Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఓ సినీమా స్టార్‌తో ఓ క్రికెట్ స్టార్‌ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలిశారు. ఐపీఎల్‌(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న అయ్యర్‌ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బన్నీ కుమారుడు అల్లు అయాన్ కోసం ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన సంతకంతో కూడిన స్పెషల్ క్రికెట్ జెర్సీని అయాన్‌కు బహుమతిగా అందించారు.  

    ఇక ఈ గిఫ్ట్‌పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ బన్నీ పోస్ట్ చేశారు.  

    ఈ భేటీతో అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ లవర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్‌తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

  • మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.  

    అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్‌ సాంగ్‌ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్‌గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.

    రామ్‌చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్‌ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్‌ యాక్టింగ్‌ అని అన్నారు. 

    కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆంధ్రాలో విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలంగాణలోని థియేటర్లలోకి వస్తుందా అనే సందేహం మాత్రం నెలకొంది. దానికి కారణం పర్సంటేజీ వివాదం. కొన్నిరోజుల ముందు అంతా సద్దుమణిగింది అనుకుంటే.. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పెద్ది'కి పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఇదలా ఉండగానే నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

    (ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)

    'మీరు పెద్ది సినిమాని ఇదే ప్రకారం ఆపాలని నిర్ణయించుకుంటే బుధవారం(మే 27) ఉదయం 10 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆమరణ నిరహార దీక్షకు దిగుతా. మీరు చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయట్లేదు అంటూనే అదే చేస్తున్నారు. చేస్తున్న వాళ్లు ఎవరో మాకు బాగా తెలుసు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ ఆటకు బలికావద్దు' అని నట్టికుమార్ ఆవేశపడిపోయారు.

    ఇదంతా చూస్తుంటే తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ అవుతుందా అనిపిస్తుంది. శనివారం జరిగిన ఇదే ప్రెస్‌మీట్‌లో ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి ఈ అడ్డంకులు దాటుకుని మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?

    స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో చరణ్.. రన్నర్, క్రికెటర్, కుస్తీ వీరుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.

    (ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)

  • జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిజిక్ మెంటైన్ చేస్తూ ఫిట్ ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో మాత్రం కాస్త బొద్దుగా ఉండేవాడు. రాఖీ మూవీ టైంలో ఇదే విషయమై పలు విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత పూర్తిగా లుక్ మార్చి అందరికీ షాకిచ్చాడు. అయితే చిన్నతనంలోనే తన శరీరం గురించి ఆలోచిస్తూ తారక్ మదనపడేవాడని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెప్పారు. ఎన్టీఆర్ చిన్నతనంలో జరిగిన సంఘటనలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ‍థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)

    'జూ.ఎన్టీఆర్‌కి నేనంటే ఇష్టం. చిన్నప్పుడే యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోవాలనుకున్నాడు. దీని గురించే వాళ్ల ‍అమ్మ కూడా నన్ను అడిగారు. 'వద్దమ్మా.. మీ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలు చేయించండి బాగా చేస్తాడు' అన్నాను. 'అంకుల్ నేను లావుగా ఉన్నానా? జనాలు చూస్తారా?' అని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. దీంతో బాబు నువ్వు మీ తాత లాగా బ్రహ్మాండంగా ఉంటావు. నువ్వేం భయపడక్కకర్లేదు' అని చెప్పినట్లు పోసాని వెల్లడించారు.

    'డైరెక్టర్ ఉదయ్ కుమార్‌తో అప్పట్లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. దీనికి నన్ను డైలాగ్స్ రాయమని అడిగాడు. అప్పట్లో రైటర్‌గా బిజీగా ఉండేవాడిని కథ వినమని చెబితే వెళ్లి విన్నాను. 'మీకు స్టోరీ నచ్చిందా బాబు' అని తారక్‌ని అడిగాను. నచ్చిందని చెప్పాడు. నేను మాత్రం నాకు నచ్చలేదు. కథ బాగోలేదు బాబు అని డైరెక్టర్ అక్కడున్నప్పుడే ఎన్టీఆర్‌కి చెప్పా. స్టోరీ లైన్ నచ్చకపోయినా నువ్వు డైలాగ్స్ రాయమంటే రాస్తాను. ఆలోచించుకో బాబు అని అన్నాను. మీరు వద్దు అన్న తర్వాత ఇంకెందుకు అని ఆ స్టోరీని పక్కనబెట్టేశాడు. ఎన్టీఆర్ నన్ను అంతలా నమ్మాడు. అలా ఉదయ్ కుమార్‌తో కాకుండా రాజమౌళితో 'సింహాద్రి' చేశాడు. తర్వాత ఎక్కడికో వెళ్లిపోయాడు' అని పోసాని అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.

    కెరీర్ ప్రారంభంలో రచయిత, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. తర్వాత కాలంలో నటుడిగా మారారు. ఎన్టీఆర్ 'టెంపర్' మూవీలో ఈయన చేసిన నారాయణమూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో 'మీరు మారిపోయారు సర్' అని పోసాని చెప్పే డైలాగ్ ‍అయితే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోసాని లీడ్ రోల్ చేస్తూ దర్శకనిర్మాతగా 'ఆపరేషన్ అరుణారెడ్డి' తీశారు. దీని ప్రమోషన్లలో భాగంగానే ఎన్టీఆర్ చిన్నప్పటి విషయాల్ని పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)

  • ఉప్పల్ స్టేడియంలో హీరోయిన్ శాన్వి మేఘన

    చిత్రమైన డ్రస్‌లో షాకిచ్చిన నోరా ఫతేహి

    మేకప్‌తో అదరగొట్టేసిన అనన్య నాగళ్ల

    చూడచక్కగా మెరిసిపోతున్న విష్ణుప్రియ

    ఒంపుసొంపులతో హీరోయిన్ సయీ మంజ్రేకర్

    అద్దం పక్కన పోజులతో నటి మౌనీ రాయ్

  • రెండు సీజన్లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకున్న సిరీస్ 'సేవ్ ది టైగ‌ర్స్'. ఇప్పుడు దీని మూడో సీజన్ కూడా రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. 2023లో రిలీజైన తొలి సీజన్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తర్వాత రెండో సీజన్ కూడా అలాంటి స్పందన సొంతం చేసుకుంది. తాజాగా సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్-3 కూడా రాబోతుంది. దీనికి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మరిన్ని ఆస‌క్తిక‌ర ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో అల‌రించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

    (ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)

    తాజాగా రిలీజ్ చేసిన 'సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3' పోస్టర్ చూస్తుంటే కథలో కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే తెలుస్తోంది. తొలి రెండు సీజన్లలో అలరించిన ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్3లోనూ అల‌రించ‌నున్నాయి. ఈసారి సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది

    (ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)

  • ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

    ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఆగస్టులో ఈ చిత్రాన్ని ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. ఈ కథ తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ ఆంటోని కనిపిస్తున్న తీరు, రక్తంతో ఉన్న ఆ విధానం, ఆయన ఇంటెన్స్ లుక్స్ ఇవన్నీ కథ ఎంత డెప్త్‌గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు.

    ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు కష్టాలు తొలగిపోలేదు. సమస్య మళ్లీ మొదటకొచ్చింది. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజీ గొడవ మళ్లీ మొదలైంది. 'పెద్ది'కి కూడా పర్సంటేజీ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో శనివారం సమావేశమైన అనంతరం పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

    (ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)

    తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీతో రెండుమూడు సార్లు చర్చలు జరిగాయి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే 2-3 నెలల్లో సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయినా అది జరగలేదు. నిర్మాతలు.. ముందుగా మూడు వారాలన్నారు. ఇప్పుడు మరో మూడు వారాలని వాయిదా వేస్తున్నారు. పర్సంటేజీ ఇస్తేనే సినిమాలని థియేటర్లలో ఆడిస్తాం అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు.

    దేశం మొత్తం థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉంది. తెలంగాణలో మాత్రం రెంటల్ ఉంది. నిర్మాతలు.. సమస్యని రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగడం లేదు. మాకు పర్సంటేజీ విధానం కావాల్సిందే. అది ఎంతిస్తారో చెప్పండి అని కూడా శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు తెలంగాణలో మాత్రం ఉండదు. రేట్లు పెంచొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాశాం. 'పెద్ది'పై మాకు ఎలాంటి పగ లేదు. కానీ ఇప్పుడు కాకపోతే నిర్మాతలు మళ్లీ ఎప్పుడు పట్టించుకుంటారనేది తెలియదు అందుకే ఈ చిత్రాన్ని కూడా పర్సంటేజీ శ్లాబ్‌లో చేర్చాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చారు.

    దీనిబట్టి చూస్తే ఆంధ్రా వరకు 'పెద్ది'కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు గానీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే అటు నిర్మాతలు గానీ ఇటు ఎగ్జిబిటర్లు ఎవరూ తగ్గడం లేదు. విడుదలకు మరో 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో 'పెద్ది' విషయంలో ఏం జరుగుతుందనేది సస్పెన్స్‌లా మారిపోయింది.

    (ఇదీ చదవండి: వయసు తేడా ఏడాది.. తల్లీకొడుకుగా చేసిన హీరోహీరోయిన్)

  • రీసెంట్ టైంలో విడాకుల విషయంతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి మౌనీరాయ్.. ఇప్పుడు ఎవరూ ఊహించని పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కి తల్లిగా చేసింది. వచ్చే నెల 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ట్రెండింగ్ బ్యూటీస్ మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోయిన్లు కావడం విశేషం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ‍థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)

    వరుణ్ ధావన్, మృణాల్ ఠాకుర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. డేవిడ్ ధావన్ దర్శకుడు. వదిలిన ట్రైలర్ బట్టి చూస్తే హీరో.. ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమిస్తాడు. పెళ్లికి ముందే వాళ్లిద్దరినీ గర్భవతుల్ని కూడా చేస్తాడు. మరి వీళ్లిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సదరు అమ్మాయిలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారా? లేదా? అనే కన్ఫ్యూజన్ కామెడీనే స్టోరీ అని తెలుస్తోంది.

    ఈ మూవీలోనే వరుణ్ ధావన్ పాత్రకు అద్దె తల్లిగా మౌనీరాయ్ కనిపించనుంది. నిజజీవితంలో వీళ్లిద్దరికీ వయసు వ్యత్యాసం ఏడాదే. కానీ తల్లికొడుకులుగా నటించడం విశేషం. ఇకపోతే ఈ మూవీ టైపు స్టోరీలు హిందీలో ఇదివరకే బోలెడన్ని వచ్చాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి? జూన్ 5న రిలీజ్ పెట్టుకున్నారు. అయితే దీని కంటే ఒకరోజు ముందు 'పెద్ది' వస్తోంది.

    (ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)

  • బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం సాగించినవారిలో హీరోయిన్‌ భామ ఒకరు. ఈమె అసలు పేరు రేఖిత ఆర్‌.కురుప్‌. నేడు (మే 23న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

    టీవీ నుంచి వెండితెరపైకి..
    కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగింది భామ. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై మెరిసింది. సూర్య టీవీ ఛానల్‌లో తాళి అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తర్వాత ఓ ఆల్బమ్‌లోనూ యాక్ట్‌ చేసింది. సరిగ్గా అదే సమయంలో మలయాళ దర్శకుడు లోహితదాస్‌ ఆమెను చూశాడు. నివేద్యం సినిమాతో భామను కథానాయికగా పరిచయం చేశాడు. 

    తెలుగులోనూ..
    ఫస్ట్‌ సినిమా క్లిక్‌ అవడంతో భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. అదే సమయంలో ఎల్లం అవన్‌ సేయల్‌ ద్వారా తమిళంలో, మొదలశాలతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మంచివాడు (2011) అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. తనలో మంచి సింగర్‌ కూడా దాగుంది.

    సింగిల్‌ మదర్‌గా..
    2020లో వ్యాపారవేత్త అరుణ్‌ జగదీశ్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది. ఇంతలోనే ఈ జంటకు కూతురు గౌరి పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. ప్రస్తుతం భామ సింగిల్‌ పేరెంట్‌గా కూతురిని పోషిస్తోంది. గతేడాది (2025) సుమతి వలవు చిత్రంతో సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

    చదవండి: భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి

  • కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఈమె స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి ఫొటోషూట్ చేసిందని చెప్పి ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. నిజంగానే రుక్మిణి ఇలా చేసిందా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు సదరు బికినీ పిక్స్‌పై ‍స్వయంగా రుక్మిణినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్‌.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: టాలీవుడ్ హీరోయిన్‌)

    'ఏఐ సాయంతో సృష్టించిన నా ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడం నేను, నా టీమ్ గుర్తించాం. అవన్నీ ఫేక్. ఏఐతో తయారు చేశారని క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటివి క్రియేట్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే. అలానే మా వ్యక్తిగత గోప్యతని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫొటోలని సృష్టించిన వాళ్లతో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు మొదలుపెట్టాం. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని రుక్మిణి చెప్పుకొచ్చింది.

    రీసెంట్ టైంలో ఇలా జరగడం మరీ ఎక్కువైపోయింది. గతంలో పలువురు ఫొటోగ్రాఫర్లు.. వెనక వైపు నుంచి, అసభ్యకర యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్నారని రుక్మిణితో పాటు పలువురు కన్నడ హీరోయిన్లు ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడిలా జరిగింది. యాంకర్ అనసూయకి కూడా ఇలానే జరగడంతో కేసు పెట్టింది.

    రుక్మిణి సినిమాల విషయానికొస్తే.. కన్నడలో చేసిన 'సప్త సాగర ఎల్లో దాచే' రెండు భాగాలతో పాటు 'కాంతార' సీక్వెల్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'డ్రాగన్'లో నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ ‍థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన)

  • థియేటర్లలో రిలీజైన చిన్నాపెద్దా సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా సతీ లీలావతి, గాయపడ్డ సింహం, సిస్టమ్, లవ్ యూ రా, 14, రాజుగాని సవాల్, మధువిధు, టీఎన్ 2026 లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి పక్కనబెడితే తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

    ధనుష్, మమిత బైజు జంటగా నటించిన సినిమా 'కర'. విఘ్నేశ్ రాజా దర్శకుడు. ఓ మాదిరి అంచనాలతో గత నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగతనానికి సంబంధించిన సీన్స్ బాగున్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు అంతంత మాత్రంగానే మెప్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ వచ్చే గురువారం(మే 28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

    'కర' విషయానికొస్తే.. కరస్వామి(ధనుష్) ఓ దొంగ. ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి(మమిత బైజు) కోసం అదంతా వదిలేసి కష్టపడాలని నిర్ణయించుకుంటాడు. ఓ హోటల్ పెట్టాలనుకుని దానికి అవసరమైన డబ్బు కోసం ఊరిలోని తమ పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతాడు. మళ్లీ దొంగతనాలు చేసేందుకు సిద్ధమవుతాడు. ఒకే ‍బ్యాంక్‌కి చెందిన బ్రాంచ్‌ల్లో డబ్బులు కొల్లగొట్టేస్తుంటాడు. కర ఇలా చేయడానికి కారణమేంటి? చివరకు పోలీసులకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు)

  • బాలీవుడ్‌ నటి కంగానా రనౌత్‌కు సంబంధించిన ఓ వీడియో గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో కంగనా మెడలో నల్ల పూజల దండా, చేతికి మట్టిగాజులు ఉన్నాయి. దీంతో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కొంతమంది ఆ వీడియోని షేర్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై కంగనా స్పందించింది. తనకు సీక్రెట్‌ పెళ్లి చేసుకునే అవసరం లేదని, ఒకవేళ​ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటానని తనదైన శైలీలో ఇన్‌స్టా స్టోరీలో బదులిచ్చింది.

    ‘నేను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆ వీడియో,ఫోటో తీశారు. అది సినిమాలో నా క్యారెక్టర్‌. అది చూసి చాలా మంది నాకు కాల్స్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న మహిళగా నటించాను. అందులో తప్పేముంది? నటీనటులు అన్నాక అన్ని పాత్రలు చేయాలి. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటా. ఇది నా ప్రామిస్‌’ అని కంగనా చెప్పుకొచ్చింది. 

    కంగనా ప్రస్తుతం క్వీన్‌ మూవీ సీక్వెల్‌లో నటిస్తోంది.  ‘క్వీన్‌’లో వివాహం రద్దయి విదేశాలకు వెళ్లిన మహిళగా కనిపించిన కంగనా.. సీక్వెల్‌లో పెళ్లైన మహిళగా కనిపించబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.  

  • పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మందికి ఆశ.. అందులోనూ సెలబ్రిటీలు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో చూడాలని చాలామంది తహతహలాడుతుంటారు. వారందరి కోసమే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అలా ఎక్కువమందికి దగ్గరైన షో బిగ్‌బాస్‌. ఈసారి కొత్తగా 'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' అనే షో తీసుకొచ్చారు. ఇది మాటీవీతో పాటు హాట్‌స్టార్‌లోనూ ప్రసారమైంది.

    10 వారాల రియాలిటీ షో
    శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో అనిల్‌ రావిపూడి, రాధ, లయ జడ్జిలుగా వ్యవహరించారు. సీరియల్స్‌, బిగ్‌బాస్‌ ద్వారా ఫేమస్‌ అయిన సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా ఎంచుకున్నారు. అలా 10 సెలబ్రిటీ జంటలను 10 వారాలపాటు ఒక మాన్షన్‌లో ఉంచారు. వారే మహేశ్‌- సాండ్రా, జాను- భాను, వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌, నటరాజ్‌ మాస్టర్‌- నీతూ, నూకరాజు- ఆసియా, సంధ్య- బ్రిట్టో, హరిత- హరీశ్‌, ప్రియాంక జైన్‌- శివకుమార్‌, అంజలి - పవన్‌, సోనియా- సిద్ధు. 

    విజేతగా వాసంతి జోడీ
    మధ్యలో అభిమానిక- ఆమిర్‌ దంపతులు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ జంటల మధ్య ప్రేమ, నమ్మకం, సహనాన్ని పరీక్షించారు. ఎన్నో గేమ్స్‌ ఆడించారు. వాటన్నింటినీ దాటుకుని అందరికంటే బలమైన జంటగా నిలిచారు వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌. ఈ జోడీ మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ట్రోఫీ గెలవడంతో పాటు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది. రెండో స్థానంలో నూకరాజు, మూడో స్థానంలో మహేశ్‌, ఐదో స్థానంలో జాను దంపతులు నిలిచారు. మొదటి నుంచి గెలుపు నాదే అని ఫిక్సయిన నటరాజ్‌ మాస్టర్‌ నాలుగో స్థానానికి పరిమితమవడంతో హర్టయి ఫినాలే నుంచి వెళ్లిపోయాడు.

     

    చదవండి: అమ్మకు క్యాన్సర్‌.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: స్నేహ ఉల్లాల్‌

  • మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్‌ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్‌. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్‌. అఖిల్‌ కథానాయకుడిగా నటించిన 'లెనిన్‌' మూవీ టీజర్‌ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.

    తండ్రికి సర్‌ప్రైజ్‌
    'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్‌ నాకో చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్‌ టీజర్‌ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్‌ డైలాగ్‌తో వీడియో మొదలైంది. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్‌ను స్టేజీపై చెప్తుంది. 

    పల్లె పరిమళం
    ఎన్టీఆర్‌ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్‌. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్‌ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్‌ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్‌ సంగీతం అందించాడు.

     

     

Mancherial

  • వీవోఏలకు జీతం చాలా తక్కువగా ఉంది. నెలంతా కష్టపడితే రూ.8 వేలు చేతికందుతున్నాయి. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల పోషణ సాధ్యం కావడం లేదు. పనికి తగ్గ వేతనం కనీసం రూ.20 వేలు చెల్లించాలి. – కుంటాల కుమార్‌, వీవోఏల జేఏసీ కన్వీనర్‌

    ఉద్యోగ భద్రత కల్పించాలి

    ఐకేపీలో వీవోఏగా 23 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఇప్పటికీ మాకు ఉద్యోగ భద్రత లేదు. జీతాలు పెరిగిందీ లేదు. గతంలో సెర్ప్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ కల్పించి జీతాలు పెంచారు. అర్హులైన వీవోఏలకు హెచ్‌ఆర్‌ పాలసీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. – పి.పోషం, వీవోఏల జేఎసీ కో కన్వీనర్‌

  • ● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

    బెల్లంపల్లి/భీమారం: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లుల్లో దిగుమతిని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం, భీమారం మండల కేంద్రంలోని సమత రైస్‌ మిల్లును సందర్శించారు. కొనుగోలు ధాన్యాన్ని వెంటవెంటనే రైస్‌మిల్లులకు తరలించడమే కాకుండా దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బెల్లంపల్లిలో సింగరేణి క్లబ్‌ను సందర్శించి ధాన్యం నిల్వకు అవకాశాలను పరిశీలించారు. ధాన్యం నిలువ చేయడానికి అవసరమైన అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు. బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, తహసీల్దార్లు కృష్ణ, సదానందం, ఆర్‌ఐ రజిత పాల్గొన్నారు.

  • బెల్లంపల్లి: పాలిసెట్‌ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఉచిత శిక్షణకు 161 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా రెగ్యులర్‌గా హాజరైన 136 మంది ప్రతిభ చాటుకున్నారు. వీరిలో 11 మంది పదివేల లోపు ర్యాంకులు సాధించడం గమనార్హం. ఓరుగంటి నిత్యశ్రీ 796, ఎండి.చాహత్‌ 1981, బేరి మల్లికార్జున్‌ 2937, వెంగళ ఈశ్వర్‌ 4498, పెద్దపల్లి అజయ్‌ 4789, గుడిసెల మనోజ్ఞ 4971 ర్యాంకులతో సత్తా చాటారు. విద్యార్థులతోపాటు కళాశాల అధ్యాపకులు, పాలి క్వెస్ట్‌ ఇంచార్జి వెంకటేశ్వర్లు, కోచింగ్‌ ఇన్‌చార్జి శివకృష్ణ, తదితరులను బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.దేవేందర్‌ ప్రశంసించారు.

  • నెన్నెల: వీవోఏలను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి ఆరోగ్య భద్రత కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం వీవోఏలు నెన్నెలలో చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ వీవోఏల శ్రమను దోచుకుంటున్నారని, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్‌ పాలసీ వర్తింపజేయాలని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు అంగలి శేఖర్‌, నాయకులు నల్ల రాజేందర్‌, తిరుపతి, శైలేందర్‌సింగ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

  • సింగరేణి వ్యాప్తంగా లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులను వెంటనే బదిలీ చేయాలి. సూపర్‌వైజర్ల విధులు రొటేషన్‌ చేయాలి. లేనిపక్షంలో సంస్థ, ఉద్యోగులకు నష్టం కలుగుతుంది. గతంలో సింగరేణి డైరెక్టర్‌ బలరాం దృష్టికి సింగరేణి సేఫ్టీ ట్రైపార్టియేట్‌ సమావేశంలో ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ తీసుకెళ్లారు. తప్పకుండా బదిలీ చేస్తామని హామీనిచ్చినా అమలు కాలేదు. కొందరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏరియాలో దీర్ఘకాలికంగా తిష్ట వేశారు.

    – కాంపెల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ సీనియర్‌ వైస్‌ పెసిడెంట్‌

  • సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సొంతిల్లు నిర్మించుకోవాలని చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం రెండోసారి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. జిల్లాలో మొదటి దశలో రాని వారికి రెండో విడతలో మంజూరుకు నిర్ణయించింది. వచ్చే నెల 2న రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తోంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తమ సొంత జాగాల్లో ఇప్పటికే నిర్మాణం చేపట్టగా, ఇంకా కొన్ని చోట్ల పలు కారణాలతో నిలిచిపోయాయి. ఇళ్లు మంజూరైనప్పటికీ చాలా చోట్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణం కాగా, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి వ్యయంతోనూ ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో కొన్ని చోట్ల లబ్ధిదారుల ఇళ్లు పునాదుల దశలోనే ఉన్నాయి. చాలామంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కొందరు మంచిరోజులు లేక వేచి చూస్తున్నారు.

    రెండో విడతలో 2500చొప్పున

    జిల్లాలో మొదటి విడతలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లితోపాటు ఖానాపూర్‌ నియోజకవర్గం పరిధి జన్నారం మండలం, సిర్పూర్‌ నియోజకవర్గ పరిధి భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాలతో కలిపి మొత్తం 11వేల ఇళ్లకు అనుమతి రాగా.. తర్వాత పలు కారణాలతో 10వేలకు మంజూరు ఇచ్చింది. వీటిలో ఇప్పటికీ 15శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. చాలామందికి మొదటి, రెండో విడత బిల్లులు మంజూరు వద్దనే నిలిచిపోయాయి. ప్రభుత్వం పునాదుల దశ నుంచి పిల్లర్లు, గోడలు, స్లాబ్‌, పూర్తయిన వరకు మొత్తం నాలుగు దశల్లో రూ.5లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టు ఇచ్చిన చోట్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయి. కొందరు కొత్తగా తమకు ఇళ్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెండో విడతలో 2500 చొప్పున మంజూరు చేస్తే మరో 7500 ఇళ్లు రానున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఎల్‌1 స్థాయిలో మండల అధికారుల వద్ద ఉన్నాయి. మొదటి విడతలో రాని వారికి రెండో విడతలో అవకాశం కలుగనుంది. ఇంటి నిర్మాణం విస్తీర్ణం కనిష్టం 400 చదరపు అడుగుల నుంచి 600లోపే నిర్మించుకోవాలనే నిబంధనతోనూ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతకంటే ఎక్కువ నిర్మాణాలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే చాలామంది వినతులు ఇచ్చారు. దీంతో రెండో విడతలో అవకాశం కల్పిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై పీడీ బన్సిలాల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం విధివిధానాల మేరకు జిల్లాలో అర్హులకు మంజూరు చేస్తామని తెలిపారు.

    జిల్లాలో మొదటి విడత

    మంజూరు 10,305

    గ్రౌండింగ్‌ 8,291

    ప్రారంభించనివి 2,014

    బేస్మెంట్‌ స్థాయి 1,994

    స్లాబ్‌ స్థాయి 1,153

    స్లాబ్‌ పూర్తయినవి 2,366

    పూర్తయిన ఇళ్లు 1,490

  • మందమర్రిరూరల్‌: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని ఐటీ, సెక్యూరిటీ, ఎస్టేట్స్‌, ఎన్విరాన్‌మెంటు, మేనేజర్‌, అండర్‌ మేనేజర్‌ తదితర హోదాల్లోని అధికారులు దీర్ఘకాలికంగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఏరియాలోని సివిల్‌, క్వాలిటీ, ఎస్టేట్‌, సెక్యూరిటీ విభాగాల్లో, గనుల్లో సూపర్‌వైజర్లు, క్లర్క్స్‌, జీఎం కార్యాలయంలోని పలు విభాగాల్లో అధికారులు, వర్క్‌షాప్‌, సీహెచ్‌పీ తదితర విభాగాల్లోని అధికారులు పైరవీలతో కీలకమైన పోస్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. కీలకమైన పోస్టు(ఫోకల్‌ పాయింట్‌)ల్లో విధులు నిర్వర్తించే వారిని రెండు, మూడేళ్లకు ఒకసారి ఇతర విభాగాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట విధులు నిర్వర్తించడం వల్ల ఇతర ఉద్యోగులను చూపు చూస్తుండడం, కొందరు ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వడం తదితర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు, సూపర్‌వైజర్లపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో బదిలీలు జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగులు కోరుతున్నారు.

    సంస్థకు నష్టం..!

    సింగరేణి సంస్థలో దీర్ఘకాలికంగా, కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వర్తించడం వల్ల సంస్థ, ఏరియా కార్మికులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపణలున్నా యి. కొన్ని ఏరియాల్లో అధికారులు కిందిస్థాయి కార్మికుల నుంచి ఈఎంఐలు, నెలవారీ చిట్టీలు కట్టించుకోవడం, ఉచిత మస్టర్లు వేయించి కార్మికులతో ఇంటి పనులు చేయించుకోవడం, మామూళ్ల వసూళ్లు తదితర ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూడు, ఐదేళ్ల వరకు ఒకే ఏరియాలో విధులు నిర్వర్తించే అధికారులు, సూపర్‌వైజర్లు, పేషీట్‌ క్లర్క్స్‌, షిఫ్ట్‌ ఓవర్‌మెన్‌లను గతంలో యాజమాన్యం ఒకేచోట కాకుండా షిఫ్టు మార్పు చేసేది. కానీ యాజమాన్యం కొందరి విషయంలో బదిలీ చేయకపోవడంతో ఇతర అధికారులు, సూపర్‌వైజర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా, కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి బదిలీపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారామయ్యకు ఓ ఏరియాలోని క్లరికల్‌ అసోసియేషన్‌ వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

  • చెన్నూర్‌రూరల్‌: ప్రభుత్వం గతంలో ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు అందజేసింది. ఇంకుడు గుంతల నిర్మాణంతో ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరంతా ఆ గుంతల్లో ఇంకేది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేవి. గ్రామాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరంతా రోడ్లపై పారకుండా ఉండేందుకు, భూగర్భ జలాలు పెంపొందేందుకు ప్రభుత్వం సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.62వేలు మంజూరు చేస్తోంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 53 ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. చెన్నూర్‌ మండలంలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఆరు, జైపూర్‌ 18, కోటపల్లిలో నాలుగు, జన్నారంలో మూడు, లక్సెట్టిపేటలో మూడు, నెన్నెలలో నాలుగు, భీమినిలో మూడు, తాండూరులో మూడు చొప్పున ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీల ఉపాధిహామీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు.

    కొనసాగుతున్న పనులు

    చెన్నూర్‌తోపాటు జైపూర్‌, బెల్లంపల్లి మండలాల్లో ఇంకుడుగుంతల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చెన్నూర్‌ మండలం సంకారం గ్రామంలో నిర్మాణం తుది దశకు చేరింది. మిగతా ఆరు మండలాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకుడుగుంతల నిర్మాణంతో గ్రామాల్లో మురుగు నీరు, దోమల బెడద తప్పుతుంది. రోడ్లపై మురికి నీరు పారదు. భూగర్భ జలాలు పెరిగి ప్రజలు, రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుంది.

  • పాతమంచిర్యాల: ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని ఈ నెల 18 నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్‌లో పని చేస్తున్న వీవోఏ(విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌)లు సమ్మె బాట పట్టారు. చాలీచాలని జీతాలతో 23ఏళ్లు పని చేస్తున్నా ప్రభుత్వం తమ సేవలకు తగిన ఫలితం అందించడం లేదని, రూ.8వేల జీతంతో జీవితాలు వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. దీర్ఘకాలికంగా సమస్యలతో సతమతం అవుతున్నామని, పరిష్కరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్‌, సెర్ప్‌ సీఈవోకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. వీవోఏలు స్వయం సహాయక గ్రామైక్య సంఘాల్లోని మహిళా సభ్యులకు పొదుపుపై అవగాహన కల్పించడం, రుణాలు ఇప్పించి, వసూలు చేయడం, రికార్డులు రాయడం, గ్రామ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5వేలు గౌరవ వేతనం, గ్రామ సంఘాల నుంచి రూ.3వేలు మొత్తంగా రూ.8వేలతో పని చేస్తున్నారు. జిల్లాలో 2003 నుంచి వీవోలుగా పని చేస్తున్నారు. అర్హులైన వారికి కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా పదోన్నతి కల్పించాలని, కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా రూ.20లక్షలు చెల్లించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధన కోసం మండల సమాఖ్య, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట సమ్మె చేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూనే సమస్యలపై పోరాటం చేయాలని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని అధికారులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మెలోనే కొనసాగుతామని వీవోఏలు స్పష్టం చేస్తున్నారు. సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ తమ సమస్యల పరిష్కారంపై స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

  • బెల్లంపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, కొనుగోళ్లు ఆలస్యం చేయొద్దని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ సూచించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు మరింత ముమ్మరం చేయాలని సూచించారు. కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కాగా, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వినోద్‌ సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి సందర్శించారు.

    సీఎంఆర్‌ లక్ష్యాలను చేరుకోవాలి

    మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేస్తూ సీఎంఆర్‌ లక్ష్యాలను పూర్తి చేసేలా రైస్‌మిల్లుల యజమానులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు. శనివారం హాజీపూర్‌ మండలం రాపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌మిల్లును సందర్శించారు. రాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన సర్వే సమావేశంలో మాట్లాడారు. కర్ణమామిడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిష్‌పాండ్‌ పనులను పరిశీలించారు. సర్పంచ్‌ భూమయ్య, తహసీల్దార్‌ పుష్పలత పాల్గొన్నారు.

Sports

  • ఐపీఎల్‌-2026లో శనివారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పంజాబ్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో పంజాబ్(15) పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. 

    అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆదివారం జరిగే రాజస్తాన్ రాయల్స్‌-ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడింది. ఈ రెండు మ్యాచ్‌లలో రాజస్తాన్‌, కేకేఆర్ ఓటమి పాలైతే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది.

    ఒకవేళ ముంబైపై రాజస్తాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండగా రియాన్ పరాగ్ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. మరోవైపు రాజస్తాన్ ఓడి, ముంబైపై కేకేఆర్ భారీ విజయం సాధిస్తే పంజాబ్‌ను అధిగమించి రహానే టీమ్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతోంది. కేకేఆర్ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి.

    శ్రేయస్ సూపర్ సెంచరీ
    ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. . ల‌క్నో నిర్ధేశించిన 197 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఈ అద్భుత విజ‌యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర. అయ్య‌ర్ అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు.

    కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. శ్రేయస్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
    చదవండి: గంభీర్ చేతుల్లో సూర్యకుమార్‌ భవితవ్యం!

  • టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ సూర్యకుమార్ బ్యాటర్‌గా తుదిజట్టులో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. 

    అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ తుది జట్టు నుంచే తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్‌ను తుదిజట్టులో ఆడించాలా వద్దా అనేది గంభీర్‌తో పాటు సెలెక్షన్ కమిటీ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. 

    ఫామ్‌లేమి దృశ్యా సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, గంభీర్‌తో సూర్యకు ఉన్న సఖ్యత కారణంగా అదంత సులువు కాదనిపిస్తోంది. ఎందుకంటే సూర్య సారథ్యంలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియాకప్‌ను గెలుచుకుంది.

    అయితే దాదాపు ఏడాదిగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై తీవ్రమైన పరిశీలన కొనసాగుతోంది, ఐదుగురు సెలెక్టర్లు కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా కెప్టెన్‌గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం రాణించడంలో విఫలమయ్యాడు. 

    అయితే భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్‌కు చివరి చాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించింది. కానీ సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరచ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. 

    ప్రస్తుతం, గంభీర్ నాయకత్వంలోని ఈ పరివర్తన దశలో భవిష్యత్ ప్రణాళిక, అధికార సమీకరణాలు మారుతుండటంతో భారత క్రికెట్ ఒక సంధి దశలో నిలబడి ఉంది. గణాంకాలు సూర్యకుమార్‌కు అనుకూలంగా లేనప్పటికీ, గౌతమ్ గంభీర్‌కు అతనిపై ఉన్న విశ్వాసం, అతనితో ఉన్న సంబంధం భారత టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.

    చదవండి: ఆర్సీబీకి షాక్‌.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్ హోదాకు తగ్గట్లే టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్ పోరుకు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్న జాకబ్ బెతెల్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. 

    చేతి వేలి గాయంతో జాకబ్ బెతెల్‌ జట్టును వీడినట్లు ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే జూన్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడ‌నుంది. దీంతో స్వ‌దేశంలో చేతి వేలి గాయానికి సంబంధించి మెరుగైన చికిత్స తీసుకోవడానికి ఇంగ్లండ్‌ వెళ్లిన‌ట్లు ఆర్సీబీ తెలిపింది.  

    'పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో జాక‌బ్ బెథెల్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది. అయితే జూన్‌లో ఇంగ్లండ్‌కు కీల‌క‌మైన టెస్టు సిరీస్ ఉండ‌డంతో మెరుగైన వైద్య ప‌రీక్ష‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు' అని ఆర్సీబీ త‌మ ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా ఇంగ్లండ్‌కే చెందిన మ‌రో స్టార్ ఆట‌గాడు ఫిల్ సాల్ట్ గాయ‌ప‌డ‌డంతో జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న జాక‌బ్ బెతెల్ సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 

    ఫిల్ సాల్ట్ తిరిగొచ్చిన‌ప్ప‌టికీ బెతెల్ రాణించ‌డంతో జ‌ట్టులో అత‌డినే కంటిన్యూ చేసింది. అయితే మే 26న ధ‌ర్మ‌శాల‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్‌-1 పోరుకు జాక‌బ్ బెతెల్ దూరం కావడంతో కోహ్లీతో క‌లిసి ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించే అవ‌కాశ‌ముంది. అందుకే జాక‌బ్ బెతెల్ స్థానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆర్సీబీ మ‌రో ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

    ఇక ఇంగ్లండ్ స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. జూన్ 4 నుంచి 8 మ‌ధ్య తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా జాక‌బ్ బెతెల్ గాయంపై స్పందించింది. ‘న్యూజిలాండ్‌తో వ‌చ్చే నెల‌లో టెస్టు సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ కోసం జాక‌బ్ బెతెల్‌ను ఎంపిక చేశాం. తొలి టెస్టుకు ముందే జాక‌బ్ బెతెల్ గాయం తీవ్ర‌త‌ను పూర్తిగా అంచ‌నా వేసేందుకు వైద్య బృందం ప‌ర్య‌వేక్షించ‌నుంది’ అని పేర్కొంది.

    చదవండి: టెస్టు క్రికెట్‌లో ఐసీసీ కీల‌క మార్పులు!

  • అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంప్ర‌దాయ టెస్టు క్రికెట్‌లో కీల‌క మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం ఐసీసీ క‌మిటీ స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఐసీసీ చైర్మ‌న్ జై షా స‌హా ఐసీసీ క్రికెట్ క‌మిటీ హెడ్ సౌర‌వ్ గంగూలీ స‌హా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 

    ఈ నేప‌థ్యంలోనే స‌మ‌వేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో వినియోగిస్తున్న ఎర్ర‌బంతికి బ‌దులు ఇక‌పై పింక్ బంతిని వినియోగంలోకి తీసుకురావాల‌నే యోచ‌న‌లో ఐసీసీ ఉంది. దీనితో పాటు టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్ విరామ స‌మయాలు, డ్రింక్స్ బ్రేక్‌ల స‌మ‌యంలో హెడ్ కోచ్ మైదానంలోకి వ‌చ్చేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం స‌హా ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

    ఐసీసీ టెస్టు ఫార్మాట్‌లో వేర్వేరు రంగుల బంతులను ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. అందువల్ల, సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ సమయంలో ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతికి మారే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో, వాతావరణ అంతరాయాలు ఏర్పడినప్పుడు లైట్ల వెలుగులో ఆటను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరిస్తే, జట్లకు ఎరుపు బంతికి బదులుగా గులాబీ బంతిని ఉపయోగించడానికి అనుమతి లభించ‌నుంది. 

    ప్రతిపాదిత మార్పుల వివరాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎరుపు బంతి నుండి గులాబీ బంతికి మారే ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనేది ఆస‌క్తిగా మారింది. డ్రింక్స్ విరామ సమయంలో హెడ్ కోచ్‌ను మైదానంలోకి అనుమ‌తించ‌డంపై స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే దీనిని వ‌న్డే క్రికెట్‌లో తీసుకురావాల‌ని ఐసీసీ యోచిస్తోంది. 

    మైదానంలోకి హెడ్‌కోచ్‌..
    ఇప్ప‌టివ‌ర‌కు స‌బ్‌స్టిట్యూట్ ఆట‌గాళ్ల‌కు మాత్రమే డ్రింక్స్ విరామంలో మైదానంలోకి అనుమ‌తి ఉంది. భ‌విష్య‌త్తులో డ్రింక్స్ విరామాల్లో హెడ్‌కోచ్‌ను కూడా మైదానంలోకి అనుమ‌తిస్తే, అత‌డు జ‌ట్టు జెర్సీ వేసుకొని రావాలా లేక సాధార‌ణంగా రావాలా అనేది నిర్ణ‌యించాల్సి ఉంది. ఇక వ‌న్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ విరామాలు ఉండేలా మార్పులు చేయ‌నున్నారు. ఒక ఇన్నింగ్స్‌లో ప్ర‌తీ డ్రింక్స్ బ్రేక్‌కు  గంటా 10 నిమిషాల వ్య‌వ‌ధి ఉండ‌నుంది.

    ఇన్నింగ్స్‌ విరామంపై కీలక నిర్ణయం
    ఇక టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్ విరామ స‌మ‌యాన్ని త‌గ్గించాల‌ని ఐసీసీ స‌మావేశంలో ప్ర‌తిపాదించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న 20 నిమిషాల స‌మ‌యాన్ని 15 నిమిషాల‌కు కుదించాల‌ని నిర్ణ‌యించింది. దీంతో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్ ముగిసిన అనంత‌రం రెండో ఇన్నింగ్స్ 15 నిమిషాల్లోనే ప్రారంభమ‌య్యేలా చూసుకోవాల‌ని ఐసీసీ తెలిపింది. మే 30న అహ్మ‌దాబాద్‌లో జ‌రగ‌నున్న మ‌లి విడ‌త స‌మావేశంలో ఐసీసీ బోర్డు దీనిపై స్ప‌ష్ట‌తనివ్వ‌నుంది.

    చదవండి: కోహ్లీకి ఎదురుప‌డితే ఈసారి దబిడిదిబిడే!

  • ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్ నాలుగో స్ధానానికి చేరుకుంది. త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

    ల‌క్నో నిర్ధేశించిన 197 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఈ అద్భుత విజ‌యంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర.

    అయ్య‌ర్ అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శ్రేయస్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు, అర్జున్‌ టెండూల్కర్‌ తలా వికెట్‌ సాధించారు. 

    అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిష్‌(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అయూశ్‌ బదోని(43), అబ్దుల్‌ సమద్‌(37) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో మార్కో జానెసన్‌, చాహల్‌ తలా రెండు వికెట్లు సాధించాడు.

    15 ఓవర్లలో 162/3
    15 ఓవ‌ర్లు ముగిసేస‌రికి మూడు వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. అర్జున్ టెండూల్క‌ర్ బౌలింగ్‌లో ప్ర‌బ్‌సిమ్ర‌న్ (69) ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరగ‌డంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.

    నిలకడగా ఆడుతున్న పంజాబ్‌
    12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ కింగ్స్‌ రెండు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌(48), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(56) ఉన్నారు.

    8 ఓవర్లలో పంజాబ్ 79/2
    8 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (30) పరుగులతో ఆడుతున్నారు.

    రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్‌
    లక్నోతో మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. తొలి వికెట్‌గా ప్రియాన్ష్ ఆర్య గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక 18 పరుగులు చేసిన కూపర్ కనోలీ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ (2), అయ్యర్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.

    పంజాబ్ టార్గెట్ 197 ప‌రుగులు
    పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ల‌క్నో ఓపెన‌ర్ జోస్ ఇంగ్లిస్ (44 బంతుల్లో 72) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. ఆయుశ్ బ‌దోని (43), అబ్దుల్ స‌మ‌ద్ (20 బంతుల్లో 37 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్‌, మార్కో జాన్సెన్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

    ఐదో వికెట్ కోల్పోయిన లక్నో
    లక్నో ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన జోస్ ఇంగ్లిస్ (72) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. శశాంక్ సింగ్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా ఇంగ్లిస్ షాట్ ఆడినప్పటికీ అయ్యర్ చేతికి చిక్కాడు. 18 ఓవర్లో ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

    మూడో వికెట్ కోల్పోయిన లక్నో
    ధాటిగా ఆడుతున్న ఆయుశ్ బదోనీ (43) రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్ 69 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి విఫలమైన బదోని కీపర్ ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంగ్లిస్‌ (24), పంత్‌ (6) పరుగులతో ఆడుతున్నారు.

    రెండు వికెట్లు కోల్పోయిన లక్నో
    పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.  2 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ను మార్కో జాన్సెన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అజ్మతుల్లా ఒమర్‌జయ్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. బదోని (20), ఇంగ్లిస్ (18) పరుగులతో ఆడుతున్నారు.

    టాస్ గెలిచిన పంజాబ్
    టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు చావో రేవో లాంటిది. మ్యాచ్‌లో ల‌క్నోపై విజ‌యం సాధిస్తే పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి.  అదే స‌మ‌యంలో ప్లేఆఫ్స్ పోటీలో ఉన్న కేకేఆర్‌, రాజ‌స్తాన్‌లు తమ చివ‌రి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ ల‌క్నో చేతిలో పంజాబ్ ఓట‌మి చ‌విచూస్తే మాత్రం ఆ జ‌ట్టు ఇంటిబాట ప‌ట్టాల్సిందే. అప్పుడు కేకేఆర్‌, రాజ‌స్తాన్‌లు ప్లేఆఫ్స్ పోటీలో ఉంటాయి.

    లక్నో సూపర్ జెయింట్స్: జోష్ ఇంగ్లిస్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, అర్జున్ టెండూల్కర్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్.

    పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌ కీపర్‌), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శుక్ర‌వారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 55 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ్యాచ్ విజ‌యం క‌న్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మ‌ధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. 

    మ్యాచ్ ముగిసిన త‌ర్వాత హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డానికి కోహ్లీ నిరాక‌రించ‌డంతో వివాదం మ‌రో మ‌లుపుకు తిరిగింది. వివాదం జ‌రిగి ఒక‌రోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి త‌గ్గ‌లేదనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

    అదేంటంటే.. ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు క్వాలిఫ‌య‌ర్‌లో ఎదురుప‌డే అవ‌కాశం లేదు. కానీ క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేట‌ర్ పోరులో ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో ఈ రెండు జ‌ట్లు మ‌ళ్లీ త‌ల‌ప‌డ‌నున్నాయి.

    అలా కాకుండా క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీ గెలిచి.. మ‌రోవైపు ఎలిమినేట‌ర్‌తో పాటు క్వాలిఫ‌య‌ర్‌-2లోనూ ఎస్ఆర్‌హెచ్ గెలిచి ఫైన‌ల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్ప‌టికీ కోహ్లీ మాత్రం ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్నాడు. మ‌రోమారు ఎస్ఆర్‌హెచ్‌తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్‌కు ద‌బిడిదిబిడి అయ్యేలాగే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో. 

    అస‌లేం జ‌రిగిందంటే..
    ఆర్సీబీ ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లీ స్లోగా ఆడ‌డంతో హెడ్ @కాస్త బౌండ‌రీలు కొట్టు* అంటూ కాస్త వెట‌కారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండ‌రీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గానే వ‌స్తున్నావు. ఒక్క‌సారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా స‌ర‌దాగా న‌వ్వేశాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో కోహ్లీ దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ని  స్ప‌ష్టంగా తెలిసొచ్చింది.

    చదవండి: అభిమానికి రోహిత్ క్ష‌మాప‌ణ‌.. ఎందుకంటే?

  • ముంబై ఇండియ‌న్స్ స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న అభిమానికి క్ష‌మాప‌ణ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విష‌యంలోకి వెళితే.. ముంబై ఇండియ‌న్స్ గ‌త మ్యాచ్‌ను ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడింది. పూర్తి వ‌న్‌సైడ్‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. 

    కేకేఆర్‌కు సొంత స్టేడియం కావ‌డంతో ఆ జ‌ట్టుకు భారీగా అభిమానులు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్ కూడా కొంత‌మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత చాలా మంది అభిమానులు ముంబై ఇండియ‌న్స్ బ‌స చేసే హోట‌ల్ ముందు ఆట‌గాళ్ల కోసం నిరీక్షించారు. ముఖ్యంగా రోహిత్ శ‌ర్మను చూడ‌డం కోసం చాలాసేపు ఎదురుచూశారు. 

    అందులోనే ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోహిత్ బ‌య‌ట‌కు వ‌చ్చినప్ప‌టికీ ఆ అమ్మాయిని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి ఎమోష‌న‌ల్ అయ్యి ఏడ్వ‌డం ప్రారంభించింది. దీనిని వీడియో తీసిన కొంద‌రు అభిమానులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన రోహిత్ శ‌ర్మ వెంట‌నే క్ష‌మాప‌ణ‌తో కూడిన వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. 

    'టెన్ష‌న్‌, గంద‌ర‌గోళం మ‌ధ్య వీటన్నింటిని ప‌ట్టించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌ని రోహిత్ తెలిపాడు. అయితే నాకోసం నిరీక్షించిన చిన్న అమ్మాయిని క‌ల‌వ‌క‌పోడం బాధ‌గా అనిపించింది. నా చ‌ర్య ప‌ట్ల క్ష‌మాప‌ణ చెబుతున్నా. మ‌రో విష‌యం ఏంటంటే ఈసారి ఎప్పుడు కోల్‌క‌తాకు వ‌చ్చినా ఆ అమ్మాయిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి మాట్లాడుతాన‌ని అంద‌రికీ వాగ్దానం చేస్తున్నా.' అని రోహిత్ శ‌ర్మ‌ చెప్పుకొచ్చాడు. 

    రోహిత్ ఒక అభిమానికి ఇలా క్ష‌మాప‌ణ చెబుతూ ప్ర‌త్యేకంగా వీడియో విడుద‌ల చేయ‌డంపై అభిమానులు తెగ సంతోష‌ప‌డిపోయారు. 'రోహిత్ త‌నను ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల‌ను ఎప్పుడు బాధ‌పెట్ట‌డానికి ఇష్ట‌ప‌పడ‌డ‌ని' కామెంట్లు చేస్తున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ పెద్దగా రాణించ‌లేక‌పోయాడు. 13 బంతుల్లో 15 ప‌రుగులు మాత్ర‌మే చేసిన రోహిత్ సౌర‌భ్ దూబే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

    ఈ సీజ‌న్‌లో గాయంతో ప‌లు మ్యాచ్‌లకు దూర‌మైన రోహిత్ 8 మ్యాచ్‌ల్లో 283 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. కెప్టెన్ పాండ్యా (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

    అనంత‌రం కేకేఆర్ స్వ‌ల్ప టార్గెట్‌ను ఛేదించడానికి క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ మ‌నీష్ పాండే, రోవ్‌మెన్ పావెల్ మ‌ధ్య 64 ప‌రుగుల భాగ‌స్వామ్యం కేకేఆర్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చింది. ఇప్ప‌టికే సీజ‌న్ నుంచి నిష్క్ర‌మించిన ముంబై ఇండియ‌న్స్ 13 మ్యాచ్‌ల్లో 8 పాయింట్ల‌తో 9వ స్థానంలో ఉంది. ముంబై త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది.

    చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్‌!

  • భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్‌-19 జట్టు తరఫున, వరల్డ్‌కప్‌-2025లో సత్తా చాటాడు.

    గాలివాటం కాదు
    ప్రపంచకప్‌ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్‌.. భారత్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌-2026లోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్‌లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.

    భారత్‌-‘ఎ’ జట్టులో చోటు
    ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్‌-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్‌ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌.

    రోహిత్‌కు గండం
    ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్‌ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

    ఈ క్రమంలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ను ఆడిస్తూ.. బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు ఇషాన్‌ ఎంపికయ్యాడు.

    జైసూ ఎదురుచూపులు
    ఇక రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి.. ఈ సిరీస్‌లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్‌తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్‌ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.

    శ్రీలంకలో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 నేపథ్యంలో వైభవ్‌ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ..

    ఫామ్‌ కొనసాగిస్తే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు
    ‘‘వైభవ్‌ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్‌-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. 

    అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్‌ కొనసాగిస్తే వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్‌ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.

    చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్‌ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’

  • సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీపై)పై గెలుపుతో లీగ్‌ దశను ముగించింది. ఐపీఎల్‌-2026లో ఉప్పల్‌ స్టేడియంలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.

    రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. అయితే, టాప్‌-2లో వెళ్లాలన్న సన్‌రైజర్స్‌ ఆశయం మాత్రం నెరవేరలేదు. ఆర్సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌లతో సమంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడింది. దీంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

    ఆరెంజ్‌ ఆర్మీ దిల్‌ ఖుష్‌
    ఏదేమైనా సొంతమైదానంలో సన్‌రైజర్స్‌ వరుస గెలుపుల నేపథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ మస్త్‌ ఖుషీ అయింది. జట్టు యజమాని కావ్యా మారన్‌ సైతం సంతోషం వ్యక్తం చేశారు. 

    అయితే, సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఆమె పలికించిన హావభావాలు వైరల్‌గా మారాయి. ఉప్పల్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

    మూడు హాఫ్‌ సెంచరీలు
    ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. కిషన్, క్లాసెన్‌ మూడో వికెట్‌కు 48 బంతుల్లోనే 113 పరుగులు జోడించారు.

    అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌‌ రజత్‌ పాటీదార్‌ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేయగా... వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు.  

    ఇదేం బౌలింగ్‌?.. ఇది చకింగ్‌ కదా?
    అయితే, సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆర్సీబీ స్టార్‌ కృనాల్‌ పాండ్యా బంతితో రంగంలోకి దిగిన సమయంలో కావ్యా మారన్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కృనాల్‌ బౌలింగ్‌ చేస్తున్నపుడు.. పక్కన ఉన్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేశ్‌తో.. ‘‘ఇదేం బౌలింగ్‌?.. ఇది చకింగ్‌ కదా?’’ అన్నట్లుగా కావ్యా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారు.

    కృనాల్‌ బౌలింగ్‌ చేయకుండా.. కేవలం బంతిని విసురుతున్నాడన్నట్లుగా కావ్యా అభినయించి మరీ చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

    కాగా కృనాల్‌ సైడ్‌  ఆర్మ్‌ యాక్షన్‌, బౌన్సర్లతో ఈ సీజన్లో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇక.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కృనాల్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 24 పరుగులు ఇచ్చి.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51) రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

    చదవండి: పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!

  • ఐపీఎల్‌-2026 ‘ప్లే ఆఫ్స్‌’లో నాలుగో బెర్తు కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

    టాప్‌-2లో ఉన్న ఆర్సీబీ- గుజరాత్‌ క్వాలిఫయర్‌-1లో తలపడనుండగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడే జట్టు ఏదో ఆదివారం (మే 24) తేలిపోతుంది. ఇక ఈ బెర్తు కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ రేసులో ఉన్నాయి.

    చావోరేవో
    ఈ క్రమంలో పంజాబ్‌ శనివారం నాటి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. నిజానికి సీజన్‌ ఆరంభంలో పంజాబ్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకువచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి.. చాన్నాళ్లు టాపర్‌గా కొనసాగింది.

    కోల్‌కతాతో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైపోయింది. దీంతో ఓవరాల్‌గా పంజాబ్‌ ఖాతాలో 13 (12+1) పాయింట్లు చేరాయి. కానీ ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ సేన దారుణంగా విఫలమైంది. వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది.

    అయితే, మిగతా జట్ల ఫలితాల కారణంగా పంజాబ్‌ ఇప్పటికీ అధికారికంగా రేసులో నిలవగలిగింది. ఈ నేపథ్యంలో లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లో పంజాబ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఏకనా స్టేడియం ఇందుకు వేదిక.

    పంజాబ్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు కావాలంటే..
    లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్‌ తప్పక గెలవాలి. తద్వారా పాయింట్ల సంఖ్య 15కు చేరుకుంది. అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి పంజాబ్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాజస్తాన్‌ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. 

    రాజస్తాన్‌ తప్పక ఓడిపోవాలి
    కాబట్టి రాజస్తాన్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో తప్పక ఓడిపోతేనే.. పంజాబ్‌కు అవకాశాలు ఉంటాయి. మరోవైపు.. కేకేఆర్‌ కూడా పంజాబ్‌ మాదిరే 13 పాయింట్లు కలిగి ఉంది.

    ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. 
    అయితే, ప్రస్తుతం నెట్‌రన్‌రేటు పరంగా పంజాబ్‌ (+0.227).. కేకేఆర్‌ (+0.011) కంటే మెరుగైన స్థితిలో ఉండటం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పంజాబ్‌ లక్నోపై ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. పైచేయి సాధించగలదు.

    అదే సమయంలో కేకేఆర్‌ ఢిల్లీపై గెలిస్తే పంజాబ్‌ మాదిరే 15 పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేటు కీలకంగా మారుతుంది. కాబట్టి కేకేఆర్‌ ఢిల్లీని కనీసం 52 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో మరోసారి పంజాబ్‌దే పైచైయి అవుతుంది.

    ఒకవేళ పంజాబ్‌ గనుక దురదృష్టశాత్తూ లక్నో చేతిలో ఓడిపోతే.. ఈ సమీకరణలతో సంబంధం లేకుండా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నాలుగో స్థానం కోసం పోటీలో ఉంటాయి.

    చదవండి: పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!

  • ఐపీఎల్‌ 2026లో ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (24 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన అతడు.. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు సాధించలేని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ ఐపీఎల్‌ సీజన్‌లో లీగ్‌ దశలోని 14 మ్యాచ్‌ల్లో డబుల్‌ డిజిట్‌ స్కోర్లు నమోదు చేసిన తొలి విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

    ఈ సీజన్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న క్లాసెన్‌.. వరుసగా 31, 52, 62, 39, 40, 59, 37, 29, 65, 11, 69, 14, 47, 51 స్కోర్లు చేశాడు. ఇందులో 6 అర్ద సెంచరీలు ఉన్నాయి. క్లాసెన్‌ ఈ 14 మ్యాచ్‌ల్లో 159.47 స్ట్రయిక్‌రేట్‌తో 606 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో సాయి సుదర్శన్‌ (638), శుభ్‌మన్‌ గిల్‌ (616) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో క్లాసెన్‌ మరో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌ చరిత్రలో నాలుగో స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్‌ చేస్తూ ఒకే టోర్నీలో 600కుపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 2018 ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున రిషభ్‌ పంత్‌ 684 పరుగులు చేసి తొలిసారి ఈ ఘనత సాధించాడు. తాజాగా క్లాసెన్‌ ఈ అరుదైన జాబితాలో పంత్‌ సరసన చేరాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో క్లాసెన్‌ మరో మైలురాయిని కూడా తాకాడు. 31 పరుగుల వద్ద అతడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున 2000 ఐపీఎల్‌ పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ ముందున్నారు.

    ఆర్సీబీ మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు అభిషేక్‌ శర్మ (56), ట్రవిస్‌ హెడ్‌ (26), ఇషాన్‌ కిషన్‌ (79), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (29 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    అనంతరం భారీ లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినా.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్‌ అయ్యర్‌ (44) మెరుపులు మెరిపించగా.. కోహ్లి (15) విఫలమయ్యాడు. 

    ఆతర్వాత వచ్చిన పడిక్కల్‌ (21), రజత్‌ పాటిదార్‌ (56), కృనాల్‌ పాండ్యా (41 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (15 నాటౌట్‌) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం​ మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమై, 55 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

     

     

  • డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌-2026లోనూ సత్తా చాటుతోంది. టేబుల్‌ టాపర్‌గా లీగ్‌ దశను ముగించి క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. కాగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుక్రవారం ఆర్సీబీతో తలపడ్డ సంగతి తెలిసిందే. 

    భారీ స్కోరు సాధించినా..
    సొంతమైదానం ఉప్పల్‌లో ఆర్సీబీపై భారీ తేడాతో గెలిస్తేనే టాప్‌–2 దక్కే అవకాశం ఉండటంతో పట్టుదలగా ఆడి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ.. బెంగళూరును 166 పరుగులలోపు మాత్రం కట్టడి చేయలేకపోయింది. 

    ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సిన స్థితిలో
    ఫలితంగా హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో గెలిచినా మూడో స్థానంతో ముగించి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సిన స్థితిలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఓడినా... ముందుగా 166, ఆపై 178 స్కోరును దాటి అగ్రస్థానాన్ని సాధించడంలో సఫలమైంది. స్లోగా బ్యాటింగ్‌ చేస్తూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.

    అవును.. పక్కా ప్లాన్‌తోనే
    ఇదే విషయాన్ని ఆర్సీబీ హెడ్‌కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ తాజాగా వెల్లడించాడు. తమ దృష్టి సన్‌రైజర్స్‌ను ఓడించడం కంటే కూడా.. టేబుల్‌ టాపర్‌గా నిలవాలంటే కావాల్సిన 166 పరుగుల మీదే ఉందని తెలిపాడు. డ్రెసింగ్‌రూమ్‌లో మాట్లాడుతూ..

    ‘‘256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ముఖ్యమే. అయితే, పాయింట్ల పట్టికలో నెట్‌రన్‌రేటుతో అగ్రస్థానంలో నిలవడమే అంతిమ లక్ష్యం. అందుకే మనం వేర్వేరు టార్గెట్లు పెట్టుకున్నాం.

    166 పరుగుల మార్కు దాటితే
    ముందుగా 166 పరుగుల మార్కు దాటితే మనకు టాప్‌-2 బెర్తు ఖరారు అవుతుంది. ఆ తర్వాత 179 పరుగుల మార్కుకు చేరుకున్నామంటే.. టేబుల్‌ టాపర్‌ మనమే. ఆ తర్వాత 256 పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్‌లో గెలుపు మనదే. ఇందుకు తగ్గట్లుగానే మన బ్యాటింగ్‌ కొనసాగింది.

    వెంకటేశ్‌ అయ్యర్‌ అత్యద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మనం అగ్రస్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా మన లక్ష్యం 180 పరుగులేనని బ్యాటర్లు ఫీలయ్యేలా చేశాము’’ అని ఆండీ ఫ్లవర్‌ చెప్పుకొచ్చాడు.

    వెంకటేశ్‌ అయ్యర్‌ ధనాధన్‌తో
    కాగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి (15), వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (21) వికెట్లు కోల్పోయింది.

    ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో పరిస్థితి చక్కదిద్దాడు. ఇక మధ్య ఓవర్లలో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (39 బంతుల్లో 56), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్‌) కాస్త నెమ్మదిగానే ఆడారు. 

    ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ 7 బంతుల్లో 15 పరుగులతో పాండ్యాతో కలిసి అజేయంగా నిలవగా.. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 200 పరుగులు చేసింది.

    ఓటమిపాలైనా.. టేబుల్‌ టాపర్‌గా
    సన్‌రైజర్స్‌ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమిపాలైనా.. టేబుల్‌ టాపర్‌గా నిలవడంలో సఫలమైంది. ఇక ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఫలితంతో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో స్థానంలో నిలిచింది.

    ఈ క్రమంలో ‘ప్లే ఆఫ్స్‌’లో భాగంగా ఈనెల 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్‌–1లో ఆర్సీబీ జట్టుతో గుజరాత్‌ తలపడుతుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో ఈనెల 27న న్యూచండీగఢ్‌లో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆడుతుంది. 

    ఇక క్వాలిఫయర్‌–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో ఈనెల 29న జరిగే క్వాలిఫయర్‌–2లో పోటీపడుతుంది.   

    చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్‌ 

  • ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఓ భారీ ఐపీఎల్‌ రికార్డు సాధించాడు. లీగ్‌ చరిత్రలో అత్యంత వేగంగా (50 ఇన్నింగ్స్‌లు) 100 సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. నిన్న (మే 22) ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను బాదిన ఏకైక సిక్సర్‌తో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దూబే పేరిట ఉండేది. 

    దూబేకు సిక్సర్ల సెంచరీ పూర్తి చేసేందుకు 59 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా, ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ కేవలం 37 ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేశాడు. రెండో స్థానంలో విండీస్‌కే చెందిన ఆండ్రీ రసెల్‌ ఉన్నాడు. రసెల్‌కు 100 సిక్సర్ల మార్కును తాకేందుకు 47 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వీరిద్దరు మాత్రమే ప్రస్తుతం పాటిదార్‌ కంటే ముందున్నారు.

    బంతుల పరంగానూ అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో పాటిదార్‌ మూడో స్థానంలోనే ఉన్నాడు. పాటిదార్‌కు ఈ ఘనత సాధించేందుకు 933 బంతులు అవసరం కాగా.. రసెల్‌ 657 బంతులు, నికోలస్‌ పూరన్‌ 884 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (943) పాటిదార్‌ తర్వాతి స్థానంలో ఉండటం విశేషం.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీ ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో 55 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ అభిషేక్‌ శర్మ (56), ట్రవిస్‌ హెడ్‌ (26), ఇషాన్‌ కిషన్‌ (79), హెన్రిచ్‌ క్లాసెన్‌ (51), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (29 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    అనంతరం భారీ లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినా.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్‌ అయ్యర్‌ (44) మెరుపులు మెరిపించగా.. కోహ్లి (15) విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్‌ (21), రజత్‌ పాటిదార్‌ (56), కృనాల్‌ పాండ్యా (41 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (15 నాటౌట్‌) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం​ మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది.

    ఈ మ్యాచ్‌లో గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎలాంటి సుఖం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకొని ఎలిమినేటర్‌ గండాన్ని తప్పించుకోలేకపోయింది. మొదటి రెండు స్థానాలను ఖరారు చేసుకున్న ఆర్సీబీ, గుజరాత్‌ క్వాలిఫయర్‌-1 బెర్త్‌లు సాధించి, అదనపు అవకాశాలు పొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. 

    ఓడినా క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. అదే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సిన జట్ల విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లోనూ గెలిస్తేనే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎదుర్కోబోయే జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఈ బెర్త్‌ కోసం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ పోటీపడుతున్నాయి. 

National

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్, నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును శనివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే 25) ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. 

    33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తవారింట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. 

    కాగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె భర్త  సమర్థ్ సింగ్.. శుక్రవారం జబల్‌పూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడానికి వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి భోపాల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడిని భోపాల్ కోర్టు శనివారం 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది కాగా, ఆమె అత్తగారు గిరిబాల సింగ్ పదవీ విరమణ చేసిన రిటైర్డ్ న్యాయమూర్తి.

  • న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినాక ఆ దేశ ఇమ్మిగ్రేషన్ పాలసీని అత్యంత కఠినతరం చేశారు. దీంతో యుఎస్‌ఎలో స్థిరపడాలనుకునే వారి ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  భారత పర్యటనలో ఉన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వీసా విధానంపై ఎన్డీటీవీతో మాట్లాడారు.  

    ప్రస్తుతం గ్రీన్‌కార్డు విషయంతో అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇదివరకూ హెచ్‌-1 బీ వీసాదారులు గ్రీన్‌కార్డు విషయంలో అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్‌1బీ వీసాదారులు తప్పనిసరిగా వారి సొంత దేశానికి వెళ్లి అక్కడినుండి గ్రీన్‌కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    తాజాగా దీనిపై మార్కో రుబియో వివరణ ఇచ్చారు..." గ్రీన్‌కార్డు కోసమై అమెరికా  తీసుకువచ్చిన విధానం కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినది కాదు.ఇది అందరికీ వర్తిస్తుంది. వలసల వ్యవస్థను క్రమబద్ధీకరించి, మెరుగుపరచుకోవాలని అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది.20 మిలియన్లకు పైగా ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. అనేక సందర్భాల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ దుర్వినియోగాలను కూడా మేము చూశాము. అందుకే మేము దానిని సంస్కరించాలని నిర్ణయించుకున్నాము. మీరు ఒక వ్యవస్థను సంస్కరించినప్పుడల్లా, కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత అసౌకర్యం ఉంటుంది," అని జాతీయ మీడియాతో తెలిపారు.

    అయితే తాత్కాలికంగా ఈ విధానం వల్ల ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో ఈ విధానం స్థిరంగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా అమెరికాకు రావాలనుకునే భారతీయులు ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా  మేలు పొందుతారని తాను భావిస్తున్నాని పేర్కొన్నారు.. ఇది వ్యక్తిగతంగా వారికి అమెరికాకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ప్రస్తుతం మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. 

  • ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు  మూడో అతిపెద్ద చమురు సరఫరా దేశంగా వెనిజువెలా అవతరించింది.

    ఇంధన పర్యవేక్షణ సంస్థ క్లెప్లర్ డేటా ప్రకారం.. వెనిజువెలా 2026 మే నెలలో  సౌదీ అరేబియా, అమెరికా రెండింటినీ అధిగమిస్తూ మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం, రష్యా, యూఏఈ మాత్రమే వెనిజులా కంటే ఎక్కువ చమురును సరఫరా చేస్తున్నాయి. ఈ నివేదిక  ప్రకారం, ఏప్రిల్‌తో పోలిస్తే ఈ నెలలో భారతదేశానికి వెనిజులా చమురు సరఫరా దాదాపు 50 శాతం పెరిగాయి.

    మే నెలలో ఇప్పటివరకు వెనిజువెలా నుండి.. భారత్ రోజుకు సగటున 4,17,000 బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. అంతకుముందు ఈ సంఖ్య రోజుకు 283,000 బ్యారెళ్లుగా ఉంది. జనవరిలో ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న తర్వాత, అమెరికా, వెనిజులా చమురు ఎగుమతులపై కొన్ని ఆంక్షలను సడలించింది. దీంతో కొనుగోళ్లు అధికంగా పెరిగాయి. 

    ఈ పెరుగుదలకు రెండు ప్రధానంగా రెండు కారణాలున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఒకటి హర్ముజ్ జలసంధి దిగ్భందనం కాగా మరోకటి.. వెనిజువెలా నుంచి సరఫరా అయ్యే క్రూడాయిల్ చౌకగా ఉండటం. అంతే కాకుండా రిలయన్స్ వంటి భారతీయ రిఫైనరీలు దానిని శుద్ధి చేయగల సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉన్నందున  అవి తమ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం.

    వీటితో పాటు అమెరికా అధ్యక్షుడు తమ వద్ద నుండే చమురు కొనుగోలు చేయాలని భారత్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా భారత్‌సైతం చమురు కొనుగోళ్లను పెంచింది.

    టాఫ్‌ ప్లేసులో రష్యా

    ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్‌ రష్యా చమురు కొనుగోలు చేయడం మరింతగా పెంచింది. రష్యా నుండి సరఫరాలు దాదాపు రెట్టింపు అయ్యి రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇరాన్ ,గల్ఫ్ దేశాల నుండి తగ్గిన సరఫరాల స్థానంలో భారతీయ రిఫైనరీలు రష్యా చమురును ఉపయోగించడం ప్రారంభించాయి. 

    అయితే ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఈ పర్యటనలో చమురు సరఫరాలపై భారత్ కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

    ప్రస్తుత భారత చమురు దిగుమతులు

    • రష్యా- 23 లక్షల బ్యారెళ్లు రోజుకు 

    • యూఏఈ- 4.40 లక్షల బ్యారెళ్లు 

    • వెనిజువెలా- 4.17 లక్షల బ్యారెళ్లు

    • సౌదీ- 3.40 లక్షల బ్యారెళ్లు

    • అమెరికా- 3.10 లక్షల బ్యారెళ్లు

  • ఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో  ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ఈ సందర్భంగా మార్కో రూబియో మోదీని అమెరికా ప్రర్యటనకు రావాలని ఆహ్వానించారు. యుఎస్‌ఏ అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకే ఈ ఆహ్వానం అందించినట్లు రూబియో పేర్కొన్నారు.

    మోదీతో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇరు నేతలు చర్చలు జరిపారు. సంక్షోభ పరిష్కారానికి దౌత్య చర్చలే ప్రధానమార్గామని మోదీ సూచించారు. అనంతరం ప్రధాని మోదీ, రూబియోతో తన సమావేశానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను పోస్ట్ చేశారు. 

    కాగా మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం  భారత్‌కు వచ్చారు. ఆయన విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. భారత్‌–పాక్‌ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్‌ పదేపదే ప్రకటించుకోవడం, భారీ టారిఫ్‌లు, హెచ్‌1బీ వీసాల కట్టడి చర్యలు తదితరాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు.

    విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరుపుతారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. రూబియో పర్యటన సందర్భంగా కోల్‌కతా, జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించే అవకాశముందని సమాచారం. ‘భారత్‌తో మాకు చాలా పనుంది. భారత్‌ మాకు మంచి మిత్ర దేశం, భాగస్వామి కూడా. నాది చాలా ముఖ్యమైన ట్రిప్‌’అంటూ భారత్‌ పర్యటనపై శుక్రవారం రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. 

  • ఫ్రెంచ్ విప్లవం గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. రష్యాలో శ్రామిక వర్గం చేసిన తిరుగుబాట్ల గురించి విన్నాం. భారతదేశంలో జేపీ ఉద్యమం, అన్నాహజారే ఉద్యమం లాంటి వీధి పోరాటాలను కళ్లారా చూశాం. వీటన్నింటికీ ఒక వ్యవస్థ ఉండేది... ఒక బలమైన నాయకుడు ఉండేవాడు.. కోట్లాది రూపాయల నిధులు ఉండేవి. కానీ.. ఏ నాయకుడు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా, కేవలం ఒక మీమ్ ఆయుధంగా, ఒకేఒక్క వారంలో జాతీయ రాజకీయ పార్టీలగుండెల్లో రైళ్లు పరిగెత్తించవచ్చని ఎవరైనా ఊహించారా?

    ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, అత్యంత పటిష్టమైన ఐటీ సెల్ కలిగిన పార్టీగా భీకరంగా నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డును, కేవలం 120 గంటల్లో తుత్తునియలు చేస్తూ... ఏకంగా 1.80 కోట్ల ఫాలోవర్ల వైపు దూసుకుపోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇవాళ భారతదేశంలో అతిపెద్ద హాట్ టాపిక్!.

    నిశ్శబ్ద డిజిటల్ విప్లవం
    ఇది కేవలం ఇంటర్నెట్‌లో సరదాగా నవ్వుకునే జోక్ కాదు. ఇది దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఒక నిశ్శబ్ద డిజిటల్ విప్లవం. దేశ యువతలో గూడుకట్టుకున్న అగ్నిపర్వతం బద్దలైన తీరు. అసలు ఈ 'బొద్దింకల పార్టీ' వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరు? జెన్-జీ తరం ఎందుకు ఈ వైపు మొగ్గు చూపుతోంది? భారతదేశ భవిష్యత్తు రాజకీయాలను ఇది ఏ దిశగా నడపబోతోంది? ఏ వృక్షానికైనా పుట్టుకకు ఒక విత్తనం కావాలి. ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' అనే మహా వృక్షం మొలకెత్తడానికి కారణం.. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనే!

    ఆ అవమానాన్నే తమ అస్తిత్వంగా మార్చుకుని..
    మే 15, 2026 న సుప్రీంకోర్టులో బోగస్ సర్టిఫికెట్లు, ఫేక్ డిగ్రీల కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో... సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ఒక ప్రముఖ న్యాయమూర్తి, వ్యవస్థలపై బురదజల్లే కొంతమంది నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్నజీవులు అనే పదునైన పదాలను ఉపయోగించారన్న వార్తలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. మరుసటి రోజే సదరు న్యాయమూర్తి తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, వ్యవస్థలను మోసం చేసే దళారులను ఉద్దేశించి మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన ఆ అవమానకరమైన వ్యాఖ్యలు చూసి యువత కుంగిపోలేదు. రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు, బంద్ కు పిలుపు ఇవ్వలేదు. అవును, మేము బొద్దింకలమే! మీ వ్యవస్థల అణు విస్ఫోటనాలను తట్టుకుని నిలబడే బొద్దింకలమే! అంటూ... ఆ అవమానాన్నే తమ అస్తిత్వంగా మార్చుకుని, ఎదురుదాడికి దిగారు. అలా పుట్టిందే ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'.

    ఆ సోషల్ మీడియా చాణక్యుడు ఎవరు? 
    ఇంతటి సంచలనానికి తెరలేపిన ఆ సోషల్ మీడియా చాణక్యుడు ఎవరు? ఆయన పేరే అభిజీత్ దీప్కే. మహారాష్ట్రలోని సంభాజీనగర్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు. ఇతను ఏ రోడ్డు పక్కనో ఉండే సాధారణ మీమర్ కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక బోస్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మేధావి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ పై ప్రజలను ఎలా ఆకర్షించాలో క్షుణ్ణంగా నేర్చుకున్న స్ట్రాటజిస్ట్. మే 16న అభిజీత్ తన ఎక్స్ ఖాతాలో ఒక సాధారణ గూగుల్ ఫామ్ లింక్ పెట్టి... మీరు కూడా సమాజంలో బొద్దింకలాగా అవమానాలు ఎదుర్కొంటున్నారా? అయితే రండి... మనమంతా కలిసి కాక్రోచ్ జనతా పార్టీ పెడదాం అని ఒక వ్యంగ్య పిలుపునిచ్చాడు. ఆశ్చర్యం! 

    కేవలం 24 గంటల్లో లక్ష మంది... 48 గంటల్లో పది లక్షల మంది ఆ ఫారమ్‌ను నింపేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేజీ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఫాలోవర్ల సంఖ్య రాకెట్ లాగా దూసుకుపోయింది. దేశంలోని పెద్ద పెద్ద ఐటీ సెల్స్, వందల కోట్లు ఖర్చు పెట్టి పెంచలేని ఫాలోయింగ్‌ను... ఈ యువకుడు కేవలం తన ఆలోచనతో, వ్యంగ్యంతో సాధించి చూపించాడు. రోమన్ తత్వవేత్త సెనెకా అన్న ఒక మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. దేశ యువత ఎప్పుడెప్పుడు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుదామా అని ఎదురుచూస్తున్న తరుణంలో... అభిజీత్ దీప్కే ఇచ్చిన 'కాక్రోచ్' బ్రాండ్ వారికి ఒక అద్భుతమైన అవకాశంగా దొరికింది.

    ప్రపంచ సోషల్ మీడియా చరిత్రలోనే..
    కేవలం ఒకే ఒక్క వారంలో 1.80 కోట్ల మంది ఫాలోవర్లు ఒక పార్టీ వైపు రావడం అనేది ప్రపంచ సోషల్ మీడియా చరిత్రలోనే ఒక అద్భుతం. ఇంతలా యువత ఎందుకు జాయిన్ అవుతున్నారు? దీని వెనుక కేవలం ఆ వ్యాఖ్యలపై మాత్రమే కోపం మాత్రమే లేదు. దీని వెనుక భారతీయ యువత ప్రతిరోజూ అనుభవిస్తున్న మూడు భయంకరమైన పీడకలలు, వ్యవస్థాగత వైఫల్యాలు దాగి ఉన్నాయి.

    బలమైన వేదికగా..
    భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు పదే పదే రోడ్డున పడుతోంది. రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా, తల్లిదండ్రులు తిండి తిని తినక కూడబెట్టిన సొమ్ముతో కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్న విద్యార్థులకు... పరీక్ష రాశాక తెలిసే నిజం ఏంటంటే.. పేపర్ లీక్ అయిందని. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష అక్రమాలు, రిక్రూట్‌మెంట్ బోర్డుల నిరంతర వైఫల్యాలు యువతలో తీవ్రమైన అశాంతిని, వ్యవస్థలపై పూర్తి నమ్మకరాహిత్యాన్ని పెంచాయి. తాము ఎంత చదివినా ఉపయోగం లేదు, డబ్బున్న వారికే సీట్లు, ఉద్యోగాలు దక్కుతాయనే నిరాశలో ఉన్న యువతకు... ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక బలమైన వేదికగా నిలిచింది.

    ‘బద్ధకస్తులు, నిరుద్యోగుల అధికారిక గొంతుక’
    దేశంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి చేతిలో ఉద్యోగం లేక, సమాజంలో తలదించుకుని తిరుగుతున్న 'జెన్-జీ' యువత సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ యువతను సాంప్రదాయ సమాజం ఏమని పిలుస్తోంది? ఫోన్లలో రీల్స్ చూసుకునే బద్ధకస్తులు, పనికిరాని వాళ్లు అని ముద్రిస్తోంది. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ తన అఫీషియల్ బయో లో ఏమని రాసిందో తెలుసా? “బద్ధకస్తులు, నిరుద్యోగుల అధికారిక గొంతుక” అని. సమాజం తమను ఏ మాటలతో అయితే అవమానిస్తోందో... అదే మాటలను తమ ఆయుధాలుగా మార్చుకుని వ్యవస్థలపైకి విసిరారు ఈ జెన్-జీ యువత.

    మేనిఫెస్టో చూస్తే.. మైండ్ బ్లాక్
    ఈ కాక్రోచ్ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే... పాలకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ వయసు ఖరారు చేయాలి ప్రజాప్రతినిధులకు కనీస విద్యార్హత ఉండాలి. లగ్జరీ బంగళాలు, ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో విలాసాలు బంద్ చేయాలి, సాధారణ అపార్ట్‌మెంట్లు ఇవ్వాలి. జడ్జీలకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. ఈ డిమాండ్లు ప్రతి సాధారణ భారతీయుడి మనసులో ఉన్నవే.అందుకే ఇది కేవలం సోషల్ మీడియా జోక్ కాదు, ఒక నిశ్శబ్ద రాజకీయ తిరుగుబాటు. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వ్యక్తి కాదు... అది దేశ యువత ఆలోచనల ప్రతిరూపం!

    జెన్-జీ అరచేతిలో ఆయుధం  ఇదే..
    ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది 'జెన్-జీ' తరం  అంటే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత. ఈ తరానికి పాతకాలపు రాజకీయ ఉపన్యాసాలు వినే ఓపిక లేదు. టీవీ స్టూడియోల్లో కూర్చుని నాయకులు ఒకరిపై ఒకరు అరుచుకునే డిబేట్లు చూస్తే అసహ్యం వేస్తుంది. వీరికి సుదీర్ఘమైన మేనిఫెస్టోలు వద్దు... వీరికి కావాల్సింది సటైర్, మీమ్స్॥ ఐరనీ. గతంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి ర్యాలీలు తీసేవి, గోడ పత్రికలు వేసేవి, ఐటీ సెల్స్ ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవి. కానీ ఈ జెన్-జీ యువతకు ఇంటర్నెట్ అనేది అరచేతిలో ఉన్న ఆయుధం.

    సరికొత్త డిజిటల్ దండయాత్ర
    ఒక అంశాన్ని ఎలా ట్రెండ్ చేయాలో, దేనిని వైరల్ చేయాలో వారికి తెలిసినంతగా మరే తరానికీ తెలియదు. తమను అవమానించిన వ్యవస్థలను చూసి ఏడవడం కంటే... ఆ వ్యవస్థలను చూసి హేళనగా నవ్వడం... ఆ నవ్వులోనే పదునైన ప్రశ్నలు సంధించడం ఈ తరం నేర్చుకుంది. అందుకే, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఈ సరికొత్త డిజిటల్ దండయాత్రను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.

    సాంప్రదాయ పార్టీల గుండెల్లో వణుకు
    మహాత్మా గాంధీ గారి ఒక ప్రసిద్ధ వాక్యం ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. మొదట వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో యుద్ధం చేస్తారు, చివరకు నీవే గెలుస్తావని.  ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మొదట దీనిని ఒక 'మీమ్' అని లైట్ తీసుకున్నారు, తర్వాత నవ్వారు... కానీ ఇప్పుడు 1.80 కోట్ల ఫాలోవర్లు దాటాక... సాంప్రదాయ పార్టీల గుండెల్లో వణుకు మొదలైంది.

    దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న...
    ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న... ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోని లైకులు, షేర్లకే పరిమితమా? లేక రాబోయే రోజుల్లో నిజమైన ఓట్ల రాజకీయాలను శాసిస్తుందా? ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం... బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీకి సంబంధించిన రీజినల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు పుట్టుకొచ్చాయి. బీహార్‌లో జరగబోయే ఉపఎన్నికల్లో ఈ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులను నిలబెడతామనే ప్రకటనలు కూడా వస్తున్నాయి.

    ఇది ఒక గట్టి హెచ్చరిక
    తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన కొందరు యువ ఎంపీలు సైతం ఈ మూవ్‌మెంట్‌ను సమర్థిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. అయితే... నాణేనికి రెండో వైపు కూడా మనం చూడాలి. డిజిటల్ ప్రపంచంలో వచ్చే లైకులు, ఫాలోవర్లు ఎప్పుడూ 100 శాతం ఓట్లుగా మారవు. గతంలో కూడా ఆన్‌లైన్‌లో ఎన్నో ట్రెండ్స్ వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. నిజమైన ఎన్నికల రాజకీయం అనేది క్షేత్రస్థాయిలో ఉండే కుల, మత, ఆర్థిక సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారి దేశాన్ని ఏలుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ... ఇది ఒక గట్టి హెచ్చరిక!

    సాంప్రదాయ పార్టీలు ఇప్పటికైనా తమ పంథా మార్చుకోకపోతే, యువత సమస్యలను గాలికొదిలేస్తే.. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రత్యామ్నాయ శక్తులు పుట్టుకొస్తాయో చూపించడానికి ఇదొక సజీవ సాక్ష్యం. తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి శ్రీశ్రీ అన్నట్లు  నేనొక దుర్గం, నేనొక సంవర్తం, నేనొక తిరుగుబాటు... నా గొంతుకలో రగిలే ఆక్రోశం రేపటి నవయుగానికి బాట. ఇవాళ భారత యువత గొంతుకలో రగులుతున్న ఆక్రోశమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ.

    చివరిగా చెప్పేది ఒక్కటే...
    ఏ యువతనైతే "బొద్దింకలు" అని ఈసడించుకున్నారో... అదే బొద్దింకలు ఇవాళ డిజిటల్ ప్రపంచంలో సామ్రాజ్యాలు ఏలుతున్న పాలకుల సింహాసనాల పునాదులను కదిలిస్తున్నాయి. బొద్దింకల శాస్త్రీయ ప్రత్యేకత తెలుసా? ఎంతటి భయంకరమైన అణు విస్ఫోటనం జరిగినా, రేడియేషన్‌ను తట్టుకుని భూమిపై బ్రతకగలిగే ఏకైక జీవి బొద్దింక! ఇవాళ భారత యువత కూడా తాము అన్ని కష్టాలను, పేపర్ లీకేజీలను, నిరుద్యోగాన్ని, లంచగొండితనాన్ని తట్టుకుని నిలబడే కఠినమైన బొద్దింకలమేనని... తమను తక్కువ అంచనా వేసి తొక్కిపారేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ డిజిటల్ విప్లవం ద్వారా చాటిచెబుతోంది.

    ఇది కేవలం ఒక మీమ్ పేజీ విజయమో, లేదా అభిజీత్ దీప్కే అనే వ్యక్తి చాణక్యమో కాదు... ఇది వ్యవస్థలపై సామాన్యుడు సాధించిన నిశ్శబ్ద విజయం. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. యువతకు కేవలం ఉచిత పథకాలు, వాగ్దానాలు ఇస్తే సరిపోదు... వారికి పారదర్శకమైన వ్యవస్థలు కావాలి, ఉద్యోగాలు కావాలి, గౌరవం కావాలి. అది ఇవ్వనంత కాలం... ఇలాంటి వేలాది కాక్రోచ్ జనతా పార్టీలు పుడుతూనే ఉంటాయి... పాలకులను ప్రశ్నిస్తూనే ఉంటాయి.

    - కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ

  • చెన్నై: కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్‌ విషాదంగా ముగిసింది. తాజాగా తీవ్ర గాయాలతో కూడిన ఆ బాలిక మృతదేహం సూలురులోని కన్నంపాల్యం లేక్‌ వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ స్పందించారు. ఇటువంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.

    పోలీసుల వివరాల ప్రకారం.. 21వ తేదీ గత గురువారం రోజు సాయంత్రం సూలూరులో ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోహాన్‌ రాజ్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అపహరించారు. అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తాము మార్పు కోసం సీఎం విజయ్‌కు ఓటేశామని ఇప్పుడు ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి స్పందించేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.

    దీంతో ఈ నిరసనల నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం విజయ్ స్పందించారు."నిన్న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణ ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని" అని Xలో పోస్ట్ చేశారు.

    అయితే ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ సీరీయస్‌గా ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులను ఆ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే సుకుమార్ కలిశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు.  

    అయితే ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే, లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, అధికార పార్టీ సభ్యుల దురుసు ప్రవర్తన, అరాచకాలు విపరీతంగా పెరిగి పోయాయాని ఇప్పుడు ఏకంగా  బాలిక అపహరణ, అనంతరం హత్య జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తుందన్నారు. కేవలం 12 రోజుల్లోనే  30కి పైగా ప్రధాన ఘటనలు వార్తల్లోకి వచ్చాయని రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న తరుణంలో జాబ్‌ మార్కెట్‌లో ఒక పరిణామం విశేషంగా నిలుస్తోంది.  కరియర్‌ ఆరంభంలో  కొత్తగా ఉద్యోగాలు చేరే వారికి ఊహించిన వేతనం లభించడమే కనా కష్టం. అలాంటిది  అనూహ్య స్థాయిలో  ఆఫర్‌ వస్తే.. మీరు చదవబోయే స్టోరీ అలాంటిదే.

    ఐఐటి (IIT) వ్యవస్థాపకులు పంచుకున్న ఆసక్తికరమైన స్టోరీ ఒకటి నెట్టింట  పెద్ద చర్చకు దారితీసింది. వారు తమ "IIT Ke 4 Launde" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ సంఘటనను పోస్ట్ చేశారు. అభ్యర్థి అడిగిన దానికంటే తాము ఎందుకు ఎక్కువ జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నామో అందులో వివరించారు.

    "అభ్యర్థి నెలకు రూ. 35 వేలు అడిగారు, కానీ మేము నెలకు రూ. 50 వేలు ఆఫర్ చేసాము. ఎందుకంటే ఆ ఉద్యోగానికి రూ. 50 వేల బడ్జెట్‌ను ఆమోదించాము."  అని తన వీడియోలో వెల్లడించారు.

    ఆ అభ్యర్థి అప్పటికే నెలకు సుమారు రూ. 30,000 సంపాదిస్తున్నాడని, ఇంటర్వ్యూ సమయంలో రూ. 35,000 - రూ. 36,000 డిమాండ్ చేశాడని చెప్పారు. అయితే, ఆ ఉద్యోగానికి కంపెనీ అప్పటికే రూ. 50వేల జీతం ఇవ్వాలని  నిర్ణయించుకుంది. 

    ఉద్యోగంలో చేరిన తర్వాత, తాను అడిగిన దానికంటే  ఎక్కువ జీతం ఎందుకిస్తున్నారని అడిగాడు, ఎందుకు ఇవ్వడకూడదు అని సమాధానమిచ్చాడు బాస్‌.  ఆ తరువాత అసలు విషయం చెప్పాడు.  తాము ముందే 50 వేలుసాలరీ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆ పనికి, ఆ వేతనం సరియైనది అనుకున్నామని వివరించారు.

    మరొక ఫౌండర్‌ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దీర్ఘకాలిక నియామకాలు, ఉద్యోగులను నిలుపుకోవడానికే (retention) తీసుకున్నట్లు తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడం కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు  ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ సానుకూలంగా స్పందించారు. ఇలాంటి నియామకాలు  చాలా అరుదుగా కనిపిస్తాయనన్నారు. ఒక నెటిజన్ "నా హెచ్ఆర్ (HR) ఇదంతా ఏఐ (AI) అని అంటోంది" అని సరదాగా కామెంట్ చేయగా, మరొకరు ‘‘డ్రీమ్స్‌ రిక్రూటర్లు (Dream recruiters)" అంటూ కొనియాడారు.

    ఇలాంటి వాళ్లు  కేవలం 2 శాతం ఉంటారబ్బా, ఇలాంటి బాస్‌లు దొరకాలి, "పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం, చాలా కంపెనీలు దీనిని అర్థం చేసుకోవు అని మరికొందరు వ్యాఖ్యానించారు. 
     

  • లదాఖ్‌లోని లేహ్ సమీపంలో గల తంగ్‌స్తే ప్రాంతంలో మే 20న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుండి ముగ్గురు భారత ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు. ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. మే 20న  జరిగిన ఈ ఘటనను అధికారులు ఈ ఉదయం ధృవీకరించారు.అయితే ప్రమాదం తర్వాత మేజర్ జనరల్ మెహతా మిగతా ఇద్దరు అధికారులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    చీతా రకానికి చెందిన ఆ హెలికాప్టర్‌లో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్,  3వ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్‌ను నడుపుతుండగా, మేజర్ జనరల్ మెహతా ప్రయాణికుడిగా అందులో ఉన్నారని  ఒక సైనికాధికారి తెలిపారు. ఈ ప్రమాదం  సందర్భంగా వీటి సెల్పీ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.

    ఇదీ చదవండి: చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌ : హై ప్రొటీన్‌ కోసం ఏది బెటర్‌
    తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ పక్కన అధికారులు రాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యం ఆ చిత్రంలో కనిపిస్తోంది. అక్కడి కఠినమైన పర్వత ప్రాంతం కాలం చెల్లిన చీతా హెలికాప్టర్ల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే, వారు ప్రాణాలతో బయటపడటం ఒక "అద్భుతం" అని అభివర్ణించారు.

    కాగా ఈ ప్రమాదంపై అధికారిక విచారణకు ఆదేశించారు. అలాగే, 1970లలో ప్రవేశపెట్టిన చీతా హెలికాప్టర్ల భద్రతపై ఈ సంఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. 1984లో సియాచిన్ గ్లేసియర్‌లో పాకిస్తాన్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన 'ఆపరేషన్ మేఘదూత్' లో ఈ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇటీవల కాలంలో జరిగిన పలు ప్రమాదాల వల్ల అనేకమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

    ప్రస్తుతం ఆర్మీ ఈ చీతా హెలికాప్టర్లను దశలవారీగా తొలగిస్తూ, వాటి స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్వదేశీంగా తయారు చేసిన 'లైట్ యుటిలిటీ హెలికాప్టర్' (LUH) ను ప్రవేశపెడుతోంది. ఆర్మీ ఇప్పటికే ఆరు పరిమిత సిరీస్ ప్రొడక్షన్ LUHల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ హెలికాప్టర్లు గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు, 6.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు మరియు 350 కిలోమీటర్ల కార్యాచరణ పరిధిని కలిగి ఉంటాయి.  

    ఐదుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న చీతా హెలికాప్టర్.. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో, తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో పనిచేయగల ప్రపంచంలోని అత్యుత్తమ హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ, తాజా ప్రమాదం పాతబడుతున్న హెలికాప్టర్ల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది.

    ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్‌, కాన్స్‌ క్వీన్‌ ఐశ్వర్య లుక్‌ స్పెషాల్టీ!

  • తిరువనంతపురం: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) కేవలం ఒక వ్యంగ్య ప్రచారం కాదని, దీని వెనుక సరిహద్దు ఆవల నుండి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన కుట్ర ఉందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, దేశాన్ని అస్థిరపరచడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన  పేర్కొన్నారు.

    డిజిటల్ యుద్ధంలో కొత్త ఎత్తుగడ
    రాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యవహారాన్ని ‘క్లాసిక్ క్రాస్-బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’గా అభివర్ణించారు. బాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ మానిప్యులేషన్ ఉపయోగించి, సహజమైన ప్రజా ఉద్యమంలా సోషల్ మీడియాలో కథనాలను అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ఓర్వలేని శక్తులే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తున్నాయని, ఇవన్నీ దేశాభివృద్ధిని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.

    కేరళలో ఊపందుకున్న ప్రచారం
    గత వారం వెలుగులోకి వచ్చిన ఈ సీజేపీ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ‘ ఎక్స్’  ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసినా, 'కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ఖాతా పుట్టుకొచ్చింది. కేరళకు చెందిన పలువురు యువ ఎమ్మెల్యేలు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం. విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్న డిమాండ్‌తో వీరు చేస్తున్న ఆన్‌లైన్ ప్రచారాలు చర్చనీయాంశంగా మారాయి.

    బెంగళూరు పోలీసుల హెచ్చరిక
    ఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మే 24న బెంగళూరు టౌన్ హాల్ వద్ద ‘శాంతియుత మానవ గొలుసు’ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. బాధ్యతారహితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ వ్యంగ్యం పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి.

  • సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్‌ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

    ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా 
    ఇటీవల  అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది. 

    ఉప ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు 
    ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల నేపథ్యంలో జూన్‌ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్‌: జూన్‌ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్‌ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

    టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం 
    రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే.  తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్‌ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, విజయ్‌ సన్నిహితుడైన ప్రవీణ్‌ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది.   

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘రోజ్‌గార్ మేళా’ మరోసారి విజయవంతమైంది. 19వ విడత మేళాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం  51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో ఈ నియామక పర్వం అత్యంత ఉత్సాహంగా సాగింది.

    ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల్లో కొలువులు
    ఎంపికైన అభ్యర్థులు రైల్వేలు, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవల వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ నియామక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ సేవల్లోకి ప్రవేశిస్తున్నారు. యువత సాధికారత, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నియామకాలు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.

    యువత భవిష్యత్తుకు భరోసా
    నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. క్రమం తప్పకుండా చేపడుతున్న ఇటువంటి నియామక డ్రైవ్‌ల ద్వారా లక్షలాది మందికి స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన వివరించారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం తమ బాధ్యతని ప్రధాని పునరుద్ఘాటించారు.

    12 లక్షల మైలురాయి దిశగా..
    కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోజ్‌గార్ మేళా కార్యక్రమం నియామక ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన 18 మేళాల ద్వారా దాదాపు 12 లక్షల మందికి నియామక పత్రాలు అందజేశామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, యువతకు భరోసా ఇవ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.

  • కేరళం రాజకీయాల్లో ఒకప్పుడు “విజయానికి బ్రాండ్‌”గా కనిపించిన పార్టీ.. విమర్శలు, ఓటమి అనే ఎదురుదెబ్బతో ఆత్మపరిశీలనలో పడింది. సాధారణంగా.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులపైనే విమర్శలు వినిపిస్తాయి. కానీ అక్కడ మాత్రం అక్కడి రాజకీయాల్లో మునుపెన్నడూ కనిపించని వాతావరణం కనిపిస్తోంది. బహిరంగంగా తమ నాయకత్వ నిర్ణయాలను సీపీఎం కార్యకర్తలే తప్పుబడుతున్నారు. 

    పార్టీ ఓటమికి “కమ్యూనలిజం”, “మైనారిటీ ఓట్ల ధ్రువీకరణ” కారణమంటూ సీపీఎం రాష్ట్ర నాయకత్వం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయి కేడర్‌ మాత్రం ఆ వాదనను నేరుగా తిరస్కరిస్తున్నారు. “మైనారిటీ ఓటు కాదు.. సీపీఎం సంప్రదాయ ఓటర్లే దూరమయ్యారు” అంటూ గణాంకాలతో సహా చెబుతున్నారు. తాళిపరంబ ఏరియా కమిటీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు సీపీఎంలో పెరుగుతున్న అసహనాన్ని బహిర్గతం చేశాయి.

    కన్నూర్‌ జిల్లాలోని తాళిపరంబ నియోజకవర్గం సీపీఎంకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. విజయన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎంవీ గోవిందన్‌ ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఈ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. గోవిందన్‌నే అక్కడ బరిలోకి దింపాలని కిందిస్థాయి శ్రేణులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశాయి. అయితే పీకే శ్యామలను అభ్యర్థిగా దింపి ప్రయోగం చేసింది. అయితే అనూహ్యంగా.. యూడీఎఫ్‌ మద్దతుతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన టీకే గోవిందన్‌ ఇక్కడ ఘన విజయం సాధించారు. దీంతో దశాబ్దాల తర్వాత ఇక్కడ సీపీఎం అభ్యర్థి ఓటమిపాలైనట్లయ్యింది.  

    “ప్రజల్లో ఆదరణ లేని ముఖాలను ముందుకు తెచ్చారు. నిజంగా ప్రజలు నమ్మిన నాయకత్వాన్ని పక్కన పెట్టారు” అంటూ మండిపడ్డారు. ఈ చర్చల్లో ఎక్కువగా  మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ పేరు ఎక్కువగా వినిపించింది. నిపా, కరోనా వైరస్‌ సమయాల్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆమెను ముఖ్యమంత్రి ముఖంగా ముందుకు తెచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వాళ్లంతా బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. “ఆమె ముఖం అయితే గెలిచేవాళ్లం” అన్న వ్యాఖ్య ఇప్పుడు కేరళ రాజకీయాల్లో వైరల్‌గా మారింది.

    అయితే ఈ అసంతృప్తి కేవలం సీపీఎం లోపలే కాదు.. మిత్రపక్షమైన సీపీఐ వరకూ చేరడం కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా మళ్లీ పినరయి విజయన్‌కే ప్రాధాన్యం ఇవ్వడంపై మిత్రపక్షమైన సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువ నాయకత్వాన్ని లేదంటే ప్రజల్లో మరింత ఆమోదం ఉన్న కొత్త ముఖాన్ని(కొంత మంది శైలజ పేరునే ప్రస్తావించారట) ముందుకు తేవాల్సిన అవసరం ఉందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఓటమికి విజయన్‌ నాయకత్వ శైలే ప్రధాన కారణమన్న వాదనను వారు కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం.

    అయితే సీపీఎం మాత్రం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పినరయి విజయన్‌కే మళ్లీ ప్రధాన ప్రతిపక్ష ముఖంగా అవకాశం ఇచ్చింది. పార్టీని కట్టిపడేసే శక్తి ఇంకా ఆయనకే ఉందన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రాస్‌రూట్‌ స్థాయిలో మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

    ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఇంత హైప్‌ ఉన్న కేకే శైలజ, పెరవూర్‌ నుంచి ఓటమి పాలయ్యారు. కేరళ పీసీసీ చీఫ్‌ సన్నీ జోసెఫ్‌(ప్రస్తుతం మంత్రి) చేతిలో ఆమె పరాజయం చెందారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజ్‌, కరోనా సమయంలో చూపించిన నాయకత్వం ఇప్పటికీ ప్రజల్లో బలంగానే ఉందని సీపీఎం వర్గాలు భావిస్తున్నాయి.

    వాస్తవానికి.. పినరయి విజయన్, ఎం.వి. గోవిందన్ లపై అధికార ధోరణి, అహంకారం, బంధుప్రీతి ఆరోపణలు ఉన్నాయి. శైలజా ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఆమెను బలహీనమైన నియోజకవర్గంలో పోటీకి పంపడం ఓటమికి దారితీసిందనేది సీపీఎం కిందిస్థాయి శ్రేణుల వాదన. ఫలితంగా.. పార్టీ 2021లో 99 సీట్ల నుండి 2026లో 35కి పడిపోయింది. శైలజా ప్రజాదరణను ఉపయోగించుకోలేకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి CPI(M)లో లోతైన సంక్షోభానికి దారితీసింది. ఇప్పటికైనా ఆ పని చేయాలని సీపీఎం నాయకత్వంపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి.

    ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. నాయకత్వ శైలి, అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లో పార్టీ ఇమేజ్‌, మిత్రపక్షాల అసంతృప్తి, గ్రాస్‌రూట్‌ కార్యకర్తల తిరుగుబాటు.. ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా? లేక సీపీఎంలో మరింత పెద్ద మార్పులకు దారితీస్తుందా? అన్నదే ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ(శనివారం, మే 23) రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం,  పల్నాడు జిల్లా శ్రీనగర్ లో 45, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 42.5, ప్రకాశం జిల్లా కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపూడిలో 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

    రేపు(మే 24, ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

    శ్రీకాకుళం, విజయనగరం,  విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. లింగాల మండలంలోని గురువారం రాత్రి కురిసిన గాలి వానకు దెబ్బతిన్న అరటి పంటలను ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) ఎంపీ అవినాష్‌ పరిశీలించారు. 

    దీనిలో భాగంగా ఎంపీ అవినాష్‌ మాట్లాడుతూ.. ‘పులివెందుల నియోజకవర్గంలో ఈనెల 21న వీచిన గాలివానకు భారీ ఎత్తున అరటిపంట నష్టం వాటిల్లింది.  లింగాల, పులివెందుల, వేముల మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నేల కూలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2వేల ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయి. ఇప్పటికే రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఓ వైపు సాగునీటి సమస్య...మరో వైపు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు

    అన్నిటినీ అదిగమించి మంచి దిగుబడి సాధించిన పకృతి ప్రకోపంతో వేల ఎకరాలు నేలకూలాయి. ఫలితంగా రైతుల కష్టం మొత్తం వృథా అయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజున్న అరటి రేటుతో లెక్క కడితే ఎకరాకు 5లక్షల  నుంచి 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.ఇలా 2వేల ఎకరాల్లో పంట నష్టం అంటే ఎంత భారీ నష్టం జరిగిందో అందరూ గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువైపు చూసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ పంటల బీమాను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

    గత ఏడాది మార్చిలోనూ ఇలానే గాలివానకు భారీగా అరటి పంటకు నష్టం చేకూరింది.  అరటికి బీమా ఇవ్వాలంటే వెదర్‌ బేస్డ్‌ స్టేషన్లలో గాలివేగం నమోదును బట్టి ఉంటుంది. ఆ గాలి వేగం ఎంత ఉందో లెక్కిద్దామంటే ఆ వెదర్‌ స్టేషన్లు అసలు పనే చేయడం లేదు. అప్పట్లో నష్టపోయిన గ్రామాల్లో గాలివేగం రికార్డులు తీస్తే నాట్‌ అప్లికబుల్‌ అని వస్తోంది. ప్రస్తుతం ఈనెల 21న వచ్చిన గాలివేగం కూడా సక్రమంగా రికార్డ్‌ కాలేదు

    గతంలోనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు ఒకవైపు నీరు లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతుంటే ప్రకృతి కోపంతో మరింత రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

  • సాక్షి, గుంటూరు: పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. గత పదిరోజులుగా ఇదే పంథాను సీఐ కృష్ణయ్య అనుసరిస్తున్నారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబుపై సీఐ రెచ్చిపోయారు. వరికూటి అశోక్ బాబును సీఐ కృష్ణయ్య, పోలీసులు ఈడ్చేశారు. దళిత నాయకుడు వరికూటి అశోక్ బాబును కిందపడేసిన పోలీసులు.. ఆయన పట్ల హేయంగా ప్రవర్తించారు.

    మధ్యాహ్నం రేపల్లె ఇన్‌ఛార్జ్ పేట మోహన కృష్ణపై దాడిచేసిన సీఐ కృష్ణయ్య.. జీపులోకి ఈడ్చేసి కొట్టారు. గతంలో బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ పట్ల ఇలానే సీఐ కృష్ణయ్య రెచ్చిపోయారు. జోగి రమేష్‌ను మామిళ్లపల్లి వెళ్లకుండా సీఐ అడ్డుకున్నారు. ప్రశ్నించిన జోగి రమేష్‌ను ఈడ్చికెళ్లారు. అంబటి మురళీకృష్ణ తోనూ దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంబటి మురళీకృష్ణ, జూపూడి ప్రభాకర్‌లను ఇంట్లోనుండి పోలీసులు లాక్కెళ్లారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రాపకం కోసం సీఐ కృష్ణయ్య రెచ్చిపోతున్నారు.

  • సాక్షి, అమరావతి:  కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పిడుగులాంటి వార్త చెప్పింది. విద్యా కానుక కింద విద్యార్థులకందించే యూనిఫాం, షూ, బ్యాగ్‌ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు జూన్ 12 వ తేదీన అందించే విద్యాకానుక కిట్‌ను అందించలేమని సమగ్రశిక్ష డైరెక్టర్‌ ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ గ్యారంటీ లేదని ప్రకటించారు. 

    ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారంతో యూనిఫాం, బ్యాగు, బట్టలు ఇవ్వలేమని తెలిపింది. ఈ పిడుగులాంటి వార్తతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ హాయాంలో పాఠశాలలు తెరిచే రోజే విద్యా కానుక కిట్‌ను అందజేసేవారని ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసి తమ చదువులకు ఆటంకం కలగజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతుంది. గత రెండేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన విద్యార్థుల చదువు విషయంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు పెడుతుండడంతో  సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

  • సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో అపచారం జరిగింది. అహోబిలం టోల్ గేట్ దగ్గర స్వామివారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన సరుకుల వాహనాన్ని  టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు అడ్డుకున్నారు. ఆలయ నిర్వాహకులు లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన సరుకులను తరలిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడ్డారు.

    ప్రసాదం తయారీకి సంబంధించిన ముడి సరుకులను తమవద్దే తీసుకోవాలని టీడీపీ నాయకులు హుక్కుం జారీ  చేశారు. తాము తప్ప ఎవ్వరు కూడా సరుకులను ఇవ్వకూడదంటూ అఖిలప్రియ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.  టీడీపీ నాయకులపై నంద్యాల ఎస్పీకి అహోబిలం మఠం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

  • సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది.  రాగల మూడు గంటల్లో అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  విజయనగరం జిల్లాలో సైతం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

    ప్రజలందరూ ఈ సూచనలను పాటించాలని తెలిపింది. 50 నుంచి 60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో చెట్లు, పోల్స్,హోర్డింగ్స్ క్రింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ  ప్రఖర్ జైన్ ఈ హెచ్చరికలను జారీ చేశారు.

  • తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో  దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి  బోరు వేసుకుంటుంటే  టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. 

    దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం  ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. 


     

  • సాక్షి, తాడేపల్లి: వెన్నుపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంధన ధరలను భారీగా పెంచి చంద్రబాబు జనం నడ్డి విరిచారని.. ప్రజాపాలనలో ఘోర వైఫల్యం చెందారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ చేపట్టిన నిరసనలకు పెద్ద ఎత్తున స్పందన లభించిందన్న అప్పిరెడ్డి.. ఇంధన ధరల పెంపుపై తమ నాయకులు అడిగిన ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పలేక పోయారన్నారు.

    ‘‘ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు దూషణలకు దిగుతున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించటం కూడా చేతగాని వారు కూటమి నేతలు. పెట్రోలుపై రూ.31లు ట్యాక్స్ వేసింది చంద్రబాబు కాదా?. డీజిల్ మీద 22 రూపాయలు ట్యాక్స్ వేసిందీ చంద్రబాబే. చివరికి అమరావతి పేరుతో మరో రూ.4 ట్యాక్స్ వేయలేదా?. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తే జగన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే పెంచారు. కేంద్రం గ్యాస్ మీద రూ.50 పెంచితే జగన్ ప్రభుత్వం ప్రజల మీద వేయకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు

    ..మరి చంద్రబాబు ఇప్పుడు ఆ పనులు ఎందుకు చేయటం లేదు?. అమరావతి కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉండదా?. రూ.3,400 కోట్ల భారం ప్రజల మీద వేయటం సిగ్గుచేటు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. ఇదేనా అనుభవజ్ఞుడి పాలన చంద్రబాబూ?. అమరావతి అద్దాలకు పెట్టే ఖర్చు ప్రజల బాగు కోసం పెట్టలేరా?. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంధన ధరలను తగ్గించాలి.

    ..టీడీపీ డీఎన్‌ఏనే వెన్నుపోటు. రైతుల నుండి అన్ని వర్గాలనూ  చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పార్టీ. వివేకా హత్య జరిగింది చంద్రబాబు పాలనలోనే. చంద్రబాబుదే గొడ్డలి పార్టీ. పొరుగు రాష్ట్రాలను చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

  • శ్రీకాకుళం క్రైమ్‌: ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్‌కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది.  

    స్నేహితురాలి ఊరికని చెప్పి.. 
    ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్‌లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్‌లైన్‌లో శ్రీకాకుళం విజేత హోటల్‌లోని రూమ్‌ను బుక్‌ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్‌కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్‌ మెసేజ్‌ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్‌ సారాంశం. 

    అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్‌ చేసి చెప్పి మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్‌ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్‌ చేయడంతో హోటల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు.  హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు.    

Business

  • అమెరికాలో కొనసాగుతున్న పన్నుల వివాదం.. మధ్య సెర్గే బ్రిన్ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవర్‌పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్న వివాదాస్పద పన్ను ప్రతిపాదనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ కమిటీకి ఈయన 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.80 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. వ్యాపార సంస్థలకు అనుకూలంగా భావిస్తున్న మరో పన్ను ప్రతిపాదనకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

    ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు ముఖ్యమైన పన్ను ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. అవి 'మెజర్ సీ, మెజర్ డి'. వీటిపై జూన్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.

    మెజర్ Cకు వ్యాపార వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం.. చిన్న వ్యాపార సంస్థలకు పన్ను మినహాయింపు పరిమితిని 5 మిలియన్ డాలర్ల నుంచి 7.5 మిలియన్ డాలర్ల వరకు పెంచుతారు. దీని వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. అయితే.. పెద్ద కంపెనీలపై పన్ను భారం కొంత పెరుగుతుంది. అయినప్పటికీ, నగర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని మద్దతుదారులు చెబుతున్నారు.

    ఇక మెజర్ D మాత్రం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఓవర్‌పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీల్లో సీఈఓల జీతాలు, సాధారణ ఉద్యోగుల జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ఆధారంగా లెక్కిస్తారు. అంతేకాకుండా.. పన్ను రేట్లు పెరగడంతో పాటు భవిష్యత్తులో వాటిని తగ్గించడం కూడా కష్టమవుతుంది.

    కార్మిక సంఘాలు, కొన్ని సంస్థలు మెజర్ డీ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాయి. ధనిక కంపెనీలు సమాజానికి తగిన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. కానీ వ్యాపార వర్గాలు మాత్రం.. ఈ విధానం వల్ల కంపెనీలు నగరాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫిసులు ఖాళీ అవడం, కంపెనీలు ఇతర ప్రాంతాలకు మారడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ పన్ను విధానం ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.

    సెర్గే బ్రిన్ కూడా అధిక పన్నుల విధానాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. 1979లో తన కుటుంబం సోవియట్ యూనియన్‌లోని సామ్యవాద పాలన నుంచి అమెరికాకు వలస వచ్చిందని గుర్తుచేసుకుంటూ, 'సోషలిజం సమాజాన్ని ఎలా దెబ్బతీస్తుందో నేను స్వయంగా చూశాను. కాలిఫోర్నియా కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకూడదు' అని వ్యాఖ్యానించారు.

    కాగా.. బ్రిన్ ఇటీవల తన నివాసాన్ని సిలికాన్ వ్యాలీ నుంచి నెవాడాలోని లేక్ టాహో సమీప ప్రాంతానికి మార్చినట్లు సమాచారం. నెవాడాలో కాలిఫోర్నియా మాదిరిగా అధిక రాష్ట్ర పన్నులు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!

  • అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ బోల్ట్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. తన మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగాన్ని తొలగించింది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసివేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ సీఈఓ రయాన్ బ్రెస్లో సమర్ధించడం మరింత సంచలనం సృష్టించింది.

    హెచ్ఆర్ విభాగం కంపెనీలో అసలు లేని సమస్యలను సృష్టిస్తోందని.. ఆ టీమ్‌ను తొలగించిన తర్వాత సమస్యలు కూడా మాయమయ్యాయని రయాన్ బ్రెస్లో పేర్కొన్నారు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి, పనితీరు మెరుగుపరచడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

    బోల్ట్ సంస్థను రయాన్ బ్రెస్లో 2014లో ప్రారంభించారు. ఇది చాలా తక్కువ కాలంలోనే అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన ఫిన్‌టెక్ స్టార్టప్‌లలో ఒకటిగా మారింది. కానీ.. 2022లో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సంస్థ విలువ తగ్గడం ప్రారంభమైంది. ఆ తరువాత అనేకసార్లు ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. 2025లో తిరిగి కంపెనీ బాధ్యతలను బ్రెస్లో చేపట్టారు. తరువాత కీలక మార్పులు చేసారు.

    ప్రస్తుతం బోల్ట్ సంస్థలో కేవలం 100 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ, కంపెనీ పనితీరు మెరుగైందని బ్రెస్లో చెబుతున్నారు. కస్టమర్లకు వేగంగా సేవలు అందుతున్నాయని, ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడిందని తెలిపారు.

    ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!

  • ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఇతర కార్ల మాదిరిగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనాలను జూన్‌లో ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

    నాగ్‌పూర్‌లో నిర్వహించిన 19వ రోజ్‌గార్‌మేళాలో గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగం చాలా సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల గురించి చెబుతూ.. తాను టయోటా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం ఉపయోగిస్తున్న విషయాన్ని వెల్లడించారు.

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా.. మారుతి సుజుకి ఇథనాల్‌తో నడిచే వాహనాలను విడుదల చేయనుందని గడ్కరీ చెప్పారు. టయోటా, టాటా, మహీంద్రా, సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే అటువంటి వాహనాలపై పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. చమురు దిగుమతులను తగ్గించడానికి అందరూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలని గడ్కరీ సూచించారు.

    మారుతి సుజుకి ఇప్పటికే ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్ ఆధారంగా రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ (FFV) కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాన్ని గత సంవత్సరం జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. దీనిని 2026లో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

    ఇవి E85 (85% ఇథనాల్ కలిపిన పెట్రోల్) వరకు ఇథనాల్ మిశ్రమాలపై నడుస్తుంది. వ్యాగన్ ఆర్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనంగా లాంచ్ కానుంది. ఆటో ఎక్స్‌పో 2023, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 రెండింటిలోనూ ప్రదర్శించిన ఈ కార్లు దాదాపు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి.

    ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!

  • ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం మనం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసు కుంటున్నాం. క్రూడ్‌ ఆయిల్‌ తరువాత భారతదేశం బంగారం పైనే పెద్ద మొత్తంలో దిగుమతి వ్యయం భరిస్తున్నదంటే ఆర్థిక వ్యవస్థపై బంగారం ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా బంగారం దిగుమతులపై 55 నుంచి 72 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ జీడీపీలో 1.6%కి సమానం. 

    డబ్లు్యజీసీ (వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం (దేవాలయా లలోని నిల్వలను కలుపుకొని) నిల్వ ఉంది. దీని విలువ సుమారు 2.4 ట్రిలియన్‌ డాలర్లు. దాయాది దేశమైన పాకిస్తాన్‌ జీడీపీ కంటే మన బంగారం నిల్వలు 6 రెట్లు అధికం. 

    అయితే బంగారం దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడు తున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎమ్‌ఎస్‌)ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ పథకం ద్వారా, వ్యక్తులు బ్యాంకు లాకర్లలో, ఇండ్లలో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వడ్డీ సంపాదించే ఆస్తిగా మార్చుకోవచ్చు. ఆభర ణాల రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించి స్వచ్ఛతను పరీక్షించిన పిదప కడ్డీ రూపంలో బ్యాంక్‌లో నిర్ణీత కాలానికి డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ బంగారాన్ని గోల్డ్‌ మెటల్‌ లోన్స్‌ (జీఎమ్‌ ఎల్‌) ద్వారా నగల వ్యాపారులకు లీజుకు ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతాయి. కేంద్రబ్యాంకులు కూడా కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఆర్థిక నష్టాలను నిర్వహించడానికి బంగారు నిల్వలను నిర్ణీత పరిమాణంలో కలిగి ఉంటాయి. 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఒక దశాబ్ద కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే వాడుక లోకి తేవడం జరిగింది.

    వడ్డీ కంటే అభిరుచి మిన్న
    బంగారు నగదీకరణ పథకం అంతగా విజయవంతం కాకపోవ డానికి కారణం, బంగారం 75% ఆభరణాల రూపంలో ఉండటం. స్త్రీలు తమ అభిరుచులకనుగుణంగా చేయించు కున్న నగల అసలు రూపాన్ని  బ్యాంకులు ఇచ్చే 2 నుంచి 3 శాతం వడ్డీ కోసం కోల్పోవ డానికి ఇష్టపడటం లేదు. శుభ కార్యాలలో స్టేటస్‌ చిహ్నంగా ఆభర ణాలను స్త్రీలు ధరించడం, కొన్ని కుటుంబాలలో ఆభరణాలు వారస త్వంగా రావడం లాంటి కారణాల వల్ల చాలా కుటుంబాలు ఆభర ణాలను తమ వద్ద భద్రపరుచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. చాలా మధ్య తరగతి కుటుంబాలు వ్యక్తిగత అవసరాల కోసం ఆభర ణాలను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కూడా ఈ పథకానికి ఒక పరిమితి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం, డిపాజిట్‌పై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు ఆకర్షించే విధంగా లేకపోవడం, భవిష్యత్తులో బంగారం ధరల గురించి అనిశ్చితి లాంటివి ఈ స్కీమ్‌ విజయానికి ప్రతిబంధకాలు.

    దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్‌ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రజలనుగోల్డ్‌ ఈటీ ఎఫ్, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్స హించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ బలపడ టానికి, దిగు మతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్య నిలువలను పటిష్టం చేయ డానికి ప్రతి భారతీయుడు తనవంతుగా సహక రించాల్సి ఉంది.
    – డా.ఎం. డి. ఖ్వాజా మొయినుద్దీన్‌ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు 

    దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్‌ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. 

  • భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పటి నుంచో.. ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలకు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది. పసిడి తన మెరుపును కోల్పోలేదు కానీ అది మధ్యతరగతి, సాధారణ కుటుంబాల అందుబాటుకు దూరమవుతోంది.

    రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. బంగారు ఆభరణాల అమ్మకాల తగ్గుతున్నట్లు తెలిసింది. ప్రజలు కొనుగోలు చేసే బంగారం బరువు తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 8% తగ్గిందని, ఇంకా ఈ ఏడాది 13-15% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇది గత పదేళ్లలోనే కనిష్ట స్థాయి అని పేర్కొంది. దీనికి కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు.

    భారతదేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. దీని వల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు చేరింది. అందువల్ల ప్రజలు అవసరమైన ఆభరణాలకే పరిమితం అవుతున్నారు.

    అయితే.. బంగారం అమ్మకాల పరిమాణం తగ్గినా, దాని విలువ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే తక్కువ బంగారం కొనుగోలు చేసినా, అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా జువెలరీ కంపెనీల ఆదాయం 20-25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కంపెనీలు అమ్మే బంగారం బరువు తగ్గినా, అధిక ధరల వల్ల వారి ఆదాయం తగ్గడం లేదు.

    ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!

  • జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం హోండా కార్స్‌ ఇండియా భారత మార్కెట్‌లో విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాపులర్‌ సెడాన్‌ మోడల్‌ సిటీలో ‘న్యూ సిటీ హైబ్రిడ్‌’ను విడుదల చేసింది.  దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. ఇదే సమయంలో కంపెనీ.. ప్రీమియం ఎస్‌యూవీ ‘జెడ్‌ఆర్‌–వీ’ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది.

    ఈ సందర్భంగా హెచ్‌సీఐఎల్‌ ప్రెసిడెంట్, సీఈవో టకాషీ నకజిమా మాట్లాడుతూ, ఈ రెండు మోడళ్లతో కలిపి 2026–27 లో మొత్తం ఆరు వ్యూహాత్మక మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

    ఈ కొత్త లాంచ్‌లు భారత మార్కెట్లో హోండా బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, కంపెనీ అమ్మకాలలో రెండంకెల వృద్ధి సాధించడంలో దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లో తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని 2026–27 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2030 నాటికి  ఈవీలు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు సహా పదికి పైగా కొత్త మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

  • దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అండగా నిలవనుంది.

    గత ఏడాది బదిలీ చేసిన రూ.2.68 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువైనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, పెరిగిపోతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన కంటింజెంట్ రిస్క్ బఫర్ (భవిష్యత్తులో వచ్చే ఊహించని ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్‌బీఐ పక్కన పెట్టే అత్యవసర నిధి) కూడా ఆర్‌బీఐ గణనీయంగా పెంచింది.

    ఆర్థిక ఒత్తిళ్ల నడుమ వెసులుబాటు

    ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, సబ్సిడీల భారం, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు వంటి సవాళ్లను కేంద్రం ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఆర్‌బీఐ నుంచి అందిన ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వ ఖజానాకు గట్టి ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా యుద్ధం) కమ్ముకుంటున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే అంశంపై ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇదీ చదవండి: మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

  • పెంపుడు జంతుల మీద ప్రేమ చూపించేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు మొదలైనవాటి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో 'డాగ్ నానీ'లకు డిమాండ్ ఎక్కువైంది.  ధనిక కుటుంబాలు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసుకునే ప్రొఫెషనల్ కేర్‌టేకర్లను నియమించుకుంటున్నారు. అధికమొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నారు.

    అమెరికాలో ఫుల్‌టైమ్ డాగ్ నానీలు వారానికి 2,500 డాలర్లకుపైగా, అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.2.4 లక్షలు వరకు సంపాదిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

    కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపారు. దీంతో వాటిపై అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమవుతోంది.

    డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్‌మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం వంటి బాధ్యతలూ ఉంటాయి. కొందరు నానీలు యజమానులు ఇళ్లలోనే ఉంటారు. వారికి వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు కూడా యజమానులే భరిస్తున్నారు.

    కుక్కలను సంరక్షించడంలో అనుభవం ఉన్నవారు గంటకు 40 నుంచి 50 డాలర్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రోజుకు 500 నుంచి 800 డాలర్ల వరకు సంపాదించుకుంటున్నట్లు సమాచారం. గతంలో బ్రిటన్‌లో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి లక్ష పౌండ్ల (రూ. కోటి కంటే ఏక్కువ) జీతంతో డాగ్ నానీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి వార్తల్లో నిలిచింది.

    పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించిన లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన లేదా సర్టిఫికేషన్ ఉన్న కేర్‌టేకర్లు మరింత ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

    ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!

  • ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.

    బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవే

    ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.

    బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.

    వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు.

    "సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"

    భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

    "రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.

    సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.

  • అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తూ గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు మరోసారి విజ్ఞప్తి చేశారు. పరాయి దేశంలో అనిశ్చితి మధ్య కాలం వెళ్లదీసే కంటే స్వదేశానికి తిరిగి వచ్చి దేశ వృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘దయచేసి మాతృభూమికి తిరిగి వచ్చేయండి. ఇది కొంత కష్టంతో కూడుకున్నది. త్యాగంతో కూడినదే కావచ్చు.. కానీ, జీవితంలో ఆత్మగౌరవం అనేదే మీ మార్గాన్ని నిర్దేశించాలి. అంతా కలిసి భారత్ గర్వపడేలా చేద్దాం’ అంటూ ఆయన ఎక్స్ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

    అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇటీవల గ్రీన్ కార్డ్ నిబంధనలపై చేసిన ఒక కఠినమైన ప్రకటనను ఉటంకిస్తూ శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తాత్కాలికంగా యూఎస్‌లో ఉంటూ, గ్రీన్ కార్డ్ కోరుకునే ఏ విదేశీయుడైనా సరే.. దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను వాడుకోవడానికి బదులు, చట్టం తన పని తాను చేసుకుపోయేందుకే ఈ విధానాన్ని తెచ్చాం. దేశ వలస విధానాన్ని దుర్వినియోగం చేసే కాలం ఇక ముగిసింది’ అని యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.

    డీహెచ్‌ఎస్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ టెక్ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లు, ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి, హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ వెంబు స్పందిస్తూ భారతీయులకు స్వదేశీ పిలుపునిచ్చారు.

    నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు

    వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, ఏఐ ఇండస్ట్రీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతంగా వృద్ధి చెందాయని పలువురు వెంబు వ్యాఖ్యలను సమర్థించారు. భారత్‌లోనే ఇప్పుడు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమెరికా తరహా భారీ జీతాలు లేకపోవడం, అధిక పన్నులు, టాక్సిక్ వర్క్ కల్చర్, మౌలిక సదుపాయాల కొరత, జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని కొందరు ఎత్తి చూపారు.

    ‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనా

    శ్రీధర్ వెంబు కేవలం పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాను అమలు చేసి చూపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహా కేంద్రీకృత మోడల్‌ను వ్యతిరేకించే ఆయన సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జోహో తన కార్యకలాపాలను పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా తమిళనాడులోని తెన్కాసి వంటి చిన్న పట్టణాలకు విస్తరించింది.

    ఇదీ చదవండి: మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

  • భారతీయ రోడ్లపై దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్’ ఇప్పుడు మరింత శక్తిమంతమైన అవతారంలో వస్తోంది. దేశీయ మార్కెట్లో ప్రీమియం, హై-కెపాసిటీ బైక్‌లకు ఉన్న భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి కంపెనీ తన సరికొత్త ‘బుల్లెట్ 650’ (Bullet 650) మోడల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు బైక్‌ల రవాణా కూడా ప్రారంభమవడంతో, ఈ ఐకానిక్ బైక్ విడుదలపై బైక్ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

    మిలన్‌లో జరిగిన అంతర్జాతీయ ఆటో షో (EICMA 2025) తో పాటు, గోవాలో నిర్వహించిన మోటోవర్స్ 2025 వేదికపై ఈ బైక్‌ను కంపెనీ తొలిసారిగా ప్రదర్శించింది. అప్పటినుంచే ఆటోమొబైల్ రంగంలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది.

    లాంచ్‌ ఎప్పుడు.. ధర ఎంత?

    రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 మోడల్‌ 2026 జూన్ లేదా జూలై మొదటి వారంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని సుమారు రూ.3.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.  బుల్లెట్‌కే విలక్షణమైన సాంప్రదాయక లుక్, గంభీరమైన శబ్దం, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ను ఇందులోనూ కొనసాగించనున్నారు.

    విస్తరిస్తున్న 650 సీసీ పోర్ట్‌ఫోలియో

    ఐషర్ మోటార్స్ లిమిటెడ్ FY26 ఆర్థిక ఫలితాల సమావేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి. గోవిందరాజన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "మా ప్రణాళికల్లో ఉన్న బుల్లెట్ 650 మార్కెట్లోకి రావడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు.

    రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఇప్పటికే ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటియోర్, షాట్‌గన్, బేర్ వంటి పాపులర్ 650 సీసీ బైక్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి అత్యంత పురాతన, నమ్మకమైన బ్రాండ్ అయిన ‘బుల్లెట్’ కూడా చేరబోతుండటం గమనార్హం.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

    అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పు

    తాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్‌ ఎకోసిస్టమ్‌లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్‌లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.

    ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్‌జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.

    స్టార్టప్‌లకు ముప్పు

    అక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్‌సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

    ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్‌ ఫౌండర్‌, నిక్‌ డేవిడోవ్‌ గుర్తుచేశారు.

    చట్టసభ సభ్యుల ఆగ్రహం

    ఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.

    ఇదీ చదవండి: మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

Politics

  • హైదరాబాద్‌: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 

    దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.

    మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు...  ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.

    రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.

    ‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు.

  • సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని, ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాల్ని ఒక్కొక్కటిగా వివరించారు. ఆయన ఇంకేమన్నారంటే..:

    ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు.. తాము ప్రజలకు చేస్తున్న మంచి ఏంటో చెప్పుకోవాలి కానీ విపక్ష నేతలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు? రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు  వ్యవస్థల మేనేజ్‌మెంట్, మ్యానిపులేషన్‌ అన్నీ తెలుసు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడూ ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చి , అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోకుండా మోసం చేయడం అందరూ చూశారు.

    వ్యవసాయం శుద్ధ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రుణమాఫీ చేస్తానని మహిళల్ని ఎలా మోసం చేసి మాయ చేశాడో కూడా అందరికీ తెలుసు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయిపోయిందని ఇప్పుడు మరో మోసం చేస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ చేసే ప్రయత్నం చేస్తాననడం వేరు సూపర్‌ హిట్‌ అయిందనడం వేరు. రెండింటికీ చాలా తేడా ఉంది. మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ఇచ్చారా, మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇచ్చారా చెప్పాలి. మీ పరిపాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? అన్ని నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా?

    కోవిడ్‌ సంక్షోభంలోనూ ప్రజల్ని ఆదుకున్న జగన్‌:
    కోవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్‌గారు ఆదుకున్నారన్న విషయం గ్రామాల్లో వెళ్లి అడిగితే అర్దమవుతుంది. ఏమైనా అంటే తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ, ప్రయాణాలకూ ఎక్కడైనా ఆటంకం ఉందా ? పేదల మనుగడకు, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, పేదల వైద్యానికీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకే ఆటంకాలన్నీ. కానీ చంద్రబాబు మాటలు చూస్తే కోటలు దాటి పోతున్నాయి.

    ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. చంద్రబాబు ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో, వాటిని ఎంత వరకూ నిలబెట్టుకున్నారో ఆలోచించాలి. డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గించారా చెప్పాలి. ఇరాన్‌ యుద్దం వల్ల దేశమంతా రేట్లు పెరిగాయి. కానీ రాష్ట్రంలో పెంచిన ధరల్ని మాత్రం తగ్గించలేరా? రైటు పండించిన పంటకు మాత్రం ధర లేదు. రైతు పరిస్ధితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుంది. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు ఏం చేస్తున్నాయో అర్ధం కావట్లేదు. మా ప్రాంతంలో జొన్నల గురించి రెండేళ్లుగా నేను అడుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలా మార్కెట్‌ అస్దితరపై ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు?

    పుస్తకాలు అంటూ రాస్తే చంద్రబాబు గురించి రాయాలి. ఏ రకంగా ప్రజాస్వామ్యంలో అవకాశాలు వినియోగించుకుని, మాయ మాటలు చెప్పి, సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందులో రాయాలి. ప్రజల కష్టాల మీద ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. ఎంతసేపూ చట్టాలు చేతుల్లో తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

    నిన్న మెగా డీఎస్సీ అన్నారు. ఓ ఉద్యోగి ఐఏఎస్‌ టాపర్‌ వచ్చాడని తెలిసి ఆన్‌ లైన్‌ లో పెట్టిన మెరిట్‌ లిస్ట్‌ తీసేశారు. ఇదేనా మీ పాలన? విద్యాశాఖ మంత్రి తన శాఖ వదిలి మిగతా శాఖల గురించి మాట్లాడతారు. విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ రోజు ఇస్తామంటున్నారు. కానీ ఆ పీటీఎం ఎప్పుడో మాత్రం చెప్పరు. ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటూ చెప్పుకుంటూ ప్రతీదీ దాపరికమే. నీతిగా పాలన అయినా చేస్తున్నారా అంటే వైజాగ్‌ గీతం భూముల్ని ఎలా దోచుకుంటున్నారో  ప్రజలు చూశారు. ఆంధ్రా యూనివర్శిటీని తాకట్టు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది. ప్రభుత్వ పెద్దలకు కానీ, వాళ్ల తాబేదార్లకు సంబంధం ఉంటే మాత్రం ఆ అంశాన్ని ఎలా నీరుగార్చాలా అని చూస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.

    రెండేళ్లలో పేదలకు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా?:
    టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. పేదలు, మధ్య తరగతికి ఇది చేశాం అని పేటెంట్‌ గా చెప్పుకునే కార్యక్రమం ఒక్కటైనా ఉందా? రైతులకు కానీ, సామాన్యులకు కానీ, విద్యార్ధులకు కానీ ఏమైనా చేస్తే చెప్పండి. లేదా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్పుకునే పరిస్ధితి ఉందా చెప్పాలి. మండల స్దాయి కార్యాలయాలకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు, అధికారులు కలిసి కింది స్దాయిలో దోచుకుంటున్నారు. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చి.

    రాష్ట్రంలో ధరలు కనీసం 15–20 శాతం పెరిగాయి. దానికి తగినట్లుగా రాబడి పెరిగిందా అంటే శూన్యం. ఇంకా ముగ్గుర్ని కంటే 30 వేలు, నలుగురిని కంటే 40 వేలు ఇస్తామంటూ పిచ్చిమాటలు చెప్తున్నారు. ఉన్న వాళ్లకు ఉద్యోగానికి దిక్కులేదు కానీ ముగ్గుర్ని, నలుగురిని కనాలట. అందరూ మీలా ధనవంతుల్లా ఉంటారా, లేక రెండెకరాలు నుంచి ఆస్తులు పెంచుకునే మంత్రాలు మీలా అందరి దగ్గర ఉంటాయా చంద్రబాబు చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతమందికి పీ–4 ఇచ్చారో చంద్రబాబు బయటపెట్టాలి.

    ఈ మాటలతో ఎంత కాలం జనాన్ని మభ్య పెడతారని అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ప్రసార మాధ్యమాలతో బుల్‌ డోజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదల ఆకలిని ఎంతకాలం ఇలా దాచిపెట్టగలరో చూద్దాం. రెండేళ్లయినా ఉద్యోగులకు పీఆర్సీ వేసే దిక్కులేదు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్రంలో ఉండాలంటే కడుపు తరుక్కుపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేస్తోంది.

    ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం..:
    ప్రతీవారం అప్పు తీసుకుంటున్న డబ్బుల్ని అవినీతికి ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతి చూడలేక జగన్‌ మావిగన్‌ ప్రతిపాదించారు. దానికి మీకెందుకు బాధ ? ఈ అవినీతి, దోపిడీ చూసి రేపు ఆ ప్రాంతంలోని మచిలీపట్నం, గన్నవరం ప్రజలే మిమ్మల్ని అడుగుతారు.

    ఏ అంశం చూసినా కుంభకోణం, పక్షపాతమే. ఎక్కడా పారదర్శకత లేదు. విద్యార్ధుల కోసం డీఎస్సీ పెడితే లీకేజ్‌ జరిగి మెరిట్‌ లేకుండా స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ, పోలీసు శాఖలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపూ ఏ రాజకీయ పార్టీ చూసుకుని ప్రయోజనాలు కల్పించడమేనా వీటి పని? ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఎక్కడా లీకేజిలు లేకుండా పాలన జరగాలనేది మా ఉద్దేశం. ఆ దిశలో నిరంతరం ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తూనే ఉంటామని, అవసరమైతే చొక్కా విప్పి వీధుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

  • సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్‌ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్‌ అంటూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్‌ పదవికి అరవ శ్రీధర్‌ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.

    బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్‌.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్‌ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్‌ ఫ్యామిలీ సెటిల్‌మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్‌’ అంటూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్‌ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా సంచలనంగా మారింది.  

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒక చానెల్‌ వార్తలపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక చానెల్‌ తనపై రాస్తున్న వార్తలను నమ్మే పరిస్థితి లేదన్నారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు.

    తనపై వస్తున్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా మహేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ..‘గాంధీ భవన్‌ను ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఒక చానెల్ నాపై వార్తలు రాస్తే నమ్మే పరిస్థితి లేదు. నా పనితీరును కేడర్‌ అంచనా వేస్తుంది. నేను ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నాను. 20 నెలలుగా  నా పనితీరు ఏంటో మా నేతలకు తెలుసు. నాపై వచ్చిన వార్తలపై నేను స్పందించవద్దని పార్టీ నేతలకు చెప్పాను. కొన్ని మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.. దానికి నేనేం చేయలేను. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుంది. ఏఐసీసీ దృష్టిలో తెలంగాణ పీసీసీది బెస్ట్ అని ఉంది. నాపై వ్యతిరేక వార్తలు రాసిన చానెల్.. గతంలో చాలా పాజిటివ్ వార్తలు కూడా ఇచ్చింది. దీనిపై సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతాను’ అని వ్యాఖ్యలు చేశారు. 

    ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుంది. బీఆర్‌ఎస్‌కు దూరదృష్టి లేదు.. హైదరాబాద్ పరిధి పెంచలేదు. సిటీ విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీష్ రావు అంటున్నారా?. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. స్టాలిన్‌లా మేము గత ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేమ్స్ ఏఐసీసీకి పంపించాం.. త్వరలో ప్రకటిస్తాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారు. నా ప్రమేయం ఏమీ ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. 

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది (2027) గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్‌.. అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది.

    కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం చెప్పింది.

    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • సాక్షి, హైదరాబాద్‌: వడదెబ్బతో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ పడ్డారు. మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం ఇవ్వనున్నట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రత‌ల‌పై ఆయన ఇవాళ(శనివారం,మే 23) అత్యవసర స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత‌నిస్తుందన్నారు.

    రానున్న మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనుందని.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి అన్నారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని.. ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు ఇవ్వాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. 

    ‘‘ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. హీట్ వేవ్‌పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వడదెబ్బ కేసులకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి’’ అని మంత్రి పొంగులేటి సూచించారు.

  • హైదరాబాద్‌: మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్‌ చేశారు. 

    ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

     

     

     

Family

  • World Turtle Day ‘సతీష్‌ భాస్కర్‌’ అనే పేరు వినబడగానే చాలామందికి తాబేళ్లు గుర్తుకు వస్తాయి.ఆయనకు ‘తాబేళ్ల సంరక్షకుడు’ అని పేరు. చిన్నప్పటి నుంచి సతీష్‌ భాస్కర్‌కు సముద్రపు తాబేళ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను తాబేళ్ల ప్రపంచంలోకి  తీసుకు వెళ్లింది. ఆ ప్రపంచంలో ఆయన వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు.అయితే ఆయన ఉక్కు సంకల్పం ముందు  ఆ ఆటంకాలు నిలవలేకపోయాయి... 

    తాబేళ్ల  పరిరక్షణ కోసం ఎవరి తోడూ లేకున్నా వేల కిలోమీటర్‌ల దూరం ఒంటరి ప్రయాణం చేశారు సతీష్‌ భాస్కర్‌. తీర్ర΄ాంత మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న ట్రాన్సిస్టర్‌ రేడియో, అలుపెరుగని స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉండేవి. అండమాన్‌ దీవుల తీరాలలో సముద్ర తాబేళ్ల పరిరక్షణకు భాస్కర్‌  చేపట్టిన కార్యక్రమాలు విస్తృతమైన ఆయన పరిశోధనకు గీటురాయిగా మారాయి.

    ఆకలితో కొన్ని రోజులు...
    లక్షద్వీప్‌లోని జనావాసాలు లేని సుహేలి ద్వీ΄ానికి వెళ్లారు భాస్కర్‌. అక్కడ అయిదు నెలల పాటు తాబేళ్లపై సర్వేలు నిర్వహించారు. ఆ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. అయినా అష్టకష్టాలు పడి అక్కడికి చేరుకున్నారు. అండమాన్‌ ద్వీపంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తినడానికి అతడి దగర్గ ఏమీ లేదు. ఆకలిని తట్టుకోలేని పరిస్థితులలో అక్కడి ఆదిమ గిరిజన తెగ వారి దగ్గర కాల్చిన మాంసం తెచ్చుకొని కడుపు నింపుకున్నారు.

    టర్టిల్‌ వాకర్‌
    సుహేలి ద్వీపంలో ఉన్నప్పుడు కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఇండోనేషియాలోని వెస్ట్‌ పపువా వంటి తీర్ర ప్రాంతాల వెంబడి అలుపెరుగకుండా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతిచోట తన ప్రయాణానికి పరమార్థాన్ని వెదుక్కున్నారు భాస్కర్‌. తాబేళ్ల ప్రపంచం గురించి సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికి తాను చేసిన ప్రయాణాలు ఉపకరించాయి. ‘టర్టిల్‌ వాకర్‌’ పేరుతో భాస్కర్‌పై 75 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు తైరా మాలనీ. ఈ డాక్యుమెంటరీ జాక్సన్‌ వైల్డ్‌ మీడియా అవార్డ్స్‌లో కన్జర్వేషన్, గ్రాండ్‌ టెటాన్‌ అవార్డులను అందుకుంది. సతీష్‌ భాస్కర్‌ ప్రయాణం గురించి ఈ డాక్యుమెంటరీ చెప్పే మాట...‘అతడిది...మృత్యువును ధిక్కరించే అన్వేషణ’

    సముద్ర తాబేళ్ల ఆవాసాలను గుర్తించే ప్రయత్నంలో మన దేశంలో తీర్ర΄ాంతంలో నాలుగువేల కిలోమీటర్లు ప్రయాణించారు భాస్కర్‌. గూళ్లు కట్టే విధానం నుంచి గుడ్ల స్వభావం వరకు తాబేళ్లకు సంబంధించి అనేక కోణాలలో అధ్యయనం చేశారు.  ఆయన సాహసాలు, ప్రయత్నాలు రాబోయే తరాలు తాబేళ్లను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచాయి.

    తాబేళ్ల సంరక్షణ కోసం...
    గుడ్లు, మాంసం, పెంకులు, చర్మం కోసం తాబేళ్లను వధిస్తున్నారు వేటగాళ్లు. మరోవైపు... చేపల వలలతో  ప్రమాదవశాత్తు తాబేళ్ల ఆవాసాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయాలు సతీష్‌ భాస్కర్‌ను తీవ్రంగా కలచివేశాయి. బాధపడడానికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితాన్ని తాబేళ్ల సంరక్షణకు అంకితం చేశారు. తాబేళ్ల స్థితి గతులు, పరిరక్షణపై యాభైకి పైగా రిపోర్ట్‌లు వెలువరించారు. 

International

  • టెహ్రాన్‌: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్‌ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

    అమెరికాకు అత్యత  కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్‌ (DNI) పదవికి తులసి గబ్బార్డ్‌  రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్‌ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్‌ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్‌ ఎంబసీ స్పందించింది.

    ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్‌ఖాతాలో రాసుకొచ్చింది.

    అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్‌ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ‍ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్‌ ట్రంప్‌కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.

    అమెరికా మీడియా కథనాలు 
    అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్‌ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్‌ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.

    ప్రత్యేకించి.. ఇరాన్‌ విషయంలో తులసి గబ్బార్డ్‌ వైఖరి మొదటి నుంచి ట్రంప్‌ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్‌ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

  • అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్‌.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్‌హౌస్‌ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్‌తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. 

    అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్‌ (DNI) పదవికి తులసి గబ్బార్డ్‌  రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్‌ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. 

    భారతీయ మూలాలు లేకున్నా.. 
    తులసి గబ్బార్డ్‌(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్‌ గబ్బర్డ్‌ సమోవన్‌-యూరోపియన్‌ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్‌ గబ్బార్డ్‌ అమెరికన్‌. కానీ ఆమె తల్లి క్యారెల్‌ గబ్బార్డ్‌కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్‌ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్‌పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్‌ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్‌ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. 

    ఏం జరిగి ఉండొచ్చు?
    అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్‌ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్‌ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.

    ప్రత్యేకించి.. ఇరాన్‌ విషయంలో తులసి గబ్బార్డ్‌ వైఖరి మొదటి నుంచి ట్రంప్‌ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్‌ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

    ట్రంప్‌.. పొగిడారు కదా!
    ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్‌హౌస్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్‌ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్‌మీడియాలో తుల్సీ గబ్బార్డ్‌ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్‌ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. 

    ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్‌ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్‌.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

    తులసి గబ్బార్డ్‌ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్‌ అబ్రహాం విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

  • ఇరాన్‌పై యుధ్దం, మిడిల్‌ ఈస్ట్‌ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్  (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్‌లైన్‌ పంచుకున్నారు.

    తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో,  ఆయన్ను దగ్గరుండి  తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు.  ఈ సందర్భంగా  గత ఏడాదిన్నరగా తనపై   ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

    ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్‌, కాన్స్‌ క్వీన్‌ ఐశ్వర్య లుక్‌ స్పెషాల్టీ!


    ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్‌లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే  ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి  క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే  ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని  ఆమె వెల్లడించారు.

    ఇదీ చదవండి: BP టెన్షన్‌ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు

    కాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్‌ సర్కార్‌లో తులసి గబ్బార్డ్  డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.

  • డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చర్యలు.. ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం చెబుతారో అనేది ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూరోప్‌లో త‌మ బ‌ల‌గాల‌ను త‌గ్గిస్తామ‌ని ఇన్నాళ్లూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. పోలాండ్‌కు అద‌నంగా 5000 మంది బ‌ల‌గాల‌ను పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ నాటో దేశాలను షాక్‌కు గురిచేసింది.

    అంతకుముందు ట్రంప్‌.. జ‌ర్మ‌నీ నుంచి త‌మ సైనికుల సంఖ్య‌ను త‌గ్గించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌ర్మ‌నీ నుంచి సుమారు 5 వేల మందిని ఉప‌సంహ‌రించ‌నున్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ యుద్ధంలో అమెరికా ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన‌ట్లు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫ‌ల‌మైన‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. ఈ క్రమంలో జర్మనీ నుంచి తమ బలగాలను ట్రంప్‌ ఉపసంహరించుకున్నట్టు సమాచారం.

    కానీ, పోలాండ్‌కు మాత్రం అద‌నంగా బ‌ల‌గాల‌ను పంపనున్న‌ట్లు ట్రంప్ చెప్ప‌డం నాటో దేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. పోలాండ్ అధ్య‌క్షుడిగా క‌రోల్ న‌వ‌రోకీ విజ‌య‌వంతంగా ఎన్నిక‌య్యారని, ఆయ‌న‌కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, అమెరికా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా 5 వేల మంది బ‌ల‌గాల‌ను పోలాండ్‌కు పంపుతోంద‌ని ట్రంప్ త‌న ట్రుత్ సోష‌ల్‌లో తెలిపారు. అయితే, జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్‌కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ఇది యూరప్‌లో అమెరికా సైనిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా భావించబడుతోంది. మరోవైపు.. పోలాండ్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఇది రష్యా ముప్పు నుంచి రక్షణను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయం సైనిక వ్యూహం కంటే రాజకీయ సంబంధాలపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    పోలాండ్‌-రష్యా ఘర్షణ.. 
    ప్రస్తుతం పోలాండ్-రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ తన భద్రతను నాటో మరియు అమెరికా సైనిక ఉనికిపై ఆధారపడి బలోపేతం చేస్తోంది. అలాగే రష్యా చర్యలను ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. ప్రస్తుతం పోలాండ్-రష్యా మధ్య ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధం రూపంలో కాకుండా “హైబ్రిడ్ వార్” రూపంలో జరుగుతున్నాయి. రష్యా పోలాండ్‌పై సైబర్ దాడులు, గూఢచారి చర్యలు, సమాచార యుద్ధం, మరియు సరిహద్దు అస్థిరతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. పోలాండ్ మాత్రం NATO తూర్పు రక్షణలో ముందు వరుసలో నిలిచి రష్యా ముప్పును ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే పోలాండ్-రష్యా సంబంధాలు మరింత కఠినమవుతాయి. మరోవైపు.. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో.. రష్యా నుంచి వచ్చే ముప్పు నిజమైన ప్రమాదమని పేర్కొన్నారు. 2025 నవంబరులో రష్యా క్షిపణి దాడిలో పోలాండ్ పౌరులు మరణించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది.

    పోలాండ్.. నాటో తూర్పు రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పోలాండ్ తన సైనిక శక్తిని విస్తరించి, NATO తూర్పు ఫ్లాంక్‌లో ప్రధాన స్థావరంగా మారింది. అమెరికా బలగాల ఉనికి, పోలాండ్ సైనిక విస్తరణ, మరియు NATO Forward Land Forces బెటాలియన్ పోలాండ్‌ను తూర్పు యూరప్ రక్షణలో కేంద్రంగా నిలబెట్టాయి.

    ప్రధాన ఘర్షణ రూపాలు

    1. హైబ్రిడ్ దాడులు

       సైబర్ దాడులు: పోలాండ్ ప్రభుత్వ, మౌలిక వసతులపై రష్యా తరచుగా సైబర్ దాడులు చేస్తోంది.

       గూఢచారి చర్యలు: రష్యా గూఢచారులు పోలాండ్‌లోని కీలక సైనిక, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

       సమాచార యుద్ధం: సోషల్ మీడియా, మీడియా ప్రచారాల ద్వారా పోలాండ్ సమాజాన్ని విభజించే ప్రయత్నం.

    2. సరిహద్దు సమస్యలు

       బెలారస్ ద్వారా వలసదారుల ప్రవేశం: రష్యా-బెలారస్ కలిసి అక్రమ వలసదారులను పోలాండ్ సరిహద్దులోకి పంపి అస్థిరత సృష్టిస్తున్నారు.

       సైనిక ఒత్తిడి: పోలాండ్ NATOతో కలిసి తూర్పు సరిహద్దులో బలగాలను పెంచుతోంది.

    3. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం

       పోలాండ్ ఉక్రెయిన్‌కు ప్రధాన లాజిస్టికల్ హబ్‌గా మారింది.

       రష్యా దీన్ని ప్రత్యక్ష ముప్పుగా భావించి పోలాండ్‌పై దాడులను పెంచింది.


    పోలాండ్ పాత్రలో ప్రధాన అంశాలు

    1. Forward Land Forces (FLF)

       NATO తూర్పు ఫ్లాంక్‌లోని ఎనిమిది మల్టీనేషనల్ బెటాలియన్లలో ఒకటి పోలాండ్‌లో ఉంది.

       ఈ బెటాలియన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి మరియు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.

    2. Mass-Army Strategy

       పోలాండ్ 2039 నాటికి 500,000 సైనికులు (300,000 యాక్టివ్, 200,000 రిజర్వ్) కలిగిన భారీ సైన్యాన్ని నిర్మిస్తోంది.

       ఇది దీర్ఘకాలిక, అధిక తీవ్రత గల యుద్ధంను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది.

       AI, డ్రోన్లు, లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమీకరిస్తోంది.

    3. Air & Missile Defence

       పోలాండ్ NATO Integrated Air and Missile Defence (IAMD)లో కీలక భాగస్వామి.

       పర్మనెంట్ NATO Air Policing ద్వారా పోలాండ్ ఆకాశాన్ని 24/7 పర్యవేక్షిస్తున్నారు.

    4. సైబర్ మరియు స్పేస్ రక్షణ

       పోలాండ్ NATO Eastern Sentry ప్రోగ్రామ్‌లో భాగమై, సైబర్ దాడులు, ఉపగ్రహ ముప్పులు.

    రష్యా ప్లాన్‌..

    నాటోలో విభేదాలు: రష్యా హైబ్రిడ్ దాడులు NATO ఏకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి.

    యూరప్‌లో అస్థిరత: సైబర్ దాడులు, ఇంధన సమస్యలు, వలసదారుల ఒత్తిడి యూరప్ భద్రతను దెబ్బతీస్తున్నాయి.

    ఉక్రెయిన్ మద్దతు తగ్గించడం: రష్యా లక్ష్యం యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తగ్గించేలా ఒత్తిడి చేయడం.

    నాటో ప్రస్తుతం రష్యా, చైనా వంటి దేశాల హైబ్రిడ్ వార్ వ్యూహాలకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2026లో NATO “Counter-Hybrid Support Teams”, Article 5 invocation readiness, మరియు EUతో సమన్వయం వంటి చర్యల ద్వారా సభ్యదేశాలను రక్షిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ పోలాండ్‌కు అదనపు బలగాలను పంపుతానని ప్రకటించడం నాటోకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తోంది. మొత్తం మీద రష్యా హైబ్రిడ్‌ వార్‌లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

    1. సమన్వయం లోపం

       ట్రంప్ నిర్ణయం NATO మిత్రదేశాలతో ముందుగా చర్చించకుండా తీసుకున్నారు.

       NATOలో ఏకత్వం, నమ్మకం దెబ్బతింటుంది.

    2. జర్మనీ నుండి బలగాల తగ్గింపు

       పోలాండ్‌కు బలగాలను పంపడం కోసం అమెరికా జర్మనీలోని సైనికులను తగ్గిస్తోంది.

       జర్మనీ, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలు దీన్ని తమ భద్రతా ప్రాధాన్యత తగ్గింపుగా భావిస్తున్నాయి.

       నాటోలోని ఇతర దేశాలు దీన్ని సంయుక్త వ్యూహం కాకుండా వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నాయి.

    4. తూర్పు-పశ్చిమ విభేదాలు

       తూర్పు యూరప్ దేశాలు (పోలాండ్, బాల్టిక్ దేశాలు) అమెరికా బలగాలను స్వాగతిస్తున్నాయి.

       పశ్చిమ యూరప్ దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) దీన్ని NATOలో విభేదాలు పెంచే చర్యగా భావిస్తున్నాయి.