Municipal Related Issues
-
అక్రమ వెంచర్పై కొరడా
సాక్షి, కొడంగల్: పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో అనుమతి లేకుండా వెలిసిన వెంచర్పై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వా త పట్టణంలోని పలు చోట్ల అక్రమ వెంచర్లు వెలిశాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇర్షాద్, కార్య నిర్వాహక అధికారి పద్మ, మున్సిపల్ సిబ్బంది మంగళవారం వీటిని పరిశీలించారు. లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శిఖం భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్లే దారి కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఉండటంతో కొడంగల్ వ్యాపారులు ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈ ప్లాట్లకు మున్సిపల్ అనుమతి లేదు. టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్ లేదు. లే అవుట్ లేదు. శిఖం భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల నుంచి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) పర్మిషన్ తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అన్ని అనుమతులు తీసు కొని లే అవుట్ చేసిన తర్వాతనే అనుమతులు ఇ స్తామని టీపీఓ ఇర్షాద్, ఈఓ పద్మ తెలిపారు. పట్టణంలో అక్రమంగా వెలిసిన వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా?
శాంతియుతంగా సాగుతున్న మునిసిపల్ కార్మికుల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేసింది. సోమవారం నిర్వహించతలపెట్టిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడిని భగ్నం చేసింది. కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్ది బలవంతంగా ఈడ్చి వాహనాల్లోకి విసిరేశారు. ఈ క్రమంలో మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. అనంతపురం న్యూసిటీ: పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కార్మికులను రోడ్డుపాలు చేసే జీఓ 279ను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెలో తారస్థాయికి చేరింది. డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్యూసీఐ మద్దతుతో మునిసిపల్ కార్మికులు రామ్నగర్లోని మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి ముట్టడించేందుకు భారీ సంఖ్యలో వెళ్లారు. ఇంటి ముందు బైఠాయించి జీఓ 279ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దొరికిన కార్మికులను దొరికినట్టుగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. కొంతమంది నాయకులను చుట్టుముట్టి కాళ్లు, చేతులు పట్టుకుని లాగేశారు. చేతులు పెడవిరిచి, మెడను తిప్పి, పిడిగుద్దులు గుద్దారు. నొప్పితో విలవిలలాడినా కర్కశంగా వ్యవహరించారు. మహిళా కార్మికులపైనా విరుచుకుపడ్డారు. లేడీ కానిస్టేబుళ్లతో వారిని అక్కడి నుంచి పక్కకు పంపించే అవకాశం ఉన్నా మగ పోలీసులు రెచ్చిపోయారు. మహిళలు పక్కకు కదలకుండా వారిని చుట్టుముట్టి.. వారిని చేతులతో నెట్టుతూ బలవంతంగా వాహనాల్లోకి కుక్కారు. ఒంటిపై దుస్తులు జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. డీఎస్పీ వెంకట్రావ్ ఆదేశాల మేరకు కార్మికులను బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసుల తోపులాటలో సీఐటీయూ నాయకులు గోపాల్, మంజుల, నాగరత్న, ఆదిలక్ష్మి, శివ గాయపడ్డారు. వీరిని పోలీసు స్టేషన్ నుంచి సర్వజనాస్పత్రికి తరలించారు. మంజుల, ఆదిలక్ష్మిలకు ఫ్రాక్చర్ అయినట్లు తెల్సింది. దుర్మార్గపు చర్య జీఓ 279 రద్దు చేయాలని పోరాడుతున్న కార్మికులపై దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని వామపక్షాల నేతలు నాగేంద్ర, రాజారెడ్డి, నాగరాజు, కార్మిక సంఘాల నేతలు గోపాల్, రాజేష్గౌడ్ ఖండించారు. ఉద్ధేశ్యపూర్వకంగానే కార్మికులపై పోలీసులు దాడులు చేశారన్నారు. మహిళా కార్మికులని చూడకుండా దాడులు చేయడం సరికాదన్నారు. మహిళలను మగ పోలీసుల ద్వారా బలవంతంగా జీపులోకి తోసేయడం దారుణమన్నారు. సమ్మెను ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు కార్మికులు రారని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పరామర్శ పోలీసుల తోపులాటలో గాయపడ్డ కార్మికులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్ జానకి పరామర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఆమె తప్పుబట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని ధ్వజమెత్తారు. పోలీసులా.. పశువులా? ఏం సార్ పోలీసులకు పెళ్లాం, బిడ్దలుండరా? ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తారా? యదపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఒంటిపై చీరలేకుండా ఊడదీశారు. దెబ్బలు తగిలినా బాధ లేదు. కానీ పోలీసులు చేసిన పనులు బాగలేవు. వాళ్లు పోలీసులా..పశువులా? – మంజుల, పారిశుద్ధ్య కార్మికురాలు -
సర్కార్ జులుం
సాక్షి, గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృత రూపం దాల్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు గొంతెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ సర్కార్ నిరసన గళాలలను అణచివేసేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ కార్మిక నాయకులు, కార్మికులను అరెస్టు చేస్తూ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాలో ము న్సిపల్ కార్మికుల సమ్మె గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. బాపట్ల, పొన్నూరు మినహా అన్ని మున్సిపాల్టీల్లో సమ్మె కొనసాగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి, వినుకొం డ, నగరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి, సత్తెనపల్లి, రేపల్లే ము న్సిపాల్టీల్లో 3700 మంది కాంట్రాక్టు పారి శుద్ధ్య కార్మికులు ఉండగా వీరిలో 2597 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. 1,744 మంది ఇంజి నీరింగ్ విభాగం కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు చాలా వరకూ సమ్మె పాల్గొంటుండటంతో పారిశుద్ధ్యం క్షిణించిం ది. దీంతో ప్రభుత్వం పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. పోలీసుల దౌర్జన్యం.. ఎనిమిది రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతున్నా స్పందించని ప్రభుత్వం పోటీ కార్మికులను పనుల్లోకి తీసుకురావడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 774 మంది పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు చేయిస్తోంది. దీంతో ఆయా మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పోటీ కార్మికుల విధులను అడ్డగిస్తున్నారు. సత్తెనపల్లి మున్సిపల్ అధికారులు పోటీ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సమయంలో సమ్మెలో ఉన్న కార్మికులు కూలీలు చెత్త తరలిస్తున్న ట్రాక్టర్ను ఏరియా ఆస్పత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన చేస్తున్న సీఐటీయూ పట్టణాధ్యక్షుడు జగన్నథరావు సహా 24 కార్మికులను మంది కార్మికులను అరెస్టు చేశారు. గుంటూరు కార్పొరేషన్లోని ఒకటో డివిజన్లో పోటీ కార్మికుల విధులను అడ్డగించేకి ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేట సంజీవనగర్లో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కూలీలను మున్సిపల్ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించి వెనక్కు పంపించారు. సీఎం దిష్టి బొమ్మ దగ్ధం.. వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేసేలా జీవో 279ని రద్దు చేయకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు దగ్ధం చేశారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వానికి కాలం చెల్లిందని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తెనాలి శాఖ అధ్వర్యంలో గురువారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం కార్మికులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తు పోలీసులతో కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ మధుబాబు, రాష్ట్ర కార్యదర్శులు పి.రామచంద్రరావు, సోమ శంకర్, తెనాలి నాయకులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం.. జీవో 279ని రద్దు చేయకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యమని ఉరితాళ్లను మెడకు బిగించుకుని మంగళగిరి పట్టణంలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాడేపల్లిలో కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నరసరావుపేటలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్డీవో ఆఫీస్కు చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పటిష్ట బందోబస్తు.. జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం దీక్షా శిబిరాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య విధుల నిర్వహిస్తున్న కూలీలను మున్సిపల్ కార్మికులు అడ్డుకోకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులను ప్రదర్శించి ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలిలో ఉద్రిక్తత తెనాలిఅర్బన్: తెనాలిలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవడంతో మున్సిపల్ అధికారులు పోలీసుల రక్షణలో పారిశుద్ధ్య నిర్వాహణ పనులు చేయిస్తున్నారు. గురువారం ఆర్ఆర్ నగర్లో ఇదే జరిగింది. అయితే ఈ సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్ శకుంతల త్రీటౌన్ పోలీసులకు అందించారు. ఎస్ఐ అశోక్కుమార్ మహిళా కానిస్టేబుల్స్తో అక్కడకు చేరుకున్నారు. కూలీలను అడ్డుకుంటే సహించేదిలేదని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయిన కార్మికులు వినకపోవడంతో మహిళా కానిస్టేబుల్స్ వారిని వారించారు. ఇంతలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో కాంట్రాక్ట్ కార్మికురాలు ఎం.జయలక్ష్మి సృహతప్పి కింద పడింది. వెంటనే తోటి కార్మికులు ఆమెను జిల్లా వైద్యశాలకు తరలించారు. విష యం తెలుసుకున్న కార్మికులు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్న జయలక్ష్మిని పరామర్శించా రు. సుమారు 16 మందిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి బైండవర్ చేసి వదిలేశారు. అనంతరం మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఠాకార్మిక సంఘం డాల్ మిల్ కార్మిక సంఘ నాయకులు అక్కడికి వచ్చి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, నాయకులు జోనేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు. -
ఉద్యమం.. ఉద్రిక్తం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): మునిసిపల్ కాంట్రాక్ట్ పారి శుధ్య కార్మికుల సమ్మె తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తతకు దారితీసింది. 279 జీఓను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్ట ణాలలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులు గురువారం కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో వేరే వారితో స్థానిక వీకర్స్ కాలనీ తదితర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలిసి సమ్మెలో ఉన్న కార్మికులు అక్కడికి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను పనులు చేయవద్దని కోరారు. తాము సమ్మెలో ఉన్నామని, సహకరించాలని కోరారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని సమ్మెలో ఉన్న కార్మికులను బలవంతంగా జీపులోకి ఎక్కించడం మొదలుపెట్టారు. దాంతో కార్మికులకు, పోలీస్లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ముగ్గురు మహిళా కార్మికులు మర్రి చంద్రకళ, మండెల్లి జుయసుధ, కూనుపాముల దయామణి స్పృహ తప్పారు. వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జీపులోకి మహిళా కార్మికులను ఎక్కించి వెనుక డోర్ వేయకుండానే వాహనాన్ని పోనివ్వడంతో కొంతమంది కార్మికులు కింద పడిపోయారు. వారికి తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహిళా కార్మికులు తాటికొండ మిరియ, ముత్యాలమహాలక్ష్మి లకు తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గోసాల రవి అనే కార్మికుడి చేయి బెణికింది. తరువాత స్థానిక ఏరియా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్దకు పారిశుధ్య కార్మికులు చేరుకుని ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కార్మిక నేతలు కర్రి నాగేశ్వరరావు, డి.సోమసుందర్, మండల నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు, గుంపుల సత్యకృష్ణ, జనసేన నాయకులు నీలపాల దినేష్, సీఐ మూర్తి, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో కార్మిక నాయకులతో చర్చలు జరిగాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదు ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డి.సోమసుందర్, కర్రి నాగేశ్వరరావులు హెచ్చరించారు. ఓ వైపు కార్మికులు సమ్మె చేస్తుండగా పోటీగా కూలీ లను తీసుకువచ్చి పారిశుధ్య పనులు చేయించడం సరికాదన్నారు. 279 జీవో విధానం అంతా లోపభూయిష్టమన్నారు. ఎన్నో ఉద్యమాలు చూశామని పోలీసులు దౌర్జన్యం చేసినా, పోటీ కార్మికులను దింపినా ఉద్యమం తీవ్రతరం అవుతుందన్నారు. రానున్న ఎన్నికలలో సత్తా చూపించండి ప్రభుత్వం పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులపై కక్షసాధింపులు చేస్తున్నందున, కార్మికులు రానున్న ఎన్నికలలో తమ సత్తా చాటాలని ఓట్లు రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని ఏఐటీయూసీ నాయకులు డి.సోమసుందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. రక్తం కారుతున్నప్పటికి సమ్మె వీడవద్దన్నారు. ఉద్యమాలు తీవ్రతరం చేద్దాం అన్నారు. ప్రజా ప్రతినిధులు తమ, తమ ఇళ్ళు వద్ద ఆయా సందర్భాలలో పారిశుధ్య కార్మికులచే పనులు చేయించుకుంటున్నారని, వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. అధికారులకు సైతం పారిశుధ్య కార్మికుల సంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలి: సీఐ మూర్తి పారిశుధ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల స్థానంలో ప్రభుత్వం వేరే కార్మికులతో పనులు చేయిస్తుందని, వారిని అడ్డుకోవడం తగదని సీఐ మూర్తి అన్నారు. పోలీసులు డ్యూటీలు చేస్తున్నారే తప్ప కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 8వ రోజుకు సమ్మె పారిశుధ్య కార్మికుల సమ్మె గురువారం నాటికి 8వ రోజుకు చేరింది. పురపాలక సంఘం శిబిరం వద్ద కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె తీవ్రతరం
నెల్లూరు, వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు కమ్మవారిపల్లి, దగ్గవోలు, సాంబయ్యబావి దళిత, గిరిజన వాడల నుండి 100 మందికి పైగా ప్రయివేటు వ్యక్తులను పనులకోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్లు మంగళవారం ఉదయం తీసుకువచ్చారు. వారిని కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడంతో పోలీసుల రంగప్రవేశం చేసి 14 మందిని అరెస్టు చేసి డక్కిలి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. చినవెంకటరమణయ్య సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం అరెస్టు చేసిన కార్మిక సంఘాల నాయకులను వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కొండపనాయుడు మాట్లాడుతూ సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి అనంతరం విడుదుల చేసినట్లు తెలిపారు. కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నించాల్సిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు కేసుల పేరుతో వారిని అరెస్టు చేసి ఉద్యమంపై ఉక్కుపాదం మోపడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోతే ప్రయివేటు వ్యక్తులతో పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవడం అధికారపార్టీ నాయకుల మొండివైఖరికి నిదర్శనమని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ఇతర ప్రాంతాలనుంచి ప్రయివేటు వ్యక్తులను రప్పించి పారిశుధ్య పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర కావలిఅర్బన్: మున్సిపల్ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్యం కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్ఎస్యూ, వామపక్షాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ 279 జీఓను తెచ్చి పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 15 మందిచేయాల్సిన పనిని కేవలం ఇద్దరు కార్మికులచేత చేయించాలని ప్రయత్నిస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు టి. మాల్యాద్రి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు అంకయ్య, పద్మ, మాలకొండయ్య, రమ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రయివేటు కార్మికులను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు ఆత్మకూరు: మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్మికులతో పారిశుధ్యపనులను చేపట్టారు. వీరిని మంగళవారం రాత్రి మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. రాత్రి సమయాల్లో కమిషనర్ ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించడం దారుణమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎల్ఆర్పల్లి, జెఆర్పేట ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారిని సమ్మె కార్మికులు అడ్డుకుని పనులు నిలిపివేయించారు. కమిషనర్ చర్యలను ఖండిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు హజరత్తయ్య, నాగరాజు, గడ్డం నాగేంద్ర, పెంచలయ్య, పలువురు మహిళా కార్మికులు ఉన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే!
కర్నూలు (టౌన్): ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కర్నూలు కార్పొరేషన్లో మున్సిపాల్టీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 279 జీవోను రద్దు చేయాలని మున్సిపల్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. రెండో రోజు ఆదివారం జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్తో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, గుడూరు మున్సిపాలిటీలలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులు సమ్మె కొనసాగించారు. జిల్లాలోని 9 మున్సిపాల్టీలలో 2,500 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 500 మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో చెత్త సేకరణ సమస్యగా మారింది. కార్మికులు విధులను బహిష్కరించడంతో కల్లూరు, పాత కల్లూరు, స్టాంటన్పురం, మామిదాల పాడు, మునగాలపాడు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతుంది. అలాగే ఇంటింటికి చెత్త రెండురోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో నిలిచిపోయింది. విధుల బహిష్కరణ– నగరంలో ర్యాలీ జీవో 279 రద్దు చేయాలని ఐఎన్టీయూసీ నాయకుడు రమణ, ఏఐటీయూసీ నాయకుడు రామకృష్ణారెడ్డి సీఐటీయూ రాముడు, వైఎస్ఆర్ టీయూసీకి చెందిన నాయకుడు స్వాములు డిమాండ్ చేశారు. రెండో రోజు అన్ని యూనియన్లకు కన్వీనర్గా వై.వి.రమణ నాయకత్వం వహించారు. కర్నూలులో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ ఒపెన్ ఎయిర్ థియేటర్ నుంచి కొండారెడ్డి బురుజు, కోట్ల సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడే మానవహారం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. కార్మికులపై కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల పొట్టగొడుతున్న జీవో 279 రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమానపనికి సమాన వేతనం, అవసరానికి తగ్గట్లు కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులతో చెత్తతరలింపునకు రంగం సిద్ధం రెండు రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. రాత్రి 1 గంట తరువాత పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రైవేటు వ్యక్తులను నియామించాలని నిర్ణయించింది. అలాగే కర్నూలులో రెగ్యులర్ కింద 348 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నగరంలో ఉన్న 13 డివిజన్లలో డివిజన్కు 15 నుంచి 20 మందిని కేటాయించి పారిశుద్ధ్య పనులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. కాగా సమ్మెను నీరుగార్చే చర్యలకు ప్రభుత్వం పాల్పడితే అడ్డుకుంటామని జేఏసీ నాయకులు రమణ చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెలో పాల్గొంటున్నామని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా ఒంటెద్దు పోకడలకు పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. -
తెనాలి మున్సిపల్ సమవేశం రసాభాసా
-
ఎత్తుకు పైఎత్తు!
పదవికాదు... నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉండాలి. అది నిజమైన రాజకీయ నాయకునికి ఉండాల్సిన నిబద్ధత. పార్టీ మారిన వెంటనే పదవికి రాజీనామా చేయడం నైతిక బాధ్యత. దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సాలూరు మునిసిపల్ వైస్చైర్పర్సన్కాకి పాండురంగ. పార్టీ మారిన వెంటనే ఇబ్బంది పెట్టాలని యోచించిన అధికార పార్టీకి వైస్చైర్మన్ పదవికి రాజీనామా అస్త్రంతో దీటైన సమాధానం ఇస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదే కోవలో ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి పాండురంగపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా పదవులకు రాజీనామా చేయకుండా వేలాడుతుంటే... తాను మాత్రం పార్టీ మారాక ఆ పార్టీతో వచ్చిన పదవితో పనేంటని రాజీనామాకు సిద్ధపడుతూ వారికి తగిన బుద్ధి చెబుతున్నారు. టీడీపీలో అవినీతి నచ్చకే... వస్త్ర వ్యాపారంతో ప్రాచుర్యం పొందిన కాకి పాండురంగ 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మొదటిసారి 2009లో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి కౌన్సిలర్గా గెలుపొంది వైస్ చైర్మన్ పదవి పొందారు. ప్రస్తుతం 22వ వార్డు కౌన్సిలర్గా నాలుగున్నరేళ్లపాటు ఉన్న ఆయన చైర్పర్సన్ గొర్లె విజయకుమారితో విభేదించేవారు. రెండేళ్ల క్రితం చైర్పర్సన్, ఆమె భర్తపైనా వ్యతిరేక కరపత్రాలు విడుదల చేశారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్న వైనాన్ని, అవినీతిని నిర్భయంగా కరపత్రాల ద్వారా బట్టబయలు చేశారు. ఈ క్రమంలో టీడీపీతో ఆయనకు దూరం పెరిగింది. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరపై అభిమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఎమ్మెల్యే రాజన్నదొర సారధ్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో పాండురంగ వైఎస్సార్సీపీలో చేరారు. -
ఏకగ్రీవంగా రామగుండం మున్సిపల్ ఎన్నికలు
-
మహిళా కార్మికురాలి గొంతు పట్టుకున్న సీఐ ఫిరోజ్
ఒంగోలు టౌన్: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఫెడరేషన్ నాయకులు, సీఐటీయూ నాయకులు, కార్మికులు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి దాని ముందు బైఠాయించారు. ఉదయం తొమ్మిది గంటలకు బైఠాయించిన కార్మికులు, నాయకులు గంటసేపు నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఒక అరగంటపాటు నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తామంటూ నాయకులు చెప్పారు. అయితే ఒంగోలు వన్టౌన్ ఏఎస్ఐ సుబ్బారావు నగర పాలక సంస్థ కార్యాలయ గేటుకు తగిలించిన సీఐటీయూ జెండాను తొలగించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు ముందు బైఠాయించిన సీఐటీయూ నాయకులను బలవంతంగా పక్కకు లాగారు. ఆ సమయంలో తీవ్ర పెనుగులాట జరిగింది. సీఐటీయూ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావును బలవంతంగా అక్కడ నుంచి లాగుతున్న సమయంలో ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కార్మికులు పోలీసుల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సీఐ ఫిరోజ్ మహిళలని కూడా చూడకుండా చిడిపోతు ఏసమ్మ అనే మహిళా కార్మికురాలి గొంతు పట్టుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. పోలీసుల చర్యలను ఎండగడుతూ నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి నాయకులు, కార్మికులు ప్రదర్శనగా బయల్దేరి స్థానిక చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. మున్సిల్ కార్మికులను చిన్నచూపు చూస్తోంది మునిసిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ, మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. తొలుత నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన సమయంలో కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాం శ్రీనివాసరావు, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గొడ్డలిపెట్టుగా మారిన జీఓ నం 279ని రద్దు చేయాలని, జీఓ నం 151 ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయాలంటూ గత రెండేళ్ల నుంచి నిరసనలు, ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ నెల 5వ తేదీ ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖామంత్రి నారాయణ, డీఎంఈ కన్నబాబులను రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసి సమస్యను విన్నవించగా, ఒకరోజు గడువు కావాలని మంత్రుల బృందం సూచించిందన్నారు. ఆ తరువాత మరో నాలుగు రోజులు గడువు కావాలని మంత్రుల బృందం పేర్కొందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. తాము ఉదయం 9 గంటలకు నగర పాలక సంస్థ కార్యాలయం గేట్లువేసి అక్కడే బైఠాయించామని, పదిన్నర గంటలకల్లా తమ ఆందోళన ముగిస్తామంటూ పోలీసులకు చెప్పినప్పటికీ, వారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రశాంతంగా జరుగుతున్న బైఠాయింపు కార్యక్రమాన్ని ఉధృతంగా మార్చారన్నారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు వారిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలను తాకరాదని చట్టం చెబుతున్నప్పటికీ పోలీసులు మహిళా కార్మికురాలి గొంతు పట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తంగిరాల మహేష్, కొర్నెపాటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, తంబి శ్రీనివాసులు, ఫెడరేషన్ నాయకులు గోపి, రత్నకుమారి పాల్గొన్నారు. -
మధిర మున్సిపాలిటీలోఅవినీతి తిమింగలాలు..!
మధిర ఖమ్మం : మధిర మున్సిపాల్టీలో ఏదైనా పని కావాలంటే అధికారులకు, సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనన్న విమర్శలు వినవస్తున్నా యి. ఇటీవల ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టపగలే అక్రమంగా డబ్బులు తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కార్యాలయంలో మరికొన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఒక్కో పనికి ఒక్కో రేటును సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలతోపాటు ఎల్ఆర్ఎస్, విద్యుత్ మీటరు కనెక్షన్ పొందాల న్నా, తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిని పిల్లల పేరు మీదకు బదలాయించాలన్నా ముడుపులు చెల్లిం చాల్సిందేనట. ముడుపులు ఇస్తేనే ఫైలు కదులుతుందని దరఖాస్తుదారులకు సిబ్బంది ప్రత్యక్షంగానే చెబుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కొన్ని ఉదాహరణలు సుమారు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మధిర రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మరొకరికి ఇవ్వకుండా ఆపి, ఆ ఒక్కరికి పోస్టుమార్టం రిపోర్టు రాలేదని చెప్పారు. దీంతో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు గుంటూరు నుంచి పలుమార్లు మధిర మున్సిపల్ కార్యాల యం చుట్టూ తిరిగారు. పైసలిస్తేనే ఆ డెత్ సర్టిఫికె ట్ ఇస్తామంటున్రాని వారు విలేకరులతో చెప్పా రు. దీనిపై మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని విలేకరులు.. ‘‘పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఉండ గా పోస్టుమార్టం రిపోర్టుతో సంబంధమేమిటి? కాజ్ ఆఫ్ డెత్ లేకుండా ఇచ్చే డెత్ సర్టిఫికెట్కు పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు?’’ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. రెండు మూడు రోజులు తరువాత కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన తరువాతనే వారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఒక ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారు. మృతుని పేరు మీద ఉన్న ఇంటిని కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని కోరారు. ఇందుకోసం అక్కడి సిబ్బంది రెండువేల రూపాయలు లంచంగా తీసుకున్నారట. డబ్బులు ఇచ్చి నెల దాటినప్పటికీ ఈ రోజుకు కూడా ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. రెడ్డి గార్డెన్స్ కల్యాణ మండపం సమీపంలో ఒకరు నూతనంగా భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.12వేలు లంచం డిమాండ్ చేశారట. నూతన కట్టడాల సంగతి చెప్పనక్కరలేదు. రేకుల షెడ్డు నిర్మాణానికి, భవన నిర్మాణానికి, దుకాణం ఏర్పాటుకు, బడ్డీకొట్టు నడుపుకునేందు కు రేట్లు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. పలుకుబడిగల వారికి ఇంటి పన్ను తగ్గిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇంటిపన్ను ఎక్కువ వస్తున్న దని సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే... ‘‘అందు లో మేము చేసేదేమీ ఉండదు. కంప్యూటర్లో కొలతలు నమోదు చేయగానే ఆటోమేటిక్గా పన్ను నిర్థారణతో రశీదు వస్తుంది’’ అని చెబుతున్నారని కొందరు చెప్పారు. అవినీతి తిమింగలాలకు డబ్బులు ముట్టచెప్పలేక కొంతమంది ఇల్లు కట్టుకోలేకుండా, దుకాణాలు నడపలేక చేతులెత్తేసిన దాఖలాలు ఉన్నాయి. కమిషనర్ వివరణ పై ఉదాహరణలను, ఆరోపణలను మున్సిపల్ కమిషనర్ దేవేందర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన వివరణ కోరింది. ‘‘ఇక్కడ అవినీతి అనేదే లేదు. కొంతమంది బురద జల్లుతున్నారు. ఎవరైనా అడిగితే నాతో చెప్పండి’’ అని అన్నారు. ప్రక్షాళన చేయాలి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు, సిబ్బంది అడుగుతున్న లంచాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టచెప్పాల్సిందే. అదేమిటని ప్రజాప్రతినిధులమైన మేము ప్రశ్నిస్తే.. నిబంధనలు అడ్డం వస్తున్నాయని చెబుతున్నారు. కానీ పైసలిస్తే మాత్రం వారికి నిబంధనలు అడ్డురావు. పరిస్థితి దారుణంగా ఉంది. – ములకలపల్లి వినయ్కుమార్, 15వ వార్డు సభ్యుడు. -
గళమెత్తిన పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం మున్సిపాలిటీ : పట్టణ ప్రాంతాల్లో నూతన పారిశుద్ధ్య విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జీఓ నంబర్ 279ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ చేపట్టిన ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపాలిటీ సహా సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీల ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అంతకుముందు విజయనగరం మున్సిపల్ పారిశుధ్ధ్య కార్మికులంతా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం నాలుగు మున్సిపాలిటీల కార్మికులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య స్వల్ప తోపులాటు చోటు చేసుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో కార్మికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మా పొట్టలు కొట్టద్దు ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను జీఓ నంబర్ 279 పేరిట రోడ్డున పడేయొద్దని సీఐటీయూ నేతలు రెడ్డి శంకరరావు, టీవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పారిశుద్ధ్య విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా విజయనగరం మున్సిపాలిటీలో జీఓ నంబర్ 279 అమలుకు చర్యలు చేపట్టడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగకపోతే ప్రజారోగ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తాజా విధానంతో ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు జగన్మోహనరావు, యు.శంకరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగులు
మధిర ఖమ్మం : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఉద్యోగులు పట్టుబడిన సంఘటన మంగళవారం మధిర మున్సిపాల్టీలో జరిగింది. బాధితుడు కోదాటి వేణుగోపాల్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో కోదాటి రాజమౌళికి 6-90, 91 ఇంటి నంబర్లలో రెండు ఇళ్లు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు వేణుగోపాల్, వెంకటేశ్వరరావు ఉన్నారు. రాజమౌళి చనిపోయిన తరువాత ఆ ఇళ్లను చిన్నకుమారుడు వెంకటేశ్వరరావుకు అప్పట్లో బదిలీచేశారు. ఈ విషయంపై 2014లో ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని వేణుగోపాల్ మధిర మున్సిపాల్టీకి వచ్చాడు. ఇద్దరు కుమారులకు చెందిన ఆస్తిని ఒకరి పేరుమీద ఎలా బదిలీ చేశారని ప్రశ్నించగా పొరపాటు జరిగిందని, తిరిగి ఆ ఇళ్లను రాజమౌళి పేరుమీదకు బదిలీచేశారు. ఖమ్మంలో నివసిస్తున్న వేణుగోపాల్కు వాటర్ప్లాంట్ ఉంది. ప్లాంట్ను మధిరకు షిఫ్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈనెల 8న దరఖాస్తు చేసుకున్నాడు. రూ.30 వేలు ఇస్తేనే ఫైలు కదులుతుందని బిల్ కలెక్టర్, ఇన్చార్జ్ ఆర్ఐ పి.వెంకటేశ్వర్లు చెప్పాడు. చివరకు రూ. 6 వేలు ఇస్తేనే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తానన్నాడు. విసిగిపోయిన వేణుగోపాల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పొజిషన్ సర్టిఫికెట్ పూర్తయిందని, రూ.6 వేలు ఇచ్చి తీసుకెళ్లాలని వేణుగోపాల్కు ఇన్చార్జ్ ఆర్ఐ తెలుపగా పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం వెళ్లి సర్టిఫికెట్ అడగ్గా లంచ్ తరువాత రమ్మని తెలిపాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగిని నిర్మలకు డబ్బులు ఇవ్వమని వెంకటేశ్వర్లు చెప్పగా ఇచ్చాడు. ఆమె డబ్బును హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుంది. అక్కడే సిద్ధంగా ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడిచేసి రూ.6 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలు చేసి ఇన్చార్జ్ ఆర్ఐ వెంకటేశ్వర్లు, నిర్మలను నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. కార్యాలయంలోని పలు ఫైళ్లను పరిశీలించారు. ఇన్చార్జ్ ఆర్ఐ వెంకటేశ్వర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నిర్మలపై కేసు నమోదుచేసి కోర్టుకు రిమాండ్ చేస్తామని ఏసీబీ డీఎస్పీ కిరణ్కుమార్ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐ రమణమూర్తి, వరంగల్ సీఐలు వెంకట్, క్రాంతి, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులపై ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చిందులు
సాక్షి, కర్నూలు : మున్సిపల్ అధికారులపై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి నగర్లో ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులను సోమవారం ఆయన అడ్డుకున్నారు. దీంతో అధికారులకు ఆయనకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత ఉప ఎన్నికల సమయంలో ఇల్లు, షాపులు పగలగొడితే మాట్లాడని బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు జోక్యం చేసుకోవడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. -
ఇచ్చిందే మాంసం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. అనారోగ్యంతో మృత్యువాత పడే స్థితిలో ఉన్న జీవాలను చౌక ధరలకు కొనుగోలు చేసి, వాటిని కోసి విక్రయిస్తున్నారు. మరికొందరు మాంసం వ్యాపారులు గొర్రెలను కోసి మేక పొట్టేలుగా నమ్మించి అంటగడుతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 50 నుండి 60 వరకు మాంసం దుకాణాలున్నాయి. కిలో మాంసం ధర రూ.400ల వరకు విక్రయిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కటికలు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వధశాల లేకపోవడంతో ఇంటి వద్దనే అపరిశుభ్ర వాతావరణంలో వాటిని వధించి మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆడ గొర్రెల మాంసాన్ని పొట్టేలుగా నమ్మించి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎలాంటి మాంసం అమ్ముతున్నారో ప్రజలకు తెలియడం లేదు. పశువైద్యాధికారి ధ్రువీకరణ చేశాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను వధశాలలో కోయాలి. కానీ వధశాల లేకపోవడంతో కటికలు తమ ఇష్టమైన ప్రదేశాల్లో మూగజీవాలను కోసి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. వెటర్నరీ అధికారులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రమైన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అనుమతి లేకుండా మేకపోతుల మాసం విక్రయం మెదక్ జిల్లా కేంద్రం కావడంతో మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మాంసం వ్యాపారులు నిబంధనలు పాటించకుండా విక్రయాలు జరుపుతున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు తమ ఇష్టానుసారం గొర్రె పోతులు, మేక పోతులను వధించడానికి వీల్లేదు. పశువైద్యులు పరీక్షించాకే వధించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు అలాంటి నిబంధనలు పాటించకుండా అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్న గొర్రెలు, మేకలను కోస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయంలో వెటర్నరీ, మున్సిపల్ అధికా రులు లంచాలు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల మాటే లేదు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సుమారు లక్ష మేర జనాభా ఉండగా ఒక్క వధశాల కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారులు గొర్రెలు, మేకలు తీసుకొచ్చాక, డాక్టర్లు వాటిని పరిశీలించి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తరువాతే వాటిని వధించాలి. అనంతరం వైద్యులు మరోసారి పరీక్షలు చేసి, క్షుణ్నంగా పరిశీలించి, వాటి మాంసం సురక్షితమైందని ముద్ర వేయాలి. ఆ తరువాతే మాంసాన్ని దుకాణాల్లో పెట్టి విక్రయించాల్సి ఉంది. గ్రామాల్లో నాణ్యమైన ఆరోగ్యవంతమైన మాంసం దొరుకుతుందని ప్రజలు నమ్ముతారు. పండుగలు, శుభకార్యాల సందర్భంగా మాంసం వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతతోపాటు తూకం వేయడంలోనూ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు. మార్కెట్లో అమ్మకం చేసే మాంసంపై ఈగలు, దోమలు వాలకుండా దోమ తెరలు వాడాల్సినప్పటికీ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్, వెటర్నరీ అధికారులు స్పందించి మాంసం విక్రయదారులు నిబంధనలు పాటించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులే చూసుకోవాలి మాంసం విక్రయం విషయాలను మున్సిపల్ అధికారులు చూసుకోవాలి. వారే డాక్టర్ను ఏర్పాటు చేసుకోవాలి. మున్సిపాలిటీ అధికారులు వధశాల ఏర్పాటు చేసి అక్కడ మూగజీవాలను పరిశీలించి కోసేందుకు అనుమతులు ఇవ్వాలి. – అశోక్కుమార్, జిల్లా వెటర్నరీ అధికారి, మెదక్ పట్టించుకునే దిక్కేది..? అధికారులు ఆరోగ్యమైన గొర్రెలు, మేకలు పరిశీలించకుండానే విక్రయదారులు అనారోగ్యానికి గురైన జీవాలను వధిస్తూ మాంసం విక్రయిస్తూ..ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. విక్రయదారులు తమ ఇష్టానుసారంగా నాణ్యతలను పాటించకుండా మాంసం విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. – విజయ్, మెదక్ వధశాల లేకపోవడంతోనే.. మెదక్ పట్టణంలో మాంసం విక్రయానికి వధశాల లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మున్సిపాలిటీకి సంబం«ధించి వధశాల ఉంటే అక్కడే ఒక డాక్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెటర్నరి డాక్టర్ సర్టిఫై చేసిన తరువాత ఆరోగ్యవంతమైన జీవాలను కోసి అమ్మాల్సి ఉంటుంది. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
జీవో 151 అమలు చేయాల్సిందే
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కనీస వేతనం రూ.18కు పెంచుతూ విడుదల చేసిన జీవో నంబరును 151ను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. విశాఖ మున్సిపల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు జి.సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ కనీస వేతనం పెంచుతూ విడుదలైన జీవోను రెండేళ్లయినా జీవీఎంసీ అధికారులు అమలు చేయకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచడానికి చర్య తీసుకోని అధికారులు పారిశుధ్యం పనులను ప్రైవేటికరించడానికి ఉద్దేశించిన జీవో 279ను మాత్రం అమలు చేయడం బాధాకరమన్నారు. జీవో 279ను వెంటనే రద్దు చేయాలని, జీవో 151ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన గ్లౌజ్లు, సబ్బులు, షూ, నూనె వెంటనే పంపిణీ చేయాలన్నారు. కార్మికులు సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 15వ తేదీ తర్వాత సమ్మె దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జి ల్లా మాజీ అధ్యక్షుడు అజశర్మ, సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమార్, యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, రాజు, నాయుడు పాల్గొన్నారు. -
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు
సాక్షి, కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది. కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. -
రూ.250కే కుళాయి కనెక్షన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్ (అటల్మిషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్ విశాఖలో బీపీఎల్ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు. వచ్చే అక్టోబర్లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కనెక్షన్ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్ డిపాజిట్ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
ధర్మవరం : ‘మాకు ఇంటి స్థలం చూపి ఇంటి నిర్మాణం చేసే వరకు మేము మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోనే నివసిస్తాం. వంటా ఇక్కడే.. స్నానాలు ఇక్కడే.. నిద్రించేది ఇక్కడే.. చివరికి తమ పిల్లలకు పాఠశాలలకు పంపాలన్నా ఇక్కడి నుంచే పంపిస్తాం’ అంటూ పట్టణంలోని లక్ష్మీనగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు చెబుతున్నారు. పట్టణంలోని లక్ష్మీనగర్లో మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంక్ నిర్మించాలని అక్కడ కొన్నేళ్లుగా నివసిస్తున్న వారిని బుధవారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు ఇళ్లను జేసీబీలతో కూల్చేసిన విషయం తెలిసిందే. ఇళ్లులేక రోడ్డున పడ్డ బాధితులు తమ సామాన్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలోకి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం గేట్ వద్దనే స్టౌవ్లు పెట్టుకుని వంటా వార్పు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి కార్యాలయం ఆవరణంలోనే నిద్రించిన బాధితులు గురువారం ఉదయం కూడా అక్కడే స్నానాలు చేశారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించారు. వంటా వార్పు అక్కడే చేసుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు కార్యాలయానికి రావడానికి వెనుకంజ వేసి ఎవరూ కార్యాలయంలోకి రాలేదు. పట్టణ పోలీసులు వచ్చి మీకు న్యాయం జరుగుతుందని మీరు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని సర్దిచెప్పినా వారు వినలేదు. తమకు న్యాయం జరిగే వరకు మున్సిపల్ కార్యాలయంలోనే నివసిస్తామని బాధితులు చెబుతున్నారు. -
విజయవాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్పొరేషన్లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
మున్సిపల్ అధికారుల తీరుపై నిరసన
గుంటూరు రూరల్: మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వివాదంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేయటంతో గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన ఘటన మండలంలోని బుడంపాడు గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కలుషితమై ఇబ్బందులు పడుతున్నామని అధికారులను అడిగితే దురుసుగా మాట్లాడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టులు చేయిస్తారా అంటూ గ్రామస్తులు ప్రధాన రహదారిలో వాహనాలను నిలిపి ఆందోళనకు దిగారు. నెలరోజులుగా మురికినీరు తాగి రోగాల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది సరఫరాచేసే ట్యాప్ నీటిని వాటర్ బాటిల్స్లో పట్టి నిరసన తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవటంతో సౌత్జోన్ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, డీఎస్పీ సీతారామయ్య ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట.. అనంతరం ఆందోళన కారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ సీసీ, ఏఈలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే కార్యాలయంపై దాడిచేసి ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించినందుకు, కార్యాలయంలోని ఫర్నీచర్, బయోమెట్రిక్ మెషిన్లను ధ్వంసం చేసిన కేసులో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మంచి నీటిని సక్రమంగా సరఫరా చేయమని అడిగితే అరెస్టులు ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలకుపైగా ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ లఠ్కర్ ప్రజలతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయటం సమంజసంకాదన్నారు. అనంతరం స్థానికులు ప్రస్తుతం మురుగు నీరు వస్తున్నందున గ్రామానికి 40 లారీల నీటిని అధికారులు అందజేయాలని కోరగా, అధికారులు ప్రస్తుతం 15 లారీలు వస్తున్నాయని వాటిని పెంచి సరిపడేంతగా పంపుతామని చెప్పారు. అయితే కార్యాలయంపై దాడిచేసిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సౌత్జోన్ డీఎస్పీ మూర్తి తెలిపారు. -
మాంసం అంతా మోసం..!
విజయనగరం మున్సిపాలిటీ: మనం తింటున్నది నాణ్యమైన మాంసమేనా..? పట్టణంలో ఆరోగ్యవంతమైన జంతు మాంసాలే విక్రయిస్తున్నారా..? మున్సిపల్ అదికారులు పరిశీలించి ముద్ర వేసిన మాంసాన్ని మనం కొంటున్నామా..? అని ఎవరైనా అడిగితే లేదనే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాల వెనుక మోసం దాగి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, అనారోగ్య జంతువుల మాంసాన్ని మున్సిపాలిటీ అనుమతి లేకుండా విక్రయించేస్తున్నట్టు సమాచారం. ఫ్రిజ్ల్లో మిగులున్న చికెన్, మటన్ నిల్వలను మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మిగులు చికెన్, మటన్ను హోటళ్లకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. నిఘా కరువు.. నగరంలో మాంసం విక్రయాలుపై నిఘా కరువైంది. మున్సిపల్ ప్రజారోగ్య విభాగాధికారులు , వెటర్నరీ విభాగాల మధ్య సమన్వయ లోపం కరాణంగా నాసిరకం, నాణ్యత లోపించిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు 130, మటన్ విక్రయశాలలు 64 వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటు అధికారికంగా... అటు అనధికారికంగా నిర్వహిస్తోన్న మాంసం విక్రయకేంద్రాలు నిబంధనలు పాటించడం లేదు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడే మాంసం విక్రయిస్తున్నారు. చేపల విక్రయాల పరిస్థితీ ఇదే. మురుగు కాలువలకు అనుకుని, రోడ్లు మీదనే విక్రయాలు చేస్తున్నారు. అపరిశుభ్ర పరిసరాల్లోనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆది, మంగళవారాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. మటన్ రూ.520 నుంచి రూ.600లకు కిలో విక్రయిస్తున్నారు. మిగులు మాంసాన్ని మరుసటి రోజు ధర తగ్గించి విక్రయిస్తున్నారు. నాసిరకం, వయస్సు మళ్లిన , అనారోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకల నుంచి సేకరించే మాంసాన్ని తక్కువ ధరకే హోటళ్లకు విక్రయిస్తున్నట్టు సమాచారం. చికెన్ అమ్ముడయ్యే ప్రాంతాలు... రోజురోజుకు విస్తరిస్తోన్న విజయనగరం పట్టణంలో చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారిక లెక్కల ప్రకారం 130 వరకు దుకాణాలు అనుమతులతో నిర్వహిస్తుండగా... అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా అంతకన్నా రెట్టింపు కేంద్రాల్లో విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్, గూడ్స్షెడ్ రోడ్ కోట జంక్షన్, దాసన్నపేట కూడలి, రింగ్రోడ్, రైల్వేస్టేషన్ రోడ్, కలెక్టరేట్ జంక్షన్ల వద్ద అధికారిక దుకాణాలు నడుస్తుండగా... వీధికొకటి చొప్పున వెలుస్తున్న సెంటర్లు సైతం వందల్లో ఉండడం గమనార్హం. రోడ్డుపక్కన చిన్నపాటి బల్లపెట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ విక్రయాలు చేపట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మిగులు వ్యర్థాలను కాలువల్లో వేయడంతో పరిసరాలు దుర్ఘంధ భరితంగా మారుతున్నాయి. ప్రాంతం : విజయనగరం మున్సిపాలిటీ మొత్తం జనాభా : 3 లక్షల పైమాటే చికెన్ సెంటర్లు : 130 పైబడి మటన్ విక్రయ కేంద్రాలు : 64 నాన్వెజ్ హోటళ్లు : 25 పట్టణ శివార్లలో దాబాల సంఖ్య : 12 రోజు వారీ మటన్ విక్రయాలు : సగటున 1000 కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : 2వేల కిలోల పైమాటే రోజు వారీ చికెన్ విక్రయాలు : 4 వేలకు పైగా కిలోలు ఆది, మంగళవారాల్లో విక్రయాలు : సుమారు 10 వేల కిలోలు నిబంధనలు ఇలా.... అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే మాసం విక్రయాలు చేయాలి. మున్సిపాలిటీకి చెందిన పశువైద్యాధికారి «ధ్రువీకరించిన తర్వాతనే స్లాటర్ హైస్లో జంతువధ చేయాలి. ఆపై మున్సిపల్ శాఖ ముద్ర వేయాలి. ఆ తర్వాత విక్రయించాలి. జంతువు ఆరోగ్యంగా ఉందా, బతికి ఉండగానే వధించారా..? లేదా అని వెటర్నరీ అధికారులు నిర్ధారించాలి. నగరంలో ఇటువంటి పరిస్థితులు, తనిఖీలు లేవు. జాగ్రత్తలు ఇలా... లేత తెలుపు రంగులోని మాంసం ఆరోగ్యకరమైనది. గట్టిదనం ఉంటేనే తాజాదనం ఉన్నట్టు. విక్రయిస్తున్న మాంసం కబేళా నుంచి తెచ్చినదా.. లేదా అన్నది దుకాణదారులను ప్రశ్నించాలి. మున్సిపల్ అధికారులు అధికారికంగా వేసే ముద్రను పరిశీలించాలి. ఎరుపు రంగులో ఉన్నా మడతలు ఉన్నా కొనకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో చూడటానికి తాజాగా ఉన్నా వండే సమయంలో చెడువాసన వస్తే అలాంటి మాంసాన్ని తినకూడదు. అనుమానం వస్తే మున్సిపల్ , వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలి. చర్యలు తీసుకుంటాం... మున్సిపాలిటీ పరిధిలో అధిక మొత్తంలో మాంసం విక్రయ శాలల ఉండటం నిజమే. పక్షం రోజుల కిందట పట్టణంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విక్రయ శాలల్లో లోపాలను గుర్తించాం. సుమారు 10 దుకాణాలు పరిశీలిస్తే అందులో ఏ ఒక్కరు నియమ నిబంధనలు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించాం. సుమారు రూ.25 వేల అపరాధ రుసుం విధించాం. వినియోగదారులు కూడా మాంసం కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలి. మున్సిపాలిటీ ముద్ర వేసి ఉన్న మాంసం ఉత్పత్తులను కొనుగోలు చేయడం మేలు. – డాక్టర్ శివకుమార్, ప్రజారోగ్య అధికారి, విజయనగరం మున్సిపాలిటీ -
మా గంజిలోన ఉప్పు చూసి గొణుగుడెందుకు?
కందుకూరు అర్బన్: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఓ చిత్రంలో పేదల పట్ల ధనవంతులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఓ పాటను చిత్రీకరించారు. ‘పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు..మా గంజిలోన ఉప్పుచూసి గొణగుడెందుకూ..’ అంటూ చిత్రంలోని ధనవంతులను తన పాటలో సూటిగా ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నే ఇప్పుడు కందుకూరు పట్టణంలోని పేదల నుంచి అధికారులు, పాలకులను ఉద్దేశించి ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న తీరు అచ్చం అలాగే ఉంది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత మున్సిపల్ అధికారుల చర్యలు ప్రస్పుటం చేస్తున్నాయి. మున్సిపల్ స్థలంలో ఉన్న లారీ స్టాండ్ను స్వాధీనం చేసుకోవాలని రెండున్నరేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినా రాజకీయ నాయకులు అటువైపు కన్నెతి చూడలేదు. ఏళ్ల నుంచి రాబందుల చేతుల్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేతగానీ మున్సిపల్ అధికారులు 50 ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న బడుగుజీవులపై కన్నెర్రజేశారు. ఇదీ.. అసలు కథ కందుకూరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి రావిచెట్టు సెంటర్లో చేపల మార్కెట్ ఉండేది. దాని చుట్టు పక్కల నిరుపేదలైన 20 ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు అక్కడ అన్న క్యాంటీన్ నిర్మించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ బంకులు తొలగించాలని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బడుగులకు హుకుం జారీ చేశారు. నిరుపేదలైన బంకుల యజమానులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఆయన కూడా పట్టించుకోలేదు. ప్రజాసంఘాల నాయకులు రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదంతా పట్టించుకోని మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలతో జులుం ప్రదర్శించి బంకులను ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ కోసం పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న నిరుపేద కుటుంబాల పొట్టకొట్టడం ఎంతవరకు భావ్యమని వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి చిన్న బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న నిరు పేదలను ఖాళీ చేయించడం దుర్మార్గమంటున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆగమేఘాలమీద బంకులు ఖాళీ చేయించడం అన్యాయమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. గుండంకట్ట, ప్రభుత్వ వైద్యశాల తదితర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించిన ధనవంతులు పాలకులు, అధికారులకు కనిపించడంలేదా..అని ప్రశ్నిస్తున్నారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం గుండంకట్ట పక్కన రాజకీయ పలుకుబడి కలిగిన బలమైన సామాజికవర్గం వారు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి లారీ స్టాండ్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్లడంతో స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే పోతుల రామారావుకు తెలుసు. ఈ స్థలం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలంగా కూడా ఉంటుంది. లారీస్టాండ్ యజమానులు ఆర్థికంగా, రాజకీయ పలుకుబడి ఉన్న వారు కావడంతో మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీ స్టాండ్ గొడవ ఎందుకన్నట్లు ఎమ్మెల్యే గద్దల జోలిక వెళ్లకుండా పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అన్న క్యాంటీన్ పేరుతో పేద ముస్లిం బతుకలను ఛిద్రం చేశారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం అంకమ్మతల్లి దేవాలయం వద్ద ఉన్న పేదల బంకులను కూడా అధికార పార్టీ నాయకులు నిలువునా తొలగించి వారి పొట్టకొట్టారు. -
నిరుపేదలకూ టోపీ
సూళ్లూరుపేట : క్యామెల్ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులకే కాకుండా నిరుపేదలకూ టోపీ పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన గరిక ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ సూళ్లూరుపేట కేంద్రంగా క్యామెల్ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థను అభివృద్ధి చేసుకున్నారు. సంస్థకు అనుబంధంగా క్యామెల్ మహిళా మ్యాక్స్ అనే సంస్థను 2002లో స్థాపించి రిజిస్ట్రేషన్ చేయించారు. 2002 నుంచి ఈ సంస్థలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకుంటే తామే రుణాలిచ్చి ఆదుకుంటామని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో నాలుగు బ్రాంచీలను స్థాపించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెంలో నాలుగు బ్రాంచీలను ఏర్పాటు చేసి 500 గ్రూపులను తయారు చేశారు. సుమారు 10 వేల మంది పొదుపు మహిళలను చేర్చుకొని వారితో రూ.20 నుంచి రూ.200 వరకు పొదుపు చేయించి నగదును వీరి వద్దే ఉంచుకున్నారు. పొదుపు కట్టిన పుస్తకాలను కూడా వీరివద్దే ఉంచుకున్నారు. 2002 నుంచి 2009 వరకు పొదుపు చేసిన మొత్తాన్ని చూపించి నాబార్డు, ఇతర బ్యాంకుల నుంచి సుమారు రూ.9.21 కోట్లను రుణంగా తీసుకున్నారు. ఇందులో మహిళలకు రుణాలిస్తూ కట్టుకుంటూ వచ్చారు. నాబార్డు శాఖ రూ.50 పైసల వడ్డీకే సంస్థలకు రుణాలిస్తే దాన్ని పొదుపు మహిళలకు రూ.రెండు వడ్డీకి ఇచ్చి అందులో రూ.1.5 వడ్డీని ఆదాయంగా మలుచుకున్నారు. మెయింటెనెన్స్ కింద నాబార్డు వారు క్యామెల్ మహిళా మ్యాక్స్కు 2.5 శాతం ఇవ్వగా, క్యామెల్ వారు మాత్రం పొదుపు మహిళల నుంచి ఐదు శాతాన్ని వసూలు చేశారు. గ్రూపుల్లో ఎవరైనా రుణాలు తీసుకోకపోయినా, వారి పేర్లపై కూడా తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు. గ్రూపునకు రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు వారి వద్ద నుంచి సంతకాలు చేయించుకొని 2 పక్కనే 1 వేసుకొని రూ.10 లక్షలు తీసుకున్న సందర్భాలున్నాయని వారి వద్ద పనిచేసిన వారు చెప్పడం విశేషం. చాలా మంది రుణాలను చెల్లించినా వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో మండలంలోని పేర్నాడు పల్లెల్లో చాలా మందికి హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ముందుగా ఆమె వచ్చి తాము కట్టిన పొదుపు నగదు మొత్తం ఎంత ఉంది..ఎంత కట్టాలనే విషయాలను నిగ్గుతేలిస్తే ఆమే తమకు బాకీ పడుతుందని అంటున్నారు. భారీగా స్థిరాస్తులు నిరక్షరాస్యులను మోసం చేశారు. చివరికి బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో పొలీసుల కస్టడీలోకి తీసుకున్న ఈశ్వరమ్మను టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య వదిలేయమని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఆమెను పూర్తిస్థాయిలో విచారించి ఉంటే నిజాలు నిగ్గుతేలి ఉండేవి. ఓజిలి మండలంలో 16 ఎకరాలు, తనియేలి వద్ద 12 ఎకరాలు, సూళ్లూరుపేటలో మూడేసి అంతస్తులు కలిగిన రెండు పెద్ద భవనాలు, పరమేశ్వరినగర్లో రెండు ప్లాట్లతో పాటు నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులను కూడబెట్టినట్టు సమాచారం. హోంగార్డు నాగూరమ్మను బలిచేసే యత్నం ఆర్థికపరమైన కేసులో ఈశ్వరమ్మను పట్టుకొని అధికార పార్టీకి చెందిన పరసారత్నం ఫోన్ చేశారని వదిలిపెట్టేసి ఇప్పుడు హోంగార్డు నాగూరమ్మను బాధ్యులు చేయాలని సీఐ కిషోర్బాబు ఒత్తిడి తెస్తున్నారు. తప్పు చేశావని అంగీకరించి సంతకం చేయమని సీఐ ఒత్తిడి చేస్తున్నారని నాగూరమ్మ ఆరోపిస్తున్నారు. నెల్లూరులో ఆమె ఎస్పీ రామకృష్ణను కలిసి తన గోడును తెలియజేశారు. ఇందులో తనకు సంబంధం లేకపోయినా హోంగార్డునని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు డీఎస్పీ విచారణ సూళ్లూరుపేట రూరల్ : తన తప్పిదాన్ని గుర్తించి ఎస్పీ ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని భయపడిన ఎస్సై నెపాన్ని హోంగార్డుపై వేసే యత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను సరెండర్ చేస్తూ మెమో ఇచ్చారు. అందులో ఆర్ఐ, హోంగార్డు అని రాయాల్సిన చోట ఆర్ఐ, వీఆర్ అని రాయడంతో నాగూరమ్మను వీఆర్ పోలీసులు సరెండర్ చేసుకోలేదు. దీంతో ఆమె తిరిగి సూళ్లూరుపేటకు వచ్చేశారు. శనివారం మధ్యాహ్నం గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనపై విచారణ జరిపారు. అందర్నీ పిలిచి వివరాలను సేకరించారు. ఆ సమయంలో ఎస్సై మరోసారి నాగూరమ్మకు సరెండర్ మెమో ఇచ్చి నెల్లూరుకు పంపించేశారు. ఈ ఫొటోలోని మహిళ పేరు కుప్పంపాటి నాగమ్మ. సూళ్లూరులోని బొగ్గుల కాలనీలో 32 మందితో ఝాన్సీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనిషికి రూ.20 చొప్పున గరిక ఈశ్వరమ్మ నిర్వహిస్తున్న క్యామెల్ మహిళా మ్యాక్స్లో పొదుపు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొన్ని గ్రూపుల్లో సభ్యులు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉన్న గ్రూపుల నుంచి సర్దుబాటు చేయడంతో 20 మంది లెక్కన ఒక్కో గ్రూపులో ఉంటూ వచ్చారు. రూ.20తో ప్రారంభించిన పొదుపును 2013 నాటికి నెలకు రూ.200 వరకు చెల్లించారు. ఈ గ్రూపులను ఆధారంగా చేసుకొని ఒక్క నాబార్డు సొసైటీ నుంచి మహిళా సాధికారత పేరుతో రూ.7.21 కోట్లను రుణాలుగా తీసుకొచ్చారు. పొదుపు మహిళలకు ప్రతి గ్రూపునకు రూ.రెండు లక్షల చొప్పున ఇచ్చారు. ఈ నగదుకు రూ.రెండు వడ్డీ లెక్కన వసూలు చేసి, మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులకు మాత్రం రూ.0.50 పైసల వడ్డీ ఇస్తూ వచ్చారు. ముందుగా పొదుపు కింద ఎంత కట్టారో లెక్కలు చూపించకుండా రుణంగా తీసుకున్న మొత్తాన్ని కట్టాలని ఇటీవల ఒత్తిడి చేశారు. పొదుపు మహిళలు ఎంత పొదుపు చేసుకున్నారో చూపిస్తే రుణం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాంకులను మోసం చేసినట్లే పొదుపు సంఘాల్లో నిరుపేద మహిళలనూ ఈశ్వరమ్మ మోసం చేశారు. -
‘టీడీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు’
శ్రీకాళహస్తి: అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అనుమతితో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సి బ్బంది గురువారం తొలగించారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్రెడ్డి ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మూడు గంటల పాటు ధర్నా చేశారు. ఆ సమయంలో మున్సిపల్ కమిషనర్ రమేష్బాబు కార్యాలయంలో లేరు. ధర్నా విషయాన్ని మున్సిపల్ సిబ్బంది ద్వారా తెలుసుకున్న ఆయన, పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఎస్ఐ శివయ్య పోలీస్ బలగాలతో మున్సిప ల్ కార్యాలయానికి చేరుకుని ధర్నా విరమించా లని వైఎస్సార్ సీపీ నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, ఎవరికీ ఆటంకం కలిగించలేదని, కమిషనర్ వచ్చి, తమతో మాట్లాడి న్యాయం చేస్తే వెళతామని అన్నారు. అనంతరం సీఐ సత్యనారాయణ మరింత మంది పోలీస్ బలగాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నా విరమించాలని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ తమపై కేసులు పెట్టి, అరెస్టు చేసినా తాము కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించే ప్రసక్తేలేదని భీష్మించారు. రెండు గంటల పాటు ధర్నా జరిగినా కమిషనర్ రాకపోవడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక మిద్దెల హరి, కొట్టెడి మధుశేఖర్ అస్వస్థతకు గురై, అక్కడే పడుకున్నారు. పరిస్థితి విషమించడంతో సీఐ సత్యనారాయణ ఈ విషయమై డీఎస్పీ వెంకటకిషోర్కు సమాచారం అందజేశారు. దీంతో డీఎస్పీ మున్సిపల్ కమిషనర్ రమేష్బాబుతో ఫోన్లో మాట్లాడి, మున్సిపల్ కార్యాలయాలనికి వెళ్లాలని సూచించారు. దీంతో ము న్సిపల్ కమిషనర్ రమేష్బాబు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చిం చారు. ఈ సందర్భంగా నేతలు మిద్దెల హరి, కొట్టేడి మధుశేఖర్, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ తాము చలానా కట్టి, మున్సి పల్ అధికారుల అనుమతితోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గత నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో టీటీడీ నేతలు అనుమతి లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అయితే మున్సిపల్ కమిషనర్ వారికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి పోయారు. కొంత సేపటి తరువాత కమిషనర్ రమేష్బాబు మాట్లాడుతూ తనని క్షమించాలని, రాజకీయ ఒత్తిళ్లతోనే అనుమతి పొందినప్పటికీ మీ ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు. అనుమతి లేని ఫ్లెక్సీలు మాత్రం పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకు చెందిన వాటిని తొలగిస్తామన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఎత్తిరాజులు, షేక్ సిరాజ్బాషా, అమాన్, జయశ్యామ్రాయల్, మహిధర్ పాల్గొన్నారు. -
ఆస్తులకూ ఆధార్
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతీ దానికి ఆధార్ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ఆస్తులకూ ఆధార్ తప్పనిసరి చేసింది. గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీడీఎంఏ శ్రీదేవి పన్ను చెల్లించే ప్రతీ ఆస్తికి ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు. బల్దియాలో ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఏడాది కిందటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతేడాది జూన్లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యలోనే ఈ కార్యక్రమం ఆగిపోయింది. మొదట్లో ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ఇతర పన్నుల వసూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ లక్ష్యం నెరవేరలేదు. బల్దియాలో 9 వేలు పూర్తి.. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్ బల్దియాలో 36 వార్డులు ఉన్నాయి. 2011 జనాభాల లెక్కల ప్రకారం 1.17 లక్షల జనాభా ఉంది. 20.65 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం 26 వేల ఆస్తులు ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఇప్పటి వరకు 9 వేల ఆస్తులకు ఆధార్ పూర్తి చేశారు. సీడీఎంఏ ఆదేశాలతో ఈ ఆధార్ నమోదు కసరత్తు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపాదికన క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా 8 బృందాలతో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్నుకు ఆధార్తో పాటు సెల్ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా బల్దియా అధికారులకు పన్నుకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా వారికే ఫోన్ చేసి తెలుసుకునే వెసులు బాటు ఉంటుంది. అక్రమాలకు అడ్డుకట్ట.. బల్దియాలో ఆస్తిపన్నును ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సెల్ఫోన్ నెంబర్లు సైతం తీసుకుంటుండడంతో ఏదైనా సమాచారాన్ని వెంటనే యజమానికి చేరవేసేలా వీలు కలుగుతుంది. పన్నుల మదింపు సమయంలో వ్యత్యాసాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టవచ్చు. సదరు యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా అక్రమంగా సంపాధించిన ఆస్తులు బయట పడే అవకాశం ఉంటుంది. అనుంధానం కొనసాగుతోంది.. ఆదిలాబాద్లో ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వేలు పూర్తిచేయడం జరిగింది. ఈ నెలాఖరులో మొత్తం ఆస్తులకు అనుసంధానం చేస్తాం. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆధార్తోపాటు సెల్ఫోన్ నెంబర్లు అనుసంధానించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఇది పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ -
టీడీపీ కక్షసాధింపు
నంద్యాల: టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 2014 అక్టోబర్ నెలలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘర్షణ కేసులో సాక్ష్యం చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్తి విషయంలో తల్లీకొడుకుల మధ్య ఘర్షణ జరగగా..సంఘటన స్థలంలో కౌన్సిలర్ లేకున్నా అతనిపై కేసు నమోదు చేయించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్పై అన్యాయంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి, కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి.. ఈ నెల 28న శనివారం రాత్రి వెంకటరమణ, పెద్దన్న వారి తల్లి ఏసక్కల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజు సంఘటనా స్థలంలో లేకున్నా టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పారవి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా సాక్ష్యం చెప్పినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేశారని కౌన్సిలర్ అమృతరాజు పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో శనివారం రాత్రి 7 నుంచి 11గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో ఉన్నానని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తి వివాద ఘర్షణను తనపై వేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఒకరిని భయపెడితే మిగతా వారు సాక్ష్యాలు చెప్పరనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనిల్ అమృతరాజ్పై పెట్టిన కేసును పక్షపాతం లేకుండా దర్యాప్తు చేసి కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తిస్థాయిలో విచారించి అన్యాయంగా కేసు పెట్టింటే ఎత్తివేస్తామని డీఎస్పీ వైఎస్సార్సీపీ నాయకులకు హామీ ఇచ్చారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం వైఎస్సార్సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వీటిని వెంటనే మానుకోవాలని శిల్పారవి హెచ్చరించారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందని, కేసును పూర్తి స్థాయిలో విచారించి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఘర్షణ జరిగిన ప్రదేశంలో లేని కౌన్సిలర్పై టీడీపీ నాయకులు.. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించినట్లు తమకు సమాచారం ఉందని, ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు. శిల్పా రవి కౌన్సిలర్ అమృతరాజుకు సంబంధం లేదు తన కుమారులు అన్నం పెట్టకుండా రోడ్డున పడేస్తే అనాథాశ్రమంలో బతుకుతున్నానని చెన్నమ్మ చెప్పారు. ఆస్తి ఇప్పించాలని కోరుతూ ఆర్డీఓను ఆశ్రయించానన్నారు. ఆస్తిని సమానస్థాయిలో పంచాలని ఆర్డీఓ చెప్పడంతో మా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. ఈ సంఘటనకు కౌన్సిలర్ అనిల్అమృతరాజ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం అమృతరాజును కేసులో ఇరికించాలని ఈ పని చేశారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు వెంకటరమణను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి అమృతరాజ్పై కేసు పెట్టించారన్నారన్నారు. -
ఏసిబికి చిక్కిన మునిసిపల్ బిల్ కలెక్టర్
-
రెండు రెస్టారెంట్లకు జరిమానా
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని లేపాక్షి రెస్టారెంట్, గ్రీన్చిల్లి రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. లేపాక్షి హోటల్, గ్రీన్చిల్లి హోటల్స్లో నిల్వ ఉన్న చికెన్, బిర్యాని, వివిధ ఫ్రైలు, బిర్యాని, ఎగ్స్ గుర్తించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అమ్ముతున్న యజమానులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. ఇలా మరోసారి జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు హోటళ్ల వారికి రూ.20వేల చొప్పన జరిమాన విధించారు. తెల్లవారుజామున హోటళ్లలో తనిఖీలు చేయడంతో పట్టణంలోని ఇతర హోటళ్ల వారు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
25 నుంచి మునిసిపల్ సమ్మె!
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని, లేని పక్షంలో ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారని స్పష్టం చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన వేతనాల పెంపు డిమాండ్పై బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్ ముందు కార్మికులతో ధర్నా నిర్వహించింది. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ మేరకు సమ్మె హెచ్చరికలు జారీ చేసింది. జేఏసీ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నేతృత్వంలోని కార్మిక సంఘాల నేతలు పురపాలక శాఖ అధికారులకు ఈ మేరకు సమ్మె నోటీసులు అందించారు. పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు, పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ, బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బందితోపాటు వివిధ కేటగిరిల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ విధులను బహిష్కరించి సమ్మెలోకి దిగనున్నారని వెల్లడించారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలను జీవో నం.14 ప్రకారం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం కార్మికులకు చెల్లిస్తున్న రూ.8,300 వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని ఇప్పటికే మేయర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే 3 నెలలకోసారి చెల్లిస్తున్నామని వారు ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్మికు ల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ డిమాండ్ చేసింది. రెండోసారి సమ్మెకు సై! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు అవస్తలకు గురయ్యారు. సమ్మె విరమిస్తే వేతనాల పెంపును పరిశీలిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అయితే జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచిన ప్రభుత్వం మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. -
కుక్క కాటు అనివార్యమేనా?
కరవనంతవరకు వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరని నానుడి. వీధికుక్కల్లో రోగక్రిములను హరించే సమర్థ విధానం దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. తన వీధుల్లో వీధికుక్కలు లేని ఒక నగరం, పట్టణం లేదా గ్రామం పేరు చెప్పండి. తన దారిన తాను పోతున్న వాడి జీవితాన్ని కల్లోలపర్చే కుక్క కాట్ల వల్ల అతగాడు రేబిస్ వ్యాధిబారిన పడి మరణించవచ్చు. గ్రామ పంచాయతీ నుంచి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ల దాకా వీధికుక్కల నిర్వహణలో కాస్తంత వైవిధ్యం ప్రదర్శించగల పౌర సంస్థను చూపించండి మరి. వ్యవస్థీకృతం అని మనం చెప్పుకుంటున్న మన సమాజంలో కుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవాలను సరైన నిష్పత్తిలో గుర్తించడం లేదు. భారత్లో 30 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీ పేర్కొంది. ప్రతి సంవత్సరం 20 వేలమంది రేబిస్ వ్యాధి కారణంగా చనిపోతున్నారని కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటన వివాదం రేపింది. వీధికుక్కల కంటే పెంపుడు కుక్కలే మనుషులను ఎక్కువగా కరుస్తున్నాయని వాదనలు ఉన్నాయి కూడా. కాబట్టి వీధికుక్కలు పెద్ద సమస్యేమీ కాదు. కొన్నేళ్ల క్రితం ముంబై, ఠాణే నగరాల్లో ఒక పిల్లాడిని కుక్క కరిచింది. ఆ పిల్లాడికి నూరు కుట్లు పడ్డాయి. మరో ఘటనలో ఒక కుక్క ఆ ప్రాంతంలోని మరో కుక్కతో కలిసి ఒక చిన్న పిల్లాడిని అకారణంగా కరిచింది. ఇక పోతే, ప్రపంచంలోని ఏకైక పట్టణ ప్రాంత జాతీయ పార్కు అయిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లోని చిరుతపులులు పార్క్ నుంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో వేటాడేవి. ఎందుకంటే వేటాడ్డానికి వాటికి సమృద్ధిగా వీధికుక్కలు దొరికేవి. దీంతో ఆ చిరుతపులులను కాల్చి చంపాలని లేక పట్టుకోవాలని, వాటిని మరోచోటికి పంపాలని జనం అభిప్రాయాలు చెప్పేవారు. అంతే కానీ వీధికుక్కల ఉపద్రవాన్ని అరికట్టాల్సిందని డిమాండ్ చేస్తూ వీరిలో ఒక్కరు కూడా పురపాలక శాఖ అధికారులను ఒత్తిడికి గురిచేసేలా ఏ చర్యలకూ దిగేవారు కాదు. నిజానికి ఈ సమస్యను నిర్లక్ష్యం చేసేవారు లేదా జనం ప్రేమతో తిండి పెడుతుండటం వల్ల వీధికుక్కల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. అయితే, కుక్కలకు టీకాలు వేయడం కానీ, వాటిలో రోగక్రిములు లేకుండా జాగ్రత్తలు చేపట్టడం కానీ చేసేవారు కాదు. కుక్కల్లోని రోగక్రిములను నాశనం చేయడం ఒక్కటే వీధికుక్కల జనాభాను నివారించలేదని కొన్నేళ్ల క్రితం, ముంబై పురపాలక సంస్థకు చెందిన ఆరోగ్యవిభాగం అధికారి వివరించారు. అలాగని ఇతర సమర్థవంతమైన కార్యక్రమాలు లేకపోవడంతో కష్టాలు మరింతగా పెరిగేవి. కేవలం రోగక్రిముల నివారణ అనే ఒక్క చర్య ద్వారా కుక్కల జనాభాను అరికట్టడానికి పదేళ్ల కాలం పట్టింది. అయితే విస్తృతస్థాయిలో స్టెరిలైజేషన్, రేబిస్ నిరోధక చర్యలను చేపట్టడం నిలకడగా సాగించాలనే ఆలోచనను పురపాలక సంస్థ అస్సలు పట్టించుకునేది కాదు. ఇది మరొక పరిణామానికి దారితీసేది. పెంపుడు కుక్కలను పెంచుకోని శునక ప్రేమికులు రెండు కారణాలవల్ల వాటికి తిండి పెట్టేవారు. వాటిపై మమత లేక పేరు కోసం వారు వీధికుక్కలకు అలా తిండి పెట్టేవారు. ఇక పెంపుడు కుక్కలతో కరిపించుకునే యజమానులు (రాజ్థాక్రే భార్యకు పెంపుడు కుక్క కరిస్తే 60 కుట్లు పడ్డాయి) వీధికుక్కల నుంచి వచ్చే ప్రమాదాన్ని అసలు చూడలేరు. రాజకీయంగా పలుకుబడి కలిగిన థాక్రే వంటి నేతలు (ఎన్నికల్లో గెలుపు సాధనకు ఇది పనిచేయదనుకోండి) ఆచరణ సాధ్యమయ్యే వీధికుక్కల పాలసీపై ఎలాంటి ఒత్తిడీ చేయరు. సమాజంలో న్యూసెన్స్ కలిగిస్తున్న వీధి కుక్కలను ఏరిపారేయడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. కానీ అపెక్స్ కోర్టు దీనిపై స్టే విధించి వీధికుక్కల్లో రోగ క్రిములను తొలగించే కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలుచేసే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో అన్ని స్థాయిల్లో ఇలాంటి విధానం ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరినైనా కుక్క కరవకుంటే వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరన్న అభిప్రాయం ఉంది. అలాగే అకారణంగా తన నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్కను చంపుతానని ఆ తండ్రి ప్రమా ణం చేశాడు. మరొక పిల్లాడిని కూడా కుక్క కరిస్తే వందలాది కుట్లు వేయించాల్సి వచ్చింది. ఇదీ కుక్కకాటు కథ. వీధికుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవం కథ. మహేశ్ విజాపుర్కర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
అప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 28 శాతం ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని టీఆర్ఎస్ సభ్యుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనుసరిస్తున్న తీరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు పెద్ద సంఖ్యలో వలస వచ్చారని, కాని వారికి అక్కడా జీవనోపాధి సరిగ్గా దొరక్క మురికివాడలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. జాతీయ సగటు (37 శాతం) కంటే ప్రస్తుతం తెలంగాణ పట్టణా జనాభా (39 శాతం) ఎక్కువగా ఉందని, కొత్త నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు ఆవిర్భవిస్తే అది 45 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. -
‘సిరిసిల్ల’ చైర్పర్సన్ రాజీనామా
-
‘సిరిసిల్ల’ చైర్పర్సన్ రాజీనామా
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ పరిధిలో పనులు చేసే కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వకుండా కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘మా మంత్రిగారే పర్సంటేజీలు తీసుకోవాలని చెప్పారు’ అని అన్న ఆమె మాటలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పావని తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ శ్యామ్సుందర్రావుకు అందజేశారు. ‘ చైర్పర్సన్ పదవికి నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్న’ అని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. పావని రాజీనామా విషయం తెలియడంతో రాత్రి 10 గంటల సమయంలో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మేనేజర్ గదిలో పావని రాజీనామా లేఖను అందించారు. అంతకుముందు ఆమె ఏమన్నారంటే.. ‘‘సిరిసిల్ల టౌన్లో ఎన్ని కోట్ల పనులొచ్చినా అందరూ అసంతృప్తిగా ఎందుకున్నరంటే.. వార్డుకు ఒక్కరే కాంట్రాక్టరు పనిచేస్తుండు.. మాకు వచ్చేది ఏమీ ఉండదు.. మా మంత్రి గారే చెప్పిండ్రు.. కాంట్రాక్టర్ల నుంచి వన్ పర్సెంటో.. టూ పర్సెంటో.. త్రీ పర్సెంటో ఉంటది’ అంటూ రాజీనామాకు ముందు పావని ఎలక్ట్రానిక్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు పర్సెంటేజీలు కౌన్సిలర్లకు ఇవ్వడం లేదని, కౌన్సిలర్గా ఎన్నో ఖర్చులు పెట్టుకున్నారని.. వారికి వన్, టూ పర్సెంట్ ఇవ్వకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. ‘‘మేం కొబ్బరి కాయలు కొట్టి ఏం లాభం? పొద్దున లేచి తిరుగుతున్నం.. వాళ్లు వర్క్లు చేసి మాకు ఇచ్చేది ఇవ్వకపోతే ఎట్లా? అయినా ఇయ్యాలనే బాధ్యత వాళ్లకే ఉండాలి’’ అని అన్నారు. ‘మళ్లీ దాన్ని రాజకీయం చేస్తున్నారని అంటున్నరు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న.. నేను వెళ్లే వార్డుల్లో డ్రైనేజీలు వేస్తుండ్రు.. మోరీలు వేస్తుండ్రు.. పగుళ్లు ఉన్నాయని కాంట్రాక్టర్లకు చెబితే.. బాగు చేస్తున్నామని అంటున్నరు. పనుల్లో వన్ పర్సంటో.. టూ పర్సంటో తీసుకోమని చెప్పిండ్రు’’అని పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది మన సిరిసిల్లలోనే కాదు.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ నడుస్తోంది.. అందరికి ఇస్తుండ్రో లేదో తెలియదు.. అందరితోపాటు నేనూ తీసుకుంటున్న.. అవి మాసారు చూస్తరు.. నేను రాజకీయం, మహిళా సంక్షేమం, మున్సిపల్ పనులు చూస్త’’అని అన్నారు. -
సార్. నేను చనిపోయానా?
జనగామ: బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా నిర్ధారించి మునిసిపల్ అధికారులు మరో తప్పు చేశారు. సర్వీసు బుక్కు వివాదం మరచిపోకముందే.. ‘డెత్’ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ‘నేను బతికే ఉన్నాను.. నేను చనిపోయినట్లుగా ధ్రువీకరించింది ఎవరు’ అంటూ బాధితుడు అధికారులను నిలదీసిన ఘటన గురువారం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ రఫత్ షాకాన్ అలియాస్ టిప్పు ప్రైవేట్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మునిసిపల్ పరిధిలోని గ్రంథాలయ సముదాయానికి సంబంధించి ఓ షెట్టర్ను అద్దెకు తీసుకున్నాడు. టిప్పు ప్రైవేట్గా పని చేస్తుండటంతో తన పేరిట ఉన్న షెట్టర్ను బంధువుకు అప్పగించాడు. షెట్టర్ల లీజు గడువు 2017 డిసెంబర్ 31న ముగిసిపోవడంతో మునిసిపల్ అధికారులు యజమానులకు నోటీసులు పంపారు. అద్దెకుంటున్న వారి వివరాలు, చనిపోయిన లీజుదారుల పేర్లను ఎజెండాలో పొందుపరిచారు. అం దులో టిప్పు పేరు కూడా ఉంది. విషయం తెలుసుకున్న టిప్పు.. మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి ‘సార్.. నేను చనిపోయానా’ అంటూ ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. తప్పు జరిగింది వాస్తవమేనని, విచారణ జరుపుతామని మేనేజర్ రమాదేవి చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవా లని కౌన్సిలర్ ఎజాజ్ డిమాండ్ చేశారు. -
‘చెత్త’ కష్టాలు
నిజాంసాగర్(జుక్కల్) : పరిసరాల పరిశుభ్రత, సం పూర్ణ పారిశుధ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రా ధాన్యత ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులకు చెత్తపై చిత్తశుద్ధి కరువైంది. ఇంటింటా వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామాలు సాధ్యమంటున్నా అమలులో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జనావాసాలు, కాలనీల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. చెత్త తరలింపు కోసం రిక్షాలు, చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్యార్డు లు ఊరురా వృథాగా మారుతున్నాయి. ఉపాధి నిధులు డంపింగ్ యార్డుల పాలు.. ‘పల్లె సీమలను పట్టుగొమ్మలుగా నిలపాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతపై దృష్టి సారించాయి. అందులో భాగంగా జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలు, ఆయా గ్రామాల్లో చెత్త నిల్వల కోసం డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. తద్వారా జిల్లాలో 314 గ్రామాల్లో డంపింగ్ యార్డుల తవ్వకానికి ఉపాధి హామీ పథకం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఉపాధి కూలీలతో తవ్వించారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో, చెత్తపై సమరానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్క డంపింగ్ యార్డు తవ్వకానికి ఉపాధి పథకం కింద రూ.1.7 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డుల్లోకి చెత్తను తరలించేవారు గ్రామ పంచాయతీల్లో కరువయ్యారు. దీంతో ఆయా గ్రామ శివారు ప్రాంతాల్లో, కాలనీలు, జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండటంతో వీధులు అపరిశుబ్రంగా మారాయి. మురికి కాలువల్లో నుంచి తీసిన చెత్తను రోడ్లపై పారేయడంతో కాలనీలు దుర్గంధంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. తద్వారా గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డులు సైతం కనుమరగవుతున్నాయి. మూలనపడ్డ రిక్షాలు.. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది చెత్తరిక్షాలను సరఫరా చేసింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మూడు చొప్పున మూడు చక్రాల చెత్త రిక్షాలను సరఫరా చేసినా చె త్తను తరలిం చేసిబ్బంది లేకపోవడంతో రిక్షాలు మూలనపడ్డాయి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి పట్టణాలు, మండల కేంద్రాల్లో తప్ప మిగతా గ్రామ పంచాయతీల్లో చెత్తరిక్షాలను ఉపయోగించిన దాఖలాలు కన్పించవు. వందశాతం సంపూర్ణ పారిశుధ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ఒక్కొక్క పంచాయతీకి మూడు చెత్తరిక్షాలను సరఫరా చేశారు. గ్రామ పంచాయతీల్లో సరిౖన సిబ్బంది లేకపోవడంతో చెత్తరిక్షాలు ఉపయోగం లేక తుప్పుపడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. అధికారులు ఇకనైనా స్పందించి చెత్తరిక్షాలు, డంపింగ్ యార్డులను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆక్రమించుకో..అద్దె వసూలు చేసుకో!
ప్రకాశం, మార్కాపురం: డివిజన్ కేంద్రమైన మార్కాపురం మున్సిపాలిటీలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. యథేచ్ఛగా స్థలంలో బంకులు పెట్టి దర్జాగా అద్దెలు వసూలు చేస్తున్నారు. 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి మున్సిపాలిటీకి ఆక్రమిత పన్ను రూపంలో కేవలం రూ.2 వేలు వసూలు చేస్తుండగా అద్దె రూపంలో షాపు యజమాని నుంచి ఆక్రమితదారులు రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. మార్కాపురం పట్టణంలో మున్సిపల్ స్థలాలకు సంబంధించి కంభం రోడ్డులోని ఆర్అండ్బీ రహదారిపై, గాంధీ పార్కు చుట్టూ కొన్ని బంకులు, పాత బస్టాండ్లో మరికొన్ని బంకులు కలిపి సుమారు 100కు పైగా ఉన్నాయి. ఈ స్థలాలను గతంలో పలువురు ఆక్రమించి అద్దెకు ఇచ్చారు. ఇందులో కిళ్లీ బంకులతో పాటు చికెన్ బండ్లు, టీ బంకులు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారులకు సంవత్సరానికి స్థల ప్రాధాన్యతను బట్టి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు అద్దె రూపంలో వస్తోంది. మున్సిపల్ అధికారులు 10 స్క్వేర్ మీటర్లు ఉంటే ఏడాదికి రూ.2 వేలు, 12 నుంచి 13 మీటర్లు ఉంటే రూ.5 వేలు, ఆ తరువాత స్థలంలో ఆక్రమణలు ఉంటే రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోరు ఉన్న వాడిదే ఆదాయం వచ్చే మార్గంగా మున్సిపల్ స్థలాలు ఉపయోగపడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఆక్రమిత స్థలాల జోలికి పోకుండా ఆక్రమణ పన్ను వసూలు చేయటంలోనే శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా కంభం సెంటర్ నుంచి శ్రీనివాస థియేటర్ వరకు సుమారు 70కి పైగా బంకులు ఉన్నాయి. ఈ స్థలాల యజమానులు గతంలో ఆక్రమించుకుని ఆ స్థలాన్ని నెలకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు అద్దెలకు ఇస్తున్నారు. మరి కొంత మంది ఇదే స్థలాన్ని రూ.70 వేల నుంచి లక్ష వరకు విక్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని దరా>్జగా కబ్జా చేసి అద్దె వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టకపోవటంతో ఖాళీ స్థలం కనిపిస్తే బంకు వేసుకోవటం, అద్దెకు ఇచ్చుకోవటం మున్సిపాలిటీలో పరిపాటిగా మారింది. పరోక్షంగా పాలకులు కూడా ఆక్రమణదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వలన పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేలకు పైగా ఆటోలు, 5 వేల ద్విచక్ర వాహనాలు, 100 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు ఉండటంతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇదే పరిస్థితి నెహ్రూ బజార్, కళాశాల రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ వైపు ఉంది. మున్సిపల్, ఆర్అండ్బీ సంయుక్తంగా ఆక్రమణలు తొలగించినట్లయితే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. మున్సిపల్ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తాం మున్సిపల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను త్వరలో తొలగిస్తాం. అయితే, ప్రధాన రహదారి వెంట ఉన్న ఆక్రమణలను ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. కంభం రోడ్డు, తర్లుపాడు రోడ్డు, కళాశాల రోడ్డుల్లో ఉన్న ఆక్రమణలు సర్వే చేసి ఆర్అండ్బీ అధికారులు తొలగించాలి. మేము వసూలు చేసే పన్ను తాత్కాలిక ఆక్రమణ పన్ను మాత్రమే. – షేక్ ఫజులుల్లా, కమిషనర్, మార్కాపురం -
పన్నులు కట్టండహో..
నిర్మల్ : ప్రజలు పన్నులు చెల్లిస్తేనే స్థానిక సంస్థలు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టిపెట్టగలుగుతాయి. ఆదాయ వనరులే సమయానికి అందకపోతే అభివృద్ధి అన్న మాటే ఉండదు. ఈక్రమంలో బల్దియా ఇప్పుడు పన్నులపై దృష్టి పెట్టింది. ఏళ్ల కొద్దీ పెండింగ్లో ఉన్న మొండి బకాయిలనూ వసూలు చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే పెద్ద బకాయిలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇంటింటికీ సిబ్బంది వెళ్లడమే కాకుండా.. ఆటోల్లో మైకుల ద్వారా చాటింపులూ వేయిస్తున్నారు. ఈక్రమంలో గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే పన్నులు వసూలవుతున్నాయి. ఏళ్ల కొద్దీ పెండింగ్లోనే.. పట్టణంగా ఎదిగి దశాబ్ధాలు గడుస్తున్నా.. నిర్మల్ అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇదేంటని.. అధికారులు, పాలకులను ప్రశ్నిస్తే సరిపడా నిధులు రావడం లేదని సమాధానమిస్తున్నారు. స్థానికంగా వచ్చే పన్నులతోనే సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులను చేపట్టవచ్చు. వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ.. ఆస్తిపన్ను మొదలు నీటిపన్ను వరకు పన్నులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఒకటి రెండు కాదు.. ఏళ్ల కొద్దీ కోట్ల రూపాయాల్లో మున్సిపల్కు రావాల్సిన మొండి బకాయిలు ఉన్నాయి. అనుమతులు లేకుండానే.. పట్టణంలో మున్సిపల్ అనుమతి లేకుండానే చాలా వరకు పనులు, వ్యాపారాలు కొనసాగుతున్నాయి. లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకోవడం లేదు. బీఆర్ఎస్దీ అదే పరిస్థితి. ఇక దుకాణాలు పెట్టిన వాళ్లు ఏళ్లకేళ్లు ట్రేడ్ లైసెన్స్లు లేకుండానే కొనసాగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. అడ్వర్టయిజ్మెంట్ పన్ను ఉంటుందనే విషయమే చాలామంది వ్యాపారులకు తెలియదు. ఆస్తిపన్నులైతే ఏళ్లుగా పెండింగ్లో పేరుకుపోయాయి. కనీసం నల్లబిల్లులు చెల్లించని వాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బల్దియా తీరూ కారణమే.. ఏళ్లకేళ్లుగా పన్నులు బకాయిలో ఉండటంలో ప్రజల పాత్ర ఎంత ఉందో.. అంతకంటే ఎక్కువ బల్దియా బాధ్యతారాహిత్యమూ ఉంది. ఇన్నేళ్లుగా ఎందుకు పన్నులు కట్టడం లేదని.. అడిగిన వాళ్లు లేరు. ఏడాదికోసారి తూతూమంత్రంగా వసూళ్లు చేపట్టడం మినహా పెద్దగా వసూలు చేయలేదు. దీంతో మొండి బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్కు ఆదాయాన్నిచ్చే వాణిజ్య సముదాయాల్లో దుకాణాలు నడుపుతున్న వాళ్లు బాగానే ఉన్నారు. కానీ.. అద్దెలను మాత్రం మున్సిపల్కు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ఏళ్లుగా బల్దియా సైతం చూసీచూడనట్లుగా వదిలేయడమూ ఇందుకు కారణమే. గతంలో డివిజన్ కేంద్రం... ఇప్పుడు జిల్లాకేంద్రంగా మారిన నిర్మల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాలు అధికంగానే ఉన్నాయి. వీటి నుంచైతే కోట్లలో బకాయిలు రావాల్సి ఉంది. మరోవైపు మున్సిపాలిటీ సైతం రూ.లక్షల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. గాడిన పడుతుందా.. మరో ఆర్థిక సంవత్సరమూ ముగిసే దశకు వచ్చింది. ఇప్పటికైనా బల్దియాల్లో పన్నుల వసూళ్లు వేగవంత చేయాలని పైనుంచి మున్సిపల్శాఖ ఉన్నతాధికారులు సీరియస్గా చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మల్ మున్సిపాలిటీలోనూ కమిషనర్ మంద రవిబాబు పన్ను వసూళ్లపై సీరియస్గా దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆస్తిపన్ను, ట్రేడ్లైసెన్స్, ప్రచారపన్ను, ఎల్ఆర్ఎస్, నీటిబిల్లు.. ఇలా అన్నింటినీ వసూలు చేయిస్తున్నారు. ప్రస్తుతం పన్నుల రాబడి మెరుగైందని చెప్పవచ్చు. కానీ.. ఇది పూర్తిస్థాయిలో చేపడితేనే మున్సిపల్ అభివృద్ధికి దోహదపడుతుంది. పన్నులు చెల్లిస్తేనే పురోగతి.. పట్టణంలో పన్నులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే సిబ్బంది ఇంటిం టికీ వెళ్లి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. నల్లబిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించనున్నాం. ట్రేడ్లైసెన్స్లు, ఇతర అనుమతులూ తీసుకోవాలని సూచిస్తున్నాం. –మంద రవిబాబు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
రసాభసగా విజయవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశం
-
స్వచ్ఛత.. ఉత్తిదే!
వనపర్తి టౌన్ : మున్సిపాలిటీలో ప్రజాసమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అమల్లోకి వచ్చిన స్వచ్ఛత యాప్ వినియోగంలో వనపర్తి మున్సిపాలిటీ అట్టడుగు స్థానంలో ఉంది. పట్టుమని పది సమస్యలను కూడా పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల ఫొటోలు తీసి ఫిర్యాదుచేస్తే వాటిని రాష్ట్ర, జాతీయస్థాయి అధికారులు పరిశీలించేలా యాప్ను రూపొందించారు. వనపర్తి మున్సిపాలిటీలో 26వార్డులు ఉండగా, లక్ష జనాభా ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31వరకు దేశంలోని పురపాలక, నగర పాలక సంఘాల పరిధిలో ఆండ్రాయిడ్ యాప్తో పట్టణప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించిన తీరును పరిశీలించి స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇటీవల ర్యాంకులు ప్రకటించారు. జాతీయస్థాయిలో అత్యధికంగా సమస్యలు పరిష్కరించిన మున్సిపాలిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో వనపర్తికి అట్టడుగుస్థానం దక్కింది. వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్కు స్థానం దక్కలేదు. కొన్నేళ్లుగా స్వచ్ఛత యాప్ అమలులో ఉంది. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అప్లోడ్ చేయడంపై పెద్దగా ఆసక్తిచూపలేదు. సమస్యల నమోదు ఆండ్రాయిడ్ పరిజ్ఞానం కలిగి ఫోన్ ద్వారా ప్లే స్టోర్లోకి వెళ్లి స్వచ్ఛత యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆయా సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారుల తీరుపై తమ అభిప్రాయాలను పోస్ట్చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ర్యాంకులు కేటాయించే సమయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు సమస్యలు అనేకం రోజురోజుకూ మున్సిపాలిటీ విస్తరిస్తోంది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో సమస్యను పరిష్కరించమని వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. యాప్ సేవలు ఉన్నాయనే విషయం తమకు ఇంతవరకు తెలియదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. ఇక మీదట పక్కాగా.. స్వచ్ఛత యాప్లో ముందుకు పోలేకపోయినం. ఆ కార్యక్రమం ముగిసింది స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకు సాధించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. ఇందులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. – వెంకటయ్య, వనపర్తి కమిషనర్ -
ప్రతి పనికీ పైసలివ్వాల్సిందే
ఆదోని టౌన్: ఆదోని మునిసిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు ప్రతి పనికీ చేయి చాస్తున్నారు. పైసలివ్వందే పని చేయడం లేదు. కీలకమైన రెవెన్యూ విభాగంలో అవినీతి మితిమీరింది. స్థిర,చరాస్తులకు సంబంధించి పేర్లు మార్చాలన్నా, తండ్రి ఆస్తిని కొడుకు పేర రాయాలన్నా, చివరకు కుళాయి కనెక్షన్ కావాలన్నా చేతులు తడపాల్సి వస్తోంది. మునిసిపాలిటీలో 33వేల నివాస గృహాలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే వారి ఆస్తిని వారసుల పేరుపై మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేస్తే దాన్ని తమపేర రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి. పన్ను చెల్లింపులు కూడా బదలాయించుకోవాలి. ఇలా పేర్ల మార్పు, ఆస్తి పన్ను త్వరితగతిన విధించాలంటే రెవెన్యూ విభాగం సిబ్బంది చేయి తడపాల్సి వస్తోంది. పేర్ల మార్పు, పన్ను బదలాయింపు తదితర వాటి కోసం 300 మంది దాకా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రెవెన్యూ విభాగంలో సకాలంలో పని కావడం లేదు. ఈ దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించినట్లయితే మునిసిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న కొందరు అధికారుల తీరు వల్ల మునిసిపాలిటీ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా చెడ్డపేరు కూడా మూటగట్టుకుంటోంది. పని కావాలంటే కిందిస్థాయి ఉద్యోగులతో ముందుగా ‘ఒప్పందం’ కుదుర్చుకుని రావాలని కొందరు బిల్ కలెక్టర్లు సూచిస్తున్నారు. మరికొందరు దళారుల పేర్లు చెబుతూ.. వారితో ‘ఓకే’ చెప్పిస్తేనే పని త్వరగా అవుతుందని అంటున్నారు. దళారుల అవతారమెత్తిన కౌన్సిలర్లు ఆదోని మునిసిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు దళారుల అవతారమెత్తారు. సొంత వార్డులో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మునిసిపల్ కార్యాలయంలోనే తిష్టవేస్తున్నారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కార్యాలయానికి వచ్చే వారికి పనులను చేసిపెడతామంటూ రూ.వేలల్లో గుంజుతున్నారు. -
నందమూరినగర్లో ఉద్రిక్తత
నంద్యాలఅర్బన్: పట్టణ శివారు ప్రాంతం నందమూరినగర్లో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది చేపట్టిన ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి..రోడ్ల విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారికి ఇరువైపులా కట్టడాలను తొలగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం పనులు ప్రారంభించారు. అయితే తమకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా కట్టడాలను కూల్చివేస్తారంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఈక్రమంలో మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కట్టడాలు తొలగిస్తున్నామని సిబ్బంది చెప్పినా స్థానికులు పనులు చేయడానికి అంగీకరించలేదు. ఉన్నఫలంగా మరుగుదొడ్లు, బాత్రూంలు తొలగిస్తే ఎలా అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. మరోవైపు కట్టడాల తొలగింపులో సిబ్బంది చూపుతున్న వివక్షపై నిలదీశారు. అధికార పార్టీ మద్దతుదారుల ఇళ్ల వద్ద ఒకలాగా, సామాన్యుల ఇళ్ల వద్ద ఒకలాగ కట్టడాలను కూల్చివేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు. ఈక్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేత కార్యక్రమం కొనసాగింది. -
థూ... ఎంత బాగుంది
మాస్క్లు మంచివి. ఢిల్లీవాళ్లందరూ ఇదే అనుకుంటున్నారు. ఢిల్లీ మున్సిపల్ బోర్డువాళ్లయితే ఓం మాస్కాయనమః, ఓం పొల్యూషనాయనమః, ఓం గుట్కా సంహరాయ నమః, ఓం థూ.. తిరస్కారాయనమః అని సంతోషంగా గంతులేస్తున్నారు. ‘ఏంటయ్యా ఈ గంతులూ’ అని అనడిగితే ‘కళ్లకు కట్టాల్సిన గంతలు నోటికి కట్టుకుంటే మరి గంతులు వెయ్యమా?’ అని సాంగ్ సింగారంట! అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీలో పొల్యూషన్ లాస్ట్ త్రీ డేస్గా రెచ్చిపోయేలా ఉందట. ముక్కు బయటపెడితే బ్లాస్టే. అందుకే అందరూ బ్లాస్ట్ అవకముందే ప్లాస్టర్ వేస్కొని తిరుగుతున్నారు. ప్లాస్టర్ అంటే.. అదే స్వామీ.. మాస్క్ అన్నమాట. ఈ దెబ్బకి మాస్కేసుకున్నవాళ్లు రోడ్ల మీద ఊయడం మానేశారట. దాంతో డెబ్భై ఐదు శాతం థూ.. థూ..లు తగ్గిపోయాయట! అలవాటులో పొరపాటుగా కొంతమంది తెలియకుండా ఊస్తూనే ఉన్నారట. చెప్పాం కదా. మనుషులు మారకపోతే మాస్కులు మార్చుకోవాలి. ఎందుకంటే థూ అంతా మాస్క్లోనే ఉండిపోతుంది కదా. ఓం మాస్కాయనమః, ఓం పొల్యూషనాయనమః ఇదండీ.. ఢిల్లీ పొల్యూషన్ మీద లేటెస్టు సెటైర్. -
వణికిస్తున్న వైరల్ ఫీవర్
సిరిసిల్ల జ్వరపీడితులకు ఒక్కసారిగా రక్తకణాలు తగ్గిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వంద మందికి రక్తపరీక్షలు చేస్తే.. 60 మందికి రక్తకణాలు పడిపోయాయని ఓ ప్రైవేటు డాక్టర్ ఒక్కరు చెప్పారు. జలుబు, తలనొప్పి, దగ్గు, దమ్ముతోపాటు, కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్నిమందులు వాడినా తగ్గకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి మొండి జ్వరాలు గతంలో ఎన్నడూ చూడలేని మరో ప్రభుత్వ వైద్యుడు చెప్పడం గమనార్హం. దోమల విజృంభన.. దోమలు ఒక్కసారిగా విజృంభించాయి. ఇటీవల మున్సిపల్ అధికారులు పందులను పట్టణం నుంచి తరలించినా దోమల ఉధృతి తగ్గలేదు. కార్మిక వాడలతోపాటు అన్నిప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధాన వీధుల్లో రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా.. మోరీనీళ్లు రోడ్లపైనే పారుతున్నాయి. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో దోమలు విస్తరిస్తున్నా మున్సిపల్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలేవు. మోరీల్లో నిల్వ ఉండే నీటి ద్వారానే దోమలు విజృంభిస్తున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి.. ఈ చిత్రాల్లోని ఇద్దరు చిన్నారులు దీక్షిత(7), గాయత్రి(7నెలలు). వీరి తల్లిదండ్రులు ప్రగతినగర్కు చెందిన రోషిణి–కమలాకర్. దీక్షతకు పదిరోజుల క్రితం జ్వరం రాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. మందులు వాడగా మళ్లీ జ్వరం వచ్చింది. మూడు రోజుల క్రితం గాయత్రి కూడా జ్వరం బారినపడింది. పిల్లలిద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైరల్ ఫీవరే ఎక్కవ పిల్లలకు వైరల్ ఫివర్ అధికంగా వస్తోంది. రోజుల తరబడి జ్వరాలు తగ్గడంలేదు. ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. నేను రోజుకు వంద మంది పిల్లలను పరీక్షిస్తున్నా. ఇరవై మంది అడ్మిట్ అవుతున్నారు. జ్వరాలు తగ్గినా మళ్లీ వస్తున్నాయి. దమ్ము, దగ్గు సమస్యలు ఉన్నాయి. – మురళీధర్రావు, పిల్లల వైద్యుడు ఓపీ సంఖ్య పెరిగింది జ్వరాలతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం మా ఆస్పత్రికి రోజూ 700 – 800 మంది వస్తున్నారు. జ్వరం తీవ్రంగా ఉంటే అడ్మి ట్ చేసుకుంటున్నాం. మిగతా వారికి వైద్యం చేసి ఇళ్లకు పంపిస్తున్నాం. మందుల కొరత లేదు. – ఆర్.తిరుపతి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
మున్సిపల్ సేవలన్నీ ఒక కౌంటర్ ద్వారానే
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పారదర్శకమైన పాలనను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సిటిజన్ సర్వీస్సెంటర్ను కార్పొరేషన్లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ అందించే వివిధ సేవలను పొందేందుకు ప్రజలు సమర్పించే దరఖాస్తులను ఒకే కౌంటర్ ద్వారా స్వీకరించి ఆన్లైన్ ద్వారా అన్ని విభాగాలకు పంపనున్నట్లు తెలిపారు. అనంతరం సిటిజన్ సర్వీస్ సెంటర్, క్యాష్రూం, ఈ1, ఈ2 విభా గాలను కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇక ముందు దరఖాస్తులన్నీ ఈ ఆఫీస్ ద్వారానే స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాటేటి నాగేశ్వరరావు, మందడపు మనోహర్రావు, చేతుల నాగేశ్వరరావు, పోతుగంటి వాణి, నీలం జయమ్మ, హనుమాన్, ఎస్సైలు శంకర్, లాల్య, లోకేశ్, ఎల్లయ్య, విజయ్కుమార్, భద్రం పాల్గొన్నారు. -
చంద్రన్న బీమా చేయించారు ఆన్లైన్ చేయడం మరిచారు
♦ మృతిచెందిన కుటుంబానికి బీమా డబ్బు కోసం చైర్మన్ దృష్టికి ♦ వందలాది మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి ప్రొద్దుటూరు టౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న బీమా లబ్ధిదారులను ఆన్లైన్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పట్టణంలోని స్వయంసేవక్ రోడ్డులో నివాసం ఉంటున్న భోగాల గురివిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 2016 ఆగస్టు 21న చంద్రన్న బీమా చేయించుకున్నారు. ఇందుకు ఇంటి వద్దకు వచ్చిన సిబ్బంది రూ.15 కట్టించుకొని రసీదు నంబర్ 30374ను ఇచ్చారు. అప్పటి నుంచి వివరాలను ఆన్లైన్లో పొందుపరచలేదు. సోమవారం గురివిరెడ్డి అనారోగ్యంతో మృతి గురివిరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. చంద్రన్న బీమా కట్టిన రసీదును తీసుకొని మృతిని కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా సొమ్ము ఇప్పించాలని కోరారు. రసీదు నంబర్, వివరాలను ఆన్లైన్లో చూసిన సిబ్బంది వివరాలను పొందుపరచలేదని తేల్చారు. ఏడాది దాటినా ఇంత వరకు బీమా కట్టించుకున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచక పోవడం చూస్తుంటే మున్సిపల్ అధికారుల పనితీరు అర్థం అవుతోంది. ఆన్లైన్లో లేని వందలమంది వివరాలు ఈ విధంగా వందలాది మంది వివరాలను మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో ఎక్కించనట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా రూ.15 కట్టించుకొని వివరాలను ఆన్లైన్లో ఎక్కించడానికి మొదట రెవెన్యూ సిబ్బందిని నియమించింది. వీరి నుంచి మెప్మా ఆర్పీలను, సీఓలకు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది వందలాది మంది వివరాలను ఆన్లైన్లో ఎక్కించకుండా కేవలం డబ్బు కట్టించుకొని రసీదులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపితే ఆన్లైన్లో లేని లబ్ధిదారుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సాధారణంగా మృతి చెందిన వారికి చంద్రన్న బీమా రూ.30వేల నుంచి రూ. 2లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్, పీడీ దృష్టికి సమస్య జరిగిన విషయంపై బాధిత కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మెప్మా పీడీ రామ్మోహన్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ కచ్చితంగా బాధిత కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని పీడీకి చెప్పారు. ఏది ఏమైనా ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఎక్కించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ముగిసిన మున్సిపల్ ఉపాధ్యాయుల రేషనలైజేషన్
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపాలిటీల పరిధిలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె.రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కనకమహాలక్ష్మి ఈ ప్రక్రియను నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో ఇప్పటి వరకు 102 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. గురువారం నిర్వహించిన కౌన్సెలింగ్లో 62 పోస్టులను మిగులుగా తేల్చారు. అదే విధంగా మూడు ఉన్నత పాఠశాలల్లో 86 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. 61 మంది స్కూల్ అసిస్టెంట్లను మిగులుగా తేల్చారు. ఈ లెక్కన చూసుకుంటే మున్సిపాలిటీలో ఉన్న 45 ప్రాథమిక , 3 ఉన్నత పాఠశాలల్లో 123 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియలో ఆయా పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు కన్నా మిగులు ఉపాధ్యాయులే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వ నిబంధనలు తేటతెల్లం చేసినట్లైంది. సర్దుబాటు ఎలా? ఇంత హెచ్చు సంఖ్యలో మిగులు పోస్టులను ఎలా సర్దుబాటు చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదు. వాస్తవానికి రెండు రోజుల క్రితం విజయనగరం మున్సిపాలిటీలోనే సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించగా... ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వల్లో మిగులు పోస్టులపై స్పష్టత తేలిన తరువాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆ రోజు కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించారు. విషయాన్ని సున్నితంగా పరిశీలించిన రీజనల్ డైరెక్టర్ రమేష్ విభజించు పాలించు అన్న సూత్రాన్ని అమలు చేయటం ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను సూనాయాసంగా పూర్తి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మున్సిపల్ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించాలి
► నిరవధిక నిరాహార దీక్షల ప్రారంభంలో నాయకుల డిమాండ్ నగరంపాలెం : రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జిల్లా, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జిల్లా, అంతర్జిల్లా బదిలీలు కోరే ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలోని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ (డీఎంఏ) ప్రాంగణం ఎదుట నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వం, జెడ్పీ, ఉపాధ్యాయులకు విధిగా బదిలీలు జరుపుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు 17 ఏళ్లుగా ఒక్కసారిగా కూడా బదిలీలు జరపకపోవటం శోచనీయమన్నారు. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ప్రభుత్వాన్ని ఒప్పించైనా ఈ వేసవిలో బదిలీలు చేయించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యాచరణ కమిటీ సభ్యులు పి. సనాఉల్లా మాట్లాడుతూ ప్రభుత్వం వి«ధిగా అందరితోపాటు మున్సిపల్ టీచర్ల బదిలీలు జరుపుతూ ఉండాలన్నారు. దీనిపై ఎమ్మెల్సీ, ఫ్యాప్టో, జాక్టోలు సరైన శ్రద్ధ చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్వీ రత్నం, సి. నారాయణ, ఎంఏ సత్తార్, 13 జిల్లాలకు చెందిన మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేషనలైజేషన్ ప్రక్రియ బహిష్కరణ
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ఉపాధ్యాయులు బహిష్కరించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులపై స్పష్టత ఇచ్చేంత వరకు రేషనలైజేషన్ జరగనివ్వమంటూ అడ్డగించారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన రేషనలైజేషన్ ప్రక్రియకు ముందుస్తు సమాచారం ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలతో పాటు మిగిలిన మూడు మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముందుగా పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఉపాధ్యాయులకు రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించిన సమయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల వాస్తవ నమోదు ప్రకారం మిగులు పోస్టులు గుర్తించాలని, రేషనలైజేషన్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తారని, మిగులు ఉపాధ్యాయులను ఎక్కడికి కేటాయింపు చేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పోస్టులను సర్దుబాటు చేసిన తరువాతే మిగులు పోస్టులు చూపించాలని, సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయుల జాబితాను తయారుచేసి ఆ జాబితాను పాఠశాలలకు ఇచ్చిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొద్ది సేపు వారించారు. మిగులు ఉపాధ్యాయులపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పగా... ఆ స్పష్టతపై ముందుగా తేల్చాలని డిమాండ్ చేశారు. అంత వరకు రేషనలైజేషన్ ప్రక్రియను జరగనివ్వమంటూ, కౌన్సెలింగ్కు హాజరైన ఉపాధ్యాయులంతా కార్యాలయం బయటకు వచ్చేశారు. -
ఆ నాయకుల చేతుల్లో పావులు
∙ మున్సిపల్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి ధ్వజం ∙ పనితీరు మార్చుకోకపోతే శాంతియుత మౌన దీక్ష తాడిపత్రి టౌన్ : తాడిపత్రి మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీకి సంబంధం లేని రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారారని, వారి మాటలు విని తనపై వివక్ష చూపుతున్నారని 23వ వార్డు మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి జయచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో «ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ఆ నాయకుల ధన దోపిడీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, తనపై కోపం తన వార్డు ప్రజలపై చూపవద్దని కోరుతూ సోమవారం ఆయన మున్సిపల్ మేనేజర్ సాంబశివరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సూచనలతో అప్రజాస్వామ్యబద్దంగా మూడు నెలల పాటు తనను కౌన్సిల్ నుంచి అధికారులు బర్తరఫ్ చేశారన్నారు. తన వార్డులో పింఛన్లు, పక్కాగృహాల మంజూరుకు సంబం ధించి లబ్ధిదారుల వివరాలు అడిగితే మున్సిపాలిటీకి సంబంధం లేని ఒక రాజకీయ నాయకుడికి ఇచ్చామని, అతన్ని అడిగి తెలుసుకోవాలని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 23వ వార్డులోని కాల్వగడ్డ వీధిలో డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మున్సిపల్ ఈఈ, ఎస్ఈ, ఏఈలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. తన వార్డు కు సంబంధించిన సమాచారాన్ని తనకు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను అర్హులైన తనవార్డు ప్రజలకు కూడా మంజూరు చేయాలని అధికారులను కోరారు. పనితీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత మౌన దీక్ష చేపడతానని హెచ్చరించారు. -
ఆంగ్ల మాధ్యమంపై ఊగిసలాట
భీమవరం టౌన్ : మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన ఊగిసలాటలో పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో మంత్రులు, అధి కారుల వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన ఉంటుం దని పేర్కొనగా.. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉంటాయని ప్రకటించారు. ఈ పాఠశాలల్లో జూన్ 11 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఏ మాధ్యమంలో విద్యాబోధన చేస్తారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం రాలేదు. తొలుత తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలొచ్చాయి. అందుకు అనుగుణంగానే జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అనంతరం కేవలం ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఇండెంట్ ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక జిల్లా అధికారులు ఇండెంట్ ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. మెప్మా సహకారంతో.. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన దిశగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్నద్ధం చేసేం దుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మున్సిపాలిటీల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలు చేస్తున్నామని, పిల్ల లందరినీ ఆ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఇంటింటా ప్రచారం చేయించారు. ఆంగ్ల మాధ్యమంపై మక్కువతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాన్వెంట్లకు పంపుతున్నారన్నది ప్రభుత్వ భావన. ఈ నేపథ్యంలోనే ఆంగ్లంలో బోధనతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 6 నుంచి 10వ తరగతి వరకు కెరీర్ ఫౌండేషన్ కోర్సుల ద్వారా విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే, ఆంగ్లమాధ్యమ బోధనకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేవు. మరోవైపు ఆంగ్లమాధ్యమ బోధనకు ఉపాధ్యాయులు సైతం సన్నద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఏమీ లేవు. ఆంగ్లంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. పట్టణాల వారీగా పాఠశాలల సంఖ్య ఇలా.. పట్టణం ప్రాథవిుక ప్రాథవిు ఉన్నత కోన్నత పాఠశాలలు భీమవరం 35 01 06 ఏలూరు 38 04 07 నరసాపురం 20 05 06 నిడదవోలు 11 01 03 పాలకొల్లు 22 00 06 తాడేపల్లిగూడెం 19 01 06 తణుకు 14 02 01 మొత్తం 159 14 35 మాతృభాషలో బోధనే మంచిది ప్రాథమిక స్థాయి నుంచి మాతృభాషలో బోధన అవసరం. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. తొలుత మాతృభాష, తరువాత హిందీ, ఆ తరువాత అంతర్జాతీయ భాషలో బోధన అవసరమని కొఠారి కమిషన్ సూచించింది. – ఎంఐ విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రెండు మాధ్యమాలూ ఉండాలి మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం బోధన ఒక్కటే పెడతామనడం సరికాదు. తెలుగులోనూ బోధన ఉండి తీరాలి. రెండూ ఉంటేనే విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చేరతారు. – టి.సత్యనారాయణమూర్తి, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ కార్యదర్శి పిల్లలు బడికి దూరమవుతారు బలవంతంగా ఆంగ్లమాధ్యమాన్ని రుద్దితే అర్థంకాక పిల్లలు స్కూలు ఎగ్గొట్టే ప్రమాదం ఉంది. మాతృభాషతోపాటు ఆంగ్ల మాధ్యమ బోధన కూడా అవసరమే. పూర్తిగా ఆంగ్లమాధ్యమ బోధన సరికాదు. – షేక్ సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాతృభాష బోధన అవసరం విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలోనే బోధన ఉండాలి. 6వ తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తే బాగుంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన ఉండి తీరాలి. – కోడి వెంకట్రావు, ప్రధానోపా«ధ్యాయుడు, భీమవరం -
పుర పన్నులకు ఒకే నోటీసు
ఏలూరు (మెట్రో)/తణుకు : నగరాలు, పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు వచ్చే వరుస నోటీసులకు ఇకపై కాలం చెల్ల నుంది. ఇప్పటివరకు నీటి పన్నుకు ఒకటి.. ఇంటి పన్ను మరొకటి.. ఖాళీ స్థలాలుంటే ఇంకొకటి చొప్పున మున్సిపాలిటీలు నోటీసులు ఇస్తూ వస్తున్నాయి. మీరు వినోదపు పన్ను పరిధిలోకి వస్తారా అంటూ అడపాదడపా తాఖీదులు సైతం అందుతున్నాయి. ఇకపై ఇలాంటి వరుస నోటీసులకు స్వస్తి పలికి.. అన్నిటికీ కలిపి ఒకే నోటీసు జారీ చేసేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే.. నగర, పురపాలక సంఘాల్లో ప్రజలు చెల్లించే పన్నులు వివిధ రకాలుగా ఉంటాయి. తొలుత ఇంటి పన్ను డిమాండ్ నోటీసులుజారీ అయ్యేవి. నాలుగైదు రోజుల అనంతరం నీటిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను నోటీసులు ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిపడేవి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి విరుగుడుగా అన్నిరకాల పన్నులకు ఒకే డిమాండ్ నోటీసు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనిని సమీకృత పన్ను విధానం అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ఆరు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి రెండు నోటీసులు మాత్రమే ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రాబోతోంది. దీనివల్ల తరచూ నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజలు పడే ఇబ్బందులు తొలగిపోతాయి. మున్సిపల్ సిబ్బందికి పనిభారం తప్పుతుంది. మున్సిపాలిటీలకు కాగితం, ప్రింటింగ్ ఖర్చులు సైతం ఆదా అవుతాయి. ప్రజలకు ఎంతో ఉపయోగం నూతన పన్ను విధానం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గతంలో విడివిడిగా ఇచ్చే పన్ను నోటీసులను ఒకే నోటీసుగా ఇవ్వడం వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. ఏలూరులో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ఈ నెలాఖరు నాటికి ఈ రూపంలో పన్నులు చెల్లిస్తే 5 శాతం తగ్గింపు కూడా ఇస్తున్నాం. – వై.సాయిశ్రీకాంత్, కమిషనర్, ఏలూరు నగరపాలక సంస్థ -
ఒకే ఇంటికి రెండు నంబర్లా ..?
⇒ గరం గరంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ⇒ కార్మికుల వేతనాల అంశంపై సభ్యుల బైఠాయింపు ⇒ తక్షణమే టెండర్ నిర్వహించాలని సీపీఎం, టీడీపీ, బీజేపీ డిమాండ్ ⇒ అక్రమాలపై నిలదీత నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై పాలకవర్గ సభ్యులు అధికారులపై గరం గరం అయ్యారు. ఒకే ఇంటికి రెండు నెంబ ర్లు ఇచ్చి మున్సిపాలిటీ ఆదాయానికి కుచ్చుటోపి పెడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గతనెల ‘సాక్షి’లో ‘ఒకే ఇంటి కి రెండు నెంబర్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశం బజార్ షాపులపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీడీఎంఏ హామీ ఇచ్చినా నేటికి అతీగతీ లేదన్నారు. ట్రాక్టర్లలో చెత్త గాలికి రోడ్లు, జనంపైనే పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గతంలో సస్పెండైన ఉద్యోగుల నుంచి ఎంత డబ్బు రావాలి?, ఎంత రీకవరి చేశారు?, ఇంకేంత రావల్సి ఉంది?, ఎందుకు రికవరీ చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతన బకా యిలపై సీపీఎం, టీడీపీ, బీజేపీ, స్వతంత్ర సభ్యులు నిరసన తెలిపి చైర్పర్సన్ వేదిక ముం దు బైఠాయించారు. దాంతో చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్, కమిషనర్ రాజేందర్కుమార్ జోక్యం చేసుకుని కార్మికులకు వేతనాలను గురువారంలోగా అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళ న విరమించారు. జీఎస్ఐ సర్వే పూర్తి కాకుం డానే సంబంధిత కాంట్రాక్టర్కు రూ.20 లక్షలు చెల్లించడం వెనుక ఉన్న మతలబు ఏంటని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ ఫ్లోర్ లీడర్ నూకల వెంకట్నారాయణరెడ్డి, టీడీపీ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి, సీపీఎం ఫ్లోర్ లీడర్ ఎండి.సలీం అధికారులను ప్రశ్నించారు. సర్వే సరిగా చేయడంలేదని గత కౌన్సిల్లో స్వయంగా కొంతమంది కౌన్సి లర్లే అధికారుల దృష్టికా తెచ్చినప్పటికీ రూ.20 లక్షలు ఎలా చెల్లి స్తారన్నారు. ఎల్ఈడీ లైట్లు వేసే వరకు ఉన్న లైట్లకు మరమ్మతులు చేయాలని బీజేపీ కౌన్సిలర్ రావు ల శ్రీనివాస్రెడ్డి అధికారులను కోరారు. 16వ వార్డుకు చెత్త ట్రాక్టర్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాక్టర్ పంపించి వార్డు ప్రజల సమస్య పరిష్కరించాలని ఆ వార్డు కౌన్సిలర్ అబ్బగోని కవిత తెలిపారు. చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడ నీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరిస్తామని, పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాల న్నారు. అనంతరం ఏజెండా అంశాలను ఆమోదించినట్లు చైర్పర్సన్ ప్రకటించారు. సమావేశంలో స్వతంత్ర సభ్యుడు జయప్రకాశ్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అహ్మద్ కలీం, కౌన్సిలర్లు మొరిశెట్టి సత్యనారాయణ, బొజ్జ నాగరాజు, పిల్లి సత్యవతి, మొయిన్, ఆలకుంట్ల నాగరత్నంరాజు, ఖయ్యుంబేగ్, మారగోని నవీన్కుమార్, ఎండ్ల గీత, తక్కెళ్ల హారిక, దుబ్బ అశోక్సుందర్, మెరుగు కౌసల్య, కేసాని కవిత పాల్గొన్నారు. -
సొమ్మొకరిది.. సోకొకరిది
► 20 ఏళ్లుగా బడాబాబుల చేతుల్లో మున్సిపల్ షాపులు ► కార్పొరేషన్కు తక్కువ అద్దె చెల్లింపు ► బయటి వ్యక్తుల నుంచి ఎక్కువ బాడుగ వసూళ్లు నెల్లూరు సిటీ: సొమ్మొకొరిది.. సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగరపాలక మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. షాపు లీజుదారులకు అధికార పార్టీ నేతల అండదండలు కొనసాగుతున్నాయి. ఫలితంగా రెవెన్యూకు రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్లు కార్పొరేషన్ పరిధిలోని 14 మున్సిపల్ కాంప్లెక్స్లలో 234 షాపులు ఉన్నాయి. వీటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైగా కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులకు పదేళ్లుగా కొందరు బినామీలుగా వ్యవహరిస్తున్నారు. షాపు లీజుకు తీసుకొని మూడేళ్లు దాటితే వేలం నిర్వహించాలనే నిబంధన అమలు కావడంలేదు. కొన్నిసార్లు వేలం నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు యత్నించగా, బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో వేలం నిర్వహించకుండా లీజుదారుడికే కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లీజుదారుడొకరు.. బాడుగకు ఉండేది మరొకరు మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపును నిర్వహించాల్సి ఉంది. అయితే లీజుదారుడు కార్పొరేషన్కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయటి వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజార్, డైకస్రోడ్డు, మద్రాస్ బస్టాండ్, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో కొందరు షాపులను వేలంలో రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేలకు దక్కించుకొని, వేరే వ్యక్తులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల బాడుగకు ఇస్తున్నారు. దీంతో కార్పొరేషన్ ఆదాయానికి రూ.లక్షల మేర గండిపడుతోంది. వేలం నిర్వహణకు అడ్డంకులు గతంలో కమిషనర్ మూర్తి కార్పొరేషన్ పరిధిలో 25 ఏళ్ల లీజు దాటిన 65 షాపులకు వేలం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. వేలం తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది జరిగి ఏడాదిన్నర కావస్తున్నా, వేలం దిశగా ముందుకెళ్లడంలేదు. ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుండగా, వీరిలో ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా షాపును సీజ్ చేసి, వారి వద్ద నుంచి అధిక మొత్తంలో నగదును డిమాండ్ చేస్తున్నారు. తానడిగిన మొత్తాన్ని ఇస్తే షాపును తెరిచేందుకు అనుమతులు వస్తాయంటూ బెదిరింపుల పర్వానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం
-
కత్తులు, ఇనపరాడ్లతో టీడీపీ నేతల అరాచకం
ఏపీలో వైఎస్సార్సీపీ వర్గీయులపై దౌర్జన్యకాండ డోన్ టౌన్(డోన్): మున్సిపల్ మార్కెట్ వేలంలో పాల్గొనేం దుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం దిన, వారం కూరగాయల మార్కెట్ వేలం పాటలను నిర్వహిం చారు. తమకు పోటీగా వేలం పాటల్లో పాల్గొంటున్నారనే అక్కసుతో వైఎస్ఆర్సీపీ నేతలపై మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్నగౌడ్, అతని అనుచరులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడిచేశారు. వారిని చర్చల పేరిట పిలిపించి.. తీవ్రంగా గాయపర్చారు. అయితే పోలీసులు వీరికి బందోబస్తుగా ఉన్నారే తప్ప అదుపులోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేలం ముగిసిన తర్వాత పోలీసులు తీరిగ్గా వీరిని పోలీసు స్టేషన్కు తరలించడం గమనార్హం. -
మునిసిపల్ బాండ్ మార్కెట్ నిబంధనల సరళీకరణ
న్యూఢిల్లీ: మునిసిపల్ బాండ్ మార్కెట్కు సంబంధించిన నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ సరళీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించానులనుకునే మునిసిపాలిటీలు 2013–14 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల(2013–14, 2014–15, 2015–16) ఆడిట్ చేసిన అకౌంట్లను స్టాక్ ఎక్సే్చంజ్లకు సమర్పించాలని సెబీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సర అకౌంట్లు సమర్పించడం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ అకౌంట్లను వచ్చే ఏడాది మార్చి 31లోపు సమర్పించాల్సి ఉంటుంది. -
దళారుల దందా..!
► జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ► ఉచితంగా ఆసుపత్రుల్లోనే పంపిణీ ► తెలియని వారి నుంచి సొమ్ము దండుకుంటున్న వైనం ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అవసరం ప్రతి ఒక్కరికి సర్వ సాధారణమైంది. విద్యాభ్యాసం నుంచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకునేంత వరకు అవసరం ఏదైనా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయగా... చనిపోయిన వారి మరణాన్ని ధ్రువీకరిస్తూ అధికారికంగా జారీ చేసే ధ్రువపత్రానికి అంతే విలువ పెరిగిపోయింది. ఈ రెండు పత్రాలు పొందే ప్రక్రియ తెలియని వారు దళారుల వలలో పడి మోసపోతున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో ఇదే అదునుగా చేసుకుంటున్న పలువురు మున్సిపల్ సిబ్బందితో పాటు వారి అనుచరులుగా వ్యవహరిస్తున్న దళారులు అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. ఉచితంగానే ఇచ్చే ధ్రువీకరణ పత్రాల కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారు. విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో నిత్యం జననలతో పాటు మరణాలు పదుల సంఖ్యలోనే జరుగుతుంటాయి. జిల్లా కేంద్రం కావటం... పేరొందిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడే ఉండటంతో గర్బిణులు ప్రసవంతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చికిత్సలు చేయిస్తుంటారు. ఇలా వైద్య సేవల కోసం వచ్చిన వారిలో నూతనంగా జన్మించిన పిల్లలు, పరిస్థితి చేయిదాటి మరణించిన వారు ఉంటారు. వీరికి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. అయితే ఈ రెండు పత్రాల జారీకి సంబంధించి దళారుల అడ్డుగోళ్ల వసూళ్లపై స్పందించిన ప్రభుత్వం గతేడాది డిసెంబర్ ఒకటి అనంతరం జన్మించిన జననాలు, మరణాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఆయా ఆసుపత్రులు, మున్సిపాలిటీలు నుంచి పొందే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలియని పలువురు దళారుల పాలిట పడి చేతి చమురు వదిలించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు గతంలో అమల్లో విధానం ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణలను మున్సిపాలిటీ ధ్రువీకరరించిన తరువాత మీసేవా కేంద్రాల ద్వారా పొందే వారు. అయితే ఈ ప్రక్రియలో దళారులు కీలక పాత్ర పోషించే వారన్న అపవాద లేకపోలేదు. దీంతో నూతన విధానం ద్వారా దళారుల ఆగడాలకు చెక్ పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం విజయనగరం మున్సిపాలిటీలో నూతన విధానం అమలు తరువాత ఇప్పటి వరకు 400 మరణాలు, 920 జననాలు జరిగినట్లు మున్సిపల్ అధికారుల సమాచారం. వీరిలో 300 జననాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపాలిటీ నుంచి సదరు పిల్లల తల్లిదండ్రులు పొందారు. అయితే జనన ధ్రువీకరణకు సంబంధించి ఆయా ఆసుపత్రుల్లోనే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం వెళ్లి మరణిస్తే సదరు ధ్రువీకరణ పత్రం కూడా అక్కడే పొందవచ్చు. అదే ఇంటి వద్దనే సాధారణ మరణం సంభవిస్తే వివరాలను మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించుకోవటం ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవచ్చు. విషయం తెలియని చాలా మంది దళారుల చేతికి చిక్కి ఇబ్బందులు పడుతున్నట్లు కార్యాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా.... 2016 సంవత్సరం డిసెంబర్ ఒకటి అనంతరం మున్సిపాలిటీ పరిధిలో జరిగే జనన, మరణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారు సదరు ఆసుపత్రి నుంచే పొందవచ్చని, ఇంటి వద్ద జరిగే వాటికి సంబంధించి మున్సిపాలిటీలో నమోదు చేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు
కొవ్వూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను గడువులోగా భవన క్రమబద్ధీకరణ (బీపీఎస్) పథకంలో క్రమబద్ధీకరించుకోవా లని, లేకుంటే అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం రీజియన్ పట్టణ ప్రణాళిక శాఖ ఆర్జేడీ పీఎన్ఎస్ సాయిబాబా హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని కట్టడాల ఫొటోలను ఆయా పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏపీ మున్సిపల్ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించామన్నారు. 20,483 దరఖాస్తులు రాజమహేంద్రవరం రీజియన్లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భవన క్రమబద్ధీకరణకు 20,483 దరఖాస్తులు వచ్చాయని ఆర్జేడీ సాయిబాబా తెలిపారు. వీటిలో 78 దరఖాస్తులను తిరస్కరించగా 6,104 పరిశీలనలో ఉన్నాయన్నారు. 14,286 మందికి భవన క్రమబద్ధీకరణ జరుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం లో ఆన్లైన్ ద్వారా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం 2016 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. సక్రమమైన బిల్డింగ్ ప్లాన్ ద్వారా గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చన్నారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్కు అప్రూవల్ వస్తే భవన యజమానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మెసేజ్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారమే నిర్మాణం ఉండాలి దరఖాస్తుదారుడు ఆన్లైన్లో నియమ నిబంధనలు తప్పక పాటించాలని, మం జూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మెస్సర్స్ సాఫ్ట్ టెక్నాలజీ ఇంజినీరింగ్స్ సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇస్తారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ చేయాలని, నిబంధనలను అతిక్రమించి కట్టడాలు చేపడితే సంబం ధిత సిబ్బంది, ప్లాను వేసి లైసెస్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవ్వూరు మాస్టర్ ప్లాన్కు ఆమోదం కొవ్వూరు పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థించగా ప్రభుత్వం ఆమోదం తె లిపిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టెండర్ విధానం ద్వారా ఆన్ గ్రౌండ్ అభివృద్ధి, శాటిలైట్ చిత్రాల ద్వారా రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తామని ఆర్జేడీ సాయిబాబా పేర్కొన్నారు. -
సెల్లార్లు పార్కింగ్కే పరిమితం
చీరాల అర్బన్ : ప్రైవేట్ హాస్పిటళ్లలో వాహనాల పార్కింగ్కు కేటాయించిన సెల్లార్లలో ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 15 ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనాలు నిర్మించే సమయంలో సెల్లార్లుగా రికార్డుల్లో చూపించి అందులో ల్యాబ్లు, ఆఫీసులు, స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చీరాల్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లు పార్కింగ్కు వినియోగించడం లేదన్నారు. హాస్పిటల్కు చెందిన అంబులెన్స్లు, రోగుల తరఫు వాహనాలను రోడ్డుపై నిలిపేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్నారు. అగ్నిప్రమాదం జరిగితే తీరని నష్టం మిగులుతుందన్నారు. గతంలోనూ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, వారికి మరోమారు నోటీసులిస్తామని చెప్పారు. భవన నిర్మాణం చేసే సమయంలో ఇచ్చిన ప్లానుకు విరుద్ధంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారని, అటువంటి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాను ఆమోదం పొంది ప్లానుకు వ్యతిరేకంగా నిర్మించిన వాటిని తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రీజియన్ పరిధిలో నెల్లూరు జిల్లాలో ఈ నిబంధనలు అమలు చేశామని, ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.బ్రహ్మయ్య, టాస్క్ఫోర్సు సిబ్బంది కె.ఎం.చంద్రశేఖర్, మల్లిఖార్జునరావు, అంకయ్య, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నిబంధనలకు నీళ్లు..యథేచ్ఛగా అక్రమాలు
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో అక్రమ వెంచర్లు రోజు రోజుకూ జోరుగా వెలుస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించి అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై అడ్డదారులు తొక్కుతూ మున్సిపల్ కౌన్సిల్ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల ఓ కౌన్సిలర్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని సర్వేనంబర్ 508లోని 5.275 గుంటల భూమిని తమ పేరున లే ఔట్ చేయాలని కోరుతూ నాగేల్లి అంజన్ బాబు, జంగిటి మురళీధర్లు 2012 నవంబర్ 15న హైదరాబాద్ డీటీసీపీకి దరఖాస్తు చేసుకొని, భూ మార్పిడి ఉత్తర్వులను తీసుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం హైదరాబాద్ డీటీసీపీ ఆమోదం తెలుపుతూ తదుపరి చర్యల కోసం మెదక్ మున్సిపాలిటీకి పంపించారు. లేఔట్ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో రోడ్లు, పార్క్ స్థలాన్ని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి ఫైనల్ లే ఔట్ రిలీజ్కు కోరినట్లు మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఎజెండాలో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ డీటీసీపీ నిబంధనల ప్రకారం లే ఔట్లో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాక ఫైనల్ లే ఔట్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ లే ఔట్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకముందే వారు అనుమతినివ్వడానికి మున్సిపల్ ఎజెండా అంశాల్లో పేర్కొని అధికారులు కౌన్సిలర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని 7వ వార్డు కౌన్సిలర్ అమీన అహ్మద్ ఆరోపించారు. మున్సిపల్ అధికారులు సదరు లే ఔట్ ప్లాట్లో స్థల పరిశీలన చేసి అన్ని సక్రమంగా ఉన్నాయని, ఫైనల్ లే ఔట్ రిలీజ్ చేసేందుకు ఎజెండాలో పొందు పర్చారని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని, అక్రమ లేఔట్పై జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే మున్సిపల్ కమిషనర్ స్వయంగా లేఔట్ను పరిశీలించాకే పర్మిషన్ ఇవ్వాలని, కానీ అలా జరగలేదని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని పాత వివేకానంద స్కూల్ ప్రాంతం సర్వే నం. 368లో ఒక ఎకరం‡ 32 గుంటల భూమిలో రోడ్లు లేవు, పార్కు లేదు, కరెంట్ స్తంభాలు లేవు. మున్సిపాలిటీకి ఆదాయం లేదు. సుమారు రూ.8కోట్ల విలువైన స్థలంలో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారన్న విషయంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కోరారు. కమిషనర్ వివరణ ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావును వివరణ కోరగా నిబంధనలు పూర్తి చేశాకే ఫైనల్ లే ఔట్ రిలీజ్ చేస్తామని తెలిపారు. కౌన్సిల్ ఆమోదం కోసమే ఎజెండా అంశాల్లో లేఔట్ను ఉంచామని చెప్పారు. కానీ ఫైనల్ లేఔట్ రిలీజ్ అంటూ ఎజెండాలో పేర్కొనడం గమనార్హం. -
ఏడుగురు మంత్రులకు ఉద్వాసన..!
-
మంత్రి పదవికి లోకేశ్ ఒత్తిడి ఉగాదికి ముహూర్తం!
మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ► మృణాళిని, పల్లె, రావెల, పీతల, పత్తిపాటి, నారాయణలకు ఉద్వాసన ► నారాయణకు సీఆర్డీఏ చైర్మన్ పదవి... లోకేశ్కు మున్సిపల్, ఐటీ శాఖలు ► కళా వెంకట్రావు, అఖిలప్రియ, అమర్నాథ్రెడ్డి, మాగుంట, మహ్మద్ జానీ, గొల్లపల్లి, సుజయకృష్ణకు పదవులు! సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19న మంచి ముహుర్తమని, ఆరోజు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేశ్ నక్షత్రబలం బాగుందని, అదే రోజు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీని ఇప్పుడే చెప్పాలంటూ లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు పట్టు పట్టారని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఉగాది రోజు కేబినెట్లో మార్పులు, చేర్పులు చేపడతా నని, ఉగాది మంచి రోజుని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే ఎన్నికల్లో ఏదైనా జరిగితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే లోకేశ్కు మంత్రి పదవి ఇచ్చి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీకి చెందిన అత్యున్నత వర్గాలు తెలిపాయి. లోకేశ్కు మున్సిపల్–పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి, సీఆర్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడుగురికి ఉద్వాసన... కేబినెట్లో భారీగా మార్పులు, చేర్పులు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఆరుగురు లేదా ఏడుగురికి ఉద్వాసన పలకనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న మృణాళినికి ఉద్వాసన పలకనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నారని, ఆయనపై కూడా కత్తి వేలాడుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రావెల కిషోర్బాబు, గనులు శాఖ మంత్రి పీతల సుజాత, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్ జానీకి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు! వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపడమే కాకుండా కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను మంత్రివర్గం లోకి తీసుకోవడంపై తర్జనభర్జన పడుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అమరనాథ్రెడ్డి, సుజయ రంగారావులకు కూడా మంత్రి పదవులు దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి. అయితే వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయా జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు ఇప్పటికే పార్టీ అధినేతకు అల్టిమేటమ్లు జారీ చేశారు. -
నంద్యాలలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కామ పిచ్చి
-
‘ఇంటి’గుట్టు రట్టు!
తాడేపల్లిగూడెం రూరల్ : ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇప్పిస్తామంటూ పలువురు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముంటున్న పలువురు పేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి ఇంటి స్థలం ఉంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ యడల సత్యనారాయణరాజుతో పాటు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వంగా సంజీవ వరప్రసాద్, ప్రైవేట్ సర్వేయర్ షేక్ రామ్కఫిర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులు పేదల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా వ్యాపించి చివరకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెవిన పడటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ బీహెచ్ సంగీతరావు, పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘరానా మోసగాళ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎంత మంది మోసపోయారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసి ఉంది. కాగా, నిందితులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. కల్లబొల్లి మాటలు నమొ్మద్దు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమొ్మద్దని మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ సూచించారు. బాధితులు ఎంత మంది ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. చీటింగ్ కేసు నమోదు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ యడాల సత్యనారాయణరాజు, వంగా సంజీవ వరప్రసాద్, షేక్ రామ్ కఫీర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులపై బాధితుడు పైడికొండల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఉసూరుమనిపించారు ఇంటి నిర్మాణానికి రుణం కోసం దరఖాస్తు చేశా. రుణం మంజూరైంది బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థలం పట్టా, రూ.వెయ్యి తీసుకుని రమ్మన్నారు. తీరా అన్ని తీసుకుని వచ్చే సరికి ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది. రుణం మంజూ రైందని ఎంతో సంతోషించా...అంతలోనే ఆనందం ఆవిరైపోయింది. – కొండే వెంకాయమ్మ -
రోడ్లపై టేలాల తొలగింపు
► రాత్రికి రాత్రే తరలించిన మున్సిపల్ సిబ్బంది ► చిరువ్యాపారుల ఆందోళన సిరిసిల్ల : సిరిసిల్లలో టేలాల తొలగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డుపై ఎలాంటి అనుమతి లేకుండా వేసుకున్న టేలాలు, దుకాణా ల ముందు రేకులను శుక్రవారం తొలగించారు.పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఉన్న దుకాణాలను తీసివేశారు. ఇప్పటికే మున్సిపల్ సి బ్బంది ఆయా దుకాణదారులకు టేలా లు తొలగించాలని కోరారు. వారు తొలగించకపోవడంతో రాత్రికి రాత్రే టేలాలను తరలించారు. కోర్టు ప్రాంతంలో కొన్ని టేలాల్లో కంప్యూటర్లు, జిరాక్స్ మి షన్లు ఉండడంతో వాటిని తొలగించాలని కమిషనర్ సుమన్ రావు కోరారు. టేలాల యజమానులు స్పం దించకుంటే తామే తొలగిస్తామని ఆయన వివరించారు. మున్సిపల్ తీరుపై చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చిన్న చిన్న వ్యాపారు లు చేసుకుంటే జీవించే తమ పొట్టలు కొడుతున్నారని వ్యాపారులు పేర్కొం టున్నారు. రోడ్డును ఆక్రమిం చిన వారి పై చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా టేలాలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. పట్టణ ప్రజ లు సహకరించాలని కమిషనర్ కోరారు. -
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి మడకశిర : మున్సిపల్ రీజనల్ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్ప్లాన్ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్ప్లాన్ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, కమిషనర్ నయీద్అహమ్మద్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఫ్లెక్సీల నిషేధం
నల్లగొండ, నల్లగొండ టూటౌన్ :మున్సిపల్ పట్టణాల్లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జనవరి ఒకటవ తేదీ నుంచి నల్లగొండ పట్టణంలో దానిని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టొద్దని, నిబందనలు అతిక్రమిస్తే జరిమానాతో పా టు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయ నాయకులు సహకరించాలి : జేసీ ఫ్లెక్సీల నిషేధంపై రాజకీయ నాయకులు సహక రించాలని జేసీ నారాయణరెడ్డి కోరారు. శుక్రవా రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ ఫ్లెక్సీలు పెట్టవద్దన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్డే నిర్వహించి ఆర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 900 మరుగుదొడ్లు ప్రారంభిం చామని, పనులు కొనసాగుతున్నాయని, నాలుగైదు రోజుల్లో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు లేని మరుగుదొడ్లు 1200 ఉన్నాయన్నారు. సెప్టిక్ ట్యాంకులు నిర్మిం చుకుంటే ప్రభుత్వం రూ.7 వేలు ఇస్తుందని తెలి పారు. ఇందుకు జనవరి 5వ తేదీలోగా ఆధార్ జీరాక్స్ ప్రతితో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోకుంటే ఫిబ్రవరి నెల నుంచి తాత్కాలికంగా రేషన్ సరుకులు నిలిపి వేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సర్టిఫికెట్ వారం రోజుల్లోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వవద్దని కోరారు. డబ్బులు అడిగితే వాట్సాప్ నంబర్ 9000020 940కు సమాచారం అందించాలని కోరారు. నేటితో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు గడువు ముగియనుందని, ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే శనివారంలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అరుణకుమార్ చరణ్, డీఈ వెం కటేశ్వర్లు, ఏసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
సెంట్రల్ లైటింగ్కు ప్రతిపాదనలు
నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో డైట్ కాలేజీ నుంచి మిర్యాలగూడ రోడ్డులో కిలో మీటరు మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. జిల్లా కలెక్టరేట్ ఉన్న సమీపంలోనే రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తెలుత్తుతున్నాయి. ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్కు వెళ్లే వారితో పాటు, రాంనగర్లో ఉన్న వైఎస్సార్ పార్కుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ రోడ్డులో పలు కాలనీలు ఏర్పాటు కావడంతో రాత్రి సమయంలో రాకపోకలు ఎక్కువయ్యాయి. అదే విధంగా పట్టణంలో రద్దీ, వాహనాల సంఖ్య ఇటీవల భారీగా పెరగడంతో యువత స్పీడుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ డివైడర్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్లు వచ్చాయి. రూ. 44.50 లక్షలతో ఏర్పాటు ... పట్టణంలోని భాస్కర్ టాకీస్ నుంచి డైట్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ను ఐదేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. డైట్ నుంచి కేశరాజుపల్లి వరకు రోడ్డు వెడల్పు జరిగినా అక్కడ రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడంతో పలు సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డివైడర్లు లేక ద్విచక్ర వాహనదారులు ఓవర్టెక్ చేసే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. డైట్ నుంచి ఒక కిలో మీటరు మేర డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 44.50 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేశారు. మార్చిలోగా పనుల పూర్తి డైట్ నుంచి బృందావన కాలనీ వరకు ఏర్పాటు చేయబోయే లైటింగ్, డివైడర్ల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సన్నమద్ధమవుతుంది. ఇక్కడ పనులు పూర్తియితే ప్రమాదాలు 90 శాతం తప్పనున్నాయి. కలెక్టరేట్ వద్ద కూడా లైటింగ్ వెలుగులు వెలగనున్నాయి. -
స్థానిక సంస్థలకు చేరని టీడీ నిధులు
9 నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్న రూ.458 కోట్లు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం స్థానిక సంస్థలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి నిధుల్లేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన కోట్ల రూపాయల ఆస్తి బదలాయింపు చార్జీల (ట్రాన్స్ఫర్ డ్యూటీ) నిధులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్నాయి. గత 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3.80 లక్షల రిజిస్ట్రేషన్లకు సుమారు రూ.458 కోట్ల మేర ట్రాన్స్ఫర్ డ్యూటీ (టీడీ)గా రిజిస్ట్రేషన్ల శాఖ ఖాతాలో జమ అయింది. కాగా, వివిధ కారణాలతో ఆయా సంస్థలకు బదిలీ కావాల్సిన టీడీ మొత్తం నెలల తరబడి రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉండిపోయింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల పబ్లిక్ డిపాజిట్(పీడీ) అకౌంట్లు, డీడీవో కోడ్లు తమవద్ద లేనందునే టీడీ మొత్తాలను సంస్థలకు బదలాయించ లేదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
నేటి నుంచి వైవీయూ అంతర్ కళాశాలల పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో యోగివేమన యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడా పోటీలను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్ అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్క్రీడా మైదానంలో, టెన్నీస్ జార్జికారొనేషన్ క్లబ్, బ్యాడ్మింటన్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు పోటీలు జరపనున్నారు. ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైవీయూ రిజిష్టార్ నజీర్ అహ్మద్ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బిరెడ్డి తెలిపారు. -
ప్రణాళికలు తయారు చేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : అదిలాబాద్ పట్టణ అభివృద్ది కోసం మున్సిపల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి పట్టణాభివృద్ది కోసం ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జ్యోతిబుద్ద ప్రకాష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ’అర్బన్-డే’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటి పన్ను వసూళ్లు, ట్రాఫిక్ సమస్యలు, మున్సిపల్ భూముల లీజులు, హరితహారం పథకం అమలు, స్వచ్చభారత్, మున్సిపల్ భూముల రక్షణకై తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా అధిక మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించని వారిపై చర్యలు తీసుకొని వసూళ్లు చేయాలని మున్సిపల్ ఇంజనీర్లను, సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. స్వచ్చభారత్ పథకంలో భాగంగా పూర్తి స్థారుులో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి ఎస్హెచ్జీలను భాగస్వాములను చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంగతయారు, ఇఇ నాగమల్లేశ్వర్రావు, డీపీవో పోచయ్య, డీఎస్పీ కెఎన్. రెడ్డి, ట్రాఫిక్ సీఐ షేర్ అలీ, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి మాట బేఖాతర్..
► పెడచెవిన పెడుతున్న మున్సిపల్ అధికారులు ► ఆసుపత్రుల వద్ద అదే తంతు.. ► అంతా మా ఇష్టం అన్నట్లుగా పార్కింగ్ వ్యవహరం ఆదిలాబాద్ కల్చరల్: పట్టణంలో జనాభా పెరుగుతోంది..రాకపోకలకు ఇబ్బందులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. పట్టణంలో రోడ్లన్ని ఇరుకుగా మారా యి ఆసుత్రుల వద్ద పార్కింగ్ స్థలం లేకుంటే వారికి నోటీసులు ఇవ్వండి..రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి.. పార్కింగ్ ప్లేస్ లేని వారికి నోటీసులు ఇచ్చి.. ఫైర్వారికి సైతం చెప్పి వారి లెసైన్సను క్యాన్సల్ చేద్దాం’’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ఇటీవల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ..ఏ ఆసుపత్రి వద్ద మున్సిపల్ నిబంధనలు కాదు కదా.. ఆయా ఆసుపత్రులు మున్సిపల్ రోడ్డుపై, మురికికాలువపై నిర్మించుకున్న నిర్మాణాలను సైతం తొలగించలేదు. మంత్రిగారూ చెప్పిన వినిపించుకోని స్థారుులో మన మున్సిపల్ అధికారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజమెనండోయ్ వారు ఏమి చేసిన ఒక వర్గం లేకుంటే మరో వర్గానికి వెళ్లోచ్చు అనే తీరును సృష్ఠిస్తున్నారు అధికారులు. మున్సిపల్ అధికారుల పనితీరు కారణంగా మున్సిపాలిటి మరింత వెనుకబాటుకు గురవుతోంది. డీఎంఏ ఇచ్చిన ఆదేశాలను సైతం భేఖతరు చేస్తూ నామమాత్రంగా కొన్ని ఆక్రమణలు తొలగించి అధికారులు నిశబ్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పిన మాటను ఆమలు చేయకపోవడం పై సర్వత్ర టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పట్టణంలోని ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు ఆసుపత్రులు నిర్మించుకున్నారు. పార్కింగ్ స్థలాలు లేకుండా మురికికాల్వలను మూసివేసి నిర్మాణాలు చేశారు. రోగులతో వాహనాలు వచ్చి వ్యాధిగ్రస్తులు తీసుకువెల్లేంత వరకు రోడ్డుపైనే పార్కింగ్లు చేస్తున్నారు. రోడ్లుపై దర్జాగా పార్కింగ్లు చేసిన , మురికి కాల్వలపై నిర్మాణాలు చేసిన ఆ ఆసుపత్రులను మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం పార్కింగ్ ఏరియా లేకుండ ఆసుపత్రులు నిర్మించరాదు. కానీ మన మున్సిపాలిటిలో ని ర్మాణాలు జరిగారుు. కాగా కొందరు గ్రౌండ్ప్లోర్ నిర్మించుకుని వాహనాల పార్కింగ్కు బదులు దుకాణాలు, మెడికల్ , ల్యాబ్ల నిర్వాహణ చేపట్టారు. పట్టణంలోని వివేకానంద చౌక్ నుంచి మొదలుకొని, నేతాజీ చౌక్, శివాజీచౌక్, సినిమా రోడ్డు, ఇలా చాలా చోట్ల ప్రజలు ఆసుపత్రుల వద్ద పార్కింగ్తో అవస్థలు పడుతున్నారు. నోటీసులు లేవు.. పట్టింపులు లేవు.. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు రోడ్ల పై పార్కింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్న మున్సిపల్ అధికారులు నోటీలిచ్చిన దాఖలాలు లేవు. రాష్టట్ర మంత్రి జోగురామన్న నోటీసులు అందించమని చెప్పిన ఇప్పటి వరకు అధికారులు ఆ దిశగా అడుగులు వేయనట్లు సమాచారం. దీంతో ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నచందంగా ఆసుపత్రిల వద్ద పార్కింగ్ వ్యవస్థ మారింది. ఈ ప్రాంతాలలో పలువురు ప్రమాదాలకు గురైన సందర్బాలు కూడా ఉన్నారుు. ఉన్నతాధికారులకు లేఖరాసి పార్కింగ్ ప్రాంతాలు లేని వారికి నిబంధనల మేరకు లెసైన్సలు రద్దు చేసేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రోడ్ల సమస్యలు పునరావృతం కావద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలానికి నగరంలో రోడ్ల సమస్యలు కనిపించవద్దని, రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడంతోపాటు నాణ్యతాపరంగా రాజీ పడవద్దని మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలొచ్చినప్పుడు కాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలతో పనులు చేపట్టాలని, నీటి నిల్వ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలో రోడ్ల అభివృద్ధి, ప్రజారవాణా, జంక్షన్ల అభివృద్ధి తదితర పథకాలపై మంత్రి బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, జలమండలి ఎండి దానకిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్లో 127 రోడ్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని, ఇందులో 57 రోడ్ల పనులను వెంటనే చేపట్టాలన్నారు. మొదటి దశలో వీటికయ్యే ఖర్చు రూ.208 కోట్లలో ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు అందజేస్తామన్నారు. వైట్ టాపింగ్ రోడ్ల క్యారేజ్వేలు వచ్చే వర్షాకాలంలోగా పూర్తి చేయాలని సూచించారు. 100 జంక్షన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా 30 జంక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. స్కైవేల ఆటంకాలు తొలగించండి కేబీఆర్ పార్కు వద్ద స్కైవే పనులకు సంబంధించి నేషనల్గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఉన్న కేసు త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్సార్డీపీ (స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్) పనులపై సవివరంగా సమీక్షించిన మంత్రి.. రూ. 2,631 కోట్లతో ఐదు ప్యాకేజీల్లోని పనులు మందకొడిగా సాగుతుండటంపై ఆరా తీశారు. పనుల జాప్యానికి కారణమైన భూసేకరణ గురించి కేంద్రమంత్రులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45ను వాణిజ్య కేటగిరీగా ప్రకటించనున్నట్లు టౌన్ప్లానింగ్ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. జూబ్లీహిల్స్లో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి పాత బొంబారుు హైవే మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొంది ంచాల్సిందిగా మంత్రి ఆదేశించారు. 480 లేన్ కి.మీ. మేర వైట్టాపింగ్.. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరంలో రూ.1,275 కోట్లతో 480 లేన్ కి.మీ.ల మేర వైట్టాపింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొం దించినట్లు తెలిపారు. నగరంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రూ. 75 కోట్లతో 489 పనులు చేపట్టినట్లు చెప్పారు. వీటిల్లో 176 పనులు పూర్తికాగా, మిగతా పనుల్ని త్వరితంగా పూర్తిచేయడంతోపాటు నాణ్యతలో రాజీ పడవద్దని హెచ్చరించారు. అధికారులపై మంత్రి ఆగ్రహం.. నగరంలో రహదారుల దుస్థితి, ముందుకు సాగని ఎస్సార్డీపీ, పురోగతి లేని వైట్టాపింగ్ పనులకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉ న్నారుు. రహదారుల దుస్థితిపై ఎన్ని పర్యాయాలు చెప్పినా ఫలితం కనిపించడం లేదన్నారు. నెలనెలా కన్జర్వెన్స సమావేశాలు జరుగుతున్నా శాఖల మధ్య సమన్వయ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ల వల్లే నగరానికి చెడ్డపేరు వస్తోందని, ఎక్కడకు వెళ్లినా ప్రజలు హైదరాబాద్ రోడ్ల గురించి దారుణంగా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితి మారాలన్నారు. -
ఫుడ్కోర్టు తొలగింపు యత్నం.. వివాదం
విజయవాడ: ఫుడ్కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్కోర్టు తొలిగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యంతో ఫుడ్కోర్టు తొలగింపు వివాదం కాస్తా సద్దుమనిగింది. -
రూ.50 లక్షలతో బాహుదాలో పూడికతీత
– పనులను పర్యవేక్షించిన కమిషనర్, డీఈ – ఈ నెల 15వ తేదీకి పనులు పూర్తి మదనపల్లె: మున్సిపల్ పరిధిలోని బాహుదా కాలువలో పూడికతీత పనులను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదట పనులు చేసేందుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందనే అంచనా వేశారు. అది ప్రస్తుతం రూ.50 లక్షలకు చేరింది. ఈ పనులను శనివారం కమిషనర్ విశ్వనాథ్ పర్యవేక్షించారు. ఆయన మట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 12 జేసీబీలు, 36 ట్రాక్టర్లతో పూడికతీత పనులు చేపట్టామన్నారు. రోజుకు దాదాపు 70 మీటర్ల చొప్పున పూడికతీత తీస్తున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీకల్లా బాహుదా, ముగ్గురాళ్ల వంకలో పూడికతీత పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని చెప్పారు. వందేళ్ల తర్వాత బాహుదాలో పూడికతీత పనులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంట డీఈ మహేష్, వైఎస్సార్సీపీ జిల్లా కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధి ఇష్టం లేదా ?
బద్వేలు అర్బన్: పట్టణాభివృద్ధికి సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని 7 నెలలు అవుతున్నా ఇంతవరకు రిపోర్ట్ తయారు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని అసలు పట్టణాభివృద్ధి జరగడం మీకు ఇష్టం లేదా అంటూ ఎమ్మెల్యే జయరాములు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో చైర్మన్ పార్థసారథి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ కార్యాలయంలోనైనా అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇష్టానుసారంగా సమయానికి విధులకు రాకుండా అలసత్వం వహిస్తే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని అన్నారు. పట్టణంలో నివాసం లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వరాదని, కమిషనర్ను ఆదేశించారు. మున్సిపాలిటీకి పన్నుల నుంచి వచ్చే ఆదాయం మినహా ఇతర ఆదాయం లేకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని నిధులు మంజూరుచేయించాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు. అంతకుముందు వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే , చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. తొలుత ఊరీ ఘటనలో మృతిచెందిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై రూపొందించిన అజెండాపై చర్చించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కమిషనర్ శివరామిరెడ్డి , డిఈ తులసికుమార్, ఆర్ఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ మధుకుమార్లతో పాటు వైస్చైర్మన్ గాజులపల్లె శ్రీదేవి, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశం రసాభస
-
ఐదు నిమిషాల్లో ముగించారు..
మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీరు ఇదీ.. ఆదిలాబాద్ కల్చరల్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఐదు నిమిషాల్లో ముగిసింది. మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు, మున్సిపల్ వైస్చైర్మన్ ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమవగానే ఉరీ ఘటనలో మృతిచెందిన అమర జవాన్లకు నివాళులర్పించి రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లు అందరు ఎజెండా పాస్ చేస్తున్నామంటూ కౌన్సిల్ నుంచి వెళ్లి పోయారు. దీంతో అధికారులు సైతం వెళ్లి పోయారు. కాగా మున్సిపల్ వైస్చైర్మన్ ఫరూక్ అహ్మద్ టౌన్ప్లానింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీపీవో శ్రీనివాస్ గతంలో పని చేసిన ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండ్కు గురయ్యారని చెప్పారు. ద్వారనగర్లో అక్రమంగా నిర్మాణానికి అనుమతులిచ్చారని, అన్ని సంక్రమంగా ఉన్న భవనాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వారంతా మద్దతునిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై త్వరలో హైకోర్టును సంప్రదించనున్నట్లు తెలిపారు. -
ఇదే చివరి అవకాశం...
- అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగిస్తాం - మునిసిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక - శిథిల భవనాలు కూలితే కమిషనర్లదే బాధ్యత సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కమిషనర్ల పనితీరుపై పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వారిపై వారంలోగా చర్యలుంటాయన్నారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారు చేసి తనకు పంపించాలని పురపాలక శాఖ డెరైక్టర్ దానకిశోర్ను మంత్రి ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మునిసిపల్ కమిషనర్లతో సోమవారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో శిథిల భవనాలను వెంటనే గుర్తించి, కూల్చేయాలని గతంలో పలు మార్లు ఆదేశించినా మునిసిపల్ కమిషనర్లు దాన్ని అమలు చేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శిథిల భవనాలను తక్షణమే కూల్చేయాలని, వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ భవనాలు పడిపోయి ప్రాణనష్టం జరిగితే కమిషనర్లనే బాధ్యులను చేస్తామని హెచ్చ రించారు. కమిషనర్లందరూ ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తానన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, డెరైక్టర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేయండి... ‘నగరాలు, పట్టణాల్లో వరదలకు దారితీస్తున్న కారణాలను గుర్తించాలి. ప్రతి మునిసిపాలిటీ పరిధిలో జల వనరులు, చెరువుల వివరాలను డిజిటలైజ్ చేయాలి. అన్ని చెరువులు, నాలాల మ్యాపులను సిద్ధం చేసుకోండి. వీటిపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయండి. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు’ అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కూల్చివేతల్లో పేదవారినే టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన కట్టడాలను కూల్చేయాలన్నారు. ఇరుకుగా మారిన నాలాలను వెడల్పు చేయాలన్నారు. ఈ పనుల కోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జారుుంట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల అనంతరం ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాడైన రోడ్లకు మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలన్నారు. ఒకటి నుంచి నీటి మీటర్ లేకుంటే రెట్టింపు బిల్లు గ్రేటర్లోని గృహ, వాణిజ్య నల్లా కనెక్షన్లకు నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోని పక్షంలో అక్టోబర్ ఒకటి నుంచి రెట్టింపు బిల్లులు వసూలు చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ జలమండలిని ఆదేశించారు. మహానగరంలో మొత్తం 8.75 లక్షల నల్లా కనెక్షన్లకు గాను సుమారు 5 లక్షల నల్లాలకు మీటర్లు లేనందున బోర్డు ఆదాయానికి భారీగా గండి పడుతుండడంతో ఈ నిర్ణయం అమలు చేయాలని సూచిం చారు. సోమవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన సందర్భంగా జలమండలి పథకాలను ఆయన సమీక్షించారు. నగరంలో దెబ్బతిన్న, పురాతన పైపులైన్ల నాణ్యత, మన్నికపై నిపుణుల కమిటీతో తక్షణం అధ్యయనం చేయాలన్నారు. పదేళ్లకు పైబడిన పైపులైన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరా ఆధారిత సెన్సర్లను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం ద్వారా బోర్డు ఆదాయం నెలకు వంద కోట్ల మేర సాధించాలని ఆదేశించారు. నగరంలోని 4 లక్షల మ్యాన్హోళ్లను జియోట్యాగింగ్ చేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
అలా చేయకపోతే పోటీకి అనర్హులు!
హైదరాబాద్: మున్సిపల్ చట్టంలో సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టంలో సవరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ వార్డుల్లో ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థి.. ఉపసంహరణ గడువులోగా ఒక వార్డు మినహా మిగిలిన చోట పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందంటూ తాజా ఉత్తర్వులో పేర్కొంది. అలా చేయని పక్షంలో ఆయా వార్డుల్లో అభ్యర్థి పోటీకి అనర్హుడవుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘ఎజెండా’పై గందరగోళం
వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు 327 అంశాలపై చర్చించిన కౌన్సిల్ పలు పనులకు అనుమతి మంజూరు కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మళ్లీ రసాభాసగా మారింది. ఎజెండా అంశాలపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం చెలరేగింది. సమావేశం ఏకపక్షంగా సాగుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్పర్సన్ పిప్పిరి సుష్మ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తొలిసారి హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కౌన్సిల్ సమావేశంలో 327 అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ వాకౌట్.. సమావేశం ప్రారంభం కాగానే కాంగ్రెస్ కౌన్సిలర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలను ఇప్పుడు సభ ముందు ఎలా ఉంచుతారని నిలదీశారు. గత ఎజెండా అంశాలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టుకు సమాధానం పంపాల్సిన అధికారులు.. అదేమీ పట్టించుకోకుండా పాత ఎజెండాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశం టీఆర్ఎస్ సమావేశంలా మారిందంటూ నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిమ్మ దామోదర్రెడ్డి, జమీల్, రామ్మోహన్, బట్టు మోహన్, లక్ష్మణ్రావు, శశిరేఖ, పద్మ, సునీత వాకౌట్ చేశారు. పనుల నిర్వహణకు అనుమతులు.. అనంతరం సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన నిధులతో చేపట్టే ప్రగతి పనులకు కౌన్సిల్ సమావేశం అనుమతించింది. సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, పైప్లైన్ నిర్మాణాలు, సీసీ డ్రైనేజీలు, మురుగుకాలువ నిర్మాణాలు,అవుట్ సోర్సింగ్ సిబ్బంది టెండర్, సెంట్రల్ లైటింగ్ పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. నీటి సమస్య నివారణకు టాస్క్పోర్సు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటర్వర్క్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్, టౌన్ప్లానింగ్ విభాగాలను ప్రక్షాళన చేయాలని కౌన్సిలర్ భూంరెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను కోరారు. స్పందించిన ఆయన మిగులు సిబ్బందిని అవసరమున్న చోటుకు పంపించాలని కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది పైరవీలు చేస్తున్నారని కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్, రవియాదవ్ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించగా.. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేస్తానని కమిషనర్ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మడిగెలకు, మటన్ మార్కెట్ మడిగెలకు అద్దె నిర్ణయించాలని, తద్వారా మున్సిపల్ ఆదాయం పెరుగుతుందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వైస్ చైర్మన్ మసూద్అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. చేపల మార్కెట్గా బల్దియా: ప్రభుత్వ విప్ మున్సిపల్ కార్యాలయం చేపల మార్కెట్గా మారిందని విప్ గంగ గోవర్ధన్ వ్యాఖ్యానించారు. దీన్ని మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. కామారెడ్డి నూతన జిల్లా కానున్న తరుణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. కౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై జోక్యం చేసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ ఎజెండాపై కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం కామారెడ్డి: మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండాలో చేర్చిన 1, 2, 3, 4 అంశాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మకు డీసెంట్ నోట్ అందజేశారు. ఈ బాక్స్ టెండర్లకు సంబంధించి ఎటువంటి నోటీసులను ప్రదర్శించ లేదని, నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయడానికి రహస్య టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎజెండా అంశంలోని 179వ అంశంపై బీజేపీ కౌన్సిలర్ భారతమ్మ డీసెంట్ నోట్ అందించారు. మున్సిపల్ జనరల్ ఫండ్ను మసీదులు, మందిరాల వద్ద వాడవచ్చా లేదా అని ప్రశ్నించారు. -
వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన
పలమనేరు :బకాయిపడిన మూడు నెలల వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. వేతనాలు అందక కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై మున్సిపల్ కార్మికులు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరికి సీపీఐ నాయకుడు చెన్నకేశవులు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, కార్మికులకు మూడు నెలలుగా వేతనం లేకుంటే ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులే ఒకటో తేదీ జీతం రాకుంటే, ఇబ్బందులు పడే ఈ రోజుల్లో కార్మికుల బతుకులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో కార్మికసంఘ నాయకులు శ్రీనివాసులు, చిన్నబ్బ తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్లలో ఉద్రిక్తత
చైర్మన్ రాజీనామా చేయాలని మున్సిపల్ ముట్టడికి యత్నం సమావేశం వాయిదా చైర్మన్ దిష్టిబొమ్మ దహనం గుండు గీయించుకుని నిరసన తెలిపిన కౌన్సిలర్ కోరుట్ల: రెవెన్యూ డివిజన్ అంశం చర్చ కోసం ఏర్పాటుచేసిన మున్సిపల్ అత్యవసర సమావేశం ఉద్రిక్త పరిస్థితుల్లో వాయిదా పడింది. చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ మున్సిపల్ ముట్టడికి కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై మున్సిపల్ చైర్మన్ శీలం వేణు దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశం వాయిదా.. రెవెన్యూ డివిజన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల తరువాత సాధన సమితి ప్రతినిధులు కోరుట్ల డివిజన్ ఉద్యమానికి మద్దతుగా మున్సిపల్ కౌన్సిల్ రాజీనామా చేయాలని కోరారు. దీంతో 16 మంది కౌన్సిలర్లు పదవులకు రాజీనామా ప్రకటించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరారు. చైర్మన్ వేణు, కొందరు కౌన్సిలర్లు రాజీనామా ప్రకటన చేయకపోవడంతో సాధన సమితి ప్రతినిధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటికే మున్సిపల్ చైర్మన్ శీలం వేణు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సమావేశం వాయిదా వేయాలని కోరుతూ కమిషనర్ వాణిరెడ్డికి లేఖ ఇవ్వగా.. వాయిదా వేసినట్లు ప్రకటించారు. సమావేశానికి బీజేపీ కౌన్సిలర్ ఇందూరి సత్యం, టీఆర్ఎస్ జువ్వాడి వర్గం కౌన్సిలర్లు గండ్ర రాజనర్సింగరావు, తిరుమల గంగాధర్, రియాజ్, లోకిని రంజిత్ హాజరయ్యారు. గుండు గీయించుకున్న కౌన్సిలర్ రెవెన్యూ డివిజన్ అంశంపై ఏర్పాటు చేసిన కీలక సమావేశాన్ని ఎలా వాయిదా వేశారని కౌన్సిలర్లు ఇందూరి సత్యం, గండ్ర రాజు అధికారులను నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్ సమావేశానికి రావాలని డిమాండ్ చేశారు. చైర్మన్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఇందూరి సత్యం గుండు గీయించుకున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ శీలం వేణు రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని కోరారు. చైర్మన్ దిష్టిబొమ్మ దహనం మున్సిపల్ సమావేశం వాయిదా పడటం.. ముట్టడి జరగకుండా పోలీసులు బందోబస్తుతో అడ్డుపడడంతో డివిజన్ సాధన సమితి ప్రతినిధులు జాతీయ రహదారిపై చైర్మన్ దిష్టిబొమ్మను దహనంచేశారు. అనంతరం మళ్లీ నల్లజెండాలతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ముట్టడికి యత్నించారు. సాయంత్రం 4గంటల సమయంలో నల్లజెండాలతో మున్సిపల్కు చేరుకున్న సాధన సమితి ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల బారికేడ్లు దాటి సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం ఒక్కడే మున్సిపల్ ఆవరణలోకి చేరుకోగా జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆయనను బయటకు పంపించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉన్న డీఎస్పీ పరిస్థితులను నియంత్రించారు. -
మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్
ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ చాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్గా నిలిచింది. ఈ క్యాంపెయిన్తో పాటు మోదీ మొదటిసారి ఎక్కడైతే చాయ్ పే చర్చను ప్రారంభించారో ఆ టీ స్టాల్కూ ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్నాక్ అవుట్లెట్ను మున్సిపల్ అధికారులు మూసేశారట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ టీ స్టాల్ ఉండటంతో పాటు, సరియైన భవన వాడక అనుమతులు లేకపోవడంతో దీన్ని సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఇస్కోన్ గాంతియా టీ స్టాల్తో పాటు మొత్తం ఎనిమిది స్నాక్ అవుట్లెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు సరియైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాటు హైవే అంతా కస్టమర్లతో గందరగోళంగా మారుతోంది. దీనిపై అహ్మదాబాద్ మున్సిపల్ అథారిటీలు వివిధ నోటీసులు పంపినప్పటికీ ఈ అవుట్లెట్లు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయలేదు. నోటీసులు పంపినా స్పందించని అవుట్లెట్లపై సీరియస్ అయిన మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు. చట్టాలను అతిక్రమించి ఈ అవుట్లెట్లను రన్ చేస్తున్నారని, అవసరమైన భవన వాడక అనుమతులు లేవని మున్సిపల్ అథారిటీలు పేర్కొన్నారు. ఈ స్నాక్ అవుట్లెట్లోనే ప్రధాని అభ్యర్థిగా మోదీ మొదటిసారి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ పే చర్చ అనంతరం ఆ టీ స్టాల్కు భారీగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు కుప్పలు తెప్పలుగా విచ్చేస్తున్నారు. దీంతో హైవేపై గందరగోళ వాతావరణం నెలకొంది. -
ఎలా తాగాలి..?
ఆత్మకూరులోని హిల్రోడ్డులో పాచినీరు సరఫరా ఆత్మకూరురూరల్ : పట్టణంలోని హిల్రోడ్డు సమీపంలో యాదవవీధి, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరులో పాచి, తదితర కలుషిత పదార్థాలు వస్తున్నాయని, దీనికితోడు మరుసటిరోజుకు మురుగువాసన వస్తోందని మహిళలు చెబుతున్నారు. నిల్వ చేసుకున్న నీటిపై మరుసటిరోజు జిడ్డులా ఏర్పడి కనీసం వినియోగించేందుకు కూడా వీలుకావడంలేదు. సమస్యను మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. కౌన్సిలర్ సైతం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో రూ.102 కోట్లతో సోమశిల ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అయ్యేలా ఏర్పాటుచేశారు. నీరు శుద్ధి చేసేందుకు శివారుల్లో ఫిల్టర్ ఏర్పాట్లు సైతం చేశారు. అయినా పలు ప్రాంతాల్లో ఇలా కలుషిత జలాలు సరఫరా అవుతుండటంతో పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇటీవల పంటవీధి పరిసరాలలోని రామిరెడ్డి శీనయ్య వీధిలో ఇలాగే కలుషిత జలాలు సరఫరా అయ్యాయి. మున్సిపల్ అధికారులు అన్ని ప్రాంతాల్లో పరిశీలించి కలుషిత జలాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రజల చేతిలో ఆయుధం స.హ చట్టం
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు తిరుపతి : సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఆయుధం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్లోని వైఎస్సార్ సమావేశ మందిరంలో శుక్రవారం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కేసులపై విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. తనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ చట్టం దోహదపడుతుందని పేర్కొన్నారు. పిటిషనర్ అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లోపు కచ్చితంగా అదించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని చెప్పారు. సమాచారం ఇవ్వని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల కు చేరువ చేయడంలో పౌర సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. సమాచార చట్టాన్ని మరింత పటిష్టం చేసేం దుకు కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు. తొలిరోజు విచారణలో మొత్తం 40 కేసులను పరిష్కరించారు. మరి కొన్నింటిపై షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మున్సిపల్ కమిషనర్ గైర్హాజరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి, దినేష్బాబు, అనంతరెడ్డి, రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం పాత కమిషనర్ చేర్చుకున్నారు.. కొత్తాయన వద్దంటున్నారు సంతకం చేయకుండానే విధుల నిర్వహణ ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్తో ఫుట్బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్కు బదిలీ చేసింది. కాని చైర్పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్ను కోరింది. చైర్పర్సన్తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్ను రిజిష్టర్లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు. ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తాము. -
సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం పాత కమిషనర్ చేర్చుకున్నారు.. కొత్తాయన వద్దంటున్నారు సంతకం చేయకుండానే విధుల నిర్వహణ ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్తో ఫుట్బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్కు బదిలీ చేసింది. కాని చైర్పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్ను కోరింది. చైర్పర్సన్తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్ను రిజిష్టర్లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు. ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని ము -
కన్నేస్తే కాజేస్తారు
భీమవరం టౌన్ : మునిసిపల్ రిజర్వ్డ్ స్థలాలపై భూబకాసురుల కన్ను పడింది. ఒకటా రెండా వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఉండటంతో వీటిని ఆక్రమించేందుకు నెమ్మనెమ్మదిగా ముందుకు వస్తున్నారు. జాగా ఉంటే పాగా వేసేద్దాం అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. భీమవరంలో 72 స్థలాలు భీమవరం మునిసిపాలిటీకి 72 రిజర్వ్డ్ స్థలాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 34 ఎకరాలు ఉండగా విలువ రూ.340 కోట్లకుపైనే ఉంది. పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఈ స్థలాలు ఉన్నాయి. అయితే మునిసిపాలిటీ వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ స్థలంలో ముందుగా రెండు గెడలు పాతడం, చిన్న బడ్డీ పెట్టడం అలాగే పాతుకుపోవడం జరుగుతుంది. తర్వాత మోటార్ సైకిళ్లు పార్కింగ్, మొక్కలు పెంపకం అంటూ ప్రారంభించి షెడ్లు వేయడం ద్వారా ఆక్రమించుకుంటున్నారు. వీటిని ఎవరైనా మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసే వరకూ విషయం బయటకు రావడం లేదు. చర్యలు శూన్యం తాజాగా ఈ నెల 12న హౌసింగ్ బోర్డు 9వ వార్డులో సుమారు రూ.3 కోట్ల విలువైన 17 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. కౌన్సిలర్ వేండ్ర విజయదుర్గ, ఆమె సోదరుడు సూర్యప్రకాశ్రావు సమాచారం అందించడంతో మునిసిపల్ అధికారులు స్థలాన్ని కాపాడుకోగలిగారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పట్టణంలో మునిసిపాలిటీ రిజర్వ్డ్ స్థలాలు, వాటికి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై గళం విప్పినా పాలకుల్లో స్పందన లేదు. మునిసిపల్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్లు వేసి, అక్కడ బోర్డులు ఏర్పాటుచేయాలని డీఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఫలితం శూన్యం. ఇంతేకాకుండా స్థలాల పరిరక్షణ కోసం ఏటా బడ్జెట్లో లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నా ఒక్క పనీ జరగడం లేదు. దీంతో స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రహరీలకు ప్రతిపాదనలు మునిసిపల్ ఆస్తులను ఆక్రమించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక్క సెంటు కూడా ఆక్రమణకు గురికానివ్వం. 14 ఆర్థిక సంఘం నిధులతో మునిసిపల్ రిజర్వ్డ్ స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. - కొటికలపూడి గోవిందరావు , మునిసిపల్ ఛైర్మన్ , భీమవరం -
మున్సిపల్ కు పవర్ కట్
♦ అంధకారంలో కార్యాలయం ♦ పౌర సేవలకు అంతరాయం ♦ జిల్లా కేంద్రంలో దుస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం.. రూ.20 వేల బకాయి కూడా చెల్లించలేని ధైన్యం. కార్యాలయానికి ట్రాన్స్ కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా కార్యాలయంలో సేవలన్నీ నిలిచిపోయాయి. ఆన్లైన్, టౌన్ ప్లానింగ్ దరఖాస్తుల అప్లోడ్, జనన, మరణ ధృవపత్రాల జారీకి అంతరాయం కలిగింది. జూన్ మాసానికి చెల్లించాల్సిన రూ. 20 వేల బకాయిలను మున్సిపల్ అధికారులు చెల్లించలేకపోయారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది కుర్చీల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. -
'ఆ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పటిది కాదు'
విజయనగరం : దేశంలో లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు తెలిపారు. గురువారం విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో 55 కెవి సోలార్ పవర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం అశోక్గజపతి రాజు మాట్లాడుతూ... సోలార్ విద్యుత్ తయారీకి ముందుకు రావాలని స్థానిక సంస్థలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఈ నాటిది కాదని అశోక్గజపతిరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మళ్లీ గలీజుదందా!
మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలంలో కొత్త ట్విస్ట్ * 100 శాతం పెంచి పాత వారికే ఇస్తారంటా.. * పోతూ.. పోతూ పాత కమిషనర్ నిర్ణయం * 30 ఏళ్లు వారికే ఇవ్వాలని జీఓ వచ్చిందంట కోదాడటౌన్ : కోదాడ పురపాలక సంఘానికి చెందిన దుకాణాల సముదాయ బహిరంగ వేలం విషయంలో పాలకులు, అధికారులు పట్టణ ప్రజలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు వేలం వేస్తాం అదిగో.. ఇదిగో అంటూ చెప్పిన అధికారులు తెరవెనుక వేరే రాజకీయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత కమిషనర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడానికి ముందు దుకాణాల లీజు దారుల నుండి 100 శాతం అద్దెలు పెంచి ఏప్రిల్ 1 నుండి వసూలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. కౌన్సిలర్లు మొదలుకొని అధికారుల వరకు కుమ్మక్కై అడుగడుగునా బహిరంగ వేలానికి మొకాలడ్డుతూ లీజుదారుల కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరపైకి కొత్త విషయం మున్సిపల్ దుకాణాల వేలం విషయంలో తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం కొందరు లీజు దారులు కొత్త విషయాన్ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చిందని దాని ప్రకారం ఒక సారి లీజు దక్కించుకున్న వారు 30 ఏళ్ల వరకు దానిపై హక్కులు ఉంటాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి వేలం వేసి దుకాణాలను కేటాయించాల్సి ఉండగా మరీ 30 సంవత్సరాల మాటేమిటో విషయం అర్థం కావడం లేదని పలువురు విపక్ష కౌన్సిలర్లు అంటున్నారు. అసలు ఆ జీఓ ఎపుడు వచ్చింది? దాని అర్థం ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? అసలు అది అసలు జీఓనేనా? ముందు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరిలో జరిగిన పాలకవర్గ సమావేశంలో పాతవారికే ఇపుడు ఉన్న అద్దెలపై 100 శాతం పెంచి దుకాణాలను కేటాయించాలని తీర్మానం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విపక్ష కౌన్సిలర్లు మాత్రం ఈ విషయం అసలు మాకు తెలియదని, దీనిపై తమకు పూర్తి వివరాలను ఇవ్వాలని వారం క్రితం జరిగిన సమావేశంలో ప్లోర్లీడర్ దండా వీరభద్రం కోరారు. గుడ్విల్ తీసుకొని ఇతరులకు.. దుకాణాల వేలం విషయం పక్కన పెడి తే దీనిలో వ్యాపారులు అనేక ఉల్లంఘనలకు పా ల్పడ్డట్లు తెలుస్తోంది. గతం లో లీజుకు తీసుకున్న వారిలో సగానికి పైగా వ్యాపారులు ఈ దుకాణాలను లక్షల రూపాయల గుడ్విల్ కింద ఇతరులకు అమ్ముకున్నారు. వాస్తవానికి లీజుదారుడు ఇతరులకు దుకాణాన్ని ఇస్తే వెంటనే లీజు ర ద్దువుతుంది. దీన్ని లీజు అగ్రిమెంట్లో ప్ర ముఖంగా పేర్కొంటారు. అంతే కాకుండా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. కానీ, పలువురు వ్యాపారులు తమ దుకాణాలను రెండుగా విభజించి ఇతరులకు అద్దెకు ఇచ్చారు. కొందరు రెండు షాప్లను కలిపి ఒకటి చేశారు. ఈ మార్పులను దొడ్డిదారిని రికార్డుల్లో కూడా నమోదు చేయించారంటే ఈ వ్యవహారంలో సిబ్బంది చేతివాటం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. లీజు అగ్రిమెంట్ కాగితాలు ఒక్కసారి బయటకు తీస్తే ఆ వ్యవహారం బయటపడే అవకాశం ఉన్నా దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కారణం ఇదంతా బహిరంగ రహస్యమే కాబట్టి. 100 శాతం పెంచినా తక్కువే.. దుకాణాల వేలం జరగకుండా అడ్డుకోవడానికి లీజుదారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడం వెనక అనేక కారణాలే ఉన్నాయి. ఈ దుకాణాల అద్దెల్లో ఉన్న తేడాతో పాటు షాప్లు పట్టణ నడిబొడ్డున ఉండడం, ఈ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉండడం కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో షాప్ అద్దె రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఉన్నది. కానీ, మున్సిపల్ దుకాణాల అద్దె మాత్రం కేవలం రూ.3 నుంచి రూ.5 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తాజాగా అద్దెలను 100 శాతం పెంచినా అది రూ.5 నుంచి రూ.6వేలు కూడా దాటదు. అంతే కాదు లక్షల రూపాయలు అడ్వాన్సగా చెల్లించినా షాప్ అద్దెకు దొరకడం కష్టమే. పాత కమిషనరే నిర్ణయం తీసుకున్నారు కమినర్గా బాలోజీనాయక్ ఉన్న సమయంలోనే సాయికృష్ణ థియేటర్ రోడ్డులో ఉన్న దుకాణాల అద్దెపై 100 శాతం పెంచి ఏప్రిల్-2016 నుంచి వసూళ్లు చేయాలని ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చారు. ఈ విషయాన్ని మరోసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. - బుచ్చిబాబు, మున్సిపల్ మేనేజర్ -
మూతపడ్డ మున్సిపల్ దుకాణాలు
* మున్సిపాలిటికీ భారీగా నష్టం * అద్దెలను పెంచడంతోనే సమస్య తిరువళ్లూరు: తిరువళ్లూరు బస్టాండులో మున్సిపాలిటీకి చెందిన షాపులకు అద్దెలను విపరీతంగా పెంచారు. దీంతో సంవత్సరం నుంచి దుకాణాలు మూతపడి నగర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. తిరువళ్లూరు మున్సిపాలిటీకి బస్టాండులో 36 షాపులు ఉన్నాయి. వీటిలో 20 సంవత్సరాల నుంచి పండ్లు, పూల వ్యాపారులు, స్వీట్స్, కూల్డ్రింక్స్ షాపులను నిర్వహించే వారు. అప్పట్లో ఒక్కో దుకాణానికి రెండు వేలు నుంచి మూడు వేల రూపాయల వరకు చెల్లించేవారు. దీంతో ప్రతి నెలా ఎంతో కొంత ఆదాయం ము న్సిపాలిటీకి వచ్చేది. అయితే నగర కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శరవణకుమార్ అప్పట్లో నిబంధనలను మార్చి ఓపెన్ టెండర్ ద్వారా అద్దెలను నిర్ణయించారు. ఒక్కో షాపు అద్దె మూడు వే ల రూపాయల నుంచి 40 వేల రూపాయలకు పెరగడంతో వ్యాపారులు అద్దె కు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో గత ఏడాది నుండి 36 షాపులు మూతపడడంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడింది. షాపులు సైతం మూతపడడంతో వ్యాపారులు బస్టాండులో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా షాపులను ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూత పడిన షాపులకు రీటెండర్ నిర్వహించి వ్యాపారులకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
8 నుంచి హరితహారం
♦ 22 వరకు కొనసాగింపు అందరూ భాగస్వాములు కావాలి ♦ 28 లక్షల పెరటి మొక్కలు నాటించాలి నేటి నుంచి గ్రామసభలు ♦ నూరు శాతం మరుగుదొడ్లు నిర్మిస్తే పురస్కారం ♦ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ డా.యోగితారాణా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, అన్ని రంగాల్లో ముందున్న జిల్లా హరితహారంలో ఆదర్శం కావాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులకు పిలుపునిచ్చారు. ఈనెల 8న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ప్రాంతాలలో ఇంటికి ఐదు చొప్పున పెరటి మొక్కలు నాటించాలని ఆమె ఆదేశించారు. ఈనెల 8 నుంచి 22 వరకు హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలులో చేంజ్ ఏజెంట్లకు సహకరించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి గ్రామాన్ని, మున్సిపాలిటీని, ఖాళీ ప్రదేశాలను హరితమయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల చేంజ్ ఏజెంట్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యాచరణ అమలుకు ఈనెల 5 అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, గ్రామజ్యోతి సభ్యులు, గ్రామ సంఘాలను గ్రామ సభలలో భాగస్వాములను చేసి, ప్రతి ఇంట మొక్కలు నాటేందుకు ఆయా కుటుంబాలను సన్నద్ధం చేయాలని సూచించారు. ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా 28 లక్షల మొక్కలను ఇంటింటా నాటించాలని స్పష్టం చేశారు. పెరటి మొక్కలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, సంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థల ఆవరణలలో 13 లక్షల మొక్కలను నాటించాలని తెలిపారు. హరితహారం కింద ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలను సరఫరా చేసేందుకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీపంలోని నర్సరీల నుండి ఆయా గ్రామ పంచాయతీలకు మొక్కలను కేటాయించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో పొలాల గట్లు, కంచెల వద్ద 1.35 కోట్ల మొక్కలను ఈనెల 17లోపు నాటించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. మిగిలిన ప్రాంతాలలో 1.56 కోట్ల మొక్కలను నాటించేందుకు గుంతలను తవ్వించాలని తెలిపారు. అపరిశుభ్రతను రూపుమాపాలి మన దేశంలో సంభవిస్తున్న 10 మరణాల్లో ఒక మరణం పారిశుధ్య లోపం వల్లనే జరుగుతున్నదని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అభిప్రాయపడినారు. అపరిశుభ్రత వల్ల తల్లి, పిల్లలలో ఏర్పడే నులి పురుగులు వల్ల వారి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతను గుర్తించేంసేందుకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో మూడు గోడ పత్రికలు ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. వాటితోపాటు నులిపురుగులు, నట్టలు సేకరించి ప్లాస్టిక్ సిసాలో ఉంచి గ్రామస్తులను చైతన్యపర్చాలన్నారు. మహాత్మాగాంధీ జయంతి అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్ఛ నిజామాబాద్గా ప్రకటించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలో మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఈనెల 31లోపు నూరు శాతం పూర్తి చేయించాలని తెలిపారు. అలాగే పల్లె ప్రగతి(టీఆర్ఐజీపీ) మండలాలైన తాడ్వాయి, గాంధారి, మాచారెడ్డి, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఆగస్టు 31లోపు మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ముందున్న మండలాలకు ఆగస్టు 15న పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా/పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ/పీడీ చంద్రమోహన్రెడ్డి, డీఎఫ్ఓ సోషల్ ఫారెస్టు సుజాత, జెడ్పీ సీఈఓ మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారంతో ఆక్రమించేశారు!
నిలువ నీడ లేక మురుగుకాల్వ గట్ల మీదో, ఏ పోరంబోకులోనే గుడిసెలు వేసుకుని జీవించే పేదలపై ప్రతాపం చూపించే అధికారులు పట్టణ నడిబొడ్డున విలువైన స్థలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే మాత్రం మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. మంగళగిరి (తాడేపల్లి రూరల్) : గత నెల రోజులుగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో రత్నాలచెరువు మురుగుకాలువల వెంట గుడిసెలు,హిందూ శ్మశానవాటికలో గుడిసెలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వారికి అండగా నిలవడంతో వెనుతిరగకతప్పలేదు. ఈ నేపథ్యంలో పట్టణ నడిబొడ్డున స్థానిక ఆర్అండ్బీ బంగ్లా వద్ద ఉన్న బీఆర్ మున్సిపల్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ఏకంగా రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంటే మాత్రం అధికారులకు కనిపించకపోవడం విశేషం. గత మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకుని విజయం సాధించిన ప్రజాప్రతినిధి బీఆర్ స్కూలు ఆవరణలోని స్థలాన్ని మూడు సెంట్లు ఆక్రమించి కనీసం మున్సిపాల్టీకి భవన నిర్మాణానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా భవనం నిర్మించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ మూడు సెంట్ల విలువ ప్రస్తుతం యాభైలక్షల రూపాయలు చేస్తుందని తెలిసింది. ఎన్నో సంవత్సరాల క్రితం బంగ్లా వద్ద అటవీభూమి 25 సెంట్లలో పాఠశాల నిర్మించారు. పాఠశాలకు ఉత్తరం వైపున రోడ్డు చిన్నదిగా వుండడంతో రోడ్ వెడల్పు కోసం కొంత భూమిని వదిలేశారు. రెండు రోడ్ల మూలమీద మూడు సెంట్ల ఖాళీ స్థలంపై కన్నేసిన స్థానిక ప్రజాప్రతినిధి వెంటనే అక్కడ నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారనే విమర్శలు రావడంతో అది తనసొంతానికి కాదని తమ పార్టీ కార్యాలయం కోసం అంటూ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. పార్టీల పేరుతో ఆక్రమణలు చేస్తే అధికారులు చర్యలు తీసుకోరా మరి అలాంటప్పుడు మిగిలిన పార్టీలు కూడా మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పార్టీ కార్యాలయాల పేరుతో నిర్మాణాలు సాగిస్తే వదిలేస్తారా అని వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. పేదలకు అండగా వుంటున్నామని చెప్పుకుంటున్న పార్టీ ప్రజాప్రతినిధులే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలకు పూనుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు,పాలకులు వెంటనే మున్సిపల్ స్థలాల ఆక్రమణలను అడ్డుకుని వాటిని పట్టణాభివృద్ధికి కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎలాంటి దరఖాస్తు అందలేదు ఈ విషయమై పట్టణ ప్రణాళికా విభాగం అధికారి మోహన్బాబును వివరణ కోరగా భవన నిర్మాణానికి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదన్నారు.ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టులో వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.స్థలానికి పట్టా వున్నట్టు భవనయజమాని, స్థానిక ప్రజాప్రతినిధి చెప్పారని తెలిపారు. ఆ స్థలం పాఠశాలదే! పాఠశాల ఆవరణలో భవనం నిర్మిస్తున్న స్థలం పాఠశాలదే. భవననిర్మాణం చేపట్టిన వెంటనే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్తో కలిపి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం.అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక పార్టీ కార్యాలయం పేరునో లేక మరెవరిపేరునైనా పట్టా వుంటే ఆ పట్టా ఎవరు ఇచ్చారు..ఎలా వచ్చింది అనేదానిపై మున్సిపల్ అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలి. పట్టా నిజంగా వుంటే భవనానికి అనుమతులు ఇవ్వడంలో తప్పులేదు. - సుఖమంచి కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ -
ఆశ పడ్డాడు.. పట్టు బడ్డాడు!
జిల్లాలో అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. సుమారు 15 రోజుల వ్యవధిలో ముగ్గురు చిక్కారు. ఈ నెల పదో తేదీన రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఆమదాలవలస మున్సిపల్ ఏఈ జి.రవి దొరికిపోగా.. 23వ తేదీన ఓ కేసు విషయంలో మూడు వేల రూపాయలు లంచం ఆశించి పొందూరు పోలీసు స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బెండి త్రినాథ్ పట్టుబడ్డారు. ఇది జరిగి కనీసం 24 గంటలు కూడా గడవకముందే నరసన్నపేట మేజర్ పంచాయతీ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు రూ. 35 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయూరు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు.. ఉద్యోగులను కలవరపరస్తున్నాయి. * రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నరసన్నపేట పంచాయతీ ఈవో * సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న అధికారులు నరసన్నపేట: అది నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయం.. శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటల వరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది.. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినట్టు తెలుసుకొని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకుంటూ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరావు, అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని రెడ్హ్యాడెడ్గా దొరికిపోవడంతో ఆందోళన చెందారు. వివరాల్లోకి వెళితే.. మేజరు పంచాయతీ ఈఓగా పనిచేస్తున్న సీహెచ్ ఉమామహేశ్వరరావును పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ పి.రంగరాజు చెప్పారు. వంశధార కార్యాలయానికి సమీపంలోని స్థలాల్లో ఒక ఇంటి ప్లానుకు సంబందించి రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈఓతోపాటు అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని కూడా కేసులో బాధ్యునిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పోలాకి గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటరమణ నరసన్నపేటలో ఇల్లు నిర్మాణానికి ప్లాన్ అప్రోవల్ కావాలని పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్లాన్ అప్రోవల్ ఇచ్చారు. అరుుతే సకాలంలో ఇల్లు నిర్మాణం కాలేదు. దీంతో ప్లాన్ అప్రోవల్కు కాలపరిమితి దాటింది. దీన్ని గమనించిన ఈఓ ఉమామహేశ్వరావు కొత్తగా ప్లాన్ పెట్టాలి, లేదా దీనిని రెన్యువల్ చేయాలని.. దీనికి కొంత ఖర్చు అవుతోందని వెంకటరమణకు చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్నా ప్లాన్ అప్రోవల్ రెన్యువల్కు రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. డబ్బు ఎందుకు ఇవ్వాలని వెంకటరమణ వాదించారని, అరుుతే డబ్బు ఇవ్వనిదే పనులు జరగవని ఈవో తేల్చి చెప్పినట్టు డీఎస్పీ వివరించారు. ఈవోకు రూ. 35 వేలు ఇచ్చేందుకు వెంకటరమణ అంగీకరించి.. తరువాత తమను ఆశ్రరుుంచినట్టు తెలిపారు. దీంతో 35 వేల రూపాయలను వెంకటరమణకి ఇచ్చి పంపించామని, ఆ సొమ్మును ఉమామహేశ్వరరావుకు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. తీసుకున్న డబ్బు అక్కడే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రఘుపాత్రుని శేఖర్కు ఈవో ఇవ్వడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టుకు తరలించామన్నారు. కాగా చీకటి పడిన తరువాత మారుతీనగర్లోని ఈఓ ఇంటి వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ కె.శ్రీనివాసరావు ఉన్నారు. రికార్డులు ఇచ్చేందుకు ససేమిరా ఏసీబీ అధికారులకు ఒక దశలో కొన్ని రికార్డులు ఇచ్చేందుకు పంచాయతీ సిబ్బంది ససేమిరా అన్నారు. ప్లాన్ అప్రోవల్కు చెందిన రికార్డులు కావాలని ఏసీబీ అధికారులు కోరగా కాగితాలు లేవని తప్పించుకోవడానికి చూశారు. దీంతో అధికారులు మరింత ఒత్తిడి చేయడంతో మరో గది నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. -
మిర్యాలగూడలో రియల్ దందా..
► జోరుగా అనధికార లే అవుట్లు ► కొరవడిన అధికారుల పర్యవేక్షణ ► మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి జోరుగా అనధికార లే అవుట్లు మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం.. ఇప్పటికే వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో ఈ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. వ్యాపారులు పట్టణ పరిసరాల్లోని పంట పొలాలను అనుమతులు లేకుండానే అనధికార లే అవుట్లుగా మార్చారు. వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. - మిర్యాలగూడ :- మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ రియల్ భూతం వెంటాడుతోంది. పట్టణ చుట్టు పక్కన ఉన్న పంట పొలాలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల గుప్పిట్లో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాటిని ప్లాట్లుగా విభజించి ఆకర్షవంతమైన ప్రకటనలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రూ.లక్షలకు కొనుగోలు చేసిన పొలాలను ప్లాట్లుగా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలోని అద్దంకి - నార్కట్పల్లి రహదారి వెంట, తాళ్లగడ్డ, బాపూజీనగర్, ఏడుకోట్లతండా సమీపంలో అనుమతి లేని వెంచ ర్లు వెలుస్తున్నా యి. వెంచర్లలో మున్సిపల్ అధికారు లు గుర్తిం చకుం డా రా ళ్లను భూమిలోపలికి పాతి ప్లాట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్లో పది శాతం భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంది. అలా చేయకుండానే మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా విభజించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 150 గజాల స్థలం రూ.నాలుగు నుంచి ఐదు లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అనధికారిక లేఅవుట్ల కారణంగా మున్సిపాలిటీకి చెందాల్సిన స్థలం రాకపోవడంతో పాటు పన్ను రూపంలో రావల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది. అధికారుల అండదండలు..? పట్టణంలో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పురపాలక సంఘం చట్టం 1965 సెక్షన్ 184, 185 ప్రకారం అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవల్సి ఉంది. కానీ అధికారులు గతంలో అనుమతి లేని లే అవుట్ల వద్ద కొలత రాళ్లను తీసివేసి చేతులు దులుపుకున్నారు. కానీ తిరిగి యథావిథిగా లే అవుట్ల వ్యాపారం జరుగుతూనే ఉంది. 13 అనధికారిక వెంచర్లు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 13 అనధికారిక వెంచర్లు వెలిసినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ వెంచర్లలో సుమారుగా 30 ఎకరాల వరకు పంట పొలాలను ప్లాట్లుగా విభజించినట్లు తెలిసింది. అనధికారిక వెంచర్ల వల్ల మున్సిపాలిటీకి చెందాల్సిన 10 శాతం భూమితో పాటు ఎకరానికి రూ.30 వేల ఆదాయం పన్ను రూపంలో రావల్సింది కోల్పోతున్నారు. 30 ఎకరాలకు గాను మున్సిపల్ అధికారులు సుమారుగా 10 లక్షల ఆదాయం కోల్పోయారు. అనధికారికంగా వెలిసిన వెంచర్లలో 2015కు ముందుగా కొనుగోలు చేసిన వారు మున్సిపల్ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా మున్సిపాలిటీకి దరఖాస్తులు పెట్టుకున్నారు. దాని ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కానీ 2015 తర్వాత వెలిసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం లేదు. లే అవుట్లకు ఉండాల్సిన నిబంధనలు: ► మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉండాలి. ► రోడ్లకు, పాఠశాల బిల్డింగ్కు, పార్కు, ఇతర సౌకర్యాల కోసం 10 శాతం భూమిని మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. ► మంచినీటి వసతికి ట్యాంకు నిర్మించాలి. ► రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలి. ► ఇవన్నీ ఏర్పాటు చేశాక లేఅవుట్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ► డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రోల్ ప్లానింగ్ అనుమతితో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. నోటీసులు జారీ చేస్తాం పట్టణంలో అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే నోటీసులు జారీ చేస్తాము. 2015 తర్వాత అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు నిలిపివేశాము. 2015కు ముందుగా అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులరైజేషన్ కింద దరకాస్తులు తీసుకున్నాము. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లలో కొనుగోలు చేయాలి. - కందుల అమరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ -
డంపింగ్పై విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చారిత్రక నగరంగా భాసిల్లుతున్న విజయనగరాన్ని చెత్త సమస్య పట్టి పీడిస్తోంది. ఇక్కడి మునిసిపల్ అధికారులు డంపింగ్యార్డు నిర్వహిస్తున్న తీరుపై విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ విభాగం సీరియస్గా తీసుకుంది. యార్డుకోసం వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారించింది. వీరు అనుసరిస్తున్న తీరువల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సమాయత్తమవుతోంది. రోజూ 20టన్నుల చెత్త తరలింపు నగరంలోని చెత్తను డంప్ చేయడానికి 15 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో డెంకాడ మండలం చొల్లంగిపేట పంచాయతీ కె.ముంగినాపల్లి వద్ద 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అక్కడకు రోజూ సుమారు 15నుంచి 20 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. తరలిస్తున్న చెత్త నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల సమీప గ్రామాలైన కె.ముంగినాపల్లి(దళితవాడ), ముంగినాపల్లి, గుణుపూరుపేట గ్రామాల్లోని ప్రజల జీవనానికి ఆటంకంగా మారింది. నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు అన్నీ కలుషితమవుతున్నాయి. రోజురోజుకు సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ గ్రామాల ప్రజలు ఉన్న ఊరిని విడిచి వెళ్లలేక, అక్కడే ఉండ లేక నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈగలు, రకరకాల పురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే నరకమే వర్షాలు కురిస్తే ఇక్కడి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. యార్డులోని కాలుష్యాలు భూగర్బ జలాలతో కలిసి కలుషితమవుతున్నాయి. వాటిని తాగుతున్న అక్కడి ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. దురదలు, గజ్జి రూపంలో చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనికోసం అక్కడ అప్పుడప్పుడు వైద్యాధికారులు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపట్లేదు. ఇప్పటికే ఇక్కడ వివిధ వ్యాధుల బారిన పడి 11మంది మృతి చెందారన్న వాదనలు ఉన్నాయి. మీడియా కథనాలతో కదిలిన విజిలెన్స్ డంపింగ్యార్డు వల్ల ప్రజలు పడుతున్న అవస్థలపై మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ యంత్రాంగం, పాలకులు స్పందించకపోయినా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సీరియస్గా స్పందించింది. కొన్ని నెలలుగా డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అధికారుల వైఫల్యాలను గుర్తించింది. ఇప్పుడా లోపాల చిట్టాలతో ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేస్తోంది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ గుర్తించిన అంశాలివి: బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఇక్కడదేమీ జరగట్లేదు. పట్టణంలోని రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద మిగిలిపోయిన వ్యర్థాలతో ఎరువులు తయారు చేసేందుకు కొనుగోలు చేసిన పలవరైజేషన్ యంత్రం నిరుపయోగంగా ఉంది. దీనికోసం వెచ్చించిన రూ. పదిలక్షలు వృథా అయింది. తరలిస్తున్న చెత్తను తడి, పొడిగా వేరుచేయాలి. సేకరణ సమయంలోనే ఈ ప్రక్రియ జరగాలి. మున్సిపల్ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైంది. యథాతధంగా చెత్త తరలించేస్తుండటంతో దేనికీ ఉపయోగ పడట్లేదు. సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో గుట్టలుగుట్టలుగా ఎక్కడబడితే అక్కడే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీనిని చదును చేయడానికి ప్రతీ మూడు నెలలకు లక్షలాది రూపాయల ఖర్చు చేస్తున్నారు. వర్మీ కంపోస్టు యార్డ్ను రూ.10లక్షలతో నిర్మించారు. గాని పలవరైజేషన్ ద్వారా వ్యర్థాల నుంచి వేరు చేసిన మెటీరియల్ను దశల వారీగా ఎరువుల కింద మార్చడం లేదు. వర్మీ కంపోస్టు యార్డ్కు చేసిన ఖర్చు అంతా నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డ్లో పనిచేయడానికి 40నుంచి 50మంది సిబ్బంది కావాలి. అధికారులు ఇక్కడ 10మంది పనిచేస్తున్నట్టు చెబుతున్నా... వారూ కనిపించడం లేదు. -
ఆయన ఎమ్మెల్యే... అనుమతులు లేకుండా...
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తీరుపై విమర్శలు కరీంనగర్ : ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రజలకే తప్ప తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదాయం కోసం ఏకంగా ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న ఆయన మున్సిపల్ నుంచి ఎటువంటి అనుమతు లు తీసుకోకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే కావడంతో వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన అర ఎకరం పైగా స్థలం ఉంది. మొదటి నుంచి ఆ స్థలంలోనే ఆయన నివాస భవనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం అదే స్థలంలో మరో చోట విశాలమైన నూతన భవనాన్ని నిర్మించుకున్నారు. పాత నివాస భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఇటీవలనే కుటుంబసభ్యుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తోపాటు ఆదనంగా మరికొన్ని అంతస్తులతో సుమారు 300 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే పనులను మొదలు పెట్టారు. మున్సిపాలిటీల చట్టం ప్రకారం... భవనం నిర్మించేవారు ఇంజనీరింగ్ ప్లాన్తో ముందుగా మున్సిపల్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. అనుమతి పత్రాల్లేకుండా నిర్మాణం చేపట్టరాదు. కాని ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. అనుమతులు లేవు ఎమ్మెల్యే నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్కు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇటీవలనే తన భార్య పేరు మీద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి సంబంధిత స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రెండ్రోజుల్లో అనుమతి పత్రం మంజూరు చేస్తాం. - శైలజ, మున్సిపల్ కమిషనర్ గతంలోనూ అంతే.. ప్రస్తుతం నిర్మిస్తున్న కాంప్లెక్స్ విషయంలోనే కాదు... నాలుగేళ్ల క్రితం నిర్మించిన నివాస భవన విషయంలోనూ ఎమ్మెల్యే మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేశారు. ఆ సమయంలో భవనానికి మున్సిపల్ నుంచి జీ+2కు అనుమతి తీసుకున్న ఆయన ఆ తర్వాత మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దానిని క్రమబద్దీకరించుకోవ డానికి ఇటీవలనే బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. చోద్యం చూస్తున్న అధికారులు.. జాతీయ రహదారి పక్కనే ఎమ్మెల్యే అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మున్సిపల్ కమిషనర్తోపాటు ఇతర మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగే సమావేశాలకు తరచూ హాజరవుతుంటారు. అక్కడే గతనెల రోజులుగా పనులు జరుగుతున్న విషయం కళ్లముందు కనిపిస్తున్నా స్పందించడం లేదు. ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి సామాన్య ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించే అధికారులు ఎమ్మెల్యే విషయంలో ఉదాసీనత కనబర్చడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు ఎదురవుతున్నాయి. -
24 గంటలూ తాగునీరు
♦ వికారాబాద్లో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నీటి సరఫరా ♦ మీటర్లు బిగించే పనిలో మున్సిపల్ యంత్రాంగం ♦ ఒక్కో కుటుంబానికి 20 కిలోలీటర్ల నీరు ♦ నీటిని పొదుపు చేసే ఆలోచనలో అధికారులు రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఆడపడుచులు బిందె పట్టుకుని బోర్ల వద్దకో.. చేతిపంపు వద్దకో వెళ్లనక్కర్లేదు. వికారాబాద్ పట్టణానికి మరో మూడు నెలల్లో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు తాగునీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. ఇప్పటికే ప్రతి ఇంటికీ మంజీరా పైపులైన్ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ఇప్పటివరకు 10 వేల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చిన మున్సిపల్ యంత్రాంగం.. ప్రస్తుతం ప్రతి నల్లాకు మీటర్లు బిగించే పనిలో నిమగ్నమైంది. - వికారాబాద్ రూరల్ వికారాబాద్ రూరల్ : అరవై వేల జనాభా ఉన్న వికారాబాద్ పట్టణవాసులకు మంజీరా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటి వరకు మున్సిపల్ యంత్రాంగం సుమారు పది వేల కనెక్షన్లకు ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 1000 నల్లాలకు మీటర్లను బిగించింది. మరో 9 వేలకు పైగా మీటర్లు బిగించిన అనంతరం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా 24 గంటల పాటు నీటి ని సరఫరా చేయనున్నారు. మంజీరా, శివసాగర్ నీటిని పట్టణంలోని సంపులోకి తరలించి అక్కడ ఫిల్టర్ అనంతరం ఆ నీటిని ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు 20 కేఎల్ (20 వేల కిలో లీటర్లు)పైగా నీటిని అందించనున్నట్లు వా రు పేర్కొంటున్నారు. తద్వారా కుటుంబానికి ఎంత అవసరమో అంతే నీటిని వినియోగదారులు వాడుకునే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి నీటిని వృథా చేస్తే ఎక్కువ బిల్లు ఎక్కువ వస్తుంది. నీటి వృథా చాలావరకు తగ్గుతుంది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి వాటికి మీటర్లను బిగించడం వల్ల చాలావరకు నీటి వృథా తగ్గిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. గతంలో కాలనీలు, ఇళ్ల వరకు ఉన్న నల్లాలకు ఎలాంటి మీటర్లు కాని లేక పోవడంతో గృహ వినియోగదారులు ఇష్టం వచ్చినట్లు నీటిని వృథా చేసేవారు. ప్రస్తుతం మీటర్లను బిగిస్తుండడంతో నీటి వృథాను చాలావరకు అరికట్టవచ్చు. 20 కేఎల్కు రూ. 200 ప్రతి కుటుంబానికి 20 కే ఎల్ నీటికి పైగా ఇవ్వాలని భావిస్తున్న అధికారులు.. ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారు. 20 కేఎల్ నీటిని వాడుకున్న వారికి కనీసంగా 200 రూపాయల బిల్లు అయ్యే విధంగా చూస్తారు. ఆపై నీటిని వాడుకున్న వారికి అదనంగా చార్జ్ చేసే ఆలోచనలో మున్సిపల్ యంత్రాంగం ఉంది. తీరనున్న తాగునీటి కష్టాలు గతంలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోయేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి బయటకు వెళ్లే బాధ తప్పిపోయింది. -
అనుమతులన్నీ.. ఆన్లైన్లోనే
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఆస్తి మార్పిడి, నల్లా బిల్లులు, ట్రేడ్ లెసైన్స్ల జారీ ♦ ఖాళీ స్థలాల పన్నుల చెల్లింపులకూ అదేపద్ధతి ♦ మున్సిపల్ సిబ్బందికి శిక్షణ పూర్తి ♦ బిల్డింగ్ ప్లానర్లకు శిక్షణ.. సాఫ్ట్వేర్ సిద్ధం ♦ సీడీఎంఏ వెబ్సైట్లో దరఖాస్తులు వివిధ రకాల అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళితే జాప్యం జరుగుతుందా..? అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేదా..? అనుమతుల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారా..? కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా..?. ఇక ఇలాంటి ఇబ్బందులన్నీ దూరం కానున్నాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే మ్యానువల్ పద్ధతికి బ్రేక్ పడనుంది. ఇక మున్సిపల్ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన స్టాఫ్వేర్ను కమిషనర్ డెరైక్టర్ అండ్ మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ (సీడీఎంఏ) సిద్ధం చేసింది. తాండూరు: మున్సిపల్ సేవలన్నింటినీ ఆన్లైన్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తే అనుమతుల జారీలో అవినీతి, అక్రమాలతోపాటు కాలయాపనకు చెక్ పడనుంది. కార్యాలయానికి రాకుండానే ఆన్లైన్లో అనుమతులను పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణాల అనుమతుల నుంచి ఆస్తిమార్పిడి (ముటేషన్), నల్లా బిల్లులు, ట్రేడ్ లెసైన్స్ల జారీతోపాటు ఖాళీ స్థలాలపై పన్నుల చెల్లింపు సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటగా భవన నిర్మాణాల అనుమతుల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఈ సేవలు అందుబాటులోకి తె చ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్తిమార్పిడి, నల్లాబిల్లులు, ఖా ళీ స్థలాలపై పన్నుల చెల్లింపుల వివరాలన్నీ మున్సిపల్ (సీడీఎంఏ)వెబ్సైట్లో మున్సిపల్ కమిషనర్లు నమోదు చేశారు. ఈ నెల చివరి నాటికి ఈ సేవలు కూడా ఆన్లైన్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా ము న్సిపల్ విభాగాల సిబ్బందికి ఆన్లైన్ సేవలపై శిక్షణ కూడా పూర్తయింది. ఈ నెల 7, 8 తేదీల్లో బిల్డింగ్ ప్లానర్లకు ఈ విషయమై సీడీఎంఏ కార్యాలయం లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సేవలు అందుబాటులోకి ఆయా అనుమతుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు లు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు అనుమతులు ఇచ్చింది, లేనిది ఆన్లైన్లో అధికారులు తెలియజేస్తారు. సిబ్బందికి శిక్షణ పూర్తయింది భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత డీటీసీపీకి దరఖాస్తు వెళుతుంది. డీటీసీసీ అధికారులు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే క్లియరెన్స్ ఇస్తూ సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమాచారం వెళుతుంది. స్థానికంగా వారు కూడా ఒకసారి వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆమోదం తెలిపితే అనంతరం ఆన్లైన్లో అనుమతులు జారీ అవుతాయి. సీడీఎంఏ వెబ్సైట్ ద్వారానే ఈ ఆన్లైన్ సేవలు కొనసాగుతాయి. ఈ విధానం అమలుకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. ఈ సేవలతో అవినీతి, అక్రమాలకు తావుండదు. అన్ని అనుమతులు 30 రోజుల్లోనే జారీ అవుతాయి. - సంతోష్కుమార్, మున్సిపల్ కమిషనర్,తాండూరు -
లైనింగ్ లేకుంటే నీళ్లు ఇవ్వరా..
♦ సాకులుచెప్పి కాంట్రాక్టర్లను బతికించొద్దు ♦ పనులు పూర్తికాకుంటే బ్లాక్లిస్టులో పెట్టిస్తాం ♦ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ♦ మంత్రి కాన్వాయిని అడ్డగించిన భైంసావాసులు భైంసా: ‘కాలువలకు లైనింగ్ లేకుంటే భూములకు నీరివ్వరా.. సాకులు చెప్పి కాంట్రాక్టర్లను బతికిచ్చే పనులు చేయొద్దు. కాంట్రాక్టరు పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిసింది. ఈయేడు పనులు పూర్తి కాకుంటే కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులోపెట్టిస్తాం. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులకు లైనింగ్ ఉంది. ఎందుకు తమాషా చేస్తున్నారు.. అంతా క్లియర్ చేయండి.. కలెక్టర్గారు మోటార్ సైకిల్ వేసుకుని నడుపుండ్రి. మల్లా అచ్చి నేను మోటార్ సైకిల్ వేసుకుని కాలువల వెంబడి నడుపుతా. ఈఈ, సీఈలతో ఓసారి కెనాల్పైకి వెళ్లండి. పనుల పరిస్థితి తెలుసుకోండి..’ అంటూ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. భైంసా సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ప్రారంభమై పదేళ్లరుునా ఇప్పటికీ పూర్తిస్థాయిలో 14 వేల ఎకరాలకు సాగునీరు అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాన్వాయి అడ్డగింత.. మంత్రి కాన్వాయిని కుభీర్ రోడ్డులో భైంసావాసులు అడ్డగించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు రోడ్డుకు పక్కనే ఉన్న ఇళ్లను తొల గించారని వారంతా రోడ్డుపైకి చేరుకున్నారు. విష యం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిలు వారితో మాట్లాడారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆందోళనకారులకు హామీనిచ్చారు. దీంతోవారంతా శాంతించా రు. రెండు నెలల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. బాసర సరస్వతీ అమ్మవారిని మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. -
‘మున్సిపల్ సబార్డినేట్’ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
తెనాలి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షునిగా యేగేంద్రనాథ్ (తెనాలి), ప్రధాన కార్యదర్శిగా పీవీ రంగారావు (సత్తెనపల్లి), కోశాధికారిగా కేఎండీ నాసిర్ హుస్సేన్ (ఎమ్మిగనూర్, చిత్తూరు జిల్లా), ఉపాధ్యక్షులుగా కేబీ మధుసూదన్రెడ్డి (జమ్మలమడుగు), కేవీఎస్ శర్మ (నరసరావుపేట), ఎం. రవిసుధాకర్ (శ్రీకాకుళం), ఎస్.విజయలక్ష్మి (నూజివీడు), సంయుక్త కార్యదర్శులుగా వి.చంద్రశేఖర్ (తణుకు), ఎం.రమేష్ (పలాస- కాశీబుగ్గ), అమీర్బాషా (ధర్మవరం), వీజే రత్నాంజలి (తాడేపల్లి), కార్యనిర్వాహణ కార్యదర్శులుగా కె.ఫజులుల్లా (మార్కాపురం), పి.రవిబాబు( బొబ్బిలి), ఎస్.బేబి( రాయదుర్గం), ఆర్.వసంతరావులను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన చిత్తూరు జిల్లా ఉంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. -
‘నారాయణ’ శిక్షణ మాకొద్దు
ఐఐటీ ఫౌండేషన్ శిక్షణ బహిష్కరించిన ఉపాధ్యాయులు విజయవాడ సెంట్రల్ : ఐఐటీ ఫౌండేషన్ బ్రిడ్జి కోర్సుల శిక్షణా తరగతుల్ని మున్సిపల్ ఉపాధ్యాయులు బహిష్కరించారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పలు మున్సిపల్ స్కూళ్లవిద్యార్థులకు ఐఐటీ శిక్షణా తరగతుల్ని 15 నుంచి ప్రారంభించాలని మున్సిపల్ మంత్రి పి.నారాయణ నిర్ణయించారు. ఈమేరకు లెక్కలు, సైన్స్, బయాలజీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు గురువారం నుంచి మూడు రోజుల పాటు పటమట జీడీఈటీ స్కూల్లో శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఫ్యాకల్టీ శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. దీంతో మున్సిపల్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మీరిచ్చే శిక్షణ మాకు అక్కర్లేదు అంటూ బయటకు వచ్చేశారు. ఎస్టీయూ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మూకల అప్పారావు, డి.చంద్రశేఖర్ మాట్లాడుతూ గతేడాది ఇదే తంతు జరిగిందన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాల్సిందిగా కోరినప్పటికీ మంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ ఉపాధ్యాయ వర్గాలపై ముఖ్యమంత్రికి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. తాము ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు వ్యతిరేకం కాదని, మంత్రి వైఖరిని మాత్రమే నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. -
కబ్జానుంచి.. నాలా విడుదల!
♦ శాశ్వత నిర్మాణాలతో మూసేసిన ♦ వ్యాపారులు 15 ఏళ్ల తర్వాత ♦ తెరుచుకున్న మోరీలు ♦ పోలీస్ పహారాలో ఆక్రమణల తొలగింపు పట్టణంలోని నాలాను ఆక్రమిస్తూ వ్యాపారులు నిర్మించిన కట్టడాలను బుధవారం పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఓపెన్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ఆరు నెలల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి.. దీనికి అవసరమైన రూ.5 లక్షలు మంజూరు చేశారు. కానీ టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆరు నెలలైనా పనులు ప్రారంభించకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు పనులకు అడ్డు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నాలాలను ఆక్రమించి మళ్లీ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ ఎంకేఐ అలీ హెచ్చరించారు. - వికారాబాద్ పట్టణంలోని నాలాలో పదిహేనేళ్లుగా పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం తొలగింపునకు ఎట్టకేలకు బీజం పడింది. నాలాను కబ్జా చేసిన వ్యాపారులు దీనిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆరు నెలల క్రితం కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిధులు విడుదల చేసినా.. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో మున్సిపల్ అధికారులు నడుంబిగించారు. వర్షాకాలం వస్తే మురుగు నీరు మొత్తం రోడ్లపై చేరుతుందనే ఉద్దేశంతో స్వయంగా పనులు ప్రారంభించారు. వారం రోజుల్లో పూర్తి చేస్తాం... బీజేఆర్ చౌరాస్తా నుంచి ఆలంపల్లి వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీగా మార్చనున్నట్లు కమిషనర్ అలీ తెలిపారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాపార సముదాయాల ముందు నిర్మాణాలు చేసుకోవాలనుకునే వారు సొంత స్థలాన్ని వాడుకోవాలని సూచించారు. పార్కింగ్ కోసం స్థలాన్ని వదలాలని తెలిపారు. మళ్లీ ఎవరైనా నాలాపై నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపెన్ నాలాను మూసేసే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. నాలాకు 5 ఫీట్ల సెట్బ్యాక్ ఉంచి వ్యాపార సముదాయలు నిర్మించుకోవాలని ఆదేశించారు. పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. పాత మూస హోటల్ వెనక స్థలంలో మంచి నీటి బావిని ఆక్రమించి మున్సిపల్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఇన్చార్జ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యేసు ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. కార్యక్రమంలో టీపీఎస్ సత్యనారాయణ, డీఈ గోపాల్, ఏఈ శ్రీనివాస్, జవాన్లు వినోద్ పాల్గొన్నారు. -
'ముందు మంత్రి, ఎమ్మెల్యేతో పన్నుకట్టించండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో మున్సిపల్ అధికారుల పన్నుల వసూలు వివాదస్పదమవుతోంది. జిల్లాలో నగరపాలక సంస్థ అధికారులు పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసేందుకు శనివారం యత్నిస్తున్నారు. దీంతో షాపు యజమానులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'జిల్లాకు చెందిన మంత్రి , ఎమ్మెల్యే ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించలేదు. ముందు వారి నుంచి పన్నులు కట్టించండి' అని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలకు ఓ న్యాయం...మాకు మరో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా సామాన్య ప్రజలు పన్ను చెల్లించకపోతే నీటి సరఫరా బంద్ చేస్తామని, ఆస్తి సీజ్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి రూ. 44 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. సామాన్య ప్రజానీకంపై ధూం..ధాం అంటూ చిందులు వేసే నగరపాలక అధికారులు వారి వద్దకు వెళ్లి పన్నులు అడగాలంటేనే జంకుతున్నారు. -
బయోగ్యాస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శన
హొసూరు: హొసూరు మున్సిపల్ పరిధిలోని చెత్తా చెదారాన్ని సేకరించి దాసరపల్లి వద్ద బయోగ్యాస్ పథకాన్ని ఏర్పాటు చేయడాన్ని వేరేచోటుకు మార్చాలని డిమాండ్ చేస్తూ దాసరపల్లి గ్రామస్థులు గురువారం బయోగా్యస్ ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. దాసరపల్లి వద్ద చెత్తాచెదారాన్ని సేకరించి వేయడంతో దాసరపల్లి, పెద్ద దిన్నూరు, ఆలూరు, దిన్నూరు, కొత్తూరు, బెగ్గిలి, ఇమ్మినపల్లి, గొల్లపల్లి తదితర 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలలో నివశిస్తున్న 5 వేల మంది పలు శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులకు గురవుతున్నారు. దాసరపల్లి వద్ద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ 10 గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బయోగ్యాస్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నదని పేర్కొన్నారు. అధికార్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ 50 మంది గ్రామస్థులు ప్రదర్శన నిర్వహించారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. -
మున్సిపల్, వ్యాట్ బిల్లులకు మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలక, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు ఆదివారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్నికల సంస్కరణలు, అధికారులకు అధికారాల వికేంద్రీకర ణకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రవేశపెట్టగా, విలువ ఆధారిత పన్నుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండలిలో ప్రవేశపెట్టారు. వ్యాట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించ కపోవడం పేదలపై పెనుభారం మోపినట్లవుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఆక్షేపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. -
పన్ను కట్టని ‘పల్లె’
► ఇంటి పన్ను చెల్లించని మంత్రి పల్లె, ఎమ్మెల్యే వరదాపురం సూరి ► వసూలుకు జంకుతున్న నగరపాలక సంస్థ అధికారులు ► రూ.44 లక్షల బకాయిలు వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. అస్తమానం మైకులు తీసుకుని నీతులు వల్లిస్తుంటారు. అటువంటి వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. వారి నుంచి వసూలు చేసేందుకునగరపాలక సంస్థ అధికారులు కూడా జంకుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి,ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) నగర పాలక సంస్థకు రూ.లక్షల్లో బకాయి పడ్డారు. తద్వారా నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం న్యూసిటీ : రాష్ట్ర ప్రభుత్వం ఇంటి, నీటి పన్ను బకాయిల విషయంలో సీరియస్గా ఉంది. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా వడ్డీ మాఫీ ఉండదని స్పష్టం చేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు పన్నుల వసూలుకు సన్నద్ధమయ్యారు. మార్చి ఆఖరులోపు పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కనీసం 85 శాతం వసూలు చేస్తేనే ప్రత్యేక నిధులు వస్తాయి. ఆ నిధులను నగరాభివృద్ధికి వినియోగించుకోవచ్చు. కానీ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే పన్నులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించలేదు. వీరిద్దరూ రూ.44 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. సామాన్య ప్రజలు పన్ను చెల్లించకపోతే నీటి సరఫరా బంద్ చేస్తామని, ఆస్తి సీజ్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో మాకో న్యాయం.. నేతలకో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి మూడు డోర్ నంబర్లపై పన్ను చెల్లించాల్సి ఉంది. డోర్ నంబర్ 13-3-612 కింద రూ.10,20,574, డోర్ నంబర్ 13-3-610,610-1 కింద రూ.8,85,122, డోర్ నంబర్ 13-3-612-1 కింద రూ.7,79,849 బకాయిలున్నాయి. అలాగే ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన ఓ భవనానికి సంబంధించి జి.నిర్మలాదేవి పేరుపై ఇంటి పన్ను నమోదైంది. డోర్ నంబర్ 15-323 కింద రూ. 7,16,223, డోర్ నంబర్ 15-325 కింద రూ 6,77,055, డోర్ నంబర్ 15-322 కింద రూ.3,43,533 పన్ను బకాయిలున్నాయి. సామాన్య ప్రజానీకంపై ధూం..ధాం అంటూ చిందులు వేసే నగరపాలక అధికారులు మంత్రి, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ‘ఎందుకొచ్చిన గొడవలే.. వారెప్పుడైనా చెల్లించనీ’ అన్న ధోరణితో ఉన్నారు. -
‘నన్ను చంపేస్తున్నారు.. కాపాడండి ’
♦ మున్సిపల్ కార్యాలయంలో రక్తపు మరకలతో ♦ యువకుడి హల్చల్ గంట తరువాత మాయమైన యువకుడు తాండూరు: ‘నన్ను చంపేస్తున్నారు.. కాపాడండి..’ అంటూ ఓ ఇరవై ఏళ్ల యువకుడు గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి హల్చల్ చేశాడు. వివరాలు.. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. చైర్పర్సన్ విజయలక్ష్మి తన ఛాంబర్లో, ఇతర కౌన్సిలర్లు, అధికారులు కార్యాలయంలో ఎవరిపనిలో వారు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటి నుంచి పరుగులు తీస్తూ రక్తపు మరకలతో ఓ యువకుడు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. హిందీలో మాట్లాడుతూ తనను చంపేందుకు కొందరు వెంటపడ్డారు. ఈక్రమంలో గాయాలయ్యాయని తెలిపాడు. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. యువకుడు అడ్మిస్ట్రేషన్ విభాగంలోకి వెళ్లాడు. మున్సిపల్ అకౌంటెంట్ సుధ, మేనేజర్ శ్రీహరి, సిబ్బంది కాశీనాథ్ తదితరులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. పక్కసెక్షన్లో పనిచేస్తున్న సిబ్బంది అక్కడికి వచ్చారు. యువకుడు హిందీలో వివరాలు చెబుతున్నా వారికి అర్థంకాలేదు. తనను ఎవరో వెంబడిస్తున్నారని భయంతో వణికిపోయాడు. విషయం అర్థంకాని అధికారులు.. వచ్చింది సైకోనా? లేక? నిజంగా అతడిపై ఎవరైనా దాడి చేశారా..? అని తెలియక ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత యువకుడికి నీళ్లు తాగించారు. కౌన్సిలర్ అరవింద్కుమార్ కార్యాలయానికి వచ్చారు. యువకుడితో హిందీలో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. యువకుడి మాట్లాడే తీరు అర్థంకాలేదు. సుమారు గంట తరువాత యువకుడు కార్యాలయం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే, ఇంత జరిగినా మున్సిపల్ అధికారులు ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. -
కార్మికుల పొట్టకొట్టొద్దు
రిలే దీక్షలు చేపట్టిన నగరపాలక సంస్థ కార్మికులు ఈ జీవో కార్మికుల కడుపుకొట్టేదే.. దీక్షనుద్దేశించి ప్రసంగించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం ఒంగోలు క్రైం : మున్సిపల్, నగరపాలక సంస్థ కార్మికుల పొట్టకొట్టే జీవో నంబర్-279ని వెంటనే రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం దీక్షలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారన్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన జీవో 279ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అప్పటి నుంచి కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ రెండు నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, మున్సిపల్ ఉన్నతాధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. చర్చల ద్వారా కూడా సమస్యను విన్నవించారన్నారు. దశలవారీగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో 13వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఆ తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జెఏసి) నిర్ణయించిందని గుర్తు చేశారు. రిలే దీక్షల్లో యూనియన్ నాయకులు కె.గోపి, కె.చిననాగేశ్వరరావు, కె.రవి, కె.బాలకృష్ణ, కె.చినయాకోబు, కసుకుర్తి వెంకాయమ్మ, రాగిరాములు, సుజాత, ఆర్.సుందరం, వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణ, టి.విజయ, కె.మోహనరావు, ఎన్.కోటయ్య, ఎస్.నాగేశ్వరరావు, మెండెం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మొండి ఘటాలు!
♦ కడప నగర పాలక సంస్థలో సగం కూడా వసూలు కాని పన్నులు ♦ అధికార పార్టీ అండతో మొండి కేస్తున్న బడా నేతలు ♦ ఎక్కువ మొత్తంలో బకాయిలన్నీ వారివే ♦ ఇరువైపులా ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది సతమతం కడప కార్పొరేషన్ : ఓ వైపు 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా కడప నగర పాలక సంస్థలో మాత్రం పన్నులు సగం కూడా వసూలు కాలేదు. నగరంలోని ప్రైవేట్ ఆస్తుల నుంచి రావలసిన పన్ను రూ.22 కోట్లకు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే వసూలైంది. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల నుంచి కూడా రూ.15 కోట్లు రావలసి ఉంది. కడప నగరంలో పేరు, పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతలే ఎక్కువ మొత్తంలో పన్నులు బకాయిపడి చెల్లించకుండా మొండికేస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు వాపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆర్అండ్బీ, హరిత, ఇతర కార్యాలయాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను వసూలు కావలసి ఉంది. మార్చి అఖరు నాటికి 100 శాతం కలెక్షన్ చేయాలని మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఒకవైపు, మరోవైపు అధికారపార్టీ నేతల మొండి వైఖరి, బెదిరింపులతో నగర పాలక రెవెన్యూ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు. పెద్దమొత్తంలో పన్ను బకాయిపడ్డ వారి సంస్థలు, ఇళ్ల ముందు ఆందోళన నిర్వహిస్తున్నా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు. బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది వెళితే రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వారి నుంచి కమిషనర్కు ఫోన్లు చేయిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగేతై పన్నులు వసూలు చేయడం తమ వల్ల కాదని నగర పాలక సంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు వరుసగా ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ను సాకుగా చూపి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదు. దీంతో చాలా మంది బకాయిదారులు వడ్డీ మాఫీ అవుతుందనే ఆశతో పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి డిమాండ్ నోటీసులు, రెడ్ నోటీసులు, ట్యాప్ కనెక్షన్ నోటీసులు, ఆక్యుపై నోటీసులు జారీ చేశారు. ఆస్తులు వేలం వేసైనా పన్నులు రాబట్టాల్సిందేనని ఉన్నతాధికారులు జప్తు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పి. చంద్రమౌళీశ్వర్రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించామన్నారు. -
పచ్చి బూతులు.. ముష్టిఘాతాలు
► తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ ► మహిళా కౌన్సిలర్ల సాక్షిగా బండబూతులు ► టీడీపీ నేతల మధ్యవర్తిత్వంతో సర్దుబాటు ► ఎమ్మెల్యే సమక్షానికి ‘పంచాయితీ’...! తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో గతంలో ఎన్నడూ జరగని దుశ్చర్య చోటుచేసుకుంది. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చోట అధికార టీడీపీ కౌన్సిలర్లు వ్యక్తిగత ప్రతిష్టకు పోయారు. బండబూతులు తిట్టుకున్నారు. మహిళా కౌన్సిలర్లు ఉన్నారనే ఖాతరు లేకుండా సభ్యసమాజం వినలేని తిట్లు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పరస్పరం దాడిచేసుకున్నారు. తోటికౌన్సిలర్లు భయాందోళనకు లోనయ్యారు. వార్తా చానళ్లలో ఈ ఘోరాన్ని వీక్షించిన ప్రజలు నివ్వెరపోయారు. ఇదేం పోయేకాలం...? అంటూ విస్మయం వ్యక్తంచేశారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఈ విధంగా రచ్చకెక్కాయనే అభిప్రాయం వినవస్తోంది. - తెనాలి అర్బన్ తెనాలిఅర్బన్ తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం చైర్పర్సన్ కొత్తమాసు తులసీదాస్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మూడు ప్యానల్ కమిటీలకు సభ్యులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వెంటనే కొనసాగిద్దామన్న చైర్పర్సన్ ప్రతిపాదనను కౌన్సిలర్లు ఆమోదించారు. వివాదం మొదలైంది ఇలా.... అజెండాలోని మొదటి అంశాన్ని చదివేందుకు మున్సిపల్ ఉద్యోగి ఉద్యుక్తులు కాగా, టీడీపీకి చెందిన 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ లేచి మాట్లాడుతూ, ప్రత్యేక సమావేశంలో ఆమోదించిన ప్యానల్ కమిటీ పేర్లను వెంటనే మిన్ట్స్ పుస్తకంలో రాయాలని కోరారు.ఇందుకు 19, 35వ వార్డుల టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, పెండేల సుబ్బారావులు వ్యతిరేకించారు. కౌన్సిల్ ఏర్పడి సుమారు రెండేళ్లుగా అలాంటి ఆనవాయితీ లేదనీ, కొత్తగా ఎందుకు కోరుతున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. సమావేశంలో చదివి, ఆమోదం పొందిన పేర్లను మినిట్స్ పుస్తకంలో మార్చి ఇతరుల పేర్లను చేరుస్తున్నట్టు ఆరోపించారు. ఇలా జరగరాదనేది తన అభిప్రాయంగా స్పష్టం చేశారు. బండబూతులు...ముష్టిఘాతాలు... ఇందుకు త్రిమూర్తి మాట్లాడుతూ ముందు సమావేశం జరగాల్సిందేని పట్టుబట్టారు.దీనిపై ఆగ్రహించిన రమేష్, ‘నువ్వేంట్రా పిల్ల నాకొడకా...చెప్పు తీసుకు కొడతా’ అని హెచ్చరించడంతో, ‘దా...కొట్టు’ అంటూ త్రిమూర్తి అతడిమీదకు వెళ్లాడు. ఇక వెంటవెంటనే పిడిగుద్దుల పర్వం మొదలైంది...బండబూతులు తిట్టుకుంటూ ఒకరిపై దాడిచేసుకున్నారు. కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు తాడిబోయిన రమేష్, టీడీపీ కౌన్సిలర్లు మాదల కోటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు వీరిద్దరినీ బలవంతంగా విడదీశారు. అప్పటికే త్రిమూర్తి చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. తిట్ల పురాణంపై మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం... టీడీపీ మహిళా కౌన్సిలర్ శాంతకుమారి, మహిళలున్నారని కూడా చూడకుండా బూతులు తిట్టటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో మహిళా కౌన్సిలర్ చెన్ను కళ్యాణి సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. దీంతో చైర్పర్సన్ తులసీదాస్ సమావేశాన్ని గంట పాటు వాయిదా వేశారు. 22వ అంశంపై అట్టుడికిన కౌన్సిల్... 25వ వార్డులోని పినపాడు చేపల చెరువు లీజుపై 22వ అంశంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. చెరువు దుర్గంధభరితంగా ఉందని, నీరు తోడి ఎండబెట్టాలని ఆ తర్వాత లీజుకివ్వాలని కోరారు. లీజు రద్దు సాధ్యం కాదని కమిషనర్ శకుంతల తిరస్కరించారు. ప్రజల ప్రాణాల కన్నా ఆదాయమే ముఖ్యమా అంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు లీజ్ను రద్దు చేయాలని కోరారు. దీన్ని కొందరు టీడీపీ కౌన్సిలర్లు వ్యతి రేకించారు. ఆ లోపు కో-ఆప్షన్సభ్యుడు ఖలీల్ అంశాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఆ ఆంశంపై డీసెంట్ ఇచ్చారు. కమిషనర్ శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ నేతల మధ్యవర్తిత్వం... కౌన్సిల్లో కొట్లాట తెలిసిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచనపై టీడీపీ నేతలు కొందరు మున్సిపాలిటీకి చేరుకున్నారు. చైర్పర్సన్ చాంబరులో కౌన్సిలర్లతో మాట్లాడి సర్దుబాటు చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయంలో కలవాలనీ, అప్పటివరకు గొడవలు వద్దని చెప్పారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించి 1, 34 అంశాలు మినహా అజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ తులసీదాస్ ప్రకటించి ముగించారు. -
గులాబీ గూటిలో ‘మున్సిపల్’ ముసలం
ఓరుగల్లు టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి సెగలు * అసంతృప్తులను బుజ్జగించే పనిలో నాయకత్వం * వరంగల్లోనే మంత్రి హరీశ్ మకాం * పాత-కొత్త శ్రేణుల సమన్వయమే అసలు సమస్య సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో లొల్లి షురూ అయ్యింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు తమ వెంట తెచ్చిన అనుచురులకు అవకాశాలు ఇప్పించుకోవడంలో పోటీ పడుతున్నారు. దీంతో పాత-కొత్త శ్రేణుల సమన్వయమే సవాలుగా మారిందంటున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆందోళనా వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వేదికగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్లు టీఆర్ఎస్లో చేరిన సందర్భంలోనే పాత-కొత్త శ్రేణుల మధ్య పంచాయితీలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి బలం చేకూరుస్తూ వరంగల్లో పాత-కొత్త నేతలు తమ వారికి కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కన్వీనర్గా ఉన్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీ ఎదుట ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కొండా మురళీ, మరోవైపు ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్రావులు ఎవరి జాబితాలు వారు పెట్టారు. సహజంగానే ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా, పార్టీ అధినాయకత్వం మంత్రి హరీశ్రావును రంగంలోకి దించింది. అయితే, ఒక్క మంత్రి మాత్రమే ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పంచాయితీ లేకపోవడం గమనార్హం. అసలేం జరుగుతోంది... వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లు ఉండగా, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో 6, పరకాల నియోజకవర్గంలో 4 డివిజన్లు ఉన్నాయి. మిగిలిన 48 డివిజన్లు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనే ఉన్నా యి. వినయ్ భాస్కర్, ముందు నుంచే తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో అలక బూనారని సమాచారం. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీ తమ అనుచరులకు ఎక్కువ టికెట్ల కోసం యత్నించారని, వీరిలో అత్యధికులు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే కావడంతో పేచీ మొదలైందంటున్నారు. పార్టీ బీ-ఫాం ఇస్తే చాలు తేలిగ్గా గెలిచే అవకాశాలు ఉన్నందున, ఉద్యమంలో పనిచేసిన పాత కేడర్కే అవకాశం ఇవ్వాలని, వారికి డబ్బున్నా, లేకున్నా పట్టించుకోవద్దని ముందు నుంచీ టీఆర్ఎస్లో ఉన్నవారు వాదిస్తున్నారు. దీనికితోడు తాజాగా టీఆర్ఎస్లో చేరిన ఎర్రబెల్లి అనుచరుడు, టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీకి టికెట్ ఇవ్వాలనడంతో తన నియోజకవర్గంలో ఎర్రబెల్లి వేలు పెడుతున్నారని వినయ్ భాస్కర్ పంచాయితీ మొదలుపెట్టారని అంటున్నారు. దీంతోపాటు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరిక తర్వాత ఆయన అనుచరుల్లోనూ ఇద్దరు ముగ్గురికి టికెట్ల హామీ ఇచ్చారని వినికిడి. మొత్తంగా కొత్తవారికి కూడా అవకాశం కల్పించాల్సిన పరిస్థితిలో అధిష్టానం ఉండగా, పాత వారి పరిస్థితి ఏమిటనే అసంతృప్తి పెరిగిపోయిందని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు హరీశ్రావు మంగళ, బుధవారాల్లో వరంగల్లోనే మకాం వేసి అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చారని, నాయకులనూ బుజ్జగించారని అంటున్నారు. అయినా, నామినేషన్లకు చివరి రోజైన బుధవారం టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారని, బీ-ఫారం ఇచ్చేటప్పటికీ (26వ తేదీ) ఈ వివాదం మరింత ముదిరి రెబెల్స్ బెడద తప్పక పోవచ్చని అంచనా వేస్తున్నారు. -
'మెరుగైన పాలనా విధానాలు అవలంబిస్తాం'
హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రం నగరాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న మున్సిపల్ పాలనా విధానాలపై తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని అస్కి ఆధ్వర్యంలో చాలా బాగా నిర్వహించారని ఆయన కొనియాడారు. శనివారం అస్కీ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర పట్టణాల్లో బహిరంగ మలమూత్రం చేసిన విధానం, ఢిల్లీ తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, నాగపూర్ నగర 24 గంటల మంచినీటి సరఫరా చేయడంపై అక్కడి అధికారులు వివరాలు ఇచ్చారని చెప్పారు. చెన్నైలో బాండ్ జారీ చేసి.. నిధుల సేకరణపై, బెంగళూరు టెండర్ ష్యూర్ విధానంపై పరిశోధన చేసి హైదరాబాద్లో మంచి మున్సిపల్ పాలనా విధానాలు అవలంబిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మార్చి మొదటివారంలో జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలో నగర ప్రాజెక్టులపై సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. -
మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ పై దాడి
ఆదిలాబాద్: పన్ను వసూలుకు వెళ్లిన ప్రభుత్వాధికారిపై ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని రిక్షా కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ కానిస్టేబుల్ బరిదాస్సింగ్ రాథోడ్.. మునిసిపాలిటీకి రూ.8వేల బకాయి పడ్డాడు. దీంతో రెడ్ నోటీసు జారీ అయింది. ఈ కమ్రంలో పన్ను వసూలు కోసం అసిస్టెంట్ కమిషనర్ రవిబాబు, సీనియర్ అసిస్టెంట్ యాదవకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ శుక్రవారం రిక్షా కాలనీలోని రాథోడ్ ఇంటికి వెళ్లాడు. తన దగ్గర కట్టడానికి ప్రస్తుతం డబ్బులు లేవని రాథోడ్ చెప్పగా... వస్తువులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడు దాడికి పాల్పడ్డాడు. అసిస్టెంట్ కమిషనర్ రవిబాబును కొట్టినట్టు సమాచారం. దీనిపై రవిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?
ఐదువేల గజాల స్థలాన్ని కాజేయాలని పన్నాగం.. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైమాటే.. కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమైన వైనం.. విచారణ కమిటీ వేసిన సబ్ కలెక్టర్.. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ వికారాబాద్: ‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధంగా తప్పించుకునేందుకు అన్ని జాగ్రతలు తీసుకుని, వాటిని ఆక్రమించుకోవడానికి తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు ఆక్రమించుకున్న తరువాత వాటిని చట్టప్రకారం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నారు. ఈ సలహాలు సైతం వారికి మున్సిపల్ యంత్రాంగమే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. మున్సిపల్ స్థలాలు పాత శిశుమందిర్ దగ్గర ఉన్న స్థలం, పోలీస్స్టేషన్ దగ్గర ప్రభుత్వ టాయిలెట్స్ స్థలం.. ఇలా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసుకుని, వాటిని న్యాయస్థానాల ద్వారా భూ బకాసురులు దక్కించుకొని ఇళ్లు నిర్మించుకుని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకం కింద వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇటీవల అక్రమార్కులు కొందరు బినామీ పేర్లతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అక్రమ కబ్జాలపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించకపోవడంతో కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాధుల స్థలంపై భూ బకాసురుల దృష్టి.. రామయ్యగూడ, అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న ఎంఐజీ, ఎల్ఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225, 226లో ఐదు వేల గజాలకుపైగా స్థలం ఉంది. దీనిపై భూ బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వం ఎంఐజీ, ఎల్ఐజీలో ఉంటున్న ప్రజలకోసం శ్మశానవాటిక స్థలాన్ని హోజింగ్బోర్డు కేటాయించింది. ఇప్పటికే చాలామంది సమాధులను ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలం మాత్రం హాట్కేక్లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ సుమారు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతుందంటున్నారు. దీంతో భూ బకాసురుల కన్ను దీనిపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ స్వంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలాన్ని కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చడానికి ప్రణాళికను రూపొందించారు. సబ్ కలెక్టర్ స్పందించి గ్రేవ్యార్డుకు కేటాయించిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూస్తే బాగుంటుందని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు. -
అద్దె వసూలుకు వెనుకంజ
మున్సిపల్ దుకాణాల కిరాయి వసూలులో సిబ్బంది మొద్దునిద్ర ఆరు సంవత్సరాల బకాయిలు రూ.30 లక్షలు.. వికారాబాద్: మున్సిపల్ ఆదాయం పెంచుకొనే మార్గం సులువుగా ఉన్నా.. ఇటు మున్సిపల్ యంత్రాంగం, అటు పాలకపక్షం మొగ్గుచూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణంలో మున్సిపల్కు సంబంధించి 110 దుకాణాలున్నాయి. ఇందులో కూరగాయాల మార్కెట్లో 44 వరకు ఉండగా.. మిగతా దుకాణాలు డీసీఎంఎస్ ఎదురుగా బస్టాండ్ రోడ్డులో ఉన్నాయి. అంతేకాకుండా రామయ్యగూడ సమీపంలోని అంబేడ్కర్కాలనీలో 12 దుకాణాలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది వీటి అద్దెలను క్రమం తప్పకుండా వసూలు చేయడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారో..? అంతుచిక్కడం లేదు. అంబేద్కర్కాలనీలోని మున్సిపల్ ఇళ్లకు 20 సంవత్సరాలుగా అద్దెలు వసూలు చేయడం లేదంటే యంత్రాంగం ఎంత మొద్దునిద్రలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. 1992, 1998లో మున్సిపల్కు సంబంధించిన ఇళ్లను, దుకాణాల సముదాయాలను అప్పటి పాలకవర్గం నిర్మింపజేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అద్దెలు పెరగనే లేదు. కొన్ని చోట్ల అసలు అడ్వా న్స్ డబ్బులు తీసుకోలేదు. అద్దెకిచ్చిన దుకాణాల నెల కిరాయిలు రూ.వెయ్యి నుంచి రూ.2600 వందల వరకు ఉన్నాయి. ఇందులో కొన్నింటికి మాత్రమే రూ.10 వేల అడ్వాన్స్ తీసుకున్నారు. ఇదిలా ఉండగా దాదాపు 20 సంవత్సరాలకుపైగా అద్దెలు పెరగలేకపోవడానికి కారణాలు తెలియడం లేదు. ప్రతీ మూడు సంవత్సరాలకోసారి అద్దెను పెంచడానికి నిబంధనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆరు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో అద్దెలు నుంచి వసూలు చేయలేదంటే కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారా..? లేక ఉన్నతస్థాయి అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి అద్దెలు వసూలు చేయడం లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిపడ్డ యజమానులకు నోటీసులు ఇచ్చి అద్దె వసూలు చేస్తే సుమారు రూ.40 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అసలు విషయం బయటకు వస్తుందని మున్సిపల్ అధికారులే పేర్కొనగడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పట్లో ఎస్సీ క్యాటగిరీకి చెందిన కొందరికి మున్సిపల్ దుకాణాలను కేటాయించినట్లు తెలిసింది. కానీ ఆ దుకాణాల్లో ఎస్సీలు నడపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం, పాలకపక్షం అన్ని దుకాణాలకు మరోసారి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలు నిర్ణయించాలని వ్యాపారులు కోరుతున్నారు -
టెక్నాలజీని విస్తృతంగా వాడతాం
నగర ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాల్లో ప్రజలు, పౌర సమాజం భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ మునిసిపల్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖను చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచడమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయానికి కారణమని చెప్పారు. మునిసిపల్ చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖలో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విధానాలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలోని వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పౌరుల సమస్యలను పరిష్కరించేందుకు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో తామిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. -
కాకినాడలో విద్యార్థి మృతి
తూర్పుగోదావరి: కాకినాడలో ఓ స్కూల్ విద్యార్థి మృతి చెందాడు. పెగోడా నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న వెంకన్న(9) అనే విద్యార్థి స్కూల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ పడి పోయాడు. స్కూల్ భవనంపైన ఆడుకుంటూ ఉండగా సన్ సైడ్పై నుంచి జారి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి కుటుంబసభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
పాఠశాల వంటగదిలో అగ్నిప్రమాదం
షార్ట్సర్క్యూట్ వల్ల పాఠశాల వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని చైతన్య థియేటర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలోని వంట గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వంట సామాగ్రి కాలి బూడిదైంది. -
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
-
కాంగ్రెస్ జోరు.. బీజేపీ బేజారు
- మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా - నాలుగో స్థానానికి పడిపోయిన అధికార బీజేపీ - రెండు, మూడో స్థానాల్లో ఎన్సీపీ, శివసేన ముంబై: మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. రాష్ట్రంలోని ఏడు నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం ఉదయం వెలువడ్డాయి. మొత్తం 345 వార్డులకుగానూ కాంగ్రెస్ 105 వార్డుల్ని గెలుచుకుని సత్తాచాటింది. 80 వార్డుల్లో విజయం సాధించిన ఎన్సీపీ రెండో స్థానంలో, 59 చోట్ల గెలిచిన శివసేన మూడోస్థానంలో నిలిచాయి. బీజేపీ కేవలం 39 స్థానాలకే పరిమితమై పరువు పోగొట్టుకుంది. చాలా కాలం తర్వాత సొంతగా పోటీచేసి, విజయం సాధించడంతో మహారాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. బీజేపీ- శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమే ఈ ఫలితాలని ప్రతిపక్ష నేత విఖే పాటిల్ అన్నారు. అధికారంలో ఉండికూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘర ఓటమి బీజేపీ శ్రేణుల్ని కలవరపాటుకుగురిచేసింది. తాజా ఫలితాలతో ఊపుమీదున్న కాంగ్రెస్ శ్రేణులు జనవరి 15, 16న ముంబై పర్యటనకు రానున్న రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నద్ధులవుతున్నారు. రాయ్ గఢ్, నందూర్బర్, అహ్మద్ నగర్, నాందేడ్, ఉస్మానాబాద్, హింగోలి, వషీం నగర పంచాయితీలతోపాటు చంద్రాపూర్ కౌన్సిల్ కు గత వారంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ లో 59 నగర పంచాయితీలు, ఒక కౌన్సిల్ క జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యథిక స్థానాలు కౌవసం చేసుకుంది. అప్పుడు రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ మంగళవారంనాటి ఫలితాల్లో అనూహ్యంగా బలం పుంజుకుంది. -
పరుగుతో ఆరోగ్యం
మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో సీఎం చంద్రబాబు {పారంభించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ స్పోర్ట్స్ : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను క్రీడలు, పరుగుల ద్వారా యువత సమకూర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డీప్ (డిసీజ్ ఎరాడి కేషన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి మారథాన్ రన్ బహుమతి ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత రోజులో కనీసం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మేరకు పరిగెట్టి ఆరోగ్యవంతులు కావాలన్నారు. రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు నగదు చెక్కులను అందజేశారు. తొలుత రన్ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రన్లో పాల్గొనేవారంతా ఉదయం ఐదు గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 6.15 గంటలకు హాఫ్ మారథాన్ రన్ను నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏడు గంటలకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి 10కే, 5కే రన్లను ప్రారంభించారు. రన్లో పాల్గొనేవారికి టీ-షర్ట్, స్నాక్స్, టైమింగ్ చిప్తో కూడిన రిబ్ను అందజేశారు. హాఫ్ మారథాన్లో కొందరు ప్రొఫెషనల్ రన్నర్లతో పాటు హైదరాబాద్, ఇతర నగరాల నుంచి లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏడున్నర వేల మంది రన్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. హాఫ్ మారథాన్లో తక్కువ మంది పాల్గొనగా, 10కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కృష్ణా, గుంటూరు కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, యువజన, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, శాప్ ఎండీ జి.రేఖారాణి, సినీ హీరోలు రామ్, శర్వానంద్, నాగశౌర్య, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, రన్ డెరైక్టర్లు డీప్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎన్.మురళి, డాక్టర్ మధు, డాక్టర్ రాకేష్, గజల్ శ్రీనివాస్, రన్ నిర్వాహక కమిటీ సభ్యుడు కె.పట్టాభిరామ్, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.పురుషోత్తం పాల్గొన్నారు. విజేతలు వీరే హాఫ్ మారథాన్ రన్లో పురుషుల విభాగంలో లెంలెం మిక్కియాస్ (ఇథియోపియా), శ్యామల్ కమాయ్ మొహుతు (కెన్యా), బి.శ్రీను (విజయనగరం), మహిళా విభాగంలో నేహాసింగ్, జ్యోతి జె.చౌహాన్ , పద్మావతి వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వారు రూ.80 వేలు చొప్పున గెలుచుకున్నారు. హాఫ్ మారథాన్ వెటరన్ పురుషుల విభాగంలో పప్పు నారాయణ, సునీల్ గౌద్, చక్రధర్ నన్నపనేని, మహిళా విభాగంలో జాక్యులెన్ బబితా విజేతలుగా నిలిచారు. 10కే రన్లో మెల్ల మెర్జ్జీబో ఎలిము, ఇర్రిమాన్, ఖరమూర్సింగ్, మహిళా విభాగంలో వినయపియం, వి.ప్రియాంక, జె.సంగీత, 10కే రన్ వెటరన్ విభాగంలో ఎ.కుమార, ఎం.తియోపిలోస్, యు.ఏడుకొండలు, మహిళా విభాగంలో వి.లక్ష్మిశ్రీ, కె.జ్యోతి వరుస స్థానాల్లో నిలిచారు. మారథాన్లో కలెక్టర్ కాంతిలాల్దండే తాడేపల్లి రూరల్ : అమరావతి మారథాన్ రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద ఉదయం 5.30 గంటలకు 5కె, 10కె, హాఫ్ మారథాన్ రన్ మూడు బృందాలుగా ప్రారంభమైంది. 5కె రన్ విజయవాడలో ముగియగా, 10కె, హాఫ్ మారథాన్ గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాయి. జిల్లా ముఖద్వారం సీతానగరం వద్ద 10కె రన్ ముగియగా, అమరావతి కరకట్ట మార్గంలో ఉన్న ప్రకృతి ఆశ్రమం వద్ద హాఫ్ మారథాన్ ముగిసింది. హాఫ్మారథాన్లో గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పాల్గొన్నారు. సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, డీఈవో శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, కమిషనర్ శివారెడ్డి, తదితరులు కలెక్టర్కు స్వాగతం పలికారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు నేతృత్వంలో డీఎస్పీ గోగినేని రామాంజ నేయులు, సీఐలు హరికృష్ణ, బ్రహ్మయ్య, ఎస్ఐ వినోద్కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10.30 వరకు బ్యారేజీపై రాక పోకలు నిలిపివేయడంతో సీతానగరం, ఉండవల్లి సెంటర్, కెఎల్ కాలనీలకు చెందిన ప్రజలు, రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
డిగ్రీ ఉంటేనే ఓటు
సొంత ఇల్లు ఉన్నా ఓకే... 1934 మొదటి కార్పొరేషన్ సభ్యులు 30 మందే.. 1937 అయ్యంగార్ కమిటీతో మార్పులు 1965 అమల్లోకి మున్సిపాలిటీ చట్టం ► ఇప్పుడు 18 ఏళ్లు నిండితే అందరికీ ఓటు హక్కు... మరి 1934లో... గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి మాత్రమే ఆ భాగ్యం... కనీసం సొంత ఇల్లైనా ఉండాలి. ఓటు హక్కు కల్పించినా... ఎక్కువమంది సామాన్యులకు వేసే భాగ్యం దక్కలేదు. ► 1934 లో మొదటి కార్పొరేషన్లో సభ్యులు 30... ఓటర్లు 13 మందిని మాత్రమే ఎన్నుకోవాలి. మరో 13 మందిని జాగీర్ల ప్రతి నిధులుగా, నలుగురిని ప్రభుత్వ తరఫున నామినేట్ చేసేవారు. మొదట్లో కొత్వాల్ చేతుల్లో నగరం పాలన సాగింది. తర్వాత బ్రిటిష్ ఇండియా విధానాల్ని అమలు చేశారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, మున్సిపాలిటీ ముఖ్య బాధ్యతల్ని హెల్త్ ఆఫీసర్లు, మునిసిపల్ ఇంజినీర్లు పర్యవేక్షించేవారు. కమిషనర్ ఎక్స్అఫీషియో సెక్రటరీగా విధులు నిర్వహించేవారు. మౌలికసదుపాయాలు కావాలంటే ప్రజలు ప్రత్యేక పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది ఆస్తిపన్నుగా వసూలు చేస్తున్నారు. 1934కు ముందు కార్పొరేషన్లో కేవలం 21 మంది మాత్రమే సభ్యులుండేవారు.వీరందరిని నిజాం ప్రభుత్వమే నామినేట్ చేసేది. ప్రస్తుతం నగర్ కార్పొరేషన్లో సభ్యుల సంఖ్య 150 మందికి చేరింది. 1937లో అయ్యంగార్ కమిటీ... ► దీవాన్ బహదూర్ అరవమడ్ సిఫార్సు మేరకు మెరుగైన మున్సిపాలిటీ పాలనకు విధానాలు సూచించాలని నిజాం 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ‘హైదరాబాద్ మున్సిపాలిటీ అండ్ టౌన్ కమిటీస్ యాక్ట్ (ఏ) ఆఫ్ 1941’ ను రూపొందించింది. ► నగరాన్ని రెండుగా విభజించి.... జనాభా 15 వేలకు పైగా ఉంటే సిటీ మున్సిపాలిటీ, 5 నుంచి 15 వేల వరకైతే టౌన్ మున్సిపాలిటీగా వ్యవహరించేవారు. పురపాలనంలో ప్రజాస్వామ్యం ► 1951లో కార్పొరేషన్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య విధానాలు అమల్లోకొచ్చాయి. కౌన్సిల్ అధికారాల అమలు, పాలన కోసం ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు. పూర్తి స్థాయి మునిసిపాలిటీగా మార్చారు. 1965లో ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. పురపాలన విభాగాలన్ని ఇందులో చేర్చారు. మొత్తం 391 సెక్షన్లు రూపొందించారు. -
‘గ్రేటర్’పై హైడ్రామా
-
కర్నూలు కార్పొరేషన్ స్వీపర్ ఆత్మహత్య
-
మున్సిపాలిటీ భవనానికి కరెంట్ కట్!
సిరిసిల్ల (కరీంనగర్) : బిల్లులు చెల్లించడం లేదంటూ విద్యుత్ సరఫరాలు నిలిపివేయడం గురించి మనం వింటూనే ఉంటాం. అయితే అదే రూల్ మున్సిపాలిటీ భవనానికి కూడా వర్తించింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటి భవనానికి శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీవారు గత ఏడాది కాలంగా బిల్లు కట్టకపోవడంతో.. ప్రస్తుతం కోటి పదిలక్షల రూపాయలు బకాయి పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటిలో అంధకారం అలుముకుంది. ఈ మేరకు సెస్ అదికారులు వివరాలు తెలిపారు. -
అధికారుల అత్యుత్సాహం
విమర్శలకు గురవుతున్న ఆక్రమణల తొలగింపు వసూళ్ల కోసమేనని ఆరోపణలు మంగళగిరి :ఆక్రమణల తొలగింపులో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు గురవుతోంది. కొందరికి అనుకూలంగా మరి కొందరికి వ్యతిరేకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. బేరసారాలకు వ్యూహంతో... అయితే కొంతకాలంగా మున్సిపల్ అధికారులు పాలకులు అక్రమకట్టడాలు, అక్రమణలు తొలగింపులో వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఉన్నాయి. రోడ్ల ఆక్రమణలను తొలగించలేని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేని అపార్ట్మెంట్లలోని సెల్లార్లో దుకాణాలను తొలగించేందుకు పూనుకోవడం అవి పట్టణంలో ఎంపిక చేసిన అపార్ట్మెంట్ల దుకాణాలను మాత్రమే తొలగించాలని ప్రయత్నిండం పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా అపార్ట్మెంట్లోని ప్లాట్ల యజమానులను ఒకరిద్దరిని తమకు అనుకూలంగా ఉన్న వారితో సెల్లార్లోని దుకాణాల ద్వారా తమకు ఇబ్బందులు వున్నాయని వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయించడం, అనంతరం పట్టణప్రణాళిక అధికారులను పంపి తొలగించేంచాలని ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. తొలగింపునకు వచ్చిన అధికారులు యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వడం ఆసమయంలో యాజమాన్యంతో అధికారులు పాలకులు బేరాలు కుదుర్చుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుర్తించిన అక్రమ కట్టడాలపై... పట్టణంలో 42 కుపైగా అక్రమకట్టడాలను గుర్తించిన అధికారులు వాటిని పట్టించుకోని అధికారులు నూతనంగా కొన్ని చోట్ల నిర్మిస్తున్న భవనాల వద్ద చేస్తున్న హడావుడి ఆశ్చ్యరం కలిగిస్తోంది. అధికారపార్టీ కౌన్సిలర్లు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు, ఐదు అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోని అధికారులు సామాన్యుడు రేకుల షెడ్డు నిర్మాణానికి పునాది తీసినా అనుమతులు లేకుండా పునాది ఎలాతీస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు నిలుపుదల చేయిస్తున్నారు. పాలకుల ప్రసన్నం ఉంటే... ఇక పాలకులకు ఆమ్యామ్యా ముడితే ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేస్తున్నా అటు వైపు చూడని పట్టణప్రణాళికా విభాగం అధికారులు పాలకులు తమ వ్యతిరేకులు అనుకున్న వారి భవనాల పనులు ఆపటానికి మాత్రం ఆగమేఘాలపై వెల్తుండడం విశేషం. కొద్ది రోజులుగా ఇందిరానగర్తో పాటు పార్కురోడ్లో నిర్మిస్తున్న రెండు భవనాలు యజమానులు తమను కలవలేదని వెంటనే భవననిర్మాణాలను నిలపాలని ఆదేశించడంతో అధికారులు జేసీబీలతో వెళ్లి నిర్మాణాలను కూల్చేందుకు పూనుకున్నారు. దీంతో స్థానికులు అడ్డం తిరగడం వాగ్వాదానికి దిగడం షరామామూలైంది. సమన్యాయం పాటించాలి పట్టణంలో అక్రమకట్టడాలన్నింటిని తొలగించాలని లేదంటే వారితో పాటు తమకు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో అధికారులు వెనుతిరగకతప్పట్లేదు. పట్టణంలో ప్రణాళిక ప్రకారం భవననిర్మాణాలు అధికారులు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కాని పాలకుల అవినీతితో పాటు వారి కక్ష కట్టినధోరణిలో కొన్ని భవనాలను ఎంపిక చేసుకుని వారిని ఇబ్బంది పెట్టడం మాని, నిభందనల ప్రకారం నడుచుకుని మున్సిపల్ ఆదాయాన్ని పెంచి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. -
అద్దె వస్తుంటే పన్ను కట్టాలి మరి!
ఒక ఇల్లు మీ పేరిట ఉంది. దాని మీద వచ్చే ఆదాయాన్ని ‘ఇంటి మీద ఆదాయం’ అని పిలుస్తారు. అది మీ ఖాతాలో పడుతుంది. సూటిగా చెప్పాలంటే... ఇల్లు అద్దెకు ఇవ్వడం వలన వచ్చే ఆదాయం పన్ను భారానికి గురవుతుంది. విదేశాల్లో ఉన్న ఇంటి మీద ఆదాయం మీరు రెసిడెంట్ అయితే పన్నుకి గురవుతుంది. యజమానే పన్ను కట్టాలి. యజమాని అంటే... ఆస్తి ఎవరి పేరిట ఉందో వారే యజమాని. పేరు మీద లేకపోయినా అద్దె తీసుకునే హక్కు ఉన్న వ్యక్తి కూడా యజమానే. అంతే కాకుండా ప్రతిఫలం తీసుకోకుండా ఇంటిని బదిలీ చేసినప్పుడు.. బదిలీ చేసిన వ్యక్తినే యజమాని అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి పాతిక లక్షల నగదు భార్యకిచ్చాడు. ఆ భార్య ఆ నగదుతో ఇల్లు కట్టి అద్దెకిచ్చింది. ఆ అద్దెని ఆదాయంగా పరిగణించడానికి పెద్ద మనిషే యజమాని. సహకార సంస్థలు ఎలాట్ చేసినప్పుడు మెంబరే యజమాని అవుతాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి 10 లక్షలు ఇచ్చి ఇల్లు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇల్లు అద్దెకిచ్చాడు. అద్దె వస్తోంది. రిజిస్ట్రేషన్ జరగ లేదు. అయితే ఇక్కడ 10 లక్షలు ఇచ్చిన వ్యక్తే యజమాని. అలాగే ఇంటిని 12 సంవత్సరాలకు పైగా లీజుకు ఇస్తే.. ఇల్లు అనుభవిస్తున్న వ్యక్తి యజమాని అవుతాడు. జాయింట్గా హక్కులుంటే... హద్దులు స్పష్టంగా ఉంటే.. జాయింట్ ఓనర్లుగా పరిగణిస్తారు. అద్దెను ఎలా నిర్వచిస్తాం... అద్దె అంటే మీ చే తికి వచ్చింది అని చెప్పొచ్చు. సమంజసంగా ఉండాలి. మరీ తక్కువగా చూపిస్తే అధికారులు ఒప్పుకోరు. అలా మదించిన అద్దెలో నుంచి కిరాయిదారు చెల్లించిన మున్సిపల్ పన్నులు, రిపేర్లు, బ్రోకరేజ్, కమీషన్ తదితర వాటికి మినహాయింపు ఇవ్వరు. తిరిగి ఇవ్వాల్సిన డిపాజిట్ అద్దె కాదు. ఇవ్వనవసరం లేని డిపాజిట్ను లీజు వ్యవధికి సర్దుబాటు చేసి అద్దెగా పరిగణిస్తారు. ఫర్నిచర్, సెట్టింగ్స్ తదితర వాటిని కలిపి అద్దెకిస్తే.. రెండింటినీ విడగొట్టాలి. ఇంటి అద్దెకాని భాగాన్ని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. ఇంటి అద్దెలో నుంచి తగ్గింపులు అద్దెలో నుంచి యజమాని చెల్లించిన స్థానిక పన్నులు తగ్గిస్తారు. ఇక్కడ చెల్లించినట్లు రుజువులు కావాలి. మిగిలిన మొత్తంలో నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్గా మినహాయిస్తారు. ఈ మినహాయింపునకు ఎటువంటి రుజువులు అవసరం లేదు. రుణాల మీద వడ్డీకి మినహాయింపు ఉంది. ఇటువంటి వడ్డీ మీద ఎటువంటి పరిమితులు లేవు. రుణాలు ఎవరి దగ్గరి నుంచైనా తీసుకోవచ్చు. ముందు రుణం చెల్లించడానికి మరో రుణం తీసుకుంటే రెండవ రుణం మీద వడ్డీ తగ్గిస్తారు. సొంత ఇంటి మీద ఆదాయం అంటే మీ ఇంట్లో మీరు ఉండటం. దీనివల్ల ఎటువంటి అద్దె రాదు. ఎటువంటి మినహాయింపులు కానీ, తగ్గింపులు కానీ ఉండవు. కానీ రుణం మీద వడ్డీకి మినహాయింపు ఉంటుంది. 01/04/1999 త ర్వాత తీసుకున్న రుణాల మీద వడ్డీ రూ.2,00,000 వరకు తగ్గిస్తారు. రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి 3 ఏళ్లలోపు ఇల్లు పూర్తి అవ్వాలి. 01/04/1999కి ముందు తీసుకున్న రుణాల మీద వడ్డీ కేవలం రూ.30,000 వరకు మాత్రమే మినహాయిస్తారు. ఇల్లు పూర్తి కావడానికి ముందు చెల్లించిన వడ్డీని ఇల్లు పూర్తయిన తర్వాత 5 సమాన భాగాలుగా ఐదేళ్లు మినహాయిస్తారు. ఇంటి అద్దె కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటే దాన్ని నష్టం అంటారు. ఈ నష్టాన్ని మీ ఇతర ఆదాయంలో నుంచి తగ్గిస్తారు. ముఖ్యాంశాలు ఇవీ... * మున్సిపల్ పన్నులు చెల్లించండి. రశీదులు భద్రపరచుకోండి. * అద్దెను ఫర్నిచర్, సెట్టింగ్స్గా విడగొట్టండి. * నెలసరి రూ.15,000 లోపు ఉంటే టీడీఎస్ బాధ్యతలు ఉండవు. * ఫ్లాట్లలో మెయింటెనెన్స్ ఉంటుంది. దీనిని కిరాయిదారును డెరైక్ట్గా ఇవ్వమనండి. అద్దెలో కలపకండి. అప్పుడు మీ చేతికి వచ్చిన మొత్తాన్ని మాత్రమే ఆదాయంగా తీసుకోవచ్చు. * ఇంటి రుణం సంస్థల నుంచి తీసుకుంటే అన్ని కాగితాలు ఉండాలి. ఇతరుల నుంచి తీసుకుంటే జాగ్రత్త వహించండి. * వరకట్నం నేరం. తీసుకోవద్దు. కానీ పుట్టింటి వారిచ్చిన నగదు, ఇతర ధనాన్ని స్త్రీ ధనంగా పరిగణిస్తారు. దీన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించండి. ఆ మొత్తాన్ని చెక్కు ద్వారా అప్పు తీసుకొని ఇంటి మీద ఖర్చుపెట్టండి. వడ్డీ ఇవ్వండి. వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ భాగస్వామికి ఏ ఇతర ఆదాయం లేకపోతే వడ్డీ మీద రూ.2,50,000 వరకు ఎటువంటి పన్నుభారం ఉండదు. కె.సీహెచ్ ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ అధికారి
మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏవో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీలోని కోనేరు సెంటర్లో దసరా సందర్భంగా ఒక కాంట్రాక్టర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి రూ.28 వేలకు బిల్లు పెట్టుకున్నారు. ఈ మొత్తం మంజూరు చేయాలంటూ ఆ కాంట్రాక్టర్ పది రోజులుగా ఏవో ఎర్రయ్య చుట్టూ తిరుగుతున్నారు. అయితే రూ.5 వేలు ఇస్తేనే బిల్లు చేస్తానంటూ ఎర్రయ్య మెలికపెట్టాడు. దీనిపై బాధితుడు ఏసీబీకి ఉప్పందించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఎర్రయ్యను పట్టుకున్నారు. -
కార్పోరేషన్ అధికారులను పరుగులు పెట్టించారు...
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫ్యాన్లు జప్తు చేసేందుకు గురువారం న్యాయశాఖ అధికారులు, సిబ్బంది నోటీసులతో రావడం అధికారులను పరుగులు పెట్టించింది. ఓ కేసులో న్యాయవాది ఫీజును ఇవ్వనందుకు కార్పొరేషన్కు సంబంధించిన సామగ్రిని జప్తు చేయడానికి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడమే ఇందుకు కారణం. చిత్తూరు కార్పొరేషన్కు 2002-2005 మధ్య కాలంలో మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ (ఎంఎస్సీ) ఏపీ రఘుపతి పనిచేశారు. ఈ కాలంలో కార్పొరేషన్ తరపున ఆస్తిపన్ను కేసులు ఈయన వాదించారు. అందుకు కార్పొరేషన్ రుసుము చెల్లించలేదు. దీంతో తనకు రూ.3.30 లక్షల ఫీజులు, వడ్డీ చెల్లించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘుపతికి రూ.3.60 లక్షలు చెల్లించాలని ఈ ఏడాది ఏప్రిల్లో చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి సత్యప్రభాకరరావు తీర్పునిచ్చారు. అయితే, ఆ తీర్పును అమలు చేయలేదంటూ, ఫీజు ఇవ్వలేదని కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని రఘుపతి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో 20 కంప్యూటర్లు, 20 ఫ్యాన్లు జప్తు చేయాలని న్యాయమూర్తి మురళీకృష్ణ ఈనెల 6న తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో న్యాయశాఖ సిబ్బంది కార్పొరేషన్ అధికారులకు జప్తు నోటీసులు అందచేశారు. చివరికి బకాయి చెల్లిస్తామంటూ కార్పొరేషన్ అధికారులు సంజాయిషీ ఇవ్వడంతో జప్తు వాయిదా పడింది. -
‘గూడెం’ అంబాసిడర్గా కృష్ణవంశీ
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు సినీ దర్శకుడు కృష్ణవంశీ అంగీకరించారు. ఆయనతో కలసి తాడేపల్లిగూడెం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సినీ హీరో సుమన్ ప్రతినిధితో ఎస్పీ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలకు పోలీసు శాఖ ద్వారా అందే సేవలు, ట్రాఫిక్ సమస్యలు, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, చోరీలు, ఘోరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎఫ్ఎం రేడియో ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. జిల్లాకు వచ్చే వీఐపీల వివరాలు, వారి సందేశాలను కూడా ఎఫ్ఎం రేడియో ద్వారా లైవ్ అప్డేట్స్ అందిస్తామన్నారు. ఇందు కోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలు వినియోగంలోకి వస్తాయని ఎస్పీ వివరించారు. -
క్రమబద్ధీకరణకు కటాఫ్ అక్టోబర్ 26
* ఆలోపు ఏర్పాటైన భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం * ఎల్ఆర్ఎస్ ముసాయిదా సిద్ధం.. నేడు ఉత్తర్వుల జారీ! * పునర్విభజన చట్టం నిబంధనల ఆధారంగా మున్సిపల్ చట్టాల సవరణ * ఆ తర్వాత ‘బీపీఎస్’పై ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీని కటాఫ్గా ప్రభుత్వం ఖరారు చేసింది. భవనాల క్రమబద్ధీకరణ (బీపీఎస్), లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకాలను ప్రవేశపెటేందుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 26న సంబంధిత ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదేరోజును కటాఫ్ తేదీగా తీసుకుని క్రమబద్ధీకరణ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 2015 అక్టోబర్ 26వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లు, లేఅవుట్లనే క్రమబద్ధీకరిస్తారు. ఈ తేదీలోపు నిర్మితమైన భవనాలన్నింటినీ ‘గూగుల్ మ్యాప్స్’ సహకారంతో గుర్తించి క్రమబద్ధీకరించే అవకాశముంది. రాష్ట్ర ఆవిర్భావ దినం 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా పరిగణించాలనే ప్రతిపాదనలున్నప్పటికీ... రాష్ట్రంలో అనుమతి లేని భవనాలు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 26ను కటాఫ్గా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణ కోసం తొలుత రెండు నెలల గడువు ఇచ్చి ఆ తర్వాత పొడిగించే అవకాశముంది. కాగా ఇప్పటికే ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ముసాయిదా ఉత్తర్వులను సిద్ధం చేసిన పురపాలక శాఖ శుక్రవారం తుది ఉత్తర్వులను జారీ చేసే అవకాశముంది. బీపీఎస్ ఉత్తర్వులకు మాత్రం మరికొన్ని రోజులు పట్టనుంది. పునర్విభజన చట్టంతో.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణపై న్యాయపర అడ్డంకులను తొలగించుకునేలా మున్సిపల్ చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్త మార్గాన్ని అన్వేషించింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల చట్టాలను సవరించడం కోసం ఆర్డినెన్స్కు బదులుగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 కల్పిస్తున్న వెసులుబాటును ఉపయోగించుకోనుంది. 2014 జూన్ 2కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఏ చట్టాన్నయినా తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకుని (అడాప్ట్) చేసుకుని తమ అవసరాలకు తగ్గట్లు సవరణ చేసుకోవచ్చని ఈ చట్టం పేర్కొంటోంది. ఈ నిబంధన ఆధారంగానే ఏపీ మున్సిపల్ చట్టాలను ‘క్రమబద్ధీకరణ’కు అనువుగా సవరించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే బీపీఎస్ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా వరంగల్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతిస్తేనే ఆ జిల్లాలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకం అమలు కానుంది. లేకుంటే వరంగల్ మినహా మిగతా జిల్లాల్లో ఈ పథకాల్ని అమలు చేసి, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వరంగల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. -
సిలబస్-ప్రిపరేషన్ ప్రణాళిక
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్లో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 123వేతన స్కేలు: రూ.22,460-రూ.66,330.అర్హత: డీసీఈ/ ఎల్సీఈ/ ఎల్ఏఏలో డిప్లొమా లేదా బీఆర్క్ లేదా బీఈ/ బీటెక్ (సివిల్) లేదా బీప్లానింగ్/బీటెక్ ప్లానింగ్.వయసు: 2015, జూలై 1 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: ఆన్లైన్ లేదా ఓంఎఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) {పశ్నలు సమయం మార్కులు పేపర్: 1 - జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 150 ని. 150 పేపర్: 2-ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయి) 150 150 ని. 150 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2015 పరీక్ష తేదీ: నవంబరు 22, 2015. పరీక్ష కేంద్రం: హైదరాబాద్ వెబ్సైట్: www.tspsc.gov.in సిలబస్ వివరాలు అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఉమ్మడిగా ఉంది. స్వల్ప మార్పులతో సిలబస్ ఒకే విధంగా ఉంది. వర్తమాన వ్యవహారాలు (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ) అంతర్జాతీయ వ్యవహారాలు జనరల్ సైన్స్, శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ విజయాలు పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ (ఫిజికల్, సోషల్, ఎకనమిక్) ఆధునిక భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం) తెలంగాణ సామాజిక- ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర (తెలంగాణ ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటుకు ప్రాధాన్యం) భారత రాజ్యాంగం; తెలంగాణ సమాజం-సంస్కృతి- వారసత్వం, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్.ఉంటుంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.జనరల్ స్టడీస్ ప్రిపరేషన్కు పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రెటేషన్కు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను రిఫరెన్స్గా ఉపయోగించుకోవచ్చు. పేపర్-2 అసిస్టెంట్ (ఫైనాన్స్, అకౌంట్స్): డిగ్రీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్లో అకౌంటింగ్ ప్రాథమిక భావనలు, బుక్ కీపింగ్, భాగస్వామ్య ఖాతాలు, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కం ట్యాక్స్, వ్యాపార సంస్థ-ప్రాథమిక అంశాలు, వివిధ రకాల వ్యాపార చట్టాలు, ఆడిటింగ్ తదితర అంశాలుంటాయి. కంప్యూటర్స్కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్; ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్స్ఎల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈ-కామర్స్ అంశాలుంటాయి. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్:ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్, డ్రాయింగ్ (బ్రిక్ అరేంజ్మెంట్, ఫ్లోరింగ్ టైప్స్, ఎలివేషన్...), సర్వేయింగ్, ఫీల్డ్ బుక్ ఎంట్రీస్, ప్లాటింగ్, కాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్ వంటి అంశాలున్నాయి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్కు సంబంధించి డిప్లొమా స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్లో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్, బేసిక్ హైడ్రాలిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ వంటి అంశాలుంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్)- ఆర్.కె.జైన్, రాజ్పుట్, జైన్ అండ్ జైన్ పుస్తకాలు రిఫరెన్సుకు ఉపయోగపడతాయి. ప్రిపరేషన్ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్తో నోట్స్ రూపొందించుకోవాలి. ఇది చివరి దశలో క్విక్ రివిజన్కు ఉపయోగపడుతుంది.క్లిష్టమైన అంశాలను చదివేటప్పుడు గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది. వీలైనన్ని మోడల్ టెస్ట్లు రాయాలి. దీనివల్ల పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పెద్ద నిర్వచనాలు, ఫార్ములాలు, స్టేట్మెంట్లను చిన్న కోడ్ల ద్వారా గుర్తుంచుకోవాలి.తెలిసిన అంశాల నుంచి కూడా ఊహించని విధంగా పరోక్షంగా ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ఇంపార్టెంట్ అనే దృక్పథాన్ని విడిచిపెట్టి, ప్రతి అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.పరీక్షకు కనీసం వారం ముందు నుంచి రివిజన్ ప్రారంభించాలి. ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించకకూడదు. -
ప్రక్షాళన షురూ...!
సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రక్షాళన మొదలైంది. బల్దియాపై ప్రత్యేక దృష్టిసారించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం ఉదయం 6 గంటలకే మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ వెంటనే శుక్రవారం ఏకంగా ఇన్చార్జ్ కమిషనర్నే మార్చి కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు పంపారు. సంగారెడ్డి బల్దియాపై కలెక్టర్ నజర్ - మొన్న తనిఖీలు.. నిన్న కమిషనర్ మార్పు - ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య నలిగిపోతున్న అధికారులు అవినీతి అక్రమాలకు సంగారెడ్డి మున్సిపాలిటీ కేరాఫ్గా మారింది. ఇవే ఆరోపణలపై గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు సస్పెండ్ కాగా కొంత మంది జైలుకు సైతం వెళ్లారు. కాగా మున్సిపల్ పాలక వర్గంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ వారు ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పనులు పూర్తిచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరుణంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై మున్సిపల్ నిధులను కొల్లగొడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై దృష్టిసారించాలని మంత్రి హరీష్రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దిశగా ఎవరూ ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో కమిషనర్ను తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు మంత్రి హరీష్రావుకు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మేనకొడలు సర్వే సంగీతను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్గా తీసుకొచ్చారు. కానీ మున్సిపల్లో జరుగుతున్న అక్రమాలు ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయోనన్న భావనతో ఆమె బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై వెళ్లింది. దీంతో తిరిగి మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ గయాసొద్దీన్ను ఇన్చార్జ్ కమిషనర్గా నియమించారు. పట్టుకోసం ప్రయత్నం.. కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్న మున్సిపాలిటీపై పట్టుసాధించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కలెక్టర్గా రోనాల్డ్ రాస్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేకంగా మున్సిపల్పై దృష్టిసారించాలని కోరినట్లు తెలిసింది. అలాగే పట్టణాభివృద్ధిపై దృష్టిసారించాలని మంత్రి సైతం ఆదేశించినట్లు వినికిడి. దీంతో మున్సిపాలిటీని గాడిలో పెట్టేందుకు కలెక్టర్ చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే కమిషనర్ మా ర్పు అని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. రెగ్యులర్ కమిషనర్ను నియమించాలి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్ కమిషనర్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధికి సహకరించాలి. నిబంధనల మేరకు, సభ్యుల అమోదంతోనే పనులు నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల మార్పుతో పనులకు ఆటంకం కలుగుతుందని తప్ప ప్రయోజనం లేదు. అధికారంలో ఉన్నవారు ఉనికి కోస అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదు. - విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ -
క్షమించేది లేదు
జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ గురువారం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది మొద్దు నిద్దర పోగొట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది... దుమ్ముకొట్టుకుని అపరిశుభ్రంగా మారిన రోడ్ల తీరుపై ఆగ్రహించారు. ఉదయం ఆరు గంటలకు మున్సిపాలిటీలో ప్రత్యక్షమైన ఆయన... అసిస్టెంట్ ఇంజనీరుతో పాటు మరో ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేశారు. వారంలో కార్యాలయాన్ని సమూలంగా మారుస్తానని... ఉద్యోగుల్లో ఆవహించిన నిర్లక్ష్యాన్ని వదలగొడతానని చెప్పారు. - మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం - అసిస్టెంట్ ఇంజనీర్, మరో ముగ్గిరిపై వేటు - సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందేనని ఆదేశం అడిగేవారే లేరన్న ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో షాకిచ్చారు. ఉద్యోగమంటే కాలక్షేపం కాదని... బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. గ్రూప్ల వారీగా పారిశుధ్య కార్మికులను పేరుపేరునా అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. వారికి జాకెట్స్ ఇవ్వకపోవడంపై కమిషనర్ను ప్రశ్నిం చారు. ప్రస్తుతం ఉన్న జాకెట్స్ నాసిరకంగా ఉన్నాయని, వెంటనే కొత్తవి తెప్పించాలని ఆదేశించారు. ఈ సమయంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు మహేష్రాజు అక్కడ లేరు. ఎక్కడని కలెక్టర్ అడగ్గా... ఇంకా రాలేదని కమిషనర్ చెప్పారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని సూచించారు. అనంతరం టౌన్ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగుల వివరాలు అడిగారు. ఇద్దరు టీపీఎస్ల్లో ఒకరు హైదరాబాద్ నుంచి వస్తున్నట్టు కమిషనర్ చెప్పడంతో ఆగ్రహించిన కలెక్టర్... జిల్లా కేంద్రంలో పనిచేస్తూ హైదరాబాద్ నుంచి రావడమేంటని ప్రశ్నించారు. ఇష్టం లేకుంటే పనిచేయవద్దని, ఉద్యోగులు కచ్చితంగా స్థానికంగానే ఉండాలని హితవు పలికారు. అందుకు సర్కులర్ జారీ చేయాలని కమిషనర్ను ఆదేశించారు. రెగ్యులర్ సిబ్బందిలో ఆంజనేయులు బుధవారం చెప్పకుండా విధులకు డుమ్మా కొట్టడంపై అడగ్గా... తనకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లానని అతను బదులిచ్చాడు. ‘ఏ ఆసుపత్రి? డాక్టర్ ఎవరు?’ అని కలెక్టర్ ప్రశ్నించగా... ప్రభుత్వాసుపత్రని, డాక్టర్ పేరు మల్లేశం అని ఆంజనేయులు బదులిచ్చాడు. అసలా పేరుతో అక్కడ డాక్టరే లేరని, తప్పుడు కారణాలు చెప్పడం తగదంటూ అతన్ని సస్పెండ్ చేశారు. అతనితో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారిశుధ్య కార్మికులు కృష్ణ, అరుణలను సస్పెండ్ చేశారు. కమిషనర్లు భయపడుతున్నారు... పారిశుధ్య కార్మికులు.. చైర్పర్సన్, వైస్చైర్మన్ ఇళ్లలో పనిచేస్తున్నారని శానిటేషన్ సూపర్వైజర్ తెలిపారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ చైర్మన్ ఇంట్లో తప్ప మరెవరి ఇళ్లలో పనిచేయడానికి వీల్లేదన్నారు. ఇక్కడ పనిచేయడానికి కమిషనర్లు భయపడుతున్నారని, ఎందుకని ఆరా తీస్తే... సిబ్బంది సరిగ్గా పనిచేయరని తేలిందన్నారు. వారంగా తానే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. సిబ్బంది పూర్తి బద్దకంగా తయారయ్యారని, వారం రోజుల్లో పూర్తిగా మార్చేస్తానని, నిర్లక్ష్యం వహించేవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఏమిటీ రోడ్లు? ‘నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా... ప్రధాన రహదారిపై ఈ దుమ్మేమిటి? శుభ్రం చేయడంలేదా?’ అని కలెక్టర్ శానిటేషన్ ఇన్చార్జి కుమార్ను అడిగారు. రెండు రోజుల్లో మొత్తం క్లీన్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఉద్యోగులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని కమిషనర్కు సూచించారు. అలాగే పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ ఇంతవరకు సరఫరా చేయలేదని కమిషనర్ చెప్పగా... వెంటనే అతని కాంట్రాక్టు రద్దు చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగే చెత్త సేకరణ కార్మికులు... తమకు ప్రస్తుతం ఇస్తున్న రూ.20 సరిపోవడంలేదన్నారు. దాన్ని రూ.50కి పెంచేందుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
పిచ్చి కుక్కల దాడి..
ఎనిమిది మందికి గాయూలు ఎంజీఎం : పిచ్చి కుక్కలు దాడిలో ఐదుగురి చిన్నారుల తో పాటు మరో నలుగురికి తీవ్ర గాయూలైన సంఘటన నగరంలోని కలెక్టరేట్ సమీపంలోని ప్రగతినగర్లో ఆదివారం సాయంత్రం జరిగింది. చిన్నారులు ఆడుకుంటుండగా వారిపైకి వీధి కుక్కలు దాడికి పాల్పడ్డారుు. పక్కనే ఉన్న నాగేంద్రనగర్లో మరో ముగ్గురిపై దాడికి దిగారుు. క్షతగాత్రులను స్థానికులతో పాటు 29 డివిజన్ నాయకులు సమ్మద్ ఆటోలో ఎంజీఎంకు తరలించారు. చిన్నారి సమీనా బేగంకు(10) తీవ్ర గాయాలై ఎంజీఎంలో అడ్మిట్ అయి చికిత్స పొందుతోంది. హర్షద్(5), మరో ఇద్దరు చిన్నారులు శాన్, తాళ్లపల్లి వినీత్కుమార్, యువకుడు మహ్మద్ ముజాహిద్(19), మహ్మద్ అబ్దుల్లా హక్ గాయూలపాలయ్యూరు. నగరం లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయి దాడులకు తెగబడుతున్నా మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆన్లైన్లో భవన నిర్మాణాల అనుమతులు
- నవంబర్ 1 నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అమలు - సాఫ్టెక్ సొల్యూషన్స్కు రూ. 26.06 కోట్లకు టెండర్ ఖరారు - రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో అమలుకు నిర్ణయం - విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీటీసీపీ రఘురామ్ సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా త్వరలో ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణాల అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ (డీటీసీపీ) జి.వి.రఘురామ్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రత్యేకాధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటి వద్ద నుంచి భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో అనుమతులు పొందే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాఫ్టెక్ సొల్యూషన్స్కు రూ.26.06 కోట్లకు టెండర్ను ఖరారు చేశామని చెప్పారు. ముందుగా పెలైట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎంసీలో ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 83 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని, అందులో 54 దరఖాస్తు దారుల వద్దే పెండింగ్ ఉన్నాయని వివరించారు. ఈ ఒక్క రోజులో 11 దరఖాస్తులు పూర్తి చేసి అనుమతులు ఇచ్చామని తెలిపారు. 200 చదరపు గజాల కంటే లోపు ఉన్న వారు దరఖాస్తుతోపాటు డబ్బు మొత్తం కట్టేస్తే రెండు లేదా మూడు రోజుల్లో అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం చేసిన ఓ బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వేశామని చెప్పారు. టీడీఆర్ బాండ్లకు కామన్ రిజిస్టర్ లేదని గుర్తించామని, దీని వల్ల ఇప్పటికి ఎన్ని తప్పులు జరిగాయనేది అటుంచితే భవిష్యత్తులో తప్పులు జరిగే ప్రమాదం ఉందని డీటీసీపీ అన్నారు. రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయకపోతే అపార్ట్ మెంట్లకు అనుమతిచ్చే సమస్యే లేదు. ఖచ్చితంగా బీటీ రోడ్ ఏర్పాటు చేయాలి. బీపీఎస్ను అందరూ వినియోగించుకోవాలని డీటీసీపీ రఘురామ్ కోరారు. -
వారి అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవద్దు
టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు వందమందిలో ఒకరికి లబ్ధి కలగకుంటే ఆ ఒక్కరూ అసంతృప్తి తెలపడం సహజం దానిని ప్రజలందరి అసంతృప్తిగా భావించొద్దు.. ఎమ్మెల్యేలకు హితబోధ హైదరాబాద్: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందని ఎవరో ఒకరు వ్యక్తం చేసిన అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. గురువారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలద్వారా 99 మందికి లబ్ధి చేకూరి ఒకరికి లబ్ధి కలగకుంటే ఆ ఒక్కరూ బహిరంగసభలో లేదా ఎమ్మెల్యేల పర్యటన సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేయటం సహజమన్నారు. అయితే ఆ ఒక్కరి అసంతృప్తిని ప్రజలందరి అసంతృప్తిగా భావించి ఎమ్మెల్యేలూ అదేతీరుగా మాట్లాడి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలద్వారా లబ్ధిపొందిన 99 మంది బయటికొచ్చి తమకు చేకూరిన లబ్ధిని చెప్పే పరిస్థితి లేకపోవటంతో ఒక్కరి అసంతృప్తే ప్రజల్లోకి పోతోందన్నారు. అందువల్ల లబ్ధిదారులు బయటికొచ్చి చెప్పేలా ఎమ్మెల్యేలు వారిని సంసిద్ధుల్ని చేయాలని సూచించారు. ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల కొన్ని పథకాల్ని అమలు చేయలేకపోతున్నామని, త్వరలో దాన్ని అధిగమించి మిగిలిన పథకాలనూ అమలు చేస్తామని చెప్పారు. పురపాలకలను పెంచుదాం రాష్ట్రంలో పురపాలక సంఘాల సంఖ్యను గణనీయంగా పెంచుదామని సీఎం చెప్పారు. పట్టణీకరణ ద్వారా కేంద్రం నుంచి పెద్దమొత్తంలో నిధులు పొందవచ్చన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్, స్మార్ట్ సిటీ పథకాల్లో తమిళనాడు నుంచి పెద్దమొత్తంలో నగరాలు, పట్టణాలు ఎంపికయ్యాయని తెలిపారు. ఇలాంటి పథకాలద్వారా భారీ మొత్తంలో నిధులు పొందేందుకు పురపాలక సంఘాల్ని పెంచటమే ఏకైకమార్గమని, త్వరలో అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అన్నీ మాద్వారానే అందేలా చూడండి: సీఎంతో ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలద్వారా ప్రజలకందే ఆర్థికపరమైన లబ్ధి అంతా తమద్వారానే చేరేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. సీఎం సహాయనిధి, ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణసాయం తదితరాలన్నీ లబ్ధిదారులకు తామే అందచేస్తామన్నారు. ప్రస్తుతం ఆన్లై న్ విధానం ద్వారా, లేదంటే ఏజెంట్లను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందచేస్తున్నారని, దీంతో ప్రభుత్వమే వీటిని చేస్తుందనే భావన వారిలో కలగట్లేదని తెలిపారు. లబ్ధిదారుల్లో ఆ భావన కలగాలంటే పథకాల అమలు నేరుగా తమద్వారానే జరగాలన్నారు. అందుకు సీఎం సమ్మతించారు. వివిధ పథకాలపై నిర్వహించిన సర్వేలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చెప్పారు. ఫించన్లపై 98 శాతం మంది సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇతర పథకాలపైనా ప్రజలు గతం కంటే సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అవినీతిలో రెవిన్యూ, పురపాలక, వైద్య, పోలీస్ శాఖలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఇకనుంచీ ప్రతినెలా టీడీఎల్పీ సమావేశం రాజధాని నగరం అమరావతిలో ఉంటుందని తెలిపారు. -
వేటు
21మంది నీలగిరి మున్సిపల్ సిబ్బంది సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ వేటు పడిన వారిలో ఓ రెవెన్యూ ఆఫీసర్, నలుగురు ఆర్ఐలు, 16 మంది బిల్ కలెక్టర్లు రూ.3.32 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు గుర్తింపు విజిలెన్స్ విచారణకూ ఆదేశం పురపాలన అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అక్రమార్కులపై సర్కార్ కొరడా ఝుళిపించింది. 2011 సంవత్సరంలో ప్రత్యేకాధికారుల పాలన నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు ఆస్తిపన్నును ఇష్టారాజ్యంగా స్వాహా చేసిన 21 మంది ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఇందులో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్తోపాటు నలుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 16 మంది బిల్కలెక్టర్లున్నారు. కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగంలో వీరి ప్రమేయాన్ని నిర్ధారిస్తూ వీరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ జనార్దనరెడ్డి ఆర్వోసీ నెం:4599/2015/సీ1 పేరుతో ఈనెల 31న జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి అందాయి. నాలుగు సంవత్సరాల్లో మొత్తం మీద రూ.3.32 కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డందుకు గాను వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆడిట్, స్పెషల్ ఆడిట్ విచారణలు జరిగిన ఈ వ్యవహారంపై మరోమారు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసలేం జరిగింది.... మున్సిపాలిటీ ఖాతాలో జమచేయాల్సిన ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫీజులపై మున్సిపల్ సిబ్బంది కన్నుపడడం ఈ కుంభకోణానికి మూలమైంది. 2011 నుంచి ఈ రెండు విభాగాల్లో వచ్చిన సొమ్మును మున్సిపల్ అకౌంట్లో జమ చేయకుండా స్వంత అవసరాలకు వాడుకుంటూ, స్వంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మొత్తం రూ. 3,32,59,133 ఉందని విచారణలో తేలింది. మున్సిపల్ కమిషనర్ ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులను ఎంచక్కా పక్కదారి పట్టించి సొంత ఆస్తులను పెంచుకున్న తమకేమీ తెలియనట్టు ఆస్తిపన్ను రశీదు పుస్తకాలను కూడా మాయం చేశారు. కంప్యూటర్లలో నమోదు చేయాల్సిన వివరాలను కూడా తప్పుదోవ పట్టించారు. ఇద్దరు ఉద్యోగులైతే మున్సిపాలిటీకి వచ్చిన సొమ్ము, నల్లా బిల్లులు, భవన నిర్మాణ ఫీజులను ఎత్తుకెళ్లారు. వీరిని ఇప్పటికే సస్పెండ్ చేసి రూ.16లక్షలు రికవరీ కూడా చేశారు. భవన నిర్మాణ ఫీజులు, ఆస్తిపన్నులకు సంబంధించిన రశీదులు కూడా ఇవ్వకుండా జేబులో వేసుకున్నారు. ఏజీ ఆడిట్ బృందం గత ఫిబ్రవరి నెలలో చేపట్టిన ఆడిట్లో కొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ ఆడిట్, ఏజీ ఆడిట్ చేయించారు. అదే విదంగా జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం ఈ అవినీతి అక్రమాలపై విచారించారు. 2011 నుంచి ఇక్కడ పని చేసిన 21 మంది ఉద్యోగులకు అవినీతి అక్రమాలలో భాగస్వామ్యంతో ఉందని తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్వో, యూడీఆర్ఐ, ముగ్గురు రెవెన్యూ ఇన్స్పెక్లర్లు, 16 మంది బిల్ కలెక్టర్లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. కాగా వీరిలో ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వహిద్ ప్రస్తుతం సూర్యాపేటలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదే విధంగా నల్లగొండలో బిల్ కలెక్టర్గా పనిచేసిన గులాం ఖాదర్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్ పదోన్నతితో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఎ.సత్యనారాయణ, కె.హన్మాన్ ప్రసాద్ మిర్యాలగూడ, పి.భిక్షం సూర్యాపేట మున్సిపాలిటీలలో బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. మిగతా వారంతా ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలోనే పని చేస్తున్నారు. అవినీతికి పాల్పడి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన మున్సిపల్ ఉద్యోగులపై అనేక విచారణల అనంతరం వేటు వేశారు. వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతరులను నియమించాలని డీఎంఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు మున్సిపాలిటీలో జరిగిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై మొట్టమొదట ‘‘సాక్షి’’ కథనం ప్రచురించింది. మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటున్న వారి లీలలను వెలుగులోనికి తెచ్చింది. అయినా పాలక వర్గం గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడంతో వరుస కథనాలు ప్రచురించింది. మొట్టమొదట ఏప్రిల్ 9వ తేదీన ‘‘దొంగలు పడ్డారు..?’’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అదే విధంగా ఏప్రిల్ 18వ తేదీన ‘‘మహా మాయ’’, 21వ తేదీన ‘‘అంతర్యమేమిటి’’..?, 22వ తేదీన ‘నీలగిరి’ అక్రమాలపై సీబీఐ, మే 4వ తేదీన ‘‘అక్రమార్కుల్లో ఆడిట్ వణుకు’’ అనే వరుస కథనాలు ప్రారంభించడంతో ఆడిట్ బృందాలు సమగ్రంగా ఆడిట్ చేసి అవినీతి, అక్రమాలను తెల్చి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో అక్రమార్కుల పాపం పండి సస్పెన్షన్కు గురయ్యారు. సస్పెన్షన్కు గురైన మున్సిపల్ ఉద్యోగులు వీరే... 1. గులాం ఖాదర్ ఖాన్, బిల్ కలెక్టర్ 2. ఎ.సత్యనారాయణ, బిల్ కలెక్టర్ 3. జె.రాజేంద్రచారి, బిల్ కలెక్టర్ 4. కె.హనుమాన్ ప్రసాద్, బిల్ కలెక్టర్ 5. ఎస్.శశిధర్, బిల్ కలెక్టర్ 6. కె.యాదయ్య, బిల్ కలెక్టర్ 7. సిహెచ్.ఈశ్వర్, బిల్ కలెక్టర్ (ఐ.సీ) 8. కె.యల్లయ్య, బిల్ కలెక్టర్ 9. పి.భిక్షం, బిల్ కలెక్టర్ 10. ఎం.రాజేందర్, బిల్ కలెక్టర్ 11. కె.ప్రవీణ్కుమార్, బిల్ కలెక్టర్ (ఐ.సీ) 12. కె.పృధ్వీరాజ్, బిల్ కలెక్టర్ (ఐ.సీ) 13. ఎం.భానుకుమార్రెడ్డి, బిల్ కలెక్టర్ (ఐ.సీ) 14. వి.జగన్నాధం, బిల్ కలెక్టర్ 15. కె.సైదులు, బిల్ కలెక్టర్ 16. వై.సైదులు, బిల్ కలెక్టర్ 17. ఎంఏ, వహీద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 18. ఎన్.శంకరయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 19. పి.మాధవరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ 20. సిహెచ్.శ్రావణి, యూడీఆర్ఐ 21. పి.రాంచంద్రారెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ -
మురుగంతా రోడ్లపైకే..
- కుప్పలు తీయరు.. మోరీలు క్లీన్ చేయరు.. - సంగారెడ్డి పట్టణంలో వెదజల్లుతున్న దుర్గంధం సంగారెడ్డి మున్సిపాలిటీ: చూసేందుకు రోడ్లున్నా.. మురికి నీరు పోవడానికి కాల్వలున్నా వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే మురుగునీరంతా రోడ్లపైకే వస్తోంది. పట్టణంలోని శాంతినగర్, కల్వకుంట, మార్క్స్నగర్, విజయనగర్కాలనీ, ఇంద్రాకాలనీలలో మున్సిపల్ సిబ్బంది మురికి కాల్వను శుభ్రం చేశారు. ఇందుకోసం కాల్వలో నుంచి మట్టిని, చెత్తను రోడ్లపై వేసి రోజులు గడుస్తున్నా ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు పందులు సంచరిస్తున్నాయి. మరో వైపు వర్షాలు కురియడంతో మురికి కుప్పలు మురిగి పోయి కాల్వల నుంచి వెదజల్లే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని అయా కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుంట చౌరస్తా వద్ద 20 రోజుల క్రితం మురికికాల్వలను శుభ్రం చేశారు. ఇక్కడ డ్రైనెజీలలో నుంచి తీసిన చెత్తను అక్కడే కుప్పలు వేశారు కానీ ఇంత వరకు వాటిని తొలగించలేకపోయారు. గాలొస్తే చాలు చెత్తంతా కొట్టుకొచ్చి ఇండ్లలోకి వస్తోందని అంటున్నారు. గణేష్నగర్ లో సైతం మురికి కల్వలు లేకపోవడంతో పందులు సంచరించడం వల్ల కచ్ఛాకాల్వలు నేలమట్టమై మురికి నీరు రోడ్లుపైనే ప్రవహిస్తుంది. ఇంద్రాకాలనీలో సైతం డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కాలనీ లో ఒక్క రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి కాల్వలను శుభ్రం చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. కొత్తగా సీసీ డ్రైన్లు నిర్మించలేకపోయిన కనీసం కచ్ఛాకాల్వలు ఏర్పాటు చేస్తే నీరు నిలువకుండా ఉంటుందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోని పారిశుద్ధ్యంలోపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అయా కాలనీ వాసులు కోరారు. కమిషనర్ వివరణ.. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయని ఇన్చార్జి కమిషనర్ గయాసొద్దీన్ను వివరణ కోరగా మురికి కాల్వలలో తీసిన చెత్తను వెంటనే తొలగించేందుకు రాదని అందుకు తీసిన మూడు రోజుల తర్వాత తొలగిస్తారని తెలిపారు. వారం రోజులైనా తమ సిబ్బంది తొలగించకుంటే మాత్రం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘గన్నవరం’ విస్తరణకూ భూసమీకరణ
పురపాలక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) ద్వారానే భూమిని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను 180రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భూసమీకరణపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 15రోజుల్లోగా తెలపాలని సూచించింది. పురపాలక శాఖ కార్యదర్శి అజయ్జైన్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత విస్తీర్ణం భూమిని సేకరిస్తామన్న అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిన విషయం విదితమే. రాజధాని తరహాలోనే ప్యాకేజీ రాజధాని భూసమీకరణ ప్యాకేజీ తరహాలోనే గన్నవరం ఎయిర్పోర్టు భూసమీకరణ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. భూసమీకరణలో పట్టా, దేవాదాయ, వక్ఫ్ భూమి ఒక ఎకరం అప్పగిస్తే.. వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలం, 450గజాల వాణిజ్య స్థలం సంబంధిత భూమి యజమానికి అప్పగిస్తారు. అసైన్డు భూముల లబ్ధిదారులు ఎకరం అప్పగిస్తే 800చదరపు గజాల ఇంటి స్థలం, 200గజాల వాణిజ్య స్థలం అప్పగిస్తారు. భూములు అప్పగించిన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. ఈ కౌలును పదేళ్లపాటూ.. ఏటా రూ.5 వేలు పెంచుతూ చెల్లిస్తారు. భూసమీకరణ చేసే గ్రామాల్లో కౌలు రైతులు, రైతు కూలీల కుటుంబాలకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్ అందిస్తారు. భూసమీకరణ చేసే ప్రాంతంలో రైతుల రుణాలను గరిష్టంగా రూ.1.50 లక్షలను ఒకే దఫాలో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేదలకు స్వయం ఉపాధి కోసం రూ.25 లక్షల వరకూ రుణాన్ని వడ్డీ లేకుండా ఇప్పిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ల్యాండ్పూలింగ్ చేసే గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, వారి పిల్లల నైపుణ్యాలకు మెరుగులు దిద్ది ఉపాధి కల్పిస్తారు. ఆ గ్రామాల్లో 365రోజులపాటూ ఉపాధి హామీ పథకం కింద పనికల్పిస్తామని ప్రభుత్వం స్పష్టీకరించింది. -
నిబంధనలకు పాతర
షాద్నగర్ రూరల్: అధికారుల అండదండలు... రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కొందరు రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కాలుష్య కారక పరిశ్రమ చుట్టూ పెద్దఎత్తున వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇదంతా షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రియల్ వెంచర్ల భాగోతం. అంతర్జాతీయ విమానాశ్రయానికి, రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న షాద్నగర్ ప్రాంతంలో వ్యవసాయ పొలాలకు మార్కెట్ ధర లక్షల్లో పలుకుతుంది. హైదరాబాద్ పట్టణవాసులే కాకుండా ఎన్నారైలు సైతం ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేందుకుఆసక్తిని చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు రియల్టర్లు నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని షాద్నగర్ మున్సిపాలిటీలో గల సోలీపూర్ గ్రామ శివారులో కొన్ని రియల్ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి వెంచర్లు ఏర్పాటు చేశాయి. సోలీపూర్ గ్రామపరిధిలోని ఓ పరిశ్రమ నుంచి వ్యర్థ రసాయనాలను భూమిలోకి పంపుతున్నారు. దీంతో పరిశ్రమ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఎక్కడ బోరు వేసినా కలుషిత నీరే బయటకు వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొనుగోలుదారులను మభ్యపెట్టి వారికి ప్లాట్లు అంటగడుతున్నారు. దీనికి కొందరు అధికారులు.. రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమ పక్కన వందల ఎకరాల్లో ప్లాట్లు చేశారు. వాటికి అనుమతులు లేకుండానే కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్లర్లు అనుమతుల కోసం స్థానిక మున్సిపల్, హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన వెంటనే తమ పనిని ప్రారంభిస్తున్నారు. అనుమతులు రాకపోయినా కొనుగోలు దారులకు ప్లాట్లను విక్రయిస్తున్నారు. -
జాతీయ పతాకానికి అవమానం!
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15న ఎగురవేసిన జాతీయ జెండా దించకుండా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ ఘటన శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసిన అధికారులు ఇప్పటికీ దించకుండా అలాడే ఉంచారు. దీంతో జాతీయ పతాకం గత ఐదు రోజులుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. -
మున్సిపల్ కార్యాలయం దిగ్బంధం
అనంతపురం: తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ అనంతపురం పారిశుధ్య కార్మికులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. మధ్యాహ్నం వరకు లోపలికి ఉద్యోగులను వెళ్లనీయకుండా గేట్లు మూసివేశారు. దాదాపు 40 మంది కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం లోపల ఉన్న కార్పొరేషన్ మేయర్, కమిషనర్ వారికి వేతనాలు అందించే విషయమై చర్చలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆక్రమణల తొలగింపులో రగడ
నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్ : పట్టణంలో ఆక్రమణల తొలగింపు ఆందోళనకు దారితీసింది. ఆక్రమణలను తొలగిస్తున్న మునిసిపల్ అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. ముం దస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న టేలాలను శుక్రవారం తొలగించడం ప్రారంభించారు. అయి తే, రెండు టేలాలను తొలగించగా సంబంధిత దుకాణదారులు అందోళనకు దిగారు. తమకు ముందస్తుగా సమాచారమివ్వకుండా ఎలా తొలగిస్తారని మునిసిపల్ కమిషనర్ గంగారాంతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఎన్నోచోట్ల ఆక్రమణలు ఉన్నా తమ దుకాణాలనే తొలగించడం అన్యాయమన్నారు. మునిసిపల్ వైస్చైర్మన్ అజీంబిన్ యాహియా, కౌన్సిలర్లు చేరుకోవడం, స్థానికులు, దుకాణదారులు గుమిగూడటంతో సీఐ జీవన్రెడ్డి, ఎస్సైలు సునీల్కుమార్, మల్లేశ్ వచ్చి స్థానికులకు పంపించారు. అనంతరం దుకాణదారులు కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు చేరుకుని వారిని పంపించివేశారు. -
నేడు మున్సిపల్ జేఏసీతో ఈటల చర్చలు
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె విరమణ కోసం మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. మునిసిపల్ కార్మిక జేఏసీతో శుక్రవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరపనున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గురువారం ఈటలతో ఫోన్లో సంప్రదింపులు జరిపి సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఈటల సీఎం కేసీఆర్తో గురువారం మాట్లాడిన తర్వాత, శుక్రవారం చర్చలు జరిపేందుకు అంగీకరించారు. ఈ చర్చల్లో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సైతం పాల్గొనే అవకాశముంది. కనీస వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర 16 డిమాండ్లతో కార్మికులు గత నెల 6న సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. సమ్మె 40 రోజుల కు చేరడంతో ప్రభుత్వం, కార్మిక నేతలు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికులకు నగర పంచాయతీల్లో రూ.7,300 నుంచి రూ.9 వేలకు, మునిసిపాలిటీల్లో రూ.8,300 నుంచి 10 వేలకు, కార్పొరేషన్లలో రూ.8,500 నుంచి రూ.11 వేలకు పెంచాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం ది. శ్లాబు విధానంలో పెంచాలనే ఈ ప్రతిపాదనలనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నేటి చర్చల్లో తేలే అవకాశముంది. -
'కార్మికులకు తొలుత రూ.1,000 పెంచుతాం'
తాండూరు (రంగారెడ్డి): మునిసిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు తొలుత రూ.1,000 పెంచుతామని రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు. జీతాల పెంపు డిమాండ్తో గత నెలరోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో... మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మునిసిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. దీనికి మంత్రి మహేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తొలుత రూ.1,000 మేర జీతం పెంచుతామని, తర్వాత మరికొంత పెంచుతామని సమ్మె విరమించాలని కోరారు. కార్మికులకు ప్రస్తుతం రూ.8,300 జీతం వస్తుండగా... దాన్ని కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.