Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ జనవరి 19న భారత్‌లో అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

    ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహార భద్రత, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

    భారత్–యూఏఈ మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం, పరస్పర పెట్టుబడులు, వాణిజ్య మార్పిడిలో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటోంది.

    గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఇది షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఐదో అధికారిక పర్యటన కాగా, అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత మూడోసారి భారత్‌కు రానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.

  • దుబాయ్: రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఎయిర్ ట్యాక్సీ సేవను ఈ ఏడాది చివరి నాటికి దుబాయ్‌లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 45 నిమిషాలు పట్టే ప్రయాణాలు, ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే పూర్తవుతాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.

    ఈ ట్యాక్సీ సర్వీస్‌ పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు దుబాయ్‌  నగరంలో వేగవంతమైన, సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్ సంస్థ రూపొందించిన జోబీ ఎస్-4 ఎలక్ట్రిక్ విమానాన్ని ఈ సర్వీస్‌లో ఉపయోగించనున్నారు. పైలట్‌తో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఇది గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

    మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరాలోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్ సమీప ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) చైర్మన్ మత్తర్ అల్ తయర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.

    పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఎయిర్ ట్యాక్సీలు కావడంతో శబ్ద, పర్యావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రయాణికులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్ ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ ప్రజా రవాణా నెట్‌వర్క్‌తో ఈ సేవలను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఎయిర్‌ ట్యాక్సీ ఛార్జీలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

  • బెల్జియం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలింది. గ్రీన్‌లాండ్‌ దక్కించునేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా.. అందుకు ఒప్పుకోని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. అయితే, ఈక్రమంలో ట్రంప్‌ బెదిరింపులకు తాము తలొగ్గబోమని, అవసరమైతే అమెరికాతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకుంటామంటూ యూరోపియన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేసింది. అంతేకాదు, తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కంపెనీలపై సుంకాల పేరుతో ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

    గత ఏడాది జూలైలో అమెరికా-యూరోపియన్‌ యూనియన్‌ దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ట్రంప్ తాజా బెదిరింపులు ఈ ఒప్పంద భవిష్యత్తుపై ఆందోళనలను రేకెత్తించాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రీన్‌లాండ్‌ కొనుగోలుకు ఒప్పుకోని డెన్మార్క్‌తో సహా ఎనిమిది దేశాలపై 10శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ ఒప్పుకోకపోతే, జూన్ నుంచి ఈ సుంకం 25 శాతం వరకు పెరుగుతుందన్నారు. గ్రీన్‌లాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకం. చైనా, రష్యా ఈ ప్రాంతంలో ఆధిపత్యం పెంచుతున్నందున గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడం అమెరికాకు అవసరమని ట్రంప్‌ పేర్కొన్నారు.

    ఈ క్రమంలో డెన్మార్క్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఈయూ నాయకులు సైతం సోషల్ మీడియా వేదికగా..‘అమెరికా బెదిరింపులకు తలొగ్గం. అవసరమైతే ఒప్పందాలను రద్దు చేస్తాం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో యూరప్‌లో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలపై జరిమానాలు, నిషేధాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇది గూగుల్, మెటా, ఎక్స్ వంటి టెక్ దిగ్గజాలకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ట్రంప్ సైనిక చర్య తీసుకోవచ్చనే భయంతో జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్ గ్రీన్‌లాండ్‌లో దళాలను మోహరించాయి. డెన్మార్క్ కూడా తన సైనిక ఉనికిని పెంచుకుంది. ట్రంప్ సైనిక చర్య తీసుకుంటే నాటో కూటమి కూలిపోతుంది. ఈ పరిస్థితి ట్రాన్స్ అట్లాంటిక్ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

    గ్రీన్‌లాండ్ వివాదం అమెరికా-ఈయూ సంబంధాలను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. ట్రంప్ సుంకాల బెదిరింపులు, ఈయూ ప్రతిస్పందన, సైనిక ఉద్రిక్తత అన్నీ కలిపి ఇరు దేశాల వాణిజ్య ఒప్పంద భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగంలో ప్రధాన చర్చగా మారనుంది. 

  • ఇస్లామాబాద్‌: సర్భ్‌జిత్ కౌర్ అనే మహిళ సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే ఒక పాకిస్థానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆ మహిళ పేరుతో వచ్చిన ఓ ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా ఆమ్నీపూర్ గ్రామానికి చెందిన సర్బ్‌జిత్ కౌర్.. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి గతేడాది నవంబర్‌లో వాఘబార్డర్‌ మీదుగా  పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఆ తీర్థయాత్రకోసం దాదాపు 2 వేల మంది భక్తులు పాకిస్థాన్‌ వెళ్లగా అందరూ తిరిగి వచ్చారు. అయితే సర్బ్‌జిత్ రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించగా వారు విచారించారు. అప్పుడు ఆమె అక్కడే నశీర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని తెలిసింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. తాజాగా ఇప్పుడు ఆమె పేరుతో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది.

    అందులో  అక్కడ తాను అస్సలు బాగాలేనని తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం తనను చిత్రహింసలకు గురిచేస్తోందని  అన్నట్లు ఉంది. దయచేసి తనను తిరిగి ఇండియా తీసుకెళ్లాలని తన భారత్‌లో ఎటువంటి హాని చేయనని ఆమె అందులో అన్నారు. తన పిల్లలను చూడాలని ఉందని ఎంతోమందికి లక్షల రుపాయలు దానంగా ఇచ్చిన తను ఇప్పుడు డబ్బుల కోసం వేడుకోవాల్సి వస్తోందని ఆడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఆడియో క్లిప్‌ సర్బ్‌జిత్‌ కౌర్‌కు చెందిందా కాదా  అనే విషయం పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.

    అయితే సర్బ్‌జిత్ కౌర్ వివాహం అనంతరం అక్కడి పోలీసులు వారిపై దాడి చేసి పెళ్లిని రద్దు చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన లాహెర్ కోర్టు సర్భ్‌జిత్‌ని అక్కడి ప్రభుత్వ వసతి గృహానికి తరలించినట్లు అక్కడి తెలిపారు. అయితే  కౌర్‌ను ఇది వరకే పాకిస్థాన్‌ నుంచి పంపించాలని ప్రయత్నించగా వాఘా బార్డర్ మూసివేయడంతో అది సాధ్యపడలేదని  అక్కడి అధికారులు అన్నారు.

  • ప్రస్తుతం పాకిస్తాన్‌- అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అవ్వడం పలుమార్లు ఆ దేశానికి మద్దతుగా మాట్లాడడం జరిగింది. దీంతో భారత్‌ యూఎస్‌తో కొంత డిస్టెన్స్ పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా రిపబ్లికన్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఇండియాతోనే స్నేహం బాగుంటుందని అక్కడి నుండే భారత్‌కు సంపద,శాంతి లభించాయన్నారు.
     

    భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ రిపబ్లికన్ పార్టీ ఎంపీ మెక్‌ కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాకు పాకిస్థాన్‌తో కంటే భారత్‌తోనే రిలేషన్ బాగుంటుందన్నారు. అమెరికాకు పెట్టుబడులు వచ్చేవి భారత్‌ నుంచి తప్ప.. పాక్‌ నుంచి కాదని 'సెంటర్ ఫర్ స్ట్రాటజీస్అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    భారతదేశంలో అత్యధిక ప్రజలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని ప్రపంచంలోని మిడిల్‌ క్లాస్ మార్కెట్‌ని భారత్ డామినేట్ చేస్తుందని తెలిపారు. ఇండియాలోని ప్రతిభావంతులైన యువత అమెరికాకు వచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారని మెక్‌ కార్మిక్ అన్నారు. అయితే ఇటీవల భారత్‌లోని యుఎస్ రాయబారి సైతం భారత్‌కు అనుకూలంగా మాట్లాడారు.

    అమెరికాకు భారత్‌ తర్వాతే మరే దేశమైనా అని అన్నారు.కాగా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధిస్తోంది.దీంతో ఎగుమతులు మందగించి దేశంలో చాలామంది ఉపాధి కోల్పోయారు.

  • ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో మరో హిందువు దారుణ హత్య చోటుచేసుకుంది. తన దుకాణంలోని ఉద్యోగికి.. కస్టమర్లకు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక హిందూ వ్యాపారిని దుండగులు కొట్టి చంపారు. ఈ హత్య అక్కడి మైనారిటీ వర్గాలలో తీవ్ర భయాందోళనలను నింపింది. మృతుడిని 55 ఏళ్ల లిటన్ చంద్ర ఘోష్‌గా గుర్తించారు. ఇతను వైశాఖి పేరుతో స్థానికంగా  ఓ స్వీట్ షాపును నడుపుతున్నాడు.

    పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లిటన్ దుకాణంలో పనిచేసే అనంత దాస్ అనే ఉద్యోగికి.. ఒక కస్టమర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, తన సిబ్బందిని రక్షించేందుకు యజమాని లిటన్ జోక్యం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు లిటన్‌పై తిరగబడ్డారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మొదట  లిటన్‌పై పిడిగుద్దులతో దాడి చేసిన దుండగులు, అనంతరం ఒక పారతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లిటన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

    సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కలిగంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ ఎండి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రిపన్ సాహా (30) అనే హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపిన ఘటన మరువక ముందే ఈ దారుణం  చోటుచేసుకుంది. 

    ఇది కూడా చదవండి: బాంబు బెదిరింపు.. ‘ఇండిగో’ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

  • డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ‍ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు  తెలుస్తోంది.

    ట్రంప్‌కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ  అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే  ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే  ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు.  అంతేకాకుండా  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.

    ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం త‍ప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

    అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్‌లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే  అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్‌హౌస్‌ తెలిపింది.
     

Movies

  • పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్‌ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్‌తో పాటు ఈద్ పండుగ సీజన్‌కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.  

    ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సీజన్‌పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్‌లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.  

    ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్‌ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్‌లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్‌గా నిలిచే అవకాశం ఉంది.  

  • ఇటీవల కొద్దికాలంగా మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సార్లు వీరిద్దరు ఈవెంట్స్‌లో కనిపించడంతో త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వార్తలొచ్చాయి. వచ్చేనెల ఫిబ్రవరిలోనే వీరి పెళ్లి అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు.

    అయితే తనపై పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ సీతారామం బ్యూటీ ఫుల్‌గా చిల్ అవుతోంది. వీటిని అస్సలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె సన్నిహితుల్లో ప్రస్తుతం ఆమైపై వస్తున్న పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇలాంటి సమయంలో  ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మృణాల్‌ సముద్రంలో విహరిస్తూ చిల్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    కాగా.. గతేడాది మృణాల్, ధనుశ్‌లపై ఆగస్టు 2025లో మొదటిసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఆ సమయంలో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో వారిద్దరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడం.. అంతకు ముందు, మృణాల్ ధనుశ్ ప్రాజెక్ట్ 'తేరే ఇష్క్ మే' ముగింపు పార్టీలో కనిపించడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఊహగానాలు మొదలయ్యాయి. 
     

     

  • గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్‌ బాగా ఉపయోగపడుతోంది. సడన్‌గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్‌ చేస్తున్నారు. అలా బిగ్‌బాస్‌ బ్యూటీ పై ఫోటో షేర్‌ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

    2016 నాటి మెమొరీస్‌
    బుల్లితెర నటి ప్రియాంక జైన్‌.. ఓవైపు మోడ్రన్‌ డ్రెస్‌లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్‌. జానకి కలగనలేదు సీరియల్‌తో మరింత పాపులరైంది.

    ప్రియుడితో..
    తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొనగా టాప్‌ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్‌ సహనటుడు శివకుమార్‌తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్‌లో వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

     

  • టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరిస్తోంది. తెలుగులో పలు బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా బాహుబలి-2 మూవీ రోజులను గుర్తు చేసుకుంది.

    బాహుబలి-2 కోసం గుర్రపు స్వారీ తరగతులను మరోసారి గుర్తు చేసుకుంది. ఈ మూవీ కోసం తాను చేసిన సాధనతో పాటు తల్లిదండ్రులతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తన హెయిర్ కట్ ఆ రోజుల్లో చాలా బాగుండేదని తెలిపింది. అంతేకాకుండా చివర్లో బాహుబలి ప్రమోషన్ల సమయంలో దిగిన ఫోటోషూట్ అంటూ బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించింది.

    కాగా.. గతేడాది ఓదెల -2తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తమన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. హిందీలో రోమియో, రేంజర్‌ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. 
     

     

  • ఈ సంక్రాంతి థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు.. కామెడీ నుంచి హారర్‌ వరకు ఇలా అన్నీ కలగలిపిన సినిమాలు రావడంతో ప్రేక్షకులు పోలోమని థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు దాదాపు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా ఉంది. 

    ఆరనీకుమా ఈ దీపం సాంగ్‌
    ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్‌ను వాడేశారు. కానీ సినిమా రిలీజయ్యేవరకు కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. తీరా థియేటర్లలో ఈ పాట రాగానే జనాలు సర్‌ప్రైజ్‌ అయ్యారు. స్క్రీన్‌పై రవితేజ మాస్‌ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేస్తున్నారు. అలా సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్‌ సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. పబ్‌లో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌తో మాస్‌ మహారాజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి..

    సినిమా
    సినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా నటించగా ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్‌వీఎల్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.

     

    చదవండి: అప్పుడు దేవుడిపైనే నమ్మకం పోయింది.. అరుణాచలం వెళ్లాక: రీతూ

  • ‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్‌, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్‌, ఎలివేషన్‌ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్‌ తేల్చేశారు.

    కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్‌ టాక్‌  వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.

    ముందుగా హిట్‌ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్‌ షోతోనే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్‌’. ఈ నెల 12న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.

    ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్‌  థియేటర్స్‌కి తరలి వెళ్తున్నారు.

    చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్‌ హిట్‌ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్‌ హీరో ఉంటేనే థియేటర్స్‌కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్‌’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్‌ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్‌ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్‌ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్‌లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు. 

    అయితే ప్రతిసారి యాక్షన్‌ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది.  ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్‌తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది. 

  • బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. రీతూ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా చాలా జరిగాయి. అటు హౌస్‌లో ఫైర్‌ స్ట్రామ్స్‌ (వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లు) వచ్చి రీతూ బ్యాడ్‌ అనేవారు. పవన్‌ను వాడుకుంటోంది అన్నట్లుగా కామెంట్స్‌ చేశారు. ఎందుకిలా అంటున్నారని నాకు చాలా బాధసింది. మరోపక్క బయట (హీరో ధర్మ మహేశ్‌తో సంబంధం అంటగడుతూ) నన్ను మరింత దారుణంగా చిత్రీకరించారు. 

    అదొక్కటే సంతృప్తి
    ఇవన్నీ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలిమినేట్‌ అయి నేను బయటకు వచ్చేస్తే బాగుండనుకుంది. నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా తోటి ఆర్టిస్టులెవరూ నాకు సపోర్ట్‌ చేయలేదు. నాకు ఓటు వేయమని అమ్మ ఫోన్‌ చేసి అడిగితే కూడా మీడియాలో రీతూ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అని వస్తోందని కామెంట్‌ చేశారంట. నన్ను ఇంత చెడ్డదానిలా చిత్రీకరించినా, నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి ఓట్లేశారు. నన్ను నన్నుగా ప్రేమించారు. ఆ విషయంలో సంతోషంగా అనిపించింది.

    డబ్బు లేకపోయినా పర్లేదు
    నాకు కాబోయేవాడి విషయానికి వస్తే.. అందం గురించి పట్టించుకోను. అర్థం చేసుకుంటే చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాంట్లో మంచిగా చూసుకోవాలి. నేను హైపర్‌ యాక్టివ్‌ కాబట్టి తనకు ఓపిక, సహనం ఎక్కువుండాలి. ప్రతి అమ్మాయిని గౌరవించాలి. పెళ్లయ్యాక ఎవరూ పని మానేయకూడదు. ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. అలాగే మా అమ్మ, అన్నను బాగా చూసుకోవాలి అని చెప్పింది.

    దేవుడిపై నమ్మకం
    చిన్నప్పుడు నేను సాయిబాబాను ఎక్కువ నమ్మేదాన్ని. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక బిజినెస్‌ కోసం నాన్న ఉన్న డబ్బంతా ఒకతడి చేతిలో పెట్టాడు. అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాకు మొక్కాను. ఉపవాసాలున్నాను. అయినా ఆ డబ్బు తిరిగి రాలేదు. నాన్న ఏం చేసుకుంటాడో అని భయమేసింది. బాబాకు మొక్కినా ఫలితం లేకపోయేసరికి ఆయనపై నమ్మకం పోయింది. నాన్న చనిపోయాక అసలు భగవంతుడిని నమ్మడమే మానేశాను. అదేంటో కానీ కొంతకాలం క్రితం సడన్‌గా నా నోటి నుంచి ఓం నమఃశివాయ అనే మంత్రాలు వచ్చేవి. దాంతో జీవితంలో మొదటిసారి అరుణాచలం వెళ్లాను. 

    నావల్ల కాదు
    అక్కడి వెళ్లాక నా ఆలోచన విధానమే మారిపోయింది. జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. నేను, మా అమ్మ, అన్న ఎప్పుడూ కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఏదైనా చెడు జరిగితే నాకే జరగాలి కానీ, వాళ్లకేదీ జరగకూడదు. ఎందుకంటే నాన్నను కోల్పోవడమే నాకు తీరని లోటు.. మళ్లీ ఉన్నవాళ్లను దూరం చేసుకుని ఒక్కదాన్ని బతకడం నా వల్ల కాదు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం, ఇల్లు కొనడం, సక్సెస్‌ అవడం, కారులో తిరగడం.. ఇవన్నీ నాన్న కోరికలు. అవన్నీ నెరవేరే సమయంలో నాన్న లేడన్న బాధ ఉంది అని చెప్పుకొచ్చింది.

  • బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్‌ ఇటీవలే దురంధర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా మూవీతో అలరించేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.   ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

    ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్‌ అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. టాలీవుడ్‌ మీ ఫేవరేట్ హీరో అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్‌ ఆసక్తికరమైన పేరు చెప్పింది. తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

    కాగా.. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా చిత్రంలో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటింటారు. ఈ సినిమాకు నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించారు. డ్రగ్స్‌ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.

     

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్‌ ట్రిప్‌లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్‌తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్‌సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

    ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్‌ వచ్చేసింది. అల్లు అర్జున్‌ తన నెక్స్ట్‌ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌తో చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.   మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.    

     

     

  • రెండేళ్ల క్రితం చావును దగ్గరి నుంచి చూశానంటోంది మలయాళ నటి, దర్శకురాలు, యాంకర్‌ రంజిని మీనన్‌. లైఫ్‌ సజావుగా సాగుతున్న సమయంలో స్ట్రోక్‌ వచ్చిందంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 2024 నవంబర్‌ 18.. ఎర్నాకుళంలోని టీడీఎమ్‌ హాల్‌లో నేను మాట్లాడాల్సి ఉంది. అయితే స్పీచ్‌ ఇవ్వడానికి వెళ్లేముందు నా భర్త రాజగోపాల్‌తో కలిసి కాఫీ తాగాలనుకున్నాను. 

    మూతి వంకర
    కానీ కాఫీ తాగుతుంటే కిందపడుతోంది. నా మాటలు కూడా వంకరపోతున్నాయి. అది చూసి నా కొడుకు ఆటపట్టిస్తుంటే లైట్‌ తీసుకున్నాను. నా భర్త నన్ను గమనించి హాస్పిటల్‌కు వెళ్దామన్నాడు. లేదు, ఈవెంట్‌కు అర్జంట్‌గా వెళ్లాలని చెప్పాను. ఫోన్‌లో టైప్‌ చేయడానికి కూడా నా శరీరం సహకరించలేదు. తీరా హాల్‌కు వెళ్లేసరికి నా పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. 

    బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు
    నా మాట పూర్తిగా మారిపోయింది. అది గమనించి చక్కెర కలిపిన నీళ్లు ఇచ్చారు. అది తాగగానే హఠాత్తుగా కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లగా నాకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు గుండెపోటు వచ్చిందన్నారు. నా మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టింది. దానివల్ల కుడివైపు శరీరం బలహీనంగా మారిపోయింది. కొన్ని జ్ఞాపకాలు చెదిరిపోయాయి. ఇక అవే నా చివరి క్షణాలనుకున్నాను. ఐసీయూలో కొన్నిరోజులపాటు ఉంచారు. ఐసీయూలో ఒక్కరోజు ఉన్నా సరే అది మనకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది.

    మళ్లీ నడక నేర్చుకున్నా..
    నాకు జ్ఞాపకశక్తి ఉందా? కోల్పోయానా? అని తెలుసుకునేందుకు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివేవాన్ని. నాలుగురోజులకు నన్ను డిశ్చార్జ్‌ చేశారు. ఐదో రోజు వీల్‌చైర్‌లోనే టీడీఎమ్‌ హాల్‌కు వెళ్లాను. తర్వాత ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. అక్కడే మళ్లీ నడక నేర్చుకున్నాను. మామూలు మనిషినయ్యాను. మన గురించి మనం పట్టించుకోకుండా పరుగులు పెట్టడం ఎంత తప్పో అప్పుడు నాకర్థమైంది అని రంజిని చెప్పుకొచ్చింది.

    చదవండి: నన్ను తిడుతూ సినిమా మధ్యలో వెళ్లిపోతారు: గుణశేఖర్‌

  • బాలీవుడ్‌ ఐటమ్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న బ్యూటీ నోరా ఫతేహీ. పలు సూపర్ హిట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో అభిమానులను మెప్పించింది. తన గ్లామర్‌తో బాలీవుడ్‌ సినీ ప్రియులను అలరించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ  కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్, తమిళ చిత్రం కాంచన 4లో కనిపించనుంది.

    అయితే సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. ఇటీవల నోరాపై రూమర్స్‌ తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ టి సిరీస్ ఛైర్మన్‌, ఎండీ భూషణ్‌ కుమార్‌తో రిలేషన్‌పై ఉన్నారని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నోరా స్పందించింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ రెడ్డిట్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. తనపై వచ్చిన వీడియోను చూసి వావ్ అంటూ స్మైలీ ఎమోజీని జోడించింది. దీంతో నోరా ఫతేహీ టాపిక్‌ బాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారిపోయింది.

    కాగా.. 2005లో నటి దివ్య ఖోస్లాను భూషణ్ కుమార్‌ వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో ఒక కొడుకు జన్మించారు. అయితే తనపై వస్తున్న రూమర్స్‌పై భూషణ్ కుమార్ మాత్రం స్పందించలేదు. నోరా ఫతేహి వ్యక్తిగత జీవితం గురించి కొత్త కొత్త ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. గతంలో మొరాకో ఫుట్‌బాల్ క్రీడాకారుడు అచ్రాఫ్ హకీమి రిలేషన్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.
     

  • టాలీవుడ్ నటుడు బాబు మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్వర్గీయ ఎన్టీఆర్‌కు సమాధికి నివాళువలర్పించేందుకు వెళ్లగా.. ఈ సంఘటన జరిగింది. కొందరు ఎన్టీఆర్‌ అభిమానులు బాబు మోహన్‌ను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    గేట్లు మూసివేశారంటూ బాబు మోహన్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఫైరయ్యారు. వారితో కాసేపు బాబు మోహన్ కూడా వాదించారు. చివరికీ గొడవ సద్దుమణగడంతో ఎక్కడివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాబు మోహన్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు సైతం స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనను తలచుకున్నారు. 

     

     

  • కోలీవుడ్‌ యంగ్‌ స్టార్స్‌ అశ్విన్‌, శ్రీతు కృష్ణన్‌, గురు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్’. జస్విని దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌  డిసెంబర్‌ 5 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్‌ చొప్పున ఇప్పటి వరకు మొత్తం 20 ఎపిసోడ్స్‌ రిలీజ్‌ అయ్యాయి. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' పరిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతాయి. అదే సయమంలో ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రి మారన్ (అశ్విన్) వస్తాడు. దీంతో పోలీసులంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటారు.వారిలో కానిస్టేబుల్‌ మాసాని(పదినే కుమార్‌) కూడా ఉంటుంది. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి.  ఆ ఊరిలో మూడు హత్యలు జరుగుతాయని మాసానికి తెలుస్తుంది. ఈ విషయాన్ని తోటి పోలీసులకు చెప్పడంతో అలర్ట్‌ అవుతారు. అయినప్పటికీ.. ఊర్లో మూడు హత్యలు జరుగుతాయి. వారిలో 'ఉమాపతి' కూతురు 'సంధ్య' కూడా ఉంటుంది. ఈ కేసుని సాల్వ్‌ చేసేందుకు కొత్తగా వచ్చిన పోలీసు ఆఫీసర్‌ వెట్రి మారన్‌ రంగంలోకి దిగుతాడు. ఈ మూడు హత్యలు ఎలా జరిగాయి? హత్యల వెనుక ఉన్నదెవరు? ధూల్ పేట్ లో ఏం జరుగుతుంది? అనేదే తెలియాలంటే ‘ఆహా’లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్‌ చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.
    ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.  ఒకేరాత్రి జరిగిన మూడు హత్యలను ఇద్దరు పోలీసు అధికారులు ఎలా ఛేదించారనేదే ఈ సిరీస్‌ కథ. పగ, ప్రతీకారాల చుట్టూ కథనం తిరుగుంది. ధూల్‌ పేట్‌లోని రౌడీ రాజకీయాలకు పోలీస్‌ స్టేషన్‌తో ముడిపెడుతూ.. అత్యంత ఆసక్తికరంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు జస్విని. ఒకవైపు ఊర్లోని రౌడీ రాజకీయాలు, పాత పగలను చూపిస్తూనే..పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ని ఆసక్తికరంగా మలిచారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం పోలీసులకు ఎంత కష్టమో అనేది ఈ సిరీస్‌లో చక్కగా ఆవిష్కరించారు. 

    సిరీస్ ప్రారంభం నుంచే ప్రతి ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచేలా కథను నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.  మొదటి ఎపిసోడ్‌లోనే మూడు హత్యల గురించి చెప్పి.. సిరీస్‌పై ఆసక్తిని పెంచేశారు. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ హిందీ ఫేమస్‌ సీరియస్‌ ‘సీఐడీ’ తరహాలో ఆసక్తికరంగా సాగుతుంది.  మొదటి ఐదు ఎపిసోడ్స్‌లోనే ప్రధాన కథంతా చెప్పేశారు. ఇక ఆరో ఎపిసోడ్‌ నుంచి ఇన్వెస్టిగేషన్‌ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తం 20 ఎపిసోడ్స్‌  ఉన్నప్పటికీ.. కథనం ఆసక్తికరంగా సాగడంతో ఎక్కడ బోర్‌ కొట్టిన ఫీలింగ్‌ కలగదు.  అయితే  ఈ సిరీస్‌కి సీక్వెల్‌ కూడా ఉంది. మొదటి కేసు సాల్వ్‌ అయినట్లు ఇందులో చూపించి.. చివరిలో రెండో కేసు కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. మొత్తం 50 ఎపిసోడ్స్‌లో ఈ సిరీస్‌ తెరకెక్కించారట.  20 ఎపిసోడ్స్‌తో మొదటి కేసు పూర్తయింది. ఇప్పుడు రెండో కేసు ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. అదెలా ఉంటుంటో చూడాలి. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ ఇష్టపడేవారికి ఈ సిరీస్‌ నచ్చుతుంది. 

    ఎవరెలా చేశారంటే..
    పోలీస్‌ ఆఫీసర్లుగా అశ్విన్‌, గురు లక్ష్మణన్‌ చక్కగా నటించారు. ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌లో లక్ష్మణన్‌ పండించే వినోదం నవ్వులు పూయిస్తుంది. సీరియస్‌ అండ్‌ సిన్సియర్‌ పోలీసు ఆఫీసర్‌గా ఆశ్విన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక అమ్మవారు భక్తురాలైన కానిస్టేబుల్‌ మాసాని పాత్రలో పదినే కుమార్‌ ఒదిగిపోయింది. శ్రీతు కృష్ణన్‌, ప్రీతి శర్మతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ వెబ్‌ సిరీస్‌ బాగుంది. అశ్వత్ నేపథ్య సంగీతం సిరీస్‌ స్థాయిని పెంచేసింది. సతీశ్ కుమార్ సినిమాటోగ్రఫీ,  సామ్ ఆర్డీఎక్స్ ఎడిటింగ్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

  • భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, సారా అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా (జనవరి 17న) యుఫోరియా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    బోల్డ్‌గా తీశా..
    ఆయన మాట్లాడుతూ.. కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమా తీయడానికి నేనెప్పుడూ వెనుకాడలేదు. యుఫోరియా నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసిన కథ. ఇందులో మూడు ప్రధానాంశాలున్నాయి. అడాలసెన్స్‌, పేరెంటింగ్‌, సోషల్‌ ఇంపాక్ట్‌.. ఈ మూడే కథకు కీలకమైనవి. కథను ఎంత స్ట్రాంగ్‌గా అనుకున్నానో అంతే బోల్డ్‌గా తీశాను. 

    ఆ ప్రమాదం ఉంది!
    కొన్ని సన్నివేశాల్లో నన్ను తిడుతూ అరుస్తారు కూడా! కొందరైతే సినిమా మధ్యలో నుంచే బాయ్‌కాట్‌ చేసి వెళ్లే ప్రమాదముంది. యూత్‌ ఎంతకు దిగజారిపోతున్నారు? సమాజం ఎలా తయారైంది? అన్నది చెప్పాను. మద్యలో కొందరు కోపంతో వెళ్లిపోదామనిపించినా చివరకు ఈ కథ ఇలాగే చెప్పాలి అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు.

     

    చదవండి: కూతురికి అమ్మవారి పేరు పెట్టిన బాలీవుడ్‌ హీరో

  • కోలీవుడ్‌ నటుడు ధ‌నుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’ వివాదంలో చిక్కుకుంది. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో ఈ మూవీ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. నవంబర్‌ 28న మొదట హిందీలో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ చిత్రంపై ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ముంబై కోర్టును ఆశ్రయించింది. ఈ మూవీ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్‌పై నష్టపరిహారం కోసం కోర్టు మెట్లు ఎక్కిందని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.

    ‘తేరే ఇష్క్ మే’ విడుదల సమయంలో 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్‌ అని  ప్రచారం చేశారు. ఇదే వారికి చిక్కులు తెచ్చింది.  ధ‌నుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌ కాంబినేషన్‌లో 'రాంఝణా' (Raanjhanaa) చిత్రాన్ని 2013లో తెరకెక్కించారు. రూ. 35 కోట్ల బడ్జెట్‌తో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది.  బాక్సాఫీస్‌ వద్ద రూ. 105 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో  ఈ చిత్ర యూనిట్‌కు మంచి ఇమేజ్‌ వచ్చింది.  ఈ చిత్రానికి సీక్వెల్‌ అంటూ తేరే ఇష్క్ మే చిత్రాన్ని మేకర్స్‌ పబ్లిసిటీ చేసుకున్నారు. దీనిని ఈరోస్‌ సంస్థ తప్పుబట్టింది. తమ ప్రమేయం లేకుండా సీక్వెల్‌ అని ఎలా ప్రకటిస్తారంటూ ముంబై కోర్టును ఆశ్రయించింది. 'రాంఝణా' సినిమాకు సీక్వెల్‌ అని చెప్పుకుని భారీగా లాభపడ్డారని ఆ సంస్థ పేర్కొంది. 

    ఆనంద్ ఎల్. రాయ్‌ చర్యల వల్ల తమ సినిమా ఇమేజ్‌ దెబ్బతిందని, అందుకు గాను రూ. 84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఈరోస్ కోరింది. 'రాంఝణా' సినిమాకు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ కేవలం దర్శకుడు మాత్రమేనని ఆ మూవీకి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని  ఈరోస్‌ చెప్పింది. తమ ప్రమేయం లేకుండా 'రాంఝణా' చిత్రానికి సీక్వెల్‌ అంటూ ‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని ప్రమోట్‌ చేసుకున్నారని ఆ సంస్థ ఆరోపించింది. మరీ ముఖ్యంగా, తేరే ఇష్క్ మే టీజర్‌లో 'ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్  రాంఝణా, #వరల్డ్ ఆఫ్ రాంఝనా' వంటి హ్యాష్ ట్యాగ్‌లు ఉపయోగించబడ్డాయని ఈరోస్ హైలైట్ చేసింది. ప్రస్తుతానికి, తేరే ఇష్క్ మే నిర్మాతలు  స్పందించలేదు.
     

  • రాజ్‌ తరుణ్, సందీప్‌ మాధవ్‌ హీరోలుగా, సిమ్రత్‌ కౌర్, సట్న టీటస్, ఛాయాదేవి, మానసా రాధాకృష్ణన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రామ్‌ భజరంగ్‌’. సీహెచ్‌ సుధీర్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి సుధీర్, డా. రవి బాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో  నేను డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాను. ప్రేక్షకులకు మా సినిమా నచ్చేలా ఉంటుంది’’ అని తెలిపారు. 

    సందీప్‌ మాధవ్‌ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని సందీప్‌ మాధవ్‌ అన్నారు. ‘‘1980 నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఉన్నాయి’’ అని సీహెచ్‌ సుధీర్‌ రాజు చెప్పారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం కష్టపడి పని చేశారు’’ అన్నారు స్వాతి సుధీర్‌. ‘‘మా సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ΄్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు రవి బాల.   

  • బాలీవుడ్‌ జంట రాజ్‌కుమార్‌ రావు- పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. తమ పెళ్లిరోజు నాడే (నవంబర్‌ 15న) పాప పుట్టడంతో సంతోషంలో మునిగిపోయారు. తాజాగా తమ ఇంట్లోకి సంతోషాల మూటను తీసుకొచ్చిన చిన్నారి చేతి ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పాపకు "పార్వతి పాల్‌ రావు" అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట​! ఇది చూసిన అభిమానులు, సెలబ్రిటీలు పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 

    2021లో పెళ్లి
    రాజ్‌ కుమార్‌ రావు- పాత్రలేఖ ఇద్దరూ సినిమా యాక్టర్సే. 2014లో సిటీలైట్స్‌ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ రానురానూ మరింత బలపడింది. పెద్దలు కూడా వారి ప్రేమాయణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 2021 నవంబర్‌ 15న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. గతేడాది న్యూజిలాండ్‌ ట్రిప్‌లో ఉన్నప్పుడు పాత్రలేఖకు తాను గర్భవతిని అన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే భారత్‌ తిరిగొచ్చేసిది. అయితే బిడ్డ పుట్టాక మళ్లీ న్యూజిలాండ్‌ ట్రిప్‌కు వెళ్లి ఆ ప్రదేశాన్ని మొత్తం చుట్టేస్తానంటోంది.

    సినిమా
    రాజ్‌ కుమార్‌ రావు.. 2010లో సినీ జర్నీ మొదలుపెట్టాడు. రణ్‌, లవ్‌ సెక్స్‌ ఔర్‌ ఢోకా, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌ 2, స్త్రీ. తలాష్‌, లవ్‌ సోనియా, హిట్‌, శ్రీకాంత్‌, భేడియా, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. పాత్రలేఖ విషయానికి వస్తే.. ఈమె లవ్‌ గేమ్స్‌, నానూకీ జాను, బద్నాం గాలి, పూలె వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

     

  • లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌.

    మీలాంటి మనిషిని చూడలే
    ఈ మేరకు కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ షేర్‌ చేసింది. ప్రియమైన ఏర్‌ రెహమాన్‌..  నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. 

    ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి
    నా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

    చీరలో వెళ్లేందుకు నో
    తన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్‌ రెహమాన్‌ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.

    చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్‌ నెంబర్‌ ఎవరిదో తెలుసా?

  • అభినేత్రి శారద పేరు తెలుగు పరిశ్రమలో ఎప్పటికీ చెరిగిపోని పేరు. ఆమె ఒక నట గ్రంథాలయం.   ఆరు పదుల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. ‘కల్యాశుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద..  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించి  ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు.  అయితే, శారద మాత్రం ముందు రచ్చ గెలిచి ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌ రేంజ్‌కు చేరుకున్నారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు   పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది.  

     'జేసీ డానియల్‌ అవార్డు - 2024'కు శారద ఎంపిక 
     తాజాగా కేరళ ప్రభుత్వం శారదను గౌరవించనుంది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినిమా పురస్కారం 'జేసీ డానియల్‌ అవార్డు - 2024'కు ఆమె ఎంపికయ్యారు. జనవరి 25న తిరువనంతపురంలో  కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతుల మీదుగా  ఈ పురస్కారాన్ని శారద అందుకుంటారు.

    ఈ వార్త తెలిసిన వెంటనే శారద స్పందించారు. ఈ అవార్డ్‌కు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తనపై మలయాళ చిత్రసీమతో పాటు అక్కడి ప్రేక్షకులు చూపిన ప్రేమను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోనని ఆమె అన్నారు. మలయాశ ప్రేక్షకులు లేకపోతే తన కెరీర్‌ లేదని పేర్కొన్నారు.  తన సినీ కెరీర్‌ ఆరంభంలో తెలుగులో  కొన్ని చిత్రాల్లో కామెడీ వేషాలు మాత్రమే దక్కాయని,  ఆ పాత్రలు కూడా ఈ అమ్మాయికి సరిగా చేయడం లేదని చాలామంది మేకర్స్‌ అన్నారని గుర్తుచేసుకున్నారు. 

    సినిమా ఛాన్స్‌లు లేని సమయంలో మలయాళంలో ‘శాకుంతల’ అనే సినిమా తనకు ఊపరిపోసిందన్నారు. అలా జాతీయ అవార్డ్‌ అందుకునే రేంజ్‌కు మలయాళ పరిశ్రమ తనను తీసుకెళ్లిందని ఆమె  అన్నారు. మలయాళ ప్రముఖ దర్శక నిర్మాత కుంజాకో తన ప్రతిభను గుర్తించారని ఆయన్ను ఎప్పటికీ మరిచిపోలేనని శారద తెలిపారు. తెలుగులో  అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్‌ చౌదరి, సర్దార్‌ పాపారాయుడు, స్టాలిన్‌, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలు చేసిన సినిమాలు  ఉన్నాయి. 
     

  • గుణశేఖర్‌ దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా నటించిన ‘ఒక్కడు’ సినిమా ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఛార్మినార్‌ సెట్‌ వేయడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక సినిమా రిలీజ్‌ తర్వాత పాటలతో పాటు కొన్ని కామెడీ సీన్ల గురించి బాగా మాట్లాడుకున్నారు.ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సెల్‌ఫోన్‌ సీన్‌ అయితే... ఇప్పుడు చూసినా పడి పడి నవ్వుతాం.

    అందులో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్‌ అయిన ధర్మవరపు సుబ్రహ్మాణ్యం.. కొత్తగా సెల్‌ఫోన్‌ కొని.. ఆ నెంబర్‌ని తన ప్రియురాలికి చెప్పి..ఫోన్‌ చేయమని చెబుతాడు. అదే సమయంలో మహేశ్‌ బాబు గ్యాంగ్‌ పాస్‌ పోర్ట్‌ కోసం అక్కడికి వెళ్తారు. పాస్‌పోర్ట్‌ ఇవ్వకపోవడంతో..బయటకు వచ్చి ఆయనకు ఫోన్‌ చేసి విసిగిస్తారు. ప్రియురాలి ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న ధర్మవరపు.. వరుసగా రాంగ్‌ కాల్స్‌ రావడంతో చిరాకుతో ఫోన్‌ని పగలగొడతాడు. ఈ సీన్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయింది. 

    అయితే ఈ సన్నివేశంలో ధర్మవరపు తనదైన స్టైల్లో చెప్పే 98480 32919 అనే నెంబర్‌ ఎవరిదో తెలుసా? ఆ సినిమా నిర్మాత ఎంఎస్‌ రాజుదట. మహేశ్‌ బాబే ఈ నెంబర్‌ పెట్టమని దర్శకుడికి సూచించాడట. ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖరే ఈ విషయాన్ని  చెప్పాడు.

    ‘ధర్మవరపు సుబ్రహ్మాణ్యం సీన్ కోసం ఓ ఫోన్ నెంబర్ పెట్టాలనుకున్నాం. అప్పుడు మహేశ్‌ బాబు వచ్చి ఎం.ఎస్‌. రాజుగారి నెంబర్‌ పెట్టేయండి అన్నారు. అప్పుడప్పుడు మహేశ్‌ కొంతమందిని ఇలా టీజ్‌ చేస్తుంటాడు. నేను వద్దని చెప్పినా.. ఆయన వినలేదు. ‘మీరు పెట్టేయండి..నేను చూసుకుంటా’ అన్నారు. అప్పుడు రాజుగారు షూటింగ్‌లో లేరు. ఆ నెంబర్‌ ఇచ్చి షూటింగ్‌ ప్రారంభించాం. నార్మల్‌గా కాకుండా పొయెటిక్‌గా చెప్పమని ధర్మవరానికి నేనే చెప్పా. రిలీజ్‌ తర్వాత అది బాగా ట్రెండ్‌ అయింది. కొన్నాళ్ల పాటు రాజుగారికి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. సినిమాలో లడ్డుగాడు మాట్లాడినట్లే..మాట్లాడేవారు. ఫస్ట్‌డే షో పడినప్పటి నుంచే రాజుగారికి ఫోన్లు రావడం మొదలయ్యాయి’ అని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు.

    ఒక్కడు(Okkadu Movie) విషయానికొస్తే.. ఇందులో మహేశ్‌ బాబుకి జోడీగా భూమిక నటించింది. విలన్‌ పాత్రను ప్రకాశ్‌ రాజ్‌ పోషించాడు. 2003 జనవరి 15న రిలీజ్‌ అయిన ఈ చిత్రం..అప్పట్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.  

National

  • బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇవాళ(జనవరి 18, ఆదివారం) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. నిన్న(శనివారం) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

    ఇప్పటివరకు లభించిన ఆరుగురు మృతదేహాలలో నలుగురిని గుర్తించారు. దిలీప్ బెడ్జా (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ), మాడ్వి కోసా, లఖీ మడ్కామ రాధా మెట్టా(పార్టీ మెంబర్)లను గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, 303 రైఫిల్‌, ఇన్సాస్‌, రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    బీజాపూర్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతాల్లో మావోయిస్టు నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం దిలీప్ బెడ్జా, ఇతర సాయుధ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ పట్టిలింగం మాట్లాడుతూ.. బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమం కోసం డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్‌, స్థానిక పోలీసులు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
     

  • ప్రయాగ్‌రాజ్: మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించారు. సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు తన అనుచరులను కూడా అడ్డుకున్నారని శంకరాచార్య అన్నారు. పోలీసులు తన శిష్యులను నెట్టివేసి, దురుసుగా ప్రవర్తించారని.. తన పల్లకిని మధ్యలోనే నిలిపివేశారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈ క్రమంలో సాధువులపై  కూడా దాడులు జరుగుతున్నాయని.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుని వెనక్కి వచ్చానని ఆయన చెప్పారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మౌని అమావాస్య నాడు తాను పుణ్యస్నానం ఆచరించబోనని స్వామి అవిముక్తేశ్వరానంద్ స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

    మౌని అమావాస్య ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మాఘమేళాలో సాధువులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు, చలి వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు సంగం ఘాట్‌కు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.

    యాత్రికుల భద్రత, రద్దీ నియంత్రణకు సంగం ఘాట్ వద్ద భారీ కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సీసీ టీవీ కెమెరాలను, డ్రోన్‌లతో నిరంతర పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం 6గంటల నుంచి దాదాపు యాభై లక్షల మంది భక్తులు వివిధ ఘాట్ల వద్ద పవిత్ర స్నానం చేశారని డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని.. స్నాన ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా సాగుతోందని.. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
     

  • భోపాల్‌:  ఓ భార్య భర్తల కథ. కానీ చిన్న కథ కాదు. భార్యకి తానెప్పటికైనా పోలీస్‌ జాబ్‌ సాధించాలనే కల ఉండేది. చదువు, పెళ్లి ఆమె కలకు అడ్డంకిగా మారాయి. రోజులు గడిచే కొద్దీ తాను అనుకున్నది సాధించలేక పోతున్నానన్న బాధ ఆమెను తొలి చేది. భార్య తీరును గమనించిన భర్త అసలు విషయం ఏంటో అడిగాడు. అందుకు భార్య తాను పోలీస్‌ కావాలని కోరికను బయటపెట్టింది. అంతేనా.. ఇప్పటి నుంచి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టమని ప్రోత్సహించాడు. అనుకున్నట్లు గానే భార్యను ఎస్సైని చేశాడు. కట్‌ చేస్తే… భార్య భర్తకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇంతకీ ఏమైందంటే..

    ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న కేసు వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి పూజారి. అతని భార్యకు పోలీస్‌ అవ్వాలనేది చిన్ననాటి కోరిక. ఆ కోరికను నెరవేర్చేందుకు ఆర్థికంగా, మానసికంగా తోడ్పడ్డాడు. ఆమె పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా మారేందుకు తాను దాచుకున్న పొదుపును ఖర్చు చేశాడు. తన సంప్రదాయ జీవనశైలిని కొనసాగిస్తూ భార్య విజయాన్ని అందించేందుకు సంకల్పించాడు.

    అనుకున్నట్లుగానే భార్య ఎస్సై అయ్యింది. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భార్యలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. భర్త చేస్తున్న వృత్తి, వస్త్రధారణ తనకు నచ్చడం లేదని పలుమార్లు చెప్పింది. భర్త మాత్రం తన రూపాన్ని మార్చుకోనని, సంప్రదాయాన్ని విడిచిపెట్టబోనని ఖరాఖండీగా చెప్పాడు. దీంతో భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమె తన కొత్త సామాజిక స్థితికి భర్త సరిపోడని వాదిస్తోంది. భర్త మాత్రం ‘నేను నా సంప్రదాయాన్ని విడిచిపెట్టను. అదే నా జీవన విధానం’ అని స్పష్టం చేశాడు.

    ఈ సంఘటన భోపాల్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఆకస్మిక జీవనశైలి మార్పులు, సామాజిక స్థితి పెరుగుదల వల్ల ఇలాంటి విభేదాలు వస్తాయని కౌన్సిలర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు భర్త నుంచి భార్యకు విడాకులు ఇచ్చేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. దంపతులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

  • కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.  తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే  మనస్థాపంతో తనువు చాలించాడు.

    గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్‌లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్‌ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్‌స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 

    అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు.  దీపక్ చాలా మంచి వాడని  అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు.    

    అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు.

  • ప్లీజ్‌ హెల్ప్‌ మీ నాన్న… నాకు చావాలని లేదు. నేను నీటితో నిండిన లోయలో పడిపోయాను. నీటిలో మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు, నాన్న…”
    ఈ మాటలు ఆ తండ్రి గుండెను ముక్కలు చేశాయి.
    ఒక యువకుడి కలలు, ఆశలు, భవిష్యత్తు అర్ధాంతరంగా ముగిసిపోయాయి.
    మంచు కమ్ముకున్న రాత్రి, రక్షణా చర్యలు లేని రహదారి, ఊహించని లోయ. ఈ మూడు కలిసి ఓ టెక్కీ జీవితాన్ని క్షణాల్లో ముగించాయి.

    ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన యువరాజ్‌ మొహతా (27) ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం విధులు ముగించుకుని కారులో తన ఇంటికి బయలు దేరాడు. సరిగ్గా నోయిడా సెక్టార్‌ 150 వద్ద  మంచు విపరీతంగా కురుస్తోంది. ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రమాదం అని తెలిపే సంకేతాలు లేవు. రిటైనింగ్‌ వాల్‌ లేదు. సైన్‌ బోర్డులు లేవు. బారికేడ్లు లేవు. ఇతర రక్షణా చర్యలు లేవు. రిఫ్లక‌్షన్స్‌ లేవు. అయినా సరే ఇంటికి సురక్షితంగా వెళ్తున్నామనే ధీమా. సరిగ్గా అలాంటి సమయంలో ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చింది. 

    ఫలితంగా 70 అడుగుల లోతులో యువరాజ్‌ కారు పడిపోయింది. ఎదో ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నానని అర్ధం చేసుకున్న యువరాజు.. ప్లీజ్‌ హెల్ప్ మీ.. ప్లీజ్‌ సేవ్‌ మీ అని కేకలు వేశాడు. లాభం లేకపోయింది. అసలే చిమ్మ చీకటి. ఏం జరిగిందే అర్ధం కాని పరిస్థితి. వెంటనే ఆ టెకీ తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేశాడు. ‘నాన్న, నేను నీటితో నిండిన లోతైన గుంతలో పడిపోయాను. నేను మునిగిపోతున్నాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. నేను చనిపోవాలనుకోవడం లేదు’అని ఆందోళన వ్యక్తం చేశాడు.   

    కొడుకు ఫోన్‌ కా​ల్‌తో హతాశుడైన రాజ్‌ కుమార్‌ మెహతా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రాజ్‌ కుమార్‌ సైతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. సుమారు ఐదుగంటల పాటు శ్రమించి 70 అడుగుల లోతులో పడిన కారును అందులో చిక్కుకున్న యువరాజ్‌ను వెలికి తీశారు.

    కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఊపిరాడక యువరాజ్‌ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కుమారుడి మరణంపై రాజ్‌కుమార్‌ మెహతా ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఎలాంటి ప్రమాదపు హెచ్చరిక బోర్డులు లేనందు వల్లే తన కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనికి మద్దతుగా స్థానికులు సైతం ఆందోళన చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న నోయిడా సెక్టార్‌ 150 వద్ద వార్నింగ్‌ బోర్డుల పెట్టాలని,రిటైనింగ్‌ వాల్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆందోళన మరింత ఉదృతం చేశారు. దీంతో పోలీసులు ఈ దుర్ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. 

  • తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో రేపటి(సోమవారం)తో ఆలయంలోకి దర్శనాలు ముగుస్తున్నాయి. మకరవిళక్కు ఉత్సవం ముగింపు దశకు చేరడంతో రేపు రాత్రి 10 గంటల తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతించరు. రాత్రి సారంకుతికి ఊరేగింపు ఉంటుంది. ఈ సంవత్సరం మకరవిళక్కు యాత్ర సాయంత్రం పూజ తర్వాత గురుతితో ముగుస్తుంది.

    శబరిమల శ్రీ ధర్మశాస్తా  సన్నిధానం రేపు (సోమవారం) వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. రాత్రి 10 గంటలకు జరగనున్న అథాళ పూజ వరకు యాత్రికులకు ప్రార్థనలు చేయడానికి అనుమతి ఉంటుంది. సాయంత్రం 6 గంటలలోపు పంబ చేరుకున్న యాత్రికులను దర్శనం కోసం సన్నిధానం వద్దకు వెళ్లడానికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఆలయాన్ని పవిత్ర ఆభరణాలతో (తిరువాభరణం) అలంకరించిన తర్వాత ప్రత్యేక దర్శనం నిన్న పూర్తయింది. పందలం కుటుంబ ప్రతినిధి పునర్థం నల్ నారాయణన్ వర్మ హాజరైన ఉచ్చ పూజ సందర్భంగా తిరువాభరణాన్ని అలంకరించారు. సాయంత్రం దీపారాధన కూడా తిరువాభరణంతో జరిగింది.

    ఈ పుణ్యకాలం నాటి నెయ్యాభిషేక ఆచారం ఈరోజుతో ముగుస్తుంది. నెయ్యభిషేకం ఉదయం 10 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత, పండళం కుటుంబ ప్రతినిధి సమక్షంలో జరిగే కలభాభిషేకానికి సన్నాహకంగా గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని కడిగి శుభ్రం చేస్తారు. తంత్రి కందరారు మహేష్ మోహనరు నేతృత్వంలో కలభ పూజ, తరువాత కలభాభిషేకం జరుగుతుంది.

    నిన్న సాయంత్రం దీపారాధన తర్వాత , పవిత్ర పడి పూజ జరిగింది. పర్వతారోహణ పూర్తి చేసిన యాత్రికులు సాయంత్రం 5 గంటల నుండి దిగువ ఆలయ ప్రాంగణంలో ఈ ఆచారాన్ని చూడటానికి వేచి ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు  ప్రాంగణం పూర్తిగా రద్దీగా మారింది. పడి పూజ తర్వాత పవిత్ర పద్దెనిమిది మెట్లను ఎక్కడానికి భారీ రద్దీ ఏర్పడింది. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా 30,000 మంది యాత్రికులకు మరియు స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మంది యాత్రికులకు దర్శన అనుమతి మంజూరు చేయబడింది. అయితే , దర్శనం కోసం ఆలయానికి భక్తులు గణనీయంగా పెద్ద సంఖ్యలో రావడంతో రద్దీ పెరిగింది.

    రికార్డు ఆదాయం..
    ఇక, ఈ ఏడాది శబరిమలకు రికార్డు సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 52 లక్షల మంది అయ్యప్ప భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు తెలిసింది. అలాగే, 2026లో శబరిమల యాత్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.435 కోట్లు ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఆలయం ఆదాయం దాదాపు 70-80 కోట్ల వరకు పెరిగినట్టు సమాచారం.

    ఇదిలా ఉండగా.. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వచ్చిన విషయం తెలిసిందే. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. 

  • లక్నో: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు వెళ్తున్న 6ఈ 6650 విమానాన్ని, ముందస్తు జాగ్రత్త చర్యగా దారి మళ్లించారు. విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమై విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.

    ఈ ఘటనపై ఏసీపీ రజనీష్ వర్మ మాట్లాడుతూ, విమానంలోని టాయిలెట్‌లో ఉన్న ఒక టిష్యూ పేపర్‌పై బాంబు ఉన్నట్లు రాసి ఉన్న సందేశం దొరికిందన్నారు. సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా లక్నోకు మళ్లించాల్సి వచ్చింది. ఘటనా సమయంలో విమానంలో పైలట్లు, సిబ్బందితో కలిపి మొత్తం 238 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు వార్తతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

    విమానం లక్నోలో సురక్షితంగా దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం లక్నో విమానాశ్రయంలో భద్రతా దళాలు విమానాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో అణువణువూ గాలిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Crime

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజియాబాద్‌లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. 

    పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్‌తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్‌ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు. 

    అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

    పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 

Sports

  • ఇండోర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 ప‌రుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.

    టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. 

    కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్‌, కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్‌(23), శ్రేయస్‌ అయ్యర్‌(3), రాహుల్‌(1) వికెట్లు భారత్‌ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి(53), విరాట్‌ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. 

    ఆ తర్వాత నితీశ్‌(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్‌ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్‌ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్‌, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

    న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫౌల్క్స్‌, క్లార్క్‌ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్‌ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. 

  • ఇండోర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచ‌రీతో చెల‌రేగాడు. 338 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో విరాట్ కోహ్లి ఒంట‌రి పోరాటం చేశాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌ట‌కి.. కోహ్లి మాత్రం త‌న అద్బుత బ్యాటింగ్‌తో అభిమానుల్లో గెలుపు ఆశ‌ల‌ను రేకెత్తించాడు.

    ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్‌ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కోల్పోయింది.

    న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫౌల్క్స్‌, క్లార్క్‌ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్‌ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు.
     

  • టీమిండియా యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొం‍టున్న సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం​ దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.

    హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్‌కు గురువుతున్నాడు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.

    "వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్‌కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. 

    ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా  ప్రస్తుతం న్యూజిలాండ్‌తో  జరుగుతున్న సిరీస్‌లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు.

  • న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్‌మ్యాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు.

    మిడాన్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్‌ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

    ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవ‌లం 61 ప‌రుగులు చేశాడు. అంత‌కుముందు జ‌రిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్‌ను కివీస్‌పై మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 ప్ర‌ణాళిక‌ల‌లో ఉన్న హిట్‌మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్‌మెంట్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌ల‌ను ఆశిస్తోంది.

    త‌డ‌బ‌డుతున్న భార‌త్‌..
    కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భార‌త్ త‌డ‌బ‌డుతోంది. కేవ‌లం 71 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. శుభ్‌మ‌న్ గిల్ 23 ప‌రుగులు చేయ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌(3), కేఎల్ రాహుల్‌(1) సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఫౌల్క్స్, క్లార్క్‌, లినిక్స్‌, జేమిస‌న్ త‌లా వికెట్ సాధించారు.
    చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్‌ మిచెల్‌..

  • వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.

    ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ తర్వాత రాజ్‌కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 

    మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు.  106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్‌కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. భారత్‌పై అతడికి ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై గత ఐదు మ్యాచ్‌లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.

    ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వ‌న్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా క‌లిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స‌గ‌టు క‌లిగిన బ్యాట‌ర్‌గా మిచెల్ చ‌రిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.

    ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో 58.45 స‌గ‌టుతో 14673 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లిని మిచెల్ అధిగ‌మించాడు. వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచ‌రీతో మెరిశాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్  మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు.
    చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

  • ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. 

    మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్‌(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్‌.. విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యంగ్‌(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 

    వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. 

    ఆఖరిలో బ్రేస్‌వెల్‌(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్  మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు. ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు. కాగా డారిల్‌ మిచెల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.
    చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌
     

     

  • సనత్ జయసూర్య, రికీ పాంటింగ్‌, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్‌.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌. 

    ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్‌ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.

    మిచెల్ సెంచ‌రీల మోత‌..
    మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్‌పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్‌లపై సత్తాచాటుతున్నాడు.

    వన్డే ప్రపంచకప్‌-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్  గడగడలాడించాడు. సెమీఫైన‌ల్ అయితే త‌న విరోచిత సెంచ‌రీతో భార‌త్‌ను ఓడించే అంత‌ప‌నిచేశాడు. అంత‌కుముందు లీగ్ మ్యాచ్‌లో కూడా భార‌త్‌పై సెంచరీ సాధించాడు. దీంతో వ‌న్డే ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను తాజా ప‌ర్య‌ట‌న‌లో అత‌డు కొన‌సాగిస్తున్నాడు.

    ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో అత‌డు ప‌రుగులు వర‌ద పారిస్తున్నాడు. తొలి వ‌న్డేలో 84 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ త‌ర్వాత రాజ్‌కోట్‌లో విరోచిత సెంచ‌రీతో చెల‌రేగాడు. మ‌ళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలోనూ శ‌త‌క్కొట్టాడు. మిచెల్ భార‌త్‌లో త‌ను ఆడిన చివ‌రి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు.  భార‌త్‌పై వ‌న్డేల్లో అత‌డి స‌గ‌టు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.

    రెండో ప్లేయర్‌గా..
    భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మిచెల్‌ నిలిచాడు. మిచెల్‌ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్‌లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్‌ను మిచెల్‌ అధిగమిస్తాడు.
    చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..
     

  • రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి ఓవర్‌లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్ పంపి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్‌ బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్‌దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.

    అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో నికోల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో తొలి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌల‌ర్‌ను ఎలా ప‌క్క‌న పెట్టావు? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

    మొద‌టి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఎట్ట‌కేల‌కు సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్

    టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్


     

     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాల్గోనేందుకు త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని మొండి ప‌ట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన  'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

    ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను  కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. 

    భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. 

    ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.
    చదవండి: ఇటలీ ప్రపంచకప్‌ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు
     

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. 

    తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్‌ కృష్ణ స్థానంలో స్టార్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్

    టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

  • భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్‌ మ్యాడ్సన్‌ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

    ఈ జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక​ జరిగింది. 2017-21 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన 37 ఏళ్ల జేజే స్మట్స్‌ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్‌ సౌతాఫ్రికా తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. స్మట్స్‌ ఇటీవల జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో అతను ఏబీ డివిలియర్స్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.

    కుడి చేతి వాటం ఓపెనింగ్‌ బ్యాటర్‌, స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన స్మట్స్‌.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ తరఫున కూడా ఆడుతున్నాడు. స్మట్స్‌ ఇటలీ పౌరసత్వం తన భార్య నుంచి సంక్రమించుకున్నాడు.

    కాగా, ఇటలీ వరల్డ్‌కప్‌ యూరప్‌ క్వాలిఫయర్స్‌లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ విభాగం నుంచి మరో జట్టుగా నెదర్లాండ్స్‌ ఉంది. ప్రపంచకప్‌ 2026లో ఇటలీ.. టు టైమ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌తో పాటు గ్రూప్‌-సిలో ఉంది.

    ఇటలీ జట్టు ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్రం చేయనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్‌ జరునుంది. అనంతరం ఈ జట్టు ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో తలపడుతుంది.

    టీ20 ప్రపంచకప్‌ 2026కు ఇటలీ జట్టు..
    వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.

  • ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్లను నిన్న (జనవరి 17) ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియా-ఆస్ట్రేలియా 3 టీ20లు, ఓ టెస్ట్‌, 3 వన్డేలు ఆడతాయి. వీటిలోని పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్టును ప్రకటించారు.

    గాయాల నుంచి కోలుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ శ్రేయంక పటిల్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. 2024 టీ20 ప్రపంచ‌కప్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో సత్తా చాటడంతో (ఆర్సీబీ తరఫున 5 వికెట్ల ప్రదర్శన) శ్రేయంకకు మరోసారి అవకాశం వచ్చింది.  

    టీ20 జట్టులో మరో ఆసక్తికర ఎంపిక భారతి ఫుల్మాలి. ఈమె చివరిగా 2019లో భారత్‌ తరఫున టీ20 ఆడింది. ఆతర్వాత పేలవ ఫామ్‌ కారణంగా కనుమరుగైంది. గతేడాది డబ్ల్యూపీఎల్‌లో ఓ మోస్తరు ప్రదర్శనలతో తిరిగి లైన్‌లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో ఆరేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.

    హర్లీన్‌ డియోల్‌పై వేటు
    గత సిరీస్‌లో టీమిండియాలో భాగమైన హర్లీన్ డియోల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌లో రాణిస్తున్నా, సెలెక్టర్లు ఆమెపై వేటు వేశారు. పై మార్పులు మినహా టీ20 జట్టులో పెద్దగా గమనించదగ్గ విషయాలే​మీ లేవు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగారు.

    ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్

    షఫాలీ స్థానం పదిలం
    వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జట్టులో పలు ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌ ప్రతికా రావల్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. షఫాలీ వరల్డ్‌కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్‌ సందర్భంగా గాయపడిన ప్రతికా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వికెట్‌కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్రచికిత్స తర్వాత రీహాబ్‌లో ఉండటంతో ఈ సిరీస్‌కు దూరమైంది.  

    జి కమలినికి వికెట్‌కీపింగ్‌ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో వన్డే జట్టులోకి కూడా వచ్చింది. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డికి చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది.  

    ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), కశ్వీ గౌతమ్, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్

    ఆసీస్‌ పర్యటన షెడ్యూల్  
    టీ20 సిరీస్:  
     - ఫిబ్రవరి 15 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్  
     - ఫిబ్రవరి 19 – మానుకా ఓవల్  
     - ఫిబ్రవరి 21 – అడిలైడ్ ఓవల్  

    వన్డే సిరీస్:  
     - ఫిబ్రవరి 24 – బ్రిస్బేన్ (అల్లన్ బోర్డర్ ఫీల్డ్)  
     - ఫిబ్రవరి 27 & మార్చి 1 – హోబార్ట్ (బెల్లెరివ్ ఓవల్)  

    ఏకైక టెస్ట్‌:
     - మార్చి 6- పెర్త్‌ (పెర్త్‌ స్టేడియం)

    * టెస్ట్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది.

Business

  • మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో EQS SUV సెలబ్రేషన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV 450, 580 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ.1.34 కోట్లు & రూ.1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).

    మెర్సిడెస్ బెంజ్ EQS సెలబ్రేషన్ ఎడిషన్ AMG లైన్ ట్రిమ్ ఆధారంగా తయారైంది. ఇందులో గ్లాస్ బ్లాక్ రంగులో కనిపించే బ్లాంకెడ్ ఆఫ్ ఫ్రంట్ ఫాసియా, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు & 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో EQS మూడు స్క్రీన్‌లు, వెంటిలేషన్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, MBUX టాబ్లెట్‌ను కలిగి ఉన్న రియర్ సీటు పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

    EQS సెలబ్రేషన్ ఎడిషన్ 122 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది ఒక జత ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిస్తుంది. 450 వేరియంట్ 355 bhp మరియు 800 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6.2 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇది ఒక ఛార్జితో 775 కిమీ పరిధిని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. 580 వేరియంట్ 536 bhp మరియు 858 Nm టార్క్ అందిస్తూ.. 809 కిమీ ప్రయాణించగలదు.

  • భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్‌లోని ఖోరాజ్‌లో కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.

    గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.

    ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!

    గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్‌లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.

  • 2026 జనవరి నెలలో సగం రోజులు పూర్తైపోయాయి. కాగా వచ్చే వారంలో (జనవరి 19 నుంచి 24 వరకు) బ్యాంకు ఎన్ని రోజులు పని చేస్తాయి, సెలవు రోజులు ఎన్ని ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

    • 23 జనవరి (శుక్రవారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు / సరస్వతీ పూజ (శ్రీ పంచమి) / వీర్ సురేంద్రసాయి జయంతి / బసంత పంచమి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా & త్రిపురలలో బ్యాంకులకు సెలవు.

    • జనవరి 24 (శనివారం): నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.

    • జనవరి 25 (ఆదివారం): ఆదివారం కారణంగా బ్యాంకు సెలవు.

    జనవరి 2026లో వారాంతాలతో సహా మొత్తం 16 బ్యాంకు సెలవులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. అంతే కాకుండా నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు. కాగా ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారే అవకాశం ఉంది.

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • చాలారోజుల నిరీక్షణ తరువాత.. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా భారతదేశంలో 'మోడల్ వై' లాంచ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి దీని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కార్లన్నీ.. షోరూంలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ.. వీటి అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్ ప్రకటించింది.

    టెస్లా ఇండియా.. ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి మోడల్ Y కొనుగోలుపైై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ స్టీల్త్ గ్రేలో పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో కూడిన స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌కు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ 300 మోడల్ వైలను దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా 100 యూనిట్లను కూడా అమ్మలేకపోయింది.

    టెస్లా అమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. 2025లో కూడా వరుసగా రెండవ సంవత్సరం సేల్స్ తగ్గినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చైనా బ్రాండ్ బీవైడీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పోటీ & కొన్ని కార్ మార్కెట్లలో సబ్సిడీలు తగ్గడం వల్ల అమెరికా, యూరప్, చైనా అంతటా టెస్లా వాటా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

    ఇదీ చదవండి: పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

  • బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ధరల పెరుగుదల చాలామంది పసిడి ప్రియులలో నిరాశను కలిగిస్తున్నాయి. ఇంతకీ గోల్డ్ రేటును ఎవరు నిర్ణయిస్తారనేది చాలామంది తెలుసుకోవాలనుకునే విషయం. ఈ కథనంలో పసిడి ధరలను నిర్ణయించడంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎంత వరకు ఉంటుంది?,  మన దేశంలో గోల్డ్ రేటును ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయనే విషయాలను తెలుసుకుందాం.

    బంగారం ధరలను ప్రభావితం చేసే అంతర్జాతీయ అంశాలు
    ఎల్‌బీఎంఏ ఫిక్సింగ్: ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియ ద్వారా ఎల్‌బీఎంఏ (లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్) రోజుకు రెండుసార్లు బెంచ్‌మార్క్‌ బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులకు రిఫరెన్స్ పాయింట్‌గా పనిచేస్తాయి.

    గోల్డ్ ఫ్యూచర్స్ & ట్రేడింగ్ మార్కెట్లు: కమోడిటీ ఎక్స్ఛేంజీ-కామెక్స్ (న్యూయార్క్), షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌జీఈ), మల్టీ కామోడిటీ ఎక్స్చేంజీ-ఎంసీఎక్స్ (ఇండియా) వంటి ప్రధాన ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజీలు బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ట్రేడింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్, స్పెక్యులేషన్ ఆధారంగా నేరుగా ధరల కదలికలను ప్రభావితం చేస్తాయి.

    సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్‌ & మానిటరీ పాలసీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)తో సహా కేంద్ర బ్యాంకులు గణనీయమైన బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. వారి క్రయవిక్రయాలు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

    ద్రవ్యోల్బణం & ఆర్థిక అనిశ్చితి: బంగారం తరచుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉపయోగించబడుతుంది. ప్రపంచ మార్కెట్లు మాంద్యం, వాణిజ్య వివాదాలు లేదా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి అనిశ్చితిని ఎదుర్కొన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.

    మన దేశంలో బంగారం ధరలను ప్రభావితం అంశాలు
    దిగుమతి సుంకాలు, ప్రభుత్వ నిబంధనలు: భారతదేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రభుత్వం కస్టమ్ సుంకాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఇది స్థానిక ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. పన్ను విధానాల్లో మార్పులు బంగారాన్ని మరింత ఖరీదైనవి లేదా సరసమైనవిగా మారుస్తాయి.

    కరెన్సీ మారకం రేట్లు: బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి, భారత రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులు దేశీయ పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే భారతీయ కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది.

    పండుగలు, వివాహాలు: దేశంలో బంగారం పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. ముఖ్యంగా దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు, వివాహ సీజన్లలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి.

    దేశీయ సరఫరా, మార్కెట్ ధోరణి: బంగారం స్థానిక లభ్యత, ఆభరణాల రూపకల్పనలో వినియోగదారుల ప్రాధాన్యతలు, బంగారు పెట్టుబడి ఉత్పత్తులలో ఆవిష్కరణలు (ఈటీఎఫ్‌లు, డిజిటల్ బంగారం మొదలైనవి) వివిధ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.

    ఐబీజేఏ: ఐబీజేఏ (ఇండియన్ బులియన్ జ్యువెల్లర్స్ అసోసియేషన్) గ్లోబల్ బెంచ్‌మార్క్‌లు, దేశీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రోజువారీ ధరల మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. రిటైల్ బంగారం ధరలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.

    గోల్డ్ రేటును ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మాత్రమే నిర్ణయించదు. ఇది అంతర్జాతీయ మరియు దేశీయ కారకాల కలయికతో నిర్ణయించబడుతుంది. కాబట్టి బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అవి ఆర్థిక విధానాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులు, వినియోగదారుల ప్రవర్తనల కారణంగా మారుతాయి. అంతర్జాతీయ, దేశీయ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారాన్ని ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై నిపుణులు సలహాతో నిర్ణయాలు తీసుకోవచ్చు.

    ఇదీ చదవండి: వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!

  • బజాజ్ ఆటో.. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్ల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. పెరిగిన ధరల కారణంగా.. చాలా బైకుల రేట్లు మారిపోయాయి. ఎంట్రీ లెవల్ పల్సర్ 125 సిరీస్‌లో, నియాన్ సింగిల్ సీట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.79,048 నుంచి రూ.79,939కి పెరిగింది. కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ ధర రూ.85,633 నుంచి రూ.86,411కి పెరిగింది, కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ ధర రూ.87,527 నుంచి రూ.88,547కి పెరిగింది.

    పల్సర్ N125 బైక్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే NS125 బేస్ వేరియంట్ ధర రూ. 91,182 నుంచి రూ. 92,642కు చేరింది. LED BT రూ. 93,792 నుంచి రూ. 94,253లకు, LED BT ABS రూ. 98,400 నుంచి రూ. 98,955లకు చేరింది. పల్సర్ 150 సింగిల్-డిస్క్ & ట్విన్-డిస్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,11,669 & రూ.1,15,481 వద్ద (వీటి ధరల్లో ఎటువంటి మార్పు లేదు) అలాగే ఉన్నాయి.

    పల్సర్ NS160, NS200, RS200 ధరలు రూ.702 చొప్పున పెరిగి, ఇప్పుడు రూ.1,20,873, రూ.1,32,726 & రూ.1,71,873 వద్ద ఉన్నాయి. డిసెంబర్ 2025లో 2026 అప్‌డేట్ తర్వాత పల్సర్ 220F రూ.1,28,490 నుంచి రూ.1,29,186లకు చేరింది. 250cc విభాగంలో, పల్సర్ N250 ధర రూ.1,34,166 కాగా, టాప్-ఎండ్ పల్సర్ NS400Z ధర రూ.1,93,830 వద్ద ఉంది.

  • మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతంలో గృహాలకే కాదు కార్యాలయ స్థలాలకూ అధికంగా డిమాండ్‌ ఉంటుంది. అందుకే హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతం గృహ కొనుగోలుదారులకు, బహుళ జాతి సంస్థలకు హాట్‌ ఫేవరేట్‌ ప్లేస్‌గా మారింది. గతేడాది జులై–డిసెంబర్‌ (హెచ్‌–2)లో పశ్చిమ హైదరాబాద్‌ హవా కొనసాగింది. 2025 హెచ్‌2లో 19,355 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో వెస్ట్‌ సిటీ వాటా 63 శాతం కాగా.. ఇదే సమయంలో నగరంలో 55 లక్షల చ.అ. ఆఫీసు స్థలం లావాదేవీలు జరిగాయి. ఇందులో పశ్చిమం వాటా 88 శాతంగా ఉందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో

    మెరుగైన మౌలిక సదుపాయాలు, తక్కువ జీవనశైలి వ్యయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల వృద్ధి, కట్టుదిట్టమైన శాంతి భద్రతలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి రకరకాల కారణంగా హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో నగరంలో గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. స్థిరమైన ఆదాయం, మెరుగైన ఫైనాన్సింగ్‌ పరిస్థితుల కారణంగా అద్దె ఆదాయం కోసం పెట్టుబడి రీత్యా కాకుండా సొంతంగా ఉండేందుకు నివాసాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశి్చమ హైదరాబాద్‌ హవా కొనుసాగుతూనే ఉంది. ఐటీహబ్, అంతర్జాతీయ స్థాయి మౌలిక, సామాజిక వసతులు, స్థిరమైన ఆదాయాలు వంటివి డిమాండ్‌కు ప్రధాన కారణాలు.

    పెరిగిన దక్షిణం, తూర్పు..
    సాధారణంగా భారతీయ కుటుంబాలు ప్రాపర్టీ విక్రయాల్లో వాస్తును తప్పనిసరిగా అనుసరిస్తుంటారు. తూర్పు ముఖంగా ప్రధాన ద్వారం ఉన్న ఇళ్లు, దక్షిణంలో స్థలం పెరిగిన ప్రాపరీ్టలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ కారణంగానే నగరంలో ఈ జోన్లలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్‌ వంటి దక్షిణ హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఎదుగుతోంది. ఇళ్ల విక్రయాలలో ఈ జోన్‌ వాటా ఏడాది కాలంలో 5 శాతం నుంచి ఏకంగా 9 శాతానికి పెరిగింది. కనెక్టివిటీ, ఉపాధి అవకాశాల పెరుగుదల, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి కారిడార్లతో ఈ జోన్‌ కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇక, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌ వంటి తూర్పు హైదరాబాద్‌ వాటా స్థిరంగా 9 శాతంగా ఉంది. ప్రధాన ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ లేకపోవడంతో తూర్పు ప్రాంతంలో కేవలం ధరల పోటీతోనే లావాదేవీలు జరుగుతుంటాయి.

    తగ్గిన ఉత్తరం, సెంట్రల్‌..
    ఇక, కొంపల్లి, మేడ్చల్, అల్వాల్, కుత్బుల్లాపూర్‌ వంటి ఉత్తర హైదరాబాద్‌ వాటా 19 శాతం నుంచి 17 శాతానికి క్షీణించింది. సాధారణంగా అందుబాటు గృహాలకు పెట్టింది పేరైన ఉత్తర హైదరాబాద్‌లో కస్టమర్ల అభిరుచిని అంచనా వేయకుండా ప్రీమియం ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున సప్లై కావడంతో డిమాండ్‌ తగ్గింది. భూమి కొరత, నియంత్రణ పరిమితుల కారణంగా బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ వంటి సెంట్రల్‌ హైదరాబాద్‌ వాటా 3 శాతానికి తగ్గింది.

    ప్రీమియం ఇళ్లకే మొగ్గు..
    2025 రెండో అర్ధభాగంలో అమ్ముడుపోయిన ఇళ్లలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 71 శాతంతో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అంతకుముందు ఏడాది హెచ్‌–2లో ఈ విభాగం వాటా 63 శాతంగా ఉంది. రూ.1.2 కోట్ల రేటు ఉన్న ఇళ్ల వాటా 44 శాతంగా ఉంది. ఇక, రూ.2.5 కోట్ల ధర ఉన్న విలాసవంతమైన గృహాల వాటా ఏకంగా 13 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. లగ్జరీ లైఫ్‌ స్టైల్, ఆధునిక వసతులు, గేటెడ్‌ కమ్యూనిటీ లివింగ్‌ వైపు కస్టమర్లు ఆసక్తి చూపించడంతో ఈ విభాగంలో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న యూనిట్ల విక్రయాలు కూడా 3 శాతం నుంచి స్వల్పంగా 4 శాతానికి వృద్ధి చెందాయి.

    ఆఫీసు అ'ధర'హో..
    నగరంలో హెచ్‌ 2లో 55 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. అంతకుముందు ఏడాది హెచ్‌ 2తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇందులో హైటెక్‌ సిటీ, కొండాపూర్, రాయదుర్గం వంటి సబర్బన్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌(ఎస్‌బీడీ) వాటా 88 శాతంగా ఉండగా.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌(సీబీడీ) ప్రాంతాల వాటా 6 శాతం, గచ్చిబౌలి, కోకాపేట, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాలు(పీబీడీ–వెస్ట్‌) వాటా 2 శాతం, ఉప్పల్, పోచారం వంటి తూర్పు ప్రాంతాలు(పీబీడీ–ఈస్ట్‌) వాటా 4 శాతంగా ఉన్నాయి. గతేడాది హెచ్‌–2లో సగటు లావాదేవీ అద్దె చ.అ.కు రూ.77గా ఉంది.

    లాంచింగ్స్‌లో వెస్ట్‌దే
    నివాస విభాగంలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. గృహ కొనుగోలుదారుల అభిరుచుల మేరకు డెవలపర్లు కూడా ప్రీమియం ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఇళ్ల విక్రయాలతో పాటు లాంచింగ్స్‌లోనూ లగ్జరీ యూనిట్లవే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. 2025 హెచ్‌–2లో నగరంలో కొత్తగా 19,775 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలకు డెవలపర్లు ఆసక్తి చూపించడం, కస్టమర్ల ప్రాధాన్యతల నేపథ్యంలో 2024 హెచ్‌–2తో పోలిస్తే లాంచింగ్స్‌ 9 శాతం మేర క్షీణించాయి. ఇక, జోన్ల వారీగా చూస్తే.. లాంచింగ్స్‌లో పశ్చిమ హైదరాబాద్‌ వాటా 62 శాతంగా ఉండగా.. ఉత్తరం 15 శాతం, దక్షిణం 10 శాతం, తూర్పు 8 శాతం, సెంట్రల్‌ సిటీ వాటా 5 శాతంగా ఉంది.

    నగరంలోని ఆఫీసు స్పేస్‌ లావాదేవీల్లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లదే హవా కొనసాగుతోంది. నగరంలో 2025 హెచ్‌–2లో జరిగిన కార్యాలయ స్థలాల లీజులలో జీసీసీల వాటా ఏకంగా 50 శాతంగా ఉంది. చార్లెస్‌ స్క్వాబ్‌ కార్పొరేషన్, వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, రాండ్‌స్టాడ్, గోల్డ్‌మన్‌ సాచ్స్, సర్వీస్ నౌ వంటి బహుళ జాతి సంస్థలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత ఆఫీసు స్పేస్‌ లీజులు 25 శాతం వాటాతో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ విభాగం ఉంది. థర్ట్‌ పార్టీ సంస్థల లావాదేవీలు 16 శాతంగా ఉంది. ఇక, నగరంలో ఆఫీసు స్థలం అద్దెలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం మేర పెరిగి, ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.77గా ఉన్నాయి.

    ఆసక్తి తగ్గినా ఆఫర్డబుల్
    నగరంలో అందుబాటు గృహాలకు ఆదరణ తగ్గుతూనే ఉంది. రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గాయి. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్ల వాటా కూడా 31 శాతం నుంచి 26 శాతానికి క్షీణించాయి.

  • క్విక్ కామర్స్ రంగంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారాన్ని ప్లాట్‌ఫారమ్‌లు విరమించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గిగ్‌ వర్కర్ల పరిస్థితిపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిరంతరం నిఘా ఉంచింది.

    ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే లేదా గిగ్‌ వర్కర్ల శ్రమను దోపిడీ చేసే అగ్రిగేటర్లపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత స్థాయి వర్గాలు హెచ్చరించాయి. బ్రాండింగ్ మార్చినప్పటికీ డెలివరీ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గకపోవడం, ఐడీల బ్లాకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

    ముఖ్యమైన అంశాలు

    గిగ్ వర్కర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియాతో జరిగిన సమావేశం అనంతరం బ్లింకిట్‌, జెప్టో వంటి సంస్థలు 10 నిమిషాల డెలివరీ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి. కేవలం ప్రకటనల మార్పుతోనే పని ఒత్తిడి తగ్గదని, వ్యాపార నమూనాల్లో మార్పులు రాకపోతే కార్మికులకు ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఈఎస్ఐసీ ‘స్ప్రీ’ (SPREE) పథకం

    గిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ‘స్కీమ్‌ టు ప్రొమోట్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ (స్ప్రీ)’ పథకం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 1.17 లక్షల మంది కొత్త యజమానులు (Employers) తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనివల్ల సంస్థల స్థాయిలోనే కార్మిక సంక్షేమానికి మార్గం సుగమమైంది. కేవలం యజమానులే కాకుండా, భారీ సంఖ్యలో ఉద్యోగులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1.03 కోట్ల మంది కొత్త ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి చేరడం విశేషం.

    ప్రస్తుతం ఈ పథకం గడువు 2026 జనవరి చివరి వరకు అందుబాటులో ఉంది. గతంలో నమోదు కాని యజమానులు, ఉద్యోగులు ఎలాంటి జరిమానాలు లేదా శిక్షలు లేకుండా ఒకేసారి రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరిశ్రమ వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ పథకం గడువును పొడిగించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు వైద్య, ఆర్థిక భద్రత చేకూరింది. గిగ్ ఎకానమీలో పారదర్శకత, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ముందుకు సాగుతోంది.

    ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!

  • భారతదేశ ఆర్థిక సుస్థిరతకు పెరుగుతున్న ఆర్థిక లోటు (Fiscal Deficit) ప్రధాన బలహీనతగా మారిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ లోటును తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ‘భారతదేశ అభివృద్ధి మార్గం’ అనే అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై పలు వ్యాఖ్యలు చేశారు.

    ‘ప్రికోసియస్‌ డెమోక్రసీ’ ప్రభావం

    భారతదేశం అభివృద్ధికి ముందే పరిణతి చెందిన ప్రజాస్వామ్యం (Precocious Democracy)గా అవతరించిందని సుబ్రహ్మణియన్ అభివర్ణించారు. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వచ్చే డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చాల్సి రావడం కీలకంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక అలవాట్లపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ప్రభుత్వ లోటు సగటున జీడీపీలో 10 శాతం వరకు ఉంటోందన్నారు. మనతో సమానంగా ఎదుగుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆయన గుర్తుచేశారు.

    సంక్షేమ పథకాలపై సమీక్ష అవసరం

    ప్రస్తుతం భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుండటం వల్ల ద్రవ్యలోటును తట్టుకోగలుగుతోందని ఆయన విశ్లేషించారు. అయితే, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ‘కేంద్రం, రాష్ట్రాలు రెండూ తమ ఆర్థిక లోటును క్రమంగా తగ్గించుకోవాలి. నగదు బదిలీ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని పునసమీక్షించాలి. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం లేకపోయినా, బాధ్యతాయుతమైన వ్యయం తప్పనిసరి’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!

  • సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.

    తీర్పు నేపథ్యం ఏమిటి?

    ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్‌ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

    గూగుల్ వాదన ఏంటి?

    అప్పీలు పెండింగ్‌లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్‌ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్‌లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.

    షరతులకు అంగీకారం.. కానీ!

    గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.

    ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు

Politics

  • సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్‌లో ఉండటం వల్ల ఎలాంటి లాభం లేదంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు జీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో తన అనుచరులతో  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ వ్యాఖ్యానించారు.

    మూడు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. పటాన్ చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటిల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు విభాగాల వారిగా పని చేద్దామని మహిపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     

     

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

    అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. 

    ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం  అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్‌కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.  

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దమ్ముంటే బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొట్టండి. మేమేంటో చూపిస్తామంటూ జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రోత రాతల పత్రికపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌ల సంఘం కోరాలి. త్వరలోనే పోలీసుల కూడా ప్రభుత్వంపై తిరగబడే  రోజు వస్తుందంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    ‘‘తొందరలోనే రేవంత్‌ అధికార కోట కూలుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, పంచుకునేందుకు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. నేడు ఖమ్మం సభలో తెలుగుదేశం జెండాలు కనిపించినప్పుడే అర్థమైంది. ఆనాడు చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడిండు. అలా మాట్లాడిన బాబును పాతాళలోకానికి ప్రజలు పాతరేశారు.’’ అని జగదీష్‌రెడ్డి గుర్తు చేశారు.

    ‘‘చంద్రబాబు వైఖరినీ రాజకీయంగా కేసీఆర్ ఎదుర్కొన్నారు. తప్పా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. కేసీఆర్ కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ స్థాయికి.. రేవంత్ రెడ్డి గడ్డి పోసతో సమానం. కేటీఆర్‌పై సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు లేవు’’ అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.

  • సాక్షి,  హైదరాబాద్‌: రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని రేవంత్‌ కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇస్తూ.. బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొడితే రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తామంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే  భౌతికదాడులకు పిలుపునిచ్చారని.. హింసను  ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ హరీష్‌ మండిపడ్డారు.

    ‘‘ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే  ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన 'ఓటుకు నోటు' దొంగ.. సీఎం పదవి అనుభవిస్తూనే,  కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్’’ అంటూ హరీష్‌ ఘాటుగా విమర్శించారు.

  • సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది ఏ వర్గానికి సంక్రాంతి పండగ సంతోషం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పండగ ముందే మద్యం ధర పెంచారు.. భూముల విలువ కూడా పెంచేశారు.. భూములు కొనాలంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికీ యూరియా అధిక ధరకే దొరుకుతుంది’’ అంటూ మండిపడ్డారు.

    ‘‘విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 5వేల 600 కోట్ల బకాయిలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జీతాలు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కిపోయిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చింది. గ్రీన్ కో కంపెనీకి అభినందనలు. మేము పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేము భూములు ఇవ్వలేదు’’ అని బొత్స పేర్కొన్నారు.

    ..ఈ రెండేళ్లలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది?. ప్రభుత్వం నుంచి ఎవరైనా సమాధానం చెప్పండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. గతంలో ఎప్పుడైనా గ్రామ బహిష్కరణ ఉందా..?. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..?. ఊరిలోకి వస్తే మనుషుల్ని చంపేస్తారా..?. దహన సంస్కారాలకు వెళ్లాలంటే ఆధార్ కార్డులు చూపించి వెళ్ళాలా?. పవన్ కళ్యాణ్‌ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా. ఇలాంటి ఘటనలపై ఎందుకు మాట్లాడటం లేదు.

    ..సాల్మన్ హత్య అత్యంత దారుణం. ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది అని ప్రధాని మోదీ అంటున్నారు.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..?. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ బహిష్కరణలపై కూడా స్పందించాలి. కూటమి పాలనలో ఏమి జరుగుతుందో ప్రధాని తెలుసుకోవాలి. సాల్మన్ హత్య అత్యంత దారుణం.. తీవ్రంగా ఖండిస్తున్నాం.. చంద్రబాబు.. ఇదేనా పరిపాలన..?

    ..ఏం చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నావ్‌.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్యులకు ఎక్కడా మేలు చేయడం లేదు. వైఎస్సార్‌ సంక్షేమ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. సంక్రాతి మూడు రోజులు.. ఏ టీవీ చూసినా.. కోడి పందాలే. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడా అందుబాటులో ఉండటం లేదు. పరిశ్రమలతో మా హయాంలో జరిగిన ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి’’ అని బొత్స చెప్పారు.

  • సాక్షి, తాడేపల్లి: సంతాప సభలో చంద్రబాబు సైతాన్ మాటలు మాట్లాడారని.. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది కేవలం 700 రోజులే.. ఈలోపు వీలైతే మంచి చేయాలే తప్ప హత్యా రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు.

    ‘‘వంగవీటి రంగా నుంచి సాల్మన్ హత్య వరకు అనేక మంది చావులకు చంద్రబాబే కారణం. ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుని చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి రావటం లేదు. లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ బతికి ఉండగా ఆయన్ను చిత్రహింసలకు గురిచేశారు. వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది ఎవరు?. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తాళి బొట్టు తెంచింది ఎవరు?. పిన్నెల్లిలో సాల్మన్ భార్య తాళిని తెంచింది ఎవరు?’’ అంటూ  టీజేఆర్‌ నిలదీశారు.

    ‘‘చంద్రబాబు అంతటి నీచుడు రాజకీయాల్లో ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరం. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదివితే చంద్రబాబు నీచ బతుకు తెలుస్తుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎందుకు రానీయలేదు?. సాల్మన్‌ను హత్య చేసిన వారిని శిక్షించమని కోరాం. ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరాం. కానీ దేనికీ చంద్రబాబు అంగీకరించలేదు. సాల్మన్‌ని చంపిందే కాకుండా కులాల పేరుతో మాట్లాడతారా?

    ..టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని యరపతినేని గుర్తుంచుకుంటే మంచిది. రాజధానిలో అడుగుకు పది వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని అడిగితే తప్పా?. రాజధాని పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. చంద్రబాబుకు రాజధానిలో ఇల్లే లేదు. గూగుల్ డేటా సెంటర్‌ని రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. కియో మోటర్స్ రాజధానిలో ఎందుకు పెట్టలేదు?. రాజధాని రైతులను తీవ్రంగా అన్యాయం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటేనే జగన్ గుర్తుకు వస్తారు. దానిని కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటానికి ప్రయత్నించారు.

    ..సంక్రాంతి పండుగ పేరుతో ప్రజా ధనాన్ని లూటీ చేశారు. మద్యం సీసా మీద వంద రూపాయలు ఎక్కువ వసూలు చేసి దోపిడీ చేశారు. ఆ సొమ్మంతా చంద్రబాబు, లోకేష్ జేబులో వేసుకున్నారు. చంద్రబాబు అలివికాని అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల మీద ఒక్కొక్కరి మీద పది లక్షల భారం వేశారు. కూటమి నేతల వలనే రాష్ట్రంలోకి యథేచ్ఛగా డ్రగ్స్, గంజాయి దిగుమతి అవుతున్నాయి’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.

  • సాక్షి, ఖమ్మం జిల్లా: సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని కథనాలు వస్తున్నాయని.. తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మద్దులపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. కోల్‌ మైనింగ్‌ టెండర్లు అనుభవరం ఉన్నవారికే ఇస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

    ‘‘మీకు మీకు ఉన్న పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మా మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి కథనాల రాసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పుడు ‍ప్రచారాలతో అపోహలు సృష్టించొద్దు. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటాను’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

    ‘‘మొట్టమొదటి సారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచి జరిగింది. 20 సంవత్సరాలలో ఖమ్మం ఎప్పుడు వచ్చినా నన్ను అభిమానించారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రేషన్ కార్డు రాకపోయినా అందరికీ ఇవ్వండి. ఉచిత విద్యుత్ మీద మొట్ట మొదటి సంతకం పెట్టింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.

    ..వైఎస్సార్‌ స్పూర్తితో ఈనాడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు ఇచ్చాము. సన్నబియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం ఖమ్మంలోనే జరిగింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. కేసీఆర్ పేదలను దగా చేసిండు తప్ప ఇళ్ళు ఇవ్వలేదు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది.

    ..ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ల గురువు ఫామ్ హౌస్‌లో ఉన్నాడు.. ఫామ్ హౌస్‌లో ఉండి పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

    ..మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. 100 రోజుల్లో సమ్మక్క,సారక్క పనులు పూర్తి చేశాం. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశాడు. మేమందరం సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కోల్ మైనింగ్ టెండర్‌లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖమ్మం జిల్లాలో 1130 గ్రామపంచాయతీలు ఉంటే 790 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

  • సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత కార్యకర్త మంద సాల్మన్‌ దారుణ హత్యపై రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం (19వ తేదీ)నాడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

    ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ను పిన్నెల్లిలో దారుణంగా ఐరన్‌ రాడ్లతో కొట్టి హత్య చేశారని.. రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోందని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.

    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోందని, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటున్నారని ఆయన తెలిపారు. సాల్మన్‌ హత్య కేసులో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులకు తగిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్లు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి.. ఆగం చేయకండి. ప్రజాభిప్రాయం లేకుండా మున్సిపల్ విభజన జరుగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

    చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్‌లో కలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పుతున్నారా?. పాతబస్తీలో నీళ్ల బిల్లులు, కరెంట్ బిల్లులు కడతారా?. కట్టని వారితో మా జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారు?. మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్‌లో కలపడం సరైంది కాదు. పాతబస్తీలో బిల్లుల ఎగవేత వల్ల వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు నష్టాల పాలవుతున్నాయి.

    రంగారెడ్డి జిల్లాల గ్రామాలను చార్మినార్‌లో కలపడం వల్ల, ఆ జిల్లా ప్రజల బ్రతుకులు ఆగం అవుతాయి. మాకు గులాంలు కొట్టడం తెలీదు. గులాంలు కొట్టే బ్రతుకులు మావి కాదు. హైదరాబాద్‌కు ఆర్థిక వనరు రంగారెడ్డి. జిల్లా ఖజానా అంతా నాడు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు తరలిపోయింది. నేడు ఎంఐఎం ఇలాకాలోకి పంపేందుకు ప్రయత్నం జరుగుతుంది. పన్నులు కట్టేవారిని, పన్నులు కట్టనివారితో కలపకండి. రంగారెడ్డి జిల్లాపై అనేక అపోహలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేయకండి. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బొగ్గ గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్టకథ, కట్టుకథలు అని ఆరోపించారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు.. ఈ వార్త విషయంలో తాను, రాధాకృష్ణ తేల్చుకుంటాం అని భట్టి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం.. నా పని. ఆస్తులను సంపాదించడం కోసం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తొలిపలుకు అని వార్త రాశారు. రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే వార్త కథనాలు అని రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారు. సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు.. బొగ్గు గనులు ప్రజల ఆత్మ. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ.. సంస్థ బోర్డు.

    పిట్టకథలతో తప్పుడు వార్తలు.. 
    టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ.. మంత్రి కాదు. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి.. ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు.. రాయడం కాదు.. ముందుగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లింది పిట్టకథ. కట్టు కథలు అల్లి రాశారు. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. రాసిన ఆయనకు ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం. ప్రజలకు నిజాలు తెలియాలి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇది అంటూ మండిపడ్డారు. నేను వైఎస్‌ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని. వైఎస్సార్‌ మీద కోపంతో నా మీద రాసి ఉండవచ్చు. ప్రజలకు నిజానిజాలు తెలియాలి.

    జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలా?..
    నేను ఈ బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను రానివ్వను. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు. వెనకాల ఎవరు ఉండి రాయించారో తర్వాత మాట్లాడతాను. మంత్రుల మధ్య పంచాయితీ పెడతాం అంటే కుదరదు. ఆత్మ గౌరవంతో పనిచేస్తున్నాం​. ఏ ఛానల్‌ అయినా ఎవరి ఇమేజ్‌ దెబ్బతీయొద్దు. మా సీఎం, మంత్రులు రాష్ట్ర విస్త్రృత ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మీ అవసరాల కోసం అల్లే కట్టుకథలు మమ్మల్ని ఏం చేయలేవు. నాది అంత వీక్‌ క్యారెక్టర్‌ కాదు. అందులో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు. రాధాకృష్ణ పలుకులతో నాకు జరిగే నష్టమేమీ లేదు. ఏ మాత్రం జ్ఞానం లేకుందా ఇలాంటి వార్తలు రాయడం ఏంటి?’ అని ప్రశ్నించారు. 

     

Telangana

  • సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా సమావేశం జరిగింది. మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

    రెండున్నర గంటల పాటు కేబినెట్‌ సమావేశం సాగింది. 18 అంశాల ఎజెండాగా భేటీ జరిగింది. జిల్లాల పునర్వవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదించింది.

     

     

     

     

     

     

     

     

     

  • సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసింది. అందులో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతి తెలిపింది. అంతేకాదు.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రిజర్వేషన్ల నివేదికను కూడా ఖరారు చేసి పంపినట్లు పేర్కొంది.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలలో మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇకపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మాత్రమే మిగిలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
     

  • సాక్షి, నల్గొండ: హైదరాబాద్ -విజయవాడ నేషనల్ హైవేపై సినిమాస్టంట్‌ను తలపించే యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కార్లు ఒకదానికొకటి వరుసగా మూడుకార్లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో  ఎవరికీ తీవ్ర గాయాలు  కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ కారు అక్కడ హైవే నెంబర్ 65 వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక వచ్చిన రెండు కార్లు వెనువెంటనే ఢీకొన్నాయి.  దీంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌తో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

    మరోవైపు సంక్రాంతి సెలవులు ముగియడంతో పండగకు హైదరాబాద్ నుంచి ఊరెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

     

  • సాక్షి మెదక్: అల్లదుర్గం మండలంలో  జరిగిన ఓ ఘటన అక్కడ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మండలంలోని ఒక గ్రామ శివారులో ఒక రాబందు కాళ్లకు జీపీఎస్ ట్రాకర్‌తో సంచరించసాగింది. ఇది గమనించిన ప్రజలు తమ గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడ్డారు. అనంతరం అటవీ శాఖ అధికారులు వచ్చి వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    బహిరన్ దిబ్బ గ్రామ శివారులో శనివారం సాయంత్రం జీపీఎస్ ట్రాకర్ సిస్టంతో ఉన్న ఒక రాబందు సంచరించింది. రాబందు కాళ్లకు నెంబర్లతో కూడిన స్టిక్కర్స్ ఉండడంతో తమ గ్రామానికి  ఏదైనా ప్రమాదం జరుగుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందారు.  దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులను సంప్రదించగా వారు వచ్చి ఆ పక్షిని పరిశీలించారు.

    ఆ రాబందుకు మహారాష్ట్రకు చెందిందని రాబందుల జాడ తెలిసేలా వాటిని ట్రేస్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీపీఎస్ ట్రాక్‌ను కాళ్లకు కట్టి వదిలేసిందని తెలిపారు.   రాబందులు సంచరించే వివరాలు తెలవడంతో పాటు వాటికి ఎవరైనా హాని తలపెట్టినా ఆ సమాచారం వెంటనే అక్కడి అధికారులకు చేరుతుందని పేర్కొన్నారు.

    కనుక రాబందులు అంతరించిపోతున్న జాతికి చెందినవని వాటికి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రజలకు సూచించారు.

Family

  • తీర్మానాలు వేరు, నిర్ణయాలు వేరు. తీర్మానాలన్నవి.. ‘చేసుకునేవి’. నిర్ణయాలన్నవి.. ‘తీసుకునేవి’. తీర్మానాలు ఫెయిల్‌ అయితే పోయేదేమీ లేదు. కాని, నిర్ణయాలు మిస్‌ ఫైర్‌ అయితేనే... ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకు చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి. 

    ఒక్కోసారి మనం తీసుకునే ‘చెత్త నిర్ణయం’ మన జీవితాన్నే ట్రాజెడీగా చేస్తుంది. అదే నిర్ణయాన్ని ఒక రాజుగారో,ఏ ప్రభుత్వం వారో తీసుకుంటే? చరిత్రలో అది ఒక ‘సీరియస్‌ కామెడీ’గా మిగిలిపోతుంది. అహంకారం వల్ల కావచ్చు, అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా మన బ్యాడ్‌ లక్‌ వల్ల కావచ్చు... చెత్త నిర్ణయం తలపైకి ఎక్కి కూర్చున్నప్పుడు రాజైనా, రాజారావు గారైనా చేసేది ఏమీ ఉండదు. చరిత్రలో ఇలాంటి ట్రాజిక్‌ కామెడీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. మీ కోసం :::


    చెంగీజ్‌ ఖాన్‌ కి ‘సారీ’ చెప్పనందుకు..!
    చెంగీజ్‌ ఖాన్‌ వీరుడు, శూరుడే కాని, క్రూరుడు మాత్రం కాడు. పైగా స్నేహశీలి. 1218వ సంవత్సరంలో ఒకరోజు ఆయనకు అనిపించింది– ఖ్వారెజ్మియన్‌ సామ్రాజ్యంతో (ప్రస్తుత ఇరాన్‌/ఇరాక్‌ ప్రాంతం) కలిసి బిజినెస్‌ చేద్దామని! మంచి విషయమే కదా. అందుకోసం 450 మంది బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌లను  పంపించాడు. కాని, అక్కడి లోకల్‌ గవర్నర్‌కి వాళ్లపై అనుమానం వచ్చి, వాళ్లంతా గూఢచారులేమోనని అందర్నీ చంపేయించాడు. ‘‘ఇట్స్‌ ఓకే’’ అని చెంగీజ్‌ ఖాన్‌ సర్దుకుపోయాడు. ‘‘కనీసం సారీ అయినా చెప్పండి’’ అని ముగ్గురు రాయబారులను ఖ్వారెజ్మియన్‌కు పంపాడు. అయితే అక్కడి రాజు అతి తెలివి ప్రదర్శించాడు. ముగ్గురిలో ఇద్దరికి గడ్డాలు గీయించి, మూడో రాయబారి తల నరికేయించాడు. 

    ఫలితం: చెంగీజ్‌ ఖాన్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన మంగోల్‌ సైన్యంతో బయల్దేరి వెళ్లి ఖ్వారెజ్మియన్‌ సామ్రాజ్యాన్ని రూపుమాపేశాడు. కోట్లాది మంది ప్రాణాలు పోయాయి.

    నీతి: పక్కింటి వాళ్లతో గొడవ పడితే పంచాయతీ అవుతుంది. కాని, చెంగీజ్‌ ఖాన్‌లాంటి వాళ్లతో గొడవ పడితే చరిత్రే మారిపోతుంది! ఇంకోలా చెప్పాలంటే – పులిని నిద్రలేపినా పర్లేదు కాని, చెంగీజ్‌ ఖాన్‌ ముఖం మీద చిటికెలు వేయకూడదు.

    చలికాలంలో దండయాత్ర
    ఇదొక క్లాసిక్‌ హిస్టరీ కామెడీ! 1812లో నెపోలియన్, 1941లో హిట్లర్‌.. ‘‘రష్యా ఎంత పెద్దదైతే మనకేంటి? ఉఫ్‌ అని ఊదేసి ఇంటికి వచ్చేద్దాం’’ అని ప్లాన్‌ వేశారు. ఉఫ్‌ అని ఊదేసేవారేనేమో కాని, వాళ్లు రెండు విషయాలను అస్సలు అంచనా వేయలేకపోయారు: ఒకటి రష్యా వైశాల్యం (అది ఒక దేశం కాదు, ఒక ప్రపంచం!), రెండోది అక్కడి భయంకరమైన చలి. 

    ఫలితం: రష్యాపైకి నెపోలియన్‌ పంపిన 6 లక్షల మంది సైన్యంలో చివరికి మిగిలింది కేవలం లక్ష మంది మాత్రమే! అటు హిట్లర్‌ కూడా అదే తప్పు చేసి, తన నాజీ సామ్రాజ్యం కూలిపోవడానికి పునాది వేసుకున్నాడు.

    నీతి: రష్యా వాళ్లతో యుద్ధం గెలవొచ్చేమో కాని, వింటర్‌లో అక్కడి మైనస్‌ డిగ్రీల చలిని మాత్రం ఎవరూ గెలవలేరు. చలికాలంలో యుద్ధం చేయటం కంటే దుప్పటి కప్పుకుని పడుకోవడం ఉత్తమం అని నెపోలియన్, హిట్లర్‌ తెలుసుకుని ఉంటారు.

    కొంప ముంచిన గిఫ్ట్‌ ప్యాక్‌!
    క్రీ.పూ. 12వ శతాబ్దం నాటి సంగతి ఇది. సుమారు 10 ఏళ్లు యుద్ధం చేసినా గ్రీకులు ట్రాయ్‌ నగరాన్ని (ప్రస్తుతం టర్కీలోని ఒక భాగం) గెలవలేకపోయారు. అప్పుడు ఒక ‘ఐడియా’ వేశారు. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి కోట ముందే వదిలేసి, ‘‘మేం ఓడిపోయాం. ఈ గుర్రాన్ని మీకు మా జ్ఞాపకార్థం కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పి అక్కడి నుంచి పడవల్లో వెళ్లిపోయినట్లు యాక్టింగ్‌ చేశారు. స్థానిక పూజారులు, జోస్యులు ‘‘ఒరేయ్‌ నాయనా.. ఇదేదో తేడాగా ఉంది, దీన్ని నమ్మకండి’’ అని అరిచినా, ట్రాయ్‌ పాలకులు వినలేదు. ‘‘అబ్బే.. గిఫ్ట్‌ వస్తుంటే వద్దంటారేంటి?’’ అని ఆ చెక్క గుర్రాన్ని లాక్కొచ్చి కోట లోపల పెట్టుకుని గ్రాండ్‌గా విజయోత్సవాలు జరుపుకున్నారు.

    ఫలితం: అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ చెక్క గుర్రం లోపల గ్రీకు సైనికులు దాక్కుని ఉన్నారు! అందరూ నిద్రపోయాక, వాళ్లు బయటకు వచ్చి కోట గేట్లు తెరిచేశారు. వెళ్లిపోయినట్లుగా మాయ చేసిన గ్రీకు సైన్యం మళ్లీ తిరిగొచ్చి ట్రాయ్‌ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది.

    నీతి: శత్రువు సడన్‌గా వచ్చి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడంటే– అది ప్రేమతో ఇచ్చింది కాదు, మనకేదో ‘పెద్ద స్కెచ్‌’ వేశాడని!

    మావో గారి ‘పిచ్చుకల’ వేట
    చైనాలో 1958లో ‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’ పేరుతో మావో జెడాంగ్‌ ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ పిచ్చుకలు మన ధాన్యాన్ని తినేస్తున్నాయి, వీటిని అస్సలు వదలకూడదు. తరిమి కొట్టండి’’ అని ఆర్డర్‌ వేశారు. దాంతో జనం అంతా గిన్నెలు, డబ్బాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఒకటే గోల.. గోల! ఆ శబ్దానికి పిచ్చుకలు భయపడి ఎక్కడా వాలకుండా గాల్లోనే ఎగురుతూ, ఎగురుతూ అలసిపోయి కిందపడి చనిపోయేవి. అలా లక్షల పిచ్చుకలను ఏరిపారేశారు.

    ఫలితం: పిచ్చుకలు ఉన్నప్పుడు అవి కేవలం గింజలనే కాదు, పంటను పాడుచేసే మిడతలను కూడా తినేవి. పిచ్చుకలు లేకపోయేసరికి మిడతల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. అవి వచ్చి పిచ్చుకల కంటే వంద రెట్లు వేగంగా పంటనంతా ఊడ్చేశాయి. దీనివల్ల వచ్చిన కరువులో దాదాపు 1.5 కోట్ల నుండి 4.5 కోట్ల మంది చైనా ప్రజలు చనిపోయారు.

    నీతి: ప్రకృతిని మనం కంట్రోల్‌ చేయాలనుకుంటే.. అది మనల్ని ‘అవుట్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ చేసి పడేస్తుంది. అలాస్కాని ‘అణాపైసలకి’ 
    అమ్మేసిన రష్యా  

    ఇది 1867లో జరిగింది. అప్పట్లో రష్యాకి ఒకటే భయం ఉండేది. ‘‘భవిష్యత్తులో బ్రిటిష్‌ వాళ్లతో యుద్ధం వస్తే, ఈ అలాస్కా ప్రాంతాన్ని మనం కాపాడుకోలేం, వాళ్లు ఫ్రీగా లాగేసుకుంటారు’’ అని టెన్షన్‌ పడ్డారు. అందుకే ఉచితంగా పోయేదానికంటే, ఎంతో కొంతకి అమ్మేద్దాం అని అమెరికాకి ఆఫర్‌ ఇచ్చారు. ఎంతకో తెలుసా? కేవలం 7.2 మిలియన్‌ డాలర్లు! అంటే ఎకరం సుమారు రెండు సెంట్లే (మన లెక్కలో చెప్పాలంటే అణాపైసలకి అన్నమాట).

    ఫలితం: అమ్మేసిన కొన్నేళ్లకే అక్కడ భారీ బంగారు గనులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏకంగా బిలియన్ల కొద్దీ బారెళ్ల ఆయిల్‌ నిక్షేపాలు దొరికాయి. చరిత్రలోనే ఇది అతిపెద్ద ‘రియల్‌ ఎస్టేట్‌ తప్పిదం’ అని చెప్పుకోవచ్చు.
    నీతి: పనికిరాని మంచుగడ్డ అనుకుని అమ్మేస్తే.. అది కాస్తా ‘బంగారు గని’ అని తర్వాత తెలిసింది. అందుకే ఆస్తి అమ్మే ముందు ఒకటికి పదిసార్లు సర్వే చేయించుకోవాలి!

    డ్రైవర్‌ కొట్టిన ‘రాంగ్‌ టర్న్‌’  
    1914లో ఆస్ట్రియా యువరాజు ఆర్చ్‌డ్యూక్‌ ఫ్రాంజ్‌ ఫెర్డినాండ్‌కి ఆ రోజు లేచిన వేళ అస్సలు బాగోలేదు. ఉదయాన్నే ఆయన మీద ఒక బాంబు దాడి జరిగితే తృటిలో తప్పించుకున్నారు. ఆ వాడితో గాయపడిన తన మనుషులను పరామర్శించాలని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ కొత్త రూట్‌ కావడంతో డ్రైవర్‌ కన్ఫ్యూజ్‌ అయిపోయి, ఒక చోట పొరపాటున రాంగ్‌ టర్న్‌ తీసుకున్నాడు. కారు రివర్స్‌ చేస్తున్నప్పుడు ఇంజిన్‌ ఆగిపోయింది. సరిగ్గా అక్కడే, ఆ ఉదయం బాంబు వేసి విఫలం అయిన హంతకుడు (గావ్రిలో ప్రిన్సిప్‌) సాండ్‌విచ్‌ తింటూ కూర్చున్నాడు.

    ఫలితం: యువరాజును చూసిన ప్రిన్సిప్, వెంటనే గన్‌ తీసి యువరాజుని కాల్చేశాడు. ఈ ఒక్క హత్య వల్ల ఐరోపా దేశాల మధ్య గొడవలు ముదిరి, ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం దాపురించింది.

    నీతి: రాంగ్‌ రూట్‌లో వెళ్తే ఫైన్‌ పడుతుంది అనుకుంటాం.. కానీ రాంగ్‌ టర్న్‌ కోట్లాది మంది ప్రాణాలు పోయే యుద్ధానికి దారి తీసింది.

    బీటిల్స్‌ని కాలదన్నిన డెక్కా  
    టాలెంట్‌ని గుర్తించడంలో ఇంతకంటే దారుణమైన పొరపాటు చరిత్రలో ఇంకొకటి జరిగి ఉండదేమో! అప్పట్లో, అంటే 1962లో అప్పుడే మొదలైన ‘బీటిల్స్‌’ బ్యాండ్‌ టీమ్‌ తమ పాటలు వినిపించడానికి డెక్కా రికార్డ్‌ కంపెనీ దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ కంపెనీ పెద్దాయన డిక్‌ రోవ్‌ ఒక ఆణిముత్యం లాంటి మాట అన్నాడు: ‘‘వద్దులే బాబోయ్‌.. ఈ గిటార్‌ వాయించే గ్రూపుల కాలం అయిపోయింది..’’ అని, వాళ్లను తిప్పి పంపించేశాడు.ఫలితం: బీటిల్స్‌ టీమ్‌ వేరే కంపెనీతో (ఇ.ఎం.ఐ. రికార్డ్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత వాళ్లు సృష్టించిన ప్రభంజనం తెలిసిందే! ప్రపంచ సంగీత చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన బ్యాండ్‌గా వాళ్లు రికార్డు సాధించారు. పాపం, ఆ డెక్కా రికార్డ్‌ వారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది.నీతి: మన దగ్గరికి అదృష్టం గిటార్‌ వాయిస్తూ వచ్చినా సరే, అది మనకు నచ్చకపోతే ‘కాలం అయిపోయింది’ అని సాకులు చెబుతాం. అప్పుడప్పుడు పాత స్టెయిలే కొత్త ట్రెండ్‌గా అవుతుందేమోనని ఆలోచించాలి.

    అతి పెద్ద అచ్చుతప్పు  

    ప్రింటింగ్‌ ప్రెస్‌లో చిన్న స్పెల్లింగ్‌ మిస్టేక్‌ జరిగితే ఏం చేస్తాం? సారీ చెప్పి సరిదిద్దుకుంటాం. కానీ రాబర్ట్‌ బార్కర్, మార్టిన్‌ లూకాస్‌ అనే ప్రింటర్లకు మాత్రం అది దిద్దుకోలేని తప్పు అయింది. 1631లో వాళ్లు బైబిల్‌ ప్రింట్‌ చేస్తున్నప్పుడు, బైబిల్‌లోని పది ఆజ్ఞలలో (టెన్‌ కమాండ్‌మెంట్స్‌) ఒక చిన్న పొరపాటు జరిగింది. ‘వ్యభిచారం చేయరాదు’ (Thou shalt not commit adultery)  అనే వాక్యంలో పొరపాటున ’n్టౌ’ అనే పదం ఎగిరిపోయింది.

    ఫలితం: ఇంకేముంది.. ఆ ఎడిషన్‌ బైబిల్‌ కాస్తా ఘోరమైన ఆ అపరాధంతో పబ్లిష్‌ అయిపోయింది! ఇది చూసి కింగ్‌ చార్లెస్‌–1 కోపంతో రాజ›ప్రాసాదంలోని వస్తువులన్నీ విసిరి పారేశారు. ఆ ప్రింటర్ల మీద భారీ ఫైన్‌ వేసి, వాళ్లని దివాలా తీయించాడు. వాళ్ల లైసెన్సులు రద్దు చేశాడు. తప్పుగా ప్రింట్‌ అయిన ఆ కాపీలన్నీ తగలబెట్టేయాలని ఆర్డర్‌ వేశారు. (కానీ కొన్ని ‘కలెక్టర్స్‌ కాపీలు’ మాత్రం ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయని అంటారు).

    నీతి: స్పెల్లింగ్‌ చెక్‌ చేయకుండా వాట్సాప్‌ మెసేజ్‌ పంపిస్తే పరువు పోతుంది. అదే మతగ్రంథంలో తప్పు చేస్తే మన చాప్టరే క్లోజ్‌ అయిపోతుంది!  

    నాసా 125 మి. డాలర్ల మిస్టేక్‌ 
    మనం కూరగాయలు కొనటానికి వెళ్లి, కిలోలకి బదులు లీటర్ల లెక్కన అడిగితే అంతా వింతగా చూస్తారు. సరిగ్గా అలాంటి తప్పునే నాసా శాస్త్రవేత్తలు చేశారు. 1999లో ‘మార్స్‌ క్లైమేట్‌ ఆర్బిటర్‌’ అనే రాకెట్‌ని అంగారక గ్రహం మీదకి పంపడానికి రెండు టీమ్‌లు పనిచేశాయి. అందులో ఒక టీమ్‌ లెక్కలన్నీ ఇంగ్లీష్‌ యూనిట్లలో (పౌండ్లు, ఫోర్స్‌) వేస్తే, రెండో టీమ్‌ మాత్రం మెట్రిక్‌ యూనిట్లను (న్యూటన్స్‌) వాడారు. దాంతో రెండు టీమ్‌ల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు.

    ఫలితం: రాకెట్‌ అంతరిక్షంలోకి వెళ్లాక, అది అప్లయ్‌ చేయాల్సిన ‘ఫోర్స్‌’ లెక్క తప్పింది. దాంతో ఆ రాకెట్‌ ఉండాల్సిన దానికంటే చాలా కిందకి వెళ్లిపోయి, అంగారక గ్రహ వాతావరణంలో కాలి బూడిదైపోయింది. అలా అప్పట్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు (125 మిలియన్‌ డాలర్లు) గాలిలో కలిసిపోయాయి.
    నీతి: లెక్కల్లో తేడా వస్తే కోట్లలో లాస్‌ వస్తుంది.

    తగలబడిన అలెగ్జాండ్రియా లైబ్రరీ
    ఇది ఏ ఒక్కరో తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదు. వరుస అతి తెలివి నిర్ణయాల వల్ల జరిగిన అనర్థం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాలెడ్జ్‌ హబ్‌.. ఈజిప్టులోని ఈ అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రాచీన కాలపు విజ్ఞానమంతా అక్కడే ఉండేది. అయితే, జూలియస్‌ సీజర్‌ గారు యుద్ధం చేస్తూ పొరపాటున ఒక భాగాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు ‘‘మాకు ఈ పుస్తకాలతో పనేంటి?’’ అని నిర్లక్ష్యం చేశారు, మరికొందరు రాజకీయం కోసమో, మతం పేరుతోనో మిగిలిన పుస్తకాలను కాల్చిపారేశారు.
    ఫలితం: ప్రాచీన చరిత్ర, సైన్స్‌కు సంబంధించిన దాదాపు 90 శాతం జ్ఞానం శాశ్వతంగా కాలి బూడిదైపోయింది. మన పూర్వీకులకు ఏమేం తెలుసో, వాళ్లు ఏయే టెక్నాలజీలు వాడారో ఇప్పుడు మనకు కేవలం ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ ఆ లైబ్రరీ సేఫ్‌గా ఉండి ఉంటే, మనం ఈపాటికే అంతరిక్షంలో ఇల్లు కట్టుకుని ఉండేవాళ్లమేమో.
    నీతి: పుస్తకాన్ని చదివినా చదవకపోయినా పర్లేదు కానీ, దాన్ని పొరపాటున కూడా కాల్చకూడదు. ఎందుకంటే మనం నాశనం చేసేది పేపర్లను కాదు, తరతరాల జ్ఞానాన్ని!

    దేవుడా! ఈ దారుణమైన తప్పులు, పొరపాట్లు చూస్తుంటే.. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్‌ చాలా బెటర్‌ అనిపిస్తోంది కదా! అలా అని అలక్ష్యంగా ఏ పనీ చేయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 
    · సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

  • తెల్లటి ఎండ ఎచ్చంగా కొడుతుంది, సరిగ్గా పన్నెండుగూడా కాలేదు టైము. అప్పటికి రొండుసార్లు అడిగి అడిగి మౌనంగా కూసుకున్నాడు జానుగాడు. రంగిసెట్టి కొట్టుకాడ పిల్లోడ్ని కూసోబెట్టి జొన్నసొప్ప కోయనీకి పోయింది రంగమ్మ. ‘సెట్టి దప్పికైతుంది ఒక్క గలాసు నీళ్లియవూ’ అని మూడోసారి అడగలేక ఎండిపోయిన పెదాల్ని నాలికతో రుద్దుకుంటూ కూసున్నాడు జానుగాడు అనబడే జాన్సన్‌.రంగమ్మ, ఆనందరావుల కొడుకు జాన్సన్‌ వయసు పదేళ్ళు. బడి మీన గాలి మల్లినప్పుడో, బడికి పంతులుగారు వచ్చినప్పుడో, ‘అయిదో క్లాస్‌ అబ్బీ’ నువ్వు అని చెబితే వినడమే తప్ప ఆ మాసిపోయిన పుస్తకాల సంచి వంక ఏనాడూ చూసిందే లేదు. పొద్దుగూకులు బస్టాప్‌ కాడ ఉండే పిచ్చి తుమ్మసెట్టు కింద సీట్లపేకలాడే వాళ్ల దగ్గర కూకోని పొద్దు ఎల్లబుచ్చుతుంటాడు. 

    ఎప్పుడన్నా వాళ్ళమ్మ గట్టిగా అర్సుకుంటే ఉన్న ఒక్క బర్రెని మేపడానికి పోతాడు.ఆనందరావుకి, రంగమ్మకి పెళ్ళి జరిగి పదేళ్లు దాటింది. ఆనందరావూ అచ్చం జానుగాడిలాగానే ఉండేవాడు. పెళ్లయిన కాణ్ణుంచి రంగమ్మకి అది నచ్చేది కాదు. రంగమ్మ తీరు వేరే, ఉన్నంతలో కాపరాన్ని నడుపుకోవాలని ఆశ. ఎప్పుడో గవర్నమెంట్‌ వాళ్లు ఇచ్చిన ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది బాగుజేపియాల, ఇంటికి ఒక బలుబైనా కరంటు ఉండాల అని అనుకుంటా మొగుడికి చెవిలో ఇల్లుకట్టుకుని చెబుతా ఉంటది. ఊళ్ళో పనిలేదు. ఉన్న కరువు పనికి పోబుద్దిగాదు. పొద్దునే లేసుడు సీట్లపేక కాడ ఊసుపోని కబుర్లు. 

    రంగమ్మకు ఇంట్లో ఉన్న ఒక్క బర్రెతో కాలం గడిచిపోయేది. దానిమేత, పాలు తీయడం, చల్ల జేసి అమ్మడం వల్లనే ఆ ఇల్లు ఆమాత్రమైనా గడుస్తుంది, నడుస్తుంది. రంగిసెట్టి కొట్టు ఆ ఊరికి ఒక రచ్చబండలాంటిది. బేల్దార్‌ పనికి కూలోళ్లు కావాలంటే యాడ దొరుకుతారో లోకంలో అందరికి తెల్సిన సంగతే, పల్లెటూళ్ళలో తక్కువ రేటుకు తేరగా దొరుకుతారని అసుమంటి వాళ్లకి రంగిసెట్టి లాంటి వాళ్ళు సాయం చేసి, నాలుగురాళ్లు యెనకేసుకుంటారు. ఊళ్ళోవాళ్ల బలహీనతలన్ని ఎలాగూ ముందే తెల్సిపోయి ఉంటాయి కాబట్టి బేరాలు తేలిగ్గానే తెగుతాయి. సదువు ఉండకూడదు, ఎదురు మాట్లాడితే పద్ధతిగాదు, ఇచ్చిన లెక్క కాడికి తలొంచుకుని ఎల్లిపోవాలో ఇట్టాంటోళ్లని యెతికి యెతికి మరీ పట్టుకుంటారు. 

    కాతాలు రాసుకునే బొక్కులో నుంచి మడతలుపడిన ఒక కాయితాన్ని, సేట్‌కి ఇచ్చాడు రంగిసెట్టి. మాకు తెలుగు రాదు సెట్టి నువ్వే పిలు వాళ్లని అన్నారు వాళ్లు. పదిమందిని పిలిపించాడు రంగిసెట్టి. అందులో ఆనందరావుతో పాటు ఇంకో తొమ్మిదిమంది పేర్లున్నాయి.రంగమ్మకి శానా కుశాలుగా ఉంది. ఈ మడిసిగాని ఆ పనికి ఒప్పుకుని పోతే అనుకున్న పనులన్నీ సక్కంగా అయిపోతాయి. పిల్లోడికి సదువు వస్తది, ఇల్లు బాగుచేసుకోవచ్చనే ఆశ ఆమె కళ్ళలో కనబడుతుంది. ‘ఒదినా నిజంగానే మనోళ్ళు దేశం పోతారంటావా పనికి! మా యన్నకి ఏమి అలవాట్లు లేవు కాని మా ఇంటాయన ఏమంటాడో ఏమో అసలే మిడిమ్యాలపు మడిసి’ అని రంగమ్మ చెవిలో గుసగుసలాడింది ఓబుగాడి పెళ్లాం రాహేలమ్మ.

     ‘పోతారు లేమ్మే పోక ఈడేం జేత్తారు, గుడ్డి గుర్రానికి పండ్లు తోముతారా?’ అని విసుక్కుంది రంగమ్మ.పిలిచిన అందరూ రంగిసెట్టి కాడ గుమి గూడారు. అదిగో అప్పుడు చూశాడు జానుగాడు హైద్రాబాద్‌ సేట్‌ చేతిలో ఒక ఆకుపచ్చని సీసా. ఆగి ఆగి తాగుతున్నాడు సేటు. మధ్య మధ్యలో చిన్నగా తేపుతున్నాడు. రంగమ్మ సేట్‌ చెప్పబోయే మాటకోసం చూస్తుంటే; ఆనందరావు– ఇల్లు , పిల్లోడు, సీట్లపేక సావాసగాళ్ళని వదిలి వెళ్ళాలా అని దిగులుగా కూసున్నాడు. జానుగాడి చూపులన్నీ ఆ ఆకుపచ్చని సీసా మీదనే ఉన్నాయి. అదేందో కనుక్కోవాలని వాడికి మామూలు కుశాలుగా లేదు, అమ్మనో అయ్యనో అడిగినా చెప్పేలాగా లేరు. పక్కనే ఉన్న సావాసగాడ్ని అడిగాడు ‘ఏందిరా ఆ సీసా’ అని.

    వాడికి తెల్సి తెలియని మాటల్తో చెప్పాడు ‘ఒరే అది డింకు సీసా సల్లగ ఉంటది. తాగితే దీనబ్బా ఒహటే తేపులు, మొన్న మా అయ్య పెద్ద కూర తిని, ఇది తాగి రొంత నాగూడక  ఇచ్చినాడు. ఓ యబ్బ చెప్పెటానికి కాదు, కాని పది రూపాయల్రా’ అని ఊరించాడు. జానుగాడికి అది మనాదిలో పడింది. పది రూపాయలు తెచ్చుకోవాలా ఆ డింకు తాగాలా...!పని చేయగలరు అని నమ్మకం కుదిరి, వాళ్ల కంటికి నదురుగా కనబడేసరికి రంగిసెట్టి ఇచ్చిన లిస్ట్‌కి టిక్కు పెట్టుకుని బేరాలు మొదులు పెట్టారు. ఏడాది ఎగ్రిమెంటు, నాలుగు నెలలకి వారం సెలవు, పెద్ద పండక్కి రొండు జతల బట్టలు, వారం వారం బటోడా, కాకుండా సమచ్చరానికి పదైదు వేలు డబ్బులు, తిండి, ఉండడానికి వసతి. రంగమ్మ కళ్ళు మెరిశాయి.

    అనందరావుకన్నా ఆ మాటకొస్తే ఆడికి వచ్చిన అందరికన్నా తనే ముందు సరే అని చెప్పేసేలాగా ఉంది. ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు. రంగిసెట్టి గొంతు సవరించుకుని ‘ఏందిరా సాలవా..? ఇంకేమైనా ఉన్నాయా గొంతెమ్మ కోరికలు అడిగి సావండి’ అని గదమాయించాడు. ఏలియా గాని, యాకోబు గాని ఏం ఉలుకు లేదు పలుకు లేదు, వాళ్లకీ లోపల సంతోషంగానే ఉంది కాని ఇంకా ఎవరైనా ఎక్కువ ఏమైనా అడిగితే బాగుండు అని మెదలకుండా ఉన్నారు. అందరూ గొణుక్కుంటూఉన్న టయానికి దిగ్గున లేశాడు ఓబయ్య ‘ఏంది సేటు నీ సమత్కారం, ఊరుగాని ఊరు పెళ్లాం పిల్లల్ని వొదిలి అంతగాలం ఆడుంటే ఇయ్యేనా మీరిచ్చేది. ఇరవై వేలియ్యి. మిగతా అన్నీ మామూలే. అట్లయితే సెప్పు, లేకపొతే వచ్చిన కారెక్కిపో’ అని అరిసినట్టుగా మాట్లాడి కూకున్నాడు.రంగిసెట్టికి కోపం నెత్తికి అంటుకుంది. 

    సేట్లు ఒద్దంటే తన కమీషన్‌ ఎక్కడ తనకి రాకుండా పోతుందో అని గుబులు పడ్డాడు. ‘ఏరా ఓబిగా! గతిలేని నా కొడకా! తాగుబోతు వాగుడంతా వాగి నోటి కాడ కూడు లాగేస్తావా ఈళ్లందరిదీ’ అని దిగ్గున లేచి తన్నబోయాడు. అక్కడున్న అందరూ వారించి ‘ఏంది సెట్టినోరు బో లేచ్చాంది తగ్గు తగ్గు’ అని ఆపినాక, నోట్లో ఉన్న పుగాక్కాడ తుప్పుక్కున ఊసి, ‘సూడు సేటు గారూ ఓబిగాడు అడిగిన దాంట్ల ఏమి తప్పులేదు. మీరే ఇంకోపాలి ఆలోసించుకోండి. మాదంతా ఇప్పుడు ఒకటే మాట. కావాలంటే మీరు రంగిసెట్టికిచ్చే కమీసన తక్కువ జేసుకోండి’ అని యాకోబు తగులుకునే తలికి అందరూ ‘అవునవును’ అని గొంతు కలిపారు. ‘మీకు బలిసిందిరా నా కొడకల్లారా ఏదో మీ కుటంబాలు బాగుంటాయని, నాలుగు మెతుకులు తింటారని అనుకుంటే నా కమీసన్‌  గురించి వాగుతున్నారు. పోండి మీరు ఎట్ట జత్తే  నాకెందుకు, మీ సాడు మీరు తాగండి’ అని పైపంచె దులుపుకుని లోపలికి వెళ్ళిపోయాడు. 

    దేశం అంతా తిరిగి పల్లేల్లో నుంచి ఇలా చదువు సంధ్య లేనివాళ్లని ఏరుకొచ్చి పనిలో పెట్టి, వాళ్లతో గొడ్డు చాకిరీ చేపించుకోవడం బాగా తెల్సిన పని. సిటీ బయట నీళ్లు దొరకని చోట కడుతున్న అపార్ట్‌మెంట్స్‌కి వీళ్లని తోలి ఆ ఇరవై వేలు ఇస్తే లెక్క సరిగ్గా సరిపోతుందని  ఆ సేట్లకి తెల్సు. రంగిసెట్టికి నొప్పి తెలియకుండా మళ్ళీ అందరినీ పిలిపించి, ఓకే మీరు చెప్పినట్టే ఇస్తామని ఒప్పించారు. అలగా వాళ్లతో మాటపడ్డందుకు రంగిసెట్టి ఏమంత సంతోషంగా లేడు.  అతని కడుపులో మంట ఇప్పట్లో తగ్గదు. నవ్వు పులుముకుని, ‘మీ కడుపు నేనెందుకు కొడతాన్రా అయ్యలారా’ అని అందరికీ కలిపి ఒకే ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నాడు.

    జానుగాడు వాళ్ల నాన్న చెయి పట్టుకుని ‘అయ్యా ఆ డింకుసీసా గావాల’ అన్నాడు. అసలే ఊరు వదిలెల్తున్న చికాకు ఎవరి మీద సూపియాలో నెత్తి గోక్కుంటున్న వాడికి ఈ మాట వరంలా చిక్కింది. ‘నా కొడక ఊరొదిలి నేను పోతా ఉంటే నీకు డింకు గావాల్నా గాలికి బుట్టిన నాకొడకా’ అని రొండు జబురుకున్నాడు. గబుక్కున రంగమ్మ లాక్కుని, ‘యాందీ మడిసి ఒక సుకము లేదు దుక్కము లేదు పిల్లోడ్ని సావనూకుతున్నాడు’ అని తిట్లకి లంకించుకుంది. జానుగాడి కళ్ళలో ఏడుపు లేదు, వాడి మనసంతా సీసామీదే ఉంది. రంగిసెట్టి ఆ నల్లటి ఇనపదాంతో ఆ మూత తెరిస్తే చేత్తో పట్టుకుని సల్లగా తాగాలని ఉంది. పది రూపాయలు– పదంటే పది రూపాయలు గావాల. 

    అందర్నీ రేత్రి పదింటికల్లా టేషను కాడికి రమ్మని వాళ్ల ఏజెంటుని అక్కడే పెట్టి సేట్లు కార్లో వెళ్ళిపోయారు. మాపటేలకి యాకోబు, సాలమాను, ఓబయ్య, ఆనందరావు, ఇంకా మిగిలినోళ్ళంతా పాస్టర్‌ కాడికి బోయి పార్ధన జేపిచ్చుకొని బయలుదేరుతూ, అయ్యగారి సేతిలో తలా ఒక ఇరవై రూపాయలు పెట్టి వొందనాలు జెప్పి బయలుదేరారు. అబ్బా ఆ డబ్బుల్లో నుంచి ఒక్క పది కాగితం జారిపడితేనా దీనెక్క ఇక ఆ సల్లటి సీసా మనదే అనుకున్నాడు జాను గాడు. అయ్యని అడుగుదామా అని అంటే నిన్న తిన్న దెబ్బలు యాదికొచ్చి యెనిక్కి తగ్గాడు.రంగమ్మ దిష్టి తీసింది మొగుడికి. ఇంట్లో ఉన్న రొండు వందకాయితాలు తీసి జేబీలో పెట్టి  కళ్లనీళ్లు తిరుగుతుండగా ‘అయ్యో! నెత్తిన ఇత్తులు బడ్డా కాణ్ణుంచి నేను నిన్నేమీ కోరిక కోరలేదు.

     నువ్వు ఎట్టా తిరిగినా ఏదో నోటి తుత్తర కొద్దీ వసపిట్ట మోయిన వాగుంటా. అదంతా మతిలో బెట్టుకోమాక. పని జేసుకో యాలకి తిను, తాగుడు జోలికి పోమాక. నీకోసం నాలుగు నెలలదాక చూస్తా ఉంటా’ అని కళ్ళు తుడుచుకుంది. జాన్సన్‌ గాడు మాత్రం నాన్న జేబు వంకే చూస్తున్నాడు. అమ్మ ఇచ్చిన రొండు వందల్లో ఒక్క పది  ఇస్తే బాగుండు అనుకున్నాడు కాని, అడగడానికి నిన్న దెబ్బలు ఇంకా మతికి ఉన్నాయి.‘ఓ అన్నా ఈ మడిసి సంగతి నీకు తెల్సుగద! అసలే తాగుడు మడిసి. నువ్వే రొంత కనిపెట్టుకుని నీ పక్కనే ఉంచుకోన్న నీ సెల్లెలు అనుకోని మాట కాసుకోన్నా! అంతా నీ మీన్నే  పెడుతున్న రొంత జాగ్రత అన్నా!’ అని కళ్ళలో నీళ్ళు కళ్ళలో పెట్టుకుంది రాహేలమ్మ.

    ‘పోవే నీ... నా గురించి నాకు తెల్వదా? ఏదో పొద్దుగాల పన్జేసి ఆనెక్కాలకి ఒక గుక్కెడు తాగుతా. దానికే ఏందీ ఇంత రంజీబు. అయినా తాగి పడుకోనీకి నేను మా అయ్య కాడికి కాదే పోయేది, పనికి. సేట్ల కాడ ఇయి నడవ్వు’ అని నవ్వుతూ తిడుతూ ముందుకు కదిలాడు. బస్సు పదిమంది వలస కార్మికులని ఎక్కించుకుని వెళ్ళిపోయింది. ప్రతి శనివారం రంగిశెట్టి దుకాణం కాడసందడి సందడిగా ఉంటది ఆడున్న కాయిన్‌ బాక్స్‌కి పనికి బోయినోళ్లు అందరూ పోన్‌ జేత్తారు. అందరూ అయిపోయినాకయితే రొంత ఎక్కువసేపు మాట్లాడొచ్చు అని అట్లనే నిల్చుకోని ఉండేది రంగమ్మ. అదే టైములో ఒకనాడు జానుగాడు పోయి ‘రంగిసెట్టి! మా అయ్య వచ్చాక ఇస్తా గాని సొమ్ములు, ముందు ఆ చల్ల సీసా ఇవ్వు’ అని గాలం వేశాడు. 

    అసలే తనమాట కాదని ఎక్కువ సొమ్ములు పెరుక్కున్నారని కోపంలో ఉన్న రంగిసెట్టి , ‘యాడరా నీ అయ్య వచ్చి ఇచ్చేది? అప్పుడే నువ్వు డింకు తాగే మొగోనివయ్యావా! మీ అయ్యలు ఆడ నానా తిట్లు తిని సంపాదిస్తుంటే ఈడ ఈ గూద నా కొడుకులకు ఏం జేయాలో తెలియడం ల్యా’ అని చెడు తిట్లకి లంకించుకున్నాడు. ఎవురి గొడవలో వాళ్ళుండడం వల్ల జానుగాడికి, రంగిసెట్టికి మజ్జన జరిగింది ఎవురూ సూడలేదు. బిత్తరపోయిన జానుగాడు సల్లగా వొచ్చి అమ్మ పక్కన నిలబడుకొని ఫోను వచ్చేదాకా వాడి సూపంతా ఆడ్నే ఉంది.ఆ గుండ్రటి కుండ అందులో సల్లని నీళ్ల మధ్యలో ఆకుపచ్చని సీసాకాయ. ఆ కంగారులోనే ‘అయ్యా ఎట్లున్నావురా అయ్యా’ అంటే, ‘బాగున్నా’ అన్నాడే గాని, పది రూపాయలు అడగలేదు. 

    రంగమ్మ ఇంట్లో ఎప్పుడు మంచం మీద పక్క శుభ్రంగా ఉంచుతుంది. గొడవ అయినాక దాన్ని కోపంతో చిందరవందర చేస్తూ మంచం మీద పడుకున్నాడు జాను గాడు. వాడికి పది రూపాయలు కావాలి. తలా ఒక రూపాయి అడుగుదామని ఆలోచన జేసీ అడిగాడు. నేరుగా రంగమ్మ కాడికి వచ్చి ‘ఏంది మీ పిల్లోడు రూపాయి అడిగినాడు ఏంది కత’ అని అడిగేతలికి జానుగాడి ఈపు సాపు జేసింది రంగమ్మ. ‘బడికి పోయి సదువుకోమంటే పోడుగాని ఈడికి డింకు సీసా గావాలంట నాకాడ సొమ్ములున్నా ఇప్పియ్యను గాక ఇప్పియన్ను నీ సొయ్యం నీకు అణగాల. ఎవురుకాడైనా చేయిజాపినా, ఇంట్లో రూపాయి కాన్రాకపోయినా నా కొడకా కొడితే మీ జేజవ్వ దిగిరావాల’ అని ఆ రోజంతా తిడతానే ఉంది.జాను గాడికి నిద్రలో అదే, మెలకువలో అదే! పదిరూపాయలు. పెద్ద కూర తిన్న రోజంతా ఆడి ధ్యాసంతా దానిమీన్నే ఉండేది. సీట్లపేక కాడికి కూడ పోవట్లే.

     ఒక్కొక్క రోజు ఎల్లి రంగిసెట్టి కొట్టు కాన్నే కూసోని, రోజుకి  ఎంతమంది తాగుతున్నారా అని లెక్కేలేసే వాడు. దేవుడా ఒక్క పది రూపాయలు దొరికేలా చేయమని సెర్చీ కాడికి బోయి పార్ధన కూడా చేశాడు. ప్చ్‌.. అయినా గాని వాడికి ఆ వరం దక్కలేదు.ఆనందరావు పనిలో కుదురుకున్నాడు. బటోడ డబ్బులు దాచుకోవడం మొదులు బెట్టాడు. ఒక పక్కన అదిలించే వాళ్ళు లేక  ఓబు తాగుడు ఎక్కువైంది. పనికి మూడు రోజులు బోతే మిగతా మూడు రోజులు నాగా లాగా తయారైంది. ముందు ఏజెంట్‌ చెప్పి జూశాడు. రాహేలుకి పోన్‌ జేశారు. ఆయమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చి మరి జెప్పింది. నవ్వి నేను తాగలేదు అనేవాడు, ఆ మాట కూడా తాగే చెప్పేవాడు. మెల్లగా పనికి పోకుండా తాగుడుకు బానిసై అప్పులు జేసీ ఒంట్లో బాగోని కాడికి తెచ్చుకున్నాడు.

    మూడు నెలలు కావడానికి ఇంకో వారం ఉంది అనగా ఒక అర్ధరాత్రి కాడ రంగిసెట్టి పోన్‌  మోగింది. ‘ఏంది సెట్టి నీ కమీషన్‌ కోసం తాగుబోతు నాయాల్ని పంపినావు. వాడు తాగి తాగి ఈడ సచ్చిపోయినాడు. వాడికి సొమ్మేం రాదు. ఏదో మళ్లా ఆ ఊరికి పనోళ్ల కోసం రావాలిగాబట్టి రొంత సొమ్ము పంపుతున్నా అక్కడ నువ్వే సెటిల్‌ జేసుకో’ అని ఏజెంట్‌ చెడామడా తిట్టి పోన్‌ పెట్టేసినాడు. రంగిసెట్టికి గుండె దడ పెరిగింది. మాదిగ పల్లె వైపు ఉరికాడు. ముందు సలవాదిరిని లేపుకుని విషయం చెప్పి అందరికి చెబుదాం పదమన్నాడు. పల్లె మొత్తం నిద్ర లేచింది. రాహేలమ్మ స్పృహ కోల్పోయింది. రంగమ్మ పరుగెత్తి కెళ్లి ‘ఊరుకో వదినా’ అంటూ ఊరడిస్తోంది. 
    ఆనందరావు, యాకోబు ఇద్దరు ఓబు శవాన్ని తీసుకుని బయలుదేరారు.

    మాదిగపల్లె ఓబు శవం కోసం ఎదురు చూస్తోంది. సంగతి తెల్సినకాణ్ణుంచీ జానుగాడు, రంగమ్మ ఆణ్నే ఉన్నారు. రాహేలుని ఆపడం ఎవురుతరం కావటం లేదు. రంగమ్మ పక్కనే కూర్చుని ‘ఊరుకో వొదినా! అంతా మన గాచారం’ అని అనునయిస్తోంది.‘గాచారం గాదు ఒదినా, మన తలరాత. ఈ ఊరిమీన ఉన్నంత ఎండ ఏఊర్లో అయినా ఉందా? ఎన్నడైనా ఇంత మబ్బు తునక చూసినమా, తోవ తడిసే వాన జూసినమా? రొండు బిందెల నీళ్లకు ఎంత దూరం పోతుంటిమీ, నీళ్ల కోసం గడప దాటని ఆడది ఉందా మనూళ్లో. వారానికి ఒక బిందె నీళ్ళు ఇది గదూ మన బతుకు. కాని సారాయి జూడు దానికి నీళ్ల కొదువే ఉండదు. ఇళ్ళూ, ఊళ్ళు ఆర్పి కూసుంటుంది. నీళ్ళు లేకపోయినా ఈ నా బట్టలు ఆ మందు తాగి ఇదిగో ఇట్టా మన తాళ్ళు తెంపుతున్నారు’ అని అంటూ మళ్ళీ ఏడవడం మొదులు బెట్టింది. రంగమ్మ కళ్ళు తుడుచుకుంది.

    ఆనందరావుకి తాగుడు లేదు. అదొక్కటే సంతోషం తనకి. ఓబు ఇంటికాడ శవాన్ని దించి నీళ్లుబోసుకుని వద్దామని ఆనందరావు, యాకోబు ఇళ్లకి వచ్చారు. రంగమ్మ కళ్లనిండా నీళ్ళు పెట్టుకుని అనందరావుకి ఎదురెళ్ళింది. పొంతలో నీళ్ళు తోడి, గాబులో నీళ్ళు కలిపి రేకుల తలుపున్న దొడ్లో పెట్టింది. జాను గాడికి నాన్న జోబు మీద కన్ను పడింది. ఒక్క పది రూపాయలు అయ్యొచ్చిండు. ఇగ ఇయాలో రేపో చేతిలో సల్లని సీసా గొంతులో తీయగా అబ్బా వాడికి వాడే ఊరించుకుంటున్నాడు.ఏందయ్య ఎందుకు మీరు పోయింది ..? పక్క పొంటి మనిషి అంతగనం తాగుతుంటే మీరు చెప్పొద్దా అంటూ ఆనందరావుని నిలదీసింది రంగమ్మ.

    ‘నువ్వు మా పని కాడికి రావే ఆడజేసే  గొడ్డు చాకిరీ నీకు తెలుస్తది. లేచిన కాణ్ణుంచి రేత్రి ఎనిమిది దాకా వొంచిన నడుము ఎత్తేదానికి ఉండదు. బువ్వ ఒక్కసారే పెడతారు. మారన్నం అడిగితే ఇంగ అంతే మా కత, రోజూ పచ్చడి, పప్పే! దానికి తోడు నీళ్ల మజ్జిగ. దీనమ్మ జీవితం ఆణ్నే సచ్చిపోతే బాగుండని ఎన్నితూర్లు అనుకున్నానో తెల్సునా. ఓబుగాడు పోయిన మూడో రొజునుంచే వాని స్యాతగాలే పని, వాడి పని గూడా మేమే జేసి, ఆ నాలుగు రాళ్లు ఇప్పిచ్చినం. వాడి బాదలకి మందు అదే అని తెల్సినాక యాడ్నే ఆపేది. వాడిని ఆసుపత్రికి తీసకపొమ్మని అడిగితే ఆ సేట్‌ నా కొడుకు తాగుబోతు నాయాళ్లు మాకు అక్కర్లేదు అని ఎల్లిపోయినాడు’ అని కళ్ళు తుడుచుకున్నాడు. రంగమ్మకి విషయం పూర్తిగా అర్థమైంది . ఇంతకి మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మళ్ళీ ఆనందరావు ఎనిక్కి పోడని ఊహించి ఇంకేం మాట్లాడలేదు.

    ఎప్పటిలానే నేలని ఎండబెట్టడానికి మళ్ళీ ఎండ వచ్చింది. ఓబుని పూడ్చిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీళ్ల టాంకి కోసమని పొయినోళ్లకి దొరకనే లేదు.ఆనందరావు, యాకోబు, ఇంకొంతమంది తలా ఇంత అని వేసుకుని అవసరమైన పెట్టే, తెల్లగుడ్డ, సెంటు సీసాలు, చల్లడానికి చిల్లర అన్ని సమకూర్చారు. పాస్టర్‌గారికి కబురు వెళ్ళింది.నీళ్ల బండి దొరకని కారణంగా స్నానం లేదు. సెంటు కొట్టి పెట్టెలో పెట్టడమే అని తీరుమానం చేసి పాస్టర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.జానుగాడు లేచేసరికి ఎదురుగుండా నోట్ల కట్టలు కనబడ్డాయి. ఇంట్లో అమ్మా, అయ్యా ఎవురూ లేరు. బయటకి వచ్చి మల్లొకసారి ఎవరూ లేరని సూసుకుని, మెల్లిగా ఒక నోటు లాగి నిక్కర జేబిలో పెట్టుకుని ఒక్క ఉదుటున బయటకి ఉరికాడు. వాడి మనసులో ఒకటే ఆశ ... ఆ సీసా సల్లగా గొంతులోకి పొయే కల. మధ్యలో బడికి పోతున్న తన సావాస గాళ్లని ఆపి, జేబులో నోటు చూపెట్టి సీసా తాగబోయే సంగతి చెప్పాడు. 

    ఒక్కసారిగా వాళ్లంతా నవ్వడం మొదులు పెట్టారు. ‘ఒరే జానుగా! అది అసలు సొమ్ము గాదురా అది పిచ్చి నోటు. ఎవురైనా సచ్చిపొతే వాళ్లమీద జల్లడానికి తెచ్చే సొమ్ములు’ అనేసరికి జానుగాడికి ఎక్కడలేనినీరసం ఆవహించింది. ఉసూరుమంటూ   వెనక్కి మరులుకొని ఓబు ఇంటిదగ్గరకి పోయాడు. అక్కడా ఉండబుద్ది గాలేదు. ఇంటికి పోయి ఆ నోటు ఆడ్నే పార్నూకి మంచమెక్కి పొనుకున్నాడు. మజ్జానం అవుతావుంది. రంగమ్మ ఇంటికి బోయి, ఒకమారు జానుగాడికి అన్నం బెట్టి వచ్చింది.సరిగ్గా రొండు గంటలకి బతికినంతకాలం తాగి తాగి సచ్చిపోయిన ఓబు పోయినాక కనీసం నీటిసుక్క గూడా ఒంటిమీన పడకుండా పెట్టెలో పడుకుని పోతున్నాడు. పల్లె పల్లె మొత్తం ఖాళీగా ఉంది. ఓబుని పెట్టెలో పెట్టి తీసుకుపోవడానికి లేపారు. పలకలు మోగుతున్నాయి.

    సరిగ్గా అదే టయానికి పడుకున్న జానుగాడు నిద్ర లేచాడు, బయటకి వచ్చి చూస్తే జనం పోతా ఉన్నారు.కళ్ళు నుల్చుకున్నాడు. తెల్లటి ఎండలో మిల మిలా మెరుస్తున్న రొండు రూపాయల బిళ్ల. దగ్గరకి వెళ్లాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఇది కాగితం కాదు, బిళ్ల– చెల్లుతుంది అనుకుని తీసుకుని జోబిలో వేసుకున్నాడు, ఆనందం ఆగేలా లేదు వాడికి. ఇంకా ముందుకు పోయాడు ఇంకో రూపాయి, ఇంకా ముందుకు పోతే ఇంకో రెండు రూపాయలు... గులాం పూసుకుని కొన్ని పూలు మీదబడి కొన్ని దొరికాయి.సరిగ్గా లెక్క జూసుకున్నాడు మొత్తం పది రూపాయలు.రంగిసెట్టి కొట్టు ఒకటే కళ్లముందు కనబడుతుంది జానుగాడికి, వాడిలో వాడే లోపల్లోపల మాట్లాడుకుంటున్నాడు ‘ఎట్లుంటది? అది సోడాలాగే ఉంటదా. తియ్యగా, పుల్లగా, అసలు ఇంట్లో నీళ్లే తాగడానికి రొండు రోజుల తర్వాత పనికి రావు. ఇన్ని రోజులు ఆ సీసాలో నీళ్లు పాడైపోవా?’ బుర్ర నిండా గందరగోళం. 

    ఇంక కాసేపట్లో ఆ సీసా తన చేతిలో ఉంటది. పరిగెత్తుతున్నాడు, కాళ్లు కాల్తున్నాయి. అయినా ఆగడం ల్యా, పలకల దరువు పెరిగే కొద్ది జానుగాడిలో హుషారు పెరుగుతుంది. దరువు దరువుకి ఒక అంగ వేసుకుంటూ  సరిగ్గా రంగిసెట్టి కొట్టు దగ్గర ఆగిపోయాడు  జానుగాడు.
    వీళ్లు అందరూ కనబడకుండా పోయాక తాగుదామని ఆలోచన చేశాడు. మళ్ళీ ఎవురైనా సొమ్ములు యాడివి అంటే దొరికినాయని చెప్పినా నమ్మరు. శవం కాడియి ఏరుకున్నావా అని తన్నినా తంతారని ఆగాడు. ఒక పక్క ఓబుని పాతిపెట్టే కార్యక్రమం నడుస్తోంది, ఏడుపులు ఇనొస్తున్నాయి.రంగిసెట్టి కొట్టుకాడ జేబిలో డబ్బులు తీసి సరిగ్గా లెక్కబెట్టి ‘ఇదిగో రంగిసెట్టి లెక్క. నాకో సీసా ఇయ్యి’ అని దాదాపుగా అరిసినంత పనిజేశాడు జానుగాడు. 

    లెక్క సరిచూసుకున్నాడు సెట్టి, యాడియిరా అని అడగబోయి, యేముందిలే పట్నం సొమ్ము అనుకుని గల్లాలో వేసుకుని సీసా మూత తీసి ఇచ్చాడు.అదే సప్పుడు కోసమే జానుగాడు కలగన్నది. ఆ ఇనుప సువ్వ దీసుకుని రంగిసెట్టి మూత తీస్తుంటే జానుగాడి మనసులో బో కుశాలయింది.చేతిలో చల్లని సీసా, పైన ఎర్రటి ఎండ. నీళ్ళు గుడక ఇంత ప్రేమగా ఏనాడు తాగలేదు. ఓబు కార్యక్రమం అయిపోయింది. అందరూ యెనిక్కి మరలుకుని వస్తున్నారు, ఓబుని తల్సుకుని పనికి పోవాలా వద్దా అని ఆనందరావు గుబులు పడుతున్నాడు. రంగమ్మ కళ్లముందు బాగుజేసుకున్న ఇల్లు, బలుబు ఎల్తురు అగపడతున్నాయి. కళ్ళముందు కుర్చీలో కూర్చుని సల్ల డింకు సీసా తాగుతున్న జానుగాడు అగపడుతున్నాడు.చిరాగ్గా మొహం బెట్టుకుని రంగిసెట్టి ఆ ముగ్గురినీ జూత్తా ఉన్నాడు. 
     

  • జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్‌ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్‌ ఉన్న కలర్‌ ఫొటోని ఫ్రేమ్‌ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.

    అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్‌ పుస్తకాలని చదివాడు. అతను హెచ్‌.జి.వెల్స్‌ 1895లో రాసిన ‘టైమ్‌ మెషీన్స్‌ ’ నవలని చదివాక టైమ్‌ ట్రావెల్‌ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్‌ డికెన్స్‌    రాసిన క్రిస్టమస్‌ కేరల్‌లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్‌ ట్రావెల్‌ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్‌ ట్రావెల్‌ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్‌ కాన్సులేట్‌ ఆఫీసర్‌ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్‌ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు.

     ‘‘వెల్‌కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్‌. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్‌ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్‌తో టైమ్‌ ట్రావెల్‌ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్‌ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్‌ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది.

     చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్‌ ట్రావెల్‌ మెషీన్స్‌ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్‌  సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్‌  నేరస్తుడు అల్‌ కపోన్స్‌ తో సంబంధం గల ది గ్రీన్స్‌  మిల్‌ బార్‌కి చేరుకున్నాడు. లైవ్‌ జాజ్‌ మ్యూజిక్‌ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్‌ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్‌ షేర్‌ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.

    ‘‘ఇతను మిస్టర్‌ డేవ్‌.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్‌వైజర్‌ బీర్‌ ఆర్డర్‌ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్‌లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్‌ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్‌ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్‌ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్‌ స్కాలర్‌ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్‌ చేస్తున్నారు?’’ ‘‘టైమ్‌ ట్రావెల్‌.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’   ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.

    ‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్‌ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్‌ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్‌ ఫోన్‌. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్‌తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు. 

    ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్‌ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్‌.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్‌  చాప్స్‌ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్‌. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్‌లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్‌ ట్రావెల్‌ చేయలేదు.

     2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్‌ మిల్‌ బార్‌లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు. 
     

Andhra Pradesh

  • కాకినాడ జిల్లా: స్థానిక కాకినాడ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడటంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ తనకు సంబంధం లేకపోయినా చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించిన సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచేసింది. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును వెంటనే కాకినాడకు పంపే విధంగా చూసి ఓ రోగి ప్రాణాలు కాపాడంలో ఆమె ప్రత్యేక చొరవ చూపింది.

     రంగంపేట పోలీస్‌ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ శాంతికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కాకినాడలో శనివారం డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తరువాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలు దేరారు. 

    కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వెంటనే తన విధులు గుర్తుకు వచ్చి చంటి బిడ్డను ఎత్తుకుని మరీ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  ప్రయాణికులు ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు ఆమెను అభినందించారు. తనకు సంబంధం లేదని వెళ్లిపోకుండా ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్‌ విధులు నిర్వహించడం గమనార్హం. ఒకవైపు బిడ్డ, మరోవైపు విధులకు సంబంధించిన బ్యాగ్‌తో విధులు నిర్వహించిన ఆమెను అంతా కొనియాడారు.  

     

  • విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్‌ఏడీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీ కాలనీకి చెందిన మువ్వ నారాయణ రావు కుమార్తె రమా హిమజ (27)కు, గత ఏడాది నవంబర్‌లో ఎంవీవీ వినీష్‌తో వివాహం జరిగింది. 

    హైదరాబాద్‌లో నివాసముంటున్న ఈ నూతన దంపతులు తొలి పండగ కోసం విశాఖ వచ్చారు. నాలుగు రోజులు కుటుంబంతో సంతోషంగా గడిపిన వీరు, శుక్రవారం కారులో అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, అదే రోజు రాత్రి తిరిగి విశాఖ బయలుదేరారు. మరో పావు గంటలో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో.. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌పై కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. 

    దీంతో కారు అదుపుతప్పి రోటరీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాద తీవ్రతకు భయపడి తీవ్ర ఆందోళనకు గురైన హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. మృతురాలి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకర నారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.