టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ బ్యూటీ..ఇకపై వెండితెరపై సందడి చేయబోతుంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది సుప్రిత. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు..తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.
ఒత్తిడితో ఎక్కువ తీసేశా..
ఆ మధ్య నేను కాస్త బరువు పెరిగా. అందరూ నన్ను లావు అయ్యావు అనడంతో ఒత్తిడికి లోనయ్యా. నేను ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువే తింటాను. అలా తినడంతో బరువు పెరిగిపోయా. దీంతో వెంటనే తగ్గాలని ఒక పూట తినడం ప్రారంభించా. ప్రతి రోజు 12-15 గంటల పాటు ఏం తినకుండా ఉండేదాన్ని. ఒక పూట మాత్రం ఏదైనా తీనేదాన్ని. ఎక్కువగా బిర్యానీలు తీనడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేరాను. అక్కడ దాదాపు 15 రోజుల పాటు నరకం చూశా. మంచి నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. 20 రోజుల పాటు అన్నమే తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి. ఒకనొక దశలో నేను బతకనేమో అనుకున్నా. నా వల్ల అమ్మతో పాటు స్టాఫ్ అంతా ఇబ్బంది పడింది. ఆస్పత్రిలో వారిని చూసి నాకే బాధకలిగింది. ఈ నరకం భరించడం కంటే..ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నా. కానీ దేవుడి దయతో కోలుకున్నా. ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను’ అని సుప్రీతి చెప్పుకొచ్చింది.
ఆ ఇద్దరికి సిస్టర్గా నటించలేను
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు హీరోయిన్గా మాత్రమే కొనసాగాలని లేదని.. మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తానని చెప్పింది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్కు సిస్టర్గా నటించే అవకాశం వస్తే వదులుకోను. ఈ ఇద్దరనే కాదు.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అఖిల్ తప్ప వేరే ఏ హీరోకి అయినా సిస్టర్గా నటిస్తా. విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. పదో తరగతి పాస్ అయితే అఖిల్తో డిన్నర్కి తీసుకెళ్తా అని అమ్మ మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అఖిల్, విజయ్ నేరుగా కనిపిస్తే..షాకులో ఉండిపోతానేమో’ అని సుప్రిత చెప్పుకొచ్చింది.


