
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది.

50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్ను ప్రయోగించాం.
On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.
Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025
నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.
– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ
(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు)