T20 WC: రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం! | IND vs WI: Rinku Singh set to rejoin team after performing father last rites | Sakshi
Sakshi News home page

T20 WC: రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం!

Feb 27 2026 9:55 PM | Updated on Feb 28 2026 8:41 AM

IND vs WI: Rinku Singh set to rejoin team after performing father last rites

టీమిండియా స్టార్‌ రింకూ సింగ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్‌ సింగ్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

తండ్రి పాడె మోస్తూ..
దీంతో రింకూ సింగ్‌ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్‌కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.

రింకూ తిరిగి జట్టుతో చేరతాడు
తన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో మ్యాచ్‌ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.

కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్‌ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బ్యాట్‌ ఝులిపించనేలేదు
ఇక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్‌ దశలో నాలుగు.. సూపర్‌-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. 

అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement