సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు 100 శాతం భారీ బోనస్ ప్రకటించింది. 2025లో అంచనాలను మించి ఆదాయ ఫలితాలను సాధించిన తరువాత ఈ బంపర్ బొనాంజా ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహం నిండింది.
కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవి కుమార్ ఎస్ గత కొన్నేళ్లుగా "విజేత సర్కిల్"లోకి ప్రవేశించాలనే సంస్థ లక్ష్యం గురించి చాలాసార్లు మాట్లాడారు. ఫలితాల విడుదల సందర్భంగా 2025లో పటిష్ట పనితీరుకు కారణమైన 3.5 లక్షలమంది సిబ్బందిని సీఈవో ప్రశంసించారు. నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే. డిసెంబర్31కల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 14,800 పెరిగి 3.51 లక్షలకు చేరింది.
లాభం జూమ్
కాగ్నిజెంట్ గత ఆర్థిక సంవత్సరం(2025) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 19 శాతం జంప్చేసి 64.8 కోట్ల డాలర్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024) ఇదే కాలంలో కేవలం 54.6 కోట్ల డాలర్లు ఆర్జించింది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి 533.3 కోట్ల డాలర్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో 508.2 కోట్ల డాలర్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో 12 భారీ డీల్స్ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. డిసెంబర్తో ముగిసిన పూర్తిఏడాది(2025)కి ఆదాయం 7 శాతం వృద్ధితో 21.1 బిలియన్ డాలర్లను తాకింది.
ఆదాయ అంచనాలు గుడ్
ప్రస్తుత ఏడాది(2026)కి కాగ్నిజెంట్ 5–7.4 శాతం అధికంగా 22.14–22.66 బిలియన్ డాలర్ల ఆదాయ అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. ఈ బాటలో తొలి క్వార్టర్(జనవరి–మార్చి)కు 5.36–5.44 బిలియన్ డాలర్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 2.7–4.2 శాతం వృద్ధి అంచనాలివి.


