Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డిని టీ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ ఈ రోజు( సోమవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. 2026 T20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసినందుకు గాను ఆయనను అభినందించారు. 

    ఈ కార్యక్రమంలో  సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.

    అంతకు ముందు తిలక్‌ వర్మకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని ఎయిర్‌పోర్టు వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. కాగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో తిలక్ వర్మ సభ్యునిగా ఉన్నారు.

  • హైదరాబాద్‌:  సినీ నటి ప్రత్యూష మృతికేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఈ రోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) నాంపల్లి కోర్టులో సిద్ధార్థరెడ్డి లొంగిపోయాడు. అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో సరెండర్‌ అయ్యాడు. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. 

    డ్రింక్‌లో పురుగుమందు కలిపిన సిద్ధార్థరెడ్డి.. అతను తాగడంతో పాటు ప్రత్యూషకు కూడా ఇచ్చాడు. ఇది తాగిన ప్రత్యూష్‌  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. 

    ఇటీవల ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది.  బెయిల్‌ కోసం ఆయన వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది.  ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు  శిక్షను సుప్రీంకోర్టు  సమర్థించింది. 

    ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్‌ రెడ్డి  అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్‌గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్‌ రెడ్డి ఇంజనీరింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో  2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ   విషం తీసుకున్నారు.

    చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్‌ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.

    నాలుగు వారాల్లో లొంగిపోవాలి
    సీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్‌ చేస్తూ సిద్ధార్థరెడ్డి  హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.

    ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..
    అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి.  కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం.  ఫేషియల్, వ్యాక్సింగ్‌ చేయించుకోవడానికి తన కజిన్‌ శిరితో కలసి బ్యూటీపార్లర్‌కెళ్లింది. పార్లర్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్‌ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్‌ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్‌ చేయమని చెప్పింది.

    అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్‌ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది, జయం ఆఫీస్‌కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్‌ కాల్‌.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్‌కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్‌లో ఉన్న శిరికి ఫోన్‌ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్‌ చేసినా సరే ప్రత్యూష ఫోన్‌ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది.

  • హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ‍్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, చార్మినార్‌, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.

    మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి  వాతావరణం  చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది.

  • ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి (nandini sidhareddy)ని వరించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు. 

    సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

     

    మెదక్ జిల్లా బందారం గ్రామంలో  సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు.  హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. 

    మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు
    తెలంగాణ మట్టి పరిమళాన్ని, సామాజిక చైతన్యాన్ని తన కలం ద్వారా జాతీయ స్థాయికి చేర్చిన ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించడం పట్ల  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రచించిన 'అనిమేష' వచన కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్రం ప్రకటించింది. సిధారెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల  మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.

    నందిని సిధారెడ్డి కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక పునర్వైభవానికి బాటలు వేసిన దార్శనికుడు. ఆయన రాసిన 'అనిమేష' కవితా సంపుటి ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుత సృష్టి. ఈ పురస్కారం ఆయన సుదీర్ఘ సాహిత్య కృషికి దక్కిన సరైన గౌరవం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక గొప్ప మేధావికి ఈ స్థాయి గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.

    మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజల్లో చైతన్యం నింపడంలోనూ ఆయన పాత్ర చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కొనియాడారు.

  • ఖమ్మం:  ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్‌లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. 

    అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. 

    ఖమ్మం టూటౌన్‌కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ..  ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది.  ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

    వేదికపై ఫోటో దిగుతూ గుండెపోటుతో మహిళ మృతి

     

  • సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లగానే మొదట బుల్లెట్‌ సౌండ్‌ వినపడింది. బుల్లెట్‌ సౌండ్‌ విని వెంటనే అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా.. పట్టించుకోలేదు. మరో రెండుసార్లు బుల్లెట్‌ సౌండ్‌ వినపడింది. 
     
    మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటా.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్‌ సౌండ్‌ నిలిచిపోయింది. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు చేరుకున్నాం. ఫామ్‌హౌస్‌ సెర్చ్‌ చేసేందుకు మేము వారెంట్‌ తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే.. సెర్చ్‌ వారెంట్లను రోహిత్‌రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్‌ శర్మ చేతిలో.. తుపాకీని మేం స్వాధీనం చేసుకున్నాం.

    బుల్లెట్‌ షెల్స్‌ పట్టుకొని మరొకరున్నారు. అతనిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లో ఓ మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్‌ మేడ్‌ రివాల్వర్‌ పాయింట్‌ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్‌ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి శరత్‌కుమార్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిని చెక్‌ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్‌ బయటపడింది. కొకైన్‌ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.

    పైలెట్‌ రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ను విచారించినప్పుడు కొకైన్‌ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. కొకైన్‌ తానే తెచ్చానని కౌషిక్‌ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు తానే కొకైన్‌ తీసుకొని వచ్చానని చెప్పాడు.’అని తెలిపారు.  

    ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు

    నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా ఈగల్‌ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు.  

National

  • ఢిల్లీ:  భారత్‌లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

    అమెరికాకు చెందిన (USCIRF) కమిషన్ భారత్‌లో మతస్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది.  భారత్‌లో క్రమపద్ధతిలో,  మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కనుక భారత్‌ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానితో పాటు మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతన్నందుకు భారత్‌కు చెందిన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ,RSS సంస్థలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.

    తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా నివేదికను మేము పరిశీలించాము. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అవి ప్రేరేపితమైనవి మరియు పాక్షికమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా USCIRF భారతదేశాన్ని వక్రీకృతమైన సమాచారం చూపిస్తూ వస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే నివేదికలు కమిషన్‌ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి. భారత దేశంపై విమర్శలు మాని  అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ నివసిస్తున్న భారతీయ వలసదారులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై USCIRF  ఆలోచించాలి,” అని తెలిపారు.

    USCIRF అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న మతస్వేచ్ఛ పరిస్థితులపై ఏటా నివేదిక అందిస్తుంది. అందులో భాగంగా కొన్ని దేశాలను CPC ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా గుర్తించాలని సూచిస్తుంది..

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్న నేపథ్యంలో సినీనటుడు విజయ్‌కు చెందిన టీవీకే ఇప్పటికీ పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్‌ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కూటమి తమిళనాడులో గెలిస్తే విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

    అయితే, పొత్తుల గురించి వస్తున్న ఇలాంటి ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్‌ నిర్మల్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. కూటమి గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అలాగే వదంతులను నమ్మవద్దని కుండబద్దలు ​కొట్టినట్లు చెప్పేశారు.

    ‘ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యం.

    కొన్ని నిర్దిష్ట పార్టీలతో, రాజకీయ నాయకులతో ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. గతంలో కూడా కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తున్నామంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రావడం అందరికీ తెలిసినదే, అది నిజం కాదు.

    అయితే ప్రజలు, టీవీకే కార్యకర్తల్లో గందరగోళం కొనసాగించేందుకు డీఎంకే ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తోంది. బాధ్యతాయుత మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వినియోగదారులు నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దు. నిజమే గెలుస్తుంది!’ అని చెప్పారు. 

  • చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమిళనాడులో నలుగురు పోలీసు సూపరింటెండెంట్ల(ఎస్పీ)ను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలతో కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలు తక్షణ బదిలీ అవుతారు. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 

    షెడ్యూల్‌తో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈసీఐ కరూర్ ఎస్పీగా హరికిరణ్ ప్రసాద్, కిరణ్ శ్రుతిని ఈరోడ్, సుజిత్ కుమార్‌ను నాగపట్నం, శ్రీనాథను విరుదునగర్ ఎస్పీగా నియమించారు. ఈ జిల్లాల ఎస్పీలు అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

    మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోనూ కీలక అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన అధికారి నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం అండ్ హిల్ అఫైర్స్ జగదీశ్‌ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.
     

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న  ఎ‍న్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.  ఈ నేపథ్యంలో  144 మందితో  తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.

    ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్‌పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య  జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.

     

    "లాజికల్ డిస్క్రెపెన్సీ"  విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

    (అట్టుడుకుతున్న దుబాయ్‌ : విమానాశ్రయం వద్ద డ్రోన్‌ దాడి)

    ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్,  బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.

    కాగా పశ్చిమ బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ  తొలి జాబితా సిద్ధం కావడం విశేషం.  ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.

    కేరళలో కూడా
    కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్‌ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్‌లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం.
     

     ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు సహా ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం అండ్ హిల్ అఫైర్స్ ప్రధాన కార్యదర్శి, మరికొందరు అధికారులను బదిలీ చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మార్పులు చేశామని తెలిపింది.

    ఎవరెవరిని బదిలీ చేశారు? 
    మమతా బెనర్జీ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న ఇద్దరు ఉన్నత అధికారులను ఎన్నికల కమిషన్ తొలగించింది.

    • చీఫ్ సెక్రటరీ: నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది.

    • ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ అండ్ హిల్ అఫైర్స్: జగదీశ్‌ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.

    ఇతర కీలక నియామకాలు

    • డీజీ అండ్ ఐజీపీ: సిద్ధ్ నాథ్ గుప్తా (ఐపీఎస్-1992)

    • డీజీ, కరెక్షనల్ సర్వీసెస్: నటరాజ్ రమేశ్‌ బాబు (ఐపీఎస్-1991)

    • ఏడీజీ అండ్ ఐజీపీ, లా అండ్ ఆర్డర్: అజయ్ ముకంద్ రనడే (ఐపీఎస్-1995)

    • కొలకతా పోలీస్ కమిషనర్: అజయ్ కుమార్ నంద్ (ఐపీఎస్-1996)

    ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. బదిలీ అయిన అధికారులను ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల పనుల్లో నియమించరు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మార్పులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
     
    తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేశారు. అర్ధరాత్రి దాటాక బెంగాల్ హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడం సరికాదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్నత అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ సోమవారం రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ఈ ఘటన 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో జరిగింది.. 

    మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు ఎన్నికల కమిషన్‌  నిర్ణయాన్ని సమర్థించారు. ఇలాంటి బదిలీలు చేయడానికి కమిషన్‌కు రాజ్యాంగ అధికారము ఉందని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన తృణమూల్ కాంగ్రెస్‌ను విమర్శించారు.
     

  • బాగా చదివి, ప్రయోజకులై,మంచి కానుకలతో తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేయాలిని చాలామంది బిడ్డల ఆలోచన. చక్కటి ఇల్లో, ఖరీదైన కారో కానుకగా ఇవ్వాలని చాలామంది డ్రీమ్‌. అలా తమ తల్లిదండ్రులకు ఒక సరికొత్త కారును గిఫ్ట్‌ ఇచ్చి, ఆశ్చర్యపరిచిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అమ్మానాన్నలకు అపురూపమైన కానుకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ కథ తెలుసుకుందాం పదండి.

    వర్ష అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో సందడిగా మారింది. తన సోదరితో కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.

    తమ తల్లిదండ్రుల కళ్ళకు గంతలు కట్టి డ్రైవ్‌వే వైపు మెల్లగా తీసుకొచ్చి మరీ బ్రాండ్‌ న్యూ కారు ఇచ్చారు. కొత్త కారును చూసి ఆ దంపతులు ఆశ్చర్య పోయారు.  అందరూ కలిసి  కారుపైన కవర్‌ తీయగానే అమ్మానాన్నల ముఖాల్లో వెయ్యి వోట్ల వెలుగు వచ్చింది. వెంటనే వారు తమ కుమార్తెలను హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. చుట్టూ ఉన్న బంధువుల చప్పట్లు, నవ్వులతో =సందడిగా మారింది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగాన్ని నింపాయి.

    భావోద్వేగ సందేశం
    "మా తల్లిదండ్రులు  ఇది లేదు, అది లేదు అని ఎపుడూ చెప్పలేదు. మమ్మల్ని ఏ విషయంలోనూ ఆపలేదు. ఎదిగి విజయం సాధించండి' అని మాత్రమే చెప్పారు. మా జీవితాంతం మాకు రక్షణగా, మద్దతుగా నిలిచినందుకు ఈ కారు ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే. మేం నలుగురం ఒక్కటే."

    నెటిజన్ల ప్రశంసలు
    ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపించారు."ఇంతటి విలువైన కుమార్తెలను పొందిన ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు," అని ఒకరు "ఆ తల్లి కళ్లలోనే అంతా కనిపిస్తోంది. అందులో కేవలం ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి" అని మరొకరు రాశారు. కన్నబిడ్డలు ఎదుగుదల, తమకు గౌరవించే తీరు చూసినపుడు  తల్లిదండ్రులు పొందే ఆ గర్వం, సంతోషం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

  • న్యూఢిల్లీ: ఇరాన్‌ వార్‌తో దేశంలో  ఎల్‌పీజీ గ్యాస్‌ లభ్యంత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్‌పీజీ కొరతలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఆందోళనగా కరంగా ఉందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.  దీంతో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) మల్లికార్జున్ ఖర్గే, జె.పి. నడ్డా మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది. జీరో అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం మరియు హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
     

    పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పిజి సరఫరాపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ కేంద్రంపై మండిపడింది. రాజ్యసభలో ఎల్‌పిజి సంక్షోభ అంశాన్ని లేవనెత్తిన మల్లికార్జున్ ఖర్గే సిలిండర్ల ప్యానిక్‌ బుకింగ్‌పై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎల్‌పిజి సమస్య మధ్యతరగతి, రెస్టారెంట్లు, హాస్టళ్లు , వాణిజ్య వినియోగ దారులను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో, ఎల్‌పిజి లభ్యత, ధర స్థిరత్వం తీవ్రమైన సమస్యలుగా మారాయనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు.  కేంద్ర పెట్రోలియం మంత్రి ఎల్‌పిజి కొరత లేదని లోక్‌సభలో ప్రకటించిన వైనాన్నిఆయన ఎద్దేవా చేశారు.  ప్రభుత్వం చెబుతున్న వాదనలు తప్పు అని వాస్తవాలు రుజువు చేస్తున్నామని మండిపడ్డారు.హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో  తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని ఖర్గే ఆరోపించడంతో జీరో అవర్ సమయంలో ఘర్షణ చెలరేగింది.

    దేశవ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్ల తీవ్ర కొరతకు ప్రభుత్వమే కారణమని ఖర్గే అన్నారు. మధ్యతరగతి , పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు  కమ్యూనిటీ కిచెన్‌లను మూసివేయాల్సి వచ్చిందని, ఎల్‌పిజి సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు.

    దేశంలో 60 శాతం ఎల్‌పిజి దిగుమతి అవుతుందని, ఇందులో 90 శాతం సరఫరా హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంద న్నారు. ప్రపంచ చమురు సంక్షోభానికి దారితీసే కీలకమైన సముద్ర మార్గం ఇది అని అన్నారు. ఎల్‌పిజి సరఫరాపై కేంద్రం ముందస్తు ప్రణాళిక వేసుకుని ఉంటే, ఈపరిస్థితి తలెత్తేది కాదన్నారు. ఖర్గే ఎరువుల సరఫరా కొరతను కూడా ఎత్తిచూపారు.

    అలాగే సిలిండర్‌ కోసం వెయిటింగ్‌ సమయాన్ని  కూడా 21 - 25 రోజులకు పెంచారు, ఇది, బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ప్రభుత్వ పేలవమైన ప్రణాళిక నిదర్శనమని, ఇది విదేశాంగ విధానంపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతుదని ఖర్గే మండిపడ్డారు.  ప్రణాళిక లేకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి దేశంలో ఎల్‌పిజి సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే  ఆరోపించారు.

    నడ్డా కౌంటర్‌ 
    ఖర్గే విమర్శలతో సభలో వేడి రాజుకుంది.  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, నడ్డా కూడా  స్పందించారు.  జీరో అవర్ కారణంగా సభ్యులు ప్రజా సమస్యలపై లేవనెత్తాల్సిన అవసరం ఉందని, చైర్ జోక్యం చేసుకోవాలని నడ్డా కోరారు. సభలో తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నపుడు వాటిపై శ్రద్ధపెట్టకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు LPG సమస్యపై మాట్లాడకుండా ఇతర అంశాలపై మాట్లాడటానికే మొగ్గు చూపారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. 

     

    ప్రతిపక్షాల ఆందోళన 
    అయితే ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, LPG సంక్షోభం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించాయి. ప్రతిపక్షాల వైపు నుంచి గందరగోళం కొనసాగుతుండగానే, సభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ముగించాలని ఖర్గేను కోరారు. ఖర్గే చేసిన ఆరోపణలకు బదులిస్తూ, నడ్డా ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఈ సంక్షోభం దేశం వల్ల కాదని, ప్రపంచవ్యాప్త కారణాల వల్లే తలెత్తిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం  ప్రకటించిన సంగతి తెలిసిందే. 
     

Sports

  • పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాతో సిరీస్‌ ఓటమి అనంతరం షాహిద్‌ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్‌ మీడియా వేదికగా వీడియో పోస్టును షేర్‌ చేసుకున్నాడు. అఫ్రిది మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్‌ కమిటీదే. 

    ఆదివారం నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ అఘా ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకపోయింది. నాయకుడిగా అంతగా అనుభవం లేని తన అల్లుడు షహీన్‌ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలి. బాబర్‌ ఆజమ్‌ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారు. కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉంది. 

    కనీసం ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీస్‌ చేరడంలో విఫలమైంది. తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను 2-1తేడాతో కోల్పోవడం చూస్తుంటే ఇదంతా సెలక్షన్‌ కమిటీ తప్పిదమేని క్లియర్‌గా తెలుస్తోంది. 

    అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌ చేయాలన్న విషయం కూడా పీసీబీ అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. జాతీయ జట్టుకు సర్జరీ అనే పేరుతో మార్పులు అంటూ ఇప్పటికే చాలా చేశారు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి. 

    దేశవాలీ క్రికెట్‌ పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా తయారవుతుంది. పాక్‌ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించే స్థాయి ఎప్పుడో కనుమరుగైంది. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలతో పాక్‌ క్రికెట్‌ను భ్రష్టు పట్టించింది. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రతీ టోర్నీలో అపజయాలే ఎదురయ్యే అవకాశాలున్నాయి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

    చదవండి: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త!

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 

    ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్‌లకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే రెండో హోమ్ గ్రౌండ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణసింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, జస్టిస్ కున్హా నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా చర్యలను ప్రవేశపెట్టినట్లు కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు.

    ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు మూడు నుంచి నాలుగు గంటల ముందే స్టేడియం గేట్లను తెరుస్తారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న వారికి బెంగళూరు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.

    చదవండి: రోహిత్‌, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్‌!

  • టీమిండియా స్టార్‌క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్‌ కోచ్‌గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్‌ గావస్కర్‌ టెస్టు సిరీస్‌ వైఫల్యం అనంతరం రోహిత్‌, విరాట్‌లు ఏకకాలంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 

    ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్‌  చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. 

    ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్‌ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్‌గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్‌లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్‌కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. 

    అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. 

    న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ల ఓటమి తర్వాత కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్‌ స్వాగతించగా, రోహిత్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్‌ శర్మను టెస్టు కెప్టెన్‌గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. 

    ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్‌ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. రోహిత్‌ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్‌మన్‌ గిల్‌కు అప్పగించారు. గిల్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లపై టెస్టు సిరీస్‌లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్‌ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది.

  • ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ధోనీ, రోహిత్‌ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌ అరుదైన ఘనత సాధించాడు.క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఆడాలనే కల ఏ క్రికెటర్‌కైనా ఉంటుంది. సూర్య జట్టులోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం టీ20లకే పరిమితం కావడం కొంతమేర ఆశ్చర్యం కలిగిస్తుంది. 

    కెరీర్‌ ఆరంభంలో వన్డేలతో పాటు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడిన సూర్యకుమార్‌ ఆ తర్వాత టీ20 స్పెషలిస్ట్‌గానే ముద్ర వేసుకున్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ తాను వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. 

    ‘ఏది రాసిపెట్టి ఉంటే జీవితంలో అదే జరుగుతుంది. తొలుత నేను క్రికెట్‌ ఆడడం ప్రారంభించినప్పుడు రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడా. దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీలో ఆడాను. ముంబైకి ప్రాతినిధ్యం వహించాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ రెడ్‌బాల్‌ క్రికెట్‌తోనే మొదలుపెడతారు. క్రమంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆట వైపు వచ్చినప్పుడు ఇక్కడే సౌకర్యంగా అనిపించింది. 

    మరీ ముఖ్యంగా టీ20లకు బాగా సెట్‌ అయ్యా. వన్డేల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. నాకు టెస్టు క్రికెట్‌పై ప్రేమ లేదని చెప్పను. ఎందుకంటే 2010 నుంచి 2020 వరకూ రంజీల్లో ఆడా. ఆ ఫార్మాట్‌ను ఆస్వాదించా. ఎవరైనా సరే టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశం వస్తే వద్దంటారా చెప్పండి? అయితే నాకున్న క్రికెట్‌ అనుభవం ప్రకారం ఈ ఫార్మాట్‌లో మూడు భిన్నమైన మార్గాల్లో ఆడాల్సి ఉంటుంది.

    కొన్నిసార్లు త్వరగా వికెట్లు పడి ముందుగా క్రీజులోకి వెళ్తే టెస్టుల్లో మాదిరిగా నెమ్మదిగా ఆడాలి. మధ్య ఓవర్లలో స్ట్రైక్‌ట్‌ పెంచుకుంటూ పోవాలి. ఇక ఆఖర్లో టీ20ల మాదిరిగా చెలరేగాలి. అందుకేనేమో నాకు ఈ వన్డే ఫార్మాట్‌ సరిగా అర్థం కాలేదు అనిపిస్తుంది. నేను వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో ఆడాను.

    అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కింది. మూడు ఫార్మాట్లకు ఉన్న ఆకర్షణ పూర్తిగా భిన్నమైంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్‌ ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్‌ ఆడి 8 పరుగులు, 37 వన్డేల్లో 773 పరుగులు సాధించాడు. ఇక 113 టీ20ల్లో 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీలున్నాయి.

    చదవండి: రెండు ముక్కల్లో విషెస్‌.. ట్రోల్‌కు గురైన బుమ్రా!

  • టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదో వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. అయితే బుమ్రా తన పెళ్లి రోజు వేడుకను పురస్కరించుకొని తన భార్యకు పంపిన రెండు ముక్కల సందేశం అతన్ని ట్రోల్‌కు గురయ్యేలా చేసింది. విషయంలోకి వెళితే.. పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సంజనా గణేశన్‌కు ‘హ్యాపీ యానివర్సరీ’ అని రెండు ముక్కల్లోనే విషెస్‌ తెలిపాడు. 

    బుమ్రా పోస్ట్‌పై సంజనా గణేశన్‌ స్పందిస్తూ.. ‘కిడ్నీ టచ్చింగ్‌ క్యాప్షన్‌ యార్‌’ అని పేర్కొంది. ఆ తర్వాత బుమ్రాతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్న సంజనా గణేశన్‌.. ‘జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, ప్రపంచం ఎంతదూరం తీసుకెళ్లినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నా ప్రాణ స్నేహితుడితో వివాహం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. 

    నీ కౌగిలిలో నన్ను బంధించి నన్ను మైమరపించావు. కానీ నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనది మన ప్రేమకథే అని బలంగా చెప్పగలను. లవ్‌ యూ బుమ్రా’ అంటూ మరో పోస్టును షేర్‌ చేసుకుంది. ఇక స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌తో బుమ్రాకు 2013లో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. 

    రెండేళ్లు డేటింగ్‌ చేసిన అనంతరం మార్చి 15, 2021న ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా ఈ దంపతులకు 2023లో తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి మరో భారత స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తితో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.

     చదవండి: ‘ఎదురుచూపులకు తెర.. ఆరోజు వచ్చేసింది’

  • టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్‌ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్‌ టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన సందర్భంగా గౌతీ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన వీరుడు మహేంద్ర సింగ్‌ ధోని సైతం గౌతీ నవ్వు గురించి కామెంట్‌ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఒకప్పటి సహచర ఆటగాడు గంభీర్‌ను ఉద్దేశించి ధోని పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయింది.

    గంభీరమైన ముఖంలో ఆ నవ్వు..
    ‘‘కోచ్‌ సాహెబ్‌.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్‌ కాంబో. మీరు అద్భుతం చేశారు’’ అంటూ ధోని క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా!.. నిన్ను చూడటం సంతోషంగా ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

    కాగా ధోని ఈసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు హాజరైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ మరోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడిన దృశ్యాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ ధోనిని కలుసుకోవడం సంతోషమంటూ కామెంట్‌ చేశాడు.

    అతడు నా స్థానంలో ఉండాలి
    ఇక తాజాగా రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్‌కు ధోని ‘స్మైల్‌ కామెంట్’‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్‌ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తను నన్ను నవ్వమని అడగటం కూడా నచ్చింది.

    ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్‌ రాస్తాను. అతడు కూడా డగౌట్‌లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. కోచ్‌ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.

    ధోని సారథ్యంలో గౌతీ
    కాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే సొంతగడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది.

    ఈ రెండు సందర్భాల్లోనూ గౌతం గంభీర్‌ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్‌ హోదాలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు.. 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చిన గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది.

    ఇక తాజా విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు సాధించింది. 

    చదవండి: T20 WC: ఆ ఒక్క ఎంపిక విషయంలోనే మా మధ్య విభేదాలు: సూర్య

  • క్రికెట్‌లో భారత్‌ ప్రపంచాన్ని శాసించడం చూడాలనుకున్న తన కల నెరవేరే సమయం ఆసన్నమైందని టీమిండియా మహిళా దిగ్గజ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయపడింది. ఆదివారం బీసీసీఐ నమన్‌ అవార్డ్స్‌ సందర్భంగా మిథాలీరాజ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఎంతోకాలంగా నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గ్లోబల్‌ క్రికెట్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ వస్తోంది. 

    గత రెండు మూడేళ్లలో పురుషుల జట్టు, మహిళల జట్టు, అండర్‌-19 జట్లు ట్రోఫీలు కొల్లగొట్టి భారత క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇక మహిళల క్రికెట్‌లోనూ గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు బీసీసీఐతో పాటు జైషాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. 

    ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఎంతో పరిణితి చెందడంతో పాటు ఆటలోనూ దూకుడు పెరిగింది. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరగడానికి నన్ను అందరూ ఐకాన్‌గా చెప్పుకుంటున్నారు. కానీ నేను నిజానికి సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ల నుంచి ప్రేరణ పొంది ఇవాళ ఈ స్థాయిలో నిలిచాను. 

    మహిళల జట్టుకు ప్రేరణ మాత్రం ఎప్పుడు పురుషుల జట్టే అని బలంగా చెప్పగలను.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక భారత క్రికెట్‌ గత రెండు మూడేళ్లలో ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదిగింది. గత రెండేళ్లలో చూసుకుంటే పురుషుల జట్టు రెండుసార్లు, మహిళల జట్లు ఒకసారి, అండర్‌-19 జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు కొల్లగొట్టాయి. 

    తొలుత 2024లో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా 17 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్‌ సాధించింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను సూర్య సారథ్యంలో టీమిండియా మూడోసారి కైవసం చేసుకుంది. ఆ తర్వాతి ఏడాది మహిళల జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక అండర్‌-19లోనూ అటు పురుషులు, మహిళల విభాగంలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.

    చదవండి: మెద్వదెవ్‌ను దెబ్బకొట్టిన సిన్నర్‌

  • టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ చేరాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ గెలవడంతో సూర్యకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

    మరోవైపు.. ఈ విజయంతో హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ (Gautam Gambhir) ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్‌ చేరింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలిసి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిపించిన గౌతీ.. తాజాగా సూర్యతో కలిసి టీ20 ప్రపంచకప్‌ విజయంలో భాగమయ్యాడు.

    ఒకటీ రెండు విషయాల్లో విభేదాలు
    ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. అయితే, ఒకటీ రెండు విషయాల్లో తమ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అయినా.. అవి అంతగా పట్టించుకోదగ్గ విషయాలు కావని పేర్కొన్నాడు.

    వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. ‘‘జట్టును ఎంపిక చేసే సమయంలో 15 మంది పేర్లలో పద్నాలుగు మేమిద్దరం కలిసి చెప్పినవే ఉంటాయి. మేము ఒకే విధంగా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనం.

    చర్చ మాత్రమే ఉంటుంది
    మా లక్ష్యాలు కూడా ఒక్కటే. అందుకే ఆ ఒక్క పేరు విషయంలో మా మధ్య వాదనలు కాకుండా చర్చ మాత్రమే ఉంటుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను గంభీర్‌ను గౌతీ భాయ్‌ అనే పిలుస్తానని.. తమది అన్నాదమ్ముల అనుబంధం అని తెలిపాడు.

    పరిస్థితికి తగినట్లే
    ఇక వరల్డ్‌కప్‌లో తాము ఆడిన విధానంపై ‍స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు హై రిస్కీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే చేయలేము. పరిస్థితికి తగినట్లే ఆడి అనుకున్న ఫలితం రాబట్టడమే మా ప్రధాన లక్ష్యం’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.

    చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌

  • ‘తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు’ అనే సామెత ఇప్పుడు చెప్పుకునే విషయానికి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్ అల్కరాజ్‌ 16 వరుస విజయాలకు మెద్వదెవ్‌ చెక్‌ పెడితే, మెద్వదెవ్‌ 9 వరుస విజయాలకు తాజాగా సిన్నర్‌ అడ్డుకట్ట వేశాడు. 

    ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ ఏటీపీ 1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌ సింగిల్స్‌ విజేతగా ప్రపంచ రెండో ర్యాంకర్‌ జానిక్‌ సిన్నర్‌ నిలిచాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇటలీకి చెందిన సిన్నర్‌ 7-6(8/6), 7-6(7/4)తో రష్యాకు చెందిన డానిల్‌ మెద్వదెవ్‌పై విజయాన్ని అందుకున్నాడు. 

    సిన్నర్‌ కెరీర్‌లో ఇదే తొలి ఇండియా వెల్స్‌ మాస్టర్స్‌ టైటిల్‌ కావడం విశేషం. కాగా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ అయిన సిన్నర్‌కు 2026 ఏడాదిలో ఇదే తొలి టైటిల్‌ కావడం గమనార్హం. టోర్నీ ప్రారంభం నుంచి ప్రత్యర్థికి ఒక్క సెట్‌ కూడా కోల్పోని సిన్నర్‌ ఫైనల్లోనూ దానిని కొనసాగించినప్పటికీ, మ్యాచ్‌లో రెండు సెట్లు టైబ్రేక్‌కు దారి తీశాయి. 

    గంటా 55 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌లో మెద్వదెవ్‌, సిన్నర్‌లు హోరాహోరీగా తలపడడంతో సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్‌ 8 పాయింట్లతో సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్‌ కూడా టైబ్రేక్‌కు దారితీయడం, ఆ సెట్‌లోనూ సిన్నర్‌దే పైచేయి సాధించడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

    టైటిల్‌ను ముద్దాడుతున్న సబలెంకా

    సబలెంకా జోరు..
    మరోవైపు మహిళల సింగిల్స్‌లో బెలారస్‌ బ్యూటీ ఎరీనా సబలెంకా విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో సబలెంకా 3-6, 6-3, 7-6(8/6)తో ఎలీనా రిబాకినాపై విజయాన్ని అందుకొని కెరీర్‌లో తొలి ఇండియన్‌ వెల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

    చదవండి: ‘వాళ్ల ఫీజు మన సైనికుల ప్రాణాలు తీస్తోంది’

  • హండ్రెడ్‌ మెన్స్‌ టీ20 టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో కావ్యా మారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌  పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వేలంలో అబ్రార్‌ అహ్మద్‌ను 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది. 

    అయితే పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం పట్ల సోషల్‌ మీడియాలో భారత మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు సంబంధించి ‘ఎక్స్‌’ ఖాతాను కూడా సస్పెండ్‌ చేయడం గమనార్హం. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా సన్‌రైజర్స్‌ పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    ‘ది హండ్రెడ్‌ టోర్నీలో ఒక ప్రాంచైజీ పాకిస్థాన్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ భారత్‌కు చెందిన ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాళ్లను తీసుకోవడం నచ్చడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. 

    ఆ తర్వాత ఐపీఎల్‌ వేలంలోనూ పాక్‌ ఆటగాళ్లను విస్మరించడం జరిగింది. ఐపీఎల్‌ 2008 సీజన్‌ మినహా పాక్‌ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్‌లో కనిపించలేదు. కానీ తాజాగా సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసింది. 

    సదరు ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాడికి ఫీజు రూపంలో చెల్లించే డబ్బులను అతడు తన దేశానికి పన్నుల రూపంలో చెల్లించడం జరుగుతుంది. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతోనే పాక్‌ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది. ఆ ఆయుధాలే ఇవాళ మన భారత సైనికులు, పౌరుల మరణాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. 

    దీంతో తెలిసీ తెలియకో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఒక రకంగా ప్రాణనష్టానికి పాల్పడుతున్న దేశంతో సంబంధం కొనసాగిస్తున్నట్లే అవుతుంది. అందుకే అభిమానుల ఆగ్రహంలో నాకు తప్పు కనిపించలేదు. ఈ ఆగ్రహం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.’ అని చెప్పుకొచ్చారు. 

    మరోవైపు బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం.. ‘ఇది మాకు సంబంధించిన విషయం కాదు. అదొక విదేశీ లీగ్‌. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము’ అని పేర్కొన్నారు.కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. 

    తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా మార్చారు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌ గతేడాది చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.

    చదవండి: న‌డ‌వ‌లేని స్థితిలో టీమిండియా స్టార్‌ క్రికెట‌ర్‌.. వీడియో

  • భారత క్రికెట్‌​ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్‌ –2026’ ఆదివారం ఘనంగా జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకలో భారత సీనియర్, జూనియర్, పురుషులు, మహిళలు, మాజీలు అంతా ఒక్క చోట చేరడంతో సందడి నెలకొంది.

    ఫైనల్లో 175 పరుగులు
    ఈ అవార్డుల కార్యక్రమంలో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) హైలైట్‌ అయ్యాడు. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బిహారీ పిల్లాడు.. అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    ఇక నమన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత జట్టు పురస్కారాలు అందుకుంది. ఈ సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతి గొప్పగా ఉంది. వరల్డ్‌కప్‌లో గెలిచి దేశానికి ట్రోఫీ అందించడం ఆనందకరం’’ అని పేర్కొన్నాడు.

    ఈ మూడింటిలో ఏది ఇష్టం? 
    ఈ క్రమంలో కామెంటేటర్‌ హర్షా భోగ్లే.. టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ స్టార్లు సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, అభిషేక్‌ శర్మలతో కలిసి వైభవ్‌ సూర్యవంశీని ప్రశ్నలు అడిగాడు. ‘ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేయడం.. లేదంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడం.. ఈ మూడింటిలో నువ్వు ఏ రికార్డు సాధించాలని అనుకుంటున్నావు’’ అని వైభవ్‌ను అడిగాడు.

    గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే లక్ష్యం
    ఇందుకు బదులిస్తూ.. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలవడమే తన లక్ష్యమని వైభవ్‌ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2013లో వెస్టిండీస్‌ వీరుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ 175 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు ఈ లెఫ్టాండర్‌ పేరిటే ఉండగా.. మరో లెఫ్టాండర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టాడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం.

    కాగా గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసు (14) లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం బాదాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే 15వ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026కు సన్నద్ధమవుతున్నాడు.

    చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

  • ఐపీఎల్‌-2026కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు హ‌ర్షిత్ రాణా రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. మోకాలి గాయం కార‌ణంగా ఈ ఏడాది సీజ‌న్ మొత్తానికి అత‌డు దూర‌మ‌య్యే అవకాశ‌ముంది. ఆదివారం ఢిల్లీలో జ‌రిగిన బీసీసీఐ న‌మ‌న్ అవార్డుల ప్రధానోత్సవ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రానా న‌డ‌వ‌లేని స్థితిలో క‌న్పించాడు.

    ఊత‌క‌ర్ర‌ల సాయంతో హ‌ర్షిత్‌ కుంటుతూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు చేస్తున్నారు. 

    కాగా బెస్ట్ ఇంట‌ర్నేష‌నల్ డెబ్యూ అవార్డు హర్షిత్‌ రాణాకు ద‌క్కింది. ఈ అవార్డు అందుకోవ‌డానికి రాణా వేదికపైకి కూడా రాలేక‌పోయాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ స్వయంగా వేదిక దిగి రాణాకు ఈ అవార్డును అందజేశారు.

    కాగా హ‌ర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026 వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. అనంత‌రం అత‌డికి అస్ప్ర‌త్రికి త‌ర‌లించి ప‌లు స్కాన్లు నిర్వ‌హించ‌గా.. స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు తేల్చారు. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు కూడా అత‌డు దూర‌మ‌య్యాడు.

    అనంత‌రం ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అత‌డు పూర్తిగా కోలుకోవ‌డానికి ఆరు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఐపీఎల్‌-19వ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.

    చదవండి: IPL 2026: స‌న్‌రైజ‌ర్స్‌, సీఎస్‌కే, ముంబై కాదు.. ఆ జ‌ట్టే ఐపీఎల్ విజేత‌!

     

     

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.

    షాహిన్‌ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఎవరు ఎంపిక చేశారు?
    ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ హెడ్‌కోచ్‌ మైక్‌ హెసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్‌ జట్టా?’’ అంటూ ఫైర్‌ అయ్యాడు.

    పాకిస్తాన్‌ క్రికెట్‌ను నాశనం చేయడంలో...
    ఇక చీఫ్‌ సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఆకిబ్‌ జావేద్‌ పాత్ర కూడా ఉంది. మైక్‌ హసన్‌కు తన సెలక్షన్‌ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్‌కోచ్‌ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    మానసికంగానే అతడు అన్‌ఫిట్‌
    అదే విధంగా.. బాబర్‌ ఆజంను బంగ్లాదేశ్‌ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్‌ జావేద్‌ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్‌ అలీ స్పందించాడు. ఆకిబ్‌ చెప్పినట్లు బాబర్‌కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. 

    ‘‘బాబర్‌ ఆజం శారీరకంగా ఫిట్‌గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్‌ఫిట్‌’’ అంటూ బసిత్‌ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్‌ ఆజం గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలం
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్‌ జావేద్‌ మాత్రం ఫిట్‌గా లేనందువల్లే సెలక్ట్‌ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ విఫలమైన సంగతి తెలిసిందే. 

    అయితే, గత వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్‌.. ఈసారి సూపర్‌-8కు చేరుకున్నా.. సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్‌ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

    చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

Movies

  •  

  • రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న ఈ వివాహా వేడుకలో అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యారు. వీరిద్దరి వెడ్డింగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లి తర్వాత అభిమానులకు స్వీట్స్‌ పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

    పెళ్లి తర్వాత రష్మిక తాజాగా మరో పోస్ట్ చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన హల్దీ వేడుక ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హల్దీ ప్లస్ హోలీ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో మేము ఎంతగా తడిసిపోయామో.. ఇప్పటికీ నా జుట్టు రంగు ఇంకా ఎర్రటి రంగులోనే ఉందన్నారు. ఇంతటి మధురమైన క్షణాల వేళ.. నా బ్రైడ్ టీమ్‌తో కలిసి  ఆ రోజు అన్ని ఆటలను గెలిచానంటూ సంతోషం వ్యక్తం చేసింది. అయితే విజ్జూ కూడా ఆ రోజు టీమ్ బ్రైడ్ అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. రష్మిక షేర్ చేసిన హల్దీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

     

  • బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌  ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్స్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైంది. అతనితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. అతనితో ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతని మరణం పట్ల పలువురు బాలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    సోషల్ మీడియాలో జాన్వీ  కపూర్ రాస్తూ..'సినిమా సెట్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లం.  వానిటీ వ్యాన్‌లో ప్రవేశించిన ప్రతిసారీ కేవలం 20 నిమిషాలు మాత్రమే టైమ్ ఉందని ఆటపట్టించేదాన్ని. నీతో  కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించేది. నీతో కలిసి పనిచేసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి.  ఇక నుంచి నేను ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతాను.  గత రెండు సంవత్సరాలుగా నా సృజనాత్మక ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు నీ ముఖాన్ని చూడటం నా జీవితంలో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి. లవ్ యూ.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా…' అంటూ పోస్ట్ చేసింది.

    కాగా.. జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.

    అసలు మార్స్ పెడ్రోజో ఎవరు?

    మార్స్ పెడ్రోజో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక మంది స్టార్స్‌తో కలిసి పనిచేశారు.  ఫిల్మ్ షూటింగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో గుర్తింపు పొందారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోని సృజనాత్మక నిపుణులతో కలిసి పనిచేశాడు, అతని  నైపుణ్యాలు, సెట్‌లో తన వర్క్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. అతని మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు పెడ్రోజోను గుర్తుచేసుకున్నారు. వరుణ్ ధావన్, నోరా ఫతేహి లాంటి స్టార్స్  పరిశ్రమకు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు.

  • కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వెంకీ ‍అట్లూరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. పోస్టర్ చూస్తే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజైన టీజర్ చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దగా ఉన్న వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడడం ఈ చిత్రం ఆసక్తిని మరింత పెంచుతోంది.  కాగా.. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో రవీనా టాండన్‌, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. 

     

  • కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.

    ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్  రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్‌ ప్రొడక్షన్‌కు స్క్రీనింగ్‌కు సంబంధించి అధికారిక  మెయిల్ అందినట్లు తెలుస్తోంది.

    జన నాయగన్‌ను జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ  చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్  సర్టిఫికెట్‌ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు  సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

     ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్‌ బోర్డ్‌కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే.

     

  • ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీకి  అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాతో నటి రాషా థడాని టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మంగ అనే పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' అనే సాంగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

    ఇవాళ బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ బర్త్‌ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ మూవీ సెట్‌లో రషా నటన, హవభావాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందరూ కలిసి రషాకు హ్యాపీ బర్త్ డే విష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు ఇందులో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నిచందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
     

     

     

  • ప్రతి మనిషిలోనూ జాలి, కరుణ, దయ అనేది ఉంటుంది. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. సెంటిమెంట్‌తోనూ ‘కొట్టేస్తున్నారు’.  తాజాగా నటుడు, దర్శకుడు దేవీప్రసాద్‌ కూడా ఇలానే మోసపోయాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేస్తే.. రూ. 6వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడట. ఆ తర్వాత కూడా పదే పదే డబ్బులు అడగడంతో అనుమానంతో ఆరా తీస్తే.. అతనో మోసగాడని తెలిసిందంట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తనలాగా ఇంకెవరు మోసపోవద్దని దేవీప్రసాద్‌ కోరాడు.

    అసలేం జరిగింది?
    గత నెలలో దేవిప్రసాద్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందట. ‘నమస్తేసర్. నేను లింగా... గుర్తున్నానా సర్’ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడట. శ్రీరంగనీతులు సినిమాలో మీతో కలిసి నటించాను అంటూ.. సెంటిమెంట్‌ డ్రామా స్టార్ట్‌ చేశాడట. ‘ఎలా చెప్పాలో అర్ధం కావటంలేదు సర్.కొన్నిరోజులుగా మలక్‌పేట యశోదాహాస్పిటల్ లో మా అమ్మగారు సీరియస్‌గా ఉన్నారు.మా దగ్గర డబ్బులు అయిపోయాయి .ఆరోగ్యశ్రీలాంటి కార్డులేవీలేవు. తెలిసినవాళ్ళు బెంగుళూరు షిఫ్ట్ చేస్తే ఫ్రీగా ట్రీట్‌మెంట్ చేయిస్తామన్నారు. అంబులెన్స్ కి 16 వేలు అడిగారు.పదివేలు దొరికాయి.6 వేలు తక్కువయ్యింది.టైమ్ లేదుసర్.ఏంచేయాలో అర్ధంకాక మీకు కాల్ చేశాను’ అని దీనంగా అడుగుతూ..ఆక్సిజన్ మాస్క్‌ఉన్న పెద్దావిడ ఫోటో,హాస్పిటల్‌లో ఓ ప్రదేశం ఫోటోలు పెట్టడంతో నిజమే అనుకొని దేవీప్రసాద్‌ రూ. 6 వేలు గూగుల్‌ పే ద్వారా పంపించారట.

    అలా దొరికిపోయాడు
    మరుసటి రోజు కూడా మళ్లీ కాల్‌ చేసి ఆపరేషన్‌ కోసం కొంత డబ్బులు కావాలని అడగడంతో దేవీప్రసాద్‌కి అనుమానం వచ్చిందట. శ్రీరంగనీతులు సినిమాకి పనిచేసినవాళ్ళకు కాల్ చేసి లింగారెడ్డి గురించి అడిగితే.. ఆ పేరుతో ఉన్నవాళ్లెవరు ఈ సినిమాలో పని చేయలేదని చెప్పారట. అంతేకాదు  ఆ సినిమా పేరుచెప్పి రెండునెలలక్రితం హీరోని కూడా ఇలానే డబ్బులు అడిగారని చెప్పడంతో దేవికి అసలు విషయం తెలిసిపోయింది. మూడు రోజుల తర్వాత అవే ఫోటోలను పంపించి భాషా అనే నటుడి దగ్గర కూడా అలానే చెప్పాడట. అయితే దేవిప్రసాద్‌ ద్వారా భాషాకు ముందే అతని గురించి తెలియడంతో లొకేషన్‌ పెట్టమని అడిగాడట. అతను హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కి మూడు వీధుల అవతలున్న ఓ లొకేషన్ పెట్టాడట. వెంటనే దేవిప్రసాద్‌ ఫోన్‌ చేసి ఇప్పుడెక్కడున్నారు అని అడిగితే బెంగుళూరులో జయదేవ్ హాస్పిటల్‌లో ఉన్నాం, ట్రీట్‌మెంట్ జరుగుతుందని చెప్పాడట. దీంతో దేవిప్రసాద్‌ అతనిపై సీరియస్‌ అయ్యాడట. ఇలా తల్లిసెంటిమెంట్‌తో తనని మోసం చేశాడని.. తనలాగా ఎవరూ మోసపోవద్దనే ఈ పోస్ట్‌ పెడుతున్నానంటూ జరిగిన విషయం మొత్తం రాసుకొచ్చాడు. 
     

  • ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సినీ దిగ్గజాలకు నివాళులర్పించారు. సినీ రంగంలో విశేషంగా రాణించిన టాలీవుడ్ దివంగత నటుడు కోట శ్రీనివాసరావును స్మరించుకున్నారు. ఆయనతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి లాంటి నటులకు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ సినీ దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచారు.

    వెండితెరపై తమదైన నటన, హావభావాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరికి ఘనంగా నివాళులర్పించింది ఆస్కార్ వేదిక. తెలుగు వెండతెరపై దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించారు. ఆ తర్పాత 89 ఏళ్ల వయసులో  ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 24న ఆయన మరణించారు.  సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం.. ధర్మేంద్రను పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

    అయితే ఆస్కార్‌ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్‌ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు.
    సినీ రంగానికి వారి సేవలను స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రను చూపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నెట్టింట అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అఫీషియల్ సైట్‌లో ఉంచామని హాలీవుడ్‌ మీడియా క్లారిటీ ఇచ్చింది.

     

     

  • చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వీక్‌లో పెద్ద సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి దురంధర్-2, టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే దురంధర్‌ బాక్సాఫీస్‌ను షేర్ చేయగా సీక్వెల్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికొస్తే టాలీవుడ్‌లో మాత్రమే కాస్తా బజ్‌ ఉంది. అంతకుమించి ఈ మూవీపై పెద్ద అంచనాల్లేవు.

    ఇక ఈ వారం ఓటీటీల విషయానికొస్తే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. వీటిలో టాలీవుడ్ నుంచి సీతాపయనం, జటాధర, బాలీవుడ్‌ మూవీ బోర్డర్-2 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే జటాధర ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా జీ5లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు చిరాయ, ల్యాండ్ లార్డ్ లాంటి డబ్బింగ్ సినిమాలు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్..

    • రేడియోయాక్టివ్ ఎమర్జన్సీ(వెబ్ సిరీస్)- మార్చి 18

    • ప్యూరియస్ సీజన్-2- (వెబ్ సిరీస్)- మార్చి 18

    • పీకీ బ్లైండర్స్ ది ఇమ్మార్షల్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- మార్చి 20

    • బోర్డర్-2(హిందీ మూవీ)- మార్చి 20

    • ది రైజ్ ఆఫ్ ది రెడ్‌హాట్ చిల్లి పెప్పర్స్(డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 20

    •    ఏ డిఫరెంట్‌ మ్యాన్‌ (హాలీవుడ్ సినిమా)- మార్చి 20

      అమెజాన్ ప్రైమ్..
    • ఇన్విసిబుల్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 18

    • ది హౌస్‌మెయిడ్(హాలీవుడ్ మూవీ)- మార్చి 19

    • డెడ్ లాక్ సీజన్-2(వెబ్ సిరీస్)- మార్చి 20

    •    అమోర్‌ యానిమల్‌ (వెబ్ సిరీస్‌): మార్చి 20

    జీ5..

    • ల్యాండ్ లార్డ్(డబ్బింగ్ సినిమా)- మార్చి 19

    • కాసర్‌గడ్ ఎంబసీ(డబ్బింగ్ మూవీ)- మార్చి 20

    • జటాధర(తెలుగు సినిమా)- మార్చి 20


    జియో హాట్‌స్టార్..

    • చిరైయా(హిందీ మూవీ)- మార్చి 20

    యాపిల్ టీవీ..

    • ఇమ్‌పర్‌ఫెక్ట్ ఉమెన్(హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ).. మార్చి 18

    సోనీ లివ్..

    • జజ్‌ సిటీ(బెంగాలీ మూవీ)- మార్చి 19

    సన్‌ నెక్ట్స్..

    • సీతా పయనం (తెలుగు సినిమా)- మార్చి 20

       

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా దేశభక్తి చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’పేరు మారింది. ఈ సినిమాకు‘మాతృభూమి’ అని టైటిల్‌ మార్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా సల్మాన్‌  ప్రకటించారు. అయితే పేరు మార్పుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

    2020లో గ‌ల్వాన్ లోయ‌లో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీర‌మ‌ర‌ణం పొందిన తెలంగాణలోని సూర్యాపేట‌కు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్‌ కనిపించబోతున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మాన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. 

    అయితే చైనా మీడియా మాత్రం చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆరోపించింది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ పరిణామాల వేళ తాజాగా సినిమా పేరును మార్చడం గమనార్హం. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 
     

  • ఆస్కార్‌ అవార్డు గెలిస్తే నింగిలోని చందమామను అందుకున్నంత సంతోషం! ఒక్కసారైనా ఆస్కార్‌ గెలవాలని కలలు కనే ఆర్టిస్టులు ఎంతోమంది. కనీసం అకాడమీ అవార్డుల వేడుకను దగ్గరినుంచైనా చూసి తరించాలనుకునేవారు బోలెడంతమంది! ప్రపంచ ప్రఖ్యాతికెక్కిన ఈ ఆస్కార్‌ వేడుకలు 1929లో మొదలయ్యాయి. అప్పుడు 12 విభాగాల్లో అవార్డులు అందించేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 24 కేటగిరీలకు చేరింది.

    ఆస్కార్‌ చరిత్రలో చెరగని చిరునామా
    ఆస్కార్‌ చరిత్రలో అత్యధిక నామినేషన్లు అందుకున్న వ్యక్తిగా సంగీత దర్శకుడు జాన్‌ విలియమ్స్‌ పేరిట చెక్కుచెదరని రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 నామినేషన్లు దక్కించుకోగా ఐదుసార్లు పురస్కారం గెలిచాడు. వాల్ట్‌ డిస్నీ ఏకంగా 26 ఆస్కార్‌లు అందుకుని చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇకపోతే అకాడమీ పురస్కారాన్ని వేలం వేయకూడదు, బయట అమ్మకూడదు. అంతలా వద్దనుకుంటే అకాడమీకే తిరిగివ్వాలి.. అది కూడా కేవలం ఒక్క డాలర్‌కి మాత్రమే!

    వారిపై బ్యాన్‌
    ఈ అవార్డుల ఫంక్షన్‌ కోసం ఏకంగా రూ.500 కోట్ల మేర ఖర్చుపెడతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి రమ్మని పిలుపు వస్తే సంబరంతో పరిగెత్తేవారెందరో!. అయితే కొందరిపై మాత్రం ఆస్కార్‌ ఈవెంట్‌కు హాజరవకుండా, అవార్డులకు నామినేట్‌ అవకుండా నిషేధం అమల్లో ఉంది. వాళ్లెవరంటే.. మీటూ ఉద్యమం సమయంలో సినీ నిర్మాత హార్వే వైయిన్‌ స్టీన్‌ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. దీంతో అతడిని అకాడమీ కమిటీ బ్యాన్‌ చేసింది.

    విల్‌ స్మిత్‌పై నిషేధం.. కాకపోతే!
    2022లో కమెడియన్‌ క్రిస్‌ రాక్‌.. స్మిత్‌ భార్యపై జోక్‌ వేశాడు. దీంతో అతడు ఆవేశంగా స్టేజీపైకి వచ్చి క్రిస్‌ చెంప చెళ్లుమనిపించాడు. దీని కారణంగా విల్‌ స్మిత్‌పై పదేళ్ల నిషేధం పడింది. అయితే అతడి నామినేషన్స్‌పై మాత్రం వేటు వేయలేదు. మైనర్‌పై లైంగిక వేధింపుల కారణంగా దర్శకుడు రోమన్‌ పోలంస్కిని, లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన కమెడియన్‌ బిల్‌ కాస్బీని సైతం అకాడమీ నిషేధించింది. 

    నేర చరిత్ర
    ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సినిమాలను పైరసీ చేస్తున్నాడని గుర్తించి నటుడు కార్మైన్‌ కార్డీని సైతం బ్యాన్‌ చేసింది. లైంగిక నేరాల చరిత్ర కారణంగా నటుడు, సినిమాటోగ్రాఫర్‌ ఆడమ్‌ కిమ్మెల్‌పైనా నిషేధం విధించింది. ఇలా ఈ ఆరుగురు నటులను ఆస్కార్‌ వేదికపైకి రాకుండా దూరం పెట్టింది.

    చదవండి: 98వ ఆస్కార్‌.. పూర్తి జాబితా

Andhra Pradesh

  • పాలకొండ రూరల్‌: విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘యువ విజ్ఞాని కార్యక్రమ్‌ (యువికా)–2026’ను నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సైన్స్‌ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు ‘యువ విజ్ఞాని కార్యక్రమ్‌’నకు అర్హులు.

    ఇందులో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. మార్చి 31 వరకు గడువు ఉందని ఐస్రో అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి రానున్న మే నెలలో14 రోజులు ప్రత్యేక వసతిగృహంలో ఉంచి శిక్షణ అందిస్తారు. ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్‌ సెషన్లు, ప్రాజెక్ట్‌లు, ఇంటరాక్టివ్‌ సెషన్లపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు.

    దరఖాస్తు చేయడం ఇలా...   
    అర్హులైన విద్యార్థులు https://jigyasa.iirs.gov.in/yuvika వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి యువికా – 2026 (yuvika 2026 Registration)  లింక్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయదలచిన విద్యార్థి పేరు, తండ్రి పేరు, పాఠశాల వివరాలను నమోదు చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి. వీటితో పాటు వ్యక్తిగత, విద్య, ఇతర వివరాలతో దరఖస్తు పత్రాన్ని పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలు (మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు) స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ ఏడాది మే 11 నుంచి 22 వరకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంగల పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

    శిక్షణ కేంద్రం ఎంచుకోవాలి..   
    దేశ వ్యాప్తంగా సతీష్‌ ధావన స్పేస్‌ సెంటర్‌– శ్రీహరికోట, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌–హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌– డెహ్రాడూన్, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌–తిరువనంతపురం, యూఆర్‌ రావు శాటిలైట్‌సెంటర్‌– బెంగుళూరు, స్పేస్‌ అప్లికేషన్‌–  అహ్మదాబాద్, నార్త్‌ ఈస్ట్రన్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌– షిల్లాంగ్, తదితర కేంద్రాల్లో ఎదో ఒక సెంటర్‌ను విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలతో నేరుగా కలవడం, అక్కడి ల్యాబ్‌లను స్వయంగా సందర్శించడంతో పాటు స్పేస్‌టెక్‌ ప్రాజెక్టు­ల చేసే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మకత, సైన్స్‌ రంగాలకు చెందిన కొలువులపై ఆశక్తి ఉన్నవారు ఈ ఆవకాశం అందిపుచ్చుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

    ఏప్రిల్‌ 13న మొదటి జాబితా..  
    ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మొదటి జాబితా ఏప్రిల్‌ 13న విడుదల చేస్తారు. జిల్లా పరిధిలో గల 213 ఉన్నత పాఠశాలల ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తుల రిజిస్టేషన్‌ ప్రక్రియ సాగుతోంది. ఆసక్తి గల విద్యార్థులు గుర్తించాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.   ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
    – పాటోజు బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం  

    ఎంపికలో ప్రాధాన్యం..   
    యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్‌ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్‌సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికైన విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్‌ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.   
    – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్‌ అధికారి, పార్వతీపురం మన్యం  

  • తాడేపల్లి : ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు వైఎస్‌ జగన్‌.  నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు వైఎస్‌ జగన్‌.

    ‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన  పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం’ అని ప్రశంసించారు. 

    ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి YS జగన్ అభినందలు

    ఇదీ చదవండి:

    నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

  • న్యూఢిల్లీ:  వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు.  ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. 

    ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్‌రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్‌ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్‌. 

    సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..
    వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్‌సింగ్‌ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్‌కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.

    చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు
    ఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్‌ డైవర్షన్‌ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.

    వాటికి సునీత సమాధానం చెప్పలేదు..
    సీబీఐ స్టేట్‌మెంట్‌ తీసుకునే సమయంలో సునీతను లెటర్‌ గురించి అడిగారు. లెటర్‌ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉంది

    దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారు
    సునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు.  దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్‌మెంట్‌లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్‌కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.

    రాజశేఖర్ ను వివేకా హత్యకు ముందు రోజున ఎందుకు కాణిపాకం పంపించారు

    రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..
    ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్‌.  ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్‌ ప్రసాద్‌, రాజశేఖ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్‌ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్‌మెంట్‌లో రాజశేఖర్‌ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్‌ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్‌ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. 

    ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?
    సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్‌ ఫర్‌ ది గెయిన్‌ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి  లేఖ రాశాను’ అని అవినాష్‌ స్పష్టం చేశారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైఎస‍్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పరిశీలకుల సమావేశం జరిగింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు దిశానిర్దేశం చేశారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట‍్లాడుతూ.. ‘వైఎస్సార్‌సీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. ప్రజలతో కలిసి, ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతోంది. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉంది. ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై విశ్వాసం మరింత పెరిగింది. 

    పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరం. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలి. అన్ని స్థాయిల్లో కమిటీలను త్వరగా పూర్తి చేయాలి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు పరిశీలకులు సపోర్టింగ్ సిస్టమ్‌లా పనిచేయాలి. మన హయాంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. 

    కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలి. టీడీపీ ఫేక్ ప్రచారం, పెయిడ్ క్యాంపెయినింగ్‌ను వాస్తవాలతో ఎదుర్కోవాలి. ఎన్నికల్లో విజయానికి బూత్ స్థాయి నిర్మాణం చాలా ముఖ్యం. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు.

     

    అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భేటీ

     

Politics

  • జగిత్యాల : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్‌ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. 

    ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్‌ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.

    బీఆర్‌ఎస్‌లో చేరతారా..?
    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీలు.  మరి జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్‌చల్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ గూటికి జీవన్‌రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం.  

    దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారని,  ఆ సభకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్‌రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

  • హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీష్‌రావు. అసెంబ్లీ మీడియా హాల్‌లో హరీష్‌ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.

    కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. 

  • దేశంలోని 10 రాష్ట్రాల్లో 37 స్థానాలను భర్తీ చేయడానికి సోమవారం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటలకు జరగనుంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది.

    ఇప్పటికే 37 స్థానాల్లో 26 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మిగిలిన 11 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. వీటిలో బిహార్ నుంచి 5, ఒడిశా నుంచి 4, హరియాణా నుంచి 2 స్థానాలు ఉన్నాయి.

    ఏకగ్రీవంగా గెలిచిన 26 మందిలో బీజేపీ ఏడు స్థానాలు సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు, డీఎంకే నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, క్రాస్‌ ఓటింగ్‌ భయంతో తీవ్ర ఉత్కంఠ మధ్య  ఎన్నికలు జరున్నాయి.

    హరియాణాలో 2 స్థానాలకు ముగ్గురి పోటీ
    హర్యానా అసెంబ్లీ మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయం కోసం 31 ఓట్లు అవసరం. భారతీయ జనతా పార్టీకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ భాటియా విజయం ఖాయమైంది. 17 ఓట్లు మిగులుతాయి. అవి స్వతంత్ర అభ్యర్థి సతీశ్‌ నందాల్‌కు పడతాయి. ముగ్గురు స్వతంత్రులు తప్ప ఇనెలో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సంఖ్య 22 అవుతుంది. అంటే విజయవానడికి తొమ్మిది ఓట్లు తక్కువ అవుతాయి. కాంగ్రెస్ వద్ద 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐక్యంగా ఉంటే పార్టీ అభ్యర్థి కర్మవీర్ బౌద్ధకు 31 కంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలానే జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా అభ్యర్థి ఓడిపోయారు. 2016, 2022లో ఇలా జరిగింది.

    బిహార్‌లో 4 స్థానాలకు ఓటింగ్

    బిహార్ అసెంబ్లీ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు. ఎన్‌డీఏకు 202 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాఘట్‌బంధన్‌కు  35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎన్‌డీఏకు 4 స్థానాలు సులభంగా వస్తాయి. ఒక్కో స్థానానికి 41 ఓట్ల లెక్కలో నాలుగు స్థానాలు గెలవడానికి 164 మంది ఎమ్మెల్యేలు అవసరం. తర్వాత ఎన్‌డీఏ వద్ద 38 ఎమ్మెల్యేలు మిగులుతారు. 5వ స్థానానికి గెలవడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు అవసరం.  

    ఒడిశాలో 4 స్థానాలకు 5 అభ్యర్థుల మధ్య పోటీ

    ఒడిశా అసెంబ్లీ 147 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ రాజ్యసభ 4 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. కానీ 5 అభ్యర్థులు ఉన్నారు. ఒక స్థానానికి విజయం కోసం 30 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం. భారతీయ జనతా పార్టీ రెండు అభ్యర్థులు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్ విజయం ఖాయం. బీజేడీ వద్ద 48 ఓట్లు ఉన్నాయి. రెండు అభ్యర్థులు నిలబెట్టింది — సంత్రుప్త మిశ్రా, దత్తేశ్వర్ హోతా. మిశ్రా విజయం ఖాయం. చిక్కు నాలుగో స్థానంలో ఉంది. భారతీయ జనతా పార్టీ దిలీప్ రాయ్‌కు మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ 14 ఎమ్మెల్యేలు, మాకపా ఒక ఎమ్మెల్యే హోతా వద్ద ఉన్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఫలితాలు మారవచ్చు.

    ముఖ్యాంశాలు

    • బిహార్‌లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు, ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు.
    • హరియాణా, బిహార్, ఒడిశా నుంచి 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ భయం ఉంది.
    • తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ ఒక ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తోంది. ఆయన కూడా ఇప్పటివరకు ఓటు వేయడానికి రాలేదు.
    • బిహార్‌లో ఇప్పటివరకు ఎన్‌డీఏ తరఫున 201 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మహాఘట్‌బంధన్‌ తరఫున 37 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
    • హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నికల్లో 70 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హిమాచల్ కసౌలి నుంచి బయలుదేరి చండీగఢ్‌లో భూపేందర్ హుడ్డా ఇంటి వద్ద చేరారు. తర్వాత అందరూ కలిసి బస్సులో అసెంబ్లీకి వద్దకు చేరుకున్నారు.

     

  • సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్‌లైన్‌ రాజకీయాలతో బెయిల్‌ ఇప్పించడమే కాకుండా, షోకాజ్‌ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.

    వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా..‘కోడిని కోస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్‌ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే హాట్‌లైన్‌ రాజకీయాలతో బెయిల్‌ ఇప్పించడమే కాకుండా, షోకాజ్‌ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?.  

    హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్‌ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్‌ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్‌ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్‌ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్‌ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్‌ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.

    • కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.

    • టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్‌.

    • KGBV మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద కూడా నో యాక్షన్‌. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మీద కూడా నో యాక్షన్‌.

    • మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్‌.

    • ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్‌. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్‌లాంటి  పోస్టులో పెట్టారు.

    కమిటీల విచారణ, షోకాజ్‌ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణా​మం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్‌ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్‌ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్‌ వేశారు.

    బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్‌ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్‌లోకి రండి అంటూ కేటీఆర్‌ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్‌ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్‌లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.

    అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    మరోవైపు.. బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

International

  • ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్‌ దాడులతో మొదలైన యుద్ధం   వరుసగా 17వ  రోజు భీకరంగా సాగుతోంది.  ఒకవైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ  తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.  మరోవైపు  ఇరాన్‌ ప్రతీ కార దాడుల్ల  ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహూ, అతని భార్య,  మరో కీలక అధికారి మరణించారన్న   ఊహాగానాలు కూడా  నెట్టింట  విస్తృతంగా వ్యాపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలోనే తన మరణం గురించి వస్తున్న పుకార్లకు సమాధానమిచ్చేలా నెతన్యాహూ పేరిట విడుదలైన వీడియోలు ఏఐ  సృష్టి నెటిజన్లు వాదిస్తున్నారు. వీటిని తోసిపుచ్చుతూ  విడుదలైన  కాఫీ షాప్‌ వీడియో కూడా ఫేక్‌ అని గ్రోక్‌ తేల్చి చెప్పింది. 

    ఇదీ  చదవండి: మోజ్తబా ఖమేనీ ఆచూకీ : మరో బిగ్‌ ట్విస్ట్‌!

    దీంతో  మరోసారి నెతన్యాహూ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెతన్యాహు, 'మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, కలిసి గెలవడం' అని క్యాప్షన్‌తో సోమవారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆయన పౌరులతో సంభాషిస్తున్నట్లు కనిపించారు.


    నెటిజన్ల విమర్శలు
    ఈ వీడియోలో నెతన్యాహు కదలికలు సహజంగా లేవని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ద్వారా సృష్టించబడిన  వీడియో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరోవైపు  ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత ఇవ్వడానికి బదులు, ఇలాంటి వీడియోలు విడుదల చేయడం పట్ల చాలా మంది పెదవి విరిచారు.
     ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్యంపై  కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేనా?  అసలు ఆయన బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? రష్యా అద్యక్షుడు పుతిన్‌ నీడలో రక్షణ పొందుతున్నాడనే మరో వార్తహల్‌ చల్‌ చేస్తోంది. ఇరాన్‌ సుప్రీం మోజ్తబా  ఖమేనీ సేఫ్టీపై అగ్రనేతలు ఏమంటున్నారు?  ఈ విషయాలపై కథనం.

    అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన వేళ, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆచూకీ , ఆరోగ్యంపై  కొనసాగుతున్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.

    మోజ్తబా ఖమేనీ  ఉనికిపై ఊహాగానాలు
    ఇరాన్‌పై ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన అమెరికా -ఇజ్రాయెల్‌  దాడుల్లో ఇరాన్‌  అప్పటి సుప్రీంనేత  అయతుల్లా అలీ ఖమేనీ ఇతర కుటుంబ సభ్యులు మరణించారు. తండ్రి మరణం తర్వాత, 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, యుద్ధం ప్రారంభంలో జరిపిన దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం కోమాలో ఉన్నారనే ఊహాగానాలు భారీగా వ్యాపించాయి. అయితే ఈ విషయాలను ఖండించిన ఇరాన్ మోజ్తబా గాయపడినప్పటికీ నాయకత్వ బాధత్యలను నిర్వహించే స్థితిలోనే ఉన్నారని ప్రకటించింది. 

    రష్యాలో చికిత్స ?
    అయితే ఆయన రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ పత్రిక 'అల్-జరీదా' తెలిపింది. దీని ప్రకారం అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత మోజ్తబాను అత్యంత రహస్యంగా ఒక రష్యన్ సైనిక విమానంలో మాస్కోకు తరలించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంలోని ఒక ప్రైవేట్ వైద్య సదుపాయంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం అక్కడే కోలుకుంటున్నారని సమాచారం. ఇరాన్‌లో దాడులు కొనసాగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఆయన్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది.

    ఇరాన్‌లోనే ఉన్నారా?
    మరోవైపు 'ది సన్' పత్రిక కథనం మాత్రం మరోలా ఉంది మోజ్తబా ఇరాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో ఆయన రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం లేదా కడుపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని పేర్కొంది.

    ట్రంప్ , నెతన్యాహు ప్రకటనలు
    అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి.ఆయన అసలు బతికే ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు ఎవరూ ఆయన్ని చూడలేదు. ఆయన బతికే ఉంటే, తన దేశం కోసం శరణు కోరడం మంచిదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మోజ్తబా సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించడం గమనార్హం. 

    మరోవైపు ఇరాన్ నేత మోజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం ఉందంటూనే  "ఆయన ప్రాణాలకు నేను ఎలాంటి భరోసా (లైఫ్ ఇన్సూరెన్స్) ఇవ్వలేనునీ, అయితే ఖమేనీ ఉన్న ప్రదేశం గురించి ఇజ్రాయెల్‌కు నిఘా సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం  ఈ ఊహాగానాలను మరింత సంక్లిష్టం చేసింది. 

    ఇరాన్ సైనిక కమాండర్లకు కూడా తమ కొత్త నాయకుడి నుండి ఎటువంటి ఆదేశాలు అందడం లేదని, దీంతో ఇరాన్ అంతర్గత గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. మోజ్తబా అందుబాటులో లేని కారణంగా యుద్ధంపై ఆయనకు ఎటువంటి నియంత్రణ లేదని, కమాండర్లకు   కూడా ఆయన స్థితిగతులపై స్పష్టత లేదని 'ది టెలిగ్రాఫ్' నివేదించింది.

    (నెతన్యాహూ కాఫీ వీడియో : షాకింగ్‌ ‘డీప్‌ఫేక్‌’ చర్చ)

    ఖమేనీ పరిస్థితి గురించి సీనియర్ అధికారులు కూడా అనిశ్చితంగా ఉన్నారని ఇరాన్ అధికారి ఒకరు ది టెలిగ్రాఫ్‌తో అన్నారు. "మోజ్తాబా గురించి ఎవరికీ ఏమీ తెలియదు, అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా లేదా ఎంత తీవ్రంగా గాయపడ్డాడో. అతను గాయపడ్డాడని చెప్పారు. అతను ఇక్కడ లేనందున అతనికి యుద్ధంపై నియంత్రణ లేదు. మెజారిటీ కమాండర్లకు, లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే, అన్ని కమాండర్లకు అతని గురించి ఎటువంటి సమాచారం లేదు."  అని ఇరాన్‌ సీనియర్‌ అధికారిన ఉటంకిస్తూ టెలిగ్రాఫ్‌ వెల్లడించింది.

    అలాగే సుప్రీం లీడర్ పేరుతో విడుదలైన మొదటి ప్రకటన ఆయన రాసింది కాదని, భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ రాసి ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మోజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి ఇరాన్ రాజకీయ , సైనిక వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

  • టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆయా దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్‌ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన‍్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ప్రకటన చేశారు.

    ‘ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రిస్తున్నాయి. మాపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్ముజ్‌ జలసంధి వినియోగించడానికి అనుమతించం. జాతీయ భద్రత రక్షణ కోసం హర్ముజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవడమే మా లక్ష్యం. జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్‌ కృషి చేసింది‘ అని అన్నారు.

    దీంతో ఇరాన్‌ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్‌ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని చెప్పింది. 

    కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ డ్రోన్‌ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆ విమానాశ్రయం నుంచి వెళ్లే, వచ్చే అన్ని విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యే వరకు ప్రయాణం చేయవద్దని ప్రయాణికులకు సూచించారు.

    హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణ కోసం కూటమిలో చేరాలని సుమారు ఏడు దేశాలను అడిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. మరోవైపు ఇరాన్‌లో ఇంకా వేలాది లక్ష్యాలపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.  

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా  యుద్ధం 17వ రోజుకు చేరింది. తమ సుప్రీంనేతమరణం తరువాత ఇరాన్‌ భీకరమైనప్రతిదాడులతో  శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా అమెరికా సైనిక బేస్‌కేంద్రాలున్న గల్ఫ్‌ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ యుద్ధంలో   గత వారం నుండి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భద్రతపై ఊహాగానాలు చెలరేగాయి.ఈనేపథ్యంలో ఆయన మరణించినట్లు వస్తున్న పుకార్లను పటాపంచలు చేయడానికి విడుదల చేసిన కాఫీ వీడియో  నెతన్యాహూ  ఉనికిపై మరింత చర్చకు తావిచ్చింది. 

    అసలు అది నిజమైనదేనా లేక 'డీప్‌ఫేక్' (AI సృష్టించినదా) అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల నెతన్యాహూ రిలీజ్‌ అయిన వీడియో ఏఐ సృష్టి అని,  ఇరాన్‌ దాడిలో నెతన్యాహు  చనిపోవడంతోనే  ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందనే  అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ వీడియోలో ఆయనకు ఎడమ చేతికి ఆరువేళ్లున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది. 

     కాఫీ వీడియోపై ఆన్‌లైన్‌లో రచ్చ
    దీనిపై స్పందనగా తాజాగా నెతన్యాహు ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. జెరూసలేం హిల్స్‌లోని ది సతాఫ్ కేఫ్‌లో  కాఫీ ఆర్డర్ చేస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదు అనే సందేశాన్ని  ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశారు. నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో లెక్కించుకోండి అంటూ తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపించారు. అంతేకాదు  తాను కాఫీ కోసం చనిపోతున్నాను అంటూ పుకార్లకు కౌంటర్‌ ఇచ్చారు. అటు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఖండించింది.

    ఏఐ సృష్టే  అంటున్న నెటిజన్లు
    నెతన్యాహు ఎక్కడ, ఎలా ఉన్నారనే పుకార్ల మధ్య, కొత్త కాఫీ వీడియో మళ్లీ అనుమానాలను బలపరుస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కృత్రిమ మేధస్సు (AI)  సృష్టి అని తేల్చారు. మరోవైపు  గ్రోక్ కూడా 'డీప్‌ఫేక్' వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు సమాధానమిస్తూ,  ఎక్స్‌ AI చాట్‌బాట్, గ్రోక్, కాఫీ షాప్ వీడియోను 'AI-జనరేటెడ్' కంటెంట్‌గా తెలిపింది. ఈ ఏఐ వీడియోలో ఇజ్రాయెల్‌ తొలుత ఫేస్‌ గుండ్రంగా ఉంది. ఒక్కసారిగా కోలగా మారిందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే కప్పులోని కాఫీ పడిపోకుండా వింతగా ఉందని కొందరు. కౌంటర్ వెనుక ఉన్న ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉండటంపై కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కోటు జేబులు కూడా వింతగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషించారు.

  • యుద్ధంతో పశ్చిమాసియా రావణకాష్టంలా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కాస్తా ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంగా రూపాంతరం చెందింది. అయితే ఇది ఉగ్రవాద వ్యతిరేక పోరాటమా లేక శతాబ్దాల నాటి సరిహద్దుల విస్తరణా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. లెబనాన్‌ను కబళిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని నెతన్యాహు లక్ష్యం ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ వైపు మళ్లుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

    15 రోజుల్లో 20 శాతం భూభాగం కబ్జా?
    గడచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎప్‌) లెబనాన్ సరిహద్దుల్లో ఊహించని వేగంతో ముందుకు సాగింది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సుమారు 20 శాతం భూభాగాన్ని ఖాళీ చేయించడం వెనుక భారీ వ్యూహం దాగివుంది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడం పేరుతో ఇజ్రాయెల్ అక్కడ శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 800 మందికి పైగా పౌరులు, పోరాట యోధులు మరణించడంతో ఈ ప్రాంతం శ్మశానవాటికను తలపిస్తోంది.

    ఏమిటీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ కల?
    బైబిల్ కాలం నాటి ‘ప్రామిస్డ్ ల్యాండ్’ (వాగ్దాన భూమి) సిద్ధాంతాన్ని పునరుద్ధరించాలనేది కొందరు అతివాద ఇజ్రాయెలీ నాయకుల తీవ్ర ఆకాంక్ష. దీనినే ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ లేదా 'అఖండ ఇజ్రాయెల్' అని పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ లోని కొన్ని భాగాలను కలుపుకోవాలి. నెతన్యాహు తాజా దాడులు ఈ పాత మ్యాప్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి.

    హిజ్బుల్లా అణచివేత.. ఇరాన్ లక్ష్యంగా పావులు
    ఇజ్రాయెల్‌కు అసలైన శత్రువు ఇరాన్ అని నెతన్యాహు నమ్ముతారు. ఇరాన్ అండతో నడుస్తున్న హిజ్బుల్లాను బలహీనపరచకుండా లెబనాన్‌పై పట్టు సాధించడం అసాధ్యం. అందుకే ఒకవైపు క్షిపణి దాడులతో హిజ్బుల్లా వెన్ను విరుస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోందని వశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ జోక్యం చేసుకోకుండా అడ్డుకోగలిగితే, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తిగా మారుతుంది.

    ట్రంప్ హయాంలో.. 
    అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన గత 13 నెలల్లో ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇరాన్ నేతలపై దాడులు, కఠినమైన టారిఫ్‌లు, ఇజ్రాయెల్‌కు బేషరతు మద్దతు ఇవ్వడం ద్వారా ట్రంప్ నెతన్యాహుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అమెరికా అండ ఉండటంతో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తోంది.

    పశ్చిమాసియా మ్యాప్ మారుతోందా?
    ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం క్షిపణుల పోరాటం కాదు.. ఇది భౌగోళిక సరిహద్దుల మార్పిడి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ‘బఫర్ జోన్’ ఏర్పాటు ఇప్పుడు లెబనాన్ లోపలి వరకు చొచ్చుకుపోయింది. నెతన్యాహు వ్యూహం గనుక ఫలిస్తే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పటంలో లెబనాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

    శాంతి చర్చలు సాధ్యమేనా?
    ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు ఇరాన్ తన పట్టు కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ తన లక్ష్యం నెరవేరకుండా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ మహా సంగ్రామం పశ్చిమాసియాను మరో పెను మార్పు వైపు నడిపిస్తోంది.

    ఇది కూడా చదవండి: ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?

Business

  • దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.

    ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank), యెస్‌ బ్యాంక్‌ (YES Bank), ఎస్‌బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.

    యాక్సిస్‌ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌లో మార్పులు
    ఏప్రిల్ 12 నుంచి ఎయిర్‌టెల్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్‌లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

    • ఎయిర్‌టెల్‌ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌ చెల్లింపులపై 25% క్యాష్‌బ్యాక్ కొనసాగుతుంది.

    • ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్‌బ్యాక్  అందుతుంది.

    • అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్‌బ్యాక్ క్యాప్‌తో అనుసంధానం అవుతుంది.

    • స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్‌బ్యాక్ నిలిపివేయనున్నారు.

    • బదులుగా జొమాటో, బ్లింకిట్‌, డిస్ట్రిక్ట్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.

    యెస్‌ బ్యాంక్‌ కొత్త ఛార్జీలు
    ఏప్రిల్ 1 నుంచి యెస్‌ బ్యాంక్‌ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా..  

    • విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.

    • కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్‌ ప్రైవేట్‌ క్రెడిట్‌ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.

    • ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.

    • అదే విధంగా టోల్, బ్రిడ్జ్‌ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ  వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.

    ఎస్‌బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులు
    ఎస్‌బీఐ కార్డ్‌ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..

    • స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్  చేసుకోవచ్చు.

    • రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.

    • అయితే ఎయిర్‌ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్‌ కార్డ్‌ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది.

  • దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. సోమవారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.

    హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం రూ.450 తగ్గి రూ.1,45,900 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.2050 క్షీణించి రూ.1,44,300 లకు దిగివచ్చింది.

    అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సోమవారం ఉదయం రూ.490 తగ్గి రూ.1,59,170 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.2240 కరిగి రూ. 1,57,420 లకు క్షీణించింది.

    ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఉదయం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గిన వెండి సాయంత్రానికి రూ.4000 క్షీణించి రూ.2,76,000 వద్దకు దిగివచ్చింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • మోర్తాడ్‌(బాల్కొండ): యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్‌ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్‌లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

    తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్‌ చీటీ సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డింగ్‌ సూపర్‌వైజర్లు, ఆఫీస్‌ బాయ్స్‌గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు.  

    వేతనం, అర్హతల వివరాలు.. 

    • హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవర్లు, స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్‌ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్‌ బాయ్స్‌కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి.  

    •     డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.  

    •     స్టీవార్డ్‌ సూపర్‌వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్‌లో పని చేసిన అనుభవం అవసరం.  

    •     ఆఫీస్‌ బాయ్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్‌ మాట్లాడగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.  

        మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు  gulfjobsgtm @gmail.com మెయిల్‌కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్‌ (83320 62299), నిజామాబాద్‌ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్‌ చేశాయి.

    నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.

    అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.

    సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది.

  • ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.  ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?

    500 శాతం డిమాండ్ 
    హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్‌పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.

    హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్‌లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.

    ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?
    ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్‌కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్‌నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్‌పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్‌లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

    ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.

    ఏయే రంగాలపై ప్రభావం?
    గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.

    రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?
    ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్‌కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.

    ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?
    డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు.

     

  • దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.

    ప్రాధాన్యత క్రమంలో పంపిణీ

    ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:

    స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.

    స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.

    స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.

    స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.

    రాష్ట్రాల వారీగా..

    కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్‌లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

    ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష

  • బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.

    తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్‌ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.

    వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 
    ఇంటి అద్దె: ఆఫీస్‌కు  సమీపంలోని చిన్న అపార్ట్‌మెంట్‌కు సుమారు రూ.36,000
    కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000
    ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్‌లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000
    ఇతర ఖర్చులు: ఆన్‌లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000

    ఇవి కాకుండా సబ్‌స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.

    ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

    సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
    ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ  వేలల్లో వ్యూస్‌, వందలాది లైక్‌లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. 

Family

  • మండే ఎండలు, ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజస్థాన్‌. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే పుష్కర్‌లో ఉన్న పవిత్రమైన పుష్కర్‌ సరోవర్‌.

    ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్‌లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఏర్పడింది అని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.

    ఎండాకాలంలో పుష్కర్‌ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది. అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పుష్కర్‌కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. 

    ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ ఆలయం పుష్కరం ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్‌ లవర్స్‌కు కూడా పుష్కర్‌ ఒక స్పిరిచ్యువల్‌ డెస్టినేషన్‌ గా నిలుస్తుంది. ఎండాకాలంలో రాజస్థాన్‌ పర్యటన అనేది సాధారణంగా కష్టమైనదే. ఒక వేళ ఏదైనా పనిలో భాగంగా వెళ్తే మాత్రం మౌంట్‌ అబూ, పుష్కర్‌ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లచ్చు. మండే వేడిలోనూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.

    ఎలా చేరుకోవాలి?
    తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌΄ోర్ట్‌ నుంచి జైపూర్‌ కు నేరుగా ఫ్లైట్‌లో చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లేవారు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌ స్టేషన్‌ నుంచి జైపూర్‌కు రైలు మార్గాన చేరుకోవచ్చు. హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌ నుంచి రైలు మార్గం అందుబాటులో ఉంది. జైపూర్‌ నుంచి రోడ్డు మార్గాన అజ్మేర్, పుష్కర్‌ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్‌లు బుక్‌ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.

    యూరప్‌లోని అందమైన ద్వీపాల కథ

    నార్త్‌ ఆట్లాంటిక్‌ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్‌ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. యూరోప్‌లో ఇది చాలా పాప్యులర్‌ డెస్టినేషన్‌. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీ΄ాలకు ప్రత్యేకమైన, ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణ. ఉదయం వేళలో సముద్ర అలలు, పచ్చని పర్వతాల మధ్య పడిన వెలుగు ప్రపంచం అంతా ప్రశాంతంగా అనిపించే దృశ్యాన్ని సృష్టిస్తుంది.

    గ్రామాల జీవనం
    ఫరో గ్రామాల సందుల్లో చిన్న ఇళ్లు, గ్రాస్‌ రూఫ్స్, సముద్రంపై నడిచే పడవల దృశ్యం కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ప్రకృతి రిథమ్‌తో కలిసి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ చూడచ్చు. ఫిషింగ్, సముద్ర సంస్కృతి ఇక్కడి ప్రజల జీవితంలో కీలక భాగంలాంటిది. ఇక్కడ ఎక్కువగా వైకింగ్స్‌ వారసులే నివసిస్తుంటారు.

    హైదరాబాద్‌ నుంచి యాత్ర
    హైదరాబాద్‌ నుంచి ఫరో ఐలాండ్‌కి ప్రయాణం సాధారణంగా వాయు మార్గంలోనే జరుగుతుంది. ముందుగా హైదరాబాద్‌ నుండి దుబాయ్‌ లేదా ఢిల్లీ నుండి యూరోప్‌లోని కోపెన్‌ హ్యాగెన్‌ చేరుకోవాలి. అక్కడి నుండి వగార్‌ విమనాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న రోడ్డు ప్రయాణం చేసి ద్వీపాల మధ్య ఉన్న అందమైన గ్రామాలకు వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. 

  • గిర్నార్‌ అనే పర్వత శ్రేణి గుజరాత్‌ రాష్ట్రంలో జూనాగఢ్‌ నగరం పక్కన ఆధ్యాత్మిక ప్రభతో నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ ఉదయం సమయంలో అడుగులు వేస్తూ కొండపైకి చేరుకుంటుంటే భక్తి, ప్రకృతి మధ్య జరిగే ఒక మౌన సంభాషణలా అనిపిస్తుంది.

    అడుగడుగునా మంత్రాల ధ్వని
    గిర్నార్‌కి చేరిన తరువాత కొండపైకి ట్రెక్కింగ్‌ చేయడానికి మెట్లు ఉంటాయి. ప్రతి అడుగు ఒక రిథమ్‌లో ముందుకు సాగుతుంది. కొన్ని ప్రదేశాల్లో ప్రశాంతంగా వినిపించే మంత్రాల ధ్వని గాలిలో కలుస్తుంది. చుట్టూ పర్వత వనాలు, పర్వతం పైకి చేరుకుంటున్న కొద్దీ భక్తులు దైవానికి మౌనంగా చేసే నమస్కారాలు.. ఇవన్నీ కలిసి ఒక పవిత్రమైన మార్గంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మారితుంది.

    గిర్నార్‌లోని అంబాజీ ఆలయం దగ్గర ఉదయం వేళలో దీపాల వెలుగు చాలా హృద్యంగా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్లిన తరువాత దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటుంది. గిర్నార్‌ శిఖరం దగ్గర నిల్చొని చూస్తూ గుజరాత్‌ నేల అందం ఏంటో తెలుస్తుంది. అక్కడి నేల అందాల్ని చూస్తూ భక్తి, ప్రకృతి రెండూ కలిసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

    పర్వతంపై సూర్యోదయం
    శిఖరం అంచున నిల్చొని సూర్యోదయాన్ని వీక్షిస్తుంటే ఆకాశం బంగారు రంగులో మారడాన్ని గమనించవచ్చు. పర్వత రేఖలు కోమలంగా కనిపిస్తాయి. ఆ క్షణంలో ఈ ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా నిలుస్తుంది.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుండి అహ్మదాబాద్‌ వరకు ఫ్లైట్‌ లేదా రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్‌ నుండి రైలు లేదా రోడ్‌ మార్గం ద్వారా జూనాగఢ్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి గిర్నార్‌ వరకు రోడ్‌ ప్రయాణం ఉంటుంది. గిర్నార్‌ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక శారీరక యాత్ర మాత్రమే కాదు. మనసుతో చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. 

  • తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి. 

    ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్‌లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్‌, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్‌కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది. 

    వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్‌ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు. 

    తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.

    (చదవండి: గ్యాస్‌ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్‌!)

     

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్‌పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్‌పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో  సంక్షోభం తలెత్తింది. దాంతో గృహ అవసరాలకే కాక హోటళ్లు, అన్నదాన కార్యక్రమాలు వంటి పలు వాటిపై ఈ గ్యాస్‌ కొరత ప్రభావం మాములుగా లేదు. అంతేగాదు దీనికి ప్రత్యామ్నాయం ఏంటీ అని సర్వతా ఒకటే చర్చ. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ సైతం బ్యాన్‌ చేసిన కట్టెల పొయ్యిలను తిరిగి వినియోగించుకోమని ఆదేశించడం చూస్తేనే తెలుస్తోంది సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ..సరికొత్త ఆశను రేకెత్తించారు పూణెకి చెందిన ఇంజనీర్ ప్రియదర్శన్ సహస్రబుద్ధే. అది కూడా వంటింటి వ్యర్థాలతోనే ఈ ఎల్‌పీజీ గ్యాజ్‌ సమస్యకు పరిష్కారం చూపించాడు.

    పూణేకు చెందిన ఇంజనీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పూర్వ విద్యార్థి ఈ ఎల్‌పీజీ గ్యాస్‌ కొరతకు తన ఇంటి కోసం కనిపెట్టిన ఆవిష్కరణతోనే మార్గం చూపాడు. ఆయన కొన్నాళ్ల క్రితం కుటుంబ ‍వ్యాపారం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత ఎంతలా ఆహారం వృధా అవుతుందో  గమనించాడు. ఆ వ్యర్థాలను ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ..పలు కంపోస్టింగ్‌ ప్రయోగాలు చేశాడు. కానీ పరిష్కారం దొరకలేదు. కానీ వాటిని తిరిగి మనకు శక్తిమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దిశగా జీవ ఇంధనాల శాస్త్రంపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. 

    అప్పుడే తెలుసుకున్నాడు వంటశాలలో ఉత్పత్తి అయిన సేంద్రీయ వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి మీథేన్‌ వాయువుని ఉత్పత్తి చేయొచ్చని. ఇది వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం. పైగా వ్యర్థాలను పొంగిపొర్లుతున్న పల్లపు ప్రాంతాలకు పంపే బదులు గృహాలకు శక్తిగా మారిస్తే..ఆ ఆలోచనే 2017లో 'వాయు' అనే సాధారణ గృహాల కోసం రూపొందించిన కాంపాక్ట్ దేశీయ బయోగ్యాస్ ప్లాంట్‌గా రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా సేంద్రీయ వంటగది వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తుంది. 

    ఇలా ఉత్పత్తి అయిన వాయువు నేరుగా స్టవ్‌కు పైపుల ద్వారా పంపొచ్చు. మిగిలిపోయిన వేస్ట్‌ని ఎరువుగా ఉపయోగించొచ్చు. ఈ ప్రయోగం ముందగా సహస్రబుద్దే తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు సేకరించిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి దాదాపు 800 లీటర్ల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇది అతని ఇంటి వంట అవసరాలకు సరిపోయింది. అంతేగాదు ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించింది కూడా. తన చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌ వాసులకు కూడా దీనిపై అవగాహన కల్పించి..వాళ్లు కూడా ఈ మార్గంలో పయనించేలా చేశాడు.  

    ఆ తర్వాత తన వినూత్న స్టార్టప్‌ సాయంతో నాసిక్‌, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌తో సహా వివిధ నగరాల్లో వందకు పైగా యూనిట్లను స్థాపించారు. ఇవి ప్రతిరోజూ దాదాపు రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ప్రాసెస్‌ చేయగలవు. ఇక్కడ ఈ ఇంజనీర్‌ వ్యర్థాలను పారేసివిగా కాకుండా వినియోగించుకునే విలువైన వనరుగా ఎలా వాడాలో తెలియజేశాడు. ఓ పక్క వ్యర్థాల సమస్యకు చెక్‌పెట్టాడు, అలాగే ఎల్‌పీజీ గ్యాస్‌పై ఆధారపడకుండా స్వచ్ఛమైన మీథేన్‌ వాయువుని పొందేలా చేశాడు. పర్యావరణానికి హితంగా, వంటిల్లు పరిశుభ్రంగా ఉంచే గొప్ప పరిష్కారం కదూ ఇది..!.

    (చదవండి: ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన భారత డిజైనర్‌ వేర్‌లు, ఆభరణాలు..!)

     

  • ప్రకృతి కొన్ని ప్రదేశాలను అత్యంత శాంతంగా సృష్టిస్తుంది. అక్కడ కాలం కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. మైనస్‌ 40 డిగ్రీలలోనూ విస్తరించి, ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరంగా పేరొందింది. రష్యాలో ఉన్న యాకుట్స్క్‌ అనే పేరుగల నగరం ఓ ప్రత్యేక ప్రపంచంలా కనువిందు చేస్తుంది.

    సైబీరియా ప్రాంతంలో లేనా నదీ తీరం దగ్గర ఉన్న యాకుట్స్క్‌ ది ప్రపంచ పటంలోనే ఒక ప్రత్యేక స్థానం. మంచు నేలపై భానుని కిరణాలు పడి, ఆకాశం నుంచి రాలిన వెలుగుల తారలా మార్చి ్ర΄ారంభంలో యాకుట్స్క్‌ కనువిందు చేస్తుంది. నట్టనడి వేసవిలో భూమి పచ్చని రంగులోకి మారి΄ోతుంది. ఈ రెండు కాలాల్లోనూ యాకుట్స్క్‌ ఒక ప్రత్యేక ప్రకృతి కథనాన్ని చూపిస్తుంది.

    సైబీరియా ప్రభాత దృశ్యం
    మార్చి, ఏప్రిల్‌ నెలలో ఉషోదయ సమయాన ఒక మనోహరమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. లేనా నది దగ్గర కనిపించే ప్రశాంతమైన పర్వతాలు, సుదూరంలో కనిపించే చెట్లు ఈ నగరానికి ఒక కొత్త రంగును అద్దుతాయి.

    కోల్డెస్ట్‌ సిటీ.. విశేషాలు ఇవీ..
    మైనస్‌ 40 డిగ్రీలు: యాకుట్స్క్‌ ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఒకటి. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు –40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయి.

    శాశ్వత భవనాలు: నగరం మొత్తం పెర్మాఫ్రోస్ట్‌ (శాశ్వతంగా ఉండేలా) పై నిర్మించబడింది. అందుకే భవనాలను దృఢమైన పిల్లర్లపై నిర్మిస్తారు.

    డైమండ్స్‌కు ప్రసిద్ధి: యాకుట్స్క్‌ పరిసర ప్రాంతాలు డైమండ్స్‌కు ప్రసిద్ధి. ప్రపంచంలో ఎక్కువ డైమండ్స్‌ లభించే ప్రాంతాల్లో ఇది ఒకటి.

    కార్లు ఆఫ్‌ చేయరు: వింటర్‌లో కార్ల ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తే ఫ్రీజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చాలాసార్లు ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచుతారు.

    ఎక్స్‌ట్రీమ్‌ సీజన్స్‌ 
    చలికాలంలో తీవ్ర చలిగా ఉండగా, సమ్మర్‌లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు పెరుగుతాయి.

    కష్టమైనా.. ఇష్టంగా!
    యాకుట్స్క్‌ ప్రజలు ప్రకృతితో కలిసి జీవించేలా తమ లైఫ్‌స్టైల్‌ను రూపొందించుకున్నారు. గ్రామాల వీధుల్లో చిన్న మార్కెట్లు, సంప్రదాయ ఇళ్లు, ఉదయం సమయంలో కనిపించే కదలికలు ఇక్కడి నగర సంస్కృతిని తెలియజేస్తాయి. స్థానిక సంస్కృతిలో యాకుట్స్క్‌ సంప్రదాయ పరంపర, నృత్యం, కళలు ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబిస్తాయి.

    సందర్శనీయ స్థలాలెన్నో! 

    యాకుట్స్క్‌ ప్రయాణంలో మామ్మోత్‌ మ్యూజియం అనేది యాకుట్స్క్‌కు చెందిన ఒక ప్రత్యేక చరిత్ర కథను చూపిస్తుంది. సైబీరియా భూమిలో కనిపించే, అంతరించిన ్ర΄ాచీన జీవుల అవశేషాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి.

    లేనా నదీ ఎంబార్క్‌మెంట్‌ వద్ద మార్నింగ్‌ వాక్‌ చేస్తూ చాలా మంది ఈ నగర రిథమ్‌ను అర్థం చేసుకుంటారు.

    కొంచెం దూరంలో ఉన్న లేనా పిల్లర్స్‌ నేచర్‌ ΄ార్క్‌ అనేది ప్రకృతి సృష్టించిన విశాల శిలా స్తంభాలతో అద్భుతంగా కనిపిస్తుంది.

    అలాగే కింగ్డమ్‌ ఆఫ్‌ పెర్మాఫ్రోస్ట్‌ అనేది  యాకుట్స్క్‌లో మంచు గుహల మధ్య     కళాకృతులు కనిపిస్తాయి.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి ముందుగా ఢిల్లీ లేదా దుబాయ్‌కు చేరుకుని అక్కడి నుంచి మాస్కో వరకు విమానంలో వెళ్లాలి. మాస్కో నుంచి విమానంలో  యాకుట్స్క్‌ చేరుకోవచ్చు.

    ఎక్కడ ఉండాలి?
    యాకుట్స్క్‌లో చిన్న హోటల్స్‌తో పాటు ట్రెడిషనల్‌ గెస్ట్‌ హౌసులు కూడా ఉంటాయి. లేనా నది దగ్గర ఉండే ప్రదేశాల్లో బస చేస్తే ఉదయం దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

    ఏమి తినాలి?
    ఇక్కడి లోకల్‌ ఫుడ్‌లో సైబీరియన్‌ రుచులు కనిపిస్తాయి. చేపలతో చేసే వంటలు, సూప్స్, సంప్రదాయ బ్రెడ్స్‌ స్థానిక భోజన సంస్కృతిని తెలియజేస్తాయి. లేనా నది తీరంలో మార్నింగ్‌ వాక్‌ చేయడం, మమ్మోత్‌ మ్యూజియం సందర్శించడం, లేనా పిల్లర్స్‌ దగ్గర ప్రకృతి శిల్పాలను చూడడం వంటి అనుభవాలు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. 

    యాకుట్స్క్‌ ట్రిప్‌ అనేది ఒక సుదూరమైన ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. ఇది ప్రకృతి, మనిషి జీవితానికి మధ్య జరిగే ఒక అందమైన అనుభవం. మార్చి హిమ వెలుగుల నుంచి వేసవి పచ్చని రంగుల వరకు ఈ నగరం కొంగొత్త దృశ్యాలను కనువిందు చేస్తుంది.

    – ఎం.జి.కిశోర్, పర్యాటకుడు 

    (చదవండి: ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీకూతుళ్లు)

  • సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలో హాలీవుడ్‌ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాలుపంచుకుంటారు. అయితే ఈసారి జరిగిన ఆస్కార్‌ వేడుకలో రెడ్‌కార్పెట్‌పై మన భారతీయ ఢిజైనర్‌వేర్‌, ఆభరణాలు తళుక్కుమనడం విశేషం. హాలీవుడ్‌ ప్రముఖులు మన దిగ్గజ ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందిచిన దుస్తులు, ఆభరణాలను ధరించి ఈ వేడకలో కనిపించడం అత్యంత హైలెట్‌గా నిలిచింది. మన భారతీయ ష్యాషన్‌ శైలిని ధరించిన ఆ ప్రముఖులు ఎవరంటే..

    ప్రముఖ బ్రిటిష్-అమెరికన్ ఫ్యాషన్ జర్నలిస్ట్, స్టైలిస్ట్,జన్నా రాబర్ట్స్ రాస్సీ ఈ ఆస్కార్‌ వేడుకలో అబుజాని, సందీప్‌ ఖోస్లా రూపొందించిన కోచర్‌ని ధరించారు. భారతీయ వస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే కోచర్‌లో కనిపించారామె. ఈ కోచర్‌ని వేలాది బగల్ పూసలు, రాళ్ళు, స్ఫటికాలతో  ఎంబ్రాయిడరీ చేసిన విలాసవంతమైన క్రాప్‌ టాప్‌. సిల్క్‌ బ్రోకేడ్‌ కాన్వాస్‌పై ఈ డిజైన్‌ని రూపొందించారు. దీన్ని డిజైన్‌ చేయడానికి దారాలను కట్టి రంగులు వేసే సాంప్రదయా సాంకేతికతతో రూపొందిస్తారు. ఇది ఏకంగా రెండు వేల గంటలు శ్రమతో చేసిన చేతి ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌.

    జాంబియన్‌  పచ్చ వజ్రం
    అంతర్జాతీయ మోడల్, బ్యూటీ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రీతికా స్వరూప్ ఈ వేడుకలో అద్భుతమైన భారతీయ నెక్లెస్‌తో మెరిశారు. ఆమె భారతీయ ఆభరణాల నైపుణ్యాన్ని వ్యక్తరిచేలా ఆస్కార్‌ రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్నారు. జిప్‌ మాదిరి నెక్‌లైన్‌తో మధ్యలో జాంబియన్‌  పచ్చ వజ్రం ఆ నెక్లస్‌ని హైలెట్‌గా కనిపించేలా చేసింది. ఈ ఆభరణానికి రూపొందించడానికి దాదాపు 160 గంటల శ్రమతో చేతితో రూపొందిస్తారట.

    తెలంగాణ హస్తకళాకారులు రూపొందించిన..
    బ్రాందీ కార్లైల్ బంగారం, వజ్రాలతో చేతితో రూపొందించిన ప్రిజం బ్రూచ్‌ను ధరించారు. బ్రూచ్ ఓపెన్-సెట్టింగ్ టెక్నిక్ ద్వారా అమర్చబడిన పావ్-సెట్ వజ్రాలతో డిజైన్‌ చేశారు. ఇది రాళ్ల ద్వారా కాంతి స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తోంది. దీన్ని తెలంగాణలోని నిపుణులైన స్వర్ణ హస్తకళాకారులు సుమారు 100 గంటలు శ్రమింది డిజైన్‌ చేస్తారట. ఈ వజ్రాల నెక్లెస్‌ మన భారతదేశ హస్త కళా వారసత్వ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.

    (చదవండి: ఆస్కార్‌ ఫుడ్‌ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..)

     

Guest Columns

  • భారతదేశ చిత్రపటం 1953 నుంచి మారిపోతూ వచ్చింది. దీనికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు నెరిపిన శాంతియుత సత్యాగ్రహ పోరాటం. పరిపాలన సవ్యంగా, అర్థవంతంగా సాగాలంటే తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని తన ప్రాణాలను పణంగా పెట్టి మద్రాసులో 58 రోజులు కఠోర దీక్షను చేస్తూ తుదకు 1952 డిసెంబర్‌ 15న రాత్రి 11 గంటల 23 నిమిషా లకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణై అమరజీవిగా మారారు. కనుకనే పొట్టి శ్రీరాములును భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖించిన ‘ది మెర్కేటర్‌ ఆఫ్‌ ఇండియా’ అని ప్రముఖ చరిత్రకారులు డాక్ట‌ర్‌ రామచంద్ర గుహ కొనియాడారు.

    పూర్వీకులు పడమటిపల్లి గ్రామానికి చెందిన వారైనా, పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న పుట్టింది మద్రాసులోనే! మొదటి 20 సంవత్సరాలు మద్రాసులోని అష్టకష్టాల జీవితాన్ని కొనసాగించి తర్వాత ఒక దశాబ్దం పాటు చదువు, ఉద్యోగం కారణంగా బొంబాయి (ముంబై) నగరంలో శ్రీరాములు నివాసం ఉన్నారు. పిమ్మట అర దశాబ్దం మించి గాంధీజీ అనుచరులుగా ఆయన బాటలో సాగుతూ తొలుత సబర్మతి ఆశ్రమం, వార్ధా ఆశ్రమం, కారాగారవాసం, బిహార్‌ భూకంప పునరావాస ప్రాంతాలు, గుజరాత్‌లోని ఆశ్రమాలలో శ్రీరాములు ప్రజాజీవితం గడిచింది. 

    తర్వాత 1936 నుంచి ఒక దశాబ్దిన్నర కాలంపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నో రకాల సంస్క రణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. హరిజనుల అభ్యున్నతి కోసం బ్రిటిష్‌ పాలనలో రెండుసార్లు, స్వతంత్రం వచ్చిన తర్వాత మరో రెండు సార్లు దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రమంటూ చేసిన దీక్ష ఐదవదీ, చివరిది!

    పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్థ పరులైన దేశభక్తులు పది, పన్నెండు మంది తన అనుచరులుగా ఉండి ఉంటే స్వరాజ్యాన్ని ఏనాడో సాధించే వాడినని మహాత్మాగాంధీ 1946లో మద్రాస్‌లో జరిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలలో శ్లాఘించారు. వారి ఆమరణ నిరాహార సత్యాగ్రహదీక్ష వల్లనే తెలుగువారితో పాటు తమిళులు, మలయాళీలు, కన్నడిగులు... తర్వాత మహారాష్ట్రీ యులు, గుజరాతీయులు, బిహారీలు, పంజాబీలు... ఇలా పలు భాషల వారు ప్రత్యేక రాష్ట్రాలను సిద్ధింప చేసుకున్నారు.

    సుప్రీంకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి వీఆర్‌ కృష్ణయ్యర్‌ 1985 మార్చి 16న మద్రాసులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ప్రసంగం చేస్తూ ఇలా స్పష్టం చేశారు: ‘భారతీయ ఫెడరల్‌ రాజ్యాంగ విధానానికి సంబంధించిన ఉత్తమ సూత్రానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గొప్ప బలం చేకూర్చారు. తన ఆత్మహుతితో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరితం చేశారు. గుడిసెలలో జీవించే కోట్లాదిమంది సామాన్య జనంతో కలిసి మెలిసి జీవిస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ప్రకటించిన గాంధీజీ వంటి మహాత్ముల కోవకు చెందినవారు పొట్టి శ్రీరాములు. 

    శాంతి, హింస, సత్యాగ్రహం అనే వాటిని రాజకీయాల్లో పట్టు వదలకుండా ప్రయోగించి తన గురువు గాంధీజీ లాగానే విజయం సాధించిన అపురూపమైన వ్యక్తి శ్రీరాములు.’ పొట్టి శ్రీరాములు జీవనశైలినీ, ఆలోచనా ధోరణినీ ఆచరించ గలిగితే  మరింత మేలైన మానవులుగా పరిణమించడం తథ్యం. వారి త్యాగమయ జీవితం, పోరాటశీలత, దృఢచిత్తం, నిస్వార్థ స్వభావం నేటికీ సదా స్మరణీయం. ఆయన సత్యాగ్రహ దీక్ష కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు సాధించుకున్న పలు భాషల భారతీయులందరికీ ఆయన ఆరాధ్యనీయులు.  

    – డాక్ట‌ర్‌ నాగసూరి వేణుగోపాల్‌
    పొట్టి శ్రీరాములుపై పరిశోధకులు – ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
    నేడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి