Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు రక్షణ (బెయిల్) పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హై కోర్టు వెల్లడించింది.

    ‘బాధితురాలు ముమ్మాటికీ మైనరే’

    పిటిషన్‌పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్‌కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికీ మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు  17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె పదో తరగతి (టెన్త్) మెమోతో పాటు, జీహెచ్‌ఎంసీ (GHMC) జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు.

    బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. "బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లింది" అని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు.

    కాగా, అంతకుముందు బండి భగీరథ్‌ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీర‌థ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు.

  • సాక్షి, హైదరాబాద్‌: లిఫ్ట్‌ తెగిపడి బీఆర్‌ఎస్‌ నాయకులు గాయపడిన ఘటన హైదరాబాద్‌లోని పుప్పాలగూడ డాలర్‌ హిల్స్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులు గాయపడ్డారు.

    వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్‌ ఒక్కసారిగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఓ అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ముగించుకుని లిఫ్ట్ లో కిందకు దిగుతున్న సమయంలో ఘటనఈ ఘటన జరిగింది.

  • సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్‌ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

  • హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహానాలు తగ్గించాలని నిర్ణయించారు. ఇక నుంచి నాలుగు వాహనాలతోనే సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ బయల్దేరనుంది.  అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ మధ్యనే సీఎం కాన్వాయ్‌ వెళ్లడానికి నిర్ణయించారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వాహనాలపై నిర్ణయం తీసుకున్నారు. 

    పశ్చిమాసియాలో  ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాహనాల వాడకాన్ని కాసేపు పక్కనపెట్టి సైకిళ్లు, మెట్రోల్లో, ఎడ్లబండిపై పయనిస్తున్నారు. 

    ఇక ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్‌లోని వాహనాలను రెండుకు పరిమితం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో తొలుత కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్‌ కూడా తన కాన్వాయ్‌ వాహనాలను నాలుగుకు పరిమితం చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్‌ఫాంపై ఉన్న ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. జైపూర్‌ వెళ్తున్నట్రైన్‌ ఏసీ బోగిలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

    రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
     

  • అశ్వరావుపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బండారు గుంపులో భూవివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. భూ వివాదం ముదరడంతో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. కళ్లలో కారం కొట్టుకుని కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలో భూవివాదాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న భూవివాదం తారాస్థాయికి చేరుకుని కత్తులతో దాడులు చేసుకునే వరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది. 

  • హైదరాబాద్:  బండి భగీరథ కేసులో సిటీ సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.   ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్‌. 

    ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ​బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్‌ కోర్టు. 

    తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ​ ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్‌. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్‌ కోర్టు.

  • సాక్షి, హైద‌రాబాద్‌: డబ్బాలో పెట్టి  కేఫ్‌/షాప్‌ల వాళ్లు అందిస్తున్న హలీమ్‌ ఎలాంటిది? ఏ దినుసులు ఎంత శాతం చొప్పున కలుపుతున్నారు? అది ఎంత మేర ఆరోగ్యకరం? ఇప్పటిదాకా తెలియని ఈ కచ్చితమైన వివరాలు హలీమ్‌ ప్రియులకు తెలియనున్నాయి. గోధుమలు, పప్పు లు సహా ఏవేవో కలిపేసి హలీమ్‌ తయారీ చేసే అక్రమ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం పడనుంది.  

    హైదరాబాద్‌ హలీమ్‌ (Hyderabad Haleem) ఎంతో పాపులర్‌. కాగా అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే ఏ ఆహారోత్పత్తికైనా నిర్దుష్ట ప్రమాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎగుమతిదారుల ఆరోపణల దృష్ట్యా హలీమ్‌ నాణ్యత ఖరారు చేయాలని, నగర సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన  ప్రఖ్యాత వంటకాన్ని ప్రామాణీకరించాలని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్ణయించింది. నిర్దుష్ట ప్రమాణాలను రూపొందించింది. గత ఏప్రిల్‌ 28న నవీకరణను జారీ చేసింది. ప్రమాణాలను పాటించాల్సిన గడువును పొడిగిస్తూ నవంబర్‌ 1గా నిర్ణయించింది.

    ప్రమాణాలు ఏమిటి? 
    మాంసం, ప్రోటీన్‌ తేమ అవసరాలతో సహా కఠిన ప్రమాణాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రవేశపెట్టింది. హలీమ్‌ను ‘సాధారణ ఆహారం’ వర్గం నుంచి ఒక ప్రత్యేక విభాగానికి మార్చి కచ్చితంగా ఏమేం ఉండాలో తేల్చింది.  

    ఇకపై చట్టబద్ధంగా ’హలీమ్‌’ అని పేర్కొనాలన్నా, అధికారముద్ర పడాలన్నా..  ఆ ఆహార ఉత్పత్తిలో ఇప్పుడు బరువు ప్రకారం కనీసం 25 శాతం మటన్‌ /చికెన్‌ ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి గోధుమ కంకులు, పప్పులు నీళ్లు  కలిపిన హలీమ్స్‌ను వండి వడ్డించే కొన్ని హలీమ్‌ స్టాల్స్‌ ఆటలు ఇక చెల్లవు.

    ప్యాక్‌ చేసి ఎగుమతి చేసే ప్రతి హలీమ్‌ తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట రసాయన ప్రమాణాలను కూడా నిబంధనలు నిర్దేశించాయి. మటన్‌ హలీమ్‌లో కనీసం 8 శాతం ప్రోటీన్, 70 శాతం తేమ ఉండాలి. చికెన్‌ హలీమ్‌లో (Chicken Haleem) కనీసం 6 శాతం ప్రోటీన్, 75 శాతం తేమ పరిమితిని నిర్దేశించారు. నిర్ణీత ప్రోటీన్, తేమ శాతాలు ఇప్పుడు హలీమ్‌ నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాల పరీక్షల సమయంలో పారామితులుగా పనిచేస్తాయి.

    చ‌ద‌వండి: భ‌ర్త డైరెక్ష‌న్‌.. భార్య యాక్ష‌న్‌

    హలీమ్‌లలో కొవ్వు 12 శాతానికి పరిమితం కావాలి. వచ్చే రంజాన్‌ నాటికి, ప్రతి వాణిజ్య తయారీదారు ఈ ప్రోటీన్‌ కొవ్వు శాతాలను తమ లేబుళ్లపై చట్టబద్ధంగా ముద్రించాల్సి ఉంటుంది. మటన్, బఫెలో మీట్‌ హలీమ్‌ల మధ్య తేడాను లేబుళ్లపై స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. 

Sports

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్ కోసం ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది. శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది.

    లక్ష్య చేధనలో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. తన తుపాన్ బ్యాటింగ్‌తో సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈజీగా సెంచరీ మార్క్ అందుకునేలా కన్పించిన మార్ష్‌.. దురదృష్టశాత్తూ రనౌటయ్యాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిష్‌(36), పూరన్‌(32 నాటౌట్‌) రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి, జాన్సన్‌ తలా ఓ వికెట్ సాధించాడు.

    అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్‌(13), సంజూ శాంసన్‌(20) ఆరంభంలోనే ఔటైనప్పటికి.. యువ ఆటగాడు కార్తీక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కార్తీక్ శర్మ 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు శివమ్ దూబే(32) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

    లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్‌, మహ్మద్‌ షమీ తలా వికెట్‌ సాధించారు. కాగా సీఎస్‌కే ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా మిగిలిన జట్లు ఫలితాలపై ఆధారపడాల్సింటుంది.

  • ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేస‌ర్ ఆకాశ్ మ‌హారాజ్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. లక్నో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన ఆకాశ్‌కు ఎట్టకేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది.

    అయితే త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని ఆకాశ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. త‌న సూప‌ర్ బౌలింగ్‌తో సీఎస్‌కే టాప‌ర్డ‌ర్‌ను ఆకాశ్ కుప్ప‌కూల్చాడు. ఆకాశ్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

    అంతేకాకుండా వికెట్ తీసిన ప్రతీసారి తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకాశ్‌ ఆకర్షించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సీఎస్‌కేపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన లక్నో బౌలర్‌గా ఆకాశ్‌ నిలిచాడు.  దీంతో ఎవరీ ఆకాశ్ సింగ్ అని నెటిజన్లు వెతుకుతున్నారు.

    ఎవరీ ఆకాశ్ సింగ్‌?
    ఈ లెఫ్ట్ ఆర్మ్‌పేస‌ర్ దేశ‌వాళీ క్రికెట్‌లో రాజ‌స్తాన్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఆకాశ్‌ దిట్ట. 2020 అండర్-19 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో అత‌డు సభ్యుడిగా ఉన్నాడు.

    అండ‌ర్‌-19 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లతో జరిగిన ఘర్షణలో ఐసీసీ శిక్షించిన ఐదుగురు ఆటగాళ్లలో ఆకాశ్ సింగ్ ఒకరు. ఆకాశ్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం కూడా ఉంది. ల‌క్నో కంటే ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌కు ఆకాశ్ ప్రాతినిథ్యం వ‌హించాడు. 2025 వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకుంది.

    గత సీజన్‌లో 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీయడంతో 2026 సీజన్‌కు కూడా జట్టు అత‌డిని ల‌క్నో అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మ‌రోసారి అత‌డు స‌త్తాచాటాడు. ముందు మ్యాచ్‌ల‌లో అత‌డికి అవ‌కాశమిచ్చింటే ప‌రిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఆకాశ్‌ పేరిట ఓవరాల్‌గా 22 టీ20 వికెట్ల ఉన్నాయి.

  • ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న సచిన్ టెండూల్క‌ర్ త‌న‌యుడు  అర్జున్ టెండూల్క‌ర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో శుక్రవారం ఏకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్జున్ అవకాశం​ దక్కుతుందని అంతా భావించారు.

    కానీ లక్నో మేనెజెమెంట్ మరోసారి అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది. ఆకాష్ మహారాజ్ సింగ్‌, యయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చిన లక్నో.. అర్జున్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌లో ఉన్న అర్జున్.. ఐపీఎల్ 2026 కోసం జరిగిన ట్రేడింగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వచ్చాడు.

    కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. సీజన్ తుది దశకు చేరుకున్నప్పటికి అర్జున్‌కు అవకాశమివ్వకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఈ ఏడాది సీజన్‌లో లక్నోకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కనీసం​ ఆఖరి మ్యాచ్‌లలోనైనా అర్జున్‌ను ఆడిస్తారా లేదా వేచి చూడాలి.

    2023లో ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అర్జున్‌.. ఇప్పటివరకు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముంబై జట్టులో ఉన్నప్పుడు కూడా అర్జున్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
    చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌?
     

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్‌కు కోటి రూపాయల చెక్‌ను ఆయన అందించారు. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ తమ అద్భుత ప్రదర్శనలతో రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 

    ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్‌లో ఇషాన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 193.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇషాన్  కిషన్ 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టుదలతో దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

    తనకు లభించిన రెండో అవకాశాన్ని కిషన్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి పునరాగమనం చేసేందుకు కిషన్ సిద్దమయ్యాడు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి కేవలం ఇషాన్ కిషన్‌నే కాకుండా, ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ షకీబ్ హుస్సేన్ కూడా సత్కరించారు.

    షకీబ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాగా కిషన్‌ పాట్నాలో పుట్టినప్పటికి ఫస్ట్‌ క్రికెట్‌ మాత్రం జార్ఖండ్‌ తరపున ఆడుతున్నాడు.
    చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..! వైభవ్‌, భువీకి ఛాన్స్‌?

  • IPL 2026 LSG vs CSK Live Updates: ఏకానా స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని సూపర్ జెయింట్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేయగా.. ఇంగ్లిష్‌(36), పూరన్‌(32) రాణించారు.

    15 ఓవర్లకు లక్నో స్కోర్‌: 156/3
    15 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో ముకుల్‌ చౌదరి(6), నికోలస్‌ పూరన్‌(8) ఉన్నారు.

    లక్నో రెండో వికెట్ డౌన్‌
    మిచెల్ మార్ష్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేసిన మార్ష్‌.. దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.

    లక్నో తొలి వికెట్‌ డౌన్‌
    లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఇంగ్లిష్‌.. ముఖేష్‌ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

    విజయం దిశగా లక్నో
    లక్నో ఓపెనర్లు(85), జోష్‌ ఇంగ్లిష్‌(36) దూకుడుగా ఆడుతున్నారు. 11 ఓవర్లకు లక్నో స్కోర్‌: 129-0

    దుమ్ములేపుతున్న మిచెల్‌ మార్ష్‌
    5 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. 5వ ఓవర్‌ వేసిన అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌.. నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు పిండుకున్నాడు.

    దూకుడుగా ఆడుతున్న ల‌క్నో ఓపెనర్లు
    3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్ న‌ష్ట‌పోకుండా 31 ప‌రుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్‌(13), జోష్ ఇంగ్లిష్‌(9) ఉన్నారు.

    రాణించిన కార్తీక్‌, దూబే.. లక్నో టార్గెట్‌ ఎంతంటే?
    ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు రాణించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

    యువ ఆటగాడు కార్తీక్‌ శర్మ 71 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శివమ్‌ దూబే)32), బ్రెవిస్‌(25) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాబాజ్‌, మహ్మద్‌ షమీ తలా వికెట్‌ సాధించారు.

    సీఎస్‌కే ఐదో వికెట్‌ డౌన్‌
    71 పరుగులు చేసిన కార్తీక్‌ శర్మ.. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    సీఎస్‌కే నాలుగో వికెట్‌ డౌన్‌
    డెవాల్డ్‌ బ్రెవిస్‌ రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన బ్రెవిస్‌.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    కార్తీక్‌ శర్మ హాఫ్‌​ సెంచరీ
    కార్తీక్‌ శర్మ 35 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    👉11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 86/3. క్రీజులో కార్తీక్‌ శర్మ(24), బ్రెవిస్‌(18) ఉన్నారు.

    సీఎస్‌కే మూడో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఉర్విల్‌ పటేల్‌.. ఆకాష్‌ మహారాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    సీఎస్‌కే రెండో వికెట్‌ డౌన్‌
    సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సంజూ శాంసన్‌.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 37/2

    సీఎస్‌కే తొలి వికెట్‌ డౌన్‌
    31 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఆకాష్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 20/0
    2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్‌(13), రుతురాజ్‌ గైక్వాడ్‌(6) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూప‌ర్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ సీఎస్‌కే తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా లక్నో జట్టులోకి అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరి వచ్చారు.

    తుది జట్లు
    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి

    లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్

  • ఐపీఎల్‌-2026లో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. భువీ 36 ఏళ్ల వయస్సులోనూ తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. భువనేశ్వర్ ప్రస్తుతం 22  వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు. 

    అతడి నిలకడైన ప్రదర్శన కారణంగానే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. దీంతో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న భువీని మ‌ళ్లీ భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మాజీలు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ ఆట‌గాడు, సీఎస్‌కే లెజెండ్ అంబ‌టి రాయుడు తాజాగా త‌న భారత ప్రత్యామ్నాయ టీ20 జ‌ట్టును ఎంచుకున్నాడు. 

    ఈ జ‌ట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను రాయుడు ఎంపిక చేశాడు. అదేవిధంగా అయ్య‌ర్ డిప్యూటీగా కేఎల్ రాహుల్‌కు అత‌డు ఛాన్స్ ఇచ్చాడు. రాయుడు త‌న జ‌ట్టులో ఫ్రంట్‌లైన్ పేస‌ర్‌గా భువనేశ్వ‌ర్ కుమార్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. 

    అదేవిధంగా యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైభవ్‌, రాహుల్‌ను ఓపెనర్లగా రాయుడు ఎంచుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్‌లో పడిక్కల్‌, పాటిదార్‌ వంటి వారు స్టార్‌ బ్యాటర్లకు చోటు దక్కింది. రిజర్వ్‌ ప్లేయర్‌గా సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌ వంటి వారు ఉన్నారు.

    కాగా వచ్చే నెలలో భారత జట్టు రెండు టీ20ల కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. దీంతో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ సూర్యవంశీ వంటి యువ సంచలనాలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

    అంబటి రాయుడు ఎంపిక చేసిన భారత ప్రత్యామ్నాయ టీ20 జట్టు:
    వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అన్షుల్ కాంబోజ్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

    రిజర్వ్‌లు: సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, శివంగ్ కుమార్, ప్రిన్స్ యాదవ్

  • ఐపీఎల్‌-2026 సీజన్‌ తుది దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎస్‌కే స్టార్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ గాయం కారణంగా సీజన్‌ మధ్యలో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి స్ధానాన్ని కుల్దీప్ యాదవ్‌తో సీఎస్‌కే భర్తీ చేసింది. రూ.30 లక్షల కనీస ధరకు అతడిని సీఎస్‌కే జట్టులో తీసుకుంది.

    29 ఏళ్ల కుల్దీప్ యాదవ్‌ గతంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతడి పేరిట మూడు ఐపీఎల్‌ వికెట్లు ఉన్నాయి. అయితే దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌కు దూరమైన నువాన్‌ తుషారా స్ధానంలో ఇంగ్లీష్‌ పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ను ఆర్సీబీ తీసుకుంది.

    గ్లీసన్‌కు టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది. అతడు ఇటీవల పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటికే భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌, డఫీ వంటి వంటి పేసర్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం.. ఇప్పుడు మరింత పటిష్టంగా మారనుంది.

    స్వదేశానికి వెళ్లిపోయిన రచిన్‌
    అదేవిధంగా కివీస్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌ను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సన్నద్దం కోసం అతడు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయినట్లు క్రిక్‌బజ్‌ తమ కథనంలో పేర్కొంది. 

    గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ.2 కోట్ల భారీ ధరకు రవీంద్రను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం లభించలేదు. కాగా పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో ఉన్న కేకేఆర్‌.. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.
    చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!
     

  • పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాన్‌ మసూద్‌ బృందానికి గట్టి షాకిచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

    104 పరుగుల తేడాతో జయభేరి
    ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఢాకా వేదికగా తొలి టెస్టు జరుగగా.. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ జయభేరి మోగించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందుకు పాక్‌ ధీటుగా బదులివ్వలేకపోయింది.

    కేవలం 386 పరుగులు చేసి షాన్‌ మసూద్‌ బృందం ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన బంగ్లాదేశ్‌.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేసింది. ఫలితంగా 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. 163 పరుగులకే కుప్పకూలింది.

    దీంతో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ పాక్‌ను మట్టికరిపించి.. 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లాదేశ్‌ సొంతగడ్డపై పాక్‌ మీద టెస్టు మ్యాచ్‌ గెలవడం ఇదే తొలిసారి ​కావడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఐసీసీ పాక్‌కు షాకిచ్చింది.

    భారీ జరిమానా, పాయింట్లలో కోత
    బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున.. భారీ జరిమానా విధించడంతో పాటు పాయింట్లలో కోత వేసింది. 

    ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ.. ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున ఆటగాళ్ల ఫీజులో కోత విధిస్తున్నాం.

    ఇక ఆర్టికల్‌ 16.11.2 నిబంధన ప్రకారం.. ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆడే జట్లు.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేస్తే.. ప్రతీ ఓవర్‌కు ఒక పాయింట్‌ చొప్పున కట్‌ చేస్తాం. పాకిస్తాన్‌ తప్పిదానికి పాల్పడినందున డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లు కోల్పోయింది’’ అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది.

    ఇక కష్టమే
    కాగా బంగ్లాతో టెస్టులో పాక్‌ 8 ఓవర్లు వెనుకడింది. ఫలితంగా నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో ఐసీసీ 40 శాతం కోత విధించింది. అదే విధంగా ఎనిమిది పాయింట్లు కట్‌ చేసింది. 

    దీంతో ప్రస్తుతం పాకిస్తాన్‌ ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే ఒక్క పాయింట్‌ కూడా కీలకమే. అలాంటిది పాక్‌ ఒకే మ్యాచ్‌లో స్వీయ తప్పిదంతో ఎనిమిది పాయింట్లు కోల్పోయి తమ దారులను దాదాపుగా మూసేసుకుంది.

    చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!
     

  • భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి.. వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్‌ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్‌ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గట్టిగానే చెబుతున్నారు.

    తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్‌ పదవి నుంచి రోహిత్‌ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్‌మెంట్‌ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.

    మౌనం వీడిన కోహ్లి
    ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్‌కప్‌ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్‌ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.

    వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.

    పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..
    అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.

    నా క్రికెట్‌ కెరీర్‌లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్‌లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.

    ప్రతి బాల్‌ నా కెరీర్‌లో ఆఖరిది అనే  ఆలోచనతోనే
    నాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్‌లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్‌లో ఎదుర్కొనే ప్రతి బాల్‌ నా కెరీర్‌లో ఆఖరి బంతి అనే  ఆలోచనతోనే సిద్ధమవుతా.

    వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. 

    ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. గంభీర్‌, అగార్కర్‌ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.

    కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఇప్పటికి 12 మ్యాచ్‌లు ఆడి 484 పరుగులు సాధించాడు.

    చదవండి: రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు!

  • టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్‌.. జట్టును విజయపథంలో నిలిపాడు.

    టైటిల్‌ గెలిచిన తర్వాత
    ఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ద్రవిడ్‌ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలోనే భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు చేరింది.

    ఇక ద్రవిడ్‌ నిష్క్రమణ తర్వాత గంభీర్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్‌-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ విజయంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్‌ గెలిచిందని నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ద్రవిడ్‌కు క్రెడిట్‌ ఇచ్చాడు.

    కోహ్లి, రోహిత్‌ రిటైర్మెంట్‌కు కారణమా?
    ఇదిలా ఉంటే.. గంభీర్‌ టీమిండియాలో సూపర్‌స్టార్‌ సంస్కృతిని పారద్రోలి.. సూపర్‌ టీమ్‌గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్‌ నుంచి దిగ్గజాలు, సూపర్‌ స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్‌తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.

    ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది
    ఈ నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ తాజాగా టీమిండియాలో ‘సూపర్‌ స్టార్‌ కల్చర్‌’పై స్పందించాడు. స్కూప్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.

    మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్‌లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.

    వారే స్ఫూర్తి దాతలు
    కాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్‌ స్టార్‌ లేదంటే దిగ్గజ ప్లేయర్‌ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. 

    సూపర్‌ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్‌ సూపర్‌ స్టార్‌ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్‌ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.

    చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!

Movies

  • చెన్నై: భారతీయ సినీ పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోందన్న కమల్‌.. ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    ‘‘పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం వినియోగదారుల ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే, ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం నిర్ధారించుకోవాలి.’’ అని కమల్‌హాసన్‌ లేఖలో సూచించారు.

    ‘‘ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి?. అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఒకే అభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశ్రమ వ్యాప్తంగా చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్‌ల మధ్య సంప్రదింపులు జరగాలి.

    సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం, మనమందరం కలిసి ఆచరణాత్మకమైన, సుస్థిరమైన నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్‌లు, స్టూడియోల అంతటా విద్యుత్ ఆదా చేయడం, సుస్థిరమైన సెట్ నిర్మాణం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం.

    మన పరిశ్రమ సంస్కృతిని తీర్చిదిద్దుతుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సినిమా కేవలం వినోదానికి మించిన బాధ్యతలను కలిగి ఉంటుంది. ఈ పరిశ్రమ నుండి అత్యధికంగా లబ్ధి పొందిన మనము ముందుగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడగలిగినట్లే’’ అంటూ కమల్‌హాసన్‌ లేఖలో పేర్కొన్నారు.

  • ఖైదీ, విక్రమ్‌ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్‌గా కనిపించనుంది.

    ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు.  ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్‌గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. 


     

  • టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారు విలువ దాదాపు రూ.2.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఖరీదైన స్పోర్ట్స్‌ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు నరేశ్‌కు అభినందనలు చెబుతున్నారు. 

    కాగా.. వీకే నరేశ్ టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన, కామెడీతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది బ్యూటీ, హే బల్వంత్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 
     

     

  • తమిళనాడు సీఎం విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్‌లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.

    చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు.   ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
     

  • టైటిల్‌ : మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
    నటీనటులు: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ & అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు, గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు
    దర్శకత్వం: మధుదీప్ చెలికాని
    నిర్మాత: అరవింద్ మండెం
    ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
    సంగీతం: ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు 
    విడుదల తేది: మే 15, 2026

    కథేంటంటే.. 
    అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని ఫిక్స్‌ అవుతాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. ఆ యాప్‌తో రైతుల జీవితం ఎలా మార్చాడు? మహి(పాయల్‌ రాధాకృష్ణ)తో ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని అరవింద్‌ ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే.. 
    ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్‌ చూడగానే ఇదేదో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కథ అనుకుంటారు. కానీ ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి..వ్యవసాయం చేసుకునే యువకుడి కథను చెప్పాడు దర్శకుడు మధుదీప్‌ చెలికాని. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా  ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు.రసాయన ఎరువులు వాడిన కూరగాయలు, రైస్‌ తీసుకొని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో ఒకవైపు రైతుల కష్టాలను చూపిస్తూనే మరోవైపు  ఆర్గానిక్‌ వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు.దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా..దాన్ని తెరపై అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ప్రెష్‌‌నెస్‌ మిస్‌ అయింది. దర్శకుడు పనితనం కొన్నిసన్నివేశాల్లో ఆకట్టుకునే విధంగా ఉన్నా, మరికొన్ని చోట్ల తేలిపోయింది. ఉన్నంతలో ఫస్టాఫ్‌ బాగానే ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు, లవ్‌ ఎపిసోడ్‌ పర్వాలేదు. కానీ సెండాఫ్‌లో కథనం స్లోగా సాగడంతో సాగదీశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది.

    ఎవరెలా చేశారంటే..
    అరవింద్‌ పాత్రకి త్రిగుణ్‌ న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు.

  • టాలీవుడ్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల అంశంపై ముందడుగు పడింది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్సంటేజీ వివాదంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ పర్సంటేజీ సమస్యను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు.

    ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీ విధానంపై చర్చ జరిగింది. సబ్‌ కమిటీ ఛైర్మన్‌గా డి. సురేష్ బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్, దిల్ రాజు, కె.ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ ఉన్నారు.  ఈ  సబ్-కమిటీలో మూడు రంగాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిర్మాతల రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్(ఎస్‌కేఎన్), టి. ప్రసన్న కుమార్ సభ్యులుగా ఉన్నారు.

    ఎగ్జిబిటర్స్‌ రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్‌ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున,  బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), ధీరజ్ మొగిలేని కూడా ఉన్నారు. 
     

  • కోలీవుడ్ హీరోయిన్ త్రిష తాజాగా కరుప్పు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు.

    ఈ సందర్భంగా త్రిష చెన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. మూవీ వీక్షించిన అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడే ఫ్యాన్స్.. ఆమె కారును చుట్టుముట్టారు. దీంతో ఒకరు విజయ్‌ని అడిగామని చెప్పండని త్రిషను ‍అడిగారు. ఇది విన్న త్రిష చిరు నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

     

     

  • టాలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సప్తగిరి ఒకరు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం పురుషః అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా మే 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ ప్రెస్‌ మీట్ నిర్వహించారు.

    ఈవెంట్‌కు హాజరైన సప్తగిరి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చేసిన చిన్న సినిమాల గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ది రాజాసాబ్‌ పేరును కూడా కలిపేశారు. ఈ మధ్యే  సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరొక్కో లాంటి సినిమాలు చేశాను. కాకపోతే అవి చిన్నస్థాయి సినిమాలు కావడంతో సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. పెద్ద సినిమాలు అయితే రీచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.  దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ బాగా ఫీలయ్యారు. సప్తగిరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

    తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై సప్తగిరి స్పందించారు. అలా మాట్లాడినందుకు నన్ను క్షమించాలని కోరారు. మినిమం బడ్జెట్‌ మూవీస్ చేస్తున్నాను.. ఆ సినిమాల లిస్ట్ చెబుతూనే ది రాజాసాబ్‌ పేరు చెప్పానని తెలిపారు. మారుతి కూడా నాకు ఫోన్ చేశారని.. సారీ చెప్పమని అడిగారని వెల్లడించారు. ఆయనకు కూడా సారీ చెప్పా.. ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా క్షమాపణలు చెప్పారు సప్తగిరి.  
     

  • టైటిల్‌: వీరభద్రుడు
    నటీనటులు: సూర్య, త్రిష, ఇంద్రన్స్‌, నట్టి, ఆర్‌.జే బాలాజీ తదితరులు
    నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
    నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
    రచన & దర్శకత్వం: ఆర్‌.జే బాలాజీ
    సినిమాటోగ్రఫీ :  జికె విష్ణు
    సంగీతం : సాయి అభ్యంకర్
    ఎడిటర్ :  ఆర్.కళైవానన్
    విడుదల తేది: మే 15, 2026

    సూర్య ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆయన ఆశలన్నీ కరుప్పు పైనే పెట్టుకున్నాడు. తెలుగులో ‘వీరభద్రుడు’పేరుతో నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    మీను అనే అమ్మాయి ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుంది. చికిత్స కోసం లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. దీంతో తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను అమ్మాలని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. నాంపల్లిలో రైలు దిగి..సికింద్రాబాద్‌ వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా..దొంగలు వచ్చి ఆ నగలను ఎత్తుకెళ్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మరుసటి రోజు దొంగలను పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు. వాటిని తీసుకోవాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెప్పడంతో మీను, ఆమె తండ్రి కోర్టుకు వెళ్తారు. 

    ఈ కేసునే టేకాప్‌ చేసిన లాయర్‌ బేబీ కృష్ణ(ఆర్‌.జే బాలాజీ)..వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు. మీను తండ్రికి ఓపిక నశించి.. చేసేదేం లేక  కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య)ను వేడుకుంటాడు. న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. మనిషిగా భూమికి మీదకు వచ్చిన వీరభద్రుడు స్వామి.. మీనుకి న్యాయం చేశాడా? అవినీతి కంపులో మునిగిపోయి బేబీ కృష్ణకు, ఇతర లాయర్లకు ఆయన ఎలాంటి బుద్ది చెప్పాడు? అనేదే ఈ సినిమా కథ. 

    ఎలా ఉందంటే..
    ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఒక కేసుని పరిష్కరించడానికి నెలల సమయం పడుతుంది. డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి. సామాన్యుడు న్యాయం కోసం కోర్టుని ఆశ్రయిస్తే.. ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు. అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే. అవినీతి కంపులో న్యాయ వ్యవస్థ మునిగిపోయిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చివరకు ఆ దేవుడే దిగివచ్చినా.. ప్రస్తుత న్యాయవ్యవస్థను బాగు చేయలేడు అనేది వినోదాత్మకంగా ‘వీరభద్రుడు’ సినిమాలో చెప్పాడు దర్శకుడు ఆర్‌.జే బాలాజీ.  దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌, దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. కోర్టులో జరుగుతున్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. 

    కానీ సూర్య స్థాయి లాంటి హీరోని పక్కన పెట్టి..  ఆర్‌.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్రను హైలెట్‌ చేయడమే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా మొదలైన అరగంట వరకు సూర్య తెరపై కనిపించడు. సూర్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆర్జే బాలజీ పాత్రకే మంచి సన్నివేశాలు  ఉంటాయి.  అయితే క్లైమాక్స్‌లో మాత్రం వీరభద్రుడు(సూర్య) తాండవం  అదిరిపోతుంది. 

    మీను పాత్రతో పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు.  నగలు అమ్మి చికిత్స చేసుకోవాలని నగరానికి వచ్చిన తండ్రి కూతుళ్లపై దొంగలు దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లడం.. కేసు పెట్టి, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది.  అయినప్పటికీ సూర్య ఎంట్రీ లేకపోవడంతో కథనం నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక వీరభద్రుడు ఆగమనం తర్వాత కథనం పరుగులు పెడుతుంది.  ఫస్టాఫ్‌ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది.  కోర్టు డ్రామా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. 

    అయితే సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్  ఆకట్టుకోకపోగా..చిరాకుగా అనిపిస్తుంది. న్యాయం కోసం దేవుడు చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎమోషన్‌ మీద దృష్టిపెట్టిన దర్శకుడు..ద్వితియార్థంలో మాత్రం మాస్‌ ఎలిమెంట్స్‌పైనే ఫోకస్‌ పెట్టాడు.  సూర్యతో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు.. పాటలు పెద్దగా ఆకట్టుకోవు.  కథనం కూడా అక్కడక్కకే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది.  క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం ఆకట్టుకుంటుంది.  తమిళ వాసనలు ఎక్కువగా ఉండడం.. సూర్య పాత్ర నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌.  

    ఎవరెలా చేశారంటే.. 
    వీరభద్రుడు పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. సామాన్య మనిషిగా, దేవుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో వీరభద్రుడు తాండవం అదిరిపోతుంది. లాయర్‌ ప్రీతిగా త్రిష చక్కగా నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. సెకండాఫ్‌లో మాత్రం ఒకటి రెండు మంచి సీన్లు పడ్డాయి.

     ఇక దర్శకుడు ఆర్‌.జే బాలాజీ పోషించిన బేబీ కృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పొచ్చు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఆ పాత్రలో బాలాజీ ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు.  సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు తేలిపోయింది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

  • రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. ‍మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్‌గా గుర్తించారు.

    ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్‌లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్‌ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్‌లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్‌కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

    కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు. 
     

  • సూర్య హీరోగా వచ్చిన కరుప్పు ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైంది. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఆర్థికపరమైన సమస్యలతో ఓ రోజు ఆలస్యంగా తెరపైకొచ్చింది. ఈ మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా త్రిష కనిపించింది.

    ఇవాళ ‍మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆర్జే బాలాజీ సైతం థియేటర్‌లో వీక్షించారు. దీంతో సినిమాను చూసి పూనకంతో ఊగిపోయారు. టాలీవుడ్ హీరో నాని నటించిన జెర్సీ మూవీ సీన్ రీ క్రియేట్ చేశారు. ట్రైన్‌ సీన్‌లో నానిలానే బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
     

     

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంపై టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

    కారణం అదేనా??

    అయితే జాన్వీ కపూర్  కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ  విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్‌కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ‍అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. 

     

  • భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. త్వరలోనే 'టాక్సిక్'తో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురి భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

    (ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ.. కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఆమె (సరయూ) పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూలేం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలు.. అన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచే నేర్చుకుంటారు' అని కియారా స్టేట్‌మెంట్ ఇచ్చింది.

    కియారా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది పూర్తి కాని కూతురి గురించి మాట్లాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. కియారా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్లకు కూతురు పుట్టింది.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు మన దేశంలో ఓటీటీకి ‍'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన)

  • కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.

    విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.

    ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు.  ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు.  ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు.  గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. 
     

  • 'ధురంధర్ 2' సినిమా మన దేశంలో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందనే విషయంపై సస్పెన్స్ వీడింది. ఎందుకంటే నేటి(మే 15) నుంచి విదేశాల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దీంతో పాటే మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని హాట్‌స్టార్ తేల్చి చెప్పింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా)

    గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తొలి పార్ట్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సీక్వెల్‌ని తాజాగా విదేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మన దేశంలో మాత్రం వచ్చే నెల 4వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ చేస్తే రెండింటి వ్యూస్‌పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ లీగ్ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. అలా జూన్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు. 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

    'ధురంధర్ 2' విషయానికొస్తే.. ఆపరేషన్ 'ధురంధర్'లో భాగంగా జస్కిరాత్ సింగ్(రణ్‌వీర్ సింగ్) తన పేరుని హమ్జా అలీ మజారీగా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి లయరీ నగరంలో బలోచ్ నాయకుడు రెహమాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా)ని చంపేస్తాడు. ఇదే టైంలో మరో గ్యాంగ్‌ నాయకుడు అర్షద్‌ పప్పు (అశ్విన్‌ ధర్‌) తనని తాను లయరీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్‌ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్‌ బలోచ్‌ (డానిష్‌) అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఈ క్రమంలో హమ్జా ఎలాంటి ప్లాన్స్ వేశాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్‌ దత్‌) నుంచి హమ్జాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? హమ్జా భారత గూఢచారి అని మిగతా వాళ్లకు తెలిసిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)

  • టాలీవుడ్ యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఊహించని విధంగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్‌ ఫంక్షన్‌కు హాజరైన ఆయన పదిలో ‍అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు, షీల్డ్స్‌ అందజేశారు. అయితే ఈ ఈవెంట్‌కు నవ తెలంగాణ విద్యార్థి విభాగం సభ్యులు వచ్చిన ఒక్కసారిగా నిరసనకు దిగారు. అసలు ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా అని నిలదీశారు.  అక్కడ స్కూల్ మేనేజ్‌మెంట్, విద్యార్థి సంఘం మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.

    అదే సమయంలో పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజీవ్ కనకాలను సైతం ప్రశ్నించారు. నుమతులు లేని అలాంటి స్కూల్ ఫంక్షన్‌కి ఎలా అటెండ్ అవుతారని అడిగారు. అయితే ఈ విషయాల గురించి తనకు ఏమీ తెలియదని రాజీవ్ కనకాల అన్నారు. మంచి కార్యక్రమం అని పిలిస్తే వచ్చానని తెలిపారు. దయచేసి ఈ ఈవెంట్‌కు సంబంధించిన నా ఫోటోలు, వీడియోలు ఎవరూ కూడా పబ్లిసిటీ వినియోగించవద్దని రాజీవ్ కనకాల విజ్ఞప్తి చేశారు. నన్ను అలర్ట్‌ చేసినందుకు నవ తెలంగాణ విద్యార్థి విభాగానికిని నా ధన్యవాదాలు అంటూ వీడియో రిలీజ్ చేశారు. 
     

     

  • టాలీవుడ్‌లో ప్రస్తుతం నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లు వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌ల్లో ఇస్తున్నట్లే సింగిల్ స్కీన్లలోనూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. నిర్మాతలు మాత్రం దీనికి పూర్తిగా అంగీకరించట్లేదు. వ్యవహారం శ్రుతి మించుతుండటంతో ఇందులో ఫిలిం ఛాంబర్ కల్పించుకుంది. హైదరాబాద్‌లో శుక్రవారం ఇరువర్గాలతో కలిసి మీటింగ్ పెట్టింది. ఇందులోనే కీలక నిర్ణయం తీసుకుంది.

    (ఇదీ చదవండి: నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్.. హీరోలు, ప్రేక్షకులు ఎవరివైపు?)

    పర్సంటేజ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీలో 18 మంది సభ్యులు. 1-2 నెలల్లో సమస్య పరిష్కారమవుతుంది. ఈ టైంలో సినిమా రిలీజులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తలో ఆరుగురు కమిటీలో ఉంటారని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్స్ యాక్టీవ్ గిల్డ్ నిర్మాతలు సమావేశం వాడివేడిగా  సాగుతోంది. చర్చలు జరుగుతున్నప్పుడే ఏషియన్ సునీల్ నారంగ్ అరుస్తూ బయటికి వచ్చేశారు. దీంతో ఈయనని బతిమాలిన చదలవాడ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ, అనుపమ్ రెడ్డి తిరిగి మీటింగ్‌కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఇరు వర్గాలు వేర్వేరుగా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే: టాలీవుడ్ విలన్)

Politics

  • సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ధరల పెరుగుదలపై తీవ్రంగా స్పందించారు. పెరుగుదలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పెట్రో ధరల పెంపు పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

    చెన్నైలో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంచడం అన్యాయం. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించకుండా లాభాల రూపంలో లబ్ధి పొందుతున్నాయి. 

    నిరు పేదలు, మధ్య తరగతి వర్గం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఇతర చిన్నచిన్న వాహనాలపై ఆధారపడుతున్నారు.  ధరల పెరుగుదల వారి నెలవారీ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసి టాక్సీలు లేదా అద్దె వాహనాలుగా నడిపే వారు మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల అద్దె ధరలు పెరగడం, అవసరమైన వస్తువుల ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం జరుగుతుందని గుర్తు చేశారు.  

    చిన్న, సూక్ష్మ పరిశ్రమలపై ప్రభావం
    మైక్రో,చిన్న పరిశ్రమలు (MSEs) కూడా ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయన్న సీఎం విజయ్‌ తద్వారా దేశీయ మార్కెట్ విక్రయాలు, ఎగుమతులు మందగించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమన్నారు.

    కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఇంధన ధరల పెరుగుదల తక్షణమే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022 ఏప్రిల్ నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, 2024 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కసారి రూ.2 తగ్గించారని, ఇప్పుడు పెరుగుదల అన్యాయమని ఆయన అన్నారు. 2022 ఏప్రిల్‌లో చివరిసారి ధరలు పెరిగాయి. ఆ తర్వాత 2024 మార్చిలో ఎన్నికల ముందు ఒక్కసారి తగ్గించారు. ఇప్పుడు మళ్లీ పెట్రో ధరలు పెంచడం ప్రజలకు భారమని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

     

     

  • సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ దుయ్యబట్టారు.

    శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్‌కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.

    టీడీపీ వైఎస్సార్‌సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్‌సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్‌సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్‌ జగన్‌ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్‌లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్‌ గుర్తు చేశారు.

    చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి.. కుప్పలు..కుప్పలుగా పెరిగిపోతున్న అప్పు
  • సాక్షి, చైన్నె:  న్నికల తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల గురించి గురువారం స్టాలిన్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగింది ఒక రకమైన కొత్త వింత మాయాజాల సునామీ అని వ్యాఖ్యలు చేశారు. సునామీ అంటే అది అద్భుతమో లేక సాహసమో కాదు.. అది వినాశనానికి సంకేతంగా అభివర్ణించారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన సునామీ ఇది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని, ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం కూడా కేవలం మిత్రపక్షాల దయతో నడుస్తున్నట్టు గుర్తు చేశారు.

    డీఎంకేలో భారీ మార్పులు
    డీఎంకేలో ప్రక్షాళన దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటుతో పాటుగా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఓటమికి కారణాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. ఈ కమిటీ 20 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. పార్టీ కార్యకర్తలు తమ మనసులోని బాధను, ఓటమికి కారణాలను నేరుగా అధిష్టానానికి తెలియజేయడానికి శుక్రవారం నుంచి ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుంది. ఎవరైనా పార్టీ కోసం పని చేయలేమని అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని, గ్రూపు రాజకీయాలను సహించేది లేదని జిల్లా కార్యదర్శులకు స్టాలిన్‌ ఈ సందర్భంగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

    సోషల్‌ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాబోయే రోజుల్లో డీఎంకే వ్యవస్థాగత నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొస్తామని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ ఓటమి తాత్కాలికం.. మనం మళ్లీ ఫీనిక్స్‌ పక్షిలా ఎగురుతాం అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడును రక్షించే బలం, పోరాట స్ఫూర్తి అన్నది ఒక్క డీఎంకేకు మాత్రమే ఉందని వ్యాఖ్యలు చేశారు. ఉదయ సూర్యుడికి అస్తమయం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి కరుణానిధి, కేఎన్‌ నెహ్రూ, తిరుచ్చి శివ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ముఖ్య నేతలు ఆర్‌ఎస్‌ భారతీ, టీకేఎస్‌ ఇళంగోవన్‌, కోశాధికారి టీఆర్‌బాలుతో పాటూ అన్ని జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.

    ఓటమికి నేనే బాధ్యుడిని..
    పార్టీ ఓటమిపై స్టాలిన్‌ తన పరిణతిని చాటుకున్నారు. ఒక నాయకుడిగా ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, అన్నాదురై, కరుణానిధి నేర్పిన పాఠాలు. ఓటమిపై చర్చ జరగాలి కానీ, అది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునేలా ఉండకూడదని హితవు పలికారు.

  • సాక్షి, గుంటూరు: ముప్పై ఏళ్లపాటు జెండా మోసి గెలిపించిన కాపులపై దాడులు చేయించడానికి.. తప్పుడు కేసులు పెట్టించడానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు మనసెలా వచ్చిందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మామిళ్లపల్లి ఘటనను ప్రస్తావిస్తూ శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

    మామిళ్ళపల్లిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మనుషుల్ని పంపి ధూళిపాళ్ల నరేంద్ర మామిళ్ళపల్లి పంపి మొక్కజొన్న రైతులపై దాడులు చేయించారు. ఆడా మగా తేడా లేకుండా ఆ రైతులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం పేరిట తప్పుడు కేసులు పెట్టించారు. ఇది చూసి.. కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసులు కూడా ‘అరే మనం ఇంత దిగజారి పనిచేస్తున్నామా?’ బాధపడుతున్నారు. 

    టీటీడీకి నకిలీ నెయ్యా?
    ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు, కృష్ణాజిల్లాలో గేదే పాలు సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి అమ్ముకుంటున్నారు. గేదె పాలతో ఆవు నెయ్యి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు?. సంగం డెయిరీ.. వైష్ణవి డెయిరీ ఈ రెండూ ఒకటి కాదా?. వైష్ణవి డెయిరీ తప్పు చేసిందని సాక్షాత్తు సీబీఐనే చెప్పింది కదా అని పేర్ని నాని అన్నారు. 

    ధూళిపాళ్ల నరేంద్రకు సంగం డెయిరీ అంటే ఎంత ప్రాణమంటే.. ఆ డెయిరీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయించడం చంద్రబాబు వల్ల కూడా కాలేదు. ‘నీకు మంత్రి పదవి కావాలా? సంగం డెయిరీ కావాలా?’ అని చంద్రబాబు అడిగితే.. మరో మాటే లేకుండా పాల డెయిరీనే ధూళిపాళ్ల ఎన్నుకున్నారు. తన అనుచరులతో క్వింటా మొక్కజొన్న రూ.1600 కొని.. సంగం డెయిరీలో రూ.2100 కొంటున్నట్లు ఆయన రాయించుకుంటున్నారు. 

    కాపులు ఉంది అందుకేనా?.. 
    ముప్ఫై ఏళ్లు నీకు జండా మోసిన కాపులపై దాడి చేయిస్తావా? అంటూ ధూళిపాళ్లపై పేర్ని నాని ఫైరయ్యారు. అదే సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీరుపైనా మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్‌ను చూసి కాపులంతా కూటమికి  ఓటేశారు. ఇప్పుడేమో కాపులపై అక్రమ కేసులు బనాయిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. కాపులను ఇంత చావబాదుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించరు. పైగా  కూటమి ప్రభుత్వంలో ఉన్న రెండున్నరేళ్లు సీఎం అవుతారని కాపులు ఆశిస్తే.. ఆయనేమో మరొక 15 సంవత్సరాలు చంద్రబాబును మోయాలి అని కాపులకు పిలుపు ఇస్తున్నాడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 

    సంఘం డైరీ ఒక కిక్కు... బోడి మంత్రి పదవి లో ఏముందని...?

    కాపుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్న పేర్ని నాని.. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కాపు రైతులపై పెట్టిన అక్రమ  ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.

Family

  • శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు.  ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.

    శనీశ్వరుడి జయంతి
    దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు.  హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. 

    వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.

    చేయవలసిన పూజలు
    శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.

    అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.

    శని దేవుడి ప్రాముఖ్యత
    సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. 

    జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

    శని శాంతి మంత్ర స్తుతి..
    ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

    క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
    ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
    నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
    వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
    ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
    కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
    శుద్ధబుద్ధి ప్రదాయనే
    య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
    మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

    నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

    శన్యారిష్టే తు సంప్రాప్తే
    శనిపూజాంచ కారయేత్
    శనిధ్యానం ప్రవక్ష్యామి
    ప్రాణి పీడోపశాంతయే

    ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.
    వై.వెంకటసుబ్బారెడ్డి
    9849100044

    మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్‌ చేయండి

     

     (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)

  • హాయ్‌! ఫ్రెండ్స్‌ .. నేనూ.. మీకు ఎంతగానో ఇష్టమైన బార్బీని. ఇవాళ నా గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుదామని మీ ముందుకు వచ్చాను.. మీకూ తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి మరి.  ∙నా  పూర్తి పేరు బార్బరా మిలిసెంట్‌ రాబర్ట్స్‌. నన్ను సృష్టించింది రూత్‌ హ్యాండ్లర్‌ అనే ఒక వ్యాపారవేత్త. 

    తన కూతురు బార్బీ పేరు మీదుగానే నాకు కూడా ‘బార్బీ’ అని పేరు పెట్టారు తెలుసా! మొట్టమొదటిసారి నన్ను న్యూయార్క్‌ టాయ్‌ ఫెయిర్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు. 150 పైగా దేశాల్లో నాకు అభిమానులున్నారంటే ఆశ్చర్యమే కదా! 

    నేను మొదట నలుపు, తెలుపు రంగుల జీబ్రా గీతల స్విమ్‌సూట్‌ ధరించి, పోనీటైల్‌ హెయిర్‌ స్టైల్‌తో ఉండేదాన్ని. 

    ఇప్పటి వరకు నన్ను 250 కి పైగా వృత్తుల వేషధారణల్లో తయారుచేశారు. అందులో డాక్టర్, పైలట్, ఆస్ట్రోనాట్, దేశాధ్యక్షురాలు వంటివి కూడా ఉన్నాయి. 

    నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై అడుగు పెట్టడానికి 4 ఏళ్ల ముందే, అంటే 1965 లోనే బార్బీ ’ఆస్ట్రోనాట్‌’ రూపంలో నేను మార్కెట్లోకి వచ్చేశాను. 

    నాకు ఎంతో ఇష్టమైన రంగు పింక్‌. దీనికి ఒక ప్రత్యేకమైన ΄పాంటోన్‌ షేడ్‌  కూడా ఉంది. నాకు జోడీగా కెన్‌ బొమ్మను1961లో విడుదల చేశారు. విచిత్రమేమిటంటే, రూత్‌ హ్యాండ్లర్‌ కొడుకు పేరు కెన్‌! 

    నన్ను ఈ మధ్యకాలంలో రకరకాల ఆకృతులలో, ఎత్తులలో, 35 కంటే ఎక్కువ చర్మపు రంగులలో తయారుచేస్తున్నారు. అందం అంటే కేవలం ఒకేలా ఉండటం కాదు అని చెప్పడమే ఇందులోని ఉద్దేశం. 

    ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైపోయిన నా నమూనాల్లో ‘టోటల్లీ హెయిర్‌ బార్బీ’ ఒకటి. ఎందుకంటే ఈ నమూనాలో నా జుట్టు పొడవుగా నేలకు అంటుకుని ఉండడమే కారణం. ఇప్పుడు కేవలం నేను ఒక బొమ్మను మాత్రమే కాదండోయ్, యూట్యూబ్‌ వ్లాగర్‌ని కూడా! నాకు కూడా ఒక సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది, అందులో నా జీవిత విశేషాలను షేర్‌ చేస్తుంటాను తెలుసా! 

    (చదవండి: పల్లెటూరి అమ్మాయి ఘనత..రైతన్నల కోసం..! ఏకంగా జపాన్‌..)



     

  • మిద్దెతోటలు లేదా టెర్రస్‌ గార్డెన్లు లేదా పెరటి తోటల్లో కోకో పీట్‌ (కొబ్బరి పొట్టు) వాడకం మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొబ్బరి పీచు నుంచి తయారయ్యే ఒక సేంద్రియ  పదార్థం. దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి:

    1 కోకో పీట్‌ తన బరువు కంటే 8–10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల మొక్కల వేర్లకు ఎక్కువ సేపు తేమ అందుతుంది, వేసవిలో కూడా మొక్కలు త్వరగా ఎండిపోవు.

    2 మట్టి కంటే కోకో పీట్‌ చాలా తక్కువ బరువు ఉంటుంది, కాబట్టి మేడపై కుండీల వల్ల భారం పడకుండా ఉంటుంది.

    3 దీని నిర్మాణం గుల్లగా ఉండటం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది. ఇది మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

    4 విత్తనాలతో మొక్కలు పెంచటానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. ఇందులో విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తుతాయి.

    5 ఎర్రమట్టి లేదా ఇతర రకాల మట్టితో కలిపి వాడినప్పుడు, ఇది నేల బిగుసుకుపోకుండా చూస్తుంది.

    6 ఇది కొబ్బరి వ్యర్థాల నుండి తయారవుతుంది కాబట్టి పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.

    7 కూరగాయల మొక్కల వేర్లు త్వరగా విస్తరించడానికి కోకో పీట్‌ మట్టిని గుల్లగా ఉంచుతుంది. 30% కోకో పీట్‌ + 40% ఎర్రమట్టి + 30% వర్మీ కంపోస్ట్‌ లేదా పశువుల ఎరువు కలుపుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయలు మొక్కలకు ఈ మిశ్రమం ద్వారా పోషకాలు, తేమ సమపాళ్లలో అందుతాయి.

    8 పూలు బాగా పూయాలంటే నేలలో గాలి ప్రసరణ (ఎయిరేషన్‌) ఉండాలి. 40% కోకో పీట్‌ + 20% ఇసుక + 40% వర్మీ కంపోస్ట్‌ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. మందార, గులాబీ, చామంతి వంటి మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా కోకో పీట్‌ సహాయపడుతుంది.

    9 నిమ్మ, జామ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు ఎక్కువ కాలం కుండీల్లోనే ఉండాలి కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండటం ముఖ్యం. 25% కోకో పీట్‌ + 50% ఎర్రమట్టి + 25% కంపోస్ట్, కొద్దిగా వేప పిండి కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేర్లు బలంగా నాటుకోవడానికి, ఎక్కువ పండ్లు కాయడానికి అవసరమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

    10 మార్కెట్లో దొరికే కోకో పీట్‌ బ్లాక్స్‌ను ఉపయోగించే ముందు.. నీటిలో నానబెట్టి, అది మెత్తగా అయ్యాక అందులోని లవణాలను పోగొట్టడానికి 2–3 సార్లు నీటితో కడిగి, తర్వాత వాడాలి.

    11 కోకో పీట్‌ మట్టిని గుల్లగా ఉంచుతుంది కాబట్టి, అదనపు నీరు కుండీ అడుగున ఉన్న రంధ్రాల ద్వారా సులభంగా బయటకు పోతుంది.

    12 కుండీలలో మట్టి కొన్ని రోజుల తర్వాత రాయిలా గట్టిగా మారుతుంది. కోకో పీట్‌ కలిపితే మట్టి ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, దీనివల్ల వేర్లకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది.

    13 కోకో పీట్‌లో సొంతంగా పోషకాలు ఉండవు. అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్‌ లేదా ఏదైనా సేంద్రియ ఎరువు కలిపితేనే మొక్కకు బలం అందుతుంది.

    14 మిద్దె తోటలో కుండీల్లో వాడటం కోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు వరి పొట్టు, కోకో పీట్‌ రెండూ ఉపయోగకరమైనవే.

    15 వరి పొట్టు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, నీరు త్వరగా బయటకు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మట్టిని గుల్లగా ఉంచుతుంది, తద్వారా వేర్లకు గాలి అందుతుంది. అదనపు నీరు నిలవకుండా బయటకుపోతుంది.

    16 వరి పొట్టులో సిలికా అధికంగా ఉంటుంది, ఇది మొక్కల కణజాలాన్ని దృఢపరిచి తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

    17 వరి పొట్టు కోకో పీట్‌ కంటే నెమ్మదిగా కుళ్ళిపోతుంది, కాబట్టి కుండీలో మట్టి ఎక్కువ కాలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది సాధారణంగా కోకో పీట్‌ కంటే చౌకగా లభిస్తుంది. 

    – కొల్లి కృష్ణ కుమారి, 
    మిద్దె తోటల సాగుదారు, గుంటూరు
    మొబైల్‌: 9490602366

    నిర్వహణ: పంతంగి రాంబాబు
    సాక్షి సాగుబడిడెస్క్‌ 

    చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు

  • పిల్లలూ! ప్రతిరోజు మనం పాఠశాలకు వెళ్లి ఏం చేస్తాం? పాఠాలు వింటాం.. స్నేహితులతో ఆడుకుంటాం కదా.. కానీ పూజ అనే మనలాంటి ఒక విద్యార్థిని మాత్రం తను ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఒక యంత్రాన్ని ఆవిష్కరించేసింది. అది ఆ పాఠశాల విద్యార్థుల సమస్యని పరిష్కరించడమే కాదు.. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తోంది. మరి మంచి పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా .. పూజా పేరు దేశమంతటా ప్రశంసలతో మార్మోగింది.. ఎన్నో బహుమతులనూ సొంతం చేసుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

    పేద కుటుంబానికి చెందిన పూజ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకునేది. పంట కోతల సమయంలో పొలాల్లోని యంత్రాల (థ్రెషర్లు) నుంచి వచ్చే దుమ్ము, ధూళి గాలిలో కలిసి ఆమె తరగతి గదిలోకి వచ్చేవి. దానివల్ల పిల్లలకు సరిగ్గా ఊపిరి ఆడక΄పోయేది, పుస్తకాలు కూడా కనబడకపోయేవి. మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఎంతో మంది రైతులు అనారోగ్యం పాలవ్వడం పూజను బాధించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించింది.

    డస్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌
    ఒకరోజు ఇంట్లో తన తల్లి పిండిని జల్లెడ పట్టడం పూజ చూసింది. సన్నని పిండి కిందకు పడితే, గరుకుగా ఉండేవి జల్లెడలో ఉండిపోయాయి. అదే సూత్రం పూజను పరిష్కారం దిశగా ఆలోచించేలా చేసింది. పంటలోని దుమ్మును వేరు చేస్తే బాగుంటుందని ఆలోచించింది. వెంటనే తన సైన్స్‌ మాస్టారు సహాయంతో పాత రేకులు, వెల్డింగ్‌ మిషన్‌ ఉపయోగించి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది. 

    దీనికి ఆమె డస్ట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ అని పేరు పెట్టింది. ఈ యంత్రం పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పంట నూర్పిడి సమయంలో వెలువడే దుమ్మును పీల్చుకుని, ఒక చోట సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది, తద్వారా ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే ఈ యంత్రాన్ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేసేలా, అందుబాటులో ఉండే వస్తువులతోనే పూజ దీనిని రూపొందించింది.

    దేశం గర్వించే గుర్తింపు!
    పూజ సాధించిన ఈ విజయానికి గానూ, ఎన్నో ప్రశంసలతోపాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అందుకుంది. సైన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌లో తను చూపించిన ప్రతిభకు గాను జపాన్‌కి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పూజ తన యంత్రం గురించి వివరించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆమెను ‘బాల శాస్త్రవేత్త’గా గుర్తించి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.

    పర్యావరణంపై చైతన్యం
    పూజ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. పర్యావరణ పరిరక్షణపై తన గ్రామంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చైతన్యం తీసుకువస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తోంది. ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి తన తెలివితేటలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మనందరం ఆమెను చూసి నేర్చుకుందాం కదూ!

    మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. వాటికి పరిష్కారం ఆలోచించాలి. మన దగ్గర డబ్బు లేక΄ోయినా, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.
    – పూజ 

    (చదవండి: ఇద్దరు సిస్టర్స్‌ కృషి: 'యాత్రి'కుల కోసం..)
     

  • వాడుక భాషలో అడవి మామిడి పండును తెలుగులో కొండ మామిడి, టౌర మామిడి, ఆద్వము అని కూడా పిలుస్తారు. అస్సామీలో ఆమ్రత అని, ఇంగ్లీష్‌లో ఇండియన్‌ హాగ్‌ ప్లం, వైల్డ్‌ మ్యాంగో అని, ఒరియాలో అంబడు, అంబ అని, కన్నడలో కడంబట్టే, అంబట్టేమర, పూండి, డి. గుడ్ల మాటే, ఆమెటి, గాయగిడ, గొడడకాయ, మరాహున్నె, కొడలిమావు అని, గుజరాతిలో అంబాడ అని, తమిళంలో అంబాళం, కింకం, పలుచకయి అని, బెంగాలీలో ఆమ్ర, ఆమడ, అంబడ అని, మరాఠీలో అమడ, అంబడ అని, మలయాళంలో అంపఝం అని, హిందీలో అంబారి, అమర, అంబర అని, సంస్కృతంలో ఆమ్రత, ఆమ్రతక, మెతుల అని పిలుస్తారు.

    పూత కాలం ఫిబ్రవరి – మార్చి. పండ్ల కాలం: జూన్‌–జులై.
    అడవి మామిడి చెట్టు మాను గట్టిగా ఉండి, బెరడుపై బూడిద పూసినట్లు ఉంటుంది. మానుకు దెబ్బ తగిలినప్పుడు జిగురు వస్తుంది. ఈ చెట్టు కూడా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్లకు పూత ఫిబ్రవరి–మార్చి నెలల్లో వస్తుంది. కాలం అనుకూలిస్తే జనవరిలో కూడా పూత మొదలవుతుంది. పండ్లు మాత్రం జూన్‌–జులై మాసాలలో వస్తాయి. కానీ, ఈ ప్రక్రియ ప్రాంతాలను బట్టి పూత–కాతలో మార్పులు ఉండవచ్చు.

    ఉనికి
    కొండ మామిడి ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల (3,900 అడుగులు) ఎత్తు వరకు గల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది సతత హరితం. కానీ కొన్ని సందర్భాల్లో ఆకులు రాల్చుతుంది. వీటి జీనస్‌లో 17 జాతులు ఉన్నాయి.

    అడవి మామిడి స్వస్థలం
    భారత్, శ్రీలంక, ఆగ్నేయాసియా, మయన్మార్, నేపాల్‌ దేశాలు. ఇండియాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, వెస్ట్‌ బెంగాల్, అండమాన్, నికోబార్‌ దీవులు. అస్సాం, హిమాలయ దిగువ శ్రేణులు మొదలగు ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. 

    ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల ఎత్తువరకు పెరుగగలవు. అలాగే అన్ని ప్రాంతాలలో వీటి పండ్ల వినియోగం ఉన్నది. వీటిపైన పరిశోధనలు ఉన్నప్పటికీ, రైతుల చెంతకు చేరిన దాఖలాలు చాలా తక్కువే. వీటిపైన నిరంతర పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్లు నల్లమల అడవుల్లో వంకల వెంబడి, సెలయేర్ల వెంబడి అధికంగా ఉన్నాయి.

    ఉపయోగాలెన్నో...

    అడవి మామిడి చెట్టు ఎన్నో ఉపయోగాలతో కూడుకున్నది. 

    కలప నిర్మాణ రంగంలో తాత్కాలిక పనులకు ఎంతగానో ఉపయోగపడుతాయి (సెంట్రింగ్‌ చెక్క, నగిషీలు చేయటానికి, బొమ్మల తయారీ మొదలైనవి)

    ఇది ప్లైఉడ్‌ తయారీలో ముఖ్యమైన వస్తువు. 

    అగ్గిపెట్టెలు, పుల్లల తయారీకి వాడుతారు. 

    క్రేట్స్, బాక్స్‌ల తయారీలో ఉపయోగిస్తారు.

    ఆకులను మేకలు, పశువులు తింటాయి.

    కొమ్మలు వంట చెరకుగా ఉపయోగపడతాయి.
    పండ్లను పిల్లలు ఇష్టంగా తింటారు. పులుపు–తీపి కలబోసినట్లు ఉంటాయి.

    వీటి కాయలను ఊరగాయ పచ్చడి పెట్టడానికి ఉపయోగిస్తారు. అట్లే పండ్ల నుండి జామ్‌ కూడా తయారు చేస్తారు.

    కాయలను చెక్కు తీసి ఒరుగు చేసుకోవచ్చు. ఆ ఒరుగును పప్పు, ఇతర కూరల్లో వేసుకుంటే పులుపుతో కూడిన రుచి వస్తుంది.

    గిరిజనులు అడవి మామిడి ఒరుగు చేసుకుంటారు. వీటిని వానాకాలం, చలికాలాల్లో పప్పుకూరలు, ఇతర కాయకూరలలో వాడుతారు.

    వీటి లేత ఆకులు, పూత, పండ్లు, వేర్లు, బెరుడును గిరిజనులు నాటు వైద్యంలో వాడుతారు. అట్లే ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు.

    వీటి పండ్లు, వేర్లు ఎక్కువ దప్పికను నివారించడానికి వాడతారు. వీటి బెరుడు విరేచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. బహిష్టు క్రమబద్ధం చేయటానికి వేర్లను ఉపయోగిస్తారు. వేర్లను రుబ్బగా వచ్చిన గుజ్జును నీళ్ళల్లో కలుపుకొని తాగితే మధుమేహ సమస్య అదుపు అవుతుంది.

    అడవిమామిడి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. క్యాన్సర్‌ కారకాలను, మైక్రోబియల్‌ చర్యలను అదుపు చేయగల శక్తి ఈ పండ్లకు ఉంది.  

    పండ్ల గుజ్జు కీళ్లనొప్పిని తగ్గిస్తుంది.

    పోషక విలువలు (100 గ్రా. అడవి మామిడి పండ్ల గుజ్జులో)
    పోషకాలు        విలువ

    ప్రోటీన్లు           0.7%
    కొవ్వు             3.0%
    పీచు పదార్థం    1.0%
    పిండి పదార్ధాలు    4.5%
    ఖనిజాలు           0.5%
    కాల్షియం          36.0 మి.గ్రా.
    భాస్వరం         11.02 మి.గ్రా.
    ఇనుము         3.9 2 మి.గ్రా.
    థయామిన్‌      0.02 మి.గ్రా.
    రిబోఫ్లేవిన్‌       0.02 మి.గ్రా.
    నికోటిన్‌ ఆసిడ్‌    0.3 మి.గ్రా.
    విటమిన్‌ సి       21.0 మి.గ్రా.
    విటమిన్‌ ఎ      450 మైక్రో గ్రాములు
    –––––––––––––––––––––––––––––––––––
    ( ౌuటఛ్ఛి: ఈౖఐ:10.130.40/్ఖ్క ఖ.0975–8232.5(4).1138–45)

    అడవి మామిడిపై పరిశోధనలు ఎంతైనా అవసరం.  వీటి ఉనికిని, సాంద్రతను పెంచగలిగితే వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అడవి మామిడి సతత హరితం, కాబట్టి ఆకులు రాల్చే చెట్ల కన్నా అధికంగా ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది.  

    అపురూపమైన అడవి పండ జాతులు
    మన దేశంలోని అడవుల్లో వందల కొలదీ మనుషులు తినదగిన, పోషకాలతో కూడిన అనేక జాతులు పండ్ల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన  కొన్ని పండ్ల జాతులను ఎంచుకొని పరిశోధనలను ముమ్మరం చెయ్య గలిగితే ఆ పండ్ల చెట్లను కూడా భవిష్యత్తులో రైతుల తోటల్లోకి, పెరటి తోటల్లోకి ఈ అరుదైన అడవి పండ్ల జాతులను ప్రవేశపెట్టవచ్చు అంటున్నారు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా రాజేంద్రనగర్‌లో ఉన్న భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా కొన్నేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య అంటున్నారు. ఆయన తన బాల్యంలో అడవుల్లో తిరుగుతూ రుచి చూసిన 65 రకాల అడవి పండ్ల జాతులపై లోతైన పరిశోధన చేసి, ‘ఆదరణ కరవైన అడవి పండ్లు– పోషక, ఔషధ నిధులు’ పేరుతో చక్కటి పుస్తకాన్ని వెలువరించారు. 

    ఈ అపురూపమైన అడవి పండ్ల జాతులను పరిరక్షించుకోవటంతో పాటు ఈ మొక్కలను రైతులకు అందుబాటులోకి తేవటం ద్వారా ప్రజల ఆహారంలో పౌష్టికాహార స్థాయిని, వైవిధ్యాన్ని పెంపొందించవచ్చని, పర్యావరణంలోనూ జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చని డాక్టర్‌ పద్మయ్య అంటున్నారు. ‘సాగుబడి ప్లస్‌’ పేజీలో ప్రతి శుక్రవారం ఒక్కో అడవి పండ్ల జాతి గురించి ఆయన అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ధారావాహికగా ప్రచురించడానికి సమ్మతించినందుకు డా. పద్మయ్యకు ధన్యవాదాలు. ఈ సమాచారం పాఠకులకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

    – డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
    ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
    మొబైల్‌: 94407 08924 

    – ఎడిటర్, సాక్షి 

    (చదవండి: పాలలో ఆ నేల రుచి ఉంటుంది!)

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ మాధురి దీక్షిత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 1980-90ల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్‌తో పాటు న‌ట‌న‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ‘బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ రోజుతో 59 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికీ అంతే అందంగా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్‌ ఆమె సొంతం. ఈ సందర్భంగా ఆమె మెరిసే అందం కోసం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏం చేస్తుంటుంది, ఎలాంటి కేర్‌ తీసుకుంటుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.

    ఈ అందాల తార మాధురి దీక్షిత్‌ మాత్రం ఇప్పటికీ మెరిసేచర్మం, ఆరోగ్యకరమైన జుట్టుతో ఆకట్టుకుంటూనే ఉంటారామె. అందుకోసం ఏం చేస్తుంటుందో  ఆమెనే స్వయంగా వెల్లండించారు. 

    ఆరోగ్యకరమైన చర్మం కోసం..
    మాధురీ దీక్షిత్ అందం చర్మం లోపలి నుంచే మొదలవుతుందని చెబుతున్నారామె. అందుకోసం, ఆరోగ్యకరమైన ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండటం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చర్మ సంరక్షణ అంటే ముఖానికి ఏం పూస్తున్నాం అనేది కాదని, శరీరానికి తేమను అందించేలా పుష్కలంగా నీరు తాగాలని అంటున్నారు.

    మెరిసే చర్మం కోసం..

    • మాధురీ దీక్షిత్ తన రోజును ముఖంపై మురికిని తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి క్లెన్సర్‌తో ప్రారంభిస్తుంది.

    • ఆ తర్వాత టోనర్‌ను ఉపయోగిస్తుంది. రోజ్ వాటర్ ఆమెకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైనది. అందువల్ల దాన్నే ఆమె టోనర్‌గా ఉపయోగిస్తుంటారామె.

    • తర్వాత విటమిన్ సీ సీరం వస్తుంది, దీనిని ఆమె తన చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంది.

    • చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలని చెబుతుంది. జిడ్డు చర్మం అయితే వాటర్‌ బేస్ట్‌ మాయిశ్చరైజర్‌, పొడి చర్మం అయితే చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలని అన్నారామె.

    • ఆమె తన చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌తో తన ఉదయపు దినచర్యను ముగిస్తుంది.

    • అలాగే మేకప్‌తో నిద్రపోవడం పెద్ద తప్పు అని మాధురీ దీక్షిత్ నొక్కి చెబుతున్నారు. 

    • ఆమె సాధారణంగా క్లెన్సింగ్ బామ్‌తో మేకప్‌ను తొలగిస్తారట. ఒక్కోసారి సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని మళ్లీ కడుక్కోవడానికి ముందు వైప్స్‌తో మైసెల్లార్ వాటర్‌ను కూడా ఉపయోగిస్తానని అన్నారు.

    • అలాగే రాత్రి సమయంలో కూడా టోనర్‌, విటమిన్‌ సీ సీరమ్‌ని అప్లై చేస్తానని అంటోంది. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తానని చెబుతోంది.

    ఇక రాత్రంతా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రాత్రిపూట రొటీన్ మాయిశ్చరైజర్, అండర్-ఐ క్రీమ్, లిప్ బామ్‌ తప్పనిసరి అని అంటోంది.

    జుట్టు సంరక్షణ కోసం..
    మృదువైన, మెరిసే జుట్టు కోసం తాను ఉపయోగించే ఒక సాధారణ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ను కూడా మాధురి పంచుకుంది. ఈ మాస్క్‌లో మెత్తగా చేసిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె ఉంటాయి. 

    ఇక్కడ అరటి పండ్లు జుట్టుకు లోతైన పోషణను ఇవ్వగా, కొబ్బరి నూనె జుట్టు చిట్లడాన్ని తగ్గించి, మెరుపుని ఇస్తుంది. ఇక తేనె కుదుళ్లను మృదువుగా చేసి వొత్తుగా పెరిగేలా చేస్తుందట.


     

     

Business

  • టాటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త తరహా వాహనాలను ప్రవేశపెట్టేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైనది ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్ లాంచ్ చేయడం. దీనిని కంపెనీ 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో దేశీయ విఫణిలోకి ప్రవేశపెట్టనుంది.

    భారత ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే E20 (20% ఇథనాల్ మిశ్రమం) అమలులో ఉండగా, భవిష్యత్తులో E85, చివరికి E100 వరకు చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు కూడా తమ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి.

    టాటా మోటార్స్ 2023 నుంచే తమ వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తోంది. అంతే కాకుండా.. సంస్థ ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైడ్రోజన్ వంటి పర్యావరణహిత సాంకేతికతలపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను ప్రదర్శించింది. ఇందులో ముఖ్యంగా టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ ఆకర్షణీయంగా నిలిచింది.

    టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ కారు 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించినప్పటికీ, ECU, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ వ్యవస్థలో మార్పులు చేసి ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా రూపొందించారు. ఇది పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడా సమర్థంగా పనిచేయగలదు.

    ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం అంటే పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండింటి మిశ్రమంతో నడిచే వాహనం. ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే పర్యావరణహిత బయోఫ్యూయల్. ఇది సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.

  • గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.

    ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.

    చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.

    మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

  • భారతదేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ మేక్‌మైట్రిప్ తన ఏఐ బేస్డ్ ట్రావెల్ అసిస్టెంట్ ‘మైరా’లో కొత్త అప్‌గ్రేడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశ్యం.. వినియోగదారుల బుకింగ్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేసి, సెర్చింగ్ నుంచి చెల్లింపు వరకు మొత్తం ఒకే ఇంటర్‌ఫేస్‌లో పూర్తి చేయగలిగేలా చేయడం. అవసరమైతే వాయిస్ ఆధారిత విధానంలో కూడా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

    'మైరా 2.0' ఇప్పుడు సాధారణ సెర్చ్‌లను మాత్రమే కాకుండా, చాలా అవసరాలకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన ప్రయాణ అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుని పరిష్కారం చూపుతుంది. ఉదాహరణకు.. కుటుంబ ప్రయాణాల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న హోటల్స్, వృద్ధుల కోసం సౌకర్యాలు లేదా వీసా సంబంధిత సమాచారం వంటి అంశాలను ఒకే చోట అందిస్తుంది. దీంతో వినియోగదారులు అనేక వెబ్‌సైట్లను పరిశీలించాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై పూర్తి సమాచారం పొందగలుగుతారు.

    ఈ కొత్త వెర్షన్‌లో.. వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. తెలుగు సహా ఎనిమిది భాషల్లో.. వాయిస్ ద్వారా సెర్చ్, ఎంపికలు, బుకింగ్ వంటివి పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులు తమ పాస్‌పోర్ట్ లేదా ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే, వాటి వివరాలను ఆటోమేటిక్‌గా గుర్తించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

    మరో ముఖ్యమైన డెవలప్మెంట్ ఏమిటంటే.. చెల్లింపు ప్రక్రియను కూడా సంభాషణలోనే పూర్తి చేయగలగడం. వినియోగదారులు సెర్చ్ చేయడం, ఎంపిక చేయడం, కన్ఫర్మ్ చేయడం,పేమెంట్ చేయడం వరకు అన్ని దశలను ఒకే ఇంటర్‌ఫేస్‌లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా, బుకింగ్ మధ్యలో కూడా వినియోగదారులు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు, దీంతో ప్రక్రియ మధ్యలో ఆగిపోకుండా కొనసాగుతుంది.

  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రూపాయలు పెరిగింది. అమెరికా - ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంధన ధరల పెంపును ప్రకటించారు. అయితే.. కొత్త కార్లు కొనేవారికి ఇంధన ధరల పెంపు భారమే అయినప్పటికీ.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఒకింత ఉపశమనం కలిగిస్తాయి. ఈ కథనంలో అలాంటి కార్లను గురించి తెలుసుకుందాం.

    మారుతి సుజుకి విక్టోరిస్
    మారుతి సుజుకి విక్టోరిస్ అనేది.. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి వచ్చిన రెండవ మిడ్‌సైజ్ ఎస్యూవీ. ఇది పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఈ కారు లీటరుకు 28.65 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 16.38 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

    టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటి. ఇది పెట్రోల్-హైబ్రిడ్ సెటప్‌తో 27.97 కి.మీ/లీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 16.72 లక్షల నుంచి రూ. 20.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

    హోండా సిటీ eHEV
    రెండు దశాబ్దాలకు పైగా మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సిటీ eHEV ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌లలో ఒకటి. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ.20 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    మారుతి సుజుకి సెలెరియో
    ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి సుజుకి సెలెరియో కూడా ఒకటి. ఈ హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 26 కిలోమీటర్ల వరకు మైలేజీని కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 6.73 లక్షల మధ్య ఉంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న మోడల్ కూడా.

    మారుతి సుజుకి స్విఫ్ట్
    2005లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఇది లీటరుకు 25.75 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్ మాత్రమే అందిస్తుంది. దీని ధర రూ.రూ.7.04 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

    ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. టోల్ ప్లాజాలు మాయం!

  • ‘రాబోయే ఆదివారం నుంచి పెట్రోల్ బంకులు పనిచేయవు...’ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ పోస్ట్ సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, పుదుచ్చేరి వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు పూర్తిగా మూసివేస్తారనేది ఆ సందేశం సారాంశం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా సృష్టించిన ఈ నకిలీ పోస్ట్ వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లో వేలాది సార్లు షేర్ కావడంతో వాహనదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

    అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పింది.

    పీఐబీ ఫ్యాక్ట్ చెక్

    ఈ వైరల్ సందేశం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ పీఐబీ ఫ్యాక్ట్-చెక్ బృందం రంగంలోకి దిగింది. ఈ వాదనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సంస్థ ఇదొక తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది.

    ‘దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఆదివారాల్లో పెట్రోల్ పంపులను మూసివేయాలని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే. పౌరులెవరూ ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దు’ అని పీఐబీ విజ్ఞప్తి చేసింది.

    అకస్మాత్తుగా ఎందుకిలా?

    ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన ఇంధన లభ్యత కొరత ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో కీలకం. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంసిద్ధత మాత్రమే కానీ, భయాందోళనలు సృష్టించడం కాదు.

    ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!

  • భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది.

    ఈ రోజు (మే 15, 2026) ట్రేడింగ్‌ సెషన్‌లో రూపాయి విలువ 96 మార్కును దాటి రికార్డు స్థాయిలో 96.07 కనిష్ఠ స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్‌లో 95.95 వద్ద ముగిసిన రూపాయి, నేడు ఉదయం డాలర్‌తో పోలిస్తే 95.74 స్థాయిల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్-యూఎస్ ఉద్రిక్తతల కారణంగా మరింత క్షీణించి 0.3% నష్టంతో 96.05 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7% మేర క్షీణించడం గమనార్హం.

    రూపాయి పతనానికి గల కారణాలు..

    బ్యారెల్ 110 డాలర్లకు చేరిన ముడి చమురు

    పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా సాగే కీలకమైన హార్మూజ్‌ జలసంధి మూసివేయడంతో గత 11 వారాలుగా చమురు ధరలు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

    ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్ల వద్ద కదులుతుండగా యూఎస్‌ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూఐటీ) బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు వ్యాపారం అంతా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడల్లా భారత్‌కు డాలర్ల అవసరం పెరిగి రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

    ఆగని ఎఫ్‌పీఐల విక్రయాలు..

    దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ/ఎఫ్‌ఐఐ) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది గత ఏడాది (రూ.1.54 లక్షల కోట్లు) అవుట్‌ఫ్లో రికార్డును సైతం అధిగమించింది.

    మే 14 ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.146 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.

    ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హబ్‌లుగా ఉన్న మార్కెట్లలోకి ఈ నిధులు మళ్లుతుండటంతో భారత రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది.

    ఫలితాన్ని ఇవ్వని ట్రంప్, జిన్‌పింగ్ సమావేశం

    హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందని, తద్వారా అమెరికా-ఇరాన్ సంక్షోభం సద్దుమణుగుతుందని మార్కెట్లు ఆశగా ఎదురుచూశాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన రెండు గంటల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు నమ్మశక్యం కాని విధంగా సాగాయని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభనపై స్పష్టత రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నిరాశ అలుముకుంది. అమెరికా విధాన నిర్ణేతల (యూఎస్‌ ఫెడ్‌) వ్యాఖ్యలు, అక్కడ వెలువడిన ఆర్థిక గణాంకాలు డాలర్‌ను మరింత బలోపేతం చేశాయి.

    భారత్‌పై పడే ప్రభావం ఏమిటి?

    రూపాయి విలువ ఇలాగే 96 దిగువన కొనసాగితే దేశీయంగా ‘ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్’ (దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉంది. ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కానున్నాయి. విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన విదేశీ నిల్వల (ఫారెక్స్‌ రిజర్వ్స్‌) ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడంపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

    ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 160.73  పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 23,643.50 వద్ద నిలిచాయి.

    వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్, అట్లాంటా లిమిటెడ్, షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్, నవ లిమిటెడ్, ఎంఐఆర్సీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్, బీటా డ్రగ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. అయితే, ఈ అభివృద్ధికి ఊతమిచ్చేది మాత్రం ముడి చమురే. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే ప్రతి చిన్న మార్పు సామాన్యుడి జేబుపైనే కాకుండా దేశ బడ్జెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మే 15, 2026 నాటి తాజా పరిణామాల నేపథ్యంలో గత రెండు దశాబ్దాల (2006-2026) చమురు విపణిని, దేశీయ ధరల ఒడిదొడుకులను విశ్లేషిద్దాం.

    2006 నాటి ఇంధన ముఖచిత్రం

    సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 2006లో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు సగటున 60 నుంచి 65 డాలర్ల మధ్య ఊగిసలాడేవి. ఆ సమయంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి.

    2006లో ధరలు (న్యూఢిల్లీలో)..

    పెట్రోల్ లీటర్: సుమారు రూ.47.51

    డీజిల్ లీటర్: సుమారు రూ.32.47

    • 2006వ సంవత్సరంలో ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సగటున రూ.45.30గా ఉండేది.  

    అప్పట్లో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) ధరల నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగినప్పటికీ ప్రభుత్వం రాయితీలు ఇస్తూ దేశీయంగా ధరలను అదుపులో ఉంచేది.

    నేటి పరిస్థితి

    పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధ వాతావరణం, వ్యూహాత్మక చమురు రవాణా మార్గమైన హార్మూజ్‌ జలసంధిలో నెలకొన్న అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భగ్గుమంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 106 నుంచి 107 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

    గత 11 వారాలుగా నష్టాలను భరిస్తూ ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆర్థికంగా భారం ఎక్కువ కావడంతో నేడు (మే 15, 2026) లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

    నాటికీ నేటికీ తేడా ఏమిటి?

    2006తో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ధర దాదాపు 70% పెరిగితే దేశీయంగా రిటైల్ ధరలు మాత్రం 100% పైగా పెరిగాయి. ఈ తీవ్రమైన వ్యత్యాసానికి వెనుక బలమైన ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి.

    డాలర్‌తో రూపాయి విలువ క్షీణత

    2006లో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు రూ.45గా ఉండేది. కానీ నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి రావడం వల్ల క్రూడ్ ధరతో సంబంధం లేకుండా భారత్ చెల్లించే మొత్తం విపరీతంగా పెరిగింది.

    నియంత్రణ లేకపోవడం

    2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలే స్వయంగా ధరలను సవరించే పద్ధతి అమల్లోకి వచ్చింది.

    పన్నుల నిర్మాణం

    ప్రస్తుతం కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నులు ఇంధన ధరల్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. చమురు కంపెనీల నివేదికల ప్రకారం.. తాజా పెంపునకు ముందు కూడా కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.14, డీజిల్‌పై లీటరుకు రూ.16 వరకు నష్టపోవాల్సి వచ్చింది.

    వృద్ధి పథంలో భారత్

    భారతదేశం ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉంది. పారిశ్రామికీకరణ, రవాణా రంగాలు ఊపందుకున్నాయి. అయితే మన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత అంతర్గత ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏప్రిల్ 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఇంధన ధరల కారణంగా 42 నెలల గరిష్టానికి (8.3 శాతం) చేరింది.

    చమురు సంక్షోభం

    ఈ అంతర్జాతీయ చమురు సంక్షోభం భారత్‌కు ఒక హెచ్చరిక లాంటిది. ఇంధన ఒడిదొడుకుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే కేవలం దిగుమతులపైనే ఆధారపడితే సరిపోదు. రాబోయే రోజుల్లో వ్యూహాత్మక చమురు నిల్వలను మరింత పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ బ్లెండింగ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా భారత వృద్ధి సాగిపోతుంది.

    ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..

  • ఉద్యోగం చేసే చాలామంది.. జాబ్ వదిలేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇలాంటి సలహాలే చాలామంది చెబుతుంటారు కూడా. కానీ అదంతా తప్పు, అనుకున్నంత సులభమేమీ కాదంటున్నారు.. యువ వ్యాపారవేత్త మెహుల్ అగర్వాల్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    డిజిటల్ క్రియేటర్.. యువ వ్యాపారవేత్త మెహుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇందులో ఉద్యోగాన్ని వదిలి సొంత వ్యాపారం ప్రారంభించడం ఎంత కష్టమైన ప్రయాణమో ఆయన నిజాయితీగా వివరించారు.

    సాధారణంగా చాలామంది 'జాబ్ వదిలేస్తే స్వేచ్ఛ వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది' అని భావిస్తారు. కానీ జాబ్ వదిలేశాక తెలుస్తుంది ఎన్ని బాధ్యతలు పెరుగుతాయో. ఈ విషయాలను ఆయన తన అనుభవం ద్వారా వెల్లడించారు.

    మెహుల్ ప్రకారం.. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిన మొదటి రోజు చాలా ఉత్సాహంగా అనిపించింది. ఉదయం త్వరగా లేచి తన కంపెనీ భవిష్యత్తు కోసం వచ్చే మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేశాడు. కొత్త ప్రయాణం ప్రారంభమవుతోందనే ఆనందం అతనిలో కనిపించింది. రెండో రోజు ఆ ప్రణాళికను మళ్లీ మార్చి మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించాడు. అయితే.. మూడో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన నిర్ణయం సరైందా కాదా అనే అనుమానాలు మొదలయ్యాయని మెహుల్ తెలిపాడు.

    భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక భయం, ఆందోళన కలిగాయని చెప్పాడు మెహుల్ వీడియోలో వెల్లడించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు బాస్ పని మాత్రమే అప్పగించేవాడు, కానీ ఇప్పుడు అన్ని పనులు తానే చూసుకోవాల్సి వచ్చిందని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఒక వ్యాపారవేత్త ఎదుర్కొనే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది.

    అయితే.. తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదని మెహుల్ పేర్కొన్నాడు. ఎందుకంటే నచ్చని, ఒత్తిడి కలిగించే ఉద్యోగాన్ని వదిలి, నచ్చిన పనిచేస్తూ ముందుకు వెళ్తున్నా అని వివరించాడు. వ్యాపారాన్ని నిర్మించే ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదిస్తున్నానని కూడా తెలిపాడు. ఇది జీవితంలో మనసుకు నచ్చిన పనిని చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

    చేసేపనిలో కేవలం విజయం మాత్రమే కాదు.. అపజయం, కష్టాలు వస్తాయని.. ఆత్మవిశ్వాసం తగ్గినా రోజులు కూడా ఉన్నాయని మెహుల్ వీడియోలో వెల్లడించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగాలను తాము కూడా ఎదుర్కొన్నామని కొందరు వెల్లడించారు. మరికొందరు వ్యాపార జీవితంలోని ఒత్తిడి, అనిశ్చితి గురించి నిజాయితీగా మాట్లాడినందుకు ఆయనను ప్రశంసించారు.

  • భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీపై మోపిన క్రిమినల్ మోసం, లంచం ఆరోపణలను కొట్టివేయడానికి అమెరికా న్యాయ శాఖ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చర్యలు ప్రారంభించారు. గత ఏడాది కాలంగా అదానీ గ్రూప్‌ను వెంటాడుతున్న ఈ చట్టపరమైన అంశం ఒక్కసారిగా తొలగిపోవడం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో చర్చకు దారితీసింది.

    ఫెడరల్ ప్రాసిక్యూషన్‌లో నాటకీయ మార్పు

    భారతదేశంలో లాభదాయకమైన సౌర శక్తి ఒప్పందాలను దక్కించుకోవడానికి దాదాపు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించారనేది అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో పాటు ఇతర అధికారులపై ఉన్న ప్రధాన ఆరోపణ. అమెరికా పెట్టుబడిదారుల నుంచి బిలియన్ల డాలర్ల మూలధనాన్ని సేకరించే క్రమంలో ఈ విషయాన్ని దాచిపెట్టి వారిని తప్పుదోవ పట్టించారని 2024 చివరలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అప్పటి అమెరికా అధికారులు కేసు నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ నేరారోపణలను విరమించుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సాక్ష్యాధారాల సమగ్రంగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    తెరపైకి 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

    ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. యూఎస్ ప్రాసిక్యూటర్లు ఈ ఆరోపణలను ఉపసంహరించుకుంటే ప్రతివాది తరఫున అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 10 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందనే ప్రతిపాదన ఈ నిర్ణయం వెనుక కీలక పాత్ర పోషించినట్లు సదరు కథనం పేర్కొంది. అమెరికా ఫస్ట్ విధానాన్ని నమ్మే ట్రంప్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఈ ఆర్థిక దౌత్యం నడిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    రాజకీయ సమీకరణాలు

    ఈ కేసు ఉపసంహరణ అంతర్జాతీయ రాజకీయాలు, అమెరికా న్యాయ వ్యవస్థల కలయికపై తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత, వ్యూహాత్మక సంబంధాలు ఈ పరిణామానికి ముఖ్యమైన నేపథ్యంగా కనిపిస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ఉన్నత స్థాయి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలపై ఆరోపణలను పక్కన పెట్టడం వెనుక అమెరికాకు ఉన్న అంతర్గత వ్యాపార, భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం పూర్తిగా కేసు యోగ్యతలపై(మెరిట్స్‌) మాత్రమే ఆధారపడి తీసుకుందని యూఎస్ న్యాయ శాఖ స్పష్టం చేసింది.

    ‘ఇది అదానీ గ్రూప్‌నకు లభించిన భారీ విజయం. తమపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని వారు మొదటి నుంచి చెప్తున్న వాదనకు ఈ నిర్ణయంతో బలం చేకూరింది’ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ విశ్లేషించింది. మరోవైపు, పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ చట్టపరమైన కార్యకర్తలు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ఇంతటి భారీ అంతర్జాతీయ అవినీతి కేసును ఇలా అర్ధాంతరంగా కొట్టివేయడం వల్ల భవిష్యత్తులో కార్పొరేట్ అవినీతిపై జరిగే పోరాటాలు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

    ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..

National

  • ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్‌లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.

    ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా..  గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • న్యూఢిల్లీ: నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీకేజీ వెనుక మాస్టర్‌ మైండ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్‌ పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన  ప్రొఫెసర్‌ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు. 

    తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్‌టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్‌ పేపర్‌ కమిటీలో సబ్జెట్‌ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్‌ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్‌ పేపర్‌ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్‌ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్‌ విద్యార్థికి లీక్‌ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్‌వర్క్‌కు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది.

    మరోవైపు నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్‌ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ అయ్యారు.  

  • భోపాల్‌: మధ్యప్రదేశ్ హైకోర్టు బోజ్‌శాల వివాదంపై కీలక తీర్పు ఇచ్చింది. ధార్‌లోని బోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని దేవీ సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు బోజ్‌శాలను ప్రాచీన సరస్వతి ఆలయంగా గుర్తించింది. చారిత్రక ఆధారాలు, పురావస్తు పరిశోధనలు బోజ్‌శాలను సంస్కృత విద్యా కేంద్రంగా నిర్ధారించాయి. 

  • గుజరాత్‌లో జానపద గాయకుడిపై నిర్వాహకులు నోట్ల వర్షం కురిపించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంప్రదాయ గుజరాతీ హాస్య జానపద ప్రదర్శన జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో జరిగింది. ఈ ప్రదర్శనలో నిర్వాహకులు గాయకుడు గోపాల్ సాధుపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించారు. ఆయన పాడుతుండగానే నోట్లతో ముంచెత్తారు.

    నోట్లు కుమ్మరిస్తున్నా..
    వైరలవుతున్న ఈ వీడియోలో భక్తులు తనపై నోట్ల సంచులను కుమ్మరిస్తున్నా.. గోపాల్ సాధు ఏమాత్రం చలించకుండా తన హార్మోనియం వాయిస్తూ పాడుతుండటం కనిపిస్తుంది. ఆ నోట్ల కుప్ప ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే.. ఆయన దాదాపుగా కనిపించకుండా పోయారు. స్టేజీపై ఆయన చుట్టుపక్కల ప్రాంతమంతా నోట్లతో నిండిపోయినప్పటికీ.. ఆయన తన ప్రదర్శనను ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఇది చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఈ ఘటనపై చర్చకు దారి తీసింది.

    నెటిజన్ల కామెం‍ట్స్‌..
    ఇది నిజమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటారు. కేవలం అలా కూర్చుని నోట్ల వర్షంలో తడిసి ముద్దవ్వడం అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు.. ఆయన సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని ఆశిస్తున్నాను. వాళ్ళు నోట్లు కుమ్మరిస్తున్నా ఆయన పాడుతూనే ఉన్నారంటూ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ డబ్బులో కొంత భాగం పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండంటూ వ్యాఖ్యానించారు.

    గతంలోనూ ఇలా..
    గుజరాత్‌లో భజన కార్యక్రమాల్లో భక్తులు ఇలా లక్షల రూపాయల నగదును వర్షంలా కురిపించిన వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో వల్సాద్ అగ్నివీర్ గౌ సేవా దళ్ నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తీదాన్ గధ్వీపై రూ.10, 20, 50, 100 నోట్లను వర్షంలా కురిపించారు. అదే విధంగా.. డిసెంబర్ 2022లో గుజరాత్‌లోని నవ్‌సారి గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో కీర్తీదాన్ గధ్వీపై దాదాపు రూ. 50 లక్షల విలువైన నోట్లను కురిపించారు. 2017, 2018లలో కూడా ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

  • ఢిల్లీ: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను అంటూ లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్ మిశ్రా పలికిన చివరి మాటలు ఇవి. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న ఆ విద్యార్థి పరీక్ష రద్దు కావడంతో తీవ్రంగా కుంగిపోయాడు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్ష చేతిలో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థ చేసిన హత్య’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

    ‘‘2015 నుండి 2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయి. 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడింది. 148 కుంభకోణాలలో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు తీసుకున్నాయి. ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్క నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య పరీక్షలలోనే 15 కుంభకోణాలు జరిగాయి. అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాలకు బాధ్యులైన ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి, ఆ తర్వాత రహస్యంగా ఉన్నత పదవులలో తిరిగి నియమిస్తున్నారు’’ అంటూ ఎక్స్‌ వేదికగా రాహుల్‌  నిలదీశారు.

    ‘‘మోసానికి సహకరించేవారికి బహుమతులు లభిస్తుండగా.. పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మోదీ జీ.. మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు కావాలి?. విద్యార్థుల బాధ నా బాధ. విద్యార్ధుల కష్టం నా కష్టం. విద్యార్ధుల భవిష్యత్తును దొంగిలించిన వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎంత కాలం పట్టినా సరే.. ఎవరినీ వదిలిపెట్టం.. ఇది నా వాగ్దానం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’’ అంటూ రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

  • ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఐదు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అత్యంత అరుదైన కేసుగా వైద్యులు అభివర్ణించారు. సాధారణంగా ఇలాంటి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు హై-రిస్క్ గర్భధారణల కారణంగా సిజేరియన్ (సి-సెక్షన్) శస్త్రచికిత్స అవసరమవుతుంది. కానీ.. మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఈ నలుగురు పిల్లలు సాధారణ కాన్పు ద్వారా జన్మించడం ఒక అసాధారణ కేసుగా ఆశ్చర్యపరుస్తోంది.

    అమీనాగా అనే ఆ మహిళకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌లలో నలుగురు పిండాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటి నుండి.. ఈ గర్భధారణ అత్యంత సంక్లిష్టమైనది వైద్యులు చెప్పారు. దీనివల్ల ఉండే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని.. కనీసం ఇద్దరు పిల్లలనైనా సురక్షితంగా ప్రసవించే అవకాశాలను పెంచడం కోసం "ఫీటల్ రిడక్షన్" (పిండాల సంఖ్యను తగ్గించడం) చేయాలని వైద్య బృందం సలహా ఇచ్చింది. అయితే నలుగురు పిల్లలతోనే గర్భాన్ని కొనసాగించాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది.

    గర్భధారణ సమయంలో అమీనా రక్తపోటు (బీపీ), కాలేయ సంబంధిత (లివర్) సమస్యలతో కూడా బాధపడ్డారు. దీంతో ఆమె చికిత్స కోసం పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆసుపత్రి పరిపాలన విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. మే 8వ తేదీన అమీనాకు మొదటిసారి నొప్పులు వచ్చాయి. మే 9న ఆమె తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు సుమారు 710 గ్రాములు ఉంది.

    ఆ సమయంలో గర్భం ఇంకా ఆరున్నర నుండి ఏడు నెలల దశలోనే ఉండటంతో, వైద్యులు ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. మిగిలిన ప్రసవాలను ఆలస్యం చేయగలిగారు. ఐదు రోజుల తర్వాత.. మే 14న ఆమెకు మళ్లీ ప్రసవ వేదన రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమె మిగిలిన ముగ్గురు పిల్లలకు (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు) జన్మనిచ్చింది. నవజాత శిశువులలో ఒకరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, మిగిలిన ఇద్దరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.

    ఈ కేసు వైద్యపరంగా అత్యంత అరుదైనదని.. సవాలుతో కూడుకుందని ఆసుపత్రి వైద్య బృందం పేర్కొంది. నలుగురు పిల్లలు వేర్వేరు సంచులలో (separate sacs) ఉన్నారని, దీనివల్ల సాధారణ ప్రసవాలు విజయవంతం కావడం వైద్యపరంగా అత్యంత అసాధారణమైన విషయమని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స, పర్యవేక్షణలో వైద్యుల బృందంతో పాటు పలువురు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సకాలంలో స్పందించడం, నిరంతర పర్యవేక్షణ, కుటుంబ సభ్యుల సహకారం ఈ హై-రిస్క్ గర్భధారణను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాయని వైద్యులు తెలిపారు. పిల్లల తండ్రి, కిరాణా దుకాణం యజమాని మహ్మద్ ఆలిమ్  వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

  • సాక్షి,న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వేలాది మంది న్యాయవాదుల విషయంలో సీబీఐ దర్యాప్తు అవసరమరని సూచించింది.  

    ‘వేలాది నల్ల గౌన్లు ధరించిన వ్యక్తులు ఫేక్‌ డిగ్రీలతో న్యాయవృత్తిలో ఉన్నారు. సీబీఐ ఏదో ఒకటి చేయాలి’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో కొంతమంది న్యాయవాదుల మాటతీరు, వారు చేస్తున్న పోస్టులు వారి అర్హతలపై తీవ్రమైన సందేహాలు కలిగిస్తున్నాయని అన్నారు.

    ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గుర్తింపు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో వెలువడ్డాయి. పిటిషనర్ సంజయ్ దూబే కోర్టును అవమానించేలా వ్యవహరించారని సుప్రీంకోర్టు భావించింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో సోషల్‌ మీడియాలో సంజయ్‌ దూబే మాటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

    సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. న్యాయవృత్తిలో క్రమశిక్షణ అంటే ఏమిటో చూపిస్తాను’ అని హెచ్చరించగా.. సీనియర్ అడ్వకేట్ గుర్తింపు కేవలం  స్టేటస్ సింబల్‌గా మారిందా లేక న్యాయవ్యవస్థకు సేవ చేయడానికా అని న్యాయమూర్తి జోయ్‌మాల్య బగ్చి ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం సదరు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించడంతో, పిటిషనర్‌ చివరికి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.ఈ సందర్భంగా కోర్టు, సమాజంలో ఇప్పటికే న్యాయవ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఉన్నారని, న్యాయవాదులు వారితో కలిసిపోవద్దని హెచ్చరించింది.

  • డాక్టర్ కేతన్ భాటికర్‌ మృతి గోవా రాజకీయాల్లో విషాదాన్ని నింపింది. గోవా కాంగ్రెస్‌ యువ నాయకుడు, ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కేతన్ భాటికర్ పాముకాటుతో మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాల్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. 38 ఏళ్ల కేతన్ భాటికర్ కర్ణాటకలోని దాండేలి గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారు దిగిన సమయంలో పాము కాటేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను గోవాలోని ధర్‌బందోర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

    ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా..
    గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ కేతన్ భాటికర్.. ఇటీవల రద్దైన పోండా అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైకోర్టు తీర్పుతో ఆ ఉపఎన్నిక రద్దు కావడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ విషాద ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేతన్ భాటికర్ మరణం వైద్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ప్రతిపక్ష నేత యూరి అలెమావో కూడా సంతాపం తెలిపారు. ప్రజాసేవ పట్ల కేతన్ భాటికర్‌కు ఉన్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

    ఉప ఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే..
    పోండా అసెంబ్లీ ఉపఎన్నిక అసలు ఎందుకు రద్దయిందంటే.. ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్‌లో మరణించడంతో అక్కడ ఉపఎన్నిక అవసరమైంది. దీంతో ఎన్నికల సంఘం 2026 ఏప్రిల్‌ 9న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున డాక్టర్‌ కేతన్‌ పోటీ చేశారు. అయితే, పోలింగ్‌కు కేవలం 16 గంటల ముందు బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆ ఉపఎన్నికను రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను డాక్టర్‌ కేతన్‌.. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 

    గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉందని.. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

    సుప్రీంకోర్టుకు డాక్టర్‌ కేతన్‌..
    దీనిపై డాక్టర్ కేతన్ భాటికర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయ్యాక రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రచారం పూర్తైంది.. పోస్టల్ బ్యాలెట్లు కూడా పడిపోయాయి. ప్రజలకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకునే హక్కు దూరమైంది. చట్టం ఎన్నికలు నిర్వహించకూడదని కాదు.. తప్పనిసరి కాదని మాత్రమే చెబుతోంది. పోండా ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన వాదించారు.  ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల చట్టంలోని Section 151A వ్యాఖ్యానం కీలకమని పేర్కొంటూ ఎన్నికల సంఘం సమాధానం కోరింది. ఈ క్రమంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఆయన చనిపోయారు. డాక్టర్‌ కేతన్‌ దాఖలు చేసిన  పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉండగా.. ఇంతలోనే పాముకాటుతో ఆయన మరణించడం రాజకీయంగా, న్యాయపరంగా కూడా చర్చనీయాంశమైంది.

    సుప్రీంకోర్టు నిర్ణయంపై..
    అయితే, డాక్టర్ కేతన్‌ మరణంతో ఆయన దాఖలు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగత హక్కులు లేదా ఎన్నికల అర్హతలకు సంబంధించిన కేసుల్లో పిటిషనర్ మరణిస్తే, ఆ పిటిషన్ “అబేట్” (చెల్లుబాటు కోల్పోవడం) అయ్యే అవకాశముంటుంది. అయితే ఇది పూర్తిగా కేసు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. పోండా ఉపఎన్నిక రద్దు అంశం ప్రజాప్రయోజనం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదిగా కోర్టు భావిస్తే, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ తరఫున మరో వ్యక్తి కేసును కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
     

  • సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ  అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

    కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ  ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.

    సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

    మేఘ సందేశం... మే 26 న కేరళకు నైరుతి రుతుపవనాలు
  • ఢిల్లీ: దేశంలో పెట్రో రేట్ల పెంపుపై కేంద్రంగా తొలిసారిగా స్పందించింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. అన్ని దేశాల కంటే భారత్‌లోనే పెట్రో రేట్లు తక్కువగా పెరిగాయని చెప్పుకొచ్చారు.

    కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ..‘పశ్చిమాసియా పరిణామాలతో చమురు ధరలు పెరిగినా భారత్‌ మాత్రం ప్రజలపై భారం మోపలేదు. మిగతా దేశాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 20-100 శాతం పెంచాయి. కానీ, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం పెరిగింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ద్రవ్యోల్భణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయి. ఇది బాధ్యతతో కూడిన పరిపాలన. ఇది ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం. నాయకత్వంలో, భారతదేశం ఆర్థిక స్థిరత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూనే ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్కసారిగా రూ.3పైగా పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. పెంపు వెనుక కారణాలు.. 2022 ఏప్రిల్‌ నుంచి(ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంలోనూ) పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు మారలేదు. పైగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్పున తగ్గించాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది.

    భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు (IOCL, BPCL, HPCL)  అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. కానీ.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది.

Advt

  • తక్కువ పెట్టుబడి, పూర్తిస్థాయి భద్రత, నెలసరి ఆదాయం, పెట్టుబడికి మంచి రాబడిని అందిస్తూ ఒక వినూత్న పద్ధతిలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రాజెక్టును నిర్వహిస్తున్న GVRR బృందావన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కొంగుబంగారం, ఇలవేల్పు అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి  కేవలం 800 మీటర్ల దూరంలో నిర్మించిన 3 స్టార్ హోటల్ సౌకర్యాలు కలిగిన కమర్షియల్ సూట్ రూమ్స్ 1BHK అపార్ట్‌మెంట్‌ను 500 చదరపు అడుగులుగా, 2BHKను 800 చదరపు అడుగులుగా నిర్మించారు. ఇందులో 9000 చదరపు అడుగుల అత్యాధునిక సౌకర్యాలతో క్లబ్ హౌస్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్స్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ తర్వాత నుంచి ఫ్లాట్ కొనుగోలుదారులకు 1BHKకు రూ. 20 వేల రూపాయిలు, 2BHKకు రూ. 32 వేల రూపాయిలు చొప్పున నెలసరి అద్దె చెల్లిస్తున్నారు.

    యాదగిరిగుట్ట 2022 సంవత్సరం పునర్నిర్మాణం జరగకముందు వార్షిక ఆదాయం రూ. 61 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం నాలుగు రెట్లు భక్తులు పెరగడమే కాకుండా వార్షిక ఆదాయం కూడా రూ. 235 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం ఆలయం, ఆలయ ప్రాంగణం, ఆలయ పట్టణం అభివృద్ధికి రూ. 1800 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ఆలయంతో పాటు, ప్రాంగణం, ఆలయ పట్టణం దినదినాభివృద్ధి చెంది పుష్కలంగా విశాలవంతమైన సౌకర్యాలు పెరగడం వల్ల భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

    గత ఏడాది నవంబర్ 16న ఒకే రోజు ఆదాయం 1.04 కోట్లుగా నమోదైంది. లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వారపు దినాల్లో 40 వేల మంది భక్తులు, వారాంతాల్లో 80 వేల మంది భక్తులు, ప్రత్యేక రోజుల్లో లక్ష మంది పైగా భక్తులు విచ్చేస్తున్నారు. యాదగిరిగుట్ట నగరంలో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మరియు ప్లాట్స్ క్రయ విక్రయాలు ఎల్లప్పుడూ పెరుగుతుందే గాని తగ్గదు.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుమల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాదగిరి గుట్టను ఆదరిస్తున్నారు. టెంపుల్, టెంపుల్ ప్రాంగణం, టెంపుల్ పట్టణంతో పాటు బసవపురం రిజర్వాయర్, హిల్ స్టేషన్స్, మధ్యలో చారిత్రక కట్టడాలు, రిసార్ట్స్, హోటల్స్ స్వర్ణగిరి ఆలయం ఇలా అన్ని ఆకర్షణీయమైన కట్టడాలు ఉండడం, మరియు రవాణా సౌకర్యాలలో మరొక ముందడుగు అత్యంత ప్రతిష్టాత్మక భారతీయ రైల్వే MMTS మూడవ దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రవాణా సౌలభ్యం వలన యాదగిరిగుట్ట పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. అలాగే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధ్యాత్మికంగాను మరియు వారాంతపు సెలవులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటాని ఒక మంచి వేదిక గా GVRR బృందావన్ మీకు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి రానున్నది.. ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకు యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.

    పరిమిత సంఖ్యలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటనే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి!
    సైట్ విజిట్ కోసం: 9133332733 / 9000896223 నంబర్లను సంప్రదించగలరు

Andhra Pradesh

  • తాడేపల్లి:  ఉండవల్లి స్టీల్‌ బ్రిడ్జిను వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మాణంలో ఉ‍న్న స్టీల్‌ బ్రిడ్జిను వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, శైలజానాథ్‌లు పరిశీలించారు. 

    రాజధానిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌కు అనుసంధానంగా స్టీల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో స్టీల్‌ బ్రిడ్జ్‌ గర్డర్‌ ఒరిగింది. దీన్ని పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు.. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అనడానికి ఇదొక నిదర్శమన్నారు. 

    పూటకో మాట చెప్తున్నారు..
    బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు పూటకో మాట చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఉదయం తప్పులేదన్నారు, సాయంత్రానికి తప్పు జరిగినట్టు ప్రకటించారన్నారు. ‘రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అమరావతి పేరుతో విజయవాడను ఓల్డ్ సిటీగా మార్చేశారు. అప్పులు తెచ్చి అమరావతి అవసరమా?, అప్పులు ఆపండి, చిన్న బ్రిడ్జి నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే ఇక అమరావతి ఎప్పటికి అవుతుంది?, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’ అని ధ్వజమెత్తారు.

    మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ ఆర్నెళ్ల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి ఇంకా పూర్తవలేదు. ఈలోపు కొంత కుంగిపోయింది. పనులు ఆపేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వారధి దగ్గర కలుపుతామన్నారు. మరి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నట్టు?, అంటే ప్లానింగ్ లోపం ఉన్నట్టా?, కొండవీటి వాగు మీద బ్రిడ్జి పూర్తి కాకుండానే బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారు?, కమీషన్ల కక్కుర్తితో హడావుడిగా పనులు చేయటం వలనే బ్రిడ్జి కుంగింది. 

    వర్షం వస్తే మునిగిపోయే రాజధాని నాసిరకం నిర్మాణాలు

    బకింగ్‌హామ్ కెనాల్ జలరవాణాకు సంబంధించినది. దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే చాలా పర్మిషన్ లు కావాలి. ఏం పర్మిషన్ లు తీసుకుని బ్రిడ్జి కడుతున్నారు?, అధికారం ఉందని ఇష్టానుసారం బ్రిడ్జిలు కడతారా?, చంద్రబాబు, లోకేష్, మంత్రి నారాయణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలకు ఖర్చు చేస్తారా?’ అని ప్రశ్నించారు. 

  • సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.

    ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ), షుగర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు. 

    గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం సానుకూలం
  • విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ల పూజ చేస్తుండగా భక్తులపై స్లాబ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి. బాలిక తలకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ప్రమాదం సమయంలో దుర్గగుడి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. 

International

  • వాషింగ్టన్‌: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం  ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే  చిలుకూరు బాలాజీని వీసా గాడ్‌ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  

    హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో హెచ్‌-1బీ వీసా పోగ్రామ్‌ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్‌ కంపెనీలు హెచ్‌-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. 

    అమెరికా సెనేటర్‌ నోట చిలుకూరు బాలాజీ 
    ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్‌-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్‌-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్‌లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.

    పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకు
    అమెరికా వీసా ప్రోగ్రామ్‌లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్‌-1బీ,ఎల్‌-1,ఎఫ్‌-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్‌లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్‌లో ఏఐపై బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. 

    ఎల్‌‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు.  

    అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్‌ ట్యాక్స్‌, వేజ్‌ రూల్స్‌ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‌‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్‌ కార్డ్‌లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. 

    వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్‌ చేస్తారు
    కార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్‌ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్‌వర్క్‌లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్‌ వర్క్‌ ఫోర్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  

    చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావన
    అమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్‌లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్‌గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్‌ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 

    11 లేదంటే 108 ప్రదక్షిణలు
    చిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

     

     

Crime

  • హైదరాబాద్‌:  తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్‌నగర్‌ పీఎస్‌ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది.  తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్‌ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది.  

    తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్‌.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. 

    దీనిపై గోవర్థన్‌ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. 

    దాన్ని మాత్రం వదలొద్దు భార్య వదిలేయడంతో భర్త సూసైడ్
  • సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజను చంపి, భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ కోసం నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేరంలో ఆరుగురు నేరుగా పాల్గొన్నారని, మరొకరు పరోక్షంగా సహకరించారని గుర్తించారు.  

    ఉత్తరాది జైల్లో కల్పన భర్త... 
    నేపాల్‌ నుంచి వలసొచ్చిన కల్పనతోపాటు ఆమె భర్త ఉత్తరాదిలో కొన్ని నేరాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా వినయ్‌ రంజన్‌ రే తల్లికి సపర్యలు చేయడానికి చేరింది. రంజన్‌ తల్లి రెండు నెలల క్రితం చనిపోయినా, కల్పన మీద ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. ఈమెకు రెండో అంతస్తులో అటాచ్డ్‌ బాత్‌రూమ్‌తో కూడిన గదిని ఇచ్చారు. ఉత్తరాదిలో చేసిన నేరంలో అరెస్టు అయిన కల్పన భర్త ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్నట్టు తెలిసింది. జైలు నుంచే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా కల్పనతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. ఇలా మెసెంజర్‌ ద్వారా రంజన్‌ ఇంట్లో దోపిడీకి స్కెచ్‌ వేసి, ఆ విషయాన్ని కల్పనకు చెప్పారు.  

    రెండు రోజుల ముందు వచ్చిన ముగ్గురు  
    ఇటీవల వినయ్‌ రంజన్‌ రే (Vinay Ranjan Ray) బెంగళూరు వెళ్లడంతో దోపిడీకి అదే అదునైన సమయంగా భావించిన కల్పన అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడి సూచనల మేరకు నేపాల్‌కు చెందిన సుజన్‌ షాహి అలియాస్‌ సురేశ్‌ సాహి, గణేశ్‌ సాహి, భరత్, దేవేందర్‌ నేరం చేయడానికి రెండు రోజులు ముందు నగరానికి వచ్చారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరు రైలు ద్వారా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి గోపాలపురం పరిధిలోని ఎంఎస్‌ హోటల్‌లో బస చేశారు. ఆ మర్నాడు మరో నిందితుడు వచ్చి వీరిని కలిశాడు. గురువారం ఈ హోటల్‌లో సోదాలు చేసిన పోలీసులు పలు రికార్డులు, నేరగాళ్లు ఇచ్చిన గుర్తింపు పత్రాల ప్రతులు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్నారు.  
      
    ఆటోలో జూబ్లీహిల్స్‌ వరకు...
    నేరం చేసిన రోజు కల్పన ఆదేశాల మేరకు ఈ ఐదుగురూ ఆటోలో ప్రశాసన్‌నగర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరి కదలికలు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల ఐదుగురినీ పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత వీరు వేర్వేరుగా రైళ్లల్లోనే పారిపోయారని పోలీసులకు ఆధారాలు లభించాయి. కల్పన (Kalpana) సహా కొందరు సొత్తుతో నేపాల్‌కు చేరినట్టు భావిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో గాలిస్తున్న టీమ్స్, ఇండో–నేపాల్‌ బోర్డర్‌లోని వివిధ ప్రాంతాలు, ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచాయి.

    పోలీసుల అదుపులో నేపాలీ మమత గ్యాంగ్‌? 
    జవహర్‌నగర్‌: జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మురళీమోహన్, విజయలక్ష్మీ నివాసంలో వారిని బంధించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నేపాలీ మమత గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మురళీమోహన్‌ నివాసంలో ఈ నెల 11న ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి, నేపాల్‌కు చెందినవారు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.

    జవహర్‌నగర్, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నేపాలీ గ్యాంగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని, అక్కడ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్‌ తీసుకొస్తారని సమాచారం. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి స్వయంగా పర్యవేక్షించి 10 ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దించి నేపాలీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.