సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో కూడిన మంత్రుల బృందం ఆర్టీసీ కార్మీకులతో సుదీర్ఘంగా చర్చించింది. 32 డిమాండ్లపై మంత్రులు చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. చివరకు అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు.
2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మీక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం వరకు జరిగిన సమ్మె ముగిసింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి బస్సులు యథావిధిగా రోడ్డెక్కుతాయని ప్రకటించారు.
ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈ విలీన ప్రక్రియ జరగ్గా, తెలంగాణలో మాత్రం జరగలేదు. కార్మిక సంఘాల నుంచి కూడా పెద్దగా డిమాండ్ లేకపోవటంతో దాని ఊసే లేదు. కానీ ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం ఉన్నట్టుండి ఆ ప్రక్రియ ప్రారంభించింది.
గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అపాయింటెండ్ డేట్ ప్రకటించకుండా, విలీన ప్రక్రియ ఎలా జరగాలో తేల్చే పేరుతో ప్రభుత్వం సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి కార్మీకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నా... ప్రభుత్వం మాత్రం దాని ఊసెత్తలేదు.
ఎన్నికల సందర్భంగా, ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా, అధికారంలోకి వచి్చన తర్వాత మాత్రం పట్టించుకోలేదు. చివరకు కార్మీక సంఘాలు సమ్మెకు దిగటం, సమ్మె రెండో రోజే ముగ్గురు కార్మీకులు ఆత్మహత్యలకు యత్నించటం, అందులో డ్రైవర్ శంకర్గౌడ్ మృతి చెందటంతో ప్రభుత్వం దిగి వచి్చంది. చాలా దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ వచి్చనా, కార్మీక సంఘాలు సమ్మెకు దిగటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తొలుత కఠినంగానే వ్యవహరించాలని భావించింది. కానీ, శంకర్గౌడ్ ఆత్మహత్య, మరో ఇద్దరు కార్మీకుల ఆత్మహత్య యత్నంతో ప్రభుత్వం తీరు మార్చుకుంది.
13 గంటల పాటు చర్చలు...
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మె పరిష్కార చర్చలు ఏకంగా 13 గంటలపాటు సాగాయి. శుక్రవారం ఉదయం 11.30కు తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్రాజ్, దానకిశోర్, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన అధికారుల కమిటీ సచివాలయంలో ¿బేటీ అయింది. నాలుగు రోజుల క్రితం ఇదే కమిటీతో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ చర్చలు విఫలమైన మరుసటిరోజు తొలి షిఫ్టు నుంచే సమ్మె మొదలైంది. శుక్రవారం ఈ కమిటీతో చర్చలు మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగాయి.
భోజనానంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో ప్రారంభమయ్యాయి. ఏకబిగిన ఆ చర్చలు అర్ధరాత్రి 12.30 వరకు కొనసాగటం విశేషం. తొలుత రెండు జేఏసీల ప్రతినిధులతో, ఆ తర్వాత సంఘాల వారీగా, మధ్యలో జేఏసీ ప్రతినిధుల వారీగా చర్చలు జరిపారు.
కొద్దిసేపు మంత్రులు వారిలోవారు విడిగా చర్చించుకోగా, కార్మీక సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు.
అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చర్చల ప్రణాళిక వెనుక..శంకర్గౌడ్ అంత్యక్రియలకు ఆర్టీసీ కార్మీక సంఘాల నేతలు హాజరు కావొద్దన్నదేనన్న చర్చ నడుస్తోంది. నేతలు అంత్యక్రియలకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అది రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ అనుమానమన్న చర్చ కార్మీక సంఘాల్లో జరుగుతోంది.















