Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.  

    జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు.  

    శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది.  

     

  • తమిళనాడు సీఎం విజయ్‌కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు.  ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.

    రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. 
     

     

  • ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన మూవీ బలగం. తెలంగాణ పల్లె సెంటిమెంట్‌తో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పల్లెటూరి సంప్రదాయాలను, రక్త సంబంధాలను ఒక్కసారిగా మళ్లీ గుర్తుకు తెచ్చింది. అచ్చ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ద్వారా పలువురు నటీనటులు ఫేమస్ అయ్యారు.

    అలా ఈ మూవీ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవారిలో రూపాలక్ష్మి ఒకరు. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను అందరూ తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. హీరోయిన్‌ కావ్య కల్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. యితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.  బలగం తర్వాత రూపలక్ష్మి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది.

    తాజాగా రూపాలక్ష్మి ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత గ్లామరస్‌గా కనిపించింది. అసలు బలగం నటి రూపానేనా అన్నంతలా మారిపోయింది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

    కాగా.. బలగం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్‌రామ్‌ల‌తో పాటు సుధాక‌ర్ రెడ్డి, న‌ర్సింహ‌, రూప లక్ష్మి, ముర‌ళీధ‌ర్‌ల‌కు చాలా మంచి గుర్తింపు ద‌క్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాత‌లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. 
     

     

  • ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్‌ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్‌ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్‌ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి,  సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్‌ బంద్‌ 2’.

    స్నేహల్‌ తార్డే, మోహన్‌ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగాయి. మౌత్‌ టాక్‌తోనే మొదటి వీకెండ్‌లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌ అయిన  9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్‌) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.

    దేవూల్‌ బంద్‌ 2 కథేంటంటే.. 
    మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్‌)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్‌ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.

  • మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్‌ సేవ్ ది టైగర్స్. ఇ‍ప్పటికే రిలీజైన రెండు సీజన్స్‌ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు సీజన్స్‌ సినీ ప్రియులను మస్తు ఎంటర్‌టైన్‌ చేశాయి.

    ఇప్పుడు మూడో సీజన్‌ కూడా సరికొత్తగా మీ ముందుకొస్తోంది. తాజాగా ఈ సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ చూస్తుంటే నవ్వుల వర్షం కురుస్తోంది. ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అనే అభినవ్ గోమఠం డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్‌ జూన్‌లోనే జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది.

    అభినవ్‌ గోమఠం. ప్రియదర్శి, చైతన్యకృష్ణ పండించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్‌ ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ వెబ్ సిరీస్‌ జూన్ 19 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్-3 ట్రైలర్ చూసేయండి. 
    ‌ 
     

  • ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వసూళ్లు రాబట్టడం చాలా కష్టంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం డిజాస్టర్స్‌గా మిగిలిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి టైమ్‌లో ఓ చిన్న సినిమా ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 26 ఏళ్ల యూట్యూబర్‌ రూపొందించిన ఈ హారర్ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

    2026లో హాలీవుడ్ చరిత్రలో ఊహించని విజయం సాధించిన మూవీ అబ్సెషన్ టేకోవర్. ఈ సినిమాకు  కర్రీ బార్కర్ దర్శకత్వం వహించగా..  మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్టే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 950 కోట్లు వసూలు చేసింది. అంటే తన బడ్జెట్‌ కంటే వందరెట్లు అధికంగా ఆదాయం రాబట్టింది.  'అబ్సెషన్' ఒక సినిమాటిక్ యూనివర్స్, భారీ విజువల్స్, అతి పెద్ద ఫ్రాంచైజీ, సూపర్‌స్టార్స్ లేకపోయినా ఈ ఘనత సాధించింది.

    ఈ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌లో పెద్దపెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. స్టార్స్‌ ఉన్నప్పటికీ వంద కోట్లు వసూల్లు రావడమే గగనంగా మారిపోయింది. హిందీలో ఒక్క దురంధర్ మినహాయిస్తే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్స్‌ కంటే కంటెంట్‌ ముఖ్యమని సగటు సినీ ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
     
     

  • ధర్మ మహేష్ హీరోగా  కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2024 డిసెంబర్‌లో  థియేటర్స్‌లో విడుదలై యావరేజ్‌ టాక్‌ సంపాదించుకుంది.  కానీ దాదాపు ఏడాదిన్నర ఓటీటీలోకి వచ్చి.. ఇక్కడ మంచి టాక్‌తో దూసుకెళ్తోంది.  జీ5 ఓటీటీ  వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం  ఫ్రీ ఆన్ జీ5  విభాగంలో  టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది.

    ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో  నేచురల్‌గా నటించారు.  కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో  బెస్ట్ డెబ్యూ యాక్టర్‌‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్.  

    హీరోయిన్‌గా నటించిన  ఐశ్వర్య శర్మ  తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్‌తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.  అలాగే  రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్  తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు.

  • ప్రముఖ నటి షహానా గోస్వామి తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రం ఆమె గుర్తు పట్టేస్తారు. హిందీలో పలు సూపర్ హిట్‌ చిత్రాల్లో కనిపించింది. 2008లో 'రాక్ ఆన్!' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత  'ఫిరాక్', 'మిడ్‌నైట్స్ చిల్డ్రన్', 'డెస్పాచ్' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారి 'సంతోష్' అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీని  2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

    ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా  ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యుకు హాజరైన 40 ఏళ్ల ముద్దుగుమ్మ రిలేషన్, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను రిలేషన్‌షిప్‌లో ఎల్లప్పుడు  ఓపెన్‌గానే ఉన్నానని  షహానా వెల్లడించారు. తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం.. తనతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తులకు పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధాలను కొనసాగించే విధానంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. అందుకే నా రిలేషన్స్‌లో ఎలాంటి రహస్యాలు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు.

    ప్రస్తుతం తనకు భాగస్వామి ఎవరు లేరని కూడా గోస్వామి వెల్లడించారు. తన జీవితంలోని సంబంధాలు సాంప్రదాయమనే ముద్ర కాకుండా.. ప్రేమ, స్నేహం మీద నిర్మించబడ్డాయని తెలిపారు. తన రిలేషన్స్‌ సంప్రదాయాలను అనుసరించకపోయినా.. అవి సాధారణమైనవి కావని అన్నారు.

    ప్రేమ అనేది నిర్బంధంగా ఉండకూడదనేది తన నమ్మకమని గోస్వామి అన్నారు.  తాను భావోద్వేగ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తానని తెలిపారు. సంబంధాలు అనేవి కట్టుబాట్లలోకి బలవంతంగా నెట్టబడకుండా సహజంగా అభివృద్ధి చెందాలని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ప్రేమ స్వేచ్ఛగా ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తానని వెల్లడించారు. ఈ ఆలోచన తాను ఎంచుకునే సంబంధాలను.. అలాగే కాలక్రమేణా అవి అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ప్రభావితం చేసిందని షహానా అభిప్రాయం వ్యక్తం చేశారు.

    మిలింద్ సోమన్‌తో డేటింగ్..బ్రేకప్

    గతంలో మిలింద్ సోమన్‌తో రిలేషన్‌, విడిపోవడంపై కూడా షహానా గోస్వామి స్పందించారు. మోడల్ మిలింద్ సోమన్‌తో తన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు అతన్ని సినిమాల్లో చూసి ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. చివరికి ఆన్‌లైన్‌లో అతని కాంటాక్ట్ వివరాలను కనుగొన్నానని వెల్లడించింది. కాగా.. వీరిద్దరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే మిలింద్, షహానాల రిలేషన్‌కు 2013లో ఎండ్‌ కార్డ్ పడింది.

  • దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ కొంతకాలంగా యూట్యూబ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. తన వంటమనిషి దిలీప్‌తో కలిసి రకరకాల వీడియోలు చేస్తోంది. అతడిని వెంటేసుకుని సెలబ్రిటీల హోంటూర్స్‌ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి తనీషా ముఖర్జీ ఇంటిని సందర్శించింది ఫరా. ముంబైలో ఉన్న ఈ ఇంట్లో అడుగుపెడితే కోల్‌కతాకు వెళ్లినట్లుగానే ఉందని అబ్బురపడిపోయింది.

    14 ఏళ్లుగా ముంబైలో..
    ఇలాంటి ఇల్లు ముంబైలో ఎక్కడా ఉండదని కితాబిచ్చింది. ఇక తనీషా మాట్లాడుతూ.. ఈ ఇంట్లోని సామాను చాలామటుకు తన తల్లి ఇంటి నుంచి వచ్చినవే అని పేర్కొంది. 14 ఏళ్ల క్రితం ముంబైలో అడుగుపెట్టానని, తర్వాత ఇక్కడే సెటిలైపోయానంది. ఈ ఇంటి కోసం మీ అక్క, హీరోయిన్‌ కాజోల్‌ ఏమైనా సాయం చేసిందా? అని ఫరా ఆతృతగా అడిగింది. అందుకు తనీషా అవునని బదులిచ్చింది. తను చెక్‌లపై సంతకం చేసి ఇచ్చేదని, అలా డబ్బు సాయం చేసిందని పేర్కొంది.

    తెలుగులోనూ..
    బాలీవుడ్‌ సెలబ్రిటీలు తనూజ- షోము ముఖర్జీల సంతానమే కాజోల్‌, తనీషా. తక్కువ కాలంలోనే కాజోల్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ, తనీషా ఆ స్టార్‌డమ్‌ అందుకోలేకపోయింది. ష్‌, సర్కార్‌, వన్‌ టూ త్రీ, సర్కార్‌ రాజ్‌, కోడ్‌ నేమ్‌ అబ్దుల్‌ వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో కంత్రి మూవీలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది.

    చదవండి: బోల్డ్‌ వీడియో.. తప్పయిపోయింది, క్షమించండి: నటుడి కూతురు

  • టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు కోసం హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఆయన సమాధి చుట్టు అడవిలా మారిపోవడంతో రంగంలోకి దిగారు. తన టీమ్‌తో కలిసి దాసరి సమాధి వద్ద క్లీనింగ్‌ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ కూడా తమ టీమ్‌ను పంపింది. దాస‌రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ముళ్ల పొద‌ల‌ను, చెట్ల‌ను తొల‌గించారు. తెలుగు సినిమాకు విశేష సేవలందించిన దిగ్గజ దర్శక, నటుడి సమాధి ఈ స్థితిలో ఉండడంపై సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవలే చేవేళ్లలోని ఆయన సమాధి చుట్టూ చెట్లు మొలిచి ఉన్నాయని ఓ యాంకర్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి, ఎందరికో లైఫ్ ఇచ్చిన దాసరి నారాయణరావు సమాధి ఈ స్థితిలో ఉండటం బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన మంచు మనోజ్ తన టీమ్‌తో కలిసి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ సమాధి పునరుద్ధరణ పనుల్లో గీతా ఆర్ట్స్‌ సైతం పాల్గొంది. ఇవాళ దాసరి వర్ధంతి కావడంతో ఆయనకు నివాళులర్పించారు మంచు మనోజ్. 

     

     

     

  • ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్‌ ఎ‍క్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్‌లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్  ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

    అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్‌ను ఈ సిరీస్‌పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్‌ కూడా రాసుకొచ్చారు.

    'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్‌. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్‌పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు.
     

     

  • చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రముఖ నటుడి కూతురు చేస్తున్న పని అలాగే ఉంది. అసలే ఇది డిజిటల్‌ యుగం. సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్‌ చేస్తుంటారు. అలాంటిది ఒక వీడియోను కావాలనే సబ్‌స్క్రిప్షన్స్‌ మెంబర్స్‌ కోసం పోస్ట్‌ చేయడమేంటో, అది వైరల్‌ అవడంతో తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడమేంటో తనకే తెలియాలి! ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దాం..

    బోల్డ్‌ వీడియో
    మలయాళ నటుడు కృష్ణ కుమార్‌కు నలుగురు కూతుర్లు సంతానం. వీరిలో అహానా, ఇషాని కృష్ణలు యాక్టర్స్‌గా చెలామణీ అవుతున్నారు. దియా, హన్సికలు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఫేమస్‌ అయ్యారు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు పెట్టి సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారి కోసం ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అలా హన్సిక కూడా కాస్త బోల్డ్‌ వీడియో ఒకటి తన సబ్‌స్క్రైబర్ల కోసం పోస్ట్‌ చేసింది. 

    డబ్బు కోసం దిగజారాలా?
    అది కాస్తా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఈ వీడియోకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ.299గా ఉంటే ఆ వీడియో తర్వాత రూ.399గా ధర ఫిక్స్‌ చేసింది. దీంతో డబ్బు కోసం ఇంతకు దిగజారాలా? ఇలాంటి వీడియోలు పెట్టాలా? అని జనం తిట్లదండకం అందుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న హన్సిక.. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఓ లేఖ వదిలింది. 'ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ కింద మూడు వారాల క్రితం ఓ వీడియో షేర్‌ చేశాను. బుద్ధి లేక, నిర్లక్ష్యంగా ఆ పని చేశాను. అందుకు నెల రోజులుగా బాధపడుతున్నాను.

    ఐదు నిమిషాల్లో డిలీట్‌.. అయినా!
    అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్‌ చేశానో నాకే అర్థం కావడం లేదు. తప్పు జరిగిపోయింది. కేవలం పోస్ట్‌ చేసిన ఐదు నిమిషాల్లోనే దాన్ని డిలీట్‌ చేశాను. కానీ, అప్పటికే కొందరు దాన్ని రికార్డు చేసి వైరల్‌ చేశారు. డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు. 20 ఏళ్లకే నా బాగోగులు నేను చూసుకునేంత సంపాదించడం మొదలుపెట్టాను. 

    చాలా భయపడ్డా..
    ఎన్నో ఏళ్లుగా మీరందరూ నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా నేను పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. నేను, నా సోదరి ఏడాదికాలంగా ఓ మ్యూజిక్‌ వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. అందులో నేను యాక్ట్‌ చేశాను. ఈ వివాదం చెలరేగిన మూడు రోజులకే ఆ పాట రిలీజైంది. నా వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు.

    భరించలేకున్నా..
    ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్‌ అయింది నేను, నా కుటుంబం. దీనికితోడు ఆన్‌లైన్‌లో వేధింపులు, విద్వేషపూరిత కామెంట్లు మరింత బాధిస్తున్నాయి. విమర్శించకూడదని నేను అనడం లేదు, కానీ ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. వారి కంటెంట్‌ కోసం నన్ను వాడుకుంటున్నారు. నా బాధ వారికి సంతోషంగా ఉంది. మనుషులు అవతలివారిని ఇట్టే ద్వేషిస్తారని ఈ సంఘటన వల్లే తెలిసొచ్చింది. 

    పూర్తిగా ఎత్తేయాలనుకున్నా..
    నేను సింపతీ కోసం ఇదంతా చెప్పడం లేదు. నా మనసులో భారాన్ని దించుకోవడానికి చెప్తున్నాను. మరి సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎందుకు పెంచావని అడుగుతున్నారు. నిజానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఎత్తేయాలనుకున్నాను. కానీ, దానివల్ల ఈ వివాదం మరింత ముదురుతుందనిపించింది. ఈ సమయంలో కొత్త సబ్‌స్క్రైబర్లను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ధర పెంచాను.

    క్షమించండి
    ఈ వివాదం తర్వాత సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తాను. అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడను. నేను చేసిన పిచ్చి పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు థాంక్స్‌' అని హన్సిక రాసుకొచ్చింది.

     

     

    చదవండి: నాన్న కొడతాడేమోనని భయంతో చెప్పలేదు: రామ్‌చరణ్‌

National

  • కోల్‌కతా: ఈ రోజు పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ అభిషేక్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ స్పందించారు.  

    సోనార్‌పూర్‌లో ఈరోజు (శనివారం) మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ పర్యటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస చెలరేగింది. అందులో  బాధితులైన తృణముల్  పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు దాడి చేశారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మమతా ""పాలకులే హంతకులుగా మారారు.. సిగ్గుపడాలి బీజేపీ" అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. అదే విధంగా దాడిని ఖండిస్తున్నామన్నారు.  గత 15 ఏళ్లుగా టీఎంసీ సాగించిన పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైందన్నారు.

    అయితే ఆ దాడి సమయంలో అభిషేక్‌ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్‌ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 

     

  • భువనేశ్వర్‌: ఒడిశాలోని భువనేశ్వర్‌ పలాసుని వంతెనపై జరిగిన ఓ భయంకర ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన ట్రక్కు.. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన నుంచి వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రీ కుమార్తె కారులో ప్రయాణిస్తుండగా.. వంతెన దాటుతున్న సమయంలో వెనుక నుంచి ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

    ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కును ఆపకుండా డ్రైవర్‌.. కారును రోడ్డుపై అలాగే నెట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇది కారులో తండ్రీకుమార్తెలతో పాటు రోడ్డుపై ఇతర వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.

    ట్రక్కు.. కారును నెట్టుకుంటూ వెళ్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర పరిధిలో తిరిగే భారీ వాహనాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నొక్కి చెప్పారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

    సదరు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరును కచ్చితంగా తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను, అలాగే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగంగా నడుపుతున్నాడా? నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? ఏదైనా మత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

     

  • హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్  దశకు  చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఫైనల్‌ మ్యాచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్‌ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ రైల్వేస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

    మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్‌ ఫైట్‌ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు  తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు ప్రత్యేక ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు నడపనున్నారు.

    ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్‌లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.

    ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్‌లు కూడా ఉంటాయి.

    రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.

    ఫైనల్ మ్యాచ్  ముగిసాక అదనపు సర్వీసులు
    మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.

    ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.

    ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.

    ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

    రైలు ఆగే స్టేషన్లు 
    ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.

    బుకింగ్స్‌  ఎలా అంటే..
    ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా పీఆర్‌ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్‌టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 

    కాగా  టైటిల్‌కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి.  

  • అహ్మ‌దాబాద్‌: దేశం ఎంత పురోగ‌తి సాధించినా ఇంకా అక్క‌డ‌క్క‌డ అంధ‌కార యుగ‌పు ఆన‌వాళ్లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. మూఢ విశ్వాసుల‌ గుడ్డి న‌మ్మ‌కాలకు గ‌రీబులు బ‌లైపోతూనే ఉన్నారు. మూఢ విశ్వాసాల‌కు మూక‌స్వామ్యం తోడుకావ‌డంతో మ‌నుషులు మాన‌వ‌త్వం మ‌రిచిపోతున్నారు. మూఢనమ్మకాలు, గుంపు మనస్తత్వం.. ఒంటరి కుటుంబాలను ఎలా నాశనం చేయగలవో చూపే ఒక భయంకరమైన ఘ‌ట‌న గుజ‌రాత్‌లో వెలుగులోకి వచ్చింది. మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై మూకుమ్మ‌డిగా దాడి చేసి ఒక‌రి ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. మూక దాడి నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునే క్ర‌మంలో ఇంటిపెద్ద క‌డ‌తేరిపోయాడు.

    సబర్కాంత జిల్లా (Sabarkantha district) విజయ్‌నగర్ తాలూకాలోని గడివన్‌కాడ గ్రామంలో ఈ అనాగరిక హ‌త్యోదంతం చోటుచేసుకుంది. మను రామ్‌జీ దామోర్, అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను మంత్ర‌గాళ్ల నెపంతో కొంతకాలంగా గ్రామస్థులు వేధిస్తున్నారు. రామ్‌జీ భార్య‌ను 'మంత్రగత్తెస ముద్ర‌వేసి ఈ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారు. దాడి జ‌రిగిన రోజున, వేధింపులు హింసగా మారాయి. మను భార్యను లక్ష్యంగా చేసుకుని గ్రామస్థుల గుంపొక‌టి వారి ఇంట్లోకి బలవంతంగా చొరబడింది. మూక దాడి నుంచి త‌న భార్య‌ను త‌ప్పించేందుకు ఆమెకు ర‌క్ష‌ణ‌గా నిల‌బ‌డ్డాడు. అత‌డి ఇద్ద‌రు కొడుకులు కూడా త‌మ క‌న్న‌వాళ్ల‌ను కాపాడుకునేందుకు క‌దిలారు. కానీ గుంపు ముందు వారు నిస్స‌హాయులుగా మిగిలిపోయారు.

    12 మంది అరెస్టు
    త‌మ‌కు అడ్డుగా నిలిచిన ఈ ముగ్గురిపై మూఢ‌విశ్వాసులు ప‌దునైన ఆయుధాలతో విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వీరిని పోలీసులు స‌హాయంతో స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తగిలిన గాయాల కారణంగా మను మరణించాడు. మూక దాడి నుంచి భార్యను ర‌క్షించి అత‌డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై చిటోడా పోలీసులు కేసు న‌మోదు చేశారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మంది నిందితుల‌ను అరెస్టు చేశారు.

    నిందితుల్లో న‌లుగురు మ‌హిళ‌లు
    చిటోడా పోలీసులు హత్యతో కూడిన అల్లర్ల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేగంగా స్పందించిన పోలీసులు, స్థానిక క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గంటలోపే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో న‌లుగురు మ‌హిళ‌లు ఉన్నార‌ని మీడియాకు ఖేడ్‌బ్రహ్మ డివిజన్ డీఎస్పీ ఉల్దీప్ నాయి వెల్ల‌డించారు. అరెస్టయిన వారు.. వాల్జీ సాలూజీ దామోర్, జిగ్నేష్ వాల్జీ దామోర్, రోహిత్ రాయ్, జివాజీ సాలూజీ దామోర్, నాగ్జీ సాలూజీ దామోర్, హిరాజీ సాలూజీ దామోర్, విజయ్ హిరాజీ దామోర్, కాంతి సాలూజీ దామోర్, సంగీతా నాగ్జీ దామోర్, అరుణ వాల్జీ దామోర్, శారదా కాంతి దామోర్, సీతా హిరాజ్ అని డీఎస్పీ తెలిపారు. 

    చ‌ద‌వండి: ట్రాఫిక్‌ చలానా ఉంటే పిల్లనివ్వను

  • బెంగళూరు: కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ ఎన్నికయ్యారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కర్ణాటక సీఎల్పీ భేటీ ఆలస్యంగా ప్రారంభమైంది. సమావేశానికి ఆలస్యంగా చేరుకున్న ఆపద్ధర్మ సీఎం సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. డీకే పేరును ప్రతిపాదించిన అనంతరం సిద్ధరామయ్య సమావేశం నుంచి వెళ్లిపోయారు. డీకే శివకుమార్‌,, గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. జూన్‌ 3న సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు.

    మరోవైపు, కొత్తగా ఏర్పడనున్న మంత్రివర్గంలో చోటు కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌ ప్రారంభించారు. చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

    తమ సన్నిహిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు. తమ వర్గానికి అత్యధిక మంత్రి పదవులు దక్కించుకునేందుకు ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈసారి మంత్రివర్గంలో కొత్తముఖాలకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతుందని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో సీనియర్‌ మంత్రులు, ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గీయుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. 40 మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.

     

     


     

  • మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.

    విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. 

    యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?

    ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు.

    " ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.

    అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. 

    ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్‌గేట్' అనే భారీ ఏఐ సూపర్‌ కంప్యూటర్ ప్రాజెక్ట్‌కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.

    మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.

    ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్‌గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్  లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.

    ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్‌లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?

    ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్‌ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.

    మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్‌వేర్లను, టూల్స్‌ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్‌వేర్లు సాఫ్ట్‌వేర్లతో వ్యాపారం చేస్తాయా?

    ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్‌ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?

    సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్‌వేర్‌కు, ప్రతి యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. 

    ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.

    ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. 

    “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.

    ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

    ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.

    అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. 

    "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.

    టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. 

    ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!

    ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. 

    “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.

    ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. 

    మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

    ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. 

    కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.

    అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. 

    "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.  
    - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్‌ ఎడిటర్‌, సాక్షి టీవీ

  • చురు జిల్లా: రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్‌, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్‌ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది. భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. సోషల్‌ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్‌గా మారాయి.

    వీధుల గుండా బలమైన ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి. దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు, దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

    ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు.. ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్‌లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

    ఇసుక తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో  అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

  • న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌, పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)తో సంబంధాలు ఉన్న భారీ ఉగ్రవాద మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం ఛేదించింది. న్యూఢిల్లీలో కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ప్రార్థనా స్థలాలపై దాడులకు కుట్ర పన్నిన ఆరోపణలతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరపాలనే  లక్ష్యంతో పాకిస్థాన్ గూఢచారి వ్యవస్థ ‘ఐఎస్‌ఐ’ ఈ మాడ్యూల్‌ను చాలా కాలంగా అత్యంత జాగ్రత్తగా నిర్మించింది. అరెస్ట్ అయిన వారిలో నేపాల్ మూలాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

    అరెస్ట్ అయిన నిందితులకు పాకిస్థాన్ మద్దతు ఉన్న హ్యాండ్లర్లు, ముంబై అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌కు చెందిన కార్యకర్తలతో కార్యాచరణ సంబంధాలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో బయటపడ్డాయి. నిందితులకు ఢిల్లీలో అధిక ప్రాధాన్యం ఉన్న కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ప్రముఖ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవాలని బాధ్యతలు అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ఆపరేషన్‌లో తుపాకులు, అత్యాధునిక పేలుడు పదార్థాలు, పలు హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం కావడంతో రాజధాని భద్రతకు తక్షణ ముప్పు తప్పింది. ఈ మాడ్యూల్‌కు నిధులు ఎలా చేరాయన్న విషయం, నియామక విధానాలు, రవాణా సహాయక నెట్‌వర్క్‌లపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. అనుమానిత ఉగ్రవాద కుట్రలో భాగమైన హ్యాండ్లర్లు, స్థానిక సహాయకుల పాత్రలపై కూడా దర్యాప్తు అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు.

    ఇదిలా ఉండగా, నెల రోజుల క్రితం దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ నెట్‌వర్క్‌పై భారత భద్రతకు సంబంధించిన సంస్థలు కీలక విజయం సాధించాయి. పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడు మహ్మద్ సలీమ్ డోలాను టర్కీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. 2020 నుంచి పరారీలో ఉన్న డోలాను, ఇస్తాంబుల్‌లోని బేలిక్‌డుజు ప్రాంతంలోని ఓ నివాసంలో ఆపరేషన్ ద్వారా ఇస్తాంబుల్ పోలీసు శాఖ నార్కోటిక్స్ క్రైమ్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిపై బహిష్కరణ ప్రక్రియ చేపట్టారు.

    అతడు ఢిల్లీ టెక్నికల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. 2023 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై కేసుతో సంబంధంగా అతడిని ముంబైకి తరలించేందుకు కోర్టు ఎన్‌సీబీకి 2 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ అయింది.

    ముంబైలోని కుర్లా ప్రాంతంలో పట్టుబడిన సహచరులు డోలా నుంచి ఆదేశాలు అందుకున్నట్టు అంగీకరించారని, దాని ఆధారంగా 126 కిలోగ్రాములకు పైగా మెఫెడ్రోన్, రూ.25,22,000 స్వాధీనం చేసుకున్నారని దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలో జరిగిన ఉన్నతస్థాయి చర్యలకు ఈ పరిణామం అనుసంధానమై ఉంది.

    దావూద్ అంతర్జాతీయ మాదకద్రవ్య సామ్రాజ్య నిర్వహణలో డోలా కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. పశ్చిమ ఆసియా, యూరప్ మార్గాల ద్వారా డీ-కంపెనీ అక్రమ సరుకులను సరిహద్దులు దాటి ఎలా తరలిస్తోంది? మాదకద్రవ్యాల డబ్బును సంఘటిత నేరాలకు మళ్లించేందుకు ఉపయోగించే హవాలా మార్గాలు ఎలా పనిచేస్తున్నాయి? ముంబైతో పాటు పొరుగు రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉన్న స్లీపర్ సెల్స్, పంపిణీదారులు ఎవరు అన్న విషయాలపై అతడి కస్టడీ కీలక సమాచారం అందిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

  • కనిపెంచిన తల్లిదండ్రులు,తోబుట్టువులు, భార్యాబిడ్డలు.. ఇలా అందర్నీ మరిచి, జీవితంమీద ఆశ కోల్పోయి తీసుకునే నిర్ణయమే ఆత్మహత్య. కానీ అంత నిస్సహాయ స్థితిలో తన ప్రాణాలు తీసుకునే చివరి క్షణాల్లో కూడా జరగబోయే ప్రమాదాన్ని గమనించి, తన కుటుంబం, ముఖ్యంగా చిన్న కూతురు మాన్వి, ఇతరులు క్షేమంగా కూడా  ఉండాలని ఆయన ఆలోచించిన తీరు అందరినీ కదిలిస్తోంది.  

    గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఈ  విషాద ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  అయితే చనిపోయే తలుపుపై రాసిన చివరి లేఖ  మాత్రం  అందర్ని కదిలించింది.


    ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు, ఆ వ్యక్తి తన ఫ్లాట్ తలుపుపై ఇంగ్లీష్‌లో ఒక హెచ్చరిక లేఖను అంటించాడు. అందులో "సెల్ఫాస్ (Celphos), విషవాయువు, మాస్క్ ధరించండి, నీళ్లు తాగొద్దు" అని రాసి ఉంది. ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ విషవాయువు వల్ల ముఖ్యంగా తన చిన్న కూతురు మాన్వి, కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోఆయన ఈ హెచ్చరిక చేశాడు.'సెల్ఫాస్' అనేది అత్యంత విషపూరితమైన క్రిమిసంహారక మందు.

    మృతుడు పంకజ్ భన్సాలీ (42) గాంధీనగర్‌లోని కుడసన్ ప్రాంతంలో గల పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్‌లో నివసించేవాడు. ఇన్‌ఫోసిటీలోని ఒక స్టాక్ మార్కెట్ సంస్థలో పనిచేసే ఆయన, దాదాపు ఐదు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. ఉద్యోగం పోవడంతో పాటు అప్పులు, నష్టాల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. 

    పంకజ్ భన్సాలీ భార్య, కూతురు మే 13న పుట్టింటికి వెళ్లారు. భార్యాభర్తలు చివరి సారిగా మే 22న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బంధువులు మే 27న ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. మే 22న లేదా  ఆ తరువాత గానీ భన్సాలీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల పాటు మృతదేహం మూసి ఉన్న ఇంట్లోనే ఉండటం వల్ల పూర్తిగా కుళ్ళిపోయింది.

    ఇన్‌ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలం నుండి విషపూరిత క్రిమిసంహారక మందును స్వాధీనం చేసుకుని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

  • రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్‌ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.

    రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. 

    మృతులను మాజీ సర్పంచ్‌ రామ్‌సింగ్‌ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్‌ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.

    ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్‌సింగ్‌ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్‌తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్‌ఫార్మెన్స్‌పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.

    అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్‌మెంట్‌ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్‌సింగ్‌ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు,  ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అసలు విషయం బయటపడింది.

    పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్‌ కొడుకు కలిసి.. తొలుత రామ్‌సింగ్‌ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్‌సింగ్‌ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.

    అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ఆధారాలు, మొబైల్‌ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్‌ ఎస్పీ హర్షవర్ధన్‌ అగర్వాల్‌ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.

    ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్‌కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. 

    నెలల తరబడి ఎదురు చూసి..
    పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్‌ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

Andhra Pradesh

  • న్యూఢిల్లీ: దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో కొనసాగిస్తూ వారికి రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. మతం మారినంత మాత్రాన శతాబ్దాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోదని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా తేల్చిచెప్పాయని గుర్తు చేసింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేర‌కు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జస్టిస్‌ కే.జి. బాలకృష్ణన్‌ కమిషన్‌కు శ‌నివారం వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

    వినతిపత్రం సమర్పించిన అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీరాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు, ఎంపీలు డాక్టర్‌ ఎం. గురుమూర్తి, గొల్ల బాబూరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌, ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడారు. దళిత క్రైస్తవుల విషయంలో వివక్షత కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సిక్కులు, బౌద్ధులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లే దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు కూడా అదే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్‌ మిశ్రా తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు.

    ప్రెస్‌మీట్‌లో వైఎస్సార్‌సీపీ ప్ర‌తినిధులు ఏమ‌న్నారంటే..వారి మాట‌ల్లోనే

    దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి  
    వైఎస్సార్‌సీపీఅధ్యక్షుడు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌కు ఈ రోజు వినతిపత్రం సమర్పించాం. ప్రస్తుతం సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. గతంలో నియమించిన పలు కమిషన్లు మతం మారినంత మాత్రాన సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కమిషన్‌ను కోరాం. 

    కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో సానుకూల సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశాం. ఈ అంశం రాజకీయాలకు అతీతమైనది. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిజమైన అర్హుల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా విషయంలో వైఎస్సార్‌సీపీచిత్తశుద్ధితో వ్యవహరించింది. 2023 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తీర్మానానికి, దళితుల హక్కుల పరిరక్షణకు మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.

    దళితుడు ఏ మతంలో ఉన్నా దళితుడే: గొల్ల బాబూరావు
    దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక వాస్తవికత మారదు. మతం ఆధారంగా దళితుల హక్కులను నిరాకరించడం సరికాదు. అందువల్ల దళితులు ఏ మతంలో ఉన్నా వారికి ఎస్సీ హోదా కల్పించాల్సిందే. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

    మత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు: జూపూడి ప్రభాకర్‌రావు
    దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తూ వారిని బీసీసీ వర్గంలోకి నెట్టివేసే ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీతీవ్రంగా ఖండిస్తోంది. దళిత క్రైస్తవులు ఏ మతంలో ఉన్నా వారి సామాజిక వాస్తవికత మారదు. అందువల్ల వారిని ఎస్సీలుగానే పరిగణించాలన్నదే మా పార్టీ స్పష్టమైన వైఖరి. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించింది. ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు ఉన్నప్పుడు, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినందుకు మాత్రమే ఎస్సీ హోదా నిరాకరించడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. మతం మారినా కుల వివక్ష పోవడం లేదని కాకా కాలేల్కర్ కమిషన్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సహా పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి. దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. 

    రెండు గ్లాసుల విధానం, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదు. అలాంటప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అదే వైఖరికి వైఎస్సార్‌సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీనిరంతరం పోరాడుతుంది. బాలకృష్ణన్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా సానుకూల సిఫార్సులు చేయాలి. దళితుల హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము ప్రతిఘటిస్తాం. అవసరమైతే పార్లమెంట్ వేదికగా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.

    దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం:మేరుగు నాగార్జున 
    దళిత క్రైస్తవులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీఈ రోజు పోరాటం చేస్తోంది. దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసిన పలు కమిషన్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని స్పష్టంగా సూచించాయి. సిక్కులు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగిస్తున్నట్లుగానే, దళిత క్రైస్తవులకు కూడా అదే హక్కులు కల్పించాలి. దళితులపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజల్లో ఆందోళన ఉంది. చర్చిలపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 

    దళిత సంక్షేమాన్ని ఆకాంక్షించే నాయకుడిగా వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్ 24న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి వైఎస్సార్‌సీపీఇప్పటికీ కట్టుబడి ఉంది. దళితుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన చర్య అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దళితులు, క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది. దళిత క్రైస్తవుల పక్షాన వైయస్ జగన్ గారు దృఢంగా నిలబడతారని స్పష్టం చేస్తున్నాం.

    దళితుల పక్షాన నిలిచిన నాయకుడు జగన్: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్  
    దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో దళితుల హక్కులపై కుట్ర జరుగుతోందనే ఆందోళన కలుగుతోంది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితా నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుట్టుకతో వచ్చిన కులాన్ని మత మార్పిడితో మార్చలేమనే వాస్తవాన్ని గుర్తించాలి. మతం మారినా సామాజిక వివక్ష, వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉందని గతంలో నియమించిన పలు కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయి.  సిక్కు, బౌద్ధ మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగుతుంటే, దళిత క్రైస్తవుల విషయంలో మాత్రమే భిన్నమైన వైఖరి అవలంబించడం సమంజసం కాదు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని గతంలో నియమించిన కమిషన్లు సిఫార్సు చేశాయి. 

    అయినప్పటికీ మరోసారి ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు మారిపోలేదు. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష, వెలివేత, అనేక రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులను కాలరాయడం సరికాదు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీనిరంతరం పోరాడుతోంది. 2023లో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి మా పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉంది.  దళితులకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీపెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉంటుంది. దళిత క్రైస్తవుల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన పరిష్కారం సాధిస్తాం. దళితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ, వైయస్ జగన్ గారు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు.  

    ఎస్సీ హోదా లేదనడం వివక్షతకు నిదర్శనం: అరుణ్ కుమార్ 
    దళితులు ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతంలోనే ఉండాలని, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదని చెబుతున్నారు. అయితే బౌద్ధం, సిక్కు మతాలను స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ హోదా కొనసాగిస్తున్నారు. ఈ భిన్నమైన వైఖరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవుల విషయంలో సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కమిషన్ ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్రైస్తవ మతంలో కులం లేదని, అంటరానితనం లేదని చెప్పడం ద్వారా భారతీయ సామాజిక వాస్తవాలను విస్మరిస్తున్నారు. మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష, వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోవడం లేదనేది వాస్తవం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న అంశంపై వైయస్ జగన్ గారి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీప్ర‌భుత్వం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. 

    ఎస్సీ హోదా కోసం ఐక్య పోరాటం:  నందిగామ సురేష్ 
    మతం మారిన కారణంతో దళితులకు ఎస్సీ హోదా నిరాకరించడం అన్యాయం. దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారి సామాజిక పరిస్థితులు, వివక్షకు గురయ్యే వాస్తవాలు మారవు. అందువల్ల దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాల్సిందే. దళితుల హక్కుల అంశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్న ఎస్సీ నాయకులు ఈ విషయంపై కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. పదవుల కోసం మౌనం పాటించకుండా దళిత సమాజం తరఫున గొంతెత్తాలి. దళితుల సమస్యలు, హక్కుల అంశాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమవడం సరైంది కాదు.  దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా ప్రజలు ప్రశ్నించాలి. సమాజంలో సంపద, అవకాశాలు, హక్కులు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు పనిచేయాలి. దళితులకు న్యాయం జరిగే వరకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించే వరకు అందరం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు.

  • తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

    ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు, కలిసివచ్చే రాజకీయ పార్టీలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. డీఎస్సీ అంశంపై పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింతగా తీసుకెళ్లాలి. 

    దీనిపై పార్టీ కమిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తీర్మానాలు చేసి వాటిని డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సర్వే ప్రారంభమయ్యేలోగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ అంశంపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి’’ అని చెప్పారు. 

  • సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్‌ఈఆర్టీలో పనిచేసే నవీవ్‌కి టాప్ ర్యాంక్‌పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్‌ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్‌కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.

    నవీన్ లాగిన్‌ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా  కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్‌.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.

    స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్‌ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై  ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు.

  • కర్నూలు:  జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు.  వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. 

    అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. దాంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. 

    గల్లంతైన వారిలో ఇద్దకు హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర, సతీష్‌లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది.  వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది.  మిగతా వారి కోసం పోలీసులు, మత్య్సకారులు గాలిస్తున్నారు. 

  • వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు నాయుడు ఈ రెండేళ్లలో ఏపీని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. సంపద సృష్టించి దాన్ని పేద ప్రజలకు పంచుతానన్న మాట గాలిమాటగా మిగిలిపోయిందని విమర్శించారు.

    రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వ వైఫల్యాలపై మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెద్ద ఎత్తున జూన్‌ 4 నుంచి నిరసన కార్యక్రమాలు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు మళ్లీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ తెరమీదకు తెచ్చారు. దీనిలో భాగంగానే పాత కథనే.. మళ్లీ లిక్కర్‌ స్కాం అంటూ తెరమీదకు తెచ్చారు. వైఎస్‌ జగన్‌ను నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

    అసలే స్కామే లేనిచోట స్కాం అంటారు.. సంబంధం లేని వారినందరినీ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ ఆధారం లేకపోయినా చంద్రబాబు నియమించిన సిట్‌ ఏదో ఒక విధంగా మావాళ్లను ముద్దాయిలుగా చూపించి జైలుకు పంపింది. మిథున్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి అందరికీ బెయిల్‌ వచ్చింది. చంద్రబాబు  నమ్మదగిన మిత్రుడు కాదని, ఇన్‌స్టాంట్‌ కాఫీ లాంటివాడేనని పవన్‌ కల్యాణ్‌కు అమిత్‌ షా స్పష్టంగా చెప్పారు.

    వైఎస్‌ జగన్‌ దీర్ఘకాలికంగా స్నేహం చేయడానికి అర్హత కలిగిన వ్యక్తి అని అమిత్‌ షా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకులందరూ మనకు వ్యతిరేకులు కానవసరం లేదని ఆయన చెప్పి పంపించారు. వైఎస్‌ జగన్‌తో ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో వారందరికీ నోటీసులిచ్చి విచారణ పేరుతో వేధిస్తూనే ఉన్నారు. 

    వ్యాపారంలో రూ.19 కోట్ల  బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా లావాదేవీలు జరిగితే ఏ రకంగా అది లిక్కర్‌ స్కాంకు సంబంధం? కేఎన్నార్‌ 2007 నుంచీ ఇన్‌కం టాక్స్‌ చెల్లిస్తూ ఉన్నారు. ఆయన ఆర్ధిక లావాదేవీలన్నీ లీగల్‌గానే ఉంటాయి. ఎవరైనా చూసుకోవచ్చు. కేఎన్నార్‌ బాద్యత ఏంటి..? అతని స్థాయి ఏంటి..? దీనిలో అతనికి ఏం సంబంధం..? చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ లక్షల కోట్లకు ఏ విధంగా అధిపతి కాగలిగారు? రెండెకరాల నుంచి రూ.లక్ష కోట్లకు చంద్రబాబు అధిపతి అయినప్పుడు కేఎన్నార్‌ లాంటి వారు రూ.20 కోట్లు సంపాదించడం తప్పా..? 

    పచ్చళ్లు అమ్ముకున్న రామోజీరావు...ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రామోజీరావు చిట్‌ఫండ్‌ పేరుతో ఖాతాదారుల సొమ్ముతో వ్యాపారాలు చేయలేదా? సైకిల్‌పై కిరసనాయిల్‌ అమ్ముకునే రాధాకృష్ణ ఇవాళ కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? రాదాకృష్ణకు ఫిలిమ్‌ నగర్‌లో ఉన్న బిల్డింగు చూస్తే ప్రజలు అవాక్కవుతారు. 

    గెట్ అవుట్! చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన అమిత్ షా?

    హైటెక్‌ సిటీలో తాడు బొంగరం లేని వాళ్లు కూడా వందల ఎకరాలు ఎలా కొనుగోలు చేశారు..?  టీవీ5 నాయుడు ఎక్కడ ప్రారంభం అయ్యారు..ఇప్పుడు ఎక్కడున్నారు..? ఇప్పుడు కేఎన్నార్‌ను ఈ డబ్బు ఎలా వచ్చిందని అడిగే సిట్‌ అధికారులు చంద్రబాబు అండ్‌ కోను కూడా ఇలానే ప్రశ్నిస్తారా? పీఏల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసే సంస్కృతి జగన్‌కు లేదు. ఇప్పటి వరకు లిక్కర్‌ స్కాం విచారణలో ఏ సాక్ష్యమే మీదగ్గర లేదు’’ అని అన్నారు.  

  • ఏలూరు:  వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి నేతల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది.  ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్సార్‌సీపీ నేత సాంబశివరావుపై టీడీపీ నేతలు దాడికి దిగారు. సాంబశివరావుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు టీడీపీ నేతలు. 

    సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని సాంబశివరావుపై దాడి చేశారు కూటమి నేతలు. గాయపడిన సాంబశివరావును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పరామర్శించారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ తరహా దాడులు చేస్తారా అంటూ మేకా ప్రతాప్‌ ప్రశ్నించారు. 

    దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో
  • సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

    కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జూన్‌లోనూ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అంచనా వేసింది. ఏపీతోపాటు యూపీ, హరియాణా, పంజాబ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పుల రోజులు నమోదవుతాయని.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

    దేశవ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని.. ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువని తాజా అంచనాలో పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడటంతో మధ్యభారత్‌ సహా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు, దేశ వాయవ్య ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

  • సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. దొంగపిండి గ్రామం వద్ద వంతెన కూలిపోయింది. ఇసుక లారీ వెళ్తుండగా వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్‌ బయటపడ్డారు. గ్రామానికి ఇదే ఏకైక మార్గం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దొంగపిండి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

     

  • తూర్పుగోదావరి (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్‌ అనిపించుకున్నారు. మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. 

    ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్‌ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులోని అడ్రస్‌కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్‌ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్‌ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు.  

Business

  • దేశీయంగా ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్‌ సంస్థ ప్రాక్సిస్‌ గ్లోబల్‌ అలయన్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది.

    సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్‌రైటింగ్‌ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్‌ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్‌ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు తమ పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది.

    కస్టమర్లు కూడా కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉండొచ్చని, కాకపోతే కంపెనీలు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్‌ తెలిపింది. అలాగే క్లెయిమ్స్‌ను సత్వరం సెటిల్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొంగొత్త నిబంధనలు, బీమా సుగమ్‌లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల వల్ల కస్టమర్లతో కంపెనీలు నేరుగా కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని వివరించింది. సొంతంగా కస్టమర్లను నిలుపుకోగలిగే కంపెనీలే భవిష్యత్తులో రాణించగలవని ప్రాక్సిస్‌ తెలిపింది. 

    చ‌ద‌వండి: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లాభం రెట్టింపు

  • ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. విమానాల వల్లే సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోగలుగుతున్నాం. ఏ రంగమైనా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది. మరి ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలుఏంటి? ఒక ఎయిర్‌లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు.

    ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలు
    ప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి అంటే.. బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి అదనపు లగేజ్ చార్జీలు ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్ కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్‌ఫ్లైట్‌ వైఫై లేదా ప్రీమియం సేవలు అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్‌పోర్ట్ చార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తుంటాయి.

    ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..
    ఉదాహరణకు.. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప‍్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ బస్ A380 ఒక సింగల్ ఫ్లైట్ లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం 7 గంటలు పడుతుందనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం.. ఈ ఫ్లైట్ మొత్తం మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం అక్షరాల ఒకటిన్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా.. 76 బిజినెస్ క్లాట్స్ ప‍్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 లాక్స్ ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ  ప్యాసెంజర్ సీట్స్ ఉంటాయి.

    అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. వాళ్ల నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం 1/2 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్ గా చూసుకున్నట్లయితే వీళ్లకి రూ.3.16 కోట్లు. అలాగే మన కార్గో చార్జీలు అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా వాళ్లకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గర దగ్గరగా 3.83 కోట్ల వరకు వస్తుంది.

    ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు?
    ఒకవేళ ఈ ఫ్లైట్ నే తీసుకుందాం A380.  ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా.. ఒకవేళ 2600 గలోన్స్ ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్ కి కావాల్సింది 27600 గెలోన్స్ దీనికి కాస్ట్ ఎంత పడుతుందనుకుంటున్నారు? నియర్లీ 60,000 డాలర్.. అంటే అక్షరాల రూ.57 లక్షలు అవుతుంది. 

    మరి ల్యాండింగ్  ఫీస్ సెక్యూరిటీ బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటికి కూడా 12.45 లక్ష అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీస్ ఉంటుంది 11.5 లాక్స్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్ లో మరి వాటికి కూడా వాళ్లకు కూడా చార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్ లో 22 ఫ్లైట్ అటెండెన్స్ ఉంటాయి. అంటే 22 ఫ్లైట్ అటెండెన్స్ ప్లస్ఫోర్ పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్లకి కూడా శాలరీస్ ఉంటాయి. 

    మరి దానికి ఖర్చు రూ.14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టం మెయింటనెన్స్ కాస్ట్‌లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు రూ.4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. 

    వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్ గా వెళ్తుంటే రూ.2.35 క్రోర్స్ వరకు వాళ్లకు ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగాలు కోట్ల రూపాయల బిజినెస్, బారి ప్లానింగ్ తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా...

  • హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎలక్ట్రిక్‌ వాహనాల దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రూ. 51 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 24 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఇక ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 438 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 29 శాతం పెరిగి రూ. 139 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 1,802 కోట్ల నుంచి రూ. 2,312 కోట్లకు ఎగిసింది.

    ఒక్కో షేరుపై కంపెనీ 15 శాతం (రూ. 0.60) మేర తుది డివిడెండు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 32 శాతం అధికంగా 1,280 ఈవీలను డెలివర్‌ చేసింది. 10,161 ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆర్డర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఆదాయాలు, లాభదాయకత, పటిష్టమైన ఫండమెంటల్స్‌ తదుపరి దశ వృద్ధికి పటిష్టమైన పునాదులుగా నిలుస్తాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ మహేష్‌ బాబు చెప్పారు. 

    చ‌ద‌వండి: టెస్లా నుంచి మ‌రో కొత్త కారు.. ఇదే అత్యంత చౌక‌

  • న్యూఢిల్లీ: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా శుక్రవారం భారత్‌లో ‘2026 మోడల్‌ వై ప్రీమియం’ (రియర్‌ వీల్‌ డ్రైవ్‌) వేరియంట్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.50.89 లక్షలుగా నిర్ణయించింది. దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు విడుదలైన టెస్లా కార్లలో ఇదే అత్యంత చౌకైనది.

    ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీ ‘మోడల్‌ వై’ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త వేరియంట్‌లో పలు హార్డ్‌వేర్‌ అప్‌గ్రేడ్‌లు, మెరుగైన ఇంటీరియర్‌ ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సున్నా నుంచి 100 కి.మి. వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

    డెలివరీలు జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని షోరూమ్‌లు, సరీ్వస్‌ సెంటర్లు, చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పా టుకు పెట్టుబడులు కొనసాగిస్తామని టెస్లా సీనియర్‌ డైరెక్టర్‌ ఇసాబెల్‌ ఫాన్‌ తెలిపారు.

    •     పశ్చిమాసియా సంక్షోభం, ఇతరత్రా విదేశీ షాక్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీని తీవ్రత మన కళ్ల ముందు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వల తగ్గుముఖం, దిగుమతుల భారం, రూపాయి పతనం, ఎరువుల రాయితీలు భారీగా ఎగబాకడం, పెట్రో ధరల పెంపు వంటివి చూస్తున్నాం. అయితే, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందన్నదే అసలు ప్రశ్న.

    •     విదేశీ షాక్‌ల విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సరైన దిశలోనే ఉన్నాయి. పలు రంగాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిరావచ్చు.

    •      అయితే, కొంతమంది భయాందోళనలకు గురిచేస్తున్నట్లుగా మన ఎకానమీలో ఏదో సంక్షోభం నెలకొందని అనిపించడం లేదు. చాలా పటిష్టంగానే ఉందని భావిస్తున్నా. గత మూడేళ్లుగా జీడీపీ సగటున 7.3% వృద్ధి చెందింది. మూడేళ్లలో ద్రవ్యోల్బణం సగటున సుమారు 4.3%గా నమోదైంది. కరెంట్‌ ఖాతా లోటు కూడా జీడీపీలో 1% పరిధిలోనే కొనసాగింది.

    •   ఆర్థిక వ్యవస్థలో కొత్తగా నిర్మాణాత్మక సమస్యలేవీ లేవు. మన శ్రామిక శక్తిలో ఇప్పటికీ 46% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. పట్టణీకరణ వేగం పుంజుకోవడం లేదు. రాబోయే దశాబ్దంలో వీటిని చక్కదిద్దాల్సి ఉంది.

    •   విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయన్న విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి కీలకమైన స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (గ్రాస్‌ ఎఫ్‌డీఐలు) చాలా బలంగా ఉన్నాయి. 2024–25లో ఇవి 81 బిలియన్‌ డాలర్లు కాగా, 2025–26లో 94 బిలియన్‌ డాలర్లు. సమస్యేమిటంటే, విదేశీ ఇన్వెస్టర్లు గతంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల గతేడాది సుమారు 20 బిలియన్‌ డాలర్లు వెనక్కి వెళ్లాయి. అలాగే, విదేశీ పరిణామాల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి.

    •   భారత్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూల దృక్పథం మారలేదు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సంస్కరణల్లో చాలా వరకు పూర్తయ్యాయి. అయితే, నియంత్రణపరమైన కొన్ని అడ్డంకులు ఇంకా కొనసాగుతున్నాయి. న్యాయపరమైన సంస్కరణలల్లో పెద్దగా పురోగతి లేదు. రాబోయే దశాబ్దాల్లో వీటితో సహా మరిన్ని భారీ సంస్కరణలు అవసరం.

    •      ప్రధాని పొదుపు చర్యలను ఒక నైతిక సూచనగానే చూడాలి. అయితే, వీటిని ప్రభుత్వాలు ఆచరించి ఆదర్శంగా నిలవాలన్న వాదనతో ఏకీభవిస్తున్నా.

    •      ముఖ్యంగా ఉచిత పథకాలను ఎడాపెడా ఇవ్వడం మంచిది కాదు, కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి మినహాయింపు. కోవిడ్‌ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గానే ఉంది. రానున్న కాలంలో కేవలం ఉచితాలతోనే ఎన్నికల్లో గెలవలేమని రాజకీయ పార్టీలన్నీ గ్రహిస్తాయని భావిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని ఆపడం సాధ్యం కాదు. మెరుగైన పాలన, సేవలతోనే విజయం లభిస్తుంది. కాలక్రమేణా ఉచిత పథకాలు వాటంతటవే కనుమరుగవుతాయి.

    •     పశ్చిమాసియా సంక్షోభం నేడోరేపో ముగిసినా చమురు సరఫరా వ్యవస్థ మునుపటి స్థాయికి చేరడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది(2026–27) అర శాతం తగ్గి 6.5 శాతానికి చేరవచ్చు. ఒకవేళ ఏడాదంతా ఉద్రిక్తతలు కొనసాగితే 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

    – డా. అరవింద్‌ పనగారియా, ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ 

  • న్యూఢిల్లీ: సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితుల దన్నుతో 2030 నాటికి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) ఆదాయం అనేక రెట్లు పెరగనున్నట్లు మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ వార్షిక నివేదికలో తెలిపింది. 2025–26లో కంపెనీ ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లు దాటినట్లు వివరించింది. నిత్యావసరాలు, పానీయాల విక్రయాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది.

    అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండెడ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్య సాకారం దిశగా ఆర్‌సీపీఎల్‌ ఇకపైనా ఇతర సంస్థలు, బ్రాండ్స్‌ కొనుగోళ్లను కొనసాగిస్తుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివరించింది. 2025 డిసెంబర్‌ 1న రిలయన్స్‌ రిటైల్‌ నుంచి విడగొట్టిన ఆర్‌సీపీఎల్‌ ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. 

  • భానుడి భగభగలతో మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు, అలాగే పండ్లు, కూరగాయలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లు రోజుకు 24 గంటల పాటు నిరంత రాయంగా పనిచేస్తుంటాయి. అయితే, చాలా ఇళ్లలో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో కూలింగ్ తగ్గడం, అదే సమయంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫ్రిజ్ లోపల కంప్రెసర్‌పై అదనపు భారం పడి, విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధన సామర్థ్య బ్యూరో నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్రిజ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కరెంట్ బిల్లును 25 శాతం వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

    చేయకూడని పొరపాట్లు ఇవే..

    వేసవిలో చల్లటి నీటి కోసం ఇంట్లో పిల్లలు, పెద్దలు తరచూ ఫ్రిజ్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి, గదిలోని వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఫ్రిజ్ మళ్లీ చల్లబడటానికి కంప్రెసర్ ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైన వస్తువులను ఒకేసారి బయటకు తీయడం అలవాటు చేసుకోవాలి. వండిన అన్నం, కూరలు లేదా పాలు పూర్తిగా చల్లారక ముందే నేరుగా ఫ్రిజ్‌లో పెట్టడం చాలా మందికి అలవాటు. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. దాన్ని సమం చేయడానికి యంత్రంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే ఏ పదార్థమైనా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపల ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం నుంచి వెలువడే వేడి గాలి బయటకు పోవడానికి తగినంత స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ త్వరగా వేడెక్కి కూలింగ్ తగ్గిపోతుంది. అందుకే ఫ్రిజ్‌ను గోడకు కనీసం 4 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఫ్రిజ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అన్ని అరలకు సమానంగా కూలింగ్ అందదు.

    ఫ్రిజ్ లోపలి భాగంతో పాటు వెనుక వైపు ఉండే కాయిల్స్, వెంట్లను కూడా శుభ్రం చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోతే హీట్ ఎక్స్ఛేంజ్ సామర్థ్యం తగ్గి, కరెంట్ ఎక్కువగా కాలుతుంది. నెలకు ఒకసారైనా వెనుక భాగాన్ని శుభ్రం చేయడం మేలు.  ఫ్రిజ్ తలుపునకు ఉండే రబ్బరు పట్టీ అంటే గాస్కెట్ వదులైనా లేదా దెబ్బతిన్నా లోపలి చల్లదనం నిరంతరం బయటకు లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా లాక్ అవ్వడం లేదని గమనిస్తే వెంటనే గాస్కెట్‌ను మార్చడం ఉత్తమం. ఫ్రిజ్‌ను ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ వంటి వేడి వస్తువుల పక్కన పెట్టకూడదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిజ్ డోర్‌ను అస్సలు తెరవద్దు. దీనివల్ల లోపల దాదాపు గంటల తరబడి చల్లదనం అలాగే ఉంటుంది. ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవడానికి 'ఆటో డీఫ్రాస్ట్' ఫీచర్‌ను ఉపయోగించాలి. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లును మరింతగా తగ్గించుకోవచ్చు.

  • న్యూఢిల్లీ: ఆర్థిక విధానాలు .. బడ్జెట్‌ ప్రతిపాదనల రూపకల్పనకు, పశ్చిమాసియా సంక్షోభంపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోతగిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, పరిశ్రమ క్లస్టర్లను సందర్శించడంపై కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

    దీని ప్రకారం ఆర్థిక శాఖలోని అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేదా డైరెక్టర్‌ సారథ్యంలో అయిదుగురు వరకు సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు భారీ, మధ్య, చిన్న తరహా తయారీ యూనిట్లను సందర్శిస్తాయి. వివిధ రంగాలవ్యాప్తంగా విధానాలు, నిర్వహణపరమైన సవాళ్లను పరిశీలిస్తాయి. మౌలిక సదుపాయాలు, రెగ్యులేటరీ అవరోధాలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, నిధుల లభ్యతపరమైన సవాళ్లు, నైపుణ్యాల్లో కొరత, సాంకేతికత వినియోగం మొదలైన అంశాలు వ్యాపారాలపై చూపుతున్న ప్రభావాల గురించి నేరుగా తెలుసుకుంటాయి.

    ఒక్కో విడతలో కనీసం రెండు స్టార్టప్‌లతో పాటు తయారీ, ఇన్‌ఫ్రా, పరిశోధనలు తదితర రంగాల సంస్థలను సందర్శించి, పరిస్థితుల గురించి బృంద సభ్యులు తెలుసుకుంటారు. కొన్ని రంగాలపై ప్రభుత్వం గణనీయంగా వ్యయం చేస్తున్నప్పటికీ, వివిధ కారణాలరీత్యా ప్రైవేట్‌ పెట్టుబడులు ఇంకా పుంజుకోవడం లేదు. పశి్చమాసియా సంక్షోభం వల్ల రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్‌ రేట్లు పెరగడం తదితర సవాళ్లు వీటికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

  • ఐటీ ఉద్యోగాలు పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి జీతం వస్తున్నా తాము పడే ఇబ్బందులు, పని ఒత్తిడి అంతా ఇంతా కాదని చాలా మంది ఐటీ ఉద్యోగులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసిన మహిళ తీసుకున్న విలక్షణ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యాలయ ఉద్యోగంలోని తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన ఆమె చివరకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

    ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం

    సుమారు 9 ఏళ్లు చేసిన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆమె.. ఆ తర్వాత  ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తనకు నచ్చిన సమయాల్లో పని చేసుకునే స్వేచ్ఛ లభించడంతో పాటు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించగలిగింది. ప్రస్తుతం తాను నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతోంది.

    సోషల్ మీడియాలో వైరల్

    ఈ మహిళ కథను మరో మహిళా ఎంట్రప్రెన్యూర్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేయగా విస్తృత చర్చకు దారితీసింది. సాంప్రదాయ కెరీర్‌ను వదిలి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చే వృత్తిని, అది కూడా పురుషాధిక్యత ఉండే పనిని ఎంచుకోవడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం అంటే కేవలం అధిక జీతమే కాదని, జీవన నాణ్యత కూడా ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ఐటీ ఉద్యోగుల స్పందన

    ఈ కథకు స్పందించిన ఓ ఐటీ ఉద్యోగి, “18 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నా ఇప్పటికీ అంతులేని మీటింగ్‌లు, గంటల తరబడి కొనసాగే కాల్స్, అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో కొనసాగాలంటే ఎంతో సహనం, మానసిక స్థైర్యం అవసరమని పేర్కొన్నారు.

    ఆమె గతంలో సంపాదించిన ఆదాయంతో మంచి సేవింగ్స్‌ చేసి ఉండవచ్చని మరో నెటిజన్  అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం సరళమైన, ప్రశాంతమైన జీవితం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. చివరికి ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతేనని వ్యాఖ్యానించారు.

    ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా నెటిజన్లు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే ఉద్యోగాన్ని వదిలి ఆటో రిక్షా నడపడం ప్రారంభించాడని, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఐదు ట్రక్కుల యజమానిగా ఎదిగాడని తెలిపారు. రూ.5 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ ఇప్పటికీ ఆటో నడుపుతుండటం అతని వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: రియల్టీ ఆస్తుల నుంచి మెరుగైన రిటర్నులను సాధించాలని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ చూస్తోంది. ఇందుకుగాను విడిగా అనుబంధ సంస్థ ఏర్పాటు అవకాశాలను అన్వేషిస్తోంది. భారీగా ఉన్న ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తాజా ప్రణాళికలకు తెరతీయనుంది. కంపెనీ ఆస్తుల కనీస విలువ రూ. 60,000 కోట్లుగా అంచనా వేసింది.

    కార్యకలాపాల నిర్వహణలో భాగంగా గత 7 దశాబ్దాలుగా రియల్టీ ఆస్తులను సమకూర్చుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ ఆర్‌.దొరైస్వామి పేర్కొన్నారు. వెల్లడించారు. సొంత వినియోగంతోపాటు రిటర్నులకు వీలున్న పెట్టుబడి వ్యూహాలతోనూ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కంపెనీ మొత్తం రియల్టీ పోర్ట్‌ఫోలియోపై పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టినట్లు తెలియజేశారు.

    తద్వారా కంపెనీకి లభిస్తున్న రిటర్నులు, ఆర్జన(ఈల్డ్స్‌)ను సమీక్షించడంతోపాటు.. మరింత మెరుగైన రిటర్నులకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు వివరించారు. అటు పాలసీదారుల రిటర్నులను పెంచడంతోపాటు.. ఇటు సంస్థ లాభదాయకతను మెరుగుపరిచే లక్ష్యం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నట్లు 
    పేర్కొన్నారు.

Sports

  • పాకిస్తాన్ క్రికెట్‌కు మ‌రో అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్ దొరికాడు. అరంగేట్రంలో త‌న స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టుకే చుక్క‌లు చూపించాడు. ఆ యువ స్పిన్నర్‌ను జోష్ ఇంగ్లిష్‌, మార్నస్ లబుషేన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఎదుర్కోలేకపోయారు. అత‌డే 21 ఏళ్ల అరాఫత్ మిన్హాస్. శ‌నివారం రావ‌ల్పిండి వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేతో మిన్హాస్ అరంగేట్రం చేశాడు.

    మిన్హాస్ మూడేళ్ల కింద‌టే  టీ20ల్లో డెబ్యూ చేసిన‌ప్ప‌టికి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ల కార‌ణంగా జ‌ట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవ‌ల డొమాస్టిక్ క్రికెట్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో పాక్ సెలెక్ట‌ర్ల నుంచి మ‌ళ్లీ అత‌డికి పిలుపు వ‌చ్చింది. ఈసారి మాత్రం సెలెక్ట‌ర్ల న‌మ్మకాన్ని అరాఫ‌త్ నిలబెట్టుకున్నాడు.

    త‌న మొద‌టి  వ‌న్డేలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పాకిస్తాన్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1984లో జకీర్‌ ఖాన్‌ తన వన్డే డెబ్యూలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో 42 ఏళ్ల రికార్డును అరాఫత్ బ్రేక్‌ చేశాడు.

    అతడి బౌలింగ్ ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది.  ఆసీస్‌ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్‌(55), మాట్‌ రెన్‌షా(61) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో అరాఫత్‌తో పాటు షాహీన్‌ షా అఫ్రిది, రౌఫ్‌, అఘా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

  • బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. డాని వ్యాట్‌, అమీ జోన్స్‌, నైట్‌ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. 

    ఈ కడప అమ్మాయి తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు నందిని శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ 150 పరుగుల మార్క్ కూడా దాటేలా కనిపించలేదు. 

    కానీ చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 39 పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లండ్ ఫైటింగ్ టోటల్‌ను సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫ్రేయా కెంప్(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. డానీ వ్యాట్‌(29), క్యాప్సీ(28) పర్వాలేదన్పించారు. ఇప్పటికే తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిందిన. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటుంది.
    చదవండి: IPL 2026: ఫైనల్‌కు వాన గండం..! మ్యాచ్‌ రద్దైతే విజేత ఎవరంటే?

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో తుది స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ ఫైన‌ల్‌ పోరులో భాగంగా ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి త‌మ రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. 

    క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీ చేతిలో ఓట‌మి చ‌విచూసిన గుజరాత్‌.. అందుకు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న క‌సితో ఉంది. బెంగ‌ళూరు మాత్రం ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ త‌మ జోరును కొన‌సాగించాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

    మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వరకు వర్షం పడేందుకు అస్కారం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వేళ వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దేతే ప‌రిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? అన్న ఆస‌క్తి అందరిలోనూ నెలకొంది.

    ఒక‌వేళ వ‌ర్షం ప‌డితే?
    మిగిలిన నాకౌట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఈ తుది పోరుకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే ను కేటాయించింది. షెడ్యూల్ ప్ర‌కారం ఆదివారం(మే 31) పూర్తి మ్యాచ్ నిర్వ‌హించడానికి అంపైర్‌లు నిర్వహిస్తారు.

    సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. 5 ఓవ‌ర్ల మ్యాచ్ నిర్వ‌హించ‌డానికి చివరి కట్-ఆఫ్ సమయం రాత్రి 11:55 గంటల వరకు ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అప్ప‌టికి వాత‌వార‌ణం అనుకూలించ‌క‌పోతే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది.

    ఒక‌వేళ ఆదివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్‌ మొదలు కాకపోతే రిజర్వ్‌ డే అయిన సోమవారం(జూన్ 1)మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. మ్యాచ్‌ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్క‌డైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే ఆటను సోమ‌వారం కొన‌సాగిస్తారు.

    రిజ‌ర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యం కాక‌పోతే లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. గ్రూపు స్టేజ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు అగ్ర‌స్ధానంలో ఉంది కాబ‌ట్టి ఛాంపియ‌న్‌గా అవ‌త‌రిస్తోంది. కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే  తేలింది.
    చదవండి: సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో?
     

  • సింగ‌పూర్ ఓపెన్‌లో భార‌త డ‌బుల్స్ ద్వ‌యం సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్ శెట్టి ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. శ‌నివారం పురుషుల డ‌బుల్స్ సెమీస్‌లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్‌-సియో సుంగ్ జె జంట‌ను ఓడించింది. 

    సాత్విక్‌-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైన‌ల్ చేర‌డంతో క‌నీసం ర‌జ‌తం ఖ‌రారు చేసుకున్న‌ట్ల‌యింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్‌లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్‌ల్లోనే జయభేరి మోగించింది. 

    రేపు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో సాత్విక్‌-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.

    చదవండి: అరుదైన ఫీట్‌.. టీమిండియా సర‌స‌న పాకిస్తాన్‌

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లోనే అత్యంత‌ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. సార‌థిగా భార‌త్‌కు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన సూర్య‌కుమార్‌.. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఐపీఎల్‌-2026లోనూ సూర్య అదే తీరును క‌న‌బ‌రిచాడు. ఈ ముంబై ఆట‌గాడు 13 మ్యాచ్‌ల‌లో 20.77 స‌గ‌టుతో కేవ‌లం 270 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

    దీంతో భార‌త జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పించేందుకు బీసీసీఐ సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్‌గానే కాకుండా పూర్తిగా టీ20 జ‌ట్టు నుంచే అత‌డిని ప‌క్క‌న పెట్టాల‌నే యోచ‌న‌లో సెలెక్ట‌ర్లు ఉన్న‌ట్లు స‌మాచారం.

    అయితే సూర్య‌కు త‌న ఫామ్‌ను తిరిగి అందుకోవ‌డానికి ముంబై టీ20 లీగ్ రూపంలో మ‌రో అవ‌కాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 టోర్నీలో ట్రయంఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్‌కు సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

    అయితే అంత‌కంటే ముందు శ‌నివారం(మే 30)న ఉగాండాతో జ‌రగ‌నున్న మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్ జ‌ట్టు త‌ర‌పున సూర్య‌కుమార్ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ సూర్య మాత్రం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. స్కై  గైర్హాజరీలో అఖిల్ హెర్వాడ్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

    కాగా  ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను ఉగాండా సొంతం చేసుకుంది. అనంత‌రం ముంబై టీ20 లీగ్‌లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్ర‌మంలోనే డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ఉగాండా, ట్రయంఫ్ నైట్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.
    చదవండి: IPL 2027: రోహిత్ శ‌ర్మ వ‌ద్దు.. ముంబై కెప్టెన్‌గా అత‌డే స‌రైనోడు

  • రావ‌ల్పిండి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి వ‌న్డే పాకిస్తాన్‌కు 1000వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో వ‌న్డే క్రికెట్‌లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 

    1075 వ‌న్డే మ్యాచ్‌లతో భార‌త్ జాబితాలో మొద‌టి స్థానంలో ఉండ‌గా, 1020 మ్యాచ్‌ల‌తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొన‌సాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల స‌ర‌స‌న పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ‌2ఆ  ప్ర‌త్యేక మెమొంటో అందుకున్నాడు. 

    ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫ‌త్ మిన్హాస్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయ‌డం మ‌రో విశేషం. వెయ్యి వ‌న్డేలు ఆడిన మూడు జ‌ట్లు విజ‌యాల శాతాన్ని ప‌రిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్‌ల్లో 617 విజ‌యాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండ‌గా, టీమిండియా (1075 మ్యాచ్‌ల్లో 571 విజ‌యాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్‌ల్లో 527 విజ‌యాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

    ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్‌షా (21) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

     

    చదవండి: వినేశ్‌కు షాక్‌.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్‌!

  • ఆసియా గేమ్స్‌లో పాల్గొనాల‌న్న భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ క‌ల చెదిరింది. ఆసియా క్రీడ‌ల ఎంపిక ట్ర‌య‌ల్స్‌కు సంబంధించి నిర్వ‌హిస్తున్న పోటీల్లో వినేశ్ సెమీస్‌లో ఓట‌మిపాల‌య్యింది.  శ‌నివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో వినేశ్ ఫొగాట్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరాజయం చ‌విచూసింది. 

    ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించడంతో పాటు క్రీడలకు దూరమైంది. ట్రయల్స్‌లో బాగా రాణించి.. అంతర్జా తీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్‌లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రేక్ ప‌డిన‌ట్ల‌యింది. 

    గత మ్యాచ్‌లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్‌లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడ‌ల ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన వినేశ్ అక్క‌డి పోరాటంలో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ, తాజాగా సెమీస్‌లో ఓట‌మి పాల‌వ్వ‌డంతో రెజ్లింగ్‌లో మాత్రం ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. 

    ట్ర‌య‌ల్స్‌లో ఓట‌మి అనంత‌రం వినేశ్ ఫొగాట్ స్పందించింది. నేను ఓడిపోలేదు. ఈ వ్య‌వస్థ‌తో  ఒంట‌రిపోరాటం చేస్తున్నా. ప్ర‌తిదాని కోసం పోరాడాల్సి వ‌స్తోంది. నాకు న్యాయం జ‌ర‌గ‌లేదు. మ‌ళ్లీ తిరిగి వ‌స్తాను. రెజ్ల‌ర్ వినేశ్‌కు తొలుత రెజ్లింగ్ స‌మాఖ్య సెల‌క్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొనేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్ర‌యించింది. అయితే 53 కేజీల కేట‌గిరీలో వినేశ్ ఆడేందుకు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. 

    చదవండి: అత‌డు ల‌క్కీ హ్యాండ్‌.. ఆ జ‌ట్టుదే ఐపీఎల్ టైటిల్‌!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ మ‌రోసారి చాంపియ‌న్‌గా నిల‌వ‌డానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మెగాటోర్నీ ఫైన‌ల్లో గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ ద‌శలో చెరో మ్యాచ్ గెలిచిన‌ప్ప‌టికీ, క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో గుజ‌రాత్‌ను 92 ప‌రుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 

    అయితే ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ విజేతగా నిల‌వనున్నట్లు, అందుకు జోష్ హాజిల్‌వుడ్ కార‌ణం కానున్న‌ట్లు ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు హాజిల్‌వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైన‌ల్స్ ఆడితే.. ప్ర‌తీసారి తాను ప్రాతినిధ్యం వ‌హించిన జ‌ట్టే చాంపియ‌న్‌గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జ‌ట్టులో హాజిల్‌వుడ్ ఉన్నాడు. 

    2012లో చాంపియ‌న్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేత‌గా నిలిచిన సిడ్నీ సిక్స‌ర్‌, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్స‌ర్స్‌, 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన ఆస్ట్రేలియా జ‌ట్టు, 2021 ఐపీఎల్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన సీఎస్‌కే, 2025 ఐపీఎల్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన‌ ఆర్సీబీ జ‌ట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్‌వుడ్ స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టులోనూ హాజిల్‌వుడ్ స‌భ్యుడిగా ఉండ‌డం విశేషం.

    దీంతో హాజిల్‌వుడ్ ల‌క్కీ హ్యాండ్ అని.. అత‌ను ఏ జ‌ట్టులో ఉంటే ఆ జ‌ట్టు చాంపియ‌న్‌గా నిలుస్తుంద‌ని అభిమానులు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. అత‌డు ల‌క్కీహ్యాండ్ మాత్ర‌మే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్‌లోనూ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైన‌ల్స్‌ కలిపి 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

    2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైనల్‌తో పాటు 2012 చాంపియ‌న్స్ లీగ్ టీ20 ఫైన‌ల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఆర్సీబీ చాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో హాజిల్‌వుడ్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ సీజ‌న్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 22 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఈ సీజ‌న్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 13 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. అయితే భువ‌నేశ్వ‌ర్‌, ర‌సిక్ స‌లామ్‌లు రాణిస్తుండ‌డంతో హాజిల్‌వుడ్‌కు పెద్ద‌గా ఇబ్బంది ఎదుర్కోవ‌డం లేదు.

    చదవండి: ‘ఈసారి హిట్‌ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంత‌ర్గ‌త విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది సీజ‌న్ మ‌ధ్య‌లోనే పాండ్యా త‌న నిర్ణ‌యాన్ని టీమ్ మేనెజ్‌మెంట్‌కు తెలియజేసిన‌ట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.  ఐపీఎల్‌-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్‌కు అప్పగించింది.

    కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్‌లో క్వాలిఫయర్‌-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు. 

    కానీ తాజా ఎడిషన్‌లో మాత్రం పాండ్యా కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

    అయితే ఐపీఎల్‌-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా?  లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్ప‌ష్టత లేదు. దీంతో వ‌చ్చే ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ ఎవ‌రన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

    ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శ‌ర్మ మ‌రోసారి ముంబై జ‌ట్టు ప‌గ్గాల‌ను చేప‌ట్టేందుకు సిద్దంగా లేడ‌ని ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలో ముంబై  తదుప‌రి కెప్టెన్ ఎవ‌ర‌న్న విష‌యంపై భార‌త మాజీ క్రికెట‌ర్ వ‌సీం జాఫ‌ర్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు.

    "ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ బెస్ట్ ఛాయిస్‌.  మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వ‌య‌స్సును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్‌" అని జాఫ‌ర్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌ల‌లో పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: రాజస్తాన్‌ సరికొత్త చరిత్ర.. సన్‌రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌
     

  • గతేడాది ఐపీఎల్‌లో విఫలమైన రాజస్తాన్‌ రాయల్స్‌.. తాజా ఎడిషన్‌లో మాత్రం అదరగొట్టింది. ఐపీఎల్‌-2026లో ప్లే ఆఫ్స్‌ చేరడమే కాకుండా.. ఎలిమినేటర్‌ గండం కూడా దాటి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

    అయితే, ఫైనల్‌కు చేరే క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ముల్లన్‌పూర్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    సంజూ స్థానంలో..
    గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదోస్థానంలో నిలిచిన రాజస్తాన్‌.. ఈసారి మాత్రం ఈ మేరకు అద్భుతంగానే రాణించింది. నిజానికి ఐపీఎల్‌-2026కు ముందు రాజస్తాన్‌ తమ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేసింది.

    సంజూ స్థానంలో కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌ను నియమించిన రాయల్స్‌.. ఓపెనర్‌గా వైభవ్‌ సూర్యవంశీని పూర్తిస్థాయిలో బరిలోకి దించింది. ఈ రెండు నిర్ణయాలు రాయల్స్‌కు బాగా కలిసి వచ్చాయి. ఈ సీజన్‌లో వైభవ్‌ పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా (క్వాలిఫయర్‌-2 ముగిసేసరికి) నిలిచాడు.

    సీజన్‌ మొత్తానికి దూరం
    ఇదిలా ఉంటే.. సంజూకు బదులు రాజస్తాన్‌ చెన్నై నుంచి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కర్రాన్‌ (రూ. 2.4 కోట్లు)లను తీసుకుంది. అయితే, సామ్‌ కర్రాన్‌ గజ్జల్లో గాయం అని చెప్పి సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రాజస్తాన్‌ శ్రీలంక స్టార్‌ దసున్‌ షనకను తీసుకుంది.

    అయితే, గాయం పేరు చెప్పి తప్పుకొన్న సామ్‌ కర్రాన్‌ ఇంగ్లండ్‌ దేశీ టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో సర్రే జట్టుకు సుమారుగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను కావాలనే నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌ కుమార్‌ సంగక్కర తాజాగా స్పందించాడు.

    సర్రే తరఫున ఆడటం నేను చూశాను
    ‘‘సామ్‌ కర్రాన్‌కు గాయమైందని మాకు సమాచారం అందింది. కానీ అతడు సర్రే తరఫున 2- 3 మ్యాచ్‌లు ఆడటం నేను చూశాను. నిజంగా ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది.

    అతడు మా జట్టుతో ఆడాలని మేము కోరుకున్నాము. అందుకే జట్టులో చేర్చుకున్నాము. కానీ అతడు ఇలా చేశాడు. కాకపోతే ముందుగానే విషయం చెప్పినందు వల్ల షనకను తీసుకువచ్చాము. ఆటగాళ్ల కెరీర్‌లో గాయాలు సహజమే.

    మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి
    అయితే, కొన్ని తీవ్రమైన గాయాలు ఉంటాయి. మరికొన్ని నామమాత్రంగా ఉంటాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు కఠినతరం చేయడం అత్యంత ముఖ్యం’’ అని సంగక్కర సామ​ కర్రాన్‌ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

    కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా ఐపీఎల్‌కు దూరమైతే తదుపరి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తోంది బీసీసీఐ. అయితే, గాయాలు, అనారోగ్య కారణాల వల్ల దూరమైన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.

    చదవండి: ఫైనల్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ పోరాటం ముగిసిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓట‌మి పాలైన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌.. మ‌రోసారి ఫైన‌ల్‌కు చేరకుండానే ఇంటిముఖం ప‌ట్టింది.

    రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాయ‌ల్స్ జ‌ట్టు బ్యాటింగ్ ప‌రంగా రాణించిన‌ప్ప‌టికి, బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మైంది. 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఊదిప‌డేసింది. అయితే ఈమ్యాచ్‌లో రాజ‌స్తాన్ ఓట‌మిపాలైన‌ప్ప‌టికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

    ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రాజ‌స్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది సీజన్‌లో రాజస్తాన్ ఏకంగా 181 కొట్టింది. దీంతో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పిన 178 సిక్సర్ల రికార్డును రాజస్తాన్ బ్రేక్ చేసింది.

    రాజస్తాన్‌ రాయల్స్ కొట్టిన మొత్తం 181 సిక్సర్లలో, కేవలం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 72 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా   'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) రికార్డును బద్దలు కొట్టాడు.

    వైభవ్ తర్వాత రాజస్తాన్ జట్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే
    ధ్రువ్ జురెల్: 24 సిక్సర్లు

    డొనవొన్‌ ఫెరీరా: 23 సిక్సర్లు

    రియాన్ పరాగ్ (కెప్టెన్): 21 సిక్సర్లు

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శుక్ర‌వారం క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ను ఓడించి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, మ‌రో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. సాయి సుద‌ర్శ‌న్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 

    అయితే ఆర్సీబీతో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుద‌ర్శ‌న్ రాజ‌స్తాన్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులోనూ మ‌రోసారి హిట్‌వికెట్‌గా వెనుదిర‌గ‌డం గ‌మ‌నార్హం. 150 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా రెండుసార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఆట‌గాడిగా సాయి సుద‌ర్శ‌న్ నిలిచిపోయాడు. హిట్‌వికెట్‌గా రెండోసారి ఔట‌వ్వ‌డంపై సాయి సుద‌ర్శన్ ఎట్ట‌కేల‌కు మౌనం వీడాడు. 

    ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తాన‌ని న‌వ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి కొత్త‌గా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉప‌యోగించి బంతులు ఆడే ప్ర‌య‌త్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్‌లో బంతిని ఆడే క్ర‌మంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద ప‌డింది. 

    కానీ రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడాల‌నుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండ‌రీ వెళ్లిన‌ప్ప‌టికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్ల‌ను గిరాటేసింది. ఫైన‌ల్లో ఈ స‌మ‌స్య రాకుండా ఒక కొత్త ప‌ద్ధ‌తిని అనుస‌రించాల‌నుకుంటున్నా. అది ఎంత‌మేర స‌ఫ‌ల‌మ‌వుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.

    ఇక ఈ సీజ‌న్‌లో సాయి సుద‌ర్శ‌న్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. గుజ‌రాత్ త‌ర‌ఫున ఓపెనింగ్‌లో వ‌స్తున్న సాయి సుద‌ర్శ‌న్ 16 ఇన్నింగ్స్‌లో 710 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 8 అర్థ‌సెంచ‌రీలున్నాయి. అయితే ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో సాయి సుద‌ర్శ‌న్ ఒక ఫిఫ్టీ కూడా న‌మోదు చేయ‌లేదు. 

    ఆ త‌ర్వాత నుంచి వ‌రుస‌గా ప్ర‌తి మ్యాచ్‌లోనూ స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో క‌నీసం అర్థ‌సెంచ‌రీ సాధించ‌డం విశేషం. మ‌రో విష‌య‌మేంటంటే సాయి సుద‌ర్శ‌న్ వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ 700 ప‌రుగుల మార్క్‌ను అధిగ‌మించాడు. గ‌తంలో క్రిస్ గేల్ మాత్ర‌మే వ‌రుస‌గా రెండు సీజ‌న్ల‌లో 700 ప్ల‌స్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘ‌న‌త సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా సాయి సుద‌ర్శ‌న్ నిలిచాడు.

     

    చదవండి: అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. కానీ 332 కోట్ల మెలిక!

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్‌పై పడింది.ఈ  ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత  'మెన్ ఇన్ బ్లూ' వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌, మూడు వన్డేల సిరీస్‌లతో భారత్‌ తలపడనుంది.

    ఆ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది భారత్‌కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఆసియా క్రీడలు (Asian Games) ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్‌ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    'అమర్ ఉజాలా' కథనం ప్రకారం..  ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోయినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్‌లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్త పత్రిక తమ కథనంలో పేర్కొంది.

    వైభవ్‌తో పాటు యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో ఆడనున్నట్లు సమాచారం. కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.

    ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీతో  5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. సెప్టెంబ‌ర్ 27న టీమిండియా విండీస్ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.

    అయితే తొలుత వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం అక్టోబ‌ర్ 6 నుంచి టీ20లు మొద‌లు కానున్నాయి. ఈ సిరీస్ స‌మ‌యానికి అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు జ‌పాన్ టూర్‌ను ముగించుకుని భార‌త జ‌ట్టుతో చేరే అవ‌కాశ‌ముంది.

    ఆసియా క్రీడలు 2026 కోసం ప్రాబుబుల్స్ లిస్ట్‌(అమర్ ఉజాలా ప్రకారం)
    తిలక్ వర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, యశస్వి జైస్వాల్, శివ‌మ్ దూబే, ప్ర‌సిద్ద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్‌, అనుకుల్ రాయల్‌, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్‌, హర్ష్ దూబే, యష్ ఠాకూర్‌, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్‌, కుల్దీప్ యాదవ్‌, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్‌
     

  • భార‌త్‌లో ఫుట‌బాల్‌కు ఆద‌ర‌ణ త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. బెంగాల్‌, కేర‌ళ‌, ముంబై, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ఫుట్‌బాల్ ఆట‌కు య‌మ క్రేజ్ ఉంటుంది. భార‌త్‌లో కూడా ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్‌బాల్ టోర్నీలు నిర్వ‌హిస్తుండ‌డంతో ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్‌లు లైవ్‌లో వీక్షించాల‌ని ప్ర‌తీ దేశం భావిస్తోంది. 

    అయితే భార‌త్‌లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో వీక్షించే అవ‌కాశం లేకుండేది. అయితే తాజాగా భార‌త ఫుట్‌బాల్ అభిమానుల‌కు ఒక గుడ్‌న్యూస్‌. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్‌వ‌ర్క్‌ ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్త‌యింది. 

    మ‌రో 24-48 గంట‌ల్లో ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్‌ల ప్ర‌సార హ‌క్కుల్ని జీ నెట్‌వర్క్‌ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్‌కాస్టర్లకు 30 నుంచి 35 మిలియ‌న్ డాల‌ర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావ‌డంతో జీ నెట్‌వ‌ర్క్‌ వెనుక‌డుగు వేసిన‌ప్ప‌టికీ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకునేందుకు పోటీలో ఉంది. 

    అయితే సోనీ నెట్‌వ‌ర్క్ మాత్రం బిడ్ దాఖ‌లు చేయ‌లేదు. దీంతో ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల ప్ర‌సార హ‌క్కుల‌ను జీ నెట్‌వ‌ర్క్  సొంతం చేసుకోవ‌డం లాంఛ‌న‌మే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్‌వ‌ర్క్ కొత్త‌గా నాలుగు స్పోర్ట్స్ చానెల్‌ల‌ను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్‌డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్‌), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్‌డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. 

    జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో మొత్తం 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్‌ల‌న్నింటి నాలుగు చానెల్స్‌లోనూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. మొత్తంగా మొన్న‌టిదాకా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను వీక్షించే భాగ్యం లేకుండా  పోయింద‌ని తెగ బాధ‌ప‌డిపోయిన అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

    చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభ‌వ్ సూర్యవంశీ!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట ముగిసింది. లీగ్ ద‌శ‌లో చాలా క‌ష్ట‌ప‌డి ప్లేఆఫ్స్ చేరిన రాజ‌స్తాన్ ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజ‌న్‌ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. 

    గ‌త సీజ‌న్‌లోనే త‌న మెరుపులను చూపెట్టిన వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో దానిని ప‌రిపూర్ణం చేశాడ‌ని చెప్పొచ్చు. ఈ సీజ‌న్‌లో అత‌డు కొన‌సాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్‌ల్లో మెరిసి ఆ త‌ర్వాత విఫ‌ల‌మ‌య్యుంటే వైభ‌వ్ గురించి చ‌ర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వ‌య‌సులోనే క్రికెట్‌లో ఉన్న అన్ని షాట్ల‌ను అల‌వోక‌గా ఆడుతూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 

    16 మ్యాచ్‌ల్లో 237కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించిన వైభ‌వ్ ఖాతాలో ఒక సెంచ‌రీ స‌హా ఐదు అర్థ‌సెంచ‌రీలున్నాయి.  క్రీజులోకి అడుగుపెట్టిందే మొద‌లు ఎడాపెడా బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదడ‌మే కాకుండా ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆడ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వైభ‌వ్ సూర్య‌వంశీలో క‌నిపించిన గొప్ప ప‌రిణితి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో క‌మిన్స్ మొద‌లుకొని ఏ బౌల‌ర్‌ను వ‌ద‌ల‌ని సూర్య‌వంశీ 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

    ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి ఉంటే ప్ర‌పంచ రికార్డు త‌న ముంగిట ఉండేదేమో. ఇక గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫ‌య‌ర్‌-2లో వైభ‌వ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుత‌మ‌నే చెప్పొచ్చు. జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింద‌న్న విష‌యాన్ని గుర్తించిన వైభ‌వ్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసిన‌ప్పటికీ మెరుపుల‌కు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. 

    వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ శ‌త‌కం చేజార్చుకున్న వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో మొత్తం 72 సిక్స‌ర్లు బాది ఒకే సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇలా సీజ‌న్ ఆద్యంతం త‌న ఆట‌తీరుతో అల‌రించిన వైభ‌వ్ సూర్య‌వంశీకి ఐపీఎల్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

    ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాల‌ను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టుల‌తో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక జ‌ట్టును త‌న భుజ‌స్కందాల‌పై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వ‌స్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్ర‌ద‌ర్శ‌న మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది వైభ‌వ్‌’ అని ఒక అభిమాని వైభ‌వ్‌కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్‌గా నిలిచింది.

    చదవండి: IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

  • వైభవ్‌ సూర్యవంశీ.. ఈ పేరే ఒక సంచలనం. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై చితక్కొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. వరల్డ్‌కప్‌-2025 ఫైనల్లోనూ భారీ శతకం (80 బంతుల్లో 175)తో జట్టును గెలిపించాడు.

    అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా వైభవ్‌ దుమ్ములేపాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై లీగ్‌ దశలో 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌.. కీలక ఎలిమినేటర్‌లో మరోసారి సన్‌రైజర్స్‌ తన బ్యాటింగ్‌ పదునేమిటో చూపించాడు.

    ఒంటిచేత్తో.. 
    కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్‌.. ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌ను ఎలిమినేట్‌ చేసి.. రాజస్తాన్‌ను క్వాలిఫయర్‌-2కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై కూడా ఈ పదిహేనేళ్ల పిల్లాడు చితక్కొట్టాడు. ముల్లన్‌పూర్‌లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 96 పరుగులు రాబట్టాడు.

    బాడీలైన్‌ బౌలింగ్‌తో
    అయితే.. సన్‌రైజర్స్‌కు ఎదురైన చేదు అనుభవం చూసిన గుజరాత్‌ బౌలర్లు వైభవ్‌ను గట్టిగానే టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా కగిసో రబడ బాడీలైన్‌ బౌలింగ్‌తో వైభవ్‌ను భయపెట్టాడు. మరోవైపు.. మహ్మద్‌ సిరాజ్‌ సైతం బౌన్సర్లు సంధిస్తూ ఇబ్బందిపెట్టాడు.

    అయినా సరే బుడ్డోడు ఏమాత్రం బెదరకుండా నిలకడగా ఆడాడు. అయితే, ఆఖరికి రబడ వైభవ్‌పై పైచేయి సాధించి అతడిని అవుట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ గుజరాత్‌ బౌలర్ల తీరును తీవ్రస్థాయిలో విమర్శించాడు.

    నాలోని తండ్రి మనసు
    ‘‘పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఆపడం కోసం బాడీలైన్‌ బౌలింగ్‌ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్లపై అదరగొడుతున్నాడని నాకు తెలుసు. కానీ.. నాలోని తండ్రి మనసు ఈ రకమైన బౌలింగ్‌ను ఏమాత్రం అంగీకరించడం లేదు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇదేం పద్ధతి?
    అయితే.. చాలా మంది నెటిజన్లు ఇర్ఫాన్‌ పఠాన్‌ కామెంట్లపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా ఎలా మాట్లాడుతున్నారు?.. వైభవ్‌ సూర్యవంశీ ఏమో ఎదురుగా వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ ఉన్నా కనికరం లేకుండా బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు.

    మీరు మాత్రం అతడికి వ్యతిరేకంగా బౌలర్లు ఏపనీ చేయొద్దని చెబుతున్నారు. ఇదేం పద్ధతి?.. పదిహేనేళ్లకే అతడు విధ్వంసం సృష్టిస్తుంటే తప్పు లేదు గానీ.. బౌలర్లు తమ వ్యూహాలు అమలు చేస్తే తప్పా? బౌలర్లు బ్యాటర్‌ను అవుట్‌ చేయాలని మాత్రమే చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

    బాడీలైన్‌ బౌలింగ్‌ అంటే ఏమిటి?
    ఆస్ట్రేలియాలో 1932-33లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌ జట్టు ఆసీస్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ను నిలువరించేందుకు బౌలింగ్‌ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది.

    ఈ తరహా బౌలింగ్‌లో ఫాస్ట్‌ బౌలర్లు షార్ట్‌ పిచ్‌ డెలివరీలు లేదంటే లెగ్‌స్టంప్‌కు కాస్త ఆవల బంతులు వేస్తూ నేరుగా బ్యాటర్‌ శరీరాన్ని టార్గెట్‌ చేశారు. తలపైకి డెలివరీలు సంధిస్తారు. ఈ ప్రమాదకర బౌలింగ్‌తో బ్యాటర్‌ తీవ్రంగా గాయపడొచ్చు లేదంటే చాకచక్యంగా ఆ బంతి నుంచి తప్పించుకోవాలి.

    గుజరాత్‌తో మ్యాచ్‌లో రబాడ ఈ తరహా బౌలింగ్‌తో చెలరేగడంతో వైభవ్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడి గ్లోవ్స్‌కు చాలాసార్లు బంతి తగిలింది. అయినా సరే అతడు పట్టుదలగా ఆడాడు. 

    అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ రాజస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

    చదవండి: జైస్వాల్‌కు క్షమాపణ చెప్పండి.. రోహిత్‌ ఎందుకు?

Politics

  • సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..

    డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
    డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్‌ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.

    జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.

    డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.

    నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్
    ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.

    చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.

    స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలు
    క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.

    గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.

    జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయం
    జీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

    ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.

    డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.

    ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే  ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

    ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు  ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు  సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

  • పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగడాలకు ఇక ముగింపు పడిందని బీజేపీ అంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నుంచి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది తాము బీజేపీలో చేరాలనుకుంటున్నామని నేరుగా చెప్పడం లేదు. వారి తిరుగుబాటు సిద్ధాంతపరమైన మార్పు కంటే, పార్టీలో పెరిగిన అసంతృప్తి, నిరాశ, దూరం పెరగడాన్ని ప్రతిబింబిస్తోంది.

    బీజేపీ కూడా వచ్చే మూడు నెలల వరకు ఫిరాయింపుదారులను చేర్చుకునే ఆసక్తి తమకు లేదని బహిరంగంగా ప్రకటించింది. టీఎంసీలోని మంచి, చెడు నేతల మధ్య తేడా స్పష్టంగా తెలిసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పుడు భావిస్తున్నట్లు కాకుండా తమ వద‍్దకు వచ్చిన టీఎంసీ నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. మూడు నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే ఇక పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కనుమరుగు అవుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.

    కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. వారి ఆరోపణలు దాదాపు ఒకేలా ఉన్నాయి. పార్టీ కార్పొరేట్ శైలిలో నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. నాయకత్వాన్ని చేరుకోవడం కష్టమైందని మరికొందరు చెబుతున్నారు. కీలక సమయాల్లో అభిషేక్ బెనర్జీ రాజకీయంగా అందుబాటులో లేరని కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతమంది సొంత పార్టీ నేతల నుంచి విమర్శలువస్తున్నాయి.

    ఓటమిపై మమత సమీక్ష ఏది? 
    ఇటువంటి ప్రచారం జరుగుతుండడానికి బలమైన కారణం ఉంది. ఓటమి తర్వాత మమతా బెనర్జీ వాస్తవిక పరిస్థితుల గురించి, పరాజయం వెనుక ఉన్న కారణాల గురించి పునరాలోచన చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు శాశ్వతం కాకపోయినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రతి ప్రధాన రాజకీయ శక్తి తనలోతాను విశ్లేషించుకునే దశలోకి వెళ్తుంది.

    చరిత్రలో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలు చూస్తే.. జ్యోతి బసు యుగం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య నాయకత్వానికి సీపీఎం మారిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలో కూడా అంతర్గత చర్చలు జరిగాయి. సీనియర్ కమ్యూనిస్టు నేత అబ్దుల్లా రసూల్ అప్పట్లో నాయకత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు. చివరకు పార్టీ ఆత్మపరిశీలన చేపట్టక తప్పలేదు. సీపీఎం సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి ఆత్మశుద్ధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునే ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కూడా ఇలాంటి ఆత్మపరిశీలన దశను ఎదుర్కొంది.

    ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం ఎలాంటి తప్పులను బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా కనిపించడం లేదు. మమతా బెనర్జీ గానీ, అభిషేక్ బెనర్జీ గానీ ఎన్నికల పరాజయానికి వ్యూహాత్మక లేదా సంస్థాగత తప్పిదాలు కారణమయ్యాయని ఒప్పుకోలేదు. దీంతో పార్టీలో మరింత అసంతృప్తి పెరిగి ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఊహాగానాలు వస్తున్నాయి.

  • అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో  టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్‌పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.  ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్‌ చౌదరి ఘాటుగా ఆరోపణలు చేశారు. 

    ‘గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ త్యాగం చేశాను. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నా వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అణచివేత కు పాల్పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు. 

    అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూకబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలన్నీ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయను. డీలిమిటేషన్ జరిగితే... మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం’ అని స్సష్టం చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

    ‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్‌కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్‌ దుయ్యబట్టారు.

    ‘‘కిషన్‌రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసిరారు. 

    దీంతో అభిషేక్‌ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్‌ పెట్టుకున్నారు.  ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

    ఎన్నికల అనంతరం హింస జరగడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి రక్షణ కల్పించారు ఘటనాస్థలిలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

    MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

    దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. “ఇది పూర్తిగా బీజేపీ ప్రేరేపిత చర్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. అయినా పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.

  • బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవడంతో డీకే శివకుమార్‌ త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు నేతలు పోటీ పడుతున్నారు.

    ఉప ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి కేహెచ్ మునియప్పను నియమించాలని కోరుతూ దళిత వర్గ నేతలు శనివారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నిరసన చేపట్టారు. మడార మహాసభ, పలు దళిత సంఘాల నేతలు పోస్టర్లు ప్రదర్శిస్తూ మునియప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. రాష్ట్రానికి చేరుకుంటున్న ఏఐసీసీ కర్ణాటక ఇన్‌చార్జ్‌ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు వినతిపత్రం అందించేందుకు నిరసనకారులు అక్కడికి వెళ్లారు.

    విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద ఈ నిరసన కొన్ని గంటల పాటు కొనసాగింది. మడిగ వర్గానికి ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు వంటి కీలక పదవులు దక్కలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తమ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని హెచ్చరించారు. తమ వర్గాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా నగరంలోని షాంగ్రి లా హోటల్‌కు చేరుకున్నారు. 

    కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) సమావేశంపై మునియప్ప మాట్లాడుతూ.. "కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, మరికొందరు బలపరుస్తున్నారు. ఇదే విధానం. దీని కంటే ఎక్కువగా ఇప్పుడేమీ చెప్పలేం. అయితే ఈ ప్రక్రియ ఈ సాయంత్రానికే పూర్తవుతుంది" అని తెలిపారు.

    కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి లింగాయత్ వర్గం నుంచి కూడా వచ్చింది. సీనియర్ నేత ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గురు బసవ పట్టదేవరు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.

    గురు బసవ మీడియాతో మాట్లాడుతూ.. "ఈశ్వర్ ఖండ్రేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో లింగాయత్ వర్గం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుంది" అని అన్నారు. కాగా, కర్ణాటకలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

  • సాక్షి, తాడేప‌ల్లి: ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీ లోపు యూనిట్ రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ విద్యుత్ హామీని అమ‌లు చేయాల‌ని, నాన్ ఆక్వా జోన్ రైతులు గ‌త రెండేళ్లుగా చెల్లించిన బిల్లులు రీయింబ‌ర్స్ చేయాల‌ని తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గ  వైఎస్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త, అప్స‌డా మాజీ వైస్ చైర్మ‌న్ వ‌డ్డి ర‌ఘురాం డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆక్వా రైతుల‌తో క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని హెచ్చరించారు.

    తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా అంద‌రికీ రూపాయిన్న‌ర‌కే యూనిట్ విద్యుత్ అందిస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, రెండేళ్లుగా ఒక్క కొత్త క‌నెక్ష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో సీడ్‌, ఫీడ్ ధ‌ర‌లు, ఎగుమ‌తులు, అన్నీ అప్స‌డా నిర్ణ‌యం మేర‌కు రైతుల‌తో చ‌ర్చించి తీసుకునేవాళ్ల‌మ‌ని.. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(అప్స‌డా)ని నిర్వీర్యం చేసేసి ద‌ళారుల చేతికి చంద్ర‌బాబు పెత్త‌నం ఇచ్చాడ‌ని మండిప‌డ్డారు.

    ఫీడ్ ధ‌ర‌లు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోమ‌ని, రైతుల‌తో చ‌ర్చించి ఏడాదికి ఒక్క‌సారే పెంచాల‌ని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల‌కు వైఎస్సార్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఆక్వా రైతుల‌తో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌ స‌మావేశం నిర్వ‌హిస్తార‌ని వ‌డ్డి ర‌ఘురాం వెల్ల‌డించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    అప్స‌డా నిర్వీర్యం.. తీవ్ర సంక్షోభంలో ఆక్వా రంగం
    కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా రంగం తీవ్ర‌మైన సంక్షోభంలో చిక్కుకుంది. వైఎస్‌ జ‌గ‌న్‌ సీఎంగా ఉండ‌గా ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (అప్స‌డా)ని ఏర్పాటు చేసి సీడ్ యాక్టు, ఫీడ్ యాక్టు అంటూ అన్ని విభాగాల‌ను ఒకే గొడుకు కింద‌కి తీసుకొచ్చి ఆక్వా రైతుల‌కు మేలు చేశారు. సీడ్‌, ఫీడు ధ‌ర‌లు పెంచాల‌న్నా, వాటి నాణ్య‌త ప‌రిశీలించాల‌న్న ఒక క‌మిటీ ఉండేది. ఈ క‌మిటీలో ప్ర‌భుత్వం, రైతులు, సీడు, ఫీడు య‌జ‌మానులు, ఎక్స్‌పోర్ట‌ర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, మెడిక‌ల్ కంపెనీలు ఉండేవి.

    వీరంతా ఉమ్మ‌డిగా చ‌ర్చించి ఏ నిర్ణ‌యమైనా తీసుకునేవారు. రేట్లు పెంచాల‌న్నా, త‌గ్గించాల‌న్నా అప్స‌డాలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఆక్వా క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీని పూర్తిగా నిర్వీర్యం చేసి, పెత్త‌నాన్ని చంద్ర‌బాబు త‌న బినామీల‌కు క‌ట్ట‌బెట్టాడు. పెరిగిన డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా ఆక్వారైతు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాడు. ఇటీవ‌ల విచ్చ‌ల‌విడిగా ఫీడు రేట్లు పెంచ‌డానికి పూనుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ గారి హెచ్చ‌రిక‌ల‌తో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.

    ఒక్క కొత్త క‌నెక్ష‌న్ ఇవ్వ‌లేదు
    ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా అంద‌రికీ స‌బ్సిడీ విద్యుత్ రూపాయిన్న‌ర‌కే ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఆక్వా రైతుల‌ను మోసం చేశాడు. రెండేళ్ల‌లో చంద్ర‌బాబు కొత్త‌గా ఒక్క కనెక్ష‌న్ కూడా ఇవ్వ‌లేదు. కొత్త‌గా రిజిస్ట్రేషన్ల పేరుతో రెండేళ్లుగా కాల‌యాప‌న చేస్తూనే ఉన్నారు. మొత్తం 64 వేల క‌నెక్ష‌న్లు ఉంటే వైఎస్సార్‌సీపీ హ‌యాంలోనే 50,800 క‌నెక్ష‌న్లు ఇవ్వ‌డం జ‌రిగింది. దీని ద్వారా ఏటా రూ.800 కోట్ల మేర విద్యుత్ స‌బ్సిడీ ఇవ్వ‌డం జ‌రిగింది. 2104-19 మ‌ధ్య కూడా యూనిట్ విద్యుత్ రూ.2 ల‌కే ఇస్తామ‌ని చెప్పి ఆరు నెల‌ల‌కే ఆపేశాడు. 2019లో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక డిస్కంల‌కు గ‌త టీడీపీ ప్ర‌భుత్వం పెట్టిన బ‌కాయిలు రూ.340 కోట్లు వైఎస్‌ జ‌గ‌నే చెల్లించి ఆక్వా రంగాన్ని ఆదుకోవ‌డం జ‌రిగింది.

    ఐదేళ్ల‌లో రూ. 3640 కోట్లు స‌బ్సిడీ రూపంలో చెల్లించిన ఘ‌న‌త వైయ‌స జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. నాన్ ఎలిజిబిలిటీ రైతుల‌కు ఇబ్బందులు రావ‌డంతో 24 గంట‌ల్లో రూ. 24 కోట్లు రోల్ బ్యాక్ చేయ‌డం జ‌రిగింది. మెరైన్ ఎక్స్‌పోర్టులో రెండుసార్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలోనే మొద‌టిస్థానం సాధించి అవార్డులు తీసుకుంది. గ‌తంలో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఉండ‌గా సీపీఎఫ్ అనే కంపెనీ ఫీడ్ ధ‌ర‌లు పెంచిన‌ప్పుడు రైతులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రెసిడెంట్‌, వైస్ ప్రెసిడెంట్‌ల‌ను థాయ్‌లాండ్ నుంచి 48 గంట‌ల్లో పిలిపించి వారితో ప్ర‌భుత్వం చ‌ర్చించి మూడేళ్ల‌పాటు పైసా కూడా పెంచ‌కుండా చూశాం. రెండుసార్లు పెంచితే రెండుసార్లూ రోల్ బ్యాక్ చేయ‌డం జ‌రిగింది.

    ఆక్వా రైతుల త‌ర‌ఫున వైఎస్సార్‌సీపీ డిమాండ్లు
    సంక్షోభంలో రోడ్డెక్కి నిర‌స‌న తెలియ‌జేస్తున్న ఆక్వా రైతుల ఆక్రంద‌న‌లు ఈ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికైనా ఆక్వా నాన్ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రూపాయిన్న‌ర‌కే స‌బ్సిడీ విద్యుత్ ఎప్ప‌టి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలి. నాన్ ఆక్వా జోన్ ప‌రిధిలో సుమారుగా 12,800 క‌నెక్ష‌న్లు ఉంటాయ‌ని అంచ‌నా. వారంద‌రూ గ‌డిచిన రెండేళ్లుగా విద్యుత్ స‌బ్సిడీకి నోచుకోకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ఆ బిల్లుల‌న్నీ రోల్ బ్యాక్ చేస్తారో లేదో చెప్పాలి. సంక్షోభంలో న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి రైతుల‌ను ఆదుకునేలా ఇత‌ర పంట‌ల మాదిరిగానే ఆక్వా లోనూ పంట‌ల సాగు వివ‌రాలు న‌మోదు చేయాలి.

    ప్రాసెసింగ్‌ ప్లాంట్ల‌కు వ‌చ్చిన ఆర్డ‌ర్లు, పంట సాగు లెక్క‌ల‌ను బేరీజు వేసుకుని ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. సోయా, ఫిష్ ఆయిల్ ధ‌ర‌లు ఏడాదికి ఒక్క‌సారే పెరుగుతాయి. ఆక్వా సీడు, ఫీడ్‌ ధ‌ర‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు పెంచ‌కుండా ఏడాదిపాటు ఒకే ధ‌రతోనే విక్ర‌యాలు జ‌రిగేలా చూడాలి. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంలో మాదిరిగానే ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తే రైతుల అంగీకారం త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి.

    జూన్ 10వ తేదీ లోపు జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రంగంలో రూపాయిన్న‌ర స‌బ్సిడీకి విద్యుత్ పంపిణీ చేయాలి. రెండేళ్లుగా నాన్ ఆక్వా జోన్ రైతులు చెల్లించిన బిల్లును రీయింబ‌ర్స్ చేయాలి. రైతుల డిమాండ్లు నెర‌వేర్చ‌క‌పోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌లెక్టరేట్ల‌ను ముట్ట‌డిస్తాం. త్వ‌ర‌లోనే ఆక్వా రైతుల‌తో వైఎస్‌ జ‌గ‌న్ సమావేశం నిర్వ‌హిస్తారు. ఆక్వా రైతుల‌కు వైఎస్సార్సీపీ అండ‌గా నిల‌బ‌డి పోరాడతుందని వడ్డి రఘురాం స్ప‌ష్టం చేశారు

International

  • ఒక అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజుల పాటు 13 నగరాలను సందర్శించా మంటూ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ చేసి వైరల్‌గా మారారు. ఈ టూర్‌ కోసం ఈ జంట ఏకంగా 10,605 డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

    ట్రావెలర్స్ అలెక్స్, అమేలియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఖర్చుల వివరాలను పంచు కున్నారు. అయితే ఖర్చు తాము అనుకున్నదానికంటే ఎక్కువే అయిందని అంగీకరించారు. తాము లగ్జరీ హోటళ్లు, ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ భారీ ఖర్చుకు కారణమని వారు పేర్కొన్నారు.

    మొత్తంగా ఇండియాలో నెల రోజుల కోసం రూ. 10 లక్షలు అంటే, రోజు రూ. 33,627 అన్నమాట అని  ఆ జంట రాసుకొచ్చింది.  30 రోజుల్లోనే 13 నగరాలను సందర్శించడం వల్ల తమ ట్రిప్‌లోట్రాన్స్‌పోర్ట్ కోసమే అత్యధికంగా ఖర్చయిందని వారు తెలిపారు. తమ భారత పర్యటనలో భాగంగా ఆరు విమానాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రీమియం హోటళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖర్చు పెరిగిందని, రోజుకు సగటున హోటల్ రూమ్ కోసం రూ. 12,064 ఖర్చు చేసినట్లు చెప్పారు.

    మొత్తం లెక్కలు వేసి, ఒక నెలలో ఇంత ఖర్చు చేశామా అనే తామే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. కేవలం బడ్జెట్ ఎంపికల కోసం మాత్రమే చూడకపోతే, ఇతర ప్రయాణికులు చెప్పినంత చౌకగా వసతి లేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం బయట తినడంతో జేబులు ఖాళీ అయ్యాయని చెప్పుకొచ్చారు. 

    వామ్మో..ఇది నిజంగానే  ఎక్కువ : సోషల్ మీడియా స్పందన
    ఈ పోస్ట్ వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆ ఖర్చు చూసి ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆ జంట మహారాజుల్లా బతికారు కాబట్టి అంత ఖర్చవ్వడంలో వింతేమీ లేదన్నారు. ఖచ్చితంగా మహారాజుల్లా రాజభోగాలు అనుభవించి ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో..ఇది నిజంగానే  చాలా ఎక్కువ అని కొందరన్నారు. ప్రత్యేక  అనుభూతులు మిగుల్చుకోవాలంటే.. తప్పదు మరి. అయితే కరోనా తరువాత  ఖర్చులు బాగా పెరిగాయన్నారు మరొకరు.

Telangana

  • హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన డ్రైవర్, పనిమనిషితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ, భారతదేశంలో వర్గ భేదాలు నెమ్మదిగా తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తద్వారా తన దినచర్యలోని ఒక సాధారణమైన,కానీ హృద్యమైన సంగతులను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

    హైదరాబాద్‌కు చెందిన  నరేష్ షేర్ చేసిన ఎక్స్‌లో ఒక  సెల్ఫీని  పోస్ట్‌ చేశారు.  ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద  కీమా పరాఠా తింటూ కెమెరా వైపు చూసి నవ్వుతున్న నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఉల్లాసభరితమైన సెల్ఫీ తో  షేర్‌ చేస్తూ దేశంలోని  వర్గ భేదాలు మెల్లగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

    తమ ఇంట్లో పనిచేసే సిబ్బందితో( డ్రైవర్, మేడ్‌) కలిసి ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇలా 'టీమ్ లంచ్' చేస్తానని నరేష్ క్యాప్షన్‌లో రాశారు. అంతేకాదు  మొదట్లో వారు తనతో కలిసి డైనింగ్ టేబుల్‌పై కూర్చోవడానికి ఎంతలా సంకోచించారో కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమాజంలో ఉన్న అలవాట్లు, కండిషనింగ్ వల్ల వారు అలా కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు.

    "భారతదేశంలో ఉన్న ఈ వర్గ వ్యవస్థ పోవాలి. దేవుడి కోసమైనా గుర్తుంచుకోండి, ఇది 2026!" అని ఆయన రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెనుక ఒక మంచి సందేశం ఉన్నప్పటికీ, తాము తిన్నది మాత్రం చాలా సాధారణమైన 'కీమా పరాటా' మాత్రమేనని నరేష్ సరదాగా పేర్కొన్నారు.

    నెటిజన్ల ప్రశంసలు
    ఈ పోస్ట్‌పై ఇంటర్నెట్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, సమాజంలోని వర్గ భేదాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు లేదా ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ పాత అలవాట్ల వల్ల విడిగా తినడానికే మొగ్గు చూపుతుంటారని, కానీ తాము కూడా వారిని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకే రకమైన పాత్రల్లో భోజనం పెట్టడం ద్వారా ఆ అదృశ్య గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు కామెంట్ చేశారు.  నేటితరం శ్రమను గౌరవిస్తున్నారని పాతకాలపు వర్గ వ్యవస్థలను అంగీకరించడం లేదని, ఇలాంటి మార్పులు కొత్త తరం ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు.
     

News

  • సాక్షి, సిటీబ్యూరో: హైద‌రాబాద్‌ నగరంలో రొమ్ము కేన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల పాలిట శాపంగా మారుతోంది. దేశంలో రొమ్ము కేన్సర్‌ బాధితుల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందన్న అంశం ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ సగటు ప్రతి లక్ష మందిలో 26.6 మందిగా ఉండగా, హైదరాబాద్‌లో ఏకంగా 54 మందికి చేరింది. గతంలో 50 ఏళ్లు దాటిన వారినే ఈ మహమ్మారి లక్ష్యంగా చేసుకునేది.

    మారుతున్న కాలంతో పాటే జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక అంశాల ప్రభావంతో  పాతికేళ్ల యువతులనూ రొమ్ము కేన్సర్‌ కబళిస్తోంది. 2020 నుంచి ఏటా రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్యలో 15 శాతం వృద్ధి కనిపిస్తోందని ఎంఎన్‌జే ఆసుపత్రి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 60 శాతం మంది రోగులు అవగాహనా లోపంతో 3, 4వ స్టేజిల్లో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

    • ఎంఎన్‌జే ఆసుపత్రికి వస్తున్న బాధితుల సంఖ్య ఏటా సుమారు 15 శాతం పెరుగుతోంది. 2020లో కొత్తగా నమోదైన రొమ్ము కేన్సర్‌ కేసులు 677 ఉండగా, 2025 నాటికి 2500కు చేరింది. ఇది మహిళాలోకాన్ని కలవరానికి గురిచేస్తోంది. మొత్తం కేన్సర్‌ కాటేస్తున్న బాధితుల్లో 40 ఏళ్ల వయసులోపు ఉన్నవారే 25 శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. 

    • నగరానికి చెందిన 22 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థికి రొమ్ము సాధారణానికి భిన్నంగా ఉండటంతో ఇటీవల ఎంఎన్‌జే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంది. రొమ్ము కేన్సర్‌ సోకిందని నిర్ధారించుకుని, చికిత్సలకు సిద్ధమైంది. వైద్యుల శస్త్ర చికిత్సల అనంతరం ఆమె కోలుకుంటోంది.

    • రంగారెడ్డి జిల్లాకు చెందిన 34 ఏళ్ల గృహిణి రొమ్ము కేన్సర్‌తో ఎంఎన్‌జే ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సుమారు 9 నెలల చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది. వీరిద్దరే కాదు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న వారిలో సుమారు 25 శాతం మంది 40 ఏళ్ల వయసు లోపే ఉంటున్నారని ఎంఎన్‌జే వైద్యులు చెబుతున్నారు. 

    కారణాలనేకం.. 
    గడిచిన ఐదేళ్లలో రొమ్ముకేన్సర్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పాతికేళ్లకే రొమ్ము కేన్సర్‌ అంటే ఆశ్చర్యమేస్తోంది. ఆధునిక జీవన శైలిలో వచ్చిన మార్పులు, ప్రాసెస్‌ చేసిన, జంక్‌ ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ఆలస్యంగా వివాహాలు, 30 ఏళ్లు దాటేంత వరకు సంతానం లేకపోవడం, పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువ సమయం కూర్చుని ఉండటం, శారీక శ్రమ లేకపోవడం, మధుమేహం, మానసిక ఒత్తిళ్లు రొమ్ము కేన్సర్‌ను ప్రేరేపిస్తున్నాయి.


    – మాటూరి రమేష్‌, సర్జికల్‌ అంకాలజీ హెచ్‌ఓడీ, ఎంఎన్‌జే ఆసుపత్రి