భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు మంధాన సోషల్ మీడియాలో ప్రకటించింది.
"గత కొద్ది రోజులగా నా వ్యక్తిగతం జీవితంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరముంది. నా పెళ్లి రద్దైందని క్లారిటీ ఇస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం దృష్టి అంతా క్రికెట్పైనే ఉంటుంది. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని" ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
ముచ్ఛల్ ఏమన్నాండంటే?
ఇక స్మృతి మంధానాతో తన బంధం ముగిసిందని పలాష్ ముచ్ఛల్ సైతం ధ్రువీకరించాడు. తాము విడిపోవడానికి సంబంధించిన నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ముచ్ఛల్ తెలిపాడు.
"నా వ్యక్తిగత సంబంధం నుండి బయటకు వచ్చాను. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నిరాధారమైన వార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం. కానీ ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఉంది.

ఆధారాల్లేని వదంతులను ప్రచారం చేసేముందు.. ఏది నిజం, ఏది అబద్దమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ముచ్ఛల్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.
కాగా ముచ్చల్- స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో తన పెళ్లిని మంధాన వాయిదా వేసుకుంటున్నట్లు ఆమె మేనేజర్ మీడియాతో తెలిపాడు. ఆ తర్వాత ముచ్చల్ కూడా అనారోగ్యంతో అస్పత్రిలో చేరాడు.
అయితే మంధాన తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్మృతి చేతికి నిశ్చితార్థం రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. ఈ నేపథ్యంలోనే మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.
చదవండి: సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం


