సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. టోకెన్కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదు
ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.
బీజేపీలో మేమంతా ఒక్కటే..
తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు.


