విజ‌యానికి చేరువ‌లో ఆస్ట్రేలియా.. అదే జ‌రిగితే? | Australia need 4 wickets on Day 5 to go 3-0 and win Ashes | Sakshi
Sakshi News home page

Ashes 2025: విజ‌యానికి చేరువ‌లో ఆస్ట్రేలియా.. అదే జ‌రిగితే?

Dec 20 2025 6:43 PM | Updated on Dec 20 2025 7:02 PM

Australia need 4 wickets on Day 5 to go 3-0 and win Ashes

అడిలైడ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న యాషెస్ మూడో టెస్టులో విజ‌యానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల దూరంలో నిలిచింది.  435 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. 

ఇంకా  228 రన్స్‌ వెనుకంజలో ఉంది. ప‌ర్యాట‌క జ‌ట్టు విజ‌యం సాధించాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాలి. క్రీజులో  జెమ్మీ స్మిత్ (2), విల్‌ జాక్స్ (11) ఉన్నారు. భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఇంగ్లీష్ జ‌ట్టును ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకొట్టాడు. కీల‌క‌మైన మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జాక్ క్రాలీ(85) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..  జోరూట్‌ (39) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో లియోన్‌తో పాటు పాట్ కమిన్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

హెడ్ సూప‌ర్ సెంచ‌రీ..
అంత‌కుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 349 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌ (219 బంతుల్లో 170 , 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. అలెక్స్ కారీ 72 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మ‌రో రెండు టెస్టులు మిగిలూండ‌గానే యాషెస్ సిరీస్‌ను కంగారులు సొంత చేసుకోనున్నారు.
చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం..! సూర్యకుమార్‌కు ఊహించని షాక్‌?

 

Advertisement
 
Advertisement
Advertisement