breaking news
Ashes 2025- 26
-
మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిసెంబర్ 2025 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా స్టార్క్ ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. యాషెస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో సొంతం చేసుకోవడంలో స్టార్క్ది కీలక పాత్ర.ఈ ఐదు టెస్టుల సిరీస్లో స్టార్క్ ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హాజిల్వుడ్ గాయాల కారణంగా దూరం కవడంతో.. పేస్ దళాన్ని స్టార్క్ ముందుండి నడిపించాడు. కేవలం బౌలింగ్లోనే కాకుండా, బ్యాటింగ్లోనూ అతడు సత్తాచాటాడు.బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో అతడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ కారణంగానే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం వెస్టిండీస్కు ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ పోటీపడ్డారు. కానీ వారిద్దరికంటే స్టార్క్ ప్రదర్శనలు మెరుగ్గా ఉండడంతో అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై స్టార్క్ స్పందించాడు."ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ విజయంలో భాగం కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా దృష్టి ఇప్పుడు 'ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్పై ఉంది" అని స్టార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ అవార్డును ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ గెలుచుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా డిసెంబర్ 2023లో పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం -
అతడో గ్యాంబ్లర్.. భయం లేనివాడు: మండిపడ్డ ఇంగ్లండ్ దిగ్గజం
ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో కంగారూల చేతిలో స్టోక్స్ బృందం.. 4-1తో ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటోంది.ఆఖరిగా 2010-11లో ఆస్ట్రేలియాలో యాషెస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత ఇప్పటికి 20 టెస్టులు ఆడి కేవలం ఒకటి మాత్రమే గెలిచి.. రెండు డ్రా చేసుకోగలిగింది. తాజాగా మరోసారి ఇలా చేదు అనుభవం ఎదుర్కొంది.అతడో గ్యాంబ్లర్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడో జూదగాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ప్రతిసారీ తానే గెలుస్తానని భావిస్తాడని.. అందుకే బొక్కబోర్లాపడుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.జవాబుదారీతనం లేదు‘‘ఇంగ్లండ్ జట్టు యాజమాన్యంలోని ముగ్గురు తెలివైన వ్యక్తులు.. ఇప్పుడు అందరికీ జోకర్లలా కనిపిస్తున్నారు. బ్రెండన్ మెకల్లమ్, రాబ్ కీ, బెన్ స్టోక్స్.. గత మూడేళ్లుగా అబద్ధాలతో సావాసం చేస్తున్నారు. ‘నాకు నచ్చినట్లు చేస్తా.. ప్రపంచంతో నాకు పనిలేదు’ అనేది మెకల్లమ్ సిద్ధాంతం.వరుస మ్యాచ్లలో జట్టు ఓడిపోతున్నా.. వారిని అడిగేవాళ్లు ఎవరూ లేరు. వాళ్ల దగ్గర జవాబుదారీతనం లేదు. ప్రదర్శన బాగా లేని వారిపై ఎవరూ వేటు వేయరు. అందుకే వాళ్లు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తారు.కెప్టెన్, కోచ్కు భయం లేదు. అందుకే ప్లేయర్లు కూడా అలాగే ఉంటారు. బాగా ఆడని వాళ్లను తప్పిస్తేనే కదా.. మిగతావారికి భయం ఉండేది. కానీ ఇక్కడ అలా జరగదు. ఇప్పటికీ రాబ్ కీ (ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్) మెకల్లమ్ను సమర్థిస్తూ పోతే.. పాత ఫలితాలే పునరావృతం అవుతాయి.కన్నీళ్లే మిగులుతాయి..వ్యక్తిగతంగా నాకు మెకల్లమ్ అంటే ఇష్టం. ఇంగ్లండ్ క్రికెట్కు అతడు నిజంగానే కొత్త ఊపిరిలూదాడు. కానీ అతడో గ్యాంబ్లర్. ప్రతిసారీ తానే గెలుస్తానని అనుకుంటాడు. క్యాసినోలో గ్యాంబ్లర్లు అంతా తమకే దక్కుతుందని ముందుగా సంబరపడిపోతారు.అయితే, ఆఖర్లో వారిలో చాలా మందికి కన్నీళ్లే మిగులుతాయి. అయినా సరే ఆడటం ఆపరు. వారి వైఖరి మార్చుకోరు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఓడిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయం లేనపుడు.. తప్పులు పునరావృతం చేస్తూనే ఉంటారు.మాజీలతో మాట్లాడండిఇంగ్లండ్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. కానీ వారి నైపుణ్యాలను వాడుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. ఇప్పటికీ ఇంగ్లండ్ బోర్డు కీ, మెకల్లమ్, స్టోక్స్ను కొనసాగించాలనుకుంటే.. ఇయాన్ బోతం, గ్రాహమ్ గూచ్, డేవిడ్ గోవర్ వంటి వాళ్లను పిలిచి.. వీరితో ఓ సమావేశం ఏర్పాటు చేయాలి. లోపాలు సరిచేసుకునేలా వారు ఇచ్చిన సలహాలు స్వీకరిస్తే బాగుంటుంది’’ అని 85 ఏళ్ల జెఫ్రీ బాయ్కాట్ ‘ది టెలిగ్రాఫ్’నకు రాసిన కాలమ్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదండి: 6 దేశాల్లో 6 సెంచరీలు: సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్! -
‘బజ్బాల్’ ఖేల్ ఖతం!.. స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
యాషెస్ 2025-26 సిరీస్ను విజయంతో ముగించాలన్న ఇంగ్లండ్కు చేదు అనుభవమే మిగిలింది. ఆఖదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 4-1తో ఈ టెస్టు సిరీస్ను ఆతిథ్య ఆసీస్ తమ సొంతం చేసుకుంది.పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్బోర్న్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే, సిడ్నీ వేదికగా ఆదివారం మొదలైన ఐదో టెస్టు.. గురువారం ముగిసింది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ‘బజ్బాల్’ ఆటకు స్వస్తి!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) స్పందించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ముందుకుపోయే ‘బజ్బాల్’ ఆటకు స్వస్తి పలుకుతామనే సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మాతో మ్యాచ్లో ఎలా ఆడాలో బహుశా అన్ని జట్లకు తెలిసిపోయి ఉంటుంది.బ్యాట్తో బరిలోకి దిగినపుడు మేము అంతా బాగుందనే అనుకుంటున్నాం. కానీ ప్రత్యర్థి జట్లు మాకోసం మరింత మెరుగైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. వాళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.ఇలాగే ఆడితే..కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మేము బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మా బ్యాటింగ్ సరిగ్గా లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఆడితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిరీస్లో ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను.ఒకరిపై ఒకరం నిందలు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయితే, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మా జట్టు అలాంటిదే. మేము తిరిగి పుంజుకుని మునుపటి మాదిరే ఉన్నత స్థితికి చేరుకుంటాం.ఏదేమైనా ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా అత్యద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్.. ఆసీస్ జట్టు మొత్తం అదరగొట్టింది. మేము కూడా మా పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఆసీస్ గడ్డపై యాషెస్లో మరోసారి ఘోర పరాభవం నేపథ్యంలో ‘బజ్బాల్’ ఆద్యులు హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ స్టోక్స్ను పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ యాషెస్ ఐదో టెస్టు స్కోర్లు👉వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్👉ఇంగ్లండ్: 384 & 342👉ఆస్ట్రేలియా: 567 & 161/5👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు షాక్.. ఒక్క పరుగు తేడాతో.. -
ఇంగ్లండ్ కెప్టెన్కు రూ. 33 లక్షల ఫైన్.. ఎందుకంటే?
ఇంగ్లండ్ వైట్బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్లో భాగంగా నవంబర్ 1న వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు బ్రూక్ ఓ నైట్ క్లబ్ బౌన్సర్తో దురుసగా ప్రవర్తించాడు.నైట్క్లబ్లోకి వెళ్లేందుకు బ్రూక్ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.సారీ చెప్పిన బ్రూక్..ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యలతో నా జట్టుకు, దేశానికి తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.ఇంగ్లండ్ క్రికెట్కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో బ్రూక్ పేర్కొన్నాడు.ఈసీబీ సీరియస్ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంది. బ్రూక్కు 30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.చదవండి: అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో.. -
Ashes: అత్యంత అరుదైన రికార్డు
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేకబ్ బెతెల్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్లో సాధించిన తొలి టెస్టు సెంచరీతోనే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ సరసన చేరాడు.యాషెస్ సిరీస్ 2025-26 (Ashes)లో భాగంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆతిథ్య ఆసీస్ తొలి మూడు టెస్టులు గెలిచి సిరీస్ సొంతం చేసుకోగా.. నాలుగో మ్యాచ్లో గెలవడంతో ఇంగ్లండ్కు ఊరట లభించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది.సిడ్నీలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఆసీస్ ధీటుగా బదులిచ్చింది. తమ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 567 పరుగులు సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లిష్ జట్టు.. బుధవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది.జేకబ్ బెతెల్ సెంచరీతోఇందుకు ప్రధాన కారణం జేకబ్ బెతెల్ (Jacob Bethell) ఇన్నింగ్స్. వన్డౌన్లో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 232 బంతులు ఎదుర్కొని.. పదిహేను ఫోర్లు బాది 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన కెరీర్లో టెస్టుల్లో తొలి సెంచరీ బాదిన 22 ఏళ్ల బెతెల్ అరుదైన ఘనతలు సాధించాడు.కపిల్ దేవ్ సరసనకాగా బెతెల్ 2024లో సౌతాఫ్రికాతో వన్డేల్లో తొలి శతకం బాదాడు. తాజాగా యాషెస్లో భాగంగా ఆసీస్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో మొదటిసారి శతక్కొట్టాడు. తద్వారా తన కెరీర్లో ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ సెంచరీలను అంతర్జాతీయ క్రికెట్లోనే నమోదు చేశాడు. దేశీ క్రికెట్లో అతడి ఖాతాలో ఇంత వరకు ఒక్క సెంచరీ లేదన్న మాట.ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్తో పాటు వెస్టిండీస్కు చెందిన మార్లన్ సామ్యూల్స్, బంగ్లాదేశ్ ప్లేయర్ మెహిదీ హసన్ మిరాజ్, ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ కాంఫర్ ఉన్నారు. ఈ అరుదైన జాబితాలో తాజాగా చేరిన జేకబ్ బెతెల్.. ఈ ఘనత సాధించి తొట్టతొలి ఇంగ్లండ్ ప్లేయర్గా నిలిచాడు. దాదాపు 149 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంగ్లండ్ క్రికెట్ తరఫున ఈ రేర్ రికార్డు సాధించింది అతడే కావడం గమనార్హం. చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టీవ్ స్మిత్.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రీన్, వెబ్స్టెర్తో కలిసి స్కోర్ బోర్డును అతడు పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో స్మిత్ 165 బంతుల్లోనే తన 37వ టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్మిత్ 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. స్మిత్తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్(163) కూడా భారీ శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు సాధించింది. కంగారులు ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో శతక్కొట్టిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లండ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(5,028) అధిగమించాడు. స్మిత్ ఇప్పటివరకు ఇంగ్లండ్పై మూడు ఫార్మాట్లు కలిపి 5,085 పరుగులు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుస్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 5085 పరుగులుడాన్ బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా) - 5028 పరుగులుఅల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 4850 పరుగులువివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 4488 పరుగులురికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 4141 పరుగులువిరాట్ కోహ్లీ (భారత్) - 4036 పరుగులుసచిన్ టెండూల్కర్ (భారత్) - 3990 పరుగులు👉అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్ధానానికి స్మిత్ ఎగబాకాడు. ఈ జాబితాలో స్మిత్ కంటే ముందు సంగక్కర(38), జో రూట్(41), పాంటింగ్(41), కల్లిస్(45), సచిన్ టెండూల్కర్(51) ఉన్నారు. -
'మాట వింటే ఉండు.. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపో'
టెస్టు క్రికెట్లో ‘బాజ్బాల్’ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లండ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. యాషెస్ 2025-26లో తొలి మూడు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన స్టోక్స్ సేన.. కేవలం 11 రోజుల్లోనే సిరీస్ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ జట్టుతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్పై విమర్శల వర్షం కురిసింది. అంతేకాకుండా టూర్ మధ్యలో నిర్వహించిన 'నూసా (Noosa)' పర్యటన వంటివి కూడా ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టను దెబ్బతీశాయి.డేంజర్లో మెకల్లమ్ పోస్ట్..అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఘోర ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్కల్లమ్కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. జట్టు వాతావరణంతో పాటు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని మెక్కల్లమ్ను బోర్డు సూచించినట్లు సమాచారం.ఒకవేళ అందుకు అతడు అంగీకరించకపోతే తనంతట తానుగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఈసీబీ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్నారు. ఐదో టెస్టు ముగిసిన వెంటనే జట్టు వైఫల్యాలపై అధికారిక సమీక్ష జరగనుంది. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్దతు మాత్రం మెక్కల్లమ్కు ఉంది. "బ్రెండన్తో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలమని నమ్ముతున్నాను. ఇప్పుడున్న స్థితిలో జట్టును మెక్కల్లమ్ మాత్రమే గట్టెక్కించగలడు" అని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. కాగా వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లీష్ జట్టు.. ఎట్టకేలకు బాక్సింగ్ డే టెస్టులో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు నువ్వానేనా అన్నట్లగా సాగుతోంది. -
‘యాషెస్’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ ప్లేయింగ్ XII
యాషెస్ 2025-26 సిరీస్లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్ బృందం వైట్వాష్ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.ఇక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్ తాజా ఎడిషన్లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్ XIIను ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది.విల్ జాక్స్తో పోటీఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ విల్ జాక్స్తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.పాట్స్ రీఎంట్రీగాయం కారణంగా గస్ అట్కిన్సన్ దూరం కాగా.. అడిలైడ్లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్వుడ్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్ పాలిట వరంగా మారింది. డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్ ఆడిన ఈ పేస్ బౌలర్ యాషెస్ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్ రీప్లేస్మెంట్గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియాతో యాషెస్ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్ ప్లేయింగ్ XIIబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్.అదే జట్టుమరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్ చివరి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.గత మ్యాచ్లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్ స్మిత్ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్ బృందం గురువారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్ను చిత్తుచేసి సిరీస్ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్బోర్న్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే -
పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా
ఊహాగానాలే నిజమయ్యాయి.. ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు.. అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ అని వెల్లడించాడు.పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడినిఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఆస్ట్రేలియా తరఫున అనేక మ్యాచ్లు ఆడాను. ఇది నా అదృష్టం. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింను నేను.నాలాంటి వాళ్లు ఆసీస్ తరఫున ఎప్పటికీ ఆడలేరని చాలా మంది హేళన చేశారు. వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూడండి నేను ఎక్కడ ఉన్నానో!.. మీరు కూడా నాలాగే అనుకున్నది సాధించగలరు. ఎంతో మందికి నేను ఆదర్శంగా నిలిచాననే భావిస్తున్నా’’ అని ఉస్మాన్ ఖవాజా పేర్కొన్నాడు.వారి త్యాగాల కారణంగానే‘‘సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కు సమీపంలోనే మేము ఉండేవాళ్లము. నా చిన్నతనంలో... మైకేల్ స్లాటర్ రెడ్ ఫెరారీలో వెళ్తున్నపుడు అలా చూస్తూ ఉండిపోయేవాడిని. నేనూ అతడి మాదిరే క్రికెటర్ అయితే బాగుండు అని అనుకునేవాడిని. మా అమ్మానాన్న మా కోసం ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే బతుకుదెరువు చూసుకున్నారు.ఏదో ఒకరోజు నేనూ టెస్టు క్రికెటర్ అయ్యి.. నా సొంతకారులో పయనించగలనని గట్టిగా నమ్మాను. నా ప్రయాణంలో నా తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారి త్యాగాల కారణంగానే నేను ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగాను.మూల్యం చెల్లించాను నాన్నా!నేను ఎన్నోసార్లు నిరాశకు గురయ్యేవాడిని. అప్పుడు మా అమ్మ ‘నువ్వు చేయగలవు’ అంటూ నాలో స్ఫూర్తి నింపేది. ఆసీస్ తరఫున తప్పక క్రికెట్ ఆడతానని మా నాన్న తరచూ చెప్పేవాడు. ఉన్నదంతా పాకిస్తాన్లో వదిలేసి.. మా భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చిన మీకు 88 టెస్టుల రూపంలో మూల్యం చెల్లించాను నాన్నా!జీవితంలోని గొప్ప వరం తనేనా భార్య రేచల్. తను లేకుండా అసలు ఈ ప్రయాణమే లేదు. జీవితంలోని గొప్ప వరం తనే. నేను నా కల వెంట పరుగులు తీస్తుంటే.. తను కుటుంబాన్ని నిలబెట్టింది. బాధ్యతలు తన భుజాన వేసుకుంది. తనకు నేనెంతో రుణపడి ఉన్నాను.పేరుపేరునా ధన్యవాదాలుగత పదేళ్లుగా రేచల్ తల్లిదండ్రులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారికి ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. నా సహచర ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా కలను నెరవేర్చుకునే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను’’ అంటూ 39 ఏళ్ల ఉస్మాన్ ఖవాజా కన్నీటి పర్యంతమయ్యాడు.మొదలైన చోటే ముగింపుకాగా 2011లో ఆస్ట్రేలియా తరఫున ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. తన కెరీర్లో ఇప్పటికి 88 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు ఆడాడు.టెస్టుల్లో ఇప్పటికి 16 సెంచరీల సాయంతో 6206 పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా.. వన్డేల్లో 1554 రన్స్ రాబట్టాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. ఇక ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో 241 పరుగులు చేయగలిగాడు. సిడ్నీ వేదికగా ఇంగ్లండ్తో జనవరి 4-8 మధ్య జరిగే ఐదో టెస్టు ఖవాజా కెరీర్లో చివరి (Test Cricket Retirement)ది కానుంది. ఎక్కడైతే తన ప్రయాణం మొదలైందో.. అక్కడే పదిహేనేళ్ల తర్వాత కెరీర్ ముగియనుంది.చదవండి: 2026లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న ఐదుగురు భారత క్రికెటర్లు -
రెండు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఐసీసీ ఆగ్రహం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెల్బోర్న్ పిచ్పై అసంతృప్తి వెలిబుచ్చింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో నాలుగో టెస్టుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికైంది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ పిచ్ పేలవమని ప్రకటించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ‘ఏకపక్షంగా బౌలర్లకు మాత్రమే సహకరించిన వికెట్’ అని ఐసీసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఐసీసీ ఎంసీజీ అసంతృప్తిపరిచిన వేదిక అని... ఒక డిమెరిట్ పాయింట్ విధించింది.ఏదైనా వేదికకు 6 డిమెరిట్ పాయింట్లు జమ అయితే ఆ స్టేడియాన్ని 12 నెలల పాటు నిషేధిస్తారు. 26న మొదలైన ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టు అత్యంత నిరుత్సాహకరంగా మరునాడే ముగిసింది. ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచిన ఈ మ్యాచ్లో మొదటి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. 20 వికెట్లు నేలకూలాయి. తర్వాతి రోజు 16 వికెట్లు పడ్డాయి. ఆ్రస్టేలియాలో ‘బాక్సింగ్ డే’ టెస్టుకున్న ప్రత్యేకతే వేరు.ఏకంగా 90 వేలకు పైగానే ప్రేక్షకులు పోటెత్తిన ఈ మ్యాచ్ అనూహ్యంగా రెండే రోజుల్లో ముగియడం క్రికెట్ అభిమానుల్ని సైతం నిరాశపరిచింది. ఈ టెస్టుకు ముందే యాషెస్ను గెలుచుకున్న ఆతిథ్య ఆ్రస్టేలియా... ప్రస్తుతం 3–1తో ఇంగ్లండ్పై పైచేయిని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు వచ్చే నెల 4 నుంచి సిడ్నీలో జరుగుతుంది.చదవండి: క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్ -
ఇది ఔటా? అంపైర్పై లబుషేన్ సీరియస్! వీడియో
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.అసలేం జరిగిందంటే?ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ తొలి బంతిని.. లబుషేన్కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోగా.. లబుషేన్ మాత్రం బంతి నేలకు తగిలి చేతిలోకి వచ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు.థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ లబుషేన్ను ఔట్గా ప్రకటించాడు. దీంతో ఈ ఆసీస్ షాకయ్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేలకు తాకినట్లు అన్పించింది. థర్డ్ అంపైర్ అసహనం వ్యక్తం చేస్తూ లబుషేన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?What did you make of this catch? Out or not out?#Ashes | #DRSChallenge | @Westpac pic.twitter.com/pnWo2qt6qc— cricket.com.au (@cricketcomau) December 27, 2025 -
మా ఓటమికి కారణం అదే: స్టీవ్ స్మిత్ విమర్శలు
హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఆసీస్కు ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.3-0తో సిరీస్ సొంతంపెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో గెలుపొంది.. ఇంగ్లండ్పై మరోసారి ఆధిపత్యం చాటుతూ.. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే వరుసగా రెండోసారి యాషెస్ సిరీస్ గెలుచుకుంది. తొలి రెండు టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ సారథ్యం వహించాడు.మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి వచ్చి జట్టుకు గెలుపు అందించగా.. అనారోగ్యం వల్ల స్మిత్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు నుంచి కమిన్స్ విశ్రాంతి తీసుకోగా.. స్మిత్ తిరిగి పగ్గాలు చేపట్టాడు.అయితే, ఈ మ్యాచ్లోనూ ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్... శనివారం నాటి రెండో రోజు ఆటలో బోల్తా పడింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే.. మెల్బోర్న్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిరోజే ఇరవై వికెట్లు కూలి ఇరుజట్లు ఆలౌట్ అయ్యాయి. రెండో రోజు సైతం పదహారు వికెట్లు పడ్డాయి. ఇక ఈ విషయంపై స్మిత్ స్పందించాడు. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ..మా ఓటమికి కారణం అదే‘‘కష్టతరమైన మ్యాచ్. తొందరంగా ముగిసిపోయింది. మేము అదనంగా కనీసం 50- 60 పరుగులు చేసి ఉంటే మంచి పోటీ ఉండేది. ఏదేమైనా చివరి వరకు మేము పట్టువీడలేదు.ఇదేంటో ఇలా ఉందివికెట్ ముందుగా ఊహించినట్లుగానే ఉంది. అయితే, బంతి పాతబడే కొద్ది పూర్వపు రూపాన్ని కోల్పోయింది. వాళ్లు బ్యాటింగ్కు వచ్చినపుడు కొన్ని ఓవర్లు దూకుడుగానే ఆడారు. ఏదేమైనా ఈ పిచ్ బౌలర్లకు అతిగా సహకరించింది.రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చికను కాస్త మెరుగుపరిచి ఉంటే బాగుండేది. అయితే, వికెట్ ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా మేము ఆడాల్సింది’’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పిచ్పై విమర్శలు గుప్పించాడు.ఆసీస్- ఇంగ్లండ్ యాషెస్ బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఆస్ట్రేలియా: 152 &132👉ఇంగ్లండ్: 110 &178/6👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..
ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.గెలుపు బోణీఆతిథ్య ఆసీస్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన కంగారూలు యాషెస్ సిరీస్ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్ బృందం తీవ్ర విమర్శలపాలైంది.ముఖ్యంగా.. బజ్బాల్ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్.బౌలర్లదే పైచేయిశుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పచ్చటి పిచ్ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్ను 110 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పొరపాట్లకు తావివ్వలేదు.ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ చివరగా 2010లో టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..ఇక ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత? -
Ashes: ఎట్టకేలకు...
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్లో కంగారూల సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించింది.యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.రెండు రోజుల్లోనే..ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లుహ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఇక 4/0 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24 నాటౌట్) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లుఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఎట్టకేలకు తొలి విజయంపేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాపార్డర్లో ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్డౌన్లో వచ్చిన ‘పేసర్’ బ్రైడన్ కార్స్ (6) విఫలమయ్యాడు.ఈ క్రమంలో జేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ (18) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లుఆస్ట్రేలియా: 152 &132ఇంగ్లండ్: 110 &178/6.చదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే! -
చరిత్ర సృష్టించిన జోష్ టంగ్
ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్ ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్దే ముఖ్య భూమిక. టాపార్డర్లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్ను కూడా పెవిలియన్కు పంపాడు.WHAT A DELIVERY!Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025తొలి ఇంగ్లండ్ బౌలర్గా అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టులలో భాగంగా తొలి మూడు గెలిచి ఆసీస్ 3-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో ఆసీస్- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య మెల్బోర్న్ వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య జట్టు బ్యాటింగ్కు దిగింది. అయితే, ఆది నుంచే ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లుడేంజరస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (12)ను అట్కిన్సన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10)ను టంగ్ వెనక్కి పంపాడు. ఇక వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ (6)తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్న టంగ్.. ఆసీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.ఇక ఉస్మాన్ ఖవాజా (29)ను అట్కిన్సన్ వెనక్కి పంపగా.. అలెక్స్ క్యారీ (20) బెన్ స్టోక్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ (17) రనౌట్ కాగా.. టెయిలెండర్లలో మైకేల్ నాసర్ (35) కాసేపు పోరాడగా.. టంగ్ అతడిని బౌల్డ్ చేశాడు. ఐదేసిన టంగ్.. ఆసీస్ ఆలౌట్ఆఖర్లో మిచెల్ స్టార్క్ (1) రూపంలో బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోగా.. స్కాట్ బోలాండ్ (0)ను అవుట్ చేసిన టంగ్ ఐదో వికెట్ తీశాడు. జే రిచర్డ్సన్ (0) నాటౌట్గా నిలవగా.. ఆసీస్ 45.2 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ జట్టు బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్కు రెండు, బ్రైడన్ కార్స్, స్టోక్స్లకు చెరో వికెట్ దక్కాయి. చదవండి: టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా! -
Ashes: ప్లేయింగ్ XII ప్రకటించిన ఆస్ట్రేలియా
సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను సొంతం చేసుకుని జోష్లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్వాష్ చేయాలని పట్టుదలగా ఉంది.మరోసారి స్మిత్ సారథ్యంలో కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్ భావిస్తున్నాడు.ఆ ముగ్గురి మధ్య పోటీఅయితే, కమిన్స్తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్ స్మిత్ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్ ఎలెవన్లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్ మధ్య పోటీ ఉందని స్మిత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.పిచ్కు అనుగుణంగాపచ్చగా ఉన్న మెల్బోర్న్ పిచ్ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్ టాడ్ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ XIIట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా , అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్.బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాసర్, జే రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్ అట్కిన్సన్, జేకబ్ బెతెల్ వచ్చారు.ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఇంగ్లండ్ హెడ్కోచ్గా రవిశాస్త్రి!
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్ వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ ఇప్పటికే కోల్పోయింది. తమ దేశంలో ‘బజ్బాల్’ ఆటలు చెల్లవనే రీతిలో కంగారూలు.. స్టోక్స్ బృందానికి చెక్ పెట్టి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ట్రోఫీని తమ సొంతం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum)ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువవుతున్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మెకల్లమ్ స్థానాన్ని భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri)తో భర్తీ చేయాలని ఇంగ్లండ్ బోర్డుకు సూచించాడు.రవిశాస్త్రి సరైన ఆప్షన్ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాను ఓడించగలిగే వ్యూహాలు రచించగల వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఆస్ట్రేలియా జట్టు బలహీనతలు, మానసికంగా, శారీరకంగా వారిని ఎదుర్కోవాలో తెలిసి ఉండాలి. వ్యూహాత్మకంగా వారిని దెబ్బకొట్టగలగాలి. నా అభిప్రాయం ప్రకారం.. ఇంగ్లండ్ జట్టు తదుపరి హెడ్కోచ్గా రవిశాస్త్రి సరైన ఆప్షన్’’ అని మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు.ఆసీస్ గడ్డపై అద్భుతాలుకాగా టీమిండియా హెడ్కోచ్గా రవిశాస్త్రి టెస్టు జట్టును విజయపథంలో నడిపించాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి, వరుసగా టెస్టు సిరీస్లు గెలిచింది. 2018-19, 2020-21 మధ్య కాలంలో ఆసీస్ను చిత్తు చేసి.. రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.ఇక యాషెస్ సిరీస్లో భాగంగా.. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది ఇంగ్లండ్. బ్రిస్బేన్లో జరిగిన పింక్ బాల్ టెస్టులోనూ ఇదే చేదు ఫలితాన్ని చవిచూసింది. తాజాగా అడిలైడ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కంగారూల చేతిలో 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. వరుసగా రెండోసారి సిరీస్ను కోల్పోయింది. ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు మెల్బోర్న్ వేదిక. ‘బజ్బాల్’ అంటూకాగా న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ 2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ‘బజ్బాల్’ అంటూ దూకుడైన విధానంతో స్టోక్స్ బృందంతో మొదట్లో మెరుగైన ఫలితాలు రాబట్టాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వడంలో మునుపటి జోరు కొనసాగించలేకపోతోంది.తాజాగా ప్రతిష్టాత్మక యాషెన్ సిరీస్ను కోల్పోయి విమర్శలపాలైంది. ఇదిలా ఉంటే.. 2025లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్కోచ్గానూ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాడు. 2027 వరకు అతడికి కాంట్రాక్టు ఉంది. అయితే, ఇంగ్లండ్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో 44 ఏళ్ల మెకల్లమ్ను పదవి నుంచి దించేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా ఘనత క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్ బోర్డు -
Ashes: ‘ఆసీస్’ చెత్త జట్టు.. ఇప్పటికీ అదే మాట అంటాను!
ఇంగ్లండ్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు కోల్పోయింది. సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కంగారూలు... మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను చేజిక్కించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.సంపూర్ణ ఆధిపత్యంఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్పై సంపూర్ణ ఆధిపత్యంతో గెలిచిన ఆసీస్.. మూడో టెస్టులోనూ దుమ్ములేపింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. ఆసీస్ విధించిన 435 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 207/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 102.5 ఓవర్లలో 352 పరుగుల వద్ద ఆలౌటైంది.ఇక 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ సిరీస్ కోల్పోని కంగారూలు... ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబర్చగా... అప్పటి నుంచి కనీసం ఒక్క మ్యాచ్లో అయినా విజయం సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. చెలరేగిన బౌలర్లుఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (83 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కాస్త పోరాడగా... అతడికి విల్ జాక్స్ (137 బంతుల్లో 47; 3 ఫోర్లు), బ్రైడన్ కార్స్(64 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు.జేమీ స్మిత్తో కలిసి ఏడో వికెట్కు 91 పరుగులు జోడించిన జాక్స్... ఎనిమిదో వికెట్కు కార్స్తో 52 పరుగులు జతచేశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్కు ఆశలు చిగురించగా... స్టార్ పేసర్ స్టార్క్... స్మిత్, జాక్స్, ఆర్చర్ (3)లను ఆవుట్ చేసి ఇంగ్లండ్కు పరాజయం ఖాయం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 349 పరుగులు చేసి ప్రత్యర్థికి రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లండ్ పని పూర్తి చేయలేక సిరీస్ ఓటమి రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొంది.అత్యంత చెత్త జట్టు ఇదిఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. సిరీస్ విజేత ఆసీస్ జట్టును ఉద్దేశించి.. ‘చెత్త’ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. కాగా యాషెస్ సిరీస్కు ముందు బ్రాడ్ మాట్లాడుతూ.. ‘‘2010-11 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇది. ఇదొక ఆప్షన్ కాదు. ఇదే నిజం’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.ఇప్పటికీ ఇదే మాట అంటానుఈ క్రమంలో మరోసారి సిరీస్ గెలుచుకున్న అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. బ్రాడ్కు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించిన బ్రాడ్.. ‘‘నేను పశ్చాత్తాపపడుతున్నానా? అస్సలు కాదు.ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ అతి గొప్పగా ఆడాల్సింది. అయితే, ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఏమీ ఆడలేదు’’ అని ‘ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే, మిచెల్ స్టార్క్ అద్భుత రీతిలో చెలరేగి వారు లేని లోటు కనబడకుండా చేశాడు. ఇక మూడో టెస్టుతో కమిన్స్ తిరిగి రాగా.. హాజిల్వుడ్ మాత్రం గాయం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా? -
గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
యాషెస్ సిరీస్ 2025-26ను సొంతం చేసుకుని గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి.దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే మ్యాచ్ ముగిసిన లియోన్ క్రచెస్ (ఊత కర్రల) సహాయంతో నడుస్తూ కనిపించడం అందరిని షాక్కు గురిచేసింది. దీని బట్టి అతడి గాయం తీవ్రమైనదిగా పరిగణించవచ్చు. ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడు తిరిగి వస్తే జాక్ వెదరాల్డ్పై వేటు పడే అవకాశముంది.ఇక లియోన్ గాయంపై ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. "నాథన్ లియోన్కి ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడిది కీలక పాత్ర. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నాథన్ తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లనున్నాడు.గతంలో కూడా అతడి పిక్క గాయం కారణంగా రిహాబిలిటేషన్లో ఉన్నాడు. కాబట్టి ఎలా కోలుకోవాలన్నదానిపై అతడికి అవగాహన ఉంది. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు తన సేవలను అతడు అందించాలనుకుంటున్నాడు. నాథర్ వేగంగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాను" అని స్టార్క్ పేర్కొన్నాడు. మూడో టెస్టులో లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. కాగా తొలి మూడు టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో రిటైన్ చేసుకుంది.చదవండి: పాకిస్తాన్ ఓవరాక్షన్!.. అసలు కప్పు గెలిస్తే ఇంకేమైనా ఉందా? -
విజయానికి చేరువలో ఆస్ట్రేలియా.. అదే జరిగితే?
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. 435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 228 రన్స్ వెనుకంజలో ఉంది. పర్యాటక జట్టు విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. క్రీజులో జెమ్మీ స్మిత్ (2), విల్ జాక్స్ (11) ఉన్నారు. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను బ్యాక్ఫుట్లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(85) టాప్ స్కోరర్గా నిలవగా.. జోరూట్ (39) కాస్త ఫర్వాలేదన్పించాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.హెడ్ సూపర్ సెంచరీ..అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. అలెక్స్ కారీ 72 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే మరో రెండు టెస్టులు మిగిలూండగానే యాషెస్ సిరీస్ను కంగారులు సొంత చేసుకోనున్నారు.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్కు ఊహించని షాక్? -
శతక్కొట్టిన హెడ్.. అరుదైన జాబితాలో చోటు
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. తన హోమ్ గ్రౌండ్ అయిన అడిలైడ్ ఓవల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హెడ్ 142 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆసీస్కు ఓపెనర్ వెథరాల్డ్ (1) ఔట్ కావడంతో ఆదిలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ సమయంలో హెడ్.. వెటరన్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా(40) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఖవాజా పెవిలియన్కు చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో హెడ్తో పాటు అలెక్స్ కారీ(52) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హెడ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.హెడ్ సాధించిన రికార్డులు ఇవే..👉అడిలైడ్ ఓవల్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ సరసన హెడ్ నిలిచాడు. ఈ మైదానంలో హెడ్కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో హెడ్ కంటే ముందు మైఖేల్ క్లార్క్ (7), రికీ పాంటింగ్ (6) ఉన్నారు.👉ఆస్ట్రేలియాలోని ఒకే వేదికలో వరుసగా నాలుగు టెస్టు సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్గా హెడ్ నిలిచాడు. అడిలైడ్లో హెడ్కు ఇది వరుసగా నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో డాన్ బ్రాడ్మాన్, వాలీ హమ్మండ్, మైఖేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ వంటి లెజెండ్స్ ఉన్నారు. -
రూ.25 కోట్ల ఆటగాడు అట్టర్ ప్లాప్
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ యాషెస్ సిరీస్లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన గ్రీన్.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అదే తీరును కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌటైన గ్రీన్.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జోష్ టంగ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బౌలింగ్లోనూ కేవలం ఒక్క వికెట్ పడగొట్టాడు.కేకేఆర్కు హెడ్ఎక్..ఇటీవల దుబాయ్లో జరిగిన మినీ వేలంలో గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. గ్రీన్ను ఒక కంప్లీట్ ఆల్రౌండర్గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బ్యాట్తో పాటు బంతితోనూ రాణిస్తాడని నైట్రైడర్స్ ఆశిస్తోంది. కానీ రెడ్ బాల్ క్రికెట్లో అతడి ప్రస్తుత ఫామ్ కోల్కతా మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఆడలేక వికెట్ పారేసుకోవడం చర్చనీయంగా మారింది.భారీ ఆధిక్యం దిశగా ఆసీస్..అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ అడిలైడ్ టెస్టులో ట్రావిస్ హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. 142 పరుగులతో హెడ్ నాటౌట్గా ఉన్నాడు. అతడితో పాటు అలెక్స్ కారీ(52) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము' -
స్టోక్స్, ఆర్చర్ విరోచిత పోరాటం.. ఇంగ్లండ్ ఆలౌట్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 213/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 286 పరుగుల వద్ద ఆలౌటైంది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83), లోయార్డర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్(105 బంతుల్లో 51) విరోచిత పోరాటం కనబరిచారు. ‘బాజ్బాల్’ ఆటతీరును పక్కన పెట్టిన స్టోక్స్... సంప్రదాయ టెస్టు క్రికెట్ ఫార్మాట్లో ఓవర్లకు ఓవర్లు క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేశాడు.ఈ క్రమంలో బ్రూక్తో ఐదో వికెట్కు 56 పరుగులు జోడించిన స్టోక్స్... తొమ్మిదో వికెట్కు ఆర్చర్తో 106 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆర్చర్ కూడా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 85 పరుగులు వెనకబడింది.శాంతించిన స్టార్క్..గత రెండు మ్యాచ్ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఈసారి కాస్త శాంతించగా... ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలా 3 వికెట్లతో సత్తా చాటారు. నాథన్ లయన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆ్రస్టేలియా బౌలర్గా లయన్ నిలిచాడు. పేస్ దిగ్గజం మెక్గ్రాత్ను అతడు అధిగమించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 326/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 91.2 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (75 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.చదవండి: సమమా... సొంతమా! -
ఆర్చర్పై స్టోక్స్ ఫైర్!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!
యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా రెండోరోజూ ఆధిపత్యం కొనసాగించింది. అడిలైడ్ వేదికగా గురువారం ఆట పూర్తయ్యే సరికి.. ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 213 పరుగులే చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 158 పరుగులు వెనుకబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లిష్ జట్టు బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు.ఓపెనర్లు జాక్ క్రాలీ (9), బెన్ డకెట్ (29) నిరాశపరచగా.. ఓలీ పోప్ (3), జో రూట్ (19) కూడా విఫలం అయ్యారు. ఇలాంటి దశలో హ్యారీ బ్రూక్ (45), కెప్టెన్ బెన్ స్టోక్స్ (45 నాటౌట్) మెరుగైన ఆటతో జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేశారు. మిగిలిన వారిలో జేమీ స్మిత్ 22 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (6), బ్రైడన్ కార్స్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 30 పరుగులతో అజేయంగా నిలవడంతో.. స్కోరు 200 అయినా దాటగలిగింది.ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) మూడు వికెట్లతో చెలరేగగా.. స్కాట్ బోలాండ్ రెండు, నాథన్ లియోన్ రెండు, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్టార్క్ అర్ధ శతకంఇదిలా ఉంటే.. అంతకు ముందు 326/8తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 371 పరుగులకు ఆలౌట్ అయింది. టెయిలెండర్ మిచెల్ స్టార్క్ అర్ధ శతకం(54)తో అదరగొట్టడంతో కంగారూలకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టార్క్ వరుస విరామాల్లో ఫోర్లు బాదుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే, అతడిని నిలువరించేందుకు ఇంగ్లండ్ సారథి స్టోక్స్ తన వ్యూహాలన్నీ అమలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తమ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)పై అసహనం ప్రదర్శించాడు.ఇందుకు ఆర్చర్ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో 86వ ఓవర్లో బంతితో రంగంలో దిగిన ఆర్చర్.. స్టార్క్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దెబ్బకు లెగ్ స్టంప్ కూడా ఎగిరిపోయింది.చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!ఈ క్రమంలో ఆర్చర్ను సహచరులు అభినందిస్తుండగా.. స్టోక్స్ మాత్రం.. ‘‘నువ్వు ప్రతిసారి ఫీల్డింగ్ ప్లేస్మెంట్ల గురించి ఫిర్యాదు చేయకు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌల్ చేయి’’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరే వేళ సహచరులు వారిని విడదీశారు.ఈ నేపథ్యంలో ఆర్చర్.. ‘‘నాకే సలహా ఇస్తున్నాడు చూడు’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో ఆర్చర్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. కాగా స్టోక్స్- ఆర్చర్ వాగ్వాదం గురించి కామెంటేటర్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ..‘‘ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. స్టోక్స్ నేరుగా అతడి దగ్గరికి వెళ్లి క్లాస్ తీసుకున్నాడు. అయితే, ఇందుకు ఆర్చర్ చెంప మీద కొట్టినట్లుగా వికెట్తో సమాధానం ఇచ్చాడు’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఆసీస్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండు మ్యాచ్లలోనూ అద్భుత ప్రదర్శనతో పేసర్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడం విశేషం.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డుBen Stokes saying to Archer Mate don't complain about the field placings when you bowl."Bowl on the stumps" he says and yep and look what happens.#ashes25 #AUSvENG pic.twitter.com/jrB46LSlyF— Bemba Tavuma 𝕏 🐐 (@gaandfaadtits) December 18, 2025 -
ఆస్ట్రేలియాకు ఊహించని షాక్.. ఆఖరి నిమిషంలో!
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు స్టీవ్ స్మిత్ అనారోగ్యం బారిన పడ్డాడు. స్మిత్ 'వర్టిగో' (తల తిరగడం) వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఆఖరి నిమిషంలో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరిచింది.స్మిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వికారం, తలతిరగడం వంటి లక్షణాలు అతడికి ఉన్నాయి. స్మిత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, మ్యాచ్ సమయానికి పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయారు. అతడిని ఆడించి రిస్క్ తీసుకుడదని మెనెజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. అతడు తిరిగి నాలుగో టెస్టు సమయానికి పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంది అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నాడు.అదరగొట్టిన ఉస్మాన్..ఇక స్మిత్ స్ధానంలో వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖావాజాకు తుది జట్టులో చోటు దక్కింది. గత రెండు టెస్టుల్లో ఆడని ఖవాజా.. స్మిత్ స్ధానంలో నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. అయితే ఉస్మాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్లు వెనుదిరగడంతో ఖవాజా జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. 120 బంతుల్లో 82 పరుగులు చేసి కీలక నాక్ ఆడాడు. 48 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్కు కాస్త ఊరటనిచ్చే ఆంశం.మూడో టెస్టుకు ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్జేక్ వెదరాల్డ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, కెమెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తాడా?.. అదే తెలివైన నిర్ణయం!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్. గాయం కారణంగా మరికొన్ని వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. 34 ఏళ్ల ఈ ఆసీస్ ఫాస్ట్బౌలర్.. స్వదేశంలో జరిగిన గత 25 మ్యాచ్లలో 15 గాయాల వల్ల మిస్సయ్యాడు.ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్తో యాషెస్ టెస్టులకూ హాజిల్వుడ్ అందుబాటులో లేకుండా పోయాడు. తన కెరీర్లో ఇప్పటికి 76 టెస్టులు ఆడిన హాజిల్వుడ్.. 295 వికెట్లు కూల్చాడు. అయితే, మూడు వందల వికెట్ల అరుదైన క్లబ్లో ఇప్పట్లో చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.వేధిస్తున్న గాయాలుకెరీర్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆకట్టుకున్న హాజిల్వుడ్.. స్వదేశంలో, విదేశాల్లో తనదైన శైలిలో రాణించాడు. అయితే, ముందుగా చెప్పినట్లు గత కొన్నాళ్లుగా అతడి టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసేందుకు సహకరించడం లేదు. పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు తరచూ అతడిని వేధిస్తున్నాయి. తాజాగా చీలమండ వెనుక భాగం నొప్పి తీవ్రం కావడంతో హాజిల్వుడ్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.రేసులో వారంతాగత ఐదు వేసవి సీజన్లలో ఆసీస్ ఆడిన ఇరవై టెస్టుల్లో హాజిల్వుడ్ పది మాత్రమే ఆడాడు. నైపుణ్యాల పరంగా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నప్పటికీ గాయాల బెడద వల్ల అతడి టెస్టు కెరీర్ ముందుగానే ముగింపు దశకు చేరుకునేలా ఉంది. హాజిల్వుడ్ స్థాయిలో కాకపోయినా.. స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, బ్రెండన్ డాగట్, జేవియర్ బార్ట్లెల్, సీన్ అబాట్ వంటి పేసర్లు సత్తా చాటుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు.టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తాడా?ఇలాంటి తరుణంలో గాయాల వల్ల హాజిల్వుడ్ తరచూ జట్టుకు దూరం కావడం.. అతడి కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టెస్టుల సంగతి పక్కనపెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో హాజిల్వుడ్కు తిరుగులేదన్నది వాస్తవం. ప్రపంచస్థాయి టీ20 అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు కొనసాగుతున్నాడు.ఆసీస్ 2021లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో హాజిల్వుడ్దీ కీలక పాత్ర. వన్డేల్లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్కప్-2027లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియాకు అతడి సేవలు అత్యంత ముఖ్యం.తెలివైన నిర్ణయం తీసుకుంటేనేఈ పరిణామాలను బట్టి ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా హాజిల్వుడ్ టెస్టులకు వీడ్కోలు పలికి.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ ఫార్మాట్కు స్వస్తి పలికి టీ20, వన్డేలలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తేనే కెరీర్కు మరికొన్నాళ్లపాటు ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు.అయితే, పూర్తిగా టెస్టులకు వీడ్కోలు పలకపోయినా.. కొన్నాళ్ల పాటు ఆ ఫార్మాట్కు దూరంగా ఉంటే పరిస్థితి చక్కబడవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న హాజిల్వుడ్.. కెరీర్ కొనసాగింపులో భాగంగా ఈ దశలో తెలివైన నిర్ణయం తీసుకుంటేనే అంతా సజావుగా సాగిపోతుందని మెజారిటీ మంది అభిప్రాయం. అయితే, హాజిల్వుడ్ మాత్రం తనలో ఇంకా మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పేర్కొనడం కొసమెరుపు.చదవండి: Ashes: మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. వాళ్లిద్దరిపై వేటు -
Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్తో ఆసీస్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చినట్లు తెలిపింది. 2-0తో ఆధిక్యంలోకాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా కమిన్స్ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వరుస విజయాలు అందుకున్నాడు.ఫలితంగా ఆసీస్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్ టెస్టులో నాథన్ లియోన్ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్లో జరిగిన పింక్ బాల్ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్లో పేసర్లు బ్రెండన్ డాగట్ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్ నెసర్ (Michael Neser) రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నెసర్, డాగట్లపై వేటు.. ఖవాజాకు షాక్ అయితే, మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్ లియోన్కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్, డాగట్లపై వేటు పడింది. పిచ్ స్వభావం దృష్ట్యానే నాథన్ కోసం నెసర్ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది. అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను కూడా మేనేజ్మెంట్ మరోసారి పక్కనపెట్టింది. ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- జేక్ వెదరాల్డ్ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్ వేదిక.ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టుట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో జోష్ టంగ్ ఆసీస్ జరిగే యాషెస్ సిరీస్ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్ గుస్ అట్కిన్సన్ స్థానంలో మరో బౌలర్ జోష్ టంగ్ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్కు మరోసారి నిరాశ ఎదురైంది. భారత్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన జోష్ టంగ్ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్కిది రెండో యాషెస్ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్ జరిగిన మ్యాచ్లో తొలిసారి ‘యాషెస్’ టెస్టు ఆడిన టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ జట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, విల్ జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్. చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే? -
Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్ గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్నే ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య ఆసీస్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు స్టోక్స్ బృందం అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ప్రస్తుతానికి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇలా కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా కీలక పేసర్ అయిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ధారాళంగా పరుగులు (సగటున 78.6) ఇచ్చుకుంటూ.. అదే స్థాయిలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు.అతడిపై వేటుఈ నేపథ్యంలో అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం.. అతడి స్థానంలో మరో రైటార్మ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue)ను తుదిజట్టుకు ఎంపిక చేసింది. దీంతో మాథ్యూ పాట్స్కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.బషీర్కు మరోసారి మొండిచేయిమరోవైపు.. స్పెషలిస్టు స్పిన్నర్ షోయబ్ బషీర్కు మరోసారి మొండిచేయి చూపిన మేనేజ్మెంట్.. స్పిన్ ఆప్షన్ కోటాలో బ్యాటింగ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను కొనసాగించింది.ఇదిలా ఉంటే.. ఓవైపు ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్న పిచ్లపై ఇంగ్లండ్ సీమర్లు మాత్రం తేలిపోతున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (డిసెంబరు 17) నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక.ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్ -
అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.కాగా బాండీ బీచ్లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.తండ్రీ-కొడుకులేఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.పండ్ల వ్యాపారి ధైర్యంమరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!ఆ శబ్దాలు వినిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.లోపలి నుంచి తాళం వేశారుసిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.బీచ్కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలిఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
Ashes: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్తో తిరిగి ఆసీస్ టీమ్తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్ చేరిక) జరిగినట్లు తెలిపింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్ కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్ వేదికగా పింక్ బాల్తో (డే- నైట్ మ్యాచ్) జరిగిన ఈ మ్యాచ్లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేశారు.అదరగొట్టారుఇంగ్లండ్తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్గా వచ్చిన ట్రవిస్ హెడ్ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఆ ఇద్దరూ దూరంఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ జోష్ హాజల్వుడ్ (Josh Hazlewood)... ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ‘యాషెస్’ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్వుడ్ మిగిలిన మూడు మ్యాచ్లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ మెక్డొనాల్డ్ మంగళవారం వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్కు హాజల్వుడ్ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్కప్ పైనే’ అని మెక్డొనాల్డ్ అన్నాడు. డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగామరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్లూ ఆడని రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ రెండు మ్యాచ్ల్లో ఆసీస్కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్ రాకతో అతడు కేవలం బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు.గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్ రాకతో కంగారూల పేస్ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్... మిగిలిన మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటనప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు -
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కమ్మిన్స్ పూర్తిగా కోలుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మూడో టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులోకి రానున్నాడు.ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో ఈ స్టార్ ఆల్రౌండర్ ఆడాల్సి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ముందుస్తు జాగ్రత్తగా అతడిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోలేదు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తన బౌలింగ్ ప్రాక్టీస్ను కమ్మిన్స్ మొదలు పెట్టాడు. స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ సేవలను కోల్పోయిన ఆసీస్కు కమ్మిన్స్ రీ ఎంట్రీ కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి. "ఆడిలైడ్ టెస్టుకు సిద్దమవుతున్నాను. ఆదివారం(డిసెంబర్ 7) మరోసారి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ తర్వాత అడిలైడ్ వెళ్లాక కూడా నెట్స్లో బౌలింగ్ చేస్తాను. ప్రస్తుతం ఫిట్గా ఉన్నారు. నా శరీరం కూడా అద్భుతంగా సహకరిస్తోంది. ఈ గ్యాప్లో ఎటువంటి సమస్యలు రాకూడదని కోరుకుంటున్నానని" మూడో రోజు ఆట సందర్భంగా ఫాక్స్ క్రికెట్తో కమిన్స్ చెప్పుకొచ్చాడు. కమ్మిన్స్, హేజిల్వుడ్ లేకపోవడంతో బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేసర్లతో కూడిన పేస్ ధళానికి స్టార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బౌలర్లు అదరగొట్టారు. రెండో టెస్టులో కూడా ఫర్వాలేదన్పిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక సిరీస్లోని మూడో టెస్టు అడిలైడ్ ఓవల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే! -
రసవత్తరంగా యాషెస్ రెండో టెస్టు..
బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మాత్రం ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పై చేయి సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.ఆతిథ్య జట్టు ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కారీ (46*), నీసర్(15*) ఉన్నారు. అదేవిధంగా ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెర్త్ టెస్టు హీరో ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్ మూడు, స్టోక్స్ రెండు, ఆర్చర్ ఓ వికెట్ సాధించారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోర్(325/9)కు తొమ్మిది పరుగులు జోడించి 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
అనుకున్నదే జరిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్
ఇంగ్లండ్తో రెండో యాషెస్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దూరమయ్యాడు. ఖవాజా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ కారణం చేతనే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు రాలేదు. అయితే రెండో టెస్టుకు దాదాపు పది రోజుల విశ్రాంతి లభించడంతో అతడు కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కానీ ఉస్మాన్ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు.మంగళవారం 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ సెషన్లో ఖవాజా పాల్గోన్నాడు. కానీ అతడు అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఖవాజాను రెండో టెస్టు జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడి స్ధానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం సీఎ వెల్లడించలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. సెకెండ్ టెస్టులో కూడా ఓపెనర్గా వచ్చే అవకాశముంది. అదే విధంగా ఖవాజా స్ధానంలో తుది జట్టులోకి ఆల్రౌండర్ వెబ్స్టర్ రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా ఈ టెస్టుకు కూడా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, పేసర్ జోష్ హాజిల్వుడ్ దూరమయ్యాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో మ్యాచ్లను కంగారుల జట్టుకు సారథ్యం వహించనున్నాడు.రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
Ashes: పింక్బాల్ టెస్టుకు ముందు ఆసీస్కు భారీ షాక్!
ఇంగ్లండ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. గాయాల బెడద వల్ల వీరిద్దరు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు కూడా దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఇటీవలే వెల్లడించింది.యాషెస్ సిరీస్తో బిజీఅయితే, తాజా సమాచారం ప్రకారం ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కూడా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉంది ఆస్ట్రేలియా.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును ముందుకు నడిపించగా.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4-8 మధ్య బ్రిస్బేన్లోని గాబా వేదికగా రెండో టెస్టు జరుగనుంది.ఖవాజా సైతం..పింక్బాల్తో జరిగే ఈ డై- నైట్ టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. కమిన్స్తో పాటు హాజిల్వుడ్ గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. అయితే, ఇప్పుడు ఖవాజా ఫిట్నెస్ సమస్య ఆసీస్కు తలనొప్పిగా మారింది. పెర్త్ టెస్టు సందర్భంగా ఖవాజాకు వెన్ను నొప్పి తిరగబెట్టింది.గత మూడు మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు అతడేఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్లోనూ ఓపెనింగ్ చేయలేదు. ఇక పింక్బాల్ టెస్టుకు సన్నద్ధమయ్యే క్రమంలోనూ అతడు వెన్నునొప్పితో బాధపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ముప్పై నిమిషాల పాటు జరిగిన సెషన్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు ఇబ్బందిపడినట్లు పేర్కొంది.దీంతో రెండో టెస్టుకు ఖవాజా అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతడు ఈ మ్యాచ్కు దూరమైతే జట్టుకు కష్టమే. గాబాలో గత మూడు పింక్ బాల్ టెస్టుల్లోనూ ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో అతడికి మాత్రమే ఉంది. కాగా ఖవాజా గనుక ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమైతే బ్యూ వెబ్స్టర్, జోష్ ఇంగ్లిస్ల రూపంలో బ్యాకప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇంగ్లండ్తో పింక్బాల్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్రాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్! -
Ashes: ఉస్మాన్ ఖవాజాపై క్రికెట్ ఆస్ట్రేలియా ఫైర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చిక్కుల్లో పడ్డాడు. అభ్యంతకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి సొంత బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన విషయం తెలిసిందే.ఈ టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్ వేదిక (Perth Stadium)గా తొలి మ్యాచ్లో పర్యాటక ఇంగ్లండ్ను ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. అయితే, తొలిరోజు పెర్త్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఎక్స్ట్రా బౌన్స్తో పేసర్లు బ్యాటర్లను తిప్పలు పెట్టారు.తొలిరోజే పందొమ్మిది వికెట్లుఈ క్రమంలో ఆట మొదలైన రోజే ఏకంగా పందొమ్మిది వికెట్లు కూలాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఏడు వికెట్లతో చెలరేగగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో ఆసీస్ నుంచి బ్రెండన్ డాగెట్ రెండు, కామెరాన్ గ్రీన్ ఒక వికెట్ తీయగా.. ఇంగ్లండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ రెండు, బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు కూల్చారు.అదొక గొప్ప వికెట్ అంటూ వెటకారంఈ నేపథ్యంలో పెర్త్ వికెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సైతం పెర్త్ పిచ్పై స్పందిస్తూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. SEN క్రికెట్తో మాట్లాడుతూ.. ‘‘తొలిరోజే 19 వికెట్లు పడ్డాయి. ఇరవై మందికి దెబ్బలు కూడా తగిలాయి. అదొక గొప్ప వికెట్. నిజంగానే ఎవరైనా ఈ మాట అంటారా?నా కెరీర్లో స్టీవ్ స్మిత్ వంటి గొప్ప బ్యాటర్ను ఇంత వరకు చూడలేదు. అయితే, అతడు కూడా పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. తను అసలు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అతడి మోచేతికి బంతి తగిలింది. బ్యాట్ను ఆడించడమే గగనం అయిపోయింది.నా దృష్టిలో S**T వంటిదిఅందుకే పెర్త్లో తొలి రోజు ఆట నా దృష్టిలో S**T వంటిది. ఇది చెప్పడానికి నేనేమీ భయపడను. గతేడాది.. ఇప్పుడ ఈ పిచ్ ఒకేలా ఉంది’’ అంటూ ఉస్మాన్ ఖవాజా ఘాటు విమర్శలు చేశాడు. ఓవైపు ఐసీసీ నుంచి పెర్త్ పిచ్కు.. ‘చాలా బాగుంది (Very Good)’ అనే ప్రశంస రాగా.. ఖవాజా మాత్రం ఇలా మాట్లాడటం గమనార్హం.అంత మాట అంటావా?.. సీఏ ఫైర్ఈ నేపథ్యంలోనే ఖవాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పెర్త్ పిచ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందుకుగానూ వివరణ ఇవ్వాల్సిందిగా అతడికి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఖవాజా వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న బోర్డు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబరు 4-8 మధ్య రెండో టెస్టు (పింక్బాల్)కు ముహూర్తం ఖరారైంది. చదవండి: అభిషేక్ శర్మ అట్టర్ఫ్లాప్.. సంజూ శాంసన్ ఫెయిల్ -
Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన
ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. కాగా సొంతగడ్డపై ఆసీస్ ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో తలపడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పెర్త్ వేదికగా నవంబరు 21న ఇరుజట్ల మధ్య మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్.. ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక డిసెంబరు 4-8 వరకు ఇంగ్లండ్- ఆసీస్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. డే- నైట్ మ్యాచ్గా నిర్వహించే ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test) కంటే ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో ఇంగ్లండ్ తలపడనుంది.కమిన్స్, హాజిల్వుడ్ అవుట్ఇదిలా ఉంటే.. ఫిట్నెస్ సమస్యల వల్ల యాషెస్ తొలి టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins).. రెండో టెస్టుతో తిరిగి వస్తాడనే ప్రచారం జరిగింది. జట్టుతో పాటు అతడు బ్రిస్బేన్కు వచ్చి నెట్స్లో ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. అయితే, అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.ఫలితంగా కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ మరోసారి జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇక కమిన్స్తో పాటు మరో పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల నొప్పి నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టు బరిలోనూ దిగుతున్నట్లు ఆసీస్ ప్రకటించింది. కాగా పింక్ బాల్ టెస్టుకు బ్రిస్బేన్లోని గాబా మైదానం వేదిక.సత్తా చాటిన స్టార్క్కాగా తొలి టెస్టులో కమిన్స్, హాజిల్వుడ్ లేని లోటును మిచెల్ స్టార్క్ పూడ్చాడు. మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కామెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్ అతడికి తోడుగా నిలిచారు. ఇక.. ఇంగ్లండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్గా వచ్చిన ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో హెడ్ సత్తా చాటగా.. వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ అజేయ అర్ధ శతకం (51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్ వెదర్లాడ్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదేస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్రాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్ ముచ్చల్ తల్లి -
గెలుపు జోష్లో ఉన్న ఆసీస్కు అదిరిపోయే శుభవార్తలు
స్వదేశంలో ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)ను ఆస్ట్రేలియా విజయంతో మొదలుపెట్టింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4- 8 వరకు రెండో టెస్టుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఆ ఇద్దరు వచ్చేస్తున్నారా!బ్రిస్బేన్లోని గాబా మైదానంలో ఈ డే- నైట్ మ్యాచ్ జరుగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)కు ముందు ఆస్ట్రేలియాకు అదిరిపోయే శుభవార్తలు అందాయి. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా తొడ కండరాల గాయంతో హాజిల్వుడ్ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే.మరోవైపు.. ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ సమస్యల వల్ల చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే, హాజిల్వుడ్ సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్లో బాల్తో ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. కమిన్స్ కూడా పింక్ బాల్తో నెట్స్లో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ..పూర్తి స్థాయిలో కోలుకుంటేనే‘‘యాషెస్ సిరీస్లో ఏదో ఒక దశలో హాజిల్వుడ్ అందుబాటులోకి వస్తాడని మాకు తెలుసు. అయితే, ఇంకాస్త ముందుగానే అతడు జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇక కమిన్స్ రిహాబిలిటేషన్ దాదాపుగా పూర్తై పోయింది.తన బౌలింగ్లో వేగం కనిపిస్తోంది. అతడు సానుకూలంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, కమిన్స్ను మ్యాచ్ ఆడే విషయంలో తొందరపెట్టలేము. అతడు పూర్తి స్థాయిలో కోలుకుంటేనే రంగంలోకి దిగుతాడు’’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు. కాగా యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులకు జరుగనున్నాయి. కమిన్స్ గైర్హాజరీలో స్టీవెన్ స్మిత్ ఆసీస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.చదవండి: IND vs SA: భారీ ఆధిక్యంలో సౌతాఫ్రికా.. టీమిండియాకు కష్టమే! -
గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
యాషెస్ 2025-26 తొలి టెస్టులో విజయం సాధించి జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ హ్యామ్స్ట్రింగ్(తొడ కండరాలు) గాయం కారణంగా మిగిలిన యాషెస్ సిరీస్కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.రెండు వారాల క్రితం విక్టోరియాతో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో హాజిల్వుడ్కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత స్కానింగ్ తరలించగా చిన్న బ్రేక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టు నుంచి అతడిని తప్పించింది.అయితే రెండో టెస్టు సమయానికి హాజిల్వుడ్ ఫిట్నెస్ సాధిస్తాడని ఆసీస్ మేనెజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ప్రముఖ క్రికెట్ రిపోర్టర్ పీటర్ లాలర్ తెలిపాడు. '7 క్రికెట్'లో పీటర్ లాలర్ మాట్టాడుతూ.. హాజిల్వుడ్ గురుంచి కొన్ని వార్తలు నేను విన్నాను. అవే నిజమైనతే ఈ సిరీస్లో హాజిల్వుడ్ను మని చూడకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా హాజిల్వుడ్ను గత కొంతకాలంగా గాయాలు వెంటాడుతున్నాయి. గత వేసవి సీజన్లో పిక్క సమస్య కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు. అలాగే 2021-22 యాషెస్ సిరీస్లో కూడా అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.కమ్మిన్స్ అనుమానమే?మరోవైపు పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం అనుమానమే. కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి టెస్టులో కమ్మిన్స్, హాజిల్వుడ్ లేనిప్పటికి సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు. మొత్తంగా పది వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్లో భాగంగా రెండో టెస్టు గబ్బా వేదికగా డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్ -
చరిత్ర సృష్టించిన ఆసీస్.. 148 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది. ట్రావిస్ హెడ్ (83 బంతుల్లో 123; 16 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసక సెంచరీతో జట్టుకు ఒంటి చేత్తో విజయం కట్టబెట్టాడు.పేసర్ల హవా సాగిన పెర్త్ టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం తేలగా... ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆ్రస్టేలియా 1–0తో ముందంజ వేసింది. 205 పరుగుల లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా జట్టు 28.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. హెడ్ శతకంతో కదం తొక్కగా... మార్నస్ లబుషేన్ (49 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచాడు.అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 123/9తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మరో 3 పరుగులు చేసి 132 వద్ద ఆలౌటైంది. దీంతో 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో విఫలమైంది. 34.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (32 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒలీ పోప్ (57 బంతుల్లో 33; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా... మిచెల్ స్టార్క్, డగెట్ చెరో 3 వికెట్లు తీశారు. స్టార్క్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన కంగారుల జట్టు ఓ వరల్డ్ రికార్డు తమ ఖాతాలో వేసుకుంది.చరిత్ర సృష్టించిన ఆసీస్..148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా రెండు వందల పరుగుల పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్లో ఆసీస్ టార్గెట్ను కేవలం 28.2 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ 204 పరుగుల లక్ష్యాన్ని 35.3 ఓవర్లలో ఛేదించింది. తాజా విజయంతో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డు ఆసీస్ బ్రేక్ చేసింది. చదవండి: కెప్టెన్గా సంజూ శాంసన్.. అధికారిక ప్రకటన -
యాషెస్ సిరీస్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హెడ్
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ ఇన్నింగ్స్లో అతి తక్కువ బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.పెర్త్ స్టేడియంలో ఇంగ్లండ్తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా హెడ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ 2025-26కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ స్టేడియంలో మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది.హోరాహోరీఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగి కంగారూ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇందుకు ఇంగ్లండ్ బౌలర్లు కూడా ధీటుగానే బదులిచ్చి ఆసీస్ను 132 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో నలభై పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ విజయ లక్ష్యం 205 పరుగులుగా మారగా.. ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ గెలుపు దిశగా పయనిస్తోంది.మ్యాచ్ స్వరూపమే మార్చివేసిన హెడ్లక్ష్య ఛేదనలో ఓపెనర్గా వచ్చిన ట్రవిస్ హెడ్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లిష్ జట్టు శైలిలో ‘బజ్ బాల్’ ఆటతొ చెలరేగిన హెడ్.. 36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు జాన్ బ్రౌన్ (33 బంతుల్లో), గ్రాహమ్ యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ ఘనత సాధించారు.చరిత్ర సృష్టించిన హెడ్.. యాషెస్ మొనగాడుఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హెడ్.. 69 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా మరో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. యాషెస్ సిరీస్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్గా నిలిచిన హెడ్.. ఛేదనలో భాగంగా నాలుగో ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.పెర్త్ టెస్టు తుదిజట్లుఆస్ట్రేలియాఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్రాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్),మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్. చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్ -
Ashes: ఇంగ్లండ్ ఆలౌట్.. ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే?
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలోనే తుది అంకానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లోనూ సత్తా చాటింది.172 పరుగులకే ఆలౌట్తద్వారా.. పేసర్లకు అనుకూలిస్తున్న పెర్త్ పిచ్పై ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఒక రకంగా భారీ లక్ష్యాన్నే విధించింది. కాగా పెర్త్ స్టేడియం (Perth Stadium)లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)తో పాటు.. ఓలీ పోప్ (46) రాణించగా.. హ్యారీ బ్రూక్ అర్ధ శతకం (52)తో మెరిశాడు.మిగతావారిలో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 32.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. డాగెట్ రెండు, గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.తామేమీ తక్కువ కాదని నిరూపించిన ఇంగ్లండ్ బౌలర్లుఅనంతరం తొలి రోజే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు కూల్చారు. దీంతో 123 పరుగులకే ఆసీస్ ఏకంగా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (21), గ్రీన్ (24), అలెక్స్ క్యారీ (26) మాత్రం ఇరవై పరుగుల స్కోరు దాటారు.ఈ క్రమంలో 123/9 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో తొమ్మిది పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఫలితంగా నలభై పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాకు ‘కొండంత’ లక్ష్యందీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్కు 205 పరుగుల లక్ష్యం (40+164) విధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 28, పోప్ 33 పరుగులు చేయగా.. టెయిలెండర్లు గస్ అట్కిన్సన్ 37, కార్స్ 20 పరుగులతో సత్తా చాటారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో విజృంభించగా.. డాగెట్, స్టార్క్ చెరో మూడు వికెట్లు కూల్చారు.చదవండి: IND vs SA: ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్ -
Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ (The Ashes) తాజా ఎడిషన్ శుక్రవారం మొదలైంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుని.. ఆతిథ్య ఆసీస్ను బౌలింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆదిలోనే ఇంగ్లండ్కు కోలుకోలేని షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ జాక్ క్రాలీని అవుట్ చేశాడు. స్టార్క్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చిన క్రాలీ.. ఆరు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.ముచ్చటగా మూడుఅనంతరం ఏడో ఓవర్ నాలుగో బంతికి స్టార్క్ మరోసారి తన బౌలింగ్ పదును చూపించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇదే జోరులో తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి మరో కీలక వికెట్ను స్టార్క్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ను స్టార్క్ డకౌట్ చేశాడు.వంద వికెట్ల క్లబ్లోతద్వారా మూడు కీలక వికెట్లు కూల్చిన స్టార్క్.. యాషెస్ సిరీస్లో ఓవరాల్గా వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆస్ట్రేలియన్గా... అదే విధంగా.. 21వ బౌలర్గా ఈ లెఫ్టార్మ్ పేసర్ చరిత్రకెక్కాడు. కేవలం 23 టెస్టుల్లోనే (యాషెస్) స్టార్క్ వంద వికెట్ల క్లబ్లో చేరడం విశేషం.అంతేకాదు.. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా కర్ట్లీ ఆంబ్రోస్ రికార్డును కూడా స్టార్క్ సమం చేశాడు. టెస్టుల్లో 405 వికెట్లు పూర్తి చేసుకుని.. ఆంబ్రోస్ సరసన నిలిచాడు. తద్వారా వసీం అక్రం (పాకిస్తాన్- 414) తద్వారా అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన రెండో లెఫ్టార్మ్ పేసర్గా స్టార్క్ రికార్డు సాధించాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్తో యాషెస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్ ఇప్పటికే 110 వికెట్లు పూర్తి చేసుకోగా.. స్టార్క్ తాజాగా 100 వికెట్ల క్లబ్లో చేరాడు.ఇక స్టార్క్తో పాటు కామెరాన్ గ్రీన్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. నిలకడగా ఆడుతున్న వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (46)ను గ్రీన్ ఎల్బీడబ్ల్యూ చేసి ఆసీస్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసింది.UPDATE: ఏడేసిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లండ్చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే -
75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్(2025-26)కు తెర లేచింది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మొదటి టెస్టుకు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు.దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా సారథిగా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా జేక్ వెదరాల్డ్((31), బ్రెండన్ డాగెట్(31) ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. 30 ఏళ్ల వయస్సు దాటిన ఆటగాళ్లు టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున డెబ్యూ చేయడం 1946 తర్వాత ఇదే తొలిసారి.75 ఏళ్ల కిందట వెల్లింగ్టన్లో న్యూజిలాండ్పై 30 ఏళ్ల దాటిన ఆటగాళ్లు ఆసీస్ తరపున టెస్టు అరంగేట్రం చేశారు. కాగా వెదరాల్డ్, డాగెట్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసీస్ జట్టులో చోటు దక్కింది.మరోవైపు గాయం కారణంగా గత కొన్నాళ్లగా జట్టుకు దూరంగా ఉంటున్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు ఒక్క స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్చదవండి: SL vs ZIM: శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే -
యాషెస్ తొలి టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే! ఇద్దరు అరంగేట్రం
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సమరానికి సమయం అసన్నమైంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు పెర్త్ వేదికగా శుక్రవారం(నవంబర్ 21) నుంచి మొదలు కానుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది.తొలి టెస్టుకు గాయాల కారణంగా హాజిల్ వుడ్, కమ్మిన్స్ వంటి కీలక ప్లేయర్లు దూరం కావడంతో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు ఆసీస్ తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి అనుహ్యంగా యాషెస్ సిరీస్కు ఎంపికైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్.. తొలిసారి 'బ్యాగీ గ్రీన్' క్యాప్(ఆసీస్ టెస్టు క్యాప్) అందుకునేందుకు సిద్దమయ్యాడు.అతడితో పాటు పేసర్ బ్రెండన్ డాగెట్ కూడా ఆసీస్ తరపున డెబ్యూ చేయనున్నాడు. ఈ రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్తో కలిసి బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. గ్రీన్ రాకతో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ బ్యూ వెబ్స్టర్కు నిరాశ ఎదురైంది.షెఫీల్డ్ టోర్నీలో దుమ్ములేపిన సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్ధానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. గత సిరీస్లో లబుషేన్.. ఉస్మాన్ ఖావాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను ఆరంభించాడు. ఇప్పుడు వెదరాల్డ్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఇక రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గైర్హజరీలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపించనున్నాడు.తొలి టెస్టు కోసం ఆసీస్ తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్..
ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే తొలి టెస్టుకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సేవలను కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు మరో ఇద్దరు కీలక ప్లేయర్ల అందుబాటుపై అనుమానాలు నెలకొన్నాయి. షెఫీల్డ్ షీల్డ్ (Sheffield Shield)లో ఆ జట్టు స్టార్ ప్లేయర్లు జోష్ హేజిల్వుడ్ (Josh Hazlewood), సీన్ అబాట్ (Sean Abbott) గాయపడ్డారు. విక్టోరియాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న వారిద్దరూ తొడ కండరాల గాయం బారిన పడ్డారు. దీంతో మూడో రోజు లంచ్ తర్వాత ఈ ఇద్దరూ మైదానంలోకి తిరిగి రాలేదు. అయితే వారి గాయాల తీవ్రతపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ఏదేమైనప్పటికి హాజిల్వుడ్ లాంటి ప్రధాన ఫాస్ట్ బౌలర్కు గాయం కావడం ఆసీస్ టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. అబాట్ కూడా గత కొంతకాలంగా జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో అబాట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్లో మైదానం వీడే ముందు ఒక వికెట్ తీశాడు. హాజిల్వుడ్ మాత్రం ఒకే వికెట్ తీశాడు. కాగా నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ప్యాట్ కమ్మిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్ అనూహ్యంగా తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్కు ప్రత్యామ్నాయంగా రైట్ ఆర్మ్ పేసర్ స్కాట్ బోలాండ్ జట్టులోకి వచ్చాడు.తొలి టెస్టుకు ఆసీస్ జట్టుస్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, జేక్ వెదరాల్డ్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్స్టర్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్, జోష్ హాజిల్వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే? -
యాషెస్ సిరీస్కు ముందు ఆసీస్కు భారీ షాక్.. కెప్టెన్ అవుట్!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఈ మేజర్ సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్నుపాము దిగువ భాగంలో నొప్పితో కమిన్స్ కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.నెలలుగా ఆటకు దూరంజూన్- జూలైలో ఆసీస్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా కమిన్స్ మాత్రం ఫిట్నెస్ సమస్యలతో స్వదేశంలోనే ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ మైదానంలో దిగలేదు. అంతేకాదు.. అక్టోబరులో న్యూజిలాండ్, టీమిండియాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు కూడా కమిన్స్ దూరమయ్యాడు.ఇంగ్లండ్తో యాషెస్ టెస్టు సిరీస్కు తగినంత విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్.. తమ కెప్టెన్ విషయంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంది. అయితే, తాను యాషెస్ కూడా ఆడతానో లేదో అంటూ కమిన్స్ తాజాగా బాంబు పేల్చాడు.ఆడతానో.. లేదో!.. వేచి చూద్దాంవిలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. జిమ్లో వర్కౌట్లు చేస్తున్నా. అయితే, గాయం నుంచి వంద శాతం కోలుకున్నానని చెప్పలేను. యాషెస్ నుంచి మళ్లీ మైదానంలో దిగాలనే ఆశిస్తున్నా.అయితే, ఈ విషయంపై ఇప్పుడే స్పష్టత మాత్రం ఇవ్వలేను. యాషెస్లో ఆడాలనే భావిస్తున్నా. ఐదు టెస్టులు ఆడతానో లేదో ఇపుడే చెప్పడం కష్టం. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈసారి ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంరు 21- జనవరి 8 వరకు ఐదు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.యాషెస్ సిరీస్ 2025 షెడ్యూల్ ఇదే👉తొలి టెస్టు: నవంబరు 21- 25- పెర్త్👉రెండో టెస్టు: డిసెంబరు 4- 8- బ్రిస్బేన్👉మూడో టెస్టు: డిసెంబరు 17- 21- అడిలైడ్👉నాలుగో టెస్టు: డిసెంబరు 26- 30- మెల్బోర్న్👉ఐదో టెస్టు: జనవరి 4- 8- సిడ్నీ.చదవండి: IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్కు ధీటుగా.. -
రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె
సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్కున్న ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్లో మరోసారి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ నవంబర్ నుంచి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. "యాషెస్ సిరీస్లో జో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా సాధించకపోతే మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా" అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బోల్డ్ ఛాలెంజ్పై హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ స్పందించింది. "ప్లీజ్ రూట్ ఒక్కసెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడు" అని కామెంట్స్లో గ్రేస్ రాసుకొచ్చింది.ఒక్క సెంచరీ కూడా..వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్లోనూ అతడు సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూట్ 14 టెస్ట్ మ్యాచ్లు, 16 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.ఆసీస్లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 నాటౌట్గా ఉంది. అయితే ఓవరాల్గా ఆసీస్పై రూట్కు మంచి రికార్డు ఉంది. రూట్ తన కరీర్లో కంగారులపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా తన స్వదేశంలో వచ్చినవే కావడం గమానార్హం. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!?
యాషెస్ సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో అన్ని మ్యాచ్లకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చునని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ తర్వాత కమ్మిన్స్ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే విండీస్తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్లకు దూరమయ్యాడు. అయితే నవంబర్ 21 నుండి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సమయానికి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అంచనా వేసింది. కానీ ఊహించిన దానికంటే అతడి వెన్ను నొప్పి తీవ్రంగా ఉన్నట్లు . డైలీ మెయిల్ ప్రకారం.. కమ్మిన్స్ తాజా స్కానింగ్లో వెన్ను గాయం తీవ్రత తెలిసినట్లు సమాచారంబుమ్రా బాటలో.. అయితే కమ్మిన్స్ టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బాటలో నడిచే అవకాశమున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో కమ్మిన్స్ను రెండు లేదా మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని ఆసీస్ సెలక్టర్లు భావిస్తున్నరంట. బుమ్రా సైతం ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. వర్క్లోడ్ మెనెజ్మెంట్ భాగంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కమ్మిన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు.కాగా కమ్మిన్స్ స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్, భారత్తో వన్డే సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో కమ్మిన్స్ ఫిట్నెస్పై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. కమ్మిన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినప్పటికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ ఈ స్టార్ పేసర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్తో టెస్టు సిరీస్లోనూ కమ్మిన్స్ భాగమయ్యాడు.2025-26 యాషెస్ సిరీస్ తేదీలు:పెర్త్ టెస్ట్ (వెస్ట్ టెస్ట్): పెర్త్ స్టేడియం | నవంబర్ 21-25బ్రిస్బేన్ టెస్ట్ (డే/నైట్ టెస్ట్): గబ్బా | డిసెంబర్ 4-8అడిలైడ్ టెస్ట్ (క్రిస్మస్ టెస్ట్): అడిలైడ్ ఓవల్ | డిసెంబర్ 17-21మెల్బోర్న్ టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్): | డిసెంబర్ 26-30సిడ్నీ టెస్ట్ (నూతన సంవత్సర టెస్ట్): ఎస్సీజీ | జనవరి 4-8చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో పాసైన కెప్టెన్ -
కీలక సిరీస్కు ముందు ఆసీస్కు షాక్!
న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్, టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు.మూడు టీ20లుకాగా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ (NZ vs AUS)లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్టోబరు 1, 3, 4 తేదీల్లో మూడు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సిరీస్ మొత్తం మౌంట్మౌంగనీయ్లోని బే ఓవల్ మైదానంలోనే జరుగనుంది.ఇదిలా ఉంటే.. కమిన్స్ గత కొంతకాలంగా ఆసీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్లలో కంగారూ జట్టు కమిన్స్ లేకుండానే బరిలోకి దిగింది. తాజాగా అతడు కివీస్ జట్టుతో సిరీస్కు కూడా దూరం కానున్నట్లు తెలిసింది.టీమిండియాతో సిరీస్కు రెడీవెన్నునొప్పి కారణంగా కమిన్స్ న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని కోడ్ స్పోర్ట్స్ తెలిపింది. అయితే, టీమిండియాతో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్కు మాత్రం కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నిజానికి చాలాకాలంగా కమిన్స్ వైట్బాల్ సిరీస్లకు దూరంగా ఉంటున్నాడు.ఇంగ్లండ్తో నవంబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం కమిన్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా కాపాడుకుంటోంది. సారథి ఫిట్గా ఉంటేనే.. ఈ కీలక టెస్టు సిరీస్లో ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదు. సొంతగడ్డపై జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్లో తప్పక గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. యాషెస్ సిరీస్ ఆరంభం అపుడేకాగా చివరగా 2023లో ఇంగ్లండ్లో జరిగిన యాషెస్ సిరీస్ను ఆసీస్ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నవంబరు 21- జనవరి 8 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది.అంతకంటే ముందు.. న్యూజిలాండ్ పర్యటనను పూర్తి చేసుకుని ఆసీస్ స్వదేశానికి తిరిగి వచ్చి.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనుంది. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య భారత్తో ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఈసారి ఈ టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 21- 25 మధ్య తొలి టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇప్పటి నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు మైండ్గేమ్ మొదలుపెట్టేశారు.ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్తో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పిచ్ల మీద అతడు పెద్దగా బ్యాట్ ఝులిపించలేడు. గతంలో కూడా ఇలాగే జరిగింది.అతడికి ఇక నిద్రలేని రాత్రులే!నాకు బ్రాడీ బౌలింగ్లో ఎలాగైతే కాళరాత్రులు మిగిలాయో.. రూట్కు కూడా జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో నిద్రలేని రాత్రులే మిగులుతాయి. జో అద్భుతమైన క్రికెటర్. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన రెండో ఆటగాడు.కానీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం అతడికి కాస్త కష్టమే. దానిని అతడు ఈసారి అధిగమిస్తాడనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని వార్నర్ పేర్కొన్నాడు.వార్నర్ ఓ జోకర్!వార్నర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. ‘‘అతడు వార్నర్. వార్నర్ అంటే ఓ జోకర్ లాంటివాడు. రూటీ మైండ్లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఎన్నటికీ అది జరుగదు.అసలు రూట్తో సరదా ఫైట్కు కూడా వార్నర్ సరిపోడు. అతడు వార్నర్.. జస్ట్ వార్నర్ అంతే!.. అంతేనా? కాదా?’’ అంటూ మొయిన్ అలీ వార్నర్ పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాషెస్ మొదలైన తర్వాత ఇంకెలా ఉంటుందో అంటూ ఇరుజట్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ ఫామ్లో రూట్కాగా జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో మూడు శతకాలతో దుమ్ములేపాడు. ఐదు టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించిన రూట్.. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (754) తర్వాత రెండో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.భారత్తో సిరీస్ సందర్భంగానే జో రూట్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రిక్కీ పాంటింగ్ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు రాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.ఇలాంటి వాళ్లు సరిపోరుఈ విషయం గురించి మొయిన్ అలీ ప్రస్తావిస్తూ.. ‘‘రూటీ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. వార్నర్ లాంటి వాళ్ల మాటలు అతడిపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయినా.. రూట్ లాంటి వాళ్లను ప్రభావితం చేయాలంటే ఇలాంటి వాళ్లు సరిపోరు’’ అంటూ వార్నర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా నవంబరు 21- జనవరి 8 వరకు ఆసీస్- ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ ఇందుకు వేదికలు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్


