భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం | Farmer unions outfits across India have strongly condemned India US trade | Sakshi
Sakshi News home page

భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Feb 8 2026 5:53 PM | Updated on Feb 8 2026 6:03 PM

Farmer unions outfits across India have strongly condemned India US trade

భారత్‌-యూఎస్‌ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్‌) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.

ప్రధానాంశాలు.. ఆరోపణలు

  • ఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‍ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.

  • మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.

  • భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.

  • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేసింది.

ఫిబ్రవరి 12న నిరసన

రైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్‌కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

వ్యవసాయంపై ప్రభావం

ఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్‌లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వాదన

మరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement