Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని తమ స్థావరాలను అమెరికా ఖాళీ చేస్తూనే.. 75 దేశాలకు వీసాలను నిలిపివేసింది. ఈ చిట్టాలో  బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తోపాటు.. మన పొరుగున ఉన్న ఆరు దేశాలు కూడా ఉండడం గమనార్హం..!

    అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన ఓ మెమో ప్రకారం.. ఈ 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్నిరకాల వలస వీసాలను రద్దు చేస్తారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ.. ‘‘కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గుర్తించాం. అందుకే ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. వీసాల నిలిపివేత అనేది తాత్కాలికమేనని త్వరలో దీనిపై పునఃపరిశీలన జరుగుతుందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు.

    నిషేధిత దేశాల జాబితా పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోయినా.. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ చిట్టాలో బంగ్లాదేశ్‌తోపాటు.. డొమినికా, ఆంటిగ్వా, బార్బుడా కూడా ఉన్నాయి. ఇరాన్‌పై యుద్ధానికి సన్నాహాల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అరబిక్ మీడియా పేర్కొంది.
     

    అమెరికా విడుదల చేసిన జాబితాలోని దేశాలివే..

    ఆసియా: ఆఫ్ఘనిస్థాన్, ఆర్మేనియా, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా (మయన్మార్), కంబోడియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, కిర్గిజిస్తాన్, లావోస్, లెబనాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, సిరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, యెమెన్.

    ఆఫ్రికా: అల్జీరియా, కామెరూన్, కేప్ వెర్డే, కోట్ డి ఐవోర్, కాంగో, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, గాంబియా, ఘనా, గినియా, హైతీ, లైబీరియా, లిబియా, మొరాకో, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా.

    ఐరోపా: రష్యా, అల్బేనియా, బెలారస్, బోస్నియా, జార్జియా, కొసావో, మాసిడోనియా (ఉత్తర మాసిడోనియా), మోల్డోవా, మాంటెనెగ్రో.

    ఉత్తర అమెరికా: ఆంటిగ్వా మరియు బార్బుడా, బహామాస్, బార్బడోస్, బెలిజ్, క్యూబా, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్.

    దక్షిణ - మధ్య అమెరికా దేశాలు: బ్రెజిల్, కొలంబియా, ఉరుగ్వే, గ్వాటెమాలా, నికరాగ్వా.

     

  • దుబాయ్‌:  తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే  జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్‌ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది.  ఇరాన్‌కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ  ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్‌ హెచ్చరించింది. 

    కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.

  • కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్‌ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

    భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్‌ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే  ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో"  లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్  చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు.
     

    అంతేకాకుండా ఈ గ్యాంగ్‌ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు  పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. 

    పంజాబ్‌కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్‌ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్‌ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి.

  • టెహ్రాన్‌: ఇరాన్‌లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్‌పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.

    ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.

    డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది. 

  • సింగపూర్‌: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జూబీన్‌ గార్గ్‌ది హత్య కాదని సహజమరణమేనని సింగపూర్‌ పోలీసులు కోర్టుకు తెలిపారు. లైఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.  

    గతేడాది జుబీన్ నార్త్ ఈస్ట్‌ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా యాట్ పార్టీకి ఒకరోజు ముందు స్విమ్మింగ్‌ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అయితే,  జుబీన్‌ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై భారత్‌లోని అస్సాం పోలీసులు,సీఐడీ విభాగం పలువురిని అదుపులోకి తీసుకుంది. సింగపూర్‌ పోలీసులు సైతం కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, కేసు దర్యాప్తు పూర్తి చేసిన సింగపూర్‌ పోలీసులు కరోనర్ కోర్టుకు రిపోర్టును అందించారు.

    రిపోర్టులో ‘యాట్‌ పార్టీకి ముందు రోజు జూబీన్‌ స్విమ్మింగ్‌కి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. స్విమ్మింగ్‌కు ముందు లైఫ్‌ జాకెట్‌ ధరించారు. కానీ స్విమ్మింగ్‌ వెళ్లిన తర్వాత లైఫ్‌ జాకెట్‌ను వద్దన్నారు. రెండు సార్లు లైఫ్‌ జాకెట్‌ ధరించాలని నిర్వాహకులు కోరారు. అందుకు జుబీన్‌ తిరస్కరించారని, స్విమ్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టుకు తెలిపారు. 

  • వాషింగ్టన్‌: పాలక్ పనీర్ వాసనతో ప్రారంభమైన వివాదంలో భారతీయ దంపతులు అమెరికా జిల్లా కోర్టులో రూ.1.8 కోట్ల నష్ట పరిహారం గెలుచుకున్నారు. 

    2023లో ఉన్నత చదువుల కోసం ఆదిత్య ప్రకాష్‌ అమెరికా వెళ్లాడు. అక్కడ కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. యూనివర్సిటీలో చేరిన ఏడాది తర్వాత అయితే, ఓ రోజు యూనివర్సిటీలో ఉన్న ఆదిత్యకు బాగా ఆకలివేసింది. వెంటనే డిపార్ట్‌మెంట్‌లో మైక్రోవేవ్‌లో తన పాలక్ పనీర్ భోజనాన్ని వేడి చేసి తినేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ మహిళా సిబ్బంది అతని వద్దకు వచ్చింది. మైక్రోవేవ్‌లో పాలక్‌ పనీర్‌ వేడిచేస్తుంటే వాసన వస్తుందని ఫిర్యాదు చేసింది. పాలక్‌ పన్నీర్‌ను వేడి చేసేందుకు మైక్రోవేవ్‌ను ఉపయోగించవద్దని సూచించింది.

    ఆమెకు మద్దతుగా పలువురు ప్రొఫెసర్లు సైతం నిలిచారు. వేడి చేయడం వల్ల వాసన వస్తుందనే కారణంతో బ్రోకలీని నిషేధించారు అని ఫ్రొఫెసర్‌ ప్రస్తావించగా..  దీనికి ప్రకాష్‌ ప్రతిస్పందిస్తూ..‘సందర్భం ముఖ్యం. బ్రోకలీ తింటే జాత్యాంహాకారాన్ని ఎదుర్కొంటారు? అని ప్రశ్నించారు.  

    ఆ ఘటన చిలికి చిలికి గాలి వానలా మారింది. పాలక్‌ పనీర్‌ వివాదం తర్వాత ప్రకాష్‌ను మీటింగ్స్‌ పేరుతో వేధిస్తున్నారు.  అదే యూనివర్సిటీలో అసిస్టెంట్‌ టీచింగ్‌ స్టాఫ్‌లో విధులు నిర్వహిస్తున్న అతని భర్య ఉర్మీ భట్టాచార్యను  వివరణ ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించారు.  విద్యార్థులు తమ పీహెచ్‌డీలో భాగంగా పొందే మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వకుండా యూనివర్సిటీ నిరాకరించింది.  

    దీంతో ప్రకాష్‌,ఉర్మీభట్టాచార్యలు కొలరాడో జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యూనివర్సిటీ తమ విద్యాహక్కుల్ని అడ్డుకుందని, యూనివర్సిటీ మా పట్ల వివక్షత చూపించారు. చదువులో ఆటంకం కలిగించిందని వాపోయారు. విచారణ చేపట్టిన కోర్టు తాజాగా,వారికి మద్దతుగా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో కేసు పరిష్కరించేందుకు 2లక్షల డాలర్ల (రూ.1.8 కోట్లు) పరిహారం చెల్లించింది. నిలిపివేసిన మాస్టర్స్ డిగ్రీలను వారికి మంజూరు చేసింది.అయితే, భవిష్యత్తులో ఆ విశ్వవిద్యాలయంలో చదువు లేదా ఉద్యోగం చేసే అవకాశాన్ని వారికి నిరాకరించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ ఘటనపై ఉర్మీ భట్టాచార్య తన ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ఈ సంవత్సరం నేను ఒక పోరాటం చేశాను. నేను తినాలనుకున్న ఆహారం తినేందుకు స్వేచ్ఛ.నిరసన తెలిపే హక్కు కోసం… నా చర్మరంగు, నా జాతి, నా మారని భారతీయ యాస ఏదైనా ఉన్నా, నేను పోరాడాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.

  • మస్కట్‌: భారత పురాతన నౌకానిర్మాణ కౌశలంతో ఇంజిన్, ఇనుము లేకుండా కేవలం చెక్క, కొబ్బరి తాళ్లు, జిగురుతో నిర్మితమైన అపురూప, అద్భుత నౌక ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన సత్తా చాటింది. కేవలం గాలివాటానికి అనుగుణంగా పయనించే నౌకను 17 మంది నిష్ణాతులైన సిబ్బంది విజయవంతంగా గమ్యానికి చేర్చారు. కేవలం 17 రోజుల వ్యవధిలోనే పోరుబందర్‌ నుంచి సముద్రయానం మొదలెట్టి ఒమన్‌లోని మస్కట్‌ సముద్రతీర నగరానికి చేరుకుని భారతీయ నావికానిర్మాణ పటిమను ప్రపంచానికి చాటిచెప్పింది. 

    భారత్, ఒమన్‌ల మధ్య ప్రాచీన సముద్రయాన రాకపోకలను ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చిందని మస్కట్‌లో భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదో శతాబ్దంనాటి విఖ్యాత అజంతా గుహల్లోని కుడ్య చిత్రం నుంచి ప్రేరణ పొందిన నిపుణులు, కళాకారుల బృందం 65 అడుగుల పొడవుతో నిర్మించిన ఇండియన్‌ నావల్‌ సెయిలింగ్‌ వెసిల్‌(ఐఎన్‌ఎస్‌వీ) కౌండిన్య బుధవారం విజయవంతంగా మస్కట్‌లోని పోర్ట్‌ సుల్తాన్‌ ఖాబూస్‌కు చేరుకోవడంతో అందులోని నావికులు సంబరాలు చేసుకున్నారు.

    నౌకకు ఘన స్వాగతం పలికిన మంత్రి, అధికారులు
    మస్కట్‌ నౌకాశ్రయానికి చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యకు భారత పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ ఘన స్వాగతం పలికారు. మస్కట్‌లో భారతీయ రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు, ఒమన్‌ పర్యాటక, వారసత్వ మంత్రిత్వ శాఖ, ఒమన్‌ రాయల్‌ నేవీ అధికారులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శర్బానంద మాట్లాడారు. ‘‘ఈ నౌక ప్రయాణం భారతీయ సముద్రయాన ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తుచేసింది. ఇంజిన్‌లేని నౌకను ధైర్యసాహసాలతో లక్ష్యం దిశగా నడిపించిన నావికాబృందాన్ని చూసి దేశం గర్విస్తోంది.

     భారత్, ఒమన్‌ల ప్రాచీన సముద్రయాన బంధాన్ని ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చింది. కమాండర్‌ ∙హేమంత్‌ కుమార్, కమాండర్‌ వికాస్‌ షేవ్రాన్‌ల సారథ్యంలో మొత్తంగా నలుగురు అధికారులు, 13 మంది నావికుల బృందంతో ఈ నౌక గత ఏడాది డిసెంబర్‌ 29వ తేదీన గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి బయల్దేరిన విషయం తెల్సిందే. 650 నాటికల్‌ మైళ్ల దూరాన్ని ఎలాంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తిచేశామని నావికాబృందం ఆనందం వ్యక్తంచేసింది. ప్రయాణం విజయవంతమవడంపై కమాండర్‌ హేమంత్‌ మాట్లాడారు. 

     ‘‘యుద్ధవిమాన వాహకనౌక మొదలు జలాంతర్గాముల దాకా ఎన్నింటినో భారత్‌ తయారుచేసింది. కానీ ఇలాంటి విలక్షణ నౌకను గతంలో తయారుచేయలేదు. అజంతా గుహలో రాతిపై వేసిన పురాతన పెయింటింగ్‌లో అస్పష్ట వివరాలు మినహా నౌక తయారీకి మన దగ్గర ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కనీసం బ్లూప్రింట్‌ లేదు. అయినాసరే దీన్నో సవాల్‌గా తీసుకుని నిపుణులు తయారుచేశారు. నౌక తయారీలో ఇనుము, మేకులు, ఇంజిన్లను ఉపయోగించలేదు. కొబ్బరి నార తాళ్లను తెరచాపలను కట్టేందుకు ఉపయోగించారు. ఉప్పుమయ సముద్రనీటిలో నౌక అడుగుభాగం పాడవకుండా ఉండేందుకు సహజ జిగురును పూతగా ఉపయోగించారు. కేరళ కళాకారులు నౌక విడిభాగాలను ప్రాచీన విధానంలో అతికించారు’’ అని ఆయన వెల్లడించారు.  

  • అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ వార్తల్లో లేనిరోజు లేదు. ఇందులో దాదాపు అన్ని వివాదాలే. ఏదొక దేశాన్ని గిల్లడం, లేకపోతే కవ్వించడం, హెచ్చరించడం, ఇవే ట్రంప్‌ పాలనా  పగ్గాలు చేపట్టిన తర్వాత కనిపిస్తున్న పరిణామాలు. ఇటీవల కాలంలో ట్రంప్‌ దూకుడు మరింత ఎక్కువైంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, అటు తర్వాత ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకోవడం.. డెన్మార్క్‌ దేశంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలనే పన్నాగం, క్యూబాకు వార్నింగ్‌.. ఇరాన్‌పై కాలుదువ్వడం వంటి జరుగుతూనే ఉన్నాయి. 

    అయితే వీటన్నింటి కంటే కూడా నాటోను దాదాపు దూరం పెట్టడం.. రష్యాను రెచ్చగొట్టడం అయితే ట్రంప్‌ పోకడలకు మరో మెట్ట అని చెప్పాలి. రష్యాకు చెందిన రెండు ఓడలను ట్రంప్‌ సీజ్‌ చేయడం చూస్తే మాత్రం యుద్ధానికి కాలుదువ్వడం గానే కన్పించింది.   ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్‌.. ఇప్పుడు పలు దేశాలతో కయ్యానికి సై అంటున్నాడు. అందులో  సైనిక పరంగా బలంగా ఉన్న రష్యా, ఇరాన్‌ల విషయంలో కూడా ట్రంప్‌ వ్యవహరిస్తున్న శైలి అయోమయంలో పడేస్తుంది. 

    రష్యాను టెస్టు చేస్తున్నాడా?
    రష్యా ఆర్థిక శక్తి తగ్గిందనే గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాడు. అసలు రష్యా పవర్‌ ఎంత ఉంది అనే దానిని టెస్ట్‌ చేయడం కోసం ట్రంప్‌ సన్నాయి నొక్కులు ప్రారంభించాడు.  అయితే సైనిక పరంగా చూస్తే రష్యా ఇప్పటికే టాప్‌-2లో ఉంది.  అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా.  అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది.  

    అయితే ఇటీవల రష్యా ఆయిల్‌ షిప్‌లను సీజ్‌ చేసి..  ఆ దేశాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు ట్రంప్‌.  రష్యా.. తమతో పోరుకు ఎంతవరకూ వస్తుందని టెస్ట్‌ చేస్తన్నట్లే ఉంది ట్రంప్‌ వైఖరి. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ట్రంప్‌ చర్యలని గమనిస్తూనే ఉన్నాడు.  పరిస్థితి శ్రుతి మించితే మాత్రం రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. తన సహనాన్ని ట్రంప్‌ పరిక్షీస్తున్నారనే విషయం పుతిన్‌ ఈపాటికే అర్థం చేసుకునే ఉంటారు. ఒకవేళ అమెరికా ఏమైనా సైనిక చర్యలకు పాల్పడితే మాత్రం దాన్నితిప్పి కొట్టే సామర్థ్యం రష్యాకు ఉంది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఇప్పుడు పుతిన్‌ను కలవర పెడుతోంది. తమ దేశానికి చెందిన రెండు చమురు షిప్‌లను అమెరికా సీజ్‌ చేసినా.. పుతిన్‌ నియంత్రణ కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆ దేశ ఆర్థిక పరిస్థితి. 

    బలహీన పడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థ
    2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయి.. 2024 వచ్చే సరికి అది కాస్తా ముదిరి పాకాన పడింది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి.  ఇలా రష్యా ఇరకాటంలో పడింది.

    వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. 

    భారత్‌పై ఆంక్షలు కూడా అందుకేనా?
    రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక చమురును భారత్‌.. రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలును కాస్త తగ్గించింది.   ఇలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా పలు దేశాలపై ఆంక్షలు విధిస్తే ట్రంప్‌ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రష్యాను ఆర్థికంగా మరింత  ఇరకాటంలో పడేయాలనేది ట్రంప్‌ చర్యలను బట్టి తెలుస్తోంది, 

    నాటో దేశాలు అంత బలంగా లేవా?
    ఇటీవల నాటోపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్‌. ప్రధానంగా నాటో రక్షణ వ్యయానికి సంబంధించి ఖర్చును అమెరికానే భరించాల్సి వస్తుందని, తమకు ఇక పని లేదని తేల్చిచెప్పేశాడు. అంటే నాటోలో బలమైన దేశాలు లేవనేది ట్రంప్‌ ఉద్దేశం. నాటోతో ఉన్నా లేకపోయినా తమకు ఏమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చేశాడు ట్రంప్‌..దాంతో నాటోకు టాటా-బైబై చెప్పేశాడు.   నాటోలో యూరప్‌ దేశాలే ఎక్కువగా ఉన్నాయి.  అయితే రష్యా చర్యలను ఎక్కువగా వ్యతిరేకించింది నాటో. ఇప్పుడు నాటోక అమెరికా దూరం అయిపోతే.. మరి వారి పరిస్థితి ఏమిటి.? చెప్పుకోవడానికే 32 దేశాలు.. అందులో 30 యూరప్‌ దేశాలు.. మిగతా రెండు అమెరికా, కెనడా. ఇప్పుడు  అమెరికా దూరం జరగడంతో ఆ సంఖ్య 31కు వచ్చింది. నాటో ఉన్న యూరప్‌ దేశాలన్ని ఆర్థికంగా సైనిక పరంగా అంతగా బలంగా లేవనే విషయం ట్రంప్‌ కటీఫ్‌తోనే అర్థమైంది. 

    ట్రంప్‌ వ్యూహంలో భాగమా..?
    అమెరికా అండ లేకపోవడంతో రష్యా ఏదొక సమయంలో నాటోపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.  ప్రధానంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యాతో యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ నాటోలో చేరడానికి కారణమైంది. ఇవన్నీ కూడా పుతిన్‌కు ఆగ్రహం తెప్పించాయి. తనకు నాటో అడ్డుపడింది అనే భావనలో ఉన్నాడు ట్రంప్‌. 

    ఈ పరిణామాలతో రష్యా-నాటో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యంత స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ట్రంప్‌.. ముందుగా నాటో దేశాలు-రష్యా కొట్టుకుంటే చూద్దామనే ప్లాన్‌లో భాగంగానే నాటోకి బైబై చెప్పడం, రష్యాను గిల్లడం చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు.  తన చర్యలతో ముందు నాటో-రష్యాలను అంచనావేసే ముందస్తు వ్యూహంలో భాగంగానే ట్రంప్‌ ఇలా చేశారనేది విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. 

  • "కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్‌ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.

    సౌదీ అరేబీయాలోని జిజాన్‌లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే  అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్‌ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో  అతను యెమన్‌కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.

    దీంతో యెమన్‌కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్‌ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.

    విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్‌కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

  • పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.

    కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌ మాజీ ‍ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా  హాట్‌ టాఫిక్‌గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్‌ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్‌లో చర్చనీయాంశమైంది.

    ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్‌లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.

    దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. 

Telangana

  • హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో  వార్డులు, చైర్పర్సన్‌, మేయర్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది.

    మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పైనా ప్రభుత్వం నోటిఫికేషన్‌లో మార్గదర్శకాలను పేర్కొంది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. మొత్తం రిజర్వేషన్లు 50%  మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది.

    ముఖ్య మార్గదర్శకాలు 

    • జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు

    • బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు

    • మహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారు

    • తాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారు

    • SEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు

    • గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపు

    • మున్సిపాలిటీల్లో వార్డులకు 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు

    • బీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్

    • మహిళలకు (జనరల్) 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లు

    • ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు

    • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్‌రిజర్వ్డ్ సీట్ల స్పష్టమైన విభజన

    • గ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు

    • జిల్లా వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల
       

  • హైదరాబాద్‌: జర్నలిస్టులపై కాంగ్రెస్‌ సర్కారు తీరు అనైతికమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నోటీసుల ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓ వార్తకు సంబంధించి ఎన్టీవీకి చెందిన పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, జర్నలిస్టులను బెదిరించి భయపెట్టి చర్యలకు పాల్పడకూడదన్నారు. అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేవారు కిషన్‌రెడ్డి

    అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్‌ సరికాదు బండి సంజయ్‌
    ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్ట్‌ చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌.  పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు బండి సంజయ్‌

    పోలీసుల తీరు సమర్థనీయం కాదు కొమ్మినేని
    ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్‌ చేసే వ్యవహారంలో పోలీసుల తీరు సమర్థనీయం కాదన్నారు రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. సోదాల పేరుతో మీడియా సంస్థలన ఇబ్బంది పెట్టొద్దన్నారు కొమ్మినేని. 

    జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: పల్లా
    జర్నలిస్టుల అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. అర్థరాత్రి తలుపులు పగులగొట్టి జర్నలిస్టులన అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ సర్కార చర్యలు ఎమెర్జెన్సీని తలపిస్తున్నాయని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు పల్లా. 

  • గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా చేతులెత్తేసిన పరిస్థితిలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆ వ్యయాన్ని పూర్తిగా భరించిన అరుదైన మానవీయ ఘటన చోటు చేసుకుంది.

    నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు,  నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న ఇబ్రి ప్రాంతంలో మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణించడంతో, వారికి లభించాల్సిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దవుతాయి.  

    ఈ నేపథ్యంలో, “అబ్బులు, కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదు” అంటూ మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

    ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓ కు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది.

    ఇదిలా ఉండగా, అబ్బులు చిన్నాపూర్ కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ ఎందుకు వినియోగించలేదన్నది పెద్ద ప్రశ్న. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.

    తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి, ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ మహమ్మద్ బషీర్ అహ్మద్ ఈ అంశాన్ని సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జి. చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన డా. చిన్నారెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రిని ఆదేశించారు.

    చలించిన ఐఏఎస్ అధికారిణి
    ఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌కు వివరించగా, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్‌కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది.

    ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు. ఓమాన్‌లో ఇండియన్ ఎంబసీ గుర్తింపు పొందిన ఇండియన్ సోషల్ క్లబ్ – తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్ ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

    ఈ మానవీయ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ బెగారి సాయిలు, మంద భీంరెడ్డి తదితరులు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, నాగేపూర్ మహిపాల్ రెడ్డికి వారు కృతఙ్ఞతలు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్లు అరెస్ట్‌ ఘటన తీవ్ర దుమారం లేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    వివరాల ప్రకారం.. ఒక వార్త విషయంలో విచారించాలంటూ మంగళవారం రాత్రి ఎన్టీవీ రిపోర్టర్లను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారు. ముగ్గురిని హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్టును కూడా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఎన్టీవీ రిపోర్టర్ల అక్రమ అరెస్ట్‌పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికీ ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్లు పోలీసుల అదుపులోనే ఉండటం గమనార్హం. 
     NTV రిపోర్టర్ల అక్రమ అరెస్టు

  • సాక్షి, హైదరాబాద్‌: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్‌ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్‌ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. 

    ‘‘మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. 

    .. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్‌లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. అంతేకాదు డీజీపీ శివధర్‌రెడ్ఢికి ఫోన్‌ చేసి జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.

    ఈ అరెస్టులను తెలంగాణ పీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఖండించారు. ‘‘అర్ధరాత్రిళ్లు అరెస్ట్‌ చేయడం కరెక్ట్‌ కాదు. సదరు జర్నలిస్టులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని ఉంటే బాగుండేది.  జర్నలిస్టుల అరెస్టుతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’’ అని అభిప్రాయపడ్డారు. 

    ఓ మంత్రి-ఐఏఎస్‌ అధికారిణి అంటూ.. ప్రముఖ చానెల్‌లో కథనం ప్రసారం అయ్యింది. దాని ఆధారంగా అటు సోషల్‌ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో సదరు ప్రముఖ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్‌​ చేశారు. 

    అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్‌ చేశారని.. ఎలాంటి ప్రొసీజర్‌, నోటీసులు ఫాలో కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రంలో మరికొన్ని చోట్లా పోలీసులు పాత్రికేయుల్ని టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పలు చానెల్స్‌, 40కి పైగా యూట్యూబ్‌ చానెల్స్‌పై పోలీసులు దృష్టిసారించినట్లు సమాచారం. అయితే అక్రమ అరెస్టులు.. పోలీసుల ప్రతాపంపై జర్నలిస్టుల సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. 

Movies

  • టైటిల్‌: నారీ నారీ నడుము మురారి
    నటీనటులు: శర్వానంద్‌, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, సత్య, సుదర్శన్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు
    నిర్మాత: అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు
    సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
    విడుదల తేది: జనవరి 14, 2026

    ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్‌ చేయలేదు. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న  శర్వా.. ఈ చిత్రంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    ఆర్కిటెక్ట్‌ గౌతమ్‌(శర్వానంద్‌).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్‌(నరేశ్‌)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్‌ రాజ్‌) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్‌ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. 

    తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్‌ ఈ రిజిస్టర్‌ పెళ్లికి ఒప్పుకుంటాడు.  పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్‌ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి?  దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్‌-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్‌-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్‌), గుణశేఖర్‌(వెన్నెల కిశోర్‌)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).

    ఎలా ఉందంటే..
    కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత దర్శకుడు రామ్‌ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి  మ్యాజిక్‌ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి.  కథనం మొత్తం కరెంట్‌ పంచ్‌ డైలాగులతో హిలేరియస్‌ యాంగిల్‌ లో సాగుతుంది.

    ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్‌-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ  చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్‌ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. 

    దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్‌ మరింత పెరగుతుంది.  వెన్నెల కిశోర్‌ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్‌..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్‌ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్‌ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్‌ని జనరేట్‌ చేసింది. ప్రీక్లైమాక్స్‌ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్‌ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్‌ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).

    ఎవరెలా చేశారంటే...
    గౌతమ్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్‌ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్‌. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్‌ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. 

    ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్‌ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్‌ రాజు, సునీల్‌, సుదర్శన్‌.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్‌ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్‌​ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్‌, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

    • రెడ్‌ డ్రెస్‌లో అదితి రావు హైదరీ అందాలు..
    • సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతోన్న మెహరీన్..
    • చికిరి చికిరి సాంగ్‌ వైబ్‌లో టాలీవుడ్ భామ సాహితి..
    • బీచ్‌లో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర చిల్..
    • ప్రకృతిని ఆస్వాదిస్తోన్న హీరోయిన్ సదా...
    • ఫ్యామిలీతో బాలీవుడ్ భామ బిపాసా బసు చిల్..

     

     

     

     

     

     

     

     

  • రణధీర్ భీసు హీరోగా నటిస్తోన్న చిత్రం మిరాకిల్. ఈ మూవీలో హెబ్బా పటేల్, ఆకాంక్ష  హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మంట్  బ్యానర్‌పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈనెల 16న ఫస్ట్ లుక్‌ రివీల్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

     

  • రీతూ చౌదరి.. విపరీతమైన నెగెటివిటీతో తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొంది. డిమాన్‌ పవన్‌తో లవ్‌ ట్రాక్‌ వల్ల మరింత వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే ఆమె చూపించే ప్రేమ నిజమైనదని రానురానూ ప్రేక్షకులే ఓ అంచనాకు వచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్‌ కోసం నిలబడే విధానం చూసి ముచ్చటపడ్డారు. 

    బిగ్‌బాస్‌లో ఉండగా రీతూపై ఆరోపణలు
    అవతలి వ్యక్తి దిగజారుతూ మాట్లాడినా సహనం కోల్పోకుండా కౌంటరిచ్చిన ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా నెగెటివిటీని పాజిటివిటీ మల్చుకుని బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చింది రీతూ చౌదరి. అయితే ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా హీరో ధర్మ మహేశ్‌ భార్య గౌతమి తనపై సంచలన ఆరోపణలు చేసింది. 

    నెగెటివిటీపై స్పందించిన రీతూ
    ధర్మ మహేశ్‌తో క్లోజ్‌గా ఉండేదని, అర్ధరాత్రి ఇంటికి వచ్చేదని, సీసీ కెమెరా వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ వివాదం కూడా రీతూపై కొంత నెగెటివిటీకి కారణమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ తనపై జరిగిన ట్రోలింగ్‌ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్‌ కార్డ్స్‌గా వచ్చిన ఫైర్‌ స్ట్రామ్‌ కంటెస్టెంట్లు డిమాన్‌ పవన్‌కు నాతో మాట్లాడొద్దని చెప్పేవారు. 

    ఓటేయమని ఫోన్‌ చేస్తే..
    రీతూ బ్యాడ్‌.. నీకర్థం కావట్లేదు, ఆమె నిన్ను వాడుకుంటుంది అన్న టైపులో మాట్లాడేవారు. అదంతా చూసి అమ్మ చాలా బాధపడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా అందర్నీ చూసి చాలా బాధగా అనిపించేది. ఇతర కంటెస్టెంట్లకు చుట్టాలందరూ ఫోన్‌ చేసి మాట్లాడుతుంటారు కదా.. మాకెవరూ చేయరు, అలా మాకెవరూ లేరు కూడా! పాపం మా అమ్మ.. నాకు ఓటు వేయండి అని ఎవరికైనా ఫోన్‌ చేస్తే కూడా.. ఆ అమ్మాయి క్యారెక్టర్‌ మంచిది కాదంటున్నారు, మేము ఓటు వేయం అన్నారు. 

    నన్ను నాశనం చేయాలని చూస్తే..
    నాపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మమ్మీ.. అవన్నీ లైట్‌ అని సర్దిచెప్పి వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకు కారణమైన వారికి ఏదో ఒకటి అవకుండా లేదు. నన్ను నాశనం చేయాలని చూస్తే కర్మ అనుభవిస్తారు. శివుడు నా ఎదుట ప్రత్యక్షమైతే మా మమ్మీ, అన్నయ్య కంటే ముందు నన్ను తీసుకెళ్లమని చెప్తాను అంటూ రీతూ భావోద్వేగానికి లోనైంది.

    చదవండి: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? క్యాన్సర్‌నే జయించింది

  • బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్‌ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్‌ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.

    అయితే వీరిద్దరిదీ ఇంటర్‌ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్‌ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్‌ రంగంలోకి దిగింది. సిస్టర్‌ కోసం అమ్మను  ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.

    నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది.

    "కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. ‍‍అలా తన మాటలతో అమ్మను మార్చేసింది.  అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది.  కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్  పెళ్లి ఉదయపూర్‌ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

  • ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. బాలీవుడ్‌లో అనేక సక్సెస్‌ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.

    చిన్నతనంలోనే..
    చిన్నప్పుడు మహారాజు గెటప్‌ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్‌ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

    సినిమా
    తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయి్‌గా మారింది. 1942: ఎ లవ్‌స్టోరీ, అకేలే, హమ్‌ అకేలే తుమ్‌, ఖామోషి: ద మ్యూజికల్‌, దిల్‌సే, కంపెనీ, తాజ్‌ మహల్‌, భూత్‌ రిటర్న్స్‌ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్‌ (భారతీయుడు), ముదల్వన్‌ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్‌ మూవీ చేసింది.

    క్యాన్సర్‌పై పోరాటం
    మనీషా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' అనే వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌ అనే వేశ్యపాత్రలో యాక్ట్‌ చేసింది. గతేడాది లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందింది.

    చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్‌గా విడాకులు: బాలీవుడ్‌ నటి

  • మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన దృశ్యం సిరీస్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రెండు పార్ట్స్‌ కూడా బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మలయాళంలో తెరకెక్కించిన ఈ చిత్రాలను తెలుగు, హిందీలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయగా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో వెంకటేశ్, హిందీ అజయ్ దేవగణ్ ఈ చిత్రాల్లో నటించారు.

    జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తోన్న దృశ్యం-3 రిలీజ్‌ తేదీని ప్రకటించారు. ఓ వీడియోను షేర్ చేసిన మోహన్‌లాల్.. ఏప్రిల్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాగా.. ఈ సమ్మర్‌లో సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది.  కాగా.. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు. ఈ మూవీని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెరకెక్కించారు. ఈ సినిమాను మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేస్తామని గతంలో దర్శకుడు జీతూ జోసెఫ్‌ చెప్పారు.

     

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కోలీవుడ్‌ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్‌ టైటిల్‌ను ప్రకటించింది. 

    అల్లు అర్జున్‌.. స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్‌ కెరీర్‌లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. 


     

     

  • పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్‌ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్‌ హగ్‌పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు  దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..

    పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకులు..
    సెప్టెంబర్‌ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్‌ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. 

    వేధింపులు తట్టుకోలేక..
    అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్‌ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్‌లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.

    పిల్లలకు దూరం
    ఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు  పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్‌ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.

    శత్రువుగా చిత్రీకరిస్తున్నారు
    పిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్‌ హగ్‌ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్‌మాల్‌ రిటర్న్స్‌, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్‌ చేసింది.

  • టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 
     

    కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.  అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్  కనిపించారు. 

     

     

  • బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

    ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్‌ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్‌ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2  20.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.

    కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది.  ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. 

  • కుటుంబమంతా ఒకచోట చేరితేనే అసలు సిసలైన పండగ. ఈ విషయం మెగా ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే అంతా కలిసి భోగి పండగను ఎంతో సంతోషంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    దోశలు వేసిన మెగా ఫ్యామిలీ
    అందులో వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌- లావణ్య, రామ్‌చరణ్‌, సుస్మిత దోశలు వేస్తున్నారు. సాయిదుర్గతేజ్‌ టీ/కాఫీ తాగుతుంటే రామ్‌చరణ్‌ అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాడు. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సూపర్‌ హిట్‌ అవడంతో మరింత జోష్‌తో పండగ జరుపుకున్నారు.

    భోగిలా లేదు
    ఇది భోగిలా లేదు, దోశ రోజుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే.. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సాంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. గతంలో కూడా భోగి సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఇలా ఒకే చోట చేరింది. చిరంజీవికూడా స్వయంగా దోశలు వేసి వడ్డించేవాడు.

    సినిమా
    చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ "మన శంకరవరప్రసాద్‌గారు". అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్‌ వద్ద దిగ్విజయంగా దూసుకెళ్తోంది. దీంతో చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది.

     

     

    చదవండి: బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే  కన్నీళ్లాగలేదు

  • ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్‌ యుజ్వేందర్ చాహల్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని తమ బంధానికి ముగింపు పలికారు. గతేడాది అఫీషియల్‌గా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు తమ వర్క్ లైఫ్‌తో బిజీగా ఉన్నారు.  

    ఈ నేపథ్యంలో ఈ విడిపోయిన జంటపై నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట మరోసారి కలవబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే మళ్లీ కలిసి జీవించడానికి కాదు.. ఓ రియాలిటీ షో కోసమట. చాహల్- ధనశ్రీ వర్మ ది -50 అనే రియాలిటీ షోలో కనిపించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్రికెటర్‌ చాహల్ స్పందించారు.

    అయితే తామిద్దరు కలుస్తామన్న వార్తలను చాహల్ కొట్టిపారేశారు. తమ వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని క్రికెటర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్రికెటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో  ఎలాంటి నిజం లేదని.. కేవలం ఊహాజనితం, తప్పుడు సమాచారం అని పేర్కొన్నారు. అయితే ఈ రూమర్స్‌పై ధనశ్రీ వర్మ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. కాగా.. ది -50 అనే రియాలిటీ షో ఫిబ్రవరి 1న ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ షోకు చిత్రనిర్మాత ఫరా ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

  • ‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్‌లో పీఆర్‌ (పబ్లిక్‌ రిలేషన్స్‌) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్‌ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్‌ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్‌ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. 

    ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్‌ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్‌లో స్పీడ్‌ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్‌ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్‌ సృష్టించారు. 

    కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్‌ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్‌ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ. 

     

  • సంక్రాంతి పండుగ అంటే... అందరిలో సంతోషం నింపుతుంది. తెలుగునాట ప్రతి ఇంటా సంబరాలు తెస్తుంది. ధనుర్మాసంలో వేసే సంప్రదాయ, రంగుల ముగ్గులైన నెలవాక ముగ్గులతో, సాతాని జియ్యరుల కీర్తనలతో ఊరంతా సందడి చేస్తుంది. పల్లెపడుచుల సొబగులతో, పిండివంటల ఘుమఘుమలతో, కోడిపందాలతో, ఎడ్ల బండ్ల పోటీలతో నూతనోత్సాహాన్ని అందిస్తుంది. జీవితాలను చైతన్యవంతం చేస్తూ, క్రాంతిని అందించే సంక్రాంతి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం... 1976  జనవరి 14న తెలుగు తెరకు ‘పాడిపంటలు’ అందించింది. పి. చంద్రశేఖర రెడ్డి (పి.సి. రెడ్డి) దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ, విజయనిర్మల నటించిన ఆ సూపర్‌ హిట్‌ చిత్రం అడుగడుగునా తెలుగుదనం కనబరిచింది. సహజ గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబమై నిలిచింది. పల్లెపట్టుల్లోని సిరిసంపదలను కళ్ళకు కట్టినట్లు చూపి, అప్పటికి వరుస వైఫల్యాలతో ఉన్న హీరో కృష్ణ కెరీర్‌ను మళ్ళీ ఘన విజయాల బాట పట్టించింది. ఆ మరపురాని మ్యూజికల్‌ హిట్‌కు నేటితో (2026 జనవరి 14తో) 50 ఏళ్ళు.  
     

    అది 1974 నాటి సంగతి. మే 1వ తేదీ. సొంత సంస్థ ‘పద్మాలయా’ బ్యానర్‌పై హీరో కృష్ణ చేసిన అపూర్వ సాహసం ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజైంది. అఖండ విజయం సాధించింది. మన్యం వీరుడు, మన తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పాత్రధారణతో కృష్ణ ఇమేజ్‌ అమాంతం ఆకాశాన్ని అంటింది. సాక్షాత్తూ ఆ అల్లూరినే చూసిన భావనతో జనం నీరాజనాలు పట్టారు. అపారమైన ఆ కీర్తి ప్రతిష్ఠలు ఆయనకు కొన్ని చిక్కులూ తెచ్చాయి. ఆ తరువాత నుంచి ఆయన ఏ సినిమా చేసినా, జనం ఆ పాత్రతో పోల్చుకొని పెదవి విరవడం మొదలుపెట్టారు.

        అంతే... ‘దేవదాసు’, ‘చీకటివెలుగులు’, ‘దేవుడు లాంటి మనిషి’... ఇలా వరుసగా ఫ్లాపులే. 1966లో ‘గూఢచారి 116’ రిలీజైనప్పటి నుంచి 1975 వరకు దాదాపు పదేళ్ళు రోజుకు మూడు షిఫ్టులు, ఏడాదికి పది – పన్నెండు సినిమాలు చేసిన ఆ నిర్మాతల హీరోకు ఒక్కసారిగా చిత్రమైన పరిస్థితి. ఇరవై నెలల కాలంలో 15కు పైగా ఫ్లాపులు. వెరసి, 1975 ద్వితీయార్ధంలో కృష్ణ కెరీర్‌ క్లిష్టదశలో ఉంది. అదిగో... అలాంటి సమయంలో స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ చేసిన మరో సాహసం... ‘పాడిపంటలు’.

    ఫ్లాపుల్లో అక్కరకొచ్చిన ఆ పాత కథ

        నిజం చెప్పాలంటే, ‘పాడిపంటలు’ చిత్రకథ అంతకు ముందెప్పుడో దర్శకుడు పి.సి. రెడ్డి మదిలో రూపుదిద్దుకున్న కథ. కృష్ణ, వాణిశ్రీ జంటగా నందినీ ఫిలిమ్స్‌ పతాకంపై ఆయన డైరెక్ట్‌ చేసిన ‘ఇల్లు – ఇల్లాలు’ 1972 డిసెంబర్‌లో రిలీజైంది. అది పెద్ద హిట్‌. మళ్ళీ అదే సంస్థలో, అదే హీరో హీరోయిన్లతో మరో సినిమా చేసేందుకు అప్పట్లోనే ఆయన అనుకున్న స్టోరీ లైన్‌... ఈ ‘పాడిపంటలు’. అందరూ ఓకే అనుకున్నా... అనివార్య కారణాల వల్ల ఆ కథ తెరకెక్కలేదు. మూడేళ్ళ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ బృందంతో మాటల సందర్భంలో ఆ పాత కథ ప్రస్తావన వచ్చింది. కథాంశం విన్న కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు ఈ గ్రామీణ నేపథ్యకథను వెంటనే తెరకెక్కిద్దామన్నారు. అదిగో... అలా ‘పాడిపంటలు’ కథ పట్టాలెక్కింది. 
        
    ఆకట్టుకున్న గ్రామాభ్యుదయ కథాంశం

        పల్లెల్లో పెద్దయెత్తున జరుపుకొనే పెద్ద పండుగ సంక్రాంతి. ఆ పండుగ కానుకగా రిలీజైన ‘పాడిపంటలు’ చిత్ర కథాంశం కూడా గ్రామీణ, వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. భారతదేశంలో అధికశాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తుండగా, ఆ గ్రామసీమలే దేశానికి జీవనాడి అన్నారు గాంధీజీ. మహాత్ముని మాటలను ఆదర్శంగా తీసుకొని, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకొని తీసిన సినిమా ఇది. దర్శక – కథారచయిత పి.సి. రెడ్డి మన పల్లెల్లోని సహజ వాతావరణాన్నీ, మమతలు – మంచితనాన్నీ ప్రేక్షక జనరంజకంగా రంగుల్లో తెరపైకి తెచ్చారు.

        నలుగురూ కలసి పనిచేస్తే తమ రామాపురం గ్రామం పురోగమిస్తుందని నమ్మి, ఆ లక్ష్యసాధన కోసం పాటుపడే ఆదర్శ భావాలున్న యువ రైతు గోపాలం (కృష్ణ). కానీ, గ్రామంలోని కొందరు స్వార్థపరుల దుశ్చర్యల వల్ల అనేక కష్టాల పాలైన గోపాలం చివరకు నదిపై ప్రాజెక్ట్‌ నిర్మాణం సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. హీరోకు మేనమామ (గుమ్మడి) కూతురుగా విజయనిర్మల, నవనాగరిక యువతిగా లత, హీరో తల్లిగా అంజలీదేవి, తమ్ముడిగా చంద్రమోహన్, విధిని ప్రాణంగా భావించే ఇంజనీరుగా జగ్గయ్య, కాంతారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు.

    గురుభక్తిలో... దటీజ్‌ హీరో కృష్ణ!

        ‘పాడిపంటలు’ షూటింగ్‌ ఆరంభానికి సరిగ్గా వారం ముందే సెప్టెంబర్‌ 24న కృష్ణకు సినీ జీవితంలో శ్రేయోభిలాషి, మార్గదర్శకులైన నిర్మాత ‘విజయా’ చక్రపాణి దూరమయ్యారు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే... సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో అవుట్‌డోర్‌లో దూరంగా మొదలైన రోజే రాత్రే... కృష్ణను హీరోగా సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్‌ ఆదుర్తి సుబ్బారావు మరణించారు. ఒకవైపు భారీ షూటింగ్‌... మరోవైపు తొలి అవకాశమిచ్చి, తీర్చిదిద్దిన గురుతుల్యుడైన ఆదుర్తి అంత్యక్రియలు! సమయానికి మద్రాసుకు వెళ్ళి నివాళులు అర్పించి రావాలంటే... దూరాభారం, సమయాభావం!!

        ఆ రోజుల్లో మద్రాసు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూ’ కాపీలు ప్రత్యేకంగా వచ్చేవి. అప్పటికప్పుడు ‘హిందూ’ యాజమాన్యంతో మాట్లాడారు. ఆ రోజుకు షూటింగ్‌ మానుకొని, విజయవాడ నుంచి తిరిగెళ్ళే విమానంలో కృష్ణ, విజయనిర్మల ప్రత్యేకంగా మద్రాసు వెళ్ళారు. ఆదుర్తి భౌతికకాయాన్ని దర్శించి వచ్చి, మర్నాడు షూటింగ్‌లో పాల్గొన్నారు. అదీ హీరో కృష్ణకున్న కృతజ్ఞత, గురుభక్తి.

    అలా... ఆ ముగ్గురూ మారారు!

        పి.సి. రెడ్డి అనుకున్న ఈ చిత్ర ఇతివృత్తానికి మొదట రచయితగా పనిచేయాల్సింది – ఆచార్య ఆత్రేయ. అందరూ కలసి పూర్తిస్థాయి స్క్రిప్టు వండసాగారు. దాదాపు నెల రోజుల దాకా స్క్రిప్టుపై పని చేసిన ఆత్రేయ ‘అసలు ఈ కథలో పాడి లేదు... పంట లేదు’ అని చీకాకు పడుతూ, పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో రచయిత మహారథి ప్రవేశించారు. ఆయన, దర్శకుడు, హీరో కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు, తదితరులు కలసి మొత్తం స్క్రిప్టు సిద్ధం చేశారు. నవరసాల ఆ స్క్రిప్టుకు హనుమంతరావు స్క్రీన్‌ప్లే చేస్తే, మహారథి అద్భుతంగా మాటలు రాశారు. అలాగే, ముందుగా ఈ సినిమాకు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి పనిచేసిన ఆదినారాయణరావుతో సంగీతం చేయిద్దామనుకున్నారు. అయితే, ఆయన అప్పటికే అక్కినేనితో నిర్మిస్తున్న సొంతచిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’తో బిజీగా ఉన్నారు. మరోపక్క దర్శకుడు పి.సి. రెడ్డి సైతం తనకు అలవాటైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.వి. మహదేవన్‌ వైపు మొగ్గడంతో, ఆయనను సంగీతానికి ఎంచుకున్నారు.  

        ‘పద్మాలయా’ సంస్థకు సన్నిహితులైన వి.ఎస్‌.ఆర్‌. స్వామి ఎప్పటిలానే ‘పాడిపంటలు’కు కూడా ఛాయాగ్రాహణం అందించాలి. ఈస్ట్‌మన్‌కలర్‌లో తీసిన ఈ చిత్రం షూటింగ్‌ మానికొండలో మొదలయ్యాక ఓ వారం పాటు ఆయనే కెమెరా వర్క్‌ చేశారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఆయన స్థానంలో ఆయన సహాయకుడు పుష్పాల గోపీకృష్ణ కెమెరా బాధ్యతలు స్వీకరించి, సినిమా మొత్తం ఆయనే పూర్తి చేశారు. నిర్మాత జి. ఆదిశేషగిరిరావు మాటల్లో చెప్పాలంటే, ‘‘ఆ సమయంలోనే వి.ఎస్‌.ఆర్‌. స్వామికి బాపు – రమణల ‘భక్త కన్నప్ప’ చిత్రం ఉంది. మళ్ళీ డేట్ల ఇబ్బంది వస్తుందని, పరస్పర అంగీకారంతోనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అప్పటికే ‘పద్మాలయా’ సంస్థలో ‘దేవుడు చేసిన మనుషులు’ (1973), ‘అల్లూరి సీతారామరాజు’ (1974) లాంటి చిత్రాలకు పనిచేసిన పుష్పాల గోపీకృష్ణ అలా ఈ ‘పాడిపంటలు’కు పూర్తిస్థాయి ఛాయాగ్రాహకుడయ్యారు.’’

        సినిమా క్లైమాక్స్‌లో విలన్లు లాంచీపై వెళుతూ ఉంటే, దానికి సమాంతరంగా రోడ్డు మీద ఎడ్లబండిపై వాళ్ళను తరుముతూ వెళతాడు. జలపాతాల నడుమ లాంచీలో ఫైటింగ్‌ జరుగుతుంది. మరోపక్క ఆనకట్టను బాంబులతో కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇలా ఉత్కంఠభరితంగా మూడు వేర్వేరు ఘట్టాలతో పతాక సన్నివేశాలు సాగుతాయి. గోపీకృష్ణ కెమెరా పనితనం, కోటగిరి గోపాలరావు (నేటి ప్రముఖ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు అన్నయ్య) ఎడిటింగ్‌ ఆ దృశ్యాలను ఆసక్తిగా తెరపైకి తెచ్చాయి. ఇక, జలపాతం నడుమ లాంచీని కాపాడడం, హీరో బండిని ఎడ్లు వరద గోదావరిని దాటించే సన్నివేశాల లాంటి వాటిని మాత్రం మినియేచర్లతో మద్రాసు వాహినీ స్టూడియోలో ట్రిక్‌ ఫొటోగ్రఫీతో ప్రముఖ ఛాయాగ్రహణ మాంత్రికుడు రవికాంత్‌ నగాయిచ్‌ చిత్రీకరించారు. 
        
    అంతా అవుట్‌డోర్‌లోనే...

        రైతు కుటుంబాల కథగా సాగిన ‘పాడిపంటలు’లో విశేషం ఏమిటంటే, ఆ సినిమా మొత్తం అవుట్‌డోర్‌లోనే చిత్రీకరణ జరుపుకొంది. ‘‘అంతకు ముందు ‘మూగమనసులు’ లాంటివి గోదావరి దగ్గర లంకల్లో ఆ పక్కన తీశారు కానీ గోదావరికి ఇటు కొవ్వూరు వైపు మొత్తం షూటింగ్‌ చేసిన మొదటి సినిమా మా ‘పాడిపంటలే’. కృష్ణాజిల్లాలోని విజయవాడ, గుడివాడ మధ్యలో ఉన్న మానికొండ గ్రామంలో 1975 అక్టోబర్‌ 1న షూటింగ్‌ మొదలుపెట్టాం. వీధులు, ఇళ్ళు వగైరా ఉన్న ప్రధాన సన్నివేశాలన్నీ మానికొండలో తీస్తే, రాజమండ్రి పరిసరాల్లో 15 రోజులు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా కోసం తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి, చింతపల్లి, అలాగే ప్రసిద్ధమైన పట్టిసీమ గుడి, ధవళేశ్వరం ఆర్థర్‌ కాటన్‌ గెస్ట్‌హౌస్, కడియం గ్రామం, ఆత్రేయపురం ప్రాంతంలోని లొల్ల లాకులు, షూటింగులతో ‘సినిమా చెట్టు’గా ప్రసిద్ధమై ఇటీవల పడిపోయిన కుమారదేవం దగ్గరి భారీ వృక్షం దగ్గర, సీలేరు ప్రాజెక్టు... ఇలా అనేకచోట్ల చిత్రీకరణ జరిపాం. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి మూడే మూడు నెలల్లో ఇంత భారీ చిత్ర నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్‌ ఆఖరికే సెన్సార్‌ కూడా జరిపించేశాం. ముందు అనుకున్నట్టే సంక్రాంతి పండుగకు రిలీజ్‌ చేశాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరిరావు ‘సాక్షి’కి వివరించారు.

    ‘బెన్‌హర్‌’ ప్రేరణతో... గుంటూరులో!

        సినిమా మొదట్లో వచ్చే ఎడ్ల బండ్ల పందాల దృశ్యాలను చివరలో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియమ్‌లో భారీయెత్తున తీశారు. హీరో కృష్ణ, విలన్‌ ప్రభాకరరెడ్డి పాల్గొనే ఎడ్ల బండ్ల పోటీని భారీ జనసందోహం మధ్య ఎంతో వ్యయప్రయాసలతో ఉత్కంఠభరితంగా చిత్రీకరించారు. ప్రసిద్ధ హాలీవుడ్‌ చిత్రం ‘బెన్‌హర్‌’లోని రథాల పోటీ సన్నివేశం ఈ ఎడ్ల బండ్ల పోటీకి స్ఫూర్తి. విలన్‌ బండి చక్రాలకు అమర్చిన ఇనుపముళ్ళు కాస్తా హీరో ఎడ్ల బండి చక్రం ఆకులను కోసివేస్తాయి. దాంతో హీరో బండి చక్రం ఒకటి ఊడిపోతుంది. మిగిలిన ఒకే చక్రంతో ఎడ్ల బండిని పరుగులు తీయించి, హీరో గెలిచే ఆ ఘట్టాన్ని కెమెరామన్‌ పుష్పాల గోపీకృష్ణ ఉత్కంఠరేపేలా సెల్యులాయిడ్‌పైకి ఎక్కించారు. కృష్ణ సోదరుడు హనుమంతరావు ఆ చిత్రీకరణ సజావుగా సాగేలా కృషి చేశారు.

    శ్రేయోభిలాషులు వద్దన్నా... సంక్రాంతి బరిలోనే!

        ‘పాడిపంటలు’ రిలీజ్‌ కూడా సంచలనమే. అప్పట్లో కృష్ణ చిత్రాలను ప్రసిద్ధ పంపిణీదారులు ‘తారకరామా ఫిలిమ్స్‌’ వారు వరుసగా రిలీజ్‌ చేస్తున్నారు. ‘పాడిపంటలు’ డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళే. సంక్రాంతికి సినిమా రిలీజని కృష్ణ ముందే ప్రకటన రిలీజ్‌ చేసేశారు. సరిగ్గా ఆ ఏడాది అదే సమయానికి ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్‌బాబుల సినిమాలున్నాయి. అప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్నందున ఎన్టీఆర్, శోభన్‌బాబు లాంటి వాళ్ళతో ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీ ఎందుకని శ్రేయోభిలాషులు వారించారు. ప్రసిద్ధ పంపిణీదారు – ‘నవయుగ ఫిలిమ్స్‌’ అధినేత చంద్రశేఖరరావు అయితే స్నేహంకొద్దీ స్వయంగా వచ్చి కలసి, కృష్ణకు చెప్పి చూశారు. అయితే, సినిమా మీద నమ్మకం, కెరీర్‌లో తాడో పేడో తేల్చుకోవాలన్న తెగింపుతో ఉన్న డేరింగ్‌ హీరో కృష్ణ వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి బరికే సై అన్నారు.

        ఆదుర్తి మరణంతో అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌ పూర్తి కాలేదు. ఆ సంక్రాంతికి అది జనం ముందుకు రాలేదు. కానీ, ఎన్టీఆర్‌ సొంత సినిమా ‘వేములవాడ భీమకవి’ (జనవరి 8న రిలీజ్‌), అలాగే ‘జీవనజ్యోతి’, ‘సోగ్గాడు’ లాంటి వరుస హిట్ల జోరు మీద ఉన్న శోభన్‌బాబు హీరోగా వి.బి. రాజేంద్రప్రసాద్‌ తీసిన ‘పిచ్చిమారాజు’ (జనవరి 9న రిలీజ్‌) రిలీజయ్యాయి. ‘పాడిపంటలు’ రిలీజ్‌ తేదీకి అవి వచ్చి వారమే అయింది. ఇక, ‘పాడిపంటలు’ రిలీజ్‌ రోజునే హీరో రామకృష్ణ సమర్పణలో జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో జానపద చిత్రం ‘కోటలో పాగా’ కూడా వచ్చింది. అయితే, చివరకు కృష్ణ సాహసమే నెగ్గింది. మిగతా పెద్ద సినిమాలన్నీ ఫ్లాపయితే, అప్పటి దాకా వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణను విజయలక్ష్మి వరించింది.

        కథతో పాటు మహారథి మాటలు, ప్రముఖ గీత రచయితల పాటలు కూడా పెద్ద హిట్టవడంతో ‘పాడిపంటలు’ విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. పక్కనే ఇతర హీరోల చిత్రాలున్నా, బాక్సాఫీస్‌ వద్ద ‘పాడిపంటలు’ ఊపు తగ్గలేదు. ఆ సంక్రాంతికి కలెక్షన్ల మొనగాడుగా కీర్తి ఆయనకే దక్కింది. మరో విశేషమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్‌ సమయానికి బాపు– రమణల ‘ముత్యాలముగ్గు’ (1975) సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకుంది. అంతకు ముందు ఏడాదైన 1975లో రిలీజై, ఆ ఏటి మేటి చిత్రంగా ప్రేక్షకుల గౌరవాదరణలు పొందిన ‘ముత్యాలముగ్గు’ ఆ సంక్రాంతి నాటికి 5 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది.

    జనం మెచ్చిన జంతువుల యాక్షన్‌!

        ‘పాడిపంటలు’కు మరో ఆకర్షణ ఆ సినిమాలో హీరో పోషించే ఎడ్ల జత. బలిష్ఠమైన ఆ ఎడ్లు సినిమాలో చేసే రకరకాల విన్యాసాలు, పాల్గొనే పందాలు, లాగే బరువులు నాటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏ పని అయినా చేసేలా శిక్షణ పొందిన ఆ ఎడ్లను ప్రత్యేకంగా కొని, ఈ సినిమా కోసం వాడడం గమనార్హం. హీరో కృష్ణ తండ్రి గారైన వీరరాఘవయ్య చౌదరి ప్రత్యేకంగా ఒంగోలు దగ్గర పరుచూరు దగ్గర నుంచి ఈ ఎడ్ల జతను కొని, తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే, సినిమా అయిపోయినా సెంటిమెంటుగా వాటిని ఆప్యాయంగా తమ దగ్గరే స్వగ్రామంలో ఉంచుకొని సాకారు. పొలం పనులకు సైతం వాడేవారు కాదు. పశువులను సైతం వాటి జీవితాంతం అలా ప్రాణంగా చూసుకోవడం నాటి పల్లె సంస్కృతిలోని ప్రత్యేకత.

        ఇక, ‘పాడిపంటలు’లోనే హీరో హీరోయిన్ల వెంట హనుమాన్‌ అనే ఓ పొట్టేలు ఉంటుంది. అది చేసే విన్యాసాలను తెరపై చూసి, జనం ఆస్వాదించారు. అప్పటికే రకరకాల జంతువులతో సినిమాలు తీయడంలో దక్షిణాది చిత్రసీమలో ‘దేవర్‌ ఫిలిమ్స్‌’ అధినేత – నిర్మాత ‘శాండో’ ఎం.ఎం.ఎ. చిన్నప్ప దేవర్‌ ఫేమస్‌. ‘పాడిపంటలు’ చూసిన ఆయన ‘నేను రకరకాల జంతువులను పెట్టి, సినిమాలు తీశాను కానీ, పొట్టేలుతో కూడా సినిమా చేయొచ్చని ఈ సినిమా చూశాక తెలిసింది’ అన్నారట. అలా ఆ తర్వాత ‘పాడిపంటలు’ పొట్టేలు దృశ్యాల ప్రేరణతోనే శ్రీప్రియ, మురళీమోహన్‌లతో సూపర్‌ హిట్‌ ‘పొట్టేలు పున్నమ్మ’ (1978) నిర్మించారు.

    విజయవాడ మిస్సయిన పద్మాలయా స్టూడియో!

        ‘పాడిపంటలు’ షూటింగ్‌ ఆరంభమయ్యే సమయానికే తెలుగు చిత్రసీమను హైదరాబాద్‌కు ఆకర్షించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 1975 ఆగస్టులోనే టాప్‌ హీరోలు ఏయన్నార్, ఎన్టీఆర్‌లు హైదరాబాద్‌లో సొంత సినిమా స్టూడియోల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేసేశారు. జూబ్లీహిల్స్‌లో 15 ఎకరాల్లో ఏయన్నార్‌ అన్నపూర్ణా స్టూడియోస్, ముషీరాబాద్‌లో మూడున్నర ఎకరాల్లో ఎన్టీఆర్‌ రామకృష్ణా స్టూడియో... రెండింటి నిర్మాణం జోరుగా సాగుతోంది. అప్పటికే, ఆంధ్రాలో తానూ సొంతంగా స్టూడియో పెట్టాలనే బలమైన ఆలోచనతో కృష్ణ ముందుకు సాగుతున్నారు.

        ‘పాడిపంటలు’ నిర్మాణ సమయానికే ‘పద్మాలయా స్టూడియో’ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనకు విజయవాడ – గుంటూరు మధ్య చినకాకాని వద్ద స్థలం కేటాయించింది. ‘సినిమా విడుదల తర్వాత స్టూడియో నిర్మాణ కార్యక్రమాలు ఆరంభిస్తాం’ అని కృష్ణే స్వయంగా చెప్పారు. అప్పట్లో విజయవాడలోని హనుమాన్‌పేటలో అందుకోసం కార్యాలయం కూడా ఏర్పాటుచేశారు. చిత్రమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్‌ రోజునే హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు సొంత స్టూడియో ‘అన్నపూర్ణా స్టూడియోస్‌’ ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల చివరకు పద్మాలయా స్టూడియో అక్కడ కాకుండా హైదరాబాద్‌లో స్థాపితమైంది.

    కర్ణార్జునులుగా... కృష్ణ ‘కురుక్షేత్రం’ కల!

        ‘పాడిపంటలు’ షూటింగ్‌ సమయానికే కృష్ణ మనసులో భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’ కల ఉంది. ఆ మహాభారత కథలో కర్ణుడు, అర్జునుడు... రెండు పాత్రలూ తానే ధరించాలన్నది ఆయన ఆలోచన. అయితే, అలాంటి భారీ ఇతివృత్తాన్ని సినిమాగా తీయాలంటే నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందనీ, పెట్టే పెట్టుబడికీ – వచ్చే వసూళ్ళకూ సరైన పొంతన కనిపించడం లేదనీ వెనకాడారు. ఆనాటి తెలుగు చిత్రాలకు ఉన్న పరిమితుల దృష్ట్యా... పరిస్థితులు ‘కురుక్షేత్రం’ లాంటి భారీ చిత్ర నిర్మాణానికి అనువైనవి కావనీ, పరిస్థితులు అనుకూలించినప్పుడు, వీలుంటే రష్యా లాంటి దేశాల సహ భాగస్వామ్యంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని కృష్ణ భావించారు.

        అయితే, చాలామందికి తెలియనిదేమిటంటే... ‘పాడిపంటలు’ రిలీజైన కొన్నాళ్ళకే 1976 మొదట్లోనే ఎన్టీఆర్‌ మాత్రం తన ‘దానవీరశూర కర్ణ’ చిత్ర నిర్మాణం మొదలుపెట్టేశారు. సినారె రచించిన ‘జయీభవ... విజయీభవ...’ అన్న సుయోధనుడి స్వాగత గీతం రికార్డింగ్‌ కూడా అప్పట్లోనే చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అటు ఎన్టీఆర్‌ ‘కర్ణ’, ఇటు కృష్ణ ‘కురుక్షేత్రం’ పోటాపోటీగా నిర్మాణం సాగడం, సరిగ్గా ఏడాది తర్వాత 1977 సంక్రాంతికి వాటి మధ్య కనివిని ఎరుగని బాక్సాఫీస్‌ యుద్ధం జరగడం మరో పెద్ద కథ!

    ఎమ్జీఆర్‌ రీమేక్‌ చేయాలనుకున్నా...

        ‘పాడిపంటలు’ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించడంతో ఆ కథను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేయాలనే ఆలోచన అప్పట్లో బలంగా కలిగింది. తమిళంలో అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉండి, డీఎంకె పార్టీ నుంచి బయటకొచ్చేసి, అన్నా డీఎంకె పేరిట కొత్త పార్టీ పెట్టి, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు తమిళ అగ్రహీరో ఎం.జి. రామచంద్రన్‌. ఆయన ‘పాడిపంటలు’ తమిళంలో చేయాలని ముచ్చటపడ్డారు. అప్పటికే ఆయన ఊరూరా పార్టీ సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినా సరే, ఓ రోజు రాత్రి వేళ మద్రాసులో ఆయన కోసం ‘పాడిపంటలు’ స్పెషల్‌ ప్రొజెక్షన్‌ ఏర్పాటు చేశారు.

        వేరే ఊళ్ళో సభలో ఉన్న ఎమ్జీఆర్‌ అది ముగించుకొని మద్రాసుకు రావడానికి రైలు మిస్సయింది. కారులో బయలుదేరారు. తీరా మద్రాసులో ప్రొజెక్షన్‌ థియేటర్‌ వద్దకు చేరేసరికి, అర్ధరాత్రి దాటేసింది. అలసిసొలసిన ఆయన ఇంకేం సినిమా చూస్తారని దర్శకుడు పి.సి. రెడ్డి తదితరులు అనుకుంటే, ఎమ్జీఆర్‌ మాత్రం ఆసక్తిగా ఆసాంతం సినిమా చూసి, సినిమా చాలా బాగుందని దర్శకుడిని అభినందించారు. హీరోగా తన ఆఖరు సినిమాగా, హీరోయిన్‌ లత జోడీగా, పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే తమిళంలో ‘పాడిపంటలు’ చేద్దామన్నారు. ఆ రీమేక్‌ ప్రయత్నాలు జరుగుతుండగానే, 1977 ఎన్నికల్లో ఎమ్జీఆర్‌ ఘన విజయం సాధించి, తమిళనాడు సీఎం అయ్యారు. దాంతో, పూర్తిగా పట్టాలెక్కకుండానే ఆ తమిళ రీమేక్‌ ఆగిపోయింది. ఇక, తన కెరీర్‌కు కీలకమైన బ్రేక్‌ ఇచ్చిన ‘పాడిపంటలు’ చిత్రాన్ని పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్‌ చేయాలని కృష్ణకు అప్పట్లో బలంగా కోరిక. కానీ, ఎందుకనో అదీ తీరనే లేదు.

    మారుమోగిన మ్యూజికల్‌ హిట్‌!

        ‘పాడిపంటలు’ పాటలు అప్పట్లో జనంలో తెగ వినిపించాయి. ప్రసిద్ధ నాటక – సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ రాసిన ‘మన జన్మభూమి బంగారుభూమి... పాడిపంటలతో పసిడిరాశులతో... కళకళలాడే జననీ... మన జన్మభూమీ...’ పాట ఆల్‌టైమ్‌ హిట్‌. కె.వి. మహదేవన్‌ సంగీతం, అలాగే ‘రైతు లేనిదే రాజ్యంలేదని...’ రైతు గొప్పదనాన్నీ, రైతు రాజ్యం ఘనతనూ అవిస్మరణీయంగా చెప్పి, భరతమాతకు నీరాజనాలిచ్చే జాన్సన్‌ సాహిత్యం ఆ పాటను ఇవాళ్టికీ గొప్పగా నిలిపాయి. అలాగే, ఆనకట్ట నిర్మాణ సందర్భానికి తగ్గట్టు శ్రీశ్రీ రాసిన ‘పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా... రండోయ్‌ రారండోయ్‌ మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌...’ ఆకట్టుకుంది. కృష్ణ – విజయనిర్మలపై వచ్చే ‘ఇరుసు లేని బండి... ఈశ్వరుని బండి... చిరతలే లేనిది చిన్నోడి బండి...’ పాట (ఆత్రేయ రచన) పెద్ద హిట్‌. ‘ఆడుతూ పాడుతూ జోరుగా వసంతమాడాలి...’ అనే ఊరి సంబరాల పాట, ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌... ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌... ముద్దుగుమ్మ పట్నం బొమ్మకు వడ్డిద్దాం వేడట్లోయ్‌...’ లాంటివీ అలరించాయి. అలా పాటలన్నీ సూపర్‌హిట్‌.  
    అక్కడ నుంచి ‘సూపర్‌స్టార్‌’ సెకండ్‌ ఇన్నింగ్స్‌!

        అప్పట్లో ‘పాడిపంటలు’ చిత్రం 33 కేంద్రాల్లో 50 థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సీజన్‌ కావడం... పండగకు రిలీజ్‌ అవడం... సినిమాలో సెంటిమెంట్, వినోదం పుష్కలంగా ఉండడం... పైగా సినిమా మ్యూజికల్‌ హిట్‌ కావడం... ఇవన్నీ ‘పాడిపంటలు’కు కలిసొచ్చాయి. ముఖ్యంగా, గ్రామీణ నేపథ్యంలోని ఈ చిత్రాన్ని పట్నాలతో పాటు పల్లెల్లోనూ బాగా ఆదరించారు. మహిళా ప్రేక్షకులు పెద్దయెత్తున నీరాజనాలు పట్టారు. ‘‘అందుకే, ఆ సినిమాకు ఊహించని రెవెన్యూ వచ్చింది. ఫస్ట్‌ డే ఎంత షేర్‌ వచ్చిందో, అయిదో రోజు కూడా అంత షేర్‌ వచ్చింది. మా సంస్థ నిర్మించిన సినిమాల్లో అధిక వసూళ్ళు తెచ్చినవాటిలో ఒకటిగా నిలిచింది. రిపీట్‌ రన్స్‌లో కూడా బాగా ఆడి, మా సంస్థకు చిరస్మరణీయ చిత్రంగా మిగిలింది’’ అని ఆదిశేషగిరిరావు వివరించారు.

        అప్పట్లో ‘పాడిపంటలు’ 27 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ పైన 6 (విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, తిరుపతి) కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రం (కాకినాడ)లో షిఫ్టులతో... మొత్తం 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. తర్వాత హైదరాబాద్‌లో షిఫ్టింగులతో 175 రోజులు పూర్తి చేసుకొని, సిల్వర్‌ జూబ్లీ జరుపుకొంది.

        అంతే... ‘అల్లూరి సీతారామరాజు’ ఇమేజ్‌ క్రీనీడలో చిక్కుకొని, వరుస ఫ్లాపులు చవిచూస్తున్న కృష్ణను ఒక్కసారిగా పరాజయాల గ్రహణం వీడింది. ఆ నీడలో నుంచి బయటపడ్డ ఆయన కెరీర్‌ మళ్ళీ పట్టాలెక్కింది. అలా అక్కడ నుంచి కృష్ణ రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. ఆ తర్వాత అనేక ఏళ్ళ పాటు సిల్వర్‌స్క్రీన్‌పై ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ మ్యాజిక్‌ కొనసాగింది. అదీ ‘పాడిపంటలు’ ఘనత!

    రచన – రెంటాల జయదేవ 
     

  • ఆడవారిపై నోరు పారేసుకున్న నటుడు శివాజీని కడిగిపారేసింది యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌. కానీ కొందరు శివాజీ లాంటి పురుషాహంకార ధోరణి ఉన్నవాళ్లు మాత్రం అనసూయనే ట్రోల్‌ చేశారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా విమర్శించారు. అయినా అనసూయ వెనక్కు తగ్గకుండా స్త్రీ హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ప్రెస్‌మీట్‌కు వీడియో కాల్‌ ద్వారా హాజరైంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. 

    నేను బాగున్నా..
    తాజాగా తన కన్నీళ్లకు గల కారణాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో జూమ్‌ కాల్‌ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. నేను పూర్తిగా బాగున్నాను.

    మనమంతా మనుషులమే
    మన స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు నేనుగానీ, ఏ మహిళ అయినా సరే ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుక్కోవడం నిజంగా బాధాకరం. కానీ, అదే సమయంలో నా వెనక నిలబడ్డ అద్బుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది. మనమంతా మనుషులమే.. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు. 

    అన్నీ దాటుకుని నిలబడతా..
    ముఖ్యమైనది ఒక్కటే.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి, అన్ని అడ్డంకులు ఎదురొడ్డి నిలబడతాను. ఎవరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది.. నన్ను కాదు. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో.. నేను అక్కడ లేకపోయినా, ధైర్యం, ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

    మానవత్వాన్ని ఎంచుకుందాం
    అది నాకు నిజమైన సాధనగా అనిపిస్తోంది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది నేరుగా నా అధికారిక సోషల్‌ మీడియా వేదికల ద్వారానే తెలియజేస్తాను. అంతవరకు మౌనంగానే ఉంటాను. మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అనసూయ రాసుకొచ్చింది.

     

     

    చదవండి: నన్ను లాక్కెళ్లి ముద్దుపెట్టాలని చూశారు: అనిల్‌ రావిపూడి

  • బిగ్‌బాస్‌ షోలో ఎక్కడెక్కడినుంచో కంటెస్టెంట్లు వచ్చి పాల్గొంటారు. హౌస్‌లో ఫ్రెండ్స్‌ అవుతారు, శత్రువులవుతారు, అమ్మ, అక్క, నాన్న, అన్న అంటూ వరుసలు కూడా కలుపుకుంటారు. ఈ స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలు కొందరు హౌస్‌లోనే ఆపేస్తే మరికొందరు మాత్రం ఆ ఆప్యాయతలను బయట కూడా కొనసాగిస్తారు.

    బిగ్‌బాస్‌లో పవన్‌- రీతూ ట్రాక్‌
    బిగ్‌బాస్‌ జోడీ డిమాన్‌ పవన్‌ - రీతూ చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొన్న వీరిద్దరూ హౌస్‌లో చాలా క్లోజ్‌ అయ్యారు. వీరి లవ్‌ట్రాక్‌ జనాలకు ఎంతగానో నచ్చింది. రీతూ ఎలిమినేట్‌ అయినప్పుడు కూడా ఈ జంట విడిపోయిందని అభిమానులు తెగ బాధపడ్డారు.

    వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్స్‌గా ..
    అలాంటివారికోసం పవన్‌- రీతూ మరోసారి జంటగా కనువిందు చేసేందుకు రెడీ అయ్యారు. వీరిద్దరూ జతగా బీబీ జోడీ సీజన్‌ 2లో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. వచ్చీరాగానే రొమాంటిక్‌ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంట డ్యాన్స్‌, కెమిస్ట్రీ చూసి జడ్జిలు చప్పట్లు కొట్టారు. 

    నయనికి రీతూ కౌంటర్‌
    కానీ బీబీ జోడీలోని మరో కంటెస్టెంట్‌ నయని పావని  మాత్రం.. కాస్త డ్యాన్స్‌ తక్కువైనట్లు అనిపించిందంటూ విమర్శించింది. దబదబ స్టెప్పులేసేందుకు ఇది మాస్‌ సాంగ్‌ కాదుగా అని రీతూ కౌంటరివ్వగా దబదబ కొట్టమనట్లేదు, కానీ స్టెప్పులేయాలని చెప్తున్నా అని నయని సీరియస్‌గా ఆన్సరిచ్చింది. ఏదేమైనా ఈ జోడీ రాకతో ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ!

     

     

  • 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా హిట్‌ కావడంతో భారీ కలెక్షన్స్‌ వస్తున్నాయి. రెండురోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ప్రకటించారు. అయితే, సినిమాకు పెద్ద బడ్జెట్‌ కాకపోయినప్పటికీ చిరంజీవి, నయనతార, వెంకటేశ్‌ వంటి స్టార్స్‌ ఉండటంతో వారి రెమ్యునరేషన్‌ ఎ‍క్కువగా ఉంటుందని టాక్‌.. ఈ మూవీకి నిర్మాతలుగా సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. దీంతో మెగాస్టార్‌ రెమ్యునరేషన్‌ ఎంత ఉంటుంది అనే ప్రశ్న ఎక్కువమందిలో కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

    'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకు గాను తను రెమ్యేనరేషన్‌ మాత్రమే తీసుకున్నానని అనిల్‌ రావిపూడి అ‍న్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను షేర్‌ ఏమీ తీసుకోవడం లేదన్నారు. చిరంజీవి కూడా సినిమా బడ్జెట్‌ను బట్టి తన పారితోషికం తీసుకున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో నయనతార, వెంకటేశ్‌ వంటి ఇద్దరు స్టార్స్‌ ఉన్నారు.. ఆపై ఆయన కూతురు నిర్మాత కాబట్టి ఆమెకు కూడా కాస్త నాలుగు రూపాయలు మిగలాలి కదా అనే దృష్టిలో చిరు ఉన్నారని తెలిపారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నారని  అనిల్‌ రావిపూడి చెప్పారు.

    ఎవరికి ఎంత రెమ్యునరేషన్‌..?
    చిరంజీవి ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారని టాక్‌ వుంది. అయితే, తన కూతురు నిర్మాతగా ఉన్నారు కాబట్టి ఇందులో తన పారితోషికాన్ని కాస్త తగ్గించారని సమాచారం. ఇందులో శశిరేఖగా నయనతార ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం ఆమె ముందుగా రూ. 15 కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఫైనల్‌గా రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌తో ఢీల్‌ సెట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్‌  రూ. 9 కోట్లు, అనిల్‌ రావిపూడి రూ. 25 కోట్లు తమ రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని సమాచారం. 

  • టైటిల్‌: అనగనగా ఒక రాజు
    నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్‌ పొన్నప్ప, రావు రమేశ్‌, చమ్మక్‌ చంద్ర, రంగస్థలం మహేశ్‌ తదితరులు
    నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
    నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
    దర్శకత్వం: మారి
    సంగీతం: మిక్కీ జె. మేయర్
    విడుదల తేది: జనవరి 14, 2026

    హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్‌, యాక్టింగ్తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్హీరో నవీన్పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్తీసుకొని ఇప్పుడుఅనగజగా ఒక రాజుఅంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్పొలిశెట్టి)కిజమీందారుఅనే ట్యాగ్తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్‌) బాగా రిచ్‌ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి షాకింగ్న్యూస్తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).

    ఎలా ఉందంటే..
    తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు.  ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు.  కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్‌ ఎంటర్‌టైన్‌ అవుతాం.  సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఒక్కో సీన్‌ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్‌ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి  అసలు కథ మొదలవుతుంది. 

    ఇక ‘ఆపరేషన్‌ చారులత’ ఎపిసోడ్‌ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది.  కథనం ఊహకందేలా సాగినా.. నవీన్‌ పొలిశెట్టి వేసే పంచ్‌లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోతుంది. 

    సెకండాఫ్‌ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్‌ క్యాంపెయిన్‌ ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కథనం ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది.  అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాడు. 

    ఎవరెలా చేశారంటే.. 
     ఈ సినిమా నవీన్‌ పొలిశెట్టి వన్‌ మ్యాన్‌ షో అని చెప్పాలి. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.  వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్‌ తండ్రిగా రావు రమేశ్‌ రెగ్యులర్‌ పాత్రలో కనిపించాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్‌ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్‌, చమ్మక్‌ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

    సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్‌ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ తెరపై రిచ్‌గా కనబడుతుంది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్లు, సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్లు కొల్లగొట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అవన్నీ నాకు కొట్టిన పిండి అంటున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి.. ఒకటీరెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని హిట్‌ మెషిన్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు.

    మెగా బ్లాక్‌బస్టర్‌ 
    అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్‌ గారు. నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా బ్లాక్‌బస్టర్‌ థాంక్యూ మీట్‌లో అనిల్‌ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

    కనబడితే లాక్కెళ్లి..
    ఆయన మాట్లాడుతూ.. ఈ కథలోని అన్ని సన్నివేశాలకు చిరంజీవి గారే స్ఫూర్తి. నాకు ఈ సినిమా చేసే అవకాశాన్నిచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మెగా ఫ్యాన్స్‌ అయితే నేను కనబడితే లాక్కెళ్లి ముద్దులు పెడదామని చూస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేను.

    ఫామ్‌హౌస్‌ కొనివ్వాలి
    అమెరికాలో ప్రీమియర్స్‌ 1 మిలియన్‌ డాలర్‌ వసూలు చేస్తే నిర్మాత సాహు గారపాటికి కారు ఇస్తానన్నాను. నేను అనుకున్న నెంబర్‌ దాటిపోయింది కాబట్టి ఆయనకు కారు కొనిస్తాను. కాకపోతే.. కలెక్షన్స్‌ మూడు దాటి నాలుగు మిలియన్‌ డాలర్లు వస్తే నాకు ఫామ్‌ హౌస్‌ కొనివ్వాలి. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా? లేదా? అనేది ఆయన ఇష్టం అని అనిల్‌ రావిపూడి సరదాగా ఓ కండీషన్‌ పెట్టాడు.

    చదవండి: మన శంకరవరప్రసాద్‌ గారు రెండు రోజుల కలెక్షన్స్‌

Sports

  • రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో బ్లాక్‌ క్యాప్స్‌ జట్టు సమం చేసింది. 285 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కివీస్ ఆడుతూ ప‌డుతూ 47.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్ మ‌రోసారి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శ‌త‌కంతో చెల‌రేగాడు.

    117 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్‌ యంగ్‌ కూడా కీలక నాక్‌ ఆడాడు. యంగ్‌ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా తలా వికెట్‌ సాధించారు.

    రాహుల్ సెంచరీ వృథా..
    అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌(56) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టేన్‌ క్లార్క్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్‌, పౌల్క్స్‌, బ్రెస్‌వెల్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డే ఇండోర్ వేదిక‌గా జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నుంది.

  • రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు జనవరి 22 నుంచి ప్రారం‍భం​ కానున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాద్ తలపడనుంది.

    ఈ సమయంలో జాతీయ విధులు లేకపోవడంతో సిరాజ్ రంజీల్లో ఆడనున్నాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్లు అతడికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరాజ్ డిప్యూటీగా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు వంటి సీనియర్ ప్లేయర్లకు  చోటు దక్కింది. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల కూడా ఉన్నాడు.

    హైదరాబాద్ జట్టు
    మహ్మద్ సిరాజ్‌, రాహుల్ సింగ్‌, సీవీ మిలింద్‌, తనయ్ త్యాగరాజన్, కె రోహిత్ రాయుడు,కె హిమతేజ, వరుణ్ గౌడ్,ఎం అభిరత్ రెడ్డి, రాహుల్ రాధేష్‌, అమన్ రావ్‌, రక్షణ్ రెడ్డి, నితిన్ సాయి యాదవ్‌, నితీశ్ రెడ్డి, సాయి ప్రగ్నయ్ రెడ్డి,బి పున్నయ్య
    చదవండి: IND vs NZ: వారెవ్వా హ‌ర్షిత్‌.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో

  • టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న  రెండో వన్డేలో స్టార్ బ్యాటర్‌ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.

    కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు.

    బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

    కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(112) అజేయ సెంచరీతో మెరిశాడు.
    చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్‌


     

     

  • క‌ర్ణాట‌క మిస్ట‌రీ స్పిన్న‌ర్ కేసీ క‌రియ‌ప్ప సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. కేవ‌లం 31 ఏళ్ల వ‌య‌స్సులోనే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి క‌రియ‌ప్ప షాకిచ్చాడు. అత‌డు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు.

    "స్ట్రీట్ క్రికెట్ నుంచి స్టేడియంలో ఫ్లడ్ లైట్లలో ఆడడం వరకు నా ప్రయాణం ఒక్క అద్భుతం. గర్వంగా జెర్సీ ధరించి, ఒకప్పుడు నేను కన్న కలలను నిజం చేసుకున్నాను. అయితే ఈ రోజు భారత క్రికెట్‌ నుంచి నేను వైదొలుగుతున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. విజయాలు చిరునవ్వును ఇస్తే, ఓటములు నన్ను రాటుదేల్చాయి. నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" తన రిటైర్మెంట్ నోట్‌లో పేర్కొన్నాడు.

    కాగా బీసీసీఐతో పూర్తిగా తెగదింపులు చేసుకున్న కరియప్ప విదేశీ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడే అవకాశముంది. కరియప్ప తన డొమెస్టిక్ కెరీర్‌లో కర్ణాటక, మిజోరం జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 157 వికెట్లు పడగొట్టారు. అయితే ఐపీఎల్ 2015 వేలంతో కరియప్ప వెలుగులోకి వచ్చాడు.

    ఏ మాత్రం అనుభవం లేనిప్పటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం అప్పటిలో పెద్ద సంచలనంగా మారింది. ఆ త‌ర్వాతి సీజ‌న్లలో పంజాబ్ కింగ్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు గతకొంతకాలంగా అతడికి దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు కూడా ఛాన్స్‌లు రావడం లేదు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌కు కరియప్ప విడ్కోలు పలికాడు.

  • న్యూజిలాండ్‌తో ఆఖ‌రి రెండు వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టులో ఢిల్లీ బ్యాట‌ర్ అయూశ్ బ‌దోనికి చోటు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుందర్ గాయం కార‌ణంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొల‌గ‌డంతో బ‌దోనికి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

    అయితే సెలెక్ట‌ర్ల నిర్ణ‌యంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో ఉన్న రియాన్ ప‌రాగ్, రింకూ సింగ్ వంటి ఆట‌గాళ్ల‌ని కాద‌ని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. గంభీర్ స‌పోర్ట్ వ‌ల్లే అత‌డిని అనుహ్యంగా జ‌ట్టులోకి తీసుకున్నారని మ‌రికొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు.

    కాగా బ‌దోని ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఆడ‌తున్నాడు. గ‌తంలో ల‌క్నో మెంటార్‌గా గౌతీ ప‌నిచేశాడు. అత‌డి గైడెన్స్‌లో బ‌దోని మ‌రింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో బ‌దోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.

    గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం విధితమే. ఈ కార‌ణాల‌తో అయూశ్ వైపు మొగ్గు చూపాడ‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.  ఇక తాజాగా ఇదే విష‌యంపై  భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. కేవ‌లం అత‌డిని టాలెంట్ ఆధారంగానే జ‌ట్టులోకి తీసుకున్నామ‌ని తెలిపాడు.

    "అయూశ్ దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. భార‌త్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున కూడా అత‌డు వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. బ‌దోని బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. కేవ‌లం ఐదుగురు బౌల‌ర్ల‌తో మాత్రమే ఆడ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు.

    ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బ‌దోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్నాము" అని రెండో వ‌న్డేకు ముందు విలేక‌రుల స‌మావేశంలో కోటక్ పేర్కొన్నాడు.
    చదవండి: BBL: పాక్‌ ప్లేయర్‌కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు

  • రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌ర‌గుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 120 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును రాహుల్ త‌న సెంచ‌రీతో ఆదుకున్నాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్ద‌రూ 70 ప‌రుగుల భాగ‌స్వామమ్యం నెల‌కొల్పారు. రోహిత్‌(24) ఔట‌య్యాక గిల్‌(56), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(8), విరాట్ కోహ్లి(23) వెంట‌వెంట‌నే పెవిలియ‌న్‌కు చేరారు.

    ఈ క్ర‌మంలో రాహుల్ ఆల్‌రౌండర్‌ ర‌వీంద్ర జ‌డేజా(27)తో క‌లిసి ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దాడు. జ‌డేజా ఔటైన‌ప్ప‌టికి రాహుల్ మాత్రం త‌న ఏకాగ్ర‌త‌ను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో త‌న ఎనిమిదివ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను కేఎల్ అందుకున్నాడు.

    ఫలితంగా భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు చేసింది. మొత్తంగా రాహుల్‌ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక​ సిక్సర్‌తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టేన్‌ క్లార్క్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్‌, పౌల్క్స్‌చ, బ్రెస్‌వెల్‌ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: BBL: పాక్‌ ప్లేయర్‌కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు

  • బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజ‌న్‌లో పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రిజ్వాన్ ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోతున్నాడు.

    ఈ క్ర‌మంలో సిడ్నీ థండ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రిజ్వాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన రిజ్వాన్‌ను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మెనెజ్‌మెంట్  బలవంతంగా మైదానం నుంచి వెనక్కి పిలిచింది. దీంతో అతడు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు.

    నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతూ టెస్టు క్రికెట్‌ను తలపించాడు. ఆఖరికి డెత్ ఓవర్లలో కూడా అతడి ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్ల ముందు అతడిని వెనక్కి రమ్మని బౌండరీ రోప్ వద్ద నుంచి కెప్టెన్ విల్ సదర్లాండ్ సైగలు చేశాడు.

    దీంతో రిజ్వాన్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు. తద్వారా బిగ్ బాష్ లీగ్ చరిత్రలో రిటైర్డ్ అవుట్ అయిన తొలి ఓవర్సీస్ ప్లేయర్‌గా రిజ్వాన్ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. రిటైర్డ్ అవుట్‌గా వెనదిరిగే ముందు రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 113తో 23 బంతుల్లో కేవలం 26 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయర్‌కు ఇది 'అవమానకరం' అని అక్మల్ అన్నాడు.

    "లీగ్ క్రికెట్ ప్రస్తుతం చాలా మారిపోయింది. ఆధునిక టీ20 క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా రిజ్వాన్ తన స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోకపోతే చాలా కష్టం. రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంను కూడా తమ స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాలని గత మూడేళ్లుగా పదే పదే చెబుతున్నాను.

    పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన ఆటగాడిగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఘోర అవమానమే. కానీ రిజ్వాన్ తన స్వయంకృత అపరాధం వల్ల ఈ పరిస్థితి తెచ్చుకున్నాడుఐపీఎల్‌-2025 సీజన్‌లో తిలక్ వర్మ వంటి కీలక ఆటగాడిని సైతం ముంబై ఇండియన్స్ తిరిగి డగౌట్‌లోకి పిలిచారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్లు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషం ఉండదని" ఆక్మల్ పేర్కొన్నాడు.

    అయితే రిజ్వాన్ వంటి స్టార్ ప్లేయ్‌ర్‌ను అర్ధాంతరంగా వెనక్కి పిలవడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని డిబేట్ హోస్ట్ తెలిపారు. రిజ్వాన్ వెంటనే బిగ్ బాష్ లీగ్ నుంచి తప్పుకొని తిరిగి స్వదేశానికి రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు పాక్ జాతీయ మీడియాలలో కథనాలు వెలువడుతున్నాయి. రిజ్వాన్ ప్రస్తుతం పాక్ వన్డే, టెస్టు జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు.



     

     

  • రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. తొలి వ‌న్డేలో 93 ప‌రుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వ‌న్డేలో మాత్రం నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితమ‌య్యాడు.

    29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా కింగ్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు.

    4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్‌పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం​ సచిన్ టెండూల్కర్‌(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.

    అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

    అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.
    చదవండి: రోహిత్‌ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్‌ కోహ్లి

  • ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్‌ ర్యాంక్‌కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?

    విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ. విరాట్‌ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్‌ ర్యాంక్‌కు చేరాడు. అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉండిన రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. 

    అదే మ్యాచ్‌లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ (29 నాటౌట్‌) ఆడిన కేఎల్‌ రాహుల్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్‌-10లో భారత్‌ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌ 5, శ్రేయస్‌ అయ్యర్‌ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.

    బౌలర్ల విషయానికొస్తే.. టాప్‌-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్‌ ఖాన్‌, జోఫ్రా ఆర్చర్‌, కుల్దీప్‌ యాదవ్‌ టాప్‌-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్‌ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్‌కు పడిపోయాడు.

    ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్‌, సికందర్‌, మొహమ్మద్‌ నబీ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌ పదో స్థానంలో నిలిచాడు. 

     

  • రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. 

    తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్‌ లెన్నాక్స్‌ (ఆదిత్య అశోక్‌ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్

    భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

     

  • ఇంగ్లండ్ క్రికెట్‌ మొగల్‌గా పేరొందిన, ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ECB) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ కాలియర్ (70) మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణాన్ని ECB ధృవీకరించి, అధికారిక నివాళి అర్పించింది. 

    ప్రస్తుత ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ మాట్లాడుతూ.. డేవిడ్ కాలియర్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించాని అన్నారు. ఆయన కాలంలో ఆట విస్తృతంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నారు. కాలియర్‌ నిజమైన జెంటిల్‌మన్, అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.  

    డేవిడ్ కాలియర్ 2004 అక్టోబర్‌లో ECB రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన జమానాలో ఇంగ్లండ్ మహిళల జట్టు  ప్రపంచకప్‌ డబుల్‌ (2009లో టీ20 మరియు వన్డే వరల్డ్‌కప్) సాధించింది.

    అలాగే పురుషుల జట్టు 2010 టీ20 వరల్డ్‌కప్‌ సాధించి, తమ ఖాతాలో  తొలి ఐసీసీ ట్రోఫీ జమ చేసింది. వీటితో పాటు కాలియర్‌ హయాంలో ఇంగ్లండ్‌ పురుషులు, మహిళల జట్లు తొమ్మిది సార్లు (పురుషులు  4, మహిళలు 5) ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లను కైవసం చేసుకున్నాయి.  

    ECBలో చేరకముందు కాలియర్ ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్సెక్స్ కౌంటీలో అసిస్టెంట్ సెక్రటరీగా.. గ్లోస్టర్‌షైర్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌లో (1980–2004) చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సేవలందించారు. కాలియర్‌ ECB పదవిలో ఉన్న సమయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్లు కోల్పోయిన ప్రభను తిరిగి దక్కించుకున్నాయి. అతని మరణం ఇంగ్లండ్ క్రికెట్‌కు పెద్ద లోటుగా భావించబడుతుంది.  

     

  • మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. నిన్న (జనవరి 13) గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 

    ఈ మ్యాచ్‌లో హర్మన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ (43 బంతుల్ల 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత WPLలో హర్మన్‌ పరుగుల సంఖ్య 1016కు (29 ఇన్నింగ్స్‌ల్లో 46.18 సగటు, 146.18 స్ట్రైక్ రేట్) చేరింది.

    ఈ ఇన్నింగ్స్‌తో హర్మన్‌ మరో రికార్డు కూడా సాధించింది. WPL చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు (10) చేసిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్‌ ఆఫ​్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న హర్మన్, ఈ విభాగంలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. 

    WPLలో హర్మన్‌కు ఇది తొమ్మిదో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. WPL చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఐదుకు మించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకోలేదు. గత మ్యాచ్‌లోనూ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) హర్మన్‌ అజేయమైన అర్ద సెంచరీ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకుంది.

    ఓవరాల్‌గా చూసినా WPL చరిత్రలో హర్మన్‌ కాకుండా ఒకే ఒకరు 1000 పరుగుల మైలురాయిని తాకారు. హర్మన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్‌ సీవర్‌ బ్రంట్‌ 1000 పరుగుల మైలురాయిని తాకింది. బ్రంట్‌ ప్రస్తుతం 1101 పరుగులతో కొనసాగుతుంది. 

    భారతీయులకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధిక WPL పరుగులు చేసిన ప్లేయర్లుగా షఫాలీ వర్మ (887), స్మృతి మంధన (711) ఉన్నారు. హాఫ్‌ సెంచరీల రికార్డుకు సంబంధించి హర్మన్‌ తర్వాత అత్యధికంగా బ్రంట్‌, లాన్నింగ్‌ తలో 9 హాఫ్‌ సెంచరీలు చేశారు. భారతీయులకు సంబంధించి షఫాలీ 6, మంధన 4 అర్ద సెంచరీలు చేశారు.

     

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికు సంబంధించి బిగ్‌ న్యూస్‌ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్‌ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాంషు కోటక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

    రో-కో టీమిండియా 2027 వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.

    ఇంతకీ కోటక్‌ ఏమన్నాడంటే.. మేనేజ్‌మెంట్‌, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌ లేదు. కోచ్‌ గౌతమ్ గంభీర్‌తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.

    వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్‌నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు.  

    కోటక్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కెరీర్‌ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. 

    ముఖ్యంగా విరాట్‌ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్‌ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.

    ఇవాళ రాజ్‌కోట్‌ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ రో-కో తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం​ వ్యక్తం చేస్తున్నారు.  

     

Politics

  • సాక్షి,తాడేపల్లి: NTV జర్నలిస్టుల అరెస్టులను వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

    ఇది పత్రికా స్వేచ్ఛ,  ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. బలవంతంగా జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి..అరెస్టు చేయటం దారుణం. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, కనీసం నోటీసులు జారీ చేయకుండా జర్నలిస్టులను అరెస్టు చేయటం సరికాదు. ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబం. జర్నలిస్టులు నేరస్థులో, ఉగ్రవాదులో కాదు.

    అయినప్పటికీ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి చర్యల వలన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయి.మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలనీ, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. 
     


     

  • సాక్షి,హైదరాబాద్‌: ఓ కథనానికి సంబంధించిన కేసులో హైదరాబాద్‌ పోలీసులు ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ట్యాగ్‌ చేస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

    కాంగ్రెస్‌ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది.జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా?. అర్థరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అతిగా ప్రవర్తించడం సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’అని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‌

    తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అత్యంత అమానవీయ పద్ధతిలో, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు
     

     

  • సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.

    మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.

    రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్‌ జగన్‌ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.

    చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్‌, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. 

National

  • చైనా మంజా వాడకంపై ‍ప్రజలకు ఎంత అవగాహన కల్పించిన తీరు మార్చుకోవడం లేదు. పండగ వేళ సరదాగా ఎగరవేసే పతంగులు కొంతమంది పాలిట మృత్యపాశాల్లా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకాలో చైనా మాంజాతో తీవ్రగాయాలై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో పండగ వేళ ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

    సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం హిందూ సంప్రదాయంలో భాగం. అందుకే దేశవ్యాప్తంగా పెద్ద, చిన్నా తేడా లేకుండా పతంగులు ఎగురవేసి తమ సంతోషాన్ని చాటుకుంటారు. పతంగులు ఎగురవేయడం కోసం వాడే చైనా మాంజా వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురవడంతో పాటు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పక్షులసైతం పెద్దఎత్తున మాంజా దారం తగిలి మరణిస్తున్నాయి. దీనిపై ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా తీరుమారడం లేదు.

    కర్ణాటక బీదర్ జిల్లా తలమడిగి బ్రిడ్జి వద్ద సంజూ కుమార్ అనే ఓవ్యక్తి బైక్ నడుపుతూ వస్తుండంగా రోడ్డుపై ఉన్న చైనా మంజా అతని ముఖానికి తగిలింది. దీంతో తలకు తీవ్రగాయాలైన సంజూ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలారు. అతికష్టంమీద వారి కుమార్తెకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అంతలోనే ‍అక్కడే ఉన్న స్థానికులు రక్తం ఎక్కువగా పోకుండా కాటన్ గుడ్డ కట్టి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజూకుమార్ అంబులెన్స్ వచ్చే సరికే ప్రాణాలు వదిలారు.

    అయితే అంబులెన్స్ సమయానికి చేరుకుంటే ఆయన ప్రాణాలు దక్కేవని సంజూ కుమార్ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పతంగిలు లేపడానికి చైనా మాంజా వాడకుండా నిషేదం విధించాలని అక్కడే ధర్నా చేపట్టారు. ఇటీవల చైనా మాంజాతో ప్రమాదానికి గురైన ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.

  • తిరువనంతపురం:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబల మేడుపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. దాంతో శబరిమల స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిపోయింది. 

     శబరిమలలో ప్రతి ఏడాది దర్శనమిచ్చే మకరజ్యోతికి ప్రత్యేకత ఉంది.  ప్రతి ఏడాది సంక్రాంతి వేళ శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై  మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ఈ ఏడాది జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య మకరజ్యోతి కనిపించింది.

    అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో చూసి చివరకు మకరజ్యోతిని దర్శించుకున్నారు. మరొకవైపు కోట్లాది మంది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా పరోక్షంగా వీక్షించారు. 


     

Andhra Pradesh

  • విశాఖ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎగురేసే గాలిపటాల కారణంగా మాంజా(అత్యంత పదునుగా ఉండే దారం) దడపుట్టిస్తోంది. ఈ మాంజా బారిన పడి అనేక మంది గాయాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో మాంజా కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఉదంతం వెలుగుచూసింది. 

    మాజీ సైనిక ఉద్యోగి నోటిని మాంజా కోసేసింది. మాంజా దారం తగిలి వెంకట్రావు అనే మాజీ సైనికోద్యోగి గాయపడ్డారు. రెండు పెదవుల మధ్య తీవ్ర గాయమైంది. దాంతో తీవ్ర రక్త స్రావంతో  ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నోటికి రుండు వైపులా కుట్ల వేసేంతంగా  గాయమైంది. మధురవాడలో బైక్ పై కొడుకుతో కలిసి ప్రయాణిస్తుండగా ఇది చోటు చేసుకుంది. 

    తెలంగాణలో ఘటనలు
    జనవరి 13 వ తేదీన  ఓ  పోలీసు అధికారి విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా మెడకు చైనీస్ మాంజా తగిలి తీవ్ర గాయపడ్డాడు. రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆసుపత్రికి తరలించారు.

    నిజామాబాద్: ఒక రైతు గాలిపటాల దారంలో చిక్కుకుని తీవ్ర గాయపడ్డాడు.

    మాంజా వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.

    ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలు
    సంక్రాంతి సీజన్‌లో: చైనీస్ మాంజా కారణంగా పదుల సంఖ్యలో గాయాలు నమోదయ్యాయి.
    పోలీసుల చర్యలు: "సీజ్ ది కైట్" ఆపరేషన్‌లో మాంజా విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేశారు. కానీ అమలు కఠినంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

    ప్రమాదాల తీవ్రత
    గాజు పొడి, లోహపు పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని, గొంతును కోసేంత పదునుగా ఉంటాయి.
    ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.
    నిషేధం ఉన్నప్పటికీ: మార్కెట్లో మాంజా సులభంగా లభిస్తోంది. పోలీసులు అరెస్టులు చేసినా, వినియోగం తగ్గడం లేదు

  • కాకినాడ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోళ్ల పందాల జోరు ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో కోడి పందాలు ప్రారంభమయయాయి. ఏడు నియోజకవర్గాలక గాను 60కి పైగా పందెం బరులు ఏర్పాటు చేశారు. 

    బరిలో కాలుదువ్వుతున్న కోళ్లపై భారీగా పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పందాలను తిలకించేందుకు బరుల వద్దకు తరలివస్తున్నార పందెం రాయుళ్లు.  ఆ ప్రాంగంణాల్లోనే విచ్చలవిడిగా గూండాట జూదాలు కొనసాగుతున్నాయి. 
     

     

  • సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

    చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. 

    ఏడాది గడిచినా.. 
    గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది.  ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. 

    Naravaripalli : చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం

    గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్‌, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్‌ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

  • ప్రకాశం జిల్లా: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గలాటా జరగటంతో బస్సు డ్రైవర్‌ మహిళలను పోలీస్‌స్టేషన్‌ సమీపంలో దింపి వెళ్లిపోగా ఎస్సై మహిళల మధ్య సర్దుబాటు చేసి వేరే బస్సుల్లో పంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి సింగరాయకొండలో జరిగింది. 

    స్థానికుల కథనం మేరకు కావలి, రామాయపట్నం ప్రాంతాలకు చెందిన మహిళలు సింగరాయకొండ లోని బంధువుల ఇళ్లకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఒంగోలు–కావలి బస్సులో వెళుతుండగా సీటు విషయమై మహిళల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.  ఈ క్రమంలో ఒక మహిళ అసభ్యంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సుమారు 10 మంది వరకు మహిళలను దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

    ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బి.మహేంద్ర హుటాహుటిన మహిళల వద్దకు వచ్చి వారిని శాంతపరచి వీరిని వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఉచిత బస్సుల వల్లే ఈ ఘటనలు ఎక్కువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.  

Business

  • మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఎంక్యూ-4సీ ట్రైటాన్

    జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.

    సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్‌ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్‌కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఇరాన్‌లో కల్లోలం - ట్రంప్ హెచ్చరిక

    ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.

    తిరిగి వస్తున్న యుద్ధనౌకలు

    గత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్‌.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్‌లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్‌కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్‌ కీలక ఆవిష్కరణ

  • దేశంలో అంటువ్యాధుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, ప్రాణాంతక ‘యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్’(ఏంఎఆర్‌) ముప్పును తగ్గించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సంచలనాత్మక అడుగు వేసింది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే రోగుల్లో ఒకేసారి అనేక రకాల ఇన్ఫెక్షన్లను గుర్తించగలిగే ‘మల్టీప్లెక్స్ మాలిక్యులర్ డయాగ్నొస్టిక్’ పరీక్షను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

    సాధారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ, టైఫాయిడ్, ఇన్‌ఫ్లుయెంజా లేదా కొవిడ్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు ఒక్కో వ్యాధికి విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక నివేదిక నెగటివ్ వస్తేనే మరో పరీక్షకు వెళ్లే ఈ దశల వారీ విధానం వల్ల కొన్ని సమస్యలున్నాయి. ఈ విధానం ద్వారా వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకేసారి బహుళ వ్యాధికారక క్రిములను (Pathogens) గుర్తించే సింగిల్-టెస్ట్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ప్రణాళిక రూపొందించింది.

    యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి అడ్డుకట్ట

    వ్యాధి ఏంటో స్పష్టంగా తెలియనప్పుడు వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్’ వాడుతుంటారు. దీనిపై ఎయిమ్స్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హితేందర్ గౌతమ్ స్పందిస్తూ.. ‘కచ్చితమైన నివేదిక లేకుండా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో సూక్ష్మజీవుల నిరోధక శక్తి పెరుగుతుంది’ అని హెచ్చరించారు. ఐసీఎంఆర్ ఏఎంఆర్‌ఎస్‌ఎన్‌ 2024 నివేదిక ప్రకారం, ప్రస్తుతం వాడుకలో ఉన్న అనేక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై ప్రభావం కోల్పోతున్నాయని తేలింది. కొత్త మల్టీప్లెక్స్ పరీక్షల వల్ల కచ్చితమైన చికిత్స త్వరగా మొదలై ఈ ముప్పు తగ్గుతుంది.

    సింగిల్‌ టెస్ట్‌కు సంబంధించిన కీలక అంశాలు

    • రోగి లక్షణాల ఆధారంగా ఒకే టెస్ట్‌లో అన్ని అనుమానిత ఇన్ఫెక్షన్లను పరీక్షించడం.

    • ఈ డయాగ్నొస్టిక్ కిట్లను అభివృద్ధి చేయడానికి భారతీయ తయారీదారులు, పరిశోధన సంస్థలకు ఐసీఎంఆర్ మద్దతు ఇస్తుంది.

    • ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

    కొవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వేగవంతమైన నిర్ధారణ పరీక్షలు దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పుగా నిలవనున్నాయి.

    ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం

  • దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.

    ‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్‌) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.

    కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావన

    సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.

    రాష్ట్రాలకు, ఎన్‌సీపీసీఆర్‌కు ఆదేశాలు

    విద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

    ‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టు

    సంప్రదింపులు

    ఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.

    రిపోర్టింగ్, పర్యవేక్షణ

    ఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం

  • అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.

    భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులు

    అధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.

    ఎగుమతులు-దిగుమతులు

    భారత్ నుంచి ఇరాన్‌కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్‌వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.

    ట్రంప్ హెచ్చరిక - భారత్‌పై ప్రభావం

    ట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.

    • భారత్ ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.

    • ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.

    సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవు

    భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్‌కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

    చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బ

    అమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు

Family

  • సాధారణంగా మనమంతా నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశగా భావిస్తాం. అయితే ఇదే అంశంపై అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు  కనుగొన్న ఒక నూతన ఆవిష్కరణ ఇప్పుడు ‍ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఒక రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు.

    రక్త పరీక్షలు, ఎక్స్‌-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా  మాదిరిగా అనిపించినప్పటికీ, శాస్త్రవేత్తలు తమ నవ్య ఆవిష్కరణలో దీనిని నిజం చేసి చూపారు. స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు తాజాగా ‘స్లీప్‌ఎఫ్‌ఎం’ (SleepFM) అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను, శ్వాస, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.

    ‘స్లీప్‌ఎఫ్‌ఎం’నకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర  శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది. తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది.

    సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్‌ను రూపొందించారు. ఈ స్లీప్‌ఎఫ్‌ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను  ఈ మోడల్‌ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులను 85 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే, ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75 శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

    మన శరీరం లోపల వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే చాలామంది తీవ్రమైన  అనారోగ్య సమస్య వచ్చేవరకూ  వైద్యుడిని సంప్రదించరు. అయితే స్లీప్‌ఎఫ్‌ఎం  పరికరం అందుబాటులో ఉంటే, ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే  గుర్తించి, అప్రమత్తం కావచ్చు. భవిష్యత్తులో మన స్మార్ట్‌వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు  మన నిద్రను విశ్లేషించి.. ‘మీ ఆరోగ్యం సరిగా లేదు.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప విప్లవానికి నాంది కానుంది.

    ఇది కూడా చదవండి: ‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం..