భార్యను,  బంధువులను కాల్చి చంపాడు!  | Gerogia NRI Gwinnett County Vijay Kumar Case | Sakshi
Sakshi News home page

భార్యను,  బంధువులను కాల్చి చంపాడు! 

Jan 24 2026 9:11 AM | Updated on Jan 25 2026 3:02 PM

Gerogia NRI Gwinnett County Vijay Kumar Case

అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘోరం 

నలుగురిని పొట్టన పెట్టుకున్న వైనం 

గదిలో దాక్కుని బతికిపోయిన పిల్లలు 

పారిపోతూ పట్టుబడ్డ నిందితుడు

న్యూయార్క్‌: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. 

కొడుకు 911కు ఫోన్‌ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్‌కుమార్‌ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్‌ కుమార్‌ (33), నిధీ చందర్‌ (37), హరీశ్‌ చందర్‌ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. 

గదిలో దాక్కున్న పిల్లలు 
విజయ్‌కుమార్‌ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్‌విలేలోని బ్రూక్స్‌ ఐవీ కోర్ట్‌లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్‌ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్‌ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు.  

 


 

Advertisement
 
Advertisement
Advertisement