Archive Page | Sakshi
Sakshi News home page

International

  • మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ముగించడానికి అమెరికా - ఇరాన్ దేశాలు ఒక కీలక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (Abbas Araghchi) ప్రకటించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

    అరాఘ్చీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, 'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' గతంలో ఎప్పుడూ లేనంతగా తుది దశకు చేరుకుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడే వరకు మీడియా సంయమనం పాటించాలని, ఊహించి చెప్పవద్దని పేర్కొన్నారు.

    ఇటీవల కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ప్రచురించాయి. దీనిపై స్పందించిన అరాఘ్చీ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఒప్పందం ఖరారైన తర్వాత అన్ని వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.

    ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై స్పందించారు. అరాఘ్చీ చేసిన పోస్టును తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేస్తూ.. మీడియాలో వస్తున్న లీకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ మీడియాలో ప్రచురితమైన వివరాలు సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఇంకా కొన్ని విభేదాలు, చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ, ఇరు దేశాలు ఒక ఒప్పందం దిశగా ముందుకు సాగడం ప్రపంచ శాంతి, మధ్యప్రాచ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం అని చెబుతున్నారు.

  • వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్‌ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్‌లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు  భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.

    ఇటీవల తరచుగా హర్ముజ్‌ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్‌ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌ వాసిగా గుర్తించారు. 

    ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్‌లోని షినాస్‌ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్‌వీర్‌ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్‌ఫైర్‌ గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.

    ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్‌ జేసన్‌ను పిలిపించి భారత్‌ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు.

  • సియోల్‌: ఉత్తర కొరియాపైకి డ్రోన్లు పంపినందుకు గాను దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు సియోల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) ఆయనకు మరో 30 ఏళ్ల భారీ జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే, ఆయన ఇప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్‌లో విఫలమైన మార్షల్ లా విధింపునకు దారితీసిన పరిణామాలపై విచారణ జరిపిన కోర్టు.. దేశద్రోహం, అధికార దుర్వినియోగం ఆరోపణల కింద ఆయనను దోషిగా తేల్చింది.

    సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు తన తీర్పులో.. 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లను పంపడం వెనుక యూన్‌ సుక్‌ యోల్‌ స్పష్టమైన వ్యూహం ఉందని పేర్కొంది. ఉత్తర కొరియాను రెచ్చగొట్టడం ద్వారా దేశంలో తీవ్ర భద్రతా సంక్షోభాన్ని సృష్టించి.. ఆ నెపంతో డిసెంబర్ 3, 2024న మార్షల్ లా విధించాలనేది ఆయన ప్రణాళిక అని కోర్టు నిర్ధారించింది.

    ఈ సైనిక ఆపరేషన్‌లో భాగస్వాములైన మరికొందరు కీలక అధికారులపై కూడా కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్.. ప్రత్యేక కౌన్సిల్ 25 ఏళ్ల శిక్షను కోరగా.. కోర్టు అంతకంటే ఎక్కువగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కమాండ్ చీఫ్ యో ఇన్-హ్యుంగ్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. డ్రోన్ ఆపరేషన్స్ మాజీ చీఫ్ కిమ్ యాంగ్ డేకు కూడా శిక్ష విధించింది.

    సైనిక పాలన విధించేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం కోసమే నిందితులు ఈ కుట్రకు పాల్పడ్డారు. ఉత్తర కొరియాను రెచ్చగొట్టి, సరిహద్దుల్లో ఘర్షణలు లేదా జాతీయ భద్రతా సంక్షోభాన్ని సృష్టించేందుకు మానసిక యుద్ధతంత్రాన్ని సైనిక వ్యూహంగా ఉపయోగించుకున్నారంటూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రక్షణ కోసం.. చట్టబద్ధమైన అవసరాల కోసం మాత్రమే సైనిక శక్తిని ఉపయోగించాలనే ప్రజల నమ్మకాన్ని అధ్యక్షుడు, రక్షణ మంత్రి పూర్తిగా వమ్ము చేశారని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇదంతా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జరిగిందని వ్యాఖ్యానించింది.

    అయితే, 2024లో ఉత్తర కొరియా.. దక్షిణ కొరియాపైకి పంపిన చెత్త బుడగలకు ప్రతిస్పందనగానే డ్రోన్లను పంపామని ఇది చట్టబద్ధమైన సైనిక చర్యేనని యూన్ తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ ఆపరేషన్ వల్ల దక్షిణ కొరియా సైనిక రహస్యాలు ఉత్తర కొరియాకు తెలిసిపోయాయని.. తద్వారా దేశ భద్రత ప్రమాదంలో పడిందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే యూన్‌ సుక్‌ యోల్‌ న్యాయ బృందం ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేసింది.

     

  • జెరూసేలం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ముందే సమాచారం లేకపోవడం, ఆయనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న తిరుగులేని శక్తి పరిమితులను బహిర్గతం చేస్తున్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇటీవల ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్‌తో తాము జరుపుతున్న అణు చర్చలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ప్రతీకార దాడులకు వెళ్లవద్దని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. అయితే, ఈ విజ్ఞప్తిని లైట్‌ తీసుకుంది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ట్రంప్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

    ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా అగ్రరాజ్య హోదాకు, దాని శక్తికి అవమానకరం. దాడి చేయవద్దని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా నెతన్యాహును కోరినప్పటికీ, ఇజ్రాయెల్ వెనుకాడకుండా దాడికి తెగబడింది. ఇది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఎంతలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఈ క్రమంలో ఇరాన్‌తో త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లేదా మంగళవారంలోగా సంతకాలు జరుగుతాయి అని కూడా ఆయన ప్రకటించారు. ఇరాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడు చర్చలకి రండి’ అని పిలుపునిచ్చారు. కానీ, ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు ఈ చర్చల ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశాయి.

    మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది.ఇరాన్ అణు ప్రణాళికలు,క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతు..వీటన్నింటినీ ఇజ్రాయెల్ తన దేశ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తోంది. అమెరికా కుదుర్చుకునే తాత్కాలిక దౌత్య ఒప్పందాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపలేవని నెతన్యాహు నమ్ముతున్నారు.

    ఈ పరిణామాలు సాంప్రదాయ మిత్రదేశాలైన అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలలో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఒక ‘ప్రపంచ శాంతి దూత’గా నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ఇమేజ్‌కు భంగం కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఇజ్రాయెల్ దానిని అంగీకరించేలా లేదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో బలంగా వ్యక్తమవుతోంది.

Telangana

  • సాక్షి, హైదరాబాద్:  సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో విమానాన్ని తిరిగి బెంగళూరు తరలించారు. కాసేపటి క్రితమే విమానం అక్కడ ల్యాండయ్యింది. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తుంది.

    కాగా నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, చింతల్‌, బాలానగరల్‌ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వానపడుతోంది. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.

  • హైదరాబాద్‌:  నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, చింతల్‌, బాలానగరల్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.  

    మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్‌ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

    సీఎం రేవంత్‌ విమానం వెనక్కి మళ్లింపు
    హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా  ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్‌ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు.  శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు.

  • సాక్షి, నారాయణపేట: జిల్లా వ్యాప్తంగా  ఎస్సీ ఎస్టీ కేసుల గురించి విసృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ రోజు (శుక్రవారం) నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో  జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులం అనే విద్వేషాన్ని రూపుమాపాలని ఎస్సీ,ఎస్టీ కేసులపై  అవగాహన కల్పించి కేసులకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు.

    మంత్రి మాట్లాడుతూ.. చనిపోయిన తర్వాత వచ్చే నష్ట పరిహారం కంటే  బతికి ఉన్నప్పుడు  ఉండే భరోసా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జిల్లాలో  ప్రజలకు చట్టంపై  పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. కులం విషయంలో అవమాన పడ్డ వ్యక్తిగా తాను కుల విద్వేషాలను వ్యతిరేకిస్తున్నాను. విద్యా వ్యవస్థలో మరింతగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు..  

    జిల్లాలో ఇంకా బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి పోవాలని ,అందరికీ మరుగుదొడ్లు మంజూరు చేయించాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో అన్ని గ్రామాలు,  గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. గిరిజన తండాలకు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను, 25 ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 

    జిల్లాలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న సివిల్ రైట్ డే, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉల్లాస్  కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు .. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. సింగరేణి మెడికల్‌ బోర్డును పునఃప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు ( శుక్రవారం)  అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సింగరేణి మెడికల్‌ బోర్డును ప్రారంభించాలని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కాగా  రేపు 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నారు. 

    ఈ విషయమై ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ "మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అనారోగ్యంతో ఉండి, అర్హత కలిగిన కార్మిక ఉద్యోగులకు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరాలి. తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో తక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి," అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. 

    ఈ కీలక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం లేదా మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని యాజమాన్యానికి సూచించారు. కాగా సింగరేణి మెడికల్ బోర్డు వివిధ కారణాలతో గత కొంతకాలంగా నిలిచిపోయింది.

  • యాదగిరిగుట్ట: భారత్‌ అండర్‌ –19 క్రికెట్‌ జట్టుకు రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు ఉట్కూరి యష్‌వీర్‌గౌడ్‌ ఎంపికయ్యాడు. జూలై 1వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్‌డేల సిరీస్‌కు భారత్‌ అండర్‌ 19 క్రికెట్‌ టీమ్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో యష్‌వీర్‌గౌడ్‌ ఉన్నాడు.

    యష్‌వీర్‌గౌడ్‌ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అంబర్‌పేట్‌లో ఉంటున్నాడు. రెండేళ్లుగా అండర్‌ –19 హైదరాబాద్‌ టీమ్‌లో ఆయన ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో బెంగళూర్‌లో బీసీసీఐ ఇచ్చిన శిక్షణలో పాల్గొని ఆకర్షించాడు. దీంతో బీసీసీఐ యష్‌వీర్‌గౌడ్‌ను శ్రీలంకతో జరిగే మూడు వన్‌డేల సిరీస్‌కు బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసింది.

    మరో రెండు రోజుల్లో భారత్‌ అండర్‌–19 జట్టుతో కలిసి బెంగళూర్‌ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తల్లిదండ్రులు ఉట్కూరి రాజ్‌కుమార్, వాణి, బాబాయ్‌ దీపక్‌కుమార్‌ గురువారం సాక్షికి తెలిపారు. భారత్‌ అండర్‌–19 జట్టుకు యష్‌వీర్‌ గౌడ్‌ ఎంపిక కావడం రాజాపేటకే కాదు, తెలంగాణకే గర్వకారణమని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Politics

  • సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమం సక్సెస్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం ఆగదు.. మోసాలను నిలదీస్తాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. 2YearsForCBNBackStabbing హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్‌లో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. రెండేళ్ల ‘నారాసుర’ పాలన-రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు.. ర్యాలీలు ప్రజాగ్రహానికి అద్దం పట్టాయని ఆయన ట్వీట్‌​ చేశారు.

    ‘‘రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ అన్నారు.. సూపర్‌ సెవెన్‌ అన్నారు.. మొత్తం 143 హామీలు త‌న మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మ‌రి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

    ‘‘రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మ‌య‌మే!’ అని వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

    ‘‘ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు... రాష్ట్ర ప్ర‌జ‌లు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక పాలన. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్‌, క్వార్ట్జ్, లేటరైట్‌ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్‌, డీజిల్ వ్యాట్‌లు పెరిగాయి,  బస్సు ఛార్జీలు పెరిగాయి,  నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి,  పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.

    ..విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌ల‌తో  యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు,  సూప‌ర్-6, సూప‌ర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు!  ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

    ..ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్ర‌జ‌ల‌కు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.

    ..చంద్రబాబుకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు. ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌ల‌ను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి ద‌య‌తో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు’’ అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


     

  • సాక్షి, తిరుప‌తి: రెండేళ్ల కూట‌మి పాల‌న‌పై చంద్ర‌బాబుతో బ‌హిరంగ చ‌ర్చ‌కు తాను సిద్ధమేన‌ని, విధ్వంస పాల‌న ఎవ‌రిదో ఆధారాల‌తో సహా రుజువు చేస్తాన‌ని తిరుప‌తి స‌భ‌లో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు దీటుగా వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాకర్‌రెడ్డి బ‌దులిచ్చారు. తిరుప‌తిలోని త‌న నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి స‌భ‌కు అప‌న‌మ్మ‌క‌పు స‌భ‌, సంక్షోభ స‌భ‌ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ స‌భ ద్వారా మ‌రోసారి చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు మాయా బ‌జార్ సినిమా చూపించాడ‌ని ఆరోపించారు.

    ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమ‌లు చేయ‌కుండా విజ‌న్ 2047 పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి భ్ర‌మ‌ల ప్రిజ‌న్‌లో బంధించాల‌ని చూస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ్రీవారి పాదాల చెంత మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పారని, "రెండేళ్ల న‌మ్మ‌కం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో కూటమి నిర్వ‌హించిన స‌భ‌ను న‌ర‌కుడి వార‌సులైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్‌ల చెక్క భ‌జ‌న స‌భ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాల‌న‌లో చేసిందేమీ లేక కేవ‌లం జ‌గ‌న్ ని తిట్ట‌డానికి రూ.20 కోట్లు ఖ‌ర్చు చేశారని భూమ‌న ధ్వ‌జ‌మెత్తారు.

    చంద్ర‌బాబు అరాచ‌క రాక్ష‌స పాల‌న‌కు, వెన్నుపోటు, అంతులేని అవినీతికి రెండేళ్లు పూర్తయ్యాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నోటీసులు ఇవ్వ‌కుండా అరెస్ట్ చేశార‌ని, చెప్పుకున్న చంద్ర‌బాబు.. త‌న త‌ప్పు లేకుంటే సీఐడీతో కేసులు ఎందుకు కొట్టేయించుకున్నాడని ప్ర‌శ్నించారు. శ్రీవాణి టికెట్ల అమ్మ‌కాలు, ప‌రకామ‌ణి వ్య‌వ‌హారం, డీఎస్సీ అక్ర‌మాల‌పై చంద్ర‌బాబుకి సీబీఐ విచార‌ణ కోరే ద‌మ్ముందా అని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

    అందుకే జ‌గన్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు
    చంద్ర‌బాబు ప‌రిపాల‌నా ద‌క్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మ‌హిళ‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా త‌ప్పించుకోలేని విధంగా త‌న రెండేళ్ల పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచాడు. "రెండేళ్ల న‌మ్మ‌కం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో రెండేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా తిరుప‌తిలో కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కూట‌మి నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ గారిని తిట్ట‌డానికే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల అమ‌లు గురించి మాత్రం స్ప‌ష్టంగా స‌మాధానం చెప్ప‌డం లేదు.

    మ‌రోసారి ప‌చ్చి అబ‌ద్ధాలు..
    ఆఖ‌రుకి తిరుమ‌ల శ్రీవారి పాదాల చెంత మ‌రోసారి ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేశారు. చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు కాబ‌ట్టే జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. త‌న వైఫ‌ల్యాల‌కు జ‌గనే కార‌ణ‌మ‌ని ఊద‌ర‌గొడుతున్నాడు. "రెండేళ్ల న‌మ్మ‌కం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో  నిర్వ‌హించిన ఈ స‌భకి అప‌న‌మ్మ‌క‌పు స‌భ‌, అబ‌ద్ధ‌పు స‌భ‌, సంక్షోభ స‌భ‌, అనాగ‌క‌రిక స‌భ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేది. 10 వేల మంది కూడా ప‌ట్ట‌ని ఆ ప్రాంతంలో 50 వేల మందితో స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌చారం చేసుకుని ప‌దుల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేశారు.

    ఆ 600 కోట్ల భూమి ఎవరికీ ఇచ్చారు? భూమన ప్రశ్నల వర్షం

    మ‌రోసారి మాయా బ‌జార్ సినిమాని చూపించారు
    వైఎస్‌ జగన్‌ పట్ల ఉన్న అక్క‌సు తీర్చుకోవ‌డానికే ఈ స‌భ‌ను నిర్వ‌హించారు. చంద్ర‌బాబు అరాచ‌క రాక్ష‌స పాల‌న‌కు, వెన్నుపోటుకి, అన్యాయానికి, అంతులేని అవినీతి, దోపిడీ దౌర్జ‌న్యాల‌కు మాత్ర‌మే రెండేళ్లు పూర్త‌య్యాయి. రెండేళ్ల పాల‌న‌లో ఆద్యంతం జ‌గన్ ప‌ట్ల ద్వేష‌మే చూపించారు. ఈ స‌భ ద్వారా మ‌రోసారి మాయా బ‌జార్ సినిమాని చూపించారు. ఎర్ర బుక్కు పేరుతో చేసిన వెర్రి చేష్ట‌లు త‌ప్ప చేసిందేమీ లేదు. న‌ర‌కుడి వార‌సులైన చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్‌లు.. చ‌ర‌కుడి వార‌సుల‌మ‌ని చెప్పుకున్న చెక్క భ‌జ‌న స‌భ ఇది. వైఎస్‌ జ‌గ‌న్ గురించి  అవాకులు చవాకులు పేలుతున్న చంద్ర‌బాబు కొడుకు పేరు లోకేష్ కాదు.. పాపేష్‌, ఎర్ర బుక్కు ఎల్లేష్‌. తాను ప‌ప్పు అనే సంగ‌తి లోకేష్ మ‌రిచిపోయినా రెండు ద‌శాబ్దాలుగా చూస్తున్న గూగుల్ మ‌రిచిపోదు. రాబోయే రోజుల్లో త‌న త‌ల్లిదండ్రుల‌నే మ‌ర్చిపోతాడేమో.

    ఓటేసిన ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచేశారు
    తెలుగుదేశం అంటేనే వెన్నుపోటు పార్టీ. హంతకుల పార్టీ అని ఆనాడు గ‌ద్ద‌ర్ అన్నదే నిజ‌మైంది. రెండేళ్ల పాల‌న‌లో చేసిందేమీ లేక‌పోయినా అన్ని చేసేశామ‌ని సిగ్గులేకుండా చెప్పుకున్నాడు. ఇద్ద‌ర్ని పిలిపించి భ‌జ‌న చేయించుకున్నాడు. కానీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన 143 హామీల గురించి రాష్ట్ర‌మంతా గ‌గ్గోలు పెడుతోంది. 23 ల‌క్ష‌ల పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని ఉత్త‌మాట‌లే. రెండేళ్ల‌లో చేసిన రూ.3.60 ల‌క్ష‌ల కోట్ల అప్పులే నిజం. 

    వైఎస్‌ జ‌గ‌న్ డీబీటీ ద్వారానే నేరుగా రూ.2.73 ల‌క్ష‌ల కోట్లు లబ్ధిదారుల అకౌంట్‌లో జ‌మ చేశాడు. కానీ చంద్ర‌బాబు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో పాటు సూప‌ర్ సిక్స్ అమలు చేస్తాన‌ని న‌మ్మించి ఓటేసిన ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచేశాడు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్వీర్యం చేశాడు. విద్యా వ్య‌వ‌స్థ నాశ‌నం చేశాడు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కాల‌ను కూడా 20 శాతం కూడా అమ‌లు చేయ‌లేదు. అయినా 2047 పేరుతో ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌ల ప్రిజ‌న్‌లో ఉంచుతున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగం ఎవ‌రికీ అర్థం కాలేదు. ఏదో మీటింగ్ కోసం రాసుకున్న ప్ర‌సంగాన్ని ఇక్క‌డ చ‌దివిన‌ట్టుంది. ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న స్వార్థం చూసుకుంటున్నాడ‌ని గ్ర‌హించిన‌ కాపు సామాజిక వ‌ర్గం ఆయ‌న‌కు దూరంగా జ‌రిగింది. వారిప్పుడు ఆయ‌న మాట‌లను న‌మ్మడం లేదు.

    సీబీఐ విచార‌ణ కోరే ద‌మ్ముందా?
    చంద్ర‌బాబు నియ‌మించిన సిట్ నివేదికే తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో మా త‌ప్పేమీ లేద‌ని తేల్చింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చంద్ర‌బాబుకి మొట్టికాయలు వేసింది. అయినా ఇంకా ల‌డ్డూని అప‌విత్రం చేశామ‌ని మాపై నిందలు వేస్తున్నాడు. మూడు రోజుల క్రితం త‌ప్ప‌తాగి కొంత‌మంది రౌడీలు గూండాల మాద‌రిగా త‌న్నుకున్నారు. స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించిన చంద్ర‌బాబే ఆల‌య ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేస్తున్నాడు.

    గ‌తంలో ప్ర‌తి స‌భలో క‌నిపించిన బీఆర్ నాయుడు ఇప్పుడెందుకు చంద్ర‌బాబు ప‌క్క‌న క‌నిపించ‌డం లేదు?  కొండ మీద మందు బాటిళ్లు కూడా కూట‌మి పాల‌న‌లో దొరికాయి. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చ‌డ‌మే కాకుండా గంజాయి, ఎర్ర‌చందనం స్మ‌గ్మ‌ర్ల‌ను తిరుప‌తిలో పెంచి పోషిస్తున్న‌ది చంద్ర‌బాబే. తిరుప‌తిలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంది.

    కేసుల‌ను ఎదుర్కోకుండా ఎందుకు కొట్టేయించుకున్నారు?  
    డీఎస్సీ 2025కింద టీచర్ ఉద్యోగాల భ‌ర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగం రూ. 15 నుంచి రూ. 20 ల‌క్ష‌ల‌కు అమ్మేసుకున్నాడు. డీఎస్సీలో జ‌రిగిన అక్ర‌మాల‌ను ఆధారాల‌తో స‌హా వైయ‌స్ జ‌గ‌న్ గారు వెలికితీస్తే ప్ర‌భుత్వం నుంచి ఇంత‌వ‌ర‌కు స‌రైన‌ స‌మాధానం లేదు. శాప్ చైర్మ‌న్ స్పోర్ట్స్ కోటా సీట్ల‌ను అమ్మేసుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు స్పందించ‌డం లేదు?  నోటీసు ఇవ్వ‌కుండానే న‌న్ను అరెస్టు చేశార‌ని చెప్పుకున్న చంద్ర‌బాబు.. ఆ కేసుల‌ను ఎత్తివేయించడానికి సీఐడీని ప్రలోభ పెట్ట‌కుండా ఉండాల్సింది. అవి త‌ప్పుడు కేసులైతే న్యాయ‌స్థానాల్లో ఎందుకు పోరాడ‌లేదు? డీఎస్సీ అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ‌కు కోరే దమ్ముందా? ప‌రాకామ‌ణి విష‌యంలో, కొండ మీద జ‌రిగే అక్ర‌మాల‌పై, శ్రీవాణి టికెట్ల గోల్‌మాల్‌పై సీబీఐ విచార‌ణ కోరే ద‌మ్ముందా?  చంద్ర‌బాబు కోరిన‌ట్టు బ‌హిరంగ చ‌ర్చ‌కు నేను సిద్ద‌మే. ఆయ‌న ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డి వ‌స్తా.

    కూట‌మి దుష్ట పాల‌న‌పై పోరాటం ఆపే ప్ర‌స‌క్తే లేదు
    చంద్ర‌బాబు దుర్మార్గ, దుష్ట‌, పాప‌పు పాల‌న అంతం చేయ‌డానికి వైయ‌స్సార్సీపీ నిర్వ‌హించిన నిర‌స‌నల‌కు మ‌హిళ‌లు స‌హా ప్ర‌జ‌లు పోటెత్తారు. పోలీసుల ఆంక్ష‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌లు క‌దం తొక్కారు. చంద్ర‌బాబు మోస‌పు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని ప్ర‌జ‌లు గ్రహించారు. క‌నీసం 5 వేల మందికిపైగా వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల మీద త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

    ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో చిన్నపోస్టు పెడితే చాలు పోలీస్ స్టేష‌న్లు తిప్పిస్తున్నారు. ఇలాంటి వారు వైయ‌స్సార్సీపీ విధ్వంస పాల‌న అని మాట్లాడ‌టం హేయం. ఎన్ని అణ‌చివేత‌ల‌కైనా వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డేది లేదు. వెన్నుపోటు పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడే వ‌ర‌కు పోరాటం ఆపేది లేదని భూమ‌న కరుణాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

  • ఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్‌ జాంగ్‌లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌.. మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.  దీనిలో భాగంగా బీజీపీపై విమర్శలు సంధించారు రేవంత్‌. 

    ‘నార్త్‌ కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని  దుష్ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించారు.

    ‘శాంతి భద్రతల కారణంతో మేం కూడా పవన్ కళ్యాణ్ మీటింగుకు  అనుమతి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు మా మంత్రులు జవాబు ఇచ్చారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా?, హిట్లర్ నాకు ఆదర్శం కాదు. నా మాటలను మీడియా వక్రీకరించింది. హైడ్రా పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని మాత్రమే చెప్పాను. క్యాబినెట్ ఎప్పుడు విస్తరించాలో అప్పుడే విస్తరిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలే  నరేంద్ర మోదీతో ఉన్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. 

    తెలంగాణ  ప్రాజెక్టుల కోసం ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారా?, కేంద్ర మంత్రుల వద్దకు కిషన్ రెడ్డితో పాటే నేను వస్తా. జూలైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్  సమావేశం ఉంటుంది. తుమ్మిడి హట్టి  ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా సహకరించాలి. కేటీఆర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి ఢిల్లీలో డాన్స్ చేస్తున్నారు. 8 మంది ఎంపీలు కేంద్రంతో పట్టుపడితే ప్రాజెక్టులు ఎందుకు రావు. ఈటెల రాజేందర్ నియోజకవర్గానికి మెట్రో రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి అనుచరులే ఫ్లెక్సీలు కట్టారు. కిషన్ రెడ్డి నెగటివ్ ఎనర్జీ నేను పాజిటివ్ ఎనర్జీ. స్కూలు ఫీజుల నియంత్రణపై మీడియా గట్టిగా రాస్తే నేను చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.

  • అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత  జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.  వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్‌ వద్ద స్నానం చేస్తూ హైడ్రామా నెలకొల్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛ గా పర్యటించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,.. ఆ ఆదేశాలు అమలు కాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారు. 

    మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని.. కేసులు నమోదు చేయాలని తాను అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు ప్రభాకర్‌రెడ్డి. ఆ ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేయాలని తాడిపత్రి పీఎస్ వద్ద ఓవకాక్షన్‌ చేశారు.. నడిరోడ్డుపై స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

     

    పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఓవర్ యాక్షన్ నడ్డి రోడ్డుపై స్నానం

     

     

  • సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

    మేనిఫెస్టోను డెస్ట్‌బిన్‌లో వేశారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

    ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు.  చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.     

    చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్

    వైఎస్సార్‌సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ)

  • సాక్షి, తాడేపల్లి: సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్‌ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.

    ‘‘సూపర్‌ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్‌ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్‌ జగన్‌ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.

    సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్‌ జగన్‌ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్‌ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

    అవినీతిలో బాబు రికార్డ్స్ ఇవి

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి దగ్గరిగా ఉన్న వాళ్ళే మీనాక్షి నటరాజన్ వ్యవహారం బయటపెట్టారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘‘ఎవరు బయటపెట్టారో కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వాళ్లే ఓడ గొట్టారు. కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ విషయం బయట పెట్టిన బ్లాక్ షిఫ్ ఎవరో తేల్చండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్‌కి పరిమితమవుతుంది’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

    ‘‘వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీనే. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేయడం మాకు కలిసొచ్చింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నాకు పంచాయితీలు లేవు. విధానపరమైన నిర్ణయాలపై మాత్రమే పంచాయతీ. రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా చేస్తుంది. రేవంత్ నిర్ణయాలు బీఆర్‌ఎస్‌కు మంచిది.

    ..అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రో రద్దు చేశారు. మెట్రో పూర్తయి ఉంటే ట్రాఫిక్ చిక్కులు తగ్గేవి. హైడ్రాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్నారు. మేము నగరంలో వంద చెరువులు బాగుచేశాం.. కానీ చెప్పుకోలేదు. రెండు చెరువులు బాగు చేసి ఉదరగుడుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది సమయం కేసీఆర్‌ డిసైడ్ చేస్తారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సర్‌ సభ్యత్వ నమోదుపై సమావేశాలు నిర్వహించాము. మిగతా 59 నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

    ‘‘రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ లేని నాయకుడు.. ఫ్యూచర్ సిటీ అంతకంటే లేదు. జులై లో డీలిమిటెషన్‌ బిల్లు చేస్తారని సమాచారం ఉంది. దేశంలో డీలిమిటేషన్ చేయక పోయినా రాష్ట్ర విభజన అంశంలోనే పొందుపరిచారు కాబట్టి  రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ చేయాలని ఉంది. డీలిమిటేషన్ తర్వాతనే సీట్లు ఎవరికి అనేది ఆలోచిస్తాం. అమ్మిన భూముల డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు కొత్త పథకాలు అమలు చేయడం లేదు’’ అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు.

  • సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్‌లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది.  అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

    ‘‘సూపర్ సిక్స్‌లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.

    డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్‌ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు.

Business

  • ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ (Accenture) తన ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వేతన పెంపు మొత్తం బేసిక్‌ పేలో కలపకుండా, దానిని రెండు భాగాలుగా విభజించి అందించనుంది. ఒక భాగం శాశ్వత బేస్‌ పే పెంపుగా ఉండగా, మిగిలిన భాగాన్ని జూన్‌లో ఒకేసారి చెల్లించే లంప్‌సమ్‌ బోనస్‌గా ఇవ్వనుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు తక్షణ నగదు ప్రయోజనం కల్పించడంతో పాటు కంపెనీ తన స్థిర వేతన వ్యయాలను నియంత్రించగలదని సంస్థ భావిస్తోంది.

    కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఒక ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే అందులో 1.5 శాతం మాత్రమే బేస్‌ పేలో చేరుతుంది. మిగిలిన 1.5 శాతం జూన్‌లో ఒకసారి చెల్లించే బోనస్‌గా అందుతుంది. అయితే ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులకు వర్తించే పెంపు మాత్రం పూర్తిగా బేస్‌ పేలోనే జమ అవుతుంది. అలాగే జూన్‌ లంప్‌సమ్‌ చెల్లింపు డిసెంబరులో ఇచ్చే వార్షిక పనితీరు బోనస్‌కు పూర్తిగా వేరుగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

    యాక్సెంచర్‌లో జూన్‌ నెలే ప్రమోషన్లు, వేతన సవరణలకు ప్రధాన చక్రంగా కొనసాగుతోంది. గత ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే ‘స్టే-అట్-లెవల్’ ఉద్యోగులకు పెంపు లభించగా, ఈసారి మరింత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పెంపు పరిధిలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం కొంత మేర వేతన ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడింది.

    ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఐటీ సేవల రంగంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్థిర ఖర్చులను అదుపులో ఉంచుతూ ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ హైబ్రిడ్‌ వేతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వేతన నిర్ణయాలు ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, వ్యాపారంపై చూపిన ప్రభావం, ప్రవర్తనా ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతాయని సంస్థ తెలిపింది.

    భారత్‌లో యాక్సెంచర్‌కు సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త విధానం వారి వేతన నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కొంతమంది ఉద్యోగులు తక్షణ నగదు లాభాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, బేస్‌ పే పెరుగుదల పరిమితంగా ఉండటం వల్ల భవిష్యత్‌ వేతన వృద్ధిపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

  • చైనా టెక్ రంగంలో సంచలనం రేపిన ఓ వ్యక్తిగత వివాదం, కేవలం కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను తుడిచిపెట్టేసింది. చైనాకు చెందిన ప్రముఖ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ సంస్థ విక్టరీ జెయింట్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, చైర్మన్ చెన్ టావో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా భారీ ఒత్తిడికి గురయ్యాయి.

    జూన్ 6న చైనా సోషల్ మీడియా వేదిక డౌయిన్‌లో "జెన్‌జెన్ జానిస్" పేరుతో ఉన్న ఓ యూజర్‌.. చెన్ టావోతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ పలు పోస్టులు చేసింది. అందులో లిఫ్ట్‌లో ఓ మహిళతో చెన్ టావో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయని చైనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చెన్ టావో వివాహితుడు కావడంతో ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యి చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

    పడిపోయిన షేర్లు

    ఈ వివాదం స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. జూన్ 8న విక్టరీ జెయింట్ టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 20 బిలియన్ యువాన్లు (దాదాపు 2.9 బిలియన్ డాలర్లు) భారత కరెన్సీలో సుమారు రూ.25 వేల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మరుసటి రోజున పెట్టుబడిదారుల ఆందోళనలు కొంత తగ్గడంతో షేర్లు తిరిగి కోలుకున్నాయి.

    వివాదంపై స్పందించిన కంపెనీ యాజమాన్యం.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం కార్పొరేట్ గవర్నెన్స్ లేదా షేర్‌హోల్డర్లకు వెల్లడించాల్సిన కీలక అంశం కాదని పేర్కొంది. ఇక చెన్ టావో భవిష్యత్తు పాత్రపై వచ్చిన ప్రశ్నలకు మాత్రం "వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం" అంటూ స్పందించేందుకు నిరాకరించింది.

    54 ఏళ్ల చెన్ టావో స్థాపించిన విక్టరీ జెయింట్ టెక్నాలజీ అమెరికా ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాకు ప్రధాన సరఫరాదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటీవల హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నిర్వహించిన భారీ ఐపీఓ ద్వారా సుమారు 2.6 బిలియన్ డాలర్లు సమీకరించి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం.. చెన్ టావో వ్యక్తిగత సంపద సుమారు 11.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు).

  • భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్‌బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్‌ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

    ఎఫ్‌సీఏలను అమెరికా డాలర్‌ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్‌, జపాన్‌ యెన్‌ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్‌సీఏపై ప్రభావం చూపుతాయి.

    గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్‌బీఐ ఫారెక్స్‌ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.

    ఇటీవల అమెరికా డాలర్‌ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్‌ ఖర్చును భరించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

    ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్‌!

  • దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్‌ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉండనుంది. కొత్త ధరల జాబితాను జూలై 1న వెల్లడించనున్నారు.

    ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని ఇప్పటివరకు గణనీయంగా సంస్థే భరించినప్పటికీ, దాని ప్రభావంలో కొంత భాగాన్ని ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాటా మోటార్స్ పేర్కొంది.

    ఈ ధరల పెంపు టాటా ప్యాసింజర్ వాహనాల మొత్తం శ్రేణిపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టాటా టియాగో (Tata Tiago), టాటా టైగర్‌, టాటా పంచ్‌ (Tata Punch), టాటా నెక్సాన్‌, టాటా కర్వ్‌ (Tata Curvv), టాటా హారియర్‌, టాటా సఫారీ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇటీవల పరిచయమైన టాటా సియెర్రా (Tata Sierra), సియెర్రా ఈవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

    టాటా మోటార్స్ ఈ ఏడాదిలో చేపడుతున్న రెండో ధరల పెంపు ఇది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచే కొన్ని వాహనాల ధరలను సంస్థ పెంచింది. మరోవైపు కమర్షియల్ వాహనాల ధరలను కూడా ఏప్రిల్‌లో 1.5 శాతం వరకు  టాటా మోటర్స్‌ పెంచింది.

    ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న వ్యయాల ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki) జూన్ 1 నుంచి కొన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా (Hyundai) కూడా జూన్ నుంచి ధరలను పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.

    జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో, టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలాఖరు లోపు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ జూన్ నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్‌ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.

    నిఫ్టీ 50 ఇండెక్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది.

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో(IPO)గా నిలిచిన ‘స్పేస్‌ఎక్స్‌’ (SpaceX) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ రాకెట్‌, శాటిలైట్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కరే 100 బిలియన్‌ డాలర్లకు పైగా కొనుగోలు ఆర్డర్లు సమర్పించినట్లు బ్లూమ్‌బర్గ్‌, రాయిటర్స్ నివేదికలు వెల్లడించాయి.

    స్పేస్‌ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించగా, మొత్తం 555.6 మిలియన్ షేర్ల ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.75 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించింది.

    ..కానీ అందరికీ షేర్లు దక్కవు

    స్పేస్‌ఎక్స్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 20 శాతం షేర్లను కేటాయించినప్పటికీ, వచ్చిన డిమాండ్ ఆ కేటాయింపును అనేక రెట్లు మించి ఉంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో చాలా మంది చిన్న మదుపరులకు పూర్తి కేటాయింపు దక్కే అవకాశాలు తగ్గాయి. మొత్తం పెట్టుబడిదారుల డిమాండ్ 250 బిలియన్‌ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    చైనా ఇన్వెస్టర్లకు నో!

    అమెరికా సాంకేతిక ఎగుమతి పరిమితుల కారణంగా చైనా ప్రధాన భూభాగం, హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్టర్ల ఆర్డర్లను స్పేస్‌ఎక్స్ ఐపీఓలో అంగీకరించలేదు. రాకెట్‌, ఉపగ్రహ, కృత్రిమ మేధస్సు రంగాలకు సంబంధించిన కీలక సాంకేతికత కారణంగా ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి.

    మస్క్‌కు మరో మైలురాయి

    స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. అయితే కంపెనీ భారీ విలువ, ఇంకా లాభదాయకత సాధించని వ్యాపార నమూనా, భవిష్యత్ వృద్ధి అంచనాలపై మార్కెట్లో చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, స్పేస్‌ఎక్స్ ఐపీఓ ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవడం ఖాయం.

    చైనా, హాంకాంగ్ ఐపీఓల ముందు చిన్నదే!

    స్పేస్‌ఎక్స్ ఐపీఓకు వచ్చిన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో కొన్ని ఐపీఓలు ఇంకా పెద్ద స్థాయిలో రిటైల్ ఆసక్తిని ఆకర్షించాయి. 2025లో షాంఘైలో చిప్ తయారీ సంస్థ మెటాఎక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ ఐపీవోకు సుమారు 3 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 444 బిలియన్ డాలర్లు) విలువైన రిటైల్ బిడ్లు వచ్చినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. అదే విధంగా హాంకాంగ్‌లో బబుల్-టీ దిగ్గజం మిక్సు గ్రూప్ ఐపీవోకు దాదాపు 1.8 ట్రిలియన్ హాంకాంగ్‌ డాలర్లు (సుమారు 230 బిలియన్ యూఎస్‌ డాలర్లు) ఆర్డర్లు నమోదయ్యాయి.

    చైనాలో ఐపీఓలకు అంత క్రేజ్ ఎందుకు?

    చైనా ప్రధాన భూభాగంలో కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీల షేర్లు మొదటి రోజే భారీ లాభాలు ఇవ్వడం సాధారణం. నియంత్రణ సంస్థలు ప్రారంభ ధరలను తక్కువగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లకు తొలి రోజు లాభాలపై అధిక నమ్మకం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది చిన్న మదుపరులు ఐపీఓలను ఒకరకమైన "లాటరీ అవకాశం"గా భావిస్తూ దరఖాస్తు చేస్తుంటారు.

    హాంకాంగ్‌లో అయితే బ్రోకరేజీలు సులభంగా మార్జిన్ రుణాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకుని కూడా ఐపీఓలకు దరఖాస్తు చేస్తుంటారు. తదుపరి టెక్ దిగ్గజాన్ని కోల్పోతామనే భయం (FOMO) కూడా ఈ ఉత్సాహానికి కారణమవుతోంది.

  • ‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.

    వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఏముంది?

    సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.

    పీఐబీ ఫ్యాక్ట్ చెక్

    ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్‌ న్యూస్‌) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్‌బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.

    పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు

    ఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

  • సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగులు బలవంతంగా బయటకు వెళ్తున్న తరుణంలో గూగుల్‌కు చెందిన ఒక టాప్ డైరెక్టర్ తన నైతిక విలువల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీని, అత్యున్నత హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రెనే మేర్హోఫర్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)తో గూగుల్ కుదుర్చుకున్న వివాదాస్పద కృత్రిమ మేధ ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. రాజీనామా లేఖను వ్యక్తిగత బ్లాగ్ పోస్ట్‌లో బహిర్గతం చేస్తూ గూగుల్ మేనేజ్‌మెంట్ తన నైతికతను కోల్పోయిందని రెనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

    డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017వ సంవత్సరంలో గూగుల్ నుంచి వచ్చిన తిరస్కరించలేని ఆఫర్‌తో రెనే మేర్హోఫర్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా చేరారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సేవలందించిన ఆయన, తొమ్మిదేళ్ల క్రితం తాను చేరిన నాటి గూగుల్ సంస్కృతికి, నేటి గూగుల్ వైఖరికి అసలు పొంతన లేదని స్పష్టం చేశారు.

    ‘ప్రపంచ స్థాయిలో అద్భుతాలు చేయడానికి గూగుల్ ఒక సరైన వేదిక. ఇక్కడి పారదర్శక సంస్కృతి, భిన్న అభిప్రాయాలకు ఇచ్చే గౌరవం నన్ను ఆకర్షించాయి. ఒక గూగులర్‌గా మా సొంత గుర్తింపును, విలువలను పనిలో చూపించే స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్కృతిని దెబ్బతీశాయి’ అని జోహన్నెస్ కెప్లర్ యూనివర్శిటీ లింజ్‌లో ప్రొఫెసర్‌గా, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ నెట్‌వర్క్స్ అండ్ సెక్యూరిటీ అధిపతిగా కూడా ఉన్న మేర్హోఫర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఇంజినీరింగ్ ఉపాధ్యక్షుడు డేవ్ క్లీడర్మాకర్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ సెక్యూరిటీ హెడ్ నిక్ క్రాలెవిచ్‌లు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    సుందర్ సొంత ఏఐ సూత్రాలను పక్కనబెట్టారా?

    2018లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా కొన్ని ఏఐ సూత్రాలను ప్రకటించారు. వాటి ప్రకారం గూగుల్ అభివృద్ధి చేసే ఏఐ అప్లికేషన్లు కింది అంశాలకు విరుద్ధంగా ఉండకూడదు.

    1. ఆయుధాల తయారీ లేదా ప్రజలకు ప్రత్యక్షంగా గాయం కలిగించే సాంకేతికతలు.

    2. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామూహిక నిఘా కోసం సమాచారాన్ని సేకరించడం.

    3. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించే సాంకేతికతలు.

    అయితే, ప్రస్తుత పెంటగాన్ ఒప్పందం ద్వారా గూగుల్ యాజమాన్యం ఈ నియమాలను నిశ్శబ్దంగా తుంగలో తొక్కిందని మేర్హోఫర్ ఆరోపించారు. అమెరికా రక్షణ శాఖ ఏదైనా చట్టబద్ధమైన ఉద్దేశం కోసం తమ ఏఐ నమూనాలను వాడుకునేలా గూగుల్ ఒప్పందం చేసుకుందని, అయితే అవి ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని ఆయన ఎండగట్టారు.

    ఉద్యోగుల తీవ్ర నిరసన

    అమెరికా రక్షణ శాఖకు క్లాసిఫైడ్ ఏఐ సేవలు అందించడాన్ని గూగుల్ అంతర్గత ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణ శాఖతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ 600 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసిన లేఖను సీఈఓ సుందర్ పిచాయ్‌కు పంపినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాలన్నీ కేవలం ఉన్నత స్థాయి యాజమాన్యం మాత్రమే తీసుకుందని, అంతర్గత ఛానెళ్ల ద్వారా తమలాంటి డైరెక్టర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మేర్హోఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

Sports

  • అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది.  సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. 

    కానీ అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్‌తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్‌తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రానున్నాడు. 

    ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆ‍ఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్‌, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.

    భారత తుది జట్టు(అంచనా)
    యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్‌ యాదవ్‌.

    చదవండి: ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

  • పారిస్ ఒలింపిక్స్‌ విజేత‌ నీర‌జ్ చోప్రా మ‌రో మెగా ఈవెంట్‌కు దూర‌మ‌య్యాడు. గాయంతో బాధ ప‌డుతున్న చోప్రా ప్ర‌తిష్ఠాత్మ‌క దోహా డైమండ్ లీగ్ నుంచి వైదొలిగాడు. వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న అత‌డు జూన్ 19 నుంచి మొద‌ల‌య్యే మెగా ఈవెంట్‌లో పాల్గొన‌డం లేదు. 

    దాంతో, నిరుడు ఇదే లీగ్‌లో 90 మీట‌ర్ల దూరం ఈటెను విసిరిన భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ ఆట‌ను అభిమానులు మిస్ కానున్నారు. ఈ మ‌ధ్య కాలంలో గాయాల కార‌ణంగా ప‌లు టోర్నీలకు డుమ్మా కొడుతున్న నీర‌జ్ చోప్రా ఈటెను ప‌ట్టేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ప్ర‌స్తుతం నీర‌జ్ వెన్నెముక గాయం నుంచి కోలుకుంటుండ‌డ‌మే అందుకు కార‌ణం. 

    ఫ‌లితంగా జూన్ 19 నుంచి జ‌రిగే దోహా డైమండ్ లీగ్‌కు చోప్రా దూర‌మ‌య్యాడు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే కామ‌న్‌వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడ‌లే లక్ష్యంగా పెట్టుకున్న నీర‌జ్.. సైకోథెర‌పిస్ట్ ఇషాన్ మ‌ర్వాహ, కోచ్ జై చౌద‌రీ సాయంతో స్విట్జ‌ర్‌లాండ్‌లోని బీయెన్నేలో 47 రోజుల శిక్ష‌ణ తీసుకుంటున్నాడు.

    చదవండి: జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!

  • న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం క్రికెట్ అభిమానులకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే కివీస్ క్రికెట‌ర్ల‌లో అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా పేరు పొందిన కేన్ విలియ‌మ్స‌న్ దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు బ్లాక్‌క్యాప్స్ బ్యాటింగ్ లైన‌ప్‌కు వెన్నుముక‌లా నిలిచాడు. వివాద‌ర‌హితుడిగా పేరున్న విలియ‌మ్స‌న్ నిష్ర‌మ‌ణ స‌గ‌టు అభిమానిని బాధించే అంశం. 

    అయితే టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (టీమిండియా), జో రూట్ (ఇంగ్లండ్‌), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్స‌న్ (న్యూజిలాండ్‌)ల‌ను 2014లో దివంగ‌త క్రికెట‌ర్ మార్టిన్ క్రో ముద్దుగా ఫ్యాబ్‌-4 అని అభివ‌ర్ణించారు. ఈ త‌రంలో ఈ న‌లుగురు అత్యంత గొప్ప టెస్టు క్రికెట‌ర్ల‌ని ఆయ‌న కొనియాడారు. అందుకు త‌గ్గ‌ట్లే ఈ ఫ్యాబ్‌-4 త‌మ ఆట‌తో అభిమానుల మ‌న‌సులు దోచుకున్నారు. 

    అయితే ఫ్యాబ్‌-4 క్ర‌మంగా కూలిపోతోంది. తాజాగా విలియ‌మ్స‌న్ రిటైర్మెంట్‌తో ఈ ఫ్యాబ్‌-4 కాస్తా ఇప్పుడు ఫ్యాబ్‌-2గా మారిపోయింది. ఇప్ప‌టికే కోహ్లీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌గా, తాజాగా కేన్ మామ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. మిగిలిన ఇద్ద‌రు క్రికెట‌ర్లు జో రూట్‌, స్టీవ్ స్మిత్ కూడా మ‌హా అయితే మ‌రో రెండేళ్లు ఆడే అవ‌కాశ‌ముంది. వీళ్లిద్ద‌రూ కూడా రిటైరైతే ఫ్యాబ్‌-4 క‌థ కంచికి చేరనుంది.

    ఇక 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అందుకున్న కేన్ విలియ‌మ్స‌న్ న్యూజిలాండ్ త‌ర‌ఫున 110 టెస్టులు, 175 వ‌న్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు క‌లిపి 378 మ్యాచ్‌లాడిన కేన్ విలియ‌మ్స‌న్ 19,346 ప‌రుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌గా కేన్ మామ కివీస్ త‌ర‌ఫున 40 టెస్టులు, 91 వ‌న్డేలు, 75 టీ20ల‌కు సార‌థ్యం వ‌హించాడు. 

    కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలో న్యూజిలాండ్ 2021 ఐసీసీ  టెస్టు చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది. అత‌డి సార‌థ్యంలోనే 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ, ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది.

    చదవండి: జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!

  • భార‌త దిగ్గ‌జ షూట‌ర్‌, కోచ్ జ‌స్పాల్ రాణా శుక్ర‌వారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జ‌స్పాల్ రాణా న్యూఢిల్లీలోని మ్యాక్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా గురువారం రాత్రి వ‌ర‌కు ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్ప‌డం, మ‌రునాడే ఆయ‌న పరిస్థితి విష‌మించి ప్రాణాలు విడ‌వ‌డం ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. 

    మ‌రి జ‌స్పాల్ రాణా ఆక‌స్మిక మృతి వెనుక కార‌ణం ఏమై ఉంటుంద‌నేది కార్డియాక్ సైన్సెస్ గ్రూప్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బ‌ల్బీర్‌సింగ్ వివ‌రించారు. 'జ‌స్పాల్ రాణా మూడు రోజుల క్రితం తీవ్ర‌మైన గుండెపోటుతో ఆసుప‌త్రిలో జాయిన‌య్యారు. అయితే విమాన ప్ర‌యాణంలో ఉండ‌గానే ఛాతిలో నొప్పి వ‌చ్చింది. అత్యంత విష‌మ ప‌రిస్థితిలో ఆయ‌న ఆసుప‌త్రికి చేరుకున్నారు. అప్ప‌టికే జ‌స్పాల్ గుండెలో ర‌క్త ప్ర‌సర‌ణ జ‌రిగే ధ‌మ‌ని పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల అత‌డి గుండె పంపింగ్ సామ‌ర్థ్యం పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోయింది. 

    ఆయ‌న కోలుకున్న‌ట్లే క‌నిపించిన‌ప్ప‌టికీ ధ‌మ‌ని మూసుకుక‌పోవ‌డం వ‌ల్ల హార్ట్ ఫెయిలయ్యింది. గుండెపోటు త‌ర్వాత  కూడా కొంత‌మందికి మైల్డ్‌, మ‌రికొంత‌మందికి తీవ్రమైన హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. అయితే జ‌స్పాల్ రాణా గుండె పరిస్థితి మొద‌ట సాధార‌ణ స్థితికి రావ‌డంతో ఆయ‌న కోలుకున్న‌ట్లే క‌నిపించారు. డాక్ట‌ర్లు కూడా శుక్ర‌వారం ఆయ‌న్ను ప‌రీక్షించి డిశ్చార్జ్ చేయాల‌ని భావించారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ శుక్ర‌వారం ఉద‌యం నిద్ర‌లో ఉండ‌గానే మ‌రోసారి గుండెపోటు రావ‌డంతో జస్పాల్‌ మ‌ర‌ణించారు.' అని చెప్పుకొచ్చారు.

    జస్పాల్ రాణా కేవలం కోచ్‌గానే కాకుండా,  స్టార్ పిస్టల్ షూటర్‌గా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. 1990ల కాలంలో భారత షూటింగ్‌లో ఆయన తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అందించారు. ముఖ్యంగా 2006 దోహా ఆసియా క్రీడల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 9 స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. 

    దీంతో ఆయనకు చిన్న వయస్సులోనే అర్జున అవార్డు దక్కింది. షూటింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక, దేశంలో అత్యుత్తమ షూటర్లను తయారుచేసే పనిలో జస్పాల్ నిమగ్నమయ్యారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను భాకర్‌కు ఈయనే వ్యక్తిగత కోచ్. సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి అద్భుతమైన షూటర్లను తీర్చిదిద్దినందుకు గానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 'ద్రోణాచార్య' అవార్డుతో సత్కరించింది. జస్పాల్ ప్రస్తుతం భారత పిస్టల్ షూటింగ్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఉన్నారు.

    చదవండి: అతడిని విస్మరించొద్దు.. సెలెక్టర్లకు మాజీ క్రికెటర్‌ హెచ్చరిక!

  • టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ టెస్టు క్రికెట్‌లో వేగంగా ఆడుతాడ‌నే పేరుంది. కానీ వ‌న్డే, టీ20 క్రికెట్‌లో మాత్రం పంత్ ఆట పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వేగంగా ఆడాల్సిన వ‌న్డే, టీ20 క్రికెట్‌లో స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం.. ఆచితూచి ఆడాల్సిన టెస్టు క్రికెట్‌లో వేగాన్ని చూపించ‌డం పంత్ నైజం. అయితే ఇటీవ‌లే పేల‌వ ఫామ్ కార‌ణంగా వ‌న్డే, టీ20 క్రికెట్‌లో చోటు కోల్పోయిన పంత్ టెస్టు జ‌ట్టులో మాత్రం స్థానం నిలుపుకున్నాడు. 

    అయితే ప‌రిమిత ఓవ‌ర్ల ఆట‌లో పంత్ ఆట ఇక ముగిసిన‌ట్లేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కీల‌క‌వ్యాఖ్య‌లు చేశాడు. జియో హాట్‌స్టార్ ఇంట‌ర్వ్యూలో ప‌ఠాన్ మాట్లాడాడు. పంత్‌ను వైట్‌బాల్ జ‌ట్టు నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో అత‌డిని పూర్తిగా విస్మ‌రించివ‌ద్ద‌ని సెలెక్ష‌న్ క‌మిటీని కోరాడు. 

    'వ‌న్డే క్రికెట్ నుంచి త‌ప్పించార‌నే నిరాశ వాదాన్ని వ‌దిలేసి మ‌ళ్లీ ట్రాక్ ఎక్కితే ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో టీమిండియాలో చోటు ద‌క్కించుకోవ‌డం పంత్‌కు పెద్ద క‌ష్ట‌మేమి కాదు. ఈ విష‌యంలో పంత్ త‌న స‌హ‌చ‌ర క్రికెట‌ర్ల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి. వన్డేల్లో వికెట్ కీపర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ తొలి ఛాయిస్. ఓపెన‌ర్‌గా, అవ‌స‌ర‌మైతే ఐదు లేదా ఆరో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. అతడికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చారు. ఇషాన్ కూడా టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. షార్ట్‌పిచ్‌ బంతులను కూడా చక్కగా ఆడ‌గ‌ల‌డు. 

    బీసీసీఐకి మూడో ఆప్షన్ సంజు శాంసన్. అతడికి ఎప్పుడు అవకాశం వచ్చినా వన్డేల్లో సత్తా చాట‌డంలో ముందుంటాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ శాంస‌న్ ప‌లు కీలక ఇన్నింగ్స్ లు ఆడటం చూశాం. పంత్ విష‌యంలో మాత్రం సెలక్టర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2027 వన్డే ప్రపంచ కప్ సెలక్షన్స్‌లో పూర్తిగా అతడిని పక్కన పెట్టొద్దు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ఫామ్ గొప్పగా లేదని తెలుసు. 

    గతంలో ఇషాన్ కిషన్ కూడా జట్టులో నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత రాణించి మళ్లీ జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సారథిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్‌కు అందించాడు. అందుకే అతడిని పంత్ స్ఫూర్తిగా తీసుకోవాలి. వైట్‌బాల్ క్రికెట్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలి.' అని ఇర్ఫాన్ తెలిపాడు. 

    పంత్ చివరిసారిగా 2024లో వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 చాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ రిజ‌ర్వ్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.  ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లోనూ పంత్ కెప్టెన్‌గా, ఆట‌గాడిగా విఫ‌ల‌మ‌య్యాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ర‌ఫున 14 మ్యాచ్‌లాడిన పంత్ 312 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌డంలో విఫ‌ల‌మైన పంత్ పాయింట్ల పట్టిక‌లో ల‌క్నోను ఆఖ‌రి స్థానంలో నిలిపాడు. 

    దీంతో ల‌క్నో యాజ‌మాన్యం పంత్‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఐపీఎల్‌లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న    చేసిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే ఆఫ్గ‌న్‌తో జ‌రిగిన టెస్టులో మాత్రం పంత్ ఆకట్టుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 81 ప‌రుగులు సాధించాడు. ఇక సౌతాఫ్రికాలో జ‌ర‌గ‌నున్న 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు రోహిత్‌, కోహ్లీల‌ను నేరుగా ఎంపిక చేస్తార‌నే ఊహాగానాల‌ను ప‌ఠాన్ తోసిపుచ్చాడు.

    చదవండి: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు కేన్‌ విలియమ్సన్‌ వీడ్కోలు

  • భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియా లెజెండ్లు సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లిలను మించిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆకాశానికెత్తాడు. భారత క్రికెట్‌కు దొరికిన అత్యంత విలువైన నిధిగా వైభవ్‌ను అభివర్ణించాడు.

    ఫార్మాట్లకు అతీతంగా
    గతేడాది కాలంగా వైభవ్‌ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో అలరించాడు.

    ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డలపై యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఇక అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆద్యంతం అలరించిన వైభవ్‌.. ఫైనల్లో ఇంగ్లండ్‌ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

    ఆరెంజ్‌ క్యాప్‌ విజేత
    వరల్డ్‌కప్‌లో అదరగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డు కూడా వైభవ్‌ గెలుచుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్‌-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు.

    ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల నుంచి వైభవ్‌ సూర్యవంశీ పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లో పర్యటించడంతో పాటు ఆసియా క్రీడలు- 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డేల్‌ స్టెయిన్‌ వైభవ్‌పై ప్రశంసలు కురిపించాడు.

    సచిన్‌, కోహ్లిలను మించిపోతాడు
    ‘‘సచిన్‌, విరాట్‌లను ఈ పిల్లాడు మించిపోగలడు. ఇదే ఫామ్‌ కొనసాగిస్తూ ఉంటే.. తన కెరీర్‌ ముగిసేనాటికి వీరిద్దరి కంటే పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు. వైభవ్‌ సూర్యవంశీ విభిన్న ఆటగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్ల కంటే వైభవ్‌ ఎంతో బెటర్‌.

    అతడొక అద్భుతమైన పిల్లాడు. భారత క్రికెట్‌కు దొరికిన అత్యంత విలువైన నిధి. అతడు ఇండియాలో ఆడినపుడు నేను దగ్గరగా చూశాను. అక్కడి బౌండరీలు చిన్నగానే ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు పవర్‌హిట్టింగ్‌ ఆడాడు’’ అని డేల్‌ స్టెయిన్‌ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.

    అయితే, వైభవ్‌ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీసీసీఐకి ఈ సందర్భంగా స్టెయిన్‌ సూచించాడు. పదిహేనేళ్ల పిల్లాడు ఒత్తిడికి లోనుకాకుండా.. అతడిపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నాడు.

    చదవండి: తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?

  • పొట్టి క్రికెట్‌ మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12- జూలై 5 మధ్య ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి షెడ్యూల్‌ ఖరారైంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌- శ్రీలంక మధ్య శుక్రవారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.

    ఇక భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం (జూన్‌ 14) ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ పాక్‌తో తలపడే భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు.

    ‘‘ఓపెనర్‌గా షఫాలీ వర్మనే సరైన ఆప్షన్‌. ఆమెకు తోడుగా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన ఉండనే ఉంది. యస్తికా భాటియా కూడా అద్భుతంగా ఆడుతోంది. మూడో స్థానంలో ఆమెను ఆడించాలి. నాలుగో స్థానంలో జెమీమా రోడ్రిగ్స్‌, ఐదో స్థానంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆడుతుంది.

    రిచా ఘోష్‌ ఆరో స్థానంలో పవర్‌ హిట్టర్‌గా సేవలు అందించగలదు. భారతి పుల్మాలిని ఎంపిక చేయాలనే ఉంది. కానీ రాధా యాదవ్‌తో పోలిస్తే ఆమె కాస్త వెనుబడి ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఫినిషర్‌గా రాణించగల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాధా యాదవ్‌నే నేను ఎంచుకుంటాను.

    ఆ తర్వాతి స్థానంలో దీప్తి శర్మ ఉంటుంది. క్రాంతి గౌడ్‌, అరుంధతి రెడ్డి, శ్రీచరణి బౌలింగ్‌ విభాగంలో సేవలు అందిస్తారు’’ అని అభిషేక్‌ నాయర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

    పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అభిషేక్‌ నాయర్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
    షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌, రాధా యాదవ్‌, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌.

  • న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్‌, మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ శుక్ర‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌కు వీడ్కోలు ప‌లికాడు. కివీస్ త‌ర‌ఫున అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు పొందిన విలియ‌మ్స‌న్ అన్ని పార్మాట్ల‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడుతోంది. 

    లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్ విలియ‌మ్స‌న్ ఆడాడు. అయితే వీడ్కోలు మ్యాచ్‌గా రెండో టెస్టు ఆడేందుకు విలియ‌మ్స‌న్ మొగ్గు చూప‌లేద‌ని, దీంతో లార్డ్స్ టెస్టుతో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడ‌ని కివీస్ బోర్డు స్ప‌ష్టం చేసింది. లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ 115 ప‌రుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో విలియ‌మ్స‌న్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో రిటైర్మెంట్‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని తాను భావిస్తున్నట్లు విలియ‌మ్స‌న్ పేర్కొన్నాడు.

    ‘రిటైర్మెంట్‌పై కొంత‌కాలంగా ఆలోచిస్తున్నా. నా వీడ్కోలుకు ఇదే స‌రైన స‌మ‌యం అనిపించింది. 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మ‌ధురానుభూతులు ఉన్నాయి. కివీస్‌కు ఐసీసీ మేజ‌ర్ టోర్నీ లేద‌నే భావన మాలో బ‌లంగా ఉండిపోయింది. కానీ 2021లో భార‌త్‌ను ఓడించి ఐసీసీ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను కైవ‌సం చేసుకోవ‌డం ద్వారా మా ఖాతాలోనూ ఒక ఐసీసీ టైటిల్ వ‌చ్చి చేరింది. 

    న్యూజిలాండ్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌డం నా అదృష్టంగా భావిస్తున్నా. జ‌ట్టు కోసం ఆడాల‌నే నా త‌ప‌న‌, క‌ష్టం ఊరికే పోలేదు. కివీస్ త‌ర‌ఫున నేను ఆడిన ప్ర‌తి మ్యాచ్‌లోనూ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ఆడ‌డం గ‌ర్వంగా భావిస్తున్నా. అన్నీ ఆలోచించే రిటైర్మెంట్‌పై నిర్ణ‌యం తీసుకున్నాం. ఇందులో ఎవ‌రి బ‌ల‌వంతం లేదు.’ అని విలియ‌మ్స‌న్ చెప్పుకొచ్చాడు.

    2010లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విలియ‌మ్స‌న్ భార‌త్‌తో తాను ఆడిన తొలి టెస్టులోనే శ‌త‌కం బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌లో విలియ‌మ్స‌న్ అన్ని ఫార్మాట్లు క‌లిపి 378 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు క‌లిపి 19, 346 ప‌రుగులు సాధించిన విలియ‌మ్స‌న్ ఖాతాలో 48 సెంచ‌రీలున్నాయి. త‌ద్వారా న్యూజిలాండ్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గానూ విలియ‌మ్స‌న్ రికార్డుల‌కెక్కాడు. 

    ఇక కేన్ విలియ‌మ్స‌న్ త‌న కెరీర్‌లో 110 టెస్టులాడి 9,515 ప‌రుగులు (33 సెంచ‌రీలు, 38 హాఫ్ సెంచ‌రీలు), 175 వ‌న్డేల్లో 7,256 ప‌రుగులు (15 సెంచ‌రీలు, 47 హాఫ్‌సెంచ‌రీలు), 93 టీ20ల్లో 2,575 ప‌రుగులు (18 హాఫ్ సెంచ‌రీలు) చేశాడు. ఇక న్యూజిలాండ్ సార‌థిగా కేన్ విలియ‌మ్స‌న్‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది. విలియ‌మ్స‌న్ మొత్తం 40 టెస్టులు, 91 వ‌న్డేలు, 75 టీ20ల్లో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. 

    అత‌డి సార‌థ్యంలో న్యూజిలాండ్ 2019 ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్‌, 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ఆడింది. ఈ రెండింటిలోనూ కివీస్ ర‌న్న‌ర‌ప్‌కే ప‌రిమిత‌మైంది. అయితే 2021లో భార‌త్‌తో జ‌రిగిన తొలి ఐసీసీ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌ను గెలిచిన న్యూజిలాండ్ తొలి మేజ‌ర్ ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2019లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును సొంతం చేసుకున్న కేన్ విలియ‌మ్స‌న్ నాలుగుసార్లు రిచ‌ర్డ్ హార్డ్‌లీ మెడ‌ల్ కైవ‌సం చేసుకున్నాడు. 

    ఇక ఐపీఎల్‌ ద్వారా భారత క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడైన కేన్‌ విలియమ్సన్‌ను అందరు ముద్దుగా ‘కేన్‌ మామ’ అని పిలుచుకుంటారు. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు కేన్‌  విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

    చదవండి: FIFA WC 2026: మెస్సీ వ‌ర్సెస్ రొనాల్డో పోరు ఎప్పుడంటే!

  • అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. 

    ఐపీఎల్‌-2026 ఫైనల్‌ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

    ఈ నేపథ్యంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కోహ్లి స్థానంలో.. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్‌ గైక్వాడ్‌ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు.

    రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్‌ కోహ్లి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.

    అక్కడ భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్‌లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్‌- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.

    ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు ​కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్‌కు కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్‌ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్‌.

    నిజానికి జైసూ అఫ్గనిస్తాన్‌తో చండీగఢ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్‌కు బదులు ఇషాన్‌ కిషన్‌నే ఆడిస్తారు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.

    ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.

  • ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. నెల‌రోజుల‌కు పైగా సాగ‌నున్న‌ సాక‌ర్ సంగ్రామంలో ఎన్ని అద్భుతాలు చోటు చేసుకున్నా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల క‌ళ్ల‌న్నీ ఇద్ద‌రి దిగ్గ‌జాల‌పైనే ఉంటాయి. ఆ ఇద్ద‌రు బ‌రిలోకి దిగారంటే ప్ర‌పంచం మొత్తం కన్నార్ప‌కుండా చూస్తోంది. మ‌రి అలాంటి ఇద్ద‌రు దిగ్గ‌జాలు ఫిఫా వంటి మేటి టోర్నీలో ప్ర‌త్య‌ర్థులుగా ఎదురుప‌డితే రికార్డులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే. 

    ఆ ఇద్ద‌రిలో ఒక‌రు అర్జెంటీనా కెప్టెన్ లియోన‌ల్ మెస్సీ అయితే..మ‌రొక‌రు పోర్చుగ‌ల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. రెండు ద‌శాబ్దాలుగా ఫుట్‌బాల్‌ను ఏలుతున్న ఈ ఇద్ద‌రికి ఇది ఆరో ప్ర‌పంచ‌క‌ప్ కావ‌డం విశేషం. ఈసారి జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ మెస్సీకి, రొనాల్డోకు చివ‌రిద‌ని ప్రచారం కూడా జ‌రుగుతోంది. అయితే ఫుట్‌బాల్ క్ల‌బ్స్ త‌ర‌ఫున‌ ఎన్నోసార్లు ఎదురుప‌డిన‌ప్ప‌టికీ, ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మాత్రం త‌మ జాతీయ జ‌ట్ల త‌ర‌ఫున ఈ ఇద్ద‌రు ఎదురుప‌డ‌లేదంటే న‌మ్ముతారా? కానీ ఇది అక్ష‌రాల నిజం.

    అయితే 2026 ప్రపంచకప్‌లో మాత్రం ఇది సాధ్య‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు గ్రూప్-జెలో అల్జీరి యా, ఆస్ట్రియా, జోర్డాన్ల‌తో కలిసి ఉంది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జూన్ 16న అల్జీరియాతో, జూన్ 22న ఆస్ట్రియాతో, జూన్ 27న జోర్డాన్‌తో గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. అర్జెంటీనా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిస్తే జూలై 4న జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్-హెచ్ రన్న‌ర‌ప్‌తో తలపడుతుంది.

    ఈసారైనా?
    మరోవైపు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ గ్రూప్-కేలో ఉంది. ఇదే గ్రూప్‌లో పోర్చుగ‌ల్‌తో పాటు కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా కూడా ఉన్నాయి. పోర్చుగల్ జూన్ 17న కాంగోతో, జూన్ 23న ఉజ్బెకిస్తాన్‌తో, జూన్ 27న కొలంబియాతో తలపడనుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిస్తే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 32లో మరో గ్రూప్ నుంచి వచ్చిన జట్టుతో ఆడుతుంది.

    అన్నీ కుదిరితే క్వార్ట‌ర్స్‌లోనే..
    ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మెస్సీ, రొనాల్డోలు ఎదురుపడాలంటే అర్జెంటీనా, పోర్చుగల్ రెండూ తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలవడంతో పాటు రౌండ్ ఆఫ్ 32, రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌ల‌ను కూడా గెలవాలి. అలా జరిగితేనే క్వార్టర్ ఫైనల్లో ఈ దిగ్గజాలు ప్రత్యక్ష పోరుకు దిగే అవకాశం ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ దిగ్గ‌జాలు ఎదురుప‌డితే చూడాల‌ని వేచి చూస్తున్న అభిమానుల క‌ల కూడా నెరవేర‌నుంది. ఇది నిజ‌మైతే మాత్రం ఫిఫా చ‌రిత్ర‌లోనే అద్భుత ఘట్టంగా నిలిచిపోనుండ‌డంతో పాటు టీఆర్పీ రేట్ కూడా ప‌గిలిపోవ‌డం ఖాయం.

    ఇద్దరూ ఇద్దరే!
    ఆట ప‌రంగా చూసుకుంటే ఈ ఇద్ద‌రిని ఒక‌రితో ఒక‌రిని పోల్చ‌లేం. ఇద్ద‌రు దిగ్గ‌జాలు అభిమానుల గుండెల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ముద్రించుకున్నారు. అయితే 2022లో కోపా అమెరికా క‌ప్‌తో పాటు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ కైవ‌సం చేసుకున్న అర్జెంటీనాకు మెస్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విష‌యంలో మాత్రం రొనాల్డోతో పోలిస్తే మెస్సీ ఒక మెట్టు పైనే ఉంటాడు.

    రికార్డుల్లో మెస్సీదే పైచేయి
    రికార్డులు ప‌రిశీలించి చూస్తే.. రొనాల్డోపై మెస్సీదే పైచేయి. ఇప్పటికే ప్రపంచకప్‌లో మెస్సీ 26 మ్యాచ్‌లు (అత్యధిక మ్యాచ్‌లు), అత్యధిక నిమిషాలు (2,314) ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా తరఫున మెస్సీ ప్రపంచకప్‌లో అత్యధికంగా 13 గోల్స్ సాధించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో మూడు గోల్స్ మాత్రమే అవసరం. మరోవైపు రొనాల్డో తాను ఆడిన ఆరు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లు క‌లిపి 8 గోల్స్ మాత్రమే సాధించాడు. 

    మెస్సీ రికార్డును అధిగమించాలంటే అతడు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అయితే పోర్చుగల్ టోర్నీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే మాత్రం అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక నిమిషాలు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం రొనాల్డోకు ఉంది. మెస్సీ, రొనాల్డోలు త‌ల‌ప‌డితే చూడాల‌ని మ‌న భార‌తీయులు కూడా వెయ్యిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. మైదానంలో కొద‌మ సింహాల్లా త‌ల‌ప‌డే ఈ ఇద్ద‌రి విన్యాసాల‌ను వీక్షించాలంటే అన్నీ సక్రమంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.

    చదవండి: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!

  • టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్‌లో మ‌రో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. అఫ్గానిస్తాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేలో బ‌రిలోకి దిగ‌నున్న రోహిత్‌..  భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్‌, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉంది.

    ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్‌.. అమర్‌నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.

    కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్‌..  ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపడం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్‌ను తృటిలో కోల్పోయింది.

    ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్‌-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్‌లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. 

    వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు  282 వన్డే మ్యాచ్‌ల్లో 11,577 పరుగులు సాధించాడు.
     

  • అప్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు గాయంతో దూర‌మైన టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ విష‌యంలో ఒక కీల‌క అప్‌డేట్‌ వచ్చింది. కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జూలైలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడ‌ని స‌మాచారం. ఈ లెక్క‌న అభిమానుల‌కు కోహ్లీ విష‌యంలో ఇది గుడ్‌న్యూస్.

    జూలై 14 నుంచి భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ 2026 సీజ‌న్ స‌మ‌యంలోనే కోహ్లీ కండ‌రాల గాయంతో స‌త‌మ‌త‌మ‌య్యాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో చివ‌రిదాకా బ్యాటింగ్ చేయ‌డంతో కోహ్లీ కండ‌రాల గాయం తీవ్ర‌త పెరిగిపోయింది. దీంతో ఫైన‌ల్ పూర్త‌యిన మ‌రుస‌టి రోజే కోహ్లీ త‌న కాలిని స్కాన్ చేయించుకున్నాడు. 

    రిపోర్ట్‌లో కోహ్లి కాలిలో ఉండే డిస్ట‌ల్ సెమిమెంబ్రానోన‌స్ టెండ‌న్ టియ‌ర్‌లో చీలిక వ‌చ్చిన‌ట్లు తేలింది. డిస్ట‌ల్  సెమిమెంబ్రానోన‌స్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వ‌స్తే అది కాలి కండ‌రాల‌ను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జ‌రుగుతుంద‌ని, కోలుకోవ‌డానికి ఒక్కోసారి ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్య‌బృందం తెలిపింది. 

    కానీ కోహ్లీ విష‌యంలో అద్భుతం జ‌రిగింద‌ని, అతడి అసామాన్యమైన ఫిట్‌నెస్ కార‌ణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడ‌ని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడ‌నే వార్త‌లు వ‌స్తున్న వేళ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క్రికెట్‌లో ఇప్ప‌టికే చాలా రికార్డులు త‌న పేరిట లిఖించుకున్న కోహ్లీ స‌చిన్ వంద అంత‌ర్జాతీయ సెంచ‌రీల రికార్డును అందుకుంటాడా లేదా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. 

    37 ఏళ్ల కోహ్లీ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 85 అంత‌ర్జాతీయ సెంచ‌రీలున్నాయి. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోహ్లీకి ఆఖ‌రి టోర్నీ అని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వ‌చ్చేలోగా స్వదేశం, విదేశం క‌లిపి సుమారు 28 నుంచి 30 వ‌న్డేల వ‌ర‌కు ఆడే అవ‌కాశ‌ముంది. ఇందులోనే ఆసియా క‌ప్‌, ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డానికి కోహ్లీకి ఇది మంచి అవ‌కాశ‌మ‌ని చెప్పొచ్చు.

    చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్‌! యార్కర్ల కింగ్‌ అరంగేట్రం?

  • వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.

    ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్‌-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్‌ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.

    భారత ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. కిష‌న్ చివ‌ర‌గా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్‌పై భార‌త్ త‌ర‌పున వ‌న్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు.

    కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవ‌లం ఓపెన‌ర్‌గా మాత్రమే ఆడ‌గ‌లడు. కాబ‌ట్టి రోహిత్‌కు విశ్రాంతి ఇస్తే త‌ప్ప జైశూకు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌దు. నాలుగో స్ధానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్‌(వికెట్ కీప‌ర్‌) బ్యాటింగ్‌కు రానున్నారు.

    ఆల్‌రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్
    హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కార‌ణంగా సిరీస్‌కు దూరం కావ‌డంతో, తెలుగు కుర్రాడు ఆల్‌రౌండ‌ర్ల కోటాలో చోటు ద‌క్క‌నుంది. అత‌డు త‌న  10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ఉండ‌నున్నాడు.

    ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?
    ఇక ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేస‌ర్ ప్రిన్స్ యాద‌వ్ భార‌త్ త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది. ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ప్రిన్స్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆక‌ర్షించాడు. 

    ఈ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్ర‌ధాన పేస‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రిన్స్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. అర్ష్‌దీప్ సింగ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.

    భారత తుది జట్టు(అంచనా)
    రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్‌ యాదవ్‌

  • శ్రీలంక‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. శుక్ర‌వారం కింగ్‌స్ట‌న్ వేదికగా జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విండీస్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 

    లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్‌(51), కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(36) మినహా మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్‌ బౌలర్లలో స్పీడ్‌ స్టార్లు జాసన్‌ హోల్డర్‌, షమీర్‌ జోషఫ్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బ తీశారు.

    అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్‌ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌(65 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటగా, బ్రాండన్‌ కింగ్‌(37) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. మలింగ ఓ వికెట్‌ తీశాడు. 

    ఇరు జట్ల మధ్య రెండో టీ20 కింగ్‌స్టన్‌ వేదికగానే శనివారం జరగనుంది. కాగా ఇప్పటికే శ్రీలంకపై వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని కరేబియన్స్‌ పట్టుదలతో ఉన్నారు.
    చదవండి: షాకింగ్‌.. శ్రేయస్ అయ్యర్‌ ఇంటి అద్దె రూ.7.14కోట్లు
     

Movies

  • సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్.  ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్‌ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్‌ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుంది.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్‌లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్‌ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్‌తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది.
     

  • బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్‌ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేశారు.

    అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్‌కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్‌ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేయండి.
     

  • ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన‌ తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు.  ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్‌ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేట‌ర్లలో విడుద‌లైంది.  ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

    కొత్త మలుపు కథేంటంటే..

    జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే  గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్‌ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

    అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.

    ఎలా ఉందంటే..

    ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్‌టైనింగ్‌గా అనిపించాయి.

    రెండో ‍‍‍అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్‌ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్‌లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.

    ఎవరెలా చేశారంటే.. 

    కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్‌తో గోదావరి యాసలో ‍అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
     

  • టాలీవుడ్ హీరో,  మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్‌లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్‌ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్‌ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.

    ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్‌ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు.

     

  • రామ్ చరణ్ పెద్ది టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా సూపర్ హిట్‌ కావడంపై చిరు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను పెద్ది టీమ్ ట్విటర్‌లో పంచుకుంది.

    రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.

     

     

  • ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్‌టైన్‌ చేశారు.  వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్‌ను తీసుకుని కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌ పైకి వెళ్లనుంది.

    ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్‌గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్‌లో జీవీ ప్రకాశ్‌ను ఇసుకలో పూడ్చి మరి  మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే అప్‌డేట్స్‌తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
     

     

  • సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.

    ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు  ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని  అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ  హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్‌సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.

    అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్‌లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్‌గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ,  శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 
     

  • వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్.  సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.

    ఈ సినిమా కథేంటంటే..

    గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర )  అసలు రూపం బయటపడుతుంది.  అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు?  ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.

    ఎలా ఉందంటే.

    డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్‌కు హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్‌ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి.

    ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు,  సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్‌తో పాటు థ్రిల్లింగ్‌ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్‌ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.

    ఎవరెలా చేశారంటే..

    నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

    ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్‌ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
     

  • కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి- పూరి జగన్నాధ్ అరుదైన కాంబోలో వస్తోన్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌లో యాక్షన్ సీన్స్ చూస్తే పూరి డైరెక్షన్ మార్క్ స్పష్టంగా కనిపించింది.

    తాజాగా ఈ టీజర్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూరి జగన్నాధ్ ఎనర్జీ, డెడికేషన్ అద్భుతంగా ఉంది. యాక్షన్స్ సీన్స్‌ హీరోకు వివరిస్తున్న తీరు పూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, టబు  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

  • ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మానియా నడుస్తోంది. ఈనెల 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.345 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే పాజిటివ్ తెచ్చుకున్న ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    అయితే ఈ మూవీలోని సాంగ్స్‌ అభిమానులను ఓ ఊపు ఊపేశాయి. రైరై రారా అంటూ సాగే పాటతో పాటు చికిరి చికిరి సాంగ్‌కు ఫ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టేశారు. పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇటీవల జరిగిన పెద్ది ఈవెంట్‌లో ప్రదర్శించారు. పెద్ది సాంగ్స్ అంతలా ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్‌ దక్కించుకున్నాయి.

    తాజాగా చికిరి చికిరి సాంగ్‌కు ఓ వరుడు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కాబోయే సతీమణి ముందే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
     

     

  • టైటిల్‌: సింగ్‌ గీతం
    నటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ త‌దిత‌రులు
    నిర్మాణ సంస్థ: వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా
    నిర్మాత: నాగ్‌ అశ్విన్‌
    దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    విడుదల తేది: జూన్‌ 12, 2026

    ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మ‌ద‌న కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్‌ చేతపట్టి ‘సింగ్‌ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    కుబేర పురం అనే ఒక ఫిక్షనల్‌ విలేజ్‌ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్‌ సాగిస్తుంటారు. ఆ మైనింగ్‌ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్‌ చేస్తారు. అదే సమయంలో త‌న తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన భూములు అక్క‌డ ఉన్నాయ‌ని తెలుసుకుని ప్ర‌తాప్ (అయాన్‌) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గ‌నులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వ‌స్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవ‌రి నోట్లోంచి మాటే రాదు. కేవ‌లం పాట మాత్ర‌మే వ‌స్తుంది. ఏం మాట్లాడాల‌న్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వ‌స్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. 

    ఎలా ఉందంటే.. 
    మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్‌పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్‌ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. 

    అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్‌ కుబేర‌పురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్‌ మాఫియా నేపథ్యం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.

    ‘ఏమయ్యింది.. ఏమ‌య్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవ‌డం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్‌గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్‌ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్‌లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్‌ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్‌ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు సింగీతం మరోసారి తన మార్క్‌ చూపించాడు. ఇక చివరిలో విజయ్‌ దేవరొకండ ఎంట్రీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. పార్ట్‌ 2 ఉంటుందన్నట్లుగా విజయ్‌ ఈ గెస్ట్ ఎప్పీరియ‌న్స్ ఉంది. మరి సీక్వెల్‌ ఉంటుందా లేదా? అనేది చూడాలి. 

    ఎవరెలా చేశారంటే..
    సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్‌ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉండే ప్రతాప్‌ పాత్రలో అయాన్‌, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్‌ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్‌, విజయ్‌ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. 

    ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్‌ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్‌.. ఆర్టిఫియల్‌గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Andhra Pradesh

  • పార్వతీపురం : పార్వతీపురం మండలం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ గుండెపోటుతో అకాల మరణం చెందడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శరత్‌ కుటుంబ సభ్యుల్ని ఫోన్‌లో పరామర్శించారు వైఎస్‌ జగన్‌.  

    ఈ మేరకు శరత్‌ భార్య, తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శరత్‌ కుటుంబానికి  వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంచితే.. రాజ్యలక్ష్మిపురంలో శరత్ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పరామర్శించారు. 

  • తిరుపతి, జూన్ 12: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల కారణంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ సముద్ర కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర నౌకాశ్రయాలు మంత్రి సర్బానంద సోనోవాల్‌లకు ఈ అంశమై ఈ రోజు (శుక్రవారం) లేఖలు రాశారు.

    ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన క్షిపణి/డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం జిల్లాకు చెందిన భారతీయ నావికుడు సురేష్ పట్నాల మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని  కేంద్రానికి ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయన కుటుంబానికి అందాల్సిన బీమా, పరిహారం, సంక్షేమ ప్రయోజనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు త్వరగా అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుని భార్య, ఇద్దరు చిన్నారులకు విద్యా సహాయం, ఉపాధి, దీర్ఘకాలిక సంక్షేమ మద్దతు కల్పించాలని సూచించారు.

    అదే విధంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఎంవీ పాస్కల్ నౌకలో 13 మంది భారతీయ సిబ్బంది చిక్కుకుపోయారని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నావికులు ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కొరతతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

    ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికోసం భారత రాయబార కార్యాలయం తక్షణం సంప్రదింపులు జరపాలని, అవసరమైన ఆహారం,నీరు, మందులు ఇతర మానవతా సహాయాన్ని అందించాలని తెలిపారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

    అలాగే బాధిత కుటుంబాలకు పరిస్థితులపై నిరంతర సమాచారం అందించాలనివిదేశాల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు.

  • సాక్షి, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై పచ్చ మూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వాహనాలకు పచ్చమూక నిప్పుపెట్టారు. టీడీపీ గూండాల దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

    దారి కాసి మరి వాహనాలను అడ్డుకున్న టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకొని మాధవరం బయల్దేరిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

National

  • సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

    అహ్మదాబాద్‌‌ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది.  దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.

    ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్‌కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.

    ఆ రోజు ఏం జరిగింది?

    2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.

    AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్‌కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్‌లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు. 

  • సాక్షి, ఢిల్లీ: హర్ముజ్‌ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్‌ సీరియస్‌ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. 

    ఇటీవల భారత్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్‌ సమీపంలోని హర్మూజ్‌ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్‌ సీరియస్ అయ్యింది..

    ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్‌ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.

    భారతీయ నావికులే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.

    కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య  శాండల్‌వుడ్‌లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్‌ స్టార్‌గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్‌ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్‌ అగమ్యగోచరమైంది.

    2024, జూన్‌ 11న మైసూరులోని ఒక హోటల్‌లో ఉండగా దర్శన్‌ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్‌ మీద బయటకు వచ్చిన దర్శన్‌ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.  

    అన్నీ మిస్‌.. మిస్‌  
    బెయిలు మధ్యలో దర్శన్‌ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.

    దర్శన్‌ జీవితంలో చీకటిదినం 
    2024, జూన్‌ 9 నటుడు దర్శన్‌ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్‌ పేరు వినిపించడంతో పోలీసులు జూన్‌ 11న అరెస్టు చేశారు. జూన్‌ 7న కిడ్నాప్‌ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్‌ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్‌ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. 

    తరచూ మలుపులు  
    ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్‌కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్‌ పొందారు. దర్శన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్‌ జైలు పక్షి అయ్యారు. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు.

  • పేరు​కే అందాల సుందరి.  చేసేది మాత్రం గలీజ దందా.  28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025  పోటీదారు  హర్ష సన్నీ  దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా  బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో    ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.

    కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్‌నుంచి 11 కిలోలకు పైగా  హై క్వాలిటీ  'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ  ఆమె  ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా  అసలు గట్టు రట్టైంది. 

    ఇదీ  చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?

    ఆమె ట్రాలీ బాగ్‌లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్‌ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో  ఆమెను ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం  కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
     

  • ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపిన ఎయిరిండియా ప్రమాదం జరిగిన ఏడాది గడిచినా  ఆ విషాదం అందరి గుండెల్లోనూ ఇంకా పచ్చిగానే ఉంది. ఆప్తులను కోల్పోయిన గుండెకోతను  ఒక్కో కుటుంబంజీవితకాలం మోయాల్సి రావడం అత్యంత విషాదకరం. అయితే ఈ ప్రమాదంనుంచి బతికి బట్టకట్టిన ఒకే ఒక్కడు విశ్వాస్‌కుమార్ రమేష్ (Vishwash Kumar Ramesh) ఇపుడు ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి ఎంటి?  ఎలా ఉన్నారు?

    ప్రమాద స్థలం నుండి  12 మంది సిబ్బందితో సహా 241 మందిలో టీ-షర్ట్‌పై రక్తపు మరకలతో, చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు రమేష్‌​. అంతటి విషాదంలోనూ అనూహ్యంగా మృత్యుముఖంనుంచి బైటపడిన రమేష్‌  చిత్రాలు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా  వైరలయ్యాయి. ఈ ప్రమాదం జరిగి ఏడాది పూర్తైనా తానింకా పూర్తిగా నిద్రపోలేక పోతున్నానని, తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ) ఆనాటి చేదు జ్ఞాపకాలతో నరకం అనుభవిస్తున్నాను అంటూ విశ్వాస్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    బతికే ఉన్నా.. కానీ
    ప్రస్తుతం యూకేలోని లెస్టర్ (Leicester) లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న 39 ఏళ్ల రమేష్, ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయారు. ఈ విపత్తు ఒక వ్యక్తిగా తనను పూర్తిగా మార్చేసిందని ఆయన చెప్పారు. "నేను ప్రాణాలతో బయటపడ్డానని  అనుకుంటున్నారు కానీ మూసి ఉన్న తలుపుల వెనుక నేను అనుభవిస్తున్న బాధ ఎవరికి తెలియదు. నేను బతికున్నందుకు గ్రేటే. కానీ బతికి ఉన్నాను అన్నది కథలో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత  అనుభవిస్తున్న నరకాన్ని మాటల్లో చెప్పలేను. శారీరకంగా, మానసికంగా , ఆర్థికంగా  బాధపడుతూనే ఉన్నాను" అని రమేష్ పేర్కొన్నారు.

    "సోదరుడిని కోల్పోవడం, తీవ్రమైన మానసిక గాయాలు, అసలు ఇది ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై నిరంతరం వేధించే సమాధానం లేని ప్రశ్నలతో జీవిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన బాధితులైన ప్రతి కుటుంబాల్లోనూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రజలకు నిజాయితీ, నిష్పాక్షికమైన సమాధానాలు అవసరం. జరిగిన దాన్ని మార్చలేం, కానీ బాధిత కుటుంబాలకు సమాధానం తెలియాలి. న్యాయం జరగాలి’’  అని డిమాండ్‌ చేశారు.

    భయం గుప్పిట్లో జీవితం
    రమేష్ కుటుంబ సలహాదారు, లెస్టర్‌కు చెందిన కమ్యూనిటీ లీడర్ సంజీవ్ పటేల్  రమేష్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అతను ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా గడద దాటి బైటికి రాలేకపోతున్నాడు. అతను తీవ్రమైన మానసిక గాయానికి (ట్రామా) గురయ్యాడు. బహుశా ఆ గాయాల గుర్తులు అతని జీవితాంతం ఉండిపోవచ్చు అని చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబం నరకాన్ని అనుభవిస్తోంది. కానీ విశ్వాస్, అతని కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలే నిదన్నారు.

    ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!

    ఆ 32 సెకన్లలో ఏం జరిగింది?
    గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లడానికి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (విమానం) టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే, అ‍క్కడే మెడికల్ కాలేజీ హాస్టల్ మరియు క్యాంటీన్ భవనాన్ని బలంగా ఢీకొట్టి కుప్పకూలింది. ఈ  ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విమానంలో ఉన్న 12 మంది సిబ్బందితో సహా 241 మంది ప్రయాణికులు కాగా, విమానం పడిన భవనంలో మరో 19 మంది ఉన్నారు. 

    ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!

  • Air India Crash గతేడాది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వందలాది కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చిన   AI-171 అత్యంత ఘోర విమాన ప్రమాదంతో వందలాది మంది జీవితాలు  తలకిందలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కడు'విశ్వాస్ కుమార్ రమేష్' సజీవంగా బతికి బయటపడినప్పటికీ, ఒక్కొక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. అలాంటి వారిలో  తన తండ్రిని, సోదరిని ఎప్పటికీ చూడలేని ఒక పసిబాలుడు ఒకడు

    బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోతుందని, అది తన జీవితంలో అంతులేని అగాథాన్ని మిగులుస్తుందని మొబ్బషెరా వహోరా అస్సలు ఊహించి ఉండరు. అ‍ప్పటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయివారిలో మొబషెరా భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియా కూడా ఉన్నారు. ఇండియాలోని కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చి, తిరిగి లండన్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తండ్రీకూతుళ్లు ఇద్దరూ చనిపోయిన ఘటనతో ఇరు కుటుంబాలు  ఆ షాక్‌ నుండి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి.

    మరోవైపు అప్పటికే గర్భవతిగా ఉన్న లండన్‌లో ఉన్న జువేరియా తల్లి మొబషీరా, ఈ ఊహించని గుండె కోతను తట్టుకోలేకపోయారు. లండన్‌లో భర్త, బిడ్డ తిరిగిన ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయింది. వారి జ్ఞాపకాలను, కడుపులో  బిడ్డను మోస్తూ ఆమె మహారాష్ట్రలోని తారాపూర్‌లో ఉన్న తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. అంతటి తీవ్రమైన బాధలోనూ ఆమె గర్భాన్ని మోస్తూ భారతదేశానికి తిరిగి వచ్చారు.  అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారి  రాక ఒక మధుర క్షణమే అయినా, అదొక చేదు నిజాన్ని కూడా గుర్తు చేస్తోంది.

    సర్వస్వం కోల్పోయి, ఒంటరిదైపోయిన తమ సోదరిని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని ఆమెబంధువు షారూఖ్‌ గుర్తు చేసుకున్నారు. తమ జీవితాలకు బాబు జననం ఆశాకిరణమే అయినప్పటికీ,  ఏ పాపం తెలియని పసివాడు తన తండ్రిని, చెల్లిని చూడలేడనే నిజాన్ని నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

    ఇంతటి ఘోర విషాదానికి ఏడాది పూర్తయినప్పటికీ, 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలలో దాదాపు 96 శాతం మందికి తాత్కాలిక పరిహారం చెల్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలియదు. ఇంకా న్యాయం కోసం వేచి చూస్తున్నాయి. 

    ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!

  • సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్‌ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

    మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్‌ను, పెండింగ్‌లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్‌ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. 

    అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్‌ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.

    మధ్యప్రదేశ్‌ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ..  నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్‌లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.

    విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు తెలిపింది. 

    సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

    కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Family

  • పుట్టింటికి వెళ్లిన భార్య‌ను తీసుకొచ్చేందుకు ఓ భ‌ర్త చేసిన వినూత్న‌ ప్ర‌య‌త్నం న‌వ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి త‌న ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన‌ సరదా ప‌ని అందరి దృష్టిని ఆకర్షించింది. నా భార్య‌ను నాతో తిరిగి పంపండి అంటూ రాసిన కేక్ తీసుకెళ్లి అత్తామామ‌ల‌ను బ‌తిమాలుకున్నాడు. ఇంత‌గా అడిగితే ఎవ‌రైనా కాదంటారా? వెంట‌నే అత్త‌మామ‌లు.. అల్లుడికి త‌న కూతురిని అప్ప‌గించేశారు. ఈ స‌ర‌దా వీడియో సోష‌ల్ మీడియాలో వెగ వైర‌ల్ అవుతోంది.

    ‘కరణ్ & మోనా’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “నువ్వు లేకుండా ఉండలేని వ్యక్తినే పెళ్లి చేసుకో” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు 16 ల‌క్ష‌ల లైకులు, 8 వేల‌కు పైగా కామెంట్లు వచ్చాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. తన భార్య 10 రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉండటంతో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన భర్త చేతిలో ఒక ప్రత్యేకమైన కేక్ కనిపించింది. ఆ కేక్‌పై ముజే మేరీ బీవీ వాప‌స్ దొ (నా భార్యను తిరిగి నా ద‌గ్గ‌ర‌కు పంపించండి) అని రాసి ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అత్త‌గారు స్వ‌యంగా కూతురిని అల్లుడికి అప్ప‌గించ‌డం వీడియోలో క‌నిపించింది. వీరు ఎక్క‌డి వారు అనే వివ‌రాలు వెల్ల‌డి కాలేదు. భార్య‌భ‌ర్త‌ల పేర్లు క‌ర‌ణ్, మోనా అని తెలుస్తోంది.

    నెటిజ‌న్ల స్పంద‌న‌
    పుట్టింటికి వెళ్లిన భార్య‌ను తిరిగి తీసుకొచ్చేందుకు వినూత్న పంథా అనుస‌రించిన స‌ద‌రు భ‌ర్త‌పై నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇల్లాలిపై ప్రేమాభిమానాలు చూపించిన ఇంటాయ‌న‌ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.  “వివాహ జీవితాన్ని సంతోషంగా లేదా బాధాకరంగా మార్చేది చాలా వరకు భర్త ప్రవర్తనే. అతని చిన్న చిన్న ప్రయత్నాలు భార్య హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు.

    “ఇది చాలా మధురమైన క్షణం. ముఖ్యంగా అమ్మ గారి స్పందన ఎంతో క్యూట్‌గా ఉంది”, “మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు. తన భావాలను ఇంత అందంగా వ్యక్తపరిచే భర్త చాలా అరుదు”, “కూతురిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే ఇలాంటి అల్లుడిని ప్రతి తల్లిదండ్రులు స్వాగతించాలి”, “ఇలాంటి అల్లుడు దొరికినందుకు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది” అని నెటిజ‌నులు కామెంట్లు పెట్టారు.

    చ‌ద‌వండి: బొంగరపు ఆట కదరా జీవితం!

    భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, చిన్న చిన్న మధురమైన ప్రయత్నాలు ఎంతటి ఆనందాన్ని తీసుకురాగలవో ఈ వీడియో మరోసారి గుర్తు చేసిందని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

  • రొమ్ము కేన్సర్‌ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్‌ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

    హాలీవుడ్‌ నటుడు, మాజీ ప్రొఫెషనల్‌ రెజ్లర్‌, టైలర్ మానేకు బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. 

    కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్‌ స్టేజ్‌లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.

    పురుషుల రొమ్ము కేన్సర్ అంటే
    రొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.

    కేన్సర్ లక్షణాలు
    ప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.

    కొన్ని సాధారణ లక్షణాలు:

    • రొమ్ములో గడ్డ లేదా వాపు

    • రొమ్ము కణజాలం గట్టిపడటం

    • రొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివి

    • చనుమొన నొప్పి లేదా సున్నితత్వం

    • లోపలికి తిరిగిన చనుమొన

    • చనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చు

    • చంక కింద శోషరస గ్రంథులు వాపు

    • నిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులు

    పురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.

    పురుషులలో రొమ్ము కేన్సర్‌కు ప్రమాద కారకాలు
    అనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:

    వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.

    కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.

    జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.

    హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.

    స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.

    కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్‌కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.

    రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.

    నివారణ

    • రొమ్ము కేన్సర్‌ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.

    • అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.

    • అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్‌తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.

    • క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

    • కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.

    • క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. 

    • రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

     

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌)

     

  • కొన్ని చిత్రాలు చెప్పే కథ ఎంతో అపురూపంగా మనసుని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చిత్ర చెప్పే కథే. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట వైరల్‌గా మారింది. పైగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అంటూ అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

    ఇంతకీ ఏంటా కథా చిత్రం అంటే..ఒక తల్లి ప్రయాణి ఇద్దరు కుమారుల కారణంగా అత్యంత ప్రత్యేకంగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవ్వుతూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఒక కుమారుడు ఆమెను విమానం ఎక్కించడానికి ఎయిర్‌పోర్ట్‌కి రాగ, మరోక కుమారుడు ఆమెను పైలట్‌గా గమ్యస్థానానికి చేర్చడానికి వేచి ఉన్నాడు. అందుకు సంబంధించిన భావోద్వేగ క్షణాన్ని పంచుకుంటూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. 

    తన పులులతో గర్వపడే తల్లి అనే క్యాప్షన్‌ జోడిస్తూ ఇలా పేర్కొన్నారు. అమ్మను నా తమ్ముడికి అప్పగిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా తమ్ముడి కెప్టన్‌ అమన్‌ సక్సేనా సారథ్యంలో అమ్మ తన గూటికి తిరిగి వెళ్తోంది. అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన రెండు ఫోటోలు ఎంతో అందంగా రెండు విషయాలను వివరించాయి. మొదటి పోటో.. ఆ తల్లి తన పెద్దకొడుకు అక్షత్‌తో కలిసి విమానాశ్రయంలో దిగిన చిత్రం . 

    అక్కడ అతను ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాడు. ఇక రెండో ఫోటోలో విమానం దిగిన తర్వాత దిగిన ఫోటో. అందులో ఆ విమానాన్ని నడిపిన చిన్న కొడుకు కెప్టెన్‌  అమన్ సక్సేనాతో దిగిన చిత్రం. ఓ అమ్మకు ఇంతకు మించిన ధైర్యం ఇంకే కావలంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తు పోస్టులు పెట్టారు నెటిజన్లు.

     

    (చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె ..)
     

  • పోయినోళ్లందరూ మంచోళ్లే... ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపి గురుతులు అన్నారో సినీకవి. బతికి ఉన్నప్పుడు దక్కని గౌరవం.. మనిషికి చనిపోయాకైనా దక్కుతుందని చెబుతుంటారు. కానీ, ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో ఆ నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేసింది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి.. మృతదేహాలపై చేసిన ఓ డాక్టర్‌ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు తన మాటల తీవ్రత గ్రహించిన ఆమె క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో.. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన మరణానంతరం కూడా మనిషికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

    ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యురాలు సీజల్‌ పవార్‌.. మెడికల్‌ కాలేజీ రోజుల్లో శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్‌ పార్ట్‌ల గురించి తాను, తన తోటి డాక్టర్లు జోకులు వేసుకునేవాళ్లమని ఆమె మాట్లాడారు. ఆ సమయంలో కమెడియన్‌ ప్రణీత్ మోర్‌తో‌ సహా అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాట్లాడింది అమ్మాయి కావడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. అయితే..

    మృతదేహాల శరీర భాగాలపై వల్గర్‌ కామెంట్లు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. వైద్య విద్య కోసం తమ శరీరాలను దానం చేసే వారి పట్ల ఇది అవమానకరమని పలువురు అభిప్రాయపడ్డారు. సరిగ్గా.. ఇదే సమయంలో జర్మనీలో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావించారు..

    ష్లైడ్‌ అనే చిన్న పట్టణంలో ఉన్న జోహానెస్‌-స్టుర్మియస్‌ జిమ్నాసియం స్కూల్‌ విద్యార్థులు.. కొన్ని దశాబ్దాలుగా తమకు అనాటమీ పాఠాలు అర్థం కావడంలో సహకరించిన అస్థిపంజరానికి అత్యంత గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అది భారత్‌కు చెందిన ఓ మహిళ అస్థిపంజరం కావడం.

    అప్పటిదాకా అదొక ప్రతీకాత్మక నమునా(ప్లాస్టిక్‌)గా భావించిన విద్యార్థులు.. అసలు విషయం అర్థమయ్యాక తెగ బాధపడిపోయారు. దశాబ్దాలుగా ప్రయోగశాలలో వేలాడుతున్న ఆ అస్థిపంజరం బ్రిటిష్‌ పాలనా కాలంలో యూరప్‌కు తరలించిన వేలాది భారతీయ మృతదేహాల్లో ఒకటిగా గుర్తించారు. ఆ మహిళ అస్థిపంజరానికి "నిరాన్‌" అని పేరు పెట్టారు. అక్కడితో వాళ్లు ఆగలేదు..

    ఆ మృతదేహం కేవలం బోధనా సామాగ్రి కాదని.. ఒకప్పుడు ప్రాణం ఉన్న మనిషే కదా అనుకున్నారు. స్కూల్‌ నిర్వాహకుల్ని ఒప్పించి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిబ్బంది సహకారంతో ఓ శవపేటికలో ఆ అస్తికలు ఉంచి గౌరవప్రదంగా సమాధి ఏర్పాటు చేశారు. 2022లో జరిగిందీ ఘటన.

    అయితే ఒకే సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఘటనలు.. "మరణించిన వారికి మనం ఎంత గౌరవం ఇస్తున్నాం?" అనే ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి.

    అదొక చీకటి వ్యాపారం
    జర్మనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరో చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసింది. బ్రిటిష్‌ పాలనలో భారతదేశం నుంచి వేలాది అస్థిపంజరాలు, మృతదేహాలు యూరప్‌, అమెరికా దేశాలకు ఎగుమతి అయ్యాయి. పేదలు, అనాథలు, గుర్తింపు లేని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా ఈ వ్యాపారంలో భాగమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వైద్య విద్య, పరిశోధనల పేరుతో సాగిన ఈ వ్యాపారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొనసాగి, 1985లోనే పూర్తిగా నిషేధించబడింది.

    ఆ గౌరవం ఎక్కడ?..
    ఈ చర్చ మధ్య మరో విషాద ఘటనను కూడా చాలామంది గుర్తుచేస్తున్నారు. ఒడిశాలో తన సోదరి మరణాన్ని నిరూపించడానికి బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో.. ఓ వ్యక్తి సమాధి తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన దేశాన్ని కలచివేసింది. అలాగే.. ఆస్పత్రి మార్చురీల్లో నెలల తరబడి గుర్తింపు లేకుండా ఉండిపోయే మృతదేహాలు, అంబులెన్స్‌ లేక భుజాలపై మృతదేహాలను మోసుకెళ్లే పేద కుటుంబాలు, శరీరదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు.. ఈ ఘటనలు అన్నీ ఒకే ప్రశ్నను మిగులుస్తున్నాయి. మనం నిజంగా మరణించిన వారిని గౌరవిస్తున్నామా? లేక వారి గుర్తింపును, మానవత్వాన్ని కేవలం అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామా?.. జీవించి ఉన్న సమాజం, మరణించినవారికి ఇచ్చే గౌరవంలోనే తన నాగరికతను ప్రతిబింబిస్తుంది. ఆ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అక్కడ మానవత్వం కూడా మెల్లగా మాయమవుతుంది.

  • జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్‌కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో  ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాగ్రౌండ్‌తో పనిలేదని చాటిచెప్పే అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్‌గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. 

    అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శంకర్‌. అతడు ఇంటర్‌ డ్రాపౌట్‌. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.

    ట్యాక్సీ ‍డ్రైవర్‌గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్‌ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్‌. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్‌లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. 

    ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్‌ అని గ్రహించి ఆటోమొబైల్‌ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్‌కు టైర్‌ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంకర్‌. 

    అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్‌ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్‌లో తట్టిన ఆ  వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. 

    భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి  ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్‌కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్‌ ఉత్తర్‌ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్‌ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్‌ జీరా మసాల అనే కూల్‌డ్రింక్‌ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. 

    మొదట్లో వంద సేల్‌ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్‌ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్‌ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్‌కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. 

    అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్‌ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

    పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్‌ రాయిస్‌ కారు కూడా ఉంది. అది తన స్టేటస్‌ ఆఫ్‌ సింబల్‌ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్‌. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్‌మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్‌ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్‌.

    (చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె ..)