ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిస్తేనే భారత జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంటుంది. లేదంటే ఈ డిఫెండింగ్ చాంపియన్కు చేదు అనుభవం తప్పదు.
ఇంగ్లండ్, సౌతాఫ్రికా రైట్రైట్
నాలుగు గ్రూపుల టాపర్లుగా టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే సూపర్-8 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం టాపర్లన్నింటినీ గ్రూప్-1లో చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).
ఇక లీగ్ దశలో ఆయా గ్రూపులలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను గ్రూప్-2లో చేర్చింది. ఈ క్రమంలో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
మిగిలిన రెండు స్థానాల కోసం
మరోవైపు.. మిగిలిన రెండు స్థానాల కోసం టీమిండియా- వెస్టిండీస్... పాకిస్తాన్- న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి పాక్- శ్రీలంక మ్యాచ్ గ్రూప్-2 నుంచి మరో సెమీ ఫైనలిస్టును తేల్చనుండగా.. ఆదివారం జరిగే భారత్- విండీస్ మ్యాచ్తో నాలుగో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది.
వెస్టిండీస్పై తప్పక గెలవాలి
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్పై తప్పక గెలిస్తేనే టీమిండియా సెమీస్ చేరుకుంటుంది. బ్యాటింగ్కు అనుకూలంగా మలిచిన ఈ పిచ్పై ఫామ్ పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తుండటంతో పరుగుల వరద ఖాయం. పైచేయి సాధించిన వారిదే సెమీస్ బెర్తు.
సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
అయితే, పటిష్ట టీమిండియా విండీస్ను ఓడించి సెమీ ఫైనల్కు చేరితే.. ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంటుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ బృందంతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతా సజావుగా సాగి విండీస్పై గెలిచి.. ఇంగ్లండ్తో భారత్ సెమీస్ ఆడితే ముఖాముఖి రికార్డు ప్రకారం టీమిండియాదే పైచేయిగా ఉండటం సానుకూలాంశం.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- ఇంగ్లండ్ ఇప్పటికి ఐదుసార్లు తలపడగా.. భారత్ మూడు సార్లు, ఇంగ్లండ్ రెండుసార్లు గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉండగా.. భారత్ ఇంకా బెర్తు ఖరారు చేసుకోలేక ఒత్తిడిలో ఉంది.


