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌ను ఓమన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏర్పాటు చేయగా, ప్రధాన రీఇన్సూరెర్‌గా మ్యూనిచ్‌ రీ వ్యవహరించినట్లు సమాచారం.

    ఈ పాలసీ ద్వారా సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు  రూ. 13,722 కోట్లు) నిర్మాణ వ్యయాన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. భవనం యాజమాన్యానికి ఇది వర్తించగా, టవర్‌లోని అపార్ట్‌మెంట్లు, హోటల్ ఇంటీరియర్స్, కార్యాలయాలు వంటి వాటికి ఆయా యజమానులు వేర్వేరుగా బీమా తీసుకుంటారు.

    యుద్ధ ప్రమాదాలకు వర్తిస్తుందా? 
    దుబాయ్‌లోని ఎమ్మార్ యాజమాన్యంలోని ప్రధాన ఆస్తులు సాధారణంగా రాజకీయ హింస, ఉగ్రవాదం, అల్లర్లు, పౌర గందరగోళం, దండయాత్ర, శత్రుత్వం (యుద్ధం ప్రకటించినా, లేకపోయినా), అంతర్యుద్ధం వంటి ప్రమాదాలకు బీమా రక్షణ కలిగి ఉంటాయని బీమా వర్గాల సమాచారం.

    అయితే పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చాలాసార్లు పాలసీల్లో మినహాయింపులుగా ఉండే అవకాశముంది. క్షిపణి దాడి వంటి ఘటనలు ‘ఉగ్రవాదం’ లేదా ‘రాజకీయ హింస’ కింద పరిగణిస్తారా? లేక ‘యుద్ధ ప్రమాదం’ కింద వస్తాయా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

    బుర్జ్ ఖలీఫా నిర్మాణ వ్యయం సుమారు 1.4 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా అంచనా. ప్రస్తుత కాలంలో ఆ ఖర్చు 3.5 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.32 వేల కోట్లు) ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఈ టవర్ ఆధారంగా అభివృద్ధి చెందిన డౌన్‌టౌన్ దుబాయ్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.

    ఇదీ చదవండి: ఆ యుద్ధం అందుకే.. కియోసాకి సంచలన ట్వీట్‌

  • పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత్‌పై ముఖ్యంగా చమురు మార్కెట్, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

    పెరగనున్న దిగుమతి భారం

    భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కును దాటే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇది 77 డాలర్ల వద్ద ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో క్రూడ్‌ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. పరిమితంగా రష్యా నుంచి అందుతున్న రాయితీ చమురు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.

    రూపాయి పతనం - ఆర్థిక సవాళ్లు

    యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి చేరుకోవచ్చు. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది.

    భారత్ - ఇరాన్ వాణిజ్య సంబంధాలు

    ఖమేనీ మరణం తర్వాత ఇరాన్‌లో ఏర్పడే అంతర్గత రాజకీయ మార్పులు భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇరాన్ కొత్త నాయకత్వం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపైనే ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుంది. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవడానికి భారత్‌కు ఈ పోర్ట్ అత్యంత కీలకం కావడంతో అక్కడి రాజకీయ మార్పులు మన వ్యూహాత్మక ప్రయోజనాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

    వ్యవసాయ ఎగుమతులు

    రెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యవసాయ ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇరాన్‌కు పెద్ద మొత్తంలో ఎగుమతి అయ్యే బాస్మతీ బియ్యం, టీ, చక్కెర వంటి ఉత్పత్తులకు సంబంధించి చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు. యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత పెరిగితే భారతీయ ఎగుమతిదారులు తమ బకాయిలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

    అప్రమత్తతే మార్గం

    ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీలో భాగమైన భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడం, దౌత్యపరంగా అడుగులు వేయడం కీలకం.

    ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!

  • ఇంటి అద్దె అలవెన్సు క్లెయిమ్‌ విషయంలో వహించాల్సిన జాగ్రత్తలు గతంలో ఎన్నోసార్లు ఉదాహరణలతో తెలుసుకున్నాము. మన్మథరావు గారి కొడుకు, కోడలిది ప్రేమ వివాహం. తల్లిదండ్రుల ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అతి తెలివితేటలున్న స్నేహితుల సలహా ప్రకారం... ఇద్దరూ వారికొచ్చిన ఇంటి అద్దె అలవెన్సుని మొత్తం మినహాయింపు పొందడానికి అవసరమైనంత మొత్తానికి రశీదులు ఇచ్చి మినహాయింపు పొందుతున్నారు. మన్మథరావు పలుసార్లు వారించినా ఫలితం లేకపోయింది. ఒకే నగరం, ఒకే చోటు ఉంటూ చెరొక రశీదు సబ్‌మిట్‌ చేసి నాటకం ఆడుతున్నారు.  

    ఈ దంపతుల్ని మించిపోయాడు వైకుంఠం గారు. పెళ్లి అయిన నాటి నుంచి మామగారి ఇంట్లోనే మకాం. మామగారికి అద్దె చెల్లిస్తున్నట్లు క్లెయిమ్‌ చేశాడు. నాలుగేళ్ల తర్వాత మామ చనిపోయారు. వైకుంఠం జీతం పెరిగింది. ఇంటి అద్దె అలవెన్సు పెరిగింది. ఎంత పెరిగిందో.. అంతా, పాతది వెరసి మొత్తానికి ఎంత అద్దె ఉండాలో అంత అద్దె ఇస్తున్నట్లు దొంగ రశీదులు సబ్‌మిట్‌ చేస్తూనే ఉన్నారు. రెండు మూడేళ్ల తర్వాత ఇంత అద్దె పుచ్చుకుంటున్న ఆ సదరు పెద్ద మనిషి ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు’ వేస్తున్నారా లేదా అని ఆరా తీసారు అధికారులు. అడ్రసు పట్టుకొని మామ గారి ఇంటికెళ్లారు. గుమ్మం మీద మామ నేమ్‌ బోర్డు ఉంది. ఇంటి నెంబరు సరిపోయింది. కానీ అడుగు ముందుకేసి అడిగే సరికి అత్తగారు ప్రత్యక్షం. ‘సుబ్బారావు గారు ఉన్నారా’ అధికారుల ప్రశ్న..! అత్తగారి నోటి నుంచి మాటలు రావడం లేదు పైగా కన్నీళ్లు... ‘ఎవరు బాబు మీరు.. ఆయన చనిపోయిన మూడేళ్లకి తీరుబాటు అయ్యిందా పరామర్శకి’ అన్నారు. ‘అదికాదండీ.. మీ అల్లుడు వైకుంఠం గారు ...’ అన్నారు అధికారులు. ‘ఆయన ఇక్కడెందుకు ఉంటారు. వీధి చివరి ఇల్లు. అధికారులకు అర్థం అయ్యింది పరిస్థితి. మెల్లగా కూపీ లాగారు. అధికారులు నోటీసులిచ్చి పిలిపించారు. అన్నీ ఒప్పుకున్నాడు వైకుంఠం. దొంగ రశీదులు, దొంగ సంతకాలు, దొంగ క్లెయిమ్‌లు.. అన్నింటిని మించి అద్దె పక్కా ఆదాయంగా డిక్లేర్‌ చేయకపోవడం... అసెస్సుమెంటు చూశారు. తప్పులన్నీ సవరించారు. పన్ను, వడ్డీ, పెనాల్టీలు 200%... ఆ షాకుతో ఇంటి అవసరం లేకుండా వైకుంఠం డిపార్టుమెంటు వరండాలోనే తిరుగుతున్నారు.  

    బహుశా ఇటువంటి బాపతులు చాలా మంది కనిపించి ఉంటారు డిపార్ట్‌మెంట్‌ వారికి... కొత్త రూలు వచ్చింది. ముసాయిదా రూల్స్‌ ప్రకారం ఇక నుంచి .. అంటే  ఏప్రిల్‌1వతేదీ, 2026 నుంచి ఏడాది అద్దె రూ.1,00,000 దాటితే.. ఫారం 124 ఇవ్వాలి. ఓనర్‌ పేరు, అడ్రస్, పాన్‌.. మీకు ఓనర్‌కి చుట్టరికం ఏమిటి? చుట్టమంటే ... అమ్మ, నాన్న, అత్తగారు, మామగారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడా... ఇలాంటి వివరాలు సంపూర్ణంగా సేకరించి ఓనర్‌ ఆదాయాన్ని ట్రాక్‌ చేస్తారు. బ్యాంకు అకౌంటుని చెక్‌ చేస్తారు. ఆ వ్యక్తి ఈ ఆదాయం తన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులలో చూపిస్తే సరి.. లేదా కొంప కొల్లేరు అవుతుంది. మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము. షరా మామూలే అయితే గోవిందా..! ముందు ఓనర్‌ గారికి నోటీసులు ఇస్తారు అన్నీ ఆరా తీస్తారు. సక్రమంగా అన్ని డిక్లేర్‌ చేస్తే సరేసరి.. లేదంటే పన్ను, వడ్డీ 200% పెనాల్టీలు.

    అలా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువుకి ఎటువంటి ఆదాయం లేకుండా ఇంటి అద్దె ఆదాయమే అనుకొండి.. రూ.12,00,000 దాకా పన్ను భారం ఉండదు. కావున నిశ్చింతగా ఆ ఇంట్లోనే ఉండండి. బ్యాంకు ద్వారా అద్దె ఇవ్వండి. కాస్త శ్రమ తీసుకొని ఓనర్‌ చేత రిటర్ను వేయించండి.

Sports

  • టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

    కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్‌ ప్రతి భారత క్రికెట్‌ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్‌ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్‌, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.

    విండీస్‌తో మ్యాచ్‌ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్‌ అత్యంత చెత్తగా ఉంది. సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్‌ ప్రదర్శనలు  మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం​ 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్‌-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్‌ ఫీల్డింగ్‌ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.

    సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం​ చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్‌ ఫైనల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచే​ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. 

    క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్‌ ఫీల్డింగ్‌ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్‌ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్‌ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

    ఈ మ్యాచ్‌లకు వరుణుడు నుంచి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. ఏదైనా కారణం​ చేత రద్దైతే పరిస్థితి ఏంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఈ నాకౌట్‌ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్‌ డే కేటాయించింది. షెడ్యూలైన రోజు మ్యాచ్‌ జరుగకపోయినా లేక పాక్షికంగా జరిగి ఆగిపోయినా, ఆగిన చోటి నుంచి మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే మాత్రం సూపర్‌-8 దశలో మెరుగైన ఫలితాలు సాధించిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

    ఈ లెక్కన తొలి సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-1 టాపర్‌గా ఉన్న సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్తుంది. న్యూజిలాండ్‌ ఇంటిముఖం పడుతుంది. రెండో సెమీఫైనల్‌ ఏ కారణంగా అయినా రద్దైతే, సూపర్‌-8లో గ్రూప్‌-2 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి, ఏ కారణంగా కూడా సెమీస్‌ రద్దు కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.

     

  • ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లాడు. 

    వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్‌ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎ‍క్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.

    ముందుగా బెయిర్‌స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్‌ లయన్స్‌ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం​ లేదని బెయిర్‌స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించాడు.

    ఇంగ్లండ్ లయన్స్‌ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

    కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ వన్డే సిరీస్‌ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. 

    త్వరలో దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు కూడా దుబాయ్‌ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్‌లోనే ఇరుక్కుపోయింది. 

  • చ‌క్క‌టి ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించి సెమీస్‌కు చేర్చిన టీమిండియా బ్యాట‌ర్ సంజు సామ్స‌న్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టి20 ప్ర‌పంచ‌క‌ప్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రివ‌ర‌కు క్రీజ్‌లో నిల‌బ‌డి విజ‌యాన్ని అందించిన ఈ కేర‌ళ క్రికెట‌ర్‌పై అభిమానుల‌తో పాటు ప్ర‌ముఖులు పొగుడుతున్నారు. ముఖ్యంగా సొంత రాష్ట్రానికి చెందిన సినిమా స్టార్స్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సంజు సూప‌ర్ ఇన్నింగ్స్ కీర్తిస్తూ మాలీవుడ్ ప్ర‌ముఖులు మోహన్‌లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, బాసిల్ జోస‌ఫ్‌, న‌విన్ పాలీ త‌దిత‌రులు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.

    విజ‌య‌కేత‌నం ఎగురవేయండి
    మాస్ట‌ర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సంజు సామ్స‌న్ స‌త్తా చాటాడని ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌లాల్‌ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. సంజు ఫామ్‌లోకి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. సెమీ-ఫైనల్స్‌కు దూసుకెళ్లిన టీమిండియాకు అభినంద‌న‌లు తెలిపారు. సెమీస్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగురవేయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

     

    స్వచ్ఛమైన ఆధిపత్యం
    సంజు సామ్స‌న్ అద్భుతంగా ఆడాడ‌ని విల‌క్ష‌ణ న‌టుడు మ‌మ్ముట్టి ప్ర‌శంసించారు. అతిపెద్ద వేదిక‌పై స్వచ్ఛమైన ఆధిపత్యం చెలాయించారని వ్యాఖ్యానించారు. సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు ఫొటో పోస్ట్ చేసి హార్ట్‌, క్లాప్స్ ఎమోజీల‌ను జోడించారు.

     

    చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్
    'టి20 గొప్ప ఇన్నింగ్స్‌లో ఇదీ ఒక‌టి. కీల‌క క్వార్ట‌ర్ ఫైనల్లో సంజు సామ్స‌న్ చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడ‌'ని నటుడు-చిత్రనిర్మాత- ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.  “నిన్ను చూసి గర్వంగా ఉంది మచా. (మిత్రుడు)” అని నటుడు కాళిదాస్ జయరామ్ మెచ్చుకున్నారు. వాట్ యాన్ ఇన్నింగ్స్ అంటూ న‌టుడు టొవినో థామస్ పొగిడారు. 'థ్యాంక్యూ సంజు సామ్స‌న్' అంటూ ప్ర‌కాశ్‌రాజ్ అభినందించారు.

     

    ది రియ‌ల్ కేర‌ళ స్టోరీ
    కాగా, కేర‌ళ స్టోరీ 2 సినిమాకు కొంత‌మంది కౌంట‌ర్ ఇచ్చారు. త‌మిళ‌ దర్శకుడు సిఎస్ అముధన్ సంజు విజయాన్ని ‘ది కేరళ స్టోరీ: టీమిండియాను సంజు సామ్స‌న్ సెమీస్ ఫైన‌ల్‌కు చేర్చాడ‌ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత సంజు చేసిన ప్రార్థ‌న‌లు మ‌త‌సామ‌ర‌స్యానికి చిరునామాగా నిలిచాయ‌ని, ఇదే రియ‌ల్ కేర‌ళ స్టోరీ అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. ఎవ‌రినీ హర్ట్ చేయ‌కుండా అన్ని మ‌తాల‌ను గౌర‌వించాడ‌ని పేర్కొంటూ ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.  

     

  • మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్‌ బాల్‌ సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. 

    అయితే, యుద్ధం కారణంగా దుబాయ్‌ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్‌ జట్టు డర్బన్‌లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్‌ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.

    యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ వన్డే సిరీస్‌ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్‌ క్రికెట్‌ ప్రపంచంపై పడే అవకాశం ఉంది. 

    త్వరలో దుబాయ్‌, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్‌-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ కూడా సందిగ్దంలో పడింది.

    ఇదిలా ఉంటే, పాక్‌ మహిళల క్రికెట్‌ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్‌లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం​ చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్‌ ఊరట పొందింది. డర్బన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. 

  • భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ  జాబితాలో చేరాడు.

    బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.  

    మరో దిగ్గజం కూడా..!
    యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్‌ కూడా తన స్పెషలైజేషన్‌లో యువ బౌలర్లకు శిక్షణ​ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే రిస్ట్‌ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

    ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు.  

    కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు.  
     

  • భారత పురుషుల క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీస్‌కు చేరడంతో ఈ ఘనత సాధించింది. భారత్‌ తర్వాత అత్యధిక సార్లు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు చేరిన జట్లుగా ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్‌ (18) ఉన్నాయి. ఆతర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (16), పాకిస్తాన్‌ (16), సౌతాఫ్రికా (15), శ్రీలంక (11), వెస్టిండీస్‌ (11), ఆఫ్ఘనిస్తాన్‌ (1), బంగ్లాదేశ్‌ (1), కెన్యా (1) జట్లు ఉన్నాయి.

    ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ సెమీస్‌కు చేరిన సందర్భాలు..
    వన్డే వరల్డ్‌కప్‌- 8 సార్లు (1983, 1987, 1996, 2003, 2011, 2015, 2019, 2023)
    టీ20 వరల్డ్‌కప్‌- 6 సార్లు (1998, 2000, 2002, 2013, 2017, 2025)
    ఛాంపియన్స్‌ ట్రోఫీ- 6 సార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026*)

    కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 1) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్‌ (97 నాటౌట్‌) చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా శాంసన్‌ సహనం కోల్పోకుండా కడదాకా క్రీజ్‌లో ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 

    మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌ 1 టాపర్‌ సౌతాఫ్రికా, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తలపడతాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. 
     

  • టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గ్రూప్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లతో మ్యాచ్‌లలో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక నమీబియాతో మ్యాచ్‌కు అనారోగ్యం వల్ల దూరం అయ్యాడు.

    జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం
    అనంతరం సూపర్‌-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోరులోనూ అభిషేక్‌ (Abhishek Sharma) విఫలమయ్యాడు. కేవలం 15 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకం (30 బంతుల్లో 55) చేయగలిగాడు. అయితే, తాజాగా వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో మాత్రం మరోసారి అభిషేక్‌ తేలిపోయాడు.

    అవుటైపోవడం బెటర్‌
    ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 11 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో షిమ్రన్‌ హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ అభిషేక్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ ఎంత వేగంగా ఆడితే అంత మంచింది.

    తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ ఆ పని చేయలేకపోయాడు. ఒకవేళ పరుగులు రాబట్టడంలో విఫలమైతే అవుటైపోవడం బెటర్‌. టీ20 క్రికెట్‌లో ఇది కీలకం.

    పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు
    పరుగులు తీయలేక ఇబ్బంది పడుతున్న బ్యాటర్‌ అవుటైతే వేరొకరికి అవకాశం వస్తుంది. నిజానికి వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ ఈ నియమాన్ని పాటించకుండా పవర్‌ ప్లేలో మొత్తం క్రీజులో ఉండి జట్టును వెనుకపడేశాడు. పవర్‌ప్లే అయ్యాక అతడు అవుటయ్యాడు.

    ఇక అభిషేక్‌ శర్మ తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులే చేసి.. ఆ తర్వాత మరీ వెనుకబడ్డాడు. ఆ వెంటనే అవుటైపోయాడు. జట్టు ప్రయోజనాల కోసం అతడు రిస్క్‌ తీసుకునే సాహసం చేయలేదు’’ అని అభిషేక్‌ నాయర్‌.. అభిషేక్‌ శర్మ ఆట తీరును విశ్లేషించాడు.

    కాగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 

    ఇదిలా ఉంటే.. విండీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ షాయీ హోప్‌ 33 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతడి స్లో బ్యాటింగ్‌ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. భారత్‌ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్‌ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్‌లో పర్యటిస్తున్నాయి.

    క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌
    ఆసీస్‌ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్‌ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్‌లోనే ఆసీస్‌ చేతిలో 0-3 తేడాతో క్లీన్‌ స్వీప్‌ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

    నామమాత్రపు విజయం
    సౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్‌.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్‌ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.

    చమారీ ఆల్‌రౌండ్‌ షో
    విండీస్‌ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది. 

  • టీమిండియా అద్భుతం చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ కీలక పాత్ర పోషించాడు.

    ఆద్యంతం నిలకడగా ఆడిన సంజూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో సిక్స్‌, ఫోర్‌ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

    వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు
    అయితే, టీమిండియా గెలుపునకు 10 బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 17) ఐదో వికెట్‌గా వెనుదిరగగా.. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆఖరి ఓవర్లో విజయ సమీకరణం ఏడు పరుగులుగా మారగా.. సంజూ తొలుత సిక్స్‌, ఆ తర్వాత ఫోర్‌ బాది గెలుపు ఖరారు చేశాడు.

    ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం
    నిజానికి దూబే బాదిన రెండు ఫోర్ల వల్ల సంజూపై ఒత్తిడి తగ్గి మరింత స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలిగాడు. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘దూబే బాదిన ఆ రెండు ఫోర్లు అత్యంత కీలకం.

    క్రికెట్‌ రికార్డులలో వాటికి చోటు లేకపోవచ్చు. కానీ క్రికెట్‌ గురించి పూర్తి అవగాహన ఉన్న వారికి వాటి ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ రెండు ఫోర్లే ఒత్తిడిని తగ్గించాయి. చివరి ఓవర్లో 8-9 పరుగులు తీయడం కూడా ఒక్కోసారి కష్టం కావచ్చు.

    సంజూ విషయంలో హ్యాపీ
    ఏదేమైనా సంజూ విషయంలోనూ నేను సంతోషంగా ఉన్నాను. అతడు గత కొంతకాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు రోజురోజుకీ మరింత గొప్పగా ఆడాలని కోరుకుంటున్నా’’ అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

    చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • టీమిండియా జూన్‌ షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    సెమీ ఫైనల్‌లో భారత్‌
    కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన భారత్‌.. సూపర్‌-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో గురువారం (మార్చి 5) సెమీస్‌ మ్యాచ్‌లో తలపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

    మళ్లీ జూన్‌లోనే
    ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరితే మార్చి 8న టైటిల్‌ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్‌-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.

    అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌
    ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్‌ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్‌ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్‌ జరుగనుంది. భారత్‌- అఫ్గన్‌ టెస్టుకు న్యూ చండీగఢ్‌ వేదిక కాగా.. వన్డే సిరీస్‌కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

    రో-కో రీఎంట్రీ డేట్‌ ఫిక్స్‌.. అభిమానులు ఖుష్‌
    అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ బరిలో దిగారు.

    రోహిత్‌ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో భారత్‌ కివీస్‌ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ సందర్భంగా జూన్‌ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్‌ అభిమానులను అలరించనున్నారు.

    భారత్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ షెడ్యూల్‌
    👉జూన్‌ 6- 10 టెస్టు మ్యాచ్‌, న్యూ చంఢీగఢ్‌ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)
    👉జూన్‌ 14- తొలి వన్డే, ధర్మశాల
    👉జూన్‌ 17- రెండో వన్డే, లక్నో
    👉జూన్‌ 20- మూడో వన్డే, చెన్నై.
    👉వన్డే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. 

    చదవండి: T20 WC: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్‌!

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో ఆరంభం నుంచి అద్భుత ఆట తీరు కనబరిచిన వెస్టిండీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించి సెమీస్‌ రేసులోకి దూసుకవచ్చిన విండీస్‌.. కీలక మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేసింది.

    విండీస్‌ అవుట్‌
    తొలుత సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్‌ జట్టు.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా భారత్‌ సెమీస్‌కు దూసుకువెళ్లగా.. వెస్టిండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌.. వెస్టిండీస్‌ సారథి షాయీ హోప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడొక స్వార్థ పరుడు.. తుదిజట్టులో అతడికి చోటు దండగ అంటూ ఘాటుగా విమర్శించాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం సరికాదని చురకలు అంటించాడు.

    స్వార్థపరుడు..
    ‘‘ప్రతి మ్యాచ్‌లో కేవలం స్వార్థం కోసం మాత్రమే అతడు ఆడతాడు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. తప్పునంతా పావెల్‌, హోల్డర్‌లపై నెట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆఖర్లో సరిగ్గా ఆడలేదంటూ వారిని నిందించాడు.

    నిజానికి నీ చెత్త బ్యాటింగ్‌తో నువ్వే వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవు. నిన్ను కెప్టెన్‌గా నియమించడమే వెస్టిండీస్‌ క్రికెట్‌ చేసిన అతి పెద్ద తప్పు.

    తుదిజట్టులో ఉండటమే దండగ
    అసలు తుదిజట్టులో షాయీ హోప్‌ ఉండటమే దండగ. అతడు కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ముందుంటాడు. బ్యాట్‌తో రాణించలేడు. అతడికి బదులు వేరొకరిని జట్టులోకి తీసుకుంటే బాగుండేదేమో! నీ బదులు రొమారియో షెఫర్డ్‌ను ఓపెనర్‌గా పంపి ఉంటే బాగుండేది హోప్‌’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ షాయీ హోప్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    కాగా కోల్‌కతాలో భారత్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన విండీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ షాయీ హోప్‌ 33 బంతులు ఎదుర్కొని 32 పరుగులే చేయగలిగాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఇక మరో ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ 25 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు.

    సంజూ శాంసన్‌ ధనాధన్‌
    ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా 20 ఓవర్లలో విండీస్‌ 195 పరుగులు స్కోరు చేయగలిగింది.

    అయితే, సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌) విజృంభణ కారణంగా టీమిండియా 192. ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది.

    చదవండి: IND vs WI అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. అందుకే మద్దతు: గంభీర్‌

National

  • బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో  ఫిబ్రవరి 18న  జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన  హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.

    గత ‍కొన్ని రోజులుగా టీవీ నటి  నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ ‍ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్‌ నాగేష్ తెలిపారు.

    ఇదీ చదవండి: న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌

    దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్‌ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్‌  ప్రకారం  బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్ రావుపై ఎటాక్‌ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

    అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్‌లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు  'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 

  • న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరుపుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ.. ఆ దేశాల నేతలకు ఫోన్లు చేసి చర్చిస్తున్నారు.  

    ఈ యుద్ధం సెగ గల్ఫ్‌ దేశాలపై తీవ్రంగా ఉంది. ప్రధానంగా ఎనిమిది అరబ్‌ దేశాలపై పడింది. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పించిన అరబ్‌ దేశాలను టార్గెట​ చేస్తూ ఇరాన్‌ దాడులను ఉధృతం చేసింది.  ఇది అమెరికాపై ప్రత్యక్ష ప్రభావం కంటే గల్ఫ్‌ దేశాలు అత్యంత ప్రభావితమవుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

    అమెరికాను యుద్ధం నుంచి ఉపసంహరించుకోవడానికి  ఇరాన్‌ వేసిన ఎత్తుగడగా ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.. వారి మాటల్ని బట్టి ఇప్పుడు ప్రభావితమయ్యే గల్ప్‌ దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మొరపెట్టుకుని యుద్ధం ఆపేలా చేయాలనేది ఇరాన్‌ వ్యూహంగా కనబడుతోంది. దీనిలో భాగంగా గల్ఫ్‌ దేశాలను టార్గెట్‌ చేసింది ఇరాన్‌. 

    దాంతో గల్ఫ్‌ దేశాల్లో విదేశీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  ఏ ముప్పు పొంచి ఉందో అర్థం కాకండా ఉంది వారి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయా దేశాధినేతలతో ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితిపై చర్చిస్తున్నారు. 

  • చీరప్పంచిరలో , భగవాన్ అయ్యప్ప స్వామి జన్మోత్సవం (పుట్టినరోజు) వేడుకలు మార్చి 4న ప్రారంభమై మార్చి 13 , 2026 వరకు కొనసాగుతాయి. భగవాన్ అయ్యప్ప ఉపయోగించిన పవిత్ర వస్తువులు , ఆయన పవిత్ర వస్త్రాలు మరియు కత్తిని ఎంతో భక్తితో భద్రపరిచిన దృశ్యాన్ని చూసే అరుదైన అవకాశం భక్తులకు లభిస్తుంది.

    పందళం వద్ద , వలియకోయిక్కల్ ఆలయం భగవాన్ అయ్యప్ప జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ఉత్సవ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. తెల్లవారుజామున , పవిత్రమైన తిరువాభరణం పెట్టెలను స్రంపికల్ ప్యాలెస్ నుండి ఉత్సవంగా తీసుకెళ్లి , ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్వహించే వలియకోయిక్కల్ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ పవిత్ర ఊరేగింపులో సూర్యోదయం సమయంలో గరుడ దర్శనాన్ని భక్తులు సాంప్రదాయకంగా చూస్తారు.

    వలియకోయిక్కల్ ఆలయంలో భగవాన్ అయ్యప్ప సంకల్పంతో పవిత్ర ఆభరణాలను అలంకరించి , ఉదయం 11 గంటలకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో తిడంబు ఊరేగింపును కూడా భక్తులు వీక్షించవచ్చు.

    మార్చి 4న పందళంలో కార్యక్రమాలు

    ఉదయం కార్యక్రమాలు

    భక్తి సమర్పణలు మరియు సాంప్రదాయ ఆచారాలతో రోజు ముందుగానే ప్రారంభమవుతుంది:

    ఉదయం 4:00 గంటలకు – పల్లియునర్తల్ (మేల్కొలుపు వేడుక)

    5:00 AM - నడతురక్కల్ , నిర్మాల్యదర్శనం , అభిషేకం మరియు ప్రత్యేక పూజలు

    5:30 AM - అష్టద్రవ్య గణపతి హోమం

    6:30 AM - శబరిమల శ్రీ అయ్యప్పన్ పవిత్ర తిరువాభరణం (ఎజున్నల్లిప్పు) ఆలయం వైపు ఊరేగింపు

    ఉదయం 7:00 గంటలకు - నవకం , కలశం, ప్రత్యేక నైవేద్యాలు

    8:00 AM - భక్తి గాన సదస్సు (భక్తి సంగీత సెషన్)

    9:00 AM - వజక్కఙ్చ , కులధివేషం , మరియు నాదస్వరం ప్రదర్శన

    ఉదయం 11:00 గంటలకు , భక్తులు దివ్య తిరువాభరణంతో అద్భుతంగా అలంకరించబడిన అయ్యప్పస్వామి పవిత్ర దర్శనం చేసుకోవచ్చు.

    ఈ వేడుక సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి ప్రదర్శనల శ్రేణి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సుసంపన్నం చేస్తుంది:

    వైద్య సహాయం (గ్రీన్మెడ్ క్లినిక్), సామాజిక సేవా కార్యకలాపాలు సమన్వయంతో కూడిన స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యం ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి దోహదపడుతుంది. ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. కాగా, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో అయ్యప్ప జన్మదినోత్సవ వేడుకలను వైభవాన్ని బాణసంచా కాల్చడం , పవిత్ర మంత్రాలు, దైవిక భక్తితో జరుపుకుంటారు.

     

    (చదవండి: సంజూ సీక్రెట్‌.. ఆమెతో లవ్‌స్టోరీ! చారులత గురించి తెలుసా?)

  • చైన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సింగంపువారి పల్లిలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఎద్దులు అదుపుతప్పి ప్రేక్షకుల పైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్దంతో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయన్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు సమన్వయం పాటించాలని చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్ ఎప్పుడూ శాంతి కోసమే కృషిచేస్తుందని మోదీ తెలిపారు. 

    నిన్న ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఆయన మృతితో ఇరాన్ రెచ్చిపోతుంది. తన సమీప గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్‌ పైనా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ప్రతి దాడులు చేస్తుండడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    అయితే ప్రస్తుతం ఇరాన్‌ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలని సూచించింది. మత ప్రచారాలను గుర్తించి ముందస్తు చర్యలను తీసుకోవాలంది. ఉద్రిక్త ప్రసంగాలు చేసే వారిపై నిఘా ఉంచాలని తెలిపింది. అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

     

  • ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాద ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఇదే విమాన ప్రయాణంలో వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని రోహిత్ సింగ్ చీఫ్ పైలట్ సీటులో నిద్రపోతున్నట్లు కనిపిస్తున్న ఒక వీడియోను అజిత్ పవార్ కుమారుడు జై పవార్ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది. ఈ స్థాయి బాధ్యతారాహిత్యం క్షమించరానిదని  ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రోహిత్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

    జనవరి 28న పూణే జిల్లా బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నడుపుతున్నది. ఈ  ఘటనపై తీవ్రంగా స్పందించిన జై పవార్.. తన తండ్రిని కోల్పోయిన వేదన వర్ణనాతీతమని, ఆ బాధ జీవితాంతం తమను వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ స్థానంలో కూర్చుని నిద్రపోవడం ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడమేనని, ఇది అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమని జై పవార్  అన్నారు.

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ ముగిసేవరకు వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన అన్ని విమానాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శనివారం విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై కూడా జై పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ప్రమాద సమయంలో విజిబిలిటీ నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉండటం, రన్‌వేపై గుర్తులు వెలిసిపోవడం, రన్‌వే ఉపరితలంపై చిన్నపాటి రాళ్లు ఉండటం ప్రమాదానికి కారణాలు కావచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక అసంపూర్తిగా ఉందని, దీనివల్ల తమకు న్యాయం జరగదని జై పవార్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజలకు, బాధిత కుటుంబాలకు ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విమాన ప్రమాదానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ తాజా వీడియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జై పవార్ డిమాండ్‌ చేశారు.

    ఇది కూడా చదవండి: చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్

  • సీనియర్‌ సిటిజెన్‌ అని ప్రత్యేకంగ పేర్కొన్నప్పటికీ, రైల్వే రిజర్వేషన్‌ సమయంలో చాలా మందికి లోయర్‌ బర్త్‌లు ఎలాట్‌ కావు. పైగా అప్పర్‌  బర్త్‌లు కేటాయించడం  ఒక్కోసారి  చాలా కోపం తెప్పిస్తుంది. అలా కాసేపు రైల్వేస్‌ని తిట్టుకుని ఊరుకోకుండా  ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. 82ఏళ్ల మహిళకు అప్పర్ బెర్త్ కేటాయించారని వ్యక్తి ఫిర్యాదుపై భారతీయ రైల్వేస్‌ ఎలా స్పందించింది. సీనియర్‌ సిటిజన్లకు లోయర్‌  బెర్త్‌ రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం ఈ కథనంలో..

    ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌ ద్వారా రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకుంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయర్‌ బెర్త్‌లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్‌లో పైబెర్త్ కేటాయించడంపై   సోషల్‌ మీడియా ద్వారా రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్‌లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముకున్నారు” అంటూ ఐఆర్‌సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. దీనిపై ఐఆర్‌సీటీసీ స్పందించింది క్లారిటీ ఇచ్చింది.

    ఐఆర్‌సీటీసీ ఏమందీ అంటే..
    ఈ వైరల్ పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి నియమాలను స్పష్టం చేసింది.

    "సర్, భారత రైల్వేల కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్‌లో, సీనియర్ సిటిజన్లు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, వేరే మార్గం లేకపోయినా, స్వయంచాలకంగా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. అయితే, ఇది బుకింగ్ సమయంలో అటువంటి లోయర్ బెర్త్‌ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో, లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్‌ను ఎంచుకునే నిబంధన ఉందని కూడా  ఉంది.  ఈ సందర్భంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ బుక్  అవుతుంది. అంతేకాకుండా, ఇండియన్ రైల్వేలలో, రిజర్వ్ చేయబడిన వసతిని ఫస్ట్‌ కమ్‌ఫస్ట్‌ సర్వ్‌  కింద బుక్‌ అవుతుంది. ఎంపిక చేసుకున్న బెర్త్ లభ్యతకు లోబడి కేటాయించబడుతుంది" అని IRCTC  వివరణ ఇచ్చింది. 

    లోయర్‌ బెర్త్‌ కావాలంటే  ఈ చిట్కా పాటించాలట

     

    ఇలాంటి వివాదంలో  గతంలో  ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)  ఇచ్చిన వివరణ ఇచ్చారు. ఇది చాలామంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించడంలో సహాయపడింది. "మీరు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్‌లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి.  అలా కాకుండా ఒకే టికెట్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చినట్లయితే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయని టీటీ వివరించారు.

     

    ఇదీ చదవండి : తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?

    భారతీయ రైల్వేస్‌లో సీనియర్ సిటిజన్ కోటా ఆటోమేటిక్ లోయర్ బెర్త్ కేటాయింపు లభ్యతను బట్టి 60 ఏళ్లు, అంతకు పైబడిన పురుషులకు, 45 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు లోయర్ బెర్త్‌లు కేటాయించ బడతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వయస్సు రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, వారు ప్రయాణ సమయంలో వారి వయస్సును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి . టికెట్ తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు దానిని చూపించాలి.

    ఇదీ చదవండి: విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు
     

  • న్యూఢిల్లీ: మార్చి నెల ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన మూడేళ్ల కాలంలో 2026 ఫిబ్రవరి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం, మార్చి 1వ తేదీన ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా హోలీ పండగ తరువాత  అంటే మార్చి 7 నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గంటకు సుమారు 33 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నప్పటికీ, అవి ఎండ తీవ్రత నుంచి ఉపశమనాన్ని కలిగించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ గాలుల వేగం తగ్గే అవకాశం ఉండటంతో ఉష్ణతాపం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే పైస్థాయికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. సమీప భవిష్యత్తులో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, పగటివేళ బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఈ తరహా వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

    ఇది కూడా చదవండి: 91శాతం వైద్యుల షాకింగ్‌ డెసిషన్‌!

Telangana

  • న్యూఢిల్లీ : మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. దీనిలో  భాగంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.

    ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం మరియు సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.

    ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

    24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
    (న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)

    వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్-91 9871999044

    సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-91 9958322143

  • సాక్షి హైదరాబాద్: నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. హోలీ నేపథ్యంలో ఈరోజు (సోమవారం) బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ కార్యాలయం పోలీసు అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీసులకు సూచించారు.

    ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడాలన్నారు.  వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామ‌ని సజ్జనార్ హెచ్చరించారు.  

    ప్రస్తుతం రంజాన్ మాసం నడస్తున్న నేప‌థ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల‌న్నారు. పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. హోలీ సందర్భంగా హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం  ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిపారు.

    హోలీ పండుగ సంద‌ర్భంగా  నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్ర‌కారం కేసులు నమోదు చెస్తామ‌ని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు. పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు. ఈ స‌మావేశంలో ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.

Family

  • శ్రీలంక లోని హపుటాలే అనే చిన్న కొండ పట్టణంలో టీ తోటల మధ్య సాగే జీవన విధానం ఒక నిశ్శబ్ద ప్రయాణ కథలా అనిపిస్తుంది. పొగమంచులో కమ్ముకున్న వెలుగు–నీడలు, టీ ఆకులు సేకరించే చేతులుం ఇవన్నీ ప్రతీ రోజు ప్రశాంతతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. 

    ఇక్కడ ప్రతీ ఉదయం హడావిడి లేకుండా మెల్లగా ప్రారంభమవుతుంది. లోయలో మేఘాలు సాఫీగా కదులుతూ ఉంటే, మనుషుల జీవితం కూడా అదే లయలో ముందుకు సాగుతుంది. సమయం ఇక్కడ పరుగెత్తదుం నడుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఇక్కడ సమయం గడుస్తుంది.

    సందర్శనీయ స్థలాలు
    హపుటాలేలో పర్యాటకులు తప్పక వెళ్లే ప్రదేశాల్లో లిప్టన్‌ సీట్, డియాలుమా జలపాతం ముఖ్యమైనవి. ఇక్కడ కనిపించేది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదుం సాధారణంగా కొనసాగుతున్న జీవితం యొక్క ఒక నిశ్శబ్ద రాగంలా ఉంటుంది. దగ్గర్లోని తంగమాలే బర్డ్‌ శాంక్చువరి వద్ద పక్షుల సందడి ఒక స్వచ్ఛమైన సంగీతంలా అనిపిస్తుంది. ప్రతీ ఉదయం ఇక్కడ వినిపించే స్వరాలు హృదయాన్ని తాకుతాయి.

    హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి కొలంబోకి నేరుగా విమాన ప్రయాణం చేసి, అక్కడి నుంచి రైలు లేదా క్యాబ్‌ ద్వారా హపుటాలే చేరవచ్చు. కొలంబో నుంచి ఈ కొండ ప్రాంతానికి వెళ్లే రైలు ప్రయాణం అత్యంత అందమైన అనుభవంగా ఉంటుంది.

    (చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!)

  • హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న స్పితి వ్యాలీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్బబ్ద నాటకం. మధ్యాహ్నం వెలుగుల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది. సాయంత్రం వెలుగుల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. 

    ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే ఇక్కడి అందాల వెనక భావాలు కూడా అర్థం అవుతాయి. ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కబ్జా చేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు నీడల ఈ ఆటను గమనిస్తే ప్రతీ గంట ఒక పెయింటింగ్లా ఉంటుంది. 

    సందర్శనీయ స్థలాలు
    హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహోల్‌ స్పితి జిల్లాలో ఉండే స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో కీ మోనాస్టరీ, చంద్రతాల్‌ లేక్, కిబ్బర్‌ గ్రామం ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది సీనరీకాదుంకాలమే నిశ్బబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతీ మలుపు ఒక సోస్ట్‌కార్డులా ఉంటుంది.

    హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి
    హైదరాబాద్‌ నుండి ఢిల్లీకి ఫ్లైట్‌ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మనాలీకి రోడ్డు జర్నీ ప్రారంభించవచ్చు. ఇక మనాలిలో మీకు నచ్చినంత టైమ్‌ స్సెండ్‌ చేసి స్పితీ వ్యాలీకి క్యాబ్‌ లేదా లోకల్‌ ట్రాన్స్‌పోర్టుతో అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండి΄ోతుంది. 

    (చదవండి: హోళీ..కలర్‌ఫుల్‌ టూర్‌ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!)

  • యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్‌ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే 

    ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! 
    కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. 

    ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.

    కృష్ణ జన్మభూమి వైభవం
    మధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. 

    అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్‌ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్‌ డివోషనల్‌ ఆరాను క్రియేట్‌ చేస్తాయి.

    యమునా తీరంలో నిశ్శబ్ద వేదం
    విశ్రామ్‌ ఘాట్‌ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్‌ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. 

    బ్రజ్‌ భూమిలో రంగుల ఋతువు
    మధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్‌ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్‌ చేస్తాయి. 

    రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.

    ‘రాధే రాధే’ అనే పలుకే మధురం...
    మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్‌ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.

    పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.

    చేయాల్సిన పనులు
    మధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్‌ వాక్‌ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్‌ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్‌ హ్యాక్‌.

    వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్‌లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.

    సందర్శనీయ స్థలాలు
    మధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్‌లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. 

    ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్‌ చేయలేరు. బృందావన్‌ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.

    ఎలా వెళ్లాలి ?

    ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.

    రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. 

    ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్‌ భూమిలో అడుగుపెడుతూనే  ఆనందానుభూతిని కలిగిస్తుంది.

    ఎక్కడ ఉండాలి ?
    మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్‌ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్‌లో తక్కువ ధరకే రూమ్స్‌ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్‌ లేదా ఫ్లైట్‌ టికెట్స్‌ వంటివి బుక్‌ చేసుకునే సమయంలో రూమ్స్‌ కూడా బుక్‌ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. 

    ఏం చూడాలి ? 
    మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్‌ మందిరం, విశ్రామ్‌ ఘాట్, బృందావన్, గోవర్ధన్‌ వంటి అనేక ప్రదేశాలను కవర్‌ చేయవచ్చు. 

    ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్‌ లిస్ట్‌ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్‌ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.

    – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు  

    (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!)

  • ఆదివారం వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్‌ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.

    సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్‌చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్‌ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్‌ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. 

    మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్‌ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్‌ ఇవానియోస్‌ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. 

    అయితే చారులత తన కెరీర్‌పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టి కెరీర్‌లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్‌ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్‌ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 

    (చదవండి: జస్ట్‌ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్‌..! నో జిమ్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌..)
     

  • బెంగళూరు: సాంకేతిక నగరం బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదునుపెట్టి, వంటగదిలో జరుగుతున్న బాగోతాన్ని బయట పెట్టారు. తన ఇంట్లో పని చేసే వంటమనిషిపై కలిగిన అనుమానంతో ఆయన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత నిఘా వ్యవస్థను వంటగదిలో ఏర్పాటు చేశారు. పంకజ్ తన్వర్ అనే ఈ టెక్కీ తాను రూపొందించిన ఈ వ్యవస్థను ‘ఏఐ రూమ్‌మేట్’గా అభివర్ణించారు. రిఫ్రిజిరేటర్ నుంచి ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటిపండ్లను వంటమనిషి పదేపదే తస్కరించడాన్ని ఈ ఏఐ బాట్ క్లిప్పింగులతో సహా రిపోర్ట్ చేయడంతో, పంకజ్ తన్వర్ ఆమెను వెంటనే పనిలోంచి తొలగించారు.

    ఈ వినూత్న నిఘా వ్యవస్థ కేవలం దొంగతనాన్ని పట్టుకోవడానికే పరిమితం కాకుండా, ఆ వంటమనిషి పనితీరును, శుభ్రతను కూడా నిశితంగా పరిశీలించింది. ఏ సమయంలో ఆమె వంటగదిలోకి వచ్చింది.. ఫ్రిజ్ ఎన్నిసార్లు తెరిచింది అనే వివరాలతో పాటు ఆమె పాటించే పరిశుభ్రతను కూడా యజమానికి నివేదించింది. చెత్త బుట్ట మూతను తాకిన చేతులతోనే చపాతీలు చేయడం, స్టౌ వెనుక భాగాన్ని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించడం లాంటి అంశాలను ఏఐ బాట్‌ ఫోటోలతో సహా పంకజ్ దృష్టికి తీసుకెళ్లింది.

    నెలకు రూ. 5,000 వేతనం తీసుకుంటూ, ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పంకజ్ తన్వర్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గోప్యతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. కెమెరా రికార్డ్ చేసే దృశ్యాల్లో ముఖాలను బ్లర్ చేసి, కేవలం చర్యలను మాత్రమే విశ్లేషించేలా దీనిని రూపొందించారు. భవిష్యత్తులో గ్యాస్ లీకేజీని గుర్తించే ఫీచర్లను కూడా దీనికి జోడించనున్నట్లు ఆయన వెల్లడించారు.

    అయితే ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు ఆయన సాంకేతిక నైపుణ్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు అతి తక్కువ వేతనానికి పని చేసే సామాన్యులపై ఇంతటి నిఘా ఉంచడం నైతికంగా సరికాదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన పంకజ్.. సదరు వంటమనిషిని తాను ఇదివరకే రెండుసార్లు హెచ్చరించానని అన్నారు. తన అనుమతితో ఆహారం తీసుకుంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని, కానీ దొంగతనాన్ని తాను సహించేదిలేదని స్పష్టం చేశారు.

    ఇది కూడా చదవండి: హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే!

  • ఇంతవరకు చూసిన వెయిట్‌లాస్‌ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్‌ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ‍ప్రయత్నించాడో వివరించే వెయిట్‌లాస్‌ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్‌కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్‌లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. 

    జిమ్‌, డైట్‌ పాటించకుండా ఆ టీనేజర్‌ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్‌గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్‌ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్‌ల తోపాటు బార్‌బెల్‌ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. 

    మొదట్లో పుల్‌అప్‌బార్‌లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్‌అప్‌ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్‌తో ఇవాళ సుమారు 18 పుల్‌అప్‌లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. 

    అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్‌గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్‌. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్‌లాస్‌కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్‌లాస్‌ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్‌గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.

    (చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!)

     

  • వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

    అతడే సుమిత్‌ మిట్టల్‌ తన మొత్తం సక్సెస్‌ జర్నీని సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. 

    దాంతో కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్‌సెట్‌లో ఆల్‌ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్‌లో ఎంసీఏ చేసే రేంజ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్‌ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. 

    చివరగా సుమిత్‌ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్‌ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: హార్ట్‌బీట్‌ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!)