Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు.  

    అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్‌పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్‌కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు.  

    చరణ్‌కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్‌ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు.  

  • విజయ్- రష్మిక పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‍లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో ప్రత్యేక పోస్ట్‌ చేశారు. పెళ్లినాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో పాటు రష్మిక  సైతం పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అప్పుడే నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

    రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' అప్పుడే ఒక నెల గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసుకోవడం అనేది ఎంతో దూరపు కలలా అనిపించేది.. కానీ ఇప్పుడు మా పెళ్లి జరిగి నెల రోజులు పూర్తయ్యాయి. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. అయితే పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్షణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో మహిళలే నాకు అండగా నిలిచి, నా రక్షకుల్లా  వ్యవహరించారు. నేను మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా. ఇది శాశ్వతంగా నిలిచిపోయే ప్రేమ. మీరందరూ లేకుంటే ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదు' తన వారిపై ప్రశంసలు కురిపించింది.

    ఐశర్య, మాగంటి ప్రియ, అర్పిత పేర్లను రష్మిక ప్రస్తావించింది. వారి గురించి తన అనుభవాలను పంచుకుంది. ఇవి మీ రోజులు.. అన్నీ మర్చిపోండి, హాయిగా ఉండండి.. అంటూ చెప్పిన మీ అందరికీ నా ధన్యవాదాలు.. మేము కూడా అలానే చేశామని రష్మిక తెలిపింది. మీరందరూ లేకుండా ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరిగేది కాదని రాసుకొచ్చింది. నా జీవితంలో నన్ను ప్రశాంతంగా, నిలకడగా ఉండేలా చేసిన అందమైన మహిళలకు నా అభినందనలు.. ఇదే నా చిన్న ప్రపంచం అంటూ ఎమోషనలైంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ వారం తెలుగులో 'కోర్ట్' జంట నటించిన బ్యాండ్ మేళం, ప్రియదర్శి సుయోధన థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు  తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'యూత్', 'హ్యాపీరాజ్' రిలీజ్ అవుతున్నాయి .

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే క్రేజ్‌ ఉన్న మూవీస్‌ ఏమీ రావట్లేదు. విజయ్ సేతుపతి 'కాట్టాన్' సిరీస్  మస్తిష్క మరణం, మర్దానీ 3 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్‌ అనిపించేలా ఉన్నాయి. ఈ శుక్రవారం ఓటీటీల్లో దాదాపు 11 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఈ ఫ్రైడే పెద్దగా ఆసక్తి పెంచే చిత్రాలేవీ కనిపించడం లేదు. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్‌

    • మస్తిష్క మరణం(మలయాళ మూవీ)- మార్చి 27

    • మర్దానీ 3 (హిందీ సినిమా)-మార్చి 27

    • ది రిటర్న్(డాక్యుమెంటరీ)- మార్చి 27

    • 53 సండేస్(హాలీవుడ్ మూవీ)-  మార్చి 27

    అమెజాన్ ప్రైమ్

    • ఓ రోమియో (హిందీ మూవీ) - మార్చి 27

    • హౌస్ ఆఫ్ డేవిడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27


    జియో హాట్‌స్టార్

    • కాట్టాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 27

    జీ5

    • ప్రజాపతి 2 (బెంగాలీ సినిమా) - మార్చి 27

    • హే కాయ్ నవీన్ (మరాఠీ సిరీస్) - మార్చి 27


    ఆపిల్ టీవీ

    •    ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 27

    సన్‌ నెక్ట్స్‌

    • మాయ బింబుమ్(తమిళ సినిమా)- మార్చి 27

     

  • సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మించారు.  ఈ చిత్రంలో డైరెక్టర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్‌  హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

    ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్‌లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్‌ స్టోరీగా ట్రైలర్‌లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

  • రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్‌ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

    తాజాగా పెద్ది మూవీ టీమ్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు అప్‌డేట్ రానుందని ప్రకటించారు. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది..ఇప్పటిదాకా బ్యాట్ పట్టుకుని అతన్ని చూశారు కదా.. ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు.. రేపు (మార్చి 27) ఉదయం 9:45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు అంటూ గదతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. చెర్రీ పుట్టినరోజు కానుకగా పెద్ది టీజర్‌ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

     

  • రవితేజ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇరుముడి. ఈ చిత్రంలో మాస్ మహారాజా అయ్యప్పదీక్షలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తే డెవోషనల్‌ టచ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  తండ్రీ, కూతుళ్ల బంధం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. 

    తాజాగా ఇరుముడి టీమ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేసింది.  ప్రేమ, ఆప్యాయత గల తండ్రి.. ముచ్చటైన కూతురి కథ.. అంటూ మైత్రి మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌తోనే కథేంటో మేకర్స్ రివీల్ చేశారు. ఈ ఏడాది రవితేజ బర్త్‌ డే సందర్భందా మూవీ టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌  నిర్మిస్తోంది.  జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కానుంది.
     

     

  •  ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం  ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ , ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’అన్నారు.

    సాయికుమార్ మాట్లాడుతూ - నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

  • టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.

    ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్‌తో ఆకట్టుకుంది.  ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది.  

    ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.

    ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    కాగా.. టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది. 
     

     

  • రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఒక్క రోజు ముందే రామ్ చరణ్‌ ఎడమ కన్నుకు చిన్న గాయం కావడంతో కాస్తా గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు నుంచి యథావిధిగా పెద్ది షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

    అయితే ఇప్పటికే ఓసారి వాయిదా పడిన పెద్ది మూవీపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 27 నుంచి ఓవర్‌సీస్‌ బుకింగ్స్‌ ఓపెన్ చేస్తామని ముందుగానే ప్రకటించారు. కానీ ఈ డేట్‌ కూడా ఏప్రిల్ 8కి మార్చారు. దీంతో మరోసారి పెద్ది వాయిదా పడనుందనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

    తాజా ‍అప్‌డేట్‌ ప్రకారం చూస్తే.. ఈ మూవీ షూటింగ్‌ ఇంకా జరుగుతూ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల వల్ల మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా బుచ్చిబాబు ఏప్రిల్ 30న రిలీజ్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అనుకున్న సమయానికి ‍అన్ని పనులు పూర్తయితే చెప్పిన డేట్ ప్రకారమే పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే మే 21వ తేదీకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. మరోవైపు శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. 
     

  • సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంతో పాటు సినిమా, టీవీ రంగాల్లో సేవలందించారు.  ఆయన చేసిన సేవలకు గాను రాజేంద్రన్ మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

    తన కళా జీవితాన్ని నాటకరంగంలో ప్రారంభించిన రాజేంద్రన్.. సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించారు. తన కెరీర్‌లో దాదాపు 60 చిత్రాలలో నటించారు. విలన్‌గా, సహాయ పాత్రలతో అభిమానులను మెప్పించారు. పలు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రితల్లూరులో గల ఎంగూర్ తారవాడులో  అయ్యప్పన్, సుమతి దంపతులకు రాజేంద్రన్ జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెలివిజన్ కోర్సు అభ్యసించిన ఆయన.. ప్రముఖ నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు.

    వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్‌కు సినిమారంగంలో  అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్‌లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్  సేవలందించారు.
     

  • దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు  విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.

    అయితే విచారణ సమయంలో  నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.

    అసలు కేసు ఏంటంటే..?

    గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–1లో ఉన్న దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)లపై  కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    2022 నవంబర్‌లో దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్‌కు చెందిన దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్‌ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్‌ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

  • ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్‌ చరణ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ హై ఇంటెన్సిటీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామ్‌ చరణ్‌ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది.  దీంతో షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చరణ్‌కి కంటికి చిన్న సర్జరీ చేశారట. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సర్జరీ చేసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 

    ‘డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు,చరణ్ కనురెప్పకు మీరు ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి, శస్త్రచికిత్స అందించినందుకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు.. రామ్‌ చరణ్‌ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. 

    పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నెల 27న రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్‌ని రిలీజ్‌ కానుంది. 

  • విరాట్‌ కర్ణ హీరోగా అభిషేక్‌ నామా రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం నాగబంధం.. తాజాగా ఈ మూవీ విడుదలను మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో  కనిపించనున్నారు. గరుడ రామ్, మహేష్ మంజ్రేకర్, జయప్రకాష్, మురళీ శర్మ, అనసూయ భరద్వాజ్, బిఎస్ అవినాష్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్‌ నామా దర్శకత్వంలో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ చిత్ర యూనిట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జులై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుందని ప్రకటించారు.

    కొద్దిరోజుల క్రితం టీజర్‌ విడుదల తర్వాత ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌ కోసమే రూ. 20 కోట్లు ఖర్చు చేశారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.

Andhra Pradesh

  • సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భువనేశ్వరి అనే ఓ తల్లి  తన ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది. అనంతరం తాను కూడా విషం తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ మహిళ అత్త అపస్మారక స్థితిలో ఉన్న ఆ నలుగురిని చూసి షాక్‌కు గురయింది. స్థానికుల సహాయంతో వెంటనే వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి , ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  

    పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం నెలకొంది.  

     

  • తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ శాఖ పనితీరుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌ అంటూ ధ్వజమెత్తారు వైఎస్‌ జగన్‌.  కేవలం కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారని, సహాయం కోసం ఎవరైనా పోలీస్‌ సాయం కోరినప్పుడు మాత్రం పోలీసులే కనిపించడం లేదన్నారు. ఈ మేరకు హలో ఇండియా ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

    జంగిల్‌  రాజ్‌గా మారిపోయింది..
    ‘ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు  జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి..అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు’ అని మండిపడ్డారు.

    17 ఏళ్ల బాలిక బలైపోయింది..
    ‘17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలిక బలయిపోయింది.  చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి..ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో  వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. 

    ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలిసినా పోలీసులు సరిగా స్పందించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు’ అని పోలీసులను తీరును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్‌ జగన్‌

    మరో భయానక వైఫల్యం.. 
    ‘ఈరోజు మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. అనేకసార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌ 100 కు కాల్ చేసినా స్పందన లేదు.  108 అంబులెన్స్ కూడా స్పందించలేదు. మా గోడు ఎవరూ వినిపించుకోలేదంటూ బాధితులు చెప్తున్నారు. 

    సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన చేయటం లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు. రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

  • విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు స్టేషన్‌లో ఫిబ్రవరి 2న జోగి రమేష్‌ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్‌కు నోటీసులు ఇచ్చాఉ భట్టిప్రోలు పోలీసులు. 

    గత నెలలో జోగి రమేష్‌పై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వాహించారని. జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్‌ 30 యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై నమోదు చేశారు. మళ్లీ నెల వ్యవధిలోనే ఏదో కారణం చూపుతూ జోగి రమేష్‌పై కేసు నమోదు చేశారు. 

  • గుంటూరు:  కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన జంట హత్యల కేసుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు గురజాల కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ  అక్రమ కేసులో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి 106 రోజుల పాటు జైల్లో ఉన్నారు. రేపు గుంటూరు జైలు నుంచి వెంకటరామిరెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. 

    ఇదే కేసుకు సంబంధించి గత వారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.  ఈ నెల 18వ తేదీన గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 99 రోజుల పాటు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతవారం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో మాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. 

    ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్త్‌లో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాము, ఎవ్వరినీ వదిలిపెట్టే సమస్య లేదు’ అని హెచ్చరించారు. 

  • విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ కానుంది. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశ) ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిల కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఆశ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని ఆశ అల్టిమేటం జారీ చేసింది. 

    పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీని ఆపేస్తామని చంద్రబాబుకి అల్టిమేటం ఇవ్వడం ఇది తొలిసారి కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని అనేకసార్లు ప్రకటించింది. ముఖ్యంగా 2025లో కనీసం మూడు ప్రధాన సందర్భాల్లో ఈ ప్రకటనలు జరిగాయి, పెండింగ్ బకాయిలు వేల కోట్లలో ఉండటమే ఇందుకు కారణం.

    గతంలోనూ ఇటువంటి హెచ్చరికలు వచ్చినా మళ్లీ ఇటువంటి ఘటనలు రిపీట్‌ అవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కాబోమని గతంలోనూ పలు ఆసుపత్రులు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. పెండింగ్‌ బకాయిలు చెల్లించకపోతే ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పాయి. 

  • శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే  అశోక్‌ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్‌ దూషణలకు దిగారు. 

    “బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.

    టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో  ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది. 

    బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం
  • విజయవాడ:   ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల ఓట్లు మాత్రమే కావాలి తప్ప, వారిపై దాడులు జరిగితే మాత్రం పట్టించుకోవడం లేదని  జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ మరోసారి ధ్వజమెత్తారు. అంబేద్కర్‌ పేరు పెట్టిన జిల్లాలో దుర్మార్గం జరిగితే చర్యలేవి చంద్రబాబు? అని ప్రశ్నించారు.

    ‘పవన్‌ సొంత నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతుంది. దళితుడి చనిపోతే అగ్రకులాలు శవాన్ని తీసుకెళ్లనివ్వని పరిస్థితి. ఇంత జరుగుతుంటే పవన్‌ ఎందుకు స్పందించడం లేదు.  పిఠాపురం నియోజకవర్గంలో కులవివక్ష కనిపించడం లేదా పవన్‌? అని నిలదీశారు. 

    టీటీడీ చైర్మన్‌, జనసేన ఎమ్మెల్యే, డ్రగ్స్‌ తీసుకున్న ఎంపీపై చర్యలేవని ప్రశ్నించారు. బర్త్‌ డే పార్టీలు, ఆట పాటల్లో హోంమంత్రి బిజీగా ఉన్నారని, ఇక డిప్యూటీ సీఎం పవన్‌ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. 

    శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

     

     

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి. ఒంటిమిట్ట, భద్రాది ఆలయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నవమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
  • సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో గడిచిన రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న ఘటనల తీవ్రత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల కాలంలో బడిబాట పట్టి తిమ్మిని బమ్మి చేసేందుకు యత్నించారు. 

    వాస్తవానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేయడంతోపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద నాణ్యమైన కిట్లు పంపిణీ చేశారు. వాటిని విద్యా మిత్ర కిట్లుగా పేరు మార్చిన చంద్రబాబు సర్కారు నాణ్యతను గాలికొదిలేసింది. పంపిణీ చేసిన రోజుల వ్యవధిలోనే బ్యాగులు చినిగిపోయి, బూట్లు దెబ్బతిన్నాయి. విద్యార్థులు డబ్బు వెచ్చించి బ్యాగులు కొనుగోలు చేయడంతోపాటు బూట్లకు బదులు చెప్పులు వేసుకుని పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితి. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక సర్దుకుపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.  

    విద్యా మిత్ర కిట్‌లో ఇచ్చిన బ్యాగులు చినిగిపోవడంతో సొంత బ్యాగులతో ఇలా..   

                     

     

Telangana

  • హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్రోల్‌ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిజానికి వాహనదారులు పెట్రోలు బంకుల వద్దకు అంత భారీగా వెళ్తూ ఫుల్‌ ట్యాంకు నింపించుకుంటున్నారు కాబట్టి కొన్ని బంకుల్లో పెట్రోల్‌ అయిపోతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. లేని ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నట్లు ఉంది వాహనదారుల తీరు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లోని పలు నగరాల్లో ప్రజల్లో భయం, ఆందోళన పెరిగాయి. ఏ అనుకోని పరిస్థితి వస్తుందోనన్న భయంతో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

    ప్రభుత్వ వివరణ ఇదే..
    ఇరాన్‌ యుద్ధం వేల క్రూడాయిల్ సరఫరా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ లోటు పూర్తిగా భర్తీ అయింది. హార్మూజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితి ఉన్నా, భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్మూజ్‌ జలసంధి ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ క్రూడాయిల్‌ను భారత్‌ పొందుతోంది. 

    అంతర్జాతీయ మార్కెట్లలో (ముఖ్యంగా పశ్చిమ గోళార్థంలోని దేశాల్లో) క్రూడాయిల్‌ పెద్ద మొత్తంలో ఉంది. ఇతర ప్రాంతాలనుంచి సరఫరా జరగకపోతే వేరే మార్కెట్ల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవచ్చు. ప్రతి భారత రిఫైనరీ 100% కంటే ఎక్కువ వినియోగంతో నడుస్తోంది. భారత ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల దేశ అవసరాలకు సరిపడే క్రూడాయిల్ సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి దేశంలో లోటు ఉండే ప్రమాదం లేదు. సరఫరాలో ఎలాంటి లోటు లేదు.

    ఈ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే..
    పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భయంతో వెళ్తున్నారు. ఇంధన లోటు ఉందేమోనన్న భయంతో ప్రజలు పొడవాటి క్యూల్లో నిలబడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. 

     

  • హైద‌రాబాద్‌: ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు గురువారం(మార్చి 26వ తేదీ) ఎంఎంటీఎస్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. 

    హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాలని సూచించిన సీఎం.. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులు న‌డ‌పాల‌ని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉన్నందున అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాలన్నారు. 

    ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌న్నారు. మెరుగైన వ‌స‌తులు ఉన్న‌ప్పుడే ప్ర‌యాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని ఈ మేరకు సీఎం పేర్కొన్నారు. స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని.. లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు.. వ‌స‌తులు మెరుగుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. 

  • హైదరాబాద్‌: "శ్రీరామనవమి శోభాయాత్ర" సందర్భంగా హైదరాబాద్‌లో రేపు (మార్చి 27న) ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో తెలిపారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు వర్తిస్తాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు శోభాయాత్ర ఉంటుంది.

    ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు  
    1. సీతారాంబాగ్ ఆలయం: ఆసిఫ్ నగర్ నుంచి భోయిగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి, మెహదీపట్నం వైపు మళ్లిస్తారు.

    2. ఫ్రెండ్స్ కేఫ్: అఘాపురా, భోయిగూడ కమాన్ బై-లేన్ల నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ భోయిగూడ కమాన్ వద్ద అఘాపురా హబీబ్ నగర్ వైపు మళ్లిస్తారు..

    3. భోయిగూడ కమాన్: దారుసలాం నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ఘోడే-కీ-ఖబర్ లేదా కొత్త అఘాపురా, చార్‌కందిల్ ఎక్స్ రోడ్, నాంపల్లి వైపు మళ్లిస్తారు.

    4. భోయిగూడ కమాన్ కుడి మలుపు: శోభాయాత్ర భోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌హాట్ మార్కెట్ వైపు కుడి మలుపు తీసుకున్నప్పుడు, గాంధీ విగ్రహం నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడే-కీ-ఖబర్ వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా కొత్త అఘాపురా వైపు మళ్లిస్తారు.

    5. జాలీ హనుమాన్ ఆలయం: పురానాపూల్ జుమేరాత్ బజార్ నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ గాంధీ విగ్రహం వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా ఘోడే-కీ-ఖబర్/పురానాపూల్ వైపు మళ్లిస్తారు.

    6. రహీంపురా: పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ పురానాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద పురానాపూల్ దర్వాజా, కర్వాన్, కుల్సుంపురా 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

    7.గాంధీ విగ్రహం: MJ బ్రిడ్జ్ నుంచి టక్కర్‌వాడీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా, ఘోడే-కీ-ఖబర్ వైపు మళ్లించబడుతుంది. MJ బ్రిడ్జ్  నుంచి అఫ్జల్‌గంజ్/సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.

    8.  టక్కర్‌వాడీ జంక్షన్: బేగంబజార్ ఛత్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ రాణి అవంతి బాయి విగ్రహం వద్ద MJ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు.

    9. రాణి అవంతి బాయి విగ్రహం (జుమేరాత్ బజార్): బేగంబజార్ బై-లేన్ల నుంచి గాంధీ విగ్రహం/పురానాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్ లేబర్ అడ్డా వద్ద అలాస్కా T-జంక్షన్ వైపు మళ్లిస్తారు.

    10. బేగంబజార్ ఛత్రీ: మాలకుంట నుంచి MJ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్ అలాస్కా T-జంక్షన్ వద్ద దారుసలాం/మాలకుంట వైపు మళ్లిస్తారు. రంగచారి లేన్, అఫ్జల్‌గంజ్ నుంచి బేగంబజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ (శ్రీకృష్ణ జ్యువెలరీ వద్ద) నుండి MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

    11. బర్తన్ బజార్: అఫ్జల్‌గంజ్ బై-లేన్ల నుండి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ U-టర్న్ వద్ద అఫ్జల్‌గంజ్/సాలార్‌జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లిస్తారు.

    12. SA బజార్: అజంతా గేట్, జాంబాగ్‌ల నుంచి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద పుత్లీబౌలి, రంగమహల్ వైపు మళ్లిస్తారు.

    13. SA బజార్ మసీదు: నయాపూల్ నుండి SA బజార్ మసీదు వైపు వచ్చే ట్రాఫిక్ అఫ్జల్‌గంజ్ T-జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ – శివాజీ బ్రిడ్జ్ – CBS వైపు మళ్లిస్తారు.

    14. MJ మార్కెట్: నాంపల్లి, అబిడ్స్ నుండి SA బజార్ మసీదు వైపు వెళ్లే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిబౌలి  రంగమహల్ వైపు మళ్లిస్తారు.

    15.అబిడ్స్ GPO: అబిడ్స్ రోడ్డు నుండి MJ మార్కెట్ వైపు వచ్చే ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు వైపు మళ్లిస్తారు. (యాత్ర శంకర్ షేర్ హోటల్ చేరుకోగానే ఈ మళ్లింపు తొలగిస్తారు).

    16.SA బజార్/గౌలిగూడ చమన్: పుట్లిబౌలి నుండి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమన్ వద్ద త్రివేణి లాడ్జ్ CBS వైపు మళ్లిస్తారు.

    17. శంకర్ షేర్ హోటల్: రంగమహల్ నుండి గౌలిగూడ చమన్ వైపు వచ్చే ట్రాఫిక్ పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్, MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు. ఆంధ్ర బ్యాంక్ నుండి వచ్చే ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మళ్లిస్తారు.

    18. రామ్ మందిర్ కమాన్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుండి పుట్లిబౌలి/జాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ రంగమహల్ Y-జంక్షన్ వద్ద CBS , అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తారు.

    19. రామ్ మందిర్ కమాన్ (అబిడ్స్ నుండి): GPO-అబిడ్స్ నుండి పుట్లిబౌలి ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద DMHS ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. అబిడ్స్ రోడ్డు నుండి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

    20.  పుత్లీబౌలి ఎక్స్ రోడ్: MJ మార్కెట్ నుండి ట్రూప్ బజార్/బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద GPO , MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

    21. పుత్లీబౌలి ఎక్స్ రోడ్ (చాదర్‌ఘాట్ నుండి): చాదర్‌ఘాట్ నుండి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ DMHS ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ నుండి వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు.

    22. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్: చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుండి DMHS ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద నింబోలిఅడ్డ – కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.

    23. ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ (నారాయణగూడ నుంచి): నారాయణగూడ నుండి బడీచౌడి వైపు వచ్చే ట్రాఫిక్ కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. అబిడ్స్ నుండి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.

    24. సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్: బాటా రోడ్–కింగ్ కోఠి –రాంకోఠి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు.
     
    రద్దీగా ఉండే ప్రాంతాలు: బేగంబజార్ ఛత్రీ, SA బజార్, అఫ్జల్‌గంజ్ T-జంక్షన్, శివాజీ బ్రిడ్జ్, CBS, రంగమహల్ Y-జంక్షన్, పుట్లిబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్ర బ్యాంక్, అబిడ్స్ GPO, MJ మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలి అడ్డ. 

    అత్యవసర సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 కు కాల్ చేయండి.
     

  • సాక్షి, హైదరాబాద్‌: ముషీరాబాద్‌లో కల్తీ, గడువు ముగిసిన ఐస్ క్రీమ్‌ల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్‌, సికింద్రాబాద్ జోన్ బృందాలు) హెచ్-ఫాస్ట్ (H-Fast) టీమ్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్‌లో ఉన్న 'బ్లూ బెల్స్ ఐస్ క్రీం' (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై మెరుపు దాడులు చేశారు.

    ఈ దాడుల్లో ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నాణ్యమైన ఐస్ క్రీమ్‌లంటూ నమ్మబలుకుతూ హోల్ సేల్, రిటైల్ కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. తయారీలో గడువు ముగిసిన (Expired) రంగులు, ఫ్లేవర్లను ఉపయోగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. అలాగే తయారీ కేంద్రం, ముడి పదార్థాల నిల్వ ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

    ఈ దాడుల్లో పోలీసులు మొత్తం రూ. 1,75,000 విలువైన 3,759 వివిధ రకాల ఐస్ క్రీం ఉత్పత్తులను (సుమారు 1,252 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 లీటర్ల ప్యాకింగ్‌లో ఉన్న 400 లీటర్ల వెనీలా, 320 లీటర్ల బటర్ స్కాచ్, 120 లీటర్ల అమెరికన్ నట్స్, 120 లీటర్ల స్ట్రాబెర్రీ, 80 లీటర్ల డ్రై ఫ్రూట్, 60 లీటర్ల మాంగో, 20 లీటర్ల క్రీమ్ & కుకీస్ ఐస్ క్రీంలు ఉన్నాయి. అలాగే విక్రయానికి సిద్ధంగా ఉన్న 2,550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లు, 1 లీటర్ ప్యాకింగ్‌లో ఉన్న 38 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 24 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అర లీటర్ ప్యాకింగ్‌లో ఉన్న 20 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్‌, 10 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలు, 50 ml పరిమాణంలో ఉన్న 800 మలై కుల్ఫీ ఐస్ క్రీంలను (40 లీటర్లు) సీజ్ చేశారు.

    ముఖ్యంగా తయారీలో వాడుతున్న కృత్రిమ ఆహార రంగులు (180 గ్రాముల ప్యాకెట్లు), టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్‌తో పాటు, గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

International

  • ఇరాన్‌పై దాడులకు నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్ రుట్టే పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలను బహిరంగంగా సమర్థించారు. ఇరాన్‌ అణు, క్షిపణి కార్యక్రమాలతో ఐరోపా భద్రతకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. 

    కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నాటోపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాటో కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టే ప్రతిస్పందిస్తూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంలో కూటమి పాత్రను సమర్థించారు. ఆ ప్రాంతంలో ఇటీవల చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారు.

    రుట్టే తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధం సమయంలో టర్కీ వైపు దూసుకెళ్తున్న మూడు బాలిస్టిక్ క్షిపణులను నాటో అడ్డుకుంది. అంతేకాదు, హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

    మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టు తర్వాత వచ్చాయి. ట్రంప్‌ నాటోను విమర్శిస్తూ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంతో తమకు మద్దతు ఇవ్వకపోవడాన్ని అమెరికా మర్చిపోదని చెప్పారు. 

  • వాషింగ్టన్‌: ఇరాన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. "ఇరాన్ తరఫున చర్చలు జరిపే ప్రతినిధులు చాలా భిన్నంగా, వింతగా ఉన్నారు. ఒప్పందం చేసుకోవాలని మమ్మల్ని వారు అడుక్కుంటున్నారు. ఎందుకంటే ఇరాన్‌ సైనికపరంగా పూర్తిగా నాశనమైంది. తిరిగి నిలబడే అవకాశం సున్నా. అయినా వారు బహిరంగంగా ఇంకా మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకంటే, వారికి తిరిగి వెనక్కిచూసే అవకాశం కూడా రాకపోవచ్చు. తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ట్రంప్‌ హెచ్చరించారు.

    మరోవైపు, ఇవాళ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఐఆర్‌జీసీ నేవీ చీఫ్‌ అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి.

    ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేస్తుందన్న భయంతో ఇరాన్‌ అక్కడ భద్రతను పెంచుతోంది. ఖార్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఇరాన్‌ భావిస్తోంది. దీంతో ఇరాన్‌ అక్కడికి తమ సిబ్బందిని తరలిస్తోంది, దీవి చుట్టూ గగనతల రక్షణ వ్యవస్థను పెంచుతోంది. ఖార్గ్‌ దీవి వాటా ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఉంటుంది.

    భుజంపై మోసుకెళ్లి ప్రయోగించే గగనతల క్షిపణి వ్యవస్థ (మాన్పాడ్స్)ను ఆ దీవి వద్ద పెంచుతోంది. అయితే, ఏ దాడి జరిగినా అధిక ప్రాణనష్ట ప్రమాదం ఉంటుందని అమెరికా అధికారులు, సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో ఫెర్రీ ఎక్కే ప్రయత్నంలో ఓ బస్సు పద్మా నదిలో పడిపోయింది. దీంతో 24 మంది మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

    ఈ ప్రమాదం బుధవారం రాజ్‌బారి జిల్లాలోని దౌలత్‌డియా వద్ద జరిగింది. ఇది ఢాకా నుంచి సుమారు 100 కిలోమీటర్లు (62 మైళ్లు) దూరంలో ఉంది. ఫెర్రీ వద్దకు చేరుకునే సమయంలో బస్సు నియంత్రణ కోల్పోయి ఓ వైపునకు ఒరిగి, సుమారు 30 అడుగులు (9 మీటర్లు) లోతులో నదిలో మునిగిపోయిందని పోలీసులు, ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ (అగ్నిమాపక, అత్యవసర రక్షణ విభాగం) తెలిపారు.

    నదిలో మునిగిన బస్సు నుంచి సిబ్బంది 22 మృతదేహాలను వెలికితీశారు, అందులో ఆరుగురు పురుషులు, 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని ఫైర్ సర్వీస్ అధికారి తల్హా బిన్ జాసిమ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 4 ఫైర్ సర్వీస్ యూనిట్లు, 10 మంది డైవర్లు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. 

    సైన్యం, పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకా కొంత మంది ప్రయాణికులు అదృశ్యమై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం రోడ్డు, ఫెర్రీ ప్రమాదాల్లో వందల మంది మరణిస్తున్నారు.

  • తీర ప్రాంతాల్లోని నిర్లవణీకరణ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోతుంది. సముద్ర జలాల్లోని ఉప్పును తొలగించి, శుద్ధ జలంగా మార్చే ప్లాంట్లు ఇవి. ఈ నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘ముహార్రక్’పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ డీశాలినేషన్ ప్లాంటు దెబ్బతింది. దైనందిన తాగునీటి అవసరాల కోసం గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఈ నిర్లవణీకరణ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ ఇప్పుడు భద్రతాపరమైన అంశంగా మారింది.

    నిర్లవణీకరణ జలాన్ని ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నది గల్ఫ్ దేశాలే. వీటి తీరప్రాంతాల్లో వందలాది డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కువైట్ ప్రాంతంలో 90 శాతం తాగునీరు ఇదే. తీర నగరాలు, విద్యుత్కేంద్రాలు, పారిశ్రామిక హబ్స్ వద్ద ఈ డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదిప్పుడు వాటి బలహీనతగా, ఇరాన్ ఆయుధంగా మారుతోంది. నిర్లవణీకరణ కేంద్రాల్ని లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది.

    విద్యుత్ సరఫరాతోనే డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే అవి మూతపడతాయి. ఉద్రిక్తతలు పెరిగితే డీశాలినేషన్ ప్లాంట్లు, విద్యుత్కేంద్రాలపై ఇరాన్‌ దాడులు చేస్తుందేమోనని, అప్పుడిక గృహావసరాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నీరు అందదేమోనని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామమే. అయితే ఈ రిస్క్ అన్ని గల్ఫ్ దేశాలకు ఒకేలా లేదు. మిగతా వాటితో పోలిస్తే సౌదీ, ఖతార్, యూఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.
    - జమ్ముల శ్రీకాంత్ 

    Sources: SANA (Syrian Arab News Agency), Gulf News

  • టెహ్రాన్‌: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం జెరూసలేం పోస్ట్‌ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది.

    హార్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్ ఉంది. ప్రపంచ వాణిజ్య చమురు, సహజ వాయువు సుమారు 20 శాతం హార్మూజ్‌ గుండా సాగుతుంది. ఈ జలసంధి మూసివేతకు బాధ్యుడిగా అలీరెజాను పేర్కొంటారు. అతడి మరణం ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలో కీలక పరిణామం. ఎందుకంటే ఐఆర్‌జీసీ నౌకాదళానిదే ఇరాన్ సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసేది కూడా ఐఆర్‌జీసీ నౌకాదళమే.

    హార్మూజ్‌పై పట్టును మరింత సాధిస్తున్న వేళ 
    ప్రస్తుతం హార‍్మూజ్ జలసంధిపై పట్టును మరింత పెంచుకుంటోంది ఇరాన్‌. కాల్పుల విరమణ ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ “డీ ఫాక్టో టోల్ బూత్ విధానం” (అధికారిక ప్రకటన లేకుండా అమలులో ఉన్న ఫీజు వ్యవస్థ) అమలు చేస్తోందని నిపుణులు చెప్పారు. 

    ఈ విధానంలో కొన్ని నౌకలు తమ సరుకు వివరాలు, సిబ్బంది సమాచారం, గమ్యస్థానం వివరాలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు అందించాలి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ (నౌకాయాన విశ్లేషణ సంస్థ) కూడా ఇదే విధానాన్ని ప్రస్తావిస్తూ, కనీసం రెండు నౌకలు జలసంధి గుండా వెళ్లేందుకు చైనా యువాన్‌లో ఫీజులు చెల్లించాయని తెలిపింది. 

    ఈ ఫీజు వసూలు వ్యవస్థను అధికారికం చేయడానికి తమ పార్లమెంట్ ప్రయత్నిస్తోందని ఇరాన్‌ నేత ఒకరు అన్నారు. “మేమే భద్రత కల్పిస్తున్నాం, నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ ఫీజులు చెల్లించడం సహజమే” అని చెప్పారు.

    ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ (అంతర్జాతీయ చమురు ధర సూచిక) ధర గురువారం 104 డాలర్ల వద్ద ఉంది, ఘర్షణ ప్రారంభం నుంచి 40 శాతం పైగా పెరిగింది.

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్  దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమ ఆసియాలో  ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజాగా మరో సంచలన  హెచ్చరిక జారీ చేసింది. తన ద్వీపాలపై దాడులు జరిగిగే మరో జలసంధిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఇరాన్ గనుక కాల్పుల విరమణ షరతులకు అంగీకరించకపోతే, సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్‌   తాజా హెచ్చరిక జారీ చేసింది.  


    శత్రువు పీచమణచాలంటే.. బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టు
    ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ దక్షిణ ద్వీపాలపై భూతల దాడులు జరిగితే, యెమెన్‌కు చెందిన సాయుధ రాజకీయ, మత సమూహమైన అన్సరుల్లా (హౌతీలు) బాబ్ అల్-మండబ్  (Bab al-Mandab)జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది.


    దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనా (Resistance) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమ్మకమైన హామీలు లేకుండా చర్చలకు లేదా కాల్పుల విరమణకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై దాడితో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అన్సరుల్లా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువును  దారికి తీసుకురావడానికి ఈ కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ మీడియా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది.శత్రువుకు మరింత  గుణపాఠం నేర్పడానికి ఈ జలసంధిని నియంత్రించడం అవసరమని భావిస్తోంది. ఈ జలమార్గంలో "విశ్వసనీయమైన ముప్పు"ను సృష్టించే సామర్థ్యం ఇరాన్‌కు ఉండటమే కాకుండా, అన్సరుల్లా  "వీరోచిత శక్తులు" కూడా "నైపుణ్యంతో కూడిన పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని   తస్నిమ్‌ తెలిపింది.

    ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు

    కాగా  ఇప్పటికే ఇజ్రాయెల్‌కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకలపై హుతీలు దాడులు చేస్తూ ఆర్థికంగా ఇజ్రాయెల్‌ను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నౌకలపైనే కాకుండా, అమెరికా యుద్ధ నౌకల పైన మరియు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల పైన హుతీలు వైమానిక దాడులు చేస్తున్నారు.రెడ్‌ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉన్న బాబ్ అల్-మండబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం.

    ఇదీ చదవండి: రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్‌ ట్రిప్స్‌, బెంజ్‌కారు!


     

Business

  • ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. భారతదేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ.. హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర బారులు తీరారు. ఈ తరుణంలో కొత్త కారు కొనాలకునేవారు ఈవీలపై ద్రుష్టి సారిస్తున్నారు. కాబట్టి ఈ కథనంలో గొప్ప మైలేజ్ ఇచ్చే బెస్ట్ కార్లు గురించి తెలుసుకుందాం.

    👉టాటా టియాగో ఈవీ: 187 కిమీ (24 కిలోవాట్ బ్యాటరీ)
    👉టాటా టిగోర్ ఈవీ: 190 కిమీ (26 కిలోవాట్ బ్యాటరీ)
    👉ఎంజీ కామెట్ ఈవీ: 193 కిమీ (17.3 కిలోవాట్ బ్యాటరీ)
    👉సిట్రోయెన్ eC3: 228 కిమీ (29.2 కిలోవాట్ బ్యాటరీ)
    👉ఎంజీ విండ్సర్ ఈవీ: 308 కిమీ (38 కిలోవాట్ బ్యాటరీ)
    👉ఎంజీ జెడ్ఎస్ ఈవీ: 339 కిమీ (50.3 కిలోవాట్ బ్యాటరీ)
    👉టాటా నెక్సాన్ ఈవీ: 350 కిమీ (45 కిలోవాట్ బ్యాటరీ)
    👉కియా కారెన్స్ క్లావిస్ ఈవీ: 364 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)
    👉టాటా కర్వ్ ఈవీ: 365 కిమీ (55 కిలోవాట్ బ్యాటరీ)
    👉టాటా హారియర్ ఈవీ: 401 కిమీ (75 కిలోవాట్ బ్యాటరీ)
    👉హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: 432 కిమీ (51.4 కిలోవాట్ బ్యాటరీ)
    👉మహీంద్రా బీఈ 6: 449 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)
    👉మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ: 456 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)
    👉మహీంద్రా XEV 9S: 478 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ)

  • ఆసుపత్రుల దిగ్గజం మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 4,32,27,668 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

    పీఈ దిగ్గజం టెమాసెక్‌కు పెట్టుబడులున్న సంస్థ ఈక్విటీ జారీ నిధుల్లో మణిపాల్‌ హాస్పిటల్స్‌కు చెందిన రుణ చెల్లింపులకు రూ. 5,378 కోట్లు వెచ్చించనుంది. అనుబంధ కంపెనీ సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు రూ. 574 కోట్లు వినియోగించనుంది.

    ఐపీవోకంటే ముందుగా రూ. 1,600 కోట్ల షేర్ల విక్రయ యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవోలో ఈక్విటీ జారీ పరిమాణాన్ని కుదించనుంది. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, కిడ్నీ మార్పిడి తదితర పలు స్పెషాలిటీలు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను దేశవ్యాప్తంగా కంపెనీ నిర్వహిస్తోంది. 2025 సెప్టెంబర్‌కల్లా 38 ఆసుపత్రుల ద్వారా 10,761 పడకలను కలిగి ఉంది. గతేడాది(2024–25)లో ఆదాయం రూ. 8,242 కోట్లను అధిగమించగా.. దాదాపు రూ. 1,082 కోట్ల నికర లాభం ఆర్జించింది.

  • ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్‌ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.

    ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.

    UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

    ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY),  నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్‌ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా UMANG ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చెందింది. 

    ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!

  • మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.

    ➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్‌పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

    ➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.

    ➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

    ➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • భారత్‌కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది.

    ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్‌పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.

    చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్‌లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.

    చమురు ధరల సెగలు.. 
    జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ బ్యారెల్‌కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్‌ త్రైమాసికంలో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది.

  • హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగమైన విడా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తన భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని, నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0 ఈవెంట్‌లో VX2 ప్లస్ KKR లిమిటెడ్ ఎడిషన్‌ లాంచ్ చేసింది. ఇది సాధారణ విడా కంటే భిన్నంగా నైట్ పర్పుల్, గోల్డ్ కలర్ పొందింది.

    KKR సాధించిన మూడు ఛాంపియన్‌షిప్ విజయాలకు ప్రతీకగా మూడు యాక్సెంట్ మార్కులను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో కూడిన ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ముందు - వెనుక భాగాలలో ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్ పొందుతుంది.

    VX2 ప్లస్ KKR లిమిటెడ్ డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో అదే 3.4kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఎంపిక చేసిన విడా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్‌లోని స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్‌ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.

    ముంచుకొస్తున్న ముప్పు

    ఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్‌లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్‌లు అచ్చం ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్‌కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.

    ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్‌లకు మాత్రమే ‘వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్‌లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్‌లకు కూడా ఈ ఫీచర్‌ను విస్తరించనున్నారు.

    ‘ఫిన్‌ఫ్లుయెన్సర్ల’పై నిఘా

    ఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్‌ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్‌ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.

    ఇదీ చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ఎ‍క్కడెంత వాడుతున్నారంటే..

    పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?

    • సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.

    • సెబీ బ్రోకర్‌ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.

    • యాప్‌లో గ్రాఫ్‌లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.

    • పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు.

  • 2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.

    జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే  లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.

    వెండి ధరలు తగ్గడానికి కారణం?
    సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.

    నిపుణుల అభిప్రాయం
    క్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.

    పెట్టుబడిదారులకు సూచనలు
    బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

    ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్‌ పెడితే.. వాషింగ్‌ పౌడర్‌ వచ్చింది!

  • న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తూ అతాను చక్రవర్తి చేసిన ఆరోపణలపై స్వతంత్ర పరిశీలనకుగాను న్యాయ సంస్థలను బ్యాంక్‌ నియమించింది. వాస్తవాల ఆధారంగా ఆరోపణల నిగ్గు తేల్చేందుకు న్యాయ సంస్థలను నియమించినట్టు బ్యాంక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బ్యాంక్‌ పాటిస్తూ వచ్చిన అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఈ నియామకం చేసినట్టు చెప్పారు.

    నైతిక పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ అతాను చక్రవర్తి ఈ నెల 18న అర్ధంతరంగా హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ‘‘గత రెండేళ్లలో బ్యాంక్‌ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, అనుసరిస్తున్న విధానాలను పరిశీలించగా, నా వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవు. నా రాజీనామాకు కారణాలు ఇవే’’అని చక్రవర్తి పేర్కొన్నారు.

  • అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.

    డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనం

    భారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్‌దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్‌తోనే నడుస్తున్నాయి.

    వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్‌నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్‌లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.

    పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.

    పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?

    ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

    ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.

    ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్‌ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.

    ప్రజలు ఏం చేయాలి?

    ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.

    ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

  • ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు భరోసానిచ్చే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) గత దశాబ్ద కాలంలో భారతీయ కుటుంబాల నమ్మకమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. 2014లో ప్రారంభమైన ఈ పథకం, నేడు కోట్లాది మంది తల్లుల కలలకు అండగా నిలుస్తోంది. ఇటీవల ఈ పథకం వడ్డీ రేట్లపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది.

    వడ్డీ రేటులో మార్పు లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
    ప్రస్తుతం అమలులో ఉన్న 8.2 శాతం వడ్డీ రేటును తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 23న లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పేర్కొన్నారు. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన అత్యంత ఆకర్షణీయమైన రిటర్న్స్‌ను అందిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    దశాబ్ద కాలంలో 100 రెట్లు వృద్ధి
    గత పదేళ్లలో ఈ పథకం సాధించిన ప్రగతి అసాధారణం. గణాంకాలను పరిశీలిస్తే సామాన్యులకు ఈ పథకంపై ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. 2014-15లో కేవలం 4.2 లక్షలుగా ఉన్న ఖాతాలు, 2024-25 నాటికి 424.57 లక్షలకు చేరాయి. అంటే పదేళ్లలో 100 రెట్లు వృద్ధి నమోదైంది. ప్రారంభంలో రూ. 0.001 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు, ప్రస్తుతం రూ. 2.99 లక్షల కోట్లకు చేరడం విశేషం.

    వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?
    సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarterly) సమీక్షిస్తుంది. ప్రధానంగా శ్యామల గోపీనాథ్ కమిటీ సిఫార్సుల మేరకు, ప్రభుత్వ సెక్యూరిటీల (G-Secs)పై వచ్చే దిగుబడిని బట్టి ఈ రేట్లను ఖరారు చేస్తారు. 2014–16 ఆర్థిక సంవత్సరంలో 9% పైచిలుకు ఉన్న వడ్డీ రేటు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2020–23 సంవత్సరాల్లో 7.6 శాతానికి (అత్యల్పం)  చేరింది. 2024 నుండి ఈ వడ్డ రేటు  8.2 శాతంగా కొనసాగుతోంది.

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చరిత్రలో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం మారిన నేపథ్యంలో ఆ జట్టు వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు రూ.16,500 కోట్లకు ఈ ఫ్రాంచైజీ విక్రయించిన తర్వాత మాల్యా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం’ అని పేర్కొన్నారు.

    2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మాల్యా ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు (సుమారు 111.6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను 2008లో ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుతూ ఇది కేవలం ఒక ‘వానిటీ ప్రాజెక్ట్’(ప్రదర్శన కోసం చేసే ఖర్చు) అని విమర్శించారు. కానీ నా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయడమే నా ఉద్దేశం. అందుకే జట్టుకు ఆ పేరు పెట్టాను. ఈ రోజు ఆర్‌సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవడం గర్వంగా ఉంది’ అని మాల్యా ఎక్స్‌ (ట్విట్టర్)లో రాశారు.

    కోహ్లీ ఎంపికే నా విజయం!

    ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన అత్యుత్తమ నిర్ణయమని మాల్యా అభివర్ణించారు. 18 ఏళ్ల క్రితం ఒక కుర్రాడిగా కోహ్లీని గుర్తించి జట్టులో చేర్చుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలను జట్టులోకి తీసుకురావడం తన అదృష్టమని పేర్కొన్నారు.

    నూతన యాజమాన్యం

    ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్ట్ వెంచర్స్) రూ.16,660 కోట్లకు ఆర్‌సీబీని కైవసం చేసుకుంది. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇకపై ఈ ఫ్రాంచైజీకి సారథ్యం వహించనున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు ప్రాంఛైజీలోని తన వాటాను విక్రయించినట్లు వెల్లడించింది.

    ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగింపు దశకు చేరుకోవడంతో, అమ్మకాల్లో జోరు పెంచేందుకు రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ మోడళ్లపై మార్చి 2026 నెలకు గానూ ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో ఈ ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 80,000 వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది.

    రెనాల్ట్ కీగర్ 
    సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కీగర్ (Renault Kiger), ఈ నెలలో భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. స్టైలిష్ లుక్, టర్బో ఇంజన్ ఆప్షన్లతో లభించే ఈ కారుపై మార్చిలో రూ. 80,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 10.34 లక్షల మధ్య ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లు కోరుకునే వారికి ఈ తగ్గింపులు మంచి డీల్ అని చెప్పవచ్చు.

    రెనాల్ట్ ట్రైబర్ 
    మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ఎమ్‌పీవీ ట్రైబర్ (Renault Triber) కూడా ఈ నెలలో అత్యంత సరసమైన ధరకే లభించనుంది. ఫ్లెక్సిబుల్ సీటింగ్ అమరికతో వచ్చే ఈ కారుపై కూడా గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపు ప్రకటించారు. ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.76 లక్షల నుండి రూ. 8.60 లక్షల వరకు ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీ కోరుకునే కుటుంబాలకు ఇది ఉత్తమ ఎంపిక.

    రెనాల్ట్ క్విడ్ 
    మొదటిసారి కారు కొనాలనుకునే వారికి ఆల్-టైమ్ ఫేవరెట్ అయిన క్విడ్ (Renault Kwid) హాచ్‌బ్యాక్‌పై రెనాల్ట్ రూ. 70,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ కారు 1.0-లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల మధ్య ఉంది. సిటీ డ్రైవింగ్‌కు అనువైన ఈ కారుపై లభిస్తున్న రూ. 70 వేల తగ్గింపు దీని విలువను మరింత పెంచింది.

Sports

  • చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్ 2026లో ఆడబోయే స్పిన్నర్ రాహుల్ చహర్, సర్రే కౌంటీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ 2026లో తన బాధ్యతలు ముగిసిన తర్వాత జూన్ 7 నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. ఈ ఒప్పందంలో చాహర్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడతాడు.

    చాహర్‌ 2025లో కూడా సర్రే తరఫున ఆడాడు. అదే అతనికి కౌంటీల్లో అరంగేట్రం సీజన్‌. చాహర్‌ తన తొలి కౌంటీ మ్యాచ్‌లోనే 10 వికెట్లు (రెండో ఇన్నింగ్స్‌లో 8/51తో) తీసి, సర్రే తరఫున అరంగేట్రంలోనే అత్యుత్తమ గణాంకాలు నమెదు చేసిన ఆటగాడిగా 166 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు విలియం మూడీ పేరిట ఉండింది. 1860లో అతను సర్రే తరఫున అరంగేట్రంలో 7/61 సాధించాడు.

    ఇదిలా ఉంటే, సీఎస్‌కే ఈ సీజన్‌ మినీ వేలంలో రాహుల్ చహర్‌ను రూ. 5. 20 కోట్లకు కొనుగోలు చేసింది. చాహర్‌ సీఎస్‌కే తరఫున దేశీయ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో ఉంటాడు. గతంలో వివిధ ఫ్రాంచైజీలకు ( MI, PBKS, SRH) ఆడిన చాహర్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 79 మ్యాచ్‌ల్లో 75 వికెట్లు సాధించాడు. ఈ సీజన్‌ను సీఎస్‌కే మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది.

    2026 ఐపీఎల్‌ సీజన్‌ కోసం సీఎస్‌కే జట్టు..
    రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఎం.ఎస్. ధోనీ, సంజు సాంసన్, డెవాల్డ్ బ్రెవిస్, అయుష్ మాఠ్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అంషుల్ కాంబోజ్, ముకేశ్ చౌధరి, శ్రేయాస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అకీల్ హొసేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహర్, స్పెన్సర్ జాన్సన్

  • పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెప్టెన్ల ప్రెస్‌ మీట్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌డేవిడ్ వార్నర్ సహచర కెప్టెన్లపై ఫైర్‌ అయ్యాడు. వార్నర్‌ విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తుండగా ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ రిజ్వాన్‌, మార్నస్‌ లబూషేన్‌ నవ్వుకుంటూ కనిపించారు. 

    దీంతో చిర్రెత్తిపోయిన వార్నర్‌ వారికి గట్టిగా చురకలంటిచ్చాడు. What’s wrong with you..? Sorry gentlemen, we have got school kids here అంటూ అసహనం ‍ప్రదర్శించాడు. ఎప్పుడూ సరదాగా ఉండే వార్నర్‌ ఇలా రియాక్ట్‌ కావడంతో విలేకరులు సహా అక్కడున్న వారంతా కాసేపు షాక్‌లో ఉండిపోయారు.

    ఇదిలా ఉంటే, 2026 ఎడిషన్‌ పాక్‌ సూపర్‌ లీగ్‌ ఇవాళ (మార్చి 26) ప్రారంభ​మైంది. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇంధన సంక్షోభం ఏర్పడటంతో ఈ లీగ్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అవి కూడా కేవలం రెండు వేదికల్లో మాత్రమే జరుపుతున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది నేతృత్వంలోని లాహోర్‌ ఖలందర్స్‌, మార్నస్‌ లబూషేన్‌ నేతృత్వంలోని కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ తలపడుతున్నాయి.

     

  • ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్‌ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.

    253 పరుగుల భారీ స్కోరు
    ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

    టాపార్డర్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆశలు రేపాడు.

    బెతెల్‌ విధ్వంసకర సెంచరీ
    కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్‌ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్‌ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

    ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్‌ బెతెల్‌ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.

    వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు
    ఈ విషయం గురించి బెతెల్‌ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

    కాగా 22 ఏళ్ల బెతెల్‌ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్‌ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.

    చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

  • ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20 మ్యాచ్‌లతో కలుపుకొని లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో వెలువడుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు.  

    కాగా, తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్‌లో 10 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి విడత నాలుగు మ్యాచ్‌లతో కలుపుకొని సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌ లీగ్‌ దశ మొత్తంలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది.

    రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లోనే (ఏప్రిల్‌ 13) ఎస్‌ఆర్‌హెచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరుగనుంది.

    ఏప్రిల్‌ 18- సీఎస్‌కేతో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
    ఏప్రిల్‌ 21- ఢిల్లీ క్యాపిటల్స్‌తో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
    ఏప్రిల్‌ 25- రాజస్థాన్‌ రాయల్స్‌ (జైపూర్‌, రాత్రి 7:30 గంటలకు)
    ఏప్రిల్‌ 29- ముంబై ఇండియన్స్‌ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)
    మే 3- కేకేఆర్‌ (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)
    మే 6- పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
    మే 12- గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)
    మే 18- సీఎస్‌కే (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)
    మే 22- ఆర్సీబీ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)

    తొలి దశలో ప్రకటించిన షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు..
    మార్చి 28- ఆర్సీబీతో (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)
    ఏప్రిల్‌ 2- కేకేఆర్‌తో (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)
    ఏప్రిల్‌ 5- లక్నో సూపర్‌ జెయింట్స్‌తో (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)
    ఏప్రిల్‌ 11- పంజాబ్‌ కింగ్స్‌తో (ముల్లాన్‌పూర్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.

    తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్‌లో టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్‌ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్‌ ఇలా ఉండబోతుంది.

    • ఐపీఎల్‌ తర్వాత జూన్‌ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఏకైక టెస్ట్‌ మరియు 3 వన్డేల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ జూన్‌ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగనుంది. అనంతరం  ధర్మశాల (జూన్‌ 14), లక్నో (జూన్‌ 17), చెన్నై (జూన్‌ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.

    • అనంతరం భారత్‌ జులైలో ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్‌ లీ స్ట్రీట్‌, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌, ట్రెంట్‌ బ్రిడ్జ్‌, బ్రిస్టల్‌, సౌథాంప్టన్‌ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, కార్డిఫ్‌, లార్డ్స్‌లో జరుగనున్నాయి.

    • సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్‌ 27, 30, అక్టోబర్‌ 3 తేదీల్లో తిరువనంతపురం​, గౌహతి, ముల్లాన్‌పూర్‌ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్‌ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్‌, డెహ్రాడూన్‌, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.

    తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..

    • టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

    • డిసెంబర్‌లో శ్రీలంక భారత్‌లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు డిసెంబర్‌ 13, 16, 19 తేదీల్లో  ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి.

    • వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి.  
       

  • ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ దశలో లీగ్ స్టేజ్‌లో మిగిలిన 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి.  ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు దేశంలోని 12 వేదికలపై జరగనున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి దశ షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. 

    మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు జరుగున్నాయి. తొలి దశ 20, రెండో దశ 50 కలిపి లీగ్‌ స్టేజ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్‌ వేదికలు తరువాత ప్రకటించబడతాయి.

    రెండో దశ మ్యాచ్‌ల వేదికలు

    • బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయపూర్, న్యూ చండీగఢ్‌

    • రెండో దశలో తొలి మ్యాచ్‌ ఏప్రిల్ 13న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది.  

    • రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్న మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

      కాగా, దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు. 


     

  • గతేడాది చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే). చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌లో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని జట్టును ముందుకు నడిపాడు.

    ఊహించని నిర్ణయం
    అయితే, పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది సీఎస్‌కే. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు సీఎస్‌కే ఊహించని నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్‌, సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను ట్రేడ్‌ చేసింది.

    సంజూ శాంసన్‌ చేరిక
    జడ్డూను రాజస్తాన్‌ రాయల్స్‌కు ఇచ్చేసి.. అతడికి బదులుగా ఆ జట్టు కెప్టెన్‌, టీమిండియా టీ20 స్టార్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)ను జట్టులో చేర్చుకుంది. దీంతో వికెట్‌ కీపింగ్‌లో ధోని వారసుడిగా సంజూ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు రుతురాజ్‌ గైక్వాడ్‌ను కాదని సంజూను కెప్టెన్‌ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, సీఎస్‌కే మాత్రం రుతుకే మరోసారి పగ్గాలు అప్పగించింది.

    నాతో పాటు ఓపెనర్‌గా
    ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ పాత్ర ఏమిటన్న అంశంపై రుతురాజ్‌ గైక్వాడ్‌ తాజాగా స్పందించాడు. ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశానికి రుతు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను, సంజూ ఈసారి ఓపెనర్లుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా ఈసారి సీఎస్‌కే ఓపెనింగ్‌ జోడీ ఎవరన్న ప్రశ్నకు తెరదించాడు.

    కాగా ఓపెనర్‌గా రుతుకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి 60 ఇన్నింగ్స్‌లో అతడు 2289 పరుగులు చేశాడు. అయితే, గతేడాది రచిన్‌ రవీంద్ర, రాహుల్‌ త్రిపాఠి సీఎస్‌కే ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. మూడో స్థానంలో రుతురాజ్‌ వచ్చాడు.

    ఓపెనర్‌గానే బెస్ట్‌
    ఇక ఇప్పటికి ఓవరాల్‌గా వన్‌డౌన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ ఆడిన రుతు కేవలం 208 పరుగులే చేశాడు. దీంతో మరోసారి తానే ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. టీమిండియా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా సంజూకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.

    చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌ అందుతుంది. స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. హాజిల్‌వుడ్‌ ఈ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే అతను సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో జోష్‌ నింపాడు. 

    తమ బౌలింగ్‌ యూనిట్‌కు బ్యాక్‌ బోన్‌ అయిన హాజిల్‌వుడ్‌ జట్టులో చేరడంతో ఆర్సీబీ టైటిల్‌ నిలబెట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేస్తుంది. గత ఎడిషన్‌లో ఆర్సీబీ టైటిల్‌ గెలవడంలో హాజిల్‌ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న హాజిల్‌వుడ్‌, ఎట్టకేలకు జట్టులో చేరడంతో ఆర్సీబీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 12.5 కోట్లకు రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

    బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే.. రూ. 1.6 కోట్లకు రీటైన్‌ చేసుకోబడిన నువాన్‌ తుషార (శ్రీలంక) ఈ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ కారణాల చేత లంక క్రికెట్‌ బోర్డు అతనికి ఎన్‌ఓసీ మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్‌ 2026లో పాల్గొనడానికి అనర్హుడయ్యాడు. తుషారపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకొని ఉండింది. డెత్‌ ఓవర్లలో అతని వైవిధ్యం జట్టుకు ఉపయోగపుడుతుందని భావించింది. అయితే చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.

    తుషార అంశం బయటికి రాక​ ముందే ఆర్సీబీ పేస్‌ బౌలింగ్‌ విభాగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ యశ్‌ దయాల్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు.

    ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరంభ మ్యాచ్‌తోనే తమ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో మార్చి 28న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. 

    ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రజత్‌ పాటిదార్‌ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సీజన్‌తో పోలిస్తే, ఆర్సీబీలో పెద్ద మార్పులు జరగలేదు. విరాట్‌ కోహ్లి, టిమ్‌ డేవిడ్‌, జేకబ్‌ బేతెల్‌, కృనాల్‌ పాండ్యా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఫిల్‌ సాల్ట్‌, రొమారియో షెపర్డ్‌, జితేశ్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తదితర ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు.

     

  • 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా హోం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు (9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్ట్‌లు) జరగనున్నాయి.

    ఈ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో మొదలవుతుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో.. టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి.  

    డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటలో మూడు వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. మూడు టీ20లు రాజ్‌కోట్, కటక్, పూణేలో షెడ్యూల్‌ అయ్యాయి.  

    వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు ఉంటాయి. ఇవి కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి.  

    ఈ హోం సీజన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం​ ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 21వ తేదీ నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతుంది. తరువాతి మ్యాచ్‌లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

    ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌-19వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌ను భార‌త మాజీ ఓపెన‌ర్ అభిన‌వ్ ముకుంద్ అంచనా వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంద‌ని అత‌డు జోస్యం చెప్పాడు. 

    కాగా గ‌తేడాది 17 ఏళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా గ‌త సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ సైతం ఈసారి  ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంద‌ని ముకుంద్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ రెండు జ‌ట్ల‌తో పాటు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తాయని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.

    కాగా సీఎస్‌కే గ‌త రెండు సీజ‌న్ల‌లోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. కానీ ఈసారి మాత్రం 'యెల్లో ఆర్మీ', ఖచ్చితంగా టాప్-4లో ఉంటుందని ముకుంద్ భావిస్తున్నాడు. అయితే ముకుంద్ త‌న ఎంచుకున్న టాప్‌-4లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మూడు సార్లు ఛాంపియ‌న్ కేకేఆర్ జ‌ట్ల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
    చదవండి: IPL 2026: మ‌రో 2 రోజుల్లో ఐపీఎల్‌.. అంతలోనే బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

  • సౌతాఫ్రికా క్రికెటర్‌ కానర్‌ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు ఎస్తురూజెన్‌.

    సంగక్కర రికార్డు బద్దలు
    తద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్‌ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఎస్తురూజెన్‌ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

    ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్‌ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్‌పై 69 పరుగులు చేశాడు.  

    33 పరుగుల తేడాతో..
    మ్యాచ్‌ విషయానికొస్తే.. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. 

    ఈ సిరీస్‌ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్‌ కైవసం చేసుకుంది.

    ధనాధన్‌ హాఫ్‌సెంచరీ
    న్యూజిలాండ్‌ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

    గత మ్యాచ్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్‌ ఎస్తురూజెన్‌ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్‌ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు.

    రుబిన్‌ హెర్మన్‌ (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ముల్డర్‌ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. కివీస్‌ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్‌ భారీ షాట్‌లతో చెలరేగిపోయాడు.

    నాలుగో వికెట్‌కు ఫోరెస్టర్‌ (21 నాటౌట్‌)తో కలిసి కానర్‌ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో బెన్‌ సీర్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

    154 పరుగులకు పరిమితం
    అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్‌ జాకబ్స్‌ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ జేమ్స్‌ నీషమ్‌ (24), టిమ్‌ రాబిన్‌సన్‌ (25), క్లీవర్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు.

    అయితే, కివీస్‌ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్‌ ఎస్తురూజెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 

    చదవండి: IPL 2026: ప్యాట్‌ కమ్మిన్స్‌ కీలక ప్రకటన

  • ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

    ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి నివాళిగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎలాంటి  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు.

    గతేడాది జూన్ 4న జరిగిన విషాదకర సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి  గౌరవార్థం ఈసారి  ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేయాలని నిర్ణయించాము. ఎలాంటి వేడుకలు లేకుండానే ఐపీఎల్‌-19వ సీజన్ ప్రారంభం కానుందని సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.

    అదేవిధంగా మరణించిన 11 మంది అభిమానులకు కర్ణాటక క్రికెట్ అసోయేషన్‌, ఆర్సీబీ కూడా ఘన నివాళి అర్పించేందుకు సిద్దమయ్యాయి. వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు. 

    అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా, ఈ వేదికపై జరిగే అన్ని కార్యక్రమాల సమయంలో ఆ సీట్లు ఇకపై ఖాళీగా ఉండనున్నాయి. ఆర్సీబీ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు. కాగా ఆరంభ వేడుకలను రద్దు చేసిన బీసీసీఐ, క్లోజింగ్‌ సెర్మనీ మాత్రం ఘనంగా నిర్వహించే అవకాశముంది.
    చదవండి: IPL 2026: ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌.. టికెట్లు బుకింగ్‌ ఎప్పటినుంచి అంటే?

Crime

  • సాక్షి, హైద‌రాబాద్‌: భూకబ్జాలను అడ్డుకోవాల్సిన పోలీసే దర్జాగా ఆక్రమణకు తెగబడ్డాడు. ఏకంగా భూకబ్జాదారులతో చేతులు కలిపి ఖాళీ స్థలాల్లో పాగా వేశాడు. కీసర పోలీసు స్టేషన్‌లో నమోదైన రెండు భూకబ్జా కేసుల్లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ) అధికారితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

    మల్కాజిగిరి డీసీపీ సీహెచ్‌. శ్రీధర్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్న భూములు, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన స్థలాలపై కన్నేసి, నకిలీ పత్రాలను సృష్టించే ముఠా సభ్యులు ప్రవీణ్‌ రెడ్డి, మోడెమ్‌ సంపత్, కాంబ్లే దీపలతో ఏఎస్‌ఐ కనకాటి లింగయ్య గౌడ్‌ జట్టు కట్టాడు.

    ఈ ముఠా ప్రధానంగా ఖాళీగా ఉన్న ప్లాట్లను, యజమానులు అందుబాటులో లేని భూములను లక్ష్యంగా చేసుకుంటుంది. తొలుత అసలు యజమానుల వివరాలు సేకరించి, వారు చనిపోయినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికేట్లు సృష్టిస్తారు. ఆపై నకిలీ వారసులను పుట్టించి, గిఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ డీడ్‌లు, సేల్‌ డీడ్‌ల ద్వారా భూములను తమ అనుచరుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేయిస్తారు.

    రెండు వేర్వేరు కేసులు.. 
    ఈ నెల 16, 17 తేదీల్లో కేశబోయిన రమాదేవి, మాధురి అనే ఇద్దరు మహిళా బాధితులు తమ భూములను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు బదలాయించారని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఖాళీ స్థలాలను వెతికి యజమాని మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ల వరకు అన్నింటినీ ఫోర్జరీ చేస్తూ, యజమానులకు తెలియకుండానే ఆస్తులను రిజిస్ట్రేష‌న్ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

    సాంకేతిక ఆధారాలతో మొదటి కేసులో ఏఎస్‌ఐ కనకాటి లింగయ్య గౌడ్, ప్రవీణ్‌ రెడ్డి, మోడెమ్‌ సంపత్, కాంబ్లే దీపలను, రెండో కేసులో ఉప్పల వేణు, దొనపాటి వెంకట్‌ రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మిగతావారి కోసం గాలిస్తున్నారు.  

  • అనంతపురం: తాడిపత్రి బాలుడి కిడ్నాప్ విషాదాంతమైంది. ఏడేళ్ల బావమరిదిని హేమచంద్రను బావ సర్వేష్ ప్రాణం తీసినట్లు పోలీసులు గుర్తించారు.

    యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో బాలుడిని సర్వేష్‌ కిడ్నాప్‌ చేశాడు. అయితే, స్కూల్‌ నుంచి ఇంటి రావాల్సిన హేమచంద్ర ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    ఈ దర్యాప్తులో అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో బాలుడి అక్క భర్త సర్వేష్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు.  బాలుడిని సర్వేష్‌ కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డబ్బు కోసం నిందితుడు సర్వేష్ తన బావమరిదిని హత్య చేసినట్లు అంగీకరించాడు.  పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా, నిర్జీవంగా పడి ఉన్న హేమచంద్ర మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

National

  • రిలయన్స్‌ ఫౌండేషన్‌  చైర్‌పర్సన్‌ నీతా అంబానీ  కళలు, సంస్కృతిపై  ప్రేమను  చాటుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.  భక్తిని, వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించే అందమైన చీరలో స్పెషల్‌గా మెరిసారు.  శ్రీరామ నవమి పవిత్ర సందర్భాన, భక్తిని,  భారతీయ వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పే ఒక చీర గురించి అంటూ నీతా లుక్‌కుసంబంధించిన ఫోటోలను ఎన్‌ఎంఏసీసీ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

    హస్తకళల ద్వారా ఒక సంస్కృతిని గౌరవించడం అనేది ఆ కళాకారుల శ్రమకు నిజమైన గుర్తింపు నివ్వడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు.  ఇటీవల ఒడిశాలోని కేఐఐటీ (KIIT)లో నీతా గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు, ఆమె ఆ ప్రాంతపు కాలాతీత హస్తకళలను గౌరవించారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం, ఆమె మట్టి రంగులలోని ఒక సుందరమైన ఇక్కత్‌  (Ikat) చీరను ఎంచుకున్నారు. స్వదేశ్ నేత కళాకారుడు హరిశంకర్ మెహర్ దీన్ని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఒడిశాలోని గొప్ప నేత వారసత్వానికి ప్రతిబింబమైన ఈ చీరను నీతాకు ఆయన  బహూకరించారు.

    సహజమైన రంగులను ఉపయోగించి, సాంప్రదాయ బంధ (Bandha)పద్ధతిలో నేసిన ఈ చీర, భక్తిని,డిజైన్‌ మేళవింపుగా అందంగా రూపొందింది. దీని ప్రధాన భాగంలో రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది. దానిపై సార్వజనీన విశ్వాసానికి  ప్రతీకగా "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించారు. కొంగుపై ఒడియా లిపిలో పవిత్ర మంత్రాలు, సాంప్రదాయ ఇక్కత్‌ నమూనాలలో నేయడం విశేషం.

    ఇదీ చదవండి: ఐపీఎల్‌ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
     

    నీతా చీర ప్రత్యేకతలు
    సహజ సిద్ధమైన రంగులలతో  సాంప్రదాయ 'బంధ' (Bandha) ప్రక్రియలో ఈ చీరను నేశారు. పవిత్రమైన పల్లు, రామనామాలు ఈ చీర ప్రత్యేకతలు.

    చీర మధ్య భాగంలో (Body) 'రామ శిల' స్ఫూర్తితో కూడిన డిజైన్ ఉంది. ఇందులో "రామ్" అనే పదం వివిధ భాషలలో లిఖించబడి, విశ్వవ్యాప్తమైన భక్తిని చాటిచెబుతోంది. చీర పల్లూ భాగంలో పవిత్రమైన మంత్రాలను ఒడియా లిపిలో, క్లాసిక్ ఇక్కత్ నమూనాలతో కలిపి అత్యంత నైపుణ్యంతో నేశారు.

    ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

    కేవలం ఇదొక వస్త్రంగానే కాకుండా, ఈ చీర సంప్రదాయం, ఆధ్యాత్మికత మరియు కథాకౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. మన వస్త్రాలు మన సంస్కృతిని, భక్తిని , కాలాతీత జ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం.

    ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్‌ లవ్‌ ప్రపోజ్‌..కట్‌ చేస్తే, వీడియో వైరల్‌

  • 2026 ఐపీఎల్ సీజన్ (BCCI-IPL 2026) శనివారం  ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  శాసనసభలో  ఒక కీలక ప్రతిపాదన చేశారు. తమ లాంటి వీఐపీలు క్యూలో నిలబడలేరు కాబట్టి ప్రతీ మ్మెల్యేకు  కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఐదు టిక్కెట్లను అందించాలని కోరారు. హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.

    హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ కశపనవర్  ప్రతీ ఎమ్మెల్యేకు ఐదు టికెట్లతోపాటు, శాసనసభ్యులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా క్రికెట్‌ సంఘాన్ని కోరడం విశేషం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంవారు  ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వారికి అన్ని భద్రతలూ లభిస్తున్నాయి. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. కానీ వారు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి కుటుంబాలకు ఐపీఎల్‌ టిక్కెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు విఐపీలు కాబట్టి వారు  క్యూలో నిలబడలేరు వారి  5  టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోయినసారి  ప్రజలతోపాటు క్యూలోనే నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం అలా జరగనివ్వమని  వ్యాఖ్యానించారు.

    ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకంలో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కూడా కశపనవర్ ఆరోపించారు. అందుకే తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో  లేవనెత్తిన ఈ విషయానికి తాము మద్దు తెలిపామనిఅవసరమైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలకు కనీసం 5 టిక్కెట్లు జారీ చేయాలని స్పీకర్‌ను కోరామన్నారు.  వాళ్లు ఎవరి మాట వినరు. అంత పెద్దవాళ్లైపోయారు. డబ్బులు వసూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ  కశపనవర్ కేఎస్‌సీఏపై విమర్శలు గుప్పించారు.

    అంతకుముందు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి చెందిన ఆర్.అశోక, కేఎస్‌సీఏపై ధ్వజమెత్తారు. నెలకు కేవలం రూ. 1,600 నామమాత్రపు ధరకు వారికి 16.32 ఎకరాలిచ్చాము. వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి కానీ వారు మ్యాచ్ టిక్కెట్ల కోసం తమ నుండి వేల రూపాయలు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం మరో స్టేడియం నిర్మించాలను కుంటోంది. వారికి గుణపాఠం నేర్పాలి అంటూ అసెంబ్లీలో మండిపడ్డారు.

    దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సంస్థాగత జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తప్పక KSCAతో చర్చలు జరపాలన్నారు.  కొన్నిసార్లు ఎమ్మెల్యేలకు కేవలం ఒక టికెట్‌ మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి కుటుంబ సభ్యులకు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని వారికి స్పష్టం చేయాలని ఖాదర్ అన్నారు. 

    ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్‌ లవ్‌ ప్రపోజ్‌..కట్‌ చేస్తే, వీడియో వైరల్‌
     

    డీకే హామీ
    ఈ విషయాన్ని KSCA అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సభకు హామీ ఇచ్చారు.  అధ్యక్షుడితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాను. అడిగే హక్కు ఎమ్మెల్యేలకు పూర్తిగా ఉంది, వారికి ఆ ప్రయోజనం దక్కాల్సిందనని డీకే అన్నారు. అంతేకాదు "ఇది 'సమ్రాట్' అశోక్ నుండి వచ్చిన అభ్యర్థన అని తాను వారికి కచ్చితంగా చెబుతానంటూ సరదాకా కామెంట​ చేయడంతో సభలోనవ్వులు పూసాయి. కాగా 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ ప్రారంభం కానుంది.

    ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

  • బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దిగ్భ్రాంతి రేపుతోంది.  మెడికల్‌ కాలేజీ  ప్రొఫెసర్  లవ్‌ ప్రపోజల్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నెలమంగళ సమీపంలోని టి. బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    అసలేం జరిగింది?
    క్లాస్ జరుగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్  ఉన్నట్టుండి మైక్ పట్టుకుని విద్యార్థులందరి ముందు ఒక విద్యార్థినికి తన ప్రేమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనకు లవ్‌ ప్రపోజ్‌ చేసిందనీ, దీంతో తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని ఆయన క్లాసులో అందరి ముందు ప్రకటించారు. అందరికీ చాక్లెట్లు పంచాడు. దీన్ని సదరు విద్యార్థిని వ్యతిరేకించడంతో వాగ్వాదం జరిగింది.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా? ఐ లవ్ యూ అని చెప్పావు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. ‘నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను? ఆధారాలు చూపించండి’ అంటూ ఆమె గట్టిగా వ్యతిరేకించింది. 

    సీసీటీవీ ఫుటేజీ ఉంది, కావాలంటే చూసుకోండి అని ప్రొఫెసర్‌  కొంచెం గట్టిగా వాదించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె ‘ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం పద, క్లాస్ అంతా వస్తారు’ అనడంతో రేపు మాట్లాడుకుందాం అంటూ అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు సదరు ప్రొఫెసర్ .

    అడ్డుకున్న విద్యార్థులు 
    ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ప్రొఫెసర్‌ను నిలదీశారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, ప్రొఫెసర్‌ను ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో  క్యాంపస్‌లో గందరగోళం నెలకొంది. 

    ఇదీ చదవండి: హోర్మూజ్ తరువాత : ట్రంప్‌కు ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
    ఇది పోలీసుల దాకా చేరింది. నెలమంగళ రూరల్ పోలీసులు కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.అటు  ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. మెడికల్ కాలేజీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

  • భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. 

    అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

    ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్‌గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.

    ప్రతి ఏటా మీకు వడ్డీ 
    చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్"  వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.

    భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే  అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.

    ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?
    ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.

    అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్"  కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.  -వెబ్‌డెస్క్‌

     

  • మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో  అంతరాయాలు వస్తాయనే ఆందోళనతో, వినియోగదారుల ప్యానిక్‌ కొనుగోళ్లతో దేశంలో పెట్రోలుబంకుల వద్ద రద్దీ ఏర్పడింది. మరోవైపు  దేశానికి సరిపడా ఇంధన నిల్వలున్నాయని, ఆందోళన అవసరం లేదని కేంద్రం పదే పదే స్పష్టతనిస్తోంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వినియోగదారులకు షాకిచ్చింది.

    మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది, పెట్రోల్‌పై లీటరుకు రూ.5 పెంచింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.3 పెంచేసింది. భారతదేశంలోని 1,02,075 పెట్రోల్ పంపులలో 6,967 పంపులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ముడిసరుకు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగ దారులపై మోపాలని నిర్ణయించింది.ఈ పెంపు నయారా బంకుల్లో మాత్రమే. నేటి నుండి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.

    మరోవైపు పెట్రోల్, డీజిల్ అనేవి నియంత్రణ లేని వస్తువులని, వాటి ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్వతంత్రంగా నిర్ణయిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నయారా వంటి ప్రైవేట్ సంస్థలకు అటువంటి రాయితీలు ఉండవు గనుక పెరిగిన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని సంస్థ వర్గాలు తెలిపాయి.

    కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఒక దశలో ముడిచమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరుకుంది. దేశంలోని 90శాతం మార్కెట్‌ను నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థలు (IOC, BPCL, HPCL))ఇప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.అయితే, గత వారం ఇవి కూడా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు  రూ.2, పారిశ్రామిక అవసరాల కోసం వాడే బల్క్ డీజిల్ ధరను లీటరుకు సుమారు  రూ.22 పెంచాయి.

  • తెలంగాణా  శాసనసభలో  'ఇప్ప సారా'  తీవ్ర దుమారం రేపింది. బుధవారం నాటి సభలో ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్‌ స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు.  

    ఇది ఇలా ఉంటే.. ఇప్పసారాపై ఒక్కసారి  ఆసక్తి పెరిగింది.  గతంలో గిరిజన ప్రాంతాల్లో లభించే స్వచ్ఛమైన ఇప్ప సారాను తాగిన వారు 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారనేది  చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్ప సారా సంగతులేంటో ఒకసారి చూద్దాం.

    మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజాలు తరతరాలుగా ఇప్పపువ్వుల సారాను వ్యక్తిగత , సామూహిక వినియోగం కోసం తయారు చేసుకుంటారు.  ఇప్పపువ్వుతో తయారుచేసే సార (మహువా డ్రింక్‌) సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో దీనిని ఒక సంప్రదాయ పానీయంగా భావిస్తారు. 

    గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టు (Madhuca longifolia)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండబెట్టిన పువ్వులను నీటిలో నానబెట్టి, సహజంగా పులియబెడతారు. ఈ పువ్వులలోని సహజ చక్కెరలతో ఆల్కహాల్‌గా మారతాయి. ఇప్ప పువ్వుతో కేవలం మద్యం మాత్రమే కాకుండా లడ్డూలు, బిస్కెట్లు, కేకులు వంటి పోషక ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు.

    ఇప్ప పువ్వు లడ్డూ
    గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, పోషకమైన లడ్డూ భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆదివాసీల సాంప్రదాయ, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన లడ్డూ. చాలా రుచిగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిల్వ కూడా ఉంటాయి. ఇది  ఎండు ఇప్ప పూలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు., రక్తాన్ని శుద్ధి చేయడంలో, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


    ఇప్పపువ్వులో ఉండే పోషక విలువలు 

    • ఇప్పపువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలను కలిగి ఉంటాయి

    • ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.విటమిన్ సి, కాల్షియం ,ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

    • దీని లోని ఔషధ గుణాల నేపథ్యంలో ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఇప్పపువ్వులను దగ్గు, బ్రోన్కైటిస్ మరియు కండరాల నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.

    • ఇక ఇప్పసారా లాభాలు : ఎలాంటి కల్తీలేకుండా, సహజంగా  పద్దతుల్లో తయారుచేసిన  ఇప్పసారాను నియంత్రిత పద్ధతిలో తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయని  నమ్ముతారు. 

    • గిరిజన సంప్రదాయాల ప్రకారం అలసటను తగ్గించడానికి . కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.

    • ఒంటి వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

    • ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుందని కొందరు భావిస్తారు.
       

    • అతిసర్వత్రా వర్జయేత్‌..నష్టాలు : లాభాలున్నాయి కదా అని అతిగా ఇప్పసారాని సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం.  అన్ని మద్య పానీయాల మాదిరిగానే దీనికీ నియంత్రణ అవసరం. అంతేకాదు కల్తీ సారా తాగడం ప్రాణాలకే ప్రమాదం. 

    • బయట దొరికే ఇప్పసారాలో మత్తు కోసం యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతారు. ఇది కాలేయం (Liver) , కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది.  చివరికి మరణానికి దారి తీస్తుంది.

    • అతిగా సేవించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.  ప్రవర్తనలో మార్పులతోపాటు  జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.

    నోట్‌ : ఇప్పపువ్వులను ఆహారంగా (లడ్డూలు లేదా పొడి రూపంలో) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, కానీ దానిని 'మద్యం' రూపంలో తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఆరోగ్య సమస్యల కోసం దీనిని వాడాలనుకుంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లైసెన్స్ లేకుండా ఇప్పసారా తయారు చేయడం లేదా విక్రయించడం నేరం. మనిషి వందేళ్లు  బతకడం  ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతోపాటు జీవన శైలి,  పోషకాహారంతో  కూడిన ఆహార అలవాట్లు,  జీన్స్‌  లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలంటున్నారు నిపుణులు. 

    ఇదీ  చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

  • పుదుపల్లి: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ అభ్యర్థి ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్భాటాలు లేవు, భారీ కటౌట్లు అసలే లేవు. కేవలం ఒక సైకిల్, ఒంటిపై తండ్రి బొమ్మ ఉన్న టీషర్ట్.. ప్రజల ఆశీస్సులు కోరుతూ పుదుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనయుడు, ప్రస్తుత యూడీఎఫ్ అభ్యర్థి చాందీ ఊమెన్ తనదైన శైలిలో ‘గ్రీన్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు.

    హోరెత్తే ప్రచారానికి స్వస్తి
    సాధారణంగా ఎన్నికలంటే వీధివీధినా వెలిసే భారీ ఫ్లెక్సీలు, మైకులతో హోరెత్తే ప్రచార రథాలు గుర్తొస్తాయి. కానీ, పుదుపల్లిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పోస్టర్లు గోడల నిండా కనిపిస్తున్నా, చాందీ ఊమెన్ మాత్రం ఎక్కడా ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో యుద్ధం, మానవీయ సంక్షోభం నెలకొన్న వేళ.. ప్రచారం కోసం అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది సరైన సమయం కాదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారం కోసం ఖర్చు చేసే నిధులను నియోజకవర్గంలోని పేదల కోసం 100 ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రచార ఆర్భాటాల కంటే పేదలకు గూడు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

    రోజూ సైకిల్‌పై..
    ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే తన హైబ్రిడ్ సైకిల్‌పై చాందీ ఊమెన్ ప్రయాణం మొదలవుతుంది. తన తండ్రి ఫోటో ఉన్న వైట్ టీషర్ట్ ధరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇరుకు దారుల్లో సైకిల్ తొక్కుతూ ప్రతి ఇంటిలోని వారినీ ఆయన పలకరిస్తున్నారు. ‘గతంలో పాదయాత్ర చేశాను, కానీ సైకిల్ అయితే గంటకు 31 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునే అవకాశం నాకు దక్కుతోంది’ అని ఆయన వివరించారు. దారి పొడవునా స్కూలు పిల్లలతో ముచ్చటిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు అడుగుతూ, సెల్ఫీలు ఇస్తూ సాగుతున్న ఆయన యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.

    తండ్రి వారసత్వం
    పుదుపల్లి అంటే ఊమెన్ చాందీకి పెట్టని కోట. 2023 ఉప ఎన్నికల్లో తన తండ్రి సాధించిన మెజారిటీ (9,000) కంటే ఎక్కువగా, దాదాపు 37,000 ఓట్ల మెజారిటీతో చాందీ ఊమెన్ విజయం సాధించారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద సలహా ‘ఎప్పుడూ ప్రజలతోనే ఉండు, ఎవరినీ నొప్పించకు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం తన నియోజకవర్గంపై వివక్ష చూపుతోందని, తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు.

    తండ్రి అడుగుజాడల్లోనే..
    చాందీ ఊమెన్ ప్రచార శైలిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన ఏమాత్రం అలసట లేకుండా గంటల తరబడి సైకిల్ తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన తండ్రి లాగే నిరాడంబరంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది’ అని ఓటర్లు అంటున్నారు. ఆయన వెనుక అనుచరులు, భద్రతా సిబ్బంది వాహనాలు ఉన్నప్పటికీ, చాందీ ఊమెన్ మాత్రం సామాన్యునిలా సైకిల్‌పైనే ప్రజల్లో మమేకమవుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం 8:30 గంటల వరకు ప్రచారం ముగించి, కొద్దిసేపు టిఫిన్ విరామం తీసుకుని తిరిగి తన తదుపరి షెడ్యూల్‌లో బిజీ అయిపోతున్నారీ యువ నేత.

    ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్‌

Family

  • కొత్త రుచులను నగరవాసులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.. పంజాబ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌ నగరంలో నివాసం ఉండేవారి కోసం వెలిసిన దాబాలు క్రమంగా చేరువయ్యాయి. దశాబ్దాలుగా భాగ్యనగర సిటీవాసులు పంజాబీ రుచులను భల్లే భల్లే అంటూ ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు హైవేలపై ప్రత్యక్షమయ్యే దాబాలు ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి నచ్చిన రెసిపీలను లాగించేస్తున్నారు ఫుడ్‌ లవర్స్‌.. ఆయా ఫ్లేవర్లలో లభించే లస్సీని ఈ సమ్మర్‌లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే అంటున్నారు.   

    శామీర్‌పేట్‌ వద్ద(హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ) ఉన్న పంజాబీ దాబా, లాంగ్‌ డ్రైవ్‌కు 
    వెళ్లినప్పుడు సేద తీరడానికి పలువురు పంజాబీ హవేలీ దాబాను ఎంచుకుంటారు. ఇది సంప్రదాయ పంజాబీ హైవే ఆహారాన్ని, విలక్షణమైన, రంగురంగుల హవేలీ డిజైన్లతో మిళితం చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన భారీ బాహుబలి లస్సీ సహా వెన్న పూసిన పరాటాలు, అమృత్‌సరి కుల్చాలు ఉంటాయి. విశేషం ఏమిటంటే.. ప్రాంగణంలో ఒక సెల్ఫీ మ్యూజియంలో ఎంజాయ్‌ చేయవచ్చు.  

    హైటెక్‌ థ్రిల్‌.. హైవే ఫీల్‌.. 
    కొండాపూర్‌లో ఉన్న చార్పాయ్‌ దాబా విలక్షణమైన అలంకరణ మంచాల మీద కూర్చునే ఏర్పాటుతో పాటు ఫైన్‌ డైనింగ్‌ సీటింగ్‌తో ఆధునిక దాబా భావనను అందిస్తుంది. ఇక్కడి మెనూలో సంప్రదాయ ఉత్తర భారతీయ థాలీలు, శాఖాహారం, మాంసాహారం రెండూ సృజనాత్మక మార్పులతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చైనీస్‌/ధాబా ఫ్యూజన్‌ స్టార్టర్స్, మెయిన్‌ కోర్సులను కూడా ఆస్వాదించవచ్చు. 

    సింపుల్‌.. హిస్టారికల్‌.. 
    సుదీర్ఘ కాలంగా బోయిన్‌పల్లిలో భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది లవ్లీ పంజాబీ దాబా. ఇది పూర్తి శాఖాహార పంజాబీ దాబా, ఇది చాలా సింపుల్‌గా ఆడంబరాలు లేకున్నా ఎంతో కాలంగా తనకు ఉన్న పేరు ప్రతిష్టలతో ఆకట్టుకుంటోంది. పరాటాలు, రోటీలు, పప్పు, కూరగాయలు కొన్ని ఇండోచైనీస్‌ వంటకాలతో నిండిన క్లాసిక్‌ పంజాబీ వంటకాలు మెనూలో ఎక్కువగా ఉంటాయి. అందుబాటు ధరల్లో ఐటవ్స్‌ు లభ్యమవుతాయని అంటుంటారు.

    హిల్స్‌లో కపూర్స్‌.. 
    నగరంలో అత్యంత ఖరీదైన, ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఉన్న కపూర్స్‌ కేఫ్‌ అచ్చం పంజాబీ థీమ్‌తో రూపొందింది. కృత్రిమ గడ్డిపై మంచాల సీటింగ్, రంగురంగుల అలంకరణతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చాలా ప్రశాంతమైన, ఆహ్లాదకర వాతావరణంతో ఇది పంజాబీ దాబా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పూర్తిగా శాఖాహార వంటకాలు మాత్రమే అందించే ఈ కేఫ్‌ ఆలూ పరాటా, బేడ్మి పూరి, చిక్కటి అమృత్‌సరి లస్సీ తదితర వంటకాలకు ప్రసిద్ధి.

    నార్త్‌ టూ సౌత్‌ 
    నగరంలోని పురాతన పంజాబీ దాబాలలో సాగర్‌ పాపాజీ కా దాబా కూడా ఒకటి.. అబిడ్స్‌లోని సాగర్‌ పాపాజీ కా దాబా, ఒక ఇంటి వంట ప్రాంగణంగా పేరొందింది. దీనిలో ఎటువంటి హంగామాలు, ఆధునిక అలంకరణలు ఉండవు. ఇది పూర్తిగా ఉత్తర భారత రుచులకు ప్రసిద్ధి చెందింది. దువా కుటుంబం 1985 నుంచి దీనిని నిర్వహిస్తోంది. దాల్‌ మఖానీ, ఆలూ పరాఠాల నుంచి ఖీమా ఫ్రై, తందూరీ రోటీల వరకు ఇంట్లో తయారు చేసిన రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ క్లాసిక్‌ చిక్కటి లస్సీ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన ఐటమ్‌ అంటారు ఫుడ్‌ లవర్స్‌.  

  • ఐరన్‌ డెఫిషియెన్సీ(ఐడిఏ)పై అవగాహన పెంచే క్రమంలో అంతర్జాతీయ పోషకాహార సంస్థ దానోన్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమం ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని భాగ్యనగరంలోని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య నిపుణులు రక్తహీనతను ఎదుర్కొనే విషయంలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. 

    2025 నవంబర్‌లో ప్రారంభించిన ‘ఐరన్‌ అప్‌’ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. ఈ కాంపెయిన్‌లో భాగంగా వైద్యులు అవగాహన పెంపు, సమయానుకూల నిర్ధారణ, పోషకాహార ప్రాముఖ్యతపై కృషి చేయాలని సంకల్పించారు. పిల్లల వైద్యులు, జనరల్‌ ఫిజీషియన్లు సహా అనేక మంది వైద్య నిపుణులు కార్యక్రమంలో భాగమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల్లో రక్తహీనతను తగ్గించేందుకు డానోన్‌ ‘స్వస్థ మాత స్వస్థ బాలక్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బీహార్‌లో అమలు చేస్తోంది. ఈ సందర్భంగా డానోన్‌ ఇండియా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ప్రియాంక వర్మ మాట్లాడుతూ.. ‘ఈ గుర్తింపు వైద్య సమాజం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో చూపిస్తుంది అని తెలిపారు. 

  • కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. తీరా ఏ సమస్యలు వచ్చినా..తట్టుకుని ముందుకు సాగి..సక్సెస్‌ అందుకునే నేర్పు, ఓర్పు కూడా అవసరం. కానీ ఇక్కడొక మహిళ లక్షల​ వేతనం కాదనుకుని సాహిత్య రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. సృజనాత్మక శక్తిపై ఆధారపడి ఉన్న రంగం, అన్ని వేళలా..అంతగొప్పగా రచనలు చేసే అవకాశం లేని దాంట్లోకి వెళ్లాలనుకోవడమే సాహసం అంటే..మంచి లగ్జరీ లైప్‌ని అనుభవించే ఉద్యోగాన్ని వదులకోవడం అంతకుమించిన సాహసం అనే చెప్పాలి. కానీ ఈ మహిళ అంత పెద్ద సాహసం చేసి కవియిత్రి అనుపించుకోవడమే ఇష్టం అని చెబుతోంది.

    ఆ అమ్మాయే 28 ఏళ్ల మాజీ కన్సల్టెంట్ అయిన నమ్రతా యాదవ్. ఆమె కవిత్వంపై అభిరుచితో సింగపూర్‌లోని కేపీఎంజీలో కార్పొరేట్‌ ఉద్యోగానికి స్వస్తి పలికింది. నిజానికి ఆమె న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2019, 2021 మధ్య నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలోకి రాకముందు ఆమె అక్కడ ఆరు నెలల పాటు రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 

    కన్సల్టింగ్‌ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యంతో ఒక పెద్ద సంస్థలో అనుభవం సంపాదించేందుకు కేపీఎంజీ(KPMG)లో చేరింది. అక్కడ వర్కింగ్‌ కల్చర్‌ కూడా నచ్చిందామెకు. ఏడాదికి దగ్గర దగ్గరగా రూ. 41 లక్షలు పైనే జీతం అందుకునేది. సింపుల్‌గా చెప్పాలంటే అక్కడ మంచి లగ్జరీ లైఫ్‌ని అనుభవించారామె. ఎలాంటి ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనలేదామె. అయితే ఆ ఉద్యోగం తన వ్యక్తిత్వానికి సరిపోదని భావించి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే సాహిత్యరంగంలోకి వచ్చేందుకు మొగ్గుచూపడం విశేషం. 

    ఎక్కువ గంటలు శ్రమతో కూడిన కార్పొరేట్‌ జీవితం తన వల్ల కాదనిపించదని అన్నారామె. దగ్గర దగ్గర 40 గంటల పని, వారాంతాల్లో విరామంగా లైఫ్‌ ఉండకూదనిపించిందట. దాంతో సింగపూర్‌ నుంచి భారత్‌కి వచ్చేసి, క్రమం తప్పకుండా హిందీలో కవిత్వాలు రాయడం ప్రారంభించానని అంటోంది. పైగా ఒక్కత్తే ఆ దేశంలో జీవించడం పట్ల ఉన్న ఆందోళన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని అంటోందామె. 2024 డిసెంబర్‌లో, లక్నోలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో స్పోకెన్ వర్డ్ పొయెట్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఎంపిక అవ్వడంతో తన డెసీషన్‌ సరైనదే అని నమ్రతకు నమ్మకం కలిగింది. 

    అంతేగాదు అక్కడ వేదికపై కవిత్వం చెబుతున్న వారిని చూసి అభిమానిగా మారడం కంటే..వారిలో ఒకరిగా తాను అవ్వాలనే కోరిక కలిగిందట. ఆ ఉత్సాహంతోనే సింగపూర్‌ని పూర్తిగా విడిచిపెట్టి భారత్‌కి వచ్చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిందట. అంతేగాదు ప్రస్తుతం ముంబైలో తన రచనలకు వీలుక ల్పించే ఉద్యగాన్ని వెతికే పనిలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మరో ఇద్దరు తనలాంటి క్రియేటివ్‌ వ్యక్తులతో కలిసి అపార్ట్‌మెంట్‌ షేర్‌ చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు తాను బాగా సంపాదించిన లైఫ్‌ నుంచి ఆదాయం లేకుండా గడపడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా..నాడు ఆర్జించిన పొదుపులే తనకు ఆసరాగా మారాయని అంటోంది. 

    అలాగే మార్చి 28న జరగనున్న తన సోలో డెబ్యూ షో కోసం పనిచేయాలని నిర్ణయించకున్నట్లు తెలిపింది కూడా. అయితే ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు మద్దతు తెలుపకపోయినా..ప్రస్తుతం తనను అర్థం చేసుకుంటున్నారని అంటోంది. ఏదీఏమైన తన అభిరుచి కోసం అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఇంత డేర్‌ చేసినందుకైనా.. నమ్రత తాను అనుకున్నట్లుగా మంచి కవయిత్రి అవ్వాలని ఆశిద్దాం.

    (చదవండి: పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్‌)

     

     

  • 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే మూడు గంటల ఎపిసోడ్‌లో, జెరోధా సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ నిఖిల్ కామత్ యూకే మాజీ ప్రధాని రిషి సునాక్‌, భార్య అక్షతా మూర్తితో సరదా సంభాషణ నిర్వహించారు. ఆ సంభాషణలో నాయకత్వ వైఫల్యం, గుర్తింపు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ఆర్థికవ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రముఖ పోడ్‌కాస్ట్‌కు అతిథులుగా వచ్చిన తొలి జంట రిషి సునాక్‌, అక్షతామూర్తిలే. ఆ పాడ్‌కాస్‌లో ఈ దంపతులు షేర్‌ చేసుకున్న అమూల్యమైన విషయాలేంటో చూద్దామా..!.

    ఆ పాడ్‌కాస్ట్‌లో రిషి ప్రధాని అనతరం లైఫ్‌, నేర్చుకున్న పాఠాలు, రాజకీయాల్లో కొనసాగనున్నారా?, యువ భారతీయులకు మార్గనిర్దేశం వంటి పలు అంశాలపై మాట్లాడగా, మూర్తి వారసత్వ విజయంలో ఉండే సవాళ్లు, తన గుర్తింపు, కుటుంబ అంచనాలు, తమ అభిప్రేయ బేధాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

    ఇక్కడ రిషి పదవి నుంచి వైదొలగిన అనతరం దీన్ని రాజకీయ ఓటమిగా కాకుండా, అరుదైన మానసిక పునఃప్రారంభంగా అభివర్ణించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తర్వాత ఏం చేయాలో అస్సలు తనకు తెలియలేదన్నారు. అయితే ఈ విరామ సమయంలోనే తనకు ఏం చేయాలి, ఏం కావలనేది క్షణ్ణంగా తెలుసుకోగలిగాను అన్నారు. ఇక్కడ మనల్ని మనం బాధతుగా భావించుకోకూడదు, ఆ రాజకీయ ఓటమిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలన్నారు. అంతేగాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాను ప్రస్తావిస్తూ..ఈ టైంలో కర్తవ్యంపై దృష్టి పెట్టడం సరైనది అని చెప్పారు రిషి. 

    అలాగే భారతీయ వినియోగ విప్లవాన్ని తరాల మార్పుగా అభివర్ణించారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఎన్నడూ చేయనంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. అలాగే పేరెంట్స్‌ కొన్న వస్తువులు పిల్లల్లు కొనడం లేదు. ఈతరానికి కొత్తబ్రాండ్లు, స్వదేశీ ఉత్పత్తులు, ప్రామాణికత కావాలని అన్నారు. అంతేగాదు భారతీయ తల్లిదండ్రులు విద్యను మెరుగైన జీవితానికి కీలకంగా చూస్తారన్నారు. 

    తాను కూడా తన తల్లిదండ్రలును ఆ విషయంలో బాగా నిరాశపరిచనట్లు తెలిపారు. తన పేరెంట్స్‌ డాక్టర్‌ కావాలనుకుంటే..బదులుగా తాను రాజకీయాలు ఎంచుకున్నానని అన్నారు. అలాగే విద్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ కామత్‌ కాలేజ్‌కి వెళ్లకపోవడంపై అభద్రతాభావం వ్యక్తం చేయగా..సునాక్‌ ఇక్కడ నేర్చుకునే సామర్థ్యం ముఖ్యం అని చెప్పారు. 

    ఇప్పడు చాలామటుకు పరిశోధన కోసం క్లాడ్‌, ఐఏ సాధనాలు వినియోగిస్తున్నా..తాను మాతరం స్వయంగా ఆలోచించడానికే ప్రాధాన్యత ఇస్తా, అలాగే తన ప్రసంగాలు, వాదనాలు తానే స్వయంగా రాసుకుంటానని చెప్పారు రిషి. అంతేగాదు యువత రాకీయాల్లోకి రావడంపై కూడా రిషి  మాట్లాడారు. చాలా స్థైర్యం, సహనం, సేవా దృక్పథం ఉంటే తప్పక రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఆ మూడు లక్షణాలు ఉంటేనే 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వస్తుందన్నారు. 

    ఇక అక్షతామూర్తి ఈ సంభాషణలో తన ఐడెంటిటీ గురించి మాట్లాడారు..తాను బ్రిటిష్‌ యాసతో మాట్లాడే బెంగళూరు అమ్మాయినని చెప్పారు. తన భర్త ప్రధాని, తండ్రి వ్యవస్థాపకుడు..కానీ ఇవేమి తన గుర్తింపు కాదని, తన ప్రభావమే తన ఐడెంటీటిగా మార్చుకుంటానని అన్నారామె. 

    చివరగా ఆ పాడ్‌కాస్ట్‌లో ఇద్దరిలో తమకు నచ్చే అంశాల గురించి కూడా షేర్‌ చేసుకున్నారు. రిషి పనిచేసేముందే క్షణ్ణంగా ఆలోచిస్తే..తాను మొదలు పెట్టాక..ఏం చేస్తే బెటర్‌ అని ఆలోచించుకుంటానని అన్నారు అక్షతా. ఇక పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో రిషి విశ్లేషణను విశ్వసిస్తానని, ఆయన తన సూక్ష్మదృష్టిని నమ్ముతాడని అక్షతా చెప్పుకొచ్చారు. ఇక సునాక్‌ వైవాహిక బంధం వల్ల ఇదంతా చేయగలిగాను..ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తన భార్యకే క్రెడిట్‌ ఇస్తూ..ఆమె మద్దతు లేకుండా ఏమి చేయలేనని అన్నారు రిషి. 

     

    (చదవండి: హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!)
     

Politics

  • తాడేపల్లి : అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల ధ్వజమెత్తారు. అమరావతి కోసం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టడంపై సజ్జల అనేక ప్రశ్నలు సంధించారు. 

    అమరావతి పేరిట అవినీతి నుంచి, రైతులకు పరిష్కారం కాని అంశాలనుంచి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో  తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? , ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరు అడ్డంకులు చెప్పారన్న దానికి చంద్రబాబు వివరణ ఇవ్వాలి: అసెంబ్లీలో తీర్మానం చేసి, అంతా చేసేశానని చంద్రబాబు చెప్పుకోవాలని అనుకుంటున్నారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపరచాలి కదా?, కానీ, అమరావతి లో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తారనే మండలిని పిలవటం లేదా?, రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు, అలాకాకుండా రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మార్చాడు, అమరావతిలో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారు’ అని సజ్జల మండిపడ్డారు

    రాష్ట్రాన్ని సమిధలా మారుస్తున్నారు
    రాజధాని విషయంలో చంద్రబాబుకు ఆచరాణాత్మక ధోరణి ఇప్పటికీ లేదు. వైఎస్సార్‌సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతికీ స్థానం ఉంది, అయితే ఇదంతా గతంలో జరిగిన పరిణామాలు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. చంద్రబాబు ఊహాజనిత రాజధాని, దానికయ్యే ఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై మేం ప్రశ్నలు వేశాం. అంతే తప్ప అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్‌ వ్యతిరేకం కాదు. అందుకనే 2019లో అధికారంలోకి రాకముందే జగన్‌ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అమరావతి ప్రాంతానికి వైఎస్సార్‌సీపీ ఆ రోజూకాని, ఈ రోజుకాని ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. మేం అభ్యంతరం వ్యక్తం చేసేది అవినీతి మీద, దోపిడీ మీద. రైతుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదు. పిల్లల పెళ్లిళ్లు కూడా రైతులు చేయలేకపోతున్నారు. 

    చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. 2014-19లో ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే. ఇప్పుడు కూడా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు చదరపు అడుగుకు రూ.19వేల వరకూ పెంచారు. అమరావతిలో పాత బిల్డింగులు కాక, ఈ రెండేళ్లలో కొత్తగా కట్టారా?, మళ్లీ డిజైన్ల పేరిట రూ.400 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 2018లో టెండర్లు ఖరారై, పనులు ప్రాంభమైన వాటికి కూడా మళ్లీ టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లతో గూడు పుఠానీ చేశారు. అందరికీ 4% కంటే ఎక్కువ టెండర్లు ఖర్చు పెట్టారు. 

    అసలు కట్టాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా?
    చంద్రబాబు తీరును చూసి, అమరావతి పేరిట చేసిన దోపిడీని చూసి రాష్ట్రం భయపడతోంది. చంద్రబాబు సృష్టించిన అవినీతి ఊబిలో రాష్ట్రం ఎక్కడకు పోతుందో తెలియడంలేదు. ప్రజల సొమ్ము, రాష్ట్ర వనరులను పీల్చి పిప్పిచేస్తున్నారు. ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును చీకట్లో పెడుతున్నారు. అమరావతి గురించి ఆర్టీఐ కింద ప్రశ్నలు వేసినా సమాచారం ఇవ్వడంలేదు. అమరావతి పనుల్లో ఎక్కడా పారదర్శకత లేదు. ఈ విడతలో రూ.9వేలకోట్లు తెచ్చి, రూ.5వేల కోట్లు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చారు. సుమారు 47వేల కోట్లకు శాంక్షన్లు ఇచ్చారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అమరావతికి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నారు. అమరావతి ఏపీలో భాగం కాదా. అమరావతిలో మా పార్టీకి ఓట్లు రాలేదా?

    అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

    పాత బిల్డింగులు తప్ప.. కొత్తగా చంద్రబాబు ఏం కట్టాడు?
    రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీకోసం ఏమైనా చేశారా?, ఇప్పటికీ కరకట్ట రోడ్డే కదా గతి. వచ్చినా వెస్ట్రన్‌ బైపాస్‌ కూడా పూర్తిచేసింది వైఎస్సార్‌సీపీ హయాంలోనే కదా. పనులు ఏమీ చేయకపోయినా, ప్రజలను నిరంతరం భ్రమల్లో పెట్టాలన్నదే చంద్రబాబు ప్లాన్‌. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ అమరావతి విషయంలో వివరాలు ప్రభుత్వం బయటపెట్టగలదా?, మొదటి విడత భూములు తీసుకున్న రైతులకే ఏమీ చేయలేదు. కాని, రెండో విడత అంటూ మళ్లీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమరావతిలో జోరుగా జరుగుతున్న పనులు కేవలం చంద్రబాబు ఇల్లు మాత్రమే. అమరావతి పేరుమీ అప్పులు తెస్తున్నారు, మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇస్తున్నారు, కమీషన్లు కొట్టేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఎందుకు అభివృద్ధి చేయడం లేదు?, దీనికి ఎవరు అడ్డుపడ్డారు. 

    చెరువుల్లో కూడా రైతులకు ప్లాట్లు ఇచ్చి వారిని నట్టేటా ముంచారు. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే.. మళ్లీ వారిమీద ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇన్‌కంట్యాక్స్‌ నోటీసులు అమరావతి పనుల కమీషన్లకు సంబంధించే వచ్చాయి. రూ.2వేల కోట్ల అవినీతిపై ఆరోజు ఇన్‌కంట్యాక్స్‌ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు కమీషన్లు, లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులపై విచారణ ఆగిపోయింది. అమరావతిలో చంద్రబాబు అవినీతికి నిదర్శనానికి ఈ నోటీసులే. అమరావతి నిర్మాణాలు, అంచనాలు, అప్పులు చూస్తే ప్రజల గుండెలు అదిరిపోతున్నాయి. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ అంటూనే అప్పులు చేస్తున్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీ ఎలా అవుతుందో చంద్రబాబు వివరించగలరా?, వీటికి సమాధానాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. అందుకే  అసెంబ్లీ తీర్మానం పేరిట డ్రామా. 

    పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టుకోవడానికే ఈ డ్రామా
    ఒక భ్రమను ప్రజలకు కల్పించడానికే ఈ డ్రామా. అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. అమరావతిలో చంద్రబాబు. కట్టాలనుకుంటున్న భవనాల నిర్వహణ ఖర్చులు వింటేనే ప్రజలకు భయం వేస్తోంది. ఆచరాణాత్మకంగా, వాస్తవిక దృక్పథంతో చంద్రబాబు ఆలోచన లేదు. పనులు కన్నా, భ్రమలను కలిగిండచమే చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు గతంలో చెప్పిన హైపర్‌ లూప్‌ ఏమయ్యింది?, అమరావతిలో ఒలింపిక్స్‌ ఏమయ్యాయి?’ అని సజ్జల ప్రశ్నించారు.