ఏదైతేనేం విమర్శకుల నోళ్లు మూయించాడు
గావస్కర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ డిఫెన్స్ ఆటతీరు తనను ఆశ్చర్యపరిచిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. మొత్తానికి జట్టుకు ఉపయోగపడే అర్ధసెంచరీతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడని కితాబిచ్చారు. లీగ్లో అసలు ఖాతానే తెరువలేకపోయిన అభిషేక్ ఎట్టకేలకు సూపర్–8లో దక్షిణాఫ్రికాతో 15 పరుగులు చేయగలిగాడు. ‘హిట్టర్గా అభిషేక్ ఎలాంటి ఆట ఆడతాడో మనందరికి తెలుసు. జింబాబ్వేపై మ్యాచ్లో మెరుపు ఫిఫ్టీతో తన ప్రదర్శనపై లేవనెత్తుతున్న సందేహాలకు చెక్ పెట్టాడు.
కుదురుగా ఆడేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ... ఆడేకొద్ది తన శైలి బ్యాటింగ్కు మారాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లను గుడ్డిగా ఎదుర్కోకుండా గౌరవించిన తీరు, అనవసర రిస్క్ తీసుకోకుండా తన పరుగుల పనిలో నిమగ్నమైన ఆటతీరు నన్ను బాగా ఆకట్టుకుంది. జింబాబ్వేతో మ్యాచ్లో డిఫెన్స్ షాట్లను ఆడటం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆడేది అభిషేకేనా అని అనిపించింది. నేర్చుకోవడం అంటే ఇదే!
వైఫల్యాల్ని అధిగమించిన ప్రదర్శన నాకు ముచ్చటేసింది’ అని సన్నీ... అభిషేక్ ఆటను ప్రశంసించారు. సంజూ సామ్సన్తో ఓపెనింగ్ చేయించి లెఫ్ట్–రైట్ బ్యాటింగ్ కాంబినేషన్తో దిగడం మంచి ఎత్తుగడగా గావస్కర్ అభివర్ణించారు. అయితే వెస్టిండీస్తో ఎదురయ్యే సవాల్ భిన్నంగా ఉంటుందని, ఆదివారం జరిగే సూపర్–8 పోరు అంత ఆషామాషీగా ఉండదని సన్నీ టీమిండియాను జాగ్రత్త పరిచారు.


