Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్‌ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

    ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్‌లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్‌ స్టోరీని పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

  • నాజర్‌, అంజలి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ముసలోడికి దసరా పండుగ. ఈ సినిమాకు మనోహర్ దర్శకత్వం వహించారు. రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత రమణ వాళ్లె నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ మాట్లాడుతూ.. "ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కముంది. ఈ సినిమాను మా పితృ స‌మానులు దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు అంకిత‌మిస్తున్నాం" అని తెలిపారు. ఈ సినిమాలో అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డి. ఇమాన్ సంగీతమందించారు. 

  • జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 20న యంగ్ టైగర్ బర్త్ డేకు ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తారా? అని వెయిటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

    ఈ నెల 20న జూనియర్ బర్త్‌ డే సందర్భంగా డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

  • టాలీవుడ్‌లో పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ‍ప్రసక్తే లేదని నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్ల బతుకులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. నిర్మాతలంతా మా బాధలను అర్థం చేసుకోవాలని అన్నారు. ‍ప్రభుత్వం జీవోలు ఇచ్చినా సరే టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని అన్నారు.

    తాజాగా శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్పందించారు.  మీ చేతిలో పెద్ద సినిమా లేకపోవడంతో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని అనడం కరెక్ట్ కాదని అన్నారు. హరిహర వీరమల్లు నుంచి ఈ సమస్య మొదలైందని తెలిపారు. ఆ తర్వాత వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి మూవీ కూడా రిలీజ్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు మీకు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మీ చేతిలో సినిమా లేకపోతే పర్సంటేజీ అని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు. ఏదైనా ఉంటే కూర్చోని మాట్లాడుకుందామని రవిశంకర్ అన్నారు. యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రవిశంకర్ మాట్లాడారు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని పట్టు పడుతున్నారు.. కానీ నిర్మాతలకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిపై కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. ఈ ప్రెస్‌మీట్‌కు నాగవంశీ, సాహు గారపాటి, సతీశ్‌ కిలారు కూడా హాజరయ్యారు. 

    కామెడీ కోసం ప్రెస్‌మీట్లు పెట్టకండి..నాగవంశీ

    ఎగ్జిబిటర్ల పర్సంటేజీ విధానంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. 300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్, సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని కౌంటరిచ్చారు. సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్‌లు కట్టేశారని విమర్శించారు. సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని నిర్మాత నాగ వంశీ ఎద్దేవా చేశారు. పెద్ది సినిమా వస్తుంటే పూజలు చెయ్యాల్సింది పోయి ఇలా బెదిరించడం సరికాదన్నారు. 

    పెద్ది రిలీజ్ ముందు ఈ గలాటా ఏంటి..!



     

  • కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

    ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్‌లైన్‌ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్‌లో తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

    తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్‌గా మారానని తెలిపారు.

    సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించారు.  ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్,  సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంక‌ర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది.
     

  • ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాస్ 2, కర్తవ్య తదితర చిత్రాలతో పాటు ఎగ్జామ్ అనే డబ్బింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి ఓ తెలుగు సినిమా కూడా చేరింది. ఇంతకీ అదేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'తెరచాప'. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 15) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

    'తెరచాప' విషయానికొస్తే.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కాశీబాబు (నాగ మహేష్) ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఇతడి మరణానికి ఆయన కొడుకు ఈశ్వర్ (నవీన్ రాజ్ శంకరపు) నిర్లక్ష్యమే కారణమని ఊరు మొత్తం వేలెత్తి చూపుతుంది. తన తండ్రిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే ఈశ్వర్, ఆ నింద భరించలేకపోతాడు. తన తండ్రి మరణం వెనుక ఏదో పెద్ద వ్యవహారమే ఉందని అనుమానించి అసలు నిజం తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) ఎలా సహాయపడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

  • మహేశ్‌ బాబు- వారణాసి కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన భారీ యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు.  అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

    అయితే భారీ యాక్షన్ ‍సీన్స్‌ను కోసం హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం గగన్‌పహాడ్‌ పరిసరాల్లో భారీ కొలను నిర్మించారు. అందుకోసం ఏకంగా 150 ట్యాంకర్ల అవసరం కావడంతో జలమండలికి లేఖ రాశారు. వేసవికాలం కావడంతో అంత నీరు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె. అశోక్‌ రెడ్డి వారణాసి టీమ్‌కు షాకిచ్చారు. దీంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఈ సీన్స్‌ కోసం ప్రత్యామ్నాయం కోసం వేట ప్రారంభించారు.

    ఈ నేపథ్యంలోనే మేకర్స్ వారణాసికి ప్లాన్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అండర్ వాటర్ యాక్షన్స్ సీక్వెన్స్ వారణాసిలోనే చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో వాటర్ సమస్య రావడంతో మేకర్స్ ఈ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. 
     

  • తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వేళ్లపై లెక్కపెట్టగలిగే నిర్మాతలు తప్పితే కొత్తగా ఎవరొచ్చినా ఇక్కడ నిలబడటం కష్టం. హీరోల ఆధిప‍త్యం చాలా పెరిగిపోయింది. దీంతో నిర్మాత అనేవాడు డబ్బులు ఖర్చుపెట్టే మెషీన్‌లా మారిపోయాడు. ఇలాంటి కారణాలతోనే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారు. అలాంటి వాళ్లలో ప్రసాద్ వి పొట్లూరి అలియాస్ పీవీపీ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. టాలీవుడ్‌ని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

    'సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో మరొకటి లేదు. మనం డబ్బులు పెట్టి అవమానాలు పడటం కంటే దారుణమైన విషయం లేదు. ఇండస్ట్రీలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నిర్మాత ఓ జోకర్‌లా అయిపోయాడు. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదే సెట్‌లో అందరూ జోకులు వేస్తుంటారు. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని నా మీద ఎవరికీ ఏ ఆందోళన ఉండదు. నన్నో బఫూన్‌లా చూస్తారు. హాలీవుడ్‌లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదు. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారు. నిర్మాతలకు విలువ లేదు. ఇలాంటి చోట ఉండటం ఎందుకని నేనే వచ్చేశాను' అని పీవీపీ ఆవేదన వ్యక్తం చేశారు.

    'టెంపర్' సినిమాకు సంబంధించి నిర్మాత బండ్ల గణేశ్‌తో వివాదం గురించి స్పందించిన పీవీపీ.. ఆ చిత్రానికి నేను సోలో ఫైనాన్సియర్. బ్యాంక్ తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.

    రవితేజ 'బలుపు' మూవీతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ సినిమాలు చేశారు. కానీ ఉన్నట్లుండి సడన్‌గా నిర్మించడం మానేశారు. ఇన్నాళ్లకు అందుకు గల కారణాన్ని బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: విడాకుల వార్తలు.. స్పందించిన హీరోయిన్)

  • అప్పట్లో హీరోయిన్‌గా మెప్పించిన లయ.. మళ్లీ సినిమాల వైపే వచ్చేసింది. అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసిన లయ.. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ సరసన సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో తగిన క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

    ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా హీరోయిన్ లయ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 12 ఏళ్ల వయసులో తాను చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విషయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో జరిగిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో లయ విజేతగా అవతరించింది. ఇలాంటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని ఇన్‌స్టాలో షేర్ చేసింది లయ. చిన్నప్పటి విజయాలు ఎప్పటికీ సంతోషంగానే అనిపిస్తాయని రాసుకొచ్చింది. ఈ ఘనత అందించిన అమ్మ, నాన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

     

     

  • బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మౌనీరాయ్ విడాకులు తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. భర్త సూరజ్ నంబియార్‌ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడమే దీనికి కారణం. ఇప్పటికీ వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నారని, విడాకుల తతంగం కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న పుకార్లపై మౌనీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

    'మీడియా వాళ్లకు విజ్ఞప్తి. అవాస్తవాలని ప్రచారం చేయొద్దు. మాకు కాస్త ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్' అని మౌనీరాయ్.. తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. మరి విడాకుల వార్తల్లో నిజానిజాలేంటి అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

    2018లో దుబాయిలో కలుసుకున్న సూరజ్-మౌనీరాయ్ నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి 2022లో గోవా వేదికగా పెళ్లి చేసుకున్నారు. మలయాళీ-బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో ఈ వేడుక జరిగింది. సూరజ్, దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ కాగా మౌనీ, హిందీ-దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్, నటిగా కనిపిస్తూనే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. లేటెస్ట్‌గా అయితే చిరు 'విశ్వంభర'లోనూ ఐటమ్ సాంగ్ చేసింది.

    (ఇదీ చదవండి: తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ)

  • టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ గత కొంతకాలంగా డల్‌ అయిపోయింది. చాలా వారాలుగా పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో థియేటర్స్‌ దగ్గర సందడే కనిపించడం లేదు. మళ్లీ ఆ సందడి రావాలంటే ఓ భారీ చిత్రం రావాలి.. సూపర్‌ హిట్‌ కొట్టాలి. అందుకే ఇప్పుడు అందరి చూపులు ‘పెద్ది’వైపు ఉన్నాయి.

     చాలా రోజుల తర్వాత తెలుగు నుంచి విడుదల అవుతున్న  పాన్‌ ఇండియా చిత్రం ఇది. జూన్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక్క రోజు ముందే అంటే జూన్‌ 3నే ప్రీమియర్లతో పెద్ది సందడి మొదలవుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 18న ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారు. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఇలా నెల మొత్తం ఇండస్ట్రీలో పెద్ది టాపిక్కే నడుతుంది.

    ఇదిలా ఉండగా.. పెద్దికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది కేవలం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామా మాత్రమే కాదట. అంతకు మించిన స్టోరీ సినిమాలో ఉందట. ఆటతో పాటు ఊరికి సంబంధించిన ఎమోషన్‌ని ఈ కథలో బలంగా చూపించబోతున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. ఊరి బాగుకోసం హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. దానికి స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంచుకొని.. అద్భుతమైన సన్నివేశాలను అల్లాడట బుచ్చిబాబు.

    కోచ్‌గా శివరాజ్‌ కుమార్‌, హీరో తండ్రిగా జగపతిబాబు పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దాడట. హీరోతో పాటు ఈ రెండు పాత్రల నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. సినిమాలలో కీలక పాత్రల తీరు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్ది కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ లీక్‌ కూడా కాలేదు. ట్రైలర్‌ వస్తే కానీ అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియదు. కుస్తీ, క్రికెట్‌ ఆటలకు ఈ కథతో ఉన్న సంబంధం ఏంటనేది కూడా ట్రైలర్‌లో చూపించే అవకాశం ఉంది. 

  • కోలీవుడ్‌ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన​్‌ ఇండియా మూవీ మిస్టర్‌ ఎక్స్‌. ఈ చిత్రానికి మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.

    తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్‌సీస్ అభిమానులకు సింప్లీ సౌత్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో  గౌతమ్‌ కార్తీక్‌, శరత్‌ కుమార్‌ ,నటి మంజు వారియర్‌, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్‌, ఖాళీ వెంకట్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

    మిస్టర్ ఎక్స్‌ కథేంటంటే..

    1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్‌ క్యాప్సిల్స్‌ నేపథ్యంలో సాగే కథే మిస్టర్‌ ఎక్స్‌. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
     

  • ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ రషా తడాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

    తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. యే మంగా.. హే మంగా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ఎల్‌వీ రేవంత్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్‌ కంపోజ్ చేశారు. ఈ మూవీని తిరుపతి పట్టణంలో సాగే ఈ కథ వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు... ప్రేమికులుగా మారి ఆనందంగా జీవించే ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


     

  • తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్‌గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.

    (ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)

    ఉదయనిధి.. విజయ్‌పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్‌పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై ‍స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

    'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్‌లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్‌గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    (ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి)

International

  • హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

    ఎంపిక చేసిన నౌకలకే అనుమతి

    హర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.

    భారత్‌కు ప్రాధాన్యత
    "భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్‌కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.

    ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు.

  • మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. భారత్‌కు రష్యా నుండి సరఫరా అవుతున్న చమురులో ఏటువంటి ఆటంకం రానివ్వమన్నారు. తమ మిత్రదేశమైన భారత ఇంధన ప్రయోజనాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.

    రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ త్వరలో భారత్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యంత శక్తివంతమైన నాయకులలో భారత ప్రధాని మోదీ ఒకరని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు విషయంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్‌తో ఒప్పందం చేసుకున్న విధంగా రష్యా చమురు అందిస్తుందని తెలిపారు.

    ఇంధన సరఫరా విషయంలో భారత్‌తో పాటు వేరే ఏదేశానికి ఇచ్చిన హామీని రష్యా ఎన్నడూ తప్పలేదన్నారు.కుడంకుళంలో నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రం భారత్‌ విద్యుత్ అవసరాలను గణనీయంగా తీరుస్తుందన్నారు. భారత-రష్యా మధ్య సంబంధాలు ఎంతో స్నేహపూర్వకమైనవని ఈ మైత్రి తరతరాలదన్నారు. హిందీ-రుసీ భాయ్-భాయ్ (భారతీయులు- రష్యన్లు సోదరులు) అనే నినాదం సరదాది కాదని అది ఇరు దేశాల సంస్కృతిలో భాగమైందన్నారు.

  • అమెరికాలో ఆసియా నీడిల్ యాంట్ కలకలం రేపుతోంది. అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా 20కి పైగా రాష్ట్రాల్లో ఈ చీమలు వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా, జపాన్, కొరియా దేశాలకు చెందిన నీడిల్ యాంట్‌ దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణ చీమలు మాదిరిగా పెద్ద పెద్ద పుట్టలను నిర్మించుకోలేవు. వరుసగా కూడా ప్రయాణించవు.. దీంతో వీటిని గుర్తించడం కష్టం. ఇవి సాధారణంగా ఇళ్ల దగ్గర ఉండే చెక్కలు, రాళ్లు, ఆకులు, తోట సామాగ్రి కింద దాక్కుంటాయి.

    ఆసియా నీడిల్ యాంట్ అంటే..
    ఇవి లేత నారింజ-గోధుమ రంగు కాళ్లు, యాంటెన్నాల చివరలు కలిగిన ఒక చిన్న ముదురు గోధుమ, నలుపు రంగు చీమలు. కూలీ చీమలు సాధారణంగా సుమారు 0.2 అంగుళాల పొడవు ఉంటాయి. అవి చిన్నవిగా ఉన్నప్పటికీ.. వాటి కాటు అత్యంత బాధాకరంగా ఉంటుంది.  ఈ చీమల విషం.. అలెర్జీ ఉన్నవారికి చాలా ప్రమాదకరం.. ఈ  చీమలు 1930లలో మొదటిసారిగా అమెరికాలో కనిపించాయని.. ఇప్పుడు ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలలో విస్తృతంగా వ్యాపించాయి.

    ఈ చీమలు తేమగా, నీడగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. ఇవి సాధారణంగా కంపోస్ట్, కుళ్ళిపోతున్న కలప, రాళ్ళు, పూల కుండీలు, ఆకుల కుప్పల కింద కనిపిస్తాయి. అవి నిశ్శబ్దంగా కదులుతూ, సాధారణంగా ఒంటరిగా ప్రయాణిస్తాయి కాబట్టి, చాలా మంది అవి కుట్టేంత వరకు వాటిని గమనించరు. ఇతర చీమల జాతులతో పోలిస్తే.. వీటిని నియంత్రించడం కష్టతరం.

    ఎందుకు ప్రమాదకరం?
    ఆసియా నీడిల్ యాంట్ కుట్టినప్పుడు సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సాధారణంగా కుట్టిన చోట ఎర్రబడటం, వాపు, మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. అయితే, కొందరిలో కొద్ది నిమిషాల్లోనే గొంతు వాపు, కళ్లు తిరగడం, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తాయి.

    తేనెటీగలు, కందిరీగల వల్ల అలర్జీ ఉన్నవారికి దీని వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ చీమల కుట్టు కొందరిలో తీవ్రమైన అలర్జీలు రావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల విపరీతమైన నొప్పి, వాపు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఇది అనాఫిలాక్సిస్ (anaphylaxis) ప్రాణాంతక అలర్జీకి దారితీయవచ్చు. 

  • బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా చేరుకున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పలు సాంకేతిక సంస్థల ప్రధాన కార్యనిర్వాహకులు ఉన్నారు. బీజింగ్‌లోని విమానాశ్రయంలో ట్రంప్‌నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. చైనా అగ్రనేతల్లో హాన్ ఒకరు.

    ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆయనను పంపడం ద్వారా అమెరికా అధ్యక్షుడికి చైనా అమిత ప‍్రాధాన్యం, గౌరవం ఇస్తోందని భావిస్తున్నారు. గతసారి 2017 పర్యటన సమయంలో స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జీచీ అనే తక్కువ స్థాయి నేతను పంపారు. గత ఏడాది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికీ హాన్ హాజరయ్యారు. కాగా, విమానాశ్రయ రన్‌వే నుంచి మోటర్‌కేడ్‌లో ట్రంప్‌ వెళ్లారు. బీజింగ్‌లో వచ్చే రెండు రోజుల పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ట్రంప్‌ చర్చలు జరపనున్నారు.  

    వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం సహా పలు అంశాలపై షీ జిన్‌పింగ్‌తో ట్రంప్‌ చర్చించనున్నారు. ద్వైపాక్షిక చర్చలు, అధికారిక విందులో పాల్గొంటారు. “మేము రెండు మహాశక్తులం. సైనిక బలంలో భూమిపై అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా. చైనాను 2వ స్థానంలో భావిస్తారు” అని ట్రంప్‌ కొన్ని గంటల క్రితం చెప్పారు.

    బీజింగ్‌లో జరుగుతున్న ఈ సదస్సు దాదాపు 10 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో చేస్తున్న తొలి పర్యటనగా నిలిచింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో సున్నితమైన వాణిజ్య సంధిని కొనసాగిస్తూ కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చైనాలో ట్రంప్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో స్వాగత కార్యక్రమం, యునెస్కో వారసత్వ కట్టడం టెంపుల్ ఆఫ్ హెవెన్ సందర్శన, అధికారిక విందు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

  • మాస్కో: రష్యా తన సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. తన అణ్వాయుధ సంపత్తిని మరింత మెరుగుపరిచే విధంగా నిన్న  (మంగళవారం) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్  ను విజయవంతంగా పరీక్షించింది.  ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించిన కొద్ది రోజులకే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శక్తివంతమైన క్షిపణిని ప్రదర్శించడం విశేషం.

    ఇది సుమారు 35,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమి చుట్టూ ఉప-కక్ష్యలో ప్రయాణించి, శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించగలదని రష్యా పేర్కొంది. ఇవి పాత సోవియట్ కాలం నాటి 'వొయెవోడా' క్షిపణుల స్థానంలో రానున్నట్లు తెలిపింది.  దీనికి అమర్చిన వార్‌హెడ్లు  పశ్చిమ దేశాలకు చెందిన క్షిపణుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని పేర్కొంది. కాగా ఈ క్షిపణి ప్రపంచంలోనే అ‍త్యంత శక్తివంతమైన క్షిపణి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
     

    రష్యా అణ్వాయుధ క్షిపణులు 

    అవంగార్డ్  ధ్వని కంటే 27 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్.

    ఒరేష్నిక్ : ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది ఐరోపాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు.

    పోసిడాన్ : ఇది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్ వాటర్ డ్రోన్. ఇది సముద్రతీరంలో పేలి 'రేడియోధార్మిక సునామీ'ని సృష్టించగలదు.

    బ్యూరెవెస్ట్నిక్ : అణుశక్తితో పనిచేసే ఈ క్రూయిజ్ క్షిపణికి అపరిమితమైన పరిధి ఉంటుంది.

    కాగా  అమెరికా, మధ్య ఉన్న చివరి అణ్వాయుధ ఒప్పందంఅమెరికా మరియు రష్యాల మధ్య ఉన్న చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్' కాలపరిమితి ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఫిబ్రవరిలో ముగిసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణు దేశాల ఆయుధ సంపత్తిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇది కొత్త అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని నిపుణులు భయపడుతున్నారు.

    కాగా 2024లో పుతిన్ రష్యా యొక్క అణు సిద్ధాంతాన్ని సవరించారు. దీని ప్రకారం, అణ్వాయుధాలు లేని దేశం (ఉక్రెయిన్ వంటివి) అణ్వాయుధ దేశాల మద్దతుతో రష్యాపై దాడి చేస్తే, దానిని ఆ రెండు దేశాల ఉమ్మడి దాడిగా పరిగణించి రష్యా అణ్వాయుధాలతో స్పందించవచ్చు.

  • బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొద్ది సేపటి క్రితమే బీజింగ్‌కు బయిలుదేరారు.  అయితే ఈ పర్యటనలో ఏ విషయాలపై ఒప్పంద జరగనుందా అని ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో తమ దేశానికి సంబంధించిన నాలుగు అంశాల జోలికి వెళ్లద్దని వార్నింగ్‌ ఇస్తూ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

    చైనా- అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే టాఫ్‌ ఎకానమీ కలిగిన దేశాలు కావడంతో అధిపత్యం కోసం పరస్పరం పోటీ పడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే మిడిల్‌ ఈస్ట్‌ యుద్ధంలో సైతం చైనా పరోక్షంగా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వీటిని చైనా కొట్టిపడేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ చైనా పర్యటనకు బయిలుదేరారు. ఆ నేపథ్యంలో ట్రంప్ అస్సలు.. ఈ రెడ్‌లైన్‌ అంశాలు చర్చించకూడదని  చైనా పేర్కొంది.  

    నాలుగు ప్రధానమైన అంశాలు

    • తైవాన్ అంశం  ఇది చైనాకు అత్యంత కీలకం.

    • ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కులు వీటి పేరుతో చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.

    • దేశ రాజకీయ వ్యవస్థ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోని సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలి.

    • చైనా అభివృద్ధి హక్కు చైనా ఆర్థిక, సాంకేతిక వృద్ధిని అడ్డుకోకూడదు.

    తైవాన్ వివాదం అనేది ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తైవాన్‌కు 11 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది, ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందం. దీనిపై చైనా మండిపడుతుంది.

    తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఇది పూర్తిగా తమ అంతర్గత విషయమని ఈ విషయంతో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. కాగా 2017 తర్వాత ట్రంప్ చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. ట్రంప్ గతంలో ప్రకటించిన అధిక పన్నుల యుద్దం తర్వాత ఆయన చైనాకు వెళుతున్నారు. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

  • చెట్టుకు కాసే పండ్లలో ఒకటో, రెండో కోసుకోవడం నేరమా?.. కింద పడిన పండ్లు తీసుకోవడం పాపమా?.. కానీ, అక్కడ ఈ రెండూ చేస్తే లక్షల్లో జరిమానా విధించడమే కాదు.. ఒక లిమిట్‌ దాటితే జైలుకు కూడా పంపుతారు. ఇదెక్కడి రాజ్యం..? అనుకునేరు. అంతకంటే ముందు ఇదొకసారి చదివేయండి.. 

    పబ్లిక్‌ ప్లేసుల్లో పెరిగి చెట్ల పండ్లు కోయడమో లేదంటే వాటి కింద గాలికి కిందపడిన కాయల్ని తీసుకోవడమో అక్కడ నేరంగా పరిగణిస్తారు. ఆ నేరానికి మూడున్నర లక్షల నుంచి 12 లక్షల రూపాయల దాకా జరిమానా, జైలు శిక్ష.. ఒక్కోసారి రెండూ విధిస్తారు. నిజంగా అది అంత తీవ్ర నేరమని మీరు భావిస్తున్నారా?.. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా?

    సింగపూర్‌.. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణ, కఠినమైన చట్టాలకు కేరాఫ్‌ కంట్రీ. అక్కడి ప్రభుత్వం ప్రజల ప్రవర్తనలో చిన్న విషయాలకే పెద్ద ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలూ ఇబ్బందిగా ఫీలవ్వకుండా ఆ నియమాలను గౌరవిస్తుంటారు.  అందుకే అక్కడి వీధులు చెత్తాచెదారం కానరాకుండా అద్దంలా తళతళ మెరిసిపోతుంటాయి. ఈ క్రమశిక్షణ వెనుక ఉన్న కఠినమైన జరిమానాలు, శిక్షలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తాయి.

    సింగపూర్‌ ప్రభుత్వం ప్రకృతి సంపదను పబ్లిక్‌ ప్రాపర్టీగా భావిస్తుంది. అందుకే వాటిని కాపాడటానికి అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక చెట్టు, ఒక పండు కూడా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. అయితే.. ఈ జరిమానాల వెనుక ఉద్దేశ్యం ప్రకృతి సంరక్షణ. చెట్లు, పండ్లు మాత్రమే కాదు పూలు కూడా ఈ సంపదలో భాగమే. వాటిని దోచుకోవడం అంటే.. వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజా ఆస్తిని దోచుకోవడంగా భావిస్తుంది. కాబట్టి చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే నియంత్రించడం కోసం ఈ కఠిన చట్టం తెచ్చింది. 

    పార్క్స్‌ ట్రీస్‌ యాక్ట్‌
    సింగపూర్‌లో ప్రకృతి సంరక్షణ కోసం రూపొందించిన చట్టం.. పార్క్స్‌ అండ్‌ ట్రీస్‌ యాక్ట్‌(Parks and Trees Act). 2005 ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పబ్లిక్ ల్యాండ్, పార్కులు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు, నేచర్ రిజర్వ్‌లకు ఈ చట్టం వర్తిస్తుంది. పబ్లిక్‌ ప్లేసుల్లో పెరిగే చెట్ల నుంచి పండ్లు కోయడం లేదంటే కింద పడిన పండ్లు తీసుకోవడం నేరం. ఇందుకుగానూ  5,000 సింగపూర్‌ డాలర్లు (సుమారు రూ.3.5 లక్షలు) జరిమానా పడుతుంది. నేచర్ రిజర్వ్ లేదంటే నేషనల్ పార్క్‌లో ఈ తప్పు చేస్తే జరిమానా 50,000 సింగపూర్‌ డాలర్లు (రూ12.5 లక్షలు) వరకు పెరుగుతుంది, అలాగే 6 నెలల జైలుశిక్ష కూడా ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ప్రియాంక సిన్హా అనే భారతీయురాలి పోస్ట్ వైరల్ అయింది.

    సింగపూర్‌లో నివసించే వారు ఏ నియమాలనైనా చాలా జాగ్రత్తగా పాటిస్తారు. ఒక పండు తీసుకోవడం వల్లే లక్షల రూపాయల జరిమానా పడుతుందని తెలిసి, ఎవరూ ఆ ప్రయత్నం చేయరు. ఇది ప్రజల్లో భయం ద్వారా క్రమశిక్షణను పెంచుతుంది.ఇలాంటి చట్టాల వల్లే ఆ దేశం ప్రపంచంలో అత్యంత శుభ్రంగా, క్రమశిక్షణతో ఉన్న దేశంగా నిలుస్తోంది.

Sports

  • టీమిండియా సూప‌ర్ స్టార్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఓపెన‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయ‌ర్‌గా కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

    కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్‌లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్‌తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు.  2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

    ఎంఎస్ ధోనీ సీఎస్‌కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

    ఐపీఎల్‌లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే
    విరాట్ కోహ్లి-279
    ఎంఎస్ ధోని-278
    రోహిత్ శర్మ-278
    రవీంద్ర జడేజా-265
    చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్!?
     

  • ఐపీఎల్‌-2026లో రాయ్‌పూర్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. పిచ్‌ కాస్త నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికి కోల్‌క‌తా బ్యాట‌ర్లు అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

    కేకేఆర్ ఇన్నింగ్స్‌లో యువ ఆట‌గాడు అంగక్రిష్ రఘువంశీ(71) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రింకూ సింగ్‌( 29 బంతుల్లో 49), గ్రీన్‌(32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, రాసిఖ్ సలామ్ దార్ తలా వికెట్‌ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ 8:45 గంటలకు ప్రారంభమైంది.

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్‌), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్

  • ఐపీఎల్‌-2026లో టీమిండియా వెటరన్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుత బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ తనలో ఏమాత్రం పదను తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.

    స‌రైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తూ క్ర‌మం త‌ప్పుకుండా వికెట్లు ప‌డ‌గొడుతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 21 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో భువీ అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. అయితే లేటు వ‌య‌స్సులో ఇర‌గ‌దీస్తున్న భువ‌నేశ్వ‌ర్‌ను తిరిగి టీమిండియాలోకి తీసుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. 

    వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027లో అత‌డిని ఆడించాల‌న్న డిమాండ్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. కాగా భువనేశ్వర్‌ చివరగా 2022 నవంబర్‌లో టీమ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ త‌ర్వాత పేల‌వ ఫామ్, యువ బౌల‌ర్లు రాక‌తో భువీ జాతీయ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. కానీ భార‌త జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికి భువీ.. ఐపీఎల్‌తో పాటు  యూపీ టీ20, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ వంటి టోర్నీల్లో ఆడుతూ వ‌స్తున్నాడు.

    ఈ యూపీ వెట‌ర‌న్ పేస‌ర్‌ ప్ర‌స్తుతం ఫుల్ ఫిట్‌గా క‌న్పిస్తున్నాడు. అయితే భువీ మాత్రం టీమిండియా క‌మ్‌బ్యాక్ గురుంచి ఆలోచించ‌డం లేద‌ని తాజాగా స్ప‌ష్టం చేశాడు. చాలా ఏళ్ల క్రితమే లాంగ్ టెర్మ్ గోల్స్‌ను నిర్దేశించుకోవడం మానేశాను అత‌డు తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ విషయంలో ఎలాగైతే చర్చ జరిగిందో, ఇప్పుడు భ‌వీ విష‌యంలోనూ  అదే పునరావృతమవుతోంది.
    చదవండి: వైభవ్‌ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
     

  • మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ బుధ‌వారం విడుద‌ల చేసింది. ప్ర‌ధాన టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని జ‌ట్లు స‌న్న‌ద్దం కావ‌డానికి వీలుగా ఈ వార్మప్ మ్యాచ్‌లు  జూన్ 6 నుండి 10 వరకు జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 12 జట్లు తలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతాయి.

    మొత్తం నాలుగు వేదిక‌ల్లో ఈ వార్మాప్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. తొలి మ్యాచ్ జూన్ 6న డెర్బీ వేదిక‌గా నెద‌ర్లాండ్స్‌, స్కాట్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. భార‌త్ త‌మ మొద‌టి ప్రాక్టీస్ మ్యాచ్ జూన్ 8న వెస్టిండీస్‌తో, త‌ర్వాత జూన్ 10న ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ప్ర‌ధాన టోర్నీ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల‌తో పాటు గ్రూపు-ఎలో ఉంది.

    మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్స్‌
    గ్రూప్ 1: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్
    గ్రూప్ 2: వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్

    మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్
    6 జూన్ నెదర్లాండ్స్ vs స్కాట్లాండ్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు

    6 జూన్ దక్షిణాఫ్రికా vs ఐర్లాండ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు

    6 జూన్ శ్రీలంక vs పాకిస్తాన్ (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు

    6 జూన్ న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు

    8 జూన్ వెస్టిండీస్ vs ఇండియా (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు

    8 జూన్ ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు
    9 జూన్ స్కాట్లాండ్ vs పాకిస్తాన్ (డెర్బీ) ఉదయం 10 గంటలకు

    9 జూన్ ఐర్లాండ్ vs బంగ్లాదేశ్ (లౌబరో) ఉదయం 10 గంటలకు

    9 జూన్ నెదర్లాండ్స్ vs శ్రీలంక (డెర్బీ) మధ్యాహ్నం 3 గంటలకు

    9 జూన్ దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ (లౌబరో) మధ్యాహ్నం 3 గంటలకు

    10 జూన్ ఇండియా vs ఇంగ్లాండ్ (కార్డిఫ్) ఉదయం 10 గంటలకు

    10 జూన్ వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా (కార్డిఫ్) మధ్యాహ్నం 3 గంటలకు
     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు కూడా చెరో మార్పుతో బరిలోకి దిగాయి. 

    కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో సౌరభ్‌ దూబే తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఆర్సీబీ జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌కు ఛాన్స్‌ లభించింది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రాత్రి 8:45 గంటలకు ప్రారంభం కానుంది. అలస్యంగా ప్రారంభమవుతున్నప్పటికి ఓవర్లను మాత్రం కుదించలేదు.

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్‌), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్
    చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జ‌ట్టులో ఇట‌లీ క్రికెట‌ర్‌ 'గే'

     

  • న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సంద‌ర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. గ‌త కొంత కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌తమవుతున్న స్టార్ ఓపెన‌ర్ జాక్ క్రాలీపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెల‌క్ష‌న్ క‌మిటీ వేటు వేసింది. అత‌డి స్ధానంలో యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎమిలియో గేను రంగంలోకి దించాలని సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యించారు. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదిక‌గా కివీస్‌తో జ‌ర‌గ‌నున్న తొలి టెస్టులో గే ఇంగ్లండ్ త‌ర‌పున అరంగేట్రం చేయ‌నున్నాడు.

    ఇటలీ నుంచి ఇంగ్లండ్‌కు
    అయితే 26 ఏళ్ల ఎమిలియో గే ఇప్పటికే ఇటలీ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గే ఇంగ్లండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌లో జన్మించినప్పటికీ.. అతడి తల్లి ఇటలీ దేశస్థురాలు కావడంతో ఆ దేశం తరఫున ఆడే అవకాశం లభించింది. 2025లో ఇటలీ తరపున మూడు టీ20 మ్యాచ్‌లు అతడు ఆడాడు. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్‌పై అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి గే అందరి దృష్టిని ఆకర్షించాడు.

    పొట్టి ప్రపంచకప్‌నకు ఇటలీ అర్హత సాధించడంలో అతడిది కీలక పాత్ర. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తన మకాంను మార్చిన గే.. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో డర్హామ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2026 కౌంటీ సీజన్‌లో అతడు కేవలం మ్యాచ్‌ల్లోనే 92 సగటుతో 554 పరుగులు సాధించాడు. 

    ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. దీంతో అతడికి ఇంగ్లండ్ టెస్టు జట్టులో తొలిసారి అతడికి చోటు దక్కింది. అంతకుముందు ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్ నుంచి వచ్చి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అత‌డి సార‌థ్యంలోనే ఇంగ్లండ్ 2019 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది.

  • ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 104 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా మూడో టెస్టు మ్యాచ్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుత టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను తొలగించి, తిరిగి బాబర్ ఆజంకు పగ్గాలు అప్పగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం. "బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాలని జట్టులో కొంత మంది ఆటగాళ్లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా  బోర్డు అధికారుల మద్దతు కూడా అతడికి ఉంది. బాబర్ కూడా తిరిగి బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. 

    కాగా బాబర్ ఆజం మోకాలి గాయం కారణంగా బంగ్లాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో మే 18 నుండి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దుమ్ములేపిన బాబర్‌.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున కూడా అదే జోరును కొనసాగిస్తాడని పీసీబీ ఆశిస్తోంది. 

    రెండో టెస్టు తర్వాత అతడిని తిరిగి టెస్టు కెప్టెన్‌గా పీసీబీ నియమించే అవకాశముంది.  బాబర్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించడమే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ నాటికి అతడిని వన్డే కెప్టెన్‌గా కూడా సిద్ధం చేయాలని పీసీబీ భావిస్తోంది. 2019 నుండి 2023 వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న బాబర్.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. 

    కానీ టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు మళ్లీ పాక్‌ టీ20 కెప్టెన్‌గా బాబర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఆ టోర్నీలో పాక్‌ దారుణ ప్రదర్శన కనబరచడంతో బాబర్‌ మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు అనుహ్యంగా కెప్టెన్‌గా బాబర్‌ పేరును పీసీబీ పరిశీలిస్తోంది.

    ఇక 2023 డిసెంబర్ నుంచి షాన్ మసూద్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన 15 టెస్టుల్లో 11 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా అతడు విఫలమవుతున్నాడు. దీంతో షాన్ మసూద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ దుమ్ములేపుతున్నాడు. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఆరంభంలోనే శుభ్‌మ‌న్ గిల్‌, జోస్ బ‌ట్ల‌ర్ వంటి కీల‌క వికెట్ల‌ను కోల్పోయిన గుజ‌రాత్‌ను సుద‌ర్శ‌న్ త‌న హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. 

    కష్టతరమైన పిచ్‌పై సుదర్శన్ సంయమనంతో ఆడి గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరు సాధించేలా చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 61 ప‌రుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది సీజ‌న్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన సుద‌ర్శ‌న్‌..  41.75 సగటుతో 501 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

    సుద‌ర్శ‌న్ 500 ప‌రుగులు దాట‌డం ఇది వ‌రుస‌గా మూడో సీజ‌న్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సుద‌ర్శ‌న్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వసీం జాఫర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. సుద‌ర్శ‌న్ ఆట‌తీరును కొనియాడుతూ, అత‌డిని భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని సుద‌ర్శ‌న్ సూచించాడు.

    ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభంలో సుద‌ర్శ‌న్ ఆరెంజ్ క్యాప్ రేసులో దారుదాపుల్లో కూడా క‌న్పించ‌లేదు. కానీ ఇప్పుడు త‌న అద్భుతమైన ఆట తీరుతో ఒక్క‌సారిగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. గుజ‌రాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అత‌డికి బాగా క‌లిసి వ‌స్తోందని, అహ్మ‌దాబాద్ పిచ్ కూడా అతడికి సహకరిస్తుందని నేను ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పాను.

    అతను  సాంప్రదాయబద్ధమైన (Orthodox) క్రికెట్ షాట్లు ఆడ‌తాడు. అలా అని ఎక్క‌డా స్లోగా ఆడ‌డు. మైదానానికి రెండు వైపులా పరుగులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజ‌రాత్ ఫ్రాంచైజీ అతడిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయిన‌ప్ప‌టికి ప్ర‌తీ సీజ‌న్‌లోనూ అత‌డు రాణిస్తున్నాడు. 

    మ‌నం సాధారణంగా భారత టీ20 జట్టు గురించి చర్చించేటప్పుడు సుద‌ర్శ‌న్ పేరును క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోము. కానీ అత‌డు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో మ‌న ఆలోచ‌న త‌ప్పు అని ప్ర‌తీసారి నిరూపిస్తున్నాడు. ఇలాంటి నిలకడ ఉన్న ఆటగాడు జట్టులో ఉండాలి. కేవలం సిక్సర్లు కొట్టే ఆట‌గాళ్లు మాత్ర‌మే కాదు, క‌ష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆట‌గాళ్లు కూడా జ‌ట్టులో ఉండాలి.

    కాబ‌ట్టి టీమిండియా సెలక్ట‌ర్లు అత‌డిని క‌చ్చితంగా టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని జాఫ‌ర్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. కాగా ఇదే సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ పేరును జాఫ‌ర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  • ఇంగ్లండ్ పురుషల క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.

    ఈ జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. బ్యాటర్ ఎమిలియో గే, ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌, ఓపెనర్ జాక్ క్రాలీలపై సెలక్టర్లు వేటు వేశారు.

    ఇక గాయం కారణంగా దాదాపు మూడు నెలలగా పోటీ క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. ఫిబ్రవరిలో దుర్హం అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో స్టోక్స్ దవడ ఎముక విరిగిన సంగతి తెలిసిందే. స్టోక్సీ ఇటీవలే  కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దుర్హం తరపున బరిలోకి దిగి తన సత్తాచాటాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ డిప్యూటీగా స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వ్యహరించే అవకాశముంది.

    న్యూజిలాండ్‌తో మొదటి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:
    బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.

    షెడ్యూల్:
    మొదటి టెస్టు: జూన్ 4 – 8 (లార్డ్స్)  

    రెండవ టెస్టు: జూన్ 17 – 21 (ది ఓవల్)  

    మూడవ టెస్టు: జూన్ 25 – 29 (ట్రెంట్ బ్రిడ్జ్)
    చదవండి: కమిన్స్‌పై చర్యలు
     

  • ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స్‌ స్పీడ్‌స్టర్‌ కగిసో రబాడ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి ఆర్సీబీ భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రబాడ.. తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఓ చారిత్రక రికార్డును సమం చేశాడు.

    ఈ మ్యాచ్‌లో రబాడ తీసిన 3 వికెట్లు పవర్‌ప్లేలో (ఇన్నింగ్స్‌ తొలి 6 ఓవర్లు) వచ్చినవే. తద్వారా ఓ ఐపీఎల్‌ సీజన్‌ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్‌ జాన్సన్‌ (2013), ట్రెంట్‌ బౌల్ట్‌ (2020)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 17 వికెట్లతో మహ్మద్‌ షమీ (2023) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. షమీ పేరిట ఉ‍న్న ఈ రికార్డును రబాడ ఈ సీజన్‌లో తప్పక అధిగమించే అవకాశం ఉంది.

    అందనంత ఎత్తుకు..!
    తాజా ప్రదర్శనతో రబాడ ఈ సీజన్‌ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రబాడ తర్వాత ఈ సీజన్‌ పవర్‌ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆర్సీబీ భువనేశ్వర్‌ కుమార్‌ (12) ఉన్నాడు. ఆతర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్‌ (9), సిరాజ్‌ (9) నిలిచారు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో కొత్త బంతితో రబాడ వేసిన స్పెల్ ఈ సీజన్‌లోనే అత్యంత ప్రమాదకరమైందిగా నిలిచింది. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రబాడ.. ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.

    కాగా, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్‌ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌ (5), జోస్‌ బట్లర్‌ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్‌ (61), వాషింగ్టన్‌ సుందర్‌ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్‌ (4-0-20-3), ప్రసిద్ద్‌ కృష్ణ (3-0-23-2), సిరాజ్‌ (3-1-11-1), రషీద్‌ ఖాన్‌ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది.

     

  • పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్‌ హసన్‌ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో షాంటో విశేషంగా రాణించాడు.

    తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్‌లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ కూడా కొనసాగుతున్నాడు.

    ఇదే మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్‌ రాణా కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.

    ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మొమినుల్‌ హ‍క్‌ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 71, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్‌ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు.

    నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్‌ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్‌ అహ్మద్‌ 48వ స్థానంలో నిలిచాడు.

    ఇక పాకిస్తాన్‌ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్‌ షకీల్‌, షాన్‌ మసూద్‌ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్‌ అబ్బాస్‌ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు.
     

National

  • నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్‌ను ఆయన పోస్ట్‌ చేశారు.

    దీనిపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్‌ బిన్‌వాల్‌తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్‌లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.

    రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్‌ను కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్వీట్‌ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్‌లో ఇండియా టుడే తెలిపింది.

    ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.

    అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

    మంగీలాల్, దినేష్  ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. 

  • చెన్నై: నీట్‌ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు.

    12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్‌ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

    మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి.

  • అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ షాపులో పనిచేస్తున్న మహిళ సుమారు రూ. 1.5 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ జ్యువెలరీ స్టోర్‌లో ఆ యువతి.. చాలా ప్రశాంతంగా, ముఖంపై చిరునవ్వుతోనే ట్రేలలో ఉన్న నగలను ఖాళీ చేయడం వీడియోలో కనిపించింది. నిందితురాలు గత 11 నెలలుగా అదే షోరూమ్‌లో పనిచేస్తోంది.

    దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఆమె నగలు ఉన్న ట్రేలను పరీక్షిస్తున్నట్లు నటిస్తూ.. అందులోని బంగారు ఆభరణాలను తీసి తన జేబుల్లోకి నింపుకుంది. రింగులు, గొలుసులు, మంగళసూత్రాలు, పట్టీలు ఇలా వరుసగా బంగారు వస్తువులను ఏరి తన జేబులో వేసుకోవడం కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.

    జ్యువెలరీ స్టోర్ ఖాతాల్లో తేడాలు రావడంతో.. షోరూమ్ మేనేజర్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అప్పుడే ఈ భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉంది. గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • లక్నో :  ప్రతీక్ యాదవ్  (Prateek Yadav ) ఆకస్మిక మరణంపై ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీక్‌ది సహజ మరణం కాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరడం  కలకలం రేపుతోంది. ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా, అకాలంగా మరణించడంతో  తాము  తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యామంటూ విచారాన్ని ప్రకటించారు. అయితే  ఈ సందర్బంగా  ఆయన   కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. 

    ప్రతీక్ యాదవ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆయన మరణించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనను చూడగానే అప్పటికే మరణించినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు..ఆయన మరణం సహజమైనది కాదని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారన్నారు. ఆయన శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి.  శరీరంలో నీలంగా మారిపోయింది, విషం ఆనవాళ్లు న్నాయని ఆరోపించారు. 

     > ఇదీ చదవండి: ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ?

     

    సహజ మరణాలకు సాధారణంగా పోస్ట్‌మార్టం నిర్వహించరు.  ఆయన మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేయడంతోనే ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించారన్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక,  ఆయన శరీరంపై గాయాల గుర్తులున్నాయని, శరీరం నీలి రంగులోకి మారిపోయిందని,దీనివల్ల ఆయనకు విషప్రయోగం జరిగినట్లు అనిపిస్తోందని, వైద్యులు కూడా పేర్కొన్నారు. ఇది ఆయన మరణం సహజమైనది కాదనే విషయాన్ని మరింత స్పష్టం చేస్తోందని రవిదాస్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీక్ యాదవ్ మరణంపై హైకోర్టుకు చెందిన ఒక పదవీ విరమణ పొందిన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని   రవిదాస్‌ డిమాండ్  చేశారు.
    ఇదీ చదవండి: ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

  • బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. అందులో డీకే శివకుమారా్ ముఖ్యమంత్రి కావాలని ఉండడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

    2023 మే 13న వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ  135 స్థానాలు గెలిచి అధికారం సాధించింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం జరిగిందని ఫుకార్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పెద్దఎత్తున కోల్డ్‌ వార్‌ నడిచింది. అధిష్టానం ఎంట్రీ ఇచ్చి ఇరునేతల మధ్య సయోధ్య కుదర్చడంతో ఎట్టకేలకు పరిస్థితులు సద్దుమణిగాయి.

    అయితే తాజాగా మరోసారి ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మే 15న డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరోసారి రచ్చలేపుతోంది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు జరగనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    అయితే అధికార మార్పు అంశమై గత నెలలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. సీఎం మార్పు అంశం జరుగుతుందన్న నిర్ణయం పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ విషయమై ఇప్పుడు చర్చలేవి లేవని హైకమాండ్ సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
     

  • కేరళలో ఒక వైపు ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం  నడుస్తుండగానే మరో సంచలన వార్త  దావాలనంలా వ్యాపించింది. ఇంధన విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అకస్మాత్తుగా అయిపోకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఇంధన అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 5,000 విలువైన పెట్రోల్‌ను , డీజిల్‌ను 200 లీటర్లను  విక్రయించనున్నాయి.

    ఎందుకీ నిర్ణయం?
    రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడటం, అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం బంకులకు కేవలం కొన్ని రోజులకు సరిపడా స్టాక్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బంకు యజమానులు జాగ్రత్తగా ఇంధనాన్ని విక్రయించాల్సి వస్తోంది. ముందస్తు చెల్లింపులు (Advance payments) చేయాల్సి రావడం  క్రెడిట్ సౌకర్యాలు రద్దు కావడంతో పెట్రోల్ బంకుల నిర్వహణ కష్టతరంగా మారింది.

    ఇదీ చదవండి: ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్‌

    పంపిణీదారుల  స్పందన
    కేరళ స్టేట్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఇంధన పంపిణీదారులు  దీనిపై వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏమీ లేదు. కేవలం రవాణా పరమైన జాప్యాలు , పంపిణీని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఈ పరిమితులు విధించారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం సుమారు రెండు నెలలకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారుల కంటే భారీగా ఇంధనం కొనేవారు (Bulk buyers) , లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అందుకే పంపిణీలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి.

    ఇదీ చదవండి: ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

  • సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ భర్త ప్రతీక్ యాదవ్ (38) మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అలాగే ఆయన శరీరంపై ఉన్న గాయాలు 'యాంటీమార్టం' (మరణానికి ముందే జరిగినవి) అని నివేదిక పేర్కొంది.

    ప్రతీక్ యాదవ్ "మాసివ్ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం" (Massive Pulmonary Thromboembolism) కారణంగా సంభవించిన "కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్" వల్ల చనిపోయారని పోస్టుమార్టం నివేదిక ప్రకారం, తేల్చి చెప్పింది. అయితే ప్రతీక్‌ మృతదేహంపై  గాయాలున్నాయనీ,  గోళ్లు, శరీరంలోని కొన్ని భాగాలు నీలంగా మారిపోయాయనే  వార్తల నేపథ్యంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కీలకంగా మారింది.

    కార్డియోరెస్పిరేటరీ కొలాప్స్  అంటే
    ఊపిరితిత్తులలోని ధమనులలో (లంగ్స్‌లో బ్లడ్ క్లాట్‌ )రక్తపు గడ్డలు అడ్డుపడటం వల్ల శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ ఆగిపోయి, గుండె ఊపిరితిత్తులు ఒక్కసారిగా విఫలమయ్యాయి. తదుపరి విశ్లేషణ కోసం గుండె , ఇతర అంతర్గత అవయవాలను (విసెరా) భద్రపరిచారు.  మరోవైపు ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన పరిస్థితి చాలా కాలంగా విషమంగానే ఉందని  సమాచారం. 

    38 ఏళ్ల ప్రతీక్ యాదవ్, బుధవారం ఉదయం లక్నోలోని తన నివాసంలో ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని సమాచారం అందగానే మెడికల్ టీమ్ ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన  ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:55 గంటలకు ఆయన మరణించారని సివిల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జి.పి. గుప్తా  వెల్లడించారు.

    ప్రతీక్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. అఖిలేష్ యాదవ్‌కు సోదరుడు (సవతి తమ్ముడు). ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందేవారనీ సమాచారం. ప్రతీక్‌ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ప్రతీక్‌ మృతదేహానికి నివాళర్పించారు. ఆయన భార్య అపర్ణయాదవ్‌ను ఓదార్చారు.

  • నాసిక్‌: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 30 ఏళ్ల‌ వ్యక్తిని మంగ‌ళ‌వారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్‌ పోలీసులు అందించిన వివ‌రాలు, సోష‌ల్ మీడియాలో ల‌భించిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించిన‌ట్టు వెల్ల‌డించారు.

    నాసిక్ పోలీసుల‌ ప్రకారం.. నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ క‌లిగివున్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్‌లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని అత‌డు నడుపుతున్నాడు. నిందితుడు రూ. 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన‌ట్టు ప్రాథమిక విచారణలో వెల్ల‌డైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్‌ను రూ. 15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు.

    “మంగళవారం మధ్యాహ్నం నాసిక్‌లోని నందగావ్, ఇందిరా నగర్‌లో నిందితుడిని అరెస్టు చేశాం. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు. అతను లీకైన పేపర్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారుచేసి, వైద్య ప్రవేశ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్‌ను రూ.15 లక్షలకు విక్రయించాడ''ని నాసిక్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ పేపర్ లీక్ నెట్‌వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని వారు తెలిపారు.

    ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్‌?
    కాగా, నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీకయిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్‌ అయిన పేపర్‌ తొలుత రాజస్తాన్‌లోని జైపూర్‌కు, తర్వాత సికార్‌ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్‌ మీడియా వేదికల ద్వారా చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాసిక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన ఓ అనుమానిత‌ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్‌ పేపర్‌ను చైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.

    చ‌ద‌వండి: నీట్‌ పేప‌ర్ లీకేజీ.. ఎలా బయటపడింది?

    గెస్ పేపర్ లేదు: డీఎస్పీ
    నీట్ పేప‌ర్ లీకేజీ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ రాష్ట్రాల్లో 15 మంది వ‌ర‌కు అనుమానితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోనూ ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిల్లో త‌మకు ఎలాంటి ప్రశ్నపత్రం గానీ, గెస్ పేపర్ గానీ లభించలేదని రాజ్‌గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కేవ‌లం న‌గదు లావాదేవీల‌కు సంబంధించిన చాట్‌లు మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు. 

    విద్యార్థి సంఘాల ఆందోళ‌న‌లు
    నీట్-యూజీ 20026 పరీక్ష లీకేజీ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధ‌వారం ఆందోళ‌న చేప‌ట్టాయి. కేరళంలోని పాలక్కాడ్‌, క‌న్నూరుయ ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి వారిని పోలీసులు నిలువ‌రించ‌డంతో తోపులాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎన్‌టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. ఎన్‌టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. ఎన్‌టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. 

  • తమిళనాడులోని ఒక ఆలయ ఉత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  భక్తులు  ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు ఇది కామన్‌. అలాగే  వివిధ  ఆలయాల్లో అందించే ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. ఇది ఇంకా సాధారణం. కానీ  ఒక  పూజారి భక్తులకు నాణేలను 'ప్రసాదం'గా పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. దేవుడికి సమర్పించిన కానుకలనే ఇలా భక్తులకు తిరిగి పంచుతారట.  దీనికి సంబంధించిన వీడియో హల్‌చల్‌ చేస్తోంది.


    @ramdevkar07 అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో  షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి, "విరాళాలు స్వీకరించడానికి బదులుగా ప్రసాదంగా డబ్బు ఇస్తున్న తమిళనాడు ఆలయం వైరల్ అవుతోంది" అనే క్యాప్షన్‌ తో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో, ఒక పూజారి భక్తులకు ప్రసాదంలా నాణేలను పంచుతుండటం విశేషం. డొనేషన్లు తీసుకోవడానికి బదులు డబ్బును ప్రసాదంగా ఇస్తున్న ఆలయం అంటూ ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే,ఆ పూజారి నోట్లో సిగరెట్ (చుట్ట) ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆగ్రహం  వ్యక్తం చేశారు.

     తమిళనాడులోని కల్పవృక్ష స్వామి ఆలయం; ఇక్కడ భక్తులకు ఆలయ కానుకల సొమ్మునే ప్రసాదంగా అందజేస్తారు. సనాతన హిందూ ధర్మానికి జై! అంటూ మరో వీడియో కూడా  ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. 

    ఇలాంటి ఆలయం నిజంగా ఉందా
    తమిళనాడులోని శ్రీ వరం తారుమ్ మాలిగైపరై కరుప్పసామి ఆలయంలో ఒక ఉత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అక్కడ భక్తులకు ఇచ్చే ఈ నాణేలను స్థానికంగా "పిడి కాసు" (Pidi Kasu) అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని జానపద సంప్రదాయాలలో భాగంగా ఇలా నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరుప్పసామిని గ్రామ దేవతగా, శక్తివంతమైన రక్షకుడిగా (కావల్ దైవం) కొలుస్తారు.  ఇక్కడి సంప్రదాయం ప్రకారం దేశవాళీ చుట్టలు, మద్యం వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలాకాలంగా వస్తున్న ఆచారం. గ్రామ సరిహద్దుల్లో ఉండే ఈ ఆలయాల్లో జరిగే ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి.

    ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌?

    నెటిజన్ల స్పందన
    ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుళ్లో నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏంటి? ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి వాటిని ఆపేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో రకమైన బిజినెస్ అని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వసూలు చేసే ఎత్తుగడ అని మరికొందరు విమర్శించారు.

     అయితే ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలిసిన వారు మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇది కరుప్పసామి ఆలయం, అక్కడ చుట్టలు సమర్పించడం ఆచారం. ఆయన గ్రామ రక్షకుడు, ఆయన ఆచారాలు ఇలాగే ఉంటాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి, ఈ వీడియో దక్షిణ భారత జానపద సంప్రదాయాలు ఆధునిక సామాజిక విలువల మధ్య చర్చను రేకెత్తించింది.

    ఇదీ చదవండి : పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం

  • బీహార్‌లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు.  ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం  రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    బీహార్‌కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్‌తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన  తమ  తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ  ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.

    అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు  సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు.  "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని  అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

    సోదరుడితో సంజు చివరి మాటలు 
    మే 13న అమ్మాయికి  పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్  ఆరోపించాడు.

    ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌?

    హత్య ,  హడావిడిగా అంత్యక్రియలు 
    సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు.  ఈ విషయాన్ని గమనించిన  గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.

    శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదు చేసినట్లు జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్  సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు.  సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.

    పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.

    ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను

  • ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా తన కాన్వాయిలోని కార్ల సంఖ్యను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కేవలం రెండు వాహనాల్లోనే తన కాన్వాయి ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ పెట్రోల్‌, డీజీల్‌ వాడకం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

    అదే విధంగా పలువురు కేంద్రమంత్రుల కాన్వాయిలోని వాహనాల సంఖ్య సైతం భారీగా తగ్గింది.  హోంశాఖ మంత్రి అమిత్‌ షా కాన్వాయి మూడు వాహనాలకు తగ్గగా రక్షణ శాఖ మంత్రి కాన్వాయి 11 వాహనాల నుంచి నాలుగు వాహనాలకు తగ్గించారు. కాగా ఇటీవల దేశ ప్రజలకు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని సైతం స్వయంగా ఆ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

    కాగా ఇటీవల హైదరాబాద్‌లోని బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని దేశానికి కీలక సూచనలు చేశారు. " పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. దీంతో పెట్రోల్, డీజీల్‌ ధరలు తీవ్రంగా పెరిగాయి.  ప్రస్తుత కష్ట సమయాల్లో ప్రజలంతా సంయమనం పాటించాలి. విదేశీ ప్రయాణాలు, దుబారా ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. పెట్రోల్‌, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలి. ప్రజా రవాణానే అధికంగా వాడాలి ఎలక్టిక్‌ వాహనాల వైపు మళ్లాలి" అని సూచించారు.

  • ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌లో మద్దతు ధరలకు 2,60,000 కోట్ల రూపాయల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్ల రూపాయలు కేటాయింపులకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. 

    సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హై స్పీడ్ డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి 20,065 కోట్ల రూపాయల కేటాయింపుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కు ఆధునికరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

    కేంద్ర సర్కార్‌ నిర్ణయాలు

    ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు

    (క్వింటాలుకు)

    వరి సాధారణ రకం రూ.2441

    వరి గ్రేడ్ ఏ రూ.2461

    హైబ్రిడ్ జొన్నలకు రూ. 4023

    మల్దండి జొన్నలు రూ. 4073  

    సజ్జలు రూ.2900

    రాగులు రూ.525 

    మొక్కజొన్న రూ.2410

    కందులు రూ.8450

     

    ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం  

    (క్వింటాలుకు)

    వరి సాధారణ రకం రూ.2441

    వరి గ్రేడ్ ఏ రూ.2461

    హైబ్రిడ్ జొన్నలకు  రూ.4023

    మల్దండి జొన్నలు రూ.4073 

    సజ్జలు క్వింటాలు రూ.2900

    రాగులు రూ.525  

    మొక్కజొన్న క్వింటాలు రూ.2410

    కందులు క్వింటాలు రూ.8450

    పెసర్లు రూ.8780

    మినుములు రూ.8200

    పత్తి (మధ్యరకం) రూ.8267

    కాటన్ లాంగ్ రకం రూ.8667

    వేరుశనగ రూ.7517

    పొద్దుతిరుగుడు రూ.8343

    సోయాబీన్ రూ.5708

    నువ్వులు రూ.10,346

    ఒడిసలు రూ.10,052

  • CBSE 12వ తరగతి ఫలితాలు 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను   ఈ రోజు (  బుధవారంమే 13, 2026)న ప్రకటించింది. ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదైంది. 

    విద్యార్థులు  అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in ద్వారా తమ మార్కుల పత్రాన్ని (marksheet) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


    ఉత్తీర్ణత శాతం తగ్గుదల

    సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలల  ఉత్తీర్ణత శాతం గత ఏceదితో  పోలిస్తే ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టింది. 2026లో, మొత్తం 17,80,365 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 17,68,968 మంది పరీక్షకు హాజరయ్యారు  వీరిలో  15,07,109 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతానికి చేరింది. గత సంవత్సరం, మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. మొత్తం 14,96,307 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 2025తో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతంలో ఇది 3.19 శాతం  తగ్గుదలను సూచిస్తుంది.

    ముఖ్యాంశాలు

    • మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా ఉంది. 2025తో పోలిస్తే  ఇది 3.19శాతం  తక్కువ.

    • బాలుర కంటే బాలికలు 6.73శాతం  మెరుగైన  ఫలితాలను కనబరిచారు.

    • త్రివేండ్రం అత్యధికంగా 95.62శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయగా, ప్రయాగ్‌రాజ్ అత్యల్పంగా 72.43శాతం శాతాన్ని నమోదు చేసింది.

    • 90 శాతానికి పైగా మార్కులు సాధించినవారు 94వేల మందికి పైగా  ఉన్నప్పటికీ ఉత్తీర్ణత శాతం తగ్గింది.
       

  • సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. రెడ్ బర్డ్ ఏవియేషన్'(Red Bird Aviation) సంస్థకు చెందిన టూ-సీటర్ శిక్షణ విమానం సాంకేతిలోపం కారణంగా కూలిపోయింది. బారామతిలోని గోజుబావి గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో, అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన ఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

    పుణే రూరల్ పోలీస్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానంలో కేవలం ఒకే ఒక ట్రైనీ పైలట్ ఉన్నారు. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నేలపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

     

    కాగా ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌జెట్ 45 వివిమానం బారామతి విమానాశ్రయం వద్ద క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘోర  ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు (ఒక పీఎస్ఓ, ఒక అటెండెంట్ , ఇద్దరు పైలట్లు) అక్కడికక్కడే మరణించిన ఘటన సంచలనం సృష్టించింది.

    ఇదీ చదవండి: సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్‌ యాదవ్‌ స్పందన

Politics

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వానికి ఫ్లోర్ టెస్ట్‌లో మద్దతు ఇవ్వడంతో, ఏఐఏడీఎంకే కఠిన చర్యలకు ఉపక్రమించింది. టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పార్టీ పదవుల నుంచి తొలగించింది.

    జిల్లా కార్యదర్శి పదవులతో సహా వివిధ బాధ్యతలలో ఉన్న 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 29 మంది ఏఐఏడీఎంకే నాయకులను పదవుల నుంచి తొలగించారు. ఈ జాబితాలో సీనియర్ నేతలు సి.వి. షణ్ముగం, ఎస్.పీ. వేలుమణి, ఆర్. కామరాజ్, సి. విజయభాస్కర్, తంగమణి, కేపీ అన్బళగన్, కేసీ వీరమణి, ఎంఆర్. విజయభాస్కర్ వంటి పలువురు కీలక నాయకులు ఉన్నారు.

    ఈ చర్యతో ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాలు మరింతగా బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళని స్వామి ఎమ్మెల్యేలను నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీని నిరూపించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని బలపరచుకుంది.

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుబారా ఖర్చులతో రాష్ట్రం అతలాకుతలమవుతుందని.. దీనిపై చర్చించాలంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు.

    ‘‘పార్లమెంటు భవనం, తెలంగాణ సెక్రటేరియట్‌కు కూడా కాని ఖర్చు అమరావతిలో చేస్తున్నారు. అడుగుకు రూ.16 వేలు ఖర్చు చేయటం దుబారా కాదా?. రూ.20 కోట్లతో అయ్యే రోడ్డును వంద కోట్లకు చేయటం చంద్రబాబుకే చెల్లు. అమరావతిలో పెడుతున్న ఖర్చులు చూసి రాయలసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. అమరావతి అద్దాలకే రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోయటానికే రూ.800 కోట్లు ఖర్చు చేస్తారా?. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దుబారాని వెంటనే ఆపాలి

    ..కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణాన్ని కూడా తాత్కాలికంగా ఆపారు. అమరావతి నిర్మాణాలపై నిర్ణయం తీసుకోండి. ముందుగా మొక్కజొన్న రైతులకు ఆ డబ్బు చెల్లించండి. చంద్రబాబు తన దుబారా ఖర్చులను రైతులకు ఉపయోగించాలి. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ల ప్రయాణాన్ని ఆపాలి. అధికారులు, మంత్రులు కూడా దబారా ఖర్చులు తగ్గించాలి. రాజధాని పేరుతో వసూలు చేసిన బంగారం, డబ్బు లెక్కలు బయట పెట్టాలి. జనం నుండి వసూలు చేసిన ఆ డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయి?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

    ‘‘ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా వెంటనే ఇవ్వాలి. పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈవెంట్ లాగా చేస్తూ దుబారా ఖర్చులు పెడుతున్నారు. వైఎస్‌ జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులను మళ్లీ మళ్లీ ప్రారంభించటం దుబారా కాదా?. ప్రధాని రెండు వాహనాల్లో వెళ్లినందున చంద్రబాబు ఒక్క ఆరులో వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది కరోనా టైంలో వచ్చింది. చివరికి దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలో చెట్లు నాటించింది తానేనని చెప్పుకున్నారు. శ్రీకాకుళం నుండి రాయలసీమకు వర్షపు నీరు పంపుతారట. ఇలాంటి డైలాగులు, అబద్దపు ప్రచారాలు ఆపాలి’’ అని సాకే శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.

  • కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తూ పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం శాసనసభలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేళ సువేందు అధికారి శాసనసభకు చేరుకున్నారు. సభలోకి ప్రవేశించే ముందు, గౌరవ సూచకంగా శాసనసభ మెట్లపై  సాష్టాంగ నమస్కారం చేశారు.

    కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మే 9న జరిగిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సాష్టాంగ నమస్కారం చేస్తూ వేదికపై ప్రజలకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించినందుకుగానూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన అలా చేశారు. ఆ సమయంలో మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    బాధ్యతలు చేపట్టిన వెంటనే పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, 45 రోజుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టేందుకు సరిహద్దు భద్రతా దళానికి భూమి కేటాయించడం వాటిలో ఉన్నాయి.

    నందిగ్రామ్ స్థానానికి రాజీనామా
    పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సువేందు అధికారి తాను భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేస్తానని బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ పూర్తిగా ఓడించడమే కాకుండా.. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆమె ​కంచుకోటలాంటి భవానీపూర్‌లో ఓడించింది. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె 15,000కుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు భవానీపూర్‌ నుంచే సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. 

  • సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాషాయ దళం సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించనుంది. ఈ నెలాఖరులోగా లేదా జూన్‌ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం అనే మూడు ప్రధాన అజెండాలతో ఈ ప్రక్షాళన చేపడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

    నితిన్‌ నబీన్‌ నుంచే మొదలు 
    బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుల్లో ఒకరిగా నితిన్‌ నబీన్‌ ఇటీవలే నియమితులైన విషయం తెల్సిందే. ఆయన దగ్గర్నుంచే సంస్థాగత ప్రక్షాళన దిశగా పార్టీ ముందుకు సాగుతోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్‌గా తీసుకోవడంతో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కాస్తంత వాయిదాపడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర ఇన్‌చార్జిలు, మోర్చాల బాధ్యతల్లో పెద్దఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్రంగా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం.

    కొత్తగా నియమితులయ్యే నాయకుల్లో 55 ఏళ్లలోపు వారే అత్యధికంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇటీవలి కాలంలో పార్టీ 45–56 ఏళ్ల వయస్సున్న నాయకులను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంపిక చేస్తోంది. బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి వయస్సు 56, ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రులు అరుణ్‌ సావ్‌కు 56 ఏళ్లు, విజయ్‌ శర్మకు 52 సంవత్సరాలు. ఇక బెంగాల్‌ కొత్త సీఎం సువేందు అధికారి వయస్సు 55. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి వయస్సు 50, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వయస్సు 53 ఏళ్లు. గుజరాత్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం కేబినెట్‌ సగటు వయస్సు 59 నుంచి 52కి తగ్గింది. అదే మాదిరిగా పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కీలక మార్పులు ఉంటాయి’ అని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు.

    రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన యువ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్రచారం, బూత్‌ స్థాయి నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొత్తగా చోటుచేసుకునే మార్పుల్లో భావజాలానికి కట్టుబడి పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    కేంద్ర కేబినెట్‌లోనూ మార్పులు? 
    పార్టీ నిర్మాణంతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ సైతం చేపట్టే అవకాశమున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని యువత తో పాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త వారిని కొందరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 2021 నుంచి పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.

    చ‌ద‌వండి: ఏడాది పాటు ప‌సిడి కొనొద్దు.. ప‌రిష్కారం ఇదిగో!

    మోదీ 2.0 రెండో దఫా ప్రభుత్వంలో చేరిన 34 మంది మంత్రుల్లో 19 మంది కేబినెట్‌ హోదాతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు, శాఖల పనిభారం, రాజకీయ సమీకరణలపై సమీక్ష చేపట్టి, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సామాజిక వర్గాల సమీకరణ, యువతను ఆకర్షించడం, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతోనే ఈ ప్రక్షాళన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాషాయ దళ నేతల ప్రధాన వ్యూహంగా ఉంటుందని అంటున్నారు.

Telangana

  • కరీంనగర్‌, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష‍్మణ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ‍ప్రైవేట్‌ ఆస్పత్రి లిఫ్ట్‌లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్‌ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్‌ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం ఉండాలంటే.. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: సీపీఎం 
    బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌ చేశారు. మే 14న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపునిస్తుందని ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని చెప్పారు. 

    పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే సరెండర్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్‌.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు.

    ..వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్‌.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడు‌వంటూ లేఖలో భగీరథ్‌ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్‌కు విజ్ఞప్తి చేశారు.

    కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్‌కు భగీరథ్‌ లేఖ రాశారు

    కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు  తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.

    బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
     

  • హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్‌ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా  గ్రిల్స్ ఉన్న లిఫ్ట్‌లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్‌ (5) అందులోనే చిక్కుకుపోయింది. 

    ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్‌కు చెందిన బిస్తు సేఫ్‌ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్‌లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

    క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్‌కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం.

  • రాజన్న సిరిసిల్లా జిల్లా, సాక్షి: గంభీరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గజ సింగవరం స్టేజివద్ద ఓ స్కార్పియో ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందంది. మరో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్షం కారణంగానే ‍ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

  • సాక్షి, జగిత్యాల జిల్లా: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విద్యార్థిగా మారిపోయారు. కోరుట్లలో నాలుగు దశాబ్దాల అనంతరం ఇవాళ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని పరీక్షలు పాసైనా.. తెలుగు పరీక్ష  తప్పిన దేవ్ జీ.. 1984- 1985లో ఇంటర్ చదివే రోజుల్లో విప్లవ భావజాలానికి ఆయన ఆకర్షితుడయ్యారు.

    కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్‌ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన దేవ్ జీకి పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ రాశారు. లాయర్ కావాలన్న ఉద్దేశంతో మళ్లీ పరీక్ష రాసినట్లు దేవ్‌జీ తెలిపారు. పరీక్షలు పాస్ కావాలని ఆయన కొద్ది రోజులుగా తిరుపతి ప్రిపేరవుతున్నారు.

     

  • సాక్షి,హైదరాబాద్‌: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్‌లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్‌బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్‌ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్‌ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

    పోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే 
    భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్‌ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్‌ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

    కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్‌ బషీరాబాద్‌  పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.

    పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

    బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..
    కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు.

Business

  • పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్‌లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్‌, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్‌ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.

    “దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.

    పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు 
    తనిష్క్‌ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్‌గోల్డ్‌న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్‌ జ్యువెలర్స్‌ కూడా ఇటీవల ‘నేషన్‌ ఫస్ట్‌ - గోల్డ్‌4ఇండియా ఇనిషియేటివ్‌’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్‌ నగల వినియోగం, గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.

    ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.

    ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్‌ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.

    మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్‌లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.

    గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.

    భారత్‌ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్‌పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.

    “భారత్‌లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్‌ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు.
     

  • న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో రిసు్కలను ఎదుర్కొనేలా దేశీయంగా ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ తెలిపారు. నిధులు, అధికారం కోసం మరొకరిపై ఆధారపడకపోవడమే సిసలైన స్వావలంబన అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్‌ అనేక సంవత్సరాలపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపైనే (ఎఫ్‌పీఐ) ఆధారపడిందని, కరోనా మహమ్మారి తర్వాతే దేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే ధోరణి పెరిగిందని కోటక్‌ చెప్పారు.

    ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో భారత్‌ కూడా దేశీయంగా ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు, షేర్ల ధరల్లాంటి స్వల్పకాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలికంగా సంస్థను తీర్చిదిద్దుకునే వ్యూహాలపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.

    కంపెనీలు తమకొచ్చే లాభాలను తిరిగి వ్యాపారంలో ఇన్వెస్ట్‌ చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతమిస్తున్న ట్యాక్స్‌ ఇన్సెంటివ్స్‌కే పరిమితం కాకుండా అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలిస్తే కొత్తగా పెట్టుబడులకు ఊతం లభించగలదని కోటక్‌ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్‌ తన బ్యాలెన్స్‌ షీట్‌ను పటిష్టం చేసుకోవచ్చన్నారు.  

    పరిశ్రమలకు మేల్కొలుపు: మంత్రి పీయుష్‌ గోయల్‌ 
    ప్రస్తుత పరిస్థితులు దేశీ పరిశ్రమలకు మేల్కొలుపులాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దిగుమతులను తగ్గించుకునేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు దీన్నొక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగతా దేశాలకన్నా మెరుగ్గా రాణించేందుకు భారత్‌ ముందు చక్కని అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

    విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు విదేశీ విహార యాత్రలపరమైన వినియోగాన్నే మాత్రమే తగ్గించుకోమని ప్రధాని చెప్పారే తప్ప వ్యాపార పర్యటనలను నిలిపివేసుకోవాలనలేదని గోయల్‌ తెలిపారు. ‘వ్యాపారాన్ని విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలి. మరింతగా విదేశీ మారకం వచ్చేలా మరిన్ని ఎగుమతి ఆర్డర్లను దక్కించుకోవాలి. కొంత ఖర్చు చేసి మరింతగా ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి‘ అని పేర్కొన్నారు.    

  • అమూల్‌, మదర్‌ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రానున్నాయని తాజాగా ఆయా సంస్థలు విడుదల చేసిన సర్క్యులర్‌ ద్వారా వెల్లడైంది. పెంచిన ధరలు ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌, టోన్డ్‌ మిల్క్‌, కౌ మిల్క్‌, బఫెలో మిల్క్‌, ప్రీమియం రకాల పాలపై కూడా వర్తిస్తాయి. 

    గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విక్రయించే అమూల్‌ పాలు లీటర్‌కు రూ.1-2 వరకు పెరిగాయి. అమూల్‌ గోల్డ్‌ ఒక లీటర్‌ ప్యాక్‌ ధర రూ.68 నుంచి రూ.70కి చేరింది. అమూల్‌ లీటర్‌ పాలు రూ.55 నుంచి రూ.57కు చేరింది.

    బఫెలో మిల్క్‌, కౌ మిల్క్‌, స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌, టీ స్పెషల్‌ రకాల ధరలను కూడా అమూల్‌ పెంచింది. అమూల్‌ బఫెలో మిల్క్‌ 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌ ధర రూ.38 నుంచి రూ.39కి చేరింది. కౌ మిల్క్‌ 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌ ధర రూ.29 నుంచి రూ.30కి చేరింది.

    మదర్‌ డెయిరీ ధరలు ఇలా.. 
    మదర్‌ డెయిరీ కూడా పలు స్టాక్‌ కీపింగ్‌ యూనిట్ల ధరలు పెంచింది. మే 13న డిస్ట్రిబ్యూటర్లు, రవాణాదారులకు పంపిన సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. కొత్త ధరల ప్రకారం మదర్‌ డెయిరీ బఫెలో మిల్క్‌ ఒక లీటర్‌ ప్యాక్‌ ధర రూ.75 నుంచి రూ.80కి పెరిగింది. 500 మిల్లీ లీటర్ల బఫెలో మిల్క్‌ ప్యాక్‌ ధర కూడా రూ.76 నుంచి రూ.80కి మారిందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

    మదర్‌ డెయిరీ ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ ఒక లీటర్‌ ప్యాక్‌ ధర రూ.69 నుంచి రూ.72కి చేరింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్‌ ధర రూ.70 నుంచి రూ.72కి పెరిగింది. డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌, టోన్డ్‌ మిల్క్‌, కౌ మిల్క్‌, ప్రో మిల్క్‌ రకాల ధరలు కూడా సంస్థ సవరించింది.

    మే 13 రాత్రి నుంచి సరఫరా అయ్యే పాలపై ఈ కొత్త ధరలు వర్తిస్తాయని, మే 14 ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ఈ ధరల ప్రకారమే జరుగుతాయని సర్క్యులర్‌లో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు సంస్థలు పలుమార్లు పాల ధరలు సవరించాయి. ఈ ధరల పెంపు వినియోగదారులపై మరింత భారం మోపనుంది.

    పశువుల మేత, రవాణా, ప్యాకేజింగ్‌, పాల సేకరణ ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని పాల సంస్థలు గతంలో వెల్లడించాయి. 2022 నుంచి సహకార సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు రాష్ట్రాల వారీగా విడతల వారీగా ధరలు సవరించాయి. అమూల్‌, మదర్‌ డెయిరీ, నందిని వంటి సంస్థలు ప్రాంతాల వారీగా పాల సేకరణ పరిస్థితులు, ముడి ఖర్చుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ధరలు మార్చాయి.

    భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. పట్టణ కుటుంబాల వినియోగంలో ప్యాకెట్‌ పాలు కీలక భాగంగా ఉన్నాయి. పాల సహకార సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు తీసుకునే ధరల నిర్ణయాలు పాల సేకరణ ఖర్చులు, సీజనల్‌ సరఫరా పరిస్థితులు, పంపిణీ వ్యయాలపై ఆధారపడి ఉంటాయి.

  • హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అందుబాటు ధరల్లో ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో అంతర్భాగంగా ఉన్న అమెజాన్‌ బజార్‌కి (Amazon Bazaar) సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగినట్లు అమెజాన్‌ బజార్‌ హెడ్‌ సమీర్‌ లాల్వానీ తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కస్టమర్ల చేరిక నాలుగు రెట్లు పెరగ్గా, విజయవాడ, గుంటూరు, వరంగల్‌ తదితర నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నట్లు  వివరించారు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1,200 మంది పైచిలుకు విక్రేతలు ఉన్నట్లు తెలిపారు. బజార్‌లో రూ. 99 నుంచి రూ. 600 ధర శ్రేణిలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఫ్యాషన్, గృహోపకరణలు, కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ మొదలైన కేటగిరీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోకి మరింత విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు లాల్వానీ చెప్పారు.  

    డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్‌ కవరేజీ 
    మరోవైపు, దేశవ్యాప్తంగా 90,000 మంది డెలివరీ అసోసియేట్స్‌కి హెల్త్‌ కవరేజీని విస్తరిస్తున్నట్లు అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) సలీమ్‌ మెమన్‌ తెలిపారు. రూ. 1.5 లక్షల వరకు మెడిక్లెయిమ్, రూ. 10,000 వరకు ఓపీడీ ప్రయోజనాలు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ మొదలైనవి వీటిలో ఉన్నట్లు వివరించారు. డెలివరీ అసోసియేట్స్‌ కోసం ఉచిత హెల్త్‌ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అసోసియేట్స్‌ సంక్షేమంపై రూ. 2,800 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా వీటిని చేపట్టినట్లు మెమన్‌ చెప్పారు.   

  • భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్‌స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్‌ రిడిఫైనింగ్‌ ఇండియా ఎకనామిక్‌ ఫ్యూచర్‌’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఆశయం గొప్పదే.. కానీ..

    భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్‌గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

    అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.

    35 కోట్ల మంది నిపుణులు అవసరం

    ఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.

    డేటా సార్వభౌమాధికారం

    డేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్‌లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.

    భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.

    ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

  • అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.

    వినియోగదారులపై ధరల భారం తప్పదా?

    ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.

    అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.

    సరఫరా గొలుసులో అంతరాయాలు

    ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్‌వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

    గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

    • గతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.

    • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

    • ఆర్‌బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?

    ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

  • సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.

    జుకర్‌బర్గ్‌ కంటే వేగంగా..

    గతంలో మార్క్ జుకర్‌బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్‌లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.

    విజయానికి బాటలు

    సూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్‌లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.

    మెరుపు వేగంతో వాల్యుయేషన్

    పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్‌మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.

    సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడి

    సూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా.. రిక్రూట్‌మెంట్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

    ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

  • భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    అసలేం జరిగింది?

    భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్‌ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.

    ‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.

    అనుమతి లేకుండానే..

    తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్‌ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.

    1. అనుష్క చేసిన పోస్ట్‌కు లింక్డ్‌ఇన్, ఎక్స్‌ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

    2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్‌ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.

    విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్‌ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్‌ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.

    నెటిజన్ల స్పందన

    ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్‌కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.

    ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

  • భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 13, 2026) తీవ్ర ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భారీ అమ్మకాల పర్వానికి స్వల్ప విరామం లభించినట్లు కనిపిస్తోంది. ప్రధాన సూచీలు రోజంతా అనిశ్చితికి లోనైనప్పటికీ ముగింపు సమయానికి సానుకూల ధోరణిని ప్రదర్శించాయి.

    • నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 33 పాయింట్ల స్వల్ప లాభంతో 23,412 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 49 పాయింట్లు పుంజుకుని 74,608 స్థాయిని చేరింది.

    మార్కెట్ గమనానికి కారణాలు

    • గత సెషన్లలో మార్కెట్ భారీగా పతనం కావడంతో (ముఖ్యంగా మే 12న సెన్సెక్స్ 1,456 పాయింట్లు పడిపోయింది), కొన్ని కీలక షేర్లు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ రంగాల్లో ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్‌కు మొగ్గు చూపడం మార్కెట్‌కు ఊతమిచ్చింది.

    • అమెరికాలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏప్రిల్‌లో 3.8%కి పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు) నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

    • అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106 డాలర్ల పైనే కొనసాగుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి. ‘మూడీస్’ సంస్థ ఇప్పటికే 2026కి భారత వృద్ధి అంచనాను 6%కి తగ్గించడం గమనార్హం.

    • ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఎంటర్‌ప్రైజ్ ఏఐ రంగంలోకి ప్రవేశిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందనే భయంతో ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నేడు ఇతర రంగాలు రాణించడంతో నిఫ్టీ పతనాన్ని అడ్డుకోగలిగింది.

    నిపుణుల విశ్లేషణ

    ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిఫ్టీకి 23,200 నుంచి 23,400 మధ్య బలమైన మద్దతు (సపోర్ట్‌) కనిపిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప మార్కెట్ మళ్లీ పూర్తి స్థాయి సానుకూల వృద్ధిలోకి రావడం కష్టమే. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్‌కు మాత్రమే పరిమితం కావడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

  • న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్‌ మానిటైజేషన్‌’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్‌ చేయొచ్చు. డిపాజిట్‌ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు.  

    భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. 

    సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

Andhra Pradesh

  • సాక్షి,గుంటూరు: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు.

    ఫోన్‌ సంభాషణలో సీఎం విజయ్‌తో.. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. సమర్థవంతమైన, పారదర్శకమైన.. ప్రజాపాలన అందించాలి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలి. తమిళనాడు ప్రజలు మీ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి, సమగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడిపించాలి. మీ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలి. భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నాని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు 
     

     

    అంతకు ముందు మే4న తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న సమయంలో విజయ్‌కు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్‌ జగన్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.  తాజాగా, ఇవాళ వైఎస్‌ జగన్‌ విజయ్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  

  • సాక్షి,తాడేపల్లి: ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ, అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌తో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి కలిశారు. 

    అక్రమ కేసుల్లో పోలీసుల విచారణను ఎదుర్కొన్న శ్రీహరి, విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసుల వివరాలను వైఎస్‌ జగన్‌కు తెలియజేశారు.

    ఈ సందర్భంగా శ్రీహరికి అండగా నిలిచిన వైఎస్‌ జగన్.. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చట్టపరంగా వాటిని ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల పక్షాన, ప్రజల తరఫున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్ పిలుపునిచ్చారు.

  • సాక్షి,తిరుపతి: కర్నూలు త్రీ టౌన్‌ పోలీసుల దారుణ వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్య్ర విచారణ జరిపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కోరారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి లేఖ రాసిన ఎంపీ గురుమూర్తి, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘణ యథేచ్ఛగా సాగుతోందని వెల్లడించారు.
    ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రాసిన లేఖలో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం ప్రస్తావించారంటే..

    బాలు ఏ నేరం చేయకపోయినా, ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా, ఒక కేసులో విచారణ అంటూ ఆయన్ను పదే పదే స్టేషన్‌కు పిలిపించిన కర్నూలు త్రీ టౌన్‌ పోలీసులు దారుణంగా వేధించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన బాలు, చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. అధికార పక్షానికి చెందిన కొందరు నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఆ విధంగా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా మద్యం, మాదకద్రవ్యాల కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలు తెలిపారు. తన నిర్దోషిత్వం గురించి, ఎంత చెప్పినా పట్టించుకోని పోలీసులు, ఆయన్ను మానసికంగానే కాకుండా, శారీరకంగా కూడా వేధించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

    కర్నూలు త్రీ టౌన్‌ పోలీసుల తీరు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21 కింద కల్పించిన సమానత్వ హక్కు, జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులకు పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే, మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని సెక్షన్‌ 12(ఎ), 12(సి), 12(జె) ప్రకారం కూడా ఉల్లంఘనే. కాబట్టి దీనిపై విచారించే హక్కు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఉంది.

    అందువల్ల కర్నూలు త్రీటౌన్‌ పోలీసుల చర్యలపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, జిల్లా పోలీసు అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, బాధితుడు బాలుతో పాటు, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. అలాగే, చట్ట విరుద్ధంగా వ్యవహరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై శాఖాపరంగా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు.

     

  • సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.

    గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.

    కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం  చంద్రబాబు సర్కార్‌ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో  అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.

Social Media

  • తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్‌ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్‌జీ ఉద్యోగానికి రిజైన్‌ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్‌జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. 

    ఓ జెన్‌జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్‌కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది.  

    అనంతరం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో  నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. 

    క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.

    ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్‌జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది.

     

Family

  • ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన తెలుగు సామెతలు విన్నారా? ‘చాలా విన్నాను’... ‘కొన్ని విన్నాను’ అనేవారితోపాటు... ‘సామెత అంటే ఏమిటి?’ అని అడిగేవారు కూడా మీలో ఉన్నారు.వినడానికి సామెతలు సరదాగా ఉంటాయి గానీ... అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలో మంచి ఉంది. మనల్ని నవ్వించే కామెడీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి.లాంగ్వేజ్‌ స్కిల్స్‌లో సామెతలు ఉపయోగించడం కూడా ఒకటని మీరు గుర్తు పెట్టుకోవాలి.‘మన సామెతలను మనం తెలుసుకోవడం అంటే... మన ముత్తాతలతో మూడువేల సార్లు మాట్లాడినట్లు’ అనే సామెత కాని సామెత ఉంది. సామెతలు అనేవి సముద్రంలాంటివి. అందులో మనకు ఎన్ని తెలిస్తే అంతమంచిది. ఈరోజు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వాటిని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి కూడా!

    కొయ్యర కొయ్యర పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట!

    వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. అలా కాకుండా లేని విషయాన్ని బాగా పెద్దగా చేసి చెప్పడం మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. మిరియాలు చిన్న సైజ్‌లో ఉంటాయి. ‘మా ఊళ్లో అలా కాదు... తాటికాయలంత ఉంటాయి’ అనడం అబద్ధం చెప్పడమే కదా! ఒక విషయాన్ని పదింతలు చేసి చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.

    తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నాడట!

    కొందరు వ్యక్తులు, మనం ఒకటి అడిగితే వారొకటి చెబుతారు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ΄పొంతన లేని సమాధానాలు ఇచ్చి నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వాడే సామెత...‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నట్లు!’

    దీనికి సంబంధించి ఒక జోక్‌...
    రాత్రి బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘దొంగతనానికి వచ్చాను. తప్పయిపోయింది’ అనలేదు. ఏదోరకంగా తప్పించుకోవాలని... ‘సార్‌... మీరు పొరబడుతున్నారు. రాత్రిపూట కూడా బ్యాంక్‌ పనిచేస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి వచ్చాను’ అన్నాడట!

    కుక్కను పెంచి...తానేమొరిగినట్లు!
    ‘అనవసరంగా  కష్టపడుతున్నారు’ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత... కుక్కను పెంచి తానే మొరిగినట్లు!ఉదాహరణకు....ఒక వ్యక్తి తన ఇంటికాపలాకు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘నువ్వు రెస్ట్‌ తీసుకో...నేను చూస్తాను’ అని వాచ్‌మెన్‌తో యజమాని అంటే ఎలా ఉంటుంది చెప్పండి!

    ...ఇవే కాదు ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. పెద్దలను అడిగి వాటిని తెలుసుకోండి. నోట్‌బుక్‌లో రాసుకోండి. అన్ని ్ర΄ాంతాలకు తెలిసిన సామెతలతో పాటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాపులర్‌ అయిన సామెతలు కూడా ఉంటాయి. మీ ప్రాంతంలో పాపులర్‌ అయిన సామెతలు ఏమిటో తెలుసుకోండి.

    ఘడియ పురుసత్తు లేదు... దమ్మిడీ ఆదాయం లేదు!
    మనం కష్టపడ్డామంటే దానికి ఫలితం ఉండాలి. మనం ఒక పని మీద టైమ్‌ పెట్టామంటే ప్రయోజనం ఉండాలి. అలా కాకపోతే... టైమ్‌ వేస్ట్‌ చేసినట్లే కదా! ఇలాంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.

    సామెతల సముద్రంలో నుంచి కొన్ని సామెతలు...

    ఆశ దోషమెరుగదు  
    అంగట్లో అరువు తల మీద బరువు
    అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు  
    అండ ఉంటే కొండలు దాటొచ్చు
    ప్రీతితో పెట్టింది పిడికెడు చాలు  
    ఎంత చెట్టుకు అంతగాలి
    చేటు కాలానికి చెడు బుద్దులు  
    మన దీపమని ముద్దాడితే మూతి మీది మీసాలు కాలకుండా ఉంటాయా!
    కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు
    కడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ
    పంచాంగం ΄పోయిందని తిథివారాలు పోతాయా?  
    గుర్రాన్ని గుగ్గిళ్లకు అమ్మినట్లు
    కుక్క సింహం కాదు, కుందేలు తోడేలు కాదు   
    నలుగురు నడిచేది దారి... పదుగురు చెప్పేది నీతి. 

  • వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం  ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్‌ హైడ్రోసిస్‌ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...

    స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.

    గాలి ఆడేలా ఉండే కాటన్‌ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్‌స్పిరెంట్స్, డియోడరెంట్స్‌ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.

    వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.

    తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది. 
     

  • ఇంతవరకు చాలామంది భారత్‌ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్‌ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్‌ చేసుకుంది. 

    ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్‌ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్‌ జోడించి మరి వీడియోని పోస్ట్‌ చేసింది.

    నేర్చుకున్న ఐదు అలవాట్లు..

    1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్‌లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్‌లో రాసింది.

    2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.

    3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్‌ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్‌గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 

    4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో  ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.

    5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్‌ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్‌ చేస్తానని చెబుతోంది.

    నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్‌ టిప్స్‌)

     

  • ఒకప్పుడు సాధారణ గృహిణిగా, పిల్లల తల్లిగా ఇంటిపట్టునే ఉన్న కనక కతూరియా ఇప్పుడు మాస్టర్‌ షెఫ్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేంతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘కనక్స్‌ కిచెన్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో మిలియన్ల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. బార్బిక్యూ నేషన్స్‌లో మెక్సికన్‌ రుచులను పరిచయం చేయడానికి ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన కనకను ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె తన ‘వంట’రి పోరాటాన్ని గురించి పంచుకున్న ఎన్నో విశేషాలు ఆమె మాటల్లోనే...

    ‘‘పాతికేళ్లుగా వంటల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఇండియన్, ఇటలీ, చైనీస్, జపనీస్, మెక్సికన్, ఫ్రెంచ్, అమెరికన్‌.. అన్నిదేశాల రుచులూ మా ఇంటి కిచెన్‌లో నేటికీ ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్‌లలో పనిచేసే షెఫ్‌ని కాదు. సాధారణ గృహిణిని. కానీ, ఈ రోజు ఇండియన్‌ షెఫ్‌గా పేరొందాను.

    బిజీగా మార్చుకున్నాను...
    నేను ఎం.కామ్‌. చదివినా, పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయ్యాను. ఇద్దరు కూతుళ్ల పెంపకంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనంత బిజీ అయిపోయింది జీవితం. వంటలపై నాకున్న అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి రోజూ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. పిల్లలు ఏడుస్తుంటే వారిని ఎత్తుకొని తిప్పుతూ, నిద్రపుచ్చుతూ, రకరకాల వెస్ట్రన్‌ వంటకాలు తయారు చేసేదాన్ని. ఆ సమయంలోనే వాటిని వీడియో తీసేదాన్ని. యూ ట్యూబ్‌ ల్యాంచ్‌ అయిన తొలినాళ్ల నుంచీ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాను.

    హోస్ట్‌గా.. గెస్ట్‌గా...
    ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, నా వంటకాలు బ్లాగ్‌లు, వీడియోలు... ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కాలేజీ స్థాయి చదువుల్లో రాణిస్తున్నారు. నా వంటలకు మొదట వారే టేస్టర్స్‌. ‘మా అమ్మ చేతి వంట ది బెస్ట్‌’ అని మార్కులు ఇస్తుంటారు. వాళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటూనే దేశంలో జరిగే అన్నిరకాల ఫుడ్‌ ఫీస్ట్‌లకు జడ్జిగా హాజరయ్యాను. ఫుడ్‌ ఈవెంట్స్‌ను హోస్ట్‌ చేశాను. 

    ప్రముఖ రెస్టారెంట్స్‌తో కలిసి వర్క్‌ చేశాను. వెస్ట్రన్‌ ఫుడ్స్‌ అందించే విషయంలో నన్ను ఆహ్వానిస్తుంటారు. నా వంటకాల రుచులనూ ఈ సందర్భంగా పరిచయం చేస్తుంటాను. టీవీ రియాలిటీ షో మాస్టర్‌ షెఫ్‌ ఇండియా ఫస్ట్‌సీజన్‌లో పాల్గొన్నాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలలో కనక్స్‌ కిచెన్‌ పేరుతో ఫుడ్‌ ఛానెల్స్‌ తీసుకు వచ్చాను. 

    ఏ విభాగంలోనైనా సవాళ్లు ఎదుర్కోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, వంటల తయారీలో ప్రతీ రోజూ, ప్రతి డిష్‌ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. రుచిలో అందరినీ మెప్పించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా వృథా అయిపోతుంది. మనసు పెట్టి చేసే వంట మన అనుకున్నవారందరినీ చేరువ చేస్తుంది. అదే నా సక్సెస్‌ మంత్ర’ అని వివరించారు ఈ ఇండియన్‌ షెఫ్‌.

    ఫిట్‌గా హెల్తీగా...
    టేస్టీ, హెల్తీ, వెజ్, నాన్‌వెజ్‌... ఇలా ఇన్నిరకాల వంటకాలు చేస్తూ, రుచి చూస్తూ, తింటూ ఉంటారు కదా! ‘బరువు పెరుగుతారు’ అని చాలా మంది అనేవారు. కానీ, ఈ విషయంలోనూ హెల్తీగా ఫిట్‌గా ఉండటానికి కృషి చేస్తుంటాను. యాక్టివ్‌గా ఉండటానికి జిమ్, వాకింగ్‌ నా లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకున్నాను.  
    – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి

     

  • గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్‌ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?
    – ఒక సోదరి, విశాఖపట్నం

    పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...

    సంబంధం కొనసాగిన కాలవ్యవధి
    డీవీ చట్టంలోని సెక్షన్‌ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.

    సహవాస గృహం (షేర్డ్‌ హౌస్‌ హోల్డ్‌) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.

    ఆర్థిక వనరుల భాగస్వామ్యం 
    ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్‌ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.

    గృహ వ్యవహారాల నిర్వహణ 
    ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.

    లైంగిక సంబంధం 
    వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.

    పిల్లలు/సంతానం 
    పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.

    సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడం
    స్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.

    ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తన
    తమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.

    పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.

    అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్‌.ఎస్‌. లోని సెక్షన్‌ 69 ప్రకారం కూడా క్రిమినల్‌ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్‌ కేసు పెట్టండి. 

    సెక్షన్‌ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.
    శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    ( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.  )

    (చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్‌ టిప్స్‌)

  • కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్‌. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్‌ నటి రాజశ్రీ దేశ్‌పాండే. తాను కేన్సర్‌తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.

    'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటి రాజవ్రీ దేశ్‌పాండ్‌కు మార్చిలో గ్రేడ్‌1 రొమ్ము కేన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటున్నారామె.

    పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..
    ఈ కేన్సర్‌ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. 

    మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్‌కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. 

    ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..
    ఈ కేన్సర్‌ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్‌ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. 

    తన ఫ్యామిలీ డాక్టర్‌ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్‌పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్‌ మ్యాన్‌ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. 

    (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్‌' కాదు 'పీఎంఓఎస్‌')