Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని  'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.

    అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్‌ఎస్ సిద్దం చేసింది.

    ఇరాన్‌తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం,  ఏ-10 థండర్‌బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్‌ నిఘా విమానం, రెండు  ఎమ్సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.

    అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక  ఎమ్క్యూ-4సీ ట్రైటాన్  నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.

    ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్‌లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్  జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • కువైట్‌లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.  దట్టమైన పొగ, మంటల కారణంగా ఐదుగురు వ్యక్తులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

    ఈ విష‌యాన్ని  కువైట్ అధికారిక అగ్నిమాపక సంస్థ 'జనరల్ ఫైర్ ఫోర్స్' ధృవీకరించింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కువైట్ వార్తా సంస్థ (KUNA) ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

    అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. 

    కాగా ఇటీవలి కాలంలో కువైట్‌లోని నివాస ప్రాంతాలలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.
    చదవండి: క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
     

  • వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్‌తో యుద్ధం విషయంలో కాంగ్రెస్‌ ట్రంప్‌పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.

    ఇరాన్‌తో యుద్ధం ట్రంప్‌ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్‌ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.

    ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్‌ సెనేటర్ టిమ్‌ కెయిన్‌ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్‌లో నెగ్గింది.

    అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్‌లో ఓటింగ్‌ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉ‍న్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్‌, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్‌పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.

    అమెరికా చట్టం ఏం చెబుతుంది.
    అమెరికా రాజ్యాంగం  ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. 

    అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్‌ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్‌లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి.

  • రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.

    ‘‘గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మెలోనీని ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇది భారత్-ఇటలీ మధ్య ఉన్న నిరంతర సహకార బంధాన‍్ని ప్రతిబింబిస్తోంది. భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 మా భాగస్వామ్యానికి ఆచరణాత్మక, విజన్‌ ఉన్న రూపాన్ని ఇస్తోంది. 

    దీనిపై సమయపాలనతో ముందుకు సాగుతున్నాం. మా రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వెళ్తోంది. భారత్‌లో ఉన్న 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.

    సంయుక్త మీడియా సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాట్లాడుతూ.. “ఈ రోజు రోమ్‌లో మా సత్సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ స్థాయికి మరింత బలపరుస్తున్నాం. ఇది రెండు దేశాల సంబంధాల్లో ఇప్పటివరకు చేరిన అత్యున్నత స్థాయి. ఇప్పుడు ఇటలీ-భారత్ గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరయ్యాయని చెప్పొచ్చు. 

    మా సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చూపగల స్థాయికి చేరుకున్నాయి. గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మోదీతో నేను ఏడు  సమావేశాలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరినొకరం, మా అభిప్రాయాలను లోతుగా తెలుసుకున్నాం. గౌరవం, పరస్పర నమ్మకంపై నిలిచిన నిజాయితీ స్నేహాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ చూసి ఆయన దూరదృష్టి, ఆచరణాత్మకత, నాయకత్వాన్ని నేను వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను. మా స్నేహం వేగంగా కలిసి పనిచేయడంలో ఎంతో సహాయపడింది” అన్నారు. 

  • ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్‌ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్‌పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. 

    ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్‌కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.

    ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్‌ నిర్ణయం వాయిదా పడింది.

    ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.

    అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.

    మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.

    కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.

    ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలి
    యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్‌లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. 

    ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.

    ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్‌ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.

    అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది.

  • వాషింగ్టన్‌:  ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం  నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత  టెహ్రాన్‌లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్‌ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్‌ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.

    ఇరాన్‌ టాప్‌ లీడర్‌ కోసం ట్రంప్‌ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి  మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్‌ ఎంచుకున్న అహ్మదీనెజాద్‌ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.

    ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్‌ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్‌కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్‌ను భావిస్తున్నారని ఆయన సహచరుడు  ఒకరు మీడియాకు తెలిపారు.

    ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్‌ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా,  అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది  భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.

    గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.

    'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్‌లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.

    యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్  దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్‌లో నాయకత్వ మార్పు విషయంలో  ట్రంప్‌ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు  విశ్వసించడం లేదని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్‌ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ

    వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా  వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా  నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

    అహ్మదీనెజాద్‌  ఎందుకు ?
    వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్‌లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్‌ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

    ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

  • మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ ఏడాది భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్‌ పర్యటన ఎంతో కీలకం కానుంది.

    ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.  గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్‌ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైతం పెట్రో డీజిల్‌ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన  ప్రజలలో నెలకొంది.

    ఈ నేపథ్యంలో పుతిన్‌ భారత్‌ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్‌కు ఎంతో ఊరట లభించింది.

    ఇతర ఇంధన రంగాలు 
    కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్‌కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం  లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.

    రూపాయి-రూబుల్ చెల్లింపులు
    అంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్‌ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్‌కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.

    భారత్‌కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?

    రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్‌ అవసరాలను దాదాపు తీర్చగలదు.

    ప్రధాన సమస్యలు

    లాజిస్టిక్స్, రవాణా సవాళ్లు 
    గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్‌కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల  నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.

    పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్‌కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.

    రిఫైనరీల సాంకేతికత 
    భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్'  రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.

    భారత్‌కు ఇష్టం లేదు 
    వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్‌ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది.
     

    అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు.

     

     

  • వాషింగ్టన్‌: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాక్‌ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవే అంటూ ట్విస్ట్‌ ఇ‍చ్చింది.

    కాగా, పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించడం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ..‘పాకిస్తాన్‌ రాజకీయాలతో అమెరికాకు సంబంధం లేదు. పాకిస్తాన్‌, అమెరికా కేవలం మిత్ర దేశాలు మాత్రమే. ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. పాక్‌ రాజకీయాలు ఆ దేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి’ అని క్లారిటీ ఇచ్చారు.

    ఇదిలా ఉండగా.. 2022, ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాక్‌ రాయబారి అసద్‌ మజీద్ ఖాన్‌తో అమెరికా హోంశాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్‌ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని.. అప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్‌ తటస్థ వైఖరిని అవలంభించడం వల్లే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని యూఎస్‌ నిర్ణయించినట్లు పాక్‌లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది.

    డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం
    2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. యాదృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్‌ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించారు. అనంతరం  2022 మార్చి 7న, వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్‌తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్‌ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.

    ఇమ్రాన్‌ తొలగింపు అనంతర పరిణామాలు
    ఏప్రిల్ 2022, ఇమ్రాన్‌ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం కొద్ది నెలలకు  నవంబర్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

    అమెరికా-పాక్ సంబంధాలు
    ఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి. పాక్‌లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్‌లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్‌కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్‌లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. 

Movies

  • రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు.  తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు.  

    ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్‌గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్‌తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం.  

  • తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒకరోజు వ్యవధిలో రెండు అప్డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు?

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)

    'పెద్ది' ట్రైలర్ విషయానికొస్తే.. మాస్ మూమెంట్స్, పంచ్ డైలాగ్స్ లాంటి వాటికంటే స్టోరీ ఎలా ఉండబోతుందనేది ఫోకస్ చేసి చూపించారు. మెగా అభిమానులు సంతృప్తి చెందారు కానీ సగటు ఆడియెన్స్‌కి మాత్రం ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. యాక్టింగ్ పరంగా చరణ్‌ని వంకపెట్టడానికి లేదు గానీ మాస్ మూమెంట్స్ లాంటివి ట్రైలర్‌లో ఎక్స్‌పెక్ట్ చేశారు. అవి లేకపోవడంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీమ్ ఉందన్నట్లు టాక్ వినిపిస్తోంది. భోపాల్, హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌లో కొత్త ట్రైలర్ రిలీజ్ చేయొచ్చంటున్నారు. జూన్ 4న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ముందురోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేయనున్నారు.

    'డ్రాగన్' విషయానికొస్తే ఇందులోనూ స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ లాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. డ్రగ్ మాఫియా, అందులోని విలన్స్‌ని చూపించారు. ఎన్టీఆర్ కూడా అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. కానీ ట్రైలర్‌లో అందుకు సంబంధించిన యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ లాంటి వాటికి పెద్దగా చోటివ్వలేదు. మూవీ థియేటర్లలోకి రావడానికి మరో ఏడాది సమయముంది కాబట్టి ఇకపై రాబోయే ప్రమోషనల్ కంటెంట్‌లో ఫైట్ సీన్స్ లాంటివి ఉండే అవకాశముంది.

    ఈ రెండింటిని పోల్చి చూడలేం గానీ రెండింటికి యునానిమస్ టాక్ అయితే రాలేదు. అలా అని పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేదు. కొందరికి విపరీతంగా నచ్చేశాయి. మరికొందరికి మాత్రం ఓ మాదిరిగా మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే స్పందన వస్తోంది.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ అలా అయ్యేసరికి అందరూ నన్ను తిట్టారు)

  • కేజీఎఫ్, సలార్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'డ్రాగన్'. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ రిలీజ్ చేశారు. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం తారక్ చాలా బక్కచిక్కిపోయాడు. గతంలో పలు ఈవెంట్స్‌లో అలానే కనిపించాడు. అయితే అంతలా బరువు తగ్గిపోవడానికి కారణాన్ని ఇన్నాళ్లకు ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో అసలేం జరిగిందో చెప్పాడు.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)

    'మూవీ షూటింగ్ మొదలుపెడదామనగా.. ఎన్టీఆర్‌ని కొంచెం సన్నబడమని చెప్పాను. కానీ ఆయన మాత్రం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిపోయాడు. దీంతో అంతా కంగారు పడ్డారు. తారక్ భార్య, తల్లి, ఫ్రెండ్సే కాదు నా టీమ్ కూడా నన్నే తిట్టారు. నేనే ఇదంతా చేశానని అన్నారు. ఎందుకంటే మరీ బక్కగా, బలహీనంగా కనిపించాడు. నేను కూడా చాలాసార్లు ఇక సరిపోతుంది ఆపేయమని చెప్పా. అయినా వినలేదు'

    'కథ కోసం, తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఆయనని ఆపడం చాలా కష్టం. ఇంత పట్టుదల గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగతంగా సమస్య ఉందని వచ్చిన వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. పాత్ర కోసం పడిన కష్టమే అది' అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు.

    వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఆఫ్గాన్ డ్రగ్ మాఫియా కంపెనీలో పనిచేసే నరహంతకుడిగా కనిపించబోతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిల్ కపూర్, జిబు మేనన్, ఖుష్బూ, అశుతోష్ రాణా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. అతిపెద్ద దేశభక్తి సినిమా: ప్రశాంత్ నీల్)

  • హెయిర్ పట్టుకుని జాన్వీ తుంటరి లుక్

    వయ్యారాలతో గ్లామరస్‌గా రితికా నాయక్

    అందంగా సోయగాలు చూపిస్తున్న నభా

    తెల్లని చీరలో మాయ చేసేలా మాళవిక

    కృతి శెట్టి క్యూట్ అండ్ స్వీట్ పోజులు

    గ్లామర్ డోస్ పెంచేసిన సయీ మంజ్రేకర్

  • సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. హీరో అవ్వాలన్న నా కలని మా అబ్బాయి ద్వారా నెరవేర్చుకున్నాను. మా అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం కూడా ఈ సినిమాల వల్ల పోతుంది. అందుకే మా కొడుకుని హీరోగా చేశాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో ఆయన కొడుకు  పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. నాకు సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇక్కడకు వచ్చాక అందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలోకి రావడం మంచి పరిణామంగా అనిపిస్తోంది.

    → దర్శకుడు వీరుతో  కంటే ముందు ఓ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత సతీష్ ముత్యాల ద్వారా వీరు పరిచయం అయ్యాడు. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మా కన్‌స్ట్రక్షన్ ఆఫీస్‌నే సినిమా ఆఫీస్‌గా మార్చాం.

    → ‘పురుష:’ కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ ఇచ్చిన తీరు కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఏదో ఒక భారీ సినిమా తీసేయాలనే కోరిక అయితే నాకు లేదు. మా అబ్బాయికి ఉన్న బిడియం, సిగ్గుని పోగొడితే చాలు అని నాకు అనిపించింది. డబ్బుల కోసం అయితే మూవీ తీయలేదు. లాభాలు ఆశించడం లేదు.

    → ఈ చిత్రంలో వీటీవీ గణేష్ పాత్ర అందరినీ నవ్విస్తుంది. ఆయన మాకు ఎంతో సహకరించారు. డేట్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. వెన్నెల కిషోర్  వల్లే కథలో సంఘర్షణ వస్తుంది. సప్తగిరి అద్భుతంగా నటించారు. కసిరెడ్డి గారు చక్కగా నటించారు. మా హీరోయిన్లు అందంగా కనిపించడమే కాకుండా తెరపై చక్కగా నటించారు. అనంత శ్రీరామ్  పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. మా అబ్బాయి గురించి నేను చెప్పను. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి.

    → ఈ సినిమాని మొత్తంగా మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మే 21 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నాం. థియేటర్లో హాయిగా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మా చిత్రం ఉంటుంది.

    → మా అబ్బాయికి నేను ముందుగానే మాట ఇచ్చాను. మూడు సినిమాలు చేస్తానని చెప్పానని. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను. అలా నేను మా వాడితో కచ్చితంగా నాకున్న స్థోమతలో మూడు సినిమాలు అయితే చేస్తాను.

  • ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చింది. అభిమానులకు నచ్చేయగా సాధారణ ప్రేక్షకులకు మాత్రం సరైన యాక్షన్ ఏదో మిస్ అయిందే అని ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో దీని గురించి డిస్కషన్ కూడా నడుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతుల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు బయటపెట్టాడు.

    (ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)

    'ఐదేళ్ల క్రితమే ఈ మూవీకి సంబంధించిన కోర్ ఐడియాని ఎన్టీఆర్‌కి చెప్పా. అయితే 'ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?' అని నన్ను అడిగారు. దీంతో ఆ పాత్ర ప్రవర్తన, అది చేసే పనులు జస్టిఫై చేయడానికి.. దాని వెనకున్న బలమైన కారణాన్ని స్క్రీన్ ప్లేలోకి తీసుకురావడానికి నాకు, నా టీమ్‌కి మూడేళ్లు పట్టింది. ఇదంతా సిద్ధమైన తర్వాత.. నేను రెడీ అని తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంతటి స్టార్‌డమ్ ఉన్న ఓ హీరో, ఇలాంటి పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం చాలా కఠిన నిర్ణయం. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకులకు ఆ విషయం అర్థమవుతుంది'

    'ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నేను రాసిన అన్ని పాత్రల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది. నా ట్రయాలజీ(కేజీఎఫ్, సలార్)లో.. ఈ జానర్‌లో 'డ్రాగన్' చివరి సినిమా. ఈ మూడు ఒకేలా కనిపించడానికి కలర్ కారణం. కానీ మూడు వేర్వేరు స్టోరీలు. దీని తర్వాత కలర్‌ఫుల్ మూవీస్ చేస్తా. మైథాలజీ ఆధారంగా ఓ కథ రాశాను. ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని సినిమాగా తీస్తాను. 'డ్రాగన్' ద్వారా అతిపెద్ద దేశభక్తి సినిమాని అందించబోతున్నాను' అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

    డ్రాగన్.. దేశభక్తి సినిమా అని ప్రశాంత్ నీల్ అనగానే ఎదురుగా ఉన్న యాంకర్ కూడా షాకయ్యారు. అసలు ఈ సమాధానం ఊహించలేదని చెప్పుకొచ్చారు. మరి డైరెక్టర్ చెప్పినట్లు ఎలాంటి దేశభక్తి చూపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది జూన్ వరకు ఆగాల్సిందే. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అనిల్ కపూర్, బిజు మేనన్, ఖుష్బూ, రుక్మిణి వసంత్, అశుతోష్ రానా, అన్షుమాన్ కపూర్, సిద్ధాంత్ గుప్తా తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో ఎనిమిది మంది విలన్స్.. ఎవరు వీళ్లంతా?)

  • హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.

    తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందిస్తున్నారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

    ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ పవర్‌ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవనున్నాయి.

    అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్/హీ-మ్యాన్‌గా నటిస్తుండగా, కమిలా మెండెస్ టీలా పాత్రలో కనిపించనున్నారు. అలాగే జారెడ్ లెటో స్కెలెటర్ పాత్రలో నటిస్తుండగా, మ్యాన్-అట్-ఆర్మ్స్ పాత్రలో ఇడ్రిస్ ఎల్బా కనిపించనున్నారు.

    అలిసన్ బ్రి, మొరెనా బక్కారిన్, క్రిస్టెన్ విగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హీ-మ్యాన్’ ప్రపంచాన్ని కొత్త తరానికి గ్రాండ్‌గా పరిచయం చేయబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా విడుదల చేయనుంది. జూన్ 5వ తేదీన ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో భారత దేశంలో విడుదల కానుంది.

  • అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చేసింది. నాలుగున్నర నిమిషాల వీడియోతో అసలు సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశారు. ‍'డ్రాగన్' ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఒపియమ్ అనే మొక్క, దీని ద్వారా వచ్చే హెరాయిన్.. దీని చుట్టూ ఉండే మాఫియా బ్యాక్‌డ్రాప్ ఇందులో చూపించబోతున్నారు. అయితే ఇందులో ఏకంగా ఎనిమిది విలన్స్ కనిపించడం అందరికీ షాకిచ్చింది. అసలు వీళ్లెవరు? ఏ ఇండస్ట్రీకి చెందినవాళ్లు? ఏయే సినిమాలు చేశారు? వాళ్ల వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

    (ఇదీ చదవండి: ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆ పేర్ల అర్థమిదే!)

    మొదటగా ఎన్టీఆర్ విషయానికొస్తే.. పేరుకే హీరో అయినప్పటికీ విలనీ టచ్ ఉన్న లూగెర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన హంతకుల ముఠాకు నాయకుడిగా నటించాడు.

    మొత్తం ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ అయిన దాదా సర్కార్ పాత్రలో తెలుగు, తమిళ, హిందీలో గతంలో పలు సినిమాలు చేసిన అశుతోష్ రాణా నటించాడు. తెలుగులో ఈయన వెంకీ, బంగారం, బలుపు, తడాఖా, పటాస్ తదితర మూవీస్ చేశాడు. ముంబైకి చెందిన ఇతడు ఎక్కువగా హిందీ మూవీస్ చేశాడు.

    ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ అయిన సుజోయ్ సర్కార్ పాత్రని అన్షుమాన్ పుష్కర్ అనే హిందీ నటుడు చేశాడు. ఇతడో సీరియల్ నటుడు. 2018 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్నాడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు.

    ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన బాబీ సర్కార్ పాత్రలో సిద్ధాంత్ గుప్తా కనిపించబోతున్నాడు. ఇతడు కూడా హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ పాత్ర కోసమే తొలుత మలయాళ హీరో టొవినో థామస్‌ని అడిగారని అంటున్నారు. బాబీ సర్కార్, లూగెర్.. అన్నదమ్ముల పాత్రలట.

    ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో రావ్ అనే అకౌంటెంట్ పాత్రని తమిళ నటుడు గురు సోమసుందరం చేశాడు. ఇతడు గతంలో తెలుగులో చీకటిరాజ్యం, స్కార్క్ లైఫ్ చిత్రాల్లో నటించాడు. కానీ మలయాళ మూవీ 'మిన్నళ్ మురళి' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

    ద ట్రైనర్ పాత్రలో 'ధురంధర్'లో షిరానీ సాబ్‌గా నటించిన బిమల్ జీత్ ఒబెరాయ్ కనిపింతబోతున్నాడు. ఇతడికో పెద్ద సైన్యమే ఉండబోతుంది. ముంబైకి చెందిన ఇతడు గతంలో పీకే, టైగర్ 3 చిత్రాల్లోనూ కనిపించాడు గానీ 'ధురంధర్' మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

    రష్యన్ డిస్ట్రిబ్యూటర్ విక్టర్ మేన్స్‌కోవ్ పాత్రలో రష్యన్ నటుడు అలెగ్జాండర్ మిజేవ్, సోమాలియా నియంత జనరల్ దురాన్ పాత్రలో బ్రిటీష్ నటుడు బెన్డిక్ట్ పాల్ గారెట్, ఆఫ్రికా-యూరప్ డిస్ట్రిబ్యూటర్ బిలే క్సెర్సీ పాత్రలో దక్షిణాఫ్రికా నటుడు తుతేలో ప్రిన్స్ గ్రాట్‌బూమ్ కనిపించబోతున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ విలన్ పాత్రలే.

    వీళ్లతో పాటు ఆఫ్గానిస్తాన్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహ్మాన్ పాత్రలో మలయాళ ప్రముఖ నటుడు బిజు మేనన్ కనిపించబోతున్నారు. ఈయన గతంలో తెలుగులో 'రణం', ఖతర్నాక్ మూవీస్‌లో నటించారు. ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈయన కాస్త సుపరిచితమే.

    అలానే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్(ఇండియా) రఘువీర్ రాథోడ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటించారు. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా చేశారు. రీసెంట్ టైంలో 'యానిమల్' మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిజు మేనన్, అనిల్ కపూర్‌వి 'డ్రాగన్'లో పాజిటివ్ పాత్రలనిపిస్తోంది.

    పైన చెప్పిన నటులతో పాటు ఈ మూవీలో తమిళ నటి ఖుష్బూ కూడా నటించింది. గ్లింప్స్‌లో విలన్స్ అందరి గురించి చెప్పే పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది గానీ ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయలేదు. వీళ్లతో పాటు రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను, శత్రు తదితరులు ఇతర సహాయ పాత్రలు చేశారు.

    ప్రస్తుతం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అందులో విలన్స్‌ని మాత్రమే చూపించారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, అందులో విలన్స్ ఎవరెవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. మరి అందులో ఎంతమంది విలన్స్ ఉంటారో ఏంటో?

    (ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)

  • ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా,చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బ్రతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాని ఇప్పటి పరిస్థితులలో చదువుకునే వారు తక్కువయ్యారు చదువు కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కుట్రదారులు కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ఎగ్జామ్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది.

    దాదాపుగా వాస్తవిక ఘటనలతో , చిన్నపాటి సినీ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సర్కుణమ్.ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.  

    కథాంశానికొస్తే తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో ఝాన్సీ మారుమల్లిని కిడ్నాప్ చేసి తైకారాకు తాను డిఎస్ పిగా వెళుతుంది. ఓ డిఎస్ పి స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమా లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.

    కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, స్టేషన్ కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్య వ్యవస్థ లో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మస్ట్‌ వాచ్ ఫర్ ఎవ్రీవన్.
     

  • తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎం. రుషికి మెగాసార్‌ స్టార్‌ చిరంజీవి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పరీక్షల ముందు ఆమెకు తండ్రి ఓ మాట ఇస్తే.. దాన్ని మెగాసార్ట్‌ నిజం చేశారు. అభిమాన హీరో ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి రుషితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాకవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. అసలు తండ్రి ఇచ్చిన మాటేంటి? చిరంజీవి చేసిన సర్‌ప్రైజ్‌ ఏంటి?

    చిరంజీవి కోసం ఫస్ట్‌ ర్యాంకు
    తెలంగాణ ఎప్‌సెట్‌కు సన్నద్దమవుతున్న సమయంలో ‘స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధిస్తే మెగాస్టార్‌తో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆమె కష్టపడి చదివి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించింది. ఈ విషయం చిరంజీవికి తెలియడంతో, ఆ యంగ్ అచీవర్‌ను స్వయంగా తన ఇంటికి పిలిపించుకొని సన్మానించారు.

    ల్యాప్‌టాప్ బహుమతి
    బుధవారం ఉదయం రుషి ఫ్యామిలీని చిరంజీవి ఇంటికి పిలిపించుకున్నారు. తన నివాసానికి వచ్చిన రుషిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఉన్నత చదువుల నిమిత్తం ప్రోత్సాహకంగా ఆమెకు ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందజేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కష్టపడి చదివి టాపర్‌గా నిలవడమే కాకుండా, తన అభిమాన హీరోను స్వయంగా కలుసుకుని సత్కారం అందుకోవడంతో రుషి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కల నెరవేరినందుకు ఆమె చాలా సంతోషించింది. 

  • ఈరోజు ఎన్టీఆర్‌తో పాటు మంచు మనోజ్ పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే మనోజ్ చేయబోయే కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే 'వడ్డీకాసులవాడ' పేరితో మనోజ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. రెండు నిమిషాలున్న వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు.

    (ఇదీ చదవండి: గ్రేట్ డైరెక్టర్ ఓటీటీ ఎంట్రీ.. ఏటీఎం దొంగతనం స్టోరీతో)

    నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 'భైరవం', 'మిరాయ్' సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. కామెడీ జానర్‌లో గతంలో మూవీస్ చేశాడు. హిట్స్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, బాలయ్య మూవీలోనూ నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ చేయబోతున్నాడు. కానీ 'వడ్డీకాసులవాడ' సినిమాలో మాత్రం ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించబోతున్నాడని అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించారు. పూర్తిగా ఫన్ జానర్‌లోనే ఈ సినిమా ఉండబోతుంది.

    ఏఐ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. అయితే ఇందులో మనోజ్ పాత్ర చెప్పే.. అప్పులన్నీ తీర్చేసి కోటీశ్వరుడిని చేస్తే తిరుపతిలో కాలేజీ కట్టిస్తా, అందరికీ 25 పర్సంటేజీ డిస్కౌంట్ ఇస్తా లాంటి డైలాగ్స్ మంచు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా అనిపించాయి. తేజ్ ఉప్పాలపాటి దర్శకుడు కాగా మనోజ్, అనిల్ సుంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

    (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్‌మెంట్)

  • హిందీ సినిమాలు కూడా చూసే తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, డంకీ తదితర మూవీస్ తీశారు. వీటిలో షారూక్‌తో 'డంకీ' తప్పితే మిగిలినవన్నీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఈయన నుంచి కొత్త మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్లకు చిన్నపాటి షాకిచ్చారు. ఓ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

    (ఇదీ చదవండి: కళ్లు లేని హీరోయిన్.. కాళ్లు లేని హీరో)

    'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీస్తున్న ఈ సిరీస్.. ఓ ఏటీఎం దొంగతనం చుట్టూ జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. దీనికి రాజ్ కుమార్ హిరానీ.. షో రన్నర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవినాశ్ అరుణ్ దర్శకుడు. ఈ సిరీస్‌తోనే తన కొడుకు వీర్ హిరానీని నటుడిగానూ పరిచయం చేస్తున్నారు. ఇందులో అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు చేశారు. జూలై 3 నుంచి హాట్‌స్టార్‌లో సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

  • ఆనందం, రన్‌, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్‌ (సికిందర్‌) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్‌కు సూపర్‌ హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్‌గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. 

    చిన్న గ్యాప్‌ తర్వాత..
    ఆ తర్వాత టాలీవుడ్‌ హీరో రామ్‌పోతినేని కథానాయకుడిగా ది వారియర్‌ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. 

    సినిమా
    ఇది మంచి యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్‌ చిత్రంతో మంచి సక్సెస్‌ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి!

  • యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంట్లో కొత్త అతిథులు వచ్చి చేరాయి. రెండు అందమైన రామచిలుకలు తారక్‌తో కలిసి ఆడుకుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్‌ తన బర్త్‌డే (మే 20) సందర్భంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వాటికి అసాహి, యూహి అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. ఇవి జపనీస్‌ పేర్లు. అసాహి అంటే సూర్యోదయం, యూహి అంటే సూర్యాస్తమయం అని అర్థం. జపాన్‌ దేశంపై తనకున్న ప్రేమతోనే పెంపుడు పక్షులకు జపనీస్‌ పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    తారక్‌ కెరీర్‌ మొదలైందిలా..
    దివంగత నటుడు ఎన్టీరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాత ఎన్టీఆర్‌ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించాడు. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. స్టూడెంట్‌ నెం.1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, యమదొంగ, అదుర్స్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా అనేక హిట్‌ చిత్రాల్లో నటించాడు. 

    సినిమా
    చివరగా తెలుగులో దేవర: పార్ట్‌ 1తో హిట్‌ అందుకున్నాడు. హృతిక్‌ రోషన్‌ వార్‌ 2 మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో డ్రాగన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది. అలాగే తారక్‌ చేతిలో దేవర 2 కూడా ఉంది.

    చదవండి: జైల్లోనే పెళ్లిరోజు.. దర్శన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

  • ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్‌, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్‌, టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్‌? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)

    కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.

    (ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?)

  • తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్‌ మూవీస్‌ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సునీల్‌ నారంగ్‌ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్‌ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్‌ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    నావల్ల కాదు
    'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్‌ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్‌కు రాసిన లేఖలో సునీల్‌ నారంగ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్‌ నారంగ్‌ రాజీనామాను ఫిలిం ఛాంబర్‌ ఆమోదించింది.

    అసలేంటి వివాదం?
    ఇటీవల టాలీవుడ్‌లో పర్సంటేజీ (కమిషన్‌) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్‌ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్‌ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

     

     

    చదవండి: ఆస్పత్రిలో అమితాబ్‌?

National

  • భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్‌కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.

    చరిత్రాత్మక ఒప్పందం  
    భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.

    ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్‌పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.

    రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్‌కు వస్తున్న నాలుగో యూనిట్‌కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.

    సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్‌లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్‌మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.

    భారత్‌కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్‌లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.

    ఐదో యూనిట్‌ను చైనా సరిహద్దులో 
    ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.

    ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది.

  • భోపాల్‌ : మాజీ మిస్‌ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ ప్రకారం ఆమెది హత్య కాదు, ఆత్మహత్యేనని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఇదే విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 

    మే 12న ట్విషా తన అత్తగారింటి టెర్రస్‌లో జిమ్ పరికరాన్ని ఉపయోగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా పోస్టుమార్టం ఫలితాలతో సరిపోలిందని కమిషనర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కోరితే రెండో పోస్టుమార్టం చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు.

    అయితే ట్విషా తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు ఎదుర్కొన్నందువల్లే ఆమె ప్రాణం కోల్పోయిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ట్విషా శర్మ భర్త సమ్రత్ సింగ్‌ లాయర్ కాగా.. అత్త గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి. ప్రస్తుతం భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. అత్తగారు న్యాయవాద నేపథ్యం ఉన్నవారు కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ట్విషా తండ్రి ఆరోపించారు.

    కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేసు స్వతంత్రంగా, వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను కేవలం రెండు రోజుల్లోనే నమోదు చేశామని, నిందితుడు సమ్రత్‌ను పట్టుకోవడానికి బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. అరెస్టులో ఆలస్యం జరిగినా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు.

    ట్విషా శర్మ, సమ్రత్ సింగ్‌ల వివాహం 2024 డిసెంబర్‌లో జరిగింది. ఇద్దరి పరిచయం ఒక డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు ఈ విషాదానికి కారణమయ్యాయని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. 

    ట్విషా శర్మ మరణించిన సమయంలో ఆమె భర్త సమ్రత్ సింగ్,పొరిగింటి వ్యక్తి, ఇంట్లో సహాయకుడు అనుమానస్పదంగా కనిపించారు. వీరు ముగ్గురూ ఆమెను మెట్లపై నుంచి కిందికి తీసుకువస్తూ,సీపీఆర్‌ చేసే ప్రయత్నాలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయింది. ట్విషా శర్మ మే 12న ఉదయం 7:20కి ఒంటరిగా మెట్లపైకి ఎక్కి టెర్రస్‌కి వెళ్లినట్ సీసీటీవీలో కనిపించింది.దాదాపు  గంట తర్వాత ఆ ముగ్గురు పైకి ట్విషా ఉన్న రూమ్‌లోకి వచ్చారు. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ (రిటైర్డ్ జడ్జ్) ఓ గదిలోకి వెళ్లి, కొద్దిసేపటికి బయటకు వచ్చి కిందికి వెళ్లినట్లు కూడా ఫుటేజ్‌లో కనిపించింది.

    ట్విషా భర్త ప్రస్తుతం పోలీసుల నుంచి పరారీలో ఉన్నాడు. ట్విషా తల్లిదండ్రులు ఈ ముగ్గురి చర్యలు అనుమానాస్పదమని, వరకట్న వేధింపుల కారణంగా హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా అదే నిర్ధారిస్తున్నాయని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ట్విషా తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దర్యాప్తుకు సిఫారసు చేశారు.

  • కోల్‌కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

    ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్‌కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్‌లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

    తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు.

     

    వివాదం ఏంటి
    కాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే  KMC నోటీసులు జారీ చేసింది.

    నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది.

  • 1498 మే 20. కేరళ తీరంలోని కాలికట్‌ (కోజికోడ్‌) సమీపంలో ఉన్న ‘కప్పకడవు’ అనే చిన్న గ్రామం చరిత్రపుటల్లోకి ఎక్కిన రోజు అది. వాస్కోడా గామా (Vasco da Gama )  అనే పోర్చుగీసు నావికుడు సముద్ర మార్గాన భారత్‌ చేరిన రోజు అది. అప్పటి నుంచి యూరప్‌ నుంచి భారత్‌కు సముద్రమార్గం కనిపెట్టిన వాడిగా వాస్కోడా గామా ప్రసిద్ధి చెందాడు.

    భారత దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం 1497 జూలై 8న పోర్చుగల్‌ రాజు మాన్యుయెల్‌ –1 ఆదేశంతో లిస్బన్‌ నుండి వాస్కోడా గామా బయలుదేరాడు. సుమారు 170 మంది సిబ్బందితో, సావో గాబ్రియేల్, సావో రాఫెల్, బెర్రియో వంటి నౌకలు ఈ ప్రయాణంలో పాల్గొన్నాయి. ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగలేదు. భయంకరమైన తుపానులు, ఆహార కొరత, స్కర్వీ వంటి వ్యాధులు నావికులను వేధించాయి. సముద్రంలో నెలల తరబడి గడపడం వల్ల సగానికి పైగా సిబ్బంది మరణించారు. నావికులు భయంతో వెనక్కి వెళ్దామని గొడవ చేసినా, గామా మొండితనంతో ముందుకు సాగాడు. తిరుగుబాటు చేసినవారిని ఇనుప గొలుసులతో బంధించి మరీ తన లక్ష్యం వైపు ప్రయాణించాడు. దక్షిణాఫ్రికా, మొజాంబిక్, మొంబాసా వంటి ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు వెళ్లాడు. అతడు భారత్‌కు చేరుకోవడంలో స్థానిక నావికుల సముద్రమార్గ అవగాహన కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలోని మలిండిలో అతడికి ఒక గుజరాతీ నావికుడు (కాంజీ మలమ్‌), అరబ్‌ నావికుడు (ఇబ్న్‌ మాజిద్‌)ల సహాయం లభించింది. రుతుపవనాల గమనాన్ని గుర్తించడంలో ఈ నావికులకు ఉన్న అవగాహనే గామాను క్షేమంగా కాలికట్‌ తీరానికి చేర్చింది. 

    కాలికట్‌ పాలకుడు జామొరిన్‌ (మాన విక్రమ) గామాను
    ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అయితే పోర్చుగీసువారు కానుకలుగా సమర్పించిన బట్టలు, టోపీలు, పగడపు దండలు, చక్కెర, తేనె వంటి అల్పమైన వస్తువులను చూసి అతడు పెదవి విరిచాడు. నిజానికి జామొరిన్‌ ఆ కానుకలను చూసి జాలిపడి, గామా చేసిన కష్టభరితమైన ప్రయాణాన్ని గౌరవిస్తూ వ్యాపారానికి అనుమతి ఇచ్చాడు. మిరియాలు, ఇతర మసాలా దినుసులు, క్యాలికో వస్త్రాల వ్యాపారం చేసుకునే వీలు కల్పించాడు. గామా ఇక్కడి నుంచి తాను వచ్చిన మూడు నౌకలలో సుగంధ ద్రవ్యా లను, ఇతర విలువైన వస్తువులను తీసుకుని తిరిగి పోర్చుగల్‌ వెళ్లి అమ్మడంతో ఈ యాత్ర చేయడానికి అయిన ఖర్చుకు 60 రెట్ల లాభం సమకూరింది. అందుకే మరోసారి ఇండియా ప్రయాణ మయ్యాడు.

    వ్యాపారం మాత్రమే లక్ష్యం కాదు 
    వాస్కోడా గామా రెండో ప్రయాణం (1502) అత్యంత క్రూరంగా సాగింది. అరేబియా సముద్రంపై పోర్చుగీసు ఆధి పత్యం సాధించడానికి గామా హింసను ఆశ్రయించాడు. సము ద్రంలో వెళ్తున్న అరబ్‌ నౌకలపై దాడులు చేయడం, ప్రయాణికు లను చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జామొరి న్‌ను తన సైనిక శక్తితో బలవంతంగా సంధికి ఒప్పించాడు. అంతు లేని సంపదతో తన స్వదేశం తిరిగి వెళ్లాడు.

    మొత్తానికి ఈ సముద్ర మార్గ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. పోర్చుగీసువారి విజయంతో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్‌ వాళ్లు భారత్‌కు రావడం మొదలుపెట్టారు. వ్యాపారం కోసం వచ్చిన వీరు, క్రమంగా దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఆక్రమణలకు పాల్పడ్డారు. చివరిసారిగా 1524లో పోర్చుగీసు భారత వైస్రాయ్‌గా వచ్చిన వాస్కోడా గామా, కొచ్చిన్‌ లోనే అనా రోగ్యంతో మరణించాడు. అతడి భౌతిక కాయాన్ని తర్వాత పోర్చు గల్‌కు తరలించారు. వాస్కోడా గామా వేసిన సముద్రపు బాట 450 ఏళ్ల భారత బానిసత్వానికి దారితీసింది. అంతులేని సంపద ఈ మార్గంలోనే యూరప్‌కు ప్రవహించింది. దేశం పేదదిగా మిగిలిపోయింది.                    

    -ఎడిటోరియల్‌ టీమ్‌

  • యశవంతపుర: కర్ణాటకలో కొడగు జిల్లాలోని దుబారె ఏనుగుల సంరక్షణాకేంద్రంలో సోమవారం వృద్ధ ఏనుగును మరో ఏనుగు కావేరి నదీతీరంలో తోసేయడం, దాని కింద నలిగిపోయి తమిళనాడు పర్యాటకురాలు మృతిచెందిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. కిందపడిన ఏనుగు మార్తాండ తీవ్రమైన గాయాలతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. 

    కంచన్‌ అనే ఏనుగు దాడి చేయడంతో మార్తాండ కడుపులోకి దంతాలు దిగబడిపోయాయి. చెవుల వెనుక, కాళ్ల మీద సైతం తీవ్రమైన గాయాలయ్యాయి. వెనువెంటనే సమీప ఏనుగుల సాయంతో మార్తాడను బుదర నుంచి పైకి లేపిదీశారు. తర్వాత పశువైద్యులు చికిత్స మొదలెట్టినా ఫలితంలేకుండా పోయిందని అటవీశాఖ పశు వైద్యాధికారి డాక్టర్‌ ముజీబ్‌ బృందం మంగళవారం ప్రకటించింది. సౌమ్య స్వభావిగా పేరుగాంచిన మార్తాండ మైసూరు దసరా జ్ఞాపకాలను గుర్తుచేసుకుని అటవీ సిబ్బంది, మావటీలు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. 

    ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

    53 ఏళ్ల మార్తాండ బరువు 4,500 కేజీలు. మూడేళ్ల క్రితం హసన్‌ జిల్లాలోని ఆలూర్‌లో దీనిని అధికారులు బంధించి సంరక్షణాకేంద్రానికి తీసుకొచ్చి దీని ఆలనాపాలన చూస్తున్నారు. దీనిపై దాడిచేసిన 26 ఏళ్ల కంజన్‌ గజరాజును 2014లో అదేజిల్లాలోని ఏసలూర్‌లో బంధించి ఇక్కడికి పట్టుకొచ్చారు. మార్తాండపై దాడిచేసిన చంపడంతో ఇకపై దానిని మైసూర్‌ దసరా ఉత్సవాలకు పంపబోమని అధికారులు స్పష్టంచేశారు.    

    ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్‌ కన్నా ముఖ్యం

  • గడిచిన ఐదు రోజుల వ్యవధిలో చమురు సంస్థలు రెండు సార్లు పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచాయి. నాలుగేళ్ల తర్వాత ఈ పెంపు ఇదే మొదటిసారి కాగా.. చమురు సంస్థలు మాత్రం తమ నష్టాలను పూడ్చుకునేందుకు ధరల పెంపు ఒక్కటే మార్గమని చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. ఏ క్షణమైనా పెట్రోధరల బాదుడు ఉంటుందని అంతా ఊహించినా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు మున్ముందు పెట్రో కష్టాలు తప్పవనే సంకేతాలిస్తున్నాయి.

    కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా.. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. విదేశీ మారక వ్యయం పెరగడం, రూపాయి విలువ విపరీతంగా నేలచూపు చూడడం.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ఇలా అన్నివైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుండడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించారు.

    ప్రధాని వ్యాఖ్యలు దేశం ఎదుర్కోబోయే లోతైన సమస్యలకు దర్పణం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో పెట్రోధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పెరగడానికి ప్రధాన కారణం.. మనవద్ద తగిన స్థాయిలో పెట్రోలియం, గ్యాస్ నిల్వలు లేకపోవడమే..! నిజానికి 1991 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంధన భద్రతపై అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. దాని ఫలితంగానే భారత్ తన ఇంధన నిల్వలకు 39 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యంతో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. దీన్నే స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్‌స్ అని అంటారు. 2000 సంవత్సరం తర్వాత దీనికి అధికారిక రూపాన్నిచ్చారు.

    పెరుగుతున్న పెట్రోలియం అవసరాలు
    భారత్‌లో పెట్రోలియం అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ వినియోగిస్తోంది. ఈ లెక్కన.. దేశంలో ఉండే పెట్రోలియం రిజర్వ్స్ వారం రోజుల అవసరాలకే సరిపోతాయి. ఇక చమురు సంస్థల వద్ద ఉన్న నిల్వలు, దిగుమతి కవరేజీని కలిపితే.. మొత్తం నిల్వలు 70 రోజుల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాయి.

    నిజానికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే.. భారత్ ఎక్కువగా ఇంధన భద్రత ముప్పును ఎదుర్కొనే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 1973 చమురు సంక్షోభం తర్వాత అమెరికా భారీ స్థాయిలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడి SPR సామర్థ్యం 714 మిలియన్ బ్యారెళ్లు. ఇది భారత నిల్వల కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ. చైనాలో ఈ సామర్థ్యం 900 మిలియన్ బ్యారెళ్లకు చేరింది.

    ఈ రెండు దేశాలతో పోలిస్తే.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విషయంలో భారత్ చాలా వరకు వెనకబడి ఉంది. ఇప్పటికిప్పుడు లెక్కలను పరిశీలించినా.. అమెరికా వద్ద ప్రస్తుతం 400 మిలియన్ బ్యారెళ్ల మేర రిజర్వ్స్ ఉన్నాయి. అయితే.. రోజుకు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. చైనా అలా కాదు. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే.. కష్టకాలమొచ్చినా తట్టుకునేలా చైనా నిల్వలున్నాయి.

    మన దేశంలో పరిస్థితి భిన్నం
    చైనా ప్రభుత్వం గనక.. చమురు వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిస్తే.. పౌరులు తూచా తప్పకుండా పాటిస్తారు. మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. LPG, LNG నిల్వల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలో సుమారు 1.4 లక్షల టన్నుల LPG నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ రోజువారీ వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. LNG విషయంలోనూ భారత్ ప్రధానంగా పెట్రోనెట్ LNG, BPCL రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్ల వద్ద ఉన్న నిల్వలపైనే ఆధారపడుతోంది. ఎరువుల తయారీలో కీలకమైన ఈ ఇంధనానికి దేశంలో భూగర్భ నిల్వ వ్యవస్థ లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు భూగర్భ LNG నిల్వలపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపా సమాఖ్య కూడా రష్యా గ్యాస్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకుని, కొత్త వ్యూహాలను అందిపుచ్చుకుంది.

    చమురుకు సంబంధించిన భారీ నిల్వలు ఉండటం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సరఫరా అంతరాయాల సమయంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించకుండా దీర్ఘకాలిక ఒప్పందాలతో తమ అవసరాలను భద్రపరుచుకోగలుగుతున్నాయి. చైనా అయితే అమెరికా ఆంక్షలను కూడా పక్కన పెట్టి.. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే.. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్‌లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.    -వెబ్‌డెస్క్‌

  • ఇండోర్‌: వివాదాస్పద భోజ్‌శాల కేసులో విజయం సాధించిన హిందూ పిటిషనర్లు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో మరోసారి పిటిషన్‌ వేశారు. ఆలయంలో ఉండాల్సిన సరస్వతీ మాత ప్రతిమ లండన్‌ మ్యూజియంలో ఉందని, కోహినూర్‌ వజ్రం కంటే ముందు అత్యంత ముఖ్యమైన ఆ విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చేలా ఆదేశాలివ్వాలని అందులో వారు కోరారు. 

    భోజ్‌శాల–కమాల్‌ మౌలా మసీదు సముదాయం ఒకప్పుడు సరస్వతీ దేవి ఆలయప్రాంతమని శుక్రవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దీంతోపాటు, ఆ ప్రదేశంలో హిందువుల పూజలు, ముస్లింల ప్రార్థనలకు వీలు కల్పిస్తూ ఏఎస్‌ఐ జారీ చేసిన ఉత్తర్వులను సైతం రద్దు చేయడం తెల్సిందే. దీంతో, శనివారం నుంచి అక్కడ సరస్వతీ మాత ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకుని హిందువులు పూజలు చేస్తున్నారు. అయితే, అక్కడుండాల్సిన అసలైన విగ్రహం వలస పాలన కాలంలో బ్రిటిషర్లు తీసుకెళ్లి లండన్‌ మ్యూజియంలో ఉంచారని పిటిషనర్లు తెలిపారు. దానిని తిరిగి తీసుకువచ్చి భోజ్‌శాలలో ప్రతిష్టించాలని కోరారు. ఇందుకుగాను బ్రిటిష్‌ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరపవచ్చని కూడా హైకోర్టు 15వ తేదీనాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. 

    ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ

    సరస్వతీ మాత విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరినట్లు పిటిషనర్లలో ఒకరైన కుల్దీప్‌ తివారీ చెప్పారు. బ్రిటిష్‌ రాజవంశీకుల దగ్గరున్న కోహినూర్‌ మాదిరిగానే వాగ్దేవి విగ్రహాన్ని కూడా తీసుకురావాలన్నారు. కానీ, కోహినూర్‌ కంటే ఇప్పుడు సరస్వతీ మాత విగ్రహమే ముఖ్యమని, ఇది తమ మతవిశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన విషయమని తివారీ పేర్కొన్నారు. రాజకీయ సంకల్పముంటే బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించి లండన్‌ నుంచి విగ్రహాన్ని తీసుకురావడం ఏమంత కష్టమైన విషయం కూడా కాదని ఆయన వ్యాఖ్యానించారు. 1034లో భోజ్‌శాలలో పర్మార్‌ రాజు భోజుడు సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించారని, 1305లో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకున్న సమయంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆలయాన్ని ధ్వంసం చేశాడని  పిటిషనర్లు పేర్కొన్నారు.     

    ఇదీ చదవండి: రోమ్‌లో ‘మెలోడీ’ రీయూనియన్‌ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్‌ల సునామీ

  • సాక్షి, రాయ్‌బరేలీ: దేశంలో ఆర్థిక తుపాను ముంచుకొస్తుందన్న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి అదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించారాయన. తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో బుధవారం నిర్వహించిన బహుజన్‌ స్వాభిమాన్‌ సభలో పాల్గొన్న ఆయన మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

    ద్రవ్యోల్బణం మనిషి(మోదీని ఉద్దేశించి..) తన వసూళ్లను ఇప్పటితోనే ఆపరు. ఆయన జనాల్ని మభ్యపెట్టడానికి ప్రతీసారి టీవీల ముందుకు వచ్చి భావోద్వేగంతో ఏడుస్తారు. త్వరలో మరోసారి అలా జరగొచ్చు. కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం ఎక్కడికి వెళ్తుందో చూడండి. నిత్యావసర ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఎరువులు కూడా దొరకవు. విదేశాలకు వెళ్లొద్దని మోదీ చెప్తారు. కానీ ఆయన వేల కోట్ల విలువైన విమానాల్లో విదేశాలకు వెళ్తారు అని రాహుల్‌ మండిపడ్డారు.

    ప్రధాని మోదీ తాను పిలుపునిచ్చిన పొదుపు చర్యలను తానే పాటించడం లేదని మంగళవారం బఛ్‌రావా సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకూ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారాయన.

    ‘‘ప్రపంచం మొత్తం త్వరలో తీవ్ర చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఈ సంక్షోభాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూసి ఉండం. దీనినెవరూ ఆపలేరు. దీని ప్రభావం ఎవరిపై పడుతుంది.. అదానీ, అంబానీలు వారి ప్యాలెస్‌లలో భద్రత మధ్య బాగానే ఉంటారు. కానీ మన రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతారు అంటూ రాహుల్‌ ప్రసంగించారు. 

    ఇదిలా ఉంటే.. పెట్రోల్‌ ధరల పెంపుపై ఇవాళ కాంగ్రెస్‌‌ పార్టీ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో సహా అన్నిచోట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శలు నిర్వహిస్తోంది. 

  • కాంగ్‌పోక్పి: మణిపూర్‌లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. జాతుల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరిన్ని ఉద్రిక్తతలకు దారితీశాయి. కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో కుకీ-జో వర్గానికి చెందిన ముగ్గురు చర్చి ప్రతినిధులు తూటాలకు బలయ్యారు. ఈ దారుణం జరిగిన కొన్ని గంటల్లోనే, సాయుధ ముఠాలు పదుల సంఖ్యలో ‍స్థానికులను బందీలుగా పట్టుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తాజా హింసాత్మక సంఘటనలతో మణిపూర్‌లో భయాందోళనలు మరింతగా పెరిగాయి.

    కాంగ్‌పోక్పిలో ఘాతుకం: శాంతిదూతలపై కాల్పులు
    మే 13న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో ముగ్గురు కుకీ-జో చర్చి నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఒకరు స్థానిక తెగల మధ్య శాంతి స్థాపన కోసం చురుగ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ హత్యల వెనుక కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘాతుకంతో ఇప్పటికే తీవ్రంగా నలిగిపోతున్న మైనారిటీ వర్గాల్లో మరింత అభద్రతాభావం నెలకొంది.

    రంగంలోకి దిగిన రక్షణ దళాలు
    చర్చి నేతల హత్యలు జరిగిన కొద్ది గంటల్లోనే, కాంగ్‌పోక్పి, సేనాపతి జిల్లాల పరిధిలో సుమారు 38 మందిని సాయుధ ముఠాలు అపహరించి, బందీలుగా ఉంచినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు భారీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, ఇప్పటివరకు 31 మందిని రక్షించాయి. అయితే, మిగిలిన వారి ఆచూకీ ఇంకా లభించలేదు. లీలోన్ వైఫే, సోంగ్తున్, ఖుంఖో, పి మోల్డింగ్ తదితర మారుమూల కొండ ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్స్ సహాయంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

    తెగల మధ్య పెరుగుతున్న అపనమ్మకం
    మరోవైపు తెగల మధ్య నెలకొన్న తీవ్ర అపనమ్మకం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. మిస్సింగ్ అయిన వారి మృతదేహాలైనా కుటుంబాలకు అప్పగించేలా చూడాలని లియాంగ్మై నాగా కమ్యూనిటీ నేత ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్‌ను కోరారు. అదే సమయంలో నాగా గ్రూపులు తమ కుకీ సమాజానికి చెందిన 14 మందిని బందీలుగా ఉంచాయని ‘కుకీ ఇన్పి మణిపూర్’ ఆరోపించింది. మే 2023 నుండి భూహక్కులు, గిరిజన హోదా అంశాలపై మేతీ, కుకీ-జో వర్గాల మధ్య జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరు వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ వస్తోంది.

  • సాక్షి, చెన్నై :  తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్‌ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం  మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్‌ మీడియా ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. 

    వివాదం ఏమిటంటే..? 
    ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్‌ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్‌ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. 

    ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ వివరణ: 
    ఈ వివాదంపై ఎక్స్‌ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని  వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్‌ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్‌ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్‌ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్‌ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్‌ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్‌ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు.  

Sports

  • అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ మంగ‌ళ‌వారం ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ రిష‌బ్ పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే పంత్ డిమోష‌న్ వెనుక గిల్ కీల‌క‌పాత్ర పోషించాడంటూ ఒక అభిమాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆస‌క్తి రేపింది. 

    పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డంపై ఒక అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకు పంత్ సోద‌రి సాక్షి లైక్ కొట్టింది. 'పంత్ వైస్ కెప్టెన్సీ ప‌ద‌వి ఊడిపోవ‌డానికి తెర వెనుక కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ పెద్ద రాజ‌కీయ‌మే న‌డిపాడు. త‌న ప‌ద‌వికి ఉన్న ముప్పును తొలగించుకోవ‌డానికే వైస్ కెప్టెన్సీకి పంత్‌ను కాద‌ని రాహుల్ పేరును ప్ర‌తిపాదించిన‌ట్లు తెలుస్తోంది’ అంటూ పోస్టు పెట్టాడు. 

    పంత్ భ‌విష్య‌త్తులో టెస్టు కెప్టెన్ అయ్యే అవ‌కాశం ఉండ‌డంతోనే గిల్ ఇలా చేసి ఉండొచ్చని సదరు అభిమాని ఆరోపించాడు. అయితే ఇదంతా ఒక అభిమాని ఎలాంటి ఆధారాలు లేకుండా త‌న అభిప్రాయంగా పోస్టును పెట్ట‌డంతో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే పంత్ సోద‌రి సాక్షి అభిమాని పెట్టిన పోస్టును లైక్ చేస్తూ ‘ఇది నిజ‌మే అయి ఉండొచ్చు’ అని పేర్కొన‌డం ఆస‌క్తిని రేపింది. 

    అయితే అభిమాని పెట్టిన పోస్టుకు లైక్ కొట్టింది నిజంగా పంత్ సోద‌రి సాక్షినా? కాదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అయితే ఈ పోస్టుపై సోష‌ల్‌మీడియాలో అభిమానులు రెండు విధాలుగా స్పందించారు. కొంద‌రు పంత్‌కు స‌పోర్ట్ చేస్తే, మ‌రికొంద‌రు గిల్‌కు మ‌ద్ద‌తుగా పోస్టులు పెట్టారు. 

    ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే యాక్సిడెంట్ త‌ర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి పంత్ పెద్ద‌గా రాణించిన దాఖ‌లాలు లేవు. 2025లో ఇంగ్లండ్ టూర్‌లో పంత్ స‌రైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. దీంతో వ‌న్డే, టీ20 జ‌ట్టు నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యాడు. అయితే టెస్టుల్లో పంత్‌కు మంచి రికార్డు ఉండ‌డంతో ఆఫ్గ‌న్‌తో టెస్టుకు ఎంపిక చేశారు. కానీ తుది జ‌ట్టులో ఉంటాడా లేడా అన్న‌ది చూడాలి. 

    ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ పంత్ పెద్ద‌గా రాణించ‌లేదు. 132 మ్యాచ్‌లాడి కేవ‌లం 286 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంతేకాదు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ జ‌ట్టును ప్లేఆఫ్స్ చేర్చ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యాడు. వ‌రుస ఓట‌ముల‌తో ఈ సీజ‌న్‌లో ల‌క్నో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది.

    చదవండి: ప్లేఆఫ్స్ ముంగిట ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా దాదాపు నెల రోజుల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న బెంగళూరు జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ వారం చివర్లో భారత్‌కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

    ఏప్రిల్‌ 18న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతి వేలికి గాయం అయింది. ఆ గాయం కారణంగా అతడు మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం జరిగిన మూడు పోటీల్లో కూడా అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. 

    గాయం తీవ్రతను పరీక్షించేందుకు మే మొదటి వారంలో ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన వైద్యపరీక్షల్లో గాయం పెద్దది కాదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే మే 22న హైదరాబాద్ జట్టుతో జరగనున్న బెంగళూరు చివరి లీగ్ మ్యాచ్‌కు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. 

    ఇప్పటికే 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించిన బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌లో స్థానం ఖాయం చేసుకుంది. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా ఫిల్ సాల్ట్ దూకుడైన ఆటతో జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకి శుభారంభాలను అందించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఫిల్‌ సాల్ట్‌ 202 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 

    చదవండి: బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు!

  • పాకిస్తాన్‌ను తమ సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హొసెన్‌ షాంటో కూడా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్‌పై గెలుపుతో బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నజ్ముల్‌ షాంటో రికార్డులకెక్కాడు. 

    షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్‌ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడితే అందులో 8 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. షాంటో కంటే ముందు ముష్ఫికర్‌ రహీమ్‌ కెప్టెన్సీలో బంగ్లా సాధించిన ఏడు టెస్టు విజయాలే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా షాంటో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

    ఇక ముష్ఫికర్‌ రహీమ్‌ సారథ్యంలో బంగ్లాదేశ్‌ 34 టెస్టులు ఆడింది. ఇందులో 7 విజయాలు, 18 ఓటములు, 9 డ్రాలు ఉన్నాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ నేతృత్వంలో 19 టెస్టులు ఆడిన బంగ్లా 4 విజయాలు, 15 ఓటములు చవిచూసింది. మోమినుల్‌ హక్‌ సారథ్యంలో 17 మ్యాచ్‌లాడిన బంగ్లాదేశ్‌ మూడు విజయాలు సాధించి, 12 ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. 

    ఈ లెక్కన నజ్ముల్‌ హసన్‌ షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్‌ టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించడంతో అతడి కెప్టెన్సీ విన్నింగ్ శాతం అందరికంటే అధికంగా ఉంది. మ్యాచ్‌ విషయానికొస్తే సిల్హెట్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 78 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ 2-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

    437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్‌ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్‌ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్‌ పతనాన్ని శాసించాడు.

    చదవండి: పాక్ మాజీ క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌కు అర్హత!

  • KKR Vs Mumbai Indians Match Live Updates From Kolkata: ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో మనీష్‌ పాండే(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రావ్‌మన్‌ పావెల్‌(40) రాణించాడు. 

    ముంబై బౌలర్లలో కార్భిన్‌ బాష్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఘజన్‌ఫర్‌ తలా వికెట్‌  సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో టాపర్డర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా(26), కార్భిన్‌ బాష్‌(32) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో సౌరభ్ దూబే, కామోరూన్‌ గ్రీన్‌, కార్తీక్‌ త్యాగి తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

    కేకేఆర్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 40 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్.. ఘజన్‌ఫర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేకేఆర్‌ విజయానికి 24 బంతుల్లో 20 పరుగులు కావాలి.

    విజయం దిశగా కేకేఆర్‌
    12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో మనీష్ పాండే(36), పావెల్‌(23) ఉన్నారు. కేకేఆర్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 51 రన్స్ కావాలి.

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    అజింక్య ర‌హానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 21 ప‌రుగులు చేసిన ర‌హానే.. బాష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 7 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 54/2

    కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఫిన్‌ అలెన్‌ దీపక్ చాహర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్‌ టార్గెట్‌ ఎంతంటే?
    ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తేలిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

    లోయార్డర్ బ్యాటర్ కార్భిన్ బాష్‌(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించడంతో ముంబై ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్‌ దూబే, గ్రీన్‌, కార్తిక్‌ త్యాగి తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్‌ నరైన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.
    17 ఓవర్లలో ముంబై 106/7
    17 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 7 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. కార్బిన్ బాష్ (2) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

    తిరిగి మొదలైన ఆట.. 9 ఓవర్లలో ముంబై 61-4
    9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ (10), హార్దిక్ పాండ్యా (8) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

    ఆటకు ఆటంకం కలిగించిన వరుణుడు
    ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ముంబై ఇండియన్స్‌ స్కోరు 8 ఓవర్లకు 57-4గా ఉన్న సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై
    కేకేఆర్‌తో  మ్యాచ్‌లో ముంబై దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. 41 ప‌రుగుల వ‌ద్ద సూర్య‌కుమార్ (15) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. పాండ్యా (6), తిల‌క్ వ‌ర్మ (5) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    రోహిత్‌ (15) ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై కష్టాల్లో పడింది. 15 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ సౌరబ్‌ దూబే బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 23 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (9), తిలక్‌ వర్మ (0) క్రీజులో ఉన్నారు.

    మెరిసిన గ్రీన్‌.. రెండు వికెట్లు కోల్పోయిన ముంబై
    కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 17 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కామెరున్‌ గ్రీన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో మెరిశాడు. తొలుత 6 పరుగులు చేసిన రికెల్‌టన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పాండే స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ఓవర్‌ చివరి బంతికి నమన్‌ ధిర్‌ను గ్రీన్‌ డకౌట్‌ చేశాడు.

    టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 36 సార్లు తలపడితే ముంబై 25 సార్లు, కేకేఆర్ 11 సార్లు నెగ్గాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిబాట పట్టనుంది. ప్రస్తుతం కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.  

    ఈ మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ ఖాతాలో 13 పాయింట్లు చేరుతాయి. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే అప్పుడు 15 పాయింట్లతో నిలవనుంది. ఇదే సమయంలో రాజస్తాన్‌, పంజాబ్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఎలిమినేట్ కావడంతో వారు గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. 

    తుది జట్లు:
    ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌ కీపర్‌) , రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కె ప్టెన్‌), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ.

    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానె(కెప్టెన్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే. 

  • ముంబై ఉగ్ర‌దాడులు (2008) త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిలిచిపోయాయి. ఐసీసీ, ఆసియాక‌ప్ వంటి మేజ‌ర్ టోర్నీల్లో మాత్ర‌మే ఇరుజ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆడేందుకు పాక్ ఆట‌గాళ్ల‌కు అనుమ‌తి లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్‌ మాజీలకు కూడా అవకాశం లేదు.

    అయితే పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ ఆమిర్‌కు మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌లే మ‌హ్మ‌ద్ ఆమిర్ బ్రిటీష్ పౌర‌స‌త్వాన్ని పొందడంతో అధికారికంగా బ్రిట‌న్ జాతీయ‌త‌ను క‌లిగి ఉన్నాడు. దీనివ‌ల్ల ఆమిర్ పాకిస్తాన్‌లో జ‌న్మించి న‌ప్ప‌టికీ తాజాగా బ్రిటీష్ పౌర‌స‌త్వాన్ని పొంద‌డంతో ఐపీఎల్లో ఆడేందుకు అర్హ‌త సాధించాడు. 

    2008 ముంబై ఉగ్ర‌దాడుల త‌ర్వాత బీసీసీఐతో పాటు భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్ పాస్‌పోర్టులు క‌లిగిన క్రికెట‌ర్ల‌ను ఐపీఎల్‌లో పాల్గొన‌కుండా నిషేధం విధించింది. అయితే బ్రిటీష్ పాస్‌పోర్టు అందుకున్న త‌ర్వాత బ్రిట‌న్‌కు చెందిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఆమిర్ పాల్గొన్నాడు. 

    ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు వేలంలో పాల్గొనాల‌నుకుంటే త‌మ పాస్‌పోర్టు ప‌త్రాల‌ను సమ‌ర్పించాల్సి ఉంటుంది. బౌగోళిక ఆంక్ష‌ల నేప‌థ్యంలో కేవ‌లం పాకిస్తాన్‌లో జ‌న్మించిన ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే తీసుకోకూడ‌ద‌నే నిబంధ‌న ఐపీఎల్లో ఉంది. మ‌హ్మ‌ద్ పాకిస్తాన్ దేశానికి చెందిన వాడైన‌ప్ప‌టికీ త‌న వ‌ద్ద యూకే పాస్‌పోర్ట్ ఉన్నందున‌, బ్రిటీష్ పౌరుడిగా వేలంలో పేరు న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

    ఆమిర్‌కు అవ‌కాశ‌మెంత‌?
    అయితే గ‌తంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ అజ‌ర్ మ‌హ్మూద్ బ్రిట‌న్ మ‌హిళ‌ను పెళ్లి చేసుకొని ఆ దేశ పౌర‌స‌త్వాన్ని పొందాడు. ఆ త‌ర్వాత యూకే పౌర‌సత్వంతో ఐపీఎల్ వేలంలో పేరు న‌మోదు చేసుకోవ‌డ‌మే గాక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌, కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

    అయితే టీ20 క్రికెట్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా గుర్తింపు పొందిన మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ఆడుతాడా లేదా అన్న‌ది ప్ర‌శ్న‌గానే ఉంది. ఇటీవ‌లే ది హండ్రెడ్‌, ఎస్ఏ20 టోర్నీల్లో పాక్‌లో జ‌న్మించిన ఆట‌గాళ్ల‌ను చేర్చ‌డంపై వివాదం చెల‌రేగింది. దీంతో మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్‌లో ఆడుతాడా అన్న‌ది అనుమాన‌మే. అయితే ఆమిర్‌కు ఇంగ్లండ్ దేశం హోదా కింద ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం పూల్‌లో త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. 

    అత‌డు డ్రాఫ్ట్ చేయ‌డానికి అర్హుడైన‌ప్ప‌టికీ, వేలంలో ఫ్రాంచైజీలు అత‌డిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తాయా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు అధికారికంగా ఆమిర్‌కు అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ బీసీసీఐ మాత్రం సున్నిత‌త్వ అంశానికే ప్రాధాన్యం ఇస్తే మాత్రం అత‌డు వేలంలో పేరు న‌మోదు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. 

    ముఖ్యంగా ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత ఐపీఎల్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల‌పై క‌ఠిన ఆంక్ష‌ల‌ను జారీ చేసింది. ఈ లెక్కన మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీ జ‌ర‌గ‌డం అనుమాన‌మే.

    స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం
    స్వ‌త‌హగా ఫాస్ట్‌ బౌల‌ర్ అయిన మ‌హ్మ‌ద్ ఆమిర్ త‌న స్వింగ్‌తో ప్ర‌త్యర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. అయితే 2010లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మ‌హ్మ‌ద్ ఆమిర్ కెరీర్‌లో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. చాలాకాలం పాటు అత‌డిపై నిషేధం కొన‌సాగింది. 2015లో ఐసీసీ అత‌డిపై నిషేధం తొల‌గించిన త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.  

    ఇక 2009లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమిర్ పాక్ తరఫున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమిర్‌ వీడ్కోలు పలికాడు.

    అయితే గ‌తేడాది ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్ భార‌త్‌లో ఆడేందుకు నిరాక‌రించిన స‌మ‌యంలో పాకిస్తాన్ హైడ్రామా చేసిన సంగ‌తి కూడా ఎవ‌రు మ‌రిచిపోలేరు. 

    చదవండి: 'క‌శ్మీరీ అని చుల‌క‌న‌.. అందుకే ఎంపిక చేయ‌లేదా?'

  • ఐపీఎల్ 2026 సీజ‌న్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మంగ‌ళ‌వారం గిల్ నేతృత్వంలో 15 మందితో కూడిన టీమిండియాను ప్ర‌క‌టించింది. సీనియ‌ర్ల‌తో పాటు ప్రిన్స్ యాద‌వ్‌, మాన‌వ్ సుతార్‌, హ‌ర్ష్ దూబే, గుర్‌నూర్ బ్రార్ వంటి కొత్త ముఖాల‌కు బీసీసీఐ చోటు క‌ల్పించింది. 

    అయితే దేశ‌వాలీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణించిన జ‌మ్మూ క‌శ్మీర్ క్రికెట‌ర్ అకిబ్ న‌బీని సెలెక్ట‌ర్లు ప‌ట్టించుకోకపోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 2025-26 రంజీ సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించిన అకిబ్ నబీ 10 మ్యాచ్‌ల్లోనే 60 వికెట్లు తీశాడు. తద్వారా ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో అకిబ్ నబీ కీలకపాత్ర పోషించాడు. 

    ఈ నేపథ్యంలో బీసీసీఐ అకిబ్ నబీని ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై రాజ‌కీయ వివాదం అలుముకుంది. అకిబ్ న‌బీ క‌శ్మీర్‌కు చెందిన వ్య‌క్తి అన్న చుల‌క‌న భావంతోనే బీసీసీఐ అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయ‌లేదంటూ క‌శ్మీర్‌కు చెందిన రాజ‌కీయ నేత, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన‌ వ‌హీద్ ఉర్‌ రెహమాన్‌-ప‌రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

    స్వ‌యానా దేశ ప్ర‌ధాని, ప్ర‌జ‌ల చేత శెభాష్ అనిపించుకున్న అకిబ్ న‌బీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న బీసీసీఐ క‌ళ్ల‌కు క‌నిపించ‌లేదా అంటూ వహీద్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు బీసీసీఐ అధ్య‌క్షుడు మిథున్ మ‌న్హాస్‌, ఐసీసీ చైర్మ‌న్ జై షాలు కూడ‌గ‌ట్టుకొని అకిబ్ న‌బీని జాతీయ జ‌ట్టుకు ఎంపిక కాకుండా అడ్డుప‌డ్డారంటూ 'ఎక్స్' వేదిక‌గా వారి పేర్ల‌ను ట్యాగ్ చేస్తూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. 

    '67 ఏళ్ల త‌ర్వాత జ‌మ్మూ క‌శ్మీర్ రంజీ ట్రోఫీ సాధించ‌డంలో అకిబ్ నబీది కీల‌క‌పాత్ర‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎంపికైన అకిబ్ న‌బీని దేశ ప్ర‌ధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, క్రికెట్ అభిమానులు ప్ర‌శంసించారు. కానీ బీసీసీఐ మాత్రం కొన్ని శ‌క్తుల‌కు త‌లొగ్గి అకిబ్ న‌బీకి జాతీయ జ‌ట్టులో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డం బాధాక‌రం. మిథున్ మ‌న్హాస్‌, జై షాల నిర్ణయం చాలా షాకింగ్‌గా అనిపించింది' అని వహీద్‌ పరా ఘాటుగా రాసుకొచ్చారు.

    ఇక అకిబ్ న‌బీ దేశ‌వాలీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. 29 ఏళ్ల అకిబ్ 2025-26 రంజీ సీజ‌న్‌లో జ‌మ్మూ క‌శ్మీర్‌కు ఆడాడు. 10 మ్యాచ్‌లాడిన అకిబ్ 17 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 12.56 స‌గ‌టుతో మొత్తం 60 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో ఏడు ఐదు వికెట్ల హాల్‌ను న‌మోదు చేయ‌డం విశేషం.

    క‌ర్నాట‌క‌తో జ‌రిగిన రంజీ ఫైన‌ల్లోనూ అకిబ్ న‌బీ 54 ప‌రుగులిచ్చి 5 వికెట్లు తీయ‌డం ద్వారా జ‌మ్మూ క‌శ్మీర్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 291 ప‌రుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. దేశ‌వాలీ టోర్నీలో అద‌రగొట్టిన అకిబ్ న‌బీని ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచ్‌లాడిన అకిబ్ నబీ ఒక వికెట్ తీశాడు. 

    జూన్ 6 నుంచి ఛండీగఢ్‌లోని ముల్ల‌న్ పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్టుకు భార‌త జ‌ట్టుకు గిల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అత‌డికి డిప్యుటీగా కేఎల్ రాహుల్ ఉండ‌నున్నాడు.

    ఆఫ్గన్‌తో టెస్టుకు టీమిండియా: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్ (వైస్ కెప్టెన్‌) , సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, దేవదత్‌ పడిక్కల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌ యాదవ్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్, గుర్‌నూర్‌ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్‌ జురేల్‌.

    చదవండి: లక్నో జట్టులోకి వైభవ్ సూర్యవంశీ!

  • రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌లో చేర‌నున్నాడ‌న్న వార్త‌ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంత‌రం వైభ‌వ్‌తో ల‌క్నో యజ‌మాని సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా చ‌ర్చించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. 

    ఆ ఫొటోలను సంజీవ్‌ గోయెంకానే స్వయంగా తన ‘ఎక్స్‌’లో పంచుకోవడం విశేషం. మాట‌ల సంద‌ర్భంలో ల‌క్నో జ‌ట్టులో చేరాలంటూ వైభ‌వ్‌కు సంజీవ్ గోయెంకా అడిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే క‌ళ్లు చెదిరే మొత్తాన్ని వైభ‌వ్‌కు ఆఫ‌ర్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అనేది ప‌క్క‌న‌బెడితే.. ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    సంజీవ్ గోయెంకా ఆశీర్వాదం తీసుకున్న వైభ‌వ్‌, ఆ త‌ర్వాత ఆయ‌న‌తో చాలాసేపు ముచ్చ‌టించాడు. ల‌క్నో జ‌ట్టులోకి వ‌స్తాడా? రాడా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే, వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట‌కు ఫిదా అయిన సంజీవ్ గోయెంకా అత‌డి టెక్నిక్‌, బ్యాటింగ్ ర‌హ‌స్యం గురించి చ‌ర్చించి ఉండొచ్చ‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ స‌మయంలోనే ల‌క్నో జ‌ట్టులో చేరాలంటూ వైభ‌వ్‌కు ఆయ‌న భారీ ఆఫ‌ర్ కూడా ఇచ్చి ఉంటార‌ని అనుకుంటున్నారు. 

    నిజానికి వైభ‌వ్ సూర్య‌వంశీకి వ‌చ్చే ఏడాది యాక్ష‌న్ పూల్‌లో బ‌రిలోకి దిగే అవ‌కాశం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వైభ‌వ్ సూర్య‌వంశీని త‌క్కువ ధ‌ర‌కే సొంతం చేసుకున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అత‌డిని విడుద‌ల చేసేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అవ‌స‌ర‌మైతే ఎక్కువ అమౌంట్‌ను కోట్ చేసి వైభ‌వ్‌ను త‌మ జ‌ట్టుతోనే అట్టిపెట్టుకునే అవ‌కాశముంది. 

    ఐపీఎల్ మెగావేలానికి మ‌రో రెండేళ్లు ఉండ‌డంతో అప్ప‌టివ‌ర‌కు వైభ‌వ్ సూర్య‌వంశీని త‌మ‌తోనే ఉంచుకోవాల‌ని రాజ‌స్తాన్ భావిస్తోంది. ఒక‌వేళ వైభ‌వ్ సూర్య‌వంశీ త‌నంత‌ట తానుగా రాజ‌స్తాన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాల‌నుకుంటే మాత్రం అత‌న్ని ద‌క్కించుకోవ‌డానికి  ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. 

    ప‌ట్టుమని 16 ఏళ్లు కూడా లేని వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో ఇవాళ ఐపీఎల్‌లో అన్ని ఫ్రాంచైజీల‌కు హాట్ కేక్‌లా మారిపోయాడు. అత‌డు వ‌స్తానంటే ఎంత భారీ ధ‌ర‌కైనా కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొడుతున్నాడు. 13 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 579 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. 

    మంగ‌ళ‌వారం ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో 221 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో వైభ‌వ్ సూర్య‌వంశీ (38 బంతుల్లోనే 93) సునామీ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టు విజ‌యాన్ని బాట‌లు వేశాడు. ఈ సీజ‌న్ ఆరంభంలో వ‌రుస విజ‌యాలు సాధించిన రాజ‌స్తాన్ ఆ త‌ర్వాత ఓట‌ముల‌తో ఢీలా ప‌డింది. 

    కానీ చివ‌రి అంకంలో మ‌ళ్లీ ఫుంజుకున్న రాయ‌ల్స్ విజ‌యాలు సాధించి 14 పాయింట్లతో ప‌ట్టిక‌లో 4వ స్థానంలో ఉంది. మే 24న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రగ‌నున్న త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ చేరుకోవాల‌ని రాజ‌స్తాన్ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇక టీమిండియా సీనియ‌ర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైభ‌వ్‌కు ఇంకా స‌మ‌య‌ముందున్న బీసీసీఐ ఇండియా-ఏ జ‌ట్టుకు మాత్రం అత‌డిని ఎంపిక చేసింది. మ‌రి ఇండియా-ఏ త‌ర‌ఫున మ్యాచ్‌ల్లో వైభ‌వ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో చూడాలి.

    చదవండి: చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్‌

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌పై విజ‌యం సాధించ‌డం ద్వారా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఆదివారం (మే 24న‌) ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌ని లేకుండా 16 పాయింట్ల‌తో రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది. మ్యాచ్ విజ‌యంలో చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీదే కీల‌కపాత్ర‌. 

    38 బంతుల్లోనే 93 ప‌రుగులు చేసి రాజ‌స్తాన్‌ను గెలుపు తీరాల‌కు ద‌గ్గ‌ర చేశాడు. ఆ త‌ర్వాత ధ్రువ్ జురెల్ మిగ‌తాప‌నిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 ప‌రుగులు మాత్ర‌మే చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఆ త‌ర్వాతి 26 బంతుల్లో 82 ప‌రుగులు చేయ‌డం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న చేతుల‌తో విచిత్ర‌మైన ఫోజు ఇచ్చాడు. 

    దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్న‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభ‌వ్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత వెల్ల‌డించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్‌ పంచుకున్నాడు. ముర‌ళీ కార్తిక్‌తో వైభవ్‌ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియ‌దు. ఏదో కొత్త‌గా ట్రై చేయాల‌నుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. 

    లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్‌ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ‘ఇక నేను న్యూస్ పేప‌ర్లు పెద్ద‌గా చ‌ద‌వ‌ను. దీనివ‌ల్ల నా గురించి పేప‌ర్ల‌లో ఏం రాస్తున్నార‌న్నది తెలియ‌దు. అయితే నా కెరీర్‌కు ఇది ఆరంభం మాత్ర‌మే. ఇంకా సుదీర్ఘ‌మైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవ‌లం ఆట‌పైనే త‌ప్ప ఇత‌ర విష‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. 

    ఇన్నింగ్స్ మొద‌ట్లో స్లోగా ఆడ‌డంపై కూడా వైభ‌వ్ వివ‌ర‌ణ ఇచ్చాడు.'మా జ‌ట్టు బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో నేను డ‌గౌట్‌లో కూర్చున్నా. ఆ స‌మ‌యంలో వికెట్ బాగుంద‌నిపిచ్చింది. అయితే ఆదిలోనే తొంద‌ర‌ప‌డితే మొద‌టికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా. కానీ మ‌రో ఎండ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ వేగంగా ఆడ‌డంతో నేను సైలెంట్ అయిపోయాను. 

    ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు

    కానీ జైస్వాల్ ఔట‌య్యేట‌ప్ప‌టికీ పిచ్‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చేసింది. అందుకే ఆ త‌ర్వాత స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొన‌సాగించాను. అయితే సెంచ‌రీ మిస్ అవ్వ‌డంపై కాస్త నిరాశ‌కు లోనైన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌డం ఆ బాధ‌ను మ‌రిచిపోయేలా చేసింది. 

    ఈ విజ‌యంతో ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువ‌య్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌డ‌మే మా ఏకైక ల‌క్ష్యం' అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: టీమిండియాలోకి వైభవ్‌.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!

Business

  • భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం  వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.

    భారత్‌లో సమస్యగా బంగారం 
    భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్‌ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.

    పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువ
    ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.

    100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పు
    ఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.

    ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

    ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !

    బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు.

    "ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.

    గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

    ప్రభుత్వానికీ విజ్ఞప్తి

    ఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు.

  • ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది.

    ఈ సరికొత్త సేవలు ఎయిర్‌టెల్‌లోని అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్‌లలోకి మారాలనుకుంటే ఎయిర్‌టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

    ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్‌లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్‌లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్‌లను బట్టి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, యాపిల్ టీవీ+, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.

    ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్‌లో లేదా ఎయిర్‌టెల్ యాప్‌లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

  • ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్‌కు చెందిన అగ్రగామి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 13కి చేరింది.

    వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత చేరువవడానికి ఈ విస్తరణ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, ఇతర వ్యాపారస్తులు, కొత్తగా ఆదాయం ఆర్జిస్తున్న వర్గాల కోసం వారి అవసరాలకు తగ్గట్టుగా ఏబీహెచ్ఎఫ్ఎల్ వివిధ రకాల గృహ రుణాలను అందిస్తోంది.

    ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఏబీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 2026 మే 20 నుండి మే 31 వరకు ఎలాంటి లాగిన్ ఫీజు (జీరో లాగిన్ ఫీజ్) లేకుండా, రూ. 50 లక్షల వరకు అక్కడికక్కడే రుణాలు మంజూరు (స్పాట్ లోన్ సాంక్షన్) చేయనున్నారు. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖర్చుతో, వేగంగా రుణాలు పొందే అవకాశం లభిస్తుంది.

  • భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'(WFH) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుండి లేదా రిమోట్‌గా పని చేయడానికి బ్యాంక్ అనుమతినిచ్చింది.

    ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రాథమికంగా 30 రోజుల పాటు దీన్ని పరిశీలించి, ఫలితాల ఆధారంగా ఈ విధానాన్ని కొనసాగించేది.. లేనిది నిర్ణయించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారాలు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న  నేపథ్యంలో.. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    వీరికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..
    బ్యాంకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుంది. బిజినెస్ ఎనేబుల్ ఫంక్షన్లు అంటే ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్ రైటింగ్ & రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ (IT) సేవలు వంటి కీలక కార్యాచరణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్పొరేట్ ఎనేబుల్ ఫంక్షన్లు అయిన హ్యూమన్ రీసోర్సెస్ (HR), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ & కాంప్లయన్స్, అలాగే సెక్రటేరియల్, బోర్డు విధులు నిర్వహించే అధికారులు కూడా రిమోట్‌ వర్క్‌ విధానంలో పనిచేస్తారు.

    అయితే కస్టమర్లతో నేరుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ బ్రాంచ్‌లు (శాఖలు), ఇతర ఫ్రంట్-ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగుల పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆయా విభాగాలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పష్టం చేసింది.

  • భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎస్‎వీకేఎం వారి నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎన్‎ఎంఐఎంఎస్) మల్టీ డిసిప్లైనరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రూపొందించింది. విద్యార్థులను పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, అనుభవపూర్వకమైన అభ్యాసం,విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాస్తవ-ప్రపంచ అనుభవం కోసం సిద్ధం చేసే ఒక అండర్ గ్రాడ్యుయేట్ అభ్యాస వ్యవస్థను తయారు చేసినట్లు ఎన్‎ఎంఐఎంఎస్ తెలిపింది.

    2026—27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్‎ఎంఐఎంఎస్ ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు, హైదరాబాదు, ఇండోర్, చండీఘడ్, అహ్మదాబాద్ లోని తమ ప్రాంగణాలలో అండర్ ‎గ్రాడ్యుయేట్ అవకాశాలను అందిస్తోంది. ఎన్‎పిఏటి (కామర్స్), ఎన్‎సిఈటి (ఇంజనీరింగ్ & ఫార్మసీ), ఎన్‎ఎల్‎ఏటి (లా), ఎన్‎డిఏటి (డిజైన్), ఎంఎస్‎టి (మ్యాథమాటిక్స్, స్టాటిస్టిక్స్ & డేటా సైన్సెస్) సహా ఎంచుకున్న కోర్స్ ఆధారంగా వివిధ ప్రవేశ పరీక్షల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్లకు గడువు మే 26న ముగుస్తుంది.

  • సాక్షి, హైదరాబాద్‌: వైమానిక, అంతరిక్ష, రక్షణ, డీప్‌టెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. అమెరికా విమానయాన సంస్థ సౌత్‌వెస్ట్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ (జీఐసీ)ని ఏర్పాటు చేయడం కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు.

    హైటెక్‌ సిటీ ప్రాంతంలో బుధవారం సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ జీఐసీ కేంద్రాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పాతికేళ్ల క్రితమే దేశంలోనే తొలి విమానాశ్రయ నిర్మాణానికి పీపీపీ మోడల్‌ను ఎంచుకోవడంతో హైదరాబాద్‌లో వైమానిక రంగానికి పునాది పడిందని తెలిపారు. డీఆర్‌డీవో, ఆర్‌సీఐ, డీఎంఆర్‌ఎల్‌ వంటి దిగ్గజ రక్షణ రంగ సంస్థలకు కేంద్రమైన హైదరాబాద్‌ అత్యాధునిక ఇంజినీరింగ్‌, సృజనలకు కేంద్రంగా అవతరిస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలు బోలెడు హైదరాబాద్‌లో తమ తొలి ఇన్నొవేషన్‌ సెంటర్ ఏర్పాటు చేశాయని అన్నారు.

    సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఎగ్జిక్యుటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ లారెన్‌ వుడ్స్‌ మాట్లాడుతూ... ‘‘ఇంజినీరింగ్‌, అనలిటిక్స్‌, ఇన్నొవేషన్లకు సంబంధించినంత వరకూ హైదరాబాద్‌లో అద్భుతమైన నైపుణ్యం అందుబాటులో ఉంది. అందుకే మేము మా తొలి ఇన్నొవేషన్‌ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ, డేటా, నెక్స్ట్‌ జనరేషన్‌ ఇంజినీరింగ్‌లతోపాటు బిజినెస్‌ ఆపరేషన్లను కూడా ఈ కేంద్రం నుంచి నడపనున్నట్లు తెలిపారు.

    వెయ్యి మందికి కొలువులు...
    సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ జీఐసీలో ప్రస్తుతం 170 మంది పనిచేస్తూండగా.. దశలవారీగా వెయ్యి మంది వరకూ ఉద్యోగాలు పొందుతారని సంస్థ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ లారెన్‌ వుడ్స్‌ ‘సాక్షి.కాం’కు తెలిపారు. ఈ కేంద్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే ఉద్యోగాలు పొందుతారని, ప్రస్తుతానికి విదేశీయులను నియమించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని యూనివర్శిటీలు, తెలంగాణ ప్రభుత్వ స్కిల్‌ వర్శిటీతోనూ కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ దాదాపు పదేళ్లుగా మెషీన్‌ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని, సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ప్రస్తుతం ఏఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ జీఐసీ ద్వారా సమీప భవిష్యత్తులోనే మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.

    తొలి టికెటింగ్‌ మెషీన్‌ మాదే..
    సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో సృజనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్‌ టికెటింగ్‌ మెషీన్‌ను వినియోగించిన సంస్థ తమదేనని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ హెడ్‌ (ఇండియా) కల్లెపల్లి కృష్ణ తెలిపారు. 1971లో ఈ టికెటింగ్‌ మెషీన్‌ను ప్రారంభిస్తే 1994లోనే అత్యాధునిక రిజర్వేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ భవిష్యత్తులో భారత్‌లోనూ ఎగిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఇతర కంపెనీలపై అడ్వాంటేజ్‌ ఇచ్చేదేనని, అందుకే సౌత్‌వెస్ట్‌ కూడా ఈ రంగంలో తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు.

  • ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

    ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర  వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

    ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.

    ప్రధాని విజన్‌కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ట్రేడింగ్ చివరి గంటలో అన్ని ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చేశాయి.

    నిఫ్టీ 50 ఇండెక్స్ 41 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 23,659 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 23,690.90 వద్ద గరిష్టం, 23,397.30 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.

    బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 117.54 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 75,318.39 వద్ద ట్రేడింగ్ సెషన్ ను  ముగించింది. ఈ ఇండెక్స్‌లో గరిష్టం 75,406.18 పాయింట్లు, కనిష్టం 74,529.41 వద్ద నమోదైంది.

    హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.04 శాతం పెరిగాయి

    రంగాల వారీగా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించాయి.

Andhra Pradesh

  • అల్లూరి జిల్లా: తనను తాను పాస్టర్‌ అని చెప్పుకున్న అభినయ్‌పై దాడి కేసులో ఎస్పీ అమిత్ బర్దర్ కీలక విషయాలు వెల్లడించారు. బుధవారం అమిత్‌ బర్దర్ మీడియాతో మాట్లాడారు.

    ‘‘అభినయ్ పాస్టర్ కాదు. అతడిపై ఎవరూ దాడి చేయలేదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలనేది ఆయన ఉద్దేశం. దాడి పేరుతో సానుభూతి పొందాలనేది అభినయ్ ఆలోచన. ఆయన సినిమా యాక్టర్ కావడంతో సినిమా తరహాలో దాడి జరిగినట్లు ప్లాన్ సిద్ధం చేశారు. గతంలో కూడా ఆయనపై అనేక కేసులు నమోదయి ఉన్నాయి. 

    హాస్పిటల్ కు రాకముందే సోషల్ మీడియాలో అభినయ్ వీడియోలు వైరల్ అయ్యాయి. గూడెం కొత్త వీధి పీఎస్‌లో BNS సెక్షన్లు 189(3), 196(2), 299, 3(5), 302, 353(1) కింద కేసు నమోదు చేశాము. కుట్రలో పాల్గొన్న నిందితుల పేర్లు.. దారా అభినయ దర్శన్, కిరణ్ జార్జ్, కె.బెన్‌హర్, భాను ప్రసాద్. దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తంగుల వసంత్ కుమార్, కుమాడ ప్రేమ్‌కుమార్, తంగుల సత్యరాజు, కిండంగి ఇంద్ర కుమార్’’అని తెలిపారు.

    పాస్ట‌ర్‌ ప్రవీణ్ పగడాలలాగే త‌న‌ను కూడా చంపాలనుకుంటున్నారని అభినయ్ మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. తనకు పోలీసుల ద‌ర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. త‌న‌పై దాడి చేసిన వారిని వదిలేసి, త‌న‌ అనుచరులను అరెస్టు చేశారని చెప్పారు. కాగా, పోలీసుల దర్యాప్తులో ఆయన నాటకాలన్నీ బయటపడ్డాయి.  

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు ఉదయం (గురువారం) 11 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ జరగనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్ ప్రజల సమస్యలపై స్పందించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  

  • సాక్షి,కృష్ణా:గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కిరీటం మాయమైంది. గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.

    మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్‌ లాకర్‌లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు.

    దాంతో సుబ్బారావు  కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించారని సుబ్బారావు వాపోయారు.

  • సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ఖజానా నుంచి అమరావతి కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి రూ.2,100 కోట్లు సీఆర్‌డీఏకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు అమరావతి కోసం మొత్తం రూ.4,100 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదలయ్యాయి.

    ఇప్పటికే రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుదేలైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.47,000 కోట్ల రుణాలు తెచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి నిధులు విడుదల చేయడం ప్రజల డబ్బు వృథా అవుతోందన్న విమర్శలకు దారితీస్తోంది.

    గతంలో అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’గా అభివర్ణిస్తూ, ప్రజల డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పటివరకు వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

    ప్రజల డబ్బు అమరావతికి పెట్టబోమని చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఇప్పుడు నిధులు విడుదల చేయడంపై  ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి అమరావతికి నిధులు కేటాయించడం ఆర్థికపరంగా సరైన నిర్ణయం కాదన్న చర్చలు కొనసాగుతున్నాయి.

Telangana

  • హైద‌రాబాద్‌: ఊరేళ్ల‌డానికి ల‌గేజీ స‌ర్దుకుని.. క్యాబో, ఆటోనో ప‌ట్టుకుని హ‌డావుడిగా రైల్వే స్టేష‌న్‌కు వెళ్ల‌గానే ట్రైన్ క్యాన్సిల్ అయింద‌ని తెలిస్తే ఉస్సూరుమంటాం. చేసేదీ లేక ప్ర‌త్యామ్నాయం వెతుక్కుంటాం. ఆర్టీసీ బ‌స్సో, ప్రైవేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యించి ప్ర‌యాణాన్ని పూర్తి చేస్తాం. ర‌ద్దవుతున్న రైళ్ల కారణంగా ప్ర‌తిరోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు త‌ర‌చుగా ర‌ద్ద‌వుతున్న ఉదంతాలు ఇటీవ‌ల కాలంలో బాగా పెరిగాయి. ఒక్క ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలోలోనే రోజుకు 18 స‌ర్వీసులుపైగా ర‌ద్ద‌వుతున్నాయంటే న‌మ్మ‌గ‌ల‌రా? కానీ ఇది నిజం. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) స్వ‌యంగా ఈ విష‌యం వెల్ల‌డించింది.

    గ‌తేడాది అంటే 2025లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలో 6 వేల‌కు పైగా రైళ్ల స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. ఇందులో 27 స‌ర్వీసులను సిబ్బంది కొర‌త కార‌ణంగా ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. కోచ్‌ల కొర‌త వ‌ల్ల 297 స‌ర్వీసుల‌ను నిలిపివేశామ‌ని ఎస్‌సీఆర్ వెల్ల‌డించింది. గ‌త నాలుగేళ్ల‌లో 46 వేల‌కు పైగా స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. వీటిల్లో ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌, ప్యాసింజ‌ర్‌, ఎంఎంటీఎస్‌ (MMTS), డెమూ స‌ర్వీసులు ఉన్నాయ‌ని తెలిపింది. ఎస్‌సీఆర్ నుంచి ఆర్టీఐ (RTI) ద్వారా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఈ వివ‌రాలు రాబ‌ట్టింది.

    2023, 24 సంవ‌త్స‌రాల‌తో పోలిస్తే 2025లో ప‌రిస్థితి కాస్త మెరుగైంది. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలో 2023లో 17,476, 2024లో16,610 రైళ్ల స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. గ‌తేడాది 6,369 రైళ్లు ప‌ట్టాలు ఎక్క‌ల‌కుండానే నిలిచిపోయాయి. బ్లాక్స్ నిర్వహణ, ట్రాక్‌ల మ‌ర‌మ్మ‌తులు, మౌలిక స‌దుపాయాల నిర్మాణ ప‌నుల కార‌ణంగా ఎక్కువ‌గా స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేయాల్సి వ‌స్తోంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోచ్‌లు, సిబ్బంది కొర‌త వ‌ల్ల కూడా స‌ర్వీసులను నిలిపివేస్తున్నారు.

    లోకోపైల‌ట్ల కొర‌త
    ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేలో లోకోపైల‌ట్ల కొర‌త స‌మ‌స్య‌గా మారింది. ఉండాల్సిన దానికంటే 25 శాతం త‌క్కువ‌గా లోకోపైల‌ట్లు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రో 1000 మంది వ‌ర‌కు లోకోపైల‌ట్ల అవ‌స‌రం ఉంద‌న్నారు. సిబ్బంది కొర‌త కార‌ణంగా లోకోపైల‌ట్లపై ప‌నిభారం అధిక‌మ‌వుతోందని, ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని అధికారులు కోరుతున్నారు.

    చ‌ద‌వండి: రేయ్‌.. నాశ‌నం అయిపోతారు

  • సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో రేపటి నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభంకానున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. రేపు గురువారం ‍ప్రారంభమై మే 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకూ పుష్కరాలు జరగునున్నట్లు తెలిపింది. ఈ అంత్యపుష్కరాలకు దాదాపు 40 లక్షల ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని అయిన సరస్వతి నదుల సంగమం. ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి, ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం  12 రోజుల పాటు వివిధ రకాల హోమాలు,పూజలు నిర్వహించబడతాయని ఆలయ అధికారులు తెలిపారు. 
        
    మే 21 ఉదయం 5:43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ద్వారా పుష్కర స్నానం ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొననున్నారు. ప్రతి రోజు వివిధ పీఠాధిపతులు పాల్గొని హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభమై జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయని అధికారులు తెలిపారు.

  • సాక్షి,జగిత్యాల: మేడిపల్లి మండలం కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివగంగ ఆలయం సమీపంలోని‌ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. తొలుత ఇద్దరు మృతదేహాలు లభించగా ఒకరు గల్లంతయ్యారు. దీంతో వెంటనే గల్లంతైన చిన్నారి కోసం గజ ఈతగాళ్లు కోనేరులో దిగి గాలింపులు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతులు మనస్వి, అర్వింద్‌గా గుర్తించారు. పిల్లల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

     

     

     

     

     

  • హైదరాబాద్‌: సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.

    హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

    వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా..  112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ రూ.101.87  కోట్లు.

    టెలికాం నెట్‌వర్క్ వారీగా పరిశీలిస్తే.. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

    ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. 'నెట్‌వర్క్ సరిగా లేదు', 'సర్వర్ డౌన్ అయ్యింది', 'వేలిముద్ర సరిగా పడలేదు' అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.

    మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.

    ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.

    ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్‌టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.

    ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు.  

    ఈ సైబర్ నెట్‌వర్క్‌ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి. కాగా,'ఘోస్ట్ సిమ్' నెట్‌వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల  ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.

    అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. 'మ్యూల్ అకౌంట్స్' సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే పరిష్కారాలను కోరడం జరిగిందో.. ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా 'ఘోస్ట్ సిమ్' సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి చెప్పనుంది.

    ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి బ్లాక్‌లిస్ట్ చేయాలి.

    ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో 'మ్యూల్ హంటర్ డేటా', I4C అనుమానితుల డేటాబేస్‌తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.

    ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలి.

    మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ 'సంచార్ సాథీ' పోర్టల్‌ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్‌ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.

    ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.. వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న 'సి-మిత్ర' సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి. 

  • సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్‌ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్‌పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్‌గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ ‍చేశారు. మహేంద్రా థార్‌లో వచ్చిన నలుగురు  యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..

    వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.

    ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ట్రేస్‌ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఖండించారు. బండి భగీరథ్‌ కేసు వివాదం తర్వాత తొలిసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. 

    ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ ఫేక్‌ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నేనేంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు నాకు లేవు. ఎవరెవరో ఏదో రాస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్‌ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఏదైనా సందర్భంగా కొడుకును తండ్రి  పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా?. విచారణ నిమిత్తం నేనే స్వయంగా భగీరథ్‌ను పోలీసులకు అప్పగించా’నని వ్యాఖ్యానించారు. 

Politics

  • అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. 

    అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..

    టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్‌ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు  వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్‌తో మొదలు పెడదాం. 

    అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? 
    ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. 

    ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్‌గ్రౌండ్‌లను చూపించి ప్రచారం చేశారు. 

    విశ్వసనీయతను దెబ్బతీసేలా.. 
    విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.

    ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే 
    ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

    రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా?  
    ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా  ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్‌ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.

    ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.

    నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్‌కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. 

  • ఉత్తర ప్రదేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ చేయి ఇవ్వ‌నుందా? వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొత్త మిత్రుడి పొత్తు కోసం హ‌స్తం పార్టీ ప్ర‌య‌త్నిస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. యూపీలో చోటుచేసుకున్న తాజా ప‌రిణామాలు ఈ వాద‌న‌ల‌కు బలాన్ని చూకూరుస్తున్నాయి. గ‌త లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాదీ పార్టీతో క‌లిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కు క‌లిసిరాలేదు. అందుకే ఈసారి కొత్త పొత్తు కోసం ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టిన‌ట్టు తెలుస్తోంది.

    2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో భాగంగా  బీఎస్పీ అధినేత్రి మాయావతితో సంప్ర‌దింపుల‌కు రాహుల్ గాంధీ త‌న ప్ర‌తినిధుల బృందాన్ని ల‌క్నోకు పంపించార‌ని స‌మాచారం. బారాబంకి ఎంపీ తనుజ్ పునియా (Tanuj Punia), కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల శాఖ జాతీయ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఈ ప‌ని మీదే ల‌క్నోకు పంపిన‌ట్టు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. బీఎస్పీ అధినేత్రి ల‌క్నోలో ఉన్నారని తెలుసుకుని కాంగ్రెస్ ప్ర‌తినిధులు ఆమె నివాసానికి వ‌చ్చార‌ని, అయితే వారిని క‌లిసేందుకు మాయావ‌తి సుముఖ‌త చూప‌లేద‌ని స‌మాచారం.

    మాయావ‌తి నో
    రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఎస్పీతో క‌లిసి పోటీ చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై చ‌ర్చలు ప్రారంభించాల‌ని రాహుల్ గాంధీ కోరుకున్నార‌ని, ఇదే మాట‌ను మాయావ‌తితో చెప్ప‌డానికి కాంగ్రెస్ ప్ర‌తినిధులు ల‌క్నోకు వ‌చ్చార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హ‌స్తం పార్టీ నాయకుల‌తో భేటీ కావ‌డానికి బీఎస్పీ అధినేత్రి నిరాక‌రించ‌డంతో, ఆమె ఇంటి గేటు వ‌ద్ద త‌మ వివ‌రాలు న‌మోదు చేసి వారు వెనుదిరిగారని సమాచారం. ఈ తాజా ప‌రిణామం ఉత్తరప్రదేశ్‌లో రాజ‌కీయాల్లో ప‌లు ఊహాగానాలకు తెర‌తీసింది.

    ఎస్పీతో పొత్తుపై అసంతృప్తి
    అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఇప్ప‌టికీ కాంగ్రెస్‌కు మిత్ర‌ప‌క్షంగా ఉంది. జాతీయ స్థాయిలోనూ ప్ర‌తిప‌క్ష కూట‌మి ఇండియా బ్లాక్‌లోనూ స‌మాజ్‌వాదీ పార్టీ భాగ‌స్వామిగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే, ఎస్పీతో పొత్తు పట్ల కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యంలో కొనసాగడం కంటే బీఎస్పీతో అవగాహనకు రావడం రాజకీయంగా ఎక్కువ ప్రయోజనకరమని పార్టీలోని చాలామంది భావిస్తున్నారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 'మ‌నీకంట్రోల్‌'తో అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం రావాలంటే సమాజ్‌వాదీ పార్టీని వ‌దిలి బీఎస్పీతో జ‌ట్టు క‌ట్ట‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

    "ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వతంత్రంగా పుంజుకోవడానికి ఎస్పీ ఎప్పటికీ తగినన్ని సీట్లు ఇవ్వదు. గెలుపు అవకాశాలు పరిమితంగా ఉన్న కష్టమైన సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌బెడుతుంది.  402 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ సుమారు 100 నుంచి 125 సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది, కానీ ఎస్పీ 40 నుంచి 50 సీట్లకు మించి ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు" అని ఆ సీనియర్ నాయకుడు అన్నారు.

    బీఎస్పీకి కూడా లాభ‌మే
    త‌మ పార్టీతో చేతులు కలిపితే బీఎస్పీ కూడా పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయ‌ప‌డ్డారు. బీజేపీ భ‌యంతో ఆమె త‌మతో పొత్తు పెట్టుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో మాయావ‌తిపై బీజేపీ ఒత్తిడి చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ప‌లు వ‌ర్గాలు ఎస్పీకి ఓటు వేయడానికి ఇష్టపడటం లేదని, కాంగ్రెస్- బీఎస్పీ కలిస్తే ఈ ఓట‌ర్ల‌ను త‌మవైపు తిప్పుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

    గ‌త కొన్నేళ్లుగా ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యాలు ఎదుర్కొన్నప్ప‌టికీ, దళిత ఓటు బ్యాంకును బీఎస్పీ కాపాడుకుంటూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా ప్రతిపక్ష ఐక్యతను విస్తృతం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఎస్పీలకు సంబంధించిన రాజకీయ సమీకరణాలలో ఎలాంటి మార్పు వచ్చినా.. అది 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల సమీకరణాలను గణనీయంగా మార్చగలదని అంచ‌నా వేస్తున్నారు. ఇది జ‌రిగితే సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌కు చిక్కులు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

    బహిరంగ చర్చలకు నో
    మ‌రోవైపు మాయావతి ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రెండింటికీ స‌మాన దూరం పాటిస్తున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం దళిత రాజకీయాలను వాడుకుంటున్నాయని ఆ రెండు పార్టీలపై తరచుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల‌ బృందాన్నికలవడానికి ఆమె నిరాకరించారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్‌తో బహిరంగంగా చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదనే సంకేతాన్ని ఆమె ఇచ్చారు.

    చ‌ద‌వండి: బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు!

    పొత్తు చ‌ర్చ‌ల కోసం కాదు
    మాయావ‌తిని మ‌ర్వాద‌పూర్వ‌కంగా క‌లిసేందుకు మాత్ర‌మే ఆమె ఇంటికి వెళ్లామ‌ని, పొత్తు చ‌ర్చ‌ల కోసం కాద‌ని రాజేంద్ర పాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) తెలిపారు. “మాయావతి ఒక సీనియర్ దళిత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి. ఆమె యోగక్షేమాలను తెలుసుకోవడం మా బాధ్యత. అందుకే ఆమె ఇంటికి వెళ్లాం. మేము గేటు వద్ద మా పేర్లు న‌మోదు చేసి వ‌చ్చాం. ఆమె ఎప్పుడు పిలిచినా, ఆమెను మళ్ళీ కలుస్తాము” అని గౌతమ్ అన్నారు. ఈ పర్యటన గురించి గానీ, పొత్తు చర్చలకు సంబంధించిన ఊహాగానాల గురించి గానీ బీఎస్పీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

  • సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేతలు కురుసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనే దిక్కులేదు అని ఘాటు విమర్శలు చేశారు.

    కాకినాడలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా, దవులూరి దొరబాబు, గిరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన వదిలేసి చంద్రబాబు అమరావతి కాంట్రాక్టర్‌లే ధ్యేయంగా ఈవెంట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అని మహిళలను అవమానపరుస్తున్నారు. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా మాట్లాడుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చేపల పులుసు ఎలా వండాలో మత్స్యకారులకే చంద్రబాబు  నేర్పించిన ఈవెంట్  చూశాం’ అని ఎద్దేవా చేశారు.

    కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘మత్స్యకారులకు సేవా? మత్యకారులకు శాపమా?. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హర్బర్ కథ ఏం చేశారో మొన్ననే చూశాం. చంద్రబాబు మళ్ళీ అక్కడికే వెళ్ళి చేపల పులుసు వండుతారు. తెలుగు వెన్నుపోటు పార్టీ.. మత్య్సకారుల నుండి రైతుల వరకు వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఒక్క పక్క.. కొడుకు ఒక పక్కన పొదుపు మీరు చేయండి. దుబారా మేము చేస్తామని డ్రామాలు చేస్తున్నారు‌. ఒకాయన సైకిల్ తొక్కుతాడు.. ఐదారు కెమెరాలు వాహనాలపై నడుస్తాయి. చంద్రబాబు డ్రామాలు ఏంటో అందరికీ తెలుసు’ అని మండిపడ్డారు

    బాబు.. ఇదేంపాలన మహిళలంటే అంత చులకనా?

     

Family

  • వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి. 
        
    1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్‌  ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్‌ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్‌ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్‌ ఫ్యాన్‌  ముందు రిబ్బన్‌ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్‌ అన్నీ లాక్‌ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది. 

    2. విండ్‌మిల్‌.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్‌మిల్‌ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్‌లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి.  

    3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయదగితే అన్నీ చేయమనండి.

    4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్‌ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్‌ తల్లి గీతాభాస్కర్‌. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. 

    కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్‌ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్‌ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్‌ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్‌ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్‌ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. 

    (‘ఫైవ్‌ ఎలిమెంట్స్‌’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్‌ ఐడి sakshisummerkids@gmail.com)

     నిర్వహణ: నిర్మలారెడ్డి

    (చదవండి: సైబర్‌ మోసంతో అకౌంట్‌ ఫ్రీజ్‌ అయితే...)

  • ‘గ్రామం చిన్నదైనా....అభివృద్ధిలో పెద్దది’ అనేలా పేరు తెచ్చుకోవడానికిసర్పంచ్‌ కృషి ఎంతో ఉంటుంది.అలాంటి ఒక సర్పంచి  సంగం అర్పితా రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల 
    జిల్లాలోని మల్లారం గ్రామసర్పంచ్‌అర్పితా రెడ్డికి జాతీయ స్థాయిగుర్తింపు వచ్చింది. ‘సాంకేతికతతోగ్రామ అభివృద్ధి’ అంశంపై ‘క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’  నిర్వహించిన ‘డిజిటల్‌ కృషి–సమృద్ధి గావ్‌’ జాతీయస్థాయి పోటీలో గ్రామాన్ని  ప్రథమ స్థానంలో నిలిపారు అర్పితారెడ్డి....

    పారిశుధ్యం నుంచి డిజిటలీకరణ వరకు అన్ని రకాలుగా మల్లారం గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి. గ్రామంలో ΄పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఇంటివారు తడి–పొడి చెత్త వేరు చేసుకునే విధానాన్ని అలవాటు చేశారు. పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు,  తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 

    గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటి వరకు ఏ సర్పంచ్‌ చేయని విధంగా గ్రామ పూర్తి సమాచారం, ప్రభుత్వ పథకాలతో గ్రామ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

    పన్నుల చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఆన్‌లైన్‌లో అందించడంతో ప్రజలకు చాలా సౌకర్యంగా మారింది. గ్రామస్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలో భద్రతను మెరుగు పరిచేందుకు  21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

    యువత కోసం ఓపెన​ జిమ్‌ ప్రారంభించారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక టీచర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ మహిళ గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి.

    బాధ్యత  పెరిగింది
    గ్రామస్థులలో బాధ్యత పెరిగింది. పారిశుధ్యం, పచ్చదనం, గ్రామ అభివృద్ధి గురించి అందరూ చైతన్యంతో ముందుకు వస్తున్నారు. యువత కూడా గ్రామ అభివృద్ధిలో΄ పాల్గొనడం ఆనందంగా ఉంది. మల్లారం గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటికి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం.
    – అర్పితారెడ్డి 

    – ఎస్‌.డి.తాహెర్‌ పాషా, పుట్టపాక లక్ష్మణ్, సాక్షి, వేములవాడ  

    (చదవండి: సైబర్‌ మోసంతో అకౌంట్‌ ఫ్రీజ్‌ అయితే...)

  • గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్‌ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్‌లైన్‌ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్‌ చేస్తున్నాము అని పంజాబ్‌ సైబర్‌ క్రైమ్‌ వారు నా అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేశారు. అలా ఫ్రీజ్‌ చేసేవరకు ఈ 500 నా అకౌంట్‌లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్‌ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్‌ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్‌ను రిలీజ్‌ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్‌ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్‌కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. 
    – చీమకుర్తి సునీల్‌ కుమార్, విజయవాడ

    పంజాబ్‌ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్‌.ఐ.ఆర్‌. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్‌.ఐ.ఆర్‌.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. 

    పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్‌ ఫ్రీజింగ్‌ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్‌ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్‌ పిటిషన్‌ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్‌ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్‌.ఐ.ఆర్‌.ను– పంజాబ్‌ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. 

    మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్‌కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్‌ /లీన్‌ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్‌ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే  బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. 

    - శ్రీకాంత్‌ చింతల హైకోర్టు న్యాయవాది
    (మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

    చదవండి: 'థాంక్యూ డియర్‌ పేరెంట్స్‌': ఒక తరం త్యాగ ఫలితమే..

  • ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇది ‘కేన్స్‌’ సీజన్‌!. పేరుకి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కానీ ఈ ప్రపంచ వేదికపై లింగ సమానత్వం, శరీర సౌందర్యం పట్ల సానుకూల దృక్పథం నుంచి రాజకీయ సందేశాలు, సంస్కృతి వరకు చర్చలకు దారితీసేలా వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఫ్యాషన్‌ అనేది ఉద్దేశ్యంతో కూడిన వ్యక్తిగ భావప్రకటనగా మారింది. ఈ ఏడాది చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేదికపై భారతీయతను చాటిచెప్పేలా దుస్తులను ధరించి అదర్నీ ఆకర్షించారు. తాజాగా ఆ జాబితాలోకి మరో బాలీవుడ్‌ నటి రుచి గుజ్జర్‌ కూడా చేరిపోయారు.

    ఈ రెడ్‌కార్పెట్‌పై ఆమె రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో మెరిసే అందర్నీ ఆశ్చర్యపరిచడం విశేషం. రుచి రాజస్థానీ మహిళలా 'ఘూంఘట్' ధరించే వచ్చింది. నిజానికి ఈ ఘూంఘట్'ని రాజస్థాన్‌లో మహిళలు తమ ముఖాన్ని లేదా తలని కప్పుకోవడానికి ఉపయోగించే ముసుగు లేదా వస్త్రాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ నటి రుచి సరికొత్త సందేశం ఇచ్చేలా ధరించడం విశేషం. 

    ఆ స్టైలింగ్‌ వెనుక ఉన్న అర్థం..
    రాజస్థాన్ సాంస్కృతిక మూలాలకు సంబంధించిన స్టైలింగ్‌ వచ్చిన రుచి ఒక లోతైన సందేశాన్ని అందించేందుకు ఇలా రెడ్‌కార్పెట్‌పైకి వచ్చారట. రాజస్తాన్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో బలవంతపు ఘూంఘట్ పద్ధతులపై దృష్టిని ఆకర్షించడానికి ఈ ఆహార్యంలో వచ్చారామె. రుచి తన రూపం ద్వారా మనం సంప్రదాయాన్ని ఎంచుకోవడానికి, సామాజిక ఒత్తిడి కారణంగా బలవంతంగా పాటించాల్సి రావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారామె. 

    రుచి దుస్తులను రూపా శర్మ డిజైన్‌ చేశారు. ఇవి వారసత్వాన్ని, ప్రతికాత్మకతను సమతుల్యం చేశాయి. ఇక్కడ రుచి వీటిని ప్రతిఘటనకు చిహ్నంగా ధరించింది. ఒక మహిళ గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ నుంచి రావాలే తప్ప ముఖం దాచుకోవడం నుంచి కాదని చెప్పేందుకే ఇలా ఆ వేదికపైకి వచ్చినట్లు పేర్కొందామె. ఈ కేన్స్‌ వేడుకలో తన ఉనికి ఒత్తిడిలో చిక్కుకున్న మహిళల గురించి ఒక్క చర్చనైనా ప్రారంభించగలిగితే, అప్పుడు ఈ నడకకు ఫ్యాషన్‌కు మించిన అర్థం ఉంటుందని అంటోందామె. 

    తన ఘూంఘట్ లొంగిపోవడం కాదని, ఇది నిరసన అని తేల్చి చెప్పారామె. రాజస్థాన్‌కు చెందిన రుచి ఈ సమస్య తనకు వ్యక్తిగతంగా సంబంధించినదని అన్నారామె. సంస్కృతి మహిళలకు సాధికారత కల్పించాలి, వారిని తుడిచిపెట్టకూడదు. సంప్రదాయం కాలంతో పాటు పరిణామం చెందాలి. గౌరవం ఎప్పటికీ అదృశ్యం కావాలని కోరకూడదు అని అన్నారామె. కాగా రుచి గుజ్జర్‌ కేన్స్‌ ఇలా ప్రత్యేకమైన లుక్‌తో రావడం తొలిసారి కాదు. గతేడాది మెరిసే బంగారు, అద్దాలతో కూడిన లెహంగానూ, దానికి జతగా బరువైన కుందన్‌ ఆభరణాలతో కూడిన మోదీ చిత్రంతో ఉన్న లాకెట్లను ధరించి అందర్నీ విస్తుపోయేలా చేసిందామె.

     

    (చదవండి: 'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా? గాయని చిన్మయి శ్రీపాద ఫైర్‌)

     

  • మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. 

    తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. 

     

    అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్‌లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. 

    పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె.

     

    (చదవండి: థాంక్యూ డియర్‌ పేరెంట్స్‌': ఒక తరం త్యాగ ఫలితమూ..)

     

     

NRI

  • శ్రీకాకుళం జిల్లా: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామానికి చెందిన ఓ తెలుగు కుటుంబంలో విషాదం నింపింది. ఇచ్ఛాపురం మండ‌లం ఒడిశా స‌రిహ‌ద్దు గ్రామ‌మైన‌ మాదుబందకు చెందిన ఎ.రామయ్య (26) పొట్టకూటి కోసం రష్యాకు వలస వెళ్లాడు. రష్యన్‌ కంపెనీలో రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా.. సోమవారం వేకువజామున 4.40 నిమిషాల సమయంలో అకస్మాత్తుగా జరిగిన డ్రోన్‌ దాడిలో రామయ్యతో పా­టు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటికే రామయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

    ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు గౌరమ్మ, నిమ్మయ్యతో పాటు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. తమ కుమారుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గంజాం జిల్లా మేజిస్ట్రేట్‌ వి.కీర్తి బాసన్‌ మంగళవారం కుటుంబ సభ్యులను ఓదార్చి ఢిల్లీలోని అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.