టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (15) ఔటయ్యాడు.
ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్కు ముందు అభిషేక్పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.
అభిషేక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్కు ఇది తన టీ20 కెరీర్లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీగా నిలిచింది. అభిషేక్ కెరీర్లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు.
వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్మెంట్. అయితే అభిషేక్ లాంటి విధ్వంసకర ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.
తాజా ప్రదర్శనలతో అభిషేక్ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్, అభిషేక్ తమ టీ20 కెరీర్లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టి ప్లస్), కేఎల్ రాహుల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్లు ఆడాడు. అతని కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్ ప్లేస్కు చేరే అవకాశం ఉంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది.
భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 55, సంజూ శాంసన్ 24, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్ రికార్డు.
అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరుగబోయే మ్యాచ్ భారత్కు డూ ఆర్ డై మ్యాచ్గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించింది.


