
శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పల్లివీధికి చెందిన రామభక్తుడు నరసింహమూర్తి 25 అడుగుల అగరబత్తీని తయారు చేసి ఆశ్చర్యపరిచారు. సర్వే కర్ర, అగరబత్తి పౌడర్ను ఉపయోగించి తయారు చేసిన ఈ బత్తీకి వారం సమయం పట్టిందని, సుమారు 48 కిలోల బరువు ఉందని ఆయన తెలిపారు.
పలాసలోని సీతారామాలయం ఎదుట ఆదివారం ఈ అగరబత్తీని (incense stick) వెలిగించగా, సుమారు గంటన్నరసేపు ప్రాంగణంతోపాటు, చుట్టుపక్కల సువాసన వ్యాపించి అందరినీ ఆకట్టుకుంది.
కోవా సారె కనువిందు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అక్విడెక్టు వద్ద ఉన్న పట్టాభి రామాలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యాన జరిగిన స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా సత్యవాణి దంపతులు కోవాతో తయారు చేయించిన 108 రకాల స్వీట్లు, పిండి వంటలను శ్రీరాముని తరఫున సీతమ్మకు సారె (కంత)గా సమర్పించారు. చదవండి: జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం!
రామతీర్థంలో వైభవంగా సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సింహాచలం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.

పట్టువ్రస్తాలతో సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఉత్సవ విగ్రహాల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. తరువాత వేద మంత్రోచ్ఛారణల నడుమ కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం నుంచి వచ్చిన పట్టు వ్రస్తాలను సమర్పించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా స్వామివారికి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రాములోరికి అప్పన్న పట్టువ్రస్తాలు
రామతీర్థం రాములోరికి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. ఈ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు (mutyala talambralu) సమర్పించడం ఆనవాయితీ. దీన్లోభాగంగానే దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, అర్చకులు, అధికారులు పట్టువ్రస్తాలు, తలంబ్రాలను తీసుకెళ్లారు.