Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    రోహిత్‌, రికెల్టన్‌ ఊచకోత
    229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోయారు. రోహిత్‌ శర్మ (83), రికెల్టన్‌ (84) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో ఏకంగా 143 పరుగులు జోడించి గెలుపు ఖాయం​ చేశారు. అనంతరం తిలక్‌ వర్మ (11), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) తక్కువ స్కోర్లకే ఔటైనా, నమన్‌ ధిర్‌ (23 నాటౌట్‌), విల్‌ జాక్స్‌ (10 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో మణిమారన్‌ సిద్దార్థ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, మొహిసిన్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు..

    పూరన్‌ విధ్వంసం
    టాస​్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63; ఫోర్‌, 8 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్‌ చేసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోర్‌ కాస్త నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (25 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. 

    మిగతా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్‌ 13, కెప్టెన్‌ పంత్‌ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్‌ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
     

  • జింబాబ్వే మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటిస్తుంది. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు జింబాబ్వేపై ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 168 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ (98) తృటిలో సెంచరీ మిస్‌ కాగా.. మరో ఓపెనర్‌ గుల్‌ ఫిరోజా (50), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (67), మిడిలార్డర్‌ బ్యాటర్‌ నజిహా అల్వి (56 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. 

    మిగతా బ్యాటర్లలో అయేషా జాఫర్‌ 3, ఆలియా రియాజ్‌ 2, కెప్టెన్‌ ఫాతిమా సనా 11 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ప్రెసియస్‌ మరంగే 3 వికెట్లతో రాణించగా.. కుద్జాయ్‌ చిగోరా, కెప్టెన్‌ నోమ్వెలో సిబండ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పసికూన జింబాబ్వే చేతులెత్తేసింది. బిలవ్డ్‌ బిజా (53) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్‌ కెలిస్‌ (31) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. మిగతా ప్లేయర్లలో కెల్లీ (11), మెలిండ (10), సిబండ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

    పాక్‌ బౌలర్లలో ఫాతిమా సనా, తస్మియా రుబాబ్‌, సయ్యదా ఆరూబ్‌ షా తలో 2 వికెట్లు పడగొట్టగా.. మొమినా రియాసత్‌, నష్రా సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే కరాచీ వేదికగా మే 6న జరుగనుంది. కాగా, వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. 
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మరో సిక్సర్ల చిచ్చరపిడుగును పరిచయం చేసింది. 2026 ఎడషన్‌లో భాగంగా ఇవాళ (మే 4) ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 22 ఏళ్ల అక్షత్‌ రఘువంశీ అనే మెరుపు వీరుడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అక్షత్‌ వచ్చీ రాగానే ఓ భారీ సిక్సర్ల రికార్డు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు.

    అక్షత్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన 11వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అక్షత్‌కు ముందు రాబ్‌ క్వీని (రాజస్థాన్‌), కెవాన్‌ కూపర్‌ (రాజస్థాన్‌), ఆండ్రీ రసెల్‌ (కేకేఆర్‌), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (ఢిల్లీ), అనికేత్‌ చౌదరి (ఆర్సీబీ), జేవన్‌ సీల్స్‌ (కేకేఆర్‌), సిద్దేశ్‌ లాడ్‌ (ముంబై), మహీశ్‌ తీక్షణ (సీఎస్‌కే), సమీర్‌ రిజ్వి (సీఎస్‌కే), వైభవ్‌ సూర్యవంశీ (రాజస్థాన్‌) ఈ ఘనత సాధించారు.

    ఈ సీజన్‌ వేలంలో అక్షత్‌కు లక్నో రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. అక్షత్‌ తన డెబ్యూ క్యాప్‌ను తన ఆరాధ్య ఆటగాడు రోహిత్‌ శర్మ నుంచి తీసుకున్నాడు. అక్షత్‌ 2025 మధ్యప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో 56 బంతుల్లో 115 పరుగులు చేసిన అక్షత్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ అప్పుడే కన్నేసింది.

    అక్షత్‌కు దేశవాలీ క్రికెట్‌లోనూ ఓ అదిరిపోయే రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌ తరఫున అరంగేట్రం చేసిన అతను.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి బంతికే సిక్సర్‌ బాదిన అక్షత్‌ ఆతర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 7 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో 19 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (44), పూరన్‌ (63) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. మార్క్రమ్‌ (29), హిమ్మత్‌ సింగ్‌ (37) క్రీజ్‌లో ఉన్నారు. 
     

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చి వ‌రుస‌గా తొలి రెండు సీజ‌న్ల‌లో ప్లేఆఫ్స్ చేరి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ సంచ‌ల‌నం సృష్టించింది. అయితే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మాత్రం ల‌క్నో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్ర‌మే విజ‌యం సాధించిన ల‌క్నో ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. 

    తాజాగా సోమ‌వారం ముంబై ఇండియ‌న్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్‌ కీల‌క మ్యాచ్ ఆడుతోంది. ఈ నేప‌థ్యంలో టాస్ స‌మ‌యంలో ల‌క్నో కెప్టెన్ పంత్ ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా పేరును ప్ర‌స్తావించాడు. తాను పేల‌వ ఫామ్‌ను అధిగ‌మించి ముంబైతో మ్యాచ్‌లో ప‌రుగులు సాధిస్తాన‌ని సంజీవ్ గోయెంకాకు మాట ఇచ్చిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు. 

    అయితే మ్యాచ్‌లో కేవ‌లం 15 ప‌రుగులు చేసిన పంత్ సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక‌పోయాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘టాస్ మేము గెలిచినా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎంత లక్ష్యాన్నైనా అవలీలగా ఛేదించొచ్చు. 

    నిజానికి ఈ సీజన్‌ను మేము మంచి ఈజ్‌తో ప్రారంభించాము. కానీ మధ్యలో నిలకడ కోల్పోయి వరుస ఓటములు చవిచూస్తూ వచ్చాం. జట్టుగా విఫలమైనప్పటికీ సంజీవ్ గోయెంకా మాపై నమ్మకముంచారు. ఆయనకు క్రికెట్ అంటే అపారమైన ఇష్టం. అయితే ఆయన అంచనాలను, అభిమానుల ఆశలను అందుకోవడంలో విఫలమయ్యాం. 

    కానీ ఇప్పటినుంచి ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు సాధించి సంజీవ్ గోయెంకాకు ఇచ్చిన మాట నిలబెట్టకుంటాం. 200 శాతం కష్టపడి విజయాలు సాధించి అభిమానులను, ఫ్రాంచైజీని సంతృప్తి పరుస్తామని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక లక్నో కెప్టెన్‌ పంత్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 204 పరుగులు సాధించాడు.

    అయితే ముంబైతో మ్యాచ్‌లో పంత్ 15 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పూరన్ (21 బంతుల్లో 63), మార్ష్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.

    చదవండి: ల‌క్నోతో మ్యాచ్‌కు హార్దిక్ దూరం.. కార‌ణ‌మిదే!

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతూ వచ్చిన అతను.. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, లక్నో తరఫున రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ కూడా ఇతని పేరిటే ఉంది. 2023 ఎడిషన్‌లో కేవలం 15 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు.

    తాజా హాఫ్‌ సెంచరీలో 7 సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన పూరన్‌.. ఓవరాల్‌గా 21 బంతులు ఎదుర్కొని ఫోర్‌, 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.

    ఒక్కసారి కుదుపు
    పూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. 

    ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.

    తుది జట్టు..
    లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రుస్తోంది. ఈ సీజ‌న్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు ఓట‌ములు చ‌విచూసిన ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవ‌కాశాలు దాదాపు కోల్పోయింది. పాండ్యా కెప్టెన్సీపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మయ్యాయి. 

    ఈ నేపథ్యంలో సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ దూర‌మ‌వ్వ‌డం ప‌లు అనుమానాలకు తావిచ్చింది. అయితే టాస్ స‌మ‌యంలో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ‌చ్చిన‌ సూర్య‌కుమార్‌.. పాండ్యా ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. అందుకే మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 

    ఇక కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గానూ పూర్తిగా తేలిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో  146 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా బౌలింగ్‌లోనూ కేవలం నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రవర్తనపై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 

    జ‌ట్టు ఆట‌గాళ్ల ప‌ట్ల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో చెడ్డ పేరును మూట‌గ‌ట్టుకున్నాడు. ఒక ద‌శ‌లో పాండ్యాను త‌ప్పించి రోహిత్‌కు మ‌ళ్లీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని ముంబై అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

    చదవండి: ‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్‌!

  • సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్‌ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. 

    గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్‌కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్‌కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్‌ను పంచుకున్నాడు.

    ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లాడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

    ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వ‌రుస విజ‌యాలతో అద‌ర‌గొడుతుంది. లేట్‌గా ఫామ్‌లోకి వ‌చ్చిన రింకూ సింగ్ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో కేకేఆర్‌కు రెండు విజ‌యాలు సాధించి పెట్టాడు. ప్ర‌స్తుతం కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు, 5 ఓట‌ములు, ఒక మ్యాచ్ ర‌ద్దుతో ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది. 

    మ‌రో 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేప‌థ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతాయి. కేకేఆర్ త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, ఆర్సీబీతో, గుజ‌రాత్‌తో, ముంబైతో ఆడాల్సి ఉంది.

    ఇక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి దేశ‌వాలీ క్రికెట్‌లో త‌మిళనాడుకు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ అంశం. టీమిండియా త‌ర‌ఫున 4 వ‌న్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో 91 మ్యాచ్‌లాడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 110 వికెట్లు తీశాడు.

    చదవండి: విజ‌య్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెట‌ర్‌!

  • ఐపీఎల్‌ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్‌’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్‌కు ప్రతీకగా నిలిచిన విరాట్‌ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సునీల్‌ నరైన్‌ను "కొత్త కింగ్‌"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.

    నరైన్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్‌ వాల్యుయబుల్‌ ప్లేయర్‌ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్‌ను గేమ్ చేంజర్‌గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.

    మరోవైపు విరాట్‌ కోహ్లి కింగ్‌ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.

    నరైన్‌ కూడా విరాట్‌లాగే కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్‌ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్‌లో విరాట్‌.. ఆల్‌రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్‌ ఎవరో డిసైడ్‌ చేయడం చాలా కష్టంగా మారింది.

    ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ తొలి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్‌.. అనూహ్యంగా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్‌ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది. 
     

  • లక్నోపై ముంబై ఇండియన్స్‌ గెలుపు
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స​్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

    రోహిత్‌ శర్మ (84) ఔట్‌
    13.6వ ఓవర్‌- 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన అనంతరం రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. 

    విధ్వంసం సృష్టించి ఔటైన రికెల్టన్‌
    10.5వ ఓవర్‌- రికెల్టన్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

    దంచికొడుతున్న రోహిత్‌, రికెల్టన్‌
    229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. తొలి ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఏకంగా 71 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ (36), రికెల్టన్‌ (34) దంచికొడుతున్నారు. 

    లక్నో భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 63; ఫోర్‌, 8 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో లక్నో ఇంకా భారీ స్కోర్‌ సాధించేలా కనిపించింది. 

    అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోర్‌ నెమ్మదించింది. ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (25 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌), హిమ్మత్‌ సింగ్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతగా ఆడి, ఊహించినంత కాకపోయినా ఓ మోస్తరు స్కోర్‌ అందించారు. 

    మిగతా బ్యాటర్లలో జోష్‌ ఇంగ్లిస్‌ 13, కెప్టెన్‌ పంత్‌ 15, అరంగేట్రం ఆటగాడు అక్షత్‌ రఘువంశీ 11 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2 వికెట్లు తీయగా.. ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

    ఒక్కసారి కుదుపు
    పూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. 

    ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.

    పంత్‌ ఔట్‌
    10.4వ ఓవర్‌- విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి రిషబ్‌ పంత్‌ (15) ఔటయ్యాడు.

    ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన లక్నో
    8.5వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌ నమన్‌ ధిర్‌కు క్యాచ్‌ ఇచ్చి మిచెల్‌ మార్ష్‌ (44) ఔటయ్యాడు. 

    రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
    8.1వ ఓవర్‌- కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో ర్యాన్‌ రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (63) ఔటయ్యాడు.

    దంచికొడుతున్న  లక్నో..
    ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ దంచికొడుతుంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది. పూరన్‌ (47), మిచెల్‌ మార్ష్‌ (43) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన జోస్‌ ఇంగ్లిస్‌ గజన్‌ఫర్‌ బౌలింగ్‌లో సూర్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 4) జరుగుతున్న 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

    ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్వల్ప అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడటం​ లేదని స్కై తెలిపాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా బరిలోకి దిగుతున్నాడు. 

    హిట్‌మ్యాన్‌ గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం​ ముంబై మరో మార్పు కూడా చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో కార్బిన్‌ బాష్‌ తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్టు..

    లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ

  • త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సినీహీరో విజ‌య్ స్థాపించిన త‌మిళగ వెట్రి క‌జ‌గం (టీవీకే) సంచ‌ల‌నం సృష్టించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌య్ టీవీకే పార్టీ త‌మిళ‌నాట వెలువ‌డిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 109 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. అయితే అత్య‌ధిక స్థానాలు గెలిచిన విజ‌య్ కింగ్ మేక‌ర్‌గా నిలిచారు. 

    అయితే డీఎంకే లేదా అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చ‌ర్ త‌మిళ‌నాట విజ‌య్ గెలుపు గురించి ముందే ఊహించాడంటూ సోష‌ల్ మీడియాలో ఒక ట్వీట్ చ‌క్క‌ర్లు కొడుతుంది. 2015 ఏప్రిల్ 25న ఆర్చర్ తన ‘ఎక్స్‌’ (అప్పటి ట్విటర్‌) వేదికగా ‘విజయ్ డబ్ల్యూటీఎఫ్‌’ అని పోస్టు పెట్టాడు. 

    నిజానికి ఆర్చ‌ర్ ఆ ట్వీట్ పెట్టింది క్రికెటర్ మురళీ విజయ్‌ను ఉద్దేశించి అని తెలుస్తోంది. అంతకుముందు 2014, డిసెంబర్ 27న ‘లవ్ టు వాచ్ విజయ్’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దానికి ముందు 2013, మార్చి 4న ‘M.Vijay 140*’ అంటూ ట్వీట్ చేశాడు జోఫ్రా ఆర్చర్. ఈ ట్వీట్స్ అన్నీ కూడా క్రికెటర్ మురళీ విజయ్‌కి సంబంధించినవి మాత్రమే. 

    అయితే తాజాగా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన నేపథ్యంలో విజయ్ విజయదుందుబి మోగించడంతో ఆయన అభిమానులు ఆర్చర్ ట్వీట్‌ను తమ హీరో విజయ్‌ కోసం చేసినట్లుగా రీట్వీట్ చేశారు. ‘మా విజయ్ ముందే గెలుస్తాడని ఊహించిన ఆర్చర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

    అయితే ఆర్చర్‌ నిజంగా ఆ ట్వీట్‌ చేశాడా అన్నది ఒకసారి చెక్‌ చేసుకోవాలని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎందు కంటే గతంలో మురళీ విజయ్‌తో విభేదాల సమయంలో క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ కూడా ఇలాంటి ట్వీట్‌ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

    ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన ఆర్చర్ 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఇక సీజన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో వరుస ఓటములు చవిచూస్తోంది. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

    చదవండి: పాక్‌ పరువు గోవిందా.. అంత తక్కువ ప్రైజ్‌మనీనా!

  • గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన లాంగ్‌ స్టాండింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్‌ తన తొలి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2061 పరుగులు చేయగా.. సాయి తన మొదటి 50 ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌ల్లో 2178 పరుగులు చేశాడు.

    ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌పై నిన్న (మే 3) ఆడిన ఇన్నింగ్స్‌ సాయికి ఐపీఎల్‌లో 50వది. ఈ ఇన్నింగ్స్‌లో అతను 41 బంతుల్లో 57 పరుగులు చేసి తన జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి గుజరాత్‌ను గెలిపించాడు.

    పై రికార్డును సాధించే క్రమంలో సాయి మరో రికార్డు ఇదివరకే నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును చేరడానికి అతి తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును చేరుకునే క్రమంలోనూ సాయి క్రిస్‌ గేల్‌ పేరిట ఉండిన రికార్డునే అధిగమించాడు. గేల్‌ ఈ మైలురాయిని 48 ఇన్నింగ్స్‌ల్లో చేరుకోగా.. సాయి 47వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.

    ఈ సీజన్‌లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్న సాయి.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 3 అర్ద సెంచరీల సాయంతో 385 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తాజాగా పంజాబ్‌పై గెలుపుతో గుజరాత్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరేసి విజయాలతో 12 పాయింట్లు కలిగి ఉంది.

    ప్రస్తుతం సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ కూడా 12 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ.. గుజరాత్‌ ఈ జట్ల కంటే తక్కువ రన్‌రేట్‌ కలిగి ఉండటంతో ఐదో స్థానంలో ఉంది. 13 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. 

  • పాకిస్తాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ విజేత‌గా బాబ‌ర్ ఆజం సార‌థ్యంలోని పెషావ‌ర్ జాల్మి నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో హైద‌రాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించిన పెషావ‌ర్ జాల్మి టైటిల్ గెలిచింది. ఈ సీజ‌న్‌లో బాబ‌ర్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచి ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ అవార్డుతో పాటు హనీఫ్ మొహమ్మద్ క్యాప్ అందుకున్నాడు. 

    ఈ నేపథ్యంలో అవార్డుతో పాటు ఆయన అందుకున్న బహుమతి విలువ కేవలం పీకేఆర్ 3,500 మాత్రమే అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.1200 మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. 

    ‘ఆర్ధిక సంక్షోభంతో  కొట్టుమిట్టాడుతున్నందునే పీఎస్‌ఎల్ నిర్వాహకులు ఆటగాళ్లకు తక్కువ ప్రైజ్‌మనీ అందించింది’.. ‘పాపం పీసీబీ దగ్గర డబ్బులేవనుకుంటా.. అందుకే ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఇస్తున్నట్లున్నారు’ అని కామెంట్లు చేశారు. అయితే నిజానికి బాబర్ ఆజం అందుకున్న బహుమతి విలువలో అంకెల సంఖ్యను సోషల్ మీడియాలో తప్పుగా చూపించినట్లు పీఎస్‌ఎల్ నిర్వాహకులు తెలిపారు. 

    ‘బ్యాటర్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ అవార్డు కింద బాబర్ ఆజం పీకేఆర్ 3,500,000 ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 11,90, 790 రూపాయలు. ఇక టీ20 ప్రపంచకప్‌లో విఫలమైన బాబర్ ఆజం పీఎస్‌ఎల్ 2026 సీజన్‌లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు. 11 ఇన్నింగ్స్‌లు కలిపి 588 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండడం విశేషం. 

    అయితే కీలకమైన ఫైనల్లో బాబర్ ఆజం తొలి బంతికే ఔటైనప్పటికీ, ఓవరాల్‌గా ఒక పీఎస్‌ఎల్ సీజన్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. పీఎస్‌ఎల్ ముగిసిన మరుక్షణమే బాబర్ ఆజం టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ చేరుకున్నాడు. మీర్పూర్ వేదికగా మే 8 నుంచి 12 వరకు తొలి టెస్టు, మే 16 నుంచి 20 వరకు రెండో టెస్టు జరగనుంది.

     చదవండి: షాక్‌లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!

  • స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ నేతృత్వంలోని పెషావర్‌ జల్మీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది. నిన్న (మే 3) జరిగిన ఫైనల్లో కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, విజేతగా అవతరించింది. 2017 తర్వాత పెషావర్‌ గెలిచిన తొలి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ ఇది. అలాగే కెప్టెన్‌గా బాబర్‌ ఆజమ్‌కు ఇది తొలి పీఎస్‌ఎల్‌ టైటిల్‌. పీఎస్‌ఎల్‌ ట్రోఫీని బాబర్‌ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా అందుకున్నాడు.

    లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పెషావర్‌, కింగ్స్‌మెన్‌ను 18 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూల్చంది. సైమ్‌ అయూబ్‌ (54) ఒంటరిపోరాటం​ చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పెషావర్‌ మీడియం పేసర్‌ ఆరోన్‌ హార్డీ 4 వికెట్లు తీసి కింగ్స్‌మెన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నహిద్‌ రాణా (4-1-22-2) అతనికి సహకరించాడు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పెషావర్‌ సైతం తడబడింది. 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆరోన్‌ హార్డీ బ్యాట్‌తోనూ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. అజేయమైన అర్ద సెంచరీ (56) చేసి పెషావర్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి అబ్దుల్‌ సమద్‌ (48) సహకరించాడు. కింగ్స్‌మెన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అలీ 3 వికెట్లు తీసి పెషావర్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో సత్తా చాటిన హార్డీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

    కాగా, పెషావర్‌ టైటిల్‌ సాధించడంతో బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌కు ముందు పేలవ ఫామ్‌లో ఉండిన అతను.. సీజన్‌ పూర్తయ్యే సరికి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి తన జట్టు ప్రతి విజయంలో కీలక పాత​ పోషించాడు. ఈ సీజన్‌లో బాబర్‌ 11 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 588 పరుగులు చేశాడు. పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఓ ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం ఇదే మొదటిసారి. 

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్‌లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్‌, దేవదత్ పడిక్కల్‌, టిమ్ డేవిడ్‌లు అదరగొడుతుంటే, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. 

    ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్‌రేట్‌తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్‌గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్‌లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. 

    అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్‌లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్‌వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్‌లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల  ఫిట్‌నెస్‌తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. 

    అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్‌లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్‌వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్‌’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్‌లీ ఈ ఫేర్‌వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. 

    కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్‌కు గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్‌లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్‌లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.

    చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’

  • ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌ ఒకరు తనను బాగా ఇబ్బంది పెట్టారన్నాడు. ఆరోగ్యం బాగాలేకపోయినా మ్యాచ్‌ ఆడాల్సిందేనని పట్టుబట్టారని ఆరోపించాడు.

    బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఐదు మ్యాచ్‌లు పూర్తైన తర్వాత.. తదుపరి మ్యాచ్‌కు మరో మూడు రోజుల సమయం ఉంది. అప్పుడు నా ఆరోగ్యం చెడిపోయింది. ప్రతీ అరగంటకు డాక్టర్‌ వచ్చి నన్ను పరీక్షిస్తూ ఉన్నారు.

    బెడ్‌ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు
    అప్పుడే జట్టు యజమాని నాకు ఫోన్‌ చేశారు. ‘ఎలా ఉన్నావు?.. మ్యాచ్‌కు సిద్ధమేనా?’ అని అడిగారు. ‘నిజం చెప్పాలంటే నేనేమీ తినలేకపోతున్నాను. కనీసం డ్రింక్స్‌ కూడా తీసుకోలేకపోతున్నా. అసలు బెడ్‌ మీద నుంచి లేచే ఓపిక కూడా లేదు’ అని బదులిచ్చాను.

    ఇందుకు స్పందిస్తూ.. ‘నీ కోసం ఇంకో డాక్టర్‌ని పంపిస్తా. మెరుగైన వైద్యం ఇప్పిస్తా’ అని చెప్పారు. ఆ మరుసటి రోజే మళ్లీ నాకు ఫోన్‌ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అయితే, నా ఆరోగ్యం అస్సలు మెరుగుపడలేదని చెప్పాను.

    ప్రైవేట్‌ విమానం పంపిస్తా
    అప్పుడు ఆయన.. ‘ఒక పని చేద్దాం. నీకోసం నేను ప్రైవేట్‌ విమానం పంపిస్తా. నువ్వు దాంట్లో మైదానానికి వచ్చి మ్యాచ్‌ ఆడు. ఆ వెంటనే అదే విమానంలో నీ బెడ్‌ వరకూ చేరుస్తాం’ అని అన్నారు’’ అని మార్క్‌ వుడ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. 

    తాను కూడా ఓనర్‌ చెప్పిన విషయం గురించి ఆలోచించానని.. అయితే, తండ్రి మాటకు తలొగ్గి ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపాడు. కానీ ఆ ఓనర్‌ ఎవరో మాత్రం వెల్లడించలేదు.

    కాగా మార్క్‌వుడ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో రెండు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఒక మ్యాచ్‌ ఆడిన ఈ ఇంగ్లిష్‌ పేసర్‌.. 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. లక్నో తరపున 11 వికెట్లు కూల్చాడు. 

    చదవండి: ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

  • ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన పాటీదార్‌ సేన.. ఇప్పటికి తొమ్మిదింట ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

    అయితే, ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. తదుపరి లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. ఏకనా స్టేడియంలో గురువారం నాటి మ్యాచ్‌తో తిరిగి గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

    వేలికి గాయం
    గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విధ్వంసకర ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ గాయం నుంచి కోలుకోలేదని సమాచారం. కాగా ఏప్రిల్‌ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సాల్ట్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ బౌండరీ నుంచి డైవ్‌ చేస్తూ బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమచేయి వేలికి గాయమైంది.

    యూకేకి చేరుకున్న సాల్ట్‌
    ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న సాల్ట్‌.. తాజాగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. యూకేకి చేరుకున్న అతడు గాయానికి సంబంధించి స్కానింగ్‌ చేయించుకున్నట్లు సమాచారం. కాగా గత మూడు మ్యాచ్‌లలో సాల్ట్‌ ఆడలేదు. అతడికి బదులు ఇంగ్లండ్‌ మరో స్టార్‌ జేకబ్‌ బెతెల్‌.. విరాట్‌ ‍కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడు.

     కాగా సాల్ట్‌ ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 202 పరుగులు సాధించాడు. అయితే, త్వరలోనే అతడు కోలుకుని తిరిగి జట్టుతో చేరతాడని ఆర్సీబీ ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. 

    ప్లే ఆఫ్స్‌ నాటికైనా సాల్ట్‌ అందుబాటులోకి వస్తాడనే ఆశాభావంతో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌ టైటాన్స్‌తో ఏప్రిల్‌ 30న మ్యాచ్‌ ముగించుకున్న ఆర్సీబీకి దాదాపు వారం రోజుల విశ్రాంతి లభించింది. దీంతో జట్ట మాల్దీవులకు విహారానికి వెళ్లినట్లు సమాచారం.

    చదవండి: గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..

National

  • సాక్షి,చెన్నై: విజయ్‌ను అభినందిస్తూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్,నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్‌కి,ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు అంటూ రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ కి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలంటూ కమల్ హాసన్ ట్వీట్‌ చేశారు.


    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి 118 సీట్లు అవసరం. 

    విజయ్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్‌ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. 

  • కుల్లంపాళయం అర్థనారి సెంగొట్టయన్.. త‌మిళుల‌కు సుప‌రిచిత‌మైన పేరు. కేఏ సెంగొట్టయన్‌గా ప్ర‌సిద్ధులు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. గోబిచెట్టిపాలయం నియోజ‌కవ‌ర్గం నుంచి 9వ సారి విజ‌యం సాధించి చ‌రిత్రకెక్కారు. 1977లో మొద‌టిసారిగా సత్యమంగళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 10 ప‌ర్యాయాలు శాస‌న‌స‌భ్యుడిగా విజ‌యాలు అందుకున్నారు. ఐదు ద‌శాబ్దాల పాటు అన్నాడీఎంకేలో కొన‌సాగిన ఆయ‌న ఈసారి ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌య కేత‌నం ఎగర‌వేయ‌డం విశేషం.

    త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రైన సెంగొట్టయన్ గ‌తేడాది న‌వంబ‌ర్‌లో హీరో విజ‌య్ నాయ‌క‌త్వంలోని త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీలో చేరారు. విజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన మొద‌టి సీనియ‌ర్ నేత ఆయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం. టీవీకేలో చేరిన వెంటనే ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌కున్న  అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నత-స్థాయి పరిపాలనా కమిటీకి ముఖ్య సమన్వయకర్తగా నియ‌మించారు. దీంతో పాటుగా పశ్చిమ జిల్లాలైన కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరిలకు ఆర్గనైజేషన్ సెక్రటరీగా కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

    అన్నాడీఎంకేలో అవ‌మానం
    టీవీకే పార్టీలో చేర‌డానికి కొద్ది రోజుల ముందు అన్నాడీఎంకేలో సెంగొట్టయన్ తీవ్ర అవ‌మానాలు ఎదుర్కొన్నారు. అన్నాడీఎంకేని వీడిన మాజీ నాయ‌కుల‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఆ పార్టీ అధినేత ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామికి రుచించ‌లేదు. పార్టీని వీడిన, బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన నాయ‌కులు తిరిగి సొంత‌గూటికి రావాల‌ని పిలుపునివ్వ‌డంతో సెంగొట్టయన్‌ను ప‌ళ‌నిస్వామి టార్గెట్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, ఈరోడ్ రూర‌ల్ ప‌శ్చిమ జిల్లా కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను తొల‌గించారు. సెంగొట్టయన్ మ‌ద్ద‌తుదారుల ప‌ద‌వులు కూడా పీకేశారు. డీఎంకే కూట‌మిని ఓడించ‌డానికే తాను మాజీ నేత‌ల‌ను తిరిగి రావాల‌ని కోరిన‌ట్టు వివ‌రించినా ప‌ళ‌నిస్వామి ప‌ట్టించుకోలేదు. అక్క‌డితో ఆగ‌కుండా పార్టీ నుంచి ఆయ‌న‌ను బ‌హిష్క‌రించారు. దీంతో విజ‌య్‌తో ఆయ‌న చేతులు క‌లిపారు.

    సరికొత్త చ‌రిత్ర
    ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళ‌యం తాలుకాలోని కుల్లంపాళయంలో జ‌న్మించిన 78 ఏళ్ల సెంగొట్టయన్ త‌మిళ రాజ‌కీయాల్లో అంచెలు అంచెలుగా ఎదిగారు. 10వ ప‌ర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి స‌త్తా చాటారు. త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో అత్య‌ధిక కాలం పాటు స‌భ్యుడిగా కొన‌సాగిన దురై మురుగన్ స‌రస‌న చేరారు. మురుగన్ ఇప్ప‌టికే 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. తాజా ఎన్నిక‌ల్లో త‌న క‌ట‌ప్పాడి నుంచి టీవీకే అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. 1996 నుంచి ఇక్క‌డ గెలుస్తూ వ‌స్తున్న ఆయ‌న‌కు కొత్త పార్టీ చేతిలో చుక్కెదురైంది. 1984 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11 సార్లు ఇక్క‌డి నుంచి పోటీ చేయగా మూడు సార్లు మాత్ర‌మే ఆయ‌న ఓటమి చ‌విచూశారు.

    చ‌ద‌వండి: త‌మిళ సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి ప్ర‌ధాని మోదీ

    సెంగొట్టయన్ త‌న నియోజ‌క‌వ‌ర్గం గోబిచెట్టిపాళ‌యంలో 10 ప‌ర్యాయాలు పోటీ చేయ‌గా ఒక‌సారి మాత్ర‌మే గెల‌వ‌లేక‌పోయారు. ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏకంగా తొమ్మిదిసార్లు గెలిచి చ‌రిత్ర‌కెక్కారు. డీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త మాజీ సీఎం క‌రుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న ఏడు వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

    కీల‌క ప‌ద‌వి
    త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వం ఏర్పాటుకు టీవీకే సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో సెంగొట్టయన్ కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సీట్లు రాక‌పోవ‌డంతో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ఆయ‌న అనుభ‌వం అక్క‌ర‌కు రావ‌చ్చు. ఎందుకంటే అన్నాడీఎంకేతో ఆయ‌న‌కు ఐదు ద‌శాబ్దాల అనుబంధం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వంలో గ‌తంలో ప‌లుమార్లు మంత్రి ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. సెంగొట్టయన్‌కు ఉన్న అపార అనుభ‌వం కార‌ణంగా టీవీకే ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

  • ఢిల్లీ: హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పేర్కొన్నారుఢిల్లీలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. భారత్ మదర్‌ ఆఫ్‌ డెమెక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయని ఐదురాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్‌ వరకూ కమలం వికసించిందని బెంగాల్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరగడం ఎంతో గొప్ప విషయమన్నారు. 

    దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ‍ప్రజలు గుర్తించారన్నారు. ఈ రోజు భారత్‌కు, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజని ప్రధాని మోదీ అన్నారు.  పార్టీ విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని తెలిపారు. బెంగాల్‌లో కమలం విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు.  బెంగాల్‌లో ప్రజాసామ్య విజయం సాధించామన్నారు. ఈ రోజు ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజని కొనియాడారు. 

    ఐదు రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్‌ కీలక పాత్ర పోషించారని మోదీ తెలిపారు. బెంగాల్‌లో  ‍‍ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా అసంఖ్యాక కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని మోదీ ఉద్ఘాటించారు. వారందరికి మనస్ఫూర్తిగా వందనం చేస్తున్నానని ప్రధాని అన్నారు.

    మరోవైపు మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.  అస్సాం ఎన్నికలలో బీజేపీ-ఎన్డీఏ విజయం, అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి మా కూటమి ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనమని.. బీజేపీ నేతలు అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి  అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారన్నారు. ఐదురాష్ట్రాలకు జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించింది.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే  234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 106 స్థానాల్లో మెజారిటీని సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు అవసరం.  మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 12 సీట్ల దూరంలో ఉంది. ఈ క్రమంలో తమిళనాడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ ముందు నాలుగు మార్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిల్లో 

    ఏఐఏడీఎంకేతో పొత్తు  
    గతంలో టీవీకే–ఏఐఏడీఎంకే మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏఐఏడీఎంకే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి టీవీకేతో కలిసే అవకాశం ఉంది. అయితే, విజయ్ బీజేపీని ఆదర్శ శత్రువుగా పేర్కొన్నందున, ఏఐఏడీఎంకే బీజేపీని వదిలేయమని అడగవచ్చు. ఇది పెద్ద సవాలుగా మారవచ్చు.

    చిన్న పార్టీలతో పొత్తు  
    డీఎంకే లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు లేకుండా, పీఎంకే, డీఎండీఎకే, వీసీకే, ఎంఎంఎంకే వంటి చిన్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇలా చేస్తే, విజయ్ తన స్వంత రాజకీయ వారసత్వాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది.

    కాంగ్రెస్ మద్దతు  
    స్థానిక పార్టీలను పక్కన పెట్టి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.

    స్వతంత్రుల మద్దతు  
    స్వతంత్ర అభ్యర్థుల మద్దతు పొందడం ద్వారా కూడా విజయ్ మెజారిటీ సాధించే అవకాశం ఉంది.

  • దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలన్నే ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్స్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క తమిళనాడు తప్ప అక్కడ మాత్రం ఎవరు ఉహించని విధంగా సినీ స్టార్‌ పార్టీ టీవీకే ఘన విజయం సాధించి లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. కాగా ఈ ఫలితాల అంచనాను ముందే ఓ ఏజెన్సీ ఊహించింది. అయితే దాని అంచనా చూసి తొలుత అందరూ నవ్వుకున్నారని ఆ సంస్థ చీఫ్‌ ప్రదీప్‌ గుప్తా జాతీయ మీడియాతో పంచుకున్నారు.  

    ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బెంగాల్, అస్సాంలలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుండగా కేరళలో  విజయకేతనం ఎగురవేస్తుండగా యూడీఎఫ్‌ విజయదుదుంబి మోగించింది. అయితే్ ఈ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితాలు మాత్రం తమిళనాడువే.. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వెనక్కి నెట్టి ఫిలిం స్టార్‌ విజయ్‌ పార్టీ ఆ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని తొలుతగా అంచనా వేసింది మాత్రం ఆక్సిస్‌ ఇండియా మాత్రమే అయితే ఆ సమయంలో ఆసర్వేలను చూసి దేశమంతా నవ్వుకుందని ఆ సంస్థ అధినేత ప్రదీప్‌ గుప్తా అ‍న్నారు.

    ప్రదీప్ గుప్తా వ్యాఖ్యలు 

    డేటా సైన్స్ విజయం: "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. మిగతా సంస్థలు గ్రౌండ్ లెవల్‌లో ప్రజల నాడిని ఎందుకు పట్టుకోలేకపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసాం కానీ దీనిని ఎవరూ నమ్మలేదుఇదంతా ఒక గాలి వార్త అని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, ఇతర సంస్థలు మమ్మల్ని చూసి నవ్వుకున్నాయి అన్నారు.

    విజయ్‌ టీవీకే పార్టీకి టీవీకేకు తాము చెప్పినట్టే 35 శాతం ఓట్లు లభిస్తున్నాయని  డీఎంకేకు మాత్రం  35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుతం 32 శాతంగా ఉందన్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) కి 23 శాతం వస్తాయని చెబితే, ప్రస్తుతం 27 శాతంగా ఉందని చెప్పారు. అదే స్థానాల ప్రకారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    టీవీకే విజయానికి కారణాలు

    ప్రదీప్ గుప్తా విశ్లేషణ ..తమిళనాట 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అధికంగా 42 శాతం మంది ఉన్నారని వీరంతా విజయ్‌ వైపు మెుగ్గు చూపారని తెలిపారు. 40 ఏళ్ల పైబడిన వారిలో 25 నుండి 30 శాతం మంది విజయ్‌కు మద్దతు ఇచ్చారు. అదే విధంగా డీఎంకే తరువాత అధికంగా మహిళా ఓటర్లు టీవీకేకే ఓటు వేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 40 స్థానాల్లో గెలువగా మరో 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

  • 2026 అసెంబ్లీ ఎన్నికల్లో  కాషాయ దళం తన హవాను చాటుకుంది. రెండు అద్భుతమైన  విజయాలు,  ఉత్సాహభరితమైన కమ్‌ బ్యాక్‌  వెరసి ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి  3-5 స్కోర్‌లైన్‌ను కైవసం చేసుకోనుంది. లేడీ టైగర్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రజాముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న స్టాలిన్‌, మరీ ముఖ్యంగా కేరళలో పినరయి విజయ్‌న్‌తోపాటు ఇతర నేతలకు కూడా ఇవొక గుణ పాఠంగా చెప్పవచ్చు.  రాజకీయ ఉద్ధండులు, సిట్టింగ్ సీఎంలుగా ఉన్న ఈ ముగ్గురి నేతృత్వంలోని ఓటమి  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ ప్రభావం, హవా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

    వెస్ట్‌ బెంగాల్‌లో బీజేపీ పాగా, కనిపించని ‘మమత’ 
    దాదాపు 50 ఏళ్లుగా టీఎంసీ లేదా వామపక్షాలు మాత్రమే పాలించిన పశ్చిమ బెంగాల్‌లో  బీజేపీ పాగా వేసింది.  బలమైన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించి,  తొలిసారి అక్కడ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. వామపక్ష రాష్ట్రం  బెంగాల్‌లో, తమ ఉనికిని విస్తరించుకునే లక్ష్యంతో బయలుదేరిన బీజేపీకి పని చాలా కష్టతరమైంది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుని, రాష్ట్రంలో ఒక నామమాత్రపు పార్టీగా మాత్రమే ఉండేది. ఒక దశాబ్ద కాలంలోనే, బీజేపీ భారత చరిత్రలోనే అత్యంత అద్భుతమైన వృద్ధి పథంలో ఒకటిగా నిలిచింది. బెంగాల్‌లో రాజకీయ రంగంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన మమతా బెనర్జీకి గట్టి దెబ్బ కొట్టింది.

    చారిత్రాత్మక నాలుగోసారి అధికారం చేపట్టాలని కన్న మమత  అభేద్యమైన కంచుకోట, బీజేపీ మాయాజాలం ముఖ్యంగా మోదీ మాయాజాలంతో కూలిపోయింది. అలుపెరుగని మోదీ ర్యాలీలు, ప్రచారం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారిస్తూ,  మోదీ చొరబాటు ఆరోపణలపై టీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. తనదైన శైలిలో దీదీ (మమత)ని ఎగతాళి చేశారు.  దీనికి తోడు క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆర్.జి. కార్, సందేశ్‌ఖాలి వంటి ఘటనలు, ఓటర్లలో నిరాశ, టీఎంసీ 'తోలాబాజీ'పై పెరుగుతున్న ఆగ్రహం వంటివి ఓటర్లు కొనసాగింపు కంటే "పరివర్తన్" (మార్పు)ను ఎంచుకునేలా చేశాయి. 2024లో ఒడిశాను జయించి, గత నెలలో బీహార్‌లో తమ సొంత ముఖ్యమంత్రిని నియమించుకున్న తర్వాత, తూర్పున బీజేపీ తన ఆధిపత్యాన్ని  చాటుకుంది.

    కేరళం మార్పుకే పట్టం! దెబ్బకొట్టిన కాంగ్రెస్‌
    కేరళంలో కురువృద్ధుడు,ప్రజాదరణనేతగా   పాపులర్‌ పినరయ్‌ విజయన్‌కు ఈ సారి ప్రజలు భారీ షాకే ఇచ్చారు.  తన ప్రత్యర్థి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)పై  తన విశ్వాసాన్ని ప్రకటించారు.  దీంతో కేరళం ఇప్పుడు తిరిగి యూడీఎఫ్ చేతుల్లోకి వచ్చింది.అవినీతి ఆరోపణలు, వామపక్షాల స్వరూపమే మారుతోందన్న ఆరోపణలతో సతమతమవుతున్న సీపీఎం, మరో ఐదేళ్లపాటు  పాలించే అధికారాన్ని కోల్పోయింది.  రాష్ట్రంలోని 140 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది. ఇది   దక్షిణాదిలో తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలని చూస్తున్న బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాంగ్రెస్‌ ప్రచారంతోపాటు కేరళలో మార్పు పవనాలు వీచాయి. అస్సాం - పుదుచ్చేరిలో, NDA సునాయాస విజయాలు సాధించి, కీలకమైన ఈశాన్య, దక్షిణ కంచుకోటలలో తన పట్టును సుస్థిరం చేసుకుంది.

    డీఎంకేకి షాక్‌, అరంగేట్రంలోనే విజయ్‌ అదుర్స్‌ 
    తమిళనాడులో, నటుడు-రాజకీయవేత్త  విజయ్  టీవీకే పార్టీ,  అరంగేట్రంలో బ్లాక్‌బస్టర్ అరంగేట్రంతో విప్లవాత్మక విజయం దూసుకుపోతున్నాడు. ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలకు వెన్నెముకగా ఉన్న డీఎంకే , ఏఐఏడీఎంకే అనే రెండు కూటముల  ద్విముఖ ద్రావిడ ఆధిపత్యాన్ని  బద్దలు చేసింది. విజయ్ స్టార్ పవర్ ,రెండు ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలపై ఓటర్లలో పెరుగుతున్న అసహనం కారణంగా తమిళనాడులో ఆశ్చర్యకరమైన  ఆధిక్యాన్ని  అందించాయి. 2026లో నిజమైన మార్పును కోరుకుంటూ, ఓటర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలోని పాత మూస ధోరణుల నుండి బయటపడటానికి సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టమవుతోంది. తుదిఫలితాలు, తమిళనాడులో ఎన్నికల అనంతర పొత్తులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలకు అసలైన సూపర్‌స్టార్ విజయేనన్నది స్పష్టం.

    అస్సాంలో హిమంత హ్యాట్రిక్: 
    రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను దాదాపు 100 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనే చిన్నపాటి వాదనను కూడా పూర్తిగా తోసిపుచ్చుతూ, అస్సాంలో తన అత్యంత ఆధిపత్య ప్రదర్శనను కనబరచడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై బీజేపీ పెట్టుకున్న  నమ్మకం  వమ్ము కాలేదు.  రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో  హిమంత మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.

    పుదుచ్చేరిలో కూడా అధికారి బీజేపీ  కూటమి మళ్లీ  అధికారాన్ని చేపట్టనుంది.  అయిదోసారి ఎన్‌. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.

    ఇండియా కూటమికి కష్టాలేనా?
    2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్దికాలం పాటు ప్రోత్సాహకరంగా పుంజుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు మరిన్ని కష్టాలు  తప్పవనే సంకేతాలనిస్తున్నాయి.  2024 సార్వత్రిక ఎన్నికలు కేవలం ఒక తాత్కాలిక పరిణామం మాత్రమేనని ఎన్డీఏ నిరూపించడంతో, ఇప్పుడు ప్రతిపక్షం మళ్లీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే, బీజేపీ అన్ని ప్రత్యర్థి పార్టీలను పాతాళానికి  తొక్కేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తోంది. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌లను పక్కన పెట్టడంతో, 2029 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.
     

  • అస్సాంలో బీజేపీ హావా కొనసాగుతుంది. రికార్డు స్థాయి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. మైనార్టీల శాతం అధికంగా ఉన్న రాష్ట్రంలో బంపర్‌ మోజారిటీ దిశగా సాగుతుంది. అయితే బీజేపీకి ఇంత భారీ విజయం దక్కడం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వశర్మ రాజకీయ ఎత్తుగడలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

    హిమంత మార్క్ పాలన

    అసోంలో ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలను బాగా ఆకర్షించాయి. 'అరుణోదోయ్' ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్దఎత్తున మైలేజ్‌ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసిందిదానితో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా "భూమిపుత్రులకు రక్షణ" అనే నినాదంతో ఆయన ప్రచారం సాగించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ, స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం స్థానికంగా ఎంతో కలిసివచ్చింది. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా  రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది.

    మైనార్టీల ఓట్లు అధికంగా  ఉన్నప్పటికీ విజయం ఎలా సాధ్యమైంది?

    హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ  2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అస్సాం రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చింది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్థానాల సంఖ్య తగ్గింది. ఫలితంగా, స్థానిక అస్సామీ జనాభా ప్రభావం ఉన్న స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది. గతంలో కాంగ్రెస్, AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) కలిసి పోటీ చేసేవి. కానీ ఈసారి విడివిడిగా లేదా బలహీనమైన కూటములతో పోటీ చేయడం వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోయి బీజేపీకి మేలు జరిగింది.దానితో పాటు తిరుగుబాటు దారుల సమస్య అధికంగా ఉండడంతో ఆ సమస్య ప్రధానంగా ఎన్నికల ‍ప్రచారం సాగింది.రాష్ట్రంలోని వివిధ హిందూ వర్గాలను (అస్సామీ, బెంగాలీ, గిరిజనులు) బీజేపీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగింది.

    హిమంత బిశ్వశర్మ నేపథ్యం

    2015 వరకూ జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగిన హిమంత బిశ్వశర్మ హస్తంతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. చేరిన ఏడాదికే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాగా తన ఎత్తులతో 15 ఏళ్లుగా బీజేపీ కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు. దీంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కోటకు బీటలు వారింది. అయితే ఆసమయంలో  సర్బానంద సోనోవాలా ముఖ్యమంత్రి కాగా అతని క్యాబినెట్‌లో హిమంత మంత్రిగా పనిచేశారు.

    అనంతరం 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ సారి కమలనాథులు హిమంతకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇ‍చ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హిమంత అభివృద్ధే లక్షంగా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు నడిపారు. హిమంత నాయకత్వంలో ‍ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీ భారీ మెజారీటీతో అధికారం దిశగా దూసుకుపోతుంది.

     

     

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ టీవీకే పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. పార్టీ పెట్టి రెండేళ్లే అవుతున్నా.. తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను మట్టికరిపించింది. అయితే.. ఈ విజయ్‌ విజయం వెనుక ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

    2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్‌ విక్టరీ వెనుక ఉన్న కపిల్‌ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్‌ ప్రచారానికి నాయకత్వం వహించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌లో రాఘవ్‌ చద్దా నియోజకవర్గ స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో ఆప్‌ విస్తరణలో కీలక పాత​ పోషించారు. కాంగ్రెస్‌ పార్టీతోనూ జాతీయ స్థాయిలో పని చేసిన అనుభవం ఉంది ఈయనకు.

    గతంలో ఐప్యాక్‌(Indian Political Action Committee)లో పని చేసిన ఆయన.. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీం ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్‌గా మారారు. ఆ తర్వాత విజయ్‌ టీవీకేకు వ్యూహాలు అందించారు. డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించారు. టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించడం.. గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయడం.. ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ వ్యూహాలను మెరుగుపరచడం చేశాడాయన. సాహు రూపొందించిన వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యం సాధించడానికి తోడ్పడింది.

     

  • చెన్నై: తమిళనాడు శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో హీరో విజ‌య్ పార్టీ త‌మిళగ‌ వెట్రి క‌ళ‌గం(టీవీకే) సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా దూసుకెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ప్రస్తుతం 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేప‌థ్యంలో టీవీకే పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, విజ‌య్ అభిమానుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు సంబ‌రాల్లో మునిగిపోయారు. త‌న కుమారుడు విజ‌యంపై విజ‌య్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. చాలా గ‌ర్వంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

    ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. గ‌త రెండేళ్లుగా త‌న కుమారుడిలో ఆత్మ‌విశాసం రెట్టింపు అయింద‌ని వెల్ల‌డించారు. తాను క‌చ్చితంగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అవుతాన‌ని విజ‌య్ బ‌లంగా న‌మ్మాడ‌ని చెప్పారు. అత‌డు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

    "ఒక తండ్రిగా నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నాను. నా కుమారుడికి శుభాకాంక్షలు. గత రెండేళ్లుగా అతడి ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా వస్తానన్న విజ‌య్‌ నమ్మకాన్ని నేను అభినందిస్తున్నాను. ఒక నాయకుడిగా, ఎలాంటి పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడతానన్నది అతడి ధైర్యం. విజయ్‌కి ఇది ఒక చారిత్రాత్మక విజయం అని నేను భావిస్తున్నాను" అని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు.

    చ‌ద‌వండి: 'త‌మిళ సీఎం ప్ర‌మాణ‌స్వీకారానికి ప్ర‌ధాని మోదీ'

    త‌మ‌ కుమారుడి విజ‌యం ప‌ట్ల త‌న భార్య శోభ కూడా సంతోషంగా ఉంద‌ని చంద్రశేఖర్ చెప్పారు. "ఆమె కేవలం అతడి తల్లి మాత్రమే కాదు. ఆమె విజయ్‌కి మొదటి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

  • న్యూఢిల్లీ: భారత రాజకీయ ముఖచిత్రంపై ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలన ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఓటమి పాలుకావడంతో, 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కామ్రేడ్ల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక పరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.

    కూలిపోయిన చివరి కంచుకోట
    ఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం  కేరళ చివరి కంచుకోటగా మిగిలింది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు.. అక్కడ వరసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్, తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్ట్ పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది.

    జాతీయ రాజకీయాల్లో చేజారిన పట్టు
    కేరళలో ఎదురైన ఈ ఘోర పరాజయం వామపక్షాల జాతీయ రాజకీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇన్నాళ్లూ కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల అండతో సీపీఎం, సీపీఐ, తదితర వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తమ బలానికి మించి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఒకప్పుడు దేశ గతిని శాసించిన ఈ పార్టీలు.. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మూడు కీలక రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండటం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది.

    యూపీఏ కాలం నుంచి మొదలైన క్షీణత
    కమ్యూనిస్టుల పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో 59 స్థానాలు గెలుచుకుని యూపీఏ-1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు, ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇండో-యూఎస్ అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత, 2009లో వారి బలం 24 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2014లో 10, 2019లో ఐదు స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం సీపీఎం, సీపీఐలకు లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, అందులో నలుగురు తమిళనాడులో డీఎంకే, ఒకరు రాజస్థాన్‌లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారే కావడం గమనార్హం.

    ఇది కూడా చదవండి: స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ! 

Politics

  • పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ప్రచారంలో పదేపదే, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తామని చమత్కారంగా చెప్పారు. 

    కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మరింత ముందుకు వెళ్లి, తదుపరి ముఖ్యమంత్రి “నాన్-వెజిటేరియన్” అవుతారని చెప్పారు. దీన్ని, బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం నిషేధిస్తుందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ గెలవడంతో మమత స్థానంలో ఎవరు వస్తారన్నది ప్రధాన చర్చగా మారింది.

    అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీకి చాన్స్‌? 
    ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్‌లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధాన మంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని, మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు.

    గత నెలలో మోదీ బెంగాల్ సంస్కృతితో మమేకమయ్యారు.. జాల్‌మురి తిన్నారు, కాళీ ఆలయం సందర్శించారు (ఇక్కడ మాంసాహారం ప్రసాదంగా ఇస్తారు). ఫుట్‌బాల్ ఆడారు, బెంగాలీలో ఆడియో సందేశం విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు “బ్రాండ్ మోదీ”పై నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది.

    కానీ, ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ (రేఖా గుప్తా). మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తరువాత, మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

    ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీ ఉన్నారు. రూపా గాంగూలీ బి.ఆర్. చోప్రా “మహాభారత్” సీరీస్‌లో ద్రౌపది పాత్రతో ప్రసిద్ధి చెందారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు, మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, నిసిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది.

  • కోల్‌క‌తా: భ‌వానీ పూర్‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఓట‌మి పాల‌య్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజ‌యం సాధించారు. మ‌మ‌తాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.

    ఈ సంద‌ర్భంగా త‌న ఓట‌మిపై మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. స‌ర్‌పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల‌ను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్ల‌లో టీఎంసీ ఏంజెట్ల‌ను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవ‌రినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. పార్టీ ఏజెంట్ల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వ‌చ్చిన త‌ర్వాత డీవో ఇక్క‌డ లేరు అని వాపోయారు.

    ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన రెండ‌వ సీఎంగా మ‌మ‌తా బెన‌ర్జీ అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఇటు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 

    2021 ఎన్నిక‌ల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మ‌మతా బెన‌ర్జీని ఓడించారు. తాజా ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌మ‌తను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓట‌మితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. 

  • తమిళనాడులో టీవీకే విజయ్‌ పార్టీ పెట్టిన రెండేళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార‍్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ‍ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

    విజయ్ 1974 జూన్ 22న మద్రాస్‌లో జన్మించారు. చెన్నైలోని లోయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత సినిమాల్లో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతలో బాగా పాపులారిటీ ఉంది.

    అభిమానులు ఆయనను దళపతి (నాయకుడు) అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్‌ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్‌ వెట్రి (1984) సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో “నాళైయ థీర్పు” (1992) ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలమైనా, విజయ్‌ ప్రతిభను అందరూ గుర్తించారు. 

    ఆ తర్వాత రసిగన్ (1994), దేవా (1995) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డ్యాన్సులు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు. 

    ఎంజీఆర్‌ను గుర్తు చేసిన విజయ్‌  
    గతంలో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు సర్కార్ (2018) వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024, ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ పార్టీ స్థాపించారు. 

    విజయ్‌ రాజకీయ సభలో చోటుచేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తొక్కిసలాటతో విజయ్‌ ఇక రాజకీయాల్లో రాణించలేరని చాలా మంది అన్నారు. అయినప్పటికీ పడి లేచిన కెరటంలా ముందుకు సాగారు విజయ్‌. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.603 – రూ.625 కోట్లు.

    విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం (వీఎంఐ) అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తరువాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మూడో శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివర్లో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందన్న సంకేతం కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి, డీఎంకే, అన్నాడీఎంకేను టీవీకే ఓడించింది. ఇ‍న్నాళ్లు డీఎంకే, అన్నాడీఎంకేకే అధికారాన్ని కట్టబెడుతూ వచ‍్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాందిపలికారు. టీవీకే విజయ్‌ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించుకున్నారు. 

  • ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నాయో తెలిసిపోయింది. తమిళనాడులో ఈ ఎన్నికలు పాత పార్టీలపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం పుంజుకోవడాన్ని చూపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ప్రభావం, బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల, కేరళలో పాలనా మార్పు కనపడింది. అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలిచింది.

    ఈ ఎన్నికల బరిలో గెలిచిన/ఓడిన దిగ్గజ నేతలు వీరే..

    విజయ్ (తమిళనాడు, టీవీకే అధినేత)
    తమిళనాడులో రాజకీయాల్లో మొదటి అడుగులోనే భారీ విజయం సాధించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. పెరంబూర్‌, తిరుచ్చిలో గెలిచారు. ఆయన పార్టీ టీవీకే సంచలనం సృష్టించింది.

    హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం, బీజేపీ నేత)
    అస్సాంలో తన నాయకత్వాన్ని మరోసారి బలంగా నిలబెట్టుకున్నాడు. జలుక్‌బరిలో గెలుపొందారు.

    సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్‌, బీజేపీ నేత)
    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలం పెరగడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నందిగ్రామ్‌లో గెలుపొందారు.

    పినరయి విజయన్ (కేరళ సీఎం, సీపీఎం)
    ధర్మడం నియోజక వర్గం నుంచి పినరయి విజయన్ విజయం సాధించారు. అయితే, కేరళలో ఆయన అధికారాన్ని కోల్పోయారు.

    ఉదయనిధి స్టాలిన్‌ (తమిళనాడు, డీఎంకే నేత)
    తమిళనాడులోని చెపాక్‌ నుంచి పోటీ చేసిన ఉదయనిధి స్టాలిన్‌ గెలుపొందారు. 

    వీడీ సతీశన్ (కాంగ్రెస్‌-కేరళ)
    వీడీ సతీశన్ పరవూర్‌ నియోజక వర్గం నుంచి గెలిచారు. కేరళలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు తీసుకురావడంతో కృషి చేశారు.  

    పళనిస్వామి (తమిళనాడు మాజీ సీఎం) 
    పళనిస్వామి విజయం సాధించారు. ఎడప్పడి నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు.

    మమత, స్టాలిన్‌, గోగోయ్ ఓటమి 

    మమతా బెనర్జీ  (పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి)
    పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు. ఎమ్మెల్యేగానూ గెలవలేదు. భవానీపూర్‌లో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలిచారు.

    ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం)
    తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ ఎదురుదెబ్బ తిన్నారు. కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కూడా వెనుకబడింది.

    గౌరవ్ గోగోయ్ (అస్సాం, కాంగ్రెస్‌)
    జోర్హాత్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన గౌరవ్ గోగోయ్ ఓటమి పాలయ్యారు.  

  • కేరళంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్‌ వచ్చింది. ఓవరాల్‌గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్‌ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. 

    మరి సీఎం ఎవరు?
    కాంగ్రెస్‌ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్‌ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్‌ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్‌, రమేష్‌ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌తో పాటు శశిథరూర్‌ కూడా ఉన్నారు. 

    మాకు చాలా మందే ఉన్నారు..
    ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్‌ సైతం  ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్‌ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. 

    ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  తుది నిర్ణయం హైకమాండ్‌దే అని శశిథరూర్‌ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్‌ దగ్గర శశిథరూర్‌ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.

    సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్‌.. కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్‌ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. 

    సతీశన్‌ది కీలక పాత్ర
    కేరళంలో కాంగ్రెస్‌  విజయం సాధించడంలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర. ప్రస్తుతం  ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న  సతీశన్‌కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్‌ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. 

    రమేశ్ చెన్నితలది అనుభవం..
    కేరళం కాంగ్రెస్‌లో సీనియర్‌గా పేరున్న రమేశ్‌ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్‌లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 

    1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్‌ అండ్‌ విజిలెన్స్‌ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. 

    కాంగ్రెస్‌ అధినాయకత్వంతో సన్నిహితంగా..
    కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌. ప్రస్తుతం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    కాంగ్రెస్‌ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్‌ అంటే  హైకమాండ్‌కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్‌ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.

    ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?
    ప్రస్తుతానికి ఈ నలుగురు  మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం.  ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్‌లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట.

  • న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల ఫలితాలతో పాటు మిగతా రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ఆయన ట్వీట్లు చేశారు.

    “పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజాశక్తి విజయం సాధించింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను. 

    సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తాము. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అనేక తరాలుగా కష్టపడి పనిచేసిన అనేక మంది కార్యకర్తల ప్రయత్నాలు, పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. ఏళ్ల తరబడి వారు కష్టపడి పని చేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మా అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు మా పార్టీకి అసలైన బలం’’ అని తెలిపారు.

    టీవీకేకు అభినందనలు 
    ‘‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవన పరిస్థితుల మెరుగుదలలో మేము ఎప్పుడూ ముందుండి పని చేస్తాము. టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు. కేంద్రం తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుతుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.

    అస్సాంలో వారి కృషి వల్లే.. 
    “అస్సాం మరోసారి బీజేపీ-ఎన్డీఏను ఆశీర్వదించింది. అస్సాం విధాన్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ విజయం సాధించడం, మా కూటమి అభివృద్ధిపై పెట్టిన దృష్టి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చినందుకు అస్సాంలోని నా సోదరులు, సోదరీమణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    రాష్ట్రంలో మార్పు కోసం మేము నిరంతరం పనిచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. అస్సాం ప్రజల మధ్య నిరంతరం కృషి చేసిన బీజేపీ-ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత దశాబ్దంలో మా పార్టీ కూటమి ఎంతగా ఎదిగిందో చూడటం ప్రశంసనీయమైన విషయం. వారి కృషి వల్లే మా సానుకూల అజెండా ప్రజల మనసులను తాకింది’’ అని అన్నారు. 

    కేరళ గురించి..
    ‘‘కేరళలో ఎన్డీయేకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేరళ పురోగతికి, వికసిత కేరళ లక్ష్యం సాధన కోసం కష్టపడతాము. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించినందుకు అభినందనలు’’ అని మోదీ చెప్పారు. 

    ప్రభుత్వ పనితీరు ఆధారంగా తీర్పు 
    ‘‘పుదుచ్చేరికి ధన్యవాదాలు. మంచి పాలనలో మా గత అనుభవం, ఎన్.రంగస్వామి నాయకత్వంలోని ప్రభుత్వ పని ఆధారంగా పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ ఆశీర్వాదం మా సుపరిపాలనను బలపరచే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది’’ అని చెప్పారు. 

  • సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకే ఘనవిజయం సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలిచి, మరో 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం సమయంలో టీవీకే ఆధిక్యం తగ్గినా, కొద్ది సేపట్లోనే తిరిగి బలంగా ముందంజ వేసి డీఎంకే, ఏడీఎంకేలను దాటేసింది.

    టీవీకే అధినేత విజయ్‌ పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించారు. విజయ్‌ పార్టీ ఈసారి ఎలాంటి కూటములు లేకుండా, ఒంటరిగా అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలు టీవీకే, డీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీగా మారాయి.

    విజయ్‌ రాజకీయ ప్రవేశం  
    విజయ్‌ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెటట్రి కజగంను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా నమోదు చేసింది. ప్రారంభం నుంచే విజయ్‌ తన పార్టీని ఆధునిక ద్రావిడ సిద్ధాంతాలపై నిలబెట్టారు. దుష్ట శక్తి, అవినీతి శక్తికి ఎదురు నిలిచే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.

    విజయ్‌ తన విజయాన్ని ఎంజీఆర్‌ తరహాలో రాయాలని, ఈ ఏడాదే అధికారంలోకి రావాలని సంకల్పించారు. ఆయన డీఎంకేను దుష్ట శక్తిగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా అభివర్ణించారు.

    పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లోనే విజయ్‌ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. సాయంత్రం 6.00 గంటల వరకు టీవీకే 111  నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 71 స్థానాల్లో, ఏడీఎంకే 52 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్‌ టీవీకే పార్టీ  ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది.  ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107  స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. 

    అదే సమయంలో విజయ్‌ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్‌ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్‌ వంద సీట్ల మార్క్‌కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని  సింగిల్‌గా ఏ‍ర్పాటు  చేయడం మాత్రం కష్టమవడం ఖాయం.   కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే  దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. 

    ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై  ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్‌ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో  విజయ్‌ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్‌ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ  పార్టీ 77 లక్షలు సాధించింది. 

    పుంజుకున్న డీఎంకే..!
    కౌంటింగ్‌ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత  50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్‌ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది.  ప్రస్తుతం ఇంకా కొంటింగ్‌ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్‌ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

     సుమారుగా డీఎంకే ఓట్ల షేర్‌ అంతా కూడా టీవీకే షిప్ట్‌ అవడమే విజయ్‌ అనూహ్య ఫలితాలకు కారణమైంది.   విజయ్‌ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి.  విజయ్‌ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్‌ను కూడా క్రియేట్‌ చేస్తోంది. సీఎం స్టాలిన్‌ కొళత్తూర్‌ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే  ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. 

  • చెన్నై: తమిళనాడులో టీవీకే గెలుపుపై విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు మేలు చేయాలనేదే విజయ్‌ లక్ష్యమని చెప్పారు. గెలుపుపై విజయ్‌ మొదటి నుంచి ధీమాగా ఉన్నారని తెలిపారు. ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నారని చెప్పారు. తాను విజయ్ తండ్రిగా గర్విస్తున్నానని తెలిపారు. ఏ కూటమిలోనూ చేరకుండానే టీవీకే విజయం సాధించడం ఆయన ధైర్యాన్ని చూపుతోందని అన్నారు. కాంగ్రెస్‌తో టీవీకే చేతులు కలపాలని బహిరంగ పిలుపునిచ్చారు.

    “కాంగ్రెస్‌కు చరిత్ర, సంప్రదాయం ఉన్నాయి. అలాంటి కాంగ్రెస్ ప్రభ ఎందుకు తగ్గిపోతుంది? అధికారం లేకపోవడం వల్లే తగ్గిపోతుంది. ఆ అధికారాన్ని మేమే ఇస్తాం. విజయ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అధికారం వస్తే కాంగ్రెస్ తన చరిత్రను నిలబెట్టుకుంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 

    గత 30 సంవత్సరాలుగా సమాజం కోసం, తమిళ ప్రజల కోసం ఏదో చేయాలనే ఆలోచన విజయ్‌లో ఉంది. అది ఆయన మనసులో ఉండేది. తమిళ ప్రజలు విజయ్‌ను నాయకుడిగానే కాదు, ప్రతి మహిళ ఆయనను తన కుమారుడిగా భావిస్తుంది. యువత ఆయనను తమ అన్నగా చూస్తుంది. అందరూ ఆయనను అన్న అని పిలుస్తారు. వృద్ధ మహిళలు ఆయనను తమ కుమారుడిగా చూస్తారు. కొంతమంది 60 సంవత్సరాల మహిళలు ఆయనను తమ మనవడిగా భావిస్తారు. ప్రజలతో విజయ్‌ అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్నాురు” అని తెలిపారు. 

    విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

    రాష్ట్రంలో టీవీకే ముందంజలో ఉండడడంతో “నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని టీవీకే అధినేత విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అన్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “ఆమె ఆయనను తల్లిగానే కాదు. ఆమె విజయ్ తొలి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు విజయం సాధించారు. 

    తమిళనాడులోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో కొళత్తూరు ఒకటి. ఇది సీఎం ఎంకే స్టాలిన్‌ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈసారి మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. 

    కొళత్తూరులో సీఎం స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ఈ ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లో విజయ్‌ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. మధ్యాహ్నం 4.15 గంటల వరకు టీవీకే 105 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 76 స్థానాల్లో, ఏడీఎంకే 53 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.

    టీవీకే విజయానికి యువ ఓటర్ల మద్దతు, అధికార వ్యతిరేక భావజాలం, బలమైన గ్రామీణ స్థాయి ప్రచారం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ దిశలో కీలక మార్పును సూచిస్తోంది.

  • చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్‌ విజయ్‌ అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విజయ్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు ఇచ్చారు. ట్రెండ్‌ ప్రకారం మ్యాజిక్‌ ఫిగర్‌ 118కి చేరువలో టీవీకే ఆగిపోనుంది.

    సోమవారం రాత్రి 8 గంటల నాటికి 70 స్థానాల్లో గెలిచి మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్‌ మార్క్‌ రాకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై విజయ్‌ చర్చలు జరుపుతున్నారు. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. త​మిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్‌ టీవీకే అవతరిస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. 

    కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అలాగే టీవీకే పార్టీతో అధికారాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ సూచించారు. ఎన్నికల ముందు దశలో టీవీకే.. ఎఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే రెండింటితోనూ కూటములను పూర్తిగా తిరస్కరించింది.

    అయితే, మెజారిటీ మార్కు దాటేందుకు టీవీకేకు చిన్న ద్రావిడ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. తమిళనాడుకు ఎంజీఆర్ వంటి సినీ తారలను నాయకులుగా ఎన్నుకున్న దీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్‌ కూడా చేరారు. 

  • తాడేపల్లి: తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్‌ విజయ్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.  సోదరుడు విజయ్‌కు అభినందనలు అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు మరింత మంచి జరగాలని  వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

    బెంగాల్‌లో బీజీపీకి వైఎస్‌ జగన్‌ అభినందనలు
    పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఓటమి పట్ల వైఎస్‌ జగన్‌ సానుభూతి తెలియజేశారు.  దీదీ(మమతా బెనర్జీ) ప్రభుత్వం ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. పశ్చిమ బెంగాల్‌ అతిపెద్దగా పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీకి అభినందనలు తెలిపారు. అలాగే అక్కడ గెలిచిన ఇతర అభ్యర్థులకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. 

    విజయ్ కి జగన్ అభినందనలు

     

Movies

  • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

    కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి  తెలిసిందే. 
     

     

  • టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకలో కేఎస్ రామారావు, శివాజీ రాజా, సాయికుమార్, అశోక్ కుమార్, రాజీవ్ కనకాల, శివబాలాజీ-మధుమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, యాంకర్ శిల్పా చక్రవర్తి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సందడి చేశారు.

    కాగా.. వీఆర్‌కే రావు భారత వైమానిక దళంలో కమాండర్‌గా పనిచేశారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా.. కళాకారుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి  ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగా బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేశారు. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన 'మొగుడ్స్ పెళ్లామ్స్' చిత్రంతో నిర్మాతగా మరో నంది అవార్డ్ అందుకున్నారు. అజైల్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆయన అందించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

     

  • కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్‌ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్‌ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్‌చల్ చేస్తోంది.

    ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్స్‌ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు.

     

  • విజయ్ గెలుపుతో కోలీవుడ్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్‌ సైతం విజిల్స్‌తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్‌ను అభినందించారు. 

    టాలీవుడ్ హీరోల ప్రశంసలు..

    దళపతి విజయ్‌కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.  మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.

    తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి  ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్‌బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్‌ విజయంపై ట్వీట్ చేశారు.

    కాజల్ అగర్వాల్ ట్వీట్..

    తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన  విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా  చెప్పారని ప్రశంసించింది.  ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ,  మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. 

    TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు
     

     

     

     

     

  • విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.

    అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్‌ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్‌గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్‌లాగే సింగిల్‌గా బరిలోకి దిగాలన్న డిమాండ్‌ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్‌ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్‌గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. 
     

  • దేవర  మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది.  

    అయితే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌పై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకోనుందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ పహారియాను పెళ్లాడనుందని  ఊహాగానాలొస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జాన్వీ కపూర్ పెళ్లి పీటలెక్కనుందని లేటేస్ట్ టాక్. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించారు.

    తన కూతురు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలను బోనీ కపూర్ ఖండించారు. జాన్వీ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. దీంతో పెద్ది బ్యూటీపై వస్తున్న పెళ్లి వార్తలకు చెక్ పడింది. అయితే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన జాన్వీ కపూర్‌.. శిఖర్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడింది. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు అర్థమైపోయింది. గతంలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అతను నాతో ఉంటే సేఫ్‌గా ఉంటాననే ఫీలింగ్ వస్తుందని జాన్వీ తెలిపింది. అతనికో నేను ఒక చిన్నపిల్లలా ఉండగలనని చెప్పింది. శిఖర్‌తో తప్ప మరెవరితోనూ నేను ఇంత సరదాగా గడపలేనని పేర్కొంది.

  • తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్‌ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్‌ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్‌లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

    మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్‌పై రూమర్స్‌ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. 

     

     

  • తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌ విజయంపై అభినందనలు చెబుతున్నారు.

    అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.   విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్‌లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

    అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో  రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

     

  • ఎవరూ ఊహించలేదు. తమిళ హీరో విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ రేంజ్ ఆధిక్యం సాధిస్తాడని. ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్‌కి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత విషయాలు పక్కనబెడితే ఇతడు నటించిన చివరి సినిమా 'జన నాయగన్‌'ని కూడా విడుదల కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ అద్భుతం చేయడంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

    ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ‍ట్రెండింగ్‌లో త్రిష

    లెక్క ప్రకారం 'జన నాయగన్‌' సినిమా ఈ ఏడాది జనవరి 9న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది వారం వారం ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది కొన్నాళ్ల క్రితం ఏకంగా పూర్తి మూవీ పైరసీకి గురవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. దీంతో మూవీ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుండు అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడింది.

    ఇప్పుడు తమిళనాడులో విజయ్.. అధికారం చేజిక్కుంచుకుని ముఖ్యమంత్రి అయితే మాత్రం 'జన నాయగన్‌'కి మార్కెట్‌లో కచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది. అటు ఆడియెన్స్ కూడా విజయ్‌ని చివరిసారి వెండితెరపై చూడాలనే ఆసక్తి కనబర‌చొచ్చు. తద్వారా టాక్‌తో సంబంధం లేకుండా వంద రెండొందల కోట్ల కలెక్షన్స్ రావొచ్చేమో అనిపిస్తుంది. మరి సమస్యలని దాటి 'జన నాయగన్‌'.. ఈ నెలలోనే రిలీజ్ అవుతందా? లేదంటే జూన్‌లో వస్తుందా అనేది చూడాలి?

    తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేకే 'జన నాయగన్‌'. విజయ్ లీడ్ రోల్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతదర్శకుడు. ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి కూడా.

    ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?

Business

  • డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్‌ ఫండ్‌ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్‌ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీలు ఈ జాబితాలో ఉంటాయి.

    ప్రస్తుతం టైప్‌ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్‌ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్‌బీఐ యాక్ట్‌ 1934లోని సెక్షన్‌ 45ఐఏ ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్‌ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..

    కియోసాకి హెచ్చరిక!
    ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.

    కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.

    జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..
    జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు.

     
     

    ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.

    జీతంపై ఆధారపడటం వల్ల
    మరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.

    పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాం
    ప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్‌కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు

  • ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.

    దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.

    చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.

    ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

  • అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్‌ నెస్ట్‌ యాన్యూటీ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. సింగిల్‌ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్‌ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్‌లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్‌ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.

    మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్‌ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్‌ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్‌ రథ్‌ తెలిపారు.

    బజాజ్‌ లైఫ్‌ ‘యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ 
    బజాజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్‌ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్‌ లైఫ్‌ యంగ్‌ అచీవర్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్‌ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యథావిధిగా కొనసాగుతుంది.

    ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.

    ఇదీ చదవండి: ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?

  • నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) ఆల్ న్యూ నిస్సాన్ గ్రావైట్ కోసం.. ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 82,999. ఇది దేశంలోని 16 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది.

    ఈ సీఎన్‌జీ కిట్‌ను మోటోజెన్ తయారు చేసి.. నాణ్యతను కూడా నిర్ధారించింది. వినియోగదారులు ఈ కిట్‌ను నిస్సాన్ అధికారిక డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కిట్‌పై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది.

    సీఎన్‌జీ రిట్రోఫిట్ కిట్‌లో రెండు 25 లీటర్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి దీనిని కారులో ఫిక్స్ చేసినప్పుడు కూడా అదే స్పేస్ ఉంటుంది. మూడో వరుస సీటింగ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ ఖర్చుతో.. కొంత ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు ఈ కిట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

    ఇదీ చదవండి: విజయ్ కార్ కలెక్షన్: లెక్సస్ నుంచి స్విఫ్ట్ వరకు..

  • సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.

    కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్‌బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్‌వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • నటుడుగా, రాజకీయ నాయకుడుగా మాత్రమే తెలిసిన విజయ్.. ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగా ఆయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి చిన్న కారు కూడా ఉంది. ఈ కథనంలో విజయ్ కాల్ కలెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

    లెక్సస్ ఎల్ఏం 350హెచ్
    విజయ్ ఉపయోగించే కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఏం 350హెచ్ ఒకటి. దీని ధర సుమారు రూ.2.20 కోట్లు. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. 48 అంగుళాల డిస్‌ప్లే, అల్ట్రా-ప్రీమియం సీటింగ్ వంటి ఫీచర్ల కారణంగా ఇదొక ప్రైవేట్ లాంజ్‌ మాదిరిగా అనిపిస్తుంది.

    బీఎండబ్ల్యూ 5 సిరీస్
    బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. రూ.74.80 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 2.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్‌తో సహా ప్రీమియం ఇంటీరియర్‌ ఇందులో చూడవచ్చు. ఇది రోజువారీ వినియోగం కోసం ఉపయోగపడే లగ్జరీ సెడాన్.

    బీఎండబ్ల్యూ ఐ7
    విజయ్ గ్యారేజిలోని ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7. దీని ధర రూ.2.5 కోట్లు. ఇది 449 హార్స్ పవర్ అందిస్తుంది. థియేటర్ స్క్రీన్, యాంబియంట్ లైటింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

    టయోటా వెల్‌ఫైర్‌
    రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ టయోటా వెల్‌ఫైర్‌ కారును ఎంచుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 1.19 కోట్ల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారును ఎక్కువ మంది సెలబ్రిటీలు, రాజకీయంగా నాయకులు ఉపయోగిస్తున్నారు. సౌకర్యవంతమైన సీట్లు, 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం వల్ల ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

    మారుతి సుజుకి స్విఫ్ట్
    టీవీకే అధినేత విజయ్ వద్ద మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఎన్నికల సమయంలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు సరసమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది.. భారతదేశంలో అత్యంత ఇష్టపడే హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే ఈ కారు రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది.

    రోల్స్ రాయ్స్ ఘోస్ట్
    విజయ్ గతంలో రోల్స్-రాయ్స్ ఘోస్ట్ సిరీస్ I కారును కలిగి ఉండేవారు, దానిని విక్రయించినట్లు సమాచారం. ఈ లగ్జరీ సెడాన్‌లో 6.6 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ ఉండేది. ఇది 563 Bhp పవర్, 780 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రియర్-వీల్ డ్రైవ్‌తో ఉంటుంది. దీని ధర రూ. 2 కోట్ల ధరకు అందుబాటులో ఉండేది.

  • సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంటేనే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, వేల గంటల శ్రమ, సంక్లిష్టమైన కోడింగ్‌తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సరైన ప్రశ్న అడగడం తెలిస్తే చాలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్‌వేర్ తయారీ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

    రాత్రికి రాత్రే ఫంక్షనల్ యాప్

    ప్రముఖ వ్యవస్థాపకుడు సందీప్ మాల్ ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోని వివరాల ప్రకారం.. తన కుమారుడు అసలు ప్రోగ్రామింగ్ నేపథ్యమే లేని మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ ‘క్లాడ్’ అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి కేవలం ఒక్క రాత్రిలో పూర్తి స్థాయి వెండర్ మేనేజ్‌మెంట్ యాప్‌ను రూపొందించాడని ఆయన వెల్లడించారు. ఈ యాప్‌లో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్, వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయని, ఒక ప్రొఫెషనల్ యాప్‌కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.

    సాంప్రదాయకంగా సాఫ్ట్‌వేర్ తయారీలో ప్రోగ్రామింగ్ భాషల వాక్యనిర్మాణం (సింట్యాక్స్‌) తెలుసుకోవడం అత్యంత కీలకం. అయితే, ఈ ఘటన తర్వాత జరుగుతున్న చర్చలో నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం కంటే, సమస్యను ఎలా ఫ్రేమ్ చేయాలి? ఏ ప్రశ్న అడిగితే సరైన పరిష్కారం వస్తుంది? అనే జడ్జిమెంట్ (నిర్ణయాత్మక సామర్థ్యం)కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే టీమ్, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ ప్రవేశ అడ్డంకులు కనుమరుగవుతున్నాయి.

    సవాళ్లు లేకపోలేదు

    ఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ వాస్తవిక దృక్పథాన్ని కోల్పోవద్దని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రోటోటైప్‌ను తయారు చేయడం వేరు. దాన్ని యాప్ స్టోర్‌లోకి తీసుకురావడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, దీర్ఘకాలంలో నిర్వహించడం వంటివి చాలా క్లిష్టమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏఐ సృష్టించిన కోడ్‌లో వచ్చే బగ్‌లను గుర్తించి డీబగ్ చేయడం ఇప్పటికీ ఒక సవాలుతో కూడిన నైపుణ్యమేనని అభిప్రాయపడుతున్నారు.

    భవిష్యత్తు దిశగా..

    సాంకేతిక నైపుణ్యం కంటే ఆలోచన, దాన్ని అమలు చేసే స్పష్టతకు విలువ పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్ తయారీ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీర్లకే పరిమితం కాదు, సృజనాత్మకత ఉన్న ఎవరైనా సరే ఏఐతో తమ సొంత పరిష్కారాలను నిర్మించుకునే యుగం మొదలైంది.

    ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

  • ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్‌పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్‌ టాలెంట్‌ రిపోర్ట్‌ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్‌ఆర్‌ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

    డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.

    విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్‌ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్‌) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్‌–హ్యాండ్‌ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.

    నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్‌’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్‌), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్‌’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్‌ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

    ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్‌ అగర్వాల్‌ విశ్లేషించారు.

  • ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్‌  చేశారు.

    వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..
    గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.

    వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..
    చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.
    ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.
    వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.

    కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'
    కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.
    రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.
    రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది.

     

    తొలగని పావెల్ నీడ!
    ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.

    అసలు బాస్ ఎవరు?
    కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz).

    "ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.

    ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం.

  • నేడు ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తోంది. రోజుకో కొత్త సాంకేతికత, శక్తివంతమైన ఏజెంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఎంత మేధస్సును కలిగి ఉన్నా సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి.

    మెటా సంస్థ 2026 మొదటి త్రైమాసిక పలితాల విశ్లేషణ సమావేశంలో మాట్లాడుతూ, జుకర్ బర్గ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఏఐ ఏజెంట్లు అత్యంత శక్తివంతమైనవి కావొచ్చు, కానీ అవి సామాన్యులకు అర్థం కానంత క్లిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన ‘మదర్ టెస్ట్’గా అభివర్ణించారు.

    ‘నా తల్లి సైతం అర్థం చేసుకునేంత సరళంగా ఈ ఏజెంట్లు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిలో మెజారిటీ సాధనాలు ఆ మదర్‌ టెస్ట్‌లో విఫలమవుతున్నాయి’ అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నిపుణులు, కోడింగ్ తెలిసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించగలుగుతున్నారు తప్ప, సాధారణ వినియోగదారులకు ఇవి భారంగా మారాయని ఆయన విశ్లేషించారు.

    మెటా వ్యూహం

    ప్రస్తుతం ఓపెన్ సోర్స్, కోడింగ్ ఆధారిత ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు తీవ్రమైన పోటీలో ఉన్నాయి. అయితే, మెటా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. వేగం కంటే వినియోగ సౌలభ్యానికి తమ కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.

    ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, కమాండ్-లైన్ సెటప్‌లు వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికే ఏఐ ఏజెంట్లు చేరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది వినియోగదారులు ఎటువంటి అదనపు శిక్షణ లేకుండా అత్యంత సహజంగా ఉపయోగించగల సాధనాలను రూపొందించాలని మెటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్క్‌ చెప్పారు.

    పెట్టుబడుల వెనుక ఆంతర్యం

    పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మెటా తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతున్నా దీర్ఘకాలికంగా మార్కెట్‌ను శాసించేది వినియోగదారులకు అత్యంత చేరువలో ఉండే ఏఐ సాధనాలేనని మెటా భావిస్తోంది. ‘సాంకేతిక పురోగతి మాత్రమే ముఖ్యం కాదు. అది మనిషి జీవితంలో ఎంత సులభంగా భాగమైందనేదే అసలైన విజయానికి కొలమానం’ అని జుకర్ బర్గ్ గుర్తు చేశారు.

    ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

Family

  • 'ప్యాడ్‌మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అరుణాచలం స్వయంగా తెలిపారు. అసలు మొదట తాను దీన్ని నమ్మలేకపోయానని అన్నారు. నిజానికి నోబెల్ బహుమతికి, మనమే మన పేరును లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను గానీ పంపడం సాధ్యం కాదన్నారు. అది తప్పనిసరిగా థర్డ్‌ సోర్స్‌ ద్వారానే జరుగుతుందని చెప్పారు. 

    పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్‌ బృందాలు నోబెల్ కోసం నా పేరును ప్రతిపాదించారు... 24 గంటల్లోపే అది ఆమోదించబడినట్లు తెలిపారు. అంతేగాదు ప్రతిష్టాత్మకమైన ఈ నోబెల్‌ శాంతి బహుమతికి నామినీగా తాను ఎంపిక అయ్యినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని అరుణాచలం మురుగనంతం పేర్కొన్నారు.

    అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. దేశంలోని గ్రామీణ మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్‌లను పరిచయం చేశారు. రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్​‌కిన్లపై మహిళలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడమే గాక దానిపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అందుకే అరుణాచలం 'ప్యాడ్‌మ్యాన్‌'గా పాపులర్ అయ్యారు. 

    కాగా, అరుణాచలం మురుగనంతం చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ను 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు ఆయన జీవితం ఆధారంగా  'ప్యాడ్‌మ్యాన్' పేరిట బాలీవుడ్‌ మూవీ కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్​, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్​ బల్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో రిలీజ్‌ అయ్యి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.

    కాగా, 2026 నోబెల్ శాంతి బహుమతికి 287 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కాగా 2026 నోబెల్‌ శాంతి బహుమతిని ఈ ఏడాది అక్టోబరు 9న ప్రకటించనున్నారు. డిసెంబరు 10న ఓస్లాలో ఈ పీజ్ ప్రైజ్‌ను ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ పీజ్ ప్రైజ్ నామినేషన్ల సమర్పణ గడువు ఈ ఏడాది జనవరి 31నే ముగిసింది.

     

    (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)

     

  • MEIL గ్రూప్ డైరెక్టర్, భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది గాలా సుమారు 400 ప్రత్యేకమైన వస్తువుల ద్వారా ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్‌ను ఎంచుకుంది. 

    ఈ మెట్‌గాల కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తికరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తున్నారు. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్‌ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. 

    పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యంత బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్‌లో జరగనున్న గాలా ఈవెంట్‌లో భారత్‌కి ప్రాతినిథ్యం వహిస్తూ.. కనిపించనున్నారు. 

    ఇక సుధా అందం,  దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.

    ఆమె ఎవరంటే..

    సుధా రెడ్డికి కృష్ణ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు  రెడ్ కార్పెట్‌పై తన ఉనికిని చాటిచెప్పేలా  ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.

    ఆమె  పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.

    2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్‌లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్‌మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. 

    కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు.

     

    (చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..)
     

  • త్రిష  తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

    అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్‌కు చెందిన వైట్‌సూట్‌తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్‌తో కూడిన ఐవరీ కలర్‌ చేనేత వస్త్రం.  

    ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్‌ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్‌వేర్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.

    తిరుమల ఆలయం విశిష్టత..
    ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.  పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. 

    కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.

     

    (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్‌ పర్యటన..!)

     

  • భారతదేశ పర్యటన గురించి ఓ విదేశీ యాత్రికుడు సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎన్నో దేశాలను పర్యటించానని, కానీ భారత్‌ పర్యటన తన ప్రయాణ అనుభవాన్నే మార్చేసిందంటూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. అంతేగాదు ఒక ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్‌  చేసుకున్నారు. 

    ఆ వీడియోలో the_globedigger గా ప్రసిద్ధి చెందిన జెఫ్ జోసీకి భారతదేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ పర్యటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించారు. తాను మొత్తం 46 దేశాలను పర్యటించానని, ఒక యాత్రికుడికి విజయవంతమైన పర్యటన అంటే..ఎలాంటి ఆటంకాలు లేని ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అని అర్థం. 

    కానీ భారతదేశంలో చేసే ప్రయాణం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. అంతేగాదు ఇక్కడ ప్రయాణం చాలా అరుదుగా సులభంగా ఉంటుందన్నారు. ఇక్కడ పర్యటన సౌకర్యానికి చాలా దూరంగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లే..ఆ గమ్యస్థానాన్ని అత్యంత అపురూపమైనదిగా మార్చేస్తాయని నొక్కి చెప్పారు. అలాగే భారత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమమైన వీధి ఆహారాలు, ప్రపంచస్థాయి బీచ్‌లు ఉన్నాయిన పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆయన గోల్డెన్ టెంపుల్‌తో సహా "ప్రముఖ" దేవాలయాలను సందర్శించడం చూపించారు. 

    ఆయన జైపూర్‌లోని హవా మహల్, ఆగ్రాలోని తాజ్ మహల్, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ను కూడా సందర్శించారు. 46 దేశాలు పర్యటించిన తర్వాత భారత్‌ తనకు ప్రయాణం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేసింది అంటూ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చి మరి పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఇక్కడ పర్యటన అంత సులభమైన గమ్యస్థానం కాదు, సౌకర్యవంతంగా ఉండకపోయినా..మదిలో నిలిచపోతుంది అంటూ భారత్‌ పర్యటనపై పొగడ్తల వర్షం కురిపించారు. 

    అలాగే భారత్‌ మనల్ని నెమ్మదించేలా, పరిస్థితులకు అలవాటు పడేలా చేయడమే గాక ప్రపంచాన్ని విభిన్నంగా చూపించేలా చేస్తుందని, ఓ పర్యాటకుడు చవి చూడాల్సింది కూడా ఇదేనంటూ భారత్‌పై ప్రశంసంల వర్షం కురిపించారు. నెటిజన్ల కూడా ఆయనతో ఏకీభవిస్తూనే..ఈ నేలపై మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  

     

    (చదవండి: ఆ ట్రైన్స్‌ జర్నీ జస్ట్‌ ట్రావెల్‌ కాదు ..అదొక ఎక్స్‌పీరియెన్స్‌)

     

     

Andhra Pradesh

  • నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్‌ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. 

    కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్‌ను అందరూ విజయ్‌తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే  చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్‌ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.

    జగన్‌ మాదిరిగా విజయ్‌ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.

    ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు  ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో!  కేరళంలో ఈసారి కాంగ్రెస్  నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఛాన్స్‌  ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్‌ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.

    దేశ రాజకీయాలలో  బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన  వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో  ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్‌ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం  ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.

    పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్‌లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి.  ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ  చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.

    విజయ్‌కు ఉన్న ధైర్యం పవన్‌కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ  ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్‌ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు  ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. 

    మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్‌బుక్‌ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను  అమలు చేయలేని స్థితిలో  ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి  లోకేశ్‌ షాడో సీఎంగా వ్యవహరిస్తూ  రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.

    అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్‌ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.

    కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్‌కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం  చంద్రబాబు, లోకేశ్‌ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో  రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్‌ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.


    - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

International

  • కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. అయితే వుహాన్‌ ల్యాబ్‌లోనే వైరస్‌ పుట్టిందన్న దానికి తగిన ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మరో అంశంపైనా డ్రాగన్‌ కంట్రీ గోప్యత ప్రదర్శిస్తోందని.. ఆ గుట్టు ఇప్పుడు రట్టయ్యిందని డాటాను రిలీజ్‌ చేసింది.

    2022 మార్చి 21న చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం (MU5735) గ్వాంగ్సీ ప్రాంతంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు భారీ సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చైనా ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.

    ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) ఒక సంచలన నివేదిక ఇచ్చింది. ఆ ప్రమాదం సహజసిద్ధంగా జరగలేదని.. కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశారని తెలిపింది.

    ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (బ్లాక్‌బాక్స్‌) విశ్లేషణలో.. 29,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లకు ఇంధన స్విచ్‌లు ఒకేసారి “రన్” స్థితి నుండి “కట్‌ఆఫ్‌” స్థితికి మార్చబడ్డాయి. దీని తర్వాత ఇంజిన్‌ వేగం తగ్గి, విమానం వేగంగా కిందికి పడిపోయింది. ఒకవేళ అది పొరపాటుగా జరిగి ఉంటే.. పైలట్లు అప్రమత్తం అయ్యేవాళ్లు. వెంటనే తప్పును సరి చేసుకునేవారు. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు అని డేవిడ్‌ సౌసీ అనే నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

    కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (CVR) బ్యాటరీ బ్యాకప్‌తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (CAAC)కి పంపారు. అయితే, సీఏఏసీ ఇప్పటిదాకా ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో రిలీజ్‌ చేసిన నివేదికలో మాత్రం అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. గతంలో..

    2022లో వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ నివేదిక కూడా ‘‘విమానం కాక్‌పిట్‌లో ఎవరో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూలిపోయింది’’ అని సంచలనాత్మక కథనం ఇచ్చింది. ఇది పైలట్‌ ఆత్మహత్య చర్యనా? లేదంటే మరెవరైనా కాక్‌పిట్‌లోకి చొరబడి చేసిన చర్యా? అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అసలు బ్లాక్‌బాక్స్‌ డేటాను చైనా ఎందుకు బయటపెట్టడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.