న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్తో శుక్రవారం నాటి మ్యాచ్ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్ ముందుకు సాగుతోంది. సూపర్-8లో తొలుత పాక్తో కివీస్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.
నెట్ రన్రేటు పరంగానూ
ఇక తమ తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్ రన్రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కూడన గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.
రెండో బెర్తు కోసం న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్తో తమ ఆఖరి మ్యాచ్లో గెలిచిందంటే న్యూజిలాండ్ నేరుగా సెమీస్ చేరుతుంది.
ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.
మ్యాట్తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్ చేరుతుందని.. అప్పటికి మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్.. మార్చి 5న రెండో సెమీస్ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్


