శ్రీనివాస్‌ హత్యకేసులో నిందితుల లొంగుబాటు | three surrender in murder case | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ హత్యకేసులో నిందితుల లొంగుబాటు

Jan 26 2018 6:15 PM | Updated on Oct 16 2018 6:33 PM

నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్‌లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నల్లగొండలోని గాంధీనగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్‌ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

 తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్‌లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్‌ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement