కొవ్వూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను గడువులోగా భవన క్రమబద్ధీకరణ (బీపీఎస్) పథకంలో క్రమబద్ధీకరించుకోవా లని, లేకుంటే అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం రీజియన్ పట్టణ ప్రణాళిక శాఖ ఆర్జేడీ పీఎన్ఎస్ సాయిబాబా హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని కట్టడాల ఫొటోలను ఆయా పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏపీ మున్సిపల్ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించామన్నారు.
20,483 దరఖాస్తులు
రాజమహేంద్రవరం రీజియన్లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భవన క్రమబద్ధీకరణకు 20,483 దరఖాస్తులు వచ్చాయని ఆర్జేడీ సాయిబాబా తెలిపారు. వీటిలో 78 దరఖాస్తులను తిరస్కరించగా 6,104 పరిశీలనలో ఉన్నాయన్నారు. 14,286 మందికి భవన క్రమబద్ధీకరణ జరుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం లో ఆన్లైన్ ద్వారా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం 2016 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. సక్రమమైన బిల్డింగ్ ప్లాన్ ద్వారా గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చన్నారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్కు అప్రూవల్ వస్తే భవన యజమానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మెసేజ్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
ప్లాన్ ప్రకారమే నిర్మాణం ఉండాలి
దరఖాస్తుదారుడు ఆన్లైన్లో నియమ నిబంధనలు తప్పక పాటించాలని, మం జూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మెస్సర్స్ సాఫ్ట్ టెక్నాలజీ ఇంజినీరింగ్స్ సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇస్తారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ చేయాలని, నిబంధనలను అతిక్రమించి కట్టడాలు చేపడితే సంబం ధిత సిబ్బంది, ప్లాను వేసి లైసెస్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొవ్వూరు మాస్టర్ ప్లాన్కు ఆమోదం
కొవ్వూరు పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థించగా ప్రభుత్వం ఆమోదం తె లిపిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టెండర్ విధానం ద్వారా ఆన్ గ్రౌండ్ అభివృద్ధి, శాటిలైట్ చిత్రాల ద్వారా రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తామని ఆర్జేడీ సాయిబాబా పేర్కొన్నారు.