రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు | Property tax collections at record level | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు

May 4 2025 12:10 AM | Updated on May 4 2025 12:10 AM

Property tax collections at record level

జీహెచ్‌ఎంసీ మినహా ఇతర పురపాలికల్లో ఎర్లీబర్డ్‌ కింద రూ. 400.36 కోట్లు వసూలు

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్‌లలో 50 శాతం కన్నా ఎక్కువ వసూళ్లు  

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుల కోసం పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్‌ పథకానికి మంచి స్పందన లభించింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఏడాది కాలంలో చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఏప్రిల్‌ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పించే ప్రక్రియ గత కొన్నేళ్లుగా పురపాలక శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025–26 సంవత్సరానికి 5 శాతం రాయితీని ఉపయోగించుకొన్న ప్రజలు గత నెలలోనే రూ. 400.36 కోట్లు చెల్లించారు. మొత్తం ఆస్తిపన్ను డిమాండ్‌ రూ. 2,264.84 కోట్లు ఉండగా, ఒక్క నెలలోనే ముందస్తుగా 17.68 శాతం చెల్లించడం గమనార్హం. 

ఇది పురపాలక శాఖలో ఒక రికార్డుగా సీడీఎంఏ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో రూ. 900.9 కోట్లు ఎర్లీబర్డ్‌ కింద వసూలు కాగా, జీహెచ్‌ఎంసీ మినహా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో రూ. 400.36 కోట్లు వసూలు కావడం పట్ల పురపాలక శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. 

గత సంవత్సరం ఎర్లీబర్డ్‌ కింద రూ. 317.84 కోట్లు (14.80 శాతం) వసూలు కాగా, ఈ సంవత్సరం మరో 3 శాతం పెరిగింది. మొత్తం సంవత్సరానికి వసూలు చేసే పన్నుల్లో జమ్మికుంట మునిసిపాలిటీలో ఎర్లీబర్డ్‌ కింద 54.78% , హుజురాబాద్‌ 51.85% వసూళ్లుచేసి 50 శాతం కన్నాఎక్కువగా వసూలు చేసిన జాబితాలో అగ్రగామిగా నిలిచాయి. 

అధికారులను అభినందించిన సీడీఎంఏ 
కాగా బొల్లారం, రామగుండం కార్పొరేషన్, గుమ్మడిదల, పీర్జాదిగూడ కార్పొరేషన్, తూముకుంట, మద్దూర్, గుండ్లపోచంపల్లి, నిజాంపేట కార్పొరేషన్, చౌటుప్పల్, నాగారం, నార్సింగి, సిద్దిపేట, నారాయణఖేడ్, రాయికల్, కోదాడలలో 30 శాతం కన్నా ఎక్కువగా వసూళ్లు చేసినట్లు సీడీఎంఏ శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు గుమ్మడిదల (42%), మద్దూర్‌ (34.2%), గడ్డపోతారాం (26.24%), మొయినాబాద్‌ (21.41%), చేవెళ్ల (21.26%) ఎర్లీబర్డ్‌ వసూళ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా తగిన సమయంలో స్పందించి ముందస్తు పన్ను వసూళ్లు చేసిన కమిషనర్లను, ఇతర అధికారులను, సిబ్బందిని ఆమె అభినందించారు. కాగా 10 శాతం కన్నా తక్కువ వసూళ్లు సాధించిన పురపాలికల్లో వరంగల్‌ కార్పొరేషన్, మెదక్, వర్ధన్నపేట, చేర్యాల, వైరా, పోచంపల్లి, భైంసా, ఇంబ్రహీంపట్నం, జలపల్లి, సదాశివపేట, వనపర్తి, ఆదిలాబాద్, దేవరకొండ, బోధన్, అశ్వారావుపేట, స్టేషన్‌ ఘనపూర్, ఎదుల్లపురం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement