Municipal Administration Department
-
రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల కోసం పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ పథకానికి మంచి స్పందన లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏడాది కాలంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పురపాలక శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025–26 సంవత్సరానికి 5 శాతం రాయితీని ఉపయోగించుకొన్న ప్రజలు గత నెలలోనే రూ. 400.36 కోట్లు చెల్లించారు. మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ. 2,264.84 కోట్లు ఉండగా, ఒక్క నెలలోనే ముందస్తుగా 17.68 శాతం చెల్లించడం గమనార్హం. ఇది పురపాలక శాఖలో ఒక రికార్డుగా సీడీఎంఏ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో రూ. 900.9 కోట్లు ఎర్లీబర్డ్ కింద వసూలు కాగా, జీహెచ్ఎంసీ మినహా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో రూ. 400.36 కోట్లు వసూలు కావడం పట్ల పురపాలక శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం ఎర్లీబర్డ్ కింద రూ. 317.84 కోట్లు (14.80 శాతం) వసూలు కాగా, ఈ సంవత్సరం మరో 3 శాతం పెరిగింది. మొత్తం సంవత్సరానికి వసూలు చేసే పన్నుల్లో జమ్మికుంట మునిసిపాలిటీలో ఎర్లీబర్డ్ కింద 54.78% , హుజురాబాద్ 51.85% వసూళ్లుచేసి 50 శాతం కన్నాఎక్కువగా వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచాయి. అధికారులను అభినందించిన సీడీఎంఏ కాగా బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడలలో 30 శాతం కన్నా ఎక్కువగా వసూళ్లు చేసినట్లు సీడీఎంఏ శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు గుమ్మడిదల (42%), మద్దూర్ (34.2%), గడ్డపోతారాం (26.24%), మొయినాబాద్ (21.41%), చేవెళ్ల (21.26%) ఎర్లీబర్డ్ వసూళ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తగిన సమయంలో స్పందించి ముందస్తు పన్ను వసూళ్లు చేసిన కమిషనర్లను, ఇతర అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా 10 శాతం కన్నా తక్కువ వసూళ్లు సాధించిన పురపాలికల్లో వరంగల్ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల, వైరా, పోచంపల్లి, భైంసా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఉన్నాయి. -
ఎల్ఆర్ఎస్.. సర్కారు ఆశలు తుస్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) ద్వారా సుమారు రూ.20 వేలకోట్ల ఆదాయం పొందాలని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది. మార్చి నెలాఖరుకల్లా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్ధీకరించాలని తీసుకున్న నిర్ణయం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పురపాలక శాఖలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన పోర్టల్ను రిజిస్ట్రార్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి.. స్థలాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించారు. కానీ ఎల్ఆర్ఎస్కు కనీస స్పందన కూడా రావడం లేదు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారు 336 మంది, వచ్చిన ఆదాయం రూ.1.16 కోట్లు మాత్రమే. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో కలిపి సోమవారం ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించినవారు 42 మంది, సమకూరిన మొత్తం రూ.34.25 లక్షలు మాత్రమేకావడం గమనార్హం. 11 రోజుల ఆదాయం రూ.47 కోట్లే! రాష్ట్రంలో 2020లో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 25.67 లక్షలు.. అందులో 20లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. మరో 2.5 లక్షల దరఖాస్తులు చెరువులు, కుంటలకు 200 మీటర్ల పరిధిలో ఉన్నవికాగా, మిగతావాటిని ఇతర కారణాలతో తిరస్కరించారు. మొత్తం దరఖాస్తుల్లో జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులు 14.45 లక్షలు. ఇందులో 13,322 దరఖాస్తులకు సంబంధించి రూ.103.13 కోట్లను గతంలోనే చెల్లించారు. వీటిలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను స్వీకరిస్తుండగా.. ఇప్పటివరకు 7,188 దరఖాస్తులకు సంబంధించి రూ.47 కోట్లు మాత్రమే సమకూరడం గమనార్హం. దీనితో జీహెచ్ఎంసీ మినహా మిగతా పురపాలికల్లో.. 20,510 దరఖాస్తుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి రూ.151.31 కోట్లు అందాయి. ఇక హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీల నుంచి కలిపి గతంలో 600 మంది వరకు ఫీజులు చెల్లించగా.. ఇప్పుడా సంఖ్య సుమారు 2వేల వరకు ఉండొచ్చని, సమకూరిన మొత్తం రూ.10 కోట్ల వరకే ఉంటుందని అంచనా. భూముల విలువ, ఓపెన్ స్పేస్ చార్జీల్లో తేడాలతో.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో భూమి కొనుగోలు విలువ, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నప్పటి విలువతోపాటు ఓపెన్ స్పేస్ చార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ధరల్లో తేడాలు వస్తున్నాయని తెలిసింది. దీనితో దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించడం లేదని సమాచారం. అలాగే రెవెన్యూ గ్రామం పేరు, దరఖాస్తుదారు పేర్కొన్న కాలనీ, గ్రామం పేర్లు వేరుగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ దరఖాస్తులను తిరస్కరించడం లేదా ఫీజుల్లో తేడా చూపించడం జరుగుతోంది. ఈ సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో.. ఆన్లైన్ ద్వారా కాకుండా మ్యాన్యువల్గా సమస్యను పరిష్కరిస్తున్నట్టు డీటీసీపీ దేవేందర్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇకపై వేగం పుంజుకుంటుందని చెప్పారు. ఇంకా 20 రోజులే గడువు! ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని.. మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పురపాలికల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారానికి అర్హమైన దరఖాస్తులు 20 లక్షలకుపైనే ఉండగా.. ఇప్పటివరకు లక్ష దరఖాస్తులకు కూడా మోక్షం లభించలేదు. మరో 20 రోజుల గడువే ఉన్న నేపథ్యంలో రోజుకు లక్ష దరఖాస్తులను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వం ఆశించిన రూ.20 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ లేఅవుట్లలోని స్థల యజమానులకు మంచి అవకాశం.. అక్రమ లేఅవుట్లలో కనీసం 10శాతం స్థలాల సేల్డీడ్స్ పూర్తయిన చోట్లలో మిగతా వారికి ఎల్ఆర్ఎస్ పథకం మంచి అవకాశం. వారు గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోకపోయినా, ఇప్పుడు నేరుగా ఫీజు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు పొందే అవకాశం ఉంది. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వ్యక్తులు రెగ్యులరైజ్ చేసుకునేందుకు ముందుకు రావాలి. ఈ నెల 31లోపు క్రమబద్ధీకరించుకుంటే 25శాతం రాయితీ పొందవచ్చు. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, చైర్మన్, సుడా (కరీంనగర్) -
ఫోర్త్సిటీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ వెంచర్గా నిర్మాణం రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్ వెంచర్ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు. ఫోర్త్సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది. కొత్త హైకోర్టును కలుపుతూ.. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్ల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్లకు తుదిరూపం ఇచ్చారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్మెంట్లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఇప్పుడు ఆరామ్ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు. ఐదు కారిడార్ల అలైన్మెంట్లు ఇలా.. కారిడార్ –4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్): నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్బీ నగర్, కర్మన్ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరామ్ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్ కారిడార్. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో): ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో. కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్ ఆలి్వన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ 8: విజయవాడ హైవేపై ఎల్.బి నగర్ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్ లైన్ పొడిగింపుగా హయత్నగర్ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్ నిర్మిస్తారు. ఈ లైన్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ లైన్లో 6 స్టేషన్లు ఉంటాయి. -
లంచగొండి భార్య... పట్టించిన భర్త!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి అవినీతి బండారాన్ని కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను విడుదల చేశారు ఆమె భర్త. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు.జ్యోతి నిత్యం లక్షల్లో లంచం తీసుకుంటుందని, ఏడేళ్ల నుంచి లంచం తీసుకోవద్దని వద్దని వారించినా భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడం తనని మనోవేదనకు గురి చేస్తుందంటూ విడుదల చేసిన వీడియోల్లో పేర్కొన్నారు.లంచం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చినా.. డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చేది కాదు. దాదాపూ రూ.80లక్షల విలువైన నోట్ల కట్టలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తన భార్య తీసుకున్న లంచానికి ఇవే సాక్షాలంటూ వీడియోల్ని విడుదల చేశారు.మణికొండలోని కాంటట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ ఇంటికి భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ ఆమె భర్తే ఆరోపించారు. ఇదే విషయంలో జ్యోతితో గొడవ పడ్డానని, అయినా తనలో మార్పురాలేదన్నారు. పైగా తాను లంచం తీసుకోకూడదు అని అనుకున్నా.. పై అధికారులు లంచం తీసుకోమని ప్రోత్సహిస్తున్నారని చెబుతూ వస్తుందని వాపోయారు. చివరికి భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు జ్యోతి భర్త విడుదల చేసిన వీడియోలో తెలిపారు. మరోవైపు జ్యోతిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు. -
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
ఓ నగర మేయర్ మున్సిపల్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్గా మారాయి.కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం. ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంలో మేయర్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..పలువురు నెటిజన్లు మేయర్కు అండగా నిలుస్తోన్నారు. #WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024 -
రాజ్కోట్ అగ్నిప్రమాదం.. గుజరాత్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మునిసిపల్ అధికారుల తీరుపై కోర్టు మండిపడింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర అధికారులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసును గుజరాత్ హైకోర్టు సోమవారం(మే27) విచారించింది. ఈసందర్భంగా రాజ్కోట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. రెండున్నరేళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని.. అది కూడా ఫైర్సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని జస్టిస్ బైరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్దేశాయ్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను బెంచ్ చూపించింది. ఈ అధికారులు ఎవరు.. వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా అని మండిపడింది. ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ..కాగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్కోట్ మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు. -
వర్షాకాల సమస్యలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశించారు. మ్యాన్హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఆయా మునిసిపాలిటీలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్లో తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యత అని, ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు చేసుకుని సన్నద్దంగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు, వాటి పరిష్కారం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. -
కోరం లేకున్నా.. బడ్జెట్ ఆమోదమే!
సాక్షి, హైదరాబాద్: చాలా మునిసిపల్ పాలకమండళ్లకు పలువురు సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో బడ్జెట్ సమావేశాలకు కోరం కరువైంది. కోరం లేకున్నా మునిసిపల్ బడ్జెట్లు ఆమోదం పొందుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2023–24 వార్షిక బడ్జెట్ల ఆమోదానికి శుక్రవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను ఇప్పటికే మూడోవంతు పట్టణ పాలకమండళ్లు సమావేశాలు నిర్వహించి రాబోయే వార్షిక బడ్జెట్లకు ఆమోదం తెలిపాయి. అయితే ఈసారి పురపాలికల్లో అవిశ్వాసాల రగడ మొదలవడంతో చాలా మునిసిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మునిసిపల్ చట్టసవరణకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మూడేళ్ల పదవీకాలం పూర్తయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరిలో అవిశ్వాసాల ప్రక్రియ సాగింది. ఇందులో భాగంగా జగిత్యాల మునిసిపల్ చైర్పర్సన్ ఏకంగా రాజీనామా కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్తోపాటు హుజూరాబాద్, వికారాబాద్, తాండూర్, యాదగిరిగుట్ట, ఆలేరు, చండూరు, జనగాం, దమ్మాయిగూడెం, జవహర్నగర్ కార్పొరేషన్, చౌటుప్పల్, నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం తదితర 37 మున్సిపల్ పాలకమండళ్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస ప్రతిపాదనల గడువును మూడేళ్ల పదవీకాలం నుంచి నాలుగేళ్లకు పెంచిన సవరణ చట్టం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో మునిసిపల్ చైర్పర్సన్లే హైకోర్టును ఆశ్రయించి 29 చోట్ల స్టే తెచ్చుకున్నారు. మిగతా మునిసిపాలిటీలకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ముగియనున్న పాత ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కోరంతో సంబంధం లేకుండా ఆమోదం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మునిసిపల్ చైర్పర్సన్లు నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు సభ్యులు హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బడ్జెట్ సమావేశం నిర్వహించగా, కోరం లేక తొలిరోజు వాయిదా పడింది. మరుసటిరోజు కోరంతో సంబంధం లేకుండా సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్ను ఆమోదించారు. అదే జిల్లాకు చెందిన కొత్తపల్లి మునిసిపాలిటీలో అవిశ్వాస నోటీసు ఇవ్వకపోయినా, సరిపడా సభ్యులు రాలేదు. అయినా కోరంతో సంబంధం లేకుండా మరుసటిరోజు బడ్జెట్ను ఆమోదించారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రల్లో భాగమే... : వెన్రెడ్డి రాజు, మునిసిపల్ చాంబర్స్ చైర్మన్ రాష్టంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ‘అవిశ్వాసాలు’. నాలుగేళ్ల పదవీకాలం వరకు అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా చేసిన సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదించకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. బడ్జెట్ ఆమోదానికి కోరంతో సంబంధం లేదు. తొలిరోజు కోరం లేకుండా వాయిదా పడితే, మరుసటి రోజు ఏకపక్షంగా ఆమోదించే అధికారం సభకు ఉంటుంది. -
Govt Of Andhra Pradesh: రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: నగరాలు, మునిసిపాలిటీల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)’ కార్యక్రమంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం వచ్చే నెల నుంచి క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రోడ్ల మరమ్మతులకు వీలుండదని, వర్షాకాలం ముగియగానే ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత నెలకొల్పడంలో భాగంగా నగరాలు, పట్టణాల్లో కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని.. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలను భాగస్వాములు చేయాలని సీఎం సూచించారు. ప్రజలకు చేరువలో రిజిస్ట్రేషన్ సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల ప్రతి 2 వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు వస్తుందని, తద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని చెప్పారు. ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని.. ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని అన్నారు. విశాఖపట్నంలో బీచ్ కారిడార్, మల్టీలెవల్ కార్ పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం, తదితర ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్హత ఉన్న వారందరికీ ఇంటి స్థలం ►అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులు, ఇతరులు, ఇతర మార్గాల మీద ఆధార పడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చాం. ►ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదని భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రాంరభించాం. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. ►అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని సృష్టించాం. ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం. పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే చాలు 90 రోజుల్లోగా వెంటనే ఇంటి పట్టాను మంజూరు చేస్తున్నాం. ►ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ►గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అసంపూర్తిగా విడిచి పెట్టింది. ఈ పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి చేయాలి. ►మంగళగిరి– తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్మెంట్ ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిఫార్సులు చేసిన నేపథ్యంలో ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదిస్తున్నాం. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి. షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. మొదటి విడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలోని 85,888 ఇళ్లలో సుమారు 45 వేలకుపైగా ఇళ్లను మూడు నెలల్లో, మిగిలిన ఇళ్లు డిసెంబర్లోగా అప్పగిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేటప్పుడు అన్ని రకాల వసతులతో ఇవ్వాలని, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. మహిళా మార్ట్ నిర్వహణ అభినందనీయం పులివెందులలో పైలట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాల సహాయంతో మార్ట్ నిర్వహణ పట్ల సీఎం జగన్ అభినందనలు తెలిపారు. తక్కువ ధరలకు సరుకులు అందిస్తుండటం మంచి పరిణామం అన్నారు. ఒక్కో మహిళ నుంచి రూ.150 చొప్పున 8 వేల మంది మహిళా సంఘాల సభ్యుల నుంచి సేకరించిన డబ్బుతో మార్టు పెట్టామని అధికారులు వివరించారు. మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందని, మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్లో ఉంచామని తెలిపారు. మార్ట్ పనితీరుపై అధ్యయనం చేసి.. మిగతా చోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) నిర్వహణ ఇలా.. ►నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 124 మునిసిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో 1.2 కోట్ల డస్ట్ బిన్లు (చెత్త బుట్టలు) ఏర్పాటు. 40 లక్షల ఇళ్లకు ఇంటికి మూడు చొప్పున గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్లో బిన్లు. ►వ్యర్థాల సేకరణకు 4,868 వాహనాలు. ఇందులో 1,771 ఎలక్ట్రిక్ వాహనాలు. మొదటి దశలో 3,097 వాహనాల ఏర్పాటు. ►225 గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లు. సేకరించిన వ్యర్థాలను వివిధ విధానాల్లో ట్రీట్ చేసేలా ఏర్పాట్లు. సేకరించిన వ్యర్థాల్లో 55 నుంచి 60 శాతం వరకు తడిచెత్త ఉంటుంది. దీన్ని బయోడిగ్రేడ్ విధానంలో ట్రీట్ చేస్తారు. 35 నుంచి 38 శాతం వరకు ఉన్న పొడిచెత్తను రీసైకిల్ చేస్తారు. మిగిలిన దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇసుక రూపంలో ఉన్న దానిని ఫిల్లింగ్కు వాడతారు. ►72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు. ఆగస్టు 15 నాటికి టెండర్ల ప్రక్రియ, 2022 జూలై నాటికి ఏర్పాటుకు కార్యాచరణ. -
సంస్కరణల్లో తెలంగాణ నం.3
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను పురపాలికల్లో విజయవంతంగా అమలుపరిచిన దేశంలోని మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీని ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.2,508 కోట్ల అదనపు రుణాలను సమీకరించ డానికి రాష్ట్రం అర్హత సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం గురువారం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. ఈ సంస్కరణ లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ పూర్తి చేయగా, ఈ జాబితాలో చేరిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం రూ.7,406 కోట్ల అదనపు రుణాలు సమీకరించుకోవడానికి అర్హత పొం దాయి. ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశుద్ధ్య సేవలను అందించేందుకు వీలుగా పురపాలి కలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంస్కరణలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ సంస్కరణలివే.. సంస్కరణల కోసం నాలుగు పౌర–కేంద్రీకృత ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. అవి.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణల సులభతరం, పట్టణ స్థానిక సంస్థ/ యుటిలిటీ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కర ణలు.. కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఊరట కలిగించేందుకు కేంద్రం 2020 మే 17న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం పేర్కొన్న సంస్కరణలను అమలు పరిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 2% అదనపు రుణాలను ఆయా రాష్ట్రాలు పొంద డానికి అర్హత సాధిస్తాయని అప్పట్లో తెలియజేసింది. ఈ సంస్కరణల అమలులో భాగంగా ఆస్తుల మార్కెట్ విలువను ప్రామాణికంగా తీసుకుని వాటి వైశాల్యం (ఫ్లోర్ ఏరియా) ఎంత ఉంటే ఆ మేరకు ఆస్తి పన్నులు విధించేలా పురపాలికల్లో ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాలని కేంద్రం పేర్కొంది. నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి ప్రవాహ సేవలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం ఆధారంగా వీటికి సంబంధిం చిన చార్జీలను సైతం ఫ్లోర్ ఏరియా ఆధారంగా విధించాలని నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’వ్యవస్థను అమలు చేశాయి. 7 రాష్ట్రాలు సులభ వ్యాపార సంస్కరణలు అమలు చేశాయి. 3 రాష్ట్రాలు మాత్రమే నాలుగింటిలో మూడు సంస్కరణలను అమలు చేశాయి. కాగా, కేంద్రం నిర్దేశించిన సంస్కరణల అమలుకు గత మూడు నెలలుగా తీవ్రంగా కష్టపడ్డామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా మున్సిపల్ శాఖ అద్భుతంగా పనిచేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వర్షాలు, వరదల వల్ల నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితిని సోమవారం ప్రగతిభవన్లో ఆయన సమీక్షించారు. పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సీఎంకు వివరించారు. ‘భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపునకు గురైన, ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయమిచ్చాం. ఒక్క వరంగల్లోనే 4,750 మందిని శిబిరాలకు తరలించాం. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలోని వారినికూడా తరలించాం. రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా సిద్ధంగా ఉండే విధంగా విపత్తు నిర్వహణ దళం (డీఆర్ఎఫ్) తయారైంది’ అని కేటీఆర్ వివరించారు. -
అంతా అక్రమార్కుల ప్లాన్ ప్రకారమే!
సాక్షి, మెదక్: అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్ప్లాన్ రోడ్డులో వెలిసిన కట్టడాలను తొలగించకుండా చోద్యం చూస్తుండడంతో పాటు సదరు యజమానులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో ‘అక్రమార్కుల మాస్టర్ప్లాన్’కు బల్దియా అధికారులు వత్తాసు పలుకుతుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది పొంతనలేని మాటలు చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ పట్టణంలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ పక్కన మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవనాన్ని పరిశీలిస్తున్న అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాసేలా పలువురు బల్దియా అధికారులు భలే ‘ప్లానింగ్’తో ముందుకు సాగుతున్నారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మాణాలను చూస్తూనే ఉన్నారు. కాని చర్యలు తీసుకోవడం లేదు. వారికి ‘మేమున్నాం.. మీకేం కాదు’ అనే భరోసా కల్పిస్తున్నారు. మెదక్ పట్టణ పరిధిలోని గంగినేని థియేటర్ ఎదుట కెనాల్ అనుకుని పంప్హౌస్కు వెళ్లే దారిలో, అజంపూర్లో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ఎసరుపెట్టి అక్రమంగా భవనాలు నిర్మించిన ఘటనకు సంబంధించి ‘సాక్షి’లో రహ‘దారి’ మాయం శీర్షికన ఇటీవల కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి సదరు నిర్మాణదారులకు అవినీతికి అలవాటు పడ్డ పలువురు బల్దియా అధికారులు పూర్తిస్థాయిలో అండదండలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారీగా ముడుపులు ముట్టడమే కారణమని తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది తలోమాట.. మాస్టర్ప్లాన్ రోడ్డులో అక్రమ కట్టడాలకు సంబంధించి టౌన్ప్లానింగ్లోని సిబ్బంది నుంచి మొదలు ఆ విభాగంలోని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారు. గంగినేని థియేటర్ వద్ద నిర్మించిన భవనం కెనాల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని.. ఇరిగేషన్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకొస్తే అనుమతులిచ్చామని ఓ అధికారి చెప్పారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో భవనం లేదని ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని కచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నిస్తే బఫర్ జోన్ను రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.. ఇది బఫర్ జోన్ కమ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు అని సమాధానమిచ్చారు. మాస్టర్ ప్లాన్ 1992 అమల్లోకి వచ్చిన తర్వాతే బిల్డింగ్ నిర్మాణమైందని.. పిల్లర్ గుంతలు తీసిన తర్వాత నోటీసులు జారీ చేశామని మరో అధికారి చెప్పడం విశేషం. ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తే మున్సిపాలిటీయే అనుమతి ఇవ్వడంతో అంటూ సమాధానం దాటవేశారు. గత అధికారుల తప్పిదంతో ఇలాంటివి చోటుచేసుకున్నాయని ఇంకో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అజంపూర్కు సంబంధించి మాత్రం చాలా ఏళ్ల క్రితం జరిగింది.. రికార్డులు వెలికి తీసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరికి నోటీసుల జారీ.. మరొకరికి త్వరలో.. ఈ అక్రమ కట్టడాలపై తలోమాట చెబుతున్న అధికారులు కలెక్టర్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో నోటీసులకు ఉపక్రమించారు. గంగినేని థియేటర్ వద్ద కెనాల్ను ఆనుకుని మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించిన భవన నిర్మాణదారుడికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో లేదని ఒకసారి.. ఉందని ఒకసారి చెబుతూ వచ్చిన అధికారులు ప్రస్తుతం సెట్బ్యాక్తో కలిపి ఆరు మీటర్లు రోడ్డు పరిధిలోకి వచ్చిందని.. ఈ మేరకు డీవియేషన్ నోటీసులు ఇచ్చామని.. అజంపూర్కు సంబంధించి ఒకరికి నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతుండడం గమనార్హం. రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? బల్దియా అధికారులు, సిబ్బంది తలోమాటకు పొలిటికల్ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. గత పాలక వర్గానికి చెందిన పెద్ద మనుషులు చెప్పినట్లు నడుచుకున్నామని.. ఇందులో తమకేం సంబంధం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి ఆవేదన వెళ్లగక్కారు. ప్రస్తుతం సైతం వారి ఒత్తిళ్లు తమపై ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని బట్టి గత పాలక వర్గంలోని పలువురికి పెద్దమొత్తంలో ఆమ్యామ్యాలు అందినట్లు బల్దియా వర్గాలో చర్చ జోరుగా సాగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నోటీసులు జారీ చేశాం. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటాం. కలెక్టర్కు నివేదిక సైతం సమర్పిస్తాం. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
ట్విట్టర్లో టాప్!
నగర పౌరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులకు ఉన్నత స్థాయిలోని వారూ తమ తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొద్దినెలల క్రితం శేరిలింగంపల్లి జోన్లో పర్యటన సందర్భంగా మేయర్ వాహనం నో పార్కింగ్ ఏరియాలో ఆపడాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో ఉంచారు. దీంతో ఆయన చలానా చెల్లించారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కారు వేగంగా ప్రయాణం చేసినందుకు ట్రాఫిక్ విభాగం జారీ చేసిన చలాన్లు పెండింగ్లో ఉండటం ట్విట్టర్లో హల్చల్ సృష్టించింది. దీంతో కమిషనర్ చలానా సొమ్ము చెల్లించడంతోపాటు ఇకపై వేగంగా నడపొద్దంటూ డ్రైవర్లను హెచ్చరించారు. సాక్షి, హైదరాబాద్: ఇలా వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి నగరవాసులు ట్విట్టర్ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్ఎంసీ తొలి స్థానంలో ఉంది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ–ఆఫీస్ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్ సర్టిఫికెట్లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తోంది. ఇక ఫిర్యాదుల కోసం ‘మైజీహెచ్ఎంసీ’యాప్ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్ అకౌంట్ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్ ఖాతాలున్నాయి. జీహెచ్ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ ట్విట్టర్ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్ఎంసీ అకౌంట్తోపాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేయర్ రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల ఖాతాలకు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్ఎంసీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. కాగా, కార్పొరేషన్ ఫేస్బుక్ను ఫాలో అవుతున్నవారు 47,087 మంది ఉన్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా ట్విట్టర్తోపాటు జీహెచ్ఎంసీ ఫేస్బుక్, మైజీహెచ్ఎంసీ యాప్, ఈ–మెయిల్స్, ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు నేరుగా నాకందే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. – దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ బెంగళూర్, పుణే తదితర నగరాల కంటే జీహెచ్ఎంసీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం అభినందనీయం. ఎక్కువ మంది సోషల్ మీడియాను వాడుతుండటమే కాక సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకుంటున్నారు. – అరవింద్కుమార్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
విజయవాడ లెనిన్ సెంటర్లో ఉద్రిక్తత
-
లెనిన్ సెంటర్లో ఉద్రిక్తత
విజయవాడ: విజయవాడ లెనిన్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను పరిష్కరించాలంటూ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించటానికి మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్, వామపక్ష పార్టీల ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పలువురిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. -
మంత్రి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు
-
మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : మంత్రి కాలువ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీవో నెం 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముట్టడిని అడ్డుకున్న పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు మున్సిపల్ కార్మికులను అక్కడినుంచి ఈడ్చిపారేశారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఉధృతమైన మిన్సిపల్ కార్మికుల సమ్మె
-
సమ్మెలో కార్మికులు.. మురుగులో మున్సిపాల్టీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజు కూడా యధాతథంగా కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు శనివారం సామూహిక రాయబారాలు సాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలు, వంటా వార్పు, మానవ హారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని, తల కిందికి కాళ్లు పైకి పెట్టి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల టీడీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, అనంతపురం జిల్లా పుట్టపర్తి, హిందూపురం, ప్రకాశం జిల్లా అద్దంకి, చీమకుర్తి, ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లా మండపేట, పెద్దాపురం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు మధ్య పోటీ కార్మికులతో పని చేయించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను కార్మికులు తిప్పికొట్టారు. జంగారెడ్డిగూడెంలో 10 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్స్టేషన్లో నిర్బంధించారు. కార్మిక సంఘం నేతలు పోలీస్స్టేషన్ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక నాయకులకు బెదిరింపులు మున్సిపల్ కార్మికుల సమ్మెను అణచివేసిందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. కార్మిక సంఘం నేతలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి కేసులు బనాయిస్తామని బెదిరించడమే కాకుండా పోటీ కార్మికులను అడ్డుకుంటే జైలుకు పంపుతామని ఉన్నతాధికారులు బెదిరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలు తిప్పికొట్టేందుకు అత్యవసర సేవలను సైతం నిలిపివేసేందుకు వెనకాడబోమని రాష్ట్ర మున్సిపల్ కార్మికుల జేఏసీ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మృతిచెందిన మున్సిపల్ కార్మికుడు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఎస్.శంకరరావు, ఎం.శివలక్ష్మితో కూడిన బృందం పరామర్శించింది. పేరుకుపోతున్న చెత్తా చెదారం రాష్ట్రంలోని దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఓపెన్ డ్రెయిన్లలోని సిల్ట్ను తొలగించకపోవడంతో కాల్వలు ఉప్పొంగి మురుగు నీరంతా రహదారులపైకి చేరుకుంటోంది. దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వం సామరస్య ధోరణితో వ్యవహరించి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సమ్మెను వెంటనే విరమింపజేయాలని ప్రజలు కోరుతున్నారు. -
తివారి హత్య : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
లక్నో : పోలీస్ కాల్పుల్లో మరణించిన ఆపిల్ సంస్థ ఉద్యోగి వివేక్ తివారి కుటుంబాన్ని ఆదుకోవడానికి యూపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వివేక్ భార్య కల్పన తివారికి మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకే మేం వికేక్ తివారి భార్యకు ఉద్యోగం కల్పిస్తున్నాం. ఆమె పోస్ట్ గ్రాడ్యూయేట్ చదివింది. ఆమె అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇస్తాము. ఇందుకోసం అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు, డాక్యుమెంట్స్ తీసుకున్నాం. అన్ని ఫార్మలిటీస్ పూర్తయ్యాయి. త్వరలోనే ఆమెను మున్సిపల్ కార్పొరేషన్లోని ఏదో ఒక డిపార్ట్మెంట్కి కేటాయిస్తాం’ అని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వివేక్ కుటుంబాన్ని అదుకుంటుందని తెలిపారు. అంతేకకా వివేక్ మృతికి నష్ట పరిహారంగా ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సొమ్మును వివేక్ కూతుర్ల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తామన్నారు. -
మరో మూడు కొత్త పురపాలికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అనుమతులు కోరుతూ గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి కొన్ని నెలలకిందట పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. ఈ ప్రతిపాదనలపై తాజాగా గవర్నర్ కార్యాలయం వివరణలను కోరింది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు వస్తే ఈ ప్రాంతాలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయని పురపాలక శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 173 గ్రామ పంచాయతీల విలీనంతో రాష్ట్రంలో 68 పురపాలికలను ఏర్పాటుచేస్తూ గత మార్చిలో ప్రభుత్వం శాసనసభలో రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్ఎంసీ చట్టాలకు సవరణలు జరిపిన విషయం తెలిసిందే. అప్పుడే ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలతో పాటు ఉట్నూరును సైతం మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఈ నాలుగు ప్రాంతాలు ఉండడంతో మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా మారింది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు లభించకపోవడంతో అప్పట్లో 68 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుతో ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఉట్నూరు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్ కార్యాలయం నుంచి అనుమతులు లభించిన తర్వాత భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించనుంది. -
మున్సిపల్ ఉద్యోగి రాసలీలలు!
తూర్పుగోదావరి, పిఠాపురం: రాజమహేంద్రవరంలోని ఒక లాడ్జీలో ఓ మున్సిపల్ అధికారి, ఓ యువతితో కలిసి ఆదివారం రాసలీలలు జరిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన రెండు మున్సిపాలిటీలకు ముఖ్య అధికారి. వివిధ అవసరాల కోసం వచ్చిన మహిళలను తన అవసరాలకు వినియోగించుకోవడంలో ఆయన ఆరితేరారు. తన ఇంటి సరిహద్దు గోడ సమస్య కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళపై కన్నేశాడు. ఆమె సమస్య పరిష్కారం కాకుండా రోజుల తరబడి తన చుట్టూ తిప్పుకునేలా చేశాడు. చివరికి తన మనసులో మాట బయటపెట్టాడు. చివరకు తన కోరిక తీరిస్తే ఆ పని పూర్తవుతుందని తేల్చి చెప్పాడు. ఆమెను లొంగదీసుకుని కొంత కాలంగా ఆమెతో కామ కోరికలు తీర్చుకుంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ మహిళతో పాటు మరో యువతిని తన వెంటబెట్టుకుని ఆ అధికారి రాజమహేంద్రవరం తీసుకువెళ్లినట్టు తెలిసింది. అక్కడ తన కారును ఓ ప్రభుత్వ కార్యాలయం వసతి గృహం వద్ద నిలిపి ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న లాడ్జీలోకి ఆ మహిళతో పాటు ఆ యువతిని తీసుకువెళ్లి అక్కడ రాసలీలలు కొనసాగించినట్టు పలువురు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వీరి కోసం మరో మున్సిపల్ కింది స్థాయి అధికారి గుర్తు తెలియని వ్యక్తి పేరున లాడ్జీరూం బుక్ చేసి సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆ అధికారి లోబరుచుకున్న మహిళతోపాటు వచ్చిన యువతిని.. మరో మున్సిపల్ ఉన్నతాధికారి కోసం తీసుకొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కర్నాటక నగరపాలక ఎన్నికల్లో హస్తం హవా
-
కన్నడ ‘స్థానికం’లో కాంగ్రెస్ జోరు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం 2,662 స్థానాల్లో ఫలితాలు వెల్లడవగా.. కాంగ్రెస్ 982 స్థానాలను, బీజేపీ 929 స్థానాలను సాధించాయి. జేడీఎస్ 375 సీట్లలో గెలవగా.. ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కలిసి 376 స్థానాల్లో ఇతరులు పాగా వేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంది. అయితే సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్తో కలిసి మెజారిటీ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ)పై కాంగ్రెస్ పట్టుదక్కించుకోనుంది. 3 సిటీ కార్పొరేషన్లు, 29 సిటీ మునిసిపల్ కార్పొరేషన్లు, 52 పట్టణ మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీల్లోని 2,709 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం కౌంటింగ్ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం 2,662 స్థానాల్లో ఫలితాలను వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో బీజేపీ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. మిగిలిన చోట్ల నువ్వా, నేనా అన్నట్లుగానే పోటీ నెలకొంది. మొత్తం 29 నగర సభల్లో బీజేపీ 10 కార్పొరేషన్లను గెల్చుకోగా, కాంగ్రెస్కు 5, జేడీఎస్కు 3 దక్కాయి. మెజార్టీ ‘జేడీఎస్+కాంగ్రెస్’దే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన జేడీఎస్, కాంగ్రెస్లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత పొత్తు కొనసాగుతుందని ముందుగానే ప్రకటించాయి. ఈ లెక్క ప్రకారం జేడీఎస్, కాంగ్రెస్ల కూటమి ఖాతాలో మొత్తం 1,357 స్థానాలు చేరాయి. దీంతో మెజారిటీ మునిసిపాలిటీల్లో బీజేపీ కన్నా ఈ కూటమిదే ఆధిపత్యం కానుంది. ‘బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు అవసరమైన చోట సంకీర్ణంలో చేరేందుకు మేం సిద్ధమే’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ పేర్కొన్నారు. ఇవి లోక్సభ ఎన్నికలకు దిక్సూచి కాదన్నారు. ఈ ఎన్నికలను కన్నడ ప్రభుత్వం పనితీరుపై రెఫరెండంగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నంగా భావించారు. అయితే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. 2013 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ చాలా పుంజుకుంది. కర్ణాటకలో మొత్తం 4,976 యూఎల్బీ స్థానాలుండగా.. మిగిలిన 2,267 చోట్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కొడగులో ఎన్నికలను వాయిదా వేశారు. విమర్శలకు చెంపపెట్టు: సీఎం ‘సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని, ప్రభుత్వం బలహీనంగా ఉందని, సర్కారు త్వరలోనే కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనపడిందని వస్తున్న విమర్శలకు ఈ ఫలితాలు సరైన సమాధానమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు తమ పార్టీ ఊహించిన రీతిలో లేవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. అయితే ఓవరాల్గా చూస్తే ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ ఎన్నికల్లో 22, 23 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం ఉండదన్నారు. విజయోత్సవ ర్యాలీపై యాసిడ్ దాడి స్థానిక సంస్థల ఫలితాల నేపథ్యంలో తుమకూరులో విజయం సాధించిన అభ్యర్థిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఆయన మద్దతుదారులతోపాటు దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. తుమకూరు వార్డు నంబర్ 16లో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనంలో నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ర్యాలీ వాహనంపై యాసిడ్ చల్లాడు. దీంతో ఇనాయతుల్లా ఖాన్ ముఖంపై గాయాలయ్యాయి. గాయపడిన ఆయన అనుచరులకూ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించారు. ఎన్నికల్లో ఖాన్ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. -
కర్ణాటక స్థానిక ఎన్నికలు..
-
కర్ణాటకలో కాంగ్రెస్ జోరు.. డీలాపడ్డ బీజేపీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మూడురోజుల క్రితం నగర, పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తర్వాతి స్థానాల్లో బీజేపీ, జేడీ(ఎస్) ఉన్నాయి. కాంగ్రెస్ 46, బీజేపీ 36, జేడీ(ఎస్) 13 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. మిగతా స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. మొత్తం 2664 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 2218 వార్డుల ఫలితాలు ప్రకటించారు. కాంగ్రెస్ 846, బీజేపీ 788, జేడీ(ఎస్) 307, స్వతంత్రులు 277 స్థానాల్లో గెలుపొందారు. శివమొగ్గ, తుమకూరు, మైసూరు మహానగర పాలికెలతో పాటు 102 పట్టణ స్థానిక సంస్థలకు గత నెల 31వ తేదీన ఎన్నికలు జరిగాయి. వచ్చే లోక్సభ ఎన్నికలకు ఈ ఫలితాలను దిక్సూచిగా అందరూ భావిస్తుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆయా అభ్యర్థుల గెలుపోటములపై మద్దతుదారులు భారీగా బెట్టింగ్లకు దిగుతున్నారు. బెట్టింగుల జోరు... మైసూరు, శివమొగ్గ, తుమకూరు మహానగర పాలికెల్లో ఎన్నికల బెట్టింగ్ విపరీతంగా నడుస్తోంది. ఈ మహానగర పాలికెల్లో కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థుల మద్దతుదారుల మధ్య బెట్టింగ్ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. శివమొగ్గలో బీజేపీ తరఫున ఎక్కువ మంది పందేలు ఒడ్డుతున్నారు. మైసూరులో జేడీఎస్ తరఫున, అలాగే తుమకూరులో కాంగ్రెస్, జేడీఎస్ల తరఫున సమానంగా బెట్టింగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇక నగర సభ బెళగావి, బళ్లారి, బీదర్, చిత్రదుర్గ తదితర ప్రాంతాల్లో భారీగానే బెట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో డబ్బులు, వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫలితాలపై టెన్షన్ ఇక ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. తాలుకా కేంద్రాల్లో నగర, పట్టణ స్థానిక సంస్థలకు, జిల్లా కేంద్రాల్లో మహానగర పాలికెల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 21 జిల్లాల్లో మొత్తం 2,634 వార్డులకుగాను బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 9,121 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. హంగ్ ఏర్పడితే పరస్పరం సహకరించుకుంటామని కాంగ్రెస్, జేడీ(ఎస్) ఇప్పటికే ప్రకటించాయి. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న ఈ రెండు పార్టీలు స్థానిక ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ పక్షం, బీజేపీ ఈ ఫలితాలను ప్రధాన అస్త్రంగా మలుచుకోనున్నాయి. -
బీఎంసీ స్వపరిపాలన దినోత్సవం నేడు
బరంపురం : బీఎంసీ (బరంపురం మున్సిపల్ కార్పొరేషన్) 151వ స్వపరిపాలనా దినోత్సవాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా బీజేడీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్కుమార్ పాణిగ్రాహి తెలిపారు. ఈ మేరకు స్థానిక ఐవీ సమావేశ మందిరంలో బీఎంసీ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ బరంపురం మున్సిపాలిటీ అని గుర్తు చేశారు. బరంపురం మున్సిపాలిటీ ఏర్పడి 151 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఈ స్వపరిపాలన దినోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛభారత్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలిమల, పరిశుభ్రతపై నగర ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు వివరించారు. గతేడాది బీఎంసీ 150వ స్వపరిపాలనా దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని, ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ నగర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అలాగే బీఎంసీ 151వ స్వపరిపాలనా దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమానికి నేతలు, అధికారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కళ్లికోట్ కళాశాల మైదానంలో సాయంత్రం జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ నటులు సునీల్శెట్టితో పాటు కరీనాఖాన్, పాప్ సింగర్ వినోథ్రాథోడ్ పాల్గొని, వీక్షకులకు కనువిందు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మేల్యే రమేష్చంద్ర చావ్ పట్నాయక్, మాజీ కేంద్రమంత్రి చంద్రశేఖర్ సాహు, మేయర్ కె.మాధవి, డిప్యూటీ మేయర్ జోత్సా్న నాయక్, కమిషనర్ చక్రవర్తి రాథోడ్, బరంపురం అభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్ మహరణ తదితరులు పాల్గొన్నారు. -
బహుముఖ పోటీ..!
మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ముహూర్తం ముంచుకొస్తోంది. మరో ఆరు రోజులే ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు వేగిరం చేశారు. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పలువు రు కౌన్సిలర్లు పార్టీ అధినాయకత్వాన్ని గట్టిగానే కోరుతున్నారు. తమతో చేసుకున్న ఒప్పందాలను సైతం ఏకరువు పెట్టడానికి వారు వెనుకాడడం లేదు. మొత్తానికి చైర్పర్సన్ పీఠానికి బహుముఖ పోటీ నెలకొనడంతో మరోమారు భువనగిరి ము న్సిపల్ రాజకీయం ఆసక్తికర చర్చకు తెరలేపింది. సాక్షి, యాదాద్రి : భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక ఇప్పు డు జిల్లాలో హాట్ టాఫిక్గా మారింది. జనరల్ మహిళకు కేటా యించిన చైర్పర్సన్ పదవి కోసం అధికార పార్టీకి చెందిన ఐదుగురు మహిళా కౌన్సిలర్లు ప్రధానంగా పోటీపడుతున్నట్లు తెలు స్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా వారు ప్ర యత్నాలు సాగిస్తున్నారని.. ముందుగా, తాజాగా చేసుకున్న ఒ ప్పందాలను తెరమీదికి తెసున్నారు. పావులు కదుపుతున్న సభ్యులు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చైర్పర్సన్గా ఉన్న బీజేపీకి చెందిన సుర్వి లావణ్యపై అధికార, ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాసానికి తెరలేపారు. జూలై 24వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆమె ఓడిపోవడంతో పదవినుంచి వైదొలిగారు. ఆమె స్థానంలో నూతన చైర్పర్సన్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకు గాను ఈనెల 31న ముహూర్తం ఖరారు చేశారు. గడువు సమీపిస్తుండడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన పలువురు మహిళా కౌన్సిలర్లు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఎనిమిది మంది మహిళలు ఉండగా వారిలో ఐదుగురు సభ్యులు తమకంటే తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోం ది. ఈక్రమంలో ముందుగా చేసుకున్న ఒప్పం దాలు, తాజా ఒప్పందాలు తెరమీదికి వస్తున్నాయి. చైర్పర్సన్ పదవికోసం అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వారిలో ను వ్వుల ప్రసన్న,ఎనబోయిన లలిత, యాట భా రతమ్మ, కడారి ఉమాదేవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నాడు ఒక్కటై.. నేడు విడిపోయి! చైర్పర్సన్గా ఉన్న సుర్వి లావణ్యను కుర్చీ లోంచి దించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అనంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య ఆమె టీఆర్ఎస్లోనుంచి బీజేపీ గూటికి చేరడంతో ఒక్క సభ్యుడు మినహా మిగతా వారందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు. చైర్పర్సన్ను దించడానికి ఒకటిగా ఉన్నవారందరూ ప్రస్తు తం విడిపోయారన్న ప్రచారం సాగుతోంది. పరిస్థితి మారిందా? ముందుగా నువ్వుల ప్రసన్నకు చైర్పర్సన్ అవకాశం ఇస్తామని అనుకున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆపరిస్థితి మారిన ట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎవరికి వారే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలోపడ్డారు. చైర్పర్సన్గా ఎంపికవ్వాలంటే 16మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నిర్ణయమే అంతిమమని ప లువురు కౌన్సిలర్లు అంటున్నారు. అదే జరిగి తే చైర్పర్సన్గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. -
ఉత్కంఠగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ఉయ్యూరు: ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్లు సంయుక్తంగా రాజకీయం నడిపి తమ వారికి పదవులు వచ్చేట్లు చేశారు. ఎట్టకేలకు ఒప్పందం ప్రకారం చైర్మన్గా అబ్దుల్ ఖుద్దూస్, వైస్ చైర్ పర్సన్గా పండ్రాజు సుధారాణిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్ చైర్ పర్సన్, చైర్మన్లతో జాయింట్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. -
రెండోసారి మున్సిపాలిటీగా నర్సాపూర్
నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ను రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు 2నుంచి మున్సిపాలిటీగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు ఒకటి నాటికి ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున 2నుంచి కొత్త పురపాలక సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగిన భవనంలోనే పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సంబంధిత అధికారులు ఆ భవనానికి ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం బోర్డును తొలగించి పురపాలక సంఘం బోర్డును ఏర్పాటు చేశారు. నేటి నుంచి అమలులోకి.. నర్సాపూర్ పట్టణం గతంలో ఒకసారి పురపాలక సంఘంగా కొనసాగింది. 1960 నుంచి కొన్నేళ్ల పాటు పట్టణం పురపాలక సంఘం హోదాలో కొనసాగింది. అనంతరం సరిపడా జనాభా లేనందున పురపాలక సంఘం నుంచి తగ్గించి మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీలను కొత్తగా పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టగా నర్సాపూర్కు పురపాలక సంఘం హోదా దక్కింది. పట్టణంలో 2011 లెక్కల ప్రకారం జనాభా 18,338 మంది ఉండగా వారిలో 9,627 మంది పురుషులు, 8,711 మంది మహిళలు ఉన్నారు. పట్టణంలో 9,607 మంది ఓటర్లు ఉండగా 4,854 పురుషులు, 4,753మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తాజాగా పరిశీలిస్తే జనాభా, ఓటర్లు ఎక్కువగా ఉంటారు. నర్సాపూర్ను గురువారం పురపాలక సంఘంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అవిశ్వాస తీర్మానంలో మరో మలుపు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి. -
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన ఫిర్యాదుతో వివిధ రాజకీయ పా ర్టీలు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కమి షనర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎట్టకేలకు పోలీసులు కమిషనర్పై ఎస్సీ,ఎస్టీ కేసు, అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తనపై కమిషనర్ విజయసింహారెడ్డి అత్యాచారానికి ప్రయత్నించారని పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్.వసంత వాపోయింది. ఆమెకు న్యాయం చేయాలని తోటి కార్మికులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎస్.వసంత పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు కమిషనర్ ఇంటి వద్ద పని చేయడానికి మేస్త్రీ అయిన నర్సింహరెడ్డి ద్వారా పిలవడం జరిగింది. దీంతో కమిషనర్ ఇంటి వద్దకు ఆమె వెళ్లింది. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత.. బెడ్ రూమ్లో శుభ్రం చేస్తుండగా కమిషనర్ వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను చెప్పినట్టు వింటే నీకు ఏమి కావాలన్నా ఇస్తాను’ అని లొంగదీసుకోవడానికి బలవంతంగా లాగారని వాపోయింది. తాను గట్టిగా కమిషనర్ను వెనక్కి నెట్టి పరుగెత్తుకుంటూ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి తోటి కార్మికులకు జరిగిన విషయం తెలిపానని వివరించింది. మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయింపు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఈ విషయం మాట్లాడటానికి కార్మికులు ప్రయత్నించారు. అయితే అధికారులు బెదగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.హర్షవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యానారాయణరెడ్డి, పద్మనాభయ్య, నాగన్న, కడప పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణరెడ్డి, వర్రా డెవిడ్, నాయకులు దివాకర్రెడ్డి, షర్పుద్దీన్, మహుబూబ్వలి, బీజేపీ నాయకుడు నాగరాజు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గంగిరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు ఎస్.మంజుల, ఏఐటీయూసీ నాయకులు ఎం.నారాయణ అక్కడికి చేరుకున్నారు. కార్మికులతోపాటు వారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అంతకుమునుపు బాధితురాలికి మద్దతుగా మున్సిపల్ చైర్మన్ ముసలయ్య నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కమిషనర్ను ప్రత్యేక వాహనంలో కార్యాలయం నుంచి బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న కార్మికులు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో రోడ్డుపై బైఠాయించారు. తర్వాత పోలీసులు కమిషనర్ను పోలీసుస్టేషన్కు తరలించారు. ఎస్ఐలు మారెన్న, చిరంజీవి, క్రిష్ణయ్య, మహమ్మద్ రఫీలు ఆందోళనను అదుపు చేశారు. ఆందోళనకారులు బాధితురాలు వసంతతోపాటు పోలీస్స్టేషన్కు వచ్చి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కమిషనర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 354–ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మారెన్న తెలిపారు. డీఎస్పీ విచారణ కడప డీఎస్పీ మాసూంబాషా ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్కు వచ్చి విచారణ చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేత హర్షవర్ధన్రెడ్డి, సీ పీఐ నాయకురాలు మంజుల డీఎస్పీని కలిసి కోరారు. కమిషనర్ ఏమంటున్నారంటే.. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విజయసిం హారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తనపై నిందా ఆరోపణలు వేస్తున్నారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ స మావేశంలో జీఓ 279ను ఆమోదం చేయాలని అజెం డాలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ఈ జీ వో అమలులోకి వస్తే ఉద్యోగ భద్రత ఉండదని నెపం తో కార్మికులు తన పైన నిందలు వేస్తున్నారని చెప్పా రు. తాను కార్మికులను బలవంతం చేయలేదన్నారు. కమిషనర్ బదిలీ ఎర్రగుంట్ల మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తనను బదిలీ చేయాలని ఆయన రెండు వారాల క్రితం ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. -
మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్ర: నాని
సాక్షి, గుడివాడ(కృష్ణా జిల్లా): తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు మరోసారి బహిరంగంగా బట్టబయలయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనుకున్న అధికారి పార్టీ కుటిల యత్నాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ తవ్వుకున్న గోతిలో ఆపార్టీయే పడిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బలం పెరిగిందనుకొని వైస్ చైర్మన్పై అవిశ్వాసం ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. శనివారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సివుండగా ఇద్దరు కౌన్సిలర్లు కనిపించడం లేదని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీని ఫిరాయింపులపై ఎండగట్టాలని అనుకున్నామని వివరించారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే టీడీపీలోని గ్రూపులు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. -
తనిఖీలకొస్తే తలుపేశారు !
రికార్డుల తనిఖీలకు వచ్చిన విజిలెన్స్ అధికారులకు ఎవరైనా ఏం చేస్తారు.. రికార్డులు చూపించి సహకరిస్తారు. కానీ బందరు మున్సిపల్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రికార్డులు చూపించడం సంగతి అటుంచితే.. కనీసం తలుపులు కూడా తీయలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ ఒక్క వ్యవహారం చాలు ఆశాఖలో ఏ మేరకు అవినీతి రాజ్యమేలుతోందో తెలిపేందుకు అని పరిశీలకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, మచిలీపట్నం: 2016–17 ఆర్థిక సంవత్సరంలో బందరులో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకంలో జోన్–2 పరిధిలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రూ.5 కోట్లు వెచ్చించి చేపట్టిన పనుల్లో నిబంధనలు తోసిరాజని, ధనార్జనే ధ్యేయంగా ముందుకు కదిలారు. నాసిరకం నిర్మాణాలతో రూ.లక్షలు దిగమించారు. ఈ అక్రమ తంతుపై ఇటీవల ‘నిధులు గుల్ల.. పనులు డొల్ల.’ అనే శీర్షికతో ఈనెల 24 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దోపిడీ పర్వంపై విశ్లేషణతో కూడిన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. ఈ అక్రమ బాగోతం గుట్టురట్టు చేసేందుకు రికార్డులు తనిఖీ నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే మంగళవారం బందరు మున్సిపల్ కార్యాయానికి వెళ్లారు. ముఖం మీదే తలుపేశారు.. ఇప్పటికే బాక్స్ టెండర్ల అంశంలో అవినీతిని మూటగట్టుకున్న విషయం తెలిసింది. తాజాగా ‘సాక్షి’ కథనం సైతం కలకలం రేపింది. ఇదే సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమ తంతుపై కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు నిజాలు నిగ్గుతేల్చేందుకు మంగళవారం మచిలీపట్నంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పాలకవర్గం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రస్తుతం అధికారులకు సహకరించి రికార్డులు సమర్పిస్తే తమ బండారం బయట పడుతుందని భావించారు. ఎలాగైనా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేశారు. అప్పుడే ఓ ఉపాయానికి తెర తీశారు. ఎలాగో వైఎస్సార్ సీపీ బంద్ కొనసాగుతోందని, బంద్ ముసుగులో మస్కా కొట్టాలని తలంచారు. అనుకున్నదే తడువుగా వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. ఇందులోనే మున్సిపల్ అధికారులు రెవెన్యూ సెక్షన్కు చేరుకున్నారు. అక్కడే అసలు కథ ప్రారంభమైంది. అక్కడికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు తలుపు వద్దకు వెళ్లగా ఒక్కసారిగా మూసేశారు. అదేమని ప్రశ్నించగా.. ఈ రోజు రాష్ట్ర బంద్ కొనసాగుతోందని, ప్రస్తుతం కార్యాలయం తెరిస్తే.. ఆందోళన కారులు కార్యాలయంలోకి ప్రవేశిస్తే నష్టం జరుగుతుందని, అందుకే తలుపులు మూసేస్తున్నామని నమ్మబలికారు. బంద్ అనంతరం బుధవారం వస్తే మీకు సహకరిస్తామని చెప్పినట్లు సమచారం. తాము విజిలెన్స్ అధికారులమని చెప్పినా పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉదయం వచ్చిన విజిలెన్స్ అధికారులు గంటలకొద్దీ అక్కడే కూర్చున్నా లాభం లేకుండా పోయింది. ఎంతకూ ఏ ఒక్క అధికారి సైతం సహకరించకపోవడంతో చేసేది లేక వెనుదిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కనీసం అధికారులకు సహకరించలేదంటే మున్సిపాలిటీలో ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేనున్నప్పుడు వస్తామన్నారు బందరు మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం విజిలెన్స్ అధికారులు వచ్చిన మాట వాస్తవమే. అయితే బంద్ కావడంతో ఆ రోజు నేనే విధులకు హాజరు కాలేదు. నేను కార్యాలయంలో ఉన్న రోజు వస్తామని మా సిబ్బందితో చెప్పి వారు వెళ్లిపోయారు. – సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
లావణ్య పదవి ఊడింది!
సాక్షి, భువనగిరి : రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. మంగళవారం ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మొత్తం 30 మంది సభ్యుల్లో.. ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్పర్సన్గా పాలన కొనసాగించారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనిని సీరియస్గా తీసుకున్న ఎమ్మేల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఆమె పదవి కోల్పోయేలా చేశారు. అవిశ్వాసం సందర్భంగా ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అక్రమంగా కౌన్సిలర్లు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. చిచ్చు ఇలా మొదలైంది.. మే30వ తేదీన 14ఎజెండా అంశాలతో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్, అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు మొదలైంది. ఇది కాస్త తారస్థాయికి చేరింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లలో కొందరు చైర్పర్సన్పై అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చారు. అనంతరం వీరి మధ్య సయోధ్య కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు అనుకూలంగా లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ జూన్ 28న సొంతగూటి(బీజేపీ)లో చేరారు. ఈనెల 4వ తేదీ నాటికి పాలకవర్గానికి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో సహా మొత్తం 24మంది సంతకాలతో చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్కు నోటీసు అందజేశారు. అవిశ్వాసానికి తమ మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంతకాలు చేసినప్పటికీ తమ ఇద్దరు కౌన్సిలర్లను టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
డ్రైనేజీ నీళ్లతో ఏం చేశారంటే...
సాక్షి, తిరువనంతపురం: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో, కేరళ అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. హోటల్ సిబ్బంది మురుగు నీటితో ప్లేట్లు కడుగుతుండటం గమనించిన ఓ యువకుడు.. వీడియో తీసి వైరల్ చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. అలప్పుజా మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ ప్రాంగణం వర్షాల కారణంగా వరద నీటితో నిండిపోయింది. పైగా హోటల్ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినటంతో ఆ నీరు కూడా వరద నీటిలో కలిసిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ థియేటర్కు.. ఓ యువకుడు సినిమా చూసేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దృశ్యం కనిపించేసరికి వీడియో తీసి.. వాట్సాప్ గ్రూప్లకు పంపించాడు. అది కాస్త వైరల్ కావటం.. ఆ వీడియో మున్సిపాలిటీ అధికారుల దృష్టికి రావటంతో హోటల్ను సీజ్ చేసి.. యాజమానికి జరిమానా విధించారు. -
మురుగునీటితో హోటల్ సిబ్బంది చేసిన నిర్వాకం
-
బతికి ఉన్న వ్యక్తికే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు!
-
ఫేక్ ఫోటోలతో పరువు పాయె...
ఫేక్ ఫోటోలతో మున్సిపాలిటీ కార్పొరేషన్ అభాసుపాలైంది. స్వచ్ఛ మ్యాప్ యాప్లో తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసి.. సోషల్ మీడియాలో పరువు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గురుగ్రామ్ ప్రాంతంలోని పలు సెక్టార్లలో ఫిర్యాదుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ 2016, అక్టోబర్లో ఓ యాప్ను ప్రజల్లోకి వదిలింది. తాజాగా 24 గంటల్లో కొన్ని ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయంటూ ఓ ప్రముఖ పత్రికలో ఫోటోలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే అందులోని ఓ ఫోటోను గమనించిన ఓ వ్యక్తి.. అది ఫేక్ అంటూ వాస్తవ పరిస్థితిని తెలిపే ఓ ఫోటోను తన ఫేస్బుక్లో పెట్టాడు. అంతేకాదు సదరు పత్రిక పోర్టల్కు దానిని ట్యాగ్ చేశాడు. దీంతో సదరు పత్రిక రిపోర్టర్ వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించగా.. అధ్వానమైన స్థితులే కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం ఫేక్ అని తేలిపోగా.. సోషల్ మీడియా మున్సిపల్ కార్పొరేషన్పై విరుచుకుపడుతున్నారు. అయితే ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ యశ్పాల్ యాదవ్.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
నేనే రాజు.. నేనే మంత్రి!
మోస్మన్/ఆస్ట్రేలియా: ఈ ఫొటోలో ఉన్న ఆయన పేరు పాల్ డెల్ప్రాట్. వయసు 76 సంవత్సరాలు. వృత్తి రీత్యా రచయిత, చిత్రకారుడు.. చూడటానికి అచ్చు రాజులా కనిపిస్తున్నాడు..! ఏ దేశానికి రాజు అని ఆలోచిస్తున్నారా.. ఆయన ఆస్ట్రేలియాలోని మోస్మన్ అనే మున్సిపాలిటీకి చెందిన సామాన్య పౌరుడు. అయితే ఇటీవలే ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ వై’ అనే రాజ్యాన్ని నెలకొల్పి తనకు తాను రాజుగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులపై కోపంతో సొంతరాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. 1993లో తన నివాస స్థలానికి రోడ్డు వేయాల్సిందిగా అధికారులకు విన్నవించుకున్నారు. అప్పటినుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే దారిలో వాతావరణ పరంగా చాలా ముఖ్యమైన పొదలు, చెట్లు ఉన్నాయని, రోడ్డు వేయడం కుదరదని అధికారులు తేల్చేశారు. తన ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి దారి లేదని, ఎలాగైనా రోడ్డు వేయాల్సిందిగా ఎంత కోరినా అధికారులు కుదరదని చెప్పారు. దీంతో ఏం చేయలేక సొంత రాజ్యం ఏర్పరచుకుని ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ వై’ అని పేరు పెట్టుకున్నారు. 2004 నవంబర్ 15న ఈ కొత్త రాజ్యానికి మున్సిపాలిటీ మేయర్ కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే ఆస్ట్రేలియాలో ఇలా మినీ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ దాదాపు 300 వరకు మినీ రాజ్యాలు.. వాటికి రాజులు కూడా ఉన్నారట. ప్రభుత్వానికి పన్నులు కట్టినన్ని రోజులు అధికారులు వీరిని ఏమీ అనరట. -
సమ్మె బాట పట్టిన మున్సిపల్ కార్మికులు
-
ప్రియాంక చోప్రాకు నోటీసులు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసింది. ప్రియాంకకు సంబంధించిన వాణిజ్య సముదాయంలో అనధికారిక నిర్మాణాలు చేసినందుకు గాను బీఎంసీ రెండు వేరు వేరు నోటీసులు పంపింది. పశ్చిమ అంథేరిలోని ఒషివారా ప్రాంతంలో ప్రియాంక చోప్రాకు ఓ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. వాస్తు కోసం ఈ బిల్డింగ్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేసినందుకుగాను ఈ నోటీసులు పంపారు. అదే బిల్డింగ్ లోని బ్యూటీ స్పాకు వచ్చిన వారి ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు, 2013లో ముంబై మున్సిపల్ అధికారుల మంజూరు చేసిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్టుగా గుర్తించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో చర్చలు తీసుకుంటామని తెలిపారు. -
‘పన్నులు పెంచితే ఉద్యమిస్తాం’
సాక్షి, అమరావతి : పన్నులు పెంచమని అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దొడ్డిదారిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్మించారు. ఆస్తి పన్ను కట్టకపోతే రెండు రూపాయలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలు వసూలు చేస్తామని నోటీసులు పంపడం అనైతికమన్నారు. నగరపాలక సంస్థతో పాటు ఇతర పాంత్రాల్లో వాటర్, డ్రైనేజీ, చెత్త ఇతర సర్వీసు ఛార్జీలతో పాటు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నరని తెలిపారు. నగర పాలక సంస్థ మరుగు దొడ్ల మీద కూడా వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. నగర ప్రజలకు పన్నుల చెల్లింపులో నోటీసులు సీడీఎమ్ఎ తరుఫున ప్రభుత్వమే ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. టీడీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పన్నులు రెట్టింపు చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన మంచినీటి, డ్రైనేజి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 దాటితే వడ్డీ వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ చివరి వరకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వడ్డీల భారాన్ని తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు. -
కాపాడే వారెవరురా...!
తిరుమల బైపాస్ రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న మొహబూబా లే అవుట్ పార్క్ స్థలంలో 1980 నుంచి రెండేళ్ల క్రితం వరకు ఇది కార్పొరేషన్ స్థలం.. ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు అన్న బోర్డు ఉండేది. కానీ ఇప్పుడా ప్రదేశంలో భారీ భవంతి వెలసింది. కోటిన్నర రూపాయల విలువ చేసే 30 అంకణాల∙స్థలాన్ని అధికార పార్టీ నాయకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కబ్జా చేశారు. కార్పొరేషన్ రికార్డుల ప్రకారం ఈ స్థలం ఇప్పటికీ పార్క్ స్థలమే. కొంతమంది అధికారులు కబ్జాదారుడికి సహకరించారు. కోటిన్నర విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టేశారు. సాక్షి, తిరుపతి తుడా : తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలకు రక్షణ కరువైంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ 27.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కొన్ని స్థలాలు ఏళ్ల క్రితమే కనుమరుగయ్యాయి. ఆ ఆక్రమణల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారులే ఆక్రమణదారులతో చేతులు కలుపుతున్నారు. స్థలాలకు ఎసరు పెడుతున్నారు. సుమారు 11 ప్రాంతాల్లోని స్థలాలను కబ్జారాయుళ్లు కొట్టేశారని అంచనా. ఇవన్నీపోగా ఇప్పుడు 43 స్థలాలు మాత్రమే మిగిలాయి. గతంలో కొంతమంది కమిషనర్లు స్థలాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ మాత్రమైనా మిగిలాయని బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన ఖరీదైన స్థలాలనైనా పూర్తిస్థాయిలో రక్షించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. 2008లో కార్పొరేషన్లోకి మూడు పంచాయితీలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతంలో 27స్థలాలు కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 23 స్థలాలకు కనీసం ప్రహ రీ గోడలను కూడా ఏర్పాటు చేయలేదు. అప్పటి పంచాయితీలకు చెందిన స్థలాలు, ప్రైవేట్ వెంచర్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన పార్కు స్థలాలు ఇప్పుడు కార్పొరేషన్ చేతిలోకి వచ్చాయి. పాత నగర పరిధిలో స్థలాలను కాపాడలేకపోయిన అధికారులు కనీసం విలీన పంచాయితీల స్థలాలనైనా కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వెంచర్లలోని పార్కు స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రహరీగోడ నిర్మించి స్థానిక అవసరాల నిమిత్తం అభివృద్ధి చేపడితేగానీ వీటిని కాపాడగలరు. ప్రహరీగోడలను సైతం నిర్మించకుండా అధికారులు ఈ స్థలాలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీటిపై స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు కన్నుపడింది. ఆక్రమించి నిర్మాణాలు చేపట్టకముందే అధికారులు రక్షించుకోవాల్సిన బాధ్యత పై స్థాయి అధి కారులపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట.. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అధికారులు లీజు పేరుతో కార్పొరేషన్ స్థలాలను కొంతమందికి కట్టబెట్టారు. ఇప్పటికీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. లీజు పేరుతో స్థలాలను ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తులు కోర్టుద్వారా స్టేలు తెచ్చుకుంటూ ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. అధికారులు సమర్ధంగా తమ వాదనను కోర్టులో వినిపిస్తే ఎప్పుడో ఈ స్థలాలను కార్పొరేషన్ చేజిక్కించుకునేది. కొంతమంది అధికారులు ఆ వ్యక్తులతో లాలూచీ పడి విలువైన స్థలాలను కార్పొరేషన్కు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతి గాంధీరోడ్డు లాంటి ప్రాంతంలోని స్థలాన్ని అతితక్కువ అద్దెతో నెట్టుకొస్తున్నారు. పదేళ్ల నుంచి ఇక్కడ మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రతిపాదన ఉంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. ఈ స్థలా న్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా అధికారులు స్పందిం చడం లేదు. శ్రీనివాసం సముదాయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 15 ఏళ్లక్రితం ఓ వ్యక్తి హోటల్ నడిపేందుకు కార్పొరేషన్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి ఆ స్థలాన్ని తీసుకునేం దుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రైల్వేస్టేషన్ పార్సిల్ సర్వీస్కు ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా మార్చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో కార్పొరేషన్ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. -
పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్ బి.దేవ్ సింగ్ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా, ఎస్.పంకజను పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా, పి.సరోజను రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా బదిలీ చేశారు. పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న ఎన్.వాణిశ్రీతో పాటు నిజామాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్ ఎం.మంగతాయారును జీహెచ్ఎంసీకు బదిలీ చేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్ డి.జగన్ను ఖమ్మం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా, వేములవాడ మున్సిపల్ కమిషనర్ ఎ.జగదీశ్వర్ గౌడ్ను ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్గా, ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ శైల జను నిర్మల్ జిల్లా మెప్మా అకౌంటెంట్ (ఆర్మూ రు కమిషనర్గా అదనపు బాధ్యతలు), నిర్మల్ మెప్మా అకౌంటెంట్ పెద్ద రామేశ్వర్ను పెద్ద అంబర్పేట్ మున్సిపల్ కమిషనర్గా, జగిత్యాల మునిసిపాలిటీ మేనేజర్ కె.గంగారాంను వేములవాడ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. -
దర్జాగా డాగ్ స్లీపింగ్
ఒంగోలు టౌన్: నగరంలో శునకాలను నిరోధిస్తామంటూ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పదేపదే చెప్పినప్పటికి, వారికి సవాల్ చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం కునుకు తీసింది. మునిసిపల్ ఇంజనీర్ ఛాంబర్కు సమీపంలో ఆ శునకం దర్జాగా నిద్రపోయింది. ఒకవైపు మునిసిపల్ కార్యాలయ ప్రాంగణమంతా సబ్సిడీ రుణాల కోసం కోలాహలంగా ఉంది. మరోవైపు కార్యాలయ సిబ్బంది ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఒక శునకం నీడపట్టు కోసం ఏకంగా మునిసిపల్ ఇంజనీర్ ఛాంబర్ ఉండే కారిడార్నే ఎంచుకొంది. దానికి అక్కడ చల్లగా ఉండటంతో గోడకు ఒకవైపు గంటల తరబడి పడుకొని నిద్రించింది. అటూ ఇటూ రాకపోకలు సాగించే సిబ్బంది, వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చే ప్రజలు దానిని చూసుకుంటూ వెళ్లారు. మునిసిపల్ సిబ్బంది అయితే దానిని తరుముదామన్న ఆలోచన కూడా రాకపోవడం గమనార్హం. నగరంలోని రోడ్లలో శునకాలు లేకుండా చేస్తామని మునిసిపల్ అధికారులు పదేపదే ప్రకటిస్తుండగా, వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గంటల తరబడి కునుకు తీసింది. -
తనఖా తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల్లో ఇకపై చేపట్టనున్న అన్ని భవన నిర్మాణాలకు తనఖా నిబంధన తప్పనిసరి కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్ల వరకు, మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్ల వరకు ఉన్న స్థలాల్లో.. గరిష్టంగా 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు తనఖా నిబంధన నుంచి మినహాయింపు ఉంది. అంతకు మించిన స్థలాల్లో, ఎత్తుతో నిర్మించే భవనాల్లో పది శాతం నిర్మాణ స్థలాన్ని స్థానిక పురపాలక సంస్థకు తనఖా పెట్టాల్సి ఉంటుంది. భవన నిర్మాణ నిబంధనలను, అనుమతులను ఉల్లంఘిస్తే.. సదరు భవనం/నిర్మాణంలో తనఖా పెట్టిన భాగాన్ని సదరు పురపాలక సంస్థ స్వాధీనం చేసేసుకుంటుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టకుండా నియంత్రించేందుకు ఈ ‘తనఖా’నిబంధనను అమలు చేస్తున్నారు. ఇక ముందు పురపాలక సంస్థల్లో చేపట్టే అన్ని భవన నిర్మాణాలకు ఎలాంటి మినహాయింపు లేకుండా ఈ నిబంధన వర్తించనుంది. ఉల్లంఘిస్తే స్వాధీనమే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టణాభివృద్ధికి, ఇళ్లు, భవనాల నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, నిబంధనలు ఉంటాయి. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను నియంత్రించేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. అయితే భవనం ముందుభాగంలో, చుట్టూ ఖాళీ స్థలం వదలడం (సెట్బ్యాక్), ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిమితులు, స్థలం విస్తీర్ణం మేరకు భవనం ఎత్తు, అంతస్తులు ఉండటం వంటి నిబంధనలను యజమానులు సరిగా పట్టించుకోవడం లేదు. దాంతో నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా నిర్మాణాలు జరపకుండా పురపాలక శాఖ ‘తనఖా’నిబంధనను అమల్లోకి తెచ్చింది. మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లకుపైగా, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో భవనాలు నిర్మించేవారు.. ఆయా నిర్మాణ వైశాల్యంలో 10 శాతం భాగాన్ని స్థానిక పురపాలికకు తనఖా పెట్టిన తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ మేరకు యజమానులు నిర్మాణ వైశాల్యంలోని 10 శాతం భాగాన్ని నోటరీ అఫిడవిట్ ద్వారా పురపాలక సంస్థకు తనఖా పెట్టాలి. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ తనఖా పెట్టిన ప్రాంతాన్ని చేర్పించాలి. ఆ తర్వాతే భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతాయి. అనుమతుల మేరకు భవన నిర్మాణం జరిగిందని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఈ సర్టిఫికెట్ను చూపిస్తేనే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని యజమాని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎవరైనా అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే.. తనఖా పెట్టిన 10 శాతం భాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం స్థానిక మున్సిపాలిటీలకు ఉంటుంది. ప్లాట్లను విభజిస్తూ నిర్మాణాలు... తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి అధిక శాతం యజమానులు ప్లాట్లను విభజించి.. వేర్వేరు నిర్మాణాలుగా చూపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. పెద్ద స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నా.. వాటిని నిబంధనల మేరకు మున్సిపాలిటీల్లో 300 చదరపు మీటర్లలోపు, కార్పొరేషన్లలో 200 చదరపు మీటర్లలోపు నిర్మాణాలుగా విభజించి.. తనఖా పెట్టకుండానే భవన నిర్మాణ అనుమతులు పొందుతున్నట్టు తేల్చారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుపుతున్నారని గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇలాంటి భవనాలను కూల్చివేయడం తప్ప ఇతర ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కానీ కూల్చివేత వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి పురపాలికలు వెనకడుగు వేస్తున్నాయి. అసలు తనఖా నిబంధన నుంచి తప్పించుకోవడానికి ప్లాట్లను విభజించి అనుమతులు పొందాలని.. లైసెన్డ్ బిల్డింగ్ ప్లానర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, పురపాలికల టౌన్ ప్లానింగ్ సిబ్బందే సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మినహాయింపులను తొలగించి.. అన్ని భవన నిర్మాణాలకు 10 శాతం తనఖా నిబంధనను వర్తింపజేయాలని రాష్ట్ర పురపాలక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే.. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది. -
ఎల్ఆర్ఎస్కు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకుని గడువులోగా ఫీజు చెల్లించలేకపోయిన వారికి శుభవార్త. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. గత నెలాఖరుతో ముగిసిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన గడువును మరో నెల రోజులు పొడిగించడంతో పాటు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015, నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టి నిర్దేశిత ఫీజులతో సహా దరఖాస్తుల సమర్పణకు 2016, మార్చి వరకు సమయమిచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద 2.6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 20 వేలకు పైగా దరఖాస్తుదారులు గడువులోగా ఫీజులు చెల్లించలేకపోయారు. రెండేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. ఫీజు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తే ఈ దరఖాస్తులను సైతం పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో హెచ్ఎండీఏతో పాటు ఇతర పురపాలికలకు మరింత ఆదాయం రానుందని భావిస్తోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు గత నెలాఖరుతో ముగిసింది. అప్పటికి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ నెలాఖరులోగా గడువు పొడిగించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశముంది. -
చంద్రబాబు హోదా కొసం పోరాటం అంటే ఇదేనా?
-
రసాభాసగా విజయవాడ మున్సిపల్ సమావేశం
-
ఇక ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణ!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణలు జరపాలని మునిసిపాలిటీలను పురపాలక శాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్ నిర్మాణం చేసిన, విస్తరించిన భవనాలు, కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం పూర్తయితే 30 రోజుల్లోగా, పూర్తికాకున్నా గృహ ప్రవేశం చేస్తే తక్షణమే పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. భవన యజమాని మారినా, భవన వినియోగం (గృహ, వాణిజ్య) మారినా సవరణలు జరపాలని పేర్కొంది. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు.. ఆస్తి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, క్షేత్ర స్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించింది. మునిసిపాలిటీల్లోని అన్ని గృహాలు, భవనాలకు సంబంధించిన ఆస్తి పన్నుల జాబితాలను యజమానుల ఆధార్ నంబర్తో అనుసంధానం చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను ఆదేశించింది. మునిసిపాలిటీలకు జారీ చేసిన ఆదేశాలివే.. కొత్తగా ఏర్పాటైన బాదెపల్లి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంపును ఏప్రిల్ 1 నుంచి, దుబ్బాక మునిసిపాలిటీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలి. కొత్తగా ఏర్పాటవనున్న 68 పురపాలికల పరిధి లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నుల వివరాలను ఆయా గ్రామ పంచాయతీల నుంచి పు రపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాలి. (మునిసిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపును చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు) 72 పురపాలికల్లో ఉన్నఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ జరిపించి ఆస్తి పన్నుల జాబితాలోని ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50% తక్కువగా పన్నులు వసూలైనట్లు వెల్లడైంది. దీంతో ఈ నెల 15 లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే బిల్డింగ్ నమూనా ఆధారంగా ఆస్తి పన్ను గణన చేసేందుకు కొత్త విధానం తీసుకురావాలి. ఆస్తి పన్నుల సవరణలపై భవన యజమానుల నుంచి వచ్చిన 4,292 అభ్యంతరాలు ముని సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలి. అనుమతి లేకుండా నిర్మించిన.. ప్రైవేటు, ప్రభు త్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా 100% ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గతం లో ఇచ్చిన ఉత్తర్వులను మునిసిపాలిటీలు అమ లు చేయాలి. పన్నుల డిమాండ్ నోటిసులో ‘భవ న యజమాని’పేరుకు బదులు ‘భవనాన్ని అధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు’అని రాయాలి. -
‘మునిసిపల్’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్ : మునిసిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 73 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.8,300 నుంచి రూ.12,000లకు, డ్రైవర్ల వేతనాలు రూ.15 వేలకు, కంప్యూటర్ ఆపరేటర్లు/సీనియర్ అసిస్టెంట్లు/ఇతర కార్యాలయ సిబ్బంది వేతనాలు రూ.17,500కు పెరగనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీతో పురపాలక శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. పెరిగిన వేతనాలను ఏప్రిల్ నుంచే అమలు చేయనున్నారు. పెంపు ద్వారా 17,022 మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వీరిలో 11,497 మంది పురుషులు.. 5,525 మంది మహిళలున్నారు. జీవో నంబర్ 14 ప్రకారం.. రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ 2016 ఫిబ్రవరి 19న ఆర్థిక శాఖ జీవో నం.14 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కార్మికుల వేతనాలు పెంచుతామని శ్రీదేవి హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. వేతనాల పెంపుతో పాటు బకాయి వేతనాల చెల్లింపు, ఎన్ఎంఆర్ ఫిక్స్డ్ పే కార్మికుల క్రమబద్ధీకరణ, అంత్యక్రియల ఖర్చుకు రూ.20 వేలు, చెప్పులు, నూనెలు తదితర డిమాండ్లపై త్వరలో ఆదేశాలు జారీ చేస్తామన్నారని తెలిపారు. వేతనాల పెంపు కోసం ఈ నెల 25 నుంచి సమ్మె బాట పట్టిన కార్మికులు.. పెంపునకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమించి ఆదివారం విధులకు హాజరయ్యారు. జీహెచ్ఎంసీలో రెండేళ్ల కిందట ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచిన విషయం తెలిసిందే. పురపాలికల తీర్మానాలతో.. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపునకు అనుకూలంగా ఇప్పటికే 56 పురపాలికలు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేశాయి. పెంపును వ్యతిరేకిస్తూ నర్సంపేట మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. మిగిలిన 16 పురపాలికలు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. అన్ని పురపాలికల్లో ఈ నెల 30లోగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెంపుపై తీర్మానం చేయాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది. పెంపునకు వ్యతిరేకంగా తీర్మానించిన నర్సంపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి అనుకూలంగా తీర్మానం చేయాలని అక్కడి అధికారులను ఆదేశించినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. కొత్త పురపాలికల్లోనూ.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ హోదా గల 136 గ్రామాల విలీనంతో రాష్ట్రంలో 68 కొత్త పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 45 పురపాలికల్లో మరో 173 గ్రామాలు విలీనమవనున్నాయి. వచ్చే ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాంతాల్లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కూడా తక్షణమే అమల్లోకి రానుంది. ఇతర పురపాలికలతో సమానంగా కొత్త పురపాలికల్లోనూ వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. -
‘పుర’ కార్మికులకు వేతనాల పెంపు
సాక్షి, హైదరాబాద్ : పురపాలికల కౌన్సిల్ అనుమతితో వెంటనే ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపును అమలు చేసి వారితో సమ్మె విరమింపజేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏ పురపాలిక కౌన్సిల్ అయినా తీర్మానం చేయకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల న్నారు. శనివారం సచివాలయంలో మున్సి పల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్లో ఆయన మాట్లాడుతూ.. వేతనాల పెంపునకు మునిసిపాలిటీల నిధులు వినియోగించుకోవాలన్నారు. మునిసిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందుబాటులో ఉండి పారిశుధ్య సమస్య లేకుండా చూడాలన్నారు. సమ్మె కొనసాగు తున్న చోట ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మునిసిపల్శాఖ మంత్రి ఆదేశించా రని ఆయన చెప్పారు. అనుకూల వార్తలకు చర్యలు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌర సంబం ధాల అధికారులు సమన్వయం చేసుకుని మీడియాలో అనుకూల వార్తలు వచ్చేలా చూడాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఖమ్మం కార్పొ రేషన్ 99% వసూలు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
మాచర్ల: ఏసీబీ అధికారుల వలకు అవినీతి చేప చిక్కింది. మాచర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగభూషణ ప్రసాద్ రూ.18 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన కె.వేణుగోపాల్ ఇంటికి రూ.800 పన్ను వస్తోంది. అయితే అంతకన్నా ఎక్కువ పన్ను పడుతుందని, తనకు రూ.20 వేలు ఇస్తే సరిచేస్తానని వేణుగోపాల్కు ఆర్ఐ నాగభూషణ ప్రసాద్ సూచించారు. తాను ఇంటిపన్ను రూ.800 చెల్లిస్తున్నానని, రూ.20 వేలు ఎందుకు ఇవ్వాలని వేణుగోపాల్ అడిగినా ఆర్ఐ పట్టించుకోకుండా వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆర్ఐ నాగభూషణ ప్రసాద్ను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు గురువారం మాచర్లకు చేరుకున్నారు. బాధితుడికి తొమ్మిది రూ.2వేల నోట్లకు రసాయనాలు పూసి ఆర్ఐ వద్దకు పంపించారు. బాధితుడి నుంచి ఆర్ఐ రూ.18 వేల నగదు తీసుకోగానే ఏసీబీ డీఎస్పీ దేవానంద్, సీఐలు వెంకటేశ్వర్లు, ఫిరోజ్ దాడిచేసి నగదు స్వాధీనంచేసుకుని, ఆర్ఐ చేతులను పరీక్షించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి అరెస్టు చేశారు. ఆర్ఐతోపాటు పురపాలక సంఘ అధికారులను విచారణ చేశారు. గతంలోనూ ఏసీబీ దాడులు గత ఏడాది పట్టణ పోలీసు స్టేషన్లో అప్పటి ఎస్ఐ నారాయణరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అంతకు ముందు వీఆర్ఓ ప్రసాద్, దుర్గి వీఆర్ఓ కూడా మాచర్లలో ఏసీబీ అధికారులకు దొరికారు. తాతాజా మున్సిపల్ ఆర్ఐ ఏసీబీకి చిక్కడంతో పట్టణంలో చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి మునిసిపల్ సమ్మె
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం ప్రకటించింది. కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని జేఏసీ నేతృత్వంలోని కార్మిక సంఘాలు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రస్తుతం పురపాలికల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా రూ.8,300 వేతనం చెల్లిస్తున్నారు. జీవో నం.14 ప్రకారం కార్మికుల వేతనాలను కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంటూ 11న పురపాలక శాఖ డైరెక్టర్కు సమ్మె నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నామని ప్రకటించింది. స్తంభించనున్న సేవలు.. మునిసిపల్ సమ్మెతో రాష్ట్రంలోని పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు స్తంభించిపోనున్నాయి. నగరాలు, పట్టణాల్లో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ విభాగాల్లోని సిబ్బందితోపాటు బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బంది కూడా సమ్మెబాట పట్టనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పౌర సేవలకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితిలో పారిశుధ్య పనులు నిర్వహించే మునిసిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీల కార్మికుల సంఘాలతో ఏర్పడిన మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మండిపడింది. ‘దేవుళ్ల’ ఎదురుచూపు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు తీవ్ర అవస్తలకు గురయ్యారు. సమ్మెకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచింది. సమ్మె విరమిస్తే మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ప్రకటించడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. సఫాయివాలాలను దేవుళ్లతో పోల్చి వారి సేవలను ఆకాశానికెత్తారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ వాదనలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని మేయర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే మూడు నెలలకోసారి చెల్లిస్తున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో అలానే ఇతర పురపాలికల కార్మికుల విషయంలోనూ అలానే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. -
వేతనాలు, బిల్లులు... నో..!
నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. రూ.లక్షల పెట్టుబడితో చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక ఆంక్షలు విధించిన ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించ లేదు. మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం బిల్లులు అందకపోవడంతో అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లోఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి సాఫ్ట్వేర్ మార్చడమేనని అధికారులు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచిఆర్థిక ఆంక్షలు కొనసాగించడమేనని కార్మికులు, కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే వేతనాల చెల్లింపు బిల్లులను మున్సిపాలిటీలలో అకౌంట్ అధికారులు సిద్ధం చేసినా, జాప్యం జరిగిందంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వం మిగులు నిధులు చూపించేందుకే ఈ తరహా ఎత్తుగడ వేసిందని పలువురు అభిప్రాయపడుతుండగా... ఎప్పుడు బిల్లులకు క్లియరెన్స్ వస్తుందా..? అని ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో రూ.11కోట్ల 10 లక్షల వేతన బకాయిలు చెల్లించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా బడుగు జీవులకు కష్టాలు తప్పవని కార్మికులు వాపోతున్నారు. ఎన్నాళ్లు ఎదురు చూడాలి..?: అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనవరి నెలలోనే పలు అభివృద్ధి పనులు పూర్తిచేశాం. మార్చి నెలలో బిల్లులు చెల్లిస్తారని భావించాం. వడ్డీకి అప్పులు చేసి పనులు జరిపించారు. నేడు ఆ అప్పులను వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు వీడి, తక్షణమే బిల్లులు చెల్లించాలి. – యశోద కృష్ణ, మున్సిపల్ కాంట్రాక్టర్, సాలూరు సాఫ్ట్వేర్ మార్చడంతో సమస్య... పాత విధానంలో కాకుండా కొత్త సాఫ్ట్వేర్ను ప్రభుత్వం అమలు చేయడంతో సమస్య తలెత్తింది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మోనటరింగ్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)పై అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రత్యేక శిక్షణ ఇస్తే త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. – ఎం.ఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
ఆలన లేని పురపాలన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పాలన గాడినపడటం లేదు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు అరకొర ఉద్యోగులతో నెట్టుకొస్తున్నాయి. జనాభాకు తగ్గట్లు మానవ వనరులు లేక పురపాలికలు స్థానిక ప్రజలకు కనీస సదుపాయాలు, మౌలిక సేవలు అందిం చ లేకపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే జూన్ 1 నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 71 పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 72 పురపాలికల్లో తీవ్ర ఉద్యోగుల కొరత ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికలకు ఉద్యోగులను సర్దుబాటు చేయడంపై పురపాలక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పురపాలికల్లో ప్రజలకు వేగంగా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం సంస్కరణలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే, చాలా మునిసిపాలిటీల్లో సరిపడ సంఖ్యలో ఉద్యోగులు లేక ఈ సంస్కరణలు అమలు కావడం లేదు. పెండింగ్లోనే పోస్టుల భర్తీ ప్రతిపాదనలు నాలుగేళ్ల కింద కొత్తగా ఏర్పాటైన 11 నగర పంచాయతీల కోసం 1,100 కొత్త పోస్టులు సృష్టించాలని రాష్ట్ర పురపాలక శాఖ పంపించిన ప్రతిపాదనలు గత మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండిపోయాయి. రెండేళ్ల కింద ఏర్పాటు చేసిన మరో 4 పురపాలికలకు అవసరమైన పోస్టులను సైతం ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో ఇతర పురపాలికల నుంచి ఉద్యోగులను సర్దుబాటు చేశారు. పాత పురపాలికలకు మంజూరైన పోస్టుల్లో 26 గ్రేడ్–2 మునిసిపల్ కమిషనర్లు, 19 గ్రేడ్–3 మునిసిపల్ కమిషనర్ల పోస్టులతో పాటు ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, అకౌంట్స్ విభాగాల్లో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్ని పురపాలికలకు ఇన్చార్జీ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 71 మునిసిపాలిటీల్లో కనీసం 2,556 కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయాల్సి ఉంది. -
మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్ మహాజన్ భార్య సాధనా మహాజన్ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిరీశ్ మహాజన్.. అన్నాహజారే దీక్ష, మహా రైతుల ర్యాలీ సమయంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఫడ్నవిస్కు సలహాలు ఇవ్వడం ద్వారా ట్రబుల్ షూటర్గా పేరు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్య గెలుపొందడం ద్వారా మహా రాజకీయాల్లో పట్టు సాధించడం ఆయనకు మరింత సులభంగా మారింది. సొంత పార్టీలోనే శత్రువుగా భావించే ఏక్నాథ్ ఖడ్సేపై పై చేయి సాధించినట్టయింది. ఇది ప్రజా విజయం : గిరీశ్ మహాజన్ జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై గిరీశ్ మాట్లాడుతూ.. జామ్నర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎన్సీపీ నాయకుల కుల రాజకీయాలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చారు : ఎన్సీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. గిరీశ్ మహాజన్ ఇంటింటికీ తిరిగి ఓటుకు 5 వేల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. -
ఇల్లు పల్లెలో.. పొలం పట్నంలో..
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సౌకర్యం, అభివృద్ధి కోసం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తారు.. అప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లోకి శివారు గ్రామాలను కలుపుతారు.. ఇలా చేయాలంటే ఆ గ్రామాలు/ఆవాస ప్రాంతాలకు పట్టణ ప్రాంత లక్షణాలు ఉండాలి.. వ్యవసాయేతర ఉపాధి నుంచి వాణిజ్య సముదాయాల వరకు పట్టణాల తరహా సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలి. కానీ తాజాగా రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, పాత మున్సిపాలిటీల విస్తరణలో పలుచోట్ల ఇందుకు భిన్నంగా జరిగింది. కొన్నిచోట్ల పట్టణాల తరహా లక్షణాలు లేకున్నా, పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్నా కూడా పలు గ్రామాలను కొత్త/పాత మున్సిపాలిటీల్లో చేర్చారు. దగ్గరగా ఉన్న గ్రామాలు/ఆవాసాలను వదిలేసి వాటికి అవ తల దూరంగా ఉన్నవాటిని కలిపేశారు. ఉదా హరణకు.. జగిత్యాల మున్సిపాలిటీకి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్ గ్రామాన్ని వదిలేసి.. దానికి అవతల మరో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారక రామనగర్ను మున్సిపాలిటీలో కలిపారు. మరికొన్ని చోట్ల గ్రామాల్లో ఇళ్లు, ఆవాసాలను వదిలేసి.. కేవలం వాటి పరిధిలోని భూము లను మాత్రమే విడదీసి మున్సిపాలిటీల్లో చేర్చారు. పురపాలక సంస్థలంటేనే జనాభా ఎక్కువగా ఉన్న చోట వారికోసం ప్రణాళికా బద్ధంగా అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలుకల్పించే వ్యవస్థలు. అలాం టిది ఇళ్లు, ఆవాసాలను వదిలేసి.. కేవలం భూములను మాత్రమే మున్సిపాలిటీల్లో కలిపేశారు. కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లి మున్సి పాలిటీ పరిధిలోకి పెద్దకల్వల, పెద్దబొంకూర్ గ్రామాలకు చెందిన భూములను మాత్రమే చేర్చడం దీనికి ఉదాహరణ. ... మరి ఇలా అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, పాత మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనానికి కారణం స్థానిక నేతల రియల్ ఎస్టేట్ దందాలేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ భూముల మార్కెట్ విలువ పెంచుకునేందుకు ఈ దిశగా పావులు కదిపారనే విమర్శలు వస్తున్నాయి. ఏలికల కోసమేనా..? రాష్ట్రంలో 173 గ్రామాల విలీనంతో 71 కొత్త పురపాలికల ఏర్పాటుకు, మరో 41 పాత పురపాలికల్లో 136 గ్రామాలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లోనే పురపాలక శాఖ చట్టాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అయితే గ్రామాల విలీనం విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు తమ భూములను పట్టణ ప్రాంతాల పరిధిలోకి తీసుకొచ్చి మార్కెట్ విలువను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేందుకు పావులు కదిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే దగ్గరగా ఉన్న ఆవాసాలను వదిలి దూరంగా ఉన్న వాటిని కలపడం.. గ్రామాలను వదిలేసి, వాటి భూములను మాత్రమే విలీనం చేయడం వంటి మార్పులు జరిగాయని తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకంగా జిల్లాల నుంచి అధికారులను హైదరాబాద్కు పిలిపించి.. గ్రామాల విలీన ప్రక్రియను తమకు నచ్చినట్టుగా మార్చినట్టు సమాచారం. పట్టణ స్వభావమున్న గ్రామాలే కలపాలి మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలను విలీనం చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలతో స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఆయా గ్రామాల్లో 40 శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉండటం.. ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, మార్కెట్ యార్డులు, హోటళ్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు వంటి పట్టణ ప్రాంత స్వభావం కలిగి ఉండటం వంటివి ఉండాలి. ఈ మేరకు మున్సిపాలిటీల్లో కలిపే గ్రామాలు/ఆవాసాలపై జిల్లా అధికారుల ప్రతిపాదనలే కీలకం. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలను పాటించలేదు. అంతేకాదు గ్రామాల్లో ప్రజలు, నివాసాలను వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాలు, భూములను మాత్రమే మున్సిపాలిటీల్లో కలిపారు. దీంతో గ్రామ పంచాయతీలు భారీగా నష్టపోనున్నాయి. ఆయా భూములపై వచ్చే ఆదాయమంతా మున్సిపాలిటీకి అప్పగించినట్లవుతుంది. అంతేకాదు పంట పొలాలు లేకుంటే వ్యవసాయాధారం లేదనే కారణంతో ఉపాధి హామీ పథకం నిధులనూ ఆ గ్రామం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గ్రామాలు వద్దు.. భూములే ముద్దు పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ.. ఐదు గ్రామ పంచాయతీలను దానిలో విలీనం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో మూడు గ్రామాలను విలీనం చేసిన ప్రభుత్వం.. పెద్దకల్వల, పెద్దబొంకూరు గ్రామాలను మాత్రం మినహాయించింది. కానీ ఆఖరి మార్పులు చేర్పుల్లో ఈ రెండు గ్రామాల్లో ఇళ్లుండే ప్రాంతాలను వదిలేసి.. మూడు వందల ఎకరాలకుపైగా భూములను మాత్రమే మున్సిపాలిటీలో కలిపేశారు. కలిపితే గ్రామం మొత్తం విలీనం చేయాలని, లేకుంటే ఇబ్బందులు వస్తాయన్న అధికారుల విజ్ఞప్తులు నేతల పైరవీలలో కొట్టుకుపోయాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక నేతలు తమ భూముల విలువను అమాంతం పెంచుకునేందుకే కొన్ని సర్వే నంబర్ల భూములను మున్సిపాలిటీలో చేర్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే భూముల అధీనం సిద్దిపేట మున్సిపాలిటీ విస్తరణ విషయంలో చుట్టూరా ఉన్న గ్రామాలను వదిలేసిన ప్రభుత్వం.. కేవలం కొన్ని సర్వే నంబర్లలోని భూములను మాత్రమే విలీనం చేసింది. తొలుత సిద్దిపేట మున్సిపాలిటీలో ఐదారు గ్రామాలను విలీనం చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో జరిగిన మార్పులు చేర్పుల్లో.. పొన్నాల, మిట్టపల్లి, ఎన్సాన్పల్లి, చినగుండవెల్లి గ్రామాల్లో ప్రజలుండే ప్రాంతాలను వదిలేసి.. నలభై సర్వే నంబర్లలో పరిధిలోని భూములను మాత్రమే విలీనం చేశారు. అటు సంగారెడ్డి పరిసరాల్లో పోతిరెడ్డిపల్లి, చింతల్పల్లిలను మున్సిపాలిటీలో విలీనం చేసిన అధికారులు.. నేతల ఒత్తిళ్లతో మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలను వదిలేసి సర్వే నంబర్లు 210 నుంచి 365 మధ్య ఉన్న భూములను మాత్రమే మున్సిపాలిటీలో కలిపారు. ‘హద్దులు’ దాటేసిన విలీనం జగిత్యాల మున్సిపాలిటీలో అయితే విలీన ప్రక్రియ ఎన్నో ‘సిత్రాలు’ చూపిస్తోంది. మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్న గ్రామాలను వదిలేసి.. వాటికి అవతల ఉన్న గ్రామాలను మాత్రం విలీనం చేయడం గమనార్హం. జగిత్యాల మున్సిపాలిటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్ గ్రామాన్ని వదిలేసి.. దాని అవతల ఉన్న తారకరామనగర్ను విలీనం చేశారు. ఇదేమిటో అంతుచిక్కక స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీకి మరోదిక్కున తిప్పన్నపేట గ్రామాన్ని వదిలేసి దాని అవతల ఉన్న శంకులపల్లెను విలీనం చేశారు. జగిత్యాల–నిజామాబాద్ రహదారి వెంట ఉన్న హస్నాబాద్ గ్రామంలో జనం ఉండే ప్రాంతాలను వదిలి భూములను మాత్రం కలిపారు. అధికార పార్టీలో అత్యంత కీలక నేత ఒత్తిళ్లతోనే ఈ అడ్డగోలు తతంగం నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ పరిధిలోనే ఉండాలి ‘‘మా పెద్దకల్వల గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో కలపవద్దని గ్రామస్తులంతా ఒత్తిడి చేయడంతో పంచాయతీగానే ఉంచారు. కానీ గ్రామంలోని భూములను మాత్రం మున్సిపాలిటీలో కలిపారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. పంచాయతీ పరిధిలోనే భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలి..’’ – సలేంద్ర రాములు, పెద్దకల్వల భూములను విడదీశారు ‘‘మున్సిపాలిటీ పరిధి పెంచడం కోసమని దగ్గరగా ఉన్న గ్రామాలకు చెందిన భూములను కలపడం సరికాదు. దీనివల్ల మాకు నష్టం కలగడంతోపాటు తీవ్ర గందరగోళం ఎదురవుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుని.. మా భూములను పంచాయతీ పరిధిలోనే ఉంచాలి..’’ – నర్ల లింగయ్య, పెద్దబొంకూర్ ప్రజలు వద్దు.. భూములు కావాలి.. ‘‘జగిత్యాలకు దగ్గరే ఉన్న మా తిమ్మాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ చివరికి గ్రామాన్ని వదిలిపెట్టి.. శివారులోని కొన్ని సర్వే నంబర్లలోని భూములను మాత్రం మున్సిపాలిటీలో కలిపారు..’’ - కాటిపల్లి మునీందర్రెడ్డి, తిమ్మాపూర్, జగిత్యాల జిల్లా ముందున్న గ్రామాన్ని వదిలేశారు జగిత్యాలకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్ గ్రామాన్ని వదిలేసి.. దూరంగా ఉన్న మా టీఆర్ నగర్ను మున్సిపాలిటీలో కలిపారు. అధికారులు, రాజకీయ ఒత్తిళ్లతోనే ఇలా చేశారు. పట్టణానికి దూరంగా ఉన్న మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం.. – కొండ శ్రీనివాస్, టీఆర్ నగర్ సర్పంచ్, జగిత్యాల జిల్లా -
‘అపరేషన్ అకర్ష్’
బరంపురం : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒడిస్సాలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. 2019లో రానున్న సాధారణ ఎన్నికలకు ముందుగా ఒడిస్సాలో మరో నాలుగు నెలల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సెమీఫైనల్స్గా భావించి ఒకవైపు అధికార పార్టీ బీజేడీ..మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ పరస్పర ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా ఒక వైపు దక్షిణ ఒడిస్సా కేంద్ర బిందువు బరంపురం..మరోవైపు పశ్చిమ ఒడిస్సా ప్రాణకేంద్రం సంబల్పూర్ నగరాలు వేదికలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న బీజేడీ బరంపురం నగరంలోను, 5వ తేదీన బీజేపీ సంబల్పూర్లోను మిశ్రమ సమ్మేళన్ పర్బ్ పేరుతో ‘అపరేషన్ అకర్ష్’ చేపట్టి తమ తమ ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలనుపోత్సహించేందుకు ఇరు పార్టీలు తమదైన రాజకీయ శైలిలో పావులు కదుపుతున్నాయి. అమిత్ షా–నవీన్ ‘ఢీ’ ఏప్రిల్ 4, 5 తేదీల్లో బీజేడీ, బీజేపీ చేపట్టే మిశ్రమ సమ్మేళన్ వేర్వేరు బహిరంగ మహాసభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘ఢీ’ కొడుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన అధికార రాష్ట్ర బీజేడీ పార్టీ బరంపురం కళ్లికోట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మిశ్రమ సమ్మేళన్ పర్బ్కు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకానుండగా..మరుసటి రోజు 5వ తేదీన సంబల్పూర్లో బీజేపీ మిశ్రమసమ్మేళన్ పర్బ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ ఒడిస్సాలో బీజేపీ తన ఓటు బ్యాంక్ను పెంచుకుని రెండో స్థానంలో ఉండగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు అమిత్ షా ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇందుకు 5వ తేదీన పశ్చిమ ఒడిస్సా, సంబల్పూర్లో జరగనున్న బీజేపీ మిశ్రమ సమ్మేళన్ సభలో భారీ స్థాయిలో యువ శక్తిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే రీతిలో 4వ తేదీన దక్షిణ ఒడిస్సా, బరంపురంలో జరగనున్న అధికార పార్టీ బీజేడీ మిశ్రమ సమ్మేళన్ పర్బ్లో స్థానిక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎంపీ చంద్ర శేఖర్ సాహు, ఏఐసీసీ సభ్యుడు విక్రమ్ పండా, డీసీసీ అధ్యక్షుడు భగవాన్ గంతాయత్లతో పాటు కాంగ్రెస్ నాయకులు బీజేడీలో చేరనున్నారు. కాంగ్రెస్ కంచుకోటకు బీటలు? ఒకప్పుడు కంచుకోటగా ఉన్న గంజాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. గంజాం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖ నాయకులంతా అధికార పార్టీ బీజేడీ పార్టీలోకి వలస పోతుండడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కానరాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో బరంపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్.జగన్నాథ్ రావు 7 సార్లు పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఘనత ఉంది. మరోవైపు అత్యధికంగా తెలుగు ప్రజల ఓట్లు ఉండే బరంపురం లోక్సభ నియోజకవర్గం నుంచి అప్పటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి బరంపురం కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటగా ఘనచరిత్ర ఉన్న బరంపురం ప్రస్తుత వలసలతో జిల్లాలో కాంగెస్ కానరాకుండా పోయే దయనీయ పరిస్థితి ఏర్పడింది. -
మంత్రి ఈటలకు కృతజ్ఞతలు
హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ సిబ్బందికి నెలవారీ వేతనం నిమిత్తం ప్రత్యేకంగా రూ.2 కోట్లను గ్రాంట్ కింద నిధులు విడుదల చేసిన మంత్రి ఈటల రాజేందర్కు మున్సిపాలిటీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హుజూరాబాద్ నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చడానికి కృషి చేసినందుకు రాజేందర్ను సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్ మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రాంట్ కింద మంజూరైన నిధుల పత్రాన్ని విజయ్కుమార్కు అందజేశారు. ఆయన వెంట కమిషనర్ జి.స్వరూపారాణీ, మునిసిపల్ ఇంజినీర్ బి.చంద్రమౌళి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రమణారావు, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
21 నగర పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 21 నగర పంచాయతీల స్థాయిని మున్సిపాలిటీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ జాబితాలో బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్, నర్సంపేట, సత్తుపల్లి, గజ్వేల్, వేములవాడ, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, హుజూర్నగర్, జమ్మికుంట, నాగర్కర్నూల్, పరకాల, హుజూరాబాద్, మధిర, హుస్నాబాద్, బాదేపల్లి, అచ్చంపేట, ఐజా, దేవరకొండ, కొల్లాపూర్, అందోల్–జోగిపేట్లు ఉన్నాయి. -
మున్సిపల్ కార్మికురాలికి అభినందన
మెట్పల్లి: చెత్త కుప్పలో దొరికిన రూ.1.20లక్షలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి నిజాయితీని చాటుకున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మద్దెల లక్ష్మిని గురువారం పలువురు అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి, కమీషనర్ అయాజ్లు, బీసీ సంఘం నాయకులు అందె మారుతి, బొడ్ల రమేశ్లు సన్మానించారు. అలాగే 9వార్డులో కౌన్సిలర్ గైనీ లావణ్యతో పాటు స్థానికులు లక్ష్మీ దంపతులను అభినందించారు. -
అద్దెకు ‘సై’కిళ్లు
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ‘గ్రేటర్’ యంత్రాంగం దృష్టిసారించింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ తరహాలో సైక్లింగ్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా నిట్ క్యాంపస్లో.. పాలిటెక్నిక్ నుంచి భద్రకాళి వరకూ సైకిల్పై ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కమిషనర్ గౌతమ్ పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా సమాలోచనలు చేశారు. వరంగల్ అర్బన్: ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ప్రయాణం ఎంతగానో దోహదపడుతుంది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ నగరాల తరహాలో వరంగల్ స్మార్ట్ నగరంలో సైకిల్ వినియోగాన్ని అమల్లోకి తెచ్చేందుకు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు గురవారం వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వీపీ.గౌతమ్తో లీ అసోసియేట్స్, హైదరాబాద్ సైకిల్ అసోసియేషన్(హెచ్బీసీ), పీడబ్ల్యూసీ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. సైకిల్ ప్రయాణంతో ప్రజలు, పర్యావరణ పరిరక్షణకు జరిగే మేలు గురించి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అద్దెకు సైకిళ్లు ఇస్తామని.. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ నుంచి సహాయ సహకారాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో అనువైన రహదారులపై చర్చించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సైకిల్ సవారీని నిట్ క్యాంపస్లో.. పాలిటెక్నిక్ కాలేజి నుంచి భద్రకాళి ఆలయం వరకు అమలు చేయాలని సూచించారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్డును నిర్మించుకుంటామని సంస్థల ప్రతినిధులు తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సైకిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సైకిల్ వినియోగం పెంచేలా నగర ప్రజలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా రహదారులను నిర్మిస్తామన్నారు. సమావేశంలో లీ అసోసియేట్స్ ప్రతినిధి జగదీష్, హెచ్బీసీ చీఫ్ మేనేజర్ విజయ్, పీడబ్ల్యూసీ ప్రతినిధులు బాలాజీ, సంతోష్, రాజేశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం ఎలా ఇచ్చారు..?
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపాలిటీలో ఒక స్వీపర్ మృతి చెందితే ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా టీడీపీ కార్యకర్తకు ఇవ్వడం బాధాకరమని, వెంటనే అతన్ని తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల వద్దకు ఎమ్మెల్యే బుధవారం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతి చెందిన కార్మికుడు సుబ్బ రాయుడు భార్య మేరి, వారి పిల్లలతో కలిసి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చిన కమిషనర్తో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికుడు చనిపోతే సంబంధిత కాంట్రాక్టర్ మృతి చెందిన కార్మికుడి కు టుంబంలో ఉద్యోగం చేసే వారు లేకపోతే మరొకరికి ఇవ్వాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా మరొకరి పేరును ఎలా నమోదు చేశారని ప్రశ్నిం చా రు. 9 నెలల పాటు పార్కులో పని చేయించుకొని జీతం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాంట్రాక్టర్కే తెలియకుండా.. కార్మికుడు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించాల్సింది కాంట్రాక్టర్ అని, అయితే కాంట్రాక్టరకే తెలియకుండా మేరువ కుమార్ అనే టీడీ పీ కార్యకర్తకు పోస్టింగ్ ఎవరిచ్చారని ఎమ్మెల్యే కమిషనర్ను ప్రశ్నించారు. అవన్నీ తనకు తెలియవని కమిషనర్ చెప్పడంతో ఎమ్మెల్యే ఇది పద్ధతి కాదన్నారు. న్యా యం జరగకపోతే 48 గంటలు నిరా హార దీక్ష చేస్తానని హెచ్చరించారు.కార్మికుని కుమార్తెకు రూ.లక్ష బాండు అందించిన ఎమ్మెల్యేసుబ్బరాయుడు కుమార్తెకు 20 ఏళ్ల నాటికి రూ.లక్ష వస్తుందని, అది పాపకు ఉపయోగపడే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. చెప్పిన ఏడవ రోజే పాప పేరుతో డిపాజిట్ చేశామన్నారు. బాండు పత్రాన్ని సుబ్బరాయుడు కుమార్తెకు అందించారు. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్రెడ్డి, కౌన్సిలర్లు ట ప్పా గైబూసాహెబ్, రాగుల శాంతి, శివకుమార్యాదవ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్ ఎస్ఏ నారా యణరెడ్డి, మహిళా రాష్ట్ర కార్యదర్శి విజ యలక్ష్మి, వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు షెక్షావలి, చేనేత విభాగం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బడిమెల చిన్నరాజ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజయ్కుమార్, ప్రమీలమ్మ, సాల్మన్ తదితరులు ఉన్నారు. కాంట్రాక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్యే... ఎమ్మెల్యే కాంట్రాక్టర్ రమణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సుబ్బ రాయుడు మరణిస్తే అతని స్థానంలో అతని భార్యకు ఉద్యోగం ఇవ్వకుండా మరొకరిని ఎలా నియమించారని ప్రశ్నించారు. తనకు ఆ విషయమే తెలియదని, నాయకులే ఇష్టం వచ్చిన వారిని వేసుకొని పేర్లు రాయించుకున్నారని తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, చైర్మన్లకు జడ్జి నోటీసులు లీగల్ (కడప అర్బన్) : జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అ వకతవకలపై వచ్చిన ఫిర్యాదు ను సుమోటోగా స్వీకరించి బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ కేసు నమోదు చేయడంతోపాటు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్, చైర్మన్లకు నోటీసులు జారీ చేశారు. వారు ఈనెల 21వ తేదీన జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్లో డీఎల్ఎస్ఏ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
షరతులు వర్తిస్తాయి..
అచ్చంపేట: 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని 16మున్సిపాలిటీలకు మొత్తం రూ.270కోట్ల నిధులు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీ) కింద విడుదల చేసింది. ఫిబ్రవరి 17న జీఓ నంబర్436 ద్వారా పలు మున్సిపాలిటీలకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కౌన్సిల్ తీర్మానం మేరకు ఈ నిధులను అప్పు కింద ఇచ్చారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు రూ.115కోట్లు మంజూరయ్యాయి. ఏడాదికాలంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వేచి చూస్తుండగా.. ఇప్పుడు అప్పు కింద ఇవ్వడంతో పాలకవర్గాలకు నిరాశే మిగిలింది. ఈ పరిస్థితితో అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చినమాట ఇప్పట్లో నేరవేరే విధంగా కనిపించడం లేదు. రెండేళ్లుగా ఎదురుచూపు అచ్చంపేట నగరపంచాయతీ ఏర్పడిన తర్వాత 2016 మార్చిలో పాలకవర్గ ఎన్నికలు జరిగాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మొత్తం 20వార్డుల్లో గెలుపొందింది. అప్పటి నుంచే పట్టణానికి ప్రత్యేక నిధులు తెస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెబుతూవచ్చారు. కానీ రెండేళ్ల తర్వాతప్రభుత్వం అప్పు కింద అచ్చంపేటకు రూ.15కోట్లు ఇచ్చింది. నాగర్కర్నూల్, కొల్లాపూర్ నగరపంచాయతీలకు గతంలో సీసీ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రాంటు కింద నిధులు విడుదల చేసింది. క్లిన్ స్వీప్ చేశామని చెప్పుకుంటున్న ఇక్కడి నేతలకు మాత్రం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఏమీలేదు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని ఆశించి పట్టణవాసులు ఒకే పార్టీకి ఓటువేస్తే రేండేళ్లయినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. చివరకు రుణం మంజూరు చేయడంతో పాలకవర్గాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. అచ్చంపేటకు ప్రత్యేక నిధులు సాధించామని చెబుతున్న నేతల మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. దేనికి ఉపయోగిస్తారంటే... మున్సిపాలిటీలకు ఆదాయం సమాకూర్చే షాపింగ్ కాంప్లెక్స్, రైతు బజార్, టౌన్హాల్స్ ఏర్పాటు వంటి వాటికి ఖర్చు చేయాలని ఆంక్షలు విధించారు. డీపీఆర్ రూపొందించి ఆడ్మినిస్ట్రేషన్ మంజూరు తీసుకున్న తర్వాత టెండర్లు పిలుస్తారు. ఈ పని మొత్తం పూర్తి కావాలంటే ఇంకా రెండు నెలల వ్యవధి పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ని«ధులను పట్టణాల్లో కనీస అవసరాల కల్పనకు వినియోగించే అవకాశం లేకండాపోయింది. ఉమ్మడి జిల్లాలోని విడుదలైన నిధులు (లక్షల్లో) మున్సిపాలిటీ/ నిధులు నగరపంచాయతీ బాదేపల్లి 1000 వనపర్తి 2000 అయిజ 1500 కొల్లాపూర్ 2500 అచ్చంపేట 1500 కల్వకుర్తి 1500 మహబూబ్నగర్ 2000 -
మున్సిపాలిటీలకు మహర్ధశ
నల్లగొండ : మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది..! మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలం గాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కింద ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తున్న క్రమంలో వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఐడీసీ ద్వారా ఒక్కో మున్సిపాలిటీకి సుమారు రూ.20కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో గ్రేడ్–1 మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, గ్రేడ్–2 మున్సిపాలిటీకి రూ.10 నుంచి 15కోట్లు, నగర పంచాయతీలకు రూ.10కోట్ల వరకు నిధులు కేటా యించనున్నారు. నల్లగొండ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కావడంతో రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మి ర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.10 నుం చి రూ.15కోట్లు, దేవరకొండ నగర పంచా యతీకి రూ.10కోట్ల వరకు నిధులు మం జూరయ్యే అవకాశం ఉందని అంటున్నా రు. దేవరకొండకు ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేసినందున ఎఫ్ఐడీసీ ద్వారా మరో రూ.5కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు, పనుల పర్యవేక్షణ బాధ్యతలు మున్సి పాలిటీ అధికారులకు సంబంధం లేకుం డా జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలి.. ఎఫ్ఐడీసీ ద్వారా విడుదలయ్యే నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదలను ఈ నెలాఖరులోగా పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రెండు, మూడు మాసాల్లో పనులు పరిపాలన ఆమోదం పొంది, టెండర్లు పిలుసా ్తరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వం జూన్2న పనులు ప్రారంభిస్తారు. స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సలహా, సూచనల మేరకు మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాధనల విషయంలో ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నిధుల విషయంలో ము న్సిపల్ కమిషనర్లకు ఎలాంటి సంబందమూ లేదు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పనులను ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ననుల పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. మున్సిపల్ పాలకవర్గాలు లేని కాలంలో స్పెషల్ అధికారులుగా వ్యవహరించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. నల్లగొండ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్, మిర్యాలగూడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్, దేవరకొండ స్పెషల్ ఆఫీసర్గా డీఆర్డీఓ లేదా డీఆర్వోను నియమించే అవకాశం ఉంది. చేపట్టే అభివృద్ధి పనులు... మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనమైన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు తొలిప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయం, పార్కులు, ఎల్ఈడీ లైట్స్, మోడల్ మార్కెట్స్, ఆడిటోరియంల నిర్మాణం, ఫుట్పాత్లు, బస్బేలు, మురికి కాల్వల అభివృద్ధి, శ్మశాన వాటికల పనులు చేపడతారు. -
తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి : గుంటూరులో అతిసార వ్యాధిపై మున్సిపల్ శాఖ వ్యవహరించిన తీరును అధికార పార్టీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుపట్టారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ప్రస్తావించారు. అధికార యంత్రాంగం అతిసార నివారణకు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరి ప్రాణాలైనా రక్షించేగలిగేవారని తెలిపారు. ‘ఈ-కొలి బ్యాక్టిరీయా కారణంగా కిడ్నీలు కూడా దెబ్బ తిన్నాయనే ప్రచారం జరుగుతోంది. అతిసార వ్యాధి ప్రబలడానికి అధికారులు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది చనిపోతే సభలో కనీస ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అసెంబ్లీలో అరకొర సమాధానం ఇవ్వడం సరైన పద్దతి కాదు’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరుకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మంజూరైందనగానే నగర ప్రజలు ఎంతో ఆనందించారు. అయితే యూజీడీ పనులు జరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్నారు. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి, పైపులైనులు వేసిన అనంతరం జరిగా పూడ్చకపోవడంతో నగరం మొత్తం గుంతలమయంగా మారింది. యూజీడీ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వల్ల భూమిలోని తాగునీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా తాగునీటిలోకి మురుగు చేరింది. దీంతో నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా వృద్ధి చెందింది. ఈ బ్యాక్టీరియా కారణంగానే నగరంలో డయేరియా వ్యాధి ప్రబలి తొమ్మిది మందిని బలితీసుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పైపులైనులు లీకై మురుగునీరు చేరింది. దీంతో తాగునీరు కలుషితమైంది. ఆ నీటిలో ప్రమాదకర ఈకోలి బ్యాక్టీరియా చేరింది. ఈ బ్యాక్టీరియా కారణంగా వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డారని డీఎంహెచ్ఓ జొన్నలగడ్డ యాస్మిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రాంతాల్లో సైతం యూజీడీపనుల వల్ల పైపులైనులు లీకవడం, పగిలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
స్వచ్ఛసేవకు జాతీయ అవార్డు
డ్వాక్రా పొదుపు సంఘాలంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది నెలనెలా పొదుపు చేయడం... బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం...తిరిగి చెల్లించడం. దీనికి భిన్నంగా శ్యామలాంబ ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవల్ ఫెడరేషన్) ఆలోచించింది. ఆలోచనను ఆచరణలో పెట్టింది. అందుకు తగిన గుర్తింపు పొందింది. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, సాలూరు: మున్సిపాలిటీలోని శ్యామలాంబ ఎస్ఎల్ఎఫ్కు జాతీయ స్థాయిలో స్వచ్ఛసేవా ఎక్స్లెన్స్ అవార్డు వరించింది. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన శ్యామలాంబ ఎల్ఎల్ఎఫ్ పారిశుద్ధ్య నిర్వహణలో తన పరిధిలో ఉన్న 28 స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన పరుస్తూనే ఇతర బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంతో జాతీయ స్థాయిలో పురస్కారం సొంతం చేసుకొంది. ఆదర్శంగా సేవా కార్యక్రమాలు... ♦ రోజువారీగా ఇళ్లల్లో నుంచి వచ్చే చెత్తను, ఇతర వ్యర్ధాలను ఆరుబయట, మురుగు కాలువల్లో పారబోయకుండా వీధుల్లోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించేలా మహిళలను చైతన్యపరచడం. ♦ వచ్చే చెత్తలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా నిల్వచేసేలా చేయడం. ♦ వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల ప్రాముఖ్యత, వినియోగంపై అవగాహన పరచడం, నిర్వహించేలా చేయడం. ♦ గడిచిన పదేళ్లగా సంఘం పరిధిలో 280 మంది మహిళలను అనునిత్యం అవగాహన పరచడంలో ఏవిధంగా శ్యామలాంబ ఎస్ఎల్ఎఫ్ ముందుకు పోతోందో తెలిపే విషయాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆన్లైన్లో పొందుపరచడంతో ఇటీవల జరిగిన స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో కూడా ఈ సంఘం మహిళలతో ప్రత్యేకంగా సర్వే బృందం సభ్యులు సమావేశం నిర్వహించింది. పారిశుద్ధ్య విషయంలో రూపొందించిన 58అంశాలతో కూడిన ఫార్మాట్పై ప్రశ్నలు వేసి, వారికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించారు. అందులో సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు క్షేత్ర స్థాయిలో కూడా అదే తరహా పరిస్థితులు కనిపించడంతో స్వచ్ఛసేవ ఎక్స్లెన్స్ పురస్కారానికి సర్వే కమిటీ సిఫారసు చేసింది. ఆనందంగా వుంది... ఇతర పొదుపు సంఘాల మాదిరిగా మా సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సామాజిక విషయాలపై కూడా ప్రతీ సమావేశంలోనూ చర్చించేవాళ్లం. దీంతో మహిళల అందరిలోనూ పారిశుద్ధ్య విషయంలో అవగాహన పెరిగింది. పదేళ్లుగా మేం చేస్తోన్న కృషికి తగిన గుర్తింపు దక్కిందన్న ఆనందం మాకెంతో గొప్పగా వుంది. ఇది మహిళలందరి విజయం.–నల్లి పద్మ, శ్యామలాంబఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు, సాలూరు కృషి ఫలించింది.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో మేం చేస్తోన్న కృషి ఫలించింది. మహిళలతోనే మార్పు సాధ్యమన్న విషయాన్ని నమ్మి, వారిని చైతన్యపరచడానికి అధిక ప్రాదాన్యమిచ్చాం. తడిపొడి చెత్తల సేకరణ, పారిశుద్ధ్యంపై మేం చెప్పే విషయాలను అర్ధం చేసుకున్న మహిళలు జాతీయ స్థాయి పురస్కారాన్ని దక్కించుకోవడం అభినందనీయం. –ఎంఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
తేల్చుకుందాం రా..!
మెదక్ మున్సిపాలిటీ: పట్టణాభివృద్ధికి పాటుపడాల్సిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరస్పర దూషణలు, దాడులకు దిగడంతో మెదక్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. ఒకదశలో నువ్వెంత ? అంటే.. నువ్వెంత ? అనుకుంటూ... దాడులకు దిగి రాందాస్ చౌరస్తాలో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ విసుకున్నారు. దీంతో విస్తుపోవడం మిగతా కౌన్సిలర్ల వంతయ్యింది. గురువారం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. 6వ వార్డు కౌన్సిలర్ అరుణార్తి వెంకటరమణ మాట్లాడుతూ తన వార్డులో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని, మాస్టర్ప్లాన్లోని ఆక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను ప్రశ్నించారు. సాయిబాలాజీ గార్డెన్, పుష్పలవాగు పరిసరాల్లో ఉన్న మాస్టర్ప్లాన్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ మాట్లాడుతూ ఆ నిర్మాణాలు గతంలో జరిగాయని, పట్టణ విస్తీర్ణం పెరగడంతో మాస్టర్ ప్లాన్ రివైజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈసమాధానంతో సంతృప్తి చెందని కౌన్సిలర్ రమణ అక్రమ నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కొనసాగిన దూషణల పర్వం.. ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే మీ 6వ వార్డులో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారని చైర్మన్ సభలో తెలిపారు. తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, గతంలో ఎన్నోపనులు ఇరుకైన వార్డుల్లో తాను స్వయంగా చేయించానని కౌన్సిలర్ రమణ ఆగ్రహంతో తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ బఫర్ జోన్లో స్థలాలను కబ్జా చేస్తున్నారని, స్వార్థ పూరిత నిర్ణయాలకు బల్దియా సిద్ధంగా లేదన్నారు. దీంతో మరోసారి ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం దూషణల పర్వంగా మారింది. రాందాస్ చౌరస్తాలో తేల్చుకుందామంటూ ఒకరికొకరు సవాల్ వేసుకున్నారు. అంతటితో ఆగకుండా దాడులకు సిద్ధం కాగా సహచర కౌన్సిలర్లు వారిని అడ్డుకున్నారు. అప్పటికీ గొడవ సద్దుమణగకపోగా చైర్మన్, కౌన్సిలర్ ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్, కాలింగ్బెల్తో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే క్రమంలో గొడవ ఉద్రిక్తతను తలపించగా పక్కనే ఉన్న కౌన్సిలర్లు సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగినట్లయ్యింది. -
విద్యుత్ బకాయిలు..రూ.167.42 కోట్లు..!
నల్లగొండ : విద్యుత్ బిల్లుల బకాయిల భారం విద్యుత్శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించడం మానేశారు. నిధుల సమస్యను కారణంగా చూపించి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మొండికేశారు. దీంతో ఏటికేడు పెరిగిపోతున్న బకాయిలను వసూలు చేయడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. విద్యుత్ శాఖ నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. ప్రతి నెలా విద్యుత్ శాఖ నిర్వహించే నెలవారీ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ బకాయిల పైన ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు మొత్తం రూ.167.42 కోట్లు అని తేలింది. దీంట్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చెల్లించాల్సిన బకాయిలు రూ.44 కోట్లు. కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.167.42 కోట్లు. వీటిల్లో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.3.21 కోట్లు కాగా, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3.74 కోట్లు, మేజర్, మైనర్ పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. పేరుకుపోయిన బకాయిలు.. జిల్లా కేంద్రంలోని 26 ప్రభుత్వ శాఖల్లో బిల్లులు చెల్లించకుండా మొండికేసిన శాఖల్లో విద్యాశాఖ రూ.కోటి 32 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పాఠశాలల హెచ్ఎంల నుంచి స్పందన ఉండటం లేదన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ చెప్తోంది. కానీ హెచ్ఎంలు మాత్రం వచ్చిన కొద్దిపాటి నిధులు పాఠశాలల నిర్వహణకే సరిపోతున్నాయని, దాంతో బిల్లులు చెల్లించడం కష్టం మారిందని అంటున్నారు. పోలీస్ క్వార్టర్స్కు సంబంధించి కోటి రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ హెడ్క్వార్టర్స్లో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ బకాయిలు ఇవి. నెలవారీ బిల్లుల చెల్లింపులో పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉంది. కానీ క్వార్టర్స్ బకాయిలను సెటిల్ చేసుకోకపోవడంతో ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయాయి. వ్యవసాయ శాఖ రూ.3.08 లక్షలు, పశుసంవర్థక శాఖ రూ.లక్షా 92 వేలు, ఉన్నత విద్య రూ.లక్షా 94 వేలు, సాగునీటి పారుదల శాఖ రూ.57.41 లక్షలు, రెవిన్యూ శాఖ రూ.7 లక్షలు, రవాణా శాఖ రూ.5.97 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ శాఖలకు సంబంధించి నిధులు సర్దుబాటుకాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులు కూడా ఫ్రీజింగ్ల పేరుతో ట్రెజరీ శాఖ నిలిపేస్తుందని అంటున్నారు. ప్రతి నెలా క్రమతప్పకుండా బిల్లులు చెల్లి స్తున్న శాఖల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, వైద్య ఆరోగ్యం, పోలీస్ శాఖలు ఉన్నాయి. బిల్లులు చెల్లించక రెండేళ్లు...! మున్సిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించక రెండేళ్లు దాటింది. పంచాయతీలు చివరిసారిగా జనవరి 2016లో చెల్లించారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. మున్సిపాలిటీల బకాయిలు రూ.3.74 కోట్లు ఉండగా, పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్న నాటి నుంచి సర్పంచ్లు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు పాటించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో వీధిలైట్ల విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. తాగునీటి బోర్లకు విద్యుత్ కట్ చేయడం సాధ్యం కానందున చర్యలు తీసుకులేకపోతున్నామని అంటున్నారు. మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సర ఫరా నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ మేరకు కమిషనర్లకు నోటీసులకు కూడా జారీ చేశామని చెప్పారు. సర్చార్జీల భారం... విద్యుత్ బకాయిల పైన సర్చార్జీల పేరుతో 18 శాతం అదనపు భారాన్ని వసూలు చేయడం జరుగుతోంది. ఈ తరహా చార్జీలు అన్ని రకాల కేటగిరీలకు చెందిన బిల్లులకు వర్తిస్తుంది. ప్రతిఏడాది 18 శాతం సర్చార్జీల పేరుతో వినియోగదారులు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు అదనపు భారాన్ని మోయాల్సిందే. ఎంతకాలం పాటు బిల్లులు చెల్లించకుండా ఉంటే అన్నేళ్ల పాటు పెండింగ్లో ఉన్న బిల్లులపైన 18 శాతం సర్చార్జీ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయిల పైన ఎస్ఈ కృష్ణయ్య మాట్లాడుతూ...అన్ని శాఖలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. -
చదువే ఆయుధం
‘ప్రస్తుత సమాజంలో మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు ఉన్నత చదువులు చదవాలి. విద్యను ఒక ఆయుధంగా మల్చుకొని చదువులో రాణించా లి. ఆర్థికంగా బలపడడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలి. దీంతో ఒకరిపై ఒకరు ఆధారపడే స్థితి నుంచి బయటపడినప్పుడు మహిళలు జీవితంలో ధైర్యంగా నిలదొక్కుకోగలుగుతారు’.. అని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక పేర్కొన్నారు. ‘సాక్షి’ మహిళా క్యాంపెయిన్లో భాగంగా ‘మహిళా సాధికారత’పై ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే.. సూర్యాపేట : మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నా.. నేటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, వేధింపులు, గృహ హింస వంటివి కొనసాగుతున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా చూడాలి. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలు వెలుగు చూçస్తు న్నాయి. ఆడపిల్ల పుట్టగానే కష్టమనుకొని పాఠశాలకు పంపించకపోవడం, తొందరగా పెళ్లిళ్లు చేయడం వంటి ఆలోచనలు తల్లిదండ్రులు మానుకోవాలి. ఆడ, మగ ఎవరైతే ఏంటి మార్పు ఇప్పటికీ 40 శాతం వచ్చింది. ఆడ, మగ ఎవరైతేనే అని తల్లిలో మార్పు రావాలి. మగబిడ్డ పుడితే బాగుం టుందనే ఆలోచనను పారదోలాలి. దీంతో ఇక ఆడపిల్లలతో సమానంగా అబ్బాయిలను సమానంగా తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది.. అలాంటప్పుడు సమాజంలో లింగ వివక్ష ఉండదు. తక్కువ అనే భావన దూరం చేయాలి మహిళల్లో ముఖ్యంగా తమకు తాము తక్కువ అనే భావనను మనసు నుంచి దూరం చేయాలి. విద్య ద్వారానే విజ్ఞానం, ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతోంది. కుటుంబ బాధ్యతల్లో మగ్గిపోకుండా వాటిలో కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలి. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు.. ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది. చట్టాలతోనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టవచ్చు. పనిచేసే చోట్లతో పాటు ఇంట, బయట కూడా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ప్రయాణాలు, కార్యాలయాల్లో వేధింపులు జరిగినప్పుడు వెంటనే బయటకు చెప్పాలి. ఇలాంటి సమయాల్లో రక్షణ కల్పించడానికి కోర్టు తీర్పులు, చట్టాలు ఉన్నాయి. దినపత్రికలు, ప్రసార మాద్యమాల ద్వారా వేధింపులు తెలియజేయాలి. -
నీకు సగం.. నాకు సగం..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్గా ఆర్డీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్ అయి ఆ భూములను అమ్ముకున్నారు. చేతులు మారిన భూములు.. వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్ ఫైళ్లు లేకపోవడం గమనార్హం. ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. బల్దియాకు కీలకం లే అవుట్ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు. అనుమతులన్నీ పెండింగ్లోనే.. గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు. అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. –రాజేశ్వర్, ఇన్చార్జి కమిషనర్ -
సౌర వెలుగులపై నిర్లక్ష్యపు నీడ..!
విజయనగరం, పార్వతీపురం: సౌర విద్యుత్ వెలుగులకు మున్సిపాలిటీలు దూరమవుతున్నాయి. పాలకులు, అధికారుల అలక్ష్యంతో బిల్లుల భారాన్ని మోస్తున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సోలార్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. అయితే... యూనిట్లు కేవలం విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల్లోనే ఏర్పాటుచేశారు. మిగిలిన నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులను దూరం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పరిస్థితి... విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం నిధులను సమకూర్చుతామని, మిగిలిన 40 శాతం నిధులను మున్సిపాలిటీలు భరించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా విజయనగరం, బొబ్బిలి పురపాలక సంఘాలు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకుని ప్రస్తుతం విద్యుత్ బిల్లుల భారాన్ని 30 శాతం మేర తగ్గించుకున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో పాలకులుగాని, అధికారుల గాని చొరవచూపడం లేదు. వాస్తవంగా 25 సంవత్సరాల పాటు లీజు ప్రాతిపధికన సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే విద్యుత్ను అందించాలనేది ప్రతిపాదన. 25 సంవత్సరాల తరువాత ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను మున్సిపాలిటీలకు అప్పగించాలన్నది నిబం ధన. పార్వతీపురం మున్సిపాలిటీలో రూ.5 కోట్లతో 25 సంవత్సరాల లీజు ప్రాతిపదికన నెడ్ క్యాప్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు వెంకపేట గోరీల వద్ద స్థల పరిశీలన చేశారు. అయితే, ఆ స్థలం చెరువుగా గుర్తించి కలెక్టర్ వివేక్యాదవ్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం తెలపలేదు. తర్వాత తోటపల్లి పంపుహౌస్వద్దకు మార్చారు. అక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక ఎలక్ట్రికల్ ఫీడర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు చెప్పడం, దీనికోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఇంత ఖర్చు ఇప్పట్లో భరించలేమంటూ మున్సిపల్పాలకులు, అధికారులు చేతులెత్తేశారు. సాలూరులో సోలార్ యూనిట్ ఏర్పాటుచేస్తే వీధిలైట్ల బిల్లు నెలకు రూ.1.06 లక్షలు, ము న్సిపల్ కార్యాలయానికి వెయ్యి, పంపు హౌస్ నుంచి రూ.2.20 లక్షలు, పైలెట్ పథకాలకు రూ.45వేల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. నెల్లిమర్లలో.... నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎకరన్నర స్థలంలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక్కడ కూడా అడుగు ముందుకు పడలేదు. ప్రసత్తుం అన్ని కేటగిరీల్లో రూ.3.20 లక్షల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటైతే ఈ బిల్లులో 30 శాతం ఆదా అయ్యేదని విద్యుత్ శాఖ అధికారులే చెబుతున్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో ముందడుగు..
కోరుట్ల టౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపాల్టీ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. దేశంలో 40 41 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్లో పోటీపడుతూ పరిసరాల పరిశుభ్రత, 100 శాతం సానిటేషన్, పారిశుధ్యం పనులు, తడి, పొడి చెత్త సేకరణ, ఉదయం, రాత్రి వేళల్లో జాతీయ రహదారితోపాటు, ప్రధాన రహదారులు పరిశుభ్రం చే స్తూ, చెత్త రహిత మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఫీడ్బ్యాక్లో దేశ ంలో 44వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కోరుట్ల బడ్డీ యాప్కు స్పందన.. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలకు తమ సమస్యలు పరిష్కారానికి, పన్నులు ఆన్లైన్లో చెల్లించడానికి కోరుట్ల బడ్డీ యాప్ రూపొందించి, ప్రచారం చేశారు. ప్రధాన చౌరస్తాల్లో ప్రచారబోర్డులపై అవగాహన కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలను భాగస్వాములు చేసేందుకు 31వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ, ప్రధాన కూడళ్ళు, కళాశాలల్లో, దుకాణా ల వద్ద బడ్డీ యాప్ ప్రచారం చేశారు. వాల్ పోస్టర్, గోడ రాతలతో బొమ్మలు వేయించారు. కోరుట్ల బడ్డీ యాప్కు స్పందన లభించింది. జనవరి 8, 9 రెండు రోజులు స్వచ్ఛ సర్వేక్షణ్ పనితీరుపై పర్యవేక్షకులు కోరుట్లకు చేరుకుని వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. 2 నెలల్లో 2500 మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. 700 మంది తమ సమస్యల పరిష్కారానికి బడ్డీ యాప్ను వినియోగించుకోగా 654 సమస్యలు వెంటనే పరిష్కరమయ్యాయి. 46 సమస్యలు ఆర్థిక వనరులతో చేపట్టాల్సిన అవసరం ఉండడంతో నిధులు రాగానే పనులు పూర్తి చేయనున్నట్లు పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఎ.మహిపాల్ పేర్కొన్నారు. షీ టాయిలెట్స్ నిర్మాణం మున్సిపల్ నిధులతో రూ. 2లక్షలు వెచ్చించి, గురుజు మార్కెట్లో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా షీ టాయిలెట్స్ నిర్మాణం చేశారు. మహిళలకు టాయిలెట్స్ ఇబ్బందులు తీర్చారు. ప్రత్యేకంగా మహిళ సిబ్బందిని ఏర్పాటు చేసి, టాయిలెట్స్ నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రహదారులు పరిశుభ్రం పట్టణంలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులు, బిజినెస్ కూడళ్ళ దారులు టీచర్స్క్లబ్ రోడ్, ఇందిరారోడ్, ఐబీరోడ్లను రాత్రివేళల్లో ఊడ్చివేయిస్తున్నారు. మిగతా రహాదారులు ఉదయం వేళ పరిశుభ్రం చేయిస్తూ, చెత్త రహిత రహదారులుగా పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సానిటేషన్పై ప్రత్యేకశ్రద్ధ పెట్టి, అవసరమైన చోట మురికి కాలువలు నిర్మాణం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రథమస్థానం దేశంలో మంచి స్థానం పదిలం చేసేం దుకు ప్రతీ రోజు పనులతీరును పర్యవేక్షిస్తున్నాం. రహదారులు పరిశుభ్రంగా ఉండేందుకు ఉదయం, రాత్రి వేళల్లో క్లీన్ చేయిస్తున్నాం. రోడ్లపై చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకొని, అందంగా ఉంచుతున్నాం. – అల్లూరి వాణిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
వాగును పూడ్చు.. భవనం కట్టు
కోదాడ : సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఉలకవాగు ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు కాగితాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. అధికారుల చేతులు తడిపారు. అనుకూలంగా కాగితాలను మార్చుకున్నారు. ఇంకేముంది ఆగమేఘాల మీద అనుమతులు మంజూరయ్యాయి. జెట్ స్పీడ్తో వాగులో భవన నిర్మాణం కొనసాగుతుంది. మొదట ఈ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఓ ప్రజాప్రతినిధి ఆ తరువాత పెద్దమనిషి అవతారమెత్తారు. అందరిని తానే ‘సరి’చేసి నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూశాడు. వందల అడుగుల వెడల్పుతో ఉన్న ఉలకవాగు మురుగుకాల్వ కన్నా చిన్నగా మారిపోయింది. ఇదేమిటం టే ఐబీ, రెవెన్యూ, మున్సిపల్శాఖ అధికారులు అది తమ పని కాదంటే తమ పని కాదని తప్పించుకుంటున్నారు. వాగు ఉందని చెబుతుంది వారే .. కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో సర్వే నంబర్ 936, 937లలో తమ్మర శేషగిరిరావుకు భూమి ఉంది. దీనిని తమ్మర వెంకటేశ్వరరావుకు జీపీఏ ఇచ్చాడు. దానిని ఆయన టీచర్స్ కాలనీ పేరుతో లే అవుట్ చేసి అమ్మాడు. జీపీఏ చేసే సమయంలో, లే అవుట్ చేసే సమయంలో అక్కడ ఉత్తరం వైపు వాగు ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కాని వాగు ఎంత వెడల్పుతో ఉందో సరిగా ఎక్కడ పేర్కొనలేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. భూమి యజమానికి తృణమో, ఫణమో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగితాల మీద ఒక రకంగాను, క్షేత్ర స్థాయిలో మరో రకంగాను వ్యవహారం నడిచింది. ప్రస్తుతం నిర్మాణం సాగుతున్న భవనానికి ఎదురుగా 50 అడుగుల వెడల్పుతో ఉలకవాగు నీరు పోవడానికి వంతెన ఉంది. దానిని చూసైనా వాగు ఎంత వెడల్పు ఉందో ఇట్టే చెప్పేయవచ్చు కాని అధికారులు మాత్రం మూమూళ్ల మత్తులో అనుకూలంగా నివేదికలు ఇచ్చారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ‘సరి’ చేశాడు... ఉలకవాగులో సాగుతున్న భవన నిర్మాణంలో ప్రజాప్రతినిధి ఒక్కరు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట నిర్మాణాన్ని వ్యతిరేకించడమే కాకుండా వాగులో పూడికను తీయ్యించి చాలా హడావుడి చేశాడు. మున్సిపల్ అధికారులతో చెప్పి పనులు కూడా ఆపించాడు. ఆ తర్వాత తెరవెనుక మంతనాలు నడిపారు. వ్యతిరేకించే వారినందరిని తానే దగ్గరుండి ‘సరి’ చేసే పని చేపట్టాడనే ఆరోపణలు కాలనీలో గుప్పుమంటున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు ఉలక వాగులో ఒక ప్లాట్ను క్రమబద్ధీకరించడానికి యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ అధి కారులు వెనుకా ముందు చూడకుండా క్రమబద్ధీకరించారు. అనుమతులు కూడా మంజూరు చేశారు. భవన నిర్మాణం విషయం కాలనీవాసులకు తెలియడంతో ఉలకవాగులో అక్రమ నిర్మాణాల వల్ల భారీ వర్షాలు వస్తే నీరు కాలనీ మీదకు వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు పనులను ఆపి వేశారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధి సైతం దీన్ని వ్యతిరేకించారు. దీంతో అక్కడ వాగు ఉందో లేదో చెప్పాలని రెవెన్యూ అధికారులను, ఐబీ అధికారులను మున్సిపల్ అధికారులు కోరగా రికార్డులలో వాగు లేదని రెవెన్యూ అధికారులు, వాగు ఉంది కాని ఎంత వెడల్పు ఉందో తెలవదని ఐబీ అధికారులు వింతైన సమాధానాలు ఇచ్చారు. దీంతో తాము ఏమి చేయలేమని మున్సిపల్ అ«ధికారులు చేతులెత్తేశారు. పనులు ఆపాం.. ఉలకవాగులో భవన నిర్మాణంపై ఫిర్యాదులు రావడంతో పనులు ఆపాం. రెవెన్యూ, ఐబీ అధికారులు వాగు విషయంలో సరైన విధంగా స్పందించలేదు. దీంతో మేము ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకు పనులు ఆపారో తెలపాలని భవన యజమాని అడగడంతో మా వద్ద సరైన కారణం లేక మళ్లీ అనుమతి ఇచ్చాం.-అమరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
దయనీయం వీరి పరిస్థితి..!!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ (నామినల్ మస్టర్ రోల్)లు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాతికేళ్లుగా పనిచేస్తున్నా.. వారికి ఇంతవరకు ఉద్యోగ భద్రత లేదు. మరోవైపు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా వీరికి వర్తించడం లేదు. గతంలో గ్రామపంచాయతీలలో పనిచేసిన వారు నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందడంతో మున్సిపల్ శాఖకు మారారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వీరి పాత్ర కీలకం కాగా.. కనీస వేతనాలు కూడా అందడం లేదు. కారుణ్య నియామకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేని వీరు తమ సర్వీసును ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. రెగ్యులరైజ్ చేయకపోయినా టైమ్స్కేల్ అందించినా కనీస వేతనాలు లభిస్తాయని.. ఆ దిశగా మున్సిపల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని వారు కోరుతున్నారు. – కోదాడ నుంచి ఆవుల మల్లికార్జునరావు సరిపడా లేని సిబ్బంది.. వాస్తవానికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో సరిపడా సిబ్బంది లేరు. మేజర్ గ్రామపంచాయతీలు నగర పంచాయతీ, మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకుంటున్నారు. అయినా.. వారి సర్వీసును మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. 2013లో విడుదల చేసిన జీవో నెంబర్ 125 ప్రకారం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 1,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వాటిని రెండు దశలలో నింపేందుకు నిర్ణయించారు. అయితే.. ఈ పోస్టులలో ఎన్ఆర్ఎంలను రెగ్యులరైజ్ చేసేందుకు ఉద్దేశించిన పబ్లిక్ హెల్త్ విభాగంలో తక్కువ పోస్టులు ఉండగా, మిగిలిన విభాగాలో పోస్టులను సూచించలేదు. దీంతో ఆ జీవో వచ్చినా ఎన్ఆర్ఎంలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. వాస్తవానికి ప్రతీ మున్సిపాలిటీ, నగర పంచాయతీలలో మాత్రం స్వీపర్లు, పబ్లిక్ హెల్త్, విద్యుత్, నీటి సరఫరాల విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఈ పోస్టుల్లో కొన్నింటిని ఎన్ఆర్ఎంలతో, మరి కొన్నింటిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తాత్కాలికంగా భర్తీ చేస్తున్నారు. అమలు కాని 212 జీవో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో నవంబర్ 28, 1993న అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 212ను విడుదల చేసింది. దీని ప్రకారం 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎన్ఆర్ఎంలను ఆ జీవో కింద రెగ్యులరైజ్ చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. వారిని ఆయా శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో నియమించాలని, తద్వారా ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. అయితే.. ఈ జీవో మాత్రం పంచాయతీరాజ్ శాఖలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. గ్రామపంచాయతీలలో ప్రభుత్వం కేటాయించిన పోస్టులు తక్కువగా ఉండడం.. ఎన్ఆర్ఎంల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఖాళీలు ఏర్పడినప్పుడు దశల వారీగా ఉద్యోగులను వారి సీనియారిటీని బట్టి నియమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఎంలలో చాలా మంది అనార్యోగం బారిన పడి మృతి చెందారు. అయితే.. వీరి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. కుటుంబాలకు ఎలాంటి భద్రత కల్పించకుండానే లోకం వదులుతున్నారు. 350 మంది ఎదురుచూపు.. రాష్ట్రవ్యాప్తంగా 2009 తరువాత ఏర్పడిన కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 350 మంది ఎన్ఎంఆర్లు రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తమను రెగ్యులరైజ్ చేసి కనీసం టైమ్ స్కేల్ అందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలోనే పలుమార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. మున్సిపాలిటీలలో అదే పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న ఎన్ఆర్ఎంలతో ఖాళీలు భర్తీ చేయవచ్చని జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఎన్ఆర్ఎంలను పబ్లిక్ హెల్త్ వర్కర్లు, స్వీపర్లు, విద్యుత్, నీటి సరఫరా విభాగాలలో నియమించి వారిని రెగ్యులరైజ్ చేశారు. ఆ తరువాత ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం అమలు కాలేదు. ఇతడి పేరు కుక్కల దేవయ్య. ఈయన కోదాడ మున్సిపాలిటీలో పారిశుధ్య విభాగంలో ఎన్ఎంఆర్గా పనిచేస్తున్నాడు. కోదాడ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు అనగా 30 ఏళ్లుగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరోగ్య భద్రత లేకపోగా ఉద్యోగ భద్రత కూడా లేదు. -
విత్తం కొద్దీ విధానం
షాద్నగర్: మున్సిపల్ కార్యాలయంలో పని ఉందా..? మీరు రోజుల తరబడి కార్యాలయాలకు తిరగాల్సిన పనిలేదు.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు అని మున్సిపల్ అధికారులు చెప్పిన మాటలు వింటున్నారా..? అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. మున్సిపల్ సేవల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఉన్నతాధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని అనుకుంటున్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది మూలంగా అది నీరుగారిపోతుంది. కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల హవానే మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతుందని మున్సిపల్ ఆవరణలో పలువురు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు.. మున్సిపల్ కార్యాలయంలో పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు.. గవర్నమెంటు రేటు కాదండి వారి రేటు... పనికి తగ్గ రేటు ఇస్తే మీ పని క్షణాల్లో అయిపోతుంది.. ఇంకా త్వరగా కావాలా..? ఇంకాస్త ఎక్కువ రేటు ఇస్తే మీకు కావాల్సిన కాగితం ఇంటికే నడిచి వస్తుంది. ‡జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భవన నిర్మాణ, వ్యాపార అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, ఓనర్షిప్ సర్టిఫికెట్లకు ఒక రేటు అంటూ ఫిక్స్ చేస్తున్నారు. రేటు ఇవ్వని వారి కాళ్లకు ఉన్న చెప్పులు అరగాల్సిందే. పెండింగ్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల విషయంలో నేరుగా ప్రజలు వెళ్లి మధ్వవర్తులను ఆశ్రయిస్తేనే పని జరుగుతుందని వాపోతున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం మున్సిపల్ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సిందే.. లేదా రోజుల తరబడి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగే దాకా తిరగాల్సిందే. ధృవీకరణ పత్రాల కోసం బాహాటంగానే డబ్బులు అడుగుతున్నారని విమర్శలు వినవస్తున్నాయి. మధ్యవర్తులదే హవా.. షాద్నగర్ మున్సిపల్ ప్రజలు ఏ విధమైన సేవలు పొందాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం పని పూర్తయిందనుకుంటే పొరపాటే. మీ ఫైల్ ముందుకు కదలాలంటే మధ్యవర్తులు, పురపాలక కిందిస్థాయి సిబ్బంది సేవలు వినియోగించాల్సిందే. ఏ పనికి రేటు ఎంత ఇస్తారో ముందు బేరం కుదుర్చు కోవాల్సిందే. మ్యూటేషన్ చేయడం లేదు గత నెల రోజులుగా మ్యూటేషన్(యాజమాన్య పేరు మార్పిడి) చేయడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సమాచారం రాకపోవడంతో మ్యూటేషన్ చేయడం లేదు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నామనేది అసత్యం. కార్యాలయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాము. – శరత్చంద్ర, మున్సిపల్ కమిషనర్ -
ఆ ఏడు గ్రామాలకు పట్టణ శోభ!
శివారు గ్రామాలకు ఇక పట్టణ శోభ రానుంది. త్వరలోనే ఈ పంచాయతీలు పురపాలక శాఖ పరిధిలో చేరనున్నాయి. ఔటర్ రింగ్రోడ్డు లోపలి గ్రామాలు కొత్తగా ఏర్పాటయ్యే నగర పంచాయతీ/మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ మేరకు ప్రతిపాదిత నగర పంచాయతీల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. స్థానిక శాసనసభ్యుల సూచనలకు అనుగుణంగా జాబితాను ఖరారు చేసిన అధికారులు.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగరీకరణ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులు.. గ్రేటర్లో కలపడం తగదని స్పష్టం చేశారు. ఈ గ్రామాలను నగర పంచాయతీ లేదా మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసిన తర్వాతే గ్రేటర్లో కలిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎమ్మెల్యేల అభిప్రాయంతో ఏకీభవించిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్లో విలీనం చేయాలనే యోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఇప్పటికే నగరంలో అంతర్భాగమైన గండిపేట మండలంలోని మణికొండ, పుప్పాల్గూడ మినహా మిగతా పంచాయతీలను జీహెచ్ఎంసీలో కలపడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలనాపరంగా, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలంలే ఇది తప్పనిసరి అని తేల్చిచెప్పారు. కొత్త నగరపంచాయతీ/మున్సిపాలిటీల ఏర్పాటుపై మంగళవారంలోగా ప్రతిపాదనలు అందజే యాలని శాసనసభ్యులకు కేటీఆర్ సూచించారు. దీని కి అనుగుణంగా ప్రతిపాదిత నగర పంచాయతీలు, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాల కూడిన జాబితాను పంపారు. కొత్తగా ఏడు మున్సిపాలిటీలు ప్రభుత్వ తాజా నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలో కొత్తగా ఏడు నగర పంచాయతీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. గండిపేట/బండ్లగూడ, తుర్కయంజాల్, తుక్కుగూడ, ఆదిబట్ల/కొంగరకలాన్, శంషాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు పురపాలక సంఘాలుగా మారే వీలుంది. ఇవేగాకుండా కొత్తూరును నగర పంచాయతీగా మార్చే అంశంపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సమీప గ్రామాలను కలిపినా.. నిర్దేశిత జనాభా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తోంది. గండిపేట మండలం కేవలం మణికొండ, పుప్పాల్గూడ మాత్రమే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని, మిగతా గ్రామాలన్నింటిని కలుపుతూ గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ఖానాపూర్, వట్టినాగుపల్లి, గండిపేట గ్రామాలు ఔటర్ రింగ్రోడ్డు అవతల ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మ్యాపుల తయారీలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. 48 గ్రామాలు ఉష్కాకి! కొత్త మున్సిపాలిటీలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 48 గ్రామాలను పురపాలక శాఖలో విలీనం కానున్నాయి. గండిపేట, శంకర్పల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు మండలాల పరిధిలోని ఈ గ్రామాలు నగర పంచాయతీల సరసన చేరనున్నాయి. కాగా, షాద్నగర్కు చేరువలో ఉన్న కొన్ని గ్రామాలను ఆ మున్సిపాలిటీలో చేర్చాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రామాల్లో ఇంకా 80శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున.. వాటి విలీనంపై పునరాలోచన చేస్తోంది. మరోవైపు తుర్కయంజాల్లో మునగనూరు చేరికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భౌగోళికంగా పెద్దఅంబర్పేట, జీహెచ్ఎంసీకి దగ్గరగా ఉన్న ఈ గ్రామాన్ని యంజాల్ మున్సిపాలిటీలో ప్రతిపాదిస్తే స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సివస్తుందని యంత్రాంగం అంటోంది. నగర పంచాయతీల ఏర్పాటుపై శాస్త్రీయత ప్రశ్నిస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. తుర్కయంజాల్: రాగన్నగూడ, తుర్కయంజాల్, ఇంజాపూర్, మునగనూరు, తొర్రూరు, బ్రాహ్మణపల్లి, కమ్మగూడ, ఉమర్ఖాన్గూడ దాయర, కోహెడ, బండ్లగూడ లేదా గండిపేట: కిస్మత్పూర్, నార్సింగి, హైదర్షాకోట్, పీరంచెరువు, మంచిరేవుల, నెక్నాంపూర్, గండిపేట, వట్టినాగులపల్లి, ఖానాపూర్, బండ్లగూడ, హిమాయత్సాగర్, కోకాపేట్ కొంగర లేదా ఆదిబట్ల: బొంగ్లూరు, మంగల్పల్లి, కొంగరకలాన్, ఆదిబట్ల, పటేల్గూడ, రాందాస్పల్లి తుక్కుగూడ: మంకాల్, రావిర్యాల, తుక్కుగూడ, సర్దార్నగర్ శంషాబాద్: సాతంరాయి, చిన్నగొల్లపల్లి, ఊట్పల్లి, కొత్వాల్గూడ, శంషాబాద్, తొండుపల్లి శంకర్పల్లి: ఫతేపూర్, బుల్కాపూర్, సింగాపూర్, శంకర్పల్లి ఆమనగల్లు: ఆమనగల్లు, విఠాయిపల్లి -
ముందు జాగ్రత్త పడితేనే..
బెల్లంపల్లి : రాత్రి అయితే చలి..పగలు ఎండ..పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం శరవేగంగా మారుతున్నాయి. ఎండలు ఈసారి ఫిబ్రవరి నెలలోనే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పురప్రజలను వేసవిలో నీటి ‘ఫోబియా’ వెంటాడుతుంది. వేసవిలో తాగునీటి సమస్య ఆందోళన ఈ ఎండలను చూసి ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. గోదావరి జలాలు మున్సిపల్కు అందకపోవడంతో ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవని భావిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మేల్కొని నీటి సమస్య తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో తాగునీటి సరఫరా తీరుపై ప్రత్యేక కథనం.. బెల్లంపల్లి పుర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం 2011లో గోదావరి నీటి పథకాన్ని ప్రతిపాదించారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం రూ.18కోట్లతో అంచనా వేశారు. మెగా కన్స్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపనీ టెండర్ దక్కించుకుని 2014లో పనులను పూర్తి చేసింది. తాగునీటి సరఫరా కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మందమర్రి ఫిల్టర్బెడ్ వరకు అంతర్గత పైపులైన్ వేసి, అప్పటికే బెల్లంపల్లి– మందమర్రి గోదావరి తాగునీటి పథకం కోసం ఏర్పాటు చేసిన పాతపైపులైనుకు అనుసంధానం చేశారు. వెంటాడిన లీకేజీ సమస్యలు... గోదావరి జలాల కోసం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓవర్హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ నిర్మించారు. గతేడాది ట్రయల్ రన్ నిర్వహించినా ఎల్లంపల్లి– మందమర్రి మధ్య చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత లీకేజీలను అరికట్టి నీటి సరఫరా కోసం మార్గం సుగమం చేశారు. మరమ్మతుల అనంతరం ఇటీవలనే మరోసారి ట్రయల్రన్ చేపట్టగా విజయవంతమైంది. అందని నీరు... ట్రయల్ రన్ విజయవంతమైనా ఫిల్టర్బెడ్కు పూర్తిస్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన ప్రకారంగా నీటి సరఫరా జరుగుతుందా లేదా అనేది పురప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్లో వాల్వ్ల ఏర్పాటు, జాయింట్ల అనుసంధానం చేయాల్సిన పనులు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. నీటి పథకంపైనే భారం.. వేసవిలో పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు ఎల్లంపల్లి నీటి పథకం ఒక్కటే ఆధారం. ప్రస్తుతం బెల్లంపల్లి– మందమర్రి గోదావరి నీటి పథకం ద్వారా సరఫరా అరకొరగా జరుగుతోంది. నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మేల్కొని గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందేలా చూసి వేసవిలో దాహారం తీర్చాలని పురప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా స్వరూపం.. జనాభా 56,369 ఇళ్ల సంఖ్య 16,066 నల్లా కనెక్షన్ల సంఖ్య 3000 రోజువారీగా నీటి సరఫరా లక్ష్యం 7 ఎంఎల్డీ సరఫరా అవుతున్న తాగునీరు 3.4 ఎంఎల్డీ ప్రత్యామ్నాయం సింగరేణి ఫిల్టర్ బెడ్లు, బోర్లు వేసవికి ముందే నీరందిస్తాం మున్సిపల్ ప్రజలకు వేసవికి ముందే గోదావరి జలాలు అందిస్తాం. ఎల్లంపల్లి నుంచి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అక్కడక్కడ చిన్నచిన్న లీకేజీలు ఉన్నాయి. వీటిని సవరించి నీటి ఎద్దడి లేకుండా నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ఈసారి గోదావరి నీరు అందిస్తాం. – సునీతారాణి, మున్సిపల్ చైర్పర్సన్ -
కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు
వనపర్తిటౌన్ : తన వద్దకు వచ్చిన ప్రతి ఫైల్ ను క్లియర్ చేస్తున్నట్లు పుర కమిషనర్ వెంకటయ్య తెలిపారు. పుర అధికారులే తాను రావట్లేదని, తన దృష్టికి తేకుండా తనను బ్లేమ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశా రు. బుధవారం పుర సర్వసభ్య సమావేశం చైర్మన్ రమేష్గౌడ్ అధ్యక్షతన జరిగింది. జోగుళాంబ గద్వాల జిల్లాకు వెళ్తున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిసేందుకు గంటలోనే పుర సమావేశం ముగించేశారు. ఈ సందర్భంగా సభలో ప్రస్తావనకు వచ్చిన ఇద్దరూ అథికారులు దరఖాస్తు విషయంలో పొరపాట్లు దొర్లిన శ్రీనివాసులు, శర్మకు, శానిటేషన్ ట్రాక్టర్పై తప్పుడు సమాచారం ఇచ్చిన శానిటేషన్ సంబంధిత అధికారికి మెమో ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి పురంలో ఒక పొరపాటు జరగనివ్వని, ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తన దృష్టికి తేవాలని సభ్యులను కోరారు. అధికార సభ్యుడు పాకనాటి కృష్ణ, కాంగ్రెస్ ప్లోర్ లీడర్ భువనేశ్వరిలు చెత్త ట్రాక్టర్ రోజు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికార సభ్యులు ఇం దిరమ్మ, రమేష్నాయక్,బీజేపీ ఫ్లోర్ లీడర్ జ్యోతి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల దరఖాస్తులు ఎందుకు తీసుకోవడం లేదని, కొత్త ఫించన్లు ఎందుకు ఆన్లైన్లో ఎన్ రోల్ చేయడం లేదని నిలదీయడంతో ఇక నుంచి ప్రక్రియ కొనసాగించనున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.విద్యుత్ దిమ్మెలను కూల్చే వ్యక్తులపై విద్యుత్శాఖ చర్య లు తీసుకునేలా మునిసిపాలిటి విద్యుత్ అ« దికారులకు లేఖ రాయాలని టీఆర్ఎస్ స భ్యుడు సతీష్యాదవ్ సూచించారు. కాం గ్రెస్ సభ్యుడు చీర్ల విజయ్చందర్, అధికార సభ్యుడు వెంకటేష్లు మాట్లాడుతూ సిటిజ న్ చార్టర్ ప్రకారం సేవలు అందడం లేదని, ముటేషన్ దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచుతున్నారని మండిపడటంతో వైస్ చైర్మన్ కృష్ణ మద్దతు ప్రకటించగా, కమిషనర్ నిబంధనలు అమలు చేస్తామన్నారు. పురపాలక మంత్రిని కలసిన కౌన్సిలర్లు వనపర్తి : పర్యటనకు వచ్చాక అభివృద్ధి పనులకు నిధులు ప్రకటించనున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం అడ్డాకులలోని ఎంపీ జితేందర్రెడ్డి అతిథి గృహంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి పుర చైర్మన్ రమేష్గౌడ్ నేతృత్వంలోని ఆల్ పార్టీ కౌన్సిల్ బృందం మంత్రిని కలి«సి అభ్యర్థించారు. త్వరలో వనపర్తికి వస్తానని మంత్రి పేర్కొన్నారు. నిధులు ప్రకటిస్తానని మంత్రి పేర్కొన్నారని చైర్మన్ రమేష్గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి పర్యాటన ఖరారైతే ఆధునిక హంగులతో నిర్మించే కూరగాయాల మార్కెట్లు, వైకుంఠధామం ప్రారంభం చేయిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులున్నారు. -
రణరంగంగా మున్సిపల్ సమావేశం
బెల్లంపల్లి : మున్సిపల్ సర్వసభ్య సమావేశం మరోమారు రణరంగంగా మారింది. కొందరు సభ్యులు బాహాబాహీకి దిగారు. ఒకరి చొక్కాలను మరొకరు పట్టుకుని రసాభసా చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశం ప్రారంభంలోనే సభ్యుడు పత్తిపాక రాజ్కుమార్ కుర్చీలోంచి లేచి అభ్యంతరం తెలిపారు. సమావేశం నెల ప్రారంభంలో నిర్వహించాలని, దీంతో సభ్యులకు ఇబ్బంది ఉండదని రాజ్కుమార్ మాట్లాడారు. అంతలోనే మరో సభ్యుడు ఎలిగేటి శ్రీనివాస్ కుర్చీలోంచి లేచి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తే ఏంటి, ప్రతి సారి ఏదో ఒక గొడవ చేస్తావ్ అంటూ ఆవేశంగా రాజ్కుమార్ వైపు వచ్చాడు. దీంతో ఈ ఇద్దరు సభ్యులు కోపోద్రిక్తులై ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. కుర్చీలను తన్నడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అంతలోనే ఇతర సభ్యులు అప్రమత్తమై ఘర్షణకు దిగిన సభ్యులను చెరో వైపుకు తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన ముగిసిన తర్వాత ఎజెండా అంశాలపై వైస్చైర్మన్ నూనేటి సత్యనారాయణ మాట్లాడారు. ఒక్కో అంశాన్ని మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం మాత్రమే ఆమోదించాలని వైస్ చైర్మన్, సభ్యులు కమిషనర్కు స్పష్టం చేశారు. ఒకటో అంశం ఆమోదించిన సభ్యులు, రూ.2.34 కోట్లతో ప్రతిపాదించిన రెండో అంశంపై చర్చ ప్రారంభం కాగా వైస్చైర్మన్, మెజార్టీ సభ్యులు వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఇంతలో సభ్యుడు రాజేశ్వర్ నిల్చుని రెండో అంశాన్ని ఆమోదించాల్సిందేనని సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు గొడవ ప్రారంభమైంది. వైస్చైర్మన్ సత్యనారాయణ, సభ్యుడు రాజేశ్వర్ ఆవేశానికి గురై కుర్చీలు విసురుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. ఘర్షణ సద్దుమణిగిన కొద్దిసేపటి తర్వాత సమావేశం నిర్వహించారు. గొడవ జరుగుతున్న క్రమంలో టూటౌన్ ఎస్సై జె.సురేష్ బందోబస్తు నిర్వహించారు. ఏకగీవ్రంగా ఆరు అంశాలు ఆమోదం.. బెల్లంపల్లి : మున్సిపల్ సమావేశంలో సభ్యులు ఆరు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్పర్సన్ సునీతారాణి, కమిషనర్ రాజు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. మరో నాలుగు అంశాలను సభ్యులు వాయిదా వేసినట్లు తెలిపారు. సభా మర్యాదలు పాటించాలని సభ్యులకు పదే పదే గుర్తు చేస్తున్నా విస్మరించి ఘర్షణ పడుతున్నారని తెలిపారు. ఇకపై సమావేశంలో గొడవకు దిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఎల్.రాములు, కె.కవిత, సరిత, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఆర్వోను సరెండర్ చేస్తూ తీర్మానం.. మున్సిపల్ రెవెన్యూ అధికారి(ఆర్వో) మల్లారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు వైస్చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సభ్యులు చేసిన తీర్మానాలను కాదని వేరే తీర్మానాలు మినిట్స్ బుక్లో రాసి తప్పుదోవ పట్టించిన ఆర్వోను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పట్టుబట్టి సభ్యులు తీర్మానం చేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కటకం సతీష్, సభ్యులు వాసు, యూసుఫ్, శారద, రమ్మణమ్మ, స్రవంతి, శ్రీనివాస్, స్వప్న, రాజ్కుమార్, లావణ్య, భాగ్యలక్ష్మీ, సుమలత, వరలక్ష్మీ, వంశీకృష్ణారెడ్డి, అరుణ, రాజులాల్యాదవ్, కో– ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పనికో రేటు
మున్సిపాలిటీలో పనికో రేటు..! ఎంత త్వరగా కావాలంటే అంత ముట్టజెప్పాల్సిందే.. భవన నిర్మాణ, వ్యాపార, దుకాణ అనుమతులు, యాజమాన్య పేరు మార్పు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఏ సేవలైనా ఎంతో కొంత చేయి తడపాల్సిందే. ఏమీ చెల్లించని వారు రోజులు చెప్పులరిగేలా తిరగాల్సిందే.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం కదా! ఇక పని అయిపోయిందనుకుంటే పొరపాటే! సాక్షి, వనపర్తి : మున్సిపాలిటీ ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా సేవలు అందించాలని ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలుచేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కార్యాలయంలో కొందరు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏ పనీ జరగడం లేదన్నది బహిరంగ రహస్యమే.. పురపాలక శాఖలో రెవెన్యూ విభాగం కీలకమైంది. కార్యాలయంలో ఖర్చు, రాబడి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేది ఇక్కడే. ఆస్తుల క్రయవిక్రయాలు, మ్యూటేషన్ (యాజమాన్య పేరు మార్పు)చేసేది ఈ విభాగమే. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తారు. సబ్రిజిస్ట్రార్, పురపాలక సంఘాల మధ్య ఎలాంటి జాప్యం లేకుండా వెంట వెంటనే యాజమాన్య పేరు మార్పిడి జరగాలి. కానీ వనపర్తి పురపాలక సంఘంలో 50శాతం మందికి కూడా నిర్ణీత గడువులోగా మ్యూటేషన్ జరగడం లేదు. పూర్తిగా ఆన్లైన్లో జరగాల్సిన పని లబ్ధిదారులు నేరుగా జోక్యం చేసుకుంటే తప్ప కావడం లేదు. లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మ్యూటేషన్ దరఖాస్తు పత్రం తెచ్చి రెవెన్యూ విభాగంలో ఇచ్చి ఇంత రేటు అని మాట్లాడుకుంటేనే ఫైల్ ముందుకు కదులుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి 2016జూన్ నెల నుంచి 3180 మ్యూటేషన్ ఫైళ్లు రాగా, అందులో మున్సిపాలిటీలో సకాలంలో పూర్తయినవి ఏ ఒక్కటీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు కట్టి చూడు! పురపాలక సంఘం పరిధిలో ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 30రోజుల్లోగా అనుమతి ఇవ్వాలి. దానిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 21రోజులకే కుదించింది. కానీ దరఖాస్తుచేసి మూడు నుంచి ఆరు నెలలు గడిచినా అనుమతి రావడం లేదు. అనుమతి మంజూరు కావాలంటే స్థానిక కౌన్సిలర్లతో పాటు, టౌన్ప్లానింగ్ అధికారులకు రూ.వేలకు వేలు సమర్పించాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే చాలారోజుల పాటు అవి అధికారుల టేబుళ్ల మీదే మూలుగుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి పురపాలక సంఘంలో ఇంటి నిర్మాణ దరఖాస్తులు కేవలం 10మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నా అవి వాస్తవ లెక్కలు కావనే విషయం అందరికీ తెలిసిందే. మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే.. మున్సిపాలిటీలో ప్రజలు ఏయే రకాల సేవలు పొందాలన్నా పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పని పూర్తయిందనుకుంటే పొరపాటే..! దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏ ఫైల్ ముందుకు కదిలి పని పూర్తికావాలంటే పురపాలక కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది లేదా మధ్యవర్తుల ప్రమేయం తీసుకోవాల్సిందే. ఏ పనికి ఎంత ఇస్తారో ముందుగా బేరం కుదిరితేనే పని పూర్తవుతుంది. పెండింగ్లో ఉంచడం లేదు.. యాజమాన్య మార్పిడి దరఖాస్తులను పెండింగ్లో ఉంచడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఆన్లైన్లో వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం మున్సిపాలిటీలో 83మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన వారి పనే చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – నూరుల్నజీబ్, రెవెన్యూ అధికారి, వనపర్తి మున్సిపాలిటీ మా దృష్టికి వస్తే చర్యలు భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుని పూర్తిగా నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నాం. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 6నుంచి 8 మంది ఎల్పీటీలు ఉన్నారు. వారు ఇంటి నిర్మాణ దరఖాస్తు సమయంలో వసూలు చేయాల్సిన డబ్బుల కంటే ఎక్కువగా వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – కృష్ణమూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారి, వనపర్తి -
క్రమశిక్షణతో చదవాలి
పెద్దపల్లిరూరల్ : చదువుకోసం దూర, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఏసీపీ హబీబ్ఖాన్ అన్నారు. రంగంపల్లి గిరిజన వసతిగృహంలో అనాథ విద్యార్థులకు కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. బీసీ, ఎస్టీ హాస్టల్లో ఉంటూ చదివే విద్యార్థులు తాము పెద్దపల్లిలోని పాఠశాలకు వెళ్లి› రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్ రాజయ్య దృíష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్, వార్డెన్లు స్వర్ణలత, రమేశ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులున్నారు. -
ఆ దారుణ హత్యకు కారణం మిర్చి బండి గొడవే!
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిర్చి బండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారితీసిందన్నారు. శ్రీనివాస్ది కేవలం యాదృచ్చికంగా జరిగిన హత్యేనని ఎస్పీ పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాంబాబు, మల్లేష్, శరత్లను ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ హత్యే : లక్ష్మి ఇంట్లో నుంచి పిలిపించి మరీ తన భర్తను హత్య చేశారని శ్రీనివాస్ భార్య, నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మి అన్నారు. చిల్లర గొడవను సాకుగా చూపుతూ ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని తెలిపారు. ఈ హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. మంచి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి మిర్చి బండి దగ్గర చిల్లర గొడవ ఎందుకు చేస్తారని లక్ష్మి అన్నారు. -
'హత్య చేసింది కూడా కోమటిరెడ్డి అనుచరుడే..'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయవిచారణ జరపాలని టీఆర్ఎస్ఎల్పీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ హత్యకు కారకులు ఎవరో తేలాలంటే గత కొంతకాలంగా హత్యకు గురైన శ్రీనివాస్ ఎవరితో మాట్లాడారో చూడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు రాంబాబు కూడా కోమటిరెడ్డికి శిష్యుడేనని టీఆర్ఎస్ పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని పేర్కొంది. నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన సంచలనం రేపింది. హత్య కేసులో ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే, వీరి వెనుక అధికార పార్టీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు విచారణ జాగ్రత్తగా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, పొంగులేటి, వీహెచ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు కలిశారు. -
శ్రీనివాస్ హత్యకేసులో నిందితుల లొంగుబాటు
నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నల్లగొండలోని గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్కు ఫోన్ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
అర్ధరాత్రి రహస్య సమావేశం
బద్వేలులో అధికారపార్టీ నాయకుల, పాలకుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖాళీస్థలాలు కనిపిస్తే రాత్రికి రాత్రే కబ్జాచేయడం, ప్రతిపక్షనాయకుల గొంతునొక్కించడం ఇప్పటివరకు జరిగిన తంతుఅయితే, తాజాగా అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పాలకవర్గం కుమ్మక్కుఅయ్యింది. బద్వేలు మున్సిపాలిటీలో అవినీతిని పంచుకునేందుకు అర్ధరాత్రిరహస్యసమావేశం జరిగింది. కాంట్రాక్టర్లకు టెండర్లు వేయవద్దు అంటూహుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బద్వేలు(అట్లూరు): బద్వేలు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు 64 పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.5.25 కోట్ల నిధులు 2016–17 కింద మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ఈనెల 11వ తేదీన టెండర్లు పిలిచారు. ఈ నెల 27 చివరి తేదీ. బద్వేలు మున్సిపాలిటీలో పాలకపక్షం అధికారపార్టీ కావడంతో ఈ పనులకు సంబంధించి ఎవరైనా టెండర్లు వేస్తే పనులు చేయనివ్వం. మార్చి లోపల పనులు చేపట్టక నిధులు వెనక్కిపోతాయి అంటూ కాంట్రాక్టర్లకు చెబుతున్నట్లు సమాచారం. అందులోభాగంగా తమకు తెలియకుండా టెండర్లు వేయవద్దంటూ మున్సిపాలిటీ పాలకపక్షం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రానట్లు తెలిసింది. అర్ధరాత్రి రహస్య సమావేశం మున్సిపాలిటీలో ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు తాము చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే తాము పనులు చేయనివ్వం.. పనులు పూర్తికాకుంటే కాంట్రాక్టర్ బ్లాక్లిస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది, కనుక అందరూ మున్సిపల్ కార్యాలయం వద్దకు రండి అంటూ బుధవారం రాత్రి కాంట్రాక్టర్లను అధికారపార్టీ నేతలు పిలిపించుకున్నారు. అలాగే టీడీపీకి చెందిన కౌన్సిలర్లు మాత్రం కార్యాలయంలో ముందుగా కాంట్రాక్టర్లను బయట వేచి ఉండమన్నారు. వారు మాత్రం లోపలకు వెళ్లి తలుపులకు గడులు పెట్టుకుని సహస్యంగా సమావేశమయ్యారు. అంతా ఓకే.. సమావేశంలో ఇక ఏడు నెలలు మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ పనులలో కలసికట్టుగా కాంట్రాక్టర్లను పోటీలేకుండా చేయడంతో పాటు లెస్కు టెండరు వేయకుండా చూడాలని అనుకున్నారు. అవసరమైతే తమ పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టర్ల నుంచి 10శాతం రాబట్టుకుని ఒక్కో కౌన్సిలర్కు రూ.2 నుంచి రూ.3లక్షలు వాటా వచ్చేలా వ్యవహారం నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రహస్య సమావేశం అనంతరం అర్ధరాత్రి అక్కడే కాంట్రాక్టర్లతో వారు లోపల మాట్లాడుకున్న విషయాలు చెప్పి ఒప్పించుకున్నారు. 27వ తేదీ ఎవరు టెండర్లు లెస్కు వేయకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార పాలకవర్గం టెండర్ల విషయంలో వేసిన ఎత్తుగడ ఫలించేందుకు మున్సిపల్ అధికారులు పూర్తి సహాయ, సహకారాలు అందించడంతో పాటు ‘అంతా ఓకే మీరు చెప్పినట్లే ’ అంటూ తలూపినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి బద్వేలు మున్సిపాలిటీ పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల పనులకు సంబంధించిన టెండర్లకు పోటీలేకుండా చేయడంతో పాటు అధికార యంత్రాంగం పూర్తి మద్దతు లభించడంతో ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ.50లక్షల నుంచి రూ.60లక్షలు గండికొట్టనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి వారి ప్రణాళిక నెరవేరితే ఒక్కో వార్డు నేతకు రూ.3లక్షల వరకు కాంట్రాక్టర్ల నుంచి ముట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాకు తెలియదు: మున్సిపల్ డీఈ రవిప్రకాష్నాయుడు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పనుల టెండర్లకు సంబంధించి కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు బుధవారం రాత్రి రహస్య సమావేశమైన విషయం నాకు తెలియదు. అయినా ఆన్లైన్ టెండర్లు ఎక్కడ నుంచి అయినా వేయవచ్చు. అంతకు మించి నాకు తెలియదు. -
'నా భర్తది రాజకీయ హత్యే'
-
పట్టించుకుంటే ‘ఒట్టు’!
కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. మొదట మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇంటింటి సర్వే చేపట్టడం వల్ల ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం దారి తప్పిపోయింది. రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు ఒకేసారి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఈ సారి నాలుగైదు నెలలు ముందుగా నిర్వహించేందుకు యత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల యంత్రాంగం మాత్రం స్తబ్దుగా మిన్నకుండడం గమానార్హం. ముందస్తుగా ఎన్నికలు జరిగితే 2017 ఓటర్ల జాబితా సవరణ ద్వారా ప్రకటించే తుది జాబితానే ప్రామాణికం అవుతుంది. నిబంధనల ప్రకారం జాబితా సవరణ కార్యక్రమం మొదలయ్యే రోజున ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఈ సారి మాత్రం జాబితా సవరణలో భాగంగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ముగిసినప్పటికీ ముసాయిదా జాబితాను ప్రకటించలేదు. దీన్ని ప్రకటిస్తే ఓటర్లు అందులో తమ పేరు ఉందో లేదో చూసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ముసాయిదా జాబితాను ఇంత వరకూ ప్రకటించ లేదు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబరు 17, 24వ తేదీలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ప్రకటించడంతో 6,677, 7,664 దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిపై బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి విచారణ జరపాలి. ఆన్లైన్లో సీఈఓ వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూలు ప్రకారం ఈ నెల 20న తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటి దాకా పట్టించుకోకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితా సవరణ పూర్తై తుది జాబితా ప్రకటించిన తర్వాత జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే, ఎన్నడూ లేని విధంగా అస్తవ్యస్త పరిస్థితులు నెల కొన్నాయి. రాజకీయ పార్టీలు సాధారణ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నా ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల యంత్రాంగం స్తబ్దుగా ఉండి పోయింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినా జాబితా ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఈ సారి ముసాయిదా ఓటర్ల జాబితా లేకుండానే ఒకటి రెండు రోజుల్లో తుది ఓటర్ల జాబితా వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్ల దినోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక : కలెక్టర్ ఈ నెల 25న అన్ని నియోజకవర్గాల్లో 8వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆర్డీఓలు, ఈఆర్ఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తామని, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, నియోజక వర్గ కేంద్రాల్లో అనువైన ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. పంచాయతీల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి టామ్టామ్ వేయించాలని, 25న 2కే రన్ నిర్వహించి ప్రధాన కూడళ్లలో మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ఫోక్ డ్యాన్స్, మిమిక్రీ, కూచిపూడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొదటి సారిగా ఓటర్లుగా నమోదైన యువతను, ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వెటరన్ ఓటర్లను గుర్తించి సత్కరించాలని సూచించారు. వీడియో కాన్పరెన్స్లో డీఆర్ఓ శశీదేవి, జడ్పీ సీఇఓ ఈశ్వర్,స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అనురాధ, డీఎస్డీఓ జగన్నాథరెడ్డి, ఐసీడీఎస్ పీడీ జుబేద బేగం ఎన్నికల సెల్ సూపరింటెండెంటు యూనస్బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘రింగ్’ తిప్పాడు.. రూ.4 కోట్లు కొల్లగొట్టాడు
సాక్షి, అమరావతి బ్యూరో: రూ.5 లక్షలు ఇస్తే సిస్టమ్ మేనేజర్.. రూ.3 లక్షలు ఇస్తే సిస్టమ్ అసిస్టెంట్.. ఆ తర్వాత రెగ్యులర్ అయ్యే అవకాశం.. ఇదీ ఉద్యోగాలిప్పిస్తామంటూ అమరావతిలోని తాత్కాలిక సచివాలయం కేంద్రంగా సాగుతున్న రాకెట్. పురపాలక శాఖలో కీలక నేతకు సన్నిహితుడైన ఓ ప్రైవేటు వ్యక్తి దీనికి రింగ్ మాస్టర్ కాగా ఓ ఉన్నతాధికారి సూత్రధారి. ఇంకేముంది నిరుద్యోగులు నమ్మి దాదాపు రూ.4 కోట్లు ముట్టజెప్పారు. పురపాలక శాఖలో తిష్ట వేసి.. రాజధాని వ్యవహారాలు చూసే ప్రభుత్వ నేతకు సన్నిహితుడైన ఆ ప్రైవేటు వ్యక్తి పురపాలక శాఖలో చక్రం తిప్పుతున్నాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, హనుమాన్జంక్షన్కు చెందిన ఆయన కొన్నేళ్లుగా విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఉంటున్నాడు. పురపాలక శాఖలో అనధికారికంగా తిష్టవేసి ఆ శాఖలో ఓ ఉన్నతాధికారితో సాన్నిహిత్యం పెంచుకుని దందాలకు తెరతీశాడు. కాగా, సెక్రటేరియట్, సీఆర్డీఏ, పురపాలక సంఘాల్లో 110 సిస్టమ్ మేనేజర్లు, 128 సిస్టమ్ అసిస్టెంట్ల పోస్టులను కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఇదే అదనుగా ఆ వ్యక్తి చక్రం తిప్పాడు. రూ.4 కోట్లు వసూలు: పురపాలక శాఖలో కీలక నేతకు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆ వ్యక్తి అభ్యర్థులకు చెప్పుకొచ్చాడు. సిస్టమ్ మేనేజర్ పోస్టుకు రూ.5 లక్షలు, సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు చొప్పున బేరం పెట్టాడు. ఆ పోస్టులను తర్వాత రెగ్యులర్ కూడా చేస్తారని ఆశ చూపించాడు. ఆయన మాటలను ఆ ఉన్నతాధికారి కూడా సమర్థించినట్లు సమాచారం. దీంతో దాదాపు 100 మంది అభ్యర్థులు ఆయన అడిగినంత ముట్టజెప్పారు. ఇలా గతేడాది నవంబర్, డిసెంబర్లలో దాదాపు రూ.4 కోట్లకుపైగా వసూలు చేశాడు. నిరుద్యోగులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పురపాలక శాఖకు పంపించారు. దరఖాస్తులు స్వీకరించినట్టు ఆ శాఖ కూడా నిర్ధారించింది. అప్పటి నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వస్తుందంటూ జాప్యం చేస్తూ వచ్చాడు. కానీ ఇంటర్వ్యూకు పిలుపు రాలేదు. అభ్యర్థులు ఆరేడు నెలల నుంచి ఆయన చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. రింగ్ మాస్టర్కు అధికారుల వత్తాసు రూ.4 కోట్లు సమర్పించిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించారు. ఈ విషయంపై పురపాలక శాఖ మంత్రిత్వ శాఖకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ ఓ వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి న్యాయం కోసం ఒత్తిడి పెంచారు. అయినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కీలక నేతకు సన్నిహితుడైన రింగ్ మాస్టర్ను వెనకేసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ నిరుద్యోగి మూడు రోజుల క్రితం హనుమాన్జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కీలక నేతకు సన్నిహితుడు కావడంతో చర్యలు తీసుకునేందుకు పోలీసుల సందేహిస్తున్నారు. మరోవైపు ఆ రింగ్ మాస్టర్ కుటుంబసభ్యులు నిరుద్యోగులపై ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తుండటం గమనార్హం. -
మునిసిపల్ ఉద్యోగి ప్రేమ వివాహం
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న ఓ ఉద్యోగి ప్రేమ వివాహం చేసుకోగా మంగళవారం కార్యాలయంలో చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. వధువు బంధువులు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేస్తుండగా చివరికి పెద్ద మనుషులు, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయ అధికారుల జోక్యంతో విషయం పోలీస్స్టేషన్కు చేరింది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడులో నివసిస్తున్న పడమర సాయి సంజీవ్హర్షిత్, విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన అన్నాబత్తుల అంజలిప్రియదర్శిని 2012 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం తెలిసినా పెద్దలు అడ్డుచెప్పడంతో సోమవారం రాత్రి ఇద్దరూ సీతానగరంలోని సాయిబాబా గుడిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం యువతి బంధువులు పోలీస్ స్టేషన్లో అభ్యంతరం చెప్పగా ఎస్సై ప్రతాప్కుమార్ సఖ్యత కుదిర్చారు. వారిద్దరికి తిరిగి పెద్దల సమక్షంలో తాడేపల్లి కృష్ణుడి దేవాలయంలో వివాహం జరిగింది. -
ఒంగోలులో ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఓ అవినీతి అధికారి వ్యవహారం వెలుగు చూసింది. గురువారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్గా పని చేసే రావిపాటి పూర్ణ చందర్రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'వందేమాతరం పాడం.. '
లక్నో : మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందేమాతరం పాడబోమని మీరట్ మేయర్ బీఎస్పీకి చెందిన సునీతా వర్మ స్పష్టం చేశారు. భారత జాతీయ గీతం జనగణమన అని ఆ గీతాన్నిమాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరట్, అలీఘడ్ ప్రాంతాల్లో బీఎస్పీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ ప్రాంతాల్లో సమావేశాల ప్రారంభ సమయంలో వందేమాతరం ఆలపించాలని గతంలో పనిచేసిన మేయర్లు షరతు పెట్టగా కొత్తగా ఎన్నికైన సునీతా ఆ విధానాన్ని నిరాకరించారు. కేవలం తాము జనగణమన మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేసినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు నిరాకరించారు. ముఖ్యంగా బీజేపీ నేతలు సునీతా వర్మ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. -
అద్దెనా.. ఇద్దాములే..!
తమకు రావాల్సింది ఉంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రభుత్వ శాఖలు.. వాటి విషయా నికొస్తే మరోలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అందుకు భువనగిరి మున్సిపాలిటీలో నిలిచిపో యిన అద్దెల బాగోతమే నిదర్శనం. మున్సిపల్ భవనంలో కొనసాగు తున్న పలు డిపార్ట్మెంట్లు నెలల తరబడి అద్దె చెల్లించకుండా మొండికే స్తున్నాయి. నోటీసులు జారీ చేసినా నో రెస్పాన్స్. ఒత్తిడి తెస్తే ఎంతోకొంత చేతిలో పెట్టి మకాం మారుస్తున్నాయి. భువనగిరి : మున్సిపాలిటీకి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో మున్సిపాలిటీకి వచ్చే కిరాయిలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పాలనా సౌలభ్యం కోసం 2016, అక్టోబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. నూతన జిల్లా కావడంతో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్డర్ టూ సర్వ్ ప్రతిపాదికన అధికారులను నియమించి జిల్లా కార్యాలయ నిర్వహణకు అందుబాటులో ఉన్న భవనాలను అద్దెకు తీసుకున్నారు. ఇందులో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్స్ ఫర్ స్మాల్, మీడియం టౌన్స్ పథకంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం మున్సిపాలిటీకి పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ప్రభుత్వ శాఖలకు చెందిన 11 కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు. ఏయే శాఖలంటే.. మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న భవన సముదాయంలో 11 శాఖలకు అద్దెకు ఇచ్చారు. ఇందులో ఒక శాఖ ఆరు నెలల అద్దె చెల్లించి ఖాళీ చేసింది. మిగిలిన 10 శాఖల కార్యాలయాలు అక్కడే కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ అభివృద్ధి కార్యాలయాలు, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా క్రీడలు యోజన, సర్వీసుల శాఖ, మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆహార పరిరక్షణ, జిల్లా టౌన్ ప్లానింగ్, జిల్లా పంచాయతీ, జిల్లా ఆడిట్ అధికారి శాఖ, ఉపాధి కల్పన అధికారి శాఖలు ఉన్నాయి.వీటిలో గిరిజన శాఖ ఐదు నెలలు, ఐసీడీఎస్ మూడు నెలలు, ఆడిట్ కార్యాలయం ఐదు నెలలు, ఉపాధి కల్పన శాఖ ఆరు నెలల చొప్పున అద్దె చెల్లించాయి. మిగిలిన శాఖలు 13 నెలల కిరాయి బకాయి పడ్డాయి. ఆయా శాఖలు రూ.11.06 లక్షలు చెల్లించాలని తెలుస్తోంది. నోటీసులు జారీ.. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అద్దె చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతోనే తమకు నిధులు రావడం లేదని ఉపాధి కల్పన కార్యాలయం మరో చోటకు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 10 శాఖలకు మున్సిపల్ అధికారులు అద్దె చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. -
ఎటు వెళ్తోంది?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అవినీతి జరిగినట్లు చెబుతుండగా.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీలో రూ.100కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇక స్థానిక మున్సిపల్ చైర్పర్సన్పాటు కొందరు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో 2005 నుంచి 2015 వరకు జరిగిన పనులపై విచారణ జరిపించాలని కొద్దిరోజుల క్రితం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేశారు. ఇదంతా జరుగుతుండగానే.. ఇప్పటికే తాము పని ఒత్తిడి ఎదుర్కొంటుండగా.. విచారణలు, నివేదికలు మొదలైతే పనిభారం పెరుగుతుందని చెబుతూ తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే దీర్ఘకాలిక సెలవులో వెళ్తామని పేర్కొంటూ బుధవారం ఒక రోజు పెన్డౌన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ రాధకు నోటీసు అందజేశారు. రాజకీయ కారణాలు.. రాజకీయ కారణాలతో ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండడంతో తాము నలిగిపోతున్నామని మున్సిపల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైన పనిఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణల పేరుతో మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణ జరిగే వరకు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను ప్రభుత్వంతో అధికారులకు తెలియజేసేందుకు ఒక్కరోజు పెన్డౌన్కు పిలుపునిచ్చామని మున్సిపల్ ఉద్యోగులు వెల్లడించారు. అవసరమైతే దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు వెనకాడేది లేదని పోటీసులు ఇచ్చిన అనంతరం ఎంఈ సత్యనారాయణ, ఏసీపీ విద్యాసాగర్, మేనేజర్ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ మోహినోద్దిన్, ఆర్ఐ శశిధర్ వెల్లడించారు. రోజుకో ట్విస్ట్ మునిసిపాలిటీలో అక్రమాలు జరిగాయనే అంశంపై రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ నగర పంచాయతీలో రూ.88లక్షల అక్రమాల వ్యవహరం బయటికి పొక్కడంతో ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో అయిజ నగర పంచాయతీలో కొద్దికాలం పనిచేసిన ప్రస్తుత మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ బి.దేవ్సింగ్పై ఏ–8 నిందితుడుగా, అసిస్టెంట్ కమిషనర్ వెంకన్నపై ఏ–6 నిందితుడిగా ఉన్నారు. దీంతో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కూడా కమిషనర్గా దేవ్సింగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళనలు చేపట్టారు. అలాగే, రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తు ‘వాచ్’ స్వచ్ఛంద సంస్థ గత నెలలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టుకు వెళ్లింది. ఈ ఫిర్యాదుల వెనక విపక్ష నాయకుల హస్తం ఉందని భావించిన మున్సిపల్ చైర్పర్సన్ రాధ తదితరులు కొద్దిరోజుల క్రితం 2005 నుంచి 2015 వరకు జరిగిన పనులపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా పార్టీలు, నేతల మధ్య జరిగే గొడవల కారణంగా తాము నలిగిపోతున్నామని చెబుతూ మున్సిపల్ ఉద్యోగులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజు పెన్డౌన్ చేపట్టనున్నట్లు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. -
ఊడ్చేవారిని రోడ్డుకీడ్చుతున్నారు..
బొబ్బిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుపేద మహిళ పేరు జలగడుగుల మంగమ్మ. ఈమె పారిశుద్ధ్య కార్మికుడు గోపాలం కుమార్తె. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులెవరయినా వారి కుటుంబాల్లోని వారంతా పనులకు వెళతారు. అలానే ఈమె తన భర్త చనిపోవడంతో తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవించేది. గోపాలం చేయాల్సిన పారిశుద్ధ్యపనులన్నీ చేసేది. ఏళ్లపాటు చేశాక ఇటీవల గోపాలం చనిపోయాడు. వాస్తవానికి వారసత్వంగా అతనిపై ఆధారపడిన కుమార్తెకు పారిశుద్ధ్య కార్మికురాలిగా కౌన్సిల్ అనుమతించలేదని తనను పక్కన పెట్టేశారు. ఇప్పుడీమె బతుకు భారమైంది. మున్సిపాలిటీలో ఈమె ఒక్కతే కాదు విజయమ్మ అనే మరో పారిశుద్ధ్య కార్మికురాలు కూడా చనిపోతే ఆమె కుటుంబ సభ్యులకు ఉద్యోగమివ్వలేదు. వేరే వారికి కట్టబెట్టారు. దీంతో ఆయా కార్మికులంతా తీవ్ర మనోవేదనతో తమ కుటుంబాలను ఈడ్చలేక దీనావస్థలో ఉన్నారు. అంగన్వాడీ, సబ్స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారన్న ఖ్యాతి దక్కించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు చివరకు పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను పూర్తిగా కల్పించని యంత్రాంగం చివరకు వారి పోస్టులను కూడా అందనీయకుండా చేస్తోంది. పట్టణంలోని 30 వార్డులుండగా 95 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించడం లేదు. చేస్తున్న పనులు పారిశుద్ధ్యం కనుక ఖచ్చితంగా బజ్బులు సోకుతున్నాయనీ, వాటిని బాగు చేయించుకోలేక మంచం పట్టి ఇలా చనిపోయిన కుటుంబాలు వీధిన పడాల్సిందేనా అని వారు వాపోతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రమోషన్లు.. పట్టణంలో ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది ఉన్నారు. అయితే వారిలో ఎవరైతే తమకు అనుకూలంగా, అనుసరులుగా ఉండి అందుబాటులో ఉంటారో వారికి సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు కల్పించారనీ అందువల్లనే కార్మికుల సంఖ్య తగ్గిందనీ కార్మిక నాయకులు బ హిరంగంగా చెబుతున్నారు. కార్మికులుగా పనిచేయిస్తూ అర్హత మేరకు సూపర్ వైజర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నా అలా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.50వేల చొప్పున అమ్ముకున్నారు కాంట్రాక్టు కార్మికులయితే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవ్వడం లేదు కనుక పోస్టును కుటుంబంపై ఆధారపడిన వారికి ఇవ్వాలి. కానీ అమ్ముకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించే వారిని రిటైర్ అయినా వేల రూపాయల వేతనంతో తిరిగి నియమించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి పోస్టును టీడీపీ నాయకులు రూ.50వేలకు అమ్ముకున్నారు. అర్హులయిన వారిని వీధిన పడేశారు. నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు.-పి శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సంఘం కాంట్రాక్టు పోస్టులకు ఇచ్చే అవకాశం లేదు పర్మినెంటు కార్మికుల కుటుంబాలకే వారసత్వ ఉద్యోగ అవకాశం ఉంది. కాంట్రాక్టు కార్మికులకు లేదు. గతంలో గోపాలం రిటైర్ అయిపోయాడు. ఆయన కుటుంబానికి పెన్షన్ వస్తుంది. ఆయన కుమారుడు కూడా ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబంలో అన్ని ఉద్యోగాలూ ఇచ్చే జీఓ లేదు కదా? అందుకనే గోపాలం కుమార్తెకు పోస్టు ఇవ్వలేదు. -హనుమంతు శంకరరావు, కమిషనర్, బొబ్బిలి మున్సిపాలిటీ -
గుజరాత్ లో బీజేపీ విజయం
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ స్ధానిక సంస్థల ఉపపోరులో బీజేపీ ముందంజలో నిలిచింది. మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఏడు జిల్లాల పరిధిలోని ఏడు మున్సిపాలిటీలకు గాను ఐదింట బీజేపీ విజయం సాధించింది. వీటికి తోడు ఒక తాలూకా పంచాయితీలోనూ బీజేపీ గెలుపొందింది. తాజాగా ఉప ఎన్నికలు జరిగిన ఎనిమిది చోట్ల గతంలో బీజేపీ కేవలం రెండు సీట్లలోనే గొలుపొందింది. దీంతో బీజేపీ బలం మూడు రెట్లు పెరగ్గా, గతంతో పోలిస్తే కాంగ్రెస్ గెలుచుకున్నమున్సిపాల్టీల సంఖ్య సగానికి పడిపోయింది. బీజేపీ బొరైవి, మహుధ, విజపూర్, పటాన్, తలాలా మున్సిపాల్టీల్లో గెలుపొందింది.గాంధీనగర్ జిల్లాలోని రంధేజా తాలూకా పంచాయితీ సీటునూ ఆ పార్టీ కైవసం చేసుకుంది.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో స్థానిక ఉప పోరులో సానుకూల ఫలితాలు రావడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. -
నోటీసులతోనే సరి!
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీకి చెందిన లీజు షాపుల అద్దె బకాయిలపై ప్రతిష్టంభన నెలకొంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి 233 దుకాణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. లీజు పొందిన ఆయా దుకాణాల వ్యాపారులకు నోటీసులు ఇచ్చి సరి పెట్టారు. బకాయిల వసూళ్లకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఒక్క రూ పాయి వచ్చిన దాఖలాలు లేవు. జేసీ నారాయణరెడ్డి మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టిన సమయంలో రెండు, మూడు రోజులు స్పె షల్ డ్రైవ్ నిర్వహించారు. రెండు, మూడు షాపులను సీజ్ చేసే దాకా వెళ్లారు. ఆ తర్వాత వ్యాపారులు కొంతసమయం కావాలని కోరడంతో అక్కడికే ఆగిపోయింది. ఇది జరిగి 7 నెలలు దాటినా నేటికీ ఒక్క రూపాయి కూడా వ్యాపారులు చెల్లించలేదు. అద్దె బకాయిలపై సంబంధిత అధికారులలో చిత్తశుద్ధి లోపించిందనే విమర్శలు లేకపోలేదు. ఏ వ్యాపారి ఎంత బకాయి ఉన్నాడనే వివరాలు సైతం అధికారుల వద్ద లేవు. దీంత వారు కూడా వసూళ్లకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ అయిన వెంటనే వ్యాపారులు కూడా ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెప్పించడంతో దీనికి ఒక ముగింపు లేకుండా పోయింది. చివరికి మున్సిపల్ లీజు షాపుల అద్దె బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఏ వ్యాపారి ఎంతివ్వాలో తెలియని పరిస్థితి నల్లగొండ మున్సిపాలిటీకి ప్రకాశంబజార్, న్యూప్రేమ్టాకీస్, తహసీల్దార్ కార్యాలయం, ప్రకాశంబజార్ డ్రెయినేజీలపై, పాతచౌరస్తాలో మొత్తం 233 దుకాణాలు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు లీజుకు ఇచ్చారు. అయితే ఏ వ్యాపారి ఎంత అద్దె బకాయి పడ్డాడనే వివరాలు మున్సిపాలిటీ వద్ద లేవు. ఈ లెక్కలు ఉంటే వసూళ్లు చేయడానికి కొంత సులభంగా ఉంటుంది. లీజు షాపుల బకాయిలు వసూలైతే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదు. లీజు షాపుల వ్యాపారులు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించే ఏర్పాట్లు చేయకపోవడమూ బకాయిలు పెరిగిపోవడానికి మూల కారణంగా భావిస్తున్నారు. కొంతమంది నిజాయితీ గల వ్యాపారులు అద్దె చెల్లిస్తున్నా వారు ఎంత చెల్లించింది కనుక్కోవడం మున్సిపాలిటీ అధికారులకు ఇబ్బందిగా మారింది. చలాన్ ద్వారా బ్యాంకులలో అద్దె చెల్లించాలని దశాబ్ధం క్రితం అప్పటి మున్సిపల్ అధికారులు చెప్పినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కానీ 2010 నుంచి వ్యాపారులు అద్దె చెల్లించడం చాలావరకు మానేశారు. ఇలా ప్రతి సంవత్సరం అద్దె చెల్లింపులు జరగకపోవడంతో కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. అంతా గందరగోళం..గజిబిజి మున్సిపల్ షాపుల అద్దెకు సంబంధించిన లెక్కలు అంతా గందరగోళంగా ఉన్నాయి. ఏడేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు లెక్క తేల్చడం అధికారులకు తలనొప్పిగా మారింది. వ్యాపారులు చెల్లించిన ఓచర్లు కూడా మున్సిపల్ అధికారులకు సమర్పించకపోవడంతో లెక్క సరిగా దొరకని పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలో అకౌంట్, రెవెన్యూ విభాగాల సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నా.. వాటిని ఎలా రాబట్టాలనే దానిపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఇరు విభాగాలను సమన్వయం చేసి, అకౌంట్ విభాగం ద్వారా బ్యాంకులలో ఏడేళ్లనుంచి జమ చేసిన వివరాలు బయటికి తీస్తే లెక్క తేలే అవకాశం ఉంది. అప్పుడు అందరి జాబితా తీస్తే బకాయిలు పడ్డ వారినుంచి నెల రోజుల్లోనే డబ్బులు వసూలు చేసే వెసులుబాటు కలుగుతుంది. మున్సిపల్ ఉ్నతాధికారులు జో క్యం చేసుకుంటేనే బకాయిల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అధికార పార్టీ హైడ్రామా
- నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ మీట్ జరగకుండా కుయుక్తులు - అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాలు చేసి, తర్వాత కొట్టేసిన టీడీపీ కౌన్సిలర్లు - కోరం లేక సమావేశం వాయిదా - అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని చైర్పర్సన్ మండిపాటు నంద్యాల : నంద్యాల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ఉప ఎన్నిక వేళ ఊదరగొట్టిన టీడీపీ నాయకులు..తమ అసలు ఆలోచనలు మాత్రం భిన్నమని రెండురోజులకే నిరూపించారు. అభివృద్ధి ఎలా పోయినా ఫర్వాలేదు గానీ..రాజకీయంగా తమదే పైచేయి కావాలన్న రీతిలో వ్యవహరించారు. పట్టణంలో అభివృద్ధి పనులకు ఆమోదం కోసం బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే.. ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దీన్ని గ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు అప్పటికప్పుడు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించాలని పన్నాగం పన్నారు. అప్పటికే సమావేశానికి హాజరైనట్లు టీడీపీ కౌన్సిలర్లు గంగిశెట్టి విజయ్కుమార్, దియ్యాల సులోచన, నూర్జహాన్, హనీఫ్, సర్తాజ్లు రిజిష్టర్లో సంతకాలు చేశారు. వీరితో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కూడా సంతకాలు పెట్టారు. ఇంతలోనే టీడీపీ ముఖ్య నాయకుల నుంచి ఆ పార్టీ కౌన్సిలర్లకు ఫోన్లో ఆదేశాలు రావడంతో వెంటనే వారు కౌన్సిల్ హాలు నుంచి బయటకు వచ్చారు. పార్టీ మారిన చైర్పర్సన్ దేశం సులోచన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. 12గంటల వరకు సభ్యుల కోసం చైర్పర్సన్ వేచిచూశారు. ధర్నాకు దిగిన టీడీపీ కౌన్సిలర్లు కొందరు అటెండెన్స్ రిజిష్టర్లో సంతకాలు పెట్టిన విషయాన్ని ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సంతకాలు చేసిన కౌన్సిలర్లు తిరిగి సమావేశం హాలులోకి వెళ్లి రిజిష్టర్ తీసుకొని వాటిని కొట్టేశారు.దీంతో సమావేశం నిర్వహించడానికి ముగ్గురు సభ్యులు తక్కువ కావడంతో కోరం లేదంటూ చైర్పర్సన్ వాయిదా వేశారు. ఇలా అయితే అభివృద్ధి ఎలా? నంద్యాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ఇందుకోసం రూ.1,500 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న ఆ పార్టీ నాయకులు పట్టణంలో అభివృద్ధి పనుల ఆమోదం కోసం నిర్వహించిన సమావేశం నుంచి బయటకు రావడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అనారోగ్యం కారణంగా రాకపోవడాన్ని గ్రహించిన టీడీపీ కౌన్సిలర్లు అప్పటికప్పుడు సమావేశం నుంచి వెళ్లిపోవడం తగదన్నారు. తద్వారా పట్టణంలో జరిగే అభివృద్ధి పనులను ఆపడం భావ్యం కాదన్నారు. కోరం లేక వాయిదా–చైర్పర్సన్ దేశం సులోచన మునిసిపల్ సమావేశానికి ముగ్గురు కౌన్సిలర్లు తక్కువ కావడంతో కోరం లేక వాయిదా వేశాం. వచ్చే నెల జరిగే సమావేశానికి ఆ ముగ్గురు కౌన్సిలర్లు హాజరవుతారు. ఇప్పుడు వారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. టీడీపీ కౌన్సిలర్లు అభివృద్ధికి సహకరించాలి. నేను ఏనాడూ వారిని ఇబ్బంది పెట్టాలని చూడలేదు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని రద్దు చేయించడం బాధాకరం. అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. -
ధర్మం, న్యాయం వైపు నిలబడండి: వైఎస్ జగన్
-కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం -సీఎం జగన్ నినాదాలతో మార్మోగిన అన్నమ్మఘాట్ - మన పాలనలో కౌన్సిల్ను అభివృద్ధి చేసుకుందాం -అగ్రిగోల్డ్ బాధితులతోసహా అందరికీ అండగా ఉంటా సాక్షి, కాకినాడ: హామీలు అమలు చేయని వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమ్మఘాట్ సెంటర్ లో వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే ముగిరిగిపోయినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ, చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుందని జగన్ పేర్కొన్నారు. 'ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు వస్తాయని చంద్రబాబే చెబుతున్నారు. ఆ లెక్కన్న రాబోయేది మన పాలనే. మన పాలనలో కాకినాడ కౌన్సిల్ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందాం' అని జగన్ ప్రకటించారు. 'జాబు రావాలంటే బాబు రావాలన్నారు. లేకుంటే 2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. ఒక్క ఉద్యోగం లేదు. ఇప్పటికీ 39 నెలలు గడిచింది. అ లెక్కన్న ప్రతీ ఇంటికి చంద్రబాబు 78 వేలు బాకీ పడ్డార'ని జగన్ గుర్తు చేశారు. బెల్ట్ షాపులన్నీరద్దు చేస్తామన్నారు. కానీ, ఇప్పుడు వీధికొక బెల్ట్ షాపు కనిపిస్తోంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. 'రైతులకు భేషరతుగా రుణ మాపీ హామీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకపోగా కరెంట ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో 200 రూపాయలు వస్తే ఇప్పుడది 500 కి చేరింది. ఇది చాలదన్నట్లు ఇంటి పన్ను వెయ్యి రూపాయలకు పెంచారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్ ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్ జగన్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇంకా జిల్లాకు ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన హమీలను జగన్ ప్రస్తావిస్తూ... తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం వర్సిటీ స్థాపిస్థామని చెప్పారు. చేశారా? కాకినాడలో మరో పోర్ట్.. నిర్మించారా? పెట్రో కారిడర్ ఏర్పాటు.. జరిగిందా? కాకినాడ స్మార్ట్ సిటీ హమీ.. ఏమైంది? కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రలు.. ఏమయ్యాయి? నౌక నిర్మాణ ఫ్యాక్టరీ తెచ్చారా? సముద్రతీరంలో ఆక్వాప్రాసెసింగ్ యూనిట్.. తీసుకొచ్చారా? రాజమండ్రిలో ఐటీహబ్ సంగతేంటి? ఇలా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని వైఎస్ జగన్ వివరించారు. -
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ హవా
కోల్కతాః స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. ఈనెల 13న పశ్చిమ బెంగాల్లో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ప్రతిపక్షాలు దరిదాపుల్లో లేకుండాపోయాయి. మొత్తం 148 వార్డులకు 140 వార్డులను తృణమూల్ గెలుచుకోగా బీజేపీ ఆరింటిని, వామపక్షాలు, ఇండిపెండెంట్లు చెరొకటి గెలుచుకున్నాయి. కాగా గూర్ఖా జన్ముక్తి మోర్చాకు గట్టి పట్టున్న ఉత్తర బెంగాల్లో ప్రాబల్యం కోసం పాలక తృణమూల్ సాగించిన ప్రయత్నాలు కొంతమేర ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాలకు దీటుగా బీజేపీ ఆరు వార్డుల్లో గెలుపొంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో బెంగాల్లో పార్టీ విస్తరణకు పూనుకునేందుకు బీజేపీకి స్ధానిక ఫలితాలు టానిక్లా పని చేస్తాయని చెబుతున్నారు. -
తెలుగు మీడియం కొనసాగించాలి
అనంతపురం న్యూసిటీ: మునిసిపల్ పాఠశాలల్లో యథావిధిగా తెలుగు మీడియం కొనసాగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా గురువారం అనంతపురం నగర పాలక సంస్థ ఎదుట సమాఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు రమణయ్య(యూటీఎఫ్), ఫణిభూషణ్(తెలుగునాడు), రామాంజినేయులు(ఎస్టీయూ), సాయప్ప(ఏపీటీఎఫ్) మాట్లాడుతూ... మునిసిపల్ పాఠశాలల్లో ఉన్నఫలంగా ఇంగ్లీష్ మీడియంను మాత్రమే ప్రవేశపెడితే చదువుకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుందన్నారు. గతంలోలాగే తెలుగు, ఇంగ్లీష్ సమాంతర మీడియంలు కొనసాగించాల్సిందేనన్నారు. విద్యా సంవత్సరం మొదలై 40 రోజులు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, ఇలాగైతే విద్యను ఏవిధంగా బోధించాలని ప్రశ్నించారు. పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్రూల్స్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించి జీఓ 40లో ఉన్న అధికారాలను ఇవ్వాలని కోరుతూ నగర పాలక సంస్థ కార్యదర్శి జ్యోతిలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. -
మళ్లీ కదలిక
కార్పొరేషన్ ఎన్నికలపై మరోసారి కదలిక కోర్టు వ్యాఖ్యలతో చిగురించిన ఆశలు ఒకటి రెండు నెలల్లో జరిగే అవకాశం కాకినాడ : ఓటమి భయంతో ఏడేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా మోకాలడ్డిన ప్రభుత్వాలు ఇక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి నెలకొంది. స్వయంగా అత్యున్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని మొట్టికాయలు వేయడంతో ఒకటి, రెండు నెలల్లోనే కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ కూడా కుంటిసాకులతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న కాకినాడను 2005 సెప్టెంబర్ 29న నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ తొలి కార్పొరేషన్ ఎన్నికలను 8 నెలల తరువాత పూర్తి చేసి 2005 సెప్టెంబర్ 30న తొలి పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. 2010 సెప్టెంబర్ 29న తొలి పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయింది. ఆ తరువాత ఎన్నికలు నిర్వాహించాల్సి ఉండగా పంచాయతీల విలీనం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంపాటు వాయిదాలు వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని పంచాయతీలు న్యాయస్థానాలను ఆశ్రయించడం, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలకు ఆ పార్టీకి అనువుగా లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఊసు ఎత్తలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎన్నికలు జరుగుతాయని ఆశించినా ఫలితం కనిపించలేదు. టీడీపీ విధానాలతో ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత పెరగడంతో ఈ ప్రభుత్వం కూడా ఎన్నికలపై వెనక్కి తగ్గింది. ఈ నేపద్యంలో కాకినాడకు చెందిన మాజీ కార్పొరేటర్ చిట్నీడి నారాయణమూర్తి న్యాయ స్థానంలో ప్రజాప్రయోజనాల వాజ్యాన్ని దాఖలు చేశారు. పాలకవర్గం లేక ప్రత్యేకాధికారిపాలనలో నగరపాలన స్తంభించి పోయిందని, నగర ప్రజలకు కనీస సదుపాయాలు అందడంలేదంటూ వేసిన వ్యాజ్యంపై కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 24లోపు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 45 రోజులు గడువు అడిగిన ప్రభుత్వం మళ్లీ ఏదో ఒకసాకుతో ఎన్నికలకు ముందుకు రాని పరిస్థితుల్లో ప్రభుత్వంపై సుమారు మూడు నెలల క్రితం కోర్టు ధిక్కార కేసును వేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు కాకినాడ ఎన్నికలపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదంటూ ప్రభుత్వాన్ని రెండు రోజుల క్రితం గట్టిగా ప్రశ్నించింది. ఆగస్టు 4వ తేదీన తమ ఎదుట వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శులకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొలిక్కి రానున్న ప్రక్రియ కోర్టు జోక్యం చేసుకుని ఆగస్టు 4 నాటికి స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించిన నగరపాలక సంస్థ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. కోర్టు జోక్యంతో ఇక కుంటుసాకులు చెప్పే అవకాశం లేదంటున్నారు. ఆగస్టు 4వ తేదీన కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండడంతో త్వరలోనే ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశం ఉందంటున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఒకటిరెండు నెలల్లో ఏడేళ్ళ తరువాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. -
మునిసిపల్ కార్మికుల సమ్మె విరమణ!
అనంతపురం న్యూసిటీ : రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం ముగిసింది. మూడ్రోజులుగా మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. జీవో 279ను రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల నేతృత్వంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నేతలు రాజారెడ్డి, గోపాల్, మునిసిపల్ కార్మిక సంఘం నేత నరసింహులు మాట్లాడుతూ.. జీఓ 279కి సంబంధించి టెండర్లను పిలవబోమంటూ ప్రభుత్వం ప్రకటించిందని, దీంతో సమ్మెను తాత్కాళికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కాగా, గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఎదుట నిర్వహించిన ధర్నాకు ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి మద్దతు తెలిపారు. మునిసిపల్ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు పీడీఎఫ్ తరపున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉపేంద్ర, నల్లప్ప, ముర్తూజా, వెంకటనారాయణ, రాజేష్గౌడ్, కృష్ణుడు, నాగభూషణ, పెన్నోబులేసు, తిప్పయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు. కార్మికులతో మంత్రి సునీత చర్చలు అనంతపురం సిటీ : గురువారం నిర్వహించిన జెడ్పీ సమావేశానికి హాజరైన మంత్రి పరిటాల సునీత... జెడ్పీ కార్యాలయ ప్రధాన గేట్ వద్ద కార్మిక సంఘాల నేతలు నారాయణరెడ్డి, ఈటె నాగరాజుతో భేటీ అయి చర్చించారు. అంతకు ముందు మంత్రితో చర్చలు జరిపేందుకు వచ్చిన కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కార్యాలయ ప్రధాన గేట్ వద్దనే బైఠాయించి, మంత్రి అక్కడకే రావాలని నినాదాలు చేశారు. కార్మికుల డిమాండ్లను విన్న ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపేదిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శివశంకర్ ఓ ఉద్యోగి నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా గురువారం ఉదయం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఆయన్ను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం
– కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు - భగ్గుమన్న మున్సిపల్ కార్మిక సంఘం – నేడు మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపు అనంతపురం న్యూసిటీ : డిమాండ్ల సాధనలో భాగంగా మున్సిపల్ కార్మికులు బుధవారం చేపట్టిన మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జీఓ 279న రద్దు చేయాలని, మున్సిపల్ సేవలను ప్రైవేటీకరణ చేయరాదంటూ గత రెండ్రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఆందోళనలో భాగంగా బుధవారం మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు ఇళ్లను ముట్టడించేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. వందలాది మంది కార్మికులు ర్యాలీగా నగరపాలక సంస్థ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా రోప్పార్టీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను బలవంతంగా అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం 150 మంది కార్మికులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, నగర కార్యదర్శి గోపాల్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం నిత్యం శ్రమించే కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైంది కాదన్నారు. 279 జీఓను రద్దు చేయాలని కోరుతూ గురువారం నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజేష్గౌడ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, మున్సిపల్ కార్మికులు అరుణమ్మ, భవానీ, సరళమ్మ, కృష్ణమ్మ, నాగేంద్ర, చలపతి, తిరుమలేసు తదితరులు పాల్గొన్నారు. కాగా, కార్మికుల ఆందోళనతో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. దుర్వాసన వ్యాపిస్తుండడంతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు. -
టార్గెట్ చైర్పర్సన్
– రెచ్చగొట్టి..కేసులు పెట్టే యత్నం – కౌన్సిల్ మీట్ను ముగించిన చైర్పర్సన్ నంద్యాల: దివంగత మాజీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై కేసులు పెట్టినందుకు ప్రతీకారంగా చైర్పర్సన్ దేశం సులోచన, ఆమె భర్త, కో ఆప్షన్ సభ్యుడు సుధాకర్రెడ్డిలను టీడీపీ టార్గెట్ చేసింది. వీరిద్దరూ టీడీపీని వీడి, వైఎస్ఆర్సీపీలో చేరడంతో ప్రతీకారానికి వ్యూహం రచించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ మీట్లో వీరిని రెచ్చగొట్టి, తర్వాత కేసులు పెట్టడానికి విఫలయత్నం చేశారు. అయితే వీరి పథకాన్ని పసిగట్టిన చైర్పర్సన్ దేశం సులోచన కౌన్సిల్ మీట్ను ముగించారు. పథకం ఇలా.. అజెండాలో కేవలం 8 నామమాత్రపు అంశాలు మాత్రమే ఉండటంతో కౌన్సిల్ మీట్ 15నిమిషాల్లో ముగియాల్సి ఉంది. అయితే అధికార పార్టీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన నిధులకు సంబంధించిన పనులను కౌన్సిల్ మీట్లో ఎందుకు తీసుకొని రాలేదని ప్రశ్నించి వివాదానికి తెరలేపారు. తర్వాత పలు అంశాలపై వాగ్వాదం జరిగింది. కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్ మాట్లాడుతుండగా, టీడీపీ కౌన్సిలర్ శివశంకర్ అడ్డుతగిలి మాట్లాడే అవకాశం లేదన్నారు. టీడీపీ కౌన్సిలర్లు వివాదాన్ని తీవ్ర చేస్తుండటంతో అజెండా ముగియడంతో చైర్పర్సన్ దేశం సులోచన సమావేశాన్ని ముగించి వెళ్లారు. చైర్పర్సన్ దేశం సులోచన, సుధాకర్రెడ్డిని రెచ్చగొట్టి.. దళిత కౌన్సిలర్లతో ఫిర్యాదులు అందజేసి కేసులు నమోదు చేయించాలనే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నీవు తాగుబోతువి.. నోరు మూసుకో
► మున్సిపల్ ఎంఈని దుర్భాషలాడిన టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త ► గది నుంచి బయటకు రాకుండా నిర్బంధం ► చైర్మన్ ముందే అధికారులపై వీరంగం ► కౌన్సిల్ సమావేశంలోకి వచ్చి బైఠాయింపు ► మేము పని చేయలేమంటూ సెలవులపై వెళ్లిన డీఈలు,ఏఈలు ప్రొద్దుటూరు టౌన్: అధికార పార్టీ కండువా కప్పుకొని మున్సిపల్ ఇంజినీర్(ఎంఈ) సురేంద్రబాబుపై 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ గాండ్ల శకుంతల, ఆమె భర్త గాండ్ల నారాయణ స్వామి గురువారం పరుష పదజాలంతో దుర్భాషలాడారు. మర్యాద పూర్వకంగా మాట్లాడాలని ఎంఈ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరింత రెచ్చిపోయారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని ఎంఈ చాంబర్ ప్రధాన ద్వారానికి కుర్చీలు వేసుకొని అడ్డుగా కూర్చున్నారు. తన వార్డులో పనులు ఎందుకు మొదలు పెట్టలేదని ఎంఈని ప్రశ్నించారు. పనులు చేస్తున్నారని చెప్పినా వినలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి కౌన్సిలర్, ఆమె భర్తతో మాట్లాడుతుండగానే కౌన్సిలర్ భర్త ఆవేశంతో ఊగిపోయారు. నీవు తాగుబోతువి, నోరు మూసుకొని కూర్చో అని పరుష పదజాలంతో ఎంఈని మాట్లాడారు. ఎంఈ గౌరవంగా మాట్లాడాలని చెప్పడంతో మరింత రెచ్చిపోయారు. అక్కడికి వచ్చిన డీఈ ఆర్కే శ్రీనివాసులు, ఈఏ అబీద్హుసేన్ శ్రీరాములపేట వీధిలో 16 మంది కూలీలు పనులు చేస్తున్నారని, మేము ఎంత చెప్పినా మీరు వినిపించుకోకుండా ఇక్కడకి వచ్చి ఎంఈని అలా మట్లాడటం సబబు కాదని అన్నారు. దీంతో వారినీ దూషించాడు. చైర్మన్ సాక్షిగా అధికారులను దూషణల పర్వ కొనసాగింది. లక్షలు లంచాలు తీసుకుంటున్నారు, సెలవుపెట్టి వెళ్లిపోండని హుకుం జారీ చేశారు. సామూహిక సెలవులు డీఈలు ఆర్కే శ్రీనివాసులు, రాజేష్, షాకీర్, ఏఈలు అబీద్హుసేన్, ఈశ్వరరెడ్డి, జీఏఈలు పనులు చేస్తున్న మమ్ములను, ఎంఈని దూషించడాన్ని నిరసిస్తూ సామూహిక సెలవుల్లో వెళుతున్నట్లు చైర్మన్కు చెప్పారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్నకు ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా జరిగిన విషయాన్ని రాసి ఇవ్వాలని కమిషనర్ చెప్పడంతో అధికారులు కమిషనర్కు ఫిర్యాదు పత్రాన్ని పంపి కార్యాలయం నుంచి వెళ్లి పోయారు. 12.30 గంటల వరకు ఎంఈ నిర్బంధం టీడీపీ కౌన్సిలర్, ఆమె భర్త ఎంఈ చాంబర్కు అడ్డుగా కూర్చున్నారు. కౌన్సిల్ సమావేశంలోకి రావాలంటూ కొందరు టీడీపీ కౌన్సిలర్లు ఎంఈని ఆయన చాంబర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎలా బయటకు తీసుకెళతారని టీడీపీ కౌన్సిలర్లతో కూడా కౌన్సిలర్ భర్త వాగ్వాదానికి దిగారు. కౌన్సిల్ సమావేశంలో పార్టీ కండువా కప్పుకొని బైఠాయింపు... కౌన్సిలర్, ఆమె భర్త కౌన్సిల్ సమావేశంలోకి వచ్చారు. సభ్యుని సీటులో కొంత సేపు కూర్చుని, మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా చైర్మన్ సీటు ముందు కూర్చున్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ రాజేశ్వరిదేవి మాట్లాడుతుండగా ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడేందుకు వచ్చినా వినిపించుకోలేదు. దీంతో కమిషనర్, సిబ్బంది, చైర్మన్ బయటకు వెళుతుంటే వారిని కౌన్సిల్ సమావేశ మందిరంలో నేలపై పడుకొని అడ్డుకున్నారు. కమిషనర్ అధికారులందరినీ బయటకు రావాలంటూ పిలుచుకెళ్లారు. మరో టీడీపీ కౌన్సిలర్ రామమునిరెడ్డి, చైర్మన్లపై ఆవేశంతో కౌన్సిలర్ భర్త ఊగి పోయారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని చెబుతున్నా వినిపించుకోలేదు. మరి కొందరు కౌన్సిలర్ల ఆతన్ని చైర్మన్ చాంబర్లోకి తీసుకెళ్లారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు అధికార పార్టీ టీడీపీ కౌన్సిలర్ భర్త కౌన్సిల్ సమావేశ మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకోవాల్సింది పోయి ముందుగానే మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. -
‘పాము’ బంధువు లాకర్లలో బంగారం గుట్టలు
- 1,400 గ్రాముల ఆభరణాలు స్వాధీనం - నేడు మరో లాకర్లు తెరవనున్న అధికారులు జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): ఏపీ మున్సిపల్ శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాము పాండురంగారావు సమీప బంధువుకు చెందిన బ్యాంకు లాకర్ను తెరవగా 1,400 గ్రాముల బంగారం ఆభరణాలు లభించాయి. ఏసీబీ సీఐ సతీష్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు పాండురంగారావు బంధువుల లాకర్లపై దృష్టి సారించామన్నారు. ఈ నేపథ్యంలో పాండురంగారావుకు సమీప బంధువు, చిన్నపిల్లల వైద్యుడైన కృష్ణమూర్తి భార్య ఎన్.రాజ్యలక్ష్మి పేరున పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (డీసీసీబీ) లాకర్ ఉన్నట్లు గుర్తించామన్నారు. మంగళవారం లాకర్ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారం ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుధవారం మరో బ్యాంకు లాకర్ను తెరవాల్సి ఉందన్నారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రూ. 2 కోట్ల విలువైన 22 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
పురపాలకా..ఇదేమి మెలిక!
- అధిష్టానం ఆదేశం బేఖాతర్ - ఉత్కంఠను రేపుతున్న పుట్టపర్తి చైర్మన్ రాజీనామా వ్యవహారం - హామీలు నెరవేరిస్తే పదవికి రాజీనామా : మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్న - హామీలకు పదవికి మెలికపెడుతున్న వైనం పుట్టపర్తి టౌన్ : ముఖ్యమంత్రి ఆదేశంతో మున్సిపల్ చైర్మన్ మార్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందని ఆశించిన టీడీపీ శ్రేణులు, పుట్టపర్తి ప్రజలకు తాజా పరిణామాలతో మరింత ఉత్కంఠ పెరిగింది. మున్సిపల్ చైర్మన్గా పీసీ గంగన్న రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో తక్షణమే రాజీనామా చేసి, ఇతరులకు అవకాశం కల్పించాలని ఏకంగా పార్టీ అధిష్టానం ఆదేశించినా ఆయన మాత్రం బెట్టువీడడంలేదు. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తానని ఓ వైపు చెప్తూనే.. మరో వైపు గత ఎన్నికలప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన హామీలను ‘పల్లె’ నెరవేరిస్తే రాజీనామా చేస్తానంటూ మెలిక పెడుతూ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తి ఎయిర్పోర్టులోకి మున్సిపల్ చైర్మన్ హోదాలో పీసీ గంగన్నను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు అధికారులపై నోరుపారేసుకున్నారు. జిల్లాలో అలజడి రేగింది. గంగన్న దురుసు వైఖరితో పోలీసు శాఖతోపాటు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది టీడీపీకి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో గంగన్నపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. రాజీకాని ‘పంచాయితీ’ : మాజీ మంత్రి ‘పల్లె’తోపాటు, పుట్టపర్తి టీడీపీ నాయకులు చైర్మన్ పదవి కోసం రెండున్నరేళ్ల ఒప్పందాన్ని జిల్లా పెద్దల వద్దకు తీసుకువచ్చారు. జిల్లా పెద్దల పంచాయితీలోనూ గంగన్న రాజీనామాకు ఆంగీకరించకపోవడంతో, పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. తలనొప్పిగా మారిన జిల్లాలోని పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలోనూ పుట్టపర్తి చైర్మన్ రాజీనామా వ్యవహారం వాడీవేడిగా సాగింది. తక్షణమే రాజీనామా చేయించి ఇతరులకు అవకాశం కల్పించాలని టీడీపీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయి ఆరామంలో ‘కొత్తనాటకం’ : ఇంతా జరుగుతున్నా... పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో జిల్లాలో ఉత్కంఠ ఉన్నా.. పార్టీ పెద్దలకు షాకిస్తూ శుక్రవారం తన అనుచరులతో కలసి గంగన్న సాయిఆరామంలో సమావేశం నిర్వహించారు. కొత్త నాటకానికి తెరలేపారు. గత ఎన్నికల సమయంలో ‘పల్లె’ రఘునాథరెడ్డి, పుడా, పుట్టపర్తి నగర పంచాయతీ వైస్ చైర్మన్, పుట్టపర్తి ఎంపీపీ, సహకార సంఘం అధ్యక్ష పదవుల విషయంలో ఇచ్చిన హామీలను తొలుత నెరవేర్చాలని, తరువాత పార్టీ పెద్దలు ఆదేశాల మేరకు వెంటనే తను రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు చైర్మన్ పదవికి గంగన్న రాజీనామా చేసే పరిస్థితిలేదని చర్చించుకున్నారు. డిమాండ్లు నెరవేరిస్తే రాజీనామా చేస్తా : పీసీ గంగన్న గత ఎన్నికల సమయంలో ‘పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న తమ డిమాండ్ను నెరవేరిస్తే, అధిష్టానం ఆదేశం మేరకు తాను మున్సిపల్ చైర్మన్పదవికి రాజీనామా చేస్తానని పీసీ గంగన్న తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక సాయిఆరామంలో తన అనుచరులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం తనను చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన మాట వాస్తవమేనన్నారు. చైర్మన్ ఒప్పందం కంటే ముందు చేసుకున్న పలు ఒప్పందాలను, ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పుట్టపర్తి సహకార సంఘం అధ్యక్ష పదవి ఒప్పందం మేరకు రెండున్నరేళ్లకు ఓబులేసు రాజీనామా చేయగా, ముమ్మనేని వెంకటరాముడు అధ్యక్ష పదవి చేపట్టాడని, అయితే అధికార పార్టీ నాయకులే సమావేశాలు జరగకుండా అడ్డుకుని పాలకమండలి రద్దేయ్యే విధంగా చేశారన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు.పుట్టపర్తి ఎంపీపీ పదవి ఒప్పందం మేరకు అమలు కాలేదన్నారు. ఈ విషయాలనన్నింటినీ ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకుపోతామని, వారి నిర్ణయం మేరకు తాను చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాంనాయుడు, కౌన్సిలర్ సుభాషిణి, నాయకులు కోనంకి చంద్రశేఖర్, వెంకటరాముడు, ఊరువాకిలి సురేష్నాయుడు, ముత్యాల మురళీ, గుట్లపల్లి గంగాద్రి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ముమ్మనేని వెంకటరామడు, బీవీప్రసాద్, సత్యనారాయణ, పుట్లగంగాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు.. కనుమరుగు
► మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ► ఉత్తర్వులు జారీ ► పాఠ్యపుస్తకాలు మంజూరు ► ఒకేమారు అమలుతో ఇబ్బందులు ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాల. ఇందులో 600 మంది బాలికలు చదువుతున్నారు. వీరిలో 300 మంది ఆంగ్ల మాధ్యమం, మరో 300 మంది తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. మారిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది నుంచి మొత్తం 600 మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదవాల్సి ఉంది. ఈ ప్రభావం విద్యార్థినులపై పడనుంది. దీంతో వీరు నష్టపోయే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు: మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే 14, 27 జీఓలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ఏడాది నుంచే ఈ విధానం ప్రారంభం కాగా, ఇందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపల్ పాఠశాలల్లో ఇక తెలుగు మాధ్యమం కనుమరగైనట్లే. చాలా రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన కొనసాగుతుండగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమకు కావాల్సిన మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం లేదు. తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే తమ చదువును కొనసాగించాల్సి ఉంటుంది. దీంతో గత ఏడాది వరకు తెలుగు మాధ్యమం చదివిన వారికి ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు పేర్కొంటున్నారు. కడప, ప్రొద్దుటూరులో.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాకు సంబంధించి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిల్లో మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. జిల్లాలో మరో ఏడు నగర పంచాయతీలు ఉన్నా వీటి పరిధిలోని పాఠశాలలు మండల పరిషత్, జిల్లా పరిషత్ల పరిధిలో నడుస్తున్నాయి. ఈ ప్రకారం కడప కార్పొరేషన్ పరిధిలో 43 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, ఏడు ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 30 ప్రాథమిక, 9 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభమైంది. ఈనెల 14న మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో కూడా ఆంగ్లమాధ్యం కొనసాగుతుందని చెప్పారు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందనే అభిప్రాయాన్ని ప్రధానోపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ స్కూళ్లలో లాగా ఒకటో తరగతి నుంచి ఒక్కో ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. 2007 ఏడాది నుంచి ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూల్ విధానాన్ని ప్రారంభించారు. ఈ ప్రకారం తొలి ఏడాది ఆరు, మరుసటి సంవత్సరం ఏడు ఇలా వరుసగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ వచ్చారు. ఆంగ్లమాధ్యమంలోనే బోధన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన సాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – చంద్రమౌళీశ్వరరెడ్డి, కడప కార్పొరేషన్ కమిషనర్. మార్పులు ఉంటే తెలియజేస్తాం గతంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఏవైనా మార్పులు ఉంటే మళ్లీ తెలియజేస్తాం. – శేషన్న, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్. తెలుగు మాధ్యమం కావాలని అడిగాం గత ఏడాది మున్సిపల్ అధికారులు ఎస్ఎంసీల ద్వారా ఆంగ్ల మాధ్యమంపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా చాలా మంది ప్రధానోపాధ్యాయులు ఆంగ్లమాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమం ఉండాలని తెలియజేశారు.తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే మారు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మున్సిపల్ పాఠశాలల్లో ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. ఒకే మారు చెప్పడానికి ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. - డీవీ రవీంద్రుడు, యూటీఎఫ్ పట్టణాధ్యక్షుడు. -
జీఓ 279 రద్దు చేయాల్సిందే
► సీఐటీయూ డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు ► మున్సిపల్ కార్మికుల విధుల బహిష్కరణ ► శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎదుట ధర్నా శ్రీకాకుళం అర్బన్: మున్సిపల్ కార్మికులకు ఉద్వాసన పలికే జీఓ 279ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ డివిజనల్ ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి ఎన్.బలరాంలు డిమాండ్ చేశారు. జీఓ 279 రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బుధవారం వేకువజాము నుంచి మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాలను, నగరాలను కాంట్రాక్టర్లు బాగా పరిశుభ్రం చేసి అభివృద్ధి చేస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయని, కార్మికులు, ఉద్యోగులు ఒళ్లు వంచి పనిచేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టు సైతం జీఓ 151 ప్రకారం జీతాలు పెంచాలని చెప్పినా ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. కార్మికులకు మంచి చేసే జీఓలను అమలు చేయడంలో శ్రద్ధ చూపకుండా కార్మికుల బతుకులను నాశనం చేసే జీఓలను తెచ్చి ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ జీతాలు, పర్మినెంట్ కార్మికులకు హెల్త్కార్డులు, జీపీఎఫ్ అకౌంట్లు, ఇంక్రిమెంట్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ ఇటీవల ప్రకటించిన పరిశుభ్ర నగరాలు, పట్టణాల అవార్డులు మున్సిపల్ కార్మికుల శ్రమ నుంచే వచ్చాయని గుర్తు చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యంత్రాల తయారీ కంపెనీలకు, దళారీలను పెంచి పోషించేందుకే జీఓ 279ను తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్లను, పార్ట్టైమ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, స్కూల్ స్వీపర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో మరిన్ని ఆందోళన, పోరాటాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒకటో పట్టణ ఎస్ఐ చిన్నంనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులనుపోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎన్.పార్థసారథి, కె.రాజు, ఎ.గణేష్, చిట్టిబాబు, గోవిందరావు, యుగంధర్, తిరుమల, నర్సమ్మ, సీతమ్మ, రాజేశ్వరి, కమలమ్మ, గౌరమ్మ, లలిత, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఆర్డీగా రవీంద్రబాబు
అనంతపురం న్యూసిటీ : కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు మున్సిపల్ ఆర్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో పీవీవీఎస్ మూర్తి(ఎఫ్ఏసీ)గా ఉన్న విషయం విదితమే. మరో మూడు రోజుల్లో ఆర్డీగా రవీంద్రబాబు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ఆర్డీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
అక్రమాలు నిజమే
– 172 అభివృద్ధి పనుల్లో రూ.50 లక్షల గోల్మాల్ – కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత ! – అధికారులపై వేటుకు రంగం సిద్ధం - ముందే అక్రమాలను వెల్లడించిన ‘సాక్షి’ అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ పరిధిలో గతేడాది జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు వెలుగుచూశాయి. పాలకవర్గానికి చెందిన కొందరు నేతల సూచనలతో చేసిన తప్పిదాలు అధికారులు మెడకు చుట్టుకున్నాయి. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు టెండర్కు విరుద్ధంగా పనులు చేసినట్లు అధికారుల తనిఖీలో తేలింది. రూ 2.5 నుంచి రూ 3 కోట్ల బిల్లుల్లో(172 పనులు) రూ 45 నుంచి 50 లక్షల వరకు కాంట్రాక్టర్లకు కోత వేయాలని డీఎంఏ కమిషనర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో ఉదాసీనతతోపాటు పరోక్షంగా పాలకులకు సహకరించిన అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 10న ‘డబ్బుల్ పనులు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పబ్లిక్హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు డీఈలు బృందంగా ఏర్పడి 172 పనులను తనిఖీ చేశారు. ఆ నివేదిక ఆధారంగా డీఎంఏ చర్యలకు సిఫార్సు చేసింది. ఇంకా 90 పనులను తనిఖీ చేయలేదు. నిగ్గుతేలిన అంశాలివే..! నగరంలో ఒక రోడ్డు నిర్మాణాన్ని 5 విభాగాలు చేసి నామినేషన్ పద్ధతిన పనులు పిలవడాన్ని తప్పుబట్టారు. ఒక రోడ్డును విభజించడం సరికాదన్నారు. నగరంలో రూ లక్షతో ఏడు సీసీ రోడ్లు వేయగా అందులో 5 నాసిరకమని గుర్తించారు. సైడ్ బర్మ్స్ (మట్టిదిబ్బలు) జేసీబీ ద్వారా చేపట్టి కూలీలతో పని చేసినట్లు రికార్డులో పొందుపర్చారు. దీని ద్వారా సదరు కాంట్రాక్టర్ రూ లక్షల్లో లబ్దిపొందినట్లు తేలింది. వీటితో పాటు పదుల సంఖ్యలో పనుల్లో నాణ్యత లోపించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈకు మరో 90 పనుల(రూ1.2 కోట్లు) జాబితాను నగరపాలక సంస్థ అధికారులు జాప్యం చేశారు. దీనిపై డీఎంఏ స్పందించారు. ఎస్ఈ సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీ చేసి రిపోర్టు ఆధారంగా బిల్లులు చేయాలన్నారు. అధికారుల్లో వణుకు.. అక్రమాలు వెలుగులోకి రావడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనుల్లో రూ లక్షల్లో నగరపాలక సంస్థకు నష్టం వాటిల్లడంలో సదరు అధికారులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై కమిషనర్ పీ వీరవెంకట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. -
ఆ జీవోలు రద్దు చేయాలి: రామకృష్ణ
అమరావతి: మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడే జీవో నెం. 279, 159, 160 లను తక్షణం రద్దుచేయాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. జీవో 151 ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 193 ప్రకారం స్కూల్ స్వీపర్స్, వాచ్మెన్లకు కూడా వేతనాలు ఇవ్వాలన్నారు. మునిసిపల్ కార్మికులకు మొండిచేయి చూపిస్తున్న ప్రభుత్వం జీవోలు తెచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం తగదన్నారు. తక్షణం కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరారు. -
ప్రజా సమస్యలు గాలికి..సమావేశాలు దేనికి?
– ప్రజా సమస్యలు గాలి వదిలేసిన అధికార పార్టీ – ప్రతిపక్ష నేత వైఎస్. జగన్పై దూషణలు – ఘాటుగా స్పందించిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు – పింఛన్లు, బీసీ, కాపు, ఎస్సీ రుణాలపై నిలదీత – జన్మభూమి కమిటీలపై ఎండగట్టిన వైసీపీ నేతలు – వాగ్వాదంతో ప్రతిపక్ష కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ రాజమహేంద్రవరం నగరపాలక మండలి సాధారణ సమావేశం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దూషణకు వేదికగా నిలిచింది. అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీయడంతో టీడీపీ వర్గీయులు వ్యక్తిగత దూషణలకు దిగారు. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక మండలి సాధారణ సమావేశం పూర్తిగా వ్యక్తిగత దూషణలకు వేదికగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్పార్టీని దూషిస్తూ కాలం గడిపేశారు. అధికారపార్టీ నేతల అక్రమాలు, దోపిడీ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న జన్మభూమి కమిటీలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిలదీయడంతో టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, టీడీపీ సీనియర్ కార్పొరేటర్లు వ్యక్తిగత దూషణలకు దిగారు. ‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన భిక్షే’ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దొంగలు, దోపిడీదారులు అంటూ టీడీపీ ఫ్లోర్లీడర్ వర్రే శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడడంతో వారు ఎవరో చెప్పాలని వైఎస్సార్ సీపీ చీఫ్విప్ మింది నాగేంద్ర డిమాండ్ చేశారు. దోపిడీలు, భూకబ్జాలు మీరు చేస్తూ దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోటి బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం మాట్లాడారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆదిరెడ్డి, వర్రే, వాసిరెడ్డి ఎదురుదాడి చేశారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో స్పందించిన వైఎస్సార్సీపీ సభ్యులు ‘నీకు ఎమ్మెల్సీ పదవి జగన్ పెట్టిన బిక్షేనన్న విషయం గుర్తుంచుకోవాలి’ అంటూ ఆదిరెడ్డికి చురక అంటించారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, వర్రే శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పింఛన్ల అక్రమాలపై విచారణ చేసి దొంగలు ఎవరో తేల్చాలని మింది నాగేంద్ర సవాల్ విసిరారు. బీసీ, ఎస్సీ, కాపు రుణాలు సకాలంలో మంజూరు చేయకుండా కమిటీ ఆమోదం పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సబ్సిడీ నగదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా సామాజిక కార్యకర్తలు ఉండాలని కమిషనర్ చెప్పగా, అందులో టీడీపీ కార్యకర్తలను ఎలా నియమించారని నాగేంద్ర ప్రశ్నించారు. ప్రభుత్వం మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని వర్రే, వాసిరెడ్డి దురుసుగా సమాధానమిచ్చారు. ఇదా మీరు చేస్తున్న అభివృద్ధి...? సీఎం చంద్రబాబు పుష్కరాలకు నిధులు ఇవ్వడంతోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి అఖండ గోదావరికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నా బీపీఎస్ నిధులు రూ.20 కోట్లు కేటాయించడమా? చంద్రబాబు, పాలక మండలి చేసింది? అని ప్రశ్నించారు. పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని తమతో లేఖలు రాయించిన ఆదిరెడ్డి ఇప్పడు టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం నీతిమయమైందా? అని నిలదీశారు. ఏ ఎండకు ఆ గోడుకు పట్టే ఆదిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని మండిపడ్డారు. ఈ క్రమంలో వాగ్వివాదం పెరగడంతో టీడీపీ ఫ్లోర్లీడర్ వర్రే ప్రతిపాదన మేరకు మేయర్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసి బలవంతంగా బయటకు పంపించేశారు. దోపిడీ, దౌర్జన్య పాలన సాగుతోంది అనంతరం మేడపాటి షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్వశ్చన్ అవర్ అని రెండు నిమిషాలు కూడా ఇవ్వకుండా ఉంటే ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. టీడీపీ కార్పొరేటర్లు ప్రతి పనిలో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మేయర్ టీడీపీ ఫ్లోర్లీడర్ వర్రే చెప్పినట్టు నడుస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ ఫ్లోర్లీడర్ మురళీధర్ మాట్లాడుతూ నగరంలో రోడ్డుపక్కల వ్యాపారం చేసుకునే బడుగు జీవులకు అన్యాయం జరిగింది. దీనిపై మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. బొంతా శ్రీహరి మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు బీపీఎస్ నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
దద్దరిల్లిన ధర్నాలు
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై కన్నెర్ర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వందమందికి పైగా మున్సిపల్ కార్మికుల అరెస్ట్ తాడితోట (రాజమహేంద్రవరం సిటీ) : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తుండగా మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాలతో దద్దరిల్లింది. సీపీఐ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కిర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, రెల్లికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో తొలగించిన 31 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి కార్పొరేషన్ గేటు వద్ద బైఠాయించారు. 20 ఏళ్లుగా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న వీరికి నోటీసులు ఇవ్వకుండానే తొలగించడం దారుణమన్నారు. 1998లో అప్పటి మున్సిపల్ కమిషనర్ వికాస్రాజ్ వీరికి అవకాశం కల్పించారని అన్నారు. కమిషనర్ ఆనాలోచిత చర్యల వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, తొలగించిన 15 రోజులకూ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 151 జీఓ అమలు, జీతాలు సక్రమంగా చెల్లించాలని వారు కోరారు. వందమంది పైగా అరెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టిన సీపీఐ, మున్సిపల్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందిని పైగా అరెస్ట్ చేసి త్రీటౌన్, వన్టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో కిర్ల కృష్ణారావు, మీసాల సత్యనారాయణ, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండల రావు, కార్యనిర్వాహక కార్యదర్శి నల్లా రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. ఆశీల వ్యవహారంపై సీపీఎం ఆందోళన చిరు వ్యాపారులపై పెంచిన ఆశీల వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కార్పొరేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. పెంచిన ఆశీల భారంపై నగర పాలక సంస్ధ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు కౌన్సిల్ సమావేశంలో వద్దకు చేరుకున్నారు. ఈమేరకు వారు వినతిపత్రాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లు, కార్పొరేటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ నగరంలో స్వయం ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారుల జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు చేసిన తప్పుకు చిరు వ్యాపారులు బలైపోతున్నారని అన్నారు. జైలు రోడ్డులో చిరువ్యాపారులను తొలగించారని వారిని అక్కడే వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.వెంకటేశ్వరరావు, ఎన్.రంగ, పి.తులసి, ఐ.సుబ్రహ్మణ్యం, కేవీపీఎస్ నాయకులు రూపస్రావు, రాజా తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు సీపీఎం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
పంది కనిపిస్తే కాల్చివేత
– వారం రోజులు డెడ్లైన్ – కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ డైరెక్టర్ కన్నబాబు ఆదేశం నంద్యాల: పట్టణంలో పందులు కనిపిస్తే కాల్చివేస్తామని, పందుల యజమానులపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తామని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు హెచ్చరించారు. కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఆదివారం పందుల పెంపకం దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పందులను నిర్మూలించక తప్పదని చెప్పారు. వందమంది ఉపాధి కోసం లక్షల మంది ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం మంచిది కాదన్నారు. గతంలో పలుమార్లు పందుల పెంపకందారులను హెచ్చరించినా ఖాతరు చేయలేదని, బెదిరింపులకు, దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే నాన్బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పందుల సమస్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, నిర్మూలనను నంద్యాల నుండే ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లోగా పందులను ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని, లేకపోతే తమ ఇళ్లవద్దనే పెట్టుకోవాలని సూచించారు. పీవీనగర్ వద్ద 3.5ఎకరాలు కేటాయింపు... పందుల పెంపకం దారుల కోసం పీవీనగర్ వద్ద 3.50ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పందులను ఈ స్థలంలో ఉంచుకోవాలని, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మున్సిపాలిటీ ఉత్తర్వులు బేఖాతరు... పట్టణంలో బయటిపేట, మూలసాగరం, నూనెపల్లె ప్రాంతాల్లో పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 95 కుటుంబాలు జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరు కావాలని మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు. అయితే, సమావేశానికి 15మంది మాత్రమే హాజరు కాగా 80 మంది డుమ్మా కొట్టారు. వచ్చిన వారితో కలెక్టర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని హామీ పత్రంపై సంతకాలు చేయించుకున్నారు. సమావేశంలో ఆర్డీఓ రామసుందర్రెడ్డి డీఎస్పీ హరినాథరెడ్డి, చైర్పర్సన్ దేశం సులోచన కమిషనర్ సత్యనారాయణ, సీఐలు గుణశేఖర్బాబు, శ్రీనివాసరెడ్డి, ఇస్మాయిల్, రూరల్ ఎస్ఐ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
నీ సేవలు మాకొద్దు
- గూడూరు కమిషనర్ జాయినింగ్ను అడ్డుకున్న విష్ణు వర్గీయులు - నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత గూడూరు: ‘నీ సేవలు మాకు అవసరం లేదు.. ఇక్కడ జాయిన్ కావడానికి వీల్లేదు.. వెనక్కు వెళ్లిపో’ అంటూ గూడూరు నగర పంచాయతీకి బదిలీపై వచ్చిన కమిషనర్ నఈమ్ అహమ్మద్ను గురువారం టీడీపీ కోడుమూరు ఇన్చార్జి డి. విష్ణువర్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో గూడూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ కమిషనర్గా పని చేస్తున్న ఎల్.రమేష్బాబు కర్నూలు కార్పొరేషన్కు, అనంతపురం జిల్లా మడకశిర కమిషనర్గా ఉన్న నఈమ్ అహమ్మద్ను ఇక్కడికి బదిలీ చేస్తూ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నఈమ్ అహమ్మద్ స్థానిక కార్యాలయానికి చేరుకోగా విష్ణు వర్గానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజనేయులు, కౌన్సిలర్లు డి.రఘునాథ్, చాంద్బాషా, మాజీ వైస్ ఎంపీపీ కరుణాకరరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు రేమట వెంకటేష్, జెడ్పీటీసీ మాజీ మెంబర్ ఎల్.వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కంబగిరి గిడ్డయ్య తదితరులు వాదనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ పవన్కుమార్ సిబ్బందితో వచ్చి సర్ధి చెప్పినా అంగీకరించలేదు. చివరకు కమిషనర్ జాయిన్ అయిన వెంటనే సెలవుల్లో వెళ్లిపోతానని ప్రదేయపడినా ఒప్పుకోలేదు. తర్వాత శుక్రవారం జాయినింగ్ అవ్వండని వైస్ చైర్మన్ స్పష్టం చేయగా అందుకు కమిషనర్ సమ్మతించలేదు. అందుబాటులో లేని సిబ్బంది.. కమిషనర్.. విష్ణు వర్గీయుల గొడవ కారణంగా కార్యాలయ సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. మేనేజర్ వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నా లీవ్ పెట్టినట్లు కమిషనర్కు వివరించారు. జాయినింగ్ రిపోర్టును తీసుకోవడానికి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కమిషనర్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వారి ఆదేశాల మేరకు సెల్ఫ్ జాయినింగ్ అయినట్లు ప్రకటించారు. -
పట్టించుకునే దిక్కులేదు
– రోడ్డును పగులగొట్టి రాత్రికి రాత్రి కాలువ నిర్మాణం – అయినా చలనం లేని మున్సిపల్ అధికారులు ప్రొద్దుటూరు టౌన్ : పట్టణంలోని కోనేటికాలువ వీధిలోని 40 అడుగుల మున్సిపాలిటీ రోడ్డును సోమవారం అర్ధరాత్రి పగుల గొట్టారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులే లేరు. మంగళవారం అర్ధరాత్రి తిరిగి కాలువను నిర్మించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డును పగుల గొట్టింది ఎవరు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, తిరిగి కాలువను నిర్మించినా అధికారులు ఎందుకు పట్టించు కోలేదు అన్న విషయంపై మున్సిపల్ అధికారులు మాకు తెలియదంటే మాకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు బంగారురెడ్డి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేదు. ఎందుకీ నిర్లక్ష్యం... కాలువలో నీరు వెల్లలేదని రూ.లక్షల వెచ్చించి నిర్మించిన రోడ్డును ద్వంసం చేసినా కూడా అధికారుల్లో చలనం లేదంటే పరిస్థితి అర్థం కావడంలేదు. రోడ్డును పగులగొట్టడం ద్వారా భారీ వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే రోడ్డు కృంగిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాల్లు పగులగొడుతుంటే ఎలా అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బిల్లులు కూడా కాని రోడ్డును పగుల కొట్టిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మీడియానే ఆప్ను ముంచిందా?
విశ్లేషణ వాస్తవానికి నరేంద్రమోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు అతి పెద్ద వార్త అయిపోయింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్పై నియంత్రణను భారతీయ జనతా పార్టీ నుంచి లాగేసుకోవడంలో ఆమ్ఆద్మీ పార్టీ పూర్తి అసమర్థతతో వ్యవహరించడం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు నిజంగానే ఒక మేలుకొలుపు లాంటిది. ఓటర్లపై ఎన్నికల సీజన్లో మాత్రమే అభిమానం కురిపించడం కాకుండా మొత్తం పాలనా ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయాలనే ఆమ్ఆద్మీ పార్టీ భావనకు ‘సుప్రీమో’ అనే భావన పూర్తిగా వ్యతిరేకమైనది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో తాము ప్రజలతో సాన్నిహిత్యాన్ని కోల్పోయామని ఆప్ పార్టీ అంగీకరించడమే కాకుండా ఓటర్ల వద్దకు వెళ్లాలని, వారికి మళ్లీ దగ్గరవ్వాలని తన శాసన సభ్యులను కోరిం ది. ఓటర్లు అంటే వాడుకుని విసిరేసే వస్తువుల వంటివారు అనే చట్రంలోకి ఆప్ కూడా తన ఆచరణ ద్వారా వెళ్లిపోయిందని ఈ ప్రకటన చెప్పకనే సూచిస్తోంది. నరేంద్రమోదీ బలమైన ఆకర్షణ, కొత్త అభ్యర్థులను మాత్రమే బరిలో దింపడం ద్వారా మెరుగైన సుపరిపాలనను అందిస్తామని ఆయన ఢిల్లీ ఓటర్లకు చేసిన వాగ్దానం బీజేపీకి పూర్తి అనుకూలంగా పనిచేశాయి. కానీ ఇది నాణేనికి సగం వైపు మాత్రమే మరి. జాతీయ పార్టీల పట్ల వ్యవహరించడంలో కేజ్రీవాల్లో మొరటుదనం, కాఠిన్యం లేకున్నట్లయితే, నిలకడైన ప్రాతిపదికన ఓటర్ల దృఢమైనవిశ్వాసాన్ని పొందు తూ నెమ్మదిగా ఎదుగుతున్న పార్టీ నేతగా ఆయన వెలిగేవారు. కానీ ఆయన నియంత్రణలో లేని మరొక విషయం ఏమిటంటే ఇతర రాజకీయ పార్టీలలో భయం కలిగించిన ఆమ్ ఆద్మీ పార్టీ తక్షణ ప్రాతిపదికే మరి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ మధ్యేవాద లేదా వామపక్ష పార్టీ అయినా చాలావరకు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉనికిలో ఉంటున్నాయి. వీటికి తప్పనిసరిగా సంస్థాపక వ్యవస్థ అవసరం. పార్టీలు కూడా వ్యవస్థలో భాగం కాబట్టి, పార్టీల కంటే వ్యవస్థలే ఎక్కువగా మనుగడ సాధించి, ఎదగాల్సిన అవసరం ఉంది. అందుకే అవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీపై తీవ్రస్థాయిలో యుద్ధాలకు, ఘర్షణలకు దిగుతూ వచ్చాయి. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 కి 67 స్థానాలు గెలిచినప్పటికీ ఆమ్ ఆద్మీ తన బలాన్ని అట్టిపెట్టుకోవడానికి మరింత దూకుడుతనాన్ని అలవర్చుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై నిందమోపడం అనే సిల్లీ వ్యూహాన్ని అది తాజాగా అవలంబించినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తొలినుంచీ తీవ్ర నిరసనలను వ్యక్తం చేయడం అనే వ్యూహంతోటే నడిచింది. అదే సమయంలో పార్టీకి చిన్న చిన్న విరాళాలు ఇచ్చిన తొలి మద్దతుదారులను కూడా అది దూరంపెట్టింది. వార్తలను సరఫరా చేయడం కంటే ఎక్కువగా మీడియా.. వ్యవస్థలో భాగంగా ఉంటోంది. ఢిల్లీ అసెం బ్లీలో గతంలో అధిక స్థానాలను కొల్లగొట్టినప్పటికీ, మునుపెన్నడూ చూసి ఉండని, రాజకీయాల్లో ఒక రకం రొమాన్స్తో, కొత్తదనంతో ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు పెట్టింది. అయితే తన రెండో వెంచర్లో తన మార్గాన్ని తానే నిరోధించుకుని, తనను తానే కించపర్చుకునే స్థాయి వంచనకు అది సిద్ధపడిపోయింది. ఆప్ ఒక చేయిని కట్టేస్తూ వార్తా టెలివిజన్లో కల్పితమైన లేదా తప్పుడు స్టింగ్లు ప్రదర్శితమయ్యాయి. అయినప్పటికీ అది అనితరసాధ్యమైన గెలుపు సాధించింది. వాస్తవానికి మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని, కాంగ్రెస్ కంటే ఆప్ పార్టీనే మెరుగైన ఫలితాలు సాధిం చినప్పటికీ ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను గెలవడంలో దాని అసమర్థతే మీడియాకు పెద్దవార్త అయిపోయింది. ఒక వైపు మొగ్గు చూపడం అనేది నిర్దయతో కూడుకున్నదే కానీ, మీడియా తన వైఫల్యాలను గుర్తించడానికి ఇష్టపడదు. బ్రేకింగ్ న్యూస్ మనస్తత్వం సమాజంలో వేడి గాలి బెలూన్లను, తప్పుడు అవగాహనలను నిర్మించడంలో బ్రహ్మాండంగా సాయపడుతుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మహర్షుల పార్టీ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ సంపద కోసం ఉవ్విళ్లూరే వారు కాకున్నప్పటికీ అవకాశాలకోసం వెంపర్లాడే వారిని చాలామందిని ఆ పార్టీ తనవైపుకు లాక్కుంది. కానీ తక్కువ కాలంలోనే యావత్ పార్టీ చిహ్నం, దాని ఉనికికి మూలం అయిన అరవింద్ కేజ్రీవాల్ని ఏమాత్రం నమ్మదగని వ్యక్తిగా మీడియాలో పదే పదే చిత్రించేశారు. అదేదో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సాధారణంగా నమ్మదగిన వారు అనిపించే తీరులో అరవింద్ కేజ్రీవాల్ను పూర్తి వ్యతిరేకంగా చిత్రించసాగారు. కేజ్రీవాల్ తొలి నుంచి బ్రేకింగ్ న్యూస్ ఆకలిని తీర్చేవాడిగా మాత్రమే కనిపించారన్నది వాస్తవమే. దీంతో ఆయన మొదటినుంచి వ్యతిరేక ముద్రనే సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన గొప్ప విజయాలను మళ్లీ సాధించడం భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా సాధ్యం కాదని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సాధించిన అద్భుత విజయాల దరిదాపులోకి కూడా కాంగ్రెస్ పార్టీ తదనంతర కాలంలో చేరలోకపోయిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక మోదీ హయాంలోని బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడిది నేరుగా తేరిపార చూడలేని ఒక నిర్నిరోధక శక్తిలాగా కనపడుతోంది. కానీ దానికి అసలైన పరీక్ష 2019 సార్వత్రిక ఎన్నికలలోనే అన్నది మర్చిపోకూడదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మున్సిపాలిటీల్లో ఈ- పాలన
–మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ రమారమణి ఎమ్మిగనూరు: ప్రతీ మున్సిపాలిటీలో ఈ–పాలనను తప్పకుండా చేపట్టాలని, బ్లాక్స్పాట్ గుర్తింపు జరగాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్, కర్నూలు జిల్లా నోడల్ అధికారిణి రమారమణి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో బ్లాక్ స్పాట్ గుర్తింపుతో సెక్రటరేట్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం జరుగుతోందన్నారు. అదే విధంగా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు–నగర పంచాయతీల్లో తప్పనిరిగా ఈ–పాలన, బ్లాక్స్పాట్ ఐడెంటిఫికేషన్ జరగాలన్నారు. సమీక్షలో అసిòస్టెంట్ నోడల్ అధికారి శంకర్రావు, కమిషనర్ సంపత్కుమార్, మేనేజర్ రంగస్వామి, టీపీఓ నాగరాజు, ఆర్వో రంగన్న, ఏఈ ఆదినారాయణరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాబందు
► కార్మిక స్వేదం.. స్వాహాపర్వం ► ఆరు నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము స్వాహా ► కాంట్రాక్టర్ జేబులోకి రూ.1.13కోట్లు ► రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని పారిశుద్ధ్య కార్మికులు ► ఆ డబ్బంతా మద్యం షాపుల్లో పెట్టుబడి ► ఇదీ ఓ టీడీపీ నాయకుడి కక్కుర్తి ఎమ్మిగనూరు: కాంట్రాక్టు కార్మికుల జీతాలు, పీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము రూ.1.13కోట్ల స్వాహా ఉదంతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం 276 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తుండగా.. అత్యధికంగా 128 మంది శానిటరీ విభాగంలో ఉన్నారు. గత ఏడాది కొత్తగా నియమించుకున్న 30 మంది కార్మికుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.70వేలు మొదలు రూ.1.5లక్షల వరకు ఓ కౌన్సిలర్ వసూలు చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. ప్రతి కార్మికుడి నెల జీతం రూ.11వేలుగా నిర్ణయించారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాల చెల్లింపు బాధ్యత భగీరథ వడ్డెర లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ది కాగా.. దీని నిర్వాహకులు మద్యం సిండికేట్ భాగస్వామి కావడం గమనార్హం. ఆరు నెలలుగా పీఎఫ్ సొమ్ము స్వాహా మున్సిపాలిటీలో పనిచేస్తున్న 276 మంది కార్మికులకు ప్రతి నెలా మొత్తం రూ.30,36,000 చెల్లించాల్సి ఉంది. పీఎఫ్ కోసం జీతంలో కాంట్రాక్టర్ 12శాతం కోత వేస్తున్నాడు. ఈ మొత్తం 3,64,000 అవుతుంది. ఈ లెక్కన గత ఆరు నెలల్లో రూ.21,84,000 కాంట్రాక్టర్ జేబుకు చేరింది. అదేవిధంగా ఈఎస్ఐ కింద ప్రతి నెలా కార్మికుడి వేతనంలో 1.75 శాతం పట్టుకుంటుండగా.. నెలకు రూ.51,130 చొప్పున ఆరు నెలలకు రూ.3,18,780 కాంట్రాక్టర్ ఏమి చేసినట్లో తెలుస్తలేదు. ఇకపోతే మున్సిపాలిటీ నుంచి కార్మికులకు వచ్చే ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము కూడా కాంట్రాక్టర్ ఖాతాలోకి చేరుతోంది. ఈపీఎఫ్ రూపంలో13శాతం చొప్పున నెలకు రూ.3,94,680 చొప్పున ఆరునెలల మొత్తం రూ.23,68,080. అదేవిధంగా మున్సిపాలిటీ చెల్లించే ఈఎస్ఐ సొమ్ము 2శాతం నెలకు రూ.60,720 చొప్పున ఆరు నెలలకు రూ.3,64,320 కాంట్రాక్టర్ స్వాహా చేశాడు. ఈ ఆరు నెలల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కార్మికుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థమవుతోంది. రెండు నెలలుగా కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు కూడా చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రతి నెలా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల మొత్తం రూ.30,36,000. ఈ లెక్కన రెండు నెలలుగా కాంట్రాక్టర్ రూ.60,72,000 బకాయి చెల్లించాల్సి ఉంది. అటు పీఎఫ్, ఈఎస్ఐ, ఇటు వేతన బకాయిలు కలిపి మొత్తం రూ.1.13 కోట్లు దారి మళ్లినట్లు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మరి ఇందులో అధికారులు, పాలక పాపమెంతో తేలాల్సి ఉంది. కార్మికుల కష్టమే పెట్టుబడి పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువలను శుభ్రపర్చడం మొదలు ఆటో, ట్రాక్టర్ డ్రైవర్స్.. హమాలీలు, ఫిట్టర్లు, ఎలక్ట్రికల్ వర్కర్లు.. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారి కష్టాన్ని.. వేతనాలను ఓ కాంట్రాక్టర్ మద్యం షాపులకు పెట్టుబడిగా బదలాయించి లబ్ధి పొందుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల మద్యం టెండర్లలో సిండికేట్ భాగస్వామిగా మారి 138 మంది టెండర్లు వేయడం చూస్తే కార్మికుల సొమ్ము ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది. కాంట్రాక్టర్కు బిల్లులు నిలిపేశాం ఆరు నెలలుగా కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్మును చెల్లించకుండా కాంట్రాక్టర్ కోటేకల్ బాలరాజు నిర్లక్ష్యం వహించాడు. రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అందువల్ల ఈ నెల మున్సిపాలిటీ నుంచి కాంట్రాక్టర్కు చెల్లించే బిల్లులన్నీ నిలిపేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – సంపత్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
పాలకుల పాపం.. అధికారులకు శాపం!
- నగర పాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అక్రమాలు - గత ఏడాది 172 పనులపై విచారణ - విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్న డీఎంఏ - బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశం - పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి..బలవుతున్న అధికారులు అనంతపురం న్యూసిటీ : అనంతపురం నగర పాలక సంస్థలో పాలకులు చేస్తున్న పాపాలు అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్న నిర్ణయాల కారణంగా అధికారులు బలయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గత ఏడాది కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. ప్రస్తుతం విచారణ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశాలున్నాయి. నగర పాలక సంస్థ ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి పనుల పేరిట రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటిలో గత ఏడాది చేపట్టిన పనులు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది నవంబర్లో సోమనారాయణ కమిషనర్గా ఉన్నప్పుడు రూ.3 కోట్ల బిల్లులను తెరపైకి తెచ్చారు. ఆయన రిలీవ్ కాగానే వాటిని ఒక్కసారిగా రూ.10 కోట్లకు పెంచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 10న ‘సాక్షి’ దినపత్రిక ‘డబ్బుల్ పనులు’ శీర్షికతో కథనం ప్రచురించింది. 134 టెండర్ పనులకు రూ.4 కోట్ల 25 లక్షల 95 వేల 247, అలాగే 59 నామినేషన్ పనులకు రూ.87,67,998లు, 158 డిపార్ట్మెంటల్ పనులకు రూ 2 కోట్ల 59 లక్షల 38 వేల 753, బాక్స్ టెండర్లకు సంబంధించి 281 పనులకు రూ.2.55 కోట్ల బిల్లులు పెట్టిన విషయాన్ని కథనంలో పేర్కొంది. అప్పటి కమిషనర్ సురేంద్రబాబు సైతం రూ.2 కోట్ల దొంగ బిల్లులు ఉన్నాయని మీడియా సమావేశంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బిల్లులను ఆపాలని, మొత్తం పనులపై విచారణ చేపట్టాలని పబ్లిక్హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డిని ఆదేశించారు. అయితే..నగర పాలక సంస్థ అధికారులు 172 పనులకు సంబంధించిన రికార్డులను మాత్రమే ఎస్ఈకి అప్పగించారు. వాటిపై విచారణ చేపట్టిన ఎస్ఈ జిల్లా కలెక్టర్కు ఈ ఏడాది మార్చిలో నివేదికను అందజేశారు. కలెక్టర్ ఆ నివేదికను డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ)కు 15 రోజుల క్రితం పంపించారు. బిల్లుల్లో చాలావరకు ‘బోగస్’ అనే విషయాన్ని విచారణ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్, డిపార్ట్మెంటల్ పనులు అత్యవసర నిమిత్తమే చేయాల్సి ఉండగా.. నిబంధనలను ఎలా ఉల్లంఘించారన్న విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఎంఏ కన్నబాబు కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటూ మూడు, నాలుగు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని నగర పాలక సంస్థ వర్గాలు అంటున్నాయి. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పాలకుల ఒత్తిళ్లతోనే తాము చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. అలాగే వేటు నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
భీమిలిలో అధికారుల నిర్లక్ష్యంపై నేతల మండిపాటు
-
ఆశీలు కాంట్రాక్టర్లకు నోటీసులు
హెచ్చరించిన నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు అవగాహన సాక్షి, రాజమహేంద్రవరం : నిబంధనలకు విరుద్ధంగా ఆశీలు వసూలు చేస్తే కాంట్రాక్టలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టిస్తామని ఆశీలు కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు హెచ్చరించారు. ‘ఆశీలు దందా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లోన వచ్చిన కథనానికి కమిషనర్ స్పందించారు. రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ మార్కెట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ఆశీలు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లకు నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. నగరపాలక సంస్థ నిర్ణయించిన రేట్ల కంటే అధిక మొత్తంలో సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వ్యాపారాలు చేసుకునే వారి వద్ద వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులు, ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఆల్కాట్ తోట కాంట్రాక్టర్ జి.సాయిబాబు, జాంపేట మార్కెట్ కాంట్రాక్టర్ డి.శ్రీనివాస్, మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్ (కంబాలచెరువు) కాంట్రాక్టర్ ఎం.చంద్రరావులకు నోటీసులు జారీ చేసింది. నిర్ణయించిన మేరకు ఆశీలు వసూలు చేయాలని, లేదంటే క్రిమినల్ కేసుల పెట్టిస్తామని హెచ్చరించింది. మరోమారు ఇది పునరావృతమైతే ఎలాంటి సమాచారం లేకుండా కాంట్రాక్ట్ రద్దు చేస్తామని తెలిపింది. తాము నిర్ణయించిన మార్కెట్ సరిహద్దుల మేరకు ఆశీలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆశీలు రేట్లపై చిరు వ్యాపారులకు సిబ్బంది అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. సిబ్బంది మార్కెట్ల వద్దకు వెళ్లి ఎంత ఆశీలు కట్టాలన్న దానిపై చిరువ్యాపారులకు వివరించనున్నారు. అంతేకాకుండా ఇకపై నిరంతరం రెవెన్యూ అధికారులు ఆశీలు వసూళ్లను పర్యవేక్షించేలా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
వైఎస్ఆర్ జిల్లా: టీడీపీ నేతల దౌర్జన్యం మూలంగా వాయిదా పడిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్నికల పరిశీలకులుగా జాయింట్ కలెక్టర్ శ్వేతను నియమించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి ఉన్నారు. గతంలో టీడీపీకి చెందిన చైర్మన్ గురివిరెడ్డి రాజీనామాతో మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రొద్దుటూరులో మెత్తం కౌన్సిలర్ల సంఖ్య 40 ఉండగా.. వైఎస్ఆర్ సీపీ సభ్యుల సంఖ్య 19గా ఉంది. కాగా ఇప్పుడు.. వైఎస్ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన కౌన్సిలర్ ముక్తియార్కు ఏడుగురు టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో శనివారం జరగాల్సిన ఈ ఎన్నికను టీడీపీ నేతలు ఓటమి భయంతో అడ్డుకున్నారు. కౌన్సిల్లో కోరం ఉండటంతో సంతకాలు తీసుకున్న అధికారులు.. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. చైర్మన్గా పోటీలోకి దిగిన ముక్తియార్పై అధికార పార్టీ ఒత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. కాగా ముక్తియార్ వెనక్కి తగ్గకపోవడంతోనే టీడీపీ నేతలు బలవంతంగా ఎన్నికను ఆపారని వైఎస్ఆర్ సీపీ నేతలు వెల్లడించారు. -
మున్సిపల్ చైర్మన్గా గోపాలబాబు ప్రమాణస్వీకారం
రామచంద్రపురం : స్థానిక మున్సిపల్ చైర్మ¯ŒSగా ఎస్ఆర్కే గోపాలబాబు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆయనను చైర్మ¯ŒSగా టీడీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఈ సమావేశానికి ప్రత్యేకాధికారిగా హాజరైన జేసీ ఎస్.సత్యనారాయణ ఈమేరకు ఎన్నిక ధ్రువపత్రాన్ని ఆయనకు అందజేశారు. గోపాలబాబు ఇటీవల జరిగిన 17వవార్డు ఉప ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందిన విషయం విదితమే. ఎక్స్అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, మున్సిపల్ మేనేజర్ జి. రాధాకృష్ణ హాజరయ్యారు. మండపేట మున్సిపల్ చైర్మ¯ŒS చుండ్రు శ్రీవరప్రకాశ్ ఈ సందర్భంగా విచ్చేసి గోపాలబాబును అభినందించారు. -
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్కు షోకాజ్
అనంతపురం టౌన్ : పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత పీసీ గంగన్నకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కొంతకాలంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐదు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సంజాయిషీ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘చైర్మన్గా గంగన్నకే మద్దతు’
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పీఠం మార్పుపై 4వ వార్డు కౌన్సిలర్ బెస్త చలపతి, కొందరు నాయకులు అనవసర రాద్దాంతాన్ని మానుకోవాలని, చైర్మన్గా గంగన్నను కొనసాగించడాన్నే సమర్థిస్తున్నామని టీడీపీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. శుక్రవారం పాలకమండలి కౌన్సిల్ హాల్లో సమావేశమైన కౌన్సిలర్లు పీసీ గంగన్నకు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు లేని పోని మాటలు చెప్పి పల్లెను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నగర పంచాయతీలో మూడేళ్లుగా అభివృద్ది పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ నాయకులు ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని, లేక పోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి పల్లె, టీడీపీ పెద్దలు నగరపంచాయతీ చైర్మన్ మార్పు విషయంలో కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరో కౌన్సిలర్ షకీల సైతం ఇదే విషయాన్ని ఫోన్లో తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీవీ సుభాషిణి, సుబ్బమ్మ, చెన్నక్రిష్ణమ్మ, ఆదినారాయణమ్మ, దిల్షాద్షేక్, శ్రీరాంనాయక్, కళావతి, శివలక్ష్మి, నాయకులు బీవీ ప్రసాద్, మహమ్మద్ రఫీ, రాజప్ప, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
విప్ నోటీసులో మున్సిపల్ అధికారి సంతకం, సెల్ నెంబర్
► ఎన్నికల అధికారికి ఫిర్యాదు ప్రొద్దుటూరు టౌన్ : టీడీపీ తరపున గెలిచిన కౌన్సిలర్ రఫీక్ ఇంటికి టీడీపీ నాయకులు విప్ నోటీసులను శనివారం అతికించారు. నోటీసులో మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న షఫీవుల్లా సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు అతని ఇంటి డోర్ నంబర్, సెల్ నంబర్ను నోటీసుల్లో పొందుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న ముక్తియార్ వర్గ కౌన్సిలర్లు షఫీవుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఉద్యోగిగా ఉంటూ విప్ నోటీసులో ఎలా సంతకం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు..: ఈ విషయంపై షఫీవుల్లా ఎన్నికల అధికారి వినాయకంకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్ ఇంటికి అతికించిన విప్ పత్రంలో నా ప్రమేయం లేకుండా నా సంతకం చేయడంతోపాటు మా ఇంటి డోర్ నంబర్, నా సెల్ నంబర్ను వేశారని పేర్కొ న్నారు. పరిశీలిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. తనపేరు రాసి ఉన్న నోటీసును కూడా ఎన్నికల అధికారికి చూపించారు. -
మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
– నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా భోధనను ప్రారంభిస్తోందని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు నగరంలోని స్లమ్ ఏరియాల్లో విస్త్రృతంగా పర్యటించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బుధవారం స్థానిక నగరపాలకలోని కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మున్సిపల్ల పాఠశాలలను కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నామన్నరు. మెప్మాలో పనిచేసే సీఆర్పీలు, పొదుపు సంఘాల నాయకురాళ్లు మురికి వాడలు, పేదలు నివసించే ప్రాంతాలలో ఇంగ్లిషు మీడియం విద్య అమలుపై తెలియజేయాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
స్వపక్షంలో విపక్షం
పారిపాలన తీరుపై వాదోపవాదాలు – తీర్మానాల అమలు ఆలస్యంపై వాగ్వాదం – మేయర్పై ధ్వజమెత్తిన టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులు – నిరసనగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్ – సభలో ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగం *‘‘నాకు మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్ లేరు. ఇప్పటి వరకు నియమించిన వారు సరిగా పనిచేయడం లేదు. నా అభీష్టం మేరకు కంప్యూటర్ను నియమించకపోతే ఎలా? ప్రెస్నోట్లు, కమిషనర్కు నోట్లు ఎలా ఇవ్వాలి’’ : కౌన్సిల్ సాక్షిగా మేయర్ ఆవేదన ఇది.. * ‘‘పాలకవర్గం, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి కుంటుపడుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదు.’’ : పాలక పక్షం ఆగ్రహం * ‘‘ఇకపై తాను సభలోకి రాకపోవచ్చు. సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలి. పదవులు శాశ్వతం కాదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి’’ : ఎమ్మెల్యే గోరంట్ల నిర్వేదం. * ‘‘ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలి. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారు’’ : ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల హెచ్చరిక ఇలా ఎన్నో విషయాలు, మరెన్నో సమస్యల ప్రస్తావనకు వేదికగా నిలిచింది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సెలింగ్ సమావేశం. నగరపాలక సంస్థ బడ్జెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈ సర్వసభ్య సమావేశంలో కార్పొరేషన్ పరిపాలన తీరుపై చర్చసాగింది. పాలక మండలి, అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో నగరంలో అభివృద్ధి ఏవిధంగా కుంటుపడుతోంది? కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందకపోవడం, తదితర విషయాలపై సభ్యులు, ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. - సాక్షి రాజమహేంద్రవరం క్రొవిడి లింగరాజు సభా మందిరంలో శుక్రవారం నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన జరిగింది. నగరంలో ఇప్పటి వరకు జరిగిన, ఇకపై జరగబోయే అభివృద్ధి విషయాలను మేయర్ సభ్యులకు వివరించారు. ప్రస్తుత సమావేశంలో బడ్జెట్పై చర్చించాలని, ఈ నెలలోనే మరో సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాసమస్యలు, ప్రశ్నోత్తాలు, ఇతర సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించినా ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పట్టుబట్టారు. అసలు తప్పు ఎవరిదో చెప్పాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ప్రశ్నించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జోక్యం చేసుకుని తీర్మానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. నాడు ఏం చేశారు? ఇదే విషయమై గతంలో మేయర్కు మద్దతుగా నిలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు సఖ్యత చెడడంతో మేయర్ను నిలదీస్తున్నారా? అనిÐð వైఎస్సార్సీపీ చీఫ్ విప్, 19వ డివిజన్ కార్పొరేటర్ మింది నాగేంద్ర టీడీపీ సభ్యులపై ధ్వజమెత్తారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాట్ల వల్ల చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. 2017–18 బడ్జెట్పై సభ్యుల సూచనలు... * బడ్జెట్పై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అందులోని లోపాలను ఎత్తి చూపుతూ సలహాలు, సూచనలు చేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది రెవెన్యూ రాబడులు ఎందుకు తగ్గాయో అధికారులు చెప్పాలని వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఆశీలు ఒక్కసారిగా నాలుగురెట్లు పెంచడం సరికాదని, అధికారులు పునరాలోచన చేయాలని కోరారు. 2002 నుంచి ఆశీలు పెంచకపోవడం వల్ల ఈ ఏడాది నాలుగు రెట్లు పెంచామని కమిషనర్ వి.విజయరామరాజు చెప్పారు. గత ఏడాది ఆశీలు వల్ల రూ.51 లక్షల ఆదాయం వస్తే ఈ ఏడాది పెంచిన రేట్ల వల్ల రూ.1.6కోట్లు రానుందని చెప్పారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత బీపీఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో ప్రజలను అధికారులు చెక్లిస్ట్ తేవాలని ఇబ్బందులు పెడుతున్నారని 23 డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి సభ దృష్టికి తీసుకొచ్చారు. బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని 12వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్ వ్యాఖ్యానించారు. మోరంపూడి–స్టేడియం రోడ్డు 100 అడుగులని మాస్టర్ప్లాన్లో పెట్టామని ఆరోడ్డు వెడల్పు వంద అడుగులో, లేక 80 అడుగులో చెప్పాలని డిమాండ్ చేశారు. మిగులు బడ్జెట్... నగరపాలక సంస్థ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పాలక మండలి ఆమోదించింది. మొత్తం బడ్జెట్ విలువ రూ.304 కోట్ల 25లక్షల 35 వేలుగా పేర్కొన్నారు. ఇందులో గత ఏడాది ప్రారంభ నిల్వ రూ.74కోట్ల 63 లక్షలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.229 కోట్ల62 లక్షల 30 వేలు వివిధ విభాగాల నుంచి ఆదాయం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు, గ్రాంట్ల రూపంలో రానుందని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్ ఖర్చులు రూ. 283 కోట్ల 34 లక్షలుగా చూపారు. ఇక రూ.20 కోట్ల 91 లక్షల 35 వేలను మిగులుగా చూపారు. సభలో గోరంట్ల ఉద్వేగం... టంగుటూరి, ఏబీ నాగేశ్వరరావు, ఏసీవై రెడ్డి లాంటి మహానుభావులెందరో నగర అభివృద్ధికి కృషి చేశారని, ఆ అవకాశం 35 ఏళ్లుగా తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని చెబుతూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగానికి లోనయ్యారు. ఇకపై తాను సభలోకి రాకపోవచ్చని, సభ్యులందరూ నగర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పదవులు శాశ్వతం కాదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. సభ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాకౌట్ ఇకపై తీర్మానాలపై సంతకాలు, ప్రతివారం స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేలా పాలన జరగాలని ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆకుల విజ్ఞప్తి చేశారు. లేదంటే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. మేయర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే ఆకుల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. మేయర్కు వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ను ఇస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. -
ఒక్క ఇంట్లోనే 150 మంది ఓటర్లా?
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితా రూపకల్పలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఒక్క ఇంట్లోనే 150 మంది నివసిస్తున్నట్లు తప్పుడు పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఈ అవకతవకలను సవరించి, తాజాగా ఓటర్ల జాబితా తయారు చేసేంత వరకు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని తిరుపతికి చెందిన పదిరి ద్వారకనాథ్రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తిరుపతి పట్టణంలోని 6/2/ఎస్12/342 ఇంటి నెంబర్లో 150 మంది నివసిస్తున్నట్లు పేర్కొంటూ వారందరినీ ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. ఇవన్నీ కూడా బోగస్ ఓట్లేనని ఆయన పేర్కొన్నారు. గోపాల్రాజు కాలనీలో 11 వీధులు ఉంటే ఓటర్లు జాబితాలో అదనంగా 12, 13 వీధులను జతచేసి, ఈ రెండు వీధుల్లో పలు డోర్ నెంబర్లను సృష్టించి అక్కడ ఓటర్లున్నట్లు ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. 1300 నుంచి 1424 వరకు ఉన్న ఓటర్ల పేరన్నీ అధికారులు సృష్టించినవేనన్నారు. బైరాగిపట్టెడ ప్రాంతంలోని డోర్ నెంబర్ 19/44/ఎస్/15 నుంచి 80 వరకు 30 ప్లాట్లు ఉన్నాయని, 101 నుంచి 504 వరకు ప్లాట్లకు నెంబర్లు ఇచ్చారని, కాని అధికారులు 1942 నుంచి 2008 వరకు నెంబర్లను సృష్టించడమే కాకుండా ఆ మేర భారీగా ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని వివరించారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఓటర్ల జాబితాను రద్దు చేసి, తాజాగా ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని ద్వారకనాథ్రెడ్డి హైకోర్టును అభ్యర్ధించారు. -
కేశన్న గౌడ్ అరెస్టు
డోన్ టౌన్: డోన్ మున్సిపల్ కార్యాలయం వద్ద వేలం పాటల సందర్భంగా గత శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసిన కేసులో టీడీపీకీ చెందిన డోన్ మున్సిపల్ వైస్చైర్మన్ కేశన్నగౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రిలయన్స్ డాబా వద్ద ఉన్న అతనితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు గౌడ్ తెలిపారు. దాడి కేసులో కేశన్న గౌడ్తో పాటు 20 మంది నిందితులుండగా ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నామన్నారు. కేశన్నగౌడ్తో పాటు జగదీశ్, మద్దిలేటి, మహేష్గౌడ్, నాగార్జున, రూపక్ కుమార్, శ్రీనివాసరెడ్డిని మీడియా ఎదుట హాజరుపరిచారు. అనారోగ్య కారణాలతో కేశన్నగౌడ్ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పోలిసులు తరలించారు. -
కమిషనర్పై విరుచుకుపడ్డ తమ్ముళ్లు
హిందూపురం అర్బన్ : అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. విజయవాడలో రవాణా శాఖ కమిషనర్పై దాడి ఘటన మరువక ముందే హిందూపురం మున్సిపల్ కమిషనర్పై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దుర్భాషలాడారు. ఒక దశలో వెళ్లిపో అన్నట్లుగా తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. కొంతకాలంగా కమిషనర్ విశ్వనాథ్, చైర్పర్సన్ లక్ష్మి, ఆమె భర్త నాగరాజు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వార్షిక బడ్జెట్ను రుపొందించారు. దాన్ని చైర్పర్సన్ ర్యాటిఫై కోసం పంపితే ఆమె సంతకాలు చేయకుండా పక్కన పడేశారు. ఈ విషయం ఎమ్మెల్యే బాలకృష్ణ వరకు వెళ్లింది. దీంతో బాలకృష్ణ తన రాజకీయ, అధికార పీఏలు కృష్ణమూర్తి, వీరయ్యలను సయోధ్య కుదుర్చి బడ్జెట్ను ఆమోదింపజేసి సమావేశం నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఈక్రమంలో ఇద్దరు పీఏలు చైర్పర్సన్ చాంబర్లో కమిషనర్తో పాటు అన్నిశాఖల అధికారులు, వైస్చైర్మన్, కౌన్సిలర్లు, టీడీపీ నాయకుడు నాగరాజును సమావేశపరిచారు. సమావేశంలో అందరి ముందూ కమిషనర్పై నాయకులు మాటల దాడి చేశారు. ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టానుసరంగా మాట్లాడారు. దీంతో కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురై సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. -
మూడింట ఏకగ్రీవం
అనంతపురం : జిల్లాలో ఖాళీపడ్డ మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులు, ఏకగ్రీవమైన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. రాయదుర్గం మునిసిపాలిటీలో ఎనిమిదో వార్డుకు ముదిగల్లు జ్యోతి, పామిడి నగర పంచాయతీ 18వ వార్డుకు బోయ సువర్ణ, తాడిపత్రి మునిసిపాలిటీ ఆరో వార్డుకు రసూల్బీ ఏకగ్రీవమయ్యారు. హిందూపురం మునిసిపాలిటీలో తొమ్మిదో వార్డుకు శాంత (టీడీపీ), రాధ (కాంగ్రెస్)ల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. తాడిపత్రి నాలుగో వార్డుకు షబ్బీర్ (వైఎస్సార్సీపీ), లక్ష్మీదేవి (టీడీపీ), రియాజ్ (ఇండిపెండెంట్)ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
పోలీసుల వలయంలో డోన్
- టీడీపీ వర్గీయుల దౌర్జన్యకాండ నేపథ్యంలో భారీ బందోబస్తు - క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం డోన్ టౌన్: డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ వర్గీయులు సాగించిన దౌర్జన్యకాండ నేపథ్యంలో శనివారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మున్సిపల్ వేలాల సందర్భంగా టీడీపీ నాయకులు చర్చల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులను బయటకు పిలిచి కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేయగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కూడళ్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు గౌడ్, ఎస్ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్యలతో పాటు పలువురు ఎస్ఐలు బందోబస్త్ను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా టీడీపీ దౌర్జన్యకాండను కళ్లారా చూసిన పాతపేట వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందేమోనని భయాందోళన చెందుతున్నారు. -
పోస్టు ప్రసాద్ పరిస్థితి విషమం
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డోన్ మున్సిపల్ వేలాల విషయంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాశవిక దాడిలో పోస్టు ప్రసాద్, ఓబులాపురం సురేష్, సుధాకర్, మదన్, రమణ, లాల్బాషాలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి మొదట డోన్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సరైన చికిత్స అందకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గౌరి గోపాల్, అమృత ప్రయివేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. గౌరి గోపాల్లో చికిత్స పొందుతున్న పోస్టు ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్పై అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురు అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పథకం ప్రకారమే దాడి : గౌరు వెంకటరరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ నేతలు పక్కా పథకం ప్రకారమే తమ పార్టీ కార్యకర్తలపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. కత్తులు, రాడ్లు, పట్టుడు కర్రలతో స్థానికులను భయాందోళనలకు గురి చేయడం చూస్తే అధికార పార్టీ అండదండలతోనే చెలరేగిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు పార్టీ అన్నివిధాల అండగా నిలుస్తుంది. దాడి జరిగిన తర్వాత కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం దారుణమైన విషయం. -
ఏడుగురు అరెస్టు
డోన్ టౌన్ : మున్సిపల్ వేలం పాటల సందర్భంగా శుక్రవారం ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులపై జరిగిన దాడి ఘటనలో 7గురిని అరెస్టు చేసినట్లు శుక్రవారం రాత్రి ఏఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. సీఐ కార్యాలయంలో విలేకరుల ఎదుట నిందితులను హాజరుపరిచిన అనంతరం ఆయన డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్తో కలిసి మాట్లాడారు. పోస్టుప్రసాద్, రమణ, సుధాకర్, లాల్బాషా, మదన్లపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనతో సంబందం ఉన్న కొండపేట, చిగురుమానుపేటలకు చెందిన 7గురిని గుర్తించామన్నారు. నిందితులు చిన్నకాంత్ అలియాస్ శ్రీకాంత్, పెద్దకాంత్ అలియాస్ చంద్రకాంత్, దూదేకుల హుమయూన్, షేక్లాల్ బాషా, బుడ్డన్నగారి రమణ, గాజుల శ్రీకాంత్, పల్లెగాని చక్రపాణిగౌడ్లను దొరపల్లె బ్రిడ్జ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిని డోన్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ చిన్నికృష్ణ ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఘటనలో సుమారు 20 మంది పాల్గొన్నారని ఏఎస్పీ తెలిపారు. మున్సిపల్ వేలం పాటలో తమకు పోటీగా వేలం పాడేందుకు ధరావత్తు సొమ్ము చెల్లించారనే ఆగ్రహంతోనే నిందితులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. -
డోన్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం
డోన్: కర్నూలు జిల్లా డోన్లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మున్సిపాలటీ టెండర్ల విషయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. టెండర్ వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. కార్యకర్త ప్రసాద్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
9న మున్సిపాలిటీల ఉప ఎన్నిక
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో ఖాళీ అయిన కౌన్సిలర్ల స్థానాలకు ఉప ఎన్నికల తేదీ ఖరారయింది. కొవ్వూరు మున్సిపాలిటీలో 16 వార్డు టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ గత ఏడాది అదే పార్టీ నేతల మధ్య తలెత్తిన ఇసుక తగాదాలో హత్యకు గురయ్యారు. అలాగే, తణుకు మున్సిపాలిటీలో మూడో వార్డు కౌన్సిలర్ గుబ్బల రామారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన ఇండిపెండెంట్ గా నెగ్గి టీడీపీలో చేరారు. ఈ రెండు స్థానాలకు వచ్చే నెల 9వ తేదీన ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది -
మీ దయ రాదా..
ఇంక్రిమెంట్లకు నోచని మున్సిపల్ ఔట్సోరి్సంగ్ సిబ్బంది జీతాలు పెంచుతూ గత ఏడాది ఆగస్టులోనే జీఓ ఉత్తర్వులు జారీ చేయని సీడీఎంఏ అప్పులపాలవుతున్నామంటూ ఉద్యోగుల ఆవేదన సాక్షి, రాజమహేంద్రవరం : దేవుడు వరమిచ్చినా దానిని అందుకోవడంలో మున్సిపల్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు. వారి జీతాలు పెంచుతూ గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జీఓ జారీ అయినా ఇప్పటివరకూ అది అమలుకు నోచుకోలేదు. దీంతో వారు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పెంచిన జీతాలు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తే ఉన్న ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో 2003లో అప్పటి ప్రభుత్వం సిబ్బందిని నియమించింది. చాలీచాలని జీతాలతో ఇప్పటికీ వారు విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణ ఉద్యోగుల మాదిరిగా ప్రతి ఐదేళ్లకూ వేతన సవరణ విధానం వీరికి వర్తించదు. ప్రభుత్వం దయతలిస్తే తప్ప జీతభత్యాలు పెరగని దయనీయత. అలాంటిది గత ఏడాది ఎన్నో వినతుల అనంతరం వివిధ విభాగాల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచుతూ జీఓ 151ని ప్రభుత్వం జారీ చేసింది. పెంచిన జీతాలను అదే ఏడాది సెప్టెంబర్ 1న ఇవ్వాలని ఆదేశించింది. ఆ మేరకు ఇతర శాఖలు ప్రభుత్వ ఆదేశాన్ని అమలు చేస్తున్నా.. పురపాలక శాఖలో మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడీఎంఏ మోకాలడ్డు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను ఇచ్చేందుకు నగరపాలక సంస్థ, మున్సిపల్, నగర పంచాయతీల పాలక మండళ్లు ఆమోద ముద్రవేశాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ను కమిషనర్, డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేష¯ŒS(సీడీఎంఏ)కు పంపాయి. అయితే సీడీఎంఏ ఇప్పటివరకూ ఆ ఫైల్పై సంతకం చేయలేదు. జీఓ జారీ చేసి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లుగా ఉన్నారు. చాలీచాలని జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇంక్రిమెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. వస్తున్న జీతాలు చాలకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న జీతాలతో పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ ఖర్చులు నెట్టుకు రాలేకపోతున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమపై దయ చూపాలని వారు వేడుకుంటున్నారు. మూడు కేటగిరీలుగా విభజన మున్సిపల్ శాఖలో మూడు కేటగిరీల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్ల జీతాలు రూ.17,500, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఫిట్టర్, మెకానిక్, లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర సిబ్బందికి రూ.15 వేలు, వాచ్మన్, మాలి, కమాలి, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్ తదితరులకు రూ.12 వేల చొప్పున జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పైన పేర్కొన్న పోస్టులకు ఇచ్చే జీతాల లెక్క వేర్వేరుగా ఉంటోంది. ఒక కేటగిరీలో పని చేస్తున్న వివిధ పోస్టుల వారందరికీ ఒకేలా జీతాలు ఇచ్చేలా గత ఏడాది జీఓ జారీ అయింది. విభాగం నుంచి జీఓ జారీ కావాల్సి ఉంది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. నిబంధనల ప్రకారం సంబంధిత విభాగం ప్రత్యేకంగా జీఓ జారీ చేయాలి. ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో జీఓ ఇచ్చింది. ఉన్నతాధికారులకు ఈ విషయం గుర్తు చేశాం. త్వరలోనే జీఓ వస్తుందని ఆశిస్తున్నాం. రాగానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలు అమలు చేస్తాం. – టి.సకలారెడ్డి, రీజినల్ డైరెక్టర్, మున్సిపల్ పరిపాలన విభాగం జిల్లాలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న అవుట్ సోరి్సంగ్ ఉద్యోగులు కాకినాడ : 591 రాజమహేంద్రవరం : 1,037 అమలాపురం : 116 తుని : 98 పిఠాపురం : 73 సామర్లకోట : 116 మండపేట : 58 రామచంద్రపురం : 54 పెద్దాపురం : 85 ఏలేశ్వరం : 47 గొల్లప్రోలు : 30 ముమ్మిడివరం : 30 మొత్తం : 2,335 -
ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు
హిందూపురం అర్బన్ : మున్సిపాల్టీలోని 9వ వార్డు ఉపఎన్నికలు ఏప్రిల్ 9న జరుగనున్నట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిదోవార్డు కౌన్సిలర్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన ఈ వార్డుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ, అదేరోజు మ««ధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుంది. ఏప్రిల్ 9న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఎన్నికల కోడ్ అమలు ఎన్నికల కోడ్ గురువారం నుంచే అమలులోకి వచ్చిందని కమిషనర్ చెప్పారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. 9వ వార్డులో మొత్తం ఓటర్లు 2,565 ఉండగా ఇందులో పురుçషులు 1303, 1262 మంది స్త్రీలు ఉన్నారు. కాగా ఎన్నికల అధికారిగా కమిషనర్, సహాయ ఎన్నికల నిర్వాహణాధికారులుగా ఈఈ రమేష్, టీపీఓ తులసీరాం వ్యవహరిస్తారన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమలు నిర్వహణాధికారిగా సోమశేఖర్, ఎన్నికల వ్యయగణాంకాధికారిగా డీఈ ప్రసాద్ వ్యవహరిస్తారని చెప్పారు. -
ఇద్దరిని మింగిన మ్యాన్హోల్
విజయవాడ: విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మ్యాన్ హోల్ పూడిక తీసేందుకు బుధవారం ఇద్దరు కార్మికులు దిగారు. పూడిక తీసే సమయంలో ఊపిరాడక వారు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బోరుమంటున్నాయి..!
► నగరంలోని బోర్ల నిండా బురద నీళ్లే ► కానరాని నీటి ఎద్దడి నివారణ చర్యలు ► పట్టించుకోని అధికారులు, పాలకులు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలో బోర్లు బోరుమంటున్నాయి. ఓ వైపు అధికారులు ప్రగతి మంత్రం జపిస్తున్నా తాగునీటి వనరులు మాత్రం వేసవిలో నగర జీవిని వెక్కిరిస్తూనే ఉ న్నాయి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కరపత్రాలు మొదలుకుని చేతి పంపుల వరకు అన్నింటిపైనా పసుపు రం గు పూస్తున్నారు. ప్రచారంలో ఇంత శ్రద్ధ చూపిస్తున్న పాలకులు అవే బోర్లు పాడైపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో చాలా చోట్ల బోర్ల నుంచి బుదర నీరే వస్తోంది. ఒక్క బక్కెట్టు నీరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. రెల్లవీధి, దంగల వీధి, బల గ, ఆదివారం పేట, గుజరాతీపేటలతో పాటు పలు కాలనీల్లోని బోర్లు ఇలాంటి నీరే ఇస్తున్నాయి. గణాంకాల కోసం నగరంలో ఇన్ని బోర్లు వేశామ ని అధికార పక్ష నేతలు చెప్పుకుంటున్నా, అవి ప్రజలకు ఉపయోగపడడం లేదు. వేసవి కాలం రావడంతో ఎప్పటికప్పుడు కరెంటు కోతలు, మున్సిపల్ కుళాయిలు సరిగా రాకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఆపత్కాలంలో బోర్లే దిక్కుగా మారుతున్నాయి. అయితే బోర్లు కూడా బురద నీరే ఇ స్తుండడంతో ఇక తామేం చేయాలని స్థానికులు ప్ర శ్నిస్తున్నారు. ఈ కాలనీలో నివసించేవారంతా నిరుపేదలు. సొంత మోటార్లు, బావులు లేని వారు. వీరికి నగర పాలక సంస్థ కుళాయి నీరే ఆధారం. వాడుక నీటి కోసం బోర్లపై ఆధారపడతారు. 2016లో తీసిన బోర్ల నుంచి కూడా బురద నీరే వస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. చేతి పంపు నుంచి బురద నీరు వస్తోంది. ఈ విషయాన్ని నాయకులు, అధికారులకు చాలాసా ర్లు చెప్పాం. అయినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు చొరవ చూపి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. ---కొర్లాపు వేణు, దంగళవీధి, శ్రీకాకుళం. ఈ మధ్యకాలంలో కుళాయిల నీరు రాకపోతే స్నానాలు, తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది ప డ్డాం. కనీసం మా ప్రాంతంలో బావులు కూడా లేవు. చేతిపంపు నీళ్లే ఆధారమయ్యాయి.--- పి.సంతోష్, దంగళవీధి, శ్రీకాకుళం నీళ్లు బురదగా వస్తుండడంతో బకెట్లలో వాటిని నిల్వ చేసుకుని బురదంతా కిందకు దిగాక వడబోసుకుని వాడుతున్నాం. ఇలా ఎంత కాలం వడపోసుకుని వాడుకోగలం. నగరంలో ఉన్నా ఏంటి ఈ దుస్థితి. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి. --- ఎం.ఆదినారాయణ, రెల్లవీధి, శ్రీకాకుళం మా దృష్టికి రాలేదు చేతి పంపుల నుంచి బురద నీళ్లు వస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే మా ఇంజినీర్లను పంపించి అక్కడ సమస్యను తెలుసుకుంటాం.తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపడతాం. ---పి.ఎ శోభ, నగరపాలక కమిషనర్, శ్రీకాకుళం -
మునిసిపల్ బడ్జెట్కు ఆమోదం
► ఇంటి పన్నులు, ఇతరాత్ర ఆదాయ వనరులపై చర్చ ► మునిసిపాలిటీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా ► ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మహబూబాబాద్ : మానుకోట మునిసిపాలిటీ 2016–17 సంవత్సర నికర బడ్జెట్, 2017–18 అంచనా బడ్జెట్కు స్వల్ప మార్పులతో పాలకమండలి సోమవారం ఆమోదం తెలిపింది. 88 కోట్ల 89 లక్షల అంచనా ఆదాయం, 86.6 లక్షల వ్యయం, 2 కోట్ల 82 లక్షల 52 వేల మిగులు బడ్జెట్పై అకౌంటెంట్ సరిత చదివి వినిపించారు. కాగా కార్యక్రమానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కూడా హాజరయ్యారు. తొలుత ఆయన మాట్లాడుతూ త్వరలో మానుకోటకు సీఎం వస్తున్నారని, ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ను తయారు చేయాలన్నారు. మునిసిపాలిటీ సమస్యలన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నిజాం చెరువును మినీట్యాంక్బండ్గా మార్చేందుకు రూ.7 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడేందుకు స్థలం, ఇతరాత్ర నిర్మాణాలతోపాటు రింగురోడ్డుతో మానుకోట రూపురేఖలు మారుతాయన్నారు. టీఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. వృత్తిపన్నును బడ్జెట్లో చేర్చాలన్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్నులు విధించి ఆ ప్రాం త అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. సీపీఐ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ మాట్లాడుతూ.. 88.89 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రతిపాదనలు తయారు చేశారని, కానీ దానిలో ఎక్కువగా పింఛన్లకు సంబంధించినవి, డబుల్ బెడ్రూమ్కు సంబంధించినవే ఉన్నాయన్నారు. చూసే వారికి బడ్జెట్ పెద్దగా కనిపించినప్పటికీ దాని మిగులు బడ్జెట్ మాత్రం తక్కువగా ఉందన్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధుల కోసం ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. బడ్జెట్ రూపకల్పన సక్రమంగా లేదన్నారు. కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ పుచ్చకాయల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకుండా పన్నులు వసూలు చేసి ఆదాయం పెంచుకోవాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెల్ టవర్లపై కూడా పన్ను వసూలు చేయాలన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్పర్సన్ డాక్టర్ భూక్య ఉమ మాట్లాడుతూ అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో కమిషనర్ జి.రాజేంద్రకుమార్, డీఈ కృష్ణాలాల్, మేనేజర్ రాజన్న, వర్క్ ఇన్స్పెక్టర్ సాబీర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
‘ఢిల్లీని ఏడాదిలో లండన్గా మారుస్తా’
న్యూఢిల్లీ: ఢిల్లీని లండన్లా తయారు చేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో తమకు విజయాన్ని కట్టబెడితే, ఢిల్లీ మొత్తాన్ని క్లీన్ చేస్తానని, కచ్చితంగా లండన్ అంత గొప్పగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గత పది, పదిహేనేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేయలేనిది తాము అధికారం చేపట్టిన రెండేళ్లలోనే ఢిల్లీలో చేశామని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకు 67 స్థానాలు ఇచ్చారు. కానీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అస్సలు అలాంటి నిడివి ఇవ్వొద్దు. పూర్తి విజయం కట్టబెట్టండి. ఎంసీడీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఢిల్లీని లండన్ ఒకే ఏడాదిలో తయారు చేసి చూపిస్తాం’ అని కేజ్రీవాల్ చెప్పారు. త్వరలో ఎంసీడీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ప్రచారానికి వెళ్లిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు గుర్తింపులేని కాలనీలకు గుర్తింపు ఇవ్వాలని తాము కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపించామని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో ఉందని గుర్తు చేశారు. -
మొగుడు, పెళ్లాం కొట్లాట లాంటిది
– గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ వివాదంపై ఎంపీ జేసీ వ్యాఖ్య గుంతకల్లు టౌన్ : ‘మొగుడు, పెళ్లాం కొట్లాటలో ఎవరైనా పంచాయితీ చేస్తారేమయ్యా?! ఇది కూడా అలాంటిదే. కొట్లాట వచ్చిన దానికి కారణం లేదు. పోయేదానికీ మన ప్రమేయం అవసరం లేద’ని గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ల మధ్య వివాదంపై ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన మునిసిపల్ చైర్పర్సన్ చాంబర్లో చైర్పర్సన్ అపర్ణ, కమిషనర్ సత్యనారాయణ మధ్య తలెత్తిన వివాదంపై పంచాయితీ చేశారు. సర్దుకుపోవాలని ఇద్దరికీ సూచించారు.స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా హాజరయ్యారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.