Vintalu Visheshalu
-
ఆటో డ్రైవర్గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్ నెం.1 లగ్జరీ కారు
కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్గా టెక్ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్గా బెంగళూరులోని ట్రాఫిక్ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్జీ కార్పొరేట్స్ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్జీ గ్రూప్ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్ బ్యాగ్తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం. -
ప్రకృతి దాచిన అందమైన క్రికెట్ స్టేడియం
కొన్నింటిని ప్రకృతి సహజసిద్ధంగా చక్కటి ఆకృతిని ఏర్పరస్తుంది. చూస్తే.. కళ్లుతిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. అలాంటి సుందరమైన క్రికెట్ స్టేడియం ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా దీన్ని నెటిజన్లు ప్రకృతి దాచిన క్రికెట్ మైదానంగా అభివర్ణిస్తున్నారు. అదెక్కడ ఉందంటే..కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో వరందరప్పల్లిలో ఉంది. దీన్ని పాలప్పిల్లి క్రికెట్ మైదానం అంటారు. సాధారణంగా స్టేడియంలు పచ్చిక బయళ్లకు దూరంగా ఉంటాయి. కానీ ఇది ప్రకృతితో అల్లుకుపోయినట్లుగా రహస్యంగా ఉంది. ప్రకృతి అందాలకు నెలవైనా కేరళను తరుచుగా 'దేవుని స్వంత దేశం'గా వర్ణిస్తారు కవులు. అందుకు తగ్గట్టు పచ్చని చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రికెట్ మైదానం ఆ వర్ణనకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఈ మైదానం దశాబ్దాల కాలం నాటిదట. దీనిని మొదట హారిసన్ మలయాళం కంపెనీ తన తోటల కార్మికులకు వినోద స్థలాన్ని అందించడానికి సృష్టించింది. అప్పటి నుంచి ఇది ఉద్యోగులకు మాత్రమే కాకుండా స్థానికులకు ఆటవిడుపు స్థలంగా మారింది. అయితే దట్టమైన చెట్లతో కప్పబడి మారుమూల ప్రాంతంలో ఉండటంతోనే బయటి ప్రపంచానికి అంతగా తెలియదని అంటున్నారు స్థానికులు. అయితే అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీజిత్ ఎస్ "ఇది అమెజాన్ రెయిన్ఫారెస్ట్ కాదు" అనే క్యాప్షన్తో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sreejith S (@notonthemap) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
వర్షమే ఆ రెండు జంటలను కలిపింది..!
కొన్ని సంఘటనలు భలే గమ్మత్తుగా జరుగుతాయి. ఆఖరికి ప్రకృతి కూడా మనమంతా ఒక్కటే అని చెప్పేలా ఘటనలు సృష్టిస్తుంది. ఒక్క తొలకరి జల్లుతో ఎలా మతసామరస్యానికి పీట వేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వరుణుడే సాక్షిగా..రెండు వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒక వేదికపైనే పెళ్లి చేసుకునేలా చేశాడు. ఈ ఘటన పూణేలోని వాన్వోరిలో చోటు చేసుకుంది.అసలేం జరిగిందంటే..పూణేలోని వాన్వోరిలో మంగళవారం సాయంత్రం ఒక హాలులో ముస్లిం పెళ్లి జరుగుతుండగా.. అక్కడకు సమీపంలోని మైదానంలో హిందూ జంట పెళ్లితంతు జరుగుతోంది. ఇంతలో వర్షం పడటంతో వారి వివాహానికి ఆటంకం ఏర్పడింది. సరిగ్గా ఆ హిందూ జంట సాయంత్రం 6.56 గంటలకు అలంకారన్ లాన్స్లో వివాహం చేసుకోవలసి ఉంది. ముహర్తం మించి పోతుంది వర్షం ఆగేట్టు లేదు. దాంతో ఒక్కసారిగా ఆ హిందూ వివాహ వేడుకలో గందరగోళం ఏర్పడింది. పక్కనే హాలులో వలీమా(ముస్లిం ఆచారంలో జరిగే పెళ్లి) జరగుతోంది. ఇక వాళ్లనే రిక్వస్ట్ చేసి సప్తపది నిర్వహించాలనుకున్నారు కుటుంబ సభ్యులు. అందుకు ముస్లీం కుటుంబం కూడా అంగీకరించి..వాళ్లు ఖాళీ చేసి వేదికను ఇచ్చారు. అలాగే హిందూ ఆచారాల కోసం చేసే ఏర్పాట్లకు ముస్లీం కుటుంబం సాయం కూడా చేసింది. ఒకరి సంప్రదాయాలనుల ఒకరు గౌరవించుకుంటూ..ఆ జంటలు ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతేగాదు రెండు వర్గాల ప్రజలు ఉమ్మడి విందును ఆనందంగా ఆస్వాదించారు. ఇక కొత్తగా పెళ్లైన ముస్లిం జంట మహీన్, మోమ్సిన్ కాజీలు హిందూ జంట నరేంద్ర, సంకృతిలతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒకరకంగా ప్రకృతి మతసామరస్యంగా ఉండండిరా.. అని పిలుపునిచ్చినట్లుగా వేర్వేరు మతాలకు చెందిన ఆ జంటలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది కాబోలు.(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్ వైరల్
200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్ జెట్ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల వరకు థ్రస్ట్ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్లో అధునాతన ఫీచర్స్, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! -
మూగ జీవే..కానీ ఎంత అద్బుతంగా వీడ్కోలు చెప్పింది..!
విశ్వాసానికి పేరుగాంచిన కుక్కలు మనుషులతో ఎంతో అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంతలా విధేయతతో ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదహారణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే. ఇది తన అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవ్వుతుంటే..అది కూడా ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. ఈ ఘటన కేరళ అగ్నిమాపకదళ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆ స్టేషన్లోని అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేస్తున్నరోజు కావడంతో..తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు చక్కగా వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్కకూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెబుతోంది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పే తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) (చదవండి: 'టాకింగ్ ట్రీ'..ఈ టెక్నాలజీతో నేరుగా మొక్కతో మాట్లాడేయొచ్చు..!) -
అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..!
ఏ వ్యాపారంలోనైనా.. అమ్మడం అనే ట్రిక్ తెలిస్తే..విజయం సాధించేసినట్లే. ఏ బిజినెస్ సక్సెస్ మంత్రా అయినా..కస్టమర్ కొనేలా అమ్మడంలోనే ఉంది. అదే పాటిస్తున్నాడు ఇక్కడొక లండన్ విక్రేత. అది కూడా మన భారతీయ భాషలో విక్రయిస్తూ..అందర్నీ ఆక్టటుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో లండన్లో ఒక వ్యక్తి కొబ్బరిబోండాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. అతడు కొబ్బరికాయ కొట్టివ్వడం, అమ్మే విధానం అంతా భారతీయ చిరువ్యాపారిలానే ఉంటుంది. ఒక్క క్షణం భారత్లో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది అతడు అమ్ముతున్న విధానం చూస్తే. "నారియల్ పానీ పీ లో" అని హిందీలో అరుస్తూ కనిపిస్తాడు. అచ్చం మన వద్ద ఉండే కొబ్బరిబొండాల విక్రేతలు తియ్యటి కొబ్బరి బొండాలు అంటూ అరుస్తారే అలానే ఈ లండన్ వ్యక్తి అరవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా మన హిందీ భాషలో చెప్పడం విశేషం. ఇది ఒకరకంగా మన భారతీయ చిరువ్యాపారులు తమ గొంతుతో కస్టమర్లను ఆకర్షించే విధానం హైలెట్ చేసింది కదూ..!. View this post on Instagram A post shared by UB1UB2: Southall, West London (@ub1ub2) (చదవండి: Mobile Tailoring: ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..) -
పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీ
మధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్తో దీక్షిత్కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..! -
'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్
అసాధారణమైన అడ్డంకులును అవలీలగా జయించి విజయ ఢంకా మోగించి స్ఫూర్తిగా నిలుస్తారు కొందరు. అదికూడా యంగ్ ఏజ్లో కాకుండా వృద్ధాప్యంలో సాధించడం అంటే మాటలు కాదు. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించాలనుకున్న వారికే ఇదంతా సాధ్యం అని చెప్పొచ్చు. అలాంటి కోవకు చెందింది ఈ అమ్మమ్మ. ఈ అమ్మమ్మ అందుకున్న గెలుపు వింటే..సూపర్ బామ్మ అని అనుకుండా ఉండలేరు. ఆ ఏజ్లో చదవాలనుకోవడమే గొప్ప..కానీ ఈ బామ్మ తనున్న వైకల్యానికి చదవాలనే నిర్ణయమే అత్యంత సవాలు. పైగా అందరి అంచనాలను తలకిందులు చేసేలా విజయం అందుకోవడం మరింత విశేషం. ఆ అమ్మమ్మ ఎవరు ఏంటా కథ సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలోని టేనస్స్ రాష్ట్రానికి చెందిన 47 ఏళ్ల అమండా జుయెట్టెన్కి ఉన్నత విద్యపూర్తి అయిన వెంటనే వివాహం అయిపోయింది. ఆ తర్వాత పిల్లల బాధ్యతలు, కుటుబ పోషణార్థం ఉద్యోగం చేయడం తదితరాలతో జీవితం గడిచిపోయింది. అమ్మమ్మగా మారే నాటికి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే పరిస్థితి కారణంగా కనుచూపు పోగొట్టుకుంది. కనీసం ఈ చరమాంకంలో అయినా ..ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామనుకుంటే..కంటి చూపే కరువైపోయింది అని విలవిలలాడింది. కనీకనబడకుండా ఉన్న ఆ కొద్దిపాటి కంటి చూపుతోనే ఏదైనా నేర్చుకోవాలని ఆరాటపడింది. ఆ క్రమంలోనే కొలరాడో సెంటర్ ఫర్ ది బ్లైండ్లో ఎనిమిది నెలల గ్రాడ్యుయేషన్ కోర్సులో జాయిన్ అయ్యింది. 30 ఏళ్లక్రితం వదిలేసిన చదువుని తిరిగి బుర్రకు ఎక్కించుకోవడం..పట్టు సాధించడం తదితరాలను తన ఆత్మవిశ్వాసంతో ఎందుర్కొంది. తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా ఆమె ప్రగాఢమైన కోరిక ఆ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి అయ్యేలా చేసింది. తన సంరక్షకుడు, గైడ్ అయిన తన పెంపుడు కుక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. తాను అందురాలిగా ఆ స్కిల్ నేర్చుకోకుండా మిగిలిపోకూడదనుకున్నా అని సగర్వంగా చెబుతోంది. అంతేగాదు అంధులకు స్వరం కావాలి. అందుకోసం మంచి ఉన్నత చదువులు చదవాలి..అప్పుడే వారు తమ గళాన్ని వినిపించగలరు అంటుందామె. వారిలో స్ఫూర్తి నింపేందుకే తన ఎడ్యుకేషన్ జర్నీని ఆపనంటోంది. డాక్టరేట్ కూడా సాధించాలనుకుంటోంది. మరీ ఆ అమ్మమ్మకి ఆల్ ద బెస్ట్ చెప్పి..విజయం సాధించాలని మనసారా కోరుకుందాం..!.(చదవండి: భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు ) -
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ మనిషి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఉరుకుల పరుగుల లైఫ్స్టైల్ అలవాటైపోయింది. ఉదయం లేచింది మొదలు కుటుంబం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, ఇతర కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఇంటికి చేరుకోగానే కొంత పీస్ ఆఫ్ మైండ్ కావాలని కోరుకుంటున్నారు. ఫలితంగా విశ్వాసానికి మారుపేరైన శునకాలను పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వాటితో కొంత సమయం వాకింగ్ చేయడం, ఆహారం పెట్టడం, పెంపుడు జంతువులతో ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.లక్షలు వెచ్చించి మరీ నచ్చి ఇంపోర్టెడ్ బ్రీడ్లు, వీధి జాతి శునకాలను పెంచుకుంటున్నారు. ఇందులో ఒక్కో బ్రీడ్లో ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల శునకాలు సైతంస్టేటస్గా ఫీలవుతున్నారు. వారి అవసరాలకు తగ్గట్లు ఎంపికలు ఉంటున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల బ్రీడ్లు అందుబాటులో ఉంటున్నాయి. విందు, వినోదాలు, టూర్లు వెళ్లినప్పుడు వాటిని హేండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నారు. మూగజీవులతో ఎంజాయ్ చేస్తున్నారు. శునకం, గుర్రం, గోవులను పెంచడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని, ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోగలిగే శక్తి వస్తుందని పలువురు జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్గ్రేట్ డేన్ : ప్రపంచంలో ఎత్తయిన శున జాతి ఇది. జర్మన్ బ్రీడ్. అత్యంత వేగంగా పరుగులు తీస్తాయి. అప్రమత్తమైన, ధైర్య సాహసాలతో కూడిన శునకం. మనుషులతో స్నేహపూర్వకంగానూ ఉంటుంది. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. జర్మన్ రాజులు ఎలుగు బంట్లు, అడవి పందులు, జింకలు, ఇతర జంతువుల వేటకు ఉపయోగించేవారట. చివావా : చివావా అనేది మెక్సికన్ జాతి శునకం. చిన్న జాతి కుక్క. చెవులు నిటారుగానూ, కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. కేవలం రెండు కేజీల బరువు ఉంటుంది. దీన్ని సెలబ్రిటీలు, ఉన్నత శ్రేణి వర్గాల మహిళలు తమ హేండ్ బ్యాగులో వేసుకుని వెంట తీసుకెళ్తుంటారు. శుభకార్యాలు, టూర్లలోనూ ఇవి వెంట ఉంటాయి. లాబ్రడార్ : ఈ రకం శునకాలకు అనేక దేశాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. ఇవి మనుషులతో స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటాయి. సహచరుడిగానూ ఈ కుక్కను పెంచుకుంటున్నారు. ఎక్కువగా క్రీడలు, వేటకు వినియోగిస్తారు. వీధి కుక్కలను సైతం.. : నగరంలో వీధి కుక్కలను సైతం చాలా మంది పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల చిన్నగా(పుట్టిన రోజుల వ్యవధిలోనే) ఉన్నప్పటి నుంచే ఇంటికి తీసుకెళ్లి ముద్దుగా చూసుకుంటున్నారు. దానితో ఇంట్లో అందరూ సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. ఇవి స్నేహపూర్వకంగా, రక్షణగానూ ఉంటాయి. -
సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..
చిన్నప్పుడే విద్యుత్ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్ జీవితంపై స్పెషల్ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్ చైర్పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్ టాప్ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్ వచ్చి షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్..నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్ జామ్ షోకు హాజరై అక్కడ మెగాస్టార్ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్లు ప్రభాస్, వెంకటేష్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్ గ్రామం, మునిపల్లి మండలం -
గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే..
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్క్రీం డిజర్ట్లలో గోల్డ్తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..ఇండోర్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట. చివరగా ఈ సరఫా బజార్లో ది గోల్డ్మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!) -
పిల్లిలా మారిన ఓ పులి కథ ఇది!
పులి మనతో మాట్లాడగలదా? తన బాధను మనతో చెప్పుకోగలదా? ఈ ఫొటో చెప్పగలదు.. ఆ పులి కథనే కాదు.. అందులోని అంతులేని వ్యథనూ మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదుఓ గదిలో బంధించి కొడితే.. పిల్లి అయినా పులిలా మారుతుందట.. కానీ అదే గదిలో ఓ పులి పిల్లిలా మారిన కథ ఇది... ఆ పులి పేరు... సలమాస్..సలమాస్.. ఓ ఇండో చైనీస్ ఆడ పులి.. థాయ్లాండ్లోని ఓ ప్రైవేటు బ్రీడింగ్ ఫార్మ్ దాని నివాసం. జీవిత ఖైదు వేసినా.. 14 ఏళ్ల తర్వాత విడుదలయ్యే చాన్స్ ఉంది.. సలమాస్ విషయంలో అది 20 ఏళ్లు.. చిన్నపాటి కాంక్రీట్ గదిలోనే అన్నేళ్లూ గడిపేసింది. తొలి సంధ్యను చూసింది లేదు.. తొలకరిలో తడిచింది లేదు.. జీవితాంతం పిల్లల్ని కనే యంత్రంగా పనిచేసింది. థాయ్లాండ్లోని టైగర్ టూరిజం, పులుల పళ్లు, గోర్లు, చర్మం, ఎముకలు, పంజా, మాంసం వంటి అక్రమ విక్రయాల వ్యాపారాల కోసం వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించింది. చిక్కిశల్యమైంది. ఎముకల గూడులా మారింది. కానీ నిర్వాహకుల మనసు కరగలేదు. మరణమే మేలు అనుకునేలా తన బతుకును మార్చారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం. అయితే, అదృష్టవశాత్తూ 2023 డిసెంబర్లో వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్లాండ్ సలమాస్తో పాటు ఆ ఫాంలో ఉన్న మరికొన్ని పులులను రక్షించింది. వాటిని తమ అభయారణ్యానికి తరలించింది. ఇక్కడే సలమాస్ తన జీవితపు మలి సంధ్యలో తొలి సంధ్యను చూసింది. తొలకరిలో తడిచింది. తొమ్మిది నెలల అనంతరం అక్కడే తుది శ్వాస విడిచింది. సలమా అంటే అరబిక్లో శాంతి అని అర్థం అట. రెస్ట్ ఇన్ పీస్ అంటే మరణానంతరం శాంతి లభించుగాక అని అర్థం అట.. జీవితాంతం అశాంతితో బతికిన సలమాస్.. రెస్ట్ ఇన్ పీస్!బ్రీడింగ్ ఫార్మ్లో సలమాస్ దయనీయ స్థితిని తన ఫొటోతో చిత్రిక పట్టిన ఆమీ జోన్స్కు ఇటీవలి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రఫీ పోటీల్లో హ్యూమానిటీ వెర్సస్ నేచర్ విభాగంలో తొలి బహుమతి దక్కింది.– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
నో డుమ్మా.. రోజంతా పనే : బెంగుళూరు పనిమనుషుల రూటే వేరు!
నగరాల్లో ప్రస్తుతం భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగులైన మధ్యతరగతి కుటుంబాలను, వేధించే ప్రధానమైన సమస్య ల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మెయిడ్/పనిమనిషి అని చెప్పొచ్చు. ఒక్కరోజు పనిమనిషి రాదు అని తెలిస్తే గృహిణుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే...బెంగళూరు వాసులు పనిమనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగుళూర్లోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం... ఆ నగరంలో పనిమనిషి స్థానం వేగంగా భర్తీ అవుతోంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా.. దాదాపుగా అన్ని పనుల్లోనూ పనిమనిషి అవసరాన్ని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి చెప్పుకుందాం...బెంగుళూర్లోని హెబ్బాళ్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ ఏడు నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకూ సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్ వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్–వండిన పోహా, పావ్ భాజీ రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు. శుభ్రంగా తింటున్నారు. దశలవారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్ను నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది. జోడిస్తుంది రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ – కోయడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానై చేసేస్తుంది. అంతేకాదు సదరు రోబోట్ ఆమె ఇతర పనులను చేసుకోవడాన్ని రకరకాలుగా సులభతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా, వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరసమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ, ఆదా అయే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువేనన్నారామె.అదేవిధంగా, నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పనిమనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీగా ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళ నుంచి బెంగుళూర్కు ఇటీవలే వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్వాషర్లు రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్లు వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నాడని మనీషా చెప్పడం గమనార్హం.తుషారా నయన్ వంటి గృహిణులు కూడా మారారు. పనిమనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు. కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ, గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్లు దృష్టి పెట్టాలనీ, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు. కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనాలను వేతన కాలిక్యులేటర్లు లేదా డిజిటల్ పేస్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు -
Wonder Kids ఏడేళ్లకే ఆపరేషన్ చేశాడు!
1993లో హిమాచల్ ప్రదేశ్లోని నూర్పూర్లో జన్మించిన ఆక్రిట్ ప్రణ్ జస్వాల్, చిన్న వయసులోనే అసాధారణ తెలివి చూపించాడు. 10 నెలలకే నడవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు; రెండేళ్లకు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులో షేక్స్పియర్, శాస్త్రీయ పుస్తకాలు చదివాడు. ఏడేళ్ల వయసున్నప్పుడు, అతను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక చేతిపై శస్త్రచికిత్స చేసి, కాలిన గాయం వల్ల అతుక్కుపోయిన వేళ్లను విడదీసాడు. ఒక గంటపాటు జరిగిన ఆపరేషన్ విజయవంతమై, అతన్ని ‘‘ప్రపంచంలోనే అతి చిన్న సర్జన్’’గా చేసింది. ఆ సర్జరీ వీడియో యూట్యూబ్లో వైరల్ అయింది. 2007లో ఓ ప్రా విన్ ఫ్రే షోలో ‘‘లిటిల్ జీనియస్’’గా కనిపించాడు ఆక్రిట్. 12 ఏళ్లలో చండీగఢ్ యూనివర్సిటీలో సైన్స్ డిగ్రీ, 17 ఏళ్లలో కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాడు. క్యాన్సర్ రోగుల బాధలు చూసి, చిన్నప్పటి నుండి క్యాన్సర్ నివారణ కనుగొనాలని కలలు కన్నాడు. ఓరల్ జీన్ థెరపీపై పరిశోధన చేస్తూ, ఆక్రిట్ సైన్స్ ద్వారా ప్రపంచాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇంతటి మేధోశక్తి కలిగిన ఆక్రిట్ ఐక్యూ 146. నాలుగేళ్ల వయసు.. రికార్డుల్లో అదుర్స్నాలుగేళ్ల పిల్లలు అల్లరితో, ఆటలతో కాలం గడుపుతారు. అయితే జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గంగ్యల్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల సిద్ధార్థ్ మాత్రం రికార్డులతో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. అంత చిన్న వయసులో అతను సాధించిన రికార్డులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సిద్ధార్థ్ తల్లిదండ్రులు శివ్ జ్యోతి పాండే, శ్వేత పాండే వైద్యులు. చిన్నప్పటి నుంచి పిల్లాడికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ పెంచారు. దీంతో రెండేళ్ల వయసుకే ఇంగ్లిష్ అక్షరాలన్నీ నేర్చేసుకున్న సిద్ధార్థ్ 12 సెకండ్లలో వాటిని అప్పజెప్పి ‘అతి చిన్న వయసులో, అత్యంత తొందరగా ఇంగ్లీషు అక్షరమాల అప్పజెప్పిన వ్యక్తి’గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. మూడేళ్ల వయసులో భారత జాతీయ చిహ్నాలు, వివిధ రకాల కరెన్సీ నోట్లను గుర్తించి మరోసారి రికార్డు సాధించాడు. ఆ వయసులోనే ఎన్నో పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇతర దేశాల పేర్లు, వాటి జెండాలు, కరెన్సీ వంటి అంశాలను సైతం మూడేళ్లకే గుర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నో మున్ముందు మరెన్నో రికార్డులు నెలకొల్పాలని సిద్ధార్థ్ ఉవ్విళ్లూరుతున్నాడు. -
వెండి గాజుల కోసం.. కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు.బంధువులు, గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది. -
70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్నాథ్కు..! వీడియో వైరల్
మనిషి సంకల్పం ముందు ఏదైనా చిన్నబోవాల్సిందే. అలాంటి ఉదంతాలు ఎన్నో కోకొల్లలుగా జరిగాయి. వాటన్నింటిని తలదన్నేలా అంతకు మించి..అనే అజేయమైన సాహాసానికి తెరతీశాడు ఈ 70 ఏళ్ల వృద్ధుడు. అతడి చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే.. ఇదేలా సాధ్యం అనే ఆశ్చర్యం కలగకమానదు. కర్ణాటకలోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్కు కాలినడకన వచ్చాడు. ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి మరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్నారాయన. ఆ వృద్ధ భక్తుడు తన తోటి యాత్రికుల బృందంతో కలబురగి నుంచి ఈ యాత్ర చేసినట్లు తెలిపారు. తాము మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని అన్నారు. అంటే దాదాపు రెండు నెలల్లో వివిధ మైదానాలు, అడవులు, పర్వత మార్గాల గుండా సుమారు 2,200 కిలోమీటర్ల అసాధారణ యాత్రను చేశారు వారంతా. అంతేగాదు ఆ వృద్ధుడు ఇదంతా మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని అంటున్నారాయన. దైవం ఆశీస్సులు ఉంటే ఎంత కఠినతరమైన ప్రయాణమైనే చిటికెలో సాధ్యమైపోతుందని ధీమాగా చెబుతున్నాడు ఆ వృద్ధుడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్ల మనసును కదిలించింది. ధృడ సంకల్పం, అజేయమైన భక్తి..అనితరసాధ్యమైన ఓర్పుని అందిస్తాయనడానికి ఆ వృద్ధుడే ఉదహారణ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 12000 km Padyatra from Karnataka to KedarnathHindu Dharma is Sanatan because of the Bhakts like him Har Har Mahadev 🔥 pic.twitter.com/bNphehFL8t— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) May 15, 2025 (చదవండి: పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు..! పట్టరాని ఆనందంలో స్వలింగ జంట) -
పేరెంట్స్ అలా స్పందిస్తారని ఊహించలేదు.!
ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్టాపిక్గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.భారత సంతతికి చెందిన క్వీర్ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు. ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె. నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్, రెండు లక్ష్లలకు పైగా లైక్లు వచ్చాయి.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!) -
గురి తప్పని విజయం... భళా ముఖేశ్!
వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్ షూటింగ్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్ పిస్టల్ షూటింగ్లో పతకాలతో భవిష్యత్ తారగా ఎదిగాడు.... గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్ సాధన చేస్తున్నాడు. 11 ఏళ్ల వయస్సులో స్కూల్ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్బాల్ సాధన కోసం ముఖేశ్ చేరాడు. కోచ్ సూచనతో అనుకోని విధంగా పిస్టల్ షూటింగ్ శిక్షణలో అన్న హితేశ్తో కలిసి సాధన ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ చీఫ్ కోచ్ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్పుణేకు మకాం మార్చాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్ ఫర్ గ్లోరీ’ షూటింగ్ అకాడమీలో చేరాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్లో విభాగాలలో ముఖేశ్ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్ భారత రైఫిల్ షూటింగ్ శిబిరానికి ఎంపికయ్యాడు.ఒలింపిక్స్ లక్ష్యంభారత జట్టు తరపున సీనియర్ విభాగంలో ఒలింపిక్స్లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్– మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు -
పెళ్లి వేడుక ఆనందంగా వధూవరులు తప్ప..అందరూ
ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన కోర్ట్ సినిమాలో చివరి దాకా ఒక సస్పెన్స్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కొన్ని నిమిషాల సేపు గడిపి వస్తారు. అయితే అక్కడ ఏం చేశారు అనే సస్పెన్స్. దీన్ని చివరిదాకా కొనసాగిస్తారు. చివర్లో తెలుస్తుంది. వారిద్దరూ ఫేక్ పెళ్లి చేసుకున్నారని... ఇప్పుడు దాదాపుగా అలాంటి ఫేక్ పెళ్లిళ్లే మెట్రో నగరాలకు వచ్చేస్తున్నాయి. అయితే అవి ఇద్దరు టీనేజర్లు చేసుకునే అమాయకపు పెళ్లిళ్లు కాదండోయ్... బాగా డబ్బున్న సంపన్నులు చేసుకునే పార్టీ పెళ్లిళ్లు. అవేమిటి అంటారా?అయితే ఆ పార్టీ సారీ స్టోరీలోకి వెళ్లాల్సిందే... ఢిల్లీ పార్టీ సీన్లో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వచ్చేసింది. దాని పేరే నకిలీ పెళ్లి వేడుకలు, ఈ వేడుకల్లో నిజమైన వధూవరులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించిన హంగు, ఉత్సాహం మాత్రం ఉండాలి. అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి, పెళ్లి వేదికలా అలంకరించబడిన స్థలానికి వెళ్తారు. అక్కడ డీజే మ్యూజిక్, ఢోల్స్, పెళ్లి పాటలతో రాత్రంతా నృత్య విహారం సాగుతుంది. ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ప్రొఫెషనల్ అవంతిక జైన్ ఇన్స్ట్రాగామ్లో ‘‘ఫేక్ సంగీత్’ ప్రకటనను చూసి తన మిత్రులతో వెంటనే షేర్ చేసింది. ‘‘కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలాంటి పెళ్లి థీమ్ పార్టీ చేయాలని కలలు కంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది నిజం అయ్యే ఛాన్స్ లాగా అనిపించింది,’’ అని ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కరికి సుమారు రూ.550 చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించి ఈ ఈవెంట్కు జైన్ ఆమె మిత్రులతో కలిసి వెళ్లారు. , సుమారు వందమంది యువతతో పాటు, ఢిల్లీ మెహ్రౌలీ లేన్ లోని పాప్యులర్ క్లబ్ అయిన జైలో రూఫ్టాప్ రెస్టారెంట్లో జరిగిన ఈ నకిలీ సంగీత్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్కు ‘‘దేశీ’’ డ్రస్ కోడ్ తప్పనిసరి. తన శరీరానికి బ్లాక్ బ్లౌజ్, ప్లమ్ కలర్ లెహంగా ధరించి అవంతిక హాజరయ్యారు. కానీ అక్కడ అంతా పెళ్లికి తగ్గ దుస్తులు ధరించి కనిపించారు. నిజమైన పెళ్లి వేడుకలే గుర్తుకొచ్చేలా కుర్తా–షెర్వానీలు, చున్నీలు, మెరిసే ఆభరణాలు ధరించారు. వేదికలో పసుపు–గులాబి రంగు డెకరేషన్లు, మారిగోల్డ్ పూల అలంకరణలు, ఫోటో బూత్లు, మెహందీ ఆర్టిస్ట్లతో పక్కా పెళ్లి మూడ్ క్రియేట్ చేశారు. పెళ్లి పాటలతో నృత్యం ఓ హైలైట్. ‘‘పంజాబీ, హిందీ బీట్స్పై మనసు పెట్టి డ్యాన్స్ చేశాం. మధ్యలో ఢోల్వాలాలు వచ్చి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు,’’ అని అవంతిక చెప్పారు. ఈ ఈవెంట్కి కేవలం యువతే కాదు, మధ్య వయస్కులు, పెద్దలు కూడా హాజరయ్యారు. అంతా కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. ‘‘ఈవెంట్ అయిపోయినా ఎవరికీ వెళ్లాలనిపించలేదు,’’ అని అవంతిక గుర్తు చేసుకున్నారు. చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసనభారతీయ సమాజంలో పెళ్లిళ్లు అనేవి ఒక పెద్ద వేడుక. అలాంటి వేడుకల మూడ్ను ఎప్పుడైనా సరే అంటే ముహూర్తాలు లేని టైమ్లో కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఆహ్వానించదగ్గ ట్రెండ్ అని చెప్పాలి. నిజమైన పెళ్లి ఆహ్వానాన్ని అందుకోవాలని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే పెళ్లిళ్లకు వెళ్లవచ్చు. ఢిల్లీకి చెందిన‘‘జుమ్మీకీ రాత్’’ అనే ఈవెంట్ కంపెనీ ఇప్పటివరకు ఇలాంటి రెండు నకిలీ పెళ్లి ఈవెంట్లు నిర్వహించింది. అంతేకాదు గత 2024 అక్టోబరులో షంగ్రీలా గ్రూప్ ‘బంధన్’ పేరుతో వెడ్డింగ్ సర్వీసును లాంచ్ చేసినప్పుడు కూడా మాక్ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన పెళ్లి వస్త్రధారణలో మోడల్ జంట, లైవ్ సుఫీ మ్యూజిక్, గజ్రా స్టాళ్లు, భోజన విందుతో ఈ ఈవెంట్ను రక్తి కట్టించారు. చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!సాధారణంగా వెడ్డింగ్ కొరియోగ్రఫీ సంస్థలు కూడా వీడియో కంటెంట్ కోసం నకిలీ పెళ్లిళ్లు ప్లాన్ చేస్తుంటాయి. ఎందుకంటే... స్టూడియో కంటే, పెళ్లి వేదికలపై తీసిన వీడియోలకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అక్కడే ఈ తరహా మాక్ వెడ్డింగ్లు జరుపుకుంటూ కల్చరల్ కనెక్షన్ను కొనసాగిస్తారు. ఇప్పుడు ఇవి పార్టీ మార్గాలుగా కూడా మారిన నేపధ్యంలో ఈ ఫేక్ వెడ్డింగ్ పార్టీ కల్చర్ మన దాకా వచ్చేస్తుందేమో...చూడాలి. -
పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకే
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.నాలుగు నెలల క్రితం వివాహంబోర్డర్ సెక్యూరిటీ దళానికి చెందిన రాంబాబు సింగ్ బీహార్లోని సివాన్ జిల్లాకు చెందినవాడు. ఏప్రిల్ 22న జరిగినపహల్గామ్ దాడి, 26 మంది అమాయకుల చనిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పోరాడుతూ అమరుడైనాడు. రాంబాబు మృతదేహాన్ని మే 14, 2025న అతని గ్రామం వాసిల్పూర్కు తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ అమరసైనికుడికి కన్నీటి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు , జిల్లా అధికారుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా వీర జవాన్కు నివాళులర్పించారు.#WATCH | Siwan, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to his native village in Siwan. pic.twitter.com/iShgQ0J1Dh— ANI (@ANI) May 14, 2025 #WATCH | Patna, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to Patna.RJD leader Tejashwi Yadav pays tribute to him. pic.twitter.com/RBGOMOUNF2— ANI (@ANI) May 14, 2025ఆపరేషన్ సిందూర్లోరాంబాబు సింగ్ ముందు వరుసలో నిలబడి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్నప్పటినుంచీ దేశానికి సేవ చేయాలనేకోరికతో సైనికుడిగా బాధ్యతల్లో చేరాడు. ఆ జవాన్ నాలుగు నెలల క్రితం (2025, ఫిబ్రవరి) వివాహమైంది. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతానికి బదిలీ అయ్యాడు. దేశంకోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడి మరణ వార్త రాంబాబు సింగ్ గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తన భర్త మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందిని, కానీ చాలా గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించారు. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?రాంబాబు సింగ్ త్యాగాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అంటూ జవాను మరణంపైబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుడి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.చదవండి: లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!పహల్గామ్ దాడి , 'ఆపరేషన్ సిందూర్'జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్లో అమాయక పౌరులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7, 2025 తెల్లవారుజామున రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. -
TSRTC city bus : అత్యంత రద్దీగా బస్సులు...అసలు కారణాలివీ!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగింది. ఫ్యూచర్సిటీ ఇప్పటి నుంచే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ అతి పెద్ద గ్లోబల్సిటీగా అవతరించనుందని ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ ఈ విస్తరణకు తగినవిధంగా ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధిపైన మాత్రం దృష్టి సారించడం లేదు. మెట్రో రెండో దశకు డీపీఆర్లు సిద్ధమైనప్పటికీ కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఆ ప్రాజెక్టు ఊగిసలాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, ఔటర్ను దాటుకొని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తున్న కాలనీలు, జనావాసాల దృష్ట్యా రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం హైదరాబాద్ మహానగరానికి ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ పదేళ్లుగా కొత్త బస్సులు రోడ్డెక్కలేదు. కాలం చెల్లిన వాటి స్థానంలో ఎలక్ట్రికల్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఏసీ కేటగిరీలకు చెందిన అద్దె బస్సులను ప్రవేశపెట్టడం మినహా ప్రజావసరాలకు అనుగుణంగా సిటీబస్సులు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సులు ఇంచుమించు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ 60 శాతం బస్సులే రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రెండేళ్లలో సుమారు 40 శాతం బస్సులు తగ్గాయి. బస్సుల కొరత క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?కొత్త బస్సులేవి..? నగరంలో ఒకవైపు సొంత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ మరోవైపు సిటీబస్సుల వినియోగం కూడా పెరిగింది. మెట్రో రైళ్లు తిరిగే కారిడార్లలో మినహాయించి నగరం నలువైపులా ప్రయాణికులు బస్సులపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. రెండేళ్ల క్రితం సుమారు 16 లక్షల మంది ప్రయా ణం చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 22 లక్షలకు చేరినట్లు అంచనా. కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించు 6 లక్షల మంది పెరిగారు. 2023 డిసెంబర్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తరువాత మెట్రోల్లో ప్రయాణం చేసే మహిళలు, సొంత వాహనాలను వినియోగించేవారు సైతం సిటీబస్సుల వైపు మళ్లారు. మరోవైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. నగరంలోని 28 డిపోల పరిధిలో 2800 బస్సులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.శివారు ప్రాంతాలు, కాలనీలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. వందలాది ప్రాంతాలకు ఉదయం, సాయంత్రం ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున మాత్రమే తిరుగుతున్నాయి. దీంతో మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొత్తగా కొన్ని బస్సులను ప్రవేశపెట్టినప్పటికీ కాలం చెల్లిన వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చినవే కానీ పెరుగుతున్న ప్రయాణికులు, విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం అవసరాల మేరకు ప్రవేశపెట్టినవి కాదని ఆర్టీసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు! మెట్రో నగరాలతో పోటీ ఎక్కడ? ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, తదితర మెట్రో నగరాల్లో సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లతో పాటు సిటీ బస్సులను కూడా గణనీయంగా పెంచారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తేలిగ్గా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 8,121 బస్సులు ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో మరో 2000 బస్సులను కొనుగోలుచేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ముంబయిలో ప్రస్తుతం 3,228 బస్సులు అందుబాటులో ఉన్నాయి.2027 నాటికి ఈ సంఖ్యను 8000 లకు పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. బెంగళూరులో 6,835 బస్సులు అందుబా టులో ఉన్నాయి. మరో 1000 బస్సులను కొత్తగా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్లో 2,800 బస్సులు తిరుగుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 500 బస్సులను అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. -
ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు!
మణికొండ: జీవిత చమరాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు..కూతురైన కరుణించకపోతుందా అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది. వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. ఈ ఘటన నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల కొమరయ్య, లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగిలో 150 గజాల్లో ఇంటిని నిర్మించుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు చేశారు. అయితే ఇంటిని కుమారులు, కూతురు కలిసి ఇటీవల రూ.60 లక్షలకు అమ్మేసి ముగ్గురు రూ. 20 లక్షల చొప్పున పంచుకున్నారు. తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు. కుమారులు, కూతురు స్థానికంగానే ఉన్నా వారికి అన్నం పెట్టడం లేదు. దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టు పక్కల వారి ఇళ్లకు వెళ్లి అడుక్కు తింటున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు.. స్థానిక మాజీ కౌన్సిలర్ ఉషారాణి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు వచ్చే రూ. 2వేల పింఛన్ రూ.5 వేలు అవుతుందని, సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్త చెప్పాడు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, తమను ఆదుకోవాలని కోరారు. -
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంతకీ ఎవరా ఆ రష్యన్ మహిళ అంటే..రష్యన్ బనియాగా పిలిచే పోలినా అగర్వాల్ ఇన్స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ..హృదయపూర్వక సందశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివాసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్లోని ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించిందని అన్నారు. అందుకు తానే ఏమని బదులిచ్చిందో వివరించింది. పోలినా ఏం చెప్పారంటే..భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగా సురక్షితమైనదని చెప్పానని అన్నారు వీడియోలో. రష్యా అందించిన ఆయుధ సంపత్తి తోపాటు భారత్ మిలటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనికుల నిస్వార్థ సేవ , అంకితభావం తదతరాలు అంతకమించిన వజ్రాయుధాలని పేర్కొంది. వాళ్లంత తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధ జరుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీరసైనికులు. అందుకు నేను వారికి ఎంతగానే కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలనని పోలినా నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆ వీడియోకి " ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటామని" క్యాప్షన్ కూడా ఇచ్చారామె. ఆ వీడియోకి ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు సైతం ప్రతిరోజూ మమ్మల్ని రక్షించే మా సైనికుల అంకితభావం, ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలుగా మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Polina Agrawal (@pol.explorer) (చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!) -
'వై-ఫై' పెట్టిన చిచ్చు..! నిర్థాక్షిణ్యంగా ప్రియురాలిని..
ఒక్కోసారి ఇంటర్నెట్ సాంకేతికత కూడా జంటల మధ్య గొడవలకు కారణమవుతుంటుంది. ప్రమాదవశాత్తు కనెక్ట్ అయిన వైఫై ఓ జంట విడిపోయేందుకు దారితీసింది. నిజానికి ఆమె తప్పు చేయపోయినా మోసం చేసిన వ్యక్తిగా నిలబడాల్సి వచ్చింది. అసలు విషయం తెలుసుకుని..తన నిజాయితీని నిరూపిద్దామన్నా..విధి ఆ అవకాశమే లేకుండా చేసింది ఆ అమ్మాయికి. అసలేం జరిగిందంటే.. నైరుతి చైనాలోని చాంగ్కింగ్లోని ఒక హోటల్కు లీ అనే మహిళ తన ప్రియుడితో కలిసి సరదాగా సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని ఓ హోటల్కి వస్తారు. అక్కడ హాయిగా షికార్లు తిరిగి ఎంజాయ్ చేసి..ఇంటికి వెళ్లిపోదామనుకుంటారు. ఆ క్రమంలో హోటల్ని ఖాళీ చేస్తుండగా.. ఆమె ఐడీ కార్డు కనిపించదు. దాంతో ఆమె ఐడీ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుందామనుకుంటుంది. ఆ నేపథ్యంలో అనుకోకుండా ఆ హోటల్ వై-ఫైకి తన మొబైల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. అంతే ఒక్కసారిగా.. ఆమె ప్రియుడికి గతంలో ఆమె వేరే ఎవరితోనే ఇక్కడకి వచ్చిందనే అనుమానం కలిగింది. అయితే లీ మాత్రం ఇదే మొదటిసారి ఈ హోటలకి రావడం అని మొత్తుకున్నా వినడు ప్రియుడు. మరీ వైఫై ఎలా కనెక్ట్ అయ్యిందో వివరణ ఇమ్మంటే..చెప్పలేకపోతుంది ప్రియుడికి. అంతే బ్రేకప్ అంటూ ఆమెను నిర్థాక్షణ్యంగా వదిలేస్తాడు. ఇక దీంతో లీకి అసలు ఈ హోటల్ వైఫైకి తన ఫోన్ ఎలా కనెక్ట్ అయ్యిందో కనుక్కోవాలని భావించి..ఆ విషయమై క్షణ్ణంగా విచారిస్తుంది. లీ తాను గతంలో పనిచేసిన చాంగ్కింగ్లోని మరొక హోటల్కి అదే యూజర్నేమ్, పాస్వర్డ్లు ఉండటాన్ని గుర్తిస్తుంది. వెంటనే రీజన్ చెప్పేందుకు తన ప్రియుడిని సంప్రదించగా అతడు వినే స్థితిలో ఉండడు, పైగా చాట్ యాప్లో కూడా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆమె అకౌంట్ని కూడా డిలీట్ చేశాడు. దాంతో ఆమె తన కథను ఒక స్థానిక వార్తా ఛానెల్లో వివరిస్తుంది. అలాగే మునపటి పని ప్రదేశంలో ఆ వైఫై--అలాగే ఈ హోటల్ వైఫ్కి ఎలా కనెక్ట్ అయ్యిందో రిపోర్టర్ సాయంతో సవివరంగా చెబుతుంది. ఇక ఇదంతా తనని నమ్మని వ్యక్తిన కలిసేందుకు ఈ వివరణ ఇవ్వడం లేదని, తనలా మరొకరు అపార్థాలకి బలవ్వకూడదని ఇలా చేశానని ఆమె బాధగా వివరించింది. (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్) -
కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియో
సోషల్ మీడియా మోజు అనేక ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ సోషల్మీడియాపై క్రేజ్ పోవడం లేదు. కొంతమంది యువతీ యువకులు సోషల్ మీడియా లైక్స్, కమెంట్స్ కోసం ఎంతటికైనా దిగజారడానికి సిద్ధపడిపోతున్నారు. తాజాగా కదులుతున్న కారుపై వధువు,వరుడు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఏమైందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..జీవితంలో అంత్యం సంతోషకరమైన క్షణాలను పదిలంగా దాచుకోవాల్సిందే. తమసంతోషాన్ని నలుగురితో పంచుకోవడంలో తప్పులేదు. కానీ లేనిపోని, పిచ్చి పిచ్చి సాహసాల వలన స్వయంగా కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే కాదు, ఒక్కోసారి సహచరులకు ముప్పుగా పరిణమిస్తుంది. సరదా పేరుతో తెలివితక్కువతో చేసే పనులపై ఇటీవలి కాలంలో చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.వివాహ వేడుక తరువాత ఒక నూతన జంట ప్రమాదకరంగా డ్యాన్స్ చేసి వైరల్గా మారారు. ఆ తరువాత చిక్కుల్లో పడ్డారు.చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో In Gwalior, a bride and groom violated traffic rules in order to go viral. A video of the groom doing stunts with a sword on the car and the bride dancing on the bonnet is becoming increasingly viral on social media#MadhyaPradesh #MetGala #MetGala2025 #MetGala2025xFREEN #Stunt pic.twitter.com/JrBfc58JTB— TodaysVoice ImranSayyed (@todaysvoice24nz) May 6, 2025గ్వాలియర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరుడు గర్వంగా కారు పైకప్పుపై నృత్యం చేశాడు. అక్కడితో ఆగలేదు.. కత్తిని గాలిలో తిప్పుతూ దర్పాన్ని ప్రదర్శించాడు. ఇక నేనేం తక్కువ అన్నట్టు, పెళ్లిదుస్తుల్లోనే వధువు కూడా బోనెట్ మీద కూర్చుని స్టెప్పులేయడం మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్ నటించిన నో ఎంట్రీ బాలీవుడ్ చిత్రంలోని ‘ఇష్క్ కి గలి విచ్ నో ఎంట్రీ’ పాటకుఉత్సాహంగా గెంతులేశారు. కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై జరిగిన ఉదందాన్ని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కామన్ సెన్స్ లేదంటూ తిట్టిపోస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు కారును ట్రాక్ చేసి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చలానా జారీ చేశారు. గోలా కా మందిర్ ట్రాఫిక్ స్టేషన్కు చెందిన సుబేదార్ అభిషేక్ రఘువంశీ దీన్ని ధృవీకరించారు. దంపతులకు, ఇతర ప్రయాణికులకు ప్రమాదం ఉందని , విచారణ అనంతరం మరిన్ని జరిమానాలు విధించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర -
వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!
హైదరాబాద్ ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రజలు రాకపోకలకు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. అది కామన్. అయితే ముంబై నగరంలోనో ఓ లేడీస్ స్పెషల్ ట్రైన్ కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏ రేంజ్లో రద్దీగా ఉందో చూస్తే షాకవ్వుతారు. అది కూడా అమ్మాయిలే ఫుట్బోర్డుపై వేళ్లాడుతూ వెళ్తున్న విధానం చూస్తే నోటమాట రాదు. మరి అదెక్కడ జరిగిందో చదివేయండి మరీ..ముంబై మహానగరం అంతటా లక్షలాదిమంది ప్రయాణికులు ఈ లోకల్ రైళ్లపై ఆధారపడతారు. ఈ స్థానిక రైళ్లే ముంబైలోని వివిధ శివారు ప్రాంతాలను అనుసంధానించడంతో.. అక్కడ నివాసితులకు ఈజీగా రాకపోకలు సాగించడంలో కీలక పాత్రపోషించేది అవే. ఐతే అలాంటి ఓ రైలు మహిళతో ఫుల్ అయ్యి ఉన్నవీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదికూడా మహిళలే ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై కళ్యాణ్ లేడీస్ స్పెషల్ లోకల్ రైలులో చోటుచేసుకుంది. అయితే ఆ రైలు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంతలా హౌస్ఫుల్ అయ్యినట్లు సమాచారం. ఏకంగా మహిళలు కూడా ఏ మాత్రం భయపడకుండా ఫుట్బోర్డుపై ప్రయాణించడమే అత్యంత షాకింగ్ గురిచేసే విషయం. అందుకు సంబంధించిన వీడియోని ముంబౌ రైల్వే యూజర్స్ ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది. అయితే నెటిజన్లు ఈ అసురక్షితమైన జర్నీలకంటే మరొక రైలు కోసం ఎదురుచూడటం మంచిదని పోస్ట్ చేయగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన జర్నీలు తమ కుటుంబాలకు శాశ్వతాన్ని బాధను మిగులుస్తాయని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025 (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్) -
ప్రత్యేక ఆకర్షణగా 103 దేశాల తాళజాతి వనం, ఎక్కడో తెలుసా?
ఓల్డ్మలక్పేట ఈ–సేవ వెనుక భాగంలో ఉన్న తాళజాతి వనం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది. అక్కడ ఉండే చెట్లన్నీ పొట్టిగా, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు వీలుగా ఉంటాయి. 103 దేశాలకు చెందిన తాళజాతి చెట్లన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఆకర్షణతో పాటు ఆహ్లాదంగా ఉంటుంది. వీటితో పాటు వివిధ దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలు కూడా ఈ పార్కులో పెరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం ఈ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవిలో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్, జర్మని, ఆ్రస్టేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఈస్ట్ ఆసియా మొదలగు దేశాల నుంచి సేకరించిన వివిధ రకాల మొక్కలు ఈ పార్కులో జీవం పోసుకుంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుందని ప్రవేశం ఉచితమని అధికారులు పేర్కొంటున్నారు. – చాదర్ఘాట్ ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరతాళ జాతి మొక్కల ఉపయోగాలు:ఆహారం: తాళ జాతి మొక్కల నుండి మనం వివిధ రకాల ఆహారాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు, తాటి పండ్లను తినవచ్చు తాటి నూనెను తయారు చేయవచ్చు. తాళ జాతి మొక్కలు ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి మొక్కలనుంచి తీసని కల్లునుఉపయోగిస్తారు.తాళ జాతి మొక్కలను వివిధ రకాలుగా వాడుకోవచ్చు, ఉదాహరణకు, తాటి కలపను ఉపయోగించి ఇల్లు కట్టవచ్చు. తాటి ఆకులతో ఇల్లు కట్టుకోవచ్చు. తాటి చాపలు , బుట్టలతోపాటు, అనేక రకాల అలకరణ వస్తువులను తయారు చేసుకోవచ్చు. మొదలనవి. పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాతావరణాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది , జీవరాసులకు నివాస స్థలాన్ని అందిస్తుంది. -
వివాహం వినూత్నం.. ! సంఘ సంస్కర్తలే సాక్షిగా..
పెళ్లి అంటే పూజలు, వేదమంత్రాలు, తాళి, మేళతాళాలు ఉంటాయి. కానీ ఎటువంటి దేవుడి ఫొటోలు లేకుండా సంఘ సంస్కర్తలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, పెరియర్ రామస్వామి, సావిత్రి బాయి పూలే, గౌతమ బుద్ధుని ఫొటోలు పెట్టుకుని ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల వివాహాలు జరిగాయి. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తె ల అభిప్రాయాల మేరకు బౌద్ధ ఆచార ప్రకారం వివాహం జరిపించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాలకు కొరవంగి గ్రామం వేదిక అయింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములైన సలభంగి చిన్నారావు ఇదే మండలం బొండాపల్లి గ్రామానికి చెందిన శ్యామంతి, సలభంగి సునీల్కుమార్ పోయిపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకుమారి వివాహాలను దమ్మ దీక్ష విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు బి. గౌతమ్బాబు, ఎస్. సింహాద్రి జరిపించారు. అలాగే పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, బాంసెఫ్ గౌరవ అధ్యక్షుడు ఎం.చిట్టిదొర ధర్మ సందేశం వినిపించారు. అనంతరం వధూవరులు పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. తాము చదువుకున్నప్పటి నుంచి బౌద్ధ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇదే విధంగా జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నదమ్ములైన పెళ్లికొడుకులు తెలిపారు. ఇందుకు బంధువులు కూడా సమ్మతించడం గొప్ప విషయమన్నారు. ఈ వివాహాలు వీవీ దుర్గారావు, కె, సత్యనారాయణ, ఎస్. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. బాంసెఫ్ ప్రతినిధులు చెండా భీమసుందర్, టీచర్లు కె. సత్యనారాయణ, ఎస్. మత్స్యలింగం పాల్గొన్నారు.(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..) -
సన్నని సైజుకు లావైన డిస్కౌంట్..! ఇది మాములు ఆఫర్ కాదు..
థాయ్ల్యాండ్లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్నెస్ టెస్ట్లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి. ఎంత సన్నని సందు నుంచి బయటకు వస్తే, అంత పెద్ద డిస్కౌంట్ ఇస్తారు. అలా ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వివిధ చర్చలకు దారితీసింది. చాలామంది ఫన్నీగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీనిని బాడీషేమింగ్గా పేర్కొంటూ మండిపడుతున్నారు. కాని, హోటల్ యజమానులు మాత్రం ‘ఇది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి చేసిన వినోదాత్మక ప్రయోగం’ అని అంటున్నారు. View this post on Instagram A post shared by Ameana Finds (@ameana_finds) (చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!) -
Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180. అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త! ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..) -
పురాతన, అరుదైన నాణేల శ్రీనివాస్!
రామగిరి(మంథని): ఆ యువకుడికి చిన్నప్పటి నుంచే నాణేల సేకరణ అంటే ఎంతో మక్కువ. వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తూనే.. సేంద్రియ సాగు పద్ధతులు అవలంబిస్తూనే నాణేల సేకరణను అభిరుచిగా మలచుకున్నారు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటితరానికి మన ఘనచరితను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఆయనే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్. స్వాతంత్య్రం రాకముందు.. వచ్చిన తర్వాత చలామణిలో ఉన్న పలు నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. ఎవరి వద్ద ఏదైనా పాత నాణేం ఉందని తెలిస్తే చాలు.. వారివద్దకు వెళ్లి మరీ దానిని సేకరించి భద్రపరుస్తున్నారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు.. తండ్రి యాదగిరి రాయమల్లుకు చెందిన గొలిసోడా బండి వద్ద ఉండేవారు. ఈ సందర్భంగా కొనుగోలు దారులు ఇచ్చే నాణేలను చూసిన శ్రీనివాస్.. అప్పుడే వాటి సేకరణపై అభిరుచి పెంచుకున్నారు. అప్పుడు తన నానమ్మ యాదగిరి బొందమ్మ వద్ద గల తూటు (రంధ్రం) నాణెంతో సేకరణ ప్రారంభించారు. అప్పట్నుంచి పలు రకాల నాణేల గురించి తెలుసుకుంటూ వాటి సేకరణను అభిరుచిగా మార్చుకున్నారు. చదవండి: ఇషా అంబానీ డైమండ్ నెక్లెస్ రూ. 1,267 కోట్లా? నెయిల్ ఆర్ట్ స్పెషల్ ఏంటి?వ్యవసాయ విస్తరణాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నాణేల సేకరణ చేస్తున్నారు. ఆయన వద్ద స్వాతంత్య్రం రాకముందు అణా.. అంత కన్నా.. చిన్నవి 22 నాణేలు, స్వాతంత్య్రం వచి్చన తర్వాత వినియోగించిన 1 పైసా–2, 2 పైసలు–3, 3 పైసలు–1, 5 పైసలు–8, 10 పైసలు–16, 20 పైసలు–7, 25 పైసలు–13, 50 పైసలు–19, రూపాయి–38, రూ.2–25, రూ.5–64, రూ.10–30, రూ.20–2 నాణేలు, రూపాయి, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ఉన్నాయి. చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోవీటిలో స్వాతంత్య్రం రాకముందు ఈస్ట్ ఇండియా, బ్రిటిష్, నిజాం, గ్వాలియర్ రాజుల కాలం నాటి నాణేలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ ఇండియా ముద్రించిన నాణేలున్నాయి. ఆధునిక డిజిటల్ సేవలైన (ఫోన్ పే, గూగుల్ పే) నడుస్తున్నందున.. ఇప్పటి పిల్లలకు వీటిపై అవగాహన కల్పించడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే ఆలోచనలో శ్రీనివాస్ ఉన్నారు. తద్వారా పిల్లలకు అవగాహన కలగడమే కాకుండా.. వారికి ఇది ఒక అభిరుచిగా మారే అవకాశం ఉంటుంది. అప్పటి తరంలో సమాజానికి వ్యవసాయం ప్రాధాన్యాన్ని నాణేల్లో తెలిపారని శ్రీనివాస్ వెల్లడించారు. భవిష్యత్ తరాలకు చరిత్ర గురించి తెలపాలన్న చిరు ప్రయత్నమే.. తన నాణేల సేకరణ అభిరుచికి కారణమని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే వేగవంతమైన పక్షులు
పక్షులు ప్రకృతి యొక్క అద్భుత సృష్టి. వాటి రంగురంగుల ఈకలు, కిలకిల శబ్దాలు మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కానీ కొన్ని పక్షులు తమ అసాధారణ వేగంతో కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆకాశంలో రాకెట్లలా దూసుకెళ్లే ఈ పక్షులు; వేటాడటం, ప్రయాణించడం లేదా ప్రమాదాల నుండి తప్పించుకోవడం కోసం తమ వేగాన్ని ఉపయోగిస్తాయి. అలాంటి వేగవంతమైన పక్షుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెరెగ్రిన్ ఫాల్కన్ (Peregrine falcon)ఈ పక్షి ఆకాశంలో రాజు. గంటకు 240–380 కి.మీ. వేగంతో డైవ్ చేసే పెరెగ్రిన్ ఫాల్కన్ ప్రపంచంలోనే వేగవంతమైన జీవి. వేట సమయంలో ఇది గాలిలో సైనిక విమానంలా దూసుకెళ్తుంది. దీని శరీర నిర్మాణం, పదునైన కళ్లు, బలమైన రెక్కలు దీన్ని అసాధారణ వేగంతో ఎగిరేలా చేస్తాయి.గోల్డెన్ ఈగిల్ (Golden Eagle)గోల్డెన్ ఈగిల్ గంటకు 128–192 కి.మీ. వేగంతో డైవ్ చేస్తుంది. దీని బలమైన రెక్కలు, శక్తివంతమైన పంజాలు వేటలో దీనికి సహాయపడతాయి. ఉత్తర అమెరికా, యూరప్లో కనిపించే ఈ పక్షి ఆకాశంలో గంభీరంగా ఎగురుతుంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోవైట్-త్రోటెడ్ నీడిల్ టైల్ ((White-throated needletail)ఈ చిన్న పక్షి గంటకు 170 కి.మీ. వేగంతో ఎగురుతుంది. దీని సన్నని శరీరం, పొడవైన రెక్కలు దీనికి అధిక వేగాన్ని అందిస్తాయి. ఆసియా, ఆస్ట్రేలియా ్ర΄ాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పక్షి తన వేగంతో కీటకాలను వేటాడుతుంది.కామన్ స్విఫ్ట్ (Common Swift) కామన్ స్విఫ్ట్ గంటకు 112 కి.మీ. వేగంతో ఎగరగలదు. ఈ పక్షి దాదాపు తన జీవితమంతా గాలిలోనే గడుపుతుంది. తినడం, నిద్ర΄ోవడం,పక్షులతో జతకట్టడం కూడా ఎగురుతూ చేస్తుంది. దీని వేగం, శక్తి దీన్ని దీర్ఘ దూర ప్రయాణాలకు అనువైన పక్షిగా ఉంచుతాయి.ఆస్ట్రేలియన్ హాబీ (Australian Hobby గంటకు 100 కి.మీ. వేగంతో ఎగిరే ఈ చిన్న ఫాల్కన్ ఆస్ట్రేలియా ప్రాంతాల్లో సాధారణం. ఇది చిన్న పక్షులను, కీటకాలను వేగంగా వేటాడుతుంది. దీని చురుకైన కదలికలు దీన్ని వేగవంతమైన వేటగాడిగా చేస్తాయి. -
భారత్ చేసింది న్యాయం..! పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు
పహల్గాం ఘటనకు ప్రతిగా భారత్ బుధవారం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయిలో ఇరు దేశాలు యుద్ధం దిశగా కదులుతున్నాయి. ఈ తరుణంలో నెట్టింట ఒక పాక్ వ్యక్తి భారత్ చేసింది న్యాయమే అంటూ పోస్ట్ చేసిన వైరల్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులోనూ ఇలాంటి సమయంలో శత్రు దేశానికి చెందిన వ్యక్తే ఇలా మాట్లాడటం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోలో దుబాయ్కి చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత్ సిందూర్ ఆపరేషన్తో పాక్పై చేసిన దాడిని సరైదని, అది న్యాయం అని మాట్లాడారు. అంతేగాదు భారత ప్రభుత్వం చర్యను, భారత సాయుధ దళాల ప్రతిస్పందనను మెచ్చకున్నాడు. ఇప్పుడు పాక్ వరకు వచ్చేటప్పటికీ తామూ బాధితులమే అని డ్రామా ప్లే చేస్తోందని ఆరోపించాడు. పహల్గాం పర్యటనకు వచ్చిన 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నప్పుడూ ఏమైంది ఇదంతా అని నిలదీశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి, మానవహక్కులు అంటూ నీతి కబర్లు చెప్పడమే గాక పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అని తిట్టిపోశాడు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా స్పందించే హక్కు భారత్కి పూర్తిగా ఉందన్నారు. అలాగే భారత్ చేసింది న్యాయమే అని ప్రశంసించాడు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడూ తెలియలేదా పాక్కి ఇది ఎప్పటికైనా నష్టమే అని అంటూ ఫైర్ అయ్యాడు. ప్రజలు మరణించగానే శాంతి అనడం కాదు..భారత్ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ..శాంతికి పీటవేస్తూ వచ్చిందనేది గుర్తులేదా అని మండిపడ్డారు. అంతేగాదు భారత్ చేసింది యుద్ధ చర్య కాదు..కేవలం అది న్యాయం.. అనినొక్కి చెప్పాడు అభయ్ వీడియోలో. పైగా ఆ వీడియోకి ఒక పాకిస్తానీ హిందువుగా నా అభిప్రాయం అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు సదరు పాక్ వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s)source: Live Mint english website ఆధారంగా..(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..) -
రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్ చేస్తే..!
అనాథ అయితేనేం.. ఒక పెద్ద కుటుంబమే ఆమెకు అండగా నిలబడింది. పెద్దలంతా, ముఖ్యంగా మహిళలంతా పెద్దిదిక్కులా మారి ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇందులోనే భాగంగా హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల వయసులో అనాథలా రైల్వే స్టేషన్లో దొరికిన యువతి పెళ్లివార్త ఇపుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. రాంగోపాల్పేట్: రెండేళ్ల వయసులో రైల్వే స్టేషన్లో దొరికి పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చింది. నిర్వాహకులే కుటుంబ సభ్యులై అన్నీ చూసుకున్నారు. పాయల్కు రెండేళ్ల వయసున్నపుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా పోలీసులు హిల్స్ట్రీట్ పాఠశాల ఆవరణలోని ఆశ్రయ్ రెయిన్బో హోంకు అప్పగించారు. రెండేళ్ల వయసు నుంచి అక్కడే ఉంటూ డిగ్రీ ఆమె ఇక్కడే పూర్తి చేసింది. ఇదీ చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!ఆ తరువాత ఆప్థమాలజీ కోర్సు పూర్తి చేసి ఓ ఆప్టికల్ షాపులో ఉద్యోగం చేస్తుంది. చందానగర్కు చెందిన యువకుడిని ఇష్టపడింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఆశ్రమం నిర్వాహకులు గ్రేస్.. కార్పొరేటర్ కొంతం దీపిక మరికొంత మంది దాతల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారు. బుధవారం రాత్రి ఆశ్రమం ఆవరణలో ఉత్సాహంగా మెహిందీ ఫంక్షన్ నిర్వహించారు. వైభవంగా ఆ మూడు ముళ్ల వేడుకను పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.చదవండి: వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
Operation Sindoor సలాం, హస్నాబాద్!
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్మీనే. కుటుంబాలకు దూరంగా ఉంటూ భరతభూమికి వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. రేయింబవళ్లు శత్రు మూకల బుల్లెట్లు, బాంబుల మోతల మధ్య నిత్యం పోరాటం చేసే సైనికులే మన ధైర్యం. ఆ సైన్యంలో దాదాపుగా వంద మందికి పైగా హస్నాబాద్ వాసులు విధులు నిర్వహిస్తున్నారు. దుద్యాల్: యువత సరిహద్దులో సేవ చేసేలక్ష్యంతో ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామం నుంచి వంద మందికి పైగా దేశ రక్షణలో సైనికులుగా చేరారు. ప్రతీ సెలక్షన్ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు సైన్యంలో చేరడం ఆనాయితీగా మారింది. 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన చేరికలు నేటికీ కొనసాగుతూ దేశ సేవలో తరిస్తున్నారు. ప్రతీ ఏడాది పది మంది పదవీ విరమణ పొందుతుంటే మరో పది మంది సైన్యంలో చేరుతుంటారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున సైన్యంలో విధులు నిర్వహిస్తున్న వారు వంద మందికి పైగా ఉన్నారు. రక్తం ఉరకలేస్తోంది ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం ప్రారంభమైంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దాదాపు 50 మంది వరకు సైనికులను జమ్మూకశ్మీర్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా సాధారణ విధులు నిర్వహించిన తమకు ప్రస్తుతం మధురానుభూతి కల్గుతోందని కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శత్రు దేశం పాకిస్తాన్తో యుద్ధం అంటే రక్తం ఉరకలేస్తుందంటున్నారు. హైదరాబాద్, నాసిక్, బెంగళూర్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రధాన నగరాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలించినట్లు అందులో హస్నాబాద్కు చెందిన వారు సైతం ఉన్నారని సైనికులు చెబుతున్నారు. ప్రాణభయం లేకుండా దేశసేవకు సిద్ధంగా ఉన్నామని.. ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘఇదీ చదవండి : వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్న కార్గిల్ యుద్ధంలో నేను సైతం ఇంతియాజ్ అలీ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధ సమయంలో పాక్–బంగ్లా దేశాలు కొన్ని ప్రాంతాలు విడుపోయాయని ఆయన చెప్పారు. భారత్ నుంచి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడం ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలోనూ పాలుపంచుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొనే అవకాశం హస్నాబాద్కు చెందిన సైనికులకు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. ఇదీ చదవండి : Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!గర్వంగా ఉంది భారత్–పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ విధుల్లో ఉన్నా. ప్రస్తుతం చైనా సరిహద్ధులోని లడక్ ప్రాంతంలో భద్రత బలగాల్లో ఉన్నాను. ఇన్నాళ్ల విధుల కంటే ఇప్పుడే సంతృప్తిగా ఉంది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థిపై యుద్ధం చేయడమే లక్ష్యం. దేశసేవలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉంది. -జి.ఆశప్ప, నాయక్ సుబేదార్ పిలుపు వస్తే పరుగెత్తుతాం ప్రస్తుతం భారత్–మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. మన దేశం శత్రుమూకపై దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు భారత సైన్యం తలమునకలైంది. మాజీ సైనికులకు పిలుపువస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. యుద్ధం చేయాలనే ఆసక్తితో ఉన్నాం. – బసప్ప, మాజీ సైనికుడు, హస్నాబాద్ -
'చిన్న ఇల్లే హాయి'..! వైరల్గా ఓ తల్లి మనోగతం
ఇల్లు చిన్నగా ఉంటేనే మంచిదనేది పెద్దల వచనం కూడా. ఇంటిని బట్టే రాబడి ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే అందుకు తగ్గ ఖర్చులు అధికంగా ఉంటాయి. మన ఆదాయానికి తగ్గ ఇల్లు అయితే ఖర్చు అదుపులో ఉంటుదనేది నానుడి. అయితే ఇప్పుడందరూ ఇల్లు విలాసవంతంగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పైగా అలా ఉండటం ఓ స్టాటస్ ఆఫ్ సింబల్గా కూడా మారింది. అందుకే ఇప్పుడు నగరాల్లో టు బెడ్ రూం, త్రీ బెడ్ రూం, విల్లా అంటూ సందడి చేస్తున్నాయి. కానీ ఇలాంటి ట్రెండింగ్ వాతారవరణంలో ఓ భారత సంతతి తల్లి మాత్రం చిన్న ఇల్లే ముద్దు అని అంటోంది. అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.లండన్(London)లోని భారత సంతతికి(Indian origin) చెందిన మహిళ తన బిడ్డ, తల్లిదండ్రులతో కలసి చిన్న ఇంట్లోనే ఉండాలనుకుంటోంది. అక్కడే తన కొడుకు పెరగాలని ఎందుకు కోరుకుంటుందో కూడా వివరించింది. ఆ తల్లి పేరు నటాష్. తాను లండన్లో ఓ చిన్నఫ్లాట్లో తన ఏడు నెలల బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది కూడా. ఆ వీడియోలో తాను లండన్లో ఇరుకైన ఆ చిన్న ఫ్లాట్లోనే ఎందుకు ఉండాలనుకుంటుందో, అందువల్ల కలిగే ప్రయోజనాలేంటో కూడా వివరించింది. నిజానికి తాము బిడ్డ పుట్టక ముందే పెద్ద ఇంటికి మారాలని భావించామని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణయం మార్చుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అలా నిర్ణయం తీసుకోవడమే తనకు ఎంతో హెల్ప్ అయ్యిందని అంటోందామె. "చిన్న ఇంట్లో బిడ్డతో గడపడం అనేది కూడా ఓ టాలెంటే అంటోంది నటాషా. ఇలా ఎప్పుడైతే చిన్న ఇంటిలోనే ఉండాలనుకుంటామో...అప్పటి నుంచి ఖర్చుల పట్ల ఫోకస్ పెరుగుతుంది. అలాగే పరిమిత స్థలంలో ఇమిడిపోయే వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ..అనవసర ఖర్చులను అడ్డుకట్ట వేస్తాం. అలాగే ఇల్లు చిన్నగా ఉంటే..అస్తమాను శుభ్రం చేస్తూ..క్లీన్గా ఉంచుకునే యత్నం చేస్తాం. దీంతోపాటు బిడ్డ అవసరాలను త్వరగా గుర్తించగలిగే వెసులుబాటు కూడా ఉంటుందట. విశాలంగా పెద్దగా ఇల్లు ఉంటే..ఒక్కొక్కళ్లు ఓ మూలన ఉంటారు. పిల్లాడి ఏడుపు శబ్దం వినకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ల పక్కన తాత లేదా అమ్మమ్మ ఉంటే పర్లేదు..లేదంటే అంతే సంగతులు అని.."చిన్న ఇల్లు గొప్పదనాన్ని తనదైన శైలిలో భలే అందంగా వివరించింది నటాషా. యితే నెటిజన్లు ఆమె చెప్పినదానికి మద్దతిస్తూ..ఇది సరైనదే గాక అర్థవంతమైనది అని కితాబిచ్చారు. అంతేగాదు ఇలా చిన్న ఇంటిలో జీవనం సాగిస్తున్న వాళ్లందరికీ ఆమె చెప్పిన లాభాలు ఎంతగానో నచ్చాయి కూడా. View this post on Instagram A post shared by Natasha (@tashilouu) (చదవండి: నిండుగర్భిణి జోష్ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!) -
Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' సైనిక ఆపరేషన్ను ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పదంపై ట్రేడ్ మార్క్కోసం కొన్నిసంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో కుబేరుడు ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి సంస్థగా నిలిచింది. ఈ మేరకు బార్ అండ్ బెంచ్ నివేదించింది.ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం (మే 7) ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముందు 'ఆపరేషన్ సిందూర్' ను వర్క్ మార్క్ గా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది.విద్య మరియు వినోద సేవలను కవర్ చేసే క్లాస్ 41 కింద 'వస్తువులు మరియు సేవలు' కోసం ఈ పదాన్ని వాడుకునే హక్కు కోసం రిజిస్ట్రేషన్ కోరింది.అంబానీతోపాటు, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పదంరిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్ ,ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారు.ఇదీ చదవండి: Thalassemia Day: బడికి వెళ్లే వయసులోనే..రక్త కన్నీటి గాథ..!పహల్గామ్ ఉగ్రవాద దాడి,25 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ కింద మే 6-7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా కేంద్రం ఈ మిషన్ను ఈ పేరు పెట్టింది. సైనిక కార్యకలాపాల పేర్లకు ఆటోమేటిక్ రక్షణ లేదుభారతదేశంలో, 'ఆపరేషన్ సిందూర్' వంటి సైనిక కార్యకలాపాల పేర్లను ప్రభుత్వం స్వయం చాలకంగా రక్షించదు. రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణంగా అటువంటి పదాలను నమోదు చేయదు లేదా వాటిని మేధో సంపత్తిగా పరిగణించదు. నిర్దిష్ట చట్టపరమైన రక్షణ లేకుండా, ఈ పేర్లను ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు ట్రేడ్మార్క్ దాఖలు ద్వారా క్లెయిమ్ చేయవచ్చని నివేదిక పేర్కొంది.చట్టపరమైన అడ్డంకులు ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పదం అందుబాటులో ఉన్నప్పటికీ, ట్రేడ్ మార్కుల చట్టం, 1999 కొన్ని కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించడానికి రిజిస్ట్రీకి అధికారం ఉంది. సెక్షన్లు 9(2) మరియు 11 ప్రకారం, రిజిస్ట్రార్ తప్పుదారి పట్టించే, తప్పుడు ప్రభుత్వ అనుబంధాన్ని సూచించే లేదా ప్రజల మనోభావాలకు హాని కలిగించే ట్రేడ్మార్క్ను తిరస్కరించవచ్చు. అయితే, ప్రభుత్వం లేదా ప్రభావిత పార్టీ ద్వారా అధికారిక అభ్యంతరం లేవనెత్తకపోతే అటువంటి నిబంధనలను నమోదు చేయడంపై ఎటువంటి నిషేధం లేదు. మరి ఇది ఎవరికి దక్కనే భవిష్యత్తులో తేలనుంది. చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా! -
నిండుగర్భిణి జోష్ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!
ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్లు ఉన్నట్లుగా డ్యాన్స్లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్గా తన కొరియోగ్రాఫర్ని బీట్చేసేలా నృత్యం చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Artist_Dance_Community (@artist_dance_community_) (చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..) -
300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.ఇలా ఎందుకంటే..స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట. అంతేకాదండోయ్ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి. అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్ ఇదే..) -
Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరి
హైదరాబాద్ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా.. సినిమాలు, టెలిఫిల్మ్లు, యాడ్ ఫిల్మ్ల షూటింగ్లకు అనుకూలంగా ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తోంది. పేరు మోసిన డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లతో ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. పల్లె వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చని వరి పొలాలు, చెరువులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గుట్టలు ఫిలిం సిటీ పక్కనే ఉండటం..సినిమా నిర్మాణానికి అనుకూలంగా ఉంది. జిల్లాలోని భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, భువనగిరి, రాజాపేట ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. కోనసీమను మించిన అందాలు జిల్లాలో కనువిందు చేయడం, హైదరాబాద్కు అతి దగ్గరగా ఉండటం.. కలిసి వస్తోంది. ప్రజల ఆత్మీయత, నిర్మాతలకు ఖర్చు తక్కువగా కావడం, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్నాయి. – సాక్షి, యాదాద్రిపోచంపల్లిలోనే ఎక్కువ షూటింగ్లుపోచంపల్లిలో ‘జైబోలో తెలంగాణ’ చిత్రం హీరో హీరోయిన్ల మధ్య పాటలను చిత్రీకరించారు. మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు, సీనియర్ నరేశ్, రామ్చరణ్, సాయికుమార్, నితిన్, గిరిబాబు, జయసుధ, హాస్య నటులు, కొత్త నటీ నటులతో సినిమాలను ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. దర్శకులు సుకుమార్, తివిక్రమ్.. ఇంకా ఎందరో దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. ఇక్కడి కట్టెకోత మెషీన్లో పుష్ప–2 సినిమా షూటింగ్ కూడా జరిగింది. ‘సీతా కల్యాణ వైభోగమే’ చిత్రాన్ని కూడా ఇక్కడే తీశారు. సాయికుమార్ చేనేత కళాకారునిగా మగ్గం నేయడం, గ్రామస్తులతో మాట్లాడడం, బైక్పై వెళ్లడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో బాలకృష్ణ ఇటీవల తీసిన ‘డాకు మహరాజ్’ సినిమాలోని రాజస్తాన్ గ్రామం సెట్ వేసి.. పలు సన్నివేశాలను చిత్రీకరించారు. భువనగిరి ఖిలాపై హిందీ, తెలుగు సినిమాల షూటింగ్లు జరిగాయి. రాజాపేట పోలీస్ స్టేషన్లో, భువనగిరిలోని డిగ్రీకళాశాలలో ‘ఆపరేషన్ దుర్యోధన’ చిత్రాన్ని అప్పట్లో చిత్రీకరించారు. ఈ సిని మాలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిగా నటించారు. హీరోగా శ్రీకాంత్ నటించారు. కాగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి ఎఫ్సీఐ గోదాముల్లో రామ్చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ నాలుగు రోజులు జరిగింది. భువనగిరి ఖిలాపై సినిమాలు తీశారు. బీబీనగర్ మండలం మహ దేవ్పూర్లో అక్కన్నమాదన్నలు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం, జియాపల్లి, నాగినేనిపల్లిలో తాటిచెట్లు, చెరువుతో గ్రా మీణ వాతావరణం ఉంటుంది. ‘రజాకార్’ సినిమాలోని బతుక మ్మ పాట చిత్రీకరణ, కొన్ని ఫైట్ సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఇక్కడ విద్యుత్ తీగలు లేకుండా పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉంటుంది. మహదేవ్పూర్లో సినీనటుడు శ్రీకాంత్ నటించిన ‘దేవరాయ’ షూటింగ్ ఇక్కడే జరిగింది. ‘ఎగిరే పావురమా’ సినిమాను బీబీనగర్ పాతరోడ్డు వంతెనపై చిత్రీకరించారు.15 ఏళ్లుగా షూటింగ్లుభూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్, రేవణపల్లి, కొత్తగూడెం గ్రామాల్లో 15 ఏళ్లుగా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. వందకు పైగా సినిమా షూటింగ్లు జరిగాయి. హైద రాబాద్కు దగ్గరగా ఉండటం, పోచంపల్లి శివారులో గ్రామీణ వాతా వరణం, చేనేత గృహాలు, రైతుల ఇళ్లు, పాతకాలం నాటి గచ్చు పెంకుటి ళ్లు, షూటింగ్లకు అనుకూలంగా పచ్చదనం, తాటివనాలు, పర్యాటక వసతి అందుబాటులో ఉండటం ప్రయోజనకరంగా మారింది.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలురాచకొండలో పలు షూటింగ్లు..రాచకొండ ఫిలిం సి టీకి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతమంతా గుట్టలతో నిండి ఉంది. ప్రకృతి అందాలను మైమరపించే లొకేషన్లతోపాటు, గుట్టల పై నుంచి జాలువారే సెల యేళ్లు ఉన్నాయి. అపురూ పవైన కట్టడాలు, చారిత్రక సంపద ఎంతో ఉంది. రాచ కొండ గుట్టల్లో ఇప్పటికే పలు సినిమాలు రూపుది ద్దుకున్నాయి. చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమా షూటింగ్ 2019లో దండుమల్కాపూర్లో జరిగింది. శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగే పూజలు, పాట, ఫైటింగ్ సన్నివేశాలను ఇక్కడ నెల రోజుల పాటు తీశారు. మల్కాపురం ఘాట్ కంచె భూముల్లో ‘రెబల్’ చిత్రం క్లైమాక్స్ సన్నివేశంతో పాటు, పవన్న్కల్యాణ్ నటించిన ‘గబ్బర్సింగ్’ సినిమా చివరి సన్నివేశాన్ని కూడా ఇక్కడే చిత్రీకరించారు. మహేశ్బాబు హీరోగా నిర్మించిన ‘ఆగడు’ చిత్రం క్లైమాక్స్ ఫైట్ను కూడా ఇక్కడే తీశారు. రాచకొండలో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘విరోధి’, ‘సీతారాముల కల్యాణం’లో క్లైమాక్స్ ఫైట్లను చిత్రీకరించారు. ‘జానకిరామ’ హిందీ సీరియల్ నిర్మాణంతో పాటు అనేక షార్ట్ ఫిలింలను చిత్రీకరించారు.హైదరాబాద్ శివారు కావడంతో..సినిమా పరిశ్రమ కేంద్రీకృతమైన హైదరాబాద్కు యాదాద్రి భువనగిరి జిల్లా శివారులోనే ఉంది. దేశంలోని పలువురు సినీరంగ ప్రముఖులు హైదరాబాద్ చేరుకునే అంతర్జాతీయ విమానాశ్రయం అతి చేరువలో ఉంది. స్థానికులు సినిమా వారిని ప్రేమతో ఆదరిస్తారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లాగే.. సినిమాకు అనువైన ప్రాంతాలు జిల్లాలోనూ ఉన్నాయి. ఎత్తయిన గుట్టలు, కొండలు, పచ్చని పొలాలు, జలపాతాలు.. సినిమా షూటింగ్లకు కలిసి వస్తున్నాయి. సినిమా నిర్మాతలకు తక్కువ వ్యయం అవుతోంది. దీనికితోడు ఇక్కడ ఉదయం సినిమా షూటింగ్లు చేసి.. సాయంత్రం హైదరాబాద్లోని తాము బస చేసిన హోటళ్లకు, ఇళ్లకు చేరుకోవచ్చు, విశాలమైన రోడ్డు సౌకర్యంతో పాటు, అందమైన లొకేషన్లు ఉండడం డైరెక్టర్లను ఆకర్షిస్తోంది.ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ..
కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి.2000లో శనేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామిని కొలిస్తే ఏల నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని తొలగుతుంది.. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు ఉమ్మడి పాలమూరు పరిధిలోని బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడిని కొలుస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక శనేశ్వర ఆలయం కావడంతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం పూజలతోపాటు ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు భక్తులు వేలల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు జరుపుతారు.నందివడ్డెమాన్లో వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉన్న నంది, వీరభద్రస్వామి విగ్రహాలను 1976లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ పాండే పిల్లలమర్రికి తరలించే ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన కొందరు పెద్దలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిలిపివేశారు. అనంతరం 1999 జనవరి 26న విగ్రహ పునఃప్రతిష్ఠ చేశారు. ఆ సమయంలో 11 రోజుల పాటు రుద్రయాగం చేసిన అర్చకులకు పక్షి రూపంలో ఒక చెట్టు వేరు కనిపించి పూర్ణాహుతి జరిగాక శనేశ్వర విగ్రహం ప్రతిష్టించాలని కలలో చెప్పడంతో విగ్రహ ప్రతిష్ఠకు పూనుకున్నారు. నందనవనం సుబ్బారాయుడు అనే శిల్పి ఆలగడ్డ నుంచి ఒక శిలను తెప్పించి ఏడున్నర రోజులపాటు శ్రమించి జేష్ట్యాదేవి విగ్రహాన్ని చెక్కారు. అనంతరం ఏప్రిల్ 17, 2000లో ఏడున్నర లక్షల శని మంత్రాలతో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కాకిపై కొలువై ఉన్న శనేశ్వరస్వామి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వ్రస్తాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు.ఇలా చేరుకోవచ్చు.. హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు బిజినేపల్లి మండల కేంద్రానికి చేరుకుని.. అక్కడి నుంచి వడ్డెమాన్కు రావాల్సి ఉంటుంది. బిజినేపల్లి నుంచి వడ్డెమాన్కు వెళ్లే మార్గంలో ముందుకు ఎదురయ్యే కమాన్ (ఆర్చి) నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే శనేశ్వరుడి ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 122 కిలోమీటర్లు, మహబూబ్నగర్ జిల్లాకేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ శనేశ్వరుడి ఆలయం ఉంటుంది.గోన గన్నారెడ్డిది ఈ ప్రాంతమే.. కాకతీయుల సామంత రాజు గోనగన్నారెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడే. గోన బుద్దారెడ్డి తర్వాత వర్ధమానపురం రాజ పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు. భక్తుల నమ్మకం.. జేష్ట్యాదేవీ సమేత శనేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ఇక్కడ ఏల నాటి శని తొలగి.. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రియమైన నల్లటి దుస్తులతో అభిషేకం చేయడం వల్ల అన్ని దోశాలు తొలగిపోతాయి. – శాంతికుమార్, అర్చకులు, శనేశ్వరస్వామి ఆలయం(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
ఊ(రి)ట బావులు : అంతుచిక్కని రహస్యాలు?
ఒకప్పుడు మంచి నీరు కావాలంటే బావికి వెళ్లాల్సిందే. తెల్లారితే చాలు గ్రామాలు, చిన్నపాటి పట్టణాల్లో కావిడి భుజాన వేసుకుని, చేతిలో చేద పట్టుకుని వీధుల నిండా జనం కనిపించేవారు. ఊరంతటికీ మంచినీటి బావి ఒకటుండేది. అక్కడకు వెళ్లే అందరూ మంచినీరు తెచ్చుకునే వారు. బావి లేని ఊరుండేది కాదు. రానురానూ బోర్లు, మంచినీటి పథకాలు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ బావులు కనుమరుగైపోయాయి. మంచినీటి మాట అటుంచితే కనీసం వాడుకలో కూడా లేకుండా పోయాయి. బావులు అంటే ఏమిటో భావితరాలకు తెలియని రీతిలో కనుమరుగయ్యాయి. కానీ చరిత్రలో తాము ఉన్నామంటూ కొన్ని బావులు మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక్కో బావి చుట్టూ ఒ క్కో విశ్వాసం పెనవేసుకుపోయింది. దీంతో ఆ బావుల్లో నమ్మకాల ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంది. అలాంటి బావులివి..గో.. - పిఠాపురంబొటన బావి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయంలో ఉంది. సుమారు 9 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణమంతా ఈ బావి నీటితోనే చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఈ బావి ఉంది. చుట్టూ రాళ్లు పేర్చి చేసిన ఈ నేలబావి నిర్మాణం వింత గొలుపుతుంది. ఈ బావి నీటితోనే ఆలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు నిర్వహిస్తూంటారు. ఈ బావిలోని నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు తీరుతాయని పలువు రు విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ఈ బావి నీటితో స్నానం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక పౌర్ణమి నాడయితే మరింత ప్రాశస్త్యమని చెబుతారు. అది కూడా అర్చకులతో నీరు తోడించుకుని స్నానం చేస్తూంటారు. చైత్రం, శ్రావణం, ధనుర్మాసాల్లో భక్తులే స్వయంగా స్నానం చేస్తారు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బావి నీటిని సీసాల్లో నింపి, తీర్థంలా తమతో తీసుకుని వెళ్లి, మామూలు నీటితో కలిపి స్నానం చేస్తారు. ఎంత వర్షాభావ పరిస్థితులున్నా ఎప్పుడూ ఈ బావి ఎండిన ఆనవాళ్లు లేవని స్థానికులు చెబుతారు. ఎంత నీరు తోడినా ఈ బావి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతూంటుంది.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుగొల్లగుంట నుయ్యి కాకినాడ జిల్లాలో మండల కేంద్రమైన ఉప్పాడ కొత్తపల్లిలో ఈ బావి పూర్వం నుంచీ పేరెన్నికగన్నది. గతంలో కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు ఇదే మంచినీటి బావి. ఈ మూడు గ్రామాల ప్రజలు ఈ బావి నుంచే మంచినీరు తెచ్చుకునే వారు. వందల ఏళ్ల నాటి ఈ బావి నుంచే పిఠాపురం మహారాజా వారి సంస్థానానికి గుర్రపు బగ్గీలపై మంచినీరు తీసుకెళ్లేవారని పెద్దలు చెబుతారు. సముద్ర తీరం దగ్గరలో ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే పడగా ఈ బావిలో మాత్రమే మంచినీరు.. అదీ కొబ్బరి నీళ్లలా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలందరూ దీనినే మంచినీటికి ఉపయోగించే వారు. ఎంతమంది ఎన్ని నీళ్లు తోడుకున్నా ఈ బావి ఎప్పుడూ ఎండిపోకపోవడం విశేషంగా చెబుతారు. ఎన్ని రకాల మంచినీటి పథకాలు వచ్చినా ఇప్పటికీ కొందరు ఈ బావి నీటినే తాగుతూంటారు.కవలల బావి తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని బావి కవల పిల్లల బావిగా పేరొందింది. ఈ బావి నీరు తాగితే కవల పిల్లలు పుడతారనే నమ్మకం పలువురిలో బలంగా ఉంది. ఈ గ్రామంలో ఏకంగా 110 మందికి పైగా కవల పిల్లలు పుట్టడమే దీనికి నిదర్శనమని చెబుతారు. ఈ గ్రామంలో ఆరు నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ల వరకూ కవలలున్నారు. గతంలో మూర్తి అనే ఒక ఉపాధ్యాయుడు గ్రామంలో జనాభా లెక్కల కోసం రాగా ఎక్కువగా కవల పిల్లలుండటం చూసి ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు ఆయన అదే గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చి, అక్కడే నివాసం ఉన్నారు. కొద్ది రోజులకు ఆయనకు కూడా కవల పిల్లలు పుట్టారు. దీంతో, ఆ గ్రామంలోని బావి నీరు తాగడంతో కవల పిల్లలు పుడుతున్నారని అందరికీ చెప్పడంతో అప్పటి నుంచీ ఇది కవల పిల్లల బావిగా పేరొందింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా ఈ బావి పేరు మార్మోగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం జనం వచ్చి ఈ బావి నీటిని తీసుకెళ్తున్నారంటే ఎంతగా పేరొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కవలలు ఎక్కువగా ఉండడం వల్లే తమ ఊరికి గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.నిండు కుండలా.. సామర్లకోటలోని మాండవ్య నారాయణస్వామి వారి ఆలయంలో ఉన్న పురాతన బావి ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. మామూలు బావుల్లో వేసవిలో నీరు అడుగంటుతూంటుంది. కనీసం నీరు తగ్గుతుంది. కానీ ఈ బావిలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.బావి నీరు వల్లే కవలలు మా గ్రామంలోని బావి నీరు తాగడం వల్లే కవలలు పుడుతున్నారన్నది మా నమ్మకం. ఎక్కువ మంది కవలలు ఒకే గ్రామంలో పుట్టడం అరుదుగా ఉంటుంది. అలా మా గ్రామంలో వంద మందికి పైగా కవలలు పుట్టారంటే దీనికి కారణం మా గ్రామంలోని బావి నీరేనని అందరూ నమ్ముతున్నారు. మాకు కవలలే పుట్టారు. గతంలో చాలా మంది నమ్మేవారు కాదు. కానీ, ఈ బావి నీరు తీసుకెళ్లిన దూర ప్రాంతాల వాళ్లకు కూడా కవలలు జన్మించినట్లు చెబుతూండటంతో అందరూ ఈ విషయం నమ్మి తీరుతున్నారు. – అడబాల రామదాసు, కవల పిల్లల తండ్రి, దొడ్డిగుంట, రంగంపేట మండలంకోరికలు తీర్చే బావిగా నానుడి మా ఊరి గుడిలోని బొటన బావి నీటితో స్నానం చేసి, స్వామిని దర్శించుకుని, మొక్కుకుంటే కోరికలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలా కోరికలు తీరిన వారు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఇక్కడకు దర్శనానికి వచ్చేవారు తప్పకుండా ఈ బావి నీటితో స్నానం చేయడం లేదా తాగడం చేస్తారు. తమతో పాటు నీటిని తీసుకెళతారు. ఈ బావి నీటిని స్వామి వారి తీర్థంగా భావిస్తారు. అంత పవిత్రంగా చూస్తారు. కోరిన కోర్కెలు తీరాక వచ్చి, స్వామి వారికి తులాభారాలు ఇస్తూంటారు. – కూనపురెడ్డి కోదండ రామయ్య, తిరుపతి, పెద్దాపురం మండలంఅపోహే.. ఇదిలా జరుగుతుందని మానసికంగా అపోహపడటం తప్ప బావి నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుట్టడం, సంతానం కలగడం వంటివి ఉండవు. సంతాన ఉత్పత్తి జన్యుపరంగా జరుగుతుంది. మానసికంగా ఒక నమ్మకం కలిగించుకుంటారు తప్ప వాటి వల్ల ఎలాంటి సంతానం కలిగే అవకాశం శాస్త్రీయంగా లేదు. – డాక్టర్ కాటన్, మానసిక వైద్యుడు, జీజీహెచ్, కాకినాడచదవండి: Yoga: ఎమోషషన్స్ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?బావి నీటి వల్ల కాదు కవలలు పుట్టడం, సంతానం కలగడం వంటివి భార్యాభర్తల మధ్య జన్యుపరంగా జరిగేవే. బావి నీటి వల్ల కాదు. అలాగైతే పూర్వం అన్ని గ్రామాల్లో బావులుండేవి. అందరికీ కవలలు పుట్టాలి కదా! ఇదంతా ఒక నమ్మకం మాత్రమే. ఎక్కువగా ఆడపిల్ల ఇంట్లో కవలలు పుట్టిన వారు ఉంటే ఆ కుటుంబంలో మిగిలిన వారికి కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. దొడ్డిగుంటలో ఇదే జరిగి ఉండవచ్చు. కేవలం రెండు అండాలు విడుదలవ్వడం వల్ల మాత్రమే కవలలు జన్మిస్తూంటారు. అంతే తప్ప బావి నీరు తాగడం వల్ల మాత్రం కాదు. – డాక్టర్ అనిత, గైనకాలజిస్టు, పిఠాపురం -
కులగణనపై మోదీ యూ–టర్న్తో ఎవరికి లాభం?
దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కుల గణన( CastCensus) డిమాండ్లు వినిపిస్తున్నా... హిందువులంతా ఒక్కటే అని చెబుతూ వచ్చిన బీజేపీ (BJP), ఎవరూ ఊహించని విధంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. కుల గణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతి పక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనున్నదా అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా కులమే బలమైనది. ఏ రాష్ట్రంలో చూసినా కులం చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. స్వాతంత్య్రం అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కులగణన కోసం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టింది. కానీ, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆ డేటాను విడుదల చేయలేదు. తర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్... సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నా... బీజేపీ పట్టించుకోనట్టే వ్యవహరించింది. బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్, ముందు నుంచీ కులగణనను వ్యతిరేకిస్తోంది. కులాలకు అతీతంగా హిందువులను ఒకే గొడుగు కింద ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆర్జేడీ–జేడీ(యూ) కూటమి ప్రభుత్వం బిహార్లో కులగణనను చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేసినప్పుడు కూడా కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను అవి వ్యతిరేకించాయి. ప్రతిపక్ష పార్టీలు కుల విభజనలను రెచ్చగొట్టి ఎన్నికల లబ్ధి పొందుతున్నాయని విమర్శించాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘బటెంగే తో కటెంగే’ (విడిపోతే చంపబడతాం) అనే నినాదంతో కులగణన డిమాండ్ను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఈ ప్రచారంలోనే ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు తన యూ–టర్న్కు ఆయన ఏమని సంజాయిషీ చెప్పుకొంటారు?వ్యూహాత్మక నిర్ణయమా?తెలంగాణ, కర్ణాటకలలో చేపట్టిన కులగణనతో దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం డిమాండ్లు పెరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునేలా బీజేపీపై ఒత్తిడి పెరిగింది. బిహార్లో 2015లో నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మొత్తం జనాభాలో 65 శాతం ఓబీసీలని తేలింది. ఈ నేపథ్యంలో ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్ష సామాజిక న్యాయ ఎజెండాను నియంత్రించడానికి బీజేపీ కులగణనకు ఒప్పుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న అనుమానం ఉంది. ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయంపై సంయమనంతో స్పందిస్తూ, కులగణన రాజకీయ సాధనంగా మారకూడదని, శాస్త్రీయంగా, సామాజిక అసమానతలను తొలగించేందుకు మాత్రమే జరగాలని చెప్పింది. ఈ స్పందన వారి అంతర్గత అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తన యూ–టర్న్ గురించి ఆయనతో చర్చించే ఉంటారు. కాబట్టి, ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక మార్పు కాదనీ, ఎన్నికల ఒత్తిడి వల్ల తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమేననీ స్పష్టమవుతోంది.2014 నుండి దేశంలో బీజేపీ తన బలం పెంచుకుంటూవస్తోంది. కానీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వెనుకబడిన వర్గాల మద్దతు చాలా కీలకం. బీజేపీలో అత్యధిక శాతం నాయకులు అగ్రవర్ణాలవారే ఉన్నారు. కాబట్టి, కులగణన వల్ల ఓబీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికారంలో తమ వాటాను డిమాండ్ చేస్తే, పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఎక్కువ కులాలు, సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ రోహిణీ కమిషన్, రాఘవేంద్ర కుమార్ ప్యానెల్ వంటి ఓబీసీ ఉప–వర్గీకరణ ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటి నివేదికలను విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం కులగణనకు నిబద్ధత చూపిస్తూ... తాము అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిపించి, బీజేపీ శిబిరంలో రాజ కీయ ఒత్తిడిని పెంచింది. చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుఈ నిర్ణయం బీజేపీకి స్వల్పకాలిక రాజకీయ లబ్ధిని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కులగణన హిందూత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, కుల ఆధారిత రాజకీయాలను మరింత బలపరుస్తుంది. ఇది మండల్ 3.0 ఆవిర్భావానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. కులం మన దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా కొనసాగుతోంది. దానిని మతం పేరు చెప్పి తొలగించలేం. ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక పునాదులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు నైతిక విజయాన్ని అందించింది. 2021లోనే నిర్వహించాల్సిన జనగణన ఇప్పటికీ జరగలేదు. ఈ నేపథ్యంలో కులగణన నిర్ణయం ఎప్పుడు అమలవు తుందో అనే సందేహాలను కొట్టిపారేయలేం!-జి. శ్రీలక్ష్మి రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
ట్రంప్ సుంకాలకు..బ్రష్ దెబ్బ..!
అమెరికా–చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు టాయిలెట్కి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖంతో తయారు చేసిన పసుపు కుచ్చు టాయిలెట్ బ్రష్ చైనాలో వైరల్గా మారింది. ఈ బ్రష్ కుచ్చు అచ్చం ట్రంప్ జుట్టు మాదిరిగానే ఉంటుంది. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతీకారంగా చైనీయులు ‘యివు కౌంటర్టాక్’ అంటూ ఇలా టాయిలెట్ బ్రష్లతో వ్యంగ్యంగా బదులిస్తున్నారు. వీటిని మార్కెట్లో రూ.160 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. ట్రంప్ మీద చైనా ప్రజల కోపతాపాలు పెరిగినట్లుగానే, ప్రస్తుతం వీటికి గిరాకీ భారీగా పెరిగింది. చాలా స్టోర్స్లలో వీటికి ‘ఔటాఫ్ స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ‘బ్రష్ ట్రంప్’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. మరెంతోమంది ఈ ట్రంప్ బ్రష్లను ఉపయోగించి, వివిధ ఫన్నీ మీమ్స్, కామెంట్లతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఏదీ ఏమైనా, మొత్తానికి చిన్నదైనా ఈ టాయిలెట్ బ్రష్ విసిరిన పొలిటికల్ పంచ్ భారీగానే ఉంది కదూ!(చదవండి: Canadian vlogger: ‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు
ఫుడ్ బిజినెస్కు ఎపుడూ మంచి డిమాండ్ ఉంటుంది. శుభ్రత, రుచిని అందిస్తే ఆహార వ్యాపారానికి మించింది లేదు. కొంతమంది ఏ వంట చేసినా భలే రుచిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత మహాత్యం ఉంటుంది వారి చేతి వంటలో. బహుశా వారు చేసే పని పట్ల శ్రద్ద, నైపుణ్యం దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ, ఫుడ్ బిజినెస్లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు రాష్ట్రానికి చెందిన చిట్టెం సుధీర్. దక్షాణాది వంటకమైన ఇడ్లీకి మరింత ఆరోగ్యంగా, రుచిగా అందిస్తూ తెలుగోడి సత్తా చాటుకున్నాడు. పదండి సుధీర్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.చిట్టెం సుధీర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. అగ్రికల్చర్ ఎకనామిక్స్లో ఎంఏ చేసిన సుధీర్, మంచి ఉద్యోగాన్ని వదిలి 2018లో మిల్లెట్ ఇడ్లీ అమ్మడం ప్రారంభించాడు. ఉన్నత విద్య పూర్తి చేసిన సుధీర్ మంచి ఉద్యోగం చేసే వాడు, మంచి ఉద్యోగం. సౌకర్యవంతైన జీవితం. అయితే వ్యవసాయంపై మక్కువ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతో సుధీర్ భిన్నంగా ఆలోచించాడు. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఇడ్లీలను అందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.50 వేలతో ప్రారంభించాడు. అనతి కాలంలోనే అతని ఇడ్లీ బహుళ ప్రజాదరణకు నోచుకుంది. సరసమైన ధర, రుచికి రుచి దీంతో అతని దుకాణం ముందు ఇప్పుడు జనం క్యూలో ఉన్నారు. విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఆరోగ్యమైన చిరు ధాన్యాలతో, సరసమైన ధరలో రుచికరమైన ఇడ్లీలు అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు 7 లక్షల రూపాయలు.ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాఎనిమిది రకాల చిరుధాన్యాల మిశ్రమాన్ని ఉపయోగించి ఇడ్లీలను తయారు చేస్తారు. అల్లం, క్యారెట్ వంటి కూరగాయలతో తయారు చేసిన చట్నీలతో వడ్డిస్తారు. పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడంమాత్రమే కాదు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చిరుధాన్యాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లోని గిరిజన రైతుల నుంచి ప్రతినెలా 700 కిలోల మినుము కొనుగోలు చేస్తూ వారి చేయూత నందించడం విశేషం.అయితే ది మిల్లెట్ మ్యాన్ సుధీర్ సక్సెస్ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో చాలా కష్టాలను సవాళ్లను, ఎదుర్కొన్నాడు. సుధీర్ కుటుంబం అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ సుధీర్ వెనక్కి తగ్గలేదు. అతనికి సంకల్పానికి కృషికి, చివరికి ఫలితం దక్కింది. ‘వాసేనా పోలి’ స్టాల్ విశాఖపట్నంలో ఒక ల్యాండ్మార్క్గా మారింది, ఉదయం 6:30 గంటల నుండే క్యూలో ఉండే కస్టమర్లకు ప్రతిరోజూ 200 కంటే ఎక్కువ ప్లేట్లను అందిస్తోంది. చిట్టెం సుధీర్ స్టాల్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన సుధీర్ స్టాల్ను సందర్శించారు కూడా. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..! -
స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!
సోషల్ మీడియా (Social media) విశేషాల పుట్ట. తాజాగా ఒకవిచిత్రమైన వీడియో తెగ సందడి చేస్తోంది. ‘‘రిమ్జిమ్.. రిమ్జిమ్.. స్కూటీ వాలా జిందాబాద్ అంటూ ఒక ఎద్దు (bull) స్కూటీని ఎంచక్కా రైడ్ చేస్తోంది. అదేంటి ఎద్దుల బండి చూశాం కానీ.. ఎద్దేంటి, స్కూటీ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవాల్సిందే. సోషల్మీడియాలో హల్చల్ చేస్తోన్న వీడియో చూసి తీరాల్సిందే.ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో చోటు చేసుకుంది. ఒక వీధిలో తిరిగే ఎద్దు స్కూటీని నడుపుతున్న దృశ్యం CCTV ఫుటేజీలో రికార్డైంది. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో తెగ వైరల్ అవుతోంది. బుల్గారి జాయ్రైడ్ వీడియో ఆరు లక్షలకు పైగా వీక్షణలను, వేలాది కామెంట్లను సొంతం చేసుకుంది.శుక్రవారం (మే 2) శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, రిషికేశ్లో ఒక వీధిలో తిరిగే ఎద్దు కన్ను పార్క్ చేసిన తెల్లటి స్కూటర్పై పడింది. అంతే.. చలో టెస్ట్ రైడ్’ అంటూ రంగంలోకి దిగిపోయింది. ఎద్దు స్కూటర్ సీటుపై ముందు కాళ్లు, వెనుక కాళ్లను నేలపై ఉంచగానే అది జర్రున ముందుకు దూకింది. ఎక్కాక ఆగేదే లే అన్నట్టు ముందుకు సాగింది. అలా వెడుతూ.. వెడతూ.. మొత్తానికి ఒకచోట ఆగిపోయింది. దీంతో ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. ఆనక.. తప్పుకోండి రా బాబోయ్.. అక్కడినుంచి పరుగు తీశారు. స్కూల్ యూనిఫాంలో, చిన్న పిల్లవాడితో నడుస్తున్న సమీపంలోని ఒక మహిళ వెంటనే ఆ పిల్లవాడిని చంకనెత్తుకొని పరుగుదీసింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోను 'భూపి పన్వర్' అనే ఎక్స్ యూజర్ "మీరు స్కూటీలను దొంగిలించే వ్యక్తులను చూసి ఉంటారు..కానీ రిషికేశ్లో వెరైటీగా స్కూటీ దొంగతనం జరిగింది. ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న విచ్చలవిడి ఎద్దులు కూడా బైక్లు , స్కూటీలపై మనసు పడుతున్నాయ’’ అనే క్యాప్షన్తో దీన్ని పోస్ట్ చేశారు. దీంతో నెటిజనుల చమక్కులు, కామెడీకామెంట్ల్స్ వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!ఒక వినియోగదారు, "cctv లేకుండా దీన్ని బీమా కంపెనీలకు ఎలా వివరించాలి" అని, మరొక వినియోగదారు, భాయ్ ఆజ్ మే భీ సవారీ కర్ హీ లేతా హూన్” (“బ్రో, ఈ రోజు నేను కూడా రైడ్కి వెళ్తాను.”).” అంటూ హాస్యంగా కామెంట్ చేశారు.అలాగే పాపం, స్కూటర్పై ముచ్చట పడ్డాక దాని కొమ్ములు హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుపోయి ఉండొచ్చని, దాంతో అది విడిపించుకునేందుకు ప్రయత్నంలో అలా ముందుకు కదిలి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
వాటర్ ఫిల్టర్ నీరు వృథా కాకూడదంటే..ఇలా చేయండి!
ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ ఆర్వోల ను వినియోగించడం పెరిగిపోయింది. ఆర్వో వాటర్ ఆరోగ్యానికి మంచో చెడో అనే విషయాన్ని పక్కన పెడితే... వీటి వినియోగంలో గ్లాసు నీటి శుద్ధికి నాలుగు గ్లాసుల నీరు వృథా అవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఫరవాలేదు కానీ అవి అడుగంటిపోయి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే వారికి ఆర్వోల వినియోగంలో అయ్యే నీటి వృథా ఒక ఇంజినీర్కు మంచి ఐడియానిచ్చింది. అది నీటి వృథాకు చెక్ చెప్పింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి మహానగచాలలో రోజువారీ అవసరాల కోసం నీటిని కొనుక్కోవటం గతంలో వేసవికాలానికి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏడాదిలో రెండు మూడు నెలలు మినహా అన్ని కాలాలు అదే దుస్థితి. ఆర్వోలు వినియోగించడం అనివార్యం అయిపోయింది. ఇదీ చదవండి: Summer Care సన్స్క్రీన్ వాడాలా? వద్దా?బెంగళూరు నివాసి ప్రభాత్ విజయన్ ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. హోరామావులో నివసిస్తున్న 45 ఏళ్ల ఈ టెక్ మేనేజర్ తన ఇంట్లో ఉపయోగిస్తున్న వాటర్ ప్యూరిఫయర్ ద్వారా గ్లాసు శుభ్రమైన నీటికి నాలుగింతల నీరు వృథా కావడాన్ని గమనించాడు. ఈ వృథా నీరు ఎలాంటి ఉపయోగమూ లేకుండా నేలలో కలిసిపోవడం అతన్ని తీవ్రంగా బాధించింది. వెంటనే దీనికి ఓ పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు. ఒక డ్రమ్ము, స్క్రూడైవర్ ఆయుధాలుగా వెంటనే ఆ ఆలోచనను కార్యాచరణలో పెట్టాడు. చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నానీరు సమృద్ధిగా ఉండే కేరళలోని అలెప్పీకి చెందిన ప్రభాత్, ప్రతి చుక్కకు డబ్బు చెల్లించాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కానీ 2014లో బెంగళూరుకు వెళ్లాక పరిస్థితి మారి΄ోయింది. అతనుండే అపార్ట్మెంట్లో రోజువారీ అవసరాల కోసం కచ్చితంగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఒక్కో ట్యాంకర్ ధర రూ.1,000. అదే సమయంలో వాటర్ ప్యూరిఫయర్ ద్వారా పెద్దమొత్తంలో నీరు వృథా అవుతుండటం అతని దృష్టికి వచ్చింది. ఈ పరికరం ద్వారా ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని అనిపించింది. ఈ ప్రక్రియలో ఉపయోగించే రివర్స్ ఆస్మాసిస్ గురించి అధ్యయనం చేశాడు. ఈ విధానంలో ప్రతి లీటరు నీటికి నాలుగురెట్ల నీరు వృథా కావడం తప్పనిసరని అర్థం చేసుకున్నాడు. నీటి కొరత, అర్ట్ మెంటు వాసుల ఆందోళన, ఈ సమస్యతో స్వయంగా తాననుభవిస్తున్న కష్టం... ఇవన్నీ ప్రభాత్ను పరిష్కారం దిశగా ప్రేరేపించాయి. అందుకే ప్యూరిఫయర్ లో వృథా అవుతున్న నీటిని తిరిగి వినియోగించుకోవడానికి ఒక సెటప్ను రూపొందించాడు. రివర్స్ ఆస్మాసిస్ (ఆర్. ఓ.) అంటే...రివర్స్ ఆస్మాసిస్ అనేది నీటి శుద్ధీకరణలో ఒక పద్ధతి. నీటిలోని మలినాలు, క్లోరిన్, లవణాలు, ధూ«ళి ఇతర కలుషితాలను సెమీ–పెర్మెబుల్ పొరతో ఫిల్టర్ చేస్తారు.నీటి వృథా నుంచి-పునర్వియోగం దిశగా... ∙ప్రభాత్ 50–లీటర్ డ్రమ్మును తన ఇంటిలో ఒక మూలన రెండు చదరపుటడుగుల స్థలంలో ఉంచారు. స్క్రూడ్రైవర్తో డ్రమ్ మూతకు ఒక చిన్న రంధ్రం చేసి డిశ్చార్జ్ పైపును చొప్పించాడు. దీన్ని ప్యూరిఫయర్కు అనుసంధానించడం ద్వారా డ్రమ్లోకి వచ్చి చేరిన నీటిని పాత్రల శుభ్రం, టాయిలెట్ క్లీనింగ్, ఇల్లు తుడవడం, గార్డెనింగ్కు ఉపయోగించడం మొదలుపెట్టాడు. సింపుల్గా.... ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇప్పుడతను స్మార్ట్గా వృథా నీటిని రీయూజ్ చేస్తున్నాడు. ‘‘ప్రస్తుతం నేను రూ పొందించిన ఈ వ్యవస్థతో నెలకు కేవలం మా ఇంటినుంచే ఆరు పూర్తి నీటి ట్యాంకర్లకు సమానమైన నీటిని ఆదాచేస్తున్నాం. ఆ ఖర్చును మిగుల్చుకున్నాం. ఇప్పుడు ఇది మా కుటుంబ జీవన విధానంగా మారింది’’ అని సంతోషంగా చెప్పాడు. బాగుంది కదూ... మనం కూడా ఇలా స్మార్ట్గా ఆలోచిస్తే నీటి వృథాకు చెక్ చెప్పవచ్చు. -
సెంచరీ దాటేసిన బక్కమ్మ.. ఎక్కడ?
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి 105వ జన్మదిన సంబరాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధురాలైన చీమల బక్కమ్మ 104 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుని 105వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపైకి చేరుకుని శుక్రవారం గ్రామంలో ఆనందోత్సవాల నడుమ జన్మదినాన్ని నిర్వహించారు. బక్కమ్మకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరి తరఫు కుటుంబమంతా (121) మంది బుధరావుపేటలో శుక్రవారం కలుసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించారు.‘‘సెంచరీలు కొట్టే వయసు మాది పాడుకోవడం కాదమ్మా... ‘శతాయుష్షు’ అనే ఆశీస్సుకు అసలైన అర్థంలా బతకాలి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటూ జీవితంలో సెంచరీ కొట్టేయాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి’’ అంటోంది శతాధిక మహిళ. ఇదీ చదవండి: Vegan ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!నూరేళ్లు బతకాలనే కల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా మన జీవన శైలి ఉండాలి. ఒత్తిడి లేని , సంతోషకరమైన జీవితం. ఎలాంటి కష్టాన్నైనా సానుకూలంగా మల్చుకుంటూ ముందుకు సాగిపోయే తత్వం, చక్కటి ఆహార నియమాలు, వ్యాయామం ఇవన్నీ సుదీర్ఘ కాలం జీవించేందుకు దోహదపడతాయి. -
బొమ్మను చూస్తే నీలా ఉంది! అమ్మాయికి సంబరమంట!
సాక్షి, వరంగల్: పుట్టినరోజు కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఎవరైనా పుట్టినరోజు స్నేహితులకు చాక్లెట్లు ఇవ్వడం సాధారణమే. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? నిజంగానే ఈ చాక్లెట్లలో ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు చేసుకుంటున్న వారి ఫొటోలను చాక్లెట్ కవర్పై ముద్రిస్తున్నారు. వాటిని స్నేహితులు, తోటి విద్యార్థులకు ఇస్తూ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి వరంగల్ నగరంలో రోజురోజుకూ విస్తరిస్తోంది. వీటిని ఇక్కడ తయారు చేస్తున్న సంస్థ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారి నుంచి ఆర్డర్ తీసుకుంటూ.. పిల్లలకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు తమ ఫొటోతో ముద్రించిన చాక్లెట్లు మిత్రులకు ఇస్తూ సంబర పడిపోతున్నారు. అందరికీ నచ్చేలా.. టేస్టీగా.. ఈ చాక్లెట్లు పిల్లల్నే కాదు.. పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిపొడి, కొబ్బరి నూనె, తేనె కలిపి వివిధ పద్ధతుల్లో తయారు చేసే ఈ చాక్లెట్ల రుచికి అందరూ ఫిదా అవుతుండటంతో వీటికి మార్కెట్లో యమ డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ కేంద్రంగా ప్రారంభమైన ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల (ఓరుగల్లు ఫొటోస్ ర్యాపర్ హోంమేడ్ చాక్లెట్లు) గురించి సామాజిక మాధ్యమాలు ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్న ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. తమ పిల్లల పుట్టినరోజుల్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వెనుకాడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పట్టణాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఈ స్చంస్థ నిర్వాహకులు కరుణాకర్, సందీప్ చెబుతున్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! మా అమ్మాయి సంబరపడిందిపరకాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మా కుమార్తె ఆరుషి ఒకటో తరగతి చదువుతోంది. ఓరుగల్లు హోంమేడ్ చాక్లెట్ల గురించి ఇన్స్ట్రాగామ్ ద్వారా తెలుసుకొని ఆర్డర్ ఇచ్చాం. పాప ఆరుషి ఫొటో చాక్లెట్ల కవర్పై ఉండటంతో తెగ సంబరపడిపోయింది. వారి పాఠశాలల్లోని ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ చాక్లెట్ల గురించి వాకబు చేశారు. – డి.రవళి, పరకాల -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
భళా వైభవ్...వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
సెరిబ్రల్ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన వైభవ్కు చెస్ పరిచయం చేశాడు తండ్రి గౌతమ్. ఆనాటి నుంచి ఒంటరి ప్రపంచం నుంచి చదరంగ ప్రపంచంలోకి వచ్చాడు వైభవ్. తండ్రితో కలిసి తరచుగా చెస్ ఆడేవాడు. క్రమంగా ఆటలో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం అతడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.దిల్లీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వైభవ్ తొలి టోర్నమెంట్. తొలి ప్రయత్నంలోనే రేటింగ్ను సాధించడం విశేషం. చెస్లో మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ రేటింగ్ ఇచ్చింది.గ్రాండ్ మాస్టర్’ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే టోర్నమెంట్స్కు వైభవ్తో పాటు అతడి తండ్రి గౌతమ్ కూడా వెళుతుంటాడు. మ్యాచ్ సమయంలో అతడి పక్కనే కూర్చొని నొటేషన్లు రాస్తుంటాడు. కొడుకు కెరీర్ పట్ల తండ్రి చూపిస్తున్న అంకితభావం మాటలకు అందనిది.ఇదీ చదవండి: అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్ View this post on Instagram A post shared by vaibhav gautam (@vaibhav.gautam_official) ఆటలంటే ఇష్టపడే గౌతమ్ తన కుమారుడు కూడా ఆటలు ఆడాలనుకునేవాడు. న్నప్పటి నుం వీల్చైర్కే పరిమితమైన వైభవ్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ...లాంటి ఆటలు ఆడలేడు. ‘ఇంతేనా’ అని కుమారుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో ‘చెస్’ అనే ఆలోచన మెరిసింది. ఇక అప్పటి నుంచి కుమారుడికి చెస్పై ఆసక్తి కలిగేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తానే గురువుగా మారాడు. మొదట్లో తండ్రి ఒక గేమ్, కొడుకు ఒక గేమ్ గెలిచేవారు. ఆ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారి΄ోయింది. తండ్రిపై ఎప్పుడూ వైభవే విజయం సాధించేవాడు. దీంతో కుమారుడిపై ఆ తండ్రికి మరింత నమ్మకం కలిగింది.‘యస్. మా వాడు సాధించగలడు’ ఒకటికి పదిసార్లు అనుకునేవాడు. ఆటలో మరింత నైపుణ్యం కోసం రామ్కుమార్ అనే కోచ్తో వైభవ్కు ఆన్లైన్లో కొన్ని నెలలు శిక్షణ ఇప్పించాడు. ఆ తరువాత జీబి జోషిని కోచింగ్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ‘మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘ఒక్క పైసా కూడా అక్కర్లేదు’ అంటూ వైభవ్కు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జోషి. ఆటలో ఎప్పటికప్పుడు రేటింగ్ పెంచుకుంటూ అద్భుతం అనిపించు కుంటున్నాడు వైభవ్.‘వైభవ్ శారీరక స్థితికి వీల్చైర్లో కూర్చుని చెస్ ఆడడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. దీని కోసం ఎంతో కఠోర సాధన చేశాడు’ అంటున్నాడు గౌతమ్. జీవనోపాధి కోసం గౌతమ్ దిల్లీలో చిన్న షాప్ నడుపుతున్నాడు. ‘మీరు ఎక్కువ సమయం వైభవ్తోనే గడపాల్సి వస్తుంది కదా’ అని అడిగితే ఆ తండ్రి చెప్పిన జవాబు...‘మా అబ్బాయికి కచ్చితంగా మంచి టైమ్ వస్తుంది. అప్పటి వరకు నా టైమ్ గురించి ఆలోచించడం లేదు’ ‘ఇలా అయితే ఎలా?’ అని ఎప్పుడూ బాధ పడలేదు వైభవ్. ఆ యువకుడు నడవలేడు. మాట్లాడలేడు. 90 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు. తనను నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి తీసుకువచ్చి కొత్త ప్రపంచం చూపించింది చదరంగం.... -
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది. తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటిమీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు. కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. ఔరా అంటారు. హాలీవుడ్ రేంజ్లో..ఇదేం ట్విస్ట్ రా మామా.. అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే..A high school student in China jumps out of building to express his true love pic.twitter.com/m96l96VcbG— Crazy Clips (@crazyclipsonly) April 21, 2025 y"> ప్రియురాలితో గొడవ పడుతూ.. క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీ లోంచి అమాంతం దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తోంది. మొదట దూకడానికి ప్రయత్నించి నపుడు అమ్మాయి తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు. కానీ రెండో సారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసి పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలోని యుహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాలో మాత్రం అసలు విషయం బైటపడింది. కిటీకిలోంచి దూకిన తరువాత అతడు మరో చిన్న వాల్ పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపీగా, సైడ్ వాక్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సో..ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరూ లవర్స్ అని తేల్చి చెప్పింది. ఇద్దరూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, తాము జోక్యం చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రోజర్ రాబిట్ సినిమాను గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లా పనికి వస్తాడంటూ కమెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?చివరిగా సరదాగా అనిపించినా.. ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి.అలాగే ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా కారణం ఏదైనా సయమనం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారమవుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలనుంచి బైటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థం మవుతుంది. క్షణికావేశం..కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆగి ఆలోచించే ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు బాటను చేసుకోవాలి. -
'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ralph Leng (Blue) 💙🇬🇧 (@ralphleng) (చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు) -
అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్లోని జామ్నగర్లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ (సీసీహెచ్ఎల్) ‘గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజమ్’ పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని క్లబ్ ప్రాంగణంలో కొవ్వొత్తులు చేత పట్టుకొని మోడల్స్ మంగళవారం ప్రదర్శన చేశారు. శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు ముద్రించిన ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా ‘పీస్ వాక్’ చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళిగా 26 కొవ్వొత్తుల ప్రదర్శనలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నటుడు సునీల్ దత్ తో కలిసి ‘గ్రౌండ్ జీరో’ నిర్వహించామన్నారు. అలాగే శాంతి సామరస్యాల పట్ల తమ నిబద్ధతకు ప్రతీకగా లక్ష మంది సంతకం చేసిన చారిత్రాత్మక ‘ఫ్రెండ్షిప్ బ్యాండ్’ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆమోదించారన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, తీవ్రవాదం ప్రపంచ ముప్పుగా మారిన నేపథ్యంలో దీనిని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
వెర్రి వెయ్యి రకాలు, పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి వంటి సామెతలు తామరతంపరగా గుర్తుకొస్తాయి ఈ మహిళను చూస్తే. ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా..మళ్లీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమె చేసిన ఘనకార్యం చూసి. డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే.. పిల్లిలా కనిపించాలనే అనే పబ్లిసిటీ స్టంట్కి శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియాలోని గోల్కోస్ట్కు చెందిన జోలీన్ డాసన్(29). సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంత ఇంత కాదు..!. ఏకంగా ఆరు లక్షలు పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్. ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానపడింది. ఆ అనుమానమే నిజమై పడరాని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వికటించి దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా..శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా..కింది ముఖం రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయ్యిందేలా అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్నా..యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్లర్లు, ఇంప్లాంట్లను తొలగించుకుంది. కనీసం ఇప్పుడైనా.. తన పరిస్థితి మెరుగ్గా ఉంటుందేమోనని ఆశిస్తున్నా..అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేగాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లొద్దని సూచిస్తోంది కూడా. పెద్దలు చెబుతుంటారే..సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో..!. లోతు పాతులు..కష్టనష్టాలు బేరీజు వేసుకుని ఏ స్టంట్కైనా లేదా ఏ పనికైనా.. పూనుకోవాలి లేదంటే అంతే సంగతులు..(చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్ను క్రికెటర్గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
ఆ కారు అచ్చం.. సింగిల్ బెడ్రూం ఫ్లాటే..!
ఇటీవల ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్ చేసే సర్వీస్లకే పరిమితం కావడం లేదు. వాళ్లు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా..అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఉబర్ ఆటోలు, క్యాబ్లే నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కారుని సెట్ చేశాడు ఈ డ్రైవర్. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఒక మహిళ తన ఉబర్ రైడ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారు లోపలి విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్ బెడ్రూం ఫ్లాట్లా ఉంటుందని పోస్ట్లో పేర్కొన్నారామె. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెటప్ చేసి ఉన్నట్లు కనిపిస్తోంది. కూల్డ్రింక్స్,వాటర్ బాటిల్స్, చిప్స్ వంటి స్నాక్స్, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటిన్నంటి తోపాటు డస్ట్బిన్ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విశేషం అంటే..ఫీడ్బ్యాక్ డైరీ తోపాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ..ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ కూడా సీటుపై అతికించాడు. నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖధీర్ క్రియేటివిటీ అదుర్స్ అనే చెప్పాలి. నెటిజన్లను సైతం ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంది. ఆతిథ్య బ్రాండ్కి పేరుగాంచిన క్యాబ్ అని, ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరూ మాత్రం అకస్తాత్తుగా బ్రేక్ వేస్తే..వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ఆ సెటప్ గాయలపాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. Literally traveling in a 1bhk today. Hands down the coolest Uber ride ever! pic.twitter.com/O3cHSF30o2— Akaanksha Shenoy (@shennoying) April 25, 2025(చదవండి: ఎవరీ తేజ్పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్కు ముందు..) -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
‘స్పెషల్ కాయిన్’..వీడియోలో చూపించి మరీ, రూ.9 లక్షలు దోచేసింది!
శంషాబాద్: ‘‘అదో స్పెషల్ కాయిన్... కాయిన్ ఎదురుగా పెట్టగానే సూది కూడా లేచి నిలబడుతుంది’’.. ఇలా కాయిన్తో అనేక విన్యాసాలు చూపించి దానిని తయారీకి రూ. 4 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. దానిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు.. లేడీ టక్కుటమార విద్యలతో పాటు మాటలను నమ్మిన ఓ మహిళ 8 లక్షల రూపాయలు చెల్లించింది.. ఆరు నెలలుగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆ మహిళ మాటలు నమ్మి చివరికి నిండా మునిగింది. జరిగింది ఇలా... శంషాబాద్ పట్టణంలోని సాతంరాయి బస్తీకి చెందిన అరుణ(32) అదే బస్తీకి చెందిన ఓ యువకుడి ద్వారా కాయిన్ విషయాన్ని తెలుసుకుంది. కర్నాటక మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ కాయిన్ వ్యాపారం చేస్తుందని తెలపడంతో గతేడాది అక్టోబర్లో అరుణ నగరంలోని తాజ్కృష్ణ హోటల్ ముందు ఉన్న కాఫీ షాపులో కిలేడీ లక్ష్మీని కలిసింది. లక్ష్మీ మరోమారు వీడియోలో కాయిన్ చూపించి దానిని తయారు చేయడానికి సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చువుతుందని తయారు చేసి దానిని అమ్మి కోటి రూపాయాల వరకు ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన అరుణ నగదు రూపంలో రూ. 90 వేలు ఇవ్వగా పలు దఫాలుగా రూ. 6 లక్షలు చెల్లించింది. తనిఖీలో కాయిన్ చేసిన తర్వాత తాను ఉంటున్న హోటల్లో తనిఖీలు జరగడంతో దానిని అక్కడే పడేసి వెళ్లాలని బుకాయించింది. తనకు మరో రెండు లక్షల వరకు చెల్లిస్తే ఈ దఫా కాయి తప్పకుండా చేసి విక్రయించి నీ కష్టం అంతా తీర్చేస్తానని నమ్మించింది. దీంతో మరోసారి మోసపోయిన మరో రెండు లక్షల వరకు ఫొన్పే ద్వారా చెల్లించింది. చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీఎయిర్పోర్టులో హైడ్రామా... తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించిన అరుణ ఎలాగైనా లక్ష్మీని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఈ నెల 19 మరో వ్యక్తి డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శంషాబాద్ ఎయిర్పోర్టుకు రప్పించింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత మరుసటిరోజు ఉదయం శనివారం కలుస్తానని చెప్పి నిందితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ నెల 20 ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కిలేడీని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి పోలీసుల సాయంతో పట్టుబడింది.. తాను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసుల సమక్షంలోనే నమ్మించింది. ఆ తర్వాత తనతో పాటు కారు ఎక్కాలని చెప్పిన లేడీ చాకచక్యంగా అరుణతో పాటు ఆమెతోపాటు ఉన్న మరో మహిళను తోసేసి తనవెంట వచ్చిన వ్యక్తితో కారుతో వేగంగా ఎయిర్పోర్టు నుంచి ఉడాయించింది. దీంతో బాధిత మహిళ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి పోలీసుల సూచనల మేరకు గురువారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలరాజు ముందు జరిగిన విషయాన్ని వెల్లడిండించడంతో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కిలేడీ ఫొటోలు, ఫోన్పే ద్వారా చెల్లింపు చేసిన వాటన్నింటిని, పలు దఫాలుగా జరిగిన సంభాషణల రికార్డింగులు సమర్పిచింది. బాధితురాలి నుంచి ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
పిల్లలు భలే నవ్వుతారు కదా.. సైన్స్ ఏం చెబుతోందంటే..!
పిల్లలూ... మిమ్మల్ని మీరు గమనించారా? మీరు ఎక్కువగా నవ్వుతుంటారు. పిల్లలు ఊరికూరికే నవ్వుతారు. ఊహ తెలిసిన పిల్లలే కాదు పసికందులు కూడా ఊరికూరికే నవ్వుతారు. ఎందుకలా నవ్వుతారు? పిల్లలకు నవ్వు అంత ఇష్టమా?పిల్లలు మాటలు వచ్చేంత వరకు రెండు రకాలుగా మాత్రమే కమ్యూనికేట్ చేయగలరు. ఒకటి నవ్వడం, రెండవది ఏడవడం. ఆకలేసినప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు లేదా ఏదైనా నొప్పి కలిగినప్పుడు ఆ భావాలని ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తారు. మరి ఎందుకు నవ్వుతారు? పెద్దవాళ్లు సగటున రోజుకు 15–20 సార్లు నవ్వితే,పిల్లలు మాత్రం రోజుకి 300–400 సార్లు నవ్వుతారు. ఎందుకింత వ్యత్యాసం. అసలు పిల్లలు అన్ని సార్లు ఎలా నవ్వుతారో ఇప్పుడు తెలుసు కుందాం.పిల్లల మెదడు ఆనందాన్ని సులభంగా పట్టుకుంటుంది...చిన్న పిల్లల మెదడు చాలా సరళంగా ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషం చూస్తారు. ఉదాహరణకు బెలూన్ గాలిలో తేలడం, కుక్కపిల్ల గెంతుతూ ఆడుకోవడం లాంటి సంఘటనలన్నీ వాళ్ళకి వింతగా తోస్తాయి దాంతో కిలకిలా నవ్వేస్తారు!నవ్వు వాళ్ళకు ఒక భాష లాంటిది...పిల్లలు ఇంకా పూర్తిగా మాట్లాడడం నేర్చుకోక ముందు నవ్వడం ద్వారా తమ భావాలను చూపిస్తారు. ఒక బొమ్మ నచ్చితోనో, అమ్మ జోల΄ాటలో మాధూర్యం నచ్చితేనో వాళ్ళు నవ్వుతూ తమ ఆనందాన్ని షేర్ చేస్తారు. ఇది వాళ్ళకు సహజంగా వచ్చే కమ్యూనికేషన్!సైన్స్ ఏం చెప్తుంది?నవ్వడం వల్ల మెదడులో ‘డోపమైన్‘ అనే హ్యాపీ కెమికల్ విడుదల అవుతుంది. పిల్లల మెదడు ఈ డోపమైన్ను చాలా త్వరగా, సులభంగా రిలీజ్ చేస్తుంది. అందుకే వాళ్ళు ఒక చిన్నపాటి చక్కిలిగింతకి కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.పిల్లలు క్యూరియస్ ఎక్స్ప్లోరర్స్...పిల్లలు ప్రపంచాన్ని ఒక అద్భుతంగా చూస్తారు. కాగితం ముక్కను చించడం, బబుల్ పగలడం, లేదా నీవు వాళ్ళతో సిల్లీ గేమ్ ఆడడం – ఇవన్నీ వాళ్ళకు కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. ఈ కొత్త అనుభవాలు వాళ్ళను నవ్విస్తాయి.సామాజిక కారణం...పిల్లలు తమ చుట్టూ ఉన్నవాళ్ళను గమనిస్తారు. నీవు నవ్వితే వాళ్ళూ నవ్వుతారు. దీన్ని ‘మిర్రర్ న్యూరాన్స్ అంటారు. వాళ్ళ మెదడు ఇతరుల భావాలను కాపీ చేస్తుంది. అందుకే చిన్నతనంలో అమ్మ నవ్వితే తిరిగి నవ్వడం, ఏడిస్తే పిల్లలూ ఏడవడం మనం తరచూ చూస్తుంటాం. ఇదీ చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? -
సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా?
మనుషుల్లో ఎవరినైనా మీ వయసెంతా అని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే మనుషులు మాట్లాడ గలరు. కాని సింహాలకి వయసునెలా లెక్కపెడతారు? వాటికి మనలాగా మాటలూ రావు... బర్త్ సర్టిఫికేట్లు కూడా ఉండవు. మరి సినిమాల్లో, జియోగ్రఫీ ఛానళ్లలో ఎనిమిదేళ్ళ మగ సింహం... ఆరేళ్ళ ఆడ సింహం...అని అంత నిక్కచ్చిగా ఎలా చెబుతారు. ఎలాగంటే సింహాల వయస్సును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పలు శారీరక లక్షణాలను పరిశీలిస్తారు. ఇవి సింహం వయస్సును నిర్ధారించడంలో సహాయపడతాయి. వాటిలో ప్రధానమైనది దాని ముక్కు రంగు. సింహపు ముక్కు రంగు వయస్సుతోపాటు మారుతుంది. చిన్నపిల్లలకు గులాబీ ముక్కు ఉంటుంది. మూడేళ్ల వయస్సు నుంచి ముక్కుపై చిన్న నలుపు మచ్చలు కనిపించటం ప్రారంభమవుతాయి. ఈ మచ్చలు వృద్ధి చెందుతూ సింహానికి ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేనాటికి ముక్కు పూర్తిగా నలుపు రంగులోకి మారుతుంది. అంతే కాకుండా సింహాల దంతాల రంగు, ముఖంపై ముడతలు, శరీర ఆకృతి, ఇతర లక్షణాలను పరిగణలోకి తీసుకుని వయసును లెక్కిస్తారు. బోనస్గా ఇంకో విషయం... సింహాల జీవితకాలం అడవులలో 8-12 సంవత్సరాలు, జూలో 18-25 సంవత్సరాలు. ఇప్పటివరకు అత్యధికంగా 25 సంవత్సరాలు బ్రతికిన సింహం పేరు ’జెండా’. వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు...‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు’ అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పూర్వకాలం పుణ్యం కోసం దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న తీర్థక్షేత్రాలను అన్వేషించి అక్కడికి వెళ్లి తీర్థస్నానం చేసి వస్తూ ఉండేవారు. అలాంటి రోజులలో ఆవిర్భవించిన జాతీయం ఇది. ఓ వ్యక్తి ఒక తీర్థక్షేత్ర మహిమను గురించి విన్నాడట. ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నంత లోనే తన ఎదురుగా ఉన్నది తాను విన్న తీర్థమేనని తెలుసుకొని ఎంతో ఆనందించాడట. ఏ మాత్రం కష్టపడకుండా ఇలా తమకు కావల్సినవి తమ సమీపంలోనే ఉన్నాయని తెలుసుకొన్నప్పుడు లేదా తాము వెతుకున్నవారు తమకు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. వెతకపోయిన తీర్థం ఎదురైనట్టు నీకోసం బయలు దేరుతుంటే నీవే ఎదురొచ్చావు సంతోషం’ అనేలాంటి ప్రయోగాలున్నాయి. -
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో సైతాన్సింగ్ ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG— ANI (@ANI) April 24, 2025"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడు కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది. -
రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు.. ఎవరీ నటుడు?
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' (Jewel Thief: The Heist Begins) శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో, రాబీ గ్రెవాల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జైదీప్ అహ్లవత్ లైఫ్ స్టైల్, ఆస్తులపై నెట్టింట చర్చ ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడిగా ఉన్న జైదీప్ నికర విలువ ఎంత? ఇతర విలువైన ప్రాపర్టీస్ ఏంటి తెలుసుకుందామా..!తనదైన నటనతోపాటు, ఇటీవల కాలంలో బాగా బరువు తగ్గి సత్తా చాటుకుంటున్నాడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). వరుస అవకాశాలతో ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్పేయి, అశుతోష్ రాణా, రాజ్కుమార్ రావు, విజయ్ రాజ్, కేకే మీనన్ వంటి సినిమా దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 'జువెల్ థీఫ్'లో 'జాదు' పాటలో స్టెప్పులతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే పాతాళ్ లోక్ సీజన్ 2తో స్ట్రీమింగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో అతని నికర విలువ ఒక్కసారిగా పుంజుకుంది.2010లో ప్రియదర్శన్ చిత్రం 'ఖట్టా మీఠా'లో అరంగేట్రం చేశాడు జైదీప్ అహ్లవత్. ప్రస్తుతం అతడు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంత ఈజీగా రాలేదు. హర్యానాలోని ఖార్ఖరాలో పెరిగిన జైదీప్ భారత సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. కానీ ఆ కల నెరవేరకపోవడంతో నాటకాలవైపు మళ్లాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, FTIIలో చదివిన తర్వాత, సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఖార్ఖరా నుండి పూణే, ముంబైకి మధ్య తిరుగుతూ నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, పాతాళ్ లోక్ లో అద్భుతమైన నటన అతడి కెరీర్ను మలుపు తిప్పింది.14 ఏళ్లకు పైగా కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన రెమ్యూనరేషన్ను రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు పెంచుకోవడం అంటే మాటలు కాదు. తాజా నివేదికల ప్రకారం 'పాతాళ్ లోక్' మొదటి సీజన్ కోసం జైదీప్ రూ.40 లక్షలు వసూలు చేశాడు. పాతాళ్ లోక్ సీజన్ 2 సైన్ చేయడానికి ముందు జైదీప్ ఆస్తి రూ. 8 కోట్లు. ఈ సిరీస్లో 'హాథీ రామ్ చౌదరి' పాత్రను పోషించినందుకు రూ.20 కోట్లు తీసుకున్నాడట. అయితే అలాంటి వాదనలను ఖండించినప్పటికీ, జైదీప్ రెమ్యూనరేషన్ రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు చేరిందంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.చదవండి: సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!జైదీప్ జైదీప్ బహుళ ఆస్తులను కలిగి ఉన్నాడని కూడా మీడియా కోడై కూస్తోంది. కొన్ని లగ్జరీ కార్లతో పాటు, రూ. 1.32 కోట్ల విలువైన లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ GLS SUV కూడా జైదీప్ సొంతం. ప్రొఫెషనల్ డ్యాన్సర్ జ్యోతి హుడాను 2009లో అతడు వివాహం చేసుకున్నాడు.చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా? -
'తొలి యూట్యూబ్ వీడియో' ..! ఇప్పటికీ 300 మిలియన్లకు పైగా వ్యూస్
సోషల్ మీడియా ప్లాట్ఫాం రారాజుగా నీరాజనాలు అందుకుంటోంది 'యుట్యూబ్'..!. దీని పుణ్యమా అని నేటితరం ఏదైనా అవలీలగా చిటికెలో నేర్చేసుకుంటోంది. ఏ చిన్న సందేహం వచ్చినా..యూట్యూబ్ సాయంతో చకచక తెలుసుకుంటున్నారు. అది కుకింగ్, చదువు, ఇతరత్రా ఏదైనా..క్షణాల్లో తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అంతేగాదు ఈ యూట్యూబ్ సాయంతో ఎంతో మంది ఓవర్నైట్ స్టార్లుగా మారారు. పైగా ఎంతోమందికి జీవనోపాధిని అందించింది కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంలో అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..అది నేటికి నిశ్శబ్దంగా ఇంటర్నెట్ చరిత్రను సృష్టిస్తోంది. యూట్యూబ్ను ఫిబ్రవరి 14, 2005న జావేద్ కరీం, చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, పేపాల్ తదితర వ్యక్తులు స్థాపించారు. ఇది ప్రస్తుతం గూగుల్ యాజమాన్యంలో ఉంది. అలా మొదలైనా యూట్యూబ్ ప్రస్థానం..ఎంతోమంది యంగ్ టాలెంట్ని వెలికితీసి పరిచయం చేసింది..వారి స్కిల్ ప్రపంచమే తెలుసుకునేందుకు వేదికగా మారింది. అంతేగాదు దీని సాయంతో కొందరూ కంటెంట్ క్రియేటర్లుగా మారి ప్రభంజనం సృష్టిస్తున్నారు కూడా. అలాంటి యూట్యూబ్ ఫ్లాట్ ఫాంపై అప్లోడ్ అయినా తొలి వీడియో ఏదో తెలుసా..!. ఇప్పటికీ అది మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతూ నెట్టింట చరిత్ర సృష్టిస్తోంది. పైగా అది జస్ట్ 19 సెకన్ల వీడియో. ఏప్రిల్ 23, 2005న, YouTube సహ వ్యవస్థాపకుడు జావేద్ కరీం శాన్ డియాగో ఓ జూ వద్ద నిలబడి చేసిన చిన్న వీడియో అది. సుమారు 20 ఏళ్ల క్రితం జావేద్ ఏనుగుల ముందు నిలబడి..వాటి గురించి మాములుగా చెబుతున్న సాధారణ వీడియో. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా..కనీసం వెనుక ఏవిధమైన సంగీత నేపథ్యం లేని సాదాసీదా వీడియో క్లిప్ అది. కానీ ఆ వీడియోకి గత కొన్నేళ్లుగా వస్తున్నా..వ్యూస్, లైక్లు చూస్తే మతిపోతుంది. ఇప్పటికీ ఆ ఈవీడియోకి 335 మిలియన్లకు పైగా వ్యూస్, 17 మిలియన్లకు పైగా లైక్లు ఉండటం విశేషం. మరో గమ్మత్తైన విశేషం ఏంటంటే.. కరీమ్ య్యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయినా ఏకైక వీడియో అదే కావడం. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరీ..!. (చదవండి: 24 ఏళ్లకే కంపెనీ రన్ చేశాడు ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..) -
ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రండి!కేరళలోని త్రివేండ్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న గోపాలన్ గల్ఫ్ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. 1983 ఆగస్టు 16న బహ్రెయిన్కు వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది. ఏమైందంటే..గోపాలన్ బహ్రెయిన్కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్ పాస్పోర్ట్ పోయింది. దీంతో గోపాలన్ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో బహ్రెయిన్లో చిక్కుకు పోయాడు. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు.అయితే భారతదేశం, విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అనే NGO ద్వారా అతని పాలిట వరంగా అవతరించింది. గోపాలన్ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది. పీఎల్సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు.ఫలించిన తల్లి ఎదురు చూపులు గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడటానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అలా కొడుకు కోసం ఆమె చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఒట్టి చేతులతో కేవలం ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో కన్నీళ్లభారంతో స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంతో తిరిగి కలవాలనే కలతో విమాన మెక్కిన రోజు అతని జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోయింది. కాసింత దయ, మానవత్వం, న్యాయం, అవిశ్రాంత పోరాటం ఫలితంగా వచ్చిన ఫలితమిది. ఎంతోమంది వలసదారులకు ఆశలకు ప్రాణంపోసిన ఉదంతమిది. ‘స్వాగతం గోపాలన్, ఇంటికి స్వాగతం’ అంటూ పీఎల్సీ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్లో పేర్కొంది. -
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఓ విదేశీయురాలు భారతీయ పౌరసత్వానికి సరితూగే ఓ హక్కుని సంపాదించుకుంది. ఇక అంతే ఇది వెలకట్టలేని ఆనందం అంటూ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది. విదేశీ గడ్డపై పుట్టిన ఆమె..హే ఇక నేను భారతీయురాలినే అంటూ ఆనందంతో పొంగిపోతూ వీడియోలో చెబుతుండటం కనిపిస్తోంది. నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్నిచూసి విస్తుపోయారు. రష్యన్ జాతీయురాలు మెరీనా ఖర్బానీ ఇన్స్టాగ్రాంలో తన సంతోషాన్నివ్యక్తపరిచే వీడియోని షేర్ చేసుకుంది. ఆమె షిల్లాంగ్ నివాసం ఉంటుంది. ఆ వీడియోలో ఒక చేతిలో బిడ్డను పట్టుకుని, మరో చేతిలో OCI కార్డును చూపిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు నేను భారతీయురాలినే అంటూ ఉద్వేగంగా చెబుతుంది ఆ వీడియోలో. మూడున్నర సంవత్సరాల కృషి ఫలితం అని కూడా చెబుతుండటం కనిపిస్తుంది. అలాగే తన తదుపరి లక్ష్యం తన బిడ్డ కూడా ఈ కార్డుని పొందడమే అని ఆ వీడియోలో చెబుతుందామె. అంతేగాదు నెట్టింట షేర్ చేసిన ఆ వీడియోకి "చివరకు నేను భారతీయురాలిని" అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారామె. అలాగే నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్ని చూసి ఆశ్యర్యపోవడమే గాక, మీరు ఎల్లప్పుడూ భారతీయులే కాకపోతే ఇప్పుడే ఈ పత్రాలు దాన్ని ధృవీకరించాయి అంతే అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఖర్బానీ ప్రేమ వివాహం అనంతరం షిల్లాంగ్ స్థిరపడ్డానని, తల్లిగా మారడం, ఇక్కడ భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకోవడం తదితరాల గురించి ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారామె. ఓసీఐ కార్డు అంటే..ఇది పూర్తి భారతీయ పౌరసత్వం కాదు. కానీ భారత సంతతికి చెందిన విదేశీ పౌరులకు అనే హక్కులను మంజూరు చేస్తుంది. అంటే వీసా అవసరం లేకుండానే భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి, పనిచేయడానికి, ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by MARINA KHARBANI Russian in India (@terk_love) (చదవండి: సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే..! ఎలాంటివి బెస్ట్ అంటే..) -
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
విమానం ప్రయాణం అంటేనే ఖర్చు ఎక్కువ. విమానాశ్రయంలో మామూలు కాఫీ లేదా వాటర్ బాటిల్ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది విమానాశ్రయం అయితే. బిల్లు చూసి గుడ్లు తేలేయాల్సిందే. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాశ్రయం ఏదో తెలుసా? అక్కడ ఒక్కో అరటి పండు ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.మిర్రర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ఇస్తాంబుల్ విమానాశ్రయం "ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది". ఇస్తాంబుల్ విమానాశ్రయం (Istanbul Airport) టర్కీలోని ఇస్తాంబుల్కు సేవలందిస్తున్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అతిపెద్దది, ప్రధాన విమానాశ్రయం. ఐరోపాలో 2వ అత్యంత రద్దీగా ఉంటుంది. మధ్యప్రాచ్యంలో 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయమిది. అంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్లో ఒక్కో అరటిపండుకు రూ.565. ఒక్కో బీరుకు రూ.1,697 వసూలు చేయడం వార్తల్లో నిలిచింది. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా కూడా ఈ విషయంపై నివేదించింది, ఇటాలియన్ ప్రయాణికుడు లియోనార్డ్ బెర్బెరిని ఉటంకిస్తూ, 90 గ్రాముల లాసాగ్నా ( పాస్తాలాంటిది) రూ. 2,376 చెల్లించాడని పేర్కొంది. అయితే ఆహార నాణ్యత ఖరీదైన ధరకు సరిపోలడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడట కూడా.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలుక్రోసెంట్స్ (బ్రెడ్ లాంటిది)రూ. 1,410-1,698 మధ్య ఉంటుంది. ఇటాలియన్ చికెన్ సలాడ్ల ధర ఏకంగా రూ. 1,698 లియోనార్డ్ కూడా కనుగొన్నాడు. అంతేకాదు, బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్ లాంటి వాటిల్లో ప్యాకెట్ ఫుడ్ ధర చాలా ఎక్కువగాఉందని తెలిపాడు ఆయన చెప్పిన దాని ప్రకారం మెక్డొనాల్డ్స్ వద్ద బిగ్ మాక్ , డబుల్ క్వార్టర్ పౌండర్ ధర సుమారు రూ. 2 వేలు, 2,450గా ఉన్నాయి.ఇక నాలుగు ఫ్రైడ్ చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ,కోకా-కోలా ధర రూ. 1,698కు పై మాటేనట. చదవండి: నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ అది మరి! ఆమె టీ కప్ స్పెషల్ ఏంటో?ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజుకు 2 లక్షల 20వేల మందికంటే ఎక్కువమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఇక్కడి ధరలు మాత్రం విదేశీ పర్యాటకులకు షాకిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హై-ఎండ్ ట్రాన్సిట్ హబ్గా పేరొందిన ఇస్తాంబుల్ విమానాశ్రయంపై రాబోయే నెలల్లో విమర్శలు మరింత వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా. -
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్గా మార్చాడు గార్గ్. పైపింగ్తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్రూమ్లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
మస్క్తో వైట్హౌస్లో బ్రేక్ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం -
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్లోని దోహాలోని ది పెర్ల్లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు. -
క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్పురాలోని ఉర్దూఘర్లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్ డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్టీ, బ్రైనీలు, బైట్స్తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్లెస్ డోనట్లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు. -
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్డే బాష్, ఇదే హైలైట్!
భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్స్టాగ్రామ్లో రిలయన్స్ బాస్కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్కర్ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్గా ఎదిగారు. ముఖేష్ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు. -
మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్ద్వారా ఇన్స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
Bella J Dark వావ్.. ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!
ఐదేళ్ల వయసుండే పిల్లలు ఆటపాటల్లో గడుపుతారు. స్కూల్కి వెళ్లనని మారాం చేస్తారు. కానీ బెల్లా మాత్రం అవేవీ చేయలేదు. పుస్తకం రాసి ప్రచురించింది. ఇప్పుడు దానికి కొనసాగింపు గా మరో పుస్తకం రాయబోతోంది. అందరూ తన ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. బెల్లా.జె.డార్క్ అనే పాప యూకేలోని వేమౌత్ ప్రాంతంలో పుట్టింది. చిన్ననాటి నుంచే అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగింది. చిన్నారుల కోసం ప్రచురించే పుస్తకాలు చదివి, వాటి మీద ఆసక్తి పెంచుకున్న తను సొంతంగా కథలు రాయాలని ఐదేళ్ల వయసులో నిశ్చయించుకుంది. కానీ ఏ అంశం మీద రాయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ సమయం లో తను గీసిన ఓ పిల్లి బొమ్మను చూసి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అక్షరరూపంలో పెట్టేసింది. ఆ కథే The Last Cat (ది లాస్ట్ క్యాట్).ఐదు రోజులపాటు ఆ కథ రాసిన బెల్లా దానికి తనే సొంతంగా బొమ్మలు కూడా వేసింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి ఎలాంటి ఇబ్బందులు పడింది, తిరిగి ఎలా తన ఇంటికి చేరిందనేది ఇందులోని కథ. ఈ కథే ఎందుకు రాశావని బెల్లాని అడిగితే, ‘పిల్లలు అలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అస్సలే వెళ్లకూడదు. ఆ విషయం అందరికీ చె΄్పాలనే ఈ కథ రాశాను’ అంటోంది. 2022 జనవరి 31న ఈ కథ పుస్తకంగా ప్రచురితమయ్యేనాటికి బెల్లాకు ఐదేళ్ల 211 రోజులు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ ప్రతినిధులు ‘అతి చిన్న వయసు రచయిత్రి’ అంటూ రికార్డు అందజేశారు. ‘ది లాస్ట్ క్యాట్’ పుస్తకం ఇప్పటికి వేల కాపీలు అమ్ముడు΄ోయింది. ఈ పుస్తకం చదివి అనేకమంది బెల్లాకు మెయిల్స్ చేస్తున్నారు. తను రాసిన కథను మెచ్చుకుంటున్నారు. ఆ సంతోషంతో ఆ కథకు కొనసాగింపుగా మరో కథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం తనకు ఇష్టమని అంటోంది బెల్లా.ఉల్ఫ్ కింగ్ సూపర్ యానిమేటెడ్ సిరీస్ హాయ్ కిడ్స్... ఈ హాలిడేస్లో మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా... అయితే ఎప్పుడూ మూవీసేనా ఒక్కోసారి సిరీస్లు కూడా చూడాలి. అందుకే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఓ సూపర్ యానిమేటెడ్ సిరీస్ మీ ముందుకు తీసుకువచ్చాం. దాని పేరే ‘ఉల్ఫ్ కింగ్’. ఇదో సూపర్ యాక్షన్ స్టోరీ. డ్రూ ఫెర్రాన్ అనే కుర్రాడి కథ. ఉల్ఫ్ జాతికి చెందిన డ్రూ ఫెర్రాన్ ఆ ఫ్యామిలీలో ఆఖరివాడు. అతనికి ఉల్ఫ్ నుండి వచ్చే సూపర్ ఫాంటసీ పవర్స్ ఉంటాయి. కాని ఈ విషయం తనకు తెలియదు. డ్రూ ఫెర్రాన్ రాజ్యాన్ని సింహరాజులు అటాక్ చేసినపుడు, వాళ్ళతో ఫైట్ చేసేటపుడు తనలోని ఉల్ఫ్ పవర్ తెలుస్తుంది. ఆ పవర్స్తో డ్రూ ఫెర్రాన్ ఎలా ఫైట్ చేసి తన రాజ్యాన్ని తిరిగి సం΄ాదించుకున్నాడనేది మాత్రం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ అయిన ఉల్ఫ్ కింగ్ చూసేయండి. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ సూపర్బ్గా ఉంటుంది. అంతేకాదు ఓ రాజ్యంలో రాజులకు సంబంధించిన సీక్రెట్స్, ఫైట్స్ అలాగే ఛేజింగ్స్తో ఈ సిరీస్ మొత్తం ఓ అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్. ఇంకెందుకాలస్యం... గ్రాబ్ ది రిమోట్ టు క్రూస్ ఫర్ ది అడ్వెంచరస్ జర్నీ ఆఫ్ ఉల్ఫ్ కింగ్. – హరికృష్ణ ఇంటూరు -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?
పిల్లలూ! మీరేదైనా మ్యాజిక్ షోకి వెళ్లినప్పుడు స్టేజీ మీద ఉన్న మెజీషియన్ తప్పకుండా ‘అబ్రకదబ్ర’ అనే మాట వాడటం వినే ఉంటారు. చాలాసార్లు మ్యాజిక్ షోలలో ఈ పదం వాడుతుంటారు. దీనికి అర్థమేమిటో, ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా? ఈ పదం ఎప్పుడు, ఎవరు, ఎలా పుట్టించారో కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ రెండో శతాబ్దానికి చెందిన రోమన్ వైద్యుడు సెరెన్ సమ్మోనికస్ రాసిన గ్రంథాల్లో ఈ మాట ఉంది. కాబట్టి ఇది చాలా పురాతనమైన మాట అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. జ్వరం తగ్గిపోవడానికి చిట్కాగా ఆయన తన గ్రంథంలో ‘అబ్రకదబ్ర’ అనే పదాన్ని వాడారు. ఈ పదానికి హిబ్రూ భాషలో ‘నేను చెప్పినట్లే సృష్టిస్తాను’, అరేబిక్ భాషలో ‘నా మాట ప్రకారం సృష్టి జరుగుతుంది’ అనే అర్థాలున్నాయంటారు. హిబ్రూ భాషలోని ‘హ బ్రఖా దబరా’ (ఆశ్వీరాదం పొందినవారు) అనే వాక్యం నుంచి ఈ పదం వచ్చి ఉంటుందని డాన్ స్కీమర్ అనే చరిత్రకారుడు అంచనా వేశారు. ఇవన్నీ అంచనాలే తప్ప ‘అబ్రకదబ్ర’ అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ పదానికి చాలా శక్తి ఉందని, ఇది పఠిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని రకరకాలుగా ప్రచారం చేశారు. అనంతరం 1800 నుంచి మెజీషియన్లు దీన్ని తమ షోల్లో వాడటం మొదలుపెట్టారు. ఏదైనా ఒక మ్యాజిక్ ట్రిక్ చేసే ముందు ఈ పదాన్ని వాడి, ఆ ట్రిక్ చేయడం ద్వారా ఈ పదానికి మహత్వం ఉందని అందరూ అనుకునేవారు. నేటికీ అది కొనసాగుతోంది. తెలుగువారి కీర్తిపతాకం.. భోగరాజు పట్టాభి సీతారామయ్య పిల్లలూ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పుట్టిన ఓ మహనీయుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయనే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సీతారామయ్య 1880 నవంబర్ 24 న కృష్ణా జిల్లా గుండుగొలను అనే ఊరిలో జన్మించారు. చిన్ననాటి నుంచి వైద్యుడిగా మారాలన్న ఆలోచనతో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చేరి ఎంబీసీఎం డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మచిలీపట్నంలో వైద్యుడిగా సేవలందించడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తన పని వదిలేసి స్వాతంత్రో ద్యమంలో చేరారు. 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించారు. అందుకే ఆంధ్రాబ్యాంకు ప్రధాన భవనానికి ‘పట్టాభి భవన్’ అని పేరు పెట్టారు. దీంతోపాటు ఆయన ఆంధ్రా ఇన్సూరెన్స్సంస్థను కూడా స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన సీతారామయ్య మహాత్మాగాంధీకి సన్నిహితుడిగా మారారు. 1935లో ‘ది హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్’ పుస్తకం రాశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ని మూడేళ్లపాటు అహ్మద్ నగర్ జైల్లో ఉంచారు. అక్కడున్నరోజుల్లో ‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’ పేరుతో తన జైలు అనుభవాలు రాశారు. ఆపై ‘గాంధీ అండ్ గాంధీయిజం’ పుస్తకాన్ని రాశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం తొలి గవర్నర్గా వ్యవహరించారు. తెలుగువారి కీర్తిపతాకంగా నిలిచారు. దేశానికి నలేని సేవలందించిన ఆయన 1959 డిసెంబర్ 17న మరణించారు. -
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు) -
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్నగర్గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు. -
స్పేస్ ఫుడ్ టేస్ట్ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్లో పోలాండ్కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్యాన్ మిషన్కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..) -
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. -
Indian railways marks 172nd anniversary: భారతీయ రైల్వే @173
153లో ముంబై నుంచి తొలి రైలు పరుగులు..బుధవారంతో 172ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైల్వే విజయ వంతంగా 172 సంవత్సరాలు (Indian railways marks 172nd anniversary) పూర్తిచేసుకుని 173వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టరి్మనస్, థానేలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రయాణికుల అసోసియేషన్స్ సభ్యులు కేకులు కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎంపీ నరేష్ మస్కే థానే స్టేషన్ మాస్టర్ కేశవ్తావడేతోపాటు రైల్వే అధికారులు, ప్రయాణికుల సంఘటన పదాధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఆలోచనతో... దేశ ఆరి్థక రాజధానిగా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగర అభివృద్ధికి అనేక కారణాలున్నప్పటికీ వాటిలో రైల్వేవ్యవస్థది ప్రధానపాత్ర. 1843లో మొదలై నేటి వరకూ రైల్వే దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మోనో, మెట్రో రైళ్ల ప్రవేశం రైల్వే విస్తరణలో కీలక ముందడుగు. వీటితో పాటు ఇటీవలే ప్రారంభించిన అత్యాధునిక వందేభారత్ రైలు, త్వరలో ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్రైలు రైల్వే కిరీటంలో కలికితురాళ్లు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన లోకల్ రైళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది 1843వ సంవత్సరం. ఏదో పని నిమిత్తం సైన్–భాండూప్ రోడ్డుపై వెళ్తున్న బ్రిటీష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్కు హఠాత్తుగా ముంబైలోని ద్వీపాలన్నింటిని కలుపుతూ ఒక రైల్వే లైన్ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభించారు. కేవలం పదేళ్లలో పనులు పూర్తిచేశారు. పట్టాలెక్కిన తొలి రైలు... 1853 ఏప్రిల్ 16వ తేదీ మొట్టమొదటి రైలు ముంబై నుంచి ఠాణేకి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవంతంగా బయలుదేరింది. అప్పటినుంచి రైల్వే ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబై రవాణాలో బెస్ట్ బస్సులతో పాటు సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇవి ‘ముంబై లైఫ్లైన్’లుగా పేరుపొందాయి. ఇక్కడ ప్రజలు నిరంతరం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటారు. వారి జీవన విధానానికి తగ్గట్లుగా లోకల్ రైళ్ల వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి అయిదు నిమిషాల తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి రోజు సుమారు 65 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నాలుగింటికి అదనంగా మరో 2 ట్రాక్లు.. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, ట్రాన్స్ హార్బర్, వెస్టర్న్రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్తోపాటు మోనో, మెట్రో రైల్వే మార్గాలలో రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇతర నగరాలలో మామూలుగా ఒకటి వెళ్లేందుకు, మరోటి వచ్చేందుకు ఇలా అప్, డౌన్ మార్గాలు (రైల్వేట్రాకులు) ఉంటాయి. కానీ లోకల్ రైలు సేవల కోసం మాత్రం ప్రత్యేకంగా నాలుగు ట్రాక్లు ఉన్నాయి. దీంతో స్లో, ఫాస్ట్ ఇలా రెండు రకాల లోకల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు పెద్ద అంతరాయం లేకుండా పోయింది. అదే విధంగా లోకల్ రైళ్ల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అయిదు, ఆరో ట్రాక్లు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా లోకల్ రైళ్లన్నీ డైరెక్ట్ కరెంట్ (డిసి)పై నడుస్తాయి. తరువాతి కాలంలోనుంచి ఆల్టర్నేట్ కరెంట్ (ఎసి)కి మార్చారు. ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్చారిత్రక ఘట్టాలు... ప్రారంభంలో ముంబై ప్రజలు రైళ్లను ‘బకరా గాడీ’లని పిలిచేవారు. 1853లో మొదటి రైలు ప్రారంభం తర్వాత 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1886 నుంచి ఫ్లాట్ఫారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై–కళ్యాణ్ రెండు వైపుల రైల్వే సేవలను ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టరి్మనస్ ‘నేటి ఛత్రపతి శివాజీ టరి్మనస్)ను 1889లో, 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. సరీ్వసులను మరింత వేగవంతం చేసేందుకు 1929లో ముంబై–కళ్యాణ్ల మధ్య రైల్వేలైన్లను విద్యుదీకరించారు. చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన -
'దయ'కు అసలైన అర్థం..! హృదయాన్ని తాకే ఘటన..
అందరివి బిజీ లైఫ్లు అయిపోయాయి. ఈ హడావిడి జీవితంలో జాలి, దయ దాక్షిణ్యాలకు చోటే లేకుండాపోయింది. ఎవరి స్వార్థం వారిది. అలా లేకపోతే వెనుకబడిపోతాం అనే ఫీల్కి వచ్చేశారు జనాలంతా. మన పొరిగింటివాడితోనే నాలుగు మాటలు కదపని వాళ్లం. ఇక ఇలాంటి వాటి ప్రసక్తే ఏం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తించే జంతువులు కూడా విచక్షణ జ్ఞానంతో మసులుకుంటాయాని తెలుస్తోంది. అంతలా దాడి చేయాలనుకుని ఒక్క క్షణం సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే..ఆహా అడవిలో పెరిగినా.. ప్రకృతి ధర్మానికి కట్టుబడ్డాయి కదూ అనిపిస్తుంది. ఏం జరిగిందంటే..ఒక పెద్ద ఏనుగు ఒక గడ్డి మైదానంలో పిల్లలతో సేద తీరి ఉన్న సింహాన్ని చూసి దాడి చేసేందుకు వస్తుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎందుకంటే దాని వద్ద ఉన్న చిన్న పిల్లలను వదిలి ఎలా వెళ్లాలో తెలియక ఒక్క నిమిషం అలా షాక్లో ఉండిపోతుంది. కొద్ది వ్యవధిలోనే తేరుకుని బాధతో ముగ్గురు పిల్లల్లో ఒక్క పిల్లనే నోట కరుచుకుని పారిపోతుంది. అయితే ఆ ఏనుగు కూడా అంత కోపంతో దాడి చేయడానికి వచ్చిందల్లా ఆ సింహం పిల్లలను చూసి కోపాన్ని తమాయించుకుని ఆగిపోయి వెనక్కి టర్న్ అవుతుంది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లల జోలికి పోకూడదన్న ఆ ఏనుకు విచక్షణ తీరుకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. దయ అనే పదానికి ఇది కదా అసలైన అర్థం అనిపిస్తుంది. మనుషుల తప్ప పశుపక్షాదులు, జంతువులు వీటిని పాటిస్తాయని పలు ఉదంతాలు నిరూపించాయి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. Elephant attacks the lioness but spares cubs pic.twitter.com/0pU8uIi7BQ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 6, 2025 (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
కావు కావు కాదు... హాయ్ హాయ్ : మాటలు నేర్చిన కాకి
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది. వాడా తాలూకాలోని పాల్ఘర్కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది! View this post on Instagram A post shared by PUNE PULSE (@punepulse) -
జర్నీ చేస్తూ కూడా నగదు పొందొచ్చు..! ఎలాగంటే..
ప్రస్తుతం ప్రజలంతా నగదు రహిత లావాదేవీలే చేస్తున్నారు. డిటిటల్ పేమెంట్లకు అలవాటుపడ్డారు కూడా. ఇది వరకటిలా నగదు కోసం బ్యాంక్ల వద్ద బార్లు తీరాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే వీధికో ఏటీఏం ఉండటంతో క్షణాల్లో పనైపోతుంది. ఈ సదుపాయం బస్సు, రైల్వే, ఎయిర్పోర్ట్లలో కూడా ఉంది. కానీ జర్నీ చేస్తున్నప్పుడూ..ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే సమయంలో నగదు పొందాలంటే మాత్రం కష్టమే. ఆయా స్టేషన్లలో ఆగితేగానీ సాధ్యం కాదు. అయితే ఆ ఇబ్బంది కూడా లేకుండా జర్నీ టైంలో కూడా ఈజీగా డబ్బుని పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. ఆ సౌకర్యాన్ని అందిస్తోంది ఇండియన్ రైల్వే సంస్థ. ఏ రైలులో ప్రారంభించారంటే.. ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (INFRIS)లో భాగంగా ఈ సదుపాయన్ని అందిస్తోంది. రైలు కదులుతున్నప్పుడూ ప్రయాణికులు నగుదు పొందేలా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని పంచవటి ఎక్స్ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది భారతదేశంలోనే తొలి ఏటీఎం రైలుగా మారింది. అది ఎలా పనిచేస్తుందనే ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఈ ఏటీఎం నుంచి రైలు కదులుతున్నప్పుడూ నగదు పొందే వెసులుబాటు ఉంది. ఇదంతా ఇండియన్ రైల్వేస్ భూసావల్ డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో విజయవంతమైనట్లు రైల్వే అదికారుల తెలిపారు. ఈ సరికొత్త రైల్వే ఏటీఎం జర్నీ అంతటా సజావుగానే పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఇగత్పురి, కసారా ప్రాంతాల మధ్య సొరంగాలు, తగిన నెట్వర్క్ అందుబాటులో ఉండదు కాబట్టి ఆప్రాంతాల్లో నగదు పొందడం కాస్త సమస్యాత్మకంగా ఉండొచ్చని అన్నారు. అలాగే యంత్రం పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంటామని అన్నారు భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పాండే. తాము ఈ ఆలోచనను INFRIS సమావేశంలో ప్రతిపాదించామని అన్నారు. ఆ తర్వాత అదెలా కార్యరూపంలోకి తీసుకురావాలనే దానిపై తమ బృందం పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏటీఎం పంచవటి ఎక్స్ప్రెస్లోని 22 కోచ్ల ప్రయాణికులకు మాత్రమే కాదు ముంబై-హింగోలి జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ప్రయాణీకులకు కూడా అందుబాటులో ఉంటుందట. ఎందుకంటే ఈ రైలు ఒక బోగిని పంచవటి ఎక్సప్రెస్ పంచుకుంటుందట. అలాగే ఈ ఏటీఎం భద్రతను నిర్థారించేలా ప్రత్యేక షట్టర్ సిస్టమ్ తోపాటు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ తదితరాలు ఉంటాయన్నారు. అయితే ప్రయాణికులు ఈ సేవను ఆదరిస్తే గనుక త్వరలో మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించే అవకాశం ఉంటుందని రైల్వే అదికారులు వెల్లడించారు. (చదవండి: టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్గా పైలట్ అనౌన్స్మెంట్) -
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది. భారీగా రికవరీ గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఫోన్ పోతే ఏం చేయాలి? సెల్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడున్నా దొరికిపోతాయిసీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ -
టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్గా పైలట్ అనౌన్స్మెంట్
విమానంలో వెళ్లేటప్పుడూ..ప్రయాణికులు సేఫ్టీ కోసం పైలట్లు, అక్కడ సిబ్బంది మనకు కొన్ని సూచనలిస్తుంటారు. అలాగే జర్నీ పూర్తి అవుతుందనగా.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రకటనలు చేస్తుంటారు. అయితే అలానే ఇక్కడొక పైలట్ కూడా ఒక ప్రకటన వెల్లడించాడు. అయితే అది ఎంత ఫన్నీగా ఉందంటే..జర్నీ బడలిక అంత ఉఫ్మని ఎగిరిపోయినంత ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అతడేం అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే..ఇదంతా డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయాణికులకు భరోసా ఇచ్చేలా అనౌన్స్మెంట్ చేస్తుంటారు పైలట్లు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ పైలట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ అత్యంత విభిన్నంగా నవ్వు తెప్పించేలా ఉంది. సదరు పైలట్ మాట్లాడుతూ.."నాకు పెళ్లై 33 సంవత్సరాలు. భార్య, నలుగురు పిల్లలు, రెండు కుక్కలు, ఎనిమిది కోళ్లు ఉన్నాయి. నాబార్య ఈ చలిలో వాటిని చూసుకుంటూ అలిసిపోతుంది. అందువల్ల కచ్చితంగా శుక్రవారం సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ కోళ్లను చూసుకోవాల్సింది నేనే కాబట్టి. అదీగాక నేను గనుక ఇంటికి సమయానికి చేరుకోకపోతే ఆమె నన్ను చంపేస్తుంది అందువల్ల మనం కచ్చితంగా సేఫ్గా ల్యాండ్ అవుతామని హామీ ఇస్తున్నా..! అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యి..ఏం అనౌన్స్మెంట్ అంటూ అందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు మెరిశాయి. జర్నీ చేసిన అలసట కూడా ఎగిరిపోయి ఉత్సాహంతో ఉన్నారంతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఏం చెప్పాడబ్బా..! అంటూ పైలట్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Liz Chan (@liz.chann) (చదవండి: Sachin Tendulkar: ఇంత స్వచ్ఛంగా ఉంటే ఫిల్టర్లు ఎందుకు? సచిన్ మనుసుదోచిన గ్రామం..) -
Telugu Theatre Day నటి ఝాన్సీ ఇంట్రస్టింగ్ పోస్ట్
గొప్ప రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 16న ఆయన గౌరవార్థం తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ కొన్ని ఫోటోలను షేర్ చేశారు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా మె నాటకరంగం తనకున్న అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు. . ఈ సందర్భంగా కళాకారులకు శుభాకాంక్షలందించారు. యాంకర్ ఝాన్సీ ఇన్స్టా పోస్ట్: రేడియో నాటకంతో మొదలైన నా ప్రయాణం, టీవీ, సినిమాల నుంచీ రంగస్థలం వైపుకి రావడం చాలా మందికి విడ్డూరంగా తోచవచ్చు.నా తపన నాటక ప్రక్రియని ప్రేమించే వాళ్లకి మాత్రం అర్ధం అయితే చాలు.నేను నాటకానికి క్రొత్త..కానీ సమకాలీన నాటక రంగంలోని సరి క్రొత్త ఒరవడిలో ఒక కెరటాన్ని కావాలని ఆకాంక్ష. తెలుగు నాటకరంగాన్ని పరిపుష్టం చేసిన మహామహులందరినీ తలుచుకుంటూ, తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు.ఇదీ చదవండి: మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్కాగా కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన రచనల ద్వారా జాతి వివక్ష , అనేక ఇతర సామాజిక దురాచారాలపై అవిశ్రాంత పోరు సలిపారు. ఆయన రచించిన అనేక అభ్యుదయ నాటకాలు, నవలలు, సామాజిక వ్యంగ్య రచనలు తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా, వితంతు పునర్వివాహాలకోసం ఆయన చేసిన కృషి స్త్రీజాతికి ఎంతో మేలు చేసింది.చదవండి: ఎయిర్ హోస్టెస్పై లైంగిక దాడి, వెంటిలేటర్పై ఉండగానే అమానుషం! -
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
టాలాంట్ చూపించడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Roll Rida (@rollrida) ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట. ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్ కిడ్..డ్డింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్ భయ్యా" అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివ్ ఆవిష్కరణను మెచ్చుకోగా, "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్కు చెందిన బైక్గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు. -
వ్యాపారవేత్తతో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్
ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్ న్యూస్ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్ పాపులర్ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ప్రకటించింది. తన నిశ్చితార్థం చిత్రాలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అభినందనలు వెల్లువెత్తాయి. ‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వైష్ణవి గౌడ. సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నిశ్చితార్థ వేడుక కోసం, వైష్ణవి గౌడ భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. సీక్విన్, బీడ్వర్క్, సున్నితమైన జరీతో కూడిన సంక్లిష్టంగా అలంకరించబడిన బ్లౌజ్ ధరించింది. ఇంకా పచ్చరంగు రాళ్ల స్టేట్మెంట్ చోకర్ నెక్లెస్ను కూడా జత చేసింది. ఇంకా మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకా, స్టేట్మెంట్ కడాతన లుక్ను మరింత ఎలివేట్ చేసింది. మరోవైపు అనుకూల్ మిశ్రా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఐవరీ షేర్వానీలో రాయల్ లుక్లో అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Vaisshnavi (@iamvaishnavioffl) వైష్ణవి గౌడ గురించి మరిన్ని వివరాలువైష్ణవి గౌడ 1995, ఫిబ్రవరి 20, 1995న జన్మించారు. ఆమె కన్నడ నటి అమూల్యకు ప్రాణ స్నేహితురాలు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాదు బెల్లీ డాన్సర్ కూడా. గత పదేళ్లకుపైగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. 2011లో 16 సంవత్సరాల చిన్న వయసులో వైష్ణవి తన మొదటి షో 'దేవి' చేసింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిని వై ష్ణవి వరుస ఆఫర్లను దక్కించుకుంది. అయితే, ఆమె 2013 షో 'అగ్నిశాక్షి' బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో కూడా పాల్గొంది. -
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ డైమండ్ల గురించి తెలుసా?
ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటి గోల్కొండ నీలి వజ్రం (Golconda Blue) వేలానికి రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14వ తేదీన జెనీవాలో జరిగే క్రిస్టీన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్ లో వేలానికి రానుంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారి వేలానికి రానుంది .23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి రంగు వజ్రాన్ని గోల్డ్ రింగ్లో అత్యంత అందంగా పొదిగారు. అత్యంత అరుదైన ఈ రత్నానికి రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులుఅంచనా . జెనీవాలో మే 14న జరగనున్న క్రిస్టీస్ ‘మెగ్నిఫిసెంట్ జువెల్స్’ వేలం నిర్వహించనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విలువైన వజ్రాల గురించి తెలుసుకుందామా.విలువైన వజ్రాలు, వివరాలుది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా (కల్లినన్ I) - 1905 లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ 530.4 క్యారెట్ల వజ్రం ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద కఠినమైన వజ్రం. కుల్లినన్ వజ్రం నుండి దీన్ని తయారు చేశారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో భాగం. రాణికి చెందిన రాజదండంపై అమర్చారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద క్లియర్-కట్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి.ది ఓర్లోఫ్ - ది గ్రేట్ మొఘల్ డైమండ్ అని కూడా పిలువబడే అదే వజ్రంగా పరిగణించబడే ఓర్లోవ్ ప్రస్తుతం మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో భాగంగా ప్రదర్శించబడుతోంది. 1774లో, దీనిని రష్యన్ ఎంప్రెస్ కేథరీన్ ది గ్రేట్ ఇంపీరియల్ స్కెప్టర్లో పొదిగించారు.[1] భారతదేశంలోని విష్ణు విగ్రహం నుండి దొంగిలించబడినట్లు భావిస్తున్న 300 క్యారెట్ల వజ్రం.సెంటెనరీ వజ్రం - 1986 లో దక్షిణాఫ్రికా ప్రీమియర్ మైన్లో గుర్తించిన ఈ 273.85 క్యారెట్ల వజ్రం దాని దోషరహిత స్పష్టత మరియు అసాధారణమైన తేజస్సుకు ప్రసిద్ధి చెందింది.ది రీజెంట్ - 17 వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొనబడిన ఈ 140.64 క్యారెట్ల వజ్రం ఒకప్పుడు నెపోలియన్ బోనపార్టే కత్తిలో భద్రపరిచారు. ఇది ఇప్పుడు లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శించబడింది.కో-ఇ-నూర్ (కోహినూర్) : ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ 105.6-క్యారెట్ల వజ్రం పెర్షియన్, ఆఫ్ఘన్ ,భారతీయ పాలకుల గుండా ప్రయాణించి బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుని క్రౌన్ జ్యువెల్స్లో ఉంది.ఐడల్స్ ఐ - 70.2-క్యారెట్ల వజ్రం ఐడల్స్ ఐ కూడా గోల్కొండ వజ్రమే. 1600లో దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్లో దీన్ని గమనించారు. పురాణాల ప్రకారం, ఈ వజ్రం మొదట పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత అతను అప్పులు తీర్చడానికి దానిని తన రుణదాతలకు ఇచ్చాడు. ఈ వజ్రం జూలై 14, 1865న లండన్లో క్రిస్టీస్ వేలంకోసం ఉంచడంతో ఇది ఉనికిలోకి వచ్చింది. టేలర్-బర్టన్ డైమండ్ - 69.42-క్యారెట్ల పియర్ ఆకారపు వజ్రం, నటి ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్ యాజమాన్యంలో ప్రసిద్ధి చెందింది.సాన్సీ డైమండ్ - రాజ సంబంధాలతో కూడిన 55.23-క్యారెట్ల వజ్రం, ఒకప్పుడు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ చక్రవర్తుల యాజమాన్యంలో ఉంది.హోప్ డైమండ్ - 45.52-క్యారెట్ల లోతైన నీలి వజ్రం. ఇది కూడా భారతదేశంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో చోరికి గురైందనీ, ఆ తరువాత హెన్రీ ఫిలిప్ హోప్ చేత కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీన్ని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉంచారు.హార్టెన్సియా డైమండ్ - ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్లో భాగమైన 20-క్యారెట్ లేత గులాబీ వజ్రం. -
సీటుకు రూ. 50వేలు తగలేశాం, ఎయిరిండియాపై కమెడియన్ ఫైర్
విమానయాన సంస్థల సేవాలోపాలకు సంబంధించి అనేక కథనాలు,ఫిర్యాదులు గతంలో అనేకం చూశాం. కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్లైన్ ఎయిరిండియా మరో వివాదం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది. హాస్యనటుడు వీర్ దాస్ ఎయిరిండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు రూ.50 వేలు పోసి ఒక్కో టికెట్ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎక్స్లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్ గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్చైర్ రాలేదని దాస్ ఆరోపించారు. Dear @airindia Please reclaim your wheelchair. I’m a lifetime loyalist. I believe you’ve got the nicest cabin crew in the sky, this post pains me to write. My wife and I book Pranaam and a wheelchair because she’s got a foot fracture that’s still healing. We’re flying to delhi.…— Vir Das (@thevirdas) April 14, 2025 "ప్రియమైన ఎయిరిండియా,ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్చైర్ను మీరు తీసుకొండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని." అన్నారు. ఇదే పోస్ట్లో ఇంకా "విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు దుర్భరమైన ప్రయాణమని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం రెండు గంటలు ఆలస్యం.. ముందుగానే వీల్చైర్ , ఎన్కామ్ (విమానాశ్రయాలలో మీట్-అండ్-గ్రీట్ సేవలు) ముందుగానే బుక్ చేసుకున్నాం అయినా ఫలితం లేదు. దాని గురించి అడగడానికి అసలక్కడ ఎవరూ లేరు" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాలుగు బ్యాగులు మోస్తూ, సాయం చేయమని సిబ్బందిని అడిగితే, క్యాబిన్ సిబ్బందిగానీ, గ్రౌండ్ సిబ్బందిగానీ అస్సలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి.. కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవలసి వచ్చింది.అలా భార్యను లగేజ్ క్లెయిమ్కు తీసుకెళ్లి, అక్కడినుంచి పార్కింగ్కు వెళ్లామని వివరించాడు. అలాగేఎయిర్పోర్ట్లో సెకండ్ఫ్లోర్లో మీ వీల్ చైర్ ఉంది తెచ్చుకోండి అంటూ ఎయిరిండియాకు సూచించారు. దాస్ పోస్ట్పై ఎయిరిండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధింత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. -
సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి. -
మునకానందం..మహదారోగ్యం..!
ప్రకృతి సృష్టించిన కొన్ని అందాలను ఎంత చూసినా తనివి తీరదు. ఒకింత ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలగలిసిన అద్భుతాన్ని మనసారా ఆస్వాదించాలంటే, తప్పకుండా ‘ది టర్కోయిస్ పూల్స్’కి వెళ్లాల్సిందే అంటారు పర్యాటకులు. టర్కీలోని డెనిజ్లీ ప్రావిన్స్ పముక్కలేలో కనిపించే అందమైన నీలిరంగు కొలనులు ఆహ్లాదానికే కాదు, ఆరోగ్యానికీ ఉత్తమమట! ‘పముక్కలే’ అంటే, ‘పత్తి కోట’ అని అర్థం. ఈ ప్రదేశంలో కాల్షియం కార్బొనేట్ సహా అరుదైన ఖనిజాలతో నిండిన నీరు కొండల మీదుగా నెమ్మదిగా జారుతూ, తెల్లటి సున్నపురాతి కొండలను తొలచడంతో అక్కడక్కడా కొలనుల్లాంటి వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయి. ఈ వేడినీటిలో స్నానం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలో పురాతన హియెరాపోలిస్ నగరం ఉంది. దాంతో అక్కడ పురాతన శిథిలాలు, థియేటర్లు ఇతర చారిత్రక కట్టడాలను చూడవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!) -
సింగపూర్ ‘ట్రీ టాప్వాక్’ తరహాలో వాక్వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్లైన్లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్లైన్లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్ప్రైజ్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి! అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్ కట్ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్ చూపించిన ఆప్యాయత, సర్ప్రైజ్ అందరినీ ఆకర్షించింది. నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్డే బోయ్కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అంబానీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలుఅనంత్కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.“నా అనంత్కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’ -
ఎక్స్ట్రీమ్ టాలెంట్ : ఇతను చాలా రిచ్ గురూ!
జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్ అంటే ఎవరికీ తెలియదు. ‘మిస్టర్ బీస్ట్’ (MrBeast) అనండి... వెంటనే గుర్తుపట్టేస్తారు. అతను ప్రఖ్యాత యూట్యూబర్. ప్రపంచవ్యాప్తంగా 383 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగిన యూట్యూబ్ ఛానెల్ ‘MrBeast’ ని అతనే నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న బీస్ట్ ప్రపంచంలోని అనేకమంది ధనవంతులను మించిపోతున్నాడు. అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా?మిస్టర్ బీస్ట్ పుట్టింది 1998 మే 7న. అమెరికాలోని కాన్సస్లో పుట్టి, ఉత్తర కరోలినాలోని గ్రీస్విల్లేలో పెరిగారు. 2012 నుంచి యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల తర్వాత, 2017లో అతను చేసిన ‘కౌంటింగ్ టు 1,00,000’ వీడియో కొన్ని రోజుల్లోనే 10 వేల దాకా వ్యూస్ సాధించి, అతని ఛానెల్కి ప్రాచుర్యం తీసుకొచ్చింది. అలా మెల్లగా అతని వీడియోలకు వీక్షకులు పెరిగారు. విచిత్రమైన విన్యాసాలు, కొత్త కొత్త ప్రయోగాలు వంటివి మిస్టర్ బీస్ట్ ఛానెల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఫోర్బ్ నివేదిక ప్రకారం, మిస్టర్ బీస్ట్ 2023–2024లో సంపాదించిన మొత్తం 85 మిలియన్ డాలర్లు(సుమారు రూ.732 కోట్లు). ఇంత ఆదాయం కలిగిన మరొక యూట్యూబర్ ప్రపంచంలో మరెవరూ లేరు. యూట్యూబ్ వీడియోల ద్వారా అతను నెలకు సుమారు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లు) సంపాదిస్తున్నాడని అంచనా. ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయన మరికొన్ని వ్యాపారాలను ప్రారంభించారు. వాటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. అన్నీ కలిపి అతణ్ని అత్యంత ధనవంతుణ్ని చేశాయి. ఇదీ చదవండి: రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?! -
మనువాడిన మామిడి చెట్లు
సారంగాపూర్: సాగు చేస్తున్న మామిడితోటలో కాపుకొచ్చిన చెట్లకు రైతు దంపతులు పెళ్లి చేశారు. వ్యవసాయంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు.నాలుగేళ్ల తరువాత మొదటి కాత (పంట) వచ్చింది, దీంతో కాత కాసిన రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిశ్చయించి బంధువులను సైతం ఆహ్వానించారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దిపర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ గావించారు. కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరుకాగా.. మామిడితోటలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆడెపు రమ్య, మహేశ్, సత్తెన్న, మమత దంపతులు పెళ్లి పెద్దలుగా హాజరయ్యారు. -
రోజా పూలను ఈ పేపర్లో చుట్టి పెడితే..
సహజ పూల అందమే వేరు. అతిథులకు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపే పుష్పగుచ్ఛాల్లో రంగు రంగుల కట్ ఫ్లవర్స్ (Cut Flowers) మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి. అయితే, త్వరగా వాడిపోవటం వీటి ప్రధాన సమస్య. దీనిని అధిగమించటానికి మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) సరికొత్త పేపర్ను తయారుచేసింది. రోజా పూలను ఈ పేపర్లో చుట్టి పెడితే సాధారణంకంటే రెట్టింపు కాలం తాజాగా ఉంటాయని సంస్థ చెబుతోంది.విదేశాలకు కట్ ఫ్లవర్స్ ఎగుమతిచేసే సమయంలో త్వరగా వాడిపోవటం వల్ల 20 నుంచి 25 శాతం వరకు నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని నివారించడానికి కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఫ్లోరీకల్చర్ మిషన్ను ప్రారంభించింది. అందులో భాగంగానే (సీఎఫ్టీఆర్ఐ) ఈ పేపర్ను తయారుచేసింది. దీనిపై పేటెంట్ (Patent) కూడా పొందింది. 2020లో ప్రపంచ కట్ ఫ్లవర్ మార్కెట్ విలువ 1,761 కోట్ల డాలర్లు. ఇది 2027 నాటికి 2,668 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఫ్లోరీకల్చర్ మార్కెట్లో మన దేశ వాటా 2020లో రూ.18,760 కోట్లు. 2026 నాటికి ఇది రూ. 54,640 కోట్లకు పెరుగుతుందని అంచనా. కట్ రోజెస్ (Cut Roses) ఎగుమతిలో మన దేశం 15వ స్థానంలో ఉంది.కొత్త పేపర్ ప్రయోజనాలు ఇవీ.. ⇒ పర్యావరణహితంగా తయారైన ఈ పేపర్లో రోజా కట్ ఫ్లవర్స్ను చుట్టి పెడితే చాలు. ⇒ ప్యాకింగ్లో ఖరీదైన, విషతుల్యమైన రసాయనాలు వాడనవసరం లేదు. ⇒ సాధారణ ప్యాకింగ్లో కన్నా రెట్టింపు రోజులు పూలు తాజాగా ఉంటాయి. చదవండి: ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి.. ఇదేం లొల్లి!⇒ గులాబీ రేకులు, ఆకులు వాడిపోకుండా, రాలకుండా ఉంటాయి.⇒ రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల ఆదాయం పెరుగుతుంది. ⇒ ఈ పేపర్ రసాయన రహితమైనది. త్వరగా కుళ్లిపోతుంది.⇒వ్యాక్యూమ్ ప్యాక్లో ఈ పేపర్లు ఉంటాయి. ప్యాకెట్ విప్పిన తర్వాత నెల రోజుల్లోపు వాడుకోవాలి. - సాక్షి స్పెషల్ డెస్క్ -
తగ్గే ప్రసక్తే లే..! చిరుతకు చెమటలు పట్టించిన శునకం..!
వంగపండు ‘ఏం పిల్లడో’ పాటలో ‘పులుల్ని మింగిన గొర్రెలున్నయట’ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటలో‘చిరుతకు చెమటలు పుట్టించిన కుక్కలున్నయట’ అనే మాటను చేర్చవచ్చు. ఈ కథనం ఊళ్లోకి ప్రవేశించిన చిరుతపై తీవ్రంగా కన్నెర్ర చేసిన శునకం గారి గురించి. ఒక అర్ధరాత్రి... ఊరంతా గుర్రు పెట్టి నిద్రపోతోంది. చిన్న అలికిడి కూడా లేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక చిరుత పులి వీధిలోకి వచ్చింది. ఆ తరువాత ఒక ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు... ‘భౌభౌ’ అనే శబ్దం వినిపించింది. మామూలుగానైతే.... ‘నన్ను బెదిరించేంత సీన్ నీకు లేదు’ అని ఆ ఇంటి కాపలా కుక్కపై చిరుత కన్నెర్ర చేయాలి.అయితే సదరు చిరుత మాత్రం కుక్క అరుపులు విని వెనక్కి తిరిగి చూడకుండా పరుగో... పరుగు!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 3.5 మిలియన్ల వ్యూస్తో దూసుకు΄ోతోంది. ఇది ఏ ప్రాంతానికి చెందిన వీడియో క్లిప్ అనేది తెలియదుగానీ నెట్వాసులు జోక్లు విపరీతంగా పేలుస్తున్నారు. View this post on Instagram A post shared by Ranthambore National Park (@ranthamboresome) (చదవండి: ఆయన ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!) -
ఇదేం పెళ్లిరా నాయనా!
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.అధికారుల వార్నింగ్గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.కేసు నమోదుపెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్స్టోరీబాల్య వివాహాలు వద్దుసోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. -
సినిమాని తలపించేలా ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి లవ్స్టోరీ..!
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది. తాను ఆంద్రప్రదేశ్లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్లో సవివరంగా వెల్లడించింది. చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Jaclyn Forero (@jaclyn.forero) (చదవండి: వెయిట్లాస్కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్గేట్స్ ఏమన్నారంటే..) -
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్నెస్పై కేర్ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు. అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు. ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్ చేసుకోకుండా కంఫర్ట్గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్ వినియోగదారుడు నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?) -
రామభక్తుడు తయారు చేసిన 25 అడుగుల అగరబత్తి చూశారా?
శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పల్లివీధికి చెందిన రామభక్తుడు నరసింహమూర్తి 25 అడుగుల అగరబత్తీని తయారు చేసి ఆశ్చర్యపరిచారు. సర్వే కర్ర, అగరబత్తి పౌడర్ను ఉపయోగించి తయారు చేసిన ఈ బత్తీకి వారం సమయం పట్టిందని, సుమారు 48 కిలోల బరువు ఉందని ఆయన తెలిపారు.పలాసలోని సీతారామాలయం ఎదుట ఆదివారం ఈ అగరబత్తీని (incense stick) వెలిగించగా, సుమారు గంటన్నరసేపు ప్రాంగణంతోపాటు, చుట్టుపక్కల సువాసన వ్యాపించి అందరినీ ఆకట్టుకుంది. కోవా సారె కనువిందుడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అక్విడెక్టు వద్ద ఉన్న పట్టాభి రామాలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యాన జరిగిన స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.ఈ సందర్భంగా సత్యవాణి దంపతులు కోవాతో తయారు చేయించిన 108 రకాల స్వీట్లు, పిండి వంటలను శ్రీరాముని తరఫున సీతమ్మకు సారె (కంత)గా సమర్పించారు. చదవండి: జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం!రామతీర్థంలో వైభవంగా సీతారాముల కల్యాణంసాక్షి ప్రతినిధి, విజయనగరం/సింహాచలం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.పట్టువ్రస్తాలతో సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఉత్సవ విగ్రహాల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. తరువాత వేద మంత్రోచ్ఛారణల నడుమ కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం నుంచి వచ్చిన పట్టు వ్రస్తాలను సమర్పించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా స్వామివారికి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.రాములోరికి అప్పన్న పట్టువ్రస్తాలు రామతీర్థం రాములోరికి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. ఈ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు (mutyala talambralu) సమర్పించడం ఆనవాయితీ. దీన్లోభాగంగానే దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, అర్చకులు, అధికారులు పట్టువ్రస్తాలు, తలంబ్రాలను తీసుకెళ్లారు. -
కరాటే కింగ్ బొంతూరి రమేష్ సక్సెస్ స్టోరీ
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపురం ఇప్పాయిగూడేనికి చెందిన బొంతూరి రమేష్ కుటుంబసభ్యులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రమేష్ గోల్కొండలో 9వ తరగతి చదువుతున్నప్పుడే కరాటేపై ఆసక్తి పెంచుకున్నాడు. పదో తరగతి పాసైనా ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపేశాడు. బ్రూస్లీ సినిమాలు చూసి 12వ యేట నుంచే కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ ప్రోత్సాహంతో కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించాడు. అనంతరం కిక్బాక్సింగ్ నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం మాస్టర్ రమేష్ జవహర్గర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, కానిస్టేబుళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాడు. ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రన్వీర్ తైక్వాండో అకాడమీ ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా కరాటే విద్యనందించి బీపీ, షుగర్, మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యోగా శిక్షణ అందిస్తున్నాడు. ఇప్పటికే పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేస్తున్నాడు. వేసవికాలంలో మరింత మంది విద్యార్థులకు కరాటే విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ.. 2011 బెంగళూరులో నేషనల్ గోల్డ్ మెడల్ 2016లో అక్షయ్కుమార్ ఇంటర్నేషనల్ గోల్డ్మెడల్ వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 220 గోల్డ్, సిల్వర్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ.. మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ -
అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?
అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాంటి పనిచేసే కటకటాల పాలయ్యాడు. అంతేగాదు తన గర్ల్ఫ్రెండ్కి మరింత అసహ్యం కలిగేలా చేసుకున్నాడు.ఈ ఘటన తైవాన్లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల కోళ్ల పెంపకందారుడు ఎల్వీ 48 ఏళ్ల టాంగ్ అనే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ల బంధం 15 ఏళ్లు కొనసాగింది. అయితే ఎల్వీ ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబ తోడ్పాటుకు ఎటువంటి సహకారం లేకపోవడంతో విసిపోయిన టాంగ్ అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి ఆమె వేరుగా జీవిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్వీ, టాంగ్ని పదే పదే బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అక్కడితో ఆగక ఇక ఆమెను ఎలాగైనా.. తన వద్దకు రప్పించుకుని, కలిసే జీవించేలా చేద్దామనే దురుద్దేశంతో దురాగతానికి తెరతీశాడు. ఆమె తండ్రి సమాధి వద్ద ఉండే చితాభస్మాన్ని దొంగలించి ఆమె మనోవ్యధను కలిగిస్తే..కచ్చితంగా తన వద్దకు తిరిగి వచ్చేస్తుందని భావించాడు. కానీ అతడు ఒకటి తలిస్తే..విధి మరొకటి తలిచింది. అయితే ఇదంతా టాంగ్కు తెలియదు. అతడు తన తండ్రి చితాభస్మం నా దగ్గర ఉందని చెప్పినా..టాంగ్ అవన్నీ బెదిరింపులే అనుకుని కొట్టిపారేసింది. నమ్మను కూడా నమ్మలేదు. అయితే ఎలా దొంగలించానో..ఫోటోలతో సహా వివరంగా పంపించాడు. అప్పుడే ఆమె తన తండ్రి స్మశాన వాటికను సందర్శించి అసలు విషయం తెలుసుకుంది. ఇక టాంగ్ అతడిని క్షమించకూడదన్న పట్టరాని కోపంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వాళ్లువెంటనే రంగంలోకి దిగి విచారించగా..అతడే టాంగ్ తండ్రి చితాభస్మాన్ని అపహరించాడని తేల్చారు. అయితే అప్పటికే ఎల్వీ మనీలాండరింగ్కి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాడు. ఇక ఈ ఘనకార్యంతో ఎల్వీపై మరిన్ని అబియోగాలు మోపి అరెస్టు చేశారు. అలాగే అతడి నుంచి ఆమె తండ్రి చితాభస్మాన్ని కూడా స్వాధీన పర్చుకుని టాంగ్కి అప్పగించారు. ప్రేమతో మన నుంచి దూరమైన వాళ్ల మనుసుని గెలుచుకోవాలే గానీ ఇలాంటి పనులతో బలవంతంగా రప్పించుకుంటే..విధి సైతం సహకరించదు అంటే ఇదే కదూ..!.(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?) -
ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?
ఊసరవెల్లుల్లా రంగులు మార్చే ఈ చెట్లు ‘ఉప్ప’చెట్లు. ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు రంగులు మార్చుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గరువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఈ చెట్లను చూడవచ్చు. దాదాపు పదహారువేల ఎకరాల విస్తీర్ణంలోని వనంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఇరవై మీటర్ల ఎత్తులో గుండ్రంగా పెరుగుతాయి. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ‘సపోటసీ’ కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ‘ఇండియన్ బటర్ ట్రీ’ అని పిలుస్తారు. ఉప్ప చెట్ల వనంలో నెమళ్లు సహా రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ దోమలు, గబ్బిలాలు మాత్రం కనిపించవు.ఏడాదికి రెండుసార్లు రంగుల మార్పుఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండుసార్లు రంగులు మారుతాయి. సాధారణం ఇవి మిగిలిన ఆకుల్లా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. తొలుత తెలుపుగా, తర్వాత లేతగులాబిగా మారి, చివరకు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్ల పువ్వులు నాగమల్లి పూలలా తెల్లగా, అందంగా ఉంటాయి. వీటి పరిమళాలు చాలా దూరం వరకు గుబాళిస్తుంటాయి.పిక్కలకు ఓ లెక్కుంది!ఉప్ప కాయలను పగలగొడితే లోపల పిక్కలుంటాయి. సాదాగా ఉంటే మగ పిక్కలని, త్రికోణాకారంలో ఉంటే ఆడ పిక్కలని గిరిజనులు నమ్ముతారు. విద్యుత్తు సౌకర్యం లేని రోజుల్లో– కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రం చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు. లేదంటే సన్నని ఇనుప తీగతో పిక్కలను దండలా గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కలను మెత్తగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకోవడానికి, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పైపూతగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. బీజం ఎక్కడ పడింది!ఉప్ప చెట్లు శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జాతీయ వృక్షం. మన దేశంలో హిమాలయాల చుట్టుపక్కల, బిహార్లో అక్కడక్కడా కనిపిస్తాయి. దక్షిణాదిన అల్లూరి జిల్లాలోనే తారసపడతాయి. ఈ చెట్ల పుట్టుక గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడిగాడట! వారు తిరస్కరించగా, కొంత దూరం ప్రయాణించి మరో ఇంటికి వెళ్లి వేడుకున్నాడు. ఆ ఇంట్లో భోజనం పెట్టగా, తిని సంతృప్తి చెంది, ఆ ప్రాంతంలో బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు గిరిజనం చెబుతున్నారు. అవే బంగారం గరువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని ప్రతీతి. జయపురం రాజా విక్రమ్దేవ్వర్మ ఈ ప్రాంతంలో ఉప్ప విత్తులు జల్లించారన్నది మరో కథనం. గిరిజనులు ఈ చెట్లను అతి పవిత్రంగా చూసుకుంటారు. ఈ తోటలో ఎవరైనా మలమూత్రాదులు విసర్జిస్తే శిక్షిస్తారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు పెట్టారు. చెట్లను కొడితే కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చారు. ఈ చెట్ల రక్షణ బాధ్యత గ్రామ దేవత గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని నమ్ముతారు. అరవై ఏళ్ల కిందట గ్రామదేవతకు గుడి నిర్మించారు. ఏటా ఇక్కడ ఘనంగా జాతర జరుపుతారు.ఎలా చేరుకోవాలంటే...పాడేరుకు 30 కిలోమీటర్లు, అరకు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరాన ఉంది. సబ్బవరం మీదుగా పాడేరు–అరకు మార్గంలో ఉప్ప గ్రామానికి చేరుకోవచ్చు. కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో వచ్చేవారు వాహనాల్లో ఇంధనం నింపుకోవాలంటే డుంబ్రిగుడలో మాత్రమే పెట్రోల్ బంకు ఉంది. ఉప్ప తోటల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ -
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం దూసుకునిపోతున్న వేళ.. ఇప్పటికీ కొన్ని దేశాలు పర్యాటక ఆంక్షలు వీడటం లేదు. వాటిలో ఉత్తరకొరియా, సౌదీ అరేబియా, భూటాన్, తుర్క్మెనిస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం ఉత్తరకొరియా. ఇక్కడ పర్యటించడానికి చాలా కఠినమైన నిబంధనలున్నాయి. కేవలం కొన్ని ప్రత్యేక పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. సౌదీ అరేబియాలో విదేశీ పర్యాటకం చాలా పరిమితంగా ఉండేది. ఆ దేశం 2019లో పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించినా, ఇప్పటికీ, కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వెళ్లడానికి అనుమతించడంలేదు. తుర్క్మెనిస్థాన్లో పర్యటించడానికి వీసా పొందడం చాలా కష్టం. ఇక భూటాన్ తమ దేశ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాల పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తోంది. (చదవండి: పరీక్ష భయాన్ని ఓడించే టెక్నిక్స్) -
అగ్గిపెట్టె కనిపెట్టింది ఎప్పుడో తెలుసా?
ఇప్పుడంటే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టె వాడుతున్నాం. అగ్గిపెట్టె (Matchbox) లేని కాలంలో నిప్పు పుట్టించడం చాలా టఫ్ విషయం అని మీకు తెలుసా? రాళ్లను మరో రాళ్లతో కొట్టి, కర్రలను మధించి నిప్పు పుట్టించేవారు. ఒకరి ఇంట్లో నిప్పు (Fire) కావాలంటే పక్కింట్లో నుంచి నిప్పు కణికల్ని తీసుకెళ్లేవారు. అగ్గిపెట్టె వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తీరాయి.క్రీస్తుశకం 577 నుంచే చైనాలో రాజవంశానికి చెందిన స్త్రీలు నిప్పు కోసం కొన్ని ప్రత్యేకమైన కర్రల్ని వాడేవారని, వాటికి రసాయనాలు పూసి నిప్పు పుట్టించేవారని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో అవే తొలి అగ్గిపుల్లలని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అప్పటి శాస్త్రవేత్తలు గ్యాస్ (Gas) ఆధారంగా నిప్పు పుట్టించే ప్రయోగాలు చేశారు.1832లో లండన్లో తొలిసారి సిగార్లు వెలిగించుకునేందుకు కర్రతో పుల్లలు తయారు చేసి వాటి చివరన రసాయనాలను అంటించారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండటంతో వీటిపై మరిన్ని ప్రయోగాలు జరిగి, చివరకు ఇవాళ మనం చూస్తున్న అగ్గిపెట్టెలు అవతరించాయి. భలే ఉందిగా అగ్గిపెట్టె పుట్టుక. -
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
జీర్ణక్రియ, పోషకాల శోషణకు నమలడం ప్రయోజనకరమని చాలామందికి తెలుసు. కానీ నమలడం వల్ల మెదడుపై కూడా ఆశ్చర్యకరమైన ప్రభావం ఉంటుందని తెలుసా? అదీ కలప వంటి గట్టి ఆహారాలను నమలడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది.ఫ్రాంటియర్స్ ఇన్ సిస్టమ్స్ న్యూరోసైన్స్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం మృదువైన ఆహారాలను నమలడంతో పోలిస్తే , గట్టి ఆహారాలను నమలడం అనేది మెదడుకి, జ్ఞాపకశక్తికి చాలా మంచిదని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గట్టి పదార్థాలను నమలడం వల్ల మెదడులో కీలకమైన గ్లూటాథయోన్ (GSH) లెవల్స్ గణనీయంగా పెరిగాయి.ఈ అధ్యయనం ఎలా జరిగిందిమెదడు తనను తాను రక్షించుకోవడానికి కొన్ని యాంటీఆక్సిడెంట్లను ఉపయోగిస్తుంది. వాటిలో ఒకటి గ్లూటాథయోన్. ఈ అధ్యయనంలో పరిశోధకులు దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 52 మంది ఆరోగ్యవంతమైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహానికి చెందిన వారికి పారాఫిన్ వాక్స్ గమ్ నమలమని, చెక్కతో చేసిన టంగ్ డిప్రెసర్లను నమలాలని మరో గ్రూపునకు చెప్పారు. ముప్పై సెకన్లు నమలడం, స్వల్ప విరామం, మళ్లీ నమలడం ఇలా ఐదు నిమిషాల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నమలడానికి ముందు, ఆ తర్వాత అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (అభిజ్ఞాన నియంత్రణకు ముఖ్యమైన మెదడు ప్రాంతం)లో గ్లూటాథయోన్ స్థాయిని, అభిజ్ఞాన పనితీరును అంచనా వేశారు. దీని ప్రకారం చెక్కను నమిలిన గ్రూపులో గ్లూటాథయోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. చూయింగ్ గమ్ నమిలిన గ్రూపులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇది ఒక రకంగా మెదడు కణాలకు రక్షక కవచంగా, మెరుగైన జ్ఞాపకశక్తి పనితీరుకు పనిచేస్తుందట.మొత్తంగా ఈ అధ్యయనం రెండు ప్రధాన ఫలితాలను ఇచ్చిందనీ మొదటిది కలప నమలడం సమూహం మెదడు గ్లూటాథియోన్ స్థాయిలు పెరగడం, రెండోది మెదడు పనితీరుతో మెరుగుపడటం జరిగిందన్నారు. మెదడు GSH స్థాయిలను పెంచడానికి ప్రస్తుతం మందులు లేదా నిర్దేశిత పద్ధతులేవీ లేనందున, గట్టి పదార్థాన్నినమలడం అనేది ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగ పడుతుందనిపరిశోధనలు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వృద్ధులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి, అభిజ్ఞా పనితీరును కాపాడుకోవడానికి బాగా నమలగలగడం చాలా ముఖ్యం. నిజానికి, దంతాల నష్టం అల్జీమర్స్ వ్యాధికి ఒక ప్రధాన ప్రమాద కారకం. బయోమెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రకారం, నమలడం అనేది హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్తో సహా అభిజ్ఞా ప్రక్రియకు అవసరమైన అనేక మెదడు ప్రాంతాలను సక్రియం చేస్తుంది. నమలడం వల్ల మెదడు కార్యకలాపాలను, రక్తప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడుకు చక్కటి ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. నోట్ : ఇది పరిమితంగా నిర్వహించిన పరిశోధన మాత్రమే అని గమనించగలరు. బలపాలు, సున్నం,బియ్య లాంటి వాటిని అసాధారణంగా తినడాన్ని అనారోగ్యానికి చిహ్నం. ఆహార పోషకాలు లోపాలు, ఒత్తిడి కారణంగా ఇలాంటి అలవాట్లు వస్తాయి. అలాగే చెక్కను నమలడం, లిగ్నోఫాగియా అని కూడా పిలుస్తారు. చెక్కను నమలడం వల్ల దంతాలు దెబ్బతింటాయి . ఇది బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువ. పైగా కొన్నిమొక్కలు విషపూరితంగా కూడా ఉంటాయి. ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య -
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్ యాదవ్కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్జెట్ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025 -
Sri Rama Navami టీటీడీ నిర్లక్ష్యం : అయ్యో... ఆంధ్రావాల్మీకి!
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రామదాసు.. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు వావికొలను సుబ్బారావు. అయితే వావికొలనును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామభక్తుడైన వావికొలను సుబ్బారావు సేవలపై కథనం. ఒంటిమిట్ట(రాజంపేట): భద్రాచలంలో రామయ్య గుడి కట్టించిన భక్తరామదాసు కీర్తి ప్రతిష్ణలు తెలంగాణా ప్రభుత్వం ఇనుమడింప చేసే విధంగా ముందుకెళుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక రామాలయం నిర్మాణానికి సూత్రధారి అయిన అపరరామదాసు, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావికొలను సుబ్బారావు గురించి పట్టించుకోవడం లేదు.టీటీడీ వావికొలను సుబ్బారావు కీర్తిప్రతిష్టలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎటు వంటి అడుగువేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుబ్బారావు బోటు(గుట్ట)ను టీటీడీ అభివృద్ధి చేయలేదు. ఇటీవల ఒంటిమిట్టకు వచ్చిన ప్రభుత్వ బృందం దృష్టికి వావికొలను అంశం వెళ్లినట్లు తెలిసింది. వావికొలను జీవితమిలా.. ఆంధ్రావాల్మీకి వావికొలను సుబ్బారావు జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు1, 1936లో మద్రాసులో పరమపదించారు. టెంకాయచిప్పను చేతిలో ధరించి.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేశారు. దీంతో ఒంటిమిట్ట రామయ్యకు నైవేద్యం కూడా పెట్టలేని స్థితికి ఆలయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఉద్ధరించడానికి వావికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. వచ్చిన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్పలో ఎంత డబ్బు పడినా.. ఏదీ ఉంచుకోలేదు. అంతా ఆలయ అభివృద్ధికే ఇచ్చారు. అలాగే రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్రవిజయం, దండకత్రయం, టెంకాయ చిప్పశతకం లాంటి ఎన్నో రచనలు కూడా వావికొలను చేశారు. వానప్రస్ధం 1920లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితునిగా పనిచేశారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కాని ఊరిలో కొందరు స్వార్ధపరులు కుళ్లు రాజకీయాలతో ఆయన్ను అవమానించారు. ఆలయంలోకి రానివ్వకుండా చేశారు.ఊరిలో నిలువలేని పరిస్ధితులును కల్పించారు. వావికొలను దుఖించి, ఆ ఊరిని వీడి. మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ, అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉన్నారు. ఈయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కొనసాగుతోంది. ఆంధ్రావాల్మీకిగా.. సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలను)108సార్లు పారాయణం చేయటం వల్ల ఆయనకు అందులోని నిగూఢ అర్థాలు స్ఫురించాయి. ఆయన రాసిన రామాయణాన్ని మహాసభమద్యలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.శృంగిశైలాన్ని అభివృద్ధి చేయాలి రామాలయం నిర్మాణంæ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన వావి కొలను సుబ్బారావుకు స్మారకమందిరం నిర్మించాలి. ఆయన నివసించిన శృంగిశైలం (సుబ్బారావుబోటు)ను అభివృద్ధి చేయాలి. – గానుగపెంట హనుమంతరావు, సాహితివేత్త, కడపవావికొలను సుబ్బారావును టీటీడీ మరవరాదు ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గురించి టీటీడీ మరవ రాదు. ఆయన నివాసం ఉన్న గుట్ట అభివృద్ధికి నోచుకోలేదు. ఆయన పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి –ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పోరేషన్, ఒంటిమిట్ట -
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్ల ట్రెండ్నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించు కోవడం విశేషం. -
జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది. -
రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..) -
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..) -
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్లోని ద్వారకాధీష్ ఆలయానికి కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్నగర్లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్నగర్కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందట. ఇది లండన్తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్ స్టోరీ వైరల్!
గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్కు బ్రేకప్ చెప్పిన మలైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.కుమార్ సంగక్కరగా పాపులర్ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించు కున్నాడు. చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించిఅనూహ్యంగా క్రికెట్ కరియర్లోకి1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్గా, శక్తివంతమైన బ్యాక్హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర 1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్కు కోచ్గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్కు చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ, తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు.(సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)ప్రేమకథ ఎలా మొదలైందంటేసంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్వుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్తో సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యెహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమపక్షులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్రస్తుత సీజన్కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. -
ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది. -
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్లాండ్, మయన్మార్లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్లాండ్లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు, వీల్చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చి పార్క్లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..) -
'విల్ పవర్' అంటే ఇది..ఏకంగా వీల్చైర్తో బంగీ జంప్..!
మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైన పక్కకు వెళ్లిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేశ్లో తన కంపెనీ ఉద్యోగి వీల్చైర్ తోపాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశారు. "చాలామంది దీనిని థ్రిల్ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్ అయిపోవాల్సింది. దానిముందు ఏ అడ్డంకి నిలువలేవు అని రాసుకొచ్చారు పోస్ట్లో గౌతమ్ అదానీ. కాగా, గత నెల పిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమల కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని అన్నారు గౌతమ్ అదానీ. అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్కరం రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేగాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్ ప్లస్లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు, వారి కోసం పాటుపడేవారి కోసం ఏదైనా చేయొచ్చేగా అని ఒక ఎపిసోడ్లో సూచించారు కూడా. Most people do it for the thrill. Kay Mehta, our own Adanian, did it to make a statement. From the heights of Rishikesh, strapped in his wheelchair, Kay took a leap that told the world: no odds, no fear, can stop willpower. Kay, you don’t just inspire us - you redefine what it… pic.twitter.com/n1CTvFKtsQ— Gautam Adani (@gautam_adani) March 27, 2025 (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్నే బిజినెస్గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్బుక్ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. -
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
‘ఇనుములో ఓ మనిషే మొలిచెనే'..!
‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నట్లు ఇప్పుడు ఇనుములో ఓ మనిషే మెులిచాడు. అమెరికన్ కంపెనీ ‘క్లోన్ రోబోటిక్స్’ మనిషిని పోలిన శరీరంతో ‘ప్రోటోక్లోన్’ పేరుతో రోబోను రూపొందించింది. ఇతర రోబోల మాదిరి కాకుండా ఇది వెయ్యి కృత్రిమ కండరాలు, 206 ఎముకలు, చర్మం, కీళ్లు వంటి ఇతర భాగాలతో నిజమైన మానవుడిలా పనిచేసే శరీరంతో ఉంటుంది. ఇందులో అమర్చిన 500పైగా సెన్సర్ల సాయంతో ఈ రోబో శ్వాస తీసుకోటం, వదలడం, చెమటలు పట్టడం, వణకడం, భయపడటం, నవ్వడం, ఏడ్వటం ఇలా మరెన్నో భావాలను వ్యక్తపరచగలదు.(చదవండి: ఏకంగా ఆన్లైన్లో మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?) -
Round Egg: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..!
ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ విషయం వింటే..ఇది జోక్ ఏమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయమే అలాంటిది మరి.. అందులోనూ ఓ కోడి గుడ్డు వేలానికి వెళ్లడమే విడ్డూరం అనుకుంటే..ఇక ఆ వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో వింటే నోరెళ్లబెడతారు. ప్చ్..! ఇదెలా అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించొద్దు..ఆలస్యం చేయకుండా అసలు కథేంటో చదివేయండి మరీ.. సాధారణంగా కోడిగుడ్డులు అండాకారం లేదా ఓవెల్ ఆకృతిలోనే ఉంటాయి. అందరికీ తెలిసింది. కానీ ఓ గుడ్డు మ్రాతం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా..!. ఈ ఘటన ఇంగ్లాండ్లోని సోమర్సెట్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్లో చోటు చేసుకుంది. ఆ ఫామ్లో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నా అలిసన్ గ్రీన్ అనే మహిళ అలా గుండ్రంగా ఉన్న కోడిగుడ్డుని చూసి అవాక్కయ్యింది. ఆ విధంగా ఆ గుడ్డు వేలానికి వెళ్లింది. అయితే అది ఏకంగా రూ. 43000లకు అమ్ముడైంది. ఆ డబ్బుని అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళల కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ డెవాన్ రేప్ క్రైసిస్కు అందివ్వనున్నట్లు పేర్కొంది అల్లిసన్. ఈ మేరకు అల్లిసన్ మాట్లాడుతూ..మూడేళ్లుగా ఫెంటన్ ఫామ్లో పనిచేస్తున్నా..ఇప్పటి వరకు దాదాపు 42 మిలయన్ల గుడ్లను సేకరించా..కానీ ఇలాంటి గుండ్రని గుడ్డుని మాత్రం చూడలేదని అన్నారు. ఇది తనను ఎంతగానో ఆకర్షించిందని..అందువల్లే వేలంలో పెట్టి వచ్చిన డబ్బు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నట్లు పేర్కొంది. అందుకు తమ ఫామ్ యజమాని కూడా ఒప్పుకోవడంతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది అలిసన్.(చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయొద్దు..! కొంచెం చూసి తిందామా..) -
ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్ : క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్
ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్అవుతోంది. తన క్యాబ్లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటలను నో రొమాన్స్.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్గా ఉండండి." అంటూ ఒక నోట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్గా నిలుస్తాయి. ఆన్లైన్ మీమ్లకు కేంద్రంగా ఉంటాయి. -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
‘ఆ రోజుల్లో’ ‘మా రోజుల్లో’ అంటూ పిచ్చుకలను తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? సొంత లాభం కొంత మానుకొని ‘నా ఇల్లు... నా పక్షులు’ అనుకుంటే పిచ్చుకలు పూర్వకళతో సందడి చేస్తాయి. పిచ్చుకలు కనిపించడం అరుదైన దృశ్యం కావడం హైదరాబాద్కు చెందిన భావన శ్రీనివాస్ను బాధించింది. ఆ బాధే పిచ్చుకల సంరక్షణను ఉద్యమ స్థాయిలో చేసేలా చేస్తోంది. సమాజంలో పర్యావరణం పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం భావన శ్రీనివాస్ను ఆలోచనలో పడవేసింది. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనే ‘జాగృతి అభ్యుదయ సంఘం’కు బీజం వేసింది. ఈ సంస్థ పక్షుల సంరక్షణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలాంటి అంశాలపై పనిచేస్తుంది.ప్రతి ఇంటికి ఒక గూడుఇంటి చుట్టుపక్కల, తోటల్లో, రహదారుల పక్కన కనిపించే పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్లు కొట్టివేయడం, ఆధునిక నిర్మాణాల వల్ల వాటికి గూళ్లు లేకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భావన శ్రీనివాస్ ‘పిచ్చుక గూళ్ల సంరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మట్టిగూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మట్టి గూళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.విద్యార్థులే వెన్నెముకగా...గూళ్ల తయారీని గ్రామీణ మహిళలకు అప్పగించి వారికి ఉ పాధి కల్పిస్తున్నారు. వేసవికాలంలో పిచ్చుకలు దాహంతో బాధపడకుండా, ప్రతి ఇంటిముందు చిన్న నీటి తోగులు (నీటి గిన్నెలు) పెట్టేలా అవగాహన కలిగిస్తున్నారు. చెట్లు, బడులు, వృద్ధాశ్రమాలలో కూడా ఈ తోగులను ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకల ప్రాముఖ్యతపై బడులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక ఇంట్లో ఒక గూడు’ అనే ఉద్యమాన్ని విద్యార్థుల సహకారంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు పక్షుల సంరక్షణ ఉద్యమంలో భాగమయ్యాయి. చదవండి : Sunita William Gujarat Home: పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియోపిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదో తెలుసా?నగరీకరణ: కొత్త కాంక్రీట్ భవనాల నిర్మాణం, చెట్ల కొట్టివేత వల్ల పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశం తగ్గిపోయింది.ప్లాస్టిక్ వినియోగం: మనం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలలో పక్షులు చిక్కుకుని మరణించడం పెరిగిపోయింది.రసాయనాల ప్రభావం: వ్యవసాయ రంగంలో అధికంగా ఉపయోగించే రసాయనిక ఎరువుల వల్ల పురుగులతో పాటు చిన్నపాటి పక్షులు చనిపోతున్నాయి.నీటి కొరత: ప్రత్యేకించి వేసవిలో పిచ్చుకలకు తాగేందుకు నీరు దొరకక పోవడం వాటి మనుగడకు కష్టంగా మారింది.అవిగో పిచ్చుకలు! రకరకాల కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పక్షి విభాగం శాస్త్రవేత్త వాసుదేవరావుతో మాట్లాడాను. అట్టపెట్టెలతో చేసిన పిచ్చుక గూళ్లు ఇచ్చారు. మంచి మట్టితో తయారుచేసిన గూళ్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనే ఆలోచనతో ఒక కుమ్మరి కళాకారుడికి నా కాన్సెప్ట్ చెప్పాను. అతను చేసి ఇచ్చాడు. సక్సెస్ అవుతామా లేదా తెలుసుకోడానికి ముందు మా ఇంట్లోనే పెట్టాము. సూపర్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వెయ్యి వరకు పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలను ఎవరు తీసుకెళ్లినా ఇతరులలో స్ఫూర్తి నింపడానికి ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టండి అని చెబుతుంటాను. – భావన శ్రీనివాస్ – శిరీష చల్లపల్లి -
ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..!
పెర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్కి సాటిలేదు ఏదీ..!. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే.."ప్రేమ" గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పెర్ఫ్యూమర్ జాక్వెస్ గెర్లైన్. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్ని ఈ పెర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్కి షాజహాన్ లవ్స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పెర్ఫ్యూమ్నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్ని బాకరట్ క్రిస్టల్తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్ డెకరేషన్ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్గా రికార్డులకెక్కింది. (చదవండి: లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..! వైరల్గా ఐఐటీ స్టూడెంట్ పోస్ట్) -
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
ఏనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి నష్ట పరిరహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళకు రూ.5 కోట్ల తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి, ఆమె కుటుంబం పడిన బాధను, ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు పేర్కొంది. అసలేంటి కేసు? వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో.2017, మే 28 నిధి రాజేష్ జెఠ్మలానీ (వయసు అప్పటికి 17) మెరైన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజీకి వెళుతుండగా, పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దాదాపు కోమా(vegetative state) లాంటి పరిస్థితిలో మంచానికే పరిమితమై పోయింది. ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఫిబ్రవరి 2021లో ఆమెకు రూ.69.92 లక్షలు వడ్డీతో పాటు రూ.1.5 కోట్ల కార్పస్ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు వైద్య , ఇతర ఖర్చులకు ఉపయోగించాలి తీర్పుచెప్పింది. అయితే దీనిపై రైల్వే శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన రూ. 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాదిత ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెఠ్మలానీకి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీనిని 'చాలా అరుదైన' కేసుగా పేర్కొంది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. మార్చి6న దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ, న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి , అద్వైత్ సేథ్నా మాట్లాడుతూ, "ఈ ప్రభావం చాలా భయంకరమైనది. సంతోషంగా, ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు/కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ, తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ షాన్బాగ్ పరిస్థితితో పోల్చారు. చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది (WR) సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖ (రైల్వే మంత్రి) అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్లోని జైపూర్లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025 (చదవండి: ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..) -
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..!
గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే ‘గేట్ టు హెల్’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది. (చదవండి: ∙ -
Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం
జీవితంలోపైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ తన చుట్టూ ఉండేవారి బాధలు, అనారోగ్యాలను చూసి చలించిపోయి వ్యాపారం ప్రారంభించే వారు చాలా తక్కువ. అదీ అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరీ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చండీగఢ్కు చెందిన మోహిత్ నిజవాన్ (Mohit Nijhawan) అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం అంత ఈజీకాదు. ఇందుకు పూర్తి విశ్వాసం, కృషి పట్టుదల ఉండాలి. చండీగఢ్కు చెందిన మోహిత్ నిజవాన్ బయో కెమిస్ట్రీలో పీజీ చేశాడు. ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. రూ.90 లక్షల వేతనం. అయితే తన బంధువుల్లో చాలా కేన్సర్ బారిన పడటం, వారిలో చాలా మందికి వైద్య ఖర్చులుగా భారీగా ఉండటం, ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు. ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలా మంది క్యాన్సర్తో బాధపడుతుండటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు తన కళ్ల ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఈ కేన్సర్ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి , డైటరీఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని గుర్తించాడు. అంతే సంచలన నిర్ణయంతీసుకున్నాడు. 2020లో ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ (microgreens) పెంచాలని నిర్ణయించుకున్నాడు.తన స్నేహితుడితో కలిసి 21వ శతాబ్దపు వెజ్జీ స్టార్టప్గా చెప్పుకునే మైక్రోగ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూశాడు. మరోవైపు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని కూడాఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మోహిత్ పట్టువీడలేదు. View this post on Instagram A post shared by GREENU: LIVE MicroGreens - A product by Embryonic Greens (@greenu_microgreens) మోహిత్ 2022 సంవత్సరంలో రూ. 30 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. 500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చండీగఢ్కు చెందిన ఒక ఆంకాలజిస్ట్కు విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్ తినిడం వల్ల కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు. గ్రీను బ్రాండ్ పేరుతో మైక్రోగ్రీన్లను విక్రయిస్తోంది. బీట్రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, రెస్టారెంట్లు, జిమ్లు, కేఫ్లు ఈ కంపెనీ కస్టమర్లలో భాగం.చదవండి: చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలుఔత్సాహికులకు శిక్షణమోహిత్ మైక్రోగ్రీన్లను అమ్మడమే కాకుండా, వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా నెలకు రూ.12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఏటా దాదాపు రూ.1.44 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ.5 లక్షలు. అలాగే ప్రతీ ఏటా రూ.60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు.ఇదీ చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?విత్తనాలను మట్టి లేకుండా, కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత (7 -10 రోజులలోపు), చిన్న చిన్న మొలకలుగా ఉన్నపుడే సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు. వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40 శాతం ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, కేన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి, పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. -
చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలు
సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ కొండమీది కోతినైనాకిందికి దింపవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడుకావచ్చు. ఉదయపూర్కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్ను ప్రారంభించడానికి దారితీసింది. స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్డౌన్ అయింది. చాలా మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు, కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తరువాత బిజినెస్గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ‘సారామ్’ అనే బ్రాండ్ను మొదలు పెట్టాడు. కట్ చేస్తే దిగ్విజయ్ బిజినెస్ కోటి రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తోంది. సారామ్లో కుల్ఫీలు, కుకీలు కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు.ఉదయ్పూర్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూవిభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ విజయానికి బాటలు వేసింది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచనను తన సోదరుడు మహవీర్ సింగ్తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు గానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్ను ఆశ్రయించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత పట్టుసాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకు ప్రతి కార్ సేల్లో ఒకే చాక్లెట్ బాక్స్ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి హోటల్ యజమానులు, కార్ షోరూమ్లను సంప్రదించాడు.తొలి ఆర్డర్అలా 2021లో దిగ్విజయ్ ఒక కార్ షోరూమ్ నుంచి వెయ్యి రూపాయల చాక్లెట్ల మొదటి ఆర్డర్ను అందుకున్నాడు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. సారామ్ ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్గా మారిపోయింది. 2023 నాటికి, సారామ్ రెండు టన్నులకు పైగా చాక్లెట్ను విక్రయించింది. ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు. కేరళ ,తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్ ఐస్ ఆపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు."నాకు చాక్లెట్టు అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు. క్లాసెస్ ఆన్లైన్లో ఉండటంతో చాలా సమయం దొరికింది. వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే YouTube ట్యుటోరియల్ ద్వారానే ఇది సాధించాడు. పార్ట్టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు. -
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో టేకాఫ్కు సిద్ధంగా విమానంలో స్పైస్జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్జెట్లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్లైన్తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025 -
ఇక్కడ జిమ్లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!
#Continuum: జిమ్లో చేరాలంటే నెలకు ఎంత కడతాం? మిగిలిన చోట్ల ఎంత ఉన్నా, న్యూయార్క్ (NewYork) లోని గ్రీన్విచ్కి దగ్గరలోని ఒక గ్రామంలో కొంటినూమ్ (Continuum )అనే వెల్నెస్ సోషల్ క్లబ్లో జిమ్ చేయాలంటే అక్షరాలా 8000 పౌండ్లు కట్టాలి. గత ఏడాది ఏప్రిల్లో ఆరంభం అయిన ఈ జిమ్లో లగ్జరీ లాంజ్ ఉంది. సభ్యులకు ఫిట్నెస్ పెంచుకోవడం కోసం టాప్క్లాస్ జిమ్ తరగతులు జరుగుతుంటాయి. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వెల్నెస్ సెంటర్ 250 మంది సభ్యులకు మాత్రమే పరిమితం. చిత్రం ఏమిటంటే, కళ్లు తిరిగేటంత సభ్యత్వ రుసుము కండలు పిండి మరీ వసూలు చేస్తున్నా కూడా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారి జాబితా చాలానే ఉందట. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఇక్కడ చేరి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్న వారందరికోసం ఇంటి దగ్గర ఉండి మరీ కసరత్తులు చేసేందుకు ఆన్లైన్లో ప్రత్యేకమైన హోమ్ వర్క్ (వర్కవుట్లు చేయిస్తారట) కూడా ఇస్తారట. డబ్బు కట్టగానే ఇక్కడ సభ్యులకు పూర్తి వివరాలతో కూడిన ‘ఆన్బోర్డింగ్ అసెస్మెంట్’ ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్నూ స్కాన్ చేసి, ఉండవలసిన దానికన్నా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే పరీక్షించి, వాటిని బ్యాలన్స్ చేసుకునేందుకు తగిన స్పెషల్ వర్కవుట్లు చేయిస్తారు. అంతేకాదు, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నిద్ర నాణ్యత ఎలా ఉంది... వంటి పరీక్షలన్నీ చేసి అందుకు తగ్గట్టు జిమ్ చేయిస్తారట. ఏమైనా.. పిండికొద్దీ రొట్టె అన్నట్టు మనం చెల్లించిన డబ్బుకు తగ్గట్టు వర్కవుట్లు చేయించి మన ఫిట్నెస్ను పరిరక్షిస్తారన్నమాట! -
చేప కొరికితే అంతలానా..! పాపం అతడికి ఏకంగా..
కుక్క లేదా ఇతర జంతువులు కొరికితే వెంటనే భయపడతాం, ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అదే చేప, పీత లాంటివి అనగానే కొందరూ లైట్ తీసుకుంటారు. ఎందుకంటే అవి విషపూరితం కాదనే ఫీలింగ్. అలానే ఈ వ్యక్తి కూడా చేపే కదే అని చాలా లైట్ తీసుకున్నాడు. చివరికి అది అతడి ఊహించిన బాధనే మిగిల్చింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదని వాపోతున్నాడు. ఇంతకీ అతడికి ఏం జరిగిందంటే..కేరళలోని కన్నూర్ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేష్ అనే రైతు తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న నీటిగుంటని క్లీన్ చేశాడు. సరిగ్గా ఆ సమయంలో కడు అనే జాతికి చెందిన చేప(క్యాట్ ఫిష్ జాతికి చెందింది) అతడి వేలిని కొరికింది. దాంతో అతడు స్థానికంగా ఉన్న పీహెచ్సీకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. నయం అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాడు. అంత సీరియస్గా పట్టించుకోలేదు. కానీ రానురాను భాధ ఎక్కవై చెయ్యి కదిలించాలంటేనే నొప్పితో విలవిల్లాడిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఇక ఆ బాధకు తాళ్లలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు అతడికి ఎందువల్ల ఇలాంటి పరిస్థి వచ్చిందన్నది అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ వైద్యులు కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చేతివేళ్లను తొలగించారు వైద్యులు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ఇన్ఫెక్షన్ అరచేయి అంతా వ్యాపించేసింది. దీంతో వైద్యులు పూర్తిగా ఆ అరచేతి మొత్తాన్ని తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..బురద నీటిలో నివశించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలపై దాడి చేసి..ఇన్ఫెక్షన్ని మెదడు వరకు వ్యాప్తి చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. ఇక్కడ ఈ రైతు రాజేష్ కేసులో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి అరచేతిని తొలగించడం తప్పమరో అవకాశం లేదు. బురదలో ఉండే ఆ చేప కారణంగానే ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించిందని చెప్పుకొచ్చారు వైద్యులు. (చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు) -
వారెవ్వా..! ఏం సందేశం ఇది..!
కొన్ని అడ్వైర్టైస్మెంట్లు ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ ఉంటాయి. మరికొన్ని విదాస్పదంగా కూడా ఉంటాయి. అందుకే మీడియాలోనూ, ఇలాంటి మార్కెటింగ్ అడ్వర్టైస్మెంట్లలో ఏమరపాటు పనికిరాదని అంటారు నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట తెగ వైరల్ అవుతున్నఈ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్ చూస్తే ఏం ఉందబ్బా అని అనుకుండా ఉండలేరు. ఒక్కసారిగా భాషా అతర్యం పెద్ద సమస్యకాదని చిటికెలో తీసిపారేసింది. నెటిజన్ల మనసు దోచుకున్న ఆ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్లో ఏముందంటే..డైరీ మిల్క్ కొత్త అడ్వర్టైస్మెంట్లో ఉత్తర దక్షిణ భారతదేశ భాషల ఆంతర్యంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించింది. ఒక ఇంటిపై హిందీ మాట్లాడే మహిళల గుంపు కూర్చొని ఉంటుంది. వారి మధ్యలోని చెన్నైకి చెందిన పోరుగింటామె కూడా వారి సంభాషణలో చేరుతుంది. అయితే ఆమెకు హిందీ రాక ఇబ్బందిపడుతుంది. అక్కడ తన ఉనికే ప్రశ్నార్థకంగా ఉంటుంది. దాంతో ఆమె మిగతా మహిళలు సంభాషణను వింటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే మరో మహిళ కల్పించకుని మాట్లాడమని సైగ చేస్తుంది. తనకు హిందీ కొంచెం కొంచెమే వచ్చు అని చెబుతుంది. దాంతో అవతల మహిళ వచ్చిరాని ఇంగ్లీష్లో జరిగింది వివరిస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఇంగ్లీష్ కొంచెం కొంచెమే వచ్చు అనేసి..డైరీ మిల్క్ ఇస్తుంది. అయినా మనుషులతో కలవాలని ఉంటే చాలు ..భాషతో సమస్య ఏం ఉందని నవ్వేస్తుంది. ఆ తర్వాత ఇరువురు ఆ డైరీ మిల్స్ని షేర్ చేసుకుని ఆస్వాదించడంతో ఆ యాడ్ ముగిసిపోతుంది. ఇక్కడ ఇందులో మన భాషలు వేరైతేనేం ఈ తియ్యటి చాక్లెట్తో కనెక్ట్ అవుదాం అన్నట్లుగా ఉంది. అందరం ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక టైంలో ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉంటాం కదా. నెట్టింట వైరల్అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకోవడమే గాక..ఎంత అందంగా భాషభేధం పెద్ద సమస్య కాదని చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. (చదవండి: కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..! వైద్యనిపుణులకే అంతుపట్టని కేసు.) -
ఇరాన్ బీచ్లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్తో ఎరుపు పెయింట్ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ఆ చెఫ్ హస్తకళ అదుర్స్..! ఆహా బంగాళదుంపతో ఇలా కూడా..
పాకశాస్త్ర నిపుణులు చేతులు అద్భుతమైన వంటలే కాదు..హస్తకళకు పెట్టింది పేరు అనొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్లలో చెఫ్లు కేవలం వండటానికే పరిమితం కారు. వండిన ఐటెమ్స్ని అందంగా ప్లేటులో పెట్టడం కూడా ఓ కళ. అది ఉంటేనే మంచి చెఫ్గా పేరు తెచ్చుకోగలరు, ఆ రంగంలో రాణించగలరు. అయితే ఇదంతా ఎందుకంటే.?..చెఫ్లు కూరగాయలతో భలేగా అందమైన ఆకృతులు మలిచి మరీ ఫుడ్ని సర్వ్ చేస్తారని తెలిసిందే. ఆ కళా నైపుణ్యంతోనే ఈ చెఫ్ ఏకంగా జ్యువెలరీనే డిజైన్ చేశాడు. దేనితోనో తెలుసా..?..అందరూ ఇష్టంగా తినే ఆలుతో ఈ ఫ్రెంచ్ చెఫ్ బ్రాస్లెట్ మాదిరి ఆకృతిని తయారు చేశాడు. చక్కగా టీ తాగేటప్పుడు చిప్స్లా తినే ఆలుతో చక్కగా ధరించే ఆభరణాన్ని డిజైన్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ చెఫ్ ఆ బంగాళ దుంపను చెక్కి..చక్కగా దీర్ఘచతురస్రాకార ఆకృతులను చేశాడు. ఆ తర్వాత వాటిని లింక్ చైన్ మాదిరిగా రూపొందించాడు. అది ఆశాంత చూసేంత వరకు జ్యువెలరీ అని తెలియదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ చెఫ్ హస్తకళా నైపుణ్యానికి ఫిదా అవుతూ..ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరీ.. View this post on Instagram A post shared by LEROY. SAITO. LE SQUER. (@lsltoronto) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..)