Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • అనంతపురం జిల్లా కూడేరు మండలం ఆరవకురు గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పల్సర్ బైక్‌ను బొలోరో వాహనం ఢీకొట్టింది. ఒక్కసారిగా పల్సర్ ట్యాంకరు పేలడంతో మోటర్ బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. వారిద్దరూ బైక్‌పై అనంతపురం వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

  • భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. దళితులను రఘురామకృష్ణ రాజు అవమానపరుస్తున్నారని,. అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. దీని పై  తాను చంద్రబాబు నాయుడుని కలుస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామన్నారు. రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి నష్టంగా నేను భావిస్తున్నానన్నారు. 

    ‘రఘురామకృష్ణం రాజు  దళితులను, క్రైస్తవులను అవమానిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక తెలుగు నేలపైనే కాదు దేశం చుట్టూ తిరుగుతున్నాయి. ఆకివీడులో మాల మాదిగల మీద అక్రమ కేసులు పెట్టారు. దళిత వర్గాలకు సంబంధించిన వాళ్లను ఏరకంగా ఇబ్బంది పెట్టినా వారు ఏ స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదు. 67 మందిని జైలుకు పంపడం దళిత వర్గాలను రెచ్చగొట్టడమే. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ అంశాలను ఉమ్మడిగా ఎదుర్కొంటాం’ అని హెచ్చరించారు. 

    దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ
  • అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బ్రాండిక్స్‌ కంపెనీ ప్రహరీ గోడ నిర్మాణంపై గ్రామస్థులు ధర్నా చేపట్టారు,. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. 

    గ్రామస్థుల తీవ్ర నిరసనలతో భారీగా పోలీసుల్ని మోహరించారు. దాంతో పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.  ఆందోళనలో పాల్గొన్న మహిళల్ని బలవంతంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు. తోపులాటలో మహిళలు సొమ్ముసిల్లి పడిపోయారు.

    ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు
  • అనంతపురం: రాజధాని అమరావతి  ఓ భ్రమ అని ప్రొఫెసర్‌, ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసమే అమరావతి పేరుతో  రాజధాని ఎపిసోడ్‌ను తీసుకొచ్చారన్నారు. అనంతపురంలో జరిగిన ఓ సదస్సులో  ప్రొఫెసర్‌ సి. రామచంద్రయ్య ప్రసంగిస్తూ.. రాజధాని అమరావతి అనేది భ్రమ తప్పితే ఏమీ లేదన్నారు. 

    ‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు వృథా చేశారు. 2014-19 మధ్య 33 వేల ఎకరాలతోనే సింగపూర్‌ తరహా రాజధాని చేస్తానన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారు. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. అమరావతి నిర్ణయాలు రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. 

    నీ అబ్బా సొత్తా అమరావతి.. అమరావతికి నేను వ్యతిరేకినే..!
  • సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్‌ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్‌ చేశారని తెలిపారు.

    కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే  అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.

    అమరావతిలో అద్దాలకే  రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు.

    పబ్లిసిటీ ఫుల్, సంక్షేమం నిల్ అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల పెన్షన్ పై లేదు
  • సాక్షి, తాడేపల్లి: సీపీఐ జాతీయ కార్యదర్శి  రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 

    గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, నిన్న శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తల్లి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 

  • సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ-చెంచు డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తిని ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి ఈడీసీ అధికారులు అనుమతించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలా అనుమతిస్తారంటూ చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం మొదలైంది.

    వివాదం ముదరడంతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును  అటవీశాఖ సిబ్బంది వెనక్కి ఇచ్చేశారు. వివాదం సద్దుమణిగిన తర్వాతనే యాత్ర పున:ప్రారంభిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆలయం తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 

    2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..

    సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్‌ అన్నారు. 

     

     

  • విశాఖపట్నం: జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య గాయాలతో బయటపడింది. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. 

    కొమ్మాది శివశక్తినగర్‌కు చెందిన ఎస్‌.బలరామ్‌ (58) గాయత్రీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన తన భార్య తులసమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి ఆనందపురం వైపు బయలుదేరారు. పరదేశిపాలెం కూడలి వద్దకు చేరుకోగానే, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్‌ బస్సు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బలరామ్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. 

    వెనుక కూర్చున్న భార్య తులసమ్మకు గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన ఆమె, తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మృతదేహంపై పడి బోరున విలపించడం సంఘటన స్థలంలో ఉన్న వారిని కంటనీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలు తులసమ్మను చికిత్స నిమిత్తం గాయత్రీ ఆసుపత్రిలో చేర్పించారు. బలరామ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై సీఎస్‌కే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్‌కే శ‌నివారం రెండో అంచె పోటీలోనూ మ‌రోసారి ముంబైని ఓడించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

    160 ప‌రుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వచ్చిన కార్తిక్‌ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. 

    అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు.  సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

    అజేయ అర్థ‌సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓట‌మి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ క్రికెట‌ర్ తిలక్ వ‌ర్మకు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో సీఎస్కే బౌల‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ వేసిన బంతి తిల‌క్ వ‌ర్మ చేతికున్న రిస్ట్ వాచ్‌ను రెండు ముక్క‌లు చేసింది. ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్లో ఇది చోటుచేసుకుంది. ఓవ‌ర్ట‌న్ వేసిన షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడే క్ర‌మంలో తిల‌క్ వ‌ర్మ మిస్ చేశాడు. 

    దీంతో బంతి తిల‌క్ వ‌ర్మ చేతికి బ‌లంగా తాకింది. నొప్పితో బాధ‌ప‌డిన తిల‌క్‌ను ఫిజియో వ‌చ్చి ప‌రిశీలించాడు. అదే స‌మ‌యంలో చేతికున్న రిస్ట్ వాచ్ రెండు ముక్క‌లు కావ‌డం గ‌మ‌నార్హం. కాగా తిలక్‌వర్మ తన చేతికి ధరించిన రిస్ట్‌ వాచ్‌ ధర రూ.28 వేలు కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తిలక్‌ వర్మ మరోసారి విఫలమయ్యాడు. 

    కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన తిలక్‌ వర్మ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా.. రికెల్‌ట‌న్ 37 ప‌రుగులు చేశాడు.

    చదవండి: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ క్రికెటర్

  • టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోదీ చరిత్ర సృష్టించాడు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ​టీ20 మ్యాచ్‌లో వికెట్ తీయడం ద్వారా సోదీ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బంగ్లా బ్యాటర్ షమ్మీ హొసేన్‌ను ఔట్ చేయడం ద్వారా ఇష్ సోదీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 141 మ్యాచ్‌ల్లో 8.16 ఎకానమీ రేటుతో 165 వికెట్లు తీశాడు. 

    అంతేకాదు కివీస్ తరఫున టీ20ల్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గానూ ఇష్ సోదీ నిలిచాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.   ఇక రెండో స్థానంలో టిమ్ సౌతీ ఉన్నాడు. సౌతీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు.

    ఆ తర్వాతి ‍స్థానంలో మిచెల్ సాంట్నర్ (138 మ్యాచ్‌ల్లో 142 వికెట్లు), నాలుగో స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (83 వికెట్లు), లోకి ఫెర్గూసన్ (76 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 14.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదోయ్ (33) టాప్ స్కోరర్‌. 

    కివీస్ బౌలర్లలో జోష్ క్లార్క్‌సన్ 3 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్‌, బెన్ సియర్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 11.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. బెవన్ జాకబ్స్ (62 నాటౌట్‌) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించాడు. 

    మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బెవన్ జాకబ్స్‌, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా తౌహిద్ హృదోయ్ నిలిచాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బం‍గ్లాదేశ్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

    చదవండి: సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..

  • టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భువనేశ్వర్‌ కుమార్‌ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 36 ఏళ్ల వయసులోనూ తన పేస్‌ పదును చూపిస్తూ ఐపీఎల్‌ 2026 సీజన్లో‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున వికెట్లు తీస్తోన్న భువనేశ్వర్‌ను టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుందని మాజీ డాషింగ్‌  ఓపెనర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వయసును కాకుండా ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.

    సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. అతనికి 35-36 ఏళ్లు ఉంటే ఏంటి? అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, టీ20 ఫార్మాట్‌లో తన పునరాగమనం గురించి అతను ఆలోచించాలి లేదా సెలక్టర్లు ఆలోచించాలి. మనం పాత భువనేశ్వర్‌ను మళ్లీ చూస్తున్నాం. అతని బౌలింగ్‌లో ఆ వాడి, వేడి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు.

    ఈ ఐపీఎల్ సీజన్‌లో భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన కేవలం 9 మ్యాచ్‌లలోనే 17 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. గ‌తేడాది (2025) ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన సీజన్ మొత్తం మీద అతను 17 వికెట్లు తీయగా, ఈసారి కేవలం 9 మ్యాచ్‌లలోనే ఆ మార్కును అందుకోవడం అతని ఫామ్‌కు నిదర్శనం. ఆర్‌సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో అతను కనీసం మూడు వికెట్లు తీశాడు.

    ఇటీవలే అతను టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 350 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా, రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 325 టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్, 24.51 సగటుతో 352 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు భారత్ నుంచి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (391 వికెట్లు) మాత్రమే ఉన్నాడు.

    చదవండి: చిక్కుల్లో పడిన క్రికెటర్‌ షమీ సోదరుడు!

  • ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇటీవల అతడు ఐపీఎల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడి పేరుకు పేరు.. డబ్బు, అభిమానం దండిగా సంపాదించుకున్నాడు వార్నర్‌.

    ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌
    ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ అందించడంతో.. ఆరెంజ్‌ ఆర్మీకి ఫేవరెట్‌గా మారిపోయాడు వార్నర్‌. ఆ తర్వాత జట్టును వీడినా ఇప్పటికీ ఆరెంజ్‌ ఆర్మీ వార్నర్‌ను తమ వాడిలానే భావిస్తుంది. ఇక 2024లో చివరగా ఐపీఎల్‌ ఆడిన ఈ ఆసీస్‌ బ్యాటర్‌ను ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.

    దీంతో వార్నర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో చేరాడు. ఈ ఏడాది కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆరంభంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించినా.. ఆ తర్వాత వరుస పరాజయాల నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే కరాచీ నిష్క్రమించింది.

    పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు
    ఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. చక్కటి ఆతిథ్యం ఇచ్చారంటూ పాక్‌ బోర్డుకు వార్నర్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు స్పందిస్తూ భారతీయ నెటిజన్‌ ఒకరు.. ‘‘పీఎస్‌ఎల్‌ను వదిలేసి.. ఐపీఎల్‌కు వచ్చేసెయ్‌’’ అని కామెంట్‌ పెట్టారు. ఇందుకు వార్నర్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ఇప్పుడు ఆ అవసరం ఏమీలేదు’’ అని పేర్కొన్నాడు.

    దీంతో వార్నర్‌ పట్ల టీమిండియా, ఐపీఎల్‌ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వార్నర్‌ మరోసారి పాకిస్తాన్‌ పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. తన కూతుళ్లలో ఇద్దరికి పాకిస్తానీ తరహా డ్రెస్సులు (ఘెరారా) వేసి మురిసిపోయాడు. అంతేకాదు ఇద్దరూ హిజాబ్‌ మాదిరి చున్నీ కూడా ధరించడం విశేషం.

    హిజాబ్‌ ధరించిన కుమార్తెలు!
    ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘‘పిల్లలకు సంప్రదాయ దుస్తులు ఇచ్చినందుకు హైదర్‌కు థాంక్యూ. తమకు తాముగా పిల్లలు ఇలా రెడీ అయ్యారు. ఫీడ్‌బ్యాక్‌ సూపర్‌గా ఉంది. మీ బెస్ట్‌ అవుట్‌ఫిట్‌ ఏమిటో జత చేయండి’’ అని వార్నర్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ దుస్తుల్లో తన కుమార్తెలు అత్యంత అందంగా ఉన్నారని కొనియాడాడు.

    ఇందుకు బదులుగా... ‘‘పిల్లలు చక్కగా ఉన్నారు వార్నర్‌ భాయ్‌’’ అంటూ కొంతమంది కితాబులిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం.. ‘‘ఇప్పుడు డ్రెస్సులు.. ఆ తర్వాత సంప్రదాయాలు.. కాస్త ఆలోచించు వార్నర్‌ భయ్యా.. తప్పుగా తీసుకోవద్దు.. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరిస్తున్నారు.  

    వార్నర్‌పై ద్వేషం తగదు
    ఇంకొందరేమో వార్నర్‌పై ద్వేషం తగదని.. ఐపీఎల్‌-2026 ఆరంభానికి ముందు.. సన్‌రైజర్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ.. ఆరెంజ్‌ ఆర్మీ పట్ల అతడు ప్రేమను చాటుకున్న తీరును గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వార్నర్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది.

    కాగా డేవిడ్‌ వార్నర్‌- కాండిస్‌ దంపతులుకు ఇవీ మే, ఇండీ రే, ఇస్లా రోస్‌ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లను వార్నర్‌, కాండిస్‌ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

    చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్‌ టెండుల్కర్‌

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ నాలుగో విజ‌యాన్ని సాధించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 
    లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కార్తిక్ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది.

    గైక్వాడ్ హాఫ్ సెంచరీ
    ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం సీఎస్‌కే 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

    రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
    160 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 63 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 24 ప‌రుగులు చేసిన ఉర్విల్ ప‌టేల్ గ‌జ‌న్‌ఫ‌ర్ బౌలింగ్‌లో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం సీఎస్‌కే 7 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 69 ప‌రుగులు చేసింది.

    సంజూ శాంస‌న్ (11) ఔట్‌.. తొలి వికెట్ డౌన్‌
    160 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 13 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన శాంస‌న్ బుమ్రా బౌలింగ్‌లో రికెల్‌ట‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

    సీఎస్‌కే టార్గెట్ 160 పరుగులు
    సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు.  సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

    ఆరో వికెట్‌ డౌన్‌..
    5 పరుగులు చేసిన రాబిన్‌ మింజ్‌ అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్‌ 139 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 

    16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (48), పాండ్యా (9) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్ వర్మ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నమన్ ధిర్ 44, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

    • 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నమన్ ధిర్ 42, తిలక్ వర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    • 7  ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నమన్‌ ధిర్‌ 25,  సూర్యకుమార్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    • 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. రికిల్‌టన్‌ 15, నమన్‌ ధిర్‌ 13 పరుగులతో ఆడుతున్నారు.

    తొలి వికెట్ కోల్పోయిన ముంబై
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన ఓపెన‌ర్ విల్‌జాక్స్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో రామ‌క్రిష్ణ ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఒక ప‌రుగు వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

    టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌
    టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ర‌ఘుశ‌ర్మ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ఆడ‌నుండ‌గా, అశ్వ‌నీ స్థానంలో క్రిష్ భ‌గ‌త్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక చెన్నై సూప‌ర్‌కింగ్స్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. 

    అకిల్ హొసేన్ స్థానంలో ప్ర‌శాంత్ వీర్‌, గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో రామ‌క్రిష్ణ ఘోష్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఈ సీజ‌న్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోరులో సీఎస్‌కే 103 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది.

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి

    ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, గజన్‌ఫర్
     

  • టీమిండియా సీనియర్ క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్‌ మహమ్మద్ కైఫ్‌ చిక్కుల్లో పడ్డాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఒక మహిళ షమీ సోదరుడిపై ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉమ్మడి స్నేహితుడు ఇమ్రాన్‌ ద్వారా మహమ్మద్ కైఫ్‌ను బాధితురాలు కలిసింది. వారి తొలి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. 

    ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయడం మొదలుపెట్టిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత బాధితురాలు కైఫ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటినుంచి కైఫ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపించిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

    ఇక మహ్మద్ షమీ సోదరుడైన మహమ్మద్ కైఫ్ దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ సహా విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీయ టోర్నమెంట్లలో ఆడాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన కైఫ్ తన కెరీర్‌లో మొత్తం మహమ్మద్ కైఫ్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 9 లిస్ట్ -ఏ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. 

    షమీ కుటుంబానికి వివాదాలు కొత్త కాదు. షమీ భార్య హసీన్ జహాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భారత క్రికెటర్ తరచూ వార్తల్లో నిలిచాడు. గత జనవరిలో ఓటర్ల జాబితాలో అవకతవకల కారణంగా షమీతో పాటు కైఫ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 

    ఇక నిలకడైన ఆటతీరుకు మారుపేరైన షమీ 2023 వన్మింన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు.

    చదవండి: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

  • భారత ‍క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌  టెండుల్కర్‌ ‘భారీ’ ధరకు అమ్ముడుపోయాడు. టీ20 ముంబై లీగ్‌ తాజా వేలంలో ARCS అంధేరి ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. కనీస ధర కంటే అతడి కోసం ఫ్రాంఛైజీ ఏకంగా 400 శాతం ఎక్కువగా ఖర్చు చేయడం గమనార్హం.

    ఐపీఎల్‌లో ముంబై నుంచి లక్నోకు
    కాగా ఆటలో తండ్రి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోతున్నాడు అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar). ఇప్పటికీ క్రికెటర్‌గా అతడికి పూర్తి స్థాయి గుర్తింపులేదు. దేశీ క్రికెట్‌లో కొన్నాళ్లు సొంత జట్టు ముంబైకి ఆడిన అర్జున్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినా ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు పెద్దగా గుర్తింపు రావడం లేదు.

    బెంచ్‌కే పరిమితం
    ఇక ఐపీఎల్‌లో చాలా కాలం ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు అర్జున్‌. ఈ జట్టుకు సచిన్‌ మెంటార్‌గా ఉండగా.. అర్జున్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఇటీవలే అతడిని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. అయితే, లక్నో తుదిజట్టులోనూ అతడికి స్థానం దక్కడం లేదు. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.

    ధర ఎంతంటే?
    ఇలాంటి తరుణంలో తొలిసారి టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వేలంలో కనీస ధర రూ. 2 లక్షలతో పేరు నమోదు చేసుకున్నాడు. 

    ఈ క్రమంలో శనివారం నాటి వేలంలో అంధేరీ ఫ్రాంఛైజీ అర్జున్‌ కోసం పోటీపడింది. ఆఖరికి రూ. 10 లక్షల ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ జీతంలో ఇది దాదాపు 33 శాతం.

    కాగా టీమిండియా స్టార్‌, 2024, 2026 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్లలో సభ్యుడైన శివం దూబే కూడా అంధేరీ జట్టుకే ఆడుతున్నాడు. అతడి ధర రూ. 20 లక్షలు. ఇక తాజా వేలంలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ను అంధేరీ రూ. 11 లక్షలకు కొనుగోలు చేసింది.

    అనుమతి వచ్చిందిలా..
    ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA)తో సంబంధం లేకున్నా.. ఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు అర్జున్‌ టెండుల్కర్‌కు ప్రత్యేక అనుమతి లభించింది. స్వతహాగా ముంబైకర్‌ అయిన అర్జున్‌.. గతేడాది వేరే రాష్ట్ర టీ20 లీగ్‌లో ఆడనందున బీసీసీఐ నిబంధన ప్రకారం అతడు ముంబై టీ20 లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.

    కాగా ఐపీఎల్‌ కాకుండా కేవలం ఒకే ఒక్క స్థానిక లీగ్‌లో ఆడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇదలా ఉంటే.. జూన్‌ మొదటి వారంలో టీ20 ముంబై లీగ్‌ జరుగనున్నట్లు సమాచారం.
    👉టీ20 ముంబై లీగ్‌.. రిటైన్‌ ప్లేయర్ల జాబితా ప్రకటన

    చదవండి: ద్రవిడ్‌ ‘ది గ్రేట్‌’ అన్నాడు!.. పాక్‌ పేసర్‌కు షాకిచ్చిన పీసీబీ!

  • ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి బీసీసీఐ శ‌నివారం భారత జ‌ట్టును ప్ర‌క‌టించింది. అమితా శ‌ర్మ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ, బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ్‌జిత్ సైకియా, మ‌హిళల జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ అమోల్ మ‌జుందార్‌, కెప్టెన్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్‌ల‌తో స‌మావేశ‌మైంది. సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు.

    హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో ఐదోసారి కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌నుండ‌డం విశేషం. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, స్మృతి మంధాన‌, జేమీమా రోడ్రిగ్స్‌, ష‌ఫాలీ వ‌ర్మ‌, రిచా ఘోష్‌లు బ్యాటింగ్ భారాన్ని మోయ‌నున్నారు. ఇక ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌, రేణుకాసింగ్‌లు బౌలింగ్ ద‌ళాన్ని ముందుండి నడిపించ‌నున్నారు. 

    తెలుగు క్రికెట‌ర్లు శ్రీచ‌ర‌ణి, అరుంధ‌తి రెడ్డి జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు. ఇక గాయం కార‌ణంగా దూర‌మైన అమ‌న్‌జ్యోత్ కౌర్ స్థానంలో భార‌తి పుల్మాలిని ఎంపిక చేసిన‌ట్లు సెలెక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బ్యాట‌ర్ హ‌ర్లీన్ డియోల్‌, స్పిన్న‌ర్ స్నేహ్‌రాణాలకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

    15 మందితో కూడిన జ‌ట్టుకు హర్మ‌న్‌ప్రీత్ కౌర్ నాయ‌కత్వం వ‌హించ‌నున్నారు. జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది.

    ఆ తర్వాత 17న నెదర్లాండ్స్‌, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్‌-బిలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, స్కాట్లాండ్‌, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్‌, జూలై 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు లార్డ్స్ ఆతిథ్యమివ్వనుంది.

    ఇక గతేడాది భారత్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.

    భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వివరాలు..
    జూన్‌ 14: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌, వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌
    జూన్‌ 17: భారత్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌, వేదిక: హెడ్డింగే
    జూన్‌ 21: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా, వేదిక: ఓల్డ్‌  ట్రాఫోర్డ్‌
    జూన్‌ 25: భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, వేదిక: ఓల్డ్‌  ట్రాఫోర్డ్‌
    జూన్‌ 28: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా, వేదిక: లార్డ్స్‌

    భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్‌, రాధా యాద‌వ్‌.

     చదవండి: ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!

  • పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అలీ టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ‘ది గ్రేట్‌’గా అభివర్ణించాడు. ద్రవిడ్‌ చెప్పినట్లే కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కలిసి వస్తుందన్నాడు. తమ విషయంలోనూ ఇదే జరిగిందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు జరిమానా బారిన పడ్డాడు. అసలు విషయమేమిటంటే..

    అరంగేట్ర సీజన్‌లోనే
    పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) తుది అంకానికి చేరుకుంది. పెషావర్‌ జల్మీ తొలుత ఫైనల్‌ చేరగా.. తాజాగా హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. కాగా హైదరాబాద్‌ జట్టు ఈ ఏడాదే పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేసింది.

    ఆరంభంలో వరుస ఓటములతో విమర్శలపాలైన హైదరాబాద్‌ జట్టు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్‌ చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ను శుక్రవారం ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌ విజయాల్లో మొహమ్మద్‌ అలీది కీలక పాత్ర. ఇప్పటికి ఈ సీజన్‌లో అతడు పదిహేడు వికెట్లు కూల్చాడు.

    ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగా
    ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అలీ. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నట్లుగా.. కష్టపడే వాళ్లకు అదృష్టం కూడా కచ్చితంగా కలిసి వస్తుంది’’ అని పేర్కొన్నాడు.

    షాకిచ్చిన పీసీబీ
    ఇదిలా ఉంటే.. అలీపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కఠిన చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఇస్లామాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా అలీ.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌తో గొడవపడటం ఇందుకు కారణం. 

    ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పీసీబీ ఈ మేరకు శిక్ష విధించింది. కాగా ఎలిమినేటర్‌-1లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

    లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి.. 184 పరుగులు చేసింది. దీంతో నరాలు తెగే ఉత్కంఠ పోరులో రెండు పరుగుల స్వల్ప తేడాతో హైదరాబాద్‌ గట్టెక్కి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. 

    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్‌లో గురువారం హైద‌రాబాద్ కింగ్స్‌మెన్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య ఎలిమినేట‌ర్ 1 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెట‌ర్ ర‌మీజ్ రాజా, ఆసీస్ మ‌హిళా మాజీ క్రికెట‌ర్ లీసా స్తాలేక‌ర్ కామేంటేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో లీసా స్తాలేక‌ర్ మాట‌ల సంద‌ర్భంగా రమీజ్ రాజాను  హ‌గ్ చేసుకున్నారు. 

    అయితే వీరిద్ద‌రు ఇది స‌రదాగా చేసిన‌ప్ప‌టికీ బ‌హిరంగంగా ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు ర‌మీజ్ రాజా, లీసా స్తాలేక‌ర్ హ‌గ్ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్య‌మా అని లీసా హ‌గ్ ఇవ్వ‌గానే ర‌మీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియో, ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ఇవ‌న్నీ న‌కిలీ ఫొటోల‌ని కాసేప‌టికే తేలిపోయింది. 

    ఎందుకంటే వీరిద్ద‌రు హ‌గ్ చేసుకున్న అనంత‌రం ర‌మీజ్ రాజా ముద్దు పెట్టిన‌ట్లుగా వీడియోలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. అయితే ర‌మీజ్ రాజాకు హ‌గ్ ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారడంతో లీసా స్తాలేక‌ర్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చ‌ర్చ‌కు దారి తీయ‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. 

    అస‌లు ఇందులో త‌ప్పేముంది. ఏదో స‌ర‌దాగా హ‌గ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. 

    ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. షాన్ మ‌సూద్ (69 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మ‌హ్మ‌ద్ న‌వాజ్ 18 ప‌రుగులు సాధించాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవ‌ర్ల‌లోనే 2 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. మాజ్ స‌దాఖ‌త్ (64 నాటౌట్‌), ఉస్మాన్ ఖాన్ (64) జ‌ట్టును గెలిపించారు.

    ఇక లీసా స్తాలేకర్‌ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.

     

  • భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్‌ అండర్‌-19 జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.

    సంచలనాలకు కేంద్రం
    నిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్‌ స్టార్స్‌తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.

    ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో
    ఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-4లో నిలిచాడు.

    ఈ నేపథ్యంలో అలెన్‌ బోర్డర్‌, బ్రియాన్‌ లారా, సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు సైతం వైభవ్‌ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

    యాక్టివిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు
    ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్‌లో యాక్టివిస్ట్‌గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్‌ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.

    చైల్డ్‌ లేబర్‌.. చదువుకోనివ్వండి
    ఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్‌ లేబర్‌ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్‌ క్రికెట్‌ ఆడనివ్వద్దు. క్రికెట్‌ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

    క్రీడాకారులకు వర్తిస్తుందా?
    కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్‌ లేబర్‌గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్‌ ఒక్కటే కాదు.. చెస్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.

    ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌
    నిజానికి వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్‌ను ఐపీఎల్‌లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్‌ లేబర్‌ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.

    ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి
    కాగా వైభవ్‌ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. 

    అయితే, చదువులోనూ వైభవ్‌ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్‌ కారణంగా అతడు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్‌ను కొన్న రాజస్తాన్‌ రాయల్స్‌.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించింది.

    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

  • గత కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటలేక చతికిలపడుతోంది తమిళనాడు క్రికెట్‌ జట్టు. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం శిక్షణ బృందాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. 

    వరుస వైఫల్యాలు
    కాగా గత రంజీ సీజన్‌లో గ్రూప్‌ దశలో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తమిళనాడు జట్టు... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో సూపర్‌ లీగ్‌ దశకు చేరలేకపోయింది. దీంతో కోచింగ్‌ స్టాఫ్‌ను మార్పు చేయాలని భావించిన తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) కొత్త కోచ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

    పురుషుల, మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్‌ జట్లకు కొత్త కోచ్‌లను నియమించనుంది. అలాగే సెలెక్షన్‌ కమిటీ సభ్యులను సైతం  ఎంపిక చేయనుంది. ఈ నెల 10 దరఖాస్తులకు చివరి తేదీ కాగా... పరిమిత ఓవర్లకు, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేయనుంది. 

    ఉండాల్సిన అర్హతలు ఇవే
    కాగా 60 సంవత్సరాలకు లోబడి ఉండి బీసీసీఐ లెవల్‌–2 కోచింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ‘నిబంధనల ప్రకారం కొత్త కోచ్‌ల నియామకం చేపడతాం. 

    వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం’ అని టీఎన్‌సీఏ కార్యదర్శి భగవాన్‌ దాస్‌ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు జట్లకు సెంథిల్‌నాథన్, వెంకటరమణ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. 

    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

  • న్యూజిలాండ్‌ స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ కైలీ జెమీసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో పదిహేనేళ్ల పిల్లాడికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. అతడిని అవుట్‌ చేసేందుకు ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో చర్చించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

    36 బంతుల్లోనే శతక్కొట్టాడు
    అవును.. జెమీసన్‌ చెప్తున్నది రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే!.. ఐపీఎల్‌-2026లో ఈ లెఫ్లాండర్‌ బ్యాటర్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో తన ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు వైభవ్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.

    ఎదురుగా ఎవరున్నా డోంట్‌ కేర్‌
    ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచస్థాయి బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లోనూ సిక్సర్లు బాది తన బ్యాట్‌ పవరేంటో మరోసారి చాటిచెప్పాడు వైభవ్‌. ఎదురుగా ఎంతటి దిగ్గజ బౌలర్‌ ఉన్నా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పిండుకుంటున్నాడు.

    నేనూ భయపడ్డా
    ఈ నేపథ్యంలో తాను సైతం వైభవ్‌ సూర్యవంశీ విషయంలో భయపడ్డాడని కివీస్‌ స్టార్‌, ఢిల్లీ పేసర్‌ కైలీ జెమీసన్‌ అన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్తాన్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే. జైపూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసింది.

    అయితే, ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4)లను త్వరగానే వెనక్కి పంపడంలో ఢిల్లీ సఫలమైంది. వైభవ్‌ను జెమీసన్‌ బౌల్డ్‌ చేయగా.. జైసూను మిచెల్‌ స్టార్క్‌ పెవిలియన్‌కు పంపాడు.

    ఢిల్లీ గెలుపు
    ఓపెనర్లు విఫలమైనా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ధ్రువ్‌ జురెల్‌ (42), డొనోవాన్‌ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్‌)లతో పాటు కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (50 బంతుల్లో 90) ఇన్నింగ్స్‌ ఇందుకు కారణం.

    అయితే, 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అనూహ్య రీతిలో ఊదిపారేసింది. ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (33 బంతుల్లో 62), కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 75).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (17 బంతుల్లో 33) వేగంగా ఆడి పని పూర్తి చేశారు.

    ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు
    ఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీని త్వరగా పెవిలియన్‌కు పంపేలా తాను ముందు నుంచే సన్నద్ధమయ్యాయని జెమీసన్‌ తాజాగా వెల్లడించాడు. ‘‘పదిహేనేళ్ల పిల్లాడికి కూడా ఇంతలా భయపడే రోజు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.

    అతడిని అవుట్‌ చేసేందుకు మేము ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించుకున్నాము. అందుకు తగ్గ ఫలితం వచ్చింది’’ అని జెమీసన్‌ చెప్పుకొచ్చాడు. రాజస్తాన్‌కు కీలకమైన ఓపెనింగ్‌ జోడీని విడదీసేందుకు తానూ, స్టార్క్‌ ప్లాన్‌ వేశామని.. అనుకున్నట్లే ఆరంభంలోనే వారిని వెనక్కి పంపామని హర్షం వ్యక్తం చేశాడు.

    కాగా 15 ఏళ్ల వైభవ్‌ను అవుట్‌ చేసిన తర్వాత.. 31 ఏళ్ల జెమీసన్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అతడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. దీంతో బీసీసీఐ జెమీసన్‌ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. 

    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

  • ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా చోటుచేసుకున్న ‘నో షేక్‌హ్యాండ్‌’ వివాదంపై.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా తాజాగా స్పందించాడు. ఆరోజు తాను ఎప్పటిలాగే గడుస్తుందని భావించానన్నాడు. అయితే, టాస్‌ సమయంలోనే తనకు నిజం తెలిసిందన్నాడు.

    తారస్థాయికి ఉద్రిక్తతలు
    మ్యాచ్‌ ముగిసిన తర్వాత అయినా టీమిండియా ఆటగాళ్లు తమతో కరచాలనం చేసేందుకు రాకపోవడం ఆశ్చర్యపరిచిందని ఆఘా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకకు బుద్ధి చెప్పే క్రమంలో భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టగా.. పాక్‌ ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఇందుకు భారత సైన్యం గట్టిగానే బదులిచ్చింది.

    కరచాలనానికి నిరాకరణ
    ఈ పరిణామాల క్రమంలో తొలిసారి దాయాదులు టీమిండియా- పాక్‌ (IND vs PAK) ఆసియా కప్‌-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. అయితే, టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాతో కరచాలనానికి టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ నిరాకరించాడు.

    ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరిస్తూ మ్యాచ్‌ ముగించిన సూర్య, శివం దూబే మైదానాన్ని వీడారు. మిగతా ఆటగాళ్లు సైతం డ్రెసింగ్‌రూమ్‌లోనే ఉండిపోయారు. దీంతో పాక్‌ జట్టు అవమానభారంతో మైదానాన్ని వీడింది.

    షాకిచ్చిన ఐసీసీ
    ఈ విషయం గురించి పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ ముందుగా నో షేక్‌హ్యాండ్‌ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి అతడిపై వేటు వేయాలని పట్టుబట్టింది.  అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించింది. రిఫరీ నిబంధనలు ఉ‍ల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారం లేదని కొట్టిపారేసింది.

    ఇక బీసీసీఐ సైతం.. ఆటగాళ్లు కచ్చితంగా కరచాలనం చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేస్తూ టీమిండియాను సమర్థించింది. నాటి ఈ ఘటనపై సల్మాన్‌ ఆఘా తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నాడు.

    కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు
    ‘‘మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశం.. ట్రోఫీ ఫొటోషూట్‌ జరిగింది. అక్కడ కూడా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక టాస్‌ సమయంలో నేను మైదానంలోకి వెళ్లినపుడు.. అంతా సాధారణంగానే ఉంటుందని భావించాను.

    అయితే, అంతలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నాకు అర్థమై పోయింది. అప్పుడే రిఫరీ నన్ను పక్కకు తీసుకువెళ్లి.. ‘ఫ్రెండ్‌.. ఇక్కడ షేక్‌హ్యాండ్‌ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని నాతో చెప్పారు.

    అప్పుడు నేను.. ‘నాకు కూడా కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు’ అని చెప్పాను. టాస్‌ సమయంలో ముందుగానే నో షేక్‌హ్యాండ్‌ గురించి చెప్పారు. అయితే, మ్యాచ్‌ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు చేరే సమయంలోనూ వాళ్లు (టీమిండియా) కరచాలనం చేసేందుకు ముందుకు రాలేదు’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు. 

    ఓవరాక్షన్‌ ఎందుకు?
    తద్వారా నాడు ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీ తమకు ముందుగానే సందేశం ఇచ్చాడని ఆఘా స్పష్టంచేశాడు. దీంతో పాక్‌ బోర్డు ఫిర్యాదుపై ఐసీసీ సరైన విధంగానే స్పందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసియా కప్‌-2025 ఫైనల్లో టీమిండియా పాక్‌ను ఓడించి ట్రోఫీ గెలిచింది.

    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. శ‌నివారం చెపాక్‌ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ముంబై ఇండియ‌న్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది.

    ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిద‌వ స్ధానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ రేసులో ముంబై ఉండాలంటే మిగిలిన సీఎస్‌కేతో పాటు మిగిలిన‌ అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ భ‌వితవ్యం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

    ముంబై జ‌ట్టులోకి ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్‌
    ఇక సీఎస్‌కేతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చెపాక్ మైదానం స్పిన్ అనుకూలించే అవ‌కాశ‌మున్నంద‌న మాయాంక్ మార్కండేను తిరిగి తుది జ‌ట్టులోకి తీసుకురావ‌ల‌ని ముంబై మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

    మ‌రో స్పిన్న‌ర్ అల్లా ఘ‌జ‌న్‌ఫ‌ర్‌తో మార్కండే బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గ‌త మ్యాచ్‌లో విఫల‌మైన పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు వార్త‌లు అత‌డి స్ధానంలో ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్ కార్భిన్ బాష్ ఆడడం దాదాపు ఖాయ‌మైంది. ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ దూరం కానున్నాడు.

    దీంతో ముంబై ఇన్నింగ్స్‌ను ర్యాన్ రికెల్ట‌న్‌, విల్ జాక్స్ ప్రారంభించ‌నున్నారు. మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, నమ‌న్ ధీర్ ఉండ‌నున్నారు. గ‌త మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాక‌పోయిన యువ ఆట‌గాడు రాబిన్ మింజ్‌ను తుది జ‌ట్టులో కొన‌సాగించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

    ముంబై ఇండియ‌న్స్ తుది జ‌ట్టు(అంచ‌నా)
    ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్, కార్బిన్ బాష్, జస్ప్రీత్ బుమ్రా,  గజన్‌ఫర్, మయాంక్ మార్కండే
    చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'

     

  • ఐపీఎల్‌లో ట్రోఫీలు గెలవకుండా ఎన్ని వ్యక్తిగత మైలురాళ్లు సాధించినా వాటికి విలువ ఉండదని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్, భారత సీనియర్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న రాహుల్‌... ఇటీవలే లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni)ని అధిగమించాడు. 

    ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి
    ఐపీఎల్‌లో ధోనీ 5439 పరుగులు చేయగా... తాజాగా రాహుల్‌ అతడిని దాటేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌ మాట్లాడుతూ... ‘ఐపీఎల్‌లో మహీ భాయ్‌ పరుగులను దాటేశానని కూడా నాకు తెలియదు. వ్యక్తిగత మైలురాళ్లు మంచివే. 

    సరైన దిశలోనే ఉన్నామని అవి భరోసా ఇస్తాయి. కానీ అసలైంది మాత్రం నిలకడగా ట్రోఫీలు గెలవడమే. ధోనీ గెలిచినన్ని ఐపీఎల్‌ ట్రోఫీలు గెలవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

    క్రికెట్‌ వ్యక్తిగత క్రీడ కాదు. టీమ్‌ స్పోర్ట్‌. అందుకే విజయవంతమైన జట్లలో భాగం కావాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటా’ అని రాహుల్‌ అన్నాడు. చిన్నప్పటి నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... అందుకే అక్కడ మ్యాచ్‌ అంటే భావోద్వేగానికి గురవుతానని రాహుల్‌ చెప్పాడు.

    నాకు బెంగళూరు అలాంటిదే
    ‘కేవలం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లోనే అని కాదు. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మీరు చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. 

    నాకు బెంగళూరు అలాంటిదే. అక్కడ క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలని అనుకుంటా. కొత్తతరం ప్లేయర్లు బౌలర్‌ చరిత్ర చూసి షాట్‌లు ఆడటం లేదు’ అని రాహుల్‌ వివరించాడు.

    వైభవ్‌, ఆయుశ్‌ అద్భుతం
    వైభవ్‌ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు... ప్రపంచస్థాయి బౌలర్లయిన బుమ్రా, కమిన్స్‌లను ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం తడబడటం లేదన్నాడు రాహుల్‌. అవకాశం ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్‌లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆధునిక టీ20 క్రికెట్‌కు ఇలాంటి మనస్తత్వమే అవసరమని రాహుల్‌ వెల్లడించాడు. వైభవ్, ఆయుశ్‌ మాత్రే వంటి వాళ్లు టీ20లు ఆడే విధానాన్ని మార్చేస్తున్నారని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. 

    చదవండి: శ్రేయస్‌, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

Politics

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజక వర్గంలో ఉన్న అన్ని 285 పోలింగ్ స్టేషన్లలో (సహాయక పోలింగ్ స్టేషన్లు కూడా కలిపి) రీపోలింగ్‌ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. 2026 మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని ఈసీఐ పేర్కొంది.

    ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 29న జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ఈసీఐ చెప్పింది. 

    కాగా, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా ప్రాంతంలో స్థానికులు నిరసన చేపట్టారు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    తాము అధికార పార్టీకి ఓటు వేసినా తమపై దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించింది. “మేము టీఎంసీకి ఓటు వేసినా కూడా వారు మాపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేయాలి, మహిళలకు భద్రత కావాలి” అని ఆమె తెలిపింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ముగిసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. 

  • సిద్దిపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ ధ్వజమెత్తారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు. నిరుద్యోగులు నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తుంటే.. సీఎం రేవంత్‌ మాత్రం ఆ నోటిఫికేషన్‌ వద్దంటున్నారని మండిపడ్డారు. 

    ఈరోజు(శనివారం, మే 5వ తేదీ) సిద్ధిపేట జిల్లా జిల్లా గ్రంధాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు హరీష్‌రావు.  ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ నిరుద్యోగులు నోటిఫికేషన్ వద్దంటున్నారని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాహుల్‌ గాంధీని అశోక్ నగర్ తీసుకువచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలని నమ్మించారు. 

    ఆనాడు నమ్మించి..నేడు వంచించడం కాంగ్రెస్ నైజం. సెంట్రల్ లైబ్రరీలో పోలీసులతో నిరుద్యోగులపై రేవంత్ దాడి చేయిస్తున్నారు. BRS హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. కాంగ్రెస్ వచ్చాక భర్తీ చేసింది కేవలం 16 వేల ఉద్యోగాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. మిగిలిన 1.84 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి. 

    పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పారు. మరి 5 వేల ఉద్యోగాలకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి..మిగతా 14 వేల పోస్టులను ఎందుకు ఆపుతున్నారు.   బీఆర్‌ఎస్‌ హయాంలో 40 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశాం. విద్యా కమిషన్ రిపోర్ట్‌ని సీఎం రేవంత్ ఎందుకు బయటపెట్టడం లేదు.  రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 

    మెగా డీఎస్సీసీ కాస్త దగా డీఎస్సీ అయిపోయింది. రేవంత్ నీ డ్రామాలు బంద్ చేయి. చిల్లర మాటలు కాదు కావాల్సింది...జాబ్ నోటిఫికేషన్ కావాలి. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయి చిత్తు కాగితం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగమైన భర్తీ చేశారా?, నీ కోసం పని చేసిన నిరుద్యోగులే రేపు రేవంత్‌ని బొందపెడతారు. తక్షణమే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. 

Movies

  • సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఫెయిలైనా సరే ఈమె యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు ఈమె చేసిన చిత్రాలు ఫెయిలైనా సరే కాస్తంత డబ్బులు రాబట్టాయి. కానీ హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' మాత్రం తొలిరోజే దారుణమైన కలెక్షన్స్‌తో ఈమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ  ఏంటి విషయం? ఈ మూవీ సంగతేంటి?

    (ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)

    బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ప్రీమియర్స్ వేయగా.. సినిమా చూస్తూ ఆమిర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. అయినా సరే ఈ మూవీని జనాలు పట్టించుకోవట్లేదు. చెప్పాలంటే రిలీజ్‌కి ముందే బజ్ లేదు. పెద్దగా బుకింగ్స్ కూడా జరగలేదు. సరే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుంటే హిట్ అవ్వొచ్చని అనుకున్నారు. కానీ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.

    సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ బాగానే చేసిందని అంటున్నారు గానీ మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు. చాలామంది మిడ్ రేంజ్ హీరోల కంటే సాయిపల్లవికి బాగానే గుర్తింపు ఉంది. ఇది కూడా 'ఏక్ దిన్' విషయంలో పనిచేసినట్లు లేదు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరుతో తీసుకొచ్చారు గానీ ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలీదు. షోలు కూడా పదికి మించి లేవంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    థాయ్ సినిమా 'వన్ డే' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్ నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు రూ.కోటి అటుఇటుగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ పాజిటివ్‌గా లేదు, కలెక్షన్సే పెద్దగా రావట్లేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే సాయిపల్లవికి బాలీవుడ్‌లో ఫస్ట్ స్ట్రోక్ తగిలినట్లే కనిపిస్తుంది. వీకెండ్ పూర్తయితే అప్పుడు వచ్చే వసూళ్ల బట్టి ఫలితంపై క్లారిటీ వచ్చేస్తుంది.

    (ఇదీ చదవండి: అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్)

  • 'కాంతార' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషభ్ శెట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనతో జరిగిన భేటీ.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఒకటని రాసుకొచ్చాడు. ఈ మేరకు తామిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ జరిగినట్లు చెబుతూ రెండు ఫొటోలని రిషభ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)

    'కాంతార, కాంతర ఛాప్టర్ 1 సినిమాల గురించి అమితా షా మాట్లాడుతూ వాటిని ప్రశంసించడం గొప్ప అనుభూతి. నా తర్వాత చిత్రాల విశేషాలని కూడా ఆయనతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా మేకింగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.

    రిషభ్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జై హనుమాన్' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అలానే శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ, సితార సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. 'కాంతార' ఫ్రాంచైజీలో మూడో భాగం అయితే ఇప్పట్లో రాకపోవచ్చనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)

  • కార్తీకదీపం సీరియల్ పేరు చెప్పగానే అందరికీ దీపనే గుర్తొస్తుంది. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోనే ఈమె తల్లి సుమిత్రగా చేస్తున్న నటి సీత గురించి చాలామందికి తెలుసు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. అయితే ఈమె అప్పుడప్పుడు బుర్కా ధరించడం, నమాజ్ చేస్తుండటంపై వస్తున్న ప్రశ్నలకు రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చింది. తను రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా వివరణ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

    'చాలారోజులుగా నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా ఫాలోవర్స్‌కి నాపై చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్‌లో అడుగుతూనే ఉంటారు. సీతాలక్ష్మీ అనే పేరు ఉంది కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా? ఎందుకు పెట్టుకోవడం లేదని అడుగుతుంటారు. మీరు బుర్కా ఎందుకు ధరిస్తున్నారని కూడా అడుగుతున్నారు. కావాలనే వేసుకుంది, నటిస్తుందని అంటుంటారు. ఇలా చాలామందికి అర్థం కావట్లేదు. వాటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు సీతాలక్ష్మీ. అది అమ్మనాన్న పెట్టిన పేరు. నా ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటైల్స్ అన్నింటిలో అలానే ఉంది. అయితే నా జీవితంలో ఓ చేదు జ్ఞాపకముంది. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. దాన్నుంచి బయటకు రావడానికి నాలుగేళ్ల పట్టింది. 2013 తర్వాత నాలుగేళ్లు యాక్టింగే చేయలేదు. ఎందుకంటే అప్పుడు నాకు విడాకులయ్యాయి. ఇది ఎందరికీ తెలుసో తెలీదు. కానీ నిజం చెప్పడానికి బాధపడను. అనుభవిస్తే కానీ ఆ బాధ అర్థం కాదు'

    'నాకు విడాకులు అయిన తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతడితో చెప్పుకొన్న తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. తోడు కావాలని ఓకే చెప్పేశాను. అలా అతడిని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన వైపు వాళ్లు నన్ను అంగీకరించారు. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. ఆయాస్ అని పిలుస్తారు. నా గురించి అంతా తెలిసిన వ్యక్తి. నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా మేం ఒక్కటయ్యాం. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేదు. అత్తగారింట్లో సపోర్ట్ కావాలంటే కొన్ని చేయకతప్పదు. అందుకే వాళ్ల వైపు వెళ్లిపోయా. అలా మా అత్తగారు నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి కాస్త యాస్మిన్ అయింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. సీత అని పిలవరు'

    'పేరు మార్చుకుంటే ఇండస్ట్రీలో కుదరదు కాబట్టి సీత అని అలానే ఉంచేసుకున్నా. నా భర్త వైపు వాళ్లు మాత్రం యాస్మిన్ అనే పిలుస్తారు. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను. అందుకే బుర్కా ధరిస్తాను. అయితే వాళ్లు ఇలానే ఉండాలి, అలాగే ఉండాలి అని నన్ను బలవంతం చేయరు. షూటింగ్‌కి వచ్చినప్పుడు మాత్రం నచ్చినట్టు ఉంటాను. అందుకే ఒకసారి బొట్టు పెట్టుకుంటాను. ఇంకోసారి పెట్టుకోను. అంతే తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఇవేం ఉండవు. నాకు మతపరమైన ఫీలింగే లేదు. నా జీవితంలో చాలా ఆశపడ్డాను. కానీ ఒక్కటీ జరగలేదు. విడాకులు అవుతాయని కలలో కూడా ఊహించలేదు. రెండో పెళ్లి కూడా ఊహించలేదు' 

    'దేవుడు ముందే అంతా నిర్ణయించి ఉంటాడు. రాసినదాన్ని తప్పించుకోలేం. వద్దంటే ఆగిపోదు.. కావాలంటే రాదు. మా అత్తగారి ఇంటి వాళ్ల కోసం అలా మారాను. నేనే తప్పు చేయడం లేదు. నేను అల్లాని మొక్కుతా. నమాజ్ చేస్తా. నిజాయితీగా ఉంటా. నేను ఎవరికీ చెడు చేయలేదు. నేను కష్టపడుతున్నా. నేను తింటున్నా. నా బాధలైనా ఆనందం అయినా దేవుడితోనే, అది ఏ దేవుడైనా అయ్యి ఉండొచ్చు' అని సీత వివరణ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)

  • అందానికే అందంలా మెరిసిపోతున్న కాజల్

    బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఇమాన్వి

    ఆరెంజ్ డ్రస్‌లో విష్ణుప్రియ అందాల ఆరబోత

    మాల్దీవుల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న కియారా

    స్టైలిష్ వాక్‌తో సెగలు పుట్టిస్తున్న మాళవిక

    అందంగా నవ్వేస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

  • తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టేస్తున్నాయి. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు తెగ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పిల్లల్ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలా అని పేరెంట్స్ చాలానే ఆలోచిస్తున్నారు. అయితే ఓటీటీల్లో పిల్లలని ఎంటర్‌టైన్ చేస్తూ విలువలు నేర్పించే యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులోకి మరొకటి చేరింది. రీసెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'హాపర్స్' చిత్రాన్ని పిల్లలతో పాటు పెద్దోళ్లు కూడా చూడొచ్చు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

    కథేంటి?
    బీవర్టన్ అనే ఊరిలో మేబల్ అనే అమ్మాయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పెద్దయి కాలేజీకి వెళ్లినా అది తగ్గదు. ఊరిలో ఫ్లైఓవర్ కడుతున్నారని, కానీ దీనికోసం పెద్ద చెరువుని కూల్చేశారని, అందులో జంతువులని బెదరగొట్టి పంపించేశారని తెలిసి బాధపడుతుంది. ఆ జంతువులని తిరిగి ఇక్కడికి ఎలా తీసుకురావాలా, ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోని విధంగా ఈమె ఆత్మ.. బీవర్ అనే జంతువులో ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైంది? బీవర్ శరీరంలో ఉన్న మేబల్.. మిగిలిన జంతువులతో కలిసి ఆ ఫ్లైఓవర్ కట్టడాన్ని అడ్డుకుందా లేదా అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే యానిమేషన్ సినిమాలకు సెపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి. అలా ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజై ఆకట్టుకున్న చిత్రమే 'హాపర్స్'. సరదా సరదాగా సాగిపోతూనే ప్రకృతి ఎంత గొప్పదో చెబుతుంది. కేవలం గంటన్నర మాత్రమే ఉండే ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడొచ్చు.

    ప్రస్తుతం నాగరికత పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు. బిల్డింగులు కట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా చెట్లు లేదా అడవులపై ఆధారపడి జీవిస్తున్న జంతువుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. జంతువులు మూగజీవులు కాబట్టి మనుషుల్ని అవేం చేయలేవు. ఒకవేళ వాటికే మనిషిలా ఆలోచించగలిగే శక్తి వస్తే ఏం చేస్తాయి అనే చిత్రమైన కాన్సెప్ట్‌తో తీసిన 'హాపర్స్' అద్భుతంగా ఉంది.

    పాయింట్ పరంగా కొత్తదేం కాదు కానీ చూపించిన ఎమోషన్స్ గానీ చేసిన కామెడీ గానీ బాగా కుదిరాయి. అడవిలో జంతువుల మధ్య సాగే హంగామా కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారు. పిక్సర్స్ స్టూడియోస్ తీసిన ఈ సినిమాలో నాన్నమ్మ-మనవరాలి ఎమోషన్ కూడా ఆకట్టుకునేలా ఉండటం విశేషం. మనిషి.. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు గానీ ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ప్రకృతే మనిషిని కాపాడటం అనే పాయింట్‌ని చూపించిన విధానం బాగుంది.

    ప్రస్తుతానికి ఈ సినిమా ఆపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో రెంట్ విధానంలో ఉంది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. సమ్మర్ హాలీడేస్‌లో మీ పిల్లలకు ఏదైనా మంచి మూవీ చూపిద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి. కచ్చితంగా నచ్చుతుంది.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • విలనిజం, క్యారెక్టర్ రోల్.. ఏదైనా సరే తనదైన నటనతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. నవీన్ చంద్రతో కలిసి నటించిన 'పోలీస్ కంప్లైంట్'.. మే 22న థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటీ దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో కృష్ణసాయి నటించారు. ఇతడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు సూప‌ర్‌స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు.

    (ఇదీ చదవండి: లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)

    'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి  మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు.

    (ఇదీ చదవండి: ఆ డైరెక్టర్‌ 10 సార్లు లైంగికంగా వేధించాడు: మోనాలిసా)

  • ఈ వీకెండ్ థియేటర్లలోకి తెలుగులో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్‌లీ', దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన 'గాయపడ్డ సింహం' చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేశాయి? వీటి కంటే ఒకరోజు ముందు రిలీజైన ధనుష్ 'కర' సంగతేంటి?

    (ఇదీ చదవండి: సత్య 'జెట్‌లీ' సినిమా రివ్యూ)

    కమెడియన్ సత్య, లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. ప్రమోషన్స్‌తో అయితే ఆకట్టుకున్నారు గానీ మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ లేదు, అలానే స్టోరీ కూడా గందరగోళంగా ఉండటం లాంటివి మైనస్ అయ్యాయి. స్టార్స్ ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. తొలిరోజు రూ.1.30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్.. మూడు నెలలు తిరిగేసరికల్లా 'గాయపడ్డ సింహం' అంటూ వచ్చాడు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే విచిత్రమైన స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలోనూ పెద్గగా చెప్పుకోదగ్గ కామెడీ లేదు. దీంతో దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.76 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

    (ఇదీ చదవండి: ‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

    ఇకపోతే గురువారం(ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చిన ధనుష్ 'కర' సినిమా సీరియస్‌గా సాగే డ్రామా. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. అయితేనేం రెండు రోజుల్లో రూ.20.20 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 1990ల్లో రైతుల్ని బ్యాంక్‌లు లోన్స్ పేరు చెప్పి ఎలా మోసం చేసేవి అనే కల్పిత కథతో దీన్ని తెరకెక్కించారు.

    (ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • ‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అడగగానే మా కోసం ‘సతీ లీలావతి’ట్రైలర్‌ రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్న  మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది’ అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఆమె, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ఈ చిత్రాన్ని మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

    ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

    దేవ్ మోహన్ మాట్లాడుతూ .. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాతినేని సత్య, నాగ మోహన్, తాగుబోతు రమేష్ , సప్తగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. 

  • కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని హీరోయిన్‌గా మారిన మోనాలిసా.. ఒకవైపు సినిమాల్లోనే నటిస్తూనే.. ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం..వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం..విచారణలో ఆమె మైనర్‌ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు నమోదు అవ్వడం..అంతలోనే ఆమె ప్రెగ్నెంట్‌ అని ప్రకటించడం..ఇలా గత కొద్ది రోజులుగా మోనాలిసా పర్సనల్‌ లైఫ్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. 

    ఈ వివాదం ముగియకముందే మరో ఈ వైరల్‌ భామ మరో బాంబ్‌ పేల్చింది. తనను హీరోయిన్ గా మార్చి, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన  డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిశ్రాతో పాటు మరో ముగ్గురిపై కూడా ఆమె పోక్సో చట్టం కింద ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలన సృష్టించింది.

    ఫిర్యాదులో ఏముంది?
    ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీ షూటింగ్‌ సమయంలో దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని మోనాలిసా ఫిర్యాదు పేర్కొంది.‘షూటింగ్ సమయంలో దర్శకుడు నాతో పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పినా.. పట్టించుకోలేదు. షూటింగ్‌ మొత్తంలో అతను నన్ను దాదాపు 10 సార్లు  లైంగికంగా వేధించాడు. మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానంటూ అనుచితంగా ప్రవర్తించాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది.

    న్యాయవాదిపై కూడా ఫిర్యాదు
    మోనాలిసా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అనిల్ విలయిల్ పేరు కూడా ఉంది.అనిల్ సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. గురువారం కోర్టుకు హాజరైన మోనాలిసా, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తుండటంతో, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

National

  • ఢిల్లీ: ‘నాన్నా బ్రతకడం కష్టంగా ఉంది.  నేను ఇబ్బందుల్లో ఉన్నాను’ అని తండ్రికి ఫోన్‌ చేసిన  ఓ  30 ఏళ్ల జ్యుడిషియల్‌ ఆఫీసర్‌.. ఆ మరుసటి రోజే శవమై పోయాడు.  ఎంతటి కష్టమొచ్చిందో తెలియదు కానీ తన ఇబ్బందిని పూర్తిగా తండ్రికీ చెప్పుకోలేక, ఇటు భార్యతోనూ పూర్తిగా ఇమడలేక తనువు చాలించాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుందని తండ్రితో అన్నాడే కానీ, విషయం మాత్రం చెప్పలేదు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ న్యాయాధికారి  దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన అనుమానిత ఆత్మహత్య క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

    వివరాల్లోకి వెళితే.. అమాన్‌ శర్మ.. ఉత్తర ఢిల్లీలోని కర్కర్దూమాలో డీఎల్‌ఎస్‌ఏ(డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ) సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ అధికారి కాస్తా  తన గ్రీన్ పార్క్ ఇంట్లో విగతజీవిగా మారిపోయాడు.  తన బావ అమాన్‌ శర్మ.. బాత్రూమ్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని బావమరిది పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. 

    చనిపోయే ముందు భార్యతో గొడవ.. కన్నీళ్లు
    అతను చనిపోయే ముందు భార్యతో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం..  అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో గొడవ పడి విపరీతంగా ఏడ్చేశాడని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఇద్దరు విపరీతంగా అరుచుకున్నారన్నారు. 

    నాకు ఫోన్‌ చేసి ఇబ్బంది ఉందన్నాడు..
    తన కొడుకు చనిపోవడానికి ముందు రాత్రి ఫోన్‌ చేసి మాట్లాడాడని, తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తండ్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ద్వారా తెలిసింది. ‘ నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. “నాకు జీవించడం కష్టంగా మారింది’ అని తండ్రి స్సష్టం చేశారు. 

    అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు
    ఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది,  మేము వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడతున్నాడు.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గుర్తించలేదు, అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు.

  • రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌ గఢ్‌ కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో   ముగ్గురు జవాన్లు  అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవగాయాలయ్యాయి. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు తొలగిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 

    అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్‌ పేరుతో వారి ఏరివేత చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో లొంగుబాటులు జరిగియి. కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ నేపథ్యంలో వారు అమర్చిన ముందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో  ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్‌  బెడ్స్‌మీదో  ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా  సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్‌ మెషీన్‌లోనే అనుకోండి) ఆరేసినపుడు,  ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది.  అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.

    చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప‍్లేస్‌  దొరకనపుడు బట్టల రాక్‌లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో,  పడకగదుల్లోనూ బట్టల రాక్‌లు అమర్చుకుంటాం. ఇంకా వాష్‌స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్‌ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట  తీగల మీద ఆరేసిన బట్టల్ని  వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం  లేకుండానే  ఒక వినూత్న టెక్నిక్‌ను వాడింది. దీనికి జస్ట్‌ అలా వీల్‌ అమర్చిన స్టాండ్‌ను లోపలికి  జరిపింది. అంతే  ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే  సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో  మహిళ.

    నెటిజన్ల  స్పందన 
    గుడ్‌ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్‌, స్పేస్‌ వేస్ట్‌ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్‌లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్‌ చేయడం గమనార్హం. 
     

    ఇదీ చదవండి: షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

     

Business

  • సుమారు మూడు దశాబ్దాలు తక్కువ ధరకే విమాన ప్రయాణ సేవలను అందిస్తున్న అమెరికన్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్, తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు, తక్షణమే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని.. ఆ విమానయాన సంస్థ ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.

    ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదల కారణంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. మా ప్రయాణికులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది. కాగా ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు రీఫండ్ చేయనున్నట్లు కూడా వెల్లడించింది.

    కోవిడ్ తరువాత స్పిరిట్ కంపెనీ లాభాలను ఆర్జించకపోగా.. ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. దీంతో సంస్థ తన సర్వీసులను నిలిపివేయడానికి సన్నద్ధమైంది. ఈ ప్రభావం సుమారు 17వేలమంది ఉద్యోగులపై పడనుంది.

  • భారత ప్రభుత్వం.. తాజాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం.. బీమా కంపెనీలలో 100% విదేశీ పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించింది. అంటే.. విదేశీ సంస్థలు ఇకపై భారత బీమా రంగంలో పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేకుండా సులభంగా ప్రవేశించగలవు. ఈ నిర్ణయం ద్వారా భారత బీమా రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి.

    అయితే.. విదేశీ పెట్టుబడులు 1938 బీమా చట్టానికి లోబడి ఉండాలి. అంతే కాకుండా బీమా, సంబంధిత కార్యకలాపాలను చేపట్టడానికి కంపెనీలు తప్పనిసరిగా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) నుంచి లైసెన్సులు లేదా అనుమతులు పొందాలి. అంటే, విదేశీ పెట్టుబడులు వచ్చినా కూడా భారత ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందన్నమాట.

    ఆటోమేటిక్ రూట్ కింద LICలో విదేశీ పెట్టుబడి 20%కి పరిమితం చేశారు. LICలో విదేశీ పెట్టుబడి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని సెక్షన్ 43 నిబంధనల ప్రకారం LICకి వర్తించే ఇన్సూరెన్స్ చట్టం, 1938 (4 ఆఫ్ 1938)లోని ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది'' అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

    మరో ముఖ్యమైన రూల్ ఏమిటంటే.. విదేశీ పెట్టుబడులు ఉన్న భారతీయ బీమా సంస్థల్లో, కనీసం ఒక కీలక పదవిలో ఉన్న వ్యక్తి (చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓ) భారత నివాసి పౌరుడై ఉండాలి. ఇది దేశీయ నియంత్రణ, బాధ్యతను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం.

    ఇక బీమా మధ్యవర్తుల (ఇంటర్మీడియరీస్) విషయంలో కూడా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో బ్రోకర్లు, రీ-ఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటరీలు ఉంటారు.

    ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

  • గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గిపోయిన షేర్ల బైబ్యాక్‌ కార్యకలాపాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉండే విధంగా పన్నుల విధానాలను క్రమబద్ధీకరించడంతో ఇవి ఆకర్షణీయంగా మారాయి. దీంతో అరబిందో ఫార్మా, సైయెంట్, విప్రోలాంటి కంపెనీలు బైబ్యాక్‌ ప్రణాళికలను ప్రకటించాయి.

    గత కొన్నాళ్లుగా బైబ్యాక్‌లలో షేర్లను విక్రయించడంపై వచ్చిన లాభాలను, డీమ్డ్‌ డివిడెండ్లుగా పరిగణించి, శ్లాబ్‌ రేట్ల ప్రకారం పన్ను వేస్తుండటంతో ఇన్వెస్టర్లలో వీటిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు. అయితే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్స్‌ యాక్ట్‌ 2026 చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం, ఇన్వెస్టర్లకు సానుకూలంగా,  హేతుబద్ధతతో వీటిని షేర్‌హోల్డర్ల చేతిలో క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణిస్తుండటంతో బైబ్యాక్‌లు కాస్త ఆకర్షణీయంగా మారుతున్నాయి. కంపెనీల నుంచి బైబ్యాక్‌ ప్రతిపాదనలు వెల్లువెత్తడానికి ఈ పన్నుపరమైన ప్రయోజనాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.

    రెండేళ్లుగా డౌన్‌..
    గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బైబ్యాక్స్‌ గణనీయంగా పడిపోయాయి. 2024–25లో కేవలం రూ. 8,034 కోట్లు, 2025–26లో రూ. 19,500 కోట్లకు పరిమితమయ్యాయి. అదే పన్ను విధానాలు సానుకూలంగా ఉన్నప్పుడు 2023–24లో వీటి పరిమాణం ఏకంగా రూ. 50,750 కోట్లుగా నమోదైంది.

    వ్యాపారంపై ధీమా..
    కేవలం ట్యాక్స్‌ ప్రయోజనాల వల్లే కాకుండా ఇతర అంశాలూ బైబ్యాక్‌కి ఊతమిస్తున్నాయి. చాలా మటుకు స్టాక్స్‌ భారీగా కరెక్షన్‌కి లోనవడం, నిధులు పుష్కలంగా ఉన్న కంపెనీలు తమ స్టాక్స్‌ని చాలా చౌకగా కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండు అంశాలే కాకుండా కంపెనీలు బైబ్యాక్‌లను చేపట్టడమనేది తమ ప్రధాన వ్యాపారాలపై కంపెనీలకి గల నమ్మకాన్ని సూచిస్తోందని నిపుణులు చెప్పారు. తమ షేర్లు ఉండాల్సిన విలువ కన్నా తక్కువ పలుకుతున్నా, ఈపీఎస్‌ (షేరువారీ ఆర్జన), రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) మెరుగుపడే కొద్దీ రేటు మరింత పెరుగుతుందని సంస్థలు ధీమాగా ఉండటాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.

    భారీగా రాబడులిచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్న కంపెనీల విషయానికొస్తే, నగదును పక్కన పెట్టుకుని కూర్చోవడానికి బదులు బైబ్యాక్‌ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, గ్లోబల్‌గా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వేల్యుయేషన్లను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌ రూపంలో కొనుక్కునే వెసులుబాటును తిరిగి ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తున్న నేపథ్యంలో ఈ విధానం మళ్లీ ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నారు.

  • ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.

    పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!
    పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.

    కియోసాకి ఏమన్నారంటే
    ‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’

    పాక్‌లో భగ్గుమంటున్న ధరలు
    ఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్‌లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.

    భారత్ విజయం వెనుక రహస్యం..
    భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.

    భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.

    పాక్ మంత్రి నిస్సహాయత
    పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.

    యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఏప్రిల్ నెలకు అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. ఈ అమ్మకాలను వెన్యూ సేల్స్ బాగా సహాయపడ్డాయి. దీనికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.

    2026 ఏప్రిల్ నెలలో కంపెనీ 51,902 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 ఏప్రిల్ అమ్మకాలతో (44,374 యూనిట్లు) పోలిస్తే 17 శాతం ఎక్కువ. దేశీయ అమ్మకాలలో వృద్ధి కనపరిచినప్పటికీ.. ఎగుమతులు 16 శాతం తగ్గాయి.

    గత ఏడాది ఏప్రిల్ నెలలో 16,400 యూనిట్లును హ్యుందాయ్ ఎగుమతి చేయగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 13,708 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. వెన్యూ సేల్స్ 12420 యూనిట్లతో బ్రాండ్ పాపులర్ సేల్ మోడల్ అయింది. తరువాత స్థానంలో ఎక్స్టర్ ఎస్‌యూవీ, వెర్నా సెడాన్, ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా సమ్మర్ ఎడిషన్ ఎస్‌యూవీ, గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్ ఉన్నాయి.

    ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

  • యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించకపోవడం వల్ల తాను ఈ సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ తెలిపారు.

    "మనం పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ పాటించలేదు. కాబట్టి వచ్చే వారం అమెరికాలోకి వచ్చే కార్లు, ట్రక్కులపై యూరోపియన్ యూనియన్‌కు విధించే సుంకాలను పెంచుతాను," అని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల ఆదాయం యునైటెడ్ స్టేట్స్‌లోకి వస్తుంది. అంతే కాకుండా ఇది ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు.

    ఆగస్టులో అమెరికా, యూరోపియన్ యూనియన్ ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి, దీని ప్రకారం యూరోపియన్ యూనియన్‌పై సుంకాలను 15 శాతానికి తగ్గించారు. ఆ సమయంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పారిశ్రామిక వస్తువులు, వాహనాలపై సుంకాలను తొలగించడానికి యూరోపియన్ యూనియన్ కూడా అంగీకరించింది. ఇప్పుడు తాజాగా ట్రంప్ సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.

    ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

  • ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్‌ పెంపు. ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోని పెన్షనర్లు గత పదేళ్లుగా దీని కోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు రూ. 1,000 గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500 కు పెంచాలని ఈపీఎస్-95 (EPS-95) సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

    ఆర్థిక మంత్రితో భేటీ.. ఆశలకు చిగురు!
    రాబోయే బడ్జెట్ కంటే ముందే EPS-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచడంతో పాటు, దానికి కరువు భత్యాన్ని (DA) కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో, లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే  డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్‌ను రూ. 7,500కు పెంచుతారా? లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు.

    ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయి?
    ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్‌ను ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు.
    నెలవారీ పెన్షన్ = (పెన్షన్‌ వర్తించే వేతనం X పెన్షన్‌ వర్తించే సర్వీస్ కాలం) / 70

    ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని రూ. 15,000 గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కేస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 7,500 కు పెంచితే, వివిధ సర్వీస్ కాలపరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు..

    సర్వీస్ ఆధారంగా పెన్షన్ అంచనా

    సర్వీస్ కాలంప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది
    10 ఏళ్లురూ. 2,142రూ. 7,500
    20 ఏళ్లురూ. 4,285రూ. 7,500
    25 ఏళ్లురూ. 5,357రూ. 7,500

    ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే, పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతుంది.

    ఈపీఎస్‌ కంట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే..
    ఉద్యోగి జీతం (బేసిక్‌ + డీఏ)లో 12 శాతం పీఎఫ్‌కి వెళ్తుంది. అదే యజమాన్యం చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు వెళ్తుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16 శాతం బడ్జెట్ మద్దతును ఈ పెన్షన్ ఫండ్‌కు అందిస్తుంది.

    పెన్షన్ పొందడానికి అర్హతలు
    🔸కచ్చితంగా ఈపీఎఫ్‌వో సభ్యుడై ఉండాలి.
    🔸కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
    🔸58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. (50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది).

    ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక రూ. 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది.

    ఇదీ చదవండి: హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

  • భారతీయులు ఒక ఉద్యోగంలో చేరితే, అది ఎంత కష్టమైన జాబ్ అయినా.. అంత సులభంగా వదులుకోరు. కానీ అమెరికన్స్ ఆలా కాదు. ఎలాంటి ఉద్యోగాన్ని అయినా తృణప్రాయంగా వదులుకుంటారు. దీనికి గల కారణం ఏమిటి?, భారతీయులు ఎందుకు ఉన్న ఉద్యోగాల్లోనే ఉండిపోతున్నారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    అమెరికాలో స్వేచ్ఛ - భారతదేశంలో బాధ్యత
    అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తన ఇష్టానుసారం తీర్చిదిద్దుకోవాలని భావిస్తారు. ఉద్యోగం వదిలేయడం కూడా ఒక వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ దానిని తప్పుగా చూడరు. ఒకరు తమ ఆసక్తి కోసం, కొత్త వ్యాపారం కోసం లేదా కొంత విశ్రాంతి కోసం ఉద్యోగాన్ని వదిలేయడం అక్కడ సాధారణం.

    కానీ.. భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబం, సమాజం చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఉద్యోగం అతని వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక స్థితితో కూడా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అంటే కుటుంబంతో చర్చించి తీసుకునే నిర్ణయం.

    ఆర్థిక భద్రత
    అమెరికాలో నిరుద్యోగ భృతి, సామాజిక భద్రత, క్రెడిట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల ఉద్యోగం పోయినా లేదా వదిలేసినా కొంత భద్రత ఉంటుంది. కాబట్టి కొంత సమయంలో వారు మళ్లీ కొత్త అవకాశాలను పొందటానికి కొంత సమయం తీసుకుంటారు. నమ్మకంతో ఉంటారు.

    భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి భద్రత ఉండదు. ఒక ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల ఉద్యోగం వదిలేయడం చాలా పెద్ద రిస్క్‌గా భావిస్తారు.

    ఉద్యోగ సంస్కృతి
    అమెరికాలో ఉద్యోగాలు మారడం అనేది సర్వ సాధారణమైన విషయం. కొత్త కంపెనీలకు మారడం ద్వారా జీతం పెరగడం, కొత్త అవకాశాలు పొందడం జరుగుతుంది. ఇది వారి కెరీర్‌కు మంచిదిగా భావిస్తారు.

    భారతదేశంలో అయితే.. ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేయడం నమ్మకంగా భావిస్తారు. తరచుగా ఉద్యోగాలు మారితే స్థిరత్వం లేదు అని అనుకుంటారు. అందువల్ల చాలా మంది తమకు ఇష్టంలేని ఉద్యోగంలో కూడా సంవత్సరాలుగా కొనసాగుతారు.

    మనస్తత్వం - విలువలు
    భారతదేశంలో చాలా మంది పిల్లలు, తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరుగుతారు. అందువల్ల వారికి స్థిరమైన ఉద్యోగం అంటే చాలా విలువ ఉంటుంది. అది వారి జీవితంలో భద్రతకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అనేది దాదాపు ఉండదనే చెప్పాలి.

    ఇదీ చదవండి: నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!

    అమెరికాలో చాలా మంది సౌకర్యవంతమైన పరిస్థితుల్లో పెరిగి ఉండటం వల్ల వారు తమ ఆసక్తులు, అభిరుచులను అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారికి భద్రత కంటే ప్యాషన్ చాలా ముఖ్యం.

    భయం!
    భారతదేశంలో ఫెయిల్యూర్ అంటే చాలా మంది భయపడతారు. ఉద్యోగం వదిలి.. కష్టాలపాలైతే సమాజం విమర్శిస్తుంది అనే భయం ఉంటుంది. అమెరికాలో అపజయాన్ని ఒక అనుభవంగా, నేర్చుకునే అవకాశంగా చూస్తారు. అక్కడ కొత్తగా ప్రారంభించడం గౌరవంగా భావిస్తారు.

    భారతదేశంలో కూడా ప్రస్తుతం ఉద్యోగం విషయంలో మార్పులు వస్తున్నాయి. యువత కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. దీంతో స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతోంది. వర్క్ - లైఫ్ బ్యాలన్స్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. 

     

  • న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్‌ ఇంక్‌(అవాంట్‌)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్‌ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్‌ మహీంద్రా పేర్కొంది.

    అవాంట్‌తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్‌ మహీంద్రా కన్సల్టింగ్‌ గ్రూప్‌(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసులు, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్‌ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.

    ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్‌లో టెక్‌ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్‌కు ఉన్న డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ నైపుణ్యం, టెక్‌ మహీంద్రా గ్లోబల్ నెట్‌వర్క్‌కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.

  • భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) సాంకేతికతకు వీలు కల్పించేలా రూపొందించిన వాణిజ్య బొగ్గు గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఈ మేరకు నాలుగు బొగ్గు గనులకు సంబంధించిన ‘కోల్ మైన్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్స్’ (సీఎంపీడీఏ)పై సంస్థలు సంతకాలు చేశాయి.

    ఎవరికి ఏ గనులు?

    రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆంధ్రప్రదేశ్‌లోని రెచెర్ల, చింతలపూడి సెక్టార్ ఏ1 బొగ్గు గనులను సొంతం చేసుకుంది.

    యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్: ఒడిశాలోని బెల్పహార్, తంగార్దిహి ఈస్ట్ బొగ్గు గనులను దక్కించుకుంది.

    ఈ నాలుగు గనుల్లో రెండు పాక్షికంగా నిర్వహిస్తున్నావి కాగా, మరో రెండు పూర్తిగా కార్యకలాపాలు సాగిస్తున్నవి.

    ఏమిటీ యూసీజీ ప్రత్యేకత?

    సాధారణంగా బొగ్గును గనుల నుంచి వెలికితీసి ఆపై విద్యుత్ లేదా ఇంధనం కోసం ఉపయోగిస్తారు. అయితే, యూసీజీ సాంకేతికత అందుకు భిన్నం. ఇది బొగ్గును నేరుగా సీమ్ (నేల లోపల బొగ్గు పొర)లోనే సింథటిక్ వాయువు (సిన్‌గ్యాస్‌)గా మారుస్తుంది. దీనివల్ల సంప్రదాయ మైనింగ్ అవసరం ఉండదు. సాధారణ పద్ధతుల్లో దీన్ని వెలికితీయడం కష్టసాధ్యం. ఈ పద్ధతి ద్వారా లోతైన బొగ్గు పొరల నుంచి కూడా సింథటిక్‌ వాయువును తయారు చేయవచ్చు.

    బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ గనులలో సాంప్రదాయ మైనింగ్‌తో పాటు యూసీజీ పద్ధతిని కూడా అనుసరించే వెసులుబాటును ఆపరేటర్లకు కల్పించారు. ఇది దేశంలోని ఇంధన వనరులను గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాజెక్టులు కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా వెలువడే సిన్‌గ్యాస్‌ యూరియా, అమ్మోనియా తయారీకి కీలకంగా మారుతుంది. ఇది ఎరువుల దిగుమతులపై భారత్‌కున్న ఆధారపడటాన్ని తగ్గించి ఆహార భద్రతకు ఊతమిస్తుంది.

    కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీలో సహజ వాయువు, నాఫ్తా స్థానంలో ఈ సిన్‌గ్యాస్‌ను ఉపయోగించి మిథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎంఈ), ఇతర సింథటిక్ ఇంధనాలను స్వదేశంలోనే తయారు చేసే అవకాశం లభిస్తుంది. ఈ నాలుగు ఒప్పందాలతో కలిపి ఇప్పటివరకు వాణిజ్య బొగ్గు వేలం ద్వారా జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138కి చేరుకుంది.

    తాజా ఒప్పందంలోని ముఖ్యాంశాలు

    గరిష్ట సామర్థ్యం: 331.544 ఎంటీపీఏ.

    ఆర్థికాభివృద్ధి: ఏడాదికి సుమారు రూ.42,980 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం.

    పెట్టుబడులు: రూ.48,231 కోట్ల మేర మూలధన పెట్టుబడులు.

    ఉపాధి: సుమారు 4,34,175 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు.

    ఇదీ చదవండి: నమ్మావో ముంచేస్తారు!

  • దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన 'ఆర్థిక నేరగాళ్ల'పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 21 మందిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు'గా (FEO) ప్రకటించింది.

    ఎవరీ ఆర్థిక నేరగాళ్లు?
    ఒక వ్యక్తి చేసిన ఆర్థిక నేరం విలువ రూ. 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉండి, వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ.. విచారణను ఎదుర్కోకుండా విదేశాలకు పారిపోయి, తిరిగి రావడానికి నిరాకరిస్తే వారిని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు' (FEO-Fugitive Economic Offender) గా గుర్తిస్తారు.

    లిస్టులో కీలక వ్యక్తులు వీరే..
    ఈడీ ప్రకటించిన 21 మంది జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్తలు, గ్యాంగ్‌స్టర్ల అనుచరులు ఉన్నారు. బ్యాంకుల‌కు కన్నం వేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, బ్రిటన్‌కు చెందిన వివాదాస్పద ఆయుధ సరఫరాదారు సంజయ్ భండారీ, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, దివంగత ఇక్బాల్ మిర్చి భార్య హజ్రా ఇక్బాల్ మెమన్ ఇందులో ఉన్నారు.

    అంతేకాకుండా, మెహుల్ చోక్సీ, ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్, మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ వంటి వారిని కూడా ఎఫ్‌ఈవోలుగా ప్రకటించే ప్రక్రియ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఈడీ వెల్లడించింది.

    భారీగా రికవరీ
    గత రెండేళ్లలో (2024-25, 2025-26) ఈడీ కార్యకలాపాలు అత్యంత వేగవంతమయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ. 2,178.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసింది. ఈ 21 మందిలో తొమ్మిది మందిని కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఎఫ్ఈఓలుగా ప్రకటించడం విశేషం. మొత్తంగా 54 మంది వ్యక్తులపై ప్రస్తుతం ఎఫ్ఈఓఏ (FEOA) చట్టం కింద చర్యలు కొనసాగుతున్నాయి.

    సంజయ్ భండారీ కేసులో కీలక మలుపు
    ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై ఈడీ కీలక వివరాలను వెల్లడించింది. 2016లో ఆదాయపు పన్ను దాడుల తర్వాత నేపాల్ మీదుగా లండన్‌కు పారిపోయిన భండారీపై 2017లో రెడ్ నోటీసు జారీ అయింది. దర్యాప్తులో అతనికి రూ. 655 కోట్ల విదేశీ ఆదాయం, రూ. 100 కోట్లకు పైగా విదేశీ ఆస్తులు ఉన్నట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా యూఏఈ, బ్రిటన్‌లలో పెట్టిన పెట్టుబడులను జప్తు చేయాలని ఈడీ కోర్టును కోరింది.

    పరారీలో ఉన్న నేరగాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, వారిని భారత్‌కు రప్పించడంతో పాటు ఆస్తుల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించామని ఈడీ తన నివేదికలో స్పష్టం చేసింది.

International

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్‌ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  

    ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా ‍వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.

    అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్‌ సైతం ఘాటుగానే స్పందించింది.  "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

    విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. 

    తాజాగా ట్రంప్‌ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. 

  • ప్రస్తుతం అమెరికా- ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్‌ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

    ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్‌ఫైర్" (టెహ్రాన్‌లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్‌లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

    టెహ్రాన్‌ మెుత్తం కలియతిరుగుతూ...

    రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ  ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్‌పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్‌లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్‌లోని లాంజ్‌కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.

    వైరల్‌గా వీడియో

    అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో  ట్రంప్ ఈ లేఖ రాశారు.   అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. 

    అయితే దీనికి స్పందనగా ఇరాన్‌ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని  ఇరాన్ హెచ్చరించింది.

    ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

    ఇదీ  చదవండి: షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

    భారీ నష్టం
    సిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్‌లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.

    ఇదీ చదవండి: నటి ఎగ్‌ ఫ్రీజింగ్‌ ఇంజెక్షన్స్‌: రెండు రోజులు నరకం

    ఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.

    ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
    మరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా  అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. 

    మరోవైపు  మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో  కొత్త కాలపరిమితిని  స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్‌పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.

  • ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్‌ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.

    ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.

    ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్‌లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

    కాగా ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి  చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్‌కు తెలిపినట్లు సమాచారం.

  • టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్‌ సీనియర్‌ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. 

    మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్‌ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ ప్రపోజల్‌ నచ్చలేదన్న ట్రంప్‌... అసలు ఈ ప్రపొజల్‌ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.

    ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్‌(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని ట్రంప్‌ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

    ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్‌ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. 

Telangana

  • సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకోసం మరో కొత్తరకం సేవలు ప్రారంభించింది. శీతలీకరించిన కాన్కోర్ కంటైనర్ రేక్‌ ' ఔషధి ఎక్స్‌ప్రెస్' సేవలను త దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (కాన్కోర్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ స్వరూప్‌ ఈ రోజు (శనివారం) సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐ.సి.డి) నుండి జెండా ఊపి ప్రారంభించారు.

    "ఔషధి ఎక్స్‌ప్రెస్" అనే బ్రాండ్‌తో ఉన్న ఈ శీతలీకరించిన (రీఫర్) కంటైనర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణ రక్షక ఔషధాలు మరియు ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్‌లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది.

    ఈ శీతలీకరించిన కంటైనర్‌ సేవ, కోల్డ్-చైన్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తోంది . అధిక నాణ్యత గల రీఫర్ కంటైనర్లను అందిస్తున్న మెర్స్క్ లైన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఐసిడి సనత్‌నగర్ యొక్క కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.

    హైదరాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కేంద్రాలలో ఒకటి మరియు దీనిని తరచుగా " భారతదేశ ఫార్మా రాజధాని" అని పిలుస్తారు. హైదరాబాద్‌లోని కీలక ఫార్మా ప్రాంతాలలో జీనోమ్ వ్యాలీ (తుర్క పల్లిలో ఉన్న ఒక ప్రధాన ఆర్&డి కేంద్రం ), జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం, పటాన్‌చెరు (ఒక పారిశ్రామిక ఫార్మా జోన్), మరియు ముచర్ల ఉన్నాయి . హైదరాబాద్–జేఎన్‌పీటీ కారిడార్, తెలంగాణ పారిశ్రామిక ప్రాంతాలకు మరియు భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటైన జేఎన్‌పీటీతో అనుసంధానించే కీలక మార్గంగా పనిచేస్తూ, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది.. 
        
    ఇండియన్ రైల్వేలు ప్రత్యేకంగా ప్రారంభిస్తున్న రీఫర్ రేక్ సేవలు ఎగుమతిదారులు మరియు దేశీయ పంపిణీదారులకు ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గించి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, సరఫరా గొలుసు విశ్వసనీయతను పెంచుతాయి. ఫార్మాస్యూటికల్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత పరిరక్షణ అవసరాలు పెరగడంతో భారతదేశంలో విశ్వసనీయమైన కోల్డ్-చైన్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ రీఫర్ రేక్ వినియోగం ప్రతిబింబిస్తుంది.  

    ఇది ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ధరల సాధన మెరుగుపడుతుందని, అలాగే వృథాను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ చొరవ, సమర్థవంతమైన, సుస్థిరమైన, మరియు పర్యావరణ అనుకూలమైన సరుకు రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద భారత ప్రభుత్వ దార్శనికతకు ఈ పథకం అనుసంధానంగా ఉంది. 

  • సాక్షి, కొత్తగుడెం: భద్రాచలం ఐటీడీఏ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఒక అధికారి పట్ల ప్రజలకు ఉండే కృతజ్ఞత సరిహద్దులు దాటి, సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తున ఉన్న ప్రపంచ శిఖరాగ్రానికి చేరుకుంది. అక్కడి నుండి ఆయనకు కృతజ్ఞతతో ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ వీడియో సందేశం తెలిపేలా చేసింది  

    సాహస యాత్ర విశేషాలు

    పెనుబల్లి మండలం వి.ఎం బంజర్ గ్రామానికి చెందిన బి. మోతీ కుమార్ అనే గిరిజన యువకుడు గతంలో మౌంట్ కిలి మంజరో పర్వతం 5 8 9 5 మీటర్లు, మౌంట్ ఎలబ్రస్ పర్వతం 5642 మీటర్లు అధిరోహించి రావడం జరిగిందని, ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు వరకు వెళ్లి  వచ్చాడు, త్వరలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించబోతున్నాడు.  దీనికి అతను, దాతల సహకారం కోరుతున్నాడు.

    హిమ శిఖరాల నుండి వీడియో సందేశం

    మోతీ కుమార్ ఎవరెస్ట్ మంచు కొండల నుండి పంపిన సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది."సార్, గిరిజనుల సంక్షేమం కోసం మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా, మీపై ఉన్న అభిమానంతో ఈ ఫ్లెక్సీని తీసుకొని వచ్చాను ధన్యవాదాలు అని ఆ యువకుడు సందేశం పంపించడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి పట్ల గిరిజన యువతకు ఉన్న ఈ అచంచలమైన ప్రేమాభిమానాలు, ప్రజా సేవకు పారదర్శకమైన పాలన తోడైతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనడానికి నిదర్శనం.

    ప్రజల నుండి ఏ అధికారికైనా అభిమానంతో కూడిన గౌరవం లభించడం మనం చూస్తుంటాం కానీ గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఐటీడీఏ పీవో బి రాహుల్ కి దేశంలోనే మొట్టమొదటిసారి ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం.

    పీఓ రాహుల్ గారి 'స్వర్ణ యుగం* 

    గిరిజన ప్రాంత అభివృద్ధిలో పీఓ రాహుల్ రెండేళ్ల లోపు పాలన ఒక అద్భుతమైన మార్పును తెచ్చింది. గిరిజన సంస్కృతిని   భద్రపరిచేందుకు అత్యాధునిక గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయటం, గిరిజన ఉత్పత్తుల కోసం 'భద్రగిరి మార్ట్ 'సృష్టించి, వారిని వ్యాపారులుగా మార్చడం, విద్య, వైద్యం, సాగు మరియు తాగునీటి సౌకర్యాల కల్పనలో విప్లవాత్మక మార్పులు చేశారు.ఆదివాసీ జేఏసీ ద్వారా 'ఆదివాసి వికాస రత్న"బిరుదు పొందారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి ఏరియాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఒకరు విషం తీసుకోగా.. మరొకరు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

    మృతుల్ని కార్తీక్‌, మంజులగా గుర్తించారు. వీళ్లకు పెళ్లై రెండు నెలలే అయ్యిందని.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మృతుల నేపథ్యం.. మరణాలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

    హైదరాబాద్ లో విషాదం నవదంపతుల ఆత్మహత్య

Family

  • న్యూఢిల్లీ : నటి ఆకాంక్ష రంజన్ కపూర్  (32) తాను తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్న విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.   ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే  తన  ఎగ్‌ ఫ్రీజింగ్‌ నిర్ణయం  వెనుక గల కారణాన్ని ఆమె మరింత వివరంగా తెలియజేశారు.

    సోహాఅలీ ఖాన్ పాడ్‌కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' తాజా ఎపిసోడ్‌లో, ఆకాంక్ష కపూర్ తాను తన అండాలను ఎందుకు ఫ్రీజ్ చేయించుకోవాలనుకున్నదీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో,  ఆకాంక్ష  తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నారు.  

    కడుపులో పెద్ద బెలూన్ ఉన్నట్టే
    ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల తాను చాలా నొప్పిని అనుభవించానని ఆకాంక్ష తెలిపారు. శారీరకంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే  ఇది అందరికీ ఇలాగే జరుగుతుందనుకోను, కానీ  తన విషయంలో మాత్రం విపరీతమైన నొప్పి ని భరించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.  2-3 రోజుల పాటు నేను సరిగ్గా నడవలేకపోయాను.  కడుపులో ఏదో పెద్ద బెలూన్ ఉన్నట్లుగా అనిపించేది, కనీసం నిటారుగా నిలబడలేకపోయేదాన్ని. తాను చాలా సన్నగా ఉండటం వల్ల అలా అనిపించి ఉండవచ్చని డాక్టర్ చెప్పారని వివరించింది.

    ఎగ్‌ ఫ్రీజింగ్‌ వెనుక  రెండు ప్రధాన కారణాలు

    తన స్నేహితులు గర్భం దాల్చుతున్న సమయంలో అందరూ పలకరిస్తుండటంతో, ఆమె కూడా AMH (Anti-Mullerian Hormone) టెస్ట్ చేయించుకున్నారు. తన వయస్సుతో పోలిస్తే ఆమెలో ఈ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తేలింది. (AMH టెస్ట్ ద్వారా ఒక మహిళలో అండాల నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు). తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతుండటం, సంతానలేమి సమస్యలు ఎదుర్కోవడం చూసి ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఆకాంక్ష తెలిపారు.

    ఇది భయం కాదు..ఇన్సూరెన్స్ 
    భయంతో తీసుకున్న నిర్ణయం  కాదని, తన  భవిష్యత్తు కోసం  చేసిన అని స్పష్టం చేసిన ఆకాంక్ష, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు. ఇదొక బీమా లాంటిదని పేర్కొన్నారు.

    ముందే చేసి ఉండాల్సింది..
    ప్రస్తుతం తనకు 32 ఏళ్లని, అసలైతే 20 ఏళ్ల వయస్సులోనే లేదా 20ల మధ్యలో ఈ ప్రక్రియ చేసి ఉంటే అండాలు మరింత ఆరోగ్యంగా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు.  తాను ఇప్పటికే ఆలస్యం చేశానని ఇది  ఎగ్‌ ఫ్రీజింగ్‌  గురించి ముందే  తెలిసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.

     కాగా ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ  పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త  బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆకాంక్ష రంజన్ కపూర్ 'గిల్టీ' (Guilty) వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. 

    ఇదీ  చదవండి: షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

  • ఇంట్లో పెంచుకునే కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుల్లాగ కాకుండా కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్‌ చేస్తుంటారు. అయితే, వాటికి ఆహారం అందించే విషయంలో ఇప్పటికీ చాలా మంది యజమానులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో దొరికే  ప్యాక్‌ చేసిన తినుబండారాలు మంచివో కాదో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకే ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు వ్యాపారవేత్త గార్గి ప్రేహర్‌. వాటికోసం ఒక బార్కరీ (బేకరీ)ని స్థాపించారు. అంతేకాదు వంటగదిలో లభించే పదార్థాలతో వాటికి సురక్షిత ఆహారం ఎలా అందించాలి అనే అంశాలపై ‘ది బార్కరీ’ (The BARKERY BOOK) అనే పేరుతో బుక్‌ను కూడా రాశారు. 

    గార్గి ప్రేహర్‌ ( Gaargi Prehar) ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్తపారిస్‌లో ఎంబీఏ పూర్తిచేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె పలు దేశాల్లో ఉన్నతస్థాయిలో పనిచేసింది. అంతలోనే ఆమెకు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే మలుపు తిరిగేలా చేసింది. పెంపుడు జంతువుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్, గ్లూటెన్‌–ఫ్రీ కేకులు, తీపి పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. 

    ఇదీ చదవండి: పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?

    పప్‌–లార్డ్స్‌ బార్కరీ
    2019లో ముంబైలో పప్‌–లార్డ్స్‌ బార్కరీ అనే తన పాటిస్సేరీని ఆమె స్థాపించారు. ప్రతి వేడుకలోనూ మూగజీవాలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వాటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తయారు చేస్తారు. వాటిల్లో కేకులు, స్నాక్స్, బేక్‌ చేసిన కుక్కీలు, సేవరి జెర్కీలు అన్నీ లభిస్తాయి. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేయగల బీర్, వైన్, గ్లూటెన్‌–ఫ్రీ  జైలిటోల్‌–ఫ్రీ వంటి ప్రత్యేకమైన వంటకాలు కూడా ఈ బేకరీలో తయారు చేస్తారు. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీల వరకు ఈ బేకరీ నుంచి కేకులను తీసుకువెళ్తుంటారు. 

    ది బార్కరీ బుక్‌
    పెంపుడు జంతువులకు అందించే ఆహారం తయారీపై ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ‘ది బార్కరీ బుక్‌’. వంటగదిలో ప్రతిరోజూ లభించే పదార్థాలతో పెంపుడు జంతువుల కోసం పోషకమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనుషులు తినే ఏ ఆహార పదార్థాలు కుక్కలకు హాని చేస్తాయి? వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి? అనే విషయాలను గార్గి ఇందులో స్పష్టంగా వివరించింది. భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ΄÷ందించిన మొదటి పుస్తకం ఈ ది బార్కరీ బుక్‌.

    ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్‌ దాకా : హోంమేకర్‌ సక్సెస్‌ స్టోరీ

    భారతదేశపు మొదటి డాగ్‌ కుక్‌బుక్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాగ్‌ లవర్స్‌కు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పుస్తకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. అలాగే విజయం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సమాజంలో మనం తీసుకువచ్చే ఒక మార్పు. ఎవరినీ కించపరచకుండా, నొప్పించకుండా సున్నితంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అదే నేను చేశాను. సాధించాను. అదే నా గెలుపు.  –   గార్గి ప్రేహర్‌ 

    ఇదీ చదవండి : షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

  • కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు దెయ్యంతో చిన్న ఇంటర్వ్యూ కావలెను. 
    సదరు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగువాడు మా బుజ్జిగాడు. 
    వాడి అడ్రస్‌... బుజ్జిగాడు, ప్రేమ్‌నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, హైదరాబాద్‌. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు ఫలానా... ఫలానా. 
    మా బుజ్జిగాడు పగలు నిద్రపోయి రాత్రంతా అల్లరిచేస్తూ ఉంటాడు కాబట్టి సంప్రదింపులకు దెయ్యాలకూ వీలుగా ఉంటుంది. ఆసక్తిగల దెయ్యాలు సదరు ఫోన్‌  నంబరులో నేరుగా సంప్రదించవచ్చు. ఇట్లు రాంబాబు.

    ఈ ప్రకటన చూడగానే మా రాంబాబుగాడికి ఫోన్‌ చేయక తప్పలేదు. 
    ‘‘ఎందుకురా ఆ ప్రకటన ఇచ్చావ్‌?’’ అంటూ నేనడగ్గానే వాడు భోరుమన్నాడు. తమ బుజ్జిగాడికొచ్చిన డౌట్లు గురించి బిక్కుబిక్కుమంటూ వాడు చెప్పిన వివరాలివి...  

    ‘‘నాన్నా... దెయ్యాలు ఒరిజినల్‌గా తాము పుట్టినరోజునే బర్త్‌–డే చేసుకుంటాయా? లేదంటే... తాము చచ్చిన రోజునే అవి దెయ్యాలై పుడతాయి  కాబట్టి తమ డెత్‌–డే రోజున బర్త్‌డే చేసుకుంటాయా?’’ అడిగాడు. 

    రాంబాబుగాడికి ఏం చెప్పాలో తోచలేదట. బుజ్జిగాడొచ్చి ఈ డౌటడిగాక వాడి సందేహంలోనూ న్యాయముందని అనిపించిందట. అంతేకాదు... తన పుట్టినరోజునే తానూ చచ్చిపోవాలనీ... దాంతో దెయ్యంగా మారాక బర్త్‌–డే విషయంలో తనకూ  పెద్దగా కన్ఫ్యూజన్‌ ఉండదనీ... పైగా పుట్టినరోజూ, చచ్చినరోజూ ఒకటే అయితే డేటు మర్చిపోకుండా ఉండేందుకు మాం...ఛి అడ్వాంటేజు కూడా ఉంటుందని అనిపించిందట.

    మరోరోజు బుజ్జిగాడు మరోమారు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘నాన్నా... ఆరోజున నువ్వు మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ దెయ్యాల్లో... జుట్టుదెయ్యాలూ, గుండు దెయ్యాలూ, కొరివిదెయ్యాలూ, రాఛ్ఛాసులూ, బ్రమ్మరాచ్చసులూ, పిశాచులూ, బేతాళ పిచాచులూ అంటూ రకరకాల కులాలుంటాయని మన బే...ద్ధ రచయిత పతంజలి గారు చెప్పారంటూ ఎవరికో స్పీచు ఇచ్చావ్‌ కదా. అప్పుడూ... దెయ్యాల్లో గనకా ఎలచ్చన్లు గట్రా అవుతుంటే ఎక్కడ ఏ క్యాస్టు దెయ్యాలు ఎక్కువో... అక్కడ వాళ్లనే క్యాండిడేటుగా నిలబెడతారు కదా’’ అని అడిగాడు బుజ్జిగాడు.

    రాంబాబుగాడిక్కూడా అది కరెక్టుగా అనిపించిందట. ఉదాహరణకు ‘చింతనిప్పుల అనే ఓ చింతలతోపు నియోజకవర్గంలో కొరివిదెయ్యాల కులపోళ్లు ఎక్కువగా ఉన్నారనుకుందాం. అక్కడ పిశాచాల కులపు క్యాండిడేటును నిలబెడితే వాడికి ఓట్లు పడతాయా? అలాగే ‘మర్రిఊడల’ అనే మరో నియోజకవర్గంలో బేతాళ పిశాచాలు ఎక్కువగా ఉంటే అక్కడ మన జుట్టుదెయ్యాలకు ఓటెవడేస్తాడు!! బుజ్జిగాడు చెప్పాక ఈ డౌటు తననూ వేధించిందం’టూ వాడు మధనపడ్డాడు.

    ఇంకోరోజు మా పోర్షన్‌ కు ముందు ఓ షట్టర్‌లో రెంటుకుండే ఓ టైలర్‌గారి దగ్గర వెళ్లి... ‘‘అంకుల్‌... దెయ్యాలు తమ తెల్లచీరలకు పీకోఫాల్సూ, వాళ్లకు మ్యాచింగు బ్లౌజులూ మీరే కుడతారా?’’ అంటూ తనను తరచూ ముద్దుచేస్తుండే ఆ టైలర్‌గారిని అడిగాట్ట. ఆయన దగ్గర ఉండే చనువు కొద్దీ ఈ ప్రశ్నైతే వేశాడుగానీ అతడికీ ఏం చెప్పాలో తెలియలేదు. ‘‘ఏమో... దెయ్యాల జుట్టుకు షాంపూలూ, దువ్వెన్లూ ఎక్కణ్ణుంచి కొంటారో’’ అంటూ బుజ్జిగాడు అడిగిన మరో ప్రశ్నకు... సదరు టైలరూ, మా వీధిలోని కిరాణా కొట్టు ఓనర్లతో పాటు నేనూ డౌట్లలో మునిగిపోయాం.

    ‘‘దెయ్యాల గురించి మావాడు తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులివ్వలేకా... వాడు రోజు విడిచి రోజు... ఈ ప్రశ్నల్తో వేధిస్తుంటే తట్టుకోలేకా ఈ ప్రకటన ఇచ్చాన్రా! ఈ యాడ్‌ చూసుకొని ఎవడైనా పిల్లపిశాచిగాడో, ఏ దెయ్యప్పిల్లో రెస్పాండ్‌ అయితే... వాడికీ మా బుజ్జిగాడికీ ఫ్రెండ్‌షిప్పు కుదిర్చేసి నేను హాయిగా, హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండొచ్చని ఇచ్చాన్రా ఈ ప్రకటన’’ అంటూ భోరుమన్నాడు మా రాంబాబుగాడు. 

    చ‌ద‌వండి: సారీ... విసిగి వేసారి..

    ఈలోపు నేనూరుకోలేదు. మా రాంబాబుగాణ్ణి మరింత కన్ఫ్యూజన్‌లో పడేస్తూ... ‘‘అన్నట్టూ... దెయ్యాలు న్యూస్‌ పేపర్లు చదువుతాయంటావా?’’ అని అడిగా. 

    – యాసీన్‌ 

  • న్యూయార్క్‌: పుస్తకం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పేపర్లు, అక్షరాలు, పెద్ద పెద్ద లైబ్రరీలు. కానీ, ఆ ఊహలను పూర్తిగా మారుస్తూ.. ప్రపంచంలోనే తొలిసారిగా ‘పుస్తకాలు లేని బుక్ స్టోర్’ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అమెజాన్ అనుబంధ సంస్థ ‘ఆడిబుల్’ న్యూయార్క్‌ నగరంలో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నేటి తరం పాఠకులు పుస్తకాలు చదవడం కంటే ఆడియో కథలు వినేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ పాప్-అప్ స్టోర్‌ను ఆవిష్కరించింది.

    ఆడిబుల్ స్టోరీ హౌస్.. ఒక సరికొత్త ఊహ
    మాన్‌హాటన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ప్రారంభమైన ఈ ‘ఆడిబుల్ స్టోరీ హౌస్’లో ఒక్క భౌతిక పుస్తకం కూడా కనిపించదు. బెస్ట్ సెల్లర్ పుస్తకాల అరలు, కాగితాల చప్పుడు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రదేశాన్ని కేవలం ‘ఆడియో స్టోరీటెల్లింగ్’ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆడిబుల్ సీఈఓ బాబ్ కారిగాన్ మాట్లాడుతూ.. ఆడియో కథలకి ప్రాణం పోసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న  ఐడియా నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నారు.

    స్టోరీ టైల్స్‌తో వినూత్న అనుభూతి
    ఈ స్టోర్‌ లోపల అరల నిండా ‘స్టోరీ టైల్స్’ అనే ఆడియోబుక్ టాబ్లెట్లు ఉంటాయి. సందర్శకులు వాటిని అక్కడే ఉన్న ప్లేయర్‌లో ఉంచి హెడ్‌ఫోన్స్ ద్వారా కథలు వినవచ్చు. ఈ టైల్స్ ద్వారా షార్ట్ ప్రివ్యూ వినొచ్చు. ఆపై పూర్తి పుస్తకాన్ని ఆడిబుల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హెడ్‌ఫోన్స్ లేకుండా గ్రూప్‌గా కూర్చొని ఆడియో వినేందుకు స్పీకర్లతో కూడిన ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. అలాగే ‘లిజనింగ్ బార్’ వద్ద ఉండే ‘స్టోరీ టెండర్స్’.. విజిటర్స్ అభిరుచికి తగ్గ ఆడియోబుక్స్‌ను ఎంపిక చేయడంలో సహాయపడతారు.

    పెరుగుతున్న ఆడియోబుక్స్‌ క్రేజ్
    అమెరికాలో ఆడియోబుక్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ బుక్ లెస్ స్టోర్ రావడం విశేషం. ఆడియో పబ్లిషర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 2024లో అమెరికాలో ఆడియో బుక్ అమ్మకాలు 2.22 బిలియన్ డాలర్ల(రూ. 9,491 కోట్లు)కు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు అయింది. సంప్రదాయ పుస్తక పఠనంలోని ఆత్మీయతను, ఆధునిక శ్రవణ అలవాట్లను కలబోసి.. ఆఫ్‌లైన్ ద్వారా సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఆడిబుల్ ఈ ఈ స్టోర్‌ను నడపనుంది.

    ఇది కూడా చదవండి: చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం

Crime

  • కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 500 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో 12 ఏళ్ల పసివాడిని తలకిందులుగా వేలాడదీసి, పైశాచికంగా హింసించిన ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్ సిబ్బంది అమానుషత్వం అందరినీ కలచివేసింది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన వార్డెన్, వంట మనిషిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

    వంటవాని కిరాతకం.. వార్డెన్ వత్తాసు
    పునలూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న 12 ఏళ్ల విద్యార్థిపై అక్కడి వంటవాడి కన్ను పడింది. తన దగ్గర ఉన్న రూ. 500 దొంగిలించాడంటూ ఆ బాలుడిపై నింద మోపాడు. అనుమానంతో ఆ పసివాడిని శారీరకంగా తీవ్రంగా హింసించాడు. అంతటితో ఆగకుండా బాలుడిని అత్యంత పాశవికంగా తలకిందులుగా వేలాడదీసి, తన రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఈ దారుణ కాండలో బాలుడిని రక్షించాల్సిన స్కూల్ వార్డెన్ కూడా వంటవాడికి సహకరించడం గమనార్హం.

    తండ్రి ఫిర్యాదుతో..
    కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సిబ్బంది చేతిలో తీవ్ర నరకయాతన అనుభవించిన ఆ బాలుడు.. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని రోదిస్తూ చెప్పాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలుడి తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. స్కూల్ సిబ్బంది పైశాచికత్వంపై ఆధారాలతో సహా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.

    నిందితుల అరెస్ట్.. సురక్షితంగా బాలుడు
    తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు వేగవంతం చేశారు. బాలుడిని హింసించిన వంటవాడిని, అతనికి సహకరించిన వార్డెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టాల కింద వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ దాడి వల్ల బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

    ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం

NRI

  • ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్‌..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్‌ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ,  కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన  ఈ మెయిల్స్‌ సంచలనంగా మారాయి.

    ఆనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం  తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం  ముందుగా అన్నీ ప్లాన్‌ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఎలా ప్లాన్‌ చేసుకున్నారంటే..
    అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్‌లో దొరికిన ఫోన్‌లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.

    ఆ ఇమెయిల్స్‌లో ఏముంది?
     మొదటి మెయిల్‌ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.
    రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    చివరి కోరిక
    తమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.

    సీసీటీవీ (CCTV) దృశ్యాలు
    ఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం  నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.

    మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.