టీటీడీలో దళారీ రాజ్యం
తిరుపతి మంగళం : టీటీడీలో అవినీతి, దళారీ వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం ఆయన తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన చేసి శ్రీవారి పవిత్రతను పెంపొందిస్తామంటూ గొప్పలు చెప్పారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాలనలో చంద్రబాబు, పవన్కళ్యాణ్, బీఆర్ నాయుడు టీటీడీని భ్రష్టుపట్టించి శ్రీవారిని అపవిత్రం చేస్తూ భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇది నిజం కాదా?
నిన్నటి రోజున గుంటూరుకు చెందిన 64 మందికి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి చేత రూ.6వేల చొప్పున సుమారు రూ.4 లక్షలు వసూలు చేసి వారికి దర్శనం కల్పించకుండా దళారులు మోసం చేశారంటే టీటీడీలో దళారీ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని భూమన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ లేఖతో పాటు ఆరుగురు టీటీడీ ఉద్యోగుల పేరుపై శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లను పొందినట్లు బాధితులు చెబుతున్నారన్నారు. దర్శనాల కోసం దళారులకు ఫోన్పే చేసి ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రెండేళ్ల కూటమి పాలనలో టీటీడీని ప్రక్షాళన చేశామని, భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నామని చెప్పారన్నారు. అయితే ఆయన ఈ విషయాలు చెప్పిన మరుసటి రోజే తిరుమలలో ఇలా జరిగిందన్నారు. టీటీడీలో అవినీతి, అధిక ధరలకు శ్రీవారి దర్శన టికెట్లను దళారీలు విక్రయించుకునేందుకు అవసరమైన ప్రక్షాళన చేశారే తప్ప భక్తుల సౌకర్యార్థం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.









