MS Dhoni: ధోనికి భారీ షాక్‌! | MS Dhoni served notice over alleged misuse of Ranchi residential plot: Report | Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోనికి భారీ షాక్‌!

Feb 28 2026 12:28 PM | Updated on Feb 28 2026 12:40 PM

MS Dhoni served notice over alleged misuse of Ranchi residential plot: Report

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్‌ స్టేట్‌ హౌజింగ్‌ బోర్డు అతడికి నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే... మైదానంలో వివాదరహితుడగా, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరొందాడు ధోని.

దిగ్గజ సారథి
తన అద్భుతమైన సారథ్య నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని (MS Dhoni). ఇక ఐపీఎల్‌లోనూ తిరుగులేని సారథిగా ఈ మిస్టర్‌ కూల్‌కు రికార్డు ఉంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ను రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని.. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా  జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఈ దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్‌-2026 బరిలో నిలిచేందుకు ఇప్పటికే సన్నద్ధమమ్యాడు.

ఆస్తికి సంబంధించిన వివాదం
ఇక మైదానంలో ధోని మెరుపుల కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. అతడు ఓ ఆస్తికి సంబంధించి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా టుడే కథనం ప్రకారం..

దుర్వినియోగం చేస్తు న్నారనే ఆరోపణలు
జార్ఖండ్‌లోని హర్మూ రోడ్‌లో గృహ అవసరాల నిమిత్తం ధోని రెసిడెన్షియల్‌ ప్లాట్‌ సొంతం చేసుకున్నాడు. దీనిని కేవలం నివాస స్థలంగా మాత్రమే ఉపయోగించాలని జార్ఖండ్‌ స్టేట్‌ హౌజింగ్‌ బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ ప్లాట్‌లో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నడుపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ధోని రింగ్‌ రోడ్డులోని కొత్త నివాసానికి మారిన తర్వాతే ఈ ప్రచారం ఊపందుకోగా.. హౌజింగ్‌ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధోనికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశం అని పేర్కొన్నట్లు సమాచారం.

నిజమని తేలితే కేటాయింపులు రద్దు
ఈ విషయం గురించి హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ సంజయ్‌ లాల్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. గృహ అవసరాల నిమిత్తమే ఈ ప్లాట్‌ను ధోనికి కేటాయించామని.. అయితే, అక్కడ వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ధోనికి నోటీసులు జారీ చేశామన్నారు.

అయితే, ధోని ఒక్కడికే కాకుండా హర్మూ రోడ్డులో ప్లాట్లు సొంతం చేసుకున్న మరి కొందరు సీనియర్‌ అధికారులపై కూడా ఇలాంటి ఆరోపణలే రాగా.. వారిని కూడా వివరణ కోరినట్లు పాశ్వాన్‌ తెలిపారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే వారికి కేటాయించిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.  

చదవండి: T20 WC 2026 SL vs PAK: పాకిస్తాన్‌కు చావోరేవో.. గెలిస్తే సరిపోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement