Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇరాన్ అన్నంత పని చేసింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా లాంటి ఐటీ కంపెనీలపై దాడి చేస్తామని టెహ్రాన్‌ ఇదివరకే హెచ్చరించింది. తాజాగా బహ్రెయిన్‌లోని అమెజాన్‌ కంపెనీపై క్షిపణులతో విరుచుకపడ్డట్లు తెలుస్తోంది.  

    కొద్దిసేపటి క్రితం బహ్రెయిన్‌లో అమెరికా కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. కాగా అంతకుముందు ఒక కంపెనీ భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేస్తున్నాయని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించింది. కానీ మంటలు సంభవించిన ప్రాంతం వివరాలు మాత్రం పేర్కొనలేదు.

    మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, మెటా సహా 18 అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది.  ఇరాన్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.

    కాగా  మరోవైపు, ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి ఒప్పందం అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ యుద్ధాన్ని రెండు మూడు వారాల్లో ముగించగలదని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది

  • మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.

    ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు  ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్‌తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్‌స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.

    హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను  తొలగించడంతో పాటు  అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. 

    టెహ్రాన్‌ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి  దిగుతుందని ప్రచారం జరుగుతుంది. 

     

     

  • ఇరాన్‌ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్‌ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్‌ తెరిచే వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్‌ హెచ్చరించారు.

    అయితే, ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.

    ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.
     

  • వాషింగ్టన్‌: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.

    ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

    అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

     

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ షాక్‌ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్‌ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్‌.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్‌ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

    అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్‌ అన్నారు.

    ‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.

    మరోవైపు, ఇరాన్‌పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్‌ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి.

    ..మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్‌ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్‌ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.  

  • ఇరాక్‌లో అమెరికన్ జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌(Shelly Kittleson) కిడ్నాప్  కలకలం రేపుతోంది. ఇరాన్ మద్దతు ఉన్న ఓ ఇరాకీ సాయుధ ముఠా బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్ట్‌ను కిడ్నాప్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ప్రాంతీయ భద్రత క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటెల్సన్‌ ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సిరియా, ఇరాక్, లెబనాన్ నుంచి ఆమె విస్తృతంగా వార్తా కథనాలను అందించారు. ఆమెను విడిపించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

    కిడ్నాప్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూప్ ‘కతైబ్ హెజ్బల్లా’కు చెందిన వ్యక్తిని ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ తెలిపారు. నిందితులు పారిపోయే క్రమంలో వాహనం బోల్తా పడటంతో ఇరాక్ భద్రతా దళాలు ఒకరిని అరెస్ట్ చేశాయి. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

    కిటెల్సన్‌ రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఇరాక్, సిరియాలోని తెగల మధ్య సంబంధాలు, యుద్ధ ప్రాంతాలపై ఆమెకు లోతైన అవగాహన ఉంది. ఆమె కిడ్నాప్‌పై 'అల్-మోానిటర్' సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాగ్దాద్ వీధుల్లో నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీటీవి దృశ్యాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

    ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాక్ ప్రభుత్వానికి, అక్కడి ఇరాన్ అనుకూల మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు పెరిగాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరాక్‌లో అమెరికన్లకు ముప్పు పెరిగిందని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. 2023లో కూడా విద్యావేత్త ఎలిజబెత్ త్సుర్కోవ్‌ను కిడ్నాప్ చేసి రెండేళ్లపాటు బందీగా ఉంచారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అమెరికన్లు, జర్నలిస్టులు ఇరాక్‌లో అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

Andhra Pradesh

  • సాక్షి, కృష్ణాజిల్లా: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పేరుతో అధికారులు చేపట్టిన చర్యలు వివాదాస్పదంగా మారాయి.  

    ఘటన వివరాలు.. NHAI అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వైసీపీ సానుభూతిపరుల షాపుల ముందు JCB తో గండ్లు పెట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ధ్వంసం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. రహదారి పక్కన ఉన్న ఇతర షాపులను మాత్రం తొలగించకపోవడం వివక్షత ఆరోపణలకు దారితీసింది.  

    దాంతో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దేవభక్తుని చక్రవర్తి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా పడేస్తారు? అని ప్రశ్నించారు. మచిలీపట్నం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఇలాగే పడేస్తారా? అంటూ నిలదీశారు. రహదారి అటువైపు ఉన్న షాపులు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చెందిన షాపులపై అధికారులు జంకుతున్నారా అని కూడా ప్రశ్నించారు.  

    వైసీపీ నేత చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 

  • ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుందని కేంద్రం వెల్లడించింది. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర విద్యార్థులు డ్రాపౌట్లు అయినట్ల తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమాధానం ఇచ్చారు.

    ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని.. 12 తరగతి వరుకు విద్యార్థుల గణాంకాలు కేంద్రం వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 36,43,083 విద్యార్థులు కాగా.. 2025-26 విద్యా సంవత్సరంలో 34,93,449కి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఏడాది వ్యవధిలో 1,49,634 విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు.

    గవర్నమెంట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తొలగించడం, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు, విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు గుడ్ బై చెబుతున్నారు.

  • సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్‌సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.

    అమరావతి పేరుతో దోపిడీ.. 
    అమరావతి బిల్లుపై లోక్‌సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా  దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్‌ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.

    చర్చలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్‌ పూలింగ్‌, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.

    ఉద్ధవ్‌  సేన ఎంపీ అర్వింద్‌సావంత్‌ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు  శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ  ఆయన ప్రశ్నించారు.

     

     

  • సాక్షి, కష్ణా: జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో కలెక్టర్ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం చర్చాంశనీయంగా మారింది. మాకు చెప్పకుండా మా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తామంటూ కలెక్టర్‌పై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. ఆకస్మిక తనిఖీలు మీకు చెప్పి రాలేమంటూ కలెక్టర్‌ బాలాజీ సమాధానం ఇచ్చారు. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరగడంతో.. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు.  

     

  • సాక్షి,విజయవాడ: టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వం తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 4న (శనివారం) వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలు పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో మల్లాది విష్ణుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 

    టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. బీఆర్ నాయుడు అసాంఘిక , అనైతిక చర్యల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలరోజులైనా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ ఛైర్మన్ ఎంత నిష్టగా ఉండాలి. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా?. లేదంటే చంద్రబాబు చెబితే బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకూ ఒత్తిడి తెస్తాం. టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు కొనసాగడాన్ని వైఎస్సార్‌సీపీ తప్పుపడుతోందన్నారు.  

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై సమీర్‌ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు. 

    లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్‌ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ (4-0-28-1), మొహిసిన్‌ ఖాన్‌ (4-1-19-1), ప్రిన్స్‌ యాదవ్‌ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు.  

    అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్‌కే పరిమితం చేశారు. నటరాజన్‌ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-31-2), అక్షర్‌ పటేల్‌ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) పర్వాలేదనిపించారు.

     

  • భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ హవా ఐపీఎల్‌లోనూ కొనసాగింది. 2026 ఎడిషన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి) అయిన అతను.. ఈ ఫ్రాంచైజీ తరఫున తొలి బంతికే వికెట్‌ తీసి ఔరా అనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 1) జరుగుతున్న మ్యాచ్‌లో తొలిసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీశాడు. షమీ దెబ్బకు ఢిల్లీ స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గోల్డన్‌ డకౌటయ్యాడు.

    కడపటి వార్తలు అందే సరికి 142 పరుగుల ఛేదనలో ఢిల్లీ తడబడుతుంది. 8 ఓవర్లలో 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. షమీ తన కోటాలో 3 ఓవర్లు పూర్తి చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీపై లక్నో బౌలర్లు ముప్పేట దాడి చేస్తున్నారు. షమీ ఓ పక్క.. ప్రిన్స్‌ యాదవ్‌ (2-0-14-2), మొహిసిన్‌ ఖాన్‌ (2-1-2-1) ఎండ్‌ నుంచి ఢిల్లీపై ఎదురుదాడి చేస్తున్నారు. 

    ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే మరో 72 బంతుల్లో 89 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సమీర్‌ రిజ్వి (11), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (12) ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిస్సంక (1), అక్షర్‌ పటేల్‌ (0) వికెట్లు ప్రిన్స్‌ యాదవ్‌ తీయగా.. నితీశ్‌ రాణాను (15) మొహిసిన్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు.

    అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్‌ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-31-2), అక్షర్‌ పటేల్‌ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) పర్వాలేదనిపించారు.

    దేశవాలీ క్రికెట్‌లో షమీ హవా
    టీమిండియా బెర్త్‌ లక్ష్యంగా షమీ దేశవాలీ క్రికెట్‌లో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. తాజా సీజన్‌లో అతను రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు.. విజయ్‌ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు తీశాడు. 
     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా రేపు (ఏప్రిల్‌ 2) సన్‌రైజర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్‌ న్యూస్‌ అందుతుంది. ఆ జట్టు అత్యంత ఖరీదైన ఆటగాడు కెమరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం​ ప్రారంభించాడు. 

    గ్రీన్‌ను కేకేఆర్‌ యాజమాన్యం ఆల్‌రౌండర్‌ కోటా రూ. 25 కోట్ల భారీ మొత్తం వచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను కేవలం బ్యాటింగ్‌ మాత్రమే చేస్తాడని తెలిసి కేకేఆర్‌ అభిమానులు చాలా ఫీలయ్యారు. అంత భారీ మొత్తం వెచ్చించి కేవలం బ్యాటింగ్‌ మాత్రమే ఏంటని బహిరంగ విమర్శలు చేశారు.

    గత మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్‌) గ్రీన్‌ బౌలింగ్‌ చేయకపోవడం కేకేఆర్‌ను మ్యాచ్‌ కోల్పోయేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌ తర్వాత గ్రీన్‌ జాతీయ జట్టు క్రికెట్‌ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా ముందుకొచ్చి అతనికి మద్దతుగా నిలబడింది. 

    గ్రీన్‌కు శస్త్రచికిత్స జరిగింది. అతను మరికొంతకాలం కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని సర్ద చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్‌ యాజమాన్యానికి ముందే చెప్పామని వివరణ ఇచ్చింది. మరో 10-12 రోజుల్లో గ్రీన్‌ బౌలింగ్‌  ప్రారంభిస్తాడని ఓ ప్రకటన విడుదల చేసింది.

    అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఈ ప్రకటన వెలువడని రెండు రోజుల్లోనే గ్రీన్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. ఇది ఒక రకంగా కేకేఆర్‌కు శుభవార్తే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయం. 

    గ్రీన్‌ హడావుడిగా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టడానికి కేకేఆర్‌ యాజమాన్యం ఒత్తిడి కారణమని తెలుస్తుంది. వారు కూడా ఈ విషయంలో తమ అభిమానుల డిమాండ్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది.

    గ్రీన్‌ బౌలింగ్‌ విషయమై కేకేఆర్‌ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను కేవలం బ్యాటింగ్‌ మాత్రమే చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీ వ్యక్తిగతమే అయినా, ఇలాంటి విషయాల్లో అభిమానుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా జట్టు గెలుపు కోసమే తహతహలాడుతుంటారు కాబట్టి, ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదు.

    ఏదిఏమైనా గ్రీన్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించడం కేకేఆర్‌కు శుభపరిణామం. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 220 పరుగుల భారీ స్కోర్‌ చేసి కూడా సరైన బౌలింగ్‌ వనరులు లేకపోవడం చేత దాన్ని కాపాడుకోలేకపోయింది. రేపటి సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లో గ్రీన్‌ బౌలింగ్‌ చేస్తే, ఆ జట్టు విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

     

  • పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ  క్రికెట్ బోర్డు రూ.67 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ చర్యపై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయని యూనిస్ మండిపడ్డాడు.

    అసలు ఏం జరిగిందంటే?
    మార్చి 27న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. దీన్ని నసీమ్‌ తప్పుపడుతూ.. ‘‘ఆమెను లార్డ్స్‌లో రాణిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’’ అని మరియంను ఉద్దేశించి వ్యంగ్యంగా ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశాడు. 

    వెంటనే అతడు ఆ పోస్టను తొలిగించినప్పటికి, పీసీబీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. పీసీబీ క్రమశిక్షణ కమిటీ కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నసీమ్ షాకు 20 మిలియన్ల పాక్‌ రూపాయల జరిమానా విధించింది. ఈ క్రమంలోనే పీసీబీ నిర్ణయాన్ని యూనిస్ తప్పుబట్టాడు.

    నసీమ్ షా ఆ ట్వీట్‌కు క్షమాపణ కూడా చెప్పాడు. తన సోషల్ మీడియా మేనేజర్ పొరపాటున చేశాడని నసీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి కూడా తప్పించాడు.  అలాంటప్పుడు హెచ్చరికతో వదిలేయాల్సింది. లేదంటే తక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సింది. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తాయి అని యూనిస్ పేర్కొన్నాడు.
    చదవండి: KKR vs SRH: స‌న్‌రైజ‌ర్స్ తుది జ‌ట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆట‌గాడికి నో ఛాన్స్‌?

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మధ్య ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్‌ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.

    షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్‌గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్‌గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.

    వివాదం  నేపథ్యం
    ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్‌ రాహుల్‌ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్‌ అయ్యాయి. 

    ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్‌ను అలా పబ్లిక్‌గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.

    ఎల్‌ఎస్‌జీలోకి షమీ
    ఐపీఎల్‌ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్‌ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్‌ చేసుకుంది. ఐపీఎల్‌ 2013లో కేకేఆర్‌ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు.  

    ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2026లో ఎల్‌ఎస్‌జీ ఇవాళ (ఏప్రిల్‌ 1) తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitals‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు.  
     

  • లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు
    లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్‌పై సమీర్‌ రిజ్వి (70 నాటౌట్‌) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. 

    అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (39 నాటౌట్‌) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్‌ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. 

    ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్‌
    4.3వ ఓవర్‌- ప్రిన్స్‌ యాదవ్‌ ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్‌ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్‌ పటేల్‌ను (0) కూడా పెవిలియన్‌కు పంపాడు. 

    మూడో వికెట్‌ డౌన్‌
    4.2వ ఓవర్‌-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
    3.3వ ఓవర్‌- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది.మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రాణా (15) ఔటయ్యాడు.

    తొలి బంతికే వికెట్‌ తీసిన షమీ
    142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్‌ తీశాడు. 

    చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో
    టాస​్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్‌ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-31-2), అక్షర్‌ పటేల్‌ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.అబ్దుల్‌ సమద్‌ (36), మిచెల్‌ మార్ష్‌ (35) పర్వాలేదనిపించారు. 

    ఆరో వికెట్‌ కోల్పోయిన లక్నో
    13.1వ ఓవర్‌- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్‌ కోల్పోయింది. ముకుల్‌ ఛౌదరిని (14) కుల్దీప్‌ యాదవ్‌ క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు.

    పీకల్లోతు కష్టాల్లో లక్నో
    9.3వ ఓవర్‌- టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ట్రస్టన్‌ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (35) ఔటయ్యాడు. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన లక్నో.. పూరన్‌ (8) ఔట్‌
    8.5వ ఓవర్‌- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో పూరన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్‌
    6.3వ ఓవర్‌- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. నటరాజన్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ బదోని డకౌటయ్యాడు.

    రెండో వికెట్‌ డౌన్‌.. మార్క్రమ్‌ (11) ఔట్‌
    5.5వ ఓవర్‌- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో.. పంత్‌ (7) ఔట్‌
    2.6వ ఓవర్‌- ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్‌ మిచెల్‌ మార్ష్‌ కొట్టిన బంతి బౌలర్‌ చేతికి తాకి నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్‌ ఔటయ్యాడు.

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

    తుది జట్లు..

    లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్

    ఇంపాక్ట్ సబ్‌లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీ

    ఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్

    ఇంపాక్ట్ సబ్‌లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌మ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గురువారం(ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓట‌మి పాలైన స‌న్‌రైజ‌ర్స్.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ ప‌రంగా ఎంత ప‌టిష్టంగా ఉందో, బౌలింగ్ ప‌రంగా అంతే బ‌ల‌హీనంగా క‌న్పిస్తోంది. ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్కట్ వంటి ఫాస్ట్ బౌల‌ర్లు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

    అంతేకాకుండా కొత్త‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన సీనియ‌ర్ పేస‌ర్ డేవిడ్ పేయిన్, గ‌త సీజ‌న్‌లో అద‌ర‌గొట్టిన ఎషాన్ మ‌లింగ‌ సైతం విఫ‌ల‌మ‌య్యారు. దీంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది.

    డేవిడ్ పేయిన్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ బ్రైడ‌న్ కార్స్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. వాస్త‌వానికి తొలి మ్యాచ్‌లోనే కార్స్ ఆడాల్సి ఉండేది. కానీ ప్రాక్టీస్ సెష‌న్‌లో చిన్న‌పాటి గాయం కార‌ణంగా అత‌డు మొద‌టి మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అయితే ఇప్పుడు అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు స‌మాచారం. 

    అదేవిధంగా హ‌ర్ష్ దూబే స్ధానంలో జీషాన్ అన్సారీని ఆడించాల‌ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌త మ్యాచ్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు మరోసారి నిరాశే ఎదరయ్యే అవ‌కాశ‌ముంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కడం లేదు. 

    ఒక‌వేళ లివింగ్‌స్టోన్ ఆడించాలంటే ఎషాన్ మ‌లింగ లేదా పేయిన్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తుంది. అలా చేస్తే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఎవరూ ఉండరు. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అంత భారీ ధ‌ర చెల్లించిన‌ప్ప‌టికి అత‌డిని ఎస్ఆర్‌హెచ్ ఉప‌యోగించుకోక‌పోవ‌డం ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది.

    ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టు(అంచ‌నా)
    అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్,ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, బ్రైడ‌న్ కార్స్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, జయదేవ్ ఉనద్కట్‌, జీష‌న్ అన్సారీ
    ఇంపాక్ట్‌ ప్లేయర్‌: పేయిన్‌/ ఎషాన్‌ మలింగ
    చదవండి: ఇంగ్లండ్‌కు గుడ్‌బై..! జింబాబ్వేకు ఆడ‌నున్న సామ్ కర్రాన్‌?

  • ఐపీఎల్‌ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతున్న వేళ, బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తమ ఆథ్వర్యంలో నడిచే ఐపీఎల్‌కు ప్రధాన ప్రత్యర్ది అయిన బిగ్‌ బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా)ను భారత్‌లో నిర్వహించే (ఆరంభ మ్యాచ్‌) అంశంపై క్రికెట్‌ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. 

    ఈ విషయమై బీసీసీయే స్వయంగా పావులు కదుపుతున్నట్లు క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్‌ ప్రత్యర్ది లీగ్‌ను బీసీసీయే ఎందుకు ఎంకరేజ్‌ చేస్తుందన్న విషయం భారతీయ క్రికెట్‌ అభిమానికి అర్దం కావడం లేదు.

    ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌ టామ్‌ మోరిస్‌ ప్రకారం, క్రికెట్‌ ఆస్ట్రేలియా 2026–27 సీజన్‌ తొలి బీబీఎల్‌ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు BBL ఎప్పుడూ విదేశీ నేలపై జరగలేదు. ఇది జరిగితే చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. 

    ఈ విషయమై క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతనిధుల ఇదివరకే బీసీసీఐతో చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్లు, ఫ్రాంచైజీలు ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి.బీసీసీఐతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. మొదట్లో ఇది సాకారం అయ్యే కలలా అనిపించలేదు కానీ, ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా అడుగులుపడుతున్నాయి.  

    చెన్నైలో తొలి మ్యాచ్‌..?  
    అన్నీ అనుకున్నట్లు జరిగితే, BBL 2026–27 సీజన్‌ తొలి మ్యాచ్‌ చెన్నైలో జరగవచ్చు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పెర్త్‌ స్కార్చర్స్‌ ఆరంభ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది.  

  • సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌ లు ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్ప‌టికి.. జింబాబ్వే క్రికెట్‌తో వారికి వీడ‌దీయ‌రాని బందం ఉంది. వారి తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడ‌గా.. త‌మ్ముడు బెన్ క‌ర్ర‌న్ ప్ర‌స్తుతం జింబాబ్వే జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా ఉన్నాడు.

    అంతేకాకుండా వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ కూడా గతంలో రోడేసియా (ప్రస్తుత జింబాబ్వే) తరఫున ఆడారు. అయితే ఇప్పుడు సామ్ కర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కూడా ఇంగ్లండ్ జ‌ట్టును వ‌దిలి జింబాబ్వే తరఫున ఆడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

    జింబాబ్వే క్రికెట్ వర్గాల్లో చురుగ్గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ ఆడమ్ థియో తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. "మాజీ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు సామ్, టామ్ క‌ర్రాన్‌లు ఇప్పుడు జింబాబ్వే క్రికెట్ త‌ర‌పున ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ప్ర‌స్తుతం టామ్ క‌ర్రాన్‌కు జింబాబ్వే జ‌ట్టు తరపున ఆడేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ప్ప‌టికి..సామ్ మాత్రం ఐసీసీ నుంచి అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాడు. 

    టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 త‌ర్వాత ఈ చ‌ర్చ‌లు జ‌రిగాయి" అని ఎక్స్‌లో థియో రాసుకొచ్చాడు. అందుకు సామ్‌, టామ్ జింబాబ్వే జెర్సీలు ధరించిన ఒక ఫోటోను కూడా జోడించాడు. ఇది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక‌య్యారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో, తన ఫాలోవర్లను ఆటపట్టించడానికి థియో ఈ పోస్ట్ చేశారు. 

    అంతే త‌ప్ప ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాగా  సామ్ క‌ర్రాన్‌, టామ్ క‌ర్రాన్‌లు కేప్‌టౌన్‌లో జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకే పౌర‌స‌త్వం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్ద‌రూ.. జింబాబ్వేకు ఆడాలంటే కనీసం నాలుగు ఏళ్లు అక్కడ నివసించాలి. అంతేకాకుండా జింబాబ్వే త‌ర‌పున డొమాస్టిక్ క్రికెట్ ఆడాలి. టామ్ క‌ర్రాన్ ప్ర‌స్తుతం జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉండ‌గా.. సామ్ క‌ర్రాన్ మాత్రం కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు
    చదవండి: ICC Rankings: దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌.. ఏకంగా 64 స్ధానాలు

  • గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అక్షర్‌ పటేల్‌ సారథ్యంలో వరుస విజయాలతో ఆరంభంలో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో ఏడు గెలిచి ప్లే ఆఫ్స్‌ చేరుకుండానే నిష్క్రమించింది.

    ఈ క్రమంలో ఐపీఎల్‌-2026లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. తాజా ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో అక్షర్‌ సేన.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG vs DC)ను ఎదుర్కోనుంది. ఇక ఈసారి ఢిల్లీ ఓపెనింగ్‌ జోడీ మారనుంది.

    కేఎల్‌ రాహుల్‌ జోడీ ఎవరు?
    టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. అయితే, అతడికి జోడీ ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నోతో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించేదెవరు?

    అభిషేక్‌ పోరెల్‌, పాతుమ్‌ నిస్సాంక లేదంటే పృథ్వీ షా?.. నేనైతే పృథ్వీ షాకే ఓటు వేస్తాను. నితీశ్‌ రాణా వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (Axar Patel), డేవిడ్‌ మిల్లర్‌, అశుతోశ్‌ శర్మ రావాలి.

    ఎనిమిదో స్థానంలో సీమర్‌ రిజ్వీ లేదంటే విప్రాజ్‌ నిగమ్‌ను ఆడించవచ్చు. కుల్దీప్‌ యాదవ్‌, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. ఒకవేళ మరో భారత బౌలర్‌ను ఆడించాలనుకుంటే టి.నటరాజన్‌ లేదంటే ఆకిబ్‌ నబీని తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

    ఊహించని విధంగా..
    కాగా గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా లీగ్‌కు దూరమయ్యాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటి మినీ వేలంలో పేరు నమోదు చేసుకోగా ముందుగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. 

    అయితే, ఆఖరి నిమిషంలో రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ తమ పాత ఆటగాడిని సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా ఊహించని విధంగా ఓపెనర్‌గా స్థానం ఇవ్వడం గమనార్హం.

    లక్నోతో మ్యాచ్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న ఢిల్లీ తుదిజట్టు
    కేఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా, నితీశ్‌ రాణా, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌, డేవిడ్‌ మిల్లర్‌, అశుతోశ్‌ శర్మ, సమీర్‌ రిజ్వి/విప్రాజ్‌ నిగమ్‌, కుల్దీప్‌ యాదవ్‌, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్‌/ఆకిబ్‌ నబీ.

    చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’

  • శ్రీలంక విధ్వంసకర బ్యాటర్‌ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. 

    అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్‌ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు.  

    మాట మార్చిన హర్షి
    బెయిల్‌ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. 

  • ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ త‌మ టాప్‌-2 స్దానాల‌ను నిల‌బెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్ల‌తో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతుండ‌గా.. కిష‌న్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.

    ఇక ఇటీవ‌ల న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా స‌త్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగ‌బాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.

    ఇక టాప్‌-10లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్  జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. 

    మ‌రోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ ర‌షీద్ ఖాన్ త‌న అగ్ర‌స్ధానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు త‌మ ర్యాంక్‌ల‌ను మెరుగుప‌రుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు.  ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 
    చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్..! ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?

  • రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ నండ్రే బర్గర్‌కు అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు (CSA) షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల (2026–27 ) జాబితా నుంచి అతని పేరును తప్పించింది. బర్గర్‌తో పాటు మరికొంత మంది స్టార్‌ ఆటగాళ్లు కూడా ఈ జాబితా నుంచి తప్పించబడ్డారు. గెరాల్డ్‌ కొయెట్జీ, లిజాడ్‌‌ విలియమ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాసీ వాన్‌ డర్‌ డస్సెన్‌ లాంటి స్టార్లు కాంట్రాక్టులు కోల్పోయారు.

    కాంట్రాక్ట్‌ల విషయంలో క్రికెట్‌ సౌతాఫ్రికా ముందు నుంచి ఓ విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆటగాళ్లు ఎన్ని ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొన్నా, జాతీయ జట్టు తరఫున వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని కండీషన్‌ పెట్టింది. అయినా, చాలామంది ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌లకే అధిక ప్రాధాన్యమిచ్చి జాతీయ విధులను నిర్లక్ష్యం చేశాడు. దీని ఫలితమే తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో స్టార్‌ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం​.

    తాజాగా కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఆటగాళ్లు ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడటం వల్ల గాయాలపాలై జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. అందుకే వీరిని కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించినట్లు క్రికెట్‌ సౌతాఫ్రికా వివరణ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టు గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 53 మ్యాచ్‌లు (7 టెస్టులు, 12 వన్డేలు, 34 టీ20లు) ఆడగా.. కొయెట్జీ 8 (టీ20లు), బర్గర్‌ 15 (9 వన్డేలు, 6 టీ20లు), విలియమ్స్‌ 6 (ఒక వన్డే, 5 టీ20లు) మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.

    మిలర్‌ (36), డస్సెన్‌ (37) వయసు పైబడుతున్న కారణంగా కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. అయితే ఆశ్చర్యకరంగా మరో వెటరన్‌ సైమన్‌ హార్మర్‌కు (37) కాంట్రాక్ట్‌ దక్కింది. ఈసారి కొత్తగా కాంట్రాక్ట్‌లు పొందిన ఆటగాళ్ల జాబితాలో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, కార్బిన్‌ బాష్‌, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ తదితరులు ఉన్నారు.

    వార్షిక కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితా..
    టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్‌ వెర్రిన్‌, సైమన్ హార్మర్

    రాయల్స్‌ హీరోగా మారిన బర్గర్‌  
    ఐపీఎల్‌ 2026లో భాగంగా తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌తో నండ్రే బర్గర్‌ చెలరేగిపోయాడు. కీలకమైన సంజూ శాంసన్‌ వికెట్‌ సహా పొదుపుగా బౌలింగ్‌ చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో బర్గర్‌ రాయల్స్‌ హీరోగా ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. అతను సంజూ వికెట్‌ తీసిన తీరు రాయల్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్‌ టెండుల్కర్‌ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

    తండ్రి సచిన్‌ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్‌ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.

    ఐదు మ్యాచ్‌లు ఆడి..
    సచిన్‌ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

    లక్నో సూపర్‌ జెయింట్స్‌లోకి
    ఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. అర్జున్‌కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో శుభంకర్‌ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరైన అర్జున్‌ టెండుల్కర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్‌ చేశారు. స్వింగ్‌ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్‌ అర్జున్‌ టెండుల్కర్‌ను అడిగాడు.

    బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?
    ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్‌ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. 

    అదే విధంగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్‌ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్‌ సబ్‌ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.

    చదవండి: సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగ‌ళ‌వారం చండీగఢ్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచాడు. టీ20ల్లో టీమిండియా లీడింగ్ వికెట్ టేక‌ర్ ఉన్న అర్ష్‌దీప్‌.. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు.

    త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 42 ప‌రుగులు స‌మ‌ర్పించుకుని వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు. అత‌డి ఎకానమీ రేటు 10.50గా ఉంది. వైశాఖ్ విజ‌య్‌కుమార్ వంటి యువ బౌల‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి త‌న స‌త్తాచాటితే, అర్ష్‌దీప్ వంటి స్టార్ పేస‌ర్ తేలిపోవ‌డం పంజాబ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచింది.

    కాగా గుజ‌రాత్ ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను అర్ష్‌దీప్ సింగ్‌కు కెప్టెన్ అప్ప‌గించాడు. అయితే ఆ ఓవ‌ర్‌ను పూర్తి చేసేందుకు అర్ష్‌దీప్ ఏకంగా 11 బంతులు వేయాల్సి వ‌చ్చింది. ఇందులో 5 వైడ్‌లు, 1 నో-బాల్ ఉన్నాయి. ఈ పంజాబీ స్పీడ్ స్టార్ త‌న చెత్త బౌలింగ్‌తో అంద‌రిని విసిగించాడు. ఈ క్ర‌మంలో అర్ష్‌దీప్ ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

    ఐపీఎల్ చరిత్ర‌లో లాంగెస్ట్ ఓవ‌ర్ వేసిన బౌల‌ర్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌,  తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యాల స‌ర‌స‌న అర్ష్‌దీప్ చేరాడు. వీరంతా అర్ష్‌దీప్ కంటే ముందు  11 బంతుల ఓవ‌ర్లు వేశారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ నిర్దేశించిన 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవ‌ర్లలో 7 వికెట్ల కోల్పోయి చేధించింది. కూప‌ర్ కొన్నోలీ అజేయంగా నిలిచి జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చాడు.
    చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయ‌స్..! ఓపెన‌ర్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?

  • భార‌త పురుష‌ల క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధ‌వారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.

    అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్‌, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంత‌కంటే ముందు భార‌త జ‌ట్టు..  ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, అఫ్గానిస్తాన్‌ల‌తో వైట్‌బాల్ సిరీస్‌ల‌లో త‌ల‌ప‌డ‌నుంది. అంతేకాకుండా జింబాబ్వే ప‌ర్య‌ట‌న ముగిసిన వెంట‌నే టీమిండియా శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

    అయితే ఈ వరుస సిరీస్‌ల నేపథ్యంలో  ఐర్లాండ్‌, జింబాబ్వే టూర్‌ల‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది. ఈ సిరీస్‌లో వైభ‌వ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్‌-2026లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచే యంగ్ క్రికెట‌ర్ల‌ను కూడా సెలెక్ట‌ర్లు ప‌రిగణ‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైన‌ప్ప‌టికి 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి మాత్రం భార‌త సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున పిలుపు రావ‌డం దాదాపు ఖాయ‌మ‌న్పిస్తోంది.

    కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌?
    మ‌రోవైపు గ‌త కొంత‌కాలంగా కేవ‌లం వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి టీ20 జ‌ట్టులోకి వ‌చ్చే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన త‌ర్వాత టీమిండియా టీ20 రెగ్యుల‌ర్ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. సూర్య ప్ర‌స్తుతం స్వ‌ల్ప గ‌జ్జ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. 

    దీంతో అత‌డికి ముఖ్య‌మైన సిరీస్‌లోనే అత‌డిని ఆడించాల‌ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ భావిస్తుందంట‌. ఈ క్ర‌మంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్‌లో భార‌త జ‌ట్టు ప‌గ్గాల‌ను శ్రేయ‌స్ చేప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని క్రికెట్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. శ్రేయ‌స్ చివ‌ర‌గా రెండేళ్ల కింద‌ట టీమిండియా త‌ర‌పున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.
    చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌
     

  • ఐపీఎల్‌-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గిల్‌ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యంపై టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ముఖ్యంగా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ నాయకత్వ బృందాన్ని భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన గుజరాత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

    రెండు ఓవర్లు వేసి 
    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత కీలక పేసర్లలో ఒకడైన గుజరాత్‌ బౌలర్‌ సిరాజ్‌ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు.

    ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్‌ సింగ్‌ టైటాన్స్‌ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువగా బౌలింగ్‌ చేయనేలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు.

    సిరాజ్‌ జట్టులో ఎందుకున్నట్లు?
    అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారు. నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సింది. గాయం కారణంగానా? లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

    కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే, పంజాబ్‌ బ్యాటర్‌ కూపర్‌ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్‌ (44 బంతుల్లో 72 నాటౌట్‌)తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు. 

    చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’

  • ఇంగ్లండ్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ ర‌వి బొపారా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.  బొపారా తన 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు. 2026 ఇంగ్లండ్‌ డొమెస్టిక్ సీజన్‌కు ముందే త‌న నిర్ణ‌యాన్ని బొపారా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా కేవలం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. 

    బొపారా 2002లో ఎసెక్స్  త‌ర‌పున త‌న కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు ఎసెక్స్ క్ల‌బ్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ త‌ర్వాత 2020లో ససెక్స్‌తో అత‌డు ఒప్పం కుదుర్చుకున్నాడు. కానీ మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నార్తాంప్టన్‌షైర్ జ‌ట్టులో బొపారా చేరాడు. గ‌త రెండు సీజ‌న్‌ల‌లో అత‌డు నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. 

    గత సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరడంలో బొపారా కీల‌క పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్లో సర్రే జట్టుపై కేవలం 46 బంతుల్లోనే 105 పరుగుల  చేసి త‌న జ‌ట్టుకు అద్భుత‌మైన‌ విజయాన్ని అందించాడు. ఈ ఏడాది కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు అత‌డికి ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికి అత‌డు తిరస్క‌రించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించి అంద‌రికి షాకిచ్చాడు.  

    ప్ర‌స్తుతం కరాచీ కింగ్స్ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొపారా.. త్వరలో కౌంటీ సీజ‌న్‌లో కామెంటేటర్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ జాతీయ సెలెక్టర్‌ కావాలని బొపారా ఆశిస్తున్నాడు. కాగా బొపారా ఇంగ్లండ్‌ తరపున చివరగా 2015లో ఆడాడు.

    అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్‌ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆడుతూ వచ్చాడు. అతడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009, 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్‌ తరపున అతడు  13 టెస్టులు, 120 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.

    రవి బొపారా టెస్టు క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. 2009లో వెస్టిండీస్‌పై అతడు  ఈ ఫీట్ సాధించాడు. ఫస్ట్ క్రికెట్‌లో కూడా అతడి పేరిట దాదాపు 13,000 వేల పరుగులు ఉన్నాయి.
    చదవండి: NZ vs SA: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
     

  • ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడం జంపా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనందు వల్లే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)ను వదిలివేసినట్లు తెలిపాడు. అదే సమయంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ఆడేందుకు డబ్బే కారణం అంటూ జంపా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.

    డబ్బుకు డబ్బు.. పేరు పేరు
    కాగా ప్రపంచంలోనే ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా డబ్బుకు డబ్బు.. పేరు పేరు సంపాదించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లో ఆడేందుకు పీఎస్‌ఎల్‌ను వీడిన ఆటగాళ్లు కూడా కోకొల్లలు.

    పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో
    తాజాగా 2026 ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ, శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక (Dasun Shanaka), ఆస్ట్రేలియా పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ తదితరులు పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరారు. అయితే, వీరికి ఆడం జంపా మాత్రం భిన్నంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో తన ప్రతిభకు తగ్గ ధర దక్కలేదని.. అందుకే పీఎస్‌ఎల్‌లో చేరినట్లు తెలిపాడు.

    జంపా మాత్రం రివర్స్‌
    ‘‘నేను రేసులో లేను. అందుకే ఐపీఎల్‌-2026 మినీ వేలంలో నా పేరు నమోదు చేసుకోలేదు. ఆ టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకొన్నా. నిజం చెప్పాలంటే... నాలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడి కంటే ఇతరులకు ఎక్కువ డబ్బు లభిస్తోంది.

    అందుకే అక్కడ ఉండటం సరైన నిర్ణయం కాదనిపించింది. అందుకే ఐపీఎల్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నా. విరామం తీసుకున్నా. ఇంతలో పీఎస్‌ఎల్‌ నుంచి పిలుపు వచ్చింది’’ అని ఆడం జంపా చెప్పుకొచ్చాడు.  

    కాగా 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన జంపా తొలుత రూ. 30 లక్షల జీతం అందుకోగా.. క్రమేణా ఆ మొత్తం 2.40 కోట్ల రూపాయలకు చేరింది. తాజాగా పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌తో జంపా రూ. 1.51 కోట్లకు (పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) ఒప్పందం చేసుకున్నాడు.

    చదవండి: మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

  • ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్‌లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.

    మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.

    తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్‌-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్  కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్‌, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.

    అయితే వరుస సిరీస్‌ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.

    భారత్‌-జింబాబ్వే టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    మొదటి టీ20: జూలై 23

    రెండో టీ20: జూలై 25

    మూడో టీ20: జూలై 26
    చదవండి: NZ vs SA: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

  • కొచ్చి: నామమాత్రమైన మ్యాచ్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు మెరిసింది. హాంకాంగ్‌ జట్టుతో మంగళవారం జరిగిన ఆసియా కప్‌ 2027 క్వాలిఫయింగ్‌ టోర్నీ చివరి మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ గ్రూప్‌ ‘సి’లో భారత్‌ ఐదు పాయింట్లతో చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 

    భారత్, బంగ్లాదేశ్‌ ఐదు పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్‌ సగటుతో బంగ్లాదేశ్‌కు మూడో స్థానం, భారత్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. హాంకాంగ్‌ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... సింగపూర్‌ 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించింది.

    గతేడాది భారత పౌరసత్వాన్ని తీసుకున్న ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్‌ రియాన్‌ విలియమ్స్‌ తొలిసారి టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 32 ఏళ్ల విలియమ్స్‌ నాలుగో నిమిషంలోనే భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. 50వ నిమిషంలో ఆకాశ్‌ మిశ్రా గోల్‌తో భారత్‌ 2–0తో ముందంజ వేసింది. 65వ నిమిషంలో ఎవర్టన్‌ కమార్గో గోల్‌తో హాంకాంగ్‌ ఖాతా తెరిచింది. అయితే తదుపరి 35 నిమిషాలు హాంకాంగ్‌ ఆటగాళ్లను భారత్‌ నిలువరించి ఈ టోర్నీని గెలుపుతో ముగించడంలో విజయవంతమైంది. కాగా కొచ్చి మైదానంలో భారత ఫుట్‌బాల్‌ టీం 30 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకోవడం విశేషం.
     

  • వెల్లింగ్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 347 పరుగుల లక్ష్యాన్ని చేధించి  భారత్ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును కివీస్ తిరగరాసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డులెక్కింది. 

    ఇంతకుముందు వరకు ఈ రికార్డు భారత మహిళల జట్టు పేరిట ఉండేది. వన్డే ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఉమెన్ ఇన్ బ్లూ.. 339 పరుగులు టార్గెట్‌ను చేజ్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డును కివీస్ బ్రేక్ చేసింది.

    ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో అన్నేకే బోష్(91) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..  కెప్టెన్ లారా వోల్వార్డ్(69), ట్రయోన్‌(52), జాఫ్టా(37) రాణించారు.

    అద‌ర‌గొట్టిన అమెలియా..
    ఇక ఈ భారీ ల‌క్ష్య చేధ‌న‌లో కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ అద్భుతం చేసింది. సుజీ బేట్స్‌(8), ప్లిమ్మ‌ర్‌(23), మ్యాడీ గ్రీన్‌(13) వంటి స్టార్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన చోట అమెలియా సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడింది. ఓ వైపు క్ర‌మం త‌ప్పుకుండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి కెర్ మాత్రం త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను కొన‌సాగించింది.

    ఈ క్ర‌మంలో అమెలియా కేవ‌లం 90 బంతుల్లోనే త‌న ఐదువ వ‌న్డే సెంచ‌రీ మార్క్‌ను అందుకుంది. ఆఖరి ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. అమెలియా కేర్ వ‌రుస‌గా మూడు బౌండరీలు బాది త‌మ జ‌ట్టుకు చిర‌స్మర‌ణీయ విజ‌యాన్ని అందించింది. మొత్తంగా మహిళల వన్డే క్రికెట్‌లో లక్ష్య చేధనలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో ప్లేయర్‌గా కెర్ నిలిచింది. అదేవిధంగా న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఉమెన్స్‌ ప్లేయర్‌గా కూడా కెర్‌ రికార్డు నెలకొల్పింది.

    మహిళల వన్డేల్లో అత్యధిక రన్ ఛేజ్ చేసిన జట్లు ఇవే
    న్యూజిలాండ్‌-347-ప్రత్యర్ధి- సౌతాఫ్రికా
    భారత్‌-339- ప్రత్యర్ధి- ఆస్ట్రేలియా
    ఆస్ట్రేలియా-331- ప్రత్యర్ధి భారత్‌
    చదవండి: మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

National

  • వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లకు, వాటి వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఊరట కల్పించింది. భద్రతా కారణాలతో తప్పనిసరి చేసిన సిమ్ బైండింగ్ నిబంధన అమలు గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఒక యాప్ పనిచేయాలంటే అది ఇన్‌స్టాల్ అయిన ఫోన్‌లోని సిమ్ కార్డుతో తప్పనిసరిగా అనుసంధానం కావడాన్నే సిమ్ బైండింగ్ అంటారు. గత ఏడాది నవంబర్‌లో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చి 90 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఐతే దీన్ని అమలు చేయడంలో టెస్టింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు మరింత సమయం కావాలని టెక్ కంపెనీలు కేంద్రాన్ని కోరాయి.

    కంపెనీల అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన కేంద్రం, గడువును డిసెంబర్ వరకు పొడిగించేందుకు సిద్ధమైనట్లు టెలికాం శాఖ ఉన్నతాధికారులను అడ్రెస్‌ చేస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ గడువు పొడిగింపుతో సిమ్ బైండింగ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడానికి టెక్ కంపెనీలకు తగినంత సమయం లభిస్తుంది. అదే సమయంలో కోట్లాది మంది యూజర్లకు తక్షణమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుంది.

  • తిరుచ్చి: ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ప్రదేశ్‌గా పేరు మారుస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో ఎన్నికల ‍ప్రచారంలో భాగంగా ఎన్డీఏపై స్టాలిన్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజిన్ ముందు ద్రవిడ మోడల్ సూపర్ ఫాస్ట్ ఇంజిన్ తల వంచదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్టాలిన్‌ విరుచుకుపడ్డారు.

    బీజేపీ ప్రభుత్వాన్ని ఒక పనికిరాని డబ్బా ఇంజిన్‌గా అభివర్ణించిన స్టాలిన్.. తమ ద్రవిడ మోడల్ పాలనను 'సూపర్ ఫాస్ట్ ఇంజిన్‌తో పోల్చారు. తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అభివృద్ధి పథంలో దూసుకుపోవడంలో తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించి, ద్రవిడ సిద్ధాంతాన్ని మరోసారి గెలిపించాలంటూ ప్రజలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

    బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే, వారి వల్ల కలిగే నష్టాలు మన ఊహకు అందవు. తమిళనాడు పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడు ఎప్పటికీ తమిళనాడుగానే ఉండాలి. ఉత్తరప్రదేశ్, మణిపూర్‌లాగా హింసాత్మక ప్రాంతంగా మారకూడదు. హోసూర్ విమానాశ్రయం, విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల కోసం తరచుగా పర్యటనలు చేస్తారు’’ అంటూ స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు.

  • ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ (సీసీఎస్‌) సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లు పాల్గొన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.

    ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్‌ సమావేశం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఎల్‌పీజీ ధరలు కూడా పెంచలేదు.

    ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్‌లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

    ఇరాన్‌పై అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై నేరుగా పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తోంది.

  • పంజాబ్‌: ఛండీఘడ్‌ బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పార్క్‌ చేసిన ఉంచిన స్కూటీలో పేలుడు సంభవించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. 

    పోలీసుల వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం చండీగఢ్ సెక్టార్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడు కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే, పేలుడుకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు.

    ఈ పేలుడు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక విచారణలో  ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి నాటు బాంబు లేదంటే ఐఈడీ విసిరి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
     

  • అకారణంగా ఇరాన్‌ జైల్లో 50 రోజులు బందీగా ఉన్నాడు. సరిగ్గా  విడుదలైన సమయానికి యుద్ధం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. జైలు గోడల మధ్యనుంచి విడుదలైనా కూడా ఆయనకు విముక్తి లభించలేదు. దీంతో అతని సంతోషం అంతా ఆవిరై పోయింది. భయంకరమైన అనుభవంతో ఎలాగోలా ప్రాణాలు ఇండియాకు చేరుకున్నాడు. ఇంతకీ ఎవరతను?  తీవ్ర ఉద్రికత్తతల మధ్య అడ్డంకులను  దాటుకొని సొంతగడ్డపై ఎలా అడుగు పెట్టాడు?

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం ఇరాన్‌లో 50 రోజుల జైలు జీవితం తర్వాత, విడుదలైన భారత్‌కు చెందిన కేతన్ మెహతా ఫిబ్రవరి 27న ఒక హోటల్‌కు చేరాడు.  మరుసటి రోజు (ఫిబ్రవరి 28) ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఆ సమయానికే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి. దీనితో విమానాశ్రయాలు మూతపడ్డాయి. భారత రాయబార కార్యాలయం (Indian Embassy)ని సంప్రదిస్తే హోటల్‌ నుంచి బయటకు రావద్దని సూచించారు.

    యుద్ధం తీవ్రం, ఉద్రిక్తతలు
    కేతన్ ఉన్న హోటల్, ఇరాన్ నావిదికాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ రేవు పట్టణానికి కేవలం 600-700 మీటర్ల దూరంలోనే ఉంది.   రోజురోజుకు యుద్ధ పరిస్థితి తీవ్రమవుతోంది. ప్రతిరోజూ 100 నుండి 200 బాంబులు పడుతుండటం, కిటికీల నుండి క్షిపణులు వర్షంలా కురవడం చూశానంటూ తన అనుభవాన్నివివరించారు. అయితే ఇండియన్‌ ఎంబసీ తనతో నిరంతరం సంప్రదిస్తూ తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.    

    యుద్ధం కారణంగా విమానాలు లేకపోవడంతో, 20 రోజుల తరువాత ఆయన బస్సు ద్వారా ఇరాన్ నుండి ఆర్మేనియా సరిహద్దు వరకు సుమారు 1,800 కిలోమీటర్లు ప్రయాణించారు.ఈ 18-19 గంటల ప్రయాణంలో కొండల మధ్య బాంబు పేలుళ్ల శబ్దాలు వినపడేవని, పేలుళ్ల ధాటికి బస్సు కూడా ఊగిపోయేదని ఆయన చెప్పారు. చివరకు, ఆర్మేనియా చేరుకున్న తర్వాత అక్కడి నుండి విమానంలో కేతన్ మెహతా సురక్షితంగా ఢిల్లీ సమీపంలోని తన నివాసానికి చేరుకున్నారు. జైలు కష్టాల కంటే, యుద్ధం మధ్య గడిపిన ఆ 25 రోజులు తన జీవితంలో అత్యంత భయానకమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.

    ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు


    జైలుకెందుకెళ్లారు?
    డిసెంబర్ 8న MT వేలియంట్ రోర్ (MT Valiant Roar) అనే  చమురు ట్యాంకర్‌ను ఇరాన్ అధికారులు  పట్టుకున్నారు. ఈ నౌక అక్రమ డీజిల్‌ను రవాణా చేస్తోందని ఆరోపించారు.  నౌకలోని 10 మంది భారతీయ సిబ్బందిని అరెస్టు చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ జైలుకు తరలించారు. అందులో కేతన్ మెహతా ఒకరు. అయితే దీనిని దుబాయ్‌కు చెందిన ప్రైమ్ ట్యాంకర్స్ LLCసంస్థ తిరస్కరించింది. 

    ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు

  • సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ వార్‌ నేపథ్యంలో చమురుపై పెరుగుతున్న ఆందోళలు మరింత ఉధృతమవుతున్నాయి.  దీంతోచమురు సరఫరాపై ఆందోళన వద్దని కేంద్రం మరోసారి స్ఫష్టం చేసింది. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.

    ‘‘దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయి. రాబోయే రెండు నెలల పాటు తగినంత సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది," అని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారం పునరుద్ఘాటించారు.  దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి,పెట్రోల్ బంకుల్లో ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రభుత్వం పేర్కొంది. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ భరోసా ఇచ్చింది.

    ఎల్పీజీ సరఫరా కూడా సాధారణంగానే ఉందనీ, దేశం దిగుమతులపై సుమారు 60 శాతం ఆధారపడి ఉందని సుజాత శర్మ అన్నారు. గృహ అవసరాలకు ఎల్‌పీజీ, అలాగే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)  100 శాతం సహజ వాయువు సరఫరాకు  ఢోకా లేదని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తూ, దేశీయ మార్కెట్లో ఏటీఎఫ్, డీజిల్ తగినంతగా లభించేలా చూసేందుకు భారత ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని కూడా విధించిందని ఆమె గుర్తుచేశారు.

    Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు
     

    ఇదీ చదవండి: 30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు

    కాగా పశ్చిమ ఆసియా సంఘర్షణల నేపథ్యంలో ఎల్‌పిజి, ఇంధన కొరతపై ఆందోళన నెలకొంది. దీంతో భారతదేశం వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.

    ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు

  • పెళ్లిళ్లు ‍స్వర్గంలో నిర్ణయించబడతాయని (Marriages are made in heaven) చాలామంది విశ్వసించే మాట. ‘ఎవరికి ఎవరు రాసి పెట్టి ఉన్నారో’ అని పెద్దలు కూడా తరచుగా అంటుంటారు. బిహార్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే ఔరా, విధి రాత అని అనుకోకమానరు. విషయం పూర్తిగా తెలియాలంటే  సినిమా లెవల్లో మలుపులు తీరిగిన ఈ కథనం చదవాల్సిందే.

    ఊహించని విధంగా, నిశ్చయించిన వరుడితో కాకుండా వేరొకరితో ఏడు అడుగులు వేసిందో వధువు. బిహార్‌లోని సిగోయిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరారాచక్‌లో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఒకవైపు బంధుమిత్రులు ఆనంద సందోహాలు, మరోవైపు బాజా భజంత్రీల మధ్య పెళ్లి మండపంలో అంతా సందడిగా ఉంది.  పెళ్లి పీటల మీద  వరుడు కూర్చుని ఉండగా, వధువు మండపం వైపు వస్తోంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అందరూ షాక్‌ అయ్యారు.  ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే  పెళ్లి కొడుకుని  పోలీసులు తీసుకెళ్లపోయారు.  

    గెస్ట్‌లంతా గందరగోళంతో చూస్తుండగా,  ఎ‍న్నో ఆశలతో పెళ్లి మండపం అడుగుల వేస్తున్న వధువు నిశ్చేష్టురాలైపోయింది. గ్రామ పెద్ద జోక్యంతో వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనినిర్ణయించారు. దీంతో సినీ ఫక్కీలో వారిద్దరూ  ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. 

    పోలీసులు ఎందుకొచ్చారంటే..
    సియారాంపూర్‌కు చెందిన సంజయ్ యాదవ్ కుమారుడు, వరుడు అనిల్ కుమార్, మోరారాచక్‌కు చెందిన భీమ్ యాదవ్ (పంకజ్ ) అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ చేశారు.   ఉన్నట్టుండి ఈ  పెళ్లి గురించి తెలిసిన అనిల్ ప్రియురాలు ఎంట్రీ ఇచ్చింది. తాను మొదటి భార్యనని, తనకు న్యాయం కావాలంటూ  సిగోయిడి పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు  కూడా చూపించడంతో  పోలీసులు రంగంలోకి దిగారు.

    దీంతో పెళ్లికొడుకుకు అప్పటికే రూబీ అనే మహిళతో వివాహం జరిగిందని  గ్రామ పెద్ద అశోక్ యాదవ్‌కు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి తెలియజేయడంతో అంతా  దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త గ్రామం అంతటా వేగంగా వ్యాపించింది. పోలీసులతో పాటు ఆ అమ్మాయి గ్రామానికి తిరిగి వచ్చి, అనిల్‌తో తన వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించింది. దీంతో గ్రామ పెద్ద ఇరు పక్షాల సుదీర్ఘ చర్చల అనంతరం, వధువు వరుడి తమ్ముడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ ఉదయమే, ఇరు కుటుంబాల సమక్షంలో ఆ వివాహం జరిపించడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తదనంతరం, అనిల్ రూబీ విషయాన్ని అంగీకరించి,  ఆమెతో కలిసి జీవిస్తూ, ఆమెను సంరక్షిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో  పోలీసులు అతన్ని విడుదల చేశారు. అలా కథ సుఖాంతం  అయింది.

  • సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్‌సభలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర  యాదవ్‌ అన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్‌ పూలింగ్‌ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్‌ను మోసం  చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.

    ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్‌
    ఉద్ధవ్‌  సేన ఎంపీ అర్వింద్‌సావంత్‌ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో  టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు  శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన  ప్రశ్నించారు.

     

  • ఐటీ కంపెనీలు ఇటీవలి కాలంలో మళ్లీ లేఆఫ్‌ల బాటపట్టాయి.  భారతీయ ఐటీ రంగంలో, ముఖ్యంగా ఒరాకిల్ (Oracle) సంస్థలో భారీ లేఆఫ్స్ బెంగళూరు లాంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.  తాజాగా ప్రముఖ  ఐటీ సంస్థ ఒరాకిల్ ఇండియా సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.  త్వరలోనే మరో 30వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. దీంతో ఏ క్షణాన ‘ఈ రోజే మీ చివరి పని దినం’ అనే సందేశాన్ని మోసుకొచ్చే మెయిల్‌  వస్తుందేమోనని  టెకీల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరికొన్ని వారాల్లో మరో విడత తొలగింపులు జరగవచ్చని అంచనా. రెండు దశాబ్దాల విస్తరణ తర్వాత భారతదేశ ఐటీ సేవల పరిశ్రమలో వృద్ధి వేగంగా మందగిస్తున్న తరుణంలో ఈ ఘటనలు  ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్పనాయి.

    మంగళవారం ఉదయం 6 గంటలకు (EST) తొలగించబడిన ఉద్యోగులకు  ఈ మెయిల్‌  పంపింది. "ఈ రోజే మీ చివరి పనిదినం" అని సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.  "సంస్థాగత మార్పు"ను కారణంగా చూపుతూ, ఈ ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది.

    మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్‌కు చెందిన సౌరభ్ ముఖర్జీయా ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ,  ఐటీ రంగం ఒక నిర్మాణాత్మక మందగమనంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. 2005 - 2020 మధ్య, ఐటీ సేవల సంస్థలు తమ ఆదాయాలను, ఉద్యోగుల సంఖ్యను ఏటా సుమారు 15శాతం చొప్పున పెంచుకున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత నియామకాలు తగ్గడంతో ఆ వేగం ఇప్పుడు 5 నుండి 6 శాతానికి పడిపోయింది.

    దాదాపు రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ఐటీ  రంగం ఇప్పుడు మందగిస్తోందని  ముఖర్జీయా  వ్యాఖ్యానించారు. ఏఐ (AI) ప్రాచుర్యం పొందక ముందే ఈ మందగమనం మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మార్పును మరింత తీవ్రతరం చేస్తోంది. నీతి ఆయోగ్ యొక్క 2025 నివేదిక ప్రకారం, 2031 నాటికి ఐటీ సేవలు , కాల్ సెంటర్లలోని 20శాతం వరకు ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా.ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) నివేదిక ప్రకారం, ఐటీ రంగం "డిఫ్లేషనరీ ఫేజ్" (ధరల తగ్గుదల దశ) లోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల దాదాపు 80 బిలియన్ల  డాలర్ల ఆదాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

    అలాగే ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం ఐటీ నిపుణుల జీవనశైలి , రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావంఐటీ నిపుణుల ఆదాయంపై ఆధారపడిన బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కోతల వల్ల ఇప్పటికే ఇల్లు కొన్నవారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుండగా, మిగిలిన ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో కొత్త కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.ఖరీదైన ఇళ్ల నుండి తక్కువ ధరలో ఇళ్లను కొనుగోలు  చేయాలని భావిస్తున్నారు.   తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన ఇళ్లకు బదులుగా తక్కువ ధర గల ఇళ్లను ఎంచుకుంటున్నారు టెక్‌ నిపుణులు.మరోవైపుప్రస్తుతం ఐటీ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా AI ఆధారిత సేవలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు

Business

  • హైదరాబాద్: ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ 'ఐస్ప్రౌట్' (iSprout), హైదరాబాద్‌లోని మీనాస్ టవర్స్‌లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 20 అంతస్తుల ఈ భారీ కాంప్లెక్స్‌లో ఇప్పటికే 10 అంతస్తులు ప్రముఖ కంపెనీలకు లీజుకు ఇవ్వడం విశేషం. ఈ సరికొత్త విస్తరణతో భాగ్యనగరంలో ఐస్ప్రౌట్ మొత్తం పోర్ట్‌ఫోలియో 17 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), పెద్ద సంస్థలను లక్ష్యంగా చేసుకుని 100 నుంచి 3,000 సీట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.

    ఈ కొత్త కేంద్రం కేవలం కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, ప్రతి క్లయింట్ అవసరాలకు అనుగుణంగా 'కస్టమ్ డిజైన్' చేసిన వర్క్‌స్పేస్‌లను అందిస్తోంది. హై-స్పీడ్ ఐటీ మౌలిక సదుపాయాలు, మీటింగ్ రూమ్‌లు, కొలాబరేషన్ సూట్‌లతో పాటు హై-ఎండ్ రెస్టారెంట్లు, కాఫీ షాపులు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం 60 రోజుల్లోనే కంపెనీల బ్రాండ్ నిబంధనల ప్రకారం కార్యాలయాన్ని సిద్ధం చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటం, మెట్రో కనెక్టివిటీ ఉండటం ఈ కేంద్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

    ఐస్ప్రౌట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో 26 కేంద్రాలను నిర్వహిస్తూ, 350కి పైగా కంపెనీలకు సేవలు అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 14,000 సీట్లుగా ఉన్న కంపెనీ సామర్థ్యం, 2026 నాటికి 43,000 సీట్లకు చేరుకోవడం సంస్థ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం. హైదరాబాద్ తమకు అత్యంత వ్యూహాత్మక మార్కెట్ అని, గ్లోబల్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇక్కడ మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతలను తాము తీసుకుంటామని ఐస్ప్రౌట్ సీఈఓ, కో-ఫౌండర్ సుందరి పాటిబండ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  • దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..

    • ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్‌వర్క్ నుండి అనుమతి పొందాలి.

    • కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.

    • ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ మూలం, ఫర్మ్‌వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.

    • కెమెరా డేటాను ఇతరులు రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

    • విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్‌లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.

    ఏ బ్రాండ్‌లపై ప్రభావం పడుతుంది?
    భారత సీసీటీవీ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

    పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?
    ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. 
    అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

    ధరలు పెరుగుతాయా?
    చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • భారతీ ఎయిర్‌టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (Nxtra)లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) నిధులను సమకూర్చనున్నాయి. ఈ పెట్టుబడిలో భారతీ ఎయిర్‌టెల్ కూడా పాలుపంచుకోనుంది. ఈ నిధుల సేకరణ అనంతరం నెక్స్ట్రా సంస్థ విలువ సుమారు 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

    ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్‌టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్‌టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.

    ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, హైపర్‌స్కేలర్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది. దేశీయ డేటా సెంటర్ మార్కెట్‌లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.

    నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్‌కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్‌లను నిర్మిస్తోంది. గూగుల్‌తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  • హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ విభాగానికి సంబంధించి 2026-2028 కాలానికి నూతన కార్యవర్గ సభ్యులు, కీలక అధికారుల నియామకం పూర్తయింది. మంగళవారం హైదరాబాద్‌లోని 'ఏపీఆర్ ఐల్' వేదికగా జరిగిన అసోసియేషన్ 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కొత్త బృందాన్ని అధికారికంగా ప్రకటించారు.

    నరెడ్కో తెలంగాణ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లుగా కాళీ ప్రసాద్ దామెర, గోపాలకృష్ణ కొరిపల్లి, సెక్రటరీ జనరల్‌గా వెంకటేశ్వరరావు రావుల, కోశాధికారిగా సుధాకర్ రెడ్డి కొండల నియమితులయ్యారు.

    ఎంపికైన నూతన నాయకత్వ బృందం 2026 నుండి 2028 వరకు రెండేళ్ల పాటు అసోసియేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిర వృద్ధిని పెంపొందించడం, వృత్తిపరమైన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేయనుంది.

  • దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. బుధవారం ఉదయం మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత రెచ్చిపోయాయి.

    హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం రూ.1800 పెరిగి రూ.1,38,850 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.3150 పెరిగి రూ.1,40,200 లకు ఎగిసింది.

    అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఉదయం రూ.1970 పెరిగి రూ.1,51,480 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మొత్తం రూ.3440 పెరిగి రూ. 1,52,950 లకు ఎగబాకింది.

    ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్‌ కేజీకి రూ.15000 పెరిగి రూ.2,65,000 వద్దకు ఎగిసింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ద్వారా ఎల్ఐసీని (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తాజా కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి సుమారు రూ.3,750 కోట్ల మేర ఎల్ఐసీకి నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ.

    అసలేం జరిగింది?
    కేసు వివరాల ప్రకారం.. 2009 నుంచి 2012 మధ్య కాలంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) జారీకి పూనుకుంది. ఆ సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల భద్రతపై తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్ఐసీని నమ్మించారు. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసేలా ఎల్ఐసీని ప్రేరేపించారు. చివరికి ఈ వ్యవహారంలో ఎల్ఐసీకి రూ.3,750 కోట్లకు పైగా నికర నష్టం వాటిల్లింది.

    ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు
    బీడీఓ ఇండియా ఎల్ఎల్పీ (BDO India LLP) 2020లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఈ కుంభకోణంలోని లోతుపాతులను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. షెల్ కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ఇంటర్-కంపెనీ డిపాజిట్ల పేరుతో నిధులను స్వాహా చేశారు. ఉనికిలో లేని అమ్మకాల ఇన్వాయిస్‌లు, కల్పిత బిల్లులను సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. సెక్యూరిటీగా చూపిన ఆస్తుల విలువను వాస్తవం కంటే భారీగా పెంచి చూపినట్లు తేలింది. 

    కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై అవినీతి నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ, ఆర్‌కామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు అధికారులు తెలిపారు.

    వరుస కేసులు
    అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. మార్చి 8న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఫిర్యాదు మేరకు రూ.1,085 కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదైంది. ఇందులో పీఎన్‌బీకి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర బకాయిలు పడ్డారు. తాజా ఎల్ఐసీ కేసుతో అనిల్ అంబానీ సహా మాజీ డైరెక్టర్ల చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది.

  • దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్‌ ‍గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ మార్కెట్‌ప్లేస్‌ ‘మైహెచ్‌క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

    ఒకప్పుడు కేవలం స్టార్టప్‌లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్‌ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

    లాభాల బాటలో దిగ్గజాలు
    ఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్‌వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్‌వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.

    వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..

    కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్‌లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.

    ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్‌పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు), డే పాస్‌లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.

    ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్‌లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్‌వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్‌లుగా మారుతున్నాయి.

    భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.

    సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీ
    ఈ పరిణామాలపై మైహెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్‌ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.

    ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ టాప్‌ గెయినర్‌గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి.

  • దేశంలోని ప్రముఖ బ్యాంకుల ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), బంధన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
    ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్‌ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.

    నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

    కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్
    పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

    రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్‌డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.

    ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్‌ విత్‌డ్రా లిమిట్‌ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గింది

    అయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్‌ను పీఎన్‌బీవన్‌ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.

    బంధన్ బ్యాంక్
    బంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది. సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.

    ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.

    ఉచిత పరిమితి మించితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఒక్కో నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.10 అదనంగా చార్జీలు ఉంటాయి. ఇ‍క తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల లావాదేవీలు విఫలమైతే రూ.25 పెనాల్టీ విధిస్తారు.

    ఇది చదవలేదా? 👉 బ్యాంకులు దేశవ్యాప్తంగా తెరిచేది ఒక్క రోజే!

  • అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

    బెంగళూరులో ధరల మోత
    తాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్‌ కంపెనీ అవుట్‌లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.

    ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధర
    పెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85
    డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52

    అంతర్జాతీయ సంక్షోభం
    ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

    ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలు
    ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

  • కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్‌లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది.

    2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?

    గార్ట్‌నర్‌ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్‌ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

    అడ్డంకిగా అవాస్తవ సమాచారం

    ఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్‌గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

    సమీకృత పరిష్కారం

    ప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్‌ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్‌ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.

    భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలు

    టెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

    దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్‌పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్‌ను ఒక ఫీచర్‌గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్‌ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.

    ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Telangana

  • బెంగళూరులో తెలంగాణ దంపతులు కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం, వరుస ఆర్థిక ఇబ్బందుల వల్ల దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. 

    తెలంగాణకు చెందిన టెకీ బాను చందర్‌రెడ్డి (32) బెంగళూరులో తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది సేపటికే ఆయన భార్య, ఐబీఎంలో పనిచేస్తున్న బిబి షాజియా సిరాజ్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    సిద్దిపేట జిల్లాకు చెందిన బాను చందర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అమెరికాలో పనిచేసేవారు. అయితే గతేడాది ఏఐ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారు. దీంతో భార్య షాజియాతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు. దాదాపు ఏడాది కాలంగా ప్రయత్నాలు చేసినా స్థిరమైన ఉద్యోగం దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాబ్ మార్కెట్‌లో ఏఐ ఆధారిత మార్పులు, ఉద్యోగాల కోతల కారణంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

    మరోవైపు, షాజియాతో మతాంతర వివాహం జరగడం వల్ల బాను చందర్‌రెడ్డిని అతని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. ముఖ్యంగా తండ్రి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బాను చందర్‌ కుంగిపోయాడు. ఓ వైపు కుటుంబసభ్యులు దూరం పెట్టడం, ఆర్ధిక ఇబ్బందులతో ఒత్తిడికి గురైన బాను చందర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని షాజియా తీవ్ర షాక్‌కు గురై 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో, తన మరణానికి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించవద్దని బాను చందర్‌రెడ్డి పేర్కొన్నారు.

    ఈ ఘటన టెక్ రంగంలో ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నిరుద్యోగం, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి కలిసినప్పుడు ఎంతటి విషాద పరిణామాలు చోటు చేసుకోవచ్చో మరోసారి స్పష్టమైంది.

  • సాక్షి,హైదరాబాద్‌: నగర పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు  ఉత్తర్వులు జారీ చేశారు. 

    తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యాక్ట్, 1968 లోని సెక్షన్ 20 ప్రకారం, 02.04.2026 ఉదయం 06.00 గంటల నుండి 03.04.2026 ఉదయం 06.00 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు (టాడీ షాప్స్), బార్లు, రెస్టారెంట్లలోని బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్ పంపిణీ చేయనున్నారు. 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ యూనిఫామ్ అమలు చేయాలని కూడా సర్కార్‌ నిర్ణయించింది.

    వచ్చే అకాడమిక్ ఇయర్‌ నుంచి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ వ్యవస్థల్లో మొత్తం 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో 19 లక్షల మంది ఉన్నారు.

     

  • సాక్షి, హైద‌రాబాద్: రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా  రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ  ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను త‌యారు చేశామ‌న్నారు.

    ఈ పోర్ట‌ల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించి భూ వివాదాల ప‌రిష్కారానికి తొలి అడుగు వేయ‌బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ వ‌చ్చే ఫ‌లితాల‌ను బ‌ట్టి అవ‌స‌ర‌మైన మార్పులు చేర్పులు చేసి భ‌విష్య‌త్తులో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. కేర‌ళం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి బుధ‌వారం.. ఈ పోర్ట‌ల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

    ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్‌ను రైతు కోణంలో రూపొందించామ‌ని సామాన్య ప్ర‌జానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ 2 నుంచి  ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వ‌రావుపేట‌, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సూచించారు.

    గ‌తంలో మాదిరిగా  రైతులు  త‌మ భూ సేవ‌ల కోసం మీ సేవ కేంద్రాల‌కు వెళ్లవ‌లసిన ప‌నిలేకుండా త‌న‌ ఇంటి నుంచే భూ సేవ‌లు పొందే విధంగా పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ని అన్నారు. రైతులు త‌మ భూమి హ‌ద్దులు తేల్చాల‌ని స‌ర్వే అధికారుల చుట్టూ తిరిగేవార‌ని.. ఇప్పుడు ఎక్క‌డికీ వెళ్ల‌కుండా ఇంటి నుంచే భూభార‌తి పోర్ట‌ల్ ద్వారా పొంద‌వ‌చ్చ‌న్నారు. రైతు లాగిన్ అయిన వెంట‌నే త‌న‌కు ఉన్న భూమి వివ‌రాలు క‌నిపిస్తాయి. ఎన్నిఎక‌రాల‌కు స‌ర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు ఎంత‌చెల్లించాలో క‌నిపిస్తుంది.

    ఫీజు చెల్లించిన త‌ర్వాత ఆ వివ‌రాలు ఆ గ్రామంలో ఉన్న లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ లాగిన్‌కు వెళుతుంది. ఆత‌ర్వాత రెండు రోజ‌ల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతుల‌కు నోటీసులు జారీ చేస్తారు.  త‌ర్వాత ఏడు రోజుల్లోపు స‌ర్వే తేదీని  స‌ద‌రు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ ఖరారు చేయ‌డ‌మేగాక  స‌ర్వేకూడా  రోవ‌ర్లతో పూర్తి చేస్తారు. దీనిని సిస్ట‌మ్‌లో న‌మోదు చేశాక అది  మండ‌ల స‌ర్వేయ‌ర్ స్య్రూటినీకి వెళుతుంది.

    ఆపై మండ‌ల త‌హ‌శీల్దార్ ఆమోదం పొందాక ద‌ర‌ఖాస్తుదారైన రైతుకు  ఎల్‌పిఎమ్‌, భూధార్ నెంబ‌ర్‌ల కేటాయింపు జ‌రుగుతుంది. ఈ వివరాలు భూభార‌తి పోర్ట‌ల్‌లో కూడా నిక్షిప్త‌మ‌వుతాయి. స‌ర్వే పూర్త‌యిన త‌ర్వాత స‌ర్వే మ్యాప్ ను జ‌న‌రేట్ చేసి భూభార‌తి పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో రిజిస్ట్రేష‌న్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి పూర్త‌య్యేవ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో పౌరుల రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ ఎమ్ ఎస్ అల‌ర్ట్స్ పంపిస్తారు. భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబంధ‌న‌ను ఈ ఐదు మండ‌లాల్లో అమ‌లు చేస్తున్నామ‌ని  ఈ ఐదు మండ‌లాల్లో ప్ర‌తి స‌ర్వే మ్యాప్ ( ఎల్‌పిఎమ్‌) యూనిక్‌ నెంబరు, అదేవిధంగా ప్ర‌తి స‌ర్వే నెంబ‌ర్‌కు   ఆధార్ నెంబ‌ర్ మాదిరిగానే భూధార్ నెంబ‌ర్‌ను కూడా ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

    ఈ ఐదు మండ‌లాల్లో రైతులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌త‌ర్వాత స‌ర్వే నిర్వ‌హించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వేయ‌ర్ల‌ను అందుబాటులో ఉంచామ‌ని అలాగే గొలుసులు, క‌ర్ర‌లు, క్రాస్ స్టాఫ్‌, మెజ‌రింగ్ టేప్ వంటి పాత స‌ర్వే ప‌రిక‌రాల‌కు స్వ‌స్తి చెప్పి రోవ‌ర్ల‌తో స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల స‌ర్వే ప్ర‌క్రియ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతుంద‌ని, క‌చ్చిత‌మైన స‌ర్వే వివరాలు వ‌స్తాయ‌ని తెలిపారు.

    భూ స‌మ‌స్య‌లు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయ‌ని వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ ఒక కీల‌క‌మైన ముంద‌డుగు అని రైతు ఇంటి నుంచే అన్నిసేవ‌లు పొందేలా పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్ధ‌ను తీసుకువ‌స్తున్నామ‌ని ఇది రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో చారిత్రాత్మ‌క మార్పున‌కు నాంది అవుతుందని మంత్రి పొంగులేటి అన్నారు.

  • చింతల వెంకట రెడ్డి.. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) ద్వారా అంతర్జాతీయ పేటెంట్లు పొందిన భారత మొట్టమొదటి స్వతంత్ర రైతు. ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా చురుకుగా పనిచేస్తూ, వ్యవసాయంలో ఉత్తమ విధానాలను వేలాది మంది అన్నదాతలకు ఉచితంగా బోధిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా అధిక దిగుబడి రాబట్టవచ్చని నిరూపిస్తున్నారు. రైతుల కోసం నిలబడిన ఆయన స్ఫూ‍ర్తిదాయక గాథను తెలుసుకుందాం..

    హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆర్గానిక్ రైతు చింతల వెంకట రెడ్డి భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ‘మట్టి-కేంద్రీకృత విధానం’తో పేరు తెచ్చుకున్నారు. ఆయన సికింద్రాబాద్‌ అల్వాల్‌లో 1950 డిసెంబరు 22న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే తండ్రికి పనుల్లో సాయం చేస్తుండేవారు. 12వ తరగతి తర్వాత కుటుంబానికి చెందిన 40 ఎకరాల పొలాన్ని చూసుకోవడానికి చదువు ఆపేశారు.

    జీవితాన్ని మలుపుతిప్పిన ఘటన
    చింతల వెంకట రెడ్డి 1970 దశాబ్దం చివరలో రసాయన ఎరువులు మట్టి సహజ శక్తిని తగ్గిస్తున్నాయని గుర్తించారు. దీంతో మట్టి ఆరోగ్యం (పోషకాలతో, సమతుల్యంగా ఉండి పంటలకు అవసరమైన అన్ని సహజ లక్షణాలు కలిగి ఉండడం) పునరుద్ధరణపై ప్రయోగాలు ప్రారంభించారు. చివరకు విజయం సాధించారు. మట్టి పునరుద్ధరణకు జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూఐపీఓ నుంచి అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన ఆవిష్కరణల్లో ప్రధానమైనది “సోయిల్ స్వాపింగ్”.

    టెక్నిక్‌ ఇదే
    భూమిలోని రెండో పొర (4-5 అడుగుల లోతు) నుంచి తీసిన మట్టిలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మట్టిని పైపొరపైకి తీసుకురావడం ద్వారా ఎలాంటి రసాయన ఎరువు లేకుండా భూసార పునరుద్ధరణను సాధించారు చింతల వెంకట రెడ్డి.

    మట్టి ద్రావణం.. ఎలా పనిచేస్తుంది?
    రసాయన స్ప్రేలకు బదులుగా మట్టి ద్రావణ పద్ధతిని చింతల వెంకట రెడ్డి అభివృద్ధి చేశారు. భూమిలోని రెండో పొర నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి, వడకట్టి, నీటిలో కలిపి ద్రావణంగా తయారు చేస్తారు. దీన్ని పంటలపై పిచికారీ చేస్తే పలుచని మట్టి పొర ఏర్పడుతుంది. ఈ మట్టిని తినే పురుగులు జీర్ణించుకోలేక చనిపోతాయి. అదే సమయంలో ఖనిజాలు మొక్కకు ఆహారంగా పనిచేస్తాయి.

    బియ్యం, గోధుమలో సమృద్ధిగా విటమిన్-డీ  

    వెంకట రెడ్డి 2021లో సహజ పద్ధతిలో ప్రధాన ఆహార పంటల్లో విటమిన్-డీ ఎక్కువ ఉండేలా చేయడంలో విజయం సాధించారు. సాధారణంగా బియ్యంలో 0 శాతం విటమిన్ డీ ఉంటుంది. ఆయన పంటల్లో 100 గ్రాములకు 102 నుంచి 141 ఐయూ వరకు నమోదైంది. గోధుమలో 100 గ్రాములకు 1832 ఐయూ ఉంటోంది. పోషకాహార లోప సమస్యకు తక్కువ ఖర్చుతో పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా వీటిపై పనిచేశారు.

    అంతర్జాతీయ గుర్తింపు

    తెలంగాణలోని చింతల వెంకట రెడ్డి వ్యవసాయ క్షేత్రం ప్రపంచ నాయకులకు సందర్శన కేంద్రంగా మారింది.

    బిల్ క్లింటన్ (2001): ద్రాక్ష సాగు విధానాన్ని ప్రశంసించారు.

    జార్జ్ డబ్ల్యూ బుష్ (2006): హైదరాబాద్ వచ్చిన సమయంలో చింతల వెంకట రెడ్డిని  కలిసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు.

    పురస్కారాలు
    పద్మశ్రీ (2020): వ్యవసాయ ఆవిష్కరణల్లో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అందజేసింది.

    డబ్ల్యూఐపీఓ పేటెంట్లు
    మట్టి పోషక నిర్వహణ, బయో-ఫోర్టిఫికేషన్ పద్ధతులకు అనేక అంతర్జాతీయ పేటెంట్లు వచ్చాయి. బయో-ఫోర్టిఫికేషన్ అంటే పంటల్లో పోషక విలువలను సహజంగా పెంచే ప్రక్రియ.

    ప్రపంచ రికార్డు: అనాబ్-ఎ-షాహీ ద్రాక్ష రకంలో హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించారు.

    వెంకట రెడ్డి సిద్ధాంతం
    “మట్టి అంటే మొక్క కడుపు. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మొక్కను తినే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు” అనేది ఆయన సిద్ధాంతం.
     

Movies

  • తమిళనాడులో ప్రస్తుతం హడావుడి నెలకొంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల మనసు గెలుచుకుని అధికారం దక్కించుకునేందుకు బోలెడన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. హీరో దళపతి విజయ్ కూడా టీవీకే పార్టీ తరఫున బరిలో నిలిచాడు. మరోవైపు తమిళ దర్శకుడు సుందర్.సి కూడా ఇదే ఎలెక్షన్స్‌లో మధురై సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. తాను బరిలో ఉన్నప్పటికీ విజయ్‌ని, అతడి పార్టీని విమర్శించనని చెబుతూ అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

    హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన సుందర్.. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం ఉందని, తన భార్య ఖుష్బూ.. విజయ్‌ని తమ్ముడిలా భావిస్తుందని అందుకే విజయ్ లేదా అతడి పార్టీపై విమర్శలు చేయనని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులని అలరించిన తాను.. రాజకీయాల్లో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని అన్నాడు. తన సినీ ప్రయాణంలో ఎలా ఆదరించారో, ఇక్కడ కూడా అలాగే మద్ధతు ఇవ్వాలని ప్రజలని కోరాడు.

    ఎన్డీఏ కూటమిలో భాగంగా సుందర్.. పుతియ నీది కచ్చి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే మధురై సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్యనే ఉంటుందని.. ఇక్కడ విజయ్ పార్టీ ప్రభావం తక్కువగా ఉంటుందని సుందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'గ్యాంగర్స్' సినిమాలో నటించి దర్శకత్వం వహించిన సుందర్, ప్రస్తుతం విశాల్ హీరోగా 'మగాడు' అనే మూవీ చేస్తున్నారు. నయనతారతో 'ముక్తి అమ్మన్ 2' కూడా తీస్తున్నారు.

    (ఇదీ చదవండి: 'పెద్ది' విడుదలపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్)

  • రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. లెక్క ప్రకారం మార్చి 27న రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీన కూడా రావట్లేదని చెప్పి కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. రీసెంట్‌గా మరో మూవీ ఈవెంట్‌లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న 'పెద్ది' వస్తుందనేసరికి అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ అందరికీ విడుదల తేదీపై సందేహం అలానే ఉండిపోయింది.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

    సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' ప్రమోషన్ల సందర్భంగా టీమ్ అంతా వెళ్లి చరణ్‌ని కలిశారు. మాటల మధ్యలో 'పెద్ది' లేట్ అవ్వట్లేదని కొంచెం ప్రమోట్ చెయ్యండ్రా అని ఫన్నీగా చెబుతూనే క్లారిటీ ఇచ్చేశారు. చెప్పిన తేదీకి రావడం పక్కా అనే స్పష్టత వచ్చేసింది.

    విడుదలకు మరో నెల కూడా లేదు. అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది. ఒకటి రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయని టాక్. మరి షూటింగ్ పూర్తి చేసి, పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేసుకోవడానికి టైమ్ ఉంటుందా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా అని చెప్పి ఏమైనా షాకిస్తారా అనేది చూడాలి?

    స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న 'పెద్ది'లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా.. రిలీజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్'లా హిట్ అవుతుందనుకున్నా.. కానీ జనాలు చూడలేదు: గుణశేఖర్)

  • విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం   గ్రాండ్  థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    ‘‘నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ఆనంద్, గోదావరి మూవీస్ చూశా.  అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల గారి ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. నేను శేఖర్ కమ్ముల గారితో నేరుగా పని చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ, ఆయనను నా గురువు, మెంటర్‌గా భావిస్తాను. ఆయన సినిమాలను చూస్తూ ఎంతో  నేర్చుకున్నాను. అలాగే నా  దర్శక గురువు  కె.వి. గుహన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఇద్దరూ నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు.

    ఇక ‘కార్మేని సెల్వం’ విషయానికొస్తే..  ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా చూసిన  ప్రతి ఒక్కరూ  కథతో కనెక్ట్ అవుతారు.  ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా మూవీ ఉంటుంది.  

    సముద్రఖని ఆయన పాత్రలోని ప్రతి షేడ్‌ను  అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు.   ఆయనతోపాటు గౌతమ్ మీనన్ గారు, లక్ష్మీ ప్రియా,  అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్‌ చేసింది.

    మ్యూజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం .  ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో  మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు.  సంగీతం అనేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్స్‌దే కాదు.. ఇన్‌స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు, మిక్సింగ్ టీమ్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్లు కలిసి చేసే పనిగా వారు భావించారు.  ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి పాటకు పని చేసిన అందరికీ క్రెడిట్ ఇవ్వడం, అలాగే రెవెన్యూ షేర్ చేయడం మా లక్ష్యం. ఇది మ్యూజిక్ వెనుక ఉన్న అసలు హీరోలకు గుర్తింపు ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం. మా డీఓపీ యువరాజ్ దక్షణ్, ఎడిటర్ జగన్‌లకు ఎంతో అనుభవం ఉంది.  

    థియేటర్‌లో ఈ సినిమా విజువల్స్ చూస్తే, కథను ఎంత గ్రాండ్‌గా తీసుకెళ్లామో అర్థమవుతుంది. ఇక  మా ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు  గారికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలియజేస్తున్నా.   ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు.  కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా  వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’’.

  • మల్లెపూల ఔట్‌ఫిట్‌తో బాంధవి శ్రీధర్

    పట్టుచీరలో మెరిసిపోతున్న నందితా శ్వేత

    మార్చి జ్ఞాపకాలని పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్

    మార్చిలో ఫన్నీ మూమెంట్స్‌లో నుపుర్ ఇలా

    క్యూట్ అండ్ స్వీట్‌గా ఆషికా రంగనాథ్

    ఢిల్లీ ట్రిప్ ఫొటోలతో ప్రియాంక మోహన్

  • మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై  నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ మీడియాతో ముచ్చటించారు.

    హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. డిజో పళ్లిచట్టంబి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నేను కమిట్ మూవీస్ ఫినిష్ చేశాను. డిజో కూడా జనగణమన సినిమాతో పాటు మరో మూవీ రూపొందించాడు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించాం. కొద్ది రోజుల తర్వాత ప్రొడ్యూసర్ మారారు. మేము వేరే ప్రొడ్యూసర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాం. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్ ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను. డిజోతో వర్క్ చేయడంలో ఎలాంటి ప్రెజర్ ఉండదు. సెట్ లో కూల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు కోపం వస్తుందా అనేది కూడా తెలియదు. 

    పళ్లిచట్టంబి సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్ గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. అంతేకానీ ఆ పరిస్థితుల నేపథ్యాన్ని మా అభిప్రాయ కోణంలో చూపించలేదు. మీరు ఒక్కసారి సినిమా చూస్తే మూవీ సోల్ అర్థమవుతుంది. మా మూవీలో మానవత్వం ముఖ్యమనే పాయింట్ ను చూపిస్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయంలో కూడా మనమంతా ఒక్కటే. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. 

    తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్ కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాను. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నేను తెలుగులో సినిమా చేయకున్నా తెలుగు ప్రేక్షకులు నా మలయాళ మూవీస్ చూసి ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు.

    హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ  ... ఈ చిత్రంలో రెబెకా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర ఇంటెలెక్చువల్, రూటెట్ గా ఉంటుంది. గ్లామర్ అనే కోణంలో ప్రేక్షకులు నా పాత్రను చూడరు. మూవీలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమా కోసం నేను బాగా కష్టపడాలి అనుకున్నా. ఈ సినిమా నన్ను నాయికగా మరింత మంచి పొజిషన్ కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ రూరల్ అమ్మాయి మనస్తత్వమే నాలో ఉంటుంది. డైరెక్టర్ డిజో సపోర్ట్ తో రెబెకా పాత్రను సంతృప్తికరంగా పోషించగలిగాను’అన్నారు.
     

  • ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో అప్పట్లో హిట్స్ కొట్టి, స్టార్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న గుణశేఖర్.. గత కొన్నేళ్ల నుంచి బాగా వెనకబడిపోయారు. రుద్రమదేవి, శాకుంతలం లాంటి పీరియాడిక్ మూవీస్ తీసి చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర వీటికి భారీ నష్టాలొచ్చాయి. దీంతో చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పటితరం యువత కనెక్ట్ అయ్యేలా 'యుఫోరియా' సినిమా తీశారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వస్తున్న సందర్భంగా ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ తన సినిమా గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి దర్శకుల్ని ప్రోత్సహించాలని వేడుకున్నారు.

    (ఇదీ చదవండి: ధురంధర్‌ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు)

    'ఫిబ్రవరి నెల ఆరంభంలో అందరికీ జీతాలు వస్తాయి. మంచి తేదీ అని 'యుఫోరియా' రిలీజ్ చేశాను కానీ జనాలు చూడలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు చూశామని చెప్పి యుఫోరియా లాంటి చిన్న చిత్రాల్ని పట్టించుకోలేదు. ఈ టైటిల్ వల్ల కూడా థియేటర్లలో మూవీ సరిగా ఆడలేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్ ఆడియెన్స్ కోసం, కానీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మమ్మల్నే ​‍అడిగారు. రిలీజ్ టైంలో తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు'

    'భూమిక.. లండన్‌లో ఉన్నప్పుడు స్టోరీ చెప్పాను. ఈ పాత్ర నమ్మితే మీకు అవార్డ్ వస్తుందని అప్పుడే చెప్పాను. నేను చెప్పినట్లే ఆమెకు ఉత్తమ సహాయ నటిగా గద్దర్ అవార్డ్ వచ్చింది. నాకు ఉత్తమ కథా రచయితగా పురస్కారం దక్కింది. థియేటర్లలోకి వచ్చిన సినిమాలని మూడు నెలల వరకు ఓటీటీల్లో రిలీజ్ చేయకూడదు. అలా అయితేనే థియేటర్ బతుకుంది. ఇండస్ట్రీకి ఇదే నా విన్నపం. ఈ మధ్య క్లైమాక్స్‌లో దేవుడి విశ్వరూపాలు చూపించి హిట్స్ కొడుతున్నారు. కథని నమ్మి సినిమాలు తీసే నాలాంటి దర్శకుల్ని ప్రోత్సహించండి' అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

    మీడియాతో చర్చించిన గుణశేఖర్.. 'మహేశ్ బాబుని యుఫోరియా చూడమని నేను అడగలేదు. కానీ తనంతట తానుగానే చూశాడు. అలానే ట్వీట్ చేశాడు. నేను సక్సెస్ మీట్ పెట్టి పిలిస్తే వచ్చేవాడు కూడా. యుఫోరియా.. ధురంధర్ రేంజ్ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే తీశాను. ఎందుకంటే ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్'  అని అన్నారు.

    సారా అర్జున్, భూమిక, గౌతమ్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా.. ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. కానీ జనాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. గుణశేఖర్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవడం కావొచ్చు, లేదంటే స్టార్స్ ఎవరూ లేకపోవడం కూడా ఈ మూవీ సరిగా ఆడకపోవడానికి కారణాలు కావొచ్చనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్')

  • నెటిజన్స్‌ ఊహించే నిజమైంది. నటి పూనమ్‌ పాండే గర్భవతి కాదు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అని ముందే ఊహించారు. తాజాగా అదే నిజమని సదరు నటి ఒపుకుంది. అంతేకాదు బేబీ బంప్‌ ఫోటో పెట్టి.. ప్రెగ్నెంట్‌ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించింది.

    అసలేం జరిగింది?
    మోడల్, నటి పూనమ్  పాండే పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) పై అవగాహన కోసమని.. తాను మరణించినట్లుగా తప్పుడు వార్తలను ప్రచారం చేయించుకుంది. తాజాగా 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. నిన్న ఉదయం(మార్చి 31) తన ఎక్స్‌ ఖాతాలో బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌  చేసింది. అది చూసి చాలా మంది షాకయ్యారు. భర్తతో విడిపోయిన తర్వాత ప్రెగ్నెంట్‌ ఎలా అయిందని కొంతమంది కామెంట్‌ చేశారు. మరికొంతమంది అయితే ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని అభిప్రాయపడ్డారు.

    అవును..నేను ప్రెగ్నెంట్‌ కాదు
    నెటిజన్స్‌ ఊహించనట్లే..తాను ప్రెగ్నెంట్‌ కాదని ప్రకటించింది పూనమ్‌. ఏప్రిల్‌ ఫూల్‌ ప్రాంక్‌ కోసమే ఇలా చేశానంటూ మరో వీడియోని రిలీజ్‌ చేసింది.  ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆమె తెలిపారు. ‘నన్ను సీరియస్‌గా తీసుకోవద్దు.. లైఫ్ ని చిల్ చేయండి’అంటూ అభిమానులకు సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    పూనమ్‌ పాండే సినీ కెరీర్‌ విషయాలకొస్తే.. హిందీలో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్‌ కర్మ, టచ్‌ ద ఫైర్‌ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మాలిని అండ్‌ కో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 2020 సెప్టెంబర్‌ 1న ప్రియుడు సామ్‌ అహ్మద్‌ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు. 

  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: దురంధర్‌-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)

    దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.

    (ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

    ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్‌లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.

    (ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘ధురంధర్‌’)

  • నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం  కుదుపుని ఇస్తుంది కెరీర్‌కు మలుపును అందిస్తుంది.  రాత్రికి రాత్రే  తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్‌ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్‌ ’ధురందర్‌’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్‌ను అనూహ్యమైన కుదుపుని అందించింది.

    వీరందరిలో, ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్‌ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్‌ సచ్‌దేవ్‌ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. 

    ధురందర్‌ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్‌ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్‌బస్టర్‌లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.

    గతంలో ఆదిత్య ధర్‌తో కలిసి ’ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రానికి కూడా శాశ్వత్‌ పనిచేశారు  తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ  ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్‌కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్‌ చిత్రంతో, తాను  రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. 

    «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్‌ పాటల్ని జోడిస్తూ దురందర్‌ చిత్రాల్లో.. శాశ్వత్‌  చేసిన కొత్త ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్‌ హిట్స్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చాయి. ఆయన  వ్యూహం అద్భుతంగా ఫలించింది.

    కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్‌ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్‌ ఫతే అలీ ఖాన్‌ పాట దిల్‌ పే జఖ్మ్‌ ఖతే హై (1977), దిల్‌ (1990) నుంచి హమ్‌ ప్యార్‌ కర్నే వాలే (1990), తానేదార్‌ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్‌ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్‌ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.

    రణ్‌వీర్‌ సింగ్‌ తన అవార్డ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్‌ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్‌–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్‌ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్‌లో టాప్‌లో నిలిచాడు.  

    ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్‌ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో  భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను  బాలీవుడ్‌లో తదుపరి పెద్ద స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో  అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం.

  • తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ.. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇ‍ప్పుడు భర్త ఫొటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్లినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో పాటు పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా)

    విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు ఆరేళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో తమన్నా కూడా ఒకరు.

    గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా.. నా నిజాయితికి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాలని చూడలేదని, ఆమెలో నా కూతురిని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. నా బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే.. శ్రీముఖి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్త ఎవరు? అతడి పేరు ఏంటి? తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.

    పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్‌ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను.ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెని చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది.

    ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు.

    (ఇదీ చదవండి: ధురంధర్‌ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు)

  • పాన్‌ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్‌ 2. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్‌ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్‌ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్‌ కుమార్‌ ఆర్‌ఎస్‌.

    కష్టపడి కథ రాసుకున్నా..
    ఆయన మాట్లాడుతూ.. ధురంధర్‌ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 

    2023లోనే రిజిస్టర్‌ చేయించా..
    అందుకే జీ స్టూడియోస్‌, టీ సిరీస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌, సోనీ పిక్చర్స్‌.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్‌ కపూర్‌ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్‌లోనే ఈ కథ రిజిస్టర్‌ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్‌ 2 మూవీ యూనిట్‌పై కేసు వేయాలనుకుంటున్నాను.

    అదే బాధగా ఉంది
    వాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్‌ కుమార్‌.. క్యాంపస్‌ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్‌ రాబిన్‌హుడ్‌ మూవీ చేస్తున్నాడు.

    చదవండి: నీ ముఖానికి గోల్డ్‌ చైన్‌ వేసుకునేంత సీన్‌ ఉందా? నటి ఆవేదన

  • హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA).. హెచ్ పీవీ(HPV Vaccine) వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ అసోసియేషన్.. ఏడాది మొత్తం హెచ్ పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలని అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇతడి అభిమాన సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు.. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్-‍అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)

    9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్‌ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం.. స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం మంచి విషయం అని చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: 10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో?)

Politics

  • ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై  అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్‌డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే.

    కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ కూటమిలో విజయ్‌ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్‌ ఏర్పడితే టీవీకే ఎన్‌డీఏలో చేరుతుంది. విజయ్‌ మద్దతుతో ఎన్‌డీఏ సర్కార్‌ వచ్చే ఛాన్స్‌’ఉందని అని వ్యాఖ్యానించారు.

    మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్‌డీఏ కూటమి విజయ్‌తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

    ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.

    ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్‌డీఏ పెద్దలు ఓ దూతను విజయ్‌ వద్దకు పంపించారు. ఎన్‌డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే  ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.

    అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్‌డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్‌దాస్‌ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Family

  • 1973 ఏప్రిల్‌ 3. న్యూయార్క్‌ నగరంలోని మన్‌హటన్‌ వీధులు ఎప్పటిలాగే రద్దీగా ఉన్నాయి. సిక్స్త్‌ ఎవెన్యూలో అటు ఇటు నడుస్తున్న జనం మధ్య ఒక వింత దృశ్యం ఆవిష్కృతమైంది. మోటరోలా కంపెనీలో పనిచేసే మార్టిన్‌ కూపర్‌ (martin cooper) అనే ఇంజినీర్‌ ఒక కిలో బరువు, తొమ్మిది అంగుళాల పొడవున్న ఒక ఇటుక లాంటి వస్తువును చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

    అప్పటి వరకు ఫోన్‌ అంటే ఒక వైరుతో గోడకు అతుక్కుని ఉండాలి, లేదా కారులో భారీ బ్యాటరీల సాయంతో నడవాలి. కానీ కూపర్‌ చేతిలో ఉన్నది ఒక ‘పోర్టబుల్‌’ సెల్యులార్‌ ఫోన్‌. పేరు డైనాటాక్‌. దాని నుంచి వెళ్ళిన మొదటి కాల్‌ ఎవరికో తెలుసా? అతని ప్రత్యర్థికి! అవును, బెల్‌ లాబొరేటరీస్‌లో తనలాగే మొబైల్‌ టెక్నాలజీపై పనిచేస్తున్న జోయెల్‌ ఏంగెల్‌కు కూపర్‌ కాల్‌ చేశాడు. ‘జోయెల్, నేను ఒక నిజమైన పోర్టబుల్‌ సెల్యులార్‌ ఫోన్‌ నుంచి మాట్లాడుతున్నాను’ అని గర్వంగా ప్రకటించాడు. ఈ మాటలు విన్న ప్రత్యర్థి నుంచి చాలాసేపటివరకూ నిశ్శబ్దమే సమాధానం అయ్యింది. అది కేవలం ఒక ఫోన్‌ కాల్‌ మాత్రమే కాదు, ఒక ఆధిపత్య పోరాటంలో విజయ ప్రకటన!

    అప్పట్లో అమెరికన్‌ టెలిఫోన్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ (ఏటీ అండ్‌ టీ) సంస్థకు టెలిఫోన్‌ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. కారులో బ్యాటరీ సాయంతో పనిచేసే మొబైల్‌ రేడియో ఫోన్లను ఆ కంపెనీ తయారు చేసేది. కూపర్‌ ‘మనిషికి విముక్తి కావాలి, కారుకు ఫోన్‌ కట్టేయడం ఏమిటి?’ అని ప్రశ్నించేవాడు. 1947లోనే బెల్‌ లాబ్స్‌ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రాంతాన్ని చిన్న చిన్న ‘సెల్స్‌’గా విభజించి సమాచారాన్ని చేరవేయవచ్చని సిద్ధాంతీకరించారు. ఆచరణలో అది సాధ్యం కావడానికి దశాబ్దాలు పట్టింది.

    చ‌ద‌వండి: గుర్రం లాగిన రైలుబండి

    1950ల నాటి మొబైల్‌ ఫోన్లు సుమారు 18 నుంచి 36 కిలోల బరువుండేవి. కూపర్‌ సృష్టించిన డైనాటాక్‌ వచ్చే వరకు అవి మనిషి చేతిలోకి రాలేదు. అది సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పట్టింది. 1983లో మోటరోలా డైనాటాక్‌ గీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధర 3,995 డాలర్లు. ధనవంతులకు, వ్యాపార వేత్తలకు మాత్రమే అది పరిమితమైంది.

    అదృశ్య బంధనాల్లో మనిషి
    ఈ మొబైల్‌ విప్లవం మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది.  ఇంటికి వెళ్తే ఆఫీసు పనితో సంబంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడో? 24 గంటలూ ఎవరో ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి! సామాజికంగా చూస్తే, మనుషుల మధ్య దూరం పెరుగు తోంది. పక్కనే కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం మానేసి, వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తితో ఫోన్‌లో గడపడం మనకు అలవాటైంది. ఉద్యోగ ఒత్తిడి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ‘ఇటుక’లా ఉన్న ఫోన్, ఇప్పుడు మన మెదడును నియంత్రించే ఒక  మహాశక్తిగా మారింది.

    చ‌ద‌వండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్ట‌లేరా?

    సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అది ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తూనే, అది మన సామాజిక విలువ లను, వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీయకుండా చూసుకోవడం మన బాధ్యత. కూపర్‌ ఆ రోజు వేసిన అడుగు ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ మనల్ని మనకు దూరం చేయకుండా చూసు కోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. మొబైల్‌ కాల్‌ కేవలం ఒక ఇంజినీరింగ్‌ విజయం మాత్రమే కాదు, అది మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయం.