దేశీ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ తాజాగా సింగపూర్కి చెందిన ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ ఫినర్జిక్ సొల్యూషన్స్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్ సింగపూర్ డాలర్లను (సుమారు రూ. 136 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో, ముఖ్యంగా కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని హెచ్సీఎల్ టెక్ తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఒప్పందం పూర్తి కాగలదని వివరించింది. 2019లో ప్రారంభమైన ఫినర్జిక్కి భారత్, సింగపూర్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్లో కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో కంపెనీ 12.6 మిలియన్ సింగపూర్ డాలర్ల ఆదాయం ఆర్జించింది.
హెచ్సీఎల్ టెక్ ఫినర్జిక్ సొల్యూషన్స్ను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో డిజిటల్ పరిష్కారాలపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఫినర్జిక్ వద్ద ఉన్న డొమైన్ నైపుణ్యం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం హెచ్సీఎల్ టెక్కు ఉపయోగపడనుంది. ముఖ్యంగా యూరప్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపర్చుకునే అవకాశం ఈ డీల్ ద్వారా లభించనుంది.
ఈ కొనుగోలుతో హెచ్సీఎల్ టెక్ తన బ్యాంకింగ్ క్లయింట్లకు మరింత సమగ్ర సేవలను అందించగలదు. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు కొత్త సేవలను అందించే క్రాస్-సెల్లింగ్ అవకాశాలు పెరగడంతో పాటు, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఆదాయ వృద్ధికి ఇది దోహదపడనుంది. ఐటీ సేవల కంపెనీలు డొమైన్ ఆధారిత సంస్థలను కొనుగోలు చేసి విలువ పెంచుకునే ధోరణిలో భాగంగానే ఈ డీల్ను మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి.


