Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.

    అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

    ఇక సీఎం విజయ్‌ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్‌ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్‌ను విజయ్‌కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై  ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

    ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్  పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ  స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.
     

  • మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్‌ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.

    అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్‌లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్‌పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్‌కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
     

     

  • తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్‌ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించింది.

    ‍అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్‌లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్‌లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్‌కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.

    ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్‌ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. 

    వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నారు.  కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్‌ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్‌-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్

    •    29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05

    •    మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05

    •    ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05

    •    టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05

    •    ద మార్క్‌డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05

    • స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06

    •    యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07

    జియో హాట్‌స్టార్

    •    ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

    అమెజాన్ ప్రైమ్

    •  ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05

    •  పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05


    జీ5

    •  పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05

    •   కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

    •   బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05

    సోనీ లివ్

    •    గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05

    సన్ నెక్స్ట్

    •    ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05

    ఆహా

    • అగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5

      ఆపిల్ టీవీ

    • కేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05

       

     

  • ప్రముఖ బుల్లితెర నటి సంభావనా ​​సేథ్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె తాజాగా కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు ఓ పాప, బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులుగా మారే ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంభావనకు శుభాకాంక్షల చెబుతున్నారు.

    నటి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ సంవత్సరం మహా దీపావళి ముందుగానే వచ్చింది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చేశారు. ఈ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. హర హర మహాదేవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా.. నటి సంభావన సేథ్.. నటుడు-రచయిత అవినాష్ ద్వివేదిని పెళ్లాడారు.

    కాగా.. గతంలో సంభావనా ​​ సరోగసీ ద్వారా బిడ్డను ఆశిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఒత్తిడి గురించి సంభావన మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా మూడు నెలల పాటు 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు సంభావన, అవినాష్‌ల వివాహం జూలై 14, 2016న జరిగింది. 

     

  • సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్‌-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ ‍స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ ఓవర్‌సీస్‌లో మాత్రమే స్ట్రీమింగ్ ‍అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

    దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్‌-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్‌స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

    దురంధర్-2 కథేంటంటే?

    రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్‌ పార్ట్‌ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్‌ పప్పు (అశ్విన్‌ ధర్‌)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్‌ పప్పుపై రెహమాన్‌ సోదరుడు ఉజెయిర్‌ బలోచ్‌(డానిష్‌) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని  భారత సీక్రెట్‌ ఏజెంట్‌ హమ్జా(రణ్‌వీర్‌ సింగ్‌) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌(మాధవన్‌) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్‌ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్‌ ఏజెంట్‌ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్‌ ’ ఎవరు? ఆపరేషన్‌ ధురంధర్‌ కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న  జస్కరిత్ సింగ్ రంగీ(రణ్‌వీర్‌)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్‌ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • టాలీవుడ్‌లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ‍మూవీని డైరెక్టర్‌ సుకుమార్‌తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.

    తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో వీక్షించిన సందీప్‌ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్‌ నుంచి బయటికి వస్తున్న సందీప్‌ను అక్కడే ఉన్న కొందరు ‍అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. 

    ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ ‍టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

     

  • రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్‌తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ  మహిళ అభిమాని ఏకంగా థియేటర్‌లోనే డ్యాన్స్‌ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

     

  • సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

    పహ్లాజ్ నిహలానీ తన కెరీర్‌లో 'ఆంఖేన్', 'అందాజ్', 'తలాష్', 'రంగీలా రాజా', 'జూలీ 2' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. సెన్సార్‌షిప్, ఫిల్మ్ సర్టిఫికేషన్  బోర్డులో ఆయన ఉన్న సమయంలో, తీసుకున్న అనేక నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీశాయి.  నిహలానీ నిర్మాతగా వివిధ జానర్‌లకు చెందిన అనేక కమర్షియల్ హిందీ చిత్రాలు నిర్మించారు. హిందీ చిత్ర పరిశ్రమకు  దశాబ్దాల పాటు ఆయన సేవలందించారు. ఆయనకు భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేశ్, చిరాగ్ ఉన్నారు.

     

  • సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్‌లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

    ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఫేమస్‌ అయ్యారు. ఇక గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్‌ చిత్రంతో కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినా కేరీర్‌కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్‌ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

    ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్‌ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్‌కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్‌ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్‌ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. 

    రష్మిక ఇప్పుడు కాక్‌–టెయిల్‌–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్‌ చేసినట్లే అవుతుంది.

Politics

  • సాక్షి, తాడేప‌ల్లి: రెండేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను వంచించిందే కాకుండా వాటిపై ప్ర‌శ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయ‌కుల మీద త‌ప్పుడు కేసులు పెట్టి వేధించడం, స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి వంగ‌వీటి న‌రేంద్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాల‌న పూర్త‌యినా సూప‌ర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమ‌లు చేసిన పాపాన‌పోలేదని.. బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ గ్యారెంటీ బాండ్ల‌కు చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఏం స‌మాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం చేసిన మెగా డీఎస్సీ వెనుక జ‌రిగిన కుంభ‌కోణంతో ప్రభుత్వం ఇరుకున ప‌డిందని, దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు తెలంగాణ‌లో విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

    ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పాల‌న చేత‌కాక‌నే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడ‌ని, చేత‌నైతే విభ‌జ‌న హామీల అమ‌లుకు ప్రయ‌త్నించాలని వంగ‌వీటి న‌రేంద్ర హిత‌వు ప‌లికారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

    ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్
    మోస‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌తో అన్ని వ‌ర్గాల‌కు వెన్నుపోటు పొడిచింది. వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు కొత్త‌గా సూప‌ర్ సిక్స్ ఇస్తామ‌ని చెప్పి చివ‌రికి ఏదీ కాకుండా చేశారు. చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు బాండ్ పేప‌ర్ల మీద సంత‌కాలు చేసి మ‌రీ సూప‌ర్ సిక్స్ హామీల విష‌యంలో మాట‌త‌ప్పారు. ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌ల త‌ర‌ఫున వైయ‌స్సార్సీపీ ప్ర‌శ్నిస్తుంటే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారు. రెండేళ్లుగా కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

    అక్ర‌మ కేసులతో వేధింపులు, దాడుల‌తో బెదిరించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌తో అడ్డంగా దొరికిన ప్ర‌తిసారీ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి త‌ల్లి, చెల్లి, గొడ్డ‌లి అంటూ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారు. జ‌రగ‌ని కుంభ‌కోణాల‌ను జ‌రిగిన‌ట్టుగా క‌ట్టుక‌థ‌లు అల్ల‌డంతోపాటు అక్ర‌మ కేసుల‌తో వైఎస్‌ జ‌గ‌న్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్న నాయ‌కుల‌ను జైళ్ల‌కు పంప‌డమే ప‌నిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క దానికీ ఆధారాలు లేక‌పోయినా పోలీసుల‌ను అడ్డం పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు బదులు తీర్చుకోవ‌గానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.

    కూట‌మి పాల‌న‌లో గాడిత‌ప్పిన శాంతిభ‌ద్ర‌త‌లు
    వైఎస్సార్సీపీ అధికారంలో ఉండ‌గా రాజ‌కీయ ల‌బ్ధి కోసం చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు నోటికొచ్చిన‌ట్టు త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. రాష్ట్రం అప్పుల‌పాలై శ్రీలంకగా మారిపోయింద‌ని ఊద‌ర‌గొట్టారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్య‌మైపోయార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌యినా వారు చేసిన ఆరోప‌ణ‌ల్లో దేనినీ నిరూపించ‌లేక‌పోయింది.

    మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్ప‌స్తామ‌ని చెప్పిన కూట‌మి నాయ‌కులు, రెండేళ్లుగా మహిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను అరిక‌ట్ట‌లేక‌పోయారు. కేంద్ర సంస్థ‌ల నివేదిక ప్ర‌కారం రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో రాష్ట్రం అట్ట‌డుగున ఉంద‌ని, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల్లో ఏపీ మొద‌టిస్థానంలో ఉంద‌ని, నేరాలు గ‌త ప్ర‌భుత్వం కంటే మూడు రెట్లు పెరిగాయ‌ని రుజువైంది. వైయ‌స్సార్సీపీ హయాంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించిన దిశ యాప్‌కి శ‌క్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. కూట‌మి ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి వేధిస్తున్నార‌ని ఆధారాల‌తో స‌హా మ‌హిళ‌లు ఫిర్యాదు చేసినా వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, బాధితుల‌నే వేధిస్తున్న ప‌రిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. 

    డిప్యూటీ సీఎంగా ఏం చేశాడో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాలి
    డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పే మాట‌ల‌కు, చేసే ప‌నుల‌కు పొంత‌న ఉండ‌టం లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసగించ‌డ‌మే కాకుండా ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌కి వెళ్లి తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేధాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కేంద్రంలో భాగస్వామ్య  పార్టీగా ఉన్న జ‌న‌సేన అధ్య‌క్షుడిగా విభ‌జ‌న హామీలు ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నించ‌కుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొట్టి ప‌బ్బం గ‌డుపుకోవాలి చూడ‌టం సిగ్గుచేటు.

    కూట‌మి పాల‌న‌కు రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా బాబు ష్యూరిటీ- భ‌విష్య‌త్ గ్యారెంటీ పేరుతో సంత‌కాలు పెట్టి రిలీజ్ చేసిన బాండ్ల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు స‌మాధానం చెప్పాలి. ఏపీలో పాల‌న గాలికొదిలేసి తెలంగాణ‌లో రాజ‌కీయాలు చేయ‌డం సిగ్గుచేటు. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఆధారాల‌తో స‌హా రుజువు కావడంతో దానికి స‌మాధానం చెప్పే ధైర్యం లేక ప‌క్క రాష్ట్రం వెళ్లి విద్వేష ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు.

    దీంతో పాటు అమ‌రావ‌తిలో అవినీతి నిరంతర ప్ర‌క్రియ‌గా మారిపోయింది. శాండ్‌, ల్యాండ్, మైన్‌, వైన్ దోపిడీని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అక్ర‌మాల‌ను వైఎస్సార్సీపీ ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు తీసుకొస్తుంటే ఏ ఒక్క‌దానికి ప్ర‌భుత్వం జ‌వాబు చెప్ప‌డం లేదు. చంద్ర‌బాబు స్క్రిప్టు ప్ర‌కారం నడుచుకుంటూ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కూడా ప్ర‌జ‌లు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని వంగ‌వీటి న‌రేంద్ర స్ప‌ష్టం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి.. గత రెండేళ్లుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్ హామీల అమలును గాలికొదిలేసి.. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా పక్కనబెట్టి, కేవలం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత కక్ష సాధింపులే ధ్యేయంగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.3.50 లక్షల కోట్ల అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడమే కాకుండా.. ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ, మెగా డీఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ భూముల దోపిడీ, ఉద్యోగుల వేధింపులు, మహిళలపై అఘాయిత్యాలతో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా గాడి తప్పించారని మండిపడ్డారు.

    కూటమి ప్రభుత్వ ఈ మోసపూరిత వైఖరిని, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు రాజీలేని నిరసన పోరాటాలు చేపడుతుందని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

    ప్రజాస్వామ్యం కాదు.. ఇది 'పొలిటికల్ గవర్నెన్స్'
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినట్లుగా రాష్ట్రంలో సాగుతోంది ప్రజాస్వామ్య పాలన కాదని, కేవలం తమ కార్యకర్తల ప్రయోజనాల కోసమే నడిచే ‘పొలిటికల్ గవర్నెన్స్’ మాత్రమే. "ప్రజాస్వామ్యం అంటే మేం ముగ్గురమే.. మేం చెప్పిందే నడవాలి" అన్నట్లుగా కూటమి పెద్దలు వ్యవహరిస్తున్నారు.  టీడీపీ కార్యకర్త వస్తే ప్రభుత్వ అధికారి కుర్చీ వేసి, కాఫీ ఇచ్చి పనులు చేసి పెట్టాలని మంత్రి అచ్చన్నాయుడు బహిరంగంగా ఆదేశించడం చూస్తుంటే రాష్ట్రంలో వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థమవుతోంది.

    కూటమి హామీల అమలు శూన్యం..
    ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. వాటికి అదనంగా మరిన్ని పథకాలు ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, నేడు అసలు పథకాలకే ఎసరు పెట్టారు. ఈ నేపథ్యంలో కూటమి మోసాలపై వైఎస్‌ జగన్ పిలుపునిచ్చిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వరుస నిరసన కార్యక్రమాలు, నాలుగు కూడళ్లలో బ్యాండు పేపర్ల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

    పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో విఫల నాయకుడు
    ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక్కడ సమాధానం చెప్పలేక రాష్ట్ర సరిహద్దులు దాటి మరో సమస్యలో చిక్కుకుని అందరితో తిట్లు తింటున్నారు. "పవన్ కళ్యాణ్.. మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ ప్రజా జీవితంలో మీరు పూర్తిగా విఫల నాయకుడు. నాడు ప్రశ్నిస్తానన్న నాయకుడు నేడెక్కడ దాక్కున్నాడు?". కనీసం సీఎం కూడా కాలేని వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ ఎందుకు?.

    డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి..
    వైఎస్సార్సీపీ ప్రజల తరపున నిలదీస్తుంటే.. కూటమి నేతలు సమాధానం చెప్పలేక వైఎస్సార్సీపీపై ‘గొడ్డలి పార్టీ’, ‘క్రిమినల్స్ పార్టీ’ అంటూ బురదజల్లుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, ఉదయం లేచింది మొదలు వైఎస్‌ జగన్‌ పేరు తలచుకోకుండా కూటమి నేతలకు రోజు గడవడం లేదు. పేదలపై ప్రేమ ఒలకబోసే చంద్రబాబు.. అమరావతిలో పేదలకు వైఎస్‌ జగన్ కేటాయించిన 50 వేల ఇళ్ల స్థలాలను ‘డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్’ (జనాభా సమతుల్యత దెబ్బతింటుంది) అనే సాకుతో రద్దు చేయడం సిగ్గుచేటు. ఈ అన్యాయాలపై భాగస్వామ్య పార్టీ బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలి.

    అస్తవ్యస్త పాలన.. అక్రమాలమయం..
    రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పింది, చివరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలే సొంత ప్రభుత్వంపై అడ్డం తిరిగే పరిస్థితి నెలకొంది. మెగా డీఎస్సీలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు రావాల్సిన అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, స్పోర్ట్స్ కోటా పేరిట పేకాట ఆడేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని, బాధితులంతా వైఎస్‌ జగన్‌ను కలిసి మద్దతు కోరగా.. వైఎస్సార్సీపీ వారికి అండగా నిలిచింది. నాడు వైఎస్‌ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను రక్షిస్తే.. నేడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 12 కీలక డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి భక్షించే కార్యక్రమానికి తెరలేపింది.

    99 పైసలకే భూములు:
    ఏ ప్రభుత్వమైనా 99 పైసలకే ఎకరా భూమిని అమ్ముతుందా? పెట్టుబడిదారుల పేరుతో ప్రభుత్వ భూములను, పేదల అసైన్డ్ భూములను తమ అనుయాయులకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. అమరావతి నిర్మాణం అనేది అంతులేని కథగా మారిందని, గాలిలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో చారిత్రాత్మక భూసర్వే చేపడితే విషప్రచారం చేసిన కూటమి నేతలు, నేడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ వైయస్సార్సీపీ చేసిన అభివృద్ధి పనులకు తమ పేర్లు పెట్టుకుంటున్నారు.

    మహిళలపై అఘాయిత్యాలు..
    కూటమి ఎమ్మెల్యేలు కీచకుల్లా మారి వరుసగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. అలాగే, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఆ డబ్బు అంతా ఎటు పోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి చేసిన అక్రమ అప్పులపై ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం.

    విద్యా, వైద్య రంగాలు ధ్వంసం.. ఉద్యోగులపై వేధింపులు..
    రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సూది, దూది, మందులు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి నెలకొంది. వైయస్.జగన్ నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూశారు,  అయితే వైయస్సార్సీపీ పోరాటానికి భయపడి ప్రైవేటు సంస్థలు వెనక్కి తగ్గాయి. విద్యాదీవెన, వసతి దీవెన నిధులు నిలిపివేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తమ హక్కులైన డీఏ, ప్రమోషన్స్, ఐఆర్ అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

    రైతుల అరెస్టులు దుర్మార్గం..
    రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదు. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లపైకి వస్తే వారిని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే అర్హతను కూటమి ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది, కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమ అరెస్టులపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో రాజీలేని పోరాటం చేస్తుంది. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి.

    ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం:
    "ఎన్నికల నాడు రంగురంగుల బ్యాండు పేపర్లు (మేనిఫెస్టో) చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజల వీపున పొడిచిన ఈ పొలిటికల్ వెన్నుపోటును జనాల్లోకి బలంగా తీసుకెళ్తాం. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగే మా ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు రైతులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తాం" అని జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.

    ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కూటమి పాలకుల ప్రతి అక్రమంపై వైఎస్సార్సీపీ భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ జరిపించి తీరుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అరెస్టులు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా కూటమి మెడలు వంచే వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని జూపూడి ప్రభాకరరావు అన్నారు.

  • చెన్నై: ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష కూటమి సమావేశంలో తాము పాల్గొనబోమని డీఎంకే గురువారం తెలిపింది. ముఖ్యంగా "కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం" కావడంతో హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.

    ఇండి కూటమిలో బలమైన పార్టీగా ఉన్న డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక‍ల్లో ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే అసంతృప్తిగా ఉంది. తమిళనాడు ఎ‍న్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత టీవీకేకు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్రంగా బాధపడ్డారని డీఎంకే తెలిపింది.

    "తమిళనాడు శాసనసభ ఎన్నికల తర్వాత డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్ల మా కార్యకర్తలు ఇంకా తీవ్రంగా మనస్తాపానికి గురవుతున్నారు. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ.. జూన్ 8న న్యూఢిల్లీలో జరగనున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాదు" అని పార్టీ తెలిపింది.

    అయితే ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే పేర్కొంది.

    డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని డీఎంకే అధికారికంగా కోరింది. దీంతో దీర్ఘకాల మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు దూరంగా నిలిచింది.

    మరోవైపు, పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఇండి కూటమి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. 

  • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్‌లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది. 

    అభిమాన సంఘాల నెట్‌వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్‌లా చాలా సంవత్సరాలు విజయ్‌ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్‌తో విజయ్‌ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్‌ కే కృ‍ష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.

    తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్‌ను చూడొద్దు. నేను విజయ్‌ను ఎంజీఆర్‌తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.

    డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.

    సినిమాలు చూసి ప్రభావితమయ్యారు.. 
    ‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృ‍ష్ణస్వామి అన్నారు.

    విజయకాంత్, శరత్‌కుమార్, భాగ్యరాజ్‌ వచ్చారు..  
    ‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్‌ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.

    ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్‌సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.

    అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్‌కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.

    తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.

    గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి. 

    ఇప్పటి కాలం మారింది. ‍స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు. 

  • సాక్షి, కృష్ణా జిల్లా: ‘‘నేను బియ్యం దొంగతనం చేశానని ఆరోపిస్తున్నారు. మీకు దమ్ముంటే విచారణ జరిపి నన్ను లోపల వేయండి’’ అంటూ మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్‌ విసిరారు. 2029 కల్లా చంద్రబాబు సర్కార్‌ పతనమవ్వడం ఖాయమని.. ఈ లోపు మీకు దమ్ముంటే తనను లోపల వేయండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

    మచిలీపట్నం నియోజకవర్గం ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ఇవాళ(గురువారం) అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌ఏలు), నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, హోంమంత్రి అనితపై మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చినప్పుడు మీకు జ్ఞానం లేదా?. 382 మందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. నిన్నటి వరకూ 3 శాతం అన్నారు.. ఇప్పుడు 382 మంది అంటున్నారు. ఎంతమందిని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారో కూడా చెప్పరా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

    ‘‘జీవోను మార్చి 29 ఆటలను 67 ఆటలకు పెంచేశారు. 40వ ఆట కింద పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్‌ ఆటను పెట్టారు. ఏ ఆటకు  ఎవర్ని తీసుకున్నారో 9 నెలలు నుంచి చెప్పడం లేదు. మేం నిరసనలు చేశాం కాబట్టి ఇప్పుడు డేటా బయటపెడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఐఏఎస్‌ సంతకం లేకుండా స్పోర్ట్స్‌ కోటా లిస్ట్‌ ఎలా పెట్టారు?. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదు. బ్యాగులు, సర్టిఫికెట్లు తెస్తే ఆ ఉద్యోగం కూడా ఇచ్చేవాళ్లు. ఆటలు కేంద్రం పెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం రుజువయ్యాక చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారు

    ..డీఎస్సీ అక్రమాల పై విద్యాశాఖ మంత్రి లోకేష్‌ నోరు విప్పడు. లోకేష్ ఏజెంట్ల కింద సీఎం, హోంమంత్రి మాత్రం మాట్లాడేందుకు వస్తారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే హోంమంత్రి మాట్లాడరు. విద్యాశాఖలో తప్పు జరిగిందని మేం అనగానే హోం మంత్రి తెరమీదకు వచ్చేశారు. డీఎస్సీలో మీరు చేసిన పాపాలు మీకు తగలకుండా  ఉంటాయా?. చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పులు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. బీమా కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకోగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి లకు జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక  ఘన స్వాగతం పలికారు. 

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన ఇరిగేషన్ అధికారులు.

  • హైదరాబాద్‌: అగ్ని ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రమాద వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

    ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

    ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు, కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తలసాని అన్నారు. అదే విధంగా అగ్నిమాపక శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అధికారులను ఆయన అభినందించారు.

     ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని తలసాని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్, ప్రవీణ్ రెడ్డి, సుమిత్ సింగ్, కట్టా బలరాం, సాయి, ప్రదీప్ గౌడ్, తదితరులు ఉన్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఖండించారు. గురువారం అమీర్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో అక్కడి ప్రకటన బోర్డులు కాలిపోయాయి. ఆ బోర్డులలోని కెమికల్ లిక్విడ్‌ పిల్లర్‌పై పడడంతో మరకలు ఏర్పడ్డాయి. అవి పగుళ్లలా కనిపించడంతో కొందరు అపోహలు పడ్డారు.

    ఆ అపోహలపై అధికారులు వివరణిచ్చారు. బిల్‌బోర్డు కాలిపోవడం వల్ల వచ్చిన కెమికల్ మరకలు మాత్రమే పిల్లర్‌పై కనిపించాయి. వాస్తవానికి పిల్లర్‌కు ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదని స్పష్టం చేశారు. నిపుణుల బృందం తనిఖీలు నిర్వహించి, పిల్లర్‌ సురక్షితంగానే ఉందని నిర్ధారించింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, మెట్రో పిల్లర్లు బలమైన నిర్మాణ ప్రమాణాలతో నిర్మించబడ్డాయని భరోసా ఇచ్చారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని, మెట్రో సేవలు ఎప్పటిలాగే సురక్షితంగా కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్‌లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చాయి. నందూస్‌ వరల్డ్‌ వీసా స్కామ్‌లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌(సీవోఎస్‌) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్‌ 
    యూట్యూబ్‌లో ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్‌ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్‌ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్‌ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్‌ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్‌ చేశారా?. వైరల్‌ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్‌ ఆరోపణల మధ్య నందూస్‌ వరల్డ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.

    సోషల్‌ మీడియాలో నందు వరల్డ్‌తో ఫేమస్‌యిన రమానందన, జాగర్లముడి మధుకర్‌ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్‌లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.

    👉ఇదీ చదవండి : నందూస్‌ వరల్డ్‌ దంపతులపై కేసు

    స్కామ్‌ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? 
    బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్‌ వీసాలు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌(సీవోఎస్‌) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్‌ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.

    ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్‌జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్‌ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్‌, నందనతో పాటు మధుకర్‌ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్‌ లావాదేవీలు, వాట్సాప్‌ చాట్‌, ఫోన్‌ కాల్స్‌ రికార్డింగ్స్‌ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

    కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని 
    సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్‌ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్‌ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్‌ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.

    మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్‌ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.

    బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలు
    ఒకప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్‌ సింబల్‌గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్‌ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. వైరల్‌ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్‌ చేశాయి. సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ నుంచి క్రిమినల్‌ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్‌ వరల్డ్‌ వ్యవహారం సోషల్‌ మీడియా నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు హాట్‌టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.

    ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్‌కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్‌ షిప్‌ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్‌ స్పాన్సర్‌ షిప్‌ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్‌ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    యూట్యూబ్‌లో తమకు వస్తున్న ఫేమ్‌ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్‌కు డబ్బులు పంపిన సస్కక్రీన్‌ షార్ట్స్‌, మనీ ట్రాన్సాక్షన్‌ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. ‌   

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నకిలీ చాక్లెట్ల తయారీ కలకలం రేపింది. ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్లను తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీతారాంబాగ్‌లో నకిలీ, గడువు ముగిసిన చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ మెరుపు దాడులు నిర్వహించారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. భారీగా నిషేధిత, గడువు ముగిసిన చాక్లెట్ ఉత్పత్తులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    నిందితుడు కొండ కార్తీక్‌ నిబంధనలకు విరుద్ధంగా చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాక్లెట్ ప్యాకెట్ల లేబుళ్లపై తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు ముగింపు తేదీ, 'బెస్ట్ బిఫోర్' వివరాలు ఏవీ లేకపోవడాన్ని అధికారులు నిర్థారించారు. మరింత లోతుగా పరిశీలించగా, చాక్లెట్ల తయారీలో గడువు ముగిసిపోయిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్‌లు, వివిధ రకాల రంగు పొడులను నిల్వ ఉంచి వాడుతున్నట్లు గుర్తించారు.

    అలాగే సదరు సంస్థకు కొత్త ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్ ఉన్నప్పటికీ.. పాత లైసెన్స్ నంబర్‌ వివరాలతో ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు తేలింది. వీటితో పాటు, అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి వైద్య ధృవీకరణ పత్రాలు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులను నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. ఎబోలా లక్షణాలతో  సూడాన్‌ దేశస్తుడు.. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరాడు. శాంపిల్స్‌ సేకరించిన అధికారులు పుణే ల్యాబ్‌కు పంపించారు. టెస్ట్‌ రిజల్ట్‌ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని.. ఎబోలా అనుమానిత వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

    ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

    సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ఎబోలా ప్రభావిత దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్‌ నుండి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇప్పటికే నిబంధనలను జారీ చేసింది. ఇటీవలే ఎబోలా వైరస్‌ పీడిత దేశాల నుంచి 28 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆరోగ్య యంత్రాంగం విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించడమే కాకుండా... ఒకవేళ వారు ఎబోలా విస్తరిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చినట్టు గుర్తిస్తే... వెంటనే వారిని 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలిస్తారు.

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ విషయంలో పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ మీపై కేసులు పెట్టమన్నారని నిరూపించగలరా? అంటూ పవన్‌ కల్యాణ్‌కు కేవీపీ బహిరంగ లేఖ రాశారు.

    ‘‘వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. వైఎస్సారే కేసులు పెట్టమన్నారన్న పోలీస్‌ అధికారికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయాలి. నిరూపిస్తే వైఎస్సార్‌ అభిమానులందరం కలిసి సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.10 కోట్లు ఇస్తాం’’ అని కేవీపీ సవాల్‌ విసిరారు.

     

     

  • అమరావతి: ఎండలతో ఠారెక్కిపోతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా ఉపశమనం కల్పించారు. ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.  దీంతో రోడ్లపైకి నీరు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి నీరు చేరింది. అదేవిధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండలాల్లో మోస్తారుగా వానలు కురిశాయి. ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం కల్పించాయి.

    అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు సైతం మండిపోయాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో44.7 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 43.8,  బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.7, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.6, కృష్ణా జిల్లా కంకిపాడులో 43.4, ప్రకాశం జిల్లా కొండపిలో 43, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

     

    Weather Updates: వచ్చేసిన రుతుపవనాలు.. ఇక వానలే.. వానలు

National

  • సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్‌ నుంచి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే, పవన్‌ ఖేరా, మన్సూర్‌ అలీ, రాజస్థాన్‌ నుంచి నీరజ్‌ డాంగీ, తమిళనాడు నుంచి ప్రవీన్‌ చక్రవర్తి, జార్ఖండ్‌ నుంచి ప్రవీన్‌ ఝా కు అవకాశం కల్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేనుగోపాల్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

     

  • ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఫ్లోరిష్ స్టేస్‌లో బస చేసిన గినియా పౌరుడు హోటల్ అగ్నిప్రమాదం తర్వాత హృదయ విదారక అనుభవాన్ని తెలిపాడు. తన స్నేహితుల్లో పలువురిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిలో చికిత్స నిమిత్తం భారత్‌కు వచ్చిన ఓ నైజీరియా రోగి, అతని తల్లి కూడా ఉన్నారని తెలిపాడు.

    ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘నేను 2 నెలల క్రితం ఫ్లోరిష్ స్టేస్‌కు వచ్చాను. నేను, నా తండ్రి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాం. శనివారం మాక్స్ హాస్పిటల్‌లో చేరాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మేము ఈ హోటల్‌లో లేము. నేను, నా తండ్రి ఆస్పత్రిలో ఉన్నాం. 

    నిన్న ఈ హోటల్‌లో ఏమి జరిగిందో నాకు తెలుసు. నా స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. ఈ హోటల్‌లో చాలా మంది చనిపోయినట్లు చూశాను. నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు. నైజీరియాకు చెందిన నా ఓ స్నేహితుడు తన తల్లితో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాడు. అతను చనిపోయాడు. అతని తల్లి కూడా చనిపోయింది. కాంగోకు చెందిన ఇద్దరు కూడా చికిత్స కోసం వచ్చారు. 

    ఓ వ్యక్తి, అతని భార్య మాక్స్ హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చారు. వారు కేవలం ఒక వారం మాత్రమే ఈ హోటల్‌లో ఉన్నారు. అతను కూడా చనిపోయాడు. నాలుగో అంతస్తులో చాలా మంది చనిపోయారు. కాంగోకు చెందిన ఆ ఇద్దరూ అక్కడే ఉన్నారు. మిగిలిన వారు కూడా నాలుగో అంతస్తులోనే, నా గది పక్కనే ఉన్నారు. నా గది చిన్నది కాదు.. పెద్దదే. వాష్‌రూమ్ కూడా ఉంది. అన్నీ బాగున్నాయి. కిటికీ కూడా ఉంది. గాజు కిటికీ ఉంది. దానికి తాళం కూడా ఉంది’’ అని చెప్పారు. 

  • చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అ‍న్నామలై విషయం గత కొద్ది రోజులుగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆయన పార్టీని వీడుతున్నారని త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని పుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై బీజేపీకి రాజీనామా చేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవాలని ఆయన రాజీనామా చేయలేదని కొట్టిపేడేశారు.

    నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ..  "అన్నామలై బీజేపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం  ఆధారాలు లేని పుకార్లు. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నాకు ఆయన నుంచి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. కొత్త పార్టీ పెట్టే విషయంపై అన్నామలై ఎవరితోనూ మాట్లాడలేదు. మేము కూడా ఆయనతో ఈ విషయం మాట్లాడలేదు, ఆయన కూడా మాతో ప్రస్తావించలేదు. ఆయన రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం, వాటిలో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కేవలం వదంతులు మాత్రమే." అని నాగేంద్రన్ అన్నారు. ఈ క్రమంలోనే అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

    ఇటీవలే న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యారు.  తదుపరి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఐదు పేజీల లేఖను ఆయనకు సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను బీజేపీ ఇంతవరకూ ఆమోదింపలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

    కాగా ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎ‍న్నికల్లో బీజేపీ అన్నామలైను పూర్తిగా సైడ్‌ట్రాక్ చేసింది. ఆయన అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ అన్నామలైని శాంతిపజేసే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • ఢిల్లీ: పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. డీ లిమిటేషన్ పై తమ విధానంలో పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదని డీఎంకె వర్గాలు అంటున్నాయి. 

    డీఎంకే నేతలతో అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వాజ్‌పేయీ మంత్రివర్గంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ గుడ్‌బై చెప్పడంతో పరిణామాలు మారాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది.

    డీఎంకే, టీఎంసీ పార్టీలకు లోక్ సభలో 50 మంది ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 50 శాతం లోక్ సభ, 50 శాతం అసెంబ్లీ సీట్లు పెంచేలా డీ లిమిటేషన్ బిల్లును రూపొందించారు. గత ప్రత్యేక సమావేశాల్లో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. జమిలి ఎన్నికల బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టి యోచనలో ప్రభుత్వం ఉంది. వర్షాకాల సమావేశాల తొలి వారంలో జేపీసీ నివేదికను వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ప్రవేశపెట్టనుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు ఉన్నాయి 

  • ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్‌ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్ భాయ్ రత్వ, మాన్సింగ్, జితేంద్ర మేక్జి భాయ్, మణిపూర్ నుంచి శారదా దేవి, రాజస్థాన్ నుంచి ఆల్క గుర్జర్, సతీష్ పునియా ,ఒడిశా నుంచి దేభాషిస్ సమంతరే, లు పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

    కాగా ఇటీవలే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎ‍న్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్‌ 8 చివరితేదీ కాగా జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్‌ 11 వరకూ విత్‌డ్రాకు సమయముంటుంది. జూన్‌ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది

  • ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2022లో 60 ఏళ్ల లవ్‌కేశ్ బజాజ్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ఇరుకైన వీధుల్లో ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి, దాన్ని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీ అండ్ బీ) సంస్థగా మార్చాలని నిర్ణయించాడు.

    ఆ భవనానికి త్వరలోనే ఫ్లోరిష్ స్టేస్ బీ అండ్ బీ అనే కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత అది ఐదు అంతస్తులు, ఒక బేస్‌మెంట్‌లో 26 గదుల ప్రాంగణంగా మారింది. అయితే,  కేవలం 6 గదులకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.

    బుధవారం అదే హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అతిథులు మరణించారు. వారిలో 12 మంది విదేశీయులు. అదే రాత్రి బజాజ్‌ను అరెస్టు చేశారు.

    పోలీసులు ప్రశ్నించగా.. వ్యాపారం మంచి లాభాలు తెస్తుండటంతో హోటల్‌లో గదుల సంఖ్య పెంచానని, అలాగే ‘ఢిల్లీ మేన్ సబ్ చల్తా హై (ఢిల్లీలో అన్నీ చెల్లుతాయి)’ అనే భావనతో అలా చేశానని బజాజ్ చెప్పినట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో నిబంధనలు, పరిమితులు, ఆంక్షలు ఏమీ ఉండవనేలా, ఏదైనా చేసుకోవచ్చనేలా ఆ హోటల్‌ యజమాని మాట్లాడారు.  

    పూర్తి సమయం హోటల్ నిర్వహణ చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో, అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించుకున్నానని కూడా బజాజ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అంశాలపై బజాజ్ భార్యను కూడా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.

    ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు గదులకే అనుమతి ఉంటే 26 గదులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. అంతేగాక, ఆ ప్రాంగణం అంతటా సులభంగా మంటలు అంటుకునే అలంకరణ సామగ్రి ఉన్నట్లు తేలింది.

    బుధవారం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) అధికారి మాట్లాడుతూ.. అలంకరణలో భాగంగా భవనం లోపల, బయట అనేక చెక్క, ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఏర్పాటు చేశారని, దీంతో మంటలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని చెప్పారు.

    బజాజ్ ఆ ప్రాంతంలో మరో రెండు ప్రాపర్టీలను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతా, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఇప్పుడు వాటినీ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • పట్నా: ఉపాధ్యాయులు విద్వేషాల‌కు దూరంగా ఉండాల‌ని జన అధికార్ పార్టీ అధినేత, పూర్నియ‌ పార్లమెంట్ సభ్యుడు పప్పు యాదవ్ వేడుకున్నారు. బిహార్‌లోని పట్నాలో కాదంఖాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాన్‌ గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు. పెద్ద మ‌న‌సు చేసుకుని ఈ వివాదాన్ని ఇంత‌టితో ముగించాల‌ని ఖాన్ స‌ర్‌ను (Khan Sir) కోరారు. ఎవరి విషయంలోనైనా త‌న వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే కాళ్లు ప‌ట్టుకుని తాను క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అన్నారు. ఖాన్ సర్, రోషన్ సర్ ఇద్దరూ త‌న‌కు సోద‌ర స‌మానులేన‌ని.. వీరిద్ద‌రికీ త‌న హృదయంలో స్థాన‌ముంద‌ని పేర్కొన్నారు.  

    ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, వివాదానికి ముగింపు ప‌ల‌కాల‌ని పప్పు యాదవ్ విజ్ఞ‌ప్తి చేశారు. విద్యా రంగంలో ఉన్నవారు ద్వేషాన్ని కాకుండా సంభాషణను, సామరస్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇద్దరు విద్యావేత్త‌ల‌ మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న వాగ్వివాదం, ఆరోపణలు బిహార్ విద్యా సంస్కృతికి మంచి సంకేతం కాదని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదంతా వ‌ద్దు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయవద్దు, విద్వేషాలు రెచ్చగొట్టవద్దు.. ఒక వ్యక్తి తప్పు చేయవచ్చు కానీ మొత్తం సమాజాన్ని, భావజాలాన్ని నిందించడం సరికాదని ఎంపీ పప్పు యాదవ్ ఉద్వేగభరితంగా చెప్పారు.

    బిహార్ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్య అనేది సమాజాన్ని ఏకం చేసే సాధనమని.. ఉపాధ్యాయులు, వారి మద్దతుదారులు సమాజంలో విభజన లేదా విద్వేషాన్ని సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బిహార్ బలం ప్రతిభ, విద్య, సామాజిక ఐక్యతలో ఉందని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని ఆయన అన్నారు.

    బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోండి
    గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడిపై పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేయాల‌ని, బాధ్యుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు పప్పు యాదవ్ తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని అన్నారు. ఇటీవ‌ల రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన విద్యార్థిని మృతి కేసు నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌రల్చ‌డానికి కోచింగ్‌ సెంటర్‌పై దాడిని పెద్ద‌దిగా చూపిస్తున్నార‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. విద్యార్థిని మృతి కేసులో దోషులు త‌ప్పించుకోకుండా చూడాల‌ని, చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష ప‌డాల్సిందే అన్నారు. విద్యార్థిని మృతి కేసుపై రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు.

    చ‌ద‌వండి: అది స‌రిపోదు.. మంత్రి రాజీనామా చేయాల్సిందే

    కోచింగ్‌ సెంటర్‌పై దాడి అందుకే
    గ్లోబల్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై మరో కోచింగ్‌ సెంటర్‌పై మంగళవారం రాత్రి 10.10 గంటల ప్రాంతంలో దాడి జ‌రిగింది. కోచింగ్‌ సెంటర్‌ వద్ద కాపలాగా ఉన్న గార్డ్‌ను చితకొట్టి భవనం మీదకు పలువురు రాళ్ల వర్షం కురిపించారు. డైరెక్టర్‌ సహా పలువురు దాడికి దిగి విధ్వసం సృష్టించారు. కాల్పులు సైతం జరిపారని ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు, విద్యావేత్త ఫైసల్‌ ఖాన్‌ ఆరోపించారు. తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తున్నామనే అక్కసుతో వేరే కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు దాడిచేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటలో వేరే కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ రోషన్‌ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. దాదాపు 20 మంది ఈ దాడి ఘటనలో పాల్గొన్నారని, ఆర్థిక కోణంలోనూ దర్యాప్తు ఆరంభించామని పట్టణ డీఎస్పీ రాజేశ్‌ రంజన్‌ తెలిపారు. 

  • మధుర:  హర్యానాకు చెందిన  గాయని కాజల్ చౌదరి  తన అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం అందరి దృష్టినీ  ఆకర్షిస్తోంది. 260 కి.మీ.ల పరిధిలోని సరస్సులు, అటవీ ప్రాంతాలను దాటుకుంటూ చేపట్టిన  ఆధ్యాత్మిక యాత్ర నెట్టింట వైరల్‌గా మారింది. '84-కోసుల' బ్రజ్ పరిక్రమలో ప్రత్యేక బుట్టలో తన 90 ఏళ్ల అత్తగారిని తలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నారు.

    బ్రజ్ ప్రాంతపు మతపరమైన ప్రదక్షిణను పూర్తి చేయాలన్న కోరికే తీర్చేందుకు అత్తగారిని మోసుకెళ్లాలని  స్వయంగానే తానే నిర్ణయించుకున్నానని, ఇందులో అత్తగారి ప్రమేయం ఏదీ లేదని స్పష్టం చేశారు. సుమారు 260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ 84-కోసుల బ్రజ్ పరిక్రమ, ఉత్తరప్రదేశ్, హర్యానా ,రాజస్థాన్ రాష్ట్రాల గుండా సాగుతూ, శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడి ఉన్న అనేక ముఖ్యమైన ప్రదేశాలు, కొలనులు , అరణ్యాల గుండా వెళుతుంది.

    ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!

    సాధారణంగా భక్తులు ఈ తీర్థయాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం తీసుకుంటారు, కానీ చాలామంది భక్తులు ప్రస్తుతం నడుస్తున్న 'అధిక మాసం' (Adhik Mas) లోనే దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గోవర్ధన్‌లోని శ్రీ ధన్‌ఘాటి ఆలయ సేవాయత్ (పూజారి) పవన్ కౌశిక్ తెలిపారు .హిందూ క్యాలెండర్‌లో వచ్చే ఈ అధిక మాసాన్ని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారని, ఈ మాసంలో బ్రిజ్‌ పరిక్రమ్‌ ఆధ్యాత్మిక యాత్ర, ఆలయాల్లో పూజలు చేయడం ,యజ్ఞాలు నిర్వహించడం అత్యంత శుభప్రదంగా  భావిస్తారని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

     

  • న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ-ఓఎస్ఎమ్ (ఆన్-స్క్రీన్ మార్కింగ్) విజిల్‌ బ్లోయర్లలో ఒకరైన సార్థక్ సిద్ధాంత్ (17).. " కాక్రోచ్ జనతా పార్టీ" వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు ఓ సందేశం ఇచ్చాడు. ఉద్యమం ఇంటర్నెట్‌లో యూజర్ల దృష్టిని ఆకర్షించేలా కాకుండా నిజమైన కారణాల ఆధారంగా కొనసాగాలని చెప్పారు. అంటే, కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడం, లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్లను సంపాదించడమే లక్ష్యంగా ఉద్యమాలు నడపకూడదని ఆయన చెప్పాడు.

    విజిల్‌ బ్లోయర్‌ అంటే సంస్థలోని లోపాలు, అవకతవకలు, అక్రమాలను బయటపెట్టే వ్యక్తి. 12వ తరగతి మార్కుల పట్టికల్లో తేడాలను గుర్తించిన తర్వాత సీబీఎస్‌ఈ ఓఎస్ఎమ్ మూల్యాంకన వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిన కీలక వ్యక్తులుగా సిద్ధాంత్, వేదాంత్, "ఎథికల్ హ్యాకర్" నిసర్గ నిలిచారు. ఈ ముగ్గురూ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది పరీక్షల వివాదాలపై వీరు గళం విప్పుతున్నారు. ఇందులో ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ 2026 పరీక్ష కూడా ఉంది. ఆ పరీక్షకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.

    భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల ‘‘బొద్దింకలు’’ అంటూ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా మొదలైన వైరల్ ఆన్‌లైన్ ఉద్యమం ‘‘కాక్రోచ్‌ జనతా పార్టీ’’ గురించి  సార్థక్ సిద్ధాంత్ మాట్లాడాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పాడు. విద్యార్థులు ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా, వాళ్లు చేసే ఏ ప్రచారం అయినా నిజమైన కారణం ఆధారంగా ఉండాలని తెలిపాడు.

    విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు వారి ఆగ్రహాన్ని అర్థవంతమైన చర్యగా మార్చేలా ఉండాలని తెలిపాడు. సమస్య పరిష్కారం దిశగా నిజమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

    "నేను కొంత దర్యాప్తు చేశాను, నిసర్గ్ కొంత దర్యాప్తు చేశాడు. విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టాం" అని సార్థక్ సిద్ధాంత్ చెప్పాడు. పరిశోధన ఆధారంగా జరిగే ఉద్యమాలకు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నడిచే ధోరణులకు మధ్య తేడాను ఆయన ప్రస్తావించారు. తన వ్యాఖ్యల్లో వేదాంత్ శ్రీవాస్తవ గురించి ప్రస్తావంచాడు.

    ఆన్‌లైన్ వేదికలకే ఉద్యమాన్ని పరిమితం చేయొద్దని సిద్ధాంత్ హెచ్చరించాడు. ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది, కానీ వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోవడం మాత్రం సరైంది కాదని చెప్పారు. కేవలం ఆన్‌లైన్‌లో ప్రాచుర్యం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమానికి తాను మద్దతు ఇవ్వనని తెలిపాడు.

    "అవును, ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది. నేను చేసినది, నిసర్గ్ చేసినది, వేదాంత్ చేసినది సాధారణంగా ఇంటర్నెట్ యాక్టివిజమే. కానీ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నవారు వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోతే, ఏ కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనకపోతే, అది సరికాదు" అని సిద్ధాంత్ చెప్పారు.

    సార్థక్ సిద్ధాంత్ ఎవరు?
    సార్థక్ సిద్ధాంత్ తన వెబ్‌సైట్ సార్థక్సిద్ధాంత్.కామ్/కోఎంప్ట్‌లో తన పరిశోధన ఫలితాలను ప్రచురించాడు. కేంద్ర ప్రజా కొనుగోలు పోర్టల్‌(Central Public Procurement portal)లోని టెండర్ పత్రాలను అనేక రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఈ వివరాలు వెల్లడించారు. సీబీఎస్‌ఈ ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఓఎస్ఎమ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. కొందరు విద్యార్థులు తప్పులు, అసమానతలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.

    ‘హౌ సీబీఎస్‌ఈ రీరోట్ రూల్స్ టు ఫేవర్ కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే శీర్షికతో ఉన్న సిద్ధాంత్ బ్లాగ్‌లో, టెండర్ ప్రక్రియలో వరుసగా జరిగిన మూడు దశల్లో అర్హత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలను బోర్డు పద్ధతిగా మార్చిందని ఆరోపించారు. దీని వల్ల చివరకు విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నాడు. "ప్రజా సంస్థ తన సొంత నిబంధనలను తిరిగి రాసి, విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుందో చెప్పే కథ ఇది" అని సిద్ధాంత్ తన బ్లాగ్ ప్రారంభంలో రాశాడు. ఆ సంస్థ ఎలాంటి తప్పూ చేయలేదంటూ ఖండించింది. సీబీఎస్‌ఈ కూడా అదే చెప్పింది.

    విద్య, మహిళలు, పిల్లలు, యువజనులు, క్రీడల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరు కావాలని సిద్ధాంత్‌ను గత మంగళవారం కోరారు. ఓఎస్ఎమ్ వ్యవస్థ కోసం సీబీఎస్‌ఈ మూడు వేర్వేరు టెండర్లు విడుదల చేసిందని సిద్ధాంత్ స్థాయీ సంఘానికి తెలిపారు. 2025 ఫిబ్రవరిలో విడుదలైన తొలి టెండర్, విన్నర్‌ లేకుండానే రద్దైంది. 2025 మేలో విడుదలైన రెండో టెండర్‌కు నాలుగు బిడ్లు వచ్చాయి, కానీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. 2025 ఆగస్టులో విడుదలైన మూడో టెండర్‌కు ర్యాంక్‌గురు, టీసీఎస్, కోఎంప్ట్ బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక దశలో ర్యాంక్‌గురు అర్హత సాధించకపోవడంతో చివరకు కాంట్రాక్ట్ కోఎంప్ట్‌కు దక్కింది.

  • ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘ఆమె వీల్‌ఛైర్‌లో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె తన తలను అతని భుజంపై ఆనించింది. రక్షణ కోసం ఎదురుచూస్తూనే.. వారు ఒకరి చేతుల్లో ఒకరు ప్రాణాలు విడిచారు. వీల్‌ఛైర్‌లో ఒకరు.. చేతులు గట్టిగా పట్టుకుని మరో జంట.’’ సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి కన్పించిన దృశ్యాలు వారిని కంటతడి పెట్టించింది.

    బుధవారం ఉదయం ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టే బిఎన్‌బి' హోటల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా.. ఆ పురుషుడు ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవచ్చనే ఆశతో వారు లోపల తాళం వేసుకున్నట్లు తెలుస్తోందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరో గదిలో బెడ్ అంచున కూర్చుని ఉన్న ఒక జంట కనిపించింది. వారిద్దరూ పూర్తిగా కాలి బూడిదయ్యారని లోపల దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు.

     బేస్‌మెంట్ (భూగర్భ గది) ద్వారా భవనంలోకి ప్రవేశించాం. హోటల్‌లోకి ప్రవేశించడానికి తాము షట్టర్‌ను కట్ చేశాం. బేస్‌మెంట్‌లోకి ప్రవేశించినప్పుడు, రిసెప్షన్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన మొదటి మృతదేహాన్ని చూశాం. అది 20 ఏళ్ల వయసున్న అమ్మాయిది. ఆమె చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కడి నుండి కొన్ని అడుగుల దూరంలో, వీల్‌చైర్‌పై ఉన్న ఒక వ్యక్తి కూడా కాలి చనిపోయి కనిపించాడు. మేం ముందుకు వెళ్లినప్పుడు.. ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వారికి సీపీఆర్‌ చేశామని రెస్క్యూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు.

  • ఉత్తరాఖండ్‌లోని చంపావత్ సమీపంలో బ్రేకులు ఫెయిలైనా, చాకచక్యంగా బస్సును కొండవైపునకు మళ్లించి భారీ ప్రమాదాన్ని తప్పించాడు. కానీ దురదృష్టవశాత్తు బస్‌ డ్రైవర్‌ మాత్రం అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ధార్‌చూలా–తానాపూర్‌ మార్గంలో లోహాఘట్‌ వద్ద బుధవారం ఉదయం జరిగింది. ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యతనిచ్చిన సాహసిక డ్రైవర్‌కు నెటిజన్లు సలాం చెబుతున్నారు.

    ఉత్తరాఖండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు ధార్చులా నుండి తానక్‌పూర్‌కు వెళ్తున్న బస్సు, పల్లపు ప్రాంతంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బస్సు నేరుగా కొండ అంచు నుంచి బస్సు లోయలోకి పడే ప్రమాదం ఉండటంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్‌ బస్సులోని 34 మంది ప్రాణాలను కాపాడాడు.  కానీ అనూహ్యంగా డ్రైవర్ బేనీరామ్ థ్వాల్ (49) ప్రాణాలు కోల్పోయాడు బస్సును ఎలాగైనా ఆపేయాలనే ఉద్దేశంతో కుడివైపు కొండను ఢీకొట్టాడు. ఈ క్రమంలో డ్రైవర్‌ సీటు నుంచి ఎగిరిపడి బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. బస్సు అలాగే ముందుకు కదలి అతనిపై నిలిచి ఆగిపోయింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోవడం  తీవ్ర విషాదాన్ని నింపింది. 

    ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

    ఒక మహిళకు స్వల్ప గాయాలవ్వగా, మిగతా ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారని ఉత్తరా ఖండ్ రవాణా సంస్థ తానక్‌పూర్ విభాగం అసిస్టెంట్ రీజినల్ మేనేజర్ సురేష్ పాండే తెలిపారు. ప్రాణాలకు తెగించి జనాలను కాపాడి వీరమరణం పొందిన బస్సు డ్రైవర్‌ బేనీరాం థావల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ అంజలి ఘటించారు. 

    ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!



     

  • ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిపే అమానవీయ ఘటన జరిగింది. లంచం ఇవ్వలేదనే కారణంతో 14 ఏళ్ల బాలికకు అతికిన ఎముకను ప్రభుత్వ వైద్యుడు మళ్లీ విరిచేశాడు. గాయపడిన బాలిక చికిత్సకు ఆ డాక్టర్‌ రూ.  25 వేలు డిమాండ్‌ చేశాడు. అప్పటికే బాధిత కుటుంబం రూ. 8 వేలు చెల్లించింది. డిమాండ్‌ చేసిన రూ.25 వేలు ఇవ్వలేదనే కారణంతో బాలికను పరీక్షల నిమిత్తం పిలిచి కాలు విరిచాడు.

    దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తక్షణమే ఉచిత చికిత్స అందించాలంటూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనను తెలుసుకున్న కలెక్టర్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. దాదాపు నెలన్నర క్రితం మానసిక వికలాంగురాలైన తన కుమార్తె కుడి కాలు ఎముక విరిగింది. దాంతో ఆమె కూతురిని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఆపరేషన్ చేయడానికి రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు.

    భర్త మరణించిన తర్వాత ఒంటరిగా పిల్లలను పోషిస్తున్న ఆమె.. అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలైన తల్లి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ను ఆశ్రయించింది. డీఎం జోక్యం చేసుకుని.. ఉచితంగా చికిత్స అందించాలని సీఎంఓకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వైఖరిలో మార్పు రాలేదు.

    డీఎం దగ్గరకు ఎందుకు వెళ్లావంటూ వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి.. చికిత్స చేయడానికి నిరాకరించారు. చివరికి చేసేదేమీ లేక ఆ తల్లి అప్పు చేసి రూ.8 వేలు ఇవ్వడంతో బాలికకు ఆపరేషన్ చేశారు. మిగిలిన డబ్బును తర్వాత ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధిత తల్లి తన కుమార్తెను ఫాలో-అప్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఉన్న డాక్టర్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడి.. మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    తన వద్ద డబ్బులు లేవని  ఆమె చెప్పడంతో.. ఆగ్రహించిన డాక్టర్ ఆ బాలిక మోకాలిని ఎంత ఘోరంగా మెలి తిప్పాడు. ఆ పిల్ల నొప్పితో గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో కాలు ఎముక విరిగిన శబ్దం స్పష్టంగా వినిపించిందని ఆమె తెలిపింది. దీంతో ఆమె నిలదీయగా.. వైద్యులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి.. బలవంతంగా ఆసుపత్రి నుండి బయటకు నెట్టేశారు.

    ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కాలు విపరీతంగా వాచిపోయి.. రాత్రంతా నొప్పితో విలవిలల్లాడటంతో.. తల్లి ప్రైవేట్ ల్యాబ్‌లో డిజిటల్ ఎక్స్-రే చేయించింది. ఎక్స్-రే రిపోర్టులో బాలిక కాలు ఎముక మళ్లీ విరిగినట్లు స్పష్టంగా తేలింది. దీనిపై నిలదీయడానికి మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా..  వైద్యులు న్యాయం చేయడానికి బదులు.. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుండి తరిమికొట్టారు.

  • సోషల్‌ మీడియా అంటే విచిత్రాలు, వింతల  పుట్ట. తాజాగా ఒక విచిత్రమైన  వీడియో సోషల్ మీడియాను సంచలనం రేపుతోంది.  ఒక యువకుడు పశువుల మేతను తింటున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పశువుల కంటే  ఇష్టంగా, ఎంతో హాయిగా, మహా ప్రసాదంలా కళ్లకద్దుకుని మరీ గడ్డిని భోంచేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు  చుట్టూ ఉన్నవారంతా ఇతడిని ఉత్సాహపరుస్తుండటం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 

    ఈ వీడియో ప్రామాణికత, ఉద్దేశ్యం, ఎక్కడిది? ఆ యువకుడు ఎవరు? ఎందుకు తింటున్నాడు అనే దానిపై స్పష్టత లేదు.  కానీ మతపరమైన లేదా మూఢనమ్మకపు ఆచారంలో భాగంగా ఆవుల కోసం ఉద్దేశించిన మేతను తింటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు దీన్నొక సాంస్కృతిక ఆచారంగా భావిస్తుండగా, మరికొందరు పశువుల కోసం ఉద్దేశించిన మేతను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    పశువుల మేత అనేది పశువులకు మాత్రమే ఉద్దేశించింది. అది మానవ ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దానిని తయారు చేయడం, నిల్వ చేయడం లేదా ప్రాసెస్ చేయడం లాంటివి ఉండవు. అటువంటి పదార్థాలను తినడం వల్ల కలుషితాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో ప్రాణాపాయం ప్రమాదం పెరగవచ్చు.

    ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!

    మరోవైపు దీనిపై ఆహార నిపుణులు, వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్‌ కోసమో, సోషల్‌ మీడియాలో ఆదరణ కోసమో ఇలాంటి అసాధారణ చర్యలకు పూనుకోవద్దని హితవు చెబుతున్నారు.   ఇలాంటి వాటిని మనుషులు జీర్ణం చేసుకోలేని, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


     

    ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

  • దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అధికారుల అవినీతి, వ్యవస్థ విఫలమై ఇలాంటి ఘోర విషాదాలు సంభవించినప్పుడు, సామాన్య పౌరులే హీరోలుగా నిలుస్తారు. అసాధారణమైన ధైర్య సాహసాలతో బాధితులను మృత్యు ముఖం నుంచి బయటపడేస్తారు. ఢిల్లీ ఘటనలో కూడా స్థానిక యువకులే ఎంతోమంది ప్రాణాలును కాపాడారు.

    బుధవారం ఉదయం, దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో స్థానిక నివాసితులు ఎలాంటి రక్షణాలు కవచాలు లేకుండానే రంగంలోకి దూకి ప్రాణాలకు తెగించి మరీ ఎంతోమంది బాధితులను కాపాడారు.

    భవనాన్ని చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, నలుదిశలా కమ్మేస్తున్న పొగ, బాధితుల హాహాకరాలు, భయాందోళనలు ఇలాంటి నిస్సహాయ వాతావరణంలో, మంటల నుండి తప్పించుకోవడానికి కిటికీల నుండి దూకుతున్న అనేకమందితో సహా, లోపల చిక్కుకుపోయి వారిని రక్షించాలనే తపనతో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ఒకరు మహమ్మద్ అఫ్జల్,  మౌ.షాహరూఖ్, మౌ.అనీష్, మౌ.అమీర్, మౌ.వసీం, రియాజవుద్దీన్ గద్దె వాలా, ఇంకా స్థానికులు  ఉన్నారు. 

     

     

    మహమ్మద్ అఫ్జల్
    సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఎలా తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారో వివరించారు. తాము అక్కడి చేరుకునేటప్పటికే భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనీ,  వెంటనే ఎదురుగా ఉన్న అర్మాన్స్'  దుకాణం నుండి తెచ్చిన పరుపులను కింద పరిచి,  హోటల్‌ నుంచి వారిని  కిందకు దూకమని కోరామని తెలిపారు.  కొందరు విజయవంతంగా దూకగా, మరికొందరు దూకలేకపోయారని అఫ్జల్ చెప్పారు. వీరి మాటల  ప్రకారం ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో మంటలు తీవ్రమవడంతో హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్‌కు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. చివరికి, అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాంతో వీరు భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

    రూ. 2 లక్షల విలువైన  పరుపులు
    అగ్నిప్రమాదం నుండి  బాధితులను కాపాడటానికి లక్షల విలువైన పరుపులను  వినియోగించారు  స్థానిక దుకాణ యజమాని. అతను అతని కుమారుడు లేకపోయి ఉంటే ఈ విషాదం మరింత ఘోరంగా ఉండేది. ఆ ఇద్దరూ దాదాపు రూ. 2 లక్షల విలువైన కొత్త పరుపులను త్యాగం చేసి, అనేక ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన ఒక తాత్కాలిక రక్షణ వలయాన్ని  ఏర్పరిచారు.

    తన సరుకుకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా, పరుపుల యజమాని తమకు సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ పరికరాలేవి అందుబాటులోలేకపోవడంతో అతని షాపులోని దుప్పట్లతోనే బాధితులను పైఅంతస్తుల నుండి జాగ్రత్తగా కిందకు దించి, ఆసుపత్రిలకు తరలించామని అఫ్జల్ చెప్పారు.

    వసీం రాజా
    మరో  హీరో వసీం రాజా. అత్యవసర పరిస్థితిలో తన వృత్తిపరమైన శిక్షణ కీలకమని నిరూపించారు. మాక్స్ హాస్పిటల్‌లో పనిచేసే రాజా, పొగ పీల్చడం వల్ల బాధపడుతున్న బాధితులకు సహాయం చేయడానికి వెంటనే తన వైద్య శిక్షణను ఉపయోగించాడు. సామూహిక ప్రాణనష్టం జరగకుండా,  సీపీఆర్ (CPR) చేసి కొంతమందికి ప్రాణభిక్ష పెట్టారు. నోటి ద్వారా శ్వాస అందించి   కొంతమందిని కాపాడగిలిగాం కానీ,  దురదృష్టవశాత్తు మరికొందరిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

    ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

NRI

  • న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ  ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్‌ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్‌ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్‌ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.

    ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.

Business

  • టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI-ట్రాయ్).. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ప్రభుత్వం, టెలికాం పరిశ్రమ నుంచి కీలక భాగస్వాములను ఒకచోట చేర్చి, విజయవాడలో ''డిజిటల్ కనెక్టివిటీ కోసం భవనాల రేటింగ్''పై ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

    నివాస, వాణిజ్య, ప్రజా ప్రదేశాలలో భవనాలలో డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఒక ప్రధాన చొరవ అయిన ట్రాయ్ యొక్క ''డిజిటల్ కనెక్టివిటీ కోసం ఆస్తుల రేటింగ్ నిబంధనలు, 2024'' గురించి అవగాహన కల్పించడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం.

    ఈ కార్యక్రమాన్ని ట్రాయ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ ఐటీఎస్ బి. ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఆయన పటిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ట్రాయ్ క్యూఓఎస్ సలహాదారు ఐటీఎస్ తేజ్‌పాల్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఈ&సీ శాఖ జాయింట్ డైరెక్టర్ ధవుర్యాన్ నాయక్ సభను ఉద్దేశించి ప్రసంగించి, భాగస్వాముల మధ్య సహకార ప్రయత్నాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

    ట్రాయ్ ఆర్ఓ హైదరాబాద్ సలహాదారు బి. ప్రవీణ్ కుమార్, డిజిటల్ కనెక్టివిటీ ఒక ప్రాథమిక అవసరంగా మారిందని నొక్కిచెప్పారు. అలాగే, డేటా వినియోగంలో గణనీయమైన భాగం భవనాల లోపలే జరుగుతుందని, అందువల్ల పటిష్టమైన ఇన్-బిల్డింగ్ పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

    భవనాల డిజిటల్ కనెక్టివిటీ సంసిద్ధత ఆధారంగా వాటికి స్టార్ రేటింగ్ వ్యవస్థను (1–5 స్టార్లు) ప్రవేశపెడుతున్న ట్రాయ్ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఈ వర్క్‌షాప్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ చొరవ, వినియోగదారుల అనుభవాన్ని, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాపర్టీ డెవలపర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల ప్రొవైడర్ల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది.

    డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన నియంత్రణ నిబంధనలు, అమలు వ్యూహాలు, ప్రణాళికా అంశాలపై సాంకేతిక సమావేశాలు జరిగాయి. వీటితో పాటు ట్రాయ్, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణుల ప్రతినిధులతో ఒక ప్యానెల్ చర్చ కూడా జరిగింది.

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడు ఒక కీలకమైన వినియోగ సేవ అని, భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో.. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ వంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో ఈ కొత్త రేటింగ్ ఫ్రేమ్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది.

  • ప్రస్తుత ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (HDFC Mutual Fund) తన గోల్డ్ ఆధారిత పథకాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

    హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఈ నిర్ణయం.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాలకు వర్తిస్తుంది. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని ఫండ్ హౌస్ స్పష్టం చేసింది.

    'హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్'లో పెద్ద పెట్టుబడిదారులు.. నేరుగా ఫండ్ హౌస్ ద్వారా పెట్టే పెట్టుబడులు జూన్ 8, 2026 నుంచి స్వీకరించబడవు. అంటే. ఒక్కసారిగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం తాత్కాలికంగా నిలిపివేశారన్నమాట. ప్రత్యేకంగా రూ.25 కోట్లకు పైగా పెట్టుబడులపై ఈ నిబంధన వర్తిస్తుంది.

    అదే విధంగా 'గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్'లో ఒక PANకి నెలకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులు అనుమతిచడం జరుగుతుంది. జూన్ 5, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లకు ఈ పరిమితి అమలులోకి వస్తుంది. అయితే.. ఈ పథకాలకు సంబంధించి ఇతర నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు కొనసాగుతాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. బంగారం దిగుమతులపై పెరిగిన పన్నులు. కాగా.. ప్రభుత్వం ఇటీవల బంగారం, వెండి దిగుమతులపై ప్రభావవంతమైన పన్నును 9.2% నుంచి 18.4%కి పెంచింది. ఈ మార్పు మే 13, 2026 నుంచి అమలులోకి వచ్చింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.

    ఇదీ చదవండి: టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?

  • వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.

    టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్‌మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

    సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్‌లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.

    టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది.

  • భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల సీఈఓల వేతనాల విషయంలో FY26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మొత్తం రూ. 82.6 కోట్ల పారితోషికం లభించింది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలలో ఇది అత్యధిక వేతనం కావడం విశేషం.

    కాగా విప్రో సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీనివాస్ పల్లియా' పారితోషికం తగ్గినప్పటికీ రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం విడుదల చేసిన విప్రో వార్షిక నివేదిక ప్రకారం, FY26లో పల్లియా పరిహారం రూ. 49.6 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది రూ. 53.6 కోట్ల కన్నా 7.4% తక్కువ.

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కే. కృతివాసన్ ఈ సంవత్సరంలో రూ. 28 కోట్లు అందుకున్నారు. ఇప్పటివరకు తమ పరిహార వివరాలను వెల్లడించిన దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల అధిపతులలో ఆయన అత్యల్ప వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన FY26 యాన్యువల్ రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు.

    ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ వేతనంలో ప్రధాన భాగం షేర్ల ఆధారిత ప్రోత్సాహకాల నుంచే వచ్చింది. ఆయనకు రూ. 50.75 కోట్ల విలువైన రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), రూ. 23.35 కోట్ల స్టాక్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించాయి.

    విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. FY26లో శ్రీనివాస్ పల్లియా జీతం, ఇతర అలవెన్సులు రూ. 14.6 కోట్ల నుంచి రూ. 15.5 కోట్లకు పెరిగినప్పటికీ, వేరియబుల్ పే రూ. 14.5 కోట్ల నుంచి రూ. 9.9 కోట్లకు తగ్గడంతో మొత్తం వేతనం కొంత తగ్గింది. అదనంగా.. ఇతర విభాగాల కింద రూ. 23.3 కోట్లు, డిఫర్డ్ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ రూపంలో సుమారు రూ. కోటి పొందారు.

    విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ వేతనం కూడా గణనీయంగా తగ్గింది. FY25లో రూ. 13.8 కోట్లుగా ఉన్న ఆయన పారితోషికం FY26లో రూ. 7.3 కోట్లకు పడిపోయింది. అలాగే వేరియబుల్ పే రూ. 7 కోట్ల నుంచి రూ. 2.2 కోట్లకు తగ్గింది.

    విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. శ్రీనివాస్ పల్లియా, రిషాద్ ప్రేమ్‌జీ ఇద్దరికీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగిన సమీకృత నికర లాభంపై 0.35 శాతం కమిషన్ పొందే హక్కు ఉంది. ఇది సంస్థ పనితీరు మెరుగుపడితే వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..

  • భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పీవీలలో ఒకటైన 'టయోటా ఇన్నోవా క్రిస్టా' కొత్త హంగులతో లాంచ్ అయింది. ఈ 2026 మోడల్ ప్రారంభ ధర రూ.19.72 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    రెండు దశాబ్దాలకు పైగా భారతీయ కుటుంబాల విశ్వాసాన్ని గెలుచుకున్న ఇన్నోవా క్రిస్టా, ఈసారి కొన్ని డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ కారు ముందు భాగంలో కొత్త గ్రిల్ మరింత బోల్డ్ అండ్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అలాగే ముందు.. వెనుక బంపర్ గార్నిష్‌లు కూడా అప్డేట్ అయ్యాయి. సిల్హౌట్ యథాతథంగా ఉన్నప్పటికీ డిజైన్ ఎలిమెంట్స్ అన్నీ చాలా ఆకట్టుకుంటాయి.

    క్యాబిన్‌లో కూడా పలు మార్పులు జరిగాయి. డ్యూయల్ టోన్ లెదర్ సీటు, గ్రేస్ కాపర్ ఫినిష్ ట్రిమ్స్, వుడ్ ప్యాటర్న్ ఇన్‌సర్ట్‌లతో డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్ మరింత విలాసవంతంగా కనిపిస్తున్నాయి. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఎంపిక చేసిన వేరియంట్లలో లభిస్తాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

    ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. కొత్త కారు ఎంట్రీ!

    కొత్త ఇన్నోవా క్రిస్టాలో కూడా సాధారణ ఇన్నోవాలోని అదే 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 148 బీహెచ్‌పీ పవర్, 343 ఎన్ఎం టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. ఈ ఇంజిన్ లీటరుకు 15 కిమీ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది.

  • ముంబై: వినియోగ వస్తువులు, రసాయనాలు, రియల్‌ ఎస్టేట్, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది.  ’గోద్రెజ్‌ వెల్త్‌’  పేరుతో కొత్త వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్‌ కాపిటల్‌తో కలిసి ఈ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆర్థిక సేవలు అందిస్తుంది.

    గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణానికి (ఏయూఎం) సంబంధించి 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆఖరు నాటికి రూ. 38,000 కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ మనీష్‌ షా తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దీన్ని రూ. 1,00,000 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. గోద్రెజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, గోద్రెజ్‌ ఫైనాన్స్‌ విభాగాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఏయూఎం గత ఆర్థిక సంవత్సరం రూ. 28,000 కోట్లుగా నమోదైంది. వెల్త్‌ బిజినెస్‌ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు.

    ముందుగా ఎనిమిది కీలక నగరాలతో ప్రారంభించి వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారాన్ని 35 ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రూ. 2 కోట్లకు పైబడి అసెట్స్‌ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఇది సరీ్వసులు అందిస్తుంది. ఇక గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రస్తుతం 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది 200 పైచిలుకు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు షా వివరించారు. అలాగే సప్లై చెయిన్‌ ఫైనాన్స్, గోల్డ్‌ లోన్స్‌ సహా మూడు కొత్త వ్యాపార విభాగాలు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం గత నెల(మే)లో ఆరు నెలల గరిష్టానికి చేరింది. పటిష్ట డిమాండ్‌ పరిస్థితులు, కొత్త క్లయింట్లను పొందడం, కొత్త బిజినెస్‌ల వినియోగంలో పురోగతి ఇందుకు సహకరించాయి. వెరసి బుధవారం విడుదలైన నెలవారీ సర్వేలో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 59.8కు బలపడింది. ఏప్రిల్‌లో ఇది 58.8గా నమోదుకాగా.. గత నవంబర్‌ తదుపరి మే నెలలో సర్వీసులు బలంగా పుంజుకున్నాయి.

    పీఎంఐగా పిలిచే పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ 50ను దాటితే సర్వీసుల రంగం విస్తరించినట్లు లెక్క. 50కు దిగువన నమోదైతే క్షీణతను చవిచూస్తున్నట్లు తెలియజేస్తుంది. ప్రధానంగా రవాణా, డిజిటల్‌ సొల్యూషన్లు, ఈకామర్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ విభాగాలలో సర్వీసులకు పెరిగిన డిమాండ్‌ కొత్త బిజినెస్‌ల వృద్ధికి దోహదపడింది. దీంతో కంపెనీలలో యాక్టివిటీ పుంజుకోవడంతోపాటు.. ఉపాధి కల్పనకు బూస్ట్‌ లభించింది. 

  • ఇళ్లలో ఉపయోగించే ఎరుపు రంగు ఎల్‌పీజీ సిలిండర్ అందరికీ తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులోనే కాకుండా పలు ఇతర రంగుల్లోనూ కనిపిస్తాయి. ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. సిలిండర్‌లో ఏ రకం గ్యాస్ ఉందో, అది ఎక్కడ ఉపయోగించాలో గుర్తించేందుకు ఈ రంగు కోడింగ్‌ను ఉపయోగిస్తారు.

    ఎరుపు రంగు సిలిండర్‌

    భారతదేశంలో ఇళ్లలో వంట కోసం ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్లు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎల్‌పీజీ దహనశీల పదార్థం కావడంతో ప్రమాద హెచ్చరికకు సంకేతంగా ఈ రంగును ఉపయోగిస్తారు. ఇండేన్‌, భారత్‌గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ వంటి సంస్థలు సరఫరా చేసే సిలిండర్లు ఈ కోవలోకే వస్తాయి.

    నీలం రంగు సిలిండర్‌

    కొన్ని పరిశ్రమలు, వర్క్‌షాప్‌లు, తయారీ యూనిట్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లకు నీలం రంగు కనిపిస్తుంది. భారీ స్థాయిలో తాపన, ప్రాసెసింగ్‌ వంటి కార్యకలాపాలకు వీటిని వినియోగిస్తారు.

    పసుపు రంగు సిలిండర్‌

    హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, క్యాటరింగ్‌ సంస్థలు ఉపయోగించే కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్లు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. వీటి ధరలు, సరఫరా నిబంధనలు గృహ సిలిండర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.

    నలుపు రంగు సిలిండర్‌

    నలుపు రంగు సిలిండర్లలో ఎక్కువగా ప్రొపేన్‌ గ్యాస్‌ నిల్వ చేస్తారు. పరిశ్రమలు, హీటింగ్‌ వ్యవస్థలు, కొన్ని ప్రత్యేక యంత్రాల్లో ఈ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. చల్లని ప్రాంతాల్లో కూడా ప్రొపేన్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది.

    తెలుపు రంగు సిలిండర్‌

    ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల్లో ఉపయోగించే ఆక్సిజన్‌ వంటి వైద్య వాయువులు లేదా ప్రత్యేక గ్యాస్‌ మిశ్రమాల కోసం తెలుపు రంగు సిలిండర్లను ఉపయోగిస్తారు. వీటిపై కఠిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉంటాయి.

    ఆకుపచ్చ రంగు సిలిండర్‌

    కొన్ని దేశాలు లేదా సంస్థలు పర్యావరణహిత గ్యాస్‌లు, ప్రత్యేక వినియోగ గ్యాస్‌ల కోసం ఆకుపచ్చ రంగు సిలిండర్లను ఉపయోగిస్తాయి. అయితే ఈ రంగు అర్థం ప్రాంతానికీ, సరఫరాదారునికీ అనుగుణంగా మారవచ్చు.

    రంగుల కంటే లేబుల్‌ ముఖ్యం

    గ్యాస్ సిలిండర్ల రంగులు గుర్తింపునకు ఉపయోగపడినా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకూడదు. సిలిండర్‌పై ఉన్న లేబుల్‌, గ్యాస్‌ పేరు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే రంగు ప్రమాణాలు దేశానికీ, సంస్థకీ అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది.

  • గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 13.84 పాయింట్లు లేదా 0.019 శాతం లాభంతో 74,360.01 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్లు లేదా 0.047 శాతం లాభంతో 23,416.55 వద్ద నిలిచాయి.

    పనాసియా బయోటెక్ లిమిటెడ్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, క్వాలిటీ వాల్స్ (ఇండియా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోబ్ ఇంటర్నేషనల్ క్యారియర్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, షా మెటాకార్ప్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • డబ్బు గురించి ఆందోళన చెందకూడదంటే ఒక మనిషికి ఎంత సంపాదన కావాలి? ఏడు అంకెల జీతం, చేతిలో లగ్జరీ కారు, మెట్రో సిటీలో సొంత ఇల్లు ఉంటే ఆర్థిక భద్రత దొరికినట్లేనా? అసలు విజయానికి కొలమానం ఏమిటి?.. నేటి డిజిటల్ యుగంలో చాలా మంది ప్రొఫెషనల్స్‌ మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే స్టార్టప్ విజయాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్స్ మధ్య.. సమాజం దృష్టిలో సక్సెస్ అయిన వారు సైతం లోలోపల ఒక రకమైన అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న అసలు విషయాలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

    ‘ఎవర్ హోప్ ఆంకాలజీ’ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సన్నీ గార్గ్ ఇటీవల పంచుకున్న ఒక పోస్ట్‌ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయనను కలిసిన 34 ఏళ్ల గుర్గావ్ యువకుడి కథ ఇది. పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ఆ యువకుడి వార్షిక ఆదాయం రూ.40 లక్షలు. బీఎండబ్ల్యూ కారు, గుర్గావ్‌లో సొంత 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. కానీ, ఆ యువకుడు పంచుకున్న కొన్ని విషయాలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. ‘డాక్టర్, నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టడం లేదు’ అన్నాడు.  

    సదరు యువకుడు భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే మొదటి 1% జనాభాలో ఉన్నాడు. అయినా అతను ఎందుకు కుంగిపోతున్నాడనే దానికి డాక్టర్ గార్గ్ విశ్లేషణ నేటి సమాజానికి అద్దం పడుతోంది. ‘ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. ఆ యువకుడి రిఫరెన్స్ పాయింట్ మారింది. ఒకప్పుడు అతను తన గ్రామంలోని పొరుగువారితో పోల్చుకునేవాడు. కానీ ఇప్పుడు అతను తనను తాను లింక్డ్‌ఇన్‌లో రూ.80 కోట్లకు స్టార్టప్‌ను విక్రయించిన 28 ఏళ్ల కుర్రాడితో పోల్చుకుంటున్నాడు. ఆదాయం పెరిగింది, కానీ అంచనాలు పది రెట్లు పెరిగాయి. దీనిపేరే మాడ్రన్‌ పావర్టీ’ అన్నారు.

    మూడు ప్రశ్నలు

    ఆ యువకుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గార్గ్ అడిగిన మూడు ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాలు అసలు సమస్యను వెల్లడించాయి.

    1. గత ఏడాదిలో ఒక్కసారైనా ‘నాకు ఇది చాలు’ అని అనుకున్నావా?

    సమాధానం: ఎప్పుడూ లేదు

    2. ఎవరి కోసం ఇంత డబ్బు సంపాదిస్తున్నావు?

    సమాధానం: నాకు తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లు పరిగెడుతున్నారు, నేను పరిగెడుతున్నాను.

    3. నీ జీవితంలో డబ్బు కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేసిన పని ఏదైనా ఉందా? 

    సమాధానం: కొద్దిసేపు ఆగి.. ‘ఏదీ లేదు’.

    డబ్బు ప్రతి పనికి కొలమానంగా మారినప్పుడు మనిషి యంత్రంగా మారిపోతాడని డాక్టర్ గార్గ్ హెచ్చరించారు. రూ.40 లక్షలు సంపాదించినా, రూ.4 కోట్లు సంపాదించినా ప్రతి ఆరు నెలలకోసారి ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడం సులభం. కానీ అంతర్గత గుర్తింపు సమస్యలను పరిష్కరించడం కష్టమని, 90% మంది ఈ రెండింటికీ తేడా తెలియక గందరగోళ పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

    విజయాన్ని ఎల్లప్పుడూ మనకంటే పైన ఉన్నవారితోనే కొలిస్తే.. ఆ విజయానికి ఎప్పటికీ ముగింపు రేఖ ఉండదు. రేసు గుర్రంలా పరిగెత్తడం ఆపి ఎక్కడ ఫుల్‌స్టాప్ పెట్టాలో తెలుసుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌!

  • పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న వేళ, ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు అయిన 'వ్యాగన్ఆర్‌'(Maruti Suzuki WagonR Flex Fuel)ను ఆవిష్కరించింది. ఈ కొత్త రూపంలోని హ్యాచ్‌బ్యాక్, ఈ85 ఇంధనంతో (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    2026 జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందు, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ఆర్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు పాల్గొన్నారు.

    ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ఆర్‌ కారు సాధారణ పెట్రోల్ వాహనాలకు భిన్నంగా.. ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. కాబట్టి కార్బన్ ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయి. వాహన పరిశ్రమలో ఇథనాల్ వినియోగాన్ని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మారుతి సుజుకి ఈ కారును లాంచ్ చేయడం జరిగింది.

    సాధారణ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో అనేక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇందులో మెరుగైన ఫ్యూయల్ డెలివరీ కాంపోనెంట్‌లు, ఇథనాల్‌కు అనుకూలమైన మెటీరియల్స్, అప్డేటెడ్ ఇంజిన్ క్యాలిబ్రేషన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. పవర్‌ట్రెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఇథనాల్ గాఢత ఆధారంగా రియల్ టైమ్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ అండ్ కంబషన్ పారామీటర్‌లను అడ్జస్ట్ చేస్తుంది. తద్వారా ఉత్తమ పనితీరు, సామర్థ్యంతో పాటు మన్నికను నిర్ధారిస్తుంది.

    సాధారణ వ్యాగన్ఆర్ భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి పాపులర్ మోడల్. అలాంటి కారు ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ రూపంలో వచ్చింది. ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని ఆటోమొబైల్ ఔత్సాహికులు భావిస్తున్నారు.

    నితిన్ గడ్కరీ స్పందన
    భారతదేశం ప్రతి ఏటా ముడిచమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యామ్నాయ ఇంధనం. దీనివల్ల రైతులు, పరిశ్రమలు, పర్యావరణం ఏకతాటిపైకి వచ్చి ప్రయోజనం పొందుతాయిని వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

    భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రవేశపెట్టి, స్వచ్ఛమైన, స్వయం సమృద్ధి గల రవాణా.. అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ, దీనికి అనుగుణంగా అడుగు వేసినందుకు మారుతి సుజుకిని నేను అభినందిస్తున్నాను. ఈ చొరవ ఇతర కార్ల తయారీదారులను కూడా వారి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుందని విశ్వసిస్తున్నాని గడ్కరీ పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!

  • హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానాశ్రయాల ఆపరేటర్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ 1.8 శాతం వాటాను ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌కి ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించింది. వీటి విలువ రూ. 1,906 కోట్లు.

    ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌ డీల్‌ డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్‌నర్స్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్విటీ ఫండ్‌ సగటున ఒక్కో షేరుకి రూ. 97.75 రేటు చొప్పున 19.50 కోట్ల షేర్లను విక్రయించింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ వీటిని కొనుగోలు చేసింది. జీఎంఆర్‌ గత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి మళ్లిన సంగతి తెలిసిందే.

Sports

  • భారత క్రికెటర్ల రిటైర్మెంట్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంటనే కొందరు ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడేందుకు క్యూ కడుతుండటంతో కొత్త విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఈ అంశంపై త్వరలో జరుగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కీలక చర్చ జరపనుంది.

    ఇటీవల తమిళనాడు ఆటగాడు విజయ్‌ శంకర్‌ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, వెంటనే క్యాండీ రాయల్స్‌ తరఫున లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్‌లలో ఆడే ధోరణిపై బీసీసీఐ దృష్టి సారించింది.

    గతంలో దినేశ్‌ కార్తీక్‌, యువరాజ్‌ సింగ్‌, ఉన్ముక్త్‌ చంద్‌, ప్రవీణ్‌ తాంబే, ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.

    ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, దేశవాళీ క్రికెట్ లేదా ఐపీఎల్ ఆడుతున్నా.. ఏ క్రికెటర్‌కూ విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే దేశీయంగా సరైన అవకాశాలు రాని కొందరు క్రికెటర్లు అదే పనిగా  భారత క్రికెట్‌తో సంబంధాలు తెంచుకొని పరాయి దేశ లీగ్‌లవైపు పయనమవుతున్నారు. 

  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్ (Kona Srikar Bharat) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

    "భారత్ తరఫున ఆడటం నా జీవితంలో అత్యున్నత గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు, బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని పేర్కొన్నాడు.

    అలాగే తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్‌లో తొలి అవకాశం ఇచ్చిన కోహ్లీకి, టెస్టు అరంగేట్రం కల్పించిన రోహిత్‌కు, ఇండియా-ఏ నుంచి జాతీయ జట్టు వరకు తనను ప్రోత్సహించిన ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

    2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.

    అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.

    లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భరత్‌ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో భరత్‌ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు.  

    అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్‌, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తానని భరత్ వెల్లడించాడు.
     

  • అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్‌-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

    రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.

    అంతలోనే గాయమా?
    ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్‌ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్‌ చేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.

    ఫలితంగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు.

    రోహిత్‌ కూడా డౌటే
    ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సైతం సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..

    కోచ్‌ ఏమన్నాడంటే..
    ‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్‌, రోహిత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్‌ ఒకేలా ఉంటుంది.

    వాళ్లు ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.

    ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్‌ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

    ఏం జరుగుతోంది?
    ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. 

    చదవండి: ‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

  • ఐపీఎల్‌-2026 ఆరంభంలో పంజాబ్‌ కింగ్స్‌ అద్భుత విజయాలు సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఊహించనిరీతిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోయి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. వచ్చే సీజన్‌ ఆరంభానికి ముందు ఈ ఐదుగురు ఆటగాళ్లను తప్పక వదిలించుకోవాలన్నాడు. ఇందులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌కు విహారి ప్రథమ స్థానం ఇచ్చాడు.

    రూ. 11 కోట్లు అందుకునే అర్హత లేదు
    తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. పంజాబ్‌ మొట్టమొదటగా మార్కస్‌ స్టొయినిస్‌ను వదిలేయాలి. అతడిని ఏకంగా రూ. 11 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ధరకు రిటైన్‌ చేసుకున్నారు.

    ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడతాడని ఇంత ధర పెట్టారు. కానీ అందుకు అతడు అర్హుడు కాడు. వచ్చే రెండు- మూడేళ్లలో అతడు రిటైర్మెంట్‌కు చేరువవుతాడు. బౌలింగ్‌లోనూ అతడు ప్రభావం చూపడం లేదు.

    వీళ్లను కూడా వదిలేయండి
    అతడిని వేలంలోకి వదిలి.. కావాలంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. స్టొయినిస్‌తో పాటు నేహాల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌లను కూడా వేలంలోకి వదిలేయండి. అసలు వాళ్లతో ఈ సీజన్‌లో ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు.

    లాకీ ఫెర్గూసన్‌ కూడా జట్టుకు అవసరం లేదు. వీళ్లందరినీ వదిలేస్తే పర్సులో కనీసం రూ. 25 కోట్లు మిగులుతాయి’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2026లో  స్టొయినిస్‌ తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 216 పరుగులు చేశాడు. అదే విధంగా నాలుగు మ్యాచ్‌లలో బౌలింగ్‌ చేసి రెండే వికెట్లు తీశాడు.

    ఇక నేహాల్‌ వధేరా ఆరు ఇన్నింగ్స్‌ ఆడి 65 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. శశాంక్‌ సింగ్‌ సైతం తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 132 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫెర్గూసన్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. మిచెల్‌ ఓవెన్‌కు అసలు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు.

    చదవండి: టీమిండియాలోకి కొత్త ప్లేయర్‌!

  • క్రికెట్‌కు మక్కాగా పేరొందిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం మరో అరుదైన ఘనత సాధించింది. 1884లో తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ చారిత్రక మైదానం.. ఇవాళ ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన టెస్టుతో 150 టెస్టు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది.

    లార్డ్స్‌ తర్వాత అత్యధిక టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన మైదానంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 118 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆతర్వాతి స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ ఉంది. ఈ మైదానం ఇప్పటివరకు 114 టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఆతర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌లోని ద ఓవల్‌ గ్రౌండ్‌ ఉంది.  ఈ మైదానంలో ఇప్పటివరకు 108 టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి.

    కాగా, లార్డ్స్‌లో ఇప్పటివరకు జరిగిన 150 టెస్ట్‌ల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు ఏకంగా 146 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 60 విజయాలు, 35 పరాజయాలు, 51 డ్రాలు నమోదు చేసింది. ముఖ్యంగా యాషెస్‌ సిరీస్‌లో ఎన్నో క్లాసిక్‌ మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగాయి.

    దాదాపు 2.5 మీటర్ల వంపు (Slope) కలిగిన ప్రత్యేకత లార్డ్స్‌కు మాత్రమే ఉంది. మ్యాచ్‌ ప్రారంభ రోజున పేసర్లకు అనుకూలించే ఈ పిచ్‌ క్రమంగా ఎండిపోతూ స్పిన్నర్లు, బ్యాటర్లకు కూడా సహకరిస్తుంది.

    ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదలైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. 

    అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే 8 పరుగులు చేసి జేమీసన్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 11.2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 31-1గా ఉంది.బెన్‌ డకెట్‌ 19, జేకబ్‌ బెతెల్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

    న్యూజిలాండ్‌: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, విలియం ఓ'రూర్క్

    ఇంగ్లండ్: ఎమిలియో గే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), గస్ అట్కిన్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

  • మరో రెండు రోజుల్లో (జూన్‌ 6) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ (ముల్లాన్‌పూర్‌) కోసం టీమిండియా సర్వం సిద్దం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఓ యువ ఆటగాడు  అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

    టీమిండియా సహాయ కోచ్ ర్యాన్‌ టెన్‌ డస్కటే ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. యువ స్పిన్నర్లు హర్ష్‌ దూబే, మానవ్‌ సుతార్‌లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సంకేతాలు ఇచ్చాడు. దీంతో వీరిలో ఒకరు టెస్టు క్యాప్ అందుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

    ముల్లాన్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌, రెండో స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ బరిలోకి దిగడం దాదాపుగా ఖాయం కాగా.. మూడో స్పిన్నర్‌ స్థానం​ కోసం హర్ష్‌, సుతార్‌ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. 

    పేసర్లుగా మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ పేర్లు ఖరారయ్యాయి. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్‌ పేస్‌ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖయంగా తెలుస్తోంది.

    బ్యాటింగ్‌ విషయానికొస్తే.. శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మేనేజ్‌మెంట్‌ ఒకవేళ మరో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌తో బరిలోకి దిగాలని భావిస్తే.. నితీశ్‌ను పక్కన పెట్టి ధృవ్‌ జురెల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. 
     

  • గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ముఖ్యంగా గౌతం గంభీర్‌ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్‌కు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా.

    ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని 3-2తో కోల్పోయింది. దాదాపుగా దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఈ సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనలో 2-2తో డ్రా చేసుకోవడంతో జట్టుపై విమర్శల జడి కాస్త తగ్గింది.

    ఇదిలా ఉంటే.. చాన్నాళ్ల తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. జూన్‌ 6 నుంచి ముల్లన్‌పూర్‌లో ఈ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగం కాదు.

    భారత్‌కు అత్యంత ముఖ్యం
    అయినప్పటికీ ఈ మ్యాచ్‌ భారత్‌కు అత్యంత ముఖ్యమని అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ సబా కరీం. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు మ్యాచ్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం కాదు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోకూడదు.

    టీమిండియాకు ఇది అతి ముఖ్యమైన మ్యాచ్‌. ఈ మ్యాచ్‌ ద్వారా తమ లోపాల్ని సరిచేసుకుని.. జట్టును పరీక్షించుకునే వీలు కలిగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని అధిగమించాల్సి ఉంది.

    టెస్టు క్రికెట్‌పై భారత జట్టు మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా సొంతగడ్డపై గతంలో మాదిరి టీమిండియా పటిష్టంగా కనిపించడం లేదు’’ అని సబా కరీం అభిప్రాయపడ్డాడు.

    యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం
    అదే విధంగా.. ‘‘అఫ్గన్‌తో టెస్టు రూపంలో యువ ఆటగాళ్లను కూడా పరీక్షించే అవకాశం వచ్చింది. కొత్త కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. ఒకవేళ వాళ్లు బాగా ఆడితే తదుపరి సిరీస్‌లకు కూడా ఎంపిక చేయండిజ

    ఇది ఇప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది గెలుపోటముల గురించి ఆలోచించే సమయం కాదు. భవిష్యత్తును తప్పక దృష్టిలో పెట్టుకోండి’’ అని సబా కరీం సెలక్టర్లకు సూచించాడు.

    అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు
    శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, రిషభ్‌ పంత్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే, ధ్రువ్‌ జురెల్‌.

    చదవండి: కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన వ్యాఖ్యలు

  • సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌-2026 టోర్నీతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు.. జూన్‌ 6 నుంచి జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.

    స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడే క్రమంలో ముల్లన్‌పూర్‌లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ప్లేయర్లు.. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో భారత్‌ అఫ్గన్‌తో టెస్టుతో పాటు.. మూడు వన్డేలు ఆడనుంది.

    ప్రస్తుత అత్యుత్తమ జట్టు ఇదే
    ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఇదేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది.

    తన జట్టులో కేఎల్‌ రాహుల్‌కు ఓపెనర్‌గా స్థానమిచ్చిన సంజయ్‌ బంగర్‌.. యశస్వి జైస్వాల్‌ను మాత్రం విస్మరించాడు. అతడికి బదులు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ను రాహుల్‌కు జోడీగా ఎంపిక చేశాడు.

    ఆసీస్‌, ఇంగ్లండ్‌ దిగ్గజాలకు చోటు
    కాగా గతేడాది జైసూ ఏకంగా మూడు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు చేశాడు. మరోవైపు.. హెడ్‌ 817, రాహుల్‌ 813 పరుగులు సాధించారు. ఇక వన్‌డౌన్‌లో ఇంగ్లండ్‌ లెజెండ్‌ జో రూట్‌ను ఎంపిక చేసిన సంజయ్‌ బంగర్‌.. నాలుగో స్థానానికి టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో ఆసీస్‌ దిగ్గజం స్టీవ్‌ స్మిత్‌కు చోటు ఇచ్చాడు.

    గతేడాది రూట్‌ 805 పరుగులతో సత్తా చాటగా.. స్మిత్‌ 651 రన్స్‌ రాబట్టాడు. వీరిద్దరి కంటే మెరుగ్గా గిల్‌.. ఏకంగా 983 పరుగులతో దుమ్ములేపాడు. ఇక తన జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా బంగర్‌.. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌కు స్థానమిచ్చాడు. ఇక ఏడో స్థానానికి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంపిక చేశాడు.

    పేస్‌ దళంలో ఎవరంటే
    అదే విధంగా స్పిన్నర్ల కోటాలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్‌ బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ను బంగర్‌ ఎంచుకున్నాడు. గతేడాది అతడు ఆరు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. పేస్‌ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌లతో పాటు టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బంగర్‌ చోటిచ్చాడు.

    ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ కంబైన్డ్‌ టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌ (సంజయ్‌ బంగర్‌)
    కేఎల్‌ రాహుల్‌, ట్రవిస్‌ హెడ్‌, జో రూట్‌, శుబ్‌మన్‌ గిల్‌, స్టీవ్‌ స్మిత్‌, రిషభ్‌ పంత్‌, బెన్‌ స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, కేశవ్‌ మహరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    చదవండి: కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

  • త్వరలో (జూన్‌ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026లో హ్యామ్‌ స్ట్రింగ్‌ గాయానికి గురయ్యాడు. 

    ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ ప్రకటించాడు.

    ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌ సిరీస్‌కు విరాట్‌ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్‌ చేసిందని సమాచారం. విరాట్‌ రీప్లేస్‌మెంట్‌ కోసం తిలక్‌ వర్మ, దేవదత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.

    ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్‌.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్‌, పడిక్కల్‌, పాటిదార్‌ను కాదని రుతురాజ్‌వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. 

  • బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ కోచ్, ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షాన్‌ టైట్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు ధృవీకరించాడు. 2025 మేలో బాధ్యతలు చేపట్టిన టైట్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యలోనే తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టైట్‌ శిక్షణలో యువ పేసర్ నహిద్‌ రాణా విశేషంగా రాణించాడు. అతడి వేగం, ప్రదర్శన మెరుగుపడటంలో టైట్ పాత్ర కీలకమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    టైట్‌ కీలక సమయంలో బంగ్లాదేశ్‌ జట్టును దెబ్బేశాడు. జూన్‌ 9 నుంచి 21 వరకు ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు టైట్‌ హ్యాండ్‌ ఇవ్వడం​ బంగ్లాదేశ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఈ సమయంలో బంగ్లా పేసర్లకు టైట్‌ శిక్షణ (ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు) చాలా ముఖ్యం. 

    అలాంటిది కారణం ఏంటో చెప్పకుండా టైట్‌ అర్దంతరంగా బంగ్లా జట్టుకు హ్యాండ్‌ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. టైట్‌ స్థానంలో మాజీ బంగ్లా పేసర్ తల్హా జుబైర్‌ను తాత్కాలిక పేస్ బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

    కాగా, 3 మ్యాచ్‌ల వన్డే‌, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. జూన్‌ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డేలు జూన్‌ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనుండగా.. మూడు టీ20లు జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌లో జరుగనున్నాయి.

    ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను ఇదివరకే ప్రకటించగా.. తొలి రెండు వన్డేల కోసం బంగ్లాదేశ్‌ జట్టును నిన్ననే ప్రకటించారు.

    ఆస్ట్రేలియా వన్డే జట్టు..
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా

    ఆస్ట్రేలియా టీ20 జట్టు..
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, ఆడమ్ జంపా

    తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్‌ జట్టు..
    మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, షొరీఫుల్‌ ఇస్లాం, నహిద్‌ రాణా

     

     

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. దేశీ స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టును ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు ఏడింట నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.

    ఇక కమిన్స్‌ తిరిగి వచ్చిన తర్వాత కూడా సన్‌రైజర్స్‌ హవా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్‌లో లీగ్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ హైదరాబాద్‌ జట్టు తొమ్మిది గెలిచి.. 18 పాయింట్లతో పట్టికలో టాప్‌-3లో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.

    ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమి
    అయితే, అనూహ్య రీతిలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి.. సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఇంటిబాటపట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్టార్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని (కావ్యా మారన్‌) ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశాడు.

    తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడానికి కావ్యా మారన్‌ కారణమని పరోక్షంగా లివింగ్‌స్టోన్‌ వ్యాఖ్యానించాడు. స్టిక్‌ టు క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్‌కి అత్యవసరమైన ఓ ఆటగాడిని మా జట్టు కొనుగోలు చేసింది.

    అతడిని అమితంగా ప్రేమిస్తారు
    వేలం సమయంలో మా యాజమాన్యం పర్సులో బోలెడు డబ్బు ఉంది. కాబట్టి అతడిని సొంతం చేసుకోగలిగింది. మా యజమానులకు అతడంటే చాలా చాలా ఇష్టం. అతడిని అమితంగా ప్రేమిస్తారు. అందుకే జట్టులోకి తీసుకున్నారు.

    మా కోచ్‌ డాన్‌ (డానియల్‌ వెటోరి) స్వయంగా నాతో ఈ మాట చెప్పాడు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ఎవరో ఒకరు గాయపడితే తప్ప నాకు తుదిజట్టులో చోటు దక్కదని తెలిసింది’’ అని లివింగ్‌స్టోన్‌ పేర్కొన్నాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్‌ ప్రస్తావించిన ఆటగాడు ఎవరా? అని నెట్టింట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సలీల్‌ అరోరా పేరును తెరమీదకు తెస్తున్నారు.

    ఆ ఆటగాడు ఎవరు?
    పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల సలీల్‌ అరోరా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సన్‌రైజర్స్‌- ముంబై ఇండియన్స్‌ అతడి కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్‌ సలీల్‌ను సొంతం చేసుకుంది.

    సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో పోరు సందర్భంగా సలీల్‌ అరోరా సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగి 9 పరుగులకే నిష్క్రమించాడు. సీజన్‌లో మొత్తంగా పదకొండు ఇన్నింగ్స్‌ ఆడి 156 పరుగులు చేశాడు.

    ఇదిలా ఉంటే.. గతేడాది ఆర్సీబీ తరఫున ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 112 పరుగులే చేయడంతో పాటు  రెండు వికెట్లు తీశాడు. 

    ఈ క్రమంలో ఆర్సీబీ అతడిని వదిలేయగా.. సన్‌రైజర్స్‌ ఊహించని రీతిలో రూ. 13 కోట్ల భారీ ధరకు లివింగ్‌స్టోన్‌ను కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడించగా.. అతడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

     

    చదవండి: భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువీకి చోటు!

  • యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20) సీజన్‌-5కు ముందు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఫ్రాంచైజీ తమ జట్టులో కనీసం నలుగురు ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్లను, ఓ ఐర్లాండ్‌ ఆటగాడిని తప్పనిసరిగా చేర్చుకోవాలని నియమం విధించారు. 

    ఈ ఐదుగురు ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన కనీస 11 మంది ఫుల్‌ మెంబర్‌ దేశాల ఆటగాళ్ల కోటాలో (ఓవర్సీస్‌) భాగంగా పరిగణించబడతారు. 

    ఈ ఏడాది నవంబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 20 వరకు జరిగే సీజన్‌-5 కోసం విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. ప్రతి జట్టులో 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండాలి. అందులో కనీసం 11 మంది ఫుల్‌ మెంబర్‌ దేశాల ఆటగాళ్లు, నలుగురు యూఏఈ ఆటగాళ్లు (ఒక క్యాప్డ్‌, ఒక అండర్‌-23 తప్పనిసరి), ఇద్దరు జీసీసీ దేశాల ఆటగాళ్లు (ఒకరు సౌదీ అరేబియా, మరొకరు కువైట్‌ నుంచి), అలాగే మరో అసోసియేట్‌ దేశానికి చెందిన ఆటగాడు ఉండాలి.

    ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నలుగురు, ఐర్లాండ్‌కు చెందిన ఒకరు, యూఏఈకి చెందిన నలుగురు, జీసీసీ దేశాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను "మ్యాండేటరీ ప్లేయర్స్‌"గా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నిబంధన వెనుక అసలు కారణాన్ని ILT20 వెల్లడించకపోయినా.. ఇది ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు, ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, క్రికెట్‌ ఐర్లాండ్‌ మధ్య ఉన్న అవగాహన ఒప్పందానికి సంబంధించినదిగా భావిస్తున్నారు.

    అదే సమయంలో ప్రతి ఫ్రాంచైజీకి గరిష్ఠ వేతన పరిమితిని 20 లక్షల అమెరికన్‌ డాలర్లుగా నిర్ణయించారు. కనీసం 15 లక్షల డాలర్లు ఆటగాళ్లపై ఖర్చు చేయడం తప్పనిసరి. ఒక్కో ఆటగాడికి కనీస వేతనం 10 వేల డాలర్లు ఉండగా, గరిష్ఠ వేతనానికి మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అదనంగా ఒక ‘వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌’ను జట్టులో చేర్చుకునే అవకాశం కూడా కల్పించారు.

    ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్‌రైడర్స్‌, డెజర్ట్‌ వైపర్స్‌, దుబాయ్‌ క్యాపిటల్స్‌, షార్జా వారియర్స్‌, గల్ఫ్‌ జెయింట్స్‌ ఈ టోర్నీలో పాల్గొనే ఆరు జట్లు. గత సీజన్‌లో డెజర్ట్‌ వైపర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది.
     

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: ఏపీలో కాస్ట్‌ కటింగ్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించని ప్రభుత్వం.. కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు చెబుతోంది. అనవసర ఖర్చులు, ఇంథన పొదుపు, వర్చువల్ గవర్నెన్స్, వర్క్‌ ఫ్రం హోమ్ పై ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.

    50 శాతం అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్‌లలో చేయాలన్న ప్రభుత్వం.. మీటింగ్‌లు, సమీక్షల కోసం అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోని అధికారులు ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా మంత్రులు, అధికారులు విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్ల వినియోగం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. డెకరేటివ్ లైటింగ్స్, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొంది.

  • సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.

    అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు  ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. 

    ప్రకాశంలో విషాదం
    ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

     

     

  • సాక్షి,విజయవాడ: అమరావతిలో ఇప్పటికే భారీ వ్యయం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు భవనాల హంగుల కోసం మరోసారి వందల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు సంబంధిత పనులకు నిధులు కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    సూపర్ బ్లాక్‌ ఎఫ్‌లో ఉన్న హైకోర్ట్‌ భవనం వద్ద అదనపు వసతుల కోసం రూ.540 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో పార్కింగ్‌, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్‌ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్‌ స్టేషన్‌, బ్యూటిఫికేషన్‌ పనులు ఉన్నాయి.

    అదే విధంగా, రాయపూడి ప్రాంతంలోని ఐఏఎస్‌ అధికారుల నివాస భవనాలకు కూడా హంగులు జోడించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లలో హంగుల కోసం రూ.94 కోట్ల రూపాయల వ్యయంకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    ఈ పనుల్లో స్టోర్‌ రూమ్స్‌, హోమ్‌ ఆటోమేషన్‌ సిస్టమ్స్‌, వార్డ్‌రోబ్స్‌, జ్యూస్‌ కౌంటర్స్‌, స్పైరల్‌ స్టెయిర్‌కేస్‌, బాల్కనీ విత్‌ కెనేపీ, పార్కింగ్‌ వసతులు వంటి అంశాలు ఉన్నాయి.ఇప్పటికే అమరావతిలో భవనాల నిర్మాణానికి భారీ నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటికి అదనంగా హంగుల కోసం మళ్లీ నిధులు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది.

  • సాక్షి,అమరావతి: గత ఎన్నికల్లో ‘సంపద సృష్టిస్తా..పేదలకు పంచుతా..’ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల పెంపుపై దృష్టి పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం విక్రయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    కేబినెట్‌ సమావేశంలో ఏపీలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. గోవా తరహాలో బీచ్‌లలో మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ షాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్‌లో అన్ని బీచ్‌లలో అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం బీచ్‌లలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తోందని, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఒంగోలు:  ప్రకాశం జిల్లా చెరువుకొమ్మ పాలెంలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు.  1) కరేటి అభిరామ్ (14) , కరేటి సుశాంత్ (12), పొదిలి చెన్ను (11) ఇల్లా దినేష్ (10)గా గుర్తించారు. చిన్నారుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారులు చెరుకు పాలెంగా గుర్తించారు. 

    చిన్నారులు నీటికుంటలో పడ్డారనే సమాచారంతో అప్రమత్తమైన స్థానికులు నీటికుంటలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నలుగురు చిన్నారులు మృత దేహాల్ని వెలికి తీశారు. చిన్నారులు మృతిపై కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.  

  • సాక్షి,అమరావతి: పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్‌ కల్యాణ్‌ వెళ్లిపోయారు. అయితే కేబినెట్‌ సమావేశం మధ్యలో పవన్‌ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్‌ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లిపోయారు. 

Family

  • గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్‌ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

    అంకిత్‌ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్‌ని సోషల్‌ మీడియాలో ఎక్స్‌లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్‌ రాజీనామా లెటర్‌ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్‌గా రిజైన్‌ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్‌ని తిర్కస్కరించాడని చెప్పారు. 

    అప్పుడు వెంటనే అంకిత్‌ పాండే డోంట్‌.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు.  ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్‌ బాక్స్‌తో ఆ అకౌంటెంట్‌ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్‌ పంచిపెట్టాడు. పైగా జాబ్‌లో మళ్లా జాయిన్‌ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్‌ అభ్యర్థించాడని అన్నారు. 

    అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్‌ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్‌ పాండే పోస్ట్‌లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.

    (చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!)

     

  • బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్‌నెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అధిక బరువు ఏ రేంజ్‌లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్‌ మాదిరి స్మార్ట్‌ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

    ఆ ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్‌. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంట్‌ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. 

    భోజన ప్రణాళిక..
    తొలిరోజు..
    ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్‌తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్‌  బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. 

    మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.

    రెండవ రోజు
    రెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్‌తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. 

    సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.

    3వ రోజు
    ఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. 

    మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.

    4వ రోజు
    కాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్‌తో రెండు రైస్ కేక్‌లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.

    5వ రోజు
    ఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్‌నట్‌లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.

    బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

     

    (చదవండి: 'సక్సెస్‌'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్‌ని..)

     

     

     

International

  • మనామా: ఆ భారతీయుడు పొట్టకూటి కోసం బహ్రెయిన్‌ వెళ్లాడు. ఆ దేశంలో చిన్నచితకా వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ చిరువ్యాపారిని అదృష్టలక్ష్మీ వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 కోట్ల లక్కీడ్రాలో అతనికి దక్కింది. దీంతో ప్రవాస భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు.

    కేరళ త్రిసూర్‌కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గత 23 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ పలురకాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏలాగైనా తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని భావించిన కృష్ణకుమార్ లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ బంఫర్‌ డ్రాలో రూ. 52 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకుంది. 

    దీంతో బహ్రెయిన్‌ కరెన్సీ ప్రకారం రూ. రెండు కోట్ల దిర్హమ్‌లు ( రూ. 52 కోట్ల) రుపాయల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అయితే తను కొన్న టికెట్‌ లక్కీడ్రాలో ఎంపికవడంతో నిర్వాహకులు తనకు ఫోన్‌ చేశారని ఆసమయంలో తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ ఉందని కృష్ణకుమార్ తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనేవాడినని ఇప్పుడు స్వంతంగా టికెట్‌ కొనడం దానికి లాటరీ తాకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

    ఇంతపెద్దమెుత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని బహుమతి డబ్బులతో ఏం చేయాలనే విషయం తన కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కృష్ణకుమార్ అన్నారు. అయితే ఈ లాటరీలో మెుదటి బహుమతి 25 మిలియన్ల దిర్హమ్‌లు కాగా ఐదుగురికి ఒక మిలియన్, లగ్జరీ కార్లు బహుమతులుగా ఉన్నాయి.