
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.
శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..
వీళ్ల తర్వాత శుక్లానే..
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్లింది లేదు. కానీ..
భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.
అంత బడ్జెట్ కేటాయించి మరీ..
అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మిషన్కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.
ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.
అందుకేనా?..
ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..
యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.
:::వెబ్డెస్క్ ప్రత్యేకం