
గత 41 ఏళ్లలో స్పష్టమైన మార్పు
విపరీతంగా పెరిగిన పట్టణీకరణ
రాత్రిపూట చిత్రీకరించిన శాటిలైట్ ఫొటోలతో గుర్తింపు
న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డుకెక్కారు. 1984 ఏప్రిల్లో ఆయన అంతరిక్ష యాత్ర చేశారు. వారం రోజుల్లో భూమిపైకి తిరిగొచ్చారు. అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది? అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశ్నించగా.. ‘సారే జహాసే అచ్ఛా’అటూ రాకేశ్ శర్మ బదులిచ్చారు.
ఒకవేళ ఆయన ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ఉంటే అప్పట్లో చూడని ఎన్నో దృశ్యాలు తిలకించేవారు. ముఖ్యంగా రాత్రిపూట మన ఇండియా ఎలా కనిపిస్తోందో వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ అవకాశం శుభాన్షు శుక్లా దక్కింది. ఆయన గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 1984 నుంచి గమనిస్తే.. గత 41 ఏళ్లలో మన దేశం ఎంతగానో పురోగమించింది.
పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాలు 2000 సంవత్సరం నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందున్న శాటిలైట్ కెమెరాలు ఆధునికమైనవి కావు. రాత్రి సమయంలో ఫొటోలను స్పష్టంగా చిత్రీకరించే సామర్థ్యం వాటికి లేదు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ శాటిలైట్ కెమెరాలు అంతరిక్షం నుంచి ప్రతి దేశాన్ని స్పష్టంగా మన కంటికి చూపగలుగుతున్నాయి. రాత్రిపూట దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలను బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేయొచ్చు. దేశ ప్రగతితోపాటు సామాజిక, ఆర్థిక మార్పులను ఇవి కొంతవరకు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు.
విద్యుత్ కాంతి విస్తృతి
ఇండియాలో పట్టణీకరణ, అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకొనేందుకు శాటిలైట్ చిత్రాల ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) ఒక అధ్యయనం చేసింది. 2012 నుంచి 2021 వరకు రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి ఉపగ్రహాలు చిత్రీకరించిన ఫొటోలు సేకరించి, విశ్లేషించింది. పదేళ్లలో దేశంలో రాత్రిపూట విద్యుత్ కాంతి(నైట్టైమ్ లైట్) విస్తృతి ఏకంగా 43 శాతం పెరిగినట్లు తేలింది.
ముఖ్యంగా బిహార్, మణిపూర్, లద్ధాఖ్, కేరళలో ఈ విస్తృతి అధికంగా ఉండడం విశేషం. 2020 సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇందుకు కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణమని చెబుతున్నారు. 1984 నాటి చిత్రాలను, ఇప్పటి చిత్రాలను గమనిస్తే 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాతే ఇండియాలో పట్టణీకరణ వేగం పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది.
అంతరిక్షం నుంచి భారత్ అద్భుతం
ఇండియన్–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలపాటు ఉండి, ఏప్రిల్లో భూమిపైకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపిస్తోందని ఆమె చెప్పారు. హిమాలయ పర్వతాలపై నుంచి వెళ్లినప్పుడల్లా అందమైన చక్కటి ఫొటోలు తీసుకున్నామని తెలిపారు. గుజరాత్, ముంబైలో సౌందర్యవంతంగా కనిపించాయని వెల్లడించారు.