టీడీపీ కక్షసాధింపు | TDP Leaders Fake Cases On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ కక్షసాధింపు

May 1 2018 11:38 AM | Updated on Oct 16 2018 6:27 PM

TDP Leaders Fake Cases On YSRCP Leaders - Sakshi

డీఎస్పీకి వినతి పత్రం అందజేస్తున్న శిల్పారవి

నంద్యాల: టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 2014 అక్టోబర్‌ నెలలో మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఘర్షణ కేసులో సాక్ష్యం చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్తి విషయంలో తల్లీకొడుకుల మధ్య ఘర్షణ జరగగా..సంఘటన స్థలంలో కౌన్సిలర్‌ లేకున్నా అతనిపై కేసు నమోదు చేయించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై అన్యాయంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి, కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి..

ఈ నెల 28న శనివారం రాత్రి వెంకటరమణ, పెద్దన్న వారి తల్లి ఏసక్కల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ అనిల్‌ అమృతరాజు సంఘటనా స్థలంలో లేకున్నా టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పారవి పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా సాక్ష్యం చెప్పినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేశారని కౌన్సిలర్‌ అమృతరాజు పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో శనివారం రాత్రి 7 నుంచి 11గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో ఉన్నానని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తి వివాద ఘర్షణను తనపై వేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఒకరిని భయపెడితే మిగతా వారు సాక్ష్యాలు చెప్పరనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనిల్‌ అమృతరాజ్‌పై పెట్టిన కేసును పక్షపాతం లేకుండా దర్యాప్తు చేసి కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను సోమవారం కలిసి  వినతి పత్రం అందజేశారు. పూర్తిస్థాయిలో విచారించి అన్యాయంగా కేసు పెట్టింటే ఎత్తివేస్తామని డీఎస్పీ వైఎస్సార్సీపీ నాయకులకు హామీ ఇచ్చారు.

అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం
వైఎస్సార్సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వీటిని వెంటనే మానుకోవాలని శిల్పారవి హెచ్చరించారు.  పోలీసులపై తమకు నమ్మకం ఉందని, కేసును పూర్తి స్థాయిలో విచారించి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఘర్షణ జరిగిన ప్రదేశంలో లేని కౌన్సిలర్‌పై  టీడీపీ నాయకులు.. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించినట్లు తమకు సమాచారం ఉందని, ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

శిల్పా రవి కౌన్సిలర్‌ అమృతరాజుకు సంబంధం లేదు
తన కుమారులు అన్నం పెట్టకుండా రోడ్డున పడేస్తే అనాథాశ్రమంలో బతుకుతున్నానని చెన్నమ్మ చెప్పారు.  ఆస్తి ఇప్పించాలని కోరుతూ ఆర్‌డీఓను ఆశ్రయించానన్నారు. ఆస్తిని సమానస్థాయిలో పంచాలని ఆర్డీఓ చెప్పడంతో మా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. ఈ సంఘటనకు కౌన్సిలర్‌ అనిల్‌అమృతరాజ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం అమృతరాజును కేసులో ఇరికించాలని ఈ పని చేశారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు వెంకటరమణను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి అమృతరాజ్‌పై కేసు పెట్టించారన్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement