
ఆంధ్రా వాల్మీకి వావికొలను సుబ్బారావుపై టీటీడీ నిర్లక్ష్యం
గుట్టకే పరిమితమైనఅపర రామదాసు ఖ్యాతి
టీటీడీ తీరుపై భక్తుల ఆవేదన
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రామదాసు.. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు వావికొలను సుబ్బారావు. అయితే వావికొలనును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామభక్తుడైన వావికొలను సుబ్బారావు సేవలపై కథనం.
ఒంటిమిట్ట(రాజంపేట): భద్రాచలంలో రామయ్య గుడి కట్టించిన భక్తరామదాసు కీర్తి ప్రతిష్ణలు తెలంగాణా ప్రభుత్వం ఇనుమడింప చేసే విధంగా ముందుకెళుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక రామాలయం నిర్మాణానికి సూత్రధారి అయిన అపరరామదాసు, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావికొలను సుబ్బారావు గురించి పట్టించుకోవడం లేదు.టీటీడీ వావికొలను సుబ్బారావు కీర్తిప్రతిష్టలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎటు వంటి అడుగువేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుబ్బారావు బోటు(గుట్ట)ను టీటీడీ అభివృద్ధి చేయలేదు. ఇటీవల ఒంటిమిట్టకు వచ్చిన ప్రభుత్వ బృందం దృష్టికి వావికొలను అంశం వెళ్లినట్లు తెలిసింది.
వావికొలను జీవితమిలా..
ఆంధ్రావాల్మీకి వావికొలను సుబ్బారావు జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు1, 1936లో మద్రాసులో పరమపదించారు.
టెంకాయచిప్పను చేతిలో ధరించి..
రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేశారు. దీంతో ఒంటిమిట్ట రామయ్యకు నైవేద్యం కూడా పెట్టలేని స్థితికి ఆలయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఉద్ధరించడానికి వావికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. వచ్చిన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్పలో ఎంత డబ్బు పడినా.. ఏదీ ఉంచుకోలేదు. అంతా ఆలయ అభివృద్ధికే ఇచ్చారు. అలాగే రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్రవిజయం, దండకత్రయం, టెంకాయ చిప్పశతకం లాంటి ఎన్నో రచనలు కూడా వావికొలను చేశారు.
వానప్రస్ధం
1920లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితునిగా పనిచేశారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కాని ఊరిలో కొందరు స్వార్ధపరులు కుళ్లు రాజకీయాలతో ఆయన్ను అవమానించారు. ఆలయంలోకి రానివ్వకుండా చేశారు.ఊరిలో నిలువలేని పరిస్ధితులును కల్పించారు. వావికొలను దుఖించి, ఆ ఊరిని వీడి. మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ, అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉన్నారు. ఈయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కొనసాగుతోంది.
ఆంధ్రావాల్మీకిగా..
సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలను)108సార్లు పారాయణం చేయటం వల్ల ఆయనకు అందులోని నిగూఢ అర్థాలు స్ఫురించాయి. ఆయన రాసిన రామాయణాన్ని మహాసభమద్యలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.
శృంగిశైలాన్ని అభివృద్ధి చేయాలి
రామాలయం నిర్మాణంæ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన వావి కొలను సుబ్బారావుకు స్మారకమందిరం నిర్మించాలి. ఆయన నివసించిన శృంగిశైలం (సుబ్బారావుబోటు)ను అభివృద్ధి చేయాలి. – గానుగపెంట హనుమంతరావు, సాహితివేత్త, కడప
వావికొలను సుబ్బారావును టీటీడీ మరవరాదు
ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గురించి టీటీడీ మరవ రాదు. ఆయన నివాసం ఉన్న గుట్ట అభివృద్ధికి నోచుకోలేదు. ఆయన పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి –ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పోరేషన్, ఒంటిమిట్ట